k ramachandra murthy
-
చిరస్మరణీయ నేత పీవీ
ఏడు దశాబ్దాలు దాటిన స్వతంత్ర భారత దేశానికి ప్రధానమంత్రులుగా ఎందరో పని చేశారు. చరిత్రలో ఒకానొక ప్రధానమంత్రి స్థానం ఏమిటో నిర్ణయించే క్రమంలో పరిశీలనకు వచ్చే అంశాలలో యుద్ధం ప్రధానమైనది. యుద్ధం గెలిచిన ప్రధానులకు దేశప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం ఉంటుంది. పాకిస్తాన్పైన 1965లో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచింది కనుక నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి పట్ల భారతీయులకు అపారమైన అభిమానం. 1971లో తూర్పు పాకిస్తాన్లో సంభవించిన తిరుగుబాటు సందర్భంగా పాకిస్తాన్తో జరిగిన మరో యుద్ధంలో ఘనవిజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధిని ప్రజలు ఎప్పటికీ విజయేందిరగానే గుర్తు పెట్టుకుంటారు. కార్గిల్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు. పరిమితమైన యుద్ధమైనప్పటికీ పాకిస్తాన్ సేనలను కార్గిల్ నుంచి తరిమికొట్టినందుకు వాజపేయికి ప్రజలు బ్రహ్మరథం పట్టి 1999 ఎన్నికలలో గెలిపించారు. రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా అప్పటి ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఫ్రాన్స్ అధినేత చార్లెస్ డీగాల్ ఆయా దేశాల ప్రజలకు ప్రాతఃస్మరణీయులైనారు. 1962లో చైనా చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. అప్పటి వరకూ నవభారత నిర్మాతగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, గాంధీజీ ప్రియశిష్యుడుగా, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ప్రగతిరథ సారథిగా, అలీనోద్యమ నేతగా పేరుప్రఖ్యాతులు గడించిన నెహ్రూ చైనా చేతిలో ఓటమితో అపఖ్యాతిపాలైనారు. 1962 నవంబర్లో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకుండానే 1964లో నెహ్రూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చైనాతో భారత్కు సరిహద్దు యుద్ధం ఇంతటితో ఆగిపోతుందో లేక కొనసాగుతుందో తెలియదు. అంతిమ ఫలితం భారత్కు అనుకూలంగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీ ప్రభ నిలిచి వెలుగుతుంది. ఒక ప్రధాని లేదా ఒక దేశాధ్యక్షుడి జీవితంలో యుద్ధం అత్యంత ప్రధానమైనది. యుద్ధంలో గెలిచి నిలిచిన ప్రజానాయకుల రాజకీయ జీవితాలలో అపజయాలు ఉన్నప్పటికీ చరిత్ర వాటిని పెద్దగా పట్టించుకోదు. దేశాల చరిత్రను మలుపు తిప్పినవారికి పెద్ద పీట వేస్తుంది. దేశ తొమ్మిదవ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) చేసిన యుద్ధం సరిహద్దులో కాదు, విపణిలో. ప్రజల మస్తిష్కాలలో. దిగజారిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పీవీ చేసిన పోరాటం చరి త్రాత్మకమైనది. బాబరీమసీదు విధ్వసం, జార్ఖండ్ ముక్తిమోర్చా పార్లమెంటు సభ్యుల కొనుగోలు వ్యవహారం, సెయెంట్ కిట్స్ కేసు, హర్షద్ మెహతా ఉదంతం, లక్కూభాయ్ పాఠక్ కేసు వంటి నిందలు వచ్చినప్పటికీ ఆయన స్వయంగా కోర్టులకు హాజరై నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాతనే కన్నుమూశారు. తక్కిన కేసుల సంగతి ఏమైనా, జేఎంఎం ఎంపీల ముడుపుల వ్యవహారం మాత్రం పీవీకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. 1993 జులైలో లోక్సభలో బలపరీక్ష జరిగినప్పుడు పీవీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా 244 మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో నెగ్గాలంటే 269 సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయాలి. విపక్షాలలో చీలిక తెచ్చి, ఏదో ఒక చాణక్యం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని, ఆర్థిక సంస్కరణలు గాడి తప్పకుండా ఉండాలంటే రాజ కీయ, నైతిక విలువలతో రాజీపడక తప్పదని పీవీ భావించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్, మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బూటాసింగ్లకు ప్రభుత్వాన్ని గట్టెక్కించే బాధ్యత అప్పగిం చారు. జెఎంఎం ఎంపీలనూ, జనతాదళ్లో అజిత్ సింగ్ వర్గీయులనూ సుముఖులను చేసుకున్నారు. టీడీపీని చీల్చారు. ములాయంసింగ్ మద్దతు సైతం స్వీకరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 265 ఓట్లూ, వ్యతిరేకంగా 251 ఓట్లూ వచ్చాయి. ఆ రోజున ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పీవీ చేసింది నైతికంగా తప్పే అయినప్పటికీ, అప్పుడు కనుక ప్రభుత్వం కూలిపోయి ఏ దేవగౌడ వంటి నాయకుడో ప్రధానిగా వచ్చి ఉంటే ఆర్థిక సంస్కరణలు దిశ కోల్పోయేవి. చరిత్ర మరోరకంగా ఉండేది. ఆరోపణలు కానీ, కోర్టు కేసులు కానీ, నైతిక తప్పిదాలు కానీ, బాబ్రీమసీదు వంటి కీలకమైన అంశంలో వైఫల్యం కానీ పీవీ సాధించిన ఆర్థిక విజయం ముందు దిగదుడుపే. చరిత్ర పీవీని దేశంలో లైసెన్స్–పర్మిట్ రాజ్ నడ్డివిరిచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడిగానే నమోదు చేస్తుంది. పంజాబ్లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఖ్యాతి కూడా ఆయనకు దక్కుతుంది. అందుకే ఆయనకు సముచితమైన స్థానం కేటాయిస్తుంది. హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రధానకార్యదర్శిగా చేరి 1951లో రాజకీయ జీవితం ఆరంభించిన పీవీ ఎంఎల్ఏగా, ఎంపీగా అనేక పర్యాయాలు గెలుపొందారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసి భూస్వాములు ఆగ్రహానికి గురైనారు. జైఆంధ్ర ఉద్యమం కారణంగా పదవి నుంచి వైదొలిగారు. తర్వాత ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ కొలువులో ముఖ్యమైన పాత్ర పోషించారు. బహుభాషాకోవిదుడిగా, రచనావ్యాసంగంలో దిట్టగా పేరుప్రఖ్యాతులు కలిగిన పీవీ ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాల రూపకల్పన బాధ్యత నిర్వహించేవారు. కాంగ్రెస్ నాయకుడిగా అనేక పనులు చేస్తూనే విశ్వనాథవారి వేయిపడగలు హిందీలో సహస్రఫణ్గా అనువదించారు. ప్రణబ్ ముఖర్జీ లేక మరెవరైనా తీర్మానం రాసినా దాన్ని చదివి పీవీ ఆమోదించిన తర్వాతే ఇందిరాగాంధీ కానీ రాజీవ్గాంధీ కానీ చర్చకు పెట్టేవారు కాదు. కేంద్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. అన్ని శాఖలలో రాణించారంటే అబద్ధం అవుతుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖనూ, విదేశీ వ్యవహారాల శాఖనూ అద్భుతంగా నిర్వహించారు. ఏ శాఖ నిర్వహించినా, ఏ పని చేసినా సృజనాత్మకంగా ఆలోచించి, కొత్త పోకడలు పోవడం, అదనపు విలువను జోడించడం పీవీ ప్రత్యేకత. స్వరాష్ట్రంలో జైళ్ళ శాఖను నిర్వహించినప్పుడు బహిరంగజైలు పద్ధతికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను పర్యవేక్షించినప్పుడు గురుకుల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మావన వనరుల మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. విదేశాంగ మంత్రిగా వందకు పైగా దేశాలను సందర్శించడమే కాకుండా చైనాతో చాలా ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. సరిహద్దు సమస్యపై చర్చలు కొనసాగిస్తూనే ఇతర రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవాలని ఇండియా–చైనా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్పై బీజింగ్లో సంతకాలు చేశారు. ఫలితంగా అప్పటి నుంచి మొన్నటి వరకూ భారత్–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందింది. వాణిజ్యంలో పరిస్థితి చైనాకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చైనాకు భారత్ ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ పది రెట్లు ఎక్కువ. నిజమే. కానీ చైనా ఎగుమతులలో 3.5 శాతం కంటే తక్కువే భారత్కు చేరుతున్నాయి. భారత్ ఎగుమతులలో 5 శాతానికి పైగా చైనాకు చేరుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు అయిదు రెట్లు ఎక్కువ అనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే చైనా వస్తువులను బహిష్కరించాలనీ, చైనాతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలనీ ఎవ్వరూ వాదించరు. చైనాతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఎగుమతులను పెంచుకోవడం శ్రేయస్కరం. 1993లో చైనాతో పీవీ కుదుర్చుకున్న ఒప్పందం ఉభయతారకమైనది. దూరదృష్టితో చేసుకున్నది. నెహ్రూ అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రసిద్ధి గడించినప్పటికీ పక్కనే ఉన్న తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెద్దగా పట్టించుకోలేదు. భారత దేశానికి తూర్పు దిశగా ఉన్న సింగపూర్, మలేసియా, ఇండోనీసియా వంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆసియన్ టైగర్లుగా అంతర్జాతీయ విపణిలో గాండ్రిస్తుంటే ఆ దేశాలను విస్మరించడం సరి కాదని లుక్ ఈస్ట్ పాలసీని పీవీ ప్రతిపాదించారు. తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెంపొందించారు. వాణిజ్యం సంబంధాలను వృద్ధి చేశారు. ఇప్పుడు నరేంద్రమోదీ సర్కార్ అదే పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మరింత పదును పెట్టి అమలు చేస్తున్నది. ప్రధానిగా పీవీ ప్రమాణస్వీకారం చేసినప్పటి దేశ ఆర్థికస్థితి ఎట్లా ఉన్నది? రెండు వారాల దిగుమతులకు మాత్రం చెల్లించడానికి సరిపోను విదేశీమారకద్రవ్యం ప్రభుత్వ ఖజానాలో ఉంది. రెండు వారాలు దాటితే దిగుమతులకు డబ్బు చెల్లించలేని డిఫాల్టర్గా మిగి లిపోయే దుస్థితిలో దేశం ఉండేది. ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్కు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. భయపడుతున్న మన్మోహన్ సింగ్కు ధైర్యం నూరిపోసి, తాను అండగా ఉంటానని నచ్చజెప్పి ఆర్థికమంత్రిగా చేర్చుకున్నారు. పరిశ్రమల శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. నాటి ఆర్థికశాఖ సహాయమంత్రి (అనంతరం రాజ్యసభ ఉపాధ్యక్షుడు) కురియన్ చేత పరిశ్రమల విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టించారు. రూపాయి విలువను 18 శాతం తగ్గించారు. లండన్ బ్యాంక్కి బంగారం నిల్వలు తరలించి విదేశీ మారక ద్రవ్యం సంపాదించారు. మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ (ఎంఆర్ టీపీ) చట్టాన్ని రద్దు చేసి లైసెన్స్ –పర్మిట్ రాజ్కు భరతవాక్యం పాడారు. దిగుమతి సుంకాలనూ, ఆదాయం పన్నునూ, కార్పొరేట్ పన్నునూ క్రమంగా తగ్గించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ఉదారంగా అనుమతించారు. ఫలితంగా 1992–97 ప్రణాళికా కాలంలో ఆర్థికాభివృద్ధి రేటు సగటున 6.5 శాతం సాధించారు. ఇది అపూర్వం. పీవీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్ళలో ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతం. 1991లో అడుగంటిన విదేశీమారక ద్రవ్యం 1995 నాటికి 25.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరు తెచ్చుకున్నది. ఈ రోజున దేశం కరోనా కల్లోలంలో సైతం ఈ మాత్రం నిలబడి ఉందంటే అందుకు కారణం 1991లో పీవీ నాటిన బీజమే. పీవీ నిరాడంబరజీవి. ఆయనపైన ఎన్ని ఆరోపణలు వచ్చినా వ్యక్తిగతంగా అవినీతిపరుడని ఆయన బద్ధశత్రువులు కూడా అనరు. 1991 నాటికి సుదీర్ఘమైన తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చి రామానందతీర్థ ఆశ్రమంలోనో, కుర్తాళం పీఠాధిపతిగానో సమాజ సేవ చేయాలనే సంకల్పంతోనే పీవీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఎన్నికలలో మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశ ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం నుంచి శ్రీపెరంబదూరు వెళ్ళిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హంతకి మానవబాంబు రూపంలో వచ్చి పాదాల దగ్గర పేలిపోయి హత్య చేసిన కారణంగా రెండవ దశ పోలిం గ్లో ఎక్కువ స్థానాలు సంపాదించిన కాంగ్రెస్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. దుఃఖంలో మునిగిపోయిన సోనియాగాంధీ నమ్మకస్తుల మాట నమ్మి ముందు శంకర్ దయాళ్ శర్మకు కబురు పెట్టారు. ప్రధానమంత్రి వంటి గురుతర బాధ్యత నిర్వహించే ఆరోగ్యం తనకు లేదని ఆయన ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరించారు. శర్మకు ముసలితనంతోపాటు ఆరోగ్యం కూడా సరిగా లేదు కనుక పీవీకి ప్రధాని బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని అర్జున్సింగ్ చేసిన సూచనను సోనియా అమలు పరిచిందని శరద్ పవార్ తన ఆత్మకథలో రాశారు. అలెగ్జాండర్ ఆత్మకథ ప్రకారం పీవీ పేరు సూచించిన వ్యక్తి హక్సర్. తన మాట జవదాటకుండా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే సోనియా పీవీకి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. పీవీ ప్రధానమంత్రిగా ఆత్మగౌరవంతో, స్థిరచిత్తంతో వ్యవహరిస్తూనే సోనియా పనులన్నీ చేయడానికి చిదంబరంను పురమాయించారు. కానీ అర్జున్సింగ్, ఎన్డి తివారీ, శివశంకర్, మాధవరావ్ సింథియా వంటి నాయకుల మాటలు విశ్వసించి పీవీ పట్ల వ్యతిరేకత పెంచుకున్న సోనియా కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్ళు పని చేసిన వ్యక్తికి గౌరవం ఇవ్వలేదు. పీవీ పార్థివకాయాన్ని ఏఐసీసీ ప్రాంగణంలో ఉంచడానికి అనుమతించకుండా అవమానిం చారు. 1996లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన పీవీ రాజకీయంగా ఒంటరి జీవితం గడిపారు. కోర్టు కేసులు ఎదుర్కొంటూ, లాయర్ ఫీజు చెల్లించడానికి డబ్బులేక ఇబ్బం దిపడిన సందర్భాలు సన్నిహితులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పీవీని మాజీ ప్రధానిగా కూడా గుర్తించక పోయినా దేశ ప్రజలు ఆయన చేసిన సేవను ఎన్నటికీ మరచిపోరు. ఏళ్లు గడిచినకొద్దీ దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు పెరుగుతూ వస్తోంది. రాజకీయ జీవితం పూర్తయిం దని భావించిన తరుణంలో చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన దేశానికి ఆర్థికరంగంలో నూతన దిశా నిర్దేశం చేసిన సమర్థుడైన ప్రధానిగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు -
‘ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు’
సాక్షి, విజయవాడ: ప్రముఖ కాలమిస్ట్, కమ్యూనిస్ట్ నేత డాక్టర్ ఏపీ విఠల్ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం విఠల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విఠల్ గొప్ప మేధావి. కమ్యూనిస్టు నాయకులలో అగ్రజుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్యకి ప్రియమైన శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక వైద్యుడిగా పేదప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందించారు. కమ్యూనిస్టు భావాలను నరనరాలలో జీర్ణించుకున్న వ్యక్తిగా.. నిబద్ధత గల కమ్యూనిస్టుగా ఆయన జీవించారు. అలాంటి వారు ప్రస్తుతం మన మధ్య నుంచి దూరం కావడం తీరని లోటు. తెలంగాణ ఉద్యమకాలంలో ముందుండి అనేక వ్యాసాలు రాశారు. జీవితంలో చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయన' అంటూ విఠల్తో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా షుగర్, హృద్రోగంతో బాధపడుతున్న ఏపీ విఠల్ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. (సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత) -
ఫ్యాక్ట్ రాయాలి.. ఫిక్షన్ కాదు
-
‘వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మీడియాకు సంకెళ్లు అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే రామచంద్రమూర్తి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా నిరాధారమైన, తప్పుడు వార్తల రాసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ప్రతిపక్షాలు వక్రీకరించడాన్ని రామచంద్రమూర్తి తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు అవాస్తవాలు రాయడం సరికాదన్నారు. ఆధారాలు లేని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వంపై నిరాధారమైన, తప్పుడు వార్తలు రాసినప్పుడు వాటిని ఖండించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. తాము రాసిన వార్తలకు.. రిజాయిండర్ను(ప్రతిస్పందన) కూడా ప్రచురిండం లేదని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసాధారణంకాదని.. చట్టవిరుద్ధం అసలేకాదని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే జీవో జారీ చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదన్నారు. సమాజానికి మేలు చేయడానికికే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు : అమర్ ఏపీలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ విలేకర్లతో మాట్లాడారు. మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని గతంలోనే పలు చర్చలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచకపోయినా.. ఎన్నో ఏళ్లుగా మీడియాకు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తున్నారని గుర్తుచేశారు. కానీ కొంతకాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. వ్యక్తికి గానీ, సంస్థకు గానీ నష్టం కలిగేలా, బురద చల్లే ప్రయత్నాలు ఏ మీడియా చేయకూడదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవోపై కొందరు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని.. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు రాసిన వార్తలు నిజమైతే.. కోర్టుల ద్వారా రక్షణ పొందవచ్చని అన్నారు. -
విజయవాడ ప్రెస్క్లబ్లో మహానేతకు నివాళి
సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతిని పురస్కరించుకొని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రెస్క్లబ్లో సోమవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధికారులు డా. సుబ్రహ్మణ్యం, సాల్మన్ వెస్లీలను ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి ఉండ్రు రాజశేఖర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చల్లప్ప, సాక్షి మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారిగా పి సుబ్రహ్మణ్యం ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించారని, మహానేత వైఎస్సార్ హయాంలో వచ్చిన అన్ని సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఏడేళ్ళ పాటు వివిధ దేశాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యం తన అనుభవాన్ని ఏపీలో ఆచరణలో చూపారని తెలిపారు. అంతేకాక సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారుల సేవలు స్పూర్తిదాయకమని తెలిపారు. చల్లప్ప మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు ఉన్నత విద్యావంతులు కావాలని కోరారు. అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తూ.. సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారులు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అలాంటి వారిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ మరణం తెలుగు ప్రజలను కలచి వేసిందని గుర్తుచేశారు. పదేళ్ల కిందట జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మహానేత వైఎస్సార్, అధికారులు మరణించడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దివంగత వైఎస్సార్ను గుర్తుచేసేలా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సంక్షేమంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే వైఎస్ జగన్ ప్రజల ఆదరణను పొందుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల రూపకల్పనలో మహానేత వైఎస్సార్ తోడుగా నిలిచిన సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారులు ప్రజలకు అత్యంత చేరువయ్యారని తెలిపారు. వారి అకాల మరణం సమాజానికి, ముఖ్యంగా దళిత సమాజానికి తీరని లోటు అని రామచంద్రమూర్తి పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన సుబ్రహ్మణ్యం పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరారని.. అటువంటి అధికారులు సమాజానికి అవసరమని అన్నారు. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వరాదని ప్రతీ క్షణం ఆలోచిస్తూ ఆ దిశగా పరిపాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండగా తాను చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రపై సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి రచించిన ’జయహో’ పుస్తకావిష్కరణ సభ ఎమెస్కో ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పేజీలకు పేజీలు ముద్రిస్తాయని, వైఎస్సార్సీపీ మాత్రం రెండు పేజీల్లోనే ప్రజలకిచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపొందించిందని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. 19 బిల్లులు ఒకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విజయవంతమైన యువనేత: శేఖర్ గుప్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే విజయవంతమైన, యువకుడైన కొత్త తరం నాయకుడని ‘ది ప్రింట్’ ఎడిటర్ ఇన్చీఫ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శేఖర్ గుప్తా పేర్కొన్నారు. జయహో పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మరెవరిలోనూ చూడని ఆత్మవిశ్వాసాన్ని తాను దివంగత వైఎస్సార్లో చూసినట్లు తెలిపారు. జగన్ రూపంలో వైఎస్సార్ వారసత్వం మన మధ్యే ఉందన్నారు. సొంతంగా ఓటింగ్ బలం ఉన్న 30 మంది ప్రాంతీయ నాయకులతో దేశం సుస్థిరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుగా నాలుగున్నర దశాబ్దాల తన వృత్తి జీవితంలో నూటికి నూరుపాళ్లు సంతృప్తినిచ్చిన కార్యక్రమం ‘జయహో’ పుస్తకరచన అని సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రచురణకర్త ఎమెస్కో విజయకుమార్ తదితరులు మాట్లాడారు. పాదయాత్ర ఫొటోలు తీసిన జర్నలిస్టులను ఈ సందర్భంగా అభినందించారు. పాదయాత్ర గుర్తొస్తే గొప్ప ఉత్తేజం: ముఖ్యమంత్రి జగన్ ‘పాదయాత్ర నిజంగానే గొప్ప అనుభవం. అంత దూరం నడిచానని గుర్తు చేసుకున్నప్పుడు గొప్ప ఉత్తేజం కలుగుతుంది. జగన్ వచ్చాడు.. మమ్మల్ని కలుస్తాడు... మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రజలు వచ్చేవారు. మా కష్టాలు విన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే వాటిని తీరుస్తాడనే వారి నమ్మకమే ఒక ఉప్పెనై అదే ఓటుగా మారింది. 50 శాతం ఓట్లతో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని విజయాన్ని ప్రజలు అందించారు. దేవుడి ఆశీర్వాదంతో వారి నమ్మకాన్ని నిజం చేసేలా ముందుకు వెళుతున్నాం’’ -
నవ్యాంధ్రలో ‘నవ’శకం
రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ విశ్వసనీయతే ప్రాణం. అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకులను ప్రజలు ఆరాధిస్తారు. మాటలకూ, చేత లకూ పొంతనలేని నాయకులను తిరస్కరిస్తారు. ఇది అత్యంత సరళమైన విషయం. ప్రజల కళ్ళు కప్పవచ్చుననీ, వారిని మభ్యపెట్టవచ్చుననీ, ప్రచార బలంతో నమ్మించవచ్చుననీ నాయకులు అనుకుంటే భంగపాటు తప్పదు. శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో సమర్పించిన 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను నిజాయతీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమ్యాలను ఈ బడ్జెట్ వెల్లడిస్తుంది. ప్రభుత్వ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. జగన్ మోహన్రెడ్డి కనీవినీ ఎరుగని ఆధిక్యంతో ఎన్నికలలో విజయం సాధించడానికి ఒకానొక చారిత్రక నేపథ్యం ఉన్నది. దాదాపు పదేళ్ళపాటు కఠోర పరిశ్రమ, ప్రజలే కేంద్రంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాలూ, బీసీ డిక్లరేషన్ వగైరా కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్సీపీకి పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానం కల్పించాయి. రాజన్న రాజ్యం రూపంలో సంక్షేమ రాజ్యం నెలకొల్పుతానంటూ జగన్ మోహన్రెడ్డి బహిరంగసభలలో వాగ్దానం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఇతోధికంగా నిధులు కేటాయించాలనీ, వారిని అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలనీ సంకల్పం చెప్పుకున్నారు. పాదయాత్రలో కోటిమందికిపైగా సాధా రణ ప్రజలను కలుసుకొని వారి బాధలగాథలు ఆలకించి, ఆకళింపు చేసు కున్నట్టు బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయి. కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా చేసేది చెప్పడం, చెప్పిందే చేయడం అనే ధర్మాన్ని ప్రభుత్వాలు పాటిస్తే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. ఆ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయా ణిస్తున్నట్టు బడ్జెట్ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, బడ్జెట్ కేటాయిం పులు వేరు, వాస్తవంగా ఖర్చు చేయడం వేరు. ఊహించిన ఆదాయం అందక పోయినా, ప్రభుత్వాల ప్రాథమ్యక్రమం మారిపోయినా కేటాయింపులు ఘనంగా ఉంటాయి కానీ నిధులు విడుదల కావు. బాధ్యతాయుతమైన రాజ కీయ నేతలూ, పార్టీలూ ఎన్నికల ప్రచారంలో వినియోగించిన ప్రణాళికకు కట్టు బడి పరిపాలన సాగించాలని ప్రయత్నిస్తారు. వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమా వేశం (ప్లీనరీ)లో ప్రకటించిన నవరత్నాలనూ, బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశా లనూ సంపూర్ణంగా అమలు చేయాలనే పట్టుదల ప్రభుత్వానికి దండిగా ఉన్నట్టు బుగ్గన బడ్జెట్ స్పష్టం చేస్తున్నది. సామాజికస్పృహ బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలలో సామాజిక సమతౌల్యం సాధించే ప్రయత్నం కనిపిస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనక» డిన వర్గాలకు చేయూతనిచ్చి ఆ వర్గాలను వేగంగా ముందుకు నడిపించాలనే తాపత్రయం ఉన్నది. వివిధ వర్గాల సంక్షేమానికి ఏమేమి చేయాలని సంకల్పించారో పాదయాత్ర సందర్భంగా బహి రంగ సభలలో జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రకటించిన అంశాలన్నింటినీ క్రమంగా, వేగంగా అమలు చేస్తూ వస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజ లను కలుసుకోవడం వల్ల, మాట్లాడటం వల్ల సమాజంలో ఎంతటి వైవిధ్యం ఉన్నదో, సమస్యల స్వభావం ఏమిటో, వందకుపైగా ఉన్న వెనుకబడిన కులా లవారికి మేలు చేయడం ఎలాగో ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. మనసులో ఒక సామాజికన్యాయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహం రూపు దిద్దుకొని ఉంటుంది. దాని ప్రభావం టిక్కెట్ల పంపిణీపైన ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ నిర్మాణంలోనూ ఉంది. ఆ వ్యూహం ప్రాతిపదికగానే ప్రాథమ్యాలు నిర్ణయించుకొని ఉంటారు. అదే పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన జరిగినట్టు కనిపిస్తున్నది. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా సాగించాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు కేటాయింపులు నిరుటి కంటే పెరి గాయి. రూ. 2,27,974 కోట్ల బడ్జెట్వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలకోసం కేటాయించిన మొత్తం రూ. 75 వేల కోట్లు. దళితులలో మాలలకూ, మాదిగ లకూ, రెల్లి కులస్తులకూ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. ఎస్సీ ఉపప్రణాళికకు కేటాయించిన మొత్తం నిరుటి కేటాయింపు కంటే 33.60 శాతం అధికం. బీసీ ఉపప్రణాళికకు 15,000 కోట్లు కేటాయించడం కూడా విశేషం. నిరుటి కేటాయింపు కంటే ఇది 17.03 అధికం. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. టిక్కెట్ల కేటాయింపులోనూ, నిధుల మంజూరులోనూ బీసీలకు పెద్దపీట వేసి బీసీ డిక్లరేషన్లో చేసిన బాసలను నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. డిక్లరేషన్లో చెప్పినట్టే ఉపప్రణాళికకు నిధులు కేటా యించారు. అదే విధంగా నామినేషన్పైన ఇచ్చే చిన్న కాంట్రాక్టు పనులలో సగం బీసీలకు ఇస్తామంటూ జగన్మోహన్రెడ్డి వాగ్దానం చేశారు. కాపుల సంక్షేమం కోసం ఐదేళ్ళలో పదివేల కోట్లు కేటాయిస్తామంటూ చేసిన వాగ్దానానికి అను గుణంగానే ఈ వార్షిక బడ్జెట్లో ఆ సామాజికవర్గానికి రెండు వేల కోట్లు ప్రత్యే కించారు. ఆయన సాధించిన అద్భుతమైన విజయంలో అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల పాత్రా ఉన్నది. పైగా కులాలకూ, ప్రాంతాలకూ, మతా లకూ, రాజకీయాలకూ, పార్టీలకూ అతీతంగా సర్వజన సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలన్నది వైఎస్ఆర్సీపీ అధినేత అభీష్టం. అందుకే అందరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నం. మొత్తం 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. మేనిఫెస్టోనే మంత్రం ఇవన్నీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలే. ఇచ్చిన వాగ్దానాలను మసిపూసి మారేడుకాయ చేయకుండా, షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుటిల యత్నాలకు ఒడిగట్టకుండా చెప్పినవి చెప్పినట్టు చేసే సంకల్పాన్ని బడ్జెట్ ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. నేలవిడిచి సాము చేయకుండా ఉన్న ఆర్థిక పరిమితులలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు అవసరమైన కేటాయిం పులు సముచితంగా జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మూడు ప్రాంతాల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రతిగ్రామానికీ తాగునీరు ఇవ్వాలని ప్రయత్నం. పింఛన్లకు కేటాయింపు లను మూడు రెట్లు పెంచారు. ఆటో డ్రైవర్లకూ, నాయీ బ్రాహ్మణులకూ, రజ కులకూ, మత్స్యకారులకూ, దర్జీలకూ, చేనేత కార్మికులకూ, బ్రాహ్మణులకూ, యువన్యాయవాదులకూ చేసిన వాగ్దానాలను విస్మరించలేదు. ప్రతి చేనేత కుటుంబానికీ సంవత్సరానికి రూ. 24వేలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. దీని వల్ల 98 వేల చేనేత కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా. ఆరోగ్యశ్రీ, 108 వంటి ఆరోగ్య పథకాలను పునరుద్ధరించి వైఎస్ హయాంలో ఎంత సమర్థంగా వినియోగించారో అంతే సమర్థంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించాలన్న తపన బుగ్గన బడ్జెట్లో కనిపిస్తున్నది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు కల్పించేందుకు అవసరమైన కేటాయింపులు కూడా చేశారు. అదే విధంగా ఉచిత విద్యుచ్ఛక్తి సరఫరా కార్యక్రమంలో విద్యుత్ వినియోగం పరిమితిని 200 యూనిట్ల వరకూ పెంచడం వల్ల అదనంగా 3.42 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎంత కేటాయించారన్నది కాదు ప్రశ్న. ఎంత ఖర్చు చేశారన్నది ముఖ్యం. నిగూఢ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే దురుద్దేశాలు ఉన్నాయా, నిధులు దారిమళ్లాయా అనేవి బడ్జెట్ ప్రతిపాదనలలో నిశితంగా గమనించ వలసిన అంశాలు. ఈ బడ్జెట్లో అటువంటి నిగూఢమైన కోణాలు ఏవీ ఉన్నట్టు లేదు. బుగ్గన చెప్పినట్టు సింగపూర్ అంతర్జాతీయ విమా నాలకు లోటుభర్తీ (వయబిలిటీ గ్యాప్ ఫండ్) సమకూర్చాలా లేక వేలాది తల్లులకూ, పిల్లలకూ పోషకాహారం అందించాలా అనే ప్రశ్నే ఉదయించకూడదు. సింగపూర్ వ్యామోహంతో టీడీపీ సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన ఉన్నది. విభజన కారణంగా నష్టబోయిన రాష్ట్రం, ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న రాష్ట్రం. రుణభారం అధికంగా ఉన్న రాష్ట్రం. ఈ పరిమితులకు లోబడి పొదుపు చర్యలు తీసుకుంటూనే బడుగు వర్గాలకు పెద్ద పీట వేసే ప్రయత్నం బుగ్గన చేశారు. రైతన్నకు వెన్నుదన్ను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్పించిన వ్యవసాయ బడ్జెట్ సైతం అన్నదాతలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు తగినట్టుగానే ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో 12.66 శాతం వ్యవసాయరంగానికి కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్లో వ్యవసాయరంగానికి కేటాయించిన రూ. 28,866 కోట్లు నిరుటి కంటే రూ. 9,796 కోట్లు అధికం. పెట్టుబడి సాయం రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతుభరోసా పథకం కింద రూ. 12,500ల వంతున రూ. 8,796 కోట్లు అవసరం. కౌలురైతులకు సైతం ఇది వర్తిస్తుంది. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంపైనా శాసనసభలో ముఖ్యమంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సున్నా వడ్డీ రుణం తన హయాంలో ఇప్పించా మంటూ చంద్రబాబునాయుడు ప్రకటిస్తే, సత్యదూరమంటూ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగం వృద్ధిరేటు మైనస్ 4.12 శాతం ఉన్న దంటూ ఆర్థికశాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకటిస్తే వ్యవసాయంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి బిగ్గరగా చెప్పు కున్నారు. రెండు పక్షాలు భిన్నమైన ప్రకటనలు చేసినప్పుడు నిజం నిగ్గు తేల్చడానికి స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారనీ, ఇందుకు కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందనీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త చెల్లిం పులు ఏప్రిల్, మే మాసాలలో జరుగుతాయి కనుక ఆ భారం వచ్చే బడ్జెట్పైన ఉంటుందనీ, ఇప్పుడు రుణాలు తిరిగి చెల్లించేవారు ఎక్కువమంది ఉండరు కనుక కేటాయించిన చిన్న మొత్తం సరిపోతుందనీ ప్రభుత్వ వర్గాల వివరణ. వడ్డీలేని రుణం, పంట ధరల స్థిరీకరణ, కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వా లన్న ప్రతిపాదనలు వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభాన్ని చాలా వరకూ పరిష్కరిస్తాయి. అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచక ఆత్మహత్యను ఆశ్ర యించిన రైతుల కుటుంబాలకు ఏడు లక్షల వంతున పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం కూడా స్వాగతించదగినదే. కడచిన అయిదు సంవత్సరాలలో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలలో పరిహారం అందని కుటుంబాలకు తన ప్రభుత్వం కుటుంబానికి ఏడు లక్షల రూపాయల వంతున చెల్లిస్తుందంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. రైతును కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసినా, ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు. సమాజంలో వివిధ వర్గాలకూ, దాదాపు అన్ని వర్గాలకూ ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు పాళ్ళూ అమలు చేయడానికి అవసరమైన భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. ‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే’, సంకల్పం ఉంటే మార్గం ఉంటుం దనే సామెత ఉంది. ఇంతకు మునుపు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు జగన్ మోహన్రెడ్డి కానీ విశ్వసనీయత కలిగిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం వెనుక విశ్వసనీయత ప్రధానమైన హేతువు. జగన్మోహన్రెడ్డి యూఎస్పీ (యునీక్ సెల్లింగ్ పాయింట్–ఆయనకే ప్రత్యేకమైన ఆకర్షణీయమైన లక్షణం) అదే. వాగ్దానాలు చేసే ముందే వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి లోతుగా ఆలోచించి ఉంటారు. ఇప్పుడు గెలిపించిందీ, మున్ముందు గెలిపించేదీ ఆ విశ్వసనీయతే కనుక యూఎస్పీ దెబ్బతినకుండా కాపాడుకోవాలన్న సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికీ, ఆచరణశీలతకూ, వాస్తవిక దృష్టికీ అద్దం పట్టే విధంగా బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. రాజ్యాంగం లాగానే బడ్జెట్ కూడా సదుద్దేశాలతో నిర్మించుకున్నది. దాని అమలులోనే సాఫల్య వైఫల్యాలు ఉంటాయి. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రమ శిక్షణతో బడ్జెట్లో ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల లక్ష్యాలను సాధించగలిగితే నవ్యాంధ్రలో నవశకానికి నవరత్నాలతో శ్రీకారం చుట్టినట్టే. కె. రామచంద్రమూర్తి -
ఇదేనా ప్రజాస్వామ్యం?
చట్టాలు చేసిన పెద్దలు అవే చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వర్ధిల్లుతున్న ‘ప్రజాస్వామ్య’ దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే. ఇతర ప్రజాస్వామ్య దేశా లలో అమలు చేయడానికే చట్టాలు చేస్తారు. మనలాగా ఉల్లంఘించడానికి కాదు. కొన్నేళ్ళుగా అత్యంత భ్రష్టుపట్టిన చట్టం ఫిరాయింపుల నిరోధక చట్టం. ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు విశ్వసి స్తున్నారని ప్రతిపక్షాల సభ్యులు చెప్పడం, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారపార్టీలో చేరుతున్నామంటూ బొంకడం నిస్సిగ్గుగా సాగుతున్న జాతరలో భాగమైపోయింది. గోవా నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను ఢిల్లీకి విమానంలో పిలిపించుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వారి మెడలో బీజేపీ కండువా వేసి స్వాగతం పలికితే, పార్టీ ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తూ కబుర్లు చెబుతుంటే, ప్రతిపక్ష సమావే శానికి హాజరైన కారణంగానే జేడీ (యూ) నేత శరద్యాదవ్పైన అనర్హత వేటు వేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అర్జీ ఇచ్చిన కొన్ని గంటలలోనే టీడీపీ సభ్యులను బీజేపీ సభ్యులుగా పార్లమెంటు వెబ్సైట్లో పరిగణిస్తే ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని ఎవరు రక్షించాలి? విభిన్నమైన పార్టీ (పార్టీ విత్ ఎ డిఫరెన్స్)అంటూ తరచు స్వోత్కర్షకు ఒడిగట్టే బీజేపీ అడ్డగోలు ఫిరాయింపులను అనుమతిస్తే ఏమని చెప్పాలి? పార్టీ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేసే నైతిక హక్కు కానీ, ఫిరాయించేవారిని తప్పుపట్టే అధికారం కానీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి వీసమెత్తు కూడా లేదు. అనైతిక, అవకాశవాద రాజకీయాలలో పండిపోయిన టీడీపీ అధినేతకు చట్టాల గురించీ, విలువల గురించీ మాట్లాడే స్థాయి లేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారమైన సాధారణ ప్రజలకు తమ ప్రతినిధుల అక్రమాలనూ, అవినీతినీ ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రశ్నించవలసిన అవసరం, బాధ్యత కూడా ఉన్నాయి. తమ తీర్పును తుంగలో తొక్కి తాము ఓడించిన పార్టీలో తమ శాసనసభ్యుడు లేదా లోక్సభ సభ్యుడు చేరిపోవడం ఆ నియోజకవర్గం ప్రజలు సహించకూడదు. ఇది గోవాలో జరిగినా, తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్లో జరిగినా ప్రజావంచనే. ‘ఆయారాం, గయారాం’ ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తు న్నదని గుర్తించిన రాజీవ్గాంధీ 1985లోనే ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. చట్టసభలోని ఒక పార్టీ సభ్యులలో మూడింట ఒక వంతు మంది విడిపోతే అది చీలిక అవుతుంది కానీ ఫిరాయింపు కాదని ఈ చట్టం నిర్దేశించింది. ఈ లొసుగును ఉపయోగించుకొని అవకాశవాదులు పార్టీలు ఫిరాయించినా సభ్యత్వం కాపాడుకున్నారు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభు త్వంపైన అవిశ్వాసతీర్మానాన్ని ఓటింగ్కు పెట్టినప్పుడు టీడీపీ లోక్సభ పక్షం చీలిపోయింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు భూపతిరాజు విజయ కుమార్రాజు నాయకత్వంలో ఆరుగురు లోక్సభ సభ్యులు చీలిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏడుగురు టీడీపీలో మిగిలారు. ఈ లోపం పూడ్చే ప్రయత్నంలో 2003లో వాజ్పేయి ప్రభుత్వం పిరాయింపుల నిరోధక చట్టం, 1985కు సవరణ చేసింది. సవరించిన చట్టం ప్రకారం లెజిస్లేచర్ పార్టీలో లేదా పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మంది పార్టీ మారాలని నిర్ణయించుకుంటే అది పార్టీ చీలిక అవుతుంది. అనర్హత వేటు పడదు. సవరించిన చట్టంలో కూడా మిగిలిపోయిన కీలకమైన లొసుగు ఏమిటంటే శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే, వారిపైన అనర్హత వేటు వేయమని సదరు పార్టీ నాయకత్వం సభాపతికి ఫిర్యాదు చేస్తే సభాపతి వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన లేదు. ప్రధానికీ లేదా ముఖ్యమంత్రికి విధేయులైన సభాపతులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఏళ్ళ తరబడి సభాపతి నిర్ణయం తీసుకోకుండా సాచి వేత ధోరణి ప్రదర్శించినా ప్రశ్నించే వెసులుబాటు న్యాయవ్యవస్థకు లేదు. సభా పతిని కాదని వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి సైతం లేదు. చట్టంలోని ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావూ (కేసీఆర్) సంపూర్ణంగా వినియో గించుకున్నారు. 2014–19లో ఆంధ్రప్రదేశ్లో 23 మంది శాసనసభ్యులనూ, ముగ్గురు లోక్సభ సభ్యులనూ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఫిరాయింపజేశారు. తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయడానికీ, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారు. ఈ రోజున దేశంలో ఫిరాయింపులకు వ్యతి రేకంగా మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరే. ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేయవలసిందిగా సభాపతి తమ్మినేని సీతారాంను జగన్ అభ్యర్థించారు. ఫిరాయింపుల జాఢ్యాన్ని నిరోధించకపోతే ఎన్నికలు అర్థరహితం అవుతాయి. పార్టీల భావజాలాలూ, సిద్ధాంతాలూ బూటకమై ప్రజలను వంచిస్తాయి. పరాజయ ప్రభావమా? ఇక నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే, ఇందులో కనిపించేదంతా నిజమో, కాదో అనే అనుమానం కొందరు వెలి బుచ్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజులలోనూ, అధికారం చెలాయించిన కాలంలోనూ చంద్రబాబునాయుడితో అంటకాగిన సుజనాచౌదరీ, సీఎం రమేష్లు నిజంగా ఆయన అనుమతి లేకుండా, మరి కొందరు పెద్దల ఆశీస్సులు లేకుండా పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళి సంచలనం సృష్టించారంటే కొందరికి నమ్మశక్యంగా లేదు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్రెడ్డి సమర్థంగా నిర్మిస్తున్నారనీ, ఆ కారణంగా ప్రజలలో ఆయన ప్రాబ ల్యం విశేషంగా పెరుగుతున్నదనీ గ్రహించిన చంద్రబాబునాయుడు ప్లేటు ఫిరా యించారు. అంతవరకూ ప్రశంసించిన ప్యాకేజీని పక్కన పెట్టారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని అప్పటి వరకూ దబాయించి అదే నినాదం పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు. అప్పుడు సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రి అయినప్పటికీ ఆయనది కేబినెట్ మంత్రి అశోక్గజపతి రాజు కంటే ఎక్కువ పెత్తనం. బీజేపీ నాయకులతో సంబంధాలూ, హడావిడీ అంతా ఆయనదే. 2004 నుంచి 2014 వరకూ పార్టీ కార్యకలాపాలు సుజనాచౌదరి ఇంటి నుంచే జరిగేవి. పార్టీ కోసం చంద్రబాబునాయుడు హెరిటేజ్ బ్యాంకు ఖాతా నుంచి నయాపైసా తీయలేదు. సుజనాచౌదరి వంటి సంపన్న నాయకులే ఖర్చులు భరించారు. పార్టీలో లోకేశ్ ప్రాధాన్యం పెరిగిన కొద్దీ సుజనాచౌదరి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. సుజనా ఆధ్వర్యంలోని సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్యాంకులకు 5,700 కోట్ల మేరకు టోపీ పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను శాఖల అధికారులు తమ కార్యాలయాలపైనా, నివాసాలపైనా దాడులు చేయడం ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించిన కారణంగానేనని సుజనాచౌదరి, మరో రాజకీయ వ్యాపారి సీఎం రమేష్ భావిస్తున్నారు. ‘నేను టీడీపీ ఎంపీని కనుకనే నన్ను టార్గెట్ చేశారు. మోదీనీ, బీజేపీని వ్యతిరేకించేవారిని వేధించే ప్రయత్నం ఇది. కేంద్రాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపైన ఆదాయంపన్ను శాఖ దాడులు చేస్తున్నది’ అంటూæ రమేష్ ఘాటుగా ఆరోపించి ఎన్నో మాసాలు కాలేదు. సుజనాచౌదరికీ, రమేష్కీ టీడీపీ ఎన్డీఏని వీడటం బొత్తిగా ఇష్టం లేదు. తమ నాయకుడు అపర చాణక్యుడనీ, మోదీ పరాజయం ఖాయమనీ, మోదీ వ్యతిరేకులను ఒక తాటిమీదికి తెచ్చి, రాహుల్గాంధీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి వెనక నుంచి ఆయనే చక్రం తిప్పుతాడనే ఆశతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ కించిత్ ఆశా భావంతో మౌనంగా ఉండిన సుజన, రమేష్లు ఓట్ల లెక్కింపులో టీడీపీ గల్లంతు కాగానే తమ దారి తాము చూసుకోవాలనీ, ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరడం వినా గత్యంతరం లేదనీ తీర్మానించుకున్నారు. రాజ్యసభ సీటు కోసం భారీ ఖర్చు చేసిన టీజీ వెంకటేశ్కు పార్టీ పట్ల విధేయత ఉండాలనుకోవడం అత్యాశ. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదు కనుక బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చిందని గరికపాటి మోహనరావు చెప్పవచ్చు. నలుగురికీ చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉంది. వ్యూహంలో భాగమా? ఈ నలుగురు ఎంపీలు తామంతట తామే బీజేపీలోకి వెళ్ళారా లేక టీడీపీ అధి నేత వ్యూహంలో భాగంగానే బీజేపీ పంచన చేరారా? అనే ప్రశ్న ఒకటి వినిపి స్తున్నది. ఈ విధంగా అనుమానించడానికి చంద్రబాబునాయుడు మార్కు రాజ కీయం కారణం. ఆత్మరక్షణతో పాటు తమ అధినేతపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడకుండా మోదీ, షాలను ప్రభావితం చేయడం కోసమే సుజన, రమేష్లను బీజేపీలోకి పంపించారనేది కొందరి వాదన. పార్టీలో చేరినంత మాత్రాన దర్యాప్తులు ఆగవంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటిం చారు. విచారణ జరిగి తనను దోషిగా నిర్ధారిస్తే తనకు అభ్యంతరం లేదంటూ సుజనాచౌదరి ‘ఇండియా టుడే’తో అన్నారు. అటువంటిది ఏమీ జరగదనే విశ్వాసం ఆయన మాటలలో ధ్వనించింది. ‘చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా మీరు అప్రూవర్గా మారబోతున్నారా?’ అంటూ ఒక న్యూస్చానల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ‘అటువంటిది ఏమీ లేకపోగా, టీడీపీకి ఏ మాత్రం ఉపయోగ పడినా నేను సంతోషిస్తాను,’ అని చౌదరి వ్యాఖ్యానించారు. మోదీ,షాలు ఏదీ మరచిపోరనీ, ఎవ్వరినీ క్షమించరనీ ప్రతీతి. అందుకే యూరోప్లో పర్యటిస్తూ కూడా చంద్రబాబునాయుడు అమరావతిలో పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి నప్పుడు తాను మోదీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడాననీ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తయిన తర్వాత 42 రోజులకు కానీ ఓట్ల లెక్కింపు జరగలేదు. ఆ వ్యవధిలో విహార యాత్రకు వెళ్ళకుండా ఇప్పుడు ఎందుకు నారావారి కుటుంబం యూరోప్ వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అనంతరం ఢిల్లీ, లక్నో, కోల్కతా, బెంగళూరు వగైరా నగరాలను చుట్టి మోదీ వ్యతిరేకులను కూడగట్టి ప్రతిపక్షంలో ఐక్యత సాధించిన నాయకుడుగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో కాలికి బలపం కట్టుకొని తిరిగారు కనుక తీరిక లేక విహారయాత్రకు వెళ్ళలేకపోయారా? నలు గురు ఎంపీలు పార్టీ నుంచి బీజేపీలోకి గెంతే సమయంలో తాను విదేశీపర్యట నలో ఉండాలన్నది ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్టా? అంటూ సందేహం వెలి బుచ్చుతున్నవారు ఉన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ముందరి కాళ్ళకు బంధం వేసినట్టు ఉన్నది. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ ఇస్తున్న లెక్క ప్రకారం నలుగురు టీడీపీ సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 71 నుంచి 75కి పెరిగింది. ఎన్డీఏ ఎంపీల సంఖ్య 108కి చేరింది. ఇంకా 18 మంది ఎంపీలు చేరితే కానీ 245మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీఏకి సాధారణ మెజారిటీ సిద్ధించదు. రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలంటే మరో ఏడాది ఆగాలి. యూపీఏకి 66 స్థానాలు ఉండగా, ఎన్డీఏకీ, యూపీఏకీ చెందని పక్షాలకు చెందిన సభ్యుల సంఖ్య 66. తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయే నవంబర్లో ఉత్తర ప్రదేశ్ నుంచి పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పదికి పదీ గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి ఉంది. 16వ లోక్సభ ఆమోదించిన రెండు తీర్మానాలు–సిటిజన్షిప్ అమెండ్ మెంట్ బిల్లు, 2018, ముస్లిం మహిళల (వివాహానికి సంబంధించిన హక్కుల పరిరక్షణ) బిల్లు, 2018 (త్రిపుల్ తలాఖ్ బిల్లు)– రాజ్యసభలో తగినంత బలం లేని కారణంగా మురిగి పోయాయి. 17వ లోక్సభలో మొదటి బిల్లుగా త్రిఫుల్ తలాఖ్ బిల్లును న్యాయశాఖమంత్రి రవిశంకర్ప్రసాద్ తిరిగి శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఈ సారైనా ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందకపోతే ఎన్డీఏ సర్కార్కు తలవంపులు తప్పవు. అందుకోసం నేపథ్యాలతో, నైతికతతో నిమిత్తం లేకుండా రాజ్యసభ సభ్యులు ఎవరైనా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి స్వాగతం చెప్పాలని అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టు కనిపి స్తున్నది. కారణాలు ఏమైనా కావచ్చు, అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని చట్టుబండలు చేయడం రాజ్యాంగస్ఫూర్తిని మంట గలపడమే. -కె. రామచంద్రమూర్తి -
అయోమయమా, అతి లౌక్యమా?
నిజమే. ప్రజాతీర్పును అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు అమరావతిలో జరిగిన విస్తృత సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం లేదు. మే 23న ఓట్ల లెక్కింపు జరగ డానికి ముందు టీడీపీ విజయం పట్ల చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు. తన పిలుపును పురస్కరించుకొనే మహిళలంతా పనికట్టుకొని అర్ధరాత్రి వరకూ క్యూలలో నిలబడి తన పార్టీకి ఓట్లు వేశారని ఆయన సంపూర్ణంగా విశ్వసించారు. ఆ మాట ఢిల్లీలో, అమరావతిలో పదేపదే చెప్పారు. ఎన్నికలలో ఘోరపరా జయం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఆయన ఇంకా కోలుకోలేదనటానికి మొన్న అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ఎన్నిక సన్నివేశంలో ఆయన ముఖారవిందమే నిదర్శనం. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పద వులు నిర్వహించిన వ్యక్తి చిరునవ్వుతో సభలో ప్రవేశించి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన యువనాయకులను అభినందించి, సభాపతి ఆసనం వైపు నడుస్తున్న తమ్మినేని సీతారాం వెంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కదిలి ఉంటే హుందాగా ఉండేది. సభాపర్వం ఆదిలోనే సామరస్యపూరితమైన వాతావరణం నెలకొనేది. ప్రతిపక్ష నేత గౌరవం పెరిగేది. తల్లకిందులైన అంచనాలు ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకునే వ్యవస్థ ఉండి ఉన్నట్లయితే చంద్ర బాబును ఓటమి ఇంతగా ఆశ్చర్యపరిచేది కాదు. తన చుట్టూ తనకు ఇష్టమైన అధికారులనూ, అనధికారులనూ పెట్టుకున్నారు. వారు అధినేతకు ఏది నచ్చు తుందో అదే చెబుతారు. సానుకూల మీడియా సైతం పరిస్థితులు చేజారిపోతు న్నాయని హెచ్చరించలేదు. విజయం తథ్యమంటూ ఆశ్వాసించింది. వందిమా గ«ధుల వల్ల ఎంత ప్రమాదమో తెలిసింది. ఫీజు చెల్లించినవారికి ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ నిజమైన సర్వే ఫలితాలను వెల్లడించే సంస్థలు అరుదు. అశోక్ గజపతిరాజు వంటి నాయకులు నిర్మొగమాటంగా మాట్లాడగలరు కానీ వారికీ రాబోయే ఉపద్రవం సంగతి బొత్తిగా తెలిసినట్టు లేదు. ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులను నడిపించడంలో చంద్రబాబు శక్తిసామర్థ్యాల పట్లా, చాణక్యం పట్లా సీనియర్ నాయకులకు మితిమీరిన విశ్వాసం ఉండటం కూడా పార్టీకి నష్టం కలిగించింది. దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడైన వెంటనే ‘ప్రజలను మనం అంత కష్టపెట్టామా?’అంటూ టీడీపీ అధ్యక్షుడు సహచరులతో వాపోయారంటే చుట్టూ ఉన్నవారు ఆయనను ఎంత మబ్బులో పెట్టారో, ఆయన ఎన్ని భ్రమలలో జీవిస్తూ ఉన్నారో ఊహించుకోవచ్చు. చంద్రబాబుకు అర్థం కాలే దేమో కానీ నాబోటి రాజకీయ పరిశీలకులకు ఆయన దారుణంగా ఓడిపోతున్నారని కొన్ని మాసాలుగా అర్థం అవుతూనే ఉంది. ఆ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉన్నాం. నిజానికి, 2014లో టీడీపీ 1.6 శాతం ఓట్ల వ్యత్యాసంతో వైఎస్ఆర్సీపీపైన గెలుపొందిన క్షణం నుంచీ ఆ పార్టీ ఓటమికి అధినాయకుడే స్వయంగా బాటలు వేశారు. ఎన్నికల తంత్రంపైన ఆధారప డటం, డబ్బుతో ఎన్నికలలో విజయం సాధించవచ్చునని నమ్మడం, అందు కోసం అవధులు మించిన అవినీతిని అనుమతించడం, పశ్చిమబెంగాల్లో మార్క్సిస్టు కార్యకర్తలు వామపక్ష సంఘటన 33 సంవత్సరాలు అధికారంలో అప్రతిహతంగా కొనసాగడానికి తోడ్పడినట్టే జన్మభూమి కమిటీలు కూడా టీడీపీ అధికారాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తాయని అంచనా వేసుకోవడం, టీడీపీ పాల నలో ఒకే ఒక సామాజికవర్గం ప్రయోజనాలు నెరవేరుతున్నాయనే అభిప్రాయం జనసామాన్యంలో ప్రబలడం, పార్టీ అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా చంద్ర బాబులో విశ్వాసం కోల్పోవడమే కాకుండా తమను ఆయన మోసం చేస్తున్నారనే అనుమానం ప్రజలలో బలపడటం ఆయన ఓటమికి ప్రధాన కారణాలు. ప్రతిద్వంది వైఎస్ జగన్మోహన్రెడ్డి చాకులాంటి యువకుడూ, ప్రతిభావం తుడూ, దీక్షాదక్షతలు కలిగిన నాయకుడూ కావడం, ఎన్నికల ప్రణాళికలో ప్రక టించిన హామీలనూ, పథకాలనూ టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిన తీరును తన 3648 కిలోమీటర్ల చారిత్రక పాదయాత్రలో అత్యంత సమర్థంగా ప్రజలకు వివరించడం, నవరత్నాల పేరుతో చిన్న పిల్లల నుంచీ వృద్ధుల వరకూ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం, బీసీ డిక్లరేషన్తోనూ, టిక్కెట్ల పంపిణీ లోనూ వెనుకబడిన వర్గాల ప్రజల హృదయాలను దోచుకోవడం ద్వారా జగన్ మోహన్రెడ్డి చంద్రబాబు ఓటమిని అనివార్యం చేశారు. అన్నిటి కంటే మించి సామాన్య ప్రజల అనుభవం ప్రధానం. స్వానుభవం కంటే భిన్నంగా నాయకులు చెప్పినా, పత్రికలు రాసినా, టీవీ చానళ్ళు గ్రాఫిక్స్లో చూపినా ప్రయోజనం ఉండదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలలో ఎంత విశ్వాసం, అభిమానం ఉన్నాయో చంద్రబాబునాయుడి పట్ల అంత అవిశ్వాసం, ఆగ్రహం ఉన్నాయి. అభిమానం, ఆగ్రహం కలిసి సునామీని సృష్టించాయి. 2014 ఎన్నికల ప్రణాళికలో టీడీపీ పేర్కొన్న మొదటి మూడు అంశాలూ– వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం– సవ్యంగా అమలు జరగలేదు. బీసీ డిక్లరేషన్లో వందమంది బీసీలను టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికల రంగంలో దించుతామనే పదో హామీ ఆదిలోనే ఆవిరై పోయింది. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే నిర్ణయానికి బీసీలు వచ్చారు. తమకు బీసీ హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారని కాపులు భావిం చారు. అవినీతిరహిత సుపరిపాలన అందిస్తామన్న పన్నెండవ వాగ్దానాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జన్మభూమి కమిటీల వరకూ సర్వత్రా అవినీతిని అందలం ఎక్కించారు. ‘మేనేజ్మెంట్’పై విశ్వాసం అన్ని వ్యవస్థలనూ ‘మేనేజ్’ చేయడంలో తనకు తిరుగులేదనే విశ్వాసం చంద్ర బాబును దారుణంగా దెబ్బతీసింది. ప్రజలు అమాయకులనీ, వారిని తేలికగా మభ్యపెట్టవచ్చుననే ధోరణి కూడా టీడీపీ పతనానికి దారితీసింది. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, ఎన్నికలకు మూడు మాసాల ముందు వరాల జల్లు కురిపిస్తే ప్రజలు పొంగిపోయి ఓట్లతో ముంచెత్తుతారనే అంచనా తప్పింది. జగన్పైన చంద్రబాబునాయుడూ, కాంగ్రెస్ నేతలూ కలిసి పెట్టించిన సీబీఐ కేసులలో పసలేదనీ, అవి రాజకీయ ప్రతీకా రేచ్ఛతో బనాయించిన కేసులనీ ప్రజలలో అత్యధికులు విశ్వసించారు. పదేపదే నేరస్థుడంటూ జగన్ను అచ్చెన్నాయుడూ, బుచ్చయ్యచౌదరీ, బోండా ఉమా మహేశ్వరరావూ వంటి నాయకులు దూషించడాన్ని ప్రజలు సహించలేదు. జగన్ను అవినీతిపరుడంటూ, నేరస్తుడంటూ సంబోధించిన చంద్రబాబు విశ్వస నీయతనే ప్రజలు శంకించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నంత వరకూ, తాను కాంగ్రెస్లో కొనసాగినంత వరకూ తనపైన కేసులు లేవనీ, తనను గౌరవనీయుడుగానే పరిగణించారనీ, కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన తర్వాతనే తనపైన కేసులు పెట్టారంటూ జగన్ ఇచ్చిన వివరణను ప్రజలు మనస్పూర్తిగా నమ్మారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మధ్య బేరీజు వేసుకొని మోదీని రెండో విడత ప్రధానిగా ఎన్నుకోవాలని నిర్ణయించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్ర బాబునాయుడినీ, జగన్మోహన్రెడ్డినీ పోల్చుకొని వైఎస్ఆర్సీపీ అధినేతకు పట్టం కట్టాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలను అమలు పరచకపోగా ప్రణాళికలో ప్రస్తావించని పనులు చంద్రబాబునాయుడు చేశారు. విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ప్రణాళికను పక్కనపెట్టి సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. రాజధాని నిర్మాణం పేరుమీద 40 వేల ఎకరాలు సమీకరించడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అస్మదీయులకు లబ్ధి చేకూర్చడం, అనవసరమైన పట్టిసీమ నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం, కేంద్రం నిర్మించవలసిన పోలవరం బాధ్య తను అడిగి నెత్తికి ఎత్తుకోవడం వంటి అనేక అక్రమాలూ, తప్పుడు నిర్ణయాలూ జరిగాయి. అధికారంలో ఉండిన అయిదేళ్ళలో రూ. 1.69 లక్షల కోట్లు అప్పు చేసి ఫలానా నిర్మాణం చేశామని చెప్పుకోలేని, చూపించలేని దుస్థితి. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నిర్మించి జగన్ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారనే ఆందో ళనతో చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి నిష్క్రమించారు. అంతటితో ఆగ కుండా, ఏవో లెక్కలు వేసుకొని మోదీ వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహించే ప్రయత్నం చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ, లక్నో, కోల్కతా, బెంగళూరు వంటి నగరాలు సందర్శించి హడావిడి చేశారు. 35 సంవత్సరాలుగా వ్యతిరేకించిన కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఢిల్లీలో రాహుల్గాంధీ నివాసానికి వెళ్ళి కండువా కప్పి వచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ను భ్రష్టుపట్టించారు. వ్రతం చెడినా ఫలం దక్కకపోవడం అంటే ఇదే. దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి మోదీ–అమిత్షా నాయ కత్వంలోని బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసిన జాతీయ నాయకుడికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళడానికి ముఖం చెల్లని పరిస్థితి. మూడు లోక్సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ నేతకు హస్తినలో గౌరవం ఏముంటుంది? భిన్న వైఖరులు చంద్రబాబు, జగన్ల భిన్నమైన రాజకీయ ధోరణులను సైతం ప్రజలు జాగ్రత్తగా గమనించారు. ఎటువంటి కేసులు వచ్చినా ‘స్టే’లు తెచ్చుకునే చంద్రబాబు ఒకవైపు. చట్టాలనూ, న్యాయస్థానాలనూ గౌరవిస్తూ కోర్టుకు హాజరవుతూనే పాదయాత్ర కొనసాగించిన జగన్ మరోవైపు. వైఎస్ఆర్సీపీ టిక్కెట్లపై నెగ్గిన 23 మంది ఎంఎల్ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రిపదవులతో సత్కరించిన ముఖ్యమంత్రి ఒక వైపు. వైఎస్ఆర్సీపీ పెట్టడానికి ముందే కాంగ్రెస్నుంచి నిష్క్రమించి, వెంటనే పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయడమే కాకుండా తన పార్టీలో చేరదలచిన కాంగ్రెస్ శాసనసభ్యుల చేతా, పార్లమెంటు సభ్యుల చేతా, టీడీపీకి చెందిన ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చేతా రాజీనామా చేయిం చిన ప్రతిపక్ష నాయకుడు మరోవైపు. ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకుడు ఒకవైపు, నెరవేర్చడం సాధ్యం కాదనుకొన్న హామీని ఇవ్వడానికి నిరాకరించిన నేత మరోవైపు. మాయామర్మం చేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఏదో విధంగా (చివరికి పాల్ వంటి విదూషకుడిని ప్రయోగించి) ఎన్నికలలో గెల వాలని ప్రయత్నించిన పార్టీ అధ్యక్షుడు ఒకవైపు. పారదర్శకంగా, ముక్కు సూటిగా వ్యవహరిస్తూ, మనసులో మాట నిస్సంకోచంగా చెబుతూ, ప్రజలతో మమేకమై, వారి విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా ఎన్నికలలో విజయం సాధిం చాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత మరోవైపు. ఎవరిది నమ్మదగిన రాజకీయమో, ఎవరిది కపట రాజకీయమో, ఎవరిది నిజాయితీనో, ఎవరిది వంచనాశిల్పమో ప్రజలు అంచనావేసుకున్నారు. అందుకే, ఒక ప్రాంతం కాదు. ఒక కులం కాదు. ఒక మతం కాదు. రాష్ట్ర ప్రజలంతా కూడబలుక్కున్నట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు చేసి ఘనవిజయం చేకూర్చారు. ఈ పాటి విశ్లేషణ చంద్రబాబునాయుడికి తెలియకపోలేదు. వాస్తవాలను అంగీకరించడం, తప్పులు ఒప్పుకోవడం కష్టం. పరాజయాన్ని అంతుపట్టని పరిణామంగా చిత్రించి, ఓటమికి దారితీసిన కారణాలను అన్వేషించడం కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీని వేసి, వాటి నివేదికలు తెప్పించుకొని, పార్టీ నాయకులను బీజేపీ వైపు చూడకుండా నిర్విరామంగా ఉంచడం చంద్ర బాబునాయుడికి ఇప్పుడు అవసరం. పార్టీని రక్షించుకోవాలి. తనయుడికి అప్ప గించాలి. 2004లో ఓడిపోయినప్పుడు అనుసరించిన పద్ధతులనే ఇప్పుడు కూడా అమలు చేస్తారు. అంతే కాని చంద్రబాబు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చు కొని, రాజకీయ దృక్పథం మార్చుకొని, ధనబలం, కండబలంతో నిమిత్తం లేని పరిశుభ్రమైన రాజకీయాలవైపు అడుగులు వేసే ఆలోచన చేస్తున్న దాఖలా లేదు. ప్రశాంతంగా ఆలోచించి, ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, నిర్మాణాత్మక రాజకీయాలవైపు దృష్టి సారిస్తే ఆయనకు చరిత్రలో స్థానం ఉంటుంది. నకారాత్మక (నెగెటివ్) రాజకీయాలకు స్వస్తి చెప్పి, సకారాత్మక (పాజిటివ్) రాజ కీయాలకు శ్రీకారం చుట్టినట్లయితే తనయుడు లోకేష్కు ఉత్తమమైన రాజకీయ వారసత్వం అందించిన సంతృప్తి మిగులుతుంది. డబ్బు రాజకీయంలోనే కొన సాగాలనుకుంటే, అదే బాటలో కుమారుడిని కూడా నడిపించాలనుకుంటే నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ ప్రస్థానం అర్థరహితం అవుతుంది. ఇంతవరకూ అనుసరించిన చంద్రబాబు మార్కు రాజకీయాన్ని ప్రజలు తిరస్క రిస్తారనే విషయం మాత్రం స్పష్టం. ఓటమిని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే అంశంపైన చంద్రబాబునాయుడి భవిష్య ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. నిర్మా ణాత్మక రాజకీయాలను ఆచరిస్తే టీడీపీకీ, ఆ పార్టీ అధినాయకుడికీ, ప్రజలకీ మేలు. కె. రామచంద్రమూర్తి -
వడివడి అడుగులు!
త్రికాలమ్ రహస్య మంతనాలు లేవు. సుదీర్ఘమైన సమాలోచనలు లేవు. వీడియో కాన్ఫ రెన్స్లు లేవు. ఊహాగానాలు లేవు. శషభిషలు లేవు. ఒత్తిళ్ళు లేవు. ముందుకూ, వెనక్కూ లాగడాలు లేవు. చివరి క్షణంలో నిర్ణయాలు మార్చడాలూ, పేర్లు చేర్చడాలూ, తొలగించడాలూ లేవు. సస్పెన్స్ అసలే లేదు. ఎన్నికలలో అభ్య ర్థులను ఖరారు చేయడం, మంత్రివర్గంలో సభ్యులను నిర్ణయించడం, వారికి శాఖలు కేటాయించడం ఇంత తేలికా? అని ఆశ్చర్యబోయే విధంగా పనులు కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేసినట్టు సాఫీగా, చకచకా జరిగిపోవడం పరిశీ లకులకు విస్తుగొలుపుతున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి అనేక కీలకమైన నిర్ణయాలు అలవోకగా తీసుకుంటున్న తీరు ఇది వరకు ఎన్నడూ కనలేదు. వినలేదు. స్వభావ రీత్యా జగన్ ఆలోచనా విధానం సరళంగా, సూటిగా ఉండటం వల్ల అనాయాసంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించాలి. నవ్యాంధ్ర ప్రభుత్వ పగ్గాలు చేతపట్టినప్పటి నుంచి ముఖ్యమైన స్థానాలలో అధికారులను నియ మించడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం మొదలుకొని మంత్రులను నియమించి వారికి సముచితమైన శాఖలు అప్పగించడం వరకూ జరిగిన పరి ణామాలను పరిశీలిస్తే పూసల్లో దారంలాగా ఒక విధానం గోచరిస్తుంది. జగన్ నిర్ణయాలపైన ప్రభావం చూపే మూడు అంశాలు గమనించవచ్చు. ఒకటి– ప్రజాస్వామ్య స్ఫూర్తి. రెండు– సామాజిక న్యాయ సూత్రం. మూడు– విధేయత. భాగస్వామ్యస్ఫూర్తి ప్రజాస్వామ్యం సార్థకం కావాలంటే ప్రజలందరికీ తగిన ప్రాతినిధ్యం, భాగ స్వామ్యం ఉన్నదనే అనుభూతి కలగాలి. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గెటిస్బర్గ్ ప్రసంగంలో ప్రజాస్వామ్యాన్ని ‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క పరిపాలనా వ్యవస్థ (గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్)’గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఇదే. ఈ అంతరార్థాన్ని జగన్ గ్రహించడమే కాకుండా సాధ్యమైనంత మేరకు అమలు పరచాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని శుక్రవారం వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు జాతీయ స్థాయి ఇంగ్లీషు చానళ్ళు విశేషవార్తగా ప్రసారం చేశాయి. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మంత్రిమండలిలో వల్లభ్భాయ్ పటేల్ ఉపప్రధానిగా ఉండే వారు. చివరి ఉపప్రధాని లాల్కృష్ణ అడ్వాణీ. మన్మోహన్సింగ్కూ, నరేంద్ర మోదీకీ ఉపప్రధానులు లేరు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి 1956లో ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసినప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే తెలంగాణకు చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రిగా ఉండాలని నియమం పెట్టుకున్నారు. ఎందుకు? తెలంగాణ ప్రజలకు కూడా తమ ప్రతినిధి ఉన్నత, నిర్ణాయక స్థాయిలో ఉన్నారనే ఒక భాగస్వామ్య భావన కలుగుతుంది. ఈ సూక్ష్మం అర్థం చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఉపముఖ్యమంత్రిని ఆరో వేలుతో పోల్చి అపహాస్యం చేశారు. ఉప ముఖ్య మంత్రిని నియమిస్తే ముఖ్యమంత్రిగా తన అధికారానికి భంగం వాటిల్లుతుందని అపార్థం చేసుకొని ఆదిలోనే హంసపాదు అన్నట్టు తెలంగాణ ప్రజల మనస్సులలో అనుమాన బీజాలు తొలినాళ్ళలోనే నాటారు. బిహార్లో జేడీ(యు) అధినేత నితీశ్కుమార్ ముఖ్యమంత్రి. బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రి. నవ్యాంధ్ర తొలి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులుగా బీసీ నాయకుడు కేఈ కృష్ణమూర్తి, కాపు నేత నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరిలో ఒకరు రాయలసీమలోని కర్నూలుకు చెందినవారైతే మరొకరు కోస్తాంధ్ర లోని తూర్పుగోదావరి జిల్లా నాయకులు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రిగా మొదట రాజయ్య, అనంతరం శ్రీహరి ఉండేవారు. ముస్లింల ప్రతినిధిగా మహమ్మద్ మహమూద్ అలీ పని చేశారు రెండో ప్రభుత్వంలో శ్రీహరి లేరు. అలీ ఉన్నారు కానీ ఉపముఖ్యమంత్రి హోదా లేదు. ఒక్కో సామాజికవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సదరు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పాల్గొంటున్నామనే భరోసా ఇచ్చినట్టు అవుతుందనీ, ఇతర సామాజికవర్గాలతో సమానంగా ఆ సామాజికవర్గాలను కూడా పరిగణించి గౌరవించినట్టు అవుతుందనీ జగన్ భావించి ఉంటారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీలకూ (పిల్లి సుభాష్ చంద్రబోస్), దళితులకూ (కళత్తూరు నారాయణస్వామి), ఆదివాసీలకూ (పాముల పుష్పశ్రీవాణి), ముస్లింలకూ (అంజద్ బాషా), కాపులకూ (ఆళ్ళ నాని) ఉపముఖ్యమంత్రి పద వులు కేటాయించాలన్న అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఒక మహిళకు హోంశాఖ కేటాయించడంలో తండ్రి వైఎస్ను ఆదర్శంగా తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ హోంశాఖ అప్పగించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత ప్రజలను చకితులను చేసిన నాయకుడు నరేంద్రమోదీ. నిర్మలాసీతారామన్కు రక్షణ శాఖ, తాజాగా ఆర్థిక శాఖ కేటాయించి ముఖ్యమైన శాఖలపైన పురుషాధిక్యాన్ని అంతం చేశారు. మేకతోటి సుచరితకు హోంశాఖ ఇవ్వడం ఒక ప్రయోగం. సుచరిత సబిత లాగా అగ్రవర్ణానికి చెందిన ఆడపడుచు కాదు. దళిత మహిళ. అణగారిన వర్గాల ప్రతినిధులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి ఆయా సామాజికవర్గాలలో సమర్థులైన నాయకులు ఎదిగి రావడానికి అవకాశం కల్పించడం దార్శనికుల లక్షణం. అత్యధిక స్థానాలు గెలుచుకున్న రెడ్లతో సమానంగా కాపులకు కూడా నాలుగు స్థానాలు కల్పించడం విశేషం. బీసీలలో చేర్చవలసిందిగా కొంత కాలంగా ఉద్యమం చేస్తున్న కాపు నాయకులను అస్తిత్వ సమస్య వెంటాడుతూ వస్తున్నది. ఉపముఖ్యమంత్రి పదవి కొనసాగించడం వల్ల వారిలో భద్రతాభావం పెరుగవచ్చు. పాతికమంది మంత్రులలో ఎనిమిది మంది వెనుకబడిన కులాల వారూ, అయిదుగురు దళితులూ ఉండటం (దామాషా లెక్కన చూస్తే) తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే ప్రథమం. శాఖల కేటాయింపులో కూడా అగ్రవర్ణాలవారి కంటే వెనుకబడిన కులాలకు చెందినవారికీ, దళితులకూ, ఆదివాసీ మహిళకూ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలను బడుగువర్గాలకు సానుకూలంగా ఇంత పకడ్బందీగా ఎవ్వరూ సాధించలేక పోయారు. దీన్నంతటినీ చారిత్రక సందర్భంగా పరిగణించాలి. విధేయులకే అందలం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి నిష్క్రమించి కొత్త కుంపటి పెట్టుకున్న పరీక్షా సమయంలో తనకు తోడుగా నిలిచి, తనతోపాటు నడిచిన నాయకుల పట్ల విశ్వాసం ఉంచి వారికి మంత్రి పదవులు ఇవ్వడం మరో విశేషం. తనను నమ్మినవారికి ఉపకారం చేయడం ఫక్తు వైఎస్ తరహా రాజ కీయం. అందుకే వైఎస్ పట్ల రాజకీయవాదులకే కాకుండా రాజకీయాలతో సంబంధంలేని అనేకమందికీ వల్లమాలిన అభిమానం. సోనియాతో విభేదించి జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నప్పుడు మంత్రి పదవులను బేఖాతరు చేసి కాంగ్రెస్ నుంచి వైదొలగిన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్. బాలినేని ఎంఎల్ఏగా గెలిచి మంత్రిపదవి అందుకున్నారు. బోస్ వైఎస్ఆర్సీపీ టిక్కెట్టుపైన 2012, 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 పరాజయం తర్వాత ఎంఎల్సీగా ఎన్నికైనారు. మోపిదేవి వెంకటరమణారావు మంత్రి పదవి కోల్పోయి జైలులో కొంతకాలం ఉన్నారు. వైఎస్ కుటుంబానికి పరమ విధేయుడు. రేపల్లె నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మత్స్యకారుల ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రిగా, వక్తగా ధర్మాన ప్రసాద రావు ప్రసిద్ధుడు. వైఎస్ మంత్రివర్గంలో ముఖ్యుడు. జగన్తో పాటు ప్రసాద రావు కాంగ్రెస్ని వీడి రాలేదు. కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మాత్రం కాంగ్రెస్ నుంచి వైదొలిగి వైఎస్ ఆర్సీపీలో చేరిపోయారు. ఈ సారి ఎన్నికలలో సోదరులు ఇద్దరూ గెలుపొం దారు. కానీ మంత్రిపదవి ప్రసాదరావును కాకుండా కృష్ణదాస్ను వరించింది. సుచరిత కూడా జగన్ బాటలో నడిచి ఉపఎన్నిక ఎదుర్కొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానాన్ని వదులుకొని కాంగ్రెస్కి బైబై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరిన మేకపాటి రాజమోహనరెడ్డి ఉపఎన్నికలోనూ, 2014లోనూ గెలిచారు. ఈ సారి ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు గౌతమ్రెడ్డిని జగన్ పరిశ్రమల మంత్రి చేశారు. ఇరిగేషన్ వంటి అత్యంత ప్రధానమైన శాఖ పొందిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో నారాయణను ఓడించిన ధీరుడు. అనిల్ కుమార్, పుష్పశ్రీవాణి, ఆదిమూలం సురేష్, కొడాలినానీ, అంజద్బాషా, గుమ్మ నూరు జయరాం, కళత్తూరు నారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వంటి శాసన సభ్యులు 2014లో కూడా గెలిచి టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా జగన్తో పాటు నడిచిన విధేయులు. అందుకే మంత్రి పదవులు దక్కాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 13 స్థానాలు గెలిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవీ, ఆయన కుమారుడు మిధున్రెడ్డికి లోక్సభలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం అప్పగించారు. తనతోపాటు జైలు జీవితం, ఇతర కష్టాలూ, నష్టాలూ సమా నంగా పంచుకున్న విజయసాయిరెడ్డికి పార్లమెంటరీపార్టీ నేతగా సముచిత స్థానం కల్పించారు. స్పీకర్గా ఎన్నిక కాబోతున్న తమ్మినేని సీతారాం బీసీ. ఆయన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఐదు విడతలుగా శాసన సభకు ఎన్నికైనారు. గతంలో మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి వైఎస్ఆర్ సీపీని అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు. నిజాయితీపరులైన అధికారుల ఎంపిక మంత్రుల ప్రమాణం కంటే ముందు అనేకమంది ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ నియామకాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్కల్లం సూచనల మేరకు జరిగాయి. నిజాయితీ పరులుగా, సమర్థులుగా, సేవాతత్పరులుగా పేరు తెచ్చుకున్న అధికారులనే కీలకమైన పదవులలో నియమించారు. ఎన్నికల ప్రచారంలో, ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు ఆశావర్కర్ల జీతం మూడు వేల నుంచి పదివేలకు పెంచే ఉత్తర్వుపైన శనివారంనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వెంటనే తొలి సంతకం చేశారు. ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్న సీపీఎస్ను రద్దు చేయ డానికి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. తాత్కాలిక సహాయం (ఇంటీరియం రిలీఫ్) ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకూ యువ ముఖ్యమంత్రి పని నల్లేరు మీద బండిలాగానే వేగంగా సాగింది. ఒకే విడతలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడం, ఒకే ఊపులో మంత్రి వర్గాన్ని పూర్తిగా నిర్మించడం, మంత్రులు ప్రమాణం చేసిన వెంటనే వారికి శాఖలు కేటాయించడం, మంత్రులు ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు గానే లెజిస్లేచర్పార్టీ సమావేశం నిర్వహించి తన మనసులోని మాట భావో ద్వేగంగా చెప్పడం వంటి అనేక కొత్త పోకడలు కనిపించాయి. రెండున్నర సంవ త్సరాల తర్వాత తొంభై శాతం మంది మంత్రులు వైదొలిగి వారి స్థానంలో కొత్తవారు వస్తారనేది మరో ప్రయోగం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయమై అధ్యయనం చేయడానికి ఆంజనేయరెడ్డి నాయకత్వంలో ఒక కమిటీని నియమిం చాలన్న నిర్ణయం ఆహ్వానించదగినదే. ఆయనకు లోగడ ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా పని చేసిన అనుభవం ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతికి ఆస్కారం ఉన్నదనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. టెండర్లను పిలవ డంలో, ఖరారు చేయడంలో పారదర్శకత పాటించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అవసరమైన సందర్భాలలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను అమలు చేస్తామనీ, అవినీతికి ఆస్కారం లేకుండా సకల చర్యలూ తీసుకుం టామనీ చెప్పారు. అవినీతిలో కూరుకొని ఉన్న రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలన్న సంకల్పం ఉదాత్తమైనదే. దానిని సాకారం చేయాలంటే నాయకత్వానికి దృఢదీక్ష ఉండటంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సహకారం అవసరం. నైతిక విలువలకు పెద్దపీట వేసే ఉన్నతాధికారులూ, ముఖ్యమంత్రి ప్రకటించిన చర్యలతో సంతుష్టులైనట్టు కనిపిస్తున్న ప్రభుత్వోద్యోగులూ, రాజ కీయ నాయకులూ ఏకోన్ముఖదీక్షతో కృషి చేసినప్పుడే నవశకోదయం సాధ్యం. ఇక నుంచీ ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలి. నిధులు కేటాయించగలగాలి. సంపద సృష్టించే వ్యవస్థను ఆవిష్కరించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. వైఎస్కు లేని సౌలభ్యం జగన్కు ఉన్నది. వైఎస్కు కాంగ్రెస్ అధిష్ఠానదేవత నెత్తిపైన ఉండేది. జగన్ను ప్రశ్నించేవారు లేరు. అందుకే జాగ్రత్తగా అడుగులేయాలి. కె. రామచంద్ర మూర్తి వ్యాసకర్త -
ఎందుకీ విన్యాసాలు?!
ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఏడవ దశ పోలింగ్ పూర్తియిన తర్వాత టీవీ న్యూస్ చానళ్ళు ఎగ్జిట్పోల్ వివరాలు వెల్లడిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు జనాభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు జరిపి ప్రకటించే ఫలితాల కంటే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు మే 23 న వెల్లడి కాబోయే అసలు ఫలితాల ఉప్పు అందిస్తాయి. ఎగ్జిట్పోల్స్ ఫలితాలను నమ్మవద్దంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుగానే హెచ్చరించారు. సర్వే జరిపిన పెద్ద సంస్థలలో ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 లోక్సభ స్థానాలలో ఐదారుకు మించి టీడీపీకి వస్తాయని చెప్పలేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 23 స్థానాలు రావచ్చునంటూ వివిధ సంస్థలు చాటాయి. ఇండియా టుడే, టైమ్స్ నౌ వంటి పెద్ద సంస్థలు, విశ్వసనీయత కలిగిన సర్వేసంస్థలతో కలిసి జరిపించిన సర్వేల ఫలితాలు ఎటువంటి సందేహాలకూ ఆస్కారం లేకుండా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నదని ఘంటాపథంగా చెప్పాయి. ఆ సంస్థలే నిర్వ హించిన ఎగ్జిట్ సర్వే ఫలితాలు అంతకంటే భిన్నంగా ఉండే అవకాశాలు లేవని చంద్రబాబునాయుడికి తెలియని విషయం కాదు. కానీ 23వ తేదీ మధ్యాహ్నం వరకూ గాంభీర్యం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ మంత్రులూ, ఇతర నాయకులూ నేత చూపిన బాటలో నడుస్తున్నారు. పార్టీలో లేకపోయినా పార్లమెంటు మాజీ సభ్యుడు, పెప్పర్స్ప్రే ప్రవీణుడు లగడపాటి రాజగోపాల్ తన సహకారం అదిస్తున్నారు. కొంతకాలం కిందటి వరకూ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పడంలో లగడపాటి ఘనాపాటి అని చెప్పుకున్నారు. లగడపాటికి ఎవరు సాటి అంటూ ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పే సమయానికి ఇతరేతర కారణాలు కమ్ముకొని రావడంతో దృష్టి మందగించింది. తప్పులో కాలేశారు. దీనితో లగడపాటి రాజగోపాల్ ఏపాటి అంటూ ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. శనివారంనాడు కూడా తెలంగాణ తోవలోనే నడిచిన లగడపాటి మాటలు ఏ మాత్రం విలువలేని పిచ్చాపాటిగా పరిగణించవలసి వస్తుంది. తన అధికారం, ప్రాభవం కొనసాగే అవకాశాలు మృగ్యమని చంద్రబాబు నాయుడుకు పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ ఉదయం పది గంటలకే స్పష్టంగా తెలిసిపోయింది. అప్పుడే ఈవీఎంలపైన వీరంగం ప్రారంభించారు. పోలింగైన తర్వాత రెండు రోజుల వరకూ డీలాపడినట్టు కనిపించారు. అంతలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ దక్కడం ఖాయమని చెప్పడం ప్రారంభించారు. 95 సీట్లు అని ఒకసారీ, 105 అని మరోసారీ, 120 అని ఇంకోసారీ, 130 వరకూ రావడం తథ్యమని చివరిసారీ సంఖ్య పెంచుతూ పోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలింగ్ జరిగిన తర్వాత ఒకే ఒకసారి విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఘన విజయం సాధిస్తామని (ల్యాండ్ స్లైడ్) చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలపైన వ్యాఖ్యానించలేదు. తన పార్టీ విజయం ఖాయమని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు ఆయన దేహభాష స్పష్టం చేస్తున్నది. 2014లో కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు సైతం ప్రజల తీర్పును గౌరవిస్తాననీ, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ వైఎస్ జగన్ అన్నారు. అంతేతప్ప చంద్రబాబులాగా ఈవీఎంలను నిందించలేదు. ఎన్ని కల కమిషన్పైన ఆరోపణలు చేయలేదు. ఇందుకు పూర్తిగా విరుద్ధం చంద్రబాబు నాయుడి వైఖరి. వార్తలలో ఉండటమే లక్ష్యమా? జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించాలనే సంకల్పంతోనే చంద్రబాబు ఈవీఎంలపైన యాగీ చేస్తున్నారనీ, ఎన్నికల కమిషన్పైన నిందారోపణలు శ్రుతి మించి చేస్తున్నారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల కమిషన్పైన దాడిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పునేఠాను తొలగించి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలంటూ గోల చేశారు. ఎన్నికల సంఘం అనుమతితో జరిగిన సమావేశంలో చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. ఆ విధంగా పంతం నెగ్గించుకున్నారు. అంతవరకే. ఈ నెల 19 న అయిదు చోట్ల రీపోలింగ్ జరపాలని నిర్ణయించినందుకు ఎన్నికల సంఘం పైన విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ని కలుసుకొని తీవ్రమైన అభ్యంతరం చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ నాయకులు దళితులను ఓటు వేయనీయకుండా అడ్డుకొని రిగ్గింగ్కు పాల్పడినట్టు స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు అందిన ఫిర్యా దును ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి పంపిం చారు. ఈ విషయంపై నివేదిక పంపించవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను ద్వివేదీ ఆదేశించారు. కలెక్టర్ సదరు ఫిర్యాదుపైన తన నివేదిక పంపుతూ దానితో పాటు సీసీ ఫుటేజీని కూడా పంపించారు. నివేదికనూ, సీసీ ఫుటేజీనీ కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేదీ పంపించారు. టీడీపీ నాయకుల నిర్వాకం కళ్ళారా చూసిన ఎన్నికల సంఘం మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది, ఇందులో తప్పు ఏమున్నది? నిజం గానే ఆ కేంద్రాలలో ఏప్రిల్ 11న ఓటర్లు టీడీపీకి ఓటు వేసి ఉంటే రీపోలింగ్లో కూడా టీడీపీకే ఓటు వేస్తారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయినవారు ఈసారి వినియోగించుకుంటారు. ఆ గ్రామాలలో 30 ఏళ్ళుగా దళితులను ఓటింగ్కు దూరంగా ఉంచు తున్నారు. ఎన్నికల సంఘం సభ్యులు చూపించిన సీసీ ఫుటేజీలు చూసిన చంద్రబాబునాయుడు అవాక్కైనట్టు సమా చారం. ఆయన కూడా పోటీగా కొన్ని కేంద్రాలలో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు కేంద్రాల విషయంలో ఆయన మాట మన్నించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాతీయ స్థాయిలో మోదీతో పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష యోధుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయం చంద్ర బాబు నాయుyì చేత నేలవిడిచి సాము చేయిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాదు. ఒకటి, రెండు సందర్భాలలో మినహా నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబునాయుడు ప్రస్తావన చేయలేదు. ఆయనను ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించలేదు. టీడీపీ అధినేత ఎంత ఘాటైన ఆరోపణలు చేసినా, ఎంత కవ్వించినా నరేంద్ర మోదీ, అమిత్ షాలు రెచ్చిపోయి తమ దాడిని మమతా బెనర్జీ (దీదీ) నుంచి చంద్రబాబునాయుడివైపు ఏమాత్రం మర ల్చలేదు. దీదీపై మోదీ, షా దాడి పశ్చిమబెంగాల్లో పరిస్థితులు వేరు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ను ఢీకొడు తున్న పార్టీ బీజేపీ. రెండు పార్టీలూ సర్వం ఒడ్డి పోరాడుతున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు పోరాటంలో లేవు. అమిత్షా రోడ్డు షో నిర్వహించిన సందర్భంలో సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రతిమను పగుల కొట్టిన దుండగులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీ నాయకులు వాదులాడుకున్నారు. కొన్ని రోజులుగా మోదీ, షాల బాణాలన్నీ మమతాదీపైనే ఎక్కుపెట్టారు. మమత కూడా ఇద్దరికి దీటుగా సమాధానాలు చెబుతూ వచ్చారు. ‘జైశ్రీరామ్’ అని మోదీ నినదిస్తే ‘కాళీమాతా కీ జై’ అంటూ మమతాదీ ఎలుగెత్తి చాటారు. బీజేపీ అగ్ర నాయకులు పశ్చిమబెంగాల్పైన ఎందుకంతగా దృష్టి కేంద్రీకరించారు? 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో మొత్తం 80 లోక్సభ సీట్లలో 71 సీట్లను బీజేపీ, రెండు సీట్లను బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్’ గెలుచుకున్నాయి. హిందీ రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మొత్తం 282 స్థానాలు లభించాయి. ఈ సారి యూపీలో బీజేపీ అంతటి సానుకూల వాతావరణం లేదు. అప్నాదళ్ చీలిపోయింది. 2014లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్వాదీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఈ సారి ఒక్కటైనాయి. మరో ప్రతిపక్షమైన రాష్ట్రీయ లోక్దళ్ని ఈ కూటమిలో కలుపుకున్నారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నదని బీఎస్పీ అధినేత మాయా వతీ, ఎస్పీ నేత అఖిలేష్యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ భావిం చిన కారణంగానే కూటమిలో కాంగ్రెస్ లేదని కొందరి అభిప్రాయం. దళితులలో జాతవ్ (చమర్) కులానికి చెందిన నేత మాయావతి. బీసీలలో యాదవ్ కుల దీపుడు అఖిలేష్. జాతవేతర దళితులనూ, యాదవేతర వెనుక బడిన వర్గాలనూ సుముఖం చేసుకొని సంఘటిత పరిచిన కారణంగానే 2014 లోక్సభ ఎన్నికల లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీ ఘనవిజయం సాధించగలిగింది. ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ కొనసాగించింది. 2014 లోక్సభ ఎన్నికలలో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత, 2017లో ఎస్పీ అయిదేళ్ళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బీజేపీకి లాభం చేకూర్చాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అయిదేళ్ళు పూర్తి చేసింది. రెండేళ్ళుగా యోగీ ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్నారు. మోదీ పట్ల వ్యతిరేకత లేదు. యోగీ పట్ల ప్రతికూలత ఉన్నది. ఈ నేపథ్యంలో యూపీలో ఎస్పీ– బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 30–35 స్థానాలు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయిదు స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో కూడా ఇదివరకు వచ్చినన్ని సీట్లు బీజేపీకి రావడం అసాధ్యం. హిందీ రాష్ట్రాలలో మొత్తం 70 సీట్ల వరకూ తగ్గే అవకాశం ఉంది. అందుకే పశ్చిమబెంగాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని శక్తివంచన లేకుండా ప్రయత్నం. బెంగాల్లో, ఒడిశాలో, అస్సాంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించగలిగితే బీజేపీకి స్వయంగా 200 సీట్లకు పైగా రావచ్చుననీ, పాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు కొత్త భాగస్వాములను చేర్చుకొని అధికారంలో బీజేపీ కొనసాగే అవకాశాలు ఉన్నాయనీ అంచనా. శుక్రవారం మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ మాటలు జాగ్రత్తగా గమనించినవారికి ఈ విషయం బోధపడి ఉంటుంది. బీజేపీకి స్వయంగా 300 సీట్లు వస్తాయనీ, అయినా సరే మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంలో అంతరార్థం అదే. చంద్రబాబు చక్రవిన్యాసం 1996–97లో పరిస్థితులు వేరు. అప్పుడు సీపీఎం నాయకుడు హరికిషన్సింగ్ సూర్జిత్, డిఎంకె అధినేత ఎం కరుణానిధి ఉండేవారు. వారే ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునేవారు. చంద్రబాబు నాయుడు యువ ముఖ్యమంత్రిగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, అనుసంధానకర్తగా పని చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరి ప్రేరణ లేకుండానే వివిధ పార్టీల నాయకులు ఎన్నికలలో తాము గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా, తమ ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటారు. నాడు చంద్రబాబు నాయుడి చొరవతో ఏర్పడిన దేవగౌడ, ఐకె గుజ్రాల్ ప్రభుత్వాలు చెరి సంవ త్సరం కూడా నిలబడలేదు. అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్య మైతే దేశానికి అంతకంటే అపకారం మరొ కటి ఉండదు. సుస్థిర ప్రభుత్వమే దేశానికి క్షేమదాయకం. ఎన్నికల సంఘం సభ్యులను కలుసుకున్న అనంతరం చంద్రబాబు ఎన్సీపీ నాయకుడు శరద్పవా ర్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్నీ, శనివారంనాడు రాహుల్గాంధీనీ, మాయావతినీ, అఖిలేష్ యాద వ్నీ కలుసుకున్నారు. మమతా బెనర్జీతో సైతం సంప్రదింపుల్లో ఉన్నారు. వారం దరితో ఏమి మాట్లాడి ఉంటారు? వారంతా చంద్రబాబు నాయుడుకు ఏమి చెప్పి ఉంటారు? ఏమీ చెప్పరు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 23వ తేదీ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఏర్పాటు చేసిన సమా వేశానికి హాజరు కావాలా లేదా అని ఆలోచిస్తున్న మాయావతి, అఖిలేష్ చంద్రబాబు నాయుడుతో ఏమి చెబుతారు? ఆయన ఏదైనా చెబితే ఆలకించి ఉంటారు. ఎవరు ఎవరిని గుర్తిస్తారో, గౌరవిస్తారో. ఎవరు ఎవరితో కలసి నడు స్తారో ఈ సాయంత్రం వెలువడే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు నిర్ణయిస్తాయి. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే ఒకే ఒక అంశంపైన వారికి ఢిల్లీలో లభించే మన్నన ఆధారపడి ఉంటుంది. ఈ లోగా ఎవరి విన్యాసాలు వారు ప్రదర్శించవచ్చు. కె. రామచంద్రమూర్తి -
మళ్లీ ‘ ఉదయం’ వస్తుందని ఆశిస్తున్నా ’
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయే నాలుగు రోజుల ముందు కూడా మళ్లీ ఉదయం పేపర్ రావాలని కోరుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. దాసరి కోరిక మేరకు మళ్లీ ఏదో ఒక రూపంలో ‘ఉదయం’ రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంపిటీషన్ బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్లో జరిగింది. ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితోపాటు సినీనటులు మోహన్బాబు, జయసుధ, ఆర్.నారాయణమూర్తి, దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కళ్యాణ్, హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. ఈ రోజు లీడింగ్లో ఉన్న అన్ని తెలుగు పేపర్ల ఎడిటర్లు దాసరి పెట్టి ఉదయం పేపర్ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి దాసరి నారాయణే కారణమని మంచు మోహన్ బాబు అన్నారు. 153 సినిమాలు చేసి ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మహా మనిషి దాసరి అని ఆర్ నారాయణ మూర్తి ప్రశంసించారు. దాసరికి పద్మభూషన్ ఇవ్వాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరాలని సీఎం కేసీఆర్ను వేడుకుంటున్నానన్నారు. -
మళ్లీ ‘ ఉదయం’ వస్తుందని ఆశిస్తున్నా ’
-
మానవహక్కులకు దిక్కేది?
దాదాపు అర్ధశతాబ్దం కిందట ఆరంభమైన నక్సలైట్ ఉద్యమంతో పాటే మానవ హక్కుల నేతల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. నక్సౖ ట్లు పోలీసులతో జరిగిన నిజమైన ఎన్కౌంటర్లో చనిపోతే మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించేవారు కాదు. పట్టుకొని కాల్చి చంపడాన్ని నకిలీ ఎన్కౌంటర్గా అభివర్ణించి దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పట్టుకున్న నక్సలైట్ను న్యాయస్థానంలో హాజరుపరిచి నిజమైన నక్సలైట్ అని నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించమని వారు అడుగుతారు. నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమానికి మూలకారణం రాజకీయార్థికమనీ, దీనిని శాంతి,భద్రతల సమస్యగా పరిగణించకుండా మూలాలకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కోరుతూ వచ్చారు. మావోయిస్టులకు ఈ రాజ్యాంగంపైన విశ్వాసం లేదు, ఈ వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించాలనేది వారి సిద్ధాంతం, అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వారికి ఎట్లా వర్తిస్తాయని ప్రశ్నించేవారు మొదటి నుంచీ ఉన్నారు. మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు సరే, రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ, సాధారణ పౌరులకూ రాజ్యాంగంపట్ల విశ్వాసం ఉన్నది కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. మావోయిస్టులపైన పోరాటం పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. హక్కులను కాలరాయకూడదు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ నిర్వాహకులే ఉల్లంఘిస్తే వారికీ, మావోయిస్టులకూ తేడా ఏమున్నది? ఈ రకమైన ప్రశ్నలూ, సమాధానాలూ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న 1960–90లలో రాష్ట్రం అంతటా వినిపించేవి. వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టి ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ కేంద్రీకృతమైంది. ఈ లోగా దేశంలో అసహన వాతావరణం ప్రబలింది. మావోయిస్టులను పట్టుకొని కాల్చిచంపడాన్ని (‘ఎన్కౌంటర్’ చేయడాన్ని) ప్రశ్నించేవారి నోరు మూయించే వాతావరణం వచ్చింది. మానవ హక్కుల కార్యకర్తలని మావోయిస్టుల సానుభూతిపరులుగానో లేదా మావోయిస్టులుగానో అభివర్ణించడం, ‘సో కాల్డ్ హ్యూమన్రైట్స్ యాక్టివిస్ట్స్’ అంటూ ఎద్దేవా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ‘రొమాన్సింగ్ విత్ మావోయిజం’ అంటూ ఒక వ్యాసాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాశారు. చత్తీస్గఢ్లోని సుక్మాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపినప్పుడు మానవ హక్కుల నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు నందినీ సుందర్, సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేష్, మానవ హక్కుల నేతలు హిమాన్షు కుమార్, సోనీ సోరీ, బేలాభాటియా సుక్మా ఘటనను ఖండించారు. చనిపోయిన జవాన్ల గౌరవార్ధం బిలాస్పూర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సన్నగిల్లిన సామాజిక స్పృహ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, విదేశాలలో చదివే అవకాశాలు పెరిగిన అనంతరం యువత దృష్టి చదువుల మీదికీ, వ్యాపారంపైకీ మళ్ళింది. సామాజిక స్పృహ క్రమంగా సన్నగిల్లింది. విద్యాసంస్థల నుంచి నేరుగా నక్సలైట్ ఉద్యమంలోకి చేరే యువతీయువకుల సంఖ్య తగ్గిపోయింది. నాయకుల నేపథ్యం ఏమైనప్పటికీ దళసభ్యులు అధికంగా ఆదివాసీలూ, దళితులే. పోరాటం సైతం వారిదే. ఉద్యమం ఉనికి అడవి ప్రాంతాలకే పరిమితమైపోయింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ వ్యవహారంలో రాజీకి ఆస్కారం లేదనీ, ఉత్తరదక్షిణ ధ్రువాలను కలపాలనే ప్రయత్నం వ్యర్థమనే అభిప్రాయం ఏర్పడింది. మావోయిస్టు నాయకులకు ఆశ్రయం ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. పోలీసులు వ్యూహం మార్చారు. మావోయిస్టుల ఆచూకీ తెలియగానే గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామీణులను హింసించే ప్రక్రియకు స్వస్తి చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠం చేసుకొని మావోయిస్టుల గుట్టుమట్టులు తెలుసుకొని ‘ఎన్కౌంటర్’ చేయడం ద్వారా ఏరివేయడం ఆరంభించారు. ఆ దశ కూడా ముగిసింది. ఛత్తీస్గడ్లోనూ, మహారాష్ట్రలోనూ దాడులూ, ప్రతిదాడులూ సాగుతున్నాయి. చంపుడు పందెం సాగుతోంది. ఎవరి లెక్కలు వారు సరి చూసుకుంటున్నారు. సాధించే అవకాశం లేని లక్ష్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులను సమర్థించేవారు సమాజంలో కొందరు ఉంటారు. దానిని రాజకీయార్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తే సంతోషించేవారే ఎక్కువ మంది. మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులనూ, 1993 మానవ హక్కుల చట్టాన్నీ ఉల్లంఘించరాదనే నియమాన్ని ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా పాటించాలనే హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. హక్కుల నాయకులలో సైతం వ్యత్యాసం ఉంటుంది. ఎటువంటి హింసనైనా నిర్ద్వంద్వంగా ఖండించేవారు ఒక బాపతు. రాజ్యం బలమైనదీ, రాజ్యాంగానికి కట్టుబడి నడవవలసిందీ కనుక రాజ్యహింసకు ప్రతిగానే మావోయిస్టుల హింస ఉంటుందని భావించేవారూ ఉన్నారూ. వారు వ్యక్తిగతంగా హింసావాదులు కారు. మావోయిస్టుల హింసను సైతం ఖండిస్తారు. ప్రముఖ హక్కుల నాయకుడు కె బాలగోపాల్ నక్సలైట్ల హింసావాదాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించారు. హక్కుల నేతల పట్ల యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హక్కుల కార్యకర్తలపైన ఒత్తిడి పెరిగింది. మావోయిజాన్ని రూపుమాపడం బదులు మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ దేశీయాంగ మంత్రి రాజ్నాధ్సింగ్ ప్రకటిస్తున్నారు. అండాసెల్లో సాయిబాబా ఈ ధోరణికి నిదర్శనమే పన్సారే, కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్ వంటి హక్కుల నాయకుల అమానుష హత్యలు. ఢిల్లీ విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకూ, మరి కొందరికీ యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్లో నిర్బంధించారు. తొంభై శాతం శారీక నిస్సత్తువ కలిగి, వీల్చైర్కే పరిమితమైన వ్యక్తిని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేసినవాడిగా పరిగణించి కనీస సౌకర్యాలు లేని సెల్లో నిర్బంధించి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్ర హైకోర్టు బెయిల్ దరఖాస్తును తిరస్కరించినప్పుడు సాయిబాబా తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుప్రీంకోర్టు 2016 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్కు తలంటింది. ‘నిందితుల పట్ల మీరు చాలా అన్యాయంగా వ్యవహరించారు,’ అంటూ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్లతో కూడిన సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. తర్వాత మరో కేసు బనాయించి జైలులో పెట్టారు. సాయిబాబా ఆరోగ్యం క్షిణించిందనీ, వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కవనీ భార్య వసంత చేసిన విజ్ఞప్తులు పాలకుల చెవికి ఎక్కలేదు. ఆయనను తక్షణం విడుదల చేసి, వైద్య సదుపాయం సమకూర్చాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రవీణులు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రచురించే ‘డీయూ బీట్’ పత్రికలో ‘కలిసే నేరస్థులుగా ఉందాం సార్’ (డియర్ ప్రొఫెసర్, లెట్స్ బి క్రిమినల్స్ టుగెదర్) అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (వీవీ) ఇంటిలో, ఆయన బంధువుల ఇళ్ళలో పోదాలు జరిపి, ఆయనను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించిన సంగతి విదితమే. భీమా కోరేగాం హింసకు కారకులని చెబుతూ ఒక కేసు పెట్టారు. తర్వాత మోదీ హత్యకు కుట్ర చేశారని మరో కేసు పెట్టారు. ఈ కుట్రలో ఎం–4 రైఫల్ కొనుగోలు చేయడానికి అవసరమైన ఎనిమిది కోట్ల రూపాయలు సమకూర్చే బాధ్యత వీవీ స్వీకరించారని ఆరోపణ. ఆయనకు బెయిల్ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించడం లేదు. 79 సంవత్సరాల వీవీ అనారోగ్యం కారణంగాæ జైలులో ఉండలేకపోతున్నారనీ, ఆరోపణలు నిరాధారమైనవనీ చెబుతూ వీవీ శ్రీమతి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి బహి రంగ లేఖ రాశారు. కడచిన 45 సంవత్సరాలలో వీవీపైన 25 కేసులు బనాయించారనీ, వాటిలో 13 కేసులలో సుదీర్ఘమైన విచారణ తర్వాత వీవీని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయనీ, తక్కిన 12 కేసులనూ సాక్ష్యాధారాలు బొత్తిగా లేనికారణంగా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయనీ హేమలత వివరించారు. జస్టిస్ గొగోయ్ నుంచి స్పందన లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కూడా బహిరంగ లేఖ రాశారు. 1968 నుంచి యాభై సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వాదనను వీవీ బలపరిచారని గుర్తు చేశారు. 2005 సెప్టెంబర్లో చంచల్గూడా జైలులో ఉన్న వీవీని చూసేందుకు కేంద్ర మంత్రిగా ఉండిన కేసీఆర్ నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను లెక్క చేయకుండా వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేశారు. ఫలితం లేదు. ఈ హక్కుల నేతల గురించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రస్తావించలేదు. సమాజం స్పందించడం లేదు. ఎవరి గొడవ వారిది ‘మీరు చెప్పేదానిని నేను ఆమోదించను కానీ మీకు చెప్పడానికి ఉన్న హక్కును చనిపోయేవరకూ కాపాడతా (I disapprove of what you say, but I will defend to death your right to say it) అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త వోల్తేర్ చెప్పిందే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఛత్తీస్గఢ్లో రమణ్సింగ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు బలగాలనూ, నక్సలైట్ల వ్యతిరేక ప్రైవేటు సాయుధ బలాలనూ (సల్వాజుడుం) వినియోగించింది. మానవ హక్కులను హరించడాన్ని ప్రశ్నించిన చరిత్రకారుడు రామచంద్రగుహా, నందినీ సుందర్, స్వామీ అగ్నివేష్, మాజీ ఉన్నతాధికారి ఇఏఎస్ శర్మలను మావోయిస్టు సానుభూతిపరులుగా అభివర్ణించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2011లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ బి సుదర్శనరెడ్డి, ఎస్ఎస్ నిజ్జర్తో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమం మూలాలలోకి వెళ్ళింది. మానవ హక్కులకోసం ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ అనుమానించి మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రవేయడం, వారిపైన ఉక్కుపాదం మోపడం తప్ప మరో మార్గం లేదని ఛత్తీస్గఢ్ సర్కార్ తరఫున వాదించడం తమకు విస్మయం కలిగిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు మూలం, అందువల్లనే పరిష్కారం, వేరే చోట ఉన్నది (The root cause of the problem, and hence its solution, lies elsewhere)అని స్పష్టం చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న ఈ రోజులలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? హేమలత లేఖకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెంటనే స్పందించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల జాతర జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు లక్ష్మణరేఖ దాటి ఒకరిపైన ఒకరు యధాశక్తి బురద చల్లుకుంటున్నారు. ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పకపోయినా, చెప్పిన నిర్ణయం తమకు నచ్చకపోయినా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. దీనికి తోడు ప్రధాన న్యాయ మూర్తిపైనే లైంగికవేధింపుల ఆరోపణ (లేదా కుట్ర)పైన విచారణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేదు. ఎన్నికల సంఘం నియంత్రణ, సుప్రీంకోర్టు అభిశంసనలను ఖాతరు చేయకుండా ప్రచారాంకంలో అమీతుమీ తేల్చుకునే అంతిమ ఘట్టంలో ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మోహరించి వాగ్బాణాలు సంధిస్తూ, పరస్పరం గాయపరుచుకుంటూ, రక్తం కళ్ళజూస్తూ పోరాటాన్ని రక్తికట్టిస్తు న్నారు. పాకిస్తాన్పైన సర్జికల్ స్ట్రయిక్స్ మేము చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రంధిలో మానవ హక్కులను ఎవరు పట్టించుకుంటారు? సాయిబాబానూ, వరవరరావునీ విడుదల చేయాలన్న లేదా కనీసం బెయిలు ఇప్పించాలన్న న్యాయమైన విన్నపాలను ఎవరు వినిపించుకుంటారు? కె. రామచంద్రమూర్తి -
ఎన్నికల వ్యవస్థకు కాయకల్ప చికిత్స
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది. ఐదేళ్ళకు ఒక సారి చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎన్నికలు నిష్పాక్షికంగా, ధర్మంగా, స్వేచ్ఛగా జరగాలి. స్వాతంత్య్ర పోరాటం నాటి విలువలు కొన్ని సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగాయి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ సిద్ధాంతాలనూ, అభ్య ర్థుల అర్హతలనూ చూసి ప్రజలు ఓటు చేసేవారు. కాంగ్రెస్ను అధికారం చెడగొట్టింది. నైతిక, రాజకీయ విలువలకు పాతర వేసింది. ప్రజలకు ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. 1967 నుంచి ప్రతిపక్షాలను గెలిపించడం ప్రారంభించారు. కాలక్రమంలో అనేక ప్రయోగాలు జరిగాయి. కూటమి ప్రభు త్వాలు ఏర్పడినాయి. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ప్రయో గాలు విఫలమైన తర్వాత బీజేపీ నాయకత్వంలో నేషనల్ డెమాక్రాటిక్ అల యెన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వాలు నిలకడగా పరిపాలించాయి. 2014లో బీజేపీకి లోక్ సభలో మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమి తమైన జాతీయ పార్టీ కాగా 1984లో లోక్సభలో రెండు స్థానాలు మాత్రమే గెలు చుకున్న బీజేపీ ఇప్పుడు ఇరవైకి పైగా రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నది. ప్రభుత్వాలను మార్చడానికి ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలో ప్రజలు తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వలెనే అవినీతికీ, అక్రమాలకూ, ఆశ్రితపక్షపాతానికీ ఒడిగడుతున్నాయి. రాజకీయ ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఎన్నికలు విపరీతమైన ఖర్చుతో కూడిన జూదంగా మారిపోయాయి. ఇది వరకు సంపన్నుల సరసన కనిపించడా నికి అగ్రనేతలు సంకోచించేవారు. క్రమంగా సంపన్నులూ, వ్యాపారులూ, పారి శ్రామికవేత్తలూ రాజకీయాలలోకి వచ్చారు. కార్పొరేట్ రంగానికీ, రాజకీయ పార్టీ లకూ అక్రమసంబంధం విడదీయలేనంతగా బలపడింది. ఇప్పుడు సంపన్నులకే రాజకీయాలలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. డబ్బు లేనిదే రాజకీయాలలో రాణించడం అసాధ్యం. టీఎన్ శేషన్ ఎన్నికల సంఘానికి అపారమైన ప్రతిష్ఠను సంపాదించి పెట్టారు కానీ ఎన్నికలలో డబ్బు పాత్రను తగ్గించలేక పోయారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ జాడ్యం జడలు విచ్చుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఎన్నికల ప్రధానాధికారులు ఎంతమంది మారినా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ పోతున్నది. నియమావళి ఉల్లంఘన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిపైన చర్య తీసుకునే అధికా రాలు తమకు ఉన్నాయో లేవో ఎన్నికల సంఘం సభ్యులకు సుప్రీంకోర్టు చెప్పే వరకూ స్పష్టంగా తెలియదు. నియమావళిని ఉల్లంఘించిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, మేనకాగాంధీ, ఆజంఖాన్లపైన రెండు, మూడు రోజులు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. తొలి రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నియమావళి అవసరం లేకపో యింది. రాజ్యాంగ నిర్మాతలే పాలకులుగా ఉన్న రోజులవి. ఎన్నికల సమ యంలో అధికార దుర్వినియోగం చేయకుండా వారిని నియంత్రించవలసిన అవ సరం లేకపోయింది. డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు అప్పటికి సోక లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు. ఆ తర్వాత తరం నాయకులకు నిగ్రహం లేదు. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. కనుక నియమావళిని ప్రవేశపెట్టవలసి వచ్చింది. మొదటి సారిగా 1960లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాన్ని అమలు చేశారు. అధికారంలో ఉన్నవారూ, ప్రతిపక్షానికి చెందినవారూ ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలో ఎన్నికల సంఘం నిర్దేశించింది. సమావేశాలు ఎట్లా నిర్వహించుకోవాలి, ప్రసంగాలు ఎట్లా ఉండాలి, ఎటువంటి నినాదాలు ఇవ్వవచ్చు అనే అంశాలకే మార్గదర్శకాలు పరిమితమై ఉండేవి. 1962 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమావళిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకూ అందజేయవలసిందిగా కోరింది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎటువంటి నియమావళిని పాటించాలో 1979లో ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ నియ మావళిని గట్టిగా అమలు చేయడం 1991లోనే ప్రారంభమైంది. దాన్ని ప్రజా ప్రాతినిధ్యచట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951) లో భాగం చేయా లంటూ 2013లో లా, జస్టిస్ వ్యవహారాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్కోడ్) ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని అమలు చేయవచ్చునంటూ ఈ సంఘం సూచించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత 45 రోజులలో ఎన్నికల కార్యక్రమం పూర్తి చేయాలనీ, ఆ సమయంలో కోడ్ అమలు చేయవచ్చుననీ నిర్ణయించారు. అంటే, నియమావళి క్రమంగా రూపుదిద్దుకొని ఈ స్థాయికి వచ్చింది. ఎన్నికల కమిషన్ చర్యల పట్ల హర్షం ఇటీవల తనపైన ఎన్నికల సంఘం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ మాయా వతి దాఖలు చేసిన రిట్పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు సమాజంలో హర్షం వ్యక్తమైంది. ఒక్క మాయావతిపైనే కాదు, హద్దుమీరిన రాజకీయ నాయ కులందరిపైనా నిషేధం విధించాలనీ, శిక్షాత్మక చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ పుల్వా మాపైన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలనూ, పాకిస్తాన్లోని బాలాకోట్లోని జైషే మొహమ్మద్కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైన బాంబుల వర్షం కురిపించిన వైమానికదళానికి చెందిన సాహసికుల శౌర్యాన్నీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించడాన్ని ప్రశ్నించకపోవడంతో ఎన్నికల సంఘం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. ప్రధాని ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ను తనిఖీ చేసిన అధికారిని ఎన్ని కల సంఘం సస్పెండ్ చేయడంతో ఇది మరింత బలపడింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ నియమావళిని రెండు సార్లు ఉల్లంఘించారు. రెండు విడతలా ఎన్నికల సంఘం ఆయనపైన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్ట్–ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేశారు. భారత సైన్యాన్నీ, సైనిక చర్యలనూ ప్రచారాంశాలుగా వినియోగించుకోవడాన్ని ఖండిస్తూ పదవీ విరమణ చేసిన పలువురు సైన్యాధికారులు రాష్ట్రపతి కోవింద్కు లేఖ పంపించారు. మాటలతో, చేతలతో హిందూ ఓటర్ల హృదయాలు గెలుచుకోవాలన్న మోదీ–అమిత్షా ప్రయత్నంలో భాగమే భోపాల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్సింగ్పైన మాలేగాం ఉగ్రవాద ఘటనలో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం. ఇలా నిర్ణయించిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ స్థావరంగా చేసుకొని కశ్మీర్లో అగ్గి రగిలిస్తున్న ఉగ్రవాద సంస్థలపైన భారత దౌత్యాధికారులు చేస్తున్న విమర్శలకు విలువ ఏముంటుంది? ఎట్లాగైనా సరే ఎన్నికలలో గెలుపొందడం ప్రధానమని అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు కనిపి స్తున్నది. ప్రతిపక్షంలో ఐక్యత లేక, మోదీకి దీటైన నాయకుడు లేక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఈ ఎన్నికల అనంతరం కూడా అధికారంలో కొనసాగ వచ్చునేమో కానీ ఎన్నికలు జరుగుతున్న పద్ధతి మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తగినట్టుగా లేదు. తనపైనే ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంటెలిజెన్స్ అధికారులను కలుస్తుండగా తాను సమీక్షా సమావేశాలు పెడితే తప్పేమిటంటూ వాదిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు లేని ఆంక్షలు చంద్రబాబుపైన ఎందుకంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేయవచ్చు. పోలవరంపైనా, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపైనా సమీక్షించినందుకు ప్రతిపక్షం ఫిర్యాదు చేసిన కార ణంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ప్రమేయంతో ప్రభుత్వ ప్రధానాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు నోటీసులు ఇచ్చారు. మంచినీటి సమస్యపైన కూడా చంద్రబాబు సమీక్షించారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులకు నోటీ సులు ఇవ్వలేదు. మంచినీటి ఎద్దడి అత్యవసరమైన సమస్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధికారులను దుర్వినియోగం చేసిన తీరు నియమావళికి మరింత పదును పెట్టవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది. ఎన్నికల షెడ్యూలు ప్రకటిం చడానికి కొద్ది రోజుల ముందే ముఖ్యమంత్రి తనకు ఇష్టులైన అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించుకున్నారు. డీజేపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ విధేయులే. అందరినీ ఎన్నికలలో టీడీపీ కోసం వినియోగించినట్టు ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. ఈ దుర్వినియోగంతో పోల్చితే నలభై నాలుగు సంవత్సరాల కిందట చరిత్ర సృష్టిం చిన రాయ్బరేలీ కేసులో ఆరోపించిన అధికార దుర్వినియోగం చాలా స్వల్ప మైనది. చారిత్రక అలహాబాద్ కోర్టు తీర్పు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పైన అనుమానాలు వ్యక్తం చేస్తు న్నట్టుగానే 1971లోనూ ప్రతిపక్షాలు బ్యాలట్పత్రాలపైన రసాయనిక ప్రక్రియ జరిపారని ఆరోపించాయి. నాటి సార్వత్రిక ఎన్నికలలో రాయ్బరేలీలో ప్రధాని ఇందిరాగాంధీపైన ప్రతిపక్ష అభ్యర్థిగా రాజనారాయణ్ పోటీ చేశారు. ఇందిరకు 1,83,309 ఓట్లు వస్తే రాజ్నారాయణ్కు 71,499 ఓట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించకముందే రాజ్నారాయణ్ విజయోత్సవం నిర్వహించారు. తానే గెలు స్తానని అంత ధీమా. తీరా ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించే సరికి డీలా పడి పోయారు. కానీ బ్యాలెట్పత్రంపైన రసాయనిక ప్రయోగం చేశారని ఆయన గట్టిగా విశ్వసించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనను బలపరి చారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించే సమయంలోనే దానిపైన కాంగ్రెస్పార్టీ గుర్తు ముద్రించారనీ, దాన్ని కప్పి ఉంచేందుకు రసాయనం ఉపయోగించారనీ, ఎన్నికలలో ఓటర్లు పెట్టిన గుర్తు కొద్ది సేపటికి అదృశ్యమై కాంగ్రెస్పార్టీ గుర్తు బయటికి వచ్చిందనీ, ఓట్ల లెక్కింపు సమయానికి రసాయన ప్రయోగం చేసిన అన్ని బ్యాలట్ పత్రాలపైనా కాంగ్రెస్ గుర్తు ఉన్నదనీ రాజ్నారాయణ్ అను మానం. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. శాంతిభూషణ్ ఆయన తరఫున వాదించారు. జూన్ 12, 1975నాడు అలహాబాద్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఇందిర ఎన్నిక చెల్లనేరదంటూ చారిత్రక తీర్పు ప్రకటించారు. యశ్పాల్ కపూర్ అనే ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్గా ఇందిరాగాంధీ నియమించారనేది న్యాయమూర్తి తప్పుపట్టిన చర్య. నిజానికి యశ్పాల్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వైదొలిగి ఇందిర ఎన్నికల ఏజెంట్గా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ–ఓఎస్డీ)గా మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఈ తీర్పు కారణంగా ఇందిరా గాంధీ పదవి నుంచి వైదొలిగి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటే బహుశా అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసేదేమో. కానీ ఆ పని చేయకుండా ఆత్యయిక పరిస్థితి ప్రకటించడంతో చరిత్ర మలుపు తిరిగింది. ఒక ఉద్యోగిని ఎన్నికల కార్యక్రమంలో వినియోగించుకున్నందుకు దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయించింది. ఆ రోజులతో పోల్చితే ఇప్పుడు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగం, ధనబలం, కండబలం, కులం, మతం, ప్రాంతం, తదితర అపభ్రంశాలన్నీ ఆవహించి ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించాయి. ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం వంటి అరకొర సంస్కరణలతో పరి స్థితి బాగుపడదు. మొత్తం రాజకీయ వ్యవస్థకే కాయకల్ప చికిత్స జరగాలి. నియమావళిని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలలో రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత సైతం ఎన్నికల సంఘమే స్వీకరించాలి. ఇప్పుడున్న ధోరణే కొనసాగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. అరాజకం ప్రబలు తుంది. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా పౌరసమాజం యావత్తూ సమష్టిగా సమాలోచన జరిపి పరిష్కరించుకోవలసిన సమస్య ఇది. -కె. రామచంద్రమూర్తి -
ఎందుకింత రాద్ధాంతం?
పోలింగ్ ముగిసిన తర్వాత యుద్ధవాతావరణం ముగుస్తుందనీ, శాంతి, సద్భావం వెల్లివిరుస్తాయనీ ఆశించినవారికి దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్కరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం రెండు గంటల సేపు మీడియాతో మాట్లాడిన తర్వాత అప్రజాస్వామికమైన ఆయన వ్యాఖ్యలపైన స్పందించక తప్పడం లేదు. ప్రతిపక్ష నేతను నేరస్థుడు అంటూ అభివర్ణించడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సహనిందితుడనీ, కోవర్టు అనీ నిందించడం చూసినవారికి ముఖ్యమంత్రి మాన సిక స్థితిపైన అనుమానం కలుగకమానదు. తాను ముఖ్యమంత్రి, ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత కనుక ఏమి మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నట్టున్నారు. గురువారం ఉదయం పోలింగ్ ఆరంభమైన కొద్దిసేపటికే ముప్పయ్ శాతం ఎల క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు పని చేయలేదనీ, ఈ సమస్యను ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ కావాలనే సృష్టించినట్టు కనిపిస్తున్నదనీ చంద్రబాబు ధ్వజమెత్తారు. మొత్తం 92 వేల పైచిలుకు ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్లో వినియోగిం చారు. 380 ఈవీఎంలు ఉదయం మొరాయించాయనీ, వాటిలో 330 ఈవీఎం లను మార్చి కొత్తవి ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించి వెంటనే ఉపయోగించామనీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వివరించినా ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. అంతకుముందు ఎన్నికల ప్రధా నాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, ఆయననూ, కేంద్ర ఎన్నికల సంఘాన్నీ దుర్భాషలాడటం అసహనం హద్దు మీరిందనడానికి నిదర్శనం. కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణిని గమనించినవారికి ఆయనను వైఫల్య భీతి వేధిస్తున్నదని గ్రహించి ఉంటారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజ యం సాధించి అధికారంలోకి వస్తారు. ఓడిపోతే అధికారం నుంచి తప్పుకుం టారు. ఇది సర్వసాధారణం. అధికారం తమ జన్మహక్కు అనీ, ఇతరులకు దాన్ని ఆశించే హక్కు లేదనే వితండవాదాన్ని చంద్రబాబు తల కెక్కించుకున్నారు. ఈవీఎంలపై ఇంత అపనమ్మకమా? వాస్తవానికి ఎన్నికల ఫలితాల కోసం మరి 40 రోజులు నిరీక్షించాలి. అంత వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి లెక్కలు వారివి. విజయాన్నీ, పరాజయాన్నీ ఎట్లా స్వీకరించాలో తెలిసినవాడే ప్రజానాయకుడు. అన్ని ప్రజాస్వామ్య వ్యవ స్థలూ పరస్పరం సహకరించుకుంటేనే కథ సజావుగా నడుస్తుంది. ద్వివేదీతో సహ కరించకపోగా ఆయనను శత్రువుల జాబితాలో చేర్చారు చంద్రబాబు. ఎన్నికల ప్రధానాధికారితో సహా ఆయనకు సహకరించే ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వారే. ఎన్నికల నిర్వహణకోసం ప్రభుత్వోగులతో పాటు అంగన్వాడీ, ఆశావర్కర్లనీ, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల ఉద్యోగులనూ నియమిం చింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు చెడిపోతే మరమ్మతు చేయడానికి బిఇఎల్ నుంచి వచ్చిన అధికారులు శిక్షణనిచ్చింది స్థానిక మెకాని క్లకే. వారి సామర్థ్యాన్ని శంకిస్తూ, ‘మెకానిక్లు మరమ్మతు చేస్తున్నారా, మేని ప్యులేట్ చేస్తున్నారా, వేర్ ఆర్ వుయ్ గోయింగ్?’ అంటూ ముఖ్యమంత్రి ఆవే శపడితే ఏట్లా అర్థం చేసుకోవాలి? తన శత్రువుల జాబితాను చంద్రబాబు రోజు రోజుకీ పెంచుకుంటూ పోతున్నారు. మొన్నటి వరకూ జగన్, మోదీ, కేసీఆర్ ఆ జాబితాలో ఉండేవారు. ఇప్పుడు ద్వివేదీ, చీఫ్ సెక్రటరీగా నియమితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను ఎవరిని తిడితే వారిని ప్రతిపక్ష నాయకుడు కూడా తిట్టాలని ముఖ్యమంత్రి భావిస్తారు. తిట్టకపోతే వారితో కుమ్మక్కు అయినట్టు నిందిస్తారు. ‘ఎన్నికల ప్రధానాధికారిని జగన్ ఒక్క మాటైనా అన్నాడా?’ అన్నది అందు కోసమే. ద్వివేదీని దబాయించడం, సుబ్రహ్మణ్యంని కోవర్టు అనీ, కోఎక్యూజ్డ్ అనీ నిందించడం ముఖ్యమంత్రి సంస్కారానికి అద్దం పడుతుంది. నిందితుడికీ, దోషికీ భేదం పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం భావ్యమా? కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి తానే సీబీఐతో పెట్టించిన అనేక బూటకపు కేసుల్లో ఒకదానిలో సుబ్రహ్మణ్యం నిర్దోషి అంటూ హైకోర్టు ప్రకటించిన తర్వాత కూడా ‘సహనిందితుడు’ అంటూ అభివర్ణించడం ఏ సంస్కారానికి నిదర్శనం? ఓటుకు కోట్ల కేసులో ‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ...’ అంటూ మాట్లాడిన చంద్రబాబుని ఏమని పిలవాలి? ఢిల్లీలో కూడా అదే ప్రవర. జగన్పైన 31 కేసులు ఉన్నాయనీ, తనపైన ఒక్క కేసు కూడా లేదనీ ప్రకటన. జగన్పైన ఉన్న కేసులన్నీ చంద్రబాబు పెట్టించినవీ, చంద్రబాబు ప్రభుత్వం పెట్టినవే. చంద్రబాబు న్యాయవ్యవస్థలోని పరిస్థితులను వినియోగించుకొని 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న సంగతి ఎవరూ మర చిపోలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం నడ వడికను దూరం నుంచి గమనిస్తున్న నాబోటి పాత్రి కేయులకు ఆయన ఎంత నిజాయితీపరుడైన అధికారో, ఎంత ముక్కు సూటిగా వ్యవహరిస్తారో తెలుసు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆశీస్సులతో పాటు ఆయన విలువలను సైతం గుండె నిండా నింపుకొని ఎన్ని సమస్యలు ఎదురైనా చలించకుండా కర్తవ్య నిర్వహణ చేస్తున్న అధికారిని పట్టుకొని అనరాని మాటలు అనడం ముఖ్యమంత్రి పదవికి శోభనిస్తుందా? ఒక సీఎస్ ఒక డీజీపీని కలుసుకుంటే ముఖ్యమంత్రికి అభ్యం తరం ఎందుకు ఉండాలి? ఇది ప్రభుత్వ వ్యవహారాలలో సర్వసాధారణం. ‘ఎక్క డికి పోతున్నాం మనం? ఇట్ ఈజ్ మాకరీ ఆఫ్ డెమాక్రసీ’ అంటూ తీవ్రంగా ఆక్షేపించడంలో ఏమైనా అర్థం ఉన్నదా? చంద్రబాబుకు నిజాయితీపరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే పడనట్టు కనిపిస్తున్నది. చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లం అంటే పడదు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ అంటే వైరిభావం. తనకు విధేయంగా ఉంటూ, తాను చెప్పినట్టు చేసినందుకు మాజీ చీఫ్ సెక్రటరీ అనీల్చంద్రపునేఠా, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మూల్యం చెల్లించడం చూశాం. డీజీపీ ఠాకూర్ ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ సభ్యు లను రెండు విడతల కలుసుకొని తిరిగి వచ్చారు. పరాజయం అంగీకరిస్తున్నట్లేనా? ఎన్నికల సమయంలో అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం కొత్త కాదు. ద్రోణంరాజు సత్యనారాయణ మృతి కారణంగా 2006లో విశాఖ సౌత్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల సంఘానికి చెప్పకుండా మార్చి వేశారు. మార్చిన తర్వాత చెప్పారు. ఫలితంగా ప్రవీణ్ను ఎన్నికలకు దూరంగా పెట్టి కలె క్టర్గా అనీల్ కుమార్సింఘాల్ని నియమించారు. అదే ప్రవీణ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వికారాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. లోగడ చేసిన తప్పిదం కారణంగా ఆయనను ఆ ఎన్నికలలో కూడా బదిలీ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఫిర్యాదు మేరకు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ను ఎన్నికల విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో ఏకే మహంతిని డీజీపీగా నియమించినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘాన్ని కానీ, ప్రతిపక్ష నాయకుడిని కానీ పల్లెత్తు మాట అనలేదు. కానీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కొనేశారంటూ బాబు అడ్డగోలుగా వ్యాఖ్యానించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఇలా అమ్ముడుపోతారని నిందించడం విజ్ఞుల లక్షణమేనా? ఈ పరుష పదజాలం బాబు దుగ్ధకు నిదర్శనం. ఆయనకు తెలియకుండానే మనసులో ఉన్నమాట బయటపడుతు న్నది. ‘అయిదేళ్ళు లోట స్పాండ్ నుంచి పరిపాలిస్తాడు’ అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనీ, జగన్ ముఖ్య మంత్రి అవుతారనీ ఒప్పుకున్నట్టే కదా! అపోజిషన్లో ఉన్నవాడికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అంటే అధికారంలో ఉన్న తనకు డబ్బు వచ్చినట్టే కదా! ఓటమి భయం, ఆక్రోశం అనాలోచితంగా, అతిగా మాట్లాడిస్తుంది. కొన్ని భయాలూ, కొన్ని నిజాలూ, కొన్ని అర్థంపర్థంలేని మాటలూ దొర్లుతాయి. ఈవీఎంలో చిప్ తయారు చేసినవాడు తనకు అపకారం చేస్తాడని అనుకుంటారు. తనను ఓడించేందుకే ఎన్నికలు మొదటి దశలో పెట్టారంటూ ఎన్నికల కమిషన్ని తప్పుపడుతున్నారు. ‘నా ఓటు నాకే పడిందో లేదో నాకు తెలియదు’ అన్నారు. అమరావతిలో ఓటు చేసిన బాబు ఓటు ఆయనకు పడదు. ఆయన కొడుకు, మంగళగిరి నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్కు పడి ఉంటుంది. చిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిలాగా రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు నిబ్బరంగా ఉన్నారు. పోలింగ్ రోజున కొన్ని చోట్ల టీడీపీ, ౖవైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. గతంతో పోల్చితే ఈసారి హింస కొంతమేర తగ్గిందంటూ ముఖ్యమంత్రికి ఇష్టుడైన డీజీపీ ఠాకూర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు వైసీపీకీ, ఇంకొకరు టీడీపీకీ చెందినవారు. వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్నీ, వైసీపీ నాయకులనూ నిష్కారణంగా దూషిస్తూ హింసాకాండ యావత్తూ వైసీపీ ఒక పథకం ప్రకారం చేయించిందని చెప్పడం అదరగండపు ధోరణి. నేరం చేసి ఎదుటివారిపైన నిందవేయడం, అధికారంలో ఉంటూ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం చంద్ర బాబుకి బాగా తెలిసిన విద్య. పరాకాష్టకు చేరిన ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు అన్ని రకాల ఎత్తుగడలూ అమలు పరి చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్, జనసేనలు విడివిడిగా పోటీ చేసే విధంగా వ్యూహరచన చే శారు. జనసేనతో సర్దుబాట్లు చేసుకున్నారు. కేఏ పాల్ అనే ఒక విచిత్రవీరుడిని రంగంలో ప్రవేశపెట్టి అతడి పార్టీకి వైఎస్ ఆర్సీపీ ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్ను పోలిన ఫ్యాన్సహిత హెలికాప్టర్ చిహ్నం సంపాదించిపెట్టారు. ఆయన అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు వేసుకునే డిజైన్ కండువాలనే వేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లు గల అనామకులకు టిక్కెట్లు ఇప్పించారు. ఎన్నికలు పది రోజులు ఉన్నాయనగా డ్వాక్రా మహిళలకు రెండు చెక్కులు ఇచ్చారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రెండు వాయిదాలు ఇస్తానని చెప్పి ఒక వాయిదా సొమ్ము వారి ఖాతాలలో వేశారు. ఇన్ని చేసినా పరాజయభీతి పీడిస్తున్నదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పరాజయం అనివార్యమని ఆయనకు నెల రోజుల కిందటే తెలిసిపోయింది. పోలింగ్ రోజున ఓటర్లు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో తన అనుమానం రూఢి అయింది. అందుకే అందరిపైనా ఒంటికాలు మీద లేవడం. ఉదయం పది గంటలలోపే 30 శాతం ఈవిఎం మెషీన్లు పనిచేయడం లేదంటూ గగ్గోలు పెట్టడం కూడా ఓటమికి సాకు వెతుక్కునే ప్రయత్నమే. మొత్తం 92వేల పైచిలుకు ఈవిఎంలు ఉంటే వాటిలో 30 శాతం అంటే ఎన్నో లెక్క కట్టే మాట్లాడారా? కేవలం 380 ఈవీఎంలు మొరా యించాయనీ, వాటిలో చాలావరకూ కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించామనీ ద్వివేదీ చెప్పారు. అయినా బాబు ధోరణి మారలేదు. ఢిల్లీలోనూ అదే పాట. ద్వివేదీ ఓటు వేయలేకపోయారని సీఎం ప్రచారం చేశారు. ఆయన గురువారం నాలుగు గంటలకు ఓటు వేసినట్టు వీడియో సాక్ష్యం విడుదల చేశారు. అయినా సరే అబద్ధాలు ఆగడం లేదు. ఆగడాలకు అంతులేదు. పోలింగ్ పూర్తియిన తర్వాత కూడా గ్రామాలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటే వారు తమ అధినేతను అనుసరిస్తున్నారని భావించాలి. సహనిందితుడూ, కోవర్టు అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంని నిందించడం, ఈసీని తూర్పారబట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం 324 అధికరణ కింద ఎన్ని కల సంఘానికి దఖలు పరచిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్) కిందా, భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) కిందా చంద్రబాబుlపైన కేసులు పెట్టవచ్చు. సుబ్ర హ్మణ్యంపైన విమర్శలు చేసిన తీరు ఎన్నికల సంఘానికి పరువునష్టం కలి గించినట్టే. ఎన్నికల సంఘాన్ని ధిక్క రించినట్టే. ఇలా ధిక్కరించే అధికారం సీఎంకి కాదు కదా ప్రధానికిSసైతం లేదు. ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుందో లేదో మే 23న మాత్రమే వెల్లడి అవుతుంది. ఈ లోగా ఓటమిని ఎట్లా స్వీకరించాలో చంద్రబాబు నేర్చుకున్నా, ఆయనకు హితైషులు నచ్చజెప్పినా ఆయనకు మంచిది. 2014లో పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో ఓడిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత హుందాగా ఫలితాన్ని ఆమోదించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహ రిస్తామని చెప్పారు. 42 ఏళ్ళ యువకుడు అయిదేళ్ళ కిందట ఎంత సంయమ నంతో, రాజ్యాంగంపట్ల, ఎన్నికల ప్రక్రియపట్ల గౌరవంతో వినమ్రంగా ఓటమిని అంగీకరించారు. ఇప్పుడు ఓడిపోతామనే అనుమానంతోనే 68 ఏళ్ళ చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పరిణతి లేని నేతగా వ్యవహరిస్తున్నారు. మే 23న ఆయన అనుమానం నిజమైతే ఏమి చేస్తారోనని ఆందోళనగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -కె. రామచంద్రమూర్తి -
ఆచితూచి వేయాలి ఓటు
ఎన్నికల ప్రచారానికి ఎల్లుండి సాయంత్రం తెరబడుతుంది. కొన్ని వారాలుగా ఎన్నికల ప్రచారం పేరుతో సాగిన రణగొణధ్వని ఆగిపోతుంది. ఓటర్లు ప్రశాం తంగా ఆలోచించి వివేకంతో తమ హక్కు వినియోగించుకునే సమయం ఆసన్న మైంది. ప్రజలకు తగిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యంలో వస్తుందంటారు (People get the government they deserve). ఎందుకంటే ప్రజలు ఎన్ను కున్న ప్రతినిధులే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. కడచిన అయిదేళ్ళ అనుభవం ఆధారంగా మన ప్రతినిధులుగా చట్టసభలకు ఎవరిని పంపించాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాలి. కలమతాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగకుండా, సమాజశ్రేయస్సే పరమావధిగా పరిగణించి ఓటు వేయాలి. అధికారపక్షం, ప్రతిపక్షం, ఇతర పక్షాల నాయకులు ఎన్నికల సభలలో చెప్పింది విన్నాం. అన్ని రకాల ప్రచారాలనూ చూశాం. వివిధ పార్టీల ఎన్నికల ప్రణాళికల (మేని ఫెస్టోల)ను అధ్యయనం చేశాం. ఏ ఎన్నికల ప్రణాళిక జనజీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదం చేస్తుందో, మెరుగైన సమాజ నిర్మాణానికి దారి తీస్తుందో, మౌలిక రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందో, ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే ప్రగతిశీలమైన పరిపాలన అందిస్తుందో గుర్తించాలి. ముఖ్యంగా ఎవరిని విశ్వసించాలో, ఎవరి చేతుల్లో మనలను పరిపాలించే బాధ్యత, అధి కారం పెట్టాలో, ఎవరికి రాష్ట్ర, దేశ సారథ్యం అప్పగించాలో క్షుణ్ణంగా ఆలోచించి సవ్యంగా నిర్ణయించుకోవాలి. గురువారంనాడు (11వ తేదీ) జరిగే పోలింగ్లో పొరపాటు చేస్తే వచ్చే అయిదు సంవత్సరాలూ కష్టనష్టాలు అనుభవించక తప్ప దనే వాస్తవాన్ని గ్రహించాలి. సరైన నిర్ణయం తీసుకుంటే ఆశలూ, ఆకాంక్షలూ కార్యరూపం ధరించే అవకాశం ఉంటుంది. విధానాల కంటే వ్యక్తులే ప్రధానం బ్రిటన్లో వలె మన దేశంలోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ పార్టీలూ, సిద్ధాంతాలూ, మేనిఫెస్టోల కంటే నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల మాదిరి లోక్సభ ఎన్నికలలోనూ, చాలా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ పోటీ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాని పదవికి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రధాన అభ్యర్థులు. ఫెడరల్ ఫ్రంట్ నిర్ణాయక పాత్ర పోషించవచ్చు. కానీ వారిద్దరితో పోల్చదగిన స్థాయిలో మరో నాయకుడు లేడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడువుకంటే ముందే జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధించింది. అక్కడ లోక్సభ ఎన్నికలే జరుగుతున్నాయి. అంతగా సందడి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో సామాన్య ప్రజలతో మమేకమై, వారి బాధలనూ, సమస్యలనూ అవగాహన చేసుకున్నారు. ప్రతి సామాజికవర్గం ప్రతినిధులనూ కలుసుకొని వారు చేసిన అభ్యర్థనలను ఆలకించి వారి సమస్యలు పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేశారు. పాదయాత్ర అనంతరం ఎన్నికల ప్రచారం ఆరంభించిన జగన్ ఎన్నికల సభలలో హుందాగా, సకారాత్మకంగా, ప్రభావవంతంగా ప్రసంగాలు చేస్తున్నారు. కడచిన నాలుగేళ్ళ పది మాసాలలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం పని చేసిన తీరును నిశితంగా విమర్శించారు. సహజంగానే ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు కనుక ఆయనపైనే ప్రధానంగా ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని ప్రజలు ఎన్ను కుంటే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలూ, అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టేది సవివరంగా చెప్పారు. రెండు వారాలుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి కూడా శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. పాద యాత్రలో భాగంగానూ, ఎన్నికల ప్రచారంలో భాగంగానూ జరిగిన జగన్ సభలకు పోటెత్తిన జనం అధికారపక్ష నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. విజయమ్మ, షర్మిల సభలకు సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం విశేషం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రచారానికి పూర్తి భిన్నంగా అధికార టీడీపీ ప్రచారం జరిగింది. టీడీపీ అధినాయకుడిది ఆద్యంతం నకారాత్మక శైలి. అధి కారంలో దాదాపు అయిదేళ్ళు ఉన్నప్పటికీ ప్రజలకు చూపించేందుకు సాధించిన విజయం ఒక్కటీ లేదు. అమరావతి డిజైన్ల స్థాయిలోనే ఆగిపోయింది. ఖరీదైన తాత్కాలిక భవనాలు మినహా శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక పేర్చింది లేదు. ఏటా మూడు పంటలు పండే భూములు నాలుగేళ్ళుగా నిష్ఫలంగా పడి ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించి, అరవై శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు పనులు 2018 వరకూ అంగుళం కదలలేదు. ఇప్పటికీ డ్యామ్ నిర్మాణం జరగలేదు. ఏదీ పూర్తి కాకముందే సంబరాలూ, సందర్శనలూ పేరిట నాలుగైదు వందల కోట్ల వృధావ్యయం. పోలవరం పూర్తి చేస్తే నిరర్థకంగా మిగిలే పట్టిసీమ నిర్మాణం కేవలం ముడుపుల కోసమే అని విషయపరిజ్ఞానం ఉన్నవారు వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులంటే చంద్రబాబుకి పెద్దగా శ్రద్ధ లేదని అందరికీ తెలుసు. వ్యవసాయం దండుగ అంటూ మాట్లాడిన వ్యక్తి ఆయన. చేసింది రవ్వంత, ప్రచారం కొండంత. కొన్ని చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం, దానికి ప్రచారం చేయించుకోవడం ఆయన ప్రత్యేకత. చేతివాటం విచ్చలవిడిగా సాగింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయం పెంపుదల అడ్డగోలుగా జరిగింది. ప్రతిపక్షం అంటే శత్రుభావం బీజేపీతో ఏకీభవించనివారిని ఎన్నడూ శత్రువులుగా, దేశద్రోహులుగా పరిగణిం చలేదని బీజేపీ వ్యవస్థాపకుడు లాల్కృష్ణ అడ్వాణీ తన బ్లాగ్లో రాసుకున్న వ్యాఖ్య నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకీ వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువగా చంద్రబాబుకి వర్తిస్తుంది. ప్రతిపక్షం అంటే శత్రుభావం, ఈసడింపు, ద్వేషం చంద్రబాబు ప్రతి మాటలో, ప్రతి కదలికలో స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అబద్ధపు అరోపణ చేసి, అదే ఆరోపణను పదేపదే తాను చేసి, తనవారిచేత చేయించి ప్రతిపక్ష నాయకుడినీ, ఇతర ప్రతిపక్ష సభ్యులనూ కించపరచడం, ఎద్దేవా చేయడం, అప్రతిష్టపాలు చేయడం ఆయనకు ఇష్టమైన క్రీడ. చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన ఇద్దరు ఉన్నతాధికారులు పదవీ విరమణ తర్వాత ముఖ్యమంత్రినీ, ఆయన చుట్టూ ఉన్న అధికార, అనధికార ప్రముఖులను అవినీతి అనకొండలుగా అభివర్ణించిన సందర్భం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత వరకూ లేదు. పైగా ఒకే సామాజికవర్గానికి చెందినవారి నియంత్రణలో ప్రభుత్వం నడుస్తున్నదని ఐఏఎస్ అధికారులు ఆరోపించడం అసాధా రణం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన క్షణంలోనే ఆరంభించిన ఆత్మస్తుతీ, పరనిందా ఎన్నికల ప్రచారంలో పతాకస్థాయికి చేరుకున్నది. నిర్హేతు కమైన విమర్శల శ్రుతి హెచ్చింది. వాగ్దాడుల తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో కనీస మర్యాదలనూ, సంప్రదాయాలనూ తుంగలో తొక్కారు. నోటికి వచ్చిన ఆరోపణలు సంధిప్రేలాపనల స్థాయికి దిగజారాయి. ప్రతిపక్ష నాయకుడిని అవినీతిపరుడనీ, రౌడీ అనీ, హంతకుడనీ, దొంగలముఠా నాయకుడనీ, నోటికి వచ్చిన మాటలన్నీ మొరటుగా మాట్లాడటం చంద్రబాబును ఇంతవరకూ గౌర వించినవారికి కూడా అసహ్యం కలిగిస్తున్నది. పులివెందుల, కడప జిల్లా ప్రజ లను పదేపదే రౌడీలంటూ ముద్రవేయడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని మతిలేని పని. ఆయన దేహభాష సైతం అభ్యంతరకరంగా ఉంటున్నది. తనకు మరోసారి అధికారం ఎందుకు ఇవ్వాలో, అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ఏమి చేశారో, భవిష్యత్తులో ఏమి చేయబోతారో ప్రజలకు వివరించాలి. జగన్నీ, తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునీ, ప్రధాని మోదీనీ విలన్లుగా చిత్రించి, వారిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ద్వేషభావం పెంచి ఓట్లు సంపాదించా లని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురినీ దుర్భాషలాడుతు న్నారు. అబద్ధాలు అదే పనిగా చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన వెంటనే నరేంద్రమోదీ, కేసీఆర్ కూడబలుక్కొని ‘ఓటుకు కోట్ల కేసు’ను తిరగ దోడినా, పోలవరం నిధుల గోల్మాల్ విషయంలో, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణంలో, సింగపూర్తో అక్రమసంబంధాలపైన విచారణ జరిపించినా కథ మరో రకంగా ఉండేది. రాష్ట్రంలో ఎవరిపైన ఐటీ దాడులు జరి గినా ముఖ్యమంత్రి ఉలిక్కి పడుతున్నారు. తన మీద ఈగ వాలకుండానే మీడియా సహకారంతో తనకు ఘోరమైన అన్యాయం జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్న చంద్రబాబును నిజంగా ముట్టుకుంటే మిన్ను విరిగి మీదపడినట్టు గగ్గోలు పెట్టి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని మోదీకి తెలుసు. సీమాంధ్ర సమావేశాలలో ప్రధాని మాట్లాడుతూ ‘యూ– టర్న్బాబూ’ అంటూ సెటైర్లు వేయడం తప్పించి ముఖ్యమంత్రికి నష్టం కలిగించే ఆరోపణలు ఏమీ చేయలేదు. చర్యలు అసలే లేవు. మోదీకి ఎన్నికలైన తర్వాత ఎవరికి ఎంపీ స్థానాలు ఎక్కువ ఉంటే వారితోనే పని. అన్ని సర్వేలూ వైఎస్ ఆర్సీపీకి 19 నుంచి 22 వరకూ ఎంపీ స్థానాలు వస్తాయని స్పష్టం చేస్తున్న ప్పటికీ, ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా చంద్రబాబును మోదీ ఎందుకు దూరం చేసుకుంటారు? అనరాని మాటలు అని రాహుల్గాంధీ నివాసానికి వెళ్ళి శాలువా కప్పిన వ్యక్తి మోదీ పంచన మళ్ళీ చేరరని పూచీ ఏమున్నది? ఎవరి సంస్కారం ఏపాటిది? కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేతులు కలిపి తనపైన సీబీఐని ప్రయోగించి, బూటకపు కేసులు బనాయించి, జైలులో పెట్టించి, పదహారు మాసాలు బెయిల్ రాకుండా చేసినప్పటికీ ఆ నాయకుల గురించి జగన్ ఒక్కసారైనా పరుషంగా మాట్లాడలేదు. పైగా కాంగ్రెస్ నాయకులను మనస్పూర్తిగా క్షమించానని ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యువ నాయకుడు అత్యంత సంయమనం, హుందాతనం, మర్యాద, సంస్కారం ప్రదర్శిస్తుంటే దేశంలోనే సీనియర్ నాయకుడినంటూ చెప్పుకునే ముఖ్యమంత్రి ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అభి లషణీయం కాని ఒక విధానంపైన కానీ ఒక కార్యక్రమంపైన కానీ, ఒక ధోరణిపైన కానీ ఎవరిని ఎంత కటువుగా విమర్శించినా అర్థం చేసుకోవచ్చు. ధర్మాగ్రహం ప్రదర్శించినా ఒప్పుకోవచ్చు. కేవలం రాజకీయ లబ్ధికోసం అడ్డదారులు తొక్కుతూ ఇంత నైచ్యానికి ఒడిగట్టడం అవసరమా? ప్రభుత్వ ఖజానా నుంచి రూ 8000 కోట్లు అన్నదాతా సుఖీభవ పథకం కింద పోలింగ్ వారంరోజుల వ్యవధి ఉన్నాయనగా రైతుల ఖాతాలలో జమచేసినట్టు బహి రంగసభలో ప్రకటించిన చంద్రబాబుకి చట్టాల పట్లా, రాజ్యాంగం పట్లా ఏ మాత్రం విశ్వాసం లేదు. వైఫల్యభీతి మాత్రం వెంటాడుతోంది. అడ్డగోలుగా మాట్లాడిస్తోంది. 2014 ఎన్నికలలో జగన్పైనా, పులివెందుల ప్రజలపైనా, కడప జిల్లాపైనా ఏ ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అటువంటి అర్థంపర్థం లేని ఆరోపణ లూ, కట్టుకథలూ, వదంతులూ మళ్ళీ విశ్వసించి మోసపోవడమా లేక జగన్కి ఒక అవకాశం ఇవ్వడమా? ఉగాదినాడు విడుదలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎన్నికల ప్రణాళికలు పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సంక్షిప్తంగా, సమగ్రంగా ఉంది. విద్యకూ, ఆరోగ్యానికీ, వ్యవసాయానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టో 32 పేజీలు ఉంది. అంతటా పునరుక్తి. అయిదేళ్ళ కింద విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోకీ, దీనికీ తేడా లేదు. తాజా మేనిఫెస్టోలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి కూడా నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీ అధికం. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళు నిరుద్యోగుల గోడు పట్టించుకోకుండా, ఆ వైఫల్యానికి క్షమాపణ చెప్పకుండా, అంతకంటే ఖరీదైన హామీ ఇవ్వడం చంద్రబాబు వంటి తెంపరికే చెల్లింది. తాను ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమిస్తు న్నారు. మేనిఫెస్టోలు పోల్చి చూసుకున్న తర్వాత, వారి నడతను పరిశీలించిన అనంతరం ఈ ఇద్దరు నాయకులలో ఎవరి మాటను విశ్వసించాలో, చెప్పిన మాటకు ఎవరు కట్టుబడి ఉంటారో, ఇచ్చిన హామీని ఎవరు నెరవేరుస్తారో, ఎవరి వ్యక్తిత్వం ఏమిటో గ్రహించాలి. ఒక వైపు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో దేశంలోని అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకొని అవకాశవాద రాజకీయాలను అను సరిస్తూ వచ్చిన చంద్రబాబు ఒక వైపు. పదేళ్ళ రాజకీయ జీవితంలో అత్యధిక సమయం మాట మార్చకుండా, మడమ తిప్పకుండా ప్రజల మధ్య గడిపిన యువనాయకుడు మరో వైపు. ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోవాలి. ఈ కసరత్తు చేసిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. కె. రామచంద్రమూర్తి -
లాలూచీ రాజకీయం లాభిస్తుందా?
‘నేను విన్నాను. నేను ఉన్నాను.’ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచార సభలలో ప్రస్ఫుటంగా చెబుతున్న మాటలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరాంగ ణంలో ముగ్గురు యోధులు యుద్ధవిన్యాసాలు చేస్తున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్ర బాబునాయుడికీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డికీ మధ్య సాగుతున్నదే నిర్ణాయక పోరాటం. మూడో యోధుడు పవర్స్టార్ పవన్కల్యాణ్. ఈ ముగ్గు రిలో ఏ నాయకుడు ఏమని అన్నారో సగటు పౌరులు చెవులారా విన్నారు. కళ్ళారా చూశారు. ఎవరు మాట మార్చుతున్నారో, ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారో, ఎవరు సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నారో, ఎవరు బండగా మాట్లా డుతున్నారో, ఎవరు యూటర్న్లు తీసుకుంటున్నారో, ఎవరు రహదారిలో నడుస్తున్నారో తెలుసుకోవడానికి అవసరమైన తెలివితేటలూ, వివేకం పౌరులకు దండిగా ఉన్నాయి. వారికి జ్ఞాపకశక్తి, తెలివి లేవనుకోవడం పొరబాటు. ఏ పార్టీకి ఓటు వేయాలో, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఓటర్లలో అత్యధికులు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు. ముగ్గురు నాయకులూ గడచిన 58 మాసాలలో ఏమేమి అన్నారో, ఏమేమి చేశారో గమనిస్తే ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపు తారో ఊహించడం కష్టం కాదు. గెలుపే గమ్యం, మార్గం అధర్మం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యవహారం చూద్దాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు పని చేసిన అనుభవం కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగిస్తుందనే ఆశతో చంద్రబాబునాయుడిని ప్రజలు గెలిపిం చారు. ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరువం దల పైచిలుకు వాగ్దానాలనూ పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారు. 1995లో ఎన్టి రామారావును గద్దె దించిన తర్వాత ప్రపంచబ్యాంకును మెప్పించాలనే రంధిలో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. 1999లో సైతం ఎన్నికల ప్రణాళికను అటకపైన పెట్టి విద్యుత్ సంస్కరణల వంటి అప్రకటిత కార్యక్రమాలు అమలు చేశారు. ఈ సారీ అంతే. ఎన్నికల సభలలో చెప్పిన పనులు చేయకుండా చెప్పని పనులు చేయడం మొదలు పెట్టారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం అయిదేళ్ళలో అంగుళ మైనా ముందుకు కదలలేదు. శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చ లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్కు ఒడిగట్టి అస్మదీయుల చేత భూములు కొనిపించి వారికి లబ్ది చేకూర్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని విభజన చట్టం నిర్దేశించింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ బాధ్యతను అడిగి నెత్తికెత్తుకున్నది అస్మదీయులకు ప్రయోజనం కలిగించడం కోసమే. అయిదేళ్ళ పదవీకాలం పూర్తవుతున్నా పోలవరం సశేషంగా మిగిలింది. చివరికి దుర్గ గుడి కింద ఫ్లయ్వోవర్ కూడా పూర్తి చేయలేకపోయారు. విజయవాడ నగరంలోకి ప్రవేశించేవారికి అది వెక్కిరిస్తున్నట్టు కనిపించి అసౌకర్యం కలిగి స్తున్నది. రుణాల మాఫీ పూర్తి కాలేదు. పసుపు కుంకుమ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ప్రారంభించారు. చాటుకోడానికి విజయం ఒక్కటీ లేదు. వైఫల్యాలు అనేకం. విద్యార్థుల ఫీజు రీయెంబర్స్మెంట్ కోసం మోహన్బాబు వంటి మాజీ మిత్రుడు ధర్నాకు దిగవలసి వచ్చింది. అంతులేని వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షంపైన దాడులు చేయడం. ప్రతిపక్ష నాయ కుడిపై బురద చల్లడం, వందిమాగధుల చేత అవాకులూచెవాకులూ మాట్లాడించ డమే ఎన్నికల ప్రచారంగా చెల్లుబాటు అవుతోంది. జగన్మోహన్రెడ్డిని ముఖ్య మంత్రి చేస్తే మిన్ను విరిగి మీద పడుతుందంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. శ్రేయోభిలాషులకు సైతం ఎబ్బెట్టుగా కని పిస్తున్నాయి ఆయన చర్యలు. 2014లో నరేంద్రమోదీ హవా, పవన్కల్యాణ్ ‘పుల్’, టీడీపీ బలం కలిస్తేనే ప్రతిపక్షం కంటే కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది. అప్పటికి చంద్రబాబు పట్ల వ్యతిరేకత లేదు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి జనాదరణ విశేషంగా పెరిగింది. ఒకప్పుడు మోదీ మహా నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తిన చంద్రబాబు మోదీ హవా తగ్గిపోయిందని అంచనా వేసి ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. మోదీ వ్యతిరేకతను రాష్ట్రంలో సృష్టించి ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలలో గెలుపొందాలని ఆశిం చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తెలుగువా రిని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇంతలో పుల్వామాలో సైనిక శకటాలపైన ఉగ్రదాడి జరగడం, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం, కొద్ది రోజుల తర్వాత భారత వైమానికి దళానికి చెందిన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించడం జరిగింది. ఈ పరి ణామాలను తన దేశభక్తికీ, తన ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమంటూ మోదీ ప్రచారం చేసుకోవడం, ప్రధానిగా కొనసాగడం తథ్యం అంటూ జనాభిప్రాయం బలపడటం చంద్రబాబును పునరాలోచనలో పడవేసింది. వెంటనే మోదీపైన దాడి తీవ్రతను పూర్తిగా తగ్గించారు. చంద్రబాబు తెలంగాణలో రాహుల్ గాంధీతో కలసి చెట్టపట్టాలేసుకొని ఎన్నికల ప్రచారం చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ‘నేను కావాలా, చంద్ర బాబు కావాలా?’ అంటూ ప్రశ్నించి ప్రజల సంపూర్ణ మద్దతు పొందారు. అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించాలనీ, కేసీఆర్ని విలన్గా చిత్రించా లనీ, ఆయనకు జగన్ బంటుగా వ్యవహరిస్తున్నారని జనాన్ని నమ్మించాలనీ ప్రయత్నం ముమ్మరం చేశారు. అందుకే చంద్రబాబు ప్రతి సభలో జగన్ నామ స్మరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి రహస్య ఒప్పందం ఉంది. కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, పనబాక లక్ష్మి వంటి ఎంతోకొంత ప్రజా దరణ కలిగిన నాయకులు టీటీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేగువేరా–చంద్రబాబు రెండో వీరుడు పవన్కల్యాణ్. ఆయన అగ్రజుడు మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. పవన్ రాజకీయాలలో ప్రవేశిం చినప్పుడు చేగువేరా అభిమాని. ఇప్పుడు చంద్రబాబు అనుయాయి. వామపక్ష భావజాలాన్ని అభిమానించే వ్యక్తిగా, గద్దర్ వంటి విప్లవ నాయకుల మిత్రుడుగా పరిగణన పొందిన పవన్ రాజకీయాలలో అడుగు పెడుతూనే బీజేపీతో కలసి ప్రయాణం చేయాలని సంకల్పించడమే విడ్డూరం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక సందర్భాలలో ఆయన పిల్లిమొగ్గలు వేశారు. లోకేష్పైన అవినీతి ఆరోప ణలు చేసి ఆ తర్వాత మౌనం పాటించారు. మంగళగిరిలో లోకేశ్ పైన పోటీకి జనసైనికుడిని పెట్టకుండా సీపీఎం అడిగిన టిక్కెట్టును సీపీఐకి ఇచ్చారు. లోకేశ్కి ఇబ్బంది లేకుండా చూసేందుకే చంద్రబాబు అభీష్టం మేరకు జనసేన, సీపీఎం అభ్యర్థులను రంగంలో దింపలేదన్నది సామాన్య పౌరులకు సైతం తెలిసిపో తోంది. చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ అంతే. అతనిపైన ఉద్యమం నిర్వహించి నిప్పులు కక్కిన పవన్ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చి చింతమనేని విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో సత్యవతి అనే బీసీ మహిళను జనసేన అభ్యర్థిగా నిలబెట్టారు. విశాఖ, అమలాపురం, నరసాపురం లోక్సభ స్థానాలు జనసేనకు దక్కేటట్టు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ నియోజకవర్గాలలో బలహీనమైన టీడీపీ అభ్యర్థులను నిలబెట్టారు. విశాఖలో (జేడీ) లక్ష్మీనారాయ ణను గెలిపించాలన్నది చంద్రబాబు అభిమతం. బాలకృష్ణ ఒత్తిడి భరించలేక ఆయన రెండో అల్లుడూ, లోకేశ్ తోడల్లుడూ, దివంగత ఎంవీఎస్ మూర్తి మనుమడూ అయిన భరత్కు టిక్కెట్టు ఇచ్చినప్పటికీ టీడీపీ శ్రేణులు జనసేన అభ్యర్థి విజయానికే కృషి చేస్తాయని అంటున్నారు. అమలాపురంలో హర్షకుమా ర్కి టీడీపీ టిక్కెట్టు ఇస్తే జనసేన అభ్యర్థి శేఖర్ (ఓఎన్జీసీ మాజీ డైరెక్టర్)కు గట్టిపోటీ ఇస్తారని భావించి బాలయోగి కుమారుడికి టీడీపీ టిక్కెట్టు ఖరారు చేశారు. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని టీడీపీ అభ్యర్థిగా నిర్ణయిం చారు. ఆ తర్వాత సుబ్బారాయుడి స్థానంలో సంపన్నుడైన చైతన్యరాజును బరిలోకి దింపారు. కొంతకాలం ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ఆయననీ పక్కనపెట్టి ఉండి శాసనసభ్యుడు శివరామరాజును అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మ్యాచ్ఫిక్సింగ్ల ఫలితంగా జనసేన అభ్యర్థులు ఖాయంగా గెలుస్తారని కాదు. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉన్నదని ఇటువంటి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. గాజువాక సీటును సీపీఎం అడిగింది. అక్కడ ఉద్యమాల నాయకుడు నరసింగరావును నిలబెట్టాలన్నది సీపీఎం ఉద్దేశం. పవన్ స్వయంగా ఆ సీటును వరించినప్పుడు వామపక్షాలు ఏమి చేయగలవు? మాయావతికి మూడు లోక్సభ స్థానాలూ, 21 శాసనసభ స్థానాలూ కేటాయించడం చంద్ర జాలంలో భాగమే. వామపక్షాలకు చెరి రెండు లోక్సభ స్థానాలూ, ఏడేసి అసెంబ్లీ స్థానాలూ కేటాయించారు. ఇది స్థానికంగా కొద్దోగొప్పో ఉనికి కలిగిన వామ పక్షాలను అవమానించడమే. సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్సభ నియోజక వర్గంలోనూ, నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ జనసేన అభ్యర్థులను ప్రకటించినట్లు తాజా సమాచారం. లాలూచీ రాజకీయానికి ఇది పరాకాష్ట. వైఎస్ఆర్సీపీకి పడే కాపు, దళిత ఓట్లను చీల్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. కానీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో, బీ–ఫారాలు ఎవరు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. ఉత్తరాది, దక్షిణాది వైరుధ్యం గురించి గంభీర ప్రసంగాలు చేసిన పవన్ పనిగట్టుకొని లక్నో వెళ్ళి మాయావతిని కలుసుకోవడం, పొత్తు పెట్టుకో మని అడగడం, ఆమె ప్రధాని కావాలని తాను అభిలషిస్తున్నట్టు చెప్పడం కపట రాజకీయానికి నిదర్శనం. స్వయంగా సినిమా నటుడు కనుక స్క్రిప్టు చదవడం సుఖంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారనే వ్యాఖ్య చేసినందుకు పవన్కల్యాణ్ను తెలుగు జాతి క్షమించదు. పవన్ లోగడ తన సినిమా రిలీజైనప్పుడు కేసీఆర్ను కలుసుకున్నారు. ఆయన నాయకత్వం లక్షణాలను పొగిడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తాను టీఆర్ఎస్కే ఓటు వేశానంటూ నాగబాబు ప్రకటించారు. రాజకీయ లబ్ధికోసం రెండు రాష్ట్రాల మధ్య ద్వేషం రగిలించే వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ వంటి వ్యక్తి చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రవాహానికి ఎదురీదిన నేత మూడో యోధుడు జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికలకు ముందు సోనియా గాంధీని ధిక్కరించడం, సొంత పార్టీ పెట్టుకోవడం, ధిక్కారమును సైతునా అంటూ ఆగ్రహించిన సోనియా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం, నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడితో కలిసి పథకం ప్రకారం జగన్పైన బూటకపు కేసులు పెట్టించడం, దర్యాప్తు పేరుతో 16 మాసాల పాటు జైలులో నిర్బంధించడం చరిత్ర. 2014 ఎన్నికలలో శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు అధైర్య పడలేదు. నిరాశ చెందలేదు. కుంగిపోలేదు. 2019 ఎన్నికలకు అప్పటి నుంచే సన్నాహాలు ఆరంభించారు. పార్టీని పటిష్టంగా నిర్మించారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. కోట్ల మంది ప్రజలను కలుసుకొని వారి సమస్యలు ఆలకించారు. తనపైన హత్యాప్రయత్నం జరిగినప్పుడు హుందాగా ప్రవర్తించారు. అధికారపక్షం ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఎజెండాను నెలకొల్పారు. దానికి స్పందించక తప్పని స్థితిలో చంద్రబాబును పడవేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం జగన్ ఆరంభించి కడదాకా కొనసాగిస్తే ముందు హోదా దండగనీ, ప్యాకేజీ మెండుదనీ వాదించి, చివరికి హోదా నినాదంతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించింది. మోదీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా జగన్ ఎజెండాను చంద్రబాబు అనుసరించక తప్పలేదు. వైఎస్ఆర్సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి నప్పుడూ చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. వృద్ధులకు పింఛన్లు పెంచడానికీ, పసుపు కుంకుమ కార్యక్రమానికీ జగన్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలూ, అంతకు మందు పార్టీ ప్లీనరీలో పేర్కొన్న నవరత్నాలే ప్రేరణ. ఎజెండా నిర్ణయిం చిన నాయకుడే మార్గదర్శకుడు. అతడే విజేత. కె. రామచంద్రమూర్తి -
కప్పదాట్లు... కట్టుకథలు!
‘వాట్ ఈజ్ డెమాక్రసీ? సమ్బడీ విల్ గివ్ మనీ, సమబడీ ఎల్స్ విల్ స్పెండ్ దట్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్స్. వాట్ వే ఐ యామ్ కన్సర్న్డ్? (ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. మరొకరు ఎన్నికలలో ఖర్చు చేస్తారు. దీనితో నాకేమిటి సంబంధం?).’ ప్రజాస్వామ్యాన్ని ఇంత సరళంగా, ధనప్రధానంగా నిర్వచించిన మేధావి ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రజాస్వామ్యాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు అది. ప్రజాస్వామ్య వైతాళికులనూ, ప్రపంచ మేధా వులనూ ఉటంకించడం ఆయన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను సమున్నతంగా నిలపాలని త్రికరణశుద్ధిగా ప్రయత్నించే నాయకుల బాపతు కాదు ఆయన. ఆచరణయోగ్యమైన, తనకు అర్థమైన రీతిలో రాజకీయం చేయడం తిరుపతి విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా ఉన్న కాలం నుంచీ చంద్రబాబునాయుడికి బాగా అబ్బిన విద్య. రాజకీయాలంటే వివిధ కులాల మధ్య సమన్వయం సాధిస్తున్నట్టు కనిపిస్తూనే అస్మదీయులకు ప్రయో జనాలూ చేకూర్చుతూ పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడిపించడం అని ఆయన అవ గాహన. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎటువంటి చాణక్యం చేసినా, ఏ నియమం ఉల్లంఘించినా తప్పు లేదనీ, అధికారంలో కొనసాగడానికి అధికార దుర్వినియోగం చేయడానికి సంకోచించనక్కరలేదనీ ఆయన భావిస్తారు. అధి కారం కైవసం చేసుకునే క్రమంలో ఎవరి సహకారం అవసరమైతే వారి సహ కారం తీసుకోవాలనీ, అందుకు ఏ వాగ్దానం అవసరమైతే ఆ వాగ్దానం నిరభ్యం తరంగా చేసేయాలనీ, అధికారం జేజిక్కిన తర్వాత తన మనుషులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏమి చేసినా సమర్థనీయమేననీ నమ్మకం. అధికారం హస్తగతం చేసుకునే క్రమంలో తనకు సహాయం చేసినవారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న పట్టింపు లేదు. మాటపైన నిలబడాలన్న నిబద్ధత లేదు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని గట్టిగా విశ్వసించిన నాయకుడు ఆయన. ఫలితంగా, ఈ రోజు సామాన్యులు ఎవ్వరూ ఎన్నికలరంగం వైపు తేరి పార చూడలేని పరిస్థితి నెలకొన్నది. పదుల కోట్ల రూపాలయలు ఖర్చు చేసిన వారే ఎన్నికల రంగంలో దిగి తమ అదృష్టం పరీక్షించుకోగలరు. సేవానిరతి, నిస్వార్థచింతన, సమాజంపట్ల ప్రేమ, అంకితభావం ఉన్నంత మాత్రాన చాలదు. డబ్బు దండిగా ఉండాలి. ఎన్నికల వ్యవహారం ఇంతగా డబ్బుతో ముడిపడే విధంగా దిగజారడానికి కారణభూతులైన నాయకులలో చంద్రబాబు అగ్రగణ్యులు. అందుకే ప్రజాస్వామ్యాన్ని ధనభూయిష్టంగా అంత అలవోకగా నిర్వచించగలిగారు. మన సులోని మాట అప్రయత్నంగానే బయటికి వస్తుంది. రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో, తన పరిమితులను తెలుసుకొని వాటిని అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆయన దిట్ట. ఏ ఎన్నికలలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో, ఎవరిని చేరదీయాలో, ఎవరిని దూరంగా పెట్టాలో తెలిసిన వ్యక్తి. ఆయనకు పరాజయం అంటే భయం. అభద్రతాభావం, వైఫల్యభీతి ఆయనను ఎల్లప్పుడూ వెన్నా డుతూ ఉంటాయి. ప్రతిక్షణం, ప్రతిరోజూ తానే గెలుపొందాలనీ, అందుకోసం ఏమైనా సరే చేసేయాలనీ ఆయన భావిస్తారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే గెలిచినా, ఓడినా పెద్దగా ప్రభావం వేయని ఉప ఎన్నికలో గెలిచేందుకు ఆయన అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపుతారు. పది మంది మంత్రులనూ, పాతికమంది ఎంఎల్ఏలనూ, డబ్బు సంచులనూ ఉపఎన్నిక జరు గుతున్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పరుగులు పెట్టించి ఘనవిజయం సాధిస్తారు. ఇందుకు నంద్యాల ఉపఎన్నిక తాజా ఉదాహరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలలో కాంగ్రెస్ చావుదెబ్బ తినడంలో తన ప్రమేయం ఉన్నప్పటికీ అసలు తెలం గాణలో ఎన్నికలు జరగనట్టూ, తాను ప్రచారం చేయనట్టూ మాట్లాడతారు. నీతినియమాలకు తిలోదకాలు రాజకీయాలలో నాయకులుగా జయప్రదంగా కొనసాగుతున్నవారందరికీ గొప్ప తెలివితేటలూ, మేధాసంపత్తీ ఉండాలన్న నియమం లేదు. సమాచారం తెలి సినవారితో సంపర్కం పెట్టుకొని వారి ఆలోచనలను సొంతం చేసుకొని తమ ఆలోచనలుగా చెప్పుకుంటూ ప్రజలను నమ్మించే నేర్పు కొందరికి ఉంటుంది. నియమనిబంధనలనూ, నీతీనిజాయితీలనూ తప్పకుండా కష్టపడి రాజకీయా లలో పైకి వచ్చిన నాయకులు కొందరు ఉంటారు. నియమాలతో నిమిత్తం లేకుండా నీతిని పట్టుకొని వేళ్ళాడకుండా విజయం సాధించడానికి ఏది అవ సరమైతే అది చేసి అధికారం సంపాదించి పదవులలో చాలా సంవత్సరాలు ఉన్నవారూ లేకపోలేదు. వీరికి అసాధారణమైన పోటీ మనస్తత్వం ఉంటుంది. అభద్రతాభావాన్ని కప్పి పుచ్చడానికీ లేదా అధిగమించడానికీ బుకాయించడం, దబాయించడం, స్వోత్కర్షకు దిగడం ఆనవాయితీ. కళ్ళెగరవేస్తూ, చూపుడు వేలుతో ఛాతిని చూపిస్తూ తాను ఎవ్వరికీ భయపడననీ, ఎవ్వరికీ లొంగే ప్రసక్తి లేదనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందిని చూశాననీ ప్రకటనలు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో తప్పు చేసి ఇతరులపైన తోసి అడ్డంగా దబాయిస్తూ ఉంటారు. అటువంటి ఘటనలలో డేటా చౌర్యం ఒకటి. మా సమాచారం దొంగిలించి మాపైనే దాడులు చేస్తారా?, ‘మా డేటాను దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు?,’అంటూ కేసీఆర్ని ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పట్టుబడి విజయవాడకు పలాయనం చిత్తగించిన సమయం లోనూ ఇదే వరుస. ‘మీకు పోలీసులు ఉన్నారు. మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది,’అంటూ రభస. డేటా చౌర్యం కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం తొమ్మదిమంది అధికారులతో ఒక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్) నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తొమ్మి దిమందితో ఒక సిట్ నియమించింది. తెలంగాణ సర్కార్ ఒక సిట్ నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సిట్లు నియమించింది. పైగా, తన రాజకీయ జీవితంలో నడవడిక (కేరెక్టర్)కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానంటూ చెప్పు కుంటారు. ఇంతవరకూ చంద్రబాబు పేరున కానీ లోకేశ్ పేరు మీద ఉన్న సంస్థ లపైన కానీ ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, సీబీఐ దాడులు నిర్వహించలేదు. నోటీసులు సైతం ఇవ్వలేదు. అక్రమాలు చేసినట్టు అను మానించిన సంస్థలపైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా ఆ సంస్థలు అక్ర మాలు చేయకపోతే వాటికి నష్టం జరగదు. మరి తనను మానసికంగా వేధిస్తు న్నారంటూ చంద్రబాబు ఎందుకు మనస్తాపం చెందుతున్నారు? అక్ర మంగా ఓటర్ల వ్యక్తిగత వివరాలను అపహరించిన సంస్థపైన వచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు స్పందిస్తే దానిని రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ మంటూ అభివర్ణించడం దేనికి? ఆంధ్రప్రదేశ్లో 3.6 కోట్ల మంది ఓటర్ల కలర్ ఫొటోలతో సహా సకల వ్యక్తిగత వివరాలు రాష్ట్రప్రభుత్వం సేకరించి ఐటీగ్రిడ్స్ అనే సంస్థకు ఎందుకు అప్పగించిందో చంద్రబాబునాయుడు తెలిసినా చెప్పరు. ఎన్నికల కమిషన్ వద్ద మాస్టర్ కాపీలో మాత్రమే ఉండవలసిన ఓటర్ల కలర్ ఫొటోలు బ్లూఫ్రాగ్, ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకూ, సేవామిత్ర వంటి యాప్లకూ ఎట్లా లభించాయో వెల్లడించరు. ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ అనే వ్యక్తి రెండు, మూడు రోజుల్లో అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పి బయటకు వస్తారని చెబుతారు. అంటే అశోక్ను ఎక్కడ దాచారో ముఖ్యమంత్రికి తెలుసని అనుకోవాలి. తెలంగాణ పోలీసులు వెతుకుతున్న నిందితుడికి ఒక ముఖ్యమంత్రి రక్షణ కల్పించడం చట్టవిహితమా? చంద్రబాబు రాజకీయం అవకాశవాదానికి పరాకాష్ఠ. ప్లేటు మార్చిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పట్ల ప్రజలలో ఆదరణ తగ్గినట్టు కనిపించింది. బీజేపీని మోయడం కంటే ఆగర్భశత్రువైన కాంగ్రెస్తో కరచాలనం లాభదాయకమని భావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్తో ఒప్పందం క్షేమదాయకం కాదని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉండదు కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పని చేస్తాయని ప్రకటించారు. మొన్నటి వరకూ చంద్రబాబు తీవ్రస్వరంతో మోదీని విమర్శించేవారు. సవాలు చేసేవారు. ఆయన కంటే తాను సీనియర్నంటూ పదేపదే చెప్పేవారు. తనకూ, మోదీకీ మధ్య పోరాటం జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేవారు. ఢిల్లీ, కోల్కతా తదితర నగరాలకు వెళ్ళి ప్రతి పక్షాలకు సంఘీభావం ప్రకటించేవారు. జగన్మోహన్రెడ్డికి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)ల రహస్య మద్దతు ఉన్నదంటూ పదేపదే ఆరోపించారు. అంతలోనే సీను మారింది. చంద్రబాబునా యుడు ప్లేటు కూడా మారినట్టుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో భారత వాయుసేన దాడి చేసిన తర్వాత జరుగుతున్న ప్రచారం ఫలితంగా మోదీ పైచేయి సాధించారనీ, ఆయన ప్రధాని పదవిలో కొనసాగే అవకాశం ఉన్నదనే అభిప్రాయం దేశప్రజలలో బలపడింది. ఇది గ్రహించిన చంద్రబాబు ఎందుకైనా మంచిదని మోదీపైన దాడులు తగ్గించారు. కేసీ ఆర్పైనా, తెలంగాణ పోలీసులపైనా ధ్వజమెత్తడానికి తాజాగా వెల్లడైన డేటా కుంభకోణాన్ని వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డేటాను తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్స్ నుంచి తస్కరించి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీకి ఇచ్చారంటూ సరికొత్త దాడికి తెరదీశారు. తాను కావాలో, కేసీఆర్ కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాలంటూ పిలుపు ఇచ్చారు. ఇటువంటి వాక్యాలే ఎక్కడైనా వినినట్టు పాఠకులకు అనిపిస్తే అది వారి తప్పు కాదు. నాలుగు మాసాల కిందట తెలం గాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఇటువంటి ప్రశ్నే అడిగారు. తాను కావాలో చంద్రబాబు కావాలో కోరుకోమని ప్రజలకు పిలుపు నిచ్చారు. వారు నిర్ద్వంద్వంగా కేసీఆర్ కావాలనే సంకల్పం ప్రకటించారు. అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు. తెలంగాణలో చంద్రబాబునాయుడు ప్రచారం చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ప్రచారం చేయబోరు. చంద్రబాబులాగా పొరుగు రాష్ట్రంలో చక్రం తిప్పాలనే దురాశ కేసీఆర్కు లేదు. అయినా సరే, ఏదో ఒక విధంగా ప్రజలలో భావావేశం రగిలించాలని చంద్రబాబు తాపత్రయం. ఇందుకోసం డేటా చౌర్యం ఉదంతాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం. వృధాప్రయాస శనివారం అంతటా చంద్రబాబునాయుడు అసాధారణమైన అంశాలు వెల్లడిం చబోతున్నట్టు అనుకూల మీడియాలో ఊదర కొట్టారు. చివరికి సుదీర్ఘ మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంలో కొత్త అంశం ఏమీ లేదు. ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టుకొని అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నట్టు పేజీ నంబర్లు చెబుతూ, కొన్ని వాక్యాలు చదువుతూ చాలా ముఖ్యమైన విషయం కనిపెట్టినట్టు హడావిడి చేశారు. అంతా హుళక్కి. విజయసాయిరెడ్డి ఫిర్యాదు రహస్యం కాదు. అది బహిరంగ పత్రం. ‘అంతా విజయసాయిరెడ్డి చెప్పినట్టే జరుగుతోంది,’అంటూ, ‘దొంగతనాలు జరగవచ్చు, దాడులు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి,’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రబాబు మీడియా సమావేశాన్ని అపహాస్యం చేశారు. అంతకు ముందు ఒక సారి ‘మీ ఇంట్లో ఆడపిల్లను ఎత్తుకొని పోవచ్చు,’ అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లా డవలసిన తీరేనా ఇది? ప్రజల వివేకాన్ని అంత తక్కువగా అంచనా వేయడం తప్పు. ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరు ఓటర్ల సమాచారం సేకరించారో. ఓటర్ల బ్యాంకు ఖాతాల, లావాదేవీల వివరాలు సమస్తం ఒక బినామీ ప్రైవేటు కంపెనీకి ఎట్లా కట్టబెట్టారో, ఆ వివరాలను సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో, ఓట్లు ఎట్లా తొలగిస్తున్నారో అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు ప్రజలు. దొంగతనాలూ, దాడులు జరగకుండా నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా ప్రజలకు తెలుసు. వైఫల్య భీతి చంద్రబాబు చేత అసంబద్ధమైన, నిరాధార మైన ఆరోపణలు చేయిస్తున్నది. ముఖ్యమంత్రి పథకం ప్రకారం ఆవేశపడుతున్నారు కానీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. 2004, 2009లో లాగానే ఈసారి కూడా చంద్రబాబునాయుడు ఎత్తుగడలు ఫలించకపోవచ్చు. ప్రజలలో వ్యతిరేకత బలంగా ఉన్నట్టు సమా చారం. స్వయంకృతం. కె. రామచంద్రమూర్తి -
యుద్ధం కాదు పరిష్కారం
ప్రతి చర్యకూ ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుందని పాకిస్తాన్కూ, ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించుకొని, ఆ దేశ సైనిక వ్యవస్థ ప్రోత్సాహంతో కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకూ స్పష్టం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమయింది. 2016లో ఉడీ సైనిక స్థావరంపైన ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. పక్షం రోజుల కిందట పుల్వామాలో అదిల్ అహ్మద్ దార్ అనే ఇరవై సంవత్సరాల కశ్మీరీ యువకుడు మానవబాంబుగా మారి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) ప్రయాణిస్తున్న ట్రక్కుల శ్రేణిపై దాడి చేసి తాను పేలిపోయి 40 మంది జవాన్ల మరణానికి కారకుడైనాడు. ఈ దాడి తమ సంస్థ పనేనంటూ జైషే హంతకముఠా నాయకుడు మసూద్ అజహర్ ప్రకటించాడు. ఇందుకు ప్రతీకా రంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు సరి హద్దు దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి జైషే ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసి సుమారు 300 మంది ఉగ్రవాదులనూ, వారి శిక్షకులనూ, కమాండర్లనూ మట్టుబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇందుకు సమాధానంగా పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి రాగా వాటిని భారత్ మిగ్ యుద్ధవిమానాలతో ఎదుర్కొని వెనక్కు పంపింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన ఒక ఎఫ్–16 విమానాన్ని మన యుద్ధవిమానాలు కూల్చివేయగా, మన మిగ్ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధవిమానాలు పడగొ ట్టాయి.భారత యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూలుతున్న మిగ్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దిగి పాక్ సైనికులకు బందీగా చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను యుద్ధఖైదీగా పరి గణించి గౌరవంగా చూడాలనీ, భారత్కు అప్పగించా లనీ నరేంద్రమోదీ ప్రభు త్వం డిమాండ్ చేసింది. శాంతికోసం అభినందన్ను భారత్కు అప్పగిస్తానంటూ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి అభినందన్ భారత్ గడ్డపైన భద్రంగా అడు గుపెట్టాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు క్లుప్తంగా ఇవి. యుద్ధమేఘాలు సరిహద్దుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పరం కాల్పులు జరుపు కుంటూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. అందుకు భారత్, పాకిస్తాన్ ప్రజలే కాకుండా దక్షిణాసియా ప్రజలూ, అంతర్జాతీయ సమాజం కూడా సంతోషించాలి. పక్షం రోజులుగా భారత్, పాకిస్తాన్ల మధ్య సంభవి స్తున్న పరిణామాలు అసాధారణమైనవి. ప్రమాదకరమైనవి. ఆందోళనకరమై నవి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధవిమాన దాడులు జరగడం ఇదే ప్రథమం. 1971 తర్వాత భారత్, పాక్ యుద్ధవిమానాలు తలబడి పూర్తి స్థాయి సంప్రదాయ యుద్ధ ప్రమాదాన్ని భారతీయుల, పాకిస్తానీల గడప వరకూ తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్లో తిష్టవేసిన పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపేందుకు భారత యుద్ధం చేయవలసి వచ్చింది. అది పరిమితమైన లక్ష్యంకోసం జరిగిన పోరాటం. 2008లో ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసినా, అంతకు ముందు 2001లో మన పార్లమెంటు భవనంపైన ఉగ్ర పంజా విసిరినా హెచ్చరికలకూ, దౌత్య చర్యలకే భారత ప్రతిస్పందన పరి మితమైనది కానీ ప్రతీకార దాడులు చేయలేదు. 1999లో సరిహద్దు పొడవునా సైన్యాన్ని మోహరించారు కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం,’ అని భారత్ కార్యాచరణ రూపంలో స్పష్టం చేసింది మోదీ హయాంలోనే. దీని ఫలితం ఆశించినట్టు ఉన్నదా? ఉగ్రవాదులు వెనుకంజ వేశారా? పాకిస్తాన్ జంకుతున్న లక్షణాలు కనిపి స్తున్నాయా? ఉగ్రవాదులను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిం చిన దాఖలాలు ఉన్నాయా? నాలుగు ప్రశ్నలకూ లేదనే జవాబు. నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ దాకా ప్రధానులందరూ కశ్మీర్ అంతర్గత వ్యవహారమనీ, పాకిస్తాన్తో భారత్ ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుం టుందనీ, మూడో పక్షం జోక్యాన్ని ఆమో దించబోమనీ కరాఖండిగా చెబుతూ వచ్చారు. సిమ్లాలో ఇందిరాగాంధీ, భుట్టోల మధ్య కుదిరిన ఒప్పందం కూడా అదే. మెరుపుదాడుల వల్లా, యుద్ధవిమానాల ప్రయోగం వల్లా ఏమి జరిగింది? ప్రపంచంలోని అన్ని దేశాలూ శాంతి, శాంతి అంటున్నాయి. నిగ్రహం పాటించాలని కోరుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తే స్పందించవ లసిన అగత్యం, హక్కు అన్ని దేశాలకూ ఉంటుంది. ఇప్పుడు కశ్మీర్ అంతర్జా తీయ సమస్యగా మారింది. పాకిస్తాన్కు దౌత్యపరమైన మద్దతు తగ్గింది. ఉగ్ర వాదానికి పాకిస్తాన్ బలమైన స్థావరంగా మారిందనే అభిప్రాయం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలలో బలంగా నాటుకున్నది. ఈ ఉగ్రవాదంతో నష్టపోతున్నది భారత్ ఒక్కటే కాదు. ఇరాన్పైనా తాలిబాన్ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ సంగతి సరేసరి. ఆ దేశం మూడు దశాబ్దాలుగా తాలిబన్ దాడులతో, అగ్రరాజ్యాల సైనిక జోక్యంతో, ఆక్రమణలతో, పాకిస్తాన్ ప్రమేయంతో సత మతం అవుతోంది. దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వల్ల భారత్కు ప్రయో జనం ఏమిటి? చైనా అండదండలు ఉన్నంత వరకూ పాకిస్తాన్ దారికి వస్తుందా? అభినందన్ను భారత్కు పంపుతానని ప్రకటించడం ద్వారా ఇమ్రాన్ఖాన్ హుందాగా ప్రవర్తిం చినట్టు కనిపించారు. సైన్యాధికారుల ఆమోదంతోనే... సైన్యం ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భుట్టో, నవాజ్షరీఫ్లకు పట్టినే గతే తనకూ పడుతుందని ఇమ్రాన్కు తెలుసు. సైన్యా ధికారులు సైతం జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని నిర్ణయించి ఉంటారు. చిన్న పొరబాటు జరిగితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఊహిం చుకోవాలని నరేంద్రమోదీకి ఇమ్రాన్ చేసిన సూచన కొట్టిపారవేయదగినది కాదు. పరిమిత దాడులైతే నష్టం కూడా పరిమితమే. సంప్రదాయరీతిలో యుద్ధా నికి రెండు దేశాలూ సిద్ధంగా లేవు. యుద్ధమంటూ జరిగితే మారణహోమం అనివార్యం. అది అణ్వస్త్రయుద్ధానికి దారితీస్తే ప్రళయమే. అందుకే అంతర్జాతీయ సమాజం దీన్ని రెండు దేశాల మధ్య వివాదంగా పరిగణించి చేతులు కట్టుకొని కూర్చోజాలదు. రెండు దేశాల అధినేతలకూ ప్రపంచ దేశాధినేతలు సుద్దులు చెబుతారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోమంటారు. ఒక్క అభినందన్ పాకిస్తాన్ సైనికుల చేత చిక్కితేనే దేశం యావత్తూ ఊపిరి బిగపట్టి అతని విడుదల కోసం నిరీక్షించింది. చైనాతో, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలలో అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాలుగు వందల టీవీ చానళ్ళు ఇటువంటి వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. పరిమిత చర్యలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న వాతావరణం అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి అనుకూలం. ఉద్రిక్తలను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎన్డీఏ నిస్సంకోచంగా చేస్తున్నది. ఇందులో నరేంద్రమోదీ సిద్ధ హస్తుడు. అధి కారపార్టీకి ఆ ప్రయోజనం దక్కకుండా ఎట్లా నివారించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని బలహీన పరచవద్దనీ, సైనికులను అవమానించవద్దనీ ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. జైట్లీ సమరోత్సాహం అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉండగా అమెరికా కమాండోలు పాకిస్తాన్లో రహస్యంగా జీవిస్తున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను హత మార్చినట్టు మన సేనలు కూడా పాకిస్తాన్లో నివసిస్తున్న మసూర్ అజహర్ని అంతం చేయాలని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఇది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేనని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మెరుపు దాడులైనా, పరిమి తమైన యుద్ధవిమానాల ప్రయోగమైనా దేశ ప్రజల ఆవేశాలను తగ్గించడానికీ, ప్రభుత్వం పట్ల, సైన్యం పట్ల విశ్వాసం నిలుపుకోవడానికీ పనికివస్తాయి కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. శాశ్వత శాంతి నెలకొనదు. అసలు సమస్య ఏమిటి? కశ్మీర్లోయలో అశాంతి. ఎన్ని వేల కోట్ల రూపాయలు లోయలో కుమ్మరించినా, ఎన్ని లక్షలమంది సైనికులను మోహరిం చినా, ఎంతమంది ఉగ్రవాదులూ, సాధారణ పౌరులూ, సాయుధబలగాలూ ప్రాణాలు కోల్పోయినా సమస్య క్రమంగా జటిలం అవుతున్నదే కానీ సమసి పోవడం లేదు. కశ్మీర్ సమస్య స్వభావం అటువంటిది. 1990 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్లో 70 వేలమంది పౌరులూ, పోలీసు ఉద్యోగులూ, ఉగ్రవాదులూ మరణించి ఉంటారు. పెల్లెట్ గన్ గాయాలతో అంధులైనవారూ, కాల్పులలో వికలాంగులైనవారూ వేలమంది ఉంటారు. కశ్మీర్ ప్రజల మనోభావాలు ఏమిటో పాకిస్తాన్కు పట్టించుకోదు. భారత్కూడా కశ్మీర్ను కాపాడుకోవాలనే ఆరాటంలో కశ్మీరీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయవలసినంత చేయడం లేదు. సాయుధ బలగాలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎట్లా పరిష్కరించాలో తెలియక ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల దృష్టికోణం నుంచి చూసి వారి సమస్యను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసం ఎవరు చేయగలరు? కశ్మీర్ లోయలో అత్యధికులు కోరుకుంటున్న ఆజాదీ వారికి అందని ద్రాక్ష. వారి అభీష్ఠాన్ని మన్నించే వాతావరణం దేశంలో లేదు. వీలైనంత మేరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు కల్పించడం ఆచరణ సాధ్యౖ మెన విధానం. అందుకే రాజ్యాంగంలో 370వ అధికరణను చేర్చింది. కశ్మీరీలు ప్రశాంతంగా భారతపౌరులుగా జీవించాలంటే వేర్పాటువాదానికి స్వస్తి చెప్పాలి. అది జరగాలంటే భారత ప్రజలు కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. అందుకు రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకీ అతీతంగా సమగ్రమైన కార్యక్రమం నిరంత రాయంగా అమలు జరగాలి. వాజపేయి చెప్పినట్టు జమ్రూ హియత్ (ప్రజాస్వా మ్యం), కశ్మీరియత్(కశ్మీర్ సంస్కృతి), ఇన్సానియత్(మానవత్వం) అనే మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా నూతన కశ్మీర్ విధాన రూపకల్పన జరగాలి. కశ్మీర్వైపు తేరిపార చూడకుండా పాకిస్తాన్ను శాసించే స్థితికి భారత్ చేరుకోవాలి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి తూర్పు పాకిస్తాన్ అంతర్థానం కావడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాకిస్తాన్ పాలకవర్గం భారత్ నుంచి కశ్మీర్ను వేరు చే సేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్ను ఓడిం చడం అసాధ్యం కనుక పరోక్షంగా జిహాదీ శక్తులకు అండదండలు సమకూర్చి కశ్మీర్ని రావణకాష్టం చేయాలన్నది జనరల్ జియా–ఉల్–హక్ సంకల్పం. అం తకు ముందు జుల్ఫికర్ అలీభుట్టో సైతం భారత్పైన వేయి సంవత్సరాల యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. భారతదేశానికి వేయి గాయాలు చేసి రక్తం పారించాలని ప్రతిన పూనారు. పాకిస్తాన్ ప్రజలకు భారత్పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులూ, చెడు ఉగ్రవా దులూ అంటూ జనరల్ ముషార్రఫ్ విభజించారు. కశ్మీర్లో రక్తపాతం సృష్టించే జిహాదీలను మంచి ఉగ్రవాదులుగా పరిగణించి వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వాలూ, సైన్యం అందిస్తున్నాయి. పాకిస్తాన్ బుద్ధి మారదు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు భారత్తో శాంతికోసం ప్రయత్నించినా పాకిస్తాన్ సైన్యాధిపతులు సహకరించరు. ఎన్నికైనవారిని గద్దె దింపి తామే పగ్గాలు చేపడతారు. భారత్తో వైరంలో వారి ప్రయోజనాలు ఉన్నాయి. కశ్మీర్లో చిచ్చు ఆరకుండా రగిలించాలనే దుర్మార్గపు విధానం వల్ల పాకిస్తాన్ బావుకున్నది ఏమీ లేదు. ఉగ్రవాదుల దాడులలో పాకిస్తాన్లోనూ సుమారు 70 వేలమంది పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. మొన్న అమె రికా, నిన్న చైనా, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులను కశ్మీర్పైన ప్రయోగించ కుండా ఉండాలంటే ఆర్థికంగా, సైనికంగా భారత్ ఇంకా ఎదగాలి. అందుకోసం శాంతిసుస్థిరతలు కావాలి. యుద్ధం వద్దు. ఇదే భారత ప్రజల అభిమతం. -కె. రామచంద్రమూర్తి -
సమర్థ దౌత్యమే సరైన ఆయుధం
కశ్మీర్లోయలో పాకిస్తాన్ ఉగ్రపంజా విసిరి విశేషంగా ప్రాణనష్టం సంభవించిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది. ప్రదానమంత్రి ఆగ్రహం వెలిబుచ్చుతారు. పాకిస్తాన్కి తగినవిధంగా జవాబు చెబుతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరి చేయడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తారు. పాకిస్తాన్ను ఉగ్ర దేశంగా అభివర్ణిస్తారు. కొన్ని వారాలపాటు ప్రతీకార దాడుల గురించీ, ‘ముహ్ తోడ్ జవాబ్’ (మొహం పగిలే జవాబు) గురించీ ప్రధాని నరేంద్రమోదీ హెచ్చ రిస్తారు. టెలివి జన్ చానళ్ళు హడావిడి చేస్తాయి. వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా వస్తాయి. 2008లో ముంబయ్పైన పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామాలో కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల (సీఆర్ పీఎఫ్)పైన దాడి వరకూ ఇదే వరుస. గురువారంనాడు అదిల్ మహమ్మద్ దార్ అనే కశ్మీరీ యువకుడు పేలుడు పదార్థాలను స్కార్పియో కారునిండా పెట్టుకొని సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకొని వెడుతున్న ట్రక్కుల శ్రేణిని ఢీకొట్టి పేలిపో యాడు. ఫలితంగా 40 మంది జవాన్లు మరణించారు. అనేకమంది గాయప డ్డారు. లోగడ ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసిందీ కశ్మీర్కు చెందిన పౌరులు కాదు. వారు పాకిస్తానీయులు. అక్కడ ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు. 2000 ఏప్రిల్లో కశ్మీర్లో తొలి మానవబాంబు పేలింది. బాదామీబాగ్లోని సైనిక ప్రధాన కార్యాలయంపైన దాడి చేసి ఇద్దరు సైనికులను హత్యచేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తి కశ్మీర్కు చెందిన యువ కుడు. కశ్మీర్కు చెందిన యువకులను ఆకర్షించి పాక్ తీసుకువెళ్ళి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి కశ్మీర్పైన ప్రయోగించడం పాకిస్తాన్ సైన్యం పోషి స్తున్న ఉగ్రవాదసంస్థల నిరంతర కార్యక్రమం. శనివారం దేశీయాంగ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభు త్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని సైతం అఖిలపక్ష సభ ఈ సందర్భంగా ఆమోదించింది. కశ్మీర్లో పాకిస్తాన్ చిచ్చు కశ్మీర్లోయలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిచ్చుపెట్టే శక్తి పాకిస్తాన్కు ఉన్నది. పాకిస్తాన్కు ఇండియా ఎటువంటి జవాబు ఇవ్వగలదు? 2016 సెప్టెం బర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్ చేసినట్టు ప్రభుత్వం ప్రక టించింది. దేశంలోనూ, విదేశాలలోనూ సర్జికల్ స్ట్రయిక్ గురించి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో చెప్పారు. అంతా బూటకమేనని పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనీ, ప్రతీకారం తీర్చుకోవాలనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్జికల్ స్ట్రయిక్ కంటే నేరుగా పాకిస్తాన్ భూభా గంలోకి యుద్ధవిమానాలు వెళ్ళి బాంబింగ్ జరిపితే పాకిస్తాన్ ఇకపైన జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొందరు సూచిస్తున్నారు. అయితే మన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశిస్తే పాక్ సైనికులు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వారికి మనకిలాగే రాడార్ వ్యవస్థ ఉండదా? అయినా సరే, ఆవేశం, ఆక్రోశం ఉన్న సమయంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాయ కులు ఇటువంటి ప్రకటనలు సైతం చేస్తారు. ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కనుకనే అసాధారణ రీతిలో ప్రభుత్వ స్పందన ఉంటుంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలు సైతం ఇంటెలిజెన్స్ వైఫల్యాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ఈ పరిస్థితిలో కశ్మీర్ను రావణ కాష్టంగా మార్చిన భారత ప్రభుత్వ విధానాలనూ, వైఫల్యాలనూ ప్రస్తా వించడం సముచితం కాదు. ఇది సంతాప సమయం. విశ్లేషణలకూ, విమర్శ లకూ తగిన సందర్భం కాదు. సైనికంగా స్పందిస్తామంటూ, పాకిస్తాన్కి గుణపాఠం చెబుతామంటూ ప్రధాని గంభీరంగా ప్రకటిస్తుంటే ఆయన వైఖరిని ప్రశ్నించడం అవివేకం. అందుకే అఖిలపక్షం ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా సైన్యానికి వదిలినట్టు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎప్పుడో ఏదో ప్రకటన వస్తుంది. ఇలా అధీనరేఖ దాటి కొందరు శత్రు సైనికులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కొత్త కాదు. ప్రతీకారం చేసినట్టు పదేపదే చెప్పుకునే సంప్ర దాయానికి మోదీ శ్రీకారం చుట్టారు. కశ్మీర్పైన జరుగుతున్న దాడుల పట్ల కోపంతో కుతకుతలాడుతున్న దేశప్రజలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ ఇది. సర్జికల్ స్ట్రయిక్లు నిర్వహించామని ప్రకటించడమే కాకుండా వాటి తాలూకు దృశ్యాలను కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. ఎన్నికలు చాలా దూరంగా ఉన్న దశలోనే సర్జికల్ స్ట్రయిక్కు అత్యంత ప్రచారం ఇచ్చినవారు ఎన్నికలు సమీపించిన తరుణంలో చేయబోయే ప్రతీకారానికి ప్రచారం ఇవ్వకుండా ఉంటారా? ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకున్నట్టూ, పాకిస్తాన్ మదం అణచినట్టూ త్వరలోనే ప్రభుత్వం ప్రక టిస్తుంది. ఏ విధంగా చూసినా ఇది అనివార్యం. కొన్ని మాసాల తర్వాత ప్రజలు ఈ అంశాన్ని మర చిపోతారు. ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ కశ్మీర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అంగుళమైనా వెనుకంజ వేశాయా? కశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయా? ఉగ్రవాదంవైపు మొగ్గుతున్న యువత ఉగ్రవాదుల దాడులు తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ కొన్నేళ్ళుగా కశ్మీర్లో యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుతున్నారు. తుపాకీ నీడన పుట్టి పెరిగిన యువకులకు సైనికులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ చేదు అనుభవం ఎదురైతే వారు ఉగ్రవాద సంస్థలలో చేరిపోతున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్ వంటి అధునాతన సాంకేతికత ఉగ్రవాదం ప్రచారానికి కూడా దోహదం చేస్తోంది. ప్రపంచం పూర్తిగా తెలియని యువకులను ఆకర్షించడానికి రకరకాల వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దార్ను చితకబాదడంతో అతడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించాడంటూ దార్ తల్లి దండ్రులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన జవాన్ల తల్లిదండుల వలెనే తాము కూడా కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్నామని అన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా దార్ తల్లిదండ్రుల పుత్రశోకానికి కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం కశ్మీర్లోయలో అస్థిరతకూ, అనిశ్చితికీ, శాంతభద్రతల వైఫల్యానికీ, పరిపాలన దెబ్బతినడానికీ దారితీసింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలోనే ఉగ్రవాదం పైచేయి సాధిస్తుంది. ఇటువంటి వాతా వరణమే 1989లోనూ, 2010లోనూ కశ్మీర్లోయలో ప్రబలింది. ఈ పరిస్థితిని ఎప్పటికైనా చక్కదిద్దుకోవలసిందే. కశ్మీరీల మద్దతునూ, విధేయతనూ భారత ప్రభుత్వం, ప్రజ సంపాదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రథమ కర్తవ్యం. ముఖ్యమైన అంశం పాకిస్తాన్కు సంబంధించింది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఊతం లభించినంత కాలం కశ్మీర్లో శాంతిభద్రతలు రక్షించడం అసాధ్యం. పాకిస్తాన్ను బలప్రయోగంతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వృధా ప్రయాస. అది కూడా అణుశక్తి కలిగిన రాజ్యం. పైగా పాకిస్తాన్కు కొండంత అండగా చైనా ఉన్నది. ఆత్మాహుతి దాడి తమ పనే అని చాటుకున్న జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న భారత ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్నది. సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపే ప్రకటనలో సైతం చైనా పాకి స్తాన్ ప్రస్తావన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుభూతి ప్రకటిస్తూ మోదీకి సందేశం పంపించారు కానీ అమెరికా మరోవైపు పాకిస్తాన్కు గొప్ప ఉపకారం చేస్తున్నది. వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో పాకి స్తాన్ ఉండ బోతోంది. మరోవైపున అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించబోతున్నారు. ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ క్రమంగా అమెరికా సైనికులను సంక్షుభిత ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వైదొలగడం అంటే అఫ్ఘానిస్తాన్ భద్రతాదళాలపైన దాడులు చేస్తున్న తాలిబాన్కు అఫ్ఘానిస్తాన్ను అప్పగించడమే. పరోక్షంగా పాకిస్తాన్ చేతు లలో అఫ్ఘానిస్తాన్ను పెట్టడమే. దౌత్యరంగంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో భారత్ ఒంటరి అఫ్ఘానిస్తాన్ సమస్య పరిష్కారానికి మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్ ప్రతి నిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భారత్ ప్రస్తావన కానీ ప్రమేయం కానీ లేదు. మన్మోహన్సింగ్. నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్ను సందర్శించి, అఫ్ఘాన్ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్లో పార్ల మెంటు భవన నిర్మాణంలో తోడ్పడినప్పటికీ అఫ్ఘాన్ సంక్షోభం పరిష్కరించ డంలో భారత్ ప్రమేయం ఉండాలని అమెరికా కానీ చైనా కానీ అఫ్ఘానిస్తాన్ కానీ భావించడం లేదు. అంతే కాదు. అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్ అనుకూల ప్రభు త్వమో, తాలిబాన్ నడిపించే ప్రభుత్వమో ఏర్పడితే ఇంతకాలం ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో పోరాడిన తాలిబాన్ను పాకిస్తాన్ కశ్మీర్వైపు మళ్ళిస్తుంది. 1989లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ (సీఐఏ) సహకారంతో పాకి స్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ అఫ్ఘానిస్తాన్పై పోరాటం చేసి ఆ దేశం నుంచి సోవియెట్ సైన్యాన్ని జయప్రదంగా పంపించివేసింది. అంతవరకూ సోవియెట్ సైన్యంతో పోరాడిన తాలిబాన్ను కశ్మీర్పైకి పంపించింది పాకిస్తాన్. దాని ఫలితంగా ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ కొన్ని సంవత్సరాలు అతలాకుతలమై పోయింది. ఇప్పుడు కూడా తాలిబాన్ను ప్రయోగిస్తే కశ్మీర్ మరోసారి అగ్ని గుండంగా మారిపోతుంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్ సంక్షోభం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇటువంటి సంస్థల సహకారంతో కశ్మీర్లో చిచ్చుపెట్టడం ద్వారా ఇండియాను నిరంతరంగా వేధిస్తూ ఉండటం పాకిస్తాన్ విధానం. సైనిక చర్య తీసుకోవాలంటే ఇజ్రేల్ ఎంటెబేలో చేసిన సాహసం ఇండియా చేయాలి. ఇస్లామాబాద్ పరిసరాలలో తలదాచుకున్న లాడెన్ను ఒబామా పంపిన సైనికులు మట్టుబెట్టినట్టే సయీద్ హఫీజ్, అజహర్ మసూద్ తదితర ఉగ్రవాదులను హతమర్చాలి. అంతటి తెగింపు, సాహసం, శక్తి ఇండియాకు ఉన్నాయా? దూరపు లక్ష్యాలను పేల్చేందుకు స్నైపర్స్ ఉపయోగించే ఆధునిక ఆయుధాలు భారత సైనికుల చేతుల్లో లేవు. పాత తరం రష్యా ఆయుధాలు భారత సైనికుల దగ్గర ఉంటే కొత్తతరం చైనా ఆయుధాలు పాకిస్తాన్ స్నైపర్స్ చేతుల్లో ఉన్నాయి. చైనా ఆయుధాల శక్తి, విస్తృతి అధికం. ఇదీ మనం గుర్తించాల్సిన క్షేత్ర వాస్తవికత. పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం అనూహ్యం. యుద్ధం ఆరంభించడం తేలికే. ముగించడం కష్టం. సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి నిష్ప్రయోజనం. యుద్ధ విమానాల ప్రయోగం సైతం అంతే. దేశవాసుల ఆగ్రహం తగ్గించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ను తాలిబాన్ సహకారంతో పారదోలినా రష్యాతో పాకి స్తాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు. న్యూయార్క్లో జంటశిఖరాలపైన దాడులు చేయించి విధ్వంసం సృష్టిం చిన బిన్లాడెన్కు ఆశ్రయం ఇచ్చినా, అఫ్ఘానిస్తాన్లో అమెరికా సైనికులను పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తాలిబాన్ మట్టుపెడుతున్నా అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు బాగానే ఉన్నాయి. చైనా–పాకిస్తాన్ మైత్రి ప్రగాఢమైనది. పాకి స్తాన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తున్నది. దౌత్యరంగంలో మాత్రం వీగిపోకుండా నిలిచింది. ఎప్ప టికప్పుడు ఎత్తుగడలతో నెట్టుకొస్తున్నది. అటువంటి కపట రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశం ఉగ్ర వాదానికి స్థావరంగా ఉన్నదనే సందేశం ప్రపంచ దేశాలన్నిటికీ చేర్చాలి. ఆ దిశగా భారత విదేశాంగ యంత్రాంగం యావత్తూ కృషి చేయడానికి పుల్వామా దాడిని ఒక బలమైన సందర్భంగా వినియోగించుకోవాలి. -కె. రామచంద్రమూర్తి -
నేతల జాతర–విలువల పాతర!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సామాన్య ప్రజలలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడం సహజం. దృశ్యశ్రవణ ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు కనిపించవలసిన చోట కనిపించాలనీ, మాట్లాడవలసిన మాట మాట్లాడాలని రాజకీయ నాయకులు తాపత్రయ పడతారు. కొందరు రాజకీయ నాయకులు తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావించే దృశ్యాన్ని వదిలిపెట్టరు. లాభసాటి దృశ్యాలలో ఉనికి కోసం ఎంత దూరమైనా వెడతారు. ప్రత్యర్థులపై దారుణాఖండల శస్త్రతుల్యమైన పదజా లంతో దాడి చేస్తారు. నిన్న పొగిడిన నోటితోనే నేడు తెగుడుతారు. సంవత్సరం కిందట సంజీవని కానిది ఈ రోజు ప్రాణప్రదమైన ఔషధి అవుతుంది. పొత్తు ఉన్నప్పుడు ఇంద్రుడూచంద్రుడూ అంటూ నెత్తికెత్తుకొని ఊరేగినవారే పొత్తు రద్దయిన తర్వాత దుష్టుడూ దుర్మార్గుడూ అంటూ నేలకేసి కొడతారు. ఒకటి, రెండు మినహాయింపులు తప్పిస్తే అన్ని పార్టీల నాయకులదీ ఇదే వరుస. ఎన్నికల బరిలో దిగే ముందు మాటల ఈటెలకు పదును పెడుతున్నారు. ఇటు వంటి రాజకీయంలో నిజానిజాలతో నిమిత్తం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. రాజ్యాంగస్ఫూర్తి అసలే లేదు. తాము నిన్నామొన్నా ఏమని చెప్పామో, ఇప్పుడు ఏమి చెబుతున్నామో అన్న స్పృహ బొత్తిగా లేదు. ప్రతిపక్షాలపై దాడే వ్యూహమా? అధికార పార్టీలు వ్యవహరించిన రీతినీ, ఎన్నికల ప్రణాళికలలో చేసిన వాగ్దానాలను అమలు చేసిన తీరునీ ఎన్నికల సమయంలో చర్చించడం సంప్రదాయం. తమ సాఫల్యవైఫల్యాలను అధికార పార్టీలు గుర్తించి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయిందీ వివరించే రోజులు పోయాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలపై దాడి చేయడం ద్వారా, సరికొత్త సంక్షేమపథకాలు పదవీకాలం ముగియనున్న తరు ణంలో అట్టహాసంగా ఆరంభించడం ద్వారా, లక్షల కోట్లు ఖర్చు చేయవలసిన ప్రాజెక్టులకు అలవోకగా శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజలను మెప్పించి మళ్ళీ గెలిచి అధికారంలో కొనసాగాలని కలలు కంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఈ విన్యాసాలు ఫలించవు. 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకొని నాలుగు సంవత్సరాలు చెట్టా పట్టాలేసుకొని యుగళగీతాలు ఆలపించిన విషయాన్ని ప్రజలు మరచిపోవాలని మోదీ, బాబూ కోరుకుంటున్నారు. ప్రత్యేకహోదాపైన మోదీ, బాబూ ఇద్దరూ ఆడిన నాటకాన్ని ప్రజలు విస్మరించాలనీ, తాజా డ్రామాను మాత్రమే వీక్షించి మైమరచిపోవాలనీ వారి ఆకాంక్ష. రఫేల్ వివాదంపై రగడ చేస్తున్న కాంగ్రెస్ నాయకులనూ, ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులనూ దేశద్రోహులుగా, దేశ సైన్యాన్ని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్న దుర్మార్గులుగా చిత్రించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తమ హయాంలో బోఫోర్స్ సహాlఅనేక కుంభకోణాలు జరిగిన వాస్తవాన్ని ప్రస్తావించ కుండా రఫేల్ను మాత్రమే ప్రజల ముందుకు ప్రముఖంగా నిలబెట్టాలని కాంగ్రెస్ నాయకుల ఆరాటం. చిట్ఫండ్ అక్రమార్కుల కొమ్ముకాయడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తు న్నారని బీజేపీ ప్రవక్తల వాదన. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపైన కేసులు బనాయించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించి అప్రదిష్టపాలు చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని మమతాదీదీ, తదితర ప్రతిపక్ష నేతల ఆరోపణ. ‘ఏమిటి నన్ను జైల్లో పెడతారా?’ అంటూ చంద్రబాబు బీజేపీ శాస నసభ్యులవైపు చూస్తూ హుంక రిస్తారు. ప్రజాధనాన్ని దుబారా చేశారనీ, నిధులు కాజేయడం కోసమే అవసరం లేని ప్రాజెక్టులు కట్టారనీ, పోలవరం నిధులకు లెక్క చెప్పడం లేదనీ, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నదనీ వస్తున్న ఆరోపణలపైన కేంద్రం విచారించలేదు. బీజేపీ నాయకులే స్వయంగా చేస్తున్న విమర్శలు గాలిలోకి కలసిపోతున్నాయి కానీ వాటిలోని నిజానిజాలు తేల్చే బాధ్యత కేంద్రం తీసుకోవడం లేదు. ఇంతటి అనుకూల పరిస్థితులలో సైతం చంద్రబాబుకి జైలుభయం పట్టుకోవడం ఆశ్చర్యం. భయంలోనుంచి బుకాయింపు పుట్టుకొచ్చింది. సీబీఐ గీబీఐ జాన్తానై అంటున్నారు. ఈడీ లేదూ గీడీ లేదూ అంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటున్నారు. కేంద్రంపైన ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తినా, మమతా బెనర్జీ తిరుగు బాటు బావుటా ఎగరవేసినా వారి పక్కన దృశ్యంలో కనిపించేందుకు చంద్ర బాబు అన్ని పనులూ వదులుకొని శ్రమకోర్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీకీ, కోల్కతాకీ వెడుతున్నారు. మోదీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కానీ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. అందుకు అవసరమైన సామగ్రి వారి దగ్గర ఉన్నది. కానీ వారికి ఆ ఉద్దేశం లేదు. చంద్రబాబుని తమ ప్రధాన ప్రత్యర్థిగా మోదీ భావించడం లేదు. ఈ రోజు గుంటూరు సభలో చంద్రబాబుపై నరేంద్రమోదీ అమిత్షా లాగానే విమర్శలు చేయవచ్చు. మామూలు విమర్శలతో సరిపెట్టకుండా మమతాబెనర్జీపై చేసినంత కరకుగా మోదీ తనపైన కూడా వాగ్దాడి చేయాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. అందుకే ‘ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తారు మోదీ?’, అంటూ రెచ్చగొడుతున్నారు. మోదీకి తానే ప్రధాన ప్రత్యర్థిగా తేలాలని తాపత్రయం. ఆంధ్రప్రదేశ్లో అంతటి దృశ్యం లేదు. పశ్చిమబెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అమిత్షా, నరేంద్రమోదీ, యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్సింగ్ చౌహాన్ తదితరులు పర్యటించి, దీదీని రకరకాల విమర్శలు చేసి వాతావరణం వేడెక్కించారు. బెంగాల్పైన ఎందుకు దృష్టి పెట్టారు? సమాజ్వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమా జ్పార్టీ (బీఎస్పీ)ల ఎన్నికల పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్లో ఈ సారి తమ పప్పులు ఉడకవని బీజేపీ నాయకత్వానికి తెలుసు. 2014లో గెలుచుకున్న 71 స్థానాలలో సగం దక్కితే ధన్యులమనుకునే పరిస్థితి. యూపీలో కోల్పోయే స్థానా లను బెంగాల్లో సంపాదించాలని మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో జనాదరణ రీత్యా తృణమూల్ కాంగ్రెస్ తర్వాత స్థానం బీజేపీదే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి విజ యావకాశాలు లేవు. అందుకే ఇక్కడికి మాటవరుసగా పర్యటనకు వచ్చి ఒకట్రెండు ఉపన్యాసాలు ఇచ్చి వెడతారు కానీ ఆంధ్రప్రదేశ్పైనా, చంద్ర బాబుపైనా దృష్టి కేంద్రీకరించే దండగమారి పని బీజేపీ అధినేతలు చేయరు. చంద్రబాబు తన అనుయాయులతో కుండల ప్రదర్శన చేయించినా, నల్ల బ్యాడ్జీలు ధరింపజేసినా, ‘మోదీ గోబ్యాక్’ అంటూ టీవీ చానళ్ళ కేమేరాల ముందు విచిత్ర విన్యాసాలు వేసినా, తానే స్వయంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఇదే గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీతో చంద్రబాబు వేదిక పంచుకున్నారు. భావి ప్రధాని అంటూ పొగిడారు. అనంతరం శాసనసభలో మోదీ అత్యున్నతమైన ప్రధాని అంటూ కీర్తించారు. వాజపేయి కంటే ఉన్నతుడనే విధంగా ప్రశంసల వర్షం కురిపించారు. వైఫల్యాలను ఒప్పుకుంటే మేలు అధికారంలో ఉన్నవారికి ఇది పరీక్షాసమయం. సాధించిన విజయాలు ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. వైఫల్యాలు ఉంటే ఒప్పుకోవాలి. దొంగలను ఉపే క్షించనంటూ, అందుకే ఈ చౌకీదార్ను ప్రజలు నియమించారంటూ పార్లమెంటు లోనూ, వెలుపలా మోదీ మిడిసిపడుతూ గంభీరమైన ప్రసంగాలు చేయడం వల్ల ప్రజలు ప్రభావితులై మూకుమ్మడిగా మళ్ళీ బీజేపీకి ఓట్లు కుమ్మరిస్తారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. లక్షల కొద్దీ ఉద్యోగాలను ఏన్డీఏ ప్రభుత్వం కల్పించిందంటూ ఎంత గట్టిగా మోదీ దబాయించినా ప్రజలు విశ్వ సించరు. అనుకున్న విధంగా ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాలేదో, స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకొని రావడంలో ఎందుకు విఫలమైనారో, గోరక్షకుల హింసాత్మక ధోరణిని ఎందుకు అరికట్టలేకపోయారో సవినయంగా వివరిస్తే ప్రజలు మన్నిస్తారు. రంకెలు వేసినంత మాత్రాన వైఫల్యాలు విజయాలుగా మారవు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ప్రసంగాలు చేసినా, సీబీఐని దుర్వినియోగం చేయడం లేదంటూ ఎంత గట్టిగా చెప్పినా లాభం లేదు. ఈ విషయం ప్రస్తావించే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదు. చంద్రబాబు చరిత్రా అటువంటిదే. కాంగ్రెస్తో చేతులు కలిపి సీబీఐతో ప్రధాన ప్రత్యర్థి వ్యక్తిత్వహననం చేయడానికి ప్రయత్నించిన ఘనుడాయన. విపక్షానికి చెందిన ఎంఎల్ఏలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చరిత్ర ఆయనది. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ వ్యవ స్థకూ తాను నిధులూ, విధులూ వికేంద్రీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఆయనకు ఇతరులను తప్పుపట్టే యోగ్యత ఉంటుందా? నామినేషన్లపైన వందల కోట్ల రూపాయల పనులు అస్మదీయులకు కట్టబెట్టే వారికీ, వారి ప్రయోజనం కోసమే అమరావతి నగర నిర్మాణం విషయంలో రకరకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించినవారికీ ఇతరులను ప్రశ్నించే నైతికత ఉంటుందా? ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం మోదీ చంద్ర బాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం. అందుకు మోదీని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. ప్రధాని పర్యటలను ప్రజలు వ్యతిరేకించవచ్చు. కానీ బీజేపీతో మొన్నటివరకూ అంటకాగిన టీడీపీ నిరసన ప్రదర్శనలు చేయడం విడ్డూరం. తమ స్వానుభవానికి విరుద్ధంగా నేతలు ఏమి చెప్పినా ప్రజలు విశ్వసించరు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి అది కనిపించదు. చుట్టూ ఉన్న వందిమాగధులు కనిపించనీయరు. ఇందిర ఘోరపరాజయం ఉదాహరణకు ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 19 మాసాలు దేశాన్ని నిరంకుశంగా ఏలిన తర్వాత అంతే అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేయాలనీ, రెండు మాసాలలోగా ఎన్నికలు నిర్వహించాలనీ ఆమె 1977 జనవరి 18న ప్రకటించారు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోతుందని ఆనాడు అత్యధికులు ఊహిం చలేదు. అంతవరకూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి పరాజయం లేదు. చుట్టూ ఉన్నవారు అదే ఎన్నికలకు అనువైన సమయం అంటూ ఊదరకొట్టబట్టే ఆమె ఎన్నికలు జరిపించడానికి నిర్ణయించారు. జైళ్లలో బంధించిన వందలాదిమంది ప్రతిపక్ష నాయకులకు అనూహ్యంగా స్వేచ్ఛ లభించింది. ఎన్నికల ప్రచారానికి రెండు మాసాలే వ్యవధి. నిధుల సేకరణ సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఎదురు నిలిచే సత్తా కలిగిన పార్టీ లేదు. ఆత్యయిక పరిస్థితిలో దేశం అభివృద్ధి చెందిందనీ, ప్రతిపక్షాల ఆందోళనలను అరికట్టగలిగామనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ ఇందిరాగాంధీ భావించారు. సంజయ్గాంధీకి పూర్తిగా పగ్గాలు అప్పగించాలా లేక అర్ధసింహాసనం ఇవ్వాలా అన్నదే ఆలోచన కానీ పరాజయం గురించి ఆమెకు చింత లేదు. తనకు పోటీ ఎవరున్నారు? ‘తాను తప్ప దేశానికి వేరే దిక్కు ఎవ్వరూ లేరని ఆమె గట్టిగా విశ్వసించింది,’ అంటూ ఇందిర మేనత్త కూతురు, ప్రఖ్యాత రచయిత నయనతార సెహగల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. నాటి ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. ఇందిరాగాంధీపై రాజ్నారాయణ్ గెలుపొందారు. వివిధ భావజాలాలకు చెందిన ప్రతిపక్ష నాయకులను జైలు జీవితం కలిపింది. రైతు నాయకుడూ, భారతీయ లోక్దళ్ అధినేత చరణ్ సింగ్, జనసంఘ్ నాయకులు అడ్వాణీ, వాజపేయి, సోషలిస్టు నాయకులు జార్జి ఫెర్నాండెజ్, రాజ్నారాయణ్, కరడుకట్టిన మితవాది, కాంగ్రెస్ (వో) నాయకుడు మొరార్జీ దేశాయ్ వంటి నానాగోత్రీకులను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క తాటిపైకి తెస్తారని ఎవరు ఊహించారు? మొరార్జీ దేశాయ్ని ప్రధానిగా వీరంతా అంగీకరిస్తారని ఎవరు కలగన్నారు? తనకు ప్రత్యామ్నాయం లేరని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నాయకుడు అనుకున్నా అది శ్రుతిమించిన స్వాను రాగమే. ఇప్పుడు మోదీకీ, చంద్రబాబుకీ భజన చేసినట్టే అప్పుడు ఇందిరా గాంధీకి పత్రికలు ఊడిగం చేశాయి (ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి కొన్ని పత్రికలు తప్ప). ఇందిరమ్మకు అన్నీ సకారాత్మక ఊహా చిత్రాలే కనిపించాయి. పరాజయ సూచనలు కానరాలేదు. అప్పటికింకా ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్ళు రాలేదు. ఇప్పుడు టీవీల హంగామా అధికారంలో ఉన్న వారిని భ్రమలలో ముంచెత్తు తుంది. ఆకాశవీధిలో విహరింపజేస్తుంది. నేల విడవకుండా నిజాయతీగా సాము చేసేవారిదే విజయం. -కె. రామచంద్రమూర్తి -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
పూటకో మాట.. రోజుకో బాట!
‘అసూయాపరులంతా ఒక్కటై రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. గద్దల్లా వాలు తున్నారు. అవినీతి గొంగళిపురుగును కేసీఆర్ కౌగలించుకున్నారు.’ ఇవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నోటినుంచి వెలువడిన మాటలు. ఎవరు అసూయపడుతున్నారు చంద్రబాబు నాయుడిని చూసి? నరేంద్రమోదీనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావా (కేసీఆర్)? వైఎస్ జగన్ మోహన్రెడ్డా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్స రాలూ, సువిశాల దేశానికి ప్రధానిగా సుమారు అయిదేళ్ళూ పని చేసిన రాజకీయ నాయకుడు మోదీ. చంద్రబాబును చూసి ఆయన ఎందుకు ఈర్ష్య పడాలి? 2019 ఎన్నికలలో బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో, మోదీ మళ్ళీ ప్రధానిగా ప్రమాణం చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రాబల్యం కలిగిన నేత మోదీ అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. తమ కంటే గొప్ప భాషాపరిజ్ఞానం కలిగిన వక్త చంద్రబాబును చూసి మోదీ, కేసీఆర్ అసూయ చెందుతున్నారా? ఆయన తమ కంటే సమర్థ పాలకుడనీ, పరిపాలనా దక్షుడనీ మోదీ, కేసీఆర్ అసూయతో రగిలిపోతున్నారా? తమ కంటే ఎక్కువ విశ్వనీయత ఉన్నదనీ, ప్రజాదరణ ఉన్నదనీ మోదీ, కేసీఆర్, జగన్మోహన్రెడ్డీ ఈర్ష్యతో కుమిలిపోతున్నారా? జీవితంలో పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా ఎన్నికలలో పోటీ చేయలేని టీడీపీ అధినేతను చూసి ఒంటరిగా పోరాడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిపైన ఇటీవలనే ఘనవిజయం సాధించిన కేసీఆర్ ఉడుక్కుంటారా? ఎవరు గద్దలో, ఎవరు సింహాలో ప్రజలకు తెలి యదా? జగన్మోహన్రెడ్డిపైన కేసులు ఎవరు పెట్టించారో, కాంగ్రెస్ నాయకుడు శంకరరావు వేసిన పిటిషన్లో ఎర్రన్నాయుడు ఎట్లా ఇంప్లీడ్ అయ్యారో ఎవరికి తెలియదు? అది బహిరంగ రహస్యం కాదా? సోనియాగాంధీ, చిదంబరంలతో చేతులు కలిపి బూటకపు కేసులు పెట్టించిన సంగతీ, జైలులో పెట్టించి బెయిల్ రాకుండా 16 మాసాలు మేనేజ్ చేసిన విషయం ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పక్క రలేదు. ఎవరు అవినీతి గొంగళి పురుగు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 1984 నుంచి 1995 వరకూ ఎన్టీఆర్ ‘నమ్మిన’ బంటుగా పనిచేసిన చంద్ర బాబుకి అవినీతికి ఒడిగట్టే అవకాశం ఉన్నదా లేక ఒక్కరోజైనా అధికారంలో లేకుండా, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో హైదరా బాద్కు రాకుండా బెంగుళూరులోనే తన మానాన తాను వ్యాపారం చేసుకుంటూ ఉన్న జగన్మోహన్రెడ్డికి అవకాశం ఉన్నదా? గుజరాత్, కర్ణాటక, రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్కి ఆర్థిక సహాయం చేయడానికి బాబుకు అన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలు ఊహించు కోలేరా? ఇవన్నీ అసహ్యించుకోవలసిన పనులే కానీ అసూయపడవలసిన ఘన కార్యాలైతే కాదు కదా! సంపద తప్ప ఏమున్నది చంద్రబాబు దగ్గర ఇతరులు ఈర్ష్యపడేందుకు? స్వవచోవ్యాఘాతాలు లెక్కలేనన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, స్వవచోవ్యాఘాతాలూ, అస త్యాలూ దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడి నోటి నుంచైనా వచ్చాయా? గతంలో కానీ వర్తమానంలో కానీ ఇన్ని యూ–టర్న్లు తీసుకున్న మరో రాజ కీయ నాయకుడు దేశ చరిత్రలో ఉన్నాడా? 1995 ఆగస్టులో వైస్రాయ్ డ్రామా జరి గినప్పుడు టీవీలు లేవు. ఉన్న నాలుగు పత్రికలూ చంద్రబాబు చెప్పుచేతలలో ఉండేవి. ఎన్టిఆర్కు అనుకూలమైన వార్తలు, వ్యాఖ్యలు పత్రికలలో కానీ రేడి యోలో కానీ వచ్చేవి కావు. అందుకనే సింహంలాంటి ఎన్టీఆర్ని బోనులో పెట్ట గలిగారు. ఇప్పుడు ఆ ఆట సాగదు. అబద్ధాలు అతకవు. మీడియాలో బహు ళత్వం ఉన్నది. నాణేనికి రెండో పార్శ్వం చూపించే పత్రికలూ, చానళ్ళూ ఉన్నాయి. టీవీలు వచ్చిన తర్వాత నేతలు మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు అవు తుంది. ఆ రికార్డులు న్యూస్చానళ్ళ లైబ్రరీలలో భద్రంగా ఉంటాయి. టీవీ తెర మీద ముఖకవళికలను కూడా వీక్షకులకు గమనిస్తారు. ఎవరు నిజం చెబుతు న్నారో, ఎవరు బొంకుతున్నారో ఇట్టే పసిగట్టగలుగుతారు. చంద్రబాబు ఈ రోజు ఏమి మాట్లాడినా అందుకు విరుద్ధంగా గత నాలుగు సంవత్సరాల ఎని మిది మాసాలలోనే మాట్లాడి ఉంటారు. టీడీపీలో అధ్యక్షులవారే అందరికంటే ఎక్కువ మాట్లాడతారు. జన్మభూమి కమిటీల నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ అన్ని విషయాలపైనా శ్రీవారే వ్యాఖ్యానిస్తారు. నిర్ణయాలు అప్పటికప్పుడే, అక్క డికక్కడే ప్రకటించేస్తారు. వ్యూహరచన చేస్తారు. ఎత్తుగడలు వేస్తారు. తక్కిన వారంతా ఆయన చెప్పినట్టు చేయవలసిందే. అందుకని ప్రతి పరిణామం పైనా చంద్రబాబు ‘బైట్’ ప్రతి టీవీ న్యూస్చానల్లోనూ ఉంటుంది. యజమానులకు ఇష్టం లేకపోతే చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే సన్నివేశాలు చూపించరు. అది వేరే విషయం. చూపించాలని అనుకున్న చానళ్ళ దగ్గర బోలెడు సామగ్రి ఉంటుంది. తాజాగా చంద్రబాబు నిగ్రహం కోల్పోవడానికి దారి తీసిన పరిణామం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కలుసుకొని ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం గురించి ప్రాథమిక చర్చలు జరపడం. దీనికి చంద్రబాబు వక్రభాష్యాలు చెప్పారు. రాష్ట్ర ద్రోహులు కుట్ర చేస్తున్నారంటూ నిందించారు. గద్దల్లా వాలుతు న్నారన్నది ఈ సందర్భంలోనే. ఈ విమర్శలకు సమాధానంగా ఆయన చర్యలను గుర్తు చేస్తే చాలు. నానారాష్ట్ర సందర్శనం ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యేక విమానంలో కోల్ కతా, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ వెళ్లి బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ప్రయ త్నాలు చేయడం గుర్తు చేయవచ్చు. ఆ పర్యటనలో చంద్రబాబు పోలవరం నిర్మా ణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలుసు కున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న స్టాలిన్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. రాహుల్గాంధీ నివాసానికి వెళ్ళి ఆయనతో కరచాలనం చేసినప్పుడు రాహుల్ని ‘పప్పు’ అంటూ అవహేళన చేయడం, సోనియాను ఇటలీ రాక్షసి అంటూ నిందించడం చూపించవచ్చు. కేటీఆర్–జగన్మోహన్ రెడ్డిల భేటీని ఆక్షేపించినప్పుడు కేసీఆర్ని చంద్రబాబు కౌగలించుకున్న దృశ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిం చినప్పటి సన్నివేశం, హరికృష్ణ పార్థివదేహం ఉండగానే తెలంగాణ ఎన్నికలలో పొత్తు గురించి కేటీఆర్తో ప్రస్తావించిన వైనం సచిత్రంగా గుర్తు చేయవచ్చు. 2009 ఎన్నికలతో టీఆర్ఎస్తో కలసి మహాకూటమి నిర్మించడం, ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్ని తూలనాడటం గురించి చెప్పవచ్చు. అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభ్యంతరం లేదంటూ అనుచరుల కమిటీతో చెప్పించి, ఆ మేరకు టీడీపీ పొలిట్బ్యూరో చేత తీర్మానం చేయించి, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసిన సంగతి దృశ్యసహితంగా చెప్పవచ్చు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్ హాజరైనప్పుడు ఆయనకు స్వాగతం చెప్పిన తెలుగు తమ్ముళ్ళ ఆనందోత్సాహాలను ప్రస్తావిం చవచ్చు. మోదీతో కుమ్మక్కు అయ్యారని విమర్శిస్తే, మోదీకి తిరుపతి లడ్టూల సంచీ అందిస్తూ అతివినయం ప్రదర్శించిన చంద్రబాబు దృశ్యం ఎన్ని విడత లైనా ప్రదర్శించవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రతి పక్ష నాయకుడు నాలుగున్నరేళ్ళుగా చేసిన పోరాటాల వివరాలు చెప్పవచ్చు. ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి ధన్యవాదాలు చెప్పడం, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్య వాదాలు చెబుతూ అసెంబ్లీతో తీర్మానం చేయించడం, ప్యాకేజీ ఇప్పించినందుకు వెంకయ్యనాయుడినీ, ఇచ్చినందుకు అరుణ్జైట్లీని ఘనంగా సన్మానించడం, హోదా సంజీవని కాదంటూ దబాయించడం, హోదా కోసం ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానంటూ యువతను హెచ్చరించడం గుర్తు చేయవచ్చు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు సమాధానంగా 1995లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమి మాట్లాడారో, ఆయన గురించి ఎన్టీఆర్ ఏమన్నారో పత్రికలలో రాయవచ్చు. టీవీలలో చూపించవచ్చు. తప్పించుకోలేరు. ‘బైట్స్’ క్షేమంగా ఉన్నాయి. కోల్కతాలో నారావారి భేరీ శనివారం కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన ‘యునైటెడ్ ఇండియా’ బహిరంగ సభకు మోదీనీ, బీజేపీనీ వ్యతిరేకించే నేతలలో చాలామంది హాజరైనారు. 2018 మార్చి వరకూ మోదీతో స్నేహం చేసిన చంద్రబాబు కూడా వెళ్ళారు. సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్ వంటి యువకులు మోదీని విమర్శిస్తే ఎవ్వరూ తప్పు పట్టరు. వారు మోదీతో అంటకాగలేదు. ప్రధానిగా మోదీ తప్పులు చేయలేదని కాదు. ఆయన ఒప్పులకుప్ప కాదు. కానీ విమర్శించేవారికి విశ్వసనీయత ఉండాలి. మోదీ వంటి అద్భుతమైన ప్రధాని ఈ దేశానికి చారిత్రక అవసరమని చంద్రబాబు అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిన విషయం ఆయన విస్మరించవచ్చు కానీ ప్రజలు ఎట్లా మరచిపోతారు? అంతగా పొగిడి ఇప్పుడు కేవలం ప్రచారంపైన ఆధారపడిన ప్రధాని అనీ, పని బొత్తిగా చేయడం లేదనీ విమర్శిస్తే నప్పుతుందా? కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించడాన్ని ప్రస్తావిస్తూ, ఎంఎల్ఏలను పశువులను కొన్నట్టు కొనుగోలు చేస్తున్నారనీ, మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాలనీ చంద్రబాబు గర్జించారు. తన పనుపున తెలంగాణ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్రెడ్డి రూ. 50 లక్షల నగదు చెల్లిస్తూ కెమెరాకు చిక్కిన ఉదంతం ఫలితంగా పదేళ్ళు ఉండవలసిన హైదరాబాద్ నగరం నుంచి ఆకస్మికంగా నిష్క్రమించి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులతో సహా లేని అమరావతికి వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందు తెలంగాణలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాసయాదవ్పైన ధ్వజమెత్తిన సంగతి మరచి పోయారు. అందుకే తలసాని ఇటీవల విజయవాడ, ఏలూరు వెళ్ళినప్పుడు చంద్రబాబుపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో గుణపాఠం నేర్చుకున్నా టీడీపీ అధినేత పరువు కృష్ణాలో కలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అడ్డగోలుగా, పశువుల కంటే హీనంగా కొనుగోలు చేశారు. రవ్వంత సంకోచం కానీ, పిసరంత బిడియం కానీ లేకుండా పార్టీ ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి, పంచాయితీలను నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల అధికారాలన్నింటినీ అస్మదీయులతో నిండిన జన్మభూమి కమిటీలకు అక్రమంగా అప్పగించిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించేం దుకు ఉద్యమించాలంటూ పిలుపునిస్తే ఇదేం బూటకమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకోరా? ‘నన్ను మించిన నటుడు చంద్రబాబు,’ అంటూ జీవిత చర మాంకంలో గుండె పగిలి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకోరా? పెద్దనోట్లు రద్దు చేయాలని మోదీకి సలహా ఇచ్చింది తానేనంటూ గొప్పగా చెప్పు కున్న ముఖ్యమంత్రే అది ఘోరమైన తప్పిదమంటూ నిందించారు. ఒక ప్రధాని లేదా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉంటాయి. నిజాయితీపరుడైన నాయకుడైనా, విమర్శకుడైనా, సంపాదకుడైనా ఏమి చేయాలి? సదరు చర్య సత్ఫలితాలు ఇస్తుందని తాము కూడా ఆశిం చామనీ, అందుకే మొదట్లో స్వాగతించామనీ, అమలు క్రమంలో అది ఆర్థిక వ్యవస్థకు హానికరంగా పరిణమించిందనీ చెప్పాలి. తప్పు ఒప్పుకోవాలి. అంతటి నిజాయితీ ఎక్కడుంది? అటువంటి విలువలు ఎక్కడున్నాయి? గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) విషయంలోనూ ఇదే అవకాశవాద ధోరణి. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు స్వాగతించి ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత అదే పనిగా విమర్శించడం సీనియర్ రాజకీయ నాయకుడికి శోభ నిస్తుందా? అక్షరం బలి కోరుతుందని ప్రముఖ కవి అజంతా తరచూ అనేవారు. తన అనుభవానికీ, వయస్సుకీ, హోదాకీ తగినట్టు ఆచితూచి మాట్లాడితే చంద్రబాబు మరింత నవ్వులపాలు కాకుండా మర్యాద కాపాడుకుంటారు. వైఖరి మార్చుకోవాలో లేక ఇదే విధంగా ముందుకు సాగిపోవాలో నిర్ణయిం చుకోవలసింది ఆయనే. కె. రామచంద్రమూర్తి -
రైతన్నలు గెలిచేదెలా?
ఈ దేశంలో రైతు జీవితం దుర్భరం. 1995 నుంచి రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. వ్యవస్థీకృతం కాని వ్యవసాయరంగంలో ఎంత సంక్షోభం నెలకొన్నా ఉద్యమాలు రగలవు. రైతులు ప్రదర్శన చేశారంటే వారిలో సహనం పూర్తిగా నశించిందని అనుకోవాలి. కొన్ని మాసాలుగా దేశంలో రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటున్నారు. మహారాష్ట్రలో వేలాదిమంది రైతులు 160 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ముంబయ్ చేరుకొని నిరసన ప్రదర్శన చేశారు. తమిళనాడు రైతులు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదనే వాస్తవాన్ని ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు మెడలో పుర్రెల దండలు వేసుకొని, నోళ్ళతో సజీవంగా ఉన్న ఎలుకలను పట్టుకొని వినూ త్నంగా ప్రదర్శన చేశారు. వైద్యులూ, లాయర్లూ, టీచర్లూ, వివిధ రంగా లకు చెందిన యువతీయువకులు భోజనాలూ, నీళ్ళూ సరఫరా చేయడం ద్వారా ఢిల్లీ వీధులలో ఊరేగింపు జరిపిన వేలాదిమంది రైతులకు సంఘీభావం ప్రకటించారు. రుణాలు మాఫ్ చేయాలనీ, కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ను న్యాయంగా నిర్ణయించాలనీ, పెట్టుబడికి సాయం చేయాలనీ వారు ఉద్ఘోషించారు. 2019 ఎన్నికలలో గెలుపొందాలంటే రైతులను శాంతింపజేయడం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకీ స్పష్టంగా తెలుసు. రైతులకు ఏ రకమైన సహాయం చేయాలన్నా లక్షల కోట్ల రూపాయలు కావాలి. అందుకే రిజర్వుబ్యాంకు నుంచి నిధులు సమీకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. కేంద్రానికీ, ఆర్బీఐకీ మధ్య వివాదం తలెత్తడానికి ఇదే ప్రధాన కారణం. తమకు నిధుల నిల్వలు ఉండాలనీ, ప్రభుత్వానికి ఇవ్వలేమనీ ఆర్బీఐ గవర్నర్లు వాదిస్తున్నారు. అంతలేసి నిధులు ఆర్బీఐలో మూలుగుతూ ఉండటం ఎందుకనీ, వాటిని సర్క్యులేషన్లో పెట్టాలనీ, అభివృద్ధికోసం ఖర్చు చేయాలనీ (సంక్షేమం అనడం లేదు) ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెబుతున్నారు. ఈ వాదనతో వేగలేకనే ఆర్థికవేత్త ఊర్జిత్పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన ఐఏఎస్ అధికారి శక్తికాంతదాస్ ఎంతకాలం పదవిలో ఉంటారో తెలియదు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని రఘురాంరాజన్ వంటి ఆర్థికవేత్తలూ, మాజీ గవర్నర్లూ ప్రబోధిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మోదీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతోంది. అందుకే మాజీ గవర్నర్ బిమల్జలాన్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. కనీస నిల్వలు ఏ మేరకు ఉంటే ఆర్బీఐకి ఇబ్బంది ఉండదో నిర్ణయించ వలసిందిగా ఈ కమిటీని ప్రభుత్వం కోరింది. నయానో, భయానో ఆర్బీఐ నుంచి నిధులు సేకరించినప్పటికీ వాటిని రైతులకు ఏ రూపంలో, ఏ పథకం కింద అందజేయాలో మోదీ ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్థికంగా శక్తికి మించిన భారంగా కాకుండా, రాజకీయంగా ఆకర్షణీయంగా ఉండే పథకం కోసం అన్వేషణ కొంతకాలంగా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణలను విశ్వసించే ప్రవీణులు రైతుల రుణాలను మాఫ్ చేయడాన్ని ఆమోదించరు. వైఎస్ రాజ శేఖరరెడ్డి ఒత్తిడి చేయడం వల్ల 2004లో ఆంధ్రప్రదేశ్లో రైతు రుణ మాఫీకి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ కష్టం మీద ఒప్పుకున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ. 77 వేల కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫ్ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన మోదీ ఆచరణలో చేయవలసినంత చేయలేకపోయారు. 22 పంటలకు పెట్టుబడిపైన ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ప్రకటించానంటూ శని వారంనాడు ఉత్తరప్రదేశ్ ఘాజీబాద్ బహిరంగసభలో మోదీ చెప్పారు. కానీ కనీస మద్దతు ధర నిర్ణయించడంలో డాక్టర్ స్వామినాధన్ సూచించిన పద్ధతిని అనుసరించలేదు. పెట్టుబడి వ్యయం అంటే కేవలం విత్తనాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాల ఖర్చు మాత్రమే కాదు. ఆ ఖర్చుతోపాటు పొలంలో పని చేసే వ్యక్తులందరి వార్షిక వేతనాలనూ, పొలం అద్దెకు (కౌలుకు) ఇస్తే సాలీనా ఎంత ఆదాయం వస్తుందో ఆ మొత్తాన్నీ, పంట బీమాకోసం చెల్లించవలసిన మొత్తాన్నీ కూడితే వచ్చే మొత్తానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాధన్ చెప్పారు. అది జరగలేదు. కేసీఆర్ మోడల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం రెండు లక్షల మేరకు రుణం మాఫ్ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన విస్తృత ప్రచారాన్ని రైతులు విశ్వసించడమే. అధికారంలోకి వచ్చిన పది రోజులలో రుణాలు మాఫ్ చేస్తానంటూ రాహుల్ వాగ్దానం చేశారు. అన్నట్టుగానే మూడు రాష్ట్రాలలో కొత్త ముఖ్యమంత్రులు కమల్నా«ద్, భూపేశ్ బఘేల, అశోక్ గహ్లోత్లు రుణాలు మాఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులను సుముఖం చేసుకోవడం ఎన్డీఏకి అత్యవసరం. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. రుణమాఫీ అమలు చేస్తామని చెప్పాలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేసినట్టు పెట్టుబడి సాయం అందజేయాలా? స్వామినాధన్ చెప్పినట్టు రైతు పెట్టుబడి పోగా యాభై శాతం లాభం మిగిలే విధంగా మద్దతు ధర నిర్ణయించి, మద్దతు ధరకూ, మార్కెట్ ధరకూ ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం చెల్లించాలా? కేంద్ర రాష్ట్రాలు కలసి భర్తీ చేయాలా? రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్న మోదీని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్రలో భాగంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుసుకున్నారు. నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేకపోగా అంత భారీ మెజారిటీలతో అన్ని సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలవడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రధాని సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, అన్ని పార్టీల నాయకులకూ ఉండటం సహజం. బుధవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 వరకూ మోదీతో కేసీఆర్ సమావేశమైనారు. ఇతర విషయాలతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ చెప్పింది ఆలకించిన వెంటనే మోదీ రంగంలో దిగారు. అదే రోజు రాత్రి పార్టీ అధ్యక్షుడు అమిత్షా, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, వ్యవసాయమంత్రి రాధామోహన్సింగ్లను పిలిపించుకొని సుదీర్ఘ సమాలోచన చేశారు. మర్నాడు ప్రధాని కార్యాలయం (పీఎంవో) సంబంధిత శాఖల అధికారులను సమ న్వయం చేసి అభిప్రాయాలు సేకరించింది. కసరత్తు జరుగుతోంది. వాగ్దానం చేయగానే సరిపోదు రుణమాఫీ ప్రకటించడం సులువే. అమలు కష్టం. తెలంగాణలో వాయిదాలలో రుణాలు ప్రభుత్వం తీర్చింది. ఒకేసారి మాఫ్ చేస్తే బాగుండేదని రైతుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అంత మొత్తం సిద్ధంగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అన్యాయం. 2014 జూన్8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు రైతులపైన ఉన్న రుణభారం రూ. 87,612 కోట్లు. అంత భారీ రుణం తీర్చే స్థోమత కొత్త రాష్ట్రానికి ఉండదనే ఉద్దేశంతో రుణమాఫీ వాగ్దానం చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకోచించారు. చంద్రబాబు నిస్సంకోచంగా వాగ్దానం చేసి గెలిచాక ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తాన్ని తగ్గించడానికి అనేక అడ్డదారులు తొక్కవలసి వచ్చింది. అర్హతపైనా, చెల్లింపులపైనా పరిమితులు విధించి దాన్ని రూ. 24 వేల కోట్లకు కుదించారు. అంటే, వాగ్దానం చేసిన మొత్తంలో నాలు గింట ఒక వంతుకు తగ్గించారు. అది కూడా వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకూ మూడు విడతలలో చెల్లించిన మొత్తం రూ. 15,147 కోట్లు మాత్రమేనని చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది. ఈ సంవత్సరం వాయిదా ఇంతవరకూ చెల్లించలేదు. కొత్తగా కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన మూడు హిందీ రాష్ట్రాలలో కూడా రైతుల రుణాలు మాఫ్ చేయాలంటే ఖజానాలో డబ్బు లేదు. బయటి నుంచి అప్పు తీసుకొని తీర్చవలసిందే. ఉదాహరణకు, రాజస్థాన్లో 2018–19 బడ్జెట్ వ్యయం మొత్తం రూ. 1,07, 865 కోట్లు. అందులో 70 శాతం నిధులు వసుంధరే రాజే ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతుల రుణాలు మొత్తం రూ. 18 వేల కోట్లు. ఈ మొత్తం రుణాల మాఫీకి కేటాయిస్తే రాష్ట్ర సిబ్బందికి జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ ఇదే పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ఆరంభమైన తర్వాత ఏడు మాసాలలోనే నాలుగింట మూడు వంతుల బడ్జెట్ బీజేపీ ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అందుకే నిష్క్ర మించేముందు బీజేపీ ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేశాయంటూ కమల్నాథ్, గహ్లోత్ ఆరోపించారు. కేరళ ప్రయోగం రుణమాఫీకి మోదీ సుముఖంగా లేరని ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఆయన కాంగ్రెస్పైన చేసిన విమర్శ స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్ రుణ మాఫీ పేరుతో రైతులకు లాలీపాప్లు ఇచ్చి మోసం చేస్తున్నదనీ, అబద్ధాలు చెబుతున్నదనీ మోదీ ధ్వజమెత్తారు. ఏదో ఒక రూపంలో రైతులకు సాయం చేయవలసిన అవసరం మాత్రం ఉంది. 2006 కేరళ రైతుకు నరకం చూపించిన సంవత్సరం. కేరళలో వాణిజ్య పంటలు అధికం. రబ్బర్, మిరియం పండించి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ సంవత్సరం అంతర్జాతీయ విపణిలో ఈ రెండు పంటల ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులపైన అప్పుల భారం పెరిగింది. దాదాపు 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన రైతుల భార్యలతో ఢిల్లీలో జరిగిన ఊరేగింపునకు ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్ నాయకత్వం వహించారు. అప్పుడే యూడీఎఫ్ ప్రభుత్వం నిష్క్రమించి అచ్యుతానందన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ సర్కార్ ప్రవేశించింది. వామపక్ష ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ను ఆయన కేరళ ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడిగా నియమించి రైతు సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత అప్పగించారు. మన రాష్ట్రాలలో వలె కాకుండా కేరళలో సహకార బ్యాంకుల వ్యవస్థ సుస్థిరంగా ఉంది. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రుణాల విమోచన కమిషన్ను నియ మించింది. రైతు ప్రతినిధులూ, వ్యవసాయరంగ నిపుణులూ, సామాజిక కార్య కర్తలూ, రాజకీయ నాయకులూ కలసి బృందాలుగా ఏర్పడి గ్రామాలలో పర్యటించి, రుణగ్రస్తులైన రైతులతో, వారికి రుణాలు ఇచ్చిన సహకార బ్యాంకుల అధికారులతో సమాలోచనలు చేసి ఏ మేరకు మాఫ్ చేయాలో అక్కడికక్కడే నిర్ణయించేవారు. సహకార బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళకు వెళ్ళి వడ్డీ వ్యాపారులలాగా అవమానించరు. బృంద సభ్యులు రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ చొరవ ఫలితంగా బలవన్మరణాలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ అమలు చేస్తున్న పథకం చూసి జార్ఖండ్ ప్రభుత్వం కూడా రైతుబంధును పోలిన పథకం డిసెంబర్ 21న ప్రవేశపెట్టింది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టిన తొలి బీజేపీ పాలిత రాష్ట్రం ఇది. ఆ మర్నాడు ఒడిశా ప్రభుత్వం రైతుబంధులో స్వల్ప మార్పులు చేసి కొత్త పథకం ప్రకటించింది. రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. భూమి ఎవరి పేరున ఉంటే వారి పేరనే చెక్కు ఇస్తున్నారు. భూమిపైన పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎనిమిది వేల చొప్పున చెల్లిస్తున్నారు. రుణభారంతో వేగలేక ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో దాదాపు 75 శాతం కౌలు రైతులే. అటువంటి రైతులు తెలంగాణలో 15 లక్షల మంది ఉంటారని అంచనా. భూమి యజమానికీ, కౌలురైతుకీ మధ్య ప్రభుత్వం ఒక వారధిగా ఉంటూ యాజ మాన్య సమస్య ఉత్పన్నం కాకుండా, యజమానికి అభద్రతాభావం లేకుండా కౌలురైతుకు బ్యాంకు రుణాలు అందేవిధంగా, రైతుబంధు వంటి పథకం వర్తించే విధంగా ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టవలసిన బాధ్యత ఉన్నది. రైతు బంధు నమూనాను అమలు చేయాలని మోదీ తలపెట్టిన ట్లయితే ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నిజంగా రుణగ్రస్తులైనవారిని ఆదుకున్నట్టు అవు తుంది. పంట దిగుబడికి గిట్టుబాటు ధర చెల్లించడంతో పాటు ప్రాసెసింగ్ వ్యవస్థనూ, మార్కెటింగ్ సదుపాయాలనూ కల్పించగలిగితే రైతులు గౌరవ ప్రదంగా జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం పీవీ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.37లోని దసపల్లా హోటల్లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు శేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని పీవీ స్మారక ప్రసంగం చేయనున్నారు. జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవనున్నారు. -
విజయోత్సవంలో అపశ్రుతులేల?
చర్విత చర్వణమే అయినప్పటికీ తప్పు జరుగుతున్నప్పుడు ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. బధిరశంఖారావమైనా కళ్ళ ఎదుట జరుగుతున్న ఘోరాన్ని ఎత్తిచూపకపోవడం నేరం. అంచనాలకు మించిన విజయం సాధించిన తర్వాత పార్టీ ఫిరాయింపులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రోత్సహించరనే ఆశ అడియాసై వెక్కిరిస్తున్నది. పార్టీ ఫిరాయించిన వారు సిగ్గుపడకుండా సగర్వంగా తిరుగాడుతున్నారు. ఎన్నికల తతంగం ముగిసి రెండు వారాలు కాలేదు. శాసనసభ్యులుగా ప్రమాణం చేయలేదు. అప్పుడే ఇద్దరు ఇండిపెండెంట్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరి పోయారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫెడరల్ ఫ్రంట్ను నిర్మిం చేందుకు నడుం బిగించిన కేసీఆర్ను చూసి గర్వించాలో లేక విందు ఆరగించిన వెంటనే చిరుతిండ్లకు ఆశపడుతున్నందుకు నిందించాలో తెలియని పరిస్థితి తెలంగాణ ప్రజలది. మొత్తం 119 స్థానాలలో సొంతంగా 88 స్థానాలు గెలుచుకు న్నారు. మిత్రుడిగా చెప్పుకునే అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం ఏడు స్థానాలు కైవసం చేసుకున్నది. గతంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతున్నదనే అనుమానంతో ఎడాపెడా ఫిరాయింపులకు తెరలేపినప్పుడు అనేకులం ఆక్షేపించాం. అయినా బాధ్యులెవరూ పట్టించుకోలేదు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్లు పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్లో చేరినప్పుడే వారిపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు స్వామిగౌడ్కు మహజరు సమర్పించుకొని ఏడాదిన్నర గడిచిపోయింది. స్వామిగౌడ్ స్పందించ లేదు. ఆకుల లలిత కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతుతో మండలి సభ్యురాలుగా గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆమెకు టిక్కెట్టు ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టి గౌరవిస్తే ఓడిపోయిన పది రోజులకే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఏ రాజనీతి కిందికి వస్తుంది? లలిత, సంతోష్కుమార్లు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొని, లోగడ ఎప్పుడో ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తున్న దామోదర్రెడ్డి, ప్రభాకర్లను కలుపుకొని కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ నిర్వహించుకున్నామనీ, పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించామనీ తెలియజేస్తూ లేఖ సమర్పించిన క్షణాలలో సభా ధ్యక్షుడు స్వామిగౌడ్ స్పందించడం, కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైనట్టు ప్రకటించడం, శనివారంనాడు గెజెట్నోటిఫికేషన్ విడుదల చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తున్న పరిణామాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్వామిగౌ డ్కు ఇది శోభాయమానమైన పరిణామం కాదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అదే సభాధ్యక్షుడిని కలుసుకొని ఫిరాయించిన సభ్యులపైన వేటు వేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, దాన్ని స్వామిగౌడ్ స్వీకరించడం ప్రజా స్వామ్య వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా తయారైనదో, ఎంత హాస్యాస్పదంగా మారిందో, ఎంత కపటంగా దిగజారిందో సూచిస్తున్నది. పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది పార్టీని చీల్చాలని తీర్మానిస్తే వారి సభ్యత్వం గల్లంతు కాకుండా ప్రత్యేక గ్రూపుగా పరిగణించవచ్చు. కానీ పార్టీ విలీనం కావా లంటే మరికొన్ని అదనపు ప్రక్రియలు అవసరం. మనకున్నది ఒకటే రాజ్యాంగం. పార్టీ ఫిరాయించినవారిపైన సభాపతులు అనర్హత వేటు వేయాలని చెబుతున్నది అదే రాజ్యాంగం. 1985లో రాజీవ్గాంధీ, 2003లో అటల్బిహారీ వాజపేయి చొరవ తీసుకొని తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం, దాని సవరణ ఫిరాయిం పుల నిరోధానికి ఉద్దేశించినవి. ఏ రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియను అనుసరించి మన నేతలు అధికారంలోకి వచ్చారో అదే రాజ్యాంగంలో ఉన్న ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అధికారానికి గులాములు ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్టుపైన గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చానాగేశ్వర రావు సైతం కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రజాస్వామ్య ప్రియులకు బాధ కలిగిస్తాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో నగదు అందజేస్తూ కెమేరాకు చిక్కిన రేవంత్రెడ్డిని చేర్చుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో గౌరవించిన కాంగ్రెస్ పార్టీనీ ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ నాయకులు అదే కేసులో నిందితుడైన సండ్రను తమ పార్టీలోకి ఎట్లా ఆహ్వా నిస్తారో చూడాలి. ఈ సారి టీడీపీతో కూటమి కట్టి వ్రతం చెడినా ఫలం దక్కని కాంగ్రెస్ పార్టీకి చిక్కినవి కేవలం 19 స్థానాలు. అప్పుడే కాంగ్రెస్ ఎంఎల్ఏలు టీఆర్ఎస్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారనీ, దూకడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. తొమ్మిదిమంది ఎంఎల్ఏలను కొనుగోలు చేయగలిగితే శాసనసభలో కాంగ్రెస్ బలం పదికి పడిపోతుంది. ప్రతిపక్ష హోదా సైతం దక్కదు. ఆ విధంగా కాంగ్రెస్ను ‘బొంద పెట్టాల’ని కేసీఆర్ నిర్ణయించుకున్న ట్టున్నారు. ఎందుకంటే సోనియాగాంధీ హాజరైన ఎన్నికల సభలో ఉత్తమకుమా ర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ని ‘బొంద పెట్ట’వలసిందిగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుసు. అదే ప్రజల నిర్ణ యాన్ని వమ్ము చేస్తూ పార్టీలు మారుతున్న శాసనసభ్యులను ఎంత అవహేళన చేసినా, ఎంత నిందించినా తక్కువే. కొనుగోలు చేయడం అంటే కేవలం రొక్కం ఇచ్చి కొనడం కానవసరం లేదు. పదవి ఆశతోనో, మరే ఇతర ప్రలోభాలతోనో పార్టీ ఫిరాయించినవారు అమ్ముడు పోయినట్టే లెక్క. రోషం ఉన్న వారైతే చీటికీ మాటికీ పార్టీలు మారరు. విలువలకు పాతరేసి కేవలం అధికారానికి గులాము లుగా వ్యవహరించేవారిని ప్రజాప్రతినిధులంటూ గౌరవించడం పొరపాటు. కొత్త శాసనసభ నిర్మాణం జరగడానికి ముందే దొంగ చూపులు చూసే వారినీ, అడ్డదారులూ తొక్కేవారినీ ఏమని నిందించినా తప్పులేదు. నైతికత ఎవరికుంది? ప్రశంసార్హమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకూ, సుస్థిరమైన పరి పాలనను అందజేస్తున్నందుకూ, శాంతిభద్రతలనూ పరిరక్షిస్తున్నందుకూ అభి నందనలు అందుకుంటూ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన ప్రభావం వేసేందుకు జైత్రయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంలో చట్టసభలలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న పంతంతో రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడం వంటి అపస్వరం అవసరమా? ఇదంతా రాబోయే లోక్సభ ఎన్ని కలలో అనుకున్నది సాధించేందుకే అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తినిన కాంగ్రెస్ను చావగొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్షం లేకపోతే అది చట్టసభ అనిపించుకుంటుందా? దౌర్భాగ్యం ఏమంటే ఏ పార్టీ సభ్యులు ఫిరాయించినా వారిని మందలించే నైతిక అధికారం ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు పార్టీ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా అడ్డగోలుగా సాగించిన కాంగ్రెస్ పార్టీకి లలితను కానీ, సంతోష్కుమార్ను కానీ తప్పు పట్టే నైతిక హక్కు ఉండదు. రేపు ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలు టీఆర్ఎస్లో చేరిపోయి టీడీపీఎల్పీని రద్దు చేస్తే ఆక్షేపించే అధికారం టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడికి ఉండదు. తలసాని శ్రీనివాసయాదవ్ 2014లో టీడీపీ టిక్కెట్టు పైన గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందుకు హైదరాబాద్ వచ్చి హుంకరించిన చంద్రబాబు స్వయంగా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను కొనుగోలు చేసిన తర్వాత పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎంఎల్ ఏలను కానీ, ఎంఎల్సీలను కానీ మందలించే నైతిక స్థాయి కోల్పోయారు. జాతీయ స్థాయిలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రశ్నించే నాధులు లేరు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అడపాదడపా ఖేదం వెలి బుచ్చుతూ ఉంటారు కానీ చట్టంలో ఉన్న లోపాన్ని సవరించాలని ప్రధాన మంత్రికి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మనస్తాపం వెలిబుచ్చుతున్న ఏకైక జాతీయ నాయకుడిగా ఆయనను చెప్పు కోవాలి. అంతవరకూ మెచ్చుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ విష యంలో నిరపరాధి కారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అనారోగ్యం కారణంగా పదవీబాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. కొత్త ముఖ్యమంత్రిని నియమించే సాహసం బీజేపీ జాతీయ నాయకత్వం చేయలేకపోతోంది. ఎందు కైనా మంచిదని ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఏలను కొనుగోలు చేసి వారిని విమా నంలో ఢిల్లీకి రప్పించుకొని కాషాయ కండువాలతో సత్కరించారు. అటువంటి పార్టీ నాయకులకు ఇతర పార్టీలకు చెందినవారిని ఆక్షేపించే అర్హత ఏముంటుంది? జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఫిరాయింపులను ప్రశ్నించడం మానుకున్నాయి. టీఆర్పీ రేటింగులు రావనో, అధికారంలో ఉన్న పార్టీని దుయ్యపట్టడం ఎందుకనో తెలియదు. ఎన్డీటీవీ, ఇండియా టుడే వంటి చానళ్ళు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో యధేచ్ఛగా సాగిన ఫిరాయింపులను ఆక్షేపించలేదు. ఢిల్లీలో చిన్న ఘటన జరిగినా, కేజ్రీవాల్ తుమ్మినా, దగ్గినా రోజంతా కథనాలు నడిపే చానళ్లు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు 50 మంది ఎంఎల్ఏలు ఫిరాయించినా, ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు కట్టబెట్టినా అదేమని అడిగిన పాపాన పోలేదు. న్యాయస్థానాలు ఫిరాయింపుల చట్టాన్ని అక్షరాలా పాటిస్తున్నారే కానీ అందులోని స్ఫూర్తిని పట్టిం చుకోవడం లేదు. సభాపతి నిర్ణయమే ఖరారనీ, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదనీ 91 రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది. సభాపతులపైన అటువంటి గురుతరమైన బాధ్యత పెట్టడం, అంతటి విశ్వాసం వారిపైన ఉంచడం నాటి పార్లమెంటు చేసిన పొరబాటు. దాన్ని సవరించుకోవాలనే సదు ద్దేశం ఎన్డీఏ నాయకత్వానికి ఉంటే అవసరమైన మెజారిటీ ఉన్నది. ఆ ఉద్దేశమే లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ద్రోహం చేసి నట్టే భావించాలి. తడబాటు లోగుట్టు ఇది ఇలా ఉంటే, చంద్రబాబునాయుడు తనకు తోచిన విధంగా ముందుకు పోతున్నారు. 2004లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నట్టే ఇప్పుడు ఎన్నికలు నాలుగు మాసాలు కూడా లేని తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారట. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమట. ఉత్తరాంధ్ర రైల్వే జోన్కోసం తన పార్టీ ఎంపీలు పోరాడుతున్నారంటూ శ్రీకాకుళం ‘ధర్మపోరాటం’ సభలో ఊదరగొట్టారు. నాలుగేళ్ళు బీజేపీ పరిష్వంగంలో మైమరచి ప్రత్యేక హోదా అడగలేదు. ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్యాకేజీ కాదంటే జైళ్ళలో కుక్కుతానంటూ ప్రతిపక్ష సభ్యులనూ, నిరసనకారులనూ బెదిరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. సింగపూరును కలవరించి అమరావతిని డిజైన్ స్థాయి దాటకుండా గ్రాఫిక్స్తో ప్రజలను అలరిస్తున్నారు. సింగపూరు సినిమా చూపిం చడానికి ఒక థియేటర్ సైతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని ప్రయత్ని స్తున్నారు. బయోస్కోప్ చూపించి మరోసారి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో వ్యూహం బెడిసి పరువు మూసీలో కలి సినా హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ విజయం వెనుక తన కృషి ఉన్నదని చాటుకుంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్కి చేసిన మేలు ఏమిటంటే ఆ మూడు రాష్ట్రాలలో అడుగుపెట్టకపోవడం. తెలంగాణలో ప్రవేశించకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి మరో పది స్థానాలైనా దక్కేవని పరి శీలకుల అభిప్రాయం. తన మనుషులపైన కేంద్ర సంస్థలతో దాడులు చేయి స్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీని ‘కోడికత్తి’ పార్టీ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆపలేదు. ఆయన మానసిక స్థితికి ఇది నిదర్శనం. తెలం గాణ దెబ్బతో మనోవ్యాధి మరింత ముదిరింది. చంద్రబాబు ధోరణికి భిన్నంగా కేసీఆర్ ఆగమేఘాల మీద దూసుకుపోతున్నారు. తెలంగాణలో సాధించిన అఖండ విజయం ఆయనకు కొత్త కాంతి ప్రసాదించింది. ఉరవడి పెరిగింది. కుమారుడికి పార్టీ పెత్తనం అప్పగించారు. మంత్రి వర్గ నిర్మాణం పూర్తి కాకుండానే ఫెడరల్ యాత్ర ఆరంభిస్తున్నారు. పెరిగిన ప్రతి ష్ఠతో ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకోబోతున్నారు. ఎన్నికలకు ముందు జరిపిన యాత్రకీ, ఈ రోజు ప్రారంభం కానున్న యాత్రకూ తేడా ఉన్నది. అప్పటి కంటే ఇప్పుడు హెచ్చిన ఉత్సాహంతో అడుగు ముందుకు పడు తోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి ఎంత బలహీనమైతే కేసీఆర్ నిర్మి స్తున్న ఫ్రంట్కు అంత బలం పెరుగుతుంది. ఎన్డీఏ కాకుండా రెండు కూట ముల నిర్మాతలూ తెలుగు నాయకులు కావడం, వారిలో ఒకరు ఇటీవల ఘన విజయం సాధించడం, మరొకరు పరాజయం చవిచూడటం విశేషం. ఇద్దరు చంద్రులలో ఒక్కరే ప్రకాశిస్తారు. ఇద్దరూ ప్రకాశించడానికి అవకాశం లేదు. ఒకరు క్షీణచంద్రుడైతే మరొకరు పూర్ణచంద్రుడు అవుతారు. ప్రస్తుతానికి తెలం గాణ చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో స్పష్ట మైన పరాజయ సంకేతాలూ, అటు జాతీయ స్థాయిలో పరాభవ సూచనలూ చంద్రబాబును వేధిస్తున్నాయి. అందుకే మాటపైన అదుపు తప్పుతోంది. కె. రామచంద్రమూర్తి -
కేటీఆర్ చేతిలో స్టీరింగ్
ఇందిరాగాంధీ, ఎన్టి రామారావు, అటల్ బిహారీ వాజపేయి, చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నిండా మునిగారు. కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్ని కలలో గెలుపోటములు సర్వసాధారణం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికలలో పోరాడి గెలుపొందిన విధం విశేషమైనది. టీఆర్ఎస్ విజయంపై అధిక సంఖ్యాకులకు అనుమానం లేదు. కొందరు రాజకీయ పరిశీలకులూ, మీడియా ప్రవీణులూ వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఆగ్రహం కారణంగా టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓడిపోతుందని తీర్మానించుకున్నారు. ఆకాంక్షకూ, అంచనాకూ మధ్య సరిహద్దురేఖ చెదిరిపోయి గందరగోళానికి గురైనారు. కేసీఆర్ పట్ల కినుక వహించడానికి తగిన కారణాలు ఉండవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి çపసికట్టడంలో అది అవరోధం కాకూడదు. టీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీ లభించడానికి కారణాలు స్పష్టంగా కని పిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు కటువుగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారనే భావనతో కాంగ్రెస్ నాయ కులు స్థాయి మరచి టీఆర్ఎస్పైనా, కేసీఆర్పైనా పరుషపదజాలం ప్రయోగిం చారు. కేసీఆర్ మాత్రం ఉద్యమభాషకు భిన్నంగా, ఆవేశరహితంగా ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తనకు కాంగ్రెస్ అందించిన ఆయు ధాలతో సమర్థంగా పోరాడారు. ‘కేసీఆర్ కావాలా, చంద్రబాబు కావాలా?’ అన్న ప్రశ్న ప్రజల హృదయాలను సూటిగా తాకింది. త్యాగాలు చేసిన సాధించుకున్న తెలంగాణపైన అమరావతి ఆధిపత్యం అవాంఛనీయమని భావించిన ఓటర్లు క్యూలు కట్టి మూకుమ్మడిగా కారు బటన్ నొక్కారు. టీఆర్ఎస్ ఖాతాలో 88 స్థానాలు నమోదైనాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరడానికి సంసి ద్ధత వెలిబుచ్చారు. చేర్చుకుంటే కాంగ్రెస్ నుంచి రావడానికి పది మంది సిద్ధంగా ఉన్నారని భోగట్టా. ఫలించిన కేసీఆర్ వ్యూహం ఏ ఫలితం ఆశించి కేసీఆర్ గడువు కంటే ఏడు మాసాల మందుగానే శాసన సభను రద్దు చేయించారో అది దక్కింది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ లభించింది. 1983లో, 1994లో ఎన్టిఆర్ కూడా పెద్ద మెజారిటీలు సాధిం చారు. ఈ సారి టీఆర్ఎస్ విజయంలోని విశేషం ప్రతిపక్షానికి చెందిన అతిరథమహారథులు మట్టికరవడం. పీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారు ఎన్నికల బరిలో రాణించలేకపోయారు. పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఓడిపోవడమే కాకుండా పాత కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఇసుమంతైనా నిలువరించలేకపోయారు. ముఖ్య మంత్రి అభ్యర్థులుగా భావించిన జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజ నరసింహ వంటివారూ పరాజయం పాలైనారు. ఈ స్థాయికి చెందినవారిలో భట్టి విక్రమార్క ఒక్కరే తాను గెలుపొందడమే కాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల విజయానికి కారకుడైనారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి మండలిలో పని చేసిన మహిళలు గీతారెడ్డి, సునీతా లక్షా్మరెడ్డి, అరుణ, సురేఖ ఓడిపోయారు. ఒక్క సబిత మాత్రం గెలిచారు. కూటమికి ప్రచారం చేయడం పేరు మీద చంద్రబాబు మొదటి పాదం ఖమ్మం జిల్లాలోనే మోపినా భయ పడినంత నష్టం కాంగ్రెస్ అభ్యర్థులకు జరగలేదు. చంద్రబాబు ప్రభావం ఇతర జిల్లాలపైన విపరీతంగా పడింది. ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా, వారి ఆకాంక్షలనూ, అనుభవాలనూ పట్టించుకోకుండా, చంద్రబాబు పట్ల తెలంగాణలో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో, ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)తో, సీపీఐతో కలసి కూటమి కట్టి భంగపడింది. చంద్రబాబు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఒక్కటే కాదు, టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోని అనైతికతను కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. టీడీపీ ప్రతినిధిగా కంభంపాటి రామమోహనరావు ఢిల్లీలో రాహుల్గాంధీ కార్యాలయానికి వెళ్ళడం, కాంగ్రెస్ అధిష్ఠానం దూతగా అశోక్ గహ్లోత్ అమరావతికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ జాబితా ఖరారు కావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తించాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి. టీఆర్ఎస్తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన తర్వాతనే కాంగ్రెస్తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారనే సంగతి విస్మరించకూడదు. చంద్రబాబుకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎటు వంటి అభ్యంతరం లేదు. సిద్ధాంతాలూ, సూత్రాలూ, విధానాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద కూటములు కట్టే చంద్రబాబు వంటి నాయకుడితో స్నేహం చేస్తే బీజేపీకి ఎటువంటి పరాభవం జరిగిందో కాంగ్రెస్కూ అదే అను భవం ఎదురవుతుంది. లోక్సభ ఎన్నికలు కొద్ది నెలలోనే జరగబోతున్నాయి. పొత్తుల గురించీ, ఎత్తుల గురించీ, జిత్తుల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం, సందర్భం ఇదే. కేటీఆర్కి ఉన్నత పదవి ఇదే మంచి సమయం అనుకొన్న కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నియమించారు. ఇది కూడా అనూహ్య పరిణామం కాదు. ఇది కేసీఆర్ సమయజ్ఞతకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సభలలో మాట్లాడిన నాయకుడు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కువ స్థాయిలో గెలిపించిన ఘనత కేటీఆర్దే. మరో యువ నాయకుడు హరీష్రావు అవిభక్త మెదక్ జిల్లాపైన దృష్టి కేంద్రీకరించి మొత్తం పది స్థానాలలో తొమ్మి దింటిని టీఆర్ఎస్ ఖాతాలో వేయడంతోపాటు మహ బూబ్నగర్లో రేవంత్రెడ్డి, డికె అరుణ వంటి ఉద్దండులను ఓడించే బాధ్యత కూడా జయప్రదంగా నెరవేర్చారు. కేటీఆర్ విద్యాధికుడు, మూడు భాషలలో ప్రతిభావంతమైన వక్త. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడాన్ని ఎవ్వరూ ఆక్షేపించజాలరు. కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ సమర్థుడూ, నమ్మ కస్తుడూ. ఇంతవరకూ నగర ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్కు పార్టీ నిర్మాణ క్రమంలో పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలోని నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. నాయకుడిగా ఎది గేందుకు దోహదం చేస్తాయి. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్ పోషించవలసిన పాత్ర ఏమైనా నిర్దిష్టంగా ఉంటే హైదరాబాద్లో కేటీఆర్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతార ని జనాభిప్రాయం. హరీష్ని అనుమానించకుండా, అవమానించకుండా సముచితమైన ఆదరణ, గౌరవం ఇచ్చినంతవరకూ కేటీఆర్కు ఇబ్బంది ఉండదు. పార్టీ అంతా అండగా ఆయన వెంటే నిలబడుతుంది. ఈ సంగతి కేటీఆర్కీ తెలుసు. వివేకంతో వ్యవహరిస్తారు. టీఆర్ఎస్తోనే తన గతం, వర్తమానం, భవిష్యత్తు ముడివడి ఉన్నాయనే స్పృహ హరీష్కూ ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు ఫలితాలు వెల్లడైన రోజునే మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్, బీజేపీల ప్రమేయంలేని మూడో కూటమి. రెండు జాతీయ పార్టీల వల్లా దేశానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడాలని పథక రచన చేస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయనేది ప్రశ్న. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ సంస్థలకూ నిధులనూ, విధులనూ ఏ మేరకు వికేంద్రీకరిస్తున్నాయనేదీ ప్రశ్నే. పైగా కాంగ్రెస్కు వచ్చే ఎన్నికలలో ఎంత లేదన్నా వందకు పైగా సీట్లు వస్తాయి. బీజేపీకి రెండువందల కంటే తగ్గక పోవచ్చు. మిగిలిన 245 స్థానాలలో కొత్తగా ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ ఎన్ని గెలుచుకోగలదు? రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని లోక్సభ స్థానాల సంగతి ఏమిటి? ఒక రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కొత్త ఫ్రంట్లో ఉండగలదు. ఉదాహరణకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒకే ఫ్రంట్లో ఉండవు. తమిళనాడులోనూ అంతే. కాంగ్రెస్, బీజేపీ కూటములను నిలువ రించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఉపకరించవచ్చు. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఫ్రంట్కు ఉండదు. వీపీ సింగ్ ప్రభుత్వంలాగా బీజేపీ మద్దతునూ, దేవెగౌడ, గుజ్రాల్ లాగా కాంగ్రెస్ బాసటనూ తీసుకొని బలహీన ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిందే కానీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి నిలదొక్కుకోవడం కష్టం. అయినా సరే, అటువంటి ప్రయత్నం జరగడం మంచిదే. కాంగ్రెస్కు కొత్త కళ ఇటువంటి సమయంలో మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీకి 2014లో అత్యధిక స్థానాలు సమకూర్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్యనే ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందింది. మాయావతి, అఖిలేశ్ సహకారంతో మధ్యప్రదేశ్లో అందలం ఎక్కబోతోంది. పదిహేనేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించవలసిన కాంగ్రెస్ బొటా బొటి మార్కులతో పాస్ కావడాన్ని ఘనవిజయంగా భావించనక్కరలేదు. ఛత్తీస్గఢ్లో అనూహ్యంగా కాంగ్రెస్కు పెద్ద మెజారిటీ లభించింది. ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్జోగీ, మాయావతి కలసి ఏర్పాటు చేసిన కూటమి వల్ల కాంగ్రెస్కు చేటు కలుగుతుందని అత్యధికులు ఊహించారు. జోగీ బీజేపీకి నష్టం కలిగించి కాంగ్రెస్కు అసంకల్పితంగా ఉపకారం చేశారు. మూడు విడతలు వరుసగా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్సింహ్ చౌహాన్, రమణ్సింగ్ల ఓటమిని అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత చౌహాన్ నవ్వుతూ హాయిగా మాట్లాడటం అభినందించవలసిన విషయం. రాజస్థాన్లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అనుకున్న బీజేపీ గట్టిగా ప్రతిఘటించడం బీజేపీ కార్య కర్తల బలాన్నీ, కాంగ్రెస్ పరిమితులనూ వెల్లడిస్తున్నది. మూడు హిందీ రాష్ట్రా లలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ కృషి ఉన్నదంటూ చంద్రబాబు చెప్పు కుంటున్నారు. అది ఆర్థిక ప్రమేయం కావచ్చునంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనూ చంద్రబాబు సందర్శించ కుండా కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో రాహుల్గాంధీ వ్యవహరించిన తీరు ప్రశంసార్హం. ఇంతవరకూ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో గెలిచినా ఢిల్లీ నుంచి అధిష్ఠానవర్గం దూతలు వెళ్ళడం, ఎంఎల్ఏలతో మాట్లాడటం, అక్కడి నుంచి పార్టీ అ«ధినేతతో ఫోన్లో మాట్లాడి ఆదేశం తీసుకోవడం లేదా ఢిల్లీ వెళ్ళి అంతా నివేదించి ఒక కవరుతో వచ్చి పార్టీ అధినేత నిర్ణయం ప్రకటించడం రివాజు. ఈ సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా, రాహుల్, ప్రియాంక (కుటుంబ వ్యవహారమని నిందించవచ్చు) సుదీర్ఘ సమాలోచనలు జరిపి, ముఖ్యమంత్రిగా కమల్నాథ్ను నిర్ణయించి, పదవి లభించని జ్యోతిరాదిత్య సింధియాను సముదాయించి, సంతృప్తిపరిచి భోపాల్కు పంపించారు. కమల్నాథ్ సోమవారం ప్రమాణం చేస్తారు. జ్యోతిరాదిత్య ఢిల్లీలోనే రాహుల్కు సహాయకుడుగా ఉంటారు. రాజ స్థాన్లో కూడా ఇదే విధమైన రాజీ కుదిరింది. గహ్లోత్ ముఖ్యమంత్రిగా, సచిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్విజయ్సింగ్ బీజేపీకి అధికారం అప్పగించి పదిహేను సంవత్సరాలు గడచిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు కమల్నా«ద్ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబోతున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని ఈ రోజు నిర్ణయిస్తారు. ముఖ్య మంత్రి పదవికి నాయకులను నిర్ణయించే క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు కనుక్కునేందుకు కూడా రాహుల్ సర్వే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియవల్ల ఎంపికలో జాప్యం జరగవచ్చు. కానీ అందరినీ సంప్రదించారనే సంతృప్తి ఉంటుంది. మూడు రాష్ట్రాలలో విజయం కాంగ్రెస్కు ఆక్సిజెన్ అందించింది. రాహుల్ ప్రతిష్ఠ ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ మోదీకి సమ ఉజ్జీ కాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2019 మే వరకూ వేచి ఉండాలి. అప్పుడే తెలంగాణలోనూ నాటకీయమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?
శుక్రవారం పోలింగ్తో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ చరమాంకంలోకి వచ్చింది. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తే కార్యక్రమం పూర్తవుతుంది. పోలింగ్ రోజు సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్పోల్స్ ఫలితాలను చూస్తే సంబరాలు జరుపుకునే స్థితిలో ఏ పార్టీ ఉండబోదని అనిపిస్తున్నది. రాజస్థాన్లో బీజేపీ ఓడిపోతుందనీ, కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందనీ సర్వే చేసిన సంస్థలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. ఫలితాలలో సైతం పెద్దగా వ్యత్యాసం ఉండదు. మిజోరంలో మిజోనేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 18 స్థానాలు గెలుచుకొని, ఇండిపెండెంట్ల సహకారంతో కాంగ్రెస్ను గద్దె దింపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మెజారిటీ స్థానాలు గెలుచుకొని అధికారంలో కొనసాగుతుందని అత్యధికుల అంచనా. ఒకే పార్టీ, ఒకే ముఖ్యమంత్రి మూడు విడతలు ఎన్నికై పదిహేనేళ్ళు పరిపాలించిన తర్వాత వారి పట్ల ప్రజలలో విముఖత ఏర్పడితే ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ఛత్తీస్గఢ్ ముఖియా రమణ్సింగ్ ఎంత ప్రజారంజకంగా పరిపాలించినా సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల వారంటే ప్రజలకు మొహం మొత్తుతుంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 110 సీట్లు, కాంగ్రెస్ 109 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదనీ, బీఎస్పీకి రెండు స్థానాలు లభించవచ్చుననీ ఎగ్జిట్పోల్స్ ఫలితాల సగటు సూచిస్తున్నది. మూడు విడతలు గెలిచిన పార్టీని నాలుగోసారి సైతం ఖాయంగా ఓడిస్తామని ఘంటాపథంగా చెప్పలేని అసమర్థత కాంగ్రెస్దీ, దాన్ని పట్టిపల్లార్చుతున్న బహునాయకత్వానిదీ. ఛత్తీస్గఢ్లో హంగ్ రావచ్చునని సర్వేక్షకులు అంటున్నారు. వాజపేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్తో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ తరఫున తొలి ముఖ్యమంత్రిగా మూడేళ్ళు పరిపాలించిన అజిత్జోగీ పార్టీ అధిష్ఠానంపైన అలిగి ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ (సీజేసీ) పేరుతో సొంత కుంపటి పెట్టు కున్నారు. సీజేసీ, బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ), సీపీఐ కలిసి ఒక కూట మిగా ఏర్పడినాయి. ఎగ్జిట్పోల్స్ సరాసరి చూసినట్లయితే 90 స్థానాలు కలిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో బీజేపీకి 41, కాంగ్రెస్కి 42 స్థానాలు లభిస్తాయి. జోగీ కూటమికి నాలుగు స్థానాలు వస్తాయని అంచనా. 46 మంది ఎంఎల్ఏలు ఏ పక్షంతో ఉంటే దానిదే అధికారం. కాంగ్రెస్, జోగీ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. జోగీ కాంగ్రెస్వైపు మొగ్గుతారో, బీజేపీనే నయం అనుకుంటారో తెలియదు. ముగ్గురు ఇండిపెండెంట్లు ఎవరిని బలపరుస్తారో చూడాలి. మొత్తం మీద జోగీ కింగ్ కానీ, కింగ్ మేకర్ కానీ కావచ్చు. రాజస్థాన్లో 1993 నుంచి ఇంతవరకూ అయిదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారీ ప్రజలు అధికారపార్టీని ఓడించి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఈ రాష్ట్రంలో ప్రధానంగా పోటీ. 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో ఈసారి బీజేపీకి 78 స్థానాలు మాత్రమే దక్కుతాయనీ, కాంగ్రెస్ 110 స్థానాలు గెలుచుకుంటుందనీ ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఏ మాత్రం సందేహం లేకుండా కాంగ్రెస్ ఆధిక్యం సాధిస్తుందని చెప్పగలుగుతున్న ఒకే ఒక రాష్ట్రం రాజస్థాన్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్పోల్స్ నిర్వహించిన పదకొండు సంస్థల ఫలితాల సగటు పరిశీలిస్తే టీఆర్ఎస్కు 67 సీట్లు వస్తాయని తేలుతోంది. ప్రజా కూటమికి 39, బీజేపీకీ 5 రావచ్చునంటున్నారు. 119 మంది సభ్యులు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో 61 మంది ఎంఎల్ఏలు ఉన్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రీపోలింగ్ అవసరం రాకుండా, హింసకు ఆస్కారం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు దోహదపడిన డీజీపీ మహేందర్ రెడ్డిని, పోలీసు యంత్రాంగాన్ని అభినందించాలి. టీఆర్ఎస్కే పట్టం తెలంగాణ అతి పిన్న రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలలో ఆరాధనాభావం ఉన్నది. ఆగ్రహం సైతం ఉన్నది. కేసీఆర్ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ విశేష ప్రయత్నం చేసింది. ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)నీ, సీపీఐనీ కలుపుకొని ప్రజా కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు ఆజన్మ విరోధి అయిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ని కూటమిలోకి ఆహ్వానించింది. వ్రతం చెడినా ఫలం దక్కక పోవచ్చునని ఎగ్జిట్పోల్స్ సూచిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో వేదిక పంచు కున్నారు. గతం గతః అనుకున్నామనీ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న గతాన్ని విస్మరించి దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, ప్రజాస్వామ్య సంస్థలనీ కాపాడేందుకు కలసికట్టుగా పోరాడాలని తీర్మానించుకున్నట్టు ఇద్దరూ చెప్పారు. కాంగ్రెస్ను పాతరేసేందుకే ఆవిర్భవించిన టీడీపీతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు ఏమిటనే ప్రశ్న సహజంగానే తెరపైకి వచ్చింది. కాంగ్రెస్–టీజేఎస్–సీపీఐ కూటమి టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తుందని భావించిన టీఆర్ఎస్ నేతలకు చంద్రబాబుతో కాంగ్రెస్ దోస్తీ ఒక వరప్రసాదంగా కలసివచ్చింది. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఒక పార్టీ గెలుస్తుంది. మరో పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మరోసారి గెలుపొందుతుంది. బిల్లీ గ్రాహం వంటి మతప్రచారకులూ, వుడ్రో విల్సన్ వంటి రాజకీయనాయకులూ చెప్పిన హితవాక్యం ఏమంటే, ‘ధనం పోతే నష్టం లేదు. ఆరోగ్యం పోతే కొంత నష్టం. శీలం (క్యారెక్టర్) కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే’. ఇది వ్యక్తిత్వవికాసంలో ముఖ్యమైన అంశం. ఎగ్జిట్పోల్స్ ఫలితాలే నిజమైతే తెలంగాణ ఎన్నికలలో ముగ్గురు నాయకులు నష్టబోతారు. జాతీయ స్థాయిలో మోదీ–అమిత్ షాల రాజ్యానికి ప్రత్యామ్నాయం నిర్మించాలనే ప్రయత్నానికి తెలంగాణలో రాహుల్గాంధీ, చంద్రబాబు నాందీప్రస్థావన చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి లగడపాటి చెప్పినట్టు విజయం సాధిస్తే రాహుల్గాంధీకీ, చంద్రబాబుకూ గొప్ప ప్రయోజనం కలుగుతుంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసే ప్రయత్నాలకు మంచి ఊపు లభిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో కూడా విజయం సాధిస్తే రాహుల్గాంధీని పట్టుకోవడానికి పగ్గాలు ఉండవు. మోదీకి ప్రత్యామ్నాయంగా జాతీయ యవనికపైన రాహుల్ అవతరించినట్టే. మహాకూటమిలోకి మాయావతిని తీసుకొని రాగలిగితే, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్పార్టీ, కాంగ్రెస్, అజిత్సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) కలసి పోటీ చేస్తే బీజేపీ కోలుకోలేని దెబ్బతింటుంది. యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాలలోనూ ఈ కూటమికి 65 వరకూ వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటువంటి స్నేహమే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో కూడా వెల్లివెరిస్తే బీజేపీకి కష్టాలు తప్పవు. మోదీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు కొత్త శక్తి అబ్బుతుంది. రాహుల్గాంధీకి స్ఫూర్తిప్రదాతగా, ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణంలో సూత్రధారిగా మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పడానికి చంద్రబాబుకు అవకాశం వస్తుంది. పాదయాత్రలో ప్రజలను అసాధారణ స్థాయిలో ఆకర్షిస్తూ వారి హృదయాలను గెలుచుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో ఎదుర్కోగలనని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రొఫెసర్ కోదడరామ్ ఆబోరు కొంతమేరకు దక్కుతుంది. గడ్డం ఉంచుకున్నా గీయించుకున్నా టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమకుమార్రెడ్డిని గబ్బర్ సింగ్గా ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అంగీకరించక తప్పదు. శీలం ప్రధానం ఎగ్జిట్పోల్ నిర్వహించిన సంస్థలలో అత్యధిక సంస్థలు చెప్పినట్టు ప్రజాకూటమి వీగిపోయి టీఆర్ఎస్కే మెజారిటీ లభిస్తే ఎన్డీఏ ప్రత్యామ్నాయ కూటమి నిర్మించాలనే సంకల్పం బలహీనపడుతుంది. రాహుల్గాంధీ ప్రతిష్ట దెబ్బతింటుంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు చలామణి తగ్గిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్లు లేకుండా ప్రాంతీయ పార్టీలను కలిపి ఫెడరల్ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదనతో కేసీఆర్ తిరిగి ఢిల్లీ వెళ్ళి నేతలతో సంప్రదింపులు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మరింత బలహీనపడతారు. మూడున్నర దశాబ్దాలు అడుగడుగునా కాంగ్రెస్ను ప్రతిఘటించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాహుల్గాంధీ ఏమి నిరూపించారు? గెలుపే ప్రధానమనీ, విజయం కోసం ఏ పనైనా చేస్తాననీ చాటి చెప్పారు. శీలం ప్రధానం కాదనీ, అవకాశవాదం పట్ల అభ్యంతరం లేదనీ తేల్చారు. ఎన్నికలలో గెలుపుకోసం ఎవరితోనైనా భుజం కలపవచ్చునని చెప్పకనే చెప్పారు. దశాబ్దాల తరబడి స్థానిక టీడీపీ నేతలతో ఘర్షణ పడి, కోర్టు కేసులు పెట్టుకొని, తరతరాలుగా వైరం కొనసాగిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడు పడని విధానం. ఇదే విధంగా టీడీపీ నాయకులు సైతం భావించి ఉంటారు. పదవే పరమావధిగా భావించే నాయకులకు ఎటువంటి అపవిత్ర కలయికల పట్లా అభ్యంతరం ఉండదు కానీ నికార్సయిన కార్యకర్తలకూ, మండల స్థాయి నాయకులకూ ప్రత్యర్థులతో రాజీపడటం సుతరామూ ఇష్టం ఉండదు. లగడపాటి జోస్యం నిజం కాకపోతే ఉత్తమ కుమార్రెడ్డి కల చెదిరిపోతుంది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడుగా ఉత్తమ్ నిర్విరామంగా కృషి చేశారు. చంద్రబాబుతో స్నేహం చేటు చేసిందని మనసులో బాధపడవలసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరి కంటే అధికంగా నష్టపోయిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్. 2009 డిసెంబర్లో తెలంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ–టీజాక్) ఆవిర్భవించినప్పటి నుంచీ దానికి నాయకత్వం వహిస్తూ ఉద్యమాన్ని కొనసాగించడంలో ముఖ్యమైన భూమిక పోషించిన కోదండరామ్కు తెలంగాణ సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నది. రాజకీయ అంశాలపైన పోరాడాలంటే రాజకీయ పార్టీ పెట్టాలనీ, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనీ వాదించినవారిలో ఈ రచయితా ఒకడు. పార్టీ పెట్టిన తర్వాత సమర్థులైన సహచరులు లభించకపోవడం, పార్టీ నిర్మాణానికి సమయం లేకపోవడం, ఎన్నికలు తరుముకుంటూ రావడం, కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులతో వ్యవహారం చేయవలసి రావడంతో కోదండరామ్ గందరగోళానికి గురి అయినట్టు కనిపించారు. ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టు కోవడానికి కాంగ్రెస్ సిద్ధపడిందో అప్పుడే ఆ కూటమి నుంచి టీజేఎస్ వైదొలగ వలసింది. చంద్రబాబును కోదండరామ్ నవ్వుతూ పలకరించడం, గద్దర్ ఆలింగనం చేసుకోవడం తెలంగాణ ఉద్యమంతో మమేకమైనవారికి నచ్చదు. ఆ ఇద్దరి సహకారం కేసీఆర్ సైతం తెలంగాణ ఉద్యమ స్వభావానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసి గెలిచినవారినీ, ఓడిన వారినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని సైతం ఆదరించడాన్ని జనం ఆమోదించలేదు. తప్పనిసరిగా ఓడిపోతారని తెలిసి కూడా చాలామంది ఎంఎల్ఏలకు మళ్ళీ టిక్కెట్లు ఇచ్చారు. ఇన్ని పనులు చేసినా టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయంటే అందుకు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలు కారణం. ఆయన విజయం సాధిస్తే ఇద్దరు ప్రముఖులకు విధిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకరు మోదీ. మరొకరు చంద్రబాబు. మోదీ మూడు సభలలో పాల్గొని సమర్థంగా ప్రచారం చేయడమే కాకుండా అమిత్షానూ, డజను మందికిపైగా కేంద్ర మంత్రులనూ తెలంగాణలో ప్రచారానికి దించారు. బీజేపీకి సీట్లు పెద్దగా పెరగక పోయినా ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని సర్వేలు సూచిస్తున్నాయి. అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అధికభాగం ప్రజాకూటమికి పోకుండా బీజేపీ అడ్డుకొని టీఆర్ఎస్ను ఆదుకున్నదని అర్థం. ప్రజాకూటమి తరఫున విడుదల చేసిన ప్రచార సామగ్రిలో చంద్రబాబు ప్రముఖంగా కనిపించి, నాలుగైదు రోజులు ఖమ్మంలోనూ, హైదరాబాద్లోనూ విస్తృతంగా ప్రచారం చేసి కేసీఆర్కు గొప్ప మేలు చేశారు. ‘నిర్ణయాలు హైదరాబాద్లో జరగాలా, అమరావతిలో జరగాలా?’ ‘నేను కావాలా, చంద్రబాబు కావాలా?’ ‘రెండు రాష్ట్రాలనూ తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తెలంగాణకు అవసరమా?’ అంటూ ఎన్నికల సభలలో ప్రజలను ప్రశ్నించి సమాధానం చెప్పించే వీలు కేసీఆర్కు దొరికింది. చంద్రబాబు రంగంలో దిగకపోతే ఆయనను ఒక ఆయుధంగా వినియోగించుకునే అవకాశం కేసీఆర్కు ఉండేది కాదు. - కె. రామచంద్రమూర్తి -
మర్యాదలు మంటగలిసిన వేళ
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడేందుకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది. యోధానుయోధులు ప్రచారం చే శారు. రోజూ పదిహేను హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనేక సభలు జరిగాయి. ఓటర్లపైన ప్రభావం వేయడానికి ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రచారం చేశారు. మూడు న్నర దశాబ్దాల వైరం మరచి భుజం కలిపిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కొత్త ప్రేమికుల వలె వ్యవహరిస్తున్నారు. వారికి ఇతరులు ఎవ్వరూ కనిపించడం లేదు. అంతా పక్కాగానే ఉన్నదనే అంచనాతో శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్ని కలకు సాహసించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఒక వైపు కూటమినీ, మరో వైపు మోదీ పరివారాన్నీ ఎదుర్కొంటూ సవ్యసాచిలాగా పోరాడుతు న్నారు. ఆపద్ధర్మ మంత్రులు హరీష్రావూ, కల్వకుంట్ల తారకరామారావూ (కేటీఆర్) సమర్థంగా సేనానికి చేదోడువాదోడుగా పరిశ్రమిస్తున్నారు, పరా క్రమిస్తున్నారు. ప్రతిపక్ష కూటమిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, రేవంత్రెడ్డి ఆలస్యంగా ఆరం భించినప్పటికీ శక్తివంచనలేకుండా పరుగెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రోజుకొక జాతీయ స్థాయి నాయకుడు వచ్చి ప్రచారం చేసి, మీడియాతో మాట్లాడి వెడుతున్నారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రామ్ హెలికాప్టర్లో తిరిగి ప్రచార సభలలో ప్రసంగిస్తున్నారు. ఖమ్మంలో జరి గిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబునాయుడు ప్రప్రథమంగా వేదిక పంచుకొని ప్రసం గించారు. ప్రజాగాయకుడు గద్దర్ రాహుల్తోపాటు చంద్రబాబునాయుడు పొట్టలో కూడా తలపెట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఖమ్మం సభకు అధ్యక్షత వహించిన భట్టి విక్రమార్క శీలం సిద్ధారెడ్డిని గుర్తు చేసుకోవడం బాగుంది. కానీ పీవీ నరసింహారావు పేరు విస్మరించడం, జలగం వెంగళరావు ప్రస్తావన లేకపోవడం, వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించకపోవడం కృతఘ్నతగానే పరిగణించాలి. అదే రోజు హైదరాబాద్లో జరిగిన రోడ్షోలో సభకు అధ్యక్షత వహించిన టీడీపీ నాయకుడు ఎల్ రమణ చంద్రబాబును అపరచాణక్యుడుగా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేయడం, తెలంగాణలో అన్ని ప్రాజెక్టులూ, అన్ని రకాల అభివృద్ధీ తనవల్లనే అయిందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆమోదిస్తున్నట్లు రాహుల్గాంధీ చిరునవ్వులు చిందించడం ఎబ్బెట్టుగా కనిపించింది. రాజకీయాలలో శాశ్వత మిత్రులూ, శాశ్వత శత్రువులూ ఉండరనే నానుడిని నూటికి నూరు పాళ్ళూ నిజమని నిరూపించిన దృశ్యం ఖమ్మంలో కళ్ళకు కట్టింది. ఇంతకాలం కాంగ్రెస్, టీడీపీల మధ్య రాజకీయ వైరం మాత్రమే ఉండేది కానీ సైద్ధాంతిక విభేదాలు ఏమీ లేవని చంద్రబాబు చెప్పారు. రాహుల్, చంద్రబాబు పరస్పరం ఒకరిపైన ఒకరు ఆధారపడినట్టు కనిపించారు. ఇంత వరకూ జరిగిన ప్రచారంలో కొట్టవచ్చినట్టు కనిపించిన ధోరణులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి–అలవికాని వాగ్దానాలు చేయడం. రెండు– నోటికి వచ్చిన ఆరోపణ చేయడం, దుర్భాషలాడటం. మూడు–వాస్తవాలను యధేచ్ఛగా వక్రీకరించి తమ అవసరాలకు తగిన కల్పితాలను సత్యాలుగా ప్రచారం చేయడం. ఈ మూడు ధోరణులూ అన్ని ఎన్నికలలో ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఈ ఎన్నికలలో పరాకాష్ఠకు చేరాయి. అన్ని సరిహద్దులనూ అతిక్ర మించాయి. సకల మర్యాదలనూ మంట కలిపాయి. హామీల అమలు సాధ్యమా? నేతలు లెక్కలేనన్ని వాగ్దానాలు లెక్కలేకుండా చేశారు. ఎన్నికలలో హోరాహోరీ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలో కొన సాగినా, ప్రజాకూటమి అధికారంలోకి వచ్చినా వారు చేసిన బాసలను అయిదేళ్ళపాటు సక్రమంగా అమలు చేయడం దాదాపు అసాధ్యం. అందుకు అవసరమైన నిధులు లభించే అవకాశం లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే తప్ప రాష్ట్ర వనరులకు పరిమితమై చేయడం సాధ్యం కాని పని. ఈ ఎన్నికలలో గట్టెక్కితే చాలు, వాగ్దానాల సంగతి తర్వాత చూసు కుందామనే ధోరణితో పోటాపోటీగా వాగ్దానాలు చేశారే కానీ వాటి అమలుకు ఎంత ఖర్చు అవుతుందో, దాన్ని భరించడానికి ఆదాయం ఎక్కడి నుంచి లభిస్తుందో ఆలోచించిన దాఖలా లేదు. ఒక వేలం(Ðð ర్రి)పాట పాడినట్టు కని పిస్తున్నది కానీ ఆచితూచి చేసిన వాగ్దానాల వలె కనిపించడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనూ, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అంశాలనూ మించి వాగ్దానాలు చేయాలనే తాపత్రయం కాంగ్రెస్లో కనిపిం చింది. ఒక వేళ గెలిచి అధికారంలోకి వస్తే ప్రతి హామీ నుంచి లబ్ధిపొందేవారి సంఖ్యను కుదించడానికి కసరత్తు చేయాలనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు. తగిన ఆదాయం లేకుండా వాగ్దానాలు చేసినట్టే సాక్ష్యాధారాలు లేకుండా ప్రత్యర్థులపైన విపరీతమైన ఆరోపణ చేయడం అలవాటుగా మారింది. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలోనే మొదటి రెండు స్థానాలలో నిలుస్తాయి. తర్వాత తమిళనాడు, కర్ణాటక. ఇంత వ్యయం భరించాలంటే రాజకీయ నాయకులు అక్రమంగా ఆర్జించడం అని వార్యం. ఉత్తరాదిలో ఇతర అవలక్షణాలు అనేకం ఉన్నాయి కానీ ఎన్నికలలో ధనబలం ఇంత పెద్ద మోతాదులో లేదు. అవినీతికి ఒడిగట్టినవారే నీతిసూత్రాలు వల్లెవేయడం, తమకంటే నీతిమంతులు దేశంలో మరెవ్వరూ లేరంటూ చెప్పుకోవడం, మీడియా ప్రశ్నించకుండా ప్రచారం చేయడం మన ప్రత్యేకత. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాహుల్గాంధీ కాస్త రాటు తేలినట్టు కనిపిస్తున్నారు. మోదీపైన రఫేల్ డీల్ ఆరోపణాస్త్రం సంధించడమే కాకుండా ప్రత్యర్థులందరిపైనా అవినీతి ఆరోపణలు చేయడమే రాజకీయం అనుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావిం చినవారు తాము అధికారంలోకి వస్తే వైఫల్యాలను సాఫల్యాలుగా ఏ విధంగా మార్చదలిచారో వివరిస్తే అది సకారాత్మక రాజకీయం అవుతుంది. ప్రత్య ర్థులపైన ఒంటి కాలిపైన లేస్తున్న రాహుల్గాంధీ కొత్త మిత్రులపట్ల అసా ధారణమైన ఆదరణ, గౌరవం ప్రదర్శిస్తున్నారు. దేశాన్ని రక్షించడానికి తానూ, చంద్రబాబూ పెద్ద బాధ్యతను భుజాలపైన ఎత్తుకున్నట్టు చెబుతున్నారు. తాము జాతీయ స్థాయికి కూటమిని విస్తరించి మోదీని గద్దె దింపుతామని రాహుల్ అంటున్నారు. ఎంత తీవ్రమైన ఆరోపణ ఎంత బిగ్గరగా చేస్తే అంత గొప్పగా పోరాటం చేసినట్టు మన నాయకులు భ్రమిస్తున్నారు. నిన్న ఏమి చెప్పామో, ఈ రోజు చెబుతున్నామో, నిన్నటికీ, నేటికీ పొంతన ఉన్నదో లేదో నాయకులు చూసుకోవడం లేదు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవినీతికి పెట్టినపేరు కాంగ్రెస్ అంటూ బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తే బీజేపీకి అంబానీలూ, అదానీలు ముఖ్యమనీ, సామాన్య ప్రజల బాగోగులు వారికి పట్టవనీ కూటమి సభ్యులు అంటున్నారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులలో నిధుల స్వాహా చేశారని కూటమి నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా విఫలమైనదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు విమ ర్శించడం విడ్డూరం. అన్ని రంగాలలో విఫలం చెందిన ముఖ్యమంత్రిగా స్వరా ష్ట్రంలో ప్రజల విమర్శలను ఎదుర్కొంటూనే పక్క రాష్ట్రంలో ప్రభుత్వం తీరు తెన్నులపైన చేస్తున్న వ్యాఖ్యానాలలో విశ్వసనీయత ధ్వనించదు. మోదీ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నట్టు సంకేతం ఇవ్వడానికి తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ప్రచారమే ప్రధానం నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం ఈ ఎన్ని కలలో కనిపిస్తున్న మరో ధోరణి. ప్రతి రాజకీయ నాయకుడు తనకు అంది వచ్చిన అవకాశాల మేరకు అభివృద్ధి సాధించడానికి పాటు పడతారు. మేధాశక్తి ఉన్న నాయకులు దూరదృష్టితో వ్యవహరించి భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధంగా ప్రగతికి బాటలు వేస్తారు. దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి బీజాలు వేసింది మాజీ ప్రధానులు రాజీవ్గాంధీ, పీవీ నరసింహారావు అనీ, రాజీవ్ సాఫ్ట్వేర్ పార్క్కు హైదరాబాద్లో 1992లో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారనీ, చంద్రబాబు మంత్రి కావడానికి ముందే కంప్యూటర్ సంస్థలు హైదరాబాద్లో ఉండేవనీ చాలామందికి తెలి యదు. నేదురుమల్లి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. వారిలో చంద్రబాబు ఒకరు. తొమ్మిదిన్నర ఏళ్ల సుదీర్ఘకాలం పాలించడం వల్ల మిగిలినవారితో పోలిస్తే ఆయనకు అదనంగా అవకాశాలు వచ్చి ఉండ వచ్చు. కానీ తాను చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. వైఎస్ హయాంలో నిర్మించిన ఔటర్రింగ్రోడ్డు, శంషాబాద్ విమా నాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు కూడా తమ ఖాతాలోనే వేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సైతం హైదరాబాద్లో ఐటీ రంగం విస్తరిస్తోంది. బెంగుళూరులో ఐటీని శిఖరాగ్రంలో నిలపడానికి కారకుడైన ఎస్ఎం కృష్ణ ఎన్నడూ తాను బెంగుళూరు కట్టినట్టు కానీ ఐటీ తెచ్చినట్టు కానీ చెప్పుకోలేదు. తమిళనాడు నాయకులు కరుణానిధి కానీ జయలలిత కానీ ప్రచారం చేయలేదు. స్వోత్కర్ష ఒక మానసిక అవసరంగా మారి చంద్రబాబు చేత లేనిపోని మాటలన్నీ మాట్లాడిస్తున్నది. ఓటుకు కోట్ల కేసు ప్రసక్తి లేదు. ‘చంద్రబాబూ, బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు’ అంటూ హుంకరించిన కేసీఆర్ ఇప్పుడు ఆ కేసు గురించి గట్టిగా మాట్లాడటం లేదు. నాలుగేళ్ళు బీజేపీతో టీడీపీ సహజీవనం చేసిన వైనం ప్రస్తావనకు రావడం లేదు. తొమ్మి దిన్నర సంవత్సరాలలో హైదరాబాద్ని కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ళలో అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా పేర్చలేక పోయారు ఎందుకని? ఈ ప్రశ్నలన్నీ అడగవలసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కూటమి కట్టారు. సమకూరిన మీడియా మద్దతు టీడీపీతో పొత్త పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్కు ఒక రకంగా నష్టం, మరో రకంగా లాభం. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా పరిగణించేవారూ, ఇతరత్రా చంద్రబాబు అంటే ఇష్టం లేనివారూ కూటమికి ఓటు వేయరు. టీఆర్ఎస్కు కానీ బీజేపీకి కానీ వేస్తారు. చంద్రబాబుతో పాటు మీడియా కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున చేరింది. సోషల్ మీడియా కూడా రంగంలో దిగింది. ఇది కాంగ్రెస్కు విశేషంగా ఉపకరించే పరిణామం. ఇంతకాలం కేసీఆర్కు కొమ్ముకాసిన పత్రి కలూ, చానళ్ళూ ఇప్పుడు కాంగ్రెస్కు అధిక ప్రచారం ఇస్తున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో మైండ్గేమ్ ఆరం భించారు. కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తే టీఆర్ఎస్ పరిస్థితి నల్లేరుమీద బండి చందం కాదు. గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుంది. మాటల యుద్ధంలో ఎవరిది పైచేయి అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో టీఆర్ ఎస్కి అనుకూలించే అంశాలు అనేకం ఉన్నాయి. వృద్ధాప్య పింఛనూ, రైతు బంధు, రైతుబీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచాయి. మిషన్ భగీరథ మెయిన్ పైపులు ఇళ్ళముందుకు వచ్చి నిలిచాయి. ఇళ్ళకు పైపులు వేయడమే తరువాయి. మిషన్ కాకతీయ వల్ల మేలు జరిగింది. ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా ఒక ఘనవిజయంగా కేసీఆర్ ప్రతి సభలో చెప్పుకుంటున్నారు. వృత్తిపనివారికోసం ప్రభుత్వం తల పెట్టిన సంక్షేమ పథకాలు జనాదరణ పొందాయి. సంక్షేమ పథకాలు అన్నీ సవ్యంగా అమలు జరుగుతున్నాయనే ధీమాతోనే కేసీఆర్ ముందస్తు ఆలోచన చేశారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది. తెలంగాణతో పాటు రాజస్థాన్లో పోలింగ్ ఈ నెల ఏడో తేదీన ఉంది. పదకొండో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంచనా. అందుకే వీటిని సెమీఫైనల్స్ అంటున్నాం. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు తెలుసు కోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పది రోజుల్లో భవిష్యత్తు చిత్రపటం దర్శనమిస్తుంది. కె. రామచంద్రమూర్తి -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
హైదరాబాద్ : ప్రశ్నించడంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు కవులు,రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను సంధించాలన్నారు. డెబ్బై ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని సుదర్శన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లా డారు. వక్రబుద్ధితో ఆలోచించేనేతల చేతుల్లో చిక్కుకున్న వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మనం అమరుల త్యాగాల మీద నడుస్తున్నామన్నారు. వ్యవస్థను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ దారి తప్పిన పిల్లలున్నారు కానీ దారి తప్పిన కలాలు లేవన్నారు. సమాజం తనదని భావించినప్పుడే నిజమైన సాహిత్యం ప్రారంభం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ తమిళ రచయిత పి. శివకామి అన్నారు. ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హెచ్ఎస్ శివప్రకాశ్, ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై పార్టీలు మాట్లాడటం లేదు : రామచంద్రమూర్తి ‘సాక్షి ’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ చర్చించడంలేదనీ, తమ మేనిఫెస్టో లో పెట్టడంలేదన్నారు. పుణె పోలీసులు విరసం నేత వరవరరావును అరెస్ట్ చేస్తుంటే ఏ పార్టీ నేతలూ మాట్లాడలేదని చెప్పారు. నాలుగేళ్లపాటు ఒక మహిళామంత్రి లేకుండా పాలించినా ఏ ఉద్యమమూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, పూర్వ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, సకల జనుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.వినాయకరెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్నికలు, ప్రజల కర్తవ్యాలు– రచయితలు’అనే అంశంపై జరి గిన సభలో అన్నవరం దేవేందర్, అల్లం రాజయ్య, సీహెచ్ మధు, ‘మేనిఫెస్టోలు – భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు – వివిధ పార్టీలు’ అనే అం శంపై జరిగిన సెషన్లో మానవ హక్కుల వేదిక అధ్య క్షుడు ఎస్. జీవన్కుమార్, సీపీఎం నేత జి. నాగయ్య, పొట్లపల్లి రామారావు జయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో బూర్ల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి నిఖి లేశ్వర్, విమలక్క, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.వి.ఆర్. శర్మ, పెద్దింటి అశోక్కుమార్ పాల్గొన్నారు. పలు పుస్తకాల ఆవిష్కరణ అలిశెట్టి ప్రభాకర్పై రాసిన వ్యాస సంకలనం నెత్తుటి పాలపుంత, తిరుమలరావు సంకలనం దళిత గీతాలు, నల్లేల రాజయ్య రచన సిరధమనులు, పెనుగొండ బసవేశ్వర్ ఆకాశమంతా పావురం, పెనుగొండ సరసిజ రచన ‘కాగితాన్ని ముద్దాడిన కళ’, నేరేళ్ల శ్రీనివాస్ రచన ‘దుళ్దుమ్మ’’, తోకల రాజేశం రచన ‘‘అడవి దీపాలు’’, బండి చంద్ర శేఖర్ రచన ‘‘ఆవాజ్’’, వడ్నాల కిషన్ రచన ‘‘వెన్నెల ముచ్చట్లు’’, జి.లచ్చయ్య రచన ‘‘కాలంబూ రాగానే’’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. -
కరడుగట్టిన ‘గరుడ’
ప్రత్యర్థికి గాయమైతే బాధపడి, సానుభూతి చూపించడం ఉత్తమం. బాధ కల గకపోయినా, సానుభూతి లేకపోయినా లోకంకోసం బాధపడుతున్నట్టు, సాను భూతి చూపుతున్నట్టు నటించడం మధ్యమం. బాధపడకుండా, సానుభూతి చూపించకుండా పరిహాసం చేయడం, వెకిలిగా మాట్లాడటం అథమం. ఆంధ్ర ప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన గురువారం విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాప్రయత్నంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు మూడవ శ్రేణి కిందికి వస్తుంది. 2003లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలిపిరిలో నక్సలైట్లు మందుపాతర పేల్చిన దుర్ఘటనలో మృత్యుముఖంలోకి వెళ్ళి సురక్షితంగా బయటపడిన సందర్భం ఎవ్వరూ మరచిపోలేనిది. రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. నాటి ప్రతి పక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఫోన్ చేసి క్షేమం తెలుసుకోవడమే కాకుండా స్వయంగా తిరుపతి వెళ్ళి ముఖ్యమంత్రిని పరామర్శించారు. అంతటితో ఆగకుండా గాంధీ విగ్రహం దగ్గర శాంతి కోసం దీక్ష నిర్వహించారు. నక్సలైట్ల ఘాతుకాన్ని ఖండించారు. అంతటి ఉదాత్తమైన వైఖరి చంద్రబాబు నుంచి ఎవ్వరూ ఊహించినట్టు లేరు. కనీసం నటించకుండా బాధితుడినే తప్పు పడుతూ, ఆయనను పరామ ర్శించినవారంతా తనపైన దాడి చేస్తున్నారనీ, తన ప్రభుత్వాన్ని అస్థిరం చేయ డానికీ, రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర జరుగుతోందనీ విలేఖరుల ముందు గుండెలు బాదుకోవడం చూసినవారికి ముఖ్యమంత్రి మానసికస్థితి పట్ల అనుమానం రాకమానదు. హత్యాప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఖండించకపోగా, ఆ ఘటనను నాటకంగా అభివర్ణించడం అమానుషం. చిరునవ్వులు చిందిస్తూ, కళ్ళెగరేస్తూ, తర్జని చూపిస్తూ, ‘ఎక్కడిపోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా?’ అంటూ టీడీపీ అధినేత నాటకీయంగా మాట్లాడిన పద్ధతీ, ఆంధ్రప్రదేశ్లో అల జడి సృష్టించేవారిని ఉపేక్షించేది లేదంటూ అర్థరహితంగా, అసందర్భంగా మాట్లాడిన తీరూ చూసిన నా బోటి రాజకీయ పరిశీలకులకు సైతం ఆందోళన కలుగుతున్నది. నిజంగానే, ఎక్కడికి పోతున్నాం మనం? జగన్మోహన్రెడ్డిని పలకరించిన వారిలో కాంగ్రెస్ నాయకులను మినహాయించి మిగిలిన వారిని ఆయన తప్పుబట్టారు. నలభై సంవత్సరాల నుంచీ రాజకీయాలలో రాటు తేలిన వ్యక్తి, 14 సంవ త్సరాలు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన నాయకుడు ఇంత నేల బారుగా వ్యవహరించడం అసాధారణం. ముమ్మాటికీ ఆక్షేపణీయం. గురువారం రాత్రి చంద్రబాబు మాట్లాడిన తీరు ఆయన అభిమానులకూ, సానుభూతి పరులకూ, రాజకీయంగా జగన్మోహన్రెడ్డిని వ్యతిరేకించేవారికి కూడా మింగు డుపడలేదు. ఎబ్బెట్టుగా తోచింది. ఆయన పట్ల గౌరవం ఎంతో కొంత తగ్గి ఉంటుంది. ఒక రకంగా చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నారు. ఇది చాల దన్నట్టు అమరావతిలో తెలుగులో పాడిన పాటనే ఢిల్లీలో శనివారం మీడియా సమావేశంలో ఇంగ్లీషులో ఆలపించారు. ఢిల్లీలో విన్యాసాలు చంద్రబాబు అదృష్టం కొద్దీ ఒక్క ఇంగ్లీషు చానెల్ కూడా ఆయన గోష్ఠిని లైవ్లో చూపించలేదు. తెలుగు చానళ్ళు మాత్రమే ఆసాంతం చూపించాయి. హిందీ మీడియాకు చెందిన ఒకరిద్దరు విలేఖరులు ప్రశ్నలు అడిగారు కానీ జాతీయ టీవీ న్యూస్చానళ్ళ, పత్రికల ప్రతినిధులు కనిపించలేదు. లేకపోతే చంద్రబాబు బండారం బయటపడేది. ప్రతిపక్ష నాయకుడిని పలకరించినవారిని ముఖ్య మంత్రి తన శత్రువులుగా భావించడం, వారంతా కలిసి రాష్ట్రంలో అస్థిరత సృష్టిం చడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించడం, రేపో, ఎల్లుండో తనపైన ఐటీ, ఈడీ దాడి జరిగే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించడం జాతీయ మీడియా చూపించి ఉంటే చంద్రబాబు పరువు కృష్ణా, గోదావరులతో పాటు యమునా నదిలో కూడా కలిసేది. అంత పని జరగనందుకు ఆయన హితైషులు సంతోషిం చాలి. ఏదో అపరాధ భావన ఆయనను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. విమానాశ్రయంలో హత్యాప్రయత్నం జరిగిన కొన్ని నిమిషాలలోనే ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నిందితుడు వైఎస్ఆర్సీపీకి చెందినవాడనీ, ప్రచా రంకోసం దాడి చేశాడనీ చెబుతూ అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు తేలికగా తీసిపారవేయడం చూశాం. ఎవరో ఎక్కడి నుంచో పంపిన మెసేజ్లు మొబైల్లో చూస్తూ ఆయన మాట్లాడటం కనిపించింది. మంత్రి చంద్రమోహన్రెడ్డి, ఎంపీ నానీ చేసిన దుర్భరమైన వ్యాఖ్యలు గమనించాం. వీరిద్దరు కానీ, కాల్వ శ్రీని వాసులు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు కానీ దాడి పైన స్పందించిన తీరు చంద్రబాబుకు కానీ టీడీపీకి కానీ మేలు చేస్తుందా? సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగిం చలేదు. ఆయనకు నిగ్రహం తక్కువ. ఆగ్రహం ఎక్కువ. 2010లో హెచ్ఎం టీవీలో ‘ఆంధ్రప్రదేశ్ దశ–దిశ’ చర్చా కార్యక్రమం హైదరాబాద్లో ఆరంభించి అన్ని జిల్లా కేంద్రాలలోనూ నిర్వహించిన విషయం విదితమే. ఆ క్రమంలో నెల్లూరులో సభ జరిగింది. ఇతర రాజకీయ నాయకులతోపాటు సోమిరెడ్డి కూడా హాజరైనారు. తెలంగాణ అతిథిగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (ఇప్పుడు తెలం గాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్) నాతో నెల్లూరు వచ్చారు. సోమిరెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆవేశంగా మాట్లాడుతూ శ్రీలంకలో ఎల్టీ టీఈ ఉగ్రవాదులను కాల్చి చంపినట్టే తెలంగాణవాదులను కూడా కాల్చివేయా లంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దానికి అంతే తీవ్రంగా స్పందించిన చక్ర పాణి అరగంటకుపైగా వీరంగం వేశారు. ఈ అనూహ్యమైన పరిణామానికి సభి కులంతా అవాక్కయినారు. ఎత్తులూ, వ్యూహాలూ నాలుగున్నర సంవత్సరాలు అధికారమాయలో, నిధులయావలో గడిచిపోయిన తర్వాత టీడీపీ అధినేతను ఓటమిభయం పట్టిపీడిస్తున్నదని ఆయన వాలకం చూస్తే తెలిసిపోతుంది. ఏదో ఒక పథకంతోనో, వ్యూహంతోనో ప్రజలను దారి మళ్ళించాలనే ప్రయత్నం ఆరేడు మాసాల కిందటే ప్రారంభించారు. ఎన్డీఏ నుంచి వైదొలిగి తన వైఫల్యాలకు బాధ్యత కేంద్రానిదీ, ప్రధాని మోదీదీ అని ప్రజలను నమ్మించడం అందులో ఒకటి. ‘ఆపరేషన్ గరుడ’ మరొకటి. ప్రతి పక్షంపైన దాడిని ముమ్మరం చేయడం ఇంకొకటి. మౌలికమైన సమస్యలపైన కాకుండా పనికిమాలిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకోవలసి రావడం నిజంగా విషాదం. చంద్రబాబు రాజకీయాలు మొదటి నుంచీ ఎత్తుగ డలూ, వ్యూహాల ప్రాతిపదికపైనే సాగాయి. ‘ఆపరేషన్ చిత్తూరు జిల్లా పరి షత్’లో డాక్టర్ కుతూహలమ్మను అధ్యక్ష పీఠంపైన కూర్చోబెట్టడంతో మొదలై, ‘ఆపరేషన్ వైస్రాయ్’లో ఎన్టీఆర్ చేతుల్లో నుంచి అధికార పగ్గాలు లాక్కొని పార్టీనీ, ప్రభుత్వాన్నీ కైవసం చేసుకున్నప్పటి నుంచీ అధికారం నిలబెట్టు కోవ డానికీ, ఎన్నికలలో గెలుపొందడానికీ ఆయన చేయని అక్రమం, వేయని ఎత్తు గడ, పన్నని వ్యూహం లేదు. రాజకీయాలలో లక్ష్య సాధన కోసం ఏమి చేసినా తప్పు లేదనీ, ఎన్ని తప్పులు చేసినా తాను మాత్రం నిప్పుగానే ఉంటాననీ ఆయన నమ్మకం. కొన్ని వ్యూహాలు సఫలమైతే, కొన్ని విఫలమైనాయి. జగన్మోహన్రెడ్డిని అవినీతిపరుడుగా చిత్రించడానికి కాంగ్రెస్ అధిష్ఠానంతో కలసి అమలు చేసిన వ్యూహం ఫలించలేదు. ఆయనపై బనాయించిన కేసులలో పసలేదనీ, న్యాయ పరీక్షలో అవి నిలువజాలవనీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ఎంత గొంతు చించుకున్నా నష్టమే కానీ ప్రయోజనం లేదని చంద్రబాబు గ్రహించారు. పైగా దాదాపు ఏడాదికాలంగా సాగుతున్న చారిత్రక పాద యాత్రను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. తన వైఫల్యాల నుంచీ, జగన్ పాదయాత్ర నుంచీ ప్రజల దృష్టి మళ్ళించడంకోసం ‘ఆపరేషన్ గరుడ’ను శివాజీ అనే నటుడితో, ఒక టీవీ చానల్ సహకారంతో 2018 మార్చిలో అమలు చేయడం ప్రారంభించారు. ఈ ‘షో’ చూసినవారికి ఈ గరుడపురాణం రాసిన అభినవ వ్యాసుడు చంద్ర బాబేనన్న అనుమానం కలుగకమానదు. శివాజీ పేరు ప్రస్తావించి ఆయన స్క్రిప్టు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిపై ప్రాణహాని లేని దాడి కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఈ స్క్రిప్టులో ఉన్నది ఉన్నట్టు జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒక్కడి పని కాదు ఈ హత్యాప్రయత్నం కేవలం శ్రీనివాసరావు అనే యువకుడు ఒంటరిగా చేసిన పని కాదనీ, దీని వెనుక కుట్ర ఉన్నదనీ అనుమానించడానికి ఆస్కారం ఉంది. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాసరావుకు కొన్ని మాసాల కిందటే విశాఖ విమానాశ్రయం క్యాంటీన్లో ఉద్యోగం వచ్చిందనీ, అతని జీతం ఏడు వేల రూపాయలనీ, అతని నివాసం కోసం అద్దె ఇంటిని క్యాంటీన్ యజమానీ, టీడీపీ నాయకుడూ హర్షవర్ధన్ ఏర్పాటు చేశారనీ సమాచారం. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు టీడీపీ అభిమానులనీ, వారికి ఇళ్ళు ఇవ్వడం, రుణాలు ఇప్పించడంతో పాటు శ్రీనివాస్కి విశాఖలో ఉద్యోగాన్ని కూడా జన్మభూమి కమిటీ ఇప్పించిందనీ చెబుతున్నారు. కొన్ని మాసాల కిందట శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్ళి తన కష్టాలు గట్టెక్కా యనీ, ఆర్థికంగా స్థిరపడ్డాననీ చెబుతూ మిత్రులకు విందు ఇచ్చినట్టు తెలు స్తోంది. కోటి రూపాయలు పెట్టి నాలుగెకరాల భూమి కొనడానికి కూడా బేర సారాలు చేశాడని భోగట్టా. ఈ పరిణామాలు గమనిస్తే శ్రీనివాస్ వెనుక ఎవరో ఉండి ఉంటారనే అనుమానం రాకమానదు. పందెం కోళ్ళ కాళ్ళకు కట్టే పదునైన కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. ఆ కత్తి మెడకు తగిలితే అక్కడికక్కడే ప్రాణాలు పోవడం ఖాయమని కోడిపందేలతో పరిచయం ఉన్న గోదావరి జిల్లా లలోని మిత్రులు అంటున్నారు. అదృష్టం కొద్దీ జగన్మోహన్రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చి, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్ష వ్యక్తం చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిం చవలసిన ప్రభుత్వాధినేత ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి తనను తాను పలచన చేసుకున్నారు. ఇది చాలదన్నట్టు ఢిల్లీ వెళ్ళి కేంద్రంపైన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయ కుడిపైన హత్యాయత్నం జరిగినప్పుడు గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవడం టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం ఎట్లా అవుతుందో మెడ మీద తల ఉన్నవారికి ఎవ్వరికీ అర్థం కాదు. చంద్రబాబుని ముఖ్య మంత్రిగా, ఆయన సహచరులను మంత్రులుగా నియమించింది గవర్నర్. గవ ర్నర్ పేరు మీదే అన్ని జీవోలూ విడుదల అవుతాయి. మంత్రివర్గం గవర్నర్ పేరు మీదే పరిపాలన సాగిస్తుంది. ఇది ‘నా ప్రభుత్వం’ అని గవర్నర్ చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి కాదు. సీజన్డ్ పొలిటీషియన్ అని ఢిల్లీ మీడియా సమావేశంలో సైతం ప్రకటించుకున్న చంద్రబాబుకి రాజ్యాంగం స్పష్టం చేస్తున్న ఇంత చిన్న విషయం తెలియదా? సర్కారియా కమిషన్ను 1983లో ఇందిరాగాంధీ నియ మిస్తే తాను నియమించినట్టు చెప్పుకుంటే ఢిల్లీ విలేఖరులు ఏమనుకుంటారు? గవర్నర్ వ్యవస్థను రద్దు చేస్తే 1995లో ఎన్టీఆర్ చేతిలోని అధికారం తీసి చంద్ర బాబు చేతిలో పెట్టడానికి కృష్ణకాంత్ ఉండేవారా? ప్రధాని, అధికారపార్టీ అధ్య క్షుడు ఒకే రాష్ట్రం నుంచి ఉండకూడదనే వాదన సమంజసమైనదే. ముఖ్యమంత్రి పదవీ, పార్టీ అధ్యక్ష పదవీ ఒకే వ్యక్తి చేతిలో ఉండవచ్చా? ఉన్నత స్థానాలలో అందరూ గుజరాత్కు చెందిన అధికారులు ఉండటం ఆక్షేపణీయమే. మరి ఒకే సామాజికవర్గానికి చెందినవారు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక పదవులలో ఉండ వచ్చా? ప్రజలు నేరుగా ఎన్నుకున్న పంచాయితీలను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీలతో అవినీతి, అరాచక, పక్షపాత పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి అధికార వికేంద్రీకరణ గురించీ, సమాఖ్యస్ఫూర్తి గురించీ మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? వ్యవస్థలన్నిటినీ మోదీ భ్రష్టుపట్టిస్తున్నారన్న మాట నిజమే కావచ్చు. చంద్రబాబు నిర్వాకం ఏమిటి? గోదావరి పుష్కరాలపైన విచారించిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత న్యాయవిచారణలో సైతం నిజం నిగ్గు తేలుతుం దనే నమ్మకం పోయింది. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ విశ్వసనీయత ఎప్పుడో మంటగలిసింది. ఇప్పుడు మరింత అపహాస్యం అవుతున్నది. ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఎవరితో, ఏ సంస్థతో దర్యాప్తు జరిపించాలని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంతిమంగా న్యాయం ప్రజాకోర్టులోనే జరగాలి. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
ఎటు చూస్తే అటు స్వర్గం!
ప్రజాస్వామ్య ప్రక్రియ వికృతంగా మారి ప్రాణవాయువును క్రమంగా హరి స్తోంది. ఢిల్లీ పర్యావరణం లాగానే దేశమంతటా ప్రజాస్వామ్య వ్యవస్థ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. కొంతకాలంగా సంభవిస్తున్న విపరిణామాలు గమనిస్తున్నవారిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించి కలవరపెడుతున్నది. ఎన్నికలు జూదంగా మారినప్పుడు, అర్థబలం, అంగబలం ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగల పరిస్థితులు దాపురించినప్పుడు, వ్యాపారులే రాజకీయవాదులూ, రాజకీయవాదులే వ్యాపారులూ అయినప్పుడు అంబేడ్కర్ ఆశించిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన, స్వాతంత్య్ర సమరయోధులు అభిలషించిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లుప్తమైనప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. కీలకమైన ఎన్నికలు తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆరు మాసాలలో లోక్సభకూ, ఆంధ్రప్రదేశ్తో సహా మరికొన్ని రాష్ట్రాల శాసనసభలకూ ప్రజాప్రతినిధులను ఎన్నుకోబోతున్నాం. పోటీ చేసే అభ్యర్థులలో కొంతమంది మొదటిసారి బరిలో దిగబోతున్నవారు. అనుభవజ్ఞులు మరికొందరు. శాసనసభ్యుల విధులూ, విధానాలు ఏమిటో చాలా తక్కువమంది అభ్యర్థులకు తెలుసు. భారత రిపబ్లిక్ ఏర్పడి 1952లో తొలిసారి ఎన్నికలు జరిగిన దరిమిలా తొలి రెండు తరాల ప్రజాప్రతినిధులకు తమ విధ్యుక్తధర్మం ఏమిటో తెలిసేది. ఆ తర్వాత రాజకీయాలు క్రమంగా మేధావులనూ, సామాజిక సేవకులనూ, నిజాయితీపరులనూ పక్కన పెట్టి వ్యాపారులకూ, పారిశ్రామికవేత్తలకూ, నేరచరితులకూ, అక్రమార్కులకూ పెద్దపీట వేశాయి. ప్రజలకు చట్టసభలలో ప్రాతినిధ్యం వహించవలసిన ఎంఎల్ఏలు చట్టాలు చేయడంలో, పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు కాకపోతే వారు కర్తవ్య నిర్వహణలో విఫలమైనట్టే. ప్రజలు కూడా తమ కష్టాలకీ, సమస్యలకూ ప్రభుత్వాలు కారణమని నిరసన వెలిబుచ్చుతారు కానీ తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిని ప్రశ్నించరు. తెలంగాణవాదానికి మద్దతు ప్రకటించవలసిందిగా అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులపైనా ఉద్యమకారులు ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఆందోళన ఊపందుకున్నది. కేశవరావు, నాగం జనార్దనరెడ్డి, మధుయాష్కీ వంటి నాయకులపైన ఉద్యమకారులు తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాని ఒక అస్త్రంగా వినియోగించింది. ఇతర పార్టీలు సైతం ఉద్యమబాట పట్టవలసి వచ్చింది. ప్రజాప్రతినిధుల పాత్ర అద్వితీయమైనది. వారిని ఎన్నుకునే ప్రక్రియ పవిత్రమైనది. దాన్ని భ్రష్టుపట్టకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత ప్రజలది. అలవికాని వాగ్దానాలు శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్ సభలలో తనదైన ధోరణిలో మాట్లాడారు. ప్రతి రైతు కుటుంబానికీ రెండులక్షల రూపాయల రుణం మాఫ్ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3000 నెలసరి భత్యం చెల్లిస్తామనీ వాగ్దానం చేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సైతం ఇదే తరహా వాగ్దానాలు నాలుగు రోజుల కిందట పాక్షిక ఎన్నికల ప్రణాళిక పేరుతో చేశారు. ప్రతి రైతు కుటుంబానికీ లక్ష రూపాయల రుణం మాఫ్ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3016లు నెలనెలా చెల్లిస్తామనీ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామనీ, డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టించి ఇస్తామనీ, రాష్ట్ర ఆదాయం పెంచుతూ, దాన్ని ప్రజలకు పంచుతూ పోతామనీ వాగ్దానం చేశారు. రైతుల కోసం ప్రవేశపెట్టే 15 పథకాలలో 72 లక్షల మంది రైతులకు కనీసం మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ చెప్పారు. పకడ్బందీగా లెక్కలు వేసిన తర్వాతే వాగ్దానాలు చేస్తున్నామంటూ నాయకులు చెప్పినా ప్రజలకు వారి అనుభవం నుంచి పుట్టిన అనుమానాలు ఉంటాయి. అమలు అసాధ్యమని తెలిసినా శక్తికి మించిన వాగ్దానాలు చేస్తున్నారనే విషయం గ్రహిస్తారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు బొత్తిగా అమలు చేయని పార్టీలు ఉన్నాయి. పాక్షికంగా అమలు చేసిన పార్టీలూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాగ్దానాలు అమలు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లు అన్నీ కలిపినా నిధులు సరిపోవని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. ఆ తర్వాతనే కేసీఆర్ నిరుద్యోగభృతి వాగ్దానం చేశారు. కేసీఆర్ 2014 నుంచి నాలుగు వాయిదాలలో రైతు రుణమాఫీ చేశారనీ, అట్లా కాకుండా కాంగ్రెస్ని గెలిపిస్తే మొత్తం రుణమాఫీ ఒకే విడతలో చేస్తావ«ుని రాహుల్గాంధీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని వాగ్దానం చేసి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాలుగున్నర సంవత్సరాలు నయాపైసా చెల్లించకుండా ఇప్పుడు నెలకు రూ. 1,000 చొప్పున ఇస్తానని చెబుతున్నది. దానిలో కూడా అనేక మినహాయింపులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించవలసి వస్తున్నది. ఇది బూటకపు వాగ్దానంగానే మిగి లిపోతున్నది. రైతు రుణమాఫీ వాగ్దానం సరేసరి. ఏ పార్టీ అయినా చేస్తున్న వాగ్దానాలు అమలుకు యోగ్యమైనవా, కావా అని నిర్ణయించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం స్వీకరించాలి. ప్రజల హృదయాలను ఏదో ఒక విధంగా గెలుచుకోవాలనే ఆరాటంలో అలవికాని వాగ్దానాలు పార్టీలు చేస్తాయి. వాగ్దానాలు అమలు చేయని పార్టీలను అయిదేళ్ళ తర్వాత ప్రజలు శిక్షించవలసిందే కానీ వాగ్దానాలను అమలు చేయించే వ్యవస్థ లేదు. ఆర్థిక నిపుణులతో, సామాజికవేత్తలతో ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించి, వివిధ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమో కాదో నిర్ణయించవలసిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించాలి. అమలు సాధ్యం కానివి ఎన్నికల ప్రణాళిక నుంచి తొలగించాలని పార్టీలను కట్టడి చేయాలి. వాగ్దానాలు సంపూర్ణంగా అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఉద్యోగుల జీతభత్యాలూ, ఇతర ప్రభుత్వ ఖర్చులకు ఎంత కేటాయించాలి? మిగిలిన మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత ఖర్చు చేయాలి? అభివృద్ధి వ్యయానికీ, సంక్షేమ వ్యయానికీ మధ్య సమతౌల్యం పాటిస్తూ సంక్షేమంకోసం ఎంత ఖర్చు చేయవచ్చు? సంక్షేమం కోసం కేటాయించిన మొత్తంలో పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమేనా? వైద్య, విద్యా రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్రమించి, ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదా లేక ప్రభుత్వ ఆసుపత్రులనూ, విద్యాలయాలనూ పటిష్టం చేయడం ఉత్తమమా అనే అంశం కూడా ఎన్నికల ప్రచారంలో చర్చకు పెట్టాలి. పన్నులు పెంచుతూ, ఆదాయాన్ని సంక్షేమం పేరు మీద పంచుతూ పోతే అభివృద్ధి ఎట్లా సాధ్యం? తమ జేబులో నుంచి తీసి రైతులకూ, నిరుద్యోగులకూ ఇస్తామన్నట్టు మాట్లాడుతున్న నేతలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దగా వివరించడం లేదు. రాష్ట్రాల వనరులు ఏమిటో, వాటిని వినియోగించి అభివృద్ధికి సోపానాలు ఏట్లా వేయాలని పార్టీలు ఆలోచిస్తున్నాయో తెలియదు. పౌరులు తమ కాళ్ళపైన తాము నిలబడే విధంగా ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు కల్పించగలదో తెలియజేయడం లేదు. విదేశాలలో దాచిన నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రెండున్నర లక్షలు డిపాజిట్ చేస్తానంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ వాగ్దానం చేసి అభాసుపాలు కాలేదా? గెలుపు ముఖ్యం. అందుకోసం అరచేతిలో వైకుంఠం చూపిద్దాం. గెలిచిన తర్వాత చూసుకుందాం అనే ధీమా పార్టీల చేత చాంతాడంత వాగ్దానాలు చేయిస్తున్నది. ఫిరాయింపుల నిరోధం మరో అత్యంత ప్రమాదకరమైన అంశం ఫిరాయింపు. ఫిరాయింపుల నిరోధం కోసం రాజీవ్గాంధీ, వాజపేయి ఎంత కృషి చేసినా చట్టం చట్టుబండలై ఫిరాయింపుల వ్యాపారం నిస్సిగ్గుగా సాగిపోతోంది. రాజ్యాంగాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులలో ఉన్నవారు ఆక్షేపించడం కూడా మానివేశారు. కొన్ని సందర్భాలలో ఉన్నత పదవులలో ఉన్నవారే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఏకంగా మంత్రివర్గాలే ఫిరాయిం చడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పుకోదగిన విశేషం. ఈ ఆత్మహననం నిర్నిరోధంగా కొనసాగుతోంది. ఉదాహరణకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా అక్కడ కొత్త ముఖ్యమంత్రికి పగ్గాలు అందించాలి. అందుకు అవసరమైన మెజారిటీ అధికార బీజేపీకి లేదు. అందుకని ఒక రోజు ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఢిల్లీకి విమానంలో రప్పించుకొని కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్గోయెల్ బీజేపీ కండువాలు దర్జాగా కప్పేశారు. ఆ విధంగా మెజారిటీ లేమి సమస్యను అధిగమించారు. ఆ క్రమంలో రాజ్యాంగాన్ని మరోసారి కుళ్ళబొడిచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి తన ఎంఎల్ఏలను ‘కొనుగోలు’ చేస్తుంటే కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రశ్నించకపోవడం, ఇది సర్వసాధారణమైనట్టు మీడియా సైతం మిన్నకుండటం దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారిందనడానికి ప్రబల నిదర్శనం. ప్రజాస్వామ్య రక్షణకు తక్షణ చర్యలు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. 1. ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం ఉండగానే తెలంగాణలో రూ. 59 లక్షల నగదుతో వెళ్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి కరా>్ణటకకు కారులో తీసుకొని వెడుతున్న రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడకపోతే ఇది బహుశా రాయలసీమకు వెళ్ళి ఉండేది. పోలీసులు పట్టుకోలేనివి ఇంతకు అనేక రెట్లు ఉంటాయి. అసలు ఇంత నల్లధనం ఎట్లా ఉత్పత్తి అవుతున్నదో తెలుసుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి పార్టీలకు నిధులు ఎట్లా సమకూర్చుతున్నదో తెలుసుకోవాలి. 2. నల్లధనం వనరులలో ముఖ్యమైనవి నీటిపారుదల ప్రాజెక్టులూ, రోడ్ల నిర్మాణం, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణవ్యయాన్ని పెంచడం పారదర్శకంగా జరిగే విధంగా చూసేందుకు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు కావాలి. దానికి సమాంతరంగా పౌరసమాజం తరఫున కూడా ఒక నిఘావ్యవస్థ నిర్మాణం జరగాలి. ఇరిగేషన్, రోడ్డు నిర్మాణం వంటి పనుల కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తున్నారో పరిశీలించాలి. టెండర్లు పిలుస్తున్నారా లేక నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టపెడుతున్నారో గమనించాలి. ఇది కేవలం అధికారపార్టీకి వదిలివేయవలసిన అంశం కాదు. ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేస్తున్నారు. అవి ఏ రకంగా ఖర్చు అవుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలి. 4. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అడగకుండానే వివరాలు ఇచ్చే పద్ధతి (డ్యూటీ టు రిపోర్ట్) ప్రవేశపెట్టాలి. 5. గ్రామపంచాయతీలకూ, స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు విధిగా జరిపించాలి. స్థానిక సంస్థలకు విధులూ, నిధులూ వికేంద్రీకరించాలి. జన్మభూమి కమిటీల వంటి సమాంతర పక్షపాత వ్యవస్థను రద్దు చేయాలి. ఇలాంటి కమిటీలు ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం. 6. ఫిరాయింపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 2003లో ఆ చట్టానికి చేసిన సవరణలు సరిపోవని తేలిపోయింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతుల నుంచి తొలగించాలి. ఒక వేళ దాన్ని మార్చకూడదనుకుంటే ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలి. స్పీకర్ నిర్ణయాన్ని పరిశీలించి తిరస్కరించే లేదా ఆమోదించే అధికారం హైకోర్టుకు ఉండాలి. గడువులోగా సభాపతి నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రుల దగ్గర ‘జోహుకుం’ అనే స్పీకర్లకు నిర్ణయాధికారాలు ఇవ్వడం, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదంటూ ఆంక్ష విధించడంతో ఫిరాయింపులు పగ్గాలు తెంచుకొని జోరుగా సాగుతున్నాయి. నైతిక విలువలు లుప్తమైన పార్టీలు అధికారంలో ఉండటంతో అవి నీతి రాజకీయానికి హద్దూపద్దూ లేకుండా పోతున్నది. ఈ విశృంఖలత్వాన్ని అరి కట్టకపోతే దేశంలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నేతిచందం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
ఎన్నాళ్లీ నిరర్థక విన్యాసాలు?
వాస్తవాన్ని అవాస్తవంగానూ, అవాస్తవాన్ని వాస్తవంగానూ చిత్రించి నమ్మిం చడం రాజకీయాలలో ప్రధానక్రీడగా కొంతకాలంగా నడుస్తోంది. పౌరుల మన సులలోనే ఈ ఆట రాజకీయనేతలు ఆడతారు. వారు ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా ఆడతారనే దానిపైనే వారి రాజకీయ ఫలాలు ఆధారపడి ఉంటాయి. చాలా సంవత్సరాలుగా గమనించడం వల్ల ఒక రాజకీయనేత పట్ల ప్రజలలో ఒక స్థూలమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని మార్చడానికి రాజకీయనాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తాడు. అవి ఎంత ప్రభావవంతంగా ఉంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉంటాయి. వీటినే ‘మైండ్గేమ్స్’ అంటారు. ఈ క్రీడలో భాగంగా కొన్ని దృశ్యాలనూ, సన్నివేశాలనూ, వాతావరణాన్నీ పనికట్టుకొని సృష్టిస్తారు. ఒకే అభిప్రాయాన్ని అన్ని స్థాయిలలోనూ పదేపదే ప్రచారం చేస్తారు. దీన్నే ‘గ్లోబల్ ప్రచారం’ అంటున్నారు. నిజానికి ఇది ‘గోబెల్స్ ప్రచారం’. 1933 నుంచి 1945 వరకూ హిట్లర్ మంత్రిమండలిలో ప్రచార వ్యవహారాల మంత్రిగా పని చేసిన జోసెఫ్ గోబెల్స్ పేరు మీద వాడుకలోకి వచ్చిన మాట. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర బాబునాయుడు అందెవేసిన చేయి. 1995లో ముఖ్యమంత్రి పదవి హస్తగతం చేసుకున్నప్పుడూ, మరుసటి సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడూ, 2014 ఎన్నికలలో గెలుపొందినప్పుడూ ‘మైండ్ గేమ్స్’ చంద్రబాబుకు విశేషంగా దోహదం చేశాయి. ఈ క్రీడలో మీడియా సహ కారం అత్యంత కీలకం. సహచరుల తోడ్పాటూ అవసరం. నేతలపైనా, పార్టీల పైనా ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతం, సామాజిక వర్గం, వృత్తి, ప్రవృత్తి, ఆర్థికస్థాయి, సామీప్యత, మరికొన్ని ఇతర కారణాల ఆధా రంగా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ అభిప్రాయాలు అశాశ్వతం. స్వీయా నుభవం ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 2014లో కొత్త రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకుడికి అనుభవం ఉంటే బాగుంటుందని భావించి చంద్రబాబుకు ఓటు వేసినవారిలో చాలామంది కడచిన నాలుగున్నర సంత్సరాల అనుభవం కారణంగా తమ నిర్ణయం సరైనది కాదని గ్రహించి ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘మైండ్ గేమ్స్’ దిశలో మార్పు చేసే నేర్పు టీడీపీ అధినేతకు దండిగా ఉంది. విస్తారమైన తన అనుభవంతో (ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సహకారంతో అద్భుతాలు చేస్తానని నమ్మించారు. అవకాశం వచ్చినప్ప టికీ అన్ని రంగాలలోనూ విఫలమైనారు. అవినీతి మాత్రం విశృంఖలమై అన్ని రంగాలకూ విస్తరించింది. కథనంలో, దృశ్యంలో మార్పు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కథనం, దృశ్యం మార్చవలసిన అగత్యం ఏర్ప డింది. ప్రజలకోసం పోరాడతాననీ, అవసరమైతే ప్రధాని మోదీపైన తిరుగు బాటు చేస్తాననీ, ఆంధ్రుల ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తాననీ చంద్ర బాబు నమ్మబలుకుతున్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేం దుకు ఉద్దేశించింది ఈ వ్యూహం. ఈ దిశగా పోరాటానికి అవసరమైన ప్రాతిపది కను నిర్మించడానికి వీలుగానే ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత మోదీ తన వెంట పడబోతున్నట్టూ, కేంద్ర సంస్థల చేత దాడులు చేయించబోతున్నట్టూ వరుసగా ప్రకటనలు చేశారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తనకు రక్షణ వలయంగా నిలబడాలని అభ్యర్థించారు. దీనికి సమాంతరంగా ఒకానొక నటుడి చేత ‘ఆపరేషన్ గరుడ’ అనే టీవీ నాటకానికి తెరలేపారు. ఏది జరిగినా ఈ ఆప రేషన్లో భాగమేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళలో పార్టీని నడిపించడానికి ఆర్థిక సహాయం చేసిన వ్యాపార రాజకీయ నాయకులలో సుజనాచౌదరి, సీఎం రమేష్, నారా యణ ప్రముఖులు. వీరికి రాజకీయాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి, వ్యాపారా వకాశాలూ కల్పించి వారి వ్యాపారాలలో చంద్రబాబు భాగస్వామ్యం స్వీకరించా రన్నది బహిరంగ రహస్యం. వీరే కాకుండా టీడీపీ అధినేత సంకేతాలకు అను గుణంగా నిధులు సమకూర్చేవారూ, ఖర్చు చేసేవారూ అనేకమంది ఉంటారు. వారికి టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏదోరకంగా లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ దేశంలోని దాదాపు అన్ని పార్టీలలోనూ అటుఇటుగా ఉంటుంది. టీడీపీలో ఇది దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై బలంగా వేళ్ళూను కున్నది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే దర్యాప్తు సంస్థలు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు నమ్మడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చెప్పుచేతలలోనే అవి నడుస్తాయని అత్యధికుల అభిప్రాయం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను(ఐటీ) శాఖ, కేంద్ర నిఘా సంస్థ, ఇతర కేంద్ర సంస్థలు ఏవైనా ఒకానొక సంస్థలోనో, వ్యక్తి నివా సంలోనో సోదాలు జరిపినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అనుకోకుండా దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని దుయ్యపట్టడం రివాజు. రాజకీయ ప్రయోజనాలూ, అభిప్రాయాలూ, విధేయతలూ ఇటువంటి సంద ర్భాలలో అనుసరించే వైఖరిని శాసిస్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అస్తమయం తర్వాత ఓదార్పుయాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి వైదొలిగి సొంతపార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డిపైన సీబీఐ సుదీర్ఘంగా దాడులు చేసి కేసులు పెట్టినప్పుడు సంబరపడినవారు ఇప్పుడు రేవంత్రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్ళలోనూ, కార్యాలయా లలోనూ సోదాలు చేస్తే ఆంధ్రులపైన దాడి చేస్తున్నారంటూ, రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటున్నారు. అవినీతి ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుసు కనుక దాడులు జరుగుతాయని ముందే ఊహించి దానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించారు. ఇటువంటి పరిణామాలు రాకుండా నివారించేందుకే సుజనాచౌదరిని కేంద్రంలో మంత్రిగా నియమించి, సీఎం రమేష్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)సభ్యుడిని చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగడమే కాకుండా గుజరాత్లోనూ, కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్కు వందల కోట్ల నిధులు టీడీపీ అధినేత పంపించారని మోదీకి సమాచారం అందిందనీ, అంతలేసి నిధులు ఎట్లా సమకూరుతున్నాయో తెలుసుకోవాలని ఆయన కుతూహలంగా ఉన్నారనీ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారసంస్థలలో ఐటీ అధికారులు సోదా చేయడం సర్వసామాన్య మనీ, ఇందుకు చంద్రబాబూ, లోకేశ్బాబూ భుజాలు తడుముకోవడం ఎందు కని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆ సంస్థలు వ్యవహరిం చినట్లయితే ఇప్పుడు జరుగుతున్న సోదాలు ఎప్పుడో జరగవలసింది. ఎన్డీ ఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడే అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఇసుకమాఫియా స్వైరవిహారం చేసింది. పోలవరం, పట్టిసీమ, ఇతర సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి సాగింది. ఎన్డీఏ నుంచి తప్పుకున్న కార ణంగా, ఉక్కు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలని వారం రోజులు దీక్ష చేసిన కారణంగా ఐటీ శాఖను ప్రధాని ప్రయోగించారన్నట్టు ధ్వనించే విధంగా ఇప్పుడు మీడి యాలో రాస్తున్నారు. అప్పుడు సోనియాగాంధీని ధిక్కరించిన కారణంగా సీబీ ఐని ప్రయోగించారని ఇదే మీడియా రాయలేదు. హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కొన్ని హాస్యాస్పదమైన ప్రకటనలకు కూడా మీడియా ప్రచారం ఇస్తోంది. అభి వృద్ధిలో గుజరాత్ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ముందుకు పోతుందోనన్న భయంతో, ఈర్ష్యతో, చంద్రబాబుకి తనకంటే ఎక్కువ కీర్తి వస్తున్నదనే దుగ్ధతో మోదీ కుట్రపూరితంగా ఐటీ అధికారులతో చేయిస్తున్నారంటూ ఆరోపిస్తు న్నారు. అక్షరాస్యతలో, తలసరి ఆదాయంలో, ఇతర అభివృద్ధి సూచికలలో బిహార్, ఉత్తరప్రదేశ్లతో పోటీ పడుతూనే అన్నింటిలోనూ నంబర్ ఒన్ అంటూ ప్రచారం చేసుకునే వైఖరికి ఇది కొనసాగింపు. కానీ ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. వారికీ తెలివితేటలు ఉంటాయనీ, ఇంగితజ్ఞానం, కనీస పరిజ్ఞానం ఉంటాయనీ, ధర్మాధర్మ విచక్షణ వారి అంతరాత్మకు ప్రబోధం చేస్తుందనీ గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్లో నాలుగున్నరేళ్ళుగా ప్రాజెక్టుల పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో, అంచనాలు ఎంత విచ్చలవిడిగా సవరిస్తున్నారో, కాంట్రాక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్పైన ఎట్లా ఎవరికి కట్టబెడు తున్నారో ప్రజలకు రేఖామాత్రంగానైనా తెలియకపోదు. పాత కాంట్రాక్టర్లపైన 60 సి నిబంధనను ప్రయోగించి వేటు వేయడం, మిగిలిన పనుల వ్యయ అంచనాలు పెంచివేసి రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు అప్పగించడం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అన్ని కాంట్రాక్టులూ రమేష్కే దోచిపెడుతున్నారంటూ వరదరాజులురెడ్డి వంటి టీడీపీ నాయకులే బహిరంగంగా ఫిర్యాదు చేసే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది. మొత్తం రూ. 3,658 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు ఇచ్చినట్టు చెబుతున్నారు. హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులలోనే అంచనాలు విపరీతంగా పెంచి నామినేషన్ పద్ధతిపైన రూ. 1,156కోట్ల విలువైన పనులు రమేష్కు అప్పగించారు. చిత్తూరు జిల్లాలో 1980–90 మ«ధ్య కాలంలో సారా వ్యాపారం చేసిన రమేష్ చంద్రబాబుకి ఎట్లా దగ్గరైనారో, తిరుపతి దగ్గర 300 ఎకరాల గుడిమాన్యం తక్కువ ధరకు ఎట్లా ఇప్పించారో, ఆ భూమిని తాకట్టు పెట్టించి బ్యాంకు రుణంతో రిత్విక్ కంపెనీ ఎట్లా పెట్టించారో చాలామందికి తెలుసు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులకు రాయలసీమలో రమేష్, దక్షిణ కోస్తాంధ్రలో నారాయణ, తెలంగాణలో సుజనాచౌదరి ఏ విధంగా ఆర్థిక సహా యం చేశారో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. కాంట్రాక్టు తీసుకోవడం, సబ్కాంట్రాక్టుకు ఇవ్వడం, సబ్కాంట్రాక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేయడం, వాటిని నగదు రూపంలో డ్రా చేయడం నిరవధికంగా జరిగినట్టు ఐటీ శాఖ అధికారులు అలహాబాద్ బ్యాంక్ లావాదేవీల ద్వారా గమనించినట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. బ్యాంకులో అప్పులు తీసుకొని, నిధులు దారి మళ్ళించి, అప్పులు ఎగగొట్టిన వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేశారు. ముఖ్యమంత్రి మెహర్బానీ కారణంగా నామి నేషన్ పద్ధతిపైన వేలకోట్ల రూపాయల విలువ కలిగిన పనులు సంపాదిం చుకున్న వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు చేశారు. వారు వ్యాపారరాజకీయులు. ప్రజలు నవ్వుకోరా? ఇటువంటి తనిఖీలు జరిగినప్పుడు వ్యాపారరాజకీయులను వెనకేసుకొస్తే ప్రజలు మెచ్చుతారా? ఐటీ సోదాలను ఆంధ్రులపైన దాడిగా అభివర్ణించడం ఆంధ్రులకు గౌరవప్రదమా? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలూ, పెట్టుబడులూ రాకుండా చేసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ మంత్రి పదవిలో ఉన్నవారు ఆరోపించడం శోభాయమానంగా ఉంటుందా? తప్పు చేయకపోతే భయపడటం ఎందుకని ప్రజలు ఆలోచించరా? నిజానికి ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేసి అన్నీ సక్రమంగానే ఉన్నాయని కితాబు ఇస్తే సదరు రాజకీయవ్యాపారి ప్రతిష్ఠ పెరగదా? సోదాలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించకముందే ‘కక్ష రాజకీయాలు’ అంటూ ధ్వజమెత్తడం సమంజసమేనా? రేవంత్రెడ్డి ఇంటి లోనూ, ఆయన బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరిగినప్పుడు చంద్రబాబు స్పందించడం ఎందుకు? ‘అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణకోసం ముందే ఎదురుదాడి చేయడం ఉత్తమం)’ అంటారు. ఇదే పద్ధతి చంద్రబాబు అవలంబించారు. కానీ ఎవరికి కొమ్ముకాస్తున్నారో, వారి గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏమిటో గమనించడం లేదు. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారనీ, ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే తెలివితేటలు పల్లెల్లో నివసించే రైతులకు కూడా ఉంటాయని మరచిపోకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని నిర్ణయాలు పారదర్శకంగా జరగాలని ప్రగతికాముకులూ, ప్రజాస్వామ్యప్రియులూ కోరుకుంటారు. సాగునీటి ప్రాజె క్టులకూ, రోడ్ల నిర్మాణానికీ, ఇతర ప్రభుత్వ పనులకూ కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతి ధర్మంగా, న్యాయంగా ఉండాలి. ప్రాజెక్టుల వ్యయం అంచనాలను సవరించే విషయం సైతం అందరికీ సమంజసంగా కనిపించాలి. ఈ రెండు అంశాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏదైనా రాజ్యాంగబద్ధమైన సంస్థ పరిశీలించి ఆమోదించిన తర్వాతనే అమలు జరగాలి. వ్యాపారులే రాజకీయ నాయకులు కావడం, వ్యాపారరాజకీయ నాయకులో, కాంట్రాక్టర్లో ముఖ్యమంత్రులకు బినా మీలు కావడం, వారే ఎన్నికలలో ఖర్చులకు నిధులు సమకూర్చడం అనే విష వలయాన్ని ఛేదించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
హింసాత్మక భాషావరణం!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల నగారా మోగనే మోగింది. పోలింగ్ డిసెంబర్ 7న జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని సెప్టెంబర్ మొదటివారంలో సిఫార్సు చేసినప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పోలింగ్ నవంబర్ రెండు లేదా మూడో వారంలో జరుగుతుందని అంచనా వేసుకున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల పేర్లు గల్లంతైనాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చివరకు హైకోర్టులో విచారణకు రావడం, అక్టోబర్ 8వ తేదీన సమా ధానం చెప్పాలనీ, సవరించిన జాబితా సమర్పించాలనీ హైకోర్టు ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా ప్రకటన తేదీని అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12కు వాయిదా వేశారు. ఈ కారణంగానే పోలింగ్ తేదీ అధికార పార్టీ ఊహించిన దానికంటే మూడు వారాలు వెనక్కు పోయింది. ఆ మేరకు కేసీఆర్ లెక్క తప్పింది. కాంగ్రెస్కు ఊపిరిపీల్చుకునే వ్యవధి దొరికింది. ఏ లక్ష్యంతో ముందస్తు ఎన్నికల ఎత్తుగడ కేసీఆర్ వేశారో అది కొంతమేరకు దెబ్బతిన్నది. పరుష పదజాలం ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. నెల రోజుల కిందటే 105మంది టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే పెద్ద బహిరంగసభ నిర్వహించారు. కొద్ది విరామం అనంతరం నిజా మాబాద్ సభతో ప్రచారం పునరారంభించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మహాకూటమి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మినహా తక్కిన పార్టీలను ఒకే తాటిమీదికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో బద్ధశత్రువుగా భావించవలసిన టీడీపీతో సైతం పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇంతవరకూ జరిగిన ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్ మాట్లాడిన తీరు గమనించినవారికి తెలం గాణలో ఎన్నికల పోరాటం ఆయనకూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడికీ మధ్య జరుగుతున్నదనే అభిప్రాయం కలుగుతుంది. మొదటి రెండు సభలలో చేసిన ప్రసంగాలలో కొంత నిగ్రహం ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత జరిగిన సభలలో కేసీఆర్ నిప్పులు కురిపించారు. భావంలో స్పష్టత, భాషలో కాఠిన్యం కేసీఆర్ ప్రత్యేకత. అంత తీవ్రంగా మాట్లాడకుండానే చెప్పదలచింది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగల నేర్పు కేసీఆర్కు ఉన్నది. ఓర్పు లేదు. ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ప్రయోగించిన పరుష పద జాలం తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న తొలి ఎన్నికలలో ముఖ్య మంత్రి నోట వినిన విజ్ఞులు విస్తుపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం అంతే పదునైన భాషలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు కేసీఆర్పైన ఆయన శైలిలోనే దాడి చేశారు. రేవంత్రెడ్డి సంగతి చెప్ప నక్కరలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా ప్రత్యర్థులను దుర్భాషలాడారు. కేసీఆర్కి ఉన్న వాగ్ధాటి చంద్రబాబుకి లేదు. ఆ కొరతను ఎత్తుగడలతో, వ్యూహరచనతో, తిమ్మిని బమ్మిని చేయడం, మసిపూసి మారేడుకాయ చేసే నైపుణ్యంతో భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలలో ఫలానా ప్రాజెక్టు కట్టానని కానీ ఫలానా పరిశ్రమ తెచ్చాన ని కానీ, ఫలానా వాగ్దానం నెరవేర్చాన ని కానీ చెప్పి ప్రజలను మెప్పించే అవకాశం చంద్రబాబునాయుడికి లేదు. అరచేతిలో స్వర్గం చూపించడంలోనే పుణ్యకాలం గడిచిపోయింది. బీజే పీతో నాలుగేళ్ళు సహజీవనం చేసి సాధించింది పూజ్యం. అనవసరమైన విదేశీ యానాలూ, అస్మదీయులకూ, బినామీలకూ అక్రమంగా దోచిపెట్టారనే ఆరోప ణలూ, అవధులు లేని దుబారా, హద్దు మీరిన ఆర్భాటం, అంతులేని స్వోత్కర్ష (నేను సీజన్డ్ పొలిటీషియన్ని, సీనియర్మోస్ట్ స్టేట్స్మన్ని, మోదీ కంటే సీనియర్ని) మినహా చెప్పడానికి చేసిన మంచిపని ఏమీ లేదు. సాధించిన ఘన కార్యాలు చూపించి ఓట్లు అడిగే అవకాశం లేదు కనుక బీజేపీనీ, నరేంద్రమోదీనీ ఆంధ్రులకు పరమశత్రువులుగా అభివర్ణించి, మోదీపైన యుద్ధం చేస్తున్న తిరు గుబాటు వీరుడిగా, ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీకగా ప్రజలను నమ్మించాలని ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పుడు తన అసమర్థ తనూ, వైఫల్యాలనూ చర్చనీయాంశాలు కాకుండా చేయవచ్చునని ప్రణాళిక. నిజానికి చంద్రబాబుకి అంతకంటే మరో మార్గం లేదు. మోదీ సహకరించి ఉంటే టీడీపీ అధినేత వ్యూహం ఫలించేది. అమరావతి భూముల కుంభకోణంపైనో, పోలవరం అవినీతిపైనో, వేలకోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టిపెట్టడంపైనో విచారణ జరిపించాలని మోదీ నిర్ణయిస్తే బాధితుడిగా అభినయించి ప్రజల సానుభూతి పొందే అవకాశం చంద్రబాబుకి ఉండేది. కోట్లకు పడగలెత్తిన నారాయణ, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి సన్నిహితులపైన కేసులు పెట్టినా రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టేవారు. ఆ పనులేవీ మోదీ చేయడం లేదు. మోదీ, అమిత్షాలు తమ శక్తియుక్తులన్నీ వింధ్యపర్వతాలకు ఆవలే వినియోగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తాము చేయగలిగింది ఏమీ లేదని వారికి స్పష్టంగా తెలుసు. కానీ మోదీని ఒక భయంకరమైన శత్రువుగా చిత్రించడం, అటువంటి బలమైన, క్రూరమైన శత్రువుతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరుడిగా ప్రజలను మెప్పించడం చంద్రబాబుకి అత్యవసరం. అందుకే బాబ్లీ ప్రాజñ క్టు నిర్మాణంనాటి పాత కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్బెయిలబుల్ వారెంటు (ఎన్బీడబ్ల్యూ) పంపిస్తే దాన్ని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలసి కుట్ర చేసి పంపించినట్టు నానా యాగీ చేయడం. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధర్మాబాద్ కోర్టుకు వెళ్ళడమా, మానటమా అనే అంశంపైన చర్చ జరపడం నిరర్థక రాజకీయానికి నిదర్శనం. ఉత్తరతెలంగాణ మీదుగా ధర్మాబాద్కు కార్లలో భారీ ఊరేగింపుగా వెడితే ఎన్నికల ప్రచారం చేసినట్టు కూడా ఉంటుందని ఒక మంత్రి సలహా ఇచ్చారట. ఎవరైనా వ్యాపారి లేదా పారి శ్రామికవేత్త పన్ను చెల్లించని పక్షంలో ఆదాయంపన్ను శాఖ లేదా వాణిజ్యపన్ను శాఖ అధికారులు సోదా చేయడం సర్వసాధారణం. తెలంగాణలో టీఆర్ఎస్కు ఫిరాయించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలలోనూ, కార్యాలయాల లోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇవి మామూలుగా జరిగే సోదాలేననీ, వారికి అనుమానం వస్తే సోదా చేస్తారనీ, అనుమానాలు నివృత్తి చేస్తే సమస్య ఉండదనీ ఏ మాత్రం ఆవేశం లేకుండా ఆయన విలేఖ రులకు వివరించారు. కేసీఆర్ ఆ విషయంపైన స్పందించ లేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారపక్షంతో, ప్రతిపక్షంతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తుల ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖ అయిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అనేక సందర్భాలలో ప్రభుత్వాధికారుల ఇళ్ళపైన దాడులు చేశారు. రవాణాశాఖలో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఇరవై కోట్ల విలువైన ఆస్తుల వివరాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. గాలిమరపై యుద్ధం గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కట్టలేదనే కారణంగా ఆదాయంపన్ను శాఖ నిర్వహించిన సోదాలను ‘ఐటీ పంజా’ అంటూ పత్రికలు సంచలనా త్మకమైన శీర్షికలు ఇచ్చి ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి హడావిడిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంపైన ప్రధాని మోదీ పగబట్టారు. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. మూకుమ్మడి ఐటీ దాడులు ఇందులో భాగమే. కేంద్రం దుర్మార్గాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. కేంద్ర వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలి’ అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి ఉద్బో« దించారు. లేని కోటలో లేని శత్రువును ఊహించుకొని యుద్ధం చేయడం చూస్తుంటే చిన్నతనంలో చదివిన నవలలో కథానాయకుడి పాత్ర గుర్తు కొస్తున్నది. 17వ శతాబ్దం అరంభంలో స్పానిష్ రచయిత సర్వెంటెస్ (Cer-vantes) రచించిన డాన్ క్విక్జోట్ (Don Quixote) అనే నవలలో తనను తాను మహాయోధుడుగా ఊహించుకునే డాన్ క్విక్జోట్ రోజీనాంటీ (Rosinante) అనే గాడిదలాగా కనిపించే ముసలి గుర్రంపైన శాంకోపాంజా (Sancho Panza) అనే శిష్యుడితో కలసి స్వారీ చేస్తూ ఒక సత్రానికి వెడతాడు. దాన్ని కోటగా భ్రమిస్తాడు. అక్కడ ఉన్న వేశ్యలను రాచకుటుంబానికి చెందిన మహిళలుగా భావించి వారికి అర్థం కాని ఉదాత్తమైన భాషలో ప్రసంగిస్తాడు. యుద్ధం చేసి తన సత్తా నిరూపించుకోవాలి కనుక ఒక అట్టకత్తి ధరించి గాలిమరతో పోరాటం చేస్తాడు. అదే తరహాలో తనను శత్రువుగా గుర్తించడానికి నిరాకరించే మోదీతో మహాసమరం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు మీడియా సహకారంతో టీడీపీ అధినేత ఎంత హంగామా చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆదా యంపన్ను శాఖ అధికారులకు భద్రత ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు కానీ లోకేశ్ కానీ హైదరాబాద్ సందర్శిస్తే తెలంగాణ ప్రభుత్వం రక్షణ ఇవ్వనంటే ఏమి చేస్తారు? రేపు ధర్మా బాద్ కోర్టుకు వెడితే అక్కడ చంద్రబాబునాయుడికి భద్రత కల్పించరాదని మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఏమి చేస్తారు? ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరం లేదని దేశీయాంగ శాఖ నిర్ణయిస్తే ఏమి చేస్తారు? సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించే వైఖరి ఇది. చిన్న సంస్థలపైన ఆదాయంపన్ను శాఖ అధి కారులు సోదాలు నిర్వహిస్తే దానిని రాష్ట్రానికీ, కేంద్రానికీ మధ్య యుద్ధంగా, ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికీ మధ్య పోరాటంగా ఏకపక్షంగా ప్రచారం చేసు కోవడం అసాధారణమైన విషయం. దేశంలో మరే నాయకుడూ ఇటువంటి హాస్యాస్పదమైన విన్యాసాలు చేయలేదు. తెలంగాణ ఫలితం కీలకం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా ఆరు మాసాల వ్యవధి ఉన్నది. దానికి డ్రెస్ రిహార్సల్గా తెలంగాణలో ఎన్నికలు ముందుగానే ఏర్పాటు చేశారు కేసీఆర్. చంద్రబాబునాయుడు సహాయసహకారాలతో తెలంగాణలో మహాకూటమి గెలిస్తే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని నిలువరించవచ్చునని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశ. అందుకు చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు దోహదం చేస్తారని అంచనా. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో కేసీఆర్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కేసీఆర్, కేటీఆర్, హరీష్లు కలిసి గబ్బర్సింగ్ అనో, సన్నాసులనో, దద్దమ్మలనో విమర్శించవచ్చు. తెలంగాణ కాంగ్రెస్వారిని తెలంగాణ ద్రోహులంటూ టీఆర్ఎస్ నేతలు నిందించినా ప్రజలు విశ్వసించరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అనే సంగతి ప్రజలకు తెలుసు. కానీ చంద్రబాబుపైన ఎన్ని బాణాలు వేసినా, ఎంత బలంగా దాడి చేసినా ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకు? చంద్రబాబునాయుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకు తెలంగాణలో ఏమి పని? సీలేరు ప్రాజెక్టుతో సహా ఏడు మండలాలు తెలంగాణ నుంచి ‘లాక్కున్న’ వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి అదే పనిగా లేఖలు రాసిన నేత, ‘వోటుకు కోట్ల’కేసులో ఫోన్లో మాట్లాడుతూ లడ్డూలాగా దొరికిపోయి హైదరాబాద్ని వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోయిన నాయకుడిని తెలంగాణ ద్రోహిగా, అవినీతిపరుడుగా నిందించడం తేలిక. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానవర్గానికీ, మరోవైపు అమరావతిలో చంద్రబాబుకీ గులాములంటూ వాక్బాణాలు సంధించడం, ప్రజలను నమ్మిం చడం సులువు. కాంగ్రెస్, టీడీపీల కలయిక అనైతికమంటూ కేసీఆర్ దుయ్య బడతారు. కేసీఆర్, నరేంద్రమోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనీ, వారు కుట్రపన్ని తననూ, తన పార్టీనీ వేధిస్తున్నారనీ చంద్రబాబు అంటారు. అదే ఆరోపణ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్లు ఒకే తానులో ముక్కలంటూ టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దాడి చేస్తారు. ఏది సత్యమో, ఏది అసత్యమో చెప్పడం కష్టం. స్పష్టాస్పష్ట దృశ్యం, దబాయింపు రాజకీయం, విశృంఖల ప్రచారం సత్యాన్ని మబ్బులాగా కమ్మేసినప్పుడు సత్య దర్శనం అసాధ్యం. రెండు మాసాల తర్వాత కానీ (డిసెంబర్ 11న) జన హృదయం బోధపడదు. కె. రామచంద్రమూర్తి -
వ్రతం చెడినా ఫలం దక్కేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్ కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ నిర్ణయాలు తీసు కోవడంలో కేసీఆర్ ప్రదర్శించే వేగం, తేజం తాజా నిర్ణయాలలో సైతం కళ్ళకు కట్టాయి. అన్ని మతాలకూ, కులాలకూ, వర్గాలకూ చెందినవారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ధైర్యంతో గడువుకు ఎనిమిది మాసాల 26 రోజులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ఒకే విడత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం రంగంలో దిగి సమరసన్నాహాలు చేస్తున్నది. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ అధిష్ఠానవర్గానికి ప్రతిపాదిం చిన మూడు అంశాల సూత్రం ఇది: 1) ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి 2)టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి 3) ఎంఐఎంతో సఖ్యత కోసం అసదుద్దీన్తో సమాలోచనలు జరపాలి. మొదటి సూత్రం అమలు చేస్తే అసలుకే ముప్పు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పదవిని ఆశిస్తున్న అరడజనుకు తగ్గని ఇతర ముఖ్యనేతలు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పని చేయకపోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ సంగతి కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి తెలుసు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో మాట్లాడి ప్రయోజనం లేదు. కేసీఆర్తో అసద్ అనుబంధం బలమైనది. ముస్లిం బాలబాలికలకోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పడం, వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడం, రిజర్వేషన్ల తీర్మానం అసెంబ్లీ చేత ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం వంటి కార్యక్రమాలు కేసీఆర్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ కాబోతున్నారని అసద్ శనివారంనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మూడు సూత్రాలలో మిగిలింది టీడీపీతో పొత్తు. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడితో వ్యవహారం. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారు. శనివారం చంద్రబాబు హైదరాబాద్కి రానే వచ్చారు. టీఆర్ఎస్లోకీ, కాంగ్రెస్లోకి గెంతినవారు పోగా మిగిలిన కొద్ది మంది నాయకులతో సుదీర్ఘ సమాలోచన జరిపి గంభీరోపన్యాసం ఇచ్చారు. కొరివితో తలగోక్కోవాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉబలాట పడుతున్నారు? వారికి చంద్రబాబు పొత్తుల పురాణం తెలియదా? ఆయన నైజం అర్థం కాలేదా? ఆయనతో లోగడ పొత్తులు పెట్టుకొని భంగపడినవారికంటే తాము తెలివిగలవారమని అనుకుంటున్నారా? రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీనీ, సోనియాగాంధీని చంద్రబాబు తిట్టిన తిట్లన్నీ మరచి పోయారా? అన్నీ తెలిసే కపటనాటక సూత్రధారితో కరచాలనం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారా? హైదరాబాద్లో టీటీడీపీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నోట వెలువడిన తాజా అసత్యవాచకం అవధరించండి ‘నేను రాష్ట్రాన్ని విభజించమని కానీ వద్దని కానీ చెప్పలేదు.’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతి ప్రకటిస్తూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి రెండు విడతల ఉత్తరాలు రాసింది ఎవరు? ‘విభజన బిల్లు శాసనసభలో మీరు ప్రవేశపెడతారా మమ్మల్ని ప్రవేశపెట్టమంటారా’ అంటూ కాంగ్రెస్ని దబాయించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ని ఓడించి అధికారంలోకి రావా లని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తపన. ఏమైనా సరే జాతీయ స్థాయిలో మోదీని వదిలించుకోవడానికి కూటమి ఏర్పాటు చేయాలనీ, అందులో టీడీపీ భాగస్వామి కావాలనీ కాంగ్రెస్ అధిష్ఠానం తాపత్రయం. ఇది సకారాత్మకమైన రాజకీయం కాదు. ఆరోగ్యపరమైనదీ కాదు. పవిత్రమైనది అసలే కాదు. ప్రజలకు మేలు చేసిది అంతకన్నా కాదు. ఇక్కడ మార్గం ముఖ్యం కాదు, లక్ష్యం ప్రధానం. అస్థిరతకు బాటలు దేశ చరిత్రలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన గడ్డుకాలంలో చక్రం తిప్పింది టీడీపీ అధినేతలనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎన్టీఆర్ ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్ను కూకటివేళ్ళతో పెకిలించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. కాంగ్రెస్వారిని కుక్కమూతి పిందెలని అవహేళన చేసేవారు. దాన్ని భూస్థాపితం చేయడం టీడీపీ ఏకైక లక్ష్యమంటూ ప్రకటించేవారు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయవాడలో ప్రతిపక్ష సదస్సు నిర్వహించారు. అది 1988లో నేషనల్ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీసింది. రాజీవ్గాంధీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్సింగ్ బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి ‘జన్మోర్చా’ను నెలకొల్పారు. దాన్ని జనతాదళ్లో విలీనం చేశారు. రాజీవ్గాంధీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 1989 ఎన్నికలలో రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలతో–బీజేపీతోనూ, వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు. నేషనల్ఫ్రంట్ అధ్యక్షుడుగా ఎన్టీఆర్ భాగస్వామ్యపక్ష నేతలతో సమాలోచనలు జరిపి విపి సింగ్ను ప్రధాని చేయాలని నిర్ణయించారు. ప్రధా నిగా ప్రమాణం చేసినప్పటి నుంచి విపి సింగ్ కుర్చీ కాపాడుకునేందుకే సర్వ శక్తులూ వినియోగించవలసి వచ్చింది. బీజేపీ అనుసరించిన హిందూత్వ విధానాలకు విరుగుడుగా మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేత అడ్వాణీ సోమనాథ్ మందిరం నుంచి అయోధ్యకు రథయాత్ర ఆరంభించారు. రథం బిహార్లోని సమస్తిపూర్ చేరగానే అడ్వాణీని లాలూప్రసాద్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా విపి సింగ్ ప్రభు త్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. జనతాదళ్ నుంచి దేవీలాల్, చంద్రశేఖర్ 64 మంది ఎంపీలతో నిష్క్రమించి సమాజవాదీ జనతాదళ్ (రాష్ట్రీయ)ను నెలకొల్పారు. లోక్సభలో విశ్వాసతీర్మానం వీడిపోవడంతో విపి సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆరు మాసాలు తిరగకుండానే చంద్రశేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్ 1991లో ఎన్నికలు జరిగి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కొనసాగారు. విపి సింగ్, చంద్రశేఖర్ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టిన అప ఖ్యాతి చంద్రశేఖర్కు దక్కింది. విపి సింగ్ హయాంలో కశ్మీర్ లోయనుంచి 90 వేలమంది పండిట్లు ప్రాణాలు చేతపట్టుకొని వలస వెళ్ళి స్వదేశంలోనే శర ణార్థులుగా శిబిరాలలో తలదాచుకున్నారు. మామగారిని గద్దె దింపి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో యునైటెడ్ఫ్రంట్కు కన్వీనర్గా వ్యవహరించి రెండు అల్పాయుష్షు ప్రభుత్వాలకు పురుడు పోశారు. 1996 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం చెందింది. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించినప్పటికీ ఎన్నికల తీర్పు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిందనే ఉద్దేశంతో పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించలేదు. రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 13 రోజులలో కుదేలయింది. అప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. యునైటెడ్ఫ్రంట్ కన్వీ నర్గా దేవెగౌడనూ, ఐకె గుజ్రాల్నూ ప్రధానమంత్రులుగా చేయడంతో ఆయన పాత్ర లేకపోలేదు. కానీ ఆయనది నిర్ణాయక పాత్ర కాదు. సీపీఎం నేత హరి కిషన్సింగ్ సూర్జీత్ సంకీర్ణ ప్రభుత్వాల సృష్టికర్త. yì ఎంకె అధినేత కరుణానిధి సంధానకర్త. చంద్రబాబు యువకుడు కనుక సీనియర్ నాయకుల మధ్య సమన్వ యకర్తగా పని చేశారు. ఇద్దరు ప్రధానులూ కలసి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించలేకపోయారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి రెండు ప్రభుత్వాలకూ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించి అనిశ్చితికీ, అస్థిరతకూ దారి తీశారు. గుజ్రాల్ ప్రభుత్వం పతనమైన సమయంలోనే ప్రణబ్ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, తదితరులు కేసరి చేతి నుంచి కాంగ్రెస్ పగ్గాలను లాగివేసి సోనియాగాంధీ చేతిలో పెట్టారు. నకారాత్మక రాజకీయం, అపవిత్ర పొత్తుల కారణంగానే దేశానికి అరిష్టం దాపురించింది. హానికరమైన ఈ ధోరణికి ప్రతీక చంద్రబాబు. పొత్తుల వీరుడు దుస్తులు మార్చినట్టు భాగస్వాములను మార్చివేయడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్సభ (1996) ఎన్నికలలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ కమ్యూనిస్టు నాయకులను ఎద్దేవా చేయడం ఆరంభించారు. 1998లోనూ వామపక్షాలతో ప్రయాణం కొనసాగించారు. కానీ ఎన్నికలు కాగానే వామపక్షాలకు గుడ్బై చెప్పి యునైటెడ్ఫ్రంట్ నుంచి నిష్క్రమించి వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్ విజయం ఫలితంగా పెరిగిన వాజపేయి ప్రతిష్ఠ సహకారంలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారంలో కొనసాగారు. 2002లో గుజరాత్లో మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ తాను చేసిన సిఫార్సును వాజపేయి అమలు చేయనప్పటికీ మద్దతు ఉపసంహరించుకోలేదు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తిందని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమై లోక్సభకు కూడా గడువుకంటే ముందు ఎన్నికలు జరిపించేందుకు వాజపేయిని ఒప్పించారు. 2004 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోయిన వెంటనే బీజేపీతో పొత్తు పెట్టు కోవడం తప్పిదమని చెబుతూ జీవితంలో మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టు కోనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 1998లో తిరస్కరించిన వామపక్షాలను 2009లో చేరదీశారు. టీఆర్ఎస్ని కూడా మహాకూటమిలో చేర్చుకున్నారు. ఫలితాలు వెల్లడైన వెనువెంటనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే అనర్థం జరిగిందని అన్నారు. 2014లో తిరిగి బీజేపీతో కలసి ఎన్నికలలో పోరాడటమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో ఇద్దరు టీడీపీ మంత్రులను చేర్పించి, ఆంధ్రప్రదేశ్లోనూ ఇద్దరు బీజేపీ మంత్రులను చేర్చుకున్నారు. నాలుగున్నరేళ్ళు అంటకాగిన తర్వాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. నిరుడు విశాఖపట్టణంలో మహానాడు జరిగి నప్పుడు చంద్రబాబు చైనా నాయకుడు డెంగ్ను ఉటంకిస్తూ పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదనీ, ఎలుకలు పట్టేది అయితే చాలుననీ చెప్పారు. రాజ కీయాలలో విలువలకు కాలం చెల్లిందనీ, విధానాలతో నిమిత్తం లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పోవాలని ఉద్ఘాటించారు. ఓట్లు బదిలీ అయ్యేనా? మహాకూటమిలో టీడీపీని చేర్చుకుంటే టీఆర్ఎస్ని ఓడించవచ్చుననే కాంగ్రెస్ అంచనా తప్పు. టీడీపీకి 12 లేదా 15, టీజెఎస్కు 5 లేదా 6, సీపీఐకి నాలుగు సీట్లు విడిచిపెట్టాలని కాంగ్రెస్ తలపోస్తున్నట్టు భోగట్టా. హైదరాబాద్ పాత బస్తీలో సుమారు పది స్థానాలవైపు కాంగ్రెస్ తేరిపార చూసే పరిస్థితి లేదు. మిగిలిన 84 స్థానాలలో కనీసం 50 స్థానాలు గెలుచుకుంటేనే మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అంటే, పోటీ చేసే స్థానాలలో సుమారు 70 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలి. అటువంటి అవకాశం ఉన్నదా? ఉంటే అన్ని స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తున్న కాంగ్రెస్ ఓటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు. అదే విధంగా కాంగ్రెస్ని మట్టికరిపించడమే ధ్యేయంగా ఓటు చేస్తున్న టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేయరు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వ్రతం చెడినా ఫలం దక్కదు. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమి విఫలమైతే ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు కాంగ్రెస్ని దగ్గరికి రానీయరని చెప్పడానికి గొప్ప తెలివి తేటలు అక్కర లేదు. అవకాశవాద, నకారాత్మక రాజకీయాల కంటే కాంగ్రెస్ ఒంటరిగా టీఆర్ఎస్తో తలబడితే అమీతుమీ తేల్చుకోవచ్చు. గెలిచినా, ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
నిజాయితీ నిలుస్తుంది, గెలుస్తుంది
ఈ దేశానికి ఇంతవరకూ14 మంది ప్రధానులుగా పని చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్కు 16 మంది ముఖ్యమం త్రులు. నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే ఆయన తనయ ఇందిరాగాంధీని బడుగుజనం ఆరాధించ డానికి కారణం ఏమిటి? నందమూరి తారకరామారావు సినీ నటుడుగా సుప్రసిద్ధుడు. తెలుగుదేశం పార్టీని స్థాపిం చిన తొమ్మిది మాసాలకే ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ని చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని జయప్రదంగా నిర్మించారు. అసాధారణమైన నాయకుడు కనుక ఎన్టీఆర్ని ఇప్పటికీ అభిమానిస్తున్నవారు అనేకమంది ఉన్నారు. అదే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డితో ఆవేశపూరితమైన అనుబంధం కలిగి నవారు రెండు తెలుగు రాష్ట్రాలలో లెక్కకు మించి ఉంటారు. ఎందుకని? ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని అర్థం చేసుకోవా లన్న అభిలాషతో రూపొందించిన ‘రచ్చబండ’ కార్యక్ర మాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించేందుకు వైఎస్ హెలి కాప్టర్లో బయలుదేరారు. అకస్మాత్తుగా వాతావరణం క్షీణించింది. హెలికాప్టర్ గల్లంతైనట్టు సమాచారం అంద డంతో పోలీసులూ, అధికార యంత్రాంగంతో పాటు మీడియా సంస్థలకు చెందిన విలేఖరులు కూడా రంగంలో దిగారు. సుదీర్ఘ అన్వేషణ అనంతరంS నల్లమల అడవిలో పావురాల గుట్టపైన హెలికాప్టర్ కూలిపోయినట్టూ, వైఎస్ సహా ఐదుగురు ప్రయాణికులూ దుర్మరణం పాలైనట్టూ విషాదవార్త అశనిపాతంలాగా తెలుగు ప్రజల హృదయా లను తాకింది. ఈ ఘోరం జరిగి తొమ్మిదేళ్ళు గడిచినా వైఎస్ ప్రస్తావన వస్తే గుండెచెదిరి కన్నీరుమున్నీరయ్యేవారు ఇప్పటికీ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్య క్రమం జరిపించాలని సంకల్పించిన అనుపల్లి గ్రామానికి వైఎస్ వర్థంతి సందర్భంగా సాక్షి టీవీ చానల్ సిబ్బంది వెళ్ళారు. నాడు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనవలసిన వారిని ఇప్పుడు సమావేశపరచి ఆ రోజు వైఎస్ రాకకోసం ఎట్లా ఎదురు చూశారో, ఏయే అంశాలు ఆయన దృష్టికి తేవాలని అనుకున్నారో, మరణవార్త విని ఎట్లా దిగ్భ్రాంతికి గురైనారో చెప్పవలసిందిగా కోరారు. వారిలో కంటతడి పెట్టనివారు లేరు. ఒక ఇందిరాగాంధీకీ, ఒక వైఎస్కీ విశేష మైన ప్రజాదరణ ఎందుకు ఉన్నది? వారు మరణించిన తీరు వల్లనా? బతికుండగా వారు నడిచిన బాట వల్లనా? పేదల జీవితాలలో వెలుగు నింపాలనే ఆకాంక్షతో సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకున్నవారినీ, వారిలో ఆత్మవి శ్వాసం పెంచినవారినీ, వారి సంక్షేమంకోసం నిబద్ధతో కృషి చేసేవారినీ ప్రజలు విస్మరించరు. నిత్యం స్మరిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడూ ఒక ప్రత్యేక వాతావర ణంలో పనిచేస్తాడు. అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు రాజకీయవాది నిర్ణయాలపైన ప్రభావం వేస్తాయి. ప్రతి ప్రధానమంత్రికీ, ముఖ్యమంత్రికీ కొన్ని పరి మితులు ఉంటాయి. అన్ని అవరోధాలనూ అధిగమించి పేదలకు ఉపకారం చేయడానికి ప్రయత్నించేవారే ప్రజా నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఒక కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయం అందాలనే లక్ష్యంలో వైఎస్ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించారు. నిరుపేదకు సైతం మెరుగైన వైద్య, విద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’ పథకా నికీ, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఫీజు చెల్లించే (ఫీ రీయెంబర్స్మెంట్) బాధ్యతను ప్రభుత్వం స్వీకరించే పథకానికీ శ్రీకారం చుట్టారు. ఒక వైపు జలయజ్ఞం వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే, వ్యవసాయ ఉత్ప త్తులకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సొమ్మును జోడించి రైతులను ఆదుకునే ప్రయ త్నం చేశారు. సకల సంక్షేమ కార్యక్రమాలూ ప్రాంతాలకూ, రాజకీయాలకూ, మతాలకూ, కులాలకూ అతీతంగా ప్రజ లందరికీ లబ్ధి కలిగించాలనే దీక్షతో పని చేశారు. గ్యాసు బండకు సబ్సిడీ చెల్లించడంలో ఉద్దేశం కూడా దిగువ మధ్యతరగతి ప్రజలను వీలైనంత ఆదుకోవాలనే తాప త్రయంతోనే. ఆయన చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసించారు. దళితులకూ, ఆదివాసీలకూ ఇందిరాగాంధీ ఆత్మవిశ్వాసం ఏ విధంగా కలిగించారో, వైఎస్ కూడా ముస్లింలలో అదే విధంగా ఆత్మవిశ్వాసం ప్రోదిచేశారు. దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ఇందిరలో ఎంత దృఢమైన సంకల్పం ఉండేదో, ఆమె ఎంత పట్టుదలగా పని చేశారో, ముస్లింల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు వైఎస్ అంతే అంకితభావంతో కృషి చేశారు. తమ సంక్షేమం కోసం ఎవరు నిజాయితీగా పని చేస్తున్నారో, ఎవరు మాటల గారడీతో కాలక్షేపం చేస్తున్నారో బడుగువర్గాలకు తెలుసు. పట్టువీడని విక్రమార్కుడు ఉదాహరణకు ముస్లిం యువతీయువకులకు విద్యాసంస్థ లలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి వైఎస్ చేసిన కృషిని గమనిస్తే ఆయనకు మైనారిటీల హృదయంలో ఎందుకు శాశ్వత స్థానం దక్కిందో అర్థం చేసుకోవచ్చు. 2004 ఎన్నికల ప్రణాళికలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, మూడు శాతం ఇస్తామని టీడీపీ వాగ్దానం చేశాయి. ఎన్నికలలో విజయం సాధించి వైఎస్ మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మూడు మాసాలైనా తిరగకుండానే ముస్లిం యువతీయువ కులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జూలై 12న జీవో నంబర్ 33 జారీ చేశారు. రిజర్వేషన్లు వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించారు. సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడిన ముస్లింలకు విద్యాసంస్థలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండాలనే ప్రతిపాదన 1971 నుంచి ఉన్నది. దానికి కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్. ఈ జీవోను తయారు చేసే ముందు సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ని సంప్రదించారు. మండల్ కమిషన్ నివేదిక అమలు విషయంలో అప్పటి ప్రధాని వీపీ సింగ్కు సల హాలు ఇచ్చిన కృష్ణన్ ముస్లింల కోటా విషయంలో ఆం్ర«దప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. అయితే, ఈ జీవో మైనారిటీల కమిషన్ సిఫార్సుల ఆధా రంగా జారీ చేశారు. 1991 జనాభా లెక్కల ప్రకారం అవి భక్త ఆంధ్రప్రదేశ్లో నివసించే 64 లక్షల మంది ముస్లింలలో (మొత్తం జనాభాలో 8.5 శాతం) అక్షరాస్యులు 18 శాతం మాత్రమే. ముస్లిం మహిళలలో అక్షరాస్యుల శాతం కేవలం నాలుగు. ముస్లింలలో 65 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. దుర్భర దారిద్య్రంలో, నిరక్ష రాస్యతలో మగ్గుతున్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించ డాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఇది రాజ్యాంగబద్ధం కాదని బీజేపీ వాదించింది. మత ప్రాతిపదికపైన రిజ ర్వేషన్లను రాజ్యాంగం అనుమతించని మాట వాస్తవమే. బీసీ కమిషన్ సిఫార్సులు కాకుండా మైనారిటీ కమిషన్ నివేదికపైన వైఎస్ ప్రభుత్వం ఎందుకు ఆధారపడింది? 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పుట్టస్వామి బీసీ కమిషన్ చాలా విడతల గడువు పెంచినా ఏ నివేదికా సమర్పించకుండానే 2003లో పదవీకాలం ముగించింది. 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు ఆ కమిషన్ నుంచి నివేదిక రాబట్టే ప్రయత్నం చేయలేదు. వైఎస్ అభిలషించినట్టు ముస్లింలకు ఐదు శాతం రిజర్వే షన్లు మంజూరు చేసినట్లయితే మొత్తం రిజర్వేషన్ల శాతం 51కి పెరుగుతుంది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నది. రాజ్యాంగబద్ధం కాదనే కారణంపైనే జస్టిస్ సుదర్శన్రెడ్డి నాయకత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం 33వ నంబరు జీవోను కొట్టివేసింది. బీసీ కమిషన్ సిఫార్సులు పాటిం చాలని చెబుతూ ఒక బీసీ కమిషన్ను వెంటనే నియమిం చవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఆరు మాసాలలో నివేదిక సమర్పించాలని ఏర్పాటు కాబోయే బీసీ కమిషన్ను హైకోర్టు ధర్మాసనం కోరింది. రిజర్వేషన్ల అమలును నిలిపి వేయనవసరం లేదనీ, హైకోర్టు నిర్ణయంపైన సుప్రీంకో ర్టుకు అప్పీలు చేసుకోవచ్చుననీ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా నికి వెసులుబాటు కల్పించింది. మరో బీసీ కమిషన్ కొన్ని వారాలలోనే జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన బీసీ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలంటూ సుగ్రీ వాజ్ఞ (ఆర్డినెన్స్) జారీ చేసింది. ఆ తర్వాత సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకోసం రిజర్వేషన్లు కల్పిం చాలని కోరే బిల్లును 2007లో శాసనసభ ఆమోదించి చట్టం చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు ఆర్డినెన్స్పైనా, చట్టంపైనా హైకోర్టులో పిటిషన్లు వేశారు. బీసీ కమిషన్ అనుసరించిన విధానం లోపభూయిష్టమని నిర్ణయిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిలాల్ న జ్కీ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 5–2 ఆధిక్యంతో ఆర్డినెన్స్ను కొట్టివేసింది. చట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా ముస్లింల రిజర్వేషన్ల విషయంలో వెనకంజ వేసే ప్రసక్తి లేదనీ, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటా మనీ వైఎస్ ప్రకటిస్తూ వచ్చారు. పట్టువిడవకుండా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వచ్చారు. ఇతర వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల మాదిరే ముస్లిం విద్యార్థులకు సైతం ప్రభుత్వం ఫీజు చెల్లిస్తూ వచ్చింది. ఈ కారణంగా పది లక్షల మందికిపైగా ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్య అభ్యసించగలిగారని, వేలమంది ఉద్యోగాలు పొందగలిగా రనీ వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహమ్మద్ అలీ షబ్బీర్ ఇటీవల అన్నారు. వైఎస్ దుర్మరణం అనం తరం సుప్రీంకోర్టు 2010 మార్చి 25న నాలుగు శాతం రిజర్వేషన్లను అనుమతిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ ప్రభుత్వం చేసినట్టు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపి చేతులు దులుపుకోలేదు వైఎస్ సర్కార్. రిజర్వేషన్లు మాత్రమే కాకుండా మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా చిన్న వృత్తి పనులకు సహాయం చేయడం, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి రాబ ట్టుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం, మసీ దులకు మరమ్మతులు చేయించడం, షాదీ ఖానాలు నిర్మిం చడం వంటి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ ప్రభుత్వం అమలు చేసింది. నారా హమారా, పరాయా? ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలలో ముఖ్యమైన వాటిని నాలుగున్నర సంవత్సరాలు విస్మరించి ఎన్నికలు సమీపించిన తరుణంలో ‘నారా హమారా’ అంటూ బహిరంగ సభలు పెడితే ముస్లింలు విశ్వసిస్తారనుకోవడం పొరపాటు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేని మంత్రి వర్గం లేదు. ప్రస్తుత చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క ముస్లిం లేడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఆ పార్టీ పెద్దలను మెప్పించడానికి అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క సీటు ముస్లింకి ఇచ్చారు. అది కూడా చిత్తూరు జిల్లా పీలేరులో మిత్రుడు కిరణ్కుమార్రెడ్డి సోదరుడు, జైసమై క్యాంధ్ర పార్టీ అభ్యర్థి కిశోర్కుమార్రెడ్డి విజయానికి దోహదం చేయడం కోసం ఒక బలహీనమైన ముస్లిం అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ని నిలబెట్టారు. అక్కడ వైఎస్ ఆర్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మంచి మెజా రిటీతో గెలుపొందారు. ఇక్బాల్ మూడో స్థానంలో నిలి చారు. నంద్యాల ఉప ఎన్నికలలో గెలుపుకోసం అనివార్య మైన పరిస్థితులలో ఫారూక్ని శాసనమండలి అధ్యక్షుడిగా నియమించారు. అప్పటికే బీజీపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకొని ఉంటారు. ఇప్పుడు ముస్లిం మంత్రిని నియమిస్తానని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ముస్లింల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకరించలేకపోయింది. ముస్లిం బాలలకోసం సుమారు రెండు వందల గురుకుల పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన విద్య అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దళి తులకూ, ఆదివాసీలకూ అందే సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకు వర్తింపజేస్తున్నది. ముస్లింల సంక్షేమం విష యంలో వైఎస్ స్ఫూర్తి తెలంగాణలో కొనసాగుతున్నది కానీ ఆంధ్రప్రదేశ్లో కొండెక్కింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే మొన్న గుంటూరు సభలో ప్రశ్నించడానికి ప్రయత్నించిన నంద్యాల యువకుల పైన ఆగ్రహం ప్రదర్శించారు. కేసులు బనాయించారు. ఇప్పుడు ఎన్ని కబుర్లు ఎంత గట్టిగా చెప్పినా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. వారికి వాస్తవాలు తెలుసు. కె. రామచంద్రమూర్తి -
పాత్రికేయ శిఖరం కులదీప్ నయ్యర్
‘తన ఆత్మను తనదిగా చెప్పుకోగలిగినవాడే (One who can call his soul his own)సిసలైన జర్న లిస్టు’ అని ప్రఖ్యాత సంపాదకుడు ఎం చలపతిరావు అన్న మాట గురువారం తెల్లవారుజామున కన్ను మూసిన జర్నలిస్టు దిగ్గజం కులదీప్ నయ్యర్కు నూటికి నూరు పాళ్ళూ వర్తిస్తుంది. కులదీప్ నయ్యర్ బహుముఖీనుడు. ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో చేయి తిరిగిన పత్రికారచయిత. సంపాదకుడు. కాలమిస్టు. రాజ్యసభ సభ్యుడు. జనతా ప్రభుత్వ హయాంలో లండన్లో భారత హైకమిషనర్గా పని చేసిన దౌత్య వేత్త. శాంతికాముకుడు. నికార్సయిన లౌకికవాది. నిజాయితీకీ, నిర్భీతికీ మారు పేరు. సరిగ్గా 45 సంవ త్సరాల కిందట నేను జర్నలిజం విద్యార్థిగా ఉండగా తోటి విద్యార్థులతోపాటు ఢిల్లీ, ముంబయ్, పుణే నగ రాలు సందర్శించినప్పుడు చాలామంది జర్నలిస్టు ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించింది. వారిలో ముఖ్యులు కుష్వంత్సింగ్, కులదీప్ నయ్యర్, రూసీ కరంజియా (బ్లిట్జ్). అప్పుడు కుల దీప్ నయ్యర్ ‘స్టేట్స్మన్’కి ఢిల్లీలో రెసిడెంట్ ఎడి టర్గా ఉండే వారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో ఆయనను కలుసుకున్నాను. మాట్లాడాను. హైదరా బాద్కి చాలా సార్లు వచ్చారు. ఎప్పుడు కలుసుకున్నా జాతీయ రాజకీయ చిత్రంపై భాష్యం చెబుతూ ఒక కొత్త కోణం ఆవిష్కరించేవారు. సకారాత్మకంగా ఆలో చించడం, తప్పు చేస్తే నిక్కచ్చిగా విమర్శించేవారు. కులదీప్ నయ్యర్కూ, కుష్వంత్సింగ్కూ చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ పాకిస్తాన్లో పుట్టారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. కుష్వంత్ సింగ్ లాహోర్లో కులదీప్ నయ్యర్కి కొంతకాలం గురువుగా ఉన్నారు. దేశ విభజన తర్వాత రక్తపుటేరులు పారుతున్న బాటలో భారత్కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక పుస్తకం రాశారు. తర్వాత పాకి స్తాన్ నుంచి ఇండి యాకు తాము చేసిన ప్రయాణాన్ని ఇద్దరూ గ్రంథస్థం చేశారు. తన అనుభవాలను కుష్వంత్సింగ్ ‘ట్రైన్ టు పాకిస్తాన్’లో రాస్తే, కులదీప్ తన ఆత్మకథ ‘బియాండ్ ద లైన్స్’లో వివరిం చారు. కులదీప్ ‘ఇండి యన్ ఎక్స్ప్రెస్’కు సంపాదకుడిగా పనిచేస్తే కుష్వంత్ ‘హిందుస్తాన్ టైమ్స్’కి సంపాదకత్వం వహించారు. ఇద్దరూ విలువల విషయంలో రాజీపడేవారు కాదు. ఎవరినైనా తెగడాలంటే సంకోచించేవారు కాదు. ఇద్దరి కాలమ్స్కీ గొప్ప పాఠకాదరణ ఉండేది. కులదీప్ ‘బిట్వీన్ ద లైన్స్’కీ, కుష్వంత్ ‘విత్ మేలిస్ టువర్డ్స్ ఒన్ అండ్ ఆల్’కీ చాలా దేశాలలో పాఠకులు ఉండే వారు. కుష్వంత్ 99వ ఏట కన్ను మూస్తే, కులదీప్ 95వ ఏట తనువు చాలించారు. ఇద్దరూ ఊపిరి ఉన్నంత వరకూ కలం దించలేదు. ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించినప్పుడు రాజకీయ నేతలతో పాటు కులదీప్ నయ్యర్ను కూడా ‘మీసా’ (మెయిన్టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ద జడ్జి మెంట్’ పేరుతో పుస్తకం రాశారు. తలుపు తాళం చెవి పెట్టే రంధ్రంలో నుంచి చూస్తూ (కీహోల్ జర్నలిజం) లోపటి విషయాలను వర్ణించినట్టు నాటకీయంగా రాసేవారు. కుట్ర సిద్ధాంతం ప్రతిపాదించేవారు. బాబరీ మసీదు విధ్వంసం విషయంలో పీవీ నర సింహారావుపైన కూడా మధులిమాయే చెప్పారంటూ అసత్యాలు రాశారు. వాటిని వాస్తవాలు అని విశ్వ సించే రాసి ఉంటారని అనుకోవాలి. 1977 ఎన్నికల అనంతరం జనతా పార్టీ అధికారంలోకి రాగానే కుల దీప్ నయ్యర్ను బ్రిటన్కు హైకమిషనర్గా పంపిం చారు. 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో యుద్ధవార్తలు రాశారు. అంతకు ముందు దేశీయాంగమంత్రి గోవింద్ వల్లభ్ పంత్కూ, ప్రధాని లాల్బహద్దూర్ శాస్త్రికీ ప్రెస్ సెక్ర టరీగా ఉండేవారు. తాష్కెంట్లో లాల్బహద్దూర్ శాస్త్రి ఆకస్మిక మరణ వార్తను ప్రపంచానికి తెలి యజేసిన మొదటి వ్యక్తి నయ్యర్. యుఎన్ఐలో కొంతకాలం పని చేశారు. అనేక గ్రంథాలు రచిం చారు. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు నెలకొనాలని తపనపడేవారు. పౌర హక్కుల ఉద్య మాలను సమర్థించేవారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రెస్ సెన్సార్షిప్ను వ్యతిరేకించినట్టే వర్తమానంలో పత్రికలూ, టీవీ చానళ్ళూ ప్రభుత్వాలకు సాగిలపడ టాన్నీ అంతే తీవ్రంగా అధిక్షేపించారు. మీడియా స్వయంగా హిందూభావజాలాన్ని (సాఫ్ట్హిందుత్వ) ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి రాజ్యాంగేతర చర్యలు తీసుకోవలసిన అగత్యం ఉండదంటూ కరకు గానే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా అంకితమైన జర్నలిస్టు, గ్రంథకర్త, పోరాట యోధుడు కులదీప్ నయ్యర్. పాతతరం పాత్రికేయ శిఖరాలలో అగ్రగణ్యుడు కులదీప్ నయ్యర్. ఆయన మరణం పత్రికా లోకానికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ తీరని లోటు. ఆయనకు ఇదే శ్రద్ధాంజలి. కె. రామచంద్రమూర్తి -
ప్రతిభకు సాక్షి పురస్కారం
సాక్షి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్ సినిమాకు విశ్వనాథ్గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్గారికి కృతజ్ఞతలు. – కృష్ణ సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల కృష్ణగారికి లైఫ్టైమ్ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్ నుంచి ఒక పెద్ద సూపర్స్టార్గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ఓనర్గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్ అడిగారు. ‘సార్ డైలాగ్స్ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్ అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్టైమ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్కి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు. – సందీప్రెడ్డి వంగా ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్ ఉండాలని డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నిర్మాత ‘దిల్ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటను ఫైనలైజ్ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి ‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్.– రేవంత్ మా టీమ్ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్ స్ట్రగుల్ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్. – సంకల్ప్ రెడ్డి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్ అయ్యారు. ఎక్స్లెన్స్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్గారే. సాక్షి మేనేజ్మెంట్కి, చైర్పర్సన్ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ సురేశ్బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్ శంకర్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు. – ‘దిల్’ రాజు సురేశ్బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్ చేసిన దర్శకుడు హారీష్ శంకర్గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్లో ఒక సైకిల్ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్పర్సన్ భారతి మేడమ్కు ధన్యవాదాలు. – రావు రమేశ్ భారతిమేడమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్మెంట్ బాగుంటుంది. తన చానల్ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్ వాయిస్ అనే నేను నమ్ముతాను. ఫస్ట్ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్ రీచ్ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అందరి సక్సెస్ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్. – శేఖర్ కమ్ముల సాక్షికి థ్యాంక్స్. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్ వైడ్గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్లకు ఇంకా థ్యాంక్స్. – సెంథిల్ కుమార్ విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్’ రాజు గారు చాలా ప్యాషనైట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్లో ఉంటుంది. ‘దిల్’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. స్మైల్తో లీడ్ చేశారు. కొన్ని సార్లు నేను షూటింగ్కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్ ది ఇయర్ కాదు. మూవీ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్బాబు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి. దర్శకుడు శేఖర్ కమ్ములగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్గారిని ఫస్ట్ టైమ్ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్ సందీప్రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్... థ్యాంక్స్ ఎ లాట్. – షాలినీ పాండే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ లిస్ట్ 2017 జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం: శ్రీమతి విజయ నిర్మల మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి: (ఖైదీ నంబర్ 150) మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ద ఇయర్: బాహుబలి –2 మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల: (ఫిదా) మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్: షాలినీ పాండే (అర్జున్రెడ్డి) మోస్ట్ పాపులర్ కమేడియన్ ఆఫ్ ద ఇయర్: అలీ (ఖైదీ నంబర్ 150) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘దిల్’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు) మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: తమన్ (మహానుభావుడు) డెబ్యూడెంట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: సందీప్రెడ్డి (అర్జున్రెడ్డి) మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్: ఘాజీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి –2) మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్): ఎమ్.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్(మేల్) : రేవంత్ (తెలిసెనే నా నువ్వే: అర్జున్రెడ్డి) మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్: శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి) ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. రాహుల్ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్ వై.ఎస్. భారతి, శేఖర్ కమ్ముల ‘దిల్’ రాజు, సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్ ‘దిల్’ రాజు, డి.సురేశ్బాబు రాశీ ఖన్నా, సంకల్ప్ రెడ్డి, వైఈపీ రెడ్డి అలీ, ‘దిల్’ రాజు కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు రావు రమేశ్, డి.సురేశ్బాబు ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత -
ద్రవిడ ఉద్యమ దిగ్గజం
భారత దేశంలో సంభవించిన అహింసాత్మకమైన విప్లవాలలో అత్యంత ప్రధానమైనది ద్రవిడ ఉద్యమం. ఆ సంస్కరణ ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన అసాధారణ వ్యక్తి ఇటీవల అస్తమించిన కళైంజ్ఞార్ కరుణానిధి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక మునుపే 1910 దశకంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతర ప్రముఖులు స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ అసోసియేషన్ లక్ష్యాలలో ప్రధానమైనవి బ్రాహ్మణభావజాల ఆధిక్యాన్ని అంతం చేయడం, సమసమాజం నిర్మించడం, సామాజికన్యాయం సాధించడం. ఆ అసోసియేషన్ జస్టిస్ పార్టీగా ప్రాచుర్యం పొందింది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్య్ర సమరం చేయడం అసాధ్యమనే గాంధీజీ వైఖరితో తీవ్రంగా విభేదించిన రామస్వామినాయకర్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి జస్టిస్పార్టీలో చేరారు. ఆయన చేరికతో నాయకత్వంలో సమూలమైన మార్పు వచ్చింది. జస్టిస్ పార్టీ ఎజెండా కంటే భిన్నమైన విస్తృతమైన కార్యాచరణ అవసరమని భావించిన పెరియార్ (పెద్దాయన) రామస్వామి నాయకర్ ఆ పార్టీని రద్దు చేసి ‘ద్రవిడ కళగం’(ద్రవిడ సమాఖ్య)–డికె– నెలకొల్పారు. నాటి విద్యార్థి ఉద్యమ నాయకుడూ, అద్భుతమైన వక్త సీఎన్ అన్నాదురై పెరియార్కు ప్రథమ అనుచరుడిగా కుదురుకున్నారు. డికె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాజీలేని హేతువాదం ప్రాతిపదికగా ఉద్యమం విస్తృతంగా నిర్వహించడం సాధ్యం కాదని అయిదేళ్ళు తిరగకుండానే అన్నాదురై గ్రహించారు. హేతువాదం, సామాజికన్యాయం, నిరీశ్వరవాదం ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాలని పెరియార్ అభిప్రాయం. రాజకీయాల పొడ ఆయనకు గిట్టదు. రాజకీయ పార్టీ పెట్టి, గెలిచి అధికారంలోకి వచ్చి పెరియార్ చెబుతున్న లక్ష్యాలనే సాధించాలన్నది అన్నాదురై వాదన. డిఎంకె ఆవిర్భావం అన్నాదురై నాయకత్వంలో చెన్నైలో 1948 సెప్టెంబర్ 17న ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) ఆవిర్భవించింది. అప్పటికే కరుణానిధికి 25 ఏళ్ళు. జస్టిస్ పార్టీ కార్యక్రమాలలో, హిందీ వ్యతిరేక ఉద్యమంలో 14వ ఏట నుంచే చురుకుగా పాల్గొన్నారు. చక్రవర్తి రాజగోపాలాచారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చేశారు. తిరుచిరాపల్లిలో దాల్మియాపురం పేరును తిరిగి కళ్ళెగుడిగా మార్చే ఉద్యమంలో సాహసోపేతంగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రతిభావంతమైన వక్తగా, సినిమా స్క్రిప్టు ద్వారా ద్రవిడ ఉద్యమ భావజాల వ్యాప్తికి అసాధారణ స్థాయిలో దోహదం చేసే రచయితగా, కార్యకర్తలను సమీకరించి ముందుకు నడిపించే సేనానిగా బహుముఖంగా రాణిస్తూ తమిళుల జీవితంతో పెనవేసుకుపోయారు. తమిళ సాహిత్యాన్నీ, సంస్కృతినీ వివిధ రూపాలలో వినియోగించుకొని ‘ద్రవిడనాడు’ ఉద్యమస్ఫూర్తిని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళడంలో ప్రధాన పాత్ర కరుణానిధిదే. సమాఖ్యస్ఫూర్తి, రాష్ట్రాల స్వయంనిర్ణయాధికారం, సకలభాషల సమానత్వం, లౌకికవాదం డిఎంకె భావజాలంలో ప్రధానమైనవి. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కరుణానిధి పిన్నవయస్సులోనే స్వదస్తూరితో రాసిన వార్తాపత్రికను తయారు చేసి స్నేహితుల ద్వారా పంపిణీ చేయించేవారు. డిఎంకె అధికార పత్రిక ‘మురసొలి’ (ఢంకా) కి అదే బీజం. ‘మురసొలి’లో కరుణానిధి పార్టీ కార్యకర్తలకోసం రాసిన లేఖలు వారికి పార్టీ విధానాలనూ, కార్యకారణ సంబంధాలనూ విశదీకరించడానికి ఉద్దేశించినవి. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సంభాషణకు ఆయన ‘మురసొలి’ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సారథి పెరియార్ సైతం ‘కుడియారసు’ (రిపబ్లిక్–గణతంత్ర వ్యవస్థ) అనే పత్రిక ద్వారా తన ఆలోచనలను కార్యకర్తలతో పంచుకునేవారు. కరుణానిధి ప్రతిభావంతుడైన వక్త. ఛలోక్తులతో, వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులను ఉడికిస్తూ, సభను రక్తికట్టించే శక్తి అయన సొంతం. ఆయన ప్రసంగాల కేసెట్లు తమిళ సినిమా పాటల కేసెట్లకంటే బాగా అమ్ముడుపోయేవి. రాజకీయాలలో ఎంత సామర్థ్యం ఉన్నదో సాహిత్యంలోనూ అంతటి అధికారం ఉన్నది. సంగీతం అంటే ప్రాణం. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన రాజకీయ నాయకులు దేశంలోనే అరుదు. పురాణాలలోని, ఇతిహాసాలలోని పాత్రల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రచారం చేయడం, పోస్టర్లూ, బ్యానర్లూ, కట్అవుట్లూ వంటి హంగులు ఉపయోగించుకోవడం భారత రాజకీయాలకు తమిళ రాజకీయం అందించిన కొత్తవిద్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్టి రామారావు పసుపు రంగుతోసహా డిఎంకె ప్రచార ప్రక్రియలన్నిటినీ అనుకరించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అనేక రాష్ట్రాలకూ కటౌట్ల సంస్కృతి పాకింది. టీవీ చానళ్ళూ, వీడియో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం విస్తృతి, వైవిధ్యం అనూహ్యంగా పెరిగిపోయాయి. 2014 ఎన్నికలలో మోదీ విశ్వరూపం ప్రదర్శించడానికి వీడియో టెక్నాలజీ దోహదం చేసింది. కరుణానిధి ప్రస్థానం పార్టీలో అత్యంత ప్రభావశీలిగా ఎదిగిన కరుణానిధి 1957లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన సమయంలో కూడా డిఎంకె లక్ష్యాలలో స్వతంత్ర ద్రవిడనాడు ప్రధానమైనది. ఈ వేర్పాటువాదం డిఎంకె ఎజెండాలో చాలాకాలం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత జాతీయ రాజకీయాలతో మమేకమై, సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములైన తర్వాత వేర్పాటువాదం పూర్వపక్షమైపోయింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన డిఎంకె అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నాదురై మంత్రివర్గంలో పబ్లిక్వర్క్స్ మంత్రి కరుణానిధి. రెండేళ్ళ తర్వాత కేన్సర్ కారణంగా అన్నాదురై మరణించారు. వారసత్వ పోరులో అప్పటి ఆప్తమిత్రుడు ఎంజి రామచంద్రన్ సహకారంతో నెడుంజళియన్ వంటి సీనియర్లను తోసిరాజని ముఖ్యమంత్రి పదవిని కరుణానిధి కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మురికివాడల నిర్మూలన, మనుషులు లాగే రిక్షాల నిషేధం, విద్యుదీకరణ పనులు ముమ్మరంగా చేశారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ రూపాయికి కిలో చొప్పున పాతిక కిలోలు బియ్యం ఇవ్వడం, ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను నెలకొల్పడం, రేషన్ షాపులను నడపడం, రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం, పంట రుణాలు మంజూరు చేయడం, పంట పండకపోతే రుణాలు మాఫ్ చేయడం వంటి అనేక సంక్షేమకార్యక్రమాలు కరుణానిధి, ఎంజీఆర్ల హయాంలోనే ఆరంభమైనాయి. అమ్మ క్యాంటీన్ వంటివి జయలలిత సృష్టి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. కడచిన మూడు దశాబ్దాలలో తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందింది. రఘురామరాజన్ రిజర్వు బ్యాంక్ గవర్నర్గా ఉండగా 2013లో చేసిన అధ్యయనంలో దేశంలోని ప్రవృద్ధ రాష్ట్రాలలో తమిళనాడు మూడవ స్థానంలో (గుజరాత్, మహారాష్ట్ర తర్వాత) నిలిచింది. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కరుణానిధి పెద్దపీట వేశారు. తిరువళ్ళువార్ పేరిట వళ్ళువార్కొట్టాం నిర్మించారు. మూడు సాగరాలు– బంగాళాఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం ఏకమయ్యేచోట కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తు తిరువళ్ళువార్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఎంజీఆర్తో విభేదాలు కరుణానిధి అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ఆయనకూ, ఎంజీఆర్కీ మధ్య దూరం పెరిగింది. అధికారం కరుణానిధి తలకెక్కిందని ఎంజీఆర్ భావించారు. ఎంజీఆర్లో ఈర్షా్యద్వేషాలు పెరిగాయని కరుణానిధి తలపోశారు. సినిమాలలో ఎంజిఆర్కి పోటీగా పెద్దకొడుకు ముత్తును కరుణానిధి ప్రవేశపెట్టారు. కరుణానిధిపై ఎంజిఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. 1972లో డిఎంకె చీలిపోయింది. ఎంజీఆర్ ఏఐఏడిఎంకె స్థాపించి 1977 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. తన ఆరోపణల ఆధారంగా కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఇందిరాగాంధీనీ, ఆమె ఉపకారాన్నీ విస్మరించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను ఎంజిఆర్ తిరస్కరించారు. 1980లో ఎంజిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత జరిగిన ఎన్నికలలోనూ, 1984లోనూ ఎంజీఆర్ విజయం సాధించడంతో కరుణానిధి పుష్కరకాలం ప్రతిపక్ష నాయకుడిగానే ఉండవలసి వచ్చింది. 1989లో కరుణానిధి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్ను ప్రధాని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అత్యధికశాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళ టైగర్లను సమర్థిస్తున్నారనే ఆరోపణపైన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ రద్దు చేశారు. 2006లో చివరిసారిగా, ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు మూడోసారి స్వీకరించారు. 2016లోనూ ఆమే గెలిచారు. ద్రవిడ పార్టీలు జాతీయ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశాయి. 1967–69లో ఇందిరాగాంధీకీ, నిజలింగప్ప, మొరార్జీదేశాయ్, అతుల్యఘోష్ ఇత్యాది సీనియర్ నాయకులకూ మధ్య విభేదాలు చెలరేగి చీలిక దిశగా కాంగ్రెస్ ప్రయాణం సాగినప్పుడు కరుణానిధి ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోటీలో వి.వి. గిరిని గెలిపించడానికీ, నీలం సంజీవరెడ్డిని ఓడించడానికీ కరుణానిధి చట్టసభల సభ్యులను సమీకరించారు. 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించడాన్ని కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. జార్జి ఫెర్నాండెస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి ఇందిర విరోధులకు తమిళనాడులో ఆశ్రయం ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన ఇందిరాగాంధీ కరుణానిధి కుమారుడు స్టాలిన్ను అరెస్టు చేయించారు. పోలీసు కస్టడీలో స్టాలిన్ను హింసించినట్టు వార్తలు వచ్చాయి. కరుణానిధిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని 1976లో బర్తరఫ్ చేశారు. విప్లవ సంస్కరణల వెనకంజ ఈ దశలో ద్రవిడ భావజాలం పలచపడింది. అవినీతి, బంధుప్రీతి పెరిగాయి. వ్యక్తి ఆరాధన పతాకస్థాయికి చేరింది. ఈ విషయాలలో ద్రవిడ పార్టీలకీ, దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకీ పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనే డిఎంకె సైతం కేవలం కరుణానిధి కుటుంబ సభ్యుల చేతిలో ఉంది. జయలలితకు కుటుంబం లేదు కనుక ఆమె మరణించగానే ఏఐఏడిఎంకె చీలిపోయింది. డిఎంకె స్టాలిన్ సారధ్యంలో పదిలంగా ఉంది. ద్రవిడ భావజాలానికి విరుద్ధమైన బీజేపీ, కాంగ్రెస్లతో నిస్సంకోచంగా పొత్తు పెట్టుకొని ఎన్డీఏ, యూపీఏ కూటములలో డిఎంకె, ఏఐఏడిఎంకెలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల అక్రమాలలో తమిళనాడేమీ తక్కువ తినలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎన్నికలకు ముందు కలర్ టీవీ సెట్లు ఉచితంగా ఓటర్లకు పంపిణీ చేసే కార్యక్రమం కరుణానిధి హయాంలోనే అమలు జరిగింది. జయలలిత వారసుడుగా చెప్పుకుంటున్న దినకరన్ ఆర్కె పురం ఉపఎన్నికలో ఖర్చు చేసిన మొత్తం నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఖర్చుకు సమానం. ద్రవిడ పార్టీల పాలన యాభై సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న తమిళనాడు ఇతర రాష్ట్రాలతో సమానంగా అన్ని రకాలా దిగజారినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు రాజకీయంగా ఎంతగా కీచులాడుకున్నా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే విధానం అమలు చేసేవారు. ముగ్గురూ కేంద్రం నుంచి తమిళనాడుకు రావలసిన నిధులనూ, పరిశ్రమలనూ, ఇతర వనరులనూ దబాయించో, బతిమిలాడో సంపాదించేవారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడేవారు కాదు. ద్రవిడ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీలో అధినేతకు పడిపడి పాదాభివందనం చేసే సంస్కృతి స్థిరపడింది. కుల నిర్మూలన కోసం పోరాడాలనే సంకల్పం సడలింది. తమిళనాడులో దళితుల పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా లేదు. పెరియార్ ఆశించిన విప్లవాత్మక సంస్కరణలు ఆయన వారసుల అధికార రాజకీయ రంధిలో గల్లంతైనాయి. ఇందుకు కరుణానిధి మాత్రమే బాధ్యులు కారు. ఎంజీఆర్, జయలలిత కూడా ద్రవిడ ఉద్యమ స్ఫూర్తికి యధాశక్తి విఘాతం కలిగించారు. కె. రామచంద్రమూర్తి -
స్వేచ్ఛగా మాట్లాడటం నేడు ఒక పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : నేడు సమాజంలో స్వేచ్ఛగా మాట్లాడటం ఒక పరీక్ష లాంటిదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం ఇక్కడి రవీంద్రభారతిలో తెలంగాణ ఎడ్యుకేషనల్, సోషల్, కల్చరల్ లిటరరీ సొసైటీ ఆధ్వర్యంలో సెక్టోరియల్ సెమినార్స్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ వాస్తవాలను సేకరించడం, వ్యాఖ్యలను ప్రచురించడానికే పరిమిత మైన పత్రికలు ప్రభుత్వాల నిఘాలో ఉన్న ట్లు తెలుస్తోందన్నారు. పత్రికలకు గతంలో ఉన్న స్వేచ్ఛ నేడు లేదన్న విషయం ప్రజలకూ తెలుసన్నారు. గతంలో ఇంతకంటే మంచిగా పరిశోధనాత్మక కథనాలు వచ్చేవన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన మీటింగ్ వార్తను పత్రికల్లో సింగిల్ కాలంలోనూ, మరుసటిరోజు మంత్రి హరీశ్రావు చేసిన ఖండనలను పతాక శీర్షికలోన్లూ వేశారని గుర్తు చేశారు. కాళేశ్వరంపై చర్చలేకపోవడం ఆశ్చర్యకరం... రూ.84 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని రామచంద్రమూర్తి అన్నారు. ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సీఎం సమీక్ష సమావేశాలు, పర్యటనల సమాచారాన్ని సీఎం కార్యాలయంలో పని చేసోన్న బృందం పంపించే సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని, సొంతంగా ఎటువంటి అదనపు విషయాలను ప్రచురించవద్దనే సందేశాన్ని సైతం పంపడం బాధాకరమన్నారు. నేడు మీడియా సీఎం అధీనంలోకి వెళ్లడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఇటీవల పని ఒత్తిడితో 250 మంది జర్నలిస్టులు చనిపోయారని, తెలంగాణలో విలేకరుల పరిస్థితి అనే అంశంపై నివేదిక తయారు చేసి త్వరలో దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికీ అందజేస్తామని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’సంపాదకుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల్లో వచ్చిన వార్తల కంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకే స్పందన ఎక్కువగా ఉందన్నారు. ఆయా అంశాలపై సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్రెడ్డి, ఉ మా సుధీర్, పాశం యాదగిరి, కారంచేడు గోపాలం, సుమనాస్పతిరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ వెల్చాల కొండల్రావు, కన్వీనర్ సీహెచ్ రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనాథ–సినారె–భరద్వాజ తెలుగు సాహిత్యంలో శిఖర సమానులు
తెనాలి: జ్ఞానపీఠ అవార్డులు స్వీకరించిన ముగ్గురు తెలుగు ప్రముఖులు ఆధునిక సాహిత్యంలో శిఖర సమానులని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. గడిచిన అయిదారు దశాబ్దాల్లో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం కేవలం ముగ్గురినే వరించడం ఆశ్చర్యకరమన్నారు. తెలుగు సాహితీ ప్రముఖుల రచనలు ఇతర భాషల్లోకి అనువదించి, ఆ రచనలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు విశ్వనాథ–సినారె–భరద్వాజ సాహితీ వాహిని పేరిట శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజకీయంగా చొరవ, ప్రోత్సాహం ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంటే గానీ సాహిత్యంలో అవార్డులు రావని అభిప్రాయపడ్డారు. బెజవాడ గోపాలరెడ్డి సహకారంతో విశ్వనాథ సత్యనారాయణకు, పీవీ నరసింహారావు ప్రోత్సాహంతో సి.నారాయణరెడ్డికి, చిన్ననాటి తమిళ స్నేహితుడు పట్టుబట్టడం వల్లే రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ వచ్చిందని చెప్పుకుంటారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సాహితీవేత్త ఆరుద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోనే ఆగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. విశ్వనాథ వంటి కవిలేరు.. ‘విశ్వనాథ సాహిత్య ప్రాభవం’పై ప్రముఖ సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, అజోవిభోకందాళం ఫౌండేషన్ (అమెరికా) వ్యవస్థాపకుడు డాక్టర్ అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడారు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ ఆనాడే సమకాలీయతను చొప్పించారని చెప్పారు. వెయ్యేళ్ల తెలుగు కవిత్వంలో విశ్వనాథ వంటి కవి లేరని అభిప్రాయపడ్డారు. ‘డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య వైభవం’పై సాహితీ ప్రముఖులు పత్తిపాక మోహన్, ఎన్ఆర్ తపస్వి ప్రసంగించారు. తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారని అన్నారు. ‘భరద్వాజ సాహిత్య మార్దవం’పై ప్రముఖ రచయితలు జీఎస్ నాగేశ్వరరావు, రెంటాల జయదేవ మాట్లాడారు. భరద్వాజ రచనల్లో ‘జీవన సమరం’ గొప్పదన్నారు. మానవతావాదిగా కొనసాగిన రచయితగా భరద్వాజ చిరస్మరణీయుడన్నారు. అనంతరం సంజీవదేవ్ రచించిన ‘జన్ బౌద్ధం’, ఎన్ఆర్ తపస్వి ఇంగ్లిష్ అనువాదంతో సహా ద్విభాషా పుస్తకాన్ని రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ఆవిష్కరించారు. మరో రచయిత శ్రీరమణకు ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు. సదస్సులో సాహితీవేత్త వెనిగళ్ల వెంకటరత్నం, మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వనీకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. చిలువూరు సురేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఇప్పుడు వీస్తున్న గాలి
రాజకీయాలలో నాయకులు ఉంటారు. నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులను మేనేజర్లు అంటారు. అంతకంటే పెద్ద స్థాయి ఊహించుకున్నవారు సీఈవో అని కూడా తమను తాము అభివర్ణించుకుంటారు. నాయకుడికి ఆవేశం, సాహసం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ సహజ లక్షణాలై ఉంటాయి. పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడం, అందు కోసం అవసరమైతే నియమనిబంధనలను ఉల్లంఘించడం, నీతినియమాలను పక్కన పెట్టడం, ఏదో ఒక విధంగా కథ నడిపించడం పార్టీ మేనేజర్లు చేసే పనులు. ముందుండి పోరాడే స్వభావం లేనివారు నాయకత్వపాత్రకు సరిపోరు. ప్రజలకు కష్టంగా తోచినప్పటికీ యదార్థం చెప్పగలవారే సిసలైన నాయకులు. నిజం చెప్పకుండా దాటవేసేవారు కానీ, అసత్యం చెప్పేవారు కానీ, అమలు చేయలేని వాగ్దా నాలు చేసేవారు కానీ ప్రజలను మభ్యపెట్టే కపట నాయకులు. సహజ నాయకులు కొత్త పోకడలు పోతారు. ప్రజల తరఫున నిలబడి పోరాడతారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యా మ్నాయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎన్టి రామారావు నాయకుడు. పార్టీనీ, పార్టీ ప్రభుత్వాన్నీ హస్త గతం చేసుకొని వాటిని కాపాడుకుంటూ వచ్చిన చంద్ర బాబునాయుడు దక్షత కలిగిన నిర్వాహకుడు. పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ను విజయపథంలో నడిపిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకుడు. ప్రతిపక్షంలో మగ్గు తున్న పార్టీని గెలిపించేందుకు అహర్నిశలూ కృషి చేసి, ఆసేతుహిమాచల పర్యంతం పర్యటించి అద్భుతంగా ప్రచారం చేసి అఖండ విజయం సాధించిన నరేంద్రమోదీ నాయకుడు. కొత్త పంథాలో పార్టీ పెట్టి విజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ నాయకుడు. కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి, అత్యంత శక్తిమంతురాలైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టి, కష్టనష్టాలు ఎదురైనా చలించకుండా యుద్ధ రంగంలో నిలబడిన జగన్మోహన్రెడ్డి నాయకుడు. అమలు సాధ్యం కాని వాగ్దానాలు అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయడం, అమలు చేయ బోవడం లేదని తెలిసి కూడా మాట ఇవ్వడం మంచి నాయకుడి లక్షణం కాదు. ఈ విషయంలో మోదీ, చంద్ర బాబునాయుడూ ఒకటే. ఎన్నికలలో గట్టెక్కడానికి నోటికి వచ్చిన వాగ్దానాలు ఇద్దరూ చేశారు. స్విస్బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేయిస్తా నంటూ మోదీ వాగ్దానం చెయ్యడం వంచన. కోట్ల ఉద్యో గాలు కల్పిస్తాననడం కూడా అంతే. అమలు చేసే ఉద్దేశం కూడా లేకుండా జనాన్ని ఆకట్టుకోవడానికి కులానికో వాగ్దానం చేసి, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం శూన్యహస్తం చూపించడంలో చంద్రబాబు నేర్పరి. రైతు రుణాల మాఫీ వాగ్దానం చేస్తూ రుణాలు చెల్లించవద్దంటూ రైతులను ఉద్దేశించి ప్రకటనలు జారీ చేయడం, జాబు కావా లంటే జాబు రావాలంటూ బూటకపు వాగ్దానం చేయడం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పడం పనిగట్టుకొని మోసం చేయడమే. లోగడ ఏ ప్రధాని అభ్యర్థి కూడా మోదీలాగా అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయ లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాష్ట్ర స్థాయి నాయ కులు ఎవ్వరూ చంద్రబాబునాయుడిలాగా నెరవేర్చలేని హామీలు గుప్పించలేదు. యువకుడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పారు. రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా ఆయనపైన ఎంతమంది పార్టీ నాయ కులూ, హితైషులూ ఎన్నిరకాలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ సాధ్యం కాని హామీ ఇవ్వడం నీతిబాహ్యమనే ఉద్దేశంతో వాగ్దానం చేయలేదు. ఆ మాట ఇచ్చి ఉంటే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగలిగేది. కానీ హామీ అమలు చేయడం కష్టతరమై ఉండేది. హామీ ఇచ్చి గెలిచిన టీడీపీ హామీని పూర్తిగా అమలు చేయడంలో విఫల మైంది. పైగా అమలు చేశామంటూ దబాయిస్తోంది. అది వేరే విషయం. వర్తమానానికి వస్తే, వంద నియోజకవర్గాలను చుట్టి వచ్చిన పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అమలు చేయడం సాధ్యమని విశ్వసిం చిన తర్వాతనే మాట ఇస్తున్నారు. జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టు కొని కాపు రిజర్వేషన్ల గురించి ప్రకటన చేయవలసిం దిగా కోరినప్పుడు కూడా జగన్ వాస్తవాలే మాట్లాడారు. తన చేతిలో ఉన్న పనైతే నిస్సంకోచంగా చేస్తానని చెబుతూ, సుప్రీంకోర్టు తీర్పు గురించి గుర్తు చేశారు. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కాపు సమా జానికి మేలు చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాననీ హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్కు టీడీపీ వెయ్యి కోట్ల రూపా యలు ఇస్తానని వాగ్దానం చేసి అందులో సగం కూడా ఇవ్వ లేదనీ, తాను అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపు ఇస్తాననీ అన్నారు. కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం తన చేతిలో ఉన్న పని కనుక ఇస్తానంటూ వాగ్దానం చేయగలిగారు. ఓట్లు సంపాదించడమే పరమావధిగా చేసే బూటకపు వాగ్దానాలు రాజకీయ నాయకుడికి అపకీర్తి తెస్తాయి. మాట మీద నిల బడటం విశ్వసనీయత కలిగిన రాజకీయవాది లక్షణం. ఏమి కావాలో తేల్చుకోవాలి నాలుగున్నరేళ్ళ కిందటే రాజకీయాలలోకి వచ్చిన సినీ నటుడు పవన్ కల్యాణ్ నాయకుడికీ, నిర్వాహకుడికీ మధ్య గల వ్యత్యాసం గమనించి ఏమి కావాలో నిర్ణయించుకో వాలి. పవన్ మాటలలో నిలకడ కనిపించడం లేదు. కొన సాగింపు ఉండటం లేదు. ఉదాహరణకు ఉద్దానంలో మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజల సమస్య తీసు కుందాం. అక్కడికి అమెరికా నుంచి ఒక ప్రొఫెసర్ను తీసు కొని వచ్చారు. కొన్ని ప్రకటనలు చేశారు. సమస్య పరి ష్కారం కాలేదు. ప్రత్యేకహోదాపైన ఉద్యమంలోనూ అంతే. పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాసతీర్మానం వైఎస్ఆర్సీపీ పెడితే తాను ఢిల్లీకి వెళ్ళి ప్రతిపక్షాలతో మాట్లాడి మద్దతు కూడకడతానని అన్నారు. తీరా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు సరికదా మద్దతు మాటవరుసకు కూడా చెప్పలేదు. ఈ నెల 25వ తేదీన ప్రత్యేకహోదా కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్రబంద్కు పిలుపు ఇస్తే మద్దతు ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చినా లోక్సభ స్పీకర్ ఆమోదించకపోతే విసిగిపోయి, ఎన్డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడానికి చివరి అస్త్రంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తే పలాయనం చిత్తగించారంటూ విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, మన్నన లేని కారణంగానూ, ప్రతిపక్ష సభ్యుల పట్ల పాలక పక్షం శత్రుభావంతో వ్యవహరిస్తున్న కారణంగానూ సమావే శాలను బహిష్కరిస్తే ముఖ్యమంత్రికి భయపడి పారిపోయా రంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులను నిందించడం రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. బద్ధ వైరం ఉన్న టీడీపీ కూడా చేయనట్టు జగన్పైన ఫ్యాక్షనిస్టు ముద్ర వేయడానికి ప్రయత్నించడం పవన్కల్యాణ్ మనసులో గూడుకట్టుకున్న అమిత్రభావానికి నిదర్శనం. రాజీనామాలూ, బహిష్కర ణలూ, బంద్లూ రాజకీయ పోరాటంలో భాగాలు. టీడీపీనీ, వైఎస్ఆర్సీపీనీ సమానంగా విమర్శిస్తే సమదూరం పాటిం చినట్టు కాదు. అధికారంలో ఉన్న పార్టీనీ, ప్రతిపక్షాన్నీ ఒకే గాట కట్టడంలో విజ్ఞత లేదు. టీడీపీని నిజంగా ఎండగట్టా లనే ఉద్దేశం పవన్ కల్యాణ్కి ఉంటే, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలనే పట్టుదల ఉంటే అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపాలి. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామంటూ చంద్రబాబు చెబుతున్నారు. అంత హడావిడిగా ఎవరో తరు ముతున్నట్టు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారని చంద్రబాబును ప్రశ్నించాలి. పదేళ్ళు హైదరా బాద్లో ఉండే హక్కును వదులుకుని అమరావతికి ఎందుకు వచ్చారని అడగాలి. ఓటుకు కోట్లు కేసులో ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ ఏలను ఎందుకు కొనుగోలు చేశారో చెప్పమనాలి. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎందుకు కట్టబెట్టవ లసి వచ్చిందో సంజాయిషీ అడగాలి. ఎన్నికల హామీలు ఏ గాలికి కొట్టుకుపోయాయో చెప్పమంటూ నిలదీయాలి. ఇసుక మాఫియా గురించీ, కాల్మనీ సెక్స్ రాకెట్ గురించీ ప్రశ్నిం చాలి. రాష్ట్రం ఆర్థికంగా కష్టాలలో ఉన్నదంటూ ప్రత్యేక విమానంలో విదేశీయానాలకు రూ. 170 కోట్లకు పైగా దుబారా ఎందుకు చేశారో చెప్పమనాలి. అమరావతి నగర నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా ఎందుకు పేర్చలేదనీ, సింగపూరు గొడవ ఏమిటనీ, పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదనీ నిలదీయాలి. విజ యవాడలో దుర్గగుడి దగ్గర ఫ్లయ్వోవర్ ఎప్పటికి పూర్తవు తుందో చెప్పమనాలి. ఈ ప్రశ్నలు ఏవీ వేయకుండా ప్రతిపక్ష నాయకుడిని తీవ్రపదజాలంతో విమర్శించడంలో ఆంతర్యం ఏమిటి? ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదగా లని ఆశించే జనసేనాని రాజ్యసభ సీటు ఇస్తానని బాబు అనగానే ఎన్నికలలో 50, 60 స్థానాలకు పోటీ చేయాలన్న సంకల్పాన్ని విరమించుకోకూడదు. ఎన్టీఆర్కు రాజ్యసభ సీటు ఇస్తానని నాటి ముఖ్యమంత్రి అంజయ్య చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనను అటక ఎక్కించలేదు. కాంగ్రెస్ పార్టీని బలపరచలేదు. పవన్ ఆంతర్యం ఏమిటి? ఏ నాయకుడు ఏమి మాట్లాడుతున్నారనే అంశం కంటే ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ ప్రయోజనం ఆశించి మాట్లాడుతున్నారో ఆలోచించడం అవసరం. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్ ప్రసంగించిన బహిరంగ సభ జరిగిన సమయంలోనే ఒంగో లులో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ధర్మపోరాట’ సభ జరి గింది. ఒంగోలులో సభికులు స్తబ్దుగా కూర్చున్నారు. బాబు పక్కనే కూర్చున్న కళావెంకటరావు, తదితరుల మొహాలలో ఉత్సాహం లేదు. ఒంగోలు సభకు హాజరైన జనం కంటే పదిరెట్లు జగ్గంపేట సభలో ఉన్నారు. అక్కడ ప్రజలు ఉత్సా హంగా కేరింతలు కొడుతూ కనిపించారు. బాబు ఎప్పటి లాగే తర్జని ఊపుతూ, ఏపీలో బీజేపీ ఆటలు సాగవంటూ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ తప్పు తెలుసుకొని అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఒకటేనంటూ ఏపీ పీసీసీ నాయకుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యా నించారు. తరచి చూస్తే అంతస్సూత్రం కనిపిస్తుంది. చంద్ర బాబు బీజేపీనీ, వైఎస్ఆర్సీపీనీ విమర్శిస్తూ ఉంటారు. రఘువీరారెడ్డీ అదే పని చేస్తారు. పవన్కల్యాణ్ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోదనీ, సొంతంగా 175 స్థానాలకు పోటీ చేస్తుందనీ రఘువీరా చెప్పారు. పవన్కల్యాణ్ కూడా స్వతంత్రంగా పోటీ చేస్తానం టున్నారు. వామపక్షాల వైఖరి ఏమిటో స్పష్టంగా వెల్లడి కాలేదు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్, జనసేన ఉపయోగపడతాయి. కాంగ్రెస్ ముక్కు ఉన్నా, ఊడినా పెద్ద తేడా ఉండదు. జనసేనాని వ్యూహం వల్ల కాపు సామాజికవర్గం ప్రభావితం అవుతుందని చంద్ర బాబు అంచనా కావచ్చు. ఆ వర్గం టీడీపీపైన ఆగ్రహంతో ఊగిపోతోందని ముఖ్యమంత్రికి తెలుసు. కాపులు తనకు ఓట్లు వేయకపోయినా వైసీఆర్సీపీకి వేయకుండా చూడాల న్నది టీడీపీ అధినేత తాపత్రయం. కాపు సామాజికవర్గం పైన పవన్కల్యాణ్ ప్రభావం అంత బలంగా ఉంటే పెద్దాపు రంలోనూ, జగ్గంపేటలోనూ జగన్ సభలు అంత జయ ప్రదం అయ్యేవి కావు. రాజకీయాలలో ఎత్తుగడలూ, ఎన్ని కల మేనేజ్మెంటూ, డబ్బులూ, కులాలూ కొంతవరకు పని చేస్తాయన్న మాట నిజమే. కొంతవరకే పని చేస్తాయని గ్రహించాలి. నాయకుడు ఒక ప్రభంజనం సృష్టిస్తే, ప్రజలు ఒక పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకుంటే ప్రత్యర్థుల ఎత్తులన్నీ చిత్తు అవుతాయని 2004, 2009 ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో దృశ్యాలు చూసినవారికి గాలి ఎటు వీస్తున్నదో, ఎంత బలంగా వీస్తున్నదో తెలుస్తుంది. కొందరు కొన్ని కారణాల వల్ల వాస్తవాన్ని అంగీకరించకపోవచ్చు. అంత మాత్రాన ప్రజల సంకల్పం మారదు. కె. రామచంద్రమూర్తి -
‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో!
శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్ రిహార్సల్స్. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వంపైన మొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తీరూ, ఓటింగ్ జరిగిన సరళీ ఉపయోగపడతాయి. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్ట డంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉద్దేశం ఏమైనా, తీర్మానాన్ని వెంటనే అను మతించి వెనువెంటనే చర్చ, ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంలో ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఏమైనా దేశప్రజలకు ఏ పార్టీ ‘జుమ్లా’ ఆట ఆడుతున్నదో, ఎవరి కపట నాటకం ఎటువంటిదో, ఎవరు నిజాయితీగా ప్రజల తరఫున నిలిచి పోరాడుతున్నారో తెలిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం పైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చి అనుమతి లభించక విసిగి వేసారి పదవులకు రాజీనామా చేసిన అయిదుగురు వైఎస్ఆర్ సీపీ లోక్సభ సభ్యులను ఎద్దేవా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? పైగా, టీడీపీ నోటీసు ఇచ్చిన వెంటనే దానిని అనుమతించడంలో ఎన్డీఏ సర్కార్ ఎత్తుగడ ఏమిటి? అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని తెలుసుననీ, ప్రత్యేకహోదాపైన చర్చ జర గాలనే ఉద్దేశంతోనే తీర్మానం పెట్టామనీ సుజనాచౌదరి అన్నారు. అమిత్ షా నోట ‘జుమ్లా’ ‘జుమ్లా’ అనే మాటను వర్తమాన రాజకీయాలలో మొదట ప్రయోగించిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ‘జుమ్లా’ అంటే ఉత్తిమాట, నీటిమీద రాత, మాట వరుసకు అన్న మాట అని రూఢి అయింది. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగంలో చేసిన మాటను ‘చునావీ జుమ్లా’ (ఎన్నికల ప్రచారంలో మాటవరుసకి అన్న మాట)గా అమిత్ షా అభివర్ణించి ఆ మాటను పట్టుకొని వేళ్ళాడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచీ ‘జుమ్లా’ అనే మాట భారత రాజకీయాలలో తరచుగా విని పిస్తున్నది. సర్జికల్ స్ట్రయిక్స్ను కూడా జుమ్లా స్ట్రయిక్స్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అభివర్ణించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. ‘జుమ్లా స్ట్రయిక్ నంబర్ ఏక్, జుమ్లా స్ట్రయిక్ నంబర్ దో...’ అంటూ రాహుల్గాంధీ ప్రధాని మోదీపైన బాణాలు సంధించి, ప్రసంగం ముగి సిన తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని పక్కనున్న సభ్యుడివైపు చూసి నవ్వుతూ కన్నుగీటడంతో మోదీపై తన దాడి యావత్తూ ‘జుమ్లా స్ట్రయికే’నని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వా లంటూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రాహుల్కీ, మోదీకి మధ్య సంవాదంగా సాగిందే తప్ప ప్రత్యేకహోదా ఊసు లేదు. చర్చను ప్రారంభిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ తన ఇంగ్లీషు ప్రసంగపాఠాన్ని బాగా చదివారు. రామ్మోహన్నాయుడు హిందీలో, ఇంగ్లిష్లో ఆశువుగా మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ పార్లమెంటేరియన్లకూ మంచి అవకాశం లభించడం తప్పిస్తే అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఒరి గింది ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబే అమరావతి మీడియా గోష్ఠిలో స్వయంగా అంగీకరించారు. పనిగట్టుకుని శనివారం ఇదే మాట చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా గోష్ఠి నిర్వహించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానాన్ని బలపర్చుతున్నట్టు జయదేవ్ చాలా పార్టీల పేర్లు చదివారు. ఆ పార్టీలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి ఉంటే 126 మాత్రమే పడేవి కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడేవికావు. జయదేవ్ చదివిన పార్టీల జాబితా సైతం ‘జుమ్లా’నే అనుకోవాలి. 12 గంటల చర్చ తర్వాత ఏమి సాధించారంటే కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేక పోయారని చెప్పు కోవాలి. తక్కిన పార్టీ నాయకులు ఎవ్వరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిం చలేదు. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యం. ప్రాంతీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలోని రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ వల్లనే అవిశ్వాసం అపహాస్యం పాలయింది. అన వసరంగా సెల్ఫ్గోల్ కొట్టుకున్నామంటూ ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. ‘మా నాయకుడి చక్రానికి తుప్పు పట్టింది. చక్రం తిరగడం లేదు. పాచిక పారడం లేదు’ అని ఒక సీనియర్ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని స్వయంగా నరేంద్రమోదీనే లోక్ సభ సాక్షిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికే ఆ పార్టీ యూ–టర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీని విమ ర్శించడం ప్రారంభించిందని కూడా చెప్పారు. ఈ రెండు అంశాలకే ప్రధాని పరి మితమైనారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీపైన ఎంతోకొంత విమర్శ చేయకపోతే బాగుండదు కనుక ఈ రెండు మాటలూ అన్నారు. చంద్రబాబుపైన మోదీకి ఆగ్రహం లేదు. ఉంటే ఆయనకు తెలిసిన సమస్త సమాచారాన్ని విని యోగించుకొని ధ్వజమెత్తేవారు. ఓటుకు కోట్ల కేసు సంగతి ప్రధానికి జ్ఞాపకం లేకపోలేదు. పట్టిసీమలో అక్రమాల గురించి సమాచారం ఉంది. సింగపూర్ సంగ తులూ తెలుసు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి వ్యవహారాలు తెలుసుకోవడం కష్టం కాదు. టీడీపీ అధ్యక్షుడిని చులకన చేయడం ప్రధానికి ఇష్టం లేదు. చంద్రబాబును మోదీ ప్రత్యర్థిగా చూడటం లేదు. వైఎస్ఆర్సీపీ పట్ల తన వైఖరిని ప్రధాని దాచుకోలేదు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా ఉద్య మిస్తున్న వైఎస్ఆర్సీపీ ‘ఉచ్చు’లో పడవద్దంటూ తాను చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ హెచ్చరించినట్టు ప్రధాని లోక్సభలో అన్నారు. 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ రాజ్యసభలో చేసిన ప్రత్యేకహోదా వాగ్దానం అమలు చేయాలంటూ డిమాండ్ చేయడాన్ని, దానికి అనుకూలంగా ప్రజాభిప్రా యాన్ని ప్రోది చేయడాన్ని ‘ఉచ్చు’గా అభివర్ణించడంలో ప్రధాని అసహనం స్పష్టం అవుతోంది. టీడీపీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చి ఏళ్ళూపూళ్ళూ గడిచినా ప్రధాని కానీ, లోక్సభ స్పీకర్ కానీ స్పందించలేదు. 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను టీడీపీ కొనుగోలు చేసినా, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టినా ప్రధాని ఆక్షేపించలేదు. మొత్తం మీద టీడీపీ పట్ల ఆపేక్ష, వైఎస్ఆర్సీపీ పట్ల ఉపేక్ష స్పష్టంగా కనిపి స్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తే, చంద్రబాబు ఇతర విష యాలపైన దృష్టి పెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా మిత్రుడిని ఎత్తిపొడవడమే కానీ గాయపరచాలనే సంకల్పం లేదు. అంతకుముందు దేశీయాంగ మంత్రి రాజ్నాథ్సింగ్ బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఎంతబలమైనదో నొక్కి వక్కాణిం చారు. ‘చంద్రబాబు నాయుడితో మాకు బలమైన అనుబంధం గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఆ బంధాన్ని తెంచడం ఎవ్వరివల్లా కాదు,’ అంటూ ఆయన ఉద్ఘాటించారు. వాస్తవానికి రాజ్నాథ్సింగ్కి మర్మం తెలియదు. ఆయన తన మనసులో ఉన్నమాట నిస్సంకోచంగా చెబుతారు. ప్రత్యేకహోదా నిజంగా సాధించాలని అనుకుంటే మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి సత్యాగ్రహం చేయడం రాజమార్గం. రాజకీయ పోరాటాలలో రాజీనామాను ఆయుధంగా వినియోగించే ఆనవాయితీ మనకు ఉన్నది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపైన ఒత్తిడి పెంచకపోగా రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలను తప్పుపట్టడం కేవలం అదరగండపు రాజకీయం. తాను లాలూచీ పడుతూ ఎదుటివారు లాలూచీ పడుతున్నట్టు ఆరోపించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకత. వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును అనుమతించకపోవడంలో, టీడీపీ నోటీసును వెంటనే అనుమతించడంలోనూ బీజేపీ, టీడీపీ లాలూచీ స్పష్టంగా కనిపిస్తున్నది. జయదేవ్ ప్రసంగంలో కొత్త అంశం ఏముంది? అవిశ్వాసతీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ ఏమైనా కొత్త విషయం చెప్పారా? నాలుగేళ్ళుగా ధర్నాలలోనూ, బంద్లలోనూ, రాస్తారోకోలలోనూ, యువభేరి సభలలోనూ, శాసనసభ సమావేశాలలోనూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పిన అంశాలనే జయదేవ్ లోక్సభలో చదివి విని పించారు. 14వ ఆర్థిక కమిషన్ ప్రత్యేకహోదాను వద్దనలేదంటూ ఆర్థిక కమిషన్ సభ్యుడు రాసిన లేఖను జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించినప్పుడు అధికార పక్షం అహంకారంతో పెడచెవిన పెట్టింది. ప్రత్యేకహోదా మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కార్ను కోరుతూ శాసనసభ రెండోసారి తీర్మానం చేసినప్పుడే ప్రతిపక్ష నాయకుడు కేంద్రానికి ఒక నెల రోజులు గడువు ఇవ్వాలనీ, గడువులోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమం బాట పట్టాలనీ, అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడాలనీ, టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగాలనీ ఉద్ఘా టించారు. 2017 మే నెలలో ప్రధానిని కలుసుకున్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వా లంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సంవత్సరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు అదే రోజు పొద్దుపోయిన తర్వాత అమరావతితో మీడియా గోష్ఠి నిర్వహించి చంద్ర బాబు నాయుడు ప్యాకేజీని ఆహ్వానించారు. అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికీ, ఆర్థికమంత్రికీ శాలువలు కప్పి సన్మానించారు. ప్రధానికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాధించిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే జగన్ మోహన్రెడ్డి ప్యాకేజీని తిరస్కరించమంటూ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సలహా పాటించకపోగా అడ్డంగా వాదించారు. ప్రత్యేకహోదా సంజీ విని కాదనీ, పదేళ్ళ కిందట ఆ హోదా లభించిన రాష్ట్రాలలో అభివృద్ధి ఏమీ జరగలేదనీ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనదనీ, అది ఆంధ్రుల శ్వాస అనీ ప్రజలలో బలంగా నాటుకున్న తర్వాత బీజేపీతో మంతనాలు జరిపి ‘జుమ్లా’ తిరుగుబాటుకు తెరదీశారు. బీజేపీ–టీడీపీ అవగాహనలో భాగంగానే ఎన్డీఏ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ ఉంటారు కానీ జాతీయ నాయకత్వంతో టీడీపీ అధినేతకి సత్సంబంధాలే ఉంటాయి. ముఖ్యమంత్రికీ, ప్రధానికీ చేసిన విజ్ఞప్తుల వల్ల ఫలితం లేకపోవడం, ధర్నాలలో, రాస్తారోకోలలో, బంద్లలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, వామపక్షాలూ, ఇతర సంస్థల కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జైళ్ళలో పెట్టడం, లాఠీచార్జీలు చేయించడంతో విసిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీ నామాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిరసన వెలిబుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారనీ, పార్లమెంటు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ భవన్కు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారనీ వైఎస్ జగన్ మే 31న పాదయాత్రలోనే ప్రకటించారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరశనదీక్ష చేస్తే కేంద్రం దిగివస్తుందని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత అనేకసార్లు అదే ఉద్బోధ చేశారు. శనివారంనాడు కూడా ఆ మాటే అన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (జూలై 24న) రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ ఏమి చేసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలపాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కానీ, ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. తర్వాత అరుణ్ జైట్లీతో సమాలోచనలు జరిపి హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించడమే గొప్ప రాజకీయ విజయంగా చాటుకున్నారు. ప్రత్యేక హోదా అవసరం ప్రజలు గ్రహించారని తెలుసుకొని బీజేపీతో విభేదించినట్టూ, తిరుగుబాటు చేసినట్టూ ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాను అమలు చేయకపోవడంలో బీజేపీ, టీడీపీల జమిలి మోసం ఉన్నదని ప్రజలు గ్రహించారు. నాలుగేళ్ళుగా అంటకాగుతూ వీరు సాగించిన నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాసతీర్మానం పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చాటుకుంటుంది. అది వీగిపోయింది కనుక ఇకమీదట హోదా ప్రస్తావన తీసుకొని రావద్దంటూ బీజేపీ వాదిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదు. ఏదేమైనా అవిశ్వాస తీర్మానంతో ఒక్క విషయం మాత్రం నిగ్గు తేలింది. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లు బీజేపీకి మద్ద తుగా నిలుస్తాయని జాతీయ చానళ్ళలో వివిధ పార్టీల ప్రవక్తలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. కె. రామచంద్రమూర్తి -
చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు!
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి స్వాగతించేందుకు ఆయన నివాసానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఊమెన్చాందీ వెడుతున్నారని పది రోజుల కిందట మధ్యాహ్నభోజన సమయంలో విన్నప్పుడు కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. నాకేమీ అది అసాధారణ చర్యగా కనిపించలేదు. కాంగ్రెస్ సంస్కృతికి, ముఖ్యంగా సోనియాగాంధీ మనస్తత్వానికి తగినట్టుగానే ఉందనిపించింది. రాజకీయాలలో కొందరికి సెంటిమెంట్లు ఏ మాత్రం ఉండవు. కొందరు మాత్రం ఇచ్చిన మాట తప్పకూడదనీ, అసత్యాలు చెప్పకూడదనీ నియమాలు పెట్టుకొని నష్టపోతారు. కష్టపడతారు. ఏదో ఒక విధంగా గెలవడమే పరమావధి అని భావించేవారిని సెంటిమెంట్లు బాధించవు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఢిల్లీలో శుక్రవారం నాడు కిరణ్కుమార్రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించినప్పుడు 22 సంవత్సరాల కిందట జరిగిన ఒక ఉదంతం జ్ఞాపకం వచ్చింది. 1996 ఎన్నికలు జరగడానికి ముందు ఏదో పనిమీద ఢిల్లీ వెళ్ళాను. పీవీఆర్కె ప్రసాద్ని కలిసేందుకు ఆయన దగ్గరికి వెడితే ‘పీవీ గారింటికి పోతున్నా మీరూ రండి’ అంటూ తీసుకొని వెళ్ళారు. రాజకీయ నాయకులకు అయాచితంగా సలహాలు ఇచ్చే అలవాటు పెద్దగా లేదు కానీ నాకు నచ్చిన, నాకు చనువున్న రాజకీయ నాయకుల హితంకోరి వారు అడగ కపోయినా సలహా ఇచ్చే అమాయకత్వం ఉంది. మేం వెళ్ళినప్పుడు పీవీ, సుబ్రహ్మణ్యస్వామి కూర్చొని తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మేము కూడా వారితోనే కూర్చున్నాం. ‘తమిళనాడులో ఇప్పుడు డిఎంకే హవా ఉంది. జయలలితతో పొత్తు కొనసాగిస్తే మీకు ఒక్క సీటు కూడా రాదు. డీఎంకేతో పెట్టుకుంటే కనీసం 20 వస్తాయి’ అని నేను అన్నాను. ‘అదేనండీ సమస్య. డిఎంకేతో పొత్తు పెట్టుకోలేం. జయలలితే శరణ్యం’ అంటూ నిస్సహాయంగా నిట్టూర్చారు పీవీ. ఆయన అన్ని మాటలు మాట్లాడటమే విశేషం. ‘హీ ఈజ్ టూ సెంటిమెంటల్, యూ నో...,’ అన్నారు స్వామి. నేపథ్యం కాస్త వివరంగా చెప్పాలంటే, రాజీవ్గాంధీ హత్య కేసులో శ్రీలంక తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ పాత్ర ఉన్నదనీ, ఆ సంస్థతో డీఎంకేకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, రాజీవ్ హత్య వెనుక డీఎంకే హస్తం ఉన్నదనీ ఆ రోజుల్లో అందరినోటా వినిపించిన మాట. 1991 సార్వత్రిక ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మానవబాంబు దురంతం తమిళనాడులో ఎన్నికలు రెండో దశలో భాగం. మొదటి దశ తర్వాత తమిళనాడు శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాజీవ్గాంధీని మానవబాంబు రూపంలో సమీపించిన ధను తనను తాను పేల్చుకొని పెద్ద విస్ఫోటనం సృష్టించింది. రాజీవ్ సహా 15 మంది ఆ దుర్ఘటనలో మర ణించారు. ఎల్టీటీఈకి రాజీవ్పైన అంత పగ ఎందుకు? శ్రీలంకలో తమిళుల తిరుగుబాటును అణ చివేయడానికి ఆ దేశ అధ్యక్షుడు జయవర్ధనేతో రాజీవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఇండియన్ పీస్కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరుతో భారత సైనికులను తమిళ పులులతో తలబడటానికి జాఫ్నాకు పంపించారు. వారిలో అత్యధికులను ఎల్టీటీఈ బలితీసుకుంది. దారుణంగా విఫలమైన ఈ దౌత్య, సైనిక వ్యూహం రాజీవ్ జీవితంలో మచ్చగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో కొలం బోలో భారత హైకమిషనర్గా పనిచేసిన జెఎన్ దీక్షిత్ చెప్పినట్టు ఐపీకే ఎఫ్ను జాఫ్నాకు పంపించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మినహా తమిళనాడు లోని రాజకీయ పార్టీలన్నీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. ఏఐఏడిఎంకె అధినేత జయలలిత రాజీవ్కి సన్నిహితురా లుగా కనిపించినప్పటికీ తమిళ రాజకీయాలలో మనుగడ కోసం ఐపీకే ఎఫ్ను మాటవరుసకైనా వ్యతిరేకించక తప్ప లేదు. 1991 జనవరి 10న పార్లమెంటులో నాటి ప్రధాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘తమిళనాడులోనే కాకుండా జాఫ్నాలోని ఎల్టీటీఈ కేంద్రకార్యాలయానికి కూడా తమి ళనాడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళినట్టు నాకు సమా చారం ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం (I have information that the chief minister of Tamil Nadu has gone to the LTTE headquarters not only in Tamil Nadu but also in Jaffna. This is something very serious)' అన్నారు. కరుణానిధి ప్రభుత్వాన్ని బర్త రఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దాంతో తమిళ నాడులో తమిళ పులులకు శిక్షణ కార్యక్రమాలను నిలిపి వేయవలసి వచ్చింది. అంతవరకూ యధేచ్ఛగా తిరు గుతూ, తమ కార్యక్రమాలను నిర్నిరోధంగా కొనసాగిస్తున్న టైగర్స్ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. బర్తరఫ్ చేయాలన్న నిర్ణయం చంద్రశేఖర్ స్వయంగా తీసుకున్నదేననీ, కాంగ్రె స్కు సంబంధం లేదనీ ఆయన దగ్గర ప్రిన్సిపల్ సెక్రట రీగా పని చేసిన ఎస్ఎన్ మిశ్రా తాను రచించిన ‘ఫ్లయింగ్ ఇన్ హై విండ్స్’ అనే పుస్తకంలో స్పష్టం చేశారు. కానీ ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ మాత్రం చంద్రశేఖర్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కారణంగానే డిఎంకే ప్రభుత్వంపైన వేటు వేశారని నమ్మాడు. జయవర్దనేతో ఒప్పందం చేసుకొని ఐపీకేఎఫ్ను పంపడమే కాకుండా తమ మిత్రప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కారకుడైన రాజీవ్ 1991 ఎన్నికల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవ కాశం ఉంది. అందుకే రాజీవ్ హత్యకు ప్రభాకరన్ వ్యూహం రచించాడు. 1991లో రాజీవ్ హత్య తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలకు వరుసగా 28, 11 స్థానాలు వచ్చాయి. డిఎంకే ఊసే లేదు. (ఆ రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి) అయితే 1996లో లోక్సభకు జరిగిన ఎన్ని కలలో రాజీవ్ హంతకులైన ఎల్టీటీఈ నాయకులతో సంబంధాలు కలిగిన డిఎంకేతో ఎన్నికల పొత్తు పెట్టు కుంటే రాజీవ్ సతి సోనియా బాధపడిపోతారనీ, ఆగ్రహిస్తారనీ పీవీ భావించి కరుణానిధితో మాట్లాడటానికి కూడా సంకోచించారు. ఇష్టం లేకపోయినా జయలలితతోనే ఎన్ని కల పొత్తు కొనసాగించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలు తుడిచి పెట్టుకొని పోయాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. తమిళ మానిల కాంగ్రెస్–మూపనార్ (టీఎంసీ–ఎం)కి 20, డిఎంకేకి 17, సీపీఐకి రెండు స్థానాలు వచ్చాయి. తమిళనాడులో కాంగ్రెస్కు ఒక్క సీటు దక్కక పోయినా పర్వాలేదు కానీ డిఎంకేతో పొత్తు పెట్టుకొని సోనియాగాంధీ మనస్సు నొప్పించకూడదని పీవీ భావిం చారు. అదే సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అదే డిఎంకేతో 2004లో, 2009లో, 2016లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోరాడింది. అంటే రాజీవ్ హత్యకు సంబంధించి సోనియాగాంధీకి లేని సెంటిమెంటు పీవీకి ఉంది. కాంగ్రెస్పార్టీకి తీరని అపకారం చేసిన కిరణ్ కుమార్రెడ్డికి చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ కనబడిన రాహుల్గాంధీని చూసినప్పుడు ఆ సెంటిమెంటు గుర్తు కొచ్చింది. సెంటిమెంటు లేని సోనియా కుటుంబం సోనియాగాంధీకి సెంటిమెంటు ఉంటే కాంగ్రెస్ పార్టీ 2004లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికీ, 2009లో అధికారంలో కొనసాగడానికీ ప్రబల కారకుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు బనాయించి, 16 మాసాలు జైలుపాలు చేసేవారు కాదు. 2004లో మొత్తం 42 లోక్సభ స్థానాలలో 29 స్థానాలనూ, 2009లో 33 స్థానాలనూ గెలిచి యూపీఏ ప్రభుత్వ అస్తిత్వాన్ని పరిరక్షించిన వ్యక్తి కుటుంబానికి సెంటిమెంటు ఉన్నవారైతే చేతనైతే సాయం చేసే వారు కానీ కక్షకట్టి, కత్తికట్టేవారు కాదు. కాంగ్రెస్ నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డి అధి కారంలోకి రాకుండా నిరోధించడానికే నాటి హోంమంత్రి చిదంబరం సలహా మేరకు కొణిజేటి రోశయ్యను తొలగించి ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డిని సోనియాగాంధీ నియమించారు. 2014లో వైఎస్సార్సీపీ తలవెంట్రుకవాసిలో ఓడిపోవడంలో కిరణ్రెడ్డి పాత్ర ఇసుమంతైనా లేదు. కాంగ్రెస్ నేలమట్టం కావడంలో మాత్రం ప్రధాన భూమిక ఆయనదే. పీవీకి సన్నిహితుడైన అమరనాథరెడ్డి కుమారుడు కిరణ్కుమార్రెడ్డి. చిత్తూరు రాజకీయాలలో అమర్నాథ్ రెడ్డికీ, చంద్రబాబుకూ పడేది కాదు. 1980లో చిత్తూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో నాటి మంత్రి అమరనాథరెడ్డి నిలబెట్టిన అభ్యర్థిని మరో మంత్రి సి దాస్తో భుజం కలిపి మంత్రి చంద్రబాబునాయుడు ఓడించారు. డాక్టర్ కుతూహలమ్మను అధ్యక్షురాలుగా గెలిపించారు. సీనియర్ మంత్రి, నాటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావుకు సన్నిహితుడూ అయిన అమరనాథ్ రెడ్డికి అది తీరని అవమానం. తన తండ్రికి ప్రత్యర్థి అయిన చంద్రబాబునాయుడితోనూ, చిదంబరంతోనూ షరీకై జగన్మోహన్రెడ్డిపైన కేసులు పెట్టించడంలో కిరణ్కుమార్ రెడ్డికి ఏ సెంటిమెంటూ అడ్డురాలేదు. తనను మనసారా ప్రేమించి, చీఫ్విప్గా, శాసనసభాపతిగా పదోన్నతి కల్పిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడికి అపకారం చేస్తు న్నాననే స్పృహ రవ్వంతైనా లేకుండా రాజకీయ ప్రయోజ నాలు సాధించడానికి ప్రయత్నించడం మామూలు విష యం కాదు. వ్యక్తుల సంగతి సరే. తన అభ్యున్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి కిరణ్కుమార్రెడ్డి ఏ విధంగా రుణం తీర్చుకున్నారు? ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైఎస్ హఠాన్మరణం తర్వాత ఊపందుకున్నది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన ఉద్యమ సారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పన్నెండు రోజుల నిరశన దీక్షతో దిగివచ్చిన యూపీఏ సర్కార్ చిదం బరం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు ప్రారం భిస్తామంటూ ప్రకటన చేయించింది. ఇందుకు నిరసనగా కోస్తాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎంఎల్ఏలు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం కాలహరణం కోసం క్షేత్ర వాస్తవికత ఏమిటో కనుక్కో వాలంటూ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3న నియమించింది. 2010 నవంబర్ 24న రోశయ్య రాజీనామా చేశారు. అనంతరం నాలుగు మాసాల తర్వాత, 2011 మార్చి 12న వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. అంతకంటే ముందు 2010 డిసెంబర్లో కాంగ్రెస్ నుంచి వైదొలగడంలో భాగంగా జగన్ కడప పార్లమెంటు సీటుకూ, విజయమ్మ పులివెందుల అసెంబ్లీ సీటుకూ రాజీనామా చేశారు. 2011 మే మొదటివారంలో ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉపఎన్నికలలో జగన్ కడప లోక్సభ స్థానాన్ని 5,45,671 ఓట్ల ఆధిక్యం తోనూ, విజయమ్మ పులివెందుల సీటును 81,373 ఓట్ల తేడాతోనూ గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జగన్ను నిరోధించడం రోశయ్య వల్ల కాదని తీర్మానించుకున్న పార్టీ అధిష్ఠానం ఆయనకు ఉద్వాసన చెప్పి రాయలసీమకే, రెడ్డి సామాజికవర్గానికే చెందిన యువనాయకుడు కిరణ్ కుమార్రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 2012 జూన్ 12న 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు రెండు వారాల ముందుగా సీబీఐ చేత జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేయించారు. విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ 15 స్థానాలు గెలుచుకున్నది. నెల్లూరు లోక్సభ స్థానాన్ని 2,90,000 మెజారిటీతో నిలబెట్టుకుంది. ఉపఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లలో వైఎస్సార్సీపీకి 46.8 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్ ఓట్ల శాతం 22కి తగ్గింది. తెలుగుదేశం పార్టీ సోదిలోకి లేదు. అధికారం ఉంటే చంద్రబాబునాయుడు మాయా మర్మం చేసి ఉపఎన్నికలలో గెలవగలరు కానీ ప్రతిపక్షంలో ఉంటే ధరావత్తు సైతం దక్కించుకోలేరు. పదేళ్ళ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలోనూ గెలవలేదు. సీబీఐ ద్వారా జగన్పై కేసులు బనాయించి జైలుకు పంపే తెలివితేటలు కిరణ్కుమార్రెడ్డికి ఉన్నాయి కానీ ఎన్నికలలో జగన్ను ముఖాముఖిగా ఎదుర్కొనే శక్తి లేదని కాంగ్రెస్ అధిష్ఠానం గ్రహించింది. కిరణ్ ఇన్నింగ్స్ చివరలో అంతకంటే పెద్ద మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వచ్చింది. రాష్ట్ర విభజనలో విచిత్రవిన్యాసాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చుకున్న తర్వాత పద్ధతి ప్రకారం ఏమి జరగాలి? కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముఖ్యమంత్రినీ, కేంద్ర మంత్రులనూ, పార్టీ ఎంపీలనూ, శాసనసభ్యులనూ, ఇతర ముఖ్యనాయకు లనూ కూర్చోబెట్టుకొని సమాలోచన జరపాలి. విభజన నిర్ణయానికి పార్టీ నాయకులందరినీ ఒప్పించి నిర్ణయం సజావుగా అమలు జరిగేటట్టు చూడాలి. ఆ పని చేయ కుండా ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య వాదులాటలూ, ఎత్తులూపైఎత్తులూ సాగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించింది. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగులుతుంటే బాధ్యతారహితంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్ తన కార్యాలయంలో విలేఖరుల గోష్ఠి నిర్వహించి వర్కింగ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు మౌనం పాటించింది. తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ, చివరి బంతి ఇంకా బౌల్ చేయవలసి ఉన్నదంటూ ఆత్మవంచనకూ, పర వంచనకూ తమ పార్టీ ముఖ్యమంత్రి ఒడిగడుతూ ఉంటే సోనియాగాంధీ కానీ, ప్రధాని మన్మోహన్సింగ్ కానీ, ప్రధాని ఉత్తర్వులను ఢిల్లీ ప్రెస్క్లబ్లో మీడియా ప్రతినిధుల సమక్షంలో పరపరా చించివేసే తెగువ ఉన్న రాహుల్గాంధీ కానీ కిమ్మనలేదు. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతుంటే ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కివెక్కి ఏడుస్తోంది అన్న చందంగా కేంద్ర నాయకత్వం స్పందించ కుండా మొండికేసింది. చివరకు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత అందుకు నిరసనగా కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంత హంగామా చేసినా, ఎన్ని విలేఖరులు గోష్ఠులు నిర్వహించి ఎంత గంభీరంగా మాట్లాడినా సమైక్యవాదాన్ని గట్టిగా సమర్థించిన నాయకుడిగా ప్రజలకు అర్థమై ఉంటే 2014 ఎన్నికలలో ఆయన నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర పార్టీ’కీ, ఎన్నికల సంఘం ప్రసాదించిన చెప్పు గుర్తుకీ జనం బ్రహ్మరథం పట్టేవారు. కిరణ్కు పోటీ చేసే ధైర్యం లేకపోయింది. పార్టీ అభ్యర్థులకు ధరావతు రక్షించుకునే ప్రజాదరణ లేకపోయింది. తన పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. ఎవరు ఎంత ప్రయత్నిం చినప్పటికీ సమీప భవిష్యత్తులో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కోలుకోలేదు. అంత దెబ్బ కొట్టారు పార్టీ నాయకులందరూ కలిసి. చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు. రాహుల్ రాజనీతికి జేజేలు! ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని అంత ప్రగాఢంగా ఆకాంక్షించి ఉంటే కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో వాదించి ఒప్పించి ఉండవలసింది. 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకోవాలని సోని యాగాంధీ, దిగ్విజయ్ సింగ్, ఇతర జాతీయ నాయకులు నాటి ముఖ్యమంత్రి వైఎస్తో గట్టిగా వాదించారు. పోటీ లేకుండా విజయం సాధిస్తామంటూ వైఎస్ కూడా అంతే గట్టిగా ఎదురు వాదించారు. చివరికి సోనియాగాంధీని ఒప్పించారు. ఒంటరిగానే కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. చేతనైతే అధిష్ఠానవర్గాన్ని ఒప్పించాలి. లేకపోతే అ«ధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించాలి. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కిరణ్ సోనియాగాంధీ నిర్ణయాన్ని మన్నించి దాని అమలుకు సహకరించి ఉంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతటి అపారమైన నష్టం వాటిల్లేది కాదు. 2013 జూలై ప్రాంతంలో వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ విభజనపై కసరత్తు చేసినప్పుడే కిరణ్ చొరవ తీసుకొని విభజన నిర్ణయాన్ని ఆమోదించి ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య సదవగాహన సాధించడానికి ప్రయత్నం చేసి ఉంటే ఎవ్వరి సహకారం లేకుండా జైరామ్ రమేష్ ఒంటరిగా విభజన బిల్లును రూపొందించే అవసరం వచ్చేది కాదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనకర్తలైనా ఒక చోట సమావేశమై అన్ని అంశాలనూ సాకల్యంగా పరి శీలించి విభజనబిల్లు తయారు చేసి చట్టం చేసి ఉంటే, రాష్ట్ర విభజన ఎన్నికల కంటే ఏడెనిమిది మాసాల ముందే జరిగి ఉండేది. రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. విభజన బిల్లులోని అంశాలు అమలు జరిగితే ప్రజలలో ఏర్పడిన అపోహలు కొంతమేరకైనా తొలగి పోయేవి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సారథ్యంలో పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కొనేది. అటువంటి అవ కాశం ఇవ్వకుండా, ఎవ్వరినీ సంప్రదించకుండా, ఒంటరి వ్యూహంతో, ఒంటెత్తు పోకడతో కొంప ముంచిన నాయ కుడిని, రహస్యోద్యమం నడిపిన నాయకుడిని ఇంటికి వెళ్ళి పార్టీలో చేరమంటూ అభ్యర్థించడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. పార్టీకి ఎనలేని ఉపకారం చేసిన వైఎస్ కుటుంబాన్ని అవమానించి, పార్టీకి అన్ని రకాలా నష్టం కలిగించి నాలుగేళ్ళుగా ఆజ్ఞాతవాసంలో ఉంటూ, తమ్ముడిని తెలుగు దేశం పార్టీలో చేరడానికి అనుమతించిన కిరణ్కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్న రాహుల్ గాంధీ రాజనీతిని ఏమని వర్ణించాలి? ఆయన మెడలో ఎన్ని వీరతాళ్ళు వేయాలి? ‘సిగ్గులేకపోతే సరి’ అన్నట్టే రాజకీయాల్లో ‘సెంటిమెంట్ లేకపోతే సరి’! -కె. రామచంద్రమూర్తి -
కశ్మీరీ శాంతి కపోతం
మతాలవారీగా, కులాలవారీగా, ప్రాంతాలవారీగా, రాజకీయ భావజాలాల వారీగా చీలిపోయిన నేటి భారతంలో గౌరవప్రదంగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా నిలబడి రాణించడం దాదాపు అసాధ్యం. కల్లోల కశ్మీరంలో అయితే జర్నలిజం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసమే. వస్తునిష్టంగానే రాస్తామంటే కుదరదు. ఉంటే ప్రభుత్వ పక్షాన ఉండాలి లేదా వేర్పాటువాదులకు విధేయంగా ఉండాలి. జరిగిన వాస్తవాలు మాత్రమే ప్రచురించడం అంటే అందరినీ శత్రువులను చేసుకోవడమే. ప్రభుత్వం లేదా సైనికాధికారులు చెబుతున్న సంగతులే ప్రచురిస్తే ‘సర్కారీ పత్రకార్’ అంటూ నిందిస్తారు. డబ్బు తీసుకొని ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారంటూ పాకిస్తాన్ అనుకూలవర్గాలూ, మిలిటెంట్లూ, వేర్పాటువాదులూ ఈసడించుకుంటారు. వేర్పాటువాదుల అభి ప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తే ‘దేశద్రోహులు’ అంటూ హిందూత్వవాదులూ, వీర దేశాభిమానులూ ముద్రవేస్తారు. ఈ నేపథ్యంలో అటు వేర్పాటువాదుల తోనూ, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోనూ, కశ్మీర్లోని ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఉన్నత సైనికాధి కారులతోనూ సమాన ఫక్కీలో సత్సంబంధాలు కలిగిఉంటూ శాంతి నెలకొల్ప డానికి ప్రయత్నించడం సాహసం. అటువంటి అరుదైన సాహసి మొన్న తూటా లకు బలైన ప్రఖ్యాత జర్నలిస్టు సుజాత్ బుఖారీ. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన పత్రిక ‘రైజింగ్ కశ్మీర్’ కార్యాలయం బయటనే ఇఫ్తార్కు వెళ్ళేందుకు కారు ఎక్కబోతుండగా హంతకులు జరిపిన కాల్పులలో నేలకొరిగాడు. సుజాత్ బుఖారీ వివేకవంతుడు. సాహసి. స్నేహశీలి. ఎత్తుగా, అందంగా, హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉండే బుఖారీకి అన్ని రంగాలవారితోనూ పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. అందరితో మాట్లాడే చనువుంది. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో పని చేస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్లో మిత్రులు ఉన్నారు. మనసు విప్పి మాట్లాడే ఆర్మీ జనరల్స్ ఉన్నారు. కనుకనే బారాముల్లా జిల్లాలో క్రీరీ గ్రామంలో శుక్రవారం జరిగిన బుఖారీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరైనారు. కొందరు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వెళ్ళారు. కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుఖారీ హత్యవార్త విని కన్నీటి పర్యంతం అయిపోయారు. ఆమె సోదరుడూ, మంత్రి తస్దీఖ్ముఫ్తీ, ప్రతిపక్ష నాయకుడూ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోనే కాకుండా దేశవ్యాప్తంగా బుఖారీని అభిమానించేవారు ఉన్నారు. యావద్భారతం శోకతప్తమైన సందర్భం ఇది. బుఖారీతో పాటు ఆయన అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు ఆగంతకుల తూటాలకు నేలకొరిగారు. అంతకు కొన్ని గంటల ముందే జౌరంగజేబు అనే జవాన్ శవం పుల్వామాలో దొరికింది. రంజాన్ సెలవుపై ఇంటికి వెడుతున్న జౌరంగజేబును దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. రంజాన్ మాసం సందర్భంగా దేశీయాంగ శాఖ కశ్మీర్లో స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించిన ఫలితంగా లభించిన అవకాశాన్ని ఉగ్రవాదులు పూర్తిగా వినియోగించుకున్నారు. కాల్పుల విరమణకు ముందు ఏప్రిల్ 19 నుంచి మే 16 వరకూ ఉగ్రవాద సంబంధమైన ఉదంతాలు 25 జరిగితే, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మే 17 నుంచి జూన్ 13 వరకూ 66 ఘటనలు జరిగాయి. కాల్పుల విరమణను పొడిగించి, చర్చల ప్రక్రియను పునరుద్ధరించకపోతే కశ్మీర్లో 1990 దశకం ఆరంభంనాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. హింసాకాండ కొనసాగి ఉగ్రవాదులది పైచేయి అయితే కశ్మీర్ అంతర్జాతీయ వివాదంగా మళ్ళీ తెరపైకి ప్రముఖంగా వస్తుంది. ఇతర దేశాల జోక్యాన్ని నివారించడం కష్టం అవుతుంది. కశ్మీరీల ఆత్మగౌరవాన్ని (అస్మితను) సుజాత్ బుఖారీ ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. కశ్మీరీ భాష అన్నా, సంస్కృతి అన్నా చెవికోసుకునేవాడు. కశ్మీరీ భాషలో వార్తాపత్రికలు రావడానికి ఉద్యమం చేశాడు. కశ్మీరీ భాషలో కవులూ, రచయితల కోసం స్థాపించిన ‘అబ్దీ మక్రజ్ కమ్రాజ్’ అనే సంస్థకు బుఖారీ అధ్యక్షుడు. ఈ సంస్థ కృషి ఫలితంగానే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2017లో కశ్మీర్ పాఠశాలల్లో పదో తరగతి వరకూ కశ్మీరీ భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. కశ్మీరీ భాషకు పర్షియన్–అరబిక్ లిపిని రద్దు చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని ఈ సంస్థ జయప్రదంగా ఆడ్డుకున్నది. ఉర్దూ, ఇంగ్లీష్, కశ్మీరీ భాషలలో అధికారం కలిగిన రచయిత బుఖారీ. మంచి వక్త. సాహిత్యసభలలో తరచుగా పాల్గొనేవాడు. అతడు కేవలం జర్నలిస్టు కాదు. శాంతికోసం పరితపించిన∙యాక్టివిస్టు కూడా. ‘రికన్సీలియేషన్ రిసోర్సెస్’ అనే సంస్థను నెలకొల్పి కశ్మీర్లో శాంతి సాధనకు చొరవ తీసుకొని సమాలోచనలు నిర్వహించే బృందంలో బుఖారీ ముఖ్యపాత్రధారి. ఇండియా, పాకిస్తాన్ల మధ్య సమాంతర దౌత్యం (ట్రాక్–2 డిప్లొమసీ) నిర్వహించేవారు. రెండు దేశాల ప్రభుత్వాల, పౌరసమాజాల ప్రతినిధులతో సమాలోచనలు అమెరికాలో, ఇంగ్లండ్లో, ఇతర దేశాలలో నిర్వహించేవారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఈ రకం దౌత్యంలో ప్రముఖ సంపాదకుడు శేఖర్గుప్తా పాల్గొనేవారు. గత నెల దుబాయ్లో బుఖారీ ఆధ్వర్యంలో జరిగిన కశ్మీర్ ఇనీషియేటివ్ భేటీ వివాదాస్పదమైంది. ఇండియా, పాకిస్తాన్లు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని అనుకున్నట్టు వార్త పొక్కింది. తీర్మానం ఆమోదానికి పెట్టలేదు కానీ అందులోని అంశాలపై రకరకాల వ్యాఖ్యలూ, ప్రతిస్పందనలూ సోషల్ మీడియాలో స్వైరవిహారం చేశాయి. ఇది ఉగ్రవాదులను ఆగ్రహోదగ్రులను చేసింది. కశ్మీర్లో శాంతి నెలకొనే అవకాశాలు మెరుగైన ప్రతిసారీ ఉగ్రవాదులు రెచ్చిపోతారు. ‘కశ్మీర్లో ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నది ఉల్లిగడ్డల లేదా ఆలుగడ్డల వ్యాపారం కోసమో, కశ్మీర్ను శాశ్వతంగా విభజించడం కోసమో కాదు. కశ్మీర్కు విమోచన కలిగించడానికి. దుబాయ్లో జరిగిన భేటీ భారత ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తులు నిర్వహించింది. అటువంటి సమావేశాలు నిరర్థకమైనవి’ అంటూ భారత ఇంటెలిజెన్స్ సంస్థల తొత్తుగా సుజాత్ తదితరులను జగమెరిగిన ఉగ్రవాది సలాహుద్దీన్ నిందించాడు. హిజ్బుల్ ముజాహిదీన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్లు బుఖారీని భారత సైన్యానికీ, ఇంటెలిజెన్స్ సంస్థలకీ డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తిగా అభివర్ణించాయి. హంతకులెవరు? సుజాత్ బుఖారీని ఎవరు చంపారు? ఈ ప్రశ్నపైన సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి నివేదికపైన సుజాత్ బుఖారీ వ్యాఖ్య చేసిన కొన్ని గంటలకే అతడిని హత్య చేయడం విశేషం అంటూ పాకిస్తాన్ విదేశాంగ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సుజాత్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉన్నదంటూ పరోక్షంగా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపిస్తున్నది. బుఖారీని ఎవరు చంపారనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి లేదు. అతడిని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? వేర్పాటువాదులతో, పాకిస్తాన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని కశ్మీర్ ముఖ్యమంత్రి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ గడువును పొడిగించాలనీ, అవసరమైతే వేర్పాటువాదులతో సైతం చర్చలు జరపాలనీ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో శాంతికాముకుడైన బుఖారీని చంపవలసిన అవసరం కల్లోలం కోరుకునేవారికే ఉంటుంది. ముగ్గురు ఉగ్రవాదులు బైక్పైన వచ్చి కాల్పులు జరిపినట్టు జమ్మూ–కశ్మీర్ డీజీపీ ఎస్పి వెయిద్ అంటున్నారు. కశ్మీర్ లోయలో ప్రభుత్వానికీ, వేర్పాటువాదులకూ మధ్య, ఇండియాకూ, పాకిస్తాన్కూ మధ్య, ముస్లింలకూ, కశ్మీరీ పండిట్లకూ మధ్య వారధిగా ఉన్న మానవతామూర్తిని పొట్టనపెట్టుకున్నారు. కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటూ, వారిని తిరిగి కశ్మీర్కు రప్పించాలని కోరుకునేవారిలో బుఖారీ అగ్రగణ్యుడు. అటువంటి ఉదారవాదులకు కశ్మీర్లో స్థానం లేదనీ, భద్రత లేదనీ స్పష్టం చేయడం, ఉదారవాదంవైపు మొగ్గు చూపవద్దని ఇతరులను హెచ్చరించడం హంతకుల లక్ష్యం. ఉగ్రవాదులకు హెచ్చరిక బుఖారీ అంత్యక్రియలకు హాజరైన జర్నలిస్టులు అతడి స్ఫూర్తితో మరింత ధైర్యంగా వ్యవహరించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని ఓyì ంచడమే అతడికి నిజమైన నివాళి. కడచిన 15 సంవత్సరాలలో కశ్మీర్లో ఉగ్రవాదులు హత్య చేసిన మొదటి ఉదారవాది బుఖారీ. 2003లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అబ్దుల్ మాజీద్ దార్ను ఉగ్రవాదులు కాల్చి చంపివేశారు. అంతకు పది నెలల ముందు ప్రొఫెసర్ అబ్దుల్ ఘనీ లోన్ని మీర్వాయిజ్ మౌల్వీ ఫారూఖ్ వర్థంతి సభలో ప్రసంగిస్తున్న సమయంలో హత్య చేశారు. 12 ఏళ్ళ కిందట మౌల్వీ ఫారూఖ్ని కూడా ఉగ్రవాదులే చంపారు. ఫారూఖ్కీ, లోన్కీ, దార్కూ, బుఖారీకి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం– ఉదారవాదం. ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు శాంతిమంత్రం జపిస్తారు కనుక వారిని ఉగ్రవాదులు ఉపేక్షించరు. స్నేహశీలి, క్రియాశీలి సుజాత్ బుఖారీని నేను 2010లో మొదటి సారి కలుసుకున్నాను. వందమందికిపైగా యువకులు చేతుల్లో రాళ్ళు పట్టుకొని మరతుపాకుల ఎదురుగా నిలిచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పారామిలటరీ సైనికులు కాల్పులకు నేలకూలిన ఘటనలు జరిగిన తర్వాత కొన్ని వారాలకు హెచ్ఎంటీవీ తరఫున అక్కడికి వెళ్ళాను. సహచరుడు జమీల్–ఉర్–రెహ్మాన్ తోడు ఉన్నాడు. గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నాయకుడూ, పాకిస్తాన్ అనుకూలుడూ అయిన సయ్యద్ అలీ షా గిలానీనీ, మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ వంటి హురియత్ నాయకులనూ, ఇతరులనూ ఇంటర్వ్యూ చేశాను. సాధారణ ప్రజలతో మాట్లాడాను. చివరి అంశంగా శ్రీనగర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అందులో సుజాత్ బుఖారీతో పాటు శ్రీనగర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ, పౌరహక్కుల నేతలూ, విద్యార్థులూ అనేక మంది చురుగ్గా పాల్గొన్నారు. కశ్మీర్లో పరిస్థితీ, సైన్యం నీడలో ప్రజల జీవితాలూ, కశ్మీరీ పండిట్ల వలస, ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న కశ్మీరీల బతుకులూ చర్చకు వచ్చాయి. కశ్మీరీలతో సంబంధాలు లేకుండా ఈ రోజుల్లో ఢిల్లీ స్టుడియోలలో కూర్చొని దేశభక్తి వండివార్చే టీవీ యాంకర్లకు వివేకం కానీ, వినయం కానీ లేవు. విషయపరిజ్ఞానం అంతకంటే లేదు. పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకోవాలనీ, పాకిస్తాన్ సహకారంతో కశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనీ సూచించే వ్యక్తులను పాకిస్తానీ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా చిత్రంచే జర్నలిస్టులు ఢిల్లీలో కొన్ని చానళ్ళను శాసిస్తున్నారు. వారికి నమస్కారం. కశ్మీర్లో ఏ ఘటన జరిగినా కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలంటే అక్కడి సంక్లిష్టమైన పరిస్థితులపైన లోతైన అవగాహన కలిగిన బుఖారీ వంటి వ్యక్తులతో మాట్లాడాలి. బుఖారీ అప్పుడు హిందూ పత్రిక ప్రతినిధిగా శ్రీనగర్లో పని చేస్తున్నాడు. ఆ పర్యటనలో రెండు దఫాలు అతడితో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కలిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. కశ్మీర్ చరిత్రను సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన కలిగింది. బాలగోపాల్ అంటే బుఖారీకీ, హక్కుల నాయకులకూ, ప్రొఫెసర్లకూ ఇష్టం, గౌరవం. అప్పటికి సంవత్సరం క్రితమే కన్నుమూసిన బాలగోపాల్ను చాలామంది గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సంపాదకుల సమావేశం సందర్భంగా ఒక సారి బుఖారీ, నేనూ కలుసుకున్నాం. ‘ది హన్స్ ఇండియా’ సంపాదకత్వం నిర్వహించిన రోజుల్లో కశ్మీర్లో ముఖ్యమైన పరిణామాలు సంభవించినప్పుడు బుఖారీని అడిగి ప్రత్యేక విశ్లేషణ తెప్పించుకొని ప్రచురించేవాడిని. హైదరాబాద్కు కూడా వచ్చాడు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా ఆవేశం లేకుండా, చిర్నవ్వు చెదరకుండా ఉండటం, ఏది మాట్లాడినా సాధికారంగా వ్యాఖ్యానించడం అతడి ప్రత్యేకత. బుఖారీ వంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు. అతడి మరణం కశ్మీర్ ప్రజలకు తీరని లోటు. కె. రామచంద్రమూర్తి -
దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తీశారు. ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మే 4.. డైరెక్టర్స్ డే దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్ డే’ అని అనౌన్స్ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. తనికెళ్ల భరణి ‘సినిమా’ మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్పై చంద్రబోస్ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్. అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ? – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ ఛైర్మన్ బీయస్యన్ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్ అకాడమీ వెబ్సైట్’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్ ఇయర్లో చూశాం’’ అన్నారు. దాసరిగారు నిజంగా ఓ శిఖరం – ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు. ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డ్స్ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ‘డైరెక్టర్స్ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు -
గుర్రం ఎగరావచ్చు!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కలల బేహారి. నిత్య స్వాప్నికుడు. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరమైన లక్షణం. ఏ రంగంలో ఉన్నవారైనా సరే అందరూ కలలు కనాలి. వాటి సాకారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించి 17 సంవత్సరాలైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ప్లీనరీలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్వప్నం గురించి మరోసారి ఉద్వేగంగా మాట్లాడారు. దేశ రాజకీయాలలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తాననీ, హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టిస్తాననీ స్పష్టంగా ప్రకటించారు. భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానని ఎలుగెత్తి చాటారు. మంచిదే. ఒక లక్ష్యం సాధించిన విజేత వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడం సహజం. అసాధ్యమని చాలామంది భావించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి సారథ్యం వహించిన రాజకీయ నేతకు తదుపరి లక్ష్యం దేశ రాజకీయాలపైన ప్రభావం వేయడం కావడంలో ఆశ్చర్యం లేదు. 35 సంవ త్సరాల కిందట నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సాధించిన ఘనకార్యాన్ని తానూ సాధించగలననే ఆత్మవిశ్వాసం కేసీఆర్కి ఉండవచ్చు. కేసీఆర్ రాజకీయ చాతుర్యం, ఎత్తుగడల విషయంలో సందేహం లేదు. కానీ కల సాకారం కావడానికి పరిస్థితులు కలిసి రావాలి. అదృష్టం కూడా అవసరం. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే మహాసేనాని. సైన్య నిర్మాణంలో, రణతంత్ర రచనలో దిట్ట. ఒకానొక సమయంలో సైన్యంలో కీలకమైన స్థానంలో ఒక అధికారిని నియమించవలసిన అవసరం ఏర్పడింది. సలహాదారులు చాలామంది అభ్యర్థులను పరీక్షించి ఒక యోధుడిని ఎంపిక చేశారు. నెపో లియన్ ఆమోదం కోరారు. పోరాట పటిమ లేదా మనోబలం లేదా గతంలో అతగాడు సాధించిన విజయాల గురించి నెపోలియన్ ప్రశ్నించలేదు. ‘అతనికి అదృష్టం కలసి వస్తుందా (ఐటజ్ఛి luఛిజుy)?,’ అని ప్రశ్నించాడట. యుద్ధాలలో విజయం సాధించాలంటే పరాక్రమం ఒక్కటే చాలదు. అదృష్టం విధిగా ఉండా లని నెపోలియన్ అభిప్రాయం. రాజకీయాలలోనూ అంతే. మర్రి చెన్నారెడ్డికి లేని అదృష్టం కేసీఆర్కి కలిసి వచ్చింది. జయాపజయాలు జయాపజయాలను యోధులు విశ్లేషించుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అపజయాలకు దారితీసిన కారణాలను తెలుసుకోవడం సులువే. విజయాలను అర్థం చేసుకోవడమే కష్టం. చాలా మంది రాజకీయ నాయకులు గెలుపును అపార్థం చేసుకొని అంతా తమ ఘనతే అనుకొని అహంకారం పెంచుకొని దెబ్బ తింటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ను సాధ్యం చేసిన పరిస్థితులనూ, తెలం గాణ రాష్ట్ర పాలనలో కొన్ని సత్ఫలితాలను సాధించడానికి సహకరించిన అంశాలనూ జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రధాన పాత్రను ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఇతర ఉద్యమ నాయ కుల పాత్ర, ప్రజల ఉద్యమస్ఫూర్తి నిశ్చయంగా తోడైనాయి. ఉద్యమ కాలంలో వివిధ ఘట్టాలలో రకరకాల వ్యక్తులు ఆయనకు సలహాలు ఇచ్చి ఉండవచ్చు. ఏ సలహా స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవలసిందీ, దాని మంచిచెడులకు బాధ్యత వహించవలసిందీ నాయకుడే కనుక ఖ్యాతీ, అపఖ్యాతీ సైతం ఆయనకే చెందుతాయి. అంతిమ విజయం సాధించిన నేతగా కేసీఆర్కు కీర్తి దక్కింది. అధికారం కూడా ఆయన సొంతమే అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు అనేకం జరిగాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన తరంగం. 1971లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అప్పటి తెలంగాణలోని మొత్తం 14 లోక్సభ స్థానాలలోనూ తెలంగాణ ప్రజా సమితి 10 స్థానాలు గెలుచుకున్నది. ఆ పార్టీ అదే సంవత్సరం సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. తర్వాత రెండు సంవత్సరాలు తిరగ కుండానే ‘జైఆంధ్ర’ ఉద్యమం ఎగిసిపడింది. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ససేమిరా అన్నారు. ఉద్యమ నాయకులతో సమా లోచనలు జరిపి వారి రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చారు. ముఖ్యమంత్రులకు ఉద్వాసన చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీ ర్ఘంగా జరిగింది. ఇందిరాగాంధీకి ఉన్నన్ని పట్టింపులు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన పట్ల సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ అప్పటి ప్రతిపక్ష నాయ కుడు నారా చంద్రబాబునాయుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయకపోతే 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించేవారు కాదు. నిర్ణాయక స్థానంలో సోనియాగాంధీ ఉండటం, ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే ప్రత్యర్థులకు నష్టం, తన పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమెను సలహాదారులు నమ్మించడం, వందలమంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆత్మహత్య చేసు కోవడం, చిన్న రాష్ట్రాలపట్ల పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి సాను కూలమైన అభిప్రాయం ఉండటంతో సహా అనేక కారణాలు రాష్ట్ర విభజనకు దారి తీశాయి. ఈ వాస్తవాలన్నిటినీ క్షుణ్ణంగా, వస్తునిష్టంగా అధ్యయనం చేసి కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవాలి. నేల విడిచి సాము తెలంగాణలో పరిపాలనపై ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో పాలన కంటే మెరుగనేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చెప్పినవన్నీ చేయలేకపోతున్నారు. కొన్నిటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జరుగుతున్న మంచి పనులన్నిటినీ తన ఖాతాలో వేసుకొని, వెనుకబాటుతనా నికీ, రైతుల ఆత్మహత్యలకూ, నిరుద్యోగ సమస్యకూ బీజేపీనీ, కాంగ్రెస్ ప్రభు త్వాలను నిందించడం రాజకీయంగా అవసరం కావచ్చు. ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వక ముందే దాని ఫలం రైతులు అనుభవిస్తున్నట్టు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే వేల ఎకరాలకు నీరు అంది స్తున్నట్టు భావించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మున్ముందు రైతు ఆత్మహత్యలు ఆగిపోవచ్చునేమో. కోటి ఎకరాల భూమికి సాగునీరు అందు తుందేమో. ప్రస్తుతానికైతే అవి లక్ష్యాలే. ఆకాంక్షలే. వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతే కానీ తెలంగాణ రాష్ట్రంలో చేయవలసింది అంతా చేసేశాం. కనుక ఇక జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడతాం అంటే కుద రదు. తమ అనుభవానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, పత్రికలు ఏమి రాసినా, టీవీ చానళ్ళు ఏమి చూపించినా ప్రజలు విశ్వసించరు. వారికి స్వీయానుభవం ప్రధానం. నేతలు నేల విడిచి సాము చేయకూడదు. ప్రస్తుతం కేసీఆర్ను నడిపిస్తున్న స్వప్నం ఫెడరల్ ఫ్రంట్. ఇది మహా జటిలమైనది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవ్యంగా ఉన్నట్లయితే, సుపరిపాలన అందించి, ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఉన్నట్లయితే దేశంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు విషయంలో ఆయనే చొరవ తీసుకునేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రికి ఊపిరి సలపనీయడం లేదు. నిద్ర పోనీయడం లేదు. చంద్రబాబు సందర్భశుద్ధీ, సమయజ్ఞతా, నిగ్రహం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. స్వవచోఘాతం నిత్యకృత్యంగా మారింది. ఏమీ లేకపోయినా ఏవేవో ఊహించుకొని ప్రజలే తనను రక్షించాలంటూ మాట్లాడు తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల రాజకీయం చేసే శక్తి ఆయనకు లేదు. అది కేసీఆర్కి కలసి వచ్చే మొదటి అంశం. దేశంలో నరేంద్ర మోదీ తర్వాత డొక్కశుద్ధి ఉండి, మూడు భాషలలో (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) ధాటిగా ఉపన్యసించే శక్తి, వాగ్దేవికటాక్షం ఉన్న నేత కేసీఆర్. తెలంగాణలో తాను కొన్ని రోజులు లేకపోయినా పరిపాలనకు ఢోకా ఉండదు. కుమారుడు తారకరామారావు, మేనల్లుడు హరీశ్రావు సమర్థులు. తనను సవాలు చేసే నాయకులు ఎవ్వరూ పార్టీలో లేరు. అయినప్పటికీ హైదరాబాద్లోనే ఉంటూ కథ నడిపిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఎందరినో ఊరిస్తున్న ప్రధాని పదవి నేడు ఉదయం కేసీఆర్ చెన్నై వెళ్ళి డీఎంకే నేత కరుణానిధితో, ఆయన కుమా రుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో సమాలోచనలు జరుపుతారు. ఇటీవల లక్నోలో సమాజ్వాదీ నేత అఖిలేశ్ యాదవ్ని కేటీఆర్ కలుసుకున్నారు. అఖిలేశ్ కేసీఆర్తో చర్చలు జరిపేందుకు మే 2న హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. మే మొదటి వారంలోనే భువనేశ్వర్ సందర్శించి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ వేయబోతున్నారు. కాంగ్రెస్ లేని భారతదేశం (కాంగ్రెస్ ముక్త్ భారత్) అంటూ మోదీ నినదిస్తే, కాంగ్రెస్, బీజేపీ లేని భారతదేశం అన్నది కేసీఆర్ నినాదం. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని ప్రతిపక్షాలకూ కలిపి 293 స్థానాలు దక్కినా అవన్నీ ఒకే తాటిపైకి రావడం, సమైక్యంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడం చాలా కష్టం. చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్లో డీఎంకే ఉంటే ఏఐఏ డీఎంకే బీజేపీతో ఉంటుంది. కేసీఆర్ నిర్మించే ఫ్రంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంటే సీపీఎం కాంగ్రెస్తో ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మూడు మాసాల కిందటే చైన్నై వెళ్ళి స్టాలిన్తో సమాలోచన జరిపారు. అఖిలేశ్తోనూ, మాయావతితోనూ మాట్లాడారు. ఢిల్లీలో శరద్ పవార్నూ, సోనియాగాంధీనీ, ఇతర ప్రతిపక్ష నేతలనూ కలుసుకున్నారు. ఆమెది కాంగ్రెస్ సహిత ఫ్రంట్. కేసీఆర్ది బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫ్రంట్. ఈ రెండు ఫ్రంట్లలో ఏది నిలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. లెక్కలు వేసి చూస్తే మమత ప్రతిపాదించే ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతో కొంత కనిపిస్తుంది. ఆమె కలలు ఆమెకు ఉన్నాయి. శరద్ పవార్ ఎన్నో సంవత్సరాలుగా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ములాయంసింగ్ ప్రధాని పదవి కోసమే కొడుకుని లక్నో సింహాసనంపైన 2012లోనే కూర్చోబెట్టారు. జయలలితకి ప్రధాని కావా లనే ఆకాంక్ష బలంగా ఉండేది. అత్యున్నత పదవి తన జన్మహక్కు అని రాహుల్గాంధీ అనుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ల భాగస్వామ్యం లేకుండా, బయటి నుంచి సైతం వాటి మద్దతు లేకుండా కేవలం ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మరోసారి కేసీఆర్కి దక్కుతుంది. అటువంటి ప్రభుత్వానికి సారథి కేసీఆర్ అయినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ తెరమీదికి వస్తారనీ, ప్రభం జనం సృష్టిస్తారనీ, అట్టహాసంగా అధికారంలోకి వస్తారనీ 2013 సెప్టెంబర్ 13వ తేదీకి పూర్వం ఎవరైనా ఊహించారా? మొరార్జీ దేశాయ్, చరణ్సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ వంటి నాయకులందరూ అనూహ్యమైన పరిస్థితులలో ప్రధానులైనవారే. అటువంటప్పుడు కేసీఆర్ ఈ దేశం ముఖియా కావడం పట్ల అభ్యంతరం ఎందుకుండాలి? లక్కు ఉంటే లక్షణంగా కావచ్చు. ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నది ఫెడరల్ ఫ్రంట్ భాగస్వాముల ప్రయో జనాలపైనా, నాయకుల అహంభావంపైనా ఆధారపడి ఉంటుంది. దిల్లీ బహుత్ దూర్ హై! కె. రామచంద్రమూర్తి -
స్వయంకృతం
తాము ఏది చేసినా చెల్లుతుందనీ, ఏదైనా తాము మాత్రమే చేయగలమనే భావన స్వానురాగం ఆవహించినవారిలో బలంగా ఉంటుంది. ఎదుటివారి శక్తిని వారు పరిగణనలోకి తీసుకోరు. ఎంతటివారైనా తన శక్తియుక్తుల ముందు బలాదూరని నమ్ముతారు. ఇటువంటి మానసిక స్థితిని నార్సిసిజంగా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. ప్రస్తుత స్థితే ప్రధానం. అంతకు ముందు, ఆ తర్వాత స్థితిగతులు ముఖ్యం కాదు. ఎప్పటికీ తమదే పైచేయి కావాలి. ప్రతి పోరాటంలో తామే గెలవాలి. గెలుపు కోసం ఏమి చేసినా తప్పులేదు. వర్తమాన పరిస్థితిలో తాము చేసే ఆలోచనలే వారికి శిరోధార్యం. వాటినే బలంగా నమ్ముతారు. ఈ రోజుకు ముందు అదే విషయంపైన ఏమి అన్నారో పట్టించుకోరు. నిన్న చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఈ రోజు చెప్పి అదే సత్యమంటూ నిస్సంకోచంగా వాదిస్తారు. తమను తాము అమితంగా ప్రేమించుకుంటారు. తమ లోపాలను తాము గుర్తించడానికి నిరాకరిస్తారు. ఇతరులను అనుకరించినప్పుడు కూడా తామే ఆ పని ప్రప్రథమంగా చేస్తున్నట్టు భావిస్తారు. అటువంటి ఆలోచన తమకి తప్ప మరెవరికీ రాజాలదని అనుకుంటారు. స్వానురాగం జీర్ణించుకున్నవారు ఎవ్వరినీ విశ్వసించరు. తమ నీడను సైతం నమ్మరు. ఎవ్వరినీ ప్రేమించరు. ప్రేమించినట్టు నటిస్తారు. వారిని ఎవ్వరూ నమ్మరు. ఎవ్వరూ ప్రేమించరు. వాడుకోవడం, వదిలేయడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కోవకి చెందిన వ్యక్తి. రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తారు. అందుకే కమ్యూనిస్టులతో, బీజేపీతో విడతల వారీగా పొత్తులు పెట్టుకునే విషయంలో స్వీయప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటారు. 1994లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రచార సారథి లక్ష్మీపార్వతీ సహిత ఎన్టి రామారావు. అప్పటికే చంద్రబాబుకి పార్టీపైన పూర్తి పట్టు వచ్చింది. చాలామంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులతో మమేకమై పనిచేశారు. 1995లో ఎన్టి రామారావుని గద్దె దింపి పగ్గాలు చేతపట్టిన తర్వాత చంద్రబాబు వైఖరి మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా చెప్పుకోవడానికి ఇష్టపడేవారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంలో కమ్యూనిస్టులు సంస్కరణలకు ఆటంకమని నిందించారు. వారిని పక్కన పెట్టారు. కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ వాదించి వారిని అవమానపరిచారు. ఆ తర్వాత కమ్యూనిస్టు భావజాలానికి పూర్తి విరుద్ధమైన భావజాలం కలిగిన బీజేపీతో చెలిమికి మొగ్గు చూపించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో విజయం తర్వాత వాజపేయి ప్రాబల్యం దేశమంతటా పెరి గిందనే అంచనాతో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అఖిలపక్ష సమావేశాలకి సీపీఐ ప్రతినిధులను ఆహ్వానించేవారు కాదు. శాసనసభలో ఆ పార్టీ సభ్యులు ఎవ్వరూ లేరు కనుక పార్టీని పిలువనక్కరలేదని సమర్థించుకున్నారు. వాస్తవానికి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అవసరం లేదని అనుకుంటారు. మొత్తం ప్రజలందరికీ తానే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వేరే వ్యక్తులు ఎందుకని భావిస్తారు. మంత్రివర్గం అంటూ ఒకటి ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనుక సొంతంగా ఆలోచించలేని వారిని, విధేయులను ఎంపిక చేసి మంత్రులుగా నియమిస్తారు. అయినప్పటికీ ఐఏఎస్ అధికారులతో స్వయంగా మాట్లాడి ఏ పని చేయాలో, ఏ పని చేయరాదో చెబుతారు. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికలలో పరాజయం అనంతరం బీజేపీకి దూరంగా జరిగారు. 2009లో తిరిగి కమ్యూనిస్టు పార్టీలతో సయోధ్య కుదుర్చుకున్నారు. బీజేపీకీ, కాంగ్రెస్కూ దూరంగా ఉండాలనే విధానంతో కమ్యూనిస్టులు రాజీపడ్డారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏకి మద్దతు ఉపసంహరించుకున్న కమ్యూనిస్టులకు తాజా శత్రువు కాంగ్రెస్. టీడీపీతో తిరిగి భుజం కలపడానికి అభ్యంతరం లేకపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే ఏకైక ఎజెండా కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి సైతం మహాకూటమిలో స్థానం కల్పించారు. ఎట్లాగైనా గెలవాలనీ, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదనీ ఉద్దేశం. చిరంజీవి నాయకత్వంలోని పీఆర్పీ టీడీపీకి అవరోధంగా ఉండనే ఉన్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. పీఆర్పీ ఆశించినంతగా ఓట్లు సంపాదించలేకపోయింది. మహాకూటమి సైతం ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే చంద్రబాబు టీఆర్ఎస్కి దూరమైనారు. అవకాశవాదానికి పరాకాష్ఠ 2014 నాటికి యూపీఏ–2 అప్రతిష్ఠపాలైనదని గ్రహించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రజలను మెప్పించడం గమనించారు. కమ్యూనిస్టు సోదరులతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభదాయకం అని లెక్కకట్టారు. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీపై గెలవడం కష్టమని భావించారు. ఎందుకైనా మంచిదని సినీ హీరో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళి తనకు మద్దతుగా నిలవాలని అడిగారు. భావసామ్యం లేదు. అవకాశవాదమే నడిపించింది. మోదీ, తానూ, పవన్ కల్యాణ్ కలసి విస్తృతంగా ప్రచారం చేశారు. అడ్డూఅదుపూ లేకుండా హామీలు గుప్పిం చారు. వైఎస్ఆర్సీపీ కంటే రెండు శాతం తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు నాలుగేళ్ళూ అమరావతి నిర్మాణం పేరుతో సింగపూర్, జపాన్, ఇంగ్లండ్ వగైరా దేశాలన్నీ ప్రత్యేక విమానంలో చుట్టి వచ్చారు. మొదటి నుంచీ విదేశాల పట్ల మోజు ఎక్కువ. అమరావతిలో రాజధాని నిర్మాణం ఎక్కడ జరుగుతుందో సన్నిహితులకు రహస్యంగా సమాచారం అందించారు (ఇన్సైడర్ ట్రేడింగ్). వారు విలువైన స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతులను నయానాభయానా ఒప్పించి ముప్పయ్ వేల పైచిలుకు ఎకరాల భూమిని సేకరించారు. ప్రపంచంలోని అయిదు అద్భుత నగరాలలో అమరావతి ఒకటి కావాలన్న కలను పలవరిస్తూ పదవీ కాలంలో అయిదింట నాలుగో వంతు గడిపేశారు. పోలవరం కింద మునిగిపోయే ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని పట్టుబట్టానని తన పుట్టినరోజు ఏప్రిల్ 20న చేసిన ధర్మదీక్ష సమయంలో కూడా పునరుద్ఘాటించారు. ఇది నిజమో, కాదో నరేంద్రమోదీ మాత్రమే చెప్పగలరు. ఆయన మౌనంగా ఉంటారనే చంద్రబాబు నమ్మకం. చంద్రబాబునాయుడూ, బాలకృష్ణ గావు కేకలు పెట్టినా, తర్జని చూపుతూ హెచ్చరించినా, ఎన్డీఏ నుంచి టీ డీపీ నిష్క్రమించినా, కేంద్ర మంత్రిమండలి నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులు వైదొలిగినా మోదీ మౌనం వీడలేదు. ఈ పరిణామాలపైన అమిత్షా మాట్లాడారు కానీ మోదీ నోటి నుంచి ఇంత వరకూ ఒక్క మాటకూడా రాలేదు. ఏప్రిల్ 30న తిరుపతిలో నిరసన సభ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎందుకు? తిరుపతిలోనే ప్రత్యేకహోదాపైన మోదీ హామీ ఇచ్చారు కనుక. నాలుగేళ్ళ కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చాలా కాలం పాటు ప్రణాళికా సంఘం ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వవలసిందిగా ప్రణాళికా సంఘాన్ని మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆదేశిం చింది. ఆ ఆదేశాలను అమలు చేయాలని ఒక్కసారి కూడా చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కానీ, దాని అధ్యక్షుడు మోదీని కానీ అడగలేదు. విదేశీ పర్యటన రంధిలోనే పుణ్యకాలం గడిచి పోయింది. అంతలో నీతిఆయోగ్ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చాయి. ప్రత్యేకహోదా అనేది ఇక మీదట ఏ రాష్ట్రానికీ ఇవ్వడం సాధ్యం కాదనీ, అందుకు ఆర్థిక సంఘం అంగీకరించదనీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ 2016 సెప్టెబర్ 8వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటిస్తే అదే రాత్రి చంద్రబాబు అమరావతిలో మీడియా గోష్ఠి నిర్వహించి ప్యాకేజీని స్వాగతిం చారు. ప్యాకేజీని సమర్థిస్తూ రకరకాలుగా మాట్లాడారు. ప్యాకేజీని వ్యతిరేకిస్తే, ప్రత్యేకహోదా కావాలంటూ ఉద్యమిస్తే పీడీ యాక్టు కింద జైల్లో పెడతానంటూ హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? తన శక్తి మీద తనకు అపరిమితమైన నమ్మకం ఉండటం వల్ల. అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలైనా ఇవ్వవచ్చుననీ, ఎన్ని పనులైనా చేయవచ్చుననీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేయవచ్చుననీ, దేనినైనా అమలు పరచవచ్చుననీ, అమలు చేయకుండా ఎగవేయవచ్చుననీ విశ్వాసం. ఎన్నికలు కనుచూపు మేరలో లేవు కనుక ప్యాకేజీకి ప్రజలను బలవంతంగానైనా ఒప్పించవచ్చునని భావించారు. ప్రతిపక్షాలకి జవాబు చెప్పవలసిన అవసరాన్ని ఆయన ఎన్నడూ గుర్తించలేదు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడి స్వపక్షీయులతో చప్పట్లు కొట్టించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. బెడిసికొట్టిన ప్యాకేజీ ప్యాకేజీ కథ చంద్రబాబు ఆశించినట్టు జరగలేదు. ప్రజలు ప్రత్యేకహోదాను విస్మరించలేదు. ప్రతిపక్ష నాయకుడు యువభేరి పేరుతో సమావేశాలు నిర్వహించి యువతీయువకులకు ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరించారు. పాదయాత్రలోనూ అదే విషయాన్ని నిత్యం పునరుద్ఘాటిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కొత్త పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ రాష్ట్రానికి రాలేదు. ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాననీ, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి కింద రెండువేల రూపాయల వంతున చెల్లిస్తామనీ చేసిన ఎన్నికల వాగ్దానాలు గాలికి కొట్టుకొనిపోయాయి. పాదయాత్రలో జనసందోహం నానాటికీ పెరిగి పోతోంది. జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా గాలి వీస్తున్నదనేది స్పష్టంగా అర్థమైపోయింది. మరో వంక దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గుజరాత్ ఎన్నికలలో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన బతుకు జీవుడా అన్నది. ఉత్తరప్రదేశ్లో రెండు లోక్సభ స్థానాలను బీజేపీ కోల్పోయింది. మోదీకి జనాదరణ తగ్గిపోతోంది. ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్ కోలుకుంటోంది. 2019నాటి ఎన్నికలలో ప్రజలకు చూపించేందుకు తన ప్రభుత్వం సాధించిన విజయం ఒక్కటీ లేదు. ప్రత్యేక విమానంలో పర్యటనలు జరుపుతుండగానే నాలుగేళ్ళూ గడిచిపోయాయి. అమరావతి నగర నిర్మాణంలో ఒక్క ఇటుకను కూడా పేర్చలేదు. పోలవరం పేచీ పరి ష్కారం కాలేదు. రైల్వేజోన్ లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు. దిక్కు తోచలేదు. ఇంతలో ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ అధికారి జైన్ వచ్చి గంటన్నర సేపు మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం తనపైన కేసులు పెడుతుందనే భయం వెంటాడుతున్నట్టు దీక్ష చివరలో చేసిన ప్రసంగం స్పష్టం చేస్తున్నది. ఈ సంగతి చంద్రబాబునాయుడికి చాలా కాలంగా అనుమానం ఉన్నది. అందుకే వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసినా టీడీపీ ఎంపీల చేత రాజీ నామా చేయించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నట్టు కనిపించినా కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని చిదంబరం, గులాంనబీ ఆజాద్తో సంబంధాలు పెట్టుకున్నట్టే బీజేపీ అగ్రనాయకులు కొందరితో సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందుకే మహారాష్ట్ర ఆర్థికమంత్రి సతీమణికి తిరుమల తిరుపతి దేవస్థానం మండలిలో సభ్యత్వం ఇచ్చారు. స్వామికార్యం, స్వకార్యం కోసం మాజీ మంత్రి సుజనా చౌదరికి బీజేపీ నాయకులతో సంబంధాలు పెట్టుకోక తప్పదు. ఇటువంటి గందరగోళం కారణంగా చంద్రబాబు ఒక మాట మీద నిలబడలేకపోవడం, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోవడం కనిపిస్తున్నది. లోపల పీడిస్తున్న భయాందోళనలను కప్పిపుచ్చుకోవడానికే గట్టిగా, సుదీర్ఘంగా గంటల తరబడి మాట్లాడటం. అంతా స్వయంకృతం. ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. హెచ్చులకు పోయి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. కె. రామచంద్రమూర్తి -
కాళేశ్వర స్వప్న సాకారం
ఒక బృహత్తరమైన ప్రాజెక్టును స్వప్నించి, సకల అనుమతులూ సాధించి, కోర్టు కేసులను అధిగమించి, పొరుగు రాష్ట్రంతో వివాదం పరిష్కరించుకొని, నిధులు సమకూర్చుకొని, నిర్మాణం పూర్తి చేసి, సాగునీరూ, తాగునీరూ అందించడం అనే మహాయజ్ఞాన్ని అయిదేళ్ళ వ్యవధిలో పూర్తి చేయడం దేశంలో ఎక్కడా ఇంతవరకూ జరగలేదు. నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్కు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి పుష్కరకాలం పట్టింది. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలి ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. నర్మదానదిపైన సర్దార్ సరోవర్ డామ్కు నెహ్రూ 1961 ఏప్రిల్ 5న శంకుస్థాపన చేస్తే 55 సంవత్సరాల అనంతరం డామ్ను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భాక్రా–నంగల్ డామ్ నిర్మాణం తొమ్మిదేళ్ళలో పూర్తయింది. దానికి శంకుస్థాపన (1955), ప్రారంభోత్సవం (1963) కూడా నెహ్రూ చేతుల మీదుగా జరగడం విశేషం. జవహర్లాల్ నెహ్రూ దేశానికి మేలు చేయలేదనీ, తీరని అపకారం చేశారనీ వాదించే కొందరు వర్తమాన రాజకీయ నాయకులు చరిత్ర తెలుసుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్రకు ఎక్కనున్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007–08లో నిర్మాణం ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి పథకానికి అధిగమించలేని అడ్డంకులు కొన్ని ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యం తమ్మిడిహట్టి (పెన్గంగ, వార్థా నదుల సంగమ ప్రదేశం) వద్ద 152 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో బ్యారేజి నిర్మించి 160 టీఎంసీల ప్రాణహిత నీటిని ఎల్లంపల్లి బ్యారేజికి తరలించడం. అక్కడి నుంచి మిడ్మానేరు, తడ్కపల్లి, పాములపర్తి, చేవెళ్లకు నీరు చేరవేయడం. ఈ ప్రాజెక్టు కింద 16. 40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుందని అంచనా. తమ భూభాగంలో ముంపును అనుమతించబోమంటూ సరిహద్దులోని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రివర్ లెవల్)ని 148 మీటర్లకు తగ్గించాలని ఉడుంపట్టు పట్టింది. ప్రాణహిత ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యంపైన కేంద్ర జలసంఘం అనుమానాలు వెలిబుచ్చింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం ఎగువ ప్రాజెక్టుల అవసరాలకు పోను తమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద 273.14 టిఎంసీల నీరు లభ్యం అవుతుంది. కానీ జలసంఘం లెక్కల ప్రకారం అక్కడ లభ్యమయ్యే నీటి పరిమాణం 165 టీఎంసీలకు మించదు. ఇందులో 63 టీఎంసీలు ఎగువ ప్రాజెక్టులు వాడుకుంటున్నాయని జలసంఘమే చెప్పింది. అందువల్ల తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం గురించి పునరాలోచించాలని సూచించింది. శాస్త్రీయంగా అధ్యయనం చేసి, సర్వేలు జరిపిన తర్వాత కాళేశ్వరం దిగువన మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ఉత్తమం అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ 283 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. అందువల్ల ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టును సమూలంగా మార్చవలసి (రీడిజైనింగ్ చేయవలసి) వచ్చింది. రీడిజైనింగ్ ఆవశ్యకత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండుగా విభజించింది. ఒకటి, బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు. తమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద ప్రాజెక్టు నిర్మించి 20 టీఎంసీల నీరు తరలించి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. రెండు, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో ఒక బ్యారేజీ నిర్మించడం, దానికి ఎగువన అన్నారం, సుందిళ్ళ గ్రామాల వద్ద రెండు బ్యారేజీలు నిర్మించడం, 180 టీఎంసీల నీరు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయడం కొత్త ప్రణాళిక. 13 కొత్త జిల్లాలలోని 18. 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన జలాశయాలూ, టన్నళ్ళూ, పంప్హౌజ్లూ, కాలువలూ గట్రా నిర్మించాలి. ఇంత భారీ ప్రాజెక్టును నెత్తికెత్తుకోవడం ఒక సాహసం. అత్యంత క్లిష్టమైన ఈ ప్రాజెక్టు అన్ని అవరోధాలనూ దాటుకుంటూ వచ్చింది. పనులు వేగంగా, సమర్థంగా జరుగుతున్నాయి. నీటి పారుదల మంత్రి హరీష్రావు పరుగెడుతూ, నిర్మాణ సంస్థలనూ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ పరుగెత్తిస్తున్నారు. పనులను పర్యవేక్షించేందుకు ఇంతవరకూ 20 విడతల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను మంత్రి సందర్శించారు. ప్రాజెక్టు రూపశిల్పి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్). శంకుస్థాపన చేయడం, ఇటీవల గవర్నర్ నరసింహ న్తో కలసి ప్రాజెక్టును సందర్శించడంతో పాటు కేసీఆర్ పనుల పురోగతిని వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికీ, తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కీ ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన మూడు ఘనకార్యాలు. 2019 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మునుపే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలని ప్రయత్నం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మంజూ రుకు అనుసరించవలసిన విధివిధానాలను రూపొందించే కమిటీకి నాయకత్వం వహించే అవకాశం నాకు ప్రభుత్వం కల్పించింది. కమిటీ నాలుగు విడతల సమాలోచన జరిపి తయారుచేసిన నివేదికను సమర్పించేందుకు బాధ్యులమంతా కేసీఆర్ దగ్గరికి వెళ్ళాం. నివేదికను స్వీకరించి, వివరాలు టూకీగా తెలుసుకున్న అనంతరం హాలులో రెండు పాయలుగా కుర్చీలు వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మమ్మల్ని కూర్చోమన్నారు. ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్ (పునఃరూపకల్పన) ఏ విధంగా చేసిందీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్వయంగా చేస్తూ వివరించారు. తర్వాత అసెంబ్లీలోనూ కాళేశ్వరం రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయో, ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి పథకాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందో చెప్పారు. అసెంబ్లీలో జరిగిన చర్చను ఆలకించాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులపైన ‘స్టే’ ఇవ్వడం గమనించాం. ప్రభుత్వం భూసేకరణ విషయంలో 2013 నాటి చట్టాన్ని విధిగా పాటించాలంటూ కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ షరతు విధించిందని తెలుసుకున్నాం. ఈ చట్టాన్ని పూర్వపక్షం చేస్తూ 2015లో ప్రభుత్వం 123 వ నంబరు జీవో జారీ చేసింది. దాన్ని హైకోర్టు నిరుడు కొట్టివేసింది. వెంటనే కొత్త భూసేకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. గ్రీన్ ట్రిబ్యూనల్ ‘స్టే’ని ఉమ్మడి హైకోర్టు ఎత్తివేసింది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అంతకు మునుపే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కేంద్ర జలసంఘానికి రాసిన లేఖలో పెక్కు అభ్యంతరాలను లేవనెత్తింది. ఎంత విస్తీర్ణానికి సాగునీరు అందుతుందనే విషయంలోనూ, ఎంత నీరు మళ్ళిస్తారనే అంశంలోనూ, ఎంత ప్రాంతం ముంపునకు గురి అవుతుందనే వివరాలలోనూ, అంత భారీ స్థాయిలో నీటిని పంపు చేయడానికి అవసరమైన విద్యుచ్ఛక్తి తెలంగాణలో ఉన్నదా అనే ప్రశ్నపైనా గోదావరి బోర్డు అనుమానాలు వెలిబుచ్చింది. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు భారీ ప్రాజెక్టులను వ్యతిరేకించేవారూ, భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తికరమైన పరిహారం ఇవ్వాలని వాదించేవారూ, పర్యావరణానికి హాని కలగరాదంటూ పోరాడేవారూ, అటవీప్రాంత విస్తీర్ణం తగ్గకూడదని పట్టుపట్టేవారూ అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టే తెలంగాణలోనూ ఉన్నారు. వారు ప్రజాకంటకులూ, ప్రగతి నిరోధకులూ కారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పౌరులందరికీ ప్రశ్నించే హక్కు ప్రసాదించింది. తమ తరఫున పోరాడేవారు ఉన్నారనే ఎరుకే ప్రజలకు ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం పెంచుతుంది. సర్దార్ సరోవర్ నిర్వాసితుల తరఫున మేధాపాట్కర్ అనేక సంవత్సరాలు పోరాటం చేసినప్పటికీ ఆమెను ప్రజావ్యతిరేకిగా ఎవ్వరూ అభివర్ణించడం లేదు. అటువంటివారికీ, కేంద్ర సంస్థలకీ, న్యాయస్థానాలకీ నచ్చజెప్పి నెగ్గుకు రావడం పాలకుల బాధ్యత. ప్రగతి ఫలాలు ప్రజలకు అందివచ్చినప్పుడు నిర్మాణ క్రమంలో ఎదురైన వివాదాలను విస్మరిస్తాం. తెలంగాణ ప్రభుత్వం చాలా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించింది. కేసీఆర్ ముంబయ్ వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో చర్చించి, ఆయన భయసందేహాలను తీర్చి, ఉభయతారకంగా పరి ష్కారం ప్రతిపాదించి, ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతింపజేశారు. వివిధ జాతీయ సంస్థల నుంచి అనుమతులు సంపాదించారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులు ఎట్లా జరుగుతున్నాయనే విషయంలో నాబోటివారికి అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రగతిని చూసిరావాలని అనుకుంటూనే నెలలు గడిచిపోయాయి. మసూద్ పర్యటన ‘కేంద్ర జలసంఘం (సెంట్రల్ వాటర్ కమిషన్) అధ్యక్షుడూ, నేనూ హెలికాప్టర్లో కాళేశ్వరం వెడుతున్నాం. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి రావచ్చు. మాతో మీరూ వస్తే బాగుంటుంది,’ అని హరీష్ పిలిచారు. వారితో కలసి సోమవారంనాడు (ఏప్రిల్ 9) నేనూ, బుద్ధవనం ప్రాజెక్టు సారథి మల్లెపల్లి లక్ష్మయ్య వెళ్ళాం. కేంద్ర జలసంఘం అధ్యక్షుడు మసూద్ హుస్సేన్, మరి ఇద్దరు కేంద్ర అధికారులూ, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధరరావు, చీఫ్ ఇంజ నీర్ హరేరామ్ అధికార బృందంలో ఉన్నారు. హెలికాప్టర్ ఎక్కడానికి ముందు, ఎక్కిన తర్వాత మసూద్ హుస్సేన్ మనసులో ఏమున్నదో తెలియదు. ఏమి చూడబోతున్నారో ఊహించి ఉండరు. కేంద్ర జలసంఘం అధికారులకు ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం ప్రోత్సాహకరంగా లేదు. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించగలదా అనే సందేహం ఢిల్లీలో చాలామందికి ఉంది. మొదటి మజిలీ మేడిగడ్డలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ చకచకా జరుగుతున్న పనులు గమనిస్తుంటే ఆయనకు అడుగడుగునా విస్మయం. అనంతరం అన్నారంలో అద్భుతాలు చూసి ఆనందం. మూడో అడుగు ఎల్లంపల్లిలో. అన్నారం, ఎల్లంపల్లిలో టన్నెళ్ళ, పంపుహౌస్ల చూసి పరవశం. చివరగా భూగర్భంలో సబ్స్టేషన్ నిర్మాణం తిలకించిన తర్వాత పులకింత. మసూద్ హుస్సేన్ వంటి అనుభవజ్ఞుడైన ఇంజనీర్ పర్యటన ముగింపు దశలో రామడుగు (కరీంనగర్ జిల్లా)లో మీడియా ప్రతినిధులను కలుసుకునే సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమానాలూ నివృత్తి చేసుకొని నిర్వాహకులను మనసారా అభినందించడానికి సిద్ధమైపోయారు. మీడియా గోష్ఠిలో తెలంగాణ సర్కార్నూ, హరీష్రావునూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి ప్రాజెక్టును ఇంతకు మునుపు ఆయన ఎక్కడా చూడలేదు. ఇంత వేగంగా దేశంలో మరెక్కడా పని జరగడంలేదు. ఇంత జటిలమైన ప్రాజెక్టు, ఇంత ఎత్తుకు (మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకూ సుమారు 520 మీటర్లు ఎత్తు) నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. వివాదాలూ, అభ్యంతరాలూ, వ్యాజ్యాలూ ఒక వైపు సాగుతుంటే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం పని ఆగకుండా రహస్యోద్యమంలాగా కొనసాగింది. కలసి వచ్చిన అంశం ఏమంటే భారీ నిర్మాణాల అనుభవం కలిగిన ఎల్ అండ్ టి, నవయుగ, మెఘా, ఆఫ్కాన్స్,హెచ్ఇఎస్, సీమన్స్ వంటి కంపెనీలు కాలంతో పరుగులు తీస్తూ పనులు పూర్తి చేస్తున్నాయి. బీహెచ్ఇఎల్ పూర్తి స్థాయిలో పాలు పంచుకుంటున్నది. తెలంగాణ ఉద్యమానికి మూలకారణమైన మూడు అంశాలు నీరు, నిధులు, నియామకాలు. సాగునీటి సమస్య పరి ష్కారానికి ఈ ప్రాజెక్టు నిశ్చయంగా దోహదం చేస్తుంది. కె. రామచంద్రమూర్తి -
నిజాలు నిగ్గు తేలాలి!
త్రికాలమ్ ‘చంద్రబాబునాయుడు 29 విడతలు ఢిల్లీ వచ్చినట్టు పదేపదే చెబుతున్నారు. ఒక్క పని కూడా కాలేదంటున్నారు. నిజమే. కానీ ఆయన వచ్చిన ప్రతిసారీ మూడే మూడు విషయాలు అడిగేవారు. ఒకటి, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్రెడ్డిపైన ఉన్న కేసుల విచారణ వేగం పెంచి, దోషిగా నిర్ధారించి జైలుకు పంపాలి. రెండు, శాసనసభ స్థానాల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు సత్వరం తీసుకోండి. మూడు, పోలవరం ప్రాజెక్టుకు తాను అడుగుతున్న నిధులన్నీ ఒక్క విడతలోనే ఇచ్చేయాలి. అంతే కానీ, ప్రత్యేకహోదా గురించి ఆయన ప్రస్తావించనేలేదు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనకు ఆయన ఆనందంగా అంగీకరించారు. పైగా రాష్ట్రానికి గొప్ప మేలు చేశానంటూ చెప్పుకున్నారు కూడా. అటువంటి వ్యక్తి మంత్రులను ఉపసంహ రించుకోవడం, మన ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ నోటీసు ఇవ్వడం విడ్డూరం.’ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల సమా వేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఈ మాటలు అన్నారని సమావేశంలో పాల్గొన్న ఒక నాయకుడు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబునాయుడు చాలా సమర్థవంతంగా ‘మార్కెటింగ్’ చేశారని (ప్రజలు ఒప్పుకునే విధంగా వివరించారని) బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని రాష్ట్రాల నాయకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఎన్డీఏ కావచ్చు. యూపీఏ కావచ్చు. కేంద్ర ప్రభుత్వం కోసం పని చేసే నిఘా విభాగం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యక్రమాలపైన కూడా కేంద్రానికి అవగాహన ఉంటుంది. ప్యాకేజీతో చంద్రబాబునాయుడు సరిపుచ్చుకున్నారనే మొన్నటి వరకూ ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దల అభిప్రాయం. అందుకే ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్డీఏ సర్కార్ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ టిక్కెట్టుపైన గెలిచిన ముగ్గురు లోక్సభ సభ్యులు పార్టీ ఫిరాయించారు. వారిపైన అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్సీపీ లోక్సభ స్పీకర్కు పిటిషన్ ఇచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకూ ఆ పిటిషన్పైన స్పీకర్ చర్య తీసుకోలేదు. ఓటుకు కోట్ల కేసు వివరాలు ప్రధాని నరేంద్రమోదీకీ, అమిత్షాకీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కొందరు అప్పుడే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 23 మంది శాసన సభ్యులను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయింపజేసిన వైనం సైతం కేంద్ర నాయకత్వానికి తెలుసు. చీటికీమాటీకీ ప్రత్యేక విమానంలో విదేశాలకు చంద్రబాబునాయుడు వెళ్ళిరావడం కూడా కేంద్రం దృష్టిలో ఉంది. పోలవరం పనులలో అక్రమాలూ, అవినీతీ జరుగుతున్న సమాచారం కేంద్ర మంత్రులకు తెలుసు. మసూద్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, రాజకీయ, నైతిక విలువలకు పాతరేసినా ముఖ్య మంత్రిని కేంద్రం ఒక్క మాట అనలేదు. నిజానికి అది ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం. దాన్ని ‘మిత్రధర్మం’ అని పిలవడం ఆత్మవంచన, పరవంచన. మిత్రులు కలసి ప్రజలకు మేలు చేయాలి కానీ ద్రోహం చేయకూడదు. ‘కేవలం రాజకీయ కారణాల వల్ల మీరు ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు కానీ రాష్ట్ర అభివృద్ధికోసం మాత్రం కాదు,’ అంటూ అమిత్ షా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో నిష్టురమాడారు. అమిత్ షా లేఖ కలకలం సృష్టించింది. లేఖాంశాలు బట్టబయలు కాగానే చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్ స్పందించారు. అమిత్ షాకి రాష్ట్రానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం లేదంటూ ధ్వజమెత్తారు. మధ్యాహ్నం రెండున్నరకు శాసనసభలో చంద్రబాబునాయుడు ఉపన్యాసం ప్రారంభించి సుదీర్ఘంగా రెండున్నర గంటలు సాగించారు. అమిత్షాను ఏకిపారేశారు. మర్యాద, మన్నన లేకుండా లేఖ రాశారంటూ తప్పుపట్టారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు అసత్యాలు చెప్పరాదంటూ ప్రబోధించారు. ఎందుకోసం ఎదురుదాడి? ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్జైట్లీ ఎన్డీఏ చివరి బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో సమర్పించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు అన్యా యం జరిగిపోతోందంటూ చంద్రబాబునాయుడు హడావుడి చేయడం వెనుక ఒక గుర్తింపు ఉన్నది. ఒక పథకం ఉన్నది. తాను ఊహించని విధంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకున్నది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి, వామపక్ష నాయకులూ, మేధావి వర్గాలూ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగ ణించాయి. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం తెలుగువారిని అవమానించడమే అన్న అభిప్రాయం జనసామాన్యంలో బలపడింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యేకహోదా ప్రధానమైన నిర్ణాయకాంశం అవుతుందనే భయం పట్టుకుంది. కేంద్రంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) సర్కార్, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం (టీడీపీ) ప్రభుత్వం కలసి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఆంధ్రు లకు ద్రోహం చేశాయనే వాస్తవం ప్రజలకు అర్థమైపోయింది. వారిలో ఆవేశం, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి. తాను రూటు మార్చకపోతే వచ్చే ఎన్నికలలో దారుణంగా దెబ్బతినడం ఖాయమని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు చేయడంలోనూ, ప్రత్యేకహోదా సాధించడంలోనూ తాను విఫలమైన సంగతి గమనించారు. ఈ వైఫల్యాలు తనను వెంటాడి ఎన్నికలలో ఓడిస్తాయని గ్రహించారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం రచించారు. తన వైఫల్యాలన్నింటికీ ఎన్డీఏ ప్రభుత్వ సహాయ నిరాకరణ ధోరణి కారణమనే ఒక అభిప్రాయాన్ని సానుకూల మీడియా ద్వారా, అసెంబ్లీలో తన సుదీర్ఘ ప్రసంగాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రబలంగా నిర్మించాలని నిర్ణయించారు. తనపైనా, తనయుడిపైనా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడం కోసం విచారణ సంస్థలను పురమాయించకముందే ఎదురుదాడికి దిగడం శ్రేయస్కరమని చంద్రబాబునాయుడు భావించి ఉంటారు. ఇప్పుడు కేసులు పెడితే ఎదురు తిరిగారు కనుక కేసులు బనాయించారని ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతి సంపా దించవచ్చు, ఎన్నికలలో గట్టెక్కవచ్చు. కేసులు పెట్టిన తర్వాత ఎదురు తిరిగితే కేసు పెట్టారు కనుక ఎదురు తిరిగారని ప్రజలు అనుకుంటారు. అప్పుడు చంద్రబాబునాయుడికి సానుభూతి రాదు. అందుకని సమయజ్ఞత పాటించి చంద్రబాబునాయుడు కేంద్రంపైన దాడి ప్రారంభించారు. కానీ మోదీ నైజం తెలిసిన ఢిల్లీ పెద్దలు చంద్రబాబునాయుడికి హితవు చెబుతూనే ఉన్నారు. మోదీతో పెట్టుకుంటే కష్టమంటూ హెచ్చరించారు. పైకి గంభీరంగా తర్జని చూపిస్తూ గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ లోలోన భయం పీడిస్తూనే ఉంది. అందుకే తడబాటు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని అరుణ్ జైట్లీ దగ్గరికి పంపించింది ఈ కారణంగానే. అటు తానే, ఇటు తానే చంద్రబాబునాయుడికి ఒక అరుదైన లక్షణం ఉన్నది. తన ప్రత్యర్థులతో ప్రతి రోజూ పోల్చుకుంటారు. ప్రతి రోజూ ప్రత్యర్థిపైన ఆధిక్యం సాధించాలని తపి స్తుంటారు. అధికారంలో ఉంటూనే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషిం చాలని ప్రయత్నిస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడుతున్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఏమి మాట్లాడారో ఆయనకు గుర్తు ఉండదు. ముఖ్య మంత్రి హోదాలో మట్లాడే సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏమన్నారో మరచిపోతారు. ఉదాహరణకు ప్యాకేజీని పొగిడిన సంగతి ప్రత్యేక హోదా అడిగే సమయంలో గుర్తు ఉండదు. నాలుగేళ్ళ తర్వాత హోదా కోసం అడగడం ప్రారంభించినప్పటికీ నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాడుతున్నట్టు ప్రజలను నమ్మించాలని ప్రయత్నం. నాలుగేళ్ళుగా నిజంగా పోరాడుతున్న పార్టీ లనూ, నాయకులనూ పూర్వపక్షం చేసి తానే అగ్రగామినంటూ చాటుకోవాలన్న ఆరాటం. ఏ పాత్ర పోషించే సమయంలో ఆ పాత్రలో లీనమైపోతారు. ఆ పాత్రను పండించడానికి శతవిధాలా కృషి చేస్తారు. ప్యాకేజీని సమర్థిస్తూ ఎంత సమర్థంగా వాదించగలరో, ప్యాకేజీని వ్యతిరేకిస్తూ అంతే బలంగా వాదన విని పించగలరు. ఇటువంటి వ్యక్తులకు సత్యాసత్య విచక్షణ కానీ ధర్మాధర్మ వివేచన కానీ ఉండవు. తమ వాదనను గెలిపించుకోవడానికీ, తమ ప్రయోజనం నెర వేర్చుకోవడానికీ ఏది అవసరమో అదే చెబుతారు. తాము చెప్పిందే సత్యం. తమపైన దాడి చేస్తే యావదాంధ్రులపైనా దాడి చేసినట్టే. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పింది కనుకనే కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయిందనీ మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా గురించి మాట్లాడనే లేదని, సంఘంలో సభ్యుడిగా పని చేసిన వ్యక్తి ఈ విషయం స్పష్టంగా చెప్పారనీ ఇప్పుడు వాదిస్తున్నారు. గత మూడేళ్ళుగా ప్రతిపక్ష నాయ కుడు జగన్మోహన్రెడ్డి, వామపక్ష నాయకులూ, మేధావులూ, నాబోటి పాత్రి కేయులూ చెబుతూ వస్తున్నది అదే. ఆర్థికసంఘం అధ్యక్షుడు వై. వేణు గోపాలరెడ్డి స్వయంగా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో, మంథన్ వేదికపైనా ఆ విషయం స్పష్టం చేశారని కూడా చెప్పాం. ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజీత్సేన్ లిఖితపూర్వకంగా ఈ విషయం నిర్ధారించారని కూడా తెలియ జేశాం. అప్పుడు మా మాట వినిపించుకోకుండా అడ్డంగా దబాయిస్తూ, ప్రత్యేకహోదా సంజీవిని కాదని బుకాయిస్తూ, ఇప్పుడు అదే వాదన మనకు వినిపించడం అదరగండం కాకపోతే ఏమిటి? ప్రత్యేకహోదా కలిగిన 11 రాష్ట్రాలకూ జీఎస్టీ నుంచి మినహాయింపులను 2027 వరకూ పొడిగిస్తూ కేంద్రమంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది 2017 ఆగస్టులో. ఈ నిర్ణయాన్ని సిఫార్సు చేసిన జీఎస్టీ మండలిలో ప్రతి రాష్ట్ర అర్థిక మంత్రికీ సభ్యత్వం ఉంది. ఈ అంశంపైన చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు సభలో ఉన్నారు. ఈ నిర్ణయం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ముఖ్యమంత్రికి ఈ విషయం అప్పుడే చెప్పి ఉంటారు. 2017 ఆగస్టు నుంచి 2018 ఫిబ్రవరి వరకూ ఈ సంగతి ముఖ్యమంత్రి ప్రస్తావించనేలేదు. 2018 జనవరి 12న మోదీని కలుసుకున్నప్పుడు సైతం ఈ అంశం గురించి చంద్రబాబునాయుడు మాట్లాడలేదు. ఇప్పుడు అదే అంశంపైన కేంద్రాన్ని నిలదీస్తున్నట్టు స్వరం పెంచి మాట్లాడుతున్నారు. నాటకీయతకేమీ కొదవ లేదు. సుదీర్ఘ ప్రసంగాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసం గానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపైన చర్చకు సమాధానం ఇస్తూ మార్చి 7న చంద్రబాబునాయుడు రెండు గంటల సేపు మాట్లాడారు. అప్పటి నుంచి దాదాపు ప్రతి రోజూ సగటున రెండు గంటల సేపు మాట్లాడుతూనే ఉన్నారు. శనివారంనాడు అమిత్షా లేఖను ఆసాంతం చదివి వినిపిస్తూ ప్రతి వాక్యాన్నీ ఖండించారు. లేఖలో పేర్కొన్న వాస్తవాలని సైతం అంగీకరించకుండా దాడి చేశారు. ఆ లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాకుండా ఆంధ్రులందరినీ అవమానించిందనీ, చులకన చేసిందనీ ఇటీవల సంభవించిన పరిణామాలను ఉటంకిస్తూ విమర్శించారు. ఈ ఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర గంద రగోళంలో పడవేశాయి. చంద్రబాబునాయుడి ప్రభుత్వంపైన బీజేపీ నాయకుడు వీర్రాజు చేసిన ఆరోపణలూ, లోకేశ్పైన పవన్కల్యాణ్ చేసిన అవినీతి ఆరో పణలూ, ‘ఆపరేషన్ ద్రవిడ’లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ‘ఆపరేషన్ గరుడ’ను బీజేపీ అమలు చేయబోతున్నదంటూ నటుడు శివాజీ టీవీ చానళ్ళలో చేస్తున్న హడావిడి ప్రజలను తికమకపెడుతున్నాయి. ఎవరి వెనుక ఎవరు ఉన్నారో, ఎవరి బంటు ఎవరో, ఎవరి ఎజెండా ఏమిటో తెలియక ప్రజలు అయో మయంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోపణాస్త్రాలు అన్ని వైపుల నుంచీ దూసుకొని వస్తున్న వాతావరణంలో ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక, పరిపాలన పైనా, అభివృద్ధిపైనా పాలకులు దృష్టి కేంద్రీకరించలేని అస్తవ్యస్త పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రకరకాలుగా వేలకోట్ల రూపాయల కైంక ర్యం జరిగిందనే ఆరోపణలన్నిటిపైనా విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చడం అందరికీ మంచిది. - కె. రామచంద్రమూర్తి -
చక్రబంధంలో చంద్రబాబు
త్రికాలమ్ నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) నుంచి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అత్యంత లాఘవంగా వైదొలిగిన తీరు బీజేపీ అగ్రనేతలకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. తెలుగువారికి, ముఖ్యంగా నారా చంద్రబాబునాయుడి రాజకీయాలను నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నవారికి, ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. రాజకీయాలలో విజయాలు సాధించేందుకే నాయకులందరూ శ్రమిస్తారు. పోటీ రాజకీయంలో, అదను చూసి ప్రత్యర్థిని దెబ్బ తీయడంలో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలూ, వ్యూహాలూ, నిర్ణయాలూ మార్చుకొని వేగంగా పావులు కదపడంలో ఆరితేరినవారు కొందరే ఉంటారు. వారిలో అగ్రగణ్యుడు చంద్రబాబు. అవకాశవాదం, తెగింపు, స్వోత్కర్ష, అసత్యాలను పదేపదే వల్లించడం, తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకొని విజయం సాధిం చడం టీడీపీ అధినేతలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు. ఈ క్రీడలో రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ స్థానం లేదు. నలభై ఏళ్ళ కిందట కాంగ్రెస్ (ఐ) టిక్కెట్టు ఇప్పించిన రాజగోపాలనాయుడూ, అమరనాథరెడ్డి దగ్గరి నుంచీ, పిల్లనిచ్చిన ఎన్టి రామారావు, అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించడానికి తోడ్పడిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 1999లో కార్గిల్ యుద్ధానంతర సానుకూల పవనాల ఫలితంగా ఎన్నికలలో గెలిచేందుకు సహకరించిన అటల్ బిహారీ వాజ్పేయి–లాల్కృష్ణ అడ్వాణీ ద్వయం, 2014లో టీడీపీ విజయానికి స్వీయ ప్రాబల్యంతో సాయపడిన నరేంద్ర మోదీ అందరూ చంద్రబాబు దృష్టిలో తిరస్కృతులే. అవసరం ఉన్నం తవరకూ ఉపయోగించుకున్నారు. అక్కర తీరిన తర్వాత తెగతెంపులు చేసుకున్నారు. ఇందులో సెంటిమెంటుకు తావు లేదు. అవకాశవాద రాజకీయాలలో ఇది అనివార్యం. నిష్కర్షగా ఉండాలి. గెలుపు కోసం ఏమి చేయడం అవసరమో అదే చేయాలి. చంద్రబాబులో కనిపిస్తున్న కొన్ని లక్షణాలు నరేంద్ర మోదీలో సైతం కనిపిస్తాయి. మార్గం కంటే లక్ష్య సాధన ప్రధానం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రత్యేక హోదా ప్రభంజనం వీస్తోంది. ఈ పెనుగాలులను సృష్టించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రత్యేక హోదా కావాలంటూ జగన్మోహన్రెడ్డి నిరసన ప్రకటించినప్పుడూ, నిరశన దీక్ష చేపట్టినప్పుడు, యువభేరి సమావేశాలలో ప్రసంగాలు చేసినప్పుడూ, పాదయాత్రలో జరిగిన సభలకు హాజరైన జనసందోహాలను ఉద్దేశించి ఉపన్యసించినప్పుడూ ప్రజలలో చైతన్యం రగిలింది. జగన్మోహన్రెడ్డి, వామపక్ష నాయకులూ, ఉద్యమసంస్థల నేతలూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న సమయంలో చంద్రబాబు మోదీ భజన చేస్తున్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటూ ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆకాశానికి ఎత్తి పొగడ్తల్లో ముంచెత్తారు. దాన్ని సుసాధ్యం చేసిన నాటి కేంద్రమంత్రి, నేటి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడికి సన్మానం చేశారు. తాను ఏమి చేసినా ప్రజలను ఒప్పించగలననే ఆత్మవిశ్వాసంతో బాబు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. మీడియా, సామాజిక శక్తులూ, పార్టీ సహచరులూ, కార్యకర్తల ప్రచారం ద్వారా ప్రజలను నమ్మించే శక్తియుక్తులు (మార్కెటింగ్ స్కిల్స్) తనకు దండిగా ఉన్నాయని ఆయన 1995 ఆగస్టులోనే నిరూపించారు. అయితే, రాజకీయాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు. అన్ని శక్తులూ అన్ని వేళలా పనిచేయవు. ప్రత్యర్థులు మారుతుంటారు. వ్యూహాలు మారుతుంటాయి. క్షేత్ర వాస్తవికతను చప్పున గ్రహించి అందుకు తగిన చర్యలు వేగంగా తీసుకునే శక్తి వయసు పెరిగిన కొద్దీ ఎంతోకొంత మందగిస్తుంది. ఎన్టిఆర్ను గద్దె దించి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకీ, ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు పనిచేసిన వ్యక్తికీ తేడా ఉంది. 34 ఏళ్ళ క్రితం టీడీపీ శాసనసభ్యుల శిబిరాలు నిర్వహించి నాదెండ్ల భాస్కరరావు ఆట కట్టించిన బాబుకూ, 23 సంవత్సరాల కిందట అత్యంత ఉత్కంఠ భరితమైన రాజకీయ విన్యాసాలతో ఎన్టిఆర్ను పదవీచ్యుతుడిని చేసిన గుండెలు తీసిన బంటుకీ, 2014 నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికీ అంతరం ఉంది. కడచిన ఆరుమాసాలుగా బాబు వ్యవహరి స్తున్న తీరు ఆయనను ఎరిగిన అనేకమందికి విస్తుకొల్పుతున్నది. ఇదివరకటి వేగం లేదు. ఏకాగ్ర చిత్తం లేదు. సమయస్ఫూర్తి లేదు. కుశాగ్రబుద్ధి లేదు. రణకౌశలం లేదు. విల్లు సంధించే సమయంలో చేయి వణుకుతోంది. బాణం గురి తప్పుతోంది. ఏమున్నది గర్వకారణం? అయిదేళ్ళలో సాధించిన ఘనకార్యాలను చూపి మరో అయిదేళ్ళు తన పార్టీని ఎన్నుకోమని ప్రజలను కోరాలని అందరి కంటే ఎక్కువగా బాబుకు తెలుసు. కానీ గత నాలుగేళ్ళలో సాధించింది ఒక్కటీ లేదు. రాజధాని నిర్మాణం ఇంకా డిజైన్ల దశ దాటలేదు. పోలవరం స్వప్న సాకారం కాలేదు. రైల్వే జోన్ దరిదాపులలో లేదు. కడపలో స్టీలు ఫ్యాక్టరీ లేదు. పట్టిసీమ వంటి వ్యర్థమైన ప్రాజెక్టులూ, తాత్కాలిక శాసనసభా ప్రాంగణం, సచివాలయం మినహా ఏమున్నది? ప్రత్యేక విమానంలో ఎన్ని దేశాలు పర్యటించి వచ్చినా, ఎన్ని సదస్సులు నిర్వహించినా, ఎంత హడావిడి చేసినా ఏమిటి ప్రయోజనం? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమైనాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నది ముఖ్యం. మన అభివృద్ధి రేటు 12 శాతం అని ఊదరకొట్టినా, వ్యాపారం చేయడంలో సౌలభ్యం కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నదంటూ పదేపదే చెప్పుకున్నా, ఇతరులతో చెప్పించినా ప్రజలకు అర్థం కాదు. స్వానుభవం మాత్రమే వారికి అర్థం అవుతుంది. తనకంటే సీనియర్లు కరుణానిధీ, అడ్వాణీ, ములా యం వంటి నేతలు అనేక మంది ఉన్నారని ఎన్నిసార్లు చెప్పినా తానే సీనియర్ని అంటూ పదేపదే చెప్పుకోవడం వల్ల అబద్ధం నిజం అవుతుందా? తాము చదివినదానికీ, చూసినదానికీ తమ అనుభవానికీ మధ్య సామీప్యం ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. కేవలం మీడియా ప్రోత్సాహం సరిపోదనీ, ప్రజల సానుకూలత అత్యవసరమనీ దేశంలో 66 సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికలు ప్రతిసారీ నిరూపించాయి. ప్రజలలో సానుకూలత లేకపోగా ఆగ్రహం ఉన్నదని జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా జరుగుతున్న సభలకు హాజరు అవుతున్న ప్రజల సంఖ్య, వారి హావభావాలు స్పష్టం చేస్తున్నాయి. కాస్త ఆలస్యంగానైనా బాబు ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రత్యేకహోదా రాబోయే ఎన్నికలలో బలమైన అస్త్రం కాబోతున్నదని గ్రహించారు. ఎన్డీఏ సర్కార్ చివరి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు ప్రత్యేకంగా కేటాయించకపోవడాన్ని అవకాశంగా తీసుకొని సంకీర్ణం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మునుపు అమలు చేసినంత వేగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు. ఏవేవో అనుమానాలూ, భయాలూ. ప్రత్యర్థుల పట్ల మోదీ, అమిత్షాల వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో నాలుగేళ్ళుగా చూస్తూనే ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తీ ఎన్ని కష్టాలు పడుతున్నాడో గమనిస్తున్నారు. పైకి ఏమి బుకాయించినా తనకున్న విస్తృతమైన సంబంధాలను వినియోగించి, న్యాయవ్యవస్థలో ‘నాట్ బిఫోర్’వంటి నిబంధనలు వాడుకొని అనేక కేసులలో స్టేలు సంపాదించిన బాబుకు భయసందేహాలు ఉండటం సహజం. అందుకే ఎన్డీఏ నుంచి నిష్క్రమించాలనే నిర్ణయం తీసుకోవడం కష్టతరమైనది. ఈ విషయం ఆలోచిస్తున్న సమయంలోనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి ఎజెండా నిర్ణయించడం ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం ఫలానా తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు. కేంద్రం దిగిరాకపోతే తన పార్టీ లోక్సభ సభ్యులు ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేస్తారని చెప్పారు. అంతవరకూ ప్రత్యేకహోదా సంజీవిని కాదనీ, ఆ హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు ఒరిగింది ఏమీ లేదనీ, ఉద్యమం చేస్తే పీడీ యాక్ట్ కింద జైల్లో పెడతామనీ హెచ్చిస్తూ వచ్చిన బాబు వెంటనే రూటు మార్చవలసిన అవసరాన్ని గుర్తించారు. మీడియా సహకారం ఎంత ఉన్నప్పటికీ, పవన్కల్యాణ్ ఎటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నదని గ్రహించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుడిగా జగన్మోహన్రెడ్డికి గుర్తింపు, జనామోదం నానాటికీ పెరుగుతున్నాయని గమనించారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీని తటాలున వది లేసి ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు. జగన్ పైచేయి ‘మేము పెట్టే అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినా సరే, మీరు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మా సహకారం కోరినా సరే’ తాము సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ అధినేత ముందుకు రావడాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవడంలో తటపటాయింపు కనిపించింది. జగన్మోహన్రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంలో అదే డిమాండ్పై అశోక్గజపతిరాజునూ, సుజనాచౌదరినీ మంత్రిమండలి నుంచి రాజీనామా చేయించారు. అప్పటికీ స్పష్టత రాలేదు. ఎన్డీఏ నుంచి వైదొలగడం గురించి నిర్ణయం తీసుకోలేకపోయారు. వివిధ రాష్ట్రాల సభ్యులు తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంటులో నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న కారణంగా బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్టు అనుమానం రాగానే అవిశ్వాస తీర్మానాన్ని ముందే ప్రవేశపెట్టాలనే కీలక నిర్ణయం వైఎస్ఆర్సీపీ వేగంగా తీసుకున్నది. పార్టీ విప్ సుబ్బారెడ్డి నోటీసు అందజేశారు. అప్పటివరకూ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎవరు పోరాడినా బలపర్చుతామనీ, వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామనీ శాసనసభలో ప్రకటించారు. అంతలోనే నిర్ణయం మార్చుకొని తెల్లవారగానే పొలిట్బ్యూరో సభ్యులతో సమాలోచన జరిపినట్టు ప్రకటించారు. ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం ఉదయం గం. 9.30 కు ప్రకటించి ఒక్క నిమిషం తర్వాత మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానానికి తోట నరసింహం చేత నోటీసు ఇప్పించారు. ప్రత్యేక హోదా ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి అదే హోదా కావాలంటూ డిమాండ్ చేయడం, అవిశ్వాసం దండగ అంటూ ప్రబోధించిన నేత అదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆదరాబాదరాగా ఎన్డీఏ నుంచి తప్పుకోవడం ఎందుకు? ఈ నాలుగేళ్ళలో చంద్రబాబు తీసుకున్నన్ని పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు ఆయన రాజకీయ జీవితం మొత్తంలో తీసుకోలేదు. చరిత్ర మారదు నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, ఎన్డీఏ నుంచి వైదొలిగిన క్షణం నుంచి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నాయకుడుగా ప్రచారం చేసుకోవడం, అంతవరకూ ప్రశంసిస్తూ వచ్చిన మోదీనే ఘాటుగా విమర్శిస్తున్నట్టు మాట్లాడటం విశేషం. చంద్రబాబుకు రాజకీయం ఒక క్రీడ. విజయ సాధనకు ఏమి చేయడానికైనా వెనుకాడరు. ఇతర ప్రతిపక్షాలు టీడీపీ తీర్మానాన్నే సమర్థిస్తున్నట్టు ప్రచారం కూడా అందుకే. నిజానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఒక రోజు ముందే జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను విపక్ష నేతలందరికీ అందించారు. సోనియాగాంధీ సహా చాలామంది ప్రతిపక్ష నేతలు వైఎస్ఆర్సీపీ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలు సుబ్బారెడ్డి, నరసింహం ఇచ్చిన నోటీసుల గురించి ప్రస్తావించగానే కాంగ్రెస్ సభ్యులందరూ చటుక్కున లేచి నిలబడ్డారు. సభలో పరిస్థితులు సవ్యంగా లేవు కనుక అవిశ్వాస తీర్మానాలని చర్చకు స్వీకరించే ప్రక్రియను పాటించడం లేదంటూ సభను సోమవారానికి వాయిదా వేశారు. రేపు ఏమి జరుగుతుందో చూడాలి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు చంద్రబాబు స్పందిస్తూ వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తొట్టతొలి నోటీసు ఇచ్చిన పార్టీగా వైఎస్ఆర్సీపీ చరిత్రకు ఎక్కుతుంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షాలను మేల్కొలిపే ప్రక్రియకు ఊతం ఇచ్చిన నాయకుడుగా, ప్రత్యేక హోదాను జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేసిన నేతగా జగన్మోహన్రెడ్డి నిలిచిపోతారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సమకాలీన చరిత్రలోని ఈ వాస్తవాలను మాత్రం కప్పిపుచ్చలేరు. - కె. రామచంద్రమూర్తి -
‘అసాధారణ రాజకీయాలు’
ఉమ్రేదరాజ్ మాంగ్కర్ లాయాథా చార్దిన్ దో ఆర్జూమే కట్గయే, దో ఇంతెజార్మే ‘జీవిత పర్యంతం అల్లాహ్ని వేడుకొని నాలుగు రోజుల ఆయుష్షు అదనంగా సంపాదించుకున్నాను. కోర్కెలు కోరడంలో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ కోర్కెలు తీరడం కోసం ఎదురుచూడటంలో మిగిలిన రెండు రోజులూ జరిగిపోయాయి,’అంటూ వాపోయాడు జఫర్. మొఘల్ సామ్రాజ్యం ఆఖరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ రంగూన్ జైలులో బందీగా ఉన్న సమయంలో ‘లగ్తానహీ దిల్మేరా, ఉజ్దే దయార్మే’(నరసంచారంలేని ఈ శూన్య ప్రదేశంలో నా మనస్సు నిలవడం లేదు) అని నిర్వేదం వెలిబుచ్చుతూ రాసుకున్న కవితలోనివి పైన పేర్కొన్న రెండు పంక్తులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితికి అవి అద్దం పడతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్ళలో సాధిం చింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడానికి కారణం ఏమిటి? ఎంత అసమర్థ ప్రభువైనా ఎన్నో కొన్ని మంచిపనులు చేస్తాడు. ‘అసాధారణ నేత’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇంత విలువైన కాలం ఎందుకు వృథా చేశారు? బీజేపీతో నాలుగేళ్ళ చెలిమి రవ్వంత మేలు చేయలేదు. ఎందుకని? తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన చంద్రబాబు కొత్త రాష్ట్రానికి అవసరమైన హంగులు సమకూర్చగలుగుతారనే విశ్వాసంతో 2014లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో, మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే పరస్పరం సహకరించుకుంటాయనీ, అభివృద్ధి పనులు నల్లేరు మీద బండిలాగా చరచరా జరిగిపోతాయని కూడా ఆశించారు. నిజానికి, చంద్రబాబు నేలమీద నడిస్తే, ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు చేస్తే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ సంప్రదించి అడుగులు వేసి ఉంటే రాజధాని సహా కొత్త రాష్ట్రానికి అవసరమైన హంగులలో అత్యధికం ఈ పాటికి సమకూరి ఉండేవి. లోగడ ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలను సంప్రతించేవారు. మీడియా అనుభవజ్ఞులతో మాట్లాడేవారు. కానీ, తాను ‘అసాధారణ’ ప్రజ్ఞాశాలిననీ, అద్భుతమైన మేధావిననీ, శూన్యంలో నుంచి రాజప్రాసాదాలను సృష్టించే తెలివితేటలు తన సొంతమనీ భావించారు. చర్వితచర్వణమే అయినప్పటికీ చెప్పక తప్పదు. రాజ ధానికి అనువైన ప్రాంతం ఏదో సూచించేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో కానీ మంత్రివర్గ సమావేశంలో కానీ అఖిలపక్ష సభలో కానీ చర్చించకుండానే బుట్టదాఖలు చేశారు. తన బుర్రలో ఉన్న ఆలోచనలనే నివేదిక రూపంలో సమర్పించేందుకు అసమదీయులతో తన సొంత కమిటీ ఒకటి నియమించారు. కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలో (శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ వద్దన్నదో అక్కడే) రాజధాని నిర్మాణం జరగాలని నిర్ణయించారు. సలహాలు పెడచెవిన ఐటీ రంగ ప్రముఖుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి ఈ సందర్భంగా ఒక సూచన చేశారు. రాజధాని నిర్మాణం అంటే ఏమిటి? శాసనసభ, మండలి నిర్వహణకు తగిన భవనాలూ, సచివాలయానికీ, హైకోర్టుకూ కావలసిన భవన సముదాయం, ముఖ్యమంత్రికీ, మంత్రులకూ, శాసనసభ్యులకూ, ఉన్నతాధికారులకూ నివాస భవనాలూ ఉంటే సరిపోతుంది. తక్కిన నగరంలో రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తే నగరం తనంతట తానే అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో మహానగరాలన్నీ విస్తరించింది ఆ విధంగానే. రాజధాని పేరుమీద 5,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక పెద్ద నిర్మాణ సంస్థకు అప్పగిస్తే, రాజధానికి అవసరమైన భవనాలను 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి లేదా రెండు సంవత్సరాల వ్యవధిలో నిర్మించి ఇస్తుందనీ, తక్కిన 2,500 ఎకరాలతో ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుందనీ, ప్రభుత్వం నుంచి నయాపైసా ఆశించదనీ హనుమాన్ చౌదరి ప్రతిపాదన. సాధారణ ముఖ్యమంత్రి అయితే ఈ సలహాను పాటించేవారు. ఈ సరికి రాజధానికి కావలసిన భవనాలన్నీ (పక్కాభవనాలు. తాత్కాలికభవనాలు కాదు) సిద్ధమయ్యేవి. చంద్రబాబు సాధారణ ముఖ్యమంత్రి కాదు. కనుక ఆయనకు సాధారణ రాజధాని పనికిరాదు. ఢిల్లీని మించిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని సంకల్పించారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చి వారి భూములను పూలింగ్ పేరిట 30 వేల ఎకరాలకు పైగా సేకరించారు. తాజ్మహల్, చార్మీనార్, కుతుబ్ మీనార్ వంటి అద్భుతమైన కట్టడాలు నిర్మించిన వాస్తుశిల్పుల వారసులు మన దేశంలో ఉన్నారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్, నర్మదా డ్యాం వంటి మెగా ప్రాజెక్టులను నిర్మించిన ఇంజనీర్లకు కొదవ లేదు. అయినా సరే. సింగపూర్ సహకారంతో రాజధాని నిర్మించాలని చంద్రబాబు తాపత్రయం. అందుకోసం కొత్త కంపెనీలు పెట్టించీ, సరికొత్త నిబంధనలు సృష్టించీ, అడ్డగోలు ఒప్పం దాలు కుదుర్చుకొనీ పడరాని పాట్లు పడుతూ, ప్రైవేటు విమానంలో ప్రపంచం అంతటా చక్కర్లు కొడుతూ రాష్ట్రం కోసం చెమటోడ్చుతున్నానంటూ, తెగ కష్టపడుతున్నానంటూ బాధపడిపోతున్నారు. ఆయనకు హితవు చెప్పే సాహసం కలిగినవారు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ లేరు. ‘ఆయన సింగపూర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇంతవరకూ డిజైన్లు సైతం ఖరారు చేయకుండా మమ్మల్ని నిందిస్తే మేము ఏమి చేస్తాం? అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. అందుకు మాదా బాధ్యత?’ అంటూ జైట్లీ మొన్న పార్లమెంటు సెంట్రల్హాల్లో వ్యాఖ్యానించారు. రాష్ట్రం అవతరించి నాలుగేళ్ళు పూర్తవుతున్నప్పటికీ రాజధాని స్వప్నంగానే మిగిలిపోయింది. నెరవేరని పోల‘వరం’ ఇక రెండో ముఖ్యమైన అంశం పోలవరం. కాలువల నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయింది. సాధారణ ముఖ్యమంత్రి అయితే పోలవరం బహుళార్థ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత విభజన చట్టం ప్రకారం కేంద్రానిది కాబట్టి సాధ్యమైనంత త్వరలో తక్కిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయవలసిందిగా ప్రధానమంత్రిపైన ఒత్తిడి తెచ్చేవాడు. కానీ ‘అసాధారణ ముఖ్యమంత్రి’ కనుక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను స్వయంగా తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. అన్నీ తానే చేయాలనీ, అంతా తనకే కావాలనే మనస్తత్వం ఇందుకు కారణం. నిర్మాణ వ్యయం అంచనాలను 2010–11 లెక్కల ప్రకారం రూ. 16 వేల కోట్ల నుంచి తాజాగా రూ. 58 వేల కోట్లకు పెంచివేశారు. మొదట 31 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్న కాఫర్డ్యామ్ ఎత్తును 42 మీటర్లకు పెంచి 2018 జూన్ నాటికే ఖరీఫ్ పంటకు గురుత్వాకర్షణశక్తితో పోలవరం నీరు అందించాలనే వ్యూహం రచించారు. అదే సమయంలో తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థను పోలవరం పనుల నుంచి తప్పించాలని అనుకున్నారు. రాయపాటి ఘనాపాటి కనుక చంద్రబాబు ఎదుట సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీని కలుసుకున్నారు. క్షేత్రంలో ఏమి జరుగుతోందో, జరగడం లేదో వివరించారు. కాఫర్డ్యామ్కు గడ్కరీ బ్రేక్ వేశారు. కథ అడ్డం తిరిగింది. పనులు ఆగిపోయాయి. తిరిగి ప్రారంభం కావడానికి సమయం పడుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైన హామీ ప్రత్యేక హోదా. విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ పట్టుబట్టిన వ్యక్తి వెంకయ్యనాయుడు. నాటి ప్రధాని అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. అనంతరం మంత్రిమండలి సమావేశంలో దాన్ని ఆమోదించారు. ప్రత్యేక హోదా అమలు చేయమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు. యూపీఏ ప్రభుత్వం కొన్ని మంచిపనులు చేసింది. మరికొన్ని పాడుపనులు చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టపోయినప్పటికీ తెలంగాణలో లబ్ధి పొందుతామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది. ఉద్యమ నాయకుడు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుతో నిర్లక్ష్యంగా వ్యవహరించేసరికి ఆయన అడ్డం తిరిగారు. తెలంగాణలోనూ తిరుక్షవరం తప్పలేదు. కోస్తాంధ్రలో భారీ మూల్యం చెల్లిం చింది. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా చావుదెబ్బ తిన్నది. తెలంగాణకు అభ్యంతరం లేదంటూ ప్రణబ్ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకీ, విభజన బిల్లు ఆమోదంలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీజేపీకీ ఆంధ్రులు అధికారం అప్పగించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉండటం వల్ల కోస్తాంధ్రకు నష్టం కలుగుతుంది కనుక నష్టాన్ని పూడ్చేందుకు బిల్లులో కొన్ని అంశాలను యూపీఏ ప్రభుత్వం చేర్చించింది. వాటిని నాలుగేళ్ళపాటు అమలు జరపకుండా విభజన పాపం కాంగ్రెస్దేనంటూ బీజేపీ, తెలుగుదేశంలు ధ్వజమెత్తడం ప్రహసన రాజకీయాలకు నిదర్శనం. ‘ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు’ అంటూ చంద్రబాబు కొత్తపాట అందుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పడిన మొదటి పిడుగు. ప్రత్యేక హోదా అక్కర లేదని ఒప్పుకునే అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకహోదా ఇవ్వవద్దని సిఫార్సు చేసిందంటూ తాజాగా అరుణ్జైట్లీ పార్లమెంటులో ప్రకటించారు. ఇది సత్యదూరం. ఆ మాట తాము ఎక్కడా అనలేదని 14వ ఆర్థికసంఘం అధ్యక్షుడు వైవి రెడ్డి హైదరాబాద్లో మంథన్ నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. ఆర్థికసంఘాన్ని అడ్డంపెట్టుకొని ప్రత్యేకహోదాను ఎగగొట్టడం వంచన. ప్రత్యేకహోదా లేక, ప్రత్యేక ప్యాకేజీ రాక రెండింటా చెడిన రేవడి చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో రైల్వే జోన్ కూడా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీని ఇంతవరకూ 29 విడతల సందర్శించారు. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ప్రతిసారీ శూన్యహస్తాలతోనే తిరిగి వచ్చారు. విభజన చట్టం హామీల అమలు కోసం తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేసిన రోజే ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహావేశాలతో నెహ్రూనూ, ఇందిరాగాంధీనీ, రాజీవ్గాంధీనీ, సోనియాగాంధీనీ రాహుల్గాంధీని ఉభయసభలలో కడిగిపారేశారు. ఆ హామీల గురించి ఒక్కమాట కూడా ప్రధాని నోట వెలువడలేదు. ఎన్నికల ప్రచారంలో తాను స్వయంగా చంద్రబాబు, వెంకయ్యనాయుడితో కలసి చేసిన హామీలను ప్రస్తావించడానికి సైతం ప్రధాని సిద్ధంగా లేరు. ఇది సైతం అసాధారణమే. జైట్లీ డొంక తిరుగుడు సరేసరి. అర్థంపర్థం లేని పాటను రాజ్యసభలో రెండుసార్లూ, లోక్సభలో ఒకసారీ పాడి వినిపించారు. ఇటువంటి అవమానకరమైన పరిస్థితులలో తెలుగుదేశం నాయకత్వానికి ఎన్టి రామారావునాటి ఆత్మగౌరవ నినాదం లీలగానైనా గుర్తు ఉంటే ఏమి చేయాలి? అశోక్ గజపతి రాజునూ, సుజనాచౌదరినీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి విరమించుకోవాలి. శ్రీనివాస్కూ, మాణిక్యాలరావుకూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన చెప్పాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పష్టంగా ప్రకటించాలి. ముఖ్యమంత్రిని వేధిస్తున్న భయసందేహాలు ఏమిటో తెలియదు కానీ అటువంటి ధైర్యమైన నిర్ణయం తీసుకోలేదు. ఏమి చేశారు? ప్రచ్ఛన్నయుద్ధం చేశారు. మీడియా సహకారంతో లీకుల రాజకీయం రసవత్తరంగా నడిపించారు. ఢిల్లీతో తెగించి పోరాడుతున్నారనే భ్రాంతికి తెలుగు పాఠకులనూ, ప్రేక్షకులనూ లోను చేశారు. ఈ లోగా సరదాగా దుబాయ్ వెళ్ళి వచ్చారు. కానీ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించి పది రోజులైనా చంద్రబాబు ప్రత్యక్షంగా నిరసన వెలి బుచ్చలేదు. కేంద్ర ప్రభుత్వానికి కానీ, బడ్జెట్కు కానీ వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది విచిత్రమైన పరిస్థితి. మామూలు ముఖ్యమంత్రి అయితే మీడియా సమావేశంలో మాట్లాడేవారు. ఆవేదన, ఆగ్రహం వెలిబుచ్చేవారు. అన్యాయం జరిగిందని చెప్పేవారు. తాను ఏం చేయదల్చుకున్నదీ ప్రకటించేవారు. అటువంటి పనులు ఏవీ చేయకపోయినా చంద్రబాబునే పోరాటయోధుడుగా రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చిత్రించడం అసాధారణ రాజ కీయం. విభజన చట్టంలోని హామీలు నెరవేరతాయని నాలుగేళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రజలు మరో సంవత్సరం మాత్రమే గడువు ఇస్తారు. - కె. రామచంద్రమూర్తి -
రైతు బడ్జెట్ అంటే ఇదేనా?
త్రికాలమ్ వ్యాపార దృష్టి ఉన్నవారికి వ్యవసాయం అర్థం కాదు. వ్యవసాయదారులకు వ్యాపారం అంతుబట్టదు. వ్యవసాయంతో బొత్తిగా సంబంధం లేని వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీకీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకీ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన అవగాహన ఉన్నట్టు కనిపించడంలేదు. గుజరాత్ స్థానిక ఎన్నికలలోనూ, అసెంబ్లీ ఎన్నికలలోనూ రైతులు ఎదురు తిరిగిన ఫలితంగా గట్టి దెబ్బ తగిలిన తర్వాత మోదీకి రైతుల గోడు పట్టించుకోవలసిన అవసరం ఏర్పడింది. జైట్లీ వార్షిక బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలోనే రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలి తాలు వెల్లడైనాయి. రెండు లోక్సభ స్థానాలను కోల్పోవడమే కాకుండా వాటి పరిధిలోని మొత్తం 17 శాసనసభ స్థానాలలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీలు సాధించిందనే వార్త అధికార పార్టీ నేతలకు దిగ్భ్రాంతి కలి గించింది. 2014లో నగరజీవులతో పాటు రైతులు సైతం సమధికోత్సాహంతో ఓట్లు వేయబట్టే బీజేపీ మెజారిటీ లోక్సభ స్థానాలు గెలవగలిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు యూపీఏ–2 ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (మిని మమ్ సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పి) చాలా తక్కువనీ, తాము అధికారంలోకి వస్తే ప్రొఫెసర్ స్వామినా«థన్ కమిటీ చేసిన సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తామనీ నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్ళు దాటినప్పటికీ వ్యవసాయదారుల పరిస్థితిలో మార్పులేదు. రుణభారం కారణంగా రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. వ్యవసాయానికి పెద్దపీట? వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకుం టున్నామనీ, ఖరీఫ్ తరుణంలో పంటలకు ఎంఎస్పిని స్వామినాథన్ చెప్పిన సూత్రం ప్రకారం నిర్ణయిస్తామనీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ‘హింగ్లీష్’ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది గొప్ప వరమనీ, రైతులను కష్టాల కడలి నుంచి రక్షించేందుకు ఉపకరిస్తుందనీ చెబుతూ ఉత్తరాది ప్రజలకు స్పష్టంగా, సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆ భాగం మాత్రం హిందీలో చదివారు. ఎన్డీఏ బడ్జెట్ అటు స్టాక్మార్కెట్నూ, ఇటు వ్యవసాయరంగాన్నీ ఆగ్రహానికి గురి చేసింది. మధ్య తరగతినీ, ఉద్యోగ వర్గాలనూ నిరాశానిస్పృహలకు లోనుచేసింది. ఇన్ని వర్గాలకు సమానంగా మనస్తాపం కలిగించిన బడ్జెట్ ప్రతిపాదనలను జైట్లీ సమర్పించడం విశేషం. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలనే విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి బలమైన తార్కాణం 2015లో కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్టు. ఉత్పత్తి వ్యయంపైన యాభై శాతం అదనంగా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించడం సాధ్యం కాదని అందులో వాదించింది. అసలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మోదీ ఎన్నడూ ప్రస్తావించలేదంటూ కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్సింగ్ 2017 మే నెలలో దబాయించారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్వయంగా ఈ నివేదిక గురించి ప్రస్తావించారు కనుక ఇప్పుడు ఎవ్వరూ కాదనలేరు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని బడ్జెట్కు ముందురోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయదారుల ఆదాయం పెరగడం లేదనీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదనీ, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారనీ నివేదించింది. వాతావరణంలో మార్పుల కారణంగా పంట దిగుబడి, వ్యవసాయదారుల ఆదాయం 25 శాతం వరకూ పడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించింది. రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోని రాష్ట్రం అంటూ దేశంలో ఈ రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర లోని విదర్భ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇవి అధికం. కానీ పంజాబ్ వంటి వ్యవసాయ విజయాలు సాధించిన రాష్ట్రంలోనూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న (భావాంతర్ భుక్తన్ యోజన) మధ్యప్రదేశ్లో కూడా రైతులు అప్పుల చెర నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మృత్యుముఖంలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న రైతులు ఏమి కోరుకుంటున్నారు? రైతు సంఘాలు చేస్తున్న మొదటి డిమాండ్ రుణమాఫీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పశ్చిమ యూపీలో రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రధాని ఆ రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాలకు దాన్ని వర్తింపజేయలేదు. ఇతర రాష్ట్రాలలో ఆ ఊసే లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీ ఎన్నికలలో గట్టెక్కడానికి రుణమాఫీ మంత్రం ప్రయోగించారే కానీ దానిని ఒక విధానంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మోదీ సిద్ధంగా లేరు. అప్పు చేసి వ్యవసాయం చేసిన రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోతే వాటిని ఎట్లా తీర్చాలి? వ్యవసాయం గిట్టుబాటు అయ్యేవిధంగా కనీస మద్దతు ధర నిర్ణయించి, ఇంతవరకూ చేసిన రుణాలను రద్దు చేయగలిగితే బక్కౖ రెతు హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో కౌలు రైతుల సంఖ్య గణనీయం. వారికి రుణ సౌకర్యం కల్పించాలన్నది వ్యవసాయ సంఘాల రెండో డిమాండ్. ‘రుణ హామీ నిధి’ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులకు పూచీగా ప్రభుత్వం నిలవాలని వాటి అభ్యర్థన. వ్యవస్థాగతమైన రుణ సదుపాయం లేని కారణంగానే కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తున్నారనీ, బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చుననీ 1998లో ఆత్మహత్యల పరంపర మొదలైనప్పటి నుంచీ వ్యవసాయ సంఘాల నాయకులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటూనే ఉన్నారు. రుణహామీ నిధిని జైట్లీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. నీతి ఆయోగ్ రూపొందించిన ‘భూమి కౌలుచట్టం’ ముసాయిదా కౌలుదారుల కంటే భూయజమానులకే అనుకూలంగా ఉంది. ఇదే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్పి నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఇందుకు ఎంత కాలం పడుతుందో చెప్పలేదు. అంత వ్యవధి ప్రభుత్వానికి లేదు. నిజంగా రైతులను ఆదుకొని వారి ఓట్లు సంపాదించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ఎంఎస్పిని ఉదారంగా నిర్ణయించడమే కాకుండా వేగంగా, సమర్థంగా అమలు చేయాలి. నానాటికి తీసికట్టు ఎన్డీఏ హయాంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతలు నానాటికి తీసికట్టుగా ఉన్నాయనడానికి నిదర్శనం మొత్తం బడ్జెట్లో వ్యవసాయ శాఖ కేటాయింపుల తగ్గుదల. నిరుడు బడ్జెట్ వ్యయంలో వ్యవసాయ శాఖ వాటా 2.38 శాతం. మొన్నటి బడ్జెట్ ప్రతిపాదనలలో అది 2.3 శాతానికి పడిపోయింది. బడ్జెట్ కేటాయింపులు పెంచకుండా రైతుల బతుకులను ఎట్లా బాగుచేస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు నిర్మిస్తామనీ, 22,000 గ్రామీణ మార్కెట్ యార్డ్లను అభివృద్ధి చేస్తామనీ ఆర్థికమంత్రి చేసిన ప్రతిపాదనలు స్వాగతించదగినవే. కానీ రైతులోకం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యకు ఇటువంటి అరకొర చర్యలు పరిష్కారం ఎట్లా అవుతాయి? నీరసించిపోయిన కాంగ్రెస్కు జవసత్వాలు కల్పించే పని అసంకల్పితంగానే మోదీ చేస్తున్నారనే వ్యాఖ్య వినిపిస్తోంది అందుకే. స్వామినాథన్ ఏమన్నాడు? రబీ పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన విధంగా ఎంఎస్పి నిర్ణయించామనీ, వచ్చే ఖరీఫ్కి కూడా అదేవిధంగా చేస్తామనీ జైట్లీ ప్రకటించారు. ఇంతకీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏమిటి? ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయదారుల జాతీయ కమిషన్ సర్వేలూ, చర్చలూ, సంప్రదింపులూ నిర్వహిం చింది. 2006లో మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా సాగు వ్యయం–ధరల కమిషన్ (సీఏసీపీ) పంట పండించడానికి పెట్టిన ఖర్చుకు మూడు రకాల నిర్వచనాలు ఇచ్చింది. ఒకటి ఏ2. రెండు ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. మూడు సీ2. పంటలు పండించే క్రమంలో రైతు నగదు రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ చెల్లించిన మొత్తాలు కలిపి ఏ2 అంటారు. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, కూలీ, ఇంధనం, నీటి సరఫరా, తదితరాలపైన పెట్టిన ఖర్చుల మొత్తం ఇది. ఎఫ్ఎల్(ఫ్యామిలీ లేబర్) అంటే పొలంలో పనిచేసే కుటుంబ సభ్యుల శ్రమ విలువ. దీనిని లెక్క కట్టి ఏ2కి కలిపితే వచ్చేది ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. మూడో పద్ధతి అత్యంత సమగ్రమైనది. రైతుకు శ్రేయస్కరమైనది. ఏ2 ప్లస్ ఎఫ్ఎల్లో కలిపినవే కాకుండా భూమిని ఎవరికైనా అద్దెకు ఇస్తే వచ్చే అద్దె మొత్తం, దాని పైన వడ్డీ మొత్తం, ఇతరత్రా ఖర్చు కూడా కలిపితే వచ్చే మొత్తం సీ2. కేంద్ర ప్రభుత్వం 2018 రబీ పంటల నిమిత్తం 2017 అక్టోబర్లోనే ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే స్వామినాథన్ సూచించిన సూత్రం తేలికగా బోధపడుతుంది. టన్ను వరిధాన్యం పండించేం దుకు ఏ2 నిర్వచనం కింద రూ. 840 ఖర్చు అవుతుందనీ, ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ కింద రూ. 1,117 అవుతుందనీ, సీ2 ప్రకారం రూ. 1,484 ఖర్చు కాగలదనీ సీఏసీపీ నిర్ణయించింది. ఎంఎస్పిని రూ. 1,550గా ప్రతిపాదించింది. ఖరీఫ్లో ఇది ఎని మిది శాతం పెరిగి రూ. 1,675 కావచ్చు. ఎంఎస్పిని ఇరవై పంటలకు నిర్ణయిం చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది బియ్యం, గోధుమలను మాత్రమే. ఇది కూడా జాతీయ ఆహార భద్రతాచట్టం అమలు చేయడం కోసం విధిగా ఆహారధాన్యాలు కొనాలి కనుక. 2015లో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) వెల్ల డించిన గణాంకాల ప్రకారం 5.8 శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్పి రేటుకు ప్రభుత్వానికి ఆహారధాన్యాలు విక్రయించారు. మిగిలినవారంతా దళారుల కబంధహస్తాలలో చిక్కినవారే. వ్యవసాయదారుల సంస్థలు బడ్జెట్లో ప్రస్తావించిన ఎంఎస్పిపైన ఇంకా స్పష్టత రావలసి ఉన్నదని స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు తక్కువ ఉంటే ప్రభుత్వం ఎంఎస్పి రేటుకు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనీ, లేదా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ అన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు మండల స్థాయిలో పరిశోధన కేంద్రాలు నెలకొల్పాలనీ, నష్ట నివారణలో నైపుణ్యం కలిగిన ఒక మహిళనూ, ఒక పురుషుడినీ ప్రతి పంచాయతీ నుంచి ఈ కేంద్రాలలో నియమించాలనీ స్వామినాథన్ సూచించారు. మధ్యదళారుల పాత్రను రద్దు చేయడం, రైతులే వినియోగదారులకు నేరుగా ఆహారధాన్యాలు విక్రయించే వ్యవస్థను నిర్మించడం ద్వారా వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని పరిష్కరించవచ్చు. 1980ల నుంచి వ్యవసాయరంగం అభివృద్ధి రేటు సగటున 2.5 శాతానికి మించలేదు. రైతు ఆదాయాన్ని ఐదారు సంవత్సరాలలో రెట్టింపు చేయాలంటే ఏటా15–20 శాతం వృద్ధి సాధించాలి. అది అసాధ్యం. ఇతర వినిమయ వస్తువులలాగానే ఆహారధాన్యాల ధరలను కూడా ఉత్పత్తిదారులకు గణనీయమైన లాభం లభించే విధంగా నిర్ణయించినప్పుడే రైతు లోగిలిలో విషాదం తొలగి పోయి ఆనందం వెల్లివిరుస్తుంది. ఇందుకు మహారాష్ట్రలో జోరందుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఇంతకాలం ఆ సంస్థలపైన విధిస్తున్న 30 శాతం పన్ను రద్దు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా అమ్మడం ఈ సంస్థల బాధ్యత. మధ్యదళారులను పూర్తిగా తొలగించి, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ఠం చేసి, వ్యవస్థీకృతమైన రుణ సదుపాయం కలిగించి, వ్యవసాయ విస్తరణ అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహించి, సాగునీరు అందించేందుకు విశేష ప్రయత్నం చేయగలిగితే రైతులూ, కౌలురైతులూ కోలుకుం టారు. వ్యవసాయం తెలిసినవారూ, వ్యాపారంలో నైపుణ్యం ఉన్నవారూ భుజం భుజం కలిపి సమష్టిగా కృషి చేస్తే వ్యవసాయం కూడా లాభసాటి వ్యాసంగం కావచ్చు. ఈ దిశగా బృహత్ ప్రయత్నం జరగాలి. - కె. రామచంద్రమూర్తి -
బహుళత్వంతోనే భవితవ్యం
త్రికాలమ్ ఈ రోజున ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. అర్ణవ్గోస్వామి రిపబ్లిక్ టీవీ, అరుణ్పురీ ఇండియా టుడే చానల్ తాజాగా నిర్వహించిన సర్వేల ఫలితాలలో కొన్ని అంకెలలో వ్యత్యాసం ఉండవచ్చును కానీ తాత్పర్యం ఒక్కటే. 2019 సార్వత్రిక ఎన్నికలలో సైతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనీ, ప్రధానిగా నరేంద్రమోదీ కొనసాగుతారనే. నిజానికి, మోదీ నాయకత్వం కారణంగానే బీజేపీకీ, దాని మిత్రపక్షాలకీ మెజారిటీ స్థానాలు లభిస్తాయన్న మాట కూడా స్పష్టమే. నేపాల్లోని లుంబిని గౌతమ బుద్ధుడి జన్మస్థానం. అక్కడి నుంచి లక్నో వరకూ బుధ, గురువారాలలో ముగ్గురు మిత్రులతో కలసి కారులో చేసిన ప్రయాణం ఈ రచయితకు గయ వెళ్ళి బోధివృక్షం కింద కూర్చునే అవసరం లేకుండానే ఒక రకమైన రాజకీయ జ్ఞానోదయం కలిగించింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) ఈశాన్య ప్రాంతం అంతా చూశాం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధిపతిగా ఉన్న గోరఖ్పూర్ మఠం సందర్శించాం. బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగిన కుశీనగర్లో మకాం చేశాం. వివాదాస్పదమైన అయోధ్య నగరంలో కొద్దిసేపు ఆగి తాజా సమాచారం సేకరించాం. రామ జన్మభూమి పోలీసు పర్యవేక్షణలో బ్యారికేడ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ ఉంది. హైవేకు రెండు వైపులా కనుచూపు ఆనినంతవరకూ ఆకుపచ్చని తివాచీ పరచినట్టు వరి, జనుము, గోధుమ పొలాలు. కొద్దిగా లోపలికి వెడితే కటిక పేదరికంలో ముస్లిం గ్రామాలు. పూర్వం బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతాలలో అత్యధికంగా ముస్లింలు కనిపించారు. మ«ధ్య ఆసియా నుంచి వచ్చిన దురాక్రమణదారుల దాడుల నుంచి బౌద్ధులకు రక్షణ లేక ఇస్లాంను ఆశ్రయించారంటూ అంబేడ్కర్ చేసిన ప్రతిపాదనను రుజువు చేసే ఆధారాలలో ఇది ఒకటి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా మదిలో మెదిలిన ఆలోచనలు మనవి చేస్తాను. యూపీ ప్రయోగం 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం యూపీలో ముస్లింలు 19.25 శాతం. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 403 నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థిని ఒక్కరిని కూడా నిలబెట్టకుండా బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంలోని రహస్యం తెలుసుకోవాలంటే యూపీ ప్రయోగం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొత్తం 19 బీజేపీ పాలిత రాష్ట్రాలలో అదే ప్రయోగం అటూఇటుగా అమలు జరుగుతోంది. రేపు కర్ణాటకలోనూ అదే వ్యూహం అమలు చేసి ఘనవిజయం సాధించేందుకు అమిత్షా పావులు కదుపుతున్నారు. మైనారిటీలను పూర్వపక్షం చేసి మెజారిటీ మతస్థులను ఏకం చేయడం ద్వారా అధికారం సాధించడం, ఇందుకు క్షేత్రవాస్తవికతను సవ్యంగా అర్థం చేసుకొని చాకచక్యంగా వ్యూహం రచించడం, పకడ్బందీగా అమలు జరపడం. బ్రిటన్, ఫ్రాన్స్లో (అనేక ఐరోపా దేశాలలో) లాగా, పాకిస్తాన్లో అత్యధికులు ఒకే మతానికి చెందినవారూ, ఒకే భాష మాట్లాడేవారూ, ఒకే వారసత్వం ఉన్నవారూ, ఒకే సంస్కృతి కలిగినవారూ ఉండటం. ‘క్లాష్ ఆఫ్ సివిలిజేషన్స్’ రచయిత శామ్యూల్ హంటిం గ్టన్ అమెరికాను వైట్–ఆంగ్లో ప్రొటెస్టెంట్ (వాస్ప్) దేశంగా అభివర్ణించాడు. ఇండియాను ఆ విధమైన మూసలోకి మార్చడం సాధ్యమా? ప్రస్తుతానికి కాకపోవచ్చు. ఆ దిశగా ప్రయత్నానికి ఊతం మాత్రం కొంత దొరికింది. బీజేపీ జయప్రదంగా అనుసరిస్తున్న వ్యూహంలో ముఖ్యమైన అంశం దేశభక్తిని పూర్తిగా సొంతం చేసుకోవడం. దేశభక్తికీ, బీజేపీకీ అభేదం పాటించడం. బీజేపీని కానీ మోదీని కానీ విమర్శించినవారి దేశభక్తిని అడ్డంగా ప్రశ్నించడం. దీన్ని జింగోయిజంగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వంటి మేధావులు అభివర్ణిస్తున్నారు. దీనికి బదులు రాజ్యాంగబద్ధమైన దేశభక్తి (కానిస్టిట్యూషనల్ పేట్రియాటిజమ్) ఉండాలన్నది ఆయన వాదన. అందుకే గుజరాత్ దళిత నాయకుడు, అసెంబ్లీ సభ్యుడు జిగ్నేశ్ మేవానీ ఒక చేత్తో మనుస్మృతినీ, రెండో చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటుకు ప్రదర్శనగా వెళ్ళి ప్రధాని మోదీకి సమర్పించి ఆ రెండింటిలో దేన్ని స్వీకరిస్తారో చెప్పాలని అడగబోతున్నట్టు ప్రకటించాడు. మనువాదం అంటే స్థూలంగా ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న విధానమని అతని వాదన. బీజేపీ వ్యూహం ఆరంభమైంది అడ్వాణీ అయోధ్యయాత్రతో. మలుపు తిరిగింది బాబ్రీమసీదు విధ్వంసంతో. లక్ష్యం నెరవేరింది 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయంతో. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ‘ఇండియా దటీజ్ భారత్’కూ ప్రస్తుతం బలంగా వేళ్ళూనుకుంటున్న భావజాలానికీ పొంతన లేదు. రాజ్యాంగ నిర్మాతలు ఇండియన్ రిపబ్లిక్కు షరతులు లేని ప్రజాస్వామ్యం, మత, భాషాపరమైన బహుళత్వం, కుల, లింగ సమానత్వం, పేదరికం నిర్మూలన, వివక్షను అంతం చేయడం పునాది కావాలని భావించారు. ఇప్పటి ధోరణులు ఇంతవరకూ దేశ ప్రజలు విశ్వసించిన దేశ స్వరూపస్వభావాలకు (‘ఐడియా ఆఫ్ ఇండియా’) విరుద్ధమైనవనీ బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నవారు ముక్కుమీద గుద్దినట్టు చెబుతున్నారు. యూపీలో వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీ గెలుస్తుందని ఎవరినడిగినా చెబుతారు. ఆ రాష్ట్రంలో మొన్నటి వరకూ యాదవ కులాధిపత్యం ఉండేది. ఇప్పుడు ఠాకూర్ల మాటకు విలువ పెరిగిందని అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ పూర్వాశ్రమంలో ఠాకూర్. అతని ప్రమేయం లేకుండానే ఆ కుల ప్రముఖుల ప్రాబల్యం పెరుగుతుంది. ఎందుకంటే మన ప్రజలు నాయకులను ప్రేమించడంతో ఆగరు. వారినీ, వారి చుట్టూ ఉన్నవారినీ ఆరాధిస్తారు. నాయకులను పూజించే స్వభావాన్ని ప్రజలు విడనాడకపోతే, ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించుకోకపోతే పరిస్థితి విషమించి నియంతృత్వానికి దారి తీస్తుంది. రాజ్యాంగ పరిషత్తులో అంబేడ్కర్ చేసిన ఆఖరి ప్రసంగంలో చేసిన హెచ్చరిక గమనించండి: ‘మతం పట్ల భక్తి (వ్యక్తుల) ముక్తికి దారి తీయవచ్చు. కానీ రాజకీయాలలో భక్తి లేదా వ్యక్తిపూజ పతనానికీ, నియంతృత్వానికీ తిరుగులేని మార్గం’ ((Bhakti in religion may be a road to the salvation of the soul. But in politics, Bhakti or hero - worship is a sure road to degradation and to eventual dictatorship).). అంబేడ్కర్ హెచ్చరికను కాంగ్రెస్ నాయకులు పెడచెవిన పెట్టబట్టే ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితిని విధించే సాహసం చేశారు. ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అనే నినాదం చేసిన నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్కాంత్ బారువా ప్రమాదకరమైన పరమభక్తుడుగా నవభారత చరిత్రలో నల్లటి అక్షరాలతో నమోదై దోషిగా మిగిలిపోయాడు. ఇప్పుడు మోదీ పట్ల, కొందరు ముఖ్యమంత్రుల పట్ల అంధభక్తుల వీరవిధేయత చూస్తే భయం కలుగక మానదు. కాంగ్రెస్ తప్పిదం స్వాతంత్య్ర యోధులలో అత్యధికులు తమ మతాన్ని ప్రేమించినవారే. స్వామి వివేకానంద వంటి వివేకవంతులైన హిందూమత ప్రబోధకులను అంగీకరించినవారే. ఆయన రచనలు చదవడం వల్ల తన దేశభక్తి వందవంతులు పెరిగిందని గాంధీ అన్నాడు. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే వివేకానందుడి రచనలను అధ్యయనం చేయాలన్నాడు టాగోర్. జాతీయోద్యమాన్ని నిర్మించిన మహానుభావులలో వివేకానంద అగ్రగణ్యుడని నెహ్రూ అంటాడు. సుభాష్చంద్రబోస్, రాజ గోపాలాచారి తదితరులకు కూడా ఆయనే ప్రేరణ. దేశభక్తితో పాటు వివేకానందనూ, పటేల్నూ, అంబేడ్కర్నూ సొంతం చేసుకోవడానికి బీజేపీ, దాని అనుబంధ సంస్థలూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆ సంస్థలకు ఇటువంటి అవకాశం ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ స్వాతంత్య్ర సమర సేనానులందరినీ విస్మరించి నెహ్రూ–ఫిరోజ్గాంధీ కుటుంబ వృక్షాన్ని మాత్రమే పట్టుకొని వేళ్ళాడటం ఇందుకు ప్రధాన కారణం. ఇందిరాగాంధీని పూజించినట్టు సోనియాను కాంగ్రెస్లో బారువా వారసులు తనివితీరా సేవించారు. 19 సంవత్సరాలు పార్టీపై ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన సోనియా మనోగతానికి భిన్నంగా మాట్లాడే సాహసం ఒక్కరికీ లేకపోయింది. ప్రధానిగా ఐదేళ్ళు పని చేసి, దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతికి బాటలు వేసిన పీవీ నరసింహారావును పదవీ విరమణ తర్వాతనే కాకుండా మరణానంతరం సైతం అవమానపరచడం తప్పని చెప్పిన నాయకుడు ఒక్కడూ లేడు. ఆంధ్రప్రదేశ్లో పదేళ్ళు ప్రతిపక్ష స్థానంలో చతికిలబడిన కాంగ్రెస్ను సమరానికి సమాయత్తం చేసి 2004లో, 2009లో విజయాలు సాధించి, అధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించి, కేంద్రంలో యూపీఏ సర్కార్ ఏర్పడటానికి దోహదం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని ప్రతిపక్ష తెలుగుదేశంతో కుమ్మక్కయి సీబీఐ విచారణ పేరుతో 16 మాసాలు జైలులో ఉంచడం విశ్వాస ఘాతుకమని అధినేతకు చెప్పే గుండెగల నాయకుడు ఒక్కడూ లేకపోయాడు. 1998లో సోనియా కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ఆ పార్టీ సారథ్యం ఆమె చేతి నుంచి పుత్రుడు రాహుల్ చేతిలోకి మారింది. అదే బీజేపీలో 1998 నుంచి ఇప్పటి వరకూ బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, అడ్వాణీ, రాజ్నాథ్సింగ్, అమిత్షాలు పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. సాధారణ కార్యకర్తలు బీజేపీ అధ్యక్షులుగా, ప్రధానులుగా ఎదిగారు. ముస్లింలలో ఛాందసం పెంచి పోషించడంలోనూ (షాబానో కేసు), వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకోవడంలోనూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా బీజేపీ వ్యూహం విజయం సాధించడానికి అవకాశం ఇచ్చాయి. ఇస్లామిక్ దేశాలలో కూడా లేని ‘త్రిపుల్ తలాఖ్’దురాచారాన్ని అంతం చేసే ప్రయత్నం చేయడానికి డెబ్బయ్ ఏళ్ళు ఎందుకు పట్టింది? కాంగ్రెస్ హయాంలో పెచ్చుమీరిన అవినీతి కూడా 2014లో మోదీ ప్రభంజనానికి దోహదం చేసింది. కమ్యూనిస్టు పార్టీలు నేల విడిచి సాము చేయడం, విదేశీ అనుభవాలనూ, భావజాలాలనూ అరువు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా చీలికపేలికలై కృశించి నశించడానికి సిద్ధంగా ఉండటం కూడా బీజేపీ భావజాలం బలపడటానికి దారి తీసింది. కింకర్తవ్యం? కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసినా అంబేడ్కర్, నెహ్రూ, తదితర వైతాళికులు నిర్మించిన నవభారతం సమైక్యంగా, సమగ్రంగా మనగలగడానికి కారణం ఏమిటి? దళితులకూ, ఆదివాసులకూ ఉద్యోగాలలో, చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడం. భాషాప్రాతిపదికపైన రాష్ట్రాల పునర్నిర్మాణానికి అంగీకరించడం. హిందీని రుద్దరాదన్న తమిళుల డిమాండ్ను ఆమోదించడం. పాకిస్తాన్ ఆవిష్కరణ జరిగిన వెంటనే జిన్నా ఢాకా వెళ్ళి ఉర్దూ నేర్చుకోవలసిందేనని తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలకు కటువుగా చెప్పాడు. అందుకే పాతికేళ్ళకే తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. తమిళులపైన సింహళ భాషను బలవంతంగా రుద్దబట్టే శ్రీలంకలో మూడు దశాబ్దాలపాటు నరమేధం సాగింది. మన దేశంలో ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శించిన కారణంగానే, ప్రజల ఆకాంక్షలను ఆలకించినందువల్లనే బహుళత్వంలో ఏకత్వం అనే ఆదర్శం ఇప్పటి వరకూ బతికి బట్టకట్టింది. ఈ ఆలోచనా విధానానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా రాజ్యాంగ నిర్మాతల స్వప్నం భగ్నమౌతుంది. పది మంది ‘ఆసియాన్’దేశాధినేతల సమక్షంలో శుక్రవారం సగర్వంగా జరుపుకున్న రిపబ్లిక్ దినోత్సవం సార్థకం కావాలంటే భారత గణతంత్రంలోని బహుళ సంస్కృతినీ, బహుముఖీనతనూ పరిరక్షించుకోవడం తప్పనిసరి. ఇప్పుడు కలవరపెడుతున్న పెడధోరణులను అరికట్టడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటికైనా నడుంబిగిస్తే అది హృదయపూర్వకంగా ఆహ్వానించదగిన పరిణామం అవుతుంది. అటువంటి పూనిక ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే ఏమి చేయాలన్నది ప్రశ్న. ఉదార హిందూత్వ అంటూ ‘సాఫ్ట్ హిందూత్వ’ విధానాన్ని రాజీవ్గాంధీ హయాం (అయోధ్యలో శిలాన్యాస్) నుంచీ అనుసరిస్తున్న కాంగ్రెస్కి ఇంతటి గురుతరమైన బాధ్యతను నిర్వర్తించే చిత్తశుద్ధీ, సామర్థ్యం ఉన్నాయని చెప్పలేం. న్యాయవ్యవస్థను రక్షించుకోండి అంటూ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టే అన్ని మతాలనూ, ప్రాంతాలనూ, భాషలనూ, సంస్కృతులనూ సమాదరించే అద్భుతమైన దేశంగా ఇండియాను కాపాడుకోండని ప్రజలకు పురమాయించడం వినా మరో మార్గం కనిపించడంలేదు. - కె. రామచంద్రమూర్తి -
అటు నేనే..! ఇటు నేనే..!
♦ త్రికాలమ్ ‘విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే సుప్రీంకోర్టుకు వెడతాం’ అంటూ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరవై నాలుగు గంటలు దాటకుండానే ఆ మాట తాను అనలేదని చెప్పారు. ఈ రెండు నాల్కల ధోరణి చంద్రబాబు రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నవారికి ఆశ్చర్యం కలిగించదు. అటూ, ఇటూ కూడా తానే ఆడే క్రీడలో ‘ఘనవిజయాలు’ సాధిస్తూ ముందుకుపోతున్న ఆయన ప్రస్థానం చిత్రవిచిత్రమైనది. దేశంలో చాలామంది ప్రాంతీయ పార్టీ నేతలను చూస్తున్నాం. కరుణానిధి, ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, మమతాబెనర్జీ, శరద్పవార్, నవీన్పట్నాయక్లలో ఎవ్వరూ ఇంతటి కపట రాజ కీయ విన్యాసాలు చేయలేదు. ఇందిరాగాంధీతో, వాజపేయితో, సోనియాగాం ధీతో రాజకీయంగా పట్టువిడుపులతో వ్యవహరించినవారు ఉన్నారు కానీ అ«ధికారంలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడిలాగా హుంకరించడం, ఎన్నికలలో పొత్తుపెట్టుకున్న మిత్రపక్షాల అభ్యర్థులను ఓడించడం, చేస్తున్నదానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం వారిలో ఎవ్వరూ చేయలేదు. చంద్రబాబు వేదన చంద్రబాబు మనోవేదనను అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పనీ కావడం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. ముఖ్యమంత్రిని వేధిస్తున్న నాలుగు అంశాలూ చాలా కీలకమైనవి. ఒకటి–ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి. రెండు–పోలవరం ప్రాజెక్టు. మూడు– రాజధాని నిర్మాణం. నాలుగు– అసెంబ్లీ స్థానాల పెంపుదల. ప్రాధమ్య క్రమంలో తేడా ఉండవచ్చును కానీ ఈ నాలుగూ ఆయనను కుంగదీస్తున్న సమస్యలు. పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, తానూ, వెంకయ్యనాయుడూ తిరుపతిలో ఒకే వేదికపైన చేసిన హామీ నీరుగారిపోయింది. తీరా ఢిల్లీలో, అమరావతిలో బీజేపీ, టీడీపీలు కలసి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యేక హోదాలో అంత ప్రత్యేకత ఏమీ లేదనీ, అది సంజీవని కాదనీ, దానితో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారనీ కేంద్రానికి వంతపాడుతూ ముఖ్యమంత్రి కొంతకాలం కాలక్షేపం చేశారు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ సైతం రాలేదంటూ తేల్చిపారేశారు. ఇతర రాష్ట్రాలతో సమానమైన స్థాయిని సాధించే వరకూ ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలంటూ వాదిం చారు. కానీ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు సాధించడంలో దారుణంగా విఫలమైనారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య విశ్వాసరాహిత్యం కనిపిస్తోంది. ఈ సమస్యను చంద్రబాబు అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుది స్వయంకృతాపరాధం. విభజన చట్టం ప్రకారం పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఆంధ్రప్రదేశ్కు అప్పగించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాల్వల తవ్వకం చాలావరకూ పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి చేయవలసిందిగా కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావలసిన ముఖ్యమంత్రి తానే ప్రాజెక్టు శేషభాగాన్ని పూర్తి చేస్తానంటూ తనది కాని భారం నెత్తికెత్తుకున్నారు. అప్పుడైనా తన శక్తియుక్తులన్నీ అందుకోసమే వినియోగిస్తే ఆక్షేపించే అవసరం ఉండేది కాదు. ఆ విధంగా చేయకుండా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నెలకొల్పి గొప్ప ప్రాజెక్టు నిర్మించినట్టూ, నదుల అనుసంధానం చేసేసినట్టూ అట్టహాసంగా పదేపదే పండుగలు చేసుకున్నారు. అది చాలదన్నట్టు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా నిర్మించారు. ఈ స్కీంలు తోడే గోదావరి నీళ్ళు పోలవరం కాల్వల ద్వారానే ప్రవహిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు స్కీంల అవసరం ఉండదు. వాటిపైన ఖర్చు చేసిన రూ. 3,000 కోట్లు శుద్ధ దండగ. ఈ రెండు మైనర్ ప్రాజెక్టులు మినహా రాష్ట్రంలో తెలుగుదేశం–బీజేపీ సంకీర్ణ సర్కార్ సాధిం చిన ఘనకార్యం ఏదీ లేదు. ఇప్పుడు పోలవరం సైతం వివాదాలలో చిక్కుకుంది. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం లేదు. శ్వేతపత్రం ప్రచురించమంటే ససేమిరా అంటోంది. కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తాననీ, అన్ని నిర్ణయాలూ తీసుకుంటామనీ అంటున్నారు కానీ రావడం లేదు. వాయిదాలు వేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ను నియమించాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు గడ్కరీ గండి కొట్టారు. ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్ళి గడ్కరీని సుముఖం చేసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా ప్రాజెక్టు ప్రదేశంలో పూచికపుల్ల కదలడం లేదు. తిరగని చక్రం రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు విధేయవర్గం. రెండోది వ్యతిరేకవర్గం. లెక్కలు చెప్పాలనీ, అవినీతి తగ్గాలనీ వాదిస్తున్న బీజేపీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకులు. విధేయవర్గం నాయకులు తెలుగుదేశం ఎంపీలను తీసుకొని ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఆ తర్వాతనే ఢిల్లీ రావలసిందిగా చంద్రబాబుకు ప్రధాని ఆహ్వానం అందింది. ప్రధాని–ముఖ్యమంత్రి సమావేశం అంత సంతోషదాయకంగా ముగిసినట్టు లేదు. సమావేశం జరిగి వారం రోజులు కాకముందే సుప్రీంకోర్టుకు వెడతాం అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించడం దేనికి సంకేతం? అలా అనడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని మర్నాడు సంజాయిషీ చెప్పడం ఎందుకు? విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానానికి వెడితే ఎవరికి నోటీసులు అందుతాయి? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికే కదా? అంటే కేంద్రంపైన రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్టే కదా! అంత పని చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని వాదిస్తే ఎట్లా కుదురుతుంది? పోలవరం పీటముడి విడిపోయి ఎన్నికల లోపు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు చంద్రబాబు తనను తానే నిందించుకోవాలి. రాజధాని నిర్మాణంపై చెప్పుకోవలసింది ఏమున్నది? మూడేళ్ళపాటు సింగపూర్ చుట్టూ ప్రదక్షిణల తర్వాత డిజైన్లు ఖరారు చేశారని మాత్రం చెప్పుకోవచ్చు. శాశ్వత ప్రాతిపదికపైన నిర్మాణం ఆరంభం కాలేదు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు తాత్కాలికమైనవే అయినా వాటి నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. అందుకు కారణాలు ఊహించుకోవలసిందే. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ‘మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను, వ్యాపారవేత్తలను చేస్తాను’అంటూ హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ రైతుల చుట్టూ తిరిగి ల్యాండ్బ్యాంక్ తయారు చేసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. ఆయన విదేశాలకు వెళ్ళి తన దగ్గర ల్యాండ్బ్యాంక్ ఉన్నదనీ, పరిశ్రమలు పెడితే భూమి ఉదారంగా ఇస్తాననీ చెబుతున్నారు. ఇటు భూములు ఇచ్చిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనే సంకల్పంతో మూడున్నర సంవత్సరాలు ఒక్క ఇటుక కూడా పేర్చకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న చంద్రబాబు పైకి గంభీరంగా కనిపించినా మనసులో బెంగటిల్లుతూ ఉండాలి. అందుకే మాటలు తూలడం. వెంటనే సర్దుకోవడం. సమతౌల్యం కోల్పోవడం ఇందుకు ప్రధాన కారణం. నయాపైస లేకుండా కేవలం తన తెలివితేటలతో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ చెప్పుకున్న బాబు చేష్టలుడిగినట్టు కనిపిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా? అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కూడా ఆయన ప్రయత్నాలు ఫలించినట్టు లేదు. ప్రతిపక్షానికి చెందిన రెండు డజన్ల శాసనసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు వచ్చే ఎన్నికలలో అసమ్మతి సెగ తగలకుండా ఉండాలంటే 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నాయకులకు టికెట్లు ఇవ్వాలి. అందుకు అదనపు స్థానాలు కావాలి. అందుకే స్థానాల పెంపు ఆ పార్టీకి ముఖ్యం. కానీ బీజేపీకి ఇది ప్రధానాంశం కాదు. దానికి పార్లమెంటు స్థానాలు ముఖ్యం. కేంద్ర పథకాలకూ, కేంద్రం సహాయంతో అమలు చేసే పథకాలకూ తన పేరూ లేదా ఎన్టిఆర్ పేరూ పెట్టుకుంటున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి నిధులు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులే వాదిస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ స్థానాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇందుకోసం హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి అనేక విడతలు కలుసుకున్నారు. మొన్న ప్రధానికి బాబు చేసిన వేడుకోళ్ళలో ఇది ప్రధానమైనది. మోదీ మన్నిస్తారో లేదో మరి. చంద్రబాబు 1995–2004 మధ్య ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఆయన శైలి ఇదే విధంగా ఉండేది కానీ ఇన్ని రకాల వైఫల్యాలు లేవు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఐకె గుజ్రాల్ని ప్రధాని పీఠంపైన కూర్చోబెట్టారు. చంద్రబాబు కోసం వాజపేయి తన పదవీకాలాన్ని కుదించుకొని ముందస్తు ఎన్నికలకు అంగీకరించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తర్వాత ప్రజలలో తన పట్ల సానుభూతి వెల్లువెత్తిందనే అభిప్రాయంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమై వాజపేయిని సైతం ఒప్పించారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఊహించగలమా? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి? తెలంగాణ ఇస్తే టీడీపీకి అభ్యంతరం లేదని ప్రణబ్ముఖర్జీ కమిటీకి లేఖ రాసి, దమ్ముంటే రాష్ట్రాన్ని విభజించమంటూ సోనియాగాంధీని సవాలు చేసిన చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం అన్యా యంగా, అశాస్త్రీయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ వాపోతున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపైన చర్చలో తెలుగుదేశం సభ్యులు పాల్గొని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి, సవరణలు సూచించి, వాటిని ఆమోదించకపోతే యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం ఉంది. విభజన క్రమంలో ఆంధ్ర ప్రాంతానికి రావలసిన రక్షణల కోసం పోట్లాడకుండా ఇప్పుడు యూపీఏని విమర్శించడం చంద్రబాబు మార్కు రాజకీయం. ప్రత్యేకహోదా హామీని బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు సాధించారు కానీ తెలుగుదేశం ఎంపీలు కాదు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండాలి. గడువు ముగిసే లోగా అన్ని వసతులూ కలిగిన రాజధాని నగరం నిర్మించుకొని అక్కడికి తరలి వెళ్ళవచ్చు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందో లేదో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించి కట్టుబట్టలతో పంపించారంటూ యూపీఏని నిందించడం కపట రాజకీయం. తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం అమలు చేయడానికీ, తెలంగాణలో టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ ఎంఎల్ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడానికీ కారణం ఒకానొక భ్రమ. రెండు రాష్ట్రాలలోనూ తన ప్రాబల్యం ఉండాలనీ, తానే రాజ్యం చేయాలనే ఆకాంక్ష. ఇది అసాధ్యమని అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తెలుసుకోలేకపోవడం విచిత్రం. తాను రాజకీయ, నైతిక విలువలను తుంగలో తొక్కి, ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసి ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎంఎల్ఏలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాజేశారు. చివరికి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే మంచిదని మోత్కుపల్లి నరసింహులు సలహా ఇచ్చే వరకూ పరిస్థితి వచ్చింది. తెలంగాణ నుంచి ఆకస్మికంగా నిష్క్రమించడానికీ, ప్రధానమంత్రితో గట్టిగా మాట్లాడలేకపోవడానికీ, ఎన్ని అవమానాలు జరిగినా ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించకపోవడానికీ ఒకే ఒక కారణం ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమే. ఆ దుస్సాహసం వెనుక దురాశ, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అనైతిక రాజకీయం ఉన్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఉన్నది. కానీ ధైర్యం చాలడం లేదు. అందుకే మాట తూలడం, నాలిక కరుచుకోవడం. కె. రామచంద్రమూర్తి -
దిద్దుబాటే శ్రేయస్కరం
సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు మీడియాతో మాట్లాడటమే అపూర్వమైన అంశం అయితే వారు అందించిన సందేశం దిగ్భ్రాంతికరమైనది. జస్టిస్ లోధా, జస్టిస్ ఠాకుర్ వంటి మాజీ ప్రధాన న్యాయమూర్తులూ, మాజీ సొలిసిటర్ జనరల్ సోలీ సొరాబ్జీ వంటి న్యాయకోవిదులూ ఈ పరిణామం దురదృష్టకరమైనదనీ, అవాంఛనీయమైనదనీ అభివర్ణించారు. న్యాయమూర్తులు చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయనీ, న్యాయవ్యవస్థను వేధిస్తున్న సమస్యలను వెల్లడిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయం కూడా ఉంది. సుప్రీంకోర్టులో అనుభవం రీత్యా, పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రా తర్వాత అగ్రగణ్యులైన నలుగురు న్యాయమూర్తులు సంప్రదాయం, నియమావళి పేరుతో తమను కట్టిపడవేసిన బంధనాలను తెంచుకొని, తెగించి ప్రజల ముందుకు వచ్చారంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రజలే కాపాడుకోవాలనీ వారు చెప్పారంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తిని కలసి సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. బహుశా రాష్ట్రపతిని కలసి ఆయనకు సమస్యను నివేదించి ఉంటే ప్రయోజనం ఉండేదేమో! నలుగురూ నిష్ణాతులే ఇప్పుడు వివాదం సృష్టించడం వల్ల ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేదు. పైగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చే అక్టోబర్ 2న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అలంకరించే అవకాశం ఉన్న రంజన్ గొగోయ్ తక్కిన ముగ్గురితో గొంతు కలపడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టదాయకంగా పరిణమించవచ్చు. జస్టిస్ చలమేశ్వర్ పదవీ కాలం ఈ యేడాది జూన్ 22తో ముగుస్తుంది. జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29 వరకే పదవిలో ఉంటారు. జస్టిస్ లోకుర్ సైతం డిసెంబర్ 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. నెలా, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోయే వారిని ప్రధాన న్యాయమూర్తి పీఠంపైన కూర్చో»ñ ట్టే సంప్రదాయం లేదు కనుక 2019 నవంబర్ 17 వరకూ పదవీకాలం కలిగిన గొగోయ్కి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ముగ్గురు సహచరులతో కలసి తిరుగుబాటు చేయడం నిజంగా సాహసమే. జస్టిస్ చలమేశ్వర్ చెప్పినట్టు, భావితరాలు తమను తప్పుపట్టకుండా తగిన సమయంలో ప్రశ్నించవలసిన బాధ్యతను నెరవేర్చామని గొగోయ్ సైతం భావిం చారు. జాతి రుణం తీర్చుకుంటున్నామని స్వయంగా చెప్పారు. ఇది ఎంతో గంభీ రమైన విషయం కాకపోతే అంత బరువైన మాటలు న్యాయమూర్తులు ఉపయోగించేవారు కాదు. సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండే నైజం గొగోయ్కి ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ను కోర్టు ధిక్కార నేరంపైన జైలుకు పంపించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగపీఠంలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. చీఫ్ జస్టిస్ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ (నెంబర్ 2) నిష్కర్షగా వ్యవహరించి వివాదాలకు కేంద్రమైనారు. న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (నేషనల్ జుడిషియల్ అపాయంట్మెంట్స్ కమిషన్–ఎన్జెఎస్సి) ప్రమేయంతో జరగాలని భావించి మెజారిటీ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం 2015 డిసెం బర్ 16న వెలువరించిన తీర్పులో తన అసమ్మతిని జస్టిస్ చలమేశ్వర్ (1:4) నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో 66(ఎ) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడం ద్వారా భావ ప్రకటనాస్వేచ్ఛకు దన్నుగా నిలిచారు. కొలీ జియం వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ పారదర్శకంగా ఉండాలని వాదించే ప్రముఖులలో చలమేశ్వర్ ప్రథములు. సీనియారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న లోకుర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా కూడా ఉన్నారు. రాజకీయవాదులు మతం పేరుతో ఓట్లు అడగరాదంటూ ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తులలో ఆయన ఒకరు. అయిదో స్థానంలో ఉన్న కురియన్ త్రిపుల్ తలాఖ్ చెల్లనేరదని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి. ఈ నలుగురూ మీడియాతో మాట్లాడటాన్ని తప్పు పట్టినవారు సైతం వారి రుజువర్తనం, నిజాయితీ, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, ధర్మనిరపేక్షత, నిబద్ధత పట్ల లవలేశమంత సందేహం వెలిబుచ్చలేదు. ముదిరిన విభేదాలు కడచిన రెండు మాసాలలో సంభవించిన కొన్ని పరిణామాలు ఒకానొక అసాధారణ పరిస్థితిని సృష్టించాయి. ఒకటి, ఉత్తరప్రదేశ్లో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు నడిపే మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కుంభకోణంపైన రగిలిన వివాదం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్లు అన్యాపదేశంగా ఆరోపించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను పురస్కరించుకొని ఈ కేసు విచారణకు ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో ఒక బెంచ్ని నెలకొల్పుతూ జస్టిస్ చలమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, చలమేశ్వర్ ఏర్పాటు చేసిన బెంచ్ని రద్దు చేసి ఆయన స్వయంగా తన ఆధ్వర్యంలోనే ఒక బెంచ్ని నియమించారు. ‘చీఫ్ జస్టిస్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అని ఏ కేసు ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందంటూ 1998లో రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు నెలకొల్పిన సంప్రదాయాన్ని జస్టిస్ దీపక్మిశ్రా గుర్తు చేశారు. నిజానికి చీఫ్ జస్టిస్ సమానులలో ప్రథముడే (ఫస్ట్ ఎమాంగ్ ఈక్వెల్స్) కానీ అందరి కంటే అధికుడు కారని నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. తక్కినవారంతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులైతే (జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు) చీఫ్ జస్టిస్ దేశానికి ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా). అంతమాత్రాన విశేషాధికారాలను వినియోగించే క్రమంలో పక్షపాతం కానీ స్వప్రయోజనాలు కానీ ఉన్నట్టు కనిపిస్తే ప్రధాన న్యాయమూర్తిని సైతం ప్రశ్నించే అధికారం న్యాయమూర్తులకూ, న్యాయవాదులకూ, సామాన్య పౌరులకూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏదైనా కేసు విచారించేందుకు నియమించిన పీఠాన్ని విస్తరించాలంటే కొత్తగా కొందరు న్యాయమూర్తులను చేర్చుతారు కానీ ఉన్నవారిని తొలగించరు. ఉదాహరణకు ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్ని విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల బెంచ్గా విస్తరించాలంటే కొత్తగా ముగ్గురిని నియమిస్తారు కానీ, మొదటి ఇద్దరిలో ఎవ్వరినీ తొలగించరు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మెడికల్ కుంభకోణం కేసు విచారించడానికి జస్టిస్ మిశ్రా నియమించిన బెంచ్లో జస్టిస్ చలమేశ్వర్ లేరు. రెండు, గుజరాత్ పరిణామాలకు సంబంధించి సోహ్రాబుద్దీన్ అనే వ్యక్తిని ‘బూటకపు ఎన్ కౌంటర్’ చేశారనే ఆరోపణను విచారిస్తున్న సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసు. నాగపూర్లో తన సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితులలో 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో లోయా మరణించారు. ఈ కేసు ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా నిందితుడు. అనంతరం షా పేరు నిందితుల జాబితా నుంచి తొలగించారు. లోయా మరణానికి సంబంధించిన కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులో నడుస్తుంటే దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఒక పిటిషన్ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తులకు కాకుండా సీనియారిటీ జాబితాలో పదో స్థానంలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్కి పోస్ట్ చేశారు. లోయా పోస్ట్మార్టం రిపోర్ట్నూ, ఇతర పత్రాలను సుప్రీం కోర్టులో జనవరి 15 నాడు సమర్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కౌన్సెల్ నిశాంత ఆర్ కర్నేశ్వార్కర్కు సుప్రీంకోర్టు పురమాయించింది. సాధారణంగా హైకోర్టులో విచారించవలసిన అంశాలు సుప్రీంకోర్టుకు వస్తే ముందు హైకోర్టుకు వెళ్ళండి అని పిటిషనర్లను న్యాయమూర్తులు ఆదేశిస్తారు. లోయా కేసు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పైగా బొంబాయ్ లాయర్ల సంఘం ఈ కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులోనే జరగాలని కోరుతోంది. ఈ సంఘం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముంబయ్కి చెందిన జర్నలిస్టు బీఆర్ లోన్ తరఫున ఇందిరా జైసింగ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ వకీలుగా వరీందర్ కుమార్ శర్మ మరో పిటిషన్ వేశారు. వీరందరి ప్రార్థనా ఒక్కటే. ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించవద్దు, బొంబాయ్ హైకోర్టులో విచారణ కొనసాగించాలి. ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసును సీనియర్ల నాయకత్వంలోని బెంచ్కి అప్పచెప్పకుండా జూనియర్కు పంపించడం వివాదాస్పదం అయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ సమానులే. సీనియర్, జూనియర్ అనే భేదం లేదు. కానీ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసులు సీనియర్లకు కేటాయించడం రివాజు. ప్రధాన న్యాయమూర్తిదే బాధ్యత ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారక ముందే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సోమవారం నుంచి తాము యథావిధిగా సుప్రీంకోర్టుకు వెడతామని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. శనివారంనాడు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల సమావేశాలు జరిగాయి. బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయమూర్తులు మీడియాను కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. వివాదం పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. లోయా కేసులో క్షుణ్ణంగా విచారణ జరగాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ వ్యాఖ్యానించడం అనవసరమైన రాజకీయ జోక్యమంటూ విమర్శించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతించింది. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడటం పట్ల బార్ అసోసియేషన్ అభ్యంతరం చెప్పలేదు కానీ పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. లోయా కేసు సహా అన్ని ‘పిల్’లనూ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలోని బెంచ్లే విచారించాలని బార్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉంది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేస్తుందని నిర్ణయించిన అనంతరం ఆ నిర్ణయం అమలు జరగాలంటే సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒక ఒప్పంద పత్రం (మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్–ఎంఓపీ) ఉండాలి. ఈ పత్రాన్ని తయారు చేయడంలో సహకరించడానికి అటార్నీ జనరల్ ముకుల్ రోహట్గీ నిరాకరించినప్పుడు ‘మీరు అటార్నీ జనరల్ దేశానికా లేక ప్రస్తుత ప్రభుత్వానికా?’ అంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఎద్దేవా చేశారు. ఎంఓపీని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపి నెలలు గడిచిపోతున్నా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తిగా తనను నియమించడానికి నిరాకరించారంటూ లూత్రా అనే న్యాయవాది వేసిన పిల్పైన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్తో కూడిన బెంచ్ తీర్పు ఇస్తూ ఎంఓపీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయి కోర్టులలో ఖాళీలు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైతే, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే న్యాయమూర్తులు తమ వంతు కర్తవ్యం నెరవేర్చినట్టే. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రా పెద్దమనసుతో నిర్వహించాలి. న్యాయమూర్తులనూ, న్యాయవాదులనూ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రధానంగా ఆయనదే. కె. రామచంద్రమూర్తి -
విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం
సాక్షి, విజయవాడ: విజయవాడలో 29వ పుస్తక మహోత్సవం నేడు ప్రారంభమైంది. 28 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవం ఈ ఏడాది కోత్త హంగులతో కొలువుదీరింది. ఈ సందర్భంగా స్వరాజ్ మైదాన్లో ‘ నన్ను ప్రభావితం చేసిన పుస్తకం’ అనే అంశంపై సదస్సి జరిగింది. ఈ సరస్సుకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులతో వారికి నచ్చిన పుస్తకం పై మాట్లాడించాలనేది మంచి ఆలోచన. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశం ప్రేరణ కలిగిస్తుంది. ఈ ప్రేరణ తో తమ జీవనశైలిని మార్చుకునే వారే తమ లక్ష్యం సాధిస్తారు. దేశ, విదేశాల్లో అనేక ఉద్యమాలను నడిపిన వారికి పుస్తకాలే ప్రేరణ కలిగించాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మందిని ప్రభావితం చేసినవి కూడా పుస్తకాలే. సమాజాన్ని, దేశాన్ని అర్ధం చేసుకోవడానికి పుస్తకాలు దోహదం చేశాయి. ఇప్పుడు పుస్తకానికి, రాజకీయానికి మధ్య దూరం పెరుగుతోంది. పుస్తక స్పర్శ తెలియని రాజకీయ నాయకులకు, పుస్తకాల ద్వారా జ్ఞానం ఆర్జించిన నేతలకు మధ్య తేడా తెలిసిపోతోంది’ అని ఆయన అన్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్షీపతి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం నేటి నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. -
మెడ మీద కత్తి వేలాడుతోంది..!
త్రికాలమ్ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉన్నది. వేటు పడుతుందనే భయం పీడిస్తూనే ఉంది. కొన్ని తలలు తెగిపడటం చూస్తూనే ఉన్నాం. మనవంతు ఎప్పుడనేదే ప్రశ్న. భయంభయంగానే జీవిస్తూ ఏడాది చివరికి క్షేమంగా చేరుకున్నాం. ఒక సంవత్సరం ఈ రోజు కాలగర్భంలో కలిసిపోతోంది. కొత్త ఆశలు మోసుకొని రేపు నూతన సంవత్సరం ఉదయిస్తుంది. కడచిన ఏడాది పాడవునా జీవితం నిజంగానే అంత భయంకరంగా ఉన్నదని కాదు. కొన్ని ఘనకార్యాలు జరగకపోలేదు. సంతోషం కలిగించిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఏదో ఎడతెగని బెంగ. దశాబ్దాలుగా అనుభవించిన స్వేచ్ఛ కోల్పోతున్నామనే బాధ. భయపడుతున్నదంతా నిజంగా జరిగిపోతుందేమోనన్న ఆందోళన. ఏమి అంటే ఏమి జరుగుతుందో, ఏమి ఆపాదిస్తారో, ఏ నింద వేస్తారో, ఏమని బెదిరిస్తారో అని దడ. జరగరానిది జరిగితే పరిస్థితులు ఇంకా ఎంతకి దిగజారుతాయోనన్న విహ్వలత. ఎంచిన కీడు జరగనందుకు ఒకింత ఊరట. ఏడాది పొడవునా ఇదే డోలాయమానం. ఈ సంవత్సరం ఎట్లా ఆరంభమైనదో అంతకంటే ఆందోళనకరంగానే అంతం అవుతోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో ప్రారంభమైన దిగులు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి భయంగా రూపాంతరం చెందింది. రాజీలేని సమర్థులైన నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇందిరాగాంధీని అందుకే ఆరాధించారు. ఇప్పుడు నరేంద్రమోదీనీ అభిమానిస్తున్నది ఆ కారణంగానే. పెద్దనోట్ల రద్దువంటి పొరబాటు నిర్ణయం తీసుకున్నా సరే, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) అమలులో తొందరపాటు ప్రదర్శించినా సరే ప్రజలు మోదీని గద్దె దింపాలనుకోవడం లేదు. రాహుల్ శైలిలో పరివర్తన రాజకీయాలకు సరిపోడనుకున్న రాహుల్గాంధీ అమెరికా పర్యటన, గుజరాత్ ఎన్నికల ప్రచారం తర్వాత ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎంతో కొంత ఎదిగాడు. ప్రజల తప్పు ఎప్పుడూ లేదు. ఎవరికి తగిన గౌరవం వారికి ఇస్తారు. మధ్యతరగతి మేధావులను విశేషంగా ఆకట్టుకున్న మోదీ వారికే కొన్ని సందర్భాలలో నిద్రలేకుండా చేస్తున్నారు. ఇంతకు పూర్వం దేశాన్ని పాలించిన ప్రధానులు ఎవ్వరూ ప్రదర్శించని సాహసం మోదీలో కనిపిస్తుంది. ప్రమాదపుటంచుల్లో విన్యాసం చేయడం ఆయనకు వినోదం. ప్రతి ఎన్నికనూ ఒక ప్రతిష్ఠాకరమైన యుద్ధంగా పరిగణించడం, పోరాటంలో గెలుపొందేందుకు ఎంతకైనా తెగించడం, సరిహద్దులను దాటడం, మెరుపుదాడులు నిర్వహించడం మోదీ ప్రత్యేకత. దశాబ్దాలపాటు అనుసరించిన మర్యాదలను ఉల్లంఘించి ప్రత్యర్థులపైన అనూహ్యమైన దాడులు చేయడం మోదీ ప్రత్యేకత. మతం మాట ఎత్తకుండా మత ప్రాతిపదికపైన ఓటర్లను చీల్చడం మోదీ విజయ రహస్యం. వికాసం అంటూ మొదలయ్యే ప్రచారం అనివార్యంగా వికారంతో ముగుస్తుంది. బీజేపీకి విజయం ప్రసాదిస్తుంది. 2017లో ఆరు రాష్ట్రాలలో ఎన్నికలను బీజేపీ గెలుచుకోవడానికి ప్రధాన కారణం మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాల యుద్ధతంత్రం. ప్రతి గ్రామంలో గోరీల దొడ్డి మాత్రమే కాదు స్మశానవాటిక కూడా ఉండాలనడం, రంజాన్ రోజున విద్యుచ్ఛక్తి సరఫరా నిరంతరాయంగా ఉంటే దీపావళి పండుగనాడు సైతం ఉండాలనడం పరోక్షంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే. ఉత్తరప్రదేశ్లో ఈ వ్యూహంతో ఘనవిజయం సాధించిన తర్వాత అదే సూత్రాన్ని అవసరమైన చోట్ల, అవసరమైన మోతాదుల్లో వినియోగిస్తున్నారు. గుజరాత్లో ఈసారి గెలుపు అంత సులువు కాదని గ్రహించిన మోదీ సరిహద్దు అతిక్రమించి మాజీ ప్రధానిపైనా, మాజీ ఉపరాష్ట్రపతిపైనా మెరుపుదాడి చేశారు. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెచ్చిపోయారు. తనను అంతం చేయడానికి అయ్యర్ పాకిస్తాన్ వెళ్ళి ‘సుపారీ’ఇచ్చారని ఆరోపించారు. అయ్యర్ ఢిల్లీ నివాసంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కసూరీకి ఇచ్చిన విందులో పాకిస్తానీయులతో కలసి మన్మోహన్, హమీద్ అన్సారీలు గుజరాత్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలలో సత్యం లవలేశం లేదని అందరి కంటే బాగా మోదీకే తెలుసు. కానీ వీరంతా కుట్ర పన్ని సాటి గుజరాతీకి అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగించాలి. హిందువుల కోసం బీజేపీ పాటుపడుతున్నట్టు నమ్మించాలి. గుజరాత్ ఎన్నికల సమయంలోనే శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధిస్తానంటూ బయలుదేరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో చర్చలు జరిపారు. హిందూమత సంస్థలు రామాలయ నిర్మాణం గురించి వరుస ప్రకటనలు చేశాయి. ఆ ఎన్నికల తర్వాత రామాలయం ఊసు లేదు. çపద్మావతి చిత్రంపై లేనిపోని రభస సైతం గుజరాత్ కోసం ఉద్దేశించిందే. ఆ విధంగా స్థాయి మరచి ప్రధాని ప్రచారం చేయకపోతే అక్కడ ఆరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు. మధ్యతరగతిలో అసహనం నిర్హేతుకమైన మీడియా ధోరణులను మధ్యతరగతి ప్రజలు ఆమోదించడానికి సమాజంలో పెరుగుతున్న అసహసం కారణం. ఇందుకు బీజేపీని మాత్రమే నిందించడం సరికాదు. కాంగ్రెస్ దోషం చాలా ఉంది. షాబానో కేసులో ఇస్లామిక్ ఛాందసవాదులకు కొమ్ముగాసి, బాబరీ మసీదు–రామజన్మభూమి వివాదంలో శిలాన్యాస్ను అనుమతించి హిందువులను మెప్పించడానికి ప్రయత్నించడం వల్ల రాజీవ్గాంధీ కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బతీశారు. ఇప్పుడు రాహుల్గాంధీ దేవాలయ సందర్శన, జందెం వేసుకున్న బ్రాహ్మణుడనంటూ చెప్పుకోవడం, రుద్రాక్షమాల ధరించడం ఎందుకు? తానూ హిందువునేనని చాటుకునేందుకు. అసలు హిందువు ఉండగా నకిలీ హిందూ ఎందుకని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ఇదే వైఖరి కొనసాగిస్తే హిందూత్వ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మైనారిటీలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించలేరు. బీజేపీకి బి–టీమ్గా మారితే అది ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ను అటువంటి దయనీయ స్థితికి బీజేపీ నెట్టగలిగింది. సెక్యులరిజం సిద్ధాంతం వల్లించడానికి కాంగ్రెస్ నేతలు భయపడే వాతావరణం కల్పించడంలో మోదీ విజయం సాధించారు. రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులరిజం’అనే మాటను తొలగిస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నది నోరుజారి కాదు. దాని వెనుక వ్యూహం ఉంది. ఇందులో కర్ణాటక ఓటర్లకు ఒక సందేశం ఉంది. మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హంతకులను ఇంతవరకూ పట్టుకోలేదు. సెప్టెంబర్లో హత్య జరిగినప్పటికీ ఇంత వరకూ అక్కడి కాంగ్రెస్ సర్కార్ హత్య కేసును ఛేదించలేకపోయింది. రాజస్థాన్లో ఒక ముస్లింని వెంటాడి, నరికి, దహనం చేసినప్పుడు సైతం పెద్దలు ఎవ్వరూ పెదవి విప్పలేదు. ఇటువంటి దురంతాలను ఖండించడానికి సంకోచించే వాతావరణం కలవరపెడుతోంది. అదే సమయంలో ముమ్మారు తలాఖ్ను నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం మంచి పని. బిల్లులోని లోటుపాట్లను సవరించుకుంటే మంచిది. డెబ్బయ్ సంవత్సరాల స్వతంత్రం ముస్లిం మహిళలకు ప్రాథమిక హక్కు ఇవ్వలేకపోయిందన్న అపరాధ భావనను మోదీ సర్కార్ తొలగించింది. ఎగువ, దిగువ సభలలో సంఖ్యాబలం ఉన్న దశలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ సాహసం చేయలేదు. ఇందిరాగాంధీ కఠినమైన నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. కానీ ఈ ఆలోచన ఆమెకు రాలేదు. ఓటు బ్యాంకు రాజ కీయం వల్లనే ముస్లిం మహిళలను నిర్లక్ష్యం చేశారంటూ బీజేపీ చేస్తున్న విమర్శను ఖండించడం కష్టం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చితే కేంద్ర సర్కార్ అవినీతి కుంభకోణాలకు దూరంగానే ఉంది. అందుకు కూడా మోదీని అభినందించాలి. లోక్సభలో బీజేపీ స్వయంగా మెజారిటీ కలిగి ఉండటం, మిత్రపక్షాలపైన ఆధారపడి లేకపోవడం మోదీకి కలిసి వచ్చిన అంశాలు. ఈ వెసులుబాటు వాజపేయికి కానీ మన్మోహన్సింగ్కు కానీ లేదు. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరిగే దేశంలో ప్రధాని స్వయంగా మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా విజయం సాధించగలమని భావించడమే భయం కలిగిస్తున్న ధోరణి. ముస్లిం జనాభాలో సగంమంది (మహిళలు) తలాఖ్ బిల్లు ఫలితంగా బీజేపీ మద్దతుదారులుగా మారితే మైనారిటీల పట్ల వ్యతిరేక ధోరణి రాజేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. మోదీ ఎవ్వరినీ సంప్రదించరనీ, ముఖ్యమంత్రులను కలుసుకోరనీ, కలుసుకున్నా వారితో చనువుగా మాట్లాడరనీ, మంత్రిమండలి సహచరులు సైతం ఆయనతో మనసు విప్పి మాట్లాడటానికి సంకోచిస్తారనీ అంటారు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశమే. తెలుగు రాష్ట్రాల అధినేతలు డిటో కొన్ని విషయాలలో మోదీ అడుగుజాడల్లోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నడుస్తున్నారు. తిరుగులేని నాయకులుగా పేరు తెచ్చుకోవాలన్న అభిలాషతో ప్రజల ప్రాథమిక హక్కులను హరించేందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. సభలు జరుపుకోవడానికీ, ఉద్యమాలు చేయడానికీ, నిరసన ప్రకటించడానికీ పోలీసు అనుమతి కావాలి. సభ తలపెడితే గృహ నిర్బంధాలూ, అరెస్టులూ, వేధింపులూ రివాజుగా మారాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బృహత్ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనంతరం నిర్మాణం జరుగుతోంది. ఏమి జరిగినా అధినేత అభీష్టం మేరకు జరగవలసిందే. ఒకరిని సంప్రదించడం కానీ ఒకరు చెప్పిన సలహాని స్వీకరించడం కానీ లేదు. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నదే. రెండు రాష్ట్రాల అధినేతలూ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి బాహాటంగా అప్రజాస్వామిక ధోరణిని ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి విధేయంగా ఉంటూ కేసుల దర్యాప్తులో ఆగమంటే ఆగుతున్నారు. సాగమంటే ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో నోటుకు ఓటు కేసు కానీ, నయీం డైరీల ఉదంతం కానీ, డ్రగ్స్ మాఫియా కానీ, మియాపూర్ భూముల వివాదం కానీ కొలిక్కిరాలేదు. మియాపూర్లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని ముఖ్యమంత్రి ప్రకటిస్తే నమ్మవలసిందే. డ్రగ్స్ వినియోగదారులను కాకుండా అక్రమ విక్రయదారులనూ, బ్రోకర్లనూ పట్టుకొని శిక్షించాలని పోలీసు అధికారులు కొత్త సూత్రం చెబితే అంతే కామోసు అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇంత కంటే దారుణం. శేషాచలం అడవులలో కూలీలను కాల్చి చంపిన కేసులో నేరనిర్ధారణ జరగలేదు. విశాఖ భూకుంభకోణంపైన వేసిన ‘సిట్’ విచారణ అనంతంగా సాగుతోంది. గోదావరి పుష్కరాల ఘట్టంలో ముఖ్యమంత్రి సమక్షంలో లఘుచిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో రెండు పదులకుపైగా భక్తులు చనిపోవడంపై విచారణ, నిర్ధారణ లేదు. పోలవరం సబ్–కాంట్రాక్టర్లకు వందల కోట్ల పనులు నామినేషన్పైన ఎందుకు ఇచ్చారంటే సమాధానం లేదు. శ్వేతపత్రం ప్రకటించాలని హితుడు పవన్కల్యాణ్ అడిగినా లెక్కాపత్రం లేదు. కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు వివరాలు చెప్పమంటే తలాతోకా లేని లెక్కలు చెబుతున్నారు. కడచిన 42 మాసాలలో సాధించిన ఘనకార్యం లేదు. అమరావతి ఇంకా డిజైన్ల స్థాయి దాటలేదు. అసెంబ్లీ భవనం, సచివాలయం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు వగైరా నిర్మాణాలన్నీ తాత్కాలికమే. తెలంగాణలో ప్రతిపక్షం సంఘటితం కాలేదు. వాటి మధ్య బలమైన సైద్ధాం తిక విభేదాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఇప్పటి వరకూ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ నాయకుడు చేస్తున్న పాదయాత్రలో ప్రజలు విశేషంగా స్పందిం చడం కనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రతికూలత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల అధినేతల వ్యవహరణ శైలి వచ్చే సంవత్సరం మారిపోతుందనీ, వారు తమకు నచ్చిన విధంగా కాకుండా ప్రజలు మెచ్చే విధంగా వ్యవహరించాలనీ, అందరినీ కలుపుకొనిపోయే రాజకీయం చేయాలనీ, రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధిగా గౌరవించాలనీ కోరుకుందాం. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అన్న నన్నయ వాక్కు నిజం కాదని మన పాలకులు నిరూపిస్తారని ఆశిద్దాం. -- కె. రామచంద్రమూర్తి -
అంతులేని జాప్యంతో అనర్థం
త్రికాలమ్ దేశ రాజకీయాలనూ, న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులనూ, వాటిపైన వివిధ రాజకీయపార్టీలు చెబుతున్న భాష్యాలనూ గమనించినవారు ‘ఇదేమి రాజ్యం?’ అంటూ విస్తుపోతారు. రాజకీయపార్టీల తీరు పట్ల దిగ్భ్రాంతి చెందు తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వాకం చూసి నివ్వెరపోతారు. రాజకీయ నాయకుడిపైన ప్రత్యర్థి ఎవరో ఒకరు ఆరోపణ చేస్తారు. ప్రజా ప్రయోజనవ్యాజ్యం వేస్తారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతారు. న్యాయస్థా నాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆర్థికాంశాలకు సంబంధించిన కేసులైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో ప్రవేశిస్తుంది. పని ప్రారం భించి ఏళ్ళు గడిచినప్పటికీ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయదు. విచారణ ప్రారం భించిన సీబీఐ న్యాయస్థానాలు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చవు. వాయి దాలు వేస్తూపోతాయి. తీరా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు కానీ ప్రభుత్వం కానీ హైకోర్టులో సవాలు చేయడం తప్పని సరి. హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఒక కేసును పరిష్కరించాలంటే దశాబ్దా లకాలం పడుతుంది. దిగువ న్యాయస్థానం నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ కేసు ఎగబాకి వచ్చే సరికి నిందితులలో కొంతమంది మరణిస్తారు. నిజం నిగ్గు తేలుతుందన్న విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత సైతం పాత ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీడియా తిరిగి తిరగమోత పెట్టి అదే వార్తను వడ్డిస్తుంది. టీవీ సమర్పకులు (యాంకర్లు) రెచ్చిపోతారు. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలనే అస్త్రాలుగా వినియోగించుకొని ఎన్నికలు గెలుస్తారు. ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఆరోపణలపైన దర్యాప్తు పూర్తికాదు. ఈలోగా దర్యాప్తు జరిపిన అధికారులు ధర్మం, న్యాయం, విలువల గురించి దేశ విదేశాలలో ఉపన్యాసాలు ఇస్తారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిందంటూ ఉద్ఘాటించిన కాగ్ (వినోద్రాయ్) భువనేశ్వర్ నుంచి బోస్టన్ వరకూ ప్రసం గాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభియోగాలు రుజువు కాకపోతే ఆయన పూచీ లేదు. ఘాటైన విమర్శలు చేసి పాత ప్రభుత్వానికి పాతరేసినవారికి కొత్త పాలకులు పెద్దపీట వేస్తారు. న్యాయమూర్తులు దర్యాప్తు సంస్థలపైనా, ప్రభుత్వాధినేతలపైనా ధర్మాగ్రహం వెలిబుచ్చుతారు. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలియదు. అంతా అయో మయం. రాజకీయపార్టీలు వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే వాదిస్తాయి. పౌరులు సైతం వారి రాజకీయ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఏ వాదన ఆమోదిం చాలో, దేనిని తిరస్కరించాలో నిర్ణయించుకుంటారు. ఆలోచించవలసిన తీర్పులు ఒకే వారం వచ్చిన రెండు తీర్పులను పరిశీలిద్దాం. ఒకటి, 2జీ స్పెక్ట్రమ్ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు. రెండు, దాణా కుంభకోణం కేసులో మరో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం. 2జీ స్పెక్ట్రమ్ కేసు మన్మోహన్ నాయకత్వంలో యూపీ ఏ–2 ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించింది. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కుంభకోణంతో పాటు 2జీ స్కాం కలసి కాంగ్రెస్ను గంగలో కలి పాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఈ కుంభకోణాలను అత్యంత సమ ర్థంగా వినియోగించుకొని ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కాంగ్రెస్ను మట్టికరిపించారు. డీఎంకే మంత్రి ఏ రాజా రాజీనామా చేయవలసి వచ్చింది. జైలు ఊచలు లెక్కపెట్టవలసి వచ్చింది. డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి కనిమొళి కూడా జైలుకెళ్లారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2జీ కేసులో నిందితులందరినీ నిరపరాధులని నిర్ణయించ డంతో కాస్త ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. కానీ దీనిపై అప్పీలు చేస్తానని ఈడీ ప్రకటించింది. ఇంకా అయిపోలేదని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ కూడా హెచ్చరిస్తు న్నారు. బీజేపీ ప్రవక్తలందరూ ఇదే మాటపైన నిలబడి ఉన్నారు. ఉత్తి దుష్ప్ర చారం తప్ప వేరే ఏమీ లేదనీ, అవినీతి ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేననీ మన్మోహన్ వ్యాఖ్యానించారు. బీజేపీ సౌధం అసత్యం అనే పునాది పైన నిలిచి ఉన్నదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపైన తమకు విశ్వాసం ఉన్నదని ఇరు పక్షాలు నొక్కివక్కాణిస్తు న్నాయి. కానీ తమతమ ప్రయోజనాలకు తగినట్టు తీర్పును అన్వయిస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదం వల్ల ఖజానాకు రూ. 1.78 లక్షల కోట్లు నష్టం వచ్చినట్టు నాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్రాయ్ అంచనా వేశారు. ఈ అంచనాను విశ్వసించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్ సింఘ్వీ నాయకత్వం లోని ఇద్దరు సభ్యుల బెంచి రాజా మంజూరు చేసిన కేటాయింపులన్నిటినీ రద్దు చేసింది. ఆ కేసులో అవినీతి లేదా కుట్ర జరిగిందా లేదా అన్న అంశం తేల్చడం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బాధ్యత అనీ, తమ కర్తవ్యం విధానం అనుసరించ కుండా ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సవరించడమనీ సింఘ్వీ శుక్రవారంనాడు వ్యాఖ్యానించారు. ఆక్షన్ లేకుండా కేటాయింపులు సరికాదు కనుక వాటిని రద్దు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ఉల్లంఘనకు ఎంత శిక్ష వేయాలి, ఎవరికి వేయాలి అన్న విషయంలో స్పష్టత లేదు. న్యాయమూర్తుల వైఖరిని బట్టి శిక్ష ఉంటుంది. ఒక్క విధాన ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందనే అంచనా ప్రభావం కూడా జస్టిస్ సింఘ్వీ పైన విధిగా ఉండి ఉంటుంది. ఆ అంచనా గాలి లెక్క మాత్రమేనని చాలామంది ప్రవీణులు వ్యాఖ్యానించారు. ఉజ్జాయింపుగా చెప్పానని కాగ్ అన్నారు. కానీ నష్ట మెంత అనేది ఎవ్వరూ నిర్ధారించలేరు. అటువంటి ప్రయత్నం జరగడం లేదు. అంత నష్టం వచ్చిందని కానీ, రాజా, కణిమొళి తదితరులు లబ్ధిపొందారని కానీ సీబీఐ నిరూపించలేకపోయింది. లక్షల పేజీల నివేదికలు తయారు చేసిన సీబీఐ ఒక్క అభియోగం కూడా నిరూపించలేదనీ, చాలా బాధ్యతారహితంగా వ్యవహ రించిందనీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. తీర్పు తర్వాత డీఎంకే నేతలు ఆనందంతో లడ్డూలు పంచుకోగా, కాంగ్రెస్ నాయకులు సత్యమే గెలిచిందనే వ్యాఖ్యనంతో సరిపుచ్చుకున్నారు. బీజేపీ ప్రతినిధులు మాత్రం ముందున్నది ముసళ్ళ పండగ అని హెచ్చరిస్తున్నారు. ఏమీ అవినీతి, అక్రమం జరగపోతే సర్వోన్నత న్యాయస్థానం స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పరిపాలనాపరమైన నిర్ణయంలో పొర పాటు జరగడం వేరు. కుట్రపూరితంగా నేరం చేయడం వేరు. 2జీలో కుట్ర లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దోషిగా తేలిన లాలూ ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వాన్ని 2జీ కుంభకోణం నిర్వీర్యం చేస్తే పట్నాలో దాణా కుంభకోణం లాలూ ప్రసాద్ను ముఖ్యమంత్రి గద్దె మీది నుంచి దించింది. ఆయన భార్య రాబ్డీదేవిని గద్దెనెక్కించింది. దాణా కుంభకోణానికి బీజం 1985 లోనే పడింది. నాటి కాగ్ టీఎన్ చతుర్వేది హయాంలో బిహార్ కోశాగారం నుంచి లెక్కలు ఎప్పుడూ ఆలస్యంగా రావడాన్ని అధికారులు గమనించారు. బిహార్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి దుబే చొరవతో దర్యాప్తు జరిగింది. పశు సంవ ర్థకశాఖ అధికారులు పశువుల దాణా కొనుగోలులో అక్రమాలు చేశారనీ, దొంగ బిల్లులు పెట్టారనీ తేలింది. 1993లో ఆదాయంపన్ను శాఖ అధికారులు జరిపిన దాడులలో 80 మంది అధికారుల దగ్గర అక్రమ సంపద ఉన్నట్టు తెలుసుకు న్నారు. పశుసంవర్థక శాఖకు చెందిన ఒక అధికారి దగ్గర రాంచీ విమానాశ్ర యంలో కోటి రూపాయలు పట్టుకున్నారు. 1997లో బిహార్ బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ పట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడే మొదలైనాయి లాలూ కష్టాలు. ఇందుకు సంబంధించి మొత్తం 64 కేసులు ఉన్నాయి. 56 మంది నిందితులు. మొత్తం రూ 950 కోట్ల మేరకు ప్రభుత్వ ధనం కాజేశారన్నది ప్రధాన అభి యోగం. ఈ కుంభకోణానికి ప్రధాన కారకుడైన వ్యక్తిపైన విచారణ జరిపించా లని కోరుతూ అధికారులు సమర్పించిన ఫైలును లాలూ 16 మాసాలు తొక్కిప ట్టారని ఆరోపణ. ఆరు కేసులలో లాలూ ప్రసాద్కు ప్రమేయం ఉన్నది. ఒక కేసులో రూ. 37.70 కోట్లను చాయ్బసా ట్రెజరీ నుంచి తీసుకున్నట్టు చేసిన ఆరో పణ రుజువై లాలూను దోషిగా నిర్ధారించి జైలుకు పంపారు. అప్పుడే రాబ్డీదేవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. రెండు మాసాలు పూర్తికాక మునుపే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూకూ, మరి 14 మంది దోషులకూ విధించే శిక్ష ఏమిటో జనవరి 3న ప్రకటిస్తారు. శనివారం రాంచీలో సాక్షుల బోనులో లాలూ, మరి 24 మంది నిలుచొని ఉండగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథమిశ్రానూ, మరి అయిదుగురినీ నిర్దోషులుగా ప్రకటించి వెళ్ళిపొమ్మన్నారు. లాలూనూ, ఇతరులనూ అక్కడే అరెస్టు చేశారు. ఈ కేసులో తాను చేసిన ఆరోపణలను సీబీఐ దిగువ కోర్టులో నిరూపించగలిగింది. బీజేపీ నాయకత్వం, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కలసి చేసిన కుట్ర ఫలితమే ఈ తీర్పు అంటూ లాలూ ద్వితీయ పుత్రుడూ, రాజకీయ వారసుడూ అయిన తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ తీర్పు వెలువడటానికి రెండు గంటల ముందే లాలూ కుమార్తె మిసాభారతిపైనా, ఆమె భర్త శైలేష్కుమార్పైనా ఈడీ కేసులు పెట్టింది. అవినీతికి పాల్పడినవారు చట్టం నుంచి తప్పించుకొని పోలేరంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ ఉద్ఘాటించారు. ఆరోపణాస్త్రాలతోనే పోరాటం సీబీఐ దర్యాప్తు పేరు మీద రాజకీయ పోరాటాలు చాలాకాలంగా సాగుతు న్నాయి. ఆరోపణలు చేసినవారికి వాటిని నిరూపించవలసిన బాధ్యత లేదు. ఆరోపణల స్థాయి దాటి సీబీఐ దర్యాప్తు మొదలైతే రాజకీయ క్రీడ ఆరంభం అవుతుంది. సీబీఐ పెట్టిన కేసులలో న్యాయస్థానం ఎదుట పరీక్ష తట్టుకొని నిలి చినవి చాలా తక్కువ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్చవాన్పై వచ్చిన ఆరోపణలపైన విచారణకు గవర్నర్ విద్యాసాగర్ ఇచ్చిన అనుమతి సమంజమైన దని సీబీఐ నిరూపించలేకపోయింది. ఆరుషి, పనివాడు హత్య కేసులో ఆరోప ణలు నిరూపించడంలో సీబీఐ విఫలమెంది. రాజీవ్గాంధీ పదవీచ్యుతికి కారణ మైన బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి కూడా సీబీఐ సాక్ష్యాధారాలు సేక రించలేని కారణంగా వీగిపోయింది. ‘మిస్టర్ క్లీన్’ అని చెప్పుకున్న రాజీవ్ను ఈ కుంభకోణం జీవితపర్యంతం వెంటాడింది. చివరికి 2005లో ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తుకోసం సీబీఐ రూ. 250 కోట్లు ఖర్చు చేసిందని కూడా న్యాయమూర్తి వెల్లడించారు. రాజీవ్ హత్య కేసులో సైతం సీబీఐ దర్యాప్తు నిష్ఫలంగా అనం తంగా సాగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐని న్యాయస్థానాలు చీవాట్లు పెట్టని సందర్భాలు తక్కువ. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీబీఐని ‘పంజరంలో చిలక’ అంటూ అభివర్ణించారు. లాలూ కానీ రాజా కానీ నేరం చేయలేదని న్యాయస్థానం చెప్పలేదు. లాలూ నేరం చేసినట్టు సీబీఐ కోర్టు నిరూ పించిందనీ, రాజా నేరానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ విఫలమైందనీ న్యాయవేత్తలు అన్నారు. అందుకనే న్యాయస్థానాలు నిర్దోషులని నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు పాత ఆరోపణలనే యథావిధిగా చేస్తున్నాయి. అందుకే అవినీతి ఎన్నికలలో నిర్ణాయకాంశం కావడం లేదు. లాలూ జైల్లో ఉన్న ప్పటికీ ఆర్జేడీ ప్రాబల్యానికి నష్టం లేదు. నితీశ్కుమార్కి లాభం లేదు. దీనికి ప్రధాన కారణం కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం. లాలూపైన వచ్చిన అభియోగాలపై విచారణ తొమ్మిది మాసాలలో పూర్తి చేయా లని గతమే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది కనుకనే ఈ మాత్రం వేగంగా విచారణ జరిగింది. అమెరికా స్టాక్ ఎక్చేంజిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనే ఆరోపణపై రజత్గుప్తాను న్యాయస్థానాలలో విచారించారు. దర్యాప్తూ, నేరారోపణ, విచారణ, నేర నిర్ధారణ అన్నీ ఒకే ఒక సంవత్సరంలో పూర్తయినాయి. న్యాయం సకాలంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే అర్ధం (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్). న్యాయపాలనలో సంస్కరణలు అమలు చేసేంతవరకూ ఈ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఈ లొసుగును రాజ కీయవాదులు తెలివిగా వినియోగించుకుంటారు. ఇదే ధోరణి కొనసాగితే సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. కె. రామచంద్రమూర్తి -
పోలవరం: కాఫర్డ్యామ్ ‘ఎత్తు’గడ!
రాజకీయ నాయకుడు (పొలిటీషియన్) వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు (స్టేట్స్మన్) రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. ఈ సూక్తి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరించడమే కాదు, స్వార్థపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారనడానికి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రబల నిదర్శనం. విలువలు లేని రాజ కీయం వల్ల నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నట్టే, రాబోయే ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయంతో పోలవరం అనే సుడిగుండంలో చిక్కుకున్నారు. 2018 లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటూ పదేపదే హామీలు ఇవ్వడం, ప్రతి పక్షం అడ్డుపడుతోందంటూ ఆరోపణలు చేయడం, పవన్ కల్యాణ్ మంచి బాలుడంటూ కితాబులు ఇవ్వడం తప్ప అసలు పోలవరంలో ఏమి జరుగుతోందో ప్రజలకు చెప్పలేదు. పోలవరంపైన శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ అడిగినా అక్కరలేదని కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు చూసి నిర్ఘాంతపోయాను. వాస్తవానికి అక్కడ పని బొత్తిగా జరగడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు మిన్నకుండి అకస్మాత్తుగా పోలవరం పూనకం వచ్చినట్టు అదేపనిగా కలవరించడం ప్రారంభించారు చంద్రబాబు. అనేక విడతల క్షేత్ర పర్యటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రతింపులు జరిపారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పని తీరును సమీక్షిస్తూ సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఆర్భాటం గమనించినవారికి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా దూసుకుపోతోందనే అభిప్రాయం కలుగుతుంది. శుక్రవారం ఉదయం ఇద్దరు జర్నలిస్టు మిత్రులతో కలసి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తిరిగి, అన్ని విషయాలూ వివరంగా అడిగి తెలుసుకున్న తర్వాత ప్రాజెక్టు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో అర్థమైంది. మేము అక్కడ ఉన్నప్పుడే కేంద్ర జలవిద్యుత్తు కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) మండలి ప్రతినిధి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కోసం పదిహేను వాహనాలలో అట్టహాసంగా చేరుకుంది. వారి వెంట రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇంజనీర్–ఇన్–చీఫ్ నాగేశ్వరరావు, ఉన్నతాధికారి రమేష్ కేంద్ర అధికారులకు ప్రాజెక్టు ‘పురోగమనం’ గురించి వివరిస్తున్నారు. అక్కడక్కడ టిప్పర్లు కనిపిస్తున్నాయి. రెండు ప్రొక్లేన్లు పని చేస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ బోర్డు వెలసిపోయి నిర్వికారంగా కనిపించింది. సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ కదులుతోంది కానీ కాంక్రీట్ను తయారు చేయడంలేదు. కేంద్ర అధికారులకు ఆ ప్లాంట్ ఎట్లా పని చేస్తోందో చూపించేందుకే దానిని నడిపిస్తున్నారని అక్కడున్నవారు చెప్పారు. కాఫర్ డ్యామ్ అవసరమా అని కేంద్ర అధికారులు ప్రశ్నించారనే శీర్షికతో శనివారం నాటి పత్రికలు వార్త ప్రచురించాయి. కాఫర్డ్యామ్ అవసరం తెలియని అమాయకులా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు? కాదు. వారు అడగడం వెనుక బలమైన కారణం ఉంది. ఎన్నికలే ప్రధానం మా ముఖ్యమంత్రిగారు 2018 జూన్ కల్లా కాఫర్డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి, నదీ ప్రవాహం మళ్ళించి గురుత్వాకర్షణశక్తి (గ్రావిటీ) సహాయంతో నీరు సరఫరా చేయాలని సంకల్పించారనీ, ఆ సంకల్పం సాకారం కావాలంటే కాఫర్ డ్యామ్ను అనుమతించాలనీ మంత్రి కోరారు. ఎర్త్ అండ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగాలంటే కాఫర్డ్యామ్ కట్టితీరాలి. అప్పుడే నీటిని అరికట్టి డ్యామ్ నిర్మాణం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాఫర్డ్యామ్ అంటే తాత్కాలికమైన మట్టి కట్ట. ఎగువన ఒక వరుసలో, దిగువన మరో వరుసలో పసుపు పచ్చ జెండాలు కనిపించాయి. అదే వరుసలో ఎగువ కాఫర్డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగాలి. శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో అసలు డ్యామ్ నిర్మాణం ముందు కాఫర్డ్యామ్ కట్టారు. మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కాఫర్డ్యామ్ను పడగొట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని తుపాకులగూడెంలో సైతం కాఫర్డ్యామ్ నిర్మించిన తర్వాతే మెయిన్ డ్యామ్ నిర్మిస్తున్నారు. కాఫర్డ్యామ్ను మెయిన్ డ్యామ్లో భాగంగా నిర్మించవచ్చుననే సూచన కూడా కేంద్ర అధికారుల నుంచి వచ్చింది. ఈ ప్రతిపాదనను ప్రారంభంలో పరిశీలించారు. అనంతరం విరమించుకున్నారు. కాఫర్డ్యామ్ ఎత్తు పెంచాలని ఏపీ సర్కార్ పట్టుబట్టడంతోనే పేచీ వచ్చింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రముఖ ఇంజనీరు సీతాపతి ఖరారు చేసిన డిజైన్ ప్రకారం 31 మీటర్ల ఎత్తున కాఫర్డ్యామ్ నిర్మించాలి. దానిని 41.5 మీటర్ల ఎత్తుకు పెంచాలని చంద్రబాబు పథకం. ఎందుకు? కుడి, ఎడమ కాలువల లోతు (స్పిల్ లెవల్) సుమారు 35 మీటర్లు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో కాఫర్ డ్యామ్ ఉంటే కానీ అందులో నీటిమట్టం 35 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అప్పుడే కాఫర్డ్యామ్ నిలువ చేసిన నీరు భూమ్యాకర్షణశక్తి ప్రభావంతో కాలువలలోకి ప్రవహిస్తుంది. కాఫర్డ్యామ్ ఎత్తు పెంచాలన్న ఎత్తుగడలోని ఆంతర్యం ఏమిటి? పోలవరం ప్రధాన ప్రాజెక్టు వచ్చే ఎన్నికల లోపు పూర్తికాదని రాష్ట్ర ప్రభుత్వాధినేతకు స్పష్టంగా తెలుసు. కానీ పోలవరం నీరు ఎన్నికలలోపే విడుదల చేసి శభాష్ అనిపించుకోవాలి. ఓటర్లను మెప్పించాలి. ఓట్లు సంపాదించాలి. 31 మీటర్ల ఎత్తు కాఫర్డ్యామ్ నిర్మించడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు అయితే 41.5 మీటర్ల ఎత్తు కట్టడానికి కనీసం రూ. 500 కోట్లు అవుతుంది. ఇప్పటికే వ్యయం పెరిగిపోతున్నదని కేంద్రం గొడవ చేస్తోంది. దుబారాను తగ్గించాలని ఆలోచిస్తున్నది. అవినీతి జరిగినట్టు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. లెక్కలు చెప్పమని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అడుతున్నదీ, అధికారులు కాఫర్డ్యామ్ ఎత్తు పెంచడం అవసరమా అని అడుగుతున్నదీ అందుకే. బరువు నెత్తికెత్తుకోవడం ఎందుకు? రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ తెలంగాణకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుంది. ఇందుకు పరిహారంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి, దాని నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా సరే కేంద్ర ప్రభుత్వమే భరించాలని 2014 మే 5 న మంత్రిమండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈ అంశాన్ని యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. పాత రేట్లు కాకుండా కొత్త రేట్ల ప్రకారమే వ్యయం అంచనా వేయాలని కూడా తీర్మానించింది. ఈ విషయం చంద్రబాబునాయుడు స్వయంగా శాసనసభలో చదివి వినిపించారు. దీనికి తోడుగా ప్రత్యేక హోదా కూడా మంజూరు చేయడానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంటులో అంగీకరించారు. తర్వాత మంత్రిమండలిలో నిర్ణయం చేశారు. చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రానికి అప్పగించవలసిందిగా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందంటూ నీతి ఆయోగ్కు చెప్పి, దాని ద్వారా కేంద్రాన్ని ఒప్పించి బరువైన బాధ్యత తలకెత్తుకున్నారు. 2014 ఏప్రిల్ 1 నాటి రేట్ల ప్రకారం ఎంత నిర్మాణ వ్యయం అవుతుందో అంతే భరిస్తామంటూ ఎన్డిఏ ప్రభుత్వం స్పష్టం చేసినప్పుడైనా ఏపీ ప్రభుత్వం తన నెత్తి మీది బరువు దించుకొని కేంద్రం నెత్తిమీద పెట్టి ఉంటే సరిపోయేది. ఆ పనీ చేయలేదు. పని చేసే శక్తి లేని ట్రాన్స్ట్రాయ్ అనే సంస్థను మార్చాలనే ఆలోచన మూడున్నర సంవత్సరాలు రాలేదు. నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆ సంస్థ స్థాయికి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని తెలిసినా కిరణ్కుమార్రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారు. వైఎస్ హయాంలో ముందు సత్యం అధినేత రామలింగరాజుకు చెందిన మేటాస్కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థ కష్టాలపాలు కావడంతో అప్పటి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీకి అప్పగించారు. ఆ సంస్థ కూడా పనులు చేయలేకపోతున్నదని గ్రహించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నాగేశ్వరరావును తప్పుకోమన్నారు. ఆయన తప్పుకున్నారు. కొత్త కాంట్రక్టర్ను నియమించే లోపుగానే వైఎస్ హఠాన్మరణం సంభవించింది. ట్రాన్స్ట్రాయ్ సబ్–కాంట్రాక్టర్లను నియమించుకుంది. సాంబశివరావు ఎల్–1గా కాంట్రాక్టు సంపాదిస్తారు. ఆనక ఖర్చులు పెరిగాయనీ వ్యయం పెంచాలనీ ప్రభుత్వాలను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. 2010లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010 కోట్లు కాగా, అది 2014 నాటికి రూ. 23,000 కోట్లు, 2017 నాటికి రూ. 58,000 కోట్లు అయింది. భూసేకరణకూ, పునరావాసానికే ఇందులో సగానికి పైగా (రూ. 33,000 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. కొంత కాలం తర్వాత సాంబశివరావును పక్కన పెట్టి ప్రభుత్వం నేరుగా సబ్–కాంట్రాక్టర్లతో వ్యవహారం చేయడం ఆరంభిం చింది. ప్రభుత్వం నియమించిన సబ్–కాంట్రాక్టర్లకు చెల్లింపులు టంచనుగా జరుగుతున్నాయి. ప్రధాన కాంట్రాక్టర్ నియమించిన సబ్–కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. దీనితో విసిగిపోయిన సాంబశివరావు గడ్కరీని కలుసుకొని తన కష్టాలు చెప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం, అవసరాల ప్రకారం నిర్ణయాలు జరిగాయి. బాబు ఆగ్రహం, సంయమనం టెండర్లను పిలిచిన విధానాన్ని తప్పుపడుతూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖ చంద్రబాబునాయుడిని ఆందోళనకూ, ఆగ్రహానికీ గురి చేసింది. పోలవరం నిర్మాణం బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తే నమస్కారం పెట్టి అప్పగిస్తానంటూ పరుషంగా మాట్లాడారు. అంతలోనే సంభాళించుకొని సంయమనం పాటించాలంటూ తోటి మంత్రులకూ, పార్టీ సహచరులకూ హితవు చెప్పారు. కానీ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలన్న నిర్ణయం విషయంలో రాజీ పడటం లేదు. బహుళార్థ సాధక నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల మొదటి నుంచీ చంద్రబాబునాయుడికి విశ్వాసం లేదు. 2004 ఎన్నికలకు ముందు వరంగల్లులో దేవాదులకూ, తూర్పు గోదావరిలో తాడిపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకూ హడావుడిగా శంకుస్థాపన చేసి ఓటర్ల మదిలో ఆశలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. నా మనవలూ, మీ మనవలు కూడా పోలవరం చూడలేరంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్టుడు అప్పట్లో వ్యాఖ్యానించేవారు. చాలా విషయాలలో చంద్రబాబునాయుడికీ, రామకృష్ణుడికీ భావసామ్యం ఉంది. పోలవరం పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు వ్యర్థం. ఈ పథకాల కోసం తవ్విన కాల్వలు పోలవరం కాల్వలకు పిల్ల కాల్వలుగా పనికి రావచ్చు. అంతవరకే. అంతకు మించి ప్రయోజనం ఉండదు. పట్టిసీమ కోసం రూ.1500 కోట్లు, పురుషోత్తపట్నం పేరుతో రూ. 1600 కోట్లు వృ«థా చేసి సంబరం చేసుకున్న చంద్రబాబునాయుడు ఆ నిధులనే పోలవరం ప్రాజెక్టుపైన ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు ఎంతో కొంత ప్రగతి సాధించేది. ఎన్నికల ప్రయోజనాలను విస్మరించి జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాఫర్డ్యామ్ను 31 మీటర్ల ఎత్తు నిర్మించడానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరావచ్చు. ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి కాదు. కానీ ఎంతో కొంత పని జరుగుతుంది. ఆ మేరకు చంద్రబాబునాయుడికి ఖ్యాతి దక్కుతుంది. అట్లా కాకుండా ఎన్నికల కోసం మాయోపాయం చేసి హడావుడిగా పనులు చేయించినా, కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచి నీరు సరఫరా చేసి పబ్బం గడుపుకున్నా రాష్ట్ర ప్రజలకు తీరని అపకారం చేసినవారు అవుతారు. పోలవరం వంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును ఏ రకమైన లోపాలూ లేకుండా, సమున్నత ప్రమాణాలతో నిర్మించాలి. నిర్ణయాలు ఇంజనీర్లు తీసుకోవాలి. వారి పర్యవేక్షణలో పనులు జరగాలి. రాజకీయ ప్రయోజనాలను పూర్వపక్షం చేయాలి. లేకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాధినేతలను చరిత్ర క్షమించదు. - కె. రామచంద్రమూర్తి -
పోలవరంపై పిల్లిమొగ్గలు!
రెండు ప్రభుత్వాల మధ్యా, ఇద్దరు రాజకీయ నేతల మధ్యా పోలవరం ప్రాజెక్టు నలిగిపోతోంది. టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్కు రాసిన లేఖపై వివాదం రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతలోనే నాలిక కరుచుకున్నారు. గుక్కతిప్పుకున్నారు. మాట సవరించుకున్నారు. నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టారు. ఆ ప్రయత్నంలో సైతం పప్పులో కాలేశారు. ఇంకా సమర్పించని మంజూనాథ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించినట్టు ప్రకటించడం, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఒక తీర్మానాన్ని శాసనసభ చేత ఆమోదింపజేయడం చంద్రబాబునాయుడు మార్కు రాజకీయం. కేంద్ర వైఖరి పైన అసంతృప్తి ప్రకటించిన విషయం మరుగున పడటానికి కాపు రిజర్వేషన్ కార్డును ప్రయోగించారు. తాము నివేదిక ఖరారు చేశాము కానీ ప్రభుత్వానికి సమర్పించలేదని బీసీ కమిషన్ అధ్యక్షుడు మంజూనాథ్ శనివారం మీడియా ప్రతినిధులకు చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక తడబాటు వెల్లడైంది. ఆగ్రహం, అంతలోనే అనునయం పోలవరం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకూ ప్రయోజనం జరుగుతుంది. ఇది ఆ ప్రాంతానికి జీవధార. ప్రాజెక్టు నిర్మాణంపైన ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. నిర్మాణంలో జాప్యం జరిగితే ప్రజలు క్షమించరు. ప్రజల ఆగ్రహాన్ని ఎగదోసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలన్నది చంద్రబాబు వ్యూహమని సోము వీర్రాజు వంటి బీజేపీ నాయకులు కొందరు బహిరంగంగానే అంటున్నారు. మోదీ ప్రతిష్ఠ తగ్గుముఖం పట్టిందన్న అంచనా ఇందుకు కారణం. శుక్రవారం మధ్యా హ్నం ఉత్తరప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడం, బీజేపీ ఘనవిజయం సాధించడం గమనించిన చంద్రబాబు వెంటనే మోదీకి తెల్లజెండా చూపించారు. కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు ప్రదేశం సందర్శించి ఢిల్లీ తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనను బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, మరి కొందరు బీజేపీ నాయకులూ కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమనీ, దానిలో జాప్యం జరిగితే బీజేపీకి చెడ్డపేరు వస్తుందనీ, పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందనీ వారు మంత్రికి చెప్పారు. ‘కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లెక్క చెప్పమని మాత్రమే అడుగుతున్నాం’ అని ఆయన వివ రించారు. ‘గడ్కరీ గురించి తెలుసుకోమని చెప్పండి మీ ముఖ్యమంత్రికి. పోల వరం ప్రాజెక్టు ఆయన కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్మించే సామర్థ్యం, వనరుల లభ్యత నాకుంది. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వదిలేయమని మొన్న నాగపూర్లో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చిలక్కి చెప్పినట్టు చంద్రబాబుకు చెప్పాను. తానే చేస్తానంటారు. జమాఖర్చుల వివ రాలపైన∙కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమంటే చెప్పరు. గుడ్డిగా నిధులు ఇచ్చుకుంటూ పోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? నేను ఒప్పుకున్నా నన్ను ప్రధాని లెక్కలు అడుగుతారు. ఒక సంవత్సరంలోనే అంచనాలు మూడు సార్లు మార్చారు. ఒకసారి రూ. 33 వేల కోట్లు అన్నారు. తర్వాత రూ. 40 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ. 50 వేల కోట్ల పైచిలుకు అంటున్నారు. ఇష్టం వచ్చిన అంకెలు చెప్పి నిధులు ఇవ్వమంటే ఇవ్వడం ఎట్లా కుదురుతుంది? నేను అడిగేదల్లా పారదర్శకత పాటించమనే. అంతకీ సబ్ కాంట్రాక్టులు ఇచ్చుకోమన్నాను. ప్రధాన కాంట్రాక్టర్ను మార్చవద్దని చెప్పాను. ట్రాన్స్ట్రాయ్ ఇండియా కోర్టుకు వెడితే ఇంకా జాప్యం జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారట. టెండర్ తిరకాసు టెండర్ వేయడానికి 45 రోజులు గడువు ఇవ్వాలన్నది నిబంధన. 18 రోజులు మాత్రమే ఇచ్చారు. టెండర్ నోటీసును ప్రభుత్వ వెబ్సైట్లో నవంబర్ 25 వరకూ పెట్టలేదన్నది మరో ఆరోపణ. లెక్కలు చెప్పడం చంద్రబాబుకు అల వాటు లేని పని. ఆ మాటకొస్తే ఏ ముఖ్యమంత్రి కూడా లెక్కలు చెప్పవలసిన అవసరం రావడం లేదు. కాంట్రాక్టర్లతో మాట్లాడి అధికారులకు చెప్పి ప్రాజెక్టుల అంచనాలు పెంచడం ఆనవాయితీ. నామినేషన్ పద్ధతి మీద పనులు కేటాయిం చడం, మాటవరుసకు టెండర్లు పిలిచినా తాను ఎవరికి ఇవ్వాలని సంకల్పిం చారో వారికి మాత్రమే అర్హత ఉండే విధంగా నిబంధనలను రూపొందించడం, అనుకున్న అçస్మదీయులకే కట్టబెట్టడం చంద్రబాబు మార్కు పరిపాలన. ఆయ నను లెక్కలు అడిగే సాహసం అధికార పార్టీలో ఎవ్వరికీ లేదు. ప్రశ్నించే ప్రతి పక్షాలను ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయంటూ అడ్డగోలుగా నిందించడం, అడ్డంగా దబాయించడం అలవాటు చేసుకున్నారు. మంత్రివర్గ సమావేశాలలో ముఖ్యమంత్రి చెప్పింది వినడమే కానీ వివరాలు అడిగే తెగింపు ఎవ్వరికీ లేదు. డూడూ బసవన్నల మాదిరి తలలూపడమే. స్వప్రయోజనాలు సాధించుకునే సావకాశం అందరికీ కల్పించినప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించే అవసరం ఎవ రికి మాత్రం ఉంటుంది? అమరావతి నిర్మాణంలో సింగపూరు మిత్రులకు పెద్ద పీట వేసినా, వేల ఎకరాలు పూలింగ్ పేరుతో సేకరించినా, తమకు ఇష్టమైన వారికి వందల ఎకరాలు కేటాయించినా అదేమని అడిగేవారు లేరు. తాను అను కున్న పనులు ఇంత సులువుగా, నిర్నిరోధంగా చేయగలుగుతున్న చంద్రబాబు కేంద్ర అధికారులు ‘క్వెరీ’లు (ప్రశ్నలు) వేస్తే సహించగలుగుతారా? తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్రెడ్డి ఈ విషయంలో ముఖ్యమంత్రికీ, ఆయన సమర్థకులకీ తత్వం బోధపరిచారు. ‘రౌతు కొద్దీ గుర్రం అంటారు. రౌతు మనసు తెలుసుకొని గుర్రం నడుచుకుంటుంది. గుర్రం అధికారి, రౌతు మంత్రి’ అని జేసీ వివరించారు. అంటే గడ్కరీ రాయ మంటేనే అమర్జిత్ లేఖ రాశారని అర్థం. మంత్రి పురమాయిస్తేనే అధికారి లేఖ రాస్తాడు. పరిపాలనా పద్ధతులు తెలిసినవారికి ఈ విషయం స్పష్టం. తెలిసి కూడా ఆఫ్ట్రాల్ అధికారి రాసిన లేఖకు విలువేముందంటూ మాట్లాడటం రాజకీయం. చంద్రబాబు వ్యవహార శైలి పట్ల ప్రధానికి అనేక అభ్యంతరాలు ఉన్నాయనీ, ఒక ముఖ్యమంత్రి దేశప్రధానితో పోటీ పడి విదేశాలు సందర్శించడం, ప్రజాధనం ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో విదేశీ ప్రయాణాలు చేయడం ఆయనకు నచ్చడం లేదనీ బీజేపీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యా నించారు. వేలకోట్ల రూపాయలు చిత్తం వచ్చినట్టు ఖర్చుపెడుతున్న ముఖ్య మంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేననీ, ఇది ప్రధానికి ఏ మాత్రం సమ్మతం కాదనీ ఆయన అన్నారు. ‘అంతమంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొను గోలు చేయడానికి బాబుకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హెరిటేజ్ఫుడ్స్లో వచ్చిన లాభాల నుంచి ఖర్చు చేస్తున్నారా?’ అని కూడా ప్రధాని చమత్కరించా రని ఆ పార్లమెంటు సభ్యుడు చెప్పారు. చంద్రబాబు పట్ల నరేంద్రమోదీకి 2002 నుంచీ అమిత్రభావమే ఉన్నది. గుజరాత్లో మత కలహాలు జరిగిన సంద ర్భంలో మోదీ ‘రాజధర్మం’ పాటించాలని నాటి ప్రధాని వాజపేయి ఉద్బోధిం చారు. మోదీని గద్దె దించాలంటూ వాజపేయికి సలహా చెప్పినవారిలో చంద్ర బాబు ఒకరని మోదీ అనుమానం. మోదీకి జ్ఞాపకశక్తి ఎక్కువనీ, ఏ విషయం కూడా మరచిపోయే ప్రసక్తి లేదనీ, ఎవ్వరినీ క్షమించే ప్రశ్న కూడా లేదనీ బీజేపీ నాయకులు చెబుతారు. వయస్సు పైబడి ఆరోగ్యం సరిగా లేని ఎన్టి రామా రావుపైన వ్యూహాత్మక విజయం సాధించడం తేలికే. మోదీపై గెలవగలరా? లెక్క చెబితేనే నిధులు లెక్క చెప్పకపోతే నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని గడ్కరీ స్పష్టం చేస్తున్నారు. ప్రధానిని కలుసుకునే అవకాశమే లేదు. ఏదైనా సమావేశంలో కలిసినా ప్రధాని ముభావంగా, దూరదూరంగా ఉంటారే కానీ కుశల ప్రశ్నలు సైతం అడగడం లేదు. ఈ వాతావరణం కూడా చంద్రబాబుకు కొత్తే. లోగడ వాజపేయి ప్రధా నిగా, అడ్వాణీ ఉప ప్రధానిగా, వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో కూర్చొని చక్రం తిప్పారు. మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఎర్రన్నాయుడు సైతం వాజపేయికి నేరుగా ఫోన్ చేసి ‘హౌ ఆర్ యూ సార్. ఐ కమింగ్.’ అని చెప్పేసి సరాసరి ప్రధానిని కలుసుకొని పనులు చక్కబెట్టుకొని వచ్చేవారు. వాజపేయి– అడ్వాణీకీ మోదీ–అమిత్షాకీ చాలా వ్యత్యాసం ఉంది. మోదీ, అమిత్షాలు వీధి పోరాటాలకు సైతం వెనుకాడని రాజకీయ యోధులు. వారికి లక్ష్య సాధనే ప్రధానం కానీ మార్గం ముఖ్యం కాదు. అటువంటి జోడీని ఢీకొనే సాహసం చంద్రబాబు చేస్తారా? ఈ విషయంలో ఆయనకు సైతం స్పష్టత లేదు. ఇటీవలి వరకూ వెంకయ్యనాయుడు మధ్యవర్తిగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా తన భుజస్కంధాలపైన వేసుకొని పరిష్కరించే వారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మంత్రుల ఇళ్ళ చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేరు. ఢిల్లీలో మీడియానూ, ఇతర ప్రము ఖులనూ ‘మేనేజ్’ చేయగల మనుషులు ఉన్నారు కానీ మోదీని సుముఖం చేసు కోగల శక్తి ఎవరికున్నది? కాపులను బీసీలలో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానించింది. బోయలను ఆదివాసీలుగా పరిగణించాలని కూడా శాసనసభ తీర్మానించింది. ఈ రెండు తీర్మానాలూ కేంద్రానికి పంపుతారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చమని అడుగు తారు (తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినంత మాత్రాన రక్షణ ఏమీ ఉండదు. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవచ్చు). రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇప్పించడానికి వీలు కల్పించాలని కోరుతారు. వీలు కల్పించ కపోతే కేంద్రం తప్పు అవుతుంది. శాసనసభ తీర్మానం చేసింది కనుక తన బాధ్యత తీరిపోయిందని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికీ, కాపులకూ, బోయలకూ రిజర్వేషన్లు రాకపోవడానికీ ఎన్డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని వాదించవచ్చు. ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు కానీ యుద్ధం ప్రకటించ డానికి మాత్రం సంకోచిస్తున్నారు. ఎందుకు? ఓటుకు కోట్లు కేసు మాత్రమే కాకుండా చంద్రబాబు గుట్టుమట్టులన్నీ మోదీకి తెలుసుననీ, అందుకే ఆయనంటే భయపడుతున్నారనీ తెలుగుదేశం నాయకులే అంటున్నారు. పోలవరం చాలా ఆవేశపూరితమైన అంశం. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం 2014 ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. ముఖ్య మంత్రి ఆ విషయంలో అనూహ్యంగా రాజీపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజె క్టుగా పరిగణించాలని కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలోనే నిర్ణయించారు. అది చట్టం కూడా అయింది. అనంతరం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయాలని యూపీఏ మంత్రిమండలి తీర్మానించింది. ఈ హామీని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలు కేంద్రం నిర్వహిస్తే ఎంత ఖర్చు అయినా కేంద్రమే భరించవలసి వచ్చేది. ప్రాజెక్టు నిర్మించిన ఘనత బీజేపీకి దక్కకుండా తనకే పేరు రావాలన్న తాపత్రయంతో, తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్ల చేత పనులు చేయించి లబ్ధిపొందవచ్చునన్న ఆలోచనతో చంద్రబాబు స్వయంగా ఆ భారం నెత్తికెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడమే మంచిదంటూ నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును ఆమోదించినప్పుడే మోదీ సర్కారు ఒక షరతు విధించింది. ప్రాజెక్టు వ్యయం 2014 ఏప్రిల్ ఒకటి ధరల ప్రకారం ఎంత ఉంటుందో అంతే చెల్లిస్తాము కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వజాలమని స్పష్టంగా చెప్పింది. ధరలు పెరిగా యనీ, అంచనాలూ పెరుగుతాయనీ, 2014 నాటి అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామంటే నిర్మాణం అసాధ్యమనీ చెప్పి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటే ఈ తిప్పలు ఉండేవి కావు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఇటీవల జాతికి అంకితం చేసినట్టే పోలవరం ప్రాజెక్టును సైతం ప్రధాని ప్రారంభించేవారు. ఆ విధంగా జరగకపోవడానికి కారకులు ఎవరో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. - కె. రామచంద్రమూర్తి -
మూడు చారిత్రక సందర్భాలు
మూడు వారాల్లో మూడు ఘనకార్యాలు. ఏ ప్రభుత్వానికైనా గర్వకారణమే. ఏ పని చేసినా పతాక స్థాయిలో ‘బ్రహ్మాండంగా’ చేయాలనే మనస్తత్వం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శైలికి తగిన విధంగానే మూడు అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ నెల 28వ తేదీ గురువారం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో నమోదు చేయదగిన రోజు. అదేరోజు హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైలుకు ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపుతారు. ఆ రోజే ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజుల సదస్సు పూర్తయిన రెండు వారాల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల అయిదు రోజుల మహోత్సవం. ఈ మూడు కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం, మెట్రోరైలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీకి చెందిన సిబ్బందీ, సాహిత్య అకాడెమీ నేతృత్వంలో పని చేస్తున్న తెలుగు భాషాభిమానులూ, మేధావులూ ఊపిరి సలపని పనితో సతమతం అవుతారు. మెట్రోరైలు తెలుగు ప్రజలకు కొత్తగా అందివస్తున్న ఆధునిక వసతి. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మహానగరాల సరసన నిలబెట్టే నిర్మాణం. తెలుగు మహాసభలు తెలంగాణలో తెలుగు భాషావాఙ్మయాలు వందల సంవత్సరాలుగా అభివృద్ధి చెందాయంటూ హృదయం ఉప్పొంగేలా చాటుకునే శుభ సందర్భం. హైదరాబాద్ బ్రాండ్ని ప్రపంచపటంలో మరోసారి నిలబెట్టడానికీ, ఇక్కడ పరిశ్రమలు పెంపొందించేందుకు అవసరమైన వాతావరణం ఉన్నదని నమ్మించడానికీ ఈ సదస్సు అవకాశం కల్పించింది. భవిష్యత్తులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వెంచర్ కేపిటలిస్టులు ప్రోత్సాహం అందించి పారిశ్రామిక ప్రగతికీ, ఉపాధి కల్పనకూ దారి తీస్తారని ఆశించవచ్చు. ఒక రైలు మార్గం నిర్మించడం, పరిశ్రమలను విస్తరించడం ఒక్క సంవత్సరంలోనో, ఐదు సంవత్సరాలలోనే అయ్యే పని కాదు. ఇటుకపైన ఇటుక పేర్చుకుంటూ వెళ్ళవలసిందే. ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, మరో ప్రభుత్వం ప్రారంభిస్తే, మరికొన్ని సర్కార్లు కొనసాగిస్తే కానీ ఒక కొలిక్కి రాదు. ఇది నిరంతరాయంగా జరగవలసిన ప్రక్రియ. నిజమైన కల మెట్రోరైలు ట్రాఫిక్ జామ్లతో, గంటల తరబడి ప్రయాణాలతో విసిగి వేసారిన హైదరాబాద్ ప్రజలకు మెట్రోరైలు కొంత ఊరట కలిగిస్తుంది. వాహనరద్దీ, వాయు, శబ్ద కాలుష్యాలూ ఎంతో కొంత తగ్గుతాయనే ఆశ. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మెట్రో ఆలోచన రూపుదిద్దుకుంది. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిం చాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఫ్లయ్వోవర్ల నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఎన్విఎస్ రెడ్డిని మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, రాష్ట్ర విభజన జరిగినా మెట్రోరైల్ ప్రాజెక్టు సారథిగా ఎన్విఎస్ రెడ్డి కొనసాగడం విశేషం. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజుకు చెందిన మైటాస్ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణం పనులు అప్పగించారు. కానీ సత్యం సంస్థ ఆర్థికంగా దెబ్బతినడంతో మెట్రోరైలు ప్రాజెక్టుకు పెద్ద అవాంతరం ఏర్పడింది. రోశయ్య హయాంలో ఎల్ అండ్ టీ రంగంలోకి దిగింది. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పనులు కొనసాగాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వానికీ, ఎల్ అండ్ టీ సంస్థకూ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పటికీ ఉభయ పక్షాలూ విజ్ఞత ప్రదర్శించడంతో అవి సర్దుకున్నాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో 30 కిలోమీటర్ల మెట్రోలైనుకు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇది ఒక రికార్డు. ఢిల్లీ మెట్రోరైలు నిర్మాత శ్రీధరన్ ఎన్వీఎస్ రెడ్డికి గురువు. ఆయన హైదరాబాద్ మెట్రోరైల్ చూసి అత్యద్భుతం అంటూ ప్రశంసించారని సాక్షి టీవీ ఇంటర్వ్యూలో రెడ్డి చెప్పారు. తాను జీవితంలో సాధించిన ఘనవిజయంగా, పదేళ్ళ శ్రమ ఫలించినట్టుగా ఆయన భావిస్తున్నారు. ప్రారంభంలో అంచనా వ్యయం రూ. 12,132 కోట్లు. 2010లో రెండోసారి టెండర్లు ఖరారు చేసినప్పుడు సవరించిన అంచనావ్యయం రూ. 14,132 కోట్లు. అనంతరం ప్రాజెక్టులో మార్పులూ చేర్పులూ జరిగాయి కనుక అంచనా వ్యయం సైతం పెరిగింది. మెట్రో హైదరాబాద్ ప్రజలకు గొప్ప వరం. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రినీ, ఎన్విఎస్ రెడ్డినీ, ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యులనూ అభినందించాలి. శిఖరాగ్ర సదస్సు ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు 170 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ నాయకత్వంలో 350 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఆమె ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణ. వ్యాపారరంగంలో విజయాలు సాధించడమే కాకుండా తండ్రికి సలహాదారుగా కొండంత అండ. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సులో పెద్దపీట వేస్తున్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే ఆమె కుటుంబం అంతా బాగుపడుతుందనే ఆదర్శం ఈ సదస్సుకు ప్రాతిపదిక. మహిళలు ఏ పనైనా సమర్థంగా చేయగలరనే విశ్వాసం పాదుకొల్పే ప్రయత్నం ఇది. అమెరికా నుంచి ఇవాంకాతో వచ్చే పారిశ్రామికవేత్తలలో అత్యధికులు ఇండియన్ అమెరికన్స్ ఉంటారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి గణనీయమైన సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రానున్నారు. సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవంలో తెలుగు యువతీయువకులూ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ప్రపంచ స్థాయి పరిగణన పొందారు. ఐటీ రంగం తెలుగు యువతకు కొత్త ఊపునిచ్చింది. ఇది కూడా కొనసాగింపు ఫలితంగా అభివృద్ధి చెందిందే. ఐటీ రంగం 1991లో ఆర్థిక సంస్కరణల ఫలి తంగా విస్తరించిందనే అభిప్రాయం బలంగా ఉంది. హైదరాబాద్ను తనే నిర్మిం చినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా చెప్పుకుం టారు. వాస్తవానికి ఐటీ రంగానికి బీజం వేసింది 1971 ఫిబ్రవరిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ. రక్షణ నుంచి ఆరోగ్యం వరకూ పదహారు మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్స్ కమిషన్ను నెలకొల్పి, దానికి అధ్యక్షుడుగా ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త ఎంజీకే మీనన్ను నియమించిన దార్శనికత ఆమెది. అప్పటి వరకూ మీనన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీరా) సంచాలకుడుగా ఉండేవారు. మూడు వందల మంది కంప్యూటర్ శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ, సాంకేతిక సిబ్బందినీ తయారు చేసేందుకు రూ. 10 కోట్లు కేటాయించారు. అనంతరం టెక్నాలజీ డెవలప్మెంట్ కౌన్సిల్ (టీడీసీ) స్థాపించారు. కంప్యూటర్రంగంలో శిఖర సమానుడైన ఆర్. నరసింహం నేతృత్వంలో ఇసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తయారు చేసిన రెండో తరం కంప్యూటర్లకు టీడీపీ బ్రాండ్ వేసేవారు. వీటిని నిర్వహించేందుకు పీపీ గుప్తా ఆధ్వర్యంలో కంప్యూటర్ మెయిన్టెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)ని నెలకొల్పారు. ఏఎస్ రావు నేతృత్వంలో ఇసిఐఎల్ ఘనవిజయాలు సాధించింది. ఆయన పేరుతోనే ఏఎస్ రావు నగర్ ఏర్పడింది. ఆ రోజుల్లో విదేశీమారక ద్రవ్యం కొరత ఉండేది. ఐబీఎం కంప్యూటర్లకు తగిన రియాద్ శ్రేణి కంప్యూటర్లను రూపాయలు చెల్లించి సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసేవారు. వీడీయూ (విజు వల్ డిస్ప్లే యూనిట్), హైస్పీడ్ లైన్ప్రింటర్ వంటి సాధనాలు రియాద్ కంప్యూటర్లలో నాసిరకమైనవి ఉండేవి. అందుకని పాశ్చాత్య యూరప్ నుంచి నాణ్యమైన విభాగాలను కొనుగోలు చేసి ఈ కంప్యూటర్లకు అమర్చేవారు. ఆ విధంగా అమర్చినవాటిని ‘ఇంటెగ్రా’ కంప్యూటర్లు అని పిలిచేవారు. ఇసీఐఎల్ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (ఈవీఎం) తయారు చేసింది. వీటినే ప్రయోగాత్మకంగా 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో షాద్నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు. ఎన్టీ రామారావు ప్రభంజనం ఎదుర్కొని కాంగ్రెస్ అభ్యర్థి శంకరరావు గెలుపొందారు. ప్రపంచంలోకెల్లా నాలుగో పెద్ద వ్యవస్థ భారతీయ రైల్వే. రైలు ప్రయాణికుల రిజర్వేషన్లకోసం ఒక వ్యవస్థను ఇసీఐఎల్, బీఇఎల్ (భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) కలసి రూపొందించాయి. సరుకు రవాణా కోసం సూపర్ కంప్యూటర్ను తయారు చేశాయి. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్)ను 1984లో ఒక స్థాయికి తీసుకొని వచ్చాయి. ఎన్ శేషగిరి ఆధ్వర్యంలో ఏర్పడిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) ప్రపంచస్థాయి సంస్థ. అప్పటికే దేశంలో చిన్న, మధ్యతరగతి, పెద్ద కంప్యూటర్ కంపెనీలు వెయ్యికి పైగా ఉండేవి. అప్పటి దాకా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాన్ని పెంచిపోషించిన వ్యక్తి ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె హత్యానంతరం రాజీవ్గాంధీ ఈ పని కొనసాగించారు. 1994 నవంబర్ 19న నాటి ప్రధాని పీవీ నరసింహారావు రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను జాతికి అంకితం చేశారు. దేశం నుంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎగుమతులు సైతం ఇందిరాగాంధీ హయాంలోనే మొదలైనాయి. ఇన్ఫోసిస్, విప్రో, సత్యం, టీసీఎస్ వంటి సంస్థలు నెలకొల్పడానికి దశాబ్దం ముందే కెల్ట్రాన్ (కేరళ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్), అప్ట్రాన్ (ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్) వెలిశాయి. ఈ రంగంలో స్వావలంబన సాధించాలన్నది ఎలక్ట్రానిక్స్ కమిషన్ను నెలకొల్పినప్పుడే చెప్పుకున్న సంకల్పం. రైల్వేల తర్వాత కంప్యూటర్ వ్యవస్థను విద్యుచ్ఛక్తి రంగానికి అనుసంధానం చేశారు. ఆర్థిక సంస్కరణలతో కంప్యూటర్ రంగంలో నారాయణమూర్తి వంటి ఔత్సాహికులు అనేకమంది ఘనవిజయాలు సాధించేందుకు అవసరమైన పునాది అంతకు ముందే పడింది. హైదరాబాద్లో ఐటీ విస్తరణలో చంద్రబాబునాయుడు పాత్ర ఉంది. సైబరాబాద్ విస్తరణలో, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణంలో వైఎస్ కృషి ఉంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా, మునిసిపల్ వ్యవహారాల మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాద్ను ఐటీ నెలవుగా అభివృద్ధి చేసేందుకు గణనీయమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారి జయేష్ రంజన్ శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు. ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడితే ఇంత పెద్ద సదస్సు నిర్వహించే అవకాశం తెలంగాణకు దక్కడం వెనుక అవిశ్రాంత శ్రమ ఉంది. ఇవాంకా, ఇతర అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు నగరాన్ని అందంగా అలంకరించడం ఆహ్వానించదగినదే. కానీ నగర డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా పునర్నిర్మించి వానలు కురిసినప్పుడు రోడ్టు ముని గిపోకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించగలిగితే అది గొప్ప విజయం అవుతుంది. ఇదంతా కొనసాగింపే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వెలుగు వచ్చిందనీ, అంతకు ముందు అంతా అంధకారమనీ చెప్పే రాజకీయ నాయకులు దాపురించారు కనుక ఇదంతా చెప్పవలసింది వచ్చింది. తెలుగు వెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆలోచన ముమ్మాటికీ కేసీఆర్దే. తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ డిసెంబర్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులను హైదరాబాద్కి పిలిపించుకొని వేడుక జరుపుకోవాలన్నది ఆయన పట్టుదల. అంతకు ముందు తెలుగుభాషను ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ఒక సబ్జెక్టుగా అన్ని రకాల పాఠశాలలూ, కళాశాలలూ బోధించాలంటూ ఆదేశిం చారు. తెలుగు బోధనాభాష కావాలని కోరుకునేవారి ఆకాంక్ష నెరవేరకపోయినప్పటికీ తెలుగు అంతరించిపోతుందని బాధపడేవారికి ఊరట కలుగుతుంది. కేసీఆర్ తెలుగును అభిమానించే వ్యక్తి. తెలుగులో అనర్గళంగా ఉపన్యసించే వక్త. కనుక ఆయన తెలుగు మహాసభలు నిర్వహించడంలో ఆశ్చర్యం లేదు. లోగడ సురవరం ప్రతాపరెడ్డి చేసిన కృషికి ఇది కొనసాగింపు. తెలంగాణలో కవులే లేరంటూ కోస్తాంధ్ర కవిపండితులు వ్యాఖ్యానిస్తే కినిసి తెలంగాణ అంతటా పర్యటించి 354 మంది రచనలు, వివరాలు సేకరించి ‘గోలకొండ కవులు’ అనే ప్రామాణిక గ్రంథం ప్రచురించి సురవరం చరితార్థులైనారు. పాల్కురుకి సోమనాథుడు. బమ్మెర పోతన, సూరన, మారన, వేములవాడ భీమకవి నుంచి దాశరథి, కాళోజీ, గద్దర్, గోరటి ఎంకన్న, అందెశ్రీ వంటి వర్తమాన వాగ్గేయకారుల వరకూ తెలంగాణ సాహిత్యక్షేత్రంలో నడయాడిన కవుల ప్రశస్తిపై కొత్త వెలుగు ప్రసరింపజేయడమే ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యం కనుక అవశ్యం అభినందనీయం. - కె. రామచంద్రమూర్తి -
అసాధారణ వ్యక్తిత్వం ఆమె సొంతం
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి నేడు. నిరుడు ఇదే రోజున ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలకు ఇవాళ తెరపడుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగేవి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ నెహ్రూ, ఇందిరలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. కాంగ్రెస్ హయాంలో అంతగా ప్రశస్తి దక్కనివారికి ఇప్పుడు కాస్త అధికంగానే ప్రశంస ఉంటుంది. ఏ దేశంలోనైనా అధికారంలో ఉన్న పార్టీకి ఎవరి పట్ల గౌరవం ఉంటే వారికి బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ ఒక కుటుంబం ఆధిపత్యంలోనే మనుగడ సాగిస్తున్న కారణంగా, దాదాపు యాభై సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా నెహ్రూ వంశజుల ప్రభ చాలాకాలం వెలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రను సవరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వాల ప్రా«థమ్యాలు మారినా, పాలకులు ఎవరి స్తోత్రం వల్లించినా ప్రజల హృదయాలలో కొందరు నేతలు శాశ్వతంగా ఉండిపోతారు. అటువంటి నాయకులలో ఇందిర ఒకరు. సిండికేట్పై విజయం నలభై నాలుగు సంవత్సరాల కిందట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న విద్యార్థులం ప్రొఫెసర్ బషీరుద్దీన్ నాయకత్వంలో ఢిల్లీ, ముంబయ్, పుణెలో పర్యటించాం. ఢిల్లీలో నాటి ప్రధాని ఇందిర నివాసానికి వెళ్ళి, ఆమెకు అభిముఖంగా పచ్చికపైన కూర్చొని, పత్రికారంగంపైన ఆమె చేసిన వ్యాఖ్యలు, భవిష్య పాత్రికేయులమైన మాకు చేసిన ఉద్బోధ ఆలకించిన క్షణాలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. అప్పటికే ఆమె పాకిస్తాన్పై విజయఢంకా మోగించి, తూర్పు పాకిస్తాన్ను జయించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసి, విజయేందిరగా దేశ ప్రజల హారతులందుకున్నారు. 1966లో లాల్బహద్దూర్ శాస్త్రి హఠాన్మరణం అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన ఇందిరాగాంధీ సిండికేటు పెద్దల (నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, సంజీవరెడ్డి, అతుల్యఘోష్, కామరాజ్ నాడార్, ఎస్కే పాటిల్ తదితరులు) ఆధిపత్యాన్ని ఛేదించారు. ఆ సందర్భంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వరాహగిరి వెంకటగిరి (వివి గిరి)ని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దించి ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయాలంటూ కాంగ్రెస్ చట్టసభల సభ్యులకు చెప్పారు. గిరిని గెలిపించారు. ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీని చీల్చడం, సిండికేటు సభ్యులను పూర్వపక్షం చేయడం అప్పటికే చరిత్ర. మేము చూసింది ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న ఇంది రని. ఒక మహిళ పురుషాధిక్య ప్రపంచంలో నెగ్గుకు రావడం అంత తేలికకాదు. నెహ్రూ కుమార్తె అయినప్పటికీ కాకలు తీరిన నేతల వ్యూహాలను ఎదుర్కోవడం కష్టం. ప్రధాని పదవిలో ఉండటం ఆమెకు కలసివచ్చిన అంశం. 1967 ఎన్నికల సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వందల బహిరంగ సభలలో మాట్లాడారు. ఆ ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ ఆమె రాజకీయ ప్రస్థానానికి అవసరమైన మెలకువలు అప్పుడే లభిం చాయి. ఆ ఎన్నికల ప్రచారంలోనే ఆమె సమాజంలోని వ్యత్యాసాలను గమనిం చారు. భూమి ఉన్నవారికీ, భూమి లేని పేదలకూ మధ్య అగాధాన్ని అర్థం చేసుకున్నారు. దళితుల, ఆదివాసుల బతుకులలో చీకటి తొలగలేదని గుర్తించారు. ఆమె ప్రత్యర్థులందరూ సంపన్నవర్గాలకు అనుకూలమైన భావజాలాన్ని విశ్వసించేవారనే ముద్ర వేయగలిగారు. స్వయంగా వామపక్ష భావజాలాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలను రద్దు చేశారు. పత్రికలతో, ప్రాంతీయ నాయకులతో నిమిత్తం లేకుండా నేరుగా పేద, మధ్యతరగతి ప్రజలను సంబోధించడం, వారితో సంభాషించడం అలవరచుకున్నారు. పేద ప్రజలతో బంధం ఏర్పాటు చేసుకున్నారు. వారి హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తిరుగులేని జాతీయ నేతగా ఎదిగారు. సంక్షేమ విధానం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలు రూపొందించడం తమిళనాడులో డిఎంకె 1967లోనే ప్రారంభించింది కానీ కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్న సందర్భం లేదు. ‘గరీబీ హఠావో’ నినాదంలో రాజకీయ పార్శ్వం ఉన్నప్పటికీ అది అవకాశవాదం మాత్రం కాదు. పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పం గుండె నిండా ఉన్నది. తమలో ఆత్మవిశ్వాసం ప్రతిష్ఠించిన అధినేతగా ఆమెను దళితులూ, ఆదివాసులూ ఎప్పటికీ మరచిపోరు. సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది ఆమె ప్రభుత్వమే. అంతకు పూర్వం ప్రభుత్వ విధానాలలో, కార్యక్రమాలలో సంక్షేమానికి ప్రాధాన్యం ఉండేది కాదు. నవభారత నిర్మాణంలో భాగంగా ప్రణాళికాబద్ధంగా వివిధ రంగాలను అభివృద్ధి చేసే ప్రయత్నమే జరిగింది కానీ, సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రత్యేక సహాయం చేయవలసిన అవసరాన్ని అంతగా పట్టించుకోలేదు. షెడ్యూల్డ్ తరగతుల అభివృద్ధి కార్పొరేషన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అధారిటీ (ఐటీడీఎల్) ఇందిరాగాంధీ ప్రమేయంతో వెలసినవే. భూసంస్కరణలు, పేదలకు భూమి ఇవ్వడం, పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదలు పెట్టినవే. ఐఐటి వంటి జాతీయ విద్యాసంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసింది ఆమె ప్రభుత్వమే. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించింది, అణు, అంతరిక్ష పరిశోధనలో అసాధారణ ప్రగతి సాధించింది ఆమె హయాం లోనే. పర్యావరణ చట్టాలు తెచ్చింది కూడా ఆమే. శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ‘ఇందిరాగాంధీ–ఎ లైఫ్ ఇన్ నేచర్’ పేరుతో పుస్తకం రాశారు. విజయేందిర తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షలాది శరణార్థులు వచ్చి పడటం వల్ల తలెత్తిన సమస్యను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఇందిర విస్తృతంగా పర్యటిం చారు. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సేవలు కూడా ఇందుకోసం వినియోగించుకున్నారు. యుద్ధ సన్నాహాల కోసం భారత సైన్యానికి అవసరమైన సమయం ఇచ్చేందుకు దౌత్యనీతిని ఆశ్రయించారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇందిరను ‘ది విచ్’(మంత్రగత్తె) అంటూ నిందించాడు. దౌత్యం వల్ల వచ్చింది ఏమీ లేదు సైన్యం అడిగిన సమయం లభించడం తప్ప. నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ యాహ్యాఖాన్ తూర్పు పాకిస్తాన్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకొని యుద్ధం ప్రకటించే సమయానికి భారత సైన్యం సరి హద్దు దాటి ఢాకా వైపు వంద కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయింది. వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్తో ఇరవై సంవత్సరాల మైత్రీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల నిక్సన్ పంపిన యుద్ధ నౌక అడుగు ముందుకు వేయలేకపోయింది. పదిహేను రోజుల్లో యుద్ధం ముగిసింది. జనరల్ నియాజీ నాయకత్వంలోని పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం ఇందిరాగాంధీ జీవితంలో అత్యున్నత విజయం. ఇంతటి ఘనకార్యం సాధించిన తర్వాత రెండు, మూడు సంవత్సరాలకే ఆమె పతనం ఆరంభమైంది. అవినీతిని ఉపేక్షించారు. పార్టీ సహచరులలో ఎవరినైనా పదవి నుంచి తొలగించాలంటే వారిపైన ఉన్న అవినీతి ఆరోపణలను ఉపయోగించుకునేవారు. తెలంగాణ ఉద్యమం అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించేందుకు అదే అస్త్రం ప్రయోగించారు. ఆర్ కె ధవన్ చూపించిన ఫైలు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా లేఖ రాయించింది. ఇదే విధంగా ఈ అస్త్రాన్ని అనేకమందిపైన ఉపయోగించారు. జేపీ నేతృత్వంలో అవి నీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఇందిరలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ప్రతిపక్ష నాయకులంతా ఉద్యమాన్ని సమర్థించడంతో ఆమెలో అభద్రతాభావం పెరిగింది. ఎవరో తనని తరుముతున్నట్టూ, తనను అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నట్టూ భయపడేవారని ఇందిరకు సన్నిహితురాలు పపుల్ జయకర్ తన పుస్తకంలో రాశారు. జేపీ ఉద్యమం ఉధృతమైంది. ప్రజలకు వ్యతిరేకమైనవిగా కనిపించిన ఆదేశాలు పాటించనవసరం లేదంటూ పోలీసులకూ, సైనికులకూ ఉద్బోధించారు. రైళ్ళు ఉద్యమకారులను చేరవేస్తూ పూటల తరబడి ఆలస్యంగా నడిచేవి. విద్యాసంస్థలు మూతపడినాయి. ప్రభుత్వం లేనట్టే లెక్క. ఇటువంటి పరిస్థితిలో అలహాబాద్ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఇందిర తరఫున నానీ పాల్కీవాలా వాదించారు. ఈ తీర్పుపైన సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. అక్కడ షరతులతో కూడిన స్టే వచ్చింది. అప్పటికే గాభరాపడిపోయిన ఇందిర తనయుడు సంజయ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్దార్థశంకర్ రే చెప్పిన సలహా పాటించి 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇది ఆమెకు తీరని మచ్చ తెచ్చిన నిర్ణయం. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో కుక్కారు. ప్రజాస్వామ్య సంస్థలనూ, సంప్రదాయాలనూ ధ్వంసం చేశారు. ఆత్యయిక పరిస్థితి విధించారు కనుక ఈ కేసులో వాదించజాలనని పాల్కీవాలా చెప్పారు. ఆయనపైన కక్షసాధింపు చర్యలు తీసుకున్నారు. టాటా కంపెనీల బోర్టుల నుంచి ఆయనను తొలగించే విధంగా ఒత్తిడి తెచ్చారు. విమర్శను తట్టుకోలేకపోవడం, ప్రత్యర్థులను అణచివేయడం. నిరంకుశంగా వ్యవహరించడం ఇందిరాగాంధీలో కొట్టొచ్చినట్టు కనిపించిన అవలక్షణాలు. తన నీడను సైతం శంకించే పరిస్థితి. ఎవ్వరినీ నమ్మలేని దౌర్బల్యం ఆమెను ఆవహించింది. సంజయ్పైన ఇందిర ఆధారపడటం ఎక్కువయింది. ఉత్తరాదిలో పోలీసుల జులుం పెరిగింది. ప్రెస్ సెన్సార్షిప్ విధించారు. దాదాపు అన్ని పత్రికలూ ప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి ‘జో హుకుం’ అంటే, ప్రభుత్వాన్ని విమర్శించింది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు పత్రికలు మాత్రమే. ఆ రోజుల్లో బెంగుళూరులో ‘ఆంధ్రప్రభ’లో పని చేస్తూ ఆత్యయిక పరిస్థితిని వ్యతిరేకించడం, అరుణ్శౌరీ బృందంతో కలసి తిరగడం, తరచు రిపోర్టింగ్కి వెళ్ళడం గర్వంగా ఉండేది. 1977లో ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇందిరగాంధీ ఖమ్మం సందర్శించినప్పుడు నేను సెలవుపైన అక్కడే ఉన్నాను. టాపు లేని జీపులో చేతులు జోడించి ప్రయాణం చేస్తున్న ప్రధాని మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 స్థానాలలో 41 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకున్నది కానీ, ఉత్తరాదిలో పార్టీ చావుదెబ్బ తిన్నది. ఇందిర సైతం ఓడిపోయారు. జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మొరార్జీ, హోంమంత్రి చరణ్సింగ్ చాకచక్యం లేకుండా మొండిగా వ్యవహరించడం ఆమెకు బాగా అనుకూలించింది. అంతఃకలహాల కారణంగా జనతా ప్రయోగం చతికిలపడింది. 1980 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందిరాగాంధీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగిన ఆరు మాసాలకే సంజయ్గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం ఆమెను కుంగదీసింది. మళ్ళీ కోలుకోలేదు. ఇదివరకటి చురుకుదనం, వ్యూహరచనా నైపుణ్యం, యుద్ధకౌశలం అదృశ్యమైనాయి. దేశంకోసం ప్రాణత్యాగం సైనిక బలగాలు స్వర్ణదేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి భింద్రన్వాలే, ఆయన అనుచరులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టగానే వారు లొంగిపోతారనీ, కాల్పులు జరగవనీ, మరణాలు ఉండవనీ జనరల్ వైద్య, లెఫ్టినెంట్ జనరల్ సుందర్జీ హామీ ఇచ్చిన తర్వాతనే సైనిక చర్యను ఇందిరాగాంధీ అనుమతించారు. రెండు గంటలలో పూర్తి కావలసిన పని రెండు రోజలు పట్టింది. తర్వాత స్వర్ణదేవాలయం సందర్శించి సమీపంలోని సరోవర్లో తేలుతున్న మృతదేహాలు చూసి ఇందిర దిగ్భ్రాంతి చెందారు. ఇందుకు ఆమే మూల్యం చెల్లించారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దేశ సమైక్యత, సమగ్రతలకోసం అత్యున్నతమైన ప్రాణత్యాగం చేశారు. నెహ్రూ నుంచి నరేంద్రమోదీ వరకూ ప్రధానులందరి పదవీకాలాలనూ, జీవితాలనూ పరిశీలిస్తే ఇందిర వ్యక్తిత్వం అర్థం అవుతుంది. ఆమె ఎదుర్కొన్న సవాళ్ళను మరెవ్వరూ ఎదుర్కోలేదు. ఆమె సాధించిన విజయాలను ఇంకెవ్వరూ సాధించలేదు. 16 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తప్పొప్పులు ఉండటం సహజం. కానీ ఆమె దేశభక్తినీ, చిత్తశుద్ధినీ శంకించడం అపచారం. - కె. రామచంద్రమూర్తి -
ఫిరాయింపులు.. దబాయింపులు!
రాజ్యాంగాన్ని సవ్యంగా అమలు చేయవలసిన వ్యక్తులూ, సంస్థలూ విఫలమైనప్పుడు రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం అనివార్యం. రాష్ట్రపతి, గవర్నర్ ప్రత్యక్షంగా రాజ్యాంగ పరిరక్షకులు. ప్రధానీ, ముఖ్యమంత్రులూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు. వీరంతా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడూ లేదా ఎవరైనా రాజ్యాంగాన్ని బుద్ధిపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే తమకు సంబంధం లేనట్టు మరోవైపు చూసినప్పుడూ చట్టపాలనను అభిలషించే పౌరులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగంలోని లోపాలను వినియోగించుకొని రాజకీయక్రీడ తెలివిగా, కొంటెగా కొనసాగిస్తుంటే బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ ఫిరాయించినవారిపైన ఏమి చర్య తీసుకోవాలో తాను నిర్ణయించడానికి ముందే విపక్ష సభ్యులు కోర్టుకు ఎక్కారు కనుక ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అనడంలోని గడుసుతనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వారు సకాలంలో చర్య తీసుకుంటే కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? ఫిరాయించినవారిపై చర్య తీసుకోవలసిందిగా సభాపతికి, న్యాయస్థానాలకు విన్నవించుకొని దాదాపు మూడున్నరేళ్లు గడుస్తున్నా ఫలితం రానప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకత్వం కర్తవ్యం ఏమిటి? శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధికార పక్షం అవలంబి స్తున్న అప్రజాస్వామిక వైఖరిని జాతీయ స్థాయి పెద్దల, సంస్థల దృష్టికి తీసుకురావడం ఒక్కటే మార్గం. ఈ విధంగా నిరసన ప్రకటించడం ద్వారా దబాయింపు రాజకీయాలకూ, రాజ్యాంగ విరుద్ధమైన పోకడలకూ సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్న పని అదే. ఇదే పని ఇంతటి బలమైన కారణం లేకుండానే చాలా స్వల్పమైన అంశాలపైన నిరసనగా ఎన్టి రామారావు సభకు రాకుండా ఉన్నారు. చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో ఉండగా సభను బహిష్కరించారు. వారు చేస్తే ఒప్పు అయినది ఎవరు చేసినా తప్పు కాజాలదు. పార్టీ ఫిరాయింపు అనేది తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని అయిదు దశాబ్దాలుగా పీడిస్తున్న జాడ్యం. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది 1967లో. ఆ సంవత్సరం 16 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తక్కిన రాష్ట్రాలలో ప్రతిపక్షాలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అప్పుడు చట్టసభల సభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రక్రియ జోరందుకున్నది. 1967–71 మధ్య 142 మంది పార్లమెంటు సభ్యులూ, 1,900 మంది శాసనసభ్యులూ పార్టీలు ఫిరాయించారు. హరియాణా, తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోయేవి. ఆయారాం గయారాం హరియాణాకు చెందిన గయాలాల్ అనే శాసనసభ్యుడు వరుసగా మూడు విడతల పార్టీలు ఫిరాయించాడు. అప్పటి నుంచీ పార్టీలు మారడాన్ని ‘ఆయారాం గయారాం’ అని పిలవడం ఆనవాయితీ. పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులూ, కార్పొరేషన్ అధ్యక్ష పదవులూ ఇచ్చేవారు. అది ఒక లాభసాటి అవినీతి వ్యాపారంగా మారింది. ఫిరాయింపుల ఆట కట్టించడానికి తొలిప్రయత్నం 1985లో నాటి ప్రధాని రాజీవ్గాంధీ చేశారు. 101, 102, 190, 191 అధికరణలలో మార్పులు చేస్తూ 52వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు. ఈ సంస్కరణల అమలు కోసం పదవ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యులపైన అనర్హత వేటు వేసే అధికారం సభాపతులకు మాత్రమే ఇచ్చారు. వారి నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయవ్యవస్థకు ఇవ్వలేదు. మూడింట ఒక వంతు మంది చట్టసభ సభ్యులు పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పార్టీలో విలీనం కావచ్చు. అంతకంటే తక్కువ మంది పార్టీని వీడితే అనర్హత వేటు తప్పదు. ప్రధాని పీవీ నరసింహారావు అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. భూపతిరాజు ఆధ్వర్యంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సభ్యులే చీలిపోయారు. చిన్న పార్టీలలో మూడింట ఒక వంతు మంది చేతులు కలిపి పార్టీ నుంచి నిష్క్రమించడం తేలిక. ఆ కారణంగా 52వ రాజ్యాంగ సవరణ వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. 2003లో నాటి ప్రధాని వాజపేయి నాయకత్వంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది సభ్యులు కలిస్తేనే పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలో విలీనం కావచ్చు లేదా వేరే పార్టీగా మనుగడ సాగించవచ్చు. సభ్యత్వానికి ఢోకా లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత సైతం ఫిరాయింపులు ఆగలేదు. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఈ క్రీడలో సమధికోత్సాహంతో పాల్గొంటున్నాయి. నీతి, నిజాయితీలకు తిలోదకాలు ఇచ్చేసి నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రభుత్వాధినేతలే ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం నల్లధనం వినియోగిస్తున్నారు. పార్టీలు మారిన వారికి పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఫిరాయింపు రాజకీయాలు ముమ్మరంగా సాగాయి. తమిళనాడులో పళ నిస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు స్పీకర్ పి. ధనపాల్ మొన్న సెప్టెంబర్ 18న టీటీవీ దినకరన్కు చెందిన 18 మంది ఏఐఏడీఎంకె శాసనసభ్యులపైన అనర్హతవేటు వేశారు. ఇతర పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఏ మాత్రం సంకోచం లేకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి. రాజ్యాంగంలోని లొసుగులను అధికార పార్టీలు ఎంత తెలివిగా ఉపయోగించుకుంటున్నాయో గమనిస్తే పాలకులకు రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల ఎంత పట్టింపు ఉన్నదో అర్థం అవుతుంది. కిహోటో హోలోహన్ వర్సెస్ జాచిల్హూ కేసు విచారణ సుప్రీంకోర్టులో 1992లో జరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. సభాపతికి పదో షెడ్యూల్ సంపూర్ణ అధికారం ఇచ్చినప్పటికీ వారు షెడ్యూల్లోని 6(1)వ పేరాలో పేర్కొన్న విధంగా వ్యవహరించాలని చెప్పింది. సభాపతి నిర్ణయాన్ని న్యాయసమీక్ష జరిపే అధికారం హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ ఉన్నదని కూడా స్పష్టం చేసింది. సభాపతికి నిర్ణయాధికారం ఇచ్చే పదో షెడ్యూల్లోని ఏడవ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని, దాని విషయంలో పునఃపరిశీలన జరపడమో, రాజ్యాంగ సవరణ చేయడమో ఉత్తమమని కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరో ఆసక్తికరమైన వివాదం కూడా ఇందుకు సంబంధించి జరిగింది. మణిపూర్ స్పీకర్ బోరోబాబూసింగ్ 1992లో ఒక శాసనసభ్యుడిపైన అనర్హత వేటు వేశారు. సదరు శాసనసభ్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు సంపాదించారు. మణిపూర్ శాసనసభ కార్యదర్శి మణిలాల్సింగ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తగినట్టు శాసనసభ్యుడి పునరాగమనానికి రంగం సిద్ధం చేశారు. ఇది తెలుసుకున్న బోరోబాబూసింగ్ మణిలాల్సింగ్ను సస్పెండు చేసి ముందస్తు పదవీ విరమణకు ఆదేశించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో న్యాయవాదులు మాట వరుసకు ప్రస్తావిస్తే సుప్రీం న్యాయమూర్తులు ఆగ్రహించి మణిలాల్ సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ధిక్కారనేరం కింది తమ ఎదుట హాజరు కావలసిందిగా స్పీకర్ని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రబలిన తెగులు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, నీతి బాహ్యం, అప్రజాస్వామికం. ఆంధ్రప్రదేశ్లో ఫిరాయించిన 21 మంది శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ సభాపతికి మహజర్లు సమర్పించింది. ఆయన స్పందించలేదు. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను ఎట్లా సమర్థిస్తారో చెప్పవలసిందిగా ఫిరాయించిన శాసనసభ్యులనూ, శాసనసభ కార్యదర్శినీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, శంకర నారాయణతో కూడిన డివిజన్ బెంచ్ 2016 నవంబర్ 14న అడిగింది. మళ్ళీ ఈ కేసు విచారణకు రాలేదు. సుప్రీంకోర్టులో విడిగా వైఎస్ఆర్సీపీ బాధ్యులు పిటిషన్ వేశారు. అమరావతిలో శాసనసభా ప్రాంగణానికి ఈ యేడాది మార్చి రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నాయకుడూ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభాపతికి బహిరంగ లేఖ రాశారు. ఫిరాయించిన శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా అభ్యర్థించారు. సభాపతి ఉలకలేదు. ముఖ్యమంత్రి మాత్రం వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి సత్కరించారు. ఫిరాయింపుదారులను వైఎస్ఆర్సీపీ సభ్యులుగా అసెంబ్లీ బులెటిన్లలో చూపించడం మరింత విడ్డూరం. వీటన్నిటినీ భరిస్తూ తాము అడిగే ప్రశ్నలకు ఫిరాయించి మంత్రి పదవులు సంపాదించినవారు సమాధానాలు చెబుతుంటే, వింటూ తలలూపుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉండాలని తెలుగుదేశం నాయకత్వం కోరుకుంటోంది. ఆ పని చేస్తే ఫిరాయింపులనూ, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులతో సత్కరించడాన్నీ వైఎస్ఆర్సీపీ ఆమోదించినట్టు అవుతుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలనూ, నీతి బాహ్యమైన వైఖరినీ ఆమోదించడం ఇష్టం లేని కారణంగానే సభను బహిష్కరించామంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఫిరాయింపుదారులపైన చర్యలు తీసుకున్న మరుక్షణం నుంచి హాజరు అవుతామని చెబుతున్నారు. తెలంగాణలో ప్రగతి తెలంగాణలో ఫిరాయింపుదారులపైన వ్యాజ్యం ఇంకాస్త ముందుకు జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎస్ఎ సంపత్కుమార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్కె అగర్వాల్, ఆర్ఎఫ్ నారిమన్తో కూడిన బెంచ్ పరిశీ లించి ఇది చాలా సున్నితమైన విషయం కనుక అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని నిర్ణయించింది. 2016 నవంబర్ 9న ధర్మాసనానికి నివేదించింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయవలసిందిగా స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషనర్ ప్రార్థించారు. ఎన్నికలలో 67 స్థానాలు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఫిరాయింపుల ధర్మమా అని 89 స్థానాలు ఉన్నాయంటూ ధర్మాసనానికి నివేదించారు. ఇదే రకమైన ప్రార్థన హై దరాబాద్ ఉమ్మడి హైకోర్టులో వేయగా 90 రోజులలోగా ఫిరాయింపుదార్లపైన చర్య తీసుకోవలసిందిగా స్పీకర్ మధుసూదనాచారిని కోరింది. ఆయన నిమ్మకునీరెత్తినట్టు మిన్నకున్నారు. పదో షెడ్యూల్లో సభాపతులకు విశేషాధికారాలు ఇచ్చినప్పుడు వారు పార్టీలకి అతీతంగా వ్యవహరిస్తారనీ, ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల బంట్లుగా కాకుండా వారి హోదాకు తగినట్టు, రాజ్యాంగం నిర్దేశించినట్టు స్వతంత్రంగా వ్యవహరిస్తారనీ భావించారు. ఈ భావనే ఘోర తప్పిదమని మూడు దశాబ్దాలలో సభాపతులే నిరూపించారు. కిహోటో హోలోహన్ కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఉన్నత పదవిలో ఉన్న సభాపతిని శంకించడం ధర్మం కాదని వ్యాఖ్యానిస్తూ, ‘సభాపతి దుస్తులు ధరించిన తర్వాత ‘లోపలి మనిషి’ ఉన్నతంగా పరిణామం చెందుతారు’ అనే ఆశాభావం వెలిబుచ్చింది. రెండున్నర దశాబ్దాల అనంతరం మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానం అరుణాచల్ప్రదేశ్ శాసనసభాపతి కేసులో తీర్పు ఇస్తూ ‘సభాపతి దుస్తుల లోపలి మనిషి’ పట్ల అవిశ్వాసం ధ్వనిస్తూ సభాపతిపైన పరిమితులు విధించాలని సూచించింది. సభాపతులు ప్రధానమంత్రులకూ, ముఖ్యమంత్రులకూ విధేయులుగానే ఉంటారని స్పష్టమైపోయింది. అందువల్ల వారికి పదో షెడ్యూల్లో దఖలు పరచిన విశేషాధికారాన్ని రద్దు చేసి ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే నిర్ణయం రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ తీసుకోవాలనీ, వారు సైతం ఎన్నికల కమిషన్ సలహాను విధిగా పాటించాలనీ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్, అంతకు పూర్వం దినేష్ గోస్వామి కమిటీ సిఫార్సు చేశాయి. దీని అమలుకు రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు ప్రధాని మోదీ సహకారం తప్పనిసరి. అవినీతిపైనా, నల్లధనంపైనా యుద్ధం చేస్తున్న ప్రధానికి నల్లధనం, అవినీతితో కూడిన ఫిరాయింపులనే వికృత క్రీడ సమ్మతం కాజాలదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కుహనా ప్రజాస్వామికశక్తుల ఆటకట్టించే శక్తి ప్రస్తుతం మోదీకి మాత్రమే ఉంది. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడను వదిలించేందుకు నడుం బిగిస్తే మోదీ చరితార్థులు అవుతారు. - కె. రామచంద్రమూర్తి -
కమలానికి కఠోర పరీక్ష
త్రికాలమ్ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అన్ని వర్గాల ఆమోదం కోసం తాను అనేకమందితో సమాలోచనలు జరుపుతున్నట్టు శ్రీశ్రీ రవిశంకర్ రెండురోజుల క్రితమే ప్రకటించారు. ఆయనకు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వంటి బీజేపీ అగ్రనాయకులు మద్దతు పలికారు. భారతదేశంలో నివసించే హక్కు హిందువులకు మాత్రమే ఉన్నదని శనివారం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఉద్ఘాటించారు. ఈ పరిణామాలకూ, గుజరాత్ ఎన్నికలకూ ఏమైనా సంబంధం ఉన్నదా? గుజరాత్ ఎన్నికలకూ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)లో సవరణలకూ లంకె ఉన్నదా? వికాస్ (అభివృద్ధి), అవినీతి రహిత పాలన అంటూ రెండు నినాదాలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ హిందూత్వను కూడా జోడిస్తే కానీ ఆశించిన ఫలితం రాదని భావించారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమా? ఎందుకంత శ్రమ? ‘రాహుల్గాంధీలాగా మా మోదీ సోమరి కాదు. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరి గినా శక్తివంచన లేకుండా కష్టపడతారు.’ ఇవి బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు ఒక ఇంగ్లీషు చానల్ చర్చాకార్యక్రమంలో అన్న మాటలు. మోదీ అక్టోబర్ మాసంలో గుజరాత్లో అయిదు పర్యాయాలు పర్యటించారు. గుజరాత్లో ఘనవిజయం ఖాయమనే విశ్వాసం ఉంటే ఒక ప్రధాని అన్నిసార్లు ఆ రాష్ట్రానికి వెళ్ళడం ఎందుకనే ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో చివరి మూడు రోజులూ ఒక్క కాశీ నగరంలోనే మోదీ ప్రచారం చేయడం విస్తుగొలిపింది. గెలుపు చాలా కష్టసాధ్యమని భావిం చిన కారణంగానే ప్రధాని ఒకే నగరంలో అన్ని రోజులు ఉన్నారేమో అనుకున్నాం. ఉత్తరప్రదేశ్లో అంతిమంగా బీజేపీ ఘనవిజయం సాధించింది. బీజేపీకి యూపీలో గెలుపొందడం చాలా అవసరం. ఆ గెలుపు పార్టీకి కొత్త ఊపునిచ్చింది. దేశప్రజల దృష్టిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్థాయి పెంచివేసింది. యూపీ కంటే గుజరాత్ బీజేపీ దృష్టిలో కీలకం. ఈ రాష్ట్రాన్ని మోదీ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు పరిపాలించారు. గుజరాత్ తరహా అభివృద్ధి దేశవ్యాప్తంగా సాధిస్తాననే వాగ్దానంతోనే ఆయన 2014 ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ సాధించిపెట్టారు. ఆ ఎన్నికలలో గుజరాత్లో ఉన్న మొత్తం 26 లోక్సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకున్నది. పైగా బీజేపీ వరిష్ఠనేత లాల్కృష్ణ అడ్వాణీ గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. షా కూడా ఆ రాష్ట్రం నుంచే ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనారు. సొంతరాష్ట్రంలో ఓడిపోతే మోదీ–అమిత్షా ద్వయానికి తలవంపులు. గెలిచినా ఆధిక్యం 2012లో కంటే తగ్గిందంటే అప్రతిష్ఠ. మారిన రాహుల్ 1995 నుంచీ అధికార పీఠానికి దూరంగా ఉన్న కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘పప్పు’గా పేరుమోసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కత్తిలాగా మాటల తూటాలు ప్రయోగించి దేశ ప్రజల మెప్పు సంపాదిం చారు. ఆత్మవిశ్వాసంతో, జీఎస్టీని గబ్బర్సింగ్ టాక్స్గా అభివర్ణిస్తూ విసురుతున్న చలోక్తులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ‘ఇండియా టుడే’, ‘టైమ్స్ నౌ’ వంటి మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు బీజేపీకి ఈ సారి 2012లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని జోస్యం చెబుతున్నప్పటికీ మోదీకి నమ్మకం కలగడం లేదు. అందుకే అంత తరచుగా గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందు ఆ రాష్ట్రంలో రూ.15,000 కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కూడా అందుకే. ‘అచ్ఛే దిన్’గురించి అంతగా ప్రస్తావించకపోవడానికీ అదే కారణం. ఈ సంవత్సరం ఆరంభంలో యూపీలో అమిత్షా, 1970లలో గుజరాత్లో ఇందిరాగాంధీ చేసిన ప్రయోగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేస్తున్నారు. యూపీలో సుమారు 200 కుల సమావేశాలను అమిత్షా నిర్వహించి అన్ని కులాల మద్దతూ కూడగట్టి యాదవ కులాన్ని ఒంటరిదాన్ని చేశారు. ఇందిరాగాంధీ క్షత్రియులనూ ( గుజరాత్ జనాభాలో 37శాతం ఓబీ సీలు), దళితులనూ (6), ఆదివాసీలనూ (15), ముస్లింలనూ (10 శాతం) ఒక తాటిపైకి తెచ్చి (ఓఏఅ M‘ఖామ్’) బలమైన సంకీర్ణం నిర్మించారు. నాడు ఈ కృషిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ నాయకుడు జీనాభాయ్ దర్జీది ప్రధానపాత్ర. నేడు రాహుల్గాంధీ చాకచక్యం వల్ల కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల 70 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల నాయకులు కాంగ్రెస్తో భుజం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మోదీ, షాలను బాగా కలవరపెడుతున్న పరిణామం. వ్యాపారమే ప్రధానంగా భావించే గుజరాతీయులలో అకస్మాత్తుగా ఒక చైతన్యం వెల్లువెత్తుతుంది. చినికి చినికి గాలివానగా మారుతుంది. యువత అతి వేగంగా స్పందించి తిరుగుబాటు చేస్తుంది. అహ్మదాబాద్ హాస్టళ్ళలో ఆహారం నాసిరకంగా ఉండటానికీ, మెస్ బిల్లులు పెరిగిపోవడానికీ నిరసనగా 1973 డిసెంబర్లో ఆరంభమైన విద్యార్థుల ఆందోళన క్రమంగా ఊపందుకొని నవనిర్మాణ ఉద్యమంగానూ, అనంతరం జయప్రకాశ్నారాయణ్ నాయకత్వంలో సంపూర్ణ విప్లవంగానూ పరిణమించింది. 1975లో ఆత్యయిక పరిస్థితికి దారితీసి, 1977లో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి కారణమై దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. విద్యార్థి ఉద్యమం గుజరాత్లో చిమన్భాయ్ పటేల్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. 43 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుజరాత్లో యువత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. మూడు బలమైన వర్గాలకు ప్రతినిధులుగా ముగ్గురు యువనేతలు– హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకుర్, జిగ్నేశ్ మెవానీ– ఎదిగారు. ముగ్గురు మరాఠీలు పతీదార్లకు ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కావాలంటూ పతీదార్ అనామత్ ఆందోళన్ సమితి (PASS )ఆధ్వర్యంలో 2015లో 22 ఏళ్ళ హార్దిక్ పటేల్ ఆందోళన మొదలుపెట్టారు. ఆనందీబెన్ పటేల్ సర్కార్ను గడగడలాడిం చారు. పతీదార్లు వ్యవసాయం ప్రధానంగా జీవించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయాధార పరిశ్రమలకూ, ఇతర పరిశ్రమలకూ, రాజకీయాలకూ విస్తరించారు. కడ్వ, ల్యూవా పటేల్ ఉపకులాలవారు హార్దిక్పటేల్ను సమర్ధిస్తున్నారు. గుజరాత్ జనాభాలో కడ్వ పటేళ్ళు ఆరు శాతం, ల్యూవా పటేళ్ళు ఎని మిది శాతం, ఇతర పటేళ్ళు రెండు శాతం ఉంటారు. 1984–85 నుంచీ పటేళ్ళు మూకుమ్మడిగా బీజేపీతో ఉన్నారు. ఈ సారి తేడా వచ్చింది. కానీ నాయకులు మాత్రం ఇప్పటికీ బీజేపీతోనే ప్రయాణం చేస్తున్నారు. అల్పేశ్ ఠాకుర్ (40) ఓబీసీ నాయకుడు. కాంగ్రెస్ నేత ఖోడాభాయ్ పటేల్ తనయుడు. ఆరేళ్ళ కిందట ‘క్షత్రియ ఠాకుర్ సేన’ను అల్పేశ్ స్థాపించారు. ఆ సంస్థలో ఏడు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏక్తామంచ్ (OSS ) నెలకొల్పారు. మంచి నిర్వాహకుడిగా పేరు సంపాదిం చారు. అల్పేశ్ ప్రభావం ఉత్తర గుజరాత్లోని సబర్కాన్తా (3 నియోజకవర్గాలు), బనాస్కాంతా (9), ఖేడా (7), మెహసానా(7), ఆనంద్ (7), పట్నా (4), గాంధీనగర్ (5), ఆరావళీ (3) జిల్లాలలో విశేషంగా ఉంటుంది. ఉత్తర గుజరాత్లోని మొత్తం 33 శాసనసభ స్థానాలలో 2012 ఎన్నికలలో కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 15కే పరిమితమైంది. అప్పుడు శంకర్సిన్హ్ వఘేలా కాంగ్రెస్లో ఉండేవారు. ఆయనకు 15 నియెజకవర్గాలలో పట్టు ఉంది. గత జులైలో వఘేలా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు. ‘జనవికల్ప్’ పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు. 1996 లో సైతం బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా కాంగ్రెస్లో చేరకుండా ‘రాష్ట్రీయ జనతా పార్టీ’ని నెలకొల్పారు. 1998 ఎన్నికలలో ఆ పార్టీ గుర్తుపై అభ్యర్థులను నిలబెట్టి 12 శాతం ఓట్లు చీల్చుకున్నారు. ఓబీసీలలో ఠాకూర్లది పెద్ద వర్గం. దాని నాయకుడు అల్పేశ్ ఇటీవల జనాదేశ్ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరి తన నాయకత్వం లోని ఓఎస్ఎస్ సంస్థను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. జిగ్నేశ్ మెవానీ 37 సంవత్సరాల యువకుడు. వృత్తిరీత్యా న్యాయవాది. పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు వేయడంలో దిట్ట. 2016లో ఉనా నగరంలో నలుగురు అర్ధనగ్నంగా ఉన్న దళిత యువకులను గోరక్షకులు విపరీతంగా కొట్టిన ఘటనపై పెద్ద ఉద్యమం నిర్మించి దళిత నేతగా ఎదిగిన వ్యక్తి జిగ్నేశ్. చాలామంది దళితులను బౌద్ధంలో చేర్పించారు. గుజరాత్ జనాభాలో దళితులు ఆరు శాతం. ముస్లింలు పది శాతం. ఈ రెండు వర్గాల మద్దతు లేకుండానే ఎన్నికలలో గెలవడం బీజేపీకి పరిపాటి. గుజరాత్లోని వివిధ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముగ్గురు యువకులు గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలలోనూ 111 స్థానాలను ప్రభావితం చేయగలరు. వీరిని కాంగ్రెస్ అక్కున చేర్చుకోగలిగితే బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బతింటాయి. అల్పేశ్, జిగ్నేశ్ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. తాను పోరాడుతున్నది పటేళ్ళకు రిజర్వేషన్లకోసం కనుక రిజర్వేషన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తాను పూర్తి మద్దతు ఇస్తానని హార్దిక్ చెబుతున్నాడు. హామీ ఇవ్వడం అంత తేలిక కాదు. పటేళ్ళకు రిజర్వేషన్లు అవసరమా, లేదా అనే విషయంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయినా బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాలని పట్టుదలగా ఉన్న హార్దిక్ కాంగ్రెస్ పార్టీని సమర్థించక తప్పకపోవచ్చు. బీజేపీ నేతల్లో గుబులు ఆర్ధిక మాంద్యం గుజరాత్లో వివిధ వర్గాలను దెబ్బతీస్తున్నది. వ్యవసాయరంగం దీనావస్థలో ఉంది. ఇటీవలి వరదలలో నష్టపోయినవారిలో చాలామంది ఇంకా కోలుకోలేదు. ఆరోగ్యం, రవాణా రంగాలు కుదేలైనాయి. ఇంతవరకూ బీజేపీని బేషరతుగా బలపరిచిన అహ్మదాబాద్, సూరత్ వజ్రాలూ, జౌళి వ్యాపారులు జీఎస్టీతో దారుణంగా దెబ్బతిని ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఈ నెల 8 వ తేదీన వదోదరా సభలో ప్రసంగిస్తున్న మోదీపైన పరిమిత వేతనాలకు వ్యతి రేకంగా పోరాడుతున్న సంస్థ అధ్యక్షురాలు చంద్రికా సోలంకీ అరడజను గాజులు విసిరి నిరసన ప్రకటించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భరత్సింగ్ సోలంకీ సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు. పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయం తాలూకు ఉత్సాహం పార్టీ కార్యకర్తలలో ఉంది. అయినప్పటికీ నవంబర్ 9, 14 తేదీలలో 14వ గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడించగలదని చెప్పడం కష్టం. బీజేపీ చేతిలో అధికారం ఉంది. వివిధ వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది. అంగబలం, అర్థబలం ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దయినప్పటికీ అధికారపార్టీ చేతుల్లో నల్లధనం అపారంగా ఉంది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల క్షేత్రస్థాయి సేవలు ఉన్నాయి. 2002 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పొందిన ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు 10–11 శాతం అధికం. మోదీ ప్రధానిగా వచ్చి ఓట్లు అడుగుతున్నారు కనుక బీజేపీకే వేయాలనే ఆలోచన చాలామందిలో ఉండవచ్చు. అయినప్పటికీ మోదీ ర్యాలీలకు జనం ఉత్సాహంగా హాజరు కాకపోవడం బీజేపీ నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నది. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే సరిపోదు. భారీ ఆధిక్యం సాధించాలి. లేకపోతే ఆర్ఎస్ఎస్ నాయకత్వం క్షమించదు. ప్రజల దృష్టిలో మోదీ–షా ద్వయం పలచన అవుతారు. వారి మ్యాజిక్ పనిచేయడం లేదనే అభిప్రాయం కలుగుతుంది. అటువంటి అభిప్రాయం ప్రబలితే గుజరాత్ ఎన్నికల తర్వాత జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, ఆ తర్వాత 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలోనూ బీజేపీకి నష్టాలూ, కష్టాలూ పెరుగుతాయి. అందుకే మోదీ అంతగా శ్రమిస్తున్నారు. కె. రామచంద్రమూర్తి -
మీడియాపై దాడులను అడ్డుకుందాం
కొరుక్కుపేట : మీడియాపై దాడులను అడ్డుకునేందుకు చెన్నైలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందులో దాడుల అడ్డుకట్టకు, మీడియా భద్రతకు ఐదు తీర్మానాలు చేశారు. వీటిని కేంద్రంతోపాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై దాడులు– బెదిరింపులు – మీడియాలో నేటి పరిస్థితిపై జాతీయ సదస్సు ఆదివారం జరిగింది. సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ సంధానకర్తగా రెండు సెషన్లతో కార్యక్రమం జరిగింది. ఇందులో సాక్షి మీడియా తరఫున ఈడీ రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్ రామ్, నటి గౌతమి, తమిళనాడు తమిళ భాష అభివృద్ధి శాఖ మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్, తమిళ మీడియా సంపాదకులు పాల్గొన్నారు. సదస్సులో మీడియాపై దాడులు, ప్రభుత్వాల తీరు, మీడియా సంస్థల్లో ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
ప్రమాదంలో టీటీడీపీ ఉనికి
త్రికాలమ్ పరిసరాల ప్రభావం మనిషిపైన తప్పనిసరిగా ఉంటుంది. పరిణామాలు మనిషి వైఖరిని మార్చివేస్తాయి. స్వాతంత్య్ర సమరం సాగిన సమయంలో సత్యం, స్వేచ్ఛ, సమానత్వం, త్యాగ భావన వంటి ఉన్నతమైన విలువలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయి. 1960లలో వియత్నాం యుద్ధం, పౌరహక్కుల ఉద్యమాలు, జాన్ ఎఫ్ కెన్నడీ హత్యోదంతం ప్రపంచవ్యాప్తంగా యువతను కది లించాయి. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ఆవిష్కృతమైన తర్వాత వ్యాపార సంస్కృతికి పెద్దపీట వేశాం. అప్పుడే హైటెక్ విప్లవం యువతీయువకులను అమెరికా బాట పట్టించింది. 2014లో మితవాద ధోరణులు ప్రబలిన ఫలి తంగా నరేంద్ర మోదీ బీజేపీకి అపూర్వమైన విజయం సాధించగలిగారు. నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మితిమీరిన మితవాద భావజాలానికి ప్రతీ కగా డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. కాలానికి అనుగుణంగా విలువలు మారతాయి. అందుకే మనిషిని కాలం రూపొందిస్తుంది (Man is the pro-duct of his times)) అంటారు. వార్తలలో వ్యక్తి వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వార్తలలో ఉన్న వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి కూడా సమకాలీన విలువలకూ, రాజకీయ సంస్కృతికీ ప్రతీక. మోదీ, ట్రంప్లను గెలిపించిన ధోరణులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)లు పాటిస్తున్న విలువలూ, అనుసరిస్తున్న విధానాలూ, ప్రదర్శిస్తున్న వైఖ రులూ రేవంత్రెడ్డి రాజకీయాన్ని నడిపిస్తున్నట్టు భావించవచ్చు. ఆర్ఎస్ఎస్ అభిమానిగా, బీజేపీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగిన రేవంత్రెడ్డి ఇండిపెండెంట్గా ఎంఎల్సి ఎన్నికలలో గెలుపొందారు. ప్రస్తుతం కొడంగల్ శాసనసభ్యుడు (అందుకే రేవంత్ తాజా విన్యాసాల వెనుక చంద్రబాబు ఉన్నారా అంటూ ప్రజలు అనుమానిస్తున్నారు). టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా సన్నిహితుడు. భార్య, కొడుకు, కోడలు సమేతంగా రేవంత్రెడ్డి కుమార్తె పెళ్ళికి చంద్రబాబు హాజరైనారు. భువనేశ్వరి, బ్రాహ్మణి సాధారణంగా రాజకీయనేతల కుటుంబాలలో వివాహాలకు వెళ్ళరు. రేవంత్రెడ్డి మాత్రం మినహాయింపు. ‘ఓటుకు కోట్లు’ ఉదంతంలో కరెన్సీ నోట్లకట్టలతో కెమెరాకు చిక్కిన రేవంత్రెడ్డికి సంఘీభావం తెలపడంకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయత్నించిన సందర్భం అది. చంద్రబాబుకూ, ఆయన కుమారుడు లోకేశ్కూ అత్యంత సన్నిహితుడు కాగలిగిన నేర్పరి రేవంత్రెడ్డి. లక్ష్యం ఛేదించడం ఎట్లాగో తెలిసిన విలుకాడు. విజయంకోసం ఉపయోగించే మార్గం ఈ తరం నాయకులలో అత్యధికులకు అంత ప్రధానం కాదు. పాతతరం విలువలు పాటించేవారికి ప్రత్యేకమైన గుర్తింపు కానీ గౌరవం కానీ లేవు. వారిని చేతగాని వాజమ్మలుగా (సన్నాసులు) పరిగణిస్తున్నారు. ఇప్పటి రాజకీయాలలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండాలన్న పట్టింపు లేదు. మాటలను తూటాలుగా పేల్చే ప్రావీణ్యం, తెగింపు ఉంటే చాలు. చేయని మంచి పనులు చేసేసినట్టూ, చేసిన తప్పులు చేయనట్టూ దబాయించే వెరపులేని మనస్తత్వం వీరి ప్రత్యేకత. గతం అంతా చీకటేననీ, తనతోనే వెలుగు వచ్చిందనీ నిస్సంకోచంగా చెప్పగలగాలి. ఎంతటివారినైనా ఎంతమాటైనా నిస్సంకోచంగా అనాలి. అటువంటివారినే గుండెబలం ఉన్న నాయకులుగా ప్రజలు పరిగణిస్తున్నారు. నేటి వాతావరణంలో వారే మేటి నేతలు. అటువంటి నేతలనే మీడియా ప్రేమిస్తుంది. ప్రశ్నించదు. ప్రమాదంలో టీటీడీపీ ఉనికి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. ఇది అనివార్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య అనేక వైరుధ్యాల కారణంగా రెండు రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ ప్రజాదరణ పొందడం ప్రస్తుతానికి అసాధ్యం. 2014లో టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసినవారిలో 15 మంది విజయం సాధించగా 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయించవలసిందిగా ప్రోత్సహించిన చంద్రబాబుకు తెలంగాణ పరిణామాల పట్ల ఫిర్యాదు చేసే నైతికాధికారం లేదు. శ్రీనివాసయాదవ్ టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరినప్పుడు పార్టీ ఫిరాయించడం ఎంతటి సిగ్గుమాలిన వ్యవహారమో, పార్టీని ఎట్లా వంచించి మరో పార్టీలోకి దూకుతున్నారో వివరిస్తూ నిప్పులు కక్కారు చంద్రబాబు. కపట రాజకీయాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఫిరాయింపుల నిరోధక చట్టం అంటూ ఒకటి రాజ్యాంగంలో ఉన్నదనే స్పృహ మోదీకి కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ లేదు. రాజీవ్గాంధీ, వాజపేయి రూపొందించిన చరిత్రాత్మకమైన చట్టాన్ని అందరూ కలసి తుంగలో తొక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను బుట్టలో వేసుకున్న చంద్రబాబు రేవంత్రెడ్డిని చేర్చుకున్నందుకు కాంగ్రెస్ను తప్పు పట్టలేరు. అనేక కారణాల వల్ల ఆయన టీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించే స్థితిలో లేరు. ‘ఓటుకు కోట్లు’ కేసు అనంతరం సమీకరణాలు మారిపోయాయి. హైదరాబాద్ విడిచి హూటాహుటిన అమరావతికి తరలి వెళ్ళిన చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే సాహసం చేయడం లేదు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నాయకులనూ, కార్యకర్తలనూ కాజేస్తున్నది కేసీఆర్ అన్నది జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కేసీఆర్ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. కేసీఆర్కు దీటుగా సమాధానం చెప్పగలిగిన నాయకులు ఏ పార్టీలోనూ లేరు. కొన్ని మాసాల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మూడు రోజు లపాటు నల్లగొండ జిల్లాలో మకాం పెట్టి టీఆర్ఎస్ను వచ్చే ఎన్నికలలో ఓడిం చేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ ప్రకటించిన తర్వాత అంగుళం కూడా ఆ పార్టీ ముందుకు కదలలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గట్టిగా, సహేతుకంగా, ప్రభావవంతంగా విమర్శించే నాయకుడు లేడు. కొత్తవారిని తమ పార్టీలో చేర్చుకొని తమలో ఇముడ్చుకునే అలవాటు బీజేపీ నాయకులకు లేదు. తమకు బలం లేని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీని సమకూర్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి కార్యకర్తల బలం ఉంది. ముప్పయ్ శాతం ఓట్లు పది లంగా ఉన్నాయి. కానీ పార్టీ నాయకులనూ, శ్రేణులనూ ఒకే తాటిపైన నడిపించే గట్టి నాయకుడు లేడు. నల్లగొండ జిల్లాలలోనే చాలామంది నాయకులు ఉన్నారు. వారిలోనే ఐక్యత లేదు. అరడజను మందికిపైగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒకరి మాట ఒకరు వినరు. కేసీఆర్కు సమాధానం చెప్పగల సత్తా ఉన్న నాయకుడు కాంగ్రెస్లో ఉన్నాడని ప్రజలు భావించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు గులాంనబీ ఆజాద్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కష్టపడుతున్నారు. జానారెడ్డికి పరిపాలనా రంగంలో విశేషానుభవం ఉన్నది. కానీ వీరిలో ఎవ్వరినీ కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం లేదు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రేవంత్రెడ్డికి మంచి అవకాశం ప్రసాదించాయి. కేసీఆర్ మాట్లాడినంత స్ఫుటంగా, అంతే కరకుగా, అంతకంటే పదునుగా మాట్లాడే శక్తి తనకు ఉన్నదని రేవంత్ గత మూడున్నర సంవత్సరాలలో అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాను ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడనే అపరాధ భావన రేవంత్రెడ్డిలో ఎక్కడా కనిపించదు. టీఆర్ఎస్ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ దొరికిపోయిన ఫలితంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు రేవంత్ ముఖం దాచుకునే ప్రయత్నం చేయలేదు. మీసాలు మెలేసి తొడగొట్టి కేసీఆర్ను సవాల్ చేస్తూ మాట్లాడారు. అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్న వ్యక్తిని తమ పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్ నాయకత్వం ఏ మాత్రం సంకోచం చూపించలేదు. ఎంఎల్ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం అక్రమమనీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మధ్య తరగతి ప్రజలు భావించవచ్చు. కానీ రాజకీయ నాయకులు ఈ విషయం పట్టిం చుకోవడం లేదు. లేకపోతే రేవంత్ను రాహుల్గాంధీ కలుసుకోవడానికి అంగీకరించేవారు కాదు. రాబోయే ఎన్నికలలో రేవంత్ కాంగ్రెస్ ప్రచార సార«థిగా ఉండబోతున్నారనే వార్తలు వచ్చేవి కావు. తనతో పాటు కాంగ్రెస్లో ప్రవేశించే పాతికమంది నాయకులకు ఎన్నికలలో పార్టీ టెక్కెట్లు ఇవ్వాలంటూ వారి జాబితాను రాహుల్కి ఇచ్చారనే ప్రచారం అయ్యేది కాదు. రేవంత్ రాక పార్టీకీ, అతనికీ లాభమనీ, ఉభయతారకంగా ఉంటుందనీ కాంగ్రెస్ నాయకులు సంతోషంగా చెప్పుకునేవారు కాదు. లక్ష్యం నెరవేరేనా? రేవంత్రెడ్డి మంచి మాటకారి. వెలమలూ, కమ్మవారూ తెలంగాణలో ఏకం అవుతున్నారంటూ ‘వెల్కమ్’ గ్రూపుగా వారిని అభివర్ణించిన మొదటి వ్యక్తి రేవంత్. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మధ్య వైరుధ్యాలను ఎత్తి చూపించిన నాయకుడూ ఆయనే. టీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్నదనీ, దక్షిణ తెలంగాణ టీఆర్ఎస్ను తిరస్కరించిందనీ ఆయన విశ్లేషణ. మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని తీర్మానం. రేవంత్ చేరితే గాంధీభవన్లో హడావిడి పెరుగుతుంది. కేసీఆర్పై విమర్శనాస్త్రాల పరంపర సంధిస్తారు. రాజకీయ ఉష్ణోగ్రత పెంచుతారు. రేవంత్ పొడ గిట్టని కేసీఆర్పైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ రేవంత్ లక్ష్యం నెరవేరుతుందా? ఆయన కోరిన టిక్కెట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తుందా? వారందరినీ గెలిపించుకొని తన గ్రూపుగా నిలబెట్టుకోగలరా? ఇది పగటి కల కాదుకదా! ప్రాంతీయ పార్టీలతో ఉండే సౌలభ్యం జాతీయ పార్టీలతో ఉండదు. టీడీపీలో చంద్రబాబు మాటకు తిరుగు ఉండదు. టీఆర్ఎస్లో కేసీఆర్ మాట సుగ్రీవాజ్ఞ. ప్రాంతీయ పార్టీ అధినేతకు నచ్చినవారికి ఎవ్వరూ అపకారం చేయలేరు. వారికి నచ్చనివారికి ఉపకారం చేయలేరు. కాంగ్రెస్ పరి స్థితి ఇందుకు భిన్నం. అది మహాసముద్రం వంటిది. పార్టీలో చేరిన తర్వాత రాహుల్గాంధీ దర్శనభాగ్యం దొరకడమే కష్టం కావచ్చు. తన వెంట వస్తారనుకుంటున్న నాయకులు నిజంగా రాకపోవచ్చు. వారితో హరీష్రావు కానీ ఇతరులు కానీ మాట్లాడి టీఆర్ఎస్లో చేరడానికి ఒప్పించవచ్చు. కాంగ్రెస్ టిక్కెట్టు కంటే టీఆర్ఎస్ టిక్కెట్టు కానీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీటీడీపీ టిక్కెట్టు కానీ ఎన్నికలలో గెలిపిస్తుందని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్కు ఉన్నంత సామర్థ్యం, యుద్ధ కౌశలం రేవంత్కు ఉన్నట్టు ఇంతవరకూ ఎక్కడా వెల్లడి కాలేదు. ఆ స్థాయి నాయకుడిగా ఎదగలేదు. టీటీడీపీ పొలిట్బ్యూరో సభ్యులలో అత్యధికులు టీఆర్ఎస్తో పొత్తు కోరుకుంటున్నారు. కాంగ్రెస్తో పోవాలని వాదిస్తున్నవారు తక్కువ మంది. టీటీడీపీ నేతలను తన వైపు తిప్పుకునే అవకాశం కేసీఆర్కు ఉంది. బీజేపీ విడిగా పోటీ చేయాలనీ, అన్నిచోట్లా వారి అభ్యర్థులు నిలబడాలనీ, వారికి డిపాజిట్లు రావడమే కాకుండా గణనీయమైన సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చుకోవాలనీ కేసీఆర్ కోరుకుంటారు. రేవంత్ వాగ్బాణాలతో గాయపడి ఆగ్రహించిన కేసీఆర్ ప్రతీకా రేచ్ఛతో ‘ఓట్లకు కోట్లు’ కేసును తిరిగి తెర వకుండా చూడాలంటూ చంద్రబాబు వేడు కుంటారు. ప్రస్తుత దృశ్యంలో కేసీఆర్ అనే కొండను రేవంత్రెడ్డి అనే పొట్టేలు ఢీకొనడం చూస్తున్నాం. బలాబలాలు తారుమారై భవిష్యత్తులో దృశ్యం మారుతుం దేమో బుల్లితెరపై చూడాలి. - కె. రామచంద్రమూర్తి -
వధ్య శిలపై విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులే బలవన్మరణం చెందుతున్నారు. చదువులో రాణించలేమోనన్న భయం, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయన్న ఆందోళన, తోటి విద్యార్థులతో పోల్చి అసమర్థులుగా చిత్రించడంతో న్యూనతాభావానికి లోనైనప్పుడు కలిగే మనస్తాపం విద్యార్థులను, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను ఆత్మహత్యకు పురి గొల్పుతున్నాయి. కడచిన రెండు సంవత్సరాలలో దాదాపు నలభై మంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారు. వీరిలో పాతికమంది దాకా నారాయణ, చైతన్య విద్యా సంస్థల హాస్టళ్ళలో నివసిస్తూ చదువుకుంటున్నవారే. సెప్టెంబర్ 17న కృష్ణాజిల్లా గూడవల్లిలో నారాయణ కాలేజిలో చదువుతున్న ఈశ్వరరెడ్డిపై అధ్యాపకులు చేయిచేసుకుంటే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడు నెల్లూరు జిల్లా గూడూరులో నారాయణ కళాశాలలోనే అధ్యాపకులు కొట్టినప్పుడు దిలీప్ అనే విద్యార్థి కర్ణభేరి చిట్లిపోయింది. శనివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వీటన్నిటిపైనా పత్రికలలో వార్తలు వచ్చాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడల్లా ఆ సంగతి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయకుండా వారిని ఆస్పత్రుల్లో చేర్పించి, వైద్యం చేస్తున్న సమయంలో మృతి చెందినట్టు సర్టిఫికెట్ తీసుకున్న అనంతరమే వారి మరణవార్త చేరేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారంనాడు విశాఖపట్టణంలో కార్పొరేట్ హాస్టళ్ళను తనిఖీ చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు ప్రకటించారు. చాలా కార్పొరేట్ హాస్టళ్ళకు అనుమతులు లేవనీ, అటువంటి హాస్టళ్ళకు నోటీసులు ఇచ్చామనీ, అవసరమైతే మూసివేయడానికైనా ప్రభుత్వం వెనకాడదనీ ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలుగా చేసింది శూన్యం. ఇన్ని పసిప్రాణాలు నిష్కారణంగా అనంతవాయువుల్లో కలిసిపోయినప్పటికీ ఒక్క హాస్టల్ యాజమాన్యంపైన కానీ, ఒక్క కాలేజి యాజమాన్యం పైన కానీ పోలీసు కేసు నమోదు చేసిన దాఖలా లేదు. అమలు కాని సంస్కరణలు నారాయణ కళాశాల విద్యార్థులు నందిని, మనీషాలు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదు. ఆత్యహత్యలు పెరగడానికి కారణాలు ఏమిటో అధ్యయనం చేయడానికి రెండేళ్ళ కిందట (2015) ఐఏఎస్ అధికారి చక్రపాణి, మాజీ వైస్చాన్సలర్ రత్నకుమారితో ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ యేడాది మే నాలుగో తేదీన ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను వెంటనే అమలు చేస్తే ఇన్ని అనర్థాలు జరిగేవి కావు. ప్రతి కార్పొరేట్ కళాశాలకీ ఒక కౌన్సిలర్ను నియమించాలని కమిటీ చెప్పింది. నియమించలేదు. విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ కలిపి ప్రత్యేకంగా ఒక యాప్ను తయారు చేసి అందించాలని కమిటీ చెప్పింది. ఆ పని జరగలేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు తీసుకోవచ్చునో, ఎటువంటి ఉద్యోగాల కోసం చదువుకోవచ్చునో వివరించే వ్యవస్థ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. అదీ ఏర్పాటు కాలేదు. ప్రతి సబ్జెక్టులో నెలకు ఒకే ఒక పరీక్ష ఉండాలనీ, అంతకంటే ఎక్కువ పరీక్షలు ఉండరాదనీ కమిటీ నొక్కి చెప్పింది. కార్పొరేట్ సంస్థలు తమకు తోచిన రీతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఆరుమాసాలకూ ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులతో సమాలోచన ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. నేటికీ తల్లిదండ్రులను అధ్యాపకులు దగ్గరికి రానివ్వరు. పరీక్షలలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను మాటిమాటికీ సెక్షన్లు మార్చి అవమానించవద్దని కమిటీ చెప్పింది. ఇదీ అమలుకు నోచుకోలేదు. సెక్షన్లు మార్చి, పనికిరానివారని ముద్రవేయించుకున్న విద్యార్థులు నిరాశానిస్పృహలకు లోనవుతూనే ఉన్నారు. టెస్ట్లలో విద్యార్థులకు వచ్చిన మార్కులను నోటీసు బోర్డులపైన పెట్టి వారిని ఆత్మన్యూనతా భావానికి లోను చేయవద్దని చక్రపాణి కమిటీ సూటిగా చెప్పింది. అది ఆగలేదు. ఉదయం ఎనిమిదిగంటల లోపూ, సాయంత్రం ఆరు తర్వాతా క్లాసులు ఉండరాదంటూ స్పష్టం చేసింది. హాస్టళ్ళలో విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకే లేపుతారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ క్లాసు ఉంటుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకూ అల్పాహారం. ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం వరకూ రుబ్బుడు. భోజనం తర్వాత అదే కార్యక్రమం రాత్రి పదిన్నర వరకూ సాగుతుంది. పదింటికి హాస్టలు గదికి చేరిన విద్యార్థులు ఏడెనిమిది మంది దాకా ఒకే గదిలో ఉండాలి. వాళ్ళు కబుర్లు చెప్పుకొని నిద్రకు ఉపక్రమించే సరికి అర్ధరాత్రి దాటుతుంది. మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేపుతారు. బట్టీ యంత్రాలు ఈ దైనందిన చర్యలలో వేరే పుస్తకాలు చదవడం లేదు. ఆటపాటలు అసలే లేవు. విశ్రాంతి లేదు. వినోదం లేదు. బట్టీ పట్టడమే కానీ ఒక సమస్యను ఎట్లా పరిష్కరించాలో సొంతంగా ఆలోచించడం, విశ్లేషించడం నేర్పరు. రాజకీయాలు పట్టవు. సమాజం తెలియదు. ఒకే స్థాయి ప్రతిభ కలిగినవారు ఒకే బ్యాచ్లో ఉంటారు కనుక తమ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులతో మాట్లాడటం, వారి సంగతులు తెలుసుకోవడం సాధ్యం కాదు. యోగా, వ్యాయామం విధిగా బోధించాలని కూడా చక్రపాణి కమిటీ సిఫార్సు చేసింది. ఇది కూడా అమలు జరగడం లేదు. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఆ ఊసే లేదు. ఆటస్థలం తప్పని సరిగా ఉండాలనీ, గ్రంథాలయం ప్రతి హాస్టల్లో ఉండాలనీ, రీడింగ్ రూంలు కూడా ఏర్పాటు చేయాలనీ సిఫార్సు చేసినా ఏ సంస్థ కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ కమిటీ నివేదికను అన్ని కార్పొరేట్ సంస్థలకు పంపామంటూ విద్యామంత్రి చెప్పారు కానీ ఇంతకాలం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదో వివరించలేదు. చక్రపాణి కమిటీ తన బాధ్యతను అద్భుతంగా నిర్వహించింది. యుద్ధ ప్రాతిపదికన చక్రపాణి కమిటీ సిఫార్సులను అమలు చేసి ఆత్యహత్యలు నిరోధించవలసిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. సూచనలు అమలు తీరును సమీక్షించేందుకు రెండు కమిటీలను నియమించాలని కూడా చక్రపాణి కమిటీ కోరింది. ఒకటి, మానిటరింగ్ కమిటీ. ప్రతి కార్పొరేట్ సంస్థకు చెందిన ప్రతి హాస్టల్కూ పర్యవేక్షక కమిటీని నియమించాలి. రెండు, ఎథికల్ కమిటీ. నైతిక విలువలను పరిరక్షించే కమిటీలో జాయింట్ కలెక్టర్, మహిళా సంక్షేమ అధికారి, ఇంటర్ విద్య ఆర్జేడీ (రీజియనల్ జాయింట్ డైరెక్టర్), ఇద్దరు పౌరసమాజం ప్రతినిధులు ఉండాలన్నారు. ఈ కమిటీలను జిల్లా కలెక్టర్లు నియమించాలి. ఇందులో కార్పొరేట్ హాస్టళ్ళు ఐచ్ఛికంగా చేసే పనులు ఏవీ లేవు. అన్నీ ప్రభుత్వం చొరవతో అమలు కావలసిన సంస్కరణలే. తల్లిదండ్రుల ఆకాంక్షలు కార్పొరేట్ విద్యా సంస్థలూ, ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల జీవితాలను నరకప్రాయం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పిల్లలకు ఎందులో ఆసక్తి ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా వారు ఎదగాలనీ, చదవాలనీ పట్టుపడుతున్నారు. వారిపైన అసాధారణమైన ఒత్తిడి తెస్తున్నారు. వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి బదులు ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలనీ, రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే మంచి ర్యాంకు వస్తుందనీ, డాక్టరో, ఇంజనీరో కావచ్చునని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హాస్టళ్ళలోని దుర్భర పరిస్థితులు తెలిసినప్పటికీ, నిర్విరామంగా చదవడం అనేది ఎంత కష్టమో ఊహించుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పిల్లలు మంచి ర్యాంకు సంపాదిస్తే తమ ఆకాంక్ష నెరవేరుతుందని తలపోస్తున్నారు. ఖర్చుకు వెరపు లేదు. తల తాకట్టు పెట్టి అయినా సంవత్సరానికి 1.20 లక్షల ఫీజు కట్టడానికి వెనకాడటం లేదు. పరీక్షల సమయంలో విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు. పిల్లల పరీక్షలప్పుడు రక్తపోటు పెరిగిన కొంతమంది తల్లిదండ్రులను తానే ఆస్పత్రిలో చేర్చిన సందర్భాలు ఉన్నాయని ముంబయ్కి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త అంజలి ఛబ్రియా అంటున్నారు. పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయాలంటూ యశ్పాల్, సైరస్ వకీల్ వంటి విద్యావేత్తలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పద్నాలుగు సంవత్సరాల చదువు ద్వారా సాధించిన జ్ఞానాన్ని ఒకే ఒక్క పరీక్షలో తేల్చి విద్యార్థి భవి ష్యత్తును శాసించడం న్యాయం కాదని ఎంతమంది చెప్పినా ర్యాంకింగ్ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరుడు మేలో నివేదిక సమర్పించిన టీఎస్ఆర్ సుబ్రమణియన్ కమిటీ కూడా మార్కులకూ, ర్యాంకులకూ స్వస్తి చెప్పాలనీ, అన్ని స్థాయిలలోనూ గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. పదవ తరగతి స్థాయిలో గ్రేడింగ్ విధానం అమలులోకి వచ్చింది కానీ ఇంటర్లో అమలు కావడం లేదు. పదవ తరగతిలో సాధారణంగా ఉండే సిలబస్ ఇంటర్కి వచ్చేసరికి అసాధారణంగా పెరిగిపోతోంది. దీన్ని కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. 1966లో విద్యాసంస్కరణలను ప్రతిపాదించిన కొఠారి కమిషన్ సైతం సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పిల్లలో పెంచిపోషించాలని ఉద్ఘోషిం చింది. సాంఘిక శాస్త్రం అనవసరమని భావించే రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. విద్యార్థికి ఎటువంటి ఉద్యోగం (కెరీర్) సరిపోతుందో నిర్ణయించే క్రమంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాలుపంచుకోవాలి. విద్యార్థి అసక్తి ఎటువైపు ఉన్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్లాసు రూం లోనే కాకుండా బయట విద్యార్థి పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఇతర అంశాలు అనేకం అతని ఎదుగుదలను నిర్దేశిస్తాయి. విద్యార్థికి తెలియకుండానే ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ అతడిని జాగ్రత్తగా గమనించి అతని భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇది ఇంటర్ స్థాయిలో కాదు, చాలా ముందుగానే నిర్ణయం అవుతుంది. విద్యార్థి అసక్తిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు తాము పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చాలంటూ ఒత్తిడి తెచ్చినప్పుడు విద్యార్థి అలజడికి గురి అవుతాడు. ఇంటర్ పరీక్ష లేదా ఎంసెట్ పరీక్ష జీవితంలో అత్యంత ప్రధానమైనదనీ, అదే చివరి అవకాశమనీ, ఈ పరీక్షలో ర్యాంకు సాధిం చకపోతే భవిష్యత్తు లేదనీ భావించిన విద్యార్థులు విపరీతమైన ఒత్తిడి తట్టుకోలేక ఆత్యహత్యలకు ఒడిగడుతున్నారు. విద్యారంగంలో సంస్కరణల గురించి పట్టించుకోకుండా, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆత్యహత్య చేసుకున్న ఒక్క విద్యార్థి కుటుంబాన్ని కూడా విద్యామంత్రి, ముఖ్యమంత్రి పరామర్శించి నట్టు వార్తలు రాలేదు. ఇంతమంది బలవన్మరణం చెందినప్పటికీ ముఖ్యమంత్రి స్పందించలేదు. మంత్రివర్గ సహచరుడే కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి అయినప్పుడు, ఆయన చాలా ముఖ్యమైన మంత్రి అయినప్పుడు, విద్యామంత్రికి సమీప బంధువైనప్పుడు విద్యాశాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ తప్పు చేస్తున్న హాస్టళ్ళపైన కానీ కాలేజి యాజమాన్యాలపైన కానీ చట్టపరమైన శిక్షాత్మక చర్యలు తీసుకోవడానికి జంకుతారు. ఈ పరిస్థితిని సరిదిద్ది, కార్పొరేట్ కళాశాలల, హాస్టళ్ళను దారిలో పెట్టి, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపి ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్టవేయవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌరసమాజానికి కూడా ఉన్నది. కె. రామచంద్రమూర్తి -
తూటాలే మాటలు!
త్రికాలమ్ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మీడియా గోష్ఠి ఆసాంతం విన్నాను. వంద నిమిషాలకు పైగా సవివ రంగా మాట్లాడారు. సింగరేణి సంస్థలో బొగ్గు గని కార్మికుల సంఘం గుర్తింపు కోసం జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘనవిజయం సాధించింది. విజయో త్సాహంలో కేసీఆర్ కొన్ని అతిశయోక్తులు మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష కూటమిని ఎద్దేవా చేసినా తప్పుపట్టనవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం హోరాహోరీ సాగింది. ప్రతిపక్షాల తరఫున వివిధ పార్టీల అధ్యక్షులూ, అగ్రనాయ కులూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఏఐసీసీ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడూ కుంతియా సైతం ప్రచారంలో పాల్గొనడమే కాకుండా కూటమి గెలిచి తీరుతుందనీ, తెరాస పతనం ఆరంభం ఆవుతుందనీ ఢిల్లీలో ప్రక టించారు. ముఖ్యమంత్రిని ‘దొర’ అని సంబోధిస్తూ కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగారు. తెరాస సైతం ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి స్వయంగా అనేక వరాలు ప్రకటించారు. అక్కడి ఎన్నికలకు ఇంతకు పూర్వం ఏ ముఖ్యమంత్రి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదు. మంత్రులూ, తెరాసకు చెందిన ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఇతర నాయకులూ శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. మొత్తం 11 డివిజన్లలో తొమ్మిది డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకుంది. కాకపోతే 2012లో కంటే ఓట్ల ఆధిక్యం తక్కువ. కిందటి సారి ఎన్నికలలో టీబీజీకెఎస్కు 6,587 ఓట్ల మెజారిటీ వస్తే ఈ సారి 4,217 ఓట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కార్మిక సంఘా లతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సారి సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కూటమికి అధిక ఓట్లు లభించాయి. అయినా తెరాస మద్దతు కలిగిన సంస్థను ఓడించలేక పోయింది. దానికి రెండంటే రెండే డివిజన్లు దక్కాయి. ఒకే యూనియన్ తొమ్మిది డివిజన్లను గెలుచుకోవడం అపూర్వమైన విషయం. ఇందుకు ముఖ్యమంత్రినీ, టీబీజీకేఎస్ నాయకులనూ, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితనీ అభినందించవలసిందే. కోదండరామ్పై దాడి ఎన్నికలలో పోరాడి గెలవడంలో తమది తిరుగులేని రికార్డు అన్నట్టు కేసీఆర్ చెప్పు కోవడంలో తప్పులేదు. ఘనవిజయం సాధించినందుకు ఆనందం వెలిబుచ్చడం, ప్రతిపక్షాలను విమర్శించడం, ఓటర్లను అభినందించడంతో కేసీఆర్ సరిపెట్టుకొని ఉంటే ఈ వ్యాసం రాయవలసిన అవసరం ఉండేది కాదు. కేసీఆర్ ప్రత్యర్థులపైన ఒంటికాలిపై లేస్తారనీ, పరుషపదజాలం ప్రయోగి స్తారనీ తెలుగువారందరికీ తెలుసు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకోవడానికి దోహదం చేసిన అంశాలలో అత్యంత ప్రధానమైనది కేసీఆర్ వాగ్ధాటి. వాక్చా తుర్యంలో, వాగ్యుద్ధ కళలో ఆయనను మించిన రాజకీయ నేత రెండు తెలుగు రాష్ట్రాలలో మరొకరు లేరన్నది అందరూ అంగీకరించే విషయమే. పదిహేను సంవత్సరాలుగా కేసీఆర్ ఉపన్యాసాలు విని ఆనందించిన నాబోటివారికి సైతం నిన్నటి ప్రసంగం బాధ కలిగించింది. ప్రొఫెసర్ కోదండరామ్పైన దారుణంగా దాడి చేసిన తీరు ఆశ్చర్యం కలిగించింది. 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామంటూ చారిత్రక ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ వరుస రాజీనామాలు చేశారు. ఈ కారణంగా యూపీఏ సర్కార్ వెనుకంజ వేసి నప్పుడు ఉద్యమాన్ని కొనసాగించడంలో కేసీఆర్కు కోదండరామ్, ఇతర ఉద్యమ కారులూ ఏ విధంగా దోహదం చేశారో సన్నిహితంగా గమనించిన వారికి కేసీఆర్ మాటల తూటాలలోని అన్యాయం, అసత్యం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ మలి ఉద్యమంలో కేసీఆర్ది అత్యంత, అనితర సాధ్యమైన పాత్ర అనడంలో రవ్వంత సందేహం లేదు. కానీ ఆయనది ఏకైక పాత్ర అంటే అంగీకరించడం అసాధ్యం. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాన్ని జయప్రదం చేశారు. 1952 నుంచే ఎన్నోరకాల ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా ప్రజల హృదయాలలో నాటాయి. ఆ ఉద్యమాల స్ఫూర్తిని కేసీఆర్ అందుకొని జైత్రయాత్ర సాగించారు. కోదండరామ్ భుజం కలిపారు. అందుకే కోదండరామ్ చేసింది ‘తొక్క’ అంటూ కేసీఆర్ తూష్ణీభావం ప్రదర్శించడం సమంజసం అనిపించలేదు. ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో గతంలో నాయకులు చేసిన ప్రసంగాలు టేపులలో ఉంటాయి. కర్నూలు నాయకుడు టీజీ వెంకటేశ్ను సంబోధిస్తూ కోదండరామ్ గుణగణాలను ప్రస్తుతిస్తూ గతంలో కేసీఆర్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చివరి ఘట్టంలోనే కేసీఆర్, కోదండరామ్ల మధ్య విభేదాలు పొడసూపిన సంగతి తెలుసు. అందుకు కారణాలు ఏమిటో ఇద్దరూ బహిరంగంగా ఎన్నడూ వివరించలేదు. కానీ శుక్రవారంనాడు కేసీఆర్ వెల్లడించారు. ఎంతోకాలంగా కడుపులో దాచుకున్న ఆగ్ర హావేశాలను కేసీఆర్ బయటపెట్టినట్టున్నారు. తెరాస అధికారంలోకి రావడం కోదం డరామ్కి ఇష్టం లేదని కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం లేదు. ఇష్టం లేక పోవడం నేరం కాదు. తెరాసను ప్రత్యక్షంగా వ్యతిరేకించిన వారూ, పరోక్షంగా వ్యతి రేకించినవారూ అనేకమంది. అది వారి ప్రజాస్వామిక హక్కు. ప్రతిపక్షాలపైన దాడి చేసే హక్కు అధికారపక్ష నాయకులకు ఉన్నప్పుడు అధికారంపక్షంపైన దాడి చేసే హక్కు ప్రతిపక్షాలకూ ఉంటుంది. ప్రతిపక్షాల తీరు అయితే, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సకారాత్మకంగా ఉన్నదా లేదా అనే విషయం ప్రజలు గమనిస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనీ, కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారనేది ప్రధాన విమర్శ. ముఖ్యంగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ పేరు ముఖ్య మంత్రి రెండు సార్లు ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా మల్లన్నసాగర్ల ప్రతిపాదనలలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పవచ్చు. వాటికి ప్రత్యామ్నాయంగా మెరుగైన ప్రణాళికలు ఉన్నా ప్రజలకు వివరించవచ్చు. నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు. నిర్మాణంలో అవతవకలు జరిగినా, అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకు పోవచ్చు. ఎన్టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి అవినీతికి సంబంధించినవే. సీనియర్ న్యాయవాది ఎస్ రామచంద్రరావు ఎన్టీఆర్, విజయభాస్కర రెడ్డి, జనార్దనరెడ్డి ప్రభుత్వాలపైన వ్యాజ్యాలు నడిపింది అవినీతి ఆరోపణలపైనే. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేసినా, న్యాయ స్థానాలను ఆశ్రయించినా అధికారపక్షం పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపైనే కానీ ప్రాజెక్టులు నిలిపివేయాలని కాదు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ప్రజలకు అత్యంత హానికరమని భావించిన అంశాలనే ఎజెండాలో చేర్చాలి. గాంధీ చంపారన్ ఉద్యమంపైన కొన్ని మాసాలు ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఉప్పు సత్యాగ్రహానికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? వలస ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను అదే పనిగా వ్యతిరేకిస్తూ, వ్యాఖ్యానిస్తూ పోలేదు ఆయన. సంకేతప్రాయంగా, సందేశాత్మకంగా ఉండే సమస్య లపైన దృష్టి పెట్టడం ద్వారా స్వాతంత్య్ర సమరం సాగించారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ఎత్తివేయాలన్న నిర్ణయంపైన ఉద్యమం నిర్మించవచ్చు. వాక్ స్వాతం త్య్రాన్ని హరిస్తున్నారంటూ, రాజ్యాంగ ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నా రంటూ ఉద్యమం చేయవచ్చు. వ్యవసాయదారుల సంఘాల నియామకాన్ని వ్యతిరే కించకుండా పంచాయతీరాజ్ సంస్థలను నిధులూ, విధులూ లేకుండా నిర్వీర్యం చేస్తున్నారంటూ ధర్మాగ్రహం ప్రదర్శించవచ్చు. యాక్టివిస్టా, రాజకీయవాదా? కోదండరామ్లో కూడా సందిగ్ధం స్పష్టంగా కనిపిస్తున్నది. టీజాక్ నాయకుడుగా, హక్కుల కార్యకర్తగానే ఉంటారో, రాజకీయాలలోకి ప్రవేశిస్తారో తేల్చుకోవాలి. రాజ కీయాలలో దిగాలనుకుంటే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇతర ప్రతి పక్షాలతో పొత్తు పెట్టుకోవచ్చు. లేదా ఏదో ఒక పక్షంలో చేరవచ్చు. సర్పంచ్గా ఎన్నిక కాకపోయినా పర్వాలేదు. రాజకీయం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయనను రాజకీయ నాయకుడు కారని అనగలమా? ప్రజల మేలుకోసం ఏదైనా ప్రతిపాదన చేసి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, దాని ఆమోదం కోసం ఒత్తిడి తేవడం యాక్టివిస్టు పని. అధికారపార్టీని ఓడించమని కానీ ప్రభుత్వాన్ని తొలగించమని కానీ యాక్టి విస్టులు ప్రజలను కోరరు. ప్రభుత్వం మెడలు వంచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు లేదా పిలుపునిస్తారు. (పిలుపు ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి మాత్రమే ఉంటాయని అనడం సమర్థనీయం కాదు. ఆ అధికారం ప్రతివారికీ ఉంటుంది. పిలుపును ఆలకించడం, ఆలకించకపోవడం అనేది ప్రజల ఇష్టం. ఉద్య మకాలంలో కేసీఆర్ అనేక సందర్భాలలో ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు సమధికోత్సాహంతో స్పందించారు. అందుకే ఉద్యమం జయప్రదం అయింది. పిలుపు ఇచ్చే అధికారం కేసీఆర్కి లేదని ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రీ అనలేదు). అరుణారాయ్ సమాచార హక్కుకోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేశారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను సాధించారే కానీ ప్రభుత్వాన్ని పడ గొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం కోసం సాగిన ఉద్యమం విజయం సాధించిన తీరు కూడా యాక్టివిజానికి ఉదాహరణే. అలాగే లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించమంటూ ప్రబోధించలేదు. డాక్టర్ జయప్రకాశ్నారాయణ్ లోక్సత్తా సంస్థను హక్కుల సాధన వేదికగా నడిపి నంత కాలం ప్రభుత్వాలను దించాలని కానీ అధికార పార్టీని ఓడించాలని కానీ చెప్పలేదు. ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనాలని అనిపించినప్పుడు లోక్సత్తాని రాజకీయ పార్టీగా మార్చారు. తన రాజకీయాలకు ప్రజల ఆమోదం లభించడం లేదని గ్రహించిన తర్వాత రాజకీయ పార్టీని రద్దు చేసి తిరిగి హక్కుల సంస్థగా మార్చి సుపరిపాలనకోసం ఉద్యమం చేస్తున్నారు. కోదండరామ్ సైతం ప్రత్యక్ష రాజ కీయాలలో ప్రవేశించాలని భావిస్తే అందులో తప్పేమీ లేదు. ఆ పని చేయకుండా తెరాస అనుబంధ సంస్థకు ఓటు చేస్తే సింగరేణి నాశనం అవుతుందని ప్రకటించడం సమర్థనీయం కాదు. అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తుందనే ఆరోపణ సైతం ఆక్షేపణీయమే. పొరుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు త్వానికి ఉన్న ప్రైవేటైజేషన్ వ్యామోహం తెలంగాణ సర్కార్కు లేదు. ప్రజా జీవి తంలో తన ప్రయాణాన్ని సమీక్షించుకోవలసిన అవసరం కోదండరామ్కి ఉన్నది. కాంగ్రెస్ నాయకుడు దయాకర్ రాజకీయవాది కనుక కేసీఆర్పైన ఎదురుదాడి చేసినా ఎవ్వరూ ఆ„ó పించలేదు. ఎవరి మాటలో ఎంత ప్రామాణికత ఉన్నదో, ఎంత నిజం ఉన్నదో, ఎవరి విశ్వసనీయత ఏ పాటిదో ప్రజలు తేల్చుకుంటారు. అంతి మంగా ప్రజలే ప్రభువులు. పరుష పదజాలం ప్రయోగించినందుకు కేసీఆర్ ఒక్కరినే నిందించనక్కర లేదు. అందరూ కఠినంగానే మాట్లాడుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి శైలి కారణం కావచ్చు. అంత కాఠిన్యం అవసరమా? అధికార, ప్రతిపక్షాల మధ్య విభే దాలు ఇతర రాష్ట్రాలలో కంటే తెలుగు రాష్ట్రాలలో అధికం. రాజకీయ వాతావర ణాన్ని సామరస్యంగా, నిర్మాణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్మించడంలో ముఖ్య మంత్రి పాత్ర అద్వితీయమైనది. నిందాత్మక రాజకీయాలకు స్వస్తి చెప్పి సామరస్య పూరిత రాజకీయాలకు శ్రీకారం చుడితే ముఖ్యమంత్రికి ప్రజాదరణ మరింత పెరుగుతుంది. కె. రామచంద్రమూర్తి -
ఇది విలీనదినమే!
త్రికాలమ్ ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి భారత్లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా? చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్ను పాకిస్తాన్కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్ పాకిస్తాన్లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలిసినా చెప్పరు. మన్మోహన్ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్ విముక్తికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. వెలుగు చూడని హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్ముఖ్లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్ప్రముఖ్’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్దారుల, దేశ్ముఖ్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్ 36 వేల మంది సైనికులను జనరల్ జెఎన్ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు. నిజాం లొంగుబాటు సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్ యాక్షన్)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే. సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్ సుందర్లాల్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్లో మూడు వారాలు హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్లాల్ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు. బీజేపీ వ్యూహం బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్వాదిగానే కొనసాగిన సర్దార్ పటేల్ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు. విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం. కె. రామచంద్రమూర్తి -
‘చంపారన్’ ఓ చుక్కాని..!
త్రికాలమ్ చర్విత చర్వణమే అయినా కొన్ని విషయాలు పదేపదే ప్రస్తావించవలసి వస్తుంది. జనాభాలో అధిక సంఖ్యాకుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న సమస్య ఏళ్ళూపూళ్ళూ గడిచినా పరిష్కారానికి నోచుకోకపోతే అదే సమస్యను పాలకుల దృష్టికి మళ్ళీమళ్ళీ తీసుకురాక తప్పదు. రైతు ఆత్మహత్య వార్త లేకుండా ఒక్క రోజైనా గడవదంటే అతిశయోక్తి కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల బలవన్మరణాలకు సంబంధించిన వార్తలు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. శనివారం తెలంగాణలోని గద్వాల జోగులాంబ జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 1998 నుంచి సాగుతున్న ఈ బలవన్మరణ పరంపరను నిలువరించడానికి గట్టి ప్రయత్నం ఇంతవరకూ జరగలేదనే చెప్పాలి. ఎంత మంది ఎన్ని విజ్ఞప్తులు చేసినా పార్లమెంటులో కానీ చట్టసభలలో కానీ ఈ సమస్యను చర్చించి పరిష్కరించే కృషి జరగలేదు. అఖిలపక్ష సమావేశం జరగలేదు. వ్యవసాయదారుల ప్రతినిధులతో, శాస్త్రవేత్తలతో, సామాజిక సేవకులతో ప్రభుత్వాలు సమావేశాలు నిర్వహించి ఈ అంశాన్ని చర్చకు పెట్టి అభిప్రాయాలు సేకరించలేదు. రైతు మరణ వార్తలు క్రమం తప్పకుండా రావడంతో సమాజంపైన వాటి ప్రభావం తగ్గిపోతోంది. మీడియా సైతం కలత చెందడం, ఆవేదన వెలిబుచ్చడం తగ్గుతూ వచ్చింది. విపణి ఆధారిత ఆర్థిక విధానాలను విశ్వసించే పత్రికలూ, టీవీ చానళ్ళూ రైతుల మరణాలకు సంబంధించిన వార్తలను ముట్టుకోవడం లేదు. ఓటు బ్యాంక్గా పరిగణించినా సరే... అయినా సరే, రైతును విస్మరించడానికి వీలు లేదు. జనాభాలో దాదాపు 60 శాతం ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఓటు బ్యాంకుగా చూసినా అది చాలా విలువైనది. ఈ సంగతి పాలకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 2014లో కేంద్ర అధికార పీఠం అధిష్ఠించిన ఎన్డీఏ కానీ తెలంగాణలోని పాలకపక్షం టీఆర్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న తెలుగుదేశం–బీజేపీ కూటమి కానీ రైతు సంక్షేమం కోసం ఏయే చర్యలు తీసుకున్నదీ ఏకరవు పెడుతున్నాయి. ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే కావచ్చు. ఫలితం లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభం కారణంగా కాదనీ, ఇతర కారణాల వల్ల అనీ మనల్ని మనం మభ్యపెట్టుకోవడం ఆత్మవంచన. ఇతరులను దబాయించడం పరవంచన. గజం మిథ్య, పలాయనం మిథ్య అనేది వాదనకు నిలబడదు. సమస్యను గుర్తించి దాని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం, సమస్య పరిష్కారమయ్యే వరకూ కృషిని కొనసాగించడం ఒక్కటే మార్గం. 1998 నుంచి ఇప్పటి వరకూ దేశంలోనూ, రాష్ట్రాలలోనూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంతకాలం అధికారంలో ఉన్నాయి. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలూ ప్రభుత్వాలు నిర్వహించాయి. కానీ ఎవరూ ఆయన సూచనలను అమలు చేయడానికి ప్రయత్నించలేదు. రైతులను ఆదుకోవడం కోసం రైతు సమన్వయ సమితుల (ఆర్ఎస్ఎస్)ను ఏర్పాటు చేస్తున్నామనీ, వాటికి చట్ట హోదా కల్పించే ఆలోచన కూడా ఉన్నదనీ తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్నది. ఆర్ఎస్ఎస్లను తక్షణం ఏర్పాటు చేయాలని మంత్రులకూ, ఎంఎల్ఏలకూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ సంస్థలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నదనీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కమిటీలలో టీడీపీ కార్యకర్తలను నియమించి సకల సంక్షేమ, ప్రభుత్వ కార్యక్రమాలు వారి సూచనల మేరకే చేస్తున్నట్టు తెలంగాణలో కూడా చేద్దామని కేసీఆర్ చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుల విమర్శ. పోటీగా రైతు రక్షణ సమితులను నియమిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇదంతా ఉపరితల రాజకీయ విన్యాసమే కానీ అసలు సమస్యను పరిష్కరించే కసరత్తు కాదు. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ చరిత్రనూ, మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన చంపారన్ ఉద్యమాన్ని అధ్యయనం చేస్తే ఇప్పుడు కర్తవ్యం ఏమిటో వారికి బోధపడుతుంది. నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గత మూడేళ్ళుగా విస్మృతిపథంలో పడిపోయారు. కొత్త తరాలకు నెహ్రూ అంటే తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. గాంధీకి సైతం అదే దుస్థితి పట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీని కానీ, బీజేపీ భావజాలాన్ని కానీ నిందించి ప్రయోజనం లేదు. గాంధీ, నెహ్రూల ప్రాసంగికత తగ్గిపోవడానికి ప్రధాన కారకులు ఈ తరం కాంగ్రెస్ నాయకులే. వారికే గాంధీ జీవితం తెలియదు. నెహ్రూ చరిత్ర తెలియదు. గాంధీ, నెహ్రూలను విస్మరించిన కాంగ్రెస్కు నిష్కృతి ఏముంటుంది? ఈ ఇద్దరూ శిఖర సమానులైన నాయకులు కనుక వారిని గుర్తు పెట్టుకోవాలని చెప్పడం లేదు. నేటి సమస్యలకు పరిష్కారాలు వారి ఆచరణలో కనిపిస్తాయి. రైతుల జీవితాలలో వెలుగు నింపడం ఎట్లాగో, కనీసం చీకటిని తొలగించడం లేదా తగ్గించడం ఎట్లాగో తెలుసుకోవాలంటే గాంధీజీ 1916–17లో నిర్వహించిన చంపారన్ ఉద్యమాన్ని అధ్యయనం చేయాలి. ఇది చంపారన్ శతవార్షికోత్సవ సందర్భం. సరిగ్గా వందేళ్ళ కిందట గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం ఫలి తంగా చంపారన్ నీలిమందు రైతులకు ఊరట లభించింది. ఈ తరం యువతకు చంపారన్ ఉద్యమాన్ని పరిచయం చేసేందుకు శాసనసభ మాజీ సభ్యుడు పి. జనార్దనరెడ్డి చొరవతో చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. దానిని ఆగస్టు 15 ఆవిష్కరించారు. చంపారన్ ఉద్యమం గురించి గాంధీ, ఆచార్య కృపలానీ, ఇర్ఫాన్ హబీబ్, గాంధీ మనుమడు తుషార్గాంధీల రచనలను సేకరించి గౌరవ్ చేత అనువదింపజేశారు. స్వదేశంలో గాంధీ తొలి ఉద్యమం దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ తలపెట్టిన మొదటి పెద్ద ఉద్యమం చంపారన్ పోరాటం. ఇది రష్యా విప్లవం కంటే ముందు జరిగింది. 1916లో లక్నోలో ఏఐసీసీ సభలు జరుగుతున్న సమయంలో బిహార్ నుంచి రైతు నాయకుడు రాజ్కుమార్ శుక్లా గాంధీని కలుసుకొని తమ ప్రాంతంలో నీలిమందు రైతుల దుస్థితిని పరిశీలించవలసిందిగా కోరాడు. అతని కోరిక మన్నించి చంపారన్ వెళ్ళిన గాంధీ రైతుల పరిస్థితిని అధ్యయనం చేశాడు. నీలిమందును వస్త్రాల తయారీలో, అద్దకంలో ఉపయోగిస్తారు. యూరప్లో దీనికి గిరాకీ ఎక్కువ. బెంగాల్ బ్రిటిష్వారి అధీనంలోకి రాగానే నీలిమందు పండించాలని రైతులపైన ఒత్తిడి తెచ్చారు. ఇది బిహార్కు పాకింది. రైతుల నుంచి నీలిమందును కారు చౌకగా కొని విదేశాలకు ఎగుమతి చేసేవారు తెల్లదొరలు. కానీ 1880లో జర్మనీలో సింథటిక్ అద్దకం వృద్ధి కావడంతో నీలిమందు గిరాకీ పడిపోయింది. యజమానుల ఆదాయం తగ్గింది. రైతుల మీద సుంకాలూ, జరిమానాలూ పెంచారు. తెల్లవారు నేరుగా రైతులను హింసించకుండా జమీందారీల ద్వారా, వారు నియమించిన టేకేదార్ల ద్వారా పీడించేవారు. నీలిమందు నేల సారాన్ని పూర్తిగా పీల్చి పిప్పిచేస్తుంది. కానీ మొత్తం ఇరవై భాగాలలో మూడు భాగాలు విధిగా నీలిమందు సేద్యానికి కేటాయించాలని నిర్దేశించే ‘తీన్కఠియా రివాజు’ను ప్రభుత్వం రుద్దింది. ఈ నిబంధన దాదాపు వందేళ్ళుగా అమలులో ఉంది. తవాన్ పేరుతో పరిహారం వసూలు చేసేవాళ్ళు. జిరాత్ పేరుతో అధిక మొత్తంలో సుంకం విధించేవాళ్ళు. అబ్వాక్ పేరుతో అక్రమ జరిమానాలు వసూలు చేసేవారు. బిగార్ పేర రైతుల ఎడ్లనూ, వ్యవసాయ పనిముట్లనూ అప్పనంగా వినియోగించుకునేవారు. ఈ దుస్థితిపైన దాదాభాయ్ నౌరోజీ, ఆర్సి దత్లు పుస్తకాలు రాశారు. నీలిమందు రైతుల సమస్య పరిష్కారం అయ్యేవరకూ గాంధీ మరో పని తలపెట్టలేదు. ఆయన సమాచారం సేకరిస్తున్నానంటూ రైతుల మధ్య ఉన్నారు. తనతో పాటు అనేకమంది వలంటీర్లను రంగంలోకి దిం పారు. అనేకమంది న్యాయవాదులు ఆయనకు అనుచరులుగా మారారు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ కార్యక్రమాలు కానీ గాంధీ చేయలేదు. రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరించారు. మొత్తం 8,000 మంది నీలిమందు రైతులు తమ ఫిర్యాదులను గాంధీకి అందజేశారు. గాంధీ ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. రైతులు గాంధీ నాయకత్వంలో సంఘటితం అవుతున్నారనే అనుమానం తెల్లదొరలకు కలిగింది. జిల్లా వదిలి వెళ్ళిపోవాలని 1917 ఏప్రిల్ 16న జిల్లా అధికారి గాంధీని ఆదేశించారు. 18న జిల్లా న్యాయాధికారి ఎదుట నిందితుడుగా నిలబడిన గాంధీ ధిక్కార స్వరం వినిపించారు. తాను వచ్చిన పని పూర్తి చేయకుండా చంపారన్ వదిలి వెళ్ళేది లేదని ప్రస్ఫుటంగా చెప్పారు. దిగివచ్చిన సర్కార్ ప్రభుత్వం నీలిమందు రైతుల సమస్యను అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని నియమించింది. ఇందులో గాంధీకి సభ్యత్వం ఇచ్చింది. రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాలనూ, అమానవీయమైన వేధింపులనూ వివరించే సమాచారాన్ని గాంధీ అప్పటికే సేకరించారు. ఆ సమస్త సమాచారాన్ని కమిటీ ఎదుట సమర్పించారు. ప్రభుత్వ ఉన్నతాధికారి డబ్లు్య మౌడీతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించలేదు. తాను చట్టాన్ని గౌరవిస్తున్నాననీ, నీలిమందు రైతులకు సాయపడటానికే వారి నుంచి సమాచారం సేకరిస్తున్నాననీ గాంధీ వివరించారు. ప్రభుత్వమే దిగి వచ్చింది. గాంధీకి తోడ్పడవలసిందిగా అధికారులను ఉన్నతాధికారి ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న జమీందారులు మొదట రైతులను బెదిరించారు. తర్వాత రాజీ కోసం ప్రయత్నించారు. గాంధీ సత్యాగ్రహం విరమించలేదు. రాజీకి అంగీకరించలేదు. 1917 జూన్ 5న రాంచీలో బిహార్–ఒడిశా గవర్నర్ ఎ గెయిట్తో గాంధీ చర్చలు జరిపాడు. అక్టోబర్ 3న తీన్కఠియా నిబంధనను రద్దు చేశారు. అబuŠ‡వాత్ పేరుతో వసూలు చేస్తున్న వడ్డీలు చట్ట విరుద్ధమని నిర్ధారించారు. టేకేదార్ల వ్యవస్థను నిర్మూలించారు. పంటపైన హక్కులు జమీందార్లకు కాకుండా రైతులకే ఉంటాయని అన్నారు. ఈ విజయాలన్నీ దేశంలో నిర్వహించిన తొలి అహింసాత్మక ఉద్యమం ఫలితాలు. రెండు అంశాలు గమనించాలి. ఒకటి, చంపారన్పైన గాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకనలు చేయలేదు. పత్రికలకు ఎక్కలేదు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టలేదు. ఒకటే సమస్యపైన దృష్టి పెట్టారు. అది పరిష్కారమయ్యే వరకూ అక్కడే దాన్ని పట్టుకునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ స్పందిస్తున్న కాంగ్రెస్ నాయకులు చంపారన్ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఏదో ఒక సమస్యపైన దృష్టి కేంద్రీకరించి అది పరిష్కారమయ్యేవరకూ కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయి. చంపారన్ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి. ఆ తర్వాతనే సర్దార్ పటేల్ బర్దోలీ రైతాంగ పోరాటం చేశారు. అనంతరం మాప్లా ముస్లిం రైతుల తిరుగుబాటు, మద్రాసు ప్రెసిడెన్సీ రైతు ఉద్యమం, చీరాల–పేరాల ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకూ కొమ్మారెడ్డి సూర్యనారాయణ, తలసాని వాసుదేవరావుల ఆధ్వర్యంలో ఆంధ్ర రైతాంగ యాత్ర జరిగాయి. చివరికి స్వాతంత్య్ర సమరంలో రైతుల భాగస్వాములు కావడానికి కూడా చంపారన్ తిరుగుబాటే కారణం. కాంగ్రెస్వారు కానీ మరో పార్టీ వారు కానీ చంపారన్ బాటలో నేటి రైతుల సమస్యను అధ్యయనం చేస్తే పరిష్కారం లభించవచ్చు. కె. రామచంద్రమూర్తి -
పాత్రికేయంపై పంజా
సందర్భం తమ భావజాలంతో ఏకీభవించనివారిని హతమార్చుతామని బెదిరించేవారూ, హతమార్చేవారూ ప్రజాస్వామ్య వ్యవస్థకు శత్రువులు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు ‘ఖబడ్దార్’ అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. గౌరి హంతకులు ఏ భావజాలాన్ని విశ్వసిస్తున్నారో అటువంటి భావజాలాన్ని ఆమోదించే యాంకర్లూ, అసహనం ప్రదర్శించే జర్నలిస్టులూ దాపురించారు. ‘సామాజిక మాధ్యమాలలో మీరు వెల్లడిస్తున్న అభిప్రాయాల విషయంలో అంత తొందరపాటు వద్దు. కొంచెం ఆలోచించండి. మనం ఉన్న కాలం అంత క్షేమకరమైనది కాదు...’ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బెంగళూరులో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్కు ఒక మిత్రుడు ఈ సలహా ఇచ్చాడు. ఒక ఘటన గురించి విన్న తరువాత మరుక్షణం మనలో కలిగే స్పందననే మనం ఇతరులతో పంచుకోవాలి అంటూ అందుకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇదంతా జరిగి వారం కూడా గడవలేదు. ఇంతలోనే ఆమె హత్య వార్త దేశాన్ని కుదిపివేసింది. నిన్న మొన్న జరిగిన గోరక్షకుల దాడుల గురించి, తాజాగా గోరఖ్పూర్ శిశు మరణాలపైన తీవ్ర నిరసన వ్యక్తం చేయడం వరకూ మిత, మతవాద రాజకీయాల మీద గౌరి నిరంతరాయంగా ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఆమె తన గురించి తనే పేర్కొన్నట్టు ఎంత వేగంగా స్పందిస్తారంటే, ప్రస్తుతం కేంద్రం, సుప్రీంకోర్టు నడుమ ఉన్న రొహింగ్యా శరణార్థుల పునరావాసం గురించి కూడా సామాజిక మాధ్యమాలలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో పాటు నక్సలైట్ ఉద్యమంలోని వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి రప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్నడ వారపత్రిక ‘గౌరి లంకేశ్ పత్రికె’కు గౌరి సంపాదకురాలు. తండ్రి నుంచి ఆ పత్రికతో పాటు, ఆయన భావాలు కూడా ఆమెకు వారసత్వంగా వచ్చాయి. ఇద్దరూ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పత్రికను ఆయుధంగా చేసుకున్నవారే. రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన సాహసోపేతురాలైన జర్నలిస్టుకు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారంనాడు అంత్యక్రియలు జరగడం విడ్డూరం. గౌరి గత కొంతకాలంలో ‘హిందూత్వ’రాజకీయాలకు వ్యతిరేకంగా కలం ఝళిపిస్తున్నవారే. టీవీ చానళ్ళు నిర్వహించే చర్చలలో రాజీలేని వాదన వినిపిస్తున్నవారే. దీనితో ఆమెకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు తప్పలేదు. కానీ తనకు ఉన్న ప్రాణహాని గురించి ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. గౌరి ప్రచురించిన ఒక నివేదిక మీద బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి పరువునష్టం దావా వేశారు. అందులో గౌరిని కోర్టు దోషిగా తేల్చింది కూడా. ఆరు మాసాల శిక్ష విధించింది. ఆమె అప్పీలుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇంత జరిగినా ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె ఫేస్బుక్ పేజీ తెరిస్తే రోహిత్ వేముల ఫొటో, ట్వీటర్ హెడర్ స్థానంలో కన్హయ్య కుమార్ ఫొటో కనిపిస్తాయి. కన్హయ్యను తన పెంపుడు కొడుకని సంబోధించేవారు. ఇవన్నీ సరే, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతినిధులుగా చెప్పుకోదగిన దబోల్కర్, పన్సారే, కల్బుర్గీలను హత్య చేసిన వారి ఆచూకీ ఈనాటికి కూడా తెలియడం లేదు. ఇప్పుడు గౌరి హత్య దర్యాప్తు విషయంలో అయినా ప్రభుత్వాలు స్పందన ఎలా ఉండబోతున్నదన్నదే అంతా ఎదురుచూస్తున్న అంశం. లౌకికవాదం కోసం, ప్రజాస్వామ్యం కోసం, దళితుల హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం గొంతెత్తే వారి అవసరం ఎప్పటికీ ఉంటుంది. దానిని గుర్తించి నట్టయితే ప్రభుత్వాలు గౌరి హంతకులను తక్షణం అరెస్టు చేయడానికి పాటు పడ తాయి. అప్పుడే ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది. నత్తనడకలో దర్యాప్తులు గౌరీ లంకేశ్ హత్యపై దర్యాప్తు జరిపి, వాస్తవాలు వెలికి తీయడానికి ప్రత్యేక బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్–సిట్) ఏర్పాటు చేస్తామనీ, పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఒకరు ఈ బృందానికి నాయకత్వం వహిస్తారనీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం బెంగళూరులో విలేకరులకి చెప్పారు. కానీ గౌరి దారుణ హత్యతో నిర్ఘాంతపోయిన దేశానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ సాంత్వన కలిగించదు. ఎందుకంటే 2013 నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో జరిగిన హత్యలపైన విచారణ నత్తనడక నడుస్తున్నది. దబోల్కర్, పన్సారీల హంతకులను పట్టుకోవడంలో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైతే కల్బుర్గీని హత్య చేసినవారి ఆచూకీని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. దేశంలో ఐటీ రాజధానిగా, కాస్మోపాలిటన్ సంస్కృతి కలిగిన నగరంగా బెంగళూరుకు మంచే పేరే ఉంది. ఈమధ్య నేరాల సంఖ్య పెరిగిపోయి నేర రాజధానిగా మారుతోంది. ఒకరిని హతమార్చాలని గట్టి పట్టుదలతో ప్రయత్నించే హంతకుల నుంచి పౌరులను రక్షించడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ హత్య జరిగిన తర్వాత సంవత్సరాలు గడిచినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలకపోవడం, హంతకులను పట్టుకోలేకపోవడం వల్ల చట్టం పట్ల భయం తగ్గిపోతుంది. నేరం చేసినవారికి శిక్ష పడకపోతే నేరాలు పెరుగుతాయి. కర్ణాటక పోలీసుల దర్యాప్తు పట్ల విశ్వాసం లేకనే తన సోదరి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ గౌరీ సోదరుడు కోరాడు. దేశవ్యాప్తంగా నిరసనలు గౌరి హత్యోదంతంతో బెంగళూరులోనే కాకుండా చెన్నై, హైదరాబాద్ నగరాలలోనూ, దేశవ్యాప్తంగా మరెన్నో నగరాలనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దుర్ఘటనపై నివేదిక పంపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హంతకులను వెంటనే పట్టుకునేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదేశించారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన నేరం. నిబద్ధత కలిగిన వారంతా ఈ దారుణాన్ని ఖండించాలి. ఈ నలుగురి హత్యల విషయంలోనూ ఒకే పద్ధతి కనిపిస్తుంది. ఆగంతుకులు ఒకే విధంగా ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు బృందాలుగా వచ్చారు. అతి సమీపం నుంచి పలుమార్లు కాల్పులు జరిపారు. ఒకే పద్ధతిలో నాలుగు హత్యలూ జరిగాయి. ‘సాధన’ పత్రిక సంపాదకుడు నరేంద్ర దబోల్కర్ను ఆగస్టు 20, 2013న కాల్చి చంపారు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు సమీపం నుంచి నాలుగుసార్లు కాల్పులు జరిపారు. తరువాత దబోల్కర్ మిత్రుడు, హేతువాది గోవింద్ పన్సారేను హత్య చేశారు. దబోల్కర్ హత్యపై దర్యాప్తును త్వరగా ముగించి, హంతకులను పట్టుకోవలసిందని పన్సారే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. 17వ శతాబ్దానికి చెందిన మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ గురించి ‘శివాజీ ఎవరు?’ పేరుతో పన్సారే ఒక పుస్తకం రాశారు. శివాజీ బలమైన లౌకికభావాలు కలిగినవాడని నిరూపించే ప్రయత్నం చేశారు. కొల్హా పూర్లో ఫిబ్రవరి 20, 2015న ద్విచక్ర వాహనం మీదే వచ్చిన దుండగులు పన్సారేను హత్య చేశారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా 2015లో వచ్చిన చట్టం ఆయన కృషి ఫలితమే. హంపీ విశ్వవిద్యాలయం మాజీ వైఎస్చాన్సలర్, హేతువాది, ప్రముఖ కన్నడ భాషా రచయిత మల్లేశప్ప ముదివాలప్ప కల్బుర్గీ హత్య ఆగస్టు 30, 2015న ధార్వాడ్లో జరిగింది. అప్పుడు కూడా ద్విచక్ర వాహనం మీద వచ్చిన వారే ఆ దురాగతానికి పాల్పడ్డారు. ‘ది రిపబ్లిక్ ఆఫ్ రీజన్: వర్డ్స్ దే కుడ్నాట్ కిల్’ అనే గ్రంథాన్ని కల్బుర్గీ రచించారు. ఈ ముగ్గురి మాదిరిగానే ఆలోచించే నాలుగో వ్యక్తి గౌరీ లంకేశ్, ఆమెను కూడా అదే పద్ధతిలో హతమార్చారు. ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దబోల్కర్, పన్సారేల హత్యలు ఒకే తీరులో, పెద్ద ప్రణాళికతో జరిగినవేనని బొంబాయి హైకోర్టు సైతం అభిప్రాయపడింది. ‘ఇవి అనూహ్యంగా, చెదురుమదురుగా జరిగిపోయిన ఘటనలు కావని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థల ధనసాయం, మద్దతు కచ్చితంగా వీటి వెనుక ఉండి ఉండాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామిక, లౌకిక, ఉదారవాద భావాలతో భారతదేశం మనుగడ సాగించాలంటే, దేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షించాలంటే ఇలాంటి ఉన్మాదాన్ని వెంటనే నిలువరించాలి. భావప్రకటన స్వేచ్ఛ సమాజానికి ఆక్సిజన్ వంటిది. ప్రశ్నించే తత్త్వం ప్రజాస్వామ్యానికి ఊపిరి. ప్రజాస్వామ్య ద్రోహులు తమ భావజాలంతో ఏకీభవించనివారిని హతమార్చుతామని బెదిరించేవారూ, హతమార్చేవారూ ప్రజాస్వామ్య వ్యవస్థకు శత్రువులు. దబోల్కర్, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు ‘ఖబడ్దార్’ అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. గౌరి హంతకులు ఏ భావజాలాన్ని విశ్వసిస్తున్నారో అటువంటి భావజాలాన్ని ఆమోదించే యాంకర్లూ, అసహనం ప్రదర్శించే జర్నలిస్టులూ ఇంగ్లీషు చానళ్ళలో దాపురించారు. జర్నలిజానికి ఇటువంటి జర్నలిస్టులు కూడా హాని చేస్తున్నారు. గావుకేకలు పెట్టడం, ఇతరులను మాట్లాడనీయకుండా తామే వాగడం, తర్జని ఊపుతూ ఒక పక్షానికి చెందిన రాజకీయవాదుల గురించి కటువుగా మాట్లాడం ఈ మధ్య జాతీయ చానళ్ళలో ఎక్కువయింది. సమాచార హక్కు చాలా విలువైనది. గౌరి హత్య అనంతరం జర్నలిస్టులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగాలు చేస్తే సరైన సమాచారం సమాజానికి అందదు. జర్నలిస్టులను రక్షించుకోవలసిన బాధ్యత సమాజానిదే. జర్నలిజంలో ఎన్ని లోపాలున్నప్పటికీ, ఎన్ని అవలక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ప్రజాస్వామ్యం మనుగడకు మీడియా క్రియాశీలకంగా పనిచేయాలి. తమ వాదనతో ఏకీభవించనివారిని హత్య చేసే భయంకరమైన ధోరణిని సమాజం తిరస్కరించాలి. ఎవరి విశ్వాసాలకు తగినట్టు వారు జీవించే స్వేచ్ఛ కావాలి. గౌరీ లంకేశ్ హత్య అనంతరం సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిస్పందనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరి హత్య పట్ల ఆనందం వెలిబుచ్చుతూ తను పెట్టిన పోస్టింగులను ప్రధాని స్వయంగా చూస్తారని ఒక వ్యక్తి గొప్పలు చెప్పుకున్నారు. అంటే తన అభిప్రాయాలకు ప్రధాని ఆమోదం ఉన్నదని ధ్వనించే విధంగా పోస్టింగ్ పెట్టాడు. ప్రముఖ న్యాయవాది ప్రశాంతభూషణ్ను సుప్రీంకోర్టులోని ఆయన కార్యాలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించి నేలమీద పడవేసి కొట్టాడు. ఆ వ్యక్తిని బీజేపీ సోషల్ మీడియాకి అధిపతిగా నియమించిందని ప్రశాంత భూషణ్ బుధవారంనాడు వెల్లడించారు. ఇటువంటి చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయి. ప్రశాంత భూషణ్పై దాడిని బీజేపీ ఆమోదించినట్టు అర్థం అవుతుంది. మొత్తంమీద దేశంలో అసహన వాతావరణం ప్రబలిందన్న మాట వాస్తవం. దీనికి కారణాలు ఏమిటో, కారకులు ఎవరో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సామరస్యపూరితమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలి. అదే గౌరీ లంకేశ్ కోరుకున్న మార్పు. దాన్ని సాధించడానికి కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి. కె. రామచంద్రమూర్తి -
నంద్యాల దేనికి నాంది?
త్రికాలమ్ నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా అక్కడే మకాం ఉండి నిత్యం రోడ్షోలు నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం చేరుకున్నారు. రెండు శిబిరాలలో ఆఖరి పోరాటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం కారణంగా జరుగుతున్న ఉపఎన్నిక తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పామోహన్రెడ్డికి మధ్య పోరాటంలా కనిపించడం లేదు. ఇది చంద్రబాబుకూ, జగన్మోహన్రెడ్డికీ మధ్య యుద్ధం. ప్రచారంలో ప్రస్తావనగా అప్పుడప్పుడు అభ్యర్థుల పేర్లు రావచ్చు కానీ ప్రధాన యోధులు వారిద్దరే. అమరావతిలో ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యావత్తూ కొన్ని రోజులుగా నంద్యాలలోనే విడిది చేసింది. మరో పాతికమంది అధికారపార్టీ శాసనసభ్యులూ అక్కడే తిష్ఠ వేశారు. జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తమ అభ్యర్థి విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒక ఉప ఎన్నికలో ఇంతటి తీవ్రమైన పోటీ, స్పర్థ, ప్రచారం, ఆవేశం మునుపెన్నడూ కనీవినీ ఎరగం. చంద్రబాబు ఎన్టీ రామారావును గద్దె దింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి ఉపఎన్నిక ప్రకాశం జిల్లా దర్శిలో 1996లో జరి గింది. ఆ రోజుల్లోనే అక్కడ విపరీతంగా డబ్బు ఖర్చు చేశారు. కాంగ్రెస్ దీటైన పోటీ ఇవ్వలేదు. తొమ్మిదివేల ఓట్ల తేడాతో టీడీపీ గెలిచింది. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా కొన్ని సందర్భాలలో విజయం వరించకపో వచ్చు. అదే సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉపఎన్నికలో నందమూరి లక్ష్మీపార్వతి టీడీపీ అభ్యర్థిపైన 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి అన్ని వేళలా అధికారం, డబ్బూ, దబాయింపూ పని చేయవని నిరూపించారు. 2001లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇండి పెండెంట్ అభ్యర్థిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీడీపీ అభ్యర్థి కె శ్రీని వాసరెడ్డిపైన 52,712 ఓట్ల భారీ మెజారిటీతో ఢంకా బజాయించారు. పదవిలో ఉన్నారు కనుక ప్రతిసారీ విజయం చంద్రబాబునే వరిస్తుందనే వాదనలో పసలేదు. గట్టి ప్రతిఘటన ఉన్న సందర్భాలలో ఓటమి తప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వాధికారాన్నీ, పోలీసు బలగాన్నీ, అర్థబలాన్నీ నిస్సం కోచంగా వినియోగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద నువ్వా–నేనా అన్నట్టు సాగుతున్న సమరంలో రెండు పక్షాలూ చావోరోవో తేల్చుకునేందుకు సిద్ధమై తలపడుతున్నాయి. అందుకే ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. నంద్యాల ప్రత్యేకత నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి కేంద్రం. ఈ స్థానం నుంచి ఎన్నికైన ఇద్దరు వ్యక్తులు దేశానికి రాష్ట్రపతిగా (నీలం సంజీవరెడ్డి), ప్రధాని (పీవీ నరసింహారావు)గా సేవలందించారు. దేశంలోని మరే ఇతర లోక్సభ స్థానానికీ ఇటువంటి ప్రత్యేకత లేదు. ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికలలో మొత్తం 42 లోక్సభ స్థానాలలో ఒక్కటంటే ఒక్కటే ప్రతిపక్షానికి దక్కింది. నంద్యాలలో జనతాపార్టీ టిక్కెట్టుపైన పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ నీలం సంజీవరెడ్డి నలభై వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. తక్కిన 41 స్థానాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నీలం ఏకగ్రీవంగా లోక్సభ స్పీకర్గా ఎన్నికైనారు. ఆ తర్వాత మూడు మాసాలకే నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కన్నుమూశారు. 1977 జూలై 21న సంజీవరెడ్డి ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికైనారు. 1969లో రాష్ట్రపతి ఎన్ని కలలో వివి గిరిని పోటీ చేయించి కాంగ్రెస్ అధికార అభ్యర్థి సంజీవరెడ్డిని ఓడించిన ఇందిరాగాంధీ 1977లో సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నికకు సహక రించడం విశేషం. 1967–69 మధ్య మొదటిసారి స్పీకర్గా పని చేసిన సంజీవ రెడ్డి అప్పట్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి లోక్సభకు ఎన్నికై నారు. నంద్యాలనుంచి సంజీవరెడ్డి తర్వాత పెండేకంటి వెంకటసుబ్బయ్య ఎన్నికై ఇందిర మంత్రిమండలిలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఏడేళ్ళ అనంతరం నంద్యాలకు మరోసారి మహర్దశ పట్టింది. 1991 ఎన్నికలకు దూరంగా ఉండిన పీవీ తమిళనాట శ్రీపెరంబదూరులో రాజీవ్గాంధీ హత్య జరగడంతో మైనారిటీ ప్రభుత్వ సారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నిక కావలసి వచ్చింది. ఆనాటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి నంద్యాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి చేత రాజీనామా చేయించి పీవీని అక్కడ పోటీ చేయించారు. ప్రధాని స్థాయికి చేరిన ఒక తెలుగు ప్రముఖుడికి పోటీ పెట్టకూడదని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఫలితంగా పీవీ 5.8 లక్షల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 1996లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పీవీ నంద్యాల నుంచి తక్కువ మెజారిటీతోనూ, బరంపురం నుంచి ఎక్కువ ఆధి క్యంతోనూ గెలిచారు. బరంపురం స్థానం ఉంచుకొని నంద్యాలను వదులు కున్నారు. అధికారం అన్నివేళలా లాభించదు దర్శి నుంచి నంద్యాల వరకూ చంద్రబాబు ఎత్తుగడలూ, వ్యూహాలూ గమ నించినవారికి కొన్ని అంశాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒకటి, ఆయనకు సెంటిమెంట్లు లేవు. రెండు, రాజకీయ విలువలు కానీ నైతిక విలువలు కానీ ఆయనకు శిరోధార్యం కాదు. మూడు, ఎన్నికలలో గెలుపే ప్రధానం. విజయం సాధించే క్రమంలో ఏమి చేసినా చెల్లుతుందనే విశ్వాసం బలంగా ఉంది. నాలుగు, ప్రజలు అమాయకులనీ, ఎన్నికలలో మాట్లాడినవన్నీ చేసితీరాలని పట్టుపట్టరనీ, ఆటలో ఆరటిపండు అనుకు ంటారనీ అభిప్రాయం. ఈ విషయంలో ఆయన నమ్మకం ఇంతవరకూ వమ్ముకాలేదు. చంద్రబాబు రాజ కీయ వ్యక్తిత్వంలో ఇది ప్రధాన పార్శ్వం. ఒకటి చెప్పడం వేరొకటి చేయడం చాలామంది రాజకీయ నాయకులకు అలవాటు. చెప్పిన దానికి పూర్తి భిన్నంగా చేయడం, చేసిన దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడటం, దాన్ని సమ ర్థించుకోవడం బాబు ప్రత్యేకత . 1994లో అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్య మంత్రిగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన ఎన్టీఆర్ను ఎట్లా గద్దె దించిందీ తెలుగు ప్రజలు జాగ్రత్తగా గమనించారు. పదవీచ్యుతి తర్వాత అల్లుడి గురించి ఆయన ఏమి మాట్లాడారో జగద్విదితం. యూట్యూబ్లోకి వెడితే లెక్కలేనన్ని క్లిప్పింగ్లు దొరుకుతాయి. రామారావు అస్తమయం అనం తరం కొన్ని మాసాలకు ఆయనను కీర్తించడం ప్రారంభించిన చం ద్రబాబు ఆయనను అధికారం లాగివేసిన ఉదంతాన్ని పిచ్చి ప్రజలు విస్మరించి ఉంటారని భావించారు. ఆ భావనకు అనుగుణంగానే 1996 లోక్సభ ఎన్ని కలలోనూ, 1999 అసెంబ్లీ పోరులోనూ విజయం కట్టబెట్టారు. గెలుపొందడా నికి కారణాలు వేరే ఉండవచ్చును. కానీ రామారావును దేవుడిని చేసి పూజిం చడం ద్వారా ఆగస్టు సంక్షోభం జ్ఞాపకాలను చెరిపివేశానని బాబు నమ్ము తున్నారు. ఇదే ప్రయోగం రాష్ట్ర విభజన సమయంలోనూ చేశారు. రాష్ట్రాన్ని విభజించమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. దమ్ముంటే విభజిం చాలని సోనియాగాంధీని సవాలు చేశారు. తాను లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం ఏర్ప డేది కాదని తెలంగాణలో, అన్యాయంగా, అశాస్త్రీయంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆంధ్రప్రదేశ్లో మాట్లాడారు. ఈ ద్విపాత్రాభినయనాన్ని రెండుచోట్లా స్వీకరించి తన విధానాన్ని బలపర్చుతారని ఆయన భావించారు. అందుకే తెలంగాణలో కూడా పట్టు కొనసాగించాలని ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ శాసనసభ్యుడిని కొనుగోలు చేసే దుస్సాహసం చేశారు. కానీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని న గదుతో సహా టేపులలో ఇరికించి తాను ఆడియాలో దొరికిపోయారు. నీతినియమాల గురించి ఆలోచించడం లేదు. ఎక్కడ పోటీ జరిగితే తాను అక్కడ ఉండాలనీ, ఎట్లాగైనా గెలిచి తీరాలనే జూదరి స్వభావం. చంద్రబాబు అదృష్టం కొద్దీ ‘ఓటుకు కోట్లు’ కేసు ముందుకు సాగడం లేదు. తప్పు చేసినా ఏదో ఒక విధంగా తప్పుకునే చాకచక్యం ఉంది. మాట వేరు, బాట వేరు విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టి, అయిదు, పది సంవ త్సరాలు సరిపోదు పదిహేనేళ్ళు ఇచ్చి తీరాల్సిందేనంటూ వాదించిన చంద్ర బాబు ఇప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మారిన శిల్పా మోహన్రెడ్డిని శనివారం ప్రచారంలో ధనదాహం ఉన్న స్వార్థపరుడుగా అభి వర్ణించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసనమండలి అధ్యక్ష పదవి ఇస్తానన్న చంద్రబాబు మాజీ మంత్రి ఫారూఖ్ వైపు మొగ్గు చూపారు. నంద్యాల నియోజకవ ర్గంలో ముస్లింలు అధికంగా ఉన్నారు కనుక ఫారూఖ్ గుర్తుకొ చ్చారు. ఇదే ఫారుఖ్కు ఆయన 2014లో మొండిచేయి చూపారు. ఇప్పుడు ఏకంగా శాసనమండలి చైర్మన్ పదవి వాగ్దానం చేశారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ డ్రామాలో ఏమి జరిగిందో ఫారూఖ్కి తెలుసు. ఎన్టీఆర్కు ఎసరుపెట్టడంలో సహకరించిన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఉపముఖ్యమంత్రి పదవీ, బావమరిది హరికృష్ణకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ ఇవ్వజూపారు. ఒకరి తర్వాత ఒకరికి జెల్లకొట్టారు. నెల తిరగకుండానే రామారావు దగ్గరికి దగ్గుబాటి తిరిగి వెళ్ళిపోతే, హరికృష్ణ 1999లో సొంతపార్టీ పెట్టుకొని తిరుగుబాటు ప్రకటించారు. 1996 ఎన్నికలకు కొన్ని మాసాల ముందే రామారావు మరణించడంతో చంద్రబాబుకి పెద్ద అడ్డంకి తప్పిపోయింది. ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసినా ఫారూఖ్ ప్రలోభాలకు లొంగిపోయారు. ఆయన వాస్తవిక దృష్టిలో ఆలోచించి ఉంటారు. ఇప్పుడు ఏమీ లేని స్థితి కంటే శాసనమండలి సభ్యత్వం కొంత మెరుగు. ఆ తర్వాత కౌన్సిల్ అధ్యక్ష పదవి బోనస్. రాకపోయినా పర్వాలేదని అనుకొని ఉంటారు. అన్నగారికి సహాయం చేసేందుకు చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరాలని వెడితే మండలి సభ్వత్వానికి రాజీనామా చేసి రావాలంటూ జగన్ మోహన్రెడ్డి షరతు విధించారు. ఈ ఆదర్శప్రాయమైన ఉదంతానికి ప్రచారం రాకుడా బాబు మీడియాను కట్టడి చేయగలిగారు. 21మంది వైఎస్ఆర్సీపీ శాస నసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించిన నీతిమాలిన చర్య ప్రస్తావన కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. నంద్యాలలో కోట్లు ఖర్చు చేస్తూనే తనకు వస్తు వ్యామోహం లేదనీ, చేతికి ఉంగరం, వాచీ కూడా ఉండదనీ చెబుతారు. అఖిలప్రియ చెప్పిన అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చినా ఎన్నికల తంత్రం ఇతర నేతలకు, మంత్రులకూ అప్పగించారు. భూమా కుటుంబానికి రాజకీయ శత్రు వైన గం గుల ప్రతాపరెడ్డికి అర్జంటుగా పచ్చకండువా కప్పారు. విద్యార్థులను సర్వేయర్ల రూపంలో పంపి ఓటర్లను బెదిరిస్తున్నారు. ఇన్ని పరస్పర విరుద్ధమైన అంశాలను సమన్వయం చేసుకోవడం చాకచక్యం కావచ్చును కానీ రాజనీతి మాత్రం కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అసలే కాదు. నంద్యాల ఎన్నికలో ఓటమి ఎదురైతే బాబు తన వైఖరిని సమీక్షించుకొని, తప్పు తెలుసుకొని, సవరించుకునే అవకాశం ఉంటుంది. గెలిచినట్లయితే తన వైఖరికి తిరుగులేదని భావించి అదే మార్గంలో ప్రయాణిస్తారు కాబోలు. 28వ తేదీన నంద్యాల ఓటర్ల తీర్పు ఎట్లా ఉండబోతోందనేదే ఉత్కంఠ కలిగించే అంశం. కె. రామచంద్రమూర్తి -
సాక్షి ప్రధాన కార్యాలయంలో జెండా పండుగ
హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రాంచంద్రమూర్తి జాతీయ జెండాను ఎగరవేసి, స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ రెడ్డి, సాక్షి మార్కెటింగ్ డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడు పదుల్లో ఏమి సాధించాం?
త్రికాలమ్ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత దేశం సాధించింది ఏమిటి? స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం ప్రధానమైన విజయం. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడు కోవడం, గడువు ప్రకారం ఎన్నికలు జరుపుకోవడం, శాంతియుతంగా ప్రభు త్వాలు మారిపోవడం మరో ఘనవిజయం. మూడో విజయం పేర్కొనాలంటే కష్టమే. దారిద్య్రం తగ్గింది. అక్షరాస్యత పెరిగింది. జీవన ప్రమాణాలు గణనీ యంగా పెరిగాయి. వైద్యవసతి పెరిగింది. కానీ ఈ రంగాలలో సాధించవలసిన లక్ష్యాలను సాధించలేకపోయామనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఆక్సిజన్ లభించక 63మంది చిన్నారులు ప్రాణాలు వదలిన ఘటన మనం ఆరోగ్యరంగంలో ఏ స్థాయిలో ఉన్నామో సూచిస్తున్నది. మనం చేసుకున్న చట్టాలనే మనం తుంగలో తొక్కడం కూడా ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమే. సమాచార హక్కు చట్టం చేసుకున్నాం. కానీ ప్రభుత్వాలు సమాచార కమి షనర్లను నియమించవు. సమాచారం అందించవు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశాం. కానీ ఫిరాయింపులను నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తాం. నంద్యాల ఎన్నికల ప్రచారం చూస్తే ఎన్నికలు జరుగుతున్న విధానం తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం మాత్రమే కాదు. అది జీవనవిధానం కావాలి. 1947 ఆగస్టు 14–15 అర్ధరాత్రి భారత పార్ల మెంటులో నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ స్పూర్తి క్రమంగా ఆవిరైపోతున్నదనే ఆవేదన వెన్నాడుతోంది. పాలనాధికారం కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన నేపథ్యంలో దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న గుబులు పట్టి పీడిస్తోంది. కాలక్రమేణా ఈ భయ సందేహాలు నిరాధారమైనవనీ, నిర్హేతు కమైనవనీ తేలవచ్చు. అదే జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అట్లా జరుగుతుందా, లేదా అన్నదే ఆలోచనాపరులను అనుక్షణం వేధిస్తున్న ప్రశ్న. స్వప్నం చెదురుతోందా? ‘ది ఐడియా ఆఫ్ ఇండియా’ (భారతస్వప్నం) చెదిరిపోతోందని కొందరి ఫిర్యాదు. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ కంటే సర్వమత సమానం, సహనం ప్రాతిపదికగా ఏర్పడిన ఇండియాకు నైతికంగా ఆధిక్యం ఉన్నదనే విశ్వాసం క్రమంగా సడలుతోంది. చివరికి ఇండియా కూడా పాకిస్తాన్ బాటలోనే ప్రయాణం చేస్తున్నదా? ఇదేనా ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం సాధించింది? దేశ విభజన సృష్టించిన అది పెద్ద వివాద హేతువు కశ్మీర్ సమస్య ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకపోగా కొరకరాని కొయ్యగా తయారై రావణకాష్టంగా రగులుతోంది. ట్రిపుల్ తలాక్, 370వ అధికరణ రద్దు వంటి ప్రతిపాదనలు ముందుకు రావడంతో మైనారిటీవర్గాలలో అభద్రతా భావం పెరుగుతోంది. లౌకికవాదం అనే పదమే హాస్యాస్పదమైనప్పుడు, నిందా త్మకమైనప్పుడు ఇంతకాలం పాటించిన, విశ్వసించిన విలువలు అగ్నిపరీక్ష ఎదు ర్కోవడం అనివార్యం. రెండు భావజాలాల మధ్య సంఘర్షణను ఇప్పుడు చూస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ రెండు భావజాలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పతనం– బీజేపీ ఉత్థానం ఏకకాలంలో సంభవిస్తున్న పరిణామాలు. కాంగ్రెస్ బలహీనపడినప్పుడే బీజేపీ బలపడుతుంది. ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత మండల్, కమండల్ రాజకీయాల కార ణంగా, అడ్వానీ రథయాత్ర ఫలితంగా ఉత్తరాదిలో బీజేపీకి ఆదరణ గణ నీయంగా పెరిగింది. బీజేపీకి లోక్సభ ఎన్నికలలో గౌరవప్రదమైన సంఖ్యాబలం లభించాక బీజేపీ నాయకులలో ఉదారవాదిగా పేరు తెచ్చుకున్న వాజపేయి నాయకత్వంలో తొలి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి బీజేపీ– సంఘపరివార్ భావజాలాన్ని రాజకీయ, సామాజిక రంగాలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించలేదు. అందరినీ కలుపుకొని పోయే విధంగా పాలన సాగింది. ఒక విధంగా నెహ్రూ బాటలోనే నడించింది. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే, ఆయన ఆచరించిన విదేశాంగ విధానాలనే కొనసాగించారు. ఇజ్రేల్తో దౌత్యసంబంధాలు పెట్టుకున్నది కూడా పీవీ నరసింహారావు హయాం లోనే. కాంగ్రెస్ విధానాల నుంచి వాజపేయి ప్రభుత్వం దూరంగా పోయిందని, రాడికల్గా వ్యవహరించిందని నిరూపించే ఉదంతం ఒక్కటీ లేదు. అందువల్ల ఆయన హయాంలో భావజాలాల మధ్య ఘర్షణ జరగలేదు. మోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన తర్వాతనే కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక సమరం ప్రారంభమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ను ఆవిష్కరించాలనే సంకల్పాన్ని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రకటించినప్పుడే భావసంఘర్షణ మొదలయింది. నెహ్రూ నుంచి వాజపేయి వరకూ వాజపేయి గద్దె దిగేవరకూ దేశం ఒక మార్గంలో పయనించింది. ప్రభుత్వ పగ్గాలను మోదీ స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ సంస్కృతికంటే భిన్నమైన సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. కాంగ్రెస్ను ఎన్ని కలలో ఓడించడంతో సరిపెట్టుకోకుండా ఆ పార్టీకి కానీ, దాని దిగ్గజాలకు కానీ ప్రాసంగికత లేకుండా చేయాలన్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాఠ్యాంశాలలో మార్పులు చేయడం. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సంవ త్సరాలు నిండిన సందర్భంగా మోదీ నెహ్రూ పేరు ప్రస్తావించకపోవడం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగంలో నెహ్రూ ప్రసక్తి ఒకటికి రెండు సార్లు రావడం గమనార్హం. తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు సమాజం కోసం పరితపించినా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించినా, ఇందిరాగాంధీ ఈ విధానాలనే కొనసాగించడంతో పాటు దళితులలో ఆత్మవిశ్వాసం పెంపొం దించేందుకు ప్రత్యేక చట్టాలు చేసినా, నిర్దిష్టమైన విధానాలు రూపొందించినా దేశం మౌలిక స్వభావంపైన వాటి ప్రభావం పడలేదు. ఈ దేశం అన్ని జాతుల, భాషల, మతాల, సంస్కృతుల, ఆచారవ్యవహారాల సమాహారం అనే భావనకు ప్రమాదం ఏర్పడలేదు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా ఈ విషయంలో అటు ఇటుగా ఒకే అభిప్రాయం కలిగినవారుగా నిర్ధారించవచ్చు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీజేపీ–ఆర్ఎస్ఎస్ భావజాలం అధికార పీఠంపైన కూర్చు న్నదనే అభిప్రాయం జనసామాన్యంలో ఏర్పడింది. ఒక దేశం గమనంలో ఏడు దశాబ్దాలు గడచిన తర్వాత ఇటువంటి పెనుమార్పు సంభవించడంలో వింతలేదు. స్వాతంత్య్ర సమరంలో అగ్రగామి పాత్ర పోషించి, స్వతంత్ర భారత నిర్మాణానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ క్రమంగా బలహీనమై, భ్రష్టుపట్టి పోయింది. ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ జాతీయ స్థాయిలో ఎదిగింది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ది గురుతరమైన బాధ్యత. అడ్వానీని పక్కన పెట్టి మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించింది ఆర్ఎస్ఎస్ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మోదీతో పాటు రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా–అందరూ ఆర్ఎస్ఎస్ శాఖీయులు కావడం యాదృచ్ఛికం కాదు. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రస్తుత పాలనావ్యవస్థను నడిపిస్తున్నదనడానికి ఇది నిదర్శనం. మోదీ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాతనే ఘర్వాప్సీ, అవార్డ్ వాప్సీ, గోరక్షక్, ట్రిపుల్ తలాక్ వంటి పదాలు దక్షిణాదివారికి కూడా అర్థం అవుతున్నాయి. ఏ పౌరుడికైనా దేశభక్తిని చాటుకోవలసిన అవసరం కల గడం కంటే అవమానకరం మరొకటి లేదు. మీడియా సంస్థలు సైతం బీజేపీ– ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్టు వ్యవహరించడం విచిత్రం. మొన్న ఉపరాష్ట్రపతి అన్సారీ వీడ్కోలు సమావేశంలో ప్రధాని ప్రసంగించిన విధం కానీ , అన్సారీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యను బీజేపీ నాయకులు అసం దర్భంగా ప్రచారం చేసిన పద్ధతి కానీ, దానికి వెంకయ్యనాయుడు స్పందించిన తీరు కానీ దేశంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అసహన ధోరణిని చాటు తున్నాయి. కాంగ్రెస్, ఇతర ‘సెక్యులర్’ పార్టీలు ఇంతకాలం మైనారిటీలను ఓటు బ్యాంకులుగా వినియోగించుకున్న తీరును ఖండిస్తూ బీజేపీ పరోక్షంగా అదే పని చేస్తున్నది. మైనారిటీలపైన ఒత్తిడి పెంచడం ద్వారా మెజారిటీ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో బీజేపీ సఫలమైనదని చెప్పవచ్చు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్లో 403 అసెంబ్లీ స్థానాల లోనూ ఒక్క స్థానంలోనైనా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండా ముస్లిమేతర వర్గాలను ఆకట్టుకోవడం వెనుక అమిత్షా పకడ్బందీ ప్రణాళిక లేకపోలేదు. మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ఆ కార్యక్రమాలను వీడియో తీసి ప్రభుత్వానికి సమర్పించాలన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశం బీజేపీ విధానాన్ని స్పష్టం చేస్తున్నది. బీజేపీ ఉద్దేశం ఏమిటి? సమాజాన్ని మతప్రాదిపదికపైన రెండుగా చీల్చడం అధికార బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఉద్దేశమా? 2019లో సైతం బీజేపీ అధికారంలోకి సునాయాసంగా వస్తుందని అందరూ భావిస్తున్న దశలో ఇటువంటి ప్రమాదకరమైన రాజకీయం అవస రమా? తెగేవరకూ లాగాలనే అభిప్రాయం మోదీకి లేదనే విషయంగా స్పష్టంగా తెలుస్తోంది. కశ్మీర్లో అన్ని రాజకీయ పక్షాలూ 370వ అధికరణ కొనసాగవల సిన అవసరాన్ని నొక్కివక్కాణించిన తర్వాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానిని ఢిల్లీలో కలుసుకున్నారు. దాన్ని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మోదీ స్పష్టం చేశారు. గోరక్షకుల ఆగడాలను ఉపేక్షించేది లేదంటూ ప్రధాని ఒకటికి రెండు సార్లు హెచ్చరించారు. అవార్డ్ వాప్సీ సందర్భంలో సైతం మోదీ నిగ్రహం పాటించారు. 2014 వరకూ దేశంలో వ్యాప్తిలో ఉన్న కాంగ్రెస్ సంబంధ భావజాలానికి ప్రత్యామ్నాయమైన బీజేపీ–ఆర్ఎస్ఎస్ భావజాలంపై చర్చ జరగాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. చర్చలో కొన్ని ఆచరణ సాధ్యం కానివిగా తేల వచ్చు. మరికొన్ని దేశ సమైక్యతకు ముప్పు తెచ్చేవిగా కనిపించవచ్చు. ఈ పరీ క్షలో నిలబడని విధానాలను పక్కన పెట్టి, నిలబడే విధానాలను ఆచరించాలన్న సంకల్పం ఉండవచ్చు. నేటి భారతంలో మైనారిటీల స్థానం ఏమిటో చూపించా లన్న ప్రయత్నం కావచ్చు. భిన్నమతాలూ, జాతులూ, భాషావర్గాలూ, కులాలూ సహజీవనం చేయవలసిన దేశంలో ఏ మతమూ మరో మతపైన, ఏ ప్రాంతం మరో ప్రాంతంపైన, ఏ భాషావర్గం మరో భాషావర్గం పైన, ఏ కులం మరో కులంపైన ఆధిక్యం ప్రదర్శించడం సాధ్యం కాదు. అటువంటి ప్రయత్నం జరి గితే అది దేశ సమైక్యతకే ప్రమాదంగా పరిణమిస్తుంది. సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ఆ స్థాయి వరకూ వ్యవహారాన్ని తీసుకొని వెళ్ళకపోవచ్చు. శతా బ్దాలుగా పరమత సహనానికీ, శాంతియుత సహజీవనానికీ అలవాటు పడిన ప్రజలు ఈ విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వడాన్ని ఆమోదించరు. కొన్ని సర్దుబాట్లకూ, సవరణలకూ అంగీకరించవచ్చు. అధికార కూటమి ప్రయత్నం ఆ దిశగానే జరుగుతున్నదని భావించాలి. ఇందుకు భిన్నంగా జరిగితే ప్రతిఘటన తథ్యం. 1975లో ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు జాతి ఒక్క తాటిపైన నిలిచి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా రక్షించుకున్నదో అదే విధంగా లౌకిక భావజాలానికి భంగం వాటిల్లినా ప్రజలు తిరగబడి తీరుతారు. అటువంటి పరిస్థితే ఏర్పడితే దేశం అనూహ్యమైన మూల్యం చెల్లించలవసి వస్తుంది. ఈ సంగతి మోదీ ప్రభృతులకు లె లుసు. అందుకే ప్రత్యామ్నాయ భావ జాలంపైన చర్చను అవధులు మీరనీయరు. చర్చ జరుగుతుంది. కానీ తెగదు. ముడిపడదు. కె. రామచంద్రమూర్తి -
విలువలే గెలవాలి!
త్రికాలమ్ నంద్యాల శాసనసభ స్థానం కోసం జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నైతిక విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి జగన్మోహన్రెడ్డి అనూహ్యమైన పరీక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు పైన గెలుచుకున్న శాసనమండలి స్థానానికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాదిరి నీతిలేని రాజకీయం చేయలేనని స్పష్టం చేశారు. చేతిలో ఉన్న మండలి స్థానం వదులుకోవడానికి ధైర్యం కావాలి. బాగా ఆలోచించుకున్న తర్వాత మండలి స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరడానికే చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారంనాడు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తన రాజీనామా లేఖను జగన్మోహన్రెడ్డికి సమర్పించారు చక్రపాణిరెడ్డి. స్పీకర్ ఫార్మాట్లో శాసనమండలి అధ్యక్షుడిని ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను అనంతరం మండలి అధ్యక్షుడి కార్యాలయానికి పంపించారు. అరుణాచలప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భ్రష్టుపడుతున్న తీరు చూసినవారికి వైఎస్ఆర్సీపీ పాటించిన నైతికత ఆనందం కలిగించి తీరుతుంది. ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచీ చట్టసభలలో సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలనే నియమాన్ని పట్టింపుతో అమలు చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన శాసనసభ్యులంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలలో గెలిచారు. ఢిల్లీలో, అమరావతిలో, హైదరాబాద్లో అధికారంలో ఉన్న పార్టీలు పాటించని నైతిక విలువలనూ, ప్రదర్శించని రాజ్యాంగ నిబద్ధతనూ యువనాయకుడు జగన్మోహన్రెడ్డి పాటించినందుకు అభినందించి తీరాలి. నంద్యాల రణక్షేత్రంలో చక్రపాణిరెడ్డి బాసట చాలా ముఖ్యమైనది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి విజయం సాధించాలంటే అతని సోదరుడు చక్రపాణిరెడ్డి సహకారం ప్రధానం. నంద్యాల విజయం వైఎస్ఆర్సీపీకీ, జగన్మోహన్రెడ్డికీ చాలా అవసరం. చావోరేవో తేల్చుకోవలసిన సందర్భం. శాసనమండలి స్థానం వదులుకోవడానికి చక్రపాణిరెడ్డి అంగీకరించకపోతే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం లేదు. నంద్యాలలో విజయావకాశాలు ఆ మేరకు దెబ్బతినేవి. ఇది తెలిసి కూడా సీటు వదులుకోవాలని జగన్మోహన్రెడ్డి షరతు విధించడం విశేషం. ఒక విధంగా నంద్యాల ఉప ఎన్నికలో విజయం కన్నా నైతికత, రాజ్యాంగ స్ఫూర్తి పాటించడమే తనకు ముఖ్యమని జగన్ చాటి చెప్పినట్టు అయింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ అంశం చర్చనీయాంశం కాకపోవచ్చు. పత్రికలూ, వార్తా చానళ్ళూ ప్రాముఖ్యం ఇవ్వకపోవచ్చు. జాతీయ స్థాయిలో చానళ్ళ, పత్రికల దృష్టి వేరే అంశాలపైన ఉండవచ్చు. స్థానిక మీడియా సంగతి సరేసరి. తగినంత ప్రచారం లభించకపోయినప్పటికీ ఇది అన్ని రాజ కీయ పార్టీలూ గమనించవలసిన పరిణామం. విలువలు పాటించే విషయంలో అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తారో లేదో మరి. ఇది కారుమబ్బుల్లో తళుక్కున కనిపించిన కాంతిరేఖ. గెలుపే ప్రధానం చంద్రబాబు ఎన్నికల వ్యూహ రచనలో దిట్ట. మూడు దశాబ్దాలకు పైగా అనేక ఎన్నికలలో పోరాడిన అనుభవం ఆయనది. ముఖ్యమంత్రికి గెలుపే ప్రధానం. ఏ విధంగా గెలిచామన్నది అప్రధానం. లక్ష్యం ముఖ్యం. మార్గం కాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా విజయం సాధిం చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. నైతిక విలువలతో పనిలేదు. రాజకీయ విలువలకు పాతర వేసినా పర్వాలేదు. గెలవాలి. తిమ్మిని బమ్మిని చేసైనా సరే, ఆరు నూరైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే విజయం సాధించి తీరాలి. ఉపఎన్నికలో ఒక సీటు గెలిచినా ఓడినా ప్రభుత్వ సుస్థిరతకు భంగం లేదు. చట్టసభలలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఉపఎన్నిక జరుగుతున్న ఒక్క స్థానం గెలుచుకోవడంపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు సర్వశక్తులూ వొడ్డి పోరాడటం చంద్రబాబు స్వభావం. ప్రత్యర్థులతో పోల్చుకొని ప్రతిరోజూ బేరీజు వేసుకోవడం, ప్రతి పోటీలో తనదే పైచేయి కావాలనుకోవడం, విజయం కోసం అన్ని రకాల నియమాలనూ ఉల్లంఘించి, అడ్డదారులు తొక్కడం ఆయనకు అలవాటు. ఇప్పుడు నంద్యాలలోనూ అదే చూస్తున్నాం. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబు ప్రణాళికలో నంద్యాల అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకున్నది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి సమర్థుడూ, స్థానికంగా విశేషమైన ప్రాబల్యం కలిగిన వ్యక్తీ కావడంతో చంద్రబాబు పని మరింత కష్టభూయిష్టౖమైపోయింది. భూమా నాగిరెడ్డి భార్య శోభ 2014 ఎన్నికల ప్రచారంలో కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన కారణంగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ టీడీపీ అభ్యర్థి మోహన్రెడ్డి కంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగిరెడ్డి (శోభ భర్త)కి స్వల్ప మెజారిటీ (3,604 ఓట్లు) లభించింది. నాగిరెడ్డికి 82,194 (46.97 శాతం) ఓట్లు రాగా, మోహన్రెడ్డికి 78,590 ( 44.91శాతం) ఓట్లు వచ్చాయి. ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యులను తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్ష సభ్యులను వేధించారు. బెదిరించారు. ప్రలోభపెట్టారు. వారి బలహీనతలు తెలుసుకొని వారితో ఆడుకున్నారు. నాగిరెడ్డిపైన పోలీసులను ప్రయోగించారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించారు. రౌడీషీట్ తెరిపించారు. పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించారు. చతుర్విధ ఉపాయాలు ప్రయోగించి ఆయన చేత తప్పు చేయించారు. పార్టీ ఫిరాయించే వరకూ ఆయనను వేధిస్తూనే ఉన్నారు. ఒక వైపు పోలీసు కేసులతో వేధించడం, మరో వైపు మంత్రి పదవి చూపించి ఊరించడం. ఆ విధంగా నాగిరెడ్డి సహా 21 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల చేత పార్టీ ఫిరాయింపజేశారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా శాసనసభ స్థానానికి రాజీనామా చేయలేదు. నాగిరెడ్డి వ్రతం చెడినా ఫలం దక్కలేదు. మంత్రి పదవి అందని ద్రాక్షే అయింది. మానసికంగా కుంగిపోయారు. మండలి ఎన్నికలలో తన అభీష్ఠానికి భిన్నంగా పని చేయాలని నాగిరెడ్డిపైన ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని నాగిరెడ్డిని మందలించారు. అపరాధభావంతో, అవమానభారంతో భూమా గుండెపోటు వచ్చి మరణించారు. ఆ క్షణం నుంచీ నంద్యాల స్థానం ఎట్లా నిలబెట్టుకోవాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు. నువ్వా–నేనా? భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రివర్గంలోకి నలుగురు ఫిరాయింపుదారులను చంద్రబాబు తీసుకున్నారు. భూమా కుమార్తె అఖిలప్రియ వారిలో ఒకరు. నంద్యాల స్థానం తమ కుటుంబానికే చెందాలని అఖిలప్రియ కోరుకోవడం సహజం. ఆ స్థానం గెలుచుకునేందుకు టీడీపీ టికెట్టు తనకే దక్కాలని 2014లో స్వల్ప తేడాతో ఎన్నికలలో ఓడిపోయిన శిల్పామోహన్రెడ్డి ఆశించడం ధర్మం. ఎవరినీ వదులుకోలేని డోలాయమాన స్థితిలో చంద్రబాబుని చూసిన శిల్పా మోహన్రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీకీ బలమైన అభ్యర్థి లభించారు. పెరుగుతున్న జగన్మోహన్రెడ్డి ప్రాబల్యంతో మోహన్రెడ్డి సొంత బలం తోడైతే విజయం సాధ్యం. ఎట్లాగైనా నంద్యాల స్థానం నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో చంద్రబాబు తనకు తెలిసిన విద్య ప్రదర్శించడం ప్రారంభించారు. మూడేళ్ళలో నంద్యాల ప్రజలకు కనిపిం చని చంద్రబాబు తరచూ తమ మధ్యకు రావడం, అడగని వరాలు గుప్పించడం, అన్ని వర్గాల ప్రజలతో చనువు ప్రదర్శించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. నంద్యాలలో వైశ్యులు గణనీయంగా ఉన్నారు కనుక వారికి అవసరమైన భవనం కట్టిస్తానని వాగ్దానం చేశారు. అడిగినవారికీ, అడగనివారికీ రకరకాల పథకాలు మంజూరు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అన్ని వర్గాలకీ అన్ని రకాల వాగ్దానాలు చేశారు. నంద్యాల పట్టణంలో ముస్లింలు 70 వేల పైచిలుకు ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకోవాలంటూ మాజీ మంత్రి ఫారుఖ్ని పట్టుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల టిక్కెట్టు ఆశించిన ఫారుఖ్కి చంద్రబాబు ఇంటర్వ్యూ దొరకటం కష్టమైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రికీ, పార్టీకీ దూరంగా ఉంటున్న మాజీ మంత్రిని పిలిపించుకొని ఆయనకు శాసనమండలి సభ్యత్వమే కాకుండా శాసనమండలి అధ్యక్ష పదవి కూడా ఇస్తానంటూ వాగ్దానం చేసి ఆయనను రంగంలో దింపారు. చక్రపాణి పదవీ విరమణ అనంతరం మండలి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది. ఇదే అధ్యక్ష పదవి చక్రపాణిరెడ్డికి చంద్రబాబు ఇవ్వజూపారు. అది మోహన్రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరక మందు ముచ్చట. చక్రపాణిరెడ్డి టీడీపీలో కొనసాగినప్పటికీ అన్నకి వ్యతిరేకంగా ఎంత శక్తిమంతంగా పని చేయగలరనే విషయంపై తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా, నంద్యాలలో గెలవాలంటే చక్రపాణిరెడ్డి మద్దతు కంటే ఫారుఖ్ మద్దతు అవసరమని భావించిన చంద్రబాబు ఫారుఖ్ని మండలి అధ్యక్ష పదవి చూపించి సుముఖం చేసుకున్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం లేకపోయినప్పటికీ ఫారుఖ్ యాంత్రికంగా తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తరఫున ముస్లిం సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఆరాధనాభావం ఉన్నది. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించింది వైఎస్ఆర్ అనే విషయం ముస్లింలు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి నంద్యాల ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. అది ఎంతమేరకు ఉన్నదనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సాధారణ పరిస్థితులలో, 174 స్థానాలతో కలిపి నంద్యాల స్థానానికి కూడా ఎన్నిక జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం. ఫిరాయించిన ఇతర ఇరవై మంది ఎంఎల్ఏలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగి, వాటితో పాటుగా నంద్యాల ఉప ఎన్నిక కూడా జరిగి ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీకి విజయావకాశాలు స్పష్టంగానే ఉండేవి. కానీ ఒక్క నంద్యాలలోనే ఎన్నికలు జరగడం, ప్రభుత్వ యంత్రాంగాన్నీ, టీడీపీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయితో చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో దింపడంతో పోటీ నువ్వా–నేనా అన్నట్టు సాగుతోంది. ఏ రోజు చూసినా నంద్యాలలో అరడజను మందికి తక్కువ కాకుండా మంత్రులు మకాం వేసి ఉంటున్నారు. శాసనసభ్యులు సరేసరి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకున్నది. వైఎస్ఆర్సీపీ చేతిలో అధికారం లేదు. నిధులు లేవు. అయినప్పటికీ చక్రపాణిరెడ్డి చేరికతో వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలత పెరిగింది. తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నంద్యాలలోనే ఉంటానంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నంద్యాలలో పర్యటించబోతున్నారు. ఒక సార్వత్రిక ఎన్నికకు ఉండే ప్రాముఖ్యం నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకోవడం విశేషం. నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతుందేమో చూడాలి. ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ ఇది చారిత్రక ఉపఎన్నిక కాబోతున్నది. రాజకీయ విలువలకూ, నైతికతకూ ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఎన్నికలో నిర్ధారణ అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
♦ సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి వెల్లడి ♦ పరీక్షల కోసం నీటి నమూనాలు జీఎస్ఐకి.. నాగోలు (హైదరాబాద్): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత గ్రామాల్లో మంచినీరు కలుషితమై స్థానికులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడ్డారని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాల నీటి నమూనాలను పరీక్షల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)కు అందజేశామన్నారు. రామచంద్రమూర్తితో పాటు సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం శ్రీకాకుళం కార్యదర్శి వంకాయల మాధవరావులు గురువారం బండ్లగూడలో జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీధర్ను కలసి ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఇటీవల సేకరించిన నీటితో కూడిన 12 సీసాలను అందజేశారు. ఈ నీటిని ల్యాబ్లో పరీక్షించి, కిడ్నీ వ్యాధులకు మూలాలు కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడినవారు ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని రామచంద్రమూర్తి చెప్పారు. ఈ జబ్బులు ప్రాణాలు హరిస్తున్నా ఎవ రూ స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఆ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. కేంద్రం,ఐరాస, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను కాపాడాలని కోరారు. ఉద్దానం ప్రాంత ప్రజలు నీటి కాలుష్యంతో పిట్టల్లా రాలిపోతున్నారని, సాక్షి యాజమాన్యం ఆ ప్రాంతానికి వచ్చి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకివ్వడం అభినందనీయమని మాధవరావు అన్నారు. గతంలో పవన్కల్యాణ్ వచ్చి హడావుడి చేశారే తప్ప పరిష్కారం చూపలేదన్నారు. వ్యాధుల మూలాలు కనుగొని సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నీటిని పరీక్షించి త్వరలో నివేదిక అందజేస్తామని జీఎస్ఐ అదనపు డీజీ శ్రీధర్ చెప్పారు. -
మంచి నడవడితోనే మనుగడ
త్రికాలమ్ రాజకీయ నాయకులకూ, ప్రభుత్వ ఉన్నతాధికారులకూ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ప్రజాస్వామ్య దేశాలలో అనేకం కనిపిస్తాయి. సిద్ధాంతపరమైన, సూత్రప్రాయమైన అభిప్రాయభేదాలను అర్థం చేసుకోవచ్చు. అటు రాజకీయవాదీ, ఇటు అధికారీ తమ వాదనే సమంజసమైనదంటూ పట్టుదలకు పోయిన ఘట్టాలూ ఉన్నాయి. ఇవి సర్వసాధారణంగా అభివృద్ధి వ్యూహాలకో, సంక్షేమ కార్యక్రమాలకో సంబంధించినవై ఉంటాయి. జనహితంతో ప్రమేయం లేకుండా కేవలం అహంకారం ఆవహించిన సమయంలో రెండు పక్షాలూ గట్టి పట్టుపట్టినప్పుడు ప్రతిష్టంభన అనివార్యం. మంత్రులతో తగాదా వచ్చిన ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రులు వేరే శాఖలలో సర్దుతారు. ముఖ్యమంత్రితోనే పేచీ వచ్చిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై వెళ్ళడం రివాజు. అది గౌరవప్రదమైన తీరు. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకూ, అధికారులకూ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు అంత గౌరవప్రదమైనవి కావు. సిద్ధాంతాలకూ, ప్రజాసంక్షేమానికీ, అభివృద్ధి ప్రణాళికకూ చెందిన అభిప్రాయాల ఘర్షణ కాదు. కేవలం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారనే దుగ్ధతో, మహిళల పట్ల సహజంగా ఉండే చులకన భావంతో దౌర్జన్యంగా, వెకిలిగా ప్రవర్తించిన సందర్భాలు. ఖమ్మం జిల్లాలో ఒక ఉదంతానికి విశేష ప్రచారం లభించింది. శ్రీనివాసన్ అనే ఐఏఎస్ అధికారికీ, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు జలగం వెంగళరావుకూ మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి జిల్లా ప్రజలు అదేపనిగా చెప్పుకునేవారు. వెంగళరావు విలక్షణమైన రాజకీయ నాయకుడు. వ్యక్తిగత ప్రయోజనం ఆశించి అధికారుల చేత ఏ పనీ చేయించే సంకుచిత మనస్తత్వం లేదు ఆయనకు. కానీ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు. అధికారులను విశ్వసించి వారికి బాధ్యతలు అప్పగించడం ఆయన ముఖ్యమంత్రిగా విజయాలు సాధించడానికి దోహదం చేసిన వైఖరి. కొన్ని సందర్భాలలో మాత్రం తనదే చివరిమాట కావాలన్న పట్టింపు ఉండేది. ఏదో ప్రజాప్రయోజనం విషయంలోనే వెంగళరావుకూ, శ్రీనివాసన్కూ మధ్య మాటామాటా పెరిగింది. చివరి మాట ఐఏఎస్ అధికారిదే అయింది. ‘నేను కావాలనుకొని శ్రమిస్తే జిల్లా పరిషత్తు చైర్మన్ను కాగలను. కానీ మీరు ఎంత శ్రమించినా ఐఏఎస్ అధికారి కాలేరు. జిల్లా కలెక్టర్ కాజాలరు’ అని శ్రీనివాసన్ అన్నమాటకు జలగంవారి దగ్గర జవాబు లేదు. అప్పటికే ఆయనకు నలభై ఏళ్ళు. చదువు డిగ్రీ దాకా వెళ్ళలేదు. పదో తరగతితోనే ఆగిపోయింది. ఈ సంభాషణ నిజంగా జరిగిందో లేక కల్పితమో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎవ్వరూ నిర్ధారించలేదు. కానీ ఇందులో సత్యం ఉన్నది. అదేవిధంగా దళిత బాంధవుడు ఎస్ఆర్ శంకరన్కూ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డికీ మధ్య విభేదాలు వచ్చాయి. బాండెడ్ లేబర్ చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న సమయంలో మెదక్ జిల్లా నుంచి కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారు. చట్టం అమలును పర్యవేక్షిస్తున్న శంకరన్ను పిలిచి చూసీచూడనట్టు వ్యవహరించమని చెన్నారెడ్డి చెప్పారు. అట్లా చేయడం తన వల్ల కాదంటూ కేంద్రానికి డిప్యుటేషన్ కోరుకున్నారు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు కళ్ళ ఎదుట అక్రమాలూ, అవినీతీ జరుగుతుంటే చూడలేక, వాటిలో భాగం కాలేక అమరావతికి దండం పెట్టి ఢిల్లీకి వెళ్ళిపోయారు. సమర్థుడైన, నిజాయితీపరుడైన అధికారిగా, కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి రిలయన్స్ సంస్థపైన సాగించిన సమరంలో విలువైన భూమిక నిర్వహించిన బ్యురాక్రాట్గా మంచిపేరు తెచ్చుకున్న గిరిధర్ వారిలో ఒకరు. ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ మరొకరు. తప్పుచేసి లెంపలేసుకున్న నెహ్రూ ఆవేశపడి అధికారులపైన నోరు చేసుకున్నప్పుడో, చేయి చేసుకున్నప్పుడో నేతలు తమ పొరపాటు గ్రహించి క్షమాపణ చెప్పిన సందర్భాలూ లేకపోలేదు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒకసారి అలహాబాద్ వెళ్ళారు. డిజీపీ స్థాయి పోలీసు అధికారి విమానాశ్రయంలో నెహ్రూకి స్వాగతం చెప్పారు. ‘పంత్జీ కహా హై’ అని నెహ్రూ అడిగారు. గోవింద వల్లభపంత్ తొక్కిసలాటలో ఇరుక్కున్నారు కనుక రాలేకపోయారని పోలీసు ఉన్నతాధికారి చెప్పిన సమాధానం నెహ్రూకు కోపం తెప్పించింది. చెంప ఛెళ్లుమనిపించి, ‘ఆయన తొక్కిసలాటలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?’ అంటూ కేకలేశారు. మర్నాడు ఢిల్లీ నుంచి పోలీసు అధికారికి ఫోన్. ప్రధాని సత్వరం రమ్మన్నారంటూ కబురు. మళ్ళీ ఏం గొడవ జరుగుతుందోనని భయపడుతూ వెళ్ళిన పోలీసు అధికారిని నెహ్రూ పార్లమెంటు భవనానికి పిలిపించుకున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారిని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం తినిపించి, ‘ఐ యామ్ సో సారీ. పంత్ నాకంటే ఎంతో పెద్దవారు. నేనైతే జంప్ చేయగలను. అటువంటి పెద్దమనిషి తొక్కిసలాటలో చిక్కుకున్నారని చెప్పేసరికి నాకు కోపం వచ్చింది. చేయరాని పనిచేశాను. క్షమించండి,’ అంటూ సంజాయిషీ చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు 1983లో అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్లోని హిమాయత్నగర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి విజయ వార్త వింటూనే గుండెపోటు వచ్చి మరణించారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా పర్వతనేని ఉపేంద్రను నిలబెట్టారు. ఉపేంద్ర ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన సమయంలో డెయిరీ కార్పొరేషన్ పాల ధర పెంచింది. దాని ప్రభావం ఎన్నికలపైన పడి ఉండవచ్చు. పాలధర పెంపుపైన అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు రచ్చ చేస్తున్నారు. పరాజయ పరాభవానికి తోడు ప్రతిపక్షాల పరిహాసం. ఎన్టీఆర్ ఖిన్నులైనారు. డెయిరీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి దయాచారిని అసెంబ్లీ భవనానికి పిలిపిం చారు. ‘ఏమిటి బ్రదర్! పాలధర పెంచే ముందు ప్రభుత్వానికి మాటవరుసకైనా చెప్పనక్కరలేదా?’ అని నిష్టూరమాడారు. ‘పాల ఉత్పత్తి ధర విపరీతంగా పెరి గింది సర్! పెంచక తప్పలేదు,’అని చెబుతూ ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ చూపించి, ‘ఈ బాటిల్ ధర పది రూపాయలు సర్, అంతకంటే తక్కువ ధరకి పాలు విక్రయించాలంటే ఎట్లా సాధ్యం? ఇప్పటికే కార్పొరేషన్ నష్టాలలో నడుస్తోంది’అన్నాడు. ఆ మాట విన్న ఎన్టీఆర్ ‘ఓకే బ్రదర్ వెళ్ళిరండి. యూ హేవ్ డన్ యువర్ డ్యూటీ. వియ్ విల్ మేనేజ్,’అంటూ తిరిగి సభలోకి వెళ్ళి లీటర్ పాల ధరనూ, వాటర్ బాటిల్లోని లీటర్ నీటి ధరనూ పోల్చి వాదన సమర్థంగా విని పించి ప్రతిపక్షాల వాదనను పూర్వపక్షం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కుసంస్కారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉదంతాలు అక్కడి రాజకీయ నాయకుల సంస్కారానికీ, ముఖ్యమంత్రి పనితీరుకూ అద్దం పడతాయి. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట తహసీల్దార్ వనజాక్షిపై తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడి, దాడి చేసిన వైనం అత్యంత అనాగరికమైనది. ఉద్యోగ సంఘాలు హాహాకారాలు చేసినా, రాష్ట ప్రజలంతా దిగ్భ్రాంతి చెందినా, అమె కళ్ళనీళ్ళ పర్యంతం అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసిన శాసనసభ్యుడినే సమర్థించారు. హద్దుమీరావంటూ తహసీల్దార్నే మందలించారు. ఈ ఘటనపైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల వనజాక్షి నిర్దోషి అని తేల్చింది. ఆమె హద్దు దాటలేదని నిర్ధారించింది. చంద్రబాబుకి నెహ్రూ లేదా ఎన్టీఆర్ వంటి సమున్నత వ్యక్తిత్వం ఉన్నట్లయితే వనజాక్షిని పిలిపించుకొని క్షమాపణ కోరేవారు. అనంతరం ఐపీఎస్ అధికారి, ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీని వాస్ (నానీ), శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యుడు బుద్ధా వెంకన్న, మరికొందరు ఈ యేడాది మార్చి 25న తిట్ల దండకంతో దాడిచేశారు. పని మీద బయటకు వెళ్ళబోతున్న కమిషనర్ కారుకు తమ కారు అడ్డంపెట్టి దౌర్జన్యం చేశారు. కమిషనర్ని చుట్టుముట్టారు. తాము వస్తుంటే ఎందుకు పోతున్నావంటూ నిలదీశారు. ఆరెంజ్ ట్రావెల్స్ పర్మిట్ను రద్దు చేయాలంటూ పట్టుపట్టారు. ధర్నా చేశారు. కమిషనర్పైన అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి తప్పు చేసిన తమ్ముళ్ళ చేత ‘సారీ’ చెప్పించారు. ఐపీఎస్, ఐఏఎస్లతో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించవలసివస్తుందన్న భయంతో వారిని బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి పంపించారు. నానీ మనస్ఫూర్తిగా ‘సారీ’ చెప్పలేదనీ, ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే చెప్పారనీ అనంతరం ఆయన వ్యవహరణ తీరు స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు చెప్పిన పనులు చేసిపెట్టాలంటూ సీఎం ఉన్నతాధికారుల సమావేశంలో ఆదేశించినప్పుడు అధికారులపైన రాజకీయులు రెచ్చిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? సభ్యతలో శిక్షణ ఈ విషయంలో తెలంగాణ వెనకబడిలేదని మహబూబాబాద్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు శంకర్ నాయక్ నిరూపించాడు. ఆదివాసీ నాయకుడు శంకర్ నాయక్కు చదువు వచ్చింది కానీ సంస్కారం అబ్బలేదు. వరంగల్లు రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుడైన శంకర్ రోడ్లు, భవనాల శాఖలో డిప్యూటీ ఇంజనీరుగా పనిచేశారు. ఉద్యోగం వదిలి రాజకీయాలలో ప్రవేశించిన అనంతరం మొర టుగా మాట్లాడటం, ఆధిక్యం ప్రదర్శించడం అలవాటు చేసుకున్నారు. అధికారులను ‘ఏందిర భయ్’అంటూ ఏకవచనంలో సంబోధించడం, దబాయించి పను లు చేయించుకోవడం మామూలైపోయింది. శాసనసభ్యుడు కనుక ఏమి చేసినా చెల్లుతుందనే అహం పెరిగింది. అక్రమార్జనా వగైరా అవలక్షణాలు సరేసరి. కానీ వ్యాపార ప్రయోజనం కోసం కలెక్టర్పైన దాడి చేయలేదు. కేవలం ఆధిక్య భావనతో, వెకిలితనంతో బుధవారంనాడు కలెక్టర్ ప్రీతిమీనా చేతిని తాకారు. అంతక్రితం కలెక్టర్ లేని సమయంలో ఆమె చాంబర్లోకి వెళ్ళి నాయక్ కూర్చున్నారు. అప్పుడు ప్రీతీ మీనా ఎంఎల్ఏపైన మొదటిసారి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ద్వంద్వంగా ఇచ్చిన ఆదేశం మేరకు టూరిజం మంత్రి చందూలాల్తోనూ, ఎంపీ సీతారామ్ నాయక్తోనూ కలిసి మీనా దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. సీఎం అంటే భయంతో క్షమాపణ చెప్పారే కానీ మనస్ఫూర్తిగా మాత్రం కాదు. అరెస్టు చేసి విడుదల చేసిన తర్వాత సీఎం పట్ల గౌరవంతో క్షమాపణ చెప్పాను కానీ తప్పేమీ చేయలేదు అంటూ దబాయించారు. రాజకీయవాదులలోనూ, ఉన్నతాధికారులలోనూ నైతిక విలువలు క్రమంగా పడిపోతున్నాయి. అధికారగణంలో కంటే రాజకీయవాదులలో ఈ పతనం ఎక్కువ వేగంగా జరుగుతోంది. నిజాయితీపరులైన, సమర్థులైన, జన సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే ఉన్నతాధికారులు జాగ్రత్తగా వెతికితే దొరుకుతారు కానీ ఈ లక్షణాలు కలిగిన రాజకీయ నాయకులు మాత్రం కలికం వేసినా కని పించరు. ఉద్యోగంలో నియమించడానికి ముందు ఐఏఎస్ అధికారులకు మసూరీలోనూ, జిల్లాలలో రెవెన్యూ శాఖలోనూ శిక్షణ ఉంటుంది. ఎవరితో ఎట్లా వ్యవహరించాలో, ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో, రాజకీయ వ్యవస్థతో ఏ విధంగా మసలుకోవాలో, విలువలతో రాజీ పడకుండా ప్రజాశ్రేయస్సుకోసం ఎట్లా పని చేయాలో విశేషమైన అనుభవం కలిగినవారు నేర్పుతారు. రాజకీయ నాయకులకు నైతికాంశాలలో శిక్షణ లేదు. ఎవరి సంస్కారానికి అనుగుణంగా వారు నేర్చుకోవడమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం అందులో ప్రధానపాత్రధారులైన ప్రజాప్రతినిధులకు సభ్యతాసంస్కారం నేర్పే ప్రయత్నం జరగడం లేదు. అధికారులతో ఎట్లా వ్యవహరించాలో, ప్రజల సమస్యలను ఎట్లా తెలుసుకొని పరిష్కరించాలో, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదగాలో బోధించి, తగిన తర్ఫీదు ఇచ్చినట్లయితే విద్యాధికుడైన శంకర్ నాయక్ సంస్కారవంతుడైన రాజకీయ నాయకుడుగా ఎదిగేవారు. ఈ రోజున ఇంతగా అపహాస్యంపాలు కావలసిన దుస్థితి ఉండేది కాదు. - కె. రామచంద్రమూర్తి -
ఫిరాయింపుల క్రీడ ఇంకానా?
త్రికాలమ్ శనివారం ప్రారంభమైన వైఎస్ఆర్సీపీ రెండురోజుల ప్లీనరీకి హాజరైన ప్రతినిధులలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఆహ్వానితుల కంటే అధికంగా పార్టీ కార్యకర్తలు హాజరు కావడం పార్టీ నడుస్తున్న తీరుపట్ల సంతృప్తికి నిదర్శనం. పాలకపక్షం పట్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తికి కూడా ఇది నిదర్శనం. క్షేత్రస్థాయిలోని రాజకీయ నాయకులకు ప్రజల నాడి తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతోందంటే ప్రతిపక్షానికి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వారు గ్రహిస్తారు. అటువంటి వాతావరణం ప్రతిపక్ష కార్యకర్తలలో ఉత్సాహం నింపడం సహజం. గతంలో జరిగిన రెండు ప్లీనరీల కంటే ఈసారి ప్లీనరీ పద్ధతి ప్రకారం ప్రారంభమైనదని చెప్పవచ్చు. ప్రసంగాలు క్లుప్తంగా, సూటిగా ఉన్నాయి. తీర్మానాలు అర్థవంతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిపైనా, ఆయన కుమారుడిపైనా వ్యక్తిగత విమర్శలు చేయకుండా వక్తలు విధానాలకూ, పాలనకూ మాత్రమే పరిమితమైతే ఇంకా బాగుండేది. పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం రెండు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఒకటి, పార్టీ ఫిరాయింపుల నిరోధం. రెండు, ఎన్నికల వాగ్దానాలు చేయడంలో వాస్తవిక దృక్పథం ఉండాలనీ, చేసిన వాగ్దానాలు అమలు చేయని పాలకులపైన శిక్షాత్మక చర్యలు ఉండాలనీ తీర్మానం ప్రతిపాదించింది. ఈ రెండు రుగ్మతలూ ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైనవి కావు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఇటువంటి అప్రజాస్వామిక ధోరణులు మితిమీరుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధం బిల్లు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న బ్రిటన్లో లేదు. ఆస్ట్రేలియా, కెనడాలలోనూ లేదు. పార్టీ ఫిరాయించిన ఎంపీలు బ్రిటన్ పార్లమెంటులో విడిగా కూర్చుంటారంతే. ఫలానా పార్టీ టిక్కెట్టుపైన గెలిచారు కనుక అదే పార్టీకి అంకితం కావాలన్న నిబంధన లేదు. అవి ప్రవృద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలు కనుక డబ్బు కోసమో, పదవి కోసమో పార్టీ ఫిరాయించే సంస్కృతి అంతగా లేదు కనుక పార్టీ విధేయతకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీ కంటే ప్రజలకూ, దేశానికీ విధేయంగా చట్టసభలలోని ప్రజాప్రతినిధులు వ్యవహరించాలన్నది ఆ సమాజాల విశ్వాసం. అందుకే అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా కొంతమంది రిపబ్లికన్ సెనేటర్లూ, అనుకూలంగా ప్రతిపక్షంలోని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లు కొందరూ ఓటు వేయడం ఆనవాయితీ. బ్రిటన్లోనూ ఇదే వరస. చట్టాల రూపకల్పనలోనూ, విధాన నిర్ణయాలలోనూ పార్లమెంటు సభ్యులు తమ విచక్షణాజ్ఞానం వినియోగించకపోతే, కేవలం ఓటర్ల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే అది దేశాన్ని దగా చేసినట్టు అవుతుందంటూ 1774లోనే నాటి బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడూ, రాజనీతిజ్ఞుడూ ఎడ్మండ్ బర్క్ హెచ్చరించాడు. మన దేశంలో పరిస్థితులు వేరు. డబ్బు కోసం, పదవుల కోసం పార్టీ ఫిరాయించడాన్ని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీలూ, ఫిరాయిస్తున్న ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులూ, శాసనసభ, శాసనమండలి సభ్యులూ అనేకమంది ఉన్నారు. ఫిరాయింపుల కారణంగా రాజకీయ అస్థిరత ఏర్పడటంతోపాటు ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి వల్ల 1970లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతగా అపహాస్యం పాలైనదో గమనించిన తర్వాత ఫిరాయింపుల నిరోధం తప్పనిసరి సంస్కరణ అని విజ్ఞులు నిర్ణయించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాలు రాజీవ్గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ వచ్చింది. రాజ్యాం గంలోని 101, 102, 190, 191 అధికరణలను సవరించి, రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్ని చేర్చి పార్టీ ఫిరాయించిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించారు. పార్లమెంటరీ లేదా లెజిస్లేచర్ పార్టీలో మూడింట ఒక వంతు మంది సభ్యులు పార్టీని వీడితే దాన్ని పార్టీలో వచ్చిన చీలికగా గుర్తించాలని అప్పటి ఫిరాయింపుల చట్టం నిర్దేశించింది. ఆ విధంగా పార్టీని చీల్చినవారి పైన అనర్హత వేటు ఉండదు. పెద్ద పార్టీలైతే మూడింట ఒక వంతు మందిని పార్టీ ఫిరాయించడం కోసం సమీకరించడం కష్టం కానీ చిన్నాచితకా పార్టీలను చీల్చడం తేలిక. చిన్న రాష్ట్రాలలో ఫిరాయింపులను 1985 నాటి చట్టం నిరోధించలేకపోయింది. రాష్ట్రాలలో అస్థిరతనూ, అనిశ్చితినీ ఈ సవరణ చట్టం అరికట్టలేకపోయింది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. 2003లో వాజపేయి సర్కార్ టెన్త్ షెడ్యూల్లో సవరణ చేసింది. మూడింట రెండు వంతుల మంది వైదొలిగితేనే పార్లమెంటరీ లేదా లెజిస్లేచర్ పార్టీ చీలినట్టు పరిగణించాలంటూ కొత్తచట్టం తెచ్చారు. ఈ చట్టంలో ఒక లొసుగు వదిలివేసిన కారణంగా ఫిరాయింపులు నిస్సిగ్గుగా కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన చట్టసభ సభ్యుడిపైన అనర్హతవేటు వేయడమా లేదా అని నిర్ణయించే అధికారం సభాపతులకు చట్టం ప్రసాదించింది. ఫలానా పక్షానికి చెందిన సభ్యుడు ఫిరాయిస్తే ఆ సభ్యుడిపైన అనర్హత వేటు వేయాలంటూ ఆ పక్షం నాయకుడు సభాపతికి లేఖ ఇస్తారు. ఆ లేఖపైన సభాపతి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చట్టం నిర్దేశించలేదు. ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కూడా లేదు. అందువల్ల స్పీకర్లు ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలను నిరవధికంగా వాయిదా వేస్తూ కాలయాపన చేస్తున్నారు. రాజీవ్, వాజపేయి తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాలు నిష్ఫలమై రాజ్యాంగ వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. లొసుగులను ఎందుకు తొలగించరు? చట్టాలలోని లోపం ఏమిటో స్పష్టంగా తెలుసు కదా. దాన్ని సవరించే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? ఎవరు చేయాలి ప్రయత్నం? అధికార పార్టీ చేయాలి. ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండటమే అధికారపార్టీలకు అవసరం. అందువల్ల ఈ లోపాలను సవరించాలన్న ఆతృత, ఉత్సుకత వాటికి ఉండదు. పైగా ఆ లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కేంద్రంలోని పాలకపక్షాలకూ, రాష్ట్రాలలోని అధికారపక్షాలకూ సమంగా వర్తిస్తుంది. ఇదివరకు సరిపోను సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాలు స్వతంత్ర సభ్యులనో, చిన్న పార్టీల సభ్యులనో ఫిరాయింపునకు ప్రోత్సహించి అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవి. ఇప్పుడు రాజకీయం బరితెగించింది. చట్టసభలలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలను బలహీనం చేయాలనే ఉద్దేశంతో యధేచ్ఛగా ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతిపక్ష సభ్యులకు ప్రలోభాలు చూపించి వారి చేత తప్పు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రులకు పరమవిధేయులైన సభాపతులు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడంలో సహకరిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్టీ ఫిరాయించినవారిని మంత్రిపదవులతో సత్కరిస్తున్నారు. చట్టాలు చేయవలసినవారే చట్టాలను నిష్కారణంగా తుంగలో తొక్కుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రాలలోని పాలకపక్షాలు కానీ ఇందుకు సిగ్గుపడటం లేదు. పోనీ ఫిరాయించినవారు ఏదైనా సైద్ధాంతిక విభేదాల వల్లనో, సూత్రబద్ధంగానో ఆ పనిచేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. నైతిక కారణాల వల్ల అధికార పార్టీ నుంచి నిష్క్రమించిన పార్లమెంటు సభ్యులూ లేదా శాసనసభ్యులూ కలికానికైనా కని పించరు. అటువంటి ఉన్నత విలువల ప్రసక్తి లేదు. ధనం, అధికారం నిగ్రహిం చుకోలేని ప్రలోభాలుగా మారాయి. సభాపతుల మౌనం, నిష్క్రియ సరాసరి రాజ్యాంగ ఉల్లంఘనే. ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కింది. ప్రతిపక్ష సభ్యులపైన కేసులు పెట్టి వేధించి, వారిపైన రౌడీషీట్లు తెరిపించి వారిని కాళ్ళ బేరానికి తెప్పించుకొని పార్టీ ఫిరాయించే విధంగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలు అందరికీ తెలిసినవే. భూమా నాగిరెడ్డి ఇందుకు ప్రబలమైన ఉదాహరణ. 2011లో వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన శాసనసభ్యుల చేత సభ్యత్వానికి రాజీనామా చేయించి, మళ్ళీ ఉపఎన్నికలలో కొత్త పార్టీ టెక్కెట్టుపైన పోటీకి నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ విషయంలో అధికార పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంది. వాస్తవానికి ఇది జాతీయ స్థాయిలో చర్చించి పరిష్కరించుకోవలసిన సమస్య. అందుకే పార్టీ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ఈ అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం సమంజసమే. ఆచరణసాధ్యం కాని వాగ్దానాలు ఎన్నికల వాగ్దానాలు అమలుకు నోచుకోకపోవడం దేశవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన అనేక వాగ్దానాలు మూడేళ్ళుగా అమలుకు నోచుకోలేదు. ఆ వాగ్దానాలు అమలు కాకపోయినా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం లేదు కనుక పర్వాలేదు. కానీ ముఖ్యమంత్రులు చేసే వాగ్దానాలు వివిధ వృత్తులవారిలో, సమాజంలోని అనేక వర్గాలలో ఆశలు రేకెత్తిస్తాయి. వాగ్దానాలు అమలు జరుగుతాయనే ఆశతో ఓటు వేస్తారు. వారి ఓట్లతో గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వారికే శఠగోపం పెడుతుంది. ఇది చాలా సందర్భాలలో జరిగిన తంతు. చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. రెండు ప్రధానమైన వాగ్దానాలు చేసి అంతకంటే చాలా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ అమలు చేశారు. అన్ని కార్యక్రమాల ఫలాలూ అన్ని ప్రాంతాల, వర్గాల, మతాల, కులాలవారికీ అందించే ప్రయత్నం చేశారు. దాన్ని ‘శాచురేషన్ లెవల్’అనేవారు. అందుకే మృత్యువాతపడి ఎనిమిదేళ్ళు కావస్తున్నా తరగని ప్రజాభిమానం. అమలుకు సాధ్యమైన ఎన్నికల వాగ్దానాలే చేయాలంటూ ఎన్నికల కమిషన్ కొన్నేళ్ళుగా పట్టుపడుతున్నది కానీ అది నెరవేరడానికి అవసరమైన వ్యవస్థ లేదు. 2014లో తెలుగుదేశం పార్టీ వాగ్దానాలను పరిశీలించవలసిందిగా ఎన్నికల కమిషన్ను కొంతమంది కోరారు. కానీ అందుకు తగిన యంత్రాంగం లేకపోవడం, ఫలానా వాగ్దానం ఆచరణ సాధ్యం కాదు కనుక ప్రచారంలో ఆ వాగ్దానం చేయరాదంటూ శాసించే అధికారం ఎన్నికల సంఘానికి లేకపోవడం వల్ల ఎన్నికల హామీలను అదుపు చేసే ప్రయత్నం ఫలించలేదు. తమ విశ్వసనీయతను కాపాడుకోవాలనే పట్టింపు కలిగిన రాజకీయ నేతలు ఒక వాగ్దానం అమలు చేసే ముందు అది సాధ్యమా, అసాధ్యమా అనే విషయాన్ని తరచి పరిశీలిస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో రైతులకు రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా జగన్మోహన్రెడ్డికి చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ అంత భారం మోయగల స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండబోదని లెక్కలు వేసుకొని ఆ వాగ్దానం చేయలేదు. పైగా తెలుగుదేశం చేసిన రుణమాఫీ వాగ్దానం అమలు సాధ్యం కాదని ప్రజలకు స్పష్టంగా చెప్పారు. కానీ ఓటర్లు ఆ వాగ్దానాన్ని విశ్వసించారు. అనంతరం ఏమి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రజలకు తెలుసు. ఆకాశమే హద్దుగా ఎన్నికల వాగ్దానాలు చేసే దురాచారానికి స్వస్తి చెప్పకపోతే అమాయక ప్రజలు ప్రతిసారీ మోసపోయి మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది. ఈ బెడద నివారణ కోసం చట్టపరమైన పరిష్కారం అన్వేషించవలసిన బాధ్యత చట్టసభలపైన ఉంది. కనీసం ఫలానా హామీని ఏ విధంగా ఆచరించి చూపుతారో, ఆర్థిక వ్యవస్థలో అందుకు అవసరమైన వెసులుబాటు ఉన్నదో లేదో నిర్ణయించే అధికారాలు ఏదైనా రాజ్యాంగ వ్యవస్థకు అప్పగించకపోతే మోసకారి రాజకీయానికి ముగింపు ఉండదు. - కె. రామచంద్రమూర్తి