Telangana budget
-
కేటీఆర్ యువరాజు అనుకుంటున్నారా? భయపడేది లేదు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నిరసన తెలియజేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేందుకే నీతి ఆయోగ్ బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు.కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదని, పైసా ఇవ్వకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.‘కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా సహకారం లేదు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు.. కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారు. ఆయన హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదు. -
బడ్జెట్ పై తెలంగాణ నేతల రియాక్షన్
-
Telangana Budget: మాది సంకల్ప బలం
గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. మేం ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలివ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి హామీలను ప్రజల ముందుంచాం. అవి అలవికానివంటూ ప్రతిపక్షాలు పదేపదే విమర్శిస్తున్నాయి. కానీ సంకల్పబలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయతీలే పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవికాని హామీలంటూ లేవని తొలి అడుగుతోనే నిరూపించాం.– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తామిచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదలతో ఉన్నామని.. ఆ దిశగానే రాష్ట్ర బడ్జెట్కు రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, అర్హులకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం, అర్హులకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి హామీలను ప్రభుత్వం ఏర్పడిన కొన్నిరోజుల్లోనే అమల్లోకి తెచ్చామని చెప్పారు. త్వరలోనే మిగతావీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను భట్టి విక్రమార్క గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ సుదీర్ఘంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించారు. భట్టి బడ్జెట్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మహాకవి దాశరథి వరి్ణంచిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషిస్తున్నాను. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. వామనావతారంలా పెరిగిన అప్పులు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దశాబ్దకాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు.. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న రూ.75,577 కోట్ల అప్పు.. 2023 డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లను ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా.. అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. ఓ వైపు అప్పులు, మరోవైపు పేరుకుపోయిన బిల్లులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతోపాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో) అప్పులు తీరుస్తూ.. సంక్షేమం పాటిస్తూ.. రాష్ట్రానికి డిసెంబర్ నాటికి రూ.6,71,757 కోట్లు అప్పులు ఉన్నట్టు తేలింది. మా ప్రభుత్వం వచ్చాక రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా.. గత ప్రభుత్వం తాలూకు రూ.42,892 కోట్ల రుణాలు, వడ్డీలు చెల్లించాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే సమయంలో సంక్షేమాన్ని విస్మరించలేదు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశాం. మూలధన వ్యయానికి అదనంగా రూ.19,456 కోట్లు ఖర్చు చేశాం. గత దశాబ్దకాలంలో ఉద్యోగ నియామకాలు సరిగా జరగక నిరుద్యోగ యువత కలలు కల్లలయ్యాయి. అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణతో యువతకు ఉద్యోగాలు అందని పరిస్థితి ఏర్పడింది. దాన్ని సరిదిద్ది నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చే చర్యలను మా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశాం. జాతీయ వృద్ధిరేటుకన్నా వెనుకబడ్డాం.. 2023–24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి చెందితే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత ఏడాది జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు తక్కువ. 2023–24లో తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు ఖర్చుల కోసం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతూ వచ్చింది. కఠిన ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు.. 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,64,063 ఎక్కువ. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 అయితే.. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241 మాత్రమే. అంటే జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని స్పష్టమవుతోంది..’’ అని భట్టి పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపులను వెల్లడించారు. అతి త్వరలో రూ.2లక్షల వరకు రుణమాఫీ ‘‘గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను అప్పుల్లోకి నెట్టిందే తప్ప నిజంగా ఎలాంటి మేలు చేయలేదు. మేం రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించాం. జూలై 18న రూ.లక్ష వరకు రుణమున్న 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో ఒకేసారి జమచేశాం. రూ.రెండు లక్షల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది.’’ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తాంబడ్జెట్ ప్రసంగంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాల వారీగా చేసిన నిధుల కేటాయింపులను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పలు అంశాలకు సంబంధించిన విధానాలను, చేపట్టబోయే చర్యలనూ తెలిపారు. ⇒ ‘రైతు భరోసా’ కింద అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది మా సంకల్పం. అందుకే ప్రజలతో చర్చించి ఎలా చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాం. ⇒ భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపర్చడానికి వారికి ఏటా రూ.12,000 అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. ⇒ మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాము. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ⇒ సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి 33 రకాల వరిని గుర్తించి, వాటికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. ⇒ ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాల పురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. ⇒ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నాం. ఇంటి విస్తీర్ణం కనీసం 400 చదరపు అడుగులతో ఉంటుంది. ⇒ ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలను 20 ఎకరాల స్థలంలో ఒకేచోట నిర్మిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మహనీయుల మాటలను ఉటంకిస్తూ..భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పలువురు మహనీయుల మాటలను ఉటంకించారు. ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండూ కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు. పునాది ఎంత బలంగా ఉంటే.. ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది’’ అన్న బీఆర్ అంబేడ్కర్ మాటలను గుర్తు చేశారు. వ్యవసాయానికి కేటాయింపులను వెల్లడిస్తున్న సమయంలో.. ‘‘ఏ పని అయినా ఆగవచ్చు.. కానీ వ్యవసాయం ఆగదు’’ అని జవహర్లాల్ నెహ్రూ చెప్పారని భట్టి పేర్కొన్నారు. ఇక ‘‘ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది’’ అని నెల్సన్ మండేలా చెప్పారని.. తాము ఇచ్చిన రుణమాఫీ హామీకి ఇది వర్తిస్తుందని భట్టి చెప్పారు. తాము రుణమాఫీ అమలుతో మండేలా మాటలను నిజం చేసి చూపామన్నారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న సమయంలో ‘‘ప్రజాస్వామ్యం అనేది బలవంతులకు, బలహీనులకు సమాన అవకాశాలు కల్పించేది’’ అని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు.అసెంబ్లీలో షేమ్ షేమ్.. ఫాల్స్ ఫాల్స్!ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా శాసనసభలో షేమ్ షేమ్.. ఫాల్స్ ఫాల్స్.. అన్న నినాదాలు హోరెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను భట్టి విక్రమార్క విమర్శిస్తున్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ‘షేమ్.. షేమ్..’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో భట్టి చెప్తున్న మాటలు ‘ఫాల్స్.. ఫాల్స్..’ అంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్రతిగా నినాదాలు చేశారు. -
‘పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్!‘..కేటీఆర్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..!విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతోఏమార్చిన డొల్ల బడ్జెట్..!రైతులకు…— KTR (@KTRBRS) July 25, 2024 అయితే ఈ బడ్జెట్పై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని మండిపడ్డారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్లో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు..నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..! మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు..ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్..! అంటూ ట్వీట్లో తెలిపారు. -
‘ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. అంకెల గారడీలా మారింది‘: హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆత్మ స్తుతి పర నిందలా మారింది. బడ్జెట్లో హామీల ప్రస్తావన లేదు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉంది. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదు. అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయింది. 2,500 మహిళలకు ఇస్తామని చెప్పింది. కోటి మంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. 8 నెలలుగా మహాలక్ష్మి కాస్త మహా నిరాశగా మారింది. ఆసరా పెన్షన్పై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో చెప్పారు. 4వేల పెన్షన్ ఇప్పటిదాక ఇవ్వలేదు. ఊదర గొట్టి బడ్జెట్లో పెట్టలేదు. పేదల ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదు. విద్యా భరోసా కార్డు, స్కూటిలు ఇస్తామన్నారు బడ్జెట్లో దాని ఊసే లేదు. ఆటో కార్మికులు వృత్తి నమ్ముకొని ఆటో నడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పొట్ట కొట్టింది. చేనేత కార్మికుల ప్రస్తావన లేదు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?: బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్పై కేంద్ర మోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా?.. 6 గ్యారంటీలు+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా? అంటూ సెటైర్లు వేశారు.గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అంటూ దుయ్యబట్టారు.రాష్ట్రంలో అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో బడ్జెట్ో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమన్నారు.‘సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా?. ఔను.. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోంది. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది?రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా?. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే?రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి. ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా?జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు అద్ధం పడుతుంది. కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేదు.. తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం శతాబ్దం జోక్. ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే.. 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు.ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం. బడ్జెట్లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు.. మీరిచ్చిన అమలుి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ లోనే తేలిందిబడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు.. సీఎంసహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా... దీనికేం సమాధానం చెబుతారు? బడ్జెట్లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా? -
హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.. కేటాయింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ను రూ. 2,91,159 కోట్లుగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 35,118 కోట్ల అప్పు తీసుకోగా , రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మెట్రో వాటర్ వర్స్ కోసం రూ. 3,385 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 3,065కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్ఎండీేఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్ రూ. 50 కోట్లు కేటాయించారు.ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని, అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టామని అన్నారు. -
కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనం: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట బడ్జెట్పై కేసీఆర్ విమర్శలా?.. కేంద్ర బడ్జెట్పై ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్బాబు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారాయన.. రాష్ట్ర బడ్జెట్ పెంచాలని అనుకున్నాం కానీ కేంద్రం నుంచి నిధులు రాలేదు.. సంక్షేమం, అభివృద్ధి సమభాగంలో బడ్జెట్ కేటాయింపులు జరిపామని మంత్రి అన్నారు.వ్యవసాయ రంగానికి న భూతో న భవిష్యత్ అనుకుంటున్నాం. హైదరాబాద్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించాం. హైదరాబాద్ ఎకో సిస్టం అభివృద్ధి కోసం 10వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం. భవిషత్ తరాలకు అవసరం అయ్యేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశాం.’’ అని శ్రీధర్బాబు వివరించారు.వ్యవసాయనికి 23వేల కోట్లు గత ప్రభుత్వం పెడితే.. ఇప్పుడు 72వేల కోట్లు పెట్టాం. వట్టి మాటలు మేము చెప్పడం లేదు.. కేసీఆర్ చెప్పి వెళ్ళారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోంది అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టాం. మాకు ఒక విజన్ ఉంది.. 2004లో మహిళలను లక్షాధికారులను చేసి చూపాం. మేము అప్పులు తెచ్చి.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నం. జులై వరకు 35వేల కోట్లు అప్పు చేసి 42వేల కోట్ల వడ్డీలు కట్టాం. రాష్ట్రం పై కేసీఆర్కు ప్రేమ ఉంటే నిన్న ఎందుకు రాలేదు?. కేంద్రం నుంచి పిలుపు రాగానే కేసీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడి పోయారు. తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని అడుగుతాం’’ అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
బడ్జెట్పై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారుజ కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడని సీతక్క విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ మెప్పుకోసమే ఆయన రాష్ట్ర బడ్జెట్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.కాగా తెలంగాణ బడ్జెట్.. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. తమ పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. -
తెలంగాణ బడ్జెట్పై కేసీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్.. ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నాం బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.మా పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాడ్డాక వీళ్లకు ఆరు మాసాల సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ బడ్జెట్ చూశాక ఒక పాలసీ లేకుండా ఉందని అన్నారు. రైతు భరోసా ప్రస్తావనే లేదు.. ఇది పూర్తిగా రైతు శత్రుత్వ ప్రభుత్వమని విమర్శించారు. భవిష్యత్తులో ఈ బడ్జెట్పై ప్రభుత్వాన్ని చీల్చిచెండతామని అన్నారాయన. -
అప్పుల కుప్పగా తెలంగాణ
-
Musi Metro Project: ఈ భారం మోసేదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. దీంతో మొత్తం భారమంతా రాష్ట్రంపైనే పడనుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం కేంద్రం సుమారు రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించాలని రాష్ట్రం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు స్వయంగా కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో మూసీ భారాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించవలసిన వచి్చంది. ⇒ ఇక మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపైన డీపీఆర్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టును కేంద్రానికి సమరి్పంచడంలో ఆలస్యం జరిగింది. బడ్జెట్ కంటే ముందే ఈ ప్రాజెక్టుపైన కేంద్రానికి డీపీఆర్ను సమరి్పంచి ఉంటే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మెట్రో రెండో దశను కూడా ప్రస్తుతానికి రాష్ట్ర నిధులతోనే ప్రారంభించవలసిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండు ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ⇒ సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్, మేడ్చల్ రూట్లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలను సైతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పనులకు శంకుస్థాపన చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సిటీ ప్రాజెక్టులే అత్యంత కీలకం కానున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. మూసీకి రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సర్వే పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిరి్మంచనున్న 70 కిలోమీటర్ల మెట్రో రెండో దశకు సుమారు రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం కానున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మెట్రో మొదటి దశను పీపీపీ పద్ధతిలో నిరి్మంచగా, రెండో దశ ప్రాజెక్టును మాత్రం ప్రభుత్వమే చేపట్టింది. ఇదీ రెండో దశ మెట్రో... ⇒ నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు అక్కడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో చేపట్టనున్నారు. ⇒ అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు రెండో దశలోనే పూర్తికావలసి ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ రూట్లోనే మైలార్దేవ్పల్లి నుంచి హైకోర్టు వరకు మరో లైన్ను నిర్మించనున్నారు. ⇒ ఎయిర్పోర్ట్ కారిడార్, హయత్నగర్ కారిడార్లలో అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్లు, స్టేషన్లను ఖరారు చేశారు. ⇒ రెండో దశ డీపీఆర్ను సిస్టా కన్సల్టెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది. నిధులిస్తే పనులు ప్రారంభం... ⇒ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్రోడ్డు జంక్షన్ వరకు సుమారు రూ.2232 కోట్ల అంచనాలతో 18.10 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ⇒ ఈ ప్రాజెక్టు కోసం వివిధ చోట్ల సుమారు 197 ఎకరాలకు పైగా భూములను సేకరించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందులో రక్షణ శాఖకు చెందిన భూములే 113 ఎకరాల వరకు ఉన్నాయి. ⇒ ఈ మార్గంలో తొలగించవలసిన కట్టడాలు, సేకరించాల్సిన భూములపైన కూడా క్షేత్రస్థాయి సర్వేలు పూర్తయ్యాయి. ⇒ ప్రభుత్వం నిధులను విడుదల చేసిన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ బడ్జెట్లో మురిపిస్తారా... ⇒ మూసీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సామాజిక, ఆరి్థక సర్వే కొనసాగుతోంది. ⇒ గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సుమారు 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయనున్నారు. ⇒ నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సుమారు 12,500 నిర్మాణాలను తొలగించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ⇒ ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. ⇒ అలాగే ఎస్టీపీలు, నదికి ఇరువైపులా రహదారులు, ఐటీ టవర్లు, మెట్రో రైలు వంటి భారీ నిర్మాణాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
బడ్జెట్ రూ.లక్ష కోట్ల నుంచి రూ.2.75 లక్షల కోట్లకు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మిగులు బడ్జెట్తో విడిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర ఖజానా ప్రారంభ నిల్వ రూ.2,544 కోట్లుగా చూపెట్టారు. ఆ ఏడాది అసెంబ్లీ అనుమతి పొందిన మొత్తం బడ్జెట్ రూ.1.06 లక్షల కోట్లు. లక్ష కోట్ల నుంచి అంచెలంచెలుగా పెరిగిన తెలంగాణ బడ్జెట్ పరిమాణం ఇప్పుడు రూ.2.75 లక్షల కోట్లకు చేరుకుంది.అంటే బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపుగా మూడు రెట్లు పెరిగాయన్న మాట. ప్రతిపాదనల మాట అటుంచితే బడ్జెట్ ఖర్చులో కూడా ఏటేటా పెరుగుదల కనిపిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చు రూ.62,306 కోట్లు కాగా, ఆ తర్వాత వరుసగా రూ.97,922 కోట్లు, రూ.1.33 లక్షల కోట్లు.. ఇలా పెరుగుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.01 లక్షల కోట్లకు చేరింది. సొంత పన్ను ఆదాయమే కీలకం..ఏ రాష్ట్రమైనా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో, ముఖ్యంగా రాష్ట్ర సొంత ఆదాయాన్ని (ఎస్వోటీ) పెంచుకోవడంలో సఫలీకృతమైతే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టే. ఈ కోణంలో పదేళ్ల తెలంగాణ రాష్ట్రం సుస్థిరతను సాధించిందని, సొంత పన్నుల ఆదాయం భారీగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన రోజు 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల కోట్ల వరకు ఉన్న సొంత పన్నుల ఆదాయం ఇప్పుడు 2024–25 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనల్లో లక్ష కోట్లు దాటింది.అప్పుల కుప్పలేపదేళ్లలో తెలంగాణ అప్పుల మూటను కూడగట్టుకుంది. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రూ.72,658 కోట్ల అప్పులుండగా.. ఇప్పుడు బడ్జెట్ లెక్కల ప్రకారం రూ.5 లక్షల కోట్లు దాటాయి. నికర అప్పు, పూచీకత్తులతో కలిపితే రూ.7 లక్షల కోట్లు దాటుతోంది. తలసరి ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించిన రాష్ట్రం, తలసరి అప్పులోనూ అదే స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హం. అప్పులకు వడ్డీల చెల్లింపులకే రూ.22 వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాల్సి వస్తోంది. 2036 కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు రూ.86 వేల కోట్లు, వడ్డీ రూ.54 వేల కోట్లు కలిపి రూ.1.40 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే ఏటా రూ.12 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టు కోసం పదేళ్లలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేయగలగడం, రైతుబంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి సజావుగా అమలు చేస్తుండడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలుగానే చెప్పుకోవాలి. కానీ అప్పులు పెరిగినా ఆస్తుల కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదనే అపవాదు కూడా తెలంగాణకు ఉంది. 2014–15లో ఆస్తుల కల్పన కింద చేయాల్సిన మూలధన వ్యయం రూ.15వేల కోట్లు దాటితే, 2024–25లో అది రూ.29,669 కోట్లకు మాత్రమే చేరింది. ఇవి కేవలం ప్రతిపాదనలే కాగా, ఖర్చు అంతకంటే తక్కువే ఉండడం గమనార్హం. -
ఆరుకు.. ఊరుకు.. ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు
ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. అప్పులు, మిత్తీలతో తీవ్ర భారం ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారు. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి మా బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. – సీఎం రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆరు ‘గ్యారంటీ’లకు.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ సర్కారు తమ తొలి బడ్జెట్ను తెచ్చింది. మొత్తంగా రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్ పద్దులో ఈ రెండింటికి కలిపి మూడో వంతు మేర నిధుల కేటాయింపు ఉండటం గమనార్హం. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు్ల, చేయూత, యువ వికాసం హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. గ్రామాల వికాసానికి తోడ్పడేలా రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన మేరకు భారీగా నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండింటితోపాటు సంక్షేమం, విద్యా రంగానికి గణనీయంగా ప్రతిపాదనలు చేసింది. అయితే కీలకమైన వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య రంగానికి కోతపెట్టింది. అప్పుల సమీకరణ ఎక్కువే.. శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్ర మార్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతబడ్జెట్లో ప్రతిపాదించిన రుణాలకంటే ఏకంగా 50 శాతం ఎక్కువగా ఈసారి అప్పుల పద్దు చూపారు. 2023–24లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.40,615.68 కోట్లు రుణ సమీ కరణ చేయనున్నట్టు పేర్కొనగా, ఈసారి ఏకంగా రూ.59,625 కోట్లకు పెంచారు. ఇతర రుణాలు కూడా కలిపి గత బడ్జెట్లో రూ.55,277.698 కోట్లు చూపగా.. ఈసారి మొత్తంగా రూ.68,585.21 కోట్ల మేర రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 25శాతం కావడం గమనార్హం. ఇక గతంలో చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీల చెల్లింపుకోసం తాజా బడ్జెట్లో రూ.35,868 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్లో 12శాతానికిపైనే. తగ్గిన రాష్ట్ర వృద్ధిరేటు రాష్ట్ర వృద్ధిరేటు 2022–23తో పోలిస్తే 14.7 శాతం నుంచి 2023–24లో 11.3 శాతానికి తగ్గిందని, వ్యవసాయ వృద్ధిరేటు మైనస్లో పడిపోయిందని ¿¶ట్టి వెల్లడించారు. అయితే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని, జూన్లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో.. బడ్జెట్ పరిమాణం, శాఖల కేటాయింపుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పన్ను ఆదాయంపైనే ఆశలు ఈ సారి బడ్జెట్లో పన్నుల ఆదాయం అంచనా రూ.20 వేల కోట్లు పెరిగింది. రాష్ట్ర వృద్ధిరేటు నిలకడగా ఉన్న నేపథ్యంలో సొంత పన్ను రాబడుల అంచనాను రూ.1.38 లక్షల కోట్లుగా చూపారు. గత బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది రూ.7వేల కోట్లు ఎక్కువ. దీంతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు కలిపి ఈసారి రెవెన్యూ రాబడుల రూపంలో రూ.2,05,601.50 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. గత బడ్జెట్లో రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566.97 కోట్లుకాగా.. తాజాగా సవరించిన అంచనాల్లో రూ.1,78,172.95 కోట్లుగానే ఉంది. అంటే గత బడ్జెట్ కంటే రూ.11వేల కోట్లు తక్కువగా.. సవరించిన అంచనాల కంటే రూ.27 వేలకోట్లు ఎక్కువగా రెవెన్యూ రాబడులను చూపారు. బడ్జెట్లో కొన్ని కీలక అంశాలివీ.. ► ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ► గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కాలేజీలు ► ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ గృహాలు ► త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం ► 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్పై త్వరలో మార్గదర్శకాలు ► మూసీ ప్రక్షాళనకు రూ.1,000 కోట్లు ► కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం కీలక కేటాయింపుల తీరు ఇదీ.. సంక్షేమ రంగాలకు గత బడ్జెట్లో రూ.33,416 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.45,149 కోట్లకు పెంచారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, కల్యాణలక్ష్మి కోసం ప్రత్యేక పద్దులు చూపలేదు. సంక్షేమశాఖలకు కేటాయించిన నిధుల్లోంచే వీటికి ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యాశాఖకు గత బడ్జెట్కన్నా ఒక శాతం అధికంగా రూ.21 వేల కోట్లు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి గతంలో కంటే రూ.7వేల కోట్లు తక్కువగా.. రూ.19,746 కోట్లే చూపారు. రైతుబంధు పథకం అమలును సమీక్షించే క్రమంలో నిధులు తగ్గాయి. వైద్యారోగ్య శాఖ పద్దులో గతంతో పోలిస్తే రూ.700 కోట్లు తగ్గాయి. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వీలుగా గృహనిర్మాణ శాఖ రూ.25వేల కోట్ల నిధులు కోరగా.. రూ.7,400 కోట్లు మాత్రమే కేటాయించారు. హౌజింగ్ శాఖ భూములు అమ్మి ఇళ్లు కట్టించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిపాదనలు, వాస్తవ ఖర్చుకు భారీ వ్యత్యాసం 2023–24 బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులు, చేసిన వాస్తవ ఖర్చులకు చాలా తేడా ఉందని కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ గణాంకాల్లో పేర్కొంది. గత ఏడాది బడ్జెట్ రూ.2,90,296 కోట్లుకాగా.. సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2,24,624.87 కోట్లకే పరిమితమైంది. ఆ మొత్తానికి రూ.50 వేల కోట్లు అదనంగా కలిపి.. తాజాగా రూ.2,75,890.69 కోట్లతో 2024–25 బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ► పన్ను రాబడుల విషయానికి వస్తే.. 2023–24లో రూ.1,31,028.65 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.13 వేల కోట్లు తక్కువగా రూ.1,18,195.10 కోట్లు మాత్రమే సమకూరుతున్నట్టు సవరణ బడ్జెట్లో అంచనా వేశారు. ► కేంద్ర పన్నుల్లో వాటా కింద గత బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువగా రూ.23,216.52 కోట్లు అందనున్నట్టు సవరణ బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే పన్నేతర ఆదాయం అంచనాల మేరకు రూ.22,808.31 కోట్లు సమకూరుతున్నట్టు వివరించారు. ► 2023–24 బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కేంద్రం నుంచి రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో కేవలం రూ.13,953.02 కోట్లే అందుతున్నట్టు తేల్చారు. ► బహిరంగ మార్కెట్ రుణాలు ఆశించిన మేర సమకూరాయి. కేంద్రం నుంచి రూ.4,102 కోట్లు వస్తాయనుకుంటే, రూ.1,500 కోట్లే అందనున్నట్టు సవరించిన అంచనాలు చెప్తున్నాయి. సంక్షేమానికి రూ.45,149 కోట్లు తాజా బడ్జెట్లో శాఖల వారీగా కేటాయించిన ప్రభుత్వం సంక్షేమశాఖలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత కొన్నేళ్లుగా కేటాయింపులు అరకొరగా ఉండడంతో సతమతమవుతున్న సంక్షేమ శాఖలకు, అనుబంధ విభాగాలకు తాజా బడ్జెట్ కాస్త ఊరట ఇచ్చే విధంగా ఉందని ఆర్థిక నిపుణులు అన్నారు. సంక్షేమ శాఖలకు అనుబంధంగా ఉన్న ఆర్థిక సహకార సంస్థలకు కొత్త కార్యక్రమాలు చేపట్టేలా కేటాయింపులున్నాయి. గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ దఫా కేటాయింపులు భారీగా పెరిగాయి. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖలతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలకు 2024–25 సంవత్సరంలో రూ.45,149 కోట్లను తాజా బడ్జెట్లో కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్లో నాలుగు సంక్షేమ శాఖలకు గతేడాది కంటే రూ.11,733 కోట్లు అధికంగా కేటాయించారు. తాజాగా జరిపిన కేటాయింపుల్లో అత్యధికంగా ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించారు. గత కేటాయింపులతో పోలిస్తే ఈ దఫా గిరిజన సంక్షేమ శాఖకు అదనంగా రూ.9,048 కోట్లు కేటాయించడం గమనార్హం. 2023–24 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకం కింద రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం పైసా ఖర్చు చేయకపోగా.. ఈసారి బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్ కంటే రూ.1,771 కోట్లు అధికంగా కేటాయించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్ కంటే రూ.62 కోట్లు పెరిగాయి. విద్యకు రూ.21 వేల కోట్లు గత ఏడాది కన్నా 1.05 శాతం అదనం గత ఏడాదితో పోలిస్తే విద్యారంగానికి మధ్యంతర బడ్జెట్లో 1.05 శాతం నిధులు పెరిగాయి. గత ఏడాది మొత్తం బడ్జెట్లో ఈ రంగానికి రూ.16,092 కోట్లు (6.7శాతం) ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో రూ. 21,389 కోట్లు (7.5శాతం) కేటాయించారు. అయితే పాఠశాల విద్యలోనే ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పోలిస్తే రూ.13 వేల కోట్ల నుంచి రూ.17,931 కోట్లకు నిధులు పెంచారు. టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వల్ల పెరిగిన వేతనాలు, పీఆర్సీ వల్ల పెరిగే జీతాలకే ఈ నిధులు సరిపోయే అవకాశముంది. గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మనబడి’ఊసే బడ్జెట్లో కనిపించలేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఉన్నతవిద్యకు రూ.2,959.10 కోట్లు, సాంకేతికవిద్యకు రూ. 487.64 కోట్లు కేటాయించారు. 65 ఐటీఐలను కొత్తగా తేబోతున్నట్టు చెప్పినా, ఇవి ప్రైవేట్ రంగంలోనే అని స్పష్టత ఇచ్చింది. నైపుణ్య వర్సిటీపె అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించింది. కల్యాణలక్ష్మికి కానరాని ప్రత్యేక పద్దు సంక్షేమ శాఖల నిధుల నుంచే ఖర్చు చేసే అవకాశం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ప్రత్యేక పద్దు తాజా బడ్జెట్లో కానరాలేదు. ఇదివరకు ఈ పథకాలకు ప్రత్యేకంగా పద్దులు కేటాయించగా, ఈసారి వాటి ఊసెత్తలేదు. ఈ పథకాలకు 2023–24, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.3210 కోట్లు, రూ. 2,750 కోట్లు కేటాయించారు. సంక్షేమ శాఖల ద్వారానే ఈ పథకాలు అమలవుతున్నాయి. ఈసారి సంక్షేమశాఖలకు నిధులు పెంచడంతో ఈ రెండు పథకాల నిర్వహణను వాటికే అప్పగించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. కానీ, తాజా బడ్జెట్లో ఆ రెండు పథకాల ప్రస్తావన లేకపోగా, తులం బంగారం అంశాన్ని కూడా చేర్చలేదు. ఇందిరమ్మ ఇళ్లకు అప్పులే దిక్కా? రూ.20,000 కోట్లు కావాల్సి ఉండగా.. కేటాయించింది రూ.7,740 కోట్లే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు కావాల్సిన నిధుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. తాజా బడ్జెట్లో పేదల ఇళ్ల కోసం రూ.7740 కోట్లను ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే రూ.20 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. గృహనిర్మాణ శాఖ కూడా రూ.25 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖను కోరింది. కానీ నిధులు అతి తక్కువగా ప్రతిపాదించటం విశేషం. అందుకే కేటాయింపులు తగ్గించారా? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించకుండా, కేంద్రం ఇచ్చే సాయం, రుణాలతో చేపట్టనుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే హడ్కో నుంచి రూ.3 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని గృహనిర్మాణ సంస్థ నిర్ణయించింది. పట్టణ ప్రగతి పక్కకే! పురపాలనకు రూ.11,692 కోట్లు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో తక్కువ కేటాయింపులే జరిగాయి. హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) మినహా రాష్ట్రంలోని 129 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, జీతభత్యాలు, నిర్వహణ వ్యయాల కింద ఈ మొత్తం కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో జరిపిన రూ. 11,372 కోట్ల కేటాయింపుల కన్నా ఈసారి రూ.320 కోట్లు మాత్రమే అధికం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఈసారి రూ.1,000 కోట్లు కేటాయించారు. కాగా గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాల ఊసు ఈసారి లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని ఎత్తివేసినట్టేనని పురపాలక వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
-
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు..
-
కాంగ్రెస్ శుభారంభం.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క
-
ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం
-
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2,75,891 కోట్ల ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించారు. బడ్జెట్ స్వరూపం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 స్వరూపం ఇలా ఉంది. మొత్తం రూ.2,75,891 కోట్లకు బడ్జెట్ సమర్పించగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉంది. కేటాయింపులు ఇలా.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్లో అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించింది. ఇక మిగిలిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించింది. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించి మంత్రి భట్టీ విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్ రూ.500 చొప్పున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
రేపే తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. అంతకు ముందు.. ఉదయం 9గం. ప్రాంతంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో.. ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇందులో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఉండవు. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడతారు. రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఖర్చుల కోసం తీసుకునే మొత్తం ఇది. -
బీసీ సంక్షేమ బడ్జెట్ పెంచాలి
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన రూ.6,229 కోట్లు ఏమాత్రం సరిపోవని, దాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది మంది విద్యార్థులు, యువకులతో కలిసి గురువారం ఖైరతాబాద్లోని బీసీ సంక్షేమ శాఖమంత్రి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ల నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లు అయితే.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయిస్తే ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్లో కొత్త పథకాలేవీ లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్చార్జీల పెంపు ప్రస్తావనే లేదని, కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీకి బడ్జెట్ కేటాయింపుల్లేవని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తా మన్న హామీకి బడ్జెట్ లేదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్కే తెలియదు: నిర్మలా సీతారామన్
-
సీఎం కేసీఆర్పై నిర్మలా సీతారామన్ ఫైర్..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై నిర్మల.. కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. వివరాల ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు. మాపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటీ అని ప్రశ్నించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కాగా, కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు పెట్టారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్కే తెలియదా? అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదు. నోడేటా అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ సెటైర్లు వేశారు. ఇదే సమయంలో ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ సీరియస్ అయ్యారు. 2014లో తెలంగాణలో అప్పులు రూ.60వేల కోట్లు. ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నాము.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాము. రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇది రాజ్యాంగం లో పొందుపరిచిన నిబంధన.. దానినే మేము అమలు చేస్తున్నాం. అప్పులపై ఎవరో ఒకరు మానీటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పాను. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ.. అక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చాం. అందరినీ ఒకేలాగా చూస్తాం.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాం. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా? అంటూ కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలి. ఇది దేశం కోసం అంటూ హితవు పలికారు. -
ఎలక్షన్ టైమ్.. బడ్జెట్ లైన్, కేరాఫ్ ఊరు
సాక్షి, హైదరాబాద్: వ్యవ‘సాయమే’ ఎజెండా.. పల్లెల అభివృద్ధి, నిధుల వ్యయంలో స్వయం ప్రతిపత్తే ధ్యేయం.. ఎన్నికల ఏడాదిలో క్షేత్రస్థాయి కేటాయింపులకు ప్రాధాన్యం, పల్లె, పట్టణ ప్రగతుల నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే బదిలీ చేసేందుకు అవకాశం.. సంక్షేమ పథకాలు య«థాతథం.. విద్యుత్ సబ్సిడీలకు నిధుల పెంపు.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత.. మొత్తం మీద 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్లో ఈ రెండు శాఖలకు కలిపి ఏకంగా రూ.60 వేల కోట్ల వరకు కేటాయించింది. ఇక బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలైన రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలకు నిధులను ఆశించిన మేరకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధితో పాటు సొంత పన్నుల ఆదాయాన్ని ఆసరాగా చేసుకుని, కేంద్రంపై ఆశలు వదులుకోకుండానే, రుణాలను పెద్దగా పెంచకుండానే, ఆర్థికాభివృద్ధికి సూచిక అయిన మూలధన వ్యయానికి 40 శాతం మేరకు నిధులు పెంచింది. ఈ మేరకు బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే, సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద చూపెట్టడం ఈ బడ్జెట్లోనే హైలెట్గా చెప్పుకోవచ్చు. రహదారుల నిర్వహణ, మరమ్మతులకు నిధులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులకు అదనంగా మున్సిపాలిటీలకు రూ.2,500 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.2,000 కోట్లను ప్రతిపాదించింది. వీటితో పాటు ఆర్అండ్బీ శాఖకు (బీటీ రెన్యువల్స్) అదనంగా మరో రూ.2,500 కోట్లను ప్రతిపాదించింది. పల్లె ప్రగతి కింద రూ.3,360 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.1,474 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకే ఇవ్వనుంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ నిధులు వెచ్చించామని, అయినా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదనే స్థానిక ప్రజాప్రతినిధుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను గ్రీన్చానల్ (ట్రెజరీ ఆంక్షలు లేకుండా) విధానంలో పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వెచి్చంచనున్నారు. గతంలో టీయూఎఫ్ఐడీసీ కింద మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.300 కోట్లను కూడా నేరుగా బడ్జెట్లోనే కేటాయించడం గమనార్హం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదించడం విశేషం. వ్యవసాయానికి ఊతం బడ్జెట్లో వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చూపెట్టింది. వ్యవసాయ, సహకార రంగాలకు ఈసారి రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతుబంధు కింద 2022–23లో రూ.14,800 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే రైతుబంధు పథకానికి రూ.275 కోట్లు ఎక్కువ చూపెట్టింది. తాజా బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూ.6,380 కోట్లు కేటాయించింది. రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసేందుకు రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేసినప్పటికీ రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించింది. రైతు బీమా కోసం రూ.123 కోట్లు, మత్స్యశాఖకు రూ.100 కోట్లు చూపెట్టిన ప్రభుత్వం.. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి, ఎన్సీడీసీ ఇచ్చే రూ.4,500 కోట్ల రుణం ద్వారానే గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పకనే చెప్పింది. సంక్షేమం యధాతథం బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలకు ఈసారి బడ్జెట్లో కూడా తగిన ప్రాధాన్యత లభించింది. కల్యాణలక్షి్మ, షాదీముబాకర్లకు రూ.3,210 కోట్లు (గత ఏడాది కంటే రూ.460 కోట్లు ఎక్కువగా) చూపెట్టింది. విద్యుత్ సబ్సిడీల (వ్యవసాయం, హెయిర్ సెలూన్లు, ఇస్త్రీ షాపులకు ఇచ్చే సబ్సిడీలు) రూపంలో గత బడ్జెట్ కంటే అధికంగా రూ.12 వేల కోట్లు, ఉచిత బియ్యం పంపిణీకి రూ.213 కోట్లు అదనంగా రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.919 కోట్లు ఎక్కువగా రూ.5,609 కోట్లు కేటాయించింది. కొత్తగా న్యూట్రిషన్ కిట్ల కోసం 33 జిల్లాలకు గాను రూ.200 కోట్లను ప్రతిపాదించింది. గత బడ్జెట్లో కేటాయించిన విధంగానే దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,500 మంది లబి్ధదారులను ఎంపిక చేసి ఈ నిధులను పంపిణీ చేయాలని ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు గత బడ్జెట్లో రూ.11,728 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు చూపెట్టింది. బడ్జెటేతర నిధుల నుంచి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు అదనంగా ‘సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు’ పథకానికి కూడా నిధులు కేటాయించింది. గృహా నిర్మాణ పథకానికి ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించగా, ఇందులో సొంత జాగాల ఇళ్లకు రూ.7,890 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల మంది లబి్ధదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సీఎం విచక్షణ మేరకు మరో 25 వేల మందిని ఎంపిక చేస్తారు. కొత్త తాయిలాలు పెద్దగా లేకపోగా.. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,016 ఇచ్చే పథకాన్ని ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రతిపాదించకపోవడం గమనార్హం. విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం బడ్జెట్లో నిధులు ఆశించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చూపెట్టారు. విద్యాశాఖకు రూ.19 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.12,161 కోట్లు ప్రతిపాదించారు. వీటితో పాటు పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, ప్రణాళిక శాఖకు రూ.11,495 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.22,260 కోట్లు చూపెట్టారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.31 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు రూ.1,000 కోట్లు, హరిత హారానికి రూ.932 కోట్లు, ఐఅండ్పీఆర్కు రూ.1,000 కోట్లు, ఎయిర్పోర్ట్–మెట్రో అనుసంధానానికి రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు రూ.400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేయడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు కేటాయించగా, అందులో కొత్త నియామకాలకు అవసరమయ్యే వేతనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణపై ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, సెర్ప్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణను కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. అయితే వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రూ. 2.37 లక్షల కోట్ల మేర అంచనా సవరణ 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఏడాది మార్చి 6వ తేదీన రూ.2.56 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపి రూ.2,37,884.55 కోట్లుగా సవరించారు. అంటే ప్రతిపాదించిన మొత్తం కంటే రూ.19 కోట్ల వరకు లోటు తేలిందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు తీసుకోవడంలో ఎఫ్ఆర్బీఎం పేరుతో కేంద్రం విధించిన నిబంధనల వల్లే రూ.13 వేల కోట్లు నష్టపోయామని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.40 వేల కోట్లు ప్రతిపాదిస్తే చాలా తక్కువగా కేంద్రం ఇస్తోందని, పన్నుల్లో వాటా తగ్గిస్తోందని చెప్పిన ప్రభుత్వం.. సవరించిన అంచనాల్లో మాత్రం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నిధులను భారీగానే చూపెట్టడం గమనార్హం. పంచ సూత్రతోనే ఖజానాకు కిక్కు – రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.2.90 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్కు అనుగుణంగా ఖజానా నింపేందుకు ఐదు పద్దులు దోహద పడనున్నాయి. ఇందులో సొంత పన్ను ఆదాయ పద్దు కింద రూ.1.31 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కలిపి దాదాపు రూ.62,500 కోట్లు, రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు, పన్నేతర ఆదాయం కింద (భూముల అమ్మకాలతో కలిపి) రూ.22,808 కోట్లు, ఇతర రూపాల్లో మరో రూ.20 వేల కోట్లు సమకూర్చుకునేలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హం. అన్నింటికీ నిధులు పెంచాం: ఆర్థికమంత్రి ఈసారి బడ్జెట్లో ఉన్న పథకాలకు నిధులు పెంచుతూనే కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడించారు. బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఆర్థిక, ప్రణాళిక, గణాంక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. పలు పథకాలకు నిధుల కేటాయింపు క్రమాన్ని వివరించారు. 2023 సంవత్సరానికి గాను ఆర్థిక, సామాజిక సర్వేను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు చేరిందని, 2022–23లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15.6 శాతంగా నమోదయిందని వెల్లడించారు. కాగా ఉదయం 10:30 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలను చదవడం ప్రారంభించిన హరీశ్రావు 12:15 గంటలకు అంటే సుమారు 105 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. -
బడ్జెట్కు లభించని గవర్నర్ సిఫారసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ 2023–24 ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసులతో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఈ మేరకు ఆమె నుంచి గ్రీన్సిగ్నల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్భవన్కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్భవన్లోనే ఉండిపోయాయి. తమిళిసై సోమవారం హైదరాబాద్కు రానున్నారని, ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వానికి తిరిగి పంపించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. విభేదాల నేపథ్యంలో.. రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. -
అంకెల రంకెలే...
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, పెద్ద పద్దు కనిపించడం కోసం భారీ బడ్జెట్ను రూపొందించారని.. అంకెలు, వాస్తవ లెక్కలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతోందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గత బడ్జెట్ అంకెలు, వాస్తవంగా సమకూరిన ఆదాయాన్ని బేరీజు వేసుకుని పరిశీలిస్తే.. తాజా బడ్జెట్ అంచనాలు–వాస్తవానికి మధ్య రూ.60 వేల కోట్ల వరకు వ్యత్యాసం ఉండనుందని చెప్పారు. అంతమేర సంక్షేమంపై ఖర్చులు తగ్గిపోనున్నట్టే కదా అని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ..అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చుకోకుంటే అవి భవిష్యత్తులో రాష్ట్రానికి పెనుభారంగా మారతాయని చెప్పారు. అప్పుల్లో 90% మొత్తాన్ని మూలధన పెట్టుబడిగానే ఖర్చు చేస్తున్నట్టు మంత్రి హరీశ్రావు చెబుతున్న మాటలకు, బడ్జెట్లో అంకెలకు పొంతనే ఉండటం లేదన్నారు. ఆ పథకాలు కూడా కొనసాగించండి: రైతుబంధుతోపాటు గతంలో రైతులకు అమలు చేసిన వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను అందించే పథకాలను కూడా కొనసాగించాలని భట్టి కోరారు. పోడు భూములను పంపిణీ చేయాలని, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, 171 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని విమర్శించారు. మహాత్ముడిని మట్టుబెట్టిన వారే దేశాన్ని పాలిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సీఎం పూర్తి ఆరోగ్యంతో ఉండాలని సీఎల్పీ తరఫున కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సర్కారీ అప్పు ప్రజలకు ముప్పు ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల మున్ముందు ప్రజలపై పెనుభారం పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారె డ్డితో కలసి భట్టి మాట్లాడారు. శాసనసభలో ప్రజాసమస్యలపై గళం వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కారని, చర్చ జరగకుండా సమయం తక్కువగా ఇచ్చారని ధ్వజమెత్తారు. కౌరవ సభను తలపిస్తోంది అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు కౌరవసభను తలపిస్తోందని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ అని సంభోధించి అవహేళన చేశారని మండిపడ్డారు. ఇది సభను పక్కదారి పట్టించడమేనని సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క ఆరోపించారు. -
సొంత ఆదాయంపై ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో పన్ను ఆదాయ ప్రతిపాదనలు తొలిసారి రూ. లక్ష కోట్లను మించాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 1,08,212 కోట్ల మేర సొంత పన్ను ఆదాయం వస్తుందనే అంచనాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను బట్టి చూస్తే రాష్ట్ర సొంత ఆదాయ వనరులపై సర్కారుకు పూర్తి ధీమా ఉన్నట్లు అర్థమవుతోంది. గతేడాది ప్రతిపాదించిన రూ. 92 వేల కోట్ల పన్ను రాబడుల్లో 100 శాతం రావడంతో ఈసారి అదనంగా రూ. 17 వేల కోట్లను అంచనా వేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. వాహనాలపై పన్ను పద్దు మినహా... ఈసారి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే పన్ను ఆదాయ పద్దులన్నింటిలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క వాహనాలపై పన్ను పద్దులో మాత్రమే కొంత తగ్గుదలను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమ్మకపు పన్ను అంచనాలు గతేడాది రూ. 26,500 కోట్లు చూపగా ఈసారి దాన్ని రూ.33,000 కోట్లకు పెంచారు. అలాగే జీఎస్టీ కింద రూ. 31 వేల కోట్లు వస్తాయని గతేడాది అంచనా వేయగా ఈసారి రూ. 36,203 కోట్లు ప్రతిపాదించారు. ఎక్సైజ్ శాఖ పద్దు కూడా రూ. 500 కోట్లు పెరిగింది. గతేడాది రూ. 17,000 కోట్ల అంచనాలు ఈసారి రూ. 17,500 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కింద గతేడాది రూ. 12,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా ఈసారి రూ. 15,600 వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. భూముల అమ్మకాలకు అదే స్థాయిలో... అయితే ఈసారి పన్నేతర ప్రతిపాదనలను తగ్గించి చూపారు. గతేడాది పన్నేతర ఆదాయం రూపంలో రూ. 30,557 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా కేవలం రూ. 20,557 కోట్లే వచ్చాయి. అయినా ఈసారి మరో రూ. 5 వేల కోట్లు కలిపి రూ. 25,422 కోట్లకు పెంచారు. అందులో మైనింగ్ శాఖ ద్వారా రూ. 6,399 కోట్లు, భూముల అమ్మకాల ద్వారా రూ. 15,500 కోట్లు చూపారు. ఇతర పన్నేతర ఆదాయ రూపంలో రూ. 3,500 కోట్లు అంచనాలను ప్రతిపాదించడం గమనార్హం. -
పల్లెకు తగ్గని ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో ఈసారి కూడా పల్లెకు పట్టం కట్టారు. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగించారు. గతేడాది ఈ శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించగా, 2022–2023 బడ్జెట్లో రూ.29,586.06 కోట్లు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే పంచాయతీరాజ్ సంస్థల పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా బడ్జెట్లోనూ అదే దృష్టిని, ప్రాధాన్యతను ప్రభుత్వం కొనసాగించింది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో రూ.3,330 కోట్లు ప్రతిపాదించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 38.41 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నారు. 57 ఏళ్ల అర్హత వయసుతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించే ఏర్పాటు చేస్తామని చెబుతున్నా దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎస్టీ పంచాయతీ భవనాలకు నిధులు గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత పంచాయతీ భవనాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నుంచి రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. పావలా వడ్డీ రుణాల కోసం రూ. 187 కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ కింద రూ.800 కోట్లు కేటాయించింది. -
ఇద్దరు మంత్రులు.. మూడోసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో వరుసగా మూడుసార్లు వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఘనతను ఆర్థిక మంత్రి హరీశ్రావు, శాసనసభ వ్యవ హారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్రావు వరుసగా 2020–21, 2021–22, 2022–23 బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వేముల కూడా వరుసగా మూడు వార్షిక బడ్జెట్లను మండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం హరీశ్ తన ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్తూ ఫిల్మ్నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. అసెంబ్లీకి చేరుకుని సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న హరీశ్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి బడ్జెట్ ప్రతిని అంద జేశారు. మంత్రి వేములతో కలసి మండలికి వెళ్లి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ జాఫ్రీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా, ఉదయం 11.30కు ప్రారంభ మైన హరీశ్ బడ్జెట్ ప్రసంగం 1.57 నిమిషాల పాటు కొనసాగింది. 90 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షతో పాటు ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించారు. -
ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ బడ్జెట్: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారు.. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చు కు పొంతన లేదన్నారు. కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే.. ‘‘ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు 3 లక్షలు మాత్రమే పెట్టారు. నిరుద్యోగులు, రైతుల గురించి ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్. ప్రచారానికి తప్ప .. ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని తెచ్చుకొన్నది తలెత్తుకొని బతకడం కోసం. ఈ రోజు సెల్ప్ రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. గవర్నర్తో మీకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలి. గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా.. చెప్పలేదు. అందుకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన కనీసం మా వైపు కూడా స్పీకర్ చూడలేదని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని’’ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రోకు తాజా బడ్జెట్లో కాసుల వర్షం కురిసింది. మెట్రోకు రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించడంతో ఎంజీబీఎస్–పాత నగరం (5.3 కి.మీ), రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంలో మెట్రో కూత పెడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత మూడేళ్లుగా మెట్రోకు రాష్ట్ర సర్కారు మొండిచేయి చూపడంతో హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్ఎంఆర్) అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికుల వసతుల కల్పన ప్రాజెక్టులు అటకెక్కిన విషయం విదితమే. చివరకు హెచ్ఎంఆర్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొన్న తరుణంలో తాజా బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. తొలి విడత మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్– ఫలక్నుమా మార్గంలో మెట్రో విస్తరణ పనులు నిధుల లేమి కారణంగా పట్టాలెక్కని విషయం విదితమే. రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తాజాగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో మొదలవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. పట్టాలెక్కని ఎంఎంటీఎస్! ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు బడ్జెట్లో మొండిచెయ్యే దక్కింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కొరతతో ఇప్పటికే చాలా చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని రూట్లలో రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పూర్తయినా కొత్త రైళ్ల కొనుగోళ్లకు నిధులు లేక పట్టాలు అలంకారప్రాయంగా మారాయి. అయిదేళ్ల క్రితం రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.550 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు దశలవారీగా రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైల్వేశాఖ సొంత నిధులతోనే చాలావరకు పనులు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు లేక కొంతకాలంగా రైల్వేశాఖ సైతం చేతులెత్తేయడంతో పనులు స్తంభించాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్కు సైతం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే సర్వే పూర్తయింది. ప్రగతిరథ చక్రం రయ్ రయ్ సిటీ బస్సుకు ఊరట లభించింది. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రెండేళ్లుగా ఆర్థిక నష్టాలతో పాటు ప్రయాణికుల ఆదరణను సైతం కోల్పోయిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పునర్వైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు, మరో రూ.1500 కోట్ల బడ్జెటేతర సహాయం అందజేయనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే ప్రతిపాదించిన 25 డబుల్ డెక్కర్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు సైతం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తాజా కేటాయింపులతో బస్సుల కొనుగోళ్లు వేగంగా జరిగే అవకాశం ఉంది. ‘ఆర్టీసీకి ఇది అన్ని విధాలా సానుకూల సమయం. సకాలంలోనే డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కుతాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేటాయింపులతో కొత్త బస్సులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్రేటర్లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత ప్రగతి సాధించే అవకాశముంది. ‘మహా’ అత్తెసరు! హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు మెహిదీపట్నం, ఉప్పల్లో స్కైవే, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ర్యాంపులు, చెరువులు సుందరీకరణ, నెక్లెస్ రో డ్డులో అభివృద్ధి పనులు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ బడ్జెట్లో అభివృద్ధి కార్యకలాపాల కోసం కేవలం రూ.10 లక్ష లు మాత్రమే కేటాయించడం అధికారులను విస్మయపరిచింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా హెచ్ఎండీఏ సొంత ఆదాయంతోనే పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.900 కోట్లపైగా అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనులకు ఇక హెచ్ఎండీఏ అటు కోకాపేట, ఇటు మూసాపేట భూముల విక్రయాలపై వచ్చే ఆదాయమే ఆధారం కానుంది. 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు 2011 నుంచి ప్రతి ఏడాది బీఓటీ అన్యూటి పేమెంట్ రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు చెల్లిస్తోంది. 2016 నుంచి రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చిన హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.440 కోట్లు చెల్లించింది. గతేడాది ఓఆర్ఆర్ బీవోటీ అన్యూటి పేమెంట్ల కింద గతంలో పెండింగ్లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి జైకా రుణం చెల్లింపుల కోసం రూ.478 కోట్లు అడిగితే రూ.472 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్తో రుణాల చెల్లింపు ముగియనుంది. ఆర్ఆర్ఆర్.. హుషార్: భూసేకరణకు రూ.750 కోట్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికిగాను భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. మహానగరం చుట్టూ విస్తరించిన ప్రధాన పట్టణాలను కలుపుతూ సుమారు 330 కి.మీ మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆర్ఆర్ఆర్.. దక్షిణ మార్గం రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లనుంది. చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, కడ్తాల్, యాచారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద కలుస్తుంది. సుమారు 120 కి.మీ పరిధి రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. దక్షిణ మార్గానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించలేదు. చౌటుప్పల్ నుంచి భువనగిరి, గజ్వేల్ మీదుగా కంది వరకు విస్తరించనున్న ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా బడ్జెట్లో భూ సేకరణకు నిధులు కేటాయించడంతో తొలుత ఈ మార్గంలో భూ సేకరణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ మార్గంలో అలైన్మెంట్ ఖరారు కావడానికి కొంత సమయం పట్టనుండటంతో భూ సేకరణ కొంత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో జిల్లా రూపు రేఖలు మారిపోయాయి. త్వరలో ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్తో జిల్లా మరింత అభివృద్ధి దిశగా పయనించే వీలుంది. మూసీకి మహర్దశ: రూ.200 కోట్ల కేటాయింపులు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్ భాగ్యరేఖ.. చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులకు తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గంలో నదికి సమాంతరంగా ఇరువైపులా తీరైన రహదారుల ఏర్పాటు, పాదచారుల దారులు, సుందర ఉద్యానాల ఏర్పాటు, ప్రక్షాళన, సుందరీకరణ పనులు ఊపందుకోనున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబర్మతి, గంగా నది తరహాలో మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు కాలుష్య కోరల నుంచి విముక్తి లభించనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర వాసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం ఒకవైపు వాహన విస్ఫోటనం. మరోవైపు కాలుష్యం చిమ్ముతున్న కాలం చెల్లిన వాహనాలు. నగరజీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సముచితమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు తాజా బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు ఈ రంగానికి ఊతమిచ్చాయి. ఎలక్ట్రిక్ రవాణా, వ్యక్తిగత వాహనాల తయారీకి సబ్సిడీ ఇవ్వడంతో పాటు వాహన కొనుగోలుదారులకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపు లభించనుంది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో కేవలం 5,700 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలు కాగా.. మిగతావి బస్సులు, ఇతర కేటగిరీలకు చెందిన రవాణా వాహనాలు ఉన్నాయి. మరోవైపు నగరంలో రోజురోజుకూ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలన్నీ సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 15 లక్షలకుపైగా కాలం చెల్లినవే. వ్యక్తిగత వాహనాలతో పాటు 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు కూడా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆటో రిక్షాలు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర కేటగిరీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి కొంత మేరకు రక్షణ లభించనుంది. -
బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల పుస్తకంలా ఉంది తప్ప.. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన అభివర్ణించారు. కరోనా వల్ల ఆదాయం దెబ్బతిన్నదని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు 2లక్షల 30 వేల 825 కోట్ల రూపాయలతో తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి చెప్పాలని భట్టి అన్నారు. ఎఫ్.ఆర్.బీ.ఎం. చట్టాన్ని సవరిస్తున్న సందర్భంలోనే రాబోయో మూడేళ్లలో ప్రతి ఏడాది రూ. 50 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అవుతోందని అన్నారు. ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉంది.. ఇప్పుడు తెచ్చే ఒటిన్నర లక్షల కోట్ల అప్పుతో.. అది రూ 5 లక్షల కోట్లకు చేరుతుందని భట్టి మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అర్థిక లోటును రూ. 45 వేల కోట్లకుపైనే చూపించచారన్నారు. ద్రవ్యలోటును అప్పులతోనే భర్తి చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం అప్పలు భారాన్ని విపరీతంగా పెంచబోతున్నారని చెప్పారు. ప్రభుత్వం భారీగా తీసుకువచ్చిన అప్పులతో సామాన్యులకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమం చేయలేదని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భ్రుతి, 57 ఏళ్లకే ఇస్తానన్న ఫెన్షన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కు పనికివచ్చే కార్యాచరణ ప్రణాళికలు ఏమీ లేవని భట్టి మీడియాకు వివరించారు. ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మోసం చేసేందుకు మాత్రమే పనికి వస్తుందని అన్నారు. ప్రజల్లోనే భ్రమల్లోకి నెట్టేలా కేసఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. 2020-21 బడ్జెట్ అంచనాలను చూస్తే.. రూ. లక్షా 43 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టి.. రివైజ్ చేసే సరికి అది కాస్తా.. రూ. లక్ష 17 వేల కోట్లకు తగ్గిందని అన్నారు. గత ఏడాది బడ్జెట్ రూ. లక్షా 43 వేల కోట్లకే చేరలేదు.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ. 2లక్షల 30 వేల కోట్లకు చూపించడం అంటే ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదని భట్టి అన్నారు. రెవెన్యూ రిసీట్స్ విషయానికి వస్తే గత ఈ ఏడాది రూ. లక్షా 76 వేల కోట్ల రూపాయలకు చూపించారు.. గత ఏడాది రివైజ్డ్ బడ్జెట్ విషయానికి వస్తే.. రూ. లక్షా 17 వేల కోట్ల కు వచ్చింది.. ఈ ఏడాది ప్రభుత్వం చూపించిన లక్షా 70 వేల కొట్ల రూపాయాల రెవెన్యూ రిసీట్స్ ఎలా వస్తాయో ప్రభుత్వం చెప్పాలని భట్టి గట్టిగా డిమాండ్ చేశారు. నాన్ టాక్స్ రెవెన్యూ విషయానికి వస్తే.. గత ఏడాది రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం చూపించింది.. అందులో కేవలం రూ. 19 వేల కోట్లు మాత్రమే వచ్చింది.. మరి ఈ ఏడాది నాన్ ట్యాక్స్ రెవెన్యూని రూ. 30 వేల కోట్లు అని బడ్జెట్ లో ప్రభుత్వం ఎలా చూపించిందో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. -
కేసీఆర్ ఏమైనా భూత వైద్యుడా..?: భట్టి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ స్థితిగతులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కరోనాకు అభివృద్ధి చెందిన దేశాలే భయపడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఇబ్బందిపడతారన్నారు. అధికారులకు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పకుండా.. సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన భూత వైద్యుడిలా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ను చూసి కరోనా గజగజ వణకదన్నారు. ఒకవేళ కేసీఆర్ను చూసి కరోనా వణికితే డబ్ల్యూహెచ్వోకు చెప్పి ప్రపంచదేశాలు తిప్పుతామని చెప్పారు. కాగా.. కరోనాకు పారాసిట్మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్ అన్నారంటూ భట్టి ఎద్దేవా చేశారు. అంతేకాక.. 27డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా దరి చేరదని, అంత ఎండలో ఆ వైరస్ చనిపోతుందని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు కర్ణాటక వాసి హుస్సేన్ సిద్ధిఖీ హైదరాబాద్లో అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత కూడా ఎలా చనిపోయాడని భట్టి ప్రశ్నించారు. అసెంబ్లీ సెషన్లో కాంగ్రెస్పై కేసీఆర్ వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నాం, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఏదైనా మంచి ఉంటే గదా.. చెప్పడానికి? దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. కరోనాపై రాజకీయాలు చేయొద్దని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలో ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలు కంగారు పడతారని నాలుగైదు రోజుల తర్వాత వెల్లడించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కొందరు దీనిపై రాజకీయ లబ్ధికోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేసే అర్థంలేని విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదంటూ సీఎం కొట్టిపారేసారు. చదవండి: కరోనా మృతదేహాలను ఏం చేస్తున్నారంటే..! 135 కోట్ల మంది ఉన్న దేశంలో ఇప్పటి వరకు వైరస్ సోకింది కేవలం 65 మందికేనని.. కేంద్రం మాత్రమేకాక కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారన్నారు. అన్ని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తగిన ఉష్ణోగ్రత దగ్గర వైరస్ బతకదని చెప్పానని.. పారాసిట్మాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని ఒక సైంటిస్ట్ తనతో చెప్పారన్నారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నిపుణులతో నిరంతరం సమీక్షలు చేస్తూ అప్రమత్తంగా ఉన్నామని ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సీఎం భరోసానిచ్చారు. కరోనా విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కేబినెట్లో కూడా దీనిపై చర్చించి మరింతగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కరోనాను కట్టడి చేసిన ప్రజల్లో భయాందోళనలకు పోగొడతామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. చదవండి: కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన -
మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ఈనెల ఆరో తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తరపున శాసనసభ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 6న శాసన మండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్ హోదాలో తమిళిసై తొలిసారిగా ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020ను ఈ నెల 8 లేదా 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎనిమిదో తేదీ ఆదివారం, మరుసటి రోజు సోమవారం హోలీ రావడంతో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో బడ్జె ట్ ప్రవేశపెట్టే తేదీతో పాటు, సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపైనా చర్చిస్తారు. ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి హరీశ్రావు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనుండగా, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తారు. 2019–20కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు 2019 సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు జరగ్గా, శాసనసభ 11 రోజులు, శాసన మండలి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశమైంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు కూడా పన్నెండు పని దినాల్లో ముగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీ వరకు శాసనసభను నిర్వహించి, మండలి సమావేశాలను మాత్రం నాలుగైదు రోజులకు పరిమితం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోనే రాజ్యసభ ఎన్నిక రాష్ట్ర కోటాలో రాజ్యసభ నుంచి ఏప్రిల్ 9న ఇద్దరు సభ్యులు రిటైర్ అవుతుండటంతో, ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే ద్వై వార్షిక ఎన్నిక షెడ్యూలును విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, 18న ముగియనుంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
6 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తీరుపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరిగే అవకాశం ఉంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. 12 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేస్తున్నారు. మార్చి 22లోపు బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు జరిగిన పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ 11 రోజులు సమావేశం కాగా, శాసనమండలిలో మాత్రం కేవలం 4 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. -
పన్నుల వాటాలో రాష్ట్రానికి అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ధేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. ఇందులో నుంచి తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా కింద 2.437 శాతం పంచుతున్నారు. ఇప్పుడది 2.133 శాతానికి తగ్గింది. పైగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటా 42 నుంచి 41 శాతానికి తగ్గించారు. ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్ధేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను నిర్ధేశించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వీటి ఆధారంగానే తాజాగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్ధేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్లో పొందుపరిచారు. ఒకవేళ 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రాష్ట్రం ఇంకా నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. 2020–21లో కేంద్రం ఇచ్చే పన్నుల వాటా (అంచనాలు) ప్రకారం తెలంగాణకు రూ.16,726.58 కోట్లు రానున్నట్టు బడ్జెట్లో అంచనా రూపొందించారు. అయితే గత రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి. ప్రభావం చూపించిన ‘జనాభా’ 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. తెలంగాణకు స్పెషల్ గ్రాంటు సిఫారసు తెలంగాణ, కర్ణాటక, మిజొరం రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చింది. తెలంగాణకు 2020–21కి రూ. 723 కోట్ల మేర పన్ను వాటా తగ్గుతుందని అంచనా వేసి గ్రాంటును సిఫారసు చేసింది. తెలంగాణకు పట్టణ స్థానిక సంస్థలకు రూ. 889 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1847 కోట్లు సిఫారసు చేసింది. 10 లక్షలకు పైబడి జనాభా ఉన్న హైదరాబాద్కు రూ.468 కోట్ల గ్రాంట్లు సిఫారసు చేసింది. గిరిజన వర్సిటీ ఒక్కటే సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి 2020–21 కేంద్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. కేవలం గిరిజన వర్సిటీ కోసం మాత్రమే రూ. 26.90 కోట్ల మేర నిధులు కేటాయించింది. తెలంగాణలో ఉన్న ఇతర జాతీయ సంస్థలకు సాధారణంగా చేసే కేటాయింపులే మినహా ప్రత్యేక ప్రస్తావనేదీ లేదు. కాగా పదిహేనో ఆర్థిక సంఘం 2020–21 సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గతంలో ఉన్న 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గించడం వల్ల ఆదాయం కోల్పోనుంది. అయితే తెలంగాణకు ప్రత్యేక గ్రాంటు కింద రూ. 723 కోట్లు పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు చేయడం స్వల్ప ఊరట. తెలంగాణలో ఐఐఎం, ఐఐఐటీ తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలు స్థాపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం నుంచి స్పందన కనిపించలేదు. మరోవైపు ఎయిమ్స్కు నిర్ధిష్ట కేటాయింపులు చూపలేదు. ఏడాది తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా 2018–19 రూ. 17,960.01 (వాస్తవిక) 2019–20 రూ. 17,422.17 (సవరించిన అంచనాలు) 2020–21 రూ.16,726.58 కోట్లు (అంచనాలు) -
మీ లెక్కలు నిజమైతే నిరూపించండి..
సాక్షి, హైదరాబాద్ : ‘గత ఆరేళ్లలో రూ. 2 లక్షల కోట్లు కూడా లేని రాష్ట్ర అప్పు లను రూ. 3 లక్షల కోట్లు అం టారా? అప్పులను ఇలా పెంచి చూపడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. ప్రభుత్వ గ్యారం టీలను కూడా అప్పుగా పరిగణిస్తే ఎలా? ఇవాళ జనం లక్షల సంఖ్యలో టీవీల్లో అసెంబ్లీ లైవ్ చూడాలె.. సభలో హీటెక్కాలె. మీరు చెప్పిన లెక్కలు నిజమే అయితే నిరూపించండి. కాదంటే మీ వ్యాఖ్యలు ఉపసంహరించు కోండి’అని సీఎం కె. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. బడ్జెట్ కూర్పును తప్పుబడుతూ భట్టి చేసిన విమర్శలతోపాటు సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేయలేదంటూ ఆయన చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘ప్రపంచంలో రికార్డు బ్రేక్ చేసి యావత్తు దేశం ఆశ్చర్యపోయేలా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్లకు కనిపిస్తలేదా? కళ్లులేని కబోదులుగా వాస్తవాలను చూసే సంస్కారం మీకు లేక ఇటు శాసనసభను అటు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడితే సహించం. భలో తప్పులు మాట్లాడితే పదేపదే అడ్డుకుంటం. సభ ఎవరి జాగీరు కాదు’అని స్పష్టం చేశారు. బడ్జెట్పై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి ప్రారంభించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సీట్లోంచి లేచి భట్టి ప్రసంగంలోని లెక్కలు, ఆరోపణలు అబద్ధాలంటూ సభ దృష్టికి తెచ్చారు. అవాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాతపెట్టినా కాంగ్రెస్ సభ్యులకు బుద్ధి రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వాడిన పదాలపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేయగా తాను సోయితోనే మాట్లాడుతున్నానని, ఎక్కడా అన్పార్లమెంటరీ పదాలు వినియోగించడం లేదన్నారు. ఆ మాటతో మొదలు.... భట్టి విక్రమార్క తన ప్రసంగం ప్రారంభంలోనే ‘మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా మార్చారు. సంపద సృష్టించే వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు’అని పేర్కొనడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆయన లేచి వాస్తవాలు మాట్లాడాలని, బడ్జెట్లో ఉన్న విషయం చూసి మాట్లాడితే మంచిదని సూచించారు. బడ్జెట్ పుస్తకంలో పొందుపరిచిన వివరాలు కాగ్ ధ్రువీకరించిన లెక్కలేనని తాను బడ్జెట్ ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పానని, వాటిలో వివాదానికి తావే లేదన్నారు. కానీ భట్టి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు మాట్లాడటమే కాకుండా సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు స్పష్టంగా ఉంటే భట్టి విక్రమార్క పదేపదే ‘రమారమి’అని అనడం సరికాదన్నారు. ఇక మిగులు బడ్జెట్ గురించి ఎలా మాట్లాడతారని, రాష్ట్రమే లేనప్పుడు మిగులు బడ్జెట్ ఎక్కడిదని, తెలంగాణ ఏర్పడ్డాక బడ్జెట్ పెట్టేందుకు ప్రాతిపదికే లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణను దివాలా తీయించామని అంటున్నారని, కానీ అన్ని లెక్కలు సభ ముందున్నాయని స్పష్టం చేశారు. బడ్జెట్లో పదేపదే కోత పెట్టామని అనడం సరికాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయింపుల్లో కోత పెట్టిన ఫలితంగానే రాష్ట్ర బడ్జెట్ను తగ్గించినట్లు తాను బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా చెప్పినట్టు సీఎం వెల్లడించారు. ఆ నీళ్లు కనిపించడం లేదా? అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్లకు కనిపించడం లేదా? అని భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రాజెక్టు ఒక్కటైనా లేదని భట్టి పేర్కొనడం కళ్లుండీ చూడలేకపోవటమేనని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా 56 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్న మంచినీళ్లు భట్టి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అలాగే మిషన్ కాకతీయ కింద బాగు చేసుకొని నీళ్లను నింపుకుంటున్న 27 వేల చెరువులను చూడలేదా అని పేర్కొన్నారు. కేవలం ఏడాదిలోనే పూర్తి చేసిన భక్త రామదాసు ప్రాజెక్టు భట్టి జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. మీలాగా మొబిలైజేషన్ ప్రాజెక్టులు తమవి కావంటూ ఎద్దేవా చేశారు. లక్ష్మీ బ్యారేజీగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టును ఇప్పటికే 20 లక్షల మంది సందర్శించిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. ‘వాస్తవాలు ఇలా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఇది సభ. ఎవరి జాగీరు కాదు, తప్పులు మాట్లాడితే మా హక్కులు కాపాడాలి అధ్యక్షా’అంటూ పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఇలాగే మాట్లాడారని, ఆ తర్వాత ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా బుద్ధి మారాలేదని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. మూడొంతుల సీట్లు గెలుచుకొని తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈవీఎంలతో గెలిచారని ఆరోపించారంటూ గుర్తు చేశారు. మరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లను ఈవీఎంలతోనే గెలిచిందా అని ప్రశ్నించారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెడుతున్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా మాట్లాడితే చేసేదేమీ లేదని అది వారి కర్మ అని పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల గాలిలో ఉండెనా... కాంగ్రెస్ హయాంలోనే కొన్ని ప్రాజెక్టుల పనులు జరిగాయన్న భట్టి మాటలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడుండె.. ఆకాశంలోనా, గాలిలోనా అంటూ ఎద్దేవా చేశారు. అసలు దానికి అగ్రిమెంట్లు కూడా లేవని, దాన్ని రీ డిజైన్ చేసి వివరాలను ఇదే సభలో వివరించామన్నారు. ఆ సమయంలో మాట్లాడలేక కాంగ్రెస్ వాళ్లు పారిపోయారని విమర్శించారు. ఆ తర్వాతే ప్రజలు మళ్లీ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రశ్నించారు. దుమ్ముగూడెం టెయిల్పాండ్ కూడా తెలంగాణవాసులను వంచించిన ప్రతిపాదననేనని, అసలు అది తెలంగాణ ప్రాజెక్టు కాదని ఇదే సభలో టీఆర్ఎస్ సభ్యులు అరిచినా పట్టించుకోలేదన్నారు. గ్రావిటీతో నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఆంధ్రాకు ఇచ్చి, లిఫ్ట్తో నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. ‘నేను ఉద్యమ నాయకుడిని. నాకు అన్నీ తెలుసు. లేకుంటే మీరు గోల్ తిప్పేటోళ్లు, ఆ ప్రాజెక్టును మీరు ఒప్పుకొని మమ్మల్ని ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. పోలవరంలో హెడ్ వర్క్స్ మునిగిపోయింది మరిచారా’అని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టుల సామర్థ్యం 30 టీఎంసీలైతే తాము ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టు 100 టీఎంసీలని గుర్తుచేశారు. అవసరమైతే మరో రూ. 20 వేల కోట్లు కూడా అప్పు తెస్తామని స్పష్టం చేశారు. ఎన్ని అప్పులు తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ కాలేదని, దీన్ని గుర్తించాలన్నారు. అనంతరం సీఎం సభ నుంచి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు కూడా భట్టి ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు అంటూ భట్టీ చెప్పబోగా ‘ఏదిపడితే అది గాంధీ భవన్లో మాట్లాడుకోండి, సభలో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. మీ ఆరోపణలకు రుజువులు చూపండి. కాదంటే మా నాయకుడికి, మా పార్టీకి క్షమాపణ చెప్పండి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదని, తమ మేనిఫెస్టోలో కూడా లేదన్నారు. -
మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నోఆకాంక్షలు, ఆశలతో తెచ్చుకున్న తెలం గాణను అప్పులకుప్పగా మార్చే శారు. మిగులు రాష్ట్రంగా భాసిల్లా ల్సిన తెలంగాణను దివాలా తీయించారు. దానికి తాజా బడ్జెట్ లెక్కలే సాక్ష్యం. ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తారా? ఇది రాష్ట్రానికి భారం కాదా? ఈ నిజాలు చెప్తే అక్క సెందుకు? సీఎం వయసులో నా కంటే పెద్ద, ఆయన పద్ధతిగా మాట్లాడాలి. అంతకంటే దారు ణంగా మాట్లాడేందుకు నాకు రెండు నిమిషాలు చాలు, కానీ నాకు సంస్కారముంది. ఈ రోజు చర్చలో వాస్తవాలు వెలుగులోకి రావాలి, ప్రజలు వాటిని తెలుసు కోవాలి, అధికారపక్షం బెదిరింపులకు భయపడం’ అంటూ బడ్జెట్పై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క శనివారం అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. బడ్జెట్లో అంకెలు ప్రస్తావిస్తూ.. అవి ఏరకంగా వాస్తవ విరుద్ధమో చెప్పే ప్రయత్నం చేశారు. 6 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం తెలంగాణనేనని, ఇదే ఓ వింత అనుకుంటే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులలో రూ.36 వేలకోట్ల మేర కోతపెడుతూ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడం మరోవింత అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం తెరదీసిందన్నారు. 2014 నుంచి క్రమంగా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతూ రాగా, ఈసారి 20 శాతం తగ్గిపోవటం పరిపాలనాతీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చెప్పిన ఏ ఒక్క కారణం కూడా సహేతుకంగా లేదని పేర్కొన్నారు. జీఎస్డీపీలో 10 శాతం వృద్ధి ఉందని బడ్జెట్లో చూపారని, అలాంటప్పుడు రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. దీనిని మాంద్యం ప్రభావం అంటున్నారని, వాస్తవానికి ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ అని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టూ పీజీ విద్య, రెండు పడకగదుల ఇళ్లు, ఇతర ఎన్నికల హామీలను చూసి జనం ఆశపడ్డారని, కనీసం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతన్నా అవి నెరవేరతాయని ఆశించారని, కానీ వాటిని అమలు చేయలేక చేతులెత్తేసినట్టు ఈ బడ్జెట్ తేల్చిచెప్తోందని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తే ఈ పరిస్థితి ఎందుకు? కొత్త రాష్ట్రం ఏర్పాటు కాగానే సంపద సృష్టించుకునే వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ దివాలా పరిస్థితి వచ్చేది కాదని, ప్రాధామ్యాలను గుర్తించి వాటి ప్రాధాన్యతాక్రమంలో ఖర్చు చేసి ఉంటే పరిస్థితి మరోకరంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రాధమ్యాలనే ప్రజల ప్రాధమ్యాలుగా మార్చేసి ఇష్టం వచ్చినట్టు చేయటంవల్లే ఈ దుస్థితి వచ్చిందని భట్టివిక్రమార్క ఆరోపించారు. దుమ్ముగూడెం రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు నాటి ప్రభుత్వం రూ.822 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.859 కోట్లు వ్యయం చేస్తే అవి పూర్తయ్యేవని, వాటివల్ల 4 లక్షల ఎకరాలకు నీళ్లుపారి ఉండేవని అన్నారు. మరో రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాణహిత–చేవెళ్ల పూర్తయి ఉండేదని, దాదాపు రూ.7,200 కోట్లు ఖర్చు పెట్టిన దేవాదుల మరో రూ.2 వేల కోట్లతో సిద్ధమై ఉండేదని.. ఇలా గోదావరిపై రూ.31,421 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 36 లక్షల ఎకరాలకు సాగునీరందించేవని సభ దృష్టికి తెచ్చారు. కృష్ణా నదిపై నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్, బీమా, ఏఎంఆర్పీలకు మరో రూ.3 వేల కోట్ల నుంచి రూ.మూడున్నర వేల కోట్లు సరిపోయి ఉండేవని, ఇవి పూర్తి అయితే మరో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలమై ఉండేవన్నారు. ఇలా తక్కువమొత్తంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాల్సి ఉండగా, రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు, పాలమూరు–రంగారెడ్డి పేరుతో భారీ ఖర్చుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి చుక్కనీరు కూడా ఎల్లంపల్లికి పంప్ చేయలేదని అన్నారు. రూ.3 లక్షల కోట్ల అప్పు నిజం కాదా? తాజా బడ్జెట్ పుస్తకంలోని 11వ పేజీలో... 2016–2019 మధ్య అప్పులు రూ.2.03 లక్షల కోట్లుగా చూపారని, 12వ పేజీలో ప్రభుత్వ గ్యారంటీడ్ పేరుతో రూ.74,314 కోట్లు చూపారని, ఇలా అన్నీ కలిపితే రూ.3 లక్షల కోట్లకు అప్పులు చేరుకున్నాయని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీడ్ రుణాలు అప్పు కాదంటే ఎలా కుదురుతుందని, అవి మన కార్పొరేషన్లకు వచ్చిన రుణాలకు సంబంధించినవేనని, వాటిని తీర్చాల్సింది మనమే కదా అని పేర్కొన్నారు. ఆరేళ్లలో ఇంత పెద్దమొత్తంలో అప్పు చేయటం రాష్ట్రానికి భారం కాదా అని ప్రశ్నించారు. వనరులు సృష్టించే ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా లేనప్పుడు, మిగిలేవి అప్పులే కదా అని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ అంతే నిధులు, నియామకాలు, నీళ్లు... ఈ మూడు ప్రధానాంశాలే లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణలో అవన్నీ నిరాశాజనకంగానే మిగిలిపోయాయని భట్టి ఆరోపించారు. ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రంలో 2.40 లక్షల ఖాళీలుంటే కేవలం 56,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని, గ్రూప్–1 కోసం ఎదురుచూసి ఎంతోమంది వయసుమీరిపోయారని అన్నారు. సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి సంబంధిత వర్గాల సంక్షేమంపై దెబ్బకొట్టారని పేర్కొన్నారు. సబ్ప్లాన్ నిధులు దాదాపు రూ.30 వేల కోట్లకుపైబడి మళ్లించి ఉండకపోతే దళితులకు సంబంధించి మూడు ఎకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీకి సంబంధించి ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు, డబుల్ బడెరూమ్ ఇళ్లు చాలావరకు సిద్ధమై ఉండేవన్నారు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారని, దానికి రూ.7,200 కోట్లు అవసరమని, 20 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చూస్తున్నారని, అవి పూర్తికావాలంటే రూ.లక్ష కోట్లు కావాలని, మూడు ఎకరాల భూమి కోసం ఏడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం రోగాలమయంగా మారిందని, ఈ పరిస్థితి రాకుండా తాము ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా లెక్కచేయకుండా చేసి ఇప్పుడేమో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారన్నారు. -
పథకాలకు ప్రాధాన్యత
-
దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
-
బడ్జెట్లో పెద్దపీట!
-
సాగునీటికి కత్తెర..
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం దెబ్బ రాష్ట్ర బడ్జెట్పై కూడా పడింది. ఈసారి బడ్జెట్లో పలు రంగాలకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగునీటి రంగానికి కూడా భారీ కుదింపు తప్పేలాలేదు. గత ఐదేళ్లుగా రూ.25 వేల కోట్లు ఈ రంగానికి కేటాయించగా, ఈసారి రూ.7 కోట్లలోపే నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్ని ప్రాజెక్టులకు ముందు పంపిన ప్రతిపాదనలతో పోలిస్తే కుదించిన అంచనాలు ఆరేడు రెట్లు తగ్గాయి. అయితే ప్రాజెక్టులు ఆగకుండా చూసేందుకు ప్రభుత్వం ‘కార్పొరేషన్ల’ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు భారీ కోత పడే అవకాశాలున్నాయి. గత ఐదేళ్ల బడ్జెట్లలో భారీ కేటాయింపులతో ముందు వరుసలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు తొలిసారి కేటాయిం పులు తగ్గే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యానికి తోడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు తగ్గిన నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్ల లోపే కేటాయింపులు పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సాగునీటి శాఖ రూ.26,500 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. దాన్ని రూ.7 వేల కోట్లకు తగ్గించాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగానే మళ్లీ ప్రతిపాదనలు సమర్పిం చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయిస్తోంది. అందుకు తగ్గట్లే నిధులు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆరు నెలల కాలానికి రూ.10వేల కోట్ల కేటాయింపులు చేయగా, అందులో రూ.3,600 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇక ప్రస్తుతం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ కోసం రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో అధికంగా పాలమూరు–రంగారెడ్డికి రూ.7 వేల కోట్లు, కాళేశ్వరానికి రూ.6 వేల కోట్ల మేర కేటాయింపులు కోరారు. పూర్వ పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ.1,200 కోట్ల మేర కేటాయింపులతో ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం మాంద్యం నేపథ్యంలో అన్ని శాఖల బడ్జెట్లో 40 శాతం కోత విధించాలని ఆర్థిక శాఖ నుంచి నీటి పారుదల శాఖకు మౌఖిక ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలను పూర్తిగా కుదించారు. పాలమూరు ప్రాజెక్టుల ప్రతిపాదనల అంచనాను రూ.1,200 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,400 కోట్లతో మొదట ప్రతిపాదనలు పంపగా, దాన్ని రూ.400 కోట్లకు కుదించారు. మైనర్ ఇరిగేషన్ కింద చేపడుతున్న పనులకు మొదట రూ.2,100 కోట్ల కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు వెళ్లగా, దాన్ని ఏకంగా రూ.400 కోట్లకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇతర ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే మాదిరి ప్రతిపాదనలు తగ్గించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మొత్తంగా రూ.7 వేల కోట్లకు తగ్గించి ప్రతిపాదనలు పంపగా ఆర్థికశాఖ దాన్ని రూ. 6,500 కోట్లకు పరిమితం చేసినట్లు తెలిసింది. అయితే ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం చూపదు. అంటే ఈ రుణాల ద్వారానే ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. -
ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నుంచి మొదలుకుని నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తి స్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని సీఎం చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికన్నాముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సమావేశపరిచి, ఆర్థిక పరిస్థితిని వివరించాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వచ్చే నెలలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, రామకృష్ణరావు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చ జరిగింది. వచ్చే నెలలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం, మొహర్రం పండుగలున్నాయి. ఇతర సెలవులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్లు, సెక్రటరీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ పాల్గొనాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని తేదీలను ఖరారు చేయాల్సి ఉన్నందున, అసెంబ్లీ కార్యదర్శి సెప్టెంబర్ 4, 9, 14 తేదీలలో సమావేశాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ మూడు తేదీల్లో ఒక తేదీని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ ప్రసంగం చేసినందున బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదు. కాబట్టి రెండు రోజులు కలిసి వస్తాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో చర్చ, తర్వాత పద్దులపై చర్చ, అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలుంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయంలో త్వరలోనే నిర్ణయం జరుగుతుంది. అసెంబ్లీని సమావేశపరచడానికి ముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా చర్చించాలని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు సరైన మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. -
తెలంగాణ బడ్జెట్పై ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గత మార్చిలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సిఎం ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్ లో కసరత్తు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ‘‘దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం-అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలి. వాస్తవ దృక్పథంతో బడ్జెట్ తయారు చేయాలి. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలి’’ అని చెప్పారు.బడ్జెట్ రూపకల్పనపై మంగళవారం కూడా కసరత్తు జరుగుతుంది. తుది రూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశపరిచి, బడ్జెట్ ప్రతిపాదించడం తదితర ప్రక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. -
సాగుకు పట్టం
సాక్షి, వికారాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచే బడ్జెట్ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనసభలోగానీ, లోక్సభలోగానీ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అయితే ఈ శాఖ తనవద్దే ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి సీఎంలుగా ఉమ్మడి రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెట్టగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మొదటిసారి సీఎం హోదాలో బడ్జెట్ వివరాలు చదివి వినిపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు బహిరంగ వేదికలపై ఇచ్చిన హామీలు, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చే దిశగా బడ్జెట్ను రూపొందించారు. తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా అన్ని వర్గాలను ఆకర్శించేందుకు ప్రయత్నించారు. రైతు రుణమాఫీ... గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతురుణ మాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో స్పష్టత నిచ్చారు. ఏతేదీవరకు కటాఫ్ డేట్గా నిర్ణయించి రుణమాఫీ చేస్తారనే విషయంలో సందేహాలను నివృత్తి చేస్తూ బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. జిల్లాలో 2,25,215 మంది రైతులుండగా, వీరిలో 1,82,600 మంది పలు బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్నారు. వీరికి గాను లక్ష రూపాయలలోపు రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018, డిసెంబరు 11వతేదీ ఎన్నికల ఫలితాల నాటికి రైతులు తీసుకున్న లక్షలోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో లోన్ కటాఫ్ డేట్పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రాప్కాలనీలు... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొని ఉన్న వ్యవసాయానుకూల వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని కూడా అంచనా వేసి దిగుబడులను పెంచడంతో పాటుగా గిట్టుబాటు ధర కల్పించడానికి పంట కాలనీల ఏర్పాటునకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఆయా జిల్లాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించే విధానమే ఈ కాలనీల ప్రధాన ఉద్దేశం. దీంతో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగాబడ్జెట్లో వ్యవసాయానికి రూ.20,107 కోట్లను ప్రతిపాదించారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో సుమారుగా 213 క్రాప్ కాలనీలను ఉద్యాన, వ్యవసాయాధికారులు ప్రతిపాదించారు. మిషన్ కాకతీయ... చెరువుల పునరుద్ధరణే ప్రధాన ధ్యేయంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. 2019– 20 బడ్జెట్లో ఈ పథకానికి నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు వెచ్చించారు. జిల్లాలో ఈ పథకం ద్వారా ఇప్పటివరకు నాలుగు విడతల్లో 733 చెరువులను రూ.234.78 కోట్లతో అభివృద్ది చేశారు. వీటి వలన జిల్లాలోని పలు ప్రాంతాల్లో 65,724 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 78 చెరువులు, కుంటల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ... జిల్లాలోని 971 ఆవాసాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.1,187 కోట్లను మంజూరు చేసింది. దీంతో జిల్లాలో సుమారుగా 90శాతం పనులు పూర్తయ్యాయి. 80శాతం గ్రామాలకు ఈ నీటినే వినియోగిస్తున్నారు. మిగిలిన పనులను వచ్చేనెలాఖరులోగా పూర్తిచేసి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. మత్స్యకార కుటుంబాలకు చేయూత... గంగపుత్ర, ముదిరాజ్ కులాలవారితో పాటుగా బోయ, బెస్త కులస్తులకు చేపలు పట్టడమే ప్రధాన వృత్తి. ఆదాయ వనరు కూడా. ఐఎఫ్డీఎస్ పథకం కింద జిల్లాలోని మత్స్యకారులకు ఈ సంవత్సరం రూ.8 కోట్ల విలువచేసే 374 బైకులు, 33 ఆటోలు, 1 హైజెనిక్ ట్రాన్స్పోర్టు వెహికిల్, 17 మొబైల్ ఔట్లెట్స్ 75 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మత్స్యకారుల అభివృద్ధికి, ఉచిత చేపపిల్లల పంపిణీకి గాను ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈఎన్టీ, దంత పరీక్షలు... గత సంవత్సరం ప్రవేశపెట్టిన కంటివెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536 కోట్లను ప్రతిపాదించింది. జిల్లాలో ఇప్పటివరకు కంటివెలుగు కింద 3.27లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 52వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 2,208 మందిని శస్త్రచికిత్సలకు సిఫారసు చేశారు. పంచాయతీలకు నిధుల వరద... గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విదిల్చింది. ఒక్కో మనిషికి ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.1,606 విడుదల అవుతాయి. దీంతో 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి సుమారుగా రూ.8 లక్షల నిధులు అందనున్నాయి. నిరుద్యోగ భృతి.. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతను ముఖ్యంగా నిరుద్యోగులకు ఆకర్శించడంలో భాగంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ప్రతినెలా ఈ భృతి కింద రూ.3,016 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు గాను విదివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించిన ప్రభుత్వం ఇందుకుగాను బడ్జెట్లో రూ. 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. కాగా పథకానికి అర్హత విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనలు విడుదల చేస్తేగాని ఎంతమంది అర్హులవుతారో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆరు కిలోల బియ్యం... జిల్లాలో 588 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా 2.33 లక్షల కుటుంబాలకు ప్రతినెలా 5,342 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,744 కోట్లు ప్రతిపాదించారు. ప్రతినెల దాదాపుగా జిల్లాలోని విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లకు నెలకు 450 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథక సహాయాన్ని బడ్జెట్లో పెంచారు. ఏటా ఖరీఫ్, రబీలో ఎకరానికి రూ.4వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని సీజన్కు రూ.5 వేలకు పెంచారు. దీంతో ప్రతీ రైతుకు ఎకరానికి రూ.10 వేలు అందనున్నాయి. ఇందుకుగాను బడ్జెట్లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం కింద గతేడాది జిల్లాలోని 2,25,215 మంది రైతులకు రూ.244 కోట్లు అందించారు. పెరగనున్న ఆసరా పెన్షన్లు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చేనెలసరి పెన్షన్ రూ.1000 నుంచి రూ.2016 పెంచారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. వృద్ధాప్య కనీస పెన్షన్ అర్హత వయసును 65 నుంచి 57సంవత్సరాలకు తగ్గించారు. వచ్చే ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆసరా పెన్షన్లకోసం బడ్జెట్లో రూ.12,067 కోట్లకు ప్రతిపాదించారు. జిల్లాలో మొత్తం ఆసరా పెన్షన్లు 1,05,516 ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 37,057, వితంతు పెన్షన్లు 49, 521, వికలాంగులు 13,039, కల్లుగీత కార్మికులు 474, వీవర్స్ 169, ఒంటరి మహిళలు 4,715,బీడీ కార్మికులు 41 మంది ఉన్నారు. వీరికి ఏప్రిల్ 1వతేదీనుంచి పెంచిన పెన్షన్లు అమలు కానున్నాయి. కల్యాణలక్ష్మికి మోక్షం.. పేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని, కొంతైనా ఆర్థిక సహకారం అందించాలని ప్రవేశపెట్టిన పథకమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ పథకం కింద మొదట్లో రూ.75,116 ఇవ్వగా, ప్రస్తుతం దీనిని రూ.1,00,116 కు పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు 3,108 దరఖాస్తులు వచ్చాయి. నిధుల కొరతతో వీటిలో కేవలం 253 మంది లబ్ధిదారులకే మంజూరుచేయడం జరిగింది. దీంతో ఈ పథకం అమలుకు గాను బడ్జెట్లో 1,450 కోట్లు ప్రతిపాదించారు. -
సంక్షేమ సాగు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో జిల్లాలో ఎంతో మందికి లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడంతో జిల్లా రైతులు, ఇతర పథకాల లబ్ధిదారులకు ఎంతో మేలు కలగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణమాఫీ, ‘ఆసరా’ రెట్టింపు, పింఛన్ల అర్హత వయో పరిమితి కుదించడం, నిరుద్యోగ భృతి తదితరాలతో జిల్లాలోని ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఓటాన్ బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతమివ్వడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘ఆసరా’ రెట్టింపు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్వయంగా ప్రవేశ పెట్టిన రూ.1.82 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద జిల్లాలో ప్రస్తుతం 2.66 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళ, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్, పైలేరియా వ్యాధి గ్రస్తులు, అభయహస్తం ఇలా అన్ని రకాల పింఛ న్లు కలిపి ప్రతినెలా రూ.27.44 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం వికలాంగులకు నెలకు రూ.1,500, మిగతా వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్ అందుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఆసరా పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2,016కు, వికలాంగలు పెన్షన్లను రూ.3,016కు పెంచుతామని హామీనిచ్చింది. ఆ హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వికలాంగులకు రూ. 3,016, మిగతా పింఛన్లు, జీవనభృతి మొత్తాన్ని రూ. 2,016 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. వయస్సు కుదింపుతో మరింత లబ్ధి ఎన్నికల హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల అర్హతను 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో జిల్లాలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల అమలు కోసం రూ.1,450 కోట్లు కేటాయించారు. కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 5,674 మంది లబ్ధిదారులకు రూ.56.80 కోట్ల లబ్ధి కలిగింది. షాదీముబారక్ కింద 2,215 మందికి గాను రూ.22.17 కోట్లు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరింత మందికి లబ్ధి కలగనుంది. షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధి పేరుతో ప్రభు త్వం రూ.16 వేల కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం రూ.2004 కోట్ల నిధులు కేటాయించడంపై ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు భరోసా.. నిజామాబాద్ అంటేనే వ్యవసాయ జిల్లాగా పేరుంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.20,107 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లా రైతాంగానికి భరోసా లభిస్తోంది. రైతుబంధు పథకం కింద జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.25 లక్షల రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రూ.181.39 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే, రైతుబీమా కింద 227 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.11.35 లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈసారి ఈ రెండు పథకాలకు కూడా నిధులు కేటాయించడంతో రైతుల్లో భరోసా పెరుగుతోంది. రుణమాఫీపై హర్షం.. రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాలో సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 3.62లక్షల మందికి రుణమాఫీ వర్తించింది. నాలుగు విడతల్లో కలిపి రూ.1,790 కోట్లు మాఫీ అయ్యాయి. ఈసారి రుణ మాఫీ అర్హత పొందే రైతుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 4.20 లక్షల మంది వరకు ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల తర్వాతే లబ్ధిదారుల సంఖ్య తేలనుంది. మరోవైపు, బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్య, వైద్య రంగాలకు స్వల్పంగానే నిధులు కేటాయించారని విద్యావేత్తలు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇది వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ అని, అన్ని రంగాలకు సమ స్థాయిలో కేటాయింపులు దక్కలేదని పేర్కొంటున్నారు. వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ తెయూ(డిచ్పల్లి): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ అన్న రీతిలో ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అగ్రస్థానాన్ని కేటాయించారు. నీటిపారుదల శాఖ, మిషన్ కాకతీయకు రూ.45 వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ, పంటల కాలనీల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించారు. అయితే, నిరుద్యోగ భృతికి కేటాయించిన రూ.1800 కోట్లు ఏమాత్రం సరిపోవు. బడ్జెట్లో విద్య,వైద్య రంగాలకు నిధుల కేటాయింపులో వివక్ష కనిపిస్తోంది. ఉన్నత విద్యకు ఎక్కువ నిధులిస్తే బాగుండేది. – రవీందర్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెయూ -
రైతులకు లక్ష రుణమాఫీ ప్రకటించిన కేసీఆర్
-
సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది
-
రైతులు తీసుకున్న రూ. లక్ష రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్ : లక్ష రూపాయల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రైతుల్లో భరోసా పెంచామన్న ముఖ్యమంత్రి అన్నదాతలను అన్నవిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్లో రైతన్నలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వ్యవసాయ శాఖకు రూ.20,107 కేటాయించిన సర్కార్... రైతుబంధ పధకం కింద ఎకరానికి ఏడాదికి అందించే మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచింది. అలాగే రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించింది. (రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్) -
రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్ వద్ద ఉండటంతో ఆయనే సభలో 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 6వ బడ్జెట్ అని పేర్కొన్న కేసీఆర్ స్వల్పకాలంలోనే పురోగతి సాధించామన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణను రోల్ మోడల్గా చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబమే లేదన్నారు. అందుకే అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ను రెండోసారి గెలిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. 2018-19లో తెలంగాణ వృద్ధిరేటు 10.6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్ల పధకం తన హృదయానికి దగ్గరైనదని అన్నారు. బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు. (అమర జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళి) కాగా ఆంధ్రరాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాళ్ల తర్వాత సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టింది కేసీఆరే. అలాగే స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. (నేడే బడ్జెట్) తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు... 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా ఆసరా పెన్షన్లు వెయ్యి నుంచి రూ.2016కు పెంపు ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు దీని కోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయింపు పెన్షన్ వయసు 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు నిరుద్యోగుల భృతి రూ.3016 (దీని కోసం విధివిధానాలను రూపకల్పన) నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు రైతుబంధు పథకానికి ఎకరానికి ఏడాదికి రూ.8 నుంచి రూ.10వేలు పెంపు దీని కోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయింపు వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయింపు రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు రైతు బీమా కోసం రూ. 650 కోట్లు బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు షెడ్యూలు కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు ఎంబీసీ కార్పోరేషన్కు రూ.1000 కోట్లు మిషన్ కాకతీయకు రూ.22,500 కేట్లు బీసీలకు మారో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల కింద రూ.3,256 కోట్లు ఒక్కో మనిషికి రూ.1606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,41 లక్షల కోట్లు పెట్టుబడులు టీఎస్ ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరధ పనులు పూర్తి మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు 2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ.94,776 కోట్లు 2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ.22,835 కోట్లు 2019-20లో ప్రగతి పద్దు రూ.1,07,302 కోట్లు నిర్వహణ పద్దు రూ.74,715 కోట్లు -
ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు
-
ఒకో జవాను కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...జవాన్లపై ఉగ్రదాడి హేయమైన చర్య అని, ఈ దాడి సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగినది కాదని సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా, తమవంతుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు. అమరులకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. -
నేడే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ శుక్రవారం అసెంబ్లీ ముందుకు రానుంది. ఆర్థికశాఖ సైతం తనవద్దే ఉండటంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జె ట్ను ప్రవేశపెట్టనున్నారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్య తలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964 నుంచి 1971 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవీకాలంలో ఒకసారి బడ్జెట్ను ప్రవేశ పెట్టగా.. కొణిజేటి రోశయ్య 2010–11 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాగా, వైద్య–ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్ట నున్నారు. ఉభయ సభల్లో వేర్వేరుగా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలు దిశగా బడ్జెట్ను రూపొందించినట్లు ఆర్థికశాఖ ఉన్నతాధి కారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా తాత్కాలిక బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ తుది అంకెలను గురువారం ఖరారు చేశారు. ప్రస్తుతం 4 నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం తెలుపుతున్నా ఏడాది మొత్తానికి బడ్జెట్ లెక్కలను సిద్ధం చేశారు. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,74,453 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. సాధారణంగా గత బడ్జెట్తో పోల్చితే 15% పెంపుతో కొత్త బడ్జెట్ ఉంటుంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు చెల్లింపుల పెంపు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి కీలక హామీల అమలు కోసం ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు జరగనున్నాయి. హామీల అమలుకు ప్రాధాన్యం అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలను విస్తరిస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వికలాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచడంతోపాటు మిగిలిన అన్ని రకాల ఆసరా పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచుతామని, బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగిస్తామని, వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని, లక్ష రూపాయల పంట రుణమాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి 5 నుంచి 6 లక్షల రూపాయల సాయం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు వంటి హామీలనూ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు ఉద్యోగ నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు తెలిపింది. పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సముచితమైన రీతిలో వేతనసవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్ ప్రసంగంలోనే సీఎం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలక్పొడం, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్రాభివద్ధికి ప్రత్యేక పథకాలు రూపకల్పన, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు, వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిన, కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన తదితర అంశాలను టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు. వీటి అమలు దిశగా తాత్కాలిక బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లుకు ఆమోదం సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ తాత్కాలిక బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. విస్తరణ తర్వాత జరిగిన మంత్రివర్గం ఈ తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దులకు, అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపారు. వార్షిక బడ్జెట్తోపాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు. వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) చట్టానికి గతంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తొలిసారి కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బడ్జెట్ను అధ్యయనం చేసేందుకు వీలుగా శనివారం ఉభయ సభలకు సెలవు ఉంటుంది. బడ్జెట్పై ఆదివారం ఉభయసభల్లో చర్చ జరుగుతుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి గురువారం తొలిసారిగా సమావేశమైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సప్లిమెంటరీ డిమాండ్స్ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ భేటీకి మంత్రులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా 10మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతోసీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీతో కలుపుకొని కేబినెట్ సభ్యుల సంఖ్య 12కు చేరుకుంది. -
రేపటి నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసన సభ, శాసన మండలి లో ప్రభుత్వం తాత్కాలిక (ఓటాన్ అకౌంట్) బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆదివారం బడ్జెట్పై చర్చ జరుగనుంది. సోమవారం ద్రవ్యవిని యోగ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. శాసన సభ, శాసన మండలి సమా వేశాల నిర్వహణకు అవసరమైన భద్రత ఏర్పాట్లపై శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాం బర్లో జరిగిన ఈ సమావేశంలో మండలి చైర్మ న్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేము ల ప్రశాంత్రెడ్డి, ఎస్టీఎఫ్ డీజీ తేజ్దీప్కౌర్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, హైదరాబాద్ నగ ర పోలీస్ కమిషనర్ అంజనాకుమార్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. పోచారం మాట్లాడుతూ... ‘శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25 వర కు జరుగుతాయి. మొత్తం 3 రోజులు సమావేశాలు సాగుతాయి. అందరి సహకారంతో శా సనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో భేటీకావడం ఆనవాయితీ అని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి అందరి సహకారం అవసరమని చెప్పా రు. శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని ప్రశాంత్రెడ్డి అన్నారు. -
అక్షరాలా రెండు లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల మార్క్ దాటబోతోంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.2.13 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ను సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బడ్జెట్ కంటే వచ్చే ఆర్థిక సంవత్సరం పద్దు దాదాపు రూ.39 వేల కోట్లు అధికం. రాష్ట్ర పన్నుల రాబడిలో 28% వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బడ్జెట్కు రూపకల్పన చేసింది. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.2 వేలు అదనంగా ఇవ్వాల్సి రావడం, ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి, రైతులకు రూ. లక్ష రుణమాఫీ వంటి హామీల అమలుతో బడ్జెట్ పరిమాణం పెరగనుంది. పెరిగిన వ్యయానికి అనుగుణంగా ఆదాయం పెంచుకునే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్కు పరిమితమవుతున్న కేసీఆర్ సర్కారు శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను బడ్జెట్లో ప్రస్తావించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న కొత్త పథకాలతో పాటు ఉన్నవాటిని పెంచేలా బడ్జెట్లో భారీ కేటాయింపులే చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆదాయం 90 వేల కోట్లే! ఈ ఏడాది పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా లక్ష కోట్ల రూపాయలు సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది అంచనా వేసిన దానికంటే వృద్ధిరేటు ఎక్కువగా ఉండటంతో వచ్చే ఏడాదికి కూడా దాదాపు 18% ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది రాష్ట్ర పన్నుల ద్వారా రూ.73,751 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ కింద రూ.40వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. మార్చి 31వ తేదీ నాటికి అది రూ.43వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంటున్నారు. అలాగే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ విభాగాల నుంచి నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ రాబడి ఉంది. ఒక్క రవాణ శాఖ మాత్రమే టార్గెట్కు స్వల్ప దూరంలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే గత డిసెంబర్ 31వ తేదీ నాటికి నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. దీంతో వచ్చే ఏడాది ఆ మొత్తాన్ని రూ.82 వేల కోట్లకు పెంచడంతో పాటు పన్నేతర ఆదాయం రూ.13 వేల కోట్లుగా ఉంటుందని భావించి రూ.95 వేల కోట్లుగా అంచనా వేసింది. మూలధన వసూళ్ల కింద ఈ ఏడాది రూ.43,507 కోట్లు నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ మొత్తాన్ని రూ.55వేల కోట్లకు పెంచింది. ఇవి కాకుండా కేంద్ర పన్నుల వాటా కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,207 కోట్లుగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువే లభించినట్లు సమాచారం. ఈ ఏడాది అంచనా వేసిన మొత్తం పెరడగంతో దాని ఆధారంగా వచ్చే ఏడాదికి రూ.25వేల కోట్లుగా అంచనా వేసిందని సమాచారం. ఇక కేంద్ర గ్రాంట్ల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.29,041 కోట్లు అంచనా వేసిన ప్రభుత్వం వచ్చే ఏడాదికి రూ.38 వేల కోట్లు వస్తుందని భావిస్తోంది. సాగునీటికి 25 వేల కోట్లు ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తంలో కేటాయింపులు జరిపింది. బడ్జెట్లో సింహభాగం వ్యవసాయం, సంక్షేమానికే కేటాయించినట్లు తెలిసింది. గడచిన ఏడాది రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.2వేలు పెంచి.. రూ.10వేలు చేయడంతోపాటు రూ.లక్ష అంతకంటే తక్కువ మొత్తంలో ఉన్న రైతు రుణాలను నాలుగు వాయిదాల్లో చెల్లించడానికి వీలుగా బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిగినట్లు సమాచారం. -
మనమే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పనిని కూడా కేంద్రం సరిగా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు తరహాలోనే కేంద్రం రైతులకు సరిపడా సాయం చేస్తే బాగుండేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో బడ్జెట్పై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని కేసీఆర్ ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటి అమలుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ హామీల అమలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెరుగైన పథకం కావాలి ‘రైతుబంధు పథకం చాలా గొప్పది. రైతులకు నేరుగా సాయం చేసేలా మన పథకం ఉంది. మనం ఇచ్చే సాయం మరీ ఎక్కువ కాకున్నా రైతులకు ఊరట కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెబుతోంది. అయితే కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉంది. రైతులకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. పెట్టుబడి సాయం విషయంలో కేంద్రం ఇప్పటికైనా ఇంకా మెరుగైన పథకం ప్రవేశపెట్టేలా యోచిస్తే బాగుంటుంది. కేంద్రం తరహాలోనే తెలంగాణ బడ్జెట్ను రూపొందించాలి. దీనిపై మరోసారి వివరంగా సమీక్షించుకుందాం. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వస్తోంది. మన రాష్ట్రం ఎక్కువ నిధులు పొందేలా సమగ్ర నివేదిక రూపొంచాలి. దీనిపై దృష్టి పెట్టండి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన ప్రణాళిక ఉండాలి. వచ్చే ఐదేళ్లల్లో అన్ని గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉండాలి. బడ్జెట్ రూపకల్పనలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’అని సీఎం అన్నారు. 18న ఆర్థిక సంఘం రాక 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18న తెలంగాణకు రానుంది. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. మొదటి రెండ్రోజులు సీఎం కేసీఆర్తో, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. 20న రాష్ట్రంలో పర్యటించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. మిషన్ భగీరథ పనులను పరిశీలించనుంది. ఆర్థిక సంఘం పర్యటన ముగిసిన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగుకు 25వేల కోట్లు! రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి కూడా గతేడాదిలాగే భారీగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల పనుల్లో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూ రూ.25 వేల కోట్ల బడ్జెట్ను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ గతంలో పంపిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థికశాఖ రూ.25 వేల కోట్లకు సీలింగ్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖ రూ.26,700 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. చాలా ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, సహాయ పునరావాస, అటవీ, పర్యావరణ సమస్యలు, గతేడాది పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ మేర నిధులు అవసరమని తెలిపింది. దీనిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష జరిపిన అనంతరం రూ.25వేల కోట్ల బడ్జెట్కే ఆర్ధిక శాఖ సీలింగ్ ఇచ్చింది. ఇందులో రూ.1,316.13 కోట్లు నిర్వహణ పద్దుకై ప్రతిపాదించగా, మిగతా 23,683.87 కోట్లు ప్రగతి పద్దుకై ప్రతిపాదించారు. ప్రగతి పద్దు కింద ప్రతిపాదించిన నిధుల్లో రాష్ట్ర ప్రణాళిక కింద రూ.13,253.77 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిధ్ధం కాగా.. మిగతా రూ.10,430.10కోట్లను ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రుణాల రూపంలో తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇక ప్రాజెక్టుల వారీగా చూస్తే అంతా ఊహిస్తున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.5,988.10 కోట్లు కేటాయించాలని, సీతారామకు రూ.2,915కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732కోట్లు, మైనర్ ఇరిగేషన్కు రూ.1,601కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాగా, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ బిల్లులు, బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ శనివారం బడ్జెట్పై సమీక్ష సందర్భంగా అధికారులతో చర్చించారు. వచ్చే బడ్జెట్లో రూ.25వేల కేటాయింపులకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రుణాల ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నేడు యాదాద్రికి సీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాదాద్రి ఆలయంలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం అభి వృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదాద్రికి వెళ్తున్నారు. -
తెలంగాణ బడ్జెట్పై ఎన్నారైల హర్షం
లండన్: ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-2019 బడ్జెట్పై ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు. లండన్లో ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రవాసుల పక్షాన నిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్కు కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశం చాలా ఉందని, కచ్చితంగా ఈ చారిత్రాత్మక నిధుల కేటాయింపుతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. గత పాలకులకు ఎన్నారైల పట్ల చిత్తశుద్హి లేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రూ. 5కోట్లు ఉండేదని, వారి సంక్షేమం కోసం చేసిన పనులేవీ లేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్ల అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని, ముఖ్యంగా గల్ఫ్ బాధితుల పట్ల ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స్పందిస్తున్న తీరు వారి బాధ్యతకు, గల్ఫ్ బిడ్డల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు అనిల్ కూర్మాచలం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ బడ్జెట్ని ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సృజన్ రెడ్డి తదితరులు తెలిపారు. -
అప్పు.. ఇంతింతై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణ ప్రస్థానం భారీ బడ్జెట్తోపాటే ఉరకలేస్తోంది. వచ్చే ఏడాదికి అప్పు ఏకంగా రూ.2.21 లక్షల కోట్లు దాటనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి అప్పుల మొత్తం రూ.1,80,238 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించింది. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.1,51,133 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇప్పటికే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.41,538 కోట్ల అప్పు చేసినట్లుగా వెల్లడించింది. వెరసి మొత్తం అప్పు రూ.2.21 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. వీటికి తోడు సాగునీటి ప్రాజెక్టుల రుణ సమీకరణకు తెలంగాణ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ను ఇటీవలే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్కు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో కార్పొరేషన్ల అప్పు అంతకంతకూ పెరిగిపోనుంది. సాధారణంగా కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు కేంద్రం 3.50 శాతం వరకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23 వేల కోట్ల మేర అప్పు తీసుకున్న ప్రభుత్వం వచ్చే ఏడాది రూ.29 వేల అప్పులు తీసుకోనుంది. అంతమేరకు జీఎస్డీపీలో 3.45 శాతం ద్రవ్యలోటును బడ్జెట్లో ప్రస్తావించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 25 శాతం మించకూడదని, అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు జీఎస్డీపీలో 21.39 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. గడిచిన నాలుగేళ్లలో ఈ అప్పు అంతకంతకు పెరిగిపోయింది. వడ్డీలకే 13 వేల కోట్లు! చేసిన అప్పులు తిరిగి చెల్లించటం రాష్ట్ర ఖజానాకు భారంగా మారనుంది. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,609 కోట్ల వడ్డీలు చెల్లించినట్లు అకౌంటెంట్ జనరల్ తన గణాంకాల్లో ధ్రువీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. అలాగే 2017–18లో వడ్డీల చెల్లింపులకు రూ.1,1138 కోట్లు వెచ్చింది. సవరణ బడ్జెట్లోనూ ఇవే గణాంకాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీల భారం రూ.1,1691 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. దాదాపు రూ.29 వేల కోట్ల అప్పులను అంచనా వేసిన ప్రభుత్వం.. వడ్డీల లెక్కలను మాత్రం తక్కువ చేసి చూపినట్లు స్పష్టమ వుతోంది. వడ్డీల మోత రూ.13 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి. -
పల్లెకు పట్టం
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది. సాగునీటి శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రాధాన్యం కల్పించింది. 2018–19 బడ్జెట్లో ఈ శాఖకు ఏకంగా రూ.15,562.84 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.12,776 కోట్లను ప్రగతి పద్దుగా, రూ.2,786.78 కోట్లను నిర్వహణ పద్దుగా పేర్కొన్నారు. ఈ మేరకు భారీ నిధులతో ప్రగతి పద్దును గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం కేటాయించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు కూడా చేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే గ్రామ పంచాయతీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవికాక ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల పేర్కొన్నారు. ఆసరాకు రూ.5,388.89 కోట్లు ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉదారంగా వ్యవహరిస్తోంది. గత బడ్జెట్లో కొత్తగా ఒంటరి మహిళలకు పింఛన్ను ప్రకటించి.. ప్రస్తుతం అమలు చేస్తోంది. తాజాగా బడ్జెట్లో బోదకాలు వ్యాధి బాధితులకు ప్రతి నెల రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సీఎం ఇటీవల ప్రకటించిన ప్రకారం బోదకాలు వ్యాధి బాధితులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. అలాగే వికలాంగులకు నెలకు రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 41,78,291 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకు ఏటా సగటున రూ.5,300 కోట్లను ఖర్చు చేస్తోంది. ఆసరాకు ఈ ఏడాది రూ.5,388.89 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు ఏడాది కేటాయింపులు 2014–15 13,761 2015–16 13,896 2016–17 14,262 2017–18 14,775 2018–19 15,562 ‘భగీరథ’కు రూ.1,803 కోట్లు రాష్ట్ర ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 15 పట్టణాలకు, 2,900 గ్రామాలు, 5,752 ఆవాసాలకు లబ్ధి చేకూరింది. ఈ ఏడాది భగీరథ పథకానికి రూ.1,803.35 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రాంతాలను 26 సెగ్మెంట్లుగా విభజించి పనులు చేపడుతున్నారు. 67 ఇన్టెక్ వెల్స్, 153 వాటర్ ఫిల్టర్స్, 1,69,705 కిలోమీటర్ల పైపులైన్లు, 35,514 ఓవర్హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్కు 80 శాతం రుణాల రూపంలోనే నిధులు సమకూరుతున్నాయి. మిగిలిన 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తోంది. గత బడ్జెట్లో ప్రభు త్వం ఈ పథకానికి రూ.3 వేల కోట్లను కేటాయించింది. -
‘పుర’ సమరానికి నిధుల పాచిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. వచ్చే ఏడాది పురపాలికలకు జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచింది. ప్రగతి పద్దు కింద పురపాలక శాఖకు 2017–18లో రూ.2,869.22 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో కేటాయింపులను రూ.4,680.09 కోట్లకు పెంచింది. వరంగల్ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్ల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.117.23 కోట్ల నుంచి రూ.755.20 కోట్లకు పెంచింది. అయితే మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సహాయక నిధులను మాత్రం రూ.426.41 కోట్ల నుంచి 230.10 కోట్లకు తగ్గించింది. మునిసిపల్ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.7.55 కోట్ల నుంచి రూ.141.64 కోట్లకు పెంచింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం అందించే టీయూఎఫ్ఐడీసీకి తొలిసారిగా రూ.200 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150 కోట్ల నుంచి రూ.89.39 కోట్లకు కేటాయింపులను తగ్గించి, అమృత్ పథకానికి రూ.203.96 కోట్ల నుంచి రూ.313.63 కోట్లకు పెంచింది. స్వచ్ఛ భారత్కు రూ.115 కోట్ల కేటాయింపులను కొనసాగించింది. ఆలయాలకు నిధుల వెల్లువ! రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు పెంచింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.100 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.250 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లను కేటాయించింది. తొలిసారిగా భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లు, ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు చెరో రూ.50 కోట్లను కేటాయించింది. ‘మూసీ’ అభివృద్ధికి రూ.377 కోట్లు ప్రగతి పద్దు కింద హైదరాబాద్లో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్ల కేటాయింపులను కొనసాగించి, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులను రూ.377.35 కోట్ల నుంచి రూ.566.02 కోట్లకు పెంచింది. హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టుకు తొలిసారిగా రూ.400 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. హైదరాబాద్ జలమండలికి రూ.1,420.50 కోట్ల రుణం, మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం, హెచ్ఎండీఏకు రూ.250 కోట్ల రుణం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణాల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. -
శాఖల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి మొండి చేయి చూపించింది. ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఆ రూపంలో ఆర్టీసీపై పడే భారాన్ని తగ్గిస్తామని, ప్రభుత్వపరంగా సాయం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. కానీ బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి మాత్రం నామమాత్రంగా ఇస్తూ చేయి దులుపుకుంటోంది. గత బడ్జెట్లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సర్కారు.. ఈసారి రూ.975 కోట్లతో సరిపెట్టింది. అసలు గతేడాదికి సంబంధించిన నిధులే ఇంకా రూ.600 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉండటం గమనార్హం. పాస్ల సొమ్మూ పద్దులోనే.. వివిధ కేటగిరీ బస్సు పాస్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి రూ.520 కోట్ల వరకు ఉంటుంది. ప్రభుత్వం ఈ మేరకు నిధులను పద్దులో చూపింది. ఇక కొత్త బస్సుల కొనుగోలుకు రుణంగా రూ.140 కోట్లు, ప్రభుత్వ పూచీకత్తు అప్పులు తీర్చేందుకు రుణంగా మరో రూ.315 కోట్లు కేటాయించింది. ఈ రెండూ కూడా రుణాలే కాబట్టి.. ఆర్టీసీ వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం గ్రాంటు కింద నిధులిస్తుందని భావించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ నిరుత్సాహానికి గురైంది. ఆలయానికి కొత్త రూపు ♦ యాదాద్రికి రూ.250 కోట్లు కేటాయింపు ♦ భద్రాచలం, వేములవాడకు 100 కోట్ల చొప్పున ♦ బాసర, ధర్మపురికి 50 కోట్ల చొప్పున నిధులు సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట, రాష్ట్రంలోని మిగతా ప్రధాన ఆలయాలనూ అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. భద్రాచలం, వేములవాడ, బాసర, ధర్మపురి ఆలయాలకు నిధులు కేటాయించింది. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.100 కోట్లు, బాసర, ధర్మపురి దేవాలయాలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. యాదాద్రికి బడ్జెట్లో రూ.250 కోట్లు ప్రతిపాదించారు. దేవాదాయశాఖపై కినుక! దేవాదాయ శాఖకు మరోసారి ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ధూపదీప నైవేద్యాలు, పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, దళిత వాడల్లో రామాలయాల నిర్మాణం తదితరాలకు సంబంధించి దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధికి గతేడాది తరహాలోనే రూ.50 కోట్లతో సరిపెట్టింది. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్కు గతేడాది లాగానే రూ.100 కోట్లు ఇచ్చారు. దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణ నేపథ్యంలో జీతాలు పెరిగినందున.. దేవాలయాల నుంచి చెల్లించగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వం గ్రాంటుగా ఇవ్వాల్సి ఉంది. దీనికి గత బడ్జెట్లో రూ.50 కోట్లు ఇవ్వగా.. ఈసారి దాన్ని రూ.72 కోట్లకు పెంచారు. -
అప్పుతోనే ‘డబుల్’ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడింది. ఈ ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు అవసరముండగా.. తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,500 కోట్లే కేటాయిం చింది. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని ఈసారి మూడు రెట్లకు పెంచింది. రాష్ట్రవ్యా ప్తంగా 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 9,522 ఇళ్లను పూర్తిచేసింది. 1,68,981 ఇళ్లు ఇంకా వివిధ స్థాయిలో ఉన్నాయి. హడ్కో నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకుని దాన్ని దశలవారీగా ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.1,143 కోట్లు మంజూరైనట్టు తాజా బడ్జెట్లో పేర్కొంది. పీఎంఏవై పట్టణ ఇళ్లకు రూ.766.50 కోట్లు, గ్రామీణ ఇళ్లకు రూ.376.60 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గృహనిర్మాణ శాఖకు కేటాయింపులు..(కోట్లలో..) నిర్వహణ పద్దు: రూ.652.05 ప్రగతి పద్దు: రూ.2,143.10 మొత్తం: రూ.2,795.15 రోడ్లకు రూ.5,363 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, వంతెనల నిర్మాణానికి దాదాపు రూ.12 వేల కోట్ల విలువైన పనులను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. అయితే తాజా బడ్జెట్లో మాత్రం రోడ్లు, భవనాల శాఖకు రూ.5,363 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద కేటాయించింది రూ.3,501 కోట్లు మాత్రమే. ఇది ఇంచుమించు గతేడాది బడ్జెట్ కేటాయింపులంతే ఉండటం విశేషం. పనుల్లో ఆశించిన వేగం లేకపోవటం వల్లనే నిధుల కేటాయింపు పెరగటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా రహదారులకు రూ.810 కోట్లు, గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.80 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రోడ్లకు రూ.460 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.80 కోట్లు కేటాయించారు. కొత్త కలెక్టర్ భవనాలకు రూ.500 కోట్లు, ఎమ్మెల్యే భవనాలకు రూ.30 కోట్లు, కళాభారతి నిర్మాణం కోసం రూ.40 కోట్లు కేటాయించారు. సచివాలయ భవనం సంగతేంటి?: సికింద్రాబాద్ బైసన్పోలో మైదానంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ అంశాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ బడ్జెట్లో దీనికి నామ మాత్రంగా రూ.5 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.15 కోట్లు కేటాయించినా ఖర్చు కాలేదు. -
లెక్కల్లో చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: వరుసగా ఐదోసారి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నికల ముంగిట్లో రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమంటూ ప్రగతి పద్దును భారీగా పెంచింది. కానీ ఇందులో వాస్తవ ఆదాయ, వ్యయాలను ఎప్పటిలాగే భారీగా పెంచి చూపించింది. ద్రవ్యలోటు ఎక్కువగానే ఉన్నా.. మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనికితోడు బడ్జెట్తో సంబంధం లేకుండా అప్పుల ద్వారా నిధుల సమీకరణ కొనసాగుతుందనీ తేల్చి చెప్పింది. అంచనాలు కుదింపు రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.5,520 కోట్ల రెవెన్యూ మిగులుతో రూ.1,74,453 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అందులో ప్రగతి పద్దు రూ.1,04,757 కోట్లు, నిర్వహణ పద్దు రూ.69,695 కోట్లుగా చూపింది. గతేడాది ప్రగతి పద్దు కింద చూపిన మొత్తం రూ.88,038 కోట్లే. అంటే ఈసారి అమాంతం మరో రూ.16 వేల కోట్లు పెంచేసింది. వాస్తవానికి జీఎస్టీ ప్రభావంతో అంచనా వేసినదానికన్నా ఆదాయం స్వల్పంగా తగ్గిందని ప్రభుత్వం బడ్జెట్లోనే ప్రస్తావించింది. గత బడ్జెట్ అంచనాలను 95 శాతానికి కుదించుకుంది. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం.. రూ.1.42 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. కానీ కొన్ని అంశాలను పరిశీలిస్తే... తాజా బడ్జెట్ భారీగా ఉండాలన్న తాపత్రయంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వాస్తవ ఆదాయ, వ్యయాలను విస్మరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు సమర్పించిన లెక్కల ప్రకారం.. జనవరి నెలాఖరు నాటికి (ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలానికి) రూ.66 వేల కోట్ల రెవెన్యూ ఆదాయం వచ్చింది. తాజాగా బడ్జెట్లో వెల్లడించిన గణాంకాల్లో.. ప్రస్తుత ఏడాది రెవెన్యూ ఆదాయం రూ.1.08 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంటే తొలి పది నెలల ఆదాయం రూ.66 వేల కోట్లుకాగా.. ఫిబ్రవరి, మార్చి రెండు నెలల్లోనే మరో రూ.42 వేల కోట్లు వచ్చినట్లుగా చెబుతోంది. ఇది అంకెల గారడీయేనన్న విమర్శలు వస్తున్నాయి. భూముల విక్రయంపైనే ఆశ రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా ఈ ఏడాది రూ.61,369 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కగట్టింది. తాజా బడ్జెట్లో దానిని రూ.73,751 కోట్లుగా అంచనా వేసింది. ఇక గతేడాది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు భారీగా పెరుగుతాయంటూ రూ.29 వేల కోట్ల ఆదాయాన్ని ప్రతిపాదించింది. కానీ ఆ మేరకు వచ్చే దాఖలాలు లేకపోవటంతో.. తాజా బడ్జెట్లో అంచనాలకు మించిన ఆదాయ, వ్యయాలను చూపించిందనే విమర్శలున్నాయి. జీఎస్టీ ప్రభావంతో సేల్స్ట్యాక్స్ ద్వారా రూ.53,482 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ప్రస్తుతం రూ.9 వేల కోట్లుగా ఉండగా.. రూ.10,600 కోట్లకు పెరుగుతుందని ప్రతిపాదించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.4,700 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఇక భూముల విక్రయం ద్వారా రూ.3000 కోట్లు వస్తుందని భావిస్తోంది. వాస్తవానికి భూముల విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు వస్తాయని గత బడ్జెట్లో అంచనా వేసిన సర్కారు.. రూ.వెయ్యి కోట్లకు మించి రాకపోవటంతో ఈసారి అంచనాలను తగ్గించుకుంది. మిగులులోనూ గారడీలే! అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆమోదించిన 2016–17 ఆర్థిక సంవత్సర గణాంకాలను ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ప్రకటించింది. రూ.1,385 కోట్ల మిగులు ఉందని లెక్కతేల్చింది. ఇక 2017–18 బడ్జెట్లో రూ.4,571 కోట్ల మిగులును ప్రతిపాదించిన సర్కారు.. ఆదాయ వ్యయాలు, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా రూ.1,545 కోట్లు మాత్రమే మిగులు ఉంటుందని సవరించుకుంది. వాస్తవానికి ఏజీ ధ్రువీకరించిన అంతకు ముందు ఏడాది గణాంకాల్లోనూ ఆర్థిక శాఖ లాఘవం చూపినట్లు కనబడుతోంది. కేపిటల్ ఆదాయంలో చేబదులు రుణం పద్దు కింద రూ.12,088 కోట్లు చూపిన ప్రభుత్వం.. అదే పద్దును ఉన్నది ఉన్నట్లుగా కేపిటల్ చెల్లింపుల్లో తిరిగి చెల్లించిన ఖర్చు కింద చూపించింది. అంటే వాస్తవంగా 2016–17లో రాష్ట్ర ఆదాయ వ్యయాలు రూ.1.21 లక్షల కోట్లు ఉండగా.. రూ.12 వేల కోట్ల మేరకు పెంచేందుకు ప్రభుత్వం ఈ గారడీ చేసిందని అర్థమవుతోంది. దాంతో మొత్తం బడ్జెట్ రూ.1.33 లక్షల కోట్లకు చేరినట్లు ఏజీ పేర్కొనడం గమనార్హం. -
బడ్జెట్పై ప్రముఖుల స్పందన
అబద్ధాల బడ్జెట్... బడ్జెట్ వాస్తవదూరంగా, ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేలా ఉంది. గత బడ్జెట్ కేటాయింపులు 60 శాతం కూడా ఖర్చు చేయలేదు. మైనారిటీలకు కేటాయింపులు పేపర్ మీదే గానీ ఖర్చు చేసింది లేదు. కమీషన్లు వచ్చే చోటే ఖర్చు చేశారు గానీ సంక్షేమానికి కాదు. పాతబస్తీకి మెట్రో అంటున్న కేసీఆర్.. బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదు? అబద్ధాలు చెప్పడంలో ఆయనకు పీహెచ్డీ ఇవ్వాలి. – షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దొంగ లెక్కలు నిలదీస్తామని సస్పెన్షన్ తెలంగాణ ప్రజలకు బడ్జెట్ ఆశనిపాతం. ప్రజలను మరింత అగాథంలోకి నెట్టేలా ఉంది. లెక్కల్లో గొప్పలు తప్పా.. ఆదాయం, వ్యయంలో పొంతనే లేదు. 60 ఏళ్లలో ఎవరూ చేయని అప్పులు చేయడంలో కేసీఆర్ ప్రగతి సాధించారు. ప్రభుత్వ దొంగ లెక్కలను సభలో నిలదీస్తామనే సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. నాలుగేళ్లుగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. – భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పింది బారెడు..జరిగేది జానెడు.. బడ్జెట్ పూర్తిగా మేడి పండులా ఉంది. చెప్పిన మాటను సీఎం నిలబెట్టుకోలేదు. చెప్పింది బారెడు.. జరిగేది జానెడు మాత్రమే. 85,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే నాలుగేళ్లలో 25,000 ఉద్యోగాలే భర్తీ చేశారు. హైదరాబాద్లో లక్ష గ్రామాల్లో లక్ష ఇళ్లు కడతామన్నారు. ఇళ్లు కట్టి ఓట్లు అడగాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. రైతులకు రుణమాఫీ కాలేదు. ఆర్భాటంగా పథకాలు ప్రకటిస్తున్నారు. – కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే దూరదృష్టి లేని బడ్జెట్ దీన్ని పూర్తిగా అంకెల గారడీ బడ్జెట్గా మేం భావిస్తున్నాం. సంక్షేమం కోసం లక్ష కోట్ల బడ్జెట్ను ఖర్చుపెడతామని గొప్పలు చెప్పారు. మూత పడ్డ కంపెనీలను తెరిపించే భరోసాను బడ్జెట్ కల్పించలేకపోయింది. సాగునీటి ప్రాజెక్టుల మీద కేసీఆర్ ప్రభుత్వానిది సవితి ప్రేమ అని తేలిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయ బడ్జెట్గా కనిపిస్తోంది. మద్దతు ధర నిధిని ఎందుకు కేటాయించలేకపోతున్నారో చెప్పాలి. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎన్నికల బడ్జెట్ ఇది ఎన్నికల బడ్జెట్. కోటి ఎకరాలకు సాగునీరం దిస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పారు. కానీ ఆ స్థాయిలో కేటాయింపుల్లేవు. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించారు. కానీ ప్రాజెక్టుల పూర్తికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. – గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బడ్జెట్ దేశానికే దిక్సూచి బడ్జెట్ దేశానికే దిక్సూచిగా ఉంది. పెట్టుబడి సాయం పథకం, బీమా పథకాలకు రూ.12 వేల కోట్ల మేర కేటాయింపులు చేయడం శుభపరిణామం. సాగునీటి రంగానికి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఐడీసీ పథకాలకు గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.100 కోట్ల మేర అధికంగా నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు దన్యవాదాలు. – ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి ‘మూడెకరాలకు’ నిధులేవీ? గత బడ్జెట్లో ఖర్చు చేయాల్సిన రూ.10 వేల కోట్లు మిగిలాయి. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా లేదు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్. దళితులకు 3 ఎకరాల భూమి హామీ నెరవేర్చలేదు. అటవీ హక్కు చట్టాన్ని పక్కనబెట్టారు. ఆదివాసులను అడవులకే పంపాలని చూస్తున్నారు. ఉద్యోగాలపై మాట తప్పారు. – సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే -
బీసీ సంక్షేమానికి అంతంతే
వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమానికి తాజా బడ్జెట్లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. అయితే, బడ్జెట్లో బీసీల ప్రత్యేకనిధి ఊసేలేదు. బీసీ ఫెడరేషన్కు నిరాశ మిగిల్చింది. 2017–18 వార్షిక బడ్జెట్లో రూ.5,,070.36 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2018–19 బడ్జెట్లో రూ.5,919.83 కోట్లు కేటాయించింది. వీటిని గురుకులాలు, కల్యాణలక్ష్మి, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కోసం ఖర్చు చేయనుంది. బీసీ సంక్షేమశాఖకు ప్రగతి పద్దు కింద రూ.5,690.04 కోట్లు, నిర్వహణ కింద రూ.229.78 కోట్లు ఇచ్చింది. అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) సంక్షేమ కార్పొరేషన్కు గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించడం గమనార్హం. అయితే, ఎంబీసీల్లోకి ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టతరాలేదు. దీంతో కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఆర్థిక చేయూత పథకాలు అమలు కావడంలేదు. 2017–18 వార్షిక బడ్జెట్లో రూ.వెయ్యికోట్లలో కేవలం రూ.100 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తాజా బడ్జెట్లో వారికి రూ.1,200 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత కార్యక్రమాలు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు కానున్నాయి. – సాక్షి, హైదరాబాద్ బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు అరకొరే తెలంగాణ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ(బీసీ కార్పొరేషన్)కు బడ్జెట్ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. మూడేళ్లుగా కేటాయింపులు పెద్దగా లేక కార్పొ రేషన్ కార్యక్రమాలు పడకేశాయి. తాజా బడ్జెట్లో రూ.5 కోట్లే కేటాయించింది. పెట్టుబడుల కింద రూ.50 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఫెడరేషన్లకూ అరకొరగానే నిధులు కేటాయించింది. గతేడాది రజకులు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించినా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో 20 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేకపోయాయి. తాజాగా రజక ఫెడరేషన్కు రూ.200 కోట్లు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్కు రూ.250 కోట్లు కేటాయించింది. వడ్డెర ఫెడరేషన్కు రూ. 5.45 కోట్లు, క్రిష్ణబలిజ, పూసల ఫెడరేషన్కు రూ.5 కోట్లు, వాల్మీకి బోయ ఫెడరేషన్కు రూ.2.10 కోట్లు, భట్రాజ్ ఫెడరేషన్కు రూ.2 కోట్లు, మేదర ఫెడరేషన్కు రూ.3 కోట్లు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్కు రూ.10 కోట్లు, కుమ్మరి(శాలివాహన) ఫెడరేషన్కు రూ.8 కోట్లు, గీతకార్మిక ఫెడరేషన్కు రూ.10 కోట్లు చొప్పున కేటాయించింది. బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి లేనట్లే... వెనుకబడిన తరగతులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తారనే ఆశలపై తాజా బడ్జెట్ నీళ్లు చల్లింది. బీసీల సమగ్ర అభివృద్ధికి గతేడాది చివర్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్కమిటీలోని మెజార్టీ సభ్యులు ప్రత్యేక అభివృద్ధి నిధివైపే మొగ్గు చూపారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ఎస్డీఎఫ్ ఉండాలని పలువురు సభ్యులు కోరారు. అయితే, తాజా బడ్జెట్లో బీసీ ఎస్డీఎఫ్పై ఎలాంటి స్పష్టత రాలేదు. మైనార్టీ సంక్షేమానికి 2 వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో రూ.1,999.99 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.25.57 కోట్లు, ప్రగతి పద్దు కింద 1974.42 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ. 1,249.66 కోట్లు ఇవ్వగా ఈసారి అదనంగా రూ.750 కోట్లు కేటాయించడం గమనార్హం. షాదీముబారక్ పథకానికి రూ.200 కోట్లు, ‘సీఎం విదేశీ విద్యానిధి’కి రూ.100 కోట్లు, దావత్ ఐ ఇఫ్తార్, క్రిస్మస్ ఫెస్ట్లకు 66 కోట్లు, గురుకులాలు, వసతి గృహాల నిర్వహణకు రూ.735 కోట్లు కేటాయించింది. -
పోలీస్.. పవర్ఫుల్..!
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేసిన ప్రభుత్వం హోంశాఖలో పోలీస్ విభాగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ప్రగతి పద్దు కింద రూ.1,389 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.975.95 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద ఈ ఏడాది రూ.4,400.68 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.3,852.21 కోట్లు కేటాయించింది.కొత్త జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలు, ఠాణాల నిర్మాణం, హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ మూడో దఫా నిధులు, ప్రతీ జిల్లాలో సిబ్బందికి క్వార్టర్లు, ట్రైనింగ్ సెంటర్లు, రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధునీకరణ, హోంగార్డుల జీతభత్యాలు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, సైనిక్ వెల్ఫేర్ తదితర విభాగాలకు సముచిత స్థానం కల్పిస్తూ నిధులు కేటా యించింది. – సాక్షి, హైదరాబాద్ ‘హైదరాబాద్’కే అగ్ర తాంబూలం.. రాష్ట్ర పోలీస్ శాఖకు కేటాయించిన మొత్తం ప్రగతి బడ్జెట్లో రూ.574 కోట్లు హైదరాబాద్ నగర కమిషనరేట్ కోసమే కేటాయించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి ఇందులో నుంచి రూ.280 కోట్లు కేటాయించా రు. ఐటీ బ్యాక్బోన్ సపోర్ట్, సీక్రెట్ సర్వీస్ ఫండ్, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, రంజాన్, బక్రీద్, బతుకమ్మ, దసరా తదితర పండగల బందోబస్తుకు రూ.10 కోట్ల మేర నిధులు ఇచ్చారు. స్టాఫ్ క్వార్టర్స్, కార్యాలయాలు, నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.40 కోట్లు ప్రగతి పద్దులో ప్రభుత్వం కేటాయించింది. డీజీపీకి గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది దానిని 98 శాతం పెంచుతూ రూ.604.86 కోట్లు కేటాయించింది. కొత్త జిల్లాల కార్యాలయాలకు రూ.400 కోట్లు కొత్త జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్ల నిర్మాణానికి ప్రగతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.20 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇచ్చింది. వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి మూడో దఫా రూ.20 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమ్యూనికేషన్స్, నెట్వర్క్ టెక్నాలజీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది. అన్ని జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నూతన భవనాల కోసం రూ.40 కోట్లు, డీజీపీ అకౌంట్ కింద సీక్రెట్ ఫండ్కు రూ.3.22 కోట్లు ఇచ్చింది. పలు జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న అగ్నిమాపక కేంద్రాల కోసం రూ.8.9 కోట్లు ప్రగతి బడ్జెట్లో కేటాయించగా, పక్కా భవనాలు లేని అగ్నిమాపక కేంద్రాలు, శిథిలావస్థలో ఉన్న కేంద్రాలకు నూతన భవనాలకు రూ.4.33 కోట్లు కేటాయించింది. ఇంటెలిజెన్స్కు రూ. 36.67 కోట్లు రాష్ట్రానికి కీలక విభాగమైన ఇంటెలిజెన్స్కు ప్రగతి పద్దులో తగినన్ని నిధులు కేటాయించింది. మొత్తం రూ.36.67 కోట్లు కేటాయించగా, అందులో ప్రధానంగా అంతర్గత భద్రతకు కావల్సిన ఆయుధాలు తదితర సామగ్రికి రూ.2 కోట్లు ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాల కల్పనకు రూ.6.19 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి ఏటా అందే మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, ఎల్డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం) నిధుల కింద రాష్ట్ర వాటాగా ఈ ఏడాది రూ.114.80 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం తోడ్పాటుతో ముందుకెళతాం.. పోలీస్ శాఖపై నమ్మకం ఉంచిన రాష్ట్ర సర్కార్ గతేడాదికంటే రెట్టింపు బడ్జెట్ కేటాయించింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్త జిల్లాల్లోనూ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలందించేందుకు ఈ బడ్జెట్ ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ కమిషనరేట్లో చేపట్టిన వినూత్న పద్ధతులను జిల్లాల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతీ పోలీస్స్టేషన్లలో రిసెప్షన్లు ఏర్పాటు చేసి బాధితులకు ఠాణా అంటే భయం లేకుండా స్నేహపూర్వక వాతావరణం సృష్టిస్తాం. సీసీటీవీలు, కమాండ్ సెంటర్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలా అన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం సహకారంతో ఈ ఏడాది కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. – డీజీపీ మహేందర్రెడ్డి -
కేసీఆర్ ఎన్నికల రథానికి.. జెండాపై రైతన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నాగేటి సాళ్లకు నిధుల వరద పారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా 26 శాతం నిధులను సాగుకే మళ్లించింది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి రైతులోకాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే మొదటి బడ్జెట్లో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిన సర్కారు ఈసారి.. వారికోసం రెండు భారీ వరాలు ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగానే ప్రకటించినట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించే బృహత్తర పథకాన్ని ప్రకటించింది. పునాస పంటలకు ఏప్రిల్లో, యాసంగి పంటలకు నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. దీనికితోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ‘రైతు బీమా పథకం’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ రెండు పథకాలు మినహా బడ్జెట్లో కొత్త వరాలేమీ ప్రకటించలేదు. రైతులకిచ్చే వడ్డీలేని పంట రుణాలకు రూ.500 కోట్లు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రూ.522 కోట్లు కేటాయించింది. ట్రాక్టర్లు, సేద్యపు పరికరాలతోపాటు నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వానికి రైతులకు అనుసంధానంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర రానట్లయితే రైతు సమన్వయ సమితి నేరుగా వాటిని కొనుగోలు చేస్తుందని, అందుకు తగిన నిధులను సమకూరుస్తామని భరోసానిచ్చింది. 2018–19 సంవత్సరానికి మొత్తం రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందులో రూ.20,820 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకే వెచ్చించనుంది. సాగునీటికి గతేడాది మాదిరే.. వ్యవసాయం తర్వాత సాగునీటి రంగానికి రెండో ప్రాధాన్యమిచ్చింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది తరహాలోనే రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో భాగంగా ప్రాజెక్టులపై ఖర్చు చేసే నిధులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుకు వెచ్చించే నిధులు రైతు ప్రయోజనాలను ఉద్దేశించినవే కావటం గమనార్హం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.4,984 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా.. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ఉంటుంది. అందుకే సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో అన్ని వర్గాలపై ప్రభుత్వం వరాలు కురిపిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆకర్షనీయ పథకాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. రైతుల తర్వాత మైనారిటీలు రాష్ట్రంలో మొత్తం 76 లక్షల మంది రైతులున్నారు. వారిని ఆకట్టుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. అన్నదాతల తర్వాత మైనారిటీలను ఆకట్టుకునేందుకు ఎక్కువ నిధులు వెచ్చించింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో మైనారిటీలకు రూ.4,400 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు వెచ్చించిందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. బీసీలు, ఎంబీసీలకు పాత నిధులే గతేడాది బీసీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేయటంలో మాత్రం ఆసక్తి కనబరచలేదు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించినా నిధులు ఖర్చు చేయలేదు. అయినా ఈసారి రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ యువతకు భారీ సబ్సిడీపై స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మూడేళ్లుగా ఆచరణలో విఫలమైంది. ఈసారి ఆర్థిక చేయూతనిచ్చే స్వయం ఉపాధి పథకాలకు రూ.1,682 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్లకు రూ.5,366 కోట్లు కేటాయించింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులకు రూ.3,282 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధికి(సీడీపీ) రూ.480 కోట్లు వెచ్చించనుంది. వరుసగా నాలుగేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ భగీరథ పథకానికి రూ.1,803 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. బడ్జెటేతర నిధులతో వీటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం తరఫున అందిస్తామని ప్రకటించిన సీఎం.. బడ్జెట్లో ఈ మేరకు నిధులు సర్దుబాటు చేశారు. గ్రామ పంచాయతీల నిధికి రూ.1,500 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,000 కోట్ల కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లకు కూడా రూ.700 కోట్ల ప్రత్యేక నిధిని ప్రకటించింది. ముఖ్యమంత్రి నిధి 3 వేల కోట్లు గతంలో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధికి బడ్జెట్ నుంచి కేటాయింపులు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి రూ.3000 కోట్లు కేటాయించినా బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఐ శాఖకు ఈసారి రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ప్రవాస తెలంగాణవాసుల అభివృద్ధి, సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న తెలంగాణవాసుల కష్టాలు తీర్చేందుకు ఈ నిధులను వెచ్చించే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2018-19 మొత్తం బడ్జెట్: 1,74,453.83 ప్రగతి పద్దు: 1,04,757.90 నిర్వహణ పద్దు:69,695.93 ( రూ. కోట్లలో) బడ్జెట్పై సాక్షి మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి -
పర్యాటకానికి మొండిచెయ్యి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకోగలిగే ప్రాంతాలు ఉన్నప్పటికీ... వసతుల కరువు, ప్రచార లేమితో ప్రయోజనం ఉండడం లేదు. అయినా పర్యాటకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో నామమాత్రంగా నిధులు కేటాయించింది. పర్యాటక శాఖకు కేవలం రూ.107 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ ప్రగతి పద్దు కింద కేటాయించిన నిధులు రూ.80 కోట్లే. కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. వృద్ధ కళాకారుల పింఛన్కు రూ.6.75 కోట్లు, సాంస్కతిక అకాడమీలకు సాయంగా రూ.4 కోట్లు, సాంస్కృతిక ఉత్సవాలకు రూ.15 కోట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథికి రూ.18 కోట్లు కేటాయించింది. పురావస్తు శాఖకు నామమాత్రమే రాష్ట్రంలో ఎన్నో చారిత్రక విశిష్టతలున్న ప్రాంతాలు, నిర్మాణాలు ఉన్నా.. ఆలనాపాలనా లేక దెబ్బతింటున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ నిధులు, సిబ్బంది లేక నిస్తేజంగా మారింది. ఇలాంటి సమయంలోనూ పురావస్తు శాఖను పట్టించుకోని ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో నామమాత్రంగా రూ.కోటి మాత్రమే కేటాయించింది. గతేడాది కూడా ఇలాగే తక్కువ నిధులు ఇచ్చినా.. అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకుని అదనంగా నిధులు విడుదల చేయించుకున్నారు. ఆ నిధులతో కొత్త ప్రాంతాల్లో చారిత్రక తవ్వకాలు, మ్యూజియంలలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్కు రూ.26,145 కోట్లు
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం అమల్లోకి తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)కి తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది కన్నా దాదాపు 12 శాతం నిధులు పెంచింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.26,145.90 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.16,452.79 కోట్లు, ఎస్టీలకు రూ.9,693.11 కోట్లు చొప్పున ఖర్చు చేయనుంది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖలకు విడదీస్తూ శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించింది. వ్యవసాయం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా విభాగాలకు ఎక్కువగా నిధులిచ్చింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుల్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలున్నాయి. ఎస్సీ ఎస్డీఎఫ్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రూ.2,551.67 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో రూ.2,800.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేటగిరీల వారీగా ఎస్డీఎఫ్ రూ.కోట్లలో కేటగిరీ 2017–18 2018–19 ఎస్సీ 14,375.12 16,452.79 ఎస్టీ 8,165.87 9,693.11 ఫిబ్రవరి నెలాఖరు నాటికి 54 శాతమే బడ్జెట్ మార్పుల్లో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు బదులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలో మార్పులు చేసిన సర్కారు.. కేటాయించిన ప్రతి పైసా ఖర్చు చేయాలని, పూర్తిస్థాయిలో ఖర్చవకపోతే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని నిర్ణయించింది. 2017–18కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఫిబ్రవరి నెలాఖరునాటికి 54 శాతం నిధులే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి వార్షిక ఖర్చుల నివేదికపై స్పష్టత రానుంది. ఖర్చులపై ఆడిట్ ముగిసిన తర్వాత ఎంత మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేయాలో లెక్క తేలనుంది. ఈ ప్రక్రియంతా మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కేంద్రం వైపే.. రాష్ట్రం చూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకుంది. ఆశించినన్ని నిధులు రావని తెలిసినా.. గడిచిన నాలుగేళ్ల అనుభవాలను విస్మరించి మరోసారి భారీ అంచనాలను వేసుకుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను భూతద్దంలో చూపించింది. గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పన్నుల వాటాతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ల రూపంలో దాదాపు రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర బడ్జెట్ తేటతెల్లం చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కేంద్రం నుంచి రూ.48 వేల కోట్లు వస్తాయనే అంచనాలతో బడ్జెట్ను తయారు చేసింది. ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన మేర సాయం అందటం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ ఏడాది కిందటే సిఫారసు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. వీటికి తోడుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో కోత వేయటంతో పాటు సీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే గ్రాంట్లను సైతం పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయని బడ్జెట్లో ప్రస్తావించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పన్నుల వాటా రూ.19,207.43 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,720.26 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.9,723.44 కోట్లు వస్తాయని పక్కాగా లెక్కలేసిన ప్రభుత్వం..అదనంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రాంట్లు వస్తాయని లెక్కలేసుకుంది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.900 కోట్లు, ఇతర గ్రాంట్ల కింద రూ.15,698 కోట్లు వస్తాయని అంచనాలు వేసుకుంది. ‘ఫెడరల్’వ్యూహం ఆశలకు గండికొట్టేనా.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది పాత జిల్లాలకు కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధిని గతంలో విడుదల చేసింది. ప్రతి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లు విడుదల చేసింది. తొలి రెండేళ్లు నిధులు కేటాయించిన కేంద్రం.. గత రెండేళ్లుగా పెండింగ్లో పెట్టింది. వీటిని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. ఈ నిధులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇటీవలే సమర శంఖం పూరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అదనంగా నిధులు రావటం కష్ట సాధ్యమనే అభిప్రాయాలున్నాయి. అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం పరిణామాల దృష్ట్యా.. కేంద్రం తెలంగాణపై మరింత శీతకన్ను వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.15 వేల కోట్లకు పైగా గ్రాంట్లు, ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
‘హైదరాబాద్’కే సొంత నాణాలు, పేపర్ కరెన్సీ
మొగల్ సామ్రాజ్య పతనంతో 1857లో గోల్కొండ సంస్థానం స్వతంత్ర రాజ్యంగా ఉనికిలోకి వచ్చింది. అప్పట్లో దాదాపు దేశం మొత్తం బ్రిటిష్ కరెన్సీ వినియోగించినా.. హైదరాబాద్ మాత్రం సొంత కరెన్సీ రూపొందించుకుంది. ఐదో నిజాం ఆఫ్జలుదౌల్లా హైదరాబాద్లోని సుల్తాన్ షాహీలో నాణాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాణాలను నాలుగు రకాలుగా.. బంగారం, వెండి, రాగి, ఇత్తడితో తయారు చేసేవారు. తొలుత 12.03 గ్రాముల బరువుండే రాగి నాణాలు, 11.02 గ్రాముల వెండి నాణాలు విడుదల చేశారు. తర్వాత 1890 ప్రాంతంలో 1.37 గ్రాములు, 2.07 గ్రాముల బరువుండే చిన్న వెండి నాణాలను, చిన్న రాగి, ఇత్తడి నాణాలను ముద్రించారు. ఇక 1905 నుంచి 1945 మధ్య నాలుగు రకాల బంగారు నాణాలనూ ముద్రించారు. వాటిల్లో 11.09 గ్రాముల బంగారు నాణెం చాలా గుర్తింపు పొందింది. -
కేంద్ర పథకాలకు తగ్గిన బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే పథకాలకు బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే ఈసారి తగ్గాయి. కేంద్ర పథకాలకు ఈ బడ్జెట్లో మొత్తం రూ.1,876 కోట్లను కేటాయించింది. ముఖ్యంగా సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,175 కోట్లు కేటాయించగా, 2018–19 బడ్జెట్లో రూ.1,058 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే రూ.117 కోట్ల మేర కేటాయింపులను ఈ ఏడాది తగ్గించింది. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ), మధ్యాహ్న భోజనం, వయోజన విద్య, ఇతర విద్యా కార్యక్రమాల కింద రూ.818 కోట్లను కేటాయించింది. కంప్యూటర్ విద్య, డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాలకు అరకొర కేటాయింపులతో సరిపుచ్చింది. పాలిటెక్నిక్లలో ప్రత్యామ్నాయ విద్యా బోధనకు నిధులను కేటాయించలేదు. -
వర్సిటీల ప్రగతి పద్దులో కోత
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, విద్యాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో సగం కోత పెట్టింది. ప్రగతి పద్దు కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 420.89 కోట్లు కేటాయించిన సర్కారు...ఈసారి దాన్ని రూ. 210.42 కోట్లకే పరిమితం చేసింది. అలాగే నిర్వహణ పద్దులోనూ వర్సిటీలు అడిగిన మేర నిధులివ్వలేదు. ♦ ఉస్మానియా యూనివర్సిటీకి నిర్వహణ పద్దు కింద రూ. 433 కోట్లు కావాలని అడిగితే రూ. 309.54 కోట్లు మాత్రమే ఇచ్చింది. అయితే గతేడాది కేటాయించిన రూ. 269.17 కోట్లకు అదనంగా నిధులు కేటాయించింది. ♦ శాతవాహన యూనివర్సిటీలో వేతనాలు, నిర్వహణకు నిర్వహణ పద్దు కింద రూ. 16.14 కోట్లు కావాలని అడిగితే..రూ. 8.71 కోట్లు (గతేడాది రూ. 7.57 కోట్లే) కేటాయించింది ♦ మహత్మాగాంధీ యూనివర్సిటీకి రూ. 22.65 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తే రూ.19.50 కోట్లు (గతేడాది రూ. 16.95 కోట్లు) కేటాయించింది. ♦ తెలంగాణ యూనివర్సిటీకి రూ. 22.55 కోట్లు కావాలని అడిగితే ఎక్కువ మొత్తాన్నే రూ. 23.77 కోట్లు (గతేడాది రూ.20.67 కోట్లు) కేటాయించింది. ♦ తెలుగు యూనివర్సిటీకి రూ. 33.68 కోట్లు అవసరమని అడిగితే రూ.19.50 కోట్లు కేటాయించింది. ♦ కాకతీయ యూనివర్సిటీకి గతేడాది రూ. 75.76 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 87.12 కోట్లు కేటాయించింది. ♦ పాలమూరు విశ్వవిద్యాలయానికి గతేడాది రూ. 5.77 కోట్లు ఇవ్వగా ఈసారి రూ. 6.64 కోట్లు ♦ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గతేడాది రూ.9.09 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 10.45 కోట్లు కేటాయించింది. గురుకులాలకు రూ.2,713.55 కోట్లు సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నెలకొల్పిన గురుకుల పాఠశాలలకు బడ్జెట్ అంతంత మాత్రంగానే కేటాయించింది. గత రెండేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనికి తోడు పార్ట్టైమ్ టీచర్లతో నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో కొత్త భవనాలు, నియామకాలు చేపట్టాల్సి ఉంది. కానీ తాజా బడ్జెట్లో కొత్త కేటాయింపులేవీ లేవు. కేవలం నిర్వహణ, ప్రస్తుతమున్న సిబ్బంది వేతనాలకు మాత్రమే రూ.2,713.55 కోట్లు కేటాయించింది. కొత్తగా ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో తరగతుల సంఖ్య పెరగనుంది. దీంతో వ్యయం అధికం కానుంది. ఈ నేపథ్యంలో గతేడాది తరహాలోనే కేటాయింపులు జరపడంతో గురుకులాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. విద్యా రంగానికి నిధులు నామమాత్రమే సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం దాని ప్రస్తావనే తేలేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాములు గురువారం ఆరోపించారు. విద్యారంగానికి 10 శాతం కూడా బడ్జెట్ కేటాయించలేదని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తం రెడ్డి పేర్కొన్నారు. నామమాత్రపు బడ్జెట్ కేటాయింపులతో విద్యను ఎలా బలోపేతం చేస్తారని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భుజంగ రావు, జి.సదానందం గౌడ్ ప్రశ్నించారు. -
చదువుకు చదివింపులు!
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్లో ఈసారి విద్యాశాఖకు కేటాయింపులు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో విద్యాశాఖకు ప్రభుత్వం రూ. 12,705.65.72 కోట్లు కేటాయించగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ. 13,278.19 కోట్లు కేటాయించింది. గతేడాది సవరించిన బడ్జెట్ (రూ. 12,635.54 కోట్లు) ప్రకారం చూస్తే ఈసారి రూ. 642.65 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. అయితే వేతనాలు, డీఏ, ఇతర ఖర్చుల కిందే ఈ మొత్తాన్ని పెంచింది. వాస్తవానికి విద్యాశాఖకు దాదాపు రూ. 15 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో రూ. 13,278 కోట్ల మేరకే కేటాయింపులు చేసింది. నిర్వహణ పద్దులోనే పెంపు ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దులోనే కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. ముఖ్యంగా వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇతర భత్యాల కింద అధిక మొత్తం వెచ్చించాల్సి రావడంతో ఈ కేటాయింపులు జరిపింది. పాఠశాల విద్యలో గతేడాది నిర్వహణ పద్దు కింద రూ. 8,157 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని రూ. 8,685 కోట్లకు పెంచింది. ఇక ప్రగతి పద్దులోనూ దాదాపు రూ. 103 కోట్లు పెంచింది. ఉన్నత విద్యలోనూ నిర్వహణ పద్దులో రూ. 100 కోట్లకుపైగా అధికంగా కేటాయింపులు జరిపిన ప్రభుత్వం... ప్రగతి పద్దులో గతేడాదికంటే ఈసారి రూ. 150 కోట్ల మేర కేటాయింపులను తగ్గించింది. సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దు కింద కేటాయింపులను కొంత పెంచగా ప్రగతి పద్దు కింద గతేడాది కేటాయించిన వి«ధంగానే ఈసారీ కేటాయింపులు జరిపింది. ‘సాంకేతిక విద్య’కు అంతంతే.. ♦ అడిగింది రూ. 907 కోట్లు...కేటాయించింది రూ. 422 కోట్లే ♦ ప్రత్యేక అభివృద్ధికి రూ. 334 కోట్లు అడిగినా పైసా ఇవ్వని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యాశాఖకు ప్రభుత్వం బడ్జెట్లో అరకొర నిధులనే కేటాయించింది. వేతనాలు, నిర్వహణకే కేటాయింపులు జరిపింది. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలకు ప్రగతి పద్దు కింద పైసా ఇవ్వలేదు. సాంకేతిక విద్య నిర్వహణ, అభివృద్ధికి నిర్వహణ పద్దు కింద రూ.627 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.280 కోట్లు కలిపి మొత్తంగా రూ. 907 కోట్లు కావాలని అడిగితే నిర్వహణ పద్దు కింద రూ.361 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.61 కోట్లు మొత్తంగా రూ. 422 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలు, అభివృద్ధి కోసం రూ. 334 కోట్లు కావాలని కోరినా పైసా ఇవ్వలేదు. వాటిల్లో పని చేసే సిబ్బంది వేతనాలు, నిర్వహణకు రూ.127.12 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు అడిగినా పైసా ఇవ్వనిది వీటికే... విద్యా సంస్థ అడిగిన మొత్తం (రూ. కోట్లలో) ఆర్జీయూకేటీ 90 జేఎన్టీయూ హైదరాబాద్ 30 జేఎన్టీయూ కాలేజీ సుల్తాన్పూర్ 87 జేఎన్టీయూ కాలేజీ కరీంనగర్ 51 జేఎన్టీయూ కాలేజీ మంథని 76 మొత్తం 334 ఫీజులకు రూ.2,903 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. 2017–18 సంవత్సరం బడ్జెట్లో రూ. 1,939.31 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు వెయ్యి కోట్లు ఎక్కువ కేటాయించింది. దీంతో బకాయిలతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించే అవకాశం ఉంది. తాజా బడ్జెట్లో ఫీజులు, ఉపకారవేతనాల కోసం రూ. 2,903.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 2,020.21 కోట్లు, ఉపకార వేతనాల కోసం రూ. 882.85 కోట్లు కేటాయించింది. కల్యాణ కానుకకు రూ.1,400 కోట్లు.. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థిక సాయంపైనా సర్కారు ఉదారత చూపింది. బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.1,400 కోట్లు కేటాయించింది. దీంతో ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్ల లోపే ఉన్న బడ్జెట్ ఒక్కసారిగా పెరిగింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ సాయం చేయాలన్న లక్ష్యంతో ఈ మేరకు నిధులు పెంచింది. ఈ పథకాల కింద బీసీలకు రూ. 700 కోట్లు, ఎస్సీలకు రూ. 400 కోట్లు, ఎస్టీలకు రూ. 150 కోట్లు, మైనార్టీలకు రూ. 150 కోట్లు కేటాయించింది. -
కేసీఆర్ తెలంగాణ ద్రోహి: జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని.. మిషన్ కాకతీయ, భగీరథ కాంట్రాక్టులు ఆంధ్రా వ్యక్తులకు ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై పలు వ్యాఖ్యలు చేశారు. 1999కి ముందు అసలు కేసీఆర్ తెలంగాణ అనే పదం మాట్లాడలేదని, పలు పదవులు అనుభవించిన తర్వాత తెలంగాణ వాదం వినిపించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్ల పాలనలో రూ. 70వేల కోట్ల అప్పు అయ్యిందని.. తెలంగాణ ఏర్పాటు తరువాత కేవలం మూడేళ్లలోనే రూ. 70వేల కోట్లు అప్పు చేసిన ఘనత కేసీఆర్దేనని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లు నిమ్మకు నీరెత్తనట్లు ప్రధాని నరేంద్ర మోదీ పాట పాడిన కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ప్లేట్ ఫిరాయించారని విమర్శించారు. గత నాలుగేళ్లుగా జనాభా ప్రాతిపదికన బడ్జెట్ వెచ్చించలేదని, రిజర్వేషన్లపై అలసత్వం వహించారన్నారు. మైనారిటీల హక్కులను కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ బలం కేవలం 3శాతం మాత్రమేనని, మోదీ డైరెక్షన్లోనే కేసీఆర్ మూడో కూటమి తెరపైకి తెచ్చారని చెప్పారు. తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డిలు ఎప్పుడైనా తెలంగాణ కోసం పోరాటాలు చేశారా అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభ నడపడం కేసీఆర్కి మాత్రమే చెల్లుతుందని ఆయన ఎద్దేవా చేశారు. -
మోదీకి పట్టిన గతే కేసీఆర్కు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధికి, వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా పూర్తి సమతుల్యతతో ఉందని సీఎం కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తగా.. మరోవైపు కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తప్పుడు లెక్కలు, మాయ మాటల బడ్జెట్తో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కావలిసిన వారికి, కమిషన్లు ఇచ్చేవారికే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసేవిధంగా బడ్జెట్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ భవన్లో గురువారం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ ఛాట్ చేశారు. అప్పులు తేవడం, అడ్డుగోలుగా ఖర్చు చేయడమే సీఎం కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ బడి బయట ఉండే విద్యార్థి మాత్రమే. సచివాలయానికి రాని కేసీఆర్కు పరిపాలనపై ఎన్నటికీ పట్టు దొరకదు. కేసీఆర్ ప్రభుత్వానికి అమరవీరుల కుటుంబాలు, రైతుల కుటుంబాలు, నిరుద్యోగులు అంటే టీఆర్ఎస్ సర్కార్కు లెక్కలేదని ఈ బడ్జెట్తో తేలిపోయింది. ఈ బడ్జెట్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు బంధం తెగిపోయింది. ఈ బడ్జెట్ దెబ్బతో నిన్న ప్రధాని నరేంద్ర మోదీకి పట్టిన గతే రేపు కేసీఆర్కు పడుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ ప్రస్తావించిన మరిన్ని అంశాలు ఇవే: ఇప్పటి వరకు టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో 30నుంచి 40శాతం లోటు ఉంది ప్రతిపాదనలు, సవరణలపై కనీస అంచనాలు లేవు. అందుకే పాలనపై కేసీఆర్కు పట్టులేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బడ్జెట్లో కేటాయించిన నిధులు 49వేల ఇళ్లకు కూడా సరిపోవు. కేసీఆర్ మూడు లక్షల ఇండ్లు కడతామంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది కేసీఆర్? 2016-17 బడ్జెట్లో ఇండ్లకు కేంద్రం ఇచ్చిన ఆరువేల కోట్లనే దారిమళ్లించారు కేసీఆర్ దళితులకు మూడెకరాల కోసం కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నాలుగు లక్షలు మంది భూమిలేని దళితులు ఉన్నారు ఫీజు రీయింబర్స్ మెంట్కు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం దారుణం. పేదలను విద్యను దూరం చేస్తున్నారు సాగునీటి రంగానికి గతంలో కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి రాష్ట్రంలో నీళ్లు అందుబాటులో ఉన్న భూమి కోటి ఎకరాలకు పెట్టుబడి రాయితీకి ఆరువేల కోట్లు సరిపోతాయి. కానీ రూ.12 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? లేని భూమికి కేటాయింపులా..? ఇది రైతులను మభ్యపెట్టే చర్య మాత్రమే. ఈ నాలుగేళ్లలో రైతులపై రుణమాఫీకి సంబందించి రూ. 12వేల వడ్డీ భారం వారిపై పడింది ఈ బడ్జెట్ ద్వారా రైతులకు రుణమాఫీ చేయలేనని కేసీఆర్ చెప్పారు. రైతులను పచ్చిగా మోసం చేశారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 4200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అమరుల కుటుంబాలకు గతంలో ఇస్తామన్న భూములు, ఉద్యోగాు ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలి -
తెలంగాణ బడ్జెట్ 2018-19
-
తెలంగాణ బడ్జెట్ 2018-19 హైలైట్స్..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ కూడా అదే పంథాను అనుసరించింది. రూ.1.74,453 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బడ్జెట్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం.. 2018-19 బడ్జెట్కు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయనకు వరుసగా ఇది ఐదో బడ్జెట్. ఇక శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, నిర్వహణ పద్దుకు రూ.61,607 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు.. అందులోని ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణ బడ్జెట్ 2018-19 హైలైట్స్.. 2018-19 వార్షిక బడ్జెట్ మొత్తం రూ.లక్షా 74వేల 453కోట్లు రెవిన్యూ వ్యయం రూ.లక్షా 25వేల 454కోట్లు క్యాపిటల్ వ్యయం రూ.33వేల 369కోట్లు రాష్ట్ర ఆదాయం రూ.73వేల 751కోట్లు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం రూ.29వేల 41కోట్లు రెవిన్యూ మిగులు రూ.5,520కోట్లు నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోంది ఈ ఏడాది వృద్ధి రేటు 10.4గా ఉంటుందని అంచాన తయారీ రంగంలో వృద్ధి రేటు 7.5శాతం గత ఏడాది తలసరి ఆదాయం రూ.1,75,534 గతే ఏడాది వ్యవసాయం రైతుపెట్టుబడి సాయం 2018-19 నుంచి ప్రారంభం. ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం రైతు సమన్వయ సమితీల ఏర్పాటు 100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి త్వరలో ధరణి వెబ్సైట్ ఆవిష్కరణ రైతుల పెట్టుబడి సాయానికి రూ.15వేల కోట్లు రైతులబీమాకోసం రూ.500కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522కోట్లు కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు రూ.132కోట్లు బిందు, తుంపర సేద్యానికి రూ.150కోట్లు పాలీ గ్రీన్ హౌస్కు రూ.120కోట్లు నీటి పారుదల/విద్యుత్ రంగం నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు మిషన్ భగీరథకు రూ.1,801కోట్లు విద్యుత్శాఖకు రూ.5,650కోట్లు విద్యుత్ రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం గత జనవరి నుంచి 24గంటల విద్యుత్ ఇస్తున్నాం విద్యారంగం విద్యాశాఖకు రూ.10,830కోట్లు గురుకుల పాఠశాలలకు రూ.2,828కోట్లు ఇప్పటి వరకు 80,048 ఉద్యోగాలను భర్తీ చేశాం.. 27,588 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది సంక్షేమ రంగం మహిళా శిశు సంక్షేమానికి రూ.1,799కోట్లు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలకు రూ.1450కోట్లు డబుల్ బెడ్ రూం.ఇళ్లకు రూ.2,643కోట్లు పౌరసరఫరాల శాఖకు రూ.2,946కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.5000కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16వేల 753కోట్లు ఎస్టీలకు రూ.9000కోట్లు పైనే దళితులకు భూపంపిణీకి రూ.1,469కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2000కోట్లు రజకుల ఫెడరేషన్కు రూ.200కోట్లు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్కు రూ.250కోట్లు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75కోట్లు న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లు బీసీ సంక్షేమానికి రూ.5,920 కోట్లు ఎస్సీల సంక్షేమానికి రూ.12,603కోట్లు ఎస్టీల సంక్షేమానికి రూ.8,063 కోట్లు గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం రూ.561కోట్లు ఎంబీసీ సంక్షేమానికి రూ.1000కోట్లు గ్రామీణం / పట్టణం / పరిశ్రమలు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు పట్టణాభివృద్ధికి రూ.1,000కోట్లు స్థానిక సంస్థలకు రూ.1500కోట్లు వరంగల్కు 300కోట్లు సాంస్కృతిక రంగం రూ.58కోట్లు చేనేత టెక్స్టైల్స్కు రూ.1200 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యం రంగం రూ.1281కోట్లు ఆర్అండ్బీశాఖకు రూ.5,575కోట్లు స్థానిక సంస్థలకు రూ.1500 కోట్లు వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375కోట్లు పరిశ్రమల రంగానికి రూ.1,286 ఐటీ పరిశ్రమకు రూ.289కోట్లు ఆలయాలు యాదాద్రికి రూ.250కోట్లు భద్రాచల ఆలయ అభివృద్ధికి 100కోట్లు బాసర ఆలయానికి రూ.50కోట్లు, ధర్మపురి ఆలయానికి రూ.50కోట్లు -ఇతరాలు--- కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందిస్తున్నాం ఓపీ సేవలకోసం వెల్నెస్ సెంటర్లు తీసుకొచ్చాం హోంగార్డుల వేతనం రూ.9వేల నుంచి రూ.20వేలకు పెంచాం ఐటీలో గణనీయమైన పురోగతి సాధించాం గూగుల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఐటీలో మహిళలను ప్రోత్సహించేందుకు ఇటీవలె వీహబ్ ప్రారంభించాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణది ప్రథమ స్థానం టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య 51శాతం పెరిగింది తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయితీలుగా మారుస్తున్నాం -
'అలాంటి అదృష్టం నాకే దక్కింది'