Telugu language
-
తెలుగులోనూ కుంభమేళా సమాచారం
రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్లో 88878–47135 ఫోన్ నంబర్కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. భక్తుని ఫోన్ నంబర్ ‘కుంభ్ సహాయక్ యాప్’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నంబర్ యాప్లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. -
సంగీతఝురిలా.. తెలుగు భాష
వన్టౌన్ (విజయవాడపశ్చిమ): తెలుగు భాష వినసొంపైనదే కాకుండా.. సంగీతంలా మనసులను పరవశింపజేస్తుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మహాసభలను ప్రారంభించి మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. జాతి మనుగడకు, వికాసానికి భాష ప్రధానమైన పాత్ర పోషిస్తుందని, తెలుగు భాష సంగీతంలా మనసుకు హత్తుకుంటుందని చెప్పారశ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సీ నారాయణరెడ్డి వంటి గొప్ప కవులు రచయితలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భానుమతి వంటి నటులు, మంగళంపల్లి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి తెలుగు దిగ్గజాల గొప్ప వారసత్వం మనదన్నారు. తెలుగు భాషా వికాసానికి అడ్డంకిగా ఉన్న జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు వారిలో అద్భుత ప్రతిభ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగువారు అద్భుతమైన ప్రతిభను కనబరిచి సమాజానికి స్ఫూర్తినిచ్చారని భారత రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. సాహితీవేత్త పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నూతన సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకుని తెలుగు రచనలను మరింత విస్తృతం చేసుకోవాలని సూచించారు. హోసూరు (తమిళనాడు) ఎంపీ కే గోపీనాథ్ మాట్లాడుతూ తెలుగు భాష పరిపుష్టికి తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ మాట్లాడారు. తొలుత ‘మార్పు’ పేరుతో ముద్రించిన మహాసభల సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. -
తెలుగు వారిని తక్కువ చేసినట్లే హిందీతో పోల్చి చూడకూడదు : రాహుల్
వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది. ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు. -
'అమ్మ భాష'కు.. పాప్ అప్!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి ప్రాణం పోస్తుంది అమ్మ. ఆ బిడ్డకు తొలిగురువు అమ్మే అవుతుంది.. చిట్టి పలుకులు... బుజ్జి మాటలు నేర్పిస్తుంది.. అందుకే మనం మాట్లాడే భాషను అమ్మ భాషగా పరిగణిస్తాం... అదే ఒక భాషకు లిపి కావాలంటే వందల ఏళ్లు పడుతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఆమె జన్మ పరిపూర్ణమైనట్టు.. ఒక భాషకు లిపి రూపుదిద్దుకుంటేనే ఆ భాషకు పరిపూర్ణత వస్తుంది.అలా లిపి ఉన్న మన తెలుగు భాషకు, లిపికి వేల ఏళ్ల చరిత్ర ఉంది.. మానవుడు ఎన్నో మార్పులకు లోనైనట్టే.. మన తెలుగు లిపిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలక్రమంలో కొన్ని అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికే కొన్ని అక్షరాలు వాడుకలో లేవు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న అక్షరాల్లో తెలుగు లిపి ముందు వరుసలో ఉంది. దీనికి కారణాలు అనేకం. ఆ విశేషాలు తెలుసుకుందాం..తెలుగు లిపికి ప్రాణం పోస్తున్న ఆర్కిటెక్ట్..ప్రమాదంలో ఉన్న తెలుగు లిపిని బతికించుకునేందుకు ఇప్పటికే అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరే శశి గూడూరు. తెలుగు లిపిని పిల్లలతో పాటు భవిష్యత్తు తరాలకు గుర్తుండి పోయేలా ప్రయత్నిస్తున్నారు ఆయన. అందుకోసం వినూత్నంగా అచ్చులు, హల్లులతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ముఖ్యంగా పుస్తకం తెరవగానే అక్షరాలు త్రీడీ రూపంలో పాప్–అప్ అయ్యేలా తయారు చేశారు.చెరగని ముద్ర వేసేలా.. టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరుకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. మాతృభాషపై ఆయనకున్న మమకారంతో కళాక్షరిక అనే పుస్తకాన్ని రూపొందించారు. డిజైనింగ్లో ఆయనకున్న నైపుణ్యం మొత్తాన్ని రంగరించి దీన్ని తీసుకొచ్చారు. ‘క’అక్షరం నుంచి ‘క్ష’వరకూ తెలుగు హల్లులు పుస్తకం తెరవగానే పాప్–అప్ అవుతాయి. తెలుగులో ఇలాంటి పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఆ సందేశమే ప్రేరణ... ఆన్లైన్లో ఒక త్రీడీ కార్డు దొరికిందని, అందులో గుర్రం బొమ్మ ముందుకు దూసుకొస్తున్నట్టు ఉందని, అప్పుడే ఈ పుస్తకం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని వివరించారు. ఇంగ్లి‹Ùలో ఇలాంటి ప్రయోగాలు చేశారని, అందుకే తెలుగులోనూ ఇలా ఎందుకు తయారు చేయకూడదనే సంకల్పంతో ఈ బుక్ను తీసుకొచ్చానని చెప్పారు.ముఖ్యంగా ‘ఱ’అక్షరం వాడకం పూర్తిగా తగ్గిపోయిందని, ఆ అక్షరాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశానని, పుస్తకం తెరవగానే మళ్లీ ఉద్భవిస్తున్నట్టు రూపకల్పన చేశానని శశి చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబేలో విజువల్ కమ్యూనికేషన్స్లో పీజీ చేసే సమయంలో తెలుగుపై ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలుగు అక్షరాలు చిన్నపిల్లలతో పాటు, పెద్ద వారి మనసులోనూ చెరగని ముద్ర వేయాలన్న కోరికతోనే పాప్–అప్ పుస్తకాన్ని రూపొందించారు.తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవి... తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శశి గూడూరు చెప్పారు. తెలుగులో పలు రకాల ఫాంట్లు డిజైన్ చేశారు. అనేక డిజైన్లు రూపొందించారు. అచ్చుల్లో బొమ్మలు ప్రతిబింబించేలా శశి తయారు చేసిన పుస్తకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. యువతలో తెలుగుపై క్రేజ్ పెరిగేందుకు టీషర్టులపై తెలుగులో అక్షరాలను వినూత్నంగా డిజైన్ చేసి ప్రింట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగులపై కూడా ఆలోచనాత్మకంగా డిజైన్లు రూపొందించి, అవగాహన కల్పిస్తున్నారు.పలు లోగోల రూపకల్పన..తెలుగు భాష పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న శశి గూడూరు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తన సేవలందించారు. టీ–శాట్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ పర్యాటక శాఖ లోగోలను శశి గూడూరు రూపొందించారు. అలాగే తెలుగులో ఐదు రకాల ఫాంట్లను తయారు చేశారు. తనకు చేతనైనంతగా తెలుగుకు సేవ చేస్తున్నానని, భవిష్యత్తులో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని శశి గూడూరు చెబుతున్నారు. -
దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు!
సాక్షి: "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది.కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం. ఎంత ఎంత ఎడమైతే... అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు,తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం. మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు. మూడు భారతీయ భాషల విశేషం.. తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు,అని ఎందరెందరో కీర్తించారు. మిగిలిన భాషలను గౌరవిస్తూనే,మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.సర్వమత సహనం వలె,సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి, 10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి. ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్,స్పానిష్,జర్మన్, ఫ్రెంచ్,అరబిక్,రష్యన్,పోర్చుగీస్, జపనీస్,హిందీ,ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి. భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. జనని సంస్కృతంబు సకల భాషలకు.. "జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు. ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో,రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది. భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది. విద్యా బోధనలో, ఉద్యోగ, ఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం. ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. తల్లిభాష తల్లిపాల వంటిది.. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. వ్యాకరణం లేకపోతే పునాదిలేని భవనంలా భాషలు దెబ్బతింటాయి. నిన్నటి వరకూ మైసూర్లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు. వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత. - మాశర్మ -
తూర్పు తీరంలో వెల్లివిరిసిన ‘ తెలుగు రేఖలు’
ప్రపంచానికి తూర్పు వైపున ఉన్న ఆస్ట్రేలియాలో వైభవోపేతంగా తెలుగు వెలుగులీనుతోంది. ఆరు దశాబ్దాలుగా ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలుగు భాషా,సాహిత్యాలను, తెలుగు వారి అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన వారు ఎందరో ప్రముఖులు తమ మేధాసంపత్తితో, ప్రతిభాపాటవాలతో ఆస్ట్రేలియా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. విశ్వవిపణిపైన తెలుగు కీర్తి బావుటాను ఎగురవేస్తున్నారు.సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఎన్నో కష్టాలను,బాధలను అనుభవించారు. కానీ ఆ ఆరవై ఏళ్లల్లో వందలు, వేలు,లక్షలుగా తెలుగు వారి ప్రస్తానం సాగింది. ఆస్ట్రేలియాదేశంలోనే మన భాషకు ఒక సామాజిక గుర్తింపు, హోదా లభించాయి. ఈ 60 ఏళ్ల పరిణామాలపైన ప్రముఖ రచయిత, మెల్బోర్న్లో నివసిస్తున్న కొంచాడ మల్లికేశ్వరరావు రచించిన అద్భుతమైన పుస్తకం ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. మొదటి తరం అనుభవించిన కష్టాలను మొదలుకొని నేటి తరం చేరుకున్న ఉన్నతమైన విజయ శిఖరాల వరకు సమగ్రంగా చర్చించింది. మల్లికేశ్వరరావు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో తెలుగుభాష అభివృద్ధి కోసం విశేషకృషి చేస్తున్నారు. భువనవిజయం వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి నాటకాలను, కవిసమ్మేళనాలను, సాహిత్య చర్చలను నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు భాష గుర్తింపు కోసం ఆస్ట్రేలియా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అక్కడి తెలుగు సంఘాలతో కలిసి పని చేశారు. తెలుగు భాషాసంస్కృతులను ప్రాణప్రదంగా భావించే ఆయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ల తెలుగు వసంతాల ప్రస్తానం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం. అంతేకాదు. ఆస్ట్రేలియాకు వెళ్లే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుంది. -
బ్రిటిష్ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇచ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..! మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ అండ్ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
సీబీఎస్ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి. -
తెలుగు వారు ఎంతో ప్రేమను చూపించారు: రెబ్బా మోనికాజాన్
‘‘సామజవర గమన’ సినిమా సక్సెస్ టూర్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వెళ్లాం. నాకు తెలుగు భాష రాకపోయినా అక్కడి ప్రజలు నా పట్ల ఎంతో ప్రేమ,ఆప్యాయతను చూపించారు.అలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను’’ అని రెబ్బా మోనికాజాన్ అన్నారు. శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్కి పరిచయమైన రెబ్బా మోనికాజాన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయ్యాక కొన్ని యాడ్స్ చేశాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. దక్షిణాదిలో నేను ఇతర చిత్రాల్లో నటించినా ‘సామజవరగమన’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా తర్వాతి సినిమాకి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతాను’’ అన్నారు. -
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి తెలుగులో తొలి తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి ఓ తీర్పు తెలుగు భాషలో వెలువడింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్ను కొట్టివేస్తూ జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును తెలుగులో ఇచ్చింది. ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి స్థానిక భాషలో తీర్పునిచ్చింది. కేసు ఇదీ.. మచ్చబొల్లారంలో సర్వే నంబర్ 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 ఎకరాల భూమి ఉండేది. వీరారెడ్డికి ఇద్దరు కొడుకులు. వీరారెడ్డి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరోసగం తీసుకున్నారు. 2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యుటేషన్ చేయాలని ఒక కుమారుడు కె.చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. సాలమ్మ రాసిన వీలునామాపై మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ వారసత్వ చట్టం–1956 ప్రకారం హిందూ మహిళ తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి (4.08 ఎకరాలు)ని భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం–1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మను 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు. వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ నవీన్రావు, జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. -
కన్నడ గడ్డ.. తెలుగు భాషకు అడ్డా
అనంతపురం: ప్రస్తుత కాలంలో మాతృభాషకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ పట్టణంలో కన్నడ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఒక్కరూ కన్నడతో పాటు తెలుగు మాట్లాడతారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులు, కొత్త వారితో తప్ప వ్యవహార శైలి తెలుగులోనే ఉంటుంది. తెలుగు భాషతో పాటు తెలుగు పండుగలు, సంప్రదాయాలు కూడా అనుసరిస్తారు. పావగడ చుట్టూ ఆంధ్ర సరిహద్దు ఉంటుంది. కేవలం పశ్చిమ వైపు మాత్రమే చిత్రదుర్గం వెళ్లే మార్గం ఉంటుంది. మిగతా ఎటు వెళ్లినా ఆంధ్ర టచ్ చేయాల్సిందే. ఫలితంగా వివాహ సంబంధాలన్నీ ఆంధ్ర వాళ్లతోనే ఉండటంతో తెలుగు భాష ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. జిల్లా సరిహద్దుగా.. పావగడ తాలూకా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉంది. పశ్చిమ వైపు మినహా ఎటు వెళ్లినా 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఆంధ్ర సరిహద్దు వస్తుంది. పావగడ జనాభా (2011 ప్రకారం) 30 వేలు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుమకూరు జిల్లాలోని శిరా, మధుగిరి ప్రాంతాలు సమీపంలో ఉంటాయి. అయితే ఆ ప్రాంతాలకు వెళ్లాలన్నా మధ్యలో ఆంధ్ర పల్లెలు దాటాల్సిందే. మైసూరు రాష్ట్రం నుంచి.. పాత మైసూరు రాష్ట్రంలో పావగడ అంతర్భాగం. అప్పటి నుంచి తాలూకా కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీగానూ ఉంది. పావగడ తాలూకా పరిధిలో 150 గ్రామాలు ఉన్నాయి. చారిత్రకంగానూ పావగడకు పేరుంది. శనేశ్వరాలయం ప్రసిద్ధి. చుట్టుపక్కల ప్రజలు శనేశ్వరాలయ సందర్శన కోసం భారీగా వస్తుంటారు. పావగడలో ప్రాచీన కాలంలో కట్టిన కోట (700 మీటర్ల ఎత్తులో) ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. -
విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మాతృభాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు భాషను ప్రోత్సహిస్తూనే సువిశాల ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా సిలబస్లో మార్పులు తెచ్చామని చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన 30 మంది కళాకారులను, భాషాకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ‘మాతృభాషా సేవా శిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అ«ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషల ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. ఆంగ్లం నేర్చుకుని తెలుగును విస్మరించాలనే అభిప్రాయం సీఎంకు లేదన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. కల్లూరి భాస్కరం, డాక్టర్ విజయలక్ష్మీ పండిట్, డాక్టర్ ఓలేటి పార్వతీశం, పెరుగు రామకృష్ణ, డాక్టర్ కప్పగంతుల రామకృష్ణ, ఉపద్రష్ట రమణ, వేంపల్లి షరీఫ్, నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, గుంటూరు రామరాజు, డాక్టర్ పాములపాటి వెంకట శేషయ్య, పి.వి.గుణశేఖర్, డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, షేక్ అహ్మద్ జయా, వెంకట్ పూలబాల, వెంకటేష్ కులకర్ణి, ఎం.ఎ.రజాక్, సత్యవోలు రాంబాబు, టేకుమళ్ల వెంకటప్పయ్య, బి.అశోక్ కుమార్, కట్టెకోల చిన నరసయ్య, రమేష్ ఆడ్రికడర్ల, పొక్కులూరు సుబ్బారావు, కరణ్ శర్మ, గాజుల సత్యనారాయణ, అన్నవరపు బ్రహ్మయ్య. హర్మోహీందర్ సింగ్ సహనీ, డాక్టర్ కె.జి.ఆర్. శేషుకుమార్, డాక్టర్ కె.ఎస్. గోపాలదత్త, డాక్టర్ తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యమూర్తి ఉన్నారు. -
నిఘంటు నిర్మాణంలో కొత్త పోకడలు
మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. పాల పాకెట్టు, పాల వ్యాను– ఇలా వాడమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ఇక పత్రికల్లో సరేసరి. ఆంబులెన్స్ సేవలు, అకౌంట్ బదిలీ, కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు– ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న మిశ్రమ పదాలను వివరిస్తుంది సరికొత్త ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’. ‘‘నిఘంటు రచన మతి చెడిన వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ‘నా బొందో’ అంటూ కేంద్రీకరించి మరీ జరగాల్సిన పని. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కానీ, ఒకటి మాత్రం నిజం. అప్పుడప్పుడూ ఈ వృత్తి, నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది’’. – ఫ్రాన్స్ సాహిత్య చరిత్రను, ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘంటువును ఎలా నిర్మించాను’ అన్న అత్యుత్తమ గ్రంథాన్ని రచించిన ఎమిలీ లిత్రే. ఇప్పుడు మనం చర్చించుకునేది ఒక్కో అక్షరానికే కాదు, ఒక్కో పదానికి ఉన్న భిన్నార్థాలను గురించే కాదు, బహుశా ఇతర భాషా నిఘంటువులలో కూడా రాని, ఒక్క తెలుగులో మాత్రమే ఇటీవల వెలువడిన తొలి ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’ గురించి. పత్రికా భాషా నిఘంటువులు అనేక భాషల్లో ఎన్నో ఉండవచ్చు. కానీ, రెండు భాషలతో కూడుకున్న మిశ్ర సమాస నిఘంటువులు మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రత్యేక నిఘంటువును విద్యారంగంలో, బోధనా రంగంలో ఉస్మానియా, హైదరాబాద్, ద్రవిడియన్ విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా గడించిన అనుభవంతో ఆచార్య పులికొండ సుబ్బాచారి రూపొందించారు. పత్రికలు నిత్యం వాడుతూ పాఠకులకు అందించే కొత్త కొత్త మిశ్ర సమాసాల లోగుట్టును బయట పెట్టారు. ఆఫీసరమ్మ ఏ భాష? పదాల వాడకంలో మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. ఉదాహరణకు ‘ఆంబులెన్స్ సేవలు’, ‘అకౌంట్ బదిలీ’, ‘ఈడీ లేఖ’, ‘ఈ’ పుస్తకం (ఎలక్ట్రానిక్ పుస్తకం), కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, ఆఫీసరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు, పెళ్లి వీడియోలు, పేపరు ప్రకటన, ప్లాస్టిక్ చెత్త, పాల పాకెట్టు, కోళ్ల ఫారం, యూనియన్ ఎన్నికలు, సమ్మె హారన్, సీల్డు కవర్ ముఖ్యమంత్రి, స్పీకర్ నిర్ణయం – ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న తెలుగాంగ్ల మిశ్రమ సమాసాలకు ఆధారాలు, అర్థ వివరణలను సుబ్బాచారి ఎంతో శ్రమపడి అందు బాటులోకి తెచ్చారు. ఇందులో 1,600 సమా సాలకు పొందికైన వివరణలున్నాయి. సంప్ర దాయ వ్యాకరణాలు చూపించని సంధి సమాసాల నియమాలను రచయిత ప్రత్యేకించి చూపారు. ఇంతకు ముందు తెలుగు భాషలో ఉన్న అందమైన పదాలకు ‘ఒక్క పదం – అర్థాలెన్నో’ మకుటంతో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి తెలుగు పదాల అందచందాలను, ప్రత్యే కతను తెల్పడానికి విశిష్టమైన తొలి ప్రయత్నం చేశారు. నిఘంటు చరిత్ర ప్రాచీనం ఇలా ఒక్కో పదానికే కాదు, ఒక్కో ‘వర్ణా’నికి (అక్షరానికి) కూడా భిన్నార్థాలుంటాయన్నాడు క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. ప్రపంచంలో తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్ల నాటి సుమేరియన్, అక్కాడియన్ ప్రతి. ప్రపంచంలో తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్ – బాబిలోనియన్ – హిట్డయిట్ భాషల్లో వెలువడింది. అలాగే ఔషధ శాస్త్రానికి సంబంధించిన ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) తొలిసారిగా మెసపటోమియా మట్టి ఫలకలపై వెలుగు చూసిందంటారు. ఎటు తిరిగీ మానవాళి విజ్ఞాన, వికాస దశల్లోకి కాలిడిన తర్వాతనే శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగునాట వైద్య భాషకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని వెల్లడించారు. మన చరకుడి ఆయుర్వేద వైద్య శాస్త్రం, శుశ్రుత కృషినీ మరవలేం. వన మూలికల ప్రాశస్త్యం తెలిపిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుపరాతి యుగం) నాటిది. అనారోగ్యం అనేది ‘విధి నిర్ణయం కాద’ని చెబుతూ, మానవ ప్రయత్నం ద్వారా, సంకల్ప బలం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని చరకుడు తన వైద్య సంపుటం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. వ్యవహార నిఘంటువు ఆధునిక యుగంలో అలాంటి గొప్ప ప్రయత్నంలో భాగమే, సరికొత్త ప్రత్యేక మిశ్ర సమాస నిఘంటు నిర్మాణం అనీ, ఇది ‘ఆహ్వానించదగిన’ పరిణామమనీ అన్న భాషా శాస్త్రజ్ఞులు, మిత్రులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వర్రావు అభిభాషణతో ఏకీభవించని వారుండరు. తెలుగు వినియోగంలోకి వచ్చేసిన ‘పాల క్యాను, పాల మీటరు, పాల పాకెట్టు, పాల వ్యాను, పాల ట్యాంకరు’ లాంటి కొత్త సమాసాలు చేయమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. లేదా ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ‘ఇలా వాడొద్దు, ఇంగ్లిష్ పదాన్ని తెలుగు చేసుకొని వాడుకోమని ఎవరైనా పండితుడు చెప్పినా లేదా ప్రభుత్వం వారు నిర్దేశించినా ఫలితం ఉండదు. జన వ్యవహారాన్ని ఎవరూ మార్చలేరు. ఇది అనివార్యంగా జరుగుతూ ఉన్న భాషా పరిణామం అని అర్థం చేసుకోవా’లన్న సుబ్బాచారి వ్యవహార పరిజ్ఞానం మెచ్చుకోదగింది. భాషా పరిణామం అనేది ‘సమాజ సహజ పరిణామంలో భాగంగా’ జరుగుతున్నది కాబట్టే, ఇలా తెలుగాంగ్ల పదాల కలయికతో మిశ్రమ సమాసాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి భాషావేత్తలు ఈ పరిణామాన్ని విధిగా అధ్యయనం చేయవలసి ఉందన్న రచయిత భావన ప్రశంసనీయమైనది. ముందు పదాల విదేశీకరణం, దేశీయ పదాలు క్రమంగా ఉనికిలోకి వచ్చిన తరువాత దేశీకరణ, అవసరాన్ని బట్టి మిశ్ర భాషా సమాసాలూ భాషా పరిణామంలో అనివార్యమని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే – సకల భాషా, సంస్కృతుల సమ్మేళనమే ఒక మిశ్ర సమాస నిఘంటువు! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..
(డెస్క్ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు. యువతలో సాహిత్యాభిలాష ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు, గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు. ఆనాడే అక్షరాంకురార్పణ అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్ 1939 మార్చి 15న డిక్లరేషన్ ఇచ్చారు. పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు. ఎందరో మహానుభావుల ప్రశంస నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం. ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ 2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు. ఆంధ్రి విశిష్టతలు ► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్ సీఆర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి. ► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది. ► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి. ► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది. ► ప్రెస్ అకాడమీ ఆర్కివ్స్ వెబ్సైట్లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం. – మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం -
నిజంగా తెలుగు భాషపై అంత ప్రేమ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా?
విజయవాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలలో తెలుగు భాష ప్రాశస్త్యం, చిన్నతనం నుంచే తెలుగు నేర్చుకోవల్సిన అవసరం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. తెలుగు భాష వికసించాలని కోరుకోవడం తప్పు కాదు. మంచిదే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ తదితర ప్రముఖులు ఈ సభలలో పాల్గొని తమ సందేశాలు అందించారు. వెంకయ్య నాయుడు అయితే శ్వాస ఆగితే, భాష ఆగితే అంటూ ప్రాసతో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ప్రముఖులిద్దరని కాదు.. అక్కడ మాట్లాడినవారిలో పలువురు పరోక్షంగా ఎపిలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది. ఏపీలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్దులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపద్యంలో దానిని ఏదో రకంగా వ్యతిరేకిస్తున్నవారు ఈ సభలో తెలుగు గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఎపి ప్రభుత్వం తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. తెలుగుదేశం నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పాలకులు ఇకనైనా మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య నాయుడు తదితరులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మృతభాష అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వక్తల కుటుంబాలకు చెందినవారు ఎంతమంది తెలుగులో ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగు సంస్కృతి కోసం సభలు పెట్టవచ్చు. కానీ తెలుగు భాషకు ఏదో అయిపోతోందన్న భావన కలిగించే యత్నమే బాగోలేదు. ఏ భాష ఎప్పుడూ మరణించదు. అందులోను కోట్ల మంది మాట్లాడే భాష అంత తేలికగా పోయేటట్లయితే, ఈ పాటికి చాలా భాషలు కనుమరుగు అయి ఉండేవి. వెంకయ్య నాయుడు కాని, రమణకాని, లేదా బుద్ద ప్రసాద్ కాని, ఇలాంటి ప్రముఖులంతా తమ మనుమలు, మనుమరాళ్లను సభకు తీసుకు వచ్చి వీరిని తెలుగు భాషలోనే తాము చదివిస్తున్నామని చెప్పగలిగి ఉంటే వారిని అంతా మరింతగా మెచ్చుకునేవారు. వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టులో తెలుగులోనే పాఠశాల నడుపుతున్నామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఒకవేళ అలా జరుగుతుంటే అభినందించాల్సిందే. తెలుగుకు సంబంధించి ఏ వార్త వచ్చినా పూనకం పూనినట్లు వార్తా కధనాలు, బానర్లు పెట్టే ఈనాడు అధినేత రామోజీరావు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూలలో తెలుగు మీడియంలోనే ప్రాధమిక విద్యను చెబుతామని ప్రకటించి ఉంటే గొప్పగా ఉండేది కదా? పోనీ రామోజీరావు లేదా, ఆయన వద్ద పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టులు ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో తెలపగలిగి ఉంటే ఎవరైనా విశ్వసించవచ్చు. తెలుగు భాషపై అంత ప్రేమ ఉన్న ప్రవాసాంధ్రులు తమ పిల్లలను అమెరికాలో కూడా తెలుగులోనే చదివిస్తున్నారా? లేదా వారిని ఇండియాకు తీసుకు వచ్చి స్వరాష్ట్రంలో తెలుగు స్కూళ్లలో చదివిస్తున్నారా? అమెరికాలో మనవాళ్లు తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిదే. ఇళ్ల వద్ద తెలుగు మాట్లాడిస్తే స్వాగతించవలసిందే. కొంతమంది కళలపట్ల ఆసక్తికలిగిన తల్లిదండ్రులు తెలుగులో పద్యపఠనం తదితర ప్రక్రియలను బోధిస్తున్నారు. ఇది సంతోషించవలసిన అంశమే. కాని అత్యధిక శాతం తెలుగువారి పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు మర్చిపోతున్నారు. వచ్చినా ఏదో పొడి, పొడి మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా వారికి ఎలా తెలుగు నేర్పించాలా అన్నదానిపై తానా లేదా ఇతర తెలుగు సంస్థలు దృష్టి పెడితే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి వారు సభలు పెట్టి విమర్శలు చేస్తే మొత్తం మారిపోతుందా? ఎపిలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు. దానికి స్పష్టమైన కారణం ఉంది. ఆంగ్ల మీడియం ఉన్న స్కూళ్లకే 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు.దాంతో ప్రభుత్వ స్కూళ్లు కేవలం పేదలకు, ఆర్థికంగా స్తోమత లేని బలహీనవర్గాలకే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసిపి ప్రభుత్వం కాని, కెసిఆర్ ప్రభుత్వం కాని ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టాయి. కెసిఆర్కు ఈ విషయంలో ఇబ్బంది రాలేదు కాని, ఎపిలో జగన్ ను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన, వామపక్షాలు చాలా ఇబ్బంది పెట్టే యత్నం చేశాయి. తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా చేసినా ఏదో రకంగా జగన్ ముందుకు వెళ్లకూడదని చివరికి కోర్టులను కూడా అడ్డం పెట్టుకుని టిడిపి చేసిన యాగీ ఇంతా ,అంతా కాదు. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు నానా రభస చేశాయి. పోనీ ఈ మీడియా సంస్థల యజమానుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగులో చదువుతున్నారా అంటే అదేమీ లేదు. వీరిలో అత్యధికులు హైదరాబాద్, ముంబై వంటి నగరాలలో కార్పొరేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. ఎపిలో మాత్రం ఆంగ్ల మీడియం పెట్టకూడదని యాగీ చేశారు. వీరెవరూ ప్రైవేటు స్కూళ్లు ఆంగ్ల మీడియం మాత్రమే అమలు చేస్తున్నప్పుడు నోరు మెదపలేదు. అంతదాకా ఎందుకు! తెలుగు గురించి చంద్రబాబు గారు చాలా ఉపన్యాసాలు చేశారు కదా? ఆయన కుమారుడు లోకేష్ను ఏ మీడియంలో చదివించారు? ప్రస్తుతం ఆయన మనుమడు దేవాన్ష్ను కాని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? బుద్ద ప్రసాద్ వంటి వారు ముందుగా ఈ విషయంలో సలహా ఇవ్వవలసింది వీరికి కదా! ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని చెబుతున్న ఈ పెద్దలు, తమ వాళ్లు మాత్రం ఆంగ్లంలో చదివినా బాగా చదవగలరని, మిగిలినవారు అర్ధం చేసుకోలేరని ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు. వీరంతా ఒక్కసారి కాకినాడ జిల్లా బెండపూడిలోని ప్రభుత్వ స్కూల్కుకు వెళ్లి, అక్కడ పిల్లలు, ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలో కూడా ఎలా రాణిస్తున్నది తెలుసుకుంటే బాగుంటుంది. వారిని ఇలాంటి సంఘాలు ప్రోత్సహించి, ఏ సందేశం ఇచ్చినా వినబుద్ది అవుతుంది. చిన్నతనంలోనే ఏమి నేర్పినా పిల్లలకు బాగా వంటపడుతుందని అంటారు. తెలుగు గురించి ఇంతలా బాధ పడుతున్నవారు పాటించి చూపిస్తే కదా మిగిలినవారు ఆచరించే అవకాశం ఉండేది. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రవాసాంద్రులు తెలుగు భాష గురించి ఏ కార్యక్రమం చేసినా సంతోషమే. దానికి ముందుగా అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించగలిగితే , అప్పుడు వారు ఏమి చెప్పినా విలువ పెరుగుతుంది కదా! - హితైషి -
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పూర్తి వివరాలు
‘‘స్వభాషను పరిరక్షించుకుందాం- స్వాభిమానాన్ని పెంచుకుందాం’’ అనే నినాదంతో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ) సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరుగనున్నాయి. ఈ నెల 23, 24 తేదీలలో శుక్ర, శనివారాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభాపతి డా॥ మండలి బుద్ధ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డా॥ జి.వి. పూర్ణచంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ, గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో వారు మాట్లాడారు. ఉద్దేశం ఇదే ఈ సందర్భంగా.. ప్రపంచ నలుమూలల నుంచి సుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ సభలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర, సిద్దార్ద అకాడెమీ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయని వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరౌతున్నారని వివరించారు. పూర్తి వివరాలు ఇక డా॥ జి.వి. పూర్ణచంద్ మాట్లాడుతూ మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుబడిన రాజరాజనరేంద్రుడి పేరు పెట్టామన్నారు. ఆదికవి నన్నయ వేదిక పై ప్రారంభసభ, సమాపన సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వివరించారు. 23 ఉదయం 10 గంటలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగు వెలుగుల సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్. వి. రమణ పాల్గొంటున్నారని తెలిపారు. పద్మశ్రీ గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ రామమోహనరావు, డా॥గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్, గేయరచయితలు అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి పాల్గొంటున్నారని తెలిపారు. యువ అవధానులతో ‘‘కుదురాట-కొత్తవెలుగు’’, 10 మంది యువ గజల్ కవుల ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి సుధాకర్, డాపప సప్పా దుర్గాప్రసాద్, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు డా॥ఎస్.పి.భారతి సోదాహరణ ప్రసంగాలు వుంటాయని పేర్కొన్నారు. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్ధాపకులు డా॥ జంపా కృష్ణ్ణ కిషోర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, ఉపాధ్యాయులు-భాషాపరిరక్షణ, తెలుగు బోధన, సామాజికమార్పులు-తెలుగు కవిత, విమర్శ, చరిత్ర, అంతర్జాలంలో తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు రాష్టేతర తెలుగు ప్రముఖులతో సదస్సులు ఉంటాయని వివరించారు. ప్రతినిధులకు రెండు రోజులు కమ్మని తెలుగు విందు ఏర్పాట్లు చేశామని, 100కి పైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు వివరించారు. శుభోధయం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్, ప్రపంచ మహాసభలు పేరుతో వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెల్లడి చేస్తామని వివరించారు. -
బైజూస్పై బురద రాతలు
సాక్షి, అమరావతి: ఆధునిక నైపుణ్యాలను సంతరించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా బైజూస్ పాఠ్యాంశాలతో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంటే ‘ఈనాడు’ వక్ర భాష్యాలు చెబుతోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి వివిధ పథకాల ద్వారా విద్యార్థుల చదువులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. గత సర్కారు హయాంలో అస్తవ్యస్థమైన విద్యా రంగాన్ని వివిధ పథకాలతో సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బైజూస్ భాగస్వామ్యం ద్వారా అత్యంత నాణ్యమైన కంటెంట్ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండడంతో సహించలేక‘ఈనాడు ’విషం చిమ్ముతోంది. ఇందులో నిజానిజాలివీ.. బైజూస్తో బోలెడు ప్రయోజనాలు బట్టీ చదువుల స్థానంలో ఆహ్లాదంగా చదువుకునేలా తరగతి గదిని రూపొందించాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్ను స్మార్ట్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. బైజూస్ కంటెంట్ టీచర్లు, పిల్లలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి నాణ్యతతో రూపొందించారు. దీనివల్ల తరగతి గది బోధనలో నాణ్యత పెరగటంతో పాటు బడిలో నేర్చుకున్న అంశాలు ఇంటి వద్ద పునఃశ్చరణ చేయడానికి అవకాశం కలుగుతోంది. పిల్లలు ఎప్పుడైనా పాఠశాలకు హాజరు కాలేకపోతే వీలైన సమయంలో నేర్చుకునేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించిన చిత్రాలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నేర్చుకునేలా దోహదం చేస్తాయి.పాఠ్య పుస్తకాలలో ఇచ్చిన సమాచారాన్ని చిన్న విభాగాలుగా రూపొందించడం వల్ల సంక్లిష్ట అంశాలను సులువుగా నేర్చుకుంటారు. 471కి పైగా వీడియోలతో నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి. గొప్ప వరం.. బైజూస్ ద్వారా ఉచితంగా పాఠాలు అందించడం పేద పిల్లలకు గొప్ప వరం. ఈ లెర్నింగ్ కోసం పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా ట్యాబ్లను సమకూరుస్తుండడం సాహసోపేత నిర్ణయం. – ఎన్.మహేంద్రరెడ్డి, టీచర్, తంగేగుకుంట, శ్రీసత్యసాయి జిల్లా రెండు భాషల్లో చక్కగా.. బైజూస్ వీడియో పాఠాలను అన్ని తరగతుల వారు వింటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చక్కటి ఉదాహరణలతో స్థాయికి తగ్గట్లు వీడియో అంశాలున్నాయి. – కె.పుష్పవతి, సైన్స్ టీచర్, ఎంసీయూపీ స్కూల్, ఏలూరు చాలా బాగుంది.. బైజూస్ కంటెంట్ చాలా బాగుంది. విద్యార్థులకు, టీచర్లకు ఎంతో సహాయపడుతుంది. వీడియోలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అద్భుత అనుభూతి కలిగిస్తున్నాయి. – సంధ్య, ప్రిన్సిపాల్, ఏపీఎమ్మెస్, అక్కివరం, విజయనగరం అద్భుతంగా నేర్చుకుంటున్నారు... బైజూస్ యాప్ ద్వారా పిల్లలకు వీడియో పాఠాలు చెబుతున్నాం. కంటెంట్ చాలా బాగుంది. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. పిల్లలు బడికి హాజరు కాని సందర్భాల్లో ఇది చాలా సహాయపడుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇంటి వద్ద పాఠ్యాంశ బోధన జరగడం అద్భుతంగా ఉంది. – ఎం.నరసింహారెడ్డి, హెచ్.ఎమ్, జెడ్పీ హైస్కూల్ సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా అబద్ధం 1 బైజూస్ కంటెంట్ కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది ఇది పూర్తి అవాస్తవం. పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ ఉంది. భాషను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. అబద్ధం 2 పిల్లల సందేహాల నివృత్తికి అవకాశం లేదు పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం బోధించాక సంబంధిత వీడియోను విద్యార్థులు పరిశీలించిన అనంతరం ఇంకా సందేహాలుంటే మరుసటి రోజు నివృత్తి చేస్తున్నారు. వలస వెళ్లిన పిల్లలు కూడా కంటెంట్ను ఫోన్లో చూసుకొని తర్వాత స్కూలుకు వచ్చి టీచర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. అబద్ధం 3 టీచర్లకు రూ.500 చాలదు ఈ ప్రస్తావన సరికాదు. కంటెంట్ ఉన్న వీడియోలు ప్రయోగాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినవైనందున విషయ పరిజ్ఞానార్జనకు మరింత ఉపయుక్తం. టీచర్లకు వీడియోలు అర్థం కావనడం వారిని అవమానించడమే. -
CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు
తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్ దంపతులైన డేవిడ్ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్ 10న బ్రౌన్ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. ఫ్రెంచ్ కాథలిక్ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్లోకి అనువదించి ‘వెర్సేస్ ఆఫ్ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకునేలా చేశారు. బ్రౌన్ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు. తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్లా, జాన్హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్ పేరును ప్రస్తావించనే లేదు. భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్ మద్రాస్ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్ రచనలన్నీ రెవరెండ్ టైలర్ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్లో ముద్రించారు. ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్బార్న్ గ్రోవ్లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..) - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖ సాహితీ పరిశోధకులు (సీపీ బ్రౌన్ 225వ జయంతి సంవత్సరం) -
ఈ తెలుగు మాట్లాడుతున్నామా?
అమ్మకు జ్వరంగా ఉంటుంది. స్కూల్లో అన్నం గంట కొట్టినప్పుడు ఇంటికెళితే బువ్వ ఉండదని ముందే తెలుసు. ఆ సంగతి ఎవరికీ చెప్పక నీళ్ల కుళాయి వైపు నడుస్తూ రెండు గుక్కలే ఈ పూటకు అనుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు కనిపెట్టి– ‘రారా. నా టిపినీలో తిందువు’ అని పిలుస్తాడు. భలేవాడు వాడు. పక్క పాపిట దువ్వుకుని, స్లిప్పర్లు టపాటపాకొట్టి నడుస్తూ, ఊరికూరికే నవ్వుతూ, మన స్నేహాన్ని ఇష్టపడుతూ. ఆ పూట వాడి ముద్దల్లో మనకు వాటా. పొరుగూరిలోనే ఉంటాడు. ఏదో ఉద్యోగం చేస్తున్నాడని విని ఉంటాము. కలిసి చాలా ఏళ్లయివుంటుంది. ‘ఏరా... ఎలాగున్నావు’ అని ఫోన్ చేసి అడగడం మంచి తెలుగు వాక్యం. తియ్యటి తెలుగు వాక్యం. పలుకుతున్నామా? ఆ పిల్ల తూనీగే. పక్కింట్లో ఉంటుంది. అక్కా అని పిలిస్తే తప్ప పలకదు. ఆదివారం వస్తే ‘రావే అమ్మాయ్’ అని గోరింటాకు పెట్టేది. ఇంట్లో పూసే రోజాపువ్వు బడికి వెళుతున్నప్పుడు జడలో గుచ్చేది. సినిమా పత్రికలో ఉన్న హీరోయిన్ ఫొటో చూపించి ‘ఈ డ్రస్సు నీకు భలే ఉంటుంది’ అని చెప్పేది. ‘భయంగా ఉందక్కా’ అనంటే, ‘తొక్కు’ అని సైకిల్ నేర్పించింది. టీచరట. రిటైరైందట. అమెరికాలో పిల్లల దగ్గర ఉందట. వాట్సప్ కాల్ చేసి ‘అకా... నీ గుర్తుగా ఇంట్లో ఎర్రగులాబీ వేశా. చూడ్డానికి ఎప్పుడొస్తావు?’ అని అడగడం అలాంటిలాంటి తెలుగు కాదు. తేనె తెలుగు. మేనమామ ఒకడు ఆ రోజుల్లో హిప్పీ క్రాఫుతో ఇంటికొచ్చేవాడు. ‘సినిమాకెళ్దాం పదండి’ అని తీసుకెళ్లేవాడు. టక్ చేసి కాలేజీకెళితే హీరోలా చూస్తారట. ‘మావయ్యా’ అని పిలిస్తే చాలు హాజరయిపోయేవాడు. ఒకసారి నాన్నతో ఎవరో గొడవపడితే ‘ఖబడ్దార్’ అని చూపుడువేలు ఆడించి వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆర్థికంగా కూడా బాగలేడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. మనమేం శ్రీమంతులం కాము. కాని వెళ్లి, దగ్గర కూచుని, చేయి పట్టుకుని ‘మావయ్యా.... సాహసవంతుడు సినిమా చూపించిన సాహసవంతుడివి నువ్వు. ఏం కాదు. లేచి తిరుగుతావు. నీకేం కావాలో నేను చూస్తాను. అందాక ఇది ఉంచు. కాదంటే నామీదొట్టే’ అని పలికే తెలుగు ఉంది చూశారూ... దేవతలు ఆశీర్వదించే తెలుగు అది. అవునండీ... ఆఫీసులో కొలీగే. కలిసి క్యాంటీన్కు వెళ్లేవారు. కలిసి భోజనానికి వెళ్లేవారు. కలిసి పని పంచుకుని చేసవతల పడేసేవారు. ఏదో మాటా మాటా అనుకున్నారు. మాట్లాడ్డం మానుకున్నారు. కాని ఎన్నాళ్లు? రోజూ కనపడాలే. పక్కనే ఉండాలే. ముఖం చూడాలే. ఇక చూసి చూసి ఎవరో ఒకరు డెస్క్ దగ్గరికెళ్లి ‘క్షమించు గురూ. ఏదో పొరపాటైంది. ఇంతకు ముందులానే ఉందాం. నీతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంది నాకు’ అన్నామనుకోండి... ఆ తెలుగు అతి సువాసనతో నిండిన తెలుగు. ‘అమ్మా... ఫోన్లు మాట్లాడేటట్టయితే స్పీకర్ పెట్టుకు మాట్లాడు. చెవికి ఇబ్బంది ఉండదు. అస్తమానం టీవీ చూడకు. మొన్నామధ్య నువ్వు చేసే పూర్ణాలు గుర్తుకొచ్చాయిగానీ అంత రుచితో ఇక్కడ ఎవరు చేయగలరనీ’. ‘నాన్నా... నా కోసమని కొత్తచొక్కా కొన్నాను. కాని బ్లూ కలర్ మీకే బాగుంటుందనిపించింది. పంపుతున్నా. వేసుకోండి’. ‘ఓ నా బంగారు చెల్లీ... ఈ అన్న పెళ్లయ్యాక మారిపోయాడని అనకు. చిన్నప్పుడు పార్కులో ఉయ్యాలూగుతూ కింద పడబోతుంటే పట్టుకున్నాను. ఇప్పుడూ అంతే, పక్కనే ఉంటాను’. ‘పెద్దొదినా... మీరిద్దరూ పిల్లలతో భోజనానికి ఎందుకు రారు మా ఇంటికి. పట్టింపులు పెట్టుకోకండి దయచేసి’... ‘ఏమే మూగమొద్దు. క్లాస్మేట్లందరం టూర్కెళ్దామంటే ఏ సంగతీ చెప్పవేమే’... ఎంతమంచి తెలుగు వాక్యాలో చూడండి ఇవి. పలకడం మరిచిపోతున్న వాక్యాలు. పలకక్కర లేదనుకుంటున్న వాక్యాలు. వ్యవహారంలో నుంచి తొలగిపోతున్న వాక్యాలు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాక్యాలు. బంధం గట్టిగా ఉంటే బలగం గట్టిగా ఉంటుంది. బంధం పట్ల ఆపేక్ష ఉంటే నిలబెట్టుకోవాలన్న తలంపు ఉంటుంది. ‘అ’ ఒక్కటే లేదు. ‘ఆ’ పక్కనే ఉంది. ‘అచ్చులు’ మాత్రమే లేవు. ‘హల్లుల’ను తోడు చేసుకున్నాయి. ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జయంతి. వ్యవహారిక భాష కోసం ఆయన జీవితాన్ని ధారబోశాడు. ప్రతి తెలుగువాణ్ణి తెలుగు కోసం గుప్పెడు ఊపిరి ఇమ్మన్నాడు. కాని జీవన వ్యవహారాల పట్ల ఉండే అక్కరను బట్టే భాష పట్ల అక్కర కూడా ఉంటుంది. మన బంధాలతో ఎలా ఉన్నామో భాషతో కూడా అలాగే ఉంటాము. జన్మ సంబంధాలు, రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు, సాటి వర్గ కుల మత సంబంధాలు... వీటికి ఎంత ప్రేమ, గౌరవం ఇస్తామో భాష పట్ల కూడా అంతే గౌరవం ఇస్తాము. ఒకటి ఉండి ఒకటి లేదు అనేది ఉండదు. అన్నీ ఒక తానులో బట్టలే. ఇల్లంటే డోర్ కర్టెన్, బెడ్రూమ్, టాయిలెట్ అని మాత్రమే కాక ‘పుస్తకాల అర’ కూడా అనుకోనంత వరకు, కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే అని కాక అనేక అనుబంధాలు కూడా అని తలవనంత వరకు, బంధాలతో ఆత్మీయత భాషతో పాశంలోనే జీవన మాధుర్యం ఉంది అని ఇవి రెండూ ఎంతకూ చెల్లించలేని, ఎగవేతకు కుదరని రుణాలని చిత్తంతో నమ్మనంత వరకూ తెలుగువారి జీవితం, తెలుగుతో నిండిన జీవితం సంపూర్ణం అనిపించుకోదు. ఎవరైనా స్నేహితునికి ఫో¯Œ చేసి ‘మంచి తెలుగు పుస్తకం ఏదైనా కొనుక్కు వద్దామా’ అనండి. ఇవాళ్టికివాళ అంతకు మించిన పుణ్యప్రదమైన తెలుగు మరొకటి లేదు. అనుబంధాల తెలుగు వెలుగు గాక! -
మాతృ భాషలో వాదనలు తప్పు కాదు
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్ను ఆదేశించారు. ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్ జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు. -
తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు
టంగుటూరు: పట్టుదల, ధైర్యం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన గడ్డం మేఘన చెప్పారు. విజయ సాధనలో ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. భారత దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, అమ్మాయిల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. వారు పట్టుదల, ధైర్యంతో కష్టపడితే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్, తల్లి ఉష. వ్యాపార రీత్యా 21 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె చెప్పిన విషయాలు.. యువతకు చాలా ఐడియాలు ఉంటాయి. వీటిని న్యూజిలాండ్ పాలకులు గుర్తిస్తారు. మూడేళ్లకోసారి యూత్ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో 120 మంది ఎంపీలు ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారు. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు అర్హులు. వీరికి చదువు, నాయకత్వ లక్షణాలు ఉండాలి. నేను స్కూలు స్థాయిలోనే హెడ్గా ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. స్నేహితులతో కలిసి అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరిస్తాను. రిప్యూటీ సెంటర్ ద్వారా ఇరాన్, ఇరాక్, సిరియా తదితర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్ధుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. చిన్నారులకు చదువులో సాయం చేస్తాం. ఇవే నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి. జూలైలో పార్లమెంటులో ప్రసంగం జూలైలో రెండు రోజులు మాకు పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్, జనరల్ డిబేట్లో, సెలెక్ట్ కమిటీలో పాల్గొంటాం. పలు సూచనలు చేస్తాం. అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మంత్రులను, ప్రధానిని సైతం నిలదీయొచ్చు. మేము సభ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై మంత్రులు, ప్రధాని చర్చిస్తారు. వాటిని బిల్లులు చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్లో ఇళ్ల సమస్య ఎక్కువ. పేదలకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిపోవడంలేదు. దీనిపైనే తొలి ప్రశ్న వేస్తాను. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీకి విరాళం చీమకుర్తి మండలం పల్లామల్లిలోని మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ బాలల కోసం చేస్తున్న మంచి పనులు చూసి రూ. 60 వేలు విరాళంగా ఇచ్చాను. పాఠశాలకు మరో రూ.2 లక్షలు ఇస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే శాయశక్తులా చేస్తాను. తెలుగంటే బాగా ఇష్టం ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తాను. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రాలేదు. తెలుగంటే బాగా ఇష్టం. అందుకే ఇక్కడ తెలుగు బాగా నేర్చుకున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష చాలా గొప్పవి. అక్కడే పుట్టి పెరిగినా వీటిని మరిచిపోలేదు. యూత్ ఎంపీకి చేసుకున్న దరఖాస్తులో కూడా నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా దేశ సంస్కృతి సంప్రదాయాలను పొందుపరిచాను. -
ఫ్రెంచ్ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సులో పాల్గొనేందుకు ఫ్రెంచ్ రాజధాని పారిస్కు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఓ విశిష్ట అతిథి భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డేనియల్ నెగర్స్ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో డేనియల్ నెగర్స్ కొన్నేళ్లుగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారు. వేల మైళ్ల దూరాన ఉంటూ తెలుగు భాషపై మమకారం చూపించడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
తెలుగు పదాల ‘మల్లెతోట’లో మల్లీశ్వరి!
ఇంగ్లిష్ మాతృభాషగా పెరిగిన ఇంగ్లండ్ ప్రజలు 300 ఏళ్ళపాటు ఫ్రెంచి, గ్రీక్, జర్మన్ వలస భాషల దాష్టీకం నుంచి తమ మాతృ భాష ఇంగ్లిష్ను రక్షించుకోవడానికి పడిన పాట్ల నుంచే తెలుగుభాషను కాపాడుకోవడా నికి తెలుగువాడు పాఠాలు నేర్చుకోవాలి! ప్రపంచాన్ని ఏలుతూ వచ్చిన ఇంగ్లిష్ వాడికి, 16–17 శతాబ్దాల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, మాతృభాషా రక్షణకు నడుం బిగించాల్సి వచ్చిందని 3,000 సంవత్సరాల ప్రాచీన పునాదులున్న తెలుగువారు మరిచిపోరాదు! ఆదివాసీ భాషలు సహా ప్రపంచ భాషా కుటుంబంలో ప్రతి ఒక్క పదమూ ఒక్కొక్క ఆణి ముత్యమని ఐక్యరాజ్యసమితి సాధికార ప్రకటన విడుదల చేసిందని మరువరాదు. మరోవైపునుంచి విభజించి పాలించే బుద్ధి విభక్తులతో ప్రారం భమై తెలుగు భాషనే గాక తెలుగు సమాజాన్ని వృత్తుల విభజనతో పాటు కులమతాల కుంపట్లు తెరిచి శాశ్వత బానిసత్వానికి వర్గ విభజనకు సరిపడా ‘కాంక్రీటు’ గుప్పించారు స్వార్థపరులు. ప్రకృతుల (ప్రజల)తో ఎదుగుతూ వచ్చిన భాష ‘వికృతుల’తో ఎందుకు విల విలలాడవలసి వచ్చింది? ప్రాచీన భారతం సంస్కృతం కాదు, ప్రాకృతం మాత్రమేనని మహామహా పండితులే ఎందుకు నిర్వచించ వలసివచ్చింది? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనే బుద్ధిహీనుడు బతకనేల అని కాళోజీ ఎందుకు నోరారా శపించవలసి వచ్చింది? అలాగే తెలుగు పదసంపదను మరచిపోయి తిరుగుతున్న తెలుగు వాడికి ఒక పదానికి ఎన్నో అర్థాలను చూపించి తెలుగు నుడులకు ‘గుడులు’ కట్టి మరీ కోట్లాదిగా చూపించి తెలుగుల వెన్నును కాపా డుతూ వచ్చిన తెలుగు ప్రముఖులలో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఒకరు! ఒక్కో తెలుగు పదానికి అర్థాలెన్నో, తెలుగు‘నుడి గుడి’ గ్రంథాల ద్వారా దశాబ్దన్నర కాలంలో తెలుగుభాషకు మల్లీశ్వరి కృషి చేస్తూ వచ్చిన అమూల్యమైన కృషి, ప్రాథమిక విద్యాస్థాయిలోనే భాషా బోధనా పద్ధతులు ఎలా ఉండాలో ప్రాక్టికల్గా నిరూపించి చూపిన విద్వక్మణి మల్లీశ్వరి ఎన్నో పురస్కారాల గ్రహీత, కవయిత్రి, ప్రసిద్ధ సమీక్షకురాలూ, నాడు తెలుగువాడైన (ముంగండ) మల్లినాథసూరి షాజహాన్ కొలువులో పలువురు ముస్లిం, సంస్కృతి కవుల్ని దిమ్మ తిరిగేలా ఓడించి నిలబడిన జెగజ్జెట్టీ! నేడు ఎవరి కొలువుల్ని ఆశ్ర యించకపోయినా సొంత ప్రతిభతో, తేజస్సుతో తననుతాను నిరూ పించుకుని తెలుగు మల్లెతోటను వాడిపోకుండా నవంనవంగా ఉంచుకున్న సాహితీమూర్తి మల్లీశ్వరి. అందుకే ప్రాచీన సూక్తి పుట్టింది. పరుల కోసమే నదులు ప్రవహిస్తాయి, గోవులూ పాలు పిండుతాయి. చెట్లూ ఇతరుల కోసమే పూలు పూస్తాయి. ఈ సంప్రదాయపు ప్రాకృ తిక సత్యాన్ని గుర్తించిన చిరంజీవి మల్లీశ్వరి, మనం మరచిపోతున్న తెలుగు అందచందాలతో సహస్రాధికంగా తెలుగులు చిమ్మే తెలుగు పదాలకు అనంతమైన నుడులకు నానుడులకు ప్రయోజనకరమైన గుడులు కట్టారు. అసలు ఎందుకు, తెలుగు భాషామతల్లికి వన్నెచిన్నెలు తొడిగిన తెలుగు శతక వాంఙ్మయాన్ని అటకమీద పెట్టేసి తిరుగుతున్న మనల్ని రక్షించే నాథుడికోసం, చీకట్లో వెతుక్కుంటున్నాం. తెలుగు పదాలకు అరసున్నల బెడదను రుద్దిన సంస్కృత ప్రియులకు జవాబుగా 300 ఏళ్ళ కిందటే శ్రీనాథుడి శాసనాల్లో (13–14 శతాబ్దిల్లో) ఈనాడు మనం వాడే ‘సున్న’ అంకెనే (0) సుఖంగా వాడాడు! కనీసం తెలుగు భాషను, ప్రజలను శ్రీనాథుడి కన్నా ముందు అనేక శతాబ్దులుగా తీర్చిదిద్దించి వచ్చిన 10 శతకాలలోని సజీవ స్రవంతిని కూడా పక్కన పెట్టేసి తిరుగుతూ వచ్చాం. వేమన శతకం నుంచి ఆంధ్రనాయక శతకం దాకా తెలుగు ప్రజలను నీతులతో, హెచ్చరికలతో అప్రమత్తం చేసి ఎన్నో మంచి బుద్ధుల నుంచి మరలకుండా ఈ రోజుదాకా కట్టిపడవేస్తున్నాయి. అలాగే వాసిరెడ్డి మల్లీశ్వరి 2016లోనూ, 2018 లోనూ తెలుగులో ఒక్కొక్క పదానికి ఎన్నేసి అర్థాలున్నాయో, ఒక్కో పదాన్ని భిన్న అర్థాలలో, విభిన్న సందర్భాలలో ఎలా ఉపయోగించ వచ్చునో ఈ రెండు గ్రంథాలలోనే పెక్కు సామెతలతో, ఆమెతలతో సంధించి వందలు, వేలాది ఉదాహరణలతో రసమయం చేసింది మల్లీశ్వరి. ‘హల్లు’తో కాకుండా ‘అచ్చు’తో పదాల ప్రారంభ ఉపసం హారాలతో వేల సంవత్సరాలు ప్రాచీన చరిత్ర గల భాషగా అజంత భాషగా ఎలా వర్థిల్లుతూ వస్తోందో నిరూపిస్తూ అందుకు దన్నుగా తెలుగు సామెతలను, వివిధ కవుల పద్యాలనూ సోదాహరణంగా ఉదహరించారు. ఆమె కృషి వెనక దాదాపు 20 ఏళ్ల సాధన ఉంది. మల్లీశ్వరి అన్నట్టు నేడు తెలుగు ఇళ్లలో, స్కూళ్లలో, తరగతి గదుల వాతావరణంలో తెలుగుభాష వాడకం తగ్గి, ఆంగ్లభాష వాడకం పెరిగి అమ్మ–నాన్నల స్థానాన్ని, మమ్మీ–డాడీలు ఆక్రమిం చడం వల్ల మరుగున పడిపోతున్న తెలుగు పదాలను, వాటికి గల అనేకానేక అందమైన అర్థాలను నేటి తరానికి అందించి మనసుకెక్కిం చాలన్న తలంపుతో ఈ రెండు పుస్తకాలలోనూ అనితరసాధ్యమైన ప్రయత్నం జరిగింది. అంతమాత్రాన అన్యభాషాదూషణకు ఆమె ప్రయత్నించలేదు. తెలుగు భాషలో ఉన్న ఎంతో అందమైన పద సంపదను ఒంట పట్టించుకోగల తెలుగు విద్యార్థులకు ఉద్దీపనగానే మల్లీశ్వరి ప్రశంసనీయమైన ప్రయత్నం జరిగింది. ఇంగ్లిష్లో ‘భిన్నార్థ దీపిక’గా చెప్పుకునే ‘ధిసారస్’కు ఏ మాత్రం తీసిపోనివి మల్లీశ్వరి రెండు అత్యుత్తమ సంపుటాలు. పదప్రయోగ వైచిత్రిలో అఖిల భారత స్థాయిలో ఆంగ్లభాషా పండితుడు, పరిశోధకుడు, పార్లమెంటు సభ్యుడైన శశిథరూర్ ‘ధిసా రస్’ను అనుసరించి తన పేరిటనే ‘ధరూరోసరస్’ అనే కొత్త ప్రయో గాలకు సాహసించాడు. అర్ధగౌరవాన్ని హాస్యాస్పదంగా మార్చే ఈ నోరుతిరగని శశిథరూర్ ప్రయత్నాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురణ కర్త మేరూ గోఖలే... పాఠకుల్ని అదరగొట్టి, చెదరగొట్టే థరూర్ ప్రయ త్నాన్ని, భిన్నార్థ దీపిక కాదు.. ‘నిరంకుశోపాఖ్యానం’ (టిరనోసరస్) అని వ్యాఖ్యానించింది! కానీ మన మల్లీశ్వరి ప్రాచుర్యంలో ఉన్న తెలుగు పదసంపద అర్ధగౌరవాన్ని ఒక ఉపాధ్యాయురాలిగా తన రెండు సంపుటాలలోనూ నిలబెట్టారు. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు
‘డిజిటల్ హ్యుమానిటీస్’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్ సాఫ్ట్ కాపీ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు. (చదవండి: బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’) ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్మేకర్ సాఫ్ట్వేర్ స్థానంలో యునికోడ్ ఫాంట్స్ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్మేకర్లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి. (చదవండి: రైతు ఆదాయంపై అర్ధసత్యాలు) ఇప్పటికే యంత్రానువాదం (మిషన్ ట్రాన్స్లేషన్) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్ ఫ్రీ అప్లికేషన్స్ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి. – డా. ఎస్. చంద్రయ్య, టి. సతీశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు,లోకేష్ తెలుగు భాష కోసం ఏమీ చేయలేదు : లక్ష్మీపార్వతి
-
ప్రవాస తెలుగు పురస్కారాలు.. ఎంట్రీలకు ఆహ్వానం
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ మరియు వీధి అరుగు ఆధ్వర్యంలో 2021 ఆగష్టు 𝟐𝟖, 𝟐𝟗లలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విదేశాలలో నివసిస్తూ తెలుగు భాషా , సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారికి ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందిస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే ఈ పురస్కారాన్ని అందిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి మీరు చేసిన వివరాలను ఈ కింది లింకు ద్వారా లేక ఈ-మెయిల్ ద్వారా పంపాలని సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగులు కోరాయి. https://tinyurl.com/pravasa , pravasatelugupuraskaralu2021@gmail.com -
ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ
సాక్షి, విశాఖపట్నం/కొరుక్కుపేట (చెన్నై): తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. భాషతో సాంకేతికతని అనుసంధానం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఇందుకు తెలుగు సంస్థలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించారు. విశాఖలో ఉన్న వెంకయ్య నాయుడు ఈ వర్చువల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల వెలుపల ఉండే తెలుగు జనాభా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఉందని గుర్తు చేశారు. వెయ్యికి పైగా తెలుగు సంస్థలు భాషా పరిరక్షణకు పాటుపడుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీదకు తీసుకురావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. కార్యక్రమంలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆలిండియా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డా.సీఎంకే రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు తదితరులు పాల్గొన్నారు. -
లాక్డౌన్లో ‘పుష్ప’ కోసం నటుడు ఫహద్ ఫాసిల్ కసరత్తు!
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో మెయిన్ విలన్గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీలో ఆయనకు డబ్బింగ్ చెప్పేందుకు ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్, హీరో తరుణ్తో ఇటీవల పుష్ప టీం చర్చలు జరిపినట్లు ఫిలీంనగర్లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. తాజా బజ్ ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఫహాద్ తెలుగు నేర్చుకునే పనిలో పడ్డాడట. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని రోజు తెలుగు భాషపై కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అయితే ఇందులో ఫహాద్ అవినీతి పోలీసు అధికారిగా, చిత్తూరు యాసలో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ యాసపై పట్టుసాధించేందుకు రోజు ప్రాక్టీస్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడట. అంతేకాదు దీనికి ప్రత్యేకంగా కోర్స్ కూడా తీసుకుంటున్నాడని వినికిడి. కాగా రూరల్ బ్యాక్డ్రాప్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పుష్పను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి
అట్లాంటా: తెలుగు జాతి, సంప్రదాయం ప్రపంచ పటంపై వెలుగుతోంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగుకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడ అధికారికంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది సందర్భంగా ఆ రోజును తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగువారి సేవలను జార్జియా ప్రభుత్వం ప్రశంసించింది. దాంతోపాటు తెలుగు సంప్రదాయం, భాష బాగుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ స్టెయిర్స్ ఆఫ్ జార్జియాలో జరిగిన ఉగాది వేడుకలో తెలుగు వారికి దానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అధికారులు అందించారు. జార్జియాలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వైద్యులు, ఇంజనీర్లుగా జార్జియా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 మంది అక్కడి విద్యా రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఉన్నారు. భారతదేశ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే తెలుగు వారుగా గుర్తింపు పొందుతున్నారు. ఏప్రిల్ 12వ తేదీని తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు పాటలు, ఆటలు, సాహిత్య పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. -
‘ఆదిపురుష్’ కోసం తెలుగు నేర్చుకుంటున్న ‘సీత’!
‘అందరికీ నమస్కారం.. బాగున్నారా! యాక్చువల్లీ ఐ డోంట్ నో తెలుగు. నెక్ట్స్ టైమ్ ఐ విల్ స్పీక్ ఇన్ తెలుగు..’ అంటూ తెలుగు చిత్రాల్లో నటించే పరభాషా తారలు అనడం పలు వేడుకల్లో విన్నాం. ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన బాలీవుడ్ భామ కృతీ సనన్ కూడా అలానే అన్నారు. ఆ తర్వాత కూడా పెద్దగా తెలుగు నేర్చుకోలేదామె. ఇప్పుడు నేర్చుకునే పని మీద ఉన్నారు. ఔం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన కృతీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ది రాముడి పాత్ర. కృతీది సీత పాత్ర. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూటర్ని పెట్టి, కృతీకి తెలుగు నేర్పిస్తోందట చిత్రబృందం. సో.. ఈ సినిమా వేడుకలో ‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు వచ్చేసింది’ అని కృతీ అంటారేమో చూడాలి. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్.. తొలిసారి తెలుగులో
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఏ సెషన్లోనైనా పరీక్షలు రాసుకునేలా, అన్నింటిలో ఉత్తమ స్కోర్ ఏది వస్తే దానినే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్ మాత్రమే కాకుండా మొదటిసారిగా 12 భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది. తెలుగులో పరీక్షలు రాసేందుకు 374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జేఈఈ మెయిన్ నిర్వహించినప్పుడు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవగా ఈసారి ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో జరిగే మొదటి సెషన్లో 6,61,761 మంది పరీక్ష రాయనున్నారు. ఇంకా మూడు సెషన్లలో పరీక్షలు రాసే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి సెషన్లో పరీక్షలు రాసే వారి సంఖ్య తగ్గింది. ఇక మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రెండో సెషన్ పరీక్షలు, ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో మూడో సెషన్ పరీక్షలు, మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నాలుగో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. మేలో సీబీఎసీఈ 12వ తరగతి పరీక్షలు ఉన్నందున జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లోనే ఎవరైనా విద్యార్థులకు 12వ తరగతి పరీక్ష ఉంటే విద్యార్థులు తెలియజేయాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే మొదటి సెషన్ జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యేందుకు నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఏపీ విద్యార్థులు 87,797 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ నుంచి 73782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం తెలంగాణలో 12 కేంద్రాలను, ఏపీలో 20 కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఏపీ పరిధిలో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో ఏర్పాటు చేశారు. పరీక్ష విధానం ఇలా.. ఈసారి కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఏ అదనంగా 15 ప్రశ్నలు ఇస్తోంది. మొత్తంగా 90 ప్రశ్నలు ఇవ్వనుండగా అందులో విద్యార్థులు 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. బీఈ/బీటెక్ పరీక్షను తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ ఉంటాయి. సెక్షన్–ఏలో 20 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే వాటన్నింటికీ సమాధానాలు రాయాలి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. సెక్షన్–బీలో నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రతి సబ్జెక్టులో 10 చొప్పున న్యూమరికల్ వ్యాల్యూ జవాబుగా ఉండే ప్రశ్నలు ఇస్తారు. అందులో 5 చొప్పున ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇదీ పరీక్షల సమయం... ♦ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో రోజూ రెండు షిఫ్ట్లలో ఆన్లైన్ పరీక్షలు ♦మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ♦రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ♦కచ్చితంగా అరగంట ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలి. పరీక్ష ప్రారంభ సమయం తరువాత విద్యార్థులను అనుమతించరు. ♦మొదటి షిఫ్ట్ పరీక్షకు విద్యార్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రం, హాల్లోకి అనుమతిస్తారు. ♦రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు అనుమతిస్తారు. -
దక్షిణామూర్తి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్ చైతన్యపురిలోని తన గృహంలో శనివారం కన్నుమూశారు. తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ పొందిన దక్షిణామూర్తి అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెయింట్’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. దక్షిణామూర్తి 1935 డిసెంబర్ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా చైతన్యపురి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన శనివారం రాత్రి 7.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం వీవీ నగర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. సంతాపం ప్రకటించిన సీఎం జగన్ పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్నారని, ఆయన అనువదించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
అమెజాన్ ఇక తెలుగులో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.ఇన్ తాజాగా తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పోర్టల్ ఇంగ్లిష్, హిందీలో సేవలు అందిస్తోంది. ఆన్లైన్ షాపింగ్లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. రానున్న పండుగల సీజన్లో మరో 20–30 కోట్ల మంది వినియోగదార్లను చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది. కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్లను తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు జరిపేందుకు మార్గం సుగమం అయిందని అమెజాన్ కస్టమర్ ఎక్స్పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిశోర్ తోట ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు భాషల చేరిక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, మొబైల్, డెస్క్టాప్ సైట్స్లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్ సర్వీసు సిబ్బందితో తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో మాట్లాడవచ్చు. -
గిడుగు జయంతిని జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే
సాక్షి, అమరావతి: తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘గ్రాంథికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని, పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యులకందించిన గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే’ అని పేర్కొన్నారు. నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు సినీ హీరో అక్కినేని నాగార్జునకు సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యంత ప్రశంసనీయమైన నటుల్లో ఒకరైన నాగార్జునకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఆస్ట్రేలియా స్కూళ్లలో తెలుగు భాష
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషకు అరుదైన గౌరవం లభించింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టం కట్టింది. అంతేకాకుండా తెలుగు భాషను ఆప్షనల్గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో 5 పాయింట్లు అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ ఫర్ ట్రాన్సిలేటర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఇది శాశ్వత నివాసానికి ప్రామాణికం. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో ఉన్న సుమారు లక్ష మందికి పైగా తెలుగు వాళ్లకే కాకుండా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లేవాళ్లకు చక్కటి అవకాశమని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకులు, మీడియా, కమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి మల్లికేశ్వర్రావు కొంచాడ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో తెలుగు భాష గుర్తింపు కోసం తాము చేసిన కృషికి ఫలితం లభించిందని ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటి వరకు వివిధ నగరాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్లు మన పిల్లలకు తెలుగును బోధించేందుకు ప్రత్యేకంగా ‘మన బడి’వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, ఇక నుంచి ఆ అవసరం ఉండబోదన్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ,తమిళ భాషలకు అక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించగా, 4వ భాషగా తెలుగు ఆ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్వేల్స్, క్వీన్స్లాండ్,సౌత ఆస్ట్రేలియా, తదితర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ప్రయోజనం లభించనుంది. భావి తరాలకు బాటలు.... ఆస్ట్రేలియాలో తెలుగు భాషా వికాసం కోసం చాలాకాలంగా అనేక సాహిత్య, సాం స్కృతిక సంస్థలు కృషి చేçస్తూ భావి తరాలకు బాటలు వేస్తున్నాయి.‘తెలుగుమల్లి’ సాహిత్య మాసపత్రిక, ‘భువనవిజయం’ వంటి సాంస్కృతిక సంస్థలు ఈ క్రమంలో తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవితాన్ని, చరిత్రను దశదిశలా చాటేలా గత పదేళ్లుగా భువనవిజయం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు వివిధ నగరాల్లో పని చేసే తెలుగు అసోసియేషన్లు ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్యగా ఏర్పడి గత ఆరేడేళ్లుగా తెలుగు భాష గుర్తింపు కోసం అక్కడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో విభిన్న సంస్కృతులకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు సైతం మరో కలికితురాయిగా నిలిచింది. 2014లో దరఖాస్తు... ‘‘ తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు అందజేశాం.కానీ అప్పటి జనాభా లెక్కల ప్రకారం మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని సవాల్గా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేపట్టాం. తెలుగు వాళ్లనందరినీ ఒక్కటి చేయగలిగాం.సుమారు లక్ష మందికి పైగా ఉన్నట్లు తేలింది. దీంతో తెలుగు భాషకు సమున్నతమైన గుర్తింపు లభించింది.ఇది తెలుగు వారికి ఒక పర్వదినం’’ అని మల్లికేశ్వర్రావు చెప్పారు. ఈ కృషిలో డాక్టర్ కృష్ణ నడింపల్లి, శివ శంకర్ పెద్దిభొట్ల, వాణి మోటమర్రి తదితరులు కూడా ఉన్నారు. -
స్టార్ మాలో రామాయణం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, బంధాలలోని గొప్పతనాన్ని, విలువలతో కూడిన జీవన విధానాన్ని చెప్పే ఇతిహాసం రామాయణం. తండ్రిమాటను జవదాటని కుమారుడు...ఆ కుమారునిపై అవాజ్యమైన ప్రేమను కురిపించే తండ్రి, పతి బాటలలోనే సతి అనే ఇల్లాలు... ఇలా ఎన్నో బంధాలు, మరెన్నో జీవనసత్యాలను తెలియజేసే మహోన్నత పౌరాణిక గాథ రామాయణం. భారతీయ జీవనగమనంలో అంతర్భాగమైన ఈ పుణ్యగాథ నేటి తరానికి మార్గనిర్ధేశకం. టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనంగా 1980లలో రామానంద్ సాగర్ తీసిన రామయణ్ గాథను ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతుంది. అంతర్జాతీయంగా ఓ పౌరాణిక గాధకు అత్యధిక వీక్షణ రేటింగ్ తెచ్చుకోవడం ద్వారా గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న రామాయణ్ను లాక్డౌన్ కాలంలో పునః ప్రసారం చేశారు. అయితే హిందీ భాషలో ఉండటం, భావం అర్థం అయినా భాష అర్థంగాక పోవడం వంటి సమస్యలను కొంతమంది అభిమానులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందిస్తూనే రామానంద్ సాగర్ తీసిన 'రామాయణ్' సీరియల్ను స్టార్ మా ఛానెల్ తెలుగులో ప్రసారం చేయబోతుంది. ఈ సీరియల్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అనకాపల్లికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ. తన యుక్త వయసులో తాను ఈ సీరియల్ను దూరదర్శన్లో ఆదివారం పూట వీక్షించేవారమంటూ, అప్పట్లో ఇంటిల్లిపాది ఈ సీరియల్నూ క్రమం తప్పకుండా చూసేవారమని, మరలా ఇన్నాళ్లకు లాక్డౌన్లో మరలా ప్రసారం చేయడం చూశామన్నారు. భాష అర్థంగాకపోవడం కొంత సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో ప్రసారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెనే మాట్లాడుతూ భారతీయ జీవనశైలికి ప్రతిరూపం రామాయణం. కనుమరుగవుతున్న కుటుంబ బంధాల వేళ పరమ పవిత్రమైన రామాయణ మహాకావ్యం మనందరికీ జీవనముక్తి మార్గం చూపడమే కాదు బంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా చూపుతుందన్నారు. ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతుంది. -
ఆంగ్లమా... తెలుగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది. వారి మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో టిక్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. ► హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈనెల 21న జీవో 20 జారీ చేశారు. దీన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ► 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1–6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి. ► అమ్మ ఒడి కార్యక్రమం కోసం పాఠశాలలు, గ్రామం, మండలాల వారీగా సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఫార్మాట్లో లిఖిత పూర్వకంగా సేకరించాలి. కోవిడ్ నేపథ్యంలో తగిన ప్రోటోకాల్ను పాటించాలి. ► మాధ్యమంపై తల్లిదండ్రుల సంతకాలతో సేకరించిన ఫార్మాట్ హార్డ్ కాపీలను పాఠశాల, మండలాల వారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో భద్రపరచాలి. ► మండల విద్యాధికారులు ఈ సమాచారాన్ని ఫారం–1 ద్వారా క్రోడీకరించాలి. జిల్లా స్థాయిలో క్రోడీకరించిన సమాచారాన్ని ఫారం–2లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి. ► ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులందరికీ ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశారు. ప్రొఫార్మాలో సమాచారం ఇలా ఇవ్వాలి... ► జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి. ► తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మీడియం కావాలో ఎంచుకుని పత్రంలో టిక్ చేయాలి. ► 2020–21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్లను ఇచ్చింది. మూడు ఆప్షన్లు ఇవీ.. 1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం 2. తెలుగు మీడియం 3. ఇతర భాషా మీడియం ► ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్ చేయాలి ► ఎంపిక చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి ► తల్లి/తండ్రి/సంరక్షుకుడు∙సంతకం తప్పనిసరిగాచేయాలి. ► కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి. -
తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్
సాక్షి, అమరావతి : గత రెండ్రోజులుగా కోవిడ్-19 నియంత్రణకు ఇంగ్లిష్ భాషలో మాత్రమే వినిపిస్తున్న కాలర్ ట్యూన్ ఇప్పుడు తెలుగులోనూ వినిపించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్రెడ్డి మాట్లాడారు. నమస్తే అంటూ మొదలై.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనసమర్థంలోకి వెళ్లవద్దని చెప్పడం, వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించడం వంటి పలు అంశాలతో కూడిన చక్కటి వాయిస్ను రూపొందించారు. సుమారు యాబై సెకన్ల పాటు ఈ కాలర్ ట్యూన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అన్ని మొబైల్ ఫోన్లలోనూ కోవిడ్ నిరోధానికి పాటించే జాగ్రత్తలు తెలుగులోనే రానున్నాయి. ఇప్పటివరకు ఇంగ్లీష్లో వచ్చే ఈ కాలర్ ట్యూన్ అర్థం కాక సామాన్యులు ఇబ్బంది పడుతుండేవారు. (బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా) హోమియో మందుల పంపిణీ కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఏపీ సచివాలయంలో మంగళవారం ఆర్సెనికం ఆల్బమ్–30 పేరున హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉపసంచాలకులు వెంకట్రామ నాయక్ నేతృత్వంలో 1,500 మందికి హోమియో మందులు అందించామని సెక్రటేరియట్ వైద్యులు వెంకట్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మీ, సత్యబాబు తెలిపారు. ఈ హోమియో మందు రాష్ట్రంలోని అన్ని వైద్య కేంద్రాల్లో, హోమియో షాపుల్లో లభిస్తోందన్నారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఆమోదించిందని వెల్లడించారు. -
అమ్మ భాష తెలుగు.. అక్షరమై వెలుగు
మాతృభాష గొప్పదనం మాటల్లో వర్ణించలేనిది. భావ వ్యక్తీకరణకు సులభమైన.. సులక్షణమైన మార్గం అమ్మభాష. అందుకే గాంధీ మాతృభాష గురించి ఇలా అన్నారు.. మాతృభాషా తృణీకారం.. మాతృదేవీ తిరస్కారం అని రెండు పంక్తుల్లో మాతృభాష ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. ప్రతి జాతి సంస్కృతి వికాసానికి మూలం మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం పెరిగింది. అయితే మనగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తపడాలి. తమతమ మాతృభాషలను కాపాడుకోవాలని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. సాక్షి, విజయవాడ : మాతృ భాషతోనే జాతి సాంస్కృతిక సంపద వెలుగొందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషల ఉనికి ప్రమాదంలో పడటం ఆందోళన కలిగించే అంశం. మాతృ భాష కోసం బెంగాల్ యువకుల ఆత్మబలిదానం రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి పునాది పడింది. నేపథ్యం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ సభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. లక్ష్యాలు ప్రపంచంలోని చిన్నాచితకా దేశాలతో పాటు అతి పెద్ద దేశాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి దేశానికి, ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ భాష ఉంటుంది. భాషా సాంస్కృతిక వైవిధ్యం కాపాడుకోవడం, బహు భాషల ప్రభావాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం భాషా వికాసానికి లక్ష్యాలుగా ఉండాలని మేధావులు సూచించారు. ►మాతృభాషా వికాసానికి ప్రభుత్వాలు నడుంబిగించాలి. ►అంతరించిపోతున్న భాషలను గుర్తించి కాపాడుకోవాలి. ►మౌఖిక భాషలకు అక్షర రూపం కల్పించాలి. ►ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా భాషా సదస్సులు నిర్వహించాలి. ►పాలనాభాషాగా ప్రజలు మాట్లాడే భాష ఉండాలి. ►భాషకు అనుబంధంగా ఉన్న మాండలికాలను ప్రోత్సహించాలి తెలుగు భాషాభివృద్ధిలో మన కవులు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినవారిలో కృష్ణానదీ తీరప్రాంతమైన పెనుగంచిప్రోలులో జని్మంచిన ఉద్యమకర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, తెలుగులో తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ ముఖ్యులు. నిద్రాణమైన తెలుగు జాతిని మేల్కొలిపిన కొమర్రాజు 1876 మే 18న పెనుగంచిప్రోలులో జని్మంచిన కొమర్రాజు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం రచయిత, విజ్ఞాన మండలి స్థాపకుడు. భువనగిరిలో ప్రాథమిక విద్య అభ్యసించి నాగపూర్లో అక్కాబావలతో ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నాడు. 1900లో బీఏ, 1902లో ఎంఏ ఉత్తీర్ణులయ్యారు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు రాశారు, తెలుగు, మరాఠీ, ఇంగ్లిషు, సంస్కృతం, బెంగాల్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1901లో శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయమైన పుస్తక భాండాగారాన్ని నెలకొల్పిన తొలి తెలుగు వ్యక్తి. 1906లో విజ్ఞాన చంద్రిక మండలిని, 1910లో విజ్ఞాన చంద్రిక పరిషత్ను స్థాపించారు. 1916లో రచించిన తెలుగు విజ్ఞాన సర్వస్వం పుస్తకం దక్షిణ భారతదేశంలో సంచలనం సృష్టించింది. 11 భాషా విషయక పుస్తకాలు, 2 చారిత్రక గ్రంథాలు, ఇతర శా్రస్తాలతో 20 పుస్తకాలు రాశారు. 1923లో ఆరోగ్యం క్షీణించి తిరిగిరాని లోకాలకేగారు. తొలి తెలుగు కథారచయిత్రి బండారు అచ్చమాంబ కొమర్రాజు సోదరి అయిన అచ్చమాంబ దేశంలోనే తొలి తెలుగు కథారచయిత్రి. ఆమె అనేక రచనల్లో స్త్రీవిద్య, వితంతు పునరి్వవాహం వంటి సాధక విషయాలతో హిందూసుందరి, జనాన అనే పత్రికల్లో వ్యాసాలు రాశారు. 1901లో మహిళా సంఘాన్ని స్థాపించిన తరువాత ఆమె 1902లో అబల సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని వెలువరించింది. 1901 నుంచి 1903 వరకు ధనత్రయోదశి, గుణవతి వంటి 10 కథలు రాశారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా గౌరవం అందుకున్నారు. ఆమె కథల్లో భావోద్వేగాలు, స్త్రీవాదాలు, హక్కులు మొదలైన వైవిధ్యభరితాలు ఆనాడే కనపడేవి. 1904లో ఆమె రాసిన బీద కుటుంబం అనే కథ నాటి సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. స్పష్టమైన అభిప్రాయాలతో రచనలు కొనసాగించి తొలి తెలుగు కథా రచయిత్రిగా సుస్థిర స్థానాన్ని పొందారు. -
తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్తో గెలవాలి!
తల్లి భాషమీద తెలుగువారికి భావోద్వేగం ఉన్నంత పట్టుదల లేదు. వీరభక్తి పొంగి పొర్లేపాటి వివేకం లేదు. విధిగా ఏం చేసి భాషను బతికించుకోవచ్చో వివేచన లేదు. పాలకుల్లోనూ గాలి మాటలు చెప్పడము న్నంత కార్యాచరణ లేదు. తల్లి భాషగా తెలుగు బాగుకు, భాషాభివృద్ధికి ప్రభుత్వాల పరంగా చేస్తున్నది పెద్ద బండిసున్న. రెండు వేల ఏళ్లకు పైన వాడుకలో, వెయ్యేండ్లకు పైబడి సాహిత్యంలో తెలుగు నిలిచిందంటే... కవి–పండితులు, ఇతర సాహిత్యకారులు, భాషాభిమానులు, సామాన్యుల నిరంతర కృషి, సాధన, వ్యాప్తి, వ్యవహారమే తప్ప పనిగట్టుకొని ప్రభుత్వాలు చేసిన గొప్ప మేళ్లేమీ లేవు. నిర్దిష్ట కార్యాచరణే లేదు. సర్కార్లు చేసిన మేలు లేకపోగా... అధికారుల ఆంగ్ల ఆధిపత్యధోరణి వల్ల ఇన్నాళ్లు తెలుగుకు జరిగిన ద్రోహమే ఎక్కువ! ఇక భాష వివిధ రూపాల్లోకి, మాండలి కాల్లోకి మారుతూ కూడా మౌలికంగా తన స్వభావాన్ని నిలుపుకొని ఈ నేలపై మనుగడ సాగిస్తోందంటే, అందుకు తెలుగు సమాజపు అవస రాలే కారణం. సామాన్యుల నుంచి సంపన్నులు, మహా విద్యావంతుల వరకు రోజువారీ వాడుక, వ్యవహారం వల్ల, అంతో ఇంతో వారి సాహితీ సృజన, ఆసక్తి వల్ల తెలుగు నిలిచింది. ఇప్పుడు తల్లి భాష గురించి తల్లడిల్లే వారిది, ఆంగ్ల భాషను తిట్టిపోసుకునే వారిదీ ఆవేశమే తప్ప సమగ్ర ఆలోచన కాదు. అసలు తెలుగుకు గడ్డుకాలం దాపురిం చడంలో లోపమెక్కడుందో గుర్తించే తెలివిడీ కాదు. తెలుగుపై సాను భూతి ప్రకటనలో ఆడంబరమే తప్ప కనీసం తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలోనూ ఆచరణ శూన్యం! తెలుగు మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన జరగాలనే వాదనలో హేతువుంది. మామూలుగా చూసినపుడు ఆ ప్రతిపాదన బాగానే కనిపిస్తున్నా... అలా చదివిన వారు ప్రాథమిక విద్యో, మాధ్యమిక విద్యో ముగిశాక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో చూడాలి. తర్వాతి కాలంలో వారెంతగా ఆంగ్లంపై ఆధారపడాల్సి వస్తున్నదో పరిశీలించాలి. అప్పటిదాకా తెలుగులో సాగించిన విద్యాభ్యాసం తమ తదనంతర ఉన్నత విద్యకు, ఉద్యోగం–ఉపాధి పొందడానికి ఎలా ప్రతిబంధకమౌతోందో గమనిం చాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ దాటాక కూడా తెలుగు మాధ్య మంలోనే కొనసాగడానికున్న అవకాశాలు–పరిధులు, వనరులు–పరి మితులు, ఇతర సాధన సంపత్తి–కొరత ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. వాటన్నిటికీ మించి, ఉన్నత–వృత్తి విద్యా కోర్సుల్లో విధి లేని పరిస్థితుల్లో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వల్ల వారు ఎదు ర్కొంటున్న కష్ట–నష్టాలు బేరీజు వేయాలి. అప్పుడుగాని, మన వాళ్ల భావావేశంలో కొరవడుతున్న సంబద్ధత, తెలుగే కావాలంటూ ఇంగ్లీషు ను ఈసడించుకోవడంలో లోపిస్తున్న హేతుబద్ధత అర్థం కావు. పోటీకి సమస్థితి కల్పించాలి జర్మనీ, జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ... ఇలా అభివృద్ధి చెందిన దేశాలను ఉటంకిస్తూ, వారంతా తల్లిభాషలో ప్రాథమిక విద్య బోధన వల్లే అత్యంత సృజనతో ఎదుగుతున్నారనే వాదన ఉంది. అది నిజమే! ప్రాథమిక విద్య తల్లి బాషలోనే సాగాలన్నప్పుడు, ఇతరేతర సదుపా యాలు, వనరుల కల్పన, సన్నద్ధత ఎంతో అవసరం. పోటీదారుల మధ్య సమ, సానుకూల వాతావరణమూ ముఖ్యమే! ఆంగ్ల–తెలుగు మాధ్యమ విద్యార్థులకు విద్య–ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసా లకు తావులేని సమస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. అవసరమైతే తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి. రిజర్వేషన్ కల్పించాలి. ఆయా దేశాల్లో లేని ఒక విచిత్ర పరిస్థితి బ్రిటీష్ వలస దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కొఠారీ విద్యా విధాన ప్రభావం వల్ల ఇంగ్లీషు చదువులొక పార్శ్వంలో వృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ వంటి స్థానిక భాషలకు, విశ్వ భాషగా పరిగణించే ఇంగ్లీషుకు మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. పైన పేర్కొన్న అభివృద్ధి సమాజాల్లో ఈ పంచాయతీ లేదు. వారికి తల్లి భాషలోనే అన్నీ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతో పోటీ పడే వారెవరూ ఉండరు. దేశంలోని అన్ని స్థాయిల వారికీ తల్లి భాషలోనే పోటీ! ఇక భాషాపరమైన వ్యత్యాసాలు, వివక్షకు తావెక్కడ? మన దగ్గర ఇప్పటికీ సంపన్నులు, ఎగువ మధ్య తరగతి, అంతో ఇంతో ఆర్థిక స్తోమత కలి గిన వారు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన జరిపిస్తుంటారు. అది సైన్స్–టెక్నాలజీ అయినా, సామాజిక శాస్త్రా లైనా, వృత్తి కోర్సులయినా... ప్రపంచ స్థాయి విషయ వనరులు, ఆధు నిక సమాచారం, కొత్త పరిభాష ఆంగ్లంలోనే లభిస్తుంది. కానీ, తెలుగు వంటి స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిశోధనల లేమి, భాష ఎదుగుదల లేకపోవడం, భాషాంతరీకరణలు, అనువాదాలు ఎప్పటికప్పుడు జర గకపోవడం, పారిభాషక పదకోశాలు, నిఘంటువులు సరిగా నిర్మాణం కాకపోవడం వల్ల విషయ వనరుల కొరత ఉంటుంది. బోధన కూడా ఆ స్థాయిలో ఉండదు. భావ ప్రసరణ నైపుణ్యాల్లోనూ వెనుకబాటుత నమే! దాంతో, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలప్పుడు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో పోటీ పడలేని స్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకుంటుంది. ఇందుకు నేపథ్యం... పేద, దిగువ మధ్య తర గతి పిల్లలు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన దొరకని సర్కారీ బడుల్లో, తెలుగులోనే చదువుకోవాల్సి రావడం. ఒక స్థాయి దాటిన తర్వాత వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అవకాశపు తలుపులు మూసుకు పోతున్నాయి. తెలివి, చొరవ, ఆసక్తి, వాటన్నిటికీ మించి అవసరం ఉండి కూడా పోటీని తట్టుకోలేక చతికిలపడుతున్నారు. అందుకే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధ నను వారు స్వాగతిస్తున్నారు. ఇవేవీ ఆలోచించకుండా సర్కారు బడుల్లో తెలుగే మాధ్యమంగా ఉండాలని, ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదనే వాదన సరికాదు. అది కడకు ఉన్నవారికి–లేనివారికి మధ్య దూరం పెంచడమే! అవకాశాల్లో వివక్షను పెంచి పోషించడమే అవుతుంది. పేదవర్గాలకు చెందిన తెలుగు మాధ్యమ విద్యార్థుల అవ కాశాల్ని కర్కశంగా నలిపేయడమే అవుతుంది. బతికుంచుకునే ఏ యత్నమూ జరగట్లే! భాష ఎన్నో ప్రయోజనాలు కలిగిన మానవ పనిముట్టు. ఇతర జీవుల నుంచి మనిషిని వేరుపర్చే ప్రత్యేక లక్షణం భాషది. మరే జీవీ మనిషి లాగా భాషనొక సాధనంగా మార్చుకొని తన రోజువారీ అవసరాలు తీర్చుకున్నది లేదు. భాషలెన్ని ఉన్నా... తల్లి భాష ఎంతో ముఖ్య మైంది. రోజువారీ వ్యవహారాల్లోనే కాక మనసు ప్రకటించడం, బంధా లల్లుకోవడం, వక్తిత్వ వికాసం, ఊహ పరిధి విస్తరణ, మానవ సంబం ధాల వృద్ధి... ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు భాష వల్లే సాధ్యం. ఇలా పరస్పర భావ ప్రసరణకే కాకుండా వారసత్వంగా వస్తున్న సంప్ర దాయ విజ్ఞానాలను భవిష్యత్తరాలకు అందించడానికి, భద్రపరచడా నికీ భాష సాధనం. ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ తల్లి భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రేరణ మన బెంగాలీలే! తూర్పు పాకిస్తానీయులు తమ తల్లి భాష బంగను జాతీయ భాషగా గుర్తించాలని 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో ఆందోళన చేస్తున్నపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు బలయ్యారు. దాంతో కదిలిపోయిన పాక్ ప్రభుత్వం బంగను ఒక జాతీయ భాషగా ప్రకటించింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డపుడు బంగ భాషే అక్కడ అధికార భాషయింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తల్లి భాషను కాపాడుకునే నిర్మాణాత్మక ప్రయత్నమేదీ తెలుగు సమాజంలో జరగటం లేదు. రాను రాను తెలుగు చదివే, రాసే వారి సంఖ్య రమా రమి తగ్గిపోతోంది. తెలుగుపట్ల కొత్తతరం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తెలుగు నేర్చుకొండని తలిదండ్రులూ తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రతి తరగతిలో తెలుగు ఒక తప్పనిసరి ‘విషయం’గా నిర్బంధం చేస్తూ ఆదేశాలి చ్చారు. ఇదివరకు అలా లేదు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంకా ఫ్రెంచ్ తదితర భాషల్లోంచి ఏదైనా ఒకటి ఎంపిక చేసుకునే అవ కాశమిస్తూ వచ్చారు. దాంతో, తేలిగ్గా ఉంటుందని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఏ హిందీనో, సంస్కృతమో, ఫ్రెంచో ఎంపిక చేసు కోవడం మన పిల్లలకు అలవాటయింది. దాంతో తెలుగుకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు తెలుగును నిర్బంధం చేయడం వల్ల విధిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తల్లి భాష పరిరక్షణలో ఇదో ముందడుగు. ఇంకెంతో చేయాలి ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల కల్పనలోనూ తెలుగులో అభ్యర్థులకుండే ప్రావీణ్యానికి అదనపు వెయిటేజీ మార్కు లివ్వాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరిశోధనలు, పరిణామాల సమాచారం నిరంతరం తెలుగులోకి తర్జుమా అయ్యేట్టు చూడాలి. ఇంటర్నెట్తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలుగు అందుబాటులో ఉండేట్లు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగును ఓ ఆధారపడదగ్గ భాషగా నేటి యువతరానికి విశ్వాసం కల్పించాలి. అధికార భాషా చట్టం నిర్దేశిస్తున్నట్టు, ప్రభుత్వ ఉత్త ర్వులు, ఆదేశాలు, నివేదికలు, విధివిధానాలు, నిత్య వ్యవహారాలు... ఇలా అన్నీ తెలుగులోనే జరిగేలా కట్టడి చేయాలి. స్థానిక న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చూడాలి. వారికెంత ఇంగ్లీష్ వచ్చినా, తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడు కోవాలి. తల్లి భాషలో మాట్లాడటాన్ని తక్కువ చేసి చూడకూడదు. మాండలికాల్ని ఆదరిస్తూనే ఓ ప్రమాణభాష రూపొందించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఒకరు మరొకరికి నేర్పండి’ (ఈచ్ వన్ టీచ్ వన్) అంటోంది. తల్లిభాష వ్యాప్తికి ఇదొక చక్కని అవకాశం. తల్లి భాష తెలుగును కాపాడుకోవ డమంటే ప్రపంచపు కిటికీ ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం కాదు. తెలు గును విని, మాటాడి, చదివి, రాయగలిగితే చాలు. మహా కథకుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘తల్లిభాషలో ఒక ఉత్తరం రాయటం చాతగాని వాడు ఎన్ని డాక్టరేట్లు సంపాదించినా నిరక్షరుడే!’ (నేడు అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవం) ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకం కాదు
సాక్షి, నెల్లూరు: ఇంగ్లిష్ మీడియంకు తాను వ్యతిరేకిని కాదని, ముందు మన మాతృభాషను మరిచిపోకుండా ఉంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఏ భాష ఉన్నా ప్రభుత్వం మాత్రం మాతృభాషతో పాటు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలన్నారు. పరాయి భాషలను తానెప్పుడూ వ్యతిరేకించబోనని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో జరిగిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగు భాషాభిమానులతో జరిగిన కార్యగోష్టి ముగింపు సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భాష ప్రాచీనతను, విశిష్టతను పరిరక్షించుకోవడం మన ప్రధాన లక్ష్యం కావాలన్నారు. మైసూరు నుంచి ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా తరలించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిద్ధపడి రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిందని.. తాను నెల్లూరుకు వచ్చేలా కృషిచేశానని వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలో అన్ని సౌకర్యాలతో కేంద్రం ఏర్పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ.. తిక్కన పుట్టిన నెల్లూరుకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శబ్ధాల్లోనే శక్తి ఉంటుందని, ఆ శబ్ధాలను పరిరక్షించుకోవాలన్నారు. భారతీయ భాషలు ఎన్ని ఉన్నాయో వాటిన్నింటినీ పరిరక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం స్థలం ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకరించారని.. త్వరలోనే ఈ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటుచేస్తామని రమేష్ చెప్పారు. మాతృభాషలోనే ప్రాథమిక శిక్షణ ఉండాలని.. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమన్నారు. మాతృభాష, మాతృభూమి, మాతృదేశం అనేవి ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యమైనవన్నారు. -
ఇక తెలుగులోనూ జేఈఈ మెయిన్!
సాక్షి, హైదరాబాద్: మాతృ భాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు జేఈఈ మెయిన్ పరీక్షలను 9 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిం చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఆదేశాల మేరకు ఈ కసరత్తును ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్/హిందీ లేదా గుజరాతీలో ఇచ్చే జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు న్నట్లు ఎంహెచ్ఆర్డీ గుర్తించింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తుండటంతో ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2021 జనవరి నుంచి జేఈఈ మెయిన్ను ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్టీఏను ఎంహెచ్ఆర్డీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎన్టీఏ కసరత్తు ప్రారంభించింది. దాదాపు లక్షన్నర మందికి పైగా తెలుగు విద్యార్థులు రాసే ఈ పరీక్షలను తెలుగులోనూ నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. వచ్చే ఏప్రిల్లో మాత్రం మూడు భాషల్లోనే.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్నూ మూడు భాషల్లోనే నిర్వహిస్తోంది. ఇంగ్లిష్, హిందీతోపాటు గుజరాతీలోనూ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 2013లో జేఈఈ మెయిన్ అమల్లోకి తెచ్చినపుడు తమ భాషలోనూ పరీక్ష నిర్వహించాలని గుజరాత్ కోరడంతో గుజరాతీలోనూ పరీక్ష నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలు అప్పట్లో అడగకపోవడంతో తెలుగులో నిర్వహించడం లేదు. 2018 వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ పరీక్షలను నిర్వహించగా, 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మూడు భాషల్లోనే ఈ పరీక్షలను నిర్వహించింది. వచ్చే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జేఈఈ మెయిన్ను కూడా మూడు భాషల్లోనే నిర్వహిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. 11 భాషల్లో నిర్వహించేలా.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, మాతృ భాషల్లో చదువుకున్న వారు నష్టపోకుండా ఉండేందుకు 11 భాషల్లో జేఈఈ మెయిన్ను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఆ 11 భాషల్లో 9 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. 2021 జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. 2021 జనవరి తరువాత కూడా ఇకపై ప్రతి ఏటా 11 భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇంకా ఏమైనా రాష్ట్రాలు అడిగితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసి ఇచ్చే అంశాలను కూడా ఎన్టీఏ పరిశీలిస్తోంది. ‘ఆ జవాబులు సరైనవే’ జేఈఈ మెయిన్ పరీక్షలోని 5 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు ‘కీ’లో పేర్కొన్న 5 సంబంధిత జవాబులు సరైనవేనని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. 5, 5.0, 5.00, 5.000, 5.0000, 05, 05.0, 05.00, 05.000, 05.0000 జవా బులన్నీ సరైనవేనని ఓ ప్రకటనలో ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు దీన్ని గమనించాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. -
తెలుగు భాషకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు
సాక్షి, అమరావతి: తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాము కూడా తెలుగు భాషా ప్రేమికులమేనని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇంటరీ్మడియెట్లో తెలుగు ఉందని, తెలుగు బీఏ, ఎంఏ ఉందని, తెలుగులో పీహెచ్డీ కూడా చేయవచ్చని గుర్తుచేశారు. ఆయన శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల వేదికపై మండలి బుద్ధప్రసాద్, మరికొందరు టీడీపీ నేతలు మాట్లాడిన తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. తెలుగు భాషను విస్మరిస్తున్నారంటూ కొందరు కక్షపూరితంగా ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు భాష తల్లిలాంటిదని, తమ ప్రభుత్వం తెలుగును ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కన్నతల్లిని ఎలా ప్రేమిస్తారో... తెలుగు భాషను సైతం అలాగే ప్రేమిస్తారని పేర్కొన్నారు. పేదల వర్గాల కోసమే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే శక్తి లేని బడుగు, బలహీన వర్గాల కోసమే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతోందని అంబటి రాంబాబు చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలో చదువుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశి్నంచారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చేలా పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలుగు భాషకు అన్యాయం, ద్రోహం జరిగినట్లుగా కొందరు మాట్లాడుతున్నారని తప్పపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జీవో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని జీవో ఇచ్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. తెలుగుపై అంత ప్రేమ ఉంటే ఆ జీవో ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ పాఠశాలలను నిరీ్వర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే కదా అని ప్రశి్నంచారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతికూలంగా రాయడమే కొన్ని పత్రికలు పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. పత్రికాధిపతుల పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు? వారు నిర్వహించే కళాశాలలు ఏ మీడియంలో ఉన్నాయో చెప్పాలని మండిపడ్డారు. తెలుగు రచయితల సభల పేరుతో తప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతంలో మీడియా వారిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని ఈ దాడిని, తాము ఖండిస్తున్నామన్నారు. -
తెలుగు భాషపైన నిజమైన ప్రేమేనా?
ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులకు హఠాత్తుగా తెలుగు భాషపైన ఎక్కడ లేని ప్రేమ పుట్టు కొచ్చింది. తెలుగు భాష సంస్కృతి అంతమైపోయిందన్న ఆందోళనతో నిద్రకూడా పోవడం లేదు. ఇప్పటికిప్పుడు తెలుగు పైన ఇంత అభిమానం ఎందుకు కలిగింది? ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్య మంలో ఉంటుందన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన వల్లనే గదా. తెలుగు మాట్లాడితే జరిమానా విధిస్తూ, ఎండలో నిలబెట్టి శిక్షిస్తూ, తెలుగు వాసనని కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్న కార్పొరేట్ స్కూళ్లలో సంపన్న వర్గాల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నప్పుడు తెలుగు భాషకు ఏ అపకారం, అపచారం జరగలేదా? ఇప్పుడు పేదలు, బలహీనవర్గాలు, దళిత, మైనారి టీల పిల్లలు ఇంగ్లిష్లో చదువుకుంటేనే తెలుగుకు అంత పెద్ద ఉపద్రవం వచ్చి పడబోతున్నదా? తెలుగు భాషపైన ఇప్పుడు అలవిమాలిన ప్రేమని ఒలకబోస్తున్న గత ప్రభుత్వం తెలుగు భాషాభి వృద్ధికి ఏం చేసింది? ఓరియంటల్ కళాశాలలు వరుసగా మూతప డుతున్నాయి. భాషా ప్రవీణ, విద్వాన్ వంటి కోర్సుల సిలబస్లో తెలుగు భాషకు సంబంధిం చిన సిలబస్ను తగ్గించి ఇంగ్లిష్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. మరి పద్నాలుగేళ్లు సీఎం రాజ్య మేలిన చంద్రబాబుకు, ఆయన అనుచరు లకు, వంత పాడుతున్న మేధావులకు ఆనాడే తెలుగు భాషకు జరిగిన అపచారం తెలీలేదా? మరో విషయం. టెన్త్, ఇంటర్ తరగతుల్లో సంస్కృతం పేపర్ ఎందుకొచ్చింది? ఎవరి ప్రయోజనం కోసం వచ్చింది? తెలుగు పేపర్ను వదిలేసి విద్యార్థు లంతా సంస్కృతం పేపర్లోకి పరుగులు తీసే పరి స్థితి ఎందుకేర్పడింది? విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ సంస్థలు ర్యాంకుల పంట పండించు కోవడం కోసం కాదా? దీంతో తెలుగు బడులకు మనుగడ లేక, తెలుగు పండితులకు గౌరవం లేక, తెలుగు భాష ఇంత చులకనైపో తుంటే, పలుచనై పోతుంటే ఇన్నేళ్లుగా చూస్తూ కూర్చున్నారు కదా.. ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడే అర్హత వీరికి ఎక్కడినుంచి వచ్చింది? గ్రామీణ ప్రాంతాల బడుల్లో సరిపడినంత విద్యార్థులు లేరన్న నెపంతో గత ప్రభుత్వం వేలాది బడులను మూసివేసింది. దాంతో పేద విద్యార్థులు అప్పులు చేసి ప్రైవేటు బడులకు పరు గులు తీయవలసి వచ్చింది. ఆ మాత్రం శక్తి కూడా లేని వేలాదిమంది పసివాళ్లు బడిబాటే మర్చి పోవాల్సి వచ్చింది. ఇంత నిర్దయగా నిరుపేదలు, బడుగు, బలహీనుల బిడ్డలకు చదువుని దూరం చేసి గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు పసి బిడ్డల చదువుల గురించి కాకుండా వాళ్ల భాష గురించి బాధపడటం ఎంత విచిత్రం. మాతృభాషలో విద్యాబోధనే ఉత్తమం అని మేధావులు, భాషా శాస్త్రవేత్తలు చెబుతోంది నిజమే. అయితే మాతృభాషలోనే ఉన్నత విద్య అభ్యసిస్తున్న జర్మనీ, జపాన్, రష్యా వంటి పలు దేశాల పరిస్థితి వేరు. ఈ దేశాలు ఆంగ్లేయుల పాలనకు తలొగ్గలేదు. ఇంగ్లిష్ నేర్చుకునే అవసరం వారికి ఏర్పడనందున శాస్త్ర, సాంకేతిక జ్ఞాన మంతా వారి మాతృభాషలోనే లభ్యమవుతుంది. కానీ భారత్ వంటి దేశాల పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ వలసగా మనం ఉండటంతో ఇంగ్లిష్ మనపై బలవంతంగా రుద్దారు. భారతీయులు అనివార్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవలసి వచ్చింది. ఇంగ్లిష్లో మాట్లాడటం గొప్ప అన్న భావన స్థిరపడి పోయింది. ఇంగ్లిష్ రానివాళ్లు ఆత్మన్యూనతలో ఉండిపోయారు. అంతగా పాతుకుపోయిన ఆంగ్ల భాషను ఇప్పటి కిప్పుడు తోసెయ్యగలమా? వారు చెబుతున్నట్లే తెలుగు భాషని ఉద్ద రిద్దాం. ‘ఆంధ్రదేశంలోని ప్రతి పాఠశాలలోనూ ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి, ఏ మినహాయింపూ లేకుండా ప్రతి తెలుగువాడూ తెలుగు మాధ్యమంలోనే చదువుకోవాలి’ అనే నినా దంతో ముందుకురండి. ఆ ఉద్యమాన్ని చేపట్టండి. కనీసం ఒక ప్రకటన చేయగలరా? చేయలేరు. ఇంగ్లిష్ మీడియం బడుల్ని పల్లెత్తు మాటనలేరు. ఇంగ్లిష్తో విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలకు నష్టం జరిగే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఎందు కంటే ఆ వ్యాపార సంస్థలు మన వాళ్లవి. అక్కడ చదువుకోవలసింది మన పిల్లలు. ఏమిటీ ద్వంద్వ నీతి? లెక్కలు, సైన్సు, సోషల్ ఇంగ్లిష్లో బోధిం చినంత మాత్రాన తెలుగు అంతమైపోతుందా? ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వాళ్లు మాత్రమే తెలుగును బ్రతికించాలా? ఇంగ్లిష్ మాధ్యమంలో చదివే సంపన్నులకు ఆ బాధ్యత లేదా? పైగా అంబేడ్కర్ అంత గొప్పవాడు కాలేదా? పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాలేదా? సీవీ రావు సైంటిస్ట్ కాలేదా? అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాలేదా? వారంతా వారి వారి మాతృభాషల్లో ప్రాథమిక విద్య అభ్యసించినవాళ్లే కదా అంటూ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లని ఉదా హరణగా చూపిస్తున్నారు. ఇదెలా ఉందంటే కార్పొ రేట్ విద్యా సంస్థలు ఒకటి రెండు ర్యాంకులు చూపించి తమ వద్ద చదివితే అందరికీ ఇలాంటి ర్యాంకులు వస్తాయన్న భ్రమని కల్పించి దోచు కుంటున్నట్టుగా ఉంది. స్వయం ప్రతిభతో, అసా ధారణ మేధస్సుతో రాణించే వాళ్లకు ఇవేవీ వర్తిం చవు. పైగా వారు చదువుకునే రోజుల్లో ఊళ్లో ఒకే బడి ఉండేది. అందరికీ ఒకే సిలబస్ ఉండేది. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వృద్ధి చెందేవారు. ఇప్పుడా పరిస్థితి ఉందా? విద్యార్థి లోక మంతా నిట్టనిలువునా రెండుగా చీలిపోలేదా? సంపన్నులందరూ ప్రైవేట్ బడుల్లోకి, పేదలు, బలహీన వర్గాలూ ప్రభుత్వ బడుల్లోకి అనివా ర్యంగా నెట్టబడలేదా? ఈ విభజన ఎవరి ప్రయో జనం కోసం జరిగింది? ఈ తెలుగు వాదం చేస్తున్న పెద్దలెవరైనా వాళ్ల పిల్లల్ని ఒక్క సంవత్సరం ఆ బడుల్లో చదివించగలరా? తమిళ మాధ్యమంలో చదివిన వారికి తమిళులు 20 శాతం రాయితీ ఇస్తు న్నారు. కన్నడిగులు 10 శాతం ఇస్తున్నారు. తెలు గుపైన అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వం వారి నెందుకు ఆదర్శంగా తీసుకోలేదు. ఇప్పుడు 90 శాతం మంది ప్రజల్ని పీడించి దోపిడీ చేస్తున్నాయి విద్య, వైద్య రంగాలు. వాటిని సమూలంగా సంస్కరించే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు 9 రకాల వసతులు సమకూరుస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. తెలుగు భాష బాగుండాలి అనేవారు అంతకంటే ముందు తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకోవాలి. వ్యాసకర్త, పాటిబండ్ల ఆనందరావు, మొబైల్ : 98498 98800. -
ఇంగ్లీష్తో పాటు తెలుగుకు ప్రాధాన్యత
సాక్షి, కృష్ణా: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఇంగ్లీష్ తో పాటు తెలుగుభాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి మంత్రి స్పష్టం చేసారు. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు సురేష్ హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అంశం పై కూలంకుష చర్చ జరిగిందని చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యాప్రమాణాలు అందిస్తామని స్పష్టం చేశారు. అభ్యాసన ఫలితాలు, ఫౌండేషనల్ లెర్నింగ్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు రూపొందించబడుతున్నాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు మూడు స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగిస్తామన్నారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోందని ఆదిములపు సురేష్ తెలిపారు. -
చంద్రబాబును ఫాలో అవుతున్న పవన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. ‘ఇంగ్లీష్ను వద్దనడం లేదు.. మాతృభాష వదలొద్దు అంటున్నాం’ అంటూ ఆయన నిన్న ట్వీట్ చేశారు. సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున మద్దతు రావడంతో చంద్రబాబు ఇప్పటికే యూటర్న్ తీసుకున్నారు. తాజాగా పవన్ కూడా చంద్రబాబునే అనుసరించారు. ఈ నెల 21వ తేదీన కొమనాపల్లి సభలో సీఎం జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలకు జనసేన పార్టీ సమాధానం అంటూ పవన్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ అరవిందరావు ‘తెలుగు వర్దిల్లతేనే వెలుగు’ అన్న పేరు తో తెలుగు భాషా పరిరక్షణ’, గురించి రాసిన వ్యాసం,అన్ని కోణాలలో చాల విశ్లేషణాత్మకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని లోని అంశాలని పరిశీలించాలి’ అంటూ పవన్ బుధవారం మరో ట్వీట్ చేశారు. -
అమ్మ భాషకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి/ఒంగోలు మెట్రో: తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి. మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది. భాష, సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు. తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు. తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు, డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది తప్ప.. చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు’ అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు. తెలుగుకు మళ్లీ వెలుగులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా వికాసానికి గట్టి చర్యలు చేపట్టారు. పరిపాలనలో తెలుగు వినియోగం, భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు. దానికి తెలుగు, హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ను అధ్యక్షుడిగా నియమించారు. ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్సా్నరాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. తెలుగు అకాడమిని పునరుద్ధరించారు. ప్రముఖ రచయిత్రి, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నారు. అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ అకాడమీని కూడా పునరుద్ధరించనుంది. భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు, విద్యా వేత్తలు, సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాష పురోగతికి బాటలు ‘ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది’ అని గురజాడ చెప్పినట్టు ప్రభుత్వం ఒక మహిళ అయిన నందమూరి లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ బాధ్యతలు అప్పగించింది. తద్వారా తెలుగు భాష పురోగతికి బాటలు వేసింది. – సింహాద్రి జ్యోతిర్మయి, ఉపాధ్యక్షురాలు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సంతోషం కలిగిస్తోంది సీఎం వైఎస్ జగన్.. మదర్సాల ఉన్నతికి చర్యలు చేపట్టడమే కాకుండా ఉర్దూ అకాడమీని పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీటిని గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం ముదావహం. – డాక్టర్ షాకీర్, విద్యావేత్త తెలుగు అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తెలుగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. భాషావేత్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విధంగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. దాంతో భావితరాలకు కూడా తెలుగును మరింత చేరువ చేసింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో తెలుగు భాషను ఏమాత్రం విస్మరించ లేదు. – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే అధికార భాషా సంఘాన్ని నియమించింది. తెలుగు అకాడమీని పునరుద్ధరించింది. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. అంతమాత్రాన తెలుగును తీసేయడం లేదు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేశారు. – నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమి అధ్యక్షురాలు -
ఉన్నతి ఉపాధి కోసం.. ఇంగ్లిష్ మీడియం
రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది చదువుతున్న ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్ ఇంగ్లిష్లోనే ఉంది. శాస్త్ర పరిశోధనా రంగం, వాటికి ప్రామాణికమైన జర్నల్స్, ఇంటర్నెట్ సమాచారం, ఇతరత్రా రిఫరెన్స్ సమాచారం అంతా కూడా అదే భాషలో అందుబాటులో ఉండటం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన విధానాన్ని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో సామాజిక విద్యా విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నత అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునేందుకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యమే చోదక శక్తి అని గుర్తించింది. జూలీ డియల్డన్- 2014 సర్వేతోపాటు పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ దృష్ట్యా ఇంగ్లిష్లో భాషా పరిజ్ఞానమే కాకుండా.. విజ్ఞాన సర్వస్వాన్ని మన విద్యార్థులు ఒడిసి పట్టేందుకు వీలుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు, మరికొందరు వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది. మాతృ భాషతోనే విజ్ఞాన సముపార్జన సాధ్యమని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇంగ్లిష్తో విజ్ఞాన అనుసంధానం ఇంగ్లిష్లోని విజ్ఞాన సర్వస్వాన్ని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు తమ మాతృభాష ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఆ దేశాల్లో జాతీయ భాష ఒక్కటే అన్నది గుర్తుంచుకోవాలి. బహుభాషలకు నెలవైన మన దేశంలో అందరూ మాట్లాడగలిగే భాష అంటూ లేదు. అధికారికంగా 22 భాషలున్నాయి. ఈ పరిస్థితిలో ఇంగ్లిషు భాషలో ఉన్న విజ్ఞాన సర్వస్వాన్ని అన్ని భాషల్లోకి అనువదించడం అన్నది ఆచరణ సాధ్యం కాదని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలోనూ గత 70 ఏళ్లలో పాలించిన ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాద్యమంలో పాఠశాల విద్య చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో తప్పనిసరిగా ఇంగ్లిష్ మాద్యమంలోనే చదవాల్సి వస్తోంది. దీంతో ఆ భాషలో విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడంతో మన విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా తల్లిదండ్రులు కేవలం ఇంగ్లిష్ మీడియం కోసమే ప్రయివేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రయివేటు స్కూళ్లకు మళ్లారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ల ఉనికి ప్రశ్నార్థంగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇంగ్లిష్తోనే ఉన్నత అవకాశాలు దేశ ప్రస్తుత జనాభా దాదాపు 136 కోట్లు. ఇంత జనాభాకు తగిన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కేవలం మన దేశంలోనే కల్పించడం ఆచరణ సాధ్యం కాదన్నది గుర్తించాలి. దాదాపు 30 కోట్ల మంది సరైన ఉపాధి అవకాశాల కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విదేశాలు, దేశంలో నెలకొల్పే విదేశీ కార్పొరేట్ సంస్థలపై ఆధారపడక తప్పదని జాతీయ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అందుకు ఇంగ్లీషులో పరిజ్ఞానం తప్పనిసరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులకు, దేశంలోని ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులకు లభిస్తున్న అవకాశాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటోందని విద్యావేత్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ వాస్తవాలను గుర్తించే పలు దేశాలు ఇంగ్లిష్ మాద్యమంలో విద్యా బోధన వైపు మరలుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం వేగంగా విస్తరిస్తోందని బ్రిటీష్ కౌన్సిల్ కోసం జూలి డియల్ డన్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రధానంగా భారత ఉప ఖండంతోపాటు బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు 55 దేశాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. జూలి డియల్ డన్ సర్వే మేరకు.. - 55 దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలు 53 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 88 శాతం ఇంగ్లిష్లో విద్యా బోధన చేస్తున్నాయి. ఉన్నత విద్యలో ప్రభుత్వ విద్యా సంస్థలు 70 శాతం, ప్రైవేట్ విద్యా సంస్థలు 90 శాతం ఇంగ్లిష్ బోధన సాగుతోంది. - 55 దేశాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు అనుకూలంగా ప్రజాభిప్రాయం మారుతోంది. గత పదేళ్లలో 62 శాతం మంది ప్రజలు ఈ మీడియం వైపు మొగ్గు చూపారు. - ఇటలీ 10 ఏళ్ల క్రితమే ఇంగ్లిష్లో విద్యాబోధనను విస్తృతంగా చేపట్టింది. జర్మనీ, ఫ్రాన్స్దేశాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయి. - శ్రీలంక 2001లోనే ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఇంగ్లిష్ మీడియం బోధనను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా నిర్వహిస్తోంది. విద్యాబోధన వేరు.. భాష పరిరక్షణ వేరు ఇంగ్లిష్లో విద్యాబోధనకు మాతృభాష పరిరక్షణకు ముడి పెట్టడం సరికాదని విద్యావేత్తలు తేల్చి చెబుతున్నారు. విద్య, సంస్కృతి, సాహిత్యంలను వేర్వేరుగా చూడాలని సూచిస్తున్నారు. ఇంగ్లిష్తో తెలుగు భాషకు ముప్పు అనే సందేహాన్ని దివంగత భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గతంలోనే కొట్టిపారేశారు. కనీసం వెయ్యి మంది మాట్లాడే భాష ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆయన సాధికారికంగా విశ్లేషించారు. అలాంటిది దాదాపు 9 కోట్ల మంది మాతృ భాష అయిన తెలుగుకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంగ్లిష్ మీడియంతో తెలుగు ఉనికికి ముప్పు అనేది ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పెద్దిరాజు చెప్పారు. నష్టపోతున్న ప్రతిభావంతులు ఉత్తరాంధ్రతోసహా మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నారు. వారికి విషయ పరిజ్ఞానం ఉంటోంది. కష్టపడేతత్వం ఉంది. కానీ ఇంగ్లిష్లో విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడంతో కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు పొందలేక నష్టపోతున్నారు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదివక పోవడమే వారికి ప్రతికూలంగా మారింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అందివస్తున్న అవకాశాలను మన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటే పూర్తిగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడమే మార్గం. - ప్రసాదరెడ్డి, ఇన్చార్జ్ వీసీ, ఆంధ్రా యూనివర్సిటీ కేరళ, ఒడిశాలే ఆదర్శం ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు రాణించి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తప్పనిసరి. యూపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో భావ వ్యక్తీకరణ అన్నది అత్యంత కీలకం. ఆ విషయంలో తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. దీన్ని అధిగమించి మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనే పరిష్కార మార్గం. మన కంటే వెనుకడిన ఒడిశా కూడా ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. కేరళ విద్యార్థులు అత్యధికంగా జాతీయ, అంతార్జతీయంగా రాణించడానికి కూడా ఇదే కారణం. - ప్రొఫెసర్ నారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ సామాజిక విద్యా విప్లవం ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన రాష్ట్రంలో సామాజిక విద్యా విప్లవానికి నాంది అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ప్రాథమిక విద్య దశలో విద్యార్థుల్లో గ్రహణ శక్తి ఎక్కువుగా ఉంటుంది. ఆ సమయంలో ఇంగ్లిష్తో సహా ఏ భాషలో అయినా సులువుగా పరిజ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. అదే ఓ వయసు వచ్చిన తర్వాత నేర్పుతామంటే అది పడికట్టు పదాలకే పరిమితమవుతుంది. ఇది గుర్తించే జర్మనీ, ఫ్రాన్స్లతోపాటు చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన వైపు మొగ్గు చూపిస్తున్నాయి. విద్య, భాష పరిరక్షణ, సాహిత్యం అన్నవి వేర్వేరు. వాటిని కలిపి చూడకూడదు. రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే తెలుగు భాషకు ముప్పు అనిగానీ విద్యార్థుల వికాసానికి భంగం అని గానీ ఎవరూ మాట్లాడ లేదు. కార్పొరేట్ కాలేజీల్లో తెలుగు బదులు సంస్కృతం సబ్జెక్టు పెడుతుంటే ప్రశ్నించలేదు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృ భాషకు, విద్యార్థుల వికాసానికి భంగం వాటిల్లుతోందని కొన్ని సంస్థలు గగ్గోలు పెట్టడం సరికాదు. తెలుగు భాష పరిరక్షణకు గ్రంథాలయాలను పటిష్ట పరచాలి. - కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నిర్మాత -
తెలుగుసహా 9 భాషల్లోకి ‘సుప్రీం’ తీర్పులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని తొమ్మిది ప్రాంతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయని, వాటిని కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని లోక్సభలో చెప్పారు. ‘సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తుతం, తొమ్మిది స్థానిక భాషలలోకి అనువదిస్తున్నాం. అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నాం’ అని చెప్పారు. కార్మిక, అద్దె ఒప్పందం, భూములు, సర్వీస్ మేటర్స్, నష్టపరిహారం, నేరాలు, కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ కేసులు, వ్యక్తిగత, ఆర్థిక, కౌలు రైతుల వివాదాలు, వినియోగదారుల హక్కుల సంరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటు ఉంచుతామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
తెలుగుకు పట్టం కట్టండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు భాషకు పట్టం కట్టాలని, అందులో భాగంగా నేటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా ప్రతి స్కూల్లో పిల్లలు తెలుగు భాషను తప్పనిసరి నేర్చుకునేవిధంగా ప్రోత్సహించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకూ తెలుగును తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఎస్సీఈఆర్టీతో కలసి తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త కార్యాచరణ చేపట్టింది. గతేడాది నుంచి అన్ని స్కూళ్లలో తెలుగు అమలు దిశగా రెండు సంస్థలు దృష్టి సారించాయి. తెలంగాణ ప్రజల భాష, సాహిత్యం, చారిత్రక, సాంస్కృతిక జీవితం ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలనే లక్ష్యంతో తెలుగును తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆ లక్ష్యం అన్ని పాఠశాలలకు చేరుకునేవిధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు పిల్లలకు తెలుగు నేర్పించే ఉపాధ్యాయుల కోసం ఎస్సీఈఆర్టీతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను, వర్క్షాపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘తెలుగు తప్పనిసరి’కి అడుగులు ఇలా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించింది. కానీ ఇంటర్మీడియెట్ స్థాయిలో అమలుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. తమిళనాడులో పదో తరగతి వరకే తమిళం తప్పనిసరి భాషగా అమలు కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కూడా ఒకటి నుంచి పదోతరగతి వరకు పరిమితం చేశారు. తెలుగు భాషేతరుల కోసం ఎస్ఈఆర్టీ గతేడాది ఒకటి, ఆరోతరగతి పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయగా, ఈ ఏడాది రెండు, ఏడో తరగతులకు కూడా అందజేశారు. ‘‘తెలుగు అమలు తీరును పర్యవేక్షించేందుకు గతేడాది నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాం, కొన్ని స్కూళ్లు మినహా చాలా వరకు తెలుగును తప్పనిసరి చేశాయి. కేంద్రీయ విద్యాలయ వంటి విద్యాసంస్థల్లో మాత్రంపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అమలు చేయనున్నట్లు చెప్పారు’’అని సిధారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఏముంది? హిందీ, కన్నడం, తమిళం, మరాఠీ వంటి ఇతర మాతృభాషల విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకొనేందుకు వీలుగా వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, చిన్న చిన్న పదాలతో పుస్తకాలను ముద్రించారు. ఏడో తరగతి స్థాయిలో చిన్న చిన్న గేయాలను పరిచయం చేశారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ఆచార సాంప్రదాయాలు, తెలంగాణ కళలను కూడా పరిచయం చేయనున్నట్లు సిధారెడ్డి తెలిపారు. 2023 నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయిలో తెలుగు అమలులోకి వస్తుందన్నారు. ‘‘తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పించడాన్ని ఒక బాధ్యతగా భావించాలి. ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడి వారైనప్పుడు ఈ ప్రాంత ప్రజల భాషలోనే మమేకం కావడం వల్ల మానవసంబంధాలు బలపడు తాయి. అందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ స్కూళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేసేందుకు సిద్ధంగా ఉంది’’అని చెప్పారు. -
తెలుగును చంపేస్తున్నారు: మాజీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)పై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీపీఎస్సీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ వింతగా వ్యవహరిస్తోందని, ప్రశ్నా పత్రాల్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇంగ్లీషులోనే ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సబ్జెక్టు ప్రశ్నా పత్రాలు ఇంగ్లీషులోనే ఉన్నా.. జనరల్ నాలెడ్జికి సంబంధించి మాత్రం తెలుగులోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రశ్నాపత్రం ఉండదు..ఇంగ్లీషులోనే ఉంటుంది అనే విషయాన్ని నోటిఫికేషన్లో ఎక్కడా ఇవ్వలేదని చెప్పారు. హాల్ టిక్కెట్లు వచ్చాక ప్రశ్నాపత్రాలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని చెబుతున్నారు.. దీని వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు మీడియం విద్యార్థుల పీక కోయడానికే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పరిపాలనలో తెలుగుకు చేసిన సేవ శూన్యమన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా తెలుగును ఒక పాఠ్యాంశంగా చేస్తానన్న చంద్రబాబు ఆ హామీని అమలు చేయలేకపోయారని విమర్శించారు. చివరికి అమరావతి హైకోర్టు శిలాఫలకాలను కూడా ఇంగ్లీషులోనే వేశారని, తెలుగు భాషను పూర్తిగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలలో కూడా ఇంగ్లీష్లో పెట్టడం అన్యాయమన్నారు. -
యూకేలో తెలుగు భాష అభివృద్ధికి ఎన్ఎస్డీ కృషి
లండన్ : యూకేలో తెలుగు భాష అభివృద్ధికి నవసమాజ్ దర్పణ్ (ఎన్ఎస్డీ) ముందడుగువేసింది. యూకేలో తెలుగు భాష నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవని గమనించి నవసమాజ్ దర్పణ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. యూకేలో నివసిస్తున్న భారతసంతతి యువత, భవిష్యత్తుతరాల వారిలో తెలుగు భాష సజీవంగా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్ఎస్డీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ శ్రీకాంత్ పంజాల తెలుగు కిండర్గార్టెన్ పుస్తకాలను తురాక్ లైబ్రెరీస్ సర్వీస్ మేనేజర్ రోజలిన్ జోన్స్కు ఉచితంగా అందించారు. ఈ పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా డిస్ప్లేలో ఉంచుతామని జోన్స్ తెలిపారు. ముందుగా ఇంగ్లండ్లో ఎస్సెక్స్ కౌంటీలో తురాక్ డివిజన్లోని లైబ్రరీలలో పుస్తకాలను పంపిణీ చేశామని, త్వరలో యూకే వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని లైబ్రెరీలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు శ్రీకాంత్ తెలిపారు. -
సినిమా పాటరాయడం చాలా కష్టం..
‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది’.. ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని’.. అంటూ నిరాశా చీకట్లను తరిమేసే స్ఫూర్తిదాయక పాటలు రాయాలన్నా.. పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా... అని తల్లి ప్రేమ మాధుర్యాన్ని గుమ్మరించాలన్నా.. తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చే తల్లి చిరునవ్వులా.. అని అద్భుతమైన గీతం రాయాలన్నా...ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా... అంటూ సమకాలీన రాజకీయాలను స్పృశించాలన్నా..మెగాస్టార్ చిరంజీవి అభిమానుల జాతీయ గీతంగా పేర్కొనే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అని ఉర్రూతలూగించాలన్నా..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది.. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది.. అని చీరకట్టు గొప్పతనానికి జైకొట్టాలన్నా..తెలుగు సినిపరిశ్రమలో ఇప్పుడు ఒక్కరికే సాధ్యం.. ఆ ఒకే ఒక్క రచయిత చంద్రబోస్.. చంద్రబోస్ కాదు.. చంద్ర‘భేష్’ అని తెలుగు సినీ పాట గర్వంగా తలెత్తుకునేలా చేసిన వేటూరి సుందరరామమూర్తితోనే ప్రశంసలు అందుకున్న కవి.మారుమూల పల్లె.. సాధారణ కుటుంబ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్లో జేఎన్టీయూ థర్డ్ ర్యాంక్ సాధించి కూడా కేవలం గానం, కవిత్వంపై మక్కువతో సినిమా పాట బాట పట్టారు చంద్రబోస్.మనిషిలో ప్రేరణ, స్ఫూర్తి రగిలించే సోలో, యుగళగీతాలు, సామాజిక సందేశాలు.. ఇలా ఏపాటైనా ఆలవోకగా రాసేసి సినిమా కవిగా వచ్చే ఏడాది పాతికేళ్ళ ప్రాయంలోకి అడుగుపెడుతున్న చంద్రబోస్ సోమవారం విశాఖలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. చదువు.. చదువు.. చదువు... చదువే ఓ మూలధనం.. విద్యార్ధులే కాదు.. సమాజంలో ఎవరైనా.. ఏ రంగంలోని వారైనా.. వారికిష్టమున్న రంగం కావొచ్చు.. అంశంకావొచ్చు.. చదవాల్సిందే.. అధ్యయనం చేయాల్సిందే. ‘పరుగెత్తు..నడువు.. లేదంటే పాకుతూవెళ్లు.. అంతేకానీ ఒకే చోట కదలకుండా కూర్చోకు’.. అని మహాకవి శ్రీశ్రీఅన్నట్లే నా సృజనతో నేను చెప్పేది ఒకే ఒక్క మాటచదవు.. చదువు.. చదువు.. తెలుగుపాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు తెలుగు సినీ పాటకు జాతీయస్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదనే అభిప్రాయం నాలో ఉంది. జాతీయ అవార్డులు పొందుతున్న మిగిలిన భాషా చిత్రాల పాటలను నేను అనువదించి వింటుంటాను. ఆ సాహిత్యమూ తెలుసుకుంటాను. కచ్చితంగా వాటికంటే మన తెలుగు పాటలేమీ తీసిపోవు. అంతకంటే మంచి సాహిత్యమే మన పాటల్లో ఉంది. కానీ ఎందుకో మొదటి నుంచి తెలుగుపాటకు తగినంత గుర్తింపు దక్కడం లేదు. బహుశా మన పాటను భుజానికెత్తుకునే వాళ్ళు అక్కడ లేకపోవడం వల్లనేమోనని అనుకుంటాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. పాట విషయమే తీసుకుందాం. తమిళ మాతృక సినిమాలో ఆ పాటకు ఎంతో గుర్తింపునిచ్చారు. ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఎన్నో అవార్డులు వచ్చాయి. వాస్తవానికి మాతృకలోని పాట కంటే తెలుగు పాటే ఎక్కువమందికి చేరువైంది. ఆ పాట కంటే మన తెలుగు పాటే బాగుందని విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ జాతీయ స్థాయి అవార్డే కాదు.. రాష్ట్రంలోనూ రాలేదు. కానీ ఆ పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణలోని యువతి ప్రణీత 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఎన్నో రోజులు చికిత్స పొందింది. ఆ సమయంలో ఆమె ప్రతిరోజూ భక్తి గీతాలతో పాటు మౌనంగా ఎదగమనే పాటతో పాటు నేనున్నాను సినిమాలోని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. అనే పాటలు విని సాంత్వన పొందానని చెప్పినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ ఆ రెండు పాటలూ నేను రాసినవే. ఏ అవార్డు ఇంతటి గౌరవాన్ని అందిస్తుంది..చెప్పండి. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు కంటే ప్రజలు ఇచ్చే గుర్తింపునకే విలువ ఎక్కువ జానపదమే... జ్ఞానపథం మన సాహిత్యానికి గానీ. సంస్కృతికి గానీ జానపదమే ప్రధానం.. అందుకే నేను జానపదమే జ్ఞానపథం అంటాను. సాహిత్యం జీవనాడిగా ఉందంటే అందుకు జానపదమే కారణం. నేను ఎదిగిన పల్లె వాతావరణం కావొచ్చు, నేను రాసిన పాట పామరులకీ అర్ధం కావాలనే ఆశ కావొచ్చు.. జానపదమే నన్ను ప్రభావితం చేసింది. నాకు సంగీతం అనువంశికంగా కాదు.. అనుసృజనగా వచ్చింది. రంగస్థలం పాటలు రాయలేదు..అశువుగా చెప్పా వాస్తవానికి నేను పాటలు పాడదామనే సినీరంగానికి వచ్చాను. మొదట లక్ష్యం అదే.. కానీ ఆ వైపు అవకాశాలు రాకపోవడంతో ఓ మిత్రుడి సలహా మేరకు పాటలు రాశా ను. మొదటిసారి 1995లో డి రామానాయుడు నిర్మించిన తాజ్మహల్ సినిమాలో పాట రాసేందుకు దర్శకుడు ముప్పలనేని శివ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా పాటలు రాస్తూనే ఉన్నాను. 24 ఏళ్ళ కెరీర్లో 3300 పాటలు రాశాను. ఒక్కోసారి ఓ పాట రాసేందుకు నాలుగైదు రోజు లు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రంగస్థలం సినిమాలోని అన్ని పాటలూ నేనే రాశాను. విచిత్రమేమిటం టే పేపర్పై పెన్ను పెట్టి ఒక్క పాట కూడా రాయలేదు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నేను కూర్చుంటే... ఆశువుగా అర్ధగంటలో ఒక్కో పాట చెప్పేస్తే.. వాళ్లు రికార్డ్ చేసేశారు. ఆ పాటల్లో ఎంతటి సాహిత్యముంది.. స్ఫూర్తి రగిలించే పాటలు నేనే ఎక్కువ రాశా నా లిరిక్స్లో నవరసాలూ ఉంటాయి. హాస్యం, శృంగారం, క్రోధం, శాంతం, కరుణ భయం,. బీభత్సం.. అన్నీ ఉంటాయి. కానీ నాకు మనిషికి ప్రేరణనిచ్చి.. స్ఫూర్తిని రగిలించి సందేశాన్నిచ్చి ముందుకు నడిపించే పాటలంటేనే ఇష్టం. నిరాశ, నిస్పృహలను పారదోలే స్ఫూర్తి సాహిత్యంతో 35పాటలు రాశాను. బహుశా తెలుగు సినిమా సాహిత్యంలో అలాంటి పాటలు ఎక్కువ రాసింది నేనే అని అనుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ వచ్చిందని భావిస్తాను.. కొత్త రచయితలూ... సినిమా రంగంలోకి రావాలనుకునే కొత్త రచయితలూ ముందు బాగా చదవండి. కవిత్వానికి మూమూలు మాటకు తేడా ఏమిటో తెలుసుకోవాలి. మాట కవిత్వం ఎలా అవుతుంది.. ఎందుకు అవుతుంది. అయ్యేందుకు మనం ఏం ప్రయోగం చేయాలో ఆలోచించాలి. సినిమా పాటలకు ఉండే నాలుగు లక్షణాలు క్లుప్తత, గాఢత, స్పష్టత, సరళత.. ముందుగా ఇవి అలవర్చుకోవాలి. ఇక సినిమా పాటలకు ఛందస్సు అవసరం లేదు..యతిప్రాస ఉంటే చాలు. ఉదాహరణకు.. ’ మా బాధలను ఓదార్చే తోడుండేవాడివిరా... ఇది మామూలు మాట.. ’’మా బాధలను ఓదార్చే నువ్వుంటే బాగుండురా... ’ ఇది కవిత్వం.. బాలసాహిత్యమే మనిషికి పునాది బాలసాహిత్యమే ఏ మనిషికైనా పటిష్ట పునాది వేస్తుంది. అంతకుమించిన సాహితీ సంపద లేదు. బాలలకు లేతప్రాయంలో శబ్దసంపద, ఊహాశక్తిని పెంపొందించే నైతిక రుజువర్తనను అందించాలి. నీతి కథలు చదివించాలి. సాహిత్యం మనల్ని పరిపుష్టం చేస్తుంది. బాల్యంలో బొమ్మరిల్లు, బుజ్జాయి, చందమామ, బాలమిత్ర.. భాగవతం, బాలసాహిత్యం వంటివి చదివితే ఎదుగుదలలో తిరుగుండదు. ఒకప్పుడు పిల్లలకు వాటితోనే విద్యాభ్యాసం మొదలుపెట్టించేవారు. మాతృభాషకు మించింది ఏదీ లేదు.. ♦ భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్టు.. ♦ మాతృభాషతోనే వేగంగా బుద్ధి వికాసం ♦ తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదు ♦ మన పాటను భుజానికెత్తుకునే వాళ్లు అక్కడ లేకపోవడం వల్లనేమో.. ♦ జాతీయ అవార్డులు సాధిస్తున్న ఇతర భాషల పాటల కంటే తెలుగు పాటేం తీసిపోదు ♦ సినిమా పాట రాయడం అవధానం కంటే పెద్ద ప్రక్రియ ♦ పాటలు పాడదామని వచ్చి రచయితగా మారాను ♦ చిరంజీవి సైరాలో పాట రాస్తున్నా విశాఖలో ఉండి ఎన్నో పాటలు రాశాను మాతృభాషను నిర్బంధంగా చదివించాలి మాతృభాషకు మించింది ఏముంది.. భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్లే.. నాన్నా అన్న పిలుపులో ఉండే గాఢత డాడీలో ఉండదు. అమ్మా అన్న పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీలో ఉండదు. పిలుపు మారినప్పుడు బంధం కూడా మారుతుంది. మాతృభాషతో బుద్ధి వికాసిస్తుంది. ఆలోచనలు విస్తరిస్తాయి. పరభాషతో బుద్ధి వికాసం అంత త్వరగా రాదు. అందుకే మాతృభాషను నిర్బంధంగా చదివించాలని నేను భావిస్తాను. కనీసం ప్రాధమిక విద్యాబోధనైనా తెలుగులో కచ్చితంగా> జరిగి తీరాలి. ఆస్ట్రేలియాలో మాతృభాషలో చదువుకున్న వారికి అక్కడి ప్రభుత్వం 130 డాలర్లు బహుమతిగా అందిస్తోంది. అక్కడ స్థిరపడిన ఏ భాషకు చెందిన వారైనా వారి మాతృభాషలో చదువుకుంటే ప్రోత్సాహం అందిస్తోంది. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే కాదు.. మనందరిదీ. సినిమా పాటరాయడం చాలా కష్టం.. మామూలు పాటలు రాయడం వేరు.. సినిమా పాటలు రాయడం వేరు. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ను పట్టుకుని. దర్శకుడు ఇచ్చే సందర్భాన్ని అర్ధం చేసుకుని, హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను మెప్పించేలా సినిమా పాట ఉండాలి. అందుకే సినిమా పాట రాయడం చాలా కష్టం. అది ఓరకంగా అవధానం కంటే పెద్ద ప్రక్రియ. ఇటీవలికాలంలో సినిమా కవులకు సోషల్ మీడియా సాహిత్యం సవాల్ విసురుతోంది. వాట్సాప్లో ప్రపంచస్థాయి కవిత్వాలు నీతులు, శుభాషితాలు. ఛలోక్తులు.. ఇలా పలు రూపాల్లో కవిత్వం వెల్లువెత్తుతోంది. దాన్ని మించి సినిమాలో చెప్పాలి. అందునా ఇప్పుడు కాలం మారింది. వేగం పెరిగింది. సినిమాకు మహారాజపోషకులైన యువత ఆలోచనలు మారాయి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కవిత్వం రాయాలంటే కత్తిమీద సాములా అయింది. సినిమాల్లో యుగళగీతాలు తగ్గాయి,, సిట్యుయేషన్ సాంగ్స్ వస్తున్నాయి. పాట సినిమాలో అంతర్భాగంగా వచ్చేదే అయినప్పటికీ అది సినిమా కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చైతన్యపరుస్తుంది. ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం ♦ సినీ కవుల్లో ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే ఎన్నో పాటలు రాశాను. నాలుగైదు మాటలతోనే గొప్ప అర్థం వచ్చేలా.. అందరికీ అర్థమయ్యేలా రాయడం ఆత్రేయ సాహిత్యం నుంచే నేర్చుకున్నాను. ఓ సందర్భంలో ఆయన రాసిన సాహిత్యం గురించి.. ప్రియుడి సన్నిహితులు చనిపోతే ప్రేయసి ఇలా ఓదారుస్తుంది.. ♦ ‘రారయ్య పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు’ ఇదీ సాహిత్యం గొప్పతనం మరో సందర్భంలో ♦ నీకు నాకూ పెళ్ళంట...నింగీ నేలకు కుళ్ళంట...ఎందుకంటేయుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసింది ఎప్పుడూ లేవంట..మరో సందర్భంలో నీకూ నాకూ పెళ్ళంట.. నదికి కడలికి పొంగంట..యుగయుగాలు వేరైనా అవి కలవనది ఎపుడూ లేదంట ♦ ఇలా అనల్పమైన అర్ధం ఇవ్వాలనే స్ఫూర్తిని ఆత్రేయ నుంచే పొందాను. పెద్ద పెద్ద సమాసాలతో సంక్లిష్టమైన పదాలతో పాటలు రాయను. నేను రాసిన ప్రతి మాట అమ్మకు అర్ధమవ్వాలని అనుకుంటా.. అమ్మకు అర్ధమైతే అందరికీ అర్ధమైనట్టే. సైరాకు రాస్తున్నా...విశాఖలో ఎన్నో పాటలురాశాను సుందరమైన విశాఖ నగరంలో నాకు వృత్తిరీత్యా ఎంతో అనుబంధముంది. ఆర్య, బన్ని సినిమాల్లోని పాటలతో పాటు ఇటీవల ట్రెండింగ్ సాంగ్గా మారిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఫ్రెండ్షిప్పై వచ్చే ట్రెండు మారినా ఫ్రెండు మారడే పాటను ఇక్కడే రాశాను. ఇలా ఎన్నో పాటలను విశాఖలో కూర్చుని రాశాను. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాకి రాస్తున్నాను. పాట రాయాలని నేను వైజాగ్లో ఉన్నప్పుడే పిలుపువచ్చింది. -
కామర్స్లో కంగు.. సివిక్స్లో చిత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ ఫలితాల్లో ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఎక్కువగా బోల్తా కొట్టారు. సైన్స్ గ్రూప్ విద్యార్థులతో పోల్చితే వీరు ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక శాతం ఫెయిలయ్యారు. ముఖ్యంగా కామర్స్లో కంగు తినగా.. సివిక్స్లో చేతులెత్తేశారు. ఎకనామిక్సలో తికమకపడ్డారు. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఇదే పరిస్థితి. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు చతికిలబడగా.. సైన్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం దూసుకెళ్లారు. సాధారణంగా సైన్స్ గ్రూపు విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్ గ్రూప్లో పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తోంది. ద్వితీయ సంవత్సరం కంటే.. ఫస్టియర్ ఆర్ట్స్లోనే ఎక్కువ శాతం మంది ఫెయిలయ్యారు. కామర్స్లో ఏకంగా 40.53 శాతం మంది విద్యార్థులు చేతులెత్తేశారు. ఆ తర్వాత సివిక్స్లో. ఈ సబ్జెక్టులో దాదాపు 37.56 శాతం మంది అనుత్తీర్ణత సాధించారు. ఇక ఎకనామిక్స్లోనూ విద్యార్థులు ఇదే వరుసకట్టారు. 36.58 శాతం మంది ఫెయిలయ్యారు. కీలకమైన ఈ మూడు సబ్జెక్టుల్లో నెగ్గడానికి కష్టపడ్డ విద్యార్థులు.. హిస్టరీ విషయానికి వస్తే కాస్త మెరుగ్గా కనిపించారు. ఈ సబ్జెక్టులో 14.20 శాతం మందే పాసకాలేకపోయారు. మాతృభాషలోనూ.. ప్రధాన సబ్జెక్టుల విషయాన్ని పక్కనబెడితే మాతృభాష తెలుగులోనూ ఆశించిన స్థాయిలో విద్యార్థులు నెగ్గలేకపోయారు. ఇంగ్లిష్, సంస్కృతం, హిందీ భాషల్లో కంటే తెలుగులోనే అధిక శాతం మంది ఫెయిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో ఇదే వరుస కనిపించింది. ఫస్టియర్లో దాదాపు 20 శాతం మంది చేతులెత్తేయడం.. తెలుగు భాషపై విద్యార్థులకు పట్టు ఏపాటిదో అర్థమవుతోంది. -
ఆముక్తమాల్యద తాళపత్రం.. తమిళనేలపై భద్రం
‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలగొకండ ఎల్లనృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స’’ఐదొందల ఏళ్లక్రితం శ్రీ కృష్ణదేవరాయల కలం నుంచి జాలువారిన పద్యమిది. పది హేనో శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రపంచానికి చాటారు. కానీ... తెలుగంటే ఎంతో అభిమానాన్ని చాటుకున్న కృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ఆముక్తమాల్య దలో మాతృభాషపై తన మమకారాన్ని మరోసారి చాటారు. ఈ పద్యకావ్యం గురించి తెలియని తెలుగువారుండరేమో. ఈ అక్షరా లను నిక్షిప్తం చేసిన తాళపత్రగ్రంథం ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి చాలా తక్కువ మం దికి తెలుసు. ఇది తమిళనాడులోని తంజా వూరులో ఉన్న సరస్వతి మహల్ గ్రంథాల యంలో కొలువుదీరి ఉంది. ఈ తెలుగు గ్రంథం తమిళ రాష్ట్రంలో ఉన్నా దాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలు పొరపాటున చెదల బారినపడో, వాతావరణ ప్రభావానికి గురయ్యో, అనుకోని ఇతర ప్రమాదాలబారిన పడో ధ్వంసమైతే శాశ్వతంగా అవి అదృశ్య మైనట్టే. దాని ఫొటో ప్రతులు రూపొందిం చాలని ఎనిమిది దశాబ్దాల క్రితమే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు. కానీ ఆయన ఆలోచనను కూడా ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయకపోవ టం విడ్డూరమే. – సాక్షి, హైదరాబాద్ వందల్లో గ్రంథాలు... తంజావూరు గ్రంథాలయంలో 778 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వీటిల్లో 455 గ్రంథాలను తర్వాత పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ మరో 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. వీటిల్లో సనాతన వైజ్ఞానికశాస్త్రం, గణితం, పురాణాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిల్లోని ప్రత్యేకతలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాగితంపై రాసిన ఒరిజినల్ గ్రంథాలు 44 ఉన్నాయి. వీటిల్లో పుస్తకరూపంలో తీసుకు రానివి 26 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన తెలుగు గ్రంథాలు తమిళనేలపై ఉన్నా వాటిని జనంలోకి తెచ్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. అసలు.. ఆ పుస్తకాల సారాంశమేంటో తెలుసుకునే కసరత్తు కూడా జరగలేదు. వాటిని భాషావేత్తలు పరిశోధిస్తే సమాజానికి తెలియని ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సర్వేపల్లి కాంక్షించినా... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకపూర్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉండగా, 1933లో తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలోని తెలుగు గ్రంథాల గురించి తెలుసుకున్నారు. వాటిల్లో అచ్చు కానివి, బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని వెళ్లి శోధించి వాటి జాబితా రూపొందించారు. వాటిల్లో అముద్రిత గ్రంథాలను ముద్రించాలని నాటి ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిస్థాయి వరకు వెళ్లటం, బిజీగా గడపటంతో ఆ గ్రంథాలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల కొందరు భాషాభిమానులు సర్వేపల్లి రూపొందించిన జాబితాను గుర్తించారు. కానీ, రెండు తెలుగు ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. భాషాభిమానుల నుంచి విన్నపాలను అందుకున్నా ఆ దిశగా ఆసక్తి చూపకపోవటం విడ్డూరం. గణితశాస్త్రంలో మన ఘనత.. గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది సనాతన భారతమే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణితంలో ఘనతను సాధిస్తుందీ మనవారే. అలాంటి గణితం పద్యరూపంలో ఉందంటే నమ్ముతారా.. గణితంలోని ఎన్నో అంశాలను పద్యాల ద్వారా గొప్పగా వివరించి ఆ శాస్త్రంలో ప్రత్యేకతలను పరిచయం చేసింది ‘గణిత చూడామణి’. 19 వ శతాబ్దంలో ఇలాగే ఇది తళుక్కున మెరిసి పూర్వీకులను గణిత పం డితులుగా మార్చింది. తంజావూరు గ్రంథా లయంలో దిక్కూమొక్కూలేక పడి ఉన్న తెలుగు తాళపత్రగ్రంథాల్లో ఎన్ని గొప్ప విషయాలున్నాయో, అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయోనని భాషాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనాలి.. ‘నేను ఓ సదస్సు కోసం వెళ్లినప్పుడు తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తాళపత్రగ్రంథాలను చూసి పులకరించి పోయాను. ఆముక్తమాల్యద లాంటి ఒరిజినల్ ప్రతులున్నాయని తెలుసుకుని సంబరపడ్డాను. వాటిల్లో ముద్రితం కానివాటిని వెంటనే ముద్రించటంతోపాటు తాళపత్ర గ్రంథా లను డిజిటలైజేషన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి నివేదించాను. కానీ, ఇప్పటి వరకు ఆ కసరత్తు ప్రారంభం కాకపోవటం బాధాకరం’ డాక్టర్ రాజారెడ్డి, వైద్యుడు, చరిత్రపరిశోధకులు ముందుకు సాగని మహాసభల స్ఫూర్తి.. ప్రపంచ తెలుగు మహాసభలలో ఎంతోమంది భాషాభిమానులు ప్రాచీన తెలుగుగ్రంథాల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అముద్రిత తెలుగు గ్రంథాలను గుర్తించి వాటిని కాపీ చేసి ప్రజల ముంగిటకు తేవాలని కోరా రు. ఈ క్రమంలోనే లండన్ లైబ్రరీలో దాదాపు 8 వేలకు పైచిలు కు తెలుగు పుస్తకాలున్నాయని, వాటిల్లో కొన్ని తెలుగునేలపై లభించటం లేదని గుర్తించి వాటిని కాపీ చేయాలని ప్రస్తావిం చారు. కానీ ఆ దిశగా అసలు అడుగు పడకపోవటం విచిత్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇలాగే వెలుగు చూసింది... రాజనీతి, పాలన, సమాజం... ఇలా ఎన్నో అంశాలను స్పృశిస్తూ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచిన గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసిన ఈ మహత్ గ్రంథం క్రీస్తుపూర్వంలో ఆవిష్కృతమైనా ఆ తర్వాత క్రీ.శ.12 వ శతాబ్దం వరకు దీనిని ప్రపంచం అనుసరించింది. ఆ తర్వాత ఆ గ్రంథ ప్రతులే కనిపించలేదు. కానీ, వందల ఏళ్ల తర్వాత ఆ గ్రంథం తాళపత్ర రూపం మైసూరులో ప్రత్యక్షమైంది. అక్కడి గ్రంథాలయంలో అనామకంగా పడి ఉన్న ఆ సంస్కృత గ్రంథాన్ని శ్యామశాస్త్రి గుర్తించి 1909 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించి పుస్తకరూపమిచ్చారు. -
తెలుగు భాషా సేవలో వైఎస్ ఆదర్శప్రాయుడు
తెలుగుదేల యన్న దేశంబు తెలు గేను / తెలుగు వల్లభుండ తెలుగొ కండ / ఎల్ల నృపులు గొలువ నెఱు గవే బాసాడి / దేశ భాషలందు తెలుగు లెస్స అని... అన్నది మన తెలుగు రాయడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషా మాధుర్యాన్ని, గొప్పదనాన్ని చాటిచెప్పిన రాయలు చరిత్రలోనే కాదు, సాహిత్య చరిత్రలోనూ శాశ్వ తమైన కీర్తిని సొంతం చేసుకున్నాడు. కానీ భారత దేశం పరాధీనమైనప్పుడు దేశ భాషలు అడుగంటిపోయాయి. ఆంగ్ల భాష అందలమెక్కింది. మాతృభాషలో మాట్లా డటం అవమానం గానూ, ఆంగ్లంలో మాట్లాడడం గొప్ప గానూ భావించే దౌర్భాగ్యం ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా కొన్ని భాషలకు స్వాతంత్య్రం రాలేదు. పరభాషను పట్టుకుని పాకులాడుతూనే ఉన్నాం. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహా త్మాగాంధీగారు స్వదేశీ భాషలను బలోపేతం చేసుకోవా ల్సిన అవసరం ఉందని ప్రబోధించారు. అందుకనుగుణం గానే భారత ప్రభుత్వం ప్రాంతీయ భాషలకు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భాషాభిమానులైన తమిళులు ప్రాచీన భాషా హోదాను తెచ్చుకుని తమ భాషలో ఉన్న ప్రాచీన సాహిత్య శాస్త్ర విజ్ఞానాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో పదిల పరు చుకుంటున్నారు. మన తెలుగు వాళ్లకు మన మాతృ భాషకు ప్రాచీన హోదా సాధన మీద అంతగా పట్టింపు లేకుండా గడిచిపోయింది. కానీ 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించారు. అదే సంవ త్సరంలో ఆయన ప్రారంభించిన ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి చెందిన మూడు సెంటర్ల (ఇడుపుల పాయ, నూజి వీడు, బాసర)లో ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుగును ‘ఆప్షనల్ సబ్జెక్టు’గా చదవడానికి అవకాశమిచ్చారు. అలా ఆయన తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నారు. ఏ కోర్సు చదివినా మనకు సంస్కారాన్ని నేర్పేది మాతృభాష మాత్రమేనని నమ్మారాయన. తాను నమ్మినదే ఆచరించి చూపించారు. ప్రాచీన హోదాతో ఏమొస్తుంది? తెలుగుకు ప్రాచీన హోదా వస్తే అటు భాషోద్ధరణ పరంగానే కాకుండా, ఉద్యోగాల కల్పన వంటి అనేక రకాల ప్రయోజనాలుంటాయి. – తెలుగు చక్కగా రాయడం, చదవడం వచ్చిన వారికి ఉన్న చోటనే ఉపాధి లభిస్తుంది. నెలరోజుల శిక్ష ణలో కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు తెలుగు టైప్ నేర్పిస్తే వాళ్లు ప్రాచీన ప్రతులను టైప్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరచడానికి మార్గం సుగమం చేయగలు గుతారు. – తాళపత్ర ప్రతులను యథాతథంగా రాసి ఇవ్వగలి గిన లేఖకులున్నారు. వారి చేత తాళపత్ర గ్రంథాల్లోని సమాచారాన్ని పేపర్ మీద రాయించుకుని, వాటిని కంప్యూటర్లో భద్రపరచడం ద్వారా తెలుగు భాషలో ఉన్న విలువైన విషయాలను భావి తరాల కోసం భద్ర పరచడం సులువవుతుంది. – తెలుగు రాష్ట్రాల్లో పండితులు, మహా పండితులు, మహామహా పండితులు ఉన్నారు. టైప్ చేసిన ప్రతులను పండితులు ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు దిద్ది, కాపీలను సరిచేస్తారు. ఇక మహా పండితులు, మహా మహా పండి తులు కాపీలను ఎడిటింగ్ చేసి పుస్తక రూపంలోకి తేవడా నికి సహకరిస్తారు. ద్విభాషా పండితులు అనువాదం చేసి ఇతర భాషల్లోకి మన గ్రంథాల్లో ఉన్న విలువైన సంగతు లను విస్తరింపచేస్తారు. – ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని డిజి టలైజేషన్ నిపుణులు అందిస్తారు. సర్వర్మెయింటెనెన్స్, వెబ్ క్రియేషన్, వెబ్ మెయింటెనెన్స్, మ్యాటర్ క్లాసిఫికే షన్ వంటి పనుల అవసరం రీత్యా ఇంజనీరింగ్ విద్యార్థు లకు ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉన్న చోటనే ఉపాధి లభిస్తుంది. గ్రామాల్లో ఉన్న వాళ్లు అక్కడే ఉండి సేవలందించవచ్చు. కొత్త డిక్షనరీలు వస్తాయి భాషాభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే, భాషలో ఉన్న పదాలన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తమై వాటి కోసం డిక్షనరీలు తయారవుతాయి. ఇప్పుడున్న డిక్షనరీలు పరిమితమైన పదాలలోనే ఉన్నాయి. ఆ డిక్షనరీలు విస్తృతమవుతాయి. తెలుగు పలుకుబడులు, సామెతలు మొదలైన అనేక భాషావిశేషాలు వెలికి వస్తాయి. తెలుగు భాషలో ఉన్న సమస్త విషయాలు తెలుగువారి ముంగిట నిలుస్తాయి. ధనం, సమయం వృథా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మన చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాస్త్రాలు అందుబాటులోకి వస్తాయి. తెలుగులో పరిశోధనలు వేగవంతమవుతాయి. మన భాషలో ప్రాచీన కాలం నుంచి నిక్షిప్తమైన సమాచార మంతా వెలుగులోకి వస్తుంది. నిధులున్నాయి... ఆచరణ లేదు కేంద్రం నుంచి 2008–2019 వరకు సంవత్సరానికి 100 కోట్లు చొప్పున తెచ్చుకోవాల్సి ఉండింది. వాటిని సాధించడానికి తెలుగు భాషపై అభిమానం ఉండాలి, ఆచరణ ఉండాలి. ఆ నిధులతో భాషాభివృద్ధి, ప్రాచీన భాషా పరిరక్షణ, ఉపాధి కల్పన, తెలుగు భాషా సభల నిర్వహణ, తెలుగు భాషా పండితులకు ప్రతిభా పురస్కా రాలు మొదలైనవెన్నో నిర్వహించవచ్చు. ఇలాంటి కార్యక్ర మాల ద్వారా కొత్తతరానికి మాతృభాష ప్రాధాన్యతను తరచుగా గుర్తు చేస్తున్నట్లవుతుంది. ఈ రకంగా మాతృ భాషాభిమానం చాటుకున్న నాయకులు శ్రీకృష్ణదేవరా యల వలే శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు పొందగలుగుతారు. గ్రంథ రచన పరిశ్రమ పూర్వం రాజులు భాషాభిమానంతో గ్రంథ రచనను ఒక పరిశ్రమగా నిర్వహించేవారు. ఎప్పటికప్పుడు పాతబ డిన తాళపత్రాలలోని విషయాన్ని తిరిగి కొత్త తాళపత్రాల మీద రాయించేవారు. ఈ ప్రక్రియ పండితుల పర్యవేక్ష ణలో జరిగేది. ఎందరికో ఉపాధి దొరికేది. సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషను పరిరక్షించుకోవడానికి ఇంతగా శ్రమించేవాళ్లు. అలాంటి సంస్కృతిని తిరిగి ప్రవేశ పెట్టు కుని భాషను, సంస్కృతి, సాహిత్యాలను కాపాడుకోవడా నికి ప్రాచీన హోదా ఒక మంచి అవకాశం. వైఎస్ఆర్ ప్రాచీన హోదా సాధించారు. దానిని ఆచరణలో పెట్టే బాధ్యతను తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసు కోవాల్సిన అవసరం ఉంది. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడనేది వాడుకలో ఉన్న మాట. బృహదారణ్యకోపనిషత్తు ‘పు’ అంటే పూర్ణం చేయడం అని, ‘త్ర’ అంటే రక్షించడం అని చెప్పింది. అంటే... తండ్రి పూర్తి చేయలేకపోయిన మంచి పనిని తనయుడు పూర్తి చేసి రక్షించాలని అర్థం. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చేవిధంగా వైఎస్ జగన్ ప్రయత్నించాలనీ, అందుకు సన్నద్ధంగా తగిన ప్రకటన చేయాలని కోరుతూ... ప్రొ‘‘ కె. కుసుమారెడ్డి వ్యాసకర్త విశ్రాంత తెలుగు ఆచార్యులు, ఓయూ -
రాజమండ్రి ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆచార్య యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషా ద్రోహి అని మండిపడ్డారు. తెలుగు భాషను ఉద్ధరిస్తానని ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఆఖరు రోజున రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చకుండా రాజమండ్రి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సాంస్కృతిక పీఠానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరమైతే రాజమండ్రిలో ఆమరణ దీక్ష చేపడతానని ఆయన అన్నారు. -
తెలుగు మళ్లీ వెలగాలి
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటీ ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యే లోగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అప్పటికి హిందీ తర్వాత తెలుగు భాష దేశంలో ద్వితీయస్థానంలో ఉండేది. మరాఠీ మూడో స్థానంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అద్వితీయ భాషగా వెలుగొందగలదని తెలుగు ప్రజలందరూ ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు ఎన్నాళ్లో నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పట్టుమని పదిహేనేళ్లలోగానే తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. బెంగాలీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడినా, దేశ భాషల్లో తెలుగు తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం కాదు సరికదా, కనీసం పదిలపరచుకోవడంలోనూ విఫలమై, నాలుగో స్థానానికి పడిపోయింది. హిందీ అప్పటికీ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బెంగాలీ రెండో స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తుండగా, మరాఠీ మూడో స్థానానికి ఎగబాకింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. ఈ లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న దశాబ్ద కాలంలో– అంటే, 2001–11 కాలంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యలో 9.63 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో నేపాలీ (1.98 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మలయాళం (5.36 శాతం), సింధీ (9.34 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్న ఆనందం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలతో ఆవిరైనట్లేనంటూ తెలుగు భాషాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు విద్యావేత్తలు ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలు పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చెబుతున్నారు. ఖరగ్పూర్, భిలాయి, ఒడిశా తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, దేశ భాషల్లో తెలుగు రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంటుందని, అంతేకాని నాలుగో స్థానంలో కాదని ఆయన మీడియాతో అన్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను అంతిమంగా స్వీకరించలేమని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు భాషాభిమానులు తమ తమ స్థాయిలో స్పందిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీ హవా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన దశాబ్ద కాలాన్నే తీసుకుంటే, 2001 –11 మధ్య కాలంలో హిందీ మాతృభాషగా గల వారి జనాభాలో ఏకంగా 10 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల రెండో స్థానంలో ఉన్న బెంగాలీ మాతృభాషగా గల వారి జనాభా కంటే ఎక్కువే. మన దేశంలో మాట్లాడే చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ ఆధునిక భాష. మిగిలిన భాషల కంటే దీనికి గల చరిత్ర చాలా తక్కువ. సంస్కృత భాష నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో పుట్టిన అపభ్రంశ రూపమైన సౌరసేని భాష హిందీకి మూలమని చెబుతారు. ప్రామాణిక రూపంలోని హిందీ రచనలు పదహారో శతాబ్దిలో మొదలయ్యాయి. మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో ఉండగా, అంటే పద్దెనిమిదో శతాబ్దిలో మాత్రమే హిందీ ఆస్థాన గౌరవాన్ని అందుకోగలిగింది. బ్రజ్భాష, అవధి, మైథిలి వంటి స్థానిక భాషలను, మాండలికాలను కలుపుకొని ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో విస్తరించింది. తెలుగుతో పాటు ప్రాచీన హోదా అందుకున్న ఆరు భాషల్లో ఏ భాష కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు సరికదా, జనాభాలో తమ శాతాన్ని కూడా పెంచుకోలేకపోతున్నాయి. హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 161 శాతం మేరకు పెరిగింది. ఇదేకాలంలో తెలుగు సహా దక్షిణాదికి చెందిన ద్రావిడ భాషలు మాట్లాడేవారి జనాభాలో 81 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. మరోవైపు 2001 నుంచి 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారి జనాభా దాదాపు రెట్టింపయింది. హిందీ మాట్లాడేవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడుతున్నా, వారు తమ మాతృభాషను కాపాడుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా హిందీని మాతృభాషగా చదువుకోగల వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. తెలుగు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటున్నా, ఆ రాష్ట్రాల్లో ఒకటి రెండు తరాలు గడిచే సరికి తెలుగును మాతృభాషగా నిలబెట్టుకోగలుగుతున్న వారి సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తోంది. తెలుగులో విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు తప్పనిసరిగా అక్కడి స్థానిక భాషలనే మాతృభాషగా స్వీకరిస్తున్నారు. సంఖ్య పెరిగినా తగ్గిన జనాభా శాతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1951 నాటితో పోల్చుకుంటే 2011 నాటికి తెలుగు మాట్లాడే వారి జనాభా సంఖ్యపరంగా రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగింది. దేశజనాభాను మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1951 నాటికి 9.24 శాతం ఉంటే, 2011 నాటికి 6.93 శాతానికి పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందీ ప్రచారం జరిగినట్లుగా మరే భాషకూ ప్రచారం జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి మాత్రమే గట్టి ప్రతిఘటన ఎదురైంది. బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి భాషలు తమ తమ రాష్ట్రాల్లో తమ ఉనికి బలంగా కాపాడుకోగలిగాయి. ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రాబల్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టడంలో తెలుగు, కన్నడ వంటి భాషలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటికి రెండో స్థానంలో ఉన్న తెలుగు, 1971 నాటికి మూడో స్థానానికి పడిపోయినప్పుడైనా, తాజాగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినప్పుడైనా తెలుగు భాషోద్ధరణ కోసం, కనీసం భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. తెలుగు భాషోద్ధరణ పేరిట 1975 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినా, వాటి వల్ల తెలుగు ప్రజలకు ఒరిగినదేమీ లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల వెలుపల ఉంటున్న తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యావకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉంటున్నా, వారిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదివరకటి కాలంలో అ‘ద్వితీయం’గా వెలుగొందిన తెలుగు భాష ప్రాభవం ఇప్పుడు క్రమంగా మసకబారుతుండటానికి వెనుకనున్న కారణాలను విశ్లేషించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఉంది. తెలుగు చరిత్రలో మైలురాళ్లు తెలుగు భాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే ఉనికిలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దికి చెందిన శాతవాహనుల కాలం నాటి ప్రాకృత పద్యసంకలనం ‘గాథాసప్తశతి’లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు, ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగులోని స్పష్టమైన తెలుగు శిలాశాసనం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శిలా శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం ‘నాగబు’. శతాబ్దాల తరబడి వాడుక తర్వాత క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో తెలుగులో గ్రంథరచన మొదలైంది. మహాభారత ఆంధ్రీకరణకు నన్నయ శ్రీకారం చుట్టాడు. నన్నయ మహాభారత రచన ప్రారంభించడానికి ముందే తెలుగులో కొన్ని జానపద గీతాలు, పద్యాలు ప్రచారంలో ఉండేవి. నన్నయ ప్రారంభించిన మహాభారత ఆంధ్రీకరణను పదమూడో శతాబ్దికి చెందిన తిక్కన, పద్నాలుగో శతాబ్దికి చెందిన ఎర్రన పూర్తి చేశారు. తెలుగులో గ్రంథరచన మొదలైన దాదాపు మూడు శతాబ్దాల కాలంలో చాలామంది కవులు ఎక్కువగా పురాణాల ఆధారంగానే కావ్యాలు రాశారు. పదిహేనో శతాబ్ది నుంచి పదహారో శతాబ్ది వరకు గల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ‘శ్రీనాథయుగం’గా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు, పోతన, గౌరన, జక్కన, తాళ్లపాక తిమ్మక్క వంటి కవులు తెలుగు ఛందస్సును పరిపుష్టం చేశారు. శ్రీనాథ యుగంలో కూడా సంస్కృత కావ్య, నాటకాల అనువాదం ప్రధానంగా కొనసాగింది. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. పదహారో శతాబ్ది మన సాహిత్య చరిత్రలో‘రాయలయుగం’గా ప్రసిద్ధి పొందింది. రాయల కాలంలో అత్యధికంగా ప్రబంధ కావ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కాలాన్ని ప్రబంధ యుగం అని కూడా అంటారు. స్వయంగా కవి అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థాన కవులైన పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు తదితరులు కూడా ప్రబంధ కావ్యాలు రచించారు. తర్వాతి కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం పుంజుకుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో చాలామంది తెలుగులో కృతులు, కీర్తనలు రచించారు. ఆధునిక యుగంలో తెలుగు తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం 1796లో విడుదలైంది. అయితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత మాత్రం పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మాత్రమే ప్రారంభమైంది. అప్పటికి దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుండటంతో ఇంగ్లిష్ కవిత్వం ప్రభావంతో నాటి యువకవులు భావకవిత్వం పేరిట కొత్తరీతిలో ప్రణయకవిత్వాన్ని విరివిగా రాశారు. బ్రిటిష్ అధికారి అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని, మరుగున పడిపోయిన వేమన పద్యాలను వెలుగులోకి తేవడమే కాకుండా, వేమన పద్యాలను ఇంగ్లిష్లోకి అనువదించాడు. తొలి ఇంగ్లిష్–తెలుగు నిఘంటువును స్వయంగా పరిష్కరించి, ప్రచురించాడు. తెలుగునాట ఏ విశ్వవిద్యాలయాలూ, సాహితీ సంస్థలూ చేయలేనంతగా తెలుగు భాషోద్ధరణకు సీపీ బ్రౌన్ కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ ద్వారా తెలుగులో నవలా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధునిక యుగంలోని తొలినాటి రచనలు ఎక్కువగా గ్రాంథికభాషలోనే ఉండేవి. సాహిత్యాన్ని పామరులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కొందరు రచయితలు వ్యావహారిక భాషోద్యమానికి తెరతీశారు. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని ఉధృతంగా సాగించడంతో చాలామంది కవులు, రచయితలు వాడుక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుడిపాటి వెంకటచలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారు తమ రచనల ద్వారా వ్యావహారిక భాషావ్యాప్తికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి శిష్యుడైన తాపీ ధర్మారావు తన సంపాదకత్వంలో వెలువడిన ‘జనవాణి’ పత్రిక ద్వారా పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. ‘జనవాణి’కి ముందునాటి పత్రికల్లో మామూలు వార్తలను కూడా సరళగ్రాంథిక భాషలో రాసేవారు. పత్రికల్లో తాపీ ధర్మారావు తెచ్చిన ఒరవడిని అనతికాలంలోనే మిగిలిన పత్రికలూ అందిపుచ్చుకున్నాయి. ప్రాచీన హోదాకు వైఎస్ కృషి, బ్రిటిష్ హయాంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రావిన్స్లో అంతర్భాగంగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం పాలనలో ఉండేది. తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన దరిమిలా, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకొని 1956 నవంబర్ 1న విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తెలుగు తన ‘ద్వితీయ’ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం తెలుగు ప్రజలకు సంతోషకరమే. అయితే, బోధనలోను, పరిపాలనలోను తెలుగు భాషా వ్యాప్తి, విస్తరణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా కృషి చేస్తేనే తెలుగు తిరిగి అ‘ద్వితీయ’ స్థానంలో వెలుగొందగలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
టీడీపీ చట్టాన్ని ఉల్లంఘించింది: యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం తెలుగును అవమానించిందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వానికి తెలుగంటే గౌరవం లేదని విమర్శించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై తెలుగులో ముద్రించలేదని ఆరోపించారు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన శిలాఫలకంపైన కూడా అక్షరాలు తెలుగులో కాకుండా ఇంగ్లీంష్లోనే ముద్రించారని ధ్వజమెత్తారు. చట్టప్రకారం శిలాఫలకాలపై ప్రాంతీయ భాషనే వాడాలని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషను ఎక్కడా వాడటం లేదన్నారు . చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని, దీనికి కారకులయిన వారిపై చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. -
సాహితీ సేనాని
విద్వాన్ బూతపాటి కిరణశ్రీకి తెలుగు భాషంటే ప్రాణం. తెలుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటాలనే దృఢ సంకల్పం. తెలుగు పండితునిగా విద్యార్ధుల్లో ఆయన స్థానం సుస్థిరం. అక్షరాలు సమాజాన్ని మారుస్తాయన్న అచంచల నమ్మకం ఆయనది. రచనలు, అనువాదాలు చేస్తూనే.. నవయుగ కవి చక్రవర్తి, పద్మ విభూషణ్ గుర్రం జాషువా కవిత్వం పట్ల, జీవిత విధానం పట్ల మక్కువతో విశ్రాంత జీవితాన్ని సమాజాన్ని మలిచేందుకు వినియోగిస్తున్నారు. జాషువా పేరిట తొలి ప్రజాగ్రంథాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. జాషువా విగ్రహాన్నీ ప్రతిష్ఠించారు. భవిష్యత్ తరానికి సాహితీ సిరులను అందించడంలో అలుపెరగని అవిశ్రాంత ఉపాధ్యాయుడు కిరణశ్రీ. జాషువా సేవలో తరించారు కిరణశ్రీ సొంత ఊరు అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. తల్లిదండ్రులు నాగరత్నమ్మ, జాన్. ఆయన తండ్రి ఆంగ్లేయుల కాలంలోనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు. కిరణశ్రీ ప్రాధమిక విద్య ఉయ్యలవాడలోనే సాగింది. సంజీవరాయునిపేటలో ఎస్ఎస్ఎల్సి పూర్తిచేశారు. 1968–71ల మద్య పద్మభూషణ్ గుర్రం జాషువాకు శిష్యునిగా సేవలందించారు. అప్పుడే తెలుగుభాషా మాధుర్యాన్ని చవి చూసి, భాషపై మక్కువ పెంచుకున్నారు. జాషువాతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రి, అమరేంద్ర, ప్రసాదరాయ కులపతి వంటి మహాపం డితుల సహచర్యం ఆయనకు లభించింది. చిన్నవయస్సులోనే వారితో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు. విద్యార్థులపై చెరగని ముద్ర చదువు పూర్తయ్యాక బెస్తవారిపేట క్రైస్తవ మిషనరీ కళాశాలలో సెకండరీగ్రేడ్ పూర్తిచేశారు కిరణశ్రీ. అనంతరం ద్వితీయశ్రేణి తెలుగు పండిట్గా 1973లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఓవైపు బోధిస్తూనే తాను విద్యార్ధిగా మారి డిగ్రీలను సాధించారు. ముప్పైమూడేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. తెలుగు నుడికారాలను, ఉచ్చారణ, పద్యపఠన, చందస్సులను బోధించడంలో ప్రతి విద్యార్థ్ధిపై తనదైన చెరగని ముద్రవేశారు. పదవీ విరమణ అనంతరం వెలుగు ప్రాజెక్టు మేనేజర్గా పనిచేశారు. 2012లో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ తెలుగు అనువాదకునిగా అనేక జీవోలను తెలుగులోకి అనువదించారు. విగ్రహం ఏర్పాటుకు పదేళ్లు! నెల్లూరులో జాషువా కవితా పీఠాన్ని 1984లో ప్రారంభించారు కిరణశ్రీ. 2008లో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. పదేళ్లపాటు సుదీర్ఘ పోరాటంతో 2018 సెప్టెంబర్లో నెల్లూరు నగరంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, కన్ఫెడరేషన్ అండ్ యునెస్కో క్లబ్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు, జాషువా కవితాపీఠం, అధికారభాషా సంఘం రాష్ట్ర, జాతీయ సంస్థల్లో అనేక కీలక పదవులను నిర్వహిస్తున్న సమయంలో కూడా జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన పలు అవరోధాలను అధిగమించాల్సి వచ్చిందన్నది నిజం. పురస్కారాలు.. పుస్తకాలు కిర ణశ్రీ రచించిన పలు పుస్తకాలను ప్రభుత్వం పాఠ్యగ్రంథాలుగా తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడో తరగతి విద్యార్థుల కోసం ‘అణిముత్యాలు’ అనే తెలుగు ఉపవాచక పుస్తకానికి గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘పిచ్చివాడు’ అనే నాటకం సుమారు యాభై పరిషత్ల అవార్డులను అందుకుంది. ‘మడివేలు మాచయ్య’ పద్యనాటకం పండితుల ప్రశంసలు సైతం అందుకుంది. అనువాదకునిగా ఆయన ఎనభైకి పైగా గ్రం«థాలను తెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషను సజీవంగా ఉంచాలని, విశిష్టమైన తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాలని నిర ంతరం కృషి చేస్తున్న కిరణశ్రీ వంటి వారి అడుగుజాడల్లో ఈతరం వారు నడవడం ఎంతైనా అవసరం. – మౌంట్బాటన్, సాక్షి, నెల్లూరు -
దుఃఖిస్తున్న తెలుగు తల్లి
ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మారిషస్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా ఇలా ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగు వారు తమ భాషా సంస్కతులను కాపాడుకునేందుకు చేస్తున్న కషి చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అనేక దేశాల్లో తెలుగు వారు తమ పిల్లలకు తెలుగు నేర్పేం దుకు తహతహలాడుతున్నారు. ఆ దేశాల్లో తెలుగు సదస్సులకు హాజరైనప్పుడు అక్కడి పిల్లలు చక్కటి తెలుగులో మాటా ్లడుతుండటం విని నేను దిగ్భ్రమ చెందుతుంటాను. ఇవాళ ఇక్కడ మెల్బోర్న్లో వంగూరి చిట్టెం రాజు ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్, లోకనాయక్ ఫౌండే షన్, ఆస్ట్రేలియా తెలుగు సంఘం కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఆరవ ప్రపంచ సాహితీ సదస్సులో ఆస్ట్రేలియా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పెద్దలూ, పిల్లలూ పాల్గొని దాన్ని విజయవంతం చేయడం చిన్న విషయం కాదు. కానీ నేనూ నా రాష్ట్రం నుంచి మీకు ఏ సందేశం ఇవ్వగలను? ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా సంస్కృతులు అద్భుతంగా పరిఢవిల్లుతున్నాయని చెపితే అది నన్ను నేను మోసగించు కున్నట్లవుతుంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పరిపాలన సాగిస్తున్నాయి. తెలంగాణలో తెలుగు వెలిగి పోతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి ముఖం వెలవెలబోతోంది. ఇక్కడ ఒక ఖండంలో, పరాయిగడ్డపై, మన స్వంత ప్రాంతాలను విడిచివచ్చిన మీరు ఒక్కటై తెలుగు భాషను సంస్కృతినీ అద్భుతంగా కాపాడుతూ, ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నందుకు నేను పులకించి పోతున్నాను. కాని అదే సమయంలో మాతృ భూమిలో తెలుగు భాష పరిస్థితిని తలుచుకుని నాకు దుఃఖం కలుగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడేభాష అయినప్పటికీ ప్రాంతీయభాషగా తెలుగు నిరాదరణకు గురైంది. అన్నింటా అధికార భాషగా ఉర్దూ పీఠం వేసుకుంది. అమ్మ భాషకోసం తెలంగాణలో నాటితరం భారీ ఉద్యమాలు,పోరాటాలు చేయాల్సి వచ్చింది. తెలుగు ప్రజలకు కనీసం సభలూ సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారు తెలంగాణలో తెలుగు వైభవానికి కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ తెలుగుకు అత్యున్నత స్థాయి కల్పించారు. జలగం వెంగళరావు ప్రధమ ప్రపంచ మహాసభలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాలు పురుడు పోసుకోవడానికి దోహదం చేశారు. కాని ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత నందమూరి వారసులమనీ, అమరావతిని రాజధానిగా నెలకొల్పామనీ చెప్పకుంటున్న వారి రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుకు ఆదరణ తగ్గిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీఓ నంబర్ 21ను విడుదల చేసింది. ఈ మేరకు చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెలుగులో తప్పనిసరిగా బోధన జరగాలని ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి దేశ విదేశాలనుంచి తెలుగు సాహితీవేత్తలను పిలిచి సత్కరించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. తెలుగుపై మమకారం లేని బాబు పాలన కాని ఎన్టీఆర్ వారసులు నడుపుతున్న ప్రభుత్వంలో తెలుగు భాష అమలు మాటేమిటి? తెలుగు అనే పదాన్ని తన సంస్థకు తగిలించుకున్న ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ ఆ భాషా పరి రక్షణకు ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రకటించిన వాగ్దా నాలను నెరవేర్చిన పరిస్థితులు కనపడటం లేదు. పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ పాలనా భాషగా తెలు గును అమలుచేస్తామని, నవ్యాంధ్రలో తెలుగు విశ్వ విద్యా లయం ఏర్పాటు చేస్తామని సీఏం స్వయంగా పలుసార్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక తెలుగు కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలుగు పండితుల శిక్షణా కళాశాలలు ఏర్పాటు చేస్తామని, తెలుగు ప్రాచీన తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ చేస్తామని ఏవేవో ప్రకటనలు గుప్పించారు. ఏ ఒక్కదాన్నీ ఆమలు చేయలేదు. పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ మీ డియంను ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ఆంగ్లభాషపై ఉన్న మమకారంలో నూరో వంతు కూడా తెలుగు భాషపై లేదని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడాల్సిన అవసరం కనపడదు. తెలుగు భాష అంటే తమకు పట్టింపు లేదని, తమకు ఆంగ్ల భాషా వ్యామోహమే ఉన్నదని, తాము, తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివారు కనుక ప్రజలను తెలుగులో చదవమని చెప్పే అధికారం తమకు లేదని, తెలుగు నేర్చు కుంటే బతుకుతెరువు లభించదని ఆనాడే ప్రకటించి ఉంటే ఇవాళ వారిని నిలదీసి ఎవరూ అడిగేవారు కాదు. కానీ తెలుగు భాషను కాపాడతామని, తెలుగులోనే ప్రధానంగా వ్యవహారాలు సాగిస్తామని 2014లోనే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాల మాటేమిటి? ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాసంస్థల్లో తెలుగు భాషను తప్పని సరి చేస్తాం, ఆ మేరకు జీవోలు జారీ చేస్తామని నాలుగేళ్ల పాటు వాగ్దానాలు గుప్పించలేదా? పైగా, మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధనను రద్దు చేస్తూ రెండేళ్ల క్రితం జీవో జారీ చేశారు. ఇవాళ మాతృభాష మా జన్మహక్కు అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో మాతృభాషను ప్రధాన భాషగా విద్యాబోధన చేస్తుంటే మన రాష్ట్రంలో మాతృభాష మీడియంను రద్దు చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంగన్వాడీలలోను తెలుగు లేకుండా చేశారు. తెలుగు భాషను కూకటివేళ్లతో పెకలించేందుకు ఇవాళ ప్రభుత్వంలో మంత్రులు కూడా కంకణం కట్టుకున్నట్లు కనపడుతున్నారు. ఒక కార్పొరేట్, వ్యాపార సంస్కృతి ఇవాళ ఏపీలో తెలుగు భాషను పూర్తిగా కబళించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ప్రతి ఏడాది ఆగస్టు 29 వచ్చేసరికి గంభీరమైన వాగ్దా నాలకు కొదువ ఉండదు. పాఠశాలలనుంచి ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో విద్యాబోధన తప్పని సరిచేస్తామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. పాఠశాలల్లో తెలుగు ప్రవే శించడం మాట దేవుడెరుగు, పసిపిల్లలను కూడా అమ్మా అనే బదులు మమ్మీ అనడమే సరైనదని చెప్పారు. తెలుగుకు పీఠాలు కడతామని మరో వాగ్దానం చేశారు. తీరా చూస్తే ఆ పీఠం సమాధి అన్న విషయం అర్థమవుతోంది. ప్రత్యేక కేంద్రం కోసం కేటాయిస్తామన్న పదివేల చదరపు అడుగుల భూమి అంటే తెలుగును పూడ్చి పెట్టడానికి ఏడడుగుల స్థలం కోసం అన్వేషణగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్ప టికైనా ఏపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా తెలుగు అమలుకు కంకణం కట్టుకోవాలి. ఇవాళ తెలుగుభాష ఉనికిని కాపాడేం దుకు ప్రభుత్వాలు విదేశాల్లో తెలుగు సంస్థలనుంచి నేర్చుకో వాల్సిన అవసరం కనపడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి తనను కబళిస్తున్న భాషా హంతకులనుంచి రక్షించమని విలపిస్తోంది. అమ్మ జోలపాట అంతర్ధానమవుతోంది. చెదలు పట్టిన పెద్ద బాలశిక్ష పుటలు చేతులు చాచి రెపరెప కొట్టుకుంటూ ఆర్తనాదం చేస్తున్నది. నినాదాల ఘోషలోభాష మరణిస్తోంది. వాగ్దానాల హోరులో అక్షరాల ఆర్తనాదం కలిసిపోయింది. కూలిన పాఠశాల భవనాల మధ్య మహాకవులూ, కవిసామ్రాట్టులూ కవిత్ర యాలూ, కవికోకిలలూ ఆత్మలై సంభాషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాక తెలంగాణలోనో, అమెరికా లోనూ, ఆస్ట్రేలియాలోనో, మారిషస్లోనో పుడితే మళ్లీ జీవిస్తామేమోనని చర్చించుకుంటున్నాయి. (నవంబర్ 3,4 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆచార్య యార్లగడ్డ లక్ష్షీ్మప్రసాద్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు) వ్యాసకర్త రాజ్యసభ మాజీఎంపీ, ఏపీ హిందీ అకాడెమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
తమిళం ఖూనీ.. తెలుగుకు చోటేది..
సాక్షి, చెన్నై : అత్యంత ప్రతిష్టాత్మకంగా నర్మదా నదీ తీరంలో ప్రతిష్టించిన ఉక్కుమనిషి విగ్రహం శిలా ఫలకంలో తమిళంకు అవకాశం దక్కినా, అక్షర దోషాలు, అర్థాన్నే మార్చేస్తూ ఖూనీచేసేలా ఉండడం తమిళనాట చర్చకు దారితీసింది. అయితే, అందులో తెలుగుకు అవకాశం కల్పించక పోవడంపై జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేలకు గుజరాత్లో భారీ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. నర్మదా నదీ తీరంలో 182 మీటర్లతో బ్రహ్మాండంగా ప్రతిష్టించిన నిలువెత్తు విగ్రహాన్ని బుధవారం మోదీ ఆవిష్కరించారు. ఇందులోని శిలాఫలకంలో తమిళానికి చోటు కల్పించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. పలు భాషల్లో ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్న నామకరణంతో నినాదాన్ని పొందుపరిచారు. అయితే, తమిళంలో ఒట్ట్రుమై శిలై అని పొందుపరచాల్సి ఉండగా, స్టేట్టుక్కో ఒప్పి యూనిటి అని ముద్రించడం విమర్శలకు దారితీసింది. అక్షర దోషం పక్కన పెడితే, అర్థమే మార్చేస్తూ, తమిళంను ఖూనీ చేశారన్న చర్చ తమిళనాట ఊపందుకుంది. కొన్ని తమిళ మీడియాల్లో వార్త కథనాలు తెర మీదకు వచ్చాయి. ఇక, తమిళం ఖూనీ చేస్తూ అక్షరాలను పొందుపరచడంపై విమర్శలు బయలుదేరినా, ఆ శిలాఫలకంలో తెలుగుకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తమిళ అక్షర దోషాలు, తమిళంకు శిలా ఫలకంలో చోటు కల్పించినట్టుగా వచ్చిన సమాచారాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించడం గమనార్హం. కాగా, అక్షర దోషాలను అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లగా, ఆగమేఘాల మీద తొలగించారని వాదించే తమిళులూ ఉన్నారు. తెలుగుకు అవమానం జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ఓ ప్రకటనలో పేర్కొంటూ, 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్యభారతాన్ని నిర్మించి, స్వతంత్ర భారతావని రూప శిల్పి పటేల్ అని కొనియాడారు. ఆయనకు 182 మీటర్ల ఎత్తులో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.అయితే, దేశంలో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాషకు ఆ శిలాఫలకంలో స్థానం కల్పించకపోవడం వేదన కల్గిస్తోందన్నారు. ఇది యావత్ తెలుగు వారికి తీరని అవమానం అని ఆవేదన వ్యక్తంచేశారు. -
అమెరికాలో తెలుగు వెలుగు
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష తెలుగు భాషేనని ఓ అమెరికా సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010–17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది. సెన్సస్ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010–17 కాలంలో ఇంగ్లిష్ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 భాషల్లో ఏడు దక్షిణాసియావే కావడం విశేషం. ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు. కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో యూఎస్కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం వెళ్తున్నారని బీబీసీ తెలిపింది. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ఇలినాయీస్ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో తెలుగు మాట్లాడే వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదలుకొని మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు నీనా దావులూరి వరకు ప్రముఖులెందరో ఉన్నారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాదీలే. -
అగ్రరాజ్యంలో వెలిగిపోతున్న ‘తెలుగు’
వాషింగ్టన్ : తెలుగు భాష అంతరించి పోతుందని భాషాభిమానులంతా భయపడుతున్నారు. కానీ మన భాషకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని అమెరికన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచమంతా ‘ఆంగ్ల జపం’ చేస్తుంటే దీనికి భిన్నంగా అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం మన తెలుగు భాష వెలిగిపోతుందంటున్నాయి సర్వేలు. అవును 2010 - 2017 మధ్యన అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య దాదాపు 86 శాతం పెరిగినట్లు అక్కడి సర్వేలు వెల్లడించాయి. అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న భాషల మీద జరిపిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్న జనాలు తాము కేవలం ఆఫీసుల్లో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడతామని.. ఇంట్లో తమ మాతృ భాషలోనే సంభాషిస్తామని వెల్లడించారట. ఈ క్రమంలో ‘టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వెజెస్ ఇన్ అమెరికా’ అనే లిస్ట్లో తెలుగు భాష స్థానం సంపాదించుకుంది. గత ఏడాది అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షలని.. 2010తో పోల్చుకుంటే ఇది రెట్టింపయ్యిందని సదరు సర్వేలు వెల్లడించాయి. ఇందుకు కారణం 1990 నుంచి ఐటీ గ్రోత్ పెరుగుతుండటంతో భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో డిమాండ్ భారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ఇంజనీర్లు అమెరికా వస్తోన్నట్లు.. అందువల్లే తెలుగు మాట్లాడే వారి సంఖ్య బాగా పెరిగిందని సర్వేలు వెల్లడించాయి. బీబీసీ కూడా ఇది వాస్తవమేనని తేల్చింది. ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ సీయీవోగా పని చేస్తోన్న సత్య నాదేళ్ల, ఇండియన్ - అమెరికన్ మిస్ అమెరికా నినా దావులురి వంటి ప్రముఖులు తెలుగు వారే కావడం విశేషం. అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న సౌత్ ఏషియన్ భాషలలో హిందీ ప్రథమ స్థానంలో ఉండగా.. ఉర్దూ, గుజరాత్, తెలుగు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అగ్రరాజ్యంలో మనదే హవా..!
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు బాష మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్లల్లో పోలిస్తే అమెరికాలో అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా తెలుగు రికార్డు సృష్టించింది. 2010-2017 మధ్య ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారు 86శాతం పెరిగారు. ఈ మేరకు అమెరికన్ థింక్ టాంక్ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది అమెరికాలో నాలుగు లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇది 2010లో తెలుగు మాట్లాడేవారితో పోలిస్తే రెట్టింపు అయ్యింది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి పది భాషల్లో ఏడు భాషలు దక్షిణాసియాకు చెందినవి కావడం విశేషం. కాగా అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో మాత్రం తెలుగు స్థానం సంపాదించలేక పోయింది. విద్యా, ఉద్యోగాల కోసం భారత్ నుంచి అత్యధికంగా అమెరికాకే వలస వెళ్తున్న విషయం తెలిసిందే. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే. 1990 నాటి నుంచి హైదరాబాద్లో ఐటీ విప్లవం మొదలైన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 700లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. అమెరికాను ఐటీ ఉద్యోగులను అత్యధికంగా సరఫరా చేస్తున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. అమెరికా అందిస్తోన్న హెచ్-1బీ వీసాల ద్వారా భారతీయులే అత్యధికంగా లబ్ధిపొందుతున్నారు. సాఫ్టవేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల కూడా మన తెలుగు తేజమే. కాగా భారత్లో తెలుగు బాషా నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎనిమిది కోట్లకు పైమాటే. -
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది. ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు. బెంగాలీ, తమిళయన్లు తక్కువే! అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది. -
తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. మహబూబ్నగర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహన్ని నింపారు. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విధంగా అమిత్ షా ట్విటర్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలను ఆకర్షించేందుకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అక్కడి ప్రభుత్వం వ్యవహారించడం బాధాకరమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా నే తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా తెలంగాణ పేదలు ఈ అద్భుతమైన కార్యక్రమ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదల వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కార్యకర్తలు నిలదీయాలి. — Amit Shah (@AmitShah) September 24, 2018 -
ఆధిపత్య భాషల వెన్నుపోటుకి బలైన తెలుగు
‘తెలుగువారికి సొంత భాష లేదు. తెలుగు నేలమీద చెలామణిలో వున్న సాహిత్యం తెలుగు కాదు. అది సంస్కృత పురాణేతిహాసాలకు అనువాదమే. లేదా వాటికి అనుకరణే. తెలుగు భాషలో మౌలికమైన రచయితలూ కవులూ లేరు. వెయ్యేళ్ళుగా కవులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న కవులెవరూ కవులు కారు. మనకున్నది అనువాదకులూ అనుకర్తలు మాత్రమే. నిజానికి మనం రాసే భాషే తెలుగు కాదు. సంస్కృతం ప్రాకృతం ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రభావానికి లోనై అది సహజత్వాన్ని కోల్పోయింది. అందుకే మన భాషలో డెబ్బై శాతం పరాయి భాషా పదాలే కనిపిస్తాయి.పరాయి భాషా పదాల్ని వాడీ వాడీ చివరికి తెలుగు మాటల్ని మరిచిపోయాం అందువల్ల యెంతో భాషా సంపదని కోల్పోయాం, సొంత సంస్కృతికి దూరమయ్యాం’. అరవై యేళ్లకి పూర్వం యెంతో ఆవేదనతో యీ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుగు భాష దుస్థితికి కారణాలు అన్వేషించిన భాషా శాస్త్రవేత్త బంగారయ్య. చావు బతుకుల్లో ఉన్న భాషల జాబితాలో చేరడానికి తెలుగు సిద్ధంగా ఉందని భాషా వేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు గానీ ఈ వినాశనానికి బీజాలు వేసినవాడు వాగనుశాసన బిరుదాంకితుడు నన్నయేనని కుండ బద్దలు కొట్టినవాడు బంగారయ్య. వాడుకలో వున్న తెలుగును కాదని భారతానువాదాన్ని డుమువులు చేర్చిన సంస్కృత పదాలతో నింపి పెట్టిన నన్నయ ఆదికవి కాదు తొలి వెన్నుపోటుగాడని ఆయన తీర్మానించాడు. గాసట బీసటగా వున్న తెలుగుని నన్నయ ఉద్ధరించాడు అని చెబుతారుగానీ నిజానికి సంస్కృతంతో కలగాపులగం చేసి భాషని భ్రష్టు పట్టించాడనీ వందల యేళ్ళు అదే కొనసాగిందనీ మనవి కాని ఇతివృత్తాల్నీ మనవి కాని ఛందో రీతుల్నీ స్వీకరించడం వల్ల పరాయి భాషకి దాస్యం చేయడం వల్ల తెలుగు జాతి ఉనికే ప్రశ్నార్థకమైందనీ భాషమీద అలవికాని ప్రేమతో తెలుగు నానుడి కూటమి స్థాపించి తెలుగా ఆంధ్రమా?, నుడి–నానుడి వంటి గ్రంథాల ద్వారా ప్రచారం చేసిన బంగారయ్య అసలు పేరు సత్యానందం. సొంత పేరులో సంస్కృతం ఉందని బంగారయ్యగా మారాడు. ‘కాలా’ సినిమాలో పా. రంజిత్ ప్రతిపాదించిన వర్ణ సిద్ధాంతాన్ని అప్పుడే (1965) ‘నలుపుచేసిన నేరమేమిటి?’ అన్న గ్రంథం ద్వారా ప్రచారం చేశాడు. చనిపోడానికి (1992) కొద్ది కాలం ముందు దళిత అస్తిత్వానికి సంబంధించి అనేక మౌలికమైన ఆలోచనల్ని (chduled castes stabbed, Schduled castes: search for Identity) గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇన్ని చేసీ అనామకంగా అజ్ఞాతంగా ఉండిపోయిన భాషా తాత్వికుడు బంగారయ్య. బంగారయ్య గొప్ప విద్యావేత్త. ప్రజా సమూహాల ఉచ్చారణని ప్రామాణికంగా తీసుకొని సంస్కృ త వర్ణాలు వదిలేస్తే తెలుగు అక్షరమాల సగానికి సగం తగ్గి అమ్మ నుడి నేర్చుకునే పసి పిల్లల మీద భారం తగ్గుతుందని భావించాడు. అందుకు అనుగుణంగా వ్యాకరణం, నుడిగంటులు (నిఘంటువులు) నిర్మించుకొనే పద్ధతులు బోధించాడు. పిల్లలకు వాచక పుస్తకాలు ఎలా ఉండాలో నిర్దేశించాడు. భిన్న ప్రాంతాల మాండలికాలని కలుపుకుంటూ పోయినప్పుడే భాష పెంపొందుతుందని గ్రహించాడు. అరువు తెచ్చుకోకుండా అవసరానుగుణంగా కొత్త పదబంధాలను సొంత భాషలోనే నిర్మించుకోవచ్చని స్వయంగా ఎన్నో పదాల్ని పుట్టించి నిరూపించాడు. వస్తు రూపాల్లో తెలుగుదనం చిప్పిల్లే మూల రచనల కోసం పరితపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆజీవితం కృషి చేశాడు. కానీ ఆధిపత్య కులాల వర్గాల భాషా రాజకీయాల కారణంగా ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదు. అయితే బంగారయ్య తెలుగు భాష పెంపుదల గురించి రచించిన గ్రంథాల్ని, చేసిన సూచనల్ని జయధీర్ తిరుమలరావు ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికా ముఖంగా ప్రకటించడంతో భాషోద్యమకారుల్లో చలనం వచ్చింది. స.వెం. రమేశ్ వంటి రచయితలు అచ్చమైన తెలుగులో కథలు రాసి (కతల గంప) యితర భాషా పదాలు లేకుండా పాపులర్ రచనలకు పాఠకుల మన్నన పొందవచ్చని నిరూపించాడు. హోసూరు మొరసునాడు మొ‘‘ ప్రాంతాల యువ రచయితలు దాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ బంగారయ్య నిరసించిన పరభాషా దాస్యం ఇప్పుడు చుక్కలనంటింది. పాలకులు ఒంట బట్టించుకున్న రాజకీయ ఆర్ధిక బానిసత్వం భాషకు సోకింది. ఒకప్పుడు సంస్కృతానికి తలవొగ్గాం, ఇప్పుడు ఇంగ్లిష్కి ఊడిగం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏలికల చలవ వల్ల తెలుగు మీడియం స్కూళ్ళు మూతబడుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనకి కాలం చెల్లిందని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుని ఒక సబ్జెక్టుగా కుదించేసి భాషని ఉద్ధరిస్తున్నామని పాలకులు బుకాయిస్తున్నారు. తెలుగులో చదివితే పనికి రాకుండా పోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాల పోటీలో నిలవాలంటే ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని ఊదరగొడుతున్నారు. తల్లిభాషను కాపాడుకోవాల్సిన ఇటువంటి తరుణంలో ‘వాగరి’ బంగారయ్య ప్రతిపాదించిన భాషా వాదాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ నుడిని నానుడిని రక్షించుకోలేని జాతికి మనుగడ లేదు. ప్రతులకు: అన్ని పుస్తక దుకాణాల్లో లభ్యం (నేడు హైదరాబాదులో ఇందిరాపార్కు సమీపంలోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ సమావేశ మందిరంలో బంగారయ్య రచించిన నుడి–నానుడి గ్రంథావిష్కరణ) ఎ.కె. ప్రభాకర్ ‘ మొబైల్ : 76800 55766 -
నాని సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నా
‘‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన తర్వాత మోడలింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశా. ఇన్స్టాగ్రామ్లో నా ఫొటోలు చూసిన నిర్మాతలు ‘చి.ల.సౌ’లో హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నేను అప్పటి వరకూ చేసిన యాడ్స్ చూపించాను. ఆడిషన్స్ చేసి, నన్ను ఎంపిక చేశారు’’ అని కథానాయిక రుహానీ శర్మ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘చి.ల.సౌ’. సిరునీ సినీ కార్పొరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటరై్టనర్గా తెరకెక్కిన చిత్రమిది. చాలా సంప్రదాయబద్ధంగా, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంది. నాకు తెలుగు రాకపోవడంతో మొదట్లో కష్టంగా అనిపించింది. తెలుగు నేర్చుకోవటానికి హార్డ్ వర్క్ చేశా. తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి హీరో నాని సినిమాలు చూశా. ప్రస్తుతం నా తెలుగు చాలా బెటర్ అయిందనుకుంటున్నా. సుశాంత్తో నటించడం సౌకర్యంగా ఉండేది. షూటింగ్ సమయంలో తను ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. మా నుంచి సరైన నటన రాబట్టుకోవడానికి రాహుల్ రవీంద్రన్ హార్డ్ వర్క్ చేశారు. పైగా రాహుల్ నటుడు కావడం వల్ల ఆయన సలహాలు మాకు ఉపయోగపడ్డాయి’’ అన్నారు. -
అమ్మభాష
-
దేశ భాషలందు చిక్కిపోతున్న తెలుగు...!
దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. తెలుగు స్థానాన్ని మరాఠి భర్తీచేసి మూడోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా గణనలో భాగంగా దేశంలోని మాతృభాషలకు సంబంధించి తాజాగా వెల్లడైన వివరాలను బట్టి ఈ అంశం వెల్లడైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది దేశంలో గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక భాషను తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ భాషగా ఎంపికచేసుకున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 7.19 శాతం మంది (మొత్తం దేశజనాభాలో) తెలుగును తమ మాతృభాషగా ఎంచుకున్నారు. అదే 2011 లెక్కలకు వచ్చేప్పటికీ అది 6.93 శాతానికి తగ్గిపోయింది. అదేసమయంలో మరాఠి మాతృభాషగా ఎంపిక చేసుకున్న వారు 6.99 శాతం నుంచి 7.09 శాతానికి వృద్ధి చెందారు. ఈ విధంగా తెలుగును మరాఠి భాష అధిగమించింది. తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హిందీ టాప్...సంస్కృతం లాస్ట్ దేశ జనాభాలో హిందీని మాతృభాషగా ఎంచుకుంటున్న వారు మాత్రం గణనీయంగా పెరిగారు. 2001 లెక్కల ప్రకారం 41.03 శాతమున్న వీరి సంఖ్య 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బాంగ్లా (బెంగాలీ) కొనసాగుతోంది. గతంలో 8.11 శాతమున్న బాంగ్లా మాట్లాడే వారి సంఖ్య తాజా లెక్కల్లో 8.3 శాతానికి పెరిగింది. దేశంలో గుర్తించిన (రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన) 22 భాషల్లో సంస్కృతం మాత్రం ఈ విషయంలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోడో, మణిపురి, కోంకణి, డోగ్రీ భాషలు మాట్లాడే వారి కంటే కూడా ఈ భాషను తక్కువమంది మాట్లాడుతున్నారు. కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు. రెండున్నరలక్షల మందికి ఇంగ్లిష్... మన దేశంలో మాతృభాషగా గుర్తించని ఇంగ్లిష్ను (షెడ్యూల్డ్ లాంగ్వేజేస్లో చేర్చని) మాత్రం 2.6 లక్షల మంది తాము మొదట మాట్లాడే భాష(ఫస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్)గా పేర్కొనడం విశేషం. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్నవారు లక్ష మందికి పైగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలుస్తున్నాయి. మనదేశంలో గుర్తింపు పొందని భాషల్లో రాజస్థాన్లోని కోటి మందికి పైగా భిలి / భిలోడి భాష మాట్లాడుతున్నారు. గోండీ భాషను 29 లక్షల మంది సంభాషిస్తున్నట్టు 2011 జనాభా గణన సమాచారాన్ని బట్టి వెల్లడైంది. గతంలోని జనాభా లెక్కల ప్రకారం ఆరోస్థానంలో ఉన్న ఉర్థూ కాస్తా ప్రస్తుతం ఏడోస్థానానికి పడిపోయింది. మొత్తం 4.74 శాతం మాట్లాడేవారితో గుజరాతీ భాష ఆరోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... భాష మాతృభాష మాట్లాడేవారు మొత్తం జనాభాలో శాతం హిందీ 52,83,47,193 43.63 బాంగ్లా 09,72,37,669 08.30 మరాఠి 08,30,26,680 07.09 తెలుగు 08,11,27,740 06.93 తమిళం 06,90,26,881 05.89 -
తెలుగు ప్రకటనలకు గూగుల్ సపోర్ట్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్నెట్లో తెలుగు ప్రకటనలు ఇచ్చేవారికి గూగుల్ ఇండియా శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్స్ ఫ్లాట్ఫామ్స్ అయిన యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్లలోని సాంకేతికతను ఇకపై తెలుగు ప్రకటనలకు కూడా అందించనున్నట్టు తెలిపింది. ప్రాంతీయ భాషలైన హిందీ, బెంగాలీ, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సాంకేతికత అందుబాటులో ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. తెలుగులో వెబ్సైట్లు, బ్లాగ్లు నిర్వహించేవారు ఇకపై గూగుల్ యాడ్ సెన్స్లోకి సైన్ ఇన్ అయి ప్రకటనలు పొందడమే కాకుండా తమ సైట్లలో ప్రకటనలు ఇచ్చేలా అడ్వర్టైజర్స్ను ఆకర్షించవచ్చని తెలిపింది. తద్వారా ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ‘గూగుల్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ సాంకేతికతపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి గూగుల్ ఇండియా వర్క్షాపులు కూడా నిర్వహించింది. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు రాజన్ ఆనంద్ మాట్లాడుతూ.. భారత్లోని ప్రాంతీయ భాషాభిమానులకు ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడం కోసమే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. తద్వారా గూగుల్ యాడ్స్ ఫ్లాట్ఫాంపై భారతీయ భాషలకు మద్దతు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రాంతీయ భాషల్లో మెరుగైన సమాచారం అందించడం కోసం పరిశ్రమలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాల్సి ఉందన్నారు. దీంతో దేశ అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రకటనకర్తలకు కూడా తమ ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇవ్వడం సులభతరం అవుతుందన్నారు. -
తెలుగులోనూ ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తోన్న ‘ధరణి’వెబ్సైట్ను తెలుగు భాషలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి సంబంధించిన భూముల వివరాలన్నింటినీ పొందుపరిచే ఈ వెబ్సైట్ను అందరికీ అర్థమయ్యేలా తొలిసారి మాతృభాషలో రూపొందిస్తున్నారు. డాటా మొత్తాన్ని తెలుగులోనే అందుబాటులో ఉంచనున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా ఈ వెబ్సైట్ రూపొందిస్తున్నారు. జిల్లాకో మండలంలో.. కాగా, ధరణి వెబ్సైట్ను ఈనెల 19 నుంచి జిల్లాకో మండలంలో ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గుడిహత్నూర (ఆదిలాబాద్), పాల్వంచ రూరల్ (భద్రాద్రి కొత్తగూడెం), రాయికల్ (జగిత్యాల), రఘునాథపల్లి (జనగామ), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), ఐజ (గద్వాల), యెల్లారెడ్డి (కామారెడ్డి), మానకొండూరు (కరీంనగర్), ముదిగొండ (ఖమ్మం), ఆసిఫాబాద్ (కొమురం భీం), కేసముద్రం (మహబూబాబాద్), దేవరకద్ర (మహబూబ్నగర్), నెన్నెల్ (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), మేడిపల్లి (మేడ్చల్), బిజినేపల్లి (నాగర్కర్నూలు), కట్టంగూరు (నల్లగొండ), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతుకుంట (రాజన్న సిరిసిల్ల), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), రామచంద్రాపురం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), చివ్వెంల (సూర్యాపేట), నవాబ్పేట (వికారాబాద్), పెబ్బేర్ (వనపర్తి), హసన్పర్తి (వరంగల్ అర్బన్), నర్సంపేట (వరంగల్ రూరల్), తుర్కపల్లి (యాదాద్రి) మండలాల్లో ఈ వెబ్సైట్ను అందుబాటులోకి తేనున్నారు. అదే రోజు నుంచి తహశీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, ఈ బాధ్యతల అమలును పైలట్ ప్రాజెక్టు తరహాలో పరిశీలించాలా లేక రాష్ట్రంలోని అన్ని మండలాల్లో (సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలు) ఒకేసారి అప్పగించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని సేవలతో అనుసంధానం ధరణి వెబ్సైట్తో రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఫలానా భూమిపై జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు క్షణాల్లో అప్డేట్ అయ్యే లా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. ముఖ్యం గా కోర్బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, సర్వే సెటిల్మెంట్ తదితర వివరాలన్నింటినీ అందు బాటులోకి తెస్తున్నారు. బ్యాంకర్లు ఆన్లైన్లోనే రైతుల భూముల వివరాలు చూసు కుని రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పిం చేలా డేటా రూపొందిస్తున్నారు. ఈ వెబ్సైట్ను ప్రయోగాత్మకంగా ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో అమల్లోకి తెస్తున్నారు. జగదేవ్పూర్ (సిద్దిపేట), ఘట్కేసర్ (మేడ్చల్), కొత్తూరు (రంగారెడ్డి), సదాశివపేట (కామారెడ్డి), కూసుమంచి (ఖమ్మం) మండలాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు ఆ రోజునుంచి ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. -
‘తప్పనిసరి తెలుగు’ సమీక్షకు కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రతి ఒక్కరూ చదివేలా చట్టం తెచ్చిన ప్రభుత్వం, అమలుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో, ఆరో తరగతిలో మొదటగా తెలుగును ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన పుస్తకాల రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పుస్తకాల రూపకల్పనకు అవసరమైన ఎడిటర్స్ కమిటీ, కంటెంట్ రైటర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సమీక్షించి, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అవసరమైన మార్పులను ఈ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్ర సిలబస్ పాఠశాలలతోపాటు ఇతర మీడియం పాఠశాలలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర సిలబస్ కలిగిన పాఠశాలల్లోనూ తెలుగు అమలుకోసం చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే చట్టానికి అనుగుణంగా నిబంధనలను జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
ఇంటర్ కాదు.. టెన్త్ వరకే తెలుగు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలనే నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంటర్కు బదులు పదో తరగతి వరకే పరిమితం చేయాలని నిశ్చయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేసేందుకు బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు వెల్లడించారు. మాతృభాష బోధన అమలుకు సంబంధించి తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధి విధానాలపై చర్చించారు. తొలి దశలో టెన్త్ వరకు.. ‘మాతృభాష తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవటం లక్ష్యంగా తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంలో చదవడం అందరికీ అనివార్యమవుతోంది. పిల్లల భవిష్యత్తును దెబ్బతీయవద్దు. అదే క్రమంలో తెలుగు కనుమరుగు కావద్దు. అందుకే ఇంగ్లిషు మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నాం. మొదట ఇంటర్మీడియెట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించాం. అయితే ఇంటర్ (10+2) అన్ని విద్యాసంస్థల్లో ఒకే మాదిరిగా లేదు. దీంతో ఇంటర్లో తెలుగును అమలు చేయడం ఇబ్బందిగా మారుతుంది. తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాతృభాష బోధన అమలును పరిశీలించిన అనంతరం మొదటి దశలో పదో తరగతి వరకు తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం’అని సీఎం వెల్లడించారు. సిలబస్ రూపొందించండి తరగతుల వారీగా తెలుగులో బోధించాల్సిన అంశాలకు సంబంధించి సిలబస్ రూపొందించాల్సిందిగా తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. భాషను కాపాడుకోవడంతోపాటు, మాతృభాష ద్వారా జీవితంలో ఉపయోగపడే విషయాలను విద్యార్థులకు బోధించాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశ భక్తిని పెంచే అంశాలు ఉండాలని వివరించారు. తెలుగు చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఓ తెలుగు పండిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె.తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ జి.కిషన్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఎస్.వి.సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఎస్.ఇ.ఆర్.టి. అధికారి సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే విద్యాసంవత్సరం నుంచే.. కేసీఆర్ ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్ట్ బోధన తప్పనిసరి కానుంది. స్వయంగా తెలుగు భాషాభిమాని అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాతృభాషను బతికించుకునేందుకు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరిగా బోధించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా తెలుగు సిలబస్ రూపొందించాలని తెలుగు వర్సిటీని, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్ కోరారు. సిలబస్లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు. -
‘తెలుగు తప్పనిసరి’ అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై విద్యా శాఖ అధికారులు ఆలోచనల్లో పడ్డారు. తెలుగు అమ లుపై డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి ప్రభుత్వానికి పంపించినా, ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దానిపై చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారా? లేదా? అన్న దానిపై అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాతృభాష అమలుపై తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాతృ భాష అమలుపై కమిటీ అధ్యయనం జరిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారులతోనూ మాట్లాడి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతోపాటుగా పాఠ్య పుస్తకాల రూపకల్పనపైనా దృష్టి సారించింది. పదో తరగతి వరకు ఇంగ్లిషులో చదువుకుని ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం పుస్తకాల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. 2018–19 విద్యా ఏడాదిలో తెలుగును అమలుకు అవసరమైన నిబంధనలపై ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తారా? లేదా? అన్న దానిపై అధికారుల్లోనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.