tribal welfare department
-
ఆ గిరిజన గ్రామాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాలకు ప్రస్తుతం 292 గ్రామాలే ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలన్నీ ఏమయ్యాయని, ఎలా మాయమయ్యాయని అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, లేని పక్షంలో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు, ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి ర వి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారని, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకట శివరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ. శ్యాంసుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను కుదించేస్తున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అందుకే గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం గతంలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 292 గ్రామాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అయిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావును ప్రశ్నించింది. తాము పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఇప్పటివరకు ఇవ్వలేదని పొన్నారావు తెలిపారు. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. -
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు..ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలన్నారు. నెలలు నిండిన గర్భిణిల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలిఅరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి ఎక్కడా కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. -
గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఆత్మీయంగా పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు, పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగిలుంటే వారికి పథకాలు అందేలా చూస్తారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 15న విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషినల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు జిల్లాల్లోని 430 గిరిజన గ్రామాల్లో నాలుగు ప్రత్యేక వాహనాల(ప్రభుత్వ పథకాల ప్రచార వ్యాన్)తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), జిల్లాల స్థాయిలో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రత్యేకంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు. గిరిజనుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇంకా అర్హత ఉన్న వాళ్లకు ఎవరికైనా రాకుంటే.. వారికి సంక్షేమ ఫలాలు అందించేలా తక్షణ చర్యలు చేపడతారు. గిరిజన జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులను చేరి్పంచడం, స్కాలర్షిప్ల మంజూరు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల అమలు, అర్హులకు వాటిని దరి చేర్చడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ‘జన జాతీయ గౌరవ్ దివస్’ను ఘనంగా జరుపుదాం సీఎం జగన్కు కేంద్ర మంత్రి లేఖ జన జాతీయ గౌరవ్ దివస్ను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్లో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నివాళి అర్పిస్తారని తెలిపారు. అలాగే బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం ఉలిహటు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశంలోని 75 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్లో ఉన్నాయి. -
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
ఒక్కో గిరిజన గురుకులానికి రూ. 5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలలకు అదనపు హంగులు దిద్దాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 47 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ భవనాల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాశ్వత ప్రాతిపదికన అదనపు గదులు, డారి్మటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్టీ ఎస్డీఎఫ్) ద్వారా సివిల్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదం తెలిపింది. ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్లు... గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో పాత పాఠశాలల్లో నిర్మాణ పనుల కోసం ఒక్కో గురుకులానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించింది. చాలాచోట్ల తరగతి గదులతో పాటు డార్మిటరీ భవనాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్కో పాఠశాలలో ఒక తరగతికి ఒక సెక్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో పాటు ఇంటరీ్మడియట్ కాలేజీలుగా దాదాపు అన్నీ అప్గ్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ఎస్టీ ఎస్డీఎఫ్ ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయించారు. మొత్తం 47 పాఠశాలలకు రూ.235 కోట్లు కేటాయించారు. అతి త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. గిరిజన విద్యార్థుల అడ్మిషన్ల డిమాండ్కు అనుగుణంగా 2023–24 వార్షికంలో కొత్తగా మరో రెండు పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వీటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మించేందుకు ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఒక్కో పాఠశాలకు రూ.12కోట్లు చొప్పున రెండింటికి కలిపి రూ.24కోట్లు కేటాయించింది. దీంతో గురుకుల పాఠశాలల నిర్మాణ పనులకు మొత్తంగా రూ.259 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ఇంజనీరింగ్ పర్యవేక్షణ... ఎస్టీ గురుకులాల్లో త్వరలో చేపట్టనున్న ఈ సివిల్ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. టెండర్ల ఖరారు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన తదితర పూర్తిస్థాయి బాధ్యతలను గిరిజన ఇంజనీరింగ్ అధికారులే చూసుకుంటారు. గత మూడేళ్లుగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి తాజాగా ఊరట లభించినట్లయింది. -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
ఏజెన్సీలో మరో 32 గర్భిణీ వసతి గృహాలు
సాక్షి, అమరావతి: కొండలు, కోనల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీలు) ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయాల్లో డోలీలు, మంచాలపై మోసుకెళ్లకుండా వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించి, ముందుగానే ఆస్పత్రులకు తరలించేందుకు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ వసతి గృహాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్–బీడబ్ల్యూహెచ్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి 45 ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనల మేరకు మరో 32 గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో మొత్తం వీటి సంఖ్య 77కు పెరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు తక్షణ వైద్య సేవలు అందించి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ వసతి గృహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో 1818 మారుమూల ప్రాంతాలున్నాయి. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేరులు తదితర మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గతంలో వైద్యం గగనమే అయ్యేది. దీంతో మరణాలూ అధికంగానే ఉండేవి. గర్భిణుల అవస్థలు చెప్పనలవి కాదు. సరైన వైద్యం అందక, ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులకు ఈ అవస్థలు తప్పించి, వారికి మంచి వైద్య సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఆ ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచేందుకు గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. గిరి రక్షక్ పేరుతో ఏర్పాటు చేయనున్న బైక్ అంబులెన్స్లు నెలలో 25 రోజులపాటు ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ఏఎన్ఎం దగ్గర్నుంచి మండల స్థాయి వైద్యాధికారి, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణులతోపాటు అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు చేపడుతుంటారు. ప్రతి గురువారం గ్రామ సచివాలయ బృందం అన్ని మారుమూల (డోలీపై ఆధారపడిన) ప్రాంతాలను సందర్శిస్తుంది. ప్రతి శనివారం (పలకరింపు) వైద్య బృందం వెళ్లి అక్కడి వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటారు. డోలీ మరణాల నివారణకు మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను డాక్టర్ నిర్ధారించిన ప్రసవ సమయానికి నెల రోజుల ముందుగానే సురక్షిత రవాణా వ్యవస్థ (108 అంబులెన్స్, ఫీడర్అంబులెన్స్, బైక్ అంబులెన్స్) ద్వారా బర్త్ వెయిటింగ్ హోమ్కు తరలిస్తారు. ఈ గృహాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు. నిత్యం పోషకాహారాన్ని, మందులను అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రాథమిక, సామాజిక, జనరల్ ఆసుపత్రులకు తరలిస్తారు. -
ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు... మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి. ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి. -
గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది. సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
మైదాన ప్రాంతంలోనూ ‘సమీకృత గిరిజనాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది. మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
గిరిజనుల్లో 'నవరత్న' కాంతులు.. ప్రగతిబాటలో ఏజెన్సీ గ్రామాలు
ఇతని పేరు మడివి సిరమయ్య. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన గుంజవరం. మూడేళ్లలో ‘నవరత్నాల’ ద్వారా ఏకంగా రూ.2.86 లక్షల మేర లబ్ధి పొందాడు. గత ప్రభుత్వ హయాంలో సాయం అంటే ఏమిటో తెలీకుండా ఉండేదని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వలంటీర్ స్వయంగా తన ఇంటికొచ్చి పథకాలూ అందేలా చూస్తున్నారని అంటున్నాడు. అడవుల్లో ఎవరికీ పట్టనట్లు ఉండే గిరిజన బతుకులు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన బాగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈమె పేరు కుంజం సావిత్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈమెకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం రెండు ఎకరాలకు భూమి హక్కు పట్టా అందించింది. అలాగే, మూడేళ్లుగా రైతుభరోసా అందిస్తూ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండగా నిలుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపింది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల మూట అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనోద్ధరణకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిద్వారా 95 శాతం మంది గిరిజనులు లబ్ధి పొందారు. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రయోజనం కలిగిన దాఖలాల్లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గిరిజనులకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలు ఏమిటంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 27.39 లక్షల మంది గిరిజనులున్నారు. 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 7 ఐటీడీఏలు అటవీ ప్రాంతంలోను, రెండు ఐటీడీఏలు మైదాన ప్రాంతాల్లోను గిరిజనుల కోసం పనిచేస్తున్నాయి. ఇక నవరత్నాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా గత మూడేళ్లలో 51,74,278 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.9,204.75 కోట్ల మేర లబ్ధిచేకూరింది. ప్రత్యక్షంగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 33,92,435 మందికి రూ.7,012.35 కోట్లు, పరోక్షంగా (నాన్ డీబీటీ) 17,81,843 మందికి రూ.2,192.40 కోట్ల మేర లబ్ధిచేకూరింది. గిరిపుత్రులకు ఇంత భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనికితోడు గిరిజన ఉప ప్రణాళిక(ట్రైబల్ సబ్ప్లాన్).. కేంద్ర, రాష్ట్ర నిధులతో దాదాపు 40 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. గిరిజనం కోసం ప్రభుత్వ చర్యల్లో ముఖ్యమైనవి.. ► గిరిజన రైతులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించేలా సీఎం జగన్మోహన్రెడ్డి స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. గత మూడేళ్ల కాలంలో 1,34,056 మందికి ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఆర్ పట్టాలు చేతికందాయి. తద్వారా వారికి 2,48,066 ఎకరాలపై హక్కు లభించింది. అంతేకాదు వారికి వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వర్తింపజేశారు. ► గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. ► గిరిజన గ్రామాల్లో డోలీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫీడర్ అంబులెన్సులను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా.. 128 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనుంది. ► రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ► ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న రూ.400 జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచారు. ► గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. ► వంద శాతం గిరిజనుల జనాభా కలిగిన తండాలు, గూడేలను 165 కొత్త గిరిజన పంచాయతీలుగా ఏర్పాటుచేసిన ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులంతా గిరిజనులే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీఓ నెంబర్ 560 జారీచేసింది. ► 4,76,206 గిరిజనుల కుటుంబాల గృహావసరాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది. ► గిరిజనులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ► కోట్లాది రూపాయలతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. è రాష్ట్రానికి మంజూరైన గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం వద్ద నిర్వహిస్తున్నారు. ► కరోనా కష్టకాలంలో.. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అడవి బిడ్డలకు అండగా నిలిచింది. ► ఇక విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.10కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం)కు భవన నిర్మాణం పూర్తయింది. గిరిజనులకు వైఎస్ కుటుంబమే బాసట నాడు వైఎస్సార్ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. అందుకే వీరిని గిరిజనులు దైవంతో సమానంగా భావిస్తారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు. మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. గిరిజనులకు విద్య, వైద్యం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగానే రూ.9వేల కోట్లకు పైగా వారికి లబ్ధిచేకూర్చారు. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
సమావేశమా.. అయితే సందర్శకులు బంద్!
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం ఉపాధికి రాయితీ రుణాలు, కల్యాణలక్ష్మి, దళితబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న వివిధ సంక్షేమ శాఖల కార్యాలయాలకు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. పేదలకు నేరుగా లబ్ధి చేకూరే ఈ పథకాలు అమలు చేస్తున్న ప్రధాన కార్యాలయాలున్నది మాసాబ్ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో. వందల మంది లబ్ధిదారులు ఇక్కడ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను నేరుగా కలసి తమ గోడు వినిపించుకుంటారు. అలాంటి వారి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఆ నమ్మకంతోనే ఇక్కడికి రాష్ట్రం నలు మూలలనుంచి వస్తుంటారు. కానీ ప్రస్తుతం సందర్శకులపై ఆంక్షలు విధించారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహణలో ఉన్న ఈ భవన్లో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ శాఖ ఉన్నతాధికారుల సమావేశాల పేరిట ఇతర కార్యాలయాలకు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. రోజూ ఈ శాఖ అధికారులకు సంబంధించి ఏదో ఒక సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆరు అంతస్తుల్లో వివిధ కార్యాలయాలున్న సంక్షేమ భవన్లో మొదటి అంతస్తు వద్దే సందర్శకులను నిలువరిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సంబంధిత ఉన్నతాధికారులను కలవకుండా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గురుకుల ప్రవేశాలతో రద్దీ.. ప్రస్తుతం సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపులన్నీ ఆన్లైన్ పద్ధతి ద్వారానే జరుగుతున్నా.. వివరాల్లో పొరపాట్లు, రిపోర్టింగ్ వివరాలు, ఇతర సమస్యలతో పెద్ద సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజూ సంక్షేమ భవన్కు వస్తున్నారు. ముఖ్యంగా రెండో అంతస్తులోని బీసీ గురుకుల సొసైటీ కార్యాలయానికి విద్యార్థులు, తల్లిదండ్రుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో మొదటి అంతస్తు వరకే సందర్శకులను అనుమతించడం, పైఅంతస్తుల్లోకి పంపకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న కొందరిని లిఫ్ట్ ద్వారా అనుమతిస్తుండగా.. అధికశాతం సందర్శకులను నిలిపివేస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సైతం సంక్షేమ భవన్లోని ఐదో అంతస్తులో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ అధికారులను కలిసేందుకు అనుమతి దొరకడం లేదు. కాగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమావేశం మందిరం మెట్ల దారి పక్కనే ఉందని, సమీక్షలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ అనుమతించవద్దని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినందునే సందర్శకులను నిలిపివేస్తున్నామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. -
భావి తరాలకు పదిలంగా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గిరిజన తెగల సంస్కృతి, భాషల అధ్యయనం విస్తృతంగా సాగుతోంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వీడియో డాక్యుమెంటేషన్ చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. గిరిజనుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబోయే తరాలకు తెలియజేయడం కోసం గిరిజన వస్తు ప్రదర్శనశాలలు(మ్యూజియం)ను ఏర్పాటు చేసింది. అరకులోయ, శ్రీశైలం, సీతంపేట(శ్రీకాకుళం జిల్లా)లో గిరిజన వస్తు ప్రదర్శనశాలలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సాహిత్యం, వాజ్ఞయాలతో కూడిన 15 వేలకు పైగా పుస్తకాలను రూపొందించడంతోపాటు, వాటిలోని చాలా వరకు డిజిటలైజేషన్ చేసింది. గ్లోబలైజేషన్ యుగంలో వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన చర్చాగోష్టిలో సమర్పించిన పత్రాలను నాలుగు సంపుటాలుగా వెలువరించింది. గిరిజన బడుల్లో 1 నుంచి 3వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంది. కోయ, ఆదివాసి, సుగాలి, కొండ, సవరా, భారతి, కువి, భాషల్లో 54 వాచకాలు రూపొందించి గిరిజన విద్యార్థులకు అందించింది. బడగ, గదబ, కొండకాపు, గౌడు, కొఠియా, రోనా, భిల్లు, పరంగి పోర్జా, పోర్జా, మాలి, ధూలియా, కట్టునాయకన్, యానాది వంటి గిరిజన తెగలకు చెందిన వారి సంస్కృతి భాష, ఇతర సంప్రదాయాలపై సమగ్ర అధ్యయనాలను చేపట్టింది. కొండరెడ్డి, కోండ్, గదబ, చెంచు, కొరజ, సవర, జాతాపు, నక్కల, కోయ, వాల్మీకి తెగల ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం కోసం వారి జీవన శైలిని వీడియో రూపంలో డాక్యుమెంటేషన్ చేయడం విశేషం. ఏటా గిరిజనోత్సవాలు గిరిజన సంస్కృతిని వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన స్వాతంత్య్ర పోరాటాలను స్మరించుకోవడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా గిరిజనోత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ జాతర, జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు అనేక పోటీలు, ఔత్సాహిక కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన నాట్య బృందాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గిరిజన ఉత్సవాల్లో పోటీలకు పంపిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్లో 2019లో జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవంలో రాష్ట్రానికి చెందిన ‘కొండరెడ్ల కొమ్ము’ నాట్యానికి 3వ బహుమతి వచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం.. సీఎం జగన్ ఆదేశాలతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం. గిరిజన తెగలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, వేషభాషలు, సంగీత, నాట్య పరికరాలు, వ్యవసాయ పరికరాలు, కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించి మ్యూజియంలతోపాటు, వీడియోలు, ఫొటోలు, డిజిటలైజేషన్ తదితర రూపాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. మరింత పరిజ్ఞానం తెలుసుకునేలా అధ్యయనం చేపట్టడంతోపాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
స్టార్స్.. మెమ్స్!
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఈ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ స్కూళ్లను మరింత ఆధునీకరించబోతున్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ. 25 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు. గురుకుల పాఠశాలల స్థాయిలో ఆశ్రమ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 326 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో మూడు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. 1.05 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యము కల్పిస్తారు. ఇవిగాక 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 30 వేల మంది పిల్లలున్నారు. ఈ పాఠశాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల పేర్లను ‘ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (స్టార్)’గా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ (మెమ్స్)గా పేరు మార్చనున్నారు. ఆశ్రమ పాఠశాలలన్నింటినీ గురుకుల పాఠశాల మాదిరి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఆశ్రమ, గిరిజన ప్రభుత్వ పాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే క్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లైబ్రరీ, ప్రయోగ శాలలు, ఆట వస్తువులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, టీచర్లలో బోధన సామర్థ్యం పెంపు, బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాథమిక సౌకర్యాల కోసం కనీసం రూ.25 కోట్లు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. మరింత లోతుగా ప్రణాళిక తయారు చేస్తోంది. మరోవైపు ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ తరగతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రారంభించింది. విడతల వారీగా అన్ని కేటగిరీల్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. -
హెచ్ఐవీ బాధిత ఎస్టీ కుటుంబాలకు చేయూత
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధిత గిరిజన కుటుంబాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేయూత అందిస్తోంది. హెచ్ఐవీ కారణంగా బతుకుదెరువు లేక మానసికంగా కుంగిపోకుండా వారిలో మనోధైర్యం నింపేలా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధి చూపించే చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 117 మంది బాధితులను గుర్తించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితుల జాబితాలు పంపించాలని కలెక్టర్లను కోరామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక శ్రద్ధతో ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితులకు రూ.1.17 కోట్లు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య చెప్పారు. -
గిరిజనుల స్వయం ఉపాధికి సర్కార్ కృషి
డుంబ్రిగుడ/అరకులోయ రూరల్: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు జీసీసీ గోడౌన్లో కొర్రాయి వీడీవీకే ఏర్పాటు చేసిన బిస్కెట్ తయారీ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వం 350 వన్ధన్ వికాస కేంద్రాలను ఏపీకి మంజూరు చేసిందన్నారు. సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ ఉత్పతులకు అదనపు విలువ జోడించి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని కాటేజీ పరిశ్రమ కిందకు మారిస్తే విద్యుత్ రాయితీ పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహకారం అందిస్తోందన్నారు. అనంతరం కాంతీలాల్ దండే కుటుంబ సమేతంగా అరకులోయను సందర్శించారు. గిరి గ్రామదర్శినిలో కాంతిలాల్ దంపతులకు గిరిజన సంప్రదాయ దుస్తులు వేసి మరోసారి పెళ్లి తంతు జరిపించారు. సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో గిరి గ్రామదర్శిని నిర్వహణ అభినందనీయమన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, ఎంపీపీ బాక ఈశ్వరి, సర్పంచ్ శారద పాల్గొన్నారు. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
గిరిజన కష్టాలకు కాంగ్రెస్సే కారణం
భోపాల్: కాంగ్రెస్ హయాంలో గిరిజనుల సంక్షేమం మరుగునపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గత పాలకుల వల్ల ఇప్పటికీ వెనుకబాటుకు గురైన ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని అన్నారు. సోమవారం ఆయన భోపాల్లో జన్జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్లో మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. ‘గత ప్రభుత్వాల్లో గిరిజనులకు సముచిత స్థానం దక్కలేదు. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం’అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈపీఐ దిశగా పరివర్తన: గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని చెప్పారు.‘వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి ఒకరూ ముఖ్యులే) అన్న ఆదర్శం దిశగా దేశం పరివర్తన చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 175 రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక వసతులను సమకూరుస్తాం’అని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 40–50 ఏళ్లు పట్టేంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,100 కిలోమీటర్ల ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రెయిట్ కారిడార్ల పనులు ఏడేళ్లలోపే పూర్తయిందన్నారు. -
జాతీయ ఆదివాసీ దినోత్సవం: గిరిజన కళలకు 'కళ'
సాక్షి, అమరావతి/బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): గిరిజన కళలకు ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 146వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ‘జన్ జాతి గౌరవ దివస్’(జాతీయ ఆదివాసీ దినోత్సవం)గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు గిరిజన కళలను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్లో సోమవారం ప్రారంభించిన గిరిజన హస్తకళల ప్రదర్శన, విక్రయాలు 19 వరకు కొనసాగుతాయి. సవర, కొండరెడ్డి, కొండదొర, నూకదొర, కోయ, జాతపు, కొండ కమ్మర, వాల్మీకి, భగతహ, కొటియా తదితర ఆదిమ గిరిజనులు రూపొందించిన హస్త కళలను ఐదు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. గిరిజన సంప్రదాయ, ప్రత్యేకత కలిగిన ఈ హస్తకళ నైపుణ్యాలను మరో తరానికి అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయి. గిరిజన హస్తకళాకారులకు జీవనోపాధి చూపడంతో పాటు.. సంప్రదాయ గిరిజన హస్తకళలను నిలబెట్టేందుకు 12 ప్రధాన రకాల ఉత్పత్తులతో గిరిజన సంక్షేమ శాఖ స్టాల్స్ను ఏర్పాటు చేసింది. మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ గిరిజన ప్రాంతాల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థింసా నృత్యం చేస్తున్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కూడా నృత్యం చేశారు. డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు రాష్ట్రంలోని గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా ఈ నెల 18 వరకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.15 వేల చొప్పున ఈ నెల 22న జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందిస్తారు. గిరిజన పోరాట యోధుడు.. బిర్సా ముండా ఆదివాసీల కోసం బ్రిటీష్ వారిపై వీరోచితంగా పోరాడిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి రోజైన నవంబర్ 15న ‘జన్ జాతి గౌరవ దివస్’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 1875 నవంబర్ 15న రాంచీలో జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న రాంచీ సెంట్రల్ జైల్లోనే మరణించాడు. గిరిజన వ్యవసాయ పద్ధతులను, జీవన విధానాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన బ్రిటీష్ వారిపై పోరాటం చేశాడు. ఆయన స్ఫూర్తి భావితరాలకు అందించాలని కేంద్రం ఆయన జయంతిని జన్ జాతి గౌరవ దివస్గా నిర్వహిస్తోంది. -
ఐబీపీఎస్ పరీక్షలకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన స్టడీ సర్కిల్లో ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు studycircle.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల అర్హతలో మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని, మొత్తం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించామన్నారు. వివరాలకు 6303497606 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
గిరిజన గర్భిణులకు కొండంత రక్షణ
సాక్షి,అమరావతి: మన్యంలోని గర్భిణులకు కొండంత రక్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత సమన్వయంతో సమర్థవంతమెన ఆరోగ్య సేవలు అందించేలా ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టం’ (గిరిజన ఆరోగ్య సమన్వయ పర్యవేక్షణ విధానం) పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దీనిని నిర్వహించనుంది. గిరిజన గర్భిణులకు కొత్తగా అందించనున్న సేవలతోపాటు కొత్త యాప్ను కూడా సోమవారం ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించే ట్రయల్ రన్ను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తారు. యాప్తో ప్రయోజనాలు ఇలా ఏజెన్సీ ప్రాంత గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక యాప్తో ప్రయోజనం మెండుగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల ఆరోగ్య సమాచారం సేకరించి ఈ యాప్లో పొందుపరుస్తారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించేలా ఈ యాప్ ఎప్పటికప్పుడు అధికారులను, సంబంధిత విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార సేకరణ నుంచి వైద్య సేవలు అందించే వరకు గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. యాప్లో పొందుపరిచిన సమాచారం మేరకు ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై ఆయా కుటుంబాల వారికి ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అవగాహన కల్పిస్తారు. 20 రోజుల ముందు వారిని ఏ ఆస్పత్రికి తరలించేది గ్రామ సచివాలయాలకు సమాచారం అందిస్తారు. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి సమాచారం అందిస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీవోలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. ప్రసూతి వసతి గృహాలకు తరలింపు ఈ యాప్ ద్వారా ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు గర్భిణులకు అవగాహన, వారి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రసవానికి 30 నుంచి 10 రోజుల సమయం ఉండగానే ప్రసూతి వసతి గృహాలకు తరలిస్తారు. ఇందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 41 ప్రసూతి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో 2,600 బెడ్లు సమకూర్చారు. ప్రసవానికి ముందు నుంచి గర్భిణులు ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేలా ఆట పాటలతో కూడిన వాతావరణ కల్పిస్తారు. అంతేకాకుండా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తరగతులు నిర్వహించడంతోపాటు బలమైన ఆహారం అందిస్తారు. తల్లీబిడ్డల మరణాలు తగ్గించడమే లక్ష్యం గిరిజన ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డోలీతో మోసుకొచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ బైక్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్లో గర్భిణుల వివరాలతోపాటు గురుకుల విద్యార్థుల వివరాలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి అందించాల్సిన వైద్య సేవలు వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలంగాణ అధికారుల బృందం ప్రశంసించింది. గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంది. ఏపీలో ఆర్ఓఎఫ్ఆర్ పథకం అమలు అవుతున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా పట్టాలను ఏ విధంగా పంపిణీ చేశారనే విషయమై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర అధికారుల బృందం శనివారం ఏపీకి వచ్చింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్ కుమార్, ప్రవీణ్కుమార్, టి,మహేష్, టి.శ్రీనివాసరావు వెలగపూడి సచివాలయంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషాతో సమావేశమయ్యారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల పట్టాలను మంజూరు చేసే చట్టాలలో ఉన్న సమస్యలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 2.29 లక్షల ఎకరాలు పంపిణీ రాష్ట్రంలో అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పథకం ద్వారా అటవీ భూములకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని రంజిత్ బాషా తెలంగాణ అధికారులకు వివరించారు. గతేడాది అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించారన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వనంత భారీగా ఇప్పటి వరకూ 2.29 లక్షల ఎకరాల భూమి పట్టాలను గిరిజనులకు అందించారని చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద కనీసం 2 ఎకరాల భూమికి పట్టాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. అటవీ భూములు కాకపోతే తిరస్కరించే వారు ► గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందినవి అయితేనే గతంలో వారికి పట్టాలు ఇచ్చే వారు. అటవీ భూములు కాకపోతే దరఖాస్తులు తిరస్కరించే వారు. ఈసారి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించాలని సీఎం ఆదేశించారు. ► ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో పాటుగా డీకేటీ పట్టాలను కూడా గిరిజనులకు అందించాం. ఇప్పటి వరకు 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలుగా ఇచ్చాం. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ పట్టాలుగా అందించాం. ► ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరింత మంది గిరిజనులకు భూమి పట్టాలను అందించనున్నాం. పట్టాలు మంజూరు చేసిన భూములలో సరిహద్దు రాళ్లను నాటడంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా ఆ భూముల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ► గిరిజనులకు సంబంధించిన భూమి వివరాలు.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను సమీక్షించడానికి ‘గిరిభూమి’ పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నాం. -
ఏపీ గిరిజన సంక్షేమానికి ఐఎస్వో సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: ఉత్తమ పనితీరు కనబరిచిన ఏపీ గిరిజన సంక్షేమ ప్రధాన కార్యాలయం, ఏపీ గిరిజన సహకార ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సరి్టఫికెట్(ఐఎస్వో) లభించింది. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్బాషా, ఏపీ గిరిజన సహకార ఆరి్థక సంస్థ ఎండీ ఇ.రవీంద్రబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలు పథకాల అమలు, నిర్వహణ, సేవలు తదితర అనేక అంశాలపై హైమ్ ఇంటర్నేషనల్ సరి్టఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్(హైదరాబాద్) సంస్థ మదింపు(ఆడిట్) చేసి ఈ ఐఎస్వో సరి్టఫికెట్ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విజయవాడలోని ఈ రెండు ప్రధాన కార్యాలయాలు ఉత్తమ పనితీరుతో అంతర్జాతీయ గుర్తింపు పొందడం వరుసగా ఇది మూడో ఏడాది అని రంజిత్బాషా, రవీంద్రబాబు తెలిపారు. -
గిరిజన సంక్షేమంలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా గిరిజనులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నావల్జిత్ కపూర్ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన–శిక్షణ మిషన్, సెంటర్ రీజనల్ స్టడీస్ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్న నావల్జిత్ కపూర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీలో గిరిజన ఉప ప్రణాళిక అమలుకు సహకారం అందిస్తామన్నారు. ఉప ప్రణాళిక అమలులో ముందున్నాం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన ఉప ప్రణాళిక అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, హక్కుల రక్షణలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు 2వ దఫా పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్బాషా, గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. థింసా నృత్యం చేసిన మంత్రి పుష్పశ్రీవాణి సీతానగరం(పార్వతీపురం)/కురుపాం/ పాడేరు: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా: విశాఖ ఏజెన్సీలోని పాడేరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కలెక్టర్ మల్లికార్జున, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నర్సింగరావు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరయ్యారు. -
'పోలవరం' పునరావాసం భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రీతిలో పునరావాసం కల్పిస్తోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ ఝా ప్రశంసించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. నాణ్యతతో ఇళ్లను నిర్మిస్తున్నారని అభినందించారు. గోదావరి వరదలవల్ల గిరిజనులు ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు సహాయ పునరావాస (ఆర్అండ్ ఆర్) ప్యాకేజీ కింద పునరావాసం కల్పించడాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ‘మానిటరింగ్ కమిటీ’ని కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ గురువారం అనిల్కుమార్ ఝా అధ్యక్షతన వర్చువల్ విధానంలో సమావేశమైంది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎన్కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబు, పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఆనంద్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసేలా పనులను వేగవంతం చేశామని శ్యామలరావు చెప్పారు. నిర్వాసితులకు వేగంగా ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులను వర్చువల్ విధానంలో చూపించారు. వీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశించారన్నారు. వాటిని పరిశీలించిన ఝా సంతృప్తి వ్యక్తంచేశారు. ఇళ్లను వేగంగా, నాణ్యంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ఈ సీజన్లో వరదలవల్ల నిర్వాసితులు, గిరిజనులు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెలలో పునరావాస కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. వారి జీవనోపాధులను మెరుగుపర్చడంపై కూడా దృష్టి పెట్టాలని ఝా సూచించగా.. శ్యామలరావు స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. -
ఏజెన్సీ విద్యార్థులకు ‘గిరిదర్శిని’!
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నడుంబిగించింది. ఈ మేరకు ‘గిరిదర్శిని’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు ఇంకా తెరుచుకోకపోవడం, ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగుతుండటంతో విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయుక్తం కానుంది. అయితే పాఠశాలలకు విద్యార్థులు వచ్చి స్టడీ మెటీరియల్ తీసుకునే బదులుగా వారి ఇళ్లకే నేరుగా పంపడం, అందులోని నిర్దేశిత అసైన్మెంట్ను పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటిని సేకరించి పాఠశాలలకు చేర్చే బాధ్యతను తపాలా శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య తపాలాశాఖ వారధిగా వ్యవహరించనుంది. గిరిజన సంక్షేమ శాఖతో తపాలాశాఖ అవగాహన కుదుర్చుకుంది. 3 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్ అందించేలా గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్ సౌకర్యం లేని వారికి.. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్లు, వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. దాదాపు 5 వేల ఆవాసాల్లోని 400 పాఠశాలల పరిధిలో అలాంటి విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ ఆన్లైన్ బోధనతోపాటు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో బోధన, అభ్యసన కార్యక్రమాల నిమిత్తం స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. నాలుగైదు రోజుల్లో నిర్దేశించిన పాఠశాలల విద్యార్థులకు తపాలా శాఖ ద్వారా స్టడీ మెటీరియల్ పంపిణీ కానుంది. స్టడీ మెటీరియల్ వినియోగం, అసైన్మెంట్ వర్కవుట్పై సూచనలూ అందులోనే ఇచ్చారు. మరోవైపు ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు నిత్యం మాట్లాడి సందేహాలను నివృత్తి చేస్తారు. -
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు
తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ గురుకులానికి చెందిన అశోక్నగర్(వరంగల్ రూరల్), రుక్మాపూర్ (కరీంగనగర్)లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, ఉమెన్ (టీటీడబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీ).. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 46 ► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్. ► సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, హిందీ తదితరాలు. అర్హత: ► టీజీటీ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి. ► ఆర్ట్ టీచర్ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. ► కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఎంసీఏ/బీటెక్ (కంప్యూటర్స్) ఉత్తీర్ణులవ్వాలి. ► కౌన్సిలర్ పోస్టులకు సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. ► పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి. ► వేతనం: టీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.30,000, పీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.40,000, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్ పోస్టులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2021 ► వెబ్సైట్: https://tswreis.in/ https://tgtwgurukulam.telangana.gov.in/ కిట్స్, వరంగల్లో ఫ్యాకల్టీ పోస్టులు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీకి చెందిన అటానమస్ ఇన్స్టిట్యూట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: ప్రిన్సిపల్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీ రింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరిం గ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. మాస్టర్స్ అభ్యర్థులకు నెట్/స్లేట్/సెట్ అర్హతతోపాటు టీచింగ్/ పరిశోధనలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: అకడమిక్ విజయాలు, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్–506015 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 06.07.2021 ► వెబ్సైట్: www.kitsw.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి! పవర్గ్రిడ్లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు -
ఎదురులేని ఏకలవ్యులు!
సాక్షి, అమరావతి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.. గిరిపుత్రులు. క్రీడల్లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలు ఇస్తున్న ప్రత్యేక శిక్షణను అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. గిరిజన విద్యార్థులు సహజంగానే కొండకోనల్లో పుట్టి పెరగడం, చిన్ననాటి నుంచి వాటిని ఎక్కిదిగడం వల్ల వారి శరీరం క్రీడలకు అనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ వారికి మంచి ప్రోత్సాహమందిస్తూ చక్కటి శిక్షణ ఇప్పిస్తోంది. వ్యాయామం నుంచి యోగా వరకు.. ప్రస్తుతం రాష్ట్రంలో 190 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 51,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 370 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాలలో సుమారు వందమందికిపైగానే విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూళ్లకు ఒక ఫిజికల్ డైరెక్టర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. వీటిలో పాఠాలతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రోజూ ఉదయం 5.30 నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటల వరకు వ్యాయామం, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 15, నవంబర్ 14న స్పోర్ట్స్, గేమ్స్ పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు అందిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధిస్తా జాతీయ స్థాయి వెయిట్లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గాలనే లక్ష్యంతో అరకు స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. ఈ నెలలో ఉత్తరప్రదేశ్లో జరిగే పవర్లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నా. – నినావత్ నరసింహ నాయక్, వెయిట్లిఫ్టర్ మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం.. గిరిజన విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే వారి ప్రతిభ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపుతున్నారు. క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. – కె శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విశాఖపట్నం జిల్లా అరకు స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ పేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయిలో అండర్–14 జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అతడు ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని సాధించి అదరగొట్టాడు. గత నెలలో కేరళలో జరిగిన జాతీయ సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా బంగారు పతకాన్ని ఒడిసిపట్టాడు. స్పోర్ట్స్ స్కూల్లో ఇస్తున్న శిక్షణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తూరు బయలుకు చెందిన నందకిశోర్ది పేద గిరిజన వ్యవసాయ కుటుంబం. అరకు క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అతడు లాంగ్జంప్లో విశేషంగా రాణిస్తున్నాడు. 2019లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఈ ఏడాది అసోంలో జరిగిన నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. ప్రత్యేక ఆకర్షణగా అరకు క్రీడా పాఠశాల ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేసిన గురుకుల క్రీడా పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వారి ఆసక్తిని బట్టి విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, రగ్బీ, వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం మొత్తం ఏడుగురు కోచ్లు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 10వ తరగతి వరకే ఉండటం వల్ల అండర్–14లో మాత్రమే విద్యార్థులు పాల్గొంటున్నారు. త్వరలోనే జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసి అండర్–16, అండర్–18లో కూడా పతకాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ పీఎన్ఎన్ మూర్తి తెలిపారు. -
ఐటీడీఏలతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమం, అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు (ఐటీడీఏ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులను ఆధునిక సమాజం వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. విద్య, వైద్యం వంటి రంగాల్లో వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంతేకాక.. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా చర్యలు తీసుకుంటోంది. షెడ్యూల్డ్ ఏరియాగా అటవీ గ్రామాలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు అధికంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న అటవీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 36 మండలాలు, 4,765 గ్రామాలున్నాయి. వీటికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. షెడ్యూల్డ్ గ్రామాల్లో గిరిజనులు గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంటుంది. పీవీటీజీల కోసం ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలోని పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం ఐటీడీఏల్లో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు (పీవీటీజీ) ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కోండు, గదబ, పూర్జ, చెంచు వంటి ఆదిమ గిరిజనులు ఉన్నారు. ఆధునిక సమాజం గురించి ఇప్పటికీ వీరికి పూర్తిస్థాయిలో అవగాహనలేదు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపడతారు. శ్రీశైలం ఐటీడీఏ పూర్తిగా చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే, నెల్లూరులో కేవలం యానాదుల కోసం ఐటీడీఏ ఏర్పాటైంది. ఇక మిగిలిన రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, కోట రామచంద్రాపురం, చింతూరు, పాడేరు ఐటీడీఏల్లో అన్ని కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఒక్క పాడేరులోనే 6,04,047 మంది గిరిజనులు ఉన్నారు. సాధారణ జనంతో పోలిస్తే ఇక్కడ గిరిజనులు 91 శాతంమంది ఉన్నారు. అరకు ప్రాంత అడవులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా మొత్తం 34 రకాల కులాలకు చెందిన గిరిజనులు రాష్ట్రంలో జీవిస్తున్నారు. ఏజెన్సీ పల్లెల ముంగిట్లోకి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజనీరింగ్–మెడికల్ కాలేజీలు, ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక.. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఏర్పాటుకావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వారి ముంగిటకు చేరింది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం గిరిజనులకు కలిగింది. వెంటనే ఐటీడీఏ స్పందిస్తోంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు గిరిజనులు ఒకప్పుడు వారి ఆచార వ్యవహారాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడూ వాటికి విలువిస్తూనే ఆధునిక సమాజం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ఐటీడీఏ తీసుకున్న చర్యలతో ఆదిమ గిరిజనులైన చెంచుల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. 25 ఏళ్ల క్రితం పురుషులు కేవలం గోచీ.. మహిళలు తువ్వాళ్లు మాత్రమే చుట్టుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఐఏఎస్ అధికారుల ఆలోచనలతో ముందుకు.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలోనే ఐఏఎస్లు ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏల్లో వీరున్నారు. అంతేకాక.. ఈ శాఖలో డైరెక్టర్, ముఖ్య కార్యదర్శుల హోదాల్లో కూడా ఐఏఎస్లు ఉన్నారు. మిగిలిన ఐటీడీఏలకూ గతంలో ఐఏఎస్లు ఉండే వారు. కానీ, ప్రస్తుతం ఆ స్థానాల్లో గ్రూప్–1 అధికారులున్నారు. ఇలా అత్యధికంగా ఉన్నతాధికారులు ఉన్న సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖే. వీరి ఆలోచనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది. పోడు వ్యవసాయానికి పెద్దపీట ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇటీవల భూమి హక్కు పత్రాలు ఇచ్చింది. వీటి ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు ఏర్పడతాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2.50 లక్షల మంది గిరిజనులకు భూమి హక్కుపత్రాలు ఇప్పించారు. ఆ తరువాత ఇప్పుడే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ 3.20 లక్షల మంది గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి వారి మనసుల్లో నిలిచారు. మరో లక్ష మందికి ఇప్పించేందుకు సర్వే జరుగుతోంది. -
త్వరలో ‘గిరిజన వికాసం’ వెబ్సైట్
సాక్షి, అమరావతి: గిరిజనుల ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో ‘గిరిజన వికాసం’ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించనుంది. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ఈ వెబ్సైట్లో గిరిజన కుటుంబాలకు చెందిన అన్ని వివరాలు పొందుపరచనున్నారు. వెబ్సైట్లో ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి సబంధించిన సమగ్ర వివరాలు ఉండటం వల్ల వారి ఆస్తులకు రక్షణ ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. దీనివల్ల ఎలాంటి భూ వివాదాలకు తావుండదని చెప్పారు. ముఖ్యమంత్రితో ఈ వెబ్సైట్ను ప్రారంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆధార్ నంబర్తో అనుసంధానం రాష్ట్రంలో గిరిజన కుటుంబాలకు సంబంధించి నిర్వహించిన సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారం పూర్తిగా ఒక చోట ఉండేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన కుటుంబ యజమాని లేదా కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్ వెబ్సైట్లో నమోదు చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం కనిపిస్తుంది. ఒక వేళ సమాచారంలో లోపం ఉంటే సంబంధిత ఐటీడీఏలో వివరాలు తెలిపి మార్పులు చేయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు గిరిజన కుటుంబాలకు అందాయా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగ పడుతుంది. వెబ్సైట్లో ఏముంటాయంటే.... ► గిరిజన కుటుంబంలో సభ్యుల పూర్తి వివరాలు. స్థిర, చరాస్తుల వివరాలు ► గిరిజన రైతుల పేరిట ఉన్న భూముల సమగ్ర వివరాల నమోదు, వెబ్ల్యాండ్, ఆర్వోఎఫ్ఆర్ çహక్కు పత్రాల వివరాలు. ► పట్టాదారు పేరు, ఊరిపేరు, సర్వే నంబరు ఇతర వివరాలు. ► రైతు భరోసా కింద ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం వివరాలు. ► అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వివిధ పథకాల ద్వారా ఎంత మొత్తం సాయం అందిందనే వివరాలు ► భూములు లేని వారి వివరాలు కూడా నమోదు. వారు ఏ ప్రభుత్వ పథకం కింద ఎంత మొత్తం సాయం తీసుకున్నారనే వివరాలు. ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూమిలో గిరిజన రైతుతో జియో ట్యాగింగ్. -
ఏజెన్సీల్లో సమాచార 'విప్లవం'
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార విప్లవం వచ్చింది. వీటివల్ల ఏ గిరిజన గూడెంలో ఏం జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గిరిజన పంచాయతీల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంవల్లే అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అలాగే, అడవుల్లో సరైన రహదారులు లేని గ్రామాలకు ఐశాట్ ఫోన్లు ఇచ్చింది. వీటి ద్వారా కూడా అత్యవసర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటోంది. గ్రామ సచివాలయాలకు ఫైబర్నెట్ సేవలు గిరిజన పంచాయతీల్లోని ప్రతి గ్రామ సచివాలయానికి ఫైబర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.3కోట్లను ఫైబర్నెట్ సంస్థకు గిరిజన సంక్షేమ శాఖ అందజేసింది. వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న పలు సెల్టవర్ల పరిధిలో అప్పుడప్పుడు సిగ్నల్స్ సరిగ్గా ఉండని కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో ఫైబర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఆ సమస్యలకు చెక్ పడనుంది. గిరిజన గూడేల్లోని వారు తమ ఇళ్లకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. అంతేకాక.. వివిధ టీవీ చానెల్స్ కూడా ఈ ఫైబర్నెట్ ద్వారా వీక్షించవచ్చు. అత్యవసర సమాచారానికి ఐశాట్ ఫోన్లు ఇక గిరిజన గూడేల్లో ఏవైనా సంఘటనలు జరిగినా, సరైన వసతులు లేకపోయినా, వైద్య సాయం కావాల్సి వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రభుత్వం ఆయా ఐటీడీఏలకు ఐశాట్ ఫోన్లను అందజేసింది. ఈ ఫోన్లు ఐటీడీఏ పీవోల పర్యవేక్షణలో ఉంచింది. ఇవి వాకీటాకీల్లా పనిచేస్తాయి. సీతంపేట, పాడేరు, పార్వతీపురం, ఆర్సీ వరం, కేఆర్ పురం, చింతూరు, శ్రీశైలం ఐటీడీఏల్లో మొత్తం 203 ఐశాట్ ఫోన్లు ఉన్నాయి. వలంటీర్లకు కూడా వీటిని ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు.. ఏజెన్సీలోని వైద్య వలంటీర్లకు ఫోన్లు ఇవ్వడం ద్వారా కూడా గిరిజనుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కలిగింది. సమాచారం తెలుసుకోవడంలో ముందున్నాం గతంలో గిరిజన గూడేల్లో సమాచారం తెలుసుకునేందుకు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు ఇప్పటికే సెల్టవర్లను ఏర్పాటుచేశాయి. అలాగే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు ఫైబర్నెట్ కనెక్షన్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తయ్యాయి. ఐశాట్ ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. – ఇ.రవీంద్రబాబు, అడిషనల్ డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ -
నెలాఖరుకు అద్దాల్లా ఆశ్రమ పాఠశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులు ఈనెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులతో రూపుమార్చుకుంటున్న ఈ పాఠశాలలు అద్దాల్లా మారుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 378 ఆశ్రమ పాఠశాలలున్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోను, నల్లమల అడవుల్లోను ఉన్నాయి. 31 ప్రభుత్వ భవనాలు, రెండు అద్దె భవనాలు, ఒక అద్దెలేని భవనం కలిపి 34 మినహా మిగిలిన 344 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో చాలా పాఠశాలలకు ఇప్పటివరకు ప్రహరీలు లేవు. జంతువుల భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పగటిపూటే ఎలుగుబంట్లు, చిరుతపులులు పాఠశాలల పరిసరాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తుండటంతో ఈ సమస్య తీరనుంది. ప్రహరీ నుంచి లోపలికి రోడ్డు వేసి ఆటస్థలాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. స్నానాల గదుల్లో టైల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లు, వాష్బేసిన్లు విద్యార్థుల సంఖ్యను బట్టి ఏర్పాటు చేస్తున్నారు. డైనింగ్ హాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. 16 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతులు ఆశ్రమ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను పోలి ఉంటాయి. విద్యార్థులు రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయులు కూడా రాత్రి వరకు ఉండి ఇంటికి వెళతారు. విద్యావిధానం గురుకుల పాఠశాలల్లో మాదిరే ఉంటుంది. ఆశ్రమ పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 9, 10 తరగతులు మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన క్లాసుల వారికి ఆన్లైన్లో బోధిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న 179 ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో నాడు–నేడు పనులు పూర్తికావచ్చాయి. ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 21, పోస్టు మెట్రిక్ హాస్టల్స్ 158 ఉన్నాయి. -
గిరిజన గూడేలకూ ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్నెట్ సౌకర్యం కలగనుంది. కొండకోనల మధ్య ఉండే గిరి శిఖర గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్ నెట్ తప్పనిసరి కావడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. 134 గూడేల్లో వేగంగా పనులు ఇప్పటికే 134 గిరిజన గూడేల్లో ఫైబర్ నెట్ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ కార్పొరేషన్కు ఇప్పటికే చెల్లించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 51 గ్రామాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 49 గ్రామాలు, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 26 గ్రామాలు, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 6 గ్రామాలు, చింతూరు, కేఆర్ పురం ఐటీడీఏల పరిధిలో ఒక్కో గ్రామంలో ఫైబర్ నెట్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ సంస్థ 200కు పైగా టవర్స్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా సమీప ఏజెన్సీ గ్రామాల్లో వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 251 గూడేల్లోనూ.. ఫైబర్ నెట్ను ప్రతి గిరిజన గ్రామానికి విస్తరించే కార్యక్రమంలో భాగంగా 251 గూడేల్లో పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు రూ.24.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఆ వెంటనే పనులు చేపడతామని అధికారులు చెప్పారు. -
ట్రైబల్ సబ్ప్లాన్ పటిష్టంగా అమలు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా, ప్రతి పైసా గిరిజనులకే చేరేలా చూడాలని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఆమోదం పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడాన్ని నియంత్రించాలని కోరారు. తాత్కాలిక సచివాలయంలో బుధవారం ఆమె గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో గిరిజన గురుకుల విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన డిజిటల్, వర్చువల్ క్లాసు రూములపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్ల నుంచి స్కూళ్లుగా స్థాయి పెంచిన అన్ని పాఠశాలల భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలపై ఆమె సమీక్షించారు. -
గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గురుకుల విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణకు సంబంధించి అధికారులు కొన్ని ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్లాసులు ఒకేసారి నిర్వహించడం వీలుకాదని అధికారులు ఇటీవల సమావేశమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు. వీరు పంపిన సూచనలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అవేంటంటే.. ► 2020–21 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో 9, 10, ఇంటర్ తరగతులను మాత్రమే నిర్వహించాలి. ► ప్రతి క్లాసును విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెక్షన్లుగా విభజించాలి. ఒక్కో సెక్షన్లో 20 మంది విద్యార్థులు ఉండాలి. ► క్లాసులకు హజరయ్యే వారు చేతులను శుభ్రం చేసుకోవడం కోసం వాష్ బేసిన్ల సంఖ్యను పెంచాలి. ప్రతి విద్యార్థికి 3 మాస్కులు, శానిటైజర్ ఇవ్వాలి. పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కోవిడ్–19పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ► విద్యార్థులకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు తీసుకెళ్లేందుకు వీలుగా మారుమూల గురుకుల పాఠశాలల వద్ద ఒక వాహనం అందుబాటులో ఉండాలి. ► స్కూళ్ళకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ► గురుకులాల్లో మిగిలిన తరగతులు చదువుతున్న విద్యార్థులకు ‘విద్యామృతం’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలి. ► కరోనా వ్యాధిపై ప్రభుత్వం, వైద్య శాఖ సూచనల మేరకు దశల వారీగా మిగిలిన క్లాసుల విద్యార్థులను కూడా గురుకులాలకు పిలిపించాలి. -
గిరిజనులకు అన్యాయం జరగనివ్వం
సాక్షి, అమరావతి: గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవో నంబర్ 3ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు సీఎంను కోరారు. జీవో నంబర్ 3ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చినట్టు సీఎం వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించి వారి సలహాలు తీసుకునేందుకు గురువారం గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు. సీఎంను కలిసిన వారిలో తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కె.కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి తదితరులున్నారు. -
అన్నీ ఉంటేనే అనుమతి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు బోర్డు బుధవారం సవివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. భవనాలు, ల్యాబ్లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ► రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, కోఆపరేటివ్, ఇన్సెంటివ్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతోపాటు కేంద్రీయ విద్యాలయాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు ఇదివరకు ఇచ్చిన అనుమతులు వచ్చే విద్యాసంవత్సరానికి (2020–21) పొడిగింపు, అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అందించాలి. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. ► 2020–21కి సంబంధించి అఫ్లియేషన్/అదనపు సెక్షన్ల ఏర్పాటు, ఇన్స్పెక్షన్ ఫీజు ఇప్పటికే చెల్లించిన కాలేజీలు కూడా దరఖాస్తులను రూ.500 రుసుముతో ఆన్లైన్లో సమర్పించాలి. ► ‘హెచ్టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తు ఫారం పొందుపరిచారు. కాలేజీలు తమ సంస్థ కోడ్, పాస్వర్డ్ వినియోగించి ఈ ఫారాలను పొందవచ్చు. ► అప్లికేషన్, అఫ్లియేషన్, ఇన్స్పెక్షన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించిన అనంతరం బోర్డు లింక్ ద్వారా ‘బీఐఈ జియో ట్యాగింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ► కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్లు,లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటోలను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ► అదనపు సెక్షన్లకు అనుమతించేందుకు ఆర్సీసీ భవన వసతి, తరగతి గదుల లభ్యతను పరిశీలిస్తారు. ► భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆటస్థలం లీజ్ డీడ్లను పరిశీలిస్తారు. ► భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. ► పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతల వివరాలను వెల్లడించాలి. ► బోర్డు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
సిక్కోలులో కలకలం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ, ఎఫ్ఏసీ)గా పనిచేస్తున్న తూతిక మోహనరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగవారం దాడులు చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురంలలో మంగళవారం తెల్లవారుజాము నుంచి మోహనరావు ఇళ్లపై దా డులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదా యానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈఈ స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేశారు. దీని ప్రకారం మొత్తం రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. దీనిలో బంగారం580 గ్రాములు విలువ రూ.27లక్షలుగాను, వెండి రెండు కేజీలు రూ.1.50లక్షలుగాను, గృహాలంకరణాల విలువ రూ.16లక్షలు, ఆయన ఇంట్లో నగదు రూ.7లక్షలు, బ్యాంక్ ఖాతాలో రూ.30లక్షలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తూతిక మోహనరావు వాస్తవానికి డిప్యూ టీ ఇంజనీర్ (డీఈ) కేడర్లో పార్వతీపురం, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు. ఈయన గతంలో సీతంపేట, నర్సీపట్నంలలో ఐటీడీఏల్లో డీఈగా కూడా పనిచేశారు. అనంతరం పార్వతీపురంలో ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో విషయం తెలుసుకున్న మోహనరావు తన పలుకుబడితో ఈఈగా అదనపు బాధ్యతలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోహనరావు ఇంట్లో దస్త్రాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు సిక్కోలులో కలకలం శ్రీకాకుళం నగరంలోని ఎల్బీఎస్ కాలనీలో సొంత నివాసంలో ఉంటున్న మోహనరావుకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో కూడా అద్దె ఇల్లు కూడా ఉంది. ఈ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి మంగళవారం దాడులు నిర్వహించారు. తెల్లవారు జామునే పార్వతీపురంలో తొలుత దాడులు చేశారు. అనంతరం మోహనరావును శ్రీకాకుళంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో మోహనరావు ఇళ్లల్లో పెద్ద మొత్తంలో నగదు, వెండి, బంగారం, విలువైన ఆస్తుల పత్రాలు గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురంలో ఆయన ఉన్న అద్దె ఇంటిలో రూ.3.5 లక్షలు, శ్రీకాకుళంలో రూ.3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తాం: ఏసీబీ డీఎస్పీ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న తూతిక మోహనరావును బుధవారం విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సాక్షికి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు మహేశ్వరరావు, భాస్కర్, సత్యారావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సింగూరు ఇసుక ర్యాంపు తాత్కాలికంగా మూసివేత ఆమదాలవలస రూరల్: పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపును తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు రెవెన్యూలో సేకరించిన ఇసుకను దూసిలో నిల్వ చేసి అవసరాలకు ఏపీఎండీసీ ద్వారా తరలించేవారు. ఇసుక ర్యాంపుపై ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు హరనాథరావు, భరత్, వాసులతో పాటు ముగ్గురు మైన్స్ అధికారులపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేయడంతో ర్యాంపులో ఉన్న వారు భయపడి ర్యాంపును ఆపేసినట్లు తెలిపారు. అందుకే ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇసుక ర్యాంపులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విధు ల నుంచి అధికారులు తొలగించారు.ఇసుక ర్యాంపు నిర్వహణలో వారి విధానాల వల్ల అక్రమంగా ఇసుక తరలిపోయినట్లు గుర్తించిన మైన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. -
గిరిజన విద్య.. కాదిక మిథ్య
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలను విద్యావంతుల్ని చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల్లో అక్షరాస్యత శాతం పెంచాలనే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27,39,920 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం 48.98 మాత్రమే. సగానికి పైగా గిరిజనులు విద్యకు దూరంగా ఉంటున్నారు. 2,678 గిరిజన విద్యాసంస్థలు గిరిజన పల్లెల్లో ప్రత్యేకంగా 2,678 విద్యాసంస్థలున్నాయి. వీటిలో 2,05,887 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 189 గురుకులాలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. వీటిలో పూర్తిగా సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతల చొప్పున స్కూల్ యూనిఫారాలు సమకూరుస్తోంది. ఒక సెట్ బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా చేసింది. నోట్ పుస్తకాలను ఇప్పటికే అందజేసింది. ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు సైతం ఇచ్చింది. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా కాస్మొటిక్ చార్జీలు అందజేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలోనూ చదివిస్తోంది అత్యున్నతమైన ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద విద్యార్థులను వాటిలో ప్రభుత్వం చేర్పించింది. ఆ పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. ప్రతిభ చాటే గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు కల్పించింది. కార్పొరేట్ కాలేజీల పథకం కింద ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఆయా కాలేజీల్లో చేర్పించింది. ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద గిరిజన విద్యార్థులను విద్యాభ్యాసం కోసం విదేశాలకు ప్రభుత్వ ఖర్చులతోనే పంపిస్తోంది. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లు ఇవ్వడం ద్వారా ఆయా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 237పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు 184 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 53 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు కలిపి 237 స్కూళ్లల్లో వృత్తి విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో 80,091 మంది గిరిజన విద్యార్థులు వృత్తి విద్య నేర్చుకుంటున్నారు. మెటీరియల్ను నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సమకూరుస్తోంది. -
‘సంక్షేమం’.. సజావుగా సాగుతోందా..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయా? లబ్ధిదారుల్లో అక్రమార్కులున్నా రా? అనేది తేల్చేందుకు సిద్ధమవుతోంది గిరిజన సంక్షేమ శాఖ. పథకాలు దారితప్పకుండా, పక్కా గా అర్హులకు చేర్చాలనే లక్ష్యంతో దీనికి ఉపక్రమిస్తోంది. ఈ శాఖ ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అర్హతలు నిర్ధారించిన తర్వాత ఫలాలు పంపిణీ చేస్తున్నప్పటికీ... వారంతా అర్హతలున్నవారేనా? కాదా? అనే కోణంలో పరిశీలించనున్నారు. రెండ్రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. పునఃపరిశీలన ఎలా చేపట్టాలనే దానిపై స్పష్టతకు రావాలని ఆమె సూచించడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 76 రకాల సం క్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నారు. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక చే యూత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అమలు చేస్తున్న వాటి ల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమాలున్నా యి. ఇందులో అధిక నిధులు ఖర్చు చేస్తున్న పథకాలపై పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించారు. ఆర్థిక చేయూత కార్యక్రమాల్లో లబ్ధిదారుల స్థితిని తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఆర్థిక చేయూత పథకాల్లో పరిశీలన చేసే అవకాశం ఉండగా... ఇం దులో అనర్హులుగా తేలితే వేటు వేయాలని నిర్ణ యించారు. అలాగే, దుర్వినియోగమైన మొత్తాన్ని రికవరీ చేయాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు. -
గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్ జగన్ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కొత్తగా ఎనిమిది ‘ఏకలవ్య’ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 8 ఏకలవ్య మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగిరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 8 స్కూళ్లు నిర్వహిస్తుండగా.. మరో 8 స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న ఈఎంఆర్ స్కూళ్లకు శాశ్వత భవనాలున్నప్పటికీ వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఈఎంఆర్ఎస్ల కోసం ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసిన క్రమంలో రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్లకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర గిరిజన శాఖ కేంద్రానికి నివేదించింది. సీబీఎస్ఈ అనుమతితో: ఇప్పటికే ఉన్న 8 ఈఎంఆర్ఎస్లకు సీబీఎస్ఈ అనుమతులు వచ్చేశాయి. తాజాగా మరో 8 స్కూళ్లను ప్రారంభించాలని ఆ శాఖ నిర్ణయించడంతో వాటికి సీబీఎస్ఈ అనుమతులకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీటికి కూడా అనుమతులు ఇస్తున్నట్లు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది. ఈఎంఆర్ఎస్ల నిర్వహణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు విడుదలవుతున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే ఒక్కో ఈఎంఆర్ఎస్కు రూ.20 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదు. వచ్చే ఏడాది సీబీఎస్ఈ సిలబస్తో ప్రారంభమయ్యే స్కూళ్లు.. సీరోల్, మరిమడ్ల, గాంధారి, ఎల్లారెడ్డిపేట్, కురవి, బాలానగర్, ఇంద్రవెల్లి, గండుగులపల్లి. -
షెడ్యూల్డ్ ఏరియాలుగా గిరిజన పునరావాస గ్రామాలు
సాక్షి, అమరావతి: పునరావాసం కింద గిరిజనులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినప్పుడు ఆ ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించాలని గిరిజన సలహా మండలి సమావేశం తీర్మానించింది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా గిరిజనులను తరలించి పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన హక్కులు కోల్పోతున్నారని సలహా మండలి అభిప్రాయ పడింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో సభ్యులైన గిరిజన ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, బాలరాజు, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, కె ధనలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, డైరెక్టర్ పి రంజిత్బాషా, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆమోదించిన తీర్మానాలను అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పుష్పశ్రీవాణి వివరించారు. - గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతాం. - రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కల´బాలి. - ఆర్వోఎఫ్ఆర్ పథకం కింద వచ్చే ఫిబ్రవరిలో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం పేదలకు ఉగాది నాటికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అంతకు ముందుగానే గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయం. - బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. అలాగే సాలూరులో వైఎస్సార్ గిరిజన యూనివర్సిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఏడు గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు గిరిజనులు అడగకుండానే ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు. -
విస్తరిస్తున్న విశాఖ యాపిల్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి ప్రాంతాల్లో యాపిల్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే 10 వేల ఎకరాల్లో యాపిల్ సాగు చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాల్లో గిరిజన రైతులతో యాపిల్ సాగు చేయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనుంది. - వచ్చే జనవరి నుంచి గిరిజన రైతులకు మొక్కల పంపిణీకి శ్రీకారం చుడతారు - ఏడాది వయసున్న ఒక్కొక్క మొక్కకు రూ.250 చొప్పున వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది - లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్ సాగుకు బాగా అనుకూలం - ఇక్కడ ఒక్కో సమయంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీలకు పడిపోతుంది. ఎక్కువ రోజులు సున్నా డిగ్రీలు నమోదవుతుంది - హిమాచల్ ప్రదేశ్లో పండుతున్న అన్నా, డార్సెట్ గోల్డెన్ రకాలను ఇక్కడ సాగు చేయిస్తారు - రైతులు మూడేళ్లపాటు మొక్కలను సంరక్షిస్తే.. అప్పటినుంచి 20 ఏళ్ల వరకు ఫలసాయం వస్తుంది. యాపిల్ సాగుకు అనువైన ప్రాంతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి, చింతపల్లి, జీకే వీధి గిరిజన గ్రామాలు యాపిల్ సాగుకు అనువైనవిగా గుర్తించాం. తక్కువ ఉష్టోగ్రతల్లో పండే యాపిల్ రకాలను ఇక్కడ సాగు చేయించాలని నిర్ణయించాం. భూసార పరీక్షలు చేయించి.. వచ్చే ఏడాది జనవరిలో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తాం. – ఆర్పీ సిసోడియా, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివాస స్థలాలు లేని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వాలంటే రూ.40 వేల కోట్లు కావాలని రెవెన్యూ శాఖ తయారు చేసిన గణాంకాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సరైన అంచనాలు, ప్రణాళికలు లేకుండా ఇలాంటి అంచనాలు వేసి భయపెట్టొద్దని హితవు పలికారు. ఇచ్చిన హామీని తక్కువ ఖర్చుతో అమలు చేసే మార్గాలు చూడాలన్నారు. 25 లక్షల ఇళ్ల స్థల పట్టాల జారీకి రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కలు వేయడమంటే ఇక దాన్ని ముట్టుకోవద్దని చెప్పడమేనని, ఇలా భయపడేలా చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి 83,833 ఎకరాలు అవసరమని, ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కాగానే ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆ గణాంకాలు అవసరం లేదని, పక్కన పడేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ఇంటి స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతాం. 25 లక్షల మంది మహిళల పేరుతో నివాస స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పాం. వచ్చే ఉగాది నాడు పండుగలా నివాస స్థలాలు పంపిణీ చేస్తాం. గత పాలకుల్లాగా పట్టాలు ఇచ్చి స్థలాలెక్కడో చూపని పరిస్థితి ఉండకూడదు. ఏయే గ్రామాల్లో ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో గ్రామ వలంటీర్లు లెక్క తీస్తారు. ఆయా గ్రామాల్లో వారికి పట్టాలు ఇవ్వడానికి ఎంత భూమి కావాలో.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూడండి. ఎక్కడైనా కొంత తక్కువ ఉంటే కొనుగోలు చేద్దాం. ఎకరా రూ.20 లక్షలు అని, రూ.40 లక్షలు అని ఏవేవో లెక్కలు వేస్తే ఎలా?’ అని సీఎం ప్రశ్నించారు. దీంతో మన్మోహన్సింగ్ పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్నందున మల్టీ స్టోరీడ్ భవనాలు ఇద్దామని, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇద్దామని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన సీఎం పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3, జీ ప్లస్ 4కు అనుగుణంగా నంబర్ ఆఫ్ ప్లాట్లు ప్లాన్ చేసుకుని అన్ డివైడెడ్ షేర్కు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థలాలు ఇద్దామన్నారు. కాగా పట్టణ గృహ నిర్మాణంలో గతంలో భారీ స్కామ్ జరిగిందని సీఎం వైఎస్ జగన్ ఎత్తి చూపారు. ‘300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సబ్సిడీతో సిమెంటు వస్తోంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు రూ.1,100 మించి కాదు. వాస్తవం ఇది కాగా.. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 పెట్టి స్కామ్గా మార్చింది. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. రివర్స్ టెండరింగ్కు వెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. మానవత్వంతో ముందుకెళ్దాం గిరిజన ప్రాంతాల్లో ఎస్సీలకు, ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇవ్వాలన్నా చట్టం అంగీకరించదనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తావించారు. ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలుగజేసుకుని 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలులేదని తెలిపారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ జోక్యం చేసుకుని కోస్తాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని గ్రామాల పక్కనే అటవీ ప్రాంతం ఉన్నందున ఐదు ఎకరాల వరకూ ఇళ్ల స్థలాలకు వినియోగించుకునేలా చట్ట సవరణ చేసే విషయం పరిశీలించాలని కోరారు. ‘రమణన్న చెప్పినట్లుగా చేద్దాం. ముఖేష్ అన్నా (ముఖేష్ కుమార్ మీనాను ఉద్దేశించి) ముందు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వండి. మిగిలినవారికి ఎలా ఇవ్వాలో ఆలోచిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. -
మన్యంలో కొండెక్కని అక్షరం!
సాక్షి, విశాఖపట్నం : మన్యంలో బడి ముఖం చూడని చిన్నారులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. అక్షరం అక్కడ మచ్చుకైనా కనిపించదు. చిట్టిచేతులతో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు అడవి బాటపడుతున్నారు. గత సర్కార్ పాలనలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. బడి ముఖం చూడని చిన్నారుల మాదిరిగానే మధ్యలో బడి మానేసినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటప్పుడు, సెలవులకు ముందు మాత్రం డ్రాపౌట్లపై సిబ్బంది సర్వే చేసి అధికారులకు నివేదికలు ఇస్తారు. తరువాత ఆ విషయాన్ని మరచిపోతున్నారు. మళ్లీ అదే సర్వేలు.. అవే నివేదికలు. వారిని పాఠశాలకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు లేని గ్రామాలు కొన్నింటిని ఎంపిక చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎన్ఆర్ఎస్టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చిలో మూసేస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికీ చాలామంది చదువుకు దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మూడు సంవత్సరాల కిందట విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో మన్యంలో అసలు బడిముఖం చూడని పిల్లలు ఏడు వేలు దాటి ఉన్నట్టు తేలింది. అయితే వారిని బడిలో చేర్పించడం ఎలా అనేది మాత్రం అధికారులు తేల్చలేకపోయారు. చిన్నపిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. అడవిలో కట్టెలు ఏరుతున్న డ్రాపౌటు పిల్లలు దీంతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవికి వెళ్లడం, వ్యవసాయం చేయడం, పశువుల కాపర్లుగా మారిపోతున్నారు. కొన్ని చిన్న గ్రామాలుగా ఉంటే మరికొన్ని పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలు 15 మంది వరకు ఉంటున్నారు. వారిని దూరంగా ఉన్న ప్రాంతాలకు బడికి పంపడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి చేర్చుకుంటున్నారు. అయితే ఒకటి రెండు తరగతులు చదివేందుకు వీలులేకుండా పోయింది. ఆ ఒకటి రెండు తరగతులు చదివేందుకు ఉపాధ్యాయులను వేయాలని కోరుతోన్నా స్పందించడంలేదు. ఏటా ఎన్ఆర్ఎస్టీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల తరువాత వాటిని ఎత్తేస్తున్నారు. ఆ పాఠశాలలు నడిపే సమయంలో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. విద్యార్థులపై వివక్ష మారుమూల ప్రాంతాల్లో అధికంగా జీపీఎస్ (టీడబ్ల్యూ) మండల పరిషత్ ప్రాథమికక పాఠశాలలుంటాయి. రెండింటిలోను చదివేది గిరిజన విద్యార్థులే. అయినా అధికారులు మండల పరిషత్ పాఠశాలపై వివక్షత చూపుతున్నారనే విమర్శలున్నాయి. జీపీఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, అందజేస్తున్నారు. మండల పరిషత్ విద్యార్థులకు అలాంటివి ఏమి అందించడం లేదు. దీనిపై అధికారులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. జీపీఎస్ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయని, మండల పరిషత్ పాఠశాలలు వారికి సంబంధం లేదంటున్నారు. కాని చదివేది పేద విద్యార్థులన్న వాస్తవాన్ని విద్యాశాఖాధికారులు మరచిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. -
తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార వృద్ధిలో భాగంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) తయారీ యూనిట్ల ఏర్పాటువైపు దృష్టి సారించింది. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూల తయారీతో బహిరంగ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన జీసీసీ.. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టింది. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలతో తయారుచేసిన సహజసిద్ధమైన స్వీట్లు, స్నాక్స్, వంటకాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ దిగుబడులకు ధరలు సైతం అధికంగా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ యంత్రాంగం ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన రైతాంగాన్ని వీటి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన పంట దిగుబడులను ప్రాసెసింగ్ చేసి వాటి ద్వారా ఆహార పదార్థాల తయారీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 25 యూనిట్ల ఏర్పాటు.. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీకి తేనె పరిశ్రమలు ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో సబ్బులు, షాంపూల తయారీ యూనిట్లున్నాయి. వీటితోపాటు నగరంలోని కొన్ని పరిశ్రమలను లీజు రూపంలో తీసుకుని అక్కడ వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్ బహిరంగ మార్కెట్లో కంటే సం క్షేమ వసతి గృహాలు, గురుకులాలకే సరిపోతోంది. డిమాండ్కు తగినట్లు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జీసీసీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక్కో యూనిట్ను గరిష్టంగా రూ.40 లక్షలతో ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తారు. పంట దిగుబడులను బట్టి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు రూ.10 కోట్లతో తయారీ యూనిట్లను నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి 60 శాతం గ్రాంటు రానుం దని అధికారులు భావిస్తున్నారు. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, మరో పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
గిరిజనులకు ఇక నేషనల్ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగలకు చెందిన పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. గతంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ద్వారా ఫెలోషిప్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఫెలోషిప్ కార్యక్రమ అమలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలో పరిశోధన విద్యార్థుల ఎంపికను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. గైడ్ టీచర్ల ఎంపిక ప్రక్రియ మొదలు దరఖాస్తు విధానం, సబ్జెక్టుతో పాటు ప్రజెంటేషన్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే అర్హతను నిర్ధారిస్తుంది. కార్యక్రమ అమలులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టింది. గిరిజన పరిశోధన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘నేషనల్ ఫెల్లోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్’కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీల పరిధిలో 157 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన తెగల నుంచి పరిశోధన విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 750 మంది గిరిజన పరిశోధన విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమం కింద అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాగ్రత్తగా వడపోసి అర్హులను ఎంపిక చేసేందుకు శాస్త్రీయ పద్ధతిని అవలంభించనున్నారు. పీవీటీజీ తెగలకు చెందిన గిరిజనులకు 3 శాతంతో పాటు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు పరిశీలించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కేంద్రానికి పంపిస్తారు. అనంతరం వాటిని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వడపోసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఎంఫిల్ విద్యార్థులకు ప్రతి నెల రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.22 వేలు కంటింజెన్సీ కింద ఇస్తారు. అదేవిధంగా పీహెచ్డీ విద్యార్థులకు ప్రతి నెల రూ.28 వేలు చొప్పున ఐదేళ్ల పాటు అందిస్తారు. కంటిజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. సగటున ఒక్కో పరిశోధన విద్యార్థికి ఏడేళ్ల కాలానికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఎంఫిల్కు... రెండేళ్ల పాటు ప్రతి నెలా 25 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా 22 వేలు ఇస్తారు. పీహెచ్డీ... ఐదేళ్ల పాటు ప్రతి నెల 28 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. -
సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను కొనసాగుతోంది. గత మూడు నెలల నుంచి హాస్టళ్ల మెస్ బిల్లులు ఇంకా విడుదల చేయకపోవడమే దీనికి నిదర్శనం. హాస్టల్ మెస్ బిల్లులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ విదేశీ విద్యా దీవెన ఫీజురీయింబర్స్మెంట్, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల మెస్ చార్జీలు కూడా విడుదల కాలేదు. దీంతో సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు, విదేశాల్లో చదువుకుంటున్నవారు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్ నుంచి సుమారు రూ.500 కోట్ల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం 3,39,664 మంది విద్యార్థినీవిద్యార్థులు (కాలేజీ, ప్రీమెట్రిక్) చదువుకుంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో 1,065, గిరిజన సంక్షేమ శాఖలో 639, బీసీ సంక్షేమ శాఖలో 1,137 చొప్పున మొత్తం 2,841 హాస్టళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా గురుకుల విద్యాలయాలు కూడా ఉన్నాయి. హాస్టళ్లకు జనరల్ బడ్జెట్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. బిల్లులు పెట్టినా కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)లో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు ముందుగా నిధులు ఇవ్వాలని ఆదేశించడంతో సాధారణ బిల్లులకు నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో అప్పులు ఇచ్చినవారు హాస్టల్ వార్డెన్లపై ఒత్తిడి మొదలు పెట్టారు. ఒక్కో హాస్టల్ వార్డెన్ కనీసం రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్ వార్డెన్ల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి సంక్షేమ శాఖలోనూ హాస్టళ్ల మెస్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు పైనే పేరుకున్నాయి. విదేశీ విద్యాదీవెన.. ఇబ్బందులెన్నో.. ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన కింద విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నవారికి మూడు నెలలైనా ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి, రెండో విడత రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సినవారికి ఆపేశారు. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పార్ట్టైమ్ ఉద్యోగాలు చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. కొందరు పెట్రోల్ బంకుల్లో గంటల ప్రకారం పనిచేసి వచ్చిన డబ్బులతో కాలం గడుపుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్లినవారిలో సుమారు 90 శాతం మందికి రెండో విడత ఇవ్వాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం ఎంపిక చేసినవారికి జిల్లాల డీడీలు నిధులు విడుదల చేయలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ట్రెజరీల్లో డబ్బులు లేవని, అవి రాగానే విడుదల చేస్తామని, బిల్లులు పెట్టామని డిప్యూటీ డైరెక్టర్లు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఉంది. సివిల్స్ అభ్యర్థుల గగ్గోలు ఇక సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఇవ్వాల్సిన డైట్ చార్జీలను కూడా సకాలంలో ఇవ్వలేదు. ఒకటీ, అరా ఇన్స్టిట్యూషన్లలో కొంత మొత్తం ఇచ్చినా మిగిలిన సంస్థలకు ఇవ్వలేదు. కోచింగ్ తీసుకుంటున్న నగరాన్ని బట్టి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అభ్యర్థుల భోజన, వసతి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇవ్వకపోవడంతో ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో కోచింగ్ తీసుకుంటున్నవారు నానా అవస్థలు పడుతున్నారు. రూము అద్దెలు, మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి తామే అద్దెలు, మెస్ బిల్లులు కట్టుకుంటున్నామని చెబుతున్నారు. అధికారులను ఈ విషయమై ప్రశ్నిస్తే.. పరిశీలించాల్సి ఉందని మాటదాటేస్తున్నారు. -
పేద గిరిజనులకు పక్కా ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ (పీవీటీజీ)ల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పీవీటీజీల్లో 4 తెగలున్నాయి. చెంచు, తోటి, కొండ రెడ్డి, కొలామ్ తెగలు అత్యంత వెనుకబడ్డ గిరిజనులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఈ తెగల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆ శాఖ చర్యలు మొదలుపెట్టింది. పూర్తిగా అటవీ ప్రాంతంలో నివసించే తెగలకు చెందిన వీరు ప్రస్తుతం తాత్కాలిన నివాసాల్లోనే ఉంటున్నప్పటికీ వీరికి అనువైన చోట పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరి పూర్తిస్థాయి ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అమలు చేస్తున్న సాంప్రదాయ పరిరక్షణ అభివృద్ధి పథకం నిధులను వినియోగించు కోవాలని గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. నాలుగు తెగల్లో 50 వేల కుటుంబాలు రాష్ట్రంలో 3 ఐటీడీఏలున్నాయి. ఉట్నూరు, ఏటూరు–నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పీవీటీ జీ కేటగిరీ కింద దాదాపు 50 వేల కుటుంబాలుంటా యని గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. ఇందులో దాదాపు 95% మందికి పక్కా ఇళ్లు లేవు. దీంతో అటవీ ప్రాంతాల్లో ఉంటున్న పేద గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పీవీటీజీల్లో ఉన్న పేద కుటుంబా లన్నింటికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికా రులు నిర్ణయించారు. సంఖ్య ఎక్కువగా ఉంటే విడ తల వారీగానైనా పూర్తిస్థాయిలో అర్హులకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) ఆధ్వర్యంలో అనంత పురంలో గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నికైన ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆ దిశగా చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా తాజాగా డీఎస్ఎస్ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించింది. పీవీటీజీలకు ఎలాంటి ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందనే దానిపై చర్చలు జరిపారు. ఆర్డీటీ రూపొందించిన ఇంటి నమూనాలనూ పరిశీలించా రు. ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.3 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు అభిప్రాయపడు తున్నారు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి డిజైన్ రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
చెల్లప్ప కమిషన్ గడువు ఆర్నెల్లు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజనుల ప్రాముఖ్యతలపై విచారణ చేపడుతున్న చెల్లప్ప కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం ఆర్నెల్లు పొడిగించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జనవరి 31 నాటితో ఈ కమిషన్ గడువు ముగియనుంది. కానీ, విచారణ ప్రక్రియ ఇంకా పూర్తికానందున కాలపరిమితిని మరో ఆర్నెల్లు పొడిగించింది. నిర్దేశిత గడువులోగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఈ–కామర్స్లోకి ‘గిరిజన’ బ్రాండ్స్
సాక్షి, హైదరాబాద్: జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్) ఉత్పత్తులన్నీ వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల వరకే పరిమితమైన అమ్మకాలను, తాజాగా ఆన్లైన్కు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ–కామర్స్తో గిరిజన సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనికోసం గత కొంతకాలంగా చర్చలు జరిపిన అధికారులు అవగాహన కుదుర్చుకోనున్నారు. సంప్రదాయ ఉత్పత్తుల పేరుతో.. జీసీసీ ద్వారా తేనె, సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, మసాలా పొడులు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో పలుచోట్ల ప్రాసెసింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేయడంతో ఉత్పత్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీఆర్ఐ (ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) ద్వారా గిరిజనుల సంస్కృతులకు సంబంధించి చిత్రకళను సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఔత్సాహిక కళాకారులను గుర్తించి వారితో పెయింటింగ్స్ వేయించి విక్రయించే వెసులుబాటు కల్పించారు. తాజాగా జీసీసీ ఉత్పత్తులతోపాటు గిరిజన సాంస్కృతిక చిత్రాలను కూడా అమెజాన్ వెబ్సైట్ ద్వారా విక్రయించనున్నారు. వీటిని ట్రైబల్ ట్రెడిషన్ ప్రొడక్ట్స్ పేరిట ప్రత్యేకంగా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. అమెజాన్తో అవగాహన నేపథ్యంలో కంపెనీ అధికారులు పలుమార్లు జీసీసీని సందర్శించారు. అదేవిధంగా పెయింటింగ్స్ను సైతం పరిశీలించారు. అవగాహన కుదిరితే ఉత్పత్తుల్లో శాంపిల్ను గోడౌన్లో అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాటిని డిమాండ్కు తగినట్లు సరఫరా చేయాలి. అమెజాన్ వెబ్సైట్లో గిరిజన సంక్షేమ శాఖ సెల్లర్ కేటగిరీలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీసీసీ నుంచి వచ్చే తేనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా కారం, పసుపు, సహజసిద్ధమైన సబ్బులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లకు చేరింది. ఆన్లైన్ విక్రయాలు మొదలుపెడితే టర్నోవర్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. అవగాహన ప్రక్రియ పూర్తయితే వచ్చేనెల మొ దటివారం నుంచి గిరిజన ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. -
కొత్తగా మరో గురుకుల సొసైటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో గురుకుల సొసైటీ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు 5 సంక్షేమ శాఖల పరిధిలో 5 గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, గిరిజనులకు టీటీడబ్ల్యూఆర్ఈఐ ఎస్, బీసీలకు ఎంజేపీటీఎస్బీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, మైనారిటీలకు ఎండబ్ల్యూఆర్ఈఐఎస్, విద్యాశాఖ పరిధిలో టీఎస్ఆర్ఈఐఎస్ పేరుతో గురుకుల విద్యాలయ సొసైటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల సొసైటీ పేరుతో ఏర్పాటు కానుంది. ఈ సొసైటీకి నిధులు, విధులన్నీ కేంద్రమే నిర్వహించనుంది. దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. సులభంగా నిధుల వినియోగం.. ఈఎంఆర్ఎస్లకు నిధులు కేంద్రమే ఇస్తుంది. వీటిని గిరిజన సంక్షేమ శాఖకు విడుదల చేయడంతో అక్కడి నుంచి అవసరాలను బట్టి నిధు లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు నేరుగా కాకుండా ప్రత్యేక పద్దుల ద్వారా ఖర్చు కావడంతో ప్రాధాన్యాంశాలు, అత్యవర కేటగిరీల్లో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్తగా గురుకుల సొసైటీ ఏర్పాటు చేస్తే నిధులను నేరుగా విడుదల చేయడం సులభతరం కానుంది. గురువారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో సొసైటీ ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా మరో 13 ఈఎంఆర్ఎస్లు రాష్ట్రంలో 11 ఈఎంఆర్ఎస్లు ఉన్నాయి. ఇవన్నీ గిరిజన మండలాల్లోనే ఉన్నాయి. తాజాగా మరో 13 ఈఎంఆర్ఎస్లను మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
‘గిరిజన’ శాఖలో.. సమస్యలు కొలిక్కి వచ్చేనా.?
ఒంగోలు టూటౌన్: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో గాడితప్పిన సంక్షేమం కొలిక్కి వచ్చేనా..? అన్న సంశయం గిరిజన సంఘాలను వెంటాడుతోంది. గతంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీటీఓగా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రేమనందం అనంతరం ఆయన స్థానంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా రెవెన్యూ శాఖకు చెందిన కె. రాజ్యలక్ష్మి డిప్యూటేషన్పై 2017 అక్టోబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ గిరిజన ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల్లేవ్.. జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 గురుకుల పాఠశాలలు, 17 ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు మూడు పోస్టు మెట్రిక్, మూడు ఫ్రీ మెట్రిక్ వసతి గృçహాలు మొత్తం 37 వసతి గృహాలు నడుస్తున్నాయి. సుమారుగా 4 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 140 వరకు పనిచేస్తుండగా అందులో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల వేతనం రూ.12 వేల వరకు ఉండగా కటింగ్లు పోను రూ.10,300 వరకు చేతికొస్తోంది. ఆ చాలీచాలనీ వేతనంతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటేషన్పై బాధ్యతలు చేపట్టిన కె. రాజ్యలక్ష్మి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ సడెన్గా నిలుపుదల చేశారు. 2018 విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత జూన్లో రెన్యువల్ ఆర్డర్లు అడగటానికి జిల్లా గిరిజన సంక్షేమశాఖకు వెళ్లిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. డీటీడబ్ల్యూఓ మిమ్మలను తొలగిస్తున్నట్లు తెలపడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. తరువాత పనిచేసిన కాలంలో రావాల్సిన పది నెలల వేతనాలు మంజూరు కాక ఆర్థిక కష్టాల పాలయ్యారు. నిత్యం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయని రోజులేదు. దీంతో గత్యంతరం లేక గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో బాధితులు స్థానిక ప్రకాశం భవనం వద్ద ధర్నాలకు దిగారు. ఆందోళనలు నిర్వహించారు. చివరకు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆమెను మాతృశాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా బాధితుల ఆవేదన, ఆక్రందన ఆవేదనగానే మిగిలిపోయింది. ఎవరూ సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరకు పాలకుల దృష్టికి గిరిజన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీటీడబ్ల్యూఓని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె స్థానంలో నెల్లూరు జిల్లా పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఎం. వెంకటసుధాకర్ను ఇటీవల గిరిజన సంక్షేమశాఖ అధికారిగా నియమించింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు గిరిజన సంఘం రావూరి శ్రీనివాసరావు, సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. వీటితో పాటు భూమి కొనుగోలు పథకం అమలు, సీఆర్టీలకు వేతనాలు, ఎన్ఎస్ఎఫ్టీసీ ఇలా పలు గిరిజన సంక్షేమ పథకాలు పడకేశాయని గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీటీడబ్ల్యూఓకి విజ్ఞప్తి చేశారు. ఈయన ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తారో వేచిచూడాలి మరి. -
నవోదయకు దీటుగా ‘ఏకలవ్య’
హైదరాబాద్: జవహర్ నవోదయ పాఠశాలలకు దీటుగా ఏకలవ్య పాఠశాలలను తీర్చిదిద్దుతామని గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయమంత్రి జశ్వంత్ సిన్హ్ సుమన్ భాయ్ భభోర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈఎం ఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) తొలి ‘ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ప్రారం భమైన ఈ స్పోర్ట్స్ మీట్ 16 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలన్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి ఆలోచననే ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో పెట్టారని తెలిపారు. 2022లోగా 400 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ప్రారంభించి, వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దతామన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకంగా నిలిచిన ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఏకలవ్యకు నిధులు పెంచాం.. ఈఎంఆర్ఎస్ టలకు 2014–15 బడ్జెట్తో పోలీస్తే.. 2018–19 బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించామని వివరించారు. వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, అందరూ పట్టుదలతో కృషి చేసి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గిరిజన యువతలో ఎంతో ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని, అందుకు క్రికెటర్ ధోనీ, బాక్సర్ మేరికోమ్లే నిదర్శనమని అన్నారు. 20 వేల జనాభాకు ఒక గురుకులం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ నినాదంతో దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఈఎంఆర్ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం నృత్యాలు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన కోయ, లంబాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బిశ్వజిత్ దాస్, రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి డాక్టర్ బెన్హూర్ మహేశ్ దత్ ఎక్క, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోగ్తు, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డైరెక్టర్ రాజేంద్ర కుమార్, శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యూనివర్సిటీకి మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీకి ముందడుగు పడింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర అవతరణ సమయంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. భూపాలపల్లి జిల్లా జాకారం సమీపంలో 483 ఎకరాల విస్తీర్ణంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వద్ద పెండింగ్లో ఉంది. పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం లభించాకే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటులో బిల్లుకు జాప్యం జరుగుతున్నందున విభజన చట్టం ప్రకారం పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ మంజూరు, నిధుల కేటాయింపులు, నిర్వహణ అంతా కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది. 173 ఎకరాలు అప్పగింత..: జాకారంలో 483 ఎకరాల స్థలాన్ని గిరిజన యూనివర్సిటీకి ప్రతిపాదించారు. ఇందులో 173 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో ఆ మేరకు రెవెన్యూ శాఖ.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరో వంద ఎకరాలు అసైన్డ్ భూమి కావడంతో రైతులకు పరిహారం చెల్లించాక అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సేకరణ ప్రక్రియ మొదలైంది. మరో 213 ఎకరాలు అటవీ శాఖ పరిధిలో ఉంది. ఈ భూమి అప్పగింతకు సంబంధించి అటవీ శాఖతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అటవీ శాఖ భూమిలో ఉన్న పచ్చదనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని, ప్రహరీ మాత్రమే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రూ.500 కోట్లతో నిర్మాణాలు గిరిజన వర్సిటీ కార్యకలాపాలు మరో 6 నెలల్లో ప్రారంభం కానుండగా అప్పట్లోగా కొత్త భవనాలు నిర్మించడం సాధ్యంకానందున మౌలిక వసతుల కల్పనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జాకారంలో ఉన్న వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్)ను పరిపాలన విభాగం, తరగతుల నిర్వహణకు వాడుకోనున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్తో పాటు 300 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలున్నా యి. రెండేళ్లలో నిర్మాణ పనులు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనులకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలుత యూజీ, పీజీ కోర్సులు 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీలో 6 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ(హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశల వారీగా అందుబాటులోకి తేనున్నారు. తొలి ఏడాది వివిధ కోర్సుల్లో 180 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏడేళ్ల తర్వాతికి ఈ యూనివర్సిటీలో 7 వేల మంది విద్యార్థులుంటారు. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30శాతం సీట్లు వారికి కేటాయించనుంది. పరిహారానికి రూ.10 కోట్లు: ఎస్కే జోషి గిరిజన వర్సిటీ భూసేకరణ వేగవంతం చేయాలని సీఎస్ ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.10 కోట్లను భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించారు. గిరిజన వర్సిటీపై సచివాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ వర్సిటీ కమిటీలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా నియమించాలన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గిరిపుత్రులకు ఈ–పాఠాలు!
గిరిపుత్రుల బడి అత్యాధునిక హంగులు సంతరించుకుంది. పాఠ్యాంశ బోధనలో నూతన ఒరవడికి తెరలేపింది. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ తరగతులకు భిన్నంగా లైవ్ టీచింగ్ను గిరిజన సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన స్టూడియో ద్వారా ఈ–పాఠ్యాంశ బోధన మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ పాఠ్యాంశ బోధనను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ–పాఠ్యాంశ బోధన అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 50 పాఠశాలల్లో ఈ–స్టూడియో బోధన కొనసాగుతోంది. నేరుగా శాటిలైట్ లింకుతో ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ లైవ్ టీచింగ్ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి రూ.11 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించి ఈ–స్టూడియో, డిజిటల్ క్లాస్రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. – సాక్షి, హైదరాబాద్ బోధన ఇలా.. ప్రస్తుతం 50 ఆశ్రమ పాఠశాలల్లో ఈ–స్టూడియో ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు 5 తరగతులుంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకో లైవ్ టీచింగ్ 45 నిమిషాల పాటు సాగుతుంది. దీంతో ప్రతి తరగతికి రోజుకో సబ్జెక్టు బోధిస్తారు. దాన్ని వీక్షించేందుకు స్కూల్లో డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్, రిసీవర్, డిష్, ల్యాప్టాప్ తదితరాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ–స్టూడియో ద్వారా జరిగే పాఠ్యాంశ బోధన స్కూల్లోని డిజిటల్ స్క్రీన్పై కనిపిస్తుంది. బోధకుడికి సంబంధించి చిన్న స్క్రీన్లో వీడియో డిస్ప్లే అవుతూనే.. బ్యాక్గ్రౌండ్లో పాఠ్యాంశానికి సంబంధించిన యానిమేషన్ కనిపిస్తుంది. సందేహాల నివృత్తి.. పాఠ్యాంశ బోధన ప్రక్రియలో విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని లైవ్లోనే అడిగే వీలుంటుంది. పాఠ్యాంశాన్ని వింటున్న ప్రతి విద్యార్థి దగ్గర ఓ బజర్ ఉంటుంది. అందులో వివిధ రకాల బటన్లు ఉంటాయి. సందేహాలు, సమాధానాలు, స్పష్టత తదితరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆ బటన్లు నొక్కుతుంటారు. అంశం అర్థం కాకపోతే బటన్ నొక్కితే వారిని లైవ్లోకి తీసుకొస్తారు. ఎక్కువ మందికి సందేహాలు వస్తే పాఠ్యాంశాన్ని తిరిగి అర్థమయ్యేలా బోధిస్తారు. తక్కువ సందేహాలు లేవనెత్తితే వాటికి అక్కడికక్కడే సూచనలు చేస్తూ కీలకాంశాలను రిపీట్ చేస్తారు. ఈ–స్టూడియో కేంద్రంగా.. లైవ్ టీచింగ్ కోసం మాసబ్ట్యాంక్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ–స్టూడియోను ఏర్పాటు చేశారు. అక్కడ టీచింగ్ రూమ్తో పాటు కంట్రోల్ రూమ్ ఉంది. పాఠ్యాంశ బోధనలో భాగంగా టీచర్ బోధిస్తున్న సమయంలోనే అందుకు సంబంధించిన యానిమేషన్లు ప్లే చేసేలా వీడియో మిక్సర్ ఉంది. అందుకు తగిన ఆడియోను జోడించేందుకు ఆడియో కంట్రోల్ ఉంటుంది. వీటిని స్టూడియో ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు సందేహాలను లేవనెత్తినప్పుడు క్షణాల్లో వారిని లైవ్లోకి తీసుకొస్తారు. ఈ–స్టూడియోలో ఐదుగురు నిపుణులతో పాటు ఇంజనీర్లు ఉంటారు. ప్రతి స్కూల్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది లైవ్ పాఠాలతో పిల్లల్లో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా క్లాస్రూంలో బోర్డుపై ముఖ్యమైన అంశాలను రాస్తూ వివరిస్తాం. ఇక్కడ డిజిటల్ బోర్డుపై యానిమేషన్ల ద్వారా వివరించడంతో పాటు ముఖ్యమైన అంశాలను డిజిటల్ బోర్డుపై రాసే వీలుంటుంది. బోర్డుపై యానిమేషన్లను చూపడంతోనే విద్యార్థులకు విషయం అర్థమవుతుంది. మరింత లోతుగా బోధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ బోధనతో విద్యార్థులు మరింత ఏకాగ్రతతో పాఠాన్ని వింటున్నారు. అర్థం కాని అంశముంటే వెంటనే బజర్ నొక్కుతున్నారు. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. – శ్రీకాంత్, టీచర్ బోధనకు సమాంతరంగా వీడియోలు ఆన్లైన్ బోధనలో యానిమేషన్లు కీలకం. బోధనకు తగినట్లుగా సమయానుకూలంగా వాటిని ప్లే చేయాలి. దీంతో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన పాయింట్లతో వీడియోలు సిద్ధం చేసుకోవడంతో పాటు వాటి నిడివిని ఖచ్చితంగా అంచనా వేయాలి. అందుకు ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటాం. బోధన ప్రక్రియ సాగుతున్నంత సేపు పరిశీలిస్తాం. – చంద్రకాంత్, స్టూడియో ఇంజనీర్ త్వరలో మరో 35 పాఠశాలల్లో.. ఈ–స్టూడియోను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలన్న లక్ష్యంతో 50 పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. త్వరలో మరో 35 స్కూళ్లలో అందుబాటులోకి తెస్తాం. కేంద్రం ఇటీవల రూ.2.85 కోట్లు విడుదల చేసింది. ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన తీసుకొస్తాం. కొత్త విధానంలో బోధన ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. – నవీన్ నికోలస్,గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ -
‘వసతి’ వణుకుతోంది..
ఖమ్మంమయూరిసెంటర్: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక నేలపైనే నిద్రిస్తూ చాలీచాలని దుప్పట్లతో అవస్థలు పడుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులను వదిలి.. సంక్షేమ వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు తగిన విధంగా వసతి కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను రాత్రివేళ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సందర్శనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. సంక్షేమ శాఖ వసతి గృహాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కేవలం పేరుకే సంక్షేమ వసతి గృహాలుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అందించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం లోని ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో దుప్పట్లు, మ్యాట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీ వసతి గృహాల్లో మినహా ఇతర శాఖల్లో విద్యార్థులు పడుకునేందుకు బంకర్ బెడ్స్ లేవు. అరకొర సౌకర్యాలతోనే బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. సౌకర్యాల లేమితో ఇబ్బందులు.. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, మ్యాట్లు ఇచ్చినా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎముకలు కొరికే చలిలో సైతం విద్యార్థులు పలుచటి మ్యాట్లను నేలపై వేసుకొని వాటిపైనే నిద్రిస్తున్నారు. దీంతో బండల చల్లదనం, పైన చలిగా లి విద్యార్థులకు నిద్రలేకుండా చేస్తోంది. నగరం లోని ముస్తఫా నగర్ ప్రాంతంలో ఉన్న బీసీ సంక్షేమ ప్రీమెట్రిక్ వసతి గృహంలో పలు గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక వారి వద్ద ఉన్న దుప్పట్లను కిటికీలకు అడ్డంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇక గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు దుప్పట్లు లేని పరిస్థితి. నూతనంగా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేరిన విద్యార్థులు ఇంటి నుంచే దుప్పట్లు తెచ్చుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కనిపించని వార్డెన్, వాచ్మెన్లు.. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాల్లో సౌకర్యాలే లేవను కుంటే.. వసతి గృహాలకు సంరక్షకులుగా ఉన్న సిబ్బంది అక్కడ కనిపించడం లేదు. ముస్తఫా నగర్ బీసీ వసతి గృహంలో రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్మన్ ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు అర్ధరాత్రి వరకు ఇష్టానుసారంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. వారు ఇష్టారీతిగా తిరుగుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వార్డెన్, వాచ్మన్ వసతి గృహంలో ఉండకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక వసతి గృహంలో విద్యార్థి హత్య జరిగినా.. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం వారి నిర్లక్ష్యాన్ని వీడలేదు. నెహ్రూ నగర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వాచ్మన్లు ఇద్దరూ వసతి గృహ గేట్లకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు గోడలు దూకి బయటకు వెళ్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే తిరుగుతున్నారు. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్మన్లు ఇంటికి వెళ్లడం, వసతి గృహాలపై పర్యవేక్షణగా ఉండాల్సిన సంక్షేమాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి వసతి గృహాలపై పర్యవేక్షణ ఉంచాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
గడప దాటని గిరిజన వర్సిటీ!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీకి చిక్కుముళ్లు వీడటంలేదు. స్థల కేటాయింపులతో పాటు నిధులు విడుదలైనప్పటికీ వర్సిటీ కార్యకలాపాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజన చట్టంలో రాష్ట్రానికి గిరిజన వర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. దీనికోసం భూసమీకరణ చేపట్టాలని కేంద్రం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలను గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో దాదాపు 200 ఎకరాలను గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరోవైపు జాకారం గ్రామం సమీపంలో ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)కోసం నిర్మించిన అత్యాధునిక భవనాన్ని కూడా వర్సిటీ కోసం కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ భవనంలో కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈమేరకు నిర్ణయించింది. భూముల అప్పగింతతో పాటు భవనాన్ని సైతం అప్పగించినా, అనుమతులు తదితర ప్రక్రియ కేంద్రం వద్దే పెండింగ్లో ఉండిపోయింది. హెచ్ఆర్డీ వద్ద పెండింగ్... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సంబంధిత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందులో భాగంగా రెండుసార్లు హెచ్ఆర్డీ అధికారులు పర్యవేక్షణ సైతం చేపట్టినప్పటికీ అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా సోమవారం హెచ్ఆర్డీ అధికారులు వర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. పార్లమెంటులో బిల్లుతోనే... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతితో పాటు వర్సిటీ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలోనే వర్సిటీ బిల్లుకు ఆమోదం లభిస్తే 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభించ వచ్చని ఉన్నాతాధికారలు అంటున్నారు. -
తరగతి గదే నివాస గది!
రాష్ట్రంలో గిరిజన విద్యార్థులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. వారి సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో నాణ్యమైన విద్య లభించక గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కన్వర్టెడ్ గిరిజన గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం వీటిపై శీతకన్ను వేయడంతో సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామంటూ రెండేళ్ల క్రితం 80 ఎస్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఇవి పేరుకు మాత్రమే గిరిజన గురుకుల పాఠశాలలు. వాస్తవానికి అక్కడ గురుకుల విద్యా విధానమే లేదు. వాటిని పరిశీలిస్తే.. సంక్షేమ హాస్టళ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి. ఈ 80 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుగా పిలుస్తోంది. బోర్డుపైనే గురుకులం.. లోపల అధ్వానం గతంలో ఉన్న సంక్షేమ హాస్టల్ భవనాల్లోనే గురుకుల స్కూళ్లు అంటూ కొత్తగా బోర్డులు పెట్టి నడుపుతున్నారు. సంక్షేమ హాస్టల్ అంటే.. విద్యార్థుల వసతి కోసం ఏర్పాటు చేసింది. బయట స్కూళ్లలో బోధిస్తారు. ఇప్పుడు వసతి కోసం ఏర్పాటు చేసిన గదిలోనే ఉపాధ్యాయులు క్లాసులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ మినహా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులంతా ఔట్సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులైనవారే. తరగతి గది, పడక గది ఒక్కటే కావడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ఇబ్బందులెన్నో.. కన్వర్టెడ్ గురుకులాల్లో కొత్తగా వార్డెన్ పోస్టులు వచ్చాయి. హాస్టళ్లు రద్దు కావడంతో వార్డెన్లు నేరుగా తమ సిబ్బంది, విద్యార్థులతో ప్రభుత్వం చెప్పిన మేరకు కన్వర్టెడ్ గురుకులాలకు చేరారు. వార్డెన్లు, సిబ్బంది పిల్లల భోజనం, వసతి సౌకర్యాలను చూస్తారు. ప్రస్తుతం వీరు ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు బోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై ఉపాధ్యాయులను నియమించింది. అయితే ఉపాధ్యాయులకు వసతి కల్పించకపోవడంతో వారు బయట అద్దె ఇళ్లళ్లో ఉంటున్నారు. విద్యార్థులకు విద్యనందించే బాధ్యత గురుకుల విద్యాలయ సంస్థది కావడం, భోజనం, వసతి సౌకర్యాల బాధ్యత ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులది కావడంతో వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. వీరి మధ్య వివాదాలతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం మాటకే దిక్కు లేదు సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలు, సమీక్ష సమావేశాల్లో 80 గిరిజన గురుకుల స్కూళ్లకు కొత్తగా భవనాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే నిర్మాణాలు మొదలుపెట్టాల్సిందిగా పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయితే పరిస్థితి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉంది. అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే నిర్మాణాలు మొదలవుతాయని, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని పాతపాటే పాడుతున్నారు. తరగతి గది, పడక గది ఒక్కటే.. విలీన గురుకులాల్లో మొదటి సంవత్సరం మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించారు. గతేడాది ఇక్కడ ఉన్న, బయట నుంచి వచ్చిన అర్హులైన విద్యార్థులతో పాఠశాలల స్థాయిని 6వ తరగతికి పెంచారు. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పదో తరగతి వరకు పెంచుతారు. ఇక రద్దు కాగా మిగిలిన 30 గిరిజన వసతి గృహాల్లో ఉండి చదువుకునే 7, 8, 9, 10 తరగతుల వారికి అక్కడే వసతి కల్పించి, ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. వాస్తవానికి వసతి గృహాలను 100 మంది విద్యార్థులకు సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఇంతకంటే ఎక్కువ మంది చేరిన చోట పరిస్థితి దారుణంగా ఉంది. మళ్లీ ఈ హాస్టళ్లలోనే గురుకుల పాఠశాలల విద్యార్థులకు 4 గదులు ఇచ్చి మిగిలినవి 7 నుంచి 10 తరగతుల వారికి ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఒకరోజైతే పర్వాలేదు. సంవత్సరాల తరబడి సర్దుకోమంటే ఎలా అని విద్యార్థులు వాపోతున్నారు. తెనాలిలోని బాలుర పాఠశాలలోని 54 మంది విద్యార్థులకు 4 గదులు ఇవ్వగా, బాలికల పాఠశాలలో 96 మందికి 4 గదులిచ్చి సరిపెట్టారు. చిలకలూరిపేటలోని బాలుర పాఠశాలలోని 140 మంది 4 గదుల్లో ఉంటున్నారు. ఇక రేపల్లెలోని బాలుర పాఠశాలలో 67 మంది తలదాచుకుంటున్నారు. వీరికి పగలు ఆ గదులలోనే తరగతులు నిర్వహిస్తుండగా రాత్రికి నివాసం కూడా అక్కడే ఉండాల్సిన దుస్థితి. మిగిలిన గదులు వంటకు, ప్రిన్సిపాల్కు, స్టోర్, భోజనశాల, వార్డెన్ గదిగా ఉపయోగిస్తున్నారు. అంటే వీటి కోసం సుమారు 5 గదులు వాడుతున్నారు. ఇంకా మిగిలిన వాటిని 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల వసతికి ఇచ్చారు. గురుకుల పాఠశాల ఉండాల్సింది ఇలా.. గురుకుల విద్యాలయం అంటే అక్కడే విద్యార్థుల విద్యాభ్యాసానికి తరగతి గదులతోపాటు ఉపాధ్యాయులు నివసించేందుకు క్వార్టర్స్ కూడా ఉండాలి. విద్యార్థులకు వసతి కోసం గదులు, భోజనం చేసేందుకు భోజనశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కనీసం రెండెకరాల ఆటస్థలం ఉండాలి. మొత్తం 20 నుంచి 25 ఎకరాల స్థలంలో గురుకుల విద్యాలయ భవనం ఉండాలి. కానీ ప్రభుత్వం వీటిలో వేటినీ పట్టించుకోలేదు. గురుకుల స్కూల్ నిర్వహణ తీరుతెన్నులపై ప్రైవేట్ ఏజెన్సీతో ఒక అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇంకా ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించలేదు. 80 స్కూళ్ల తరగతులు గచ్చుమీదే.. గుంటూరు జిల్లా రేపల్లె, స్టువర్టుపురం, తెనాలి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, వినుకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, ఉయ్యూరు, విస్సన్నపేట, నందిగామ, కొండపల్లి, మైలవరంలతోపాటు ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 80 గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క తరగతి గదిలోనూ విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో గచ్చుమీదనే విద్యార్థులు కూర్చోవాల్సిన దుస్థితి. ఏజెన్సీ ప్రాంతంలో హాస్టళ్లను రద్దు చేసి ఏర్పాటు చేసిన 30 ఆశ్రమ పాఠశాలలు మరీ దారుణంగా ఉన్నాయి. వాటికి కనీసం కాపౌండ్ గోడలు కూడా లేవు. దీంతో పాములు, తేళ్లు, ఇతర వన్యజీవులు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒకేసారి హాస్టళ్ల రద్దుతో ఇబ్బందులు నిజమే.. గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఒకేసారి పూర్తిగా రద్దు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. దీనివల్ల విద్యార్థులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, ఉపాధ్యాయులు సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ప్రత్యామ్నాయాలు చూసుకుని గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ఉంటే బాగుండేదని తర్వాత గుర్తించాం. ఆ దృష్ట్యా అధ్యయన కమిటీని నియమించాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం. కొత్త భవనాల నిర్మాణాలకు స్థలసేకరణ జరుగుతోంది. త్వరలోనే భవన నిర్మాణాలను చేపడతాం. – ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి మా పాఠశాలలో మంచినీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయకపోవటంతో పలువురు విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి. – మల్లా అంజి, పదో తరగతి విద్యార్థి, పీటీజీ పాఠశాల, విజయపురిసౌత్, గుంటూరు జిల్లా ఈ చిత్రం.. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల మరుగుదొడ్ల దుస్థితికి నిదర్శనం. ఈ పాఠశాలలో మొత్తం 279 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ పరిశుభ్రతను గాలికొదిలేశారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటికి తలుపులు కూడా సరిగా లేవు. తరగతి గదుల పక్కనే కుళ్లిన చెత్త దర్శనమిస్తోంది. గదుల నిండా బూజు, చెత్తాచెదారం అధికంగా ఉంది. పిల్లలు అపరిశుభ్రంగా, చిరిగిన వస్త్రాలతోనే తరగతులకు హాజరవుతున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో విద్యార్థినులను పట్టించుకునేవారు కరువయ్యారు. కొందరు ఉపాధ్యాయులు తరగతులకు గైర్హాజరు అవుతున్నా అడిగేవారే లేరు. ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు.. భూమిక. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు తనకు స్కూల్ యూనిఫాం, చున్నీ ఇవ్వలేదని వాపోతోంది. పాఠశాలకు ప్రహరీ లేదని, దీంతో పాఠశాల ఆవరణలోకి విష పురుగులు వస్తున్నాయని చెబుతోంది. -
‘మోడల్’ బడి
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వంద పాఠశాలలు ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్కు జిల్లాలో 59 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతోపాటు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ఒక్కో బడికి గిరిజన సంక్షేమ శాఖ రూ.4లక్షల వరకు వెచ్చించనుంది. విద్యాబోధన కోసం ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను నియమించనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడంతోపాటు అక్షరాస్యతను పెంపొందించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు మెరుగైన వసతుల కల్పన, ఆటపాటలతో కూడిన విద్య అందించనున్నారు. కిచెన్షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, డైనింగ్హాల్, క్రీడామైదానం, వివిధ రకాల ఆట వస్తువుల సమూహం, పాఠశాలల్లో టీవీ, ప్రొజెక్టర్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం రూ.4లక్షల వరకు ఖర్చు చేస్తారు. పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి రంగులతో వివిధ రకాల కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన ఒత్తిడి, బరువు లేని విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులు పాఠశాలల్లోనే వదిలి ఇళ్లకు వెళ్లనున్నారు. 2236 మంది విద్యార్థులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 59 పాఠశాలల్లో 2,236 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరికి కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 28 ప్రాథమిక పాఠశాలల్లో 1,301 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక పాఠశాలల్లో 730 మంది, మంచిర్యాల జిల్లాలో 5 ప్రాథమిక పాఠశాలల్లో 144 మంది, నిర్మల్ జిల్లాలో 3 ప్రాథమిక పాఠశాలల్లోని 61 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ప్రతీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను నియమించి బోధన చేయిస్తారు. జిల్లాల వారీగా ఎంపికైన పాఠశాలలు ఇవే.. ఆదిలబాద్ జిల్లాలో కొత్త లోద్దిగూడ, గాదిగూడ, మామిడిగూడ, చోర్గాం–ఎమ్టీ, పిప్రి–జీ, గోంకొండ, ఇంద్రవెల్లి–కె, అందుగూడ, వాన్వాట్, చోర్గాం–జీ, జాలంతాండ, ఎస్ఎన్ తండా, నానాదిగూడ, గోపాల్పూర్, వంకతుమ్మ, భవానిగూడ–సీ, చింతగూడ, గోపాల్సింగ్తాండ, పర్సువాడ–బీ, దుబార్పెటఏ, పల్సి–బీ తాండ, మనుగ్రోడ్, లంకర్గూడ, జాతర్ల, అందర్బంద్, లక్ష్మిపూర్, బెల్సరాంపూర్, కాండ్వా–జీ. ఆసిఫాబాద్ జిల్లాలో అర్జున్గూడ, అందుగూడ–జీ, పోచంలోద్ది, సావాతి, పంగ్డి, లక్ష్మిపూర్గోంది, కాయచిచాల, కేస్లాగూడ–బీ, కైర్గూడ, ముంజంపల్లి, మాలిని, కాకడ్బుడ్డి, గిన్నెదరి, డోర్గాం, వీవీఆర్హెచ్కాలనీ, గోయాగాం, మార్లవాయి, చిన్న అర్డెపల్లి, మర్కగూడ, పోతపల్లి.– మంచిర్యాల జిల్లాలో హాస్టల్తండా, దమ్మన్నపేట పెద్దపూర్, దేవాపూర్, పెద్దన్పల్లి. నిర్మల్ జిల్లాలో వాకీల్నగర్, గుర్రమదిర, ఇస్లాంపూర్ ప్రాథమిక పాఠశాలలు ఎంపిక అయ్యాయి. గ్రామస్తుల భాగస్వామ్యం.. ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో గిరిజన సంక్షేమ శాఖ అక్కడక్కడ గ్రామస్తులను కూడా భాగస్వాములను చేస్తోంది. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత, పాఠశాలల విధానం వివరిస్తుండడంతో గ్రామస్తులు ముందుకొస్తున్నారు. చోర్గాం–ఎమ్టీ ప్రాథమిక పాఠశాలకు గ్రామస్తులు మూడెకరాల భూమి విరాళంగా ఇవ్వడంతోపాటు ఎనిమిది గదుల భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. గాదిగూడ ప్రాథమిక పాఠశాలకు కిచన్ షెడ్ నిర్మాణాన్ని గ్రామస్తులు చేపట్టగా, పుసిగూడ గ్రామస్తులు పాఠశాలకు కిచెన్ షెడ్ నిర్మాణం, క్రీడా మైదానం కోసం అర ఎకరం భూమి విరాళంగా సమకుర్చారు. నాగోల్కొండ గ్రామస్తులు కిచెన్షెడ్, మరుగుదొడ్లు, రెండు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. జాలంతండా వాసులు పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మాణం చేయనున్నారు. అన్ని వసతులు కల్పిస్తాం.. గిరిజన సంక్షేమ శాఖ ఎంపిక చేసిన మోడల్ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం కార్పొరెట్ స్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఎంపికైన పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కళాకృతులతో కూడిన రంగులు వేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించనున్నాం. – జగన్, ఏఎంవో ఐటీడీఏ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం వచ్చే విద్యాసంవత్సరం నుంచి మోడల్ గిరిజన ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నాం. ఇందు కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. పాఠశాలల సౌకర్యాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మోడల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఐదో తరగతి వరకు ఆటపాటలతో కూడిన గుణాత్మక ఆంగ్ల విద్యాబోధన ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. – చందన, డీడీటీడబ్ల్యూ ఐటీడీఏ -
తోటి విద్యార్థులే కొట్టి చంపారా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన తీరు అత్యంత పాశవికంగా ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తోటి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం ఖమ్మంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపురానికి చెందిన దేవత్ జోసఫ్(10) ఖమ్మం నెహ్రూనగర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 3.15 గంటల వరకు పాఠశాలలోనే ఉన్నాడు. అయితే పక్కనే ఉన్న వసతి గృహానికి వెళ్లిన సదరు విద్యార్థి కొద్ది నిమిషాల్లోనే మృత్యువాత పడటం.. ఆ సమయంలో వసతి గృహంలో విద్యార్థులు పెద్దగా ఎవరూ లేకపోవడంతో ఈ హత్య ఏ రకంగా జరిగింది.. ఎవరు చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జోసఫ్కు తగిలిన బలమైన గాయాలు, మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు.. జోసఫ్తో ఎవరైనా ఘర్షణ పడి.. ఆ తర్వాత హత్య చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, దీని వెనకాల ఉన్న ఉన్మాదం ఏమిటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. నేలకేసి కొట్టి చంపారా? జోసఫ్ శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో అతడిని నేలకేసి బాది ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు హాస్టల్ వార్డెన్ ప్రతాప్సింగ్, సిబ్బందిని విచారించారు. సంఘటన జరిగిన కొద్ది సేపటికే అదే వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు కంగారు పడుతూ వసతి గృహం ఆవరణ నుంచి బయటకు వెళ్లాడని, ఎక్కడికి వెళ్తున్నావని తాను అడిగితే స్కూల్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడని వార్డెన్ పోలీసులకు వివరించారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జోసఫ్ మృతదేహంపై బలమైన గాయాలు ఉండటంతో అతనితో ఘర్షణకు దిగిన వారే అనంతరం హత్య చేసి ఉంటారని టూ టౌన్ సీఐ నరేందర్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. సీసీ పుటేజీలకు పరిశీలించిన ఏసీపీ వెంకట్రావు, టౌటౌన్ సీఐ నరేందర్.. మృతుడు జోసఫ్తో మరో విద్యార్థి కలిసి తిరిగినట్లుగా ఉన్న పుటేజీని గుర్తించారు. జోసఫ్ తల్లి మూగ మహిళ కాగా.. తండ్రి రెక్కాడితే డొక్కాడని దినసరి కూలీ కావడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. కాగా, బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కొడుకు చనిపోవడానికి వసతి గృహం అధికారుల బాధ్యతా రాహిత్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. -
గిరిజనులకు రుణాలు
ఏటూరునాగారం(వరంగల్): చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందకుండా తాత్సారం చేస్తూ బ్యాంకు అధికారులు ట్రైకార్ లక్ష్యాన్ని నీరు గారుస్తూ వస్తున్నారు. దీనిని గుర్తించిన గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్ నుంచి నేరుగా రూ.50 వేల రుణాన్ని వంద శాతం సబ్సిడీ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా గిరిజనులు వాటా ధనం, రుణం కిస్తీలు చెల్లించడం ఉండదు. ఈ మేరకు సెప్టెంబర్ 16న ఐటీడీఏకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 2018–19 ట్రైకార్ వార్షిక యాక్షన్ ప్లాన్ను ఐటీడీఏ అధికారులు సిద్ధం చేసి కమిషనర్కు అందించనున్నారు. గతంలో యాక్షన్ ప్లాన్ రూ.1 లక్ష, రూ.50 వేల సబ్సిడీతో కూడిన రుణాల వివరాలు, పలు రకాల యూనిట్లతో తయారు చేసిన నివేదికను అందజేశారు. నూతనంగా రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ వేసేందుకు ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మళ్లీ యాక్షన్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసి పంపించారు. నిరుపేదల్లో వెలుగులు రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ రుణం నిరుపేదల్లో వెలుగు నింపనుంది. గిరిజనుడి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు జమ అయిన వెంటనే వాటిని డ్రా చేసుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. గతంలో బ్యాంకు వాటా ధనం 20 శాతం, లబ్ధిదారుడి వాటా ధనం 10 శాతం జమ చేసుకుని బ్యాంకు చుట్టూ తిరిగే వారు. కాళ్ల చెప్పులు అరిగిపోయినా కూడా రుణం వచ్చేది కాదు. లక్ష నుంచి ఐదు లక్షల వరకు యూనిట్ల వారీగా సబ్సిడీలను అందజేసింది. రూ.50 వేల వరకు వందశాతం సబ్సిడీని అమలు చేస్తూ మిగతా వాటి రుణాలను యథావిధిగా అమలు చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుడు ఎంపీడీఓ కార్యాలయంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా ఐటీడీఏ లాగిన్లోకి వచ్చి కలెక్టర్ అప్రూవల్తో కమిషనర్ నుంచి ట్రైకార్ ద్వారా నగదు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వంద శాతం సబ్సిడీతో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే గిరిజనులకు ఎంతగానో ఆసరాగా నిల్వనుంది. మొత్తం 1325 యూనిట్లకు రూ. 22,64,00,759 మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇందులో ఉన్న సెక్టార్ల వారీగా రూ.50 వేలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి రుణాలు మంజూరవుతాయి. అసెంబ్లీ రద్దుతో ఆలస్యం అసెంబ్లీ రద్దు కావడం వల్ల ఎస్టీ కార్పొరేషన్ రుణాలను పొందే లబ్ధిదారులు అక్టోబర్లో లేదా ఎన్నికల పర్వం పూర్తి అయిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2018లో దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఖాతాల్లో మాత్రమే రుణాలు జమ అయ్యాయి. వాటిని పూర్తిగా లబ్ధిదారులకు అందజేసిన తర్వాతనే 2018–19 రుణాల దరఖాస్తులు స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన రుణాలకు యుటిలైజ్ సర్టిఫికెట్ (యూసీ)లు కూడా ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ అధికారులను ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంత మంది రుణాలు సద్వినియోగం చేసుకున్నారని కమిషనర్ నిర్ధారించనున్నారు. 100 శాతం సబ్సిడీతో లాభం 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల రుణాలు ఇవ్వడం వల్ల గిరిజన కుటుంబాలు బాగుపడుతాయి. ఇంటి ఆవరణలోనే షాపులను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఆస్కారం ఉంటుంది. రుణాలను ఈ విధంగా ఇస్తే గిరిజనుల జీవితాలు బాగుపడుతాయి. బ్యాంకులతో లింక్ పెడితే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి చేరకుండానే దళారులు మింగుతున్నారు. వంద శాతం సబ్సిడీ గిరిజనులకు ఉపయోగపడనుంది. ఆలం ప్రభాకర్, రాజన్నపేట, కన్నాయిగూడెం మండలం సద్వినియోగం చేసుకోవాలి.. కొత్తగా ప్రవేశపెట్టిన 100 శాతం రూ.50 వేల రుణం గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. దాంతో కుటుంబాలు బాగుపడుతాయి. బ్యాంకు వాటాతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ఈ రుణం ఇవ్వనున్నాం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాలు అందిస్తాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. చక్రధర్రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం -
‘ఏకరూపం’ అందేదెప్పుడు?
ఆదిలాబాద్రూరల్: సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ.. హామీగానే మిగిలిపోయింది. పాఠశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించిన దాఖాలాలు కనిపించడం లేదు. వేలాది మంది విద్యార్థులు పాత దుస్తులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న 17,893 మంది విద్యార్థులు కొత్త దుస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా పంపిణీ.. బీసీ సంక్షేమ వసతి గృహంలో చదువుకునే విద్యార్థుల దుస్తులు ఇటీవలనే కుట్టు పూర్తయింది. గత రెండు రోజుల కిందట కొంత మంది హెచ్డబ్ల్యూవోలు దుస్తువులు తీసుకెళ్లగా మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థుల అందించే దుస్తులు ప్రస్తుతం దర్జీల వద్ద కుట్టు దశలో ఉన్నాయి. దర్జీలకు కుట్టుకు సంబంధించిన చార్జీ కుదరకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థులు.. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా ఇందులో బాలికల వసతి గృహాలు 16 ఉండగా ఇందులో 8,272 మంది బాలికలు ఉన్నారు. 38 బాలుర వసతి గృహాల్లో 9,621 మంది బాలురు ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు 9 ఉండగా ఒకటి బాలికల వసతి గృహం ఉంది. ఇందులో 42 మంది ఉన్నారు. బాలుర వసతి గృహాలు 8 ఉండగా ఇందులో 540 మంది విద్యార్థులు ఉన్నారు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో 20 వసతి గృహాలు ఉండగా ఇందులో 3 బాలికల వసతి గృహాలు ఉండగా 510 మంది బాలికలు ఉన్నారు. 17 బాలుర వసతి గృహాలు ఉండగా 970 మంది విద్యార్థులు ఉన్నారు. మరో నెల రోజులు పట్టే అవకాశం.. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాల విద్యార్థులకు దుస్తుల పంపిణీకి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులను గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి రెడీమేడ్ అందించనుందని, మిగితా రెండు జతల దుస్తువులను జిల్లాలోని 30 మంది దర్జీలకు కుట్టు కోసం అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జత కుట్టు కూలీకి రూ. 45 చొప్పున అందించనున్నారు. కొంత మంది హెచ్డబ్ల్యూవోలు తీసుకెళ్లారు.. ఎస్సీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ దుస్తులను అందజేశాం. బీసీ విద్యార్థులకు సంబంధించిన దుస్తులు కుట్టు పూర్తి అయి ఇటీవలనే తమ శాఖకు చేరుకున్నాయి. సగం మంది బీసీ వసతి గృహాల హెచ్డబ్ల్యూవోలు వాటిని తీసుకెళ్లారు. మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉంది. వాటిని సైతం విద్యార్థులకు అందేలా చూస్తాం. – ఆశన్న, బీసీ, ఎస్సీ, అభివృద్ధి శాఖల అధికారి, ఆదిలాబాద్ కుట్టు కోసం అందించాం రెండు జతల దుస్తులను కమిషనరేట్ నుంచి రేడిమేడ్ అందించనున్నారు. మిగితా రెండు జతలకు సంబంధించిన క్లాత్ 15 రోజుల కిందటనే సరఫరా అయింది. దుస్తువులు కుట్టుడు అయిన వెంటనే ఆయా వసతి గృహాలకు పంపిణీ చేస్తాం. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. – చందన, డీడీ గిరిజన సంక్షేమ శాఖ, ఉట్నూర్, ఆదిలాబాద్ -
ఆదివాసీల చిత్రకళకు ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ తెగల్లోని ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కొలామీ, బంజార, కోయ వర్గాలకు చెందిన యువతను ఎంపిక చేసి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ చిత్రకారులు వేసిన చిత్రాలతో గురువారం మాసబ్ట్యాంక్లోని సెంటినరీ మ్యూజియం ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందు లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఔత్సాహిక చిత్రకారులు ప్రదర్శించారు. ప్రతి ఆదివాసీ తెగకున్న ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళ పునరుద్ధరణకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ని గిరిజనులు, ఆదివాసీల సంస్కృతికి సంబంధించి చిత్రకళ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనుల సంస్కృతిని చిత్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి కార్యాలయంలో పెయింటింగ్స్ ఆదివాసీ చిత్రకారుల చిత్రాలను ప్రతి ప్రభు త్వ కార్యాలయంలో ఉండేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో చిత్రకారులకు మంచి ఉపాధి లభించనుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఆదివాసీ చిత్రాలు కనిపించనున్నాయి. ప్రైవేటువ్యక్తులు సైతం వీటిని కొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్కు తగినట్లు ఔత్సాహిక చిత్రకారులకు సామగ్రిని యంత్రాంగం సరఫరా చేస్తోంది. -
‘పొరపాటున నోరుజారా.. నా ఉద్దేశం అది కాదు’
హైదరాబాద్ : గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరంను చిక్కుల్లో పడేశాయి. శుక్రవారం ఇక్కడి మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018లో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని, అలా కావాలంటే విజయ్ మాల్యాలా తెలివిగా ఆలోచించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా చాకచక్యంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి సులువగా రుణాలు పొందాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్డు కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఇలా పలు రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని, అయితే ఇతర సామాజిక వర్గాలవారితో సమానంగా చూడటం లేదని జువల్ ఓరం వ్యాఖ్యానించారు. ‘అంతా విజయ్మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, బ్యాంకులకు మాల్యా చాలా చేశాడంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాం రేపాయి. బ్యాంకులను ప్రభావితం చేయండి, ప్రభుత్వాలను, వ్యవస్థలను కాదని షెడ్యూల్డు కులాలవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అయితే మాల్యాను పొగడటం ఏంటని కేంద్ర మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరణ ఇచ్చుకున్న మంత్రి ప్రసంగం మధ్యలో పొరపాటున విజయ్మాల్యా పేరును ప్రస్తావించాను. మరొకరి పేరును ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మీడియ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని’ కేంద్ర మంత్రి జువల్ ఓరం అన్నారు. -
పటిష్టంగా గిరిజన పథకాల అమలు
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు మేలు చేసేలా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని ఆ శాఖాధికారులను ప్రభు త్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలను సీఎస్ సమీక్షించారు. గిరిజన విద్యాసంస్ధల ద్వారా 2 లక్షలకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రైబల్ మ్యూజి యంకు ప్రాచుర్యం కల్పించి, ఎక్కువమంది సంద ర్శించేలా చూడాలని కోరారు. రూ. 205 కోట్లతో 16,479 మందికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళిక రూపొందించామని, ఈ ఏడాది ఐదువేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు. 2,28,175 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని, కల్యాణలక్ష్మి ద్వారా రూ.150 కోట్లతో 3,400 మందికి సహాయం అందించాలని నిర్ణయించామన్నారు. కాగా, ట్రై ఫెడ్ ఎండీ ప్రవీణ్కృష్ణ సీఎస్తో భేటీ అయ్యారు. గిరిజన అటవీ ఉత్పత్తులకు ఎంఎస్పీ, వన్ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అటవీ ఉత్పత్తులు, మార్కెటింగ్ సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ వివరించారు. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోవల్ ఓరం పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. శుక్రవారం మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని, కేంద్ర మంత్రి హోదాలోనూ వివక్షకు గురైన తీరును సభకు వివరించారు. ‘1999లో ఎంపీగా ఎన్నికై వాజ్పేయి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చాంబర్లోకి వెళ్దామని బయల్దేరా. కానీ నాకు ప్రత్యేక చాంబర్ లేదు. దాంతో అందుకోసం పోరాడి సాధించా’అని వివరించారు. గిరిజనులు రిజర్వేషన్లతో లాభపడుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వివక్షకు కూడా గురవుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, దీంతో వారి అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. అదేక్రమంలో గిరిజనులు తమ పేర్లను వారి సంప్రదాయాల ప్రకారం పెట్టుకోవడంతో సమాజంలో కొంత చిన్నచూపునకు గురవుతున్నారన్నారు. గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ప్రత్యేక రాయితీలిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నైపుణ్యమున్న గిరిజనులకు పెట్టుబడి రాయితీ: ఈటల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. మహిళలకు 45%, పురుషులకు 35% పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనుల్లోనూ గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. ఓన్ యువర్ కార్ పథకం కింద ఒక్క వాహనంపై రూ.5 లక్షలు రాయితీ ఇచ్చామని, గిరిజన రైతులకు 95% రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని, వ్యవసాయ పనిముట్లన్నీ 95% రాయి తీతో అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ల దగ్గర ప్రాజెక్టు రిపోర్టు ఉందని, కానీ గిరిజనుల దగ్గర కమిట్మెంట్ ఉందని అన్నారు. 45 మంది కార్పొరేట్లకు రూ.7.3 లక్షల కోట్ల రుణం ఇచ్చిన బ్యాంకులు నైపుణ్యం ఉన్నవారికి మాత్రం రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని నూరుశాతం అమలు చేయాలంటే అధికారుల చిత్తశుద్ధి తోడవ్వాలన్నారు. ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే గిరిజనుల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిబాల వికాస్ పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకై ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి నివారించవచ్చన్నారు. పీరియాడికల్ చెకింగ్తో అనారోగ్య సమస్యల్ని వెంటనే పరిష్కరించవచ్చని చెప్పారు. ఇదే పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరులోని గిరిజన బాలికల పాఠశాలలో ప్రారంభించారు. గిరిజన శాఖ కమిషనర్ క్రిస్టినాజెడ్ చొంగ్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రయోజనాలను వివరించారు. -
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్లోని గెస్ట్హౌస్లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్సైట్తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో 863 ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఆర్ఈఐ–ఆర్బీ కార్యనిర్వాహక అధికారిని ఆదేశించారు. జోన్, జిల్లా అంశాలతోపాటు రోస్టర్ పాయింట్లు, అర్హతలను నిర్ణయించి పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.. పోస్టుల వివరాలు: ప్రిన్సిపాల్ 15, లెక్చరర్ 616, లైబ్రేరియన్ 15, ఫిజికల్ డైరెక్టర్ 15, మెస్ మేనేజర్/వార్డెన్ 15, స్టాఫ్నర్సు 31, కేర్ టేకర్ 15, ల్యాబ్ అసిస్టెంట్ 62, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 22, జూనియర్ అసిస్టెంట్ 11, స్టోర్ కీపర్ 15. -
‘గిరిజనేతరుల హక్కులను కాలరాస్తున్నాయి’
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లోని భూముల బదలాయింపు నియంత్రణ చట్టం(1ఆఫ్70 యాక్ట్) లోని కొన్ని నిబంధనలు గిరిజనేతరుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఖమ్మం జిల్లా, చెంచుపల్లి గ్రామానికి చెందిన సూరెడ్డి రమణారెడ్డి వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. -
‘ఆశ్రమ’ టీచర్ల బదిలీ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఈ టీచర్లకూ వర్తింపజేశారు. బదిలీలకు సంబంధించి ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లోని టీచర్ల బదిలీలు సైతం ఆన్లైన్ పద్ధతిలో వెబ్కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనుంది. బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్లో వస్తున్న సందేహాలను నివృ త్తి చేయాలని టీఎస్పీఆర్టీయూ పే ర్కొంది. ట్రాన్స్ఫర్ షెడ్యూల్లో అప్లికేషన్కు జూన్ 12 వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఆన్లైన్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని సరి చేసి బదిలీ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరింది. -
వంద గ్రామాల్లో అంధకారం!
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దెమ్మెపల్లె గ్రామానికి చెందిన రంజిత్ వ్యవసాయ కూలీ. వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా కొంచెం డబ్బు కూడబెట్టి ఓ టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ కొనుగోలు చేశాడు. కానీ ఇంటికి తీసుకొచ్చిన నాటి నుంచి వాటిని అట్టా డబ్బాల్లోంచి బయటకు తీయలేదు. ఎందుకంటే అతడి ఇంటికి విద్యుత్ సరఫరా లేదు. ఆ మాటకొస్తే ఆ ఊరికే విద్యుత్ సరఫరా లేదు. - ఒక్క దెమ్మెపల్లె మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా గిరిజన పల్లెల్లో ఇదే పరిస్థితి. రాత్రయితే ప్రతి ఇంట్లోనూ అమావాస్య చీకట్లే. అక్కడక్కడా సోలార్ లైట్లు ఉన్నా.. అవి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. సెల్ఫోన్ చార్జింగ్ నుంచి మొదలుకొని ఏ చిన్న పనికైనా విద్యుత్ తప్పనిసరి. కాని ఎన్నోఏళ్లుగా గిరిజన గ్రామాలు కారు చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. విద్యుత్ లైన్లు వేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నా.. కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధిని నిలదీస్తున్నా.. ఫలితం మాత్రం శూన్యం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వందకుపైగా గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. విద్యుత్ సరఫరా లేక అభివృద్ధి ఆమడదూరంలోనే ఉండిపోయాయి. ప్రత్యేక అభివృద్ధి నిధిలో భాగంగా గిరిజన తండాలకు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా.. అధికారుల ఉదాసీనతతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు విద్యుత్ లేని గ్రామాల్లో ఎక్కువ భాగం అటవీ భూములు ఉండటంతో అక్కడ కరెంటు లైన్ల ఏర్పాటుకు అటవీ శాఖ మోకాలడ్డుతోంది. రిజర్వుడ్ అటవీ ప్రాంతం నుంచి లైన్లు వేస్తే అటవీ సంపదకు విఘాతం కలుగుతుందని పేర్కొంటోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గిరిజన తాండాలకు విద్యుత్ వెలుగులు అందడం లేదు. సెల్ఫోన్ల మౌనవ్రతం కరెంటు లేని గ్రామాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తాగునీటికి చేతిపంపులే దిక్కు. కొన్నిచోట్ల గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సోలార్ లైట్లు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. కానీ వీటిని పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నా.. వాటి చార్జింగ్ కోసం మండల కేంద్రం, లేదంటే సమీపంలో కరెంటు ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. బ్యాటరీ నిండుకుంటే మళ్లీ పక్క గ్రామాలకు పరిగెత్తాల్సిందే. అప్పటివరకు సెల్ఫోన్లు మూగబోయి ఉండాల్సిందే. అధికారుల లెక్కల్లో 34 గ్రామాలే.. గిరిజన సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రా ష్ట్రంలో కరెంటు లేని గ్రామాలు 34 మాత్రమే ఉన్నాయి. సగటున యాభై కుటుంబాలున్న ప్రాంతాన్ని గ్రామంగా పరిగణిస్తూ గణాంకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. గణాం కాలను సమర్పించిన గిరిజన సలహా మండలి.. అక్కడ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఆమోదించినప్పటికీ.. పనులు మొదలుకాలేదు. నూనె దీపాలతోనే.. ఊర్లో దాదాపు వంద మంది ఉంటాం. అన్ని గుడిసెల్లోనూ రాత్రిపూట నూనె దీపాలే. కరెంటు సరఫరా కోసం అధికారులను, నాయకులను అడిగి అలిసిపోయాం. కరెంటు లైన్లు వేస్తామంటూ శంకుస్థాపన చేసినా పనులు సాగలేదు. వ్యవసాయ పనుల కోసం పడే కష్టాలు అంతాఇంతా కావు. చేసేది లేక పొరుగు గ్రామాలకు వలసలు పోతున్నాం. – బిజ్జయ్య, రైతు, రాంపూర్ పెంట, అమ్రాబాద్ పనులు ఉన్నప్పుడే ఊర్లో.. ఊర్లో కరెంటు లేకపోవడంతో అందరూ అమ్రాబాద్కు తరలిపోతున్నారు. నేను కూడా వ్యవసాయ పనులు ఉన్నప్పుడే ఊర్లో ఉంటున్నా. గ్రామంలో పని లేకుంటే మండల కేంద్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నా. మేజర్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడి హోదాలో కరెంటు సౌకర్యం కల్పించాలని అధికారులను వందలసార్లు కోరా. కానీ ఫలితం మాత్రం లేదు. –అంజయ్య, వార్డు సభ్యుడు, కొమ్మెన పెంట, అమ్రాబాద్ పంచాయతీ -
మినీ గురుకుల సిబ్బందికి వేతన కష్టాలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మినీ గురుకులాల్లో సిబ్బందికి వేతన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అత్తెసరు జీతాలే ఇస్తోంది. ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం రూ.5వేలకు మించడం లేదు. మెజార్టీ ఉద్యోగులకు నెలకు కేవలం రూ.2,500 చొప్పున ఇవ్వడం గమనార్హం. వీటిని పెంచాలని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని మినీ గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచే అడ్మిషన్లు తీసుకుని వసతితో కూడిన బోధన అందిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమ శాఖ 29 మినీ గురుకులాలను తెరిచింది. వీటిలో వార్డెన్, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం, అకౌంటెంట్, కుక్, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్మెన్ కేటగిరీల్లో 418 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. ఏళ్లుగా అరకొర జీతాలే మినీ గురుకులాల్లో సిబ్బందికి ఏళ్లుగా అరకొర వేతనాలే ఇస్తున్నారు. వార్డెన్కు రూ.5 వేలు, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎంలకు రూ.4 వేలు, అకౌంటెంట్కు రూ.3,500, కుక్, ఆయా, స్వీపర్, వాచ్మెన్లకు రూ.2,500 చొప్పున వేతనాలిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ గురుకులాల్లో సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. వేతన పెంపును కోరుతూ పలుమార్లు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు. గిరిజన సంక్షేమ శాఖ వేతన పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి ఏడాది కావస్తున్నా ఫైలుకు మోక్షం కలగలేదు. మరో పక్షం రోజుల్లో 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు వేతనాలు పెంచాలని మినీ గురుకులాల సిబ్బంది అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గడువులోగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.