former problems
-
ఆ చైతన్యం ఏది..?
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు ముందు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. అందులో భాగంగా ఆధునిక వ్యవసాయం, నకిలీ విత్తనాలు, సాగు పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి, పంటల ఉత్పత్తులు గోదాముల్లో నిల్వ చేసి రుణం పొందే విధానం, వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయాల్సిన పంటలు, చీడపీడల నివారణ, పాడి పశువుల ద్వారా అభివృద్ధి, పశు సంవర్ధక శాఖ అందిస్తున్న రాయితీలు, వ్యవసాయంలో విద్యుత్ వినియోగం, విత్తనోత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహం వంటి అంశాలపై వ్యవసాయాధికారులతో రైతుల్లో చైతన్యం కలిగించేవారు. కానీ, గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు లేదు. దీంతో రైతులు పలు అంశాలపై అవగాహన లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా? అనే అయోమయంలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కనీసం దీని గురించి కూడా ఊసెత్తకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు ముందే ప్రభుత్వం ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నిర్వహించకపోగా, ఈ ఏడాది కూడా నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ‘రైతు చైతన్య యాత్ర’ పేరును ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’గా మార్చి ఏటా మే చివరి నుంచే రైతులకు సాగు అంశాలు, నకిలీ విత్తనాలు, ఆధునిక వ్యవసాయం, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి లాంటి అంశాలపై వ్యవసాయాధికారులతో సమావేశాలు (వారం రోజులపాటు) పెట్టించి రైతులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ చైతన్య యాత్రలను గతేడాది నిర్వహించలేదు. ఈ ఏడాదైనా నిర్వహిస్తారా? లేదా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ చైతన్య యాత్రలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం కనీసం ఊసెత్తకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది. అవగాహన లేకపోతే ఎలా? ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఏఏ పంటలు సాగు చేయాలి? ఖరీఫ్లో ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది, ఏ పంట సాగు చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే అందుకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటల వివరాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావాలంటే పాటించాల్సిన సాగు పద్ధతులపై అవగాహన కల్పించకపోతే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటితోపాటు పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి? నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలతో వచ్చే నష్టాలు, ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాలు, సేంద్రియ ఎరువుల వాడకం, చీడ పురుగుల నివారణ, భూసార పరీక్షలు అలాంటివి వ్యవసాయ రుణాలు, సబ్సిడీ రాయితీలు పొందే పద్ధతులు, పంటల మార్పిడి, వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు పద్ధతులతోపాటు ఆరుతడి పంటలపై మండలస్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయధికారులే స్వయంగా ఆయా గ్రామాలకు వచ్చి రైతుల్లో చైతన్యం కల్పించడం ‘రైతు చైతన్య యాత్ర’ల ముఖ్య ఉద్దేశం. ఈ చైతన్య యాత్రలు, అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ, మరో 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు రైతుల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేవారు. కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైతన్య యాత్రలు నిర్వహించకపోతే రైతులకు ఎలా అవగాహన కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యథావిధిగా కొసాగించాలి గతేడాది ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలి. సాగు పద్ధతులపై అవగాహన లేక రైతులు పంట వేసి నష్టపోయే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించాలి. జంగ జమలయ్య, వేంసూరు అవగాహన కల్పిస్తేనే మేలు ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తేనే మేలు జరుగుతుంది. సాగు చేసే పంటలపై అవగాహన లేకపోతే పంటలు సాగు చేసి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, రాయితీలపై అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం. గతంలో మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. సంగీతం వీర్రాజు, రైతు, వేదాంతపురం -
ఉపాధి చిక్కుల్లో రాజధాని చిన్నరైతు!
సాక్షి, తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన దాదాపు 50 వేల మంది చిన్న, సన్నకారు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి, జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన ఉండడంలేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడ 33వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. భూములిచ్చిన వారిలో అధిక భాగం రైతులు ఎకరం, అర ఎకరం ఉన్నవారే. దీంతో తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఇల్లు గడవక దిక్కుతోచడంలేదని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వీరికి ఏటా కౌలు చెల్లిస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, రైతుల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చినా, అది ఎక్కడా అమలుకావడంలేదు. అప్పులు చేసి చదివించాల్సి వస్తోందంటున్నారు. అంతేకాక, రాజధాని మూడు మండలాల్లో సరైన ప్రభుత్వ వైద్యశాల లేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూలి పనీ దొరకడం లేదు గతంలో ఉన్న ఎకరం, అరెకరంలో ఏదో ఒక పంట వేసుకుని, అప్పోసొప్పో చేసుకుని తినేవారమని, పంట చేతికి రాగానే అప్పులు తీర్చేవారమని రైతులు చెబుతున్నారు. రాజధాని పుణ్యమా అంటూ వడ్డీ వ్యాపారస్తులు రైతువారీ వడ్డీకి స్వస్తి చెప్పి అధిక వడ్డీలకు తిప్పుతున్నారని, ఆ అప్పు చేసి ఎలా తీర్చాలో అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పొలాల్లో పనిలేక నిర్మాణ పనులకు వెళ్తే అక్కడా అన్యాయమే జరుగుతోందని వాపోతున్నారు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను అతితక్కువ కూలీకి తీసుకువచ్చి వారితో పనులు చేయించుకుంటున్నారని.. తమను తొలగిస్తున్నారని వాపోయారు. దీంతో ఇప్పుడు ప్రతిరోజూ పొట్ట చేతబట్టుకుని ఎక్కడ పని దొరుకుతుందా అని వెతుక్కుంటున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకుని భూములిచ్చిన చిన్న, సన్నకారు రైతులకు పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. పని కోసం వెతుక్కోవాల్సి వస్తోంది ఉన్న ఎకరాన్ని పూలింగ్కు ఇచ్చా. వచ్చిన కౌలు చాలకపోవడంతో రోజు కూలీ చేసుకుంటున్నాం. కురగల్లులో నిర్మిస్తున్న వర్సిటీలో రూ.10వేల జీతానికి చేరాను. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు రూ.7 వేలకే చేయడంతో మమ్మల్ని తొలగించారు. ఇప్పుడు పనికోసం వెతుక్కోవాలి. – దావులూరి వెంకటేశ్వరరావు పనిలేక ఇబ్బంది పడుతున్నాం ఉన్న 75 సెంట్లు పూలింగ్కు ఇచ్చాం. గతంలో అక్కడ కూరగాయలు పండించి అమ్ముకొని జీవించే వాళ్లం. ఇప్పుడు పనిపోయింది. కొత్త పని కోసం వెతుక్కుంటున్నాం. నాలాగా చాలామంది రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వం దారి చూపకపోతే ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుని వలస వెళ్లాల్సిందే. – నాగేశ్వరరావు, ఐనవోలు కూలీలకు పని దొరకడంలేదు గతంలో పొలాల్లో పనిచేసుకుని సాయంత్రానికి ఆరేడు వందలతో ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు సిమెంటు పనిచేసినా రూ.500 ఇవ్వడంలేదు. ఎవరిని అడిగినా పనిలేదు పొమ్మంటున్నారు. ఇలా అయితే మేం ఎక్కడకు వలస వెళ్లాలో అర్ధంకావడంలేదు. – బాణావతు దినేష్నాయక్, నవులూరు -
సూక్ష్మసేద్యం అనుమతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మసేద్యానికి బ్రేక్ పడింది. రైతులు చుక్కచుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధులలేమి సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క దరఖాస్తుకు కూడా ఉద్యానశాఖ అనుమతివ్వలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో సూక్ష్మసేద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి రూ.200 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ సబ్సిడీతో ప్రోత్సాహం ఇచ్చినా.. ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ. 25–30 వేల వరకు ఖర్చు కానుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ. లక్షకు పైగానే ఖర్చుకానుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు సూక్ష్మసేద్యం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. 2016–17లో కేవలం 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా, 2017–18లో ఏకంగా 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి సూక్ష్మసేద్యాన్ని మంజూరు చేసింది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. 800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది నాటికి చెల్లింపులకు పూర్తయింది. ఇంకా రూ.200 కోట్లు కేంద్రం వాటా పెండింగ్లో ఉందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్లో దరఖాస్తులు... ఇప్పటివరకు నిధులు పెండింగ్లో ఉండిపోవడం, ఈ ఏడాది బడ్జెట్లో సూక్ష్మసేద్యం పథకానికి కేటాయించిన రూ.127 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఉద్యానశాఖ సందిగ్ధంలో పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1.20 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నిధులు లేకపోవడంతో వాటి అనుమతులకు బ్రేక్ పడింది. తమ వాటాగా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై తమకు కేంద్రం మెమో కూడా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలోనూ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే సూక్ష్మసేద్యంతో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. సూక్ష్మసేద్యం అమలుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్ల రుణం తీసుకొచ్చినా పెద్దగా మార్పురాలేదన్న ఆరోపణలున్నాయి. -
‘గజపతి’ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్.. ఘన స్వాగతం
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఎస్.కోట నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసుకొని గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేతకు ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దీంతో కొత్త వలస-విజయనగరం రోడ్డు జనసంద్రంతో నిండిపోయింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గొడికొమ్ము గ్రామ మహిళలు కలిసి జననేతను కలిశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదని, దీంతో తీసుకున్న రుణానికి ప్రతీ నెలా వడ్డీల రూపంలో రూ.3వేలు వసూలు చేస్తున్నారని రాజన్న తనయుడికి తమ ఆవేదన వక్యం చేశారు. పలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటంలేదని, సాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని దివ్యాంగురాలు, వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వైఎస్ జగన్ను కలిసి వినతి పత్రం సమర్పించింది. (జగన్ను కలిసిన సాహసవీరుడు) అంతకముందు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎలాంటి అభివృద్ది చేయటం లేదని, నియోజకవర్గ సమస్యలు అస్సలు పట్టించుకోవడంలేదని ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు జననేతకు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే లలిత కుమరి పట్టించుకోవడం లేదని జామి మండల మైనారిటీలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమను అక్రమంగా తొలగించారిన జామి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వైఎస్ జగన్కు పిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు జననేతకు వినతి పత్రం సమర్చించారు. (జగన్తో నడిచిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి) జననేతను కలిసిన జిందాల్ నిర్వాసితులు దివంగత నేత వైఎస్సార్ తర్వాత తమను పట్టించుకునేవారే లేరని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైఎస్ జగన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజన్న తనయుడిని జిందాల్ ఫ్యాక్టరీ నిర్వాసితులు, రైతులు టీడీపీ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీ పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, జిందాల్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతుల వైఎస్ జగన్ను కోరారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న జననేత వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు మండుటెండను సైతం లెక్క చేయకుండా జననేత వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. (చారిత్రాత్మక పైలాన్ ఆవిష్కరణ) చదవండి: నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. -
ధర.. దైన్యం
అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్లో టమాట రేటు చూసి రైతు నోట మాట రావడం లేదు. మిర్చి ధర వింటే మూర్ఛవస్తోంది. వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులను ఉద్యానతోటలు కూడా ఊసురుమనిపిస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక పండిన పంట ఉత్పత్తులను అమ్ముకోలేక చతికిలపడుతున్నారు. సరైన ప్రణాళిక, సాగు స్థిరీకరణ, గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దారుణ నష్టాలు చవిచూస్తున్నారు. ఓవైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకులు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ‘అనంత’ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కూర‘గాయాలే’ ఇటీవలకాలంలో అంతో ఇంతో నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగ, వరి లాంటి పంటలకు పోకుండా కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్శాఖ నుంచి సరైన ప్రణాళిక, సాగు, మార్కెటింగ్ సదుపాయం లేక కూరగాయలకు ధరలు లేక దారుణ నష్టాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టమాటా, మిరప సాగు చేసిన రైతులు ధరల పతనంతో ఈ సీజన్లో రూ.250 నుంచి రూ.300 కోట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. పెరిగిన సాగు... తగ్గిన ధర జిల్లా వ్యాప్తంగా టమాట, మిరపసాగు బాగా పెరిగింది. దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. అయితే మార్కెట్లో ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేకపోతున్నారు. ఈ రెండు పంటల ద్వారా ఏటా 10 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడులు వస్తుండగా... రమారమి రూ.900 నుంచి రూ1,000 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్లో ధరలు దారుణంగా పతనం కావడం, తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ ఏడాది రైతులకు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కిలో రూ.10 ప్రకారం కొంటున్నా మార్కెట్లో రైతులకు మాత్రం కిలో రూ.2 కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం నివారించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. టమాట పరిస్థితి ఇలా... జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఓడీచెరువు, నల్లమాడ, గోరంట్ల, తాడిమర్రి, బత్తలపల్లి, అనంతపురం, ధర్మవరం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కనగానపల్లి, చిలమత్తూరు, మడకశిర, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హిరేహాళ్, గుత్తి, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు తదితర మండలాల్లో టమాట పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 14,200 హెక్టార్లలో పంట సాగులోకి రాగా ప్రస్తుతం 7,800 హెక్టార్లలో పంట పొలం మీద ఉన్నట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి రూ.1.20 లక్షలు...రాబడి రూ.80 వేలు మామూలు పద్ధతిలో అయితే ఎకరా విస్తీర్ణంలో టామాట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టుబడి అవుతుండగా, ట్రెల్లీస్, మల్చింగ్ పద్ధతిలో అయితే ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు క్రేట్స్, రవాణా, కమిషన్ల ఖర్చు అదనంగా భరించాలి. ఎకరా టమాట బాగా పండితే 30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్లో కిలో కనీసం రూ.10 పలికితే కాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కిలో రూ.10 ఉంటే అందులో పెట్టుబడులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కింద రూ.8 వరకు పోతుంది. మిగతా రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇపుడు కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనున్న చిత్తూరు, మదనపల్లి, అలాగే కర్ణాటకలోని కోలార్, చింతామణి, హైదరాబాద్ చుట్టుపక్కల, కొన్ని తెలంగాణా జిల్లాల్లో టమాట సాగు పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. నవంబర్ వరకు ఇదే రకమైన మార్కెట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిరపదీ అదే దారి జిల్లా వ్యాప్తంగా బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, బొమ్మనహాళ్, కణేకల్లు, పరిగి, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, బత్తలపల్లి, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, తనకల్లు, మడకశిర ప్రాంతాల్లో మిరప సాగు ఎక్కువగా ఉంది. ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో ఎండుమిర్చి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 4,100 హెక్టార్లలో మిరప సాగు చేయగా అందులో ప్రస్తుతం 2,400 హెక్టార్లలో పంట ఉన్నట్లు చెబుతున్నారు. ఎకరా పచ్చి మిరప సాగుకు రూ.1.10 నుంచి 1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. పంట నాటిన 75 రోజుల తర్వాత నుంచి 7 నుంచి 8 నెలల వరకు పంట కోతలు ఉంటాయి. అంతా బాగుంటే ఎకరాకు 15 టన్నుల మిరప దిగుబడులు వస్తాయి. అన్ని రకాల ఖర్చులు పోనూ కిలో కనీసం రూ.15 పలికితే కాని మిరపకు గిట్టుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు కనిష్ట స్థాయికి పడిపోవడంతో మిరప రైతులు నిలువునా మోసపోతున్నారు. తెలంగాణ, మహరాష్ట్రలో విపరీతంగా మిరప సాగు, దిగుబడులు రావడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు విశ్లేషిస్తున్నారు. దళారుల దందా కూరగాయల వ్యాపారంలో దళారీలే బాగుపడుతున్నారు. దళారీలు సిండికేట్ అయి ఒక రేటును ఫిక్స్ చేస్తున్నారు. రైతులనుంచి తక్కువ ధరలకు పంట కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నూటికి రూ.10 కమిషన్ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పండించిన పంట అమ్ముకోవాలంటే కమిషన్, బాడిగ, హమలీ ఖర్చుల పోనూ మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు. కూలి డబ్బులుకూడా వచ్చేట్లు లేవు నాకు ఐదెకరాల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో టమాట సాగు చేశాను. ప్రస్తుతం 15 కిలోల టమాట బాక్సును వ్యాపారులు రూ.45 అడుగుతున్నారు. ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కాదుగదా.. కూలీలు కూడా వచ్చేట్టు లేవు.– సుబ్రమణ్యం, బుక్కరాయసముద్రం ధర అధ్వానం నాకు పదెకారల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో డ్రిప్పు ద్వారా మిరప సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కిలో రూ.3, రూ.4కు అడుగుతున్నారు. పంట దిగుబడి ఉన్నా..ధర మాత్రం రావడం లేదు. కేజీ రూ.15 నుంచి రూ.20 పలికి ఉంటే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల దాకా ఆదాయం వచ్చేది. – రవిచంద్రారెడ్డి, సంజీవపురం -
ప్రకృతి సేద్యంలో మేమే మేటి
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రకృతిని కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో ‘సుస్థిర సేద్యం–ఆర్థిక చేయూత–అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర జీఎస్డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిదేనని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం అంటే అత్యధిక వ్యయం, శ్రమతో కూడుకున్నది. భూసారం క్షీణించి పర్యావరణం దెబ్బతింటుంది. ఉత్పత్తి, మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నవి. పంటలు సరిగ్గా పండక గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుంటారు. వాతావరణ మార్పులతో కరవు కాటకాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించడానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ను) ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి సేద్యంలో మీరు ఒక డాలర్ పెట్టుబడి పెట్టినట్లయితే 13 డాలర్ల లాభం వస్తుంది. రసాయన ఎరువులతో వచ్చే దుష్ప్రభావాలు మేం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయంతో తొలగిపోతున్నాయి. సురక్షితమైన, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి సాధ్యమవుతోంది. వ్యవసాయాన్ని మేము లాభసాటిగా తీర్చిదిద్దడంతో ఐటీ నిపుణులు ఆ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. యువతను వ్యవసాయం వైపు ఆకర్శిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారోత్సత్తులు తీసుకుంటుండటంతో తమ ఆరోగ్యం బాగుపడిందని ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించాలన్నదే మా ధ్యేయం. కోర్ డ్యాష్బోర్డును మీకు కనెక్ట్ చేస్తా.. 20 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు 9 లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి. వీరంతా తమ గ్రామాలు దాటి తమ భాష రాని, తమ ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారు. భూమి ఉపరితలంపై కురిసే వర్షపు నీటిని రియల్ టైమ్ మేనేజ్మెంట్ ద్వారా ఒడిసి పడుతున్నాం, భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్పపీడనాలు ఏర్పడి అవి తుపానులుగా మారి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థతో చెప్పగలుగుతున్నాం. న్యూయార్క్లో ఉండి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నేను రియల్ టైమ్ వ్యవస్థ సహాయంతో నిర్వహించగలను. నాకు సీఎం కోర్ డ్యాష్బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్బోర్డును మీకు కనెక్ట్ చేస్తా. మీరు అందులోని అంశాలన్నీ చూడొచ్చు’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. -
దేవుడి భూములకు పంగనామాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే రాజధానిలో ల్యాండ్ పూలింగ్లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది. రైతువారీ పట్టాలు చెల్లవు.. ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
34 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీనికనుగుణంగా 3,140 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సేకరణలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 1,128 ఐఏపీ సెంటర్లు, 1,799 ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలు, 213 ఇతర కేంద్రాలు కలిపి 3,140 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సంఖ్య పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనడం ఆలస్యం చేయొ ద్దని సూచించారు. గ్రేడ్–1 మద్దతు ధర రూ.1,770, కామన్ వెరైటీకి రూ.1,750 ఇస్తామని, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, పాత బ్యాగుల నాణ్యతలో కఠినంగా వ్యవహరించాలన్నా రు. ఈ ఖరీఫ్లో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కేసులున్న మిల్లులకు వద్దు కేసులున్న రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయొద్దని, మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు పోనూ 17 లక్షల టన్నుల బియ్యం నిలువ చేయాల్సి వస్తుందని, అందులో 9.69 ఎల్ఎంటీ సివిల్ సప్లయ్ శాఖ వద్ద అందుబాటులో ఉందని మంత్రికి కమిషనర్ అకున్ సబర్వాల్ వివరించారు. మిగిలిన స్థలాన్ని ఎఫ్సీఐ నుండి తీసుకుంటామన్నారు. -
పత్తి కొనుగోలుకు 386 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి 386 కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్రావు భారత పత్తి సంస్థ (సీసీఐ)ను ఆదేశించారు. అందులో 98 మార్కెట్ యార్డుల్లో, 288 కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయాలన్నారు. 25 ముఖ్య మార్కెట్ యార్డు కేంద్రాల్లో వచ్చే నెల 10లోగా, మిగిలిన కేంద్రాలను 20వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం మార్కెటింగ్, వ్యవసాయశాఖలు, మార్క్ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుముల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెండర్లలో పాల్గొన్న 288 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసేలా జిల్లా కలెక్టర్లు, సీసీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనకపోవడంపై హరీశ్ అధికారులను ప్రశ్నించారు. ఆ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని సీసీఐ సీఎండీని ఫోన్లో కోరారు. అలాగే సీసీఐ సంచాలకులు అల్లిరాణితో ఫోన్లో చర్చించి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత శాతం తేమ ఉండేలా చూసుకోండి... రైతులు పత్తిని మార్కెట్ యార్డులకు తెచ్చేటప్పుడు శుభ్రపరిచి, ఆరబెట్టి తేమ 8% నుంచి 12% మా త్రమే ఉండేటట్లు చూసుకొని తెస్తే సరైన ధర వస్తుం దని దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను హరీశ్ ఆదేశించారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.5,450గా కేంద్రం నిర్ణయించిందని, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా పత్తిని తెచ్చి ఆ మేరకు లబ్ధి పొందాలని రైతులను కోరారు. మొక్కజొన్నల కొనుగోలుకు 259 కేంద్రాలను తెరవాలని మార్క్ఫెడ్ ఎం డీని కోరారు. పెసర కొనుగోలుకు 9 కేంద్రాలను ప్రా రంభించాల్సిందిగా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కందులు, మినుములు, వేరుశనగ మద్దతు ధర కొనుగోలుకు ముందస్తు అనుమతి తీçసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్ఫెడ్, హాకాల ఎండీ సురేందర్రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, మార్క్ఫెడ్ పంట ఉత్పత్తుల సేకరణ మేనేజర్ ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐలకు ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములుండి విదేశాల్లో నివసిస్తున్న(ఎన్ఆర్ఐ) పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేరిట ఉన్న చెక్కులను ఎవరికీ ఇవ్వకపోవడంతో వ్యవసాయశాఖ వద్దే ఉండిపోయాయి. ఒకానొక సందర్భంలో విదేశాల్లో ఉన్నవారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో వ్యవసాయ శాఖ వర్గాలున్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో అనవసరంగా వ్యతిరేకత మూటగట్టుకోవడం అవసరమా అన్న భావనతో ఎన్ఆర్ఐలకు చెక్కులు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దాదాపు 61 వేల మంది ఎన్ఆర్ఐ రైతులకు లబ్ధి కలగనుంది. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, రాష్ట్రం సహా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబసభ్యులకు సొమ్ము... ఈ ఖరీఫ్లో 1.43 కోట్ల ఎకరాల భూమి కలిగిన 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే, ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. రూ. 5,100 కోట్లు రైతులకిచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న 61 వేల మంది పట్టాదారులకు ఇప్పుడు ఎలా ఇవ్వాలన్న దానిపై సర్కారు కసరత్తు చేస్తోంది. అత్యధిక మంది బతుకుదెరువు, వ్యాపార, ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్సహా వివిధ దేశాల్లో ఉంటున్నారు. రైతుబంధు పథకం నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతే స్వయంగా వచ్చి చెక్కు తీసుకోవాలి. ఈ నిబంధన విదేశాల్లో ఉన్న పట్టాదారులకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల డిక్లరేషన్ మేరకు వారి కుటుంబసభ్యులకు చెక్కులిచ్చే అవకాశాలున్నాయి. అయితే, కుటుంబసభ్యులెవరూ ఇక్కడ లేని పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. చనిపోయిన రైతుల పేరుతో 90 వేల చెక్కులు మరో 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరుతో ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో ఉండే 1.14 లక్షల మంది చెక్కుల అందజేతపైనా మీమాంస కొనసాగుతోంది. చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యవసాయశాఖ కమిషనరేట్లో కౌంటర్లు పెట్టి అందజేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పటికీ చెక్కులు జిల్లాల్లోనే ఉన్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా కూడా ఆ చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. -
మళ్లీ యూటర్న్
తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రైతులను మళ్లీ మోసం చేసింది. ఆక్వా చెరువులకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో హడావిడిగా తాను కూడా చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆచరణలో అమలు చేయలేదు. తాజాగా జారీచేసిన జీవో ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా యూనిట్కు రూ.3.86 రైతులు చెల్లిస్తే... తర్వాత మత్స్యశాఖ ద్వారా రూ.1.86 వెనక్కి చెల్లిస్తామని పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆక్వా సాగు 72,945 హెక్టార్లు ఉండగా 29,922 కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద జరిగే సాగులో 40 శాతం వరకూ జిల్లాలోనే జరుగుతోంది. ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో అక్వా రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని, కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో మే నెలలో జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్ చార్జీలను యూనిట్ రూ.3.80 నుంచి రూ.1.50కి, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు ఏడు రూపాయల నుంచి రూ.ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్స్టోరేజి, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతానని, నాలుగో ఏడాది నుంచి ఆక్వాకు మద్దతు ధర ప్రకటిస్తానని ఆయన çహామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై జగన్ సీరియస్గా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 26న హడావిడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. విద్యుత్ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయినా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కరెంటు బిల్లులు యూనిట్ రూ.3.80 టారిఫ్తోనే వచ్చాయి. ప్రస్తుతం జీవో విడుదల చేస్తూ రైతులు ముందు రూ.3.86 చొప్పున బిల్లులు చెల్లిస్తే తర్వాత రూ.1.86 మత్స్యశాఖ నుంచి ఇప్పిస్తామని అందులో పేర్కొన్నారు. మత్స్యశాఖ ద్వారా చెల్లింపులేంటి? వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం 2017–18లో రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు రూ. 42,110 కోట్లు కాగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగువేల కోట్ల పైగా ఆదాయం వస్తోంది. కానీ 2018–19 బడ్జెట్లో మత్స్యశాఖకు కేటాయింపులు కేవలం రూ. 386 కోట్లు మాత్రమే. ఇవి మత్య్సకారుల సంక్షేమానికి సరిపోవడం లేదు. అటువంటప్పుడు మత్స్యశాఖ ద్వారా చెల్లిస్తాననడం వంచన అని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాలో విద్యుత్ కనెక్షన్లు భూయజమానుల పేరుతో ఉన్నాయి. బిల్లులు చెల్లించేది కౌలు రైతులైతే, భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 1980 నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్దారులు అనేక మంది చనిపోయారు. ప్రస్తుతం భూములు వారి వారసుల పేరుతో ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సమస్యాత్మకంగా మారతాయని ఆక్వారైతులు అంటున్నారు. ఆక్వాపై చంద్రబాబు హైడ్రామా ఆక్వా రైతులపై చంద్రబాబు మళ్లీ డ్రామా ఆడుతున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించామని చెబుతూ రైతుల వద్ద నుంచి పాత బకాయిలు వసూలుకు మార్గం చూసుకున్నారు. ఓవర్లోడ్, ఏసీడీల పేరుతో భారీగా బిల్లులు వేసి, వాటిని చెల్లిస్తేనే రాయితీ ఇస్తాననడం సరికాదు. బిల్లు ఏక మొత్తంలో చెల్లించిన తరువాత తగ్గించిన సొమ్ము తిరిగి బ్యాంకు అకౌంట్లో యజమాని పేరున వేస్తాననడం విడ్డూరంగా ఉంది. చెరువులు సాగుచేసే లీజుదారులు లక్షలు వెచ్చించి రొయ్యల సాగు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల రాయితీల పేరుతో బకాయిలు గుంజడానికే చంద్రబాబు ఎత్తుగడ. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు నష్టాలతో విద్యుత్ బకాయిలు పడ్డారు. తగ్గించిన సొమ్మును మినహాయించుకుని బిల్లు చెల్లించే పద్ధతి తీసుకురావాలి. – వేగేశ్న వెంకట్రాజు (యండగండి శ్రీను), ఆక్వా రైతు, చినకాపవరం రాయితీ పేరుతో భారీ మోసం విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆక్వా రైతుపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రొయ్యల రైతుల విద్యుత్ బకాయిలు ముక్కుపిండి వసూలు చేసేందుకు విద్యుత్ బిల్లుల రాయితీలు ప్రకటించారు. విద్యుత్ బిల్లులో తగ్గించిన యూనిట్ ధరను యథావిధిగా ఎందుకు వసూలు చేయరు. డొంకదారుల్లో రాయితీలు ఇస్తాననడం చంద్రబాబు వంచన యోచనలో భాగం. యూనిట్కు రూ.1.86 పైసలు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ సొమ్మును బిల్లులోనే తగ్గించి చెల్లించే విధంగా రైతులకు అవకాశం కల్పించాలి. పాత బకాయిల పేరుతో చార్జీలు తగ్గించకపోవడం దారుణం. – గొట్టుముక్కల సూర్యనారాయణరాజు (సూరిబాబు), ఆక్వా రైతు, ఆకివీడు -
దిగుబడికి దెబ్బే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 670 మండలాలకుగాను 394 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందని వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ.. రెండు సీజన్లలో కలిపి 186.41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఒక్క ఖరీఫ్లోనే అత్యధికంగా 98.07 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం, అదును తప్పి కురుస్తున్న వర్షాలతో పంటల సాగు గాడి తప్పింది. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. అలాగే, రాష్ట్రంలో చిరుధాన్యాలు, నూనె గింజల పంటల పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఏం చేయాలో అర్ధంకాక వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. దిగుబడి తగ్గితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 30 శాతం వ్యవసాయ రంగం వాటా తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆహార సంరక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో 16.55 శాతం అధికంగా వృద్ధి సాధించడం సాధ్యమయ్యే పనిగా కనిపించడంలేదు. ప్రధాన పంటల పరిస్థితి ఇలా.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో గుర్తించిన 23 అభివృద్ధి సూచికలలో 9 పంటల్ని ఎంపిక చేశారు. వాటిలో వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, ప్రత్తి, చెరకు, పొగాకు ఉన్నాయి. అయితే, వీటిల్లో ప్రస్తుతం ఏ ఒక్క పంట కూడా సరిగ్గాలేదు. 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 186.41 లక్షల మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. వరిలో 14 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, అపరాలలో 33 శాతం, నూనె? గింజల్లో 30 శాతం పెరుగుదల నమోదు చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ గాడి తప్పింది. ఇప్పటికే తొలిదశలో పంట దెబ్బతింది. ప్రస్తుత ఖరీఫ్లో వేరుశనగ దిగుబడిని 10.28 లక్షల టన్నులుగా అంచనా వేసినా అది ఇప్పుడు 2–3 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. భారీగా తగ్గనున్న దిగుబడి ఇదిలా ఉంటే.. ఖరీఫ్లో మొత్తం 98.07 లక్షల టన్నుల దిగుబడి లక్ష్యం కాగా.. ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 20 లక్షల టన్నులకు పైగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాధార పంటలు సాగుచేసే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పంట ఉత్పత్తులు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక్కడ వర్షాభావంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా యావత్తు తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. తుపానో, వాయుగుండమో వస్తే తప్ప ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు. రాయలసీమలో ప్రధాన ఖరీఫ్ పంట వేరుశనగను సుమారు 9.25 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారమే 6.60 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. అయితే, ఈ పంటలో మూడొంతులు వాడు ముఖం పట్టింది. ఫలితంగా దిగుబడి లక్ష్యం 10.28 లక్షల మెట్రిక్ టన్నులు నెరవేరే సూచనలు కనిపించడంలేదు. అపరాలదీ అదే పరిస్థితి. వరి సాగు విస్తీర్ణం కూడా లక్ష్యానికి దూరంగానే ఉంది. వరి పంట చేతికి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున దిగుబడులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. దేశంలో 7.3మిలియన్ టన్నుల అధిక దిగుబడి గత ఏడాది కంటే ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 284.80 మిలియన్ టన్నులకు చేరే అవకాశముందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది కంటే ఇది 7.3 మిలియన్ టన్నులు ఎక్కువని కేంద్రం చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వరుస కరువులతో రైతులు అల్లాడుతున్నారు. దిగుబడులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కంటే 7.3 శాతం, అపరాలు 9 శాతం పెరిగితే రాష్ట్రంలో ఈ పంటలు సైతం తిరోగమనంలో ఉండడం గమనార్హం. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
అమరావతిలో అసైన్డ్ భూముల రైతులు విడుదల
-
రాజధానిలో ‘భూ’మంతర్
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు: 2,028 ఎకరాలు లంక, శివామ్ జమీందార్ భూములు: 2,284 ఎకరాలు ఎకరం అసైన్డ్ జరీబు భూమి విలువ: దాదాపు రూ.2.28 కోట్లు ఎకరం అసైన్డ్ మెట్ట భూమి విలువ: దాదాపు రూ.2.02 కోట్లు సాక్షి, తుళ్లూరు: రాష్ట్ర రాజధాని అమరావతిలో పేద దళిత, గిరిజన రైతులను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు దారుణంగా వంచించారు. భూసమీకరణ కింద పరిహారం రాదంటూ మభ్యపెట్టి అసైన్ట్ భూములను కారుచౌకగా కొట్టేశారు. వాటిని భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి, పరిహారం కింద నివాస, వాణిజ్య స్థలాలు సొంతం చేసుకున్నారు. అమాయక దళిత, గిరిజనుల భూములను లాక్కోవడానికి భూబకాసురులు సాగించిన కుట్రలు, కుతంత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం సర్కారు మోసపూరితంగా వ్యవహరించింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తారనే ప్రకటన వచ్చాక ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల కన్ను పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై పడింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు. వీటిని 1954, 1971, 1976, 2005 సంవత్సరాల్లో భూమిలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం పంచి పెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. వీటి అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. బినామీలతో తప్పుడు ప్రచారం అసైన్డ్ భూములను గతంలో ప్రభుత్వాలే ఇచ్చాయి కాబట్టి వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏ వెనక్కి తీసుకుని పైసా కూడా పరిహారం ఇవ్వదు అంటూ టీడీపీ నాయకులు, మంత్రులు తమ బినామీలతో ప్రచారం చేయించారు. ఇప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత సొమ్ము వస్తుందంటూ అసైన్డ్ భూముల అనుభవదారులను మాటలతో వంచించారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు కూడా వంతపాడారు. దీంతో భయాందోళనకు గురైన అసైన్డ్ రైతులు తమ భూములను నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసి ఇచ్చేశారు. ఆ వెంటనే సీఆర్డీఏ అధికారులు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించారు. తక్కువ ధరకు పేదల నుంచి భూములను కొట్టేసిన బడాబాబులు వాటిని ప్రభుత్వానికి ఇచ్చి, భారీగా పరిహారం జేబులో వేసుకున్నారు. అసైన్డ్ రైతులకు తీరని అన్యాయం అధికార పార్టీ నేతలు అసైన్డ్ రైతులను బెదరగొట్టి ఎకరా భూమికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపే చెల్లించారు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం.. ఎకరానికి 500 గజాల చొప్పున నివాస స్థలం, 100 గజాల చొప్పున వాణిజ్య స్థలం దక్కించుకున్నారు. నివాస స్థలం గజం విలువ రూ.22,000, వాణిజ్య స్థలం రూ.26,000 పలుకుతోంది. దాని ప్రకారం 500 గజాల విలువ రూ.1.10 కోట్లు. 100 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.26 లక్షలు. అంటే ఎకరానికి రూ.1.36 కోట్ల విలువ ఉంది. అసైన్డ్ రైతులే తమ భూములను నేరుగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే జరీబు ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం దక్కేది. 800 గజాల నివాస స్థలం విలువ రూ.1.76 కోట్లు, 200 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.52 లక్షలు. అంటే ఎకరం భూమిని కారుచౌకగా ప్రభుత్వ పెద్దలకు విక్రయించడం వల్ల అసైన్డ్ రైతు రూ.2.28 కోట్లు నష్టపోయినట్లు లెక్క. మెట్ట భూమి ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఈ లెక్కన ఎకరం మెట్ట భూమి విలువ రూ.2.02 కోట్లు. జరీబు రైతులకు రూ.50 వేలు, మెట్ట రైతులకు రూ.30 వేల చొప్పున పదేళ్లపాటు ప్రభుత్వం నుంచి పరిహారం ఆందుతుంది. ఈ పరిహారాన్ని కూడా అసైన్డ్ రైతులు కోల్పోయారు. మా భూములు మాకిప్పించండి ‘‘రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నాయకులు తమ బినామీలను గ్రామాల్లోకి పంపించి.. అసైన్డ్ భూములకు పరిహారం రాదు, వీటిని తీసేసుకుంటుంది, కొనేవాళ్లు దొరికితే ఇప్పుడే అమ్మేసుకోండి అంటూ పుకార్లు పుట్టించారు. అధికారులు కూడా ఇవే మాటలు చెప్పారు. దీంతో భయపడి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఆ భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి’’ – పొన్నూరి నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఉద్ధండ్రాయునిపాలెం చట్టం.. మాకు చుట్టమే! చట్టం ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయకూడదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆయా భూములను తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికి ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేద కుటుంబాలకు పంపిణీ చేయాలి. అయితే, అధికార పార్టీ నాయకులు చట్టాన్ని సైతం లెక్కచేయలేదు. అసైన్డ్ రైతులను భయపెట్టి భూములను లాగేసుకున్నారు. ఇదంతా బహిరంగంగానే జరిగినా అదేమిటని అడిగే నాథుడే లేకుండాపోయాడు. -
మద్దతు దక్కేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీ ఐ) ఏర్పాట్లు చేస్తోంది. పత్తికి మద్దతు ధర కల్పించడానికి సీసీఐ ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో 68 వేల హెక్టార్లలో సుమారు లక్ష మందికిపైగా రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రస్తుతం పత్తి వివిధ దశల్లో ఉంది. మాడ్గుల, కొందర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వర్షానికి వర్షానికి మధ్య చాలా రోజుల విరామం ఉండడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు పోషకాల లేమి కూడా ఎదురైంది. దీంతో పూర్తిస్థాయిలో పూత దశకు చేరుకోలేదు. నవంబర్ రెండో వారం నుంచి పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ లోగా అంటే న వంబర్ ఒకటి కల్లా కొనుగోలు కేం ద్రాలు తెరచాలన్న యోచనలో సీసీఐ ప్రతిని ధులు ఉన్నారు. గతేడాది వరకు దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వారు నిర్ణయించిందే ధరగా రైతు లు అమ్ముకున్నారు. ఈసారి ఇటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతుకు ‘మద్దతు’.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది వరకు క్వింటా పత్తి రూ.4,320 ఉండగా దీన్ని తాజాగా రూ.5,450కు పెంచడం విశేషం. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించే అంశం. రైతులు పత్తిని వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మేలు జరుగుతుంది. ఈ మేరకు త్వరలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి వివిధ సాకులతో తక్కువ ధరకు పత్తిని వ్యాపారులు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరకు కాస్త అటుఇటుగా లాభపడ్డారు. అయితే రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్ బార్ కోడ్ కార్డులు రైతులకు ఆలస్యంగా అందజేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గతేడాది అందజేసిన క్యూర్ బార్ కోడ్ కార్డుల ద్వారానే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతుల వద్ద ఆ కార్డులు ఉన్నాయి. ఐదేళ్లపాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయదేవి తెలిపారు. కార్డులు లేని రైతులు ఆధార్కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, వ్యవసాయ అధికారుల ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్రైవేటు దోపిడీ
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: సాగర్ కుడి కాలువ కింద నీటిని విడుదల చేస్తున్న ప్రభుత్వం రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తనాల కోసం బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులు ఏ రకం విత్తనాలు సాగు చేయాలో సూచించిన ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే అదనుగా వ్యాపారులు విత్తనాల ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 25 కేజీల బస్తా విత్తనాలపై రూ.800 నుంచి రూ.1500 వరకు పెంచారు. దీంతో రైతులకు విత్తన కొనుగోల్లు భారంగా మారాయి. ఈ ధరలకు పేదరైతులు విత్తనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, విత్తన వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని, ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఎన్ఎల్ఆర్ 145 ఇవ్వని ప్రభుత్వం.. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో వరిసాగు కానుంది. కొమ్మమూరు కెనాల్ పరిధిలో 72,800 ఎకరాలు ఉండగా గుండ్లకమ్మతో పాటు చెరువుల పరిధిలోని ఆయకట్టుతో కలుపుకుంటే మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తొందరగా దిగుబడి ఇచ్చే వరి రకాలను సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రధానంగా ఎన్ఎల్ఆర్ 34449 తోపాటు ఎన్ఎల్ఆర్ 145 రకాలను సాగు చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వమే ఏపీ సీడ్స్ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని అధికారులు ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం సాగవనున్న విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. ఏపీ సీడ్స్ వద్ద మూడు వేల క్వింటాళ్ల ఎన్ఎల్ఆర్ 34449 రకం విత్తనాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా రైతాంగం దాదాపు 50 శాత విస్తీర్ణంలో ఎన్ఎల్ఆర్ 145 రకం వరి సాగుచేస్తారు. ఈ రకం తక్కువ నీటితో పండించుకోవచ్చు. పైపెచ్చు 130 రోజుల్లోనే పంటకాలం ఉంటుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో వినియోగిస్తుంది . దీంతో రైతులు సులభంగానే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకొనే వెసులు బాటు ఉంటుంది. అందుకే రైతులు ఈ రకం వరి విత్తనాలకోసం ఎదురు చూస్తుంటారు. కానీ ప్రభుత్వం ఎన్ఎల్ఆర్ 145 రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకరాలేదు. ఎన్ఎల్ఆర్ 34449 విత్తనాలను.. అది కూడా 80 వేల క్వింటాళ్లు అవసరమైతే మూడు వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలు 12 వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి. దీంతో రైతులు రెండు రకాల విత్తనాలకోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుబాటులో లేని ఎన్ఎల్ఆర్ రకం.. ప్రభుత్వం ఏపీ సీడ్స్ ద్వారా తగినన్ని విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు అధిక రేట్లకు కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఎన్ఎల్ఆర్ 34449 రకం విత్తనాలు (25 కిలోల బస్తా) కిలో రూ.28.15 ప్రకారం రూ.703.75గా ఉంది. ప్రభుత్వం కిలోకు రూ.5 సబ్సీడీ ఇస్తోంది. సబ్సీడీ పోను రైతు రూ.588.75 చెల్లించాలి. కానీ ఇవే ఇత్తనాలు బయట మార్కెట్లో రూ. 1300 అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో రైతు అదనంగా రూ.711.25 చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు 50 శాతం రైతులు సాగు చేసే ఎన్ఎల్ఆర్ 145 రకం విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో రైతుల ఈ రకం విత్తనాలను ప్రైవేటు వ్యాపారుల వద్ద అధికధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్ఎల్ఆర్ 145 రకం 30 కిలోల బస్తా రూ.2 వేల నుంచి 2200 వరకూ అమ్ముతున్నారు. ఇది రైతులు కొనలేని ధర. ఒకరకంగా చెప్పాలంటే వ్యాపారులు అవకాశం చూసుకొని దోపిడీ చేస్తున్నట్లే. ఒక పక్క ఎన్ఎల్ఆర్ 145 రకం విత్తనాలు అధికంగా సాగుచేయాలని సూచిస్తున్న వ్యవసాయాధికారులు విత్తనాలను మాత్రం సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు అధికారులు సీడ్ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వం ద్వారా విత్తనాలు సరఫరా చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీని వెనుక రూ.కోట్లలో చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తోంది. పశ్చిమ ప్రకాశం తో పాటు తూర్పు ప్రాంతంలోనూ పంటలులేవు. దీంతో రైతాంగం కుదేలయింది. ఈ పరిస్థితిలో ఈ ఏడాది సాగర్ నీళ్లు వస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా ఒక పండించుకుందామంటే కొనలేని పరిస్థితిలో విత్తనాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటు దోపిడీని అరికట్టాల్సి ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు వరి విత్తనాలను సరఫరా చేయాలి. -
రాజధానికి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వం కక్ష సాధింపు
-
రాజధానికి భూములు ఇవ్వలేదని..
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా పొలాలకు వెళ్లే వాటర్ పైపులను అధికారులు పగలగొట్టారు. దీనిపై వివరణ అడిగితే.. నిడమర్రు ఈ16 నిర్మాణం కోసమే వాటర్ పైపులు పగలగొట్టామని అధికారులు కాకమ్మకబుర్లు చెబుతున్నారు. కానీ రెండు రోజులుగా నీరు వృథాగా పోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే వాటర్పైపులు పగల కొట్టవద్దంటూ స్థానిక రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వారు అనుకున్న పని చేశారని రైతులు మండిపడ్డారు. తమ పొలాలకు నీరు వచ్చే మార్గం అదొక్కటేనని, ఇప్పుడు అధికారులు ఇలా చేయడంతో పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. పగల కొట్టిన పైపులకు మరమ్మత్తులు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
అనుమతి లేని నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఆగ్రోస్లో టార్పాలిన్ల విక్రయాలపై దుమారం చెలరేగుతోంది. సర్కారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా టార్పాలిన్లను సబ్సిడీపై రైతులకు సరఫరా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీని నిర్ణయించడంలో కానీ, వాటి ని రైతులకు సరఫరా చేసే అంశంపైకానీ ఏదీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. దీంతో రైతులకు ఇచ్చిన సబ్సిడీని ఎవరు చెల్లించాలి, దీనికి ఎవరు బాధ్యులన్నది చర్చనీయాంశమవుతోంది. సరఫరా కంపెనీలతో కొందరు కుమ్మక్కు కావడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టార్పాలిన్ల విలువ రూ. 5.4 కోట్లు... ఈ ఏడాది రైతులకు రూ.5.4 కోట్ల విలువైన టార్పాలిన్లను సబ్సిడీపై సరఫరా చేయాలని ఆగ్రోస్లో కొందరు నిర్ణయానికి వచ్చారు. వచ్చిందే తడవుగా జాబితాల్లో ఉన్న కంపెనీలతో మాట్లాడారు. సాధారణంగా బయట ఒక్కో టార్పాలిన్ ధర రూ. 2,500 కాగా, ఆగ్రోస్ ద్వారా రూ. 2,350కే రైతులకు ఇవ్వాలనుకున్నారు. అంటే బయటకంటే రూ. 150 తక్కువకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో రైతులకు సగం సబ్సిడీ ఇచ్చారు. అంటే వారికి రూ. 1175కు ఒక్కో టార్పాలిన్ను విక్రయించారు. మిగిలి న సగం ప్రభుత్వం భరించాలన్నమాట. ఈ వ్యవహా రానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాక, వ్యవసాయశాఖకు చెందిన మండల ఏవోల ద్వారా వాటిని రైతులకు విక్రయించారు. రైతుల వాటా సొమ్ము రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించారు. ప్రభుత్వ వాటాగా మరో రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఆ సొమ్మును చెల్లింపులపై ఇప్పుడు ఆగ్రోస్లో అంతర్మథనం మొదలైంది. అలాగనీ ఆగ్రోస్ భరించే స్థితిలో లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినా లభించే అవకాశాలు లేవు.దీంతో ఆగ్రో చిక్కుల్లో పడింది. అవును నిజమే: ఆగ్రోస్ ఎండీ ఈ విషయంపై ప్రస్తుత ఆగ్రోస్ ఎండీ సురేందర్ను వివరణ కోరగా, అనుమతి లేకుండా టార్పాలిన్లు విక్రయించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. తాను ఇటీవలే ఆగ్రోస్ బాధ్యతలు తీసుకున్నానని, తనకు పూర్తి వివరాలు తెలియవన్నారు. -
దళితుల భూపంపిణీకి ఎన్నికల జోష్
సాక్షి, హైదరాబాద్: దళితుల భూపంపిణీ పథకంపై ఎన్నికల ప్రభావం పడింది. రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు తగ్గుతున్న క్రమంలో ఈసారి అతి తక్కువ లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేవలం 159 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకుగాను రూ.4.06 కోట్లు అవసరమని ప్రణాళికలో పేర్కొంటూ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల సీజన్ వచ్చిన దళితుల భూపంపిణీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1,900 మంది రైతులకు భూపంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి రూ.407.32 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ఎక్కడ ? గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో ప్రభుత్వం దళితుల భూపంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, లక్ష్య సాధన సులువు కాదనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్థి రంగం పుంజుకుంది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి. ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల భూపంపిణీ పథకానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయడం ఎస్సీ కార్పొరేషన్కు కష్టంగా మారింది. అన్ని వసతులతోపాటు సాగుకు యోగ్యమైన భూమినే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఎకరాకు రూ.7లక్షలు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం తాలూకు సాధనే కష్టమైందని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
మొక్కజొన్న గజగజ
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. మొదట్లో సిద్దిపేట, మెదక్ జిల్లాలకే పరిమితమైన కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) ఆ తర్వాత గత వారంలో 8 జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 17 జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, గద్వాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నివేదిక తెలిపింది. అలాగే పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి విస్తరించింది. గత వారం వ్యవసాయ శాఖ వర్గాల లెక్కల ప్రకారం మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కనిపించిన గులాబీరంగు పురుగు, ఇప్పుడు ఏకంగా మరో 12 జిల్లాలకు విస్తరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ కనిపించింది. మొక్కజొన్నపై కత్తెర, పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తున్నా చర్యలు చేపట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. కోటి ఎకరాల్లో పంటల సాగు... ఖరీఫ్ సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికి 1.01 కోట్ల ఎకరాలకు అంటే 93 శాతానికి చేరింది. అందులో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 44.71 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 49.06 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.91 లక్షల(94%) ఎకరాల్లో సాగయ్యాయి. ఆహార పంటల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.11 లక్షల (102%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు సాధారణం కంటే గణనీయంగా పుంజుకున్నాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.48 లక్షల (86%) ఎకరాల్లో సాగైంది. కంది 97%, పెసర 72% సాగయ్యాయి. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఏదీ? ఇటీవల కురిసిన వర్షాలకు అనేకచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అనేక జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవిగాక పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టం ఇంత పెద్ద ఎత్తున ఉన్నా వ్యవసాయశాఖ కేవలం ప్రాథమిక నివేదిక వరకే పరిమితమైంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పంపించలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కనీసం ప్రాథమిక నివేదిక కూడా తమకు చేరలేదని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 614.5 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 584.1 ఎంఎంలు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లో ఇప్పటివరకు ఈ ఐదు రోజుల్లో 74 శాతం లోటు నమోదైంది. ఇటీవల భారీగా వర్షాలు కురిసినప్పటికీ ఇప్పటికీ 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, నాగర్కర్నూలు, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో లోటు నమోదైంది. -
ఎరువు.. బరువు
సాక్షి భూపాలపల్లి: ఇప్పటికే విపరీతమైప ఒడిదుడుకుల మధ్య సేద్యం సాగుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కుదేలైన అన్నదాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరోవైపు గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగు వంటి చీడపీడల ఉధృతికి వ్యవసా యం భారంగా మారుతోంది. దీనికి తోడు ప్రస్తుతం పెరిగి న ఎరువుల ధరలు అన్నదాతకు మరింత భారంగా పరిణమించాయి. ప్రభుత్వం పంపిణీ చేసే యూరియా మినహాయించి మిగతా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై రూ.50 నుంచి 100 వరకు ధరలు పెరిగాయి. రైతుకు ఎకరాకు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.4000లకు మించి వ్యయం అవుతోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం జిల్లాలో రైతుల పరిస్థితి అంత బాగోలేదు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, కొత్తగా మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు రూపంలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని అదుపు చేయడానికే రసాయ న మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి అదనంగా రెండు నుంచి మూడు వేల రూపాలయల ఖర్చు అవుతోం ది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పంటల చేలల్లో వర్షపునీరు నిలవడంతో మొక్కల ఎదుగుదల లోపించింది. వారం రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మరో మారు ఎరువుల ధరలు పెరిగాయి. ఐదు నెలల్లో పెరగడం ఇది మూడోసారి. దీంతో వ్య యం కాస్త ఎకరానికి మరో వెయ్యిరూపాయలు పెరగనుంది. మున్ముందు కాలం ఎట్లుంటుందో తెలియదు. దిగుబడి ఏమేరకు వస్తదో.. ధర ఎట్టుంటదో.. ఇప్పుడు మాత్రం పెట్టుబడి ఎక్కువైతాంది.. అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. అధికమైన ఎరువుల వినియోగం రెండు వారాల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట పొలాల్లో ఎరువులు చల్లుతూ రైతులు బీజీగా ఉన్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట పండిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆశించిన విధంగా పత్తి, ఇతర పంటల్లో ఎదుగుదల లోపించింది. మొక్కల పెరుగుదల కోసం ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం అన్ని పంటకు కలిపి దాదాపు 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగుచేస్తుండడంతో రైతులు యూరియా, డీఏపీ, 20–20 ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో డీఏపీ, 20–20 కూడా ఉన్నాయి. డీఏపీ ప్రతి బస్తాపై రూ.180, 20–20 బస్తాపై రూ.100 పెరిగింది. ప్రభుత్వం యూరియా బస్తాను 5 కిలోలు తగ్గించినా ధర రూ.290 దగ్గరే ఉంచింది. డీపీపీ బస్తా ధర మొదట్లో రూ.1081 ఉండగా తాజాగా 1,330కి పెరిగింది. అయితే ఇందులో జింక్, వేప æకలిపిన డీపీపీతోపాటు సాధరణ డీఏపీలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ డీఏపీ రూ.1,290, కోటెడ్ డీఏపీ పేరిట బస్తాకు రూ.40 నుంచి రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. -
ఢిల్లీలో కదం తొక్కిన రైతు,కార్మిక సంఘాలు
-
రైతు సొమ్ము.. రాబందుల పాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సొమ్ముపై రాబందుల కన్ను పడింది. రైతులకు పెట్టుబడి కింద ఇస్తున్న సొమ్మును కొన్నిచోట్ల అక్రమార్కులు కాజేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెట్టుబడి మొత్తాన్ని స్వాహా ఘటన వెలుగు చూడటంతో సర్కారు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఎంతో పకడ్బందీగా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్రమాలు జరగడం ఆగలేదు. ఇందులో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. పెట్టుబడి సొమ్మును బ్యాంకు, రెవెన్యూ అధికారులతోపాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు ప్రాథమిక విచారణలో ఈ మేరకు వెల్లడైంది. సుమారు రూ.70 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ అయింది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కూ డా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. మిగిలిన చెక్కులు 7.7 లక్షలు గత మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.7 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్న దాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొందరి పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. అందులో విదేశాల్లో ఉన్నవారి పేరు మీద దాదాపు 70 వేలు, చనిపోయిన రైతుల పేరు మీద లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. కొన్ని రకా ల చెక్కుల్లో లోపాలున్నందున వాటిని తీసుకొచ్చే రైతులకు సొమ్ము చెల్లించవద్దని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. వాటిని విత్హోల్డ్లో పెట్టా లని ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండలో ‘విత్ హోల్డ్’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. నల్లగొండలోని నాంపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాం కు క్యాషియర్, ప్రభుత్వాధికారులు, బయటి వారితో కలిసి సొమ్మును కాజేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, దేవర కొండ, చండూరు మండలాలకు చెందిన విత్హోల్డ్లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు నుంచి ఎలా కొట్టేశారు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్బీఐ క్యాషియర్.. విత్హోల్డ్లో ఉంచిన రైతుబంధు చెక్కులను రెవెన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. అయితే రైతుల వద్ద ఉన్న చెక్కులను రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు మిగిలిపోయిన చెక్కులను ప్రభుత్వం ఇంకా జిల్లాల్లోనే ఉంచడంలో అర్థం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా విదేశాల్లో ఉన్న పట్టాదారు చెక్కులను పంపిణీ చేయడంలో తాత్సారం చేస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ను ఆదేశించాం పెట్టుబడి చెక్కుల సొమ్మును కాజేసిన అంశంపై విచారణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ను ఆదేశించాం. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే బ్యాంక్ క్యాషియర్పై కేసు నమోదైంది. కలెక్టర్ నుంచి రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది. పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా...
అటు వ్యవసాయరంగంలోని రైతులు, వ్యవసాయకార్మికులు, ఇటు పారిశ్రామికరంగంలోని ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామికులు దేశం నలుమూలల నుంచి కదిలారు. శ్రమశక్తినే నమ్ముకున్న ఈ శ్రామికవర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా తమ మౌలికసమస్యల పరిష్కారానికి గళమెత్తారు. కార్మికులు, కర్షకులు భుజం, భుజం కలిపి ఏకతాటిపై నడిచారు. అంగన్వాడి, ఆశావర్కర్లు, ఇలా వివిధరంగాలకు చెందిన కార్మిక,కర్షకలోకం వెంట నడిచింది. బుధవారం ఢిల్లీ నడివీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. చలోపార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం 23 రాష్ట్రాల నుంచి రైతులు, కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్న వారందరికీ రామ్లీలా మైదానంలోనే టెంట్లు, ఇతరత్రా ఏర్పాట్లతో తాత్కాలికంగా బస ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి నేలంతా బురదమయమై చిత్తడిగా మారింది. ఈ ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా చాలా మంది రైతులు, కార్మికులు అక్కడే ఎలాగోలా సర్దుకున్నారు. మిగతావారిని గురుద్వారాలు, సాహిబాబాద్లోని క్యాంపులు, విడిదికేంద్రాలకు వాలంటీర్లు తరలించారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వచ్చిన పలువురు శ్రామికులు, కర్షకులు అనారోగ్యం బారిన కూడా పడ్డారు. జ్వరం, జలుబు, డయేరియా వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఢిల్లీ ప్రభుత్వ సంచార ఆరోగ్యపథకం పరిధిలోని నలుగురు డాక్టర్ల బృందం సపర్యలు చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 699 మందికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఈ బృందంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్కుమార్ సాహు తెలిపారు. గత మార్చినెలలో నాసిక్ నుంచి ముంబై వరకు నిర్వహించిన రైతుల ‘మహాపాదయాత్ర’లో పాల్గొన్న వారిలో 5 వేల మంది ఈ ర్యాలీలోనూ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి మరో బృందం మణిపూర్ నుంచి పయనమైంది. మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ నుంచి ఓ రైతుల బృందం దేశ రాజధానికి వచ్చి చేరింది. బిహార్ నుంచి వచ్చిన మహిళా రైతులు, కార్మికుల బృందం తమ జానపద నృత్యాల ద్వారా ఢిల్లీ నిరసనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని ఆదిలాబాద్, తదితర ప్రాంతాల నుంచి అంగన్వాడి స్కూల్ టీచర్లుగా, వర్కర్లుగా పనిచే స్తున్న మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఎం అనుబంధ సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), అఖిల భారత కిసాన్ సభ, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లు... స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలో భాగంగా రైతులకు గిట్టుబాటుధరలు, సకాలంలో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ధరల పెరుగుదల నియంత్రించి, ప్రజాపంపిణీ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు, ఉపాధి కల్పనకు గట్టి చర్యలు తీసుకోవాలి. రైతుల పంటరుణాల మాఫీ, కార్మికచట్టాల సక్రమ అమలు, నెలకు కనీస వేతనంగా రూ. 18 వేలు, మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, దేశవ్యాప్తంగా కోటి మంది అంగన్వాడి వర్కర్లు, అక్రిడేటెడ్ సోషల్ హెఃల్త్ యాక్టివిస్ట్లను కార్మికులుగా ప్రభుత్వ గుర్తింపు. -
భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబీమా
నల్లగొండ అగ్రికల్చర్ : ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం భూమి ఉన్న ప్రతి రైతుకూ వర్తిస్తుంది. బాండ్లు రాలేదని దిగులుపడాల్సిన అవసరం లేదు. పాస్బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ జిరాక్స్లను తీసుకెళ్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేయించాలి. ఆన్లైన్లో నమోదు అయిన నాటి నుంచి రైతు బీమా వర్తిస్తుంది’’ అని జేడీఏ జి.శ్రీధర్రెడ్డి తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో జేడీఏ’ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు పట్టాదార్ పాస్బుక్కులు, రైతు బంధు చెక్కులు, బీమా పథకం, విత్తనాల పంపిణీపై ఉన్న సందేహాలను ‘జేడీఏ’తో ఫోన్లో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. ఎక్కువ మంది పట్టాదార్ పాస్బుక్కులు, రైతు బంధు చెక్కుల గురించే మాట్లాడారు. రైతుల ప్రశ్నలు, జేడీఏ సమాధానాలు వారి మాటల్లోనే... ప్రశ్న : మట్టినమూనా పరీక్షలను ఎక్కడ చేయించాలి – మురళీయాదవ్, మిర్యాలగూడ జేడీఏ : మిర్యాలగూడలోని భూసార పరీక్షాకేంద్రంలో మట్టినమూనాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రశ్న : పాస్బుక్కు, చెక్కు రాలేదు – ఎల్లయ్య, పోలంపల్లి, చందంపేట జేడేఏ : మీ తహసీల్దార్ను సంప్రదించండి, పాస్బుక్కు వచ్చిన తరువాత రైతుబంధు చెక్కును ఇప్పిస్తాం. ప్రశ్న : పత్తిలో వేరుపురుగు వచ్చి చెట్లు చచ్చిపోతున్నాయి. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి శ్రీనివాస్ మాడుగుల పల్లి జేడీఏ : ట్రైకోడర్మవిరిడిని నీటిలో కలిపి చెట్టు వేర్ల దగ్గర తడిచే విధంగా పోయండి. సూక్మపోషకాలను పిచికారీ చేయండి. దీంతో పురుగు నాశనమవుతుంది. ప్రశ్న : పాస్బుక్కు రాలేదు, బీమా వర్తిస్తుందా? భిక్షం, మిర్యాలగూడ జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి ఆన్లైన్లో నమోదు చేయించండి. నమోదు అయిన నాటినుంచి బీమా వర్తిస్తుంది. ప్రశ్న : రైతుబంధు చెక్కులు ఎప్పుడు వస్తాయి? పల్లె క్రిష్ణయ్య, వేములపల్లి జేడీఏ : పాస్ బుక్కులు వచ్చిన తరువాత రైతు బంధు చెక్కులు వస్తాయి. ప్రశ్న : రైతు బీమా పధకానికి ఎక్కడ అన్లైన్ చేయించాలి? అనికుమార్రెడ్డి, తిమ్మన్నగూడెం జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి పాస్బుక్కు జీరాక్స్, ఆధార్ కార్డుతో నామినిది కూడా జీరాక్స్ వస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రశ్న : పాస్బుక్కు వచ్చి నెల రోజులు అయ్యింది. ఇప్పటికీ రైతుబంధు చెక్కు రాలేదు. యాదయ్య, తొండ్లాయి, శంకర్, నల్లగొండ, ఘనీ, హాలియా జేడీఏ : త్వరలోనే చెక్కు వస్తుంది. ప్రశ్న : పాస్బుక్కులు రాలేదు సత్తిరెడ్డి ఉట్లపల్లి, వెంకటయ్య, బొల్లెపల్లి, వెంకటేశ్వర్లు, సిరసనగండ్ల జేడీఏ : తహసీల్దార్ను, లేదా ఆర్డీఓలను కలవండి. బుక్కులు వచ్చిన తరువాత చెక్కులను ఇప్పిస్తాం. ప్రశ్న : రబీలో సబ్సిడీ విత్తనాలు ఇస్తారా శ్రీను, మునుగోడు జేడీఏ : వేరుశనగ, మినుము, ఉలువులు సబ్సిడీపై ఇస్తాం ప్రశ్న : రుణమాఫీ రాలేదు సుజాత, కట్టంగూరు జేడీఏ : ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వంనుంచి ఆమోదం వస్తే రుణమాఫీ వస్తుంది. -
గ్రీన్ హైవే.. టెన్షన్
మోర్తాడ్(బాల్కొండ): గ్రీన్ హైవే నిర్మాణం ఏమో కానీ, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉన్న భూములు పోతే ఇక ఏం చేసుకుని బతికేదనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని కేంద్రం తొలుత యోచించింది. అయితే, పెద్ద మొత్తంలో ఇళ్లు, చెట్లు, వ్యవసాయ భూములకు నష్టం కలగనుంది. అంతేకాక మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైప్లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో అన్ని కష్ట నష్టాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త రహదారికి శ్రీకారం చుట్టింది. రైతులకు తీరని నష్టం.. ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారిని విస్తరించడానికి బదులు మరో మార్గంలో కొత్త హైవేను నిర్మిస్తే తక్కువ నష్టంతో సరిపెట్టవచ్చని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో వేంపల్లి నుంచి మంచిర్యాల వరకు 125 కిలోమీటర్ల పొడవున కొత్త రహదారిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే, కొత్తగా నిర్మించనున్న ఈ మార్గంలో చేసిన సర్వే ప్రకారం.. మన జిల్లాకు సంబంధించి వందలాది ఎకరాల భూముల్లోంచి ఈ కొత్త రోడ్డు నిర్మించనున్నారు. వేంపల్లి, రెంజర్ల, శెట్పల్లి, తొర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల గ్రామాలకు చెందిన రైతులు విలువైన పంట భూములు కోల్పోనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్..! గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో భాగంగా నష్టపోయే చెట్ల స్థానంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, హైవే నిర్మాణానికి సంబంధించిన సర్వే కూడా పూర్తికావడంతో త్వరలోనే భూ సేకరణకు నోటిఫికేషన్ను జారీ అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ హైవే నిర్మాణానికి సేకరించే భూమికి నష్ట పరిహారం అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పరిశీలించనుంది. ఆందోళనలో రైతులు.. అయితే, రహదారి నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఆ భూములను నమ్ముకుని బతుకుతున్నామని, జీవనాధారమైన భూములు కోల్పోతే ఏం చేసుకుని బతకాలని వాపోతున్నా రు. నష్ట పరిహారం తమకు ముఖ్యం కాదని, కో ల్పోతున్న భూములకు బదులు భూములు ఇవ్వా లని రైతులు చెబుతున్నారు. తరతరాల నుంచి చేస్తున్న వ్యవసాయ భూములను కోల్పోవడం వ ల్ల భారీ మొత్తంలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని రైతులు కోరుతున్నారు. అయి తే, రహదారి నిర్మాణాలకు సహకరించాలని నేషన ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణ, రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారుల నిర్మా ణం, విస్తరణ కీలకమైదని వారు చెబుతున్నారు. -
సిఫార్సు ఉంటేనే!
జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు కావాలన్నా, సబ్సిడీ పరికరాలు తీసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇన్చార్జుల సిఫార్సులు తప్పనిసరి అని అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి అధికారపార్టీ నేతల బినామీలకు రైతురథం పేరుతో ట్రాక్టర్లను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాలతో ఇష్టా నుసారంగా అధికారపార్టీ నేతల అనుచరులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ట్రాక్టర్లు తీసుకుందామన్నా టీడీపీ నేతల లేఖలు అధికారులు అడుగుతుండటంతో రైతులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతురథం అనే కన్నా టీడీపీ రథం అని పేరుపెట్టుకుని నేరుగా వారికే ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.1.5 లక్షల సబ్సిడీ జిల్లాలో నెల్లూరు మినహా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు 1,070 రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేసే విధంగా గత ఏడాది టార్గెట్ విదించారు. వీటికి ఒక్కోదానికి రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. టీడీపీ నేతలు, జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 2018 సంవత్సరానికి కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు. రథాల రాజకీయం గత ఏడాది జిల్లాకు 1,050 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. మొదట 700 ట్రాక్టర్లు మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ అధికారుల చేత జిల్లాకు చెందిన మంత్రి ప్రకటన చేయించారు. తరువాత తానే జిల్లాకు అవసరం అని ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు మంజూరు చేయించానని చెప్పుకునేదానికి తిరిగి 1,050 ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జిల్లాకు 1,300 ట్రాక్టర్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 550 ట్రాక్టర్లు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 150 ట్రాక్టర్లకు అనుమతి జిల్లాలో రైతురథం ట్రాక్టర్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో ఇంత వరకు అధికారులు ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 150 ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిని ఈ వారంలోనే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లను ఈ విధంగా పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కనుసన్నల్లో జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలకు రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సూచనలతో 150 ట్రాక్టర్లను పంపకానికి అధికారులు సిద్ధం చేశారు. మరొకొన్ని ట్రాక్టర్లను మంజూరు చేసే విధంగా అధికారులకు సిఫార్సు లేఖలు పంపిణినట్లు సమాచారం. ఈ విధంగా ఆ మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చేస్తున్నాం మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. కొన్ని ట్రాక్టర్లను ఇప్పటికే మంజూరు చేసిన మాట వాస్తవమే. ట్రాక్టర్లు మంజూరు చేయాలంటే ఇన్చార్జి మంత్రి లేదా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సంతకంతో లెటర్ ఉండాలి. అన్నింటినీ పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తాం .–బి.చంద్రనాయక్, జేడీ, వ్యవసాయశాఖ అధికారపార్టీ వాళ్లకే ఇస్తున్నారు రైతురథం ట్రాక్టర్లు మొత్తం టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే గత ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది ప్రస్తుతం ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలే అనే విషయం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నులో జరుగుతోంది. –ప్రభాకర్నాయుడు, యనమదల, చేజర్ల మండలం అర్హులకు అందడం లేదు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే రైతురైథం పథకంలో అర్హులైన వారికి ట్రాక్టర్లు ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు చెప్పిన వారికి ఇస్తామంటే వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్నాం అని చెప్పడం దేనికి, నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే ఇస్తే సరిపోతుంది కదా. గత ఏడాది అర్హులకు అందలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితిగా ఉంది. –సంకటి రామకృష్ణారెడ్డి, చేజర్ల -
తవ్వుకో.. దోచుకో..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఆకేరువాగు అడ్డాగా రోజువారీగా టన్నుల కొద్దీ ఇసుక నగరానికి చేరుతోంది. ధనార్జనే ధ్యేయంగా దళా రులు రెచ్చిపోతున్నారు. ఇక వాగుల్లో టన్నుల కొద్దీ ఇసుక తోడుకుంటూ పోతుంటే భూగర్భజలాలు అడుగుంటుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కారణమేదైనా ఇలా టన్నుల కొద్దీ ఇసుక తరలించుకుపోతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ దందాకు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరం దగ్గరలో ఉండడంతో ఇసుక దళారుల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. వాల్టాకు తూట్లు.. జిల్లాలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మం డలంలోని ఆకేరు వాగుకు చుట్టు పక్కల ఉన్న పచ్చని చెట్లు, పొలాలను ఇసుకాసురులు నేలమట్టం చేస్తున్నారు. రైతుల కంట్లో ఇసుక కొడుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కోసం వాల్టా(నీరు, భూమి, చెట్టు) చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తూ తూట్లు పొడుస్తున్నారు. అధికారులు మా మూళ్ల మత్తులో జోగుతుండగా అక్రమార్కులు వాల్టా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆకేరు వాగు అడ్డాగా.. ఆకేరు వాగు శివారు రైతుల పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే వారికి తెలియకుండానే పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వాగుకు ఆనుకొని మా పొలాలు ఉండడమే శాపంగా మారిందని కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్ధన్నపేటలోని కొత్తపల్లి, కూనూరు, ల్యాబర్తి, నందనం, ఇల్లంద, పర్వతగిరి మండలంలోని రోళ్లకల్లు, అన్నారం, నారాయణపురం, కల్లెడ, రాయపర్తి మండలంలోని కొత్తూరు గుండా ఆకేరు వాగు పారుతుంది. ఈ వాగు చుట్టు పక్కల ఉన్న భూముల్లో ఇసుకను తోడేస్తున్నారు. వరంగల్ నగరంతో పాటు, సంగెం, నెక్కొండ, ఐనవోలు మండలాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇక్కడి రైతుల పచ్చని పంటలను ధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలను ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఇసుక అక్రమదందాతో వందల ఎకరాల్లో సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల రణగొణ ధ్వనితో దద్దరిల్లుతున్న ఆకేరువాగు తెల్లవారుకాగానే అంతా నిర్మానుష్యంగా మారుతుంది. ఇసుక తవ్వకాలతో చుట్టు పక్క రైతులు విలువైన పంట భూములను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల పంచాయితీ రోడ్డెకుతున్నా అధికార ముసుగులో ఉన్న పెద్దలు సామరస్యంగా చక్కబెడుతూ అక్రమ తవ్వకాలకు పచ్చజెండా ఊపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనిపించని దాడులు ఇసుక రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరికలు రెవెన్యూ, పోలీస్ అధికారులు చేయడమే తప్పా దాడులు చేసిన సంఘటన లేవు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో నేరుగా విజిలెన్స్ అధికారులు రంగంలో దిగారు. స్థానిక పోలీసులకు సమాచారం తెలియకుండానే ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ప్రతీ రోజు వరంగల్, హన్మకొండ, కాజీపేటలకు దాదాపు 300లకు పైగా ట్రాక్టర్లు వస్తున్నాయి. ఆగస్టు 28న విజిలెన్స్ అధికారులు 26 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 13, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ట్రాక్టర్లను విజిలెన్స్ అధికారులు అప్పగించారు. రాత్రి సమయంలో తవ్వుతున్నట్లు తెలుస్తోంది పగలు సమయంలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించకుండా రాత్రి సమయంలో తవ్వుతున్నారని సమాచారం అందింది. ఇటీవల రైడ్ చేసి పలు మోటార్లు, ట్రాక్టర్లు సీజ్ చేశాం. త్వరలో దాడులు చేస్తాం. ప్రభుత్వ అనుమతి లేనిది ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. –కనకయ్య, తహసీల్దార్, వర్ధన్నపేట -
ఎరువు భారం 35 కోట్లు
మోర్తాడ్(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్ అయ్యింది. డాలర్ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్ ఎరువుల ముడిసరుకు ధరకు రెక్కలు తొడిగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధర పెరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. పంటల దిగుబడి పెరగాలంటే కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు అధికం అవుతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందనే చందంగా రైతుల పరిస్థితి తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్లో కాంప్లెక్స్ ఎరువుల ధర ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.173 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం ఒక బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది. గతంలో పెరిగిన ధరల వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల భారం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ధర పెరగడంతో మరో రూ.35 కోట్ల ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీకి వినియోగించే ముడిసరుకును ఎరువుల ఉత్పత్తి కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి సరుకుపై డాలర్ ప్రభావం పడుతుండటంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇఫ్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్ ఎరువుల ధర పెరగడం వల్ల ప్రతి రైతు ఒక హెక్టార్కు రూ.వెయ్యిని ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో, కామారెడ్డి జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు కొంత మేర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వరి కంటే వాణిజ్య పంటలలోనే కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. డీఏపీ రకం కాంప్లెక్స్ ఎరువు ధర గతంలో రూ.1,295 ఉండగా ఇప్పుడు రూ.1,345కు చేరింది. 20:20 రకం ఎరువు ధర రూ.960 నుంచి రూ.1,025కు చేరింది. 12:32:16 రకం ఎరువు రూ.1175 నుంచి రూ.1275 కు చేరింది. రైతులు ఎక్కువగా డీఏపీతో పాటు 20:20 రకాన్ని వినియోగిస్తున్నారు. డాలర్ ధరలో మార్పు లేక పోతే కాంప్లెక్స్ ఎరువుల ధరలో తగ్గుదల కనిపించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డాలర్ ధరలు పెరిగినా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం పెరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డాలర్ ధరలు పెరగడం వల్లనే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడం వల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరల్లో పెరుగుదల ఏర్పడింది. ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందువల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. – మారుతి ప్రసాద్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి. లేకుంటే రైతులు ఇంకా భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను అదుపులో ఉంచాలి. ధరలు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. – ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్ పెట్టుబడులు అధికం అవుతున్నాయి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడుతారు. – కొప్పుల భాజన్న, రైతు, మోర్తాడ్ -
ఇది కొత్త ఉత్సాహం
ప్రగతి నివేదన సభకు పదపదమంటూ రైతులు ఉత్సాహంగా బైలెల్లారు. నేతల ఫ్లెక్సీలతో అలంకరించుకున్న ట్రాక్టర్లు బండెనక బండి.. వేలాది బండ్లు అన్నట్లు జాతర మాదిరిగా తరలివెళ్లాయి. హోరెత్తిన తెలంగాణ పాటలు, డీజే మోతలతో ఉర్రూతలూగించాయి. ఎటుచూసినా ఇక్కడే నివేదన సభ.. అన్నట్లుగా ట్రాక్టర్ల సందడి కనిపించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఖమ్మం నగరంలో సందడి నెలకొంది. కాగా.. టీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం నడుమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ నడపగా.. పక్కనే ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు కూర్చున్నారు. ఖమ్మం మయూరిసెంటర్ : రెండో తేదీన హైదరాబాద్లో జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు రైతులు వందలాది ట్రాక్టర్లలో తరలిరావడం, ఉత్సాహంగా ప్రదర్శన వెళుతుండడం కొత్త ఉత్సాహాన్నిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన రైతులు 1890ట్రాక్టర్ల ద్వారా శుక్రవారం ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీకి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ గుమ్మడికాయ కొట్టగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి స్వయంగా ట్రాక్టర్ను నడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రైతు కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.5లక్షల బీమాను వర్తించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాని ప్రారంభించారన్నారు. పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాచకుండా ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి సాయం చేస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ల ను ఆధునీకరించడం, పంట ఉత్పత్తులను దాచుకునేందుకు గిడ్డంగులను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులకు తమ పార్టీ చేసిన మేలు గతంలో ఏ పార్టీ చేయలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రైతులు తమవెంటే ఉంటారని తెలిపారు. అన్నదాతకు సేవలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారే స్వచ్ఛందంగా తరలిరావడం గొప్ప కార్యక్రమం అన్నారు. భవిష్యత్లో రైతాంగానికి మరిన్ని మంచి కార్యక్రమాలు అందించేందుకు, సేవలు చేసేందుకు కేసీఆర్ను ఆశీర్వదించడానికి రైతులు ప్రగతినివేదనసభకు తరలి వెళ్తున్నారన్నారు. ఇంత భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్న ఎంపీకి రాష్ట్ర పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో యువత పాల్గొని అండగా నిలవాలన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకే..: ఎంపీ పొంగులేటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్లో జరిగే ప్రగతి నివేదన సభ ద్వారా తమకు సేవ చేసిన రైతుబాంధవుడికి కృతజ్ఞత తెలుపుకునేందుకే రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 51నెలల్లో సాధించిన ప్రగతిని, ప్రజలకు చేసిన సేవలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. 28 లక్షల మంది ఈ నివేదన సభలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయన్నారు.సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మంచి అవకాశం వచ్చిందంటూ జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా నివేదన సభకు తరలివస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు పలు కారణాలతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి చెల్లిస్తుందన్నారు. ఖమ్మం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన సూర్యాపేట, నల్లగొండ మీదుగా ప్రగతినివేదన సభా ప్రాంగణానికి చేరుకుంటుందని, చివరలో తాను కూడా వీరితో కదలివెళ్తానని వివరించారు. రెండు రోజుల పాటు రైతులకు అవసరమైన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మేయర్ పాపాలాల్, నల్లమల వెంకటేశ్వరరావు, సాధు రమేష్రెడ్డి, లింగాల కమల్రాజు, తాతా మధు, కమర్తపు మురళి, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కూలీలను రైతులుగా చూపి 15కోట్లు బ్యాంక్ లోన్
-
భూసేకరణ జీవో చెల్లదు
తాటిచెట్లపాలెం (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన జీవో నంబర్ 118, పార్లమెంట్ చట్టం 113కు పూర్తి వ్యతిరేకమన్నారు. విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం ‘భూసేకరణ– పరిష్కారం’ అనే అంశంపై జరిగిన సెమినార్లో జస్టిస్ గోపాలగౌడ మాట్లాడారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విమర్శలుగుప్పించారు. ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి వస్తే ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలని, ప్రజల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత వారికి తగు నష్టపరిహారం, ప్రతిగా స్థలం ఇవ్వాలని, అలాగే బాధితులకు జీవనాధారం చూపించాల్సి ఉందని వివరించారు. భూసేకరణ అనేది హౌసింగ్ స్కీం కోసమైతే అక్కడి పరిస్థితులు నివాసయోగ్యతకు అనుకూలంగా ఉండాలని, పర్యావరణ అనుమతులు ఉండాలని పార్లమెంట్లో చేసిన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో ఆమెదం పొందాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ ఇష్టానుసారంగా చేసిన ఆ జీవో చెల్లదని, అలాంటి జీవో బంగాళాఖాతంలో కలిపేయడమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే అది రాష్ట్రపతి ఆమోదం పొందాలని కాని ఇక్కడ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవేమీ పాటించకుండా పారిశ్రామిక కారిడార్ల, విశ్వవిద్యాలయాలు, రహదారుల పేరిట పేద, మధ్య తరగతుల రైతుల నుంచి బలవంతంగా లక్షల, వేల ఎకరాలు భూసేకరణ చేస్తోందని జస్టిస్ గోపాలగౌడ దుయ్యబట్టారు. రైతుల్ని వేధిస్తూ భూసేకరణ రాష్ట్రంలో పెట్రో యూనివర్సిటీకి 250 ఎకరాలు అవసరమైతే దీని పేరిట 750 ఎకరాలు సేకరించేందుకు కుట్రపన్నుతున్నారని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. అయితే దీని కోసం ఇంతవరకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడాలని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ప్రజల్ని, రైతుల్ని వేధిస్తూ భూసేకరణ చేస్తోందన్నారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, కానీ అభివృద్ధి పేరిట సంవృద్ధిగా పంటలు పండే వేల, లక్షల ఎకరాలు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. రైతులంతా ఏకమై పోరాడితే అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కొందరు రైతులకు పట్టాలు లేనందున వారికి తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వారు దశాబ్దాలుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఆ భూములకు వారే హక్కుదారులని చట్టం చెబుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉండాలిగాని వారిని బిచ్చగాళ్లను చేయడానికి కాదని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పనిచేసేది కేవలం పట్టణ ప్రజల కోసమేనా? గ్రామీణులు, రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. సమావేశంలో íసీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, సీపీఐ నేతలు గంగారాం, కె.లోకనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పాలి! పారిశ్రామిక ప్రాంతం కోసం భూసేకరణ చేయదలిస్తే ఆ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది.. లాభనష్టాలు, ప్రాజెక్టు రిపోర్టులు తదితర అంశాలతో, వివిధ శాఖల అనుమతులతో మాత్రమే చేయాల్సి ఉంటుందని జస్టిస్ గోపాలగౌడ తెలిపారు. మన దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణులేనని, వీరి జీవనాధారం పాడి పంటలు, ఫలసాయమేనని వివరించారు. మరి అలాంటి సాగు భూముల్ని బలవంతంగా ప్రభుత్వాలు తీసేసుకుంటే ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై అలాంటి నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. -
కక్ష సాధింపు!
రాజధాని గ్రామమైన ఉండవల్లి రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. పూలింగ్ ప్రక్రియను మొదటి నుంచి ఈ గ్రామానికి చెందిన రైతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశత్వంపై రైతులంతా కలిసి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉండవల్లిలో భూములను సేకరించవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్ను సైతం పక్కన పెట్టిన ప్రభుత్వం.. తన ఆగడాలను రెట్టింపు చేసింది. రైతుల అనుమతి లేకుండానే గ్రామ పొలాల్లో నుంచి విద్యుత్ తీగలు లాగిస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో : ఉండవల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగేందుకు గురువారం అధికారులు సిద్ధమయ్యారు. తమ అనుమతి లేకుండానే తీగలు ఎలా లాగుతారని ప్రశ్నించిన రైతులపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. తీగలు లాగడాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు ఈడ్చిపారేసి మంగళగిరి పోలీసుస్టేషన్కు తరలించారు. అమరావతికి కొండవీటి వాగు నుంచి ముంపు బెడద తప్పించడానికి ప్రకాశం బ్యారేజి సీతానగరం వద్ద రూ.237 కోట్లతో ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 16 మోటార్లను ఏర్పాటు చేసి వరద సమయంలో కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం అవసరమైన సబ్స్టేషన్ను కొండవీటివాగు హెడ్ స్లూయిస్ వద్ద ప్రభుత్వం చేపట్టింది. దీనికి మంగళగిరి మండలం నులకపేట 130 కేవీ సబ్స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. వాగు వద్దకు వచ్చే సరికి తీగలు రైతుల పొలాల్లో నుంచి వెలుతున్నాయి. సుమారు 9 ఎకరాల్లో నుంచి తీగలను వేశారు. రైతులు ఎదురుతిరిగినా పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించి మరీ తీగలు లాగారు. విడతల వారీగా రైతులు కాపలా.... నెలన్నర రోజుల కిందట ప్రభుత్వం ఇలాగే నియంతృత్వంగా వ్యవహరించడంతో రైతులంతా కలిసి ఎదురుతిరగడంతో అప్పట్లో అధికారులు వెనుతిరిగారు. అప్పటి నుంచి రైతులు విడతల వారీగా రేయింబవళ్లు తమ పొలాల్లో కాపలా ఉంటూ వచ్చారు. ఎప్పుడు ఎవరూ వచ్చి తీగలు లాగుతారోనని భయం భయంగా గడిపారు. గురువారం ఉదయం అధికారులు చడీచప్పుడుకాకుండా వచ్చి పోలీసుల సాయంతో రైతులను అరెస్ట్ చేయించి తమ పనికానిచ్చేశారు. కోట్లలో నష్టపోనున్న బాధిత రైతులు... ఉండవల్లి రైతులు మొదటి నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మూడు పంటలు పండే భూములను వదులుకునేది లేదని తేల్చి చెబుతూ వచ్చారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను అడ్డుకుని, వాటిని కోర్టులో సవాల్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తీగలు లాగిన పొలాలు మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా తీగలు లాగడం వల్ల భూముల ధరలు భారీగా పడిపోవడంతో పాటు వీటిని కొనేందుకు ఎవరూ ముందుకురారని బాధిత రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో ఈ భూమిని డెవలప్ చేసుకోవాలన్నా, భవంతులు కట్టుకోవాలన్నా హై టెన్షన్ వైర్లు ఉండడం వల్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని... ఇక జీవితాంతం ఈ భూమిని వదిలేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 కోట్ల మేర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలోనూఎదురు దెబ్బ కనకదుర్గా వారధి నుంచి తుళ్లూరు మండలంలోని బోరుపాలెం వరకు 21 కిలోమీటర్ల నిర్మించనున్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉండవల్లి రైతులు తమ భూములను ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఆ భూములను సేకరించాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. భూ సేకరణ కోసం ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘిస్తోందని, తప్పులతడకగా సర్వే చేసిందని సాక్ష్యాధారాలతో సహా రైతులంతా హైకోర్టును ఆశ్రయించడంతో రోడ్డు కోసం సేకరించాలనుకున్న 153 ఎకరాలపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. -
పొలాల్లో హై‘టెన్షన్’
తాడేపల్లి రూరల్: రాజధానికోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉండవల్లిలో రైతుల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్శాఖ అధికారులు భారీగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. ఆందోళన చెందిన రైతులు హడావుడిగా పంటపొలాలకు చేరుకుని వైర్లు లాగడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లను బయటకు తీయగా.. వారిని పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. వైర్లు లాగుతాం.. ఏం చేస్తారు? గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలను ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినప్పటినుంచి భూములివ్వని రైతులను ఏదోవిధంగా బెదిరిస్తూ దమనకాండకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉండవల్లిలో రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్శాఖ అధికారులు భారీగా పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చారు. ఇది తెలుసుకున్న ఆయా పొలాలకు చెందిన 18 మందికిపైగా రైతులు హడావుడిగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతుండగానే.. కాంట్రాక్టరు హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు అడ్డుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్ అధికారులు మళ్లీ వైర్లు లాగే ప్రయత్నం చేశారు. అంతేగాక.. వైర్లు లాగుతాం, ఏం చేస్తారో చెయ్యండంటూ రైతులపై విరుచుకుపడ్డారు. దీనిపై రైతులు.. అన్నం పెట్టే అన్నదాతలు మిమ్మల్నేం చేయగలరు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన తహసీల్దార్.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వైర్లు వెళ్లే స్థలాలకు కూడా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తారంటూ చెప్పగా.. ఎలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు. దానికి అధికారులు సమాధానం చెప్పకుండా వైర్లు లాగుతామంటూ ముందుకెళ్లారు. దాంతో రైతులు తమ జేబుల్లోనుంచి పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లు బయటకు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆరుగురు రైతులను పోలీసులు బలవంతంగా జీపులో మంగళగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు మహిళా రైతులను పంటపొలాలనుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం హైటెన్షన్ వైర్లను లాగే ప్రక్రియ చేపట్టారు. అదుపులోకి తీసుకున్న రైతులను గురువారం సాయంత్రం పూచీకత్తుపై వదిలిపెట్టారు. -
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైటెన్షన్ లైన్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉండవల్లి పొలాల్లో ఉద్రిక్తత
-
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
బతుకుపై బండ'రాయి'
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని నాగల్గిద్ద మండలం మేత్రి రాందాస్కు రాళ్లలతో నిండిన ముప్పావు ఎకరం భూమి ఉంది. దానిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందులో పంటలు సరిగా పండక కుటుంబంతో సహా ఉపాధి కోసం వలస బాట పట్టాడు. వర్షాలకు మాత్రమే పంటలు పండే ఆ భూముల్లో వర్షాభావంతో ఇప్పటికే వేసిన పెసర పంట సగానికి పైగా ఎండిపోయింది. నారాయణఖేడ్ ప్రాంతంలో రాళ్ల భూముల్లో రైతులు చేస్తున్న ‘కష్టాల సాగు’కు రాందాస్ కథ అద్దం పడుతోంది. నారాయణఖేడ్ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రాళ్ల భూమి విస్తరించి ఉంది. వీటిపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఎలాంటి నీటి ఆధారం లేకపోవడంతో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. వర్షాధార పంటలు జొన్న, పెసలు, మినుములు తదితరాలను పండిస్తున్నారు. నియోజకవర్గంలోని నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో ఈ తరహా ‘ఎర్ర నేలలు’ఎక్కువగా ఉన్నాయి. పలుగు రాళ్లతో కూడిన ఈ భూములను స్థానికంగా ఎర్ర మొరం భూములు లేదా పడావు భూములుగా వ్యవహరిస్తారు. పూర్తిగా రాళ్లతో కూడిన ఈ భూమిలో భూగర్భ జల జాడలు ఎక్కడా కనిపించడం లేదు. బావుల తవ్వకానికి ఈ భూములు అనుకూలం కావని రైతులు చెబుతున్నారు. 300–400 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని కొందరు రైతులు చెబుతున్నారు. దీంతో వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. నాకు ఉన్న భూమితో పాటు మరో ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నువ్వులు, అవిశెలు వంటి గడ్డి జాతి పంటలు పండిస్తున్నా. రాళ్ల భూమి కాబట్టి వేరే పంటలు వేసే అవకాశం లేదు. ఈ భూముల్లో సాగు చేసినా లాభం లేదనే ఉద్దేశంతో చాలా మంది పంటలు వేయడం మానేశారు. వర్షం ఎక్కువ కురిసినా నీటి జాలుతో వేర్లు కుళ్లిపోయి పంటలు దెబ్బతింటాయి. ఈ భూములకు ఎకరా కౌలుకు రూ.5 వేలు ఇవ్వడం కూడా కష్టమే. ఏవైనా ఫ్యాక్టరీలు, తోటలు పెడితే ఏదన్నా ప్రయోజనం కలుగుతుంది. – బక్కప్ప, రైతు, నాగల్గిద్ద మాకు ఐదెకరాల భూమి ఉంది. ఎలాంటి నీటి ఆధారం లేదు. వర్షాధార పంటలు కంది, పెసర, జొన్న వేస్తున్నాం. పూర్తిగా రాళ్లతో కూడిన భూమి కావడంతో పత్తి, వరి పంటలు వేసేందుకు మాకు అవకాశం లేదు. ఏటా దుక్కి దున్నేందుకు రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతుంది. వర్షాలు లేకపోతే పంట చేతికందే పరిస్థితి ఉండదు. ఎకరాకు ఒక్కో సారి క్వింటాలు కందులు కూడా పండవు. వానలు పడితే చేనులో పని చేసుకుంటం. లేదంటే తలోదారిన వేరే పనికి వెళ్తాం. – శాంతాబాయి, బంగ్లా తండా,నాగల్గిద్ద మండలం వర్షం లేకుంటే ఉపాధి బాటే.. తొలకరి మొదలవ్వగానే జొన్నలు, కందులు, పెసలు, మినుములు తదితర పంటలు వేస్తారు. జొన్న కొంత మేర వర్షాభావాన్ని తట్టుకోవడం, పెసలు, మినుములు తక్కువ కాల వ్యవధిలో దిగుబడి రావడంతో రైతులు వీటి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రాళ్లతో కూడిన భూమిని దుక్కి దున్నేందుకు ఏటా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఒకసారి రాళ్లను తొలగించినా, ఆ నేలల స్వభావం వల్ల మరుసటి సంవత్సరం కూడా మళ్లీ రాళ్లు వస్తాయని అంటున్నారు. వర్షాలు ఎక్కువ కురిస్తే మృత్తిక క్షయం జరుగుతోందని, తక్కువ పడితే పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రావడం లేదని చెబుతున్నారు. దీంతో వేలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సాగు నీరు అందించడం లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే తమకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడుపోయిన ఈ భూములు ప్రస్తుతం ఎకరాకు రూ.2 లక్షల పైనే ధర పలుకుతున్నాయి. -
కనికరం ‘కరువు’
సాక్షి, అమరావతి: రైతులపై ఈ సర్కారు కాస్తయినా కనికరం చూపడం లేదు. కళ్లెదుట కనిపిస్తున్న కరువుకు పరదా కప్పేసింది. ప్రభుత్వ వాతావరణ శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే 395 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. సాధారణం కంటే తక్కువ వర్షం కురిసినందున రాష్ట్రంలో 395 మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తేల్చి చెబుతుండగా, ప్రభుత్వం 275 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. మిగిలిన 120 మండలాలు ‘పచ్చ’గా ఉన్నట్లు నివేదికల్లో చేర్చేసింది. కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే ఈ 120 మండలాల్లోనూ పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలనే రకరకాల నిబంధనలు పేరిట 120 మండలాలను కరువు జాబితాలో చేర్చలేదు. ఏటా ఇదే తంతు కరువు బారిన పడిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరువు మండలాలను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడం, పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగ్గొట్టడం చంద్రబాబు సర్కారుకు అలవాటే. 2014 జూన్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.2,350 కోట్ల మేర పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేశారు. 2015లో దుర్భిక్ష మండలాలను సగానికి కుదించారు. 2016లోనూ అలాగే చేశారు. 2017 ఖరీఫ్లో పంటలన్నీ ఎండిపోయినా సెప్టెంబర్, అక్టోబర్లో అల్పపీడనాల వల్ల కురిసిన వర్షాన్ని లెక్కలోకి తీసుకుని కరువు లేదని ప్రకటించడం ద్వారా రైతులను దగా చేశారు. 2017 రబీలో 350 మండలాల్లో వర్షపాతం లోటు ఉన్నా 121 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. పడిపోయిన సాగు విస్తీర్ణం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. ఇందులో గుంటూరు జిల్లా కూడా ఉంది. గుంటూరు జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. జూన్, జూలై నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆరు జిల్లాల్లో 275 కరువు మండలాలను ప్రకటించినట్లు ప్రభుత్వం ఈ నెల 8న జారీచేసిన జీవోలో పేర్కొంది. అనంతపురం జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉండగా, 44, కర్నూలు జిల్లాలో 54 మండలాలకు గాను 37, చిత్తూరులో 66 మండలాలకు గాను 58 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఖరీఫ్లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది లక్ష్యం కాగా.. 9.6 లక్షల ఎకరాల్లోనే సాగైంది. 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఇదే కాలంలో సాగు విస్తీర్ణం 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే ఈ ఏడాది 5.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు తగ్గిపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో సాధారణంగా 247.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 215.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. రైతాంగాన్ని ఆదుకోవాలి ‘‘రాష్ట్రంలో దుర్భిక్షం తీవ్రత కళ్లకు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణం. రైతాంగాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన సర్కారు ఇలా కరువును దాచేయడం ఏమాత్రం సమంజసం కాదు’’ – నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు -
‘ఖరీఫ్ కంది 75% కొనుగోలు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో సాగవుతున్న కంది ఉత్పత్తిలో 75% మేర కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కోరనుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి హరీశ్రావు త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కేంద్ర అర్థ, గణాంక శాఖ ముందస్తు అంచనాల ప్రకారం మద్ద తు ధరకు కొనుగోలు పథకం కింద సేకరణకు అనుమతినిస్తుంది. దీని ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 40% మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ ఖరీఫ్లో రైతులు కందులు 6.57 లక్షల ఎకరా ల్లో వేశారు. ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. గతేడాది కంది సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, దిగుబడి 2.84 లక్షల టన్నులుగా ఉంది. మొదటి ముందస్తు అంచనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కేవలం 75,300 క్వింటాళ్లకే అనుమతించింది. తర్వాత రాష్ట్రమే రైతుల నుంచి క్వింటాకు రూ.5,450 మద్దతు ధర తో 1.13 లక్షల మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
పక్కాగా సర్వే
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో పంట నష్టం అంచనాకు బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టానికి సంబంధించి కలెక్టర్ దివ్యదేవరాజన్ కొద్దిరోజుల ముందే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 101 క్లస్టర్లకు గాను 101 బృందాలను ఏర్పాటు చేసి సర్వే కోసం పంపించారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓ, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్ఓ ఉన్నారు. సర్వే కోసం వారికి ప్రత్యేక యాప్ను ఇచ్చారు. ఆ యాప్పై వారికి అవగాహన కల్పించేందుకు సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టం సర్వేను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పూర్తి పారదర్శకంగా నష్టం జరిగిన రైతులనే పరిగణనలోకి తీసుకునే పరిస్థితి. తద్వారా సర్వేలో బోగస్ పేర్ల నమోదు జరిగే ఆస్కారం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక గ్రామంలోని పంట నష్టపోయిన రైతుకు సంబంధించి చేను ఫొటోను యాప్లో అప్లోడ్ చేసే క్రమంలో దాని అక్షాంశాలు, రేఖాంశాలు అందులో నమోదవుతాయి. అంతేకాకుండా సర్వే చేసిన తేదీ, సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనేది అందులో పేర్కొంటారు. ఇక పంట నష్టానికి సంబంధించి మాత్రం ఆ యాప్లో నమోదు చేయరు. రికార్డులో నష్టం వివరాలను నమోదు చేసుకుంటారు. ఇలా సర్వే ఒక పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టంలో రాజకీయ జోక్యం, గ్రామంలో భూస్వాముల నుంచి ఒత్తిడి చోటుచేసుకొని బోగస్ పేర్లు, ఎకరాలు నమోదు చేయడం వంటివి, తద్వారా పరిహారాన్ని పరిహాసం చేసి స్వాహా చేసేవారు. దీనికి అవకాశం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేస్తుండడంతో అసలైన రైతులకు పంట నష్టపరిహారం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎక్కువ రోజులు.. సాధారణ సర్వే కంటే జియో ట్యాగింగ్ ద్వారా చేపడుతున్న ఈ సర్వేకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా మామూలు సర్వేలో బృందాలు ఒక చేనులో పరిశీలన చేసిన తర్వాత పక్క చేనులో కూడా ఇదే పరిస్థితి ఉందని నమోదు చేసుకొని నష్టాన్ని అంచనా వేసేవారు. కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు. నష్టం జరిగిన ప్రతి రైతుకు సంబంధించి జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఒక క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. సాధారణ సర్వేలో రోజు 400 నుంచి 500 ఎకరాలు సర్వే చేసే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జియో ట్యాగింగ్ సర్వేలో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు సర్వే చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా సాధారణ సర్వే కంటే రెట్టింపు రోజులు ఈ జియో ట్యాగింగ్ సర్వేకు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ సర్వే 10 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. పకడ్బందీగా సర్వే జరుగుతుండడంతో పంట నష్టపోయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాలుగైదు రోజుల్లో పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమై ఉండడం, కొంత ఆలస్యమైనా మరో వారం, పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏనుగు కేశవ్రెడ్డి జైనథ్ మండలం కాప్రి గ్రామంలో 5.11 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఇటీవల భారీ వర్షాలకు చేనులో వరద నీరు నిలిచి పంట పూర్తిగా నష్టపోయాడు. సర్వే బృందం పంట నష్టం నమోదులో ఒక కొత్త పద్ధతిని అవలంబించింది. పంట నష్టపోయిన చేనులో రైతును నిల్చోబెట్టి ఆ చేనుకు సంబంధించి ప్రత్యేక యాప్లో ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనే విషయాలను నమోదు చేసుకున్నారు. ఇక ఆ ఫొటో తీసిన సమయం, తేదీ అందులో స్పష్టంగా కనిపిస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ప్రాంతంలోని అక్షాంశాలు, రేఖాంశాలు నమోదవుతాయి. పంట నష్టం సర్వేలో బోగస్ పేర్లు, ఎకరాలు, తదితర నమోదు చేసే అవకాశం లేదు. తద్వారా పంట నష్టపోయిన నిజమైన రైతులకే పరిహారం అందజేసేందుకు అవకాశం ఉంటుందనేది అధికారుల భావన. పకడ్బందీగా సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించడం జరుగుతోంది. పంట నష్టం సర్వేలో పూర్తి పారదర్శకత ఉంటుంది. జియో ట్యాగింగ్ ద్వారా రైతు చేనుకు సంబంధించి ఫొటోతోపాటు రైతు వివరాలు, చేను అక్షాంశాలు, రేఖాంశాలు నమోదు చేయడం జరుగుతుంది. తేదీ, సమయం అన్ని స్పష్టంగా ఉంటాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్ -
పాము కాట్లు..సమయస్ఫూర్తి !
నూజివీడు: వర్షాకాలంలో పొలం పనుల్లో నిమగ్నమయ్యే రైతులు పాముకాటుకు గురవుతున్నారు. జిల్లాలో ఈ పరిస్థితి దివిసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో రైతులు పాముకాటు బాధితులవుతున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో నాలుగు రోజుల వ్యవధిలోనే 40 మంది పాము కాటుకు గురయ్యారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తక్షణం ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.నరేంద్రసింగ్ వెల్లడించిన వివరాలివి.... రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.... రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా మోకాళ్ల వరకు ఉండే గమ్బూట్లు వేసుకోవాలి. అలానే టార్చిలైటు, కర్ర తప్పనిసరిగా ఉండాలి. పాములకు చెవులుండవు. శబ్ధ తరంగాలను గ్రహించి అవి అప్రమత్తమవుతాయి. ఈ నేపథ్యంలో రాత్రిపూట వెళ్లేటపుడు చప్పుడు చేసుకుంటూ, శబ్ధం వచ్చేలా అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఎక్కువ శాతం కాళ్లు, పాదాలపైనే పాముకాట్లు పడుతుంటాయి గనుక పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకోవడం మంచిది. చెత్తాచెదారంను ఒక్కసారిగా చేత్తో ఎత్తకూడదు. ముందు కర్రతో అటూఇటూ కదిలించి ఆ తరువాత ఎత్తేయాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వర్షాలు కురిసినపుడు పాముల పుట్టలలోకి నీరు చేరడం వల్ల అవి బయటకు వచ్చి చెత్తాచెదారంలోకి చేరి తలదాచుకుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, మదుగు ఎక్కువగా ఉన్న చోట సంచరిస్తూ ఉంటాయి. వీటి సమీపంలోకి వెళ్లినపుడు పాము కాటుకు గురవుతుంటారు. గ్రామాలలో ఇచ్చే పసరు మందు, నాటువైద్యులు ఇచ్చే ఆకులు, అలములను ఎట్టి పరిస్థితులలోనూ నమ్ముకోకూడదు. పాము కరిచిన వ్యక్తిని ఏమాత్రం భయపెట్టకూడదు. భయం వల్ల ఆందోళన పెరిగి రక్తం మరింత తొందరగా గుండెకు చేరుతుంది. దీనివల్ల మరణం త్వరగా సంభవిస్తుంది. కాటును గుర్తించడం ఎలా... పాము శరీరంపై నేరుగా కాటువేసిందా, వస్త్రాల పై నుంచి వేసిందా అనేది పరిశీలించాలి. శరీరంపై కాటువేస్తే ఎన్ని గాట్లు పడ్డాయనేది ప్రధానంగా గుర్తించాలి. ఎందుకంటే విషం ఉన్న పాములు కాటేస్తే కేవలం రెండు గాట్లు మాత్రమే పడతాయి. సాధారణ పాములు కాటువేస్తే రెండు కంటే ఎక్కువ గాట్లు పడతాయి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాములు కాటేస్తే రెండు గాట్లు మాత్రమే పడతాయి. వైద్యం అందకేమృత్యువాత.... ఏటా దేశంలో 2 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, సకాలంలో వీరికి వైద్యం అందక దాదాపు 30 వేల మంది మృత్యువాత పడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల రకాలకు పైగా పాములున్నప్పటికీ వాటిలో 350 రకాలు మాత్రమే విషపూరితమైనవని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. విషం ఉన్న పాములలో కూడా కట్లపాము, తాచుపాము, రక్తపింజర ప్రమాదకరం. ఇవి కాటేస్తే వాటి విష ప్రభావం కేంద్ర నాడీ మండలంపై పనిచేస్తుంది. దీంతో మరణం వేగంగా సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాటువేసిన వెంటనే ప్రథమ చికిత్స.... పాము కాటువేసిందని తెలిసిన వెంటనే ఏమాత్రం ఆందోళన చెందడం గానీ, అటూఇటూ పరిగెత్తడం గాని చేయకూడదు. పాముకాటు వేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో అప్రమత్తం కావాలి. పాముకాటువేసిన శరీరానికి పై భాగంలో తాడుతో గానీ, గుడ్డతో గానీ, రబ్బర్తో గానీ గట్టిగా కట్టాలి. ఎందుకంటే విషం రక్తంలో కలసి గుండెకు చేరితే మరణం సంభవించినట్లే లెక్క. పాము కాటేసిన చోట బ్లేడుతో కొద్దిగా గాయం చేసి విషం కలిసిన రక్తాన్ని బయటకు వెళ్లేలా చేయాలి. విషప్రభావం ఇలా... మానవ శరీరంపై విషం రెండు రకాలుగా ప్రభావాన్ని చూపుతుంది. నరాలపై చూపే ప్రభావాన్ని న్యూరో టాక్సిన్ పాయిజన్గా, నేరుగా గుండెపై చూపే ప్రభావాన్ని కార్డియో టాక్సిన్ పాయిజన్గా పిలుస్తారు. ఒక్కోసారి ఏ పాము కరిచిందో సరిగా తెలియని పరిస్థితులలో ఏ పాము విషానికైనా విరుగుడుగా పనిచేసే యాంటీవీనమ్ను వేస్తారు. ఈ మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైన బాధితుడిని త్వరితగతిన ఆసుపత్రులకు చేర్చినట్లయితే ప్రాణాపాయం నుంచి బయటవడవచ్చు. స్పందించడమే ప్రధానం పాముకాటుకు గురైన వెంటనే స్పందించడమే ప్రధానం. కాటువేసిన భాగానికి పైన తాడుతో కట్టి నూతన బ్లేడుతో కాటువేసిన చోట చిన్న గాయం చేసి రక్తాన్ని బయటకు పిండేయాలి. దీనివల్ల శరీరంలోకి ప్రవేశించిన విషం గుండెకు చేరకుండా ఉంటుంది. తక్షణమే ఆసుపత్రికి వస్తే సకాలంలో చికిత్స అంది ప్రాణాలు నిలుస్తాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో పాముకాటు మందులను 24 గంటలూ అందుబాటులో ఉంచి ఉచితంగానే ఇస్తున్నారు.– డాక్టర్. ఆర్.నరేంద్రసింగ్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, నూజివీడు. -
కాంగ్రెస్తో పొత్తుకు బాబు ప్రయత్నం
అమరావతి: కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కోంటోందని, ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నా కరువు మండలాల ప్రకటన గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆరు జిల్లాల్లో కరువు, మిగతా జిల్లాల్లో అధిక వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. నాబార్డు నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో, ప్రధానంగా రైతాంగం అట్టడుగు స్థాయికి పడిపోయిందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఏరియల్ సర్వే చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖా మంత్రి తప్పుడు నివేదికలను ఇచ్చి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. -
ప్రకృతికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుంది
విజయవాడ: బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవాలని ఇక్కడికి వచ్చానని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని కాపడుతుందని, దానికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుందని అన్నారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం పట్ల మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తోన్న రైతులతో మాట్లాడాలి..వ్యవసాయ క్షేత్రాలను చూడాలని వచ్చానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తున్నా అక్కడికి వెళ్తానని తెలిపారు. తాతల అనుభవాలు నాకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేశాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి పూర్తిగా కనుమరుగువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ పాలేకర్ అనుభవాలు, వ్యవసాయ విధానాలతో వ్యవసాయం చేయాలని సూచించారు. దేశంలో రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు. భారతీయ జీవన విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆదుకోవాలని, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పరిశోధనలు చెయ్యాలన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫుడ్స్కి ఆదరణ పెరుగుతోందని అన్నారు. -
బీ(ధీ)మా కల్పించేనా..!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ప్రధానంగా పత్తి, సోయా పంటలను పూర్తిగా కోల్పోయిన రైతాంగం కుదేలైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటకు సంబంధించి ప్రాథమిక అంచనాలు వేసినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకవేళ ఈ సర్వే నిర్వహించి నివేదిక పంపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల అవుతుందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులకు బీమానే ధీమా ఇవ్వాల్సింది. గతేడాది వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదు. అసలు ఆ పరిహారం వస్తుందా.. రాదా అనేది తెలియని పరిస్థితి. వాతావరణ ఆధారిత బీమాలో అటు వర్షాభావ పరిస్థితుల్లోనూ, ఇటు అతివృష్టిలోనూ పరిహారం అందజేసే పరిస్థితి ఉంటుంది. ప్రీమియం చెల్లించినా పరిహారం ఎప్పుడొస్తుందో అనే విషయంలో స్పష్టత లేకపోవడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ బీమాకు సంబంధించిన కార్యాలయం ఆదిలా బాద్లో లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో వ్యవసాయ అధికారులను రైతులు సంప్రదించినా పరిహారం విషయంలో వారు ఒక స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు. అసలు పరిహారం వస్తుందా.. రాదా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోవడంతో రైతుల్లో అయోమయం కనిపిస్తోంది. దీంతో అసలు ప్రీమియం చెల్లించి లాభమేమిటన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతోనే పలువురు రైతులు వాతావరణ ఆధారిత, ఫసల్బీమా యోజన ప్రీమియం గడువులోగా బ్యాంకుల్లో రుణం తీసుకునేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు సంబంధించి ప్రీమియం డబ్బులను రుణం నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీంతో రైతులు గడువు తర్వాతే రుణం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారంటే ఈ బీమాలపై ధీమా లేకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం లక్షా 92,626 హెక్టార్లు కాగా, అందులో లక్షా 86,007 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా లక్షా 28,300 హెక్టార్లలో పత్తి పంట సాగైంది. ఇది సాధారణ విస్తీర్ణం కంటే 3 శాతం అధికం. సోయాబీన్ 30,120 హెక్టార్లలో సాగైంది. కందులు 21,260 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు కొద్దిమొత్తంలో సాగయ్యాయి. కాగా పత్తిని మండల యూనిట్గా వాతావరణ ఆధారిత బీమా కింద, సోయా, కందులు, ఇతర పంటలు గ్రామ యూనిట్గా ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించేందుకు గత నెలలో గడువులోగా కొద్ది మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించారు. బ్యాంక్ రుణం ద్వారా కొంతమంది, నాన్లోనింగ్ రైతులు కూడా మీసేవ ద్వారా నేరుగా ఈ ప్రీమియం కట్టి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫసల్ బీమాలో రైతులు 10వేలలోపే ఉండడం గమనార్హం. ఇక వాతావరణ ఆధారిత బీమాలో వేల మంది రైతులు ప్రీమియం కట్టారు. పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఏ యేడాదికి సంబంధించి ఆ యేడాది బీమా పరిహారం డబ్బులు అందజేయాలని రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. తద్వారా తదుపరి పంటల సాగులో పెట్టుబడికి కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో పలువురు రైతులు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లించినా వారికి పరిహారం రాకపోవడంతో ఈయేడాది పలువురు రైతులు ఈ బీమా పొందేందుకు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. సర్వే ప్రారంభం.. జాతీయ బీమా కంపెనీ(ఎన్ఐసీ) జిల్లాలో ఫసల్ బీమా యోజనకు సంబంధించి సర్వే మొదలు పెట్టింది. ప్రధానంగా పంట నష్టం సంభవించిన తర్వాత రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఈ బీమా అధికారులపై సర్వేను త్వరగా ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ కూడా ఎన్ఐసీ అధికారులతో సమావేశమై రైతులకు పరిహారం అందించే విషయంలో సర్వే చేసి పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కాగా మంగళవారం జైనథ్, బేల, ఆదిలాబాద్రూరల్ మండలాల్లో ఈ సర్వే మొదలుపెట్టారు. ఎన్ఐసీ క్లస్టర్ మేనేజర్ రాకేష్రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులతో కలిసి సర్వే ప్రారంభించారు. ఇచ్చోడ, తలమడుగు, తాంసి, భీంపూర్లలో బుధవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత పరిహారం విషయంలో స్పష్టత వస్తుంది. అత్యధికంగా వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించి ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తేనే జిల్లాలో అధిక మంది రైతులకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కుదేలైన అన్నదాత
-
3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, అమరావతి: ఎడతెరిపి లేని వర్షాలు పంటలను తుడిచిపెట్టాయి. వరుణుడి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు రకాల పంటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ కోస్తాలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలతో సుమారు 3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. దెబ్బతిన్న పంటల్లో వరి మొదటి స్థానంలో ఉండగా పత్తి, మొక్కజొన్న, చెరకు, అరటి, పసుపు, కంద వంటి పంటలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార బృందాలు త్వరలో గ్రామాలలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 2.34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికిప్పడు నష్టం విలువ ఎంత అనేది చెప్పడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నా రైతు సంఘాలు మాత్రం వేయి కోట్లకు పైమాటే అంటున్నాయి. పంట నష్టం వివరాలను తగ్గించి చూపే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగా నష్ట తీవ్రతను తగ్గించి చూపారని వారు గుర్తు చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున తక్షణమే సాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 1.48 లక్షల ఎకరాల్లో వరికి దెబ్బ దక్షిణాకోస్తాలోని విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 1.48 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగి ఉంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలోని 16 లంక గ్రామాల భూముల్లో పంట పూర్తిగా వరద నీటిలో మునిగి ఉంది. ప్రస్తుతం ఆయా లంక గ్రామాలకు వెళ్లేందుకు పడవలు తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఎంత విస్తీర్ణం మేర నీట మునిగి ఉందనేది తెలియడం లేదు. లంక గ్రామాల్లో వేసిన ఉద్యాన, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 17,300 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 34,594 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. కోనసీమలోని లంక గ్రామాలలో పసుపు, కంద పంటలు నీట మునిగి ఉన్నాయి. పంట నష్ట పరిహారం ఏదీ? ఎక్కడ? గత మేలో కురిసిన అకాల వర్షాలకు సుమారు రూ.200 కోట్ల నష్టం జరిగినా ఇంతవరకు రైతులకు నయాపైసా చేతికి అందలేదు. అదిగో ఇదిగో అని తిప్పుతూనే ఉన్నారు. అప్పట్లో మార్కెట్ యార్డులలో సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. నష్టం అంచనా అంటూ హడావిడి చేసి రెండు నెలల తర్వాత ఆ మొత్తాన్ని రూ.190 కోట్లకు చేర్చినా రైతులకు అందింది శూన్యమే. ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకెంత కాలం పడుతుందో, రైతు చేతికి వచ్చేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. తెగుళ్ల బెడద– నివారణ సూచనలు ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంటలకు తెగుళ్లు సోకే బెడద ఎక్కువగా ఉండొచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ పంట సంరక్షణకు పలు సూచనలు చేశారు. వీటిని పాటించి పంటను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. వరి నాటు వేసిన పొలంలో అధికంగా ఉన్న నీటిని తొలగించి ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సా కోనాజోల్ గాని వాలిదామైసిన్ను గానీ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి వేసి నెల రోజులు దాటితే ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. కుళ్లు తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు ఆశించకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాముల్ని పిచికారీ చేయాలి. వంగ, టమాటా వంటి కూరగాయల పంటలకు తెగుళ్లు రాకుండా ఆక్సిక్లోరైడ్ను నీళ్లలో కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపుకు తాటాకు తెగులు ఆశించినట్టయితే ప్రోపికొనజోల్ లేదా మాంకోజెట్ ను పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఎకరాకు రూ.10 వేలు
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరికి వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని, ఆయా పంటలను తిరిగి వేసుకునేందుకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున (ఎకరాకు సుమారు రూ.10 వేలు) సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వరదల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 వేల ఎకరాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 6,468 హెక్టార్లలో వరి, పత్తి, ఉద్యానవన పంటలు, కూరగాయలు దెబ్బతిన్నాయని తెలిపారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు, రోడ్లు, ఇళ్లు దెబ్బతినడంతో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. పశ్చిమగోదావరిలో రూ.350 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.250 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరదలపై సీఎం బుధవారం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో రెండుజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జలనవరులశాఖ, ఆర్అండ్బీ తదితర విభాగాల ముఖ్యఅధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కాటమనేని భాస్కర్లు తమ జిల్లాల్లో వరద ప్రభావం, నష్టం, పునరావాస చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరదలకంటే ఎర్రకాలువ పొంగడంతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఎర్రకాలువ వరదను పోలవరం కుడికాలువ, సముద్రంలోకి మళ్లించి మరోసారి నష్టం జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వరదలకు ప్రభావితమైన తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లోని 149 గ్రామాలు, పశ్చిమలో 25 మండలాల్లోని 195 గ్రామాల్లో చేపట్టిన పునరావాస చర్యలపై అధికారులను అభినందించారు. వరదలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు రూ.35 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. 110 కిలోమీటర్ల మేరకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. పశ్చిమలో కొత్తగా ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లనిర్మాణానికి గృహ నిర్మాణ పథకం కింద రూ.1.5 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.25 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నెలరోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కోనసీమలో లంకల్లోకి వెళ్లేందుకు నదిని దాటే 8 ప్రాంతాల్లో 15 రోజుల్లో స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కరువు, వరద వారసత్వంగా వస్తున్నాయి... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు, కోస్తాలో వరదలు కవలపిల్లల్లా వారసత్వంగా వస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి రోజుకు రూ.150 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతోందన్నారు. ఆ నీటిని కొంతమేరకైనా కరువు జిల్లాలకు మళ్లిస్తే బాగుండేదన్నారు. పోలవరం ప్రాజెక్టును 2019లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. ఆలోపు పూర్తి చేస్తామంటే ఎవరికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రాజెక్టు రీడిజైన్లను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఇప్పటివరకు చేసిన పనులకు ఇవ్వాల్సిన రూ.2,600 కోట్లను మంజూరు చేయకపోవడమే అడ్డంకిగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు చేపట్టామని, నదుల అనుసంధానం చేసి కరువును తరమికొడతామన్నారు. త్వరలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్నారు. దుబారా ఖర్చులను అరికడితే ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని ఓ నాయకుడంటున్నారని, అలాంటప్పుడు మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి చెక్కు.. వీటికేది దిక్కు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూములుండీ విదేశాల్లో నివసిస్తున్న పట్టాదారులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము అందజేతపై నీలినీడలు అలుముకున్నాయి. మే నెలలో వారికి ఎలాగైనా అందజేసేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఆలోచించిన సర్కారు... ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. విదేశాల్లో ఉన్న వారికి ‘సొమ్ము ఇవ్వడం అవసరమా’అన్న ధోరణిలో ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చనిపోయిన రైతుల పేరుతో ఉన్న చెక్కులు, దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పట్టాదారుల చెక్కుల పంపిణీపైనా సర్కారు నిర్ణయం తీసుకోవడంలేదు. దీంతో 61 వేల మంది ఎన్ఆర్ఐ, 90 వేల మంది చనిపోయిన రైతుల చెక్కులు మూలనపడి ఉన్నాయి. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతులకు చెందిన 1.14 లక్షల విలువైన చెక్కులు కూడా అలాగే ఉండిపోయాయి. ఇలా మొత్తంగా 2.75 లక్షల చెక్కుల సొమ్ము త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది. ఆయా కుటుంబాల ఎదురుచూపు... ఖరీఫ్ సీజన్లో 58.33 లక్షల మంది రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. అందుకోసం రూ. 5,730 కోట్లు బ్యాంకులకు అందజేసింది. అయితే గ్రామాలకు పంపిన చెక్కుల్లో ఇప్పటివరకు కేవలం 48 లక్షల మంది రైతులే చెక్కులు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన సొమ్ములో రూ. 5,100 కోట్లు రైతులు తీసుకున్నారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్న పట్టాదారుల విషయంలో సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంపై వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా సహా ధనిక దేశాలకు వెళ్లిన వారిలో చాలామంది ఆర్థికంగా శ్రీమంతులే. కానీ గల్ఫ్ దేశాలకు వెళ్లినవారిలో అధికులు పేదలే. వారి పేరిట ఉన్న చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవడానికి వారిక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నవారు, వారి కుటుంబీకులు వాటికోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక 90 వేల చెక్కులు చనిపోయిన రైతుల పేరిట ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందనే ఆరోపణలు న్నాయి. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉండే వారి కోసం చెక్కులను జిల్లాల నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి కౌంటర్ల ద్వారా అందజేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవీ జరగలేదు. దీంతో గ్రామాలకు వెళ్లడానికి వీలుపడని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మా భూమి’ ఏమైపోయిందో!
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబానికి పదెకరాల భూమి ఉంది. ఆ భూమి ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద నమోదయింది. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ ముగ్గురి పేర్ల మీద పాస్పుస్తకాలున్నాయి. పహాణీలో పేర్లున్నాయి. మాభూమి వెబ్సైట్లో సర్వేనంబర్ను చూసుకుంటే వారి పేర్ల మీదనే ఆ భూమి పదిలంగా ఉండేది... కానీ, ఇప్పుడు ఆ భూమికి పాస్పుస్తకాల్లేవు. ఎవరో ఫిర్యాదు చేశారని రెవెన్యూ యంత్రాంగం పాస్పుస్తకాలు నిలిపివేసింది. వారి భూములను పార్ట్–బీలో చేర్చి పక్కన పెట్టింది. కనీసం ఆన్లైన్లో చూసుకుందామన్నా ఇప్పుడు మా భూమి వెబ్సైట్ లేదు. భూరికార్డులూ అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు కుటుంబంలో ఎడతెగని ఆందోళన.. ఈ ఆందోళన ఆ ఒక్క రైతు కుటుంబానిదే కాదు.. కారణమేదైనా భూరికార్డుల ప్రక్షాళన తర్వాత తమ భూములకు పాస్పుస్తకాలు రాని లక్షలాది మంది రైతులది. అన్నీ సరిగానే ఉన్నా సాంకేతిక కారణాలతో పాస్పుస్తకాలు రాని వారు, పుస్తకాల్లో అచ్చు తప్పులు పడి మళ్లీ ప్రభుత్వానికి తమ పుస్తకాలను సరెండర్ చేసినవారు, ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే పార్ట్–బీలో చేర్చిన భూములకు చెందిన రైతులంతా ఇప్పుడు ఇదే ఆందోళనతో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. ధరణీ.. కానరాదేమీ! భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 57లక్షలకు పైగా ఖాతాల్లో 2కోట్లకు పైగా ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేశారు. 49లక్షలకు పైగా ఖాతాలకు పాస్పుస్తకాలను ముద్రించారు. ఆధార్ నంబర్లు, ఫొటోలు లేవనే కారణంతో 7లక్షలకు పైగా ఖాతాలకు పుస్తకాలను అసలు ముద్రించనే లేదు. ముద్రించిన వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయలేదు. కొన్ని కాలమ్లు రాలేదని, తప్పులు వచ్చాయంటూ నిలిపివేసిన వీటిలో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలను మళ్లీ పంపిణీకి జిల్లాలకు పంపారు. అంటే, మొత్తంమీద 10లక్షలకు పైగా ఖాతాలకు పాస్పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు, ఈ ఖాతాల్లో ఉన్న భూములపై ఎవరికి హక్కులున్నాయో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయా రావా... పాస్పుస్తకాలు ఇస్తారో లేదోననే ఆందోళన రైతాంగంలో నెలకొంది. ధరణి పేరు మీద పైలట్గా ప్రారంభమయిన 21 మండలాల్లోనూ రికార్డులు సరిగా లేకపోవడంతో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పార్ట్–బీ పేరుతో వివాదాలున్నాయని పక్కన పెట్టిన భూములను ఇంతవరకు పరిష్కరించలేదు. ఇలా మరో 3లక్షలకు పైగా ఖాతాల్లో రైతులు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందోననే గాభరాకు గురవుతున్నారు. కేవలం పాస్పుస్తకమే తమకు ఆధారంగా ఉందని, ఆన్లైన్ రికార్డుల్లో కూడా తమ పేర్లు చేర్చాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని, భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ రికార్డులు నమోదు చేయాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏడాది నుంచి రికార్డుల్లేవు.. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవి కావు. రైతుల దగ్గర ఉండే పాస్పుస్తకాలు తప్ప భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ‘భూభారతి’పేరుతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించే ప్రయత్నం జరిగినా అది పూర్తి కాలేదు. కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్గా రేమండ్ పీటర్ బాధ్యతలు చేపట్టాక 2016లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఫలానా సర్వే నంబర్లో ఉన్న భూమి ఏ రైతు పేరు మీద ఉందో చూపించే విధంగా ‘మా భూమి’వెబ్సైట్లో పొందుపరిచారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన 2017, సెస్టెంబర్ 15 నుంచి ఈ వెబ్సైట్ను నిలిపివేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత ధరణి పేరుతో కొత్త వెబ్సైట్ ప్రారంభించారు. -
వైఎస్సార్సీపీతోనే రైతుసంక్షేమం
మదనపల్లె రూరల్: రాష్ట్రంలో వైఎస్సార్సీపీతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలంలోని కాశీరావుపేటలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ విద్యుత్ అంశా ల గురించి వివరాలు అడిగారు. టమాట పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, మోటర్లకు లోఓల్టేజి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిథున్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతుసంక్షేమానికి పెద్దపీట వేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. నేరుగా రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారన్నారు. ఎండనక, వాననక రాత్రింబవళ్లు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ సమస్యలు తెలుసుకుం టున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల్లో రైతు శ్రేయస్సు కోసం రైతు భరోసా కింద పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు రూ. 50 వేలు ఇస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించడం, హంద్రీ–నీవా ద్వారా సాగు, తాగునీరు ఇవ్వడం, రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు రద్దుచేయడం, 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాలు అమలు చేస్తారన్నారు. ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేస్తే రైతుల సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు బాబ్జాన్, ఉదయ్కుమార్, షమీమ్ అస్లామ్, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బాలగంగాధర్రెడ్డి, మస్తాన్రెడ్డి, ఖాజా, సుగుణాంజినేయులు, నీరుగట్టు వెంకటరమణారెడ్డి, వేమనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల వెల్లువ
‘రుణమాఫీ ఫిర్యాదులు కర్నూలు జిల్లాలో తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ జిల్లాలో రుణమాఫీ బాగానే జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.’ – ఇవీ సోమవారం రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన అంచనా తప్పని ఒక్కరోజులోనే తేలిపోయింది. తమకు రుణాలు మాఫీ కాలేదని, ఎందరు అధికారులను కలిసినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఫిర్యాదు చేయడానికి వేలాదిమంది రైతులు తరలివచ్చారు. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో రెండోరోజైన మంగళవారం కూడా రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో జెడ్పీ ప్రాంగణం కిటకిటలాడింది. రెండో రోజు దాదాపు ఆరు వేల మంది రైతులు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చారంటే జిల్లాలో రుణమాఫీ ఏ రీతిలో అమలైందో అర్థం చేసుకోవచ్చు. రైతు సాధికార సంస్థ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయంతో 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద రైతులు బారులుతీరారు. అర్ధరాత్రి వరకు ఫిర్యాదుల పరిశీలన కొనసాగింది. ఒక్కో రైతుది ఒక్కో వేదన.. పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఒక్కో రైతుది ఒక్కో వేదనగా ఉంది. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా ఒక్కరూపాయి కూడా మాఫీ కాని రైతులు 50 శాతం మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాని వారు, మొదటి విడత రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యి.. రెండు, మూడు విడతలు రానివారు ఉన్నారు. మాఫీ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు, మూడు విడతల మాఫీ నిధులను సంబంధిత బ్యాంకులకు విడుదల చేశామని, వెళ్లి బ్యాంకులో కలవాలంటూ అధికారులు పాత పాటే పాడారు. పరిష్కార వేదిక పేరిట హడావుడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు రైతుల కోసం ఏదో చేస్తున్నారే అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా దుయ్యబట్టారు. బంగారంపై తీసుకున్న రుణం మాఫీ కాలేదు బంగారంపై రూ.78 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. కానీ మాఫీ కాలేదు. అర్హత ఉన్నందున మాఫీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిర్యాదు చేశా. యథావిధిగా ఎన్ఐసీ పోర్టల్లో వివరాలు లేవు. బ్యాంకుకు వెళ్లమని కాగితం చేతిలో పెట్టారు. – బి.గిరప్ప, చాగి, ఆదోని మండలం -
ఏపీలోనే రైతుల పరిస్ధితి దారుణంగా ఉంది
-
తెలంగాణలో వర్షాలతో రైతులకు భారీ నష్టం
-
రైతులపై సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు : కర్నూలులో మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెడ్పి మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ గ్రీవెన్స్ సెల్లో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను పారిశ్రామికవేత్తలతో పోల్చారు. కేవలం లక్ష రూపాయలు అప్పు ఉన్న రైతులు ఆత్మహత్యలు ఎందు చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అంటూ, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చులకనగా చేసి మాట్లాడారు. రైతులకు ఆదర్శవంతంగా రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 680 కోట్లతో రైతులకు కొంత రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీలో 9లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించి, అర్హులైన అందరు రైతులకు రుణమాఫీ అందజేస్తామని తెలిపారు. కాగా, సోమిరెడ్డికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి షాకిచ్చారు. జిల్లాలోని రైతాంగ సమస్యలను మంత్రి వద్ద ఎకరువు పెట్టారు. జిల్లాలో కరువు మండలాల గుర్తింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 53 మండలాలకు గాను కేవలం 37 మండలాలను కరువు మండలాలుగా ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షపాతం లేని కారణంగా కర్నూలు జిల్లాను కరువు పీడిత జిల్లాగా ఎంపిక చేయాలన్నారు. తమ ప్రాంతంలో వర్ష పాతం తక్కువగా ఉన్నా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉందని కేఈ పేర్కొన్నారు. -
ఖరీఫ్ సాగుకు కరువు పోటు
ఖరీఫ్ సాగు రైతులను కుంగదీస్తోంది. ఇటీవల ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరోవైపు వేడి గాలులు పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లలో నీరు రావడం లేదు. మరికొన్ని బోర్లలో నీరు వస్తున్నా వరి పొలాలు తడారిపోతున్నాయి. దీంతో ఖరీఫ్లో పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చేతికందుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరుణుడు కరుణించపోతాడా అన్న చివర ఆశతో ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. డక్కిలి (నెల్లూరు): ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు కరువు పోటు తప్పడం లేదు. వరిపంటను సాగుచేసిన రైతులను వాతావరణ పరిస్థితులు నష్టాలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పంటల సాగు రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. డక్కిలి మండలంలో నెల్లూరు మసూర 34449, ఎంటీయూ–1010 రకం వరి పంటను సుమారు 800 హెక్టార్లలో ఖరీఫ్ కింద సాగు చేశారు. బోర్లు, ఏర్లను ఆధారం చేసుకొని వరి పంటను సాగుచేసిన రైతులకు ప్రస్తుతం పంటలు చేతికందుతాయా అన్న ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది రైతులను తొలకరి వర్షాలు పలకరించకపోవడంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పొందేందుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది రైతులు అయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏర్లు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వరి పంటకు ఆరుతడులు కడుతూ పంటను సంరక్షించుకుంటున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న వరి రెండు నెలల క్రితం బోర్లలో, ఏరుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులు ఖరీఫ్ కింద తమకున్న పొలాల్లో వరి పంటను సాగు చేశారు. గత 10 రోజుల వరకు సాగునీటి కొరత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బోర్లు, ఏరుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతతో తమ కళ్లెదుటే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటను ఎలానైనా రక్షించుకోవాలన్న ఆశతో బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నష్టపోతున్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. భగీరథ యత్నం డక్కిలి మండలంలో ప్రధానంగా నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, భీమవరం, కొత్తనాళ్లపాడు, లింగసముద్రం, దగ్గవోలు, మోపూరు, దందవోలు, ఆల్తూరుపాడు, తీర్థంపాడు, ఆముడూరు, శ్రీపురం, మాటుమడుగు తదితర గ్రామాల్లో ఖరీఫ్ కింద వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశ, చిరుపొట్ట దశలో ఉంది. మరో నెల రోజులు సాగునీరు అందితే రైతులకు పంట చేతికందుతుంది. ఇప్పటికే రైతులు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, దుక్కుల కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. మరోవైపు సాగునీటి కొరతను తీర్చుకునేందుకు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసాలకు లోనైనా మరో వారం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే డక్కలి మండలంలో సాగవుతున్న 90 శాతం వరి పంట ఎండిపోయే అవకాశం ఉందనే ఆందోళనతో రైతులు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్జీలు ఇచ్చారు. ఎండిపోయిన డ్యామ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డక్కిలి మండలంలోని చాకలపల్లి సమీపంలో ఉన్న అలపలేరు డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రాంతంలో డ్యామ్లో నీరు ఉండడం వల్ల పరిసర గ్రామాల్లోని బోర్లలో నీరు బాగా వచ్చేది. అయితే ఈ ఏడాది డ్యామ్ ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పంటను రక్షించుకునేందుకు డ్యామ్ నుంచి కొంతమంది రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేకుంటున్నా మరో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని చాకలపల్లి, యల్లావజ్జలపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి గత 10 రోజుల నుంచి సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. ఏర్లు, బోర్లలో నీరు అడుగంటడంతో అలపలేరు డ్యామ్ నుంచి ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీరు పొలాలకు అందిస్తున్నాం. ప్రతి రోజూ ఆయిల్ ఇంజిన్లు నడిపేందుకు బాగా ఖర్చవుతోంది. డ్యామ్లో కూడా నీరు అడుగంటింది. – ఎం.వెంకటేశ్వర్లు, చాకలపల్లి, రైతు రూ.వేలు ఖర్చు చేయాల్సివస్తుంది ఖరీఫ్ కింద ఐదెకరాల్లో వరి పంట సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో అలపలేరు డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసుకునేం దుకు పైప్ల కోసం రూ.20 వేలు ఖర్చు చేశాను. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఎండిపోయిన పంటలకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మధు, చాకలపల్లి, రైతు -
టీజేఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచనల నేపథ్యంలో పార్టీని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఆ తరువాత జిల్లాల్లో బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నా.. కలసి వచ్చే పక్షాలనూ కలుపుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ముందు సొం త కార్యాచరణే చేపట్టాలని ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి జి.వెంకట్రెడ్డి వెల్లడించారు. సకల జనుల సమ్మె రోజునే.. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను ఎత్తిచూపుతూ వాటి సవరణ కోసం మండల కేంద్రాల్లో రైతులతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి చేపట్టాలని టీజేఎస్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులు.. రైతు బంధులో జరుగుతున్న అవకతవకలు, నష్టపోయిన రైతులతో మండల అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యాచరణను అమలు చేయనుంది. ఆ బాధ్యతలను టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్రెడ్డికి అప్పగించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చేనెల 12న హైదరాబాద్లో దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. సకల జనుల సమ్మె చేపట్టిన సెప్టెంబర్ 12వ తేదీనే ఈ దీక్ష చేపట్టాలని తీర్మానించింది. రాజీవ్ లేదా విజయవాడ రహదారిపై భూములు తీసుకున్న వివిధ కంపెనీలను పరిశీలించి ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో ఈ నెల 27 నుంచి 31 వరకు కార్యక్రమం నిర్వహించి చర్చించాలని టీజేఎస్ నిర్ణయించింది. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్తో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న రాజీవ్ రహదారి, విజయవాడ హైవేపై సడక్ బంద్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాచరణ విజయవంతం కోసం అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తరువాత పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్లాలని, జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. -
6 జిల్లాల్లో కరువు కాటు!
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు వల్ల భారీగా పంట నష్టం సంభవించిందని వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దాదాపు 5 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట దెబ్బతిందని, దీనివల్ల 3.10 లక్షల టన్నుల మేర వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోయినట్లేనని పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో జూన్, జూలై నెలల వర్షపాతం, వర్ష విరామం (డ్రైస్పెల్), ఇతర నిబంధనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఈ నెల 8న 275 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నష్టాలను మదించి త్వరగా నివేదికలు పంపాలని ఆరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. దీంతో ఈ జిల్లాల్లోని 275 కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నివేదికలు రూపొందించి సంయుక్త వ్యవసాయ కమిషనర్లు కలెక్టర్లకు సమర్పించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సూత్రప్రాయ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర కరువు నిబంధనావళి ప్రకారం 33 శాతం లోపు పంట నష్టం వాటిల్లిన వారికి ఎలాంటి సాయం (పెట్టుబడి రాయితీ) ఇవ్వరు. అందువల్ల ఇలాంటి నష్టాలను వ్యవసాయ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 5 లక్షల హెక్టార్లలో(12.5 లక్షల ఎకరా) 3.10 లక్షల టన్నుల మేరకు పంట దిగుబడి కోల్పోయినట్లు ఆయా జిల్లాల అధికారులు పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. కరువు మండలాల్లో పంట నష్టంపై ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి పంపామని వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు తెలిపారు. పంట నష్టపోయిన 7.40 లక్షల మంది రైతులకు రూ.695 కోట్లు పైగా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులు నివేదించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను వ్యవసాయ శాఖ క్రోడీకరించి పంట నష్టం వివరాలతో సమగ్రమైన నివేదిక రూపొందించి రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్కు పంపుతుంది. విపత్తు నిర్వహణ కమిషనర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితో సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి పంపించి వారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి కరువు సాయం కోసం నివేదిక పంపనున్నారు. తుది నివేదికను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో అత్యధిక నష్టం క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ప్రకారం కరువు వల్ల కర్నూలు జిల్లాలో అధిక నష్టం సంభవించింది. ఈ జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు పంటలు కోల్పోయారు. 2.17 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట నష్టం వాటిల్లింది. ఈ ఒక్క జిల్లాలోనే లక్ష టన్నులపైగా వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోనుందని అంచనా. అనంతపురం జిల్లాలో 2.20లక్షల మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. 1.5లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 1.10 లక్షల టన్నులకుపైగా పంట దిగుబడికి నష్టం జరిగినట్లు అంచనా. చిత్తూరు జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు కరువు వల్ల పంటలు నష్టపోయారు. 90 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల జిల్లాలో 60 వేల టన్నుల వ్యవసాయోత్పత్తుల దిగుబడి తగ్గిపోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
మృత్యుభూతం
ఆ రైతు, అతనితోపాటు ఒక డాక్టరు.. చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ ముసలామె మంచం ఎదురుగా నిలబడ్డారు. ఆమె స్తబ్దుగా వుంది. అన్నీ వదిలేసినట్లు స్థిరంగా ఆ ఇద్దరి సంభాషణ వింటూ, వాళ్ళనే చూస్తూ వుంది. ఆమె చావడానికి సిద్ధంగా వుంది. వచ్చే చావుని ఎదిరించాలన్న కోరిక ఆమెలో లేదు. తొంభై రెండేళ్ళ వయసు అంటే అదే చివరి అంకం అని ఆమెకి తెలుసు.జ్యేష్ఠ మాసపు సూర్యుడు కిటికీలోనుంచి, తెరిచివుంచిన తలుపులోనుంచి మంటపుట్టించే వేడి కిరణాలను ప్రసరిస్తున్నాడు. అవి బురదమట్టితో అలికిన ఇంటి నేలపైన అడ్డదిడ్డంగా పడుతున్నాయి. నాలుగు తరాల మోటు మనుషులు వేసిన అడుగుల కింద నలిగిన నేల అది. ఎండతో పాటు వచ్చిన సన్నటి గాలులు పొలాల వాసనను వెంటబెట్టుకొస్తున్నాయి. డాక్టరు గొంతుపెగిల్చి కాస్త గట్టిగానే మాట్లాడటం మొదలుపెట్టాడు – ‘‘హోన్రే! మీ అమ్మ పరిస్థితి ఇలా వున్నప్పుడు నువ్వు ఆమెను వదిలి పెట్టడం మంచిది కాదు. ఆమె ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదలచ్చు’’. రైతు చాలా బాధపడి సమాధానం ఇచ్చాడు – ‘‘కానీ పొలం నుంచి గోధుమలు తెచ్చుకోవాలి. కుప్పలూడ్చి అలాగే వదిలేసి చాలా రోజులైంది. వాతావరణం కూడా అనుకూలంగా వుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెచ్చుకోగలను. ఏమంటావు అమ్మా?’’ అన్నాడు. మరణశయ్య మీద వున్న ఆమె, కొడుకు లోభత్వానికి బాధపడ్డా, సరే అన్నట్లు కళ్ళతో, ముఖకవళికలతో చెప్పింది. కొడుకు గోధుమలుతెచ్చుకోడానికి వెళ్తే, ఒంటరిగా ప్రాణం వదలడానికి సిద్ధపడ్డట్టుగా వున్నదా సమాధానం.కానీ డాక్టరు కోపం నషాళాన్ని తాకింది. ‘‘నీ అంత దుర్మార్గుడు వుంటాడా? నేను నిన్ను అడుగు కూడా బయటపెట్టనివ్వను. అర్థమయిందా? కాదూ కూడదూ వెళ్ళాల్సిందే అంటే వెళ్ళే ముందు నర్స్ రాపేని తీసుకురా. ఆమెకు నీ తల్లిని దగ్గరుండి చూసుకోమని చెప్పి అప్పుడు కదులు. నా మాట వింటావా లేదా? నీకు మాత్రం ఇలాంటి పరిస్థితి రాదా? అప్పుడు కుక్కకన్నా హీనంగా చస్తావు. వింటున్నావా?’’సన్నటి పొడుగాటి ఆ రైతు చిన్న చిన్న అడుగులు వేస్తూ వెనకాముందు ఆడాడు. నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జనపడ్డాడు. ఓ పక్క డాక్టరు అంటే భయం. మరో పక్క డబ్బులు వృధా అయిపోయే పరిస్థితి. స్వతహాగా రూపాయి రూపాయి కూడబెట్టడాన్ని ఎంతో ఇష్టపడే పొదుపరి. వెనుకాడాడు. లెక్కలు కట్టాడు.తడబడుతూ మాట్లాడాడు – ‘‘ఆమె ఎంత తీసుకుంటుంది?’’ అన్నాడు.‘‘నాకేం తెలుసు? ఆమెతోనే మాట్లాడుకో! కానీ చెప్తున్నా. గంటలో ఆమె ఇక్కడుండాలి.’’రైతు ఒక నిర్ణయానికి వచ్చాడు.‘‘కోప్పడకండి డాక్టరుగారూ. నేనే వెళ్ళి తీసుకొస్తాలెండి.’’ అన్నాడు. డాక్టరు వెళ్ళిపోయాక రైతు తన తల్లి వైపు తిరిగి తప్పదని ధ్వనిస్తున్న గొంతుతో – ‘‘నేను వెళ్ళి రాపేని పిల్చుకొస్తాను. ఖంగారు పడకు’’ అని బయల్దేరాడు.లా రాపే ముసల్ది. బట్టలు వుతకడం ఆమె వృత్తి. ఆ చుట్టుపక్కల ఎంతో మంది చావుల్ని చూసింది. వాళ్ళు చనిపోతుండగా చూసింది. తెల్లటి గుడ్డలో వాళ్ళను చుట్టిపెట్టి, తిరిగిరాని లోకాలకు పంపించేదాకా వెంటే వుంది. అది అయిపోగానే బతికున్నవాళ్ళ గుడ్డల్ని ఇస్త్రీ చేసే పని చేసుకునేది.ఆమె ఎవరిమీదో విరోధమున్నట్లు, ఇంకెవరినో చూసి అసూయపడుతున్నట్లు వుంటుంది. డబ్బు ఆశ. చనిపోయేవాళ్ళ యాతన చూడటం అంటే ఆమెకు ఒక పైశాచిక ఆనందం వున్నట్లు అందరూ అనుకుంటారు. హాన్రే బాన్టెంప్స్ ఆమె ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆమె బట్టలకోసం గంజి తయారుచేస్తూ వుంది. ‘‘ఏమ్మా రాపే? ఏంటి విశేషాలు?’’ అన్నాడు పలకరిస్తూ. ఆమె తల వెనక్కి తిప్పి అతన్ని చూసింది.‘‘ఏముంటాయి. అంతా మాములే. నీ సంగతులు చెప్పు’’ అంది. ‘‘నేనా? నాకేం? నేను బాగానే వున్నాను. మా అమ్మ ఆరోగ్యమే సరిగాలేదు’’‘‘మీ అమ్మా?’’‘‘అవును మా అమ్మే’’‘‘ఏమైందామెకి?’’ ‘‘ఏముంది. అంతా అయిపోయింది. చావడానికి సిద్ధంగా వుంది’’ ‘‘అయ్యో మరీ అంత దారుణంగా వుందా?’’ ముసలామె గంజి కలుపుతున్న నీటిలో నుంచి చేతులు బయటికి తీసి జాలిగా అడిగింది. ‘‘డాక్టరు రేపు వుదయం దాకా కూడా వుండదేమో అన్నాడు’’‘‘అయ్యో! అయితే పరిస్థితి అసలు బాలేదన్నమాట’’హాన్రే కాస్సేపు తటపటాయించాడు. కాసేపటికి విషయంలోకి రాక తప్పలేదు. ‘‘ఆమె వెళ్ళిపోయేదాకా ఆమెతో వుండాలి. ఎంత తీసుకుంటావు? నేనేం డబ్బులున్నవాణ్ణి కాదు. కనీసం పనిమనిషిని పెట్టుకునే స్థోమత కూడా లేదు. అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా అదే!’’.అవన్నీ పట్టనట్లు అతనివైపు చూసింది రాపే. ‘‘రెండు రేట్లు వున్నాయి. పగటిపూట నలభై సౌలు, రాత్రికి మూడు ఫ్రాంకులు. ఈ రేటు డబ్బు వున్నవాళ్ళకి. ఇరవై సౌలు పగటికి, నలభై రాత్రికి ఇది మిగతావాళ్ళకి రేటు. నువ్వు కూడా ఇరవై, నలభై ఇవ్వు’’ అంది.రైతు ఆలోచించాడు. తన తల్లి గురించి తనకు బాగా తెలుసు. ఆమె పట్టు పట్టిందంటే వదిలే రకం కాదు. ఎప్పుడూ తలవంచిన ఘటం కాదు.డాక్టర్లు ఎన్ని చెప్పినాకనీసం ఇంకో వారం బండి లాగేయ్యగలదు. ఇదంతా ఆలోచించుకోని అతను ఆమెతో కొత్త ప్రతిపాదన పెట్టాడు. ‘‘అలా కాదు. నువ్వు ఆమె చనిపోయేదాకా ఆమెకు సేవ చెయ్యాలి.మొత్తానికి కలిపి ఇప్పుడే ఒక రేటు అనేసుకుందాం. ఎలా జరిగినా సరే! డాక్టర్లేమో ఇవాళో రేపో అంటున్నారు. అలా జరిగితే నీకే లాభం, నాకు నష్టం. అలా కాకుండా ఆమె తట్టుకోని నిలబడిందనుకో నీకు నష్టం, నాకు లాభం.’’నర్స్ ఆ మనిషి వైపు ఆశ్చర్యంగా చూసింది. చావుతో పందేలు వేయడం ఆమెకు కొత్త. అంచేత కాస్త తటపటాయించింది. నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం వుందని అనిపించింది. ఇంతలో వచ్చినవాడు ఏదైనా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకుంది. ‘‘మీ అమ్మను చూస్తేగానీ నేను ఏ విషయం చెప్పలేను’’ అంది. వెంటనే చేతులు కడుక్కొని, అతని వెంటే బయల్దేరింది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇద్దరూ. ఇంటికి చేరుకున్నాక హోన్రే సన్నగా గొణిగాడు – ‘‘ఈపాటికే అంతా అయి పోయిందేమో’’. అలా జరిగి వుంటే బాగుండు నన్న కోరిక అతని గొంతులో అస్పష్టంగా వినిపించింది.లోపల ముసలామె బతికేవుంది. ఆ దరిద్రపు మంచం మీద అలాగే వెల్లకిలా పడుకొని వుంది. దాదాపు నూరు సంవత్సరాల జీవితంలో ఆమె సాధించినవాటన్నింటికీ ఇప్పుడు అలిసిపోయినట్లు పడివుంది. రాపే మంచం దగ్గరకు వెళ్ళి చావటానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసింది. ఆమె నాడి పరిశీలించి, గుండె పైన చిన్నగా తట్టింది. ఆమె శ్వాస విని, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించింది. అలా కొంతసేపు పరిశీలించిన తరువాత ఆ గదిలో నుంచి బయటకు నడిచింది. ఆమె వెంటే అతను కూడా కదిలాడు. ఆ ముసలామెకి ఆ రాత్రి గడిస్తే గొప్ప అని అనుకుంది రాపే.‘‘ఏమంటారు’’ అడిగాడతను. ‘‘బహుశా రెండురోజులు వుంటుందేమో! మహా అయితే మూడు అంతే. నాకు మొత్తం అన్నీ కలిపి ఆరు ఫ్రాంకులు ఇవ్వు చాలు’’ అంది. ‘‘ఆరు ఫ్రాంకులా? ఆరు ఫ్రాంకులు!’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నాను కదా! ఆమె ఓ ఐదారు గంటలకన్నా బతకదని.’’ఇద్దరి మధ్యా తీవ్రమైన వాదన జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా తేల్చమంది.ఇతనికి కూడా పొలానికి వెళ్ళకపోతే గోధుమల పనికాదని తెలుసు. చివరికి ఆమె చెప్పిన రేటుకే అంగీకరించాడు. అతను అంగలు వేసుకుంటూ ఎండకు గోధుమలు ఆరబెట్టిన పొలానికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంట్లోకి నడిచింది. ఆమె ఎప్పుడూ తనతో పాటు ఏదో ఒక పని తెచ్చుకుంటుంది. చనిపోతున్నవాళ్ళ పక్కనే తనపని కూడా చేసుకుంటూ కూర్చుంటుంది. ఒకసారి తన పని చేసుకుంటే, ఒకసారి తనని నియమించుకున్న కుటుంబానికి పని చేసేది. ఒకసారి పనికి కుదిరాక ఎంత పనైనా చేసేస్తుంది.ఉన్నట్టుండి ఆమెకు ఏదో జ్ఞాపకం వచ్చింది.‘‘నీ గొంతులో ఎవరైనా కాసిని పవిత్రజలం పోశారామ్మా?’’ అంది.ముసలామె లేదన్నట్లు తలాడించింది. రాపే కాస్త భయం భక్తి వున్న మనిషే. అందుకే ఆ సమాధానం విని వెంటనే లేచి నిలబడింది. ‘‘భగవంతుడా! అలా ఎలా జరిగింది. వుండు నేను ఇప్పుడే వెళ్ళి నీకు పవిత్రజలం పోసే ఏర్పాటు చేస్తాను’’ అంటూ పాస్టరు ఇంటికి పరుగులుపెట్టింది. ఆమె ఉరుకులు చూసి వీధుల్లో వుండే జులాయివాళ్ళంతా ఏదో ప్రమాదం జరిగిందేమో అనుకున్నారు.ఫాదరు వెంటనే తన తెల్లగౌను వేసుకొని ఆమె వెంట బయల్దేరాడు. అతనితో పాటే చర్చిలో కాయిర్ నిర్వహించే బృందంలో పిల్లవాడు కూడా వచ్చాడు. వీళ్ళంతా ఇలా నడుస్తుంటే హోన్రే దూరం నుంచి చూసి, ‘‘పాస్టరుగారు ఎక్కడికి వెళ్తున్నారో’’ అన్నాడు. అతనికన్నా తెలివైన మరో మనిషి సమాధానమిచ్చాడు – ‘‘ఇంకెక్కడికీ! అదిగో ఆయన మీ అమ్మకోసమే పవిత్రజలం తీసుకెళ్తున్నాడు’’. హోన్రే ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. పైగా ‘‘అంతే అయ్యుంటుందిలే’’ అని తన పనిలో నిమగ్నమైపోయాడు.అతని తల్లి పాస్టరు ముందు తన తప్పులన్నీ చెప్పి క్షమాపణలు అడిగింది. స్వచ్ఛతను, శాంతిని పొందింది. ఆ తరువాత పాస్టరు వెళ్ళిపోయాడు. ఇరుకు గదిలో ఇద్దరే మిగిలారు. చావడానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసి ఇంకా ఎంతకాలం ఇలా ఆయిష్షుని సాగదీస్తుందో అని ఆలోచిస్తోంది రాపే. కృష్ణపక్ష రోజులు కావటంతో గాలులు వీచడం మొదలైంది. గోడకు వేలాడదీసిన కేలండర్ టపటపమని కొట్టుకుంటోంది. ఒకప్పుడు తెల్లగా వుండి ఇప్పుడు పచ్చగా మారిన కర్టెన్లు గాలికి ముసలి ప్రాణంలాగే ఎగిరిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.మంచంలో కదలకుండా, కళ్ళు మాత్రం తెరిచి మనసులో ఏ భావం లేకుండా చావుకోసం ఆమె ఎదురుచూస్తున్నట్లుంది. వచ్చినట్లే వచ్చి రాకుండాపోతున్న మృత్యువు ఆమెతో ఆటలాడుతోంది. భారంగా తీస్తున్న ఊపిరి ఆమె నోటినుంచి సన్నటి ఈలలా వస్తోంది. ఆ శబ్దం ఏ క్షణంలోనైనా ఆగిపోతుంది. ఈ భూమి మీద మరో ఆడమనిషి తగ్గిపోతుంది. అలా జరిగినా ఎవరికీ పెద్ద బాధ కలిగేలా లేదు. పొద్దుగుంకుతుండగా హాన్రే తిరిగి వచ్చి నేరుగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళి ఆమె ఇంకా ప్రాణాలతోనే వుందని తెలుసుకున్నాడు.‘‘ఎలా వుంది’’ అన్నాడు అక్కడికి ఆమెకి ఏదో తగ్గిపోయే అనారోగ్యం వున్నట్లు. ఆ తరువాత రాపేని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ‘‘రేపు ఉదయం ఐదుగంటలకి వచ్చేసెయ్’’ అన్నాడు.‘‘అలాగే. ఐదుకే వస్తాను’’ అన్నదామె.తెల్లవారుతుండగా ఆమె ఆ ఇంటికి వచ్చేసరికి హాన్రే సూప్ తయారు చేసుకొని తాగుతూ కనిపించాడు.‘‘మీ అమ్మ చనిపోయిందా లేదా?’’ అడిగిందామె.‘‘లేదు. కాస్త కుదుటపడినట్లు వుంది’’ అంటూ సమాధానం చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు రాపే వైపు కనుచివర్ల నుంచి దొంగచూపు చూశాడు. ఆ తరువాత లేచి పనికి వెళ్ళిపోయాడు. రాపే ఆందోళనగా చావుబతుకుల్లో వున్న ముసలామె దగ్గరకు వెళ్ళింది. ఆమె అలాగే వుంది. కదలకుండా కళ్ళు మాత్రం తెరిచి, చేతులతో మంచాన్ని బలంగా పట్టుకొని వుంది. ఇది ఇలాగే సాగితే ఆమె ఇంకో రెండు రోజులో, నాలుగు రోజులో బతకచ్చు. ఎనిమిది రోజులు కూడా పట్టచ్చు. అసలే అత్యాశ వున్న ఆమెకు మోసపోయానేమోనన్న భయం కలిగింది. జిత్తులమారి రైతుమీద, చావడానికి సిద్ధంగా లేని అతని తల్లిపైనా చాలా కోపం వచ్చింది.అయినా సరే ఆమె తన పని మానుకోలేదు. అన్ని సేవలు చేసి ముడతలు పడ్డ ముసలామె ముఖాన్నే చూస్తూ ఎదురుచూసింది. కాస్సేపటికి టిఫిన్ చెయ్యడానికి తిరిగివచ్చిన హాన్రే సంతోషంగానూ, తృప్తిగానూ వున్నట్లు ప్రవర్తించాడు. కాస్త పరిహాసంతో కూడిన చణుకులు విసిరాడు.అతని గోధుమపంట సకాలంలో చేతికి వచ్చిన ఆనందం అతని మాటల్లో వుంది. రాపేలో అసహనం పెరిగిపోయింది. గడుస్తున్న ప్రతి నిమిషం ఆమె నుంచి సమయాన్ని, డబ్బుని దొంగిలిస్తున్నట్లుగా అనిపించసాగింది. ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ రోగిష్టిదాన్ని, దిక్కుమాలిన పక్షిని, లేకుండా చేస్తే? తన డబ్బుని తనకి కాకుండా చేస్తున్న ఆ ఎగశ్వాసని అసలు లేకుండా చేస్తే? ఆమె గొంతుని నులిమేస్తే? అంతలోనే అలా చేయడంలో వున్న సమస్యలను తలచుకుంది. మరో రకంగా పథకం వెయ్యసాగింది. మంచం దగ్గరగా వెళ్ళి –‘‘మీరెప్పుడైనా మృత్యుభూతాన్ని చూశారా?’’ అంది.‘‘లేదు’’ అని ముసలామె సమాధానం చెప్పింది. ఇక అక్కడ్నుంచి నర్స్ ఆమెకు మృత్యుభూతం గురించి భయపెట్టేలా చెప్పడం మొదలుపెట్టింది. చావుబతుకుల్లో వున్న ముసలామె బలహీనమైన మనసును భయంతో వణికించేసింది. చావడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భూతం కనిపిస్తుందనీ, మరణయాతన నుంచి ఆ భూతం విముక్తిని ఇస్తుందని చెప్పింది. ఆ భూతం చేతిలో ఓ చీపురు వుంటుందనీ, తలపైన కవచం వుంటుందనీ, భయంకరమైన అరుపులు అరుస్తుందని చెప్పింది.‘‘ఒక్కసారి ఆ మృత్యుభూతాన్ని చూస్తే ఇక అంతా అయిపోయినట్లే. కొన్ని నెలల ఆయుష్షు వున్నవాళ్ళు కూడా ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తారు’’ అంటూ తన అనుభవంలో చివరి క్షణాలలో భూతాన్ని చూసిన వాళ్ళు అంటూ చాలామంది పేర్లు చెప్పింది.ముసలామెకి అదంతా విని భయంగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. అసహనంగా కదిలి అతి కష్టం మీద తలని రెండో వైపుకు తిప్పుకుంది. అదే అదనుగా రాపే అక్కడ్నుంచి తప్పుకుంది. కబోర్డ్ దగ్గర వున్న ఓ పెద్ద గుడ్డని తీసి తన చుట్టూ చుట్టుకుంది. ఇనుప మూకుడు ఒకటి తీసుకుని తలపైన బోర్లించుకుంది. దాని కాడలు కొమ్ముల్లా కనపడేట్లు పెట్టుకుంది. ఒక చేతిలో చీపురు తీసుకుని, మరో చేతితో ఇంకో గిన్నని పట్టుకుంది. ఉన్నట్టుండి ఆ గిన్నెని నేల మీదకు విసిరికొట్టింది.అది నేల తాకుతూనే పెద్ద శబ్దం చేసింది. ఆ తరువాత ఆమె కుర్చీ పైకి ఎక్కి, మంచానికి కట్టిన తెరని కిందనుంచి పైకి ఎత్తి ఒక్కసారిగా తన ముఖాన్ని ముసలామెకు చూపించింది. చేతులు భయం కలిగించేలా తిప్పుతూ, కీచు గొంతుతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ముఖం కనపడకుండా కప్పుకున్న మూకుడులో ఆ అరుపులు ప్రతిధ్వనించి ఇంకా భయంకరంగా వినపడసాగాయి. భయంతో బిక్కచచ్చిన ముసలామెని చీపురుతో తడుతూ ఇంకా బెదరకొట్టింది. అదిరిపోయిందామె. ఆమె ముఖం పిచ్చిపట్టినట్లుగా మారిపోయింది. చావడానికి సిద్ధంగా వున్న ఆమెలో ఏదో చిత్రమైన శక్తి ప్రవేశించినట్లు బలమంతా కూడదీసుకొని లేచి పారిపోవాలని ప్రయత్నం చేసింది.భుజాలు, సగం శరీరం పైకి లేపింది కూడా. అంతే! ఒక్కసారి గట్టిగా నిట్టూరుస్తూ వెనక్కిపడిపోయింది. అయిపోయింది.రాపే ఏమీ ఎరగనట్లు ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసింది. చీపురు మూల పెట్టేసింది, కప్పుకున్న గుడ్డ మళ్ళీ కబోర్డ్లో పెట్టేసింది. మూకుడు, గిన్నెలను గట్టుపైన, కుర్చీని గోడవారగా సర్దేసింది. ఆ తరువాత అనుభవం నేర్పిన చాకచక్యంతో చనిపోయిన ముసలామె పెద్ద కళ్ళను మూసేసింది. ఓ ప్లేటు మంచం మీద పెట్టి అందులో కాసింత పవిత్రజలం పోసింది. ఆ తరువాత మంచం పక్కనే మోకరిల్లి, ఎంతో కాలంగా చదివి చదివి నోటికి వచ్చేసిన ప్రార్థనలన్నీ చదివింది.హాన్రే సాయంత్రం తిరిగి వచ్చేసరికి ప్రార్థనలు చేస్తున్న రాపేను చూశాడు. వెంటనే లెక్కలు వేసి ఆమెకు ఇరవై సౌలు లాభం వచ్చిందని గుర్తించాడు. ఆమె గడిపిన రెండు రోజులు, ఒక రాత్రికి అయిదు ఫ్రాంకులే అయ్యేది కానీ ఒప్పందం ప్రకారం ఆరు ఫ్రాంకులు ఇవ్వాల్సివస్తోందని నష్టం లెక్క వేసుకున్నాడు. ఫ్రెంచి మూలం : గి ది మొపాసా అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్ -
ఎమ్మెల్యే సిఫార్సులుంటేనే పరికరాలిస్తాం!
సాక్షి, అమరావతి: వ్యవసాయ పరికరాలు కొనాలంటే ఎమ్మెల్యే సిఫార్సులు తప్పనిసరంటూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు నుంచి చెప్పనిదే చిన్నపాటి పరికరాల కోసం దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారు. కనీసం దరఖాస్తులూ తీసుకోవడం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం కింద రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకొనే విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దరఖాస్తుతో వెళ్తే ఎమ్మెల్యే సిఫార్సులుండాలని వ్యవసాయ అధికారులు చెబుతుండడంతో, సేద్యం పనులు మానుకొని అటు ఎమ్మెల్యే ఇళ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏమిటీ డీబీటీ? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకోవచ్చు. పరికరాలు రాయితీపై తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి డీబీటీ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రైతులు తమకు అవసరమైన యాంత్రిక పరికరం పొందడానికి వారే స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. బిల్లులను వ్యవసాయ శాఖకు అందచేస్తే రాయితీతో కలిపి మొత్తం నగదును రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ప్రస్తుత ఖరీఫ్కు దాదాపు రూ.400 కోట్లను కేటాయించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, రొటోవేటర్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, గ్రాస్ కట్టర్, డిస్క్ప్లవ్ వంటి పరికరాలను కొనుగోలు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారుల ద్వారా దరఖాస్తు చేయాలి. సిఫార్సు తప్పనిసరి గ్రామాల్లో ఎంపీవో (మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారి) నుంచి దరఖాస్తు తీసుకునేందుకు రైతులు వెళితే, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ చేయించుకోవాలని, లేకుంటే అక్కడి నుంచి సిఫార్సు లేఖ తీసుకురావాలని చెబుతున్నారు. పదిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిలో తమకు అవసరమైన చిన్నపాటి పరికరాలను రాయితీపై పొందడానికి రైతులు చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు పెద్ద అడ్డంకిగా మారారు. రూ.5 లక్షల రాయితీ లభించే వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు వంటి పరికరాలకు గతంలో ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని, ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.10 వేల రాయితీ లభించే చిన్నపాటి పరికరం పొందడానికీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కావాలని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారు.. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. కొందరు రైతులు దరఖాస్తులు పూర్తి చేసుకునే విధానం తెలియక ఎమ్మెల్యేల కార్యాలయాలకు వెళ్తున్నారని, అక్కడి సిబ్బందితో దరఖాస్తులు పూర్తి చేయించుకుని తమకు ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు తెలియకుండా నియోజకవర్గాల్లో ఏమీ జరగకూడదని, ప్రతీ దరఖాస్తును తాము చూడనిదే, సిఫార్సు చేయనిదే ఇవ్వవద్దని ఎమ్మెల్యేలు చెబుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పనిచేయలేమనే భావనతో రైతులను ఎమ్మెల్యేల కార్యాలయాలకు పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. -
ఆయ‘కట్టు కథలు’
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నా.. గోదావరి పరవళ్లు తొక్కుతున్నా.. వంశధార, నాగావళి పోటీ పడి ప్రవహిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవుతోంది. ప్రాజెక్టుల్లో కావాల్సినన్ని నీళ్లున్నా కూడా నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలతో పాటు రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క ఆయకట్టుకు విడుదల చేయకుండా ప్రభుత్వం కట్టుకథలు చెబుతోంది. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్ సీజన్లో 42.78 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఇందులో 16.26 లక్షల హెక్టార్లలో వరి వేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 21.34 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో 8.54 లక్షల హెక్టార్లలోనే వరి వేశారు. అదికూడా.. కరువనేదే ఎరుగని గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు వంశధార ప్రాజెక్టు కిందనున్న ఆయకట్టుకు మాత్రమే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. మిగిలిన ఆయకట్టులను గాలికొదిలేసింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో వరుసగా ఐదో ఏడాది కూడా విఫలమైన సీఎం చంద్రబాబు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 కోట్ల ఎకరాలకు నీళ్లందిస్తామంటూ ప్రకటన చేయడంతో అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 92,19,918 ఎకరాల ఆయకట్టు ఉంది. గత నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా కనీసం 25 శాతం ఆయకట్టుకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 16.26 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 8.54 లక్షల హెక్టార్ల(21.17 లక్షల ఎకరాలు)లోనే వరి పంట వేశారు. ఇందులో కనీసం 2 లక్షల ఎకరాలను బోరు బావుల కింద సాగు చేసి ఉంటారని అంచనా. అంటే.. వరికి సంబంధించి కేవలం 19.17 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం నీళ్లందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పట్టించుకోని సర్కార్.. ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. జూలై నెలాఖరుకే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. సాధారణంగా ఆగస్టు రెండో వారానికి శ్రీశైలాన్ని చేరాల్సిన కృష్ణమ్మ నెల ముందే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు అవసరాల కోసం 30 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డును తెలంగాణ సర్కార్ కోరితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం 25 టీఎంసీలు మాత్రమే చాలని పేర్కొంది. దీంతో బోర్డు ఆ మేరకు కేటాయింపులు చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడేలోగా జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా జూలై 19 నుంచి రోజుకు సగటున 5,940 క్యూసెక్కుల నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తూ అక్కడి ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. శ్రీశైలం జలాశయం ద్వారా జూలై 24 నుంచి రోజుకు సగటున 2,100 క్యూసెక్కులను కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. కానీ టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించాలి. ఆగస్టు మొదటి వారానికే హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి. నాగార్జునసాగర్లో నిల్వ కనీస నీటిమట్టాన్ని తాకిన వెంటనే సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీరందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఐదారు రోజుల పాటు అరకొరగా నీరు విడుదల చేసి చేతులు దులుపుకుంది. తెలుగు గంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. తుంగభద్రలో ఈ ఏడాది నీటి లభ్యత పెరిగినా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు మాత్రం నీరు అందలేదు. సాగర్ కుడి, ఎడమ కాలువల కిందనున్న 14.68 లక్షల ఎకరాలదీ అదే పరిస్థితి. దీన్నేమంటారు బాబూ? అటు తుంగభద్రకు ఇటు శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీళ్లందించడానికి అనుకూలమైన పరిస్థితులున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాయలసీమ, నెల్లూరు.. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ కిందనున్న ఆయకట్టు రైతులు రోడ్లెక్కారు. సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. రైతుల ఆందోళనలు మిన్నంటడంతో సీఎం చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘కట్టు’కథలు వల్లెవేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను ఆయకట్టులకు అందించి పంటలు కాపాడకుండా.. 2 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు నివ్వెరపోయారు. రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు 92,19,918 ఎకరాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు లక్ష్యం 16.26 లక్షల హెక్టార్లు ఇప్పటివరకు 8.54 లక్షల హెక్టార్లు (21.17 లక్షల ఎకరాలు)లోనే పంట బోరు బావుల కింద సాగు 2 లక్షల ఎకరాలు కేవలం 19.17 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా నీరు -
పంట నష్టం అపారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వంద కోట్లకుపైగా నష్టం ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్లో మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు నిండుకున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరి, పంటనష్టం రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో వర్షాలు కురిసినట్లే కురిసి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, భారీ వర్షాలతో పంటకు జీవం పోసినట్లే పోసి, వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు జరిగిన నష్టానికి ఆవేదన చెందుతున్నారు. వరద పంటల్లో చేరగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశా యి. ఉమ్మడి జిల్లాలో వరి పంట 10 వేల ఎకరాలకు పైగా నష్టపోగా, పత్తి పంట 1.5 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశా రు. సోయా 20 వేల ఎకరాలు, కంది పంట 10 వేల ఎకరాలు, జొన్న, ఇతర పంటలు 5 వేల ఎకరాలకుపైగా నష్టపోయాయి. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశముంది. నష్టపోయిన పంట రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఖరీఫ్లో వేసిన పంటలు వర్షార్పణం అవుతాయేమోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. -
‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్ ట్రిఫులారిన్ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్లు నిరాకరించే అధికారం ఉంది. -
రైతులకు అప్పులిస్తలే!
సాక్షి, హైదారాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ పంట రుణాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో లక్ష్యానికి మించి పంట రుణాలిచ్చిన బ్యాంకులు.. నాలుగేళ్లుగా మాత్రం ఆ లక్ష్యాలు చేరుకోవడం లేదు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 115 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 103 శాతం ఇవ్వగా.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014–15లో లక్ష్యంలో 93 శాతమే రైతులకు ఇచ్చాయి. అలా తగ్గుతూ వచ్చిన రుణాలు గతేడాది 79 శాతానికి చేరుకున్నాయి. 2017–18లో పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు కాగా, రూ. 31,410 కోట్లే అందించాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భూమి చదును చేయడం, బావులు తీయడం తదితర మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే ఈ రుణాల విషయంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం చూపాయి. 2011లో లక్ష్యానికి మించి 205 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 200 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు.. 2014–15లో కేవలం 62 శాతమే ఇచ్చాయి. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త రుణమే లేదు ప్రస్తుత ఖరీఫ్లో రుణాల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఈ ఖరీఫ్లో 83 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవగా ఇప్పటివరకు బ్యాంకులు 30 శాతానికి మించి రుణాలివ్వలేదు. ఈ ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ. 25,496 కోట్లు, కానీ తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 7,300 కోట్లే ఇచ్చాయి. విచిత్రమేంటంటే ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు రుణాలు తీసుకున్న వారంతా రెన్యువల్ చేసుకున్న వారే. అంటే పాత బాకీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నవారే. ఇతరులకు కొత్తగా రుణం ఇవ్వలేదని సర్కారుకు పంపిన బ్యాంకు నివేదికే స్పష్టం చేసింది. బ్యాంకులు సహకరించక, మరోదారి లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద రైతులు అప్పులు చేస్తున్నారు. ఈ విషయమై ప్రభు త్వం మొత్తుకుంటున్నా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నా బ్యాంకుల వైఖరిలో మార్పు రావడం లేదన్న విమర్శలున్నాయి. సర్కారు, బ్యాంకుల మధ్య దూరమే!: భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుంది. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. అయితే రైతుల వివరాలు ధరణి వెబ్సైట్లో సరిచూసుకొని రుణాలు ఇవ్వాలన్న సర్కారు నిబంధనే రుణాల విడుదలకు శాపమైందని చెబుతున్నారు. వెబ్సైట్ ఇప్పటికీ అమలులోకి రాకపోవడంతో రెన్యువల్ చేసుకున్న వారికి తప్ప కొత్త రుణం రాలేదు. ఇలా కొందరు బ్యాంకు వర్గాలు ధరణిని సాకుగా చూపిస్తుండగా.. మరికొందరు ప్రభుత్వమే కారణమంటున్నారు. సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రుణాలపై వడ్డీ ఎలా చెల్లిస్తారో చెప్పకుండా గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి. పావలా వడ్డీ సొమ్ము కూడా చెల్లించలేదని చెబుతున్నారు. ఇలా ప్రభుత్వం, బ్యాంకుల మధ్య తీవ్రమైన అగాథమే పంట, దీర్ఘకాలిక రుణాల్లో సమస్యలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. -
చిగురిస్తున్న ఆశలు
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ నీటి విడుదలపై ఎడమ కాల్వ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజులుగా కృష్ణాబేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల నీరు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో దిగువన ఉన్న జలాశయాల్లోకి కూడా నీరు చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 522.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 17,226 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలోకి రాగానే దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నందున రైతులు ఆశతో ఉన్నారు. ఆల్మట్టి వైపు చూపు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్పైనే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రైతుల ఆశలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టాలు ఉన్నాయి. వస్తున్న వర్షపు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువకు వస్తున్న నీటి విషయంలో ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత మేరకు దిగువకు వదులుతున్నారనే విషయాన్ని ఆయకట్టు రైతులు ప్రతిరోజు పరిశీ లిస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్లో 1705 అడుగు పూర్తిస్థాయి నీటి మట్టంకు గాను ప్రస్తుతం 1704.66 అడుగుల మేర నీరుంది. ప్రస్తుతం డ్యామ్లోకి 57,500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 90,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా నారాయణపూర్ ప్రాజెక్టులో 1615 అడుగులకు గాను 1614.27 అడుగుల మేర నీరుం డగా 90 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 92,680 క్యూసెక్కుల నీరు దిగువకు వదులు తున్నారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 44,621 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. తుంగభద్ర కు పెరిగిన వరద తుంగభద్ర ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో 1633 అడుగులకు గాను 1632.30 అడుగుల నీరుంది. కాగా 1,12,671 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో దిగువకు 1,18,445 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 872 అడుగలు మేర నీరుంది. కాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 57,906 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 24,851 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇంకా 13 అడుగుల నీరు చేరితే దిగువకు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలంకు ప్రాజెక్టులోకి వస్తున్న నీరు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కూడా ప్రస్తుతం వస్తున్న నీరు 17,226 క్యూసెక్కులు ఉండగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఎదురు చూస్తున్నారు. -
ఇన్చార్జి మంత్రుల చేతిలోనే ‘స్టీరింగ్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఏడాది సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్లు మంజూరు చేసే అధికారమున్న జిల్లాస్థాయి అధికారుల కమిటీని తప్పించి, పూర్తి అధికారాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటీవలే అన్ని జిల్లాల వ్యవసాయశాఖాధికారులకు అందాయి. ఇప్పటికే ఈ సబ్సిడీ ట్రాక్టర్లన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకే దక్కుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి, ఆధునిక యంత్ర పరికరాలతో పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర లక్ష్మి) పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లా అధికారుల కమిటీ ప్రమేయం లేదు ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సబ్సిడీ ట్రాక్టర్లు పొందాలనుకున్న రైతులు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించి.. డివిజన్ స్థాయిలోని ఏడీఏ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ద్వారా జిల్లా స్థాయి అధికారుల కమిటీ వాటిని పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తుంది. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీకి డీఏఓ కన్వీనర్గా, ఆగ్రోస్ ఆర్ఎం, వ్యవసాయ శాస్త్రవేత్త, లీడ్ బ్యాంక్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఈ జిల్లా స్థాయి అధికారుల కమిటీతో ప్రమేయం ఉండదు. దరఖాస్తులు నేరుగా కలెక్టర్ ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాల్సి ఉంటుంది. ఇన్చార్జి మంత్రి ఆమోద ముద్ర వేస్తేనే ట్రాక్టర్ మంజూరు అవుతుంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పథకం పూర్తిగా విమర్శల పాలైంది. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే ఈ ట్రాక్టర్లు పంచుకుంటున్నారు. వీటి మంజూరులో పెద్ద ఎత్తున ముడుపులు కూడా చేతులు మారుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్పై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు దండుకున్నారనేది బహిరంగ రహస్యం. సగం ధరకే (గరిష్టంగారూ.3.5 లక్షల వరకు సబ్సిడీ) ట్రాక్టర్ వస్తుండటంతో ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు నాయకులు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై ట్రాక్టర్ల మంజూరు అధికారాలు ఏకంగా మంత్రికి కట్టబెట్టడంతో ట్రాక్టర్లు పొందాలంటే ఇన్చార్జి మంత్రులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టేట్ రిజర్వు కోటాపై వివాదాస్పదం గతంలో సబ్సిడీ ట్రాక్టర్ల పథకం అమలులో స్టేట్ రిజర్వు కోటా (ఎస్ఆర్క్యూ) పేరుతో జారీ అయిన మార్గదర్శకాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆయా జిల్లాలకు మంజూరైన ట్రాక్టర్లలో కొన్నింటిని ఫలానా లబ్ధిదారునికే ఇవ్వాలని ఏకంగా కమిషనరేట్ నుంచే సిఫార్సు లేఖలు అధికారికంగానే జిల్లా అధికారులకు అందడం పట్ల ఆ శాఖ వర్గాలు అప్పట్లో ముక్కున వేలేసుకున్నాయి. స్టేట్ రిజర్వు కోటా ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈసారి ట్రాక్టర్ల మంజూరు అధికారం ఏకంగా జిల్లా మంత్రులకు కట్టబెట్టడంతో ఎలాంటి ఆరోపణలు వ్యక్తమవుతాయనేది వేచి చూడాల్సి ఉంది. -
రైతు రక్తాక్షరాలు
బొమ్మనహళ్లి : కన్నడ నాట విచిత్ర పరిస్థితి నెలకొంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా ఉత్తర కర్ణాటక చుక్కనీరు లేక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో తమకు సాగు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కొందరు రైతులు తమ రక్తంతో ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. కుమారస్వామి సొంత జిల్లా అయిన హాసన్ ప్రాంతం నుంచే లేఖ రాయడం గమనార్హం. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా బాగూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తమకు సాగు, తాగునీటిని కల్పించాలని తమ రక్తంతో లేఖ రాయడంతో పాటు రక్తంతో సంతకాలు కూడా చేశారు. బాగూరు గ్రామం సమీపంలో ఉన్న సొరంగ మార్గం కాలువలో నీరు లేదని, ఈ కాలువకు నీరు మళ్లించాలని, లేకుంటే ప్రజలతో పాటు పశువులు కూడా తాగునీటి కష్టాలు తప్పవన్నారు. భూగర్భ జలాలు సైతం ఇంకిపోవడంతో బోర్లలో సైతం నీరు లేదని, ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఆ లేఖలో పేర్కొన్నారు. నీరు కల్పించలేని పరిస్థితి ఉంటే దయా మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు. -
కరువు ఛాయలు
జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. తాగు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో రైతుల బాధలు వర్ణనాతీతం. వరుణుడు సైతం కరుణించక పోవడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా సగం కూడా పడక పోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. 2015లో వరదలు వచ్చి వేసిన పంటలు కొట్టుకోని పోయాయి. చెరువులకు గండ్లు పడి చుక్క నీరు లేకుండా పోయింది. 2016లో తీవ్ర అనావృష్టితో రైతులు అవస్థలు పడ్డారు. పెన్నా డెల్టాకింద తప్ప జిల్లా మొత్తం సాగు విస్తీర్ణం తగ్గింది. 2017లో ఓ మోస్తరు వర్షాలు పడ్డా నీరు భూమిలోకి ఇంకి పోవడంతో నీటి చుక్క ఎక్కడా నిల్వ లేదు. 2015లో 33, 2016లో 27 మండలాలను కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో 15 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ఇప్పటి వరకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కరువు మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సింది పోయి ఇంత వరకు వ్యవసాయ శాఖ తరపున ఒక్క రూపాయి కూడా చెల్లించిన దాఖలాల్లేవు. ఈ ఏడాది 45 మండలాలు జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 45 మండలాల్లో తీవ్రంగా కరువు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో జిల్లా మొత్తం కరువు ఛాయల్లో చిక్కుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 173.3 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. అయితే 77.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. పరిహారం ఎక్కడ? ప్రభుత్వం నుంచి కరువు మండలాల్లోని రైతులకు ఎటువంటి పరిహారం అందిన దాఖలాల్లేవు. నాలుగు సంవత్సరాలుగా కరువుతో రైతులు అల్లాడుతున్నా వారికి బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యుల్ చేస్తామని ప్రభుత్వ ప్రకటనలు నీటిమూటలుగా మారాయనే విమర్శలున్నాయి. జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదనే ఆరోపణలున్నాయి. నివేదిక పంపుతున్నాం జిల్లాలో కరువు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, నమోదైన వర్షపాతం, ఏయే పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. పరిహారం అందించే విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. –శివనారాయణ, వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీ సాయం లేదు కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా పంటకు పెట్టిన పెట్టుబడి రాలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. –కె.వెంకటకృష్ణారెడ్డి, డీసీ పల్లె, మర్రిపాడు నాలుగేళ్లుగా ఇంతే నాలుగు సంవత్సరాలుగా వరిపంట వేసి నీరు లేక ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నేలపాలు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో రుణం కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా రుణమాఫీ కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. –పసుపులేటి వెంకటేశ్వర్లు, వెన్నవాడ, ఆత్మకూర -
అత్త సొమ్ము..అల్లుడి దానం!
చీరాల : రొంపేరు భూములు ఏళ్ల తరబడి కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పైగా అవి తమ సొంత భూములన్నట్లు కొందరు ఇతరులకు కూడా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యవసాయ మురుగు కాలువల్లో ప్రధానమైన రొంపేరు కుడి కాలువకు సంబంధించిన సుమారు 300 ఎకరాలు 125 మంది అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టా భూములతో పాటు రొయ్యల చెరువులు సాగు చేసుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురైనా డ్రైనేజీ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూమి ఆక్రమించిన చాలామంది ఎకరాన్ని రూ.5 నుంచి 7 లక్షలకు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కాస్తా అక్రమార్కుల పరమవుతన్నాయి. కోట్లాది రూపాయలు విలువైన వందలాది ఎకరాల భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురైనా కాపాడాల్సిన అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు ఉంచిన భూములన్నీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. లంచాలకు కక్కుర్తి పడిన రెవెన్యూ యంత్రాంగం ఇతర శాఖలకు చెందిన భూమిని కూడా కొందరికి బి.ఫారాలు ఇచ్చి అక్రమార్కుల సరసన నిలబడింది. వివరాలు.. వ్యవసాయ భూముల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షాల సమయంలో వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కుడి మురుగునీటి కాలువ నిర్మించారు. వరదలు, ఇతర వ్యవసాయ మురుగు నీరంతా ఈ కాలువ నుంచి పెదగంజాం వద్ద సముద్రంలో కలుస్తోంది. కబ్జా కోరల్లో 300 ఎకరాలు భవిష్యత్లో కాలువ వెడల్పు పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుగా డ్రైనేజీ శాఖ కాలువకు ఇరువైపులా 300 ఎకరాల వరకు ఉంచింది. కారంచేడు నుంచి పెదగంజాం వరకు ఈ రొంపేరు కాలువ 35 కిలో మీటర్ల పొడవున ఉంటుంది. అదే పొడవున ఆ శాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కాలువ పక్కనే ఉన్న భూములను ఆక్రమించుకొని కొందరు వ్యవసాయం చేస్తుండగా మరికొందరు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కారంచేడు నుంచి పందిళ్లపల్లి వరకు 200 ఎకరాలు ఆక్రమించుకొని వరిసాగు చేస్తుండగా పందిళ్లపల్లి నుంచి పెదగంజాం వరకు 100 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్న భూముల్లో రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు. కన్నెతి చూడని డ్రైనేజీ అధికారులు కళ్లెదుటే ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా సంబం«ధించిన డ్రైనేజీ శాఖ వాటిని కాపాడుకొనేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. డ్రైనేజీ శాఖ భూములను ఆక్రమించుకొని ఉన్న కొందరికి రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పదేళ్ల క్రితం బి–ఫారాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇవి నకిలీవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ శాఖ భూములు బదలాయింపు జరగకుండా బి–ఫారాలు ఇవ్వడం అక్రమం. అరకొరగా ఆధునికీకరణ రొంపేరు డ్రైన్లు ఆధునికీకరణకు గతంలో ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న కాలువ కంటే 20 శాతం వెడల్పున కాలువను విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రైనేజీ శాఖ తమ భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినా నేటికీ వారు ముందుకు రాలేదు. ఆధునికీకరణ జరగాలంటే తప్పని సరిగా ఆక్రమణలో ఉన్న కొందరి భూములు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొంపేరు భూములకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు పలుకుతోంది. ఇంకా మిగిలి ఉన్న భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పైపెచ్చు తాము సాగు చేస్తున్నామని, భూమిపై హక్కు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాలకుపైగా ఆక్రమించుకొని వరి, రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. చాలామంది ఈ భూములను తమ సొంత భూములుగా భావించి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన దర్జాగా అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత డ్రైనేజీ శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అక్రమార్కులకు నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నా వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోవడంతో ప్రస్తుతం ఆధునికీకరణ పనులకు అవసరమైన భూమి కూడా డ్రైనేజీ శాఖకు లేకపోవడం గమనార్హం. -
జల రాజకీయం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జల జగడం కొనసాగుతోంది. రైతుల నీటి కష్టాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతు లు పది రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. ఒక్క తడి ఇచ్చినా తమ పంటలు గట్టెక్కుతాయని, నీటి ని ఇవ్వాలని కోరుతూ పలుమార్లు ఎస్సారెస్పీ కా ర్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు మద్దతు గా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. రైతుల సాగునీటి సమస్యను ఒక అవకాశంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అఖిలపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు శుక్రవారం చలో ఎస్సా రెస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కాకతీయ కాలువకు అర టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం నుంచి ఆయకట్టు రైతుల గ్రామాలకు తరలివెళ్లాలని నిర్ణయించాయి. మరోవైపు ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు కూడా రైతుల సమస్యలపై స్పందిస్తున్నారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు మద్దతు తెలిపేందుకు జిల్లాకు వచ్చారు. బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ రాష్ట్ర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇ లా పది రోజులుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేత ల ఆందోళనలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావుతో సమావేశమయ్యారు. ప్రాజె క్టులో నీటి నిల్వ పరిమితంగా ఉన్న నేపథ్యంలో కాకతీయ కాలువకు నీటి విడుదల ప్రస్తుతానికి వీలు పడదని ఆయన ప్రకటించారు. నేతల అరెస్టులు ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళన నేపథ్యంలో జిల్లా లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఎస్సా రెస్పీ పరీవాహక గ్రామాల్లో వందలాదిగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. శనివారం ఎస్సారెస్పీ వెళ్తున్న కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డిని డిచ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో... కామారెడ్డి జిల్లాలోనూ సాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నాట్లు వేసుకున్నారు. సింగూరు నుంచి జిల్లా వాటా కింద రావాల్సిన తొమ్మిది టీఎంసీల నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నిజాంసాగర్లో సుమారు రెండున్నర టీఎంసీల నీరుంది. జిల్లా వాటా కింద రావాల్సిన నీటిని విడుదల చేయాలని రైతులు కూడా కోరుతున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఒక అవకాశంగా భావించి ఆందోళన చేపట్టింది. మొత్తం మీద రెండు జిల్లాల పరిధిలో సాగునీటి అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలను కొనసాగించడంతో రాజకీయ వేడి రాజుకున్నట్లవుతోంది. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతోన్న బందోబస్తు
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద వర్షంలోనూ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద పోలీసు బలగాలు గత రెండు వారాల నుంచి పహారా కాస్తున్నాయి. పోచంపాడు గ్రామం, అలాగే ప్రాజెక్టు వైపు వెళ్లే వారిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల రైతులు సాగునీటి కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. శ్రీరాంసాగర్కు వరద పెరగడంతో ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు ప్రాంత పరిధిలోని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో వెంటనే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆయా గ్రామాల ప్రజలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెల్సిందే. రైతులు బలవంతంగా గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద భద్రతను పెంచారు. అయితే వర్షాలు పడుతుండటంతో రైతులకు కాసింత ఉపశమనం లభించింది. -
మా పొట్టకొడుతున్నారు.. ఆదుకో అన్నా
పిఠాపురం: భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటు పొట్టపోసుకునే నిరుపేద రైతుల పొట్టకొట్టడానికి చూస్తున్నారని, ఉన్న భూమి పోతే ఇక వేరే దారిలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తుని మండలం రాజుపేట వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వద్ద తుని మండలం రాజుపేట, కొత్త వెలంపేట, సీతయ్యపేట, లోవ కొత్తూరుకు చెందిన పలువురు సన్న, చిన్నకారు రైతులు తమ సమస్యలు విన్నవించుకున్నారు. పై నాలుగు గ్రామాల పరిధిలో 30 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన సుమారు 500 ఎకరాల భూమిని సుమారు రెండు వేలకు పైగా రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఈ గ్రామాల భూములు కొండ ప్రాంతానికి చెందినవి అయినా ఎంతో కష్టపడి చదును చేసుకుని చెరకు, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సరుగుడు, నిమ్మ, వంటి పంటలతో పాటు అన్ని రకాల వాణిజ్య పంటలు పండిస్తు జీవిస్తున్నామన్నారు. ఈ భూములపై కన్నెసిన అధికార పార్టీ నేతలు అ««ధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటీవల పారిశ్రామికవాడ పేరుతో భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు 32 ఎకరాల భూములకు చెందిన రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. వీటితో పాటు మిగిలిన సుమారు 450 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారన్నారు. వేల కుటుంబాలను వీధి పాలు చేస్తు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దురాగతాన్ని ఆపి తమను కాపాడాలని వైఎస్ జగన్కు రైతులు విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకు ఏదీ చేతకాదు!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో సుబాబుల్, జామాయిల్ రైతులకు పేపర్ మిల్లుల యజమాన్యాలు ధర రాకుండా చేశాయి. అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో అప్పట్లో కలెక్టర్లుగా వ్యవహరించిన ఉదయలక్ష్మి, విజయకుమార్ పేపర్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశాలు పెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయకుంటే రవాణా బంద్ చేస్తాం.. కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించడంతో రైతులకు న్యాయం జరిగింది. నాటి కలెక్టర్లు చూపిన చొరవ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చూపడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీఓను కూడా అమలు చేయించలేని చేతకాని చంద్రబాబు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఖరిని తూర్పార పట్టారు. సుబాబుల్ 4200, జామాయిల్, సరుగుడు 4400 రూపాయలు చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి జీఓ విడుదల చేసినా జిల్లాలో ఆ ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. సగానికి సగం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుంటే జిల్లా యంత్రాంగం మౌనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓను అమలు చేయించాల్సిన బాధ్యత యంత్రాంగానికి లేదా..అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేలా చూశారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం రైతులను దళారులకు వదిలేశారని విమర్శించారు. రైతుల పక్షమో, పేపర్ మిల్లుల యాజమాన్యాల పక్షమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సుబాబుల్, జామాయిల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జామాయిల్ సాగులో జిల్లాలో 60 శాతం ఉందని, అయినా ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతాంగానికి రావడం లేదన్నారు. జామాయిల్ తాట తీసి సరఫరా చేయాలన్న నిబంధన విధించడంతో రైతులు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారన్నారు. వెంటనే ఈ నిబంధన మార్చాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ పత్తి, పొగాకు పంటలకు ప్రత్యమ్నాయంగా తీసుకొచ్చిన సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కర్ర కొనుగోలు చేసి నేరుగా మార్కెట్ కమిటీలు డబ్బులు చెల్లించే విధంగా పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ దేశంలోని సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులకు ధర లేకుండా తీవ్రంగా నష్టపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి పేపర్ను, పేపర్ తయారీ గుజ్జును దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ పదేపదే వల్లెవేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో సీపీఐ జిల్లా నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు చావలి సుధాకర్, లోక్సత్తా జిల్లా నాయకుడు షఫీ, పౌర సమాజం నాయకుడు నరసింహారావు, రైతు కూలీ సంఘం నాయకుడు హనుమంతురావు, రైతు నాయకుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వ్యవసాయోత్పత్తులకు గడ్డుకాలం
వ్యవసాయ రంగంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయడానికి నీతి ఆయోగ్ను ఆదేశించారు. ప్రణాళికాబోర్డును రద్దుచేసి, దానిస్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పర్చిన తర్వాత ఈ సంస్థ ప్రతిపాదించిన సూచనలు, నివేదికలు కార్పొరేట్లకు అనుకూలంగా వున్నాయే తప్ప, సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆచరణ రుజువు చేసింది. రైతుల ఆదాయం రెట్టింపుచేసే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్ 4 సూచనలను ప్రకటించింది. 1. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటం 2. వ్యవసాయ ఉత్పత్తులు పెంచటం 3. భూసంస్కరణలు అమలుచేసి పేదలకు భూములు పంచటం 4. రైతులకు సహాయం అందించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని సూచించింది. అసలు పెరుగుదల అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికగా పెరుగుదలను పరిశీలించాలి? 1. రైతుల ఆదాయం 2. ఉత్పత్తి పెరుగుదల 3. వ్యవసాయ రంగంలో అదనపు విలువ పెంపుదల 4. దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల. పై నాలుగింటిలో ఏ రంగంలో పెరుగుదల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది? ఈ నాలుగు అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ భారతదేశంలో ప్రస్తుత విధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కానీ, రైతు ఆదాయం పెరగడం కానీ అసాధ్యమని ఈ మధ్య తేల్చారు. గిట్టుబాటు ధరలు రెండు విధాలుగా చూడాలి. 1. మార్కెట్ సంస్కరణలు 2. కనీస మద్దతు ధర నిర్ణయం. మార్కెట్ సంస్కరణల విషయంలో రాజ్యాంగం రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్కెట్ చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి బిల్లులు తయారుచేసి తమ తమ శాసనసభలలో ఆమోదానికి పెట్టాల్సిందిగా ఆదేశిం చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ఆ బిల్లులను ఆమోదించాయి. ఈ చట్ట సభల ద్వారా కార్పొరేట్ సంస్థలకు మార్కెట్లలో కొనుగోలుచేసే అవకాశం కల్పిం చారు. ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల నుంచి వైదొలిగి రాష్ట్రాలపై నెట్టివేసింది. గిట్టుబాటు ధరలు నిర్ణయించటం, వాటిని అమలుచేసే బాధ్యతను కేంద్రం గానీ, రాష్ట్రంగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. కేంద్రం ధరలు ప్రకటించి చేతులు దులుపుకోగా, రాష్ట్రం నేటికీ ధరల అమలుపై తన బాధ్యతను ప్రకటించలేదు. ఉత్పత్తిని పెంచడం: గత సంస్కరణల నుండి (1997 నుండి) మన దేశీయ పరిశోధనల విభాగాలను దాదాపుగా మూసివేశారు. బహుళజాతి సంస్థలైన మోన్శాంటో, డూపాంట్, కార్గిల్, సింజెంటా సంస్థలు 80% ప్రయోగాలను చేస్తుండగా, వాటిని మన దేశంలో వినియోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 27 కేంద్రాలలో 5 వేల ఎకరాల భూమి పరిశోధనల కొరకు కేటాయించబడినప్పటికీ, ఆ పరి శోధనా కేంద్రాలన్నింటినీ మూసివేయడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? సహాయక చర్యలు: ప్రస్తుతం బడ్జెట్లో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. పేద దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలు తమ బడ్జెట్లో 5 నుంచి 8 శాతం కేటాయించాయి. 8 రకాల సబ్సిడీలను రైతులకు అందచేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. నిర్ణయించిన ఆదాయం, నిర్ణయించిన ధరలు మార్కెట్లో తగ్గితే ఆ లోటును కూడా ప్రభుత్వాలు రైతుకు నగదుగా ఇస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటీ భారతదేశంలో అమలు జరగడం లేదు. రెట్టింపు కావడానికి చేపట్టాల్సిన చర్యలు: నాణ్యత గల వ్యవసాయ ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీలో పరిశోధన చేసి రైతులకు సకాలంలో అందించాలి. వ్యవసాయ భూమి తగ్గుదలను అరికట్టాలి. సకాలంలో పంటలకు సాగునీటి వసతి కల్పించాలి. సకాలంలో రుణాలు ఇవ్వాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడంతోపాటు, సహకార వ్యవస్థను బలపర్చాలి. పంటలు వేసేటప్పుడే ధరలు నిర్ణయించి, ఆ ధరలను అమలు జరపాలి. ప్రభుత్వమే అన్ని పంటలకు ప్రీమియం చెల్లించాలి. 60 సం.లు దాటిన రైతులకు పెన్షన్లు ఇవ్వాలి. బడ్జెట్లో 6% వ్యవసాయ రంగానికి కేటాయించాలి. పరిశోధనా కేంద్రాలలో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేసి, రైతులకు అందించాలి. కార్పొరేట్ల జోక్యం ఉన్నంతకాలం రైతుల ఆదా యం పెరగదని ప్రపంచబ్యాంకు అనుకూల నిపుణులే వ్యాఖ్యానిస్తున్న అంశాలను కేంద్రం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రకటించిన విధానాలను మార్చాలి. వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ నిపుణులు మొబైల్ : 94900 98666 -
‘మాకే తప్పుడు సమాచారం ఇస్తారా?’
సాక్షి, ముంబై: వర్షాలు పడకపోవటతో వాతావరణ శాఖపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈసారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్నిరోజుల క్రితం ప్రకటించింది. దీంతో మరాఠ్వాడా ప్రాంతానికి(మహారాష్ట్ర) చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వర్షాలు కురవకపోటంతో ఆగ్రహించిన అన్నదాతలు.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్(పుణె )పై పర్బానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్షపాతంపై వాతావరణ శాఖ సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని.. ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై వాతావరణ శాఖ అధికారులు తప్పుడు అంచనాలను ఇచ్చారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతు సంఘం ‘స్వాభిమాని షేట్కారీ సంఘటన’ చీఫ్ మానిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులను ఆశ్రయించారు. ఐఎండీ అధికారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. గతేడాది జూన్లో బీడ్ జిల్లా వాసులు కూడా ఇలాంటి ఫిర్యాదే చేయగా.. పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉంటే ‘వర్షాలపై తప్పుడు సమాచారంతో రైతులకు తీరని నష్టం చేశారంటూ’ వాతావరణ శాఖపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. గతేడాది సెప్టెంబర్లో పర్యావరణ మంత్రితత్వ శాఖకు ఓ లేఖ రాశారు కూడా. -
మా బడి తోట.. ‘దివ్య’మైన బాట
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలోనే ఆమె కౌలు రైతులు, ఆదివాసీల కోసం చేపట్టిన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం విదితమే. తాజాగా ఆమె ఆలోచనల నుంచి వచ్చిందే ‘మా బడి తోట’. ఆదిలాబాద్ జిల్లా సర్కారు బడుల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ బడిలో సేంద్రియ పద్ధతిలో కిచెన్ గార్డెన్ను సాగు చేయాలి. తద్వారా విద్యార్థులకు మేలైన పోషకాహారం అందించడంతోపాటు వ్యవసాయం, పోషక విలువలపై ఈ పాఠశాలల్లో సాగు ద్వారా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కూరగాయల విత్తన రకాలు అందజేత జిల్లాలో కేజీబీవీ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలతోపాటు వసతిగృహాలు కలిపి 1400లకు పైగా ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కూరగాయల విత్తన రకాలకు సంబంధించి తయారుచేసిన ప్యాకెట్లను కలెక్టర్ అందజేశారు. ఒక్కో రకం కూరగాయల పంటకు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు గ్రూపుగా కలసి దత్తత తీసుకోవాలి. బడి ఆవరణలో ఎంపిక చేసిన ప్రదేశంలో ఆయా రకాల విత్తనాలను ఆయా గ్రూపు విద్యార్థులతో నాటించాలి. నారు పెంపకంలో అటు కలుపు తీయడమే కాకుండా నీళ్లందించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ దత్తత తీసుకున్న గ్రూపు పిల్లలే వహించేలా చూడాలి. కూరగాయలు అందించడం ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మేలు జరుగుతున్నందునా ఈ నారు పెంపకంలో వారిని భాగస్వాములు చేసి తోటను వృద్ధి చేయాలి. దీనికి సంబంధించి మాబడి తోట పెంపకానికి సూచనలను ఇస్తూ నాలుగు పేజీల నోట్ను తయారుచేసి ప్రతి పాఠశాలకు అందజేశారు. టమాటా మినహా ఇతర కూరగాయ గింజలన్ని నాటిన మొక్కల నుంచి తీసుకొని తర్వాత సంవత్సరంలో నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. స్థలం లేనిచోట.. ఆదిలాబాద్ జిల్లాలో 1400లకు పైగా పాఠశాలలు ఉంటే ఓ పది శాతం పాఠశాలల్లో స్థలం కొరత కారణంగా కిచెన్గార్డెన్ ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటిచోట తీగజాతి సొరకాయ, బీరకాయ వంటివి పెంచాలని కలెక్టర్ సూచించారు. గోడల మీదా పెరిగేలా వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రహరీలు లేని పాఠశాలల్లో ముళ్ల కంచెలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి వసతిలేని దగ్గర నీళ్లు వృథా కాకుండా విద్యార్థుల భోజనం తర్వాత చేతులు శుభ్రం చేసే దగ్గరి నుంచి కూరగాయల నారు వరకు నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా మాబడితోట కార్యక్రమం విషయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ‘దివ్య’మైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. -
పత్తి.. ముంచెత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతన్నలు తెల్ల బంగారంపై మోజు పెంచుకున్నారు. గులాబీ రంగు పురుగు భయపెడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నష్టమైనా కష్టమైనా పత్తే మేలు చేస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి ఈసారి పత్తి సాగవడాన్ని బట్టే పత్తిపై రైతులు ఎంత ధీమాగా ఉన్నారో తెలుస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 42.66 లక్షల ఎకరాల్లో (102 శాతం) పంట సాగు చేశారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీజన్లో దిగుబడి భారీగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు పీకేస్తున్న రైతులు గులాబీరంగు పురుగు దాడి గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది 10 లక్షల ఎకరాల్లో పురుగు దాడి చేయగా ఈసారి ఉధృతి ఇంకా ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గులాబీ ఉధృతికి ఇప్పటికే పలుచోట్ల రైతులు మొక్కలు పీకేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదికేడాది గులాబీ పురుగు దాడి పెరుగుతోందని, దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతేడాది సకాలంలో వర్షాలు కురవక, గులాబీ పురుగు వల్ల పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయని.. గత సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 2 కోట్ల క్వింటాళ్లకు మించి రాలేదని, కాబట్టి పత్తి రైతులకు మున్ముందు పెను సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనుమతిలేని బీజీ–3ని పావు శాతం విస్తీర్ణంలో వేసినట్లు అంచనా. గ్లైఫోసెట్ నిషేధంతో బీజీ–3లో పెరిగే కలుపును నివారించే పరిస్థితి కూడా ఉండదు. ఇది కూడా పత్తి రైతుపై వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదముంది. దిగుబడి పెరిగినా ధర పలకదే! భారీ దిగుబడులొచ్చిన ప్రతిసారీ పత్తి ధరలు తగ్గుతుండటం చూస్తూనే ఉన్నాం. పైగా అంతర్జాతీయ పరిస్థితులూ పత్తిపై ప్రభావం చూపుతుంటాయి. మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో రైతులను నిలువునా ముంచుతున్న పరిస్థితులూ కనబడుతున్నాయి. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ. 4,020 కాగా, కీలక సమయంలో క్వింటాకు రూ. 3 వేల వరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేశారు. పైగా భారత పత్తి సంస్థ (సీసీఐ) కూడా వివిధ కారణాలు చూపి ధర తగ్గించిన పరిస్థితులున్నాయి. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. అయితే పత్తి మద్దతు ధరను కేంద్రం రూ. 5,150కు పెంచడం రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పత్తి చేతికి వస్తున్నందున ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కూడా ఖరీఫ్ పంటల కొనుగోలుపై తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. పుంజుకోని వరి నాట్లు ప్రస్తుత ఖరీఫ్లో వరి నాట్లు పుంజుకోలేదు. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.87 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.91 లక్షల (85%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు 92 శాతానికి చేరుకుంది. ఈసారి లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 423.5 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 338 ఎంఎంలే నమోదైంది. 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే 17 జిల్లాల్లో లోటు, 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి సహా ఇతర పంటలపైనా వ్యతిరేక ప్రభావం ఉంటుందని, వరి నాట్లు వేయడానికి వాతావరణం అనుకూలంగా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వరి వేయాలా.. వద్దా..!
రాజుపాళెం (వైఎస్సార్ కడప): రాజోలి నుంచి మెదలయ్యే కేసీ కాలువ ఆయకుట్టు పరిధిలో రైతులకు సాగునీటిపై అధికారులు ఏ విషయం చెప్పలేకపోతున్నారు. అన్నదాతలేమో వరినారు కయ్యలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటినుంచి డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో 876 అడుగుల నీటిమట్టం ఉందని, ఆయకట్టు పరిధిలో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు. నాలుగైదు రోజులుగా నారుదొడ్డి చేసుకుంటూ, వట్టి వడ్లు, పులక చల్లుకుంటున్నారు. గత నెల 29న ప్రధాన కాలువకు, ఈనెల 1న కేసీ చాపాడు కాలువలకు ఆశాఖ అధికారులు, డీసీ చైర్మన్లు నీటిని విడుదల చేశారు. కేసీ చాపాడు కాలువ కింద రాజుపాళెం, ప్రొద్దుటూరు, చాపాడు మండలాలు, కేసీ ప్రధాన కాలువ కింద కర్నూలు జిల్లా చాగలమర్రి, వైఎస్ఆర్ జిల్లా రాజుపాళెం, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, వల్లూరు మండలాలు కలిపి దాదాపు 92 వేల ఎకరాల ఆయకుట్టు ఉంది. ఇప్పటికే రాజపాళెం మండలంలోని వెలవలి, తొండలదిన్నె, టంగుటూరు, వెంగళాయపల్లె, రాజుపాళెం, పగిడాల, గాదెగూడూరు గ్రామాల్లోని రైతులు వరి నారుకయ్యలు తయారు చేసుకొని పులక చల్లుతున్నారు. ఎకరా వరి పంట సాగు చేయాలంటే విత్తనవడ్లు రూ.900, ఎరువు, కూలీల ఖర్చు రూ.500, ఎద్దులకు రూ.400 కలిపి రూ.1800 నుంచి రూ.2200 ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. గత మూడేళ్లేగా సాగునీరు లేకపోవడంతో కేసీ ఆయకట్టు వరి సాగుకు నోచుకోవడం లేదు. వరి సాగు చేయొద్దు ఈక్రమంలో కర్నూలు జిల్లాల్లోని ఉన్నతాధికారులు కేసీ ఆయకట్టు కింద వరిపంట వేయొద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో నారుదొడ్లలో పులక చల్లిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడేళ్లుగా ఆరుతడి పంటే సాగు కేవలం ఆరుతడి పంటలైన మినుము, పెసర, శనగ, జొన్న పంటలనే రైతులు సాగు చేసుకోవాల్సి వస్తోంది.అక్కడక్కడా పత్తి సాగవుతోంది. మాగాణి భూముల్లో వరి సాగు చేసుకోవాల్సిన రైతులకు ప్రతిఏటా సాగునీటి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నప్పటికి మంత్రి, అధికారులు కేసీ ఆయకట్టు పరిధిలో సాగునీటిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం రాజోలి ఆనకట్ట నుంచి కేసీ చాపాడు కాలువకు 200, కేసీ ప్రధాన కాలువకు 600, కుందునదిలోకి 2900 క్యూసెక్కులు నీరు పోతోంది. 10 ఎకరాలకు పులక చల్లాను నేను పది ఎకరాల్లో నారుదొడ్డిలో పులక చల్లాను. అధికారులు మాత్రం డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతులంతా కాలువలకు నీరు రావని అనుకుంటున్నారు. ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోంది. ఏంచేయాలో తెలియడం లేదు. అధికారులు కేసీ కాలువ కింద వరి పంట సాగుపై ప్రకటన ఇవ్వాలి. – పద్మనాభరెడ్డి, రైతు, వెలవలి, రాజుపాళెం మండలం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి నేను ఇరవై ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారుకయ్యలను సిద్ధం చేసి పులక, వడ్లు చల్లాను. కాలువకు నీటిని విడుదల చేసేటప్పుడు అధికారులు డిసెంబరు నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలోని అధికారులు మాత్రం వరిపంట సాగు చేయవద్దంటున్నారు. గత మూడేళ్లుగా వరిపంట వేయలేదు. – చెన్నంగి ఎర్రన్న, రైతు, తొండలదిన్నె, రాజుపాళెం మండలం -
కొత్త రుణం ఒక్కటీ లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కనీసం ఒక్క కొత్త రుణం కూడా రైతులకు మంజూరు కాలేదు. ఇది రాష్ట్ర చరిత్రలోనే సంచలన విషయంగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పాత బాకీలు చెల్లించిన రైతులకే రెన్యువల్స్ చేసి ఖరీఫ్ పంట రుణాలు ఇస్తున్నాయి తప్ప మిగిలినవారెవ్వరికీ ఇవ్వట్లేదు. ఇదే విషయాన్ని బ్యాంకులు గత నెలలో సర్కారుకు పంపిన పంట రుణాల నివేదికలో వెల్లడించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన మొదలైంది. భూప్రక్షాళనలో ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మందికి పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం తీసుకోకుండా రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారం సరిచూసుకున్నాకే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యం కాలేదు. ధరణి వెబ్సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా ధరణి వెబ్సైట్తో సంబంధం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీని తీసుకొని రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశించాలని రైతులు, వ్యవసాయాధికారులు కోరుతున్నారు. 30 శాతానికే పరిమితం..! రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 84.56 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 78 శాతం విస్తీర్ణంలో సాగైంది. కానీ పంట రుణం 30 శాతానికే పరిమితమైంది. ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.25,496 కోట్లు. కాగా, తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ.7,300 కోట్లే ఇచ్చాయి. సాగు విస్తీర్ణానికి, రుణాల విడుదలకు భారీ తేడా ఉంది. గత నెల 20 నాటికి పంట రుణాలు ఎన్ని ఇచ్చాయో సమగ్ర నివేదికను బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదిక ప్రకారం ఇప్పటివరకు రుణాలు తీసుకున్న రైతులంతా బాకీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నవారే. వేరే ఏ రైతుకూ కొత్తగా పంట రుణం ఇవ్వలేదని బ్యాంకు నివేదిక చెబుతోంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులున్నారు. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. -
సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్పై 4 రోజుల శిక్షణ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లలో 25%, కూరగాయల్లో 30% వరకు వినియోగదారులకు చేరకముందే కుళ్లిపోయి వృథా అవుతున్నాయి. ఈ దుస్థితిని నివారించాలంటే పండ్లు, కూరగాయలను శుద్ధి చేసి, తదనంతరం వినియోగించే రూపంలోకి మార్చాలి. ఈ నేపథ్యంలో సౌరశక్తితో పండ్లు, కూరగాయల శుద్ధిపై రైతులు, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) స్వచ్ఛంద సంస్థ 4 రోజుల శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 4–7 తేదీల్లో శిక్షణ ఇస్తారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ., ఎన్.ఐ.ఎన్., పి.జె.టి.ఎస్.ఎ.యు., ‘సీడ్’ నిపుణులు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 040–23608892, 23546036, 96526 87495 -
రైతులే.. కూలీలు..!
పుడమితల్లిని నమ్ముకున్న అన్నదాతను అనుక్షణం కష్టాలు వెంటాడుతున్నాయి..వరుణదేవుడు కరుణ చూపకపోవడం..ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కుదేలవుతున్నాడు.పది మందికి అన్నం పెట్టి పోషించిన రైతులే నేడు కుటుంబీకులను పోషించడానికి కూలి బాట పడుతున్నారు. సాక్షి కడప : కరువు రక్కసి కాటు నుంచి అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు. పంటలు పండక..అప్పుల పాలై..ఉపాధి కోసం కొందరు ఉన్న ఊరు వదిలి వలస వెళితే.. మరికొందరు ఇక్కడే ఉపాధి వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతు కుటుంబాలు కూడా కరువు కోరల్లో చిక్కి తల్లడిల్లిపోతున్నాయి. పెద్ద రైతులు సైతం కూలీబాట పడుతుండటం బాధాకరం. ప్రభుత్వాలు ఆదుకోనంత కాలం..పాలకులు పాలసీలలో మార్పులు తేనంత కాలం అన్నదాత ఏదో ఒక సమస్యతో కునారిల్లి చేసేదిలేక వద్దురా ఈ వ్యవసాయమంటూ తప్పుకుంటున్నారు. జిల్లాలో 5.50లక్షల నుంచి 6లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రకృతి సహకరించకపోవడం..వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోవడం.. పనులకు యాంత్రీకరణ ఖర్చులు పెరగడం.. తెగుళ్లు, చీడ, పీడలతో లాభసాయం లేకపోగా అన్నదాతకు అప్పులు చేతికొస్తుండటంతో వ్యవసాయంపై అనాసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వరుస కరువులు కూడా వారిని ప్రత్యామ్నాయం వైపు నడిపించాయి. అనేక పల్లెల్లో చాలామంది వలసబాట పట్టగా.. మరికొంతమంది పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకంవైపు అడుగులు వేశారు. ఉపాధి హామీ పథకం ఉన్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లకుండా స్థానికంగా కొందరు కూలీలుగా మారి దినసరి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి. కరువు పాట.. ఉపాధి బాట.. జిల్లాలో వరుస కరువుల వల్ల అన్నదాత ఉపాధి వైపు అడుగులు వేశాడు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా మారిపోయారు. 3ఎకరాల నుంచి 10ఎకరాల ఉన్న వారు కూడా ఉపాధి పనులకు వెళుతున్నారు. పొలంలో ఎంత కష్టపడినా లాభాలు రాకపోవడంతో ఉపాధి పనులు చేసుకుంటే రూ.180లనుంచి రూ.200ల వరకు గిట్టుబాటు అవుతుందని పలుగు, పార చేత పట్టారు. ఒకప్పుడు ఐదారు ఎకరాల పొలం ఉన్న అసామి రోజు 20, 30మంది కూలీలతో పనులు చేయించేవారు. ప్రస్తుతం తానే పనులు చేసే పరిస్థితికి కాలం నడిపించింది. కలిసిరాని వ్యవసాయం అన్నదాతకు వ్యవసాయం కలిసి రాకుండా పోతోం ది. ఒకప్పుడు ఎకరా, రెండుఎకరాలు ఉంటే జీవ నం గడిచే పరిస్థితి. ప్రస్తుతం 10ఎకరాలు ఉన్నా కూడా కుటుంబం గడవడం గగనంగా మారింది. ఒకప్పుడు పశువులు, ఎద్దులతో కళకళలాడిన పల్లెలు నేడు కళావిహీనంగా మారుతున్నాయి. రైతుల గోడు పట్టని ప్రభుత్వం నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. వర్షాలు సక్రమంగా కురవక పోవడం, పంటలు పండడక పోవడంతో ఉపాధి కూలీ పని చేస్తూ బతకాల్సిన పరిస్థితి. నాతో పాటు భార్య, కుటుంబ సభ్యులు మొత్తం నలుగురు గంగమ్మ తల్లి గ్రూపు జాబ్కార్డు నెంబర్ 6010101లో పని చేసుకుటున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా సహాయం అందిచడం లేదు. రైతుల గురించి పట్టించుకోవడం లేదు.ఉపాధి కూలీ పనికి వెళ్లాలంటే పెద్ద రైతులకు సిగ్గుగా ఉంది. కానీ పరిస్థితుల కారణంగా తప్పడంలేదు. –ఎం.లక్ష్మినారాయణరెడ్డి, పెండ్లిమర్రి మండలం చెన్నంరాజుపల్లె గ్రామం ఉపాధి పనులకు వెళుతున్నా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 60 రోజులు దాటినా చినుకు జాడ లేదు. పొలాల్లో పనులు లేకపోవడంతో ప్రతిరోజు ఉపాధి పనికి వెళుతున్నా. నాకున్న మూడు ఎకరాల పొలంలో పత్తి, వరి సాగు చేస్తాను. ఈఏడాది ఇప్పటి వరకు పదునైన వాన పడకపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. పత్తిపంట అదును దాటిపోతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – రవీంద్రారెడ్డి, రైతు, రాజుపాళెం -
అర టీఎంసీ ఇస్తే ఇబ్బంది లేదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాకతీయ కాలువ ఆధారంగా పంటలు వేసుకుంటున్నాము. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ నీళ్లిస్తే ఎండిపోతున్న మా పంటలు గట్టెక్కుతాయి. మేము రోజుకు 200 క్యూసెక్కులే నీటిని వదలమంటున్నాము. నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాక సెప్టెంబర్లో నీళ్లిస్తామని సర్కారు అంటోంది. అప్పటి వరకు మా పంటలు బతుకుతయా? ఒక్క తడి ఇచ్చినా పంటలు గట్టెక్కుతాయి. – ఇది ఎస్సారెస్పీ కాకతీయ కాలువ రైతుల ఆవేదన. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. తాగునీటి అవసరాలు, డెడ్స్టోరేజీ, ఆవిరి నష్టాలకు పోను ఉన్న నీరు బొటాబొటిన సరిపోతాయి. రాబోయే రోజుల్లో ఎగువన వర్షాలు కురిసి.. ప్రాజెక్టులోకి నీరు వస్తే కాకతీయ కాలువతో పాటు, సరస్వతి, లక్ష్మి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – ఇది ప్రభుత్వ వాదన. ఇదీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిస్థితి.. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16 టీఎంసీల నిల్వ ఉంది. రైతులు అడుగుతున్న మేరకు రోజుకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తే ఇబ్బందేమీ లేదని నిపుణు లు పేర్కొంటున్నారు. ఇలా నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదని అంటున్నారు. ప్రస్తుతమున్న 16 టీఎంసీల్లో.. మిషన్ భగీరథకు 6.5 టీఎంసీలు, డెడ్స్టోరేజీ 5.0 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 3 టీఎంసీలు (4 నెలలకు) పోగా సుమారు 1.5 టీఎంసీలు మిగులుతాయి. ఇందులో నుంచి 0.5 టీఎంసీలు ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు. సెప్టెంబర్లోనే వరద..: గత దశాబ్ద కాలంగా ఎస్సారెస్పీకి వచ్చిన ఇన్ఫ్లోలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ నెలలోనే భారీ ఇన్ప్లో వచ్చి చేరుతుంది. దీనికి తోడు జలాశయం ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం అర టీఎంసీ ఇచ్చేందుకు ససేమిరా అనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు జిల్లాల రైతుల ఆందోళన..: ఎస్సారెస్పీ జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. కాకతీయ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు ఉద్యమబాట పట్టారు. రైతులకు మద్దతు తెలిపేందుకు నిజామాబాద్కు వస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సోమవారం భిక్కనూర్ వద్ద అదుపులోకి తీసుకుని తిరిగి హైదరాబాద్ తరలించారు. -
వైఎస్ జగన్ హామీపై కౌలు రైతుల హర్షం
-
అమాత్యా.. ఆలకించరూ..!
సాక్షి ప్రతినిధి కడప: పాడిపరిశ్రమ జీవనోపాధికి ఊతంగా నిలుస్తోంది. రైతులు దీనిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవా లని నాటి పాలకులు ప్రోత్సహించారు. పాల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు కృషి చేశారు. కాగా ప్రస్తుతం పాడి తిరోగమనంలో ఉంది. సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయి.ఆశాఖలో 129 ఉద్యోగాలు వివిధ స్థాయిల్లో ఖాళీలు ఉండడమే దీనికి ప్రధాన కారణం. పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి దుస్థితి నెలకొంది. కనీసం ఖాళీలు భర్తీ చేసుకోలేని దుర్గతిలో ఉండిపోయారు. పదవులు ప్రాంతం ఉన్నతికి ఉపయోగపడాలి. తద్వారా ప్రజామెప్పు పొందగలిగితే ఆ పదవికి వన్నే తెచ్చినవారు అవుతారు. జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనైతికంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా జిల్లాలో ఉన్న లోటుపాట్లు సవరిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా జిల్లాను పయనింపజేయగల్గితే ప్రజలల్లో పేరు ప్రతిష్టలు పెరిగేవి. జిల్లా అభివృద్ధి అలా ఉంచితే సొంత శాఖలో ఉన్న లోటుపాట్లను కూడా సవరించలేని స్థితిలో మంత్రి ఆది ఉండిపోయారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకు పశుసంవర్ధకశాఖ దర్పంగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 224 ఉద్యోగాల్లో 129 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మంత్రిగా ఖాళీలను భర్తీ చేయాలనే స్పృహ కూడా లేకపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. తిరోగమనదిశగా... 2004 సంవత్సరానికి ముందు జిల్లాలో కేవలం 35వేల లీటర్లు పాల ఉత్పత్తి ఉండేది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయదారులు ప్రత్యామ్నాయంగా పాడిని వృద్ధి చేసుకోవాలని తద్వారా ఒడిదుడుకులు లేని జీవనం కొనసాగించాలని హితవు పలికారు. అందుకు అనుగుణంగా పశుక్రాంతి పథకం ప్రవేశపెట్టి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. ఏకకాలంలో 1లక్ష లీటర్లు బల్క్మిల్క్ సెంటర్ల ద్వారా సేకరించి పాడిరైతులకు అండగా నిలిచారు. 2009నాటికి పాల ఉత్పత్తి 2లక్షల లీటర్లకు చేరింది. అక్కడి నుంచి పాడి పరిశ్రమ తిరోగమనంలో పడిపోయింది. ప్రస్తుతం 30వేల లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఏస్థాయిలో పడిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా బల్క్మిల్క్ సెంటర్లను ఎత్తేయడం, ఉన్న వాటిని ప్రైవేటు పరం చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పాడి వృద్ధి అలా ఉంటే పశువుల సంరక్షణ మరీ అధ్వానంగా ఉండిపోయిందని పలువురు వాపోతున్నారు. ప్రతిరోజు 50 నుంచి 80 పశువులు మృతి చెందుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటికి సకాలంలో వైద్య సేవలు అందకపోవడమే ప్రధాన కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. మంత్రి ఇలాఖాలో 129 పోస్టులు ఖాళీ.... జిల్లాలో 1.69లక్షల ఆవులు, 5.96 లక్షల బర్రెలు, 15.4లక్షల గొర్రెలు, 5లక్షల మేకలు ఉన్నాయి. వీటి సంరక్షణ నిమిత్తం 126 పశువైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 224 మంది వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 95 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇలాఖాలో 129 ఉద్యోగులు భర్తీ చేయాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించే జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, లైవ్స్టాక్ అసిస్టెంట్లు కలిసి జిల్లా వ్యాప్తంగా 111 ఖాళీలు ఉన్నాయి. వైద్యులు పోస్టులు 14 ఖాళీలు ఉండిపోయాయి. వీటిని భర్తీ చేద్దాం, సొంత జిల్లాలోలైనా ఖాళీలు లేకుండా చూద్దాం అన్న ఆలోచన మంత్రికి లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత పరపతి పెంచుకోవాలనే తపన పట్ల జిల్లా ఉన్నతి పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయిందని పరిశీలకులు సైతం వాపోతున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీలు భర్తీ చేసి మెరుగైన పశువైద్యం అందించడంతోపాటు గణనీయంగా పాల ఉత్పత్తి పెంచాలనే దృక్పథం కొరవడిందని పలువురు వెల్లడిస్తున్నారు. ఇకనైనా మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
-
అరెరే..విత్తనాలను తెగనమ్ముకుంటున్నారే!
కడప అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులు రైతన్నను అగాధంలో పడేశాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో పదును వర్షం కురవకపోవడంతో వ్యవసాయ పంటల సాగు అగమ్యగోచరంగా తయారైంది. గతేడాది ఇదే సమయానికి అనుకున్న మేర పంటలు సాగు కావడంతో, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. పంటల సాగుకు పొలాలను దుక్కులు దున్ని, ఎరువులు చల్లి సిద్ధం చేసి ఉంచారు. అడపాదడపా చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కరుస్తుండడం రైతుల్లో కాస్త ఉత్సాహం నింపినా, అరకొర పదునైనా, రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడతాయనే ఆశతో కొంతమంది రైతులు అక్కడడక్కడ పంటలను సాగు చేశారు. అయితే ఆ తర్వాత వానలు కురిసే నమ్మకం కనిపించకపోవడంతో రైతులు పంట సాగుకు పూనుకోలేక పోయారు. వర్షాలు కురవకపోతాయా? పంటలు పండించుకోక పోతామా... అనే నమ్మకాన్ని మనసులో ఉంచుకుని రెండు నెలలుగా ఆకాశంవైపు ఆశగా చూస్తున్న రైతన్నను వానలు నిరాశపరచాయి. విత్తన పంపిణీ ఇలా.. వేరుశనగ కాయలు 43,030 క్వింటాళ్లకుగాను 10,488 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కందులు 1,000 క్వింటాళ్లకుగాను 221 క్వింటాళ్లు, పెసలు 80 క్వింటాళ్లకుగాను, 30.58 క్వింటాళ్లు, మినుములు 173.2 క్విం టాళ్లకు 69.2 క్వింటాళ్లు, జీలుగలు 15,000 క్విం టాళ్లకు 13,144 క్వింటాళ్లు, జనుములు 2,000 క్వింటాళ్లకు 1,612 క్వింటాళ్లు, పిల్లి పెసర 1,500 క్వింటాళ్లకు 881 క్వింటాళ్లు పంపిణీ చేశారు. సాలు తప్పిన సాగు.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సాధారణ సాగు 1.34 లక్షలుకాగా, ఇందులో ఇప్పటికి 12,501 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. జూన్ నెలలో 69.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 31.9 మి.మీ కురిసింది. జూలైలో 97.0 మి.మీ కురవాల్సి ఉన్నా ఇప్పటివరకు 21.4 మి.మీ కురిసింది. ఈ అరకొర వర్షానికి జిల్లావ్యాప్తంగా వేరుశనగ, కంది, ఆము దం, సజ్జ, పత్తి,పెసర, వరి, అలసంద, మిరప, ఉల్లి తదితర పంటలు కలిపి 12,501 హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. విత్తనాలను తెగనమ్ముకుంటూ... ఈ ఖరీఫ్లో పదునుపాటి వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ప్రధాన పంటైన వేరుశనగ సాగుకు విత్తనకాయలను సబ్సిడీపై ఇచ్చిన వాటితో పాటు పాత గత రబీలో పండిన పంట నుంచి సేకరించుకున్నవి కూడా సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ విత్తనకాయలు 30కిలోల బస్తాను రూ.1,250లు వెచ్చించి తీసుకొచ్చారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని ఆశించారు. రెండు నెలలు కావస్తున్నా అదునులో పదును కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో, బర్మా (ఊజిఈగ)పురుగు ఆశిస్తే కొనుగోలు చేసే వారుండనే భయంతో విత్తనాలను తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదనతో తెలిపారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రామకృష్ణారెడ్డి. గొందిపల్లె గ్రామం, వేముల మండలం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికిగాను 20బస్తాలు కొనుగోలు చేశాడు. రూ.24 వేలు ఖర్చు. పదునుపాటి వానలు కురవకపోవడంతో చేసేదేమీ లేక విత్తనాలను తెగనమ్ముకున్నాడు. రూ.20 వేలు వచ్చాయి. అంటే రూ.4 వేలు నష్టపోయాడు. ఈ పరిస్థితి ఒక్క రామకృష్ణారెడ్డిదే కాదు. జిల్లాలో వేరుశనగ ఇతర పంటలను సాగు చేసే ప్రతి రైతు పరిస్థితి ఇలానే ఉంటోంది. విత్తనాలు అమ్ముకుంటున్నాం నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంట వేయాలనుకుని వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాం. వానలు కురవకపోవడంతో విత్తనాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. –ఎర్రగోర్ల చలపతి, యువరైతు, వేముల -
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం
ఖమ్మం వైద్యవిభాగం : అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 15న కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. గురువారం ‘కంటివెలుగు’పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బందికి నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇరు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకొని అవసరమైన కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు చేయించుకునేలా చైతన్య పర్చాలన్నారు. దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడ చేపట్టలేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఈ నెలాఖరునాటికి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో 4,500 చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల్లో సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంటివెలుగుకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ మాట్లాడుతూ.. ‘కంటివెలుగు’ ద్వారా జిల్లాలో పరీక్షలు నిర్వహించేందుకు 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 36 బృందాలు శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందిస్తారన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి నగరంలోని మమత జనరల్ ఆస్పత్రి, అఖిల కంటి ఆస్పత్రి, జిల్లా ప్రధాన ఆస్పత్రులతో పాటు ఎల్వీ ప్రసాద్, సరోజినీదేవి కంటి ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మా ట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలో 31 వైద్య బృందాల ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 1.15 లక్షల కళ్లజోళ్లతోపాటు మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకునే విధంగా ప్రణాళిక రూపొందిచామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, నగర మేయర్ పాపాలాల్, కమిషనర్ సందీప్కుమార్ఝూ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారులు కొండల్రావు, దయానందస్వామి, జిల్లా పరిషత్ సీఈఓ నగేష్, ఉమ్మడి జిల్లాల వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం రఘునాథపాలెం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని జింకలతండా వద్ద ఉన్న విత్తన గిడ్డంగిలో నూతనంగా రూ.కోటి 35 లక్షలతో మంజూరైన విత్తన ప్రయోగశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మొత్తానికి ఉపయోగపడే ప్రయోగశాలను జింకలతండా వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ డాక్టర్ పాపాలాల్, కొండబాల కోటేశ్వరరావు, బుడాన్ బేగ్, కోటిలింగం, ఆర్డీఓ పూర్ణచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఆజ్మీరా వీరునాయక్, ఎంపీపీ మాలోత్ శాంత, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం
కేప్టౌన్ : దక్షిణాఫ్రికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్రం తర్వాత కూడా దేశంలోని అధిక భూమి తెల్లవారి చేతుల్లోనే ఉంది. తెల్ల రైతుల చేతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు పరిహారంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వకూడదని దక్షిణాఫ్రికా ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇందుకు ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించాల్సివుంటుంది. మరోవైపు అత్యధిక భూములు కలిగివున్న తెల్లవారి నుంచి వాటిని లాక్కోవడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వెనెజులా, జింబాబ్వేల్లా పంట కొరత ఏర్పడి దేశం ఆకలితో అలమటించే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిని ఖాతరు చేయకుండా దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముందుకు సాగుతున్నారు. అయితే, రాజకీయ స్వలాభం కోసమే సిరిల్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సిరిల్ తెల్లవారి నుంచి భూములను లాక్కొవాలని నిర్ణయించుకున్నారని ఆరోపిస్తున్నాయి. తెల్లజాతి వారి ప్రభాల్యం కలిగిన ఆఫ్రీ ఫోరం అనే సంస్థ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పెను పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో సమస్య ఏంటి? బ్రిటీష్ పాలనా కాలంలో 1913లో నేటివ్ ల్యాండ్స్ యాక్ట్ పేరుతో దక్షిణాఫ్రికాకు చెందిన నల్లజాతి వారు భూములు కలిగివుండరాదనే చట్టం వచ్చింది. అక్కడి నుంచి మొదలైన భూముల దోపిడి స్వతంత్రం వరకూ కొనసాగింది. ఆ తర్వాత దేశంలోని అధిక శాతం అంటే 87 శాతానికి పైగా భూములను తెల్లజాతి వారు కలిగివున్నారు. నల్లజాతి వారు కేవలం 13 శాతం భూములను కలిగివున్నారు. దీన్ని మార్చేందుకు 1994లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ‘అమ్మేవారు-కొనేవారు’ పథకాన్ని ప్రారంభించి, తెల్లజాతీయుల నుంచి భూమిని కొని నల్లజాతి వారికి పంచాలని సంకల్పించింది. అయితే, ఇది మొదలై 24 ఏళ్లు గడుస్తున్నా కొనుగోలు చేసిన భూములను వేళ్లపై లెక్కించొచ్చు. దీంతో భూములను స్వాధీనమే ఇందుకు పరిష్కారమని సరిల్ సర్కారు భావించింది. ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించకుండా తెల్లజాతి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. -
ఏపీ రాజధానిలో భూములిచిన రైతులు ఆమరణ నిరాహారదీక్ష
-
రైతుల మహాదర్నా.. ఉద్రిక్తత
సాక్షి, నిజామాబాద్ : పోచంపాడు ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాంసాగర్ నుంచి సాగునీరు అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం పోచంపాడులోని ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ కార్యాలయం వద్ద నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 24 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మహిళా రైతులు సైతం భారీ సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సేవ్ ఫార్మర్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించటానికి మహిళా రైతులు ప్రయత్నించటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కాకతీయ కాలువకు, లక్ష్మీ కాలువకు నీటిని విడుదల చేసేవరకు ఆందోళన విరమించమని వారు పట్టుబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. -
పత్తి పైనే ఆసక్తి
జిల్లాలో రైతులు ఈసారి కూడా పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్లో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 72,123 హెక్టార్ల (63 శాతం)లో వివిధ పంటలు వేశారు. అయితే.. కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 50,499 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న, మిగతా ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రైతులు ఈ ఖరీఫ్లోనూ పత్తిసాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడగా.. అత్యధికంగా పత్తి సాగైంది. గతేడాది, ఈసారి అనుకూలంగా వర్షాలు పడుతున్నా.. రైతులు పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా పత్తిసాగే కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రాజెక్టులు, చెరువులకు నీరు రాకపోవడం కూడా వరిసాగుకు ప్రతికూలంగా మారిందని, అందుకే ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను ఇంకా 5 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, ఆరుతడి పంటలు వేశారని అంటున్నారు. వ్యవసాయశాఖ అంచనా ఇదీ.. ఇప్పటికి సాగు 63 శాతమే.. గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2017 ఖరీఫ్ యాక్షన్ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 72,123 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. అయితే.. 36,347 హెక్టార్లకు కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 47,523 హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యానికి ఇప్పటికే 50,499 హెక్టార్ల (106 శాతం)లో పత్తి పంట వేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న వేయగా, మిగతా 1,204 హెక్టార్లలో ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 898.3 మిల్లీమీటర్లు కాగా, గతేడాది జూలై 31 వరకు 347.90 మిల్లీమీటర్లు నమోదైతే, ఈసారి 252 మి.మీటర్లుగా ఉంది. ఫలితంగా ఖరీఫ్ ఆరంభమై రెండు నెలలు కావస్తుండగా ఇప్పటికీ జిల్లాల్లో సగటు సాగు 63 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే జిల్లా ఆయకట్టుకు జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండీలకు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన నీరు చేరలేదు. దీంతో వరి రైతులు పొలాలు, నారుమళ్లు, వరినారు సిద్ధం చేసుకున్నా.. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రబీలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆచీతూచీ సేద్యం వైపు కదులుతున్నారు. ఈ ఖరీఫ్లో తొలకరి జల్లులు కొన్ని మండలాల్లో ఆశాజనకంగానే ఉన్నా.. ఇప్పటికీ ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చిచూస్తే వర్షాలు పడుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్లో వరి తదితర పంటలకు స్వస్థి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, వరిసాగుపై వేచిచూసే ధోరణితో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. -
సాగని సాగు.. జాడలేని వానలు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అప్పులు చేసి పంటలు వేసినవారు కొందరు.. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కాలని దుక్కి దున్నినవారు ఇంకొందరు.. ఎకరాలకొద్దీ కౌలుకు తీసుకొని విత్తు వేసిన వారు మరికొందరు.. చినుకు జాడ లేకపోవడంతో ఇప్పుడు వీరందరికీ కంటిమీద కునుకు లేదు! నేలను నమ్ముకొని నింగివైపు ఆశగా చూస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. జూన్ చివరి వారంలో కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసిన అన్నదాతలు తలలు పట్టుకున్నారు. మరో 10 రోజులు ఇలాగే వర్షాలు పడకుంటే పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల వర్షాల్లేక మొలకెత్తిన విత్తనాలు మాడిపోయాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందిన కాడికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పత్తికి ట్యాంకర్లతో నీళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 5.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చెరువులు నిండి బావులు, బోర్లలోకి నీరు వస్తుందని భావించిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. మరో పది రోజులపాటు వర్షాలు కురవకపోతే పత్తి, మొక్కజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటల పరిస్థితి దారుణంగా మారుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో వరి కోసం నారుమళ్లు పోసిన రైతులు ఇప్పటిదాకా నాట్లు వేయలేదు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. ఈ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలో గడచిన ఏడాది ఇదే సమయానికి 2.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లోనే సాగయ్యాయి. కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పోస్తున్నారు. ‘‘మరో వారం రోజుల్లో ఓ మోస్తరు వర్షం అయినా కురవకపోతే పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ విభాగం చెప్పడం వల్ల కూడా రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలు ఎండిపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలి’’అని వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. తాజా పరిస్థితిపై సీఎంకు లేఖ రాస్తానని, వనపర్తి జిల్లాలో మంచినీటికి కూడా సమస్యగా ఉందని సాక్షి ప్రతినిధితో చెప్పారు. వరి మరీ దారుణం రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే వరి పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. గడచిన ఏడాది ఇదే సమయానికి సాగు చేసిన దానికన్నా 25 శాతం అధికంగా వరి వేశారు. కానీ వానల్లేక పలుచోట్ల నారుమళ్లు ఎండిపోతున్నాయి. వర్షాలు బాగా పడతాయని ఆశించి గ్రామాలకు వచ్చిన వలసదారులు ఉపాధి కోసం మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘‘నాకు 2 ఎకరాల భూమి ఉంది. ముంబైలో కూలీ పని చేస్తా. మంచి వర్షాలు కురుస్తాయంటే వరి పండించుకుందామని వచ్చి నారుమడి పోశా. కానీ వానల్లేక ఎండిపోయింది. రూ.14 వేలు నష్టపోయా. మళ్లీ ముంబై వెళ్లక తప్పడం లేదు’’అని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన అంజయ్య ఆవేదన చెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతాల్లో వరి నారుమళ్ల దశలోనే ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖకు ప్రాథమిక సమాచారం అందింది. -
నూనెగింజల సాగులో మొండి చేయి..
ఆహార భద్రత పథకాన్ని పక్కాగా అమలు చేసి ఆహాధాన్యాల కొరతను అధిగమిస్తామని ప్రభుత్వం చెబుతోంది.అందుకు అవసరమైన ప్రణాళికలను జిల్లా నుంచి పంపినా పట్టించుకోలేదు. నూనెగింజల పథకానికి నిధులు కేటాయిస్తూ జీఓలు మాత్రం జిల్లా వ్యవసాయశాఖకు పంపింది. పరికరాల విషయంలో ప్రభుత్వంలోని పెద్దలకు, కంపెనీల మధ్య డీల్ కుదరక, ధరలు ఖరారుకాక పథకాలు మూలన పడిపోయాయని వ్యవసాయశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కడప అగ్రికల్చర్ : నూనెగింజల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏడాది కేడాది నూనెగింజల పంటల సాగు తగ్గిపోతోంది. జిల్లాకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎస్ఎఫ్ఎం), నూనె విత్తుల పథకం (ఐసోఫాం)ను మొన్నటి వరకు వేర్వేరుగా నిర్వహించే వారు, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి జాతీయ ఆహార పథకాన్ని అమలు చేస్తున్నారు.ఇందుకగాను 600 సాగునీటిపైపుల యూనిట్లు జిల్లాకు కేటాయించారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా తుంపర సేద్య పరికరాలు 600 యూనిట్లు, మరొక పథకానికి కలిపి రూ.50 లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేసింది. ఈ పథకాల్లోని పరికరాల కోసం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం మొండి పట్టుదలతో గత ఏడాది ఇచ్చిన ధరలకే ఇప్పుడు టెండర్లు కోట్ చేయాలనే సంకేతాలు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఖరీప్ నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలు నిర్వీర్యమైపోయే పరిస్థితులు ఉన్నాయి.ఈ టెండర్లు ఖరారై ధరలు నిర్ణయమయ్యే లోపు ఖరీఫ్ పంటకాలం ముగిసిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. సాగునీటి కోసం రైతులు భగీరథ పోరాటాలు చేస్తున్నారు. సాగునీటి కష్టాలు కర్షకులకు కన్నీటిగాథను మిగులుస్తోంది. సేద్యపు జలాలను పొదుపుగా వాడడం కోసం సబ్సిడీ పైపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రైతుల కళ్లల్లో కాంతులు నింపలేదు. సేద్యపు నీటి కష్టాలు తీర్చలేదు. 600 యూనిట్లు మంజూరు జాతీయ ఆహార భద్రత పథకం కింద సాగు నీటిపైపులు 600 యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో ఒక్కో యూనిట్లో ఎకరాకు 60 పైపులు ఇవ్వనున్నారు.సాగునీటి పైపులకు గత ఏడాది రూ.7500 రాయితీ ఇచ్చారు. ఈ పథకం మొత్తానికిగాను రూ.35లక్షలు కేటాయించారు. అదే విధంగా నూనె గింజల అభివృద్ధి పథకం కింద దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పథకాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో యూనిట్కు 60 పైపులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు పథక ఫలాలు అందడం లేదు. మార్కెట్లో పైపులు, తుంపర సేద్య పరికరాల ధరలు అధికంగా ఉంటున్నాయని, డీజిల్, పెట్రోలు ధరలు పెరిగినందున పాత ధరలకు ఇవ్వలేమని కంపెనీలు నిరాకరించినందున, తాము కూడా ఆయా కంపెనీలు కొత్తగా ప్రకటించిన ధరలకు పైపులు, తుంపర సేద్య పరికరాలు కొనుగోలు చేసి అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేయ్యడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం కంటే ఇచ్చేదేదో మాకే ఇస్తే తుంపర సేద్య పరికరాలు, పైపులు మేమే తెచ్చుకుంటాం..కదా? అని రైతులు అంటున్నారు. రైతుల ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు రైతులకందించే పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. సాగునీటి పైపుల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా ఉంది. కమీషన్ల కోసం ప్రభుత్వంలోని పెద్దలు ఏమైనా చేస్తారు. రైతులు ఏమై పోయినా ఫర్వాలేదు.. మాకు రావలసిన ఆమ్యామ్యాలు వస్తే చాలని అనుకుంటారు. జి.చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
రైతు బీమాకు వయసెందుకు అడ్డు?
ఆయన పేరు లక్ష్మయ్య. మేడ్చల్ జిల్లాలోని ఓ గ్రామంలో రైతు. మూడెకరాల భూమి ఆయన పేరున ఉంది. ఇటీవలే ఆయనకు 61 ఏళ్లు నిండాయి. తనకు రైతు బీమా కావాలని వ్యవసాయాధికారుల వద్దకు వెళితే, నిబంధనల ప్రకారం వయసు ఎక్కువ ఉండటంతో అధికారులు కుదరదని చెప్పారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరెడ్డి వయసు 63 ఏళ్లు. ఆయనకు ఐదెకరాల సాగు భూమి ఉంది. రైతు బీమా తీసుకుందామంటే వయసు మీరిందంటూ అధికారులు చెప్పడంపై ఆయన మండిపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకంలో వయసు నిబంధనపై రైతులు మండిపడుతున్నారు. ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులే అర్హులన్న నిబంధన వారికి గుదిబండగా మారింది. రాష్ట్రంలో 59 ఏళ్లు నిండిన దాదాపు 11 లక్షల మంది ఈ పథకానికి అనర్హులుగా తేలినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ‘శారీరక శ్రమ చేసే రైతులు ఆరోగ్యంగానే ఉంటారు. 60 ఏళ్ల లోపు వారికి అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ఆ తర్వాతే సమస్యలు మొదలవుతాయి.. మరణాలు సంభవిస్తాయి. కాబట్టి 59 ఏళ్ల వరకున్న వారికే బీమా అన్న నిబంధన ఉండటంతో చాలామంది అవకాశం కోల్పోతున్నారు. రైతు బీమాతో ఇక ఎవరికి లాభం’అని ఓ వ్యవసాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. బీమాకు 70 ఏళ్ల వరకు వయసు పరిమితిని ప్రభుత్వం తొలుత పరిశీలించింది. అయితే 59 ఏళ్లకు మించిన వారికి బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో సర్కారు వెనక్కు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. రూ. 5 లక్షల పరిహారం ఇటీవల చేపట్టిన భూప్రక్షాళన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులున్నారు. వారిలో ఇప్పటివరకు 48 లక్షల మంది వరకు పెట్టుబడి చెక్కులు తీసుకున్నారు. ఆయా రైతులందరికీ జీవిత బీమా చేర్పించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే, ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రైతులందరినీ కలిసే పనిలో వ్యవసాయ శాఖ వర్గాలు నిమగ్నమయ్యాయి. గతనెల రోజులుగా పాలసీలో రైతులను చేర్పించడం, నామినీ పత్రాలు స్వీకరించే కార్యక్రమం జరుగుతోంది. అవగాహన కల్పించడంలో వైఫల్యం.. బీమా గురించి రైతులకు సున్నితంగా వివరించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీమా కంపెనీల ప్రతినిధులు బీమా పాలసీలను చాలా సున్నితంగా వివరిస్తారు. అప్పుడు ఎవరూ అంతగా ఫీల్ అవ్వరు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా రైతు బీమా వివరించే సందర్భంలో నేరుగా ‘చచ్చిపోతే డబ్బులొస్తాయి’అనడంతో అక్కడక్కడ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ‘చనిపోతే డబ్బులిస్తారా? అంటే మా కుటుంబ పెద్ద చనిపోవాలని కోరుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో రైతుబీమా కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ ఉన్నతాధికారి ఒకరు హైదరాబాద్ నుంచి వెళ్లారు. అక్కడ ఓ రైతు కుటుంబాన్ని కలిశారు. రైతు బీమాలో చేరాలని కోరారు. ‘గతంలో ఇలాగే జీవిత బీమాలో చేరాక మా కుటుంబంలో ఒకరు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు రైతు బీమా తీసుకోలేం’అంటూ ఆ కుటుంబం తిరస్కరించింది. ఇలా దాదాపు 2 లక్షల మంది రైతుల ఈ పాలసీని తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. బీమా పాలసీలను వివరించే పద్ధతి సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చే నెల 15 నుంచి రైతులకు బీమా పత్రాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మూడో వంతు వరకు అనర్హులు ఉండటంతో రైతుల్లో వ్యతిరేకత వస్తుందంటున్నారు. కాగా, గ్రామాల్లో కౌలు రైతులు, ఇతర భూమి లేని వారికి కూడా బీమా కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది. -
రైతు బీమాకు రేపే చివరి గడువు
హన్మకొండ : రైతు బీమా పథకం గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 20తో గడువు ముగిసినా ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 15న బాండ్ పొందాలనుకునే రైతులు ఈనెల చివరి వరకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు బాం డులు జారీ చేసేందుకు జూలై 15 వరకు గడువు విధించగా దరఖాస్తులు సేకరణ పూర్తి కాకపోవడంతో గడువు పెంచుతూ వస్తోంది. ఈ నెలాఖరులోపు రైతుల వివరాలు దరఖాస్తు ఫారంలో నింపి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించిన రైతులకు వచ్చే నెల 15న బీమా బాండ్లు చేతికందుతాయి. నిర్ణీత సమయంలో దరఖాస్తు ఫారాలు రైతుల నుంచి రాక పోవడంతో మరో అవకాశం ఇచ్చింది. రైతులందరికీ అవకాశం.. ప్రతి రైతు బీమా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం తీసుకువచ్చింది. దీనికి సంబం ధించిన ప్రీమియం ఒక్కో రైతుకు రూ.2,271లు ప్రభుత్వం చెల్లిస్తుండగా భారతీయ జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. రైతు ఏ కారణంచేత మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షలు అం దుతాయి. 18 నుంచి 59 ఏళ్ల వయసు రైతులు అర్హులు. ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాలు రైతుల పేరుతో ముద్రించిన ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు ఫారాల్లో నింపుతున్నారు. ఇందుకు గ్రామ రైతు సమన్వయ సమితులు సహకారం అందిస్తున్నాయి. అయితే వివిధ కారణాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు పూర్తి చేసి సమర్పించలేక పోయారు. కొనసాగుతున్న వివరాల సేకరణ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6,16,266 మంది రైతులున్నారు. ఇప్పటి వరకు 4,65,747 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత కలిగిన 3,63,323 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుకు సంబంధించిన నామినీ పేరు, ఆధార్ నంబర్, రైతు సంతకం, నామినీ ఆధార్ నంబర్ వివరాలు తీసుకుంటున్నారు. రైతుబంధు చెక్కు పొందిన వారు అర్హులు.. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులతో పాటు, ఏదేని కారణం చేత పట్టాదారు పాసుపుస్తకం అందక రైతుబంధు చెక్కు పొందిన రైతులు కూడా రైతు బీమా పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. రైతు బంధు చెక్కు అందుకున్న రైతు బీమాకు ఎందుకు అర్హుడు కాకూడదని ఆలోచించి మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొందరు రైతులకు బీమా సౌకర్యం కలుగనుంది. తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. 31లోగా దరఖాస్తు చేసుకోలేని రైతుల పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను వివరణ కోరగా ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని సమాధానమిచ్చారు. -
నీరు పుష్కలం.. విడుదలలో జాప్యం
బనగానపల్లె (కర్నూలు): జలాశయాల్లో నీరు ఉన్నా.. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), జీఎన్ఎస్ఎస్(గాలేరి–నగరి సుజల స్రవంతి) కాలువకు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఆయకట్టు కింద ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం నాటికి 873 అడుగులకు చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 17,500 క్యూసెక్కుల నీటిని తెలుగంగ, కేసీ ఎస్కేప్ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఎస్సార్బీసీ, జీఎన్ఎస్ఎస్కు కూడా నీరు వదలాలి. అయితే ఆ విధంగా జరగకపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నారుమళ్లు పోసుకోవాలా..వద్దా? జూలై చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 873 అడుగుల నీటిమట్టం చేరుకోవడం ఇదే మొదటిసారి. దీంతో వరినారుమళ్లు పోసేందుకు మంచి సమయంగా రైతులు భావించారు. ఎస్సార్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతుందని అధికారులు పేర్కొనడంతో రైతుల్లో ఆశలు చిగురించా యి. అయితే నీటిని ఎప్పుడు విడుదల చేసేది అధికారుల స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం నారుమళ్లు పోసుకునేందుకు 500 క్యూసెక్కుల నీటినైనా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఒట్టిపోయిన జీఎన్ఎస్ఎస్ పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు సుమారు 82 కి.మీ. పొడవున జీఎన్ఎస్ఎస్ వరదకాల్వ ఉంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఈ కాల్వ ద్వారా గత ఏడాది 5వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాది 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కాల్వ ద్వారా విడుదల చేసిన నీరు అవుకు రిజర్వాయర్ చేరి అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్కు వెళ్తాయి. ఈ పద్ధతిలో అవుకు రిజర్వాయర్ నిండి గండికోట రిజర్వాయర్కు చేరాలంటే కనీసం నెలరోజులు సమయం పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే సెప్టెంబర్ మొదటి వారానికి గాని గండికోట రిజర్వాయర్కు చేరే అవకాశం ఉండదు. ప్రధాన కాల్వకు ఇరువైపులా లైనింగ్ లేనందున నీటి విడుదల జరిగితే పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ బోర్ల ద్వారా పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. -
అమ్ముకోలేక అప్పులపాలు!
సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్ఫెడ్ సేక రించిన లక్షలాది మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. కొనుగోలు చేసి వెంటనే విక్రయించకపోవడంతో రూ. 2 వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు పాడైపోతున్నాయి. పైగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ, గోదాముల అద్దె, నిర్వహణ భారం.. అంతా కలసి సర్కారుకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన మొక్కజొన్న, కంది, ఎర్రజొన్న, మినుములన్నీ గోదాముల్లో మూలుగుతున్నాయని.. అన్నీ కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల, పెద్దేరు, వనపర్తి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో ఉంచిన మొక్కజొన్నకు పురుగు పడుతోందంటున్నారు. దీంతో గోదాముల సమీపంలో నివసించే ప్రజలు పురుగులతో సతమతమవుతున్నారు. కల్వకుర్తి వంటి చోట్ల ప్రజలు ధర్నాలకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రజొన్నకు మార్కెట్లో గణనీయంగా ధర పడిపోయింది. మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. కొనుగోలు చేసిన నెల రోజుల్లో విక్రయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కజొన్న 4.41 లక్షల టన్నులు గత ఖరీఫ్, రబీల్లో పండించిన మొక్కజొన్నను రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 4.41 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించిన ప్రభుత్వం.. ఆ మేరకు రైతులకు రూ. 629 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని గోదాముల్లో ఉంచింది. ఖరీఫ్ మొక్కజొన్న విక్రయాలు ప్రారంభించింది. అయితే ఖరీఫ్, రబీ మొక్కజొన్న రెండూ ఒకేచోట ఉండటం.. ఇప్పటికే నెలలు గడుస్తుండటంతో అనేక చోట్ల పురుగు పడుతోందని, ఆ పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో వాటి తాకిడి చుట్టుపక్కల వారు తట్టుకోలేకపోతున్నారని మార్క్ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్ మొక్కజొన్నే పూర్తిగా విక్రయించలేదని, రబీ జొన్నను ఇప్పటికిప్పుడు వదిలించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే మార్క్ఫెడ్కు రూ. కోట్లలో నష్టం మిగలనుంది. అంతేకాదు గోదాముల్లో ఉంచడం వల్ల అద్దె భారం, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడంతో ఆ భారం కలసి తడిసి మోపెడవనుంది. గత ఖరీఫ్, రబీ సీజన్ల మొక్కజొన్న ఉండగానే మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ కొనుగోలుకు మార్క్ఫెడ్ సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎర్రజొన్నలు కొనే దిక్కులేదు గత ఫిబ్రవరిలో మార్కెట్లో క్వింటా ఎర్రజొన్న ధర రూ. 1,800 వరకే పలికింది. దీంతో రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వాటిని రూ. 2,300 చొప్పున 51,749 టన్నులు కొనుగోలు చేసింది. అందుకోసం రైతులకు మార్క్ఫెడ్ రూ. 119 కోట్లు చెల్లించింది. ఆ ఎర్రజొన్నలను ఆయా జిల్లాల్లోని గోదాముల్లో నిలువ చేశారు. కానీ తిరిగి విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఎర్రజొన్నలూ పురుగులు పట్టే స్థితికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కనీసం క్వింటా రూ. 1,000కి కూడా కొనే వారు లేకుండా పోయారు. అవి అమ్ముడవకపోతే మార్క్ఫెడ్కు రూ. 119 కోట్లు నష్టం వాటిల్లనుంది. మినుములు, శనగలు కూడా.. ఇవిగాక 1.86 లక్షల టన్నుల కందులు గోదాముల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కందిని క్వింటా రూ. 5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆ మేరకు రైతులకు రూ. 646 కోట్లు చెల్లించారు. విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేసి చివరకు పాడయ్యే పరిస్థితికి వచ్చాక కొంత కమీషన్ తీసుకొని వదిలించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు 2 వేల మెట్రిక్ టన్నుల మినుములు, 17 వేల మెట్రిక్ టన్నుల శనగలు, 3,500 మెట్రిక్ టన్నుల జొన్నలూ గోదాముల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. రూ. 2 వేల కోట్లు రుణాలు తెచ్చి రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసిన మార్క్ఫెడ్, వాటిని విక్రయించకుంటే తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. -
గిట్టుబాటు ధర లేక కూలీలుగా మారుతున్నామయ్యా..
దీర్ఘకాలంపాటు వ్యవసాయం చేసి నష్టపోతూ వస్తున్నాను. గిట్టుబాటు ధర లేక కూలీగా మారుతున్నామయ్యా అంటూ పాదయాత్రగా వచ్చిన జగన్కు కట్టమూరు జంక్షన్ వద్ద తన సమస్యను చెప్పుకున్నాడు కట్టమూరుకు చెందిన రైతు కామిశెట్టి సూర్యనారాయణ. రైతుగా పంటను సాగు చేస్తే మిగిలేదేమీ ఉండడం లేదని, పైగా నష్టం వచ్చి అప్పుల పాలవుతున్నామని వాపోయారు. సాగుపై విసిగి వేసారి కూలిపనికి పోతున్నామని, రోజుకు రూ.250 నుంచి రూ.300 వస్తుందని, అదే చాలనుకునే పరిస్థితిలో తానున్నానన్నారు. -
పంట పూర్తిగా దెబ్బతిందయ్యా
అధిక పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట మొత్తం దెబ్బతిందయ్యా అంటూ కాట్రావులపల్లికి చెందిన మొక్కజొన్న రైతు శివుడు గణేశ్వరరావు వాపోయారు. పాదయాత్రలో సీతానగరం జంక్షన్ వద్ద జగన్ను కలిసి తన గోడు వినిపించాడు. అదిగోనయ్యా దెబ్బతిన్న పంట అంటూ తన చేనును జగన్కు చూపించాడు రైతు గణేశ్వరరావు. రైతు విజ్ఞప్తి మేరకు జగన్ చేనువైపు చూసి దెబ్బతినడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అకాలంగా కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్నదని, ఎకరాకు రూ.30 వేలు నష్టం వాటిల్లిందంటూ రైతు గణేశ్వరరావు జగన్ ఎదుట వాపోయారు. -
నీవు చల్లగుండాలయ్యా....
ఎండనక వాననక కాలినడకన జనం మధ్యలో పాదయాత్ర చేస్తున్న జగన్కు పెద్దల ఆశీర్వాదాలందుతున్నాయి. పాదయాత్ర పొడవునా పెద్దలు తమదైన శైలిలో జగన్ను ఆశీర్వదిస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చున్నా చెల్లిపోయే జీవితం అయినా జనం కోసం కాలినడకన ముందుకు వస్తున్నారంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పాదయాత్రగా జగన్ జగ్గంపేట వైపు వెళ్తుండగా ఆటోలో కాలికి గాయమైన ఓ పెద్దాయన జగన్ను చూసేందుకు ఉత్సాహం చూపారు. రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న జగన్ను చూసిన పెద్దాయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. -
10 రోజుల్లో బీమా సొమ్ము
సాక్షి, హైదరాబాద్: రైతులకు జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని, రైతు చనిపోతే 10 రోజుల్లోగా కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. 18–60 ఏళ్ల మధ్య వయసు కలిగిన రైతులకు జీవిత బీమా సదుపాయం కల్పించనున్నామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. శనివారం ఇక్కడ జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత పాలక మండలి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం రైతు బంధు కార్యక్రమం కింద 58 లక్షల ఎకరాల భూ యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందన్నారు. కేవలం వంద రోజుల్లో 95 శాతం గ్రామీణ భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశామన్నారు. దీనికోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయ కింద 46వేల చెరువులకుగాను ఇప్పటివరకు 30 వేల చెరువుల పునరుద్ధరణ పూర్తి చేశామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద రెండు 3 నెలల్లో రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామన్నారు. నగరంలో రాష్ట్ర ప్రభుత్వం–సీఐఐ మధ్య సంప్రదింపుల విభాగం ఏర్పాటు చేస్తామని సీఐఐ చేసిన ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విభాగం సహకారాన్ని తీసుకుంటామన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ హబ్ గా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, గతేడాది రాష్ట్రం లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 13 శాతం వృద్ధి చెందా యన్నారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో జాతీ య సగటు వృద్ధి రేటు 9 శాతంతో పోల్చితే రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందన్నారు. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీలు తమ రెండో ప్రధాన కార్యాలయాలన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నా యన్నారు. ఫార్మా, మెడికల్ డివైజెస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్స్, ఫుడ్ప్రాసెసింగ్ రంగాల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమ ంలో సీఎస్ ఎస్.కె.జోషి, సీఐఐ చైర్మన్ ఆర్.దినేష్, సదరన్ రీజి యన్ డైరెక్టర్లు టీవీఎస్ సుందరం అయ్యర్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన కౌలు రైతులు
-
జీరోవడ్డీతో పంట రుణాలు
బషీరాబాద్(తాండూరు): జిల్లా సహకార సంఘం నుంచి నావంద్గి సొసైటీకి రూ. కోటి పంట రుణాలు మంజూరు అయినట్లు పీఎసీఎస్ చైర్మన్, జిల్లా సహకార సంఘం డైరెక్టర్ అల్వీన్ అనంత్రెడ్డి తెలిపారు. సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతీ రైతుకు లక్ష రూపాయల వరకు రుణపరిమితితో జీరోవడ్డీపై పంట రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆయన బషీరాబాద్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో డీసీసీబీ జీరోవడ్డీతో రుణాలు ఇస్తుందన్నారు. నావంద్గి సహకార సంఘంలో4,227 మంది రైతులు ఉన్నారని, వీరిలో గతేడాది 1500 మంది రైతులకు రూ.5కోట్ల స్వల్పకాలిక రుణాలు, 300 మందికి రూ.1.50కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతంలో తీసుకున్న రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకు వారం రోజుల్లో కొత్త రుణాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు క్రాప్లోన్ తీసుకోని రైతులు కొత్త పాసుపుస్తకం, పహాణి నఖల్తో వస్తే రుణాలు ఇస్తామని చెప్పారు. జిల్లా మంత్రి మహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి సహకారంతో బషీరాబాద్ మండలానికి అధిక రుణాలు రాబట్టినట్లు చెప్పారు. రైతుల కోసం డీసీసీబీ నుంచి ఎన్ని నిధులైనా తీసుకువస్తామని చైర్మన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రూ.కోటి పంట రుణాలు మంజూరు చేసిన డీసీసీబీ చైర్మన్కు అనంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ వెంకటయ్య పాల్గొన్నారు. -
లారీల సమ్మెతో దళారీల దందా!
సాక్షి, అమరావతి: వారం రోజుల నుంచి జరుగుతున్న లారీల సమ్మె సెగ పరిశ్రమలతోపాటు సామాన్యులను తాకుతోంది. లారీల సమ్మె దీర్ఘకాలం జరిగే సూచనలు కనపడుతుండటంతో హోల్సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభిం చారు. కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకుల ధరలను పెంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో స్థానికంగా పండే కూరగాయల ధరలు తగ్గడం గమనార్హం. ఉల్లిపాయలు, క్యాప్సికం, టమోటా, క్యాబేజీ లాంటి కూరగాయల ధరలు పెరగ్గా.. వంకాయలు, బెండ, దొండ లాంటిస్థానికంగా పండేవాటి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవటంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా, మామిడి రైతుల ఆక్రందన లారీల సమ్మె ప్రభావం ఆక్వా, మామిడపండ్ల ఎగుమతిపై బాగా కనిపిస్తోంది. ధరలు బాగున్నా సమ్మె కారణంగా చెరువుల్లో చేపలు, రొయ్యల సేకరణను నిలిపివేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఆక్వా రైతు ఒకరు వాపోయారు. ప్రస్తుత సీజన్లో నీలం, చిత్తూరు మామిడి రకాన్ని ఎగుమతి చేస్తామని సమ్మె కారణంగా కాయలు కోయకుండా చెట్లకే వదిలేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. రేటు బాగున్నా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని, వర్షాలు పడితే చేతికి వచ్చిన పంట దక్కదని చిత్తూరు జిల్లా రైతులు వాపోతున్నారు. బోసిపోయిన బెజవాడ వన్టౌన్ మార్కెట్ నిత్యం రూ. వందల కోట్ల టర్నోవర్తో కళకళలాడే విజయవాడ వన్టౌన్ హోల్సేల్ మార్కెట్ లారీల సమ్మె కారణంగా వెలవెలపోతోంది. సాధారణంగా ఆషాడమాసంలో వ్యాపారం తక్కువగా ఉంటుంది. సమ్మె మరో వారం రోజులపాటు జరిగితే శ్రావణమాసం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వస్త్రలత వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లారీలు ఆగిపోవడంతో సుమారు 10,000 మంది హమాలీలు కూలీ దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ విక్రయిస్తున్న వాహన డీలర్లు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలపై మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించడం లేదు. జీఎస్టీలో చాలా వస్తువులు రేట్లు తగ్గడంతో పాత సరుకును విక్రయించాలనే ఉద్దేశంతో కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం లేదని ఎలక్ట్రానిక్ గూడ్స్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. తాము సాధారణంగా నెల రోజుల స్టాక్ నిర్వహిస్తామని, దీంతో ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఆటోమొబైల్ రంగంపై లేదని కార్లు, ద్విచక్రవాహనాల డీలర్లు తెలిపారు. సమ్మె మరో వారం రోజులు కొనసాగితే మాత్రం వాహన కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సర్కారుకు సోమవారం వరకు గడువు పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, టోల్ గేట్ చార్జీల తగ్గింపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే సమ్మెను ఉధృతం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు చెప్పారు. అప్పటివరకు సామాన్యులకు ఇబ్బంది లేకుండా సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. సోమవారం దాకా నిత్యావసర సరుకులు, పెట్రోల్ లాంటి వాటికి మినహాయింపు కొనసాగుతుందన్నారు. లారీల సమ్మెకు సంఘీభావంగా పెట్రోలియం ట్యాంకర్లు కూడా సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పెట్రోలియం డీలర్ల ఫెడరేషన్ ఖండించింది. లారీల సమ్మెకు సంఘీభావం ప్రకటించే అంశంపై ఇంత వరకు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. టమాట రైతులకు రూ.20 కోట్ల నష్టం చిత్తూరు: లారీల సమ్మె టమాటా రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిత్యం జరిగే రూ.2.5 కోట్ల లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిబెంగాల్ తదితర రాష్ట్రాలకు టమాట, క్యాబేజీ, ఇతర కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతి అవుతుంటాయి. ఇతర రాష్ట్రాలకు రోజూ 4 వేల టన్నుల టమాటాలు ఎగుమతి చేస్తారు. సమ్మె వల్ల టమాటా రైతులకు ఇప్పటివరకూ సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు పరిసరాల్లోని బెల్లం తయారీ రైతులు కూడా రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తిలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు కడప, ఒడిశా నుంచి రావాల్సిన ముడిసరుకు ఆగిపోయింది. సమ్మెతో కృష్ణపట్నం, ఎన్నూర్ ఓడరేవుల నుంచి ఎరువుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. ‘తూర్పు’న ఆగిన 35 వేల లారీలు రాయవరం (తూర్పుగోదావరి జిల్లా): సమ్మె కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 35,000 లారీలు కదలడం లేదు. బియ్యం, కోడిగుడ్లు, కొబ్బరి, అరటితోపాటు ఇటుక తదితరాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, క్యారెట్తోపాటు సిమెంట్, ఐరన్ దిగుమతులు ఆగిపోయాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన రావులపాలెం, రాజమహేంద్రవరం, మండపేట, తుని, కాకినాడ, అనపర్తి, పిఠాపురం, కత్తిపూడి, ఏలేశ్వరం, జగ్గంపేటలో సమ్మె ప్రభావం స్పష్టంగా ఉంది. గత వారం రోజులుగా లారీలు నిలిచిపోవడంతో రూ.70 కోట్ల దాకా నష్టపోయినట్లు లారీ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. -
అక్రమ తవ్వకాలను నిరసిస్తూ రైతుల ఆందోళన
-
గడువులోగా ప్రీమియం చెల్లించండి: పోచారం
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కింద రైతులు బీమా ప్రీమియంను గడువులోగా చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు కర పత్రాలు, గోడపత్రికలు ముద్రించి గ్రామాల్లో ప్రచారం చేశామని తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా వర్తించదని, పరిహారం అందదన్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే రైతులందరి బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులే మినహాయించుకుంటాయని పేర్కొన్నారు. బ్యాంకు రుణం తీసుకోని రైతులు తమ మండలంలోని కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియంను చెల్లించాలన్నారు. 2017–18 యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపినట్లు చెప్పారు. కాగా,పీఎంఎఫ్బీవై కింద వరి బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని, ఇతర పంటలకు జూలై 31 ఆఖరు అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. -
ఆగస్టు 15న రైతు బీమా సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. రైతుబీమా, బిందు సేద్యం, భూ రికార్డుల ప్రక్షాళన, కంటి వెలుగు, హరితహారం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. - రైతు బంధు చెక్కులు పొందిన రైతులందరినీ సంప్రదించి అర్హులైన రైతులను బీమా పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి సూచించారు. 48.26 లక్షల మంది రైతు బంధు చెక్కులు పొందా రని, ఇప్పటివరకు 40.64 లక్షల మందిని సం ప్రదించామని, అర్హుల ను సంప్రదించి ఆగస్టు 1 నాటికి వీరి వివరాలను ఎల్ఐసీ వారికి సమర్పిస్తే గుర్తింపు సంఖ్య, సర్టిఫికెట్లు ముద్రిస్తారని అన్నారు. రైతు బీమాలో చేరేందుకు ఆసక్తి చూపని వారి వివరాలు నమోదు చేయాలన్నా రు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో రైతులకు బీమా సర్టిఫికెట్లు అందించాలన్నారు. - భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆరు లక్షల డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన∙కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షలు, మండల స్థాయిలో 1.5 లక్షల పాసుపుస్తకాలను ముద్రించాల్సి ఉందని ఈ ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. మిగతా పాసుపుస్తకాల డిజిటల్ సంతకాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. - కంటివెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్ ఆగస్టు 15న గజ్వేల్లో ప్రారంభిస్తారని.. అన్ని జిల్లా ల్లో అమలుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి అన్నారు. జిల్లా స్థాయిలో మెడికల్ అధికారులు, ఆప్టిమెట్రీషియన్లతో బృం దాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. - కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు మండల, ఆర్డీవో స్థాయిలో పెండింగ్లో ఉం టున్నాయని, వీటిపై కలెక్టర్లు సమీక్షించాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందించాలనే సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు నిధుల కొరత లేదని, మంజూరు పత్రాలను వేగంగా అందజేయాలని సూచించారు. -
కోటి సాయం
నటుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకెళుతున్న నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ ద్వారా పలువురు పేద విద్యార్థులకు విద్యా దానం చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోదరుడు కార్తీ హీరోగా సూర్య నిర్మించిన ‘కడైకుట్టి సింగం’ ఇటీవల విడుదలైంది. ‘చినబాబు’ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ‘కడైకుట్టి సింగం’ సక్సెస్ మీట్ను మంగళవారం చెన్నైలో నిర్వహించారు. ఇది వ్యవసాయం, కుటుంబ అనుబంధాల ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కావడంతో సూర్య ఈ వేడుకలో రైతులకు కోటి రూపాయలు సాయంగా అందించారు. మన కంటే కూడా చెమటోడ్చుతున్న వారు రైతులేనని అందుకే ఈ సాయాన్ని అందిస్తున్నానని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమిళనాడులో ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఈ నగదు అందజేయనున్నారు. -
ఇక బలవంతపు భూసేకరణే!
సాక్షి, అమరావతి: సంప్రదింపుల పేరుతో సామధాన దండోపాయాలు ప్రయోగించి ఎక్కడ కావాలంటే అక్కడ భూములను లాక్కోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే 2013 కేంద్ర భూసేకరణ చట్టం స్థానే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం – 2018కి సంబంధించిన విధి విధానాలతో సోమవారం జీవో జారీ చేసింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ అంచనా, ప్రజాభిప్రాయ సేకరణలను చట్టుబండల్లా మార్చి(తొలగించి) తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం – 2018 ప్రకారం భూ యజమాని ఇక ప్రేక్షకుడిగా మిగిలిపోనున్నాడు. సవరించిన కొత్తచట్టం ప్రకారం భూసేకరణ అథారిటీ (కలెక్టరు) సంప్రదింపుల ద్వారా రైతులను ఒప్పించి భూములను సేకరించవచ్చు. తెలిసో తెలియకో, సర్కారు ఒత్తిడికి భయపడో భూములు ఇవ్వడానికి అంగీకరిస్తూ రైతులు సంతకాలు చేస్తే తర్వాత ఈ చట్టం ప్రకారం రైతులు కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు (భూమి ఇవ్వడానికి అంగీకరించకుండా సంతకాలు చేయకుండా ఉంటే మాత్రమే కోర్టుకు వెళ్లి రక్షణ పొందవచ్చు). భూయజమానుల హక్కులను దారుణంగా దెబ్బతీసే ఈ చట్టం వాస్తవంగా అయితే ఇప్పటి నుంచి అమలు కావాలి. అయితే 2014 జనవరి ఒకటో తేదీ నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలంటూ జీవోలో ప్రభుత్వం మెలిక పెట్టడం గమనార్హం. జీవోలోని ముఖ్యాంశాలివీ.. ఏ విభాగమైనా, సంస్థ అయినా భూమి కావాలని కలెక్టరుకు దరఖాస్తు చేసుకుంటే భూసేకరణ అథారిటీ (సంబంధిత జిల్లా కలెక్టరు) సంప్రదింపుల పద్ధతిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనినే కన్సెంట్ అవార్డు అంటారు. దీని ప్రకారం భూములు ఇవ్వడానికి ఇష్టపడే రైతులు సమ్మతి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో), పనుల విభాగం కార్యనిర్వహణ ఇంజినీరు ( భూమి సేకరణ కోరిన శాఖ కాకుండా వేరే విభాగం వారు), భూమి కోరుతున్న సంస్థ ప్రతినిధితో కూడిన కమిటీ భూయజమానులతో సంప్రదింపులు జరిపి ధర ఖరారు చేస్తుంది. సమ్మతి తెలిపిన భూ యజమానులు, భూసేకరణ సంస్థ ప్రతినిధులు దీని ప్రకారం అంగీకారపత్రాలపై సంతకాలు చేస్తారు. దీనినే అగ్రిమెంటు అంటారు. దీని ప్రకారం కలెక్టరు అవార్డు ప్రకటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలిలా.. ఏదైనా విభాగం కనీసం ఎంత భూమి సేకరించాలో మొదట నిర్ణయించుకుని రెవెన్యూ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ దీనిని ఖరారు చేసిన ప్రజాప్రయోజనాల కోసమని భావిస్తే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దీంతో మైదాన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం అమల్లో ఉన్నందున అక్కడ గ్రామసభలు తప్పనిసరి. ఎవరైనా తమకు భూమి కావాలంటూ జిల్లా కలెక్టరుకు విజ్ఞప్తి చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి కలెక్టరు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. – ఈ జీవో ప్రకారం భూసేకరణ వల్ల ప్రభావితులయ్యే కుటుంబాలకు ముందస్తు నోటీసులు జారీ చేయాలి. నిర్వాసితులకు 2018 భూసేకరణ చట్టం ప్రకారం ఏకమొత్తంగా పరిహారం చెల్లించాలి. – భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం సుగమమయ్యింది. సవరణలతో వచ్చే నష్టాలివీ.. ఏపీ భూసేకరణ చట్టం–2018 వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. - ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు. - ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది. - కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనికి రైతులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే తర్వాత దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. మరీ అన్యాయం... ఇప్పుడు జారీ చేసిన 2018 భూసేకరణ చట్టానికి సంబంధించిన జీవో 2014 జనవరి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొడం దారుణమని నిపుణులతోపాటు అధికారులు కూడా అంటున్నారు. అనగా 2013 కేంద్ర భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్లకు కొత్త చట్టమే అమలు చేస్తామని అర్థం. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో, వివిధ ప్రాజెక్టులకు, మచిలీపట్నం పోర్టుకు, అమరావతి అనంతపురం హైవే భూసేకరణకు 2013 భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్లను చట్టుబండలుగా మార్చి కొత్త చట్టం ప్రకారం భూములు లాక్కోవాలన్న ఎత్తుగడతోనే పాత తేదీతో జీవో జారీ చేసిందని అధికారులు పేర్కొన్నారు. -
సిండి‘కేటు’
అల్లాదుర్గం(మెదక్) : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో సిండికేట్ దందా ప్రారంభించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు అరువు ఇస్తున్నారు. ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 5 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్ప డుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దందా అల్లాదుర్గం ఉమ్మడి మండలంలో ఐదేళ్లుగా యథేచ్చగా కోనసాగుతుంది. ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం.. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలో సుమారు 45 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులంత సిండికెట్గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు. గ్రామానికో బ్రోకర్.. దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నారు. వట్పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వట్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ విత్తనాలు అమ్మడంతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు విచారణ జరిపినా ఆ వ్యాపారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్రంగా మోసం చేస్తున్నారు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం. – నాగరాజు రైతు, ముప్పారం. చర్యలు తీసుకుంటాం.. ఈ సిండికేట్ అక్రమ వ్యాపరం గురించి మా దృష్టికి రాలేదు. మండల వ్యవసాయ అధికారి ద్వారా విచారణ చేపడతాం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. –పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
నర్సంపేట రూరల్: ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నా రు. భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా తదితర కార్యక్రమాలతో భూములపై హక్కులను కల్పించి, నేడు కాలరాసేందుకు ప్రభుత్వం యత్ని స్తోందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్పుస్తకాల్లో 90శాతం ఏదో ఒక తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ డం లేదన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. టీజేఎస్ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, చాపబాబు, బొనగాని రవీందర్, షేక్జావీద్, బొట్ల పవన్, భూక్యగోపాల్నాయక్, అంగోతు వినోద్, మామిండ్ల ఐలయ్య, బుల్లెట్ వెంకన్న, నందగిరి రజనీకాంత్, బందెల సదానందం, గుంటి సంజీవ, రాజశేఖర్, జాఫర్, యాకుబ్, హనుమంత్, లక్ష్మయ్య, శివ, అనిల్ పాల్గొన్నారు. పెద్దకోర్పోలు గ్రామంలో... నెక్కొండ(నర్సంపేట): టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జన సమితి పార్టీ పోరా డుతోందని ఆ పార్టీ అధినేత ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా నెక్కొం డ మండలం పెద్దకోర్పోలు గ్రామంలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలను మరిచిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. 60 ఏళ్లలో రూ.63వేల కోట్ల అప్పు ఉంటే.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అప్పులను రెట్టింపు చేశారని అన్నారు. భూ ప్రక్షాళనతో సమస్యలు పరిష్కారం కాకపోగా రైతులకు కొత్త చిక్కులు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. టీజేఎస్ సోమవారం చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాస్, వరంగల్ కన్వీనర్ బోనగాల రవీందర్, వెంకన్న, వినోద్నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం -
అన్నదాతలపై అప్పుల మూట
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా వంచిస్తు న్నారు. రుణ మాఫీ హామీని అమలు చేయకపోవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల బ్యాంకుల నుంచి కొత్త రుణాలు వచ్చే దారిలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అప్పులు, వడ్డీల భారం పెరిగిపోయి, అవి తీర్చే మార్గం కనిపించక రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చే నాటికి బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు రూ.87,612 కోట్లు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి అవి ఏకంగా రూ.1,25,972.02 కోట్లకు చేరడం గమనార్హం. ఇక ప్రైవేట్ అప్పులు ఎన్ని రూ.వేల కోట్లు ఉంటాయో ఊహించుకోవాల్సిందే. రుణమాఫీకి షరతులు బ్యాంకుల్లో బంగారం కుదువ పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకోండి, చంద్రబాబు అధికారంలోకి రాగానే విడిపించి ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో చాలామంది రైతులు బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి వ్యవసాయ రుణాలను తీసుకున్నారు. అయితే, బంగారం కుదువ పెట్టి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. దీంతో రూ.35,000 కోట్ల రుణాలు మాఫీకి నోచుకోలేదు. తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని, లేకపోతే బంగారం వేలం వేస్తామంటూ బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేశాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉన్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. అయితే, ఈ రుణాలన్నీ మాఫీ చేయబోమంటూ టీడీపీ ప్రభుత్వం పలు కొర్రీలు విధించింది. ఒక్కో కుటుంబంలో ఎంతమంది ఎంత రుణం తీసుకున్నప్పటికీ ఆ కుటుంబంలోని అందరికీ కలిపి కేవలం రూ.లక్షన్నర మాత్రమే మాఫీ చేస్తామని, అది కూడా పంటల రుణాలకే వర్తిసుందని షరతు విధించింది. ఉద్యానవన పంటలు, మత్స్య, కోళ్లు, పాడి పరిశ్రమ అవసరాలు, గోదాముల్లోని సరుకు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. మాఫీ చేయాల్సిన రుణాలను ఇలా షరతుల పేరిట రూ.24,000 కోట్లకు కుదించింది. అదైనా పూర్తిగా ఇవ్వకుండా మోసం చేస్తోంది. రుణమాఫీ కోసం ప్రతిఏటా అరకొరగా నిధులు విదిలిస్తూ చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చిన సొమ్ము రుణాలపై కనీసం వడ్డీలు చెల్లించడానికైనా ఏ మూలకూ చాలని పరిస్థితి నెలకొంది. గతంలో రుణాలపై వడ్డీని ప్రభుత్వాలే చెల్లించేవి. చంద్రబాబు గద్దెనెక్కాక దానికి ఎగనామం పెట్టారు. డిఫాల్టర్లుగా మారిన రైతులు ఈ ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్ర రైతాంగం రుణాలు రూ.1,25,972.02 కోట్లకు చేరినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ నెల 13వ తేదీన ఒక నివేదికలో వెల్లడించింది. ఇందులో సన్న, మధ్య తరగతి రైతుల రుణాలు రూ.74,027.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చంద్రబాబు మాట తప్పడంతో వారంతా డిఫాల్టర్లుగా మారారు. దాంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అసలు రుణాలు అలాగే ఉండడంతోపాటు వడ్డీల భారం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో రైతులు పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు. బ్యాంకుల్లో ఉన్న అప్పు, ప్రైవేట్ అప్పు కలిసి రైతులను కుంగదీస్తున్నాయి. అప్పుల భారం భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. -
ప్రభుత్వానికి ఎదురుతిరగండి: పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పొలాలు లాక్కునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలని రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. మూడు పంటలు పండే భూములను ప్రభుత్వం సేకరించకూడదని ఆయన అన్నారు. మూడు పంటలు పండే భూముల్ని మెట్ట పొలాలుగా చూపి దోపిడీ చేస్తారా అని ఆయన సర్కారును నిలదీశారు. మంత్రి నారాయణ పంట భూములను ట్రాక్టర్లతో దున్నారని, ఆయనకు రైతుల గురించి, వ్యవసాయం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే భూదాహం తగ్గించుకోవాలని హితవు పలికారు. రైతుల భూములను ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని, రాజధాని గ్రామాల్లో నియతృత్వంతో వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సింగూరు పోరాటం, బషీర్బాగ్ కాల్పుల వంటి ఘటనలు పునరావృతం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. -
రెండో విడత రైతుబంధుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రైతుబంధు సొమ్ము పంపిణీకి సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలోగా పెట్టుబడి సొమ్ము పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి రబీ సీజన్ మొదలు కానుండటంతో ఆ లోగానే పెట్టుబడి సాయం రైతులకు ఇస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీ రైతుకూ పెట్టు బడి సొమ్ము ఇస్తారు. ఆయా రైతులు సాగు చేసి నా, చేయకపోయినా పెట్టుబడి సొమ్ము అందనుంది. ఖరీఫ్లో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలై తే, రబీలో 31.92 లక్షల ఎకరాలే. పంటల సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రబీలోనూ ఖరీఫ్ లో ఇచ్చిన రైతులందరికీ పెట్టుబడి సాయం చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్డులా? చెక్కులా? ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేలు అందజేసిన సంగతి తెలిసిం దే. ఆ ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే చెక్కులను గ్రామాలకు సరఫరా చేసింది. ఇప్పటివరకు 49 లక్షల చెక్కులను రైతులకు అందజేశారు. 9 లక్షలకు పైగా చెక్కులు మిగిలిపోయాయి. వాటి ల్లో దాదాపు లక్షన్నర చెక్కులకు చెందిన రైతులు చనిపోయారు. మరో లక్ష చెక్కులు ఎన్ఆర్ఐలకు సంబంధించినవి. మిగిలినవి ఇతరత్రా కారణాల తో తీసుకోలేదు. రెండో విడత రైతుబంధు సొమ్ము ను రైతులకు ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రబీలో చెక్కులకు బదులు బ్యాంకు కార్డుల వంటి వాటిని ఇవ్వాలని గతంలో సర్కారు నిర్ణయించింది. అయితే చెక్కుల పంపిణీపై సర్కారుకు భారీ ప్రశంసలు వచ్చాయి. దీంతో బ్యాంకు కార్డులు ఇస్తే అంత ప్రచారం వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. చెక్కులను ఇస్తేనే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు సీఎం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో చెక్కులవైపే సర్కారు మొగ్గు చూపుతుందని అనుకుంటున్నారు. కాగా, జిల్లాల్లో మిగిలిపోయిన చెక్కులను వెనక్కు పంపా లని వ్యవసాయశాఖ ఆదేశించింది. అందుకు కారణాలు వివరిస్తూ నివేదిక పంపాలని పేర్కొంది. -
తాండవ జామ..భలే టేస్ట్ గురూ!
విశాఖపట్నం ,నాతవరం (నర్సీపట్నం): జామ తోటల పెంపకంపై ఆదాయం బాగుండటంతో రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు తాండవ జంక్షన్ జామకాయలకు ప్రసిద్ధి. అప్పటిలో విస్తారంగా సాగు జరిగేది. రానురాను తెగుళ్ల బారిన పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు రైతులు జామతోటల పెంపకంపై దృష్టి సారించారు. మండలంలోబాపన్నపేట, మర్రిపాలెం, వెన్నలపాలెం, డి,యర్రవరం ,ములగపూడి, నాతవరం, మాదంపూడి ప్రాంతాలల్లో సుమారు 80 ఎకరాలు వేశారు. దేశవాళీ రకాలు కాకుండా లక్నో 49, భువనగిరి బత్తాయి తదితర రకాల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎకరాకు రూ.80 వేల ఆదాయం మండలంలోని బాపన్నపేట గ్రామానికి చెందిన చోడే మోహన్రావు చౌదిరి సుమారు 10 ఎకరాల్లో తైవాన్, హైబ్రిడ్ రకాలు వేశారు. నాటిన తరువాత మూడేళ్ల నుంచి దిగుబడి వస్తోందని ఆయన వివరించారు. ఏడాదికి రూ.60 నుంచి రూ.70 వేల మధ్య ఆదాయం వస్తోందని చెప్పారు. యాపిల్ను పోలివుండే తైవాన్ జామకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. జామ కాయల వ్యాపారమే ఆధారం మర్రిపాలెం శివారు రెల్లి కాలనీకి చెందిన వంద కుటుంబాలు జామ కాయల అమ్మకాలపై ఆధారపడ్డారు. వీరంతా రైతుల నుంచి సేకరించిన జామకాయలను తాండవ జంక్షన్లో విక్రయించి ఉపాధి పొందుతున్నారు. తాండవ వల్లే రుచి : తాండవ జలాశయం వల్లే ఈ ప్రాంతంలో జామకాయలు రుచికరంగా ఉంటాయి. తాండవ నీరు తియ్యదనం వల్ల ఈ ప్రాంతంలో పండించే జామ కాయల రుచికూడా అదేవిధంగా ఉంటుంది. నర్సీపట్నం– తుని మార్గంలో వెళ్లే ప్రతిఒక్కరూ జామకాయలను కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రోత్సాహం కరువు తాండవ జంక్షన్లో జామకాయల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ముద్ర పథకంలో రుణాలు ఇప్పిస్తే అధిక వడ్డీలనుంచి బయటపడతాం. – బంగారి అబ్బు, రెల్లి సంఘం అధ్యక్షుడు జామ ఆరోగ్యకరం జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జామి కాయలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది, తక్కువ మోతాదులో ‘ఏ’ విటమిను కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యానర్స్ రాకుండా ఉపయోగపడుతుంది.– అనుషరావు, నాతవరం పీహెచ్సీ వైద్యాధికారి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం జామ సాగు చేయడానికి ముందుకు వచ్చె రైతులకు రాయితీపై మొక్కలు అందజేస్తున్నాం. అలాగే ఉపాధి హమీ పథకంలో తోటల పెంపకానికి నిధులు కేటాయిస్తున్నాం. రైతులకు జామసాగు ప్రయోజనాలపై సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – చెట్టి బిందు, ఉద్యవనశాఖాదికారిణీ -
వ్యవసాయ పని దినాలు తగ్గిపోతున్నాయి..
కాకినాడ రూరల్ ప్రాంతంలో వ్యవసాయ పనులు తగ్గిపోతున్నాయని, రానున్న రోజుల్లో వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయని తమ సమస్యలను చెప్పుకున్నారు వ్యవసాయ కూలీల మేస్త్రి సానా సతీష్. కొవ్వాడలో సహచర కూలీలతో జగన్ను కలిసి కూలీల స్థితిగతులను చెప్పారు. ఉపాధి పనుల్లో వంద రోజుల పని నియమాన్ని అమలు చేయడంలేదని, దీంతో ఇతర వృత్తులకు వలసలు పోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
తాంసి: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే బాపూరావు అన్నారు. కప్పర్లలో మంగళవారం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి కప్పర్లను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపూరావును, లోక భూమారెడ్డిని గ్రామస్తులు సన్మానించారు. గ్రామ సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మె ల్యే కప్పర్ల నుంచి నిపాని వరకు రోడ్డుకు రూ.6 లక్షలు , రైతు వేదిక భవనం కోసం రూ.12 లక్షలు, రెండు ఆలయాలకోసం దేవదాయశాఖ తరఫున రూ.80 లక్షలు కేటాయిస్తామని గ్రామస్తులకు తెలిపారు. లోక భూమారెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు 50 శాతం సబ్సిడీతో రైతుకు గేదెలు పంపిణీ చేస్తామని, సొసైటీలు ఏర్పాటు చేసుకొని రుణాలు పొందాలని సూచించారు. సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సదానంద్, వీడీసీ అధ్యక్షుడు శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు శ్రీధర్ రెడ్డి,నారాయణ,మహేందర్ ఉన్నారు. -
పరిటాల శ్రీరామ్ రైతులపై అనుచిత వ్యాఖ్యలు
-
పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సునీత, తన తనయుడి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఆ అర్హత శ్రీరామ్కు లేదు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. రైతుల మనోభాలను పరిటాల కుటుంబం దెబ్బతీస్తోందన్నారు. రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ శ్రీరామ్ వ్యాఖ్యానించటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు.. కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లారని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పదవుల్లో ఉంటున్న పరిటాల కుటుంబం ఏం సాధించిందని ప్రశ్నించారు. కరవుపై మాట్లాడే అర్హత పరిటాల శ్రీరామ్కు లేదని ఆయన పేర్కొన్నారు. -
బాలయ్యా.. హామీ నెరవేర్చవేమయ్యా!
హిందూపురం అర్బన్: ‘‘చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తాం.. నేతన్నకు అండగా ఉంటాం’’ అంటూ ఓట్లు దండుకున్న పాలకులు, ఆ మేరకు రుణమాఫీ చేయకపోవడంతో కడుపుమండిన వారంతా రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ ఆక్రోశాన్నివెళ్లగక్కుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో చేనేతల వెతలు అన్నీ ఇన్నీ కావు. రుణమాఫీ వర్తించలేదని ఎన్నోమార్లు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో వారంతా సోమవారం హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ఎదుటే నిరసనకు దిగారు. అర్జీలిచ్చి.. అలిసిపోయి.. ఈ సందర్భంగా పలువురు చేనేతలు మాట్లాడుతూ.. 2012లో డబ్ల్యూసీసీ పథకం కింద హిందూపురం ప్రాంతంలోని చేనేతలంతా బ్యాంకుల్లో రూ.50 వేల చొప్పున రుణం తీసుకున్నామన్నారు. మగ్గం పనులు లేక పస్తులుంటున్నా వడ్డీలు కడుతూ వచ్చామన్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో టీడీపీ చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ ప్రకటించిందనీ, అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా చేనేతల రుణాలు మాఫీ చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఏడీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమని వాపోయారు. హిందూపురం మండలం, పరిసర గ్రామాల్లో సుమారు 155 మంది చేనేతలకు రుణమాఫీ కాలేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లామనీ.. ఆయన జిల్లా «అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో రుణాలు మాఫీ అయ్యేలా చూస్తామంటూ హామీలిచ్చారన్నారు. అయితే నెలలు దాటినా రుణాలు మాఫీకాలేదన్నారు. చేనేతల నిరసన సుమారు అరగంట పాటు సాగిన తర్వాత తీరిగ్గా ఇంట్లోంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే పీఏ వారి నుంచి మరోసారి వినతులు తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పంపారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కిష్టప్ప, దేవరాజు, నారాయణ పాల్గొన్నారు. -
ఖరీఫ్ భళా.. రుణాలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర దాటింది.. సాగు విస్తీర్ణం ఇప్పటికే సగానికి మించింది.. కానీ రైతులకు రుణాలందించడం లో బ్యాంకులు అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయి. ఈ సీజన్లో రూ.25 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటిదాకా అందులో ఐదో వంతు కూడా ఇవ్వ లేదు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అనేక కొర్రీలు పెడుతు న్నాయి. ‘ఔను ఖరీఫ్ రుణాలు ఇంకా పుంజుకోలేదు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కావా లని కొన్నిచోట్ల బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారంటే పరి స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. దీంతో అనేకచోట్ల అన్నదాతలు ప్రైవేటు అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. మళ్లీ అప్పులు, వడ్డీలే దిక్కవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లతో సమీక్ష చేయకపోవడాన్ని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇచ్చింది రూ.5 వేల కోట్లే: రాష్ట్రంలో పంటల సాగు 49 శాతానికి చేరింది. ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 30.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.76 లక్షల ఎకరాలు కాగా, కేవలం 3.91 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.64 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, 5.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఓవైపు పంటల సాగు పెరుగుతోంది. మరోవైపు వర్షాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పంటల రుణాలు మాత్రం 20 శాతానికి మించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖరీఫ్లో బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాల లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు ఐదో వంతు అంటే రూ.5,099 కోట్లే ఇచ్చినట్లు వెల్లడించాయి. వాస్తవంగా పత్తి రైతులకు రూ.8,279 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.3 వేల కోట్లకు మించలేదని అంచనా. కొత్త పాసు పుస్తకాలు రాలేదంటూ.. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుగా తేలింది. కానీ వారిలో 43 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. సర్కారు లెక్కల ప్రకారం 15 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని తేలింది. ఇలా పాసు పుస్తకాలు రాని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాయి. మరోవైపు పాసు పుస్తకాలు వచ్చినా వాటిని బ్యాంకుల వద్ద కుదువ పెట్టాల్సిన పనిలేదని, ఆన్లైన్లో చూసుకుని రుణాలు ఇవ్వాలని సర్కారు నిర్దేశిం చినా బ్యాంకులు పట్టించుకోవడంలేదు. పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిందేనని బ్యాంకు లు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల కు కొత్త రుణాలు అందడం కష్టంగా మారింది. ‘రైతుబంధు’ కూడా జమ! బ్యాంకులు రైతుల నుంచి పంట రుణంపై వడ్డీని వసూ లు చేస్తున్నాయి. రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టక్కరలేదని వ్యవసాయ శాఖ చెబుతుంటే, బ్యాంకులు మాత్రం పట్టించుకోవడంలేదు. కొత్త రుణం కావాలని వెళ్లిన రైతుల నుంచి అసలు, వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నా యి. ‘రైతుబంధు’చెక్కులను తమ పొదుపు ఖాతాల్లో జమ చేయగా ఆ సొమ్మును పాతబాకీ వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా ఉన్న బాకీ సొమ్మును విడుదల చేస్తే, వాటిని రైతు ల ఖాతాల్లో వడ్డీ కింద తిరిగి జమ చేస్తామని బ్యాం కులు తెలిపాయి. ప్రభుత్వం విడుదల చేయకపోవడం తో బ్యాంకులు రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం పదేపదే చెబు తున్నా బ్యాంకర్లు ఏమాత్రం అంగీకరించడంలేదు. ‘రుణమాఫీ’పై వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేయడంతో రైతులపై విపరీతమైన వడ్డీ భారం పడింది. బ్యాంకులో ఉన్న పట్టా పాసు పుస్తకాలను విడిపించుకునేందుకు వడ్డీని రైతులే భరించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక రైతు 2013లో రూ.లక్ష పంట రుణం తీసుకున్నాడు. 2014లో ప్రభుత్వం మొదటి విడత కింద రూ.25 వేలు చెల్లించగా రుణాన్ని రెన్యువల్ చేసుకున్నాడు. ఇలా నాలుగు విడతలు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. కానీ రూ.లక్షకు ఈ మొత్తం కాలంలో పడిన వడ్డీని మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు. ఇలా ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రాకపోవడంతో బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, రుణాలు ఇవ్వకుండా వేధించడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
ఏదీ జలసిరి.. కరిగె తరి సిరి
నాగార్జునసాగర్ ఆయకట్టు నుంచి సాక్షి ప్రతినిధి బొల్లం శ్రీనివాస్ ఒకప్పుడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు.. రైతుల్లో ‘సాగర’మంత ఆనందం.. తొలకరితోనే ఎరువాక సాగేవారు.. ఖరీఫ్, రబీ సీజన్లు వచ్చాయంటే బీడు భూములన్నీ పచ్చని పైర్లతో కళకళలాడేవి.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు! ఖరీఫ్ సీజన్ మొదలై నెల గడిచినా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలోనే ఉన్నారు. వరుసగా రెండు కార్లు (పంటలు) నీళ్లందకపోవడంతో వేలాది మంది రైతులు బోర్లు, బావులకు లక్షలు ఖర్చు చేసి నీటి కోసం తిప్పలు పడుతున్నారు. నీళ్లు లేక వర్షాధార పంటల వైపు మొగ్గుతున్నారు. ఇక ఏ ఆదరువు లేని సన్న, చిన్నకారు రైతులు పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల దయనీయ స్థితి ఇదీ!! ఈ ఆయ కట్టు ‡రైతుల కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. చి‘వరి’కి నిరాశే.. కృష్ణా నది బేసిన్లో నైరుతి వర్షాలు ఆలస్యమవుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో పడే వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండిన తర్వాతే శ్రీశైలం, నాగార్జునసాగర్లోకి నీళ్లు వస్తున్నాయి. సాగర్ నిండిన తర్వాత రబీలో ఆరుతళ్లకు నీరు విడుదలవుతుంది. నవంబర్, డిసెంబర్లో నీళ్లివ్వడంతో ఆయకట్టు చివరి భూములకు అందడం లేదు. ఒకప్పుడు వరి పండిన భూములు నీళ్లు లేక మెట్టగా మారాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి, హాలియా, మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి, హుజూర్నగర్ నియోజకవర్గంలోని పాలకీడు, నేరడుచర్ల మండలాల్లో వేలాది ఎకరాలు మెట్ట భూములుగా మారాయి. ఈ భూములకు ఇక నీళ్లు అందవని ఆయకట్టు రైతులు ఇప్పటికే పత్తి, కంది, పెసర సాగు చేశారు. ఆగస్టు నాటికి ప్రాజెక్టు నిండి ఖరీఫ్కు నీటిని విడుదల చేసినా ఈ భూములకు నీళ్లందడం లేదు. దీంతో రైతులు ఏటా మెట్ట పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇలా నాడు తరి పంటలు వేసే భూములు మెట్ట పంటలకు నెలవయ్యాయి. బోర్లు, బావులకు లక్షల ఖర్చు ఆయకట్టుకు రెండు సీజన్లలో ఒకే పంటకు నీటిని విడుదల చేస్తుండడంతో రైతులు పంట సాగును వదులుకోలేక బోర్లు, బావులు తవ్విస్తున్నారు. పదేళ్లలో సాగర్ ఆయకట్టులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు చూస్తే బోర్లు, బావుల కోసం రైతులు పడుతున్న పాట్లు స్పష్టమవుతోంది. 2004 ముందు ఆయకట్టులో 69,451 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,17,244కు చేరింది. అంటే పదిహేనేళ్లలో 47,793 కనెక్షన్లు పెరిగాయి. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 22,642 కనెక్షన్లు ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి 51,337 కనెక్షన్లు అయ్యాయి. అలాగే కోదాడ డివిజన్ పరిధిలో 25,151 కనెక్షన్లుంటే ప్రస్తుతం 65,907 కనెక్షన్లకు చేరాయి. మిర్యాలగూడ, వేములపల్లి, నిడమనూరు, గరిడేపల్లి, నేరడుచర్ల, కోదాడ, మునగాల మండలాల్లో బోర్లు, బావుల తవ్వకం ఎక్కువగా ఉంది. మూడు, నాలుగు ఎకరాలున్న ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేస్తూ రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్, పైపులు, తవ్వకం అంతా కలిపి ఒక్కో బావికి రూ.లక్షపైనే ఖర్చు పెడుతున్నారు. మెట్ట సాగు చేసినా తరి కౌలు ఆయకట్టులో 2.50 లక్షల ఎకరాలు కౌలు కింద సాగవుతుంది. కొంత భూమి ఉన్న రైతులు, అసలు భూమి లేని వారు.. కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. వరి లేకపోతే మెట్ట పంటలు ఏవి వేసినా ఎకరానికి రూ.20 వేల చొప్పున రెండు సీజన్లు ఖరీఫ్, రబీకి రూ.40 వేలు చెల్లించాలి. భూములను కౌలుకు తీసుకునే రైతులు సాగర్ నీళ్లు వచ్చినా, రాకున్నా.. వర్షాధారంగా పంటలు వేసినా కౌలు మాత్రం తరి (వరి) సాగు ప్రకారం కట్టాలి. ఖరీఫ్ సీజన్లో ముందే పంట సాగు చేయకున్నా ఒక పంటకు కౌలు చెల్లించాలి. సాగర్ నీళ్లు వస్తాయనుకొని ఆశగా ఎదురుచూస్తున్న కౌలు రైతులు చివరకు నీళ్లు రాక పత్తి, కంది, పెసర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు చీడపీడలు, పంట చేతికొచ్చే సమయంలో వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కష్టాలన్నింటనీ తట్టుకొని చేతికొచ్చిన పంటను అమ్మితే కౌలు, పంట నూర్పిడి ఖర్చులు పోను రోజు కూలైనా గిట్టుబాటు కావడం లేదు. పట్టణాల్లో అడ్డా కూలీలుగా రైతులు ఆయకట్టుకు నీళ్లు రాక రెండు, మూడెకరాలున్న సన్న, చిన్నకారు రైతులు పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారుతున్నారు. మిర్యాలగూడ, హాలియా, హుజూర్నగర్, కోదాడ పట్టణాల్లో ఉదయం 8 గంటలకే రోజువారీ కూలీలతో వచ్చి పనుల కోసం ఎదురుచూస్తున్నారు. నీళ్లుంటే దుక్కులు దున్నడం, వరి నాట్లతో ఆయకట్టు కళకళలాడేది. కానీ పరిస్థితి తిరగబడటంతో రైతులు పట్టణాల బాట పడుతున్నారు. గ్రామాల్లో ఉంటే ఏ పని దొరకడం లేదని, కుటుంబం ఖర్చుల కోసమైనా అడ్డా కూలీలుగా మారుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పట్టణాల్లో భవన నిర్మాణ పనులకు వెళ్తే వీరికి.. ఒక్కొక్కరికి రూ.350 నుంచి రూ.400 వరకు కూలి ఇస్తున్నారు. అప్పు చేసి ట్రాక్టర్లు తెచ్చినా.. 5 నుంచి 10 ఎకరాలు ఆపైన భూములున్న రైతులు ట్రాక్టర్లతో పంటలు సాగు చేస్తున్నారు. ఈ రైతులు తమ భూములు దున్నుకోవడంతోపాటు ట్రాక్టర్లు లేని రైతుల భూములు కూడా కిరాయికి దున్నుతారు. ట్రాక్టర్లకు బ్యాంకులు ఆర్థిక సహాయం అందిస్తున్నా మిగిలిన సొమ్ము అప్పుగా తెచ్చుకుంటున్నారు. చివరికి నీళ్లు రాక పంటల సాగు లేకపోవడంతో ట్రాక్టర్లు మూలకు పడి ఉంటున్నాయి. అప్పు పెరిగిపోతుందనుకుంటున్న కొందరు రైతులు మళ్లీ ట్రాక్టర్ల షోరూంలకే వాటిని అమ్మకానికి తీసుకెళ్తున్నారు. ‘ఉత్తి’పోతలు సాగర్ ఆయకట్టు కింద ఉన్న ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎడమ కాల్వకు 49 ఎత్తిపోతల పథకాల పరిధిలో 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో నీటిని విడుదల చేస్తే వీటి పరిధిలో వరి సాగవుతుంది. ఖరీఫ్ లేదా రబీలో ఆరుతళ్లకు నీటిని విడుదల చేస్తే.. ఒక్కోసారి ఎత్తిపోతలకు నీళ్లివ్వడం లేదు. దీంతో ఎత్తిపోతల కింద చివరి భూములకు నీరందడం లేదు. చేసేది లేక ఎత్తిపోతల కింద రైతులు మెట్ట పంటల వైపు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో దోసపహాడ్ లిఫ్ట్ కింద 2 వేల ఎకరాల పైగా ఆయకట్టులో ఇప్పటికే 1,500 ఎకరాల్లో పత్తి, కంది, పెసర వంటి పంటలు సాగు చేశారు. ప్రాజెక్టు లక్ష్యం ఇదీ.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో మొత్తం ఆయకట్టు 6,45,085 ఎకరాలు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో 1,56,456 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 2,29,206 ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో 2,59,423 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు నాటికి సాగర్ నిండితే ఈ మాసాల్లోనే నీటిని విడుదల చేస్తారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం సామర్థ్యం 590 (312.05 టీఎంసీలు) అడుగులు. 550 అడుగుల వరకు నీరుంటే ఖరీఫ్కు నీటిని విడుదల చేస్తారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి ప్రవాహాలు లేకపోవడంతో ప్రస్తుతం సాగర్లో 511 అడుగులే నీరుంది. నాలుగేళ్లుగా నీళ్లు లేవు.. ఈ రైతు దంపతుల పేరు మాంకాళి లక్ష్మయ్య, కౌసల్య. వీరిది తిరుమలగిరి మండలం బడాయిగడ్డ గ్రామం. ఆయకట్టు కింద ఎకరం భూమి ఉంది. ఇందులో వరి పండితేనే వారికి తిండి గింజలు. వీరు సాగు చేస్తున్న భూమికి అల్వాల కాల్వ నుంచి నాలుగేళ్లుగా నీళ్లు రావడం లేదు. అంతకుముందు వరి పండించిన భూమిలో మెట్ట పంటలు సాగు చేస్తున్నారు. రెండేళ్లు పత్తి, ఒకేడు జొన్న, మరో ఏడు సజ్జలు సాగు చేశారు. ఇప్పుడు కూడా పత్తి వేశారు. నీళ్లు సక్రమంగా అందితే వరి పండేదని, కానీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగెకరాలు.. ఆరు బోర్లు సాగర్ నీళ్లు రావడం లేదని తిరుమలగిరి మండలం యల్లాపురం గ్రామానికి చెందిన కాంసాలి గోవింద్ తన నాలుగు ఎకరాల్లో ఆరు బోర్లు వేయించాడు. కేవలం రెండు బోర్లలో ఇంచు మేర నీళ్లు పడ్డాయి. వాటితో అరెకరం వరి సాగవుతుంది. మిగతా మూడున్నర ఎకరాలు పత్తి వేశాడు. బోర్లకు చేసిన రూ.2 లక్షల అప్పు ఎలా తీర్చాలని గోవింద్ సతమతమవుతున్నాడు. మూడెకరాల అడ్డా కూలీ ఈయన పేరు ధనావత్ సైదా. త్రిపురారం మండలం రాగడప గ్రామం. సాగర్ ఆయకట్టు కింద మూడెకరాల భూమి ఉన్న ఈయన ఇప్పుడు అడ్డాకూలీగా మారాడు. భూమి సాగు చేయాలంటే సాగర్ నీళ్లు రావాల్సిందే. ఇప్పట్లో నీళ్లొచ్చే అవకాశాలు లేకపోవడంతో మిర్యాలగూడలో అడ్డాకూలీకి వెళ్తున్నాడు. రోజు రూ.350 నుంచి రూ.400 వరకు కూలి వస్తుందని, ఇదీ లేకపోతే ఇంటి ఖర్చులు ఎలా గడుస్తాయని సైదా ఆవేదన వ్యక్తం చేశాడు. 700 ఎకరాలు.. 250 బోర్లు నేరడుచర్ల మండలంలోని నర్సయ్యగూడెం గ్రామంలో 150 కుటుం బాలకు 700 ఎకరాల భూమి ఉంది. సాగర్ నీళ్లు రావడం లేదని ఎనిమి దేళ్లుగా ఈ గ్రామంలోని రైతులు బోర్లు వేయించడంతోపాటు బావులు తవ్విస్తు న్నారు. ఇప్పటి వరకు 700 ఎకరాలకు 250 బోర్లు, 30 బావులు తవ్వించారు. విద్యుత్ సరఫరా, మెటార్లు, పైపులు వేయడం, బోర్లు, బావులు తవ్వించినం దుకు సుమారు ఈ గూడెం రైతులు రూ.1.55 కోట్లు ఖర్చు చేశారు. అయినా బోర్లలో నీరు లేక వరి చివరి వరకు పారడం లేదని రైతులు వాపోతున్నారు. -
దీనస్థితిలో కాడెద్దులుగా మారిన రైతులు
-
బీమా.. రైతుకు ఏదీ ధీమా!
సాక్షి, అమరావతి బ్యూరో: పంటల బీమా గడువు ముంచుకొస్తోంది. రైతులను సమయాత్తం చేసి, బీమా చెల్లించేలా చూడాల్సిన వ్యవసాయశాఖ వెనుకబడింది. ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు రైతులకు అండగా ఉండేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమలులో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి 8 పంటలకు బీమా చేసుకొనే అవకాశం ఉంది. వరి, కంది, మినుము, ఆముదం, పసుపు, చెరకు పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం పంటల బీమాను అమలుచేసే ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేసింది. గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాతావరణ ఆధారిత బీమాను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు దక్కించుకున్నాయి. జిల్లాలో పత్తి, మిరప పంటలు వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి వస్తాయి. రైతులు తీసుకునే పంట రుణాల మొత్తంలో బ్యాంకులు రెండు శాతం మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులతో పంట బీమా చేయించేలా వ్యవసాయశాఖ చైతన్యం చేయాలి. జిల్లాలో అధికారికంగా 1.60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అనధికారికంగా వారి సంఖ్య మూడు లక్షల మందికి పైనే. వీరితో పాటు పంటలు సాగు చేసే రైతులు చాల మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకోరు. అలాంటి వారితో ఈ బీమా చేయించాల్సిన అవసరం ఉంది. వరి మినహా మిగిలిన పంటలకు ఈ నెల 31వ తేదీతో బీమా చేయించే గడువు ముగుస్తోంది. వరికి ఆగస్టు 21వ తేదీ వరకు గడువు ఉంది. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకోని వారు ఒక్కరు కూడా ఇప్పటి వరకూ బీమా చేయించలేదు. బీమా చేసుకోవాలి ఇలా.. పంటల బీమాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 700 కామన్ సర్వీస్ (మీ–సేవ) సెంటర్లలో చేసుకొనే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పంట వేసిన ధ్రువీకరణ పత్రం వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోవాలి. కౌలు రైతులైతే పంట సాగు ధృవీకరణ పత్రాలు జతచేయాలి. ఇన్సూరెన్స్ మొత్తంలో పంట రకాన్ని బట్టి రెండు నుంచి ఐదు శాతం చెల్లించాలి. ప్రీమియం ఇలా.. కంది, మినుపు, వరి, ఆముదం పంటలకు రైతులు ఇన్సూరెన్స్ మొత్తంలో రెండు శాతం చెల్లించాలి. పసుపు, పత్తి, మిరప పంటకు ఇన్సూరెన్స్ మొత్తంలో ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది. చెరుకుకు 4.78 శాతం పంటల బీమా కింద చెల్లించాలి. వరి పంటకు మాత్రం ఆగస్టు 21వ తేదీ వరకు పంటల బీమా చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన అన్ని పంటలకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోపే బీమా చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రైతులు పంటల బీమాను చేసినట్లు కనిపించలేదు. 31వ తేదీలోపు లోను తీసుకోని రైతులంతా బీమా చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం అందుతుంది. వ్యవసాయ శాఖ సైతం ఆ దిశగా రైతులను సమాయత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమాల కింద గుంటూరు జిల్లాలో ఎనిమిది పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉంది. పంట రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు పంటల బీమా చేయించేలా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలు, వాల్పోస్టర్లతో విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులతో బీమా చేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అండగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు -
సూక్ష్మ సేద్యంలో వెనుకబాటే!
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ సేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. దేశంలో 2.3 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి రాగా.. రాష్ట్రంలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే అందుబాటులోకి వచ్చింది. శనివారం విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలో కేంద్ర వ్యవసాయ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశంలో వ్యవసాయ రంగాలకు చెందిన అన్ని అంశాలపై సమగ్ర విశ్లేషణ చేసింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 35.31 లక్షల ఎకరాల్లో రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నారు. గుజరాత్లో 28.45 లక్షల ఎకరాల్లో, ఛత్తీస్గఢ్లో 7.1 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం చేస్తున్నారు. భూసార కార్డుల్లోనూ అంతంతే! భూసార కార్డుల జారీలోనూ రాష్ట్రంలో పెద్దగా పురోగతి లేదు. భూసార కార్డుల రెండో దశకు సంబంధించి 5.17 లక్షల మట్టి నమూనాలను తీయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. 4.87 లక్షల నమూనాలను సేకరించారు. 3.45 లక్షల నమూనాలను పరీక్షించారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కేవలం లక్ష భూసార కార్డులను మాత్రమే రైతులకు అందజేసినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. - దేశంలో వరి ఉత్పాదకత ఏటా పెరుగుతోంది. 1950– 51లో హెక్టారుకు వరి ఉత్పాదకత 6.68 క్వింటాళ్లుంటే, 2016–17 నాటికి 25.5 లక్షలకు చేరుకుంది. - వంట నూనెల తలసరి అందుబాటు 1980–81లో 3.8 కిలోలుంటే, 2015–16లో 17.7 కిలోలకు పెరిగింది. పంచదార తలసరి అందుబాటు 1980–81లో 7.3 కిలోలైతే, 2015–16లో 19.4 కిలోలకు చేరింది. -
భూమి నుంచివెళ్లకపోతే కాల్చేస్తా
మహేశ్వరం రంగారెడ్డి : మర్యాదగా భూమి కబ్జా విడిచి వెళ్లకపోతే గన్తో కాల్చేస్తానని రైతులను ఓ వ్యాపారి రివాల్వర్తో బెదిరించాడు. దీంతో రైతులు తిరగబడి ఆ వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మోహబ్బత్నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో సుమారు 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోహబ్బత్నగర్ గ్రామానికి చెందిన వరాత్యవత్ రాజునాయక్, గోల్కొండ అంజయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని 1975లో పట్టాదారు రాంబాయమ్మ, యాదగిరమ్మలు ఇనాంగా రైతులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్కు చెందిన వ్యాపారస్తులు అలోబి రామ్కుమార్ తివారీ, అలోబి శంకర్ తివారీ, అలోబి శివకుమార్ తివారీ, సంతోష్ తివారీ, మాజీ పట్వారీ వంగ వెంకట్రెడ్డిలు కలిసి శుక్రవారం ఆ భూమి వద్దకు వెళ్లి ఈ భూమి తమదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే మర్యాద ఉండదని రైతులను హెచ్చరించారు. రైతులు వ్యాపారుల మాటలకు బెదరకపోవడంతో రామ్కుమార్ తీవారీ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్చేస్తానని రైతులు శ్రీశైలం, అంజయ్యలను బెదిరించాడు. భయపడిపోయిన ఇతర రైతులు రామ్కుమార్ చేతిపై కొట్టడంతో రివాల్వర్ కింద పడిపోయింది. రైతులు వ్యాపారస్తులను చితకబాది, వారి వాహనాలను ధ్వంసం చేశారు. రివాల్వర్ను రైతులు తీసుకుని మహేశ్వరం పోలీసులకు అప్పగించారు. మహేశ్వరం సీఐ సునీల్కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఇరువురిని విచారించారు. అక్కడ రివ్వాలర్తో కాల్పులు జరపలేదని ఏసీపీ తెలిపారు. ఈ భూమిపై కేసు కోర్టులో ఉందని, ఇరువురు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారని, ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రివాల్వర్ ఎక్కుపెట్టలేదు మోహబ్బత్నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో ఉన్న 57 ఎకరాలు మా పట్టా భూమి. అప్పట్లో రాంబాయమ్మ, యాదగిరమ్మల నుంచి కొనుగోలు చేశాం. కొంత మంది రైతులు అక్రమంగా చొరబడి కబ్జా చేయడానికి యత్నిస్తుండగా వారిని అడ్డుకోబోయాం. మా పట్టా భూమి నుంచి వెంటనే ఖాళీ చేయాలని కోరాం. రైతులు వాగ్వాదానికి దిగి కర్రలతో దాడిచేసి గాయపరిచారు. నా లైసెన్స్ రివాల్వర్ను బ్యాగులో పెట్టుకున్నాను. ఎవరిపైనా కాల్చడానికి యత్నించలేదు. నా డబ్బులు, రివాల్వర్ లాక్కున్నారు. గన్ ఎక్కుపెట్టానని అసత్య ప్రచారం చేస్తున్నారు. మాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామ్కుమార్ తివారి పొలం విడిచి వెళ్లిపోవాలని రివాల్వర్తో బెదిరించారు.. తమ భూమి వద్దకు వచ్చి కబ్జా విడిచి వెళ్లిపోవాలని రామ్కుమార్ తివారీ, అతని సోదరులు రివాల్వర్తో బెదిరించారు. తమతో పెట్టుకుంటే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. రామ్కుమార్ వద్ద ఉన్న రివాల్వర్ నాపై ఎక్కుపెట్టాడు. వెంటనే మా కుటుంబ సభ్యులు, ఇతర రైతులు దాడిచేసి రివాల్వర్ను లాక్కొన్నారు. తివారీలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిలోకి వచ్చి వెళ్లిపొమన్నడానికి వారు ఎవరు. భూమి మాదేనని న్యాయస్థానం మాకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. – గోల్కొండ శ్రీశైలం, రైతు, మోహబ్బత్నగర్ -
అన్యాయం చేస్తే ఆత్మహత్యలే శరణ్యం
బనగానపల్లెరూరల్: ధాన్యం కొనుగోలు చేసి పరారైన వ్యాపారులను అదుపులోకి తీసుకుని డబ్బు లు ఇప్పించి న్యాయం చేయాలని నందవరం గ్రామ రైతులు కోరారు. లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులను అదుపులోకి తీసుకుని డబ్బులు ఇప్పిం చాలని కోరుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన 80 మంది రైతులు శుక్రవారం స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. రైతుల వివరాల మేరకు.. గడివేముల మండలానికి చెందిన జాకీర్ ఉశేన్, నందవరానికి చెందిన నుశి చిన్నవెంకటసుబ్బారెడ్డి 80 మంది రైతుల నుంచి రూ. 1.20 కోట్ల విలువైన వడ్లు, జొన్నలు, శనగలు కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా పరారయ్యారు. వారి నుంచి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 53 రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో బాధిత రైతులు రైతు రక్షణ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డెక్కారు. నందివర్గం ఎస్ఐ శంకరయ్య నచ్చజెప్పినా రైతులు వినకపోవడంతో పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. వ్యాపారి నుశి వెంకటసుబ్బారెడ్డి ప్రతిరోజు వారి బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నారని, అయినా ఆయన ఎక్కడున్నది పోలీసులు తెలుసుకోవడం లేదని రైతులు సీఐతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఐ హామీ మేరకు రైతులు శాంతించారు. ఆందోళనలో రైతు రక్షణ కమిటీ రాష్ట్ర సలహాదారుడు సుధాకర్రెడ్డి, అధ్యక్షులు శేషారెడ్డి, ఉపా«ధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి ఎర్రన్నగారి శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, ఆదిశేషు, వుశేన్ వలి, నాగశేషుడు, రైతులు పాల్గొన్నారు. -
‘గులాబీ’ విలయం
సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ రంగు పురుగు ప్రళయం ముంచుకొస్తోంది’.. ఈ మాటలన్నది స్వయానా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త. గులాబీ పురుగు వల్ల పత్తి పంటకు ఈసారి భారీ నష్టం జరగనుందని ఆయన ఆవేదన. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని, వర్షాలతో మున్ముందు దాని విస్తరణ మరింత వేగం కానుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరించారు. సాధారణంగా కాయ దశలో కనిపించాల్సిన ఆ పురుగు.. మొక్క దశలోనే దాడి చేయడంపై అన్నదాతల ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు పరిశోధనలు విస్తృతం చేయాలని, పురుగుపై యుద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఒకచోట గులాబీరంగు పురుగుంటే ఆ చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఆదిలాబాద్లో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు వ్యవసాయాధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు సోకిందని.. ఈసారి రెండు వారాల్లోనే దాని ఉధృతి కనిపించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గుజరాత్ రైతులను అతలాకుతలం చేసిన ఆ పురుగు.. జాగ్రత్తలు తీసుకోకుంటే ఈసారి తెలంగాణ రైతులను తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో? రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాటిలో అధిక భాగం పత్తి పంటదే. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 30.30 లక్షల ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం ఇంకా పెరగనుంది. ఇప్పుడు సాగైన 30 లక్షల ఎకరాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల పత్తిలో గులాబీ పురుగు ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వారం రెండు వారాల్లో ఉధృతి పెరిగితే అడ్డుకోవడం కష్టమైన వ్యవహారమంటున్నారు. గులాబీ పురుగు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య పత్తి మొక్కపైకి వస్తుంది. ఆ సమయంలో చూడలేం. కాబట్టి లింగాకర్షక బుట్టలు వీలైనన్ని వేస్తే అందులో వచ్చి పడతాయి. అలా పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో 4 పురుగులు పడితే తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తారు. పురుగును గుర్తించాక క్రిమిసంహారక మందులతో అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను ఇప్పటికే రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అందించలేదు సరికదా వాటిని తెప్పించడంలోనూ విఫలమైందని వ్యవసాయ శాస్త్రవేత్తలే విమర్శిస్తున్నారు. 10 రోజుల క్రితమే జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద నిధులు కేటాయించి బుట్టలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని,ఇంకా కొనలేదని విమర్శలున్నాయి. మరోవైపు పత్తి సరఫరా చేసే జిన్నింగ్ మిల్లుల నుంచి కూడా పంట వైపునకు పురుగు వ్యాపిస్తుందని చెబుతున్నారు. బీటీ–2 వైఫల్యమే బీటీ–2 టెక్నాలజీ వైఫల్యం వల్లే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పీడిస్తోంది. దాన్ని నివారించేందుకు బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని జొప్పించి 2002లో బీటీ–1 పత్తి విత్తనాన్ని మోన్శాంటో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే 2006 నాటికి బీటీ–1 గులాబీ పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో రెండు కణాలు జొప్పించి బీటీ–2ను తీసుకొచ్చారు. 2012 నాటికి దీనిలోనూ గులాబీ పురుగును తట్టుకునే శక్తి నశించింది. కానీ దాన్ని రద్దు చేయకుండా 3 కణాలు జొప్పించి బీటీ–3 తీసుకొచ్చారు. దానికితోడు పత్తి కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసెట్ పురుగుమందును తీసుకొచ్చారు. దీని వల్ల జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని తెలియడంతో కేంద్రం అనుమతివ్వలేదు. అయినా రహస్యంగా రైతులకు అంటగడుతూనే ఉన్నారు. బీటీ టెక్నాలజీ విఫలమైనా గులాబీ పురుగు పీడిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలున్నాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా గులాబీ పురుగు కారణంగా గతేడాది రాష్ట్రంలో అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న వాదనలున్నాయి. మరోవైపు గులాబీ పురుగుతో పత్తి పంట పోతే రైతుకు బీమా పరిహారం రాదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతేడాది గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించింది. పత్తి విత్తన కంపెనీల నుంచీ పరిహారం ఇప్పించింది. రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
ఆర్డీఓ కోసం ఆరు గంటలు పడిగాపులు
శ్రీకాళహస్తి : పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయంలో తిరుపతి ఆర్డీఓ నరసింహులు కోసం అన్నదాతలు గురువారం ఆరు గంటల పాటు పడిగాపులు కాశారు. చివరకు ఆయన రాకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోయారు. పూతలపట్టు–నాయుడుపేట ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ వారానికి ఓ సారి రెండు, మూడు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించి..వారి భూములకు «ఎంత మేరకు ధర చెల్లిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం శ్రీకాళహస్తి మండలంలోని చెర్లోపల్లె, కాపుగున్నేరి, ఇసుకగుంట గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్జీఓ కార్యాలయంలో ఆర్డీఓ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని తహసీల్దార్ సుబ్రమణ్యం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. రైతులు టెన్షన్తో గురువారం ఉదయం 9 గంటలకే ఎన్జీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు అయింది. అయినా ఆయన రాలేదు. అప్పుడు ‘భోజనం చేసి రండి..ఆర్డీఓ మూడు గంటలకు వస్తారు...’ అంటూ తహసీల్దార్ సుబ్రమణ్యం అదేశాలు జారీచేశారు. అయినా రైతులు అక్కడే వేచి ఉన్నారు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ‘ఆర్డీఓ రావడం లేదు...మరోసారి సమావేశం నిర్వహిస్తాం....సమావేశం ఎప్పుడు నిర్వహించే విషయం వీఆర్ఏలతో చెప్పి పంపుతాం’ అంటూ తహసీల్దార్ చల్లగా కబురు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలసేపు వేచివున్న రైతులకు కోపమొచ్చింది. తహసీల్దార్ అలా చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు. అడ్డదిడ్డంగా రోడ్డు అలైన్మెంట్ అధికార పక్షానికి చెందిన నేతల భూములు ఉంటే వాటిని తప్పించి పేదోడి భూములపైకి రోడ్డును తిప్పడం దారుణమంటూ రైతులు తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని గ్రామాలను వదిలిపెట్టి.. ఒక్క ఇల్లు పోకుండా పొలాల్లో అలైన్మెంట్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు ఇసుకగుంటలో మాత్రం ఇళ్లపై, గిడ్డంగులపై రోడ్డు అలైన్మెంట్ ఇవ్వడం దారుణమంటూ రైతు సిద్దాగుంట శంకర్రెడ్డి ప్రశ్నించారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డును తిప్పుకోవడం న్యాయమేనా ?’ అంటూ నిలదీశారు. రోడ్డులో మలుపులు ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపులు తప్పించడానికి కొన్ని చోట్ల అలైన్మెంట్ మార్పు చేశారని...అంతేతప్ప నేతల ఒత్తిళ్లతో పక్కకు తిప్పాపని చెప్పడం సరికాదంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చారు. జీవితమంతా ఈ ప్రభుత్వానికి భూములను నామమాత్రపు «ధరలకు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోయారు. తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని...ఒకవేళ బలవంతంగా లాక్కుంటే గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములు ఇవ్వడానికి అంగీకరిస్తామని తేల్చిచెప్పారు. -
‘పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే’
సాక్షి విశాఖపట్నం : పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి మాత్రమే కాదు.. దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రెండు రోజులు కోస్తాలో పర్యటనలో బిజీబిజీగా ఉన్న కేంద్ర మంత్రి నేడు విశాఖపట్నం పర్యటించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. అంతేకాక పోలవరం సివిల్ కన్స్ట్రక్షన్ పార్టును ఫిబ్రవరి 8 లోపల పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం కోసం భూ సేకరణ సమస్యగా ఉంది.. అందుకు కొన్ని ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ‘పోలవరం భూ నిర్వాసితులు అభివృద్ధికి కేంద్రం చిత్త శుద్ధితో ఉంది. పోలవరం భూసేకరణపై కేంద్రానికి ఇచ్చిన మొదటి డీపీఆర్ కంటే ఇప్పుడు భూసేకరణ రెట్టింపు ఉంది. దీనిపై సొంత శాఖతో నివేదిక రప్పిస్తాం.1941లో పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాకే పురోగతి వచ్చింది. అభివృద్ధికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది. రాజకీయాలతో అభివృద్ధిని ముడిపెట్టడం లేదు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. కేంద్రం వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఏపీ రైతాంగం ఆయిల్ సీడ్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాలు చూస్తారు.అరబ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం కేంద్రం రూ. 8 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. దానిని రూ. 2 లక్షల కోట్లకు తగ్గించాలని చూస్తున్నాం’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
భారీ వర్షాలకు నీటిమునిగిన నారుమళ్లు
-
ఉరేసుకొని చస్తాం..
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంత రైతుల్లో ప్రభుత్వం మళ్లీ అలజడి సృష్టిస్తోంది. సర్వేలంటూ, హైటెన్షన్ వైర్లంటూ రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే భూ సమీకరణతో వేలాది ఎకరాలను బీడు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు అరకొరగా మిగిలిన భూముల్లో కూడా పంటలు సాగుచేసుకోనివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంట పొలాల మీదుగా హైటెన్షన్ వైర్లు లాగడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ స్థలాల్లో గానీ, ఇళ్ల మీదుగా కానీ ఇలాంటి విద్యుత్ వైర్లు వేయగలరా? అంటూ అధికారులను నిలదీశారు. అయినా కూడా వారు వెనక్కి తగ్గకపోవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు బెదిరించారు. వివరాలు.. రాజధాని ప్రాంతం ముంపునకు గురవకుండా ఇరిగేషన్ శాఖ రూ.240 కోట్లతో కృష్ణానదిపై కొండవీటివాగు హెడ్స్లూయిస్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం నులకపేట 130 కె.వి సబ్స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారు. కొండవీటి వాగు వద్దకు వచ్చేసరికి రైతుల పంట పొలాలు, స్థలాల మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైతులు గతంలో కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో తాత్కాలికంగా పనులు విరమించిన ఇరిగేషన్ శాఖ అధికారులు.. మళ్లీ మంగళవారం రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొలాల్లోంచి హైటెన్షన్ వైర్లను లాగడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. ఎక్కడో పైన వెళ్లే వైర్లను ఆపడానికి మీరెవరంటూ రైతులను ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నించగా.. మీ స్థలాలు, ఇళ్ల మీదుగా ఇలాంటి భారీ కరెంటు వైర్లు వెళుతుంటే ఊరుకుంటారా అంటూ నిలదీశారు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూములను ఐదారుగురు పంచుకోవాల్సి ఉందని, ఇది అగ్రికల్చరల్ భూమి కాదని.. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదంటూ అభ్యంతరం తెలిపారు. రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వబోమంటూ గతంలో కోర్టును ఆశ్రయించామని.. అలాంటి భూముల్లో ఎలా వైర్లు ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి.. రైతులను అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మా పొలాల మీదుగా వైర్లు లాగితే వాటికే ఉరేసుకొని చస్తామని రైతులు స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తీసుకెళితే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తిరిగి వెళ్లిపోయారు. మెట్రో రైల్ సర్వే కోసమంటూ.. మైట్రో రైల్ సర్వే కోసమంటూ వచ్చి హడావుడి చేసిన కొందర్ని ఉండవల్లి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. ఓ సర్వే సంస్థకు చెందిన బృందం మంగళవారం ఉదయం పొలాలను ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ తిరుగుతుండటంతో.. అక్కడ ఉన్న ఇద్దరు రైతులు వారిని నిలదీశారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులున్నాయని.. అడ్డుకుంటే అడ్డుకుంటే ఇబ్బందులు పడతారంటూ వారు బెదిరింపులకు దిగారు. దీంతో రైతులు వారిని పొలాల్లోంచి బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఇంతలో ఈ విషయం తెలిసిన గ్రామ రైతులు భారీగా అక్కడకు చేరుకున్నారు. తాము ప్రభుత్వానికి భూములివ్వలేదని.. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నందున సర్వే చేయవద్దంటూ వారికి తేల్చిచెప్పారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. వారిని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. మళ్లీ వస్తే కేసులు పెడతామంటూ రైతులు సర్వే బృందాన్ని హెచ్చరించారు. -
తాడేపల్లి మండలం ఉండవల్లిలో హైటెన్షన్
-
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ తాడేపల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘మద్దతు ధర’ అసలు మతలబు!
ప్రపంచ మార్కెట్కు భారతదేశ ఎగుమతులు ఎక్కకుండా నిరోధిస్తూ భారత దిగుమతులపై సుంకాలు విపరీతంగా పెంచడానికి అమెరికా నిర్ణయించింది. మన వ్యవసాయ రంగాన్ని సరళీకరించడం పేరుతో ప్రపంచ బ్యాంక్, అమెరికా ప్రోత్సాహంతో విదేశీ సరుకు దిగుమతుల కోసమే భారత మార్కెట్లలోని కొన్ని విభాగాల్ని ధారాదత్తం చేసుకున్నాం. విదేశీ దిగుమతులపైన మనం విధించాల్సిన సుంకాలను తొలగించుకుంటున్నాం. బ్రిటిష్వారి పరిపాలనలో మాదిరిగా సంప్రదాయ పరిశ్రమల్ని నాశనం చేస్తున్న కారణంగా కోట్లాదిమంది దేశ ప్రజలు ఉపాధి కోల్పోయే దుస్థితిలో పడుతున్నారని గుర్తించాలి. ‘‘రైతాంగం పండించే వరి, పత్తి వగైరా పంటలకు ప్రభుత్వం క్వింటాల్కు కనీస ధరను రూ.200 పెంచాలని నిర్ణయించింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం. పంటలు పండించడానికి రైతు భరించే ఖర్చు కన్నా అదనంగా 50 శాతం ధరను రైతుకు ముట్టజెప్పబోతున్నట్టు లెక్క. అంటే, పంటకయ్యే విత్తనాల కొనుగోలుపైన, సేద్యపు నీటి వాడకంపైన రైతు కుటుంబం ప్రత్యేకించి కూలి చెల్లించాల్సిన పని లేదు. కాబట్టి, ఈ కనీస ధరను 50 శాతం పెంచాం.’’ – ప్రధాని మోదీ ప్రకటన (4–7–18) ‘‘రైతాంగం వ్యవసాయ ఖర్చులు, పంట ధరలను బేరీజు వేసుకునే అన్ని రకాల వ్యయాన్ని సమగ్రంగా అంచనా వేశాకే జాతీయ స్థాయి సాధికార కమిషన్ రైతులు పండించే పంటలకు హెచ్చు మద్దతు ధరను నిర్ణయించింది. ఎందుకంటే, దేశ రైతాంగ ప్రజల ఆర్థిక సమస్యలను గుర్తించబట్టే కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నేడు ప్రభుత్వం పెంచిన పంట కనీస ధర మొత్తంమీద చూస్తే (రూ. 200) పైకి ఎక్కువగానే కనిపిస్తుంది కానీ, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక కమిషన్ (2006) సిఫారసు చేసిన ప్రతిపాదనల కన్నా తక్కువ అని గమనించాలి.’’ – దేశంలో వ్యవసాయ సంక్షోభం నివారణకు ఏర్ప డిన జాతీయ స్థాయి సాధికార కమిషన్ అధ్యక్షుడు ఎం.ఎస్. స్వామినాథన్ (4–7–18) గత నాలుగున్నరేళ్ల బీజేపీ ఏలుబడిలో రైతుల బాధలు ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తొచ్చాయి. కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను గుర్తించడాన్ని ఆయన చారిత్రక నిర్ణయంగా ప్రకటించుకున్నారు. బీజేపీ సర్కారు పెంచిన తాజా కనీస ధర లోతు పాతులు పరిశీలిస్తే ఆ నిర్ణయంలోని డొల్లతనం బట్ట బయలవుతుంది. 2019 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రభుత్వం కనీస ధర పెంచుతూ చేసిన ప్రకటన వెలువడిన మూడు రోజులకే 36 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తాజా నివేదిక వెలు వడింది. ఈ నివేదిక భారత దేశంలో వ్యవసాయ సంబంధిత విధానాలను సమీక్షిస్తూ, ‘‘ఇండియాలో రైతులు ప్రధాన వ్యవసాయ సబ్సిడీల వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాని, నరేంద్ర మోదీ అధికా రంలోకి వచ్చాక 2014 నుంచి 2016 దాకా అనుసరిం చిన విధానాల నిర్ణయాల మూలంగా రైతులకు అందిన ఆదాయాలు ఏటా సగటున ఆరు శాతం చొప్పున తరిగిపోతూ వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు దక్కాల్సిన శ్రమ ఫలితంలో ఆ పంటను అనుభవించే వినియోగదా రుల నుంచి 25 శాతం తక్కువ ఆదాయం లభి స్తోంది!’’ అని పేర్కొంది. అందుకనే వరి పంట కనీస ధరను క్వింటాల్కు రూ.1550 నుంచి రూ.2000కు అంటే అదనంగా రూ.450 పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలు పండించడానికి అవసరమైన ఎరువుల (యూరియా, ఫాస్ఫేట్ వగైరా) ధరలు, ఇంకా సాగుకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్రాల ధరలూ బాగా పెరిగిపోయాయి. వీటిని సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలపై నియంత్రణ లేదు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి సకాలంలో సంతలకు తరలించే సరైన ప్రొక్యూర్మెంట్ విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ధాన్యం సేకరణకు అవసరమైన గిడ్డంగుల సౌకర్యం కొరవడింది. ఇంకా, ఈ విషయంలో కీలకమైన భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను 1991లో ప్రపంచ బ్యాంకు అమల్లోకి తెచ్చిన సంస్కరణలు బలహీనపరిచాయి. ఫలితంగా ప్రైవేటు గుత్త వ్యాపార సంస్థల ప్రవేశంతో రైతుల కష్టాల పెరిగాయి. రైతులను, వ్యవసాయ రంగాన్ని ముట్టడించిన ఇన్ని అనర్థాలకు మౌలిక పరిష్కారాలు వెతకడం లేదు. ఈ పనిచేయకుండా మోదీ ప్రకటిం చిన ‘కనీస మద్దతు ధర’ ఎన్నికల కోసం నడిపే తంతుగా లేదా మోసంగా మిగిలిపోతుందే తప్ప ‘చారిత్రక నిర్ణయం’గా నిలదొక్కుకోలేదు. మాట తప్పిన మోదీ సర్కారు! ధాన్యాలకు కనీస ధరను మొత్తం ఖర్చులకు అద నంగా 50 శాతం ధర చేర్చి ఇస్తామని 2014 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. కానీ, నాలుగేళ్ల నుంచీ ‘మాట తప్పిన మోదీ’ గానే ప్రధాని మిగిలిపోయారు. మాటలు నేర్వకపోతే పూటలు గడవవన్న సామెతకు విలువ లేకుండా పోవాలంటే మాట ప్రకారం 2014 నుంచే కనీస మద్దతు ధరను అమలు చేయాల్సింది. అదే చేసి ఉంటే ఈ సరికే రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం దేశ రైతాంగానికి కలిగేదని నిపుణుల అంచనా! ఈ చారిత్రక మోసం లేదా వైఫల్యం వల్ల నష్టపోయినవారు రైతులు, వ్యవసాయ కార్మికులేనని గమనించాలి. పెంచుతామన్న ప్రకటిత కనీస ధర హామీ అమల్లోకి రానందున 2014–17 మధ్య కాలంలో ప్రతి ఏడాదికి రైతాంగానికి దక్కిన కనీస మద్దతు ధర పెరుగుదల కేవలం 3.6 శాతం మాత్రమేగానీ, దక్కాల్సిన సగటు ధర 13 శాతమని పరపతి అంచనా (క్రెడిట్ రేటింగ్) సంస్థ ప్రకటిం చింది. 2009–13 మధ్య నాలుగేళ్లలో కనీస మద్దతు ధర 19.3 శాతం పెరిగింది. ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ధరలు పెరుగుతూ రైతుల రుణభారాన్ని కూడా పెంచేశాయి. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పాలకులు రైతులు, వ్యవసాయ కార్మికులను సాగు నుంచి క్రమంగా సాగ నంపడానికి వారు పట్టణాలు, నగరాలకు వలస పోయే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ దుస్థితికి పరిణామాలు దారితీయక ముందే పాలకులు రైతులకు చెల్లించే మద్దతు ధరకు తోడుగా ఆహార భద్రతా చట్టాన్ని, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కూడా స్వామినాథన్ పట్టుబడుతున్నారు. అమెరికా మార్కెట్లోకి వచ్చే సరకులపై సుంకాలు పెంచాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తాజాగా చైనా, భారత్లను ముమ్మ రించే మరో బెడద. 20 ప్రధాన పంటలను ప్రభుత్వం గానీ, సహకార రంగ సంస్థలుగాని కాపాడేలా ధాన్యం సేకరణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ తన 70వ నివేదికలో ప్రతిపాదించింది. 9 కోట్ల 20 లక్షల రైతు కుటుంబాల రుణభారం రూ.4 లక్షల 23 వేల కోట్లు. ఇందులో రుణదాతలు, వర్తకులు, ఉద్యోగులు, భూస్వాములు, దుకాణదారులు వడ్డీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ. 1 లక్షా 23 వేల కోట్లు. ఈ పెట్టుబడిదారీ మార్కెట్ ‘దందా’ వ్యవస్థలో వరికి, గోధుమ పంట లకు వర్తక వ్యాపారులు తమ లావాదేవీల్లో రైతులకు చెల్లింపజూచే వెల తక్కువగా ఉంటుంది. ఈ కారణం గానే ప్రభుత్వం అనుసరించే ప్రొక్యూర్మెంట్ (ధాన్య సేకరణ) ధరను కనీస మద్దతు ధరగా పేర్కొంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత నుంచి క్రమంగా అమెరికా సలహాలపైన, ప్రపంచబ్యాంకు సంస్కరణల ప్రభావం వల్ల తప్పుకుంటూ వచ్చిందో అప్పటి నుంచే రైతుల పరిస్థితి అనాథల స్థితికి వచ్చింది. కాగా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పరిధిలోకి రానివి దేశంలో విస్తారంగా, భారీ స్థాయిలో పండించే బంగాళా దుంపలు (ఆలుగడ్డలు), ఉల్లి, వేరుశెనగ పంటలు. ఇందుకు కారణం– ఈ పంటలను ధాన్యా దుల మాదిరిగా నిల్వ ఉంచడం సాధ్యం కాదు. కానీ నిలవ ఉండగలిగే కంది, పెసర పంటలతో పోల్చితే తేడా స్పష్టం అని నిపుణుల అంచనా.పెరుగుతున్న పండ్లు, కూరగాయల సాగు! అలా బేరసారాలతో రైతులు బలహీనులు కావడం వల్ల, ప్రభుత్వం బాధ్యత నుంచి పక్కకు తప్పుకో వటం వల్ల కూడా గత పదేళ్లకు పైగా ధాన్యాదులు పండే భూముల్ని పండ్లు, కాయగూరల పంటలకు భారీగా మళ్లించడమూ జరిగిందని వ్యవసాయ పరి శోధకులు అభిప్రాయపడుతున్నారు. రైతు ‘వ్యధాభ రిత కథా చిత్రం’ అంతటితో ముగియలేదు. తీరా దొంగ బేరాలు చేయలేక పంట పొలాల్ని పండ్లు, కాయగూరలకు మళ్లించినా వాటికీ సరైన ధరలు లేక మార్కెట్లకు ఎక్కడం లేదని బీజేపీ పాలకులు చెబు తున్నారు. ఈ సాకుతో నింపాదిగా చాప కింద నీరులా విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులను భారత ‘రైతుల అవసరాలను, ఆహారశుద్ధి పరిశ్రమను ఆదుకునే’ పేరిట ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశం లోకి దించేశారు. కునారిల్లుతున్న వ్యవసాయ రంగం బలోపేతం కావడానికి అవసరమైన పెట్టుబడులను రైతాంగానికి దన్నుగా సమకూర్చకుండా ఆహార భద్ర తకు స్వయంగా పాలకులు కీడు చేస్తున్నారు. విచిత్రమేమంటే, 1990ల చివరి నుంచీ వ్యవ సాయ, వాణిజ్య వ్యాపారీకరణ ముఖ్యంగా పత్తి లాంటి వాణిజ్య పంటల వైపు అవసరానికి మించిన విస్తరణకు రైతుల్ని, వ్యవ సాయాన్ని ప్రోత్సహించిన ప్రాంతాలున్నాయి. ఈ విలోమ (తారుమారు) పద్ధ తుల్లో భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్ని ప్రోత్సహించిన అమెరికా తీరా నేడు చేస్తున్న విద్రో హం ఏమిటి? ప్రపంచ మార్కెట్కు ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థకూ భారతదేశ ఎగుమతులు ఎక్కకుండా నిరోధిస్తూ అమెరికాలో భారత దిగుమ తులపై సుంకాలు విపరీతంగా పెంచడానికి నిర్ణయిం చింది. మన వ్యవసాయరంగాన్ని సరళీకరించడం లేదా ‘ఉదారవాద సంస్కరణ’లను ప్రవేశపెట్టించే పేరుతో ప్రపంచ బ్యాంక్, అమెరికా ప్రోత్సాహంతో విదేశీ సరుకు దిగుమతుల కోసమే భారత మార్కెట్ల లోని కొన్ని విభాగాల్ని ధారాదత్తం చేసుకున్నాం. ఉదాహరణకు మనం వంటనూనెల్ని (ఖాద్య తైలాలు) దిగుమతి చేసుకునే ఖర్మ పట్టింది. విదేశీ దిగుమతుల పైన మనం విధించాల్సిన సుంకాలను తొలగించుకుంటున్నాం. బ్రిటిష్వారి పరిపాలనలో మాదిరిగా సంప్రదాయ పరిశ్రమల్ని నాశనం చేస్తున్న కారణంగా కోట్లాదిమంది దేశ ప్రజలు ఉపాధి కోల్పోయే దుస్థితిలో పడుతున్నారని గుర్తించాలి. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
అన్నం పెట్టే చేతికి ఊతమివ్వండి
సాక్షి, అమరావతి/ఆత్కూరు (గన్నవరం): అన్నం పెట్టే చేతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయం గురించి ఆలోచించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ’ఆరుగాలం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం విజయవాడలో జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ రైతుకు శాశ్వత న్యాయం జరగాలంటే మౌలిక వసతులు కల్పించాలే తప్ప రుణమాఫీ వంటి ఉపశమన చర్యలు పరిష్కారమార్గం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విస్మరణకు గురైన రంగం వ్యవసాయమేనని, దాన్ని ప్రస్తుతం సవరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతు దృక్పథంలోనూ మార్పు రావాలని, అదనపు విలువ జోడింపు, ఆహార శుద్ధి, పంటల మార్పిడి, ఈ–నామ్ వంటి వాటిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నూటికి 40 శాతం మందికే వ్యవస్థాగత రుణ సౌకర్యం లభిస్తోందని, మిగతా 60 శాతం మంది ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారని, పంటల బీమా రంగంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. సాగుతో పాటు పాడి, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలపైనా దృష్టి పెడితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పుస్తక రచయిత యలమంచిలి శివాజీని ఘనంగా సత్కరించారు. పుస్తకం ప్రచురించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు రైతులకు చేస్తున్న సేవను కొనియాడారు. అనంతరం నిర్వాహకులు ఉపరాష్ట్రపతిని ఘనంగా సన్మానించారు. మంత్రి కొల్లు రవీంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు హాజరయ్యారు. స్వర్ణభారత్ ట్రస్ట్లో పుస్తకావిష్కరణ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్లో పోలూరు హనుమజ్జానకీరామశాస్త్రి రచించిన జీవితం–సాహిత్యం సంకలన పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల వలన కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయన్నారు. యువత వీటి బారిన పడకుండా మన జీవన విధానాన్ని కొనసాగించాలన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్లో స్కిల్డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కేఎల్ వర్సిటీని అభినందించారు. -
హీరో తన కొడుకును హీరోనే చేయాలనుకుంటున్నాడు
సాక్షి, కృష్ణా : యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ , బ్రహ్మ శ్రీ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ రాసిన ‘జీవితము-సాహిత్యము’ అనే పుస్తకాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. తనకు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండటం ఇష్టమని ఆయన అన్నారు. యలమంచిలి ఓ అలుపెరగని యోధుడని చెప్పారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయానికి కావాల్సినంత ప్రాధాన్యత లభించలేదని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీని విమర్శించనని చెప్పారు. అది తన పని కూడా కాదని అన్నారు. రైతుని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భారత రైతులు పంటలు పండిస్తున్నారని, అందుకు భారత రైతులకు సెల్యూట్ చేయాలన్నారు. ‘ఓ రాజకీయ నాయకుడు తన తనయుడికి మాట్లాడటం రాకపోయినా, అతన్ని రాజకీయ నాయకుడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. సినిమా నటుడు అతని తనయుడికి ముఖం బాగా లేకపోయినా హీరోని చేయాలనుకుంటున్నాడు. కానీ ఒక రైతు తన కొడుకును రైతుగా చేయాలనుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు వ్యవసాయంలో నెలకొన్నాయి. నేను ఉపరాష్ట్రపతి అయ్యాక నియమ నిబంధల ప్రకారం ప్రజల్లో ఉండలేకపోతున్నాను. అందుకని ఆ నియమ నిబంధనలను కొంత సవరించాను. మూడు కార్యక్రమాలను నిర్ణయించుకున్నాను. ఒకటి దేశ యూనివర్శిటీలన్నీ తిరిగి యువతకి మార్గదర్శకం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా కార్యాలయాలకు వెళ్లి పరిశీలించి ప్రోత్సహించాలి. వ్యవసాయదారులని కలవటం, లాభసాటి విధానంపై దృష్టి సారించాలి.’ -
ఫసల్ బీమా సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: పంటలు సాగుచేసిన రైతులు వాటికి బీమా చేసుకుంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశముండదని జిల్లా వ్యవసాయాధికారి తిరుమలప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలం కాసులపల్లిలో శనివారం రైతులకు పంటల బీమా పథకాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు ఇనుగాల తిరుపతిరెడ్డి, ఏడీఏ కృష్ణారెడ్డి తదితరులు పోస్టర్ను ఆవిష్కరించారు. బ్యాంకు ద్వారా పంటరుణాలు పొందని రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలన్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి పంటకు ఈనెల 15 వరకు గడువు ఉందన్నారు. మొక్కజొన్న పంటకు ఈనెలాఖరు, వరిపంటకు ఆగస్టు 31 వరకు గడువు ఉందన్నారు. పూర్తి వివరాలకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఏవో ప్రకాశ్రావుతో పాటు రైతు సమన్వయసమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో.. కాల్వశ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ లంక సదయ్య, ఏవో కమలాకర్ రైతులను కోరారు. బీమాపై మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తర్ణాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. గర్రెపల్లిలో.. గర్రెపల్లి: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఆపద కాలంలో వరం లాంటిదని సుల్తానాబాద్ మండల వ్యవసాయాధికారి సురేందర్ తెలిపారు. గర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. అతి తక్కువ ప్రీమియంతో పంటలకు బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. సర్పంచ్ పడాల అజయ్, ఈవోపీఆర్డీ చంద్రప్రకాష్, కార్యదర్శి రమేశ్బాబు, మల్లికార్జున్, భిక్షపతి, కనుకయ్య, జొన్నకోటి అంజయ్య, ముత్తునూరి రాజేశం పాల్గొన్నారు. ఎలిగేడు మండలంలో.. ఎలిగేడు: రైతులు ఫసల్ బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి డేవిడ్ రాజు అన్నారు. ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, ర్యాకల్దేవుపల్లి, శివుపల్లి, బుర్హాన్మియాపేట, ఎలిగేడు గ్రామాల్లో శనివారం బీమాపై రైతులకు వివరించారు. ఏఈవోలు పద్మ, రమేశ్, అనిల్ పాల్గొన్నారు. -
వలస బాట పట్టిన రాజధాని రైతులు
-
నీకు కన్పించకపోతే.. నీ కొడుకును పంపు..
సాక్షి, విశాఖపట్నం: మహారాష్ట్ర తరహాలో ఏపీలోనూ రైతులు తమ హక్కుల సాధన కోసం సమష్టిగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. పోరాటాన్ని రాజధాని ప్రాంతమైన ఉండవల్లి నుంచే మొదలు పెడతామన్నారు. ఇందుకోసం అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో జేఏసీ ఏర్పాటు చేద్దామన్నారు. శుక్రవారం ఉదయం అమరావతి, కాకినాడ సెజ్, పోలవరం, సోంపేట, వంశధార ప్రాజెక్టులు, భావనపాడు పోర్టు, కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూ నిర్వాసితులతో కలిసి విశాఖలో ఏపీ భూ నిర్వాసితుల జనసభ నిర్వహించారు. ఈ సభలో పవన్కల్యాణ్ మాట్లాడుతూ పురాణాల్లో హిరణ్యకశ్యపుడి మాదిరిగానే నేటి పాలకులు భూములు లాక్కొని రైతును, రైతు కుటుంబాలను రోడ్డు పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజధాని కన్పించదు. పరిశ్రమలు రావు. ఉద్యోగాలు ఇవ్వరు. కానీ వాటి పేరు చెప్పి వేల ఎకరాలను బలవంతంగా లాక్కుంటూ.. రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని’ ఆరోపించారు. విశాఖలో ఇన్నో సొల్యూషన్స్, ప్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు ఎకరా రూ.35 లక్షలకే కట్టబెట్టారని, బయట వాళ్లకైతే ఎకరా రూ.3.5 కోట్లు అంటున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసే వరకు, భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలన్నారు. నీకు కన్పించకపోతే..నీ కొడుకును పంపు.. ఉత్తరాంధ్రలో సమస్యలు మీ కంటికి కన్పించకపోతే మీ కొడుకు లోకేష్ను పంపితే ఆయనకు చూపిస్తానని పవన్కల్యాణ్ చంద్రబాబుకు సూచించారు. జూట్ మిల్లును సందర్శించిన అనంతరం తగరపువలస జంక్షన్లో జరిగిన బహిరంగçసభలో 2019 ఎన్నికల్లో టీడీపీ గూండాలు పేట్రేగిపోయి దౌర్జన్యంగా ఓట్లు వేయించుకుంటారని ఆరోపించారు. ‘మంత్రి గంటా, ఎంపీ అవంతి గెలుపొందడానికి నేనే కారణం.. కానీ వాళ్లు ఈ ప్రాంతానికి ఏం చేశారని’ ఆయన ప్రశ్నించారు. ‘వైఎస్సార్సీపీ నుంచి లాక్కున్న ఎంపీలతో కలిసి మీకు 19 మంది ఉన్నా కనీసం రైల్వే జోన్ కూడా ఎందుకు సాధించలేకపోతున్నారని’ నిలదీశారు. నేడు నిరసన కవాతు.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి నిరసనగా విశాఖలో శనివారం నిరసన కవాతు జరపనున్నట్టు జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మహేందర్రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు బీచ్రోడ్లోని ప్రారంభం కానున్న నిరసన కవాతుకు పవన్ సారథ్యం వహిస్తారని చెప్పారు. -
బుల్లెట్ రైలు వద్దు.. బుల్లెట్ దెబ్బలకు రెడీ..
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ‘గుజరాత్ గ్యాస్ కంపెనీ’ 2007లో రైతుల నుంచి భూమిని సేకరించి భూగర్భం నుంచి గ్యాస్ పైపులైన్లు వేసినప్పుడు మహేశ్ పటేల్ అనే రైతు తన పండ్ల తోటలో 130 మామిడి, సపోటా చెట్లను కోల్పోయారు. ఆయనకు ప్రతి చెట్టు నుంచి ఏడాదికి నాలుగువేల రూపాయల లాభం వచ్చేది. ఈ లెక్కన ఆయనకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టం వాటిల్లింది. ఆయనకు జరిగిన నష్టం ఇదొక్కటే కాదు. ఆయన పొలం గుండా గ్యాస్ పైపు లైన్ డయగ్నల్లీ (వికర్ణంగా) పోవడంతో ఇరువైపులున్న కొంత పొలం ఎందుకు ఉపయోగపడకుండా పోయింది. అక్కడ పెద్ద చెట్లు పెరిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆయనకు మరో ప్రమాదం ముంచుకు వచ్చింది. ముంబై నుంచి అహ్మదాబాద్కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్ రైలు కూడా ఆయన పొలం గుండానే వెళుతోంది. అప్పుడు మరింత నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తోట గుజరాత్లోని నవసారి జిల్లా మానెక్పూర్లో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలి ప్రాంతాల్లోని 312 గ్రామాల గుండా ప్రతిపాదిత బుల్లెట్ రైలు వెళుతుంది. వాటిల్లో ‘అగ్రి ఎక్స్పోర్టు జోన్’గా గుర్తించిన ఎనిమిది జిల్లాలు కూడా ఉండడం గమనార్హం. వాటిల్లో నవసారి జిల్లా ఒకటి. మహేశ్ పటేల్ ఇంతకుముందు ఒక్క గుజరాత్ గ్యాస్ పైప్లైన్ వల్లనే నష్టపోయారు. కొందరు రైతులైతే రెండు, మూడు గ్యాస్ పైపు లైన్ల కారణంగా నష్టపోయారు. గుజరాత్ గ్యాస్తో పాటు గెయిల్, రిలయన్స్ కంపెనీల గ్యాస్ లైన్ల కారణంగా వారు నష్టపోయారు. ఎందుకంటే ఈ మూడు కంపెనీల లైన్లు పక్కపక్కన కిలోమీటరున్నర పరిధి గుండా వెళ్లాయి. 2001లో ‘అగ్రి ఎక్స్పర్ట్ జోన్’గా ప్రకటించిన ఎనిమిది జిల్లాల్లో బుల్లెట్ రైలు కారణంగా 80,487 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని, వాటిల్లో దాదాపు 27 వేల పండ్ల చెట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. వారికి నష్ట పరిహారం ఎంత, ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ‘నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్’ అధికారులు తెలిపారు. గ్యాస్పైప్ లైన్లు వేసినప్పుడు చెట్టుకింత నష్ట పరిహారం అని ఇచ్చారని, ఇప్పుడు అదే లెక్కన ఇవ్వొచ్చని వారంటున్నారు. ఎనిమిది జిల్లాల పరిధిలో 11 లక్షల టన్నులు మామిడి, నాలుగున్నర లక్షల టన్నుల సపోటా పండ్ల దిగుమతి వస్తోందని రైతు సంఘం తెలియజేసింది. 2017లో నవసారి జిల్లా దేశంలో అత్యధిక సపోటా పండ్లను దిగుమతి చేసిన జిల్లాగా కూడా గుర్తింపు పొందిందని రైతులు తెలిపారు. మొత్తం గుజరాత్లో దిగుబడి అవుతున్న మామిడి పండ్లలో 45 శాతం దిగుబడి ఈ నవసారి నుంచే వస్తోందని వారు చెప్పారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న వల్సాద్ జిల్లా నుంచి ఎక్కువ దిగుబడి వస్తోందని వారంటున్నారు. బుల్లెట్ రైలు కారణంగా ఈ రెండు జిల్లాల్లోనే 16,398 పండ్ల చెట్లు, 10,919 ఇతర చెట్లు పోతాయని అధికారుల అంచనాలే తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా 15 నుంచి 20 ఏళ్ల వయస్సున్న చెట్లని రైతులు తెలిపారు. ఇతర చెట్లలాగా మామిడి చెట్లను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించలేమని, కొత్తగా పెట్టే చెట్లు ఎదగాలంటే కనీసం పదేళ్లు పడుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ స్థాయిలో చెట్లను కొట్టివేయడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. బుల్లెట్ రైతు ప్రతిపాదనను గుజరాత్ పరిధిలోని పండ్ల తోటల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ రైతుల్ని చైతన్య పరుస్తున్నారు. రైల్వేశాఖ నిర్వహిస్తున్న అవగాహనా తరగతులను వరుసగా బహిష్కరిస్తున్నారు. ఎవరికో మేలు చేయడం కోసం, తమ పొట్టలు కొట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా బుల్లెట్లు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వారు ఆవేశంగా అంటున్నారు. జౌళి, బంగారు వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న బుల్లెట్ రైలు(ముంబై నుంచి అహ్మదాబాద్) మార్గాన్ని 508 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 1.1 లక్షల కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ ప్రాజెక్టును జపాన్ ప్రభుత్వం సహకారంతో చేపడుతున్నారు. బుల్లెట్ రైలు వస్తే రెండు నగరాల మధ్య దూరాన్ని రెండు గంటల్లో అధిగిమించవచ్చు. ప్రస్తుతం ఏడు గంటలు పడుతోంది. -
మోదీయే నిజమైన రైతుబంధు
పెద్దపల్లిరూరల్: ఆరుగాలం కష్టపడి పంట దిగుబడులు సాధించిన రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుని నిజమైన రైతుబంధుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంటలను సాగుచేసే రైతులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన కేంద్రం మద్దతు ధరను పెంచిందన్నారు. 24 రకాల పంటలకు పెంచాలనుకున్నా తొలిదఫాగా 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుందని వివరించారు. పెద్దపల్లి జిల్లాలో వరి, పత్తి పంటల సాగు ఎక్కువ విస్తీర్ణంలో చేస్తున్న రైతులకు మద్దతు ధర పెంపు ఎంతో ఉపకరిస్తుందన్నారు. పత్తికి క్వింటాల్కు రూ. 1130, వరికి రూ. 200 మద్దతు ధర పెంచడం హర్షనీయమన్నారు. కష్టపడి పని చేసే రైతు, కౌలు రైతులకే నేరుగా లబ్ధి చేకూరేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా రైతాంగం సంతోష పడుతుందన్నారు. అ యితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే అమలులోకి తెచ్చిన రైతుబంధు పథకం భూ యజమానులకే లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే మద్దతు «ధరకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారం దేశంలో నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్షాల సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న ధీమాను గుజ్జుల వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా జనచైతన్య యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు. బుధవారం పెద్దపల్లికి చేరిన ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా చేపట్టిన బైక్ర్యాలీకి తరలివచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొంతం శ్రీనివాస్రెడ్డి, మీస అర్జున్రావు, కర్రె సంజీవరెడ్డి, పుట్ట మొండయ్య, ఠాకూర్ రాంసింగ్, పిన్నింటి రాజు, ఫహీమ్, జంగ చక్రధర్రెడ్డి, కందుల సదానందం, ఠాకూర్ రాజారాంసింగ్, స్వతంత్ర కుమార్, ఆనంద్, బచ్చలి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘కనీస మద్దతు ధర’లో అసలు కిటుకు తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజన్కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం నాడు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, ఇది ప్రస్తుత విధాన స్వరూపానే మార్చి వేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో గొప్పగా చెప్పింది. పైగా రైతులకు పంటకయ్యే ఖర్చుకు 50 శాతాన్ని మించే కనీస మద్దతు ధర ఇస్తామంటూ ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీని అక్షరాల అమలు చేస్తున్నామని డాబుసరిగా చెప్పుకుంది. 2020 సంవత్సరం నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే చేసిన ప్రతిజ్ఞను అమలు చేసే దిశగా ఈ అడుగు వేస్తున్నామని కూడా సగౌరవంగా ప్రకటించుకుంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత పెంచిందా, లేదా? రైతులు ఎంత డిమాండ్ చేస్తూ వచ్చారు? ప్రభుత్వం ఎంత పెంచింది? అసలు కనీస మద్దతు ధరను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రాథమిక ప్రమాణాలు ఏమిటీ? గత ప్రభుత్వాల కన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఎక్కువ పెంచిందా? ఈ పెంపుతో రైతుల కష్టాలు తీరుతాయా? అన్ని కోణాల నుంచి ప్రభుత్వ మద్దతు ధరలను పరిశీలించి చూస్తేగానీ సంగతంతా బోధ పడదు. ఓ పంటకయ్యే మొత్తం ఖర్చును పరిగణలోకి తీసుకొని దానికన్నా ఎక్కువ ధర వచ్చేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. కనీసం ఆ మద్దతు ధరకన్నా మార్కెట్ ఆ పంటను కొనకపోతే ప్రభుత్వమే ఆ ధరకు పంటను రైతు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంట ఖర్చును ఎలా లెక్కిస్తారు? పంటకయ్యే ఖర్చును ప్రాతిపదికగా తీసుకొని కనీసమద్దతు ధర నిర్ణయిస్తారు. అయితే ఈ ఖర్చును ఏ ప్రమాణాలపై నిర్ణయిస్తారు. మూడు ప్రమాణాలు లేదా మూడు సూత్రాల ప్రకారం పంటకయ్యే ఖర్చును లెక్కిస్తారు. మొదటి సూత్రం: ఏ2.....విత్తనాలు, ఎరువులు, పురుగుమందలకు రైతులు పెట్టే ఖర్చుతోపాటు వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ అద్దె యంత్రాలకు రైతులు చెల్లించే మొత్తంను పరిగణలోకి తీసుకుంటారు. రెండవ సూత్రం: ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ (ఫ్యామిలీ లేబర్): మొదటి సూత్రం కింద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు, యంత్రాలకు పెట్టే మొత్తం ఖర్చు ప్లస్ రైతు కుటుంబం ఆ పంటపై పెట్టే మొత్తం శ్రమను పరిగణలోకి తీసుకోవడం. మూడవ సూత్రం: సీ2. అంటే కాంప్రెహెన్సివ్ కాస్ట్. విత్తనాల దగ్గరి నుంచి రైతు కుటుంబం శ్రమ వరకు అయ్యే ఖర్చు ప్లస్ రైతు ఓ పంటపై పెట్టిన పెట్టుబడికి వచ్చే కనీస వడ్డీ, ఆ పంట పండే భూమి లీజుకయ్యే మొత్తం. ఈ మూడు సూత్రాల ప్రాతిపదికన ఓ పంటకు కనీస మద్దతు ధరను కేంద్రంలోని ‘కమిషన్ ఫర్ అగ్రికల్టర్స్ కాస్ట్ అండ్ ప్రైసెస్’ నిర్ణయిస్తుంది. పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వాల అసలు కిటుకు అంతా ఇక్కడే ఉంది. 2017లో దేశవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన రైతులు కూడా తమ పెట్టుబడులకన్నా యాభై శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. మూడవ సూత్రమైన ‘సీ2’ కన్నా 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని కోరారు. వారికి ఈ అవగాహన ఎలా వచ్చిందంటే వ్యవసాయ సంస్కరణలపై అధ్యయనం చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ కమిషన్ 2006లో సమర్పించిన నివేదికలో ఇదే సిఫార్సు చేశారు కనుక. ఏ ప్రాతిపదికన మద్దతు ధర నిర్ణయించారు? స్వామినాథన్ నివేదిక సిఫార్సు మేరకు లేదా రైతుల డిమాండ్ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవ సూత్రం ప్రకారం కనీస మద్దతు ధరను నిర్ణయించక రెండో సూత్రం ప్రకారం నిర్ణయించింది. కనీస మద్దతు ధర పెంపును ‘సీ2’ సూత్రం ప్రకారం లెక్కిస్తే ఒక్క సజ్జల కనీస మద్దతు ధర పెంపు మాత్రమే పెట్టుబడికి 50 శాతంపైగా ఉంది. మిగతా వాటి ధరలన్నీ 14 శాతం, అంతకన్నా తక్కువే. అత్యంత ముఖ్యమైన వరికి 12.2 శాతం, నువ్వులకు కేవలం మూడు శాతం పెంచింది. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం పెంచిందీ ఎక్కువా ? అదీ అంతా నిజం కాదు. 2012–2013లోనే ఎక్కువ పెరిగాయి దేశంలోని ఎక్కువ పంటలకు కనీస మద్దతు ధరలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 2012–2013 ఆర్థిక సంవత్సరంలోనే ఎక్కువ పెరిగాయి. సీ2 సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం వరి మద్దతు ధరను పెట్టుబడులపై 12.2 శాతం పెంచగా, నాడు మన్మోహన్ సర్కార్ 15 శాతం పెంచింది. జొన్నలపై నేటి ప్రభుత్వం 11.3 శాతం పెంచగా, నాటి ప్రభుత్వం 53 శాతం పెంచింది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం సజ్జలు, రాగులు, గడ్డి నువ్వులపైనే కాస్త ఎక్కువ పెంచింది. మోదీ ప్రభుత్వం బుధవారం నాడు 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించినా అందులో పెరిగిందీ 14 పంటలకే. మద్దతు ధరను అమలు చేస్తుందా ? అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేది ఎక్కువగా బియ్యం, గోధుమలు మాత్రమే. ఓ మోస్తారుగా పప్పు దినుసులను కొనుగోలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు చౌక ధరలపై రేషన్పై బియ్యం, గోధమలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున బియ్యం, గోధుమలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అది కూడా ఉత్తర భారత దేశం నుంచే ఎక్కువగా కొనగోలు చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి మద్దతు ధరకు బియ్యం, గోధుమలను కేంద్రం కొనుగోలు చేసి వాటిని రేషన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నా ప్రభుత్వం వద్ద ధాన్యం వృధా అవుతోంది. ఈ వృధా అరికట్టేందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు కొత్త స్కీమ్ను ప్రకటించాయి. కనీస మద్దతు రేటుకు, మార్కెట్ రేటుకున్న వ్యత్యాసాన్ని నేరుగా రైతులకు డబ్బు రూపంలో ప్రభుత్వం చెల్లించడమే ఆ స్కీమ్. అది కూడా ఆయా రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే అమలవుతోంది. సీ2తో సవరించిన మద్దతు ధరలను పొలిస్తే పంట పాత(రూపాయల్లో) కొత్త(రూపాయల్లో) పెరిగిన శాతం 1. వరి 1,560 1,750 12.2 2. జొన్నలు 2,183 2,430 11.3 3. సజ్జలు 1,124 1,950 47.3 4. రాగి 2,370 2,897 22.2 5. మొక్కజొన్న 1,480 1,700 14.9 6. కందిపప్పు 4,981 5,675 13.9 7. పెసరపప్పు 6,161 6,975 13.2 8. మినపపప్పు 4,989 5,600 12.2 9. పల్లీలు 4,186 4,890 16.8 10. పొద్దు తిరుగుడు గింజలు 4,501 5,388 19.7 11. సోయాబిన్ 2,972 3,399 14.4 12. నువ్వులు 6,053 6,249 3.2 13. పత్తి(మీడియం రకం) 4,514 5,150 14.1 14. నైగర్ సీడ్(కలోంజి) 5,135 5,877 14.4 -
ధాన్యం డబ్బులతో దళారి పరార్
బాన్సువాడ : రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యాన్ని సేకరించి, దళారుల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలించి సొమ్ము చేసుకునే రైస్ మిల్లర్లను మోసం చేశాడో వ్యక్తి. రూ. కోటి రూపాయలతో పరారయ్యాడు. కొందరికి ఐపీ నోటీసులూ పంపినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ ప్రాంతంలో పలువురు వ్యాపారులు ఖరీఫ్, రబీలలో రైతుల నుంచి ధాన్యం సేకరించారు. గత ఖరీఫ్లో క్వింటాలుకు రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు మాత్రమే రైతులకు చెల్లించి ధాన్యం కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని దళారుల ద్వారా మహారాష్ట్రకు పంపి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. బాన్సువాడ మండలం లోని ఓ దళారి.. బాన్సువాడ, తాడ్కోల్, కోమలంచ, ముదెల్లి, రాంపూర్, కోటగిరి ప్రాంతాల్లోని పలువురు రైస్మిల్లర్ల నుంచి ధాన్యం సేకరించాడు. సుమారు 300 లారీల వరకు ధాన్యాన్ని సేకరించి మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలించి సొమ్ము చేసుకొన్నాడు. ఒక్కో రైస్మిల్లర్కు రూ. 5 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ధాన్యం డబ్బులు ఇవ్వాలని అడగ్గా.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెబుతూ వస్తున్నాడు. బాన్సువాడ ప్రాంత రైస్మిల్లర్లు డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో పదిహేను రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన రైస్మిల్లర్లు.. మహారాష్ట్రలో ధాన్యం విక్రయించిన రైస్మిల్లర్లను కలిసి, డబ్బుల విషయమై అడిగారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులను నెల రోజుల క్రితమే ఇచ్చామని వారు సమాధానం ఇవ్వడంతో అవాక్కయ్యారు. కాగా సదరు దళారికి బాన్సువాడలో రెండు ప్లాట్లు ఉండగా, వాటిని ఎవరికీ తెలియకుండా ఇటీవలే విక్రయించినట్లు సమాచారం. డబ్బుల కోసం తనపై ఒత్తిడి తీవ్రమవడంతో రైస్మిల్లర్లకు ఐపీ నోటీసులు పంపించినట్లు తెలిసింది. దళారీ ద్వారా మోసపోయిన రైస్మిల్లర్లు ఎవరికి ఫిర్యాదు చేయలేక మిన్నకుండిపోతున్నారు. ఈ ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతుల వ్యవహారం మొత్తం జీరో వ్యాపారం కావడంతో వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సదరు దళారీ ద్వారా ఎంత మంది రైతులు మోసపోయారనేది తెలియాల్సి ఉంది. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బజార్హత్నూర్: తెలంగాణలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. బుదవారం దేగామలో ముంపు బాధితులకు నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సన్మాన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని బతికించుకోవడానికి, రైతు అప్పుల్లో కూరుకుపోకుండా, రైతుకు అండగా నిలవడానికి ఖరీఫ్కు ఎకరాకు రూ.4 వేలు, రబీ సాగుకు రూ.4 వేలు అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే పంట రుణమాఫీ చేశామని, భవిష్యత్లో రైతు మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రూ.5 లక్షల బీమా కల్పించేందుకు రైతు బీమా పథకం తీసుకువచ్చామని తెలిపారు. మూడోవిడతలో 130 కుటుంబాలకు పునరావసంకోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. ముంపు గ్రామం దేగామలో మొదటి, రెండోవిడతల్లో పునరావాసం కింద 156 కుటుంబాల కాలనీలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. దేగామ గ్రామంలో మిగతా 190 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ఎగువ ప్రాంతంలోకి తరలించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు విన్నవించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమ రాంరెడ్డి, సర్పంచ్లు లక్ష్మన్, గుంజాల భాస్కర్రెడ్డి, విద్యాసాగర్, ప్రహ్లాద్, ఎంపీటీసీ గంగాప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చిల్కూరి భూమన్న, నాయకులు కానిందే రాజారాం, మడ్గె రమణ, భగత్ వినోద్, కొడారి నరేశ్, సకేశ్, విజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
కత్తి మహేష్పై ఎందుకు చర్యలు తీసుకోరు?
సాక్షి, భూపాలపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతును రాజును చేసిన ఘనత మోదీకి దక్కిందని, మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు జై జవాన్, జై కిసాన్ అనేవి నినాదాలుగా ఉండేవి కానీ నేడు వాటిని గొప్పగా కీర్తించిన వ్యక్తి మోదీ అని తెలిపారు. 70 ఏళ్లుగా రైతుల పేరుతో ఓట్లు దండుకున్నారని, బీజేపీ రైతుల మొహంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటోందని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తే, బీజేపీ ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల వరకు లాభాలు వచ్చేలా చేసిందని తెలిపారు. శ్రీరాముడుపై కత్తి మహేష్ కించపరిచే వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం మతం, కులం కోణంలో చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించైనా రాముడిపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వంరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వరంగల్ నడిబొడ్డున బాణసంచా అక్రమంగా తయారు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రభుత్వం తన శాఖల పనితీరుపై పట్టు కోల్పోయినట్లు తెలుస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం అందిచాలని కోరారు. సింగరేణి కార్మికులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావులు పాల్గొన్నారు. -
గోకులాల్లో గోసంపద
అన్నదాతకు పాడి పశువుల పెంపకం భారంగా మారింది. పశు పోషణ, వసతి రైతులకు శిరోభారం కావడంతో చాలా మంది వాటిని విక్రయించి రైతువారీ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పాడి పశువులతో కలకలలాడే గ్రామాల్లో నేడు అవి లేక వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో పాడి పశువులను అభివృద్ధి చేసి పాల దిగుబడిని పెంచేడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం: పశు సంవర్ధక శాఖ ద్వారా ఊరూరా గోకులాలను ఏర్పాటు చేసి అందులో పాడి పశువులకు ఆశ్రయం కల్పించి వాటి రక్షణతో పాటు పాల దిగుబడిని పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాకు తొలి విడతగా 25 యూనిట్లు మంజూరు... జిల్లాకు తొలి విడతగా 25 గోకులం యూనిట్లు మంజూరయ్యాయి. ఇందు కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు గ్రామాల వారిగా యూనిట్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించే రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. 25 యూనిట్లు మంజూరు చేసినప్పటికీ పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం మండలానికి మూడు యూనిట్లు చొప్పున మంజూరు చేయడానికి గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఏ గ్రామంలో అయినా ఈ యూనిట్ మంజూరు చేయడానికి అనుకూలమైన వసతులు లేకుంటే అక్కడ నుంచి వేరొక గ్రామానికి తరలించే అవకాశం ఉంటుంది. దీని దృష్ట్యా ముందస్తుగా మూడు గ్రామాలు చొప్పున ఎంపిక చేశారు. ఇలా పార్వతీపురం ఐటీడీఏ ఉప ప్రణాళికా ప్రాంతంలోని పార్వతీపురం మండలంలో 4 గ్రామాలు, కొమరాడలో–3, గరుగుబిల్లి–3, కురుపాం–3, జియ్యమ్మవలసలో–3, గుమ్మలక్ష్మీపురంలో –3, మక్కువ–3, సాలూరు–3 గ్రామాలు చొప్పున ఎంపిక చేశారు. ఒక్కో యూనిట్కు రూ.21 లక్షలు.. ఒక్కో గోకులం నిర్మాణానికి రూ.21లక్షలు మంజూరు చేస్తారు. ఇందులో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18.50లక్షలు, పశు సంవర్ధక శాఖ నుంచి రూ.2.50లక్షలు మంజూరు చేస్తారు. ఈ యూనిట్ను నిర్వహించడానికి ఆయా గ్రామాలకు చెందిన పాడి రైతులతో పాటు మరికొందరితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీని విలేజ్ ఆర్గనైజేషన్ కమిటీ అంటారు. కమిటిటీలో పాడి పశువులు ఉన్న ముగ్గురు రైతులు, ఒక పశువైద్యాధికారి, గ్రామ కార్యదర్శి ఉంటారు. వీరు ఈ గోకులం యూనిట్ను నిర్వహిస్తారు. ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొన్ని నిబంధనలు విధించారు. తప్పనిసరిగా ఆయా గ్రామాలకు రహదారి సౌకర్యం, నీటి వసతి, విద్యుత్ సదుపాయం కలిగి ఉండడంతో పాటు మహిళా గ్రూపులకు చెందిన కుటుంబంలో ఉన్న రైతులు అర్హులు. అంతే కాకుండా పశువైద్య కేంద్రానికి అందుబాటులో ఉన్న గ్రామాల్లో మాత్రమే ఈ గోకులం యూనిట్లను మంజూరు చేస్తారు. గోకులం యూనిట్ల నిర్మాణం కోసం ఆయా గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన 25 సెంట్లు భూమిని కేటాయించాల్సి ఉంటుంది. గోకులాల ఉపయోగం... ప్రస్తుతం గ్రామాల్లో పశువులు ఇంటికి ఒకటో లేక రెండో ఉంటాయి. వాటి కోసం ఇంటి ముందు లేక వెనక భాగంలో పశువుల శాలను నిర్మించాలి. రోజూ శాలను శుభ్రపరచాలి. వాటిని మేతకు తోలుకు పోవాలి. పాడి పశువులకు దాణా పెట్టాలి. జబ్బు చేస్తే వైద్యుని వద్దకు తోలుకుపోవాలి. ఇలా ఎవరికి వారే ఈ పనులు చేసుకోవాలి. ఇది రైతులకు కష్టతరమైన పని. కాబట్టి రైతులందరి పాడి పశువులను ఒకే చోటకు చేర్చి వాటికి మేత, తాగునీరు, వైద్య పరీక్షలు చేయడం, అవసరమైన మందులు వేయడం వంటి సౌకర్యాలున్నా గోకులంలో లభ్యమయ్యే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. ఒక గ్రామానికి చెందిన 20 మంది రైతులకు చెందిన పాడి పశువులను ఈ గోకులంలో చేర్చి వాటిని సంరక్షిస్తారు. ఇక్కడ పశువులకు అవసరమైన సైలేజ్ గడ్డి, దాణామృతం వంటి మేతను రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. పశువులకు జబ్బు చస్తే కమిటిలో ఉన్న వైద్యులకు సమాచారం ఇవ్వగానే వెంటనే వైద్యాధికారి వచ్చి పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తారు. పాడి రైతులకు వరం గోకులాలు అందుబాటులోకి వస్తే పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 25 గోకులాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక్కో యూనిట్కు రూ.21లక్షలు మంజూరు కానుంది. ఒక గ్రామంలో ఉన్న 20 మంది పాడి రైతులను గుర్తించి వారి పాడి పశువులను ఈ గోకులాల్లో చేర్పించి ఒకే చోట అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. పశువులు ఊరిలో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉండదు. తాగునీరు, మేత ఒకే చోట లభిస్తాయి. గోకులాలు అందుబాటులోకి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.–యండ సింహాచలం, పశుసంవర్ధక శాఖ, జాయింట్ డైరెక్టర్ -
ఊరింపా.. ఉసూరా!?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మద్దతు ధర పెంపు ఊరట మాత్రమేనని ఓవైపు.. ఈ పెంపుతో రైతుకు ఒరిగేదేమీ లేదని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. పంటల సాగు వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయిస్తామని కేంద్రం చెప్పిందని, కానీ ఆ స్థాయిలో ధరలు నిర్ణయించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా సొంత ఫార్ములా ప్రకారం మద్దతు ప్రకటించారని ఆరోపణలొస్తున్నాయి. వరికి క్వింటాకు రూ. 200 పెంచామని చెబుతున్నారని, కానీ డీఏపీ బస్తా కూడా రూ. 200 పెంచారని.. దీని వల్ల రైతుకు ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మొత్తం 14 పంటలకు.. పంటల మద్దతు ధరలు పెంచుతామని 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ బడ్జెట్లో దీనికి కార్యరూపం తీసుకొచ్చారు. ఆ ప్రకారం మొత్తం 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచింది. క్వింటా వరి (సాధారణ రకం) ధర రూ. 1,550 నుంచి రూ. 1,750కు పెరిగింది. గ్రేడ్ ఏ రకం వరి క్వింటా ధర రూ. 1,590 నుంచి రూ. 1,750 పెంచారు. పత్తి ధర రూ. 4,020 నుంచి రూ. 5,150కు పెంచారు. పప్పు ధాన్యాల్లో కందులు క్వింటా ధర రూ. 5,450 నుంచి రూ. 5,675, పెసర్లను రూ. 5,575 నుంచి రూ. 6,975, మినుములను రూ. 5,400 నుంచి రూ. 5,600, వేరుశనగల పాత ధర రూ. 4,450 ఉండగా, కొత్త ధర రూ. 4,890కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరి ధాన్యం క్వింటా మద్దతు ధరను గతేడాదికన్నా రూ. 200 ఎక్కువ పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే కందులకు రూ. 225, పత్తికి రూ. 1,130, పెసర్లకు రూ.1,400, జొన్నలకు రూ.700 ఎక్కువ పెంచినట్లు పేర్కొంది. సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచామని కేంద్రం చెప్పినా ఏ ప్రాతిపదికన పెంచారో మాత్రం స్పష్టం చేయలేదు. సొంత ఫార్ములా ప్రకారం!: రాష్ట్ర వ్యవసాయ శాఖ.. జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ) ఈ ఏడాది జనవరిలో సమర్పించిన సాగు వ్యయాల ప్రకారం క్వింటా వరి పండించేందుకు రూ. 2,202 ఖర్చు అవుతుంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి క్వింటాకు రూ. 3,303 మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వరి, మొక్కజొన్నకు క్వింటాకు కనీసం రూ. 2 వేల పైన ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పత్తి లాంగ్ స్టాపిల్ క్వింటాకు రూ. 6,087.. క్వింటా కందికి రూ. 5,896 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వీటికి 50 శాతం అదనంగా మద్దతు ఇస్తేనే రైతుకు సాగు లాభసాటిగా ఉంటుందని పేర్కొంది. వీటినీ కేంద్రం పట్టించుకోలేదు. మరోవైపు క్వింటా వరి మద్దతు ధరను రూ.2,000 చేస్తే బాగుండేదని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఖర్చు సాగు ఖర్చులో ఒకటిన్నర రెట్లు పెంచామని కేంద్రం చెప్పడంలో అర్థం లేదు. ఖర్చు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. తెలంగాణలో వరి సాగు ఖర్చు క్వింటాకు రూ. 2,100 ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం ఒకటిన్నర రెట్లు కలిపితే రూ. 3,100 కావాలి. కానీ కేంద్రం తెలంగాణ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పైగా డీఏపీ బస్తా ధర రూ. 200 పెంచి మద్దతు ధరను రూ. 200 పెంచింది. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నేత పెంపులో ఫార్ములా ఏదీ ప్రస్తుతం నిర్ధారించిన ధరలు రైతుకు ఊరట మాత్రమే. మద్దతు ధరల పెంపులో వ్యవస్థీకృత ఏర్పాటు చేయలేదు. ఫార్ములా అంటూ ఏమీ లేకుండానే చేశారు. దేనికి ఎంత, ఎందుకు పెంచుతున్నారో కూడా స్పష్టత లేదు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు ఎన్నికల స్టంట్ స్వామినాథన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండానే మద్దతు ధరలు ఖరారు చేశారు. సొంత ఫార్ములా ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే. – పిడిగం సైదయ్య, ఉద్యాన శాస్త్రవేత్త