Natural Resource
-
వొద్దు అన్నోళ్లే వావ్ అంటున్నారు!
సునీత ఐపీఎస్ అవ్వాలనుకున్నారు. అమ్మా నాన్నా చనిపోయిన నేపథ్యంలో ఎంబీఏ చదువుకొని హైదరాబాద్లో కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశారు. రసాయనిక అవశేషాలున్న ఆహారం, వాయుకాలుష్యం కారణంగా అనారోగ్యం పాలయ్యారు. సొంతూరుకు తిరిగొచ్చి.. వారసత్వంగా సంక్రమించిన మూడెకరాల బంజరు భూమిని చదును చేసి మాగాణిగా మార్చి.. గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. సులువుగా బ్యాంకు రుణాలివ్వడంతోపాటు.. చిన్న కమతాల మహిళా రైతులు స్వయంగా ఉపయోగించుకోగలిగేలా పవర్ టిల్లర్లను, కలుపుతీత యంత్రపరికరాలను ప్రత్యేకంగా రూపొందించి అందించడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆమె కోరుతున్నారు. ‘ఇదో పిచ్చిది, దీనికేం పనిలేదు..హైద్రాబాద్లో మంచిగా ఉద్యోగం చేసుకోక, ఇక్కడ వ్యవసాయం చేస్తానని వచ్చింది. మాతోని కానిది గీ పిల్లతో ఏం అయితది..’ అని కొందరు గ్రామస్తులు ముఖం మీదే చెప్పినా సునీత అధైర్య పడలేదు. పట్టుదల పెంచుకుంది. స్కూటీపై ఇంటి నుంచి రోజూ పొలం వద్దకు వెళ్లి జీవామృతంతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో, గ్రామరైతులు సునీతను చూసి ఆశ్చర్యపడుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముక్కెట్రావుపేట గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కొప్పుల ధర్మయ్య, శాంతమ్మల ఏడుగురు సంతానంలో చివరి సంతానం సునీత(30). తోడబుట్టిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైద్రాబాద్లో ఎంబిఎ వరకు చదివారు. ఐపీఎస్ అధికారి కావాలన్నది ఆమె కల. కానీ, తల్లీదండ్రులు కాలం చేశారు. కుటుంబ పరిస్థితులు కలసి రాలేదు. ఆ నేపథ్యంలో హైదరాబాద్లోనే ప్రైవేటు ఉద్యోగంలో చేరారు. వచ్చే జీతం ఖర్చులకు సరిపోయేవి. కానీ, ఏదో తెలియని వెలితి. హాస్టల్లో అంతా రసాయనిక అవశేషాలున్న ఆహారమే. దీనికి వాయుకాలుష్యం తోడుకావడంతో అనారోగ్యం పాలయ్యారు. మందులు వాడుతున్నా ఆరోగ్యం మరింత దిగజారింది. బంజరును మాగాణిగా మార్చి.. ఈ నేపథ్యంలో ఐదారేళ్ల క్రితం సునీత దసరా పండుగకు సొంతరు వెళ్లారు. పచ్చని పొలాలు, బంధుమిత్రుల అనుబంధాలు కాలుష్యం లేని గ్రామీణ వాతావరణం ఆమెను కట్టిపడేసాయి. ఆ విధంగా సొంత ఊరులోనే జీవనాన్ని సాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అక్కడుండి ఏమి చేయాలో పాలుపోలేదు. చేతిలో డబ్బు లేదు కానీ.. తండ్రి సంపాయించిన 3 ఎకరాల భూమి మాత్రం ఉంది. అది రాళ్లు, రప్పలతో నిరూపయోగంగా ఉన్న బంజరు భూమి. వ్యవసాయాన్నే వృత్తిగా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, వ్యవసాయంలో ఆమెకు ఓనమాలు తెలియదు. అయినా, సంకల్పంతో ముందడుగు వేశారు. సంప్రదాయ దుస్తులు వదిలేసి.. ప్యాంటు, షర్ట్ ధరించి భూమిలోకి కాలు పెట్టింది. గ్రామస్తుల ఎగతాళి మాటలు ఆమె పట్టుదల ముందు ఓడిపోయాయి. స్నేహితులు ఇచ్చిన తోడ్పాటుతో నిధులు సమకూర్చుకొని రూ 3.50 లక్షల ఖర్చుతో నిరూపయోగంగా ఉన్న భూమిని చదును చేయించి, మాగాణి పొలంగా ఉపయోగంలోకి తీసుకువచ్చారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ‘సాగుబడి’ కథనాల స్ఫూర్తితో.. ‘సాక్షి’లో ‘సాగుబడి’ కథనాల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి సునీత తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేశారు. పాలేకర్ శిక్షణా శిబిరాలకు హాజరయ్యారు. పాలేకర్ పుస్తకాలు, ‘గడ్డిపరకతో విప్లవం’ వంటి పుస్తకాలు చదివి.. ప్రకృతికి వ్యవసాయానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, రసాయనాలతో అనర్థాలను అర్థం చేసుకున్నారు. 2016 ఖరీఫ్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేయడం ప్రారంభించారు. ఆవును సమకూర్చుకొని జీవామృతం, ఘనజీవామృతం స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ను మోటారుతో తోడుకొని ఏటా రెండు పంటలూ సాగు చేస్తున్నారు. పొలం దున్నేటప్పుడు ఆవుల పేడను పొలమంతా చల్లటం, నాటు వేసే సమయంలో ఘనజీవామృతాన్ని అందించింది. తర్వాత, నాటు వేసి జీవామృతాన్ని ప్రతి 20 రోజులకొకసారి పొలానికి అందిస్తున్నారు. ఎకరానికి రూ. 2 లక్షల నికరాదాయం వచ్చే ఖరీఫ్ నుంచి పాలేకర్ ఐదంస్థుల సాగు చేపట్టి, క్రమంగా కొన్ని సంవత్సరాల్లో తన 3 ఎకరాలను జీవవైవిధ్యంతో కూడిన ఆహార అడవిగా మార్చుకోవాలని సునీత కృతనిశ్చయంతో ఉన్నారు. ఎకరానికి తొలి ఏడాది 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం బీపీటీ రకాన్ని మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 33 బస్తాల వరకు దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఎకరానికి రెండు పంటలు కలిపి రూ. 2 లక్షల మేరకు నికరాదాయం వస్తున్నదన్నారు. సామాజిక సేవ ప్రజల ఆరోగ్యం రైతుల చేతుల్లోనే ఉందని నమ్మే సునీత.. రైతులు విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయడం వల్ల సమాజం అనారోగ్యకరంగా మారే ప్రమాదం ఉందంటారు. పరిసర గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజంతో పాటు, అవినీతి లేని సమాజాన్ని నిర్మించడంలోనూ రైతులు తమదైన పాత్ర నిర్వహించాలన్నది ఆమె భావన. ఎవరికి అన్యాయం జరిగిందని తెలిసినా వారికి అండగా నిలుస్తున్నారు. స్వయానా తన అన్న ఆ గ్రామ సర్పంచ్గా అవినీతికి పాల్పడ్డాడంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి, అతని చెక్ పవర్ను రద్దు చేయించటం సునీత చిత్తశుద్ధికి నిదర్శనం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, ఫొటోలు: ఎలేటి శైలేందర్ రెడ్డి సులభ రుణాలు, మహిళలు నడపగలిగే ప్రత్యేక పవర్ టిల్లర్లు తయారుచేయాలి సమాజంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలన్నదే నా అభిమతం. అడ్డంకులను అధిగమించినప్పుడే జీవితంలో తృప్తి. మనం చేసే పని నీతి, నీజాయితిగా ఉండాలి. అవాంతరాలు రావచ్చు. పట్టుదలతో నిలదొక్కుకుంటే సమాజం ఆ తర్వాత గుర్తించి విలువనిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న మహిళా రైతులు తమ సాగు భూముల్లో తాము స్వయంగా నడుపుకోగలిగేలా అనువుగా ఉన్న పవర్ టిల్లర్లు, వీడర్లు అందుబాటులో లేవు. తక్కువ వైబ్రేషన్స్ ఉండేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు మహిళా రైతులకు అందించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రైతులకు భూమిని తనఖా పెట్టుకొని సులువుగా బ్యాంకు రుణాలు అందించేలా ప్రభుత్వం శ్రద్ధతీసుకోవాలి. మహిళా రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం స్టాళ్లు ఏర్పాటు చేయాలి లేదా ప్రత్యేక రుణాలను అందించాలి. – కొప్పుల సునీత(79890 45496), యువ మహిళా రైతు, ముక్కెట్రావుపేట, వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా keerthisk999@gmail.com ఆవులతో సునీత -
ప్రకృతినే హ్యాండిల్ చేశాం..
సాక్షి, అమరావతి: ప్రకృతిని హ్యాండిల్ చేయగలుగుతున్నా కూడా పొలిటికల్గా హ్యాండిల్ చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఒక జాతీయ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు మరో పార్టీ సహాయ నిరాకరణ చేయడంతో పాటు భయాందోళనకు గురిచేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన హక్కుల గురించి డిమాండ్ చేస్తే దాడులు చేసే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికాదని, ఐటి దాడులు చేయడం ద్వారా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కక్ష సాధింపు వైఖరి సరికాదు, న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. అప్పుడు కేంద్రంలో ఓ పార్టీ ఒకరకంగా ఇబ్బంది పెడితే ఇప్పుడు మరో జాతీయ పార్టీ మరోరకంగా ఇబ్బంది పెడుతోందన్నారు. సాంకేతికత, అభివృద్ధితో విపత్తులను అధిగమిస్తున్నామని, దివిసీమ, తూర్పుగోదావరి తుపాన్లలో ప్రాణనష్టం అత్యధికమని, కానీ హుద్ హుద్, తిత్లీ తుపాన్లలో ప్రాణ నష్టం నివారించగలిగామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వచ్చేదాకా విశ్రమించకూడదన్నారు. పోలవరం పునరావాసం పనులు వేగవంతం చేయండి పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక నుంచి పనుల పురోగతిని వర్చువల్ రివ్యూ ద్వారా ఆయన సమీక్షించారు. వచ్చే వారానికి కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌంటింగ్) పనులు పూర్తవుతాయని అధికారులు వివరించారు. ప్రాజెక్టు కోసం పశ్చిమగోదావరి జిల్లాలో భూసేకరణ పూర్తికాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 55,858.6 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన హైలెవల్ కెనాల్ నిర్మాణంతో వంశధార–బహుదా అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి–పెన్నా అనుసంధానం ఫేజ్ 1 టెండర్ల ప్రక్రియ చివరిదశకు వచ్చిందని వివరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే అవార్డులు సాక్షి ప్రతినిధి ఒంగోలు: విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7,010 మంది విద్యార్థులకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ప్రతిభా అవార్డులను సీఎం అందచేశారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చన్నారు. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను యంత్రాల్లా పనిచేయిస్తుండడం సరికాదన్నారు. అందుకే ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలల్లో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ప్రతిభా అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.20 వేలు నగదు, అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా అవార్డు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే వారి పదవీకాల సమయం ఓ ఏడాది అధికంగా ఇస్తామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తి ప్రదాత అని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని సీఎం అన్నారు. నాడు వాజ్పేయ్ ప్రభుత్వంలో అబ్దుల్ కలాం దేశ అధ్యక్షుడిగా ఉండాలని తాను ప్రతిపాదించానని చెప్పారు. 2022 నాటికి రాష్ట్రం దేశంలో 3వ స్థానానికి చేరుకుంటుందని, 2029కి నంబర్–1 అవుతుందని, 2050కి ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. జ్ఞానభేరి పెట్టి జిల్లాకు రూ.10 కోట్లు నిధులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్ క్షేత్ర సందర్శన
మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ స్వయంగా హిందీ/ఇంగ్లిష్ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్ జానియల్– 98225 15913, సచిన్ జడె–88050 09737 -
సల్లంగ బతుకమ్మ
తెలంగాణలో కొన్ని పండుగలకు తరతరాల చరిత్ర ఉంది. కొన్ని పండుగలు ప్రజల సంబురాల నుండి పుట్టి, జీవన గమనంలో భాగంగా మారాయి. తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో మార్మోగిపోయే సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. బతుకమ్మ అనగానే మనకు ఒక సామాజిక వ్యవస్థగా, సమాజంలో జరిగిన సంఘటనలకు స్పందించి, చైతన్యాన్ని కల్పించే దిశగా పాట రూపంలో, ఆటల రూపంలో సామాజికులు తీర్చిదిద్దుకున్న ఒక అపురూపమైన కళారూపం ఈ బతుకమ్మ. వర్షాకాలం చివరి రోజుల్లో తెలంగాణ ప్రాంతమంతా ఎక్కడ చూసినా విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లెపడుచులా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుకున్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండిజిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి. పూరిగుడిసెల మీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. పూరిగుడిసెలకు ఇంత అందం ఎక్కడినుంచి వచ్చింది, ఎవరిచ్చారూ అని ఆలోచిస్తే, మన బతుకమ్మగాక మరెవరు అంటారు కల్మషమెరుగని నైజాం ప్రాంత ప్రజానీకం. పొలం గట్ల మీదకు ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి.మగవారు పూలు కోసుకురావాలి. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవారిదే మరి. తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగరోజుల్లో భక్తిశ్రద్ధలు అడుగడుగునా కనిపిస్తాయి. మహాలయ పక్ష అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. చివరిరోజున అనగా దుర్గాష్టమి రోజున పెద్దగా పేర్చిన బతుకమ్మను ఇంటిముందు వాకిట్లో, వీధిలో కూడలిలో ఉంచి ఆడపడచులంతా కలిసి సామూహికంగా పాటలు పాడుతూ– లయబద్ధంగా చేతులు కలుపుతూ, అడుగులో అడుగు వేస్తూ, బతుకమ్మ ఆడతారు. ఇక బతుకమ్మ పాటలన్నీ ఎంతో హుషారు గొలిపిస్తాయి. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తూ, ఇక తదితర ఆడపిల్లలకు సంబంధించిన విషయాలమీదే ఎక్కువగా ఉంటాయి. జాము రాతిరి దాకా ఆడి చివరకు బతుకమ్మను చెరువులోనో, వాగులోనో నిమజ్జనం చేస్తారు. ముల్తైదువలు ఒకరికొకరు పసుపు కుంకుమలను ఇచ్చి పుచ్చుకుంటారు. తీపిపదార్థాలు తినిపిస్తారు. ఆ సమయంలో ఊరు ఊరంతా చెరువు గట్టు మీదకు తరలి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది.బతుకమ్మ పండుగ విషయంలో పలుకథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా ప్రాచీనమైన కథను చెప్పుకుందాం. శివుని అర్ధాంగి, జగన్మాత పార్వతీదేవి తన పుట్టింటివారు పిలవకున్నా, తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అవమానం పొంది, యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుందని, అది చూసి సహించలేని ప్రజలు, భక్తులూ ముక్తకంఠంతో బతుకమ్మ బతుకమ్మ అంటూ హృదయవిదారకంగా విలపిస్తూ భక్తితో పాటలు పాడగా పార్వతీదేవి ప్రత్యక్షమైందనీ, ఆనాటినుండి ప్రజలు బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారని ఒక కథ ప్రచారంలో ఉంది. పుట్టినపిల్లలు పురిటిలోనే చనిపోతుంటే వారికి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టే ఆచారం ఈనాటికీ తెలంగాణలో ఉంది. బతుకమ్మ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న గట్టి నమ్మకం ఈనాటికీ తెలంగాణలో ఉంది. సిరిలేని సురులతో ఉయ్యాలో సంతోషమొందిరి ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగ నిలిచె ఉయ్యాలో అంటూ బతుకమ్మ కథలను పాడుతూ ఉండడం కనిపిస్తుంది. బతుకమ్మ పాటలు నేటికీ వింటున్నామంటే అందుకు కారణం జనబాహుళ్యం వీటిని బతికించుకుంటూ రావడమే. ప్రకృతిలో పనికిరానిది ఏదీ లేదన్న సందేశం మనకు ఈ పండుగ ద్వారా అందుతుంది. ఈ ఆటపాటల వలన ఆడపిల్లల్లో ఐకమత్యం, అందరితో కలిసి మెలిసి అందరితో కలిసి మెలిసి ఉండాలనే మనస్తత్వం అలవాట్లలో మంచి మార్పు, ఇతరులకు సహాయం చేసే గుణం, ఓర్పు, నేర్పు అలవడతాయి. కులం, వర్గం అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. గౌరికి తల తల్లి నీటి మీద తేలే విధంగా వరమిచ్చిందట. గౌరి గౌరమ్మగా, బతుకమ్మగా మారి నీటిమీద తేలేలా సాధించుకుంటుందన్న కథను కూడా చెబుతారు. బతుకమ్మను పేర్చిన స్త్రీలు చివరి రోజున శివుడు మెచ్చిన గంగ గౌరీలను కలిపి చేసిన పసుపు ముద్దను ఒకరికొకరు పంచుకుంటారు. ఇంకొక ముఖ్యమైన కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది అన్నా చెల్లెళ్లకు సంబంధించినది. చెల్లిని అన్నయ్య ప్రాణప్రదంగా చూసుకుంటుంటే సహించలేని వదినలు ఆమెకు పాలలో విషం కలిపి చంపేసి పాతిపెడతారు. ఆమె అక్కడ తంగేడై మొలుస్తుంది. తమ చెల్లెలిని చంపారన్న కోపంతో, భార్యలను చంపడానికి బయలుదేరిన అన్నలను బతుకమ్మ మీ చెల్లెలిని తంగేడునై పుట్టాను. వదినెల చేత బతుకమ్మను చేయించి ప్రతి ఏటా నన్ను సాగనంపమంటుంది. అందుకే బతుకమ్మకు తంగేడును శ్రేష్ఠంగా చెబుతారు. మరొక కథ– వేల ఏళ్ల కిందట బతుకమ్మ ఒక సామాన్య రైతుకుటుంబంలో పుట్టింది.పెరిగి పెద్దది కాగానే వివాహం చేశారు. అత్తవారింట్లో అందరి మనసులెరిగి మసలుకుంటుంది. సుమంగళిగా తనువు చాలించాలని గౌరీదేవిని పూజించేది. ఆమె పూజలకు మెచ్చిన గౌరీదేవి బతుకమ్మగా వెలసి స్త్రీల కోర్కెలు తీర్చమంటూ దీవించింది. –చోళరాజైన ధర్మాంగదునికి వందమంది కుమారులు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి పెంచుకుంటారు. ఇలా పలు కథలున్నాయి. స్త్రీలపండుగగా ప్రసిద్ధికెక్కిన బతుకమ్మగా తల్లి వారి కటుంబాన్ని చల్లగా చూస్తుందని గట్టి నమ్మకం.పిల్లాపాపలకు ఆరోగ్యాన్ని, ఆడపిల్లలకు ముత్తయిదువతనాన్ని ఇస్తుందని భావించే బతుకమ్మ– సర్వజనులనూ రక్షించాలని ప్రార్థిద్దాం. – డా. పులివర్తి కృష్ణమూర్తి -
తేరుకోని ఇండోనేసియా
ఇండోనేసియాలో భూకంపం, సునామీ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎంత కష్టం!
సినిమాకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి షూటింగ్ లొకేషన్లో ఏర్పడే మనస్పర్థల వల్ల, ఆర్టిస్టుల డేట్స్ విషయంలోనూ, ప్రకృతి వల్ల కూడా అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అనూహ్య ఇబ్బందిలోనే చిక్కుకుంది ‘దేవ్’ టీమ్. కార్తీ, రకుల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ను హిమాచల్ ప్రదేశ్లోని కులూమనాలిలో ప్లాన్ చేసి, యూనిట్ అక్కడకు చేరుకుంది. సడెన్గా కుండపోతగా వర్షం కురవడంతో వరదలు వచ్చాయి. దాంతో షూటింగ్ ప్రదేశమంతా బీభత్సంగా తయారవ్వడంతో పాటు సుమారు 140 మంది యూనిట్ మెంబర్స్ అక్కడ చిక్కుకుపోయారట. ఈ విషయాన్ని కార్తీ షేర్ చేస్తూ – ‘‘మంచు పడుతున్న సీన్స్ షూట్ చేద్దామని హిమాచల్ ప్రదేశ్ వచ్చాం. మాకు అనుగుణంగానే లొకేషన్ ఉండటంతో షూటింగ్ సజావుగా జరుగుతుందనుకున్నాం. హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది. కొండ మీదున్న రాళ్లు జారి రోడ్డు మీద పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. షూటింగ్ లొకేషన్లో (కొండ మీద) చిక్కుకుపోయిన వాళ్లతో కమ్యూనికేషన్ లేదు. సేఫ్టీ కోసం నన్ను కొండ కింద ఊర్లోనే ఉండ మన్నారు’’ అన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం నిర్మాతకు సుమారు కోటిన్నరకు పైనే నష్టం మిగిల్చిందట. అలాగే గత 23 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్లో ఇంతటి బీభత్సాన్ని చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. -
ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్య ఇళ్లుండాలి
సాక్షి, తిరుపతి: ‘ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఇళ్లు ఉండాలి. ఊర్లో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఊర్లు ఉండాలి. ఒకప్పుడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు ప్రకృతిని ప్రమోట్ చేస్తున్నాను. మీరు తినే తిండి యూరియా. ఆ తిండితో అనారోగ్యం పాలువుతున్నారు. భూములు నిస్సారమయ్యాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఆయన అలిపిరి మార్గంలోని కపిలతీర్థం వద్ద నిర్మించిన నగర వనాన్ని ప్రారంభించి మొక్కను నాటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహతి ఆడిటోరియానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ‘పచ్చదనం పరిశుభ్రత’ను కాంక్షిస్తూ నెహ్రూ మున్సిపల్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో నెహ్రూ నగర్ వద్ద డిజిటల్ డోర్ నెంబర్లకు శ్రీకారం చుట్టారు. అనంతరం మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. మెడికల్, ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతి డిజిటల్ డోర్ నెంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని.. ప్రభుత్వ సేవలు ఏ సమయానికి ఎలా అందుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరుపతిలో అమలుచేస్తామని తెలిపారు. తిరుపతిని ఒక మెడికల్, ఎడ్యుకేషన్ హబ్గా తయారుచేసి దేశంలోనే నంబర్–1గా తీర్చిదిద్దుతానన్నారు. అలాగే, తిరుపతిని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమకు కేంద్రంగా దీనిని తయారుచేస్తానన్నారు. త్వరలో తిరుమలకు ఎలక్ట్రికల్ వాహనాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. జపాన్లో ఎవరూ రోడ్లపై కాగితాలు వేయరని, ఇక్కడ మాత్రం కాగితాలు, ఇతర చెత్త ఇష్టా రాజ్యంగా వేస్తున్నారన్నారు. ప్రకృతి సేద్యంతో లాభాల పంట ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి లాభాలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని అక్టోబరు 2న ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అమరనాథ్రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ సమీకృత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్. నారాయణరెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్, మరలెనహళ్లి, శ్రీనివాసపురం గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాల కోసం.. 94495 96039, 83101 99215, 99017 30600. -
16న కొర్నెపాడులో జీవన ఎరువులపై శిక్షణ
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని పంటల్లో జీవన ఎరువుల వాడకం, రైతు స్థాయిలో వాటి తయారీపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రైతు కొక్కు అశోక్కుమార్ శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ చేస్తారు. వివరాలకు..8367535439, 0863–2286255. -
వక్క లెక్కే వేరు!
ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు. అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మొదట్లో చేదు అనుభవం... కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్నగర్ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్నగర్ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్పామ్ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు. అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే ఫలసాయాన్ని అందిస్తున్నది. అరటి+ వక్క+మిరియం+జాజి... వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు. వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది. అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకం వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది. ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం, సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు! ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది. ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు! ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్– 83329 45368. చీడపీడల నివారణలో.. చేతిని మించిన సాధనం లేదు! కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు – వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా దివంగత వైఎస్సార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ -
వానకు ముందే విత్తనం..!
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి.. అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..! కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్బీఎన్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది. మే నెల లోనే విత్తనం.. అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో క్లస్టర్కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్ఎఫ్ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం. ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు. వానల్లేకపోయినా.. విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. రక్షణ కవచంగా మిత్రపురుగులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్బీఎన్ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది. ‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు. పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే – రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ -
బతుకు పంట!
ఆ రైతు వయసు 73 ఏళ్లు... చేసేది ముప్పాతిక ఎకరం (75 సెంట్లు)లో వ్యవసాయం. ఏడాదికి ఆదాయం అక్షరాలా రూ.1.50 లక్షలపైనే. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ, పాలేకర్ సూచించిన, అయిదు అంతస్తుల సేద్య విధానానికి రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఆ వ్యవసాయ క్షేత్రం కొబ్బరి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలచెట్లతో అడవిని తలపిస్తుంటుంది. నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదన తో అటు ఆరోగ్యం, ఇటు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రోజువారీ పండ్లు, కూరగాయలు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయటమే కాదు, ఆ వయసులోనూ కొబ్బరి చెట్లను అవలీలగా ఎక్కుతూ, గెలలను దింపుతూ, స్వయంగా బజారులో అమ్ముకుంటూ తానే ఒక సైన్యంలా శ్రమిస్తున్నాడు. ఫలితంగానే నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదనతో అటు ఆనందం, ఇటు ఆరోగ్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటుతున్నాడు. ఎందరో రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆ నిత్య కృషీవలుడు నామని రోశయ్య ఆదర్శ జీవన సేద్యంపై ‘సాగుబడి’ కథనం.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం అత్తోట.. రోశయ్య స్వస్థలం. ఊరివెలుపల మాగాణి పొలాల్లో గుబురుచెట్లతో అడవిలా కనిపించేదే ఆయన వ్యవసాయక్షేత్రం. చుట్టూ వరి పండించే మాగాణి భూముల మధ్య ఇదొక్కటే మెట్ట చేను. వాస్తవానికి ఒకప్పుడది మాగాణి భూమే. సేద్యాని కనుగుణంగా మెట్టగా మార్చుకున్నారు రోశయ్య. పెద్దల్నుంచి సంక్రమించిన ఆ భూమికి చుట్టూ గట్లపై కొబ్బరి చెట్లు నాటారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఏటా 10 సెంట్ల చొప్పున మెరక చేసుకుంటూ ఏడెనిమిదేళ్లలో మొత్తం భూమిని మెట్టగా మార్చేసుకుంటూ ఏటా కొన్ని కొబ్బరి చెట్లు నాటుతూ వచ్చారు. వాటితోపాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, దుంప పంటలు, పూలచెట్లతో సహా 23 రకాల మొక్కలు/ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు ప్రస్తుతం రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిచెట్లు–70, నిమ్మచెట్లు–60, జామచెట్లు–8, సీతాఫలం–20, బత్తాయి–4, నారింజ–1, అరటి– 25, దానిమ్మ–2, ఉసిరి–2, నేరేడు–4, మామిడి–4తో సహా సపోటా, బొప్పాయి, మునగ చెట్లతోపాటు 3 నుంచి 5 సెంట్ల విస్తీర్ణం చొప్పున కంద, బెండ, వంగ వంటి కూరగాయల తోటలున్నాయి. ఒక వరుసలో పసుపు విత్తారు. 10 సెంట్లలో పశువుల మేత పెరుగుతోంది. వావిలి, వేప, నల్లేరు, తులసి, ఆముదం, కుంకుడు, రబ్బరు, ఉమ్మెత్త వంటి ఔషధ మొక్కలు, కొన్నిరకాల పూలమొక్కలు ఉన్నాయి. అంతర పంటల సాగులో రోశయ్య మేటి అనిపించుకుంటున్నారు. మినుము, పెసర, పసుపు, కంద పంటలను మూడునాలుగేళ్ల కాలవ్యవధిలో సాగుచేస్తూ వచ్చారు. మినుము పంట చేతికొచ్చాక, బంతి పూల సాగుకెళతారు. ఆ పంట తర్వాత మళ్లీ అపరాలు, మరోసారి పసుపు సేద్యం, ఇంకోసారి మొక్కజొన్న...ఇలా పంటల వైవిధ్యం పాటిస్తూ ఏడాదిలో 365 రోజులు పంట చేతికొచ్చేలా రూపొందించుకొనే ప్రణాళిక లాభసాటి వ్యాపారి వ్యవహారంలా అనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వేసిన నిమ్మతోట ఇప్పుడు బ్రహ్మాండంగా కాపునిస్తోంది. కొబ్బరి చెట్లు ఎత్తు తక్కువ ఉన్నపుడు అరటి ఎక్కువగా సాగుచేశారు. గతేడాది వరకు 20 సెంట్లలో పండించిన పసుపుకు మార్కెట్ ధర ఆశాజనకంగా లేదని ఈ సంవత్సరం విరమించుకున్నారు. ఆ విస్తీర్ణంలో అలోనేరేడు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు రూ.500 కనీస ఆదాయం.. రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లకు 28 ఏళ్ల వయసు. రోజుకు ఒక్కో చెట్టు నుంచి మూడేసి గెలలను దింపుతారు. కొబ్బరి బోండాలను సైకిలుకు కట్టుకుని, అత్తోట గ్రామ సెంటరులో విక్రయిస్తారు. కొబ్బరి బోండాలను విడిగా, సీసాల్లోనూ కోరినవిధంగా ఇస్తారు. అత్తోట, దగ్గర్లోని గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొబ్బరి నీళ్లు అవసరమైన వారు నిశ్చయంగా రోశయ్య ఇంటి తలుపుతడతారు. నిమ్మ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి బోండాలతో రూ.400, నిమ్మకాయలతో రూ.100 చొప్పున రోజుకు రూ.500 ఆదాయాన్ని కళ్లచూస్తున్నట్టు రోశయ్య ఒకింత గర్వంగా చెప్పారు. ఏడాదిలో కనీసం 10 నెలలపాటు ఈ రెండింటిపైనే రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఇతర పండ్లు, కూరగాయలను సొంతానికి వినియోగించుకుంటూ మిగిలినవి మార్కెట్ చేస్తుంటారు రోశయ్య, ఆవిధంగా తన రెక్కల కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పారు. 5 సెంట్ల స్థలంలో వేసిన గజేంద్ర రకం కంద గతేడాది 400 కిలోల దిగుబyì నీ, రూ.6000 ఆదాయాన్నిచ్చింది. 20 సెంట్ల స్థలంలో పసుపు సాగుతో 300 కిలోల ఎండు పసుపు కొమ్ములు వచ్చాయి. దీనితో క్వింటాలు రూ.6,000 చొప్పున రూ.18 వేలకు అమ్మగలిగారు. ఉసిరికాయలపై ఏటా రూ.1,500 వస్తాయి. పచ్చిగడ్డిని ఆవుకు మేతగా వినియోగిస్తున్నారు. చక చకా కొబ్బరి చెట్లు ఎక్కేస్తున్నారు... కొబ్బరి చెట్టు ఎక్కడం అంత సులువు కాదని తెలిసిందే. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు దింపేవారు లేక చాలామంది వాటిని చెట్లకే వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో వున్నా, కూలీ ఖర్చు ఎక్కువ అడుగుతారు. రోశయ్యకు ఈ ఇబ్బందులేం లేవు సుమా! 73 ఏళ్ల వయసులో కొబ్బరి చెట్టును ఇట్టే ఎక్కేస్తున్నారు. మోకాళ్ల నొప్పి వస్తుందనే భావనతో ఇటీవలే చిన్న నిచ్చెన తెచ్చుకున్నారు. నిచ్చెనతో సగం దూరం వెళ్లాక, అక్కడ్నుంచి కాళ్లకు బంధం తాడు, మొలలో కొడవలి, నోట్లో మోకుతో చెట్టు మొదల్లోకి సునాయాసంగా వెళతారు. ఒక్కో గెలను నరికి, మోకుకు తగిలించి, కిందకు జారవిడుస్తాడు. తర్వాత మరో గెల...మొత్తం పది, పదిహేను నిముషాల్లో కొబ్బరి గెలల దింపుడు పూర్తిచేసి దిగొచ్చాడు. పాలేకర్ సూచనలతో సేంద్రియంలోకి.. అనుకోకుండా 2008లో ఒకరోజు పాలేకర్ సమావేశాలకు హాజరైన రోశయ్య, అప్పట్నుంచి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ప్రకతి వ్యవసాయానికి కీలకమైన ఆవును కొనుగోలు చేశారు. మూడేళ్ల తర్వాత దూడలతో సహా వేరొకరికి లాభానికి విక్రయించారు. మళ్లీ ఒంగోలు జాతి ఆవును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ‘నంది’ని పోలిన రెండు ఆవులను పోషిస్తున్నారు. ఆవు వ్యర్థాలను సేకరించుకొని వాటితో జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నామాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, ఇంగువ ద్రావణం వంటి కషాయాలను సొంతం తయారుచేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తరచూ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ రోశయ్య తగిన సలహాలనిస్తున్నారు. ఐదు అంతస్తుల వ్యవసాయ క్షేత్రం.. పాలేకర్ సూచించిన అయిదు అంతస్తుల సేద్యం లక్ష్యంగా వ్యవసాయం చేస్తున్నట్టు రోశయ్య చెప్పారు. భూమిలోపల దుంప పంటలు, పైన ఎత్తు తక్కువలో కూరగాయలు, తర్వాత నిమ్మ, బొప్పాయి వంటి పంటలు, ఆపైన మామిడి, మునగ వంటివి, చివరగా కొబ్బరి చెట్లతో తన వ్యవసాయక్షేత్రాన్ని ఆ విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. చుట్టూ సరిహద్దులో, మరో వరుసలో కొబ్బరి చెట్లు ఉంటే, మధ్యలో ఒకవైపు కూరగాయలు, దుంప పంటలు, కూరగాయలు పెంచుతున్నారు. మరోవైపు పశుగ్రాసాన్ని సాగుచేస్తున్నారు. మధ్యలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెరుగుతూ ఫలాలను అందిస్తున్నాయి. వ్యవసాయశాఖ ఎన్పీఎం దుకాణాన్ని రోశయ్యకు మంజూరు చేశారు. వివిధ రకాల కషాయాలను తయారుచేసి రైతులకు అందించటం రోశయ్య విధి. ప్రస్తుతం ఇది ప్రారంభంలోనే ఉంది. లీటరుకు రూ.2 మిగులుతున్నట్టు చెప్పారు. ‘ఇద్దరు పిల్లలూ సెటిలయ్యారు.. నాకూ ఆ ఇంటామెకు ఈ 75 సెంట్ల క్షేత్రం ఉంచుకున్నాం. ఆరోగ్యకరమైన çపండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. మేము తింటూ నలుగురికి అందిస్తున్నాం...ఇంతకన్నా కావాల్సిందేముంది’ అంటూ చిరునవ్వు నవ్వారు రోశయ్య. శారీరక శ్రమ గురించి అడిగితే, కష్టపడితేనే కదా! ఫలితం వచ్చేది’ అంటూ ప్రశ్నించి, నేటి తరానికి రోశయ్య (96665 32921) కర్తవ్య నిర్దేశం చేస్తున్నారు!! స్వయంగా చెట్టెక్కికొబ్బరి కాయలు దింపుతున్న 73 ఏళ్ల రైతు రోశయ్య, చెట్లకు నిండుగా నిమ్మకాయలు – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
పిచ్చి మొక్కే కదా అని పీకేస్తే...
దొగ్గలి ఆకు... తెల్ల గర్జల ఆకు... చెన్నంగి ఆకు... పప్పు కూర ఆకు... గునుకు ఉత్తరేణి ఆకు... వీటి పేర్లు విన్నారా? తోటకూర, గోంగూర, పాలకూర ఇవి మాత్రమే ఆకు కూరలని, వీటిని మాత్రమే తినాలని అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది!ప్రకృతిలో చాలా ఆకుకూరలున్నాయి. తెలిసిన వారికి అవి మంచి కూరలు. తెలియని వారికి పిచ్చి కూరలు. ఈ ‘పిచ్చి’ మొక్కలకు ఉన్న రుచి ఏమిటో చూడండి. పప్పు కూర పకోడీ కావలసినవి: పప్పు కూర – రెండు కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి + ఉల్లి పేస్ట్ – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙పప్పుకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో తరిగిన పప్పు కూర వేసి, నూనె మినహా మిగిలిన పదార్థాలన్నీ జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత ఈ పిండిని పకోడీల మాదిరిగా వేసి పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పప్పు కూర పకోడీ సిద్ధమైనట్లే. గునుగు/ ఉత్తరేణి కిచిడీ కావలసినవి: గునుగు/ఉత్తరేణి ఆకు కూర – ఒక కట్ట (రెండు కప్పుల ఆకు); మెంతి కూర – పావు కప్పు; పాల కూర – పావు కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; పచ్చి మిర్చి – 5; పెసర పప్పు – ఒక కప్పు; పుదీనా – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – అర కప్పు; బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని తయారీ: ∙ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో బియ్యం, పప్పులు, పల్లీలు, ఆకు కూరల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙మూత తీసి, కొత్తిమీరతో అలంకరించాలి ∙ఉల్లిపాయ పెరుగు పచ్చడితో అందించాలి. చెన్నంగి పచ్చడి కావలసినవి: చెన్నంగి ఆకు – మూడు కప్పులు; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న చెన్నంగి ఆకు వేసి పచ్చి దనం పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి ∙చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙వేయించి ఉంచుకున్న ఆకు, ఉప్పు జత చేసి మరోమారు మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙రొట్టెలు, అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. గురుమడి ఆకు వేపుడు కావలసినవి: గురు మడి ఆకు – రెండు కప్పులు; పెసర పప్పు – అర కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙గురుమడి ఆకును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి ∙సన్నగా తరగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక గురుమడి ఆకు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ కొద్దిసేపయ్యాక నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఆకు బాగా వేగిందనిపించాక ఉల్లి తరుగు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి మగ్గిన తరవాత దింపేయాలి. ఆకుకూర సజ్జ/జొన్న రొట్టె కావలసినవి: మనకు ఇష్టమైన ఆకు కూర తరుగు – రెండు కప్పులు; జొన్న పిండి లేదా సజ్జ పిండి – నాలుగు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – రొట్టెలు కాల్చడానికి తగినంత తయారీ: ∙ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆకు కూర వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆకు కూర బాగా చల్లారాక సజ్జ పిండి లేదా జొన్న పిండి, ఉప్పు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుంటూ చేతితో రొట్టె మాదిరిగా తయారుచేసి, పెనం మీద వేసి కాల్చాలి. తెల్ల గలిజేరు ఆకు పప్పు కావలసినవి: తెల్ల గలిజేరు ఆకు – ఒక కప్పు; కందిపప్పు లేదా పెసర పప్పు – రెండు కప్పులు; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; ఇంగువ – కొద్దిగా. పోపు కోసం... ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙ముందుగా తెల్ల గలిజేరు కూర ఆకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙ కంది పప్పు లేదా పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు వేయించాలి ∙తరిగి ఉంచుకున్న తెల్ల గలిజేరు కూర ఆకు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙ఆకు కూర బాగా మగ్గిన తరవాత ఉడికించిన పెసర పప్పు/కందిపప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙వేడి వేడి అన్నంలోకి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలలోకి ఈ పప్పు రుచిగా ఉంటుంది. దీనినే పునర్నవ అని కూడా అంటారు. - నిర్వహణ వైజయంతి పురాణపండ -
కలబంద ద్రావణంతో పంటలకు మేలు
ప్రకృతి నేర్పిన పాఠాలను ఆకళింపు చేసుకొని ప్రకృతి/సేంద్రియ సేద్యాన్ని ఔపోశన పట్టి, నేర్చుకున్న విషయాలను పదుగురు రైతులకు తెలియజెపుతూ చక్కని దిగుబడులు రాబడుతున్నారు మహిళా రైతు అప్పన్నగారి యశోదమ్మ. కలబంద వంటి అనేక మొక్కల ద్రావణాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సుపల్లె గ్రామానికి చెందిన యశోదమ్మ స్వతహాగా రైతు. పెట్టుబడిలేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విభాగంలో క్లస్టర్ రిసోర్సు పర్సన్గా పనిచేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి, టమాటా, వంగ, బెండ, మిరప, సొర, బీర తదితర కూరగాయ పంటలు, మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు కలబంద ద్రావణం చక్కటి పరిష్కార మార్గమని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు. కలబంద ద్రావణం తయారీ ఇలా.. 2 కిలోల కలబంద ఆకులను దంచి పెట్టుకోవాలి. అలాగే, పావు కిలో కుంకుడు కాయలను పొడి చేయాలి. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 5 కిలోల ఆవు పేడను సేకరించాలి. వీటిలో ఆవుపేడ తప్ప మిగతా అన్నిటినీ 200 లీటర్ల నీరుపట్టే డ్రమ్ములో వేసి.. తర్వాత ఎంతపడుతుందో అంత నీరు పోయాలి. ఆవు పేడను ఒక పలుచటి గొనె సంచిలో మూటకట్టి నీళ్ల డ్రమ్ములో వేలాడదీయాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద కర్రతో కలియతిప్పాలి. వారం రోజులకు బాగా మురిగితే కలబంద ద్రావణం తయారవుతుంది. ద్రావణం పిచికారీ చేసే సమయంలో 20 లీటర్ల పిచికారీ డ్రమ్ములో 200 మిల్లీ లీటర్ల ద్రావణంతోపాటు 150 గ్రాముల పసుపు పొడి, 150 గ్రాముల రాళ్ల సున్నం వేసి మిగిలిన భాగం నీరు పోసుకొని.. పంట లేత ౖపైరు నుంచి మొగ్గ దశ వరకు ఏ పంటపై అయినా పిచికారీ చేసుకోవచ్చు. పూత సమయంలో పిచికారీ వద్దు పైరు మొలక దశలో 20 లీటర్ల నీటికి 150 మిల్లీ లీటర్లు, పూత దశకంటే ముందు 20 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్లు, పిందె సమయంలో 20 లీటర్ల నీటికి 300 లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పూత విచ్చుకున్న సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ద్రావణం పిచికారీ చేయవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు. పచ్చపురుగు, తెల్లదోమ, రెక్కల పురుగులు, ముఖ్యంగా వరిలో పొడ తెగులు, దోమపోటు, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం నివారిస్తుంది. మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది.. పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ద్రావణం మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కందిరీగలు, తూనీగలు, తేనెటీగలు ఇతర మిత్ర పురుగులు పైరు పైకి వచ్చి చేరతాయి. పంటలో పూత నిలబడేలా దోహదపడుతుంది. íపిందె రాలడం తగ్గుతుంది. టమాటా పంట మూడు నెలలు ముగియగానే పాత మొక్క కింద మళ్లీ కొత్తగా చిగుర్లు వచ్చి యధావిధిగా పంటను ఇస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన పంటలకంటే అధిక దిగుబడి వస్తుందని యశోదమ్మ(88979 31488) ధీమాగా చెబుతున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా కలబంద ద్రావణం -
ఒకే పంట సరికాదు! ఏ పంటైనా దిగుల్లేదు!
ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం.. వీటితో ఏ పంటలోనైనా నిస్సందేహంగా మంచి నికరాదాయం పొందడం సాధ్యమేనా? అని అంటే.. ముమ్మాటికీ సాధ్యమేనంటున్నారు యువ రైతు శ్రీనివాసరెడ్డి. ఏడేళ్ల అనుభవం ఆయనకు ఇచ్చిన భరోసా ఏమిటంటే.. ఏదో ఒక పంటకే రైతు పరిమితం కాకూడదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పంటల/తోటల సరళిని మార్చుకుంటూ వెళ్లడమే ఉత్తమ మార్కెటింగ్ వ్యూహమని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ కరివేపాకు సాగులో.. ఏడాదికి ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నికరాదాయం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ పంటనైనా పండించొచ్చన్న భరోసాతో ఈ యువ రైతు గొప్ప ఆశావహ జీవితాన్ని నిర్మించుకోవడంపై ‘సాగుబడి’ కథనం. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన రైతు బాదం మల్లారెడ్డి, పద్మల కుమారుడైన శ్రీనివాసరెడ్డి బీకాం చదివి మట్టినే నమ్ముకొని జీవితాన్ని పండించుకుంటున్నాడు. తాతల కాలం నాటి 18 ఎకరాల సొంత భూమిలో ఏడేళ్లుగా మనసుపెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యాన పంటల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం.. యూట్యూబులో వీడియోలు చూడటం, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలు చదవడం ద్వారా నేలతల్లి ఆరోగ్యమే రైతు, దేశ సౌభాగ్యమని గుర్తించి తదనుగుణంగా ధైర్యంగా ఏడేళ్ల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో కరివేపాకు, 11 ఎకరాల్లో దానిమ్మ, ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. కివీ పండ్ల సాగుపై తాజాగా దృష్టిసారిస్తున్నారు. కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర ఎకరంలో ఏడేళ్ల క్రితం కరివేపాకు నాటి జీవామృతం, ఘనజీవామృతంతో సాగు ప్రారంభించిన తొలి ఏడాదే సత్ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. బోదె పద్ధతిలో కరివేపాకు సాగు చేపట్టిన శ్రీనివాసరెడ్డి క్రమంగా పదెకరాలకు విస్తరించారు. అయితే, కరివేపాకుకు మార్కెట్ విస్తరించకపోవడంతో గత మూడేళ్లుగా దానిమ్మ వైపు దృష్టి మరల్చారు. కరివేపాకు ఏటా 3 కోతల్లో ఎకరానికి మొత్తం 18 టన్నుల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అత్యధికంగా కిలోకు రూ. 25 ధర పలుకుతుంది. ఎండాకాలంలో హాస్టళ్లు మూతపడతాయి, ఆకు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అడిగే వారే ఉండరు. ఏదేమైనా మొత్తంగా సగటున కిలోకు రూ. పది ధర పలుకుతుందని, ఎకరానికి ఏటా రూ. లక్షన్నర వరకు నికరాదాయం పొందుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రసాయనిక సేద్యంలో రూ. 50 వేలు అధికంగా ఖర్చవుతుందన్నారు. 11 ఎకరాల్లో దానిమ్మ సాగు దానిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని కొందరు రైతులు దానిమ్మ పంటకు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదని నిరాశపరిచారు. అయితే, నిరాశ చెందకుండా మూడేళ్ల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. ఏడాదిన్నర క్రితం 3 ఎకరాలు, 2 నెలల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. రసాయనిక మందులు వాడకుండా జీవామృతం, ద్రావణాలు, కషాయాలతోనే రెండు కోతల్లో ఖర్చులు వచ్చాయి. ఈ దఫా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. బోర్లు అడుగంటి, బావి నీరు కూడా చాలకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో రెండెకరాలు కొనుగోలు చేసి బోర్లు వేసి పైప్లైన్ ద్వారా బావిలోకి ఆ నీటిని తరలించి.. బావి నుంచి 18 ఎకరాలకు డ్రిప్ ద్వారా నీటి తడులు పెడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు శ్రీనివాసరెడ్డి వద్ద ఆరు దేశీ ఆవులున్నాయి. కరివేపాకుకు 15 రోజులకోసారి జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తారు. వారానికోసారి వేపనూనె, నీమాస్త్రం.. 20 రోజులకోసారి ముడినూనెల పిచికారీ చేయడం వల్ల కరివేపాకు మంచి నాణ్యత, రంగు వస్తున్నాయని తెలిపారు. తండ్రి మల్లారెడ్డి ఆవుల సంరక్షణ బాధ్యతలు చూస్తూ కుమారునికి సూచనలు, సలహాలు అందిస్తుంటారు. ఏడేళ్లుగా ప్రకృతి సాగు వల్ల భూసారం పెరిగింది. పొలంలో ఎక్కడ మట్టి తీసి చూసినా తమ విసర్జితాలతో భూసారం పెంచే వానపాములు కనిపిస్తాయి. ఆవుల మూత్రం, పేడతో తానే కాక ఇతరులకు ద్రావణాలు, కషాయాలు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పుడూ ఒకే ఉద్యాన పంటపై ఆధారపడటం కన్నా అనేక పంటలపై దృష్టిపెట్టడం రైతుకు శ్రేయస్కరమని ఆయన విశ్వాసం. ఏడాది క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఇప్పుడు కివీ పండ్ల సాగుపై దృష్టిసారిస్తున్నానన్నాడు. శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రైతులు స్వయంగా వచ్చి, సోషల్ మీడియా ద్వారా కూడా సలహాలు తీసుకుంటూ ఉండటం విశేషం. – మేడగం రామాంజనేయరెడ్డి ,సాక్షి, దర్శి, ప్రకాశం జిల్లా డ్రాగన్ ఫ్రూట్ తోటలో శ్రీనివాసరెడ్డి.. బావిలోకి బోరు నీరు.. పొలం వానపాముల మయం -
ప్రకృతితో దోస్తీ.. మంచిదే!
ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని చాలాకాలంగా తెలుసు. ఈ విషయాన్ని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు. పచ్చటి చెట్ల మధ్య ఎక్కువ కాలం గడపడం గుండెజబ్బులతోపాటు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను అడ్డుకోగలదని, ఒత్తిడిని దూరం చేయగలదని తాము దాదాపు 29 కోట్ల మంది వివరాలను విశ్లేషించడం ద్వారా తెలుసుకున్నామని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్త కామీ ట్వోహిగ్ బెన్నెట్ తెలిపారు. ఇప్పటికే జరిగిన దాదాపు 140 అధ్యయనాలను మరోసారి సమీక్షించడం ద్వారా తమకు ఈ విషయం అర్థమైందని చెప్పారు. సహజసిద్ధమైన లేదా పార్కుల్లాంటి మానవ నిర్మిత పచ్చటి ప్రాంతాలు రెండింటి ద్వారా మన ఆరోగ్యానికి అందే లాభం ఒకేలా ఉందని వీరు తేల్చి చెప్పారు. చెట్లు, పచ్చదనం అందుబాటులో లేనివారి ఆరోగ్యాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎంతో తేడా కనిపించిందని బెన్నెట్ అన్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న వారి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని వివరించారు. పచ్చదనానికి దగ్గరగా ఉన్న వారి ఎంగిలిలో ఒత్తిడిని సూచించే కార్టిసాల్ రసాయనం తక్కువగా ఉందని తెలిపారు. -
మొక్కలే అతడి ప్రాణం..
నెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన ఓ వన ప్రేమికుడు అనువుగాని చోట పెరుగుతున్న చెట్లను సంరక్షిస్తున్నాడు. వివరాలలోకి వెళ్తే... గ్రామానికి చెందిన పరుపాటి ఇంద్రసేనారెడ్డికి చెట్లంటే ప్రాణం. ఈ మేరకు అనువుగాని చోటైన తాటి చెట్ల కొమ్మల్లో పెరుగుతున్న చెట్లకు ప్రాణం పోస్తున్నాడీ వనప్రేమికుడు. పాము చంద్రయ్య, అమ్మ వెంకన్నల సహాయంతో 20 చెట్లను వేర్లతో తీసి అనువైన ప్రదేశాలలో నాటేందుకు సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే గ్రామంలోని ప్రధాన వీధుల వెంట, కస్తూర్భాగాంధీ గురుకులం, ప్రభుత్వం పాఠశాల ఆవరణ, పంచాయతీ కార్యాలయాలలో నాటించారు. ఆయన కృషిని గుర్తించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అటు సేంద్రియ పంటలు ఇటు ఇంటిపంటలు!
‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘ఇంటిపంట’, ప్రకృతి వ్యవసాయ కథనాలతో స్ఫూర్తిపొందిన యలమంచి వంశీ అనే యువరైతు గత రెండేళ్లుగా రసాయనాలు వాడకుండా వరి, మిర్చి సాగుతోపాటు మిద్దె తోటను సాగు చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబానికే కాకుండా బంధుమిత్రులకూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పంటలు అందిస్తూ ఇతరులకు స్ఫూరినిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని ఆంధ్రకేసరి కాలనీ నివాసి అయిన వంశీ.. తన తండ్రి హయాంలో 23 ఏళ్ల క్రితం నిర్మించిన నివాస భవనంపైన రెండేళ్ల క్రితం సిమెంటు బెడ్స్ నిర్మించి మిద్దె తోట పెంచుతూ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు తింటున్నారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టెర్రస్పైన 17 మడులను ఇటుకలతో నిర్మించి సిమెంటు ప్లాస్టింగ్ చేయించారు. టెర్రస్ మీద ఒక అడుగు ఎత్తున ఖాళీ ఉంచి మడులు నిర్మించారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున మడి నిర్మించారు. అడుగు లోతున మట్టి, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని నింపి కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం వంగ, బెండ, దొండ దిగుబడి వస్తోంది. క్యాబేజి, బీట్రూట్ కూడా ఉన్నాయి. ఆపిల్ బెర్ తదితర పండ్ల మొక్కలు కూడా వేశారు. పంచగవ్య, వేస్ట్డీకంపోజర్, జీవామృతం, కషాయాలతో వరి, మిర్చి సాగు చేస్తున్న వంశీ మిద్దె తోటను కూడా శ్రద్ధగా సాగు చేస్తున్నారు. మారుమూల పల్లెటూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఇంటిపైన కూరగాయలు పెంచడం పలువుర్ని ఆకర్షిస్తోంది. సేంద్రియ వరి బియ్యాన్ని, మిర్చి పొడిని హైదరాబాద్లోని ఆర్గానిక్ షాపులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను రుచి చూసిన వారు మళ్లీ అడుగుతుండటంతో మరింత ఉత్సాహం కలుగుతోందని, ఈ ఏడాది ఎకరంలో మిర్చితోపాటు 9 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నానని వంశీ తెలిపారు. గ్రామాల్లో సైతం మిద్దె తోటలు నిర్మించుకుంటే ఎండాకాలం ఇల్లు చల్లగా ఉంటుంది. మిద్దెతోట కూరగాయలను తమ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటున్నారని వంశీ (99089 97969) తెలిపారు. -
అవుట్డోర్తో ఆ వ్యాధులకు చెక్..
లండన్ : పచ్చని తోటల్లో ఆహ్లాదకర వాతావరణంలో విహరిస్తే మానసిక ఉల్లాసమే కాదు మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు సహా చివరికి ఒత్తిడీ దరిచేరదని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. కలివిడిగా ఉండటం మానసిక, శారీరక ఆరోగ్యాలపై పెనుప్రభావం చూపుతుందని ఈ భారీ సర్వేలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అథ్యయనం నేపథ్యంలో పచ్చని వాతావరణంలో గడపాలని రోగులకు ఇక వైద్యులు సూచించే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్తో పాటు దాదాపు 20 దేశాలకు చెందిన కోట్లాది మందిపై జరిపిన పరిశోధన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిగ్గుతేల్చారు. ప్రకృతి సహజమైన పచ్చిక బయళ్లలో సమయం గడపడం ద్వారా అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని తమ సర్వేలో వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. ప్రకృతి ఒడిలోఅధిక సమయం వెచ్చించడం ద్వారా టైప్ టూ డయాబెటిస్, గుండె జబ్బులు, అకాల మరణం ముప్పును నిరోధించవచ్చని, నిద్ర లేమిని నివారించవచ్చని అథ్యయన రచయిత కోమి బెన్నెట్ పేర్కొన్నారు. పార్కులు, ఉద్యానవనాలు, పచ్చికబయళ్లతో కూడిన సహజమైన ప్రకృతితో సహవాసం హృదయ స్పందనలను సమన్వయం చేయడంతో పాటు ఒత్తిడినీ దూరం చేస్తుందన్నారు. ప్రకృతి ఒడిలో సేదదీరే వారు సహజంగానే శారీరక శ్రమతో పాటు నలుగురితో కలివిడిగా ఉంటారని ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. సహజసిద్ధమైన వాతావరణంలో ఉండే వైవిధ్య బ్యాక్టీరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వాపులను నిరోధిస్తాయన్నారు. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ జర్నల్లో తాజా అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
కందకాలతో నీటి లభ్యత పెరిగింది!
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు. 3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు. -
ఏనుగుల ప్రవృత్తి ఇలా ఉందేం?!
ప్రకృతిలో కనిపించే కొన్ని ప్రతిచర్యలూ, ప్రవృత్తులు వింతగా అనిపిస్తుంటాయి. ఇదేమిటి.. ఇలా జరుగుతుందేమిటి అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఉదా : అడవి పచ్చగా లేనప్పుడు ఆహారం కోసం ఏనుగులు అలమటిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలై చెట్లు పచ్చబారగానే ఆ లేత చిగుళ్లు తినేటప్పుడు వాటి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. చిగురిస్తూ పక్కలకు పెరిగే ఆ కొమ్మల్ని అడ్డంగా విరిచేస్తుంటాయవి. కొన్నిసార్లయితే కొన్ని మొక్కలకు మొక్కల్నే పెరికి అవతల పారేస్తుంటాయి. వేసవిలో ఆహారం అంతగా దొరకనప్పుడు అంతకంతకూ అలమటించిపోయాయి కదా.. మరి ఇప్పుడు హాయిగా ఆ లేత చిగుర్ల మేతను మేయవచ్చు కదా. మనిషి మరో ముద్ద ఎక్కువ తిన్నట్టు... కావాలంటే ఏనుగూ మరో కొమ్మ ఎక్కువ తినవచ్చు. కానీ ఏమిటీ వృథా? అందునా ఏనుగులు చాలా తెలివైనవి. ఒక్కసారి తాము పడిన కష్టాన్నీ... ఒక్కసారి తమకు దొరికిన నీటి వనరును ఎన్నడూ మరచిపోవు. ఎప్పుడూ గుర్తుంచుకుంటాయి. ఆ కష్టకాలపు అనుభవంతో రాటుదేలి, మరో సీజన్కు అదే కష్టం రాకుండా జాగ్రత్తపడతాయి. మరి ఇంతటి జాగ్రత్తపరుల చేత ఈ దుందుడుకు వ్యవహారాన్ని ఎందుకు చేయిస్తుంది ప్రకృతి? ఎందుకంటే.. మరుసటి ఏడాదికి మరో తరం పుట్టుకొస్తుంది. అవి ఏనుగులు మాత్రమే కాదు... మరెన్నో జీవరాశుల సంతానాలు! వాటన్నింటికీ తగినన్ని చెట్లూ, ఆకులూ, తద్వారా వచ్చే పండ్లూ ఫలాలూ కావద్దూ?! అందుకే ఏనుగులు చిన్నా చితకా చెట్లను పీకిపారేస్తాయి. అలా మరిన్ని అదనపు చెట్లకు అవసరమైన నేలను తయారు చేస్తాయి. సూర్యకాంతికి అడ్డొస్తున్న పక్కలకు పాకే కొమ్మలను విరిచేస్తాయి. తద్వారా ఆ కాంతి సువిశాలమైన స్థలంలోకి ధారాళంగా వచ్చేలా చేస్తాయి. ఇలా మరిన్ని ఫలవంతమైన వృక్షాలకు అనువైన నేలను తయారు చేస్తాయి. తమతో పాటు మరిన్ని జీవులకు అవసరమైన ఆహారం కోసం... అదనపు ఫలాల కాపుకు రంగం సిద్ధం చేస్తాయి. విధ్వంస ప్రక్రియల్లోను, విరిచేసే ప్రక్రియల్లోనూ మరెన్నో జీవరాశులకు మేలు చేసే గుణాన్ని ఇన్స్టింక్ట్ ద్వారా దేవుడు ఏనుగు లాంటి జంతువులకు ఇచ్చాడు. విధ్వంసం సరే... మరి నిర్మాణాత్మకమైన పనులు చేస్తాడన్న పేరున్న మనిషికి ఇచ్చిన విచక్షణ ఏమిటి? దాంతో అతడు చేస్తున్నదేమిటి? ఆలోచించాలి. ఒక చెట్టును నరికేముందు వంద చెట్ల మొక్కలను నాటేందుకు ఆలోచించే పనేముంది?! -
కట్నంగా 1001 మొక్కలు
కేంద్రపర (ఒడిషా): ఒడిషాలోని కేంద్రపర జిల్లాలో ఓ ప్రకృతి ప్రేమికుడు కట్నానికి బదులుగా 1001 మొక్కలు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి అందుకున్నాడు. 33 ఏళ్ల సరోజ్కాంత బిశ్వాల్ అనే ఈ స్కూల్ టీచర్ ఈ విధంగా ప్రకృతిపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. కట్నానికి తాను బద్ధ వ్యతిరేకినని, దానికి బదులుగా తనకు ఈ పండ్ల మొక్కలు ఇవ్వాలని వధువు తరఫు వారిని కోరినట్లు బిశ్వాల్ చెప్పారు. శనివారం ఆయన వివాహం జరిగింది. బిశ్వాల్ వివాహం టపాసులు కాల్చడం లాంటి ఆడంబరాలు లేకుండా జరిగిందని వధువు గ్రామస్తులు చెప్పారు. కట్నం నిరాకరించి, ఇలా మొక్కలు తీసుకోవడం తన భార్య రష్మిరేఖకు చాలా సంతోషం కలిగించిందని బిశ్వాల్ చెప్పారు. రష్మిరేఖ కూడా ఉపాధ్యాయురాలే. -
నాన్ బీటీ.. నాదే విత్తనం!
విత్తనమే లేకుంటే వ్యవసాయమే లేదు. పది వేల సంవత్సరాల క్రితం నుంచీ రైతులు తాము పండించిన పంటలో నుంచే మెరుగైన విత్తనాన్ని సేకరించి దాచుకుని.. తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇతర రైతులతో విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అమ్ముతున్నారు. ఇది రైతుకున్న హక్కు. విత్తన సార్వభౌమత్వమే రైతు స్వాతంత్య్రానికి ప్రాణాధారం. అయితే, విత్తనం కంపెనీల సొత్తుగా మారిపోయిన ఆధునిక కాలంలోనూ.. విత్తనం కోసం అంగడికి పోకుండా.. తమదైన సొంత విత్తనాన్ని అపురూపంగా కాపాడుకుంటున్న రైతు కుటుంబాలు లేకపోలేదు. వరి వంటి పంటల్లో సొంత విత్తనాన్నే వాడుకుంటున్న రైతులు చాలా చోట్ల కనిపిస్తారు. అయితే, ఆశ్చర్యకరమేమిటంటే ఏళ్ల తరబడీ పత్తి, మిర్చి పంటల విత్తనాలూ సొంతవే వాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు తీస్తున్న కుటుంబాలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన రైతు దంపతులు లావణ్య, రమణారెడ్డి! రమణారెడ్డి, లావణ్య దంపతుల స్వగ్రామం కారువంక(నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం). ఇతర పంటలతోపాటు గత 29 ఏళ్లుగా పత్తి పండిస్తున్న కుటుంబం ఇది. గత ఎనిమిదేళ్లుగా పత్తి, మిర్చి పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటూ రైతు లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పత్తిని వర్షాధారంగా, మిర్చిని డ్రిప్తో సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై పొలం పనులు చేసుకోవడం వీరి అలవాటు. 2010 నుంచి సుభాష్ పాలేకర్ చూపిన బాటలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నాన్ బీటీ సూటిరకం లోకల్ పత్తి విత్తనాన్నే గత ఎనిమిదేళ్లుగా వాడుతున్నారు. తమ పత్తి పంటలో 2,3 విడతల తీతల్లో నాణ్యత ఉన్న చెట్ల నుంచి దూదిని సేకరించి విత్తనం కోసం వేరుగా పక్కన పెట్టుకుంటారు. దగ్గర్లోని జిన్నింగ్ మిల్లులో ఆ పత్తిని జిన్నింగ్ చేయించి, గింజలను శుద్ధి చేయించి ఇంటికి తెచ్చుకుని తర్వాత పంట కాలంలో విత్తుకుంటారు. క్వింటా పత్తి నుంచి 65 కిలోల వరకు విత్తనాలు వస్తాయని, వాటిని శుద్ధి చేయించి ప్రతి ఏటా విత్తుకుంటున్నామని రమణారెడ్డి తెలిపారు. మార్కెట్లో కంపెనీలు అమ్మే జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కొనుగోలు చేయకుండా పత్తిని సైతం తన సొంత నాన్బీటీ సూటి విత్తనంతోనే సాగు చేస్తున్నామని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు.. ఏవీ వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులన్నీ కలిపి 16 ఉన్నాయి. ఎకరానికి ఘనజీవామృతం మొత్తం 600 కిలోలు, 400 లీ. ద్రవ జీవామృతం, అవసరం మేరకు కషాయాలు వాడుతున్నారు. ప్రతి పది పత్తి సాళ్లకు ఒక సాలు కందిని విత్తుతున్నారు. ఘనజీవామృతం దుక్కి ఎకరానికి వంద కిలోలు వేస్తారు. జీవామృతాన్ని నెలకోసారి పది రెట్లు నీటితో కలిపి మొక్కకు పోస్తారు, నెలకోసారి పిచికారీ చేస్తారు. దీపావళి రోజుల్లో పత్తిలో ఆవాలను అంతరపంటగా చల్లుతారు. తమ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బెడద అసలు లేకపోవడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎకరానికి వర్షాధారంగా 12–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందుతున్నారు. గత ఏడాది 18 ఎకరాల్లో అధిక వర్షాల కారణంగా కొంత నష్టం జరగడంతో 219 క్వింటాళ్ల (ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున) పత్తి దిగుబడి వచ్చిందని రమణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఈ ఏడాది 10 ఎకరాల్లో నాన్ బీటీ పత్తిని ఇప్పటికే విత్తామని, మరో పదెకరాల్లో త్వరలో విత్తబోతున్నామని చెప్పారు. రోహిణీ కార్తెలోనే విత్తుకోవడం..! రోహిణీ కార్తెలో వర్షానికి ముందే తాము ఎకరానికి 3 కిలోల విత్తనాన్ని సాళ్లుగా విత్తుకుంటామని, అధిక దిగుబడి పొందడానికి ఇదే ముఖ్యకారణమని రమణారెడ్డి చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు సరిగ్గా లేక విత్తనంలో సగం మొలిచినా మంచి దిగుబడే వస్తున్నదని, ఇది గత ఎనిమిదేళ్లుగా తమ అనుభవమని ఆయన అంటున్నారు. తమ సొంత విత్తనమే కాబట్టి పూర్తిగా మొలవకపోయినా మళ్లీ విత్తనం వేసుకోవచ్చన్న భరోసా వీరిలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తమకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని అంటున్నారాయన. ఆరుద్రలో మిరప, వరి నారు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎండు మిరపను డ్రిప్తో సొంత విత్తనంతో సాగు చేస్తూ.. ఎకరానికి 30–36 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందుతూ రమణారెడ్డి, లావణ్య తమ ప్రత్యేకత చాటుతున్నారు. నాగపూర్లో ఒక రైతు నుంచి గత 14 ఏళ్ల క్రితం హర్షవర్ధిని మిరప విత్తనాన్ని తెచ్చారు. 2,3 కోతల్లో మంచి నాణ్యతతో ఉన్న కాయలను విత్తనానికి పక్కన పెట్టుకుంటూ.. ఇప్పటికీ అదే వంగడం వాడుకుంటున్నామని తెలిపారు. 9 నెలల పంటకాలంలో 5 విడతలుగా ఎకరానికి 2 నుంచి 4 టన్నుల వరకు ఘనజీవామృతం వేస్తారు. 5 విడతల్లో ఎకరానికి వెయ్యి లీ. ద్రవజీవామృతం ఇస్తున్నారు. గత ఏడాది 3 ఎకరాల్లో ఎండు మిరప సాగు చేశారు. ఆరుద్ర కార్తెలో మిరప, వరి నార్లు పోసుకుని నాటు వేస్తారు. మొదట్లోనే మిర్చి పొలం చుట్టూ ఎర పంటగా ఆవాలు చల్లడం ద్వారా పురుగుల తాకిడిని అదుపు చేస్తున్నారు. మొక్కనాటిన 3 నెలల తర్వాత ధనియాలు, మెంతులు, గోధుమలు, పప్పుశనగ వంటి స్వల్పకాలిక అంతర పంటల విత్తనాలు చలుతున్నారు. గత ఏడాది ఎకరానికి 30 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీశామని రమణారెడ్డి(99513 41819) వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో అనుసరిస్తే నాన్బీటీ సూటిరకం పత్తి, మిరప పంటలను కూడా నిశ్చింతగా సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చని ఈ రైతు దంపతులు చెబుతున్నారు. ఇదేమి చోద్యం?! రమణారెడ్డి, లావణ్య గత 8 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో చేస్తున్న సఫల ప్రయోగాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్పైసెస్ బోర్డు పట్టించుకున్న దాఖలాల్లేవు. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ముఖ్యమైన వాణిజ్య పంటలపై 8 ఏళ్ల క్షేత్రస్థాయి ఆదర్శ సేద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విడ్డూరం! -
వెరైటీగా ఉంది.. సెహ్వాగ్ వీడియో వైరల్
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ప్రకృతి గురించి ఆలోచించాలంటూ ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు తరచుగా చెబుతుంటారు. ఈ క్రమంలో సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెక్క(కట్టె)తో రూపొందించిన బైక్పై వెళ్తుండగా ఈ వీడియో తీశారు. బైకు మీద వెళ్తున్న వ్యక్తికి తన బైక్తో పాటు ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టమంటూ ట్వీట్ చేశారు. కచ్చితంగా వాడాల్సిన పార్ట్స్ మినహా ఇతర బైక్ విడి భాగాలు చెక్కతో తయారు చేశారు. ప్రకృతితో కలిసి ఉంటున్న భావన కలగాలని అతడు ఈ బైక్ వాడుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, చెట్లను కొట్టివేసి బైకును తయారుచేశారు కదా అని మరికొందరు ట్వీట్లు మొదలుపెట్టారు. Bike se pyaar , Nature se bhi pyaar ! pic.twitter.com/Qxn0ckGrea — Virender Sehwag (@virendersehwag) 8 June 2018 -
చెక్క బైక్పై సెహ్వాగ్
-
యూట్యూబ్ సేద్యం
తాము బాగుండాలి. భూమి బాగుండాలి. సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో యువ రైతు సోదరులు దండవేని నరేష్, సురేష్ నడుము బిగించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో తల్లిదండ్రులు తోటి రైతుల మాదిరిగానే విరివిగా రసాయనిక ఎరువులు వాడటంతో భూమి తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీళ్లు లేక పంటలు పండలేదు. దీంతో, ఇంటి అప్పులు వడ్డీలతో కలిపి రూ.16 లక్షలకు పెరిగాయి. డిగ్రీ చదివిన అన్న నరేష్ దుబాయ్ వెళ్లాడు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు సురేష్ పదో తరగతి పూర్తి చేసి, రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తుండేవాడు. తదనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని ఆచరించడం మొదలుపెట్టారు. పిచ్చోడని ఇంట్లో వాళ్లే తిట్టారు..! ప్రకృతి సాగు పద్ధతిలో తొలి రెండేళ్లు అంతంతమాత్రంగానే పంట పండింది. ఆ ఏడాది పంటలకు ధరలు బాగున్నాయి. దీంతో, ఇంట్లోవాళ్లు ఇదేం పద్దతి, పంట కూడా రావడం లేదని, ఇద్దరు అన్నదమ్ములు పిచ్చోళ్లమాదిరిగా తయారయ్యారు అంటూ తిట్టారు. మా ఊరోళ్లు అయితే, ఈ పద్దతిలో మీరు వ్యవసాయం చేస్తే ఉన్న భూమి అమ్ముడు ఖాయం అంటూ ముఖం మీదే చెప్పడం చేసారు. అయినప్పటికి, మేము చేసే పనులను మేము చేసుకుంటూ పోయేవాళ్లం. గత రెండేళ్ల నుండి మిగత రైతులు పొలాలకు ఏదో ఒక జబ్బు వచ్చి పంట పోయేది. కానీ మా పొలంలో ఎప్పుడూ దెబ్బతినలేదు. ఇది చూసిన తర్వాత మా మీద నమ్మకం కుదిరి కుటుంబసభ్యులు సహకరించడం మొదలుపెట్టారు. పందిళ్ల కింద కూడా తోటలు.. గత నాలుగేళ్లుగా 2 ఎకరాలలో మామిడి, 4 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మూడు ఆవుల మూత్రం, పేడతో ఘనజీవామృతం, జీవామృతం తయారు చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం వాడతున్నారు.బీరకాయ, సొరకాయ, కాకర కాయలను పందిరి పద్దతిలో సాగు చేస్తున్నారు. ఆ పందిళ్ల కింద పాలకూర, తోటకూర, టమాట, బెండ, గోరు చిక్కుడు సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే 20 శాతం అదనపు ధరకు అమ్ముతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నువ్వులను కూడా విక్రయిస్తున్నారు. వాకింగ్ క్లబ్ల వద్ద కూడా రసాయన అవశేషాల్లేని తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. మట్టి ద్రావణం.. సీవీఆర్ పద్ధతిలో భూమి పై నుంచి సేకరించిన 7 కిలోల మట్టి, భూమి 2 అడుగుల లోతు నుంచి తీసిన 7 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలపాలి. కొంత సేపటి తర్వాత, గుడ్డతో ఆ మట్టి ద్రావణాన్ని వడపోసి పంటలపై పిచికారీ చేస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా తయారు చేసిన మట్టి ద్రావణాన్ని వరి, కూరగాయలు, పండ్ల తోటలకు పిచికారీ చేస్తున్నారు. ఫిష్ అమినోయాసిడ్ ద్రావణం: కిలో చేపల(పనికిరాని వ్యర్థాల)ను చిన్న ముక్కలు చేసి, వీటికి కిలో బెల్లం కలిపి డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 15 రోజుల తర్వాత గుడ్డలో వడపోసి, వచ్చిన ద్రావణాన్ని కూరగాయలు, వరి పొలానికి పిచికారీ చేస్తున్నారు. మొక్కల పెరుగుదలకు ల్యాబ్ కుండలో బియ్యం కడిగిన నీరు ఒక లీటరుకు 3 లీటర్ల అవు పాలను కలిపి.. నాలుగు రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల పైన పెరుగు గడ్డలాగా పేరుకుంటుంది. దాన్ని తీసివేసి కింది ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా(లాబ్) అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కూరగాయల సాగు ఇలా.. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎకరానికి వంద కిలోల చొప్పున దుక్కిలో చల్లారు. కూరగాయ çపంటలపై ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రం, అగ్నిస్త్రం, దశపత్ర కషాయాలతో తెగుళ్లను నియంత్రించారు. మొక్కల పెరుగుదలకు ‘ల్యాబ్’ను ఉపయోగించడంతో కూరగాయలు ఏపుగా పెరుగుతున్నాయి. వరి పంట కోసం... వరి పొలం దుక్కిలో ఘనజీవామృతం వాడారు. ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తున్నారు. నెల రోజుల తర్వాత ఫిష్ అమినోయాసిడ్ను పిచికారీ చేశారు. మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడింది. మొగి పురుగు నివారణకు నీమాస్త్రం, అగ్నిస్త్రం వాడారు. వరి పొట్ట దశలో సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మామిడి పంటకు.. ప్రతి 20 రోజుల కొకసారి డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నారు. పూత దశలో జీవామృతాన్ని పిచికారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, దశపర్ణ కషాయం, వరి పిండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. మామిడి చెట్ల మొదళ్ల దగ్గర తేమ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు పసుపు ఆకును ఆచ్ఛాదనగా వేశారు. పసుపు ఆకు తేమను కాపాడటంతో పాటు నెమ్మదిగా కుళ్లి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మా తోట వద్దకు వచ్చి చూడమంటాం! గతంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడి చేతులు కాల్చుకున్నాం. మూడు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పండించిన కూరగాయలు, బియ్యం తదితర ఉత్పత్తులను నేరుగా జనం వద్దకే వెళ్లి అమ్ముకుంటున్నాం. రసాయనాలు వాడకుండా పండించినవేనా అన్న అనుమానం ఉంటే.. వచ్చి మా తోటను చూడండని చెబుతుంటాం. ప్రతి రైతూ కొద్ది భాగంలోనైనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇది భూమికి, రైతుకు.. అందరికీ మంచిది. ఆరోగ్యకరమైన సమాజమే మా లక్ష్యం. – దండవేని నరేష్, సురేష్ (96409 63372) అల్లీపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల, ఫొటో: ఏలేటి శైలేందర్ రెడ్డి -
చందనపు చల్లన
వేసవి ఊపు మీద ఉంది. సూరన్న శివాలూగుతున్నాడు. రానున్న రెండు మూడు వారాలు కీలకమైనవి. జాగ్రత్త పడాల్సినవి. సూర్యుడి వేడి ప్రకృతికి ఒక సహజ అవసరం. ఈ సహజ అవసరంలోని తీవ్ర క్షణాలను సహజ రక్షణ కవచాలతోనే మనం ఎదుర్కోవాలి. అందుకు ఏం చేయాలి. వినండి.ఇంట్లోనే ఉన్నాం కదా అని సరిగా నీళ్లు తాగకుండా ఉండకూడదు. నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోతే నిద్ర లేమి, అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. కీర దోస, పుచ్చకాయ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, రాగి జావ వంటివి తీసుకుంటూ, కాఫీ, టీలను తగ్గించాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎండగా ఉన్నప్పుడు చల్లని పండ్ల రసాలు గొంతులోకి దిగుతుంటే, చల్లగా హాయిగా అనుభూతి కలుగుతుంది. అలాగని ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సోడా నీరు, శీతల పానీయాలు, ఐస్క్రీముల జోలికి పోకూడదు. పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహారక మందు ఎంత ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్ల వంటివి. తినడానికి ముందు వాటిని ఉప్పు నీటిలో రెండు సార్లు నానబెట్టి, శుభ్రపరచుకోవాలి. ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన శీతల పానీయం కొబ్బరిబొండం. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే, ఎండవల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. గ్లాసుడు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను తేనె వేసి బాగా కలిపి తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.నారింజ లేదా కమలాపండ్ల రసం తీసి, అందులో కొద్దిగా పంచదార, తేనె కలిపి తాగితే కడుపు చల్లగా అవుతుంది. వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కీర దోసకాయ రసం తీసి, చెంచాడు తేనె, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.గుప్పెడు పుదీనా ఆకులు, చెంచాడు తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి మెత్తగా చేసి స్మూతీలా తీసుకుంటే మంచిది. నాలుగు పుచ్చకాయ ముక్కలను జ్యూస్గా తీసి అలాగే తాగడం మంచిది. ∙ జామకాయ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. రసం తీసేటప్పుడు విత్తనాలను తొలగించడం మంచిది. ∙ అన్నిటి కంటె మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి, మరింత ఎక్కువగా నీళ్లు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. వేసవిని ఆయుర్వేదం ఆదాన కాలం అంటుంది. ఈ కాలంలో సూర్యుడు ప్రాణుల నుంచి శక్తిని తీసుకుంటాడు కాబట్టి దానికి ఆ పేరు. ఈ శక్తిని మళ్లీ సమకూర్చుకోవడం ఎలాగో ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలంలో వచ్చే మూత్రంలో మంట, అతిసారం లాంటి అనేక వ్యాధుల్ని వాటి నివారణను సూచిస్తుంది.పళ్లరసాలు తాగిన వెంటనే వాటి దోషాల నివారణగా కొద్దిగా వేడి నీళ్లలో శొంఠి, మిరియాల పొడి (ఒక్కొక్కటి చిటికెడు) కలిపి తాగాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే టోపీ కాని గొడుగు కాని వాడాలి.షడంగ పానీయంచందనం (మంచి గంధం), ముస్తా (తుంగ ముస్తలు), ఉశీరం (వట్టి వేరు) ఉదీచ్య (కురువేరు) నాగర (శొంఠి), పర్పాటక... వీటిని దంచి కషాయం కాచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నకషాయాన్ని 30 మి.లీ. తీసుకుని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రి) కలిపి రోజూ తాగాలి.జంబీర పానీయం: గ్లాసుడు నీటిలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచాడు నిమ్మరసం, నాలుగు చెంచాల శర్కర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.తక్ర పానీయం: పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగొట్టి రోజుకి రెండు మూడుసార్లు తాగాలి. – వి. ఎల్. ఎన్. శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు -
‘ఇంటిపంట’ స్ఫూర్తితో బడిపంట!
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం.. ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు. ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు. అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు! మా ఇంటిపంటల రుచి బాగుంది! ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా. – షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా.. స్కూల్లో గ్రోబ్యాగ్స్లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను. – వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది. హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా! మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా. ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు చైతన్యం కోసమే ‘బడిపంట’! సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం. షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అడవిలో చల్లని తల్లి!
ఆమె చేయి చలవ. ఎంత చలవంటే.. ఎంతటి విషమైనా కళ్లు తేలేయాల్సిందే! ఆకులను రెండు చేతులతో నలిపి రసం పిండిందంటే.. ఏ జబ్బయినా ఇట్టే తట్టా బుట్టా సర్దేయాల్సిందే. అది కేవలం ఆమె నిండు మనసుతో ఇచ్చే మందు శక్తి మాత్రమే కాదు. ఆమె నోటి నుంచి జాలువారే చల్లని మాటలు రోగులకు కొండంత ధైర్యాన్నిస్తాయి. తాము త్వరలోనే కోలుకుంటామన్న భరోసానిస్తాయి. అందుకే అందరూ ఆమెను ‘అడవిలో అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు లక్ష్మీ కుట్టి. 75 ఏళ్లు. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లార్ అటవీ ప్రాంతంలో కొండకోనల్లో తాటాకు గుడిసే ఆమె నివాసం.పురుగో, పుట్రో, పామో, తేలో కుట్టిందంటే.. ఎక్కడెక్కడి నుంచో కొండలు ఎక్కి మరీ లక్ష్మీ కుట్టి దగ్గరకు వస్తుంటారు కేరళవాసులు. లక్ష్మీ కుట్టికి అడవి అన్నా, ఔషధ మొక్కలన్నా పంచప్రాణాలు. 50వ దశకంలో చదువుకున్న తొలి గిరిజన బాలిక ఆమే. తండ్రి చదువెందుకన్నా.. పట్టుపట్టి బడికెళ్లింది. రోజూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి కష్టపడి చదువుకుంది. ఆ బడిలో 8వ తరగతి వరకే ఉండటంతో అక్కడితో చదువు ఆగిపోయింది. తల్లి దగ్గర్నుంచి వైద్యం అడవిలోని కనీసం 500 రకాల వ్యాధులు, రుగ్మతలకు మూలికా వైద్యం చేయటం లక్ష్మీ కుట్టి ప్రత్యేకత. అయితే, పాము లేదా తేలు కుట్టిన సమస్యలతోనే ఎక్కువ మంది తన దగ్గరకు వస్తున్నారని ఆమె అంటారు. తన తల్లి దగ్గరి నుంచే ఈ వైద్యం నేర్చుకున్నానని, ఒక్కటి కూడా మరచిపోలేదంటారు. అయితే, ఈ వందలాది ఔషధ మొక్కల గుణగణాల గురించి, వైద్య పద్ధతుల గురించి ఇప్పటి వరకు ఎక్కడా రాసి పెట్టలేదు. ఇది గమనించిన కేరళ అటవీ శాఖ అరుదైన ఈ సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని గ్రంధస్థం చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు లక్ష్మీ కుట్టి సహకారం తీసుకుంటోంది. ప్రకృతి నుంచి ఫార్మసీ ఈ అడవి బామ్మను వెతుక్కుంటూ అవార్డులు వచ్చాయి. 1995లో తొలిగా ‘నాటు వైద్య రత్న’ అవార్డుతో కేరళ ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు వచ్చిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా జనం ఆమె వద్దకు వైద్యం కోసం వస్తున్నారు. అవార్డుల పరంపరలో తాజాది భారతీయ జీవవైవిధ్య కాంగ్రెస్ అవార్డు(2016). తనతోపాటు రోజూ బడికి వచ్చి చదువుకున్న మేనబావ మతన్ కానిని 16వ ఏట ఆమె పెళ్లాడింది. ‘నేను తీసుకున్న నిర్ణయాల్లో, సాధించిన విజయాలన్నిటిలోనూ ఆయన నాకు తోడు నీడగా ఉన్నాడు. నేను లేకపోయినా నువ్వు ఇవన్నీ సాధించేదానివే. ఎందుకంటే నువ్వు అంతటి ధీర వనితవు అని అంటూ ఉండేవాడు. ‘‘గత ఏడాది చనిపోయే వరకు నాకు సరైన జీవిత భాగస్వామిగా ఉన్నాడు’ అందామె. వారికి ముగ్గురు మగ సంతానం. విషాదం ఏమిటంటే పెద్ద కొడుకును ఏనుగు చంపేసింది. చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యాడు. (రెండో కొడుకు రైల్వే చీఫ్ టిక్కెట్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు). అయినా ఆమె కుంగిపోలేదు, అడవినీ, వైద్యాన్నీ వదల్లేదు. వ్యంగ్య రచయిత్రి కూడా! లక్ష్మీ కుట్టి మూలికా వైద్యురాలిగా మాత్రమే కాదు, వ్యంగ్యం పండించిన కవిగా, రచయిత్రిగా కూడా కేరళలో ప్రసిద్ధి పొందారు! గిరిజన సంస్కృతీ సంప్రదాయాల గురించి, అడవుల ప్రాముఖ్యత గురించి ఆమె వ్యాసాలు రాశారు. వీటి సంకలనం ప్రచురితమైంది. ‘వీటిని గిరిజన భాషలో కాదు, మళయాళంలోనే రాశాను. అలతి పదాలనే వాడాను. పామరులైనా సులువుగా పాడుకునేలా’ అంటారామె. ‘ఈ అడవే నా ప్రపంచం. బయటి ప్రపంచం నాకు చాలానే ఇచ్చింది. అవార్డులు, సత్కారాలతోపాటు పుస్తకాలనూ ఇచ్చింది. అయినా, నేను అడవిని వదలి బయటికి రాలేను. అడవిలో జీవించాలంటే, ధైర్యం ఉండాలి’ అంటున్నది ఒంటరిగానే అడవిలోనే ఉంటున్న ఈ బామ్మగారు. – పంతంగి రాంబాబు -
భేరుండ బ్రహ్మాండ
గండ భేరుండం అంటే చాలా పెద్దది.. గొప్పది అని అర్థం.పట్టు, డిజైనర్ చీరల మీద.. ఆభరణాల మీదగండభేరుండ చిహ్నం గొప్ప లుక్ని, గ్రాండ్నెస్ని తీసుకొస్తుంది.రాచరికపు హంగు ఈ చిహ్నం సొంతం. అందుకే ఇప్పుడు ఫ్యాషన్ ఆకాశంలో గండభేరుండం ఎగురుతోంది.కొన్నిసార్లు జీవితంలో అంతగా పట్టింపులేని, పట్టించుకోని అంశాల వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. వాటి పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నంలో కళాకారుల సృష్టి వెనక దాగున్న ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఆ కోవకి చెందినదే గండభేరుండ. వస్త్రాల మీద, ఆభరణాల పైనా గ్రాండ్గా కొలువు దీరుతోంది. ఒక శరీరం రెండుతలలు గండభేరుండ అనేది రెండుతలల పక్షి. ఈ పక్షి ప్రాచీనకాలంలో ఉన్నట్లు రుజువులు లేవు. ఇదొక పౌరాణిక గాధ అని చెబుతారు. వేల ఏళ్ల క్రితం గండభేరుండకు సంబంధించి కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో– రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభ మృగ రూపం ధరించాడని, దానిని ఎదిరించేందుకు నరసింహస్వామి అయిన విష్ణువు రెండుతలలతో, విశాలమైన రెక్కలతో, పదునైన కోరలతో, నల్లని రూపంతో గండభేరుండంలా అవతరించాడని.. అది గరుత్మంతునికన్నా బలమైనదని కథనాలు ఉన్నాయి. కర్నాటకలోని బేలూర్లో గల చెన్నకేశవాలయంలో గల గండభేరుండ శిల్పాకృతి ప్రకృతిలోని జీవులన్నింటిలో గండభేరుండం బలమైనదని చాటుతుంది. గ్రాండ్గా ఆవిష్కరించారు దక్షిణభారతదేశంలో గండభేరుండకు గల ఘనమైన ఖ్యాతి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. దేవాలయాల మీద, చారిత్రక కట్టడాల మీద రాచరికానికి హంగుగా ఉన్న భేరుండాన్ని పట్టుదారాలతో చీరల మీద చిత్రించారు నేతకారులు. అపారమైన దైవశక్తికి ప్రతీకగా ఉండే గండభేరుండం డిజైన్తో పల్లూ మొత్తం నింపేశారు. మోటిఫ్స్గా చిన్న చిన్న భేరుండ బొమ్మలను తీసుకున్నారు. ఆభరణాలలో భేరుండం స్వర్ణకారుల ఆభరణాలలోనూ గండభేరుండం అందంగా అమరింది. ముత్యాలు, రత్నాలతో ముచ్చటైన రూపం సంతరించుకుంది. ఘన చరిత గల గండభేరుండ డిజైన్ ఉన్న చీర ఒక్కటైనా∙వార్డ్రోబ్లో ఉండాలని, తమ ఆభరణాలలో చిన్న రూపుగా అయినా కావాలని కోరుకుంటున్నారు. ప్రాచీన కళలోని గ్రాండ్నెస్ను ఇష్టపడుతున్నారు కనుకే గండభేరుండ గ్రాండ్గా వెలిగిపోతోంది. రాచరికపు హంగు కర్నాటకలోని వొడయార్ రాజుల పాలనలో తమ రాజ్యశక్తికి గండభేరుండ చిహ్నాన్ని వాడేవారు. స్వాతంత్య్రానంతరం కర్నాటక ప్రభుత్వం గండభేరుండ పక్షిని తమ రాష్ట్ర అధికారిక చిహ్నంగా తీసుకుంది. మైసూర్ప్యాలెస్ ద్వారం మీదా ఈ పక్షి రూపం చూడచ్చు. తెలుగునాట కాకతీయుల చారిత్రక కట్టడాల మీద, రామేశ్వరం, బృహదీశ్వరం వంటి ప్రాచీన దేవాలయాల మీదా ఈ పక్షి రూపాన్ని తిలకించవచ్చు. విజయనగర సామ్రాజ్యాధీశులు 500 ఏళ్లక్రితమే భేరండ చిహ్నాన్ని తమ అధికారక నాణేల మీద వాడినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. - నిర్వహణ: ఎన్.ఆర్. -
పరిమళం తగ్గుతోంది!
ఇదివరకటి కాలంలో వసంతం వచ్చిందంటే చాలు, పూల వనాలు పరిసరాలను పరిమళ భరితం చేసేవి. ఇప్పటి కాలంలో వసంతమైతే వస్తోంది గాని, పూల వనాలు ఇదివరకటి స్థాయిలో పరిమళించడం లేదు. ప్రకృతి ధర్మసూత్రాలకు లోబడి వసంతంలో మొక్కలకు ఆకులు చిగురించి, పూలు పూస్తూనే ఉన్నా, పూల పరిమళంలోని గాఢత మాత్రం క్షీణిస్తూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్కు చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ గర్లింగ్ చెబుతున్నారు. డీజిల్తో నడిచే వాహనాల నుంచి వెలువడే వాయువుల ప్రభావం వల్ల పూలలో పరిమళం తగ్గిపోతోందని ఆయన వెల్లడిస్తున్నారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వాయు కాలుష్యం ఫలితంగా పూల పరిమళం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తేలింది. లావెండర్, డఫోడిల్స్, మల్లెలు, గులాబీలు వంటి పూల పరిమళం ఇదివరకటి కాలంలో చాలా దూరం నుంచే నాసికకు తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ‘న్యూ సైంటిస్ట్’ జర్నల్లో ప్రచురించారు. -
వాన నీరే స్వచ్ఛమైన తాగునీరు!
నీరు.. మనుగడకు ప్రాణావసరం. మారుమూల గ్రామీణులు సైతం క్యాన్ నీటిని కొనుక్కొని తాగుతున్న పరిస్థితులున్న కాలం ఇది. ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగు నీటి కోసం పడని పాట్లుండవు. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక కుటుంబం కేవలం తమ ఇంటిపైన కురిసిన వాన నీటినే పట్టుకొని తాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. గత ఆరేళ్లుగా వాన నీటినే పట్టుకొని, శుద్ధి చేసి, భూగర్భ ట్యాంకులో దాచుకొని ఏడాదంతా తాగుతూ పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నదో కుటుంబం. అంతేకాదు.. ప్రతి కుటుంబమూ ఇలాగే వాన నీటిని ఒడిసిపట్టుకొని ఏడాదం తా తాగితే నీటి సమస్య తీరడంతోపాటు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడమూ సాధ్యమేనని ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం.., ఎం.సి.వి. ప్రసాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 70 ఎకరాల ఆసామి. ప్రకృతి వ్యవసాయదారుడు. మదనపల్లి సమీపంలోని ‘ప్రకృతివనం’ వారి వ్యవసాయ క్షేత్రం. బోర్వెల్స్లో నీటి మట్టం అట్టడుగుకు వెళ్లేకొద్దీ టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) పెరిగిపోవడం వల్ల తాగడానికి పనికిరాకుండా పోతూ ఉంటాయి. మదనపల్లి ప్రాంతంలో భూగర్భ జలం లోతు టీడీఎస్ 1,500 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. పోనీ క్యాన్లలో అమ్మే ఆర్.ఓ.(రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుద్ధి చేసిన) నీరు కొనుక్కొని తాగుదామా అంటే.. ఆర్.ఓ. నీటిలో టీడీఎస్ మరీ తక్కువగా(20 నుంచి 35) ఉంటున్నాయి. పి.హెచ్. 5–6 వరకు ఉండటం వల్ల ఆమ్ల గుణాన్ని సంతరించుకొని ఉంటూ.. ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాయని ప్రసాద్ భావించారు. అటువంటి పరిస్థితుల్లో నిపుణులను సంప్రదించి.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాననీటిని దాచుకొని తాగుతున్నారు. రాయలసీమవాసులకే కాదు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ ప్రాంత వాసులకే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఆరోగ్యదాయకమైన తాగు నీరు వాన నీటి సంరక్షణ ద్వారానే సాధ్యమని ప్రసాద్ చెబుతున్నారు. వాన నీటిని పట్టుకొనేదిలా... రాయలసీమలో 500 మి.మీ. వర్షం కురుస్తుంది. డాబా ఇంటి పైకప్పు మీద ప్రతి చదరపు అడుగుకు 50 లీటర్ల చొప్పున వాన నీటిని ఒడిసిపడుతున్నారు. ఇంటిపై నుంచి పైపుల ద్వారా కిందికి వచ్చే నీరు తొలుత రెయిన్ ఫిల్టర్ ద్వారా ప్రవహించి మట్టి, ఆకులు, చెత్త లేకుండా క్లీన్ అవుతాయి. వాన నీరు స్వచ్ఛమైనది. అయితే, అందులో లవణాలు ఉండవు. కానీ, లవణాలతో కూడిన నీరే ఆరోగ్యదాయకమైనది కాబట్టి, ఆ నీటికి లవణాలు కలపాలి. అదీ సులభమే. వాన నీటిని మినరలైజేషన్ ట్యాంకులో నుంచి ప్రవహించేలా ఏర్పాటు చేసుకుంటే సరి. సున్నపురాయి, కుండ పెంకులు, బొగ్గులు, ఇసుక, గులకరాళ్లను పొరలుగా వేసి ఉండడం వల్ల ఈ ట్యాంకులో నుంచి ప్రవహించే నీరు ఆరోగ్యదాయకమైన తాగు నీరుగా మారతాయి. ఆ నీటిని భూమిలో నిర్మించుకున్న ట్యాంకులోకి పంపి నిల్వ చేసుకుంటున్నారు. అలా నిల్వ చేసుకునే నీటిని మోటారు ద్వారా లేదా చేతి పంపు ద్వారా ప్రతి రోజూ పంప్ చేసుకొని తాగునీరుగా ఉపయోగించుకుంటున్నారు. భూగర్భ ట్యాంకులో నిల్వ ఉండే తాగునీటికి గాలి, వెలుతురు తగలకుండా జాగ్రత్తపడితే చాలు... నాచు పట్టదు. నీరు పాడవదు. ఇలా ప్రతి ఏటా 40 వేల లీటర్ల వాన నీటిని పట్టుకొని, శుద్ధి చేసుకొని, జాగ్రత్త చేసుకున్న నీటినే ఏడాది పొడవునా ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు, ప్రకృతివనంలో పనిచేసే 50 మంది పనివారు, అతిథులు పిల్లాపాపలతో సహా నిరభ్యంతరంగా తాగుతూ ఆరేళ్లుగా ఆరోగ్యంగా ఉన్నారు. తొలుత బెంగళూరులోని కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమ శాఖ వద్ద, ఇటీవల ఎస్సెన్ అండ్ కో లోనూ పరీక్షలు చేయించి నీటి నాణ్యతను నిర్థారించుకున్నామని ప్రసాద్ తెలిపారు. తాము తాగే నీటిని పరీక్షిస్తే టీడీఎస్ 208, పి.హెచ్. 7.13 మధ్య ఉందని, ఇది ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్ వాటర్ అన్నారు. ఇంతకీ ఎంత ఖర్చవుతుంది? వాన నీటిలో నుంచి డస్ట్ క్లీన్ చేసే రెయిన్ ఫిల్టర్ రూ. 7,500, మినరలైజేషన్ ట్యాంకు స్టీల్దైతే రూ. 10 వేలు(సిమెంటుదైతే రూ. 4 వేలు) ఖర్చవుతుంది. భూగర్భంలో నీటి నిల్వ ట్యాంకు నిర్మాణానికి లీటరుకు రూ. 4–5 ఖర్చవుతుంది. 1500 చదరపు అడుగుల ఇంటి కప్పు నుంచి వాన నీటిని సేకరించి నిల్వ చేసుకోవడానికి సుమారు రూ. 50,000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత ఏ ఖర్చూ లేకుండానే.. మబ్బుల్లో నుంచి వచ్చే స్వచ్ఛమైన, అమూల్యమైన చెలమ నీటిని తాగొచ్చని ప్రసాద్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లు లేక లేదా మరే ఇతర కారణంగానైనా ఆర్.ఓ. నీటిని తాగే వారు కూడా.. ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్ వాటర్ స్వంతంగా తయారు చేసుకొని తాగడానికీ మరో మార్గం ఉందని ప్రసాద్ అంటున్నారు. ఆర్.ఓ. వాటర్ను మినరలైజేషన్ ట్యాంకులో పోసుకొని.. 4 గంటల తర్వాత.. ఆ నీటిని పట్టుకొని తాగవచ్చని, ఈ నీరు కూడా ఆరోగ్యదాయకమైన అల్కలైన్ వాటరేనని ప్రసాద్ చెబుతున్నారు. మినరలైజేషన్ ట్యాంకును 30–50 లీటర్లు పట్టే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రతో లేదా మట్టి పాత్రతో ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలున్నా తీర్చడానికి, వీడియో కాల్ చేస్తే ‘ప్రకృతివనం’లో తాము వాడుతున్న ఫిల్టర్లను చూపడానికి కూడా సంసిద్ధంగా ఉంటామని ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల వారు వెంకట్రెడ్డి– 89198 96367, ఎం.సి.వి. ప్రసాద్– 94401 68816 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మన్య దీపిక!
రైతులు.. అందులోనూ గిరిజనులు.. ఇక చెప్పేదేముంది! దిగుబడులు వస్తున్నాయంటే.. దళారుల పంట పండినట్లే కదా!! కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు.. కాలంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంత అమాయక గిరిజన రైతులూ ఇప్పుడు తెలివి తెచ్చుకుంటున్నారు. రసాయనాల్లేకుండా ప్రాణానికి ప్రాణంగా సాగు చేసిన తమ పంటలకు ఇప్పుడు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రతి ఒక్కరి తలరాతను కలసికట్టుగా తిరగరాసుకుంటున్నారు. కల్లాకపటం లేని ఆ గిరిజన రైతు కలల కంపెనీకి వెలుగుబాట చూపుతున్న మార్గదర్శి.. పడాల భూదేవి! ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైతన్య దీప్తికి ‘సాగుబడి’ నుంచి జేజేలు! కొండకోనల్లో, ప్రకృతి ఒడిలో కపటం లేని జీవించే గిరిజన రైతులు అవగాహన లేక, దారిచూపేవారు లేక, ఐక్యత లేక, దళారుల దోపిడీ వల్ల అనాదిగా పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హిర, సీతంపేట, ఎల్ఎన్పేట, కొత్తూరు, వీరఘట్టం మండలాల్లో రైతుల సంగతి వేరు. ఈ మండలాల్లో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది గిరిజన రైతులు సంఘటితమై భూమి హక్కులను సాధించుకోవడం ద్వారా పేదరికాన్ని అధిగమిస్తున్నారు. ఉమ్మడి భూమి హక్కులు సాధించుకున్నారు. మెరుగైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని, స్వల్ప ఖర్చుతోనే అధికోత్పత్తి సాధిస్తున్నారు. అంతేకాదు.. నాబార్డు సహాయంతో 10 నెలల క్రితం ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్’ను ఏర్పాటు చేసుకొని తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకొని పడాల భూదేవి నేతృత్వంలో అధిక నికరాదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన నేత, తన తండ్రి దివంగత చిన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ భూదేవి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆధునిక పోకడలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకుంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటకు అధికాదాయం పొందవచ్చని గిరిజన రైతులను చైతన్య పరచి ఆమె ముందుకు నడిపిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తీరు.. భూదేవి మాటల్లోనే.. ఎకరానికి 13 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడి గత 13 సంవత్సరాలుగా సేంద్రియ సాగు విధానాన్ని మా గిరిజన రైతులకు అలవాటు చేశాం. ఇదే క్రమంలో చిరుధాన్యాలు సాగు ప్రారంభించాం. వ్యవసాయ యాంత్రీకరణ, సాగులో ఆధునిక విధానాలు అలవాటు చేస్తున్నాం. రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను పాత పద్ధతిలో కేవలం ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సాధించేవారు. కొత్త పద్ధతులు అలవాటు చేసిన తరువాత మొక్కలు నాటే ‘గులి’ పద్ధతిలో సాగు చేసి, ఎకరానికి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించే స్థాయికి చేరుకున్నారు. సీతంపేట ఐటీడీఏ, నాబార్డు, ఆత్మ, వ్యవసాయశాఖలతో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరుధాన్యాలు, సేంద్రియ సాగుతో లాభాల బాట పడుతున్నాం.. దాదాపు 3 వేల ఎకరాల్లో రెండు వేల మంది గిరిజన రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. ఏటా రాగి వంద టన్నులు, కొర్రలు 50, జొన్న 35, సజ్జ 25 టన్నుల వరకూ దిగుబడి వస్తోంది. సొంత విత్తనాలనే వాడుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏపీ సీడ్స్ సంస్థకు 9 టన్నుల రాగి విత్తనాలు కిలో రూ.36 చొప్పున పంపిణీ చేశాం. 11 మంది డైరెక్టర్లలో ఆరుగురు మహిళలు ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను, పప్పుధాన్యాలను సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను దళారులకు, లేదా స్థానిక సంతల్లో వచ్చిన ధరకు అమ్మేసుకుంటూ ఉండటం వల్ల ఎంతో ఆదాయాన్ని నష్టపోతుండేవారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేసుకున్నాక తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. ఇందులోని 11 మంది డైరెక్టర్లలో నాతో పాటు ఆరుగురం మహిళా గిరిజన రైతులమే. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ ఉత్పత్తులకు మేమే ధర నిర్ణయిస్తున్నాం. ఐటీడీఏ సమకూర్చిన గోదాములో సుమారు రూ.5–6 లక్షల ఖరీదైన ప్రాసెసింగ్ యంత్రాలను నెలకొల్పాం. కంపెనీలో సీఈవోతోపాటు పార్ట్టైమ్ సిబ్బంది సహా 30 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. చిరుధాన్యాల నుంచి బిస్కెట్ల వరకు.. కొర్ర బియ్యం, సామ బియ్యం, ఊద బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు.. కంది పప్పు, మినప్పప్పు, ఉలవలు, చీపుర్లు, చింతపండు.. వంటి 25 రకాల సరుకులను శుద్ధి చేసి, చక్కగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాం. శ్రీకాకుళం రైతుబజారులో, సీతానగరం ఐటీడీఏ ఆవరణలో ప్రత్యేక స్టాల్స్ను నిర్వహించడంతోపాటు.. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు కూడా సరుకును నేరుగా వినియోగదారులకు, దుకాణదారులకు విక్రయిస్తున్నాం. అంతకుముందు కుంచం(3 కిలోలు) సేంద్రియ కందులు రూ.90లకు రైతులే స్థానికంగా అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రూ. 120కు బయట మార్కెట్లలో అమ్మగలిగాం. కొర్ర ధాన్యాన్ని రైతు నుంచి కిలో రూ. 40కు కొనుగోలు చేసి, శుద్ధిచేసి ప్యాకెట్లలో నింపి రిటైల్గా కిలో రూ. 80కు విక్రయిస్తున్నాం. గత పది నెలల్లో 325 మంది రైతులు తమ ఉత్పత్తులను రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా విక్రయించారు. ఇప్పటికి నెలకు రూ. 4 లక్షల టర్నోవర్ జరుగుతున్నది. విదేశీ మార్కెట్ల కోసం అన్వేషణ.. మా సేంద్రియ ఉత్పత్తులను మొదట మేము తింటున్నాం. ఉత్పత్తులను మా ప్రాంత హాస్టల్ పిల్లలకు, వివిధ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నాం. ఇక్కడ మార్కెట్కు ఇవ్వగా మిగిలే ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో అమ్మేందుకు కూడా మార్గాలను అన్వేషిస్తున్నాం. పీజీఎస్ సర్టిఫికేషన్ పొందే దశలో ఉన్నాం. అడవి తల్లి ఒడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన మా ఉత్పత్తులను వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతాం. (వివరాలకు.. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ–హిరమండలం, శ్రీకాకుళం జిల్లా– డైరెక్టర్ పడాల భూదేవి: 73820 98533, సీఈఓ కైలాస్ సాహు: 88978 65521) హాస్టళ్లకు రాగి పిండి, చిరుధాన్యాల బిస్కెట్లు.. శ్రీకాకుళం జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ కోసం ఏడాది కాలంగా నెలకు 9 టన్నుల రాగి పిండిని అందిస్తున్నారు. గిరిజన కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల అనేక మంది ఒంటరి మహిళలుగా మిగిలిపోతున్నారు. వీరిలో 15 మందికి ఉపాధి కల్పించేందుకు చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాల తయారీని ప్రారంభించాం. చిరుధాన్యాల పిండితో బిస్కెట్లు, కేక్, జంతికలు, మిక్చర్, పకోడి, రాగిపిండితో అంబలి, సంగటి, అట్లు, రొట్టెలు, లడ్డూలు తయారు చేస్తున్నాం. వాటిని రైతుబజార్లతో పాటు ప్రైవేట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. వాసన్ స్వచ్ఛంద సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సహకారంతో చిరుధాన్యాలతో నెలకు రూ. 5 లక్షల బిస్కెట్లను తయారు చేస్తున్నాం. ఐటీడీఏ సహకారంతో రోజుకు 11 వేల బిస్కెట్లు గిరిజన విద్యార్థులకు అందిస్తున్నాం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఫొటోలు: కుప్పిలి జయశంకర్, సాక్షి ఫొటో జర్నలిస్టు. -
అమ్మా! మియ్యావ్
ప్రకృతిని కూడా పుస్తకాల్లోనే చూసి నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి. ‘‘బుక్లో ఏమేమున్నాయి? చూద్దామా కృతి బంగారూ’’ గారంగా కూతుర్ని ఒళ్లోకి తీసుకుంది అమ్మ.అమ్మ చేతిలోని ‘మై ఫస్ట్ ఎబిసి’ బుక్ లాక్కుని తనే ఓపెన్ చేసింది కృతి. సి పేజీ ఓపెన్ అయింది.క్యాట్ అని చెప్పాలా... మాతృభాషలో పిల్లి అని నేర్పించాలా... తల్లికి మీమాంస.‘‘అమ్మా! మియ్యావ్’’ అంటూ రెండు చేతులను గొంతు కిందకు చేర్చి కళ్లు పెద్దవి చేసి మూతిని సున్నాలా చుట్టింది ఒకటిన్నర ఏళ్ల కృతి.పేజీలు తిప్పుతున్నారిద్దరూ. హెచ్ పేజీలో కోడి ఉంది. ‘హెన్’ పలకడం ఈజీ, మాటలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత ‘కోడి’ అని నేర్పించవచ్చు... అనుకునే లోపే...‘‘అమ్మా! బోబు... బో బ్బో బ్బో... కొక్కొక్కో...’’ రెక్కలు విచ్చినట్లు చేతుల్ని చాచి చెప్పింది కృతి. తల్లి మురిపెంగా చూసింది కృతిని.పిల్లలకు తల్లే తొలి గురువు. తల్లి కంటే ముందు ప్రకృతే గురువు. ఆ తల్లికి చిన్నప్పుడు నేర్పించింది కూడా ప్రకృతే. పెద్దయ్యాకే పుస్తకాలు నేర్పించాయి. పుస్తకాలతో నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రకృతిని కూడా ప్రకృతిలో కాకుండా పుస్తకాల్లోనే నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి.ప్రకృతిలో భాగంగానే నేర్పేవారు ఉంటారా లేక ప్రకృతే నేర్పుతుందా అని వర్డ్స్ వర్త్ ఓ చోట సంశయపడతాడు. నేర్పేవారు ఎవరైనప్పటికీ నేర్చుకోవడం అన్నది మనిషి ప్రవృత్తి. ఆ ప్రవృత్తే మనిషిని ప్రకృతి దగ్గరకు తీసుకెళుతుంది. ఆ తర్వాతే పుస్తకాలు. గురువర్యులు. -
ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న
ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్ బెర్ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు. రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్ బెర్ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు. – పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా -
సిరిధాన్యాల విత్తనాలు ఉచితం!
అరిక.. 5 నెలల పంట. దీన్ని ఖరీఫ్లో ఆరుద్ర కార్తెలో మాత్రమే విత్తుకోవాలి. కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగలు 3 నెలల పంటలు. వీటిని ఖరీఫ్లోను, రబీలోనూ సాగు చేసుకోవచ్చని డా.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ వివరించారు. ఆయన ‘సాగుబడి’కి అందించిన వివరాలు.. ► ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. పొలాన్ని మడులుగా విభజించి.. ఈ చిరుధాన్యాలన్నిటినీ ఒక ఎకరంలో సాగు చేసుకోవచ్చు. అవి కలిసిపోకుండా కందిని సరిహద్దు పంటగా వేసుకోవచ్చు. ► మూడు తడులు ఇవ్వడానికి నీటి సదుపాయం ఉంటే.. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకూ సేంద్రియ సిరిధాన్యాలను పండించుకోవచ్చు. ఎకరానికి రూ. 2,300 ఖర్చు అవుతుంది. ► సాలు దున్నిన తర్వాత సిరిధాన్యాలు విత్తుకొని, విత్తనాలపైకి మట్టి పడేలా ఇరవాలు దున్నాలి. 5 సెం.మీ. లోతు దున్నితే చాలు. అంతకంటే లోతులో పడిన సిరిధాన్య విత్తనాల మొలక పైకి రాలేదు. ► విత్తిన వెంటనే తడి ఇవ్వాలి. రెండో తడి 30 రోజులకు, మూడో తడి 60 రోజులకు ఇస్తే చాలు. డ్రిప్, స్ప్రింక్లర్, పారించడం.. ఏ పద్ధతిలోనైనా తడి ఇవ్వొచ్చు. ► వరి కోసిన పొలాల్లో, వేరుశనగ పీకిన పొలాల్లో, కూరగాయలు పండించిన పొలాల్లో.. ఎటువంటి భూమి అయినా.. పంటల మార్పిడి కోసం ఈ రబీలో సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. కోతలు పూర్తయిన తర్వాత మోళ్లను భూమిలో కలియదున్నితే భూమి సారవంతమవుతుంది. ► సిరిధాన్యాల పంట నుంచి ఎకరానికి రెండు ట్రాక్టర్ల నాణ్యమైన, పశువులు బాగా ఇష్టపడే గడ్డి వస్తుంది. ► సిరిధాన్యాలను నూర్చే టప్పుడు ప్లాస్టిక్ బరకాలను ఉపయోగించి, ఇసుక, మట్టి కలవకుండా జాగ్రత్తపడాలి. ► అరిక, కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగల ప్రత్యేకత ఏమిటంటే.. పొట్టు తీయని ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. పురుగు రాదు. రెండేళ్లు నిల్వ ఉన్నవి కూడా విత్తనానికి నిక్షేపంగా పనికొస్తాయి. విత్తనాలను గోనె సంచుల్లోనే గాలి, వెలుతురు తగిలే చోట నిల్వ చేయాలి. ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేస్తే.. ఉక్కిపోయి మొలక శాతం తగ్గవచ్చు. ► సిరిధాన్యాల బియ్యానికి మాత్రం రెండు, మూడు నెలల తర్వాత సన్న పురుగు వస్తుంది. మిక్సీతో అవసరం ఉన్నప్పుడు పొట్టు తీసుకునే మెలకువ తెలిసింది కాబట్టి, ఒకేసారి ఎక్కువ మొత్తంలో మిల్లు పట్టించుకొని అమ్ముకోలేక తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ► సిరిధాన్యాలను రైతులు వెంటనే అమ్మేయకుండా.. నిల్వ చేసుకోవాలి. మిక్సీతో శుద్ధి చేసి తయారు చేసిన బియ్యాన్ని రైతు కుటుంబాలు ఇంటిల్లపాదీ అన్ని వయసుల వారూ తిని పూర్తి ఆరోగ్యవంతులుగా మారాలి. తమ గ్రామాలు, దగ్గర్లోని పట్టణాలు, నగరాల్లో వినియోగదారులకు ఏడాది పొడవునా నేరుగా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకుంటే.. రైతులు అధిక నికరాదాయం పొందవచ్చు. ► రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. యూరియా ఎక్కువ వేస్తే పంట అతిగా పెరిగి పడిపోతుంది. పడిపోయిన పంటను కోయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. పైగా పడిపోయిన కంకుల్లో నుంచి గింజలను అన్ని రకాల పక్షులూ సులువుగా తినేస్తాయి. కాబట్టి రైతుకు చేతికి వచ్చే దిగుబడి బాగా తగ్గిపోతుంది. ► నిలబడి ఉన్న చిరుధాన్య పంట గింజలను జీనిగ, బుల్బుల్ వంటి అతి చిన్న పిట్టలు మాత్రమే తినగలవు. ఇవి ఎంత ఎక్కువ తిన్నా ఎకరానికి క్వింటాకు మించి తినలేవు. 7 క్వింటాళ్ల దిగుబడి మనకు వస్తుంది. ► వర్షాకాలపు పంటలో జొన్న, కొర్రలకు ఎర్రదిమ్మ తెగులు వస్తుంది. కానీ, రబీలో ఇవేవీ రావు. వరికి వచ్చే కాండం తొలిచే పురుగు, తెల్లమచ్చ(మజ్జిగ) తెగులు సిరిధాన్య పంటల జోలికి రావు. ► డ్వాక్రా మహిళా సంఘాలు, చిరు వ్యాపారులు సిరిధాన్యాలతో టిఫిన్లు, రకరకాల పిండివంటలు తయారు చేసి అమ్ముకుంటే మంచి పౌష్టికాహారాన్ని జనానికి అందించినట్టవుతుంది. మంచి ఆదాయమూ పొందవచ్చు. సిరిధాన్య వంటలకు వరిపిండి, శనగపప్పు పిండితో చేసే పిండివంటలకు ఖర్చయ్యే నూనెలో సగం సరిపోతుంది. ► రాబోయే ఖరీఫ్ కోసమైతే.. ఎకరానికి 2.5 కిలోల సిరిధాన్యాల విత్తనాలు, అరకిలో నాటు రకం కంది విత్తనాలను రైతులకు ఉచితంగా ఇప్పుడే ఇస్తాను. 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊళ్లలో ఐదారు రకాల సిరిధాన్యాలు పండాలి. అందరూ తినాలి. ఆసుపత్రులు వద్దు.. సిరిధాన్యాలు ముద్దు.. ► సిరిధాన్యాల ఉచిత విత్తనాలు, సాగు మెలకువల కోసం విజయకుమార్ (వెలమవారిపాలెం, వేంపల్లె మండలం, డా.వైఎస్సార్ కడప జిల్లా)ను సంప్రదించాల్సిన ఫోన్: 98496 48498. సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ కథనానికి విశేష స్పందన ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ శీర్షికతో గత మంగళవారం ‘సాగుబడి’లో ప్రచురించిన కథనానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సిరిధాన్యాలను సాగు చేసినప్పటికీ తగిన ప్రాసెసింగ్ మిల్లులు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు అందుబాటులో ఉండే మిక్సీ ప్రత్యామ్నాయం గొప్ప ఊరట కలిగింది. కేవలం మిక్సీ ద్వారా సిరిధాన్యాల బియ్యాన్ని ఇంటిపట్టునే కావాలనుకున్నప్పడు సిద్ధం చేసుకునే అవకాశం ‘బుచ్చి పద్ధతి’ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు చాలా మంది రైతులు సంబరపడుతున్నారు. సిరిధాన్యాలలోని విశిష్ట ఔషధ గుణాల గురించి డాక్టర్ ఖాదర్ ప్రచారం చేస్తుండడంతో వినియోగదారుల్లో వీటి పట్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సిరిధాన్యాల శుద్ధికి మిక్సీ ఉంటే చాలన్న సమాచారం రైతుల్లో పెద్ద సంచలనమే కలిగించింది. డాక్టర్ ఖాదర్, బాలన్, మహబున్నీలకు అనేక మంది ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొర్ర తదితర ఐదు రకాల సిరిధాన్యాల విత్తనాలు కావాలని, ఈ రబీలోనే సాగు చేస్తామని రైతులు ముందుకు వస్తుండటం విశేషం. అటవీ వ్యవసాయ పద్ధతిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు, బుచ్చి పద్ధతిలో సిరిధాన్యాల శుద్ధిపై సంక్రాంతి తర్వాత తెలుగునాట రైతు శిక్షణా శిబిరం నిర్వహిస్తామని, విత్తనాలను అందుబాటులోకి తెస్తామని బాలన్ తెలిపారు. ఇదిలాఉండగా, ఎకరంలో విత్తడానికి సరిపోయే 3 కిలోల సిరిధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా ఇస్తానని డా. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ప్రకటించారు. ఎంత మంది రైతులకైనా ఎకరానికి విత్తనం ఉచితంగా ఇస్తానని, అంతకు మించి కావాలనుకుంటే కిలో రూ. 40కి ఇస్తాననటం విశేషం. -
ప్రకృతి సేద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ప్రకృతి సేద్యానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే చిరునామాగా నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంతంలో ఆదివారం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని రైతులకు సూచించారు. సుభాష్ పాలేకర్ వద్ద మంచి ప్రాజెక్టు ఉందని, తాను మార్కెట్ మేనేజర్గా మారి దాన్ని ప్రమోట్ చేస్తానని బాబు వివరించారు. ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన పంటలు వైపరీత్యాలను తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచంలో ఏపీ రోల్మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతే నా ధ్యాస రాష్ట్ర ప్రగతి, ప్రజలందరి పురోగతే తన నిరంతర ధ్యాస అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు, సంక్షేమం, సర్వతోముఖ వికాసానికి తాను దీక్ష తీసుకున్నానని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబు ఆదివారం రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా లేఖను విడుదల చేశారు. తెలుగువారు ఎక్కడున్నా ఈ పండక్కి వచ్చి సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఓ విహంగ వీక్షణం
చాలా ముద్దుగా కూడా ఉండి ఉంటుంది, ఆ పక్షి. పసుపు రంగు మెడతో ఉన్న బుజ్జి పక్షి. ఆ పిల్లవాడి తుపాకీ దెబ్బకి రాలిపోయింది. అప్పుడు ఆలోచించాడా అబ్బాయి, ఈ పక్షి పేరేమై ఉంటుందని! ఏ జాతిదై ఉంటుందని! ఆ మృత విహంగాన్నే తీసుకుని వెళ్లి మేనమామను అడిగాడు. ఆయన ప్రకృతిని ప్రేమించేవాడే. పక్షులని వేటాడుతూ ఉండేవాడే. కానీ ఆయనకీ తెలియలేదు. మేనల్లుడి ప్రశ్నల ధాటికి తట్టుకోలేక అంతో ఇంతో పరిచయం కలిగిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కార్యదర్శి డబ్లు్య ఎస్ మిల్లార్డ్ దగ్గరకు తీసుకుపోయాడు. ఆ పిల్లవాడి ఆసక్తి చూసి మిల్లార్డ్ కొంత చెప్పాడు. మిల్లార్డ్కీ ముచ్చట తీరలేదు. తను సేకరించిన పక్షుల బొమ్మలను చూపించాడు. నిజానికి వాటికి ప్రాణం లేదు. పట్టుకున్న తరువాత వాటి లోపలి మాంసాన్ని తొలగించి, దూది కుక్కి మళ్లీ నిండుగా తయారుచేసే స్టఫ్డ్ పక్షులు. ఎన్ని జాతులు! ఎన్ని రంగులు! ఎన్ని పరిమాణాలు! వాటిని చూశాకే ఆ అబ్బాయిలో పక్షుల మీద ఉన్న ఆసక్తికి హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. అలా ప్రపంచ పక్షిశాస్త్రానికి కొత్త వెలుగును ఇచ్చిన ఒక శాస్త్రవేత్త పుట్టాడు. ఆయనే డాక్టర్ సలీం అలీ (నవంబర్ 12, 1896– జూలై 27, 1987). ఆ పిచ్చుక అలీ జీవితం మీద ఎంత ప్రభావం చూపిందో చెప్పలేం. తన జీవిత చరిత్రకు, ‘ఒక పిచ్చుక పతనం’ అని పేరు పెట్టారాయన. ‘నువ్వు ఎగిరిపోవాలనుకుంటే, అన్నీ వదిలిపెట్టెయ్! అప్పుడే బరువు తగ్గుతుంది’ అంటాడొక తత్వవేత్త. సలీం అలీ చేసింది అదే. ఇదే విషయాన్ని తన వాస్తవ అనుభవంతో ఇంకాస్త లోతుగా చెప్పారు అలీ– ‘నీవు పక్షుల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలిపెట్టాలి’. పక్షులతో ఆయన అనుబంధం ఇలా ఒక తాత్విక స్థాయికి చేరుకుంది. జీనత్ ఉన్నిసా, మొయిజుద్దీన్ దంపతుల తొమ్మిది మంది సంతానంలో నాలుగో సంతానమే సలీం. మూడో ఏటకే అమ్మానాన్న కన్నుమూశారు. ‘గోరొంక గూటికే చేరావు చిలుక’ అన్నట్టు మేనమామ అమీరుద్దీన్ తాయబ్జీ ఆయనను పెంచుకున్నాడు. ఆయనకీ పిల్లలు లేరు. ప్రకృతి అన్నా, వేట అన్నా మహా ఇష్టం. మేనల్లుడిని తాయబ్జీ మొదట జనానా బైబిల్ మెడిసిన్ మిషన్ గరల్స్ హైస్కూలులో చేర్చాడు. తరువాత సెయింట్ జేవియర్ హైస్కూలుకు మార్చాడు. ఇలా స్కూలుకి వెళ్లడం బొత్తిగా నచ్చలేదు సలీంకి. అందుకే 1913లో బొంబాయి యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పట్టా తీసుకోగలిగాడు. అప్పుడు బీయస్సీలో చేరాడు. కానీ అల్జీబ్రా, లాగర్దమ్స్ అంటే బొత్తిగా సరిపడలేదు. మొదటి సంవత్సరంతోనే ఆగిపోయింది డిగ్రీ చదువు. మళ్లీ పక్షుల వీక్షణానికి అనుకోకుండా అవకాశం వచ్చింది. చదువు పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేని సలీంని బర్మాలో ఉంటున్న అతని కుటుంబం దగ్గరికి పంపించాడు మేనమామ. అప్పటికే పెళ్లి కూడా అయింది. ఆమె పేరు తెహమినా బేగం. బర్మాలో (నేటి మైన్మార్) తేవీ అనేచోట వారి కుటుంబానికి కలప, గనుల వ్యాపారం ఉండేది. అంటే మళ్లీ అటవీ ప్రాంతానికే. కాబట్టి పక్షులను చూస్తూ కాలం గడపవచ్చు. ఏడేళ్లు చేసిన పని అదే. ఆ తరువాత భారతదేశానికి వచ్చేశాడు. మళ్లీ కాలేజీలో చేరాలని అనిపించింది. దావర్స్ కాలేజీలో వాణిజ్యశాస్త్రం చదవడానికి చేరాడు. కానీ పద్దులు కాదు, పక్షులే కళ్ల ముందు కదిలేవి. శ్రద్ధ పెట్టలేకపోయాడు. దీనిని గమనించి అప్పటి ప్రిన్సిపాల్ ఫాదర్ ఎథెల్బర్ట్ బ్లాటర్ ఉదయం పూట వాణిజ్యశాస్త్రం చదవడానికీ, సాయంత్రం జంతుశాస్త్ర తరగతులకు హాజరు కావడానికీ అనుమతించాడు.సలీం అలీ కళ్లెప్పుడూ పక్షుల కోసమే వెదుకుతూ ఉండేవన్న మాట నిజం. ఆయన వేకువనే లేచేవారు. చుట్టూ చెట్లు చేమలు, వాటి మధ్య వారి ఇల్లు ఉండేది. ఆ చెట్ల మీద గిజిగాడి గూళ్లు ఉండేవి. పోర్సిలిన్ పూలకుండీ అంతటి కళాత్మకతను గడ్డిపోచల అల్లికతోనే సాధించిన ఆ పక్షుల ప్రతిభ విస్మయ పరిచేది. ప్రతి చెట్టుకూ గూడే. అన్ని గూళ్లు ఎందుకు కడతాయి? అన్నది కూడా ఆయన శోధిం^è దలిచాడు. డాక్టర్ అలీ చాలా చిత్రమైన విషయం కనుగొన్నాడు. గిజిగాడి గూళ్లను మగ పక్షులు నిర్మిస్తాయి. గూడు సిద్ధమైన తరువాత ఆడపక్షి వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతుంది. పెంచుతుంది. ఇంతలో ఆ మగపక్షి అక్కడే ఇంకో కొమ్మకు మరో గూడు కడుతుంది. కానీ ఈసారి పాత ఆడపక్షి కాదు, మరొక ఆడపక్షి వచ్చి గుడ్లు పెడుతుంది. ఈ విషయాన్నే ఆయన మొదటిసారి ఒక అంతర్జాతీయ సైన్సు పత్రికలో ప్రచురించాడు. మొదట చర్చ వచ్చినా, తరువాత అంతా అంగీకరించారు.సాయం వేళ చదువుతో జంతుశాస్త్రంలో డిగ్రీ తెచ్చుకున్నాడు సలీం. కానీ ఎంఎస్సీ లేదా పీహెచ్డీ పట్టా లేదు కాబట్టి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో ఉద్యోగం రాలేదు.దేశంలో అప్పటికి ఏ విశ్వవిద్యాలయంలోను పక్షిశాస్త్రం లేదు. అప్పటికే ఒంటరి పోరాటంలో ఉన్న అలీకి తన పనిలో కొత్తదనం కనిపించలేదు. అప్పుడే బెర్లిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇర్విన్ స్ట్రెస్మాన్ ఆహ్వానించాడు. అలీ జర్మనీ వెళ్లాడు. అక్కడే చాలామంది పక్షిశాస్త్రవేత్తలతో కలసి తిరిగాడు. మళ్లీ 1930లో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఒక విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొంది వచ్చినా వలస భారతంలో ఆయనకు అనుకున్న ఉద్యోగం రాలేదు. బొంబాయి దగ్గరే ఉన్న కిహిమ్ అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడ పక్షుల మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేశాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సారథ్యం ఆయనకే అప్పగించారు. వందేళ్ల చరిత్ర ఉన్నప్పటికీ అప్పటికే కడగండ్లతో కాలం గడుపుతున్న ఆ సొసైటీని డాక్టర్ సలీం కాపాడారు. భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది. పక్షిశాస్త్రవేత్తగా (ఆర్నిథాలజీ) డాక్టర్ సలీం సేవలు అసమానమైనవి. ఆయన రాసిన పుస్తకాలు, ప్రచురించిన వ్యాసాలు ఈ విషయాన్ని నిస్సందేహంగా నిరూపిస్తాయి. పక్షుల జీవన సరళిని పరిశీలించడం కూడా శాస్త్రంలో భాగమేనని తేల్చారు. ఆయన పరిశోధనలో పక్షుల అలవాట్లు, ఆహారం, గుడ్లు, పిల్లల పోషణ ప్రధానంగా చోటు చేసుకున్నాయి. జీవావరణ పరిస్థితులనే ఆయన ఎక్కువ అధ్యయనం చేశారు. భారతదేశంలో పక్షుల వర్గీకరణ అనేది ఆయన వచ్చిన తరువాత మరింత శాస్త్రీయతను సంతరించుకోవడం విశేషం. ఆయన పరిశోధన వల్ల జరిగిన మేలు అసాధారణమైనది. ప్రపంచంలో దాదాపు 8,580 జాతుల పక్షులు ఉన్నాయని అంటారు. ఇందులో 1,200 జాతులు భారతదేశంలో నివసిస్తున్నాయన్న సంగతి మనకు చెప్పినవారు డాక్టర్ అలీయే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం కొనసాగిందంటే అందుకు కారకుడు డాక్టర్ సలీం అలీ. 250 ఏళ్ల చరిత్ర కలిగిన భరత్పూర్ పక్షి రక్షణ కేంద్రం ఒక అద్భుతం. రాజస్థాన్లో ఇది ఉంది. దీనికే కియోలదేవ్ (స్థానికంగా శివుడిపేరు) ఘానా జాతీయ సంరక్షణ కేంద్రంగా తరువాత నామకరణం చేశారు. అక్కడ ఉన్న కియోలదేవ్ ఆలయం కారణంగా ఆ పేరు వచ్చింది. భరత్పూర్ సంస్థానంలో ఘానా అనేచోట ఇది సహజంగా ఏర్పడింది. దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. శీతాకాలంలో కొన్నివేల పక్షులు వస్తాయి. స్థానికంగా 250 రకాలు ఎప్పుడూ ఉంటాయి. 1938లో అప్పటి వైస్రాయ్ లిన్లిత్గో ఆ ఏడాది 4,273 పక్షులను వేటాడాడు. 1958 ప్రాంతంలో స్థానికులు ఈ పక్షి కేంద్రాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. దీనితో సలీం అలీ నేరుగా నెహ్రూను కలసి పక్షి రక్షణ కేంద్రంగా ప్రకటింపచేశారు. 1971లో దీనికి ప్రపంచ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు రక్షణలో కూడా ఆయన కృషి ఉంది. ఇది కూడా ఒక అద్భుత పక్షి కేంద్రమే. 1847లో దీనిని గుర్తించారు. 90 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించుకొని ఉంది. 1970 దీనికి సమీపంలో ఒక జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని యోచించారు. దీనితో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం మొదలయింది. చివరికి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకుంది. ఈ పార్కుతో డాక్టర్ అలీకి విశేష అనుబంధం కూడా ఉంది. ‘బర్డ్స్ ఆఫ్ కేరళ’ అని ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశారు. మరొక పుస్తకం ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’. పక్షుల గురించి శోధనకు వెళ్లినప్పుడు అలీకి ఇంకేమీ పట్టేది కాదు. ఆయన విహంగాలను వెతుక్కుంటూ ప్రపంచమంతా తిరిగారు. ఇబ్బంది కలిగించే వాతావరణం గాని, కొండలూ కోనలూ గాని ఆయన గవేషణకు అడ్డం కాలేకపోయాయి. భారతదేశం నలుమూలలా కూడా ఆయన అన్వేషణ సాగింది. పక్షుల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన కళ్లు డేగ కళ్లయిపోతాయని మిత్రులు చమత్కరించేవారు. ఖాకీ యూనిఫారమ్లో, ఆకుపచ్చ టోపీతో నెరిసిపోయిన జుట్టుతో, చిరుగెడ్డంతో కనిపించేవారాయన. ఇంకో మిత్రుడు ‘తెల్ల వెంట్రుకల బుల్బుల్ వస్తోంది!’ అనేవాడు. ‘నేను బాగా పాడతాను కాబట్టి, ఆ పేరు సరిగానే ఉంది. కానీ నాకు రాబందు అన్న పేరైతే బావుంటుంది’ అని డాక్టర్ అలీ చెప్పేవారు. మెడలోఒక బైనాక్యులర్ వేసుకుని, చేతిలో పేజీలు నలిగిన చిన్న డైరీతో అడవుల వెంట, కొండల వెంట, చెట్ల మధ్య నుంచి ఆయన మైళ్ల తరబడి నడిపోతున్న దృశ్యం మిత్రులకు నిరంతరం ఆశ్చర్యంగా అనిపించేంది. ఎనిమిది పదులు దాటిన తరువాత కూడా ఆయనలో అదే తృష్ణ కనిపించేది. రెక్కలు సాచి విహాయసంలో ఎగిరే పక్షిని చూస్తూ ఉండడం ఆయనకొక వ్యసనం. ఆయన పక్షుల మనస్తత్వం ఎంత బాగా గ్రహించారో చూస్తే వింతనిపిస్తుంది. చాలా విమానాశ్రయాలకు పక్షుల బెడద మొదలైంది. ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పక్షులు అక్కడికి ఎందుకు వస్తున్నాయో దర్యాప్తు చేయండని సలహా ఇచ్చారు. నిజమే, అంత గడబిడ ఉన్నచోటకి ఆ చక్కని ప్రాణులు ఎందుకు వస్తాయి? పరిశోధించిన అధికారులకు ఒక విషయం తెలిసింది. ఇలాంటి ఫిర్యాదు వచ్చిన విమానాశ్రయాలకు సమీపంలో కబేళాలు ఉన్నాయి. అందుకే పక్షులు అక్కడికి చేరుతున్నాయి. వాటి తప్పు కాదు. ఆయన 91వ ఏట కన్నుమూశారు. అప్పటికి మూడేళ్ల ముందు కూడా ఆయన ఒడిశాలోని తూర్పు కనుమలలో తిరిగారు. నల్లమెడ కొంగను చూడడం కోసం లద్ధాక్ చలిలో తిరిగారు. ఫ్లెమింగో పక్షి గూడును చూడ్డానికి ఏం చేశారో తెలుసా? రాణ్ ఆఫ్ కచ్లో ఒంటె మీద పదిగంటల పాటు ప్రయాణించారు. కానీ ఆ గూడును చూడడం సాధ్యపడలేదు. అయినా నిరుత్సాహపడలేదు. భారత్,పాక్ దేశపు పక్షులు అన్న అంశంతో ఆయన చేసిన పరిశోధనను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రెస్ వారు 1968, 1974 సంవత్సరాల మధ్య పది వాల్యూమ్లుగా ప్రచురించారు. ఏడు దశాబ్దాల పాటు పక్షుల గురించి అన్వేషించి, ఒక శాస్త్రాన్ని మథించినా జీవితపు చరమాంకంలో ఆయన అన్న మాట అందరినీ విస్తుపోయేటట్టు చేస్తుంది. ‘నాకు ఇంత కీర్తిప్రతిష్టలు రావడం బాగానే ఉంది కానీ, పక్షిశాస్త్ర శోధనలో ఇక్కడ దాదాపు ఏమీ జరగలేదనే అనుకుంటాను. నేను నూతిలో కప్పలాంటి వాడిని. లేదంటే, అందరూ గుడ్డివాళ్లే ఉన్నచోట ఒంటికన్నువాడిని’ అని సవినయంగా చెప్పుకున్నారు. ప్రఖ్యాత జీవావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ మాత్రం అలీ గురించి గొప్ప మాట అన్నాడు. ‘ఈ 20వ శతాబ్దంలో జీవజాలం మీద ఏ ఒక్కరు చేయనంత కృషి ఆయన ఒక్కరే చేశారు.’ చివరికి ఆ పక్షిప్రేమికుడు కేన్సర్ వ్యాధికి గురయ్యారు. 91వ ఏట హంస ఎగిరిపోయింది. ∙డా. గోపరాజు నారాయణరావు -
'నేను చిన్న చీమలా ఉన్నా'
ప్రకృతి ఎవరినైనా అలరిస్తుంది. అందునా హిమాలయాల అంచున ఉన్న ధర్మశాల ప్రకృతి అందాలకు ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. భారత కోచ్ రవిశాస్త్రి సైతం ఇందుకు అతీతుడు కాదు. ధర్మశాల చుట్టూ ఉన్న ప్రకృతి ఆయను విపరీతంగా నచ్చిందంట. అంతే ఇంకేముంది సోషల్ మీడియా ట్విట్టర్లో ధర్మశాల, పక్కనే ఉన్న హిమాలయాలను పొగుడుతూ పోస్టుపెట్టేశాడు. చుట్టూ ఉన్న భారీ అందాల మధ్య తానో చిన్న చీమగా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. హిమాలయాల అందాలు అద్భుతంగా ఉన్నాయని, క్రికెట్కు చాలా అనుకూలంగా ఉందంటూ ధర్మశాలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక భారత్-శ్రీలంకల మధ్య జరగున్న మొదటి వన్డే మ్యాచ్కు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలుకున్న విరాట్ సేన వన్డేల్లోను తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఇప్పటికే ధర్మశాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. Feel like an ant with the giant in the background. THE MIGHTY HIMALAYAS. What a setting for #cricket #TeamIndia pic.twitter.com/hPoseRuo6H — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 Breathe easy in Dharamsala #TeamIndia #INDvSL pic.twitter.com/DpvQZ7KQfq — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 -
అటవీ జంతువుల ఆత్మీయ క్షేత్రం!
వన్యప్రాణులతో సామరస్యపూర్వక జీవనానికి ఈ క్షేత్రం నిలువుటద్దం. పండించే పైరు, నేలలో జీవరాశిని ఇన్నాళ్లు రైతు నేస్తాలంటున్నారు. సమీప జనావాసాలపై విరుచుకుపడే అటవీ జంతువులు కూడా ప్రకృతిసేద్యం పుణ్యమాని ఇప్పుడు రైతు మిత్రులుగా మారాయి. ప్రకృతి సేద్యం గొప్పతనాన్ని ఇదీ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రకృతిసేద్యంలో నేల బాగుపడటమే కాదు పర్యావరణ వ్యవస్థ యావత్తూ పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ తేయాకు క్షేత్రం. అటవీ జంతువులకు ముఖ్య విహారయాత్రా స్థలంగా మారిన ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించిన ఆ అభ్యుదయ రైతు టెన్జింగ్ బోడోసా. అస్సాంలోని ఉదలగురి జిల్లా కచిబారీ అతని స్వగ్రామం. ప్రకృతి సేద్యంలో పర్యావరణ వ్యవస్థ సమతుల్యత ఏర్పడుతుందనటానికి తన పొలాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా నిలిపాడు. తండ్రి చనిపోవటంతో ఆరో తరగతిలో చదువు మానేసి మలేసియాకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు. 2006లో తిరిగి ఇల్లు చేరి రసాయన సేద్యంలో టీ తోటల సాగు చేపట్టాడు. పురుగుమందుల పిచికారీతో తరచూ అస్వస్థతకు గురవ్వటం, కుంటలోని చేపలు చనిపోవటం అతన్ని ఆలోచనలో పడేశాయి. ప్రతి ఒక్కరూ టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అలాంటి వారికి టీతో పాటు కాస్త విషం కూడా ఇస్తున్నామా అని అంతరాత్మ నిలదీసినట్టనిపించేది. కొంత అంతర్మథనం తరువాత సేంద్రియ పద్ధతుల్లో టీ తోటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2007లో సేంద్రియ తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించి అనతికాలంలోనే నాణ్యమైన పంటను అధిక దిగుబడిని సాధించాడు. అస్సాం రాష్ట్రంలోనే తొలి సేంద్రియ తేయాకు రైతుగా గుర్తింపు పొందాడు. శ్రమకోర్చి అమెరికా, జర్మనీ వంటి పలు దేశాలకు సేంద్రియ తేయాకును ఎగుమతి చేశాడు. ఏటా రూ. 60–70 లక్షల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. 30 వేల మంది రైతులకు సేంద్రియ తేయాకు తోటల సాగులో టెన్జింగ్ శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ప్రపంచంలోనే తొట్టతొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రాలుగా టñ న్జింగ్ టీ తోటలు గుర్తింపు పొందాయి. అటవీ జంతువులకు ఆటపట్టు అక్కడ తేయాకు తోటల రైతులు ఏనుగుల మందలను పొలాల్లోకి రాకుండా బెదర గొట్టేందుకు చెట్లను నరికి మంటలు వేయటం, కంచె వేయటం చేసేవారు. టెన్జింగ్ పొలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. అతను అటవీ జంతువులతో వైరానికి బదులు చెలిమిని పెంచుకున్నాడు. 7 ఎకరాల్లో సేంద్రియ తేయాకుతో పాటు రకరకాల పండ్లు, కూరగాయ పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగుచేయటం ద్వారా పర్యావరణ సమతుల్యం ఏర్పడింది. అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో అనేక అటవీ జంతువులు, పక్షులకు అతని పొలం ఆవాసంగా మారింది. అడవి పందులు, నెమళ్లు, జింకలకు అది ఇష్టమైన విహార స్థలం. అక్కడ జంతువులు అడవిలో ఉన్నట్టే ప్రవర్తిస్తాయి. తోటలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వచ్చిపోయే అటవీ జంతువులతో పొలం కళకళలాడుతుంది. బారులు తీరుతున్న పర్యాటకులు ఏనుగులకయితే టెన్జింగ్ పొలం ముఖ్య విహార యాత్రా స్థలం గా మారింది. అవి ఇష్టంగా తినే వెదురు చెట్లను పొలం చుట్టూ నాటాడు. అక్కడ గడపటాన్ని ఏనుగులు అమితంగా ఇష్టపడతాయి. కొన్నిసార్లు 70–80 ఏనుగుల మందలు గుంపులు గుంపులుగా కలసి తోటలో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు వాటి తొక్కిసలాటల్లో కొంతమేర పంట నష్టం జరుగుతుంది. ఒకసారి అవి ఇంటిని కూడా నాశనం చేశాయి. ‘అయితే అడవి జంతువుల కోసం కూడా నేను పంటలను సాగు చేస్తున్నానని భావిస్తా.. అవి నా జీవితంలో సంతోషం నింపాయి’ అని మురిసిపోతారాయన. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు. కొందరు నెలల తరబడి అక్కడే ఉంటారు. రెండేళ్ల క్రితం పొలంలో ఏనుగులమధ్య పోట్లాట జరిగింది. ఒక ఏనుగు చనిపోవటంతో టెన్జింగ్ పొలం వార్తల్లోకి వచ్చింది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ సంస్థ అధికారులు పొలాన్ని సందర్శించి.. ఆ తోటలో ఏనుగులు స్వేచ్ఛగా సంచరించటాన్ని చూసి సంతోషించారు. ప్రపంచంలోనే తొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రంగా టెన్జింగ్ తేయాకు తోటను ధ్రువీకరించారు. మనుషుల సుఖసంతోషాలకు దగ్గరి దారి ప్రకృతిని గౌరవించటం మాత్రమే అని టెన్జింగ్ తరచూ చెబుతుంటారు. ఆయన నమ్మకాన్ని అక్కడి అటవీ జంతువులు అనుక్షణం నిజం చేస్తుండటం ప్రకృతి సాక్షిగా ఒక అద్భుతం! – సాగుబడి డెస్క్ . -
ప్రకృతి ప్రేమికుడు వైఎస్ఆర్
సింహాద్రిపురం : ప్రకృతి ప్రేమికుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ప్రకృతి విధ్వంసకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ రైతు విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సింహాద్రిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల పాలిట ప్రకృతి జగనన్న అని, సకాలంలో సరిపడా వానలు కరుణిస్తేనే రైతాంగం సులువుగా బయటపడుతారన్నారు. ఇంతకమునుపు చంద్రబాబు పాలనలో ప్రకృ తి వైఫరీత్యాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాయని, లాభసాటి ధరలతో రైతాంగం సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో గత మూడేళ్లు వర్షాలు లేక కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ఖరీఫ్లో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రకృతి ప్రేమికులైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర మొదలయ్యే తెల్లవారుజామున భారీ వర్షం కురవడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకృతి దేవత స్వాగతం పలికందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి వర్షం ద్వారా స్వాగతిస్తూనే ఉందన్నారు. ప్రకృతి కరుణవల్ల వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాబోవు రోజుల్లో తిరిగి వైఎస్సార్ పాలన చూస్తారన్నా రు. అంతకముందు వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరవిందనాథరెడ్డి, భరత్కుమార్రెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు అధ్యక్షుడు శివరామిరెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు జనరల్ సెక్రటరీ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి రెండో సమ్మేళనం అక్టోబర్ 14వ తేదీ(శనివారం)న విజయవాడలో జరగనుంది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయదారులు తరలిరావాలని ఏపీ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అగ్ర నేత కుమారస్వామి(94401 27151) పిలుపునిచ్చారు. సిరిధాన్యాల ‘అటవీ కృషి’పై డా. ఖాదర్ శిక్షణ అరిక, సామ, కొర్ర తదితర సిరిధాన్యాలను ‘అటవీ కృషి’ పద్ధతుల్లో సాగు చేయడం, శుద్ధి చేయడం, సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా తినడం ద్వారా జబ్బులను పారదోలడంపై కర్ణాటకకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ మైసూర్ సమీపంలోని తన సిరిధాన్య క్షేత్రంలో రైతులకు, ఔత్సాహికులకు సెప్టెంబర్ 30 – అక్టోబర్ 1 తేదీల్లో శిక్షణ ఇస్తారు. ‘అటవీ చైతన్యం’ అనే ప్రకృతి సేద్య ద్రావణాన్ని తయారు చేసుకోవడం, వాడటం ఎలాగో నేర్పిస్తారు. ఈ పద్ధతిలో సాగయ్యే మిశ్రమ పంటల క్షేత్రాన్ని చూపిస్తారు. 28వ తేదీలోగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రవేశ రుసుము: రూ. 2 వేలు. వివరాలకు 097422 58739 నంబరులో వాట్సప్/మెసేజ్ ద్వారా సంప్రదించవచ్చు. గో ఆధారిత ప్రకృతిసేద్యంపై అక్టోబర్ 10న బసంపల్లిలో శిక్షణ అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతిసేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు. అక్టోబర్ 10న సీకే పల్లి మండలం బసంపల్లి గ్రామంలో ఉదయం 9 గం. నుంచి సా. 4.30 వరకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలి. ప్రవేశ రుసుము రూ. 100. ఇతర వివరాలకు నాగరాజు (94407 46074) పార్థసారధి (96633 67934)లను సంప్రదించవచ్చు. 1న వరి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో అక్టోబర్ 1న వరి, కూరగాయల ప్రకృతి సేద్యంపై ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతు ధర్మారం బాజీ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. -
కువకువల సంధ్యారాగం
ఎర్రటి సూరీడు నల్లటి మబ్బుల మాటుకు జారుకుంటున్న వేళ..నీలాకాశం కాషాయం కాటుక దిద్దుకుని మెరిసిపోతుంటే.. పగలంతా అలసిసొలసిన గువ్వలు ఆ ప్రకృతి కాన్వాస్పై ఒక్క చోట చేరి ఆత్మీయ సరాగాలు ఆలపిస్తున్నట్లుంది కదూ ఈ చిత్రం. ఈ మనోహర దృశ్యం ప్రత్తిపాడు సమీపంలోని పాత మద్రాసు రోడ్డు వెంబడి శుక్రవారం కనువిందు చేసింది. –ప్రత్తిపాడు -
సహజ ఎరువుపై శ్రద్ధలేదు!
అన్ని జిల్లాల్లో మొక్కుబడిగా సాగుతున్న కంపోస్టు పిట్స్ల నిర్మాణం ♦ మంజూరైన కంపోస్టు పిట్స్ 1,68,725 ♦ నిర్మాణంలో ఉన్నవి 19,631 ♦ నిర్మాణాలు పూర్తయినవి5,669 ♦ ప్రారంభానికి నోచుకోనివి1,43,425 పశువుల పేడ, వ్యర్థా ల కోసం నిర్మించు కునే కంపోస్టు పిట్ల కోసం ఒక్కో రైతుకు రూ.4,040 చొప్పున చెల్లిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా నిర్మించే వర్మీ/నాడెప్ కంపోస్టు పిట్స్ల కోసం రూ.12 వేలు చెల్లిస్తున్నారు. వీటిని తమ ఇంటి ఆవరణలో గానీ, వ్యవ సాయ భూమి వద్ద గానీ నిర్మించు కునే వెసులుబాటు కల్పించారు. జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : వ్యవసాయ రంగానికి చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ చివరివరకు కొనసాగకపోవడంతో ఈ పథకాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నాయి. సహజ ఎరువు తయారీని ప్రోత్స హించి రైతులకు పెట్టుబడిని తగ్గించడానికి తీసుకొచ్చిన ‘వర్మీ/ నాడెప్ కంపోస్టు పిట్స్’ నిర్మాణం ముందుకు సాగడం లేదు. వీటి తయారీపై రైతులకు అవగాహన కల్పించకపోవడం, అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రచారం లేక పురోగతి శూన్యం.. రైతులు ఇంటి ఆవరణలో సహజ ఎరువులు తయారు చేసుకోవడా నికి ఏర్పాటు చేసుకునే నిర్మాణాలకు ప్రభుత్వమే నిధులు సమకూ రుస్తున్నదన్న విషయం రైతులకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణం వల్లే ఆయా జిల్లాలకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిర్మాణాల కోసం నిధులు.. సాధారణంగా రైతులు పశువుల పెంటను ఎరువుగా ఉపయోగిస్తారు. దీన్ని పెరట్లోనో, ఇంటి సమీపంలోనో ఏర్పాటు చేసుకుంటారు. అయి తే దీని చుట్టూ గోడ లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఓ పద్ధతి ప్రకారం పెంటను ఎరువుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధు లను మంజూరు చేస్తోంది. అయితే ఈ విషయం రైతులకు తెలీదు. నిర్మాణాలు అంతంత మాత్రమే.. కంపోస్టు పిట్స్ల నిర్మాణాల్లో వరంగల్ రూరల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాకు 10,878 కంపోస్టు పిట్స్ మంజూరైతే 1,224 కంపోస్టు పిట్స్ను మాత్రమే నిర్మించారు. ఇక రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాల్లో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. జయశంకర్, వరంగల్ అర్బన్, కొమురం భీం, మహబూబా బాద్, భద్రాద్రి, మేడ్చల్, నిర్మల్, వనపర్తి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద పల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాలు కంపోస్టు పిట్స్ నిర్మాణాల్లో బాగా వెనుకబడి ఉన్నాయి. -
‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!
► కర్ణాటకలో సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కాడు కృషి) పునరుద్ధరణ ► ‘కాడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువే అటవీ కృషికి మూలాధారం ► రసాయనాల్లేకుండా వర్షాధారంగానే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే అసలైన వ్యవసాయమని ప్రచారోద్యమం ► కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి సిరిధాన్యాలు తింటే కేన్సర్, మధుమేహం తదితర జబ్బులన్నీ వాటికవే నయమవుతాయంటున్న అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త ► అమెరికాలో పెద్ద ఉద్యోగం వదిలి వచ్చి మైసూరు ప్రాంతంలో స్థిర నివాసం.. ► 20 ఏళ్లుగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తూ జన్మ సార్థకం చేసుకుంటున్నడాక్టర్ ఖాదర్ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యక్తి కాదు.. శక్తి!! ప్రజల ఆహారపు అలవాట్లను, రైతుల సాగు పద్ధతిని రసాయన రహితంగా, పంటల సరళిని అత్యంత ఆరోగ్యదాయకమైన రీతిలోకి, ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోకి మార్చేందుకు గత రెండు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నారు డాక్టర్ ఖాదర్. వర్షాధారంగా కొద్దిపాటి నీటి(200 ఎం.ఎం.)తో పండే చిరుధాన్యాలే అసలైన ఔషధ విలువలున్న ఆహార పదార్థాలని, మానవాళిని పీడిస్తున్న ఈ కాలపు సకల రోగాలకు ఈ ‘సిరి’ధాన్యాలే ప్రకృతి మనకు ప్రసాదించిన సంపూర్ణ ఆహారమంటూ డాక్టర్ ఖాదర్ ప్రచారోద్యమం చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రద్ధగా చదువుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో స్టెరాయిడ్స్పై పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి పర్యావరణ సంబంధమైన అంశాలపైన, రసాయనాలకు విరుగుడు కనుగొనే అంశాలపైన వివిధ కంపెనీలలో పదేళ్ల పాటు పనిచేశారు. ఆధునిక మానవ సమాజం తినకూడనివి తింటూ దారుణమైన రోగాల పాలు కావడంతోపాటు.. భూమాతను రసాయనిక వ్యవసాయంతో నాశనం చేసుకుంటూ ఉండటం ఆయనను అమెరికాలో నిలువనీయకుండా చేసింది. 1997లో తిరిగి వచ్చి మైసూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పురాతన భారతీయ ప్రకృతి సేద్య పద్ధతి అయిన ‘అటవీ కృషి’ (కాడు కృషి)ని పునరుద్ధరించి, కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి రైతులకు, గిరిజనులకు పరిచయం చేస్తున్నారు. 2009 నుంచి స్వయంగా 7 ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు వంటి సిరిధాన్యాలతోపాటు నూనెగింజలు, పప్పుధాన్య పంటలను కలిపి పండిస్తూ ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మధుమేహం, కేన్సర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక జబ్బులతోపాటు రైతుల ఆత్మహత్యలను సైతం పారదోలే వజ్రాయుధాలు ‘సిరిధాన్యాలే’నని ఎలుగెత్తి చాటుతున్నారు! వేలాది మంది రైతులు, రోగులకు ఆపద్బాంధవుడిగా మారారు. ఇటీవల విజయవాడ విచ్చేసిన డా. ఖాదర్తో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► శాస్త్రవేత్తగా అమెరికాలో పదేళ్లు పని చేసి, కర్ణాటకలోని మైసూరుకు తిరిగి వచ్చి ‘కాడు కృషి’ అనే అటవీ వ్యవసాయ పద్ధతికి రూపకల్పన చేశారు. అంతరించిపోతున్న ‘సిరి ధాన్యాలను స్వయంగా సాగు చేస్తూ.. ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు కదా.. వీటి గురించి వివరిస్తారా..? భారతదేశంలో మానవులంతా వెయ్యేళ్ల క్రితం నుంచే మన ముందు తరాల వాళ్లు అద్భుతమైన ‘సిరిధాన్యాల’ను రోజువారీ ప్రధాన ఆహారంగా తింటూ వచ్చారు. కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామలు, అరికలు.. ఈ ఐదూ దేవుడు ప్రసాదించిన అత్యద్భుతమైన నిజమైన ఆహార ధాన్యాలు. అందుకే వీటికి నేను ‘సిరి ధాన్యాలు’ అని పేరుపెట్టాను. ఇవే పండించుకొని మరీ తింటున్నాను. కర్ణాటకలోని గ్రామాల్లో తిరిగి రైతులను స్వయంగా కలిసి వారికి వీటి విత్తనాలు ఇచ్చి, పండించమని ప్రోత్సహిస్తున్నాను. కనీసం వెయ్యి చోట్లకు వెళ్లి మీటింగ్లు పెట్టి చెప్పాను. ఇప్పుడు కర్ణాటక అంతటా సిరిధాన్యాలు పెంచడం, వాడకం పెరిగాయి. మానవులు ఆధునికత పేరిట ఇవ్వాళ కంపెనీల మాటలు విని తినకూడనివి తింటున్నారు. ఇవ్వాళ మధుమేహం, కేన్సర్, ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పండించకూడని పంటలు రసాయనిక పద్ధతుల్లో పండిస్తున్నారు. హరితవిప్లవం వల్ల 48 శాతం పంట భూములు పూర్తిగా నిర్జీవమై నిస్సారమై మరుభూములుగా మారిపోతున్నాయి. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ నిశితంగా అధ్యయనం చేసి.. తినే తిండికి కొత్త జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని గ్రహించాను. ఈ గ్రహింపు వచ్చినదే తడవుగా ‘నేను చేయాల్సింది ఉద్యోగం కాదు స్వదేశంలో రైతులు, ప్రజలతో కలిసి పనిచేయాలి’ అనిపించింది. అంతే.. ఉద్యోగం వదిలేసి వచ్చి 20 ఏళ్లుగా మైసూరు ప్రాంతంలో స్వతంత్రంగా పనిచేస్తున్నాను. అంతరించిపోతున్న సిరిధాన్యాల విత్తనాలను సేకరించి రైతులకిచ్చి సాగుచేయించాను. 2009లో 7.5 ఎకరాల బంజరు కొని నేను కూడా ‘అటవీ కృషి’ చేస్తున్నాను. ► సిరిధాన్యాల ప్రాధాన్యం ఏమిటి? సిరిధాన్యాలు మన దేశంలో మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వీటిని చిన్నచూపు చూడడం ప్రారంభమైంది. చిరుధాన్యాలని, తృణధాన్యాలని అంటూ వీటిని తినాల్సిన అవసరం లేదన్న భావన కల్పించడం వల్ల ఈ పంటలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 128 ఏళ్ల నుంచి మాత్రమే మనం వరి బియ్యం తింటున్నాం. నీటి వసతి బాగా ఉన్న దగ్గరే వరి, గోధుమ పండేవి. మొదట్లో అడపాదడపా పండుగలకో పబ్బాలకో తినే వాళ్లం. వరి, గోధుమలు, చెరకు వంటి అధికంగా నీరు అవసరమయ్యే పంటలను రసాయనాలతో పండిస్తున్నాం. కిలో వరి బియ్యం పండించడానికి 8 వేల లీటర్ల నీరు అవసరం. అడవుల నరికివేత కారణంగా నదులు, రిజర్వాయర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇంకెన్నాళ్లీ దుర్గతి? కానీ, కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు చాలు. నాలుగు వర్షాలు పడితే చాలు 3 నెలల్లో పంట పండుతుంది. అండు కొర్రలు 75 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ► మీ ‘అటవీ వ్యవసాయం’ ప్రత్యేకత ఏమిటి? కన్నడలో కాడు అంటే అడవి అని అర్థం. వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అడవిని నాశనం చేసి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం పేరుతో, ఆధునిక పద్ధతుల పేరుతో వాణిజ్య పంటలను కంపెనీల మాటలు విని రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు కుమ్మరించి సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదన ఆశ చూపించి బీటీ పత్తి, చెరకు, వరి, గోధుమ వంటి అధిక నీరు అవసరమయ్యే ఏక పంటలను రైతుల చేత సాగు చేయిస్తున్నారు. భూమి తల్లిని సర్వనాశనం చేస్తున్నాం, మనల్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే 38 శాతం సాగు భూములు మరుభూములుగా మారాయి. భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అటవీ కృషి అని అంటున్నాను. నిజమైన ఆహార పంటలు పండించుకుంటూనే భూమి తల్లిని, జంతుజాలాన్ని కాపాడుకోవడానికి అటవీ కృషిని ప్రారంభించాం. గుప్పెడు అడవి మట్టితో తయారు చేసి వాడుకునే ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువు.. ప్రతి రైతూ తన సాగు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో పొలం పక్కనే అడవిని పెంచడం.. ఆకులు, అలములు పొలంలో వేసుకోవటం ముఖ్యమైన విషయాలు. ఒకే పంటను పండిస్తే చీడపీడల సమస్యలు తలెత్తుతాయి. కొర్రలు తదితర 5 రకాల సిరిధాన్యాలు (ఏకదళ పంటలు), పప్పుధాన్యాలు (ద్విదళ పంటలు), నూనె గింజ పంటలను మిశ్రమ సేద్యం చేయాలి. మా పొలంలో 12 పంటలు కలిపి పండిస్తున్నాం. చీడపీడల సమస్యే రాలేదు. ► ప్రతి రైతూ పొలం పక్కనే 20 శాతం విస్తీర్ణంలో తానే అడవిని పెంచుకోవాలని మీరు చెబుతున్నారు. కేవలం ఎకరం, రెండకరాలున్న రైతులకు ఇదెలా సాధ్యం? 7.5 ఎకరాల బీడు భూమిని 2009లో కొనుగోలు చేసి, 3 ఎకరాల్లో అడవిని, 4.5 ఎకరాల్లో పంటలను పెంచుతున్నాను. 3 ఎకరాల అడవి 10 ఎకరాల్లో పంటను కాపాడుతుంది. అడవిలో చెట్లకు రాలే ఆకులు, రెమ్మలను ఏరి ఎండాకాలంలో తెచ్చి పొలంలో వేసుకోవాలి. అడవిలో చెట్ల ఆధారంగా కొన్ని పక్షులు, చిన్నా చితకా జంతువులు కూడా పెరుగుతాయి. ఆకులు అలములను వీటి మలమూత్రాల్లోని సూక్ష్మజీవులు సహజ ఎరువుగా మార్చుతాయి. అందుకే దీన్ని ‘అటవీ ప్రసాదం’ అంటున్నాం. దీన్ని తెచ్చి వేసవిలో పొలంలో వేసుకోవాలి. సిరిధాన్య పంటలు పొలంలో వేస్తే కంకులు కోతకొచ్చే సమయంలో 15 రోజులపాటు పక్షుల గుంపులు మన పొలంలోకి పిలవని అతిథులుగా వచ్చేస్తాయి. కొంతమేరకు పంటను అవి తినేస్తాయి. అయినా, పర్వాలేదు. ఎందుకంటే.. అవి తినే గింజల ఖరీదు కన్నా అవి మన పొలంలో వేసే రెట్టలు ఎంతో విలువైన పోషకాలతో భూమిని సారవంతం చేస్తాయి. ఎక్కడో ఒక రైతు సిరిధాన్యాలు పండిస్తే పక్షుల వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కొందరు రైతులు సిరిధాన్యాలు వేస్తే రైతుకు నష్టం తెలియనంత తక్కువగా ఉంటుంది. పొలంలో అక్కడక్కడా చిన్న, చిన్న నీటి కుంటలు తవ్వుకుంటే.. అందులోకి చేరే నీటిలోకి ఈ పక్షుల రెట్టల్లోంచి వచ్చి చేరే సూక్ష్మజీవరాశి ఆ నీటిని పోషక జలంగా మార్చేస్తాయి. పక్షులు పురుగులను ఏరుకొని తినేస్తాయి. అడవి పక్కన ఉండే పొలంలో చీడపీడల బెడదే ఉండదు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ భూమిలో కనీసం 20 శాతం విస్తీర్ణంలోనైనా అడవిని కూడా పెంచుకోవాలి. అప్పుడు అడవిని ప్రత్యేకంగా ఎక్కడో పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రకృతిలో పరస్పరాధారిత జీవనచక్రాన్ని మనమే తెంపేశాం. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా దీన్ని తిరిగి మనమే నిర్మించుకోవాలి. ‘అటవీ కృషి’ పద్ధతి మూలసూత్రం ఇదే. కర్ణాటకలో వందల వేల రైతులు ఈ పద్ధతిలో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ► సిరిధాన్యాల సాగు రైతుల ఆత్మహత్యలు ఆపగలదా? సిరిధాన్యాల సాగు చాలా సులువు. తెలుగు రైతులు సిరిధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టినా తగినంత మార్కెట్ ఉంది. కేవలం ఆహారం వల్లనే హైదరాబాద్లో నూటికి 38 మందికి మధుమేహం వచ్చింది. వచ్చే ఐదేళ్లలో ఇది 60 శాతానికి చేరుతుంది. వీరికి సిరిధాన్యాల గురించి తెలిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ ఇక్కడే ఏర్పడుతుంది. పేద రైతులు పండించే సిరిధాన్యాలను మంచి ధరకు పట్నవాసులు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? ప్రభుత్వాలు కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల మీద ఆధారపడితే రైతులు స్వావలంబన దిశగా ముందుకు వెళ్లలేరు. కొన్నాళ్లకు ప్రభుత్వ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ∙ (డాక్టర్ ఖాదర్ను 094485 61472, , musk123rt@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఆయన సాధారణంగా రైతుల సమావేశాల్లో, హోమియో వైద్యంలో బిజీగా ఉంటారు..) సిరిధాన్యాలకు ఆ ఔషధ గుణాలెలా వచ్చాయి? జొన్నలు, సజ్జలు, రాగులు ఈ పరిధిలోకి రావా? ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్) ఎంత ఉంది? పిష్టపదార్థం (కార్బోహైడ్రేట్లు) –పీచుపదార్థం మధ్య నిష్పత్తి ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యం, గోధుమలు తింటూ ఉంటే ఆరోగ్యం బాగుపడదు. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిష్టపదార్థం 79 శాతం. పీచుపదార్థం – పిష్టపదార్థం నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిష్టపదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే శక్తిగల ఆహారంగా భావించాలి. తిన్న తర్వాత నెమ్మదిగా 6–8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజ్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒక రకం చొప్పున మార్చి మార్చి తింటే చాలు. 2 గంటలు నానబెట్టడం వల్ల సిరిధాన్యాల బియ్యంతో అన్నం బాగా ఒదుగుతుంది. కిలో వండితే పది మందికి సరిపోతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు తటస్థ ధాన్యాలు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన ఆహారం. ‘అటవీ చైతన్యం’ ద్రావణం తయారీ ఎలా? ‘అటవీ చైతన్యం’ తయారీకి కావలసిన పదార్థాలు: 1. అభయారణ్యంలో నుంచి తెచ్చిన గుప్పెడు మట్టి 2. ఐదు రకాల సిరిధాన్యాల పిండి పావు కిలో 3. పప్పుధాన్యాల పిండి పావు కిలో 4. తాటి బెల్లం 50 గ్రాములు 5. 30 లీటర్ల నీరు మట్టి కుండను కుతిక వరకు నేలలో పాతిపెట్టి.. అందులో 30 లీటర్ల నీటిని పోసి మట్టి, పిండి, తాటిబెల్లం కలిపి.. కుండపై మూత పెట్టాలి. కుండపై నేరుగా ఎండ పడకుండా నీడను కల్పించాలి. రోజూ కలియదిప్పాల్సిన పని లేదు. 5 రోజులకు అటవీ చైతన్యం వాడకానికి సిద్ధమవుతుంది. 6వ రోజు నుంచి 21వ రోజు వరకు దీన్ని వాడుకోవచ్చు. అప్పటి వరకు సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉంటుంది. అటవీ చైతన్యం తయారీ కోసం ప్రతిసారీ అభయారణ్యంలోకి వెళ్లి మట్టి తేనవసరం లేదు. అటవీ చైతన్యం ద్రావణాన్ని ఒక లీటరు తీసి పక్కన పెట్టుకొని.. 21 రోజుల లోగా.. మళ్లీ తయారు చేసుకోవాలి. మట్టికి బదులు ఈ ద్రావణాన్ని కుండలో వేసుకోవాలి. అంటే సిరిధాన్యాల పిండి, పప్పుల పిండి, తాటి బెల్లం మళ్లీ కలుపుకొని.. ఈ లీటరు అటవీ చైతన్యం ద్రావణాన్ని కలుపుకుంటే చాలు. 5 రోజుల తర్వాత అది వాడకానికి సిద్ధమవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం తిరిగి కలుపుకుంటూ ఉండవచ్చు. మైసూరు దగ్గరలోని మా క్షేత్రాన్ని సందర్శించే వారికి ఒక లీటరును ఉచితంగా ఇస్తున్నాం. పిచికారీ పద్ధతి: ద్రవ రూప ఎరువు ‘అటవీ చైతన్యం’ ఒక లీటరు తీసుకొని 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని ఎకరం పొలంలో మట్టిపైన, సూర్యాస్తమయం సమయంలో, పిచికారీ చేయాలి. కొత్త స్ప్రేయర్తో పిచికారీ చేయవచ్చు లేదా చేతితోనైనా చల్లవచ్చు. వారానికి రెండు సార్లు చల్లాలి. ఇలా 6 వారాలు చేస్తే.. భూమి సారవంతమై పంటల సాగుకు అనువుగా మారుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బాగా పాడైపోయిన భూమిని కూడా ఇలా తిరిగి పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఎటువంటి రసాయనిక ఎరువులు, కలుపుమందులు చల్లకుండా.. వరుసగా రెండేళ్లు అటవీ చైతన్యాన్ని ఇలా పిచికారీ చేస్తే ఇక ఆ భూమిలో చల్లకపోయినా పర్వాలేదు. భూమిని సారవంతం చేయడానికే కాదు.. పంటలపైన పిచికారీ చేసినా సరిపోతుంది. వందల ఎకరాలు సాగు చేసే రైతులు అందుకు అవసరమైనన్ని కుండల్లో అటవీ చైతన్యాన్ని తయారు చేసుకోవచ్చు. తొలి దశలో నాగలితో భూమిని దున్నాలి. భూమి గుల్లబారిన తర్వాత నేలను కుళ్లగించే చేతి పరికరాలతో నేలను తవ్వితే సరిపోతుంది. అటవీ చైతన్యాన్ని క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే 3 నుంచి 6 నెలల్లోగా ఎటువంటి బీడు భూమినైనా పంటల సాగుకు అనువుగా మార్చుకోవచ్చు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటో: కందుల చక్రపాణి, ఫొటో జర్నలిస్టు, విజయవాడ -
దేశీ విత్తనం.. ఆరోగ్యం.. ఆదాయం!
రసాయన సేద్యం చేసేటప్పుడు అప్పుల కోసం తిరిగి తిరిగి అనునిత్యం అనుభవించిన వేదనను అధిగమించి ప్రకృతి సేద్యంలో దేశీ వరి వంగడాల సాగు ద్వారా ప్రశాంత జీవనానికి బాటలు వేసుకున్న ఆ యువ రైతు బైరపాగ రాజు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకు చదివి 2004లో కుటుంబ సేద్యం చేపట్టాడు. బలం వీర్యవృద్ధికి దోహదం చేసే మాప్లా సాంబ, సాధారణ ప్రసవం కోసం కూల్కర్ రకం, పలు ఔషధ విలువలున్న మైసూర్ మల్లిగ వంటి వందలాది దేశీ వరి రకాలను ఆయన సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమంలో జరిగిన పాలేకర్ శిబిరంలోనే రాజు తొలిసారి శిక్షణ పొందాడు. అనేక సంవత్సరాలుగా సాక్షి ‘సాగుబడి’ పేజీలో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యంపై వచ్చే కథనాలను ఆసక్తిగా చదివి ఆకళింపు చేసుకుంటున్నాడు. ఆ కథనాల స్ఫూర్తితో 2014 ఖరీఫ్లో తొలిసారిగా ప్రకృతి సేద్య విధానంలో 25 సెంట్లలో ఆర్ఎన్ఆర్ –15048 రకం వరిని ప్రయోగాత్మకంగా సాగుచేశాడు. ఖరీఫ్లో ఆరు, రబీలో 8 బస్తాల దిగుబడి వచ్చింది. 2015 ఖరీఫ్లో అరెకరంలో 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రాజుకు ప్రకృతి సేద్యంపై గురి కుదిరింది. 2016లో ‘సాగుబడి’ పేజీలో వార్తను చూసి హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ‘సేవ్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దేశీ విత్తన పంపిణీ కార్యక్రమానికి హాజరై 70 రకాల దేశీ విత్తనాలను రాజు తెచ్చుకున్నాడు. ఖరీఫ్లో రెండెకరాల్లో సాగు చేశాడు. నారుమడిని భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకం విత్తనాన్ని పోసుకున్నారు. అట్టముక్కలపై రకాల పేర్లు రాసి సూచికలు ఏర్పాటు చేశారు. తొలుత బీజామృతంతో విత్తన శుద్ధి చేశారు. రెండుసార్లు నీటి ద్వారా జీవామృతం అందించారు. నాటుకునే ముందు నారును కట్టలుగా కట్టి బీజామృతంలో ముంచి శుద్ధి చేశారు. దమ్ములో ఎకరాకు 100 కిలోల ఘన జీవామృతం వేశారు. మడికి 4 రకాల చొప్పున నాట్లు వేశారు. రకానికి రకానికి మధ్యన 3 అడుగుల ఎడం కాలిబాటలు వదిలారు. నాట్లు వేసిన 10, 35, 65, 100 రోజుల దశలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. చీడపీడల నివారణకు అగ్నిఅస్త్రం చల్లారు. దేశీ విత్తనాలకు ఎలాంటి తెగుళ్లు ఆశించలేదు. నాట్లు,కోత దశలో కొంచెం శ్రమ పెరిగింది. ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. విత్తన వరి మడుల మధ్య దూరం వదిలేయడం వల్ల కొంత భూమి వృథా అయ్యిందని, అందువల్ల ఎక్కువ రకాల విత్తనోత్పత్తి చేసినప్పుడు దిగుబడి తక్కువగా ఉంటుందని రాజు చెప్పారు. విత్తనాలను కిలో రూ. 50 చొప్పున రైతులకు విక్రయించారు. అయినా, సాగు ఖర్చు తక్కువ కాబట్టి, ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించింది. ప్రకృతిసేద్యంలో నేల గుల్లబారటం వల్ల కలుపు సులభంగా చేతికొస్తుంది. శ్రమతో పాటు కూలి ఖర్చు సగం తగ్గింది. పొలంలో సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలతో పాటు పలు రకాల మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగింది. మైసూర్ మల్లిగ, కాలాబట్టిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఖరీఫ్లో ఒక ఎకరంలో మైసూర్ మల్లిగ (సన్నరకం), మరో ఎకరంలో కాలాబట్టి (దొడ్డు రకం.. నల్ల బియ్యం) రకాలను.. మరో ఎకరంలో బాసుమతి, కులాకర్, మాపిళ్లై సాంబ, ఇల్లప్సాంబ, కె5, నవార రకాలను రాజు సాగు చేస్తున్నాడు. కాలాబట్టి నాటిన 40 రోజుల్లో మనిషి ఎత్తున ఎదిగింది. మైసూర్ మల్లిగ 40 బస్తాల ధాన్యం దిగుబడితో మంచి ఆదాయమూ వస్తుందని రాజు ఆశిస్తున్నారు. మహిళలకు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజువారీ తినడానికి ఈ రకం బాగుంటుంది. కాలాబట్టి దొడ్డు రకం నల్లబియ్యం రకం. పాయసం వండుకోవడానికి ఇది శ్రేష్టమైనది. తన కుటుంబ సభ్యులు పిండి (రసాయనిక ఎరువులు) వేయకపోతే లాభం ఎక్కువ రాదని అంటున్నారని, ప్రకృతి వ్యవసాయంలోనే ఈ ఏడాది మంచి దిగుబడితోపాటు అధిక నికరాదాయం సాధించి వారికి కూడా పూర్తిస్థాయి సంతృప్తి కలిగించగలనన్న భరోసా ఇటీవలి వర్షాల వల్ల కలిగిందని రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహంతో కూరగాయలను సైతం సాగు చేసేందుకు రాజు సిద్ధమవుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. ప్రత్యేక ఔషధ గుణాలకు తాతల కాలం నాటి దేశీ వరి వంగడాలు పెట్టింది పేరు. పోషక విలువలు పుష్కలంగా కలిగి ఉండటంతోపాటు వీటిని సేవ్ సంస్థ విజయరామ్, శివప్రసాద రాజుల ప్రోత్సాహంతో శ్రద్ధగా సాగు చేస్తున్నా. రైతులకు విత్తనాలు, ప్రజలకు బియ్యం అందిస్తున్నా. ఆరోగ్యవంతమైన సమాజం కోసమే ప్రకృతి సేద్యం చేస్తున్నా. హేళన చేసిన వారే మెచ్చుకుంటున్నారు. – బైరపాగ రాజు (81868 86807), గుమ్మకొండ, నాగర్ కర్నూల్ – చింతకింది లింగం, సాక్షి, తిమ్మాజీపేట, నాగర్ కర్నూల్ జిల్లా -
వీటితో స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండండి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 25,864 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది నమోదైన కేసులకన్నా 14 రెట్లు ఎక్కువ. ఇక 2016లో 1,786 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. స్వైన్ఫ్లూ శ్వాసకోస వ్యాధి కావండంతో త్వరగా విస్తరిస్తోంది. వ్యాధిని గుర్తించడంలో నిర్లక్ష్యం వహించడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ వ్యాధి మరణాల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడంతోనే స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా లభించే ఆహార పదార్థాలతో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇది చల్లని వాతవారణంలో త్వరగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఈ మన్సూన్ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది వాటితో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు.. ♦వేడి నీరు, నిమ్మ రసం, తేనేల మిశ్రమాన్ని ఉదయాన్నే పడిగడుపున తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. ♦ హెర్బల్ టీలతో కూడా వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసి, అల్లం, నిమ్మ, బ్రాహ్మి టీలతో ఈ వ్యాదికి దూరంగా ఉండవచ్చు. ♦ఉసిరి జ్యూస్లో తేనేను కలిపి తాగడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందు యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రిన్లు పుష్కలంగా ఉంటాయి. ♦పసుపు మానవ శరీరానికి మంచి ఔషదంలా పనిచేస్తోంది. యాంటి బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గా పనిచేస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంపోందిస్తుంది. ఇది మనం వంటలలో రోజు వాడేదే. ♦ నల్లమిరియాలు శరీరంలో వేడిమిని తగ్గించడమే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తాయి. మిరియాలను కూడా మన ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాం. ♦ దాల్చిన చెక్కతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పిలను తగ్గించడమే కాకుండా ఎలాంటి వైరస్లు ధరిచేరకుండా చేస్తోంది. దాల్చిన చెక్క పౌడర్ను తేనేలో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. -
చిన్న రిక్వెస్ట్ బాస్!
మా కోరికలేవీ పెద్దవి కావు బాస్. చిన్న చిన్న విఘ్నాలు తొలగిస్తే చాలు. ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఉండ్రాళ్లు పెడుతూ తరిస్తాం. విపత్తులు, ఉత్పాతాలు, విలయాలు... వాటి పని మీరే చూసుకుంటారు. చికాకులు, చిర్రుబుర్రులు, చివాట్లు, చిక్కులు... ఇవి మా ప్రాబ్లమ్స్. ఇవే విఘ్నాలు. నిన్ను దేవుడూ అని పిలుస్తూ ఎక్కడో దూరంగా ఉంచాలని లేదు. మనసుకు దగ్గరగా ఉంటావ్... బాగా క్లోజ్గా అనిపిస్తావ్. ఏదైనా చెప్పేసుకోవచ్చు... అన్నంత క్లోజ్గా అనిపిస్తావ్ బాస్. మా విన్నపం మన్నించండి. కొంచెం కన్సిడర్ చేయండి బాస్. ఇది ఓ ఫ్యామిలీకి కంబైన్డ్గా వచ్చిన కల. వినాయకుణ్ణి ఏం కోరుకున్నారో సరదాగా చదవండి. పత్రితో నీకు పూజలు చేస్తాం. పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు. గొడుగు నీకు అమరుస్తాం. ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు. ఉండ్రాళ్లు సమర్పిస్తాం. ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు. అత్తగారు ఊరి నుంచి ఆవకాయతో దిగుతుంది. తెల్లారి లేచే సరికి కొడుకు కిచెన్లో కేరెట్ తరుగుతుంటాడు. ‘అదేమిటే అమ్మాయ్. అబ్బాయి చేత కూరగాయలు తరిగిస్తున్నావ్. రేపటి నుంచి విమ్ సోప్ చేతిలో పెట్టి అంట్ల ముందు కూర్చోబెడతావా ఏంటి? వాడు ఉద్యోగానికి వెళ్లొద్దూ?’ అంటుంది అత్తగారూ. ‘నేనూ బేవార్సుగా లేను కదా అత్తయ్యా. నేనూ జాబ్కు వెళ్లాలి కదా. ఇంట్లో ఆ మాత్రం సాయం చేయకపోతే పనులెలా అవుతాయ్’ అంటుంది కోడలు. అక్కడి నుంచి ఆ ఇంట్లో శాంతికి విఘ్నం. అలా కాకుండా అత్తగారు కిచెన్లో కష్టపడుతున్న కోడలిని చూసి ‘ఏరా అబ్బాయ్. అమ్మాయి ఒక్కత్తే ఎంత పనని చేసుకుంటుంది. కూర్చుని పేపర్ చదువుకోకపోతే ఆ కేరెట్ కాస్త కట్ చేసి పెట్టరాదూ’ అనంటే ఎంత బాగుంటుంది.నువ్వు స్నానానికి వెళ్లమ్మాయ్. ఈలోపు నేను కేరేజీ కట్టేస్తానుగా’ అంటే ఎంత బాగుంటుంది. ‘సాయంత్రం ఉరుకులు పరుగుల మీద వచ్చేయకండి. కలిసి సినిమాకెళ్లి హోటల్లో ఏదైనా తినేసి రండి. నాదేముంది ఈ పూట శనివారం. నేను ఉపవాసం. వస్తూ నాకేదైనా లైట్గా పట్రండి’ అంటే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. పిల్లలు పిడుగులు. తండ్రి ఆఫీసుకు వీరభక్తుడు. ఆదివారం పూటైనా కృష్ణకాంత్ పార్క్కు వెళ్లి కోన్ ఐస్క్రీమ్ తినిపించు డాడీ’ అని వాళ్ల మారాము. మా బాస్ కొంటె కృష్ణుడు. పెండింగ్ వర్క్ పూర్తి చేయకపోతే మెమోతో ముద్దిస్తాడు’ అని తండ్రి హైరానా. పిల్లల అలక. తండ్రి ఆగ్రహం. తల్లి పీచుపీచు. ఇక ఆ ఇంటి మనశ్శాంతికి విఘ్నం. అలా కాకుండా ఆ బాస్ను ఏ అండమానో చెక్కేసేలా చేస్తే ఎంత బాగుంటుంది. డాడీగారు జాంజామ్మని సాయంత్రానికే ఇల్లు చేరుకుని బైక్ మీద ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని జి.వి.కె మాల్లో మాలామాల్ చేయిస్తే ఎంత బాగుంటుంది. మళ్లీ రెండు వారాల దాకా అడక్కుండా ఉండేలా ఫన్ జోన్లో ఆడించి, ఫుడ్ కోర్ట్లో తినిపించి, బిగ్ స్క్రీన్ మీద మహేశ్బాబు మాస్ మూవీ చూపించి తెస్తే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. భర్తగారికి ఊరుకూరికే ఆకలేస్తుంటుంది. భార్యగారికి చీటికి మాటికి నిద్ర కమ్ముకొస్తోంది. షుగరా అని భర్తకు డౌటు. థైరాయిడ్డేమో అని భార్య నలుగుబాటు.శనివారం ఎర్లీమార్నింగ్ ల్యాబ్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పటి నుంచి రిపోర్ట్సు వచ్చేంత వరకూ అనుక్షణంఆత్మశాంతికి విఘ్నం. ఆనందానికి విఘ్నం. ఆలోచనకు విఘ్నం.అలా కాకుండా అది షుగరూ కాదూ పాడూ కాదు మనిషి గుమ్మటంలా ఉన్నావ్ అని రిపోర్టు వస్తే? థైరాయిడ్డు లేదూ ఏమీ లేదు మనిషి దంగల్ లేడీలా ఉందని కౌంట్ తేల్చి చెప్తే?ఎంత హాయిగా ఉంటుంది. మరెంత హొయలుగా అనిపిస్తుంది. వానాకాలంలో జలుబు, ఎండాకాలంలో కాసిన్ని చెమటకాయలు, చలికాలంలో చుండ్రు తప్ప జీవితంలో ఎప్పుడూ ఏ అనారోగ్యం రాకుండా ఉంటే? అలా అని కరుణించు స్వామీ. ఈ లైఫ్ను హాస్పిటల్ మెట్లక్కనీయకుండా ఆశీర్వదించు స్వామీ. జూబ్లీహిల్స్లో కలిగిన వారి కల్యాణానికి వెళ్లాం. బెంగుళూరు నుంచి వచ్చిన చిట్టిరోజాలతో కట్టిన మండపం. ఒక సెల్ఫీ. ఒక మూలగా మద్రాస్ అయ్యంగార్ వయొలిన్ కన్సర్ట్. ఒక సెల్ఫీ. ఆహూతులలో సన్నాసన్నని తమన్నా. ఒక సెల్ఫీ. బఫే దగ్గర డబుల్ బిరియానీతో ఒక సెల్ఫీ. ఆలూ అల్బత్తాతో ఒక సెల్ఫీ. ఇవన్నీ తీసుకుని ఇంటి కొచ్చి ‘ఫ్యామిలీ గ్రూప్’లో వాట్సప్ చేసి వాట్ యార్ అని పోజు కొడదామంటే వైఫై పని చేయకపోతే? దేర్ ఈజ్ నో ఇంటర్నెట్ కనెక్షన్ అని మెసేజ్ చూపిస్తుంటే? ఆ యొక్క అతిశయానికి ఆ యొక్క ప్రదర్శనానందానికి ఎంతటి విఘాతం. మరెంతటి విఘ్నం. అలా కాకుండా ఆల్వేస్ వైఫై పని చేసేలా ఉంటే? నట్టింట నెట్ కళకళలాడుతుంటే?అలా అని హండ్రెడ్ ఎంబిపిఎస్తో ఆశీర్వదించు స్వామీ. అబ్బాయికి మీసం కర్వ్ తిరిగే ఏజ్ వచ్చింది. అమ్మాయికి ఊరికూరికే నవ్వొచ్చే ప్రాయం వచ్చింది. అబ్బాయి ఎక్కడ తిరుగుతాడో తెలియదు.అమ్మాయిని ఎవరు తనవైపు తిరిగేలా చేసుకుంటారో తెలియదు. అది కాదూ..’ అని తల్లి ఏదో చెప్పబోతుంది. నీకేం తెలియదు ఊర్కో’ అని విసురు.అది కాదురా’ అని తండ్రి ఏదో అనబోతాడు. నస ఆపు డాడీ’ అని రుసురు.ఏ వయసు ముచ్చట ఆ వయసులో ఉండాల్సి వున్నా అది హద్దు అదుపుల్లో ఆరోగ్యకరమైన అంచుల్లో లేకపోతే మరి ఆ తల్లిదండ్రులకు ఎంతటి ఘాతం. మరెంత విఘాతం.అలా కాకుండా పిల్లలు తమ మంచి చెడ్డలను తల్లిదండ్రులతో పంచుకుంటే ఎంత బాగుంటుంది. వారిని తమ జర్నీలో తోడుగా ఉంచుకుంటే మరెంత అందంగా ఉంటుంది. అలా అని ప్రతి సంతానానికీ వారి కన్నవారికీ వెలుగు పంచు స్వామీ.నలుగురి హృదయాలలో ఆనందాన్ని వెలిగించు స్వామీ. ఒక భర్తగారికి వాటర్ అలెర్జీ. అతను వైన్ షాప్లో దొరికేదానినే వాటర్ అనుకుని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక హజ్బెండ్ గారికి ఇల్లంటే రోత. వారు పేకాట క్లబ్బునే తన ఆవాసం చేసుకుంటూ ఉంటారు. ఒక మొగుడు మహాశయునికి కరెన్సీయే ఆక్సిజన్. దాని వేటలో ఇంటికే రారు. ఒక పురుషుడు వేళ్లతో వాట్సప్లో ఎవరెవరితోనో మాట్లాడటం తప్ప ఇంట్లో నోరు తెరవడు. ఒక మగ అతనికి నిలువెల్లా అనుమానం. మరో మగపురుగుకి చేయి దురుసు జాస్తి.ఏ ఇంటికైనా ఇంతకు మించిన విఘ్నం ఉంటుందా?ఆ ఇంటి ఇల్లాళ్లకు పిల్లలకు అంతకు మించిన విఘాతం ఉంటుందా?సరదాలు వ్యసనాలుగా మారని, విసుగులు ఉత్పాతాలుగా రూపాంతరం చెందని, అసంతృప్తులు ఆజ్యంగా మారి పైకప్పులను తగలబెట్టని ఇళ్లు కావాలి. దంపతులు మార్నింగ్ పూట కలిసి చిర్నవ్వుతో టీ సేవించే, పిల్లలు నవ్వుకుంటూ స్కూలు విషయాలు చెబుతూ ఒడిలో కూర్చునే, అమ్మానాన్నలూ తరుచూ వచ్చిపోయే లేదంటే పిల్లల దగ్గరే ఉండిపోయే, నెలకోసారైనా ఆత్మీయులు చేయి కడిగే, ఆనందానికి తప్ప దుఃఖానికి చెమర్చని కళ్లు ఉండే, ఇరుగు పొరుగులతో సామరస్యం ఉండే, చక్కని వంట కుదిరే, పండే పక్క కుదిరే, తృప్తిగా నిదుర పట్టే, నిర్మలమైన వేకువ తట్టి లేపే ఇళ్లు ఉంటే ఎంత బాగుంటుంది?అలాంటి ఇళ్లను కటాక్షించు స్వామీ.బయట జోళ్ళు, ఇంట్లో వెచ్చాలు, అవసరాలు తీర్చగల డబ్బు ఉండే ఏటీఎం కార్డులు, బాల్కనీలో పూలు పూసే కుండీలు, అవసరానికి సాయం చేసే చేతులు, దేవుని ఆశీర్వాదాలు, చెదరని దరహాసాలు... ఇవి ఉండే ఇళ్లను ప్రసాదించు స్వామీ. పత్రితో నీకు పూజలు చేస్తాం.పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు.గొడుగు నీకు అమరుస్తాం.ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు.ఉండ్రాళ్లు సమర్పిస్తాం.ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు.నిన్ను చల్లగా నిమజ్జనం చేస్తాం.సకల అసంతృప్తులను అసమానతలను అమానవీయ ఆలోచనలను ఏటిలో కలుపు.అస్తు దేవా. తథాస్తు గణేశా. – కె -
నాకు క్యూటీ కావాలి!
పిట్ట కథ ఓ పదిహేను రోజులక్రితం... టైం ఎనిమిదవుతుంది... నేనింకా నిద్రలోనే ఉన్నా.. బాల్కనీ గోడ పక్కన ఓ కొత్త సవ్వడి.. ఇంతకు ముందు విన్నపక్షుల సవ్వడిలా లేదు. బలవంతంగా నిద్రలేచి తలుపు తీసి చూశాను. ఏం కనిపించలేదు. కానీ ఆ కొత్త సవ్వడి మాత్రం వినిపిస్తూనే ఉంది. మొహం కడుక్కుని స్నానం చేసేలోపు ఓ ఐదారుసార్లు వినిపించింది ఆ సౌండ్ పిట్ట మాత్రం కనిపించలేదు. ఇలా కాదని జాగ్రత్తగా సీతాఫలం చెట్టు ఆకుల మధ్యలోంచి నెమ్మదిగా చూశాను.. అప్పుడు కనిపించింది.. నేను ఊహించినట్టే ఓ కొత్త పక్షి. చాలా చిన్నగా... పిచ్చుకలో సగం సైజే ఉంది. బూడిదరంగు శరీరం... తోకమాత్రం భలే అందంగా ఉంది. నెమలీకను బీడీ సైజ్ లో కట్ చేసి అతికించినట్టుంది. అది సీతాఫలం చెట్టు ఆకు వెనకాల దాక్కుంది.. ఆ ఆకు దానిని పూర్తిగా కవర్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అదెంత ఉందో. కానీ చూడ్డానికి మాత్రం భలే ముద్దుగా ఉంది. అరుపు కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి నాకు ఆసక్తి పెరిగింది. రెండోరోజు చూస్తే సీతాఫలం చెట్టు మీదే చిన్న గూడు కట్టుకుంది.. అసలా గూడు చూస్తే హాశ్చర్యపోతారు. కేవలం మూడంటే మూడే ఆకులతో ఎంత చక్కగా గూడు కట్టిందంటే, భలే ముచ్చటగా ఉందిలే. వెంటనే మా ఆవిడను పిలిచి చూపించాను. ముచ్చటగా కట్టుకున్న దాని ఇల్లు చూసి ముక్కున వేలేసుకుంది. మా అబ్బాయికయితే ప్రపంచ వింత చూస్తున్నంత సంబరం. వాడు స్కూల్లో టాంటాం వేశాడు తనకు కొత్త ఫ్రెండ్ అని, దాని పేరు క్యూటీ అనీ, దాని గూడు బాగుందనీ ఇలా... క్యూటీతో చిక్కేంటంటే.. అలికిడి వినిపిస్తే గూట్లోంచి ఎగిరిపోయేది.. అందుకే మెల్లగా.. బెడ్ రూం డోర్ తీసి మెత్తగా అడుగులు వేస్తూ చిన్నగా మెడ పైకెత్తి చూస్తే దాని గూడు కనిపించేది. అందులో తలపైకెత్తి పడుకునేది. చిన్న మొహం.. పూసల్లాంటి కళ్లు.. చిన్నముక్కు.. పదేపదే చూడాలనిపించేది కానీ సెకనులో వెయ్యోవంతులో ఎగిరిపోయేది. కొన్ని రోజులు ఇదే తంతు. మేమైతే భలే ఎంజాయ్ చేస్తున్నాం ఇదంతా.. వారం రోజుల్లోనే దాంతో చిన్న అటాచ్మెంట్ పెరిగింది. దానికి కూడా నమ్మకం కుదిరిందేమో. ఇంతకు ముందులా మరీ వేగంగా పారిపోవడం లేదు. లేకపోతే చప్పుడు చేయకుండా చూడడం నాకు అలవాటయిందో మరి.. చెట్ల ఆకుల మధ్యలో కూర్చుని ఆ చిన్న అందమైన తోకని బోరింగ్ కొట్టినట్టు పైకీ, కిందకీ ఊపుతూ బోలెడు పాటలు పాడేది. మేం జాగ్రత్తగా తలుపు కొంచమే తెరిచి దానిని చూస్తుండేవాళ్లం. వేడివేడి టీకప్పుతో కిటీకీ దగ్గర నిల్చుని బయట దానిని చూడడం నాకు గొప్పగా అనిపించేది.ఆ మధ్య రెండు రోజులు వర్షం పడింది.అర్ధరాత్రి మెలకువొచ్చింది.. జోరున వర్షం పడుతున్న శబ్దం నా మనసులో ఏదో అలజడి. పే...ద్ద గాలి వాన. మా తలుపు సందులోంచి సన్నగా నీళ్లు లోపలికి వస్తున్నాయ్. అమ్మో.. ఇంత గాలివాన.. క్యూటీ ఎలా ఉందో... సిమెంట్తో కట్టిన ఇంట్లోకే నీళ్లొస్తున్నాయ్.. దాని ఆకుల గూడు ఎలా ఉందో! మనసులో ఒకటే దడదడ. ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని నెమ్మదిగా డోర్ తెరిచి ఆకుల మధ్యలోంచి లైట్ వేసి చూశాను. ఆశ్చర్యం.. దాని గూడు ఏమాత్రం తడవలేదు.. గాలికి దాని గూడు ఊగుతుంటే ఊయల ఊగినట్టు.. లోపల హాయిగా నిద్రపోతుంది. ఈసారి మాత్రం ఎగిరిపోలేదు.. దానిని అంత స్పష్టంగా చూడడం అదే మొదలు. ఇక నాకు ఇదే అలవాటైపోయింది.. పొద్దున్నే వాటి సవ్వడితో లేవడం... ఓసారి దాని గూట్లోకి తొంగిచూడడం.. బయటికెళ్లి రాగానే దాన్నోసారి పలకరించడం... ఆ చిన్న పిట్ట పుణ్యమాని మా ఇంట్లోనూ చిన్న చిన్న మార్పులు... ‘‘ఇదిగో, పొరపాటున కూడా ఆ గోడ పక్కన ఏదీ విసిరేయకు.. దాని గూడుకి తగిలితే కష్టం. నీళ్లు.. గింజలు పెట్టావా? మరిచిపోయావా? వాడిమీద అరిచేటప్పుడు కాస్త హాల్లోకి వెళ్లు.. ఆ చిన్నప్రాణం భయపడితే కష్టం...’’ ఇలా ఉండేవి నా హెచ్చరికలు..మొత్తానికి నిద్రలేవడం మొదలు.. అర్ధరాత్రి దాకా దాని గురించి బోలెడు మాటలు. ఓ కుక్కనీ, పిల్లిని, చిలుకను పెంచుకునే వాళ్లలాగ మాకు ఓ బుజ్జి పిట్ట..! ఇలా ఇరవై రోజులు గడిచాయి.మూడు రోజుల క్రితం పొద్దున్నే దాని అలికిడి లేదు! ఏదో పోగొట్టుకున్నట్టుంది. లేచి బాల్కనీలోంచి తొంగిచూశాం. గూడు ఖాళీగా ఉంది.. ఏమైంది? పొద్దున్నే వెళ్లిపోయింటుందా?ఆ రోజు ఇలా నాలుగైదు సార్లు చూసినా ఎప్పుడూ గూడు ఖాళీగానే కనిపిస్తోంది. నా మనసేమో కాస్త సున్నితం. అందుకే దిగులుగా ఉంది.. ఇక మా అబ్బాయి నాలుగు రోజులుగా ఒకటే ప్రశ్న ‘‘నాన్నా.. క్యూటీ ఎక్కడికి వెళ్లిందీ’’ అని. వారమైనా పత్తాలేదు.. రోజు రోజుకు నాకు దిగులు పెరిగిపోతోంది. ఇలా లాభంలేదని ఓ కర్ర తీసుకొచ్చి నెమ్మదిగా ఆ గూడును కదిపి చూశాం. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. లోపల క్యూటీ నిర్జీవంగా పడుంది. తలెత్తి మిటుకు మిటుకు మంటూ చూస్తే తల పక్కకు వాలిపోయి ఉంది... జాగ్రత్తగా గమనించాను.. గూట్లో తెల్లగా పౌడర్.. చెట్టునిండా.. ఆకుల మీదకూడా. ఏం జరిగుంటుంది..? ఎవరైనా పిండి పడేసుంటారా? ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. మా ఆవిడ రాగానే అడిగాను ఆ తెల్లపౌడర్ ఏంటని? గుర్తు చేసుకుని చెప్పింది. నాలుగు రోజుల క్రితం మూడు ఇళ్ల అవతల ఒకరోజంతా బోర్ వేశారు.. నీళ్లు పడలేదు సరికదా.. పెద్ద శబ్దం. కింద బండ ఉందేమో.. తెల్లటి పౌడర్ కాలనీ అంతా. తను చెబుతూనే ఉంది.. బాల్కనీ తలుపుమీద.. కిటికీమీద, నేలమీద...ఒక ఇంచు మేర ఆ బూడిద పరుచుకుందనీ.. అదంతా కడిగేసరికి తల ప్రాణం కాళ్లకొచ్చిందనీ.నాకు విషయం అర్థమైపోయింది.. ఆ పేద్ద శబ్దాలు, విపరీతంగా రేగిన బూడిద దెబ్బకు ఈ చిన్న ప్రాణం తట్టుకోలేకపోయిందనీ, ఊపిరాడక ఉన్నచోటే ప్రాణమొదిలేసిందనీ... జడివానకు, సుడిగాలికి తట్టుకునేలా గూడు నిర్మించుకుందనుకుందిగానీ, పిచ్చిది. మనుషుల సంగతి దానికేం తెలుసు? తప్పెవరిది? అమాయకంగా మా మధ్యలోకొచ్చిన ఆ చిన్ని ప్రాణానిదా? మనలాంటి జీవులు కూడా ఈ ప్రకృతిలో భాగమేనని ఆలోచించని మనుషులదా? - వాసవీ మోహన్ -
పర్యావరణంలో మనిషి బంధం పెంచుకోవాలి
-
సూరజ్.. యంగ్ ఫార్మర్.. ద గ్రేట్!
♦ చిన్నప్పటి నుంచే పెరటి తోటల సాగుపై మక్కువ ♦ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతూనే.. పన్నెండెకరాల్లో ప్రకృతి సేద్యం ♦ పాలేకర్ శిక్షణ పొందాక పూర్తిస్థాయి సేద్యం ♦ సూరజ్ను ప్రకృతి సేద్య ప్రచారకర్తగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం వయసు మళ్లిన వారు, మహిళలు తప్ప యువకులు వ్యవసాయంలో కొనసాగడం అరుదై పోతున్న ఈ కాలంలో కేరళ రాష్ట్రంలో ఒక విద్యార్థి సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సేంద్రియ పెరటి తోటలు, టెర్రస్ గార్డెన్ల సాగులో గత కొన్నేళ్లుగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. సి. ఎస్. సూరజ్ అనే విద్యార్థి ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను మక్కువతో చిన్నప్పటి నుంచే సాగు చేస్తూ.. ప్రకృతి వ్యవసాయదారుడిగా మారాడు. కేరళ – తమిళనాడు సరిహద్దులోని వాయనాడ్ జిల్లా చిరకంబాత్ ఇల్లం ఇరవయ్యేళ్ల సూరజ్ స్వస్థలం. తాతల నాటి ఐదున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎదురుగానే వాళ్ల ఇల్లు ఉంటుంది. తండ్రి కాంట్రాక్టర్ కావడంతో వ్యవసాయం కుంటుపడింది. అయితే, సూరజ్ తన తల్లి తోడ్పాటుతో ఇంటిపంటల సాగును కొనసాగించాడు. చిన్నప్పటి నుంచి అతని ఆలోచనలు వ్యవసాయం చుట్టూనే తిరిగేవట. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం.. పదిహేనేళ్ల ప్రాయంలో సూరజ్ ఇంటర్మీడియెట్లో చేరాడు. ఆ కొత్తలోనే తమకు దగ్గరలోని సుల్తాన్ బతేరి పట్టణంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం జరిగింది. ఆ ఐదు రోజుల శిబిరంలో సూరజ్ శ్రద్ధగా పాల్గొని వ్యవసాయాన్ని ప్రకృతికి అనుగుణంగా, స్వల్పఖర్చుతో ఎలా చేయాలో కూలంకషంగా తెలుసుకున్నాడు. తన జీవన గమ్యానికి మార్గం సుగమం అయినట్లు, స్పష్టత వచ్చినట్లు తోచింది. తమ పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేపట్టాడు. తల్లిదండ్రులు వెన్ను తట్టడంతో చదువు కొనసాగిస్తూనే చక్కని దిగుబడులు తీస్తున్నాడు. వ్యవసాయ విద్య.. ప్రకృతి సేద్యం.. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన తర్వాత ఏడాది తొలిగా ఎకరాలో శ్రీ పద్ధతిలో సూరజ్ వరిని సాగుచేసి 4 టన్నుల ధాన్యం దిగుబడి పొందాడు. ఆ ప్రాంతంలో అప్పటి సగటు దిగుబడికి ఇది రెట్టింపు కావడంతో సూరజ్ స్పీడు పెంచాడు. తన ఇంటికి 200 కిలోమీటర్ల దూరంలోని త్రిస్సూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వారాంతాల్లో ఇంటికి వెళ్లి వ్యవసాయ పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఎకరంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు. 10 ఎకరాల్లో 15 రకాల కూరగాయలు, పండ్లను సాగు చేస్తున్నాడు. త్రివేండ్రం, కాలికట్, కొచ్చి వంటి నగరాల్లో ఆర్గానిక్ షాపులు, సూపర్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాడు. ఇందులో 4 ఎకరాల్లో కాఫీ, మిరియాలు, లిచి, అవకాడో, బొప్పాయి, అరటి, ప్యాషన్ ఫ్రూట్ తదితరాలను మిశ్రమ సాగు చేస్తున్నాడు. మిగతా పొలంలో టమాటా తదితర కూరగాయలను, ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. మొత్తం మీద ఏడాదికి రూ. 7 నుంచి 8 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు సూరజ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగం చదువుకుంటూనే ప్రకృతి వ్యవసాయం కొన సాగిస్తున్న సూరజ్ ద్వారా యువతను వ్యవసాయంలోకి ఆకర్షించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం 2015కు ముందే ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా ప్రకటించింది. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్వహించే ప్రచార, రైతు శిక్షణా శిబిరాల్లో సూరజ్ పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతుల గురించి వివరిస్తుంటారు. 2015లో, 2016 డిసెంబర్లో రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగించాడు. ‘స్టూడెంట్ ఫార్మర్’ అవార్డు, కేరళ ప్రభుత్వ ‘కర్షక ప్రతిభ’ అవార్డును పొందాడు. చిక్కుడు గింజలతో ‘కునపజలం’! సూరజ్ పంటలకు పంచగవ్య, జీవామృతం, కునపజలం వాడుతున్నాడు. మాంసానికి బదులు చిక్కుడు గింజలను వాడుతూ ‘వెజిటేరియన్ కునపజలం’ తయారు చేసి వివిధ పంటలపై విస్తృతంగా వాడుతున్నాడు. 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల కునప జలాన్ని కలిపి.. నెలకు ఒకసారి పిచికారీ చేస్తున్నారు. పంచగవ్యను భూసారం పెంపొందించడానికి ఏటా రెండు సార్లు ఇస్తున్నారు. 4సార్లు పిచికారీ చేస్తున్నారు. జీవామృతాన్ని ఏటా రెండుసార్లు భూమికి ఇస్తున్నారు. ఏటా ఎకరానికి ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు చల్లుతున్నారు. పంటలపై చీడపీడల బెడద పెద్దగా లేదని, కషాయాలతోనే కంట్రోల్ చేస్తున్నామని సూరజ్ తెలిపాడు. తనను చూసి కనీసం 20 మంది యువ రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం చేపట్టారని, తరచూ తనను సంప్రదిస్తుంటారన్నారు. (సూరజ్ను 085475 70865,smartsooraj2@gmail.com ద్వారా సంప్రదించవచ్చు) – సాగుబడి డెస్క్ -
16న పండ్ల తోటలు, పాలీహౌస్లలో కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ
రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 16న ప్రకృతిసేద్యంలో పండ్లతోటలు, పాలీహౌస్ల్లో కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ ఇస్తారు. పండ్ల తోటలు, పాలీహౌస్ల్లో కూరగాయల సాగుపై హైదరాబాద్కు చెందిన ప్రకృతి వ్యవసాయదారు హరిబాబు, చీమకుర్తికి చెందిన శ్రీధర్ బాబు, ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, హేమంత్ రైతులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొంద దలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. -
దున్నకుండా ముప్పయ్యేళ్లుగా సేద్యం!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. చెప్పినోడికి వ్యవసాయం తెలియదని నవ్విపోతారు. అయితే, మధ్యప్రదేశ్కు చెందిన రైతు రాజు టైటుస్ మాత్రం ఇలాగే వ్యవసాయం చేస్తున్నారు. పొలాన్ని అసలు దున్నకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా గత 30 ఏళ్లుగా ఫుకుఓకా బాటలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ♦ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా.. పొలాన్ని దున్నకుండా 30 ఏళ్లుగా సేద్యం చేస్తున్న మధ్యప్రదేశ్ రైతు ♦ జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా సందర్శించిన అద్భుత వ్యవసాయ క్షేత్రం మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్కు చెందిన ‘రాజు టైటుస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలయ్యి పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (ఒన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్ని ఇచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు. అవహేళనలను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశాడు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడతాడు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకింది. దీనివల్ల మట్టి గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. 80వ దశకం చివరికల్లా రసాయన ఎరువుల వాడకం తార స్థాయికి చేరింది. వాటిని వాడకుండా సేద్యం చేయటం అసాధ్యమనే అభిప్రాయం రైతుల్లో బలంగా నాటుకుపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో రాజు చేస్తున్న ప్రయత్నం ఆ గ్రామస్తుల మోములపై నవ్వులు పూయించింది. రైతులు కలుపు మొక్కలను పంట మొక్కలకు శతృవులుగా భావించి నిర్మూలిస్తారు. అలాంటిది కలుపు, గడ్డి మొక్కలను పంటలతో పాటు పెంచటమనే విషయం వినగానే పడీపడీ నవ్వేవారు. అవహేళనలే కాదు సాటి రైతుల నుంచి రాజుకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎత్తుగా పెరిగిన సుబాబులు చెట్ల నీడ తమ పొలాల మీద పడి పంటలు పండటంలేదని వాటిని నరికివేయాలని పొరుగు రైతులు ఫిర్యాదు చేసేవారు. మరోవైపు రాజు పొలంలో బాగా పెరిగిన గడ్డితో గ్రామస్తుల పశువులు మంచి విందు చేసుకునేవి. పక్క పొలాల్లో రైతులు తగులబెట్టిన పంట వ్యర్థాల నుంచి నిప్పు రాజు పొలంలోకి పాకి గడ్డి తగులబడేది. ఇలాంటి అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు. విత్తన బంతులతో పంటల సాగు! అంకితభావంతో అతను చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించాడు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు సాగుకు ఉపక్రమించాడు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశాడు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశాడు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదుగుతాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదన కల్పించారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకుపోయి తేమను పోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం రైతులకు అప్పు చేయాల్సిన అగత్యం తప్పుతుంది.రాజు పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేస్తున్నాడు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరువును అందించాల్సిన అవసరం ఉండదని ఆయన అంటారు. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్ల కలప, మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఇప్పుడాయన వయసు 71. గత 30 ఏళ్లుగా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేస్తూ సమృద్ధిగా పంటలు పండిస్తూ దేశవ్యాప్తంగా పేరుపొందారు. దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది రైతులకు స్ఫూర్తినిస్తున్న ఈ రాజు నిజంగా ప్రకృతి వ్యవసాయానికి రారాజే! సారవంతమైన పొలమే మూలాధారం వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయన ఎరువులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు. భారతదేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న యూరియా. దీనివల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతిసేద్య పంట ఉత్పత్తులే కారణం. మా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణం. ఫుకుఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు. – రాజు టైటుస్ (091797 38049), హోషంగాబాద్, మధ్యప్రదేశ్ rajuktitus@gmail.com – దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
బంగ్లాదేశ్పై ప్రకృతి కన్నెర్ర!
కొండచరియలు విరిగిపడి 68 మంది మృతి బంగ్లాదేశ్పై ప్రకృతి కన్నరెచేసింది. భారీ వర్షాల ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 68 మంది మృతిచెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్లోని ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగమతిలో 10 మంది, బందర్బాన్లో ఏడుగురు, చిట్టగ్యాంగ్లో 8 మంది కొండచరియల కింద సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. 2010లోనూ బంగ్లాదేశ్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
చిత్ర తేజం..దృశ్యకావ్యం
- సైకిల్పై 6వేల కి.మీ యాత్ర – 16 రాష్ట్రాల్లో పర్యటన – కెమెరాతో వేలాదిగా ప్రకృతి చిత్రాలు – కర్నూలు యువకుని ప్రతిభ కర్నూలు(హాస్పిటల్): ప్రకృతిలో ఎన్నెన్నో వింతలు..వాటిని రెండు కళ్లతో చూడటం అందరికీ సాధ్యం కాదు. అందుకే కెమెరా కళ్లను కూడా మనిషి జతచేసుకున్నాడు. ఆ ‘కళ్ల’తో ఈ ప్రకృతిని మరింత అందంగా చూపించాలనే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉన్నాడు. ఆ కెమెరా కళ్ల ద్వారా వచ్చిన దృశ్యాలు నిత్యం మనకు మేగజైన్లు, పత్రికల్లో, టీవీ చానళ్లు, సినిమాలలో అద్భుతంగా కనిపిస్తుంటాయి. కర్నూలుకు చెందిన కుర్రాడు తేజేశ్వర్ ఇదే పని చేస్తున్నాడు. కెమెరా భుజాన వేసుకుని దేశంలోని 16 రాష్ట్రాల్లో సైకిల్పై సాహస యాత్ర చేశాడు. సుమారు 6వేల కిలోమీటర్లు ప్రయాణించి అద్భుత చిత్రాలు బంధించాడు. కర్నూలు నగరంలోని నెహ్రూనగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసులు, పార్వతికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన మద్దికెర తేజేశ్వర్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ను హైదరాబాద్లోని జేబీఐఈటీ కాలేజిలో చదివాడు. తనకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ, ప్రయాణం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చదువు మధ్యలో మూడు నెలల పాటు ముంబయిలోని ఫ్యాషన్ ప్రో సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫి, సెల్ఫ్ న్యూడ్ ఫొటోగ్రఫి, స్ట్రీట్ ఫొటోగ్రఫి, నేచర్ ఫొటోగ్రఫిలో తర్ఫీదు పొందాడు. ఆ సమయంలో అక్కడి అధ్యాపకురాలు ప్రాచీ చపేకర్ సూచనలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శిక్షణ తర్వాత కొన్నాళ్ల పాటు మోడరన్ ఇండియా మేగజైన్లో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్గా పనిచేశాడు. ప్రకృతి అందాల ఫోటోల కోసం సైకిల్ యాత్ర ఈ ప్రకృతి, అందమైన ప్రపంచాన్ని తన కెమెరాలో బంధించాలని తేజేశ్వర్ కలలు కనేవాడు. ఆ కలలకు రూపాన్ని కల్పించేందుకు గత సంవత్సరం ఆగష్టు 6వ తేదిన ముంబయి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, పూణే, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేశాడు. తనకు చిన్నతనం నుంచి ఇష్టమైన ప్రయాణం, ఫొటోగ్రఫి అనే ఇష్టాలను ఆయన ఈ విధంగా తీర్చుకున్నాడు. యాత్రలో కనిపించిన ప్రతి అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇప్పటి వరకు 6వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. నేచర్ ఫోటోగ్రఫి కోసం, సోషల్ డాక్యుమెంటరీ కోసం ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపాడు. ‘జాంటీ’ తోడుగా కష్టం ఇష్టంగా...! –తేజేశ్వర్, నేచర్ ఫొటోగ్రాఫర్ సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో తీవ్ర అలసట, అయిష్టం ఏర్పడేది. కొన్నిసార్లు ముందుకు సాగబుద్ధి అయ్యేది కాదు. నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలంటే తోడు అవసరమని భావించాను. ఈ మేరకు జైపూర్లో రూ.8వేలు వెచ్చించి జర్మన్ షెప్పర్డ్ అనే జాతి కుక్కపిల్లను కొనుగోలు చేశాను. దానిని వెంట బెట్టుకుని యాత్ర ప్రారంభించాను. ఆ మరునాడు జైపూర్ రోడ్డుపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటిరోడ్స్ కనిపించాడు. ఆయన స్నేహితురాలు సమంత నాలాగే ఒక మంచి ఉద్దేశంతో 8వేల కిలోమీటర్ల పరుగు చేస్తోంది. వారిద్దరూ జైపూర్ రోడ్డుపై నన్ను చూసి ఆపారు. నా గురించి, నేను చేస్తున్న పని గురించి తెలుసుకున్నారు. నా వద్ద ఉన్న కుక్కపిల్లను చూసి ముచ్చటపడ్డారు. దీనికి ఏం పేరు పెట్టావని అడిగారు. ఇంకా పేరు పెట్టలేదన్నాను. వెంటనే సమంత దీనికి ‘జాంటిరోడ్స్’ అని పేరు పెట్టాలని సూచించారు. వారి సూచన మేరకు కుక్కపిల్లకు ఆ పేరే పెట్టాను. అప్పటి నుంచి ఆ కుక్కపిల్ల నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతోంది. -
పచ్చని ప్రపంచం కోసం...
ప్రకృతి కోసం... ‘ప్రణామం ప్రణామం ప్రణామం... సమస్త ప్రకృతికే ప్రణామం’ అని ఇటీవలి సినిమాలో ఓ హిట్ పాట. ప్రతి ఏటా జూన్ 5న వచ్చే ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ కూడా ఈ మాటనే అంటుంది. దానిని మొదలెట్టిన ఐక్యరాజ్య సమితి తన సభ్యులైన 143 దేశాలతో అదే మాటను అనిపిస్తుంది. సముద్ర జల కాలుష్యం, అధిక జనాభా, వన్యమృగాల పట్ల క్రూరత్వం తదితర అంశాలతో 1974లో మొదటిసారిగా మొదలైన పర్యావరణ దినోత్సవం ఏ ఏడాదికా ఏడాది ప్రపంచ దేశాల చైతన్యంతో పర్యావరణం పట్ల విశిష్ణ స్పృహను కలిగేలా చేస్తోంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో సాగే ఈ దినోత్సవానికి ఈ సంవత్సరం ఆతిథ్య దేశం కెనడా ‘కనెక్టింగ్ పీపుల్ టు నేచర్’ అనే థీమ్ను నిర్థారించింది. ఈ థీమ్ను అనుసరించి వివిధ దేశాలతో పాటు భారతదేశంలో కూడా సోమవారం అనేక కార్యక్రమాలు జరిగాయి.ముఖ్యంగా యువత ఉత్సాహంగా మొక్కలు నాటడం, ప్రదర్శనలు ఇవ్వడం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ సందర్భంగా పర్యావరణ స్పృహను కలిగించే పోస్టల్ ఎన్వలప్ను విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మురాదాబాద్లో కాలేజీ యువతీ యువకులు పార్కులో లతలూ తీగలతో యోగా చేసి ఆకట్టుకున్నారు. గౌహతీ సమీపంలో ఉన్న దీవుల్లో కొత్తగా మొక్కలు నాటారు. గాలి, నీరు, నింగి అన్నీ మనిషి జీవనానికి ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవడానికి ఏదో ఒక రోజు చైతన్యంతో పని చేయడం కాదు... అనునిత్యం అనుక్షణం చేయాలి. అప్పుడు భవిష్యత్ తరాలకు ఈ అందమైన భూమిని అందివ్వగలం. -
బంగారు తల్లి!
‘తల్లిపాలు అమృతంతో సమానం’ అంటారు. ఆ అమృతానికి కొరత ఏర్పడింది. మన దేశంలో తక్కువ సంఖ్యలో ‘తల్లిపాల కేంద్రాలు’ ఉన్నాయి. వీటి గురించి కూడా తక్కువ మందికే తెలుసు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తల్లిపాల గొప్పదనం గురించి ప్రచారం చేయడమే కాదు... స్వయంగా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చెన్నైకి చెందిన శరణ్య గోవిందరాజులు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో ‘నేచురల్ పేరెంటింగ్’ అనే ఫేస్బుక్ కమ్యూనిటీలో చేరారు శరణ్య, ఈ కమ్యూనిటీ ద్వారా ‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’తో పాటు ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోగలిగారు.‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’ శరణ్యను ఆకట్టుకుంది. తాను కూడా చేయాలనుకున్నారు. ఈ సమయంలోనే వాహిదాలాంటి బ్రెస్ట్మిల్క్ డోనర్లు శరణ్యకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రోత్సహించారు. పాలను దానం చేయడానికి ‘కంచి కామకోఠి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్’ను ఎంచుకున్నారు శరణ్య. పాలదానం చేసే క్రమంలో హాస్పిటల్కు వెళుతున్నప్పుడు ‘బ్రెస్ట్ మిల్క్బ్యాంక్లు’ ‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’ అనేవి ఎంత ప్రాధాన్యత కలిగిన విషయాలో మరింత బాగా తెలిసింది.‘‘పాలదానం విషయంలో నా కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఆనందాన్ని ఇస్తుంది’’ అంటున్నారు శరణ్య.ఒకసారి శరణ్య హాస్పిటల్కు వెళ్లినప్పుడు ఒక తల్లి... ‘‘ఏమ్మా... పాలను ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకుంటావు?’’ అని అడిగింది. ఆశ్చర్యపోవడం శరణ్య వంతైంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని తాను ఉచితంగా పాలదానం చేస్తున్నానని చెప్పారు. ఆ సమయంలో ఆ తల్లి కంట్లో వెలుగు కనిపించింది.‘బ్రెస్ట్ మిల్క్ డొనేషన్’ గురించి కొందరికి అపోహలు ఉండవచ్చు. కొందరికి అవగాహన లేకపోవచ్చు.... ఇలాంటి వారికి శరణ్య గోవిందరాజులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శరణ్యతో ఒక్కసారి మాట్లాడితే చాలు... ‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’ అనేది మనసుకు ఎంత తృప్తిని ఇచ్చే పనో తెలుసుకోగలుగుతున్నారు.‘బ్రెస్ట్ మిల్క్ డొనేషన్’ గురించి ఎంత అవగాహన కలిగిస్తే...అన్ని ‘మిల్క్బ్యాంకు’లు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శరణ్యలాంటి వాళ్లు మరింత మంది పూనుకుంటే ఆ అవగాహన విస్తృతి మరింత వేగంగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. -
సూక్ష్మజీవులే సేద్యానికి ప్రాణం!
వ్యవసాయ సంక్షోభం పైకి ఆర్థిక సంక్షోభంలా కనిపిస్తున్నప్పటికీ.. దీని మూలాలు పంట భూమిలో అనంత కోటి సూక్ష్మ జీవరాశి వినాశనంలో దాగి ఉంది. రసాయనిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల పంట భూములు నిర్జీవమై, నిస్సారమై ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. సేద్యాన్ని తిరిగి ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం ఒక్కటే మార్గం. అంటే భూమిలో సూక్ష్మజీవరాశిని,వానపాములను కంటికె రెప్పలా కాపాడుకునే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి(జడ్.బి.ఎన్.ఎఫ్.)ని చేపట్టడమే మేలైన మార్గమని జడ్.బి.ఎన్.ఎఫ్. పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ‘సేవ్’ తదితర సంస్థలు సుమారు 3 వేల మంది యువ రైతు కుటుంబాలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం సందర్భంగా పాలేకర్ ‘సాగుబడి’తో ముచ్చటించారు. పాలేకర్తో ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. పంటల సాగులో భూమిలోని సూక్ష్మజీవరాశి, వానపాముల ప్రాధాన్యం ఏమిటి? బియ్యాన్ని మనం నేరుగా తినలేం, అన్నం వండుకొని తినాల్సిందే. అదేవిధంగా పంట భూమిలో ఉండే పోషకాలు కూడా మొక్కలు, పంటల వేర్లు నేరుగా గ్రహించగలిగే రూపంలో ఉండవు. వాటిని వేర్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చగలిగేది మట్టిలో ఉండే కోటానుకోట్ల సూక్ష్మజీవరాశే. అందువల్లనే పంట భూమిలో ఉండే లెక్కకు అందనన్ని జాతుల సూక్ష్మజీవులు, వానపాముల పాత్ర పంటల సాగులో అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే, రసాయనిక ఎరువులు, కలుపు మందుల వాడకంతో భూమిలోని సూక్ష్మజీవరాశి సర్వ నాశనం అవుతున్నది. రసాయనిక ఎరువులు, కలుపుమందులు మాత్రమే కాదు సేంద్రియ ఎరువులు కూడా మట్టిలోని సూక్ష్మజీవరాశిపై విషతుల్యమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. అందువల్లనే ఈ రెండు పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు ప్రతి పంటకూ ఎరువులను మార్కెట్లో కొని వేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇదొక కుట్ర. కానీ, భూమిలోని సూక్ష్మజీవరాశిని పెంపొందిస్తూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నిక్షేపంగా దిగుబడి సాధిస్తున్నాం. అదెలాగో వివరించండి..? దేశీ ఆవులను మనం వేల సంవత్సరాలుగా పూజిస్తున్నాం. కాబట్టి ఈ ఆవుల పేడ, మూత్రం, పాల వల్ల ఉపయోగకరమైన ప్రత్యేక గుణాలు లేకపోతే ఎందుకు పూజిస్తున్నట్లు? ఈ ఆలోచనతో దేశంలోని 35 గోజాతుల పేడ, మూత్రంలను లేబరేటరీలో పరీక్ష చేయించా. గ్రాము నాటు ఆవు పేడలో 300 కోట్లకుపైగా మేలుచేసే సూక్ష్మజీవులు ఉన్నాయని తెలుసుకున్నా. అనేకానేక జాతుల సూక్ష్మజీవులున్నాయి. కానీ, జెర్సీ, హోలిస్టీన్ పేడలో 70 లక్షలకు మించి లేవు. అందువల్ల దేశీ ఆవు పేడ, మూత్రంతో జీవామృతాన్ని తయారు చేశా. భూమిలో సూక్ష్మజీవుల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే కల్చర్ (తోడు)గా జీవామృతాన్ని వాడుతున్నాం. సూక్ష్మజీవరాశిని పెంపొందించే తోడును పంట భూమికి అందిస్తే చాలు, ఎటువంటి ఎరువులూ బయటి నుంచి తెచ్చి వేయాల్సిన అవసరమే లేదు. కానీ, చివికిన పశువుల ఎరువు (దిబ్బ ఎరువు) ను, రసాయనిక ఎరువులను పంటలకు ఆహారంగా వాడాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. పంటలకు కావాల్సింది ఎరువు కాదు, భూమిలో ఇప్పటికే ఉన్న సకల పోషకాలను అందుబాటులోకి తేవడానికి సూక్ష్మజీవరాశిని పెంపొందించే తోడు (మైక్రోబియల్ కల్చర్)ను పొలాల్లో వేస్తే చాలు. ఈ తోడును తయారు చేయడానికి అవసరమైన సూక్ష్మజీవరాశి దేశీ ఆవు పేడ, మూత్రంలో పుష్కలంగా ఉన్నాయి. పది కిలోల దేశీ ఆవు పేడలో 30 లక్షల కోట్ల మేలుచేసే సూక్ష్మజీవులుంటాయి. దీనితో జీవామృతం కలిపితే అందులోని సూక్ష్మజీవులు 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటాయి. 48 గంటల్లో సూక్ష్మజీవుల సంఖ్య ఎంతకు పెరుగుతుందో చెప్పాలంటే సూపర్ కంప్యూటర్ కావాలి. జీవామృతం, ఘనజీవామృతం తయారు చేయించి వాడటంతో భూసారం పెరిగి, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. దేశంలో 50 లక్షల మంది రైతులు పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం చేస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. పంట భూమిలో సూక్ష్మజీవరాశిని పెంపొందిస్తే చాలా? కాదు, భూమిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతోపాటు.. భూమి పైన పొలంలో అనేక రకాల అంతర పంటలు సాగు చేయడం ద్వారా పంటల జీవవైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి. నేను ఇదే చెబుతున్నా. ప్రధాన పంట మధ్యలో సుమారు 20 రకాల అంతర పంటలు వేయిస్తున్నా. అన్ని ఎక్కువ రకాల అంతర పంటలు విధిగా సాగు చేయాల్సిన అవసరం ఏమిటి? ఎందుకంటే, అనేక పంటలు ఉంటే అనేక రకాల మిత్ర పురుగులను ఆకర్షిస్తాయి. ఎన్ని రకాల అంతర పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల బాక్టీరియా, పక్షులు, మిత్రపురుగులను మన పంట పొలంలోకి ఆహ్వానించగలుగుతాము. మిత్రపురుగులు, పక్షులు వచ్చి శత్రుపురుగులను తినేస్తాయి. కాబట్టి పంటలకు చీడపీడల బెడద ఉండదు. పగటి ఉష్ణోగ్రతతోపాటు పంట భూమిలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది. పంటలు, తోటలు కూడా ఎండిపోతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ఏమైనా పరిష్కారం ఉందా? పంటల దిగుబడి సజావుగా రావాలంటే పంట భూమిలో జీవనద్రవ్యం (హ్యూమస్) చాలినంత తయారు కావటం చాలా ముఖ్యం. పంట భూమిలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు జీవనద్రవ్యం తరిగిపోతుంది. రసాయనిక, సేంద్రియ సేద్యం చేసే భూముల్లో హ్యూమస్ ఏర్పడదు. ఇది కూడా కుట్రే. అయితే, ప్రకృతి వ్యవసాయంలో పంట వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదన (స్ట్రా మల్చింగ్) చేస్తాం కాబట్టి, ఉష్ణోగ్రత పెరిగినా హ్యూమస్ దెబ్బతినదు. పంటలు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి. ప్రకృతి సేద్యం జరిగే తోటల్లో కూడా గడ్డీ గాదంతో ఆచ్ఛాదన అంతగా చేస్తున్నట్లు లేదు..? పండ్ల తోటల్లో గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేయడం తప్పనిసరి. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే పప్పు ధాన్య (ద్విదళ) పంటలను అంతర పంటలు (లైవ్ మల్చింగ్)గా సాగు చేయాలి. వేసవిలో అంతర పంటలు కూడా ఉండవు. కాబట్టి.. పొలంలో పైపాటు చేయించాలి. 4.5 అంగుళాల కన్నా ఎక్కువ లోతుగా దున్నకూడదు. పైపొర మట్టి 4.5 అంగుళాల వరకే ప్రాణవాయువు అందుతుంది. సూక్ష్మజీవరాశి కూడా ఈ పైపొర మట్టిలోనే ఉంటుంది. అంతకన్నా కింద మట్టిని దున్నితే కార్బన్ డయాక్సయిడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. భూతాపోన్నతికి ఇది కారణమవుతుంది. కాబట్టి, ఖాళీ భూముల్లో వేసవి దుక్కులుగా గానీ, పండ్ల తోటల్లో, వార్షిక పంటల్లో గానీ లోతు దుక్కి చేయడం ప్రమాదకరం. ప్రకృతి వ్యవసాయంలో ట్రాక్టర్ వాడకుండా అరక, గొర్రులతో పైపైన మట్టిని లేవదున్నాలి. అంతే తప్ప పైపొర 4.5 అంగుళాల మట్టి లోపలికి తిరగబడేలా ఎట్టిపరిస్థితుల్లోనూ లోతు లోతుగా దుక్కి చేయకూడదు. ప్రకృతి సేద్యం చేసే పొలాల్లో ఉండే వానపాములు నిరంతరం బొరియలు చేస్తుంటాయి. అందువల్ల వాన నీటి సంరక్షణ పూర్తిస్థాయిలో జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల్లోనూ పంట తట్టుకుంటుంది. దీన్ని రుజువు చేశాం. హైడ్రోపోనిక్స్ సేద్యం గురించి మీ అభిప్రాయం? ఇది పూర్తిగా పిచ్చి పని. దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల పంట భూములు ఖాళీగా ఉన్నాయి. మట్టి అవసరం లేని హైడ్రోపోనిక్స్ సేద్యం పేరిట.. ద్రవరూప రసాయనిక ఎరువులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. రైతుల సొమ్మును దోచుకోవడానికి ఇది మరో రకమైన కుట్ర. చలి దేశాల్లో 7 నెలలు మంచు కురుస్తుంది కాబట్టి వాళ్లు ఏడాదంతా పంటలు సాగు చేసుకోవడానికి పాలీహౌస్లలో హైడ్రోపోనిక్స్ అని మరొకటని వాళ్ల బాధలు వాళ్లు పడుతున్నారు. మనకు హైడ్రోపోనిక్స్ గానీ, పాలీహౌస్లు గానీ బొత్తిగా అవసరం లేదు. రైతులను భారీ అప్పుల ఊబిలోకి దింపడానికి బ్యాంకర్లు, దళారులు పన్నిన కుట్రే పాలీహౌస్ సేద్యం. గాలివానలకు, వడగళ్లవానలకు పాలీహౌస్లు నాశనమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో ఎండాకాలంలోనూ 10% నీటితో, 10% విద్యుత్తో పూలు, కూరగాయ పంటలు చక్కగా పండించి చూపిస్తున్నాం.. ఇవేవీ అవసరం లేదు. జన్యుమార్పిడి ఆవాలు విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందన్న వార్తలు వినవస్తున్నాయి. ప్రకృతి సేద్యానికి జీఎం విత్తనాలు పనికొస్తాయా? ప్రకృతి వ్యవసాయంలో దేశీ వంగడాలు అధిక దిగుబడినిస్తున్నాయి. దేశీ పత్తి వంగడాలే బీటీ పత్తి కన్నా అధిక దిగుబడినిస్తున్నాయి. చీడపీడలను తట్టుకుంటున్నాయి. బీటీ పత్తి వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆవాలతోపాటు ఏ పంటలోనూ జన్యుమార్పిడి విత్తనాల అవసరమే లేదు. అంతర్జాతీయ దోపిడీ వ్యవస్థ హరిత విప్లవం తర్వాత మార్కెట్లోకి తెచ్చిన మరో ముదనష్టపు టెక్నాలజీ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎం పంటలకు అనుమతి ఇవ్వకూడదు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మార్గం ఏమిటి? రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలతోపాటు చీడపీడలు, వరదలు, కరువు కాటకాలు, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రుణాలు తీర్చలేక ఇప్పటికి 7 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు ఈ దుస్థితి నుంచి విముక్తమయ్యారు. నాణ్యమైన, పోషక విలువలు, ఔషధ విలువలతో కూడిన సహజాహారాన్ని పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుంది. ప్రభుత్వాలు ఇందుకు దోహదపడేలా విధాన నిర్ణయాలు తీసుకోవాలి. రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలను నిషేధించాలి. ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పశువుల ఎరువు పంట పొలాలకు బలం అని మన రైతులు అనాదిగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ, మీరు ఇది ప్రమాదకరం అంటున్నారు..? దేశీ ఆవులు లేదా ఇతర పశువుల పేడతో తయారైన దిబ్బ ఎరువు గానీ, వర్మీ కంపోస్టు గానీ, బయోడైనమిక్ పద్ధతిలో తయారైన ఆవు కొమ్ము ఎరువు గానీ వాడటం అత్యంత ప్రమాదకరం. వీటిలో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పంట పొలాల్లో చల్లినప్పుడు లేదా ఆ తర్వాత గానీ పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పెరగగానే.. ఈ ఎరువుల్లోని కర్బనం విడుదలై వాతావరణంలో కలవడం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు పెరిగినప్పుడు కర్బనం పూర్తిగా విడుదలై, వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి, కార్బన్ డయాక్సయిడ్గా మారుతుంది. కార్బన్ డయాక్సయిడ్, మిథేన్, నైట్రస్ ఆక్సయిడ్ వంటి హరిత గృహ వాయువుల వల్ల భూతాపం పెరిగిపోతున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే.. చెట్లు, పంటలు 98% పోషకాలను సూర్యరశ్మి నుంచి, వాతావరణం నుంచే గ్రహిస్తాయి. ఎక్కడో తయారు చేసిన రసాయనిక/ సేంద్రియ ఎరువులను తెచ్చి వేయాల్సిన అగత్యమే లేదు. చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కూడా వీటి అవసరం లేదు. భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. ఉన్న పోషకాలను మొక్కల వేళ్లు ఉపయోగించుకునే రూపంలోకి మార్చేది సూక్ష్మజీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో ఆచ్ఛాదన చేస్తే చాలు. ఇదే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి విశిష్టత. -
ముంబయ్ నుంచి సైకిల్ యాత్ర
- 15 రాష్ట్రాల్లో పర్యటన - కర్నూలులోని ఇంటికి చేరిన ఇంజినీరింగ్ విద్యార్థి తేజేశ్వర్ కల్లూరు (రూరల్) : వివిధ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి ఫొటో డాక్యుమెంటరీ రూపొందించాలనే లక్ష్యంతో ఓ బీటెక్ విద్యార్థి సైకిల్ దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాడు. ఆగస్టు 6, 2016న ముంబయి నుంచి సైకిల్పై బయలుదేరాడు. 10 నెలల కాలంలో 15 రాష్ట్రాలను చుట్టేశాడు. వింతలు, విశేషాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఫొటోలను తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడే కర్నూలు నెహ్రూనగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎం.శ్రీనివాసులు, ఎం.పార్వతి కుమారుడు తేజేశ్వర్. గుజరాత్, రాజస్థాన్, ధిల్లీ, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా మీదుగా 25వేల కిలోమీటర్లు సైకిల్పై పర్యటించి ఆదివారం కర్నూలు చేరుకున్నాడు. జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లు, పాకిస్తాన్ ముష్కరులు జవాన్లపై చేసిన దాడులు, అక్కడ పరిస్థితులపై ఫొటోలు తీసినట్లు తెలిపాడు. మొదట ఒంటరిగా బయలుదేరాడు. జైపూర్ వెళ్లాక ఓ కుక్కపిల్లను కొన్నాడు. దాన్ని వెంటబెట్టుకుని అన్ని ప్రదేశాలను చుట్టేశాడు. ఆదివారం కర్నూలు చేరిన తేజేశ్వర్కు మాజీ కార్పొరేటర్ నరసింహులు, ఆర్ఎస్వైఎఫ్ నగర అధ్యక్షుడు విల్సన్, పారిశ్రామిక వేత్త రాజేష్పటేల్, ఎంఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ సత్కరించారు. రెండు రోజుల విరామం తర్వాత బెంగుళూరు బయలుదేరి కేరళ, తమిళనాడు, విశాఖపట్టణం, ఒరిస్సా మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కర్నూలు చేరతానని తెలిపాడు. -
మా కుక్కనే పొయ్యద్దంటావా... డిష్యూం!
ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో చిన్న విషయమై చెలిరేగిన వివాదం కాల్పుల వరకు వెళ్లి.. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలోని అన్నపూర్ణాదేవి గుడికి వెళ్లాడు. అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క.. అటువైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోసింది. దాంతో పూరన్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా ఎలా చేస్తారంటూ మున్నాను అడిగారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో కోపం వచ్చిన మున్నా, అతడి కొడుకు కలిసి కాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులలో పూరన్ లాల్, అతడి కొడుకులు విజయ్ కుమార్, ముకేష్ కుమార్లతో పాటు రాంకిశోర్ శర్మ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. వాళ్లందరినీ వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. -
భూతాపానికి విరుగుడు ప్రకృతి సేద్యమే!
- ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న బస్ కండక్టర్ బాజి, అతని కుటుంబం - ఎకరా వరిలో 26 బస్తాల దిగుబడి.. రూ. 50 వేల నికరాదాయం - నాలుగేళ్లలో భూమిలో 0.5 నుంచి 2.5కు పెరిగిన సేంద్రియ కర్బనం ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించటం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకొని మంచి దిగుబడులు పొందొచ్చని పచ్చనాకు సాక్షిగా రుజువు చేస్తున్నాడు ధర్మారం భాజీ. గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కారుమంచి ఆయన స్వగ్రామం. 2012లో సా„ దినపత్రిక ‘సాగుబడి’ పేజీ ద్వారా పాలేకర్ శిక్షణ గురించి తెలుసుకొని హాజరయ్యారు. అప్పటి నుంచి ఆర్టీసీ బస్ కండక్టర్గా పనిచేస్తూనే ప్రకృతి సేద్యంలో వరి, కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ఎకరానికి 26 బస్తాల ధాన్యం దిగుబడి.. రూ. 50 వేల నికరాదాయం 2012లో తొలిసారిగా 18 ఎకరాల్లో వరిని సాగు చేశారు. తొలి ఏడాది అదునులో పనులు చేయలేకపోయారు. ఎకరాకు 12–14 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో ఆ ఏడాది అప్పుల పాలయ్యారు. అయినా పట్టు విడవకుండా మరుసటి ఏడాది 12 ఎకరాల్లో వరిని సాగు చేశారు. విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి ఎ.సత్యనారాయణ మూర్తి (94915 82181) సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దుక్కిలో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేశారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. 70 లీటర్ల నీటికి 70 లీటర్ల జీవామృతం కలిపి 15 రోజులకోసారి ఎకరా పైరుపై పిచికారీ చేసేవారు. ఈ ద్రావణానికి నెలకోసారి 7 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేసేవారు. 3 లీటర్ల దశపత్ర కషాయం 120 లీటర్ల నీటిలో కలిపి 60 రోజుల దశలో ఎకరా పైరుపై పిచికారీ చేశారు. ఆ ఏడాది ఎకరానికి 18 బస్తాల దిగుబడి సాధించారు. దిగుబడి పెరగటంతో అప్పటి నుంచి ఏటా వరి సాగులో ఇవే పద్ధతులను అనుసరిస్తున్నారు. 2015లో ఖరీఫ్, రబీల్లో నాలుగున్నర ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 22 బస్తాల దిగుబడి సా«ధించారు. 2016 ఖరీఫ్లో ఆరెకరాల్లో బీపీటీ రకం వరిని సాగు చేశారు. దిగుబడి ఎకరాకు 26 బస్తాలకు పెరిగింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి విక్రయించారు. బస్తాకు 50 కిలోల బియ్యం వచ్చాయి. కిలో రూ. 60 చొప్పున విక్రయించారు. ధాన్యానికి బస్తాకు రూ. 3వేల చొప్పున ఎకరాకు రూ. 78 వేల నికరాదాయం వచ్చింది. ట్రాక్టరు దుక్కి, కలుపు, నూర్పిడి ఇతర ఖర్చులు రూ. 18 వేలు.. కౌలు రూ. 9 వేలు కలిపి మొత్తం ఎకరా వరి సాగుకు రూ. 27 వేల ఖర్చయింది. ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం లభించింది. మూడెకరాల్లో కూరగాయల సాగు..30 కుటుంబాలకు కిలో రూ.30కి సరఫరా.. పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలను మూడెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలుత దుక్కిలో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అందుబాటులో ఉండే దేశీ విత్తనాలనే వాడతారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. జీవామృతం, నీరు సమపాళ్లలో కలిపి ప్రతి పదిహేను రోజులకోసారి పైరుపై పిచికారీ చేస్తారు. కూరగాయలను గ్రామంలోని 30 కుటుంబాలకు విక్రయిస్తున్నారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కిలో రూ. 30 చొప్పున విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు మీరావలి, జాన్బీలు.. తమ్ముడు నాగూర్ వలీలు భాజీతోపాటు ప్రకృతి వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతూ సహకరిస్తున్నారు. వాతావరణ మార్పులకు ధీటైన జవాబు! రసాయన సేద్యంలో వరి సాగులో విస్తృతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల విడుదలయ్యే అమ్మోనియా వాయువు ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో పంటలకు చీడపీడల తాకిడి పెరుగుతోంది. యూరియాకు బదులు ఆవుపేడ, మూత్రం వాడటం వల్ల గ్లోబల్ వార్మింగ్ను తగ్గించొచ్చంటారు బాజీ. అలాగే గాడుపు నుంచి పైర్లను కాపాడేందుకు జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పైర్లను కంచెపంటగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన రేడియో ధార్మికత పరపరాగ సంపర్కం ప్రక్రియను దెబ్బతిస్తోంది. కూరగాయ పంటల్లో అయితే మగపూలు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. పంట గింజ పోసుకోదు. వరిలో తాలు గింజ పోసుకుంటుంది. రేడియో ధార్మికతను తట్టుకుని దిగుబడి నిచ్చే శక్తి ఉన్న నాటు రకాలను సాగు చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటారాయన. దీంతో పాటు 2 లీటర్ల కొబ్బరి నీరు కలిపి గింజ పాలు పోసుకునే దశలో పిచికారీ చేస్తున్నట్టు భాజీ తెలిపారు. నీటి కరువుకు ప్రకృతి సేద్యమే విరుగుడు వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయానికి సంభవించిన అనేక ఇబ్బందుల్లో తీవ్రమైనది కరువు. తోటి రైతులందరూ నీటి ఎద్దడితో వరి సాగును మానుకున్నా గడ్డు పరిస్థితుల్లోను ప్రకృతి సేద్య పద్ధతిలో వరిని సాగు చేయవచ్చని నిరూపించారు బాజీ. రసాయన సేద్యం చేసిన భూమి ఉపరితలంలో ఉండే చిన్నపాటి రంధ్రాలు పూడుకుపోవటం వల్ల కురిసిన నీరు భూమిలోకి ఇంకి ఆవిరయిపోతుంది. ప్రకృతి సేద్యంలో జీవామృతం వాడటం వల్ల వానపాములు చేసే బొరియల ద్వారా నీరు భూమి అడుగు పొరల్లోకి చేరి భూగర్భజలాలు పెరుగుతాయి. కరువులో జీవామృతం పైరుపై పిచికారీ చేస్తే చాలు. పోషకాలు అందుతాయి. పంట వ్యర్థాలు, ఎండుగడ్డి, ధనియాల పంటలతో ఆచ్ఛాదన చేసి కూరగాయ పంటల్లో తేమను పట్టి ఉంచుతున్నారు. ఇవ్వాళ్టి పరిస్థితుల్లో భూతాపాన్ని అదుపు చేయటం ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదంటారు భాజీ. దీనివల్ల చీడపీడల పెరుగుదల. రసాయన కీటకనాశనులు విచక్షణ లేకుండా పిచికారీ చేయటంతో పంటలకు మేలు చేసే సాలీడు, కప్పలు, అక్షంతల పురుగులు, మిడతలను నిర్మూలిస్తున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అదే ప్రకృతి సేద్యంలో వాడే కషాయాలు మిత్ర పురుగులను మాత్రమే కాదు శతృ పురుగులను సైతం చంపవు. దీనివల్ల జీవావరణం, జీవవైవిధ్యానికి ఎలాంటి హాని లేదు. 4 ఏళ్లలో 2.5కి పెరిగిన సేంద్రియ కర్బనం తుఫానులు, వరదల తాకిడికి చేతికొచ్చే పంటలు మట్టి కొట్టుకుపోయి రైతును నట్టేట ముంచుతున్నాయి. దీనికి ప్రకృతి సేద్యమే సమర్థవంతమైన పరిష్కారం అంటారు భాజీ. సంకరజాతి వంగడాల వాడకంతో మొక్కలు సత్తువను కోల్పోతున్నాయి. జీవామృతం వాడకం వల్ల పైరు బలంగా పెరుగుతుంది. గాలి వానలకు ఎదురొడ్డి నిలుస్తుంది. నీటి ముంపుకు గురయినా పైరు తట్టుకుంటుంది. బాజీ వ్యవసాయ క్షేత్రంలో 2011లో గుంటూరు లాం ఫారం శాస్త్రవేత్తలు మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా మట్టిలో సేంద్రీయ కర్బనం 0.5 శాతం ఉన్నట్టు తేలింది. 2015లో జరిపిన మట్టి పరీక్షల్లో ఎలాంటి రసాయన అవశేషాలు లేవని.. సేంద్రియ కర్బనం 2.5 శాతానికి పెరిగినట్టు పరీక్షల్లో తేలింది. 2014లో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.ప్రకృతి వ్యవసాయం చేయటం ప్రారంభమైనప్పటి నుంచి భాజీ జీవనశైలిలోనూ మార్పు వచ్చింది. గడ్డి కప్పిన పూరింటిలో నివసిస్తున్నాడు. విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాన్ని వాడుతున్నారు. మట్టికుండల్లోనే వంట చేసుకుంటున్నారు. – కంచి శ్రీనివాస్, సాక్షి, శావల్యాపురం, గుంటూరు జిల్లా రసాయనిక ఎరువులు వాడకుండాl లాభదాయకంగా వ్యవసాయం చేస్తున్నా..! ఒక వైపు కండక్టర్ ఉద్యోగం చేస్తూనే.. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో విజయవంతంగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. ఒక్క గ్రాము రసాయనిక ఎరువు, పురుగుల మందు, కలుపు మందు వాడకుండా ఘనజీవామృతం, జీవామృతం, కషాయాల ద్వారానే వ్యవసాయం లాభసాటిగా చేయడం నేర్చుకున్నాను. మనసు పెట్టి నిమగ్నమై చేస్తే ఏ రైతైనా ఈ సేద్యాన్ని సులభంగా నేర్చుకొని చేయవచ్చు. వాతావరణ మార్పులను అధిగమించి వ్యవసాయం లాభసాటి చేయలన్నా, భవిష్యత్ తరాల మనుగడ బాగుండాలన్నా రైతులందరూ ప్రకృతి సేద్యం చేపట్టాల్సిందే. రుతు పవనాల మీద ఆధారపడి చేసే సేద్యం బాగుండాలంటే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) తగ్గాలి. అప్పుడే సకాలంలో వర్షాలు కురుస్తాయి. అది జరగాలంటే రైతు చేయాల్సింది ప్రకృతి సేద్యం చెయ్యడం ఒక్కటే. – ధర్మారం బాజీ (96525 58884), యువ ప్రకృతి వ్యవసాయదారు, కారుమంచి, శావల్యాపురం మండలం, గుంటూరు జిల్లా. -
నులి పురుగులతో పెను కష్టం!
నులిపురుగులు.. మట్టి జీవులు. కంటికి కనిపించవు. సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్)లో చూస్తే.. ఏమీ ఎరుగని సన్నని దారాల్లా ఉంటాయి.. కానీ, అదీ ఇదని లేకుండా అన్ని రకాల పంటలనూ నాశనం చేస్తున్నాయి. రైతుల నోటి దాకా వచ్చిన పంటను నిలువునా ఎండగడుతున్నాయి. నులిపురుగులు పంట మొక్కలు, పండ్ల చెట్ల వేళ్లను ముక్కుతో పొడిచి రసం పీల్చుకుంటూ.. ఆ వేళ్ల చుట్టూ తెగ బలిసిపోతాయి. అవి పెరిగేకొద్దీ నేలపైన ఎంత ఎత్తున ఉన్న పండ్ల చెట్టయినా, మొక్కయినా, తీగయినా.. నీళ్లు, పోషకాలు అందక వాడిపోయి.. కొద్ది నెలల్లోనే నిలువునా ఎండిపోవాల్సిందే! అది వాటి పవర్!! ఈ నులిపురుగులను చంపే రసాయనిక మందును ఇప్పటివరకూ కనిపెట్టలేదు. కానీ, విషగుళికలు వాడి కొంత అదుపు చేయగలుగుతున్నారంతే. పోషకాలు చాలడం లేకనో, నీరు చాలడం లేకనో పంటలు ఇలా అయిపోతున్నాయని భ్రమింపజేసి.. తలపండిన రైతులను, సీనియర్ శాస్త్రవేత్తలను సైతం బోల్తా కొట్టించడంలో నులిపురుగులు ఆరితేరిపోయాయి. చెల్క/ మెట్ట పొలాల్లో ఆరుతడి పంటలు వేసుకొని పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులే కాదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పాలీహౌస్లు ఏర్పాటు చేసుకున్న హైటెక్ రైతులు కూడా విలవిల్లాడిపోతున్నారు. పెట్టుబడులు ఎక్కువైనా వెచ్చించి కార్నేషన్, జెర్బర వంటి ఖరీదైన పూలు, అనేక రకాల కూరగాయ పంటల్లో అధికోత్పత్తి సాధించాలనుకున్న పాలీహౌస్ రైతుల భారీ ప్రణాళికలన్నీ నులిపురుగుల ధాటికి తల్లకిందులైపోతున్నాయి. ఒకటి, రెండు పంటలయ్యే సరికి ఆ పాలీహౌస్లలో బెడ్లతోపాటు వాటి కింది నేల కూడా పంటల సాగుకు సుతరామూ పనికిరానంతగా పాడైపోతోంది. దారీ తెన్నూ తెలీక కొంత మంది రైతులు పాలీహౌస్లలో సేద్యం అంటేనే భయపడిపోతున్నారు. అధికోత్పత్తిని ఆశించి తైవాన్, థాయ్లాండ్, చైనా, బంగ్లాదేశ్ దేశాల నుంచి పింక్, వైట్ పెద్ద జామ రకాల మొక్కలు పశ్చిమ బెంగాల్ మీదుగా య«థేచ్ఛగా దిగుమతి అవుతున్నాయి. కోటి ఆశలతో వీటిని సాగు చేస్తున్న రైతుల జామ తోటలు అనేక జిల్లాల్లో కునారిల్లుతున్నాయి లేదా నిలువునా ఎండిపోతున్నాయి. గోరు చుట్టుపై రోకటిపోటులా.. ఈ మొక్కలతోపాటు మనకు తెలియని విదేశీ జాతి నులిపురుగులు కూడా దిగుమతి అయ్యాయి కూడా. స్పెయిన్ నుంచి కార్నేషన్ అంట్లతోపాటు మరో రకం విదేశీ జాతి నులిపురుగులు వచ్చి మన భూముల్లోకి చేరిపోయాయి. ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో ముందస్తు పరీక్షలు చేసే నెమటోడ్ నిపుణుల కొరతతో క్వారంటైన్ నిబంధనలను అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడమేనని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని అనేక జిల్లాల్లో గత మూడేళ్లుగా నులిపురుగులు విజృంభిస్తుండడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. సుమారు 300 మంది రైతుల పొలాలు, పాలీహౌస్ల నుంచి డాక్టర్ సునంద నమూనాలు సేకరించి, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.)లో నులిపురుగులపై జాతీయ సమన్వయ పరిశోధనా స్థానం కొద్ది నెలల క్రితమే ఏర్పాటైంది. ఈ స్థానం సారథిగా డా. సునంద సేవలందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంటలను ఆశించే నులిపురుగులపై పనిచేస్తున్న పరిశోధనా స్థానం ఇదొక్కటే. దేశవ్యాప్తంగా ఏటా జామ సహా ఉద్యాన తోటల్లో నులిపురుగుల వల్ల 10–12 శాతం దిగుబడి దెబ్బతింటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రూ. 2,100 కోట్ల మేర రైతులకు ఆర్థిక నష్టం కలుగుతోంది. ఐ.సి.ఏ.ఆర్. – ఎ.ఐ.సి.ఆర్.పి. సర్వే ప్రకారం తాజాగా రూపొందించిన నెమటోడ్స్ అట్లాస్లో ఈ వివరాలు పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ‘సాగుబడి’ పాఠకుల కోసం నులిపురుగుల బెడదపై కొన్ని సంగతులు.. విదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి జామ రకాల దిగుమతి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన పండ్ల జాతుల్లో జామ ముఖ్యమైనది. తాజా అంచనాల ప్రకారం 12 వేల హెక్టార్లకన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే జామ తోటలున్నాయి. అయితే, గత రెండేళ్లుగా జామ తోటల్లో కొన్ని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పోషకాల లోపమా? నీరు లోపమా? అని తర్జన భర్జన పడే లోపే జామ తోటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నులిపురుగుల బారిన పడిన జామ తోటల్లో పంట నష్టం 30 నుంచి 60 శాతం వరకు ఉందంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం అవుతుంది. కొన్ని నర్సరీల్లో అయితే నులిపురుగుల సోకిన జామ మొక్కల శాతం 90 నుంచి 100% వరకూ ఉందని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో నెమటోడ్స్ విభాగం సారధి డా. సునంద అన్నారు. విదేశాల నుంచి జామ మొక్కలను దిగుమతి చేసుకునేటప్పుడు ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో తెగుళ్లు, పురుగులతోపాటు నులిపురుగుల సమస్య లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. అయితే, నులిపురుగుల నిపుణులు లేకపోవడం వల్ల ఈ పరీక్ష చేయకుండానే యధేచ్ఛగా తైవాన్, చైనా, థాయ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా మన దేశంలోకి మొక్కల దిగుమతి జరిగిపోతోంది. ఆ మొక్కలతోపాటు మన దేశంలోకి వచ్చిన మట్టి మిశ్రమం ద్వారా విదేశీ జాతుల నులిపురుగులు మన భూముల్లోకి చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఆ విధంగా.. తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి రకాలకు చెందిన పింక్, వైట్ జామ మొక్కలతో పాటు అనే విదేశీ జాతి నులిపురుగులు తెలుగు రాష్ట్రాల పొలాల్లోకి వచ్చేశాయి. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో నులిపురుగుల శాస్త్రవేత్త డా. సునంద తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఎండిపోతున్న తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి రకాల జామ తోటల్లో నమూనాలు సేకరించి పరీక్షించారు. మోలోయిడోగైన్ ఎంటెరోలోబి (M్ఛlౌజీఛీౌజyn్ఛ ్ఛn్ట్ఛటౌlౌbజీ) అనే విదేశీ జాతి నులిపురుగు సోకినట్లు గుర్తించారు. తొలుత 2013లో తమిళనాడులోని దిండిగల్లో జామ తోటలో దీన్ని కనుగొన్నారు. 2015లో తెలంగాణలో తొలిసారి బయటపడింది. అయితే, దేశీ జామ రకాలైన అలహాబాద్ సఫేద్, లక్నో 49 రకాల జామ తోటల్లో ఈ నులిపురుగుల సమస్య లేదని డా. సునంద చెప్పారు. ఈ విదేశీ జాతి నులిపురుగు జామ ఒక్క పంటనే కాదు.. మట్టి లేదా అంట్ల ద్వారా ఏ పంటనైనా ఆశిస్తుంది. చివరకు గడ్డి మొక్కల వేళ్లపై కూడా బతికేస్తుందన్నారు. తైవాన్, వి.ఎన్.ఆర్. బిహి వంటి విదేశీ జామ రకాలను దిగుమతి చేసుకొని తూర్పు గోదావరి జిల్లా కడియంలోని నర్సరీ రైతులకు ఇస్తున్నాయని, వీటి ద్వారా విదేశీ జాతి నులిపురుగులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ఈ నులిపురుగుల వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున అరికట్టకపోతే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి రైతాంగానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగించే ప్రమాదం ఉందని డా. సునంద హెచ్చరిస్తున్నారు. నాలుగో నెల నుంచే నులిపురుగుల సమస్య ప్రకృతి వ్యవసాయంతోనే తోటను నిలబెట్టుకుంటా! ప్రకృతి వ్యవసాయదారుడు కొచ్చెర్లపాటి రవికిరణ్కు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామపరిధిలో నాలుగు ఎకరాల భూమి ఉంది. పాలేకర్ శిక్షణ పొంది, పుస్తకాలు చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలిసిన ఒక రైతు వద్ద నుంచి తైవాన్ పింక్ జామ 1,800 మొక్కలను తెచ్చి.. ఏడాదిన్నర క్రితం నాటారు. కడియం నుంచి సూద మొక్కలు(రూట్ స్టాక్) తెప్పించి, దానిపై తైవాన్ పింక్ కొమ్మలను గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలను ఒక రైతు వద్ద నుంచి కొని నాటారు. 4 నెలలు గడిచేటప్పటికి ఆకులు పసుపు రంగుకు పాలిపోవడం, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయి. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.కు చెందిన డా. సునందను సంప్రదించారు. పరీక్షలు చేసి నులిపురుగులు సోకాయని నిర్థారించారు. రసాయనిక మందులు వాడమని సలహా ఇచ్చారు. అయితే, రవికిరణ్ మాత్రం ప్రకృతి వ్యవసాయంపై నమ్మకంతో తన మార్గంలోనే ముందుకెళ్తున్నారు. భూమిలో సేంద్రియ పదార్థం పెంచితే మొక్కలు తిరిగి పుంజుకుంటాయని నమ్ముతున్నారు. జీవామృతం, పంచగవ్య, పుల్లమజ్జిగ.. ఇస్తున్నారు. మేకల ఎరువుకు జీవామృతం కలిపి 3 నెలలు పులియబెట్టి, దానికి జీవన ఎరువులను కలిపి మొక్కల చుట్టూ పోసి మల్చింగ్ చేస్తున్నారు. జామ మొక్కల దగ్గర్లో బంతి మొక్కలు వేశారు. బంతి మొక్కల వేళ్ల నుంచి వెలువడే స్రావం నులిపురుగుల నియంత్రణకు ఉపయోగపడుతోందన్నారు. తనతోపాటు 30–40 ఎకరాల్లో తైవాన్ జామ వేసిన రైతులు రసాయనాలు వాడి, చాలా నష్టపోయి తోటలు పూర్తిగా తీసేశారని రవికిరణ్ తెలిపారు. తన పొలంలో ఒక రెండెకరాల్లో జామ పక్కనే మునగ మొక్కలు వేసి, కొమ్మలు నరికి మల్చింగ్ చేస్తున్నానని, ఆ ప్రాంతంలో నులిపురుగుల నష్ట తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఓపికగా ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్న రవికిరణ్ (99636 12578) అభినందనీయుడు. సేంద్రియ సేద్యంలో నులిపురుగుల సమస్య తక్కువే: డా. సునంద నులిపురుగుల సమస్య తీవ్రత సేంద్రియ సేద్యం చేసే పొలాల్లో రసాయనిక వ్యవసాయం చేసే పొలాలతో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుందని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో నులిపురుగుల నిపుణురాలు డా. సునంద తెలిపారు. అయితే, ఇటీవల సంవత్సరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టిన పొలాల్లో పెద్ద తేడా కనిపించలేదని, సుదీర్ఘకాలం నుంచి సేంద్రియ సేద్యం చేసే పొలాల్లో కచ్చితంగా ఈ తేడా ఉంటుందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే జీవన ఎరువుల ప్రభావం వల్ల నులిపురుగులు అదుపులో ఉండే అవకాశం ఉందన్నారు. ప్రధాన పంట మొక్కల పక్కన బంతి మొక్కలు, ఆవాల మొక్కలు సాగు చేయడం ద్వారా నులిపురుగుల బెడదను నివారించవచ్చని ఆమె తెలిపారు. ఈ మొక్కలు వేళ్ల ద్వారా స్రవించే ద్రవాలు నులిపురుగులను నిరోధిస్తాయన్నారు. అనేక రకాల పంటలను కలిపి ఒకే పొలంలో పండించడం, ఎర పంటలను సాగు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడం సులభమవుతుందని డా. సునంద వివరించారు. నులిపురుగుల సమస్య ఎదుర్కొంటున్న రైతులు నమూనాలు తెస్తే ఉచితంగా పరీక్ష చేసి, తగిన సూచనలు ఇస్తామన్నారు. నులిపురుగుల సమస్యపై రైతులకు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. శిక్షణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు లేదా రైతు బృందాలు నులిపురుగుల సమస్యపై హైదరాబాద్లోని ఎన్.ఐ.పి. హెచ్.ఎం. 3 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తుంది. వసతి ఉచితం. భోజనం ఖర్చు రైతులే భరించుకోవాలి. ఆసక్తి కలిగిన వారు ఎన్.ఐ.పి. హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్కు ఫ్యాక్స్ (040–24015346) ద్వారా లేఖ రాయవచ్చు. శిక్షణకు రావలసిన తేదీలను రైతులకు తదుపరి తెలియ జేస్తారు. డా. సునందను 89787 78707 నంబరులో గాని, ఈమెయిల్ patilsunanda722@gmail.com ద్వారా గాని సంప్రదించవచ్చు. -
ప్రకృతి సేద్యంపై మే 9–10 తేదీల్లో బెంగళూరులో అంతర్జాతీయ సదస్సు
‘ప్రకృతి వ్యవసాయం – ప్రపంచ ప్రజలకు పౌష్టికాహారం, ఆహార భద్రత సాధనకు వినూత్న మార్గం’ అనే అంశంపై ఈ ఏడాది మే 9,10 తేదీల్లో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు బెంగళూరులోని రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వేదిక కానుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థ అయినప్పటికీ దేశీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రసాయన రహిత సహజాహారోత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ‘శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు’ (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులకు శిక్షణ ఇస్తోంది. ఈ ట్రస్టు చైర్మన్గా హైదరాబాద్కు చెందిన పులిమామిడి రామకృష్ణారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సదస్సు నిర్వహించతలపెట్టారు. చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో దేశీ ఆవు పేడ, మూత్రం తదితరాలతో తయారు చేసిన ఉత్పాదకాలతోనే భూసారాన్ని గణనీయంగా, కచ్చితంగా పెంచుకునే వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. త్రికరణశుద్ధిగా చేస్తే ప్రకృతి వ్యవసాయంలో సులువుగా తొలి ఏడాదే అధిక దిగుబడి సాధించడం ముమ్మాటికీ సాధ్యమేనని రైతులతో పనిచేస్తున్న క్రమంలో గ్రహించామని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, వినియోగదారులు, రైతులకు భారతీయ ప్రకృతి వ్యవసాయం అద్భుత ఫలితాలను చాటిచెప్పడమే ఈ సదస్సు లక్ష్యమని ట్రస్టు చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రుషి – కృషి’ పేరిట అనేక రాష్ట్రాల్లో తమ వద్ద ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొందిన రైతుల్లో కనీసం సగం మంది ఈ సాగుపద్ధతిని అనుసరిస్తున్నారని ఆయన వివరించారు. మే 9–10 తేదీల్లో జరిగే శిఖరాగ్ర సదస్సుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, శాస్త్రవేత్తలు, పలువురు దేశ విదేశీ నిపుణులు, ప్రముఖులు ఈ సదస్సులో ప్రసంగిస్తారని రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సదస్సుకు హాజరుకాదలచిన వారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు agriconference.artofliving.org చూడండి.ఈ–మెయిల్: agriconference@artofliving.org, ఫోన్స్: 080–67612310, శ్రీమతి మరియమ్మ 098493 70809, శ్రీమతి సునీల 098490 00196 ప్రకృతి సేద్యంపై 7 నుంచి కొల్లాపూర్లో శిక్షణ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ‘రుషి–కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిర్వహించనున్నారు. ట్రస్టు అధినేత పులిమామిడి రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వరి రైతులకు శిక్షణ ఇస్తారు. కొల్లాపూర్లోని ఫంక్షన్హాలులో శిక్షణ ఉంటుంది. భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి సేద్యం చేపట్టిన సతీష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల రైతులు ఆయనను 95027 31861 నంబర్లో సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. ఏప్రిల్ 9, 18 తేదీల్లో చెన్నమరాజుపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై గంగిరెడ్డి శిక్షణ ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మన్నేటి గంగిరెడ్డి తన స్వగ్రామం పెండ్లిమర్రి మండలం చెన్నమరాజుపల్లి (కడప నుంచి 18 కి.మీ. దూరం)లో ఏప్రిల్ 9, 18వ తేదీల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. గోమాత పంచామృత కషాయాల ఆశ్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తారు. తన వ్యవసాయ పనులు చూసుకుంటూనే నెలకు 10 రోజులు వివిధ గ్రామాలకూ వెళ్లి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సమయం కేటాయిస్తున్నానని గంగిరెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో రైతులకు రెండేళ్ల పాటు శిక్షణ ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. గంగిరెడ్డిని 95021 47401 నంబరులో సంప్రదించవచ్చు. 6న మిర్యాలగూడలో, 9న కొర్నెపాడులో శిక్షణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వివిధ పంటల సాగుపై రైతునేస్తం ఫౌండేషన్ ఏప్రిల్ 6న మిర్యాలగూడలో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రకృతి వ్యవసాయదారులు శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీమతి శశికళ, జి. సతీష్రెడ్డి, కొక్కు అశోక్కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా కొర్నెపాడులో ప్రకృతి సేద్యం చేసే వరి, పత్తి, మిరప, ఉద్యాన తోటల రైతులకు వర్తించే పథకాలపై శిక్షణ ఇస్తారు. ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతులు ధర్మారం బాజి, శ్రీమతి లావణ్యా రమణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు 83744 22599, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు. విశాఖలో దేశీ విత్తనోద్యమకారుల సమ్మేళనం భారత్ బీజ్ స్వరాజ్ మంచ్(బి.బి.ఎస్.ఎం.) ఆధ్వర్యంలో దేశీ విత్తనాలు సాగు చేస్తూ పరిరక్షిస్తున్న సేంద్రియ రైతులు, మేలైన వంగడాలను రూపొందించే రైతులు, దేశీ విత్తన పరిరక్షణోద్యమ కార్యకర్తల జాతీయ సమ్మేళనం ఏప్రిల్ 8 – 9 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. వివరాలకు.. కృష్ణప్రసాద్ – 098808 62058, దేవుళ్లు –98492 05469. prasadgk12@gmail.com -
ప్రకృతికి పుట్టిన రోజు పండుగ ఉగాది
–మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు –ఘనంగా ఉగాది విశిష్ఠ సేవాపురస్కారాల కార్యక్రమం రాజమహేంద్రవరం రూరల్ : ఉగాదిని హిందువుల పండువగా భావించరాదని, ప్రకృతికి ఉగాది పుట్టినరోజు పండుగలాంటిదని, అన్ని మతాల వారు ఈ మధుమాసాన్ని ఆచరించాలని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు అన్నారు. సోమవారం హేవిళంబి నామ ఉగాదిని పురస్కరించుకుని ఫిలాంత్రోఫిక్ సొసైటీ, తెలుగువిశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో తెలుగు విశ్వవిద్యాలయ సెమినార్ హాలులో ఉగాది విశిష్ట సేవాపురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ చైత్రమాసంలో వసంత రుతువు అనాదిగా మానవజాతికి మరువలేని తీపి గురుతన్నారు. తెలుగువిశ్వవిద్యాలయ పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఉగాదిని గుర్తు చేసే కోయిల పాట వింటే ప్రాణం లేచివస్తుందని, జగమంతా వసంతాలు పూయు ఉగాది ఒకటి చాలని అన్నారు. తెలుగుభాషా రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రజల్లో విశ్వవిద్యాలయాల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేలా ఫిలాంత్రోఫిక్ సొసైటీ వివిధ విశ్వవిద్యాలయాలతో చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సభలో ఆదికవినన్నయ్య విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ పి.విజయనిర్మల జ్యోతిప్రజ్వలన చేయగా, సీనియర్ జర్నలిస్టు, ఏపిడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండేలా శ్రీరామ్మూర్తి, నన్నయ్యవిశ్వవిద్యాలయం తెలుగు విభాగ కన్వీనర్ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా మాట్లాడారు. తెలుగు బాష కమ్మదనంపై కె.వాణి పాడిన గీతం, డాక్టర్ పుట్ల హేమలత వాఖ్యానం ఆహుతులను అలరించాయి. ఉగాది కవితతో అందరి మదిని దోచారు కవి నూజెళ్ల శ్రీనివాసరావు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 22మందికి ఉగాది విశిష్ట సేవా పురస్కార్ అవార్డులు అందించి, ఘనంగా సన్మానించారు. పురస్కారాలు పొందినవారు వీరే సాహిత్యం విభాగంలో డాక్టర్ బి.ప్రభాకరరావు(రెక్టర్, జేఎన్టీయూ, కాకినాడ), డాక్టర్ జనపాల కాళేశ్వరరావు(కవి, రచయిత, సామాజికవేత్త), మల్లెమొగ్గల గోపాలరావు(కవి, రచయిత), యడవల్లి శ్రీనివాసరావు(కవి, సామాజికవేత్త), బత్తుల మురళీకృష్ణ(కవి, రచయిత), సాంస్కృతిక రంగంలో తురగా సూర్యారావు(నటుడు, సామాజికవేత్త), డాక్టర్ కేవీఎం లాల్ నెహ్రూ(నృత్యం, సామాజిక రంగం), డాక్టర్ రవిపరస(నఖ చిత్రలేఖనం), సామాజిక రంగాల్లో డీజే సుధాకరరాజు, డాక్టర్ ఒమ్మి రఘురాం, డాక్టర్ మనికిరెడ్డి సత్యనారాయణ, మల్లాడి సత్యనారాయణ, చింతా వెంకటరమణి, డాక్టర్ కట్టా నళిని, డాక్టర్ రాయవరపు సత్యభామ, కె.వాణి, మల్లెపూల నిర్మలకుమారి, డాక్టర్ యంగలశెట్టి సాయికుమార్, డాక్టర్ కె.కృష్ణంరాజు, గుంపుల వెంకటేశ్వరరావు, రెవ.జోసఫ్ పాలంగి, గరికపర్తి నమశ్శివాయ -
‘ప్రకృతి’ ఉత్పత్తులకు విశేష ఆదరణ
- నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి కర్నూలు(అగ్రికల్చర్): పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకుండా.. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకు విశేష ఆదరణ లభిస్తోందని నంద్యాల రైతు శిక్షణ కేంద్రం డీడీఏ సంధ్యారాణి, వ్యవసాయశాఖ డీడీఏ మల్లికార్జునరావు అన్నారు. నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల శిబిరాన్ని సోమవారం.. కర్నూలు సీక్యాంప్ రైతు బజార్లో వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బండి ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లె, బేతంచెర్ల, వెలుగోడు మండలాల్లో 8 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 299 మంది రైతులు 350 హెక్టార్లలో ఈ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రదర్శనలో బియ్యం, జొన్నలు, జొన్నపిండి, కందిపప్పు, రాగులు, కొర్ర బియ్యం, నువ్వులు, పసుపుతో పాటు మామిడి కాయలు, పండ్ల, ఇతర కూరగాయలను విక్రయానికి ఉంచారు. వినియోగదారులు పోటీ వీటిని పడి కొనుగోలు చేశారు. మంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. ఎన్పీఎం డీపీఎం నాగరాజు, నంద్యాల రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ అరుణకుమారి, వ్యవసాయాధికారులు నాగసరోజ, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ టిప్స్
ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు భారతీయ వైద్యులు. వీటిలో అల్లం ప్రాధాన్యం మరీ ఎక్కువ. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కాని చిటికెడు శొంఠి పొడి కాని ఇవ్వాలి. పెద్దవాళ్లు కూడా మోతాదు పెంచి తీసుకోవచ్చు.జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠి పొడి కాని కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లం రసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది. పైత్యంతో వాంతులవుతుంటే శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి. వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పని చేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని పోగొడుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగుసార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు. అల్లం టీ తాగినప్పుడు కడుపులో వికారం వస్తే డాక్టర్ని సంప్రదించాలి. -
పిల్లలు ప్రకృతి ప్రేమికులు ఎలా!
టోరంటో: ఇంటి వెలుపల క్రీడలు ఆడే పిల్లలకు ప్రకృతిపై ప్రేమ ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఓక్నాగన్కి చెందిన ప్రొఫెసర్లు జరిపిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. చిన్నతనంలో ఇంటి బయట ఆడుకున్న 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతని ప్రొఫెసర్లు ప్రశ్నించగా.. తాము ప్రకృతిని అమితంగా ఇష్టపడతామని, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని వారు తెలిపారు. ఈ తరహాలో అలోచించే పిల్లలు చిన్నప్పుడు వివిధ పర్యావరణ సంబంధిత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అందుకే వారు ప్రకృతిపై ఇష్టాన్ని పెంపొందించుకున్నారని వర్సిటీ ప్రొఫెసర్ బూన్ విశ్లేషించారు. బయట ఆడుకునే సమయంలో పిల్లలు ప్రకృతిని ఆస్వాదిస్తారన్నారు. అందుకే పెద్ద అయిన తరువాత వారికి ప్రకృతిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్ కేథరీన్ వివరించారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు వారానికి నాలుగుసార్లైనా అవుట్ డోర్ గేమ్స్ (బయట ఆడుకునే క్రీడలు) ఆడితే పిల్లల్లో ప్రకృతిపై ప్రేమ, గౌరవం పెరుగుతుందని చెప్పారు. ఈ అధ్యయన వివరాలను ఆస్ట్రేలియాకి చెందిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే జర్నల్లో ఇటీవల ప్రచురించారు. -
పీడ ఫీలింగ్
పడుతుంటే పట్టుకోవాల్సిన పిల్లలను పడతొక్కేవాళ్లుంటారా? పీడకలలొస్తే లాలించే పెద్దలే ఓ పీడకలవుతారా? ఇక పిల్లల్ని ఎవరి అండకు వదలాలి? ఇక పిల్లల్ని ఏ భరోసాకి అప్పజెప్పాలి? చీదర పుడుతోంది... కాదు కాదు కంపరం పుడుతోంది... పట్టలేనంత కోపం వస్తోంది! గొంతు పట్టుకోవాలన్నంత ఆవేశం పొంగుతోంది!! కాని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. వీళ్లను మనం కొట్టకూడదు... చట్టమే తాట తీస్తుంది!! పెడోఫీలియా... పిల్లలను లైంగికంగా వేధించే ఉన్మాద ప్రవర్తన!! ఈ పీడ ఫీలింగ్ నుంచి సమాజాన్ని కడిగేయాలనే ఈ ప్రయత్నం!! పేరెంట్స్ నీడ్ టు నో! తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ‘పెద్దలకు ’ అప్పజెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ బి కేర్ఫుల్!! చిన్నపిల్లలను లైంగికంగా వేధించే ప్రవృత్తిని ఒక మానసిక స్థితిగా కాకుండా దాన్నొక రాక్షస చర్యగా పరిగణించాలి. ‘హలో.. సరిత గారూ... నిహారిక క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండీ..!’‘హలో.. చెప్పండి మామ్!’‘మీ పాపకు జ్వరం. ఒళ్లు కాలిపోతోంది. వచ్చి తీసుకెళ్తారా...’‘అయ్యో.. ఉదయం స్కూల్కి పంపేప్పుడు బాగానే ఉంది కదా..’ కంగారుగా బదులిచ్చింది సరిత.‘ఏమోనండీ మరీ.. అసెంబ్లీకి కూడా అటెండ్ అవకుండా క్లాస్ రూమ్లోనే పడుకుని ఉండిపోయింది. అటెండెన్స్ తీసుకుంటుంటే తన పక్కన ఉండే పిల్లలు చెప్పారు... నిహారికకు జ్వరమని. వెళ్లి చూస్తే ఒళ్లు కాలిపోతోంది. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను’ వివరించింది క్లాస్ టీచర్. ‘వచ్చేస్తున్నానండీ’.. ఇందాకటి కంగారే కంటిన్యూ అయింది సరిత గొంతులో. ‘సరిత గారూ.. ఇంకో విషయమండీ... రెండు రోజుల కిందటే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఎందుకో ఈ మధ్య నిహారిక చాలా డల్గా కనపడుతోంది. పిల్లలతో కలవట్లేదు. లంచ్ కూడా సరిగ్గా తినట్లేదల్లే ఉంది. ఏమైందో కనుక్కోవడానికి యాజ్ ఏ టీచర్ నా ప్రయత్నం నేను చేశాను. గమ్మున ఉంటోంది తప్ప పెదవి విప్పట్లేదు. మీరూ వర్కింగ్కదా.. బహుశా మిమ్మల్ని మిస్ అవుతుందేమో... చూడండి...’ అని టీచర్ సజెస్ట్ చేసింది. కూతురు కళ్లల్లో భయం ఫోన్ కాల్ కట్ అయ్యాక ఆఫీస్కి సగం దూరంలో ఉన్న సరిత స్కూల్కి రూట్ మార్చుకుంది. దారంతా నిహారిక గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి ఆమెను. నిజమే.. తనూ గమనిస్తోంది! తను సాయంకాలం ఇంటికి రాగానే గట్టిగా వాటేసుకుంటోంది. తన వెన్నంటే తిరుగుతోంది. రాత్రి స్నానానికి వెళితే కూడా బాత్రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఉంటోంది. ఆరేళ్ల పిల్ల అంతలా అంటిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపకు ఊహ తెలిసినప్పటి నుంచే తను, ప్రకాష్ ఇద్దరూ నిహారికను ప్రిపేర్చేశారు... వర్కింగ్ పేరెంట్స్ చైల్డ్గా ఎలా ఉండాలో... తన పని తాను ఎలా చేసుకోవాలో... ఇంట్లో ఎవరూ లేకపోతే భయపడకుండా ఎలా ఉండాలో... ఫోన్లో ఎలా మాట్లాడాలో... తన వివరాలు ఎలా చెప్పాలో... అన్నీ నేర్పించారు. సహజంగానే చురుకుదనం ఉన్న పిల్ల. ఇన్ని రోజులుగా దేనికీ భయపడలేదు. ఇప్పుడీ సడెన్ ఛేంజ్ ఏంటీ? నిజంగానే అమ్మానాన్న తనతో గడపట్లేదని దిగులు పడుతోందా? స్కూల్లో ఏమన్నా స్ట్రెస్ ఫీలవుతోందా? అన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఒక్కర్ని కంటేనే చక్కగా పెంచగలమని నిహారిక ఒక్కతే చాలనుకున్నారు. బహుశా తనకు తోడులేక ఏమన్నా ఒంటరితనం ఫీలవుతోందా? విషయాన్ని ప్రకాశ్కి చెప్పి పాప దిగులు, భయం, డల్నెస్ వెనక కారణం కనుక్కోవాల్సిందే అని నిర్ణయించుకుంది సరిత. ఆ ఆలోచనలకు, తన ప్రయాణానికి బ్రేక్ వేసింది స్కూల్ రావడంతో! నానమ్మకు కబురు ‘ప్రకాశ్... దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. సంభాళించడం నా వల్ల కాదు. మీ అమ్మను పిలువ్ ప్లీజ్’.. ఎంతో కష్టమ్మీద కూతుర్ని నిద్రపుచ్చి మంచం మీదే కూర్చున్న ప్రకాశ్ భుజమ్మీద తలవాల్చింది సరిత బేలగా. ‘ఏమయిందంటావ్?’ ఓ చేత్తో సరితను పొదివి పట్టుకుంటూ మరో చేత్తో కూతురి తల నిమురుతూ అన్నాడు ప్రకాశ్. ‘తెలియట్లేదు. ఎంత అడిగినా నోరు విప్పదు. చూస్తున్నావ్గా రెండు రోజుల్నుంచి నా ఒళ్లు దిగలేదు. గట్టిగా హత్తుకుని ఉంటోంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. దాన్ని మామూలు పిల్లను ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్యను పిలిపించు ప్రకాశ్’ అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది సరిత. కథలు... గోరుముద్దలు కొడుకు, కోడలి నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన బయలుదేరింది వసంత. అత్తను చూడగానే బోరుమంది కోడలు. మనవరాలి మొహం చాటంతయింది. కూతురి మొహంలోని చిరునవ్వును చూసి అమ్మను పిలిపించడం మంచి పనే అయింది అనుకున్నాడు ప్రకాశ్. తెల్లవారి నుంచే ఆఫీస్లకు హాజరవ్వడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు. పాపకు ఇంకో వారం సెలవు పొడిగించారు. చక్కటి కథలతో కమ్మటి గోరుముద్దలు తినిపించసాగింది వసంత. ఆట, పాటతో రెండు రోజుల్లోనే మనవరాలి మనసులో బెరుకు పోగొట్టింది. ఆ పసిదాని భయానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచించసాగింది. ఆమె దృష్టి ముందుగా నిహారిక స్కూల్కి వెళ్లే ట్రాన్స్పోర్టేషన్ మీద పడింది. స్కూల్ బస్లో వెళ్తుంది. 30 మంది పిల్లల మధ్య వెళ్తుంది. కొలిక్కిరాని ఆలోచనలు ‘ఏమ్మా..! స్కూల్ బస్లో వెళ్తుంటే పిల్లలతో నువ్వేమైనా గొడవ పడ్డావా?’ అడిగింది ఒకరోజు రాత్రి అన్నం తినిపిస్తూ! ‘ఉహూ’ చెప్పింది నిహారిక. ‘మరి స్కూల్లో టీచర్లు, నీ ఫ్రెండ్స్ ఏమన్నా అంటున్నారా?’ ప్రశ్నించింది. దానికి తల అడ్డంగా ఊపింది అమ్మాయి. అన్నం తినిపించడం అయిపోయాక మనవరాలి మూతి కడిగి పడుకోబెడుతూ ఇంటి పరిసరాల మీదకు తన ధ్యాసను మళ్లించింది నానమ్మ. ఇండిపెండెంట్ హౌజ్. కొడుకు, కోడలు, మనవరాలు, ఆ ఇంటిని ఇరవైనాలుగ్గంటలూ కాపలాకాసే వాచ్మన్. అతని వయసు యాభై ఏళ్లు. నమ్మకస్తుడే. ‘ఇంట్లోకి దోమను కూడా దూరనివ్వడు. పిల్లను కంటికి రెప్పలా కాచుకుంటాడు’ అని చెప్పారు కొడుకు, కోడలు. ఇక పనిమనిషి. ఈ పిల్ల వెళ్లిపోయాక వస్తుంది. దీన్ని బెదిరించి, భయపెట్టే ఆస్కారమే లేదు. ఆమె ఈ ఆలోచనల్లో సీరియస్గా ఉన్నప్పుడే... నిహారిక మూలుగు వినిపించింది. బాత్రూమ్లోంచి. ఎప్పుడు వెళ్లిందో బాత్రూమ్లోకి... ఆ మూలుగుతో ఈ లోకంలోకి వచ్చింది వసంత. గభాల్న బాత్రూమ్లోకి పరిగెత్తింది. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి ‘నానమ్మా... నొప్పి’ అంటూ విలవిల్లాడసాగింది పిల్ల. ‘అయ్యో.. తల్లీ.. ఎక్కడే. కడుపునొప్పా?’ అంటూ పొట్ట చూసింది. ‘కాదు నానమ్మా.. ’ అంటూ నొప్పి ఎక్కడో చూపించింది. తొడల దగ్గర ఏ చీమ అయినా కుట్టిందేమో అంటూ కలవర పడింది వసంత. ‘నానమ్మా.. పాస్కి వెళ్లినప్పుడల్లా నొప్పెడుతోంది’ అంటూ కన్నీళ్లతో చెప్పింది నిహారిక. ఏమీ అర్థంకాక అయోమయంలో పడింది వసంత. చూద్దామని పరీక్షించి గాభరా పడిపోయింది. తొడల దగ్గర ప్రాంతం కందిపోయింది. వెనక భాగమంతా గాట్లు! వసంతకు వణుకు వచ్చేసింది. తను వచ్చిన దగ్గర్నుంచీ చూస్తోంది. బాత్రూమ్కి వెళ్లి వచ్చినప్పుడల్లా పిల్ల మొహం పాలిపోయి ఉంటోంది. కళ్లల్లో ఏదో బాధ. ఇప్పుడర్థమైంది. బెడ్రూమ్లోకి వచ్చి పాపను ఒళ్లోకి తీసుకొని హత్తుకుంది. ‘ఏమైంది నాన్నా.. ’ అంటూ అనునయించింది. అంతే ఆ పాప గట్టిగా నానమ్మను వాటేసుకొని వెక్కివెక్కి ఏడ్చింది. విషయమంతా చెప్పింది. ‘నేను వచ్చేసాను కదా.. నీకింకేం భయంలేదు. ఇంక అలా జరగదు’ అంటూ ఆ పిల్లకు అభయమిచ్చి పడుకోబెట్టింది. నిశ్చేష్టులైన తల్లిదండ్రులు! కొడుకు, కోడలి గది తలుపు కొట్టింది. సరిత తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి... ‘ఏమైందత్తయ్యా... పాప మళ్లీ ఏమైనా భయపడుతోందా?’ అడిగింది కంగారుగా. ‘కాదు, భయమేస్తోంది అంటూ... లోపలికి వెళ్లి మనవరాలు చెప్పిన విషయాన్ని వాళ్ల చెవిన వేసింది. హతాశులయ్యారు భార్య, భర్త. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ప్రకాశ్. ఆవేశంగా వాకిట్లోకి నడిచాడు. వాచ్మన్ గదిలోకి వెళ్లి వాచ్మన్ను బరబరా బయటకు లాక్కొచ్చాడు. ‘రాస్కెల్ మా సొంత మనిషివని నమ్మి స్కూల్ నుంచి రాగానే పాప బాధ్యతను నీకు అప్పగిస్తే నువ్ చేసేది ఇదా?’ అంటూ కొట్టబోయాడు. వసంత అడ్డుకుంది. దుఃఖంతో కుంగిపోయాడు ప్రకాశ్. తేరుకొని పోలీస్కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లాడు. పెడోఫిలియా అంటే? అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పరిచితుల వికృతచేష్టలకు పిల్లలు బలికావడం ఎక్కువైంది. మన ఇంట్లో సొంత వ్యక్తులు మొదలు... బాగా తెలిసినవారు, ఇంట్లోకి చొరవగా చొచ్చుకుపోయేవారు, తరచుగా వచ్చే స్నేహితుల వరకు... ఎవరో ఒకరి నుంచి పిల్లలు లైగింక వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. కాబట్టి అపరిచితులనే కాదు, పరిచితులను కూడా బాగా గమనించాలి. వాళ్లలో కొంతమంది ‘పెడోఫిలియా’ అనే మానసిక రుగ్మతను కలిగి ఉండొచ్చు. అలాంటి వాళ్లు పసిపిల్లలను హింసిస్తూ లైంగికానందాన్ని పొందుతారు. పై కేస్లో వాచ్మన్ చేసింది ఇదే. ఇలాంటి హింస వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వాళ్ల ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది. అందుకే ఈ నేరాల నుంచి పిల్లలను సంరక్షించేందుకు 2012లో పోక్సో యాక్ట్ (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) తెచ్చారు. దీని ప్రకారం నేరస్తుడికి ఏడేళ్లు జైలు శిక్ష, కొన్నిసార్లు యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది. ఇంకొన్నిసార్లు ఈ శిక్షలతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిద్దాం
- అదనపు క్లస్టర్లను గుర్తించండి - రాయలసీమ కన్సల్టెంటు సుబ్బారావు సూచన కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే ఖరీప్ సీజన్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి వ్యవసాయం రాయలసీమ జిల్లాల కన్సల్టెంటు సుబ్బారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో సీఏలు, సీఆర్పీలు, ఆత్మ బీటీఎం, ఏటీఎంలతో ఆయన సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ముందుగా వేసవిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వేసవి దుక్కులను ప్రోత్సహించాలని, ఇందువల్ల పంటలకు హాని చేసే పురుగులను చాలావరకు నివారించుకోవచ్చన్నారు. వాలుకు అడ్డంగా దున్నుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఇందువల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుందన్నారు. ఖరీప్ సీజన్లో గత ఏడాది కంటే మరింత సమర్థవంతంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. ఇంత వరకు జిల్లాలో 11 క్లస్టర్లలోనే ఈ వ్యవసాయాన్ని చేపడుతున్నామని, వచ్చే ఖరీప్లో మరిన్ని క్లస్టర్లలో చేపట్టాలని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతున్నందునా పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, పండిన పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కారణంగా వ్యవసాయ దిగుబడులకు మార్కెట్లో ఆశించిన ధరలు లభించడం లేదని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు తావులేదని, కేవలం ద్రవ,ఘన జీవామృతాలు, కషాయాలతో పంటలు పండించడం జరుగుతోందని తెలిపారు. సమావేశంలో ఆత్మపీడీ రవికుమార్, డీడీఏలు మల్లికార్చునరావు, గణపతి, డీపీఎం నాగరాజు, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తులు తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ ఆఫ్ అలస్కాలో మిరాకిల్ సీ
-
ప్రకృతి ‘పొత్తు’ పొడిచింది!
ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది! విత్తన మొక్కజొన్న ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు తొలి ఏడాదే ఎకరాకు 3 టన్నుల దిగుబడి జీవామృతం, పంచగవ్య, కషాయాల వాడకంతో భారీగా తగ్గిన ఖర్చు ప్రకృతి సేద్యంతో పెరిగిన నికరాదాయం రసాయన సేద్యంతో నికరాదాయం క్షీణించిన తరుణంలో లాభసాటి వ్యవసాయానికి పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతులే మేలని భావించాడు రైతు గుండుగొలను రవి. సీడ్ మొక్కజొన్న సాగులో ఖర్చు భారీగా తగ్గించుకోవటంతో పాటు తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు ఆయన స్వగ్రామం. మొక్కజొన్నను 2015లో రెండెకరాల్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే ఖర్చు తడిసి మోపెడైనప్పటికీ దిగుబడి మాత్రం టన్నుకు మించలేదు. తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రకృతి సేద్యంలో విత్తన మొక్కజొన్న సాగుకు శ్రీకారం చుట్టారు. 2016 అక్టోబర్ 15న రెండెకరాల్లో మొక్కజొన్న పంటను విత్తుకున్నారు. దుక్కిలో ఎకరాకు క్వింటా ఘనజీవామృతం వేసుకున్నారు. నెల రోజుల దశలో కూలీలతో కలుపు తీయించారు. డ్రిప్పు ద్వారానే సాగు నీటితో పాటు జీవామృతం అందించారు. ఎకరాకు 200 లీటర్ల చొప్పున ఐదుసార్లు ఇచ్చారు. అయితే, పొత్తు పొడవు పెరగటానికి, గింజ బరువు రావటానికి ఒకసారి పంచగవ్యను వాడారు. 200 లీటర్ల నీటికి 6 లీటర్ల పంచగవ్య కలిపి ఇచ్చారు. చీడపీడల నివారణ కు 6 లీటర్ల నీమాస్త్రం, 20 లీటర్ల్ల పుల్లమజ్జిగ, అర ‡లీటరు కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేశారు. ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది! రసాయన సేద్యంతో పోల్చితే ప్రకృతి సేద్యంలో ఖర్చు సగానికి తగ్గింది. అంతేకాదు, దిగుబడి తగ్గకపోగా పెరిగింది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన తొలి ఏడాది కూడా దిగుబడి ఏమాత్రం తగ్గకపోవటం విశేషం. తోటి రైతులకు రసాయన సేద్యంలో ఎకరా సాగుకు రూ. 23 వేలు ఖర్చయింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రకృతి సేద్యంలో మొక్కజొన్న సాగుకు ఎకరానికి సేంద్రియ ఎరువులు, కషాయాలకు రూ. 2 వేలతోపాటు మొత్తం రూ. 12 వేలు ఖర్చు అయింది. 2 క్వింటాళ్లు అదనంగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టన్ను రూ. 16 వేల చొప్పున ధర పలికింది. రసాయన సేద్యం చేసిన మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించగా.. ప్రకృతి సేద్యం చేసిన రవికి సుమారు రూ. 35 వేల నికరాదాయం లభించడం విశేషం. కషాయాలను విక్రయించే షాపును ఏర్పాటు చేయడం ద్వారా తోటి రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. – వైవీఎస్ రామచంద్రరావు, సాక్షి,కామవరపుకోట, పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి సేద్యంపై నమ్మకం కుదిరింది! గతేడాది సీడ్ మొక్కజొన్న సాగులో ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు చేసినా తగినంత దిగుబడి రాక నష్టపోయా. ప్రకృతి సేద్యంపై నమ్మకం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పొలంలో ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టా. ఖర్చు సగానికి తగ్గింది. దుక్కి, కూలీలు తదితర ఖర్చులన్నీ కలిపి రూ. 12 వేలు ఖర్చు అయింది. తొలి ఏడాదే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో నమ్మకం కుదిరింది. తోటి రైతులు కూడా ఈ విధానంతో బాగుపడాలని కోరుకుంటూ జీవామృతం, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నా. – గుండుగొలను రవి (97041 70606),ప్రకృతి వ్యవసాయదారుడు, సాగిపాడు,కామరపుకోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 25 వేల ఖర్చు నా సొంత పొలం రెండెకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేశాను. 15 బస్తాల రసాయనిక ఎరువులు వాడా. పురుగుమందులకు బాగా ఖర్చయింది. ఎకరాకు రూ. 25 వేల ఖర్చు వచ్చింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. – బి. వెంకటేశ్వరరావు(89788 05492), రసాయనిక వ్యవసాయదారుడు, సాగిపాడు, కామరపు కోట మం.,ప. గో. జిల్లా -
ప్రకృతి..వికృతి
- ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇవ్వని ప్రభుత్వం - శిక్షణల పేరుతో రూ.50 లక్షలకు పైగా వృథా వ్యయం - దేశవాళి ఆవులు లేవు.. ఎన్పీఎం షాపులూ లేవు - ప్రభుత్వ చర్యలతో నీరుగారుతున్న రైతుల ఉత్సాహం కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే రైతులకు మాత్రం ఎలాంటి చేయూత ఇవ్వడం లేదు. వ్యవసాయ సీజన్ ముగిసినా 2016–17 సంవత్సరానికి సంబంధించి ప్రోత్సాహకాలు అందించలేదు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా 100 మంది అన్నదాతలు అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహించేందుకు పూనుకుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో 11 క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్లో 300 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టింది. జిల్లా స్థాయిలో డీపీఎం, క్లస్టర్కు ఒక అసిస్టెంట్ను నియమించింది. ఆత్మ సిబ్బంది కూడా ప్రకృతి వ్యవసాయం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైతులకు చేయూత ఇవ్వాల్సింది ఇలా.... ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి ఆవు కీలకం. ఆవు మూత్రం, పేడలతో ద్రవ, ఘన జీవామృతాలు తయారు చేసుకుంటారు. ప్రతి క్లస్టర్కు 30 దేశవాళి ఆవులు సబ్సిడీపై పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో ఆవుకు ప్రభుత్వం రూ.10వేలు సబ్సిడీ ఇస్తుంది. ప్రతి క్లస్టర్లో ఐదు ఎపీఎం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులు.. జీవామృతం, ఇతర కషాయాలను స్వంతంగా తయారు చేసుకోలేకపోతున్నందున నామమాత్రపు ధరలతో వీటిని పంపిణీ చేయాలనే ఎన్పీఎం షాపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి రూ.50వేలు ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో సాంకేతికత జోడించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక కస్టమ్ హయరింగ్ సెంటరును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో రోటోవేటర్ తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉంటాయి. వీటికి రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. అందని ప్రోత్సాహకాలు.. వ్యవసాయశాఖ.. ప్రకృతి వ్యవసాయానికి 2015–16లోనే ప్రణాళికలను సిద్ధం చేసుకొని 2016–17లో అమలులోకి తీసువచ్చింది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ కూడా పూర్తి అయింది. 2017–18 వ్యవసాయ సీజన్కు కూడ రైతులు సిద్ధం అవుతున్నారు. కాని 2016–17 సంవత్సరానికి సంబంధించి రైతులకు అందించిన ప్రోత్సాహం సున్నానే... దేశవాళి ఆవులు లేవు, ఎన్పీఎం షాపుల జాడే లేదు. కస్టమ్ హయరింగ్ సెంటర్లు లేవు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తారో వ్యవసాయ యంత్రాంగానికే తెలియాలి. ప్రతి క్లస్టర్లో 300 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయ చేపట్టాలని నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది ఇవే క్లస్టర్లలో 750 మంది రైతులతో ఈ వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. శిక్షణలకు రూ.50 లక్షల పైమాటే... క్షేత్ర స్థాయిలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకపోయినా.. శిక్షణల పేరుతో అడ్డుగోలుగా నిధులు వ్యయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇందుకు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి నెలా ప్రకృతి వ్యవసాయం పేరుతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతునే ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో రైతులకు మాత్రం చేయూత కరువు అవుతోంది. చర్యలు తీసుకుంటాం: నాగరాజు, డీపీఎం దేశవాళి ఆవులు కొనుగోలు చేసినట్లు పశువైద్యులు, ఏడీఏలు ధ్రువీకరించాల్సి ఉంది. వీరి దగ్గరి నుంచి తగిన నివేదికలు వస్తే సబ్సిడీ విడుదల చేస్తాం. ఎన్పీఎం షాపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. 2016–17కు సంబంధించి మాత్రం ఇంతవరకు రైతులకు సబ్సిడీలు విడుదల కాలేదు. ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. -
ఓర్వకల్లు మండలంలో ప్రకృతి వ్యవసాయం
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్లు మండలాన్ని మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకొస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ, ఓర్వకల్లు మండల ఐక్య సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతితో కలసి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్న దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలోనూ రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించనున్నట్లు తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
- క్లస్టర్ అసిస్టెంట్లకు డీపీఎం ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు సూచించారు. వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో మంగళవారం క్లస్టర్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఖరీప్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంగా చేపట్టాలని, అందుకోసం ఇప్పటి నుంచే రైతులను చైతన్య పరచాలన్నారు. 2016-17లో ప్రకృతి వ్యవసాయంలో సాధించిన ప్రగతిని ఇతర రైతులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి అందాల తీరం సూర్యలంక
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ బాపట్ల: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్గా ఉంటుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ అన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ ఎమ్మెల్యేలతో కలిసి సూర్యలంక తీరానికి చేరుకున్న స్పీకర్ ఆదివారం ఉదయం తీరంలో పర్యటించారు. స్పీకర్ను హరితా రిసార్ట్స్లో బాపట్ల ఎంపీపీ మానం విజేత మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాలతో సత్కరించారు. తీరంలో పర్యటించిన వారిలో ఢిల్లీ ఎమ్మెల్యేలు అల్కాలంబ, పరిమళచూసెస్, భావనగౌరే, టీడీపీ రాష్ట్ర నాయకుడు మానం బ్రహ్మయ్య ఉన్నారు. -
పదో వంతు ఖర్చుతోనే ప్రకృతి సేద్యం!
కూరగాయలు, బొప్పాయి, అరటి సాగులో రాణిస్తున్న గుంటూరు జిల్లా రైతు జీవామృతం, కషాయాలతోనే సేద్యం.. ప్రకృతి సేద్యంతో భారీగా తగ్గిన సాగు ఖర్చు అభ్యుదయ పంథాలో అలుపెరగని ఆయన సేద్య ప్రస్థానానిది మూడు దశాబ్దాల చరిత్ర.ఉన్నత చదువులు చదివి వారసత్వంగా వ్యవసాయాన్ని చేపట్టిన ఆయన అమృత హస్తాల్లో పలు పంటలు చివుర్లు తొడిగాయి. పెరిగిన ఖర్చులు తరిగిన దిగుబడులతో రేపిన ఆలోచన ఆయనను ప్రకృతి సేద్యం చేసేందుకు ప్రేరేపించాయి. ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగుతో వినియోగదారులకు ఆత్మబంధువుగా మారారు ఆరుమళ్ల సాంబిరెడ్డి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి ఆయన స్వగ్రామం. డిగ్రీ వరకు చదివి వారసత్వంగా వ్యవసాయాన్ని చేపట్టారు. స్వీట్కార్న్, కీరదోస వంటి పంటలను ఈ ప్రాంతంలోనే తొలిసారిగా సాగు చేసిన ఘనత సాంబిరెడ్డిది. సుభాష్ పాలేకర్ తరగతులకు హాజరై పుడమికి, మనిషికి ప్రకృతి సేద్యమే రక్ష అని తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా ఆరెకరాల తన నల్లరేగడి పొలంలో తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను... సొర, వంగ వంటి కూరగాయలు... బొప్పాయి, అరటి వంటి పండ్లతోటలను సాగు చేస్తున్నారు. సొర, వంగలో అంతర పంటలుగా ఆకుకూరలు సొర, వంగ పంటలను సాంబిరెడ్డి ఎకరంలో సాగు చేస్తున్నారు. రెండు విడతలుగా పంట చేతికొచ్చేలా 25 సెంట్ల మడుల్లో సాగు చేస్తున్నారు. తొలకరిలో పశువుల ఎరువు వేసి పొలాన్ని సిద్ధం చేసుకొని ముందుగా ఆకుకూరల విత్తనాలు చల్లుతారు. తరువాత సొర, వంగ విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుంటారు. బోదెల మధ్య 8, మొక్కల మధ్య నాలుగు అడుగుల ఎడం ఉండేలా విత్తుకొని, పొలమంతా తడిచేలా నీటి తడి ఇస్తారు. ప్రతి 15 రోజులకోసారి 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు 20 లీ. నీటికి 50 మి. లీ. దశపత్ర కషాయం పిచికారీ చేస్తారు. శిలీంధ్ర నాశనిగా 20 లీటర్ల నీటికి పావు లీటరు పులిసిన మజ్జిగను కలిపి పిచికారీ చేస్తున్నారు. పావు ఎకరాలో 5 వేల సొరకాయలు కాస్తున్నాయి. పావు ఎకరాలో సాగుకు రూ. 5 వేలు ఖర్చవుతోంది. కాయ రూ. 10– 15 చొప్పున రూ. 50 –70 వేల వరకు ఆదాయం లభిస్తోంది. వంగలో పావు ఎకరాలో పంటకు 13 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కిలో రూ. 20–30 చొప్పున విక్రయిస్తున్నారు. సాగు ఖర్చులు రూ. 5 వేలు పోను రూ. 25 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. అంతర పంటలుగా సాగుచేసిన ఆకుకూరల ద్వారా రూ. 10 వేలు అదనపు ఆదాయంగా సమకూరుతోంది. బొప్పాయి, అరటిలో సగానికి తగ్గిన ఖర్చు.. హైబ్రిడ్ బొప్పాయి పంటను సాంబిరెడ్డి రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది జూలైలో మొక్కలు నాటుకున్నారు. సాళ్ల మధ్య ఆరడుగులు, మొక్కల మధ్య ఏడడుగులు ఉండేలా ఎకరాకు వెయ్యి మొక్కలు నాటుకున్నారు. 15 రోజులకోసారి డ్రిప్ ద్వారా మొక్కలకు నీరందిస్తున్నారు. తడి ఇచ్చినప్పుడు పాదుల్లో మొక్కకు అర లీటరు చొప్పున జీవామృతం పోస్తారు. 20 లీటర్ల నీటికి 2 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేస్తారు. ప్రస్తుతం కాయదశలో ఉంది. గతేడాది జూలైలో హైబ్రిడ్ అరటి కర్పూరం, చక్రకేళిని సాలు విడిచి సాలు పద్ధతిలో నాటుకున్నారు. ప్రస్తుతం పంట గెలల దశలో ఉంది. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు ఎకరాకు రూ. 70 వేలు ఖర్చయ్యేది. ప్రకృతి సేద్యంలో రూ. 30 వేలకు తగ్గిందని సాంబిరెడ్డి చెప్పారు. ఏటా ఎకరానికి రూ. లక్ష నికరాదాయం ఎకరంనర పొలంలో వివిధ రకాల ఆకుకూరలను ఆయన సాగు చేస్తున్నారు. ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని పశువుల ఎరువు వేస్తారు. 80 గజాల విస్తీర్ణంలో మడులు చేసుకుంటారు. విత్తనాలను మడుల్లో చల్లి చేతిగొర్రుతో మట్టిలో కలిసేలా దున్ని తడి ఇస్తారు. ఆకుకూరలకు వారం వ్యవధితో నీటి తడులిస్తారు. ఎకరాకు 200–400 లీటర్ల జీవామృతం నీటిద్వారా ఇస్తారు. 15 రోజులకు లీటరు నీటికి 100 ఎం. ఎల్ జీవామృతం, 3 మి.లీ.వేపనూనెను కలిపి ఆకుకూరలపై పిచికారీ చేస్తారు. దోమ నివారణకు గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలు వాడతారు. నెల రోజులకు పంట కోతకొస్తుంది. రూ. 5 చొప్పున కట్టలు కట్టి విజయవాడలోని సేంద్రియ కూరగాయలు విక్రయించే షాపులకు అమ్ముతారు. ఎకరా ఆకుకూరల సాగుకు రూ. 20–25 వేల ఖర్చవుతుంది. రూ. 30 వేల వరకు నికరాదాయం లభిస్తుంది. రసాయన సేద్యంలో ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. 3 లక్షల వరకు ఖర్చయ్యేదని.. ప్రకృతిసేద్యంలో రూ. 30 వేలకు మించి అవ్వటం లేదని సాంబిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఏడాదికి ఐదు పంటల ద్వారా ఎకరాకు రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం పొందుతున్నారు సాంబిరెడ్డి. కూరగాయల నాణ్యత బావుండటం.. పొలం హైవేకు దగ్గరగా ఉండటంతో నిత్యం 200 మంది వినియోగదారులు వాహనాల్లో వచ్చి నేరుగా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. సాంబిరెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్న తోటి రైతులందరితో కలిసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఏర్పాటు చేసి విజయవాడలో దుకాణం నిర్వహిస్తున్నారు. – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా మూడో ఎడాదికి దిగుబడి పెరిగింది మందుకట్టలు కొని పొలంలో చల్లితే పోయేదానికి ఇంత చాకిరీ చేయాలా అనుకుంటున్నారు కొందరు రైతులు. ప్రకృతి సేద్యంలో మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గింది. మూడో ఏడాది రసాయన సేద్యంలో సాగు చేసిన దానికన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది. పొలం గుల్లబారింది. నేలలో వానపాములు, తేనెటీగల సంఖ్య పెరిగింది. రసాయన సేద్యం చేసేటప్పుడు వీటి జాడే లేదు. ఖర్చు ఎకరాకు రూ. 20–25 వేల వరకు తగ్గింది. మంచి కూరగాయలు పండిస్తున్నారని కొనుగోలు దారులు అభినందిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. – ఆరుమళ్ల సాంబిరెడ్డి (94939 21929),కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా -
చెరకు ప్రకృతి సేద్యంతో బతుకు తియ్యన!
8’ గీ 2’ దూరంలో చెరకు నాటాలి..ఆకులన్నిటికీ ఎండ తగిలితేనే అధిక దిగుబడి సాధ్యం ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! ఎకరానికి 40 నుంచి 80 టన్నుల చెరకు దిగుబడి ఖాయం రికవరీ కూడా 9% నుంచి 14%కు పెరుగుతుంది అంతర పంటలతో ఏడాదంతా అదనపు ఆదాయం తెలుగు నాట చెరకు రైతులకు సుభాష్ పాలేకర్ మార్గదర్శనం సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న పంటగా వరి తర్వాత స్థానాన్ని చెరకు పంట ఆక్రమిస్తున్నది.కరువు పరిస్థితుల్లో చెరకు సాగు కనాకష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చెరకు సాగును ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవడమే మేలన్న భావన వేళ్లూనుకుంటున్నది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. నారాయణం నాగేశ్వరరావు వేలాది మంది రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ డా. సుభాష్ పాలేకర్ చేత ఇటీవల శిక్షణ ఇప్పించారు.ఆయన బొబ్బిలి వచ్చి రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో చెరకు దిగుబడి ఎకరానికి 40 టన్నుల నుంచి 80 టన్నులకు పెరగడం ఖాయమని పాలేకర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న చెరకు తోటలు దిగ్విజయంగా ఎకరానికి వంద టన్నులకు పైగా దిగుబడినిస్తున్నాయన్నారు. చెరకు వరుసల మధ్య 8 అడుగుల దూరం పెట్టి.. ఏడాది పొడవునా అనేక అంతర పంటలు సాగు చేయవచ్చు అంటున్నారు. పాలేకర్ చెరకు సాగు పద్ధతి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు రైతులకు ఉపకరిస్తుందన్న భావనతో.. పాలేకర్ మాటల్లోనే సవివరంగా అందిస్తోంది ‘సాగుబడి’..! చెరకు ‘గ్రామీణి’ కుటుంబంలో గడ్డి జాతికి చెందిన బహువార్షిక మొక్క. గడ్డి మొలిచే ఏ భూముల్లోనైనా చెరకును సాగు చేయొచ్చు. పొలంలో ఒక్కసారి నాటితే వందేళ్లయినా కార్శి తోటలు తీసుకోవచ్చు. మూడేళ్లకే నరికేయాల్సిన పని లేదు. ఇది స్వప్నం కాదు, వాస్తవం. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో 12వ కార్శి తోటలు ఉన్నాయి. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎకరానికి 4 టన్నుల చెరకు విత్తనం వాడుతున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి కేవలం 240 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4.5 క్వింటాళ్ల పంచదారను ఉత్పత్తి చేయగలిగేంత చెరకు విత్తనాన్ని వృథాగా నేలపాలు చేస్తున్నారు. ఇది అర్థం లేని పని. వరుసల మధ్య ఎడాన్ని బట్టి దిగుబడి! చెరకు ‘ఫొటో సింథటిక్’ మొక్క. ప్రతి ఆకుకూ (8,500 నుంచి 12,000 ఫుట్ క్యాండిళ్ల) పూర్తి స్థాయిలో సూర్యరశ్మి అవసరం. మే, జూన్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండనూ తట్టుకొని చెరకు ఆకులు ఆహారోత్పత్తి చేసుకుంటాయి. నీడ పనికిరాదు. చదరపు అడుగులోని చెరకు ఆకులు రోజుకు 12.5 కిలో కేలరీల సౌరశక్తిని గ్రహించగలవు. తద్వారా 2.25 గ్రాముల మేరకు చెరకు గడ పెరుగుతుంది. ఈ విధంగా ఎకరంలో ఏడాదికి 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని చెరకు ఆకులు గ్రహిస్తే.. 240 టన్నుల వరకు చెరకు దిగుబడి వస్తుంది. మీరిప్పుడు వరుసల మధ్య రెండు, మూడు అడుగుల దూరం పాటిస్తున్నారు. వరుసల మధ్య 3 అడుగుల దూరం పెడితే 33 శాతం ఆకులపైనే ఎండ పడి, ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. 5 అడుగుల దూరం పెడితే 40 టన్నుల దిగుబడి వస్తుంది. 8 అడుగుల దూరం పెడితే కింది ఆకులపైన కూడా పూర్తిగా ఎండపడి, ఎకరానికి 60 టన్నుల దిగుబడి వస్తుంది. 8‘“ 8‘ దూరంలో నాటితే అత్యధిక దిగుబడి వస్తుంది. అయితే, 8’“ 8’ దూరం మరీ ఎక్కువ అనిపిస్తే.. 8‘“ 2‘ దూరంలో నాటుకోండి. ఇందుకోసం ఎకరానికి 2,722 కన్నుల విత్తనం సరిపోతుంది. ఎకరానికి 4 టన్నులకు బదులు 44 గడలను విత్తనంగా వాడితే రూ.11 వేల ఖర్చు తగ్గుతుంది. ఆచ్ఛాదన, జీవామృతంతో చక్కని దిగుబడి! 160 కోట్ల కిలో కేలరీల సౌరశక్తిని ఉపయోగించుకొని ప్రకృతి సేద్యంలో ఎకరంలో ఏడాదికి 240 టన్నుల చెరకు దిగుబడి తీయాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం 2.5% ఉండాలి. కర్బనం, నత్రజని 10:1 నిష్పత్తిలో ఉండాలి. కానీ, మన దేశంలో భూములు రసాయనిక ఎరువుల వల్ల నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.07% మాత్రమే ఉంది. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే కొద్దీ పంటల దిగుబడి పెరుగుతుంది. దీన్ని 1%కి పెంచితే ఎకరానికి వంద టన్నుల చెరకు దిగుబడి సాధించవచ్చు. సేంద్రియ కర్బనం జీవనద్రవ్యం (హ్యూమస్) ద్వారా నేలకు అందుతుంది. జీవనద్రవ్యమే భూమికి సారం, దిగుబడి శక్తి, ఉత్పాదక శక్తి. ఆకులు, గడ్డీ గాదం వంటి పంటల అవశేషాలను భూమిలో కలిసి కుళ్లిపోయేలా చేస్తే జీవనద్రవ్యం పెరుగుతుంది. చెరకు ఆకులను తగులబెట్టవద్దు. చెరకు ఆకును పొలంలో వరుసల మధ్య ఖాళీలో వేస్తేనే మట్టిలో జీవనద్రవ్యం తయారవుతుంది. ఆచ్ఛాదన వేయకపోతే జీవనద్రవ్యం తయారు కాదు. మట్టిలో జీవనద్రవ్యం రకరకాల మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా తయారవుతుంది. నాటు ఆవు పేడలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులున్నాయి. టన్నుల కొద్దీ పేడ ఎరువు అవసరం కూడా లేదు. ఎకరానికి నెలకు 10 కిలోల దేశీ ఆవు పేడతో జీవామృతం తయారు చేసి వాడితే చాలు. పంటల అవశేషాల ద్వారా నేలకు కర్బనం ఎక్కువగా అందుతుంది. గాలిలో 78.6% ఉన్న నత్రజనిని గ్రహించి 36 రకాల సూక్ష్మజీవులు నేలకు అందిస్తాయి. అపరాల పంట వేళ్లలో ఉండే సూక్ష్మజీవులు జీవనద్రవ్యం తయారీకి ఉపకరిస్తాయి. అందువల్ల, చెరకు పొలంలో వరుసల మధ్య ఆకులు, కొమ్మరెమ్మలు, గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వేయడంతోపాటు.. పప్పుధాన్యాలను అంతర పంటలుగా తప్పకుండా వేయాలి. అప్పుడే పంట దిగుబడులనందించే జీవనద్రవ్యం తయారవుతుంది. చెట్లకు కావాల్సిన పోషకాలలో 98.5% గాలి, ఎండ, బ్రహ్మాండ శక్తి (కాస్మిక్ ఎనర్జీ), తేమ ద్వారా ప్రకృతిసిద్ధంగా అందుతున్నాయి. మిగతా 1.5% పోషకాలను ఖనిజాల రూపంలో మొక్కలు మట్టి నుంచి తీసుకుంటున్నాయి. పంచభూతాలు, సూక్ష్మజీవులు, దేశీ ఆవు పేడ ఉంటే చాలు.. మార్కెట్లో వేటినీ కొనకుండానే నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. చెరకు సాగులో 90% సాగు నీరు ఆదా! పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చెరకు సాగులో డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండానే 90% సాగు నీటిని పొదుపు చేయవచ్చని సుభాష్ పాలేకర్ తెలిపారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉంచాలి. సాళ్ల మధ్యలో 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తవ్వుకొని అంతర పంటలు సాగు చేసుకోవాలి (వివరాలకు బొమ్మ చూడండి). చెరకు నాటిన తర్వాత మొదటి 3 నెలల పాటు సాళ్ల మధ్య ఉన్న ఈ 4 కాలువల్లోనూ నీటిని పారించాలి. చెరకు నాటిన 3 నెలల తర్వాత 1వ కాలువకు నీరివ్వడం పూర్తిగా ఆపేయాలి (ఈ కాలువలోనే చెరకు మొక్క నాటి ఉంటుంది). 2, 3, 4 కాలువలకు మామూలుగానే నీరివ్వాలి. – చెరకు నాటిన 6 నెలల తర్వాత.. 2, 4 కాలువలకు కూడా నీరివ్వడం ఆపేసి, 3వ కాలువకు మాత్రమే నీరివ్వాలి. ఇలా చేయడం వల్ల పంట మొక్కల వేళ్లు నీటి తేమ ఉండే 3వ కాలువ వైపే చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వేరు పొడవు పెరుగుతుంది. ఆకుల సంఖ్యతో పాటు ఆహారోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కాండం పొడవు, చుట్టుకొలత, బరువు పెరుగుతాయి. దిగుబడి పెరుగుతుంది. చెరకు నరకడానికి నెల రోజుల ముందే ఆ ఒక్క కాలువకూ నీరివ్వడం ఆపేయాలి. తద్వారా చక్కెర / బెల్లం దిగుబడి పెరుగుతుంది. 3 కాలువలకు నీరు ఆపేయడంతో 75% సాగు నీరు ఆదా అయ్యింది. ఆచ్ఛాదన ద్వారా మరో 15% తేమ వాతావరణం నుంచి మొక్కలకు అందుతుంది. ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో 10% నీటి ఖర్చుతోనే పంటల సాగు పూర్తవుతుంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చెరకు, అంతర పంటల సాగు పద్ధతి భూమిని దున్ని సిద్ధం చేసిన తర్వాత చెరకును 8‘ “ 2‘ దూరంలో నాటుకోండి. అతి కొద్ది స్థలంలో 8‘ “ 4‘, 8‘ “ 8‘ దూరంలోనూ నాటుకొని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడండి. తేడా మీకే తెలిసివస్తుంది. చెరకు విత్తనంగా ఒక కన్ను ముచ్చెను నాటుకుంటే చాలు. కన్ను ఆకాశం వైపు చూసేలా నాటాలి. వర్షాధారంగా చెరకు సాగు చేస్తుంటే.. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్లో నాటాలి. సాగు నీరుంటే అక్టోబర్ – నవంబర్, జనవరి – ఫిబ్రవరి తదితర నెలల్లో వీలువెంబడి నాటుకోవచ్చు. చెరకు సాళ్ల మధ్య 8 అడుగుల దూరం తప్పనిసరి. 8 అడుగుల దూరంలో ఉన్న చెరకు సాళ్ల మధ్య.. అంతరపంటల సాగు కోసం 2 అడుగులకు ఒకటి చొప్పున 4 కాలువలు తీసుకోవాలి. పంట ఏదైనా స్థానిక / దేశవాళీ సూటి వంగడాలనే ఎంపిక చేసుకోవాలి. ఇవైతేనే ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడినిస్తాయి. విత్తనాలు గానీ, నారు గానీ కచ్చితంగా బీజామృతంతో శుద్ధిచేసిన తర్వాతే నాటాలి. 1వ కాలువ : ఎడమ కింది వైపు ఒంటి కన్ను చెరకు ముచ్చెను నాటుకోవాలి. పైన ఎడమ, కుడి వైపు ఉల్లి / వెల్లుల్లి వేసుకోవాలి. 2వ కాలువ : పైన ఎడమ వైపు పప్పుధాన్యాలు (శనగ, కంది, పొట్టి కంది, పెసర, మినుము, ఉలవ, బీన్స్, చెట్టు చిక్కుడు వంటి ద్విదళ జాతి కూరగాయ పంటలు) విత్తుకోవచ్చు. పైన కుడి వైపున కూరగాయ పంటలు, నూనె గింజలు విత్తుకోవచ్చు. 3వ కాలువ : ఎడమ, కుడి వైపులలో ఏకదళ పంటలైన వరి (సుగంధ వరి వంటి ఔషధ గుణాలున్న దేశీ వంగడాలు వేసుకోవాలి), రాగులు (తైదలు /చోళ్లు) నాటుకోవచ్చు. 4వ కాలువ : ఎడమ వైపు పైన ద్విదళ పంటలైన కూరగాయ పంటలు (మిరప, పసుపు, అల్లం, వంగ, టొమాటో, క్యాలీఫ్లవర్, క్యాబేజి, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, బెండ, ఆకుకూరలు), నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వు, లిన్సీడ్, ఆవాలు, సోయాబీన్స్) విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు. కుడి వైపు పైన పప్పుధాన్య పంటలు విత్తుకోవచ్చు. ఆచ్ఛాదన, అంతర పంటల మార్పిడి! చెరకు పంటలో మొదటి రెండు సాళ్ల మధ్య ఆచ్ఛాదన వేస్తే.. తర్వాత రెండు సాళ్ల మధ్య అంతరపంటలు పండించాలి. చెరకు ఒక సీజన్ పూర్తయ్యాక.. గతంలో ఆచ్ఛాదన వేసిన సాలులో ఈ దఫా అంతర పంటలు వేయాలి. గతంలో అంతర పంటలు పండించిన సాలులో ఈ దఫా చెరకు ఆకులు, పిలకలతో ఆచ్ఛాదన చేయాలి. ఆచ్ఛాదనగా వేసే గడ్డీ గాదంలో 25 శాతం పప్పు ధాన్య పంటల వ్యర్థాలు, 75 శాతం వరి, చిరుధాన్యాల పంటల గడ్డి కలిసి ఉండేలా చూస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. మెట్ట పొలాలకు ఘనజీవామృతం మెట్ట పంటల సాగులో ద్రవ జీవామృతాన్ని నేలకు ఇవ్వడం కష్టం కాబట్టి ఘనజీవామృతాన్ని నేలకు ఇవ్వొచ్చు. అనంతపురం జిల్లాలో కరువు కాలంలోనూ వేరుశనగ వర్షాధార సాగులో ఘనజీవామృతం అద్భుత ఫలితాలనిచ్చింది. మన దేశంలోనే కాదు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఘన జీవామృతంతో వర్షాధార సేద్యంలో సత్ఫలితాలొచ్చాయి. ఘనజీవామృతం తయారీ పద్ధతి... నాటు ఆవు పేడను ఎండబెట్టి పొడిగా చేసి జల్లెడ పట్టాలి. 200 కిలోల పేడ పొడిని ఒక ప్లాస్టిక్ పట్టాపై పరచి.. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లాలి. నిలువుగా, అడ్డంగా పారతో కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో 48 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఎండ, వాన పడకుండా జాగ్రత్త వహించాలి. కలిపిన 48 గంటల తర్వాత ఘనజీవామృతాన్ని ఎండలో పల్చగా పరచి ఎండబెట్టాలి. రోజుకు 2,3 సార్లు కలియదిప్పుతూ బాగా ఎండేలాæ చూడాలి. తేమ పూర్తిగా ఎండిన తర్వాత.. ఒక చెక్కతో ఉండలన్నింటినీ చితిపి పొడిగా మార్చాలి. గోనె సంచిలో నింపి నిల్వ చేసుకోవాలి. ఘనజీవామృతాన్ని ఏడాది వరకు వాడుకోవచ్చు. చెరకు తోటకు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతాన్ని దుక్కిలో వేసి కలియదున్నాలి. సీజనల్ పంటలకైతే ఎకరానికి 200 కిలోల చొప్పున వేసుకుంటే చాలు. జీవామృతాన్ని 15 రోజుల వరకు వాడొచ్చు! రసాయనిక ఎరువులే కాదు, పేడ ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, సూక్ష్మపోషక ఎరువులు వంటివి అసలు వాడకుండానే ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఘనజీవామృతం, జీవామృతంలను సొంతంగా రైతులే తయారు చేసి వాడుకుంటే చాలు.. చక్కని పంట దిగుబడులు పొందవచ్చు. జీవామృతం ఎరువు కాదు. మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను పంట భూముల్లో ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే సంవర్ధనమే (మదర్ కల్చర్ – తోడు) ద్రవ జీవామృతం. జీవామృతాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత 15 రోజుల వరకు వాడుకోవచ్చని సుభాష్ పాలేకర్ ఇటీవల బొబ్బిలిలో చెరకు రైతుల శిక్షణా తరగతుల్లో చెప్పారు.. వివరాలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. జీవామృతం తయారీ పద్ధతి పంట ఏదైనా ఎకరానికి ఒక విడతకు 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. ప్లాస్టిక్ డ్రమ్ము లేదా సిమెంటు తొట్టెను నీడలో ఉంచి.. 200 లీటర్ల నీరు పోయాలి. 10 కిలోల దేశీ ఆవు తాజా పేడ కలపాలి (సగం నాటు ఆవు పేడ కచ్చితంగా వాడాలి. సగం నాటు ఎద్దు పేడ వాడొచ్చు. మొత్తం నాటు ఎద్దు పేడ వాడొద్దు). 5–10 లీటర్ల నాటు లేదా దేశీ ఆవు మూత్రం కలపాలి (శాకాహారి అయిన మనిషి మూత్రం కూడా కొంత కలపవచ్చు). కిలో నల్లబెల్లం కలపాలి (నల్ల బెల్లం కాకపోతే ఎర్రటి / పసుపు రంగు బెల్లం వాడొచ్చు. తెల్లని చక్కెరను మాత్రం జీవామృతం తయారీలో వాడొద్దు. బెల్లానికి బదులు తీపి పండ్ల గుజ్జు వాడొచ్చు లేదా 3 లీటర్ల చెరకు రసం లేదా 4 కిలోల చెరకు ముక్కలు వాడొచ్చు). కిలో పప్పుధాన్యాల పిండి కలపాలి. పిడికెడు చేను గట్టు మీద మట్టి లేదా అడవిలోని మట్టి కలపాలి (జీవామృతంలో సూక్ష్మజీవరాశిని పెంపొందించేందుకు మట్టిని కలపాలి). ఇవన్నీ కలిపిన తర్వాత 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధమవుతుంది. అప్పటి నుంచి 15 రోజుల వరకు పంటలకు వాడుకోవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కుడి వైపునకు తప్పకుండా కర్రతో కలపాలి. సూక్ష్మజీవరాశి పెంపొందడానికి ఇది చాలా అవసరం. చెరకు తోటలో జీవామృతాన్ని పోసే పద్ధతి నీటిపారుదల సదుపాయం ఉన్న చెరకు తోటలో జీవామృతాన్ని ఎకరం పొలానికి 200 లీటర్ల చొప్పున నెలకు కనీసం ఒకసారి లేదా రెండుసార్లు ఇవ్వాలి. మధ్య మధ్యలో రెండు, మూడుసార్లు ఎకరానికి నెలకు 400 లీటర్ల జీవామృతం ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తొలి ఏడాది ఎన్ని ఎక్కువ సార్లు జీవామృతాన్ని భూమికి ఇస్తే అంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. చెరకు 8‘ “ 8‘ (సాళ్లు, మొక్కల మధ్య 8 అడుగుల దూరం) తోటలో నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు లీటరు చొప్పున జీవామృతం (నేల మీద పోసేటప్పుడు జీవామృతానికి నీరు కలిపి పలచన చేయాల్సిన అవసరం లేదు) పోయాలి. 8‘ “ 2‘ దూరం పెట్టినప్పుడు నెలకు ఒకటి లేదా రెండు సార్లు మొక్కకు పావు లీటరు చొప్పున పోయాలి. నీటి వసతి లేని మెట్ట పంటలో కూడా జీవామృతం పోసి అద్భుత ఫలితాలు పొందవచ్చు. చెరకుపై జీవామృతం పిచికారీ పద్ధతి 1వ పిచికారీ : చెరకు కన్ను నాటిన తర్వాత 21 రోజులకు మొదటి విడత పిచికారీ చేయాలి. ఎకరానికి 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. చెరకు పంటతోపాటు అంతరపంటలపై కూడా పిచికారీ చేయాలి. 2వ పిచికారీ : 1వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 3వ పిచికారీ : 2వ పిచికారీ తర్వాత 21 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 4వ పిచికారీ : 3వ పిచికారీ తర్వాత 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేయాలి. 5వ పిచికారీ : 4వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 6వ పిచికారీ : 5వ పిచికారీ తర్వాత 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. 5 నెలల తర్వాత మనిషి వెళ్లే ఖాళీ ఉండదు కాబట్టి జీవామృతం పిచికారీ సాధ్యపడదు. -
పల్లె–నగరం మధ్య తేడాలు
నగర గీతం అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి. పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం. పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు. పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత. పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు. పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు. నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది. నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్’ కవితల్లో ప్రతిఫలించాయి. నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం. నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు: శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది. మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి. సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి. నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు. అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది. పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి. మాదిరి ప్రశ్నలు 1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి? (6 మార్కులు) 2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి? (3 మార్కులు) 3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి. 3 మార్కులు) 4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్ ఏం చెప్పదలచుకున్నారు? (6 మార్కులు) 5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి? (3 మార్కులు) 6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి. (6 మార్కులు) -
చెంగు చెంగున
అమ్మాయి పరికిణీ ఓణీ వేసుకుని ఇల్లంతా పరుగులు తీస్తుంటే... జింకపిల్లలా చెంగుచెంగున గెంతులేసినట్లే అనిపిస్తుంది. లేడికి లేచిందే పరుగు అంటారు. అవునవును. సంక్రాంతికి ఎంగ్ లేడీస్ హాఫ్ శారీ కడితే... ఫుల్లుగా చెంగులే చెంగులు! తమ్ముళ్లు, చెల్లాయిలు ఆ చెంగులు పట్టుకుని పరుగెడుతుంటే పండగ కళ వచ్చేసినట్టే. ► అల్లరి ఆటల ఆనందంలో హరివిల్లుల సోయగం అమ్మాయి లంగాఓణీ రూపం. ► నింగిని వదిలి నేలకు దిగిన దేవకన్యల పరవశం లంగాఓణీ ముస్తాబు సొంతం. ►గడపకు పసుపు– కుంకుమలా, గుమ్మానికి తోరణంలా పండగ సింగారమంతా లంగాఓణీయే చుట్టేసుకుంటుంది. చూపులను కట్టేసుకుంటుంది. ► పెద్దంచు పట్టు పరికిణీ.. అంచు రంగులో ఓణీ ధరిస్తే పరవశాల ప్రకృతి సిగలో ముద్దబంతిలా వెలిగిపోవాల్సిందే! ►ఆకాశంలో పతంగులు రంగవల్లులు అల్లే వేళ అమ్మాయి అద్దాల లంగా ఓణీలో ప్రత్యక్షమైతే పుడమిన హరివిల్లు పూచినట్టే! ►లంగాఓణీ హంగులు అమ్మాయి నవ్వులతో పోటీపడితే పండగ సంబరాలు సింగారపు కళను అద్దుకున్నట్టే. ► నింగిన చందమామ నట్టింటికి వచ్చిందంటే అది లంగాఓణీ ధరించిన అమ్మాయే అయ్యుంటుంది. రెండు కళ్లు సరిపోనంత వెన్నెల పట్టపగలే కురిపించేస్తుంది. -
కర్నూలులో మయన్మార్ బృందం
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పరిశీలన కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మయన్మార్ దేశ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. మయన్మార్ నుంచి పది మంది అధికారులు కలిగిన బృందం కర్నూలు చేరుకుంది. ముందుగా కల్లూరు మండలం బొల్లవరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని భూసార పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీ శేషారెడ్డి భూసార పరీక్ష కేంద్రాల్లో చేపట్టే మట్టి, నీళ్ల పరీక్షల గురించి వివరించారు. మయన్మార్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ఉన్నాయని, వీటిని మరింత అధ్యయనం చేసి మయన్మార్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న ప్రయోగాత్మక ‘శిల్ప'o!
► నాలుగేళ్లుగా చెరకుతోపాటు వరి, కూరగాయ పంటల సాగు ►భూసారంతోపాటు ఏటేటా పెరుగుతున్న పంటల దిగుబడి, నికరాదాయం.. ►ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి ఉత్పత్తి.. రూ. లక్ష వరకూ నికరాదాయం ►ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి, అంతర పంటగా మినుము సాగు.. ఆసక్తి, ఓర్పు ఉంటే ప్రకృతి సేద్యం యువ మహిళలకూ సుసాధ్యమేనని నిరూపిస్తున్నారు యువ మహిళా రైతు శిల్ప. పుస్తక పఠనం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో కలిగిన పరిచయం.. నాలుగేళ్ల అనుభవంతో పరిపుష్టమైంది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం, పంటల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులు ఆమెను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి సాగుకు శ్రీకారం చుట్టారు. సేంద్రియ బెల్లం, బెల్లంపొడి తయారీపై దృష్టి పెట్టారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏటేటా భూసారంతోపాటు దిగుబడి, నికరాదాయంతోపాటు సంతోషమూ ఇనుమడిస్తోందని భరోసాగా చెబుతున్నారు శిల్ప. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన రైతులకు శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారామె. కరవంటే అనంతపురం, అనంతపురం అంటే కరవు.. రెండూ వేరు వేరు కాదు... గుక్కెడు నీటికి కటకటలాడే చోటది. అలాంటి చోట వ్యవసాయానికి ఉపక్రమించటం ఎండమావిలో నీరు వెతకటమే. దానికి తోడు ఎలాంటి ఫలితాలిస్తాయో తెలియని కొత్త పద్ధతులను న మ్ముకోవటమంటే నేల వదిలి సాము చేయటమే. ఆ రెండు పనులను అత్యంత చాకచక్యంతో నిర్వహించి ఒంటిచేత్తో సాగు చేస్తూ... పచ్చ బంగారాన్ని తన పొత్తిళ్లలో పొదివిపట్టిన భూదేవి అనుపతి శిల్పా కాళేశ్వర్. అనంతపురం జిల్లా పెనుకొండ ఆమె స్వగ్రామం. ఎంబీఏ వరకు చదువుకున్న ఆమెకు వ్యవసాయం బొత్తిగా తెలియదు. సుభాష్ పాలేకర్ పుస్తకాల పఠనంతో ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా చూసి స్ఫూర్తిని పొందారు. తొలుత పెరటి తోటను సాగు చేసి.. సత్ఫలితాలు రావడంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం విశేషం. ప్రకృతి సేద్యంలో విభిన్న పద్ధతులను అనుసరిస్తూ కరువు సీమ రైతు లోకానికి మార్గదర్శిగా నిలుస్తున్నారావిడ. బోదెలపై ఆరుతడి వరి.... గత నాలుగేళ్లుగా శిల్ప ప్రకృతి సేద్యంలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది బోదెలపైన వరిని సాగు చేసి అందరినీ అబ్బురపరిచారు శిల్ప. సాగు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాత్మక పద్ధతికి శ్రీకారం చుట్టారు. పాకిస్థాన్ బాస్మతీ, లోయా, నవారా వరి రకాలను 30 సెంట్ల పొలంలో బోదెలపై సాగు చేశారు. ముందుగా పొలాన్ని దుక్కి దున్ని 50 సెం. మీ. ఎడం ఉండేలా బోదెలు చేసుకున్నారు. 21 రోజుల వయసున్న నారును బోదెలపై నాటించారు. 50 సెం. మీ. దూరంలో పాదుకో మొక్క చొప్పున నాటారు. సాధారణంగా 20 పిలకలు వస్తే ఎక్కువ.. కానీ ఈ మొక్కలకు 40–50 వరకు పిలకలు వచ్చాయి. ప్రతి 15 రోజులకోసారి 500 లీటర్ల జీవామృతాన్ని నీటితో కలిపి పారించేవారు. నాటిన 20 రోజులకు, పొట్ట దశలో నీమాస్త్రాన్ని.. గింజ దశలో పులిసిన మజ్జిగను పిచికారీ చేయటంతో ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. అయితే, గింజ దశలో బోరు చెడిపోవడంతో దిగుబడి దెబ్బతిన్నదని, వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో బోదెలపై ఆరుతడి వరిని సాగు చేస్తామని శిల్ప తెలిపారు. రెండు వరి మొక్కల మధ్య అదే బోదెపై మినుము (ఉద్దులు)ను సాగు చేశారు. ఎకరాకు కిలో విత్తనాలు విత్తారు. ఇది 90 రోజుల పంట కావటంతో వరితో పాటే సాగు పూర్తయింది. ఊదల సాగుకు అదనంగా రూపాయి ఖర్చు కాలేదు. చెరకులో అంతరపంటలుగా పసుపు, కూరగాయలు.. నాలుగు ఎకరాల్లో చెరకును నాలుగేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కార్శి పంటగా చెరకుతో పాటు అంతర పంటలుగా పసుపు, ఉల్లితో పాటు వంగ, మిరప వంటి పంటలను శిల్ప సాగు చేస్తున్నారు. ఈ ఆరెకరాలకు రెయిన్ గన్ల ద్వారా నీటినందిస్తున్నారు. చెరకులో ఏటా ఎకరాకు మూడు ట్రక్కుల పశువుల ఎరువు, 3 క్వింటాళ్ల వేపపిండి దుక్కిలో వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. సాధారణంగా కార్శి పంటగా సాగు చేసే చెరకులో మూడేళ్ల తరువాత మళ్లీ కొత్త విత్తనం నాటుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తే 30–40 ఏళ్ల వరకు చెరకును కార్శి పంటగా సాగు చేయవచ్చని చెపుతున్నారు. దీని వల్ల రైతుకు వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. ముందుగా నిద్రావస్థను తొలగించేందుకు విత్తన పసుపు కొమ్మును నేలపై కుప్పగా వేస్తారు. విత్తనాన్ని వేపాకు, ఎర్ర మన్నుతో గాలి చొరబడకుండా కప్పి నెల రోజులు ఉంచుతారు. చెరకు కోత కోసిన 2–3 నెలల వ్యవధిలో చెరకు 3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు చెరకు సాళ్ల మధ్యలో బోదెను ఏర్పాటు చేసి విత్తన పసుపును నాటుకుంటారు. చెరకులో అంతరపంటగా ఉల్లిని సాగు చేస్తున్నారు. బోదె పక్కన ఉలి ్ల నారును నాటుతారు. చెరకు కోతకొచ్చేసరికి అంతర పంటలు కూడా చేతికొస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా యాజమాన్య చర్యలు చేపట్టటం, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రైతుకు అదనపు ఆదాయం లభించింది. కంచె పంటగా సాగు చేసే కందితో ఎకరాకు 2 క్వింటాళ్ల కందుల దిగుబడి వస్తోంది. ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి.. చెరకును సొంతగా గానుగాడించి సేంద్రియ బెల్లాన్ని తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఎకరాకు చెరకు 2 టన్నుల వరకు బెల్లం లేదా బెల్లం పొడి దిగుబడి వస్తోంది. గానుగ ఆడించేందుకు రూ. 70 వేల వ్యయంతో క్రషింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకున్నారు. చెరకును క్రషర్లో వేస్తే రసం వస్తుంది. దీన్ని బాణలిలో పోసి బాగా మరగబెడతే పాకం తయారవుతుంది. వేడిమీదున్నప్పుడే దీన్ని రకరకాల అచ్చులలో పోసి వివిధ ఆకృతుల్లో బెల్లం దిమ్మలను తయారు చేస్తారు. కిలో రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. అంతరపంటల ద్వారా ఎకరానికి రూ. 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరానికి కనీసం రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం లభిస్తోంది. బెల్లం పొడిని కూడా తయారు చేస్తూ.. కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం, బెల్లం తయారీ ప్రక్రియలో ఎలాంటి రంగులనూ వాడటం లేదు. అందువల్ల ఈ బెల్లం మంచి రుచిగా ఉండటమే కాక ఆరోగ్యకరం కూడా. ఎక్కువ తీపి ఉండడం, ఏడాది కాలానికి Sపైగా నిల్వ ఉండటం సేంద్రియ బెల్లం ప్రత్యేకత. దీంతో ముందుగానే వ్యాపారుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని విజయవాడ, హైదరాబాద్, బొంబాయి వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు ఇతర పంటల సాగు.. సేంద్రియ బెల్లం, బెల్లం పొడి తయారీలో ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుండడం విశేషం. మరిన్ని వివరాలకు.. తిప్పన్న 94943 67890, చంద్ర 80192 44100లను సంప్రదించవచ్చు. – తలారి మల్లికార్జున, సాక్షి, పెనుకొండ, అనంతపురం జిల్లా ఇనుమడిస్తున్న సంతోషం! గతంలో వ్యవసాయం గురించి తెలియకపోయినా ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. మొదటి రెండేళ్లు చీడపీడలు కనిపించాయి. తర్వాత ఆ సమస్య లేదు. భూసారం ఏటేటా పెరుగుతోంది. పంట ఆరోగ్యంగా ఉంటున్నది. ఏటేటా దిగుబడితోపాటు నికరాదాయం పెరుగుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేయడం వల్ల చోటుచేసుకుంటున్న ప్రకృతిపరమైన మార్పు మాకు బాగా తెలుస్తోంది. వానపాములు, పక్షులు, పిచ్చుకలు, కొంగలకు మా తోట ఆలవాలంగా మారింది. బెల్లం, బెల్లంపొడి ఎకరానికి రెండు టన్నుల వరకు వస్తోంది. ఎకరానికి రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు నికరాదాయం వస్తోంది. రాయలసీమలో రైతులు బోదెల పద్ధతిలో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయాన్ని ధైర్యంగా చేపడితే చక్కని దిగుబడి, ఆదాయం కూడా పొందవచ్చని రైతులు గ్రహించాలి. ఆసక్తి కలిగిన వారికి మా తోటలో శిక్షణ ఇస్తున్నాం.. – శిల్ప, ఆదర్శ యువ రైతు, పెనుకొండ, అనంతపురం జిల్లా -
2030కి ఆకలి కేకలకు అంతం!
♦ సమతుల పౌష్టికాహారమే ఇప్పుడు మన ముందున్న సమస్య ♦ చిరు ధాన్యాలతోనే పౌష్టికాహారం.. పప్పు ధాన్యాల వినియోగాన్ని పెంచాలి ♦ నిత్య హరిత విప్లవం ద్వారానే ఇది సాధ్యం ♦ వరి, గోధుమలతో పాటు చిరుధాన్యాలను తక్కువ ధరకు అందించాలి ♦ సముద్ర మట్టం పెరిగితే నష్టపోయేది వ్యవసాయ రంగమే.. ♦ దీన్ని నివారించడానికి మడ అడవులను పెంచాలి ♦ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ (తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఆకలి కేకల నుంచి భారత్ విముక్తం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, బహుశా 2030 నాటికి ఆకలి బాధ అంతమవుతుందని హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం ముందున్న అతి పెద్ద సమస్య సమతుల పౌష్టికాహారమన్నారు. ఆహార భద్రతా చట్టం దేశ చరిత్రలో ఓ మైలురాయని అభివర్ణించారు. అందరికీ పౌష్టికాహారం అందాలంటే శాశ్వత హరిత విప్లవమే(ఎవర్ గ్రీన్ రివల్యూషన్) మార్గమని స్పష్టం చేశారు. 104వ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా శుక్రవారమిక్కడ ఆహారం, పౌష్టికాహార భద్రతపై ప్రసంగించారు. అనంతరం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పలు అంశాలను చెప్పారు. బెంగాల్ కరువు మొదలు ఆహార భద్రత వరకు 1942–43లో వచ్చిన బెంగాల్ కరువుతో వేలాది మంది క్షుద్బాధతో మరణించారు. అయితే ఆ వేళ ఆహారం లేక జనం చచ్చిపోయిన దానికన్నా సరైన పంపిణీ లేదా అందుబాటులో లేక మరణించారు. ఆ దుస్థితి నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకు స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పాటు పలువురు వ్యవసాయం, నీటిపారుదల, ఎరువుల రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ విధానం (మార్కెటింగ్, ధరలు, సేకరణ), ప్రజా ప్రాతినిధ్యం కీలకాంశాలుగా సాగిన ఆ ఉద్యమంతో 1968 నాటికి తిండిగింజల తిప్పలు తీరాయి. ఆనాటి ఉద్యమం మధ్యలోనే విఫలమైనా... 2013లో తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టం దేశ చరిత్రలో ఓ మైలు రాయి. ఈ చట్టంతో అందరికీ సమతుల ఆహారం అందాల్సి ఉంది. వరి, గోధుమలతో పాటు చిరుధాన్యాలను అతి తక్కువ ధరకు అందించాలి. 2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధి... 2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధిని సాధించాలన్నది ప్రస్తుత ఎజెండా. కేంద్రప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఇదొకటి. ఆకలిని అంతం చేయడం, ఆహార లక్ష్యాన్ని సాధించడం, పౌష్టికాహారాన్ని అందించడం మన ముందున్న లక్ష్యం. 2020 నాటికి దేశంలో వంద మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అదే స్థాయిలో చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల దిగుబడి, వినియోగం కూడా పెరగాలి. అప్పుడే సమతుల ఆహారం అందించినట్టవుతుంది. ఈ లక్ష్య సాధనకు నిత్య హరిత విప్లవమే మార్గం. ఇది శాశ్వతంగా సాగాలి. 2010లో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం ఈ అంశంపై కలసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. క్యాలరీలు, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు సమపాళ్లలో అందకపోతే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్నే శాస్త్రపరిభాషలో హిడెన్ హంగర్ అంటారు.(తీరని ఆకలి. కడుపు నిండుతుందే తప్ప పోషకాలు ఉండవు. ఫలితంగా వ్యాధులు వస్తాయి.) ఈ నేపథ్యంలో ఈ బయో ఫోర్టిఫికేషన్ (బయోటెక్నాలజీతో పోషక విలువలున్న వంగడాలను సృష్టించడం) వంగడాలను రూపొందించాలి. బొటానికల్ గార్డెన్స్ ప్రాధాన్యత పెరగాలి... గతంలో మనకు ప్రతి ఇంటా కూరగాయల పందిళ్లు ఉండేవి. ఇప్పుడు లేదు. అవకాశం ఉన్న ప్రతి ఇంటా బొటానికల్ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లను పెంచితే అటు పర్యావరణానికి ఇటు పోషకాలకూ ఢోకా ఉండదు. సముద్ర మట్టం పెరిగితే అంతా అనర్థమే... ప్రస్తుతం పర్యావరణానికి ముంచుకొస్తున్న సమస్య సముద్ర మట్టం పెరగడం. దీన్ని నివారించేలా మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి. సముద్ర మట్టాలు పెరిగితే తొలుత నష్టపోయేది వ్యవసాయ రంగమే. ఆగ్రో బయోడైవర్శిటీని కాపాడుకునేలా సంప్రదాయ దృక్పథంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ముందుకు వెళ్లాలి. ఆహార భద్రత అంటే.. ఆహార అవసరాలను తీర్చేందుకు అవసరమైన తిండిగింజలను భౌతికంగా అందుబాటులో ఉంచడమే కాకుండా అవి సామాజికంగా, ఆర్థికంగా, అందరికీ సరిపడా అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే క్రియాశీల, ఆరోగ్యకరమైన జీవనానికి అనువైన ఆహారాన్ని అందించినట్టవుతుంది. దీన్నే ఆహార భద్రత అంటారు. పోషకాహార భద్రత అంటే.. సమతుల ఆహా రాన్ని అందరికీ భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉంచాలి. రక్షిత మంచి నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడం. యువత ఎందుకు మొగ్గు చూపడం లేదు? ఆర్థికంగా గిట్టుబాటు కాకనే. వాస్తవ ఆదాయం వస్తుందన్న భరోసా ఉంటే యువకులు వస్తారు. ఐటీ రంగంలో ఆకర్షణీయ వేతనాలున్నాయి. ఇప్పుడు వ్యవసాయ వర్సిటీలు వ్యవసాయ సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలి. ఆర్థికంగా గిట్టుబాటయ్యే పనిని ప్రభుత్వాలు చేస్తే సాంకేతికంగా, ఆకర్షణీయంగా మలిచేలా విశ్వవిద్యాలయాలు చేయాలి. పాలకులు పంటల బీమా, ఇతరత్రా రాయితీలు వంటి పథకాలను ప్రవేశపెట్టినా అవి పరిమితమైనవి. పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై.. ఆయన తరఫున స్వామినాథన్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ భవానీ సమాధానం ఇస్తూ... ఎవరికి తోచిన రీతిలో వారు భూమిని సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలేకర్ విధానంపై మాకు నిర్ధిష్టమైన అభిప్రాయమేమీ లేదు. ఒకరు సేంద్రీయం అంటున్నారు, మరొకరు ప్రకృతి సేద్యం అంటున్నారు. ఇంకొకరు సంప్రదాయ సేద్యం అంటున్నారు. ఇలా ఎన్ని ఉన్నా అందరి లక్ష్యం మానవాళి సంక్షేమమే, భూ ఆరోగ్యస్థితిని కాపాడడమమే కదా...!! పేదలకు వరం చిలగడదుంప పౌష్టికాహారాన్ని చిలగడ దుంపలోనూ (స్వీట్ పొటాటో) పొందవచ్చు. అల్పాదాయ వర్గాలకు ఇదో వరం. పోషకాలపై అవగాహనను పెంచాలి. ఇళ్ల వద్ద పండించే దుంపలను, పండ్లను, కూరలను విరివిగా తీసుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలి. ఆహారమే ఔషధం... ఎంత తింటున్నాం అనే దానికన్నా ఏమి తింటున్నాం అన్నదే ప్రధానం. అందుకే ఆహారమే ఔషధం అంటారు. మందులతో అన్ని వ్యాధులను నయం చేస్తారనుకోవడం భ్రమ. న్యూట్రీషియన్, వ్యవసాయ, ఆరోగ్య, అటవీ, వైద్య విభాగాలన్నీ కలసి పని చేయాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. రైతు ఆత్మహత్యలు సంక్లిష్ట సమస్య ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. అననుకూల పరిస్థితులు, వాతావరణం, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రుణాలు పెద్ద సమస్యగా మారాయి. బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి వస్తే వాయిదా రూపంలో కట్టమంటున్నారు. చేతిలో డబ్బులే లేకుంటే ఎక్కడి నుంచి తీసుకువచ్చి రుణాలు చెల్లిస్తారో పాలకులు ఆలోచించాలి. ఏదైనా ఉపద్రవం వస్తే ఆదుకోవడానికి గతంలో మాదిరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఈ నేపథ్యంలో స్థానిక కమ్యూనిటీలే ధైర్యం చెప్పాలి. జీవితం ఉన్నది బతకడానికే గాని ప్రాణం తీసుకోవడానికి కాదు. -
జీవితేచ్ఛకు కొత్త చిగుళ్లు!
- ప్రకృతి సేద్యంతో వయోధిక రైతు జీవితంలో చిగురించిన సరికొత్త ఆశలు - 60 ఏళ్ల వయసులో బహుళ పంటలతో సాగు కొత్త పుంతలు - కూరగాయలు, పత్తి, చెరకు, అపరాలు, ఎల్లిపాయ సాగులో అధిక దిగుబడులు - అంతర పంటలుగా బంతి, నాటు పొగాకు సాగుతో అధికాదాయం అప్పు కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర మాటిమాటికీ చేయి చాచాల్సిన అవమానకర పరిస్థితి కుంగదీసి ఊరు వదిలి వెళ్లమంటే.. దశాబ్దాలుగా సేద్యాన్నే నమ్ముకున్న రైతన్నకు మట్టిపై ఉన్న మమకారం మళ్లీ ఒక ప్రయత్నం చేసి చూడమంది. మిత్రుడి ప్రోత్సాహంతో ప్రకృతి సేద్యం చేపట్టగా వ్యవసాయానికి కొత్త ఊపిర్లూదింది. ఒకటికి నాలుగు పంటల సాగుతో పెరిగిన నికరాదాయం ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ప్రకృతికి ప్రణమిల్లిన అన్నదాతకు నలుగురిలోనూ తలెత్తుకొని తిరిగేలా జవజీవాలనిచ్చింది. అలా అరవయ్యేళ్లకు ప్రకృతి సేద్యబాట పట్టిన మనోహరాచారిని ఇప్పుడు ఇతర రైతులు అనుసరిస్తున్నారు. 1972.. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో కాడి పట్టారు వనపన మనోహరాచారి. రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండలం పద్మారం ఆయన స్వగ్రామం. పదో తరగతి చదివిన తర్వాత 1978లో తొలిసారి పత్తి సాగును చేపట్టారు. అప్పట్లో పత్తి సాగులో దుక్కిలో ఎకరాకు అర బస్తా డీఏపీ మాత్రమే వేసేవారు. పంట కాలం మొత్తంలో రెండుసార్లు పురుగుమందులు కొట్టేవారు. ఎకరాకు 10 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వచ్చేది. క్వింటా పత్తికి రూ. 1300–1500 వరకు ధర ఉండేది. 2013... మనోహరాచారి అరవయ్యో పడిలోకి అడుగుపెట్టారు. ఇప్పుడూ పత్తిని సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకం 10 బస్తాలకు పెరగ్గా.. పురుగు మందులను వారానికి రెండుసార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. దిగుబడి అదే పది క్వింటాళ్లు. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. 40 ఏళ్లలో పురుగుమందులు, ఎరువుల ధరలు 40 రెట్లు పెరిగితే.. పంట అమ్మకం ధర మాత్రం పెరిగింది రెండింతలే. 2014... చేసిన అప్పులు తీరే పరిస్థితి కనపడలేదు. తన మీద తనకు నమ్మకం సడలింది. ఎన్నాళ్లిలా.. పగలనకా రేయనకా.. ఎండనకా వాననకా.. రక్తాన్ని స్వేదంగా మార్చి కష్టపడితే చివరకు మిగిలిందేమిటి అనే అంతర్మథనం మొదలైంది. తన రుణాలు తీర్చాలంటే మట్టితో తన రుణం తెంచుకోవాలని... పట్టణానికి వలస బాట పట్టాల్సిందేనని నిశ్చయించుకున్నారు మనోహరాచారి. చాలా కాలంగా తన మిత్రుడు తనను ప్రకృతి సేద్యం చేయాలని పోరుతున్నా ఇన్ని (రసాయనిక) ఎరువులు, పురుగుమందులు వల్ల కానిది గోమూత్రం వల్ల ఏమవుతుందని భావించి లక్ష్య పెట్టలేదు. కానీ లోలోపల మిణుకు మంటున్న ఆశ ఆఖరి సారిగా ప్రయత్నం చేసి చూడమంది... అలా ఆయన ప్రకృతి సేద్యంలోకి అడుగుపెట్టి బతుకును పండించుకుంటున్నారు. పాలేకర్ రాసిన పుస్తకాలను చదవటం, సాక్షిలో ‘సాగుబడి’ కథనాలను క్రమం తప్పకుండా చదువుతూ ప్రకృతి సేద్యంలో లోతుపాతులను ఆకళింపు చేసుకుంటూ అనుసరిస్తున్నారు. మనోహరాచారి 2014–15లో తొలిగా ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఉత్సాహం నింపాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండో ఏడాది ఇతర పంటలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నల్లరేగడి భూమి. మూడు బోర్లు పనిచేస్తున్నాయి. పంటలకు డ్రిప్పు ద్వారా అందిస్తూ నీటిని పొదుపుగా వాడుతూ పంటలను సాగు చేస్తున్నారు. పత్తిలో 14 క్వింటాళ్ల దిగుబడి! తొలిసారిగా 2014లో ప్రకృతి సేద్యంలో (హైబ్రిడ్) పత్తిని ఎకరంన్నర పొలంలో సాగు చేశారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేశారు. పురుగు నివారణకు దశపత్ర కషాయం వాడారు. 15 రోజుల పంటకు ఎకరాకు 5 క్వింటాళ్ల వర్మికంపోస్టు వేశారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతం డబ్బాలతో పాదుల్లో పోశారు. 200 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 20–25 వేల వరకు అయ్యే ఖర్చు ప్రకృతి సేద్యంలో రూ. 6 వేలకు తగ్గింది. ఈ ఏడాది పత్తిలో 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని మనోహరాచారి అంచనా వేస్తున్నారు. చెరకులో 50 టన్నుల దిగుబడి మనోహరాచారి మొత్తం పదెకరాల్లో చెరకును కార్శి పంటగా సాగు చేస్తున్నారు. తొలిసారి రెండెకరాల్లో చెరకును ప్రకృతి సేద్యంలోకి తెచ్చారు. తొలుత ఎకరాకు 2 క్వింటాళ్ల ఘనజీవామృతం వేశారు. 20 రోజులకోసారి డ్రిప్పు ద్వారా ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందిస్తారు. రసాయన సేద్యం చేసే రైతులు గత ఏడాది లద్దెపురుగు నివారణకు విపరీతంగా కీటకనాశనులు పిచికారీ చేసినా తోటలు దెబ్బతిన్నాయి. మనోహరాచారి మాత్రం ఎకరాకు 10 లీటర్ల అగ్ని అస్త్రంను డ్రిప్పు ద్వారా అందించి పంటను లద్దె పురుగుల బెడద నుంచి కాపాడుకున్నారు. పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించి కలుపును నివారించడమే గాక పొలంలో తేమను కూడా ఎక్కువ రోజులు కాపాడుకోగలిగారు. దీనివల్ల నీరు ఆదా అయింది. సూక్ష్మవాతావరణంతో వానపాములు, సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితి నెలకొనడంతో భూసారం పెంపొందింది. పైపాటు, కూలీలకు అయ్యే ఖర్చులో రూ. 10 వేల వరకు ఆదా అయ్యాయి. రసాయన ఎరువులు, పురుగుమందులకు ఎకరాకు 20 వేల వరకు ఖర్చయ్యేది. జీవామృతం... దశపత్ర కషాయాలు వాడటంతో ఆ ఖర్చు కూడా రైతుకు ఆదా అయింది. ఇది తొలి ఏడాది ఖర్చు మాత్రమే. నాలుగేళ్లలో ఖర్చు సగం మేర తగ్గుతుంది. రసాయన సేద్యం నుంచి ప్రకృతి సేద్యంలోకి మారిన తొలి ఏడాది కూడా చెరకు దిగుబడి తగ్గలేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఎకరాకు 40 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 50 టన్నుల వరకు దిగుబడి రావచ్చని మనోహరాచారి భావిస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు పోను టన్నుకు రూ. 1,900 ధర లభించింది. ఎకరాకు రూ. 75 వేల ఆదాయం వచ్చింది. జడ కట్టేందుకు రూ. 15 వేలు పోను ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం లభించింది. కూరగాయల్లో ఎకరాకు రూ. 40 వేల నికరాదాయం గతేడాది వేసవిలో ప్రకృతి సేద్య విధానంలో మూడెకరాల్లో కీరదోస, పప్పు దోస పంటలను సాగు చేశారు. డ్రిప్పు ద్వారా 15 రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందించారు. తీగజాతి కూరగాయలు జీవామృతానికి బాగా స్పందించాయి. పూత బాగా వచ్చింది. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వచ్చింది. విత్తనాలు కూలీలు, రవాణా ఖర్చులు రూ. 10 వేలయ్యాయి. ఖర్చులు పోను ఎకరాకు రూ. 30–40 వేల నికరాదాయం లభించింది. కందిలో మొక్కజొన్న సాగు.. కందిలో పెసర, మినుము, మొక్కజొన్న పంటలను అంతర పంటలుగా సాగు చేశారు. ఆవులం దేశీ రకం కందిని సాగు చేశారు. మొక్కల మధ్య నాలుగడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉండేలా పాదుల్లో విత్తనాలను నాటుకున్నారు. 20, 40 రోజుల దశలో ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని కంది, మొక్కజొన్నకు అందించారు. 200 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతాన్ని కలిపి ఎకరా పైరుపై 30–50 రోజుల దశలో పిచికారీ చేశారు. అతివృష్టికి పెసర, మినుము పంటలు చేతికి రాలేదు. కందిలో ఎకరాకు 8–10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. మొక్కజొన్న ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఖర్చులు రూ. 6 వేలు మాత్రమే కాగా రెండు పంటలకు కలిపి రూ. లక్ష వరకు నికరాదాయం రావచ్చని మనోహరాచారి తెలిపారు. నాణ్యమైన ఎల్లిపాయలకు మారు పేరు మనోహరాచారి చాలాకాలంగా ఎల్లిపాయ పంటను రసాయన సేద్యంలో సాగు చేస్తున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా ఎకరా పొలంలో ఎల్లిపాయను ప్రకృతి సేద్య విధానంలో సాగు చేసి మంచి దిగుబడి సాధించారు. డ్రిప్పుతో 20 రోజులకోసారి ఇచ్చే తడితో పాటే 200 లీటర్ల జీవామృతం ఇచ్చేవారు. 80 కిలోల సొంత విత్తనం వాడారు. రెండుసార్లు కలుపు తీతకు, గడ్డలు ఏరేందుకు కూలీలకు కలిపి మొత్తం ఎకరాకు రూ. 10 వేల ఖర్చయింది. దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్లకు పెరిగింది. క్వింటా రూ. 6,500 చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ. 1.30 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ. 1.20 లక్షల నికరాదాయం లభించింది. రసాయన సేద్యంలో పండించిన ఎల్లిపాయ గడ్డ మూడు నెలలకే మెత్తబడేది. పొలంలో కలుపు మళ్లీ మళ్లీ పుట్టుకొచ్చి పంటకన్నా కలుపు ఎక్కువ ఉండేది. ప్రకృతి సేద్యంలో కలుపు ఉధృతి బాగా తగ్గింది. పంటను ఏడాది నిల్వ ఉంచినా గడ్డ మెత్తబడలేదు. రసాయన సేద్యంలో 12 ఎకరాల సాగుకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రకృతి సేద్యంలో 18 ఎకరాల సాగుకు రూ. 20 వేలకు మించి ఖర్చు లేదు. మినుములు, ఎల్లిపాయలు కిలోకు రూ. 20–25 వరకు అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. రైతు ఇతర రైతులను చూసి నేర్చుకుంటాడు. మనోహరాచారి స్ఫూర్తితో లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నాగారం నారాయణరెడ్డి, రాంరెడ్డి ప్రకృతి సేద్యం చేపట్టడం విశేషం. – పొల్కంపల్లి గాండ్ల నాగరాజు,సాక్షి, మహబూబ్నగర్ వ్యవసాయం తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నా! రసాయన సేద్యంలో అప్పులు చేసినా.. తీర్చేదారి లేక పనికోసం ఊరొదిలి పట్నానికి పోదామనుకున్నా. ఆ సమయంలో ప్రకృతి సేద్యం చేయటం ప్రారంభించా. రూ. లక్ష ఖర్చు కాస్తా మంత్రం వేసినట్టే రూ. 10 వేలకు తగ్గింది. ఎరువులు, పురుగు మందులు కొనాల్సిన అవసరం లేకపోవటమే దానికి కారణం. రసాయన సేద్యం ఆపితే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి. రసాయన సేద్యంతో రైతు బాగుపడడు. ఎరువులు, పురుగుమందులు అమ్మే వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు బాగుపడుతున్నారు. ఇంతకు ముందు అప్పులు తీర్చేదారిలేక తలదించుకొని బతుకుతున్నట్టనిపించేది. ప్రకృతి సేద్యంలోకి మారాక తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నా. రైతులు ప్రకృతి సేద్యం చేస్తే ఆ అప్పులు ఉండవు.. ఆత్మహత్యలు ఉండవు. – వనపన మనోహరాచారి (99669 84871)పద్మారం, చౌదరిగూడెం మండలం,రంగారెడ్డి జిల్లా ఆపిల్ బేర్లో అంతర పంటలుగా బంతి, పొగాకు తొలి ఏడాది ప్రకృతి సేద్యంలో అంతర పంటలకు పెద్ద పీట వేశారు మనోహరాచారి. ఒకటిన్నర ఎకరాలో ప్రకృతి సేద్యంలో ఆపిల్ బేర్ను సాగు చేస్తున్నారు. జూలైలో ఎకరాకు 200 మొక్కలు నాటారు. నెలకోసారి డ్రిప్పు ద్వారా జీవామృతం అందిస్తున్నారు. ఆపిల్ బేర్ మధ్యలో సెప్టెంబర్లో బంతిపూల నారు నాటారు. అక్టోబర్ ఆఖరుకు కోత తెగేది. రసాయన సేద్యంలో నెల రోజులు మాత్రమే పూలకోత తెగేది. ప్రకృతి సేద్యంలో మూడో నెలలోనూ పూల దిగుబడి వచ్చింది. దిగుబడి రెండింతలైంది. రసాయన సేద్యంలో ఖర్చు రూ. 15 వేలు కాగా ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు తగ్గి రూ. 30 వేల నికరాదాయం వచ్చింది. పూలు కోతకొచ్చిన అక్టోబర్ నెలలోనే రెండు బంతి మొక్కల మధ్యలో పొగాకు నారును నాటారు. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 15 వేల ధర చొప్పున విక్రయించారు. ఎకరాకు రూ. 4 వేలు మాత్రమే ఖర్చయింది. -
రాజకీయ నేతలే ఎందుకు అబద్ధాలు ఆడతారు?
న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా రాజకీయ నాయకులే ఎక్కువ అబద్ధాలు ఆడతారు. బహిరంగ సభల్లో , ఎన్నికల ర్యాలీల్లో, ఇంటర్వ్యూల్లో, టీవీ చర్చాగోష్ఠిల్లో మాత్రమే కాకుండా సర్వదా అన్ని పరిస్థితుల్లో అలవోకగా అబద్ధాలు ఆడుతారు. ఈ విషయంలో బెరుకనేది కనిపించకుండా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నట్లుగా అబద్ధాన్ని అతికినట్లు చెప్పడంలో వారికి వారేసాటి. నిజాన్ని చెప్పడంలో పొదుపు, అబద్ధాలను చెప్పడంలో విశృంఖలత పాటిస్తారు. ఎందుకు? అబద్ధాలు ఆడే రాజకీయ నాయకుల్లో పలు రకాల వాళ్లు ఉంటారు. కొందరు తాత్కాలిక ప్రయోజనం ఆశించి, మరికొందరు దీర్ఘకాలిక ప్రయోజనం ఆశించి ఆబద్ధాలు ఆడేవారుంటున్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అబద్ధాలాడితే మరికొందరు పార్టీ లేదా ప్రాంతం, లేదా దేశం ప్రయోజనాలు ఆశించి ఆబద్ధం ఆడుతారు. పార్టీ లేదా దేశం పరువు ప్రతిష్టల పరిరక్షణ కోసం అబద్ధాలు ఆడేవారు కొందరైతే అధికారం కోసం అబద్ధపు హామీలు ఇచ్చేవారు కొందరు ఉంటారు. మరికొందరైతే అబద్ధం ఆడినట్లు ఉండకుండా, నిజాన్ని కొంచెం అటు, ఇటుగా మార్చి చెబుతారు. కొందరు ఊహాత్మక అబద్ధాలు ఆడుతారు. ఏది ఏమైనా తాము మాట్లాడింది అబద్ధమని తేలినప్పుడు తేలిగ్గా తీసుకునేవారు ఉంటారు, తన మాటలను వక్రీకరించారంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించేవారు మరికొందరు. ఇవి కూడా అబద్ధాలే.... తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాలకు క్షమాపణలు చెప్పేవారంటున్నారు, అప్పుడున్న పరిస్థితుల్లో తాను అలా అనుకున్నానని నెపాన్ని పరిస్థితులపైకి నెట్టే వారుంటారు. ఏదేమైనా రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకుడు ఒబామా అంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం, భారత సైన్యంలోని తూర్పు కమాండ్ ఎప్పుడూ నిర్వహించే సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటే దేశంలో సైనిక కుట్ర జరుగుతోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వక్తం చేయడం, నరేంద్ర మోదీ తనను చంపేందుకు కుట్రపన్నారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించడం, ఆర్థిక ఆంక్షలున్న ఇరాక్కు అమెరికా ఆయుధాలు విక్రయించలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటించడం లాంటివి కూడా అబద్ధాలే. మిసా భారతి అబద్ధం... బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి మాట్లాడుతూ గెస్ట్ లెక్చర్ ఇవ్వడం కోసం తనను హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించిందని ప్రకటించారు. ఆ విషయాన్ని హార్వర్డ్ యూనివర్శిటీ అధికారికంగా ఖండించింది. ఆప్ కేబినెట్ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తనకు లా డిగ్రీ ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆయన లా చదవలేదని తెలియడంతో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి వ్యక్తిగత ప్రతిష్టను ఇనుపడింప చేసుకునేందుకు ఆడే అబద్ధాలు. ఇలాంటి అబద్ధాల వల్ల కొన్ని సార్లు కెరీర్ నష్టపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్షమాపణలతో బయటపడవచ్చు. కేసు విచారణ నుంచి బయటపడేందుకు నాడు బిల్ క్లింటన్, తనకు మోనికా లెవిన్స్కీతో ఉన్న సంబంధాన్ని ఒప్పుకొని అందుకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. పలు కారణాలతో అబద్ధాలు... ద్వంద్వ ప్రమాణాలతో, ఆత్మవంచనతోనూ, మోసంచేసే ఉద్దేశంతో, వాస్తవాలను దాచాలనే ఉద్దేశంతోనే సాధారణంగా అబద్ధాలు ఆడుతుంటారు. దేశ ప్రతిష్టను రక్షించేందకు కొందరు అబద్ధాలు ఆడుతుంటారు. 1953 నుంచి 1961 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన డ్వైట్ డీ హైసనొవర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ అమెరికా నిఘా విమానాన్ని అప్పటి సోవియట్ యూనియన్ కూల్చడం అబద్ధమనడం అలాంటి అబద్ధమే. కొందర అధికారంలోకి రావడానికి వాస్తవాస్తవాలను పట్టించుకోకుండా ఉద్వేగంతో అబద్ధాలు ఆడుతారు. ఆ కోవకు చెందిన వ్యక్తిగా డోనాల్డ్ ట్రంప్ను పేర్కొనవచ్చు. విదేశాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయని, అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయని, వేతనాలు పడిపోతున్నాయని, ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని ఎన్నికల సందర్భంగా ఆయన పదే పదే మాట్లాడారు. అయితే ఆయన మాటలన్నీ అబద్ధాలన్నీ తేలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోవడమే కాకుండా గడచిన తొమ్మిదేళ్లకన్నా నిరుద్యోగ సమస్య ఈసారి తగ్గింది. అబద్ధాలతోనే పెరుగుతున్నాం... మనం చిన్నప్పటి నుంచి అబద్ధాలతో పెరుగుతాం. పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తే తల్లి అబద్ధాలతో భయపడుతూ, బుజ్జగిస్తూ తినిపిస్తుంది. అలాంటి అబద్ధాలను శ్వేత అబద్ధాలు అంటాం. వాటిల్లో కల్లాకపటం ఉండదు. నిజజీవితంలో నిజంగా ఆడే అబద్ధాలతోనే ప్రమాదం. మనం అబద్ధాలు ఆడినప్పుడు ఇది తప్పంటూ మనల్ని గిల్లీ హెచ్చరించే వ్యవస్థ మన మెదడులో ఉంటుందని, పదే పదే అబద్ధాలు ఆడుతుంటే అలా హెచ్చరించే వ్యవస్థ స్పందన కోల్పోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి స్పందన కోల్పోవడం వల్లనే రాజకీయ నాయకులు అలవోకగా అబద్ధాలు ఆడేస్తారట. -
ప్రకృతి కూడా ఫ్లాట్ అయిపోతుంది!
అపార్ట్మెంట్ పేరు చెప్పగానే... కొద్దిగా సైజు తేడాలతో ఒకదానిపై ఒకటిగా పేర్చిన అగ్గిపెట్టెలు గుర్తొస్తాయి మనకు. హంగుల్లో తేడాలు మినహాయిస్తే... అన్నిచోట్లా అపార్ట్మెంట్ల తీరు ఇదే. అయితే కాలం మారుతోందనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక తార్కాణాలు కనిపిస్తున్నాయి. ప్రకృతితో మమేకమవుతూ పర్యావరణానికి కొద్దో గొప్పో మేలు చేసే కొత్త తరహా ఇళ్లకు ఆదరణ కూడా ఎక్కువే. ఈ కోవకే చెందుతుంది ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ‘స్లూయిషుషీస్’. దీని ప్రత్యేకతలు ఒకటా రెండా? బోలెడు! అన్నింటి కన్నా ముందు చెప్పాల్సింది - ఇది ‘జీరో ఎనర్జీ’ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. అంటే.. సౌర, పవన విద్యుత్తు వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును మాత్రమే వాడతారన్నమాట. నెదర్లాండ్స రాజధాని ఆమ్స్టర్డ్యామ్ నగరంలో నిర్మాణం కానున్న ఈ భవనం మొత్తం ఐజే లేక్ అనే సరస్సుపై తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకోదాంట్లోకి వెళ్లేందుకు నడక మార్గంతోపాటు పడవమార్గం కూడా ఉండటం మరో విశేషం. ప్రతి ఇంటికీ తనదైన చిన్న పచ్చదనం ఉంటుంది. మొత్తం 46 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో, 380 అపార్ట్మెంట్లున్న ఈ కాంప్లెక్స్లో వాహనాల పార్కింగ్ మొత్తం భూగర్భంలోనే. అంతేకాదు.. ఒక రెస్టారెంట్, ఒక మ్యూజియం, సెయిలింగ్ స్కూల్ వంటి అదనపు హంగులున్నాయి. ఇంతెందుకు... స్థానిక ప్రభుత్వం చేపట్టిన ఈ భవనాన్ని బిగ్, బార్కోడ్ ఆర్కిటెక్చర్ సంస్థలు డిజైన్ చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే 2018లో దీని నిర్మాణం మొదలుకానుంది. -
ఈ నది నవ్వూ... పచ్చదనమే!
నదులు, చెరువులు... పార్కులకు ఈ కాలపు నగరాల్లో చోటు దొరకడం కష్టమే. హైదరాబాద్, బెంగళూరులనే ఉదాహరణగా తీసుకుంటే ఒకప్పుడు ఈ రెండు నగరాల్లో వందలకొద్దీ చెరువులు, కుంటలుండేవి. ఆక్రమణలపాలై ఒక్కొక్కటీ కనిపించకుండాపోయాయి. దీంతో చిన్నపాటి వర్షాలకే మునిగిపోయే జనావాసాలు, కాలనీలు! ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకంటే.. పక్క ఫొటోలో చూడండి... ఇది అమెరికాలోని డల్లాస్ నగరం సంకల్పించిన పర్యావరణ హితమైన అతి భారీ ప్రాజెక్టు. నగర ప్రాంతాల్లో తరచూ ముంపు ప్రమాదానికి కారణమవుతున్న ట్రినిటీ నదిని సరికొత్తగా ముస్తాబు చేసేందుకు, అమెరికాలోనే అతిపెద్ద పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘నేచర్ డిస్ట్రిక్ట్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తయితే దాదాపు పదివేల ఏకరాల్లో భారీ పచ్చ‘ధనం’ సిద్ధమవుతుంది. మైకేల్ వాన్ వాల్కెన్బర్గ్ అసోసియేట్స్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. వరద ముప్పును గణనీయంగా తగ్గిస్తూనే.. నదీ పరిసర ప్రాంతాలను అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దేలా వీరు డిజైన్ను రూపొందించారు. ఇప్పటికే అక్కడ గ్రేట్ ట్రినిటీ ఫారెస్ట్ పేరుతో దాదాపు 7000 ఎకరాల అడవి ఉంది. మరో వెయ్యి ఎకరాల్లో పిల్లల ఆటస్థలాలతోపాటు గోల్ఫ్ క్లబ్, గుర్రపుశాల వంటివి ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా పచ్చటి మైదానాలు, ఆటస్థలాలు వంటివాటితో కలిపి ట్రినిటీ రివర్పార్క్ సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ పార్కు కోసం స్థానికులు దాదాపు 5 కోట్ల డాలర్ల విరాళాలు అందించారు. బాండ్ల అమ్మకం ద్వారా మరో మూడు కోట్ల డాలర్లు సేకరించారు. -
వింటే శివస్తోత్రం కంటే యాగంటి
మానవ జీవితానికి ఊతం కోసం భక్తి. ఉల్లాసం కోసం ప్రకృతి. ఈ రెంటి అనుసంధానంగా భారతదేశమంతటా ఆలయాలు ఏర్పడ్డాయి. ఉమతో కలిసి మహేశ్వరుడు కొలువైన యాగంటి తెలుగువారికి సొంతమైన ఆధ్యాత్మిక సంపద. ఎర్రమల సౌందర్యానికి ప్రతీక. రోజు రోజుకూ పెరిగే బసవయ్య ఇక్కడి విశిష్టత. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం- యాగంటి. తెలుగువారి శైవక్షేత్రాల్లో యాగంటి నాగరిక ఛాయలు సోకని ప్రత్యేక క్షేత్రం. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని అధిరోహించిన ఉమా మహేశ్వరులు వెలసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. అందుకే భృగు, అగస్త్య వంటి మహా రుషులు అక్కడ సంచరించారని అంటారు. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్తావన చేశారు. ఇక్కడి నంది విగ్రహం రోజురోజుకూ పెరిగి కలియుగాంతానికి రంకె వేస్తుందని కాలజ్ఞానం. అంటే కలియుగాంతంతో ముడిపడిన క్షేత్రం ఇది అని అర్థం చేసుకోవాలి. నేకంటి... యాగంటి యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. బ్రహ్మంగారి వల్ల విఖ్యాతమైన బనగానపల్లికి ఇది కేవలం 13 కిలోమీటర్ల దూరం. చుట్టూ అడవి... ఎర్రటి కొండలు... పచ్చటి పరిసరాలు... రణగొణులు లేని ఏకాంతం... స్వచ్ఛమెన కొండధార ఉన్న ఈ క్షేత్రం చూసినంతనే ఆహ్లాదం కలిగించే క్షేత్రం. దీని ఉనికి పురాణ కాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడని దాని ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘నేకంటి నేకంటి’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు. అగస్త్యుని ఆలయం యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథనం. ఆయన ఇక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించాడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీవిష్ణువు మూలవిరాట్టు చివరి నిమషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన ఈశ్వరుడు ఇది శైవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయంగా మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహాలయాల్లో ఒక దానిలో శ్రీ వేంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటన వేలు భగ్నం అయి ఉండటానికి భక్తులు దర్శించవచ్చు. హరిహరరాయల కాలం నాటి క్షేత్రం ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందనేది కచ్చితంగా తెలియకపోయినా హరిహరరాయలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది (ఇలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). అజ్ఞాత కొండ ధారతో నిండే ఈ కోనేరులో స్నానం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని ఒక నమ్మకం. మరో అజ్జాత కొండ ధారతో వచ్చే నీటిని ‘అగస్త్య పుష్కరిణి’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికి వాడతారు. శని దోషం లేదు... కాకి ప్రవేశం లేదు ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకనొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుంటే కాకాసుర డనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించినట్లు ప్రతీతి. ఆగ్రహించిన అగ స్త్య ముని ఈ క్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కాన రావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా క్షేత్రం శనిప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ఉమామహేశ్వరస్వామిని దర్శించి పూజించడం వల్ల తప్పక శనిదోషం తొలగిపోతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఉత్సవాలు- పూజలు: ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు, కార్తికమాస సందర్భంగా నెల రోజులు మాసోత్సవాలు, సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఇక్కడికి వచ్చిన భక్తులకు స్వామివారి అర్చన, అభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, ఆకుపూజలు, కల్యాణం, అన్నాభిషేకం, దంపతుల పూజలు, ఆకాశదీప పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఉమాశంకరదీక్షిత శర్మ తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులు పూజలను బట్టి ఆలయ అధికారులు నిర్ణయించిన టికెట్లను పొందాల్సి ఉంటుంది. - గుండం సర్వేశ్వరరెడ్డి సాక్షి, బనగానపల్లె, కర్నూలు జిల్లా. దర్శన వేళలు: ప్రతిరోజు ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. వసతి సౌకర్యాలు: ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర సేవాసదన్, బ్రహ్మణి రెసిడెన్సీ తదితర వసతి గృహాలు ఉన్నాయి. వారు గదుల సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. ఇంకా అన్నదాన సత్రాల్లో కూడా వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన, ఉమామహేశ్వర రెడ్ల, వేదగాయత్రి బ్రాహ్మణ, వాసవి ఆర్యవైశ్య సత్రాల ద్వారా నిత్యాన్నదాన భోజన సౌకర్యాలు ఉన్నాయి. రవాణా సౌకర్యం: యాగంటి క్షేత్రం బనగానపల్లె నుంచి 13 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఆర్టీసి బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి బనగానపల్లె-76 కి.మీలు, అనంతపురం నుంచి బనగానపల్లె - 120 కి.మీ. నంద్యాల నుంచి బనగానపల్లె - 45 కి.మీ, హైదరాబాద్ నుంచి బనగానపల్లె - 228 కి.మీ, శ్రీశైలం నుంచి బనగానపల్లె - 223 కి. మీ. మహానంది నుంచి బనగానపల్లె - 60 కి.మీ యాగంటి బసవయ్య యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్ఠించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. మూడు ముఖ్యమైన గుహలు ఈ క్షేత్రం చుట్టూ నిలువుగా చెక్కినట్టుగా కొండలు ఉంటాయి. వాటి లోపల గుహలు ఉంటాయి. ఆలయానికి కుడివైపున ఉన్న కొండలో మూడు ముఖ్యమైన గుహలు ఉన్నాయి. ఒక గుహను వేంకటేశ్వర గుహ అంటారు. ఇందులో వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాయి. బొటన వేలు భగ్నమైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. తిరుమల వేంక టేశ్వరుని విగ్రహంతో పోల్చితే ఈ విగ్రహం కొంచెం భిన్నంగా ఉంటుంది. మరో గుహను అగస్త్య గుహ అంటారు. ఇందులో పూజ లందుకుంటున్న శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠిం చాడని నమ్మకం. మూడో గుహను బ్రహ్మంగారి గుహ అంటారు. పశువుల కాపరిగా ఉండగా బ్రహ్మంగారు ఇక్కడికి పశువులతో వచ్చి ఈ గుహలోనే కాలజ్ఞానంలో కొంతభాగం రాశారని నమ్మకం. తన శిష్యురాలైన గరివిరెడ్డి అచ్చమ్మకు ఇక్కడే జ్ఞానో దయం చేశారట. ఇంకా భక్తులకు అందుబాటులో లేని గుహలలో మహాత్ములు నేటికీ ధ్యానం చేస్తుంటారంటారు. -
తెలి మంచు కురిసింది..!
-
దేశీ విత్తనంతో నేలతల్లికి వందనం!
- కారు చౌడు నేలలో దేశీ వరి ధాన్య సిరులు - 150 రకాల దేశీ వరి విత్తనాల సేకరణ.. ఎంపిక చేసిన 8 రకాల సాగు - అరెకరం నీటి కుంట ద్వారా 70 దేశీ ఆవులు, గిత్తల పోషణ - 10 శాతం పంట భూమిలో వాన నీటి సంరక్షణ చేపడితే డెల్టా రైతుకు నీటి కష్టాలుండవు - దేశీ వంగడాలు, ప్రకృతి సేద్యంతోనే బంగారు భవిష్యత్తు అంటున్న విజయరామ్ ప్రకృతి సేద్యానికి దేశీ విత్తనం, దేశీ ఆవే మూలాధారాలని భావిస్తున్న విజయరామ్.. కృష్ణా డెల్టాలోని చౌడు భూమిలోనూ దేశీ విత్తనాలతో మంచి దిగుబడులు సాధిస్తూ తోటి రైతాంగానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. తొలుత తాను ఆరేళ్ల క్రితం పాలేకర్ ప్రకృతి సేద్యాన్ని నేర్చుకొని, శిక్షణా శిబిరాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో దేశీ వరి వంగడాలు దాదాపు కనుమరుగైపోయిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి 150 రకాల దేశీ వరి వంగడాలను సేకరించారు. మేలైన రకాలను సాగు చేసి రైతులకు విత్తనాలు అందిస్తున్నారు. రసాయనిక సేద్యంతో రోగగ్రస్థమైన సమాజానికి కాయకల్ప చికిత్స చేసే యజ్ఞంలో.. ఔషధ విలువలతో కూడిన సహజాహార ఉత్పత్తికి దేశీ వరి వంగడాలు, దేశీ గోసంపద పరిరక్షణ అత్యవసరం. ఈ చైతన్యంతోనే విజయరామ్ నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. మచిలీపట్నానికి చెందిన మేకపోతుల విజయరామ్ హైదరాబాద్లో అప్లయిడ్ ఆర్ట్ స్టూడియో నడుపుతూ మిఠాయిల వ్యాపారం చేపట్టారు. పర్యావరణ ప్రేమికుడైన ఆయన ‘సేవ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి వాన నీటి సంరక్షణ, మట్టి గణేశ విగ్రహాల తయారీ వంటి కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఆ దశలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్, రాజీవ్ దీక్షిత్ బోధనలు పరిచయమయ్యాయి. రాజమండ్రిలో 2009లో పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. దేశీ గోసంపద పరిరక్షణకు దేశీ విత్తనాలతో ప్రకృతి సేద్యం చేయడమే లక్ష్యంగా భావించారు. ఆ స్ఫూర్తితోనే నెల తిరగక ముందే కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు సమీపంలోని పినగూడూరు లంక గ్రామంలో ఆరెకరాల సాగు భూమిని కొనుగోలు చేశారు. 2010 ఖరీఫ్ నుంచే ప్రకృతి సేద్యంతోపాటు దేశీ గో సంపద పరిరక్షణకూ ఉపక్రమించారు. గిర్, ఒంగోలు, సాహివాల్ ఆవులు, గిత్తలను కొనుగోలు చేసి సౌభాగ్య గోసదన్ను మూడెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆవులు విశ్రమించడానికి పక్కా భవనాలతోపాటు ఎండలో ఆరుబయట తిరగడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే.. వ్యవసాయ సంక్షోభానికి, ఆత్మహత్యలకు పరిష్కారంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు నేర్పించాలని సంకల్పించారు. పాలేకర్తో 4 శిబిరాల ద్వారా సుమారు 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. వానపాములు, సూక్ష్మజీవరాశికి కృతజ్ఞతగా ఆచ్ఛాదన! సుమారు అరెకరంలో 15 అడుగుల లోతున నీటి కుంటను తవ్వి.. వాన నీటి సంరక్షణ చేస్తున్నారు. మిగతా పొలంలో ఖరీఫ్లో దేశీ వరి వంగడాలను, రబీలో అపరాలు సాగు చేస్తున్నారు. అపరాలు నూర్చిన తర్వాత ఎండాకాలంలో నాలుగైదు అంగుళాల మందాన పశువులు తొక్కిన గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వాడుతున్నారు. ‘పంట భూమిలోని సూక్ష్మజీవులు, వానపాములే ప్రకృతి సేద్యంలో పంటలకు పోషకాలను అందిస్తాయి. వాటికి కృతజ్ఞతగా ఎండాకాలం ఇలా ఆచ్ఛాదన చేస్తున్నా’నని విజయరామ్ అంటారు. అది కారు చౌడు భూమి. భూగర్భ నీరు కూడా పంటలకు పనికిరావు. అయినా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సవాలుగా తీసుకున్న విజయరామ్ దీక్షగా ముందడుగు వేశారు. చౌడు తీవ్రత ఎంతని అడిగితే.. అసలు భూసార పరీక్ష, నీటి పరీక్ష ఎందుకు? అని ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. రసాయనిక సేద్యం చేసే మాగాణుల్లో నుంచి నీటి ఊట తన భూమిలోకి రాకుండా జాగ్రత్త పడడానికి 3-4 అడుగుల వెడల్పున గట్లు తీయడం విశేషం. దేశీ వరి వంగడాల సేకరణ.. సాగు.. పంపిణీ.. ఒరిస్సాకు చెందిన దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారిణి సబర్మతి కృషిపై ‘సాక్షి’ ఫ్యామిలీలో నాలుగేళ్ల క్రితం ప్రచురితమైన కథనం విజయరామ్ను కదిలించింది. హుటాహుటిన సబర్మతి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సందర్శించి.. అపురూపమైన అనేక వరి వంగడాల సేకరణకు ఉపక్రమించారు. అది మొదలు అనేక రాష్ట్రాలు పర్యటించి సుమారు 150 రకాలను సేకరించారు. 2015 ఖరీఫ్లో వీటిని తన క్షేత్రంలో చిన్న చిన్న మడుల్లో సాగు చేసి.. వాటి గుణగణాలను, దిగుబడినీ స్వయంగా నమోదు చేశారు. వీటిలో రైతులకు అన్ని రకాలుగా నచ్చే ఘని, మడు ముర్రంగి, నారాయణ కామిని, పుల్లాకార్, పుంగార్, కాలాభట్ సెంటెడ్, తులసి బాసొ వంటి వంగడాలను ఎంపిక చేశారు. వీటిని ఈ ఏడాది తన పొలంతోపాటు ఇతరులకు చెందిన సుమారు 60 ఎకరాల్లోనూ పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలు వాడుతున్నారు. ఎటుచూసినా అడుగున్నర దూరంలో ఒక మొక్కను నాటితే చాలు. ఎకరానికి కిలో విత్తనం చాలు. చీడపీడల బెడద లేకుండా మంచి దిగుబడి పొందడానికి ఇదే మార్గమని విజయరామ్ అనుభవ పూర్వకంగా గ్రహించారు. ఆరోగ్యంగా పెరుగుతున్న తన పంటను చూపుతూ సందర్శకులతో ఇదే విషయాన్ని చెబుతుంటారు. రసాయనిక వ్యవసాయం చేసే వరి పొలాల్లో ఉన్న చీడపీడలు ఈ పొలంలో కనిపించకపోవడం విశేషం. అధిక దిగుబడినిచ్చే దేశీ వంగడాలు.. కర్ణాటకకు చెందిన ఘనిఖాన్ అభివృద్ధి పరచిన ‘ఘని’ దేశీ వరి వంగడాన్ని 2.6 ఎకరాల్లో విజయరామ్ తన చౌడు భూమిలో సాగు చేస్తున్నారు. 120 రోజుల పంట. గింజ రాలదు. పడిపోదు. చీడపీడలు లేకుండా చక్కగా పెరిగిన ఈ వంగడం నెలలో కోతకు రానుంది. ఎకరానికి 35 బస్తాల (బస్తా 70 కిలోలు) దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మడు ముర్రంగి రకం ఈ సీజన్లో 4 అడుగుల ఎత్తు పెరిగింది. పాలుపోసుకునే దశలో ఉంది. 130 రోజులు. పడిపోదు. గింజ రాలదు. నీటి మట్టం పెరిగే కొద్దీ అంతకన్నా ఎత్తు పెరగడం దీని ప్రత్యేకత. ఎకరానికి 25 - 30 బస్తాల దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఈ రకం కృష్ణా డెల్టా రైతులకు విస్తృతంగా అందించాలని ఆశిస్తున్నారు. నారాయణ కామిని వంగడాన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన నారాయణ బచాడ అనే రైతు అభివృద్ధి పరిచారు. చక్కని రుచికరమైనది. నెమ్మదిగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ వంగడాన్ని ఎక్కువ మందికి ఇవ్వడానికి విస్తారంగా సాగు చేయిస్తున్నామని విజయరామ్ తెలిపారు. పాలేకర్ సేద్య పద్ధతిని పూర్తిగా ఆచరిస్తే ఏ నేలలోనైనా తొలి ఏడాదే 20-15 బస్తాల దిగుబడి వస్తుందన్నారు. తులసిబాసో అనే సుగంధ రకం బియ్యం సైజు చిన్నగా ఉంటుంది. వరి కోత అయిన తర్వాత పొలానికి నీరు పెట్టి వదిలేస్తే.. 35 రోజుల్లో మరోసారి 40% పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ ఏడాది తమ పొలంలో 75 సెంట్లలో నవారా (బ్లాక్ రైస్)ను సాగు చేస్తే.. పుష్కరాల కారణంగా కాలువ నీరు రావడం ఆలస్యమై నేల నెర్రెలిచ్చినప్పటికీ తట్టుకొని.. 10-12 బస్తాల దిగుబడి రావడం విశేషం. ప్రకృతి సేద్య పద్ధతులు, ఆచ్ఛాదన వల్లనే ఇది సాధ్యమైందన్నారు. వాన నీరు మన సంపద.. మన పొలంలో కురిసిన వాన నీరు మన సంపద. ఎకరానికి పది సెంట్ల స్థలంలో నీటి కుంట తవ్వుకుంటే.. వర్షాలు, కాలువ నీరు ఆలస్యంగా వచ్చినా నార్లకు, నాట్లకు ఆటంకం ఉండదు. డబ్బు వృథా, పంట విస్తీర్ణం వృథా అనుకోవడం తప్పు. మొదటి ఏడాదే ఖర్చు తిరిగి వచ్చేస్తుంది. మా అరెకరం కుంట వల్ల వ్యవసాయానికే కాదు.. 70 ఆవులకు, 20 మంది మనుషులకూ నీటి కొరత లేదు. కరువొచ్చినా ఒక్క ట్యాంకరు కూడా కొనలేదని విజయరామ్ అన్నారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో పొట్టి వరి రకాలు సాగులోకి వచ్చాక దేశీ వంగడాలు కనుమరుగైపోయాయి. అయితే, వరి గడ్డిని కట్టలు కట్టేందుకు ‘కట్ల గడ్డి’గా మాత్రం నెల్లూరు మొలగొలుకులు రకాన్ని ప్రతి వరి పొలంలోనూ కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తుండడం కనిపించింది! ఆరోగ్యదాయకంగా దేశీ ఆవుల పోషణపై విజయరామ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం పెదముత్తేవి వద్ద 9 ఎకరాల్లో పశుగ్రాసాన్ని ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, సంప్రదాయ గానుగలతో నూనెలు, షాంపూలు, సున్నిపిండి తదితర ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడం ద్వారా రైతు సమగ్ర ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయడం అభినందనీయం. జనవరి, ఫిబ్రవరిలో విత్తనోత్సవం వివిధ రాష్ట్రాల్లో సేకరించి, తెలుగునాట సాగుచేసిన దేశీ వరి వంగడాలను వచ్చే జనవరి, ఫిబ్రవరిలో వేలాది మంది రైతులకు అందించేందుకు విజయరామ్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని ‘మన గ్రామం’ కార్యాలయంలో 2017 జనవరి 8, 9 10 తేదీల్లో భారీ ఎత్తున దేశీ వరి విత్తనాలు పంపిణీ చేస్తారు. పినగూడూరులంకలోని సౌభాగ్య గోసదన్లో ఆ తర్వాత ఏ రోజైనా దేశీ వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. అదేవిధంగా, హైదరాబాద్లో ఫిబ్రవరిలో విత్తనోత్సవం నిర్వహిస్తామన్నారు. వివరాలకు 0866 2583426 నంబరులో సంప్రదించవచ్చు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : జె. అజీజ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మచిలీపట్నం ఔషధ విలువలున్న ఆహారాన్నందించడమే లక్ష్యం! ఏదో ఒక పంట పండించాం.. తిన్నాం అని కాదు.. ఔషధ విలువలున్న ఆహారాన్ని ప్రజలకు అందించాలి. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఖాళీ కావాలి. ఇదే లక్ష్యంతో వేలాది మంది రైతులకు గతంలో పాలేకర్ గారి ద్వారా శిక్షణ ఇప్పించాం. అదే దీక్షతో ఇప్పుడు దేశీ వరి విత్తనాలను వేలాది మంది రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఔషధ విలువలున్న వరి బియ్యం దైవం మనకిచ్చిన అద్భుత వరం. దేవాలయాల్లో నైవేద్యాలు దేశీ వరి బియ్యంతో పెడితే బాగుంటుంది. ఇందుకోసం యాదాద్రి పరిసరాల్లోని 365 మంది రైతులకు దేశీ వరి విత్తనాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలోనే దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తే.. దైవదర్శనానికి వచ్చిన రైతులకు దేశీ విత్తనాలు ఇస్తుండొచ్చన్నది ఆలోచన. పాలకులు స్పందించాలి. - మేకపోతుల విజయరామ్, సౌభాగ్య గోసదన్, పినగూడూరు లంక (తరకటూరు దగ్గర), గూడూరు మం., కృష్ణా జిల్లా -
భూమాతకు ఎంత కష్టం..!
ప్రకృతి వ్యవస్థలో అతి ముఖ్యమైనది మట్టి..మానవాళి మనుగడకు పునాది నేల తల్లి! భూమిపైన, భూమి లోపల ఉన్న సకల జీవరాశికి ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణ!! ఆహారోత్పత్తి యజ్ఞంలో నిమగ్నమైన అన్నదాతలకు పంట భూమంటే ప్రాణ సమానం. కేవలం దిగుబడులనిచ్చే ఒకానొక వస్తువు మాత్రమే కాదు.. మానవాళి జీవికకే ఆధారభూతమైన నేలతల్లి! కానీ, అన్నపూర్ణ వంటి నేల తల్లికి కష్టకాలం వచ్చింది. పంట భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతోంది. అపసవ్య వ్యవసాయ పద్ధతులతోపాటు అనేక కారణాల వల్ల సాగు భూములు జీవాన్ని కోల్పోయి నాశనమవుతున్నాయి. పంట భూముల్లో సూక్ష్మజీవుల జీవ వైవిధ్యానికి మనుషుల ఆరోగ్యానికి స్పష్టమైన సంబంధం ఉందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహారోత్పత్తులు సూక్ష్మపోషక లోపం లేకుండా ఔషధ విలువలను సంతరించుకోవడానికి కారణం.. పంట భూమిలో సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెంపొందడమే! పంట భూములు దెబ్బతినడానికి ప్రధానంగా రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతులే కారణం. ప్రపంచవ్యాప్తంగా సాగు భూములు 9 రకాలుగా ధ్వంసమవుతున్నాయని, ఈ తొమ్మిది కోణాల్లోనూ సాగు భూముల దుస్థితి భారతదేశంలో ఘోరంగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా నివారణ చర్యలను చేపట్టకపోతే ఆహార భద్రతకే పెనుముప్పు వస్తుందని ప్రపంచ పంట భూముల దినోత్సవం సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. 1 అంతరిస్తున్న సూక్ష్మజీవరాశి జీవజాతుల్లో మూడో వంతుకు మట్టే ఆవాసం. సూక్ష్మజీవులు, వానపాముల వంటి జీవజాతులు అంతరించిపోవడం వల్ల ప్రకృతి సేవలు కుంటుపడుతున్నాయి. సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేయడానికి, పోషకాల పునర్వినియోగానికి విఘాతం కలుగుతోంది. భూతాపం పెరుగుతోంది. భూసారాన్ని పెంపొందించాలన్నా, పంట భూముల ఉత్పాదకతను, వ్యవసాయోత్పత్తుల్లో సూక్ష్మపోషకాలను పెంపొందించాలన్నా పంట భూముల్లో జీవవైవిధ్యాన్ని పెంపొందించక తప్పదు. గ్రామీణ జీవనోపాధులు, పర్యావరణం మెరుగవ్వాలన్నా మట్టిలో సూక్ష్మజీవరాశిని పెంపొందించుకోవడం తప్పనిసరి. 2 క్షీణిస్తున్న సేంద్రియ కర్బనం భూమికి సేంద్రియ కర్బనమే బలం. సేంద్రియ కర్బనం నిల్వ చెట్టూ పుట్టలో, వాతావరణంలో ఉన్న దాని కన్నా ఎక్కువగా భూమిలోనే ఉంది. ఇది నానాటికీ క్షీణిస్తోంది. ఫలితంగా భూసారం తగ్గుతోంది. వాతావరణ మార్పులను నియంత్రించే సామర్థ్యం నశిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మీటరు లోతు మట్టిలో 1,41,700 కోట్ల టన్నుల సేంద్రియ కర్బనం నిల్వలున్నాయని అంచనా. భూ వినియోగ మార్పిడి వల్ల ఈ కర్బనం వాతావరణంలోకి విడుదలవుతోంది. క్రీ. శ. 1850 నుంచి 6,600 టన్నుల సేంద్రియ కర్బనం గాలిలో కలిసి, భూతాపం పెరగడానికి తోడ్పడుతోంది. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి సుస్థిర భూ యాజమాన్య పద్ధతులను అనుసరించక తప్పదు. 3 పోషకాల అసమతుల్యత పంట భూముల్లో పోషకాల సమతుల్యత లోపించింది. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వల్ల నేలలో సూక్ష్మజీవరాశి నశించి.. పంట నేలల ఉత్పాదక శక్తి తగ్గిపోతోంది. సూక్ష్మపోషకాల లోపం ఏర్పడుతోంది. పంట భూమితోపాటు భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. హరిత గృహ వాయువులు వెలువడి భూతాపం పెరుగుతోంది. అవసరం లేని రసాయనిక ఎరువులు వేయడం మానాలి. దీని వల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఆహారోత్పత్తి పెరుగుతుంది. 4 నేలతల్లికి గుండెకోత సాగు భూముల్లో అతిగా దున్నడం వల్ల.. నీరు, గాలి వల్ల భూమి పైపొర చాలా వేగంగా (ఏటా 0.9 మి.మీ.) కొట్టుకుపోతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 వేల నుంచి 3 వేల టన్నుల వరకు మట్టి కొట్టుకుపోతోందని అంచనా. లోతు దుక్కుల వల్ల ఏటా 500 కోట్ల టన్నులు, ఎత్తు గాలుల వల్ల 200 కోట్ల టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఉత్పాదక శక్తి 10% తగ్గుతుంది. తగిన యాజమాన్య చర్యలతోపాటు కందకాలు తవ్వడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. 5 నేల ఆమ్లీకరణ అమ్మోనియం ఎరువులు అతిగా వేయడం, పంట వ్యర్థాలను పొలంలోంచి పూర్తిగా తొలగించడం, ఎడతెగని వర్షాలు, అడవుల నరికివేత.. తదితర కారణాల వల్ల నేలలో ఆమ్ల గుణం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భూమి పైపొర, కింది పొరల్లో మట్టి పి.హెచ్. 5.5 కన్నా తక్కువగా ఉంటే ఆమ్ల స్వభావం ఏర్పడుతుంది. మట్టి పైపొర 30% వరకు, కింది పొర 75% వరకు ఆమ్లీకరణకు గురైనట్లు అంచనా. సుస్థిర భూసంరక్షణ పద్ధతుల ద్వారా, సున్నం వాడటం ద్వారా నేల పి.హెచ్.ను పెంపొందించవచ్చు. 6 చుక్క ఇంకే దారేది? పంట భూములను శాశ్వత నిర్మాణాలు, పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించడం పెరుగుతోంది. ప్రతి నిమిషానికి 42 ఎకరాల పంట భూమిని ఇతర అవసరాలకు మళ్లించి.. కాంక్రీటు నిర్మాణాల ద్వారా నీటి చుక్క భూమిలోకి ఇంకే దారి లేకుండా సీలింగ్ చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణ సేవలకు విఘాతం కలుగుతోంది. 7 చట్టుబడడం పంట ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి బరువైన యంత్రాలు, పశువులు తిరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 4% పంట భూమి చట్టుబండగా మారిందని అంచనా. దీని వల్ల పంట మొక్కల వేళ్లు భూమి లోపలికి చొచ్చుకెళ్లలేవు. దిగుబడి 60% వరకు తగ్గిపోతుంది. వ్యవసాయంలో చీటికి మాటికి యంత్రాలు వాడటం వల్ల 80%, పచ్చిక బయళ్లలో ఎక్కువ సంఖ్యలో పశువులను మేపడం వల్ల 16% నేల చట్టుబడిపోతున్నట్లు అంచనా. నేలను తక్కువగా దున్నటం మంచి పరిష్కారం. దుక్కి తగ్గితే ఖర్చుతోపాటు నీటి సంరక్షణ జరుగుతుంది. సేంద్రియ కర్బనంతో పాటు భూసారం పెరుగుతుంది. 8 కలుషిత వ్యర్థాల కాలుష్యం భార ఖనిజాలు, రసాయనిక పురుగుమందులు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల నేల కలుషితమైపోతోంది. భూమిలో కలిసే కలుషిత వ్యర్థ జలాల వల్ల వ్యవసాయోత్పత్తులు వినియోగ యోగ్యం కాకుండా పోతున్నాయి. పంట దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. 9 చౌడు నష్టం హెక్టారుకు రూ. 30 వేలు నీటిలో కరిగే రసాయనిక ఎరువుల వాడకం వల్ల (పొటాషియం, సల్ఫేట్, కార్బనేట్, బైకార్బనేట్, మెగ్నీషియం, కాల్షియం, క్లోరిన్ వంటి) లవణాలు పంట భూముల్లో పోగుపడుతున్నందున చౌడు సమస్య ఉత్పన్నమవుతోంది. పంటల పెరుగుదల దెబ్బతినడం, దిగుబడులు తగ్గడం.. భూమి ఉత్పాదకత తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారింది. చౌడు బారిన పడిన ప్రతి హెక్టారు పంట భూమికి రూ. 30 వేల మేరకు నష్టం జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. అంచనా వేసింది. చౌడును తట్టుకునే వంగడాలు, సేంద్రియ / ప్రకృతి సేద్యం చేపట్టడం ద్వారా చౌడు సమస్యను అధిగమించవచ్చు. - ‘సాగుబడి’ డెస్క్ -
కాలుష్య నియంత్రణకు సహకరించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సమాజంలోని ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణకు సహకరించాలని కళాజాతా బృందాల కోఆర్డినేటర్ వై.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. డిసెంబర్ 2వ తేదీన నిర్వహించనున్న కాలుష్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ అవెర్నెస్ ఫోకాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణపై కళాజాతా బృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కర్నూలు పట్టణంలోని చెన్నమ్మ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో కళాజాతా బృందం పాటలు, కథలు ద్వారా కాలుష్య నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదని, మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు వై.రమణ, ఎం.విజయకుమార్ పాల్గొన్నారు. -
కూలీల్లేకుండా పన్నెండెకరాల్లో పండ్ల సాగు!
- జీవామృతం, దశపత్ర కషాయాలతోనే సాగు - పనులన్నీ స్వయంగా రైతు సోదరులిద్దరే చేసుకుంటున్న వైనం - ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలకన్నా తక్కువే! -12 ఎకరాల పండ్ల తోట నుంచి ఏటా రూ. 3.25 లక్షల నికరాదాయం రసాయనిక ఎరువులు, పురుగుమందుల పేరిట వేలకు వేలు వెచ్చిస్తూ కూడా.. దిగుబడి లేక, ఆదాయం రాక కుంగిపోతున్న పండ్ల తోటల రైతులకు అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరుల ఉమ్మడి ప్రకృతి సేద్య ప్రస్థానం ఒక చక్కని పాఠం. తోటను అనుదినం కనిపెట్టుకొని ఉండి, స్వయంగా చెమటను చిందిస్తున్నారు. కూలీల అవసరం కూడా లేకుండా రైతు కుటుంబాలు అత్యంత తక్కువ ఖర్చుతో పండ్ల తోటను నిర్వహించడం ఎలాగో వీరు నిరూపిస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ.. మట్టిని నమ్ముకున్న రైతులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పన్నెండెకరాల పండ్ల తోటను నామమాత్రపు ఖర్చుతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొరిపల్లి అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక ఆయన స్వగ్రామం. వీరలంకపల్లి శివారు రామకృష్ణా గార్డెన్స్లో గత పదేళ్లుగా 12 ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. అది తెల్ల గరప భూమి. రెండు బావులు, ఒక బోరు ఉన్నాయి. మొక్కలు నాటిన మొదట్లో నాలుగేళ్లు రసాయనిక సేద్య పద్ధతులను అనుసరించారు. 30 బస్తాల వరకు రసాయనిక ఎరువులు వేసేవారు. రూ. 50 వేల వరకు ఖర్చు చేసి రసాయనిక పురుగుల మందులు చల్లేవారు. అలా కొన్ని మొక్కలు చనిపోవటం, మొక్కల పెరుగుదల నిలిచిపోవటంతో నాలుగేళ్ల తర్వాత అప్పలస్వామి సోదరులు ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. గోమూత్రం, పేడతో వ్యవసాయం చేయడం ఏమిటని చుట్టుపక్కల రైతులు వేళాకోళం చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తొలినాళ్లలో మామిడి, జీడిమామిడి మొక్కలు మాత్రమే ఉన్నాయి. క్రమేణా సపోటా, నారింజ, బత్తాయి, పంపర పనస, పనస, నిమ్మ, దానిమ్మ, జామ, నేరేడు, పైనాపిల్, కొబ్బరి, ఉసిరి, బాదం, సీతాఫలం, రామఫలం, దబ్బ, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పలు పండ్ల జాతులను ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనాలు లేని నేరుడు, తేనె రుచిలో ఉండే కేరళ పనస, కూరల్లో వాడే సదా పనస.. పులుపు, పీచు ఎక్కువగా ఉండే పచ్చడి మామిడి వంటి ప్రత్యేక రకాల పంటలను సైతం సాగు చేస్తున్నారు. ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలు! దాదాపు పన్నెండెకరాల పండ్ల తోటలను ఈ రోజుల్లో నామమాత్రపు ఖర్చుతో సాగు చేయటం అంటే మాటలు కాదు. రసాయన ప్రకృతి సేద్య పద్ధతుల్లో సుదీర్ఘ అనుభవాలతో రాటు తేలిన అప్పలస్వామి సోదరులు ప్రత్యేక పంథాను అనుసరించారు. ప్రకృతి సేద్యం ప్రారంభించినప్పటి నుంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతాన్ని చెట్లకు అందిస్తున్నారు. జీవామృతాన్ని అప్పలస్వామే స్వయంగా తయారు చేస్తారు. తన పొలంలో 200 లీటర్ల సామర్థ్యం గల ఆరు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని.. వాటిల్లో జీవామృతం తయారు చేసుకుంటారు. వారంలో ఆరు రోజులు రోజుకొక డ్రమ్ములోని జీవామృతాన్ని పండ్ల మొక్కలకు పోస్తారు. ఖాళీ అయిన డ్రమ్ములో తిరిగి కొత్తగా జీవామృతం కలుపుతూ ఉంటారు. ఏడాదిలో నికరంగా పది నెలల పాటు చెట్లకు జీవామృతం అందిస్తారు. డ్రమ్ము జీవామృతం తయారీకి పది కిలోల తమ నాటు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రంతోపాటు కిలో బెల్లం, కిలో శనగపిండి వాడతారు. ఏడాదికి 3 క్వింటాళ్ల శనగపిండి అవసరమవుతుంది. రూ. 16,500 ఖర్చవుతుంది. కిలో నల్ల బెల్లం రూ. 15 చొప్పున ఆరు నెలలకు సరిపడా 180 కిలోల బెల్లానికి రూ. 2,500 వరకు ఖర్చవుతుంది. మరో ఆరు నెలలు బెల్లానికి బదులు తోటలో మిగల పండిన మామిడి, సపోటా పండ్లను జీవామృతం తయారీలో వాడతారు. రూ. 3 లక్షలకు పైగా నికరాదాయం... వీరి తోటలో సపోటా, కొబ్బరి, నిమ్మ, మామిడి చెట్ల నుంచి పండ్ల దిగుబడి వస్తోంది. సపోటా కాయ రూ. 5 చొప్పున అమ్ముతున్నారు. ఏడాదికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. కొబ్బరిలో ఏడాదికి రూ. 50 వేల ఆదాయం వస్తోంది. ఎకరాకు 20 మామిడి చెట్లున్నాయి. రసాయన సేద్యంలో పండించిన కాయలు ఒక్కోటి రూ. 15 చొప్పున విక్రయిస్తుండగా ప్రకృతి సేద్యంలో పండించిన వాటిని కాయ రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం లభిస్తోంది. మొత్తం 12 ఎకరాల సాగుకు అయ్యే రూ. 25 వేల ఖర్చు పోను.. రూ. 3.25 లక్షల నికరాదాయాన్ని అప్పలస్వామి ఆర్జిస్తున్నారు. ప్రయాస లేని మార్కెటింగ్.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నాణ్యమైన పండ్లు కావడంతో స్థానికంగానే వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ఇవి రుచి బావుండటం, కాయలు పెద్దగా ఉండటంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. పండ్ల నాణ్యతను గుర్తించిన వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అడపాదడపా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, నిమ్మకాయలను మాత్రం మార్కెట్లో మామూలు కాయలతో పాటే సాధారణ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అప్పలస్వామి తెలిపారు. నిమ్మకాయలు ఇతర పండ్లలా విడిగా రుచి చూసేవి కాకపోవటంతో.. ఆర్గానిక్ అన్నా ప్రత్యేకంగా కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని ఆయన చెప్పారు. ఆ క్షేత్రం.. ప్రయోగాలకు ఆలవాలం.. మామిడి మొక్కలు గుప్పెడు లావు వూరే వరకు కర్రతో ఊతం ఏర్పాటు చేశారు. మామిడి చెట్టుకు కొమ్మలు అస్తవ్యస్తంగా పెరగనిస్తే.. చెట్టు కాండం లావు వూరదు. దీన్ని నివారించేందుకు ఐదడుగుల మేర ఎలాంటి కొమ్మలు ఉంచరు. యాభై ఏళ్లు పెరిగిన మామిడి చెట్టును అమ్ముకుంటే.. కలప ద్వారానే రైతుకు రూ. లక్ష ఆదాయం వస్తుందని అప్పలస్వామి చెప్పారు. ఈ తోటలో 20 ఏళ్ల పనస చెట్టుకు నాలుగేళ్ల నుంచి కాపు పూర్తిగా నిలిచిపోయింది. చెట్టును నరికివేయాలనుకున్న పరిస్థితుల్లో స్నేహితుడి సూచన మేరకు.. ఇసుక నింపిన 5 బస్తాలను చెట్టు కొమ్మలపై ఉంచారు. దాంతో కాపు వచ్చి 13 కాయలు కాశాయి. ఈ ఏడాది దీనిపై మరింత పరిశోధన చేయనున్నట్టు ఆయన తెలిపారు. తోటలో ప్రత్యేకంగా పెంచిన గిరిపుష్పం (గ్లైరీసీడియా) చెట్ల కొమ్మలను నరికి చెట్ల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తారు. దీనివల్ల పాదుల్లో తేమ నిల్వ ఉంటుంది. నత్రజని తదితర పోషకాలతో కూడిన ఆకులు భూమిలో కలిసిపోయి భూసారాన్ని పెంపొందిస్తాయి. తన ఆవులు, గిత్తలను రోజుకో చెట్టుకు చొప్పున కట్టేసి ఉంచుతారు. వాటి పేడ, మూత్రం పాదుల్లో పడి చెట్లకు మంచి ఎరువుగా ఉపయోగపడుతున్నది. ఈ పద్ధతిని అనుసరిస్తున్నందు వల్ల పండ్ల చెట్లకు ప్రత్యేకంగా ఘన జీవామృతం తయారు చేసి వేయాల్సిన అవసరం లేదని అప్పలస్వామి చెప్పారు. సూక్ష్మజీవుల కోసం శాస్త్రీయ సంగీతం..! భూమికీ ప్రాణం ఉంటుంది. సుఖం, దుఃఖం, సంతోషం, బాధ వంటి భావోద్వేగాలుంటాయన్నది అప్పలస్వామి ప్రగాఢ నమ్మకం. పొలంలో మైక్ ఏర్పాటు చేసి ప్రవచనాలు, భగవద్గీత, శాస్త్రీయ సంగీతాన్ని వినిపిస్తున్నారు. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిలో జీవం తొణికిసలాడుతుందని ఆయన అంటారు. తద్వారా పంట దిగుబడులు కూడా పెరుగుతున్నాయంటారు అప్పలస్వామి. చినజీయర్స్వామి, ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వ సలహాదారు పి.విజయ్కుమార్, అప్పలస్వామి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై నెల్లూరు, తిరుపతికి చెందిన రైతులకు ఈ తోటలో శిక్షణ ఇవ్వడం విశేషం. - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఇన్పుట్స్: కోన శ్రీనివాస్, సాక్షి, గోకవరం, తూ. గో. జిల్లా అతి తక్కువ ఖర్చు ఇలా సాధ్యం.. ఏడాదికి పదిసార్లు జీవామృతం, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తారు. విడతకు 5 లీటర్ల చొప్పున ఏడాదికి 50 లీటర్ల పెట్రోలుకు గాను రూ. 3,500 ఖర్చవుతుంది. శనగపిండి, బెల్లం, పెట్రోల్ అన్నింటికీ కలిపి పన్నెండెకరాల పండ్ల తోటకు ఏడాదికి రూ. 22,500 ఖర్చవుతుంది. అంటే ఏడాది సాగు ఖర్చు ఎకరాకు రూ. 2 వేల క న్నా తక్కువేనన్నమాట! ఒక మనిషి రోజుకొక టీ తాగడానికి ఏడాదికి హీన పక్షం రూ. 2 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో సాగు వ్యయాన్ని ఒడుపుగా తగ్గిస్తూ పన్నెండెకరాల్లో పండ్ల తోటలను అప్పలస్వామి సోదరులు పొందికగా సాగు చేస్తుండడం విశేషం. మొక్కల వయసును బట్టి చెట్టుకు 5-10 లీటర్ల చొప్పున జీవామృతం పోస్తారు. ఇలా 12 ఎకరాల తోటలోని మొక్కలన్నింటికి ఒక విడత జీవామృతం పోయటానికి నెల సమయం పడుతుంది. రసాయన సేద్యంలో ఎంత లేదన్నా ఎకరాకు ఎరువులు, పురుగుమందులకు ఏడాదికి రూ. 10 వేలకు తక్కువ ఖర్చు కాదు. జీవామృతం తయారీకి అవసరమైన గట్టు మన్ను, ఆవు పేడ, మూత్రం పొలంలోనే లభిస్తాయి. 50 కిలోల బెల్లం, శనగ పిండిని కొనుగోలు చేస్తారు. నాణ్యమైన శనగ పిండి కోసం శనగపప్పును కొని మర పట్టిస్తారు. విడతకు ఎకరాకు చీడపీడల నివారణకు 200 లీటర్ల జీవామృతం, 10 లీటర్ల గో మూత్రం, 5 లీటర్ల దశపత్ర కషాయం కలిపి... చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేస్తారు. చెట్లు పూత, కాత మీదున్నప్పుడు 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం చీడపీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే పిచికారీ చేస్తారు. తోటలో ఏ పనైనా స్వయంగానే.. జీవామృతం మొక్కలకు బకెట్లతో స్వయంగా అప్పలస్వామే పోస్తారు. పిచికారీ కూడా స్వయంగా తానే చేస్తారు. పొలానికి నీరు పారగట్టటం, కాయలు కోయటం, కషాయాల తయారీ వంటి పనులను తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి స్వయంగా చేసుకుంటారు. కూలీలను పెట్టరు. మరీ అవసరమైతే ఇంటి ఆడోళ్లు పనుల్లో సహాయ పడతారని అప్పలస్వామి తెలిపారు. ఉచిత విద్యుత్ కావటంతో కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు. పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు. పెరిగిన గడ్డిని ఎప్పటికప్పుడు ఆవులు మేసేస్తుంటాయి. దీంతో దుక్కికి అయ్యే ట్రాక్టర్ / అరకల ఖర్చు తప్పింది. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో పండ్ల దిగుబడి, రుచి పెరిగింది! రసాయన సేద్యంలో కన్నా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టాకే దిగుబడితో పాటు కాయల రుచి పెరిగింది. ఖర్చు పెద్దగా లేదు. రసాయన వ్యవసాయంలో వచ్చే పంట ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆసుపత్రులు, వైద్యులు డబ్బుగడిస్తున్నారు. ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తే రైతు కుటుంబాలకు, ప్రజలకు హాస్పిటళ్ల గుమ్మం తొక్కే అవసరం ఉండదు. రసాయనాలతో పండించిన ఆహారం తిన్న మనిషిలాగే చెట్లకు కూడా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల జబ్బు చేస్తుంది. కానీ, చెట్లు చెప్పలేవు.. మనిషి చెపుతాడు.. అంతే తేడా! - కొరుపల్లి అప్పలస్వామి (96661 50374) ప్రకృతి వ్యవసాయదారుడు, వెదురుపాక, గోకవరం మండలం, తూ.గో. జిల్లా -
రేపటి నుంచి ప్రకృతివ్యవసాయంపై శిక్షణ
- 13 జిల్లాల అధికారులకు రెండు రోజుల శిక్షణ తరగతులు కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 23, 24 తేదీల్లో మండల కేంద్రమైన ఓర్వకల్లు రాష్ట్రంలోని 13 జిల్లాల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శిక్షణకు 13 జిల్లాల ప్రకృతి వ్యవసాయం డీపీఎంలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిద జిల్లాల వ్యవసాయాధికారులకు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ సలహాదారు విజయకుమార్ తదితరులు పాల్గొని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారని తెలిపారు. -
ప్రకృతి సేద్యంలో మా‘స్టారు’!
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ప్రకృతి సేద్యం ఐదెకరాల్లో వరి సాగు ఆయనో స్కూల్ మాస్టార్. బడిలో పాఠాలతో పాటు సేద్యంపై ఉన్న ప్రేమ ఆయన్ను పొలం బాట పట్టేలా చేసింది. బస్తాల కొద్దీ రసాయన ఎరువులు, డబ్బాల కొద్ది పురుగుమందులతో చేసిన సేద్యం చివరకు అప్పులనే మిగిల్చింది. శ్రమే తప్ప రూపాయి ఆదాయం వచ్చింది లేదు. ఇంక వ్యవసాయం మానేద్దామని నిశ్చయించుకున్న పరిస్థితుల్లో సుభాష్ పాలేకర్ శిక్షణకు హాజరవ్వటంతో ఆయన పంట పండింది. ఆ స్కూల్ మాస్టార్ వేముల ప్రభాకర్ రెడ్డి(98667 87125). జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామం. ప్రభాకర్ రెడ్డి బీఏ, బీఈడీ చదివారు. వ్యవసాయంపై ఉన్న శ్రద్దతో డిగ్రీ చదివే వయస్సులోనే కౌలు సేద్యం చేసేవారు. 1998లో టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వ్యవసాయంపై ఆసక్తి తగ్గలేదు. వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమిలో మామిడి తోట సాగు చేసేవారు. గుట్టలు, రాళ్లతో ఉన్న మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దారు. పది ఎకరాల్లో వరి పొలం సాగు చేసేవారు. రసాయన సేద్యంలో ఎన్ని మందుకట్టలేసినా పంట దిగుబడి అంతంతమాత్రంగా ఉండేది. ఏనాడూ పెద్దగా లాభపడింది లేదు. ఖర్చులు తిరిగిరాక పోగా జీతం డబ్బులు ఖర్చయ్యేవి. దీనికి తోడు, సక్కగా టీచర్ ఉద్యోగం చేసుకోక, వ్యవసాయం చేస్తున్నవా..అని గ్రామంలోని రైతులు దెప్పిపొడిచేవారు. ‘సాగుబడి’ కథనాల స్ఫూర్తితో... ఇక వ్యవసాయం లాభం లేదనుకుని మానేద్దామనుకున్న తరుణంలో సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, శిక్షణకు హాజరయ్యారు. దీనికి తోడు సాక్షి దినపత్రిక ‘సాగుబడి’లో వచ్చే కథనాలను చదవడం ప్రారంభించారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రకృతి సేద్యంలో ఐదెకరాల్లో జై శ్రీరాం రకాన్ని సాగు చేశారు. బీజామృతంతో విత్తన శుద్ది చేశారు. చివరి దుక్కిలో ఎకరానికి రెండు క్వింటాళ్ల ఘన జీవామృతాన్ని వేశారు. నీటిద్వారా పదిరోజులకోసారి జీవామృతాన్ని అందించారు. నెల రోజులకు క్వింటా ఘన జీవామృతాన్ని పొలంలో చల్లారు. చీడపీడల నివారణకు ముందు జాగ్రత్తగా దశపత్ర కషాయాన్ని లీటరుకు 10 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేశారు. నాట్లు, జీవామృతం తయారీ, కలుపు కూలీలకు ఎకరాకు రూ. 9 వేలు మాత్రమే ఖర్చయింది. మరో 15 రోజుల్లో పంట నూర్పిడి చేయనున్నారు. 22-23 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని ప్రభాకర్ రెడ్డి ఆశిస్తున్నారు. - పన్నాల కమలాకర్రెడ్డి, జగిత్యాల, సాక్షి రైతుదే పైచేయి కావాలి..! రసాయన ఎరువులు, పురుగుమందులు లేని ఉత్పత్తులను పండించాలనేది నా ఆశయం. అలాగే పంట కొనేందుకు వినియోగదారులు, వ్యాపారులు రైతు దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలి. రైతుదే పైచేయి కావాలి. అది ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. పండించిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చి నేరుగా వినియోగదారులకే విక్రయిస్తా. - వేముల ప్రభాకర్రెడ్డి (98667 87125), తీగల ధర్మారం, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా 20న ప్రకృతి వ్యవసాయంలో పత్తి, మిరప సస్యరక్షణపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో పత్తి, మిరప పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణ పద్ధతులపై రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 20న శిక్షణ కార్యక్రమం జరగనుంది. మహబూబ్నగర్, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులు లావణ్య రెడ్డి, నార్నె హనుమంతరావు రైతులకు శిక్షణ ఇస్తారు. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర గల కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో ఉదయం 9:30 నుంచి శిక్షణ ఉంటుంది. పేర్ల నమోదు కోసం 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ప్రకృతి సేద్య ప్రసాదం!
- 21 ఎకరాల్లో పాలేకర్ పద్ధతుల్లో మామిడి, వరి, కూరగాయల సాగు - కృష్ణా జిల్లాలో సాగు.. హైదరాబాద్లో అమ్మకం - నేరుగా వినియోగదారులకు విక్రయంతో పెరిగిన నికరాదాయం - వరిలో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం - మామిడిలో కూరగాయల సాగుతో ఎకరాకు రూ. 75 వేల నికరాదాయం హైదరాబాద్లో సొంత వ్యాపారంలో స్థిరపడిన శేషసాయి వరప్రసాద్ జీవితాన్ని పాలేకర్ శిక్షణ మలుపుతిప్పింది. ఆ ప్రేరణతో నడి వయసులో పొలం బాట పట్టారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, పండ్లు, వరిని పండిస్తూ.. నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక నికరాదాయం గడిస్తున్నారు. వందల కి.మీ. దూరంలో ఉన్న తన పొలానికి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తుండడం విశేషం. సొంత గ్రామానికి దూరంగా నివసిస్తున్నా ప్రకృతి సేద్యం చేస్తూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్కి చెందిన శేషసాయి వరప్రసాద్. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం బూరుగుగూడెం ఆయన స్వగ్రామం. 1985లో డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి పదేళ్లపాటు క్యాటరింగ్ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత నాగోలులో సొంతంగా క్యాటరింగ్ సంస్థను ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. గ్రామంలో ఉన్న 21 ఎకరాల మామిడి తోటను కౌలుకు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ద్వారా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి చదివి 2008లో శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. ఆ విధంగా ప్రసాద్ మనసు ప్రకృతి సేద్యం వైపు మళ్లింది. 2009 నుంచి తన తోటను కౌలుకు ఇవ్వటం మానేసి.. సొంతంగా తానే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వ్యాపారస్తులకు మామిడి పంటను అమ్మితే వారు దిగుబడి కోసం విచ్చలవిడిగా పూత, పురుగు నివారణ కోసం మందులు పిచికారీ చేసేవారు. దీంతో తోటలు దెబ్బతిని.. రైతులు మామిడి తోటలను తొలగించారు. ప్రసాద్ కూడా ఆరెకరాల్లో చెట్లను తొలగించి.. మూడెకరాల్లో కూరగాయలు, మూడెకరాల్లో వరిని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేపట్టారు. ప్రకృతి వ్యవసాయంలో ఒక వ్యక్తికి తానే శిక్షణ ఇచ్చి పొలంలో సూపర్వైజర్గా నియమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఎర్రనేల, బోర్లపైనే వ్యవసాయం. తొలి దశలో దిగుబడులు తగ్గినా తదనంతరం మంచి దిగుబడులు వస్తున్నాయి. కూరగాయల సాగులో అధిక నికరాదాయం తొలి రెండేళ్లు పసుపును ప్రకృతి సేద్యంలో సాగు చేశారు. ఆదాయం కోసం పది నెలలు వేచి చూడాల్సి రావడంతో.. కూరగాయల సాగును చేపట్టారు. మూడెకరాల్లో వంగ, బెండ, టమాటా, దొండ, కాకర, వంకాయ, మునగ, మిర్చి, పొట్ల, బీర, దోసతోపాటు గోంగూర, తోటకూరలను సాగు చేస్తున్నారు. ఇదీ ఆయన సాగు పద్ధతి.. భూమిని పైపైన దున్ని ట్రక్కు మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని ఐదు మడులుగా విభజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు కొన్ని సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయలు వాడుతున్నారు. పురుగును గుడ్డు దశలోనే నివారించేందుకు నీమాస్త్రం వాడతారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేశారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీ. కషాయాన్ని 200 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతాయి. కిలో రూ. 20-30 చొప్పున విక్రయిస్తారు. నీటి కొరత వల్ల కూరగాయలు ఏడాదికి ఒకటే పంట వేస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేలు ఖర్చవుతాయి. ఖర్చులు పోను రూ. 75 వేల నికరాదాయం లభిస్తున్నది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రసాద్ తెలిపారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పోల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగేది.. ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్లను హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. కూరగాయలు రుచికరంగా ఉండటం, ఫ్రిజ్లో పెట్టకున్నా మూడు రోజులు తాజాగా ఉండటంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఫోన్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. వరి.. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం ప్రసాద్ తన పొలంలో బీపీటీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. దమ్ములో ఎకరాకు ట్రక్కు ఆవు పేడ వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని 15 రోజులకోసారి నీటి ద్వారా అందిస్తారు. రెండు వారాలకోసారి చీడపీడల నివారణకు బ్రహ్మస్త్రం,అగ్ని అస్త్రం వంటి కషాయాలు పిచికారీ చేస్తారు. ప్రకృతి సేద్యంలో తొలి ఏడాది 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో సాటి రైతులు అవహేళన చేశారు. అయినా.. ఆయన తన పని తాను కొనసాగించారు. గతేడాది ఎకరాకు 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రసాద్ ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తారు. బస్తా ధాన్యం మరపట్టిస్తే 55 కిలోల ముడి బియ్యం వస్తాయి. కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఆయన దగ్గర బియ్యం కొనే వారిలో కనీసం 50 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. ఖర్చులు పోను ఎకరాకు రూ. లక్ష నికరాదాయం వస్తున్నదని ఆయన తెలిపారు. ఖర్చు రూ. 3 వేలు.. ఆదాయం రూ. 60 వేలు 15 ఎకరాల మామిడి తోటలో 300 చెట్లున్నాయి. ఇవి 30 ఏళ్ల నాడు నాటినవి. రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 48 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదు లీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ ట్రాక్టరుతో దున్నుతారు. పూత దశలో బ్రహ్మస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందె దశలో, పురుగు దశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో గతేడాది సగం దిగుబడే వచ్చింది. రసాయనిక సేద్యంలో ఎరువులు, పురుగు మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు మించి ఖర్చు కాదు. పండ్లకు మంచి ధర వస్తుంది. అయితే, చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండు రెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చు అంటారాయన. మామిడి పండ్లను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి, నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో పెట్టెలో 30 కాయలుంటాయి. పెట్టె రూ. 400 చొప్పున విక్రయిస్తారు. గతేడాది ఎకరాకు 150 పెట్టెల దిగుబడి వచ్చింది. రూ. 60 వేల చొప్పున పదిహేనెకరాల్లో రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. మామిడి చెట్ల మధ్య ఖాళీగా ఉండే భూమిలో స్థంభాలను పాతించి.. గుమ్మడి, బూడిద గుమ్మడి, పొట్ల, బీర, ఆనప వంటి తీగజాతి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఎకరాకు రూ. 30 వేల ఆదాయం పొందుతున్నారు. ‘పంతులు హైదారబాద్ నుంచి వచ్చి పిచ్చి వ్యవసాయం చేస్తున్నాడ’ని సాటి రైతులు తొలినాళ్లలో ఎగతాళి చేసేవారని, ఇప్పుడు వారే ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొస్తున్నారని ప్రసాద్ సంతృప్తిగా చెప్పారు. ఆయన తన తోటలో 26 నాటు ఆవులను పెంచుతున్నారు. ఆరుగురు రైతులకు ఆవుపేడ, మూత్రాన్ని ఉచితంగా ఇస్తూ.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తుండడం విశేషం. కథనం : సాగుబడి డెస్క్ ఇన్పుట్స్ : కొమ్ము అర్జునరావు, సాక్షి, చాట్రాయి, కృష్ణా జిల్లా ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదు! హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ‘హరిత విప్లవం’తో ఆర్థికాభివృద్ధి సాధించాయని చదివి స్ఫూర్తిపొందేవాళ్లం. వరిలో ఎకరాకు 50-60 బస్తాల దిగుబడి అంటే అబ్బురపడేవాళ్లం. కానీ.. ఇప్పుడక్కడ దిగుబడులూ తగ్గాయి. కేన్సర్ రోగుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాల్సి వస్తున్నది. కేవలం డబ్బుంటే సరిపోతుందా.. మనిషి బ్రతకటానికి..? కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే సంపాదించిన రూపాయికి అర్థం లేదు. ప్రతి రైతూ తన కుటుంబం కోసం ఎకరంలో విధిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆరోగ్యంగా జీవించాలి. ప్రకృతి సేద్యం ద్వారా ఐదారు రకాల కూరగాయలు పండించి, మంచి ధరకు అమ్ముకుంటే.. నెలకు ఎకరానికి రూ. 50 వేల వరకూ నికరాదాయం పొందవచ్చు. అంతేకాదు.. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మాదిరిగా వ్యవసాయదారులు కూడా వారాంతపు సెలవులు తీసుకోవచ్చు. - పెండ్యాల శేషసాయి వరప్రసాద్ (98480 23143), బూరుగుగూడెం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా -
పిడుగు పడి మహిళ దుర్మరణం
లింగపాలెం : పిడుగు పడి ఓమహిళ దుర్మరణం పాలైంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం లింగపాలెం మండలం వేములపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కనిపెడ శ్యామల(29), మాదాసు రాధ, నత్తా అనురాధ ఆదివారం పొలంలో కూలి పనికి వెళ్లారు. పనిచేస్తుండగా వర్షం పడటంతో చెట్టు పక్కకు వెళ్లి నిలబడ్డారు. సమీపంలో పిడుగు పడడంతో శ్యామల అక్కడికక్కడే మృతి చెందింది. రాధ, అనురాధ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థాని కులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రకృతి సేద్యం సామాజిక బాధ్యత!
- తండ్రి మరణంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం చేపట్టిన ఇంజినీర్ - వర్షాధారంగా మిశ్రమ సాగు - రైతుల సహకార సంఘం ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయం - అధిక నికరాదాయంతో ఆర్థిక భద్రత తండ్రి కేన్సర్తో మరణించటం ఆ యువకుడిని కుంగదీసింది. వైద్యానికిరూ. లక్షలు ఖర్చు పెట్టినా తండ్రి దక్కలేదు. తండ్రిని పొట్టనబెట్టుకున్నది రసాయనిక ఎరువులు, పురుగుమందులతో తాము పండించి, తింటున్న ఆహారోత్పత్తులేనన్న భావన తీవ్రంగా ఆలోచింపజేసింది. అలా మేల్కొన్న ఎరుకతో ఉద్యోగాన్ని వదిలేసి.. తమ 15 ఎకరాల పొలంలో ప్రకృతి సేద్యం చేపట్టాడు. వర్షాధారంగా మెట్ట పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. వాతావరణ మార్పులకు తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం నికరాదాయం పెంచుకోవడానికి మాత్రమే కాదని, ఇది యువ రైతుగా తన సామాజిక బాధ్యత కూడా అని ఎలుగెత్తి చాటుతున్నాడు! అరకొర వర్షాలతోనే ప్రకృతి సేద్యం చేస్తూ తన 15 ఎకరాల మెట్ట పొలాన్ని అక్షయపాత్రగా మార్చుకున్నారు ఏదుల గోపీనాథ్ రెడ్డి (32). కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, ఉప్పలపాడు ఆయన స్వగ్రామం. గోపీనాథ్ రెడ్డి 2006లో ఎలక్ట్రానిక్స్లో బీటెక్ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకులో ఫీల్డ్ అసిస్టెంట్గా, పైపుల ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేశారు. 2009లో తండ్రి కేన్సర్తో మరణించటంతో విద్యావంతుడైన గోపీనాథ్లో అంతర్మథనం ప్రారంభమైంది. రసాయన సేద్యం వల్లనే ఇంటిపెద్ద దిక్కును కోల్పోయామనే ఆలోచన ఆయన మనసును మెలిపెట్టింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకెవరిని కోల్పోవాల్సివస్తుందోననే ఆందోళన ప్రారంభమైంది. ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గాల కోసం వెతుకుతున్న క్రమంలో 2013లో పాలేకర్ రెండు రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో తను ఎంచుకోవలసిన మార్గం కళ్లముందే మెదిలినట్లైంది. ప్రకృతి వ్యవసాయం చేపడితే భవిష్యత్ బాగుంటుందని అనిపించింది. ఉద్యోగాన్ని వదలి పొలం బాట పట్టారు. 2013లో తొలిసారిగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 10 ఆవులు, 2 ఎద్దులు కొనుగోలు చేశారు. ముగ్గురు జీతగాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా గిరాకీ ఉండి తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగుకు ఎంచుకున్నారు. ఆ ఏడాది కురిసిన రెండు వర్షాలతోనే ఎకరాలో 15 క్వింటాళ్ల పసుపు, కంది 3, శనగ 3, వేరుశనగ 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. వరిలో 12 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తం 8 ఎకరాల సాగుకు రూ. లక్ష ఖర్చయింది. రూ.1. 50 లక్షల ఆదాయం రాగా రూ. 50 వేల నికరాదాయం లభించింది. రెండో ఏడాదికి రెట్టింపు ఆదాయం.. 2014లో పదెకరాల్లో ప్రకృతి సాగును చేపట్టారు. ఎకరాకు పసుపులో 9 క్వింటాళ్లు, కంది 4, మహేంద్ర జొన్న 11, శనగలు 4, వరి 14 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఆ ఏడాది 10 ఎకరాల సాగుకు రూ. 1.20 లక్షలు ఖర్చవ్వగా రూ. 2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోనూ రూ. 1.30 లక్షల నికరాదాయం లభించింది. 2015లో మొత్తం 15 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేశారు. ఎకరాకు పచ్చజొన్న 10 క్వింటాళ్లు, తెల్లజొన్న 6 , కందులు 2, ఊదలు 5 , రాగులు 6, ధనియాలు 5 , శనగలు 3, సజ్జలు 9, చిక్కుడు 1, పచ్చజొన్న 10, తెల్లజొన్న 6 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. వరిలో 15 బస్తాల దిగుబడి వచ్చింది. 15 ఎకరాల సాగుకు ఖర్చు రూ. 1.40 లక్షలు కాగా 2.90 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోనూ రూ. 1.50 లక్షల నికరాదాయం లభించింది. ఈ ఏడాది ఎకరాకు రూ. 25 వేలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని ఆశిస్తున్నారు. మెట్ట భూముల్లో అంతర పంటలతో రైతు ఆదాయానికి హామీ మెట్ట భూముల్లో అంతర పంటల సాగు వల్ల పలు రకాల ప్రయోజనాలున్నాయంటారు గోపీనాథ్రెడ్డి. రాగులు, ఊదలు, కొర్రలు, జొన్నలను ఆయన అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు వెంటనే తేమ ఆవిరవ్వకుండా అంతర పంటలు కాపాడతాయి. గాలిలోనూ తేమను నిలుపుతాయి. అంతర పంటల వ్యర్థాలు ఎరువుగా ఉపయోగపడతాయి. భూమిలో వానపాముల సంఖ్య పెరుగుతుంది. మొక్కలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. ముఖ్యంగా రసాయన సేద్యంలో వాడే నీటిలో 10-20 శాతం నీటితోనే ఈ విధానంలో పంటలను సాగు చేయవచ్చంటారాయన. నీటి అవసరం తగ్గటం వల్ల విద్యుత్ ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. ఆఖరు దుక్కిలో ఎకరాకు 2 క్వింటాళ్లు, పైరు పూత దశలో క్వింటాల్ చొప్పున ఘనజీవామృతం వేస్తారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తారు. దీనివల్ల మొలక త్వరగా రావటంతో పాటు మొలక శాతం పెరుగుతుంది. తొలినాళ్లలో ఆశించే చీడపీడలు, తెగుళ్లను మొక్కలు తట్టుకుంటాయి. ప్రతి పదిహేను రోజులకోసారి పైరుపై జీవామృతాన్ని పిచికారీ చేస్తారు. గింజ పాలుపోసుకునే దశలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారీ చేస్తారు. దోమను నివారించేందుకు నీమాస్త్రం, పురుగులను నివారించేందుకు అగ్నాస్త్రం.. కాండం, కాయతొలిచే పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. సహకార సంఘం ద్వారా ఉత్పత్తుల అమ్మకం.. పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించుకుంటేనే రైతుకు ప్రయోజనం అంటారు గోపినాథ్రెడ్డి. కందులు మార్కెట్లో విక్రయిస్తే క్వింటాల్ రూ. 5 వేలు. అదే పప్పుగా మార్చి అమ్మితే క్వింటాల్కు రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. ఇది రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మరో ఆదాయ వనరు రైతుకు లభించినట్టే అని అంటారు గోపీనాథ్రెడ్డి. దీనికోసం ప్రకృతి సేద్యం చేసే రైతులతో కలసి ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహాయ సహకార సంఘం’ను ఏర్పాటు చేశారు. పండించిన పంట ఉత్పత్తులను ఈ పేరుతోనే కర్నూలు సంతలో నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. రుచి నాణ్యత వల్ల వారి ఉత్పత్తులకు వినియోగదారుల ఆదరణ లభిస్తోందని గోపీనాథ్రెడ్డి తెలిపారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న గోపీనాథ్రెడ్డిని రైతు నేస్తం, భారతీయ కిసాన్ సంఘ్ ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించాయి. - గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు జిల్లా సొంత విత్తనంతో మేలు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే విత్తనం దగ్గర మోసం జరుగకూడదంటారు గోపీనాథ్ రెడ్డి. సంప్రదాయ వంగడాలనే గోపీనాథ్ సాగులో వాడుతున్నారు. కొన్ని రకాల దేశీ వంగడాలను దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి తెచ్చారు. ప్రస్తుతం తాను పండించిన పంట నుంచే విత్తనోత్పత్తి చేసి తరువాతి పంటలో వాడుతున్నారు. విత్తనోత్పత్తి కోసం కొన్ని ప్రత్యేక లక్షణాలతో ఉన్న చెట్లను ఎంపిక చేసుకుంటారు. పెద్ద ఆకులతో చెట్టు గుబురుగా ఉండాలి. మరీ ఎత్తుగాను మరీ పొట్టిగాను ఉండకూడదు. కాయలు జంపు ఉండాలి. చెట్టుకు చీడపీడలు ఆశించకూడదు. అలాంటి చెట్లను ఎకరాకు 50 వర కు ఎంపిక చేసి ఎరుపు రంగు రిబ్బెన్ కడతారు. పంట కోతకు రెండు రోజులు ముందుగానే వీటిని సేకరించి నీడకింద ఆరబెట్టి విత్తనాన్ని తయారుచేసుకొని నిల్వ చేసుకుంటారు. ఖర్చు తక్కువ.. నికరాదాయం ఎక్కువ! రసాయన సేద్యంలో కంపెనీ విత్తనాలు కొనాలి. పురుగు కనపడితే కొట్టుకెళ్లి పురుగుమందులు తెచ్చి పిచికారీ చేయాలి. అయినా చావకపోతే మందు మార్చాలి. ఒక్కటే పంటను సాగు చేస్తారు. అది పోతే ఆదాయం మొత్తం పోయినట్టే. పంటను వ్యాపారులు చెప్పిన ధరకు విక్రయించాలి. ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ. కానీ ప్రకృతి సేద్యం దీనికి పూర్తిగా భిన్నమైనది. దిగుబడి తక్కువ వ చ్చినా రైతుకు నికరాదాయం పెరుగుతుంది. అంతరపంటల ద్వారా ఖచ్చితమైన ఆదాయం లభిస్తుంది. ప్రకృతి సేద్యంలో రైతు సొంత విత్తనం వాడతాడు. తన పంటకు తనే ధర నిర్ణయిస్తాడు. ప్రకృతి సేద్యంతో రైతుకు ఇతరులపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. ఖర్చు తక్కువ నికరాదాయం ఎక్కువ. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అందుకే నా దృష్టిలో ప్రకృతి వ్యవసాయం అనేది కేవలం నా జీవనాధారం కోసం మాత్రమే కాదు.. నేను పండిస్తున్న అమృతాహారం ద్వారా సమాజం కూడా బావుంటుంది. దీనివల్ల నా వంతు సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్న తృప్తి నాకుంది. - ఏదుల గోపీనాథ్రెడ్డి (98859 79659), ఉప్పలపాడు, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా -
ఉపవాస దీక్ష వల్ల ఆరాధాన మరణించలేదు
-
డార్వినిజం ప్రకృతి వరణ సిద్ధాంతం
ప్రకృతిలో పరిణామం సంభవించిన తీరు, కొత్త జాతులు ఆవిర్భవించిన విధానాన్ని డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం వివరిస్తుంది. డార్విన్ ప్రకారం.. జీవ పరిణామం అనేది హఠాత్తుగా జరగదు. ఇది క్రమేణా సంభవించే జీవ ప్రక్రియ. డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం ప్రకారం... ప్రకృతి, వైవిధ్యాలను కలిగించదు. ఉపయోగకరమైన వైవిధ్యాలతో ఉన్న జీవులను మాత్రం ప్రకృతి ఎన్నుకుంటుంది (నేచురల్ సెలక్షన్). చార్లెస్ రాబర్ట డార్విన్ (బ్రిటన్ ప్రకృతి శాస్త్రవేత్త. 1809, ఫిబ్రవరి 12న ఇంగ్లండ్లోని ష్రూస్బరిలో జన్మించాడు. డార్విన్ తన 22వ ఏట ఐదు సంవత్సరాల (1831-1835) పాటు హెచ్.ఎం.ఎస్. బీగల్ అనే బ్రిటిష్ నౌకపై ప్రయాణిస్తూ అట్లాంటిక్, దక్షిణ అమెరికా, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల్లో గలవృక్ష-జంతు జాలాన్ని పరిశీలించాడు. దక్షిణ పసిఫిక్లోని గాలపాగోస్ ద్వీపంలోగల ఫించ్ పక్షుల ముక్కుల నిర్మాణంలో స్వల్ప వైవిధ్యాలను గమనించాడు. ఫించ్ పక్షులపై అధ్యయనం చేసి, వైవిధ్యాల ఆధారంగా జీవజాతులు శాశ్వతమైనవి కావని, అవి ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతాయని తెలిపాడు. థామస్ మాల్థూస్, చార్లెస్ లయల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రాసిన ప్రఖ్యాత రచనలు.. డార్విన్కు గొప్ప జీవ పరిణామ శాస్త్రవేత్తగా గుర్తింపు తీసుకొచ్చాయి. థామస్ మాల్థూస్ జనాభాల మీద రాసిన వ్యాసం - యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సపల్ ఆఫ్ పాపులేషన్. ఈ వ్యాసం ప్రకారం జనాభా గుణ శ్రేణి (జ్యామితీయ రీతి)లో పెరుగుతుంటే (1, 2, 4, 8, 16....), వాటి ఆహార అవసరాలు అంకశ్రేఢిలో పెరుగుతాయి (1, 2, 3, 4, .....). అంటే ఆహారం, నివాసం పెరగవని అర్థం. చార్లెస్ లయల్ రచించిన గ్రంథం.. ‘ప్రిన్సపల్స్ ఆఫ్ జియాలజీ’లో భౌగోళిక మార్పులు నెమ్మదిగా, క్రమబద్ధంగా జరుగుతాయని ప్రతిపాదించాడు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలిసారి శాస్త్రీయంగా, సరైన ఆధారాలతో ప్రతిపాదించింది - చార్లెస్ డార్విన్. అందువల్లే డార్విన్ను జీవ పరిణామ పితామహుడు (ఫాదర్ ఆఫ్ ది ఎవల్యూషన్)గా పేర్కొంటారు. ఇదే కాలంలో ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్.. మలయా ఆర్చిపెలాగోలోని జంతు, వృక్ష జాతులను పరిశీలించి, డార్విన్లాగే స్వతంత్రంగా ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి.. తన పరిశీలనలను డార్విన్కు పంపాడు. కాబట్టి వాస్తవంగా ప్రకృతి వరణాన్ని వాలెస్, డార్విన్లు ప్రతిపాదించారని చెప్పవచ్చు. అయితే వాలెస్ కంటే ఎక్కువ నిరూపణలను లండన్ లిన్నేయస్ సొసైటీకి అందించిన కారణంగా ఆ గొప్పతనమంతా డార్విన్కే దక్కింది. డార్విన్ 1859లో జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇది 19వ శతాబ్దపు ప్రత్యేక గ్రంథం. ఈ పుస్తకం పూర్తి పేరు.. On The origin of Species by means of Natural Selection (or) The preservation of favoured races in the struggle for life.. డార్విన్ ఇతర పుస్తకాలు 1. The structure and distribution of coral reefs 2. Geological Observations on South America 3. Fertilization of Orchids. 4. The variation of animals and plants under domestication 5. The Descent of Man 6. The Expression of the Emotions in Man and Animals 7. Insectivorous plants 8. The Effects of Cross and Self Fertilisation in the Vegetable Kingdom. 9. Different forms of Flowers on Plants of the Same Species. 10. The Power of Movement in Plants. 11. Selection in Relation to Sex. డార్విన్ తన పరిశీలనలను ప్రకృతి వరణ సిద్ధాంతంగా పేర్కొన్నాడు. డార్విన్ ప్రతిపాదించినందువల్ల దీన్ని డార్వినిజం అని కూడా అంటారు. డార్వినిజం లేదా ప్రకృతి వరణ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలు... 1. ప్రత్యుత్పత్తి 2. జనాభాల నిర్ణీత సంఖ్య 3. మనుగడ కోసం పోరాటం 4. వైవిధ్యాలు 5. ప్రకృతి వరణం 6. అనువంశికత 7. కృత్రిమ ఎన్నిక 8. లైంగిక ఎన్నిక 9. పాన్జెనెసిస్ సిద్ధాంతం అత్యధిక సంఖ్యలో.. ప్రతి జీవి తన సంతానాన్ని అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేయగలదనే సత్యాన్ని డార్విన్ గమనించాడు. ఉదా: పారమీషియం రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ప్రత్యుత్పత్తి జరుపుతుంది. పిల్ల జీవులు ఏ విధమైన అవాంతరం లేకుండా అదే నిష్పత్తిలో సంతానాన్ని ఉత్పత్తి చేస్తే 5 ఏళ్లలో మొత్తం పారమీషియాల ఘనపరిమాణం భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జనాభాల నిర్ణీత సంఖ్య సంతానం అధికంగా ఉత్పత్తి అయినా జీవుల మధ్య ఆహారం, ఆవాసం కోసం పోరాటం జరగడం వల్లచాలా జీవులు సంతానోత్పత్తి దశకు చేరకముందే చనిపోతున్నాయి. ఫలితంగా జీవుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఇది డార్విన్ గుర్తించిన రెండో సత్యం. మనుగడ కోసం పోరాటం ఆహారం పరిమితంగా ఉండటం వల్ల జీవుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడుతుంది. దీన్నే డార్విన్ మనుగడ కోసం పోరాటం (స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స) అని వర్ణించాడు. ఇది 3 రకాలు. ఎ. సజాతి సంఘర్షణ: ఒకే జాతికి చెందిన జీవుల మధ్య పోరాటం. ఉదా: మానవుడు - మానవుడు, కుక్క - కుక్క, పిల్లి- పిల్లి మధ్య జరిగే పోరాటం. బి. విజాతి సంఘర్షణ: భిన్న జాతుల మధ్య జరిగే పోరాటం. ఉదా: శాకాహారులు, మాంసాహారుల మధ్య పోరాటం, ఎలుక - పిల్లి, పాము - ముంగిస మధ్య పోరాటం. సి. భౌతిక శక్తులతో సంఘర్షణ: తుపానులు, వరదలు, భూకంపాలు, సునామీలతో జీవులు జరిపే పోరాటం. కాబట్టి పోరాటం వల్ల జనాభా సంఖ్య పెరగకుండా స్థిరంగా ఉంటుంది. వైవిధ్యాలు జీవుల మధ్య కనిపించే తేడాలనే వైవిధ్యం అంటారు. వైవిధ్యాలు ఉపయోగకరంగా లేదా హానికరంగా ఉండొచ్చు. ఉపయోగకరమైన వైవిధ్యం గల జీవులు.. ఆ విధమైన వైవిధ్యం లేని జీవుల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశాలుంటాయని డార్విన్ గుర్తించాడు. ఉదా: దేహంపై దట్టంగా రోమాలు గల గొర్రె.. చలి బారి నుంచి రక్షణ పొందుతుంది. ప్రకృతి వరణం ఉపయోగకరమైన వైవిధ్యాలు, అధిక ప్రత్యుత్పత్తి జరిపే శక్తిగల జీవులను ప్రకృతి ఎన్నుకొంటుంది. దీన్నే ప్రకృతి వరణం అంటారు. డార్విన్ ప్రకృతి వరణాన్ని యోగ్యతాల సార్థక జీవనం (సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్) అని హెర్బర్ట స్పెన్సర్ పేర్కొన్నాడు. మనుగడ కోసం జరిగే పోరాటంలో ఉపయుక్త వైవిధ్యాలు లేని జీవులు శత్రువుల బారిన పడి నశిస్తాయి. అనువంశికత ఉపయుక్త వైవిధ్యాలు తరతరానికి అభివృద్ధి చెందుతూ సంతానానికి సంక్రమించడాన్నే అనువంశికత అంటారు. కొన్ని వేల తరాల తర్వాత ఆ వైవిధ్యాల సంచిత ప్రభావం వల్ల ఆ జీవి మొదటి పూర్వీకులకంటే భిన్నంగా ఉంటుంది. అదే కొత్త జాతి జీవి. కృత్రిమ ఎన్నిక ఇందులో మానవుడు ప్రజనన కర్త. మానవుడు రెండు జీవులను ఎన్నుకొని, వాటి మధ్య సంపర్కం జరిపి, మేలైన రకాలను ఉత్పత్తి చేస్తాడు. ఉదా: కోళ్లు, పందులు, పశువులు. లైంగిక ఎన్నిక ఇది కూడా డార్వినిజానికి అనుబంధమే. స్త్రీ జీవి.. ఆకర్షణీయమైన రంగు, ఆకృతి, అందం గల పురుష జీవినే ఎన్నుకుంటుంది. పాన్జెనెసిస్ సిద్ధాంతం ప్రతి జీవిలో పాన్ జన్యువులుంటాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా బీజకోశాలను చేరి, అక్కడి నుంచి బీజకణాల ద్వారా సంతానానికి చేరతాయి. డార్వినిజంపై ప్రధాన అభ్యంతరాలు డార్వినిజంలో లోపాలున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అవి... జీవుల్లో ఉండే వైవిధ్యాల పుట్టుకను డార్విన్ వివరించలేదు (కారణం జన్యువుల గురించి డార్విన్కు తెలియదు). అవశేషావయవాలను గురించి ఎలాంటి వివరాలు డార్వినిజంలో లేవు. అనువంశికత, అనువంశికత రహిత వైవిధ్యాల మధ్య తేడాను డార్విన్ వివరించలేదు. ఐరిస్ జింకలో కొమ్ములు అవసరానికి మించి పెరిగాయి. అలాగే జెపర్ సన్స మమాత్ (ఏనుగు)లో దంతాలు అవసరానికి మించి పెరిగాయి. అందువల్లే ఆ రెండు జీవులు నశించాయి. అయితే అవసరానికి మించి అవయవాల అభివృద్ధి ఎందుకు జరిగిందో డార్విన్ పేర్కొనలేదు. డార్వినిజంలోని లోపాలను సరిదిద్ది డివ్రీస్, హర్డీ, వీన్బెర్గ, సీవెలరైట్లు నియోడార్వినిజాన్ని ప్రతిపాదించారు. మోడల్ ప్రశ్నలు 1. The Origin of Species గ్రంథ కర్త ఎవరు ? 1) హెర్బర్ట స్పెన్సర్ 2) చార్లెస్ డార్విన్ 3) డీవ్రీస్ 4) జె.బి.లామార్క 2. జీవ పరిణామ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా, సరైన ఆధారాలతో తొలిసారి ప్రతిపాదించింది? 1) లామార్క 2) డార్విన్ 3) డీవ్రీస్ 4) మెండల్ 3. జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని డార్విన్ ఎప్పుడు ప్రచురించాడు? 1) 1809 2) 1859 3) 1885 4) 1871 4. డార్విన్ ప్రకృతి వరణం ముఖ్య ఉద్దేశాలు? 1) ఉపయుక్త - నిరుపయుక్త సూత్రం 2) అత్యుత్పత్తి, పోరాటం, యోగ్యతాల సార్థక జీవనం 3) ఆర్జిత గుణాల అనువంశికత 4) యాదృచ్ఛిక మార్పు 5. ‘యోగ్యతాల సార్థక జీవనం’ అన్న శాస్త్రవేత్త? 1) డార్విన్ 2) హెర్బర్ట స్పెన్సర్ 3) మాల్థూస్ 4) లామార్క 6. జీవ పరిణామ శాస్త్ర పితామహుడు? 1) లామార్క 2) మెండల్ 3) స్పెన్సర్ 4) చార్లెస్ డార్విన్ 7. డార్విన్ పరిశీలించిన ద్వీపం? 1) గాలపాగోస్ 2) ఫిజి 3) మడగాస్కర్ 4) నికోబార్ 8. పరిణామానికి ముఖ్యకారణం? 1) ఉత్పరివర్తనం 2) ఆర్జిత లక్షణం 3) ప్రకృతి వరణం 4) లైంగిక ప్రత్యుత్పత్తి సమాధానాలు 1) 2 2) 2 3) 2 4) 2 5) 2 6) 4 7) 1 8) 3 -
ఆధునిక పద్ధతులు అనుసరణీయం
– ప్రకృతి వ్యవసాయంపై ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి నంద్యాలరూరల్: ప్రకృతి వ్యవసాయం ఆధునిక పద్ధతులు అనుసరణీయమని వేదశాస్త్ర విజ్ఞాన పరిశోధనా సంస్థల ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం ప్రాచీన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యుగంలో అనుసరణీయత అన్న అంశంపై రైతు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. కాలానుగుణంగా సాగు విధానాలు కూడా మార్చుకోవాలన్నారు. ఉద్యాన పంటలు, మూలికల సేద్యం చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి దేశీవాలి ఆవు కీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పశుపోషణ చేపట్టాలన్నారు. జీవామృతం తయారు చేసుకొనే విధానాన్ని రైతులకు వివరించారు. ఆర్ఏఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ నాగరాజరావు, సరళమ్మ, మునిరత్నం, జయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా చేపట్టాలని రైతులకు సూచించారు. శిక్షణా శిబిరంలో నంది రైతు సమాఖ్య నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, అప్పిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఒడిలో
-
సహజ శిలామూర్తికి క్షీరాభిషేకం
-
ఓజోన్ పొర దెబ్బతినడంతోనే ప్రకృతి వైపరీత్యాలు
– జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు రాజేంద్రారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓజోన్ పొర దెబ్బతింటుండడంతోనే వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలు నెలకొంటున్నాయని పొల్యూషన్ బోర్డు కర్నూలు జోనల్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు రాజేంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ ఓజోన్ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో మార్పులతో విపరీతమైన ఎండలు, వర్షాలు సక్రమంగా కురవకపోవడం, ప్రజలు రోగాలబారిన పడి చనిపోతుండడంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఓజోన్ పొరను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రజలు వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణమన్నారు. వీటిని ప్రజలు మితంగా వాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. లేదంటే 50–60 ఏళ్ల మధ్య ఓజోన్ పొరకు పడిన చిల్లులు విస్తరించి అల్ట్రాసోనిక్ కిరణాలు నేరుగా భూమి పడే ప్రమాదం ఉందన్నారు. వాటితో ప్రజలకు చర్మక్యాన్సర్లు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెంది ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం ఓజోన్ పొరపై నిర్వహించిన వ్యాసరచన విద్యార్థులకు బహుమతులుగా మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు ఇంజినీరు ప్రసాదరావు, ప్రొఫెసర్లు మాధవరెడ్డి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమల సిగలో అగ్ని శిఖ
ఆత్మకూరు రూరల్: మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పచ్చటి నల్లమల అడవులను తాకుతూ.. కొండల మీదుగా వెళ్తున్న మేఘాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి–బైర్లూటి ప్రాంతంలో ఔషధ మొక్క శంకర పుష్పి(అగ్ని శిఖ) అత్యంత రమణీయంగా కనువిందు చేస్తోంది. అరవిరిసిన అగ్నిశిఖ పుష్పాలపై నీటి బిందువులు ఎర్రని ముత్యాలను తలపిస్తున్నాయి. ఆగి ఆగి కురుస్తున్న వర్షం.. అగ్నిశిఖ అందం నల్లమల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. -
చర్మకాంతి కోసం సహజ పద్ధతులు..
న్యూఢిల్లీః మీ చర్మం కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారా? ముఖంలో అందం మరింత ఇనుమడించాలనుకుంటున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించాల్సిందే. శరీరంలో ఆరోగ్యం నశించినప్పుడు.. చర్మంపై ఎంతటి ఖరీదైన క్రీములు పూసినా ప్రయోజనం ఉండదంటున్నారు కాస్మెటిక్ అండ్ ఈస్తటిక్ నిపుణులు. సరైన జీవనశైలికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సహజసిద్ధమైన మార్గాలను పాటించడంతో ముఖంలో కాంతి పెరుగుతుందని చెప్తున్నారు. కాస్మెటిక్, ఈస్తటిక్ సర్జన్.. సీనియర్ కంన్సల్టెంట్ అనూప్ ధీర్.. చర్మసౌందర్యానికి కొన్ని సులభమైన చిట్కాలను అందించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ముఖంలో కాంతి కనిపించాలన్నా కేవలం ఈ చిన్నపాటి జాగ్రత్తలను ఫాలో అయిపోతే చాలంటున్నారు. ఎప్పుడూ బద్ధకంగా కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి చర్మం పొడిబారేందుకు, ముడుతలు, చారలు పడేందుకు దోహద పడతాయని, జీవన శైలిని నియమబద్ధంగా ఉంచుకోవడం ఎంతో అవసం అని అనూప్ చెప్తున్నారు. అలాగే రాత్రీ పగలూ తేడా లేకుండా చర్మానికి పూసే క్రీములను, నూనెతో వండిన, జంక్ ఫుడ్ తినడాన్నిమానుకుని.. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు తినడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చని చెప్తున్నారు. అలాగే మెరిసే చర్మానికి హైడ్రేషన్ ఎంతో అవసరమని, అందుకు నీటిని కూడా అధిక మొత్తంలో తాగడం అవసరమంటున్నారు. నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించి, చర్మంలోపల ఉండే టాక్సిన్ ను బయటకు పంపి, పోషకాలను చేర్చేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చర్మకాంతికోసం వ్యాయామంలో తప్పనిసరిగా కార్డియోను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వర్కవుట్ ముఖానికి చేసే ఫేషియల్ వంటిదని, ఈ వ్యాయామంతో వచ్చే చెమట ద్వారా చర్మంలో చిక్కుకున్న నూనె, ధూళి వంటివి బయటకు వచ్చి, చర్మం కాంతివంతంగా మారుతుందని చెప్తున్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో టమోటా, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ, చియా విత్తనాలతోపాటు పెరుగును జోడిస్తే మంచి ఫలితాలు పొందొచ్చన్నారు. అలాగే బ్యూటీపార్లర్లకు భారీగా డబ్బును వెచ్చించే బదులు.. ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వేసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు, ఫేస్ వాష్ లకు బదులుగా రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మరింత కాంతివంతంగా తయారౌతుందని అనూప్ ధీర్ సూచిస్తున్నారు. -
మేఘనకు ఎఫ్ఓఎన్ పురస్కారం
న్యూఢిల్లీ: ప్రకృతి సంబంధిత అంశాల్లో విశిష్ట సాహిత్యాన్ని అందించినందుకుగానూ కుమొన్ లిటరరీ ఫెస్టివల్ ‘ఎఫ్ఓఎన్ (ఫెలోస్ ఆఫ్ నేచర్) సౌత్ ఏషియా స్టోరీ’ పురస్కారానికి ముంబై రచయిత్రి మేఘనా పంత్ ఎంపికయ్యారు. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కుమొన్ లిటరరీ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ అవార్డును వచ్చే నెల ఆమెకు అందజేస్తారు. పీపుల్ ఆఫ్ ది సన్ అనే చిన్నకథ రాసినందుకు మేఘన ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ‘ప్రకృతి రచనల ప్రోత్సాహానికే ఈ అవార్డు కేటాయించాం. ఒకప్పుడు ఈ తరహా రచనలకు అద్భుత ఆదరణ ఉండేది. ఇప్పుడు ఇలాంటి వాటి సంఖ్య చాలా తగ్గింది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఈ కళను పునరుద్ధరించేందుకు ఎఫ్ఓఎన్ అవార్డు సాయపడుతుంది’ అని ఫెస్టివల్ వ్యవస్థాపకుడు సుమంత్ బాత్రా తెలిపారు. ఈ పురస్కారం కింద గ్రహీతకు రూ.లక్ష నగదు అందజేస్తారు. -
ప్రకృతి సేద్య పతాక రెపరెపలు!
- వరి సాగులో మూడేళ్లుగా ఏటేటా పెరుగుతున్న దిగుబడి - బియ్యం విక్రయంతో ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం - పెరుమాళ్లు ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం - చెరకులో తొలి ఏడాదే ఎకరాకు 45 టన్నుల దిగుబడి - నెల్లూరు రైతు లింగారెడ్డి విజయగాథ రసాయనిక ఎరువుల వాడకంతో నిస్సారమైన భూమిలో మూడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన లింగారెడ్డి దీక్షగా కొనసాగిస్తున్నారు. ఏటేటా దిగుబడులు పెంచుకుంటూ.. అధిక నికరాదాయాన్ని పొందుతున్నారు. చెరకులో తొలి ఏడాదే రసాయన సేద్యంలోకన్నా ఎక్కువ దిగుబడి తీశారు. వరిలో మూడేళ్లకు తోటి రైతులతో సమానంగా దిగుబడి తీస్తున్నారు. వరిని తక్కువ నీటితో సాగు చేయడం అవసరమని భావించి.. పెరుమాళ్లు ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు.. రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. పొలంలో వానపాముల సంతతి పెరిగితే చాలు అవే వ్యవసాయం చేస్తాయంటున్నారు ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుడు అల్లూరు లింగారెడ్డి. నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకూరు ఆయన స్వగ్రామం. 2013 నుంచి వరి, చెరకు, అరటి తదితర పంటలను ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై 2007లో తిరుపతిలో పాలేకర్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో లింగారెడ్డి పాల్గొన్నారు. అప్పట్లో రొయ్యలు సాగు చేస్తుండటంతో ఆసక్తి ఉన్నా దృష్టి పెట్టలేదు. అయితే భూముల ధరలు పెర గటంతో చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. వచ్చిన సొమ్ముతో కొడవలూరు మండలం బసవాయపాళెంలో 2013లో 26 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రస్తుతం లింగారెడ్డి 15 ఎకరాల్లో వరి, 6 ఎకరాల్లో చెరకు, 2 ఎకరాల్లో అరటి పంటలను బోరు నీటితో సాగు చేస్తున్నారు. చెరకు తొలి ఏడాదే 45 టన్నుల దిగుబడి.. గతేడాది ఫిబ్రవరిలో చెరకు చేనులో 200 కిలోల ఘన జీవామృతం వేశారు. 15 రోజులకోసారి నీటి ద్వారా ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని పారించేవారు. దీంతోపాటు, చెరకును నాటిన మొదటి ఐదు నెలలు నెలకోసారి పైరుపై జీవామృతాన్ని పిచికారీ చేసేవారు. మొదటి నెల 100 లీటర్ల నీటికి 10 లీటర్ల జీవామృతం, రెండో నెలలో 200 లీటర్ల నీటికి 10 లీటర్ల జీవామృతం చొప్పున చల్లారు. చెరకును ఆశించిన మొవ్వు తెగులును నివారించేందుకు దశపత్ర కషాయం, నీమాస్త్రాన్ని 60 రోజుల దశలో పిచికారీ చేశారు. చెరకు సాగులో ఎకరాకు విత్తనానికి రూ. 15 వేలు, కలుపు తీతకు 20 వేలు, ఇతర ఖర్చులు రూ. 5 వే లు కలిపి మొత్తం రూ. 40 వేల ఖర్చయ్యింది. కూలీలతోనే కలుపు తీయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెరకు పంట చేతికొచ్చింది. రసాయన సేద్యంలో ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుండగా.. లింగారెడ్డి ప్రకృతి సేద్యంలో తొలి ఏడాదే 45 టన్నుల దిగుబడి సాధించటం విశేషం. టన్నుకు రూ. 1,500 చొప్పున ఎకరాకు రూ. 67 వేల ఆదాయం లభించింది. ఖర్చులు పోను ఎకరాకు 25 వేలకు పైగా నికరాదాయం లభించింది. చెరకు ఆకు ఆచ్ఛాదనతో ప్రయోజనాలు.. చెరకు కోత పూర్తయ్యాక ఆకులు తదితర వ్యర్థాలను తగులబెట్టకుండా రెండో పంటలో ఆచ్ఛాదనగా వాడి.. కలుపును సమర్థవంతంగా అరికట్టారు. దీనివల్ల రెండో ఏడాది కలుపు తీత ఖర్చు మిగిలింది. పైగా ఆచ్ఛాదన వల్ల భూమిలో వానపాముల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దీంతో భూమి సారవంతమైంది. రెండో ఏడాది ఎకరాకు 65 టన్నులకు తగ్గకుండా చెరకు దిగుబడి వస్తుందని లింగారెడ్డి భావిస్తున్నారు. ఎకరా చెరకు సాగు ఖర్చు రూ. 10 వేలకు తగ్గిందన్నారు. ప్రకృతి సేద్యంలో చెరకు సాగుపై దృష్టి పెట్టి.. మంచి నికరాదాయం పొందాలని ఆయన తోటి రైతులను కోరుతున్నారు. ఎకరా వరిలో రూ. 65 వేల నికరాదాయం! లింగారెడ్డి గత మూడేళ్లుగా 15 ఎకరాల్లో ప్రకృతి సేద్య పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. నెల్లూరు మొలగొలుకులు, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048 రకాలను సాగు చేస్తున్నారు. దమ్ములో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు. 20 రోజులకోసారి కాలువ నీటితోపాటు ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందిస్తున్నారు. భూమిలో సారం లేకపోవటంతో మొదటి రెండేళ్లు ధాన్యం దిగుబడులు ఆశించిన మేర రాకున్నా.. లింగారెడ్డి తన కృషిని కొనసాగించారు. తొలి ఏడాది ఎకరాకు 16 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో తోటి రైతులు లింగారెడ్డిని ఎగతాళి చేశారు. అయినా నిరుత్సాహపడకుండా ప్రకృతి సేద్యాన్ని కొనసాగించారు. రెండో ఏడాది 22 బస్తాల దిగుబడి వచ్చింది. మూడో ఏడాది రసాయన సేద్యం చేసిన తోటి రైతులతో సమానంగా ఎకరాకు 30 బస్తాల ధాన్యం దిగుబడిని సాధించారు. లింగారెడ్డి తాను పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. రసాయనిక అవశేషాల్లేకపోవడం, రుచి బాగుండటంతో బంధువులు, పరిచయస్తులు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎకరాలో ధాన్యాన్ని మరపట్టిస్తే 15 క్వింటాళ్ల బియ్యం వస్తున్నాయి. రూ. 80 వేల ఆదాయం వస్తోంది. ప్రకృతి సేద్యంలో ఎకరా వరి సాగుకు రూ. 15 వేలు ఖర్చవుతుండగా.. ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం లభిస్తోందని లింగారెడ్డి తెలిపారు. తన పొలం పరిసరాల్లోని ఇతర రైతులకు రసాయన సేద్యంలో ఎకరా వరిలో 20-30 బస్తాల దిగుబడి వస్తోందన్నారు. సాగుకు రూ. 20-25 వేల ఖర్చు పెడుతున్నారు. ధాన్యాన్ని అమ్ముకోవటం వల్ల లాభం అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఈ ఏడాది పెరుమాళ్లు పద్ధతిలో ప్రయోగాత్మకంగా 50 సెం.మీ. దూరంలో వరి నారు నాటారు. నీటిని నిల్వగట్టకుండా ఆరుతడి పద్ధతిని పాటిస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరుగుతోందని లింగారెడ్డి తెలిపారు. రెండెకరాల్లో అరటి.. గతే డాది రెండెకరాల్లో అరటిని ప్రకృతి సేద్య విధానంలో సాగు చేస్తున్నారు. తొలిపంటలో ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చినట్టు లింగారెడ్డి తెలిపారు. కొన్ని కూరగాయ పంటలను సైతం పండిస్తున్నారు. తనలాగానే మరింత మంది రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి.. ఏటికేడు రసాయనిక అవశేషాల్లేని మేలైన దిగుబడులు సాధించాలని లింగారెడ్డి ఆకాంక్షిస్తున్నారు. - బిల్లుపాటి నాగేశ్వరరావు, సాక్షి, నెల్లూరు రూరల్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకృతి సేద్యంతో రైతుకు మేలు.. ఒకప్పుడు 50 కిలోలు యూరియా వేసే పొలానికి ఇప్పుడు 500 కిలోలు వేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల సాగు భూములు, ప్రజల ఆరోగ్యం పాడవుతోందనే విషయాన్ని రైతులందరూ గుర్తించాలి. ప్రకృతి సేద్యంలోకి మారితే తొలి రెండేళ్లు దిగుబడి తగ్గినా నష్టం ఉండదు. మూడేళ్లు ఓపిక పడితే.. ప్రకృతి సేద్యంలో మంచి దిగుబడులు పొందవచ్చని స్వానుభవంలో నాకెరుకైంది. భూసారం పెంపొందుతుంది. రైతుకు ఖర్చు తగి,్గ నికరాదాయం పెరుగుతుంది. వినియోగదారుల ఆరోగ్యమూ బాగుపడుతుంది. - అల్లూరు లింగారెడ్డి (94939 49389), పెద్ద చెరుకూరు, నెల్లూరు రూరల్ మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 23, 24 తేదీల్లో ‘పల్లె సృజన’ శోధాయాత్ర! ‘పల్లె సృజన’, హనీబీ నెట్వర్క్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 23 - 24 తేదీల్లో అనంతపురం జిల్లాలో చిన్న శోధాయాత్రను నిర్వహించనున్నాయి. హనిమిరెడ్డి పల్లి నుంచి కంబాల పల్లి వరకు వివిధ గ్రామాల్లో కాలి నడకన వెళ్లి గ్రామాల్లో సృజనశీలురను కలుసుకొని వారి సంప్రదాయ విజ్ఞానాన్ని నమోదు చేస్తారు. పాల్గొనదలచిన యువతీ యువకులు, రైతులు, ఇతరులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. రాజు- 95028 55858, సందీప్- 87909 75313లను సంప్రదించవచ్చు. www.pallesrujana.org/ చూడొచ్చు. 2017నవంబర్లో అంతర్జాతీయ సేంద్రియ మహాసభ సేంద్రియ సేద్యంపై అంతర్జాతీయ (19వ) మహాసభ- 2017కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది నవంబర్ 9-11 తేదీల్లో నోయిడాలో ఈ మహాసభ జరుగుతుంది. అనేక దేశాలకు చెందిన సేంద్రియ రైతులు, శాస్త్రవేత్తలతోపాటు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పాల్గొంటాయి. సేంద్రియ రైతులు తమ వినూత్న ఆవిష్కరణల గురించి ప్రతినిధులకు వివరించవచ్చు. శాస్త్రవేత్తలు 2016 సెప్టెంబర్ 30లోగా పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చు. 2016 అక్టోబర్ 1 నుంచి ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు www.owc.ifoam.bio చూడండి. 18న జీవన ఎరువుల తయారీపై శిక్షణ సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే జీవన ఎరువు మైకోరైజా, పంటలపై తెగుళ్ల నివారణకు ఉపయోగించే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్లను రైతులు తమ ఇంటి వద్ద తయారు చేసుకునే పద్ధతులపై ఈ నెల 18న గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. విశ్రాంత వ్యవసాయాధికారి కొసరాజు తిరుమలరావు, సేంద్రియ రైతు నొక్కు అశోక్కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన రైతులు 0863- 2286255, 83744 22599 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అద్భుతం
చిలమత్తూరు : సేంద్రీయ పద్ధతుల ద్వారా పంటలు, మొక్కలు సాగు చేయడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం అద్భుతమని దక్షిణాఫ్రికా హైకమిషనర్ ఎఫ్కే మొరాలీ పేర్కొన్నారు. ఇలాంటి పద్ధతులను దక్షిణాఫ్రికాలోనూ అమలయ్యేలా ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. డెక్కన్ వాటర్ హార్వెస్టింగ్ సంస్థ (హైదరాబాద్) ప్రతినిధులు అయ్యప్ప, వి.ప్రకాష్, సుబ్బారావు, శివకుమార్, సోమశేఖర్రెడ్డి పిలుపుమేరకు ఆయన శనివారం చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ సుబ్బరావుపేట సమీపంలో సేంద్రీయ పద్ధతులతో సాగు చేస్తున్న తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు అయ్యప్ప పలు అంశాలను ఆయనకు వెల్లడించారు. 75 ఎకరాల పొలంలో మహాగని, హెర్బల్, కొండవేప తదితర మొక్కలను సుమారు 25 వేలు సాగు చేశామన్నారు. ప్రతి మొక్కకు నీరు తడవడానికి కందకాలు తవ్వినట్టు వివరించారు. రసాయనిక ఎరువులు వాడకుండా జీవామతంతోనే మొక్కలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సాగు చేసిన టమాట, ముల్లంగి తదితర పంటలను కూడా ప్రదర్శించారు. ఈ విషయాలను గమనించిన కమిషనర్ మొరాలీ మాట్లాడుతూ ఇలాంటి కరువుఛాయలు దక్షిణాఫ్రికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. ఆ ప్రాంతాల్లో ఇలాంటి పద్ధతులను అవలంభించడానికి అక్కడి ప్రధానితో చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామకష్ణారెడ్డి, పురుషోత్తమ్రెడ్డి, హనుమంతరెడ్డి, విష్ణు, వీరప్ప తదితరులు ఉన్నారు. -
ప్రకృతి సేద్యానికి పెట్టని ‘కోట’
- సత్తువుడిగిన సాగు భూమికి ఊపిరులూదిన ఉద్యమకారుడు గంగాధరం - సేంద్రియ, ప్రకృతి సేద్యాల ప్రచారంలో రెండు దశాబ్దాల అలుపెరగని పయనం ఇప్పుడంటే చిన్న పట్టణాల్లో కూడా సేంద్రియ ఆహారోత్పత్తులు విక్రయించే షాపులు ఉన్నాయి. కొందరు వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులకు మాత్రమే ప్రాథాన్యం ఇస్తున్నారు. రసాయన సేద్యం చేసే రైతులు కూడా కుటుంబానికి సరిపడా ఆహారోత్పత్తులను సేంద్రియ లేదా ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించుకొని తింటున్నారు. రసాయన అవశేషాల్లేని ఆహారంపై నేడు తెలుగు గడ్డపై వెల్లివిరుస్తున్న చైతన్యానికి నారు పోసి నీరు పెట్టి పోషించిన తొలితరానికి చెందిన ఒకానొక పట్టువదలని విక్రమార్కుడు గంగాధరం.. ఇరవై ఏళ్ల క్రితం.. సేంద్రియం అనే పదం తెలుగు నేలకు తెలియని రోజులవి. రసాయన సేద్యంతో కూనారిల్లుతున్న తెలుగు రైతుకు ఆనాడే సేంద్రియ పద్ధతులను పరిచయం చేశారు డాక్టర్ కోట గంగాధరం. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు వుండలం చెంచురాజు కండ్రిగ ఆయన స్వగ్రామం. పశువుల సంఖ్య తగ్గి సేంద్రియ ఎరువుల లభ్యత తగ్గింది. రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడంతో భూములు సారహీనమౌతున్నాయి. పురుగుమందుల వాడకంతో పంటలు విషతుల్యమై రైతులు, వినియోగదారుల జీవితాలు అతలాకుతలమౌతున్నాయి. ఆ దశలో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ (1992) పూర్తిచేసిన ఆయన.. ఉద్యోగంలో చేరేకన్నా రైతులకు ఉపయోగపడే పనేదైనా చేస్తే బాగుంటుందనుకున్నారు. తెలుగు నేలపై సేంద్రియ విప్లవానికి నాంది.. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలను కలిసిన ప్పుడు పంజాబ్ రైతులు వర్మికంపోస్టును వాడి మంచి ఫలితాలను సాధిస్తున్న విషయాన్ని వారు గంగాధరానికి చెప్పారు. దీంతో తను వెతుకుతున్న దారి ఇదేనని ఆయనకు అనిపించింది. కానీ గ్రామాల్లోకి వెళ్లి రైతులకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తే.. రైతులు సవాలక్ష ప్రశ్నలు వే సి విసిగించేవారు. కొన్నింటికి సమాధానం తెలియక రైతుల ముందు తెల్లమొహం వేయాల్సి వచ్చేది. వర్మీకంపోస్టుపై తొలి శిక్షణా శిబిరం 1994లో తిరుపతి ఎస్వీ వ్యవసాయ కాలేజ్లో ఏర్పాటు చేశారు. హాజరయిన 90 మందిలో 10 మంది రైతులు మాత్రమే యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో 5గురు మంచి దిగుబడులు పొందారు. పంట ఉత్పత్తులు రుచికరంగా ఉండటంతో పాటు నిల్వ ఉండే కాలం పెరిగింది. రసాయన ఎరువుల వాడకం తగ్గి రైతుకు ఖర్చు ఆదా అయ్యింది. ఆ తరువాత మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి రైతులకు వర్మికంపోస్టు తయారీపై శిక్షణనిచ్చేవారు. అక్కడికి ఈ ఐదుగురు సీనియర్ సేంద్రియ రైతులను వెంటబెట్టుకెళ్ల్లేవారు. రైతులు అడిగే సందేహాలను వారితోనే నివృత్తి చేయించేవారు. వర్మీ కంపోస్టు తయారీ, ఉపయోగాలను తెలిపే పుస్తకాలను ముద్రించి ఇచ్చేందుకు, యూనిట్ల ఏర్పాటుకు రుణాలను ఇచ్చేందుకు ఖాదీ కమిషన్ ముందుకువచ్చింది. క్రమంగా స్వచ్ఛంద సంస్థలు, రైతు నాయకులు శిక్షణనిచ్చేందుకు ఆహ్వానించాయి. ఈ నేపధ్యంలో గంగాధరం 1996లో వర్డ్ (వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్రమంతా తిరుగుతూ శిక్షణనిచ్చారు. 1999లో ఆప్కాబ్ సహకారంతో రైతులకు శిక్షణ అందించారు. 2005లో ‘కపార్ట్’ ఆధ్వర్యంలో తిరుపతిలో 30 మందికి శిక్షణనిచ్చారు. అలా పదేళ్లలో సేంద్రియ వ్యవసాయం ప్రతి గ్రామాన్నీ స్పృశించింది. 2006 కల్లా వర్మీకంపోస్టు తయారీ, విక్రయం పెద్ద వ్యాపారంగా మారింది. వ్యాపారస్తులే వర్మికంపోస్టు లాభాల గురించి రైతులకు వివరించి, విక్రయించేవారు. ఇంక అందులో అందుకోవలసిన ఎత్తులేవీ లేవని గంగాధరం భావిస్తున్న సమయం అది. ఈ పూర్వరంగంలో 2007లో మహారాష్ట్ర నుంచి ప్రకృతి వ్యవసాయ పవనాలు కొత్తగా తెలుగు నేలకు తాకాయి. అయితే, వర్మీ కంపోస్టు వాడకంపై పాలేకర్కు సదభిప్రాయం లేకపోవటంతో ‘వర్డ్’ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణనిచ్చేందుకు తొలుత ఒప్పుకోలేదు. అయినా పట్టువిడువకుండా మూడురోజుల పాటు హైదరాబాద్లోనే ఉండి పాలేకర్ను ఒప్పించారు. 2007లో తిరుపతిలోని వెటర్నరీ కాలేజి ఆడిటోరియంలో రైతులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంగాధరం కృషితో 500 మంది రైతులు హాజరయ్యారు. అప్పటికే గంగాధరానికి పదేళ్లుగా రైతులు, వ్యవసాయాధికారులతో ఉన్న పరిచయాల వల్ల ప్రకృతి వ్యవసాయం తెలుగు నేలలో వేళ్లూనుకుంది. సెప్టెంబర్ 11 నుంచి జరగబోయే పాలేకర్ శిక్షణా శిబిరంలోనూ గంగాధరం కీలకపాత్ర నిర్వహిస్తుండడం విశేషం. ప్రకృతి వ్యవసాయ పాఠశాల.. ఇప్పటికీ.. ఒక్కగంట ఖాళీ సమయం ఉన్నా గంగాధరం దగ్గర్లో ఉన్న కళాశాలకో.. పాఠశాలకో వెళతారు. అధ్యాపకుల అనుమతి తీసుకొని ప్రకృతి వ్యవసాయం గురించి విద్యార్థులకు వివరిస్తారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణనిచ్చేందుకు ఆయనే స్వయంగా ప్రకృతి వ్యవసాయ పాఠశాలను ఏర్పాటు చేశారు. నెలకు 30 మంది రైతులకు శిక్షణనిస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయ భూవుుల్లో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయూనికి శ్రీకారం చుట్టింది. దీనికోసం ఆలయూల తరపున ఉద్యానవన శాఖకు చెందిన అధికారులకు గంగాధరమే శిక్షణనిచ్చారు. ఎక్కువ రోజులు స్వగ్రామంలో ఉండలేకపోవటంతో తన ఆరెకరాల పొలాన్ని గంగాధరం కౌలుకు ఇచ్చేవారు. అయితే కౌలు రైతులు రసాయన సేద్యం చేస్తుండటంతో.. మూడేళ్లుగా ప్రకృతి సేద్యం ప్రారంభించారు. అయితే నిర్వహణ సులభంగా ఉండే పెసర, మినుము, సజ్జ వంటి పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న సజ్జలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. - గురుస్వామి సాక్షి, పిచ్చాటూరు, చిత్తూరు జిల్లా కుటుంబం అంతా కలిస్తేనే ప్రకృతి సేద్యం పండుగ... బీజామృతంతో విత్తనశుద్ధి, దుక్కిలో ఘన జీవామృతం వాడకం, రెండువారాలకోసారి నీటిద్వారా జీవామృతం అందించటం, అంతర పంటల సాగు, వాఫ్స వంటి విధానాలను ప్రకృతి సేద్యంలో తప్పనిసరిగా పాటించాలి. ఇవన్నీ చేయాలంటే తన కుటుంబ సభ్యుల సహకారం రైతుకు తప్పనిసరి. అందుకే ముందు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. - డాక్టర్ కోటపాటి గంగాధరం (98490 59573), ప్రకృతి వ్యవసాయ నిపుణులు,చెంచురాజు కండ్రిగ, పిచ్చాటూరు మండలం, చిత్తూరు జిల్లా -
మొక్కే ఆమె ప్రిస్క్రిప్షన్
మొక్కా అమ్మా ఒక్కటే. రెండూ మనిషిని కాపాడుతాయి అంటారు పిట్ల చూడామణి. అమ్మ జన్మనిస్తుంది... మొక్క సంజీవనిగా మారి పునర్జన్మ ఇస్తుంది అంటారామె. భీమిలి మండలం దివీస్ లేబరేటరీలో మూడెకరాలలో పెంచుతున్న ఔషధవనంలో తోటమాలిగా పనిచేస్తున్న చూడామణికి తాత కొమ్మూరి సన్యాసి ద్వారా బాల్యం నుంచే మొక్కలు గురించి తెలుసు. మొక్క, చెట్టు, పాదు... వీటన్నింటిలోనూ ఔషధగుణాలు ఉంటాయని తల్లిపాలు, పట్టుడుపాలకు ఎంత తేడా ఉందో పసరు మందులు, ఇంగ్లీషు మందులకు అంత తేడా ఉందని ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఆమె తెలుసుకోగలిగింది. ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో ఏ చెట్టు ఆకు ఏ వైద్యానికి పనికొస్తుందో, ఏ చెట్టు వేరుతో ఏ దీర్ఘకాలిక వ్యాధి నయమవుతుందో ఆమెకిప్పుడు బాగా తెలుసు. బాల్యం నుంచే వనమూలికలపై ఆసక్తి.. చూడామణి తండ్రి వాసం శివరామయ్య కానిస్టేబుల్. ఆయన భీమిలిలో పని చేస్తున్నప్పుడు ఇక్కడి సెయింట్ ఆన్స్లో ఐదవ తరగతి వరకు, విశాఖ బిహెచ్పివిలో పని చేస్తున్నప్పుడు అక్కడ ఏడో తరగతి వరకు చదువుకుంది చూడామణి. ఆమె తాత సన్యాసి విశాఖ ఏజెన్సీలోని దేవరాపల్లి, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాలలోని కొండకోనల్లో తిరిగి వనమూలికలు, ఆకులు, చెట్ల వేర్లు సేకరించేవారు. విశాఖలోని అల్లుడు శివరామయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా చిక్కాలతో రకరకాల మూలికలు, చూర్ణాలు, లేహ్యాలు, పసర్లు ... ఒకటేమిటి ఆరోగ్యానికి ఆవసరమయ్యే కొర్రలు, అడ్డపిక్కలు, ఈడపళ్లు. ఇప్పపువ్వు తెచ్చేవాడు. వ్యాధికి పనికి వచ్చే మిశ్రమాలు తెలియందే ఒకదానికొకటి కలపకూడదని హెచ్చరించేవాడు. తాత ప్రకృతి వైద్యంపై చూడామణికి ఆసక్తి కలిగింది. అడిగి కొంత గమనించి, కొంత తాత నుంచీ... మూలికల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. పదో తరగతి వరకు చదువుకున్న ఆమె ఆ తరువాత వ్యవసాయ, ఉద్యానవన సబ్జెక్టులలో డిప్లమో చేసింది. ఉద్యోగం చేయాలన్న తలంపుతో కొన్నాళ్లు ఆనందపురంలో బయోడీజిల్ మొక్కలు పెంపకంలోనూ, రంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 300 ఎకరాలలో చేపట్టిన ఉద్యానవన పంటల ప్రాజెక్టులోను సూపర్వైజరుగా పనిచేసింది. ప్రస్తుతం దివీస్ లేబరేటరీలో 160 రకాల ఔషధ మొక్కలను సేకరించి వీటితో విత్తనాలు వృద్ధి చేయించే పనిలో మునిగిపోయింది ఈమె. అరుదైన మొక్కలు.. రామఫలం, విభీషణఫలం, రుద్రాక్ష, లావెండర్, శ్రీగంధం, బిర్యానీ ఆకు(దాల్చినచెక్కు), యాలుకలు, రెక్క సంపెంగ, లెమన్గ్రాస్, కర్పూర తులసి, లవంగ తులసి, మోదుగ, అటుకు మామిడి, సుగంధి, పిప్పర్మెంట్ వాకుడు పళ్లు, బొగడ, పాపిట ఆకు, వాటర్ యాపిల్ వంటి అరుదైన మొక్కలు ప్రస్తుతం చూడామణి సంరక్షణలో ఉన్నాయి. వ్యాధులను నయం చేసే నల్లేరు, ఇసుకరాసి, దుంప పసుపు, శంఖుపుష్పి, సర్పగంధి, కొండవేప, వావిళ్లు, బలరావి, అత్తిపత్తి, శతావరి, ఇన్సులిన్, వెంపలి, వాగ్దేవి, అతిబల, పత్రబీజం, సరస్వతి ఆకు, అవిసె, గాడిద గరప, అడ్డసరం, నేలవేము, భూతంగేడు, సముద్రపాల వంటి మొక్కలు కూడా ఉన్నాయి. ఫలితాలు అద్భుతం.. రోగాలకు బాగా తెలిసిన ఆకులు, వేర్లు, గింజలను విడిగాను, కలిపి వాడటం ద్వారాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వ్యాధులను నయం చేయవచ్చని నిరూపించింది చూడామణి. మధురవాడలో ఒక వ్యక్తి కిడ్నీలో 8 ఎంఎం రాయిని కొండపిండి రకానికి చెందిన పుష్పాలను వాడటం ద్వారా 25 రోజులలో మటుమాయం చేసింది. పదకొండు ఏళ్ల బాలునికి మూడుసార్లు శస్త్రచికిత్స చేసినా రాని నడకను చూడామణి అయిదు మాసాలలో వనమూలికల ద్వారా తీసుకురాగలిగింది. వయసుతో పనిలేకుండా పసిపిల్లలు, వృద్ధులు, మహిళలలో పొడచూపే దీర్ఘకాలిక రోగాలు, సంతానం కోసం లక్షలు ఖర్చుచేసినా రాని ఫలితాలను వేర్లద్వారా సాధించవచ్చని నిరూపించింది. ఉచిత వైద్యసేవలు చేయాలన్నా... లక్షలు పోసి ఇంగ్లీషు వైద్యం చేయించుకున్నా కొన్ని వ్యాధులు లొంగవు. లొంగినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మూలికలతో వ్యాధులు నయం చేయగలిగే సత్తా ఉన్నా వైద్యం చేయడానికి చూడామణి వద్ద సర్టిఫికెట్ లేదు. ‘అందుకే బయట వైద్యం చేయలేకపోతున్నాను’ అందామె. ‘దివీస్ లేబరేటరీ యాజమాన్యం ప్రోత్సాహంతో భావితరాలకు ఆయుష్సును పెంచే మొక్కలను వృద్ధి చేసేపనిలో భాగంగా విత్తనాలు తయారు చేస్తున్నాను. నాకు ఉండటానికే ఇల్లు లేదు. స్వంతంగా మూలికలవనాన్ని వృద్ధి చేసుకోవాలంటే కనీసం పావు ఎకరం స్థలం కావాలి. పెట్టుబడి కావాలి. నా భర్త బుల్లిబాబు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం నలుగురు కూలీల ద్వారా వనాన్ని సంరక్షిస్తున్నాను. యాజమాన్యం సూచిస్తే ఎవరికీ ఎటువంటి హానిలేని మూలికా వైద్యాన్ని చేయవచ్చు’ అందామె. భారతదేశం మూలికలకు పుట్టినిల్లు. సంప్రదాయ వైద్యానికి పట్టుకొమ్మ. చూడామణి ఒక్కతే కాదు ఇలాంటి ఎందరో సరైన ప్రోత్సాహం కోసం ప్రజలను చేరే మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. కార్పొరెట్ వైద్యం ఖరీదైన వైద్యం. ప్రజలకు అందుబాటులోకి రావడంలో జరిగే ప్రయత్నాలలో తప్పు లేకపోవచ్చు. కాని అతి తక్కువ ఖర్చుతో మొండి వ్యాధులను నయం చేయగలిగే మూలికా వైద్యం అందుబాటులో లేకపోవడం మాత్రం తప్పే. చూడామణి వనం జగమంత విస్తరించాలని కోరుకుందాం. - గేదెల శ్రీనివాసరెడ్డి, తగరపువలస (విశాఖపట్నం) -
మార్పు కోసం.. మనం మారుదాం
పెనుభూతంలా ప్లాస్టిక్ పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు కొరవడిన నియంత్రణ చర్యలు గాంధీ మహాత్ముడు ఒక సందర్భంలో ‘‘మార్పు అనేది మన నుంచే మొదలు కావాలి’’ అన్నాడు. అవును పర్యావరణ పరిరక్షణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నాం. పర్యావరణానికి హాని చేసే అనేక కారకాలను మనం నిత్యం ఉపయోగిస్తూనే ఉన్నాం. వాటిలో ప్రధానమైంది పాస్టిక్. పాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే దాదాపు వెయ్యి సంవత్సరాలుపడుతుంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు హాని చేసే చర్యలకు స్వస్తి చెబుదాం. మార్పుకు నాంది పలుకుదాం. ఆదిలాబాద్ రూరల్ : ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న అంశం పాస్టిక్ వినియోగం. పర్యావరణానికి అత్యంత హాని కలిగించే కారకంగా ప్లాస్టిక్ మారింది. ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరమేయడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలను శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు అన్వేషిస్తున్నాయి. కొంత వరకు సఫలం కూడా అయ్యాయి. ప్లాస్టిక్ అంటే.. ప్లాస్టిక్ రెండు కత్రిమ అణువుల సమ్మేళనం. అవి పోలిమర్లు, మోనోమర్లు. ఈ రెండు అణువుల మధ్య రసాయనిక చర్య జరిపి ప్లాస్టిక్ను తయారు చేస్తారు. ప్లాస్టిక్ తయారీలో ఎథిలిన్ దోహదపడుతుంది. ప్లాస్టిక్ తయారీకి పెట్రోలియంను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ తయారీ కోసం క్రూడ్ ఆయిల్ను 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తర్వాత ఆ మిశ్రమంలో నాఫ్తా అనే పదార్థాన్ని కలిపి తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేస్తారు. ఆ మిశ్రమాన్ని 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. దాంట్లో వివిధ రకాల రసాయనాలను కలిపితే చివరకు ప్లాస్టిక్ తయారవుతుంది. ప్లాస్టిక్ గురించి కొన్ని నిజాలు పెట్రోలియం సహాయంతో తయారవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు దీని వల్ల పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది, 7 మిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం ఖర్చు అవుతోంది. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే వివిధ రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులను ప్లాస్టిక్ తయారీలో వాడుతారు. వీటి వల్ల ప్రజలకు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మెదడు, గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ని తినడం కారణంగా ఏటా అనే లక్షల్లో మూగజీవులు చనిపోతున్నాయి. పరిష్కారం ప్లాస్టిక్ సంచులకు బదులు జనపనారతో తయారు చేసిన సంచులను వాడండి. వస్త్రాలతో తయారు చేసిన సంచులను వాడండి. కిరాణం నుంచి చిన్న చిన్న కొని తెచ్చుకునేప్పుడు కవర్లను అడగకండి. పర్యావరణాన్ని కలుషితం చేసే 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను నిషేధించండి. క్యారీ ఏ బ్యాగ్.. నాట్ క్యారీ బ్యాగ్ అనే విధానాన్ని అలవర్చుకోండి. మనం ఏం చేద్దాం... ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనం ఉంటున్న భూమిని రక్షించుకునేందుకు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకుండా ఉందాం. ప్లాస్టిక్ వ్యర్థాలను నిపుణుల సూచనల ప్రకారం పాతిపెట్టడం వంటివి చేద్దాం. కూరగాయల కొనుగోలు దగ్గరి నుంచి గహోపకరణాల కొనుగోలు వరకు సాధ్యమైనంత వరకు వస్త్రాలతో తయారు చేసిన సంచులనే వాడుదాం. ప్లాస్టిక్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలతో కలిసి నడుద్దాం. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిద్దాం. అధికారులతో కలిసి ప్లాస్టిక్ నియంత్రణ చర్యలకు పూనుకుందాం. -
ప్రకృతి వ్యవసాయానికి క్లస్టర్ల ఏర్పాటు
నంద్యాలరూరల్: ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రీయత కోసం క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు తెలిపారు. ఆదివారం నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఏడీఆర్ గోపాల్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల సమావేశంలో మాట్లాడారు. తంగడంచలో సీడ్ హబ్కు 500 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే 300 ఎకరాల్లో నవధాన్యాల ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలను ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించామన్నారు. వాటి శాస్త్రీయతను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. రాయలసీమతోపాటుపాటు ప్రకాశం జిల్లాలో కూడా నవధాన్యాల ఉత్పత్తికి యూనివర్సిటీ పరిధిలో చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగును తగ్గించామని, ఇంకా తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో రైతులకు పరిశోధన ఫలాలు అందేలా చూడాలని నాయుడు ఆదేశించారు. సమావేశంలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
బాల్య వివాహం నిలిపివేత
విజయనగరం ఫోర్ట్ : బాల్య వివాహానికి నేచర్ కొలాబ్ ఆర్గనైజేషయన్ 1098 సంస్థ (చైల్డ్లైన్) సభ్యులు బ్రేకులు వేశారు. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామాని చెందిన 16 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ నెల 25న వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి 1098కు ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో చైల్డ్లైన్ సభ్యులు ఇరు కుటుంబీకులతో పాటు గ్రామపెద్దలను విజయనగరంలోని చైల్లైన్ కార్యాలయానికి శుక్రవారం పిలుపించుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లు నిండకుండా అమ్మాయిలకు వివాహం చేయడం నేరమన్నారు. దీంతో వివాహం నిలిపివేయడానికి ఇరువురూ అంగీకరించారు. కార్యక్రమంలో చైల్డ్లైన్ ప్రతినిధులు జి.కె. దుర్గ, గణేష్. అప్పలరాజు, రమణమ్మ, వినోద్, యాళ్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రకతి వ్యవసాయంపైశిక్షణ
కొందుర్గు: మండలంలోని పద్మారంలో శుక్రవారం ప్రకతి వ్యవసాయంపై రైతులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు విశ్వ మానవత సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస అల్లూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మానవత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణతో ఏర్పాటుచేస్తున్న ఈ శిక్షణలో భూసార పరీక్షలపై అవగాహన, విత్తనాలు నాటుట, విత్తనాలను శుద్ధిచేయు విధానం, కషాయాల తయారి తదితర అంశాలపై వివరిస్తారని పేర్కొన్నారు. -
ఆకుపచ్చని సేద్య సౌధం!
నీటి వనరులు బాగా తక్కువగా ఉన్న చోట అందుకు తగిన చిరుధాన్య పంటలు పండించడం.. రసాయనిక సేద్యానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం.. పండించిన చిరుధాన్యాలను అలాగే అమ్మేకంటే అటుకులు చేయించి అమ్మడం.. ఇవన్నీ ఆరుగాలం చెమటను చిందించే రైతన్నకున్న విజ్ఞతకు నిదర్శనాలు. అటువంటి విజ్ఞత కలిగిన రైతు దంపతులు తలమంచి నరసారెడ్డి, శారద. పంట పొలంతో పశువులకు అనుసంధానం చేయడం ద్వారా తమ వ్యవసాయ క్షేత్రాన్ని కరువు కాలాల్లోనూ సస్యశ్యామలంగా మార్చుకున్న మార్గదర్శకులు ఈ ఆదర్శ రైతు దంపతులు.. ♦ మామిడి తోటలో చిరుధాన్యాల సాగు.. ♦ చిరుధాన్యాల కన్నా అటుకులు తినడం సులభం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో తలమంచి నరసారెడ్డి, శారద దంపతులు 21 ఎకరాల్లో ఆకుపచ్చని ఆశాసౌధాన్ని నిర్మించుకున్నారు. కాంట్రాక్టులు, వివిధ వ్యాపారాల్లో ఆటుపోట్లను చవిచూసిన నరసారెడ్డి పదిహేనేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లోనే నాలుగు ఆవులు, దూడలను తెచ్చి పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఏభైకి చేరింది. ఆరు ఎద్దులు ఉన్నాయి. సొంత అరకలతోనే దుక్కి పనులు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న దగ్గరి నుంచి వీరి క్షేత్రం పచ్చగా మారిపోయింది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న నరసారెడ్డి, శారద మక్కువతో ప్రకృతి సేద్య జీవనం సాగిస్తున్నారు. 12 ఎకరాల్లో 18 ఏళ్ల నాటి సుమారు 500 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్య చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల మిశ్రమ సేద్యం చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదన ద్వారా భూమిని సారవంతం చేస్తున్నారు. కొర్రలు, ఆరికలు, ఒరగలు, వివిధ రకాల జొన్నలు, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని అందిస్తున్నారు. సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని జీవామృతం తయారు చేసి.. మినీ ట్రాక్టర్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరంలో ఆర్ఎన్ఆర్15048, మరో ఎకరంలో సోనా మసూరితోపాటు ఇంకో అరెకరంలో నవర రకం సంప్రదాయ వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు. సోనామసూరి నాట్లు వేశారు. మిగతా రెండు వరి వంగడాలను వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏ యే పంటల పెరుగుదల తీరు, దిగుబడి తీరుతెన్నులను నిశితంగా పరిశీలించే నరసారెడ్డి ప్రయోగశీలి. రాగులు ఒక మడిలో ఏక పంటగా సాగు చేస్తూనే, మరో మడిలో నాట్లు వేసే పద్ధతిలో వేశారు. చిరుధాన్య పంటల సాగులో రాలిన విత్తనాలు మొలకెత్తుతుండటంతో వరుసగా 2-3 పంటలు తీస్తున్నారు. ఉదాహరణకు.. 2015 ఖరీఫ్లో 2 కిలోల కొర్రలు చల్లారు. అక్టోబర్లో పంట నూర్చారు. అదే పొలంలో విత్తనాలు చల్లకుండానే రాలిన కొర్రలే మళ్లీ మొలిచాయి. 2016 జనవరిలో కొర్ర పంట కోశారు. అదే భూమిలో ఏప్రిల్లో మళ్లీ కొర్ర పంటను కోశారు. బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేశారు. రోజుకు 40 కిలోల పేడ నీటిని పోస్తూ ఉంటారు. గ్యాస్ను వంటకు వాడుకోవడంతోపాటు 25 హెచ్పి డీజిల్ ఇంజిన్ను పాక్షికంగా గోబర్ గ్యాస్తో నడుపుతున్నారు. భూగర్భ జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతం అది. వర్షాలు కూడా తక్కువే. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం జియాలజిస్టును తీసుకొచ్చి బోర్లు ఎక్కడ వేయాలో చెప్పమన్నారు. ఆయన పొలమంతా కలియదిరిగి ఇక్కడ బోరు వేసినా నీటి చుక్క పడదు. సాగు మానెయ్యడం మేలని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోయాడు. అయితే, నరసారెడ్డి పొలం మధ్యలో నుంచి వెళ్తున్న చిన్న వాగుపై చెక్ డ్యాం నిర్మించి.. వాననీటిని ఒడిసిపడుతున్నారు. చెక్డ్యాం వద్దే బోరు వేశారు. ఒక బోరు రెండించుల నీరు పోస్తోంది. మరోచోట కూడా బోరు వేస్తే కొద్దిగా నీరు వస్తోంది. పరిమిత నీటి వనరులతోనే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. అనేక అవరోధాలను అధిగమించి సాగు చేసే చిరుధాన్యాలను హైదరాబాద్లో మిల్లుకు తీసుకెళ్లి అటుకులు పట్టించి, ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నారు. చిరుధాన్యాలు తినడం అలవాటు లేని వారు సైతం ఈ అటుకులను సులభంగా తినగలుగుతున్నారని, తమకు మంచి ఆదాయంతో పాటు చిరుధాన్యాల వాడకాన్ని పెంచుతున్నందుకు ఆనందంగా ఉందని నరసారెడ్డి, శారద తెలిపారు. తాము కూడా చిరుధాన్యాల అటుకులు, రాగి ముద్ద తింటున్నామన్నారు. ధాన్యాన్ని ముడిబియ్యం పట్టించి అమ్ముతున్నారు. తద్వారా రెట్టింపు ఆదాయం పొందుతున్నామని తెలిపారు. ఆవులతోపాటు కొన్ని గొర్రెలు, మేకలు, కోళ్లను సైతం పెంచుతున్నారు. పశువుల పేడ, మూత్రాన్ని వ్యవసాయానికి వాడుకుంటూనే అధికాదాయం పొందుతున్నారు. అన్నిటికన్నా మిన్నగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకుని తింటూ.. నలుగురికీ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తున్న నరసారెడ్డి, శారద (98480 25089) దంపతుల కృషి ప్రశంసనీయం. - సాగుబడి డెస్క్ -
పుష్కరాల్లో సర్వమత ప్రార్థనలు చేయండి: సీఎం
అమరావతి: ప్రకృతితో అనుసంధానమైన నదులు కుల, మత, ప్రాంతాలకు అతీతమైనవని... కృష్ణా పుష్కరాల 12 రోజుల పాటు అన్ని గ్రామాల్లోను సర్వమత ప్రార్థనలు చేసి ఆ నది రుణం తీర్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎంవోలో బుధవారం రాత్రి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను గురువారం ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొని సాయంత్రం ఇబ్రహీంపట్నం వద్ద గల సంగమ ప్రాంతంలో కృష్ణా పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం పుష్కరాలు ప్రారంభిస్తూ దుర్గాఘాట్లో స్నానం చేస్తానని చెప్పారు. పుష్కరాల 12 రోజులు రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు హారతి, సంకల్పాన్ని అన్ని టీవీ చానల్స్ కచ్చితంగా ప్రసారం చేయాలని ఆదేశించారు. చెప్పారు. గోదావరి-కృష్ణా సంగమం వల్ల కృష్ణా నదిలో ఫలానా చోట పుష్కర స్నానం చేస్తే పుణ్యం రాదనే పుకార్లను నమ్మొద్దని సీఎం కోరారు. గోదావరి నది నుంచి పుష్కరుడు కృష్ణా నదికి వస్తున్నాడని, ఈ రెండు నదులు సంగమంతో ఇక్కడ మరింత పవర్ఫుల్గా ఉంటుందన్నారు. పుష్కరాల్లో టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పుష్కరాలపై జొన్నవిత్తుల రచించిన పాటలతో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ రూపొందించిన కృష్ణా పుష్కర వైభవం సీడీని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అలాగే పుష్కర కరపత్రాన్నీ ఆవిష్కరించారు. -
ప్రకృతిలో ప్రయాణం..!
-
ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ
ఇబ్రహీంపట్నం : కాలుష్యమయంగా మారుతున్న భూగోళంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి అన్నారు. ‘బడిలో చెట్టు భవితకు మెట్టు’ అనే కార్యక్రమంలో భాగంగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని మొక్కల సంరక్షణకు ట్రీగార్డ్స్ ను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది చెట్లను మన అవసరాలకు నరికివేస్తున్నమే తప్ప తిరిగి మొక్కలు పెంచే బాధ్యతను తీసుకోవడం లేదన్నారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించని పక్షంలో భవిష్యత్ను ఊహించుకోలేమని తెలిపారు. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతిని కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు అధికమైతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఏడాదికి 46 కోట్ల చొప్పున ఐదేళ్లలో 250 కోట్ల మొక్కలను నాటాలన్న లక్షా్యన్ని పెట్టుకోవడం శుభ పరిణామన్నారు. అనంతరం మొక్కల పెంపకంపై విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్రెడ్డి, మండల విధ్యాధికారుల వెంకట్రెడ్డి, రఘుకుమార్, గురుకుల విద్యాపీఠ్ ప్రిన్సిపాల్ డీ శ్రీనివాస్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్గుప్త, శ్రీనివాస్గౌడ్, సీఐ స్వామి, ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, పాండు రంగారెడ్డి, చిత్రాలేఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిలీప్రెడ్డి మొక్కలను నాటి, ట్రీగార?ట్స్ ను పెట్టారు. ఈ ఫౌండేషన్కు విరాళం ఇచ్చిన జంబుల వెంకట్రెడ్డి కుటుంబాన్ని సన్మానించారు. -
చంద్రబాబు వైఖరితో ఆహార సంక్షోభం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు చిలకలూరిపేట టౌన్: సీఎం చంద్రబాబు వైఖరితోనే పచ్చటి సాగు భూములు ధ్వంసమై ఆహార, ఆర్థిక సంక్షోభం తలెత్తనుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 27వ మహాసభలు శనివారంతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో అవినీతి, విధ్వంసక పాలన సాగుతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఏకమై ప్రభుత్వ విధానాలకు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. -
కేన్సర్ నుంచి రక్షణకు ప్రకృతి సేద్యం!
రసాయనిక సేద్యానికి, అధిక ఆహార ధాన్యాల దిగుబడికి అనేక దశాబ్దాల క్రితం నుంచి పెట్టింది పేరు పంజాబ్ రాష్ట్రం. కానీ, వ్యవసాయంలో రసాయనాల వాడకం మితిమీరిపోయి.. తినే ఆహారం స్లోపాయిజన్గా మారిపోతే? అంతకన్నా ప్రమాదకర పరిస్థితి మరేమి ఉంటుంది? ధాన్యం, గోధుమ రాశులు పండించే పచ్చని పంట పొలాల సాక్షిగా కేన్సర్ మహమ్మారి రైతు కుటుంబాలకు కడుపుకోతను మిగుల్చుతుంటే.. కింకర్తవ్యమ్? ఈ ప్రశ్నలకు ప్రకృతి వ్యవసాయమే ఏకైక సమాధానమని అవతార్సింగ్ భావించారు. కన్న కొడుకు కేన్సర్ బారిన పడి మృతిచెందిన క్షణంలో రసాయన సేద్యానికి చెల్లు చీటీ ఇచ్చాడాయన. ప్రకృతి సేద్యానికి పచ్చ తివాచీ పరిచారు. కుటుంబం, సమాజం ఆరోగ్యం కోసం ఆ రైతు తీసుకున్న నిర్ణయం అన్నదాతలందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. * కేన్సర్తో కుమారుడి మరణం.. రసాయన సేద్యానికి స్వస్తి చెప్పిన పంజాబ్ రైతు * ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం అవతార్ సింగ్ స్వగ్రామం పంజాబ్ రాష్ట్రం భోగ్పూర్ సమీపంలోని చార్కే. పన్నెండెకరాల పొలంలో ప్రకృతి సేద్య విధానంలో వివిధ రకాల పంటలను ఆయన సాగు చేస్తున్నారు. ఆయన కుటుంబం అంతా నాణ్యమైన రసాయనిక అవశేషాల్లేని పంట ఉత్పత్తులను వినియోగించడమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఖ్యాతి గడించారు. ఈ విజయానికి వెనుక విషాధ గాథ దాగి ఉంది. చేదు జ్ఞాపకం.. తీపి ఫలాలు... కానీ దశాబ్దం క్రితం.. పరిస్థితి నేటికి పూర్తి భిన్నం. రసాయన సేద్యం చేస్తుండటం వల్ల పంటలపై పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేసేవారు. అవసరమైన పురుగు మందులన్నింటినీ టోకున ఒకేసారి కొనుగోలు చేసేవారు. 2006లో అమర్జిత్ సోదరుడు బ్లడ్ కేన్సర్తో చనిపోయారు. పంటలపై విపరీతమైన రసాయనిక పురుగు మందుల వాడకమే కొడుకు మరణానికి కారణమని ఆయన భావించారు. రసాయన వ్యవసాయం వల్ల తదుపరి కూడా తమ కుటుంబంలో సభ్యుల ఆరోగ్యానికి ముప్పు వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని భావించారు. దీంతో రసాయనాల వాడకాన్ని వదలి ప్రకృతి సేద్యం చేపట్టారు. అప్పటి నుంచి కూరగాయలు, చెరకు, మొక్కజొన్న, పసుపు పంటలను ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. ‘రసాయన సేద్య పద్ధతి మంచిది కాదనే విషయం తెలిసినా చాలా ఏళ్లు కొనసాగించాం. కొన్నాళ్లకు దాని దుష్పరిణామాలు అనుభవించాం. కుటుంబ సభ్యుల ప్రాణాలను బలిపెట్టాల్సిరావటంతో సాగు పద్ధతిని మార్చుకున్నాం’ అంటారు అవతార్ సింగ్ కొడుకు అమర్జిత్ సింగ్. తొలి రోజుల్లో అవగాహన కోసం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ రాసిన పలు పుస్తకాలను అవతార్ సింగ్ చదివారు. అయితే, సాటి రైతులు మాత్రం ప్రకృతి సేద్యంలో దిగుబడులు సరిగ్గా రావని.. ఆకలితో పస్తులుండి చావటం ఖాయమని ఆయనను వారించే ప్రయత్నం చేశారు. అవతార్సింగ్ మాత్ర ం వారి మాటలను పట్టించుకోలేదు. యోగిలా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. పంటకు పోషకాలను అందించేందుకు ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన జీవామృతాన్ని.. చీడపీడలు తెగుళ్లను నివారించేందుకు ఇంగువ, పటిక, పులిసిన మజ్జిగ, అల్లం వెల్లుల్లి కషాయాలను వాడుతున్నారు. క్రమంగా ప్రకృతి సేద్యంలో అవతార్సింగ్ మంచి పట్టు సాధించారు. ప్రకృతి సేద్యంలో పండించిన చెరకుతో తయారు చేసిన బెల్లాన్ని అమెరికా, ఇంగ్లాండ్ సహా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయన పండించిన బెల్లానికి విదేశాల్లోనూ మంచి గిరాకీ ఏర్పడింది. నాడు నవ్విన సాటి రైతులందరికీ నేడు అవతార్సింగ్ ఆదర్శప్రాయుడిగా మారారు. ఆయన వేసిన బాటలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులు ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నారు. రసాయన పురుగు మందుల వల్ల పంట పెరుగుదలకు దోహదం చేసే మిత్ర పురుగులు చనిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిత్ర పురుగులు ఏవి, శత్రు పురుగులు ఏవి అనే విషయంలో అవగాహన లేకపోవటమే రైతుల ఇబ్బందులకు కారణమంటారు అమర్జిత్. ‘పంజాబ్ ప్రభుత్వం, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ప్రకృతి సేద్యంపై శీతకన్నేశాయి. అయితే ప్రజలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తాయనే కారణంతో రసాయన అవశేషాల్లేని వ్యవసాయోత్పత్తులనే కొంటున్నారు. నేను కొనసాగించిన రసాయన సేద్యం వల్లే నా కొడుకు ప్రాణాలను బలిపెట్టాల్సి వచ్చింది. అప్పట్నుంచి ప్రకృతి సేద్యం ఆచరించటం మొదలుపెట్టాను.ప్రకృతి సేద్యం లాభార్జన కోసం మాత్రమే కాదు.. మనం ప్రేమించే వారి బాగు కోసం.. ఆరోగ్యం త ర్వాతే కదా మనకు ఏదైనా..?’ అంటారు అవతార్సింగ్. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
ప్రకృతి సేద్య బాటన ‘ముల్కనూర్’!
డబ్బా మూత తీయటం.. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయటం సులభంగా ఉండటంతో రైతులు పురుగుమందుల వాడకానికి అలవాటుపడ్డారు. కానీ.. మనసుపెట్టి అవగాహన చేసుకోవాలే గానే ప్రకృతి సేద్యాన్ని అంతే సులభంగా చేయవచ్చంటా రాయన. ఎలాంటి హడావుడి లేకుండా ప్రకృతి సేద్యంలో సునాయాసంగా వివిధ పంటలను సాగు చేస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారాయన. బోరు బావిలో ఉన్న కొద్దిపాటి నీళ్లతోనే ప్రకృతి సేద్యం చేస్తూ తీవ్ర కరవు పరిస్థితుల్లోను తోటి రైతులకు స్ఫూర్తిని పంచుతున్న ఆ రైతు పేరు పడాల గౌతమ్. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఆయన స్వగ్రామం. దశాబ్దాలుగా రసాయనిక వ్యవసాయానికి పెట్టిందిపేరైన ముల్కనూర్లో ప్రకృతి సేద్యాన్ని తొలుత ప్రారంభించిన ఘనత గౌతమ్కే దక్కుతుంది. ♦ తొలి అడుగు వేసిన సీనియర్ రైతు గౌతమ్ ♦ బొప్పాయి నీడలో అల్లం సాగు ♦ కరువులోనూ కళకళలాడుతున్న బొప్పాయి ♦ అంతర పంటలతో అధికాదాయం ♦ వివిధ రకాల నూనెల పిచికారీతో తెగుళ్ల నివారణ గౌతమ్ డిగ్రీ వరకు చదివారు. తమకున్న నాలుగెకరాల పొలంలో 2013 వరకు తమ గ్రామంలో మిగతా రైతుల్లానే రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతూ సేద్యం చేసేవారు. 2013లో హైదరాబాద్లో సుభాష్ పాలేకర్ నిర్వహించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం శిక్ష ణా తరగతులకు హాజర య్యారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు కలిగే ప్రయోజనాలను అవగాహన చేసుకున్నారు. సొంత ఆవులు లేకపోవటంతో పొరుగు రైతుల వద్ద నుంచి గోమూత్రం, పేడను సేకరించి జీవామృతం తయారు చేసుకొని పంటలకు వాడారు. ఎకరా వరితో రూ.54 వేల నికరాదాయం.. తొలి ప్రయత్నంగా 2014 ఖరీఫ్లో ఎకరం భూమిలో 1008 (సన్న రకం) వరి పంటను సాగు చేసి 36 బస్తాల దిగుబడి సాధించారు. బియ్యం విక్రయిస్తే రూ. 70 వేల ఆదాయం వచ్చింది. రూ. 16 వేల ఖర్చులు పోను రూ. 54 వేల నికరాదాయం లభించింది. రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 10 వేల నికరాదాయం లభించటమే కష్టంగా ఉండేది. అలాంటిది తొలి ఏడాదే రూ. 50 వేలకు పైగా లాభం కళ్లజూడటంతో ప్రకృతి సేద్యంపై గురి కుదిరిందంటారు గౌతమ్. ప్రకృతి సేద్యంలో అరెకరంలో అల్లం పంటను సాగు చేశారు. గతేడాది జూన్లో అల్లం దుంపలను బెడ్లపై విత్తుకున్నారు. రెండు అల్లం సాళ్ల మధ్యలో నీడ కోసం అలసంద, బొబ్బర్లను అంతర పంటలుగా సాగు చేశారు. ఇంటి అవసరాలకు సరిపడా దిగుబడి వచ్చింది. ఆగస్టులో మొక్కజొన్న, స్వీట్కార్న్లను అంతర పంటలుగా సాగు చేస్తే క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చింది. మొక్కల నీడలో ఉంటే అల్లం పంట ఎదుగుదల బావుండి, మంచి దిగుబడి వస్తుందని భావించి.. మొక్కజొన్న పంట పూర్తవ్వగానే నీడ కోసం అల్లం తోటలో బొప్పాయి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి మొక్కలను అక్టోబర్ మొదటి వారంలో నాటారు. మొక్కల మధ్య ఆరడుగులు, సాళ్ల మధ్య ఎనిమిదడుగుల దూరం ఉంచారు. అరెకరం అల్లం పంటలో 400 బొప్పాయి మొక్కలు నాటారు. న వంబర్లో మరో ఎకరంలో ఏక పంటగా బొప్పాయిని సాగు చేశారు. పూత, కాతకు ‘మీనామృతం’! లీటరు నీటికి 5 ఎం. ఎల్. చొప్పున ప్రత్యేకంగా తయారుచేసిన ‘మీనామృతా’న్ని కలిపి వారానికోసారి పిచికారీ చేసి పూత, పిందె రాలటాన్ని నివారిస్తున్నారు. నీటి పారకం, పిచికారీ ద్వారా పది రోజులకోసారి జీవామృతాన్ని మొక్కలకు అందిస్తారు. దశపత్ర కషాయం, మీనామృతంతో కలిపి వారానికోసారి పిచికారీ చేస్తారు. మొక్కలు నాటుకున్నప్పుడు, మూడు నెలల వయసున్నప్పుడు చెట్టుకు పావుకిలో చొప్పున ఘన జీవామృతం వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బొప్పాయిలో తొలి కాపు వచ్చింది. ఇప్పటి వరకు ఎనిమిది కోతలు వచ్చాయి. ఇంకా ఏడాదిన్నర వరకు పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడి రావచ్చని గౌతమ్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ. 2.80 వేల ఆదాయం వస్తుందని ఆయన అంచనా వేశారు. జీవామృతం, కషాయాల తయారీ... పిచికారీ చేసిన కూలీలకు కలిపి రూ. 80 వేలు అయ్యింది. ఎకరంన్నర బొప్పాయి తోటకు రూ. 3 లక్షల నికరాదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాయలను హైదరాబాద్ నుంచి వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రసాయన సేద్యంలో పండించిన బొప్పాయి కాయకు రూ. 12 చెల్లిస్తుండగా ప్రకృతి సేద్యంలో పండించిన కాయలకు రూ. 20 చెల్లిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి ఏడాది కూడా దిగుబడులు తగ్గకుండా గౌతమ్ జాగ్రత్తపడ్డారు. పాలేక ర్ సూచన మేరకు నాటినప్పుడు మొక్కకు పావు కిలో చొప్పున ఘన జీవామృతం అందించారు. దీంతో తొలి ఏడాదే బొప్పాయిలోనూ మంచి దిగుబడి వచ్చింది. అల్లం దిగుబడి 4 నెలల్లో చేతికొస్తుంది. ఎక్కువ శ్రమ అనే కారణంతో ప్రకృతి సేద్యం చేసేందుకు కొందరు రైతులు ఇష్టపడటం లేదు. అయితే, ప్రణాళిక రూపొందించుకుంటే ద్రావణాలు, కషాయాల తయారీ ఏమంత కష్టం కాదంటారు గౌతమ్. నెలకు సరిపడా ద్రావణాల తయారీకి అవసరమయ్యే ప్లాస్టిక్ డ్రమ్ములను ముందుగానే కొనుక్కోవాలని, నెలలో ఒక్కరోజు(15 రోజులకో పూట) కేటాయించి ద్రావణాలు, కషాయాలను తయారు చేసుకుంటే చాలని గౌతమ్ సూచిస్తున్నారు. రైతుకు సమయం కలిసివస్తుంది. అవసరమైనప్పుడు వెతుక్కోనవసరం లేకుండా నేరుగా స్ప్రేయర్లో పోసుకుని పిచికారీ చేసుకోవచ్చంటారు గౌతమ్. - తాళ్ళపల్లి సురేందర్, సాక్షి, భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా నూనెలతో పల్లాకు తెగులు కట్టడి! రసాయన సేద్యం చేస్తున్న సాటి రైతుల బొప్పాయి తోటలకు ఎల్లో మొజాయిక్ వైరస్ (పల్లాకు తెగులు) ఆశించింది. అరికట్టేందుకు ఎన్ని రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గౌతమ్ సాగు చేస్తున్న బొప్పాయి తోటలో కొన్ని మొక్కలకూ ఈ తెగులు ఆశించింది. అయితే, దశపర్ణి కషాయం, వివిధ రకాల నూనెలను క్రమం తప్పకుండా పిచికారీ చేసి వైరస్ను పొలమంతా వ్యాపించ కుండా గౌతమ్ అరికట్టారు. 200 లీటర్ల నీటిలో.. కిలో కొబ్బరి నూనెకు వేప, కానుగ, కొబ్బరి, విప్ప వంటి నూనెలను పావు కిలో చొప్పున కలిపి మూడు నెలలకోసారి ఎకరా తోటపై పిచికారీ చేస్తారు. ఆకులపై జిగటగా నూనె పొర ఏర్పడటం వల్ల రసం పీల్చే పురుగులు, చీడపీడలు ఆశించకుండా వికర్షకంగా పనిచే శాయి. దీని వల్ల పల్లాకు తెగులు ఉధృతి తగ్గింది. తోటి రైతుల తోటల్లో 70 నుంచి 80 శాతం పంటను ఆశించగా.. గౌతమ్ పొలంలో మాత్రం 10 శాతం పంటకే పరిమితమైంది. నూనెల పిచికారీ వల్ల చెట్లకు వివిధ పోషకాలు అందుతాయని ఆయన చెప్పారు. సాగు ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది ప్రకృతి సేద్యంలో పురుగుల కట్టడికి కషాయాలు, పోషకాల కోసం జీవామృతం వాడతాను. మిత్ర పురుగులు అభివృద్ధి చెంది చీడపీడల ఉధృతి తగ్గింది. రసాయన సేద్యంతో పోల్చితే ఖర్చు 75 శాతం మేరకు తగ్గుతుంది. జాగ్రత్తగా చేస్తే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాదే దిగుబడి తగ్గకపోగా పెరుగుతుంది. ఈ ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా ఉంది. వచ్చే ఏడాది నుంచి బత్తాయిని కూడా ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేయాలని అనుకుంటున్నాను. నన్ను చూసి మరో ఆరుగురు రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. - పడాల గౌతమ్ (98497 12341), ముల్కనూర్, కరీంనగర్ జిల్లా -
పదన పదనగా పారిన పసీనా...
నేపథ్యం ఎగిలివారంగతో సాహితీ లోకంలోకి అడుగు పెట్టి, దందెడతో సాహితి అభిమానులందరి హృదయాలకు దగ్గరై, అక్షర మొగ్గలుగా విచ్చుకొని బతుకు పరిమళాలు వెదజల్లుతూ ‘మిగ్గు’తో వినయంగా మీ ముందు తీరొక్కరంగుల పటమేస్తున్న. ప్రకృతి కోసం, పరుల కోసం, పంటల కోసం, పని కోసం, ఉత్పత్తి కోసం, ప్రగతి కోసం, పనికిరాని పశువుల కళేబరాలను అక్కరకొచ్చె అరొక్క పనిముట్లుగా మల్చి, తరతరాలుగా వంచనకు గురవుతూ, ఎద్దడుగు జాగ, ఎండి, బంగారం, పైస, ఫలం లేని ఎడ్డి గుడ్డి ఎట్టి బతుకులు నాకిచ్చిన ఆస్తి కులం, బలగం, తోలుతిత్తి, బిత్తి, లంద, దందెడ, తాడు, తల్గు, వార్నె, మంచం, తొట్టె, బుట్ట, చెత్త, చెదారం, జోడు, కాడు, వారు, సంచి, గూటం, కత్తి, ఆరె, డప్పు. చెప్పు కుట్టుతాంటె మా అయ్య ఎద్దు కొమ్మునుంచి ఎండిన పశువు కొవ్వు(మిగ్గు)ను తీసి, ఆరెను సానబెట్టి, అచ్చం శాస్త్రవేత్త లెక్కనె పదనపదనగా పారిన పసీననంతా పదునెక్కిన అతారెలు చేసేది. ఏది మాకు గాదు, పొద్దు గూకితె బుక్కెడు బువ్వ లేదు. జాతికి ఇంతజేసిన నా అయ్య ‘జాతిపిత’ కాలేదు. ఆకలితో, అనారోగ్యంతో నవిసిపోస్కొని నడుమంతరాన్నె నా అయ్య, అవ్వ చచ్చిండ్రు. నన్ను ఆగం జేసి, అనాథను జేసిండ్రు. ఆ ఆలాపనల నుంచి అక్షరబద్ధమైనదే ఈ మిగ్గు. స్వాతంత్య్రం వచ్చి స్వరాజ్యం ఏర్పడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అందమైన నినాదాలుగా మారి ఆచరణలో ఆమెడ దూరంలోనె. ఇంకా కులం కంపు కొడుతూనె ఉంది. అంటరాని జీవితాలు అంధకారంలోనె. ఆకలితో, ఆత్మన్యూనతతో, అవమానాలతో, అసమానతలతోనె! అత్యాచారాలకు అణిచివేతలకు గురవుతూనె వున్న ఆ ఆదిమానవుల, కష్టజీవుల పరోపకారం తప్ప పగలు, ప్రతీకారాలు తెలువని అణగారిన ప్రజల ఆర్తనాదాల నుంచి ఈ మిగ్గు ముగ్గుబోసుకున్నది. (పొన్నాల బాలయ్య కవితా సంకలనం ‘మిగ్గు’ ప్రచురణ: తెలంగాణ రచయితల సంఘం. పేజీలు: 126; వెల: 100; కవి ఫోన్: 9908906248) -
ఇంద్రధనుస్సు చీరకట్టే..!
ఎండావాన కలసిన వేళ... ప్రకృతిలో ఒక పులకింత... ఆకాశంలో ఒక వినూత్న తేజస్సు ఆకాశ వీధికి తోరణం కట్టినట్లు ఆకర్షణీయమైన ఇంద్ర ధనుస్సు. చూపరుల మదిలో ఉల్లాసాల ఉషస్సులు ప్రసరింపజేస్తున్న ఈ సోయగాల ఇంద్ర ధనుస్సు కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం కనిపించింది. ఆకాశపు తెల్ల కాగితంపై కోణమానిని పెట్టి వెలుగు రేఖ గీసినట్టనిపించే ఈ దృశ్యం నిర్మలాకాశ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసింది. సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు ఇంద్రధనుస్సు చీరకట్టే..! -
ప్రకృతిని అధ్యయనం చేసి అద్భుతాలు సృష్టిద్దాం..
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు ఏఎన్యూ : ప్రకృతిలో జీవరాశికి సంబంధించిన ఎన్నో విశిష్టతలున్నాయని, ప్రకృతిని అధ్యయనం చేసి అద్భుతాలు సృష్టించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న ఏపీ సైన్స్ కాంగ్రెస్ బ్రోచర్ ఆవిష్కరణ, సైన్స్ పాపులరైజేషన్ ప్రోగ్రాంపై సదస్సును బుధవారం యూనివర్సిటీలో నిర్వహించారు. బ్రోచర్ ఆవిష్కరించాక ‘ఇన్సె్పౖర్డ్ సింథసీస్ ఆఫ్ నానో మెటీరియల్స్’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు ల్యాబ్లకే పరిమితమై సమయాన్ని వృథా చేసుకోవద్దని, సహజ సిద్ధమైన వాటిపై పరిశోధనలు చేయాలని సూచించారు. ప్రస్తుతం మెడిసిన్, సర్జరీ తదితర అన్ని అంశాల్లో నానో మెటీరియల్స్ కీలకంగా మారినట్లు తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.రామకృష్ణారావు మాట్లాడుతూ వేల సంవత్సరాల కిందటే భారతీయులు ప్రపంచానికి గొప్ప సైన్స్, విద్య, నాగరికతను అందించినట్లు తెలిపారు. సైన్స్ తదితర రంగాల్లో ప్రపంచంలో భారతీయుల గొప్పతనాన్ని చాటేలా విద్యార్థులు, పరిశోధకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఎన్యూ వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్, రెక్టార్, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ కార్యదర్శి ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఆచార్య ఏవీ బసవేశ్వరరావు, ఏఎన్యూ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్పాల్, ఓఎస్స్డీ ఆచార్య దత్తాత్రేయరావు, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య బి.విక్టర్బాబు, మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి.రాంబాబు తదిరతులు ప్రసంగించారు. పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంటితోట కూరల రుచి ఎంతో ఇష్టం!
ప్రకృతితో మమేకమవ్వాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. కానీ, ఆ ఆకాంక్షకు కార్యరూపం ఇవ్వగలిగేది కొందరే. అటువంటి కోవలోని వారే డాక్టర్ కొండా శ్రీదేవి. హైదరాబాద్ కృష్ణనగర్లో సొంత ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా బిజీగా ఉండే ఆమె తన ఆసుపత్రి మేడ మీద ప్రత్యేక శ్రద్ధతో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇనుప మెట్లను ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్ కుండీలను అమర్చారు. పూలమొక్కలతోపాటు సేంద్రియ పద్ధతుల్లో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను పదేళ్లుగా పండిస్తున్నానని డా. శ్రీదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సేపు మొక్కల పనిలో గడుపుతానన్నారు. పెద్ద కుండీలో దానిమ్మ చెట్టు ఫలాలనిస్తోంది. ఎక్కువ కుండీల్లో వంగ, మిరప, టమాటా పండిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండే వెడల్పాటి మట్టి కుండీలో కొత్తిమీర, పాలకూర సాగు చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సబ్సిడీపై రూ. 3 వేలకు అందిస్తున్న ఇంటిపంటల కిట్ను కొనుగోలు చేశారు. వారు ఇచ్చిన సిల్పాలిన్ బెడ్స్లో టమాటాతోపాటు చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ విత్తారు. మట్టిలో పశువుల ఎరువు కొంచెం కలిపిన మట్టి మిశ్రమం వాడుతున్నానని, నెలకోసారి ప్రతి కుండీకీ కొద్ది మొత్తంలో వర్మీ కంపోస్టు వాడుతున్నానని ఆమె తెలిపారు. మొక్కలతో సంభాషిస్తూ వాటి బాగోగులు చూసే పనిలో నిమగ్నమైతే రోజంతా పనిచేసిన అలసట ఇట్టే మాయమవుతుందన్నారు. మొక్కలు మరింత ఏపుగా పెరగడం కోసం, చీడపీడల నివారణకు కంపోస్టు టీని, ట్రైకెడోర్మా విరిడి ద్రావణాన్ని కూడా వాడాలనుకుంటున్నానని డా. శ్రీదేవి తెలిపారు. తాను పండించుకున్న వంకాయలు, టమాటాల రుచి తనకెంతో ఇష్టమని ఆమె సంతృప్తిగా చెప్పారు. నగరవాసుల ఆరోగ్యదాయకమైన జీవనానికి సేంద్రియ ఇంటిపంటల సాగు చాలా అవసరమని అంటున్న డా. శ్రీదేవి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ (రిటైర్డ్) సంగెం చంద్రమౌళి కుమార్తె. వివరాలకు 98495 66009 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు. - ఇంటిపంట డెస్క్ (intipanta@sakshi.com) ఫొటోలు: రాంపురి లావణ్యకుమార్ -
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
-
మార్వెలస్ మాథేరాన్
టూర్దర్శన్ ప్రకృతి అందాలకు నెలవైన పడమటి కనుమల్లో మాథేరాన్ చాలా చిన్న పట్టణం. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం మన దేశంలోనే అతి చిన్న హిల్స్టేషన్. ఇక్కడి జనాభా పట్టుమని పదివేలు కూడా ఉండదు. వాహనాల రణగొణలు ఏమాత్రం వినిపించవు. ఎలాంటి హడావుడీ కనిపించదు. చుట్టూ నింగిని తాకే కొండలు... పచ్చదనం నింపుకున్న లోయలు... పక్షుల కిలకిలలు... వనవిహారంపై మక్కువ గలవారు మాథేరాన్ను చూస్తే... ‘మార్వెలస్’ అనకుండా ఉండలేరు. మాథేరాన్ను 1850లో అప్పటి థానే కలెక్టర్ హఫ్ పాయింజ్ మాలెట్ తొలిసారిగా గుర్తించాడు. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఈ ప్రదేశాన్ని పట్టణంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి బాంబే గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్స్టోన్ దీనికి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ జనావాసాలు ఏర్పడ్డాయి. తర్వాత 1907లో వ్యాపారవేత్త సర్ అదామ్జీ పీర్భోయ్ సమీపంలోని నేరల్ వరకు మాథేరాన్ హిల్ రైల్వే లైన్ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఈ రెండు పట్టణాల మధ్య టాయ్ ట్రెయిన్ను నడుపుతున్నారు. ఏం చూడాలి? * పడమటి కనుమల అందాలను తనివితీరా చూసి తీరాల్సిందే. కొండ శిఖరాలపై ఉన్న లూయిసా పాయింట్, పనోరమా పాయింట్, హనీమూన్ పాయింట్, పోర్కుపైన్ పాయింట్, అలెగ్జాండర్ పాయింట్, ఎకో పాయింట్, వన్ ట్రీ పాయింట్ వంటి ప్రదేశాల నుంచి తిలకిస్తే మాథేరాన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, పచ్చదనంతో నిండిన లోయల అందాలు కనువిందు చేస్తాయి. * నెరల్-మాథేరాన్ల మధ్య కొండ మార్గంలో నడిచే టాయ్ ట్రెయిన్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. * మాథేరాన్ మెయిన్ రోడ్డుకు కేవలం కిలోమీటరు దూరంలోనే షార్లట్ సరస్సు వర్షాకాలంలో జలకళతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సుకు సమీపంలోనే పురాతనమైన పిశర్నాథ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇందులోని స్వయంభూ లింగాన్ని సిందూరంతో అర్చిస్తారు. ఆలయం వద్ద నుంచి తిలకిస్తే సరస్సు పరిసరాలు ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. * మాథేరాన్ మెయిన్రోడ్డుపై ఉన్న సెంట్రల్ బజారులోని దుకాణాలు స్థానిక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ బజారు మీదుగా నడక సాగించడం ఆహ్లాదభరితంగా ఉంటుంది. * మాథేరాన్లోని అంబర్నాథ్ ఆలయం మరో పురాతన శివాలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళా సౌందర్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఏం చేయాలి? * మాథేరాన్ పట్టణంలోకి కార్లు తదితర మోటారు వాహనాలను అనుమతించరు. పట్టణంలో తిరగాలంటే కాలినడకను ఆశ్రయించాలి. నడిచే ఓపిక లేకుంటే రిక్షాలపై ప్రయాణించవచ్చు. మరో విశేషమేమిటంటే ఇక్కడ గుర్రాలను అద్దెకిస్తారు. ఆసక్తి ఉన్న వారు గుర్రాలపై సవారీ చేస్తూ వీధులన్నీ చుట్టి రావచ్చు. * షార్లెట్ సరస్సు, లూయిసా పాయింట్, హనీమూన్ పాయింట్, ఎకో పాయింట్, కింగ్ జార్జి పాయింట్ తదితర వ్యూ పాయింట్ల వద్ద సరదాగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. * అంబర్నాథ్ ఆలయం, పిశర్నాథ్ మహాదేవ మందిరం వంటి పురాతన ఆలయాలతో పాటు కొండ శిఖరంపై నిర్మించిన ప్రబాల్ కోటను సందర్శించవచ్చు. * ట్రెక్కింగ్పై ఆసక్తి గలవారు ఇక్కడ అడుగడుగునా తారసపడే కొండలపైకి, లోయల్లోకి దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల అడవుల్లో వనవిహారాలు చేయవచ్చు. ఏం కొనాలి? * చిన్న పట్టణం కావడంతో మాథేరాన్లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఏవీ ఉండవు. అయితే, మెయిన్ రోడ్డులో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిన్న దుకాణాల్లో షాపింగ్ చేసుకోవచ్చు. * ఈ దుకాణాల్లో తోలు వస్తువులు, టోపీలు, షూస్, స్థానిక కళాకారులు పేము, ఎండిన పూలు వంటి వాటితో రూపొందించిన హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే మిఠాయి ‘చిక్కీ’ రుచిని ఆస్వాదించేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కొనుక్కుని తీసుకువెళతారు. * ఇక్కడి దుకాణాల్లో తేనె, వనమూలికలు, గాజు బొమ్మలు వంటివి కూడా చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి మాథేరాన్కు సమీపంలోని నేరల్ వరకు రైలులో రావచ్చు. * నేరల్ నుంచి మాథేరాన్కు టాయ్ ట్రెయిన్ అందుబాటులో ఉంటుంది. చాలా తాపీగా సాగే ఈ రైలు ప్రయాణాన్ని అడుగడుగునా ఆస్వాదించవచ్చు. * ఒకవేళ ముంబై మీదుగా రోడ్డుమార్గంలో రావాలనుకున్నా నేరల్ వరకు మాత్రమే బస్సులు లేదా ట్యాక్సీల్లో వచ్చి, అక్కడి నుంచి టాయ్ ట్రెయిన్ ద్వారా మాత్రమే మాథేరాన్కు రావాల్సి ఉంటుంది. * పుణే, ఔరంగాబాద్ల నుంచి కూడా నేరల్ వరకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. -
నేడు వరల్డ్ స్నేక్ డే
పపపపపప... ప్రకృతి! కల్లోకొస్తే... గజగజ వణికిపోతాం. కళ్లెదురుగా కనిపిస్తే బిగుసుకుపోతాం. ‘పపపపపపపపప.. పాము...’ అంటూ పరుగులు తీస్తాం. కానీ కొంతమంది అలా ఉండరు. పాముని కళ్లింత చేసుకుని అబ్బురంగా చూస్తారు. పాముకు కలలో కూడా అపకారం తలపెట్టరు! పామును ఎవరైనా చంపబోతే... ‘వద్దొద్దు.. మూగప్రాణి వదిలేద్దాం’ అంటారు. ఏమిటి.. వాళ్లకూ మనకూ తేడా? మనకు భయం. వాళ్లకు భయం లేదు. అంతే తేడా. అవును. పామును ప్రకృతిలో భాగంగా చూస్తే... భయం అనిపించదు. ప్రకృతి నుంచి వేరు చేసి చూసినప్పుడే... భయం ఆవహిస్తుంది. భయం పాముకన్నా ప్రమాదకరమైనది. ఇవాళ ‘వరల్డ్ స్నేక్ డే’! పాముల గురించి తెలుసుకుందాం. భయాన్ని పోగొట్టుకుందాం... ప్రతి ‘డే’కి ఒక హిస్టరీ ఉంటుంది. కానీ ‘స్నేక్ డే’కి అలాంటి హిస్టరీ ఏం కనిపించదు! ‘జూలై 16 వరల్డ్ స్నేక్ డే’ అన్నదొక్కటే ప్రపంచానికి తెలుసు. దీనిని ఎవరు ప్రారంభించారో ఎక్కడా సమాచారం లేదు! ఎలా మొదలైందో అదీ లేదు. అంతమాత్రాన ఈ ‘ప్రపంచ సర్ప దినోత్సవానికి’ ప్రాముఖ్యం లేదని కాదు. ఏటా ఈ రోజు ప్రపంచ పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు స్నేక్ డేని జరుపుకుంటారు. అంతా ఒక చోట చేరతారు. పాముల ముద్దు ముచ్చట్లను షేర్ చేసుకుంటారు. ఈ సందడినంతా మనం టెక్సాస్లో చూడాలి! కోళ్ల ఫారంలా అక్కడొక ఫేమస్ స్నేక్ ఫారం ఉంది. 1967 నుంచి అది అక్కడ ఉంది. 1970లలో ‘రమోన్స్’ అనే రాక్ బ్యాండ్ సాంగ్తో ఆ పాముల ఫారానికి క్రేజ్ పెరిగింది. టూరిస్టులు ఎక్కువయ్యారు. ఇక జూలై 16 వచ్చిందంటే సందర్శకుల కిటకిట. స్నేక్ డే సందర్భంగా ఫ్యామిలీ ఇస్తున్న సర్ప సమాచారం ఇది. సర్పాలు-సంగతులు ⇒ పాములు తమ తలకంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేయగలవు. వీటి దడవల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది. ⇒అంటార్కిటికాలో తప్ప ప్రపంచంలోని ప్రతి ఖండంలోనూ పాములు ఉన్నాయి. పదహారు వేల అడుగుల కంటే ఎత్తున ఉన్న హిమాలయాల మీద కూడా పాములు కనిపించవు. అలాగే ఐర్లాండ్, ఐస్ల్యాండ్, న్యూజిలాండ్ దీవుల్లో కూడా పాములు ఉండవు. వాటి మనుగడకు అవసరమైన వాతావరణం ఆ ప్రాంతాలలో ఉండదు. ⇒ ఇవి నాలుకతో వాసన చూస్తాయి.. ⇒ నీటి అడుగున ఉండే పాములు తమ చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి. సర్పచిత్రాలు ⇒నోము (1974) : ఈ చిత్ర కథానాయిక చంద్రకళ నాగభక్తురాలు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భర్త తరపు చుట్టాలు ఆస్తి కోసం ఇద్దర్నీ చంపాలని కుట్రలకు పాల్పడతారు. భక్తురాలి కోసం నాగదేవత ఏవిధంగా ఆ కుట్రలను తిప్పి కొట్టింది? నాస్తికుడైన భర్తను ఎలా రక్షించింది? అనేది చిత్ర కథాంశం. ⇒దేవతలారా దీవించండి (1977) : నల్లమల అడవిలో ఉన్న నాగదేవత గుడిలోని నిధిని ఐదుగురు స్నేహితులు వశం చేసుకోవాలని చూస్త్తారు. నాగదేవతకు హాని తల పెడతారు. నాగదేవత ఎలా పగ తీర్చుకుందనేది చిత్రకథ. ⇒పున్నమి నాగు (1980) : చిన్నప్పట్నుంచీ తండ్రి కొంచెం కొంచెం విషాన్ని ఆహారంలో కలిపి ఇవ్వడంతో నాగులు (చిరంజీవి)లో పాము లక్షణాలు వస్తాయి. పౌర్ణమి రోజున పాము తరహాలో ప్రవర్తిస్తాడు. అతని కాటుకు అమాయక మహిళలు మరణిస్తారు. ఈ లక్షణాలను వదిలించుకోవడానికి పరిష్కారం లేదని తెలిసి నాగులు ఆత్మహత్య చేసుకుంటాడు. ⇒దేవి (1999) : ఓ ప్రమాదంలో చిక్కుకున్న నాగదేవతను రక్షించబోయి ఓ పెద్దాయిన ప్రాణాలు కొల్పోతాడు. దుష్టశకులు, కుటుంబ సభ్యుల నుంచి ఆయన కుమార్తెను రక్షించడానికి మనిషి రూపంలో భువిపైకి వచ్చిన నాగదేవత కథే ఈ చిత్రం. దశ విషసర్పాలు పాము కనబడగానే గుండె గుభేల్మంటుంది. అది కరుస్తుందేమో, కరిస్తే ప్రాణం హరీమంటుందేమోనని కంగారు పుడుతుంది. కానీ అన్ని పాములూ కరిచేయవు. కరిచినా అన్ని పాముకాట్లకూ ప్రాణాలు పోవు. ప్రపంచంలో ఉన్న పాముల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. వాటిలో ఇవి తొలి పది స్థానాల్లో ఉన్నాయి... 1. ఫియర్స్ స్నేక్ లేక ఇన్ల్యాండ్ తైపాన్ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం. ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఇది ఒక్కసారి కాటేస్తే వచ్చే విషంతో 100 మంది మనుషులు, 2,50,000 ఎలుకలు చనిపోతాయట. అంటే సాధారణ కోబ్రాలో ఉండే విషంతో పోలిస్తే యాభై రెట్లు. 2. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, ఇండోనోసియాల్లో అత్యధికంగా కనిపించే ఈ పాము అత్యంత వేగంగా కదులుతుంది. దీనికి కోపం ఎంత ఎక్కువంటే ఒక్కసారి కాటేసి ఊరుకోదట. కసి తీరేవరకూ వేస్తూనే ఉంటుందట. 3. బ్లూ క్రెయిట్ ఇవి ఆగ్నేయ ఆసియా, ఇండో నేసియాల్లో కనిపిస్తాయి. ఇవి రాత్రిళ్లు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. కోబ్రాలో కంటే పదహారు రెట్ల అధిక విషం ఉంటుంది వీటిలో. ఇది కాటు వేస్తే కండరాలు చచ్చుబడటం, నరాలు చిట్లిపోవడం, వాంతులు వంటి లక్షణాలు కలుగుతాయి. త్వరగా చికిత్స చేయకపోతే కోమా లోకి వెళ్లిపోవడమో, బ్రెయిన్ డెడ్ కావడమో జరుగుతుంది. 4. తైపాన్ ఇది కూడా ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కరవగానే రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది. ఊపిరి సలపదు. ఓ గంటలోపే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇది కరిచిన ప్రతిసారీ విషయం విడుదల కాదట. విడుదలైతే మాత్రం అంతే సంగతులు. 5. బ్లాక్ మాంబా ఆఫ్రికా ఖండంలో ఇవి విరివిగా ఉంటాయి. నేలమీద జీవించే పాముల్లో ఇది అత్యంత వేగ వంతమైన సర్పం. ఒక్క కాటుతో విడుదలయ్యే విషంతో పది నుంచి ఇరవై అయిదు మంది ప్రాణాలు పోతాయి. ఇది కరిస్తే ముందు నోరు ఆరిపోతుంది. కళ్లు మసకబారతాయి. కండరాలు పట్టు వదిలేస్తాయి. కడుపునొప్పి, వాంతులు, పెరాలిసిస్.. ఇలా రకరకాల సమస్యలు తలెత్తి పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల్లోపు ప్రాణం పోతుంది. 6. టైగర్ స్నేక్ ఆస్ట్రేలియాలో కనిపించే ఈ సర్పం ఒంటిమీది డిజైన్ పులుల మాదిరిగా అనిపిస్తుంది. అందుకే దీనికా పేరు వచ్చింది. ఇవి గుడ్లు పెట్టవు. ఒకేసారి ఇరవై నుంచి ముప్ఫై పిల్లల్ని కంటాయి. కరిస్తే అరగంటలో ప్రాణం పోతుంది. ఒకవేళ విషం కాస్త తక్కువ మోతాదులో విడుదలైతే ఆరు నుంచి ఇరవై నాలుగ్గంటల్లో పోతుంది. 7. ఫిలిప్పైన్ కోబ్రా కోబ్రాలన్నింటిలోకీ ఇది ప్రమాదకరమైనది. ఇది మన ప్రాణం తీయాలంటే దాని దగ్గరకు వెళ్లక్కర్లేదు. మూడు మీటర్ల దూరంలో ఉన్నా మన ముఖమ్మీదికి విషాన్ని చిమ్ముతుంది. అది కళ్లలో పడితే చూపు పోతుంది. శరీరంలోకి చేరితే కార్డియాక్ అరెస్ట్ అయ్యి ప్రాణం పోతుంది. 8. వైపర్స్ సా స్కేల్డ్ వైపర్, చెయిన్ వైపర్, పిల్ వైపర్స్ అంటూ వీటిలో చాలా రకాలు ఉన్నాయి. అన్నీ ప్రమాదకరమే. ఇండియా, చైనా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో విరివిగా ఉంటాయి. రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇవి జంతువుల్ని చుట్టేసి కాటేసి వదిలేస్తాయి. అవి విలవిల్లాడి చనిపోయేవరకూ ఉండి అప్పుడు మింగుతాయి. 9. డెత్ యాడర్ ఆస్ట్రేలియా, న్యూ గినియాల్లో కనిపించే ఈ సర్పాలు తోటి సర్పాల్ని కూడా కాటేస్తుంటాయి. ఇవి ఎంత తెలివైనవంటే... ఆకలేసినప్పుడు తలని, తోకని మాత్రమే బయట ఉంచి మిగతా శరీరాన్ని ఇసుకలోనో, ఆకుల్లోనో దాచిపెట్టేసుకుంటాయి. అవతలి జీవులు దగ్గరికి రాగానే మింగేస్తాయి. 10. ర్యాటిల్ స్నేక్ గలగలా శబ్దం చేస్తూ కొట్టుకునే తోకను బట్టి దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. అమెరికా, కెనడా, అర్జెంటీనాల్లో కనిపిస్తుంది. ప్రపంచంలో మొత్తం ముప్ఫై ఆరు రకాల ర్యాటిల్ స్నేక్స్ ఉన్నట్లు అంచనా. మరణానికి చేరువవుతున్న దశలో వీటిలోని విషం మరింత పవర్ఫుల్గా ఉంటుంది. పర్యావరణం భయమే.. సగం విషం పాములు పంటపొలాలను నాశనం చేసే ఎలుకలను, కీడు చేసే కీటకాలను తింటాయి. వీటి వల్ల మనిషికి మేలే జరుగుతుంది. అదీకాకుండా పర్యావరణ సమతుల్యం కాపాడటంలో పాముల పాత్ర అధికంగా ఉంటుంది. పాము కనపడగానే చంపేయడం అనే ఆలోచన మానుకోవాలి. అలాగే, దేవత అంటూ పూజల పేరిట చేసే అకృత్యాలకు స్వస్తి చెప్పాలి. మన దగ్గర మాత్రం రక్తపింజర, తాచుపాము, చిన్నపింజర, కట్లపాము.. ఈ నాలుగే విషపూరితమైనవి. పాము కాటు వేయగానే చాలా మంది విపరీతమైన భయాందోళనలకు లోనవుతారు. ఈ కారణంగా సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. ఏదైనా పాము కాటు వేస్తే వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అన్ని పెద్ద ఆసుపత్రులలో దీనికి సంబంధించిన మందులు ఉన్నాయి. ముందైతే మన జాగ్రత్తలో మనం ఉంటే పాములతో ఎలాంటి సమస్యా లేదు. - అవినాష్ విశ్వనాథ్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఫస్ట్ ఎయిడ్ పాము కాటు... ప్రథమ చికిత్స పాము కాటు తర్వాత రెండు సూదులు గుచ్చినట్లుగా ఉంటే అది విషసర్పం కాటు అని తెలుసుకోవచ్చు. దీనికి తక్షణం చికిత్స అవసరం పాము కాటు తర్వాత ఆందోళన వద్దు. దాని వల్ల రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. ఫలితంగా ఒంటిలోపల విషం వేగంగా విస్తరించి, ప్రాణాపాయమూ కలగవచ్చు. కాటుకు గురైన వ్యక్తి ఒంటి మీది ఉంగరాలు, బ్రేస్లెట్స్, వాచీ, తాయత్తులు వంటి వాటిని తొలగించాలి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. చేయకూడదని పనులు : ఆస్పిరిన్ మాత్రలు లేదా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు సినిమాల్లో చూపించినట్లుగా పాముకాటుపై గాటుపెట్టడం, విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం వంటివి అసలు చేయకూడదు పాము కాటు వేసిన చోట ఐస్ పెట్టడం, కాపడం పెట్టడం వంటివి చేయకూడదు చేతిపైనా లేదా కాలిపైన కాటు పడ్డప్పుడు దాన్ని గుండె కంటే పైన ఉండేలా పెట్టకూడదు వీలైతే కాటు వేసిన పామును గుర్తించగలిగితే మంచిదే. ఎందుకంటే కొన్ని విషాలు నరాల వ్యవస్థమీద, రక్తం మీద, కండరాల మీద పనిచేస్తుంటాయి. పామును స్పష్టంగా గుర్తించగలిగితే, దాని విషం పనిచేసే తీరు ఆధారంగా వెంటనే సంబంధిత యాంటీవీనమ్ ఇవ్వవచ్చు. అయితే ఇందుకోసం తాత్సారం చేయకూడదు. - డాక్టర్ సి. హేమంత్, సీనియర్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ సర్ప పురాణం భారతీయ సంస్కృతిలో...అడుగడుగున పడగ జాడలు పామును భారతీయులు నాగేంద్రుడిగా కొలుస్తారు. కొందరికి పాము ఇలవేల్పు. సాక్షాత్తు విష్ణుమూర్తి శయనించేది సర్పం మీదే. అందుకే ఆయన శేషశయనుడయ్యాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు పాములలో తాను అనంతుడ (ఆదిశేషుడు) నని చెప్పాడు. అనంతుడు అంటే అంతం లేనివాడని అర్థం. ఆదిశేషువును మూలప్రకృతికి ప్రతీకగా పురాణాలు చెబుతున్నాయి. శివుడి మెడలో కంఠాభరణంగా, వినాయకునికి జందెంగా నాగేంద్రుడు కనిపిస్తాడు. విష్ణుపురాణం ప్రకారం బ్రహ్మదేవుని కుమారుడైన కశ్యపునికి నలుగురు భార్యలు. అందులో మూడవ భార్య అయిన కద్రువ వేయి పాములకు జన్మనిచ్చింది. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, క ర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు... ప్రముఖులు. ఆమె కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది. పాములు తమోగుణానికి ప్రతీక. ఇవి పాతాళంలో ఉంటూ, భూగర్భంలో ఉన్న సంపదలను సంరక్షిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మానవాళి పురాతన కాలం నుంచి పాముని ఆరాధించినట్లుగా చరిత్ర చెబుతోంది. పునఃసృష్టికి, శక్తికి ప్రతీకగా సర్పాలను కొలిచే ఆచారం భారతీయులలో ఉంది. పాము కుబుసం విడిచి, మళ్లీ చర్మం ధరించడం వల్ల వాటికి పునఃసృష్టి శక్తి ఉన్నట్లుగా భావిస్తారు. ముఖ్యంగా తాచుపామును నాగదేవతగా కొలిచే ఆచారం కనపడుతుంది. నాగపంచమికి, నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తే, ఆ పాలు నాగేంద్రుడు స్వీకరిస్తాడని ఒక నమ్మకం. భారతదేశంలో అనేక ప్రాంతాలలో నాగేంద్రుడి ఆకారంలో చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. అనంతపురం జిల్లా లేపాక్షిలో పెద్ద నాగేంద్రుని శిలా విగ్రహం ఇందుకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ప్రమాదవశాత్తు తాచుపాము చనిపోతే, మానవులకు అంత్యక్రియలు జరిపిన విధంగా వీటికి కూడా చితి పేర్చి తలకొరివి పెట్టి, భస్మం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మగ పామును నాగరాజుగా భావించి, గుడి కట్టి, ఆ విగ్రహానికి పూజలు చేస్తారు. మరికొన్ని ప్రాంతాలలో నేరుగా సర్పానికే పూజలు చేస్తారు. సింధు నాగరికత ప్రజలు సర్పాన్ని పూజించినట్లుగా చరిత్ర చెబుతోంది. ‘కద్రువ నాగమాత’ అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో నాగేంద్రుడిని ప్రస్తావించాడు. భాగవతంలో అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి సన్నద్ధులయ్యారు. మంధరగిరిని కవ్వంగా ఎంచుకున్నారు. తాడుగా వాసుకిని ప్రయోగించారు. తల భాగం వైపు రాక్షసులు, తోక భాగం వైపు దేవతలు నిలబడి, మంధరగిరిని చిలికారు. అమృతాన్ని సాధించారు. ఈ సత్కార్యంలో వాసుకిదే ప్రధానపాత్ర. శంకరుడికి ఆభరణంగా ఉన్న సర్పం కారణంగా సంగీతంలో ‘శంకరాభరణం’ అనే రాగం కూడా పుట్టింది. నాగరత్నమ్మ, నాగమణి, నాగేశ్వరరావు... వంటి పేర్లు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. సర్పాన్నే భుజంగం, అహి, పాము, ఉరగం, గాలి మేపరి, పన్నగం... వంటి అనేక పేర్లతో పిలుస్తాం. భారతీయ సాహిత్యంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలలో ప్రథమంగా, ‘వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి, కాటందుకొన్నది కలలోన రాజును’ అని వర్ణించాడు. - డా. పురాణపండ వైజయంతి -
రైతు మిత్ర పంటలు!
- పప్పు ధాన్య పంటలకు పెరుగుతున్న ఆదరణ - ఏకపంటల రసాయనిక సేద్యమే పప్పుధాన్య పంటలకు శాపం - మిశ్రమ పంటల ప్రకృతి లేదా సేంద్రియ సేద్యంతోనే పప్పుధాన్యాలకు పెద్దపీట - మెట్ట పొలాల్లో పక్కపక్కన సాళ్లలో చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాల సాగే ఉత్తమం హరిత విప్లవం పేరిట ఏకపంటల రసాయనిక వ్యవసాయం ముఖ్యంగా వరి, గోధుమ పంటల సాగుపైనే పాలకుల దృష్టి కేంద్రీకృతమైన తర్వాత పప్పు ధాన్యాల పంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆహారంలో బియ్యం, గోధుమల తర్వాత అత్యధిక ప్రాథాన్యం కలిగినప్పటికీ పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతూ వచ్చింది. అందువల్లనే పప్పుధాన్యాల సాగు ప్రాధాన్యాన్ని చాటుతూ ఐక్యరాజ్యసమితి 2016ను ‘అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. ఇంతకీ, పప్పుధాన్యాల సాగులో ఏ పద్ధతి మేలైనది? కంది నారును పెంచి, మొక్కలను పొలంలో నాటి డ్రిప్ ద్వారా ఏకపంటగా రసాయనిక వ్యవసాయం చేయడం ఇటీవల అక్కడక్కడా కనిపిస్తోంది. అయితే, దేశ విదేశాల్లో పర్యావరణ హితమైన ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విరాజిల్లుతున్న పొలాలు, పండ్ల తోటల్లో అంతర పంటలుగా పప్పుధాన్య పంటలకు పెద్ద పీట వేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో ఏక దళ పంటలైన సజ్జ, జొన్న, కొర్ర, రాగి వంటి చిరుధాన్య పంటలతోపాటు.. కందులు, మినుములు, పెసలు, ఉలవలు, అలసందలు తదితర ద్విదళ పంటలను పక్క పక్క సాళ్లలో రసాయనిక ఎరువులు వాడకుండా సాగు చేయడం ఉత్తమమని వివిధ దేశాల్లో ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలు చాటి చెబుతున్నాయి. మొక్కలు సాధారణంగా ఆకుల ద్వారా వాతావరణం నుంచి, వేళ్ల ద్వారా భూమి నుంచి ప్రాణావసరమైన పోషకాలను తీసుకొని పెరుగుతాయి. అయితే, పప్పుధాన్య పంట మొక్కల పరిస్థితి వేరు. భూమి నుంచి తీసుకున్న దాని కన్నా ఎక్కువ పోషకాలను తిరిగి భూమికి ఇస్తాయి. గాలిలో 97% నత్రజని ఉంది. నత్రజని పంటల సాగులో కీలకపాత్ర కలిగిన పోషకం. నత్రజనిని గాలి నుంచి గ్రహించి వేళ్ల ద్వారా భూమిని సారవంతం చేయడం పప్పుధాన్య పంట మొక్కల ప్రత్యేకత. ఐతే రసాయనిక ఎరువులు వేసిన పొలంలో పప్పుధాన్య పంట మొక్కల వేళ్ల ద్వారా నత్రజనిని భూమికి అందించే సహజ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ఎందుకంటే.. గాలిలో నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందించే పనిని చూసుకునేది ప్రధానంగా రైజోబియం, బ్రాడీ రైజోబియం రకాల సూక్ష్మజీవులే. రసాయనిక ఎరువులు, కలుపుమందులు వంటి రసాయనాలు వాడటం వల్ల మట్టిలో నివసించే సూక్ష్మజీవరాశి దుంపనాశనమవుతోంది. అందుకే, ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయంలో పప్పుధాన్య పంటలు తమ సహజ లక్షణాలతో విరాజిల్లుతూ చక్కని పంట దిగుబడులనివ్వడమే కాకుండా భూమిని సారవంతం చేస్తున్నాయి. జొన్న, సజ్జ, కొర్ర, రాగులు వంటి చిరుధాన్య పంటలతో పాటు అదే పొలంలో పక్క పక్కన సాళ్లలోనే పప్పుధాన్య పంటలను మిశ్రమ పంటలుగా సాగు చేయడమే ఇందుకు కారణం. వాతావరణ మార్పులకు వజ్రకవచం.. ఆహారోత్పత్తి, ఆహార భద్రత, వాతావరణ మార్పులు అనేవి పరస్పర ఆధారితాలు. పప్పుధాన్యాల సంవత్సరం -2016 సందర్భంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతున్న విషయాల్లో రైతులు, పాలకులు గమనించాల్సినవి ఇవీ.. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచ ఆహార భద్రత పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించే శక్తి పప్పుధాన్యాల సాగుతో ఒనగూడుతుంది విశ్వవ్యాప్తంగా 47 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న పప్పుధాన్యపు పంటల వల్ల భూమిలో 70 లక్షల టన్నుల నత్రజని స్థిరీకరణ జరుగుతోంది. ఆమేరకు రసాయన ఎరువుల వాడకం తగ్గి పరోక్షంగా ఉద్గారాల కాలుష్యం తగ్గుతున్నది ఏకపంటల విధానంలో కన్నా అంతర పంటలు, పంట మార్పిడి వంటి పద్ధతుల్లో పప్పు ధాన్యాలను సాగు చేస్తే నేలలో ఎక్కువ కర్బన స్థిరీకరణ జరుగుతుంది. నేలలో రకరకాల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది పప్పుధాన్యపు మొక్కల వేళ్లు భూమిలో లోతుకు వెళ్లటం వల్ల బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. వీటి వేర్లు లోతుకు వెళతాయి. మిశ్రమ పంటలుగా సాగు చేసినప్పుడు ఇవి నీటి కోసం ఇతర పంటలతో పోటీ పడవు మాంసకృత్తులను, పోషకాలతో కూడిన పప్పుధాన్యాల సాగు సుస్థిర ఆహారోత్పత్తికి, పోషకాహారంతో కూడిన ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. బ్రిటిష్ కొలంబియాలోని సాల్ట్ స్ప్రింగ్ఐస్ల్యాండ్కి చెందిన డాన్ జాసన్ గత 30 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. జన్యుమార్పిడి చే సిన విత్తనాల కన్నా సంప్రదాయ విత్తనాలతోనే పలు ప్రయోజనాలున్నాయని ఆయన నమ్ముతున్నారు. మిశ్రమ పంటలుగా అపరాల సాగుతోనే భూతాపాన్ని తగ్గించగలమని జాసన్ అంటున్నారు. - సాగుబడి డెస్క్చీ సేంద్రియ పశుపోషణపై 17న రైతులకు శిక్షణ సేంద్రియ పద్ధతిలో పశుపోషణ, పశువుల యాజమాన్యం, పునరుత్పత్తి వంటి అంశాలపై రైతునేస్తం ఫౌండేషన్ ఈనెల 17న శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఉ. 9:30 గంటల నుంచి సా. 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పశువైద్యులు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల పాడి రైతులు 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు. 29న గుంటూరులో దేశీ విత్తన సంబరం దేశీ విత్తనాల పరిరక్షణకు కృషి చేస్తున్న హరిత భారతి ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 29న ద్వితీయ ఆంధ్రప్రదేశ్ దేశీ విత్తన సంబరం నిర్వహిస్తున్నది. గుంటూరు కూరగాయల మార్కెట్ సమీపంలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ పంటల దేశీ విత్తనాలు పొందవచ్చు. గత సంవత్సరం దేశీ విత్తనాలు తీసుకున్న రైతులు రెట్టింపు పరిమాణంలో తీసుకొచ్చి ఈ విత్తన సంబరంలో ఇతర రైతులకు అందిస్తారు. వివరాలకు నిర్వాహకుడు సీహెచ్ త్రినాథులును 0866-2550688, 81252 46688 నంబర్లలో సంప్రదించవ చ్చు. ప్రవేశం ఉచితం. 30-31 తేదీల్లో తిరుచిరాపల్లిలో దేశవాళీ విత్తనోత్సవం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఈ నెల 30-31 తేదీల్లో దేశీ విత్తనోత్సవం జరగనుంది. దేశవాళీ పప్పుధాన్యాలు, కూరగాయలు, చిరుధాన్యాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. దేశీ వంగడాల పరిరక్షణకు కృషి చేస్తున్న పసుమాయ్ శిగరం నేచర్ ట్రస్ట్, క్రియేట్ (తమిళనాడు), సహజ సమృద్ధ (కర్నాటక) వంటి పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ విత్తన ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తిరుచిరాపల్లి థిల్లాయ్ నగర్లోని ‘మక్కల్ మంద్రం’లో 30వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం. వసతి, భోజన ఏర్పాట్ల కోసం ముందుగా పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాల కోసం ప్రవీణ్ (తమిళం, కన్నడ, ఇంగ్లిష్) - 080507 43047, యోగనాథన్ (తమిళం, హిందీ) - 094449 46489లను ఫోన్ ద్వారా లేదా praveendspc@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 31 నుంచి పర్మాకల్చర్పై 14 రోజుల శిక్షణ పొలాల్లో సేంద్రియ పంటలు పండించే రైతైనా, పెరట్లో లేదా మేడపైన సేంద్రియ ఇంటిపంటల సాగుదారులైనా పర్యావరణహితమైన సేద్యానికి సంబంధించిన మౌలిక అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండటం అవసరం. పర్మాకల్చర్ (పర్మినెంట్ + అగ్రికల్చర్ = శాశ్వత వ్యవసాయం) అందుకు ఉపకరిస్తుంది. శాశ్వత వ్యవసాయ నిపుణులు జి .సాయి ప్రసన్న కుమార్ పర్మాకల్చర్ పద్ధతులపై రెండు వారాల డిజైన్ సర్టిఫికెట్ (రెసిడెన్షియల్) కోర్సును నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ 5-7 గంటల పాటు తరగతులు జరుగుతాయి. జూలై 31 నుంచి ఆగస్టు 13 వరకు 14 రోజుల పాటు హైదరాబాద్లోని నాగోల్లో తరగతులు జరుగుతాయి. వివరాలకు.. సాయిని 99514 52345 నంబర్లో సంప్రదించవచ్చు. ఉల్లి రైతు శ్రమ తగ్గించే ఆవిష్కరణ - ఉల్లి నారు నాటే పరికరాన్ని తయారుచేసిన మహారాష్ట్ర రైతు శాస్త్రవేత్త - మొక్కలు నాటడంతోపాటు ఒకేసారి ఎరువు వేయడం, బోదెలు కూడా చేయొచ్చు - ఎకరంలో మూడు గంటల్లో ఈ పనులన్నీ పూర్తి చేయొచ్చు సమస్యలను సరికొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు అధిగమించగలిగితేనే వ్యవసాయంలో రాణించగలం అనే తత్వాన్ని ఒంటబట్టించుకున్న ఆధునిక రైతు శాస్త్రవేత్త పండరినాథ్ సర్జేరావ్ మోరే. మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని సంఘవి భూసర్ ఆయన స్వస్థలం. ఉల్లి నారును నాటేందుకు అదునులో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడటం కద్దు. దీన్ని అధిగ మించేలా.. ఉల్లి నారును నాటటం, ఎరువులు వేయటం, నీటి బోదెల ఏర్పాటు వంటి మూడు పనులను ఒకేసారి పూర్తిచేసే పరికరాన్ని పండరీనాథ్ రూపొందించారు. దీని వల్ల అధిక శ్రమ, సమయం వృథాను నివారించవచ్చు. ఈ ఆవిష్కరణకుగాను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. ఈ పరికరం 1.5 మీ. వెడల్పు ఉంటుంది. బరువు 3.5 టన్నులు. 8 గొర్రులు ఉంటాయి. 25 హెచ్. పి. సామర్థ్యం గల ట్రాక్టర్తో ఇది పనిచేస్తుంది. ట్రాక్టర్ ముందుకు కదులుతుంటే విత్తే పరికరానికి బిగించి ఉన్న పళ్ల చక్రం కదులుతూ పెట్టెలో ఉన్న ఎరువు తగు మోతాదులో పైపుల ద్వారా సాళ్లలో పడుతుంది. పరికరానికి వెనుక అమర్చిన గొర్రుల ద్వారా నీటి బోదెలు పూర్తవటంతో పాటు సాళ్లలో కలుపు మొక్కలు ధ్వంసమవుతాయి. పరికరంపై నలుగురు కూలీలు కూర్చొని నారును నాళికల్లో వేస్తే భూమిలో 1 సెం. మీ. లోతులో నాటుతుంది. సాళ్లమధ్య 18, మొక్కల మధ్య 9 సెం. మీ. ఎడం ఉంటుంది. నారు సమాన లోతులో పడేందుకు రెండు వైపులా రెండు చక్రాలను అమర్చారు. మామూలుగా నాటితే మొక్కల సాంధ్రత ఎకరాకు 1.50 లక్షలు కాగా ఈ పరికరంతో విత్తితే 2 లక్షలకు పైగా ఉంటుంది. నారు మొక్కలు చక్కగా వేళ్లూనుకుంటాయి. నారు నాటేందుకు నలుగురు కూలీలు సరిపోతారు. ఎకరంలో విత్తనం, ఎరువు వేసుకోవటం, నీటి బోదెలు చేయటం వంటి అన్ని పనులు మూడు గంటల్లో పూర్తవుతాయి. తృణధాన్యాలు, అపరాల విత్తనాలను ఈ పరికరంతో విత్తుకోవచ్చు. ఎరువులు వేసే పరికరంతో కలిపి దీని ధర రూ. 70 వేలు. 15 రోజుల్లో తయారు చేసి ఇస్తారు. పండరీనాథ్ను 099608 68195 ఫోను నంబరులో లేదా ఈమెయిల్ : ఞ్చఛీజ్చిటజ్చ్టీజిఝౌట్ఛఃట్ఛఛీజీజజఝ్చజీ.ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ జీరో బడ్జెట్ ‘జిబ్బర్లిక్ యాసిడ్’! ఉద్యాన తోటల్లో దిగుబడులు పెంపొందించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా రసాయన వ్యవసాయంలో రైతులు జిబ్బర్లిక్ యాసిడ్ను విస్త్రృతంగా వాడుతున్నారు. దీని ధర కిలో రూ.15 - 25 వేల వరకు ఉంది. సేంద్రియ, ప్రకృతి సేద్యం చేసే రైతులు రసాయనాలను పిచికారీ చేయరు. దీనివల్ల వారు జిబ్బర్లిక్ ఆసిడ్తో కలిగే ప్రయోజనాలను కోల్పోవలసిందేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాంటి అవసరమే లేదంటున్నారు పంజాబ్లోని హోషియాపూర్కు చెందిన ప్రకృతి వ్యవసాయ దారులు. రైతులు రసాయనాల్లేకుండానే జిబ్బర్లిక్ ఆసిడ్ను సులభంగా తయారు చేసుకునే విధానాన్ని వారు కనుగొని, వినియోగిస్తున్నారు. పశువుల పేడతో తయారు చేసిన 5 కిలోల పిడకలను తీసుకోవాలి. ప్లాస్టిక్ డ్రమ్ము లేదా నీడన ఉన్న తొట్టిలో 18-20 లీటర్ల నీరు పోసి ఈ పిడకలను నీటిలో వేసి 4-5 రోజులు నానబెట్టాలి. వడపోసిన ఆ ద్రావణం మొత్తాన్నీ 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారీ చేసుకుంటే చక్కని గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది. ఇది ఖర్చు లేనిదే కాకుండా పర్యావరణ హితమైనది కూడా. అంతగా ఖర్చు లేకుండా రైతులే స్వంతంగా దీన్ని తయారు చేసుకొని వాడుకొని ప్రయోజనం పొందవచ్చని హోషియాపూర్ రైతులు తమ అనుభవంగా చెబుతున్నారు. మనమూ తొలుత కొన్ని చెట్లపై ప్రయత్నించి చూద్దామా? ప్రకృతి సేద్యంపై కోర్సు ప్రకృతి వ్యవసాయంపై నార్వేజియన్ లైఫ్ సెన్సైస్ యూనివర్శిటీతో కలిసి కోల్కతా విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ పొలినేషన్ స్టడీస్ ఆర్నెల్ల సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నది. శిక్షార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు స్వయంగా ప్రకృతి వ్యవసాయ పనులు చేయిస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ కలిగిన వారు అర్హులు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://cpscu.in/?p=846 వెబ్సైట్ చూడవచ్చు. ఆసక్తిగల వారు తమ దరఖాస్తును agroecology.cps @gmail.com ద్వారా జూలై 15లోగా పంపాలి. -
వారెవ్వా... వాయనాడ్
టూర్దర్శన్ ప్రకృతి అందాలకు నెలవైన కేరళ రాష్ట్రానికి ‘దేవుడి సొంత రాజ్యం’ అనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రాజ్యం అన్నాక రాజధాని ఉండాలి కదా! రాజకీయంగా చెప్పుకుంటే కేరళకు తిరువనంతపురమే రాజధాని కావచ్చు కాని, ‘దేవుని సొంత రాజ్యానికి’ రాజధాని ఏది? అంటే వాయనాడ్ పేరునే చెప్పుకోవాలి. పడమటి కనుమల్లో ఉన్న వాయనాడ్ జిల్లాలో ప్రకృతి అందాలన్నీ రాశి పోసినట్లుగా కనువిందు చేస్తాయి. వాయనాడ్ అడవుల్లో సంచరించే అరుదైన వన్యప్రాణులు, విహంగాలు సరేసరి! వీటన్నింటినీ ఒక్కసారి చూస్తే చాలు... ‘వారెవ్వా... వాయనాడ్’ అనక తప్పదు. ఏం చూడాలి? వాయనాడ్లో చూసి తీరాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కొత్త రాతియుగం నుంచే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు తమ వాణిజ్య అవసరాల కోసం వాయనాడ్ కొండలపై రోడ్లు వేయడంతో ఇక్కడకు పర్యాటకుల రాకపోకలకు మార్గం సుగమమైంది. * పడమటి కనుమల్లో అడుగడుగునా కనిపించే జలపాతాలు వాయనాడ్లోనూ కనిపిస్తాయి. సూచిపరా, మీన్ముట్టి, కాంతన్పరా, చెతాలయం వంటి జలపాతాల సొగసులను చూసి తీరాల్సిందే. వానాకాలంలో ఇవి మరింత ఉధృతంగా ఉరకలేస్తూ సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇక పాపనాశిని, పంచతీర్థ వంటి పుష్కరిణులు, సరోవరాలు కూడా ఇక్కడ చూడాల్సినవే. * వాయనాడ్ కొండలపై ఉన్న లక్కిడి వ్యూపాయింట్, నీలిమల వ్యూపాయింట్ నుంచి చూస్తే కొండలు, లోయలు, పచ్చని అడవుల అందాలు కనివిందు చేస్తాయి. ఈ ప్రదేశాల నుంచి ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. * వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో వనవిహారం మరపురాని అనుభూతినిస్తుంది. ఈ అభయారణ్యంలో ఎక్కడ చూసినా ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. జింకలు, దుప్పులు, కుందేళ్లు, పులులు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కేరళ అటవీ శాఖ ఏనుగులపై సవారీ అవకాశం కూడా కల్పిస్తోంది. * బ్రహ్మగిరి కొండలపై కీకారణ్యంలో ఉన్న పక్షిపాతాళం పక్షుల అభయారణ్యంలో పక్షులను తిలకించడం వింత అనుభూతినిస్తుంది. నెమళ్లు, రకరకాల కొంగలు, మైనాలు, పిచ్చుకలు వంటి పక్షుల కిలకిలరావాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. * వాయనాడ్ జిల్లాలో పురాతనమైన ఎడక్కల్ గుహలలోని కుడ్యచిత్రాలు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాల నాటివని చెబుతారు. ఈ గుహలను తిలకించడంతో పాటు చీన్గిరిమల, చెంబ్రా వంటి శిఖరాలను అధిరోహించేందుకు పర్వతారోహకులు ఉబలాటపడతారు. * తిరునెల్లిలోని ప్రాచీన విష్ణుభగవానుడి ఆలయం, కాల్పెట్టలోని వారంబెట్ట మసీదు వంటి పురాతన కట్టడాలు కూడా ఇక్కడ చూసి తీరాల్సినవే. ఏం చేయాలి? * పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారికి ఇక్కడి కొండలు, గుట్టలు చాలా అనువుగా ఉంటాయి. కొండలపెకైక్కి దిగువ కనిపించే లోయలను, అడవులను తిలకించడం మరపురాని అనుభూతినిస్తుంది. * జలపాతాల ఒడ్డున పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ఉధృతి తక్కువగా ఉన్న జలపాతాల దిగువన జలకాలాటల్లో సేదదీరవచ్చు. * వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఏనుగులపై ఊరేగవచ్చు. పక్షిపాతాళంలోని పక్షుల అభయారణ్యంలో పక్షుల కిలకిలలను ఆలకిస్తూ తన్మయత్వం చెందవచ్చు. పక్షిపాతాళంలోని పురాతన గుహలను కూడా సందర్శించవచ్చు. * వాహనాల రొదలేని వాయనాడ్ రోడ్లపై వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలక్షేపం చేయవచ్చు. ఏం కొనాలి? * వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల చిన్న చిన్న దుకాణాలతో పాటు అధునాతనమైన షాపింగ్ మాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొబ్బరిచిప్పలతో స్థానిక కళాకారులు రూపొందించిన సంప్రదాయ కళాకృతులు ఇక్కడి దుకాణాల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇవి సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. * ఏనుగు దంతాలు, పేము, వెదురు, కలపతో తయారు చేసిన కళాకృతులు, చైనా సిరామిక్ వస్తువులు కూడా ఇక్కడి దుకాణాల్లో విరివిగా దొరుకుతాయి. * వాయనాడ్ కాఫీ గింజలు, కాఫీ పొడి, మున్నార్ తేయాకుతో పాటు ఇక్కడి అడవుల్లో విరివిగా పండే యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు వంటివి తక్కువ ధరల్లోనే దొరుకుతాయి. * స్వచ్ఛమైన తేనె, కరక్కాయలు, వనమూలికలు, ఇక్కడి అడవుల్లో పండే పండ్లు చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూరప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు. * వాయనాడ్ జిల్లా కేంద్రం కాల్పెట్టకు సమీపంలోని రైల్వేస్టేషన్ కూడా కోజికోడ్లోనే ఉంది. కోజికోడ్ నుంచి 72 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి కాల్పెట్ట చేరుకోవాల్సి ఉంటుంది. * కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్ల మీదుగా బస్సులు లేదా ట్యాక్సీల్లో వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు. -
పైసా ఖర్చులేని రాళ్ల వైద్యం భలే!
బీజింగ్: ప్రకృతి వైద్యమంటే ఆకులను, బెరళ్లను పేస్ట్గా చేసి రాసుకోవడం గురించి తెలుసు. కొన్నిసార్లు మట్టిని ఒంటినిండా పూసుకొని కూడా వైద్యం చేస్తారు. మరి ఎండకు వేడెక్కే బండలపై పడుకోబెట్టి చేసే ప్రకృతి వైద్యం గురించి మీకు తెలుసా? చైనాలో చాలామంది మహిళలు ఇప్పుడు ఇలాంటి వైద్యాన్నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎండలో.. కాలే రాళ్లపై పడుకుంటే ఎన్నో రకాల రోగాలు నయమవుతాయని అంటున్నారు. ఈ వైద్యం కోసమని ముఖాలపై చిన్నపాటి టవల్నో, గుడ్డనో కప్పుకుని ఎండకు వేడెక్కిన పెద్ద పెద్ద రాళ్లను కౌగిలించుకుంటున్నారు. మరీ పెద్దరాయి దొరికితే దానిపై వెల్లకిలా పడుకుంటున్నారు. అక్కడ ఇదో పెద్ద ట్రెండ్గా మారిపోయింది. పైసా ఖర్చులేని వైద్యం కదా.. అందుకే పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3-5 గంటల మధ్య గ్జియాన్ నగరంలో ఎక్కడ చూసినా ఇలా రాళ్లపై పడుకునేవారే కనిపిస్తున్నారు. -
రాళ్లే రోగాలను తగ్గిస్తాయ్ !
-
రాళ్లే రోగాలను తగ్గిస్తాయ్ !
గ్జియాన్: ఎండకు వేడెక్కే బండలపై పడుకోబెట్టి చేసే ప్రకృతి వైద్యం గురించి మీకు తెలుసా? చైనాలో చాలామంది మహిళలు ఇప్పుడు ఇలాంటి వైద్యాన్నే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఎన్నో రోగాలు నయమవుతాయంటున్నారు. ఈ వైద్యం కోసమని ముఖాలపై చిన్నపాటి టవల్నో, గుడ్డనో కప్పుకుని ఎండకు వేడెక్కిన పెద్దపెద్ద రాళ్లను కౌగిలించుకుంటున్నారు. పైసా ఖర్చులేని వైద్యం కదా.. అందుకే పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3-4 గంటల మధ్య గ్జియాన్ నగరంలో ఎక్కడ చూసినా ఇలా రాళ్లపై పడుకునేవారే కనిపిస్తున్నారు. -
శ్రీమతికి పచ్చల హారం!
♦ కాంక్రీట్ నగరంలో పచ్చని పొదరిల్లు ♦ ప్రకృతిపై ప్రేమతో వినూత్న గృహానికి రూపం ♦ ఇంటిని వనంలా తీర్చిదిద్దిన వైనం... తాము ఎంతగానో ఇష్టపడేవారిపై తమ ప్రేమను వ్యక్తపరచవలసిన సందర్భం వచ్చిన ప్రతిసారి చరిత్రలో ఒక గొప్ప కళాఖండమో, నిర్మాణమో రూపుదిద్దుకున్నాయి. తరాలు గడిచినా వారి ప్రేమను చరిత్రలో అజరామరంగా నిలుపుతున్నాయి. లియోనార్డో మోనాలిసా పెయిటింగ్ నుంచి షాజహాన్ తాజ్మహల్ వరకు ఇలా రూపుదిద్దుకున్నవే. వారి ప్రేమతో జీవకళను సంతరించుకున్న కళాఖండాలు భవిష్యత్ తరాలకు తమ వసివాడని ప్రేమ విలువను చాటిచెపుతున్నాయి. ఆ కోవకే చెందిన ఈ కాలపు ఓ భర్తగారి ‘ఆకుపచ్చని’ ప్రేమగాథ ఇది. శ్రీమతి కోరిందే తడవుగా ఓ అందమైన ఆకుపచ్చని పొదరిల్లును తీర్చిదిద్ది ఆమెకు కానుకగా ఇచ్చిన ఆ భర్త పర్యావరణ ప్రేమికుడు..అంతకు మించి అందరికీ ఆదర్శనీయుడు. ఆ వివరాలు నేటి సండే స్పెషల్లో మీకోసం.... సాక్షి, సిటీబ్యూరో: భార్యపై ప్రేమను మాటల్లో కాక చేతల్లో చూపాలనుకునే భర్త ఆయన. భార్య భర్తల మధ్య అన్యోనత ఉండాలే గాని పూరిల్లయినా మేడతోనే సమానం అని నమ్మే భార్య ఆవిడ. చిలకా గోరింకల్లాంటి ఆ దంపతులు విహార యాత్ర కోసం ఓసారి కుటుంబ సభ్యులతో కలసి కేరళకు వెళ్లారు. రిసార్ట్లో పచ్చని ప్రకృతి నడుమ చెక్కతో నిర్మించిన కుటీరంలో విడిది చేశారు. ప్రకృతి శోభతో అలరారే కుటీరం అందం శ్రీమతి మది దోచింది. భర్తతో మనకు హైదరాబాద్లో ఇలాంటి ఇల్లుంటే ఎంత బాగుంటుందో కదా అంది. అప్పటికి భర్త గారి మౌన మే సమాధానమైంది. ఇంటికి తిరిగొచ్చాక ఏడాది పాటు కష్టపడి కేరళ సంప్రదాయ శైలిలో ఫ్లైవుడ్తో ఇంటిని నిర్మించారు ఆ భర్త. దాంతోపాటు చుట్టూ అందమైన ఇంటి పంటల క్షేత్రాన్ని సృష్టించి తన గృహలక్ష్మికి బహుమతిగా సమర్పించారు. హైదరాబాద్, ఎల్బీనగర్లోని బీఎన్రెడ్డి నగర్కు చెందిన ఆ అన్యోన్య దంపతులు చింగిరెడ్డి శ్రీధర్రెడ్డి, లక్ష్మి. శ్రీధర్రెడ్డి ప్రైవేట్ కంపెనీలో రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. లక్ష్మి గృహిణి. ఆరు సెంట్ల స్థలంలో అపార్ట్మెంట్ నిర్మిస్తే అద్దెల ద్వారా లభించే ఆదాయాన్ని ఆయన దీని కోసం వదులుకోవటం విశేషం. రెండేళ్లపాటు శ్రమించి వంద గజాల స్థలంలో చెక్క ఇంటిని నిర్మించారు శ్రీధర్రెడ్డి. ఇంటి బయట వసారా. చుట్టూ పండ్ల మొక్కలు. కింద తివాచి పరచినట్టు కాళ్లను మెత్తగా తాకే పచ్చిక. ఉదయాన్నే తమ కిలకిలరావాలతో నిద్రలేపే పక్షులు. ఒక్క రోజు అక్కడ గడిపిన వారికి ఉషోదయం వారి జీవిత పుస్తకంలో ప్రత్యేక పుటగా నిలుస్తుంది. వివిధ రకాల కాయగూర, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. దీనికోసం తొలుత ఇంటి ఆవరణలో 10 ట్రక్కుల ఎర్రమట్టిని తోలించారు. దొండ, సొర వంటి తీగజాతి మొక్కలు వంగ , మిర్చి, క్యాబేజీ వంటి కాయగూర పంటలు, దానిమ్మ, చిన్న ఉసిరి, అడవి ఉసిరి, ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పాషన్ ఫ్రూట్, ఎర్రజామ, అరటి, అంజూర, గంగరేగి, మామిడి వంటి పండ్ల మొక్కలు...బ్రహ్మకమలం, అడవి సంపెంగ వంటి పూల మొక్కలను పెంచుతున్నారు. ఏడాది వయసున్న ఆపిల్ చెట్టు కూడా ఉందిక్కడ. ముగ్గురు సభ్యులు గల తమ కుంటుంబానికి వారంలో మూడు రోజులకు సరిపడా కూరగాయలను పండించుకుంటున్నారు. శ్రీధర్రెడ్డి రోజూ మూడు గంటల పాటు రెండేళ్లు శ్రమించి ఈ హరితవనానికి జీవం పోశారు. ఇప్పటికీ వాటికి ఎరువులు వేయటం, కలుపు తీయటం వంటి పనుల కోసం ప్రతిరోజూ ఉదయం రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఇంటికి వచ్చిన బంధువులు మా అభిరుచిని మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు అపార్ట్మెంట్లో కన్నా ఈ ఇంటిలో ఉండేందుకే వారు ఇష్టపడుతుండటం సంతోషం కలిగిస్తోంది. - శ్రీధర్రెడ్డి (97011 11754) -
పోతే జైలుకు.. లేదంటే భూమిలోనే..
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఏటూరునాగారం: ప్రకృతితో సావాసం చేసే గిరిజనులు జైలుకు వెళ్లడమో.. లేదంటే పోడు భూమిలోనే ఉండడం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో సోమవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయ ముట్టడి, ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సున్నం రాజయ్య మాట్లాడుతూ 2005కి పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతున్నా పాలకులు పట్టించుకోవ డం లేదన్నారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేతకానితనాన్ని నడిరోడ్డుకు ఈడుస్తామన్నారు. పోడు భూములపై స్పష్టమైన సర్వే చేయిస్తామని ఉన్నతాధికారుల హామీని ఐటీడీఏ పీవో వెల్లడించడంతో ధర్నా విరమించారు. -
మెతుకు పండితే.. బతుకు పండగే
పుడమి గొంతులో పురుగు మందు పోస్తున్నారు. మొలకెత్తింది విషబీజమని తెలియక మురిసిపోతున్నారు. రుచిలేని దిగుబడి అద్భుతమని భ్రమిస్తున్నారు. నష్టపోయిన రోజు.. అదే పురుగు మందుతో ఊపిరి తీసుకుంటున్నారు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం.. పెట్టుబడి లేని వ్యవసాయం. బడుగు రైతు సైతం దిగుబడి సాధించాలి. ఆరోగ్యకరమైన పంటలతో ఆనందం అనుభవించాలి.. అదే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటోంది. జీవామృతాలతో చేనుకు జీవం పోస్తోంది. అన్నదాత బతుకులో ఆశలు కురిపిస్తోంది. అద్భుతమైన పంటలతో జగతికి ఆదర్శంగా నిలవాలని తపిస్తోంది. బొబ్బిలి నియోజకవర్గంలోని మెట్టవలస క్లస్టర్లో వ్యవసాయశాఖ సాగిస్తున్న పకృతి వ్యవసాయ ప్రస్థానం విజయవంతంగా సాగిపోతోంది. ♦ ఊపందుకున్న ప్రకృతి వ్యవసాయం ♦ మెట్టవలస క్లస్టర్లో ప్రయోగాత్మకంగా అమలు ♦ వరి, వేరుశనగ, చెరకు,కూరగాయ పంటల సాగు ♦ ఆసక్తి చూపుతున్న వందలాది రైతులు బొబ్బిలి రూరల్: హరిత విప్లవం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. బహుళ జాతి సంస్థల నుంచి పొటాష్ దిగుమతి చేసుకోవలసి వచ్చింది. యూరియా, నత్రజనితో మొదలైన సాగు దుష్పరిణామాలనిస్తోంది. రసాయనాల అవశేషం పంట గింజలను విషతుల్యం చేస్తోంది. జన్యులోపాలున్న పిల్లలకు.. వ్యాధుల విజృంభణకు కారణమవుతోంది. రైతుల జీవితాలను చిది మేస్తోంది. అప్పులపాలై రోడ్డు న పడేస్తోంది. ఇవన్నీ ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్పాలేకర్ను కదిలించాయి. పెట్టుబడి లేని వ్యవసాయానికి రూపకల్పన చేయించాయి. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆవి ష్కరించాయి. రుచికరమైన పోషక విలువలున్న ఆహారధాన్యాల ఉత్పత్తికి కారణమవుతున్నా యి. అన్నదాత కన్నీళ్లు తుడుస్తున్నాయి. పంటకు గిట్టుబాటుకు తెచ్చి పెడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ బొబ్బిలి మండలం మెట్టవలసను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తోంది. ప్రస్తుతం మెట్టవలస, గొర్లె సీతారాంపురం 100 మంది కూరగాయ రైతులు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. కాశిందొరవలస, నారాయణప్పవలస గ్రామాల్లో 30 మంది 100 ఎకరాల వరకు వరి, చెరకు పండిస్తున్నారు. ఈ ప్రభావంతో గోపాలరాయుడుపేట, నారసింహుని పేట, మల్లంపేటలో వేరుశనగ, చెరకు, వరి సాగు చేస్తున్నారు. అంతా సహజసిద్ధమే రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధంగా లభించే ఆవుమూత్రం, ఆవుపేడ, పప్పుల పిండి, వివిధ రకాల ఆకులు, పుట్టమన్ను, బెల్లం తదితర పదార్థాలతో పండించడమే ప్రకృతి వ్యవసాయం. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ విధానంలో విత్తనశుద్ధి నుంచి పంటలకు కావలసిన పోషకపదార్థాలు, పురుగు మందుల నివారణకు రైతులే సొంతంగా మందులు తయారుచేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో వీటిని ఇటీవల అందుబాటులో ఉంచారు. మెట్టవలసలో ఘన జీవామృతం, ద్రవజీవామృతం, నీమాస్త్రం తయారు చేస్తున్నారు. వెలుగు ఆధ్వర్యంలో వాండ్రాసి లక్ష్మి వీటిని తయారు చేసి విక్రయిస్తోంది. విత్తనశుద్ధికి బీజామృతం కావలసిన పదార్ధాలు: ఇరవై లీటర్ల నీరు, 5కిలోల ఆవుపేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, సున్నం 50 గ్రాములు, గుప్పెడు పుట్టమన్ను. తయారీ విధానం: ఆవుపేడను 20 లీటర్ల నీటిలో మూటతో వేలాడదీసి, ఆవుమూత్రం, సున్నం కలిపి 12 గంటల పాటు ఉంచాలి. దీనిలో పుట్టమన్ను వేసి రోజుకు 2సార్లు కర్రతో కలిపి 3 రోజులుంచితే బీజామృతం తయారవుతుంది. వాడే విధానం.. ఉపయోగాలు: ఈ మిశ్రమాన్ని విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై చల్లి, నీడలో ఆరబెట్టి నాటాలి. విత్తనాల నుంచి సంక్రమించే వ్యాధులను నివారిస్తుంది. అరటి పిలకలు, చెరుకు కణుపులు, వరి, ఉల్లి, మిరప, టమాటా, వంగ మొదలైన నారును బీజామృతంలో ముంచి నాటాలి. ‘ఘన’ మైన దిగుబడికి ‘జీవామృతం’ కావలసిన పదార్ధాలు: దేశవాళీ ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, పప్పుదినుసుల పిండి 2 కిలోలు, గుప్పెడు పుట్టమన్ను తయారీ విధానం: అన్ని పదార్ధాలతో ఆవు మూత్రాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ పాత్రలో బాగా మగ్గబెట్టి 7రోజులు ఉంచాలి. రోజూ తీసి కలపాలి. ఎండబెట్టి పొడిచేసి 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. ఉపయోగాలు: దీనిని ఆఖరి దుక్కులో వేస్తే పంటలకు ఎంతో మేలు కలుగుతుంది. పంటలకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ, స్థూల పోషకాలకు ఉపయోగపడుతుంది. ద్రవ జీవామృతం కావలసిన పదార్ధాలు: నీరు 200 లీటర్లు, దేశవాళీ ఆవుపేడ 10 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, బెల్లం 2కిలోలు లేదా 4 లీటర్ల చెరుకు రసం, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, గుప్పెడు పుట్టమన్ను. తయారీ విధానం: పెద్ద డ్రమ్ములో 200 లీటర్ల నీటిని పోసిపైన చెప్పిన అన్నిటినీ పోసి బాగా కర్రతో కలపాలి. ఈ ద్రావణాన్ని 4 నుంచి 7రోజులు పులియబెట్టి రోజూ 3, 4సార్లు కర్రతో కలపాలి. వారం తరువాత ద్రవజీవామృతం తయారవుతుంది. ఉపయోగాలు: పంట నీటికాల్వలో 200 లీటర్ల జీవామృతం డ్రమ్మును ఉంచి నల్లా బిగించాలి. నీరు పారుతున్నప్పుడు నల్లా వదిలితే నీటితో పాటు ద్రవజీవామృతం పొలంలోకి వెళ్తుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం వాడాలి. ద్రవజీవామృతాన్ని బావిలో కూడా కలపవచ్చు. డ్రిప్ ద్వారా కూడా వేయవచ్చు. వందల లీటర్ల జీవామృతాన్ని నెలరోజుల వ్యవధిలో 3,4సార్లు చల్లుకోవాలి. అమృతజలం కావలసిన పదార్దాలు: పది లీటర్ల ఆవుమూత్రం, 20 కేజీల ఆవుపేడ, 15 కేజీల వేపపిండి, 400 గ్రాముల నువ్వుల నూనె, 2 కేజీల బెల్లం, 2 కేజీల పప్పు దినుసుల పిండి, 200 లీటర్ల నీరు తయారీ విధానం: 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాలను వేసి 3రోజుల పాటు మురగనివ్వాలి. సన్నని గుడ్డతో వడబోసి మొక్కలకు సాగునీటి ద్వారా అందించాలి. ఉపయోగం: మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ అందుతుంది. దశపర్ణి కషాయం కావలసిన పదార్దాలు: 200 లీటర్ల నీరు, దేశవాళీ ఆవుపేడ 2 కేజీలు, ఆవుమూత్రం 10 లీటర్లు, పసుపుపొడి 200 గ్రాములు, శొంఠిపొడి 200 గ్రాములు లేదా అల్లం పొడి 500 గ్రాములు, పొగాకు కేజీ, పచ్చిమిరపకాయల పేస్టు కేజీ లేదా కారం కేజీ, వెల్లుల్లి పేస్టు 100 గ్రాములు, బంతిపూలు ఆకులు, కాండంతో సహా 2 కేజీలు తీసుకోవాలి. కావలసిన 10 రకాల ఆకులు: వేపాకు 2కేజీలు, గానుగ ఆకు 2 కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, అత్తాకోడలు(బేలి లేదా లేంటినా) ఆకులు 2 కేజీలు, వావిలి ఆకులు 2 కేజీలు, తులసి లేదా అడవి తులసి ఆకులు అరకేజీ తీసుకోవాలి. తయారీ విధానం: ముందుగా పదార్ధాలు, పేస్టు, ఆవుమూత్రం, పేడను డ్రమ్ములో కలిపి వేయాలి. పదిరకాల ఆకులను మెత్తగా దంచి వాటిని డ్రమ్ములో కలిపి రోజూ 3సార్లు గడియారం ముళ్లు తిరిగే దిశలో 3నిమిషాల పాటు తిప్పాలి. ఇలా 40 రోజులు నిల్వ ఉంచి రోజూ తిప్పాలి. 41వ రోజున తీస్తే మంచి కషాయం తయారవుతుంది. దీన్ని పలుచని గుడ్డతో వడకట్టి 6 నుంచి 10 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు వేయాలి. ఈ కషాయం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఉపయోగాలు: వరిపై రసం పీల్చేపురుగు నివారిస్తుంది. మామిడిలో బూడిద తెగులు నివారిస్తుంది. కీటక నాశని నీమాస్త్రం కావలసిన పదార్ధాలు: నీరు 200 లీటర్లు, ఆవుపేడ 2 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, వేపాకులు, రెమ్మలు,చిగుర్లు 10 కిలోలు తయారీ విధానం: పది కిలోల వేపను బాగా రుబ్బి, 200 లీటర్ల నీటిని తీసుకుని డ్రమ్లో బాగా కలపాలి. పది లీటర్ల ఆవుమూత్రం కలిపి, ఇందులో 2 కిలోల ఆవుపేడను కర్రతో బాగా తిప్పి కలపాలి. 48 గంటల వరకు మూసి ఉంచి రోజూ 3సార్లు కలపాలి. తరువాత పలుచని గుడ్డతో వడగడితే నీమాస్త్రం తయారవుతుంది. ఉపయోగాలు: నీమాస్త్రాన్ని పంటపొలాల్లో చల్లితే అన్నిరకాల పురుగుల గుడ్లను చంపుతుంది. తెగుళ్ల నివారణకు దోహదపడుతుంది. పంట విత్తిన 20, 45, 60 రోజులకోమారు చల్లాలి. రైతులకు వరం ప్రకృతి వ్యవసాయం రైతులకు వరం. బొబ్బిలి క్లస్టర్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నాం. వీలైనంత ఎక్కువ మంది రైతులతో ప్రకృతి సేద్యం చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై అందరికీ అవగాహన పెంపొందించాలి. - ఎం.శ్యామసుందరరావు, ఏవో, బొబ్బిలి ప్రకృతి వ్యవసాయంతో లాభాలు ప్రకృతి వ్యవసాయంలో వరి, చెరుకు పండిస్తున్నాను. పంట దిగుబడి బాగుంది. పంటకు ధర బాగానే వస్తోంది. ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించాననే సంతృప్తి కలుగుతోంది. నాలుగెకరాల్లో వరివేసి ఘనజీవామృతం వేసి పంటలు పండిస్తున్నాను. - బలగ సింహాచలమ్మ, మల్లమ్మపేట ఎంతో లాభదాయకం సేంద్రియ వ్యవసాయం బాగుంది. దశపర్ణి కషాయంతో చెరుకు, వరి పంటలు పండిస్తున్నాను. ప్రస్తుతం చెరో 4 ఎకరాల్లో వరి, చెరుకు వేశాను. వేరుశనగ పంట పండిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత విస్తరించి ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఈ వ్యవసాయం లాభదాయకం - కర్రి శ్రీనివాసరావు, గోపాలరాయుడు పేట -
ఆ ఇల్లు పంటల పెన్నిధి!
- నెలకు సరిపడా కూరగాయల సాగు.. పండ్లు కూడా.. - మేడపైనే నాటు కోళ్ల పెంపకం.. సేంద్రియ గుడ్ల ఉత్పత్తి ప్రకృతి వ్యవసాయం మనుషుల మనస్సుల్లో మానవీయ విలువలను ఇనుమడింపజేస్తుందని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి ఆయన. పంట పొలాల్లో కాయకష్టం చేసే అన్నదాతలతో సహానుభూతి చెందుతూ.. తన ఇంటిపైనే సేంద్రియ పంటలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తుమ్మేటి రఘోత్తమ్రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం, నారపల్లి ఆయన స్వగ్రామం. నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను పూర్తిగా, నెలలో 10 రోజులకు సరిపడా పండ్లను ఇంటిపంటల ద్వారానే పొందుతుండటం విశేషం. గోదావరి ఖనిలో బొగ్గుగని కార్మికుడిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని 2009లో నారపల్లిలో స్వంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇంటిపైనే 200కు పైగా కుండీల్లో టమాట, వంకాయ, క్యాబేజీ, ఉల్లి, దొండ, మిరప, మునగ, చేమగడ్డ వంటి కాయగూరలు.. కరివేపాకు, పుదీనా, తోటకూర, బచ్చలి, గంగవాయిలి, కాలిఫ్లవర్ వంటి ఆకుకూరలు.. నేతిబీర, దోస, దొండ, బీర, కాకర వంటి తీగజాతి కూరలు... సీతాఫలం, రామా ఫలం, అల్లనేరేడు, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, పంపర, పనస, సపోటా, బొప్పాయి, మామిడి వంటి పండ్ల మొక్కలు.. ములకబంతి, నిత్యవరహాలు, చంద్రకాంతలు వంటి పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. మట్టి, సిమెంటు కుండీలను, ప్లాస్టిక్ డబ్బాలను మొక్కలు పెంచేందుకు వాడుతున్నారు. రెండుపాళ్లు ఎర్రమన్ను, ఒక పాలు పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని మొక్కలను పెంచేందుకు వాడుతున్నారు. పశువులు, మేకలు, కోళ్ల పెంటను ఎరువులుగా వాడుతున్నారు. ఆర్నెల్లకోసారి మొక్కపాదుల్లో మూడంగుళాల లోతు మట్టిని తీసివేసి పిడికెడు పేడ ఎరువు, వేపపిండి వేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరందిస్తారు. మొక్కలను ఆశించే వేరుపురుగు, తెల్లచీమలు వంటి చీడపీడలను తొలిదశలోనే గుర్తించి చేతితో ఏరిపారేస్తారు. ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 5 ఎం. ఎల్. వేపనూనెను కలిపి మొక్కలపై పిచికారీ చేసి నివారిస్తున్నారు. రఘోత్తమ్రెడ్డి ఇంటిపంటల నుంచే విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. వీటితో పాటు ఆరు నాటు కోళ్లను పెంచుతూ.. నెలకు సరిపడా గుడ్లను పొందుతున్నారు. కోళ్ల పెంటను ఇంటిపంటల కు ఎరువుగా వాడుతున్నారు. వీటి మేత కోసం కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యపు పంటలను ఇంటిపంటల్లో పెంచుతుండటం విశేషం. ‘ఇంటిపంటల పెంపకం వల్ల శారీరక వ్యాయామంతో పాటు ప్రకృతి ఒడిలో జీవిస్తున్న భావన కలుగుతుంది. ఇది అనుభవిస్తేనే గానీ తెలియని ఆనందం’ అంటారు ప్రసిద్ధ రచయిత కూడా అయిన రఘోత్తమ్రెడ్డి. - డి. వి. రామకృష్ణారావు, వ్యవసాయ శాస్త్రవేత్త, హైదరాబాద్ ఆరేళ్ల నుంచి కూరగాయలు కొనలేదు! ఆరేళ్ల క్రితం మేడపైన ఇంటిపంటల పెంపకం ప్రారంభించా. బీమ్ల పైనే ఎత్తు మడులను ఏర్పాటు చేశాను. మేడపై బరువు పెరుగుతుందన్న భయపడనక్కర్లేదు. కూరగాయల సాగులో రైతులు పురుగుమందులు విపరీతంగా వాడుతున్నారు. అందుకే పట్టుబట్టి టై గార్డెన్ ఏర్పాటు చేసుకున్నా. విష రహిత తాజా కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నా. గడచిన ఆరేళ్లలో కూరగాయలు కొనలేదు. ఇల్లున్న వారంతా ఇంటిపంటలు పండించుకోవాలి. - తుమ్మేటి రఘోత్తమ్రెడ్డి (90001 84107), నారపల్లి, ఘట్కేసర్ మం., రంగారెడ్డి -
మానసిక రుగ్మతలు అందుకేనట!
వాషింగ్టన్: నగర జీవనానికి అలవాటుపడిన మనిషి ప్రకృతిని ఆస్వాదించడం దాదాపు మరచాడనే చెప్పాలి. అయితే ప్రకృతిలోని పచ్చదనం, తాజా గాలి దొరక్కపోవటంతో నగరవాసులు తీవ్రమైన మానసిక వ్యాధుల బారిన పడుతున్నాడని తాజా అధ్యయనంలో తేలింది. సహజ వాతావరణానికి దూరమౌతున్న కొద్దీ.. మానసిక వ్యాదులు పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు. మానసికపరమైన రుగ్మతలు, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నగరవాసికి సహజ వాతావరణం కావాల్సిందేనని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పీటర్ ఖాన్ తెలిపారు. ముఖ్యంగా పట్టణాల్లో విస్తరించిన పరిశ్రమలు ప్రజలకు సహజ వాతావరణాన్ని దూరం చేస్తున్నాయని తెలిపారు. మానసిక రుగ్మతల నుంచి దూరంగా ఉండాలంటే పట్టణవాసులు తమ రోజువారి జీవితంలో కాస్తయినా సహజ వాతావరణంలోకి వెళ్లాల్సిందే అని పరిశోధకులు తెలిపారు. -
బెరుకులోయ!
కొండచరియలు పడే ప్రాంతంగా గుర్తింపు జీఎస్ఐ పరిశోధనలో వెల్లడి రైల్వేకు తరచూ భారీ నష్టం పర్యాటక రంగంపైనా ప్రభావం ఐరన్మెష్లు, రాక్ రివిటింగ్తో పరిష్కారం అందాల అరకులోయకు దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. సహజ సౌందర్యం, ప్రకృతి రమణీయతతో పర్యాటకులను తనవైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతాల్లో చేరింది. దేశంలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ఒకటిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదే ఇప్పుడు పర్యాటక ప్రియుల్లో ఒకింత అలజడి రేపుతోంది. దీంతో అరకులోయ బెరుకులోయగా మారుతోంది. విశాఖపట్నం: తూర్పు కనుమల్లో ఉన్న అరకులోయ ప్రాంతం వివిధ రకాల స్వభావాన్ని కలిగి ఉంది. కోండలైట్ రకానికి చెందిన గార్నెట్, సిలిమినేట్, నైస్ వంటి పలచటి రాళ్ల సముదాయంతో ఉంటుంది. ఈ రాళ్లు బలంగా ఉండవు. బండరాళ్ల మధ్య కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం సిలికేటు కలిసి ఉంటాయి. వర్షాలొచ్చినప్పుడు అవి కరిగిపోయి, బండరాళ్లు జారిపోతుంటాయి. వీటిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. అరకులోయ ప్రాంతంలో వర్షాకాలంలోనే కాదు.. భారీ వానలు కురిసినప్పుడల్లా కొండచరియలు విరిగిపడడం పరిపాటిగా మారింది. అలాంటి సమయంలో భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. పదేళ్ల క్రితం 2006లో అరకు సమీపంలోని కోడిపుంజువలస గ్రామంలో వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడి 18 మంది మృత్యువాతపడ్డారు. 2014లో హుద్హుద్ తుపాను సమయంలో అరకు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా చిన్నా చితకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క కొత్తవలస-కిరండోల్ (కేకే) లైనుపై ఈ కొండచరియలు తరచూ విరిగిపడుతూ రైల్వేకి పెను నష్టాన్ని తెస్తున్నాయి. రోజుకు సగటున ఈ లైనులో రెండు పాసింజరు రైళ్లు, 50 గూడ్స్రైళ్లు ఐరన్ ఓర్ లోడు (రోజంతా లక్షల టన్నుల బరువు)తో రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు వాటి అదురు/ఒత్తిడికి టన్నెల్స్ వద్ద ఉన్న కొండచరియలు రైల్వే లైనుపైన, ఆ సమయంలో ప్రయాణించే రైళ్లపై పడుతున్నాయి. దీంతో లైన్లతో పాటు రైళ్లు దెబ్బతింటున్నాయి. రోజుల తరబడి రైలు సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో రైల్వే రూ.కోట్లలో నష్టపోతోంది. తాజాగా ఈ నెల 19న బొర్రా-చిముడుపల్లిల మధ్య కొండచరియలు గూడ్స్ రైలుపై పడడంతో మూడు ఇంజన్లు, రెండు బోగీలు ధ్వంసమయ్యాయి. లైను బాగా దెబ్బతింది. అదే పాసింజరు రైలుపై పడితే ఎంతటి ప్రమాదం వాటిల్లేదో? ఇటీవల కాలంలో కొండచరియలు పడడం మునుపటికంటే అధికమవుతోంది. ఇదే ఇప్పుడు అన్ని వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ముప్పు జాబితాలోకి.. దేశంలోని కొండచరియలు విరిగిపడే అవకాశాలున్న ప్రాంతాల్లో మన అరకులోయ కూడా చేరింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు జరిపింది. దేశంలో 0.42 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా గుర్తించింది. ఇందులో సిక్కిం, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, కేరళ, గోవా, మహరాష్ట్రలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అరకును కూడా చేర్చింది. అరకు ప్రాంతంలో 0.01 మిలియన్ చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో కొండచరియలు జారిపడే ప్రదేశం ఉన్నట్టు తొలిసారిగా తేల్చింది. రైళ్ల మార్గంలోనే కాదు రోడ్డు మార్గంలోనూ కొండచరియలు పడుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక విదేశీ పర్యాటకులు అరకుతోపాటు మన్యం అందాలను చూడడానికి పోటీ పడతారు. ఇలా ఏటా ... లక్షల మంది పర్యాటక ప్రియులు వస్తుంటారు. వీరిలో అత్యధికులు పాసింజరు రైలులోనే వెళ్లి తిరుగు ప్రయాణంలో మరో వాహనంలో వస్తారు. ఆ సమయంలో కొండచరియలు జారిపడితే వాటిల్లే ప్రమాదాన్ని ఊహించడమే కష్టమవుతుంది. రివిట్మెంట్తో పరిష్కారం కేకే లైన్లో కొండచరియలు విరిగిపడడం అధికమవుతోంది. ముఖ్యంగా టన్నెల్స్ వద్ద ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తున్నాయి. రాళ్ల మధ్య అంతగా పట్టులేని కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం సిలికేటు ఉండడం వల్ల భారీ వర్షాల వేళ బండరాళ్లు జారిపడుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి రాళ్లతో రివిటింగ్, లేదా ఐరన్ మెష్లతో కట్టడి చేయడం ఒక్కటే మార్గం. ఉదాహరణకు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి కొండ నుంచి బండరాళ్లు జారిపడకుండా ఐరన్ మెష్లను కట్టారు. కేకే లైన్లో దాదాపు 70-80 టన్నెళ్ల వద్ద ఇలాంటి మెష్లను ఏర్పాటు చేయాలి. లేదంటే రాళ్లతో రివిటింగ్ చేయాలి. రాబోయే వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొండచరియల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. -సంపత్కుమార్, జియో ఫిజిక్స్ విభాగాధిపతి, ఏయూ -
విశ్వనగరిలో అడవి అందాలు
నేడు వరల్డ్ మ్యూజియం డే సిటీబ్యూరో: ప్రకృతితో గిరిజనులది విడదీయరాని బంధం. ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తూ అందులో మమేకమవుతారు గిరిజనులు. వారి జీవనశైలి ప్రకృతిలాగే రమణీయంగా ఉంటుంది. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు చూపరులను కట్టిపడేస్తాయి. సామాన్య జనానికి దూరంగా తమదైన లోకంలో జీవించే అడవిబిడ్డలను చూడాలంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి వెళ్లాలనుకుంటున్నారా ....? అయితే మీరు పప్పులో కాలేసినట్లే... మన భాగ్యనగరంలో గిరిజనులను దర్శించవచ్చు. వారి ఆటపాటలను, వారు చెప్పే ముచ్చట్లను మాసబ్ట్యాంక్ సంక్షేమ భవన్ ట్రైబల్ మ్యూజియంలో ఎంచక్కా ఆస్వాదించవచ్చు. గ్రౌండ్ ఫ్ల్లోర్లో: గిరిజన సమాచారం తెలిపేలైబ్రరీ, ఆదివాసీల కాల చక్రం తెలిపే చిత్ర పటం ఉంది. మినీ ఆడిటోరియంలలో: మానవుని పరిణామక్రమాన్ని తెలిపే మ్యూజియం ఉంది. 12 రకాల గిరిజన సంసృ్కతులను చూడవచ్చు. మొదటి అంతస్తులో: గిరిజనుల జీవన విధానం ఉట్టిపడేలా గిరిజనుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. సాంస్కతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలు, దృశ్యశ్రవణ విభాగంలో లఘుచిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. 18 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన సంగ్రహాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన వస్తు విశేషాలను టచ్స్క్రీన్ కంప్యూటర్లో చూసుకునే వెసులుబాటు కల్పించారు. రెండో అంతస్తులో... కులదేవతల ప్రతిమలు, వేటకు, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను వీక్షించవచ్చు. పండుగలకు చేసే నృత్య ప్రతిమలు, వాయిద్యా పరికరాలు, యానాది, ఎరుకల, కోయ్య, లంబాడీ, చెంచుల, సవరల ఇళ్లు విశేషంగా ఆకట్టుకుంటాయి. -
ఈ కలం.. జన గళం! 'జర్నలిస్టు'
నేచర్ ఆఫ్ జాబ్ సమాజంతో దగ్గరి సంబంధం ఉన్న ఉద్యోగం జర్నలిస్ట్. మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది ఎంతో వైవిధ్యమైన వృత్తి. రాసే వార్తలో ప్రతి పదం వాస్తవికంగా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్టులు రాసే ప్రతి అక్షరం ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జర్నలిజం యువతకు మంచి కెరీర్ ఆప్షన్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఉద్యోగ స్వభావం, అవసరమైన స్కిల్స్ తదితరాలపై కథనం.. రెండు విభాగాలు జర్నలిజంలో ముఖ్యంగా రెండు విభాగాలుంటాయి. ఒకటి బ్యూరో, రెండోది డెస్క్. బ్యూరోలో రిపోర్టర్లుంటారు. సిటీ, స్టేట్, జిల్లాల వారీగా వేర్వేరు బ్యూరోలుంటాయి. రిపోర్టర్లు ఫీల్డ్కు వెళ్లి వార్తను సేకరించి డెస్క్కు చేరవేస్తారు. బ్యూరో మాదిరిగానే డెస్క్లు కూడా సిటీ, స్టేట్, బిజినెస్, స్పోర్ట్స, జిల్లాలు.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. డెస్క్లో ప్రాథమికంగా సబ్ ఎడిటర్లు ఉంటారు. రిపోర్టర్లు ఇచ్చిన వార్తల్లోని దోషాలను సవరించి, దానికి మంచి శీర్షిక పెట్టి వార్తగా మలుస్తారు. ఒక వార్తకు సంబంధించి తుది నిర్ణయం డెస్క్దే. పనివేళలు ఎలక్ట్రానిక్ మీడియాలో షిఫ్ట్ల వారీగా పనివేళలు ఉంటాయి. ఇవి ప్రతి వారం మారుతుంటాయి. ప్రింట్ మీడియాలో డెస్క్ విభాగంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు పని వేళలు ఉంటాయి. బ్యూరో విభాగం... ఆ రోజు ఉదయం నుంచి జరిగిన అంశాలను సాయంత్రానికల్లా వార్తల రూపంలో డెస్క్కు అందిస్తుంది. రిపోర్టర్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి నిర్ణయాలు వెలువడినా వెంటనే వార్తలు రాసి డెస్క్కు అందించాల్సి ఉంటుంది. కావాల్సిన స్కిల్స్ ⇒ జర్నలిస్టు కావాలనుకునే వారికి ప్రాథమికంగా, తప్పనిసరిగా భాషపై మంచి పట్టు ఉండాలి. ⇒ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలన్నింటిపై కనీస అవగాహన ఉండాలి. ⇒ నిరంతరం నేర్చుకునే తత్వం అత్యవసరం. ⇒ ఏది వార్తో, ఏది కాదో గుర్తించే నైపుణ్యం ఉండాలి. ⇒ పనిలో వేగం, కచ్చితత్వం తప్పనిసరి. ఉద్యోగావకాశాలు.. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో ఉద్యోగావకాశాలకు ఢోకాలేదనే చెప్పుకోవాలి. టీవీ చానళ్లు, న్యూస్ పేపర్లలో అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా డెస్క్, బ్యూరో విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కెరీర్ ప్రారంభంలో రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. ⇒ జర్నలిజం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించొచ్చు. ⇒ జర్నలిజం ద్వారా పేదలు, బాధితులకు సాయం చేయొచ్చు. తద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ⇒ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ అన్ని రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ⇒ జర్నలిజంలో కాలంతో పోటీపడి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ ప్రతి రోజు డెడ్లైన్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి ఎక్కువ. ⇒ సెలవులు తక్కువగా ఉంటాయి. కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ఉద్యోగాలు సాధించొచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంసీజే అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా విశ్వవిద్యాలయం కోర్సు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ఏయూసెట్లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.andhrauniversity.edu.in కాకతీయ విశ్వవిద్యాలయం కోర్సు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.kakatiya.ac.in శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: కనీసం 45% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.spmvv.ac.in యోగి వేమన విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.yogivemanauniversity.ac.in తెలంగాణ విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్లో ఎంఏ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.telanganauniversity.ac.in ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.anucde.info -
నాన్నా... చూసొద్దామా!
సమ్మర్ స్పెషల్ హైదరాబాద్లో ఉన్న పిల్లలకు హైదరాబాద్లో ఉన్న విశేషాలు చూసే టైమ్ ఉండదు. హైదరాబాద్లో లేని పిల్లలకు అక్కడకు చేరే వీలు ఉండదు. సమ్మర్ సెలవలు అందుకే వస్తాయి. ఉన్న ఊళ్లోనివి తెలియని ఊళ్లల్లోనివి చూసి రమ్మంటాయి. పిల్లలూ... పెద్దల వెంటపడండి. బస్సెక్కండి... ఆటో ఎక్కండి... రైలు ఎక్కండి... కానీ ఇవి మాత్రం మిస్ కాకండి. సాలార్జంగ్ మ్యూజియం గంటకోసారి గంటకొట్టే అబ్బాయికి ఆకలెయ్యదా నాన్నా? ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? రెబెకాకు ముసుగు ఎవరు కప్పారు? ఏమో! వీటికి సమాధానాలు మీ దగ్గర లేకపోయినా ఏం ఫరవాలేదు. ఓ సారి పిల్లల్ని సాలార్జంగ్ మ్యూజియానికి తీసుకెళ్లండి. అలాగే మీకు దగ్గరున్న ఇతర మ్యూజియాలనూ చూపించండి. కళాజగత్తును, శాస్త్రసాంకేతిక ప్రపంచాన్ని ఏకకాలంలో అర్థం చేసుకుంటారు. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లోని దివాన్దేవుడీలో ఉండేది. ఇప్పుడు దారుషిఫా చౌరస్తాకు సమీపంలో మూసీనది పక్కన 1968లో నూతనంగా నిర్మించిన భవనంలోకి సాలార్జంగ్ మ్యూజియాన్ని మారింది. 1,2,3 సాలార్జంగ్లు భారతదేశంతో పాటు విదేశాల నుంచి సేకరించిన దాదాపు 48 వేల కళాఖండాలను మ్యూజియంలో పొందుపరిచారు. రెబేకా (పాలరాతి ముసుగు సుందరి), గంటలు కొట్టే గడియారంలతోపాటు చైనా, జపానీస్, యూరోపియన్ పెయింటింగ్లతో కూడిన గ్యాలరీలు, అరుదైన కళాఖండాలు మ్యూజియంలో సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఎప్పుడు వెళ్లవచ్చు?: శుక్రవారం సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 5 గంటల మధ్య. టిక్కెట్లు: పెద్దలకు -రూ.20, పిల్లలకు-రూ.10 (12 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితం), విదేశీయుులకు- రూ.500. సాలార్జంగ్ మ్యూజియం ఆవరణలో పార్కించ్ చార్జ్... ద్విచక్ర వాహనానికి రూ.5, కారుకు రూ. 30, బస్సుకు, రూ.50. బిర్లా ప్లానిటోరియం నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయా? గ్రహాలను మనం చూడలేమా? డైనోసార్ మన ఇల్లంత ఉంటుందా? ఇన్నింటికి జవాబుల కోసం బుర్రగోక్కోవడం కంటే ఓసారి ప్లానిటోరియానికి తీసుకెళ్తే సరి. హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియంలో పిల్లలకి సైన్స్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. డైనోసార్లో పుట్టుకను శాస్త్ర రీత్యా చూడవచ్చు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వెలకట్టలేని అంశాలు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. శాస్త్రీయ ఆలోచనలు ఒంటపట్టించేందుకు సైన్స్ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు బిర్లా సైన్స్ మ్యూజియం ఓ గొప్ప వేదిక. జీవ పరిణామ క్రమాన్ని తెలియజేసేలా శిలాజాలు, అంతరిక్ష రహస్యాలను అద్దం కంటే ప్లానిటోరియం ప్రదర్శన పిల్లలకు విజ్ఞానదాయకంగా, పెద్దలకు వినోదంగా ఉంటుంది. ఓసారి పిల్లల్ని తీసుకెళ్తే పై ప్రశ్నలకు సమాధానాలు వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడు ఆ చిట్టి బుర్రల్లో కొత్త ప్రశ్నలు మొదలవుతాయి. కొత్త క్వశ్చన్ బ్యాంకులన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. బిర్లా ప్లానిటోరియం, మ్యూజియం నౌబత్ పహడ్లో... ఖైరతాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కేవలం ఒకటి, రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఎప్పుడు వెళ్లవచ్చు?: వారాంతపు సెలవు లేదు. ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య వెళ్లవచ్చు. ప్రవేశ రుసుము: రూ.80. ఫోన్ నెంబర్లు: 040- 23241067, 23235081. నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కు పాతబస్తీ బహదూర్పురాలో 380 ఎకరాల సువిశాల వైశాల్యంతో విస్తరించి ఉంది. ఇది అరుదైన వన్యప్రాణులకు అభయారణ్యం. అడవిని పోలిన సపారీ పార్కులతో ఇది వైవిధ్యమైన ప్రాణిప్రపంచం. రంగురంగుల చిలకల ప్రపంచం, వివిధ రకాల కీటకాలశాల, రకరకాల సీతాకోక చిలకలతో సంద ర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఆలోచింపజేస్తుంది ఈ జూ. దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియా సింహాల పరిరక్షణను విజయవంతంగా నిర్వహిస్తోంది ఈ జూ. వాటి పునరుత్పత్తికి దేశంలోనే రికార్డులెక్కిన జూలలో జన్యు ప్రయోగాల ద్వారా తెల్ల పులుల సంతానోత్పత్తి నిలయం అయింది. జీబ్రా, కంగారు వంటి అరుదైన విదేశీ జంతువులు కనుమరుగయ్యాయి. హార్న్బిల్, ఫెలికాన్, ప్లెమింగ్ ఘోష్, సారాస్ క్వెన్, లవ్బర్డ్స్, తెల్ల చిలకల వంటి అరుదైన పక్షులతో పాటు దేవాంగపిల్లి, జంగిలికాట్, ముళ్ల పంది, కస్తూరి పిల్లులు, ఆసియా సింహాలు, తెల్లపులులు, చిరుత, ఆఫ్రికా సింహం, జాగ్వార్ రకం చిరుత పులి, సరిసృపాల జగత్తులో రస్సల్ ఫైపర్, రాక్ఫైథాస్, లెటిక్యూలేటెడ్ ఫైథాస్ రకాల కొండచిలువలు, ఆఫ్రికన్ చింపాంజి, జంట ఖడ్గమగాలు, నీటి గుర్రాలు ఈ జూకు ప్రత్యేకఆకర్షణ. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఎలా గడిచిపోయిందో తెలియదు. ఎలా వెళ్లాలంటే... నగరంలో అన్ని ప్రదేశాల నుంచి సిటీబస్సులు ఉన్నాయి. ఎప్పుడు వెళ్లాలి?: ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం జూకు సెలవు. ప్రవేశ రుసుం: పెద్దలకు రూ.30, చిన్నారులకు రూ.15. బ్యాటరీ వాహనం డ్రైవ్: పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25. చిట్టి రైలు ప్రయాణం: పెద్దలకు రూ.15, చిన్నారులకు రూ.5లు. బొటానికల్ గార్డెన్..! ప్రకృతి మనకు ఎన్ని చెట్లనిచ్చిందో పిల్లలకు చెప్పడం ఎలా? కష్టం మీద పది పేర్లు చెబితే పదకొండవ చెట్టు పేరు గుర్తు రాదు. గూగుల్ సెర్చ్లో చెట్ల పేర్లను వెతకడం మాని బొటానికల్ గార్డెన్ బాట పట్టండి. చెట్లను చూడడంతోపాటు ఆరోగ్యకరమైన గాలని పీల్చుకోవచ్చు. హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్ ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గార్డెన్ అటవీప్రాంతాన్ని తలపిస్తుంది. చూడచక్కనైన చల్లటి వాతావరణం గార్డెన్ సొంతం. దీనిని ‘కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్, కొత్తగూడ’ అంటారు. ఇందులో రోజ్ గార్డెన్, ఎంటర్టైన్ పార్క్ ఉండేవి. వేసవి కారణంగా వాటిని నిర్వహించడం లేదు. పెద్ద పెద్దపార్టీలు, గెట్టూ గెదర్స్, ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తారు. దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఉండే వృక్షాలను ఇందులో చూడవచ్చు. సైన్స్కు సంబంధించి ఎన్నో శాస్త్రీయ నామాలు గల ఔషధమొక్కలు ఇందులో ఉన్నాయి. ఇది సైన్స్ విద్యార్థులకు రిసెర్చ్ కేంద్రం, పర్యాటకులకు వినోదం. పిల్లలకు రోజంతా ఉత్సాహంగా గడపడానికి చక్కటి ప్రదేశం. ‘ఆడుకుంటూ నేర్చుకోవడం’ అంటే ఏమిటో ఇక్కడకు వెళ్తే తెలుస్తుంది. ఎప్పుడు వెళ్లవచ్చు: ఉదయం 9 గం॥నుంచి సాయంత్రం 5 గం॥( ఏప్రిల్, మే నెలల్లో సాయంత్రం 6.30 వరకు). వారాంతపు సెలవులు: లేవు. ప్రతిరోజూ వెళ్లవచ్చు. ప్రవేశ రుసుం: పిల్లలకు రూ.5 , పెద్దలకు రూ. 15. మరిన్ని వివరాలకు: రాజేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్ను (9533068033) సంప్రదించవచ్చు. -
జీవామృతం పారింది.. బత్తాయి నవ్వింది!
♦ డిగ్రీ చదివి బత్తాయి సాగులో రాణిస్తున్న యువరైతు ♦ రెండేళ్లుగా ప్రకృతి సేద్యం.. దిగుబడులు సంతృప్తికరం ♦ తోకముడిచిన వేరుకుళ్లు తదితర తెగుళ్లు అతను డిగ్రీ చదువుకున్నాడు. సొంత భూమిలో బత్తాయి తోట సాగు ప్రారంభించాడు. అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయ పద్ధతులను పాటించాడు. ఏటా తెగుళ్లతోపాటు ఖర్చూ పెరుగుతున్నా.. దిగుబడి నానాటికీ తీసికట్టవుతూ వచ్చింది. విసిగి వేసారి ప్రకృతి సేద్యం చేపట్టాడు. ఖర్చు 80 శాతం తగ్గింది. కానీ, దిగుబడి తొలి ఏడాది కూడా తగ్గలేదు. మరోవైపు బత్తాయిల నాణ్యత పెరిగింది.. ఏ రైతుకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి..? గోట్ల గౌతమ్ అనే విద్యాధికుడైన యువ రైతు తన 18 ఎకరాల బత్తాయి తోటలో ప్రకృతి సేద్యం చేస్తూ.. తొలి ఏడాది నుంచే రసాయన సేద్యానికి దీటుగా దిగుబడులు సాధిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ మండలం కొత్తపల్లి ఆయన స్వగ్రామం. డిగ్రీ వరకు చదువుకున్నారు. అయినా వ్యవసాయంపై మక్కువతో 2005 నుంచి 18 ఎకరాల్లో బత్తాయి సాగు (రసాయనిక వ్యవసాయం) ప్రారంభించారు. ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాక 2010లో పంట దిగుబడి ప్రారంభమైంది. అదే సమయంలో తామర పురుగు, పచ్చదోమ, తెల్లదోమతో వైర స్ తెగుళ్ల వ్యాప్తి పెరిగింది. తరచూ వేరుకుళ్లు, కాంకర్ వంటి తెగుళ్లు, రసం పీల్చే పురుగులు పంటను ఆశించేవి. వీటిని నివారించేందుకు క్రిమిసంహారక మందులను విరివిగా పిచికారీ చేయాల్సి వచ్చేది. దీని వల్ల ఖర్చు పెరిగేది. శ్రమ ఎక్కువయ్యేది. అంత చేసినా దిగుబడి.. పంట నాణ్యత తగ్గుతూ ఉండేది. రకరకాల మందులను మార్చి మార్చి పిచికారీ చేసినా నెల రోజుల తర్వాత మళ్లీ చీడపీడల దాడి మొదలయ్యేది. వేరుపురుగుతో వేగలేక కొత్తపల్లి గ్రామంలో కొందరు రైతులు బత్తాయి తోటలను నరికివేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి అననుకూల పరిస్థితుల్లో ఇక రసాయనిక పురుగుమందుల పిచికారీతో చీడపీడల నివారణ సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు గౌతమ్. ఆ దశలో పత్రికల ద్వారా ప్రకృతి సేద్యం గురించి తెలుసుకొన్నారు. 2013లో నాగ్పూర్లో జరిగిన పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. మెలకువలను ఆకళింపు చేసుకొని శ్రద్ధగా ఆచరించటం ప్రారంభించారు. చెట్టుకు నెలకు 5-7 లీటర్ల జీవామృతం జీవామృతం తయారీ కోసం ఆరు ఒంగోలు జాతి ఆవులను గౌతమ్ పెంచుతున్నారు. నెలకు 25 వేల లీటర్ల జీవామృతాన్ని తయారు చేసి బత్తాయి మొక్కలకు అందిస్తున్నారు. ఒక్కో చెట్టుకు నెలకు 5-7 లీ. చొప్పున అందిస్తున్నారు. తయారు చేసిన జీవామృతాన్ని వారం లోపలే మొక్కలకు అందిస్తారు. మరో ట్యాంకును ఏర్పాటు చేసి ఫిల్టర్ అయిన జీవామృతాన్ని డ్రిప్ ద్వారా చెట్లకు అందిస్తున్నారు. లీటరు నీటికి 10 నుంచి 20 మిల్లీ లీటర్ల జీవామృతాన్ని కలిపి నెలకోసారి చెట్లపై పిచికారీ చేస్తున్నారు. ఎలాంటి కషాయాలు పిచికారీ చేయకుండానే తెగుళ్ల బెడద తగ్గిపోయింది. ప్రకృతి సేద్యం పాటించినప్పటి నుంచి తోటలోకి ఎక్కువ సంఖ్యలో పక్షులు రావటం మొదలైంది. పంటను ఆశించే వివిధ రకాల పురుగులను తింటూ సహజ కీటక నివారిణిలుగా ఇవి పని చేస్తున్నాయి. తోటలో పెరిగే గడ్డి కూడా బలమే! ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగవుతున్న పండ్ల తోటల్లో చెట్ల మధ్య పెరిగే గడ్డి మొక్కలను దున్నకూడదంటారు గౌతమ్. పెరిగిన గడ్డి వల్ల ఆచ్ఛాదన ఏర్పడి భూమిలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉంటుంది. తేమను ఆధారంగా చేసుకొని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు భూమి పై పొరలో నివశిస్తాయి. శిలీంధ్రాల బారి నుంచి చెట్లను కాపాడే సహజ రక్ష క కవచాలుగా ఇవి పని చేస్తాయి. వీటిని కాపాడుకోవాలంటే భూమిని దున్నకూడదంటారాయన. ప్రకృతి సేద్యం చేస్తున్న కొందరు పండ్ల తోటల రైతులు జీవామృతాన్ని అందిస్తున్నా... దిగుబడులు ఆశించిన రీతిలో పెరగటం లేదని బాధపడుతుంటారు. తోటను తరచూ దున్నటమే దీనికి కారణం అంటారు గౌతమ్. బత్తాయి తోటలో అంతర పంటగా ఎకరాకు 300 మునగ మొక్కలను పెంచుతున్నారు. మునగ మొక్కలు ఇప్పుడు పూత దశలో ఉన్నాయి. ఖర్చు 80% తగ్గింది.. పంట పండింది.. ప్రకృతి సేద్యంలో 80 శాతం ఖర్చు తగ్గిందని గౌతమ్ తెలిపారు. 18 ఎకరాల తోటకు రసాయన సేద్యంలో ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. 6-7 లక్షల వరకు ఖర్చయ్యేది. అయితే, జీవామృతం తయారీకి అవసరమైన శనగపిండి, బెల్లం కొనుగోలుకు మాత్రమే రూ. లక్ష వరకు ఖర్చవుతోంది. రసాయన సేద్యంలో ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి వచ్చేది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన ప్పటి నుంచి 9-10 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. పంట నాణ్యత బాగుండటంతో గతేడాది రూ. 33 లక్షలకు వ్యాపారులు తోటను కొనుగోలు చేశారు. - శ్రీకర్, గద్వాల న్యూటౌన్, మహబూబ్నగర్ జిల్లా ప్రకృతి సేద్యం తోనే బత్తాయి రైతుకు మనుగడ! 18 ఎకరాల్లో బత్తాయి తోటకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకానికి రూ. 6-7 లక్షలు ఖర్చయ్యేది. పురుగుమందుల పిచికారీ వల్ల ఖర్చే తప్ప ఉపయోగం లేదు. ప్రకృతి సేద్యంలో ఖర్చు తగ్గి భూమి సారవంతమవుతున్నది. మంచి నాణ్యమైన పంట దిగుబడి వస్తోంది. ప్రకృతి సేద్యంతోనే బత్తాయి రైతుకు మనుగడ. రైతులంతా ప్రకృతి సేద్యాన్ని ఆచరించాలి. - గోట్ల గౌతమ్ (99480 50031), కొత్తపల్లి, గద్వాల్ మండలం, మహబూబ్నగర్ జిల్లా. -
శిబిచక్రవర్తి దాతృత్వం
పురానీతి విశ్వవిఖ్యాతి పొందిన మహాదాతలలో శిబిచక్రవర్తి పేరును ముందుగా చెప్పుకోవాలి. ధర్మనిరతిలోను, దానగుణంలోను శిబిచక్రవర్తి పేరు ప్రఖ్యాతులు దేవలోకం వరకు వ్యాపించాయి. అయితే, శిబిచక్రవర్తి నిజంగానే ధర్మనిరతి గలవాడా? దానగుణ సంపన్నుడా? ఇదేదో తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు యమధర్మరాజు. ఈ విషయంలో అతడికి తోడుగా ఉండటానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు. ఈ సంగతి తెలియని శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజప్రాసాదం మేడ మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన చెంత వాలింది. ఈలోగా దానిని తరుముతూ ఒక గద్ద వచ్చింది. అనుకోని పరిణామానికి నివ్వెరపోయాడు శిబిచక్రవర్తి. ప్రాణభయంతో వణుకుతున్న పావురం ‘రాజా! నన్ను నీవే కాపాడాలి’ అంటూ మొరపెట్టుకుంది. ‘తప్పక కాపాడతాను. నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది’ అని భరోసా ఇచ్చాడు. పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద ఊరుకోలేదు. ‘రాజా! నేను ఆకలితో అలమటిస్తున్నాను. ఆ పావురం నా సహజ ఆహారం. దానిని వదిలేస్తే నా ఆకలి తీర్చుకుంటాను’ అని అడిగింది. ‘రక్షణ కల్పిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. దానిని వదల్లేను. నీ ఆకలి తీర్చుకోవడానికి మరేది అడిగినా ఇస్తాను. పావురాన్ని వదిలేయి’ అని బదులిచ్చాడు శిబిచక్రవర్తి. ‘రెండు షరతులకు అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను’ అని చెప్పింది గద్ద. సరేనన్నాడు శిబిచక్రవర్తి. షరతులేమిటో చెప్పమన్నాడు. ‘పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచే కోసి ఇవ్వాలి. మాంసం ఇస్తున్నప్పుడు నువ్వు కంటతడి పెట్టరాదు’ అంది గద్ద. షరతులకు అంగీకరించాడు శిబిచక్రవర్తి. వెంటనే ఒక తక్కెడను, తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు కత్తిని తెప్పించాడు. గుప్పెడు మాంసం కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు. తన కుడితొడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కెడలోని ఒకవైపు పళ్లెంలో వేశాడు. మరోవైపు పళ్లెంలో పావురాన్ని నిలిపాడు. పావురమే బరువు తూగింది. మరికొంత మాంసాన్ని తీసి వేశాడు. అయినా పావురమే బరువు తూగింది. శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసమంతా తక్కెడలో వేసేశాడు. అయినా పావురమే బరువు తూగింది. ఇదేదో మాయలా ఉందనుకున్నాడు. అయితే, ఏదైనా కానీ తాను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉండాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిబిచక్రవర్తి ఎడమకంట ఒక కన్నీటి బిందువు ఉబికింది. దానిని చూడగానే గద్ద... ‘రాజా! నీవేదో అయిష్టంగా నీ మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు. అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు. నీ అండలోని పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేసి పోతా. నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా చేస్తా’ అంది. ‘పక్షిరాజా! నువ్వు పొరబడుతున్నావు. నీ ఆకలితీర్చే అదృష్టం నా శరీరంలోని కుడిభాగానికి దక్కినందుకు ఎడమభాగం ఆనందంతో పులకిస్తోంది. అందుకే నా ఎడమకన్ను ఆనందబాష్పాన్ని చిందిస్తోంది. నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమభాగం కూడా సిద్ధంగా ఉంది. చూడు! ఎడమభాగంలోని మాంసాన్ని కూడా వేసేస్తాను’ అంటూ మళ్లీ కత్తికి పనిచెప్పబోయాడు. శిబిచక్రవర్తి ధర్మనిరతికి, దానగుణానికి సంతోషించిన దేవతలు పూలవాన కురిపించారు. అతడి శరీరానికి పూర్వరూపం ఇచ్చారు. గద్దరూపంలో ఉన్న యమధర్మరాజు. పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. ‘ఇదంతా నీ ధర్మనిరతిని పరీక్షించేందుకు ఆడిన నాటకం’ అని చెప్పి అంతర్ధానమయ్యారు. నీతి: ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట తప్పకపోవడమే ధర్మం. -
చార్ధామ్ యాత్ర
జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్,కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒక్కసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవత లు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన 6 నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్లో వచ్చే దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ ఏడాది మే 8 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్లోనే... గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్లో శ్రీ మహావిష్ణువు, కేదార్నాథ్లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు దేవాలయాలు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. యమునోత్రి మొదటి దర్శనం చార్ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది - సూర్యదేవుడు ఆయన అర్ధాంగి ఛాయాదేవికి యముడు, యమున ఇద్దరు సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట. గంగోత్రి గంగ మొదటగా నేలమీదికి దూకింది ఇక్కడే! చార్ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్ రాష్ర్టంలోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. భగీరథుడి తపఃఫలంగా ఉద్భవించిన గంగ 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకు దూకుతుంది. గంగ మొదటగా నేల మీదకు దిగింది ఈ చోటనే! గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది. కేదార్నాథ్ నరనారాయణులు తపస్సు చేసిన స్థలం అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్నాథ్. అతి గొప్ప పుణ్యక్షేత్రం. ఇది వైశాఖమాంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారంలో గాని, మే నెల మొదటి వారంలో గానీ తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరు వారంలో లేదా నవంబరు నెల మొదటి వారంలో మూసివేస్తారు. మందాకినీ నది ఒడ్డున వెలసిన ఈ కేదార్నాథ్ ఆలయం ప్రాంగణంలో సజీవాకృతిలో ఉన్న బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉంది. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్లో తపస్సు చేశార ని స్థలపురాణం చెబుతోంది. బద్రీనాథ్ బ్రహ్మకపాలం ఉన్నదే బద్రీనాథ్ జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలూ సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపు నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి, నారదుడు, ఉద్ధవుడు, స్వామి పాదుకలు ఉండగా, కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. తప్తకుండం సమీపంలో ఉన్న నల్లటి శిలను బ్రహ్మకపాలం అంటారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అత్యంత సుందరమైన స్త్రీని సృష్టించి, ఆమె అందానికి మోహితుడయ్యాడట. ఆగ్రహించిన శివుడు బ్రహ్మ శిరస్సును ఖండించగా ఆ శిరస్సు శివుని చేతికి అంటుకుపోయిందట. ఎక్కడా వదలని ఆ శిరస్సు బదరికాశ్రమం చేరగానే ఊడిపోయిందట. అలా, ఇక్కడ కనిపించే శిలనే బ్రహ్మదేవుని కపాలమని స్థలపురాణం చెబుతోంది. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చార్ధామ్ యాత్రలో ఆర్.వి.టూర్స్ - ట్రావెల్స్ ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది ఆర్.వి.టూర్స్ - ట్రావెల్స్ సంస్థ. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చార్ధామ్ యాత్ర ఏర్పాటు చేస్తూ యాత్రికుల మన్ననలను పొందుతోంది. హిమాలయ మంచుకొండల్లో సైతం తెలుగువారి భోజన సదుపాయాలతో పాటు వసతి సౌకర్యాలను, యాత్రీకులకు తోడుగా గైడ్స్ని ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యులు వెంటలేరన్న లోటును తీరుస్తోంది. అందరికీ అందుబాటులో: ‘‘ఈ ఏడాది (2016) చార్ధామ్ యాత్రకు సంబంధించి 14 రోజుల వ్యవధిలో హైదరాబాద్ నుండి ప్రారంభమై తిరిగి హైదరాబాద్కు వచ్చేవరకు యాత్రికుల వసతి సౌకర్యాలను చాలా తక్కువ ధరలకే ఏర్పాటు చేశామ’’ని ఆర్.వి.సంస్థ అధినేత ఆర్.వి.రమణ తెలియజేస్తున్నారు. వచ్చే నెల మే 5, 12, 19 - జూన్ 2 తేదీలలో ఆర్.వి.ట్రావెల్స్ వారు ప్రత్యేకంగా చార్ధామ్ గ్రూపు ప్యాకేజీలు ఏర్పాటుచేశారు. ‘ఆర్.వి,ట్రావెల్స్ సంస్థ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా చార్ధామ్ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు ఆర్.వి.రమణ తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించి తమ యాత్రను ఏర్పాటు చేసుకోవలసిందిగా కోరుతున్నారు. వివరాలకు... చాలా హ్యాపీగా అనిపించింది నేనో కార్పోరేట్ ఇంజనీర్ని. కుటుంబసభ్యులతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లాను. ఏ తీర్థయాత్రకు వెళ్లినా ఫుడ్ పెద్ద సమస్యగా ఉంటుంది. కానీ, ఆర్.వి.ట్రావెల్స్లో ఫుడ్ మా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. అంతదూరం తీసుకెళ్లి ఆంధ్రాఫుడ్ పెట్టమంటే మామూలు విషయం కాదు. గెడైన్స్ బాగా ఇచ్చారు. మళ్లీ అదే ట్రావెల్స్ నుంచి జూన్లో అమర్నాథ్కు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను. వ్యక్తిగత షాపింగ్కు తప్ప మరే ఖర్చు లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. - విద్యాధర్, గుంటూరు 9553633733 ఎన్నో జన్మల పుణ్యఫలం కిందటేడాది నేనూ నా భార్యా చార్ధామ్ యాత్రకు వెళ్లొచ్చాం. ఈ యాత్ర ఎన్నో జన్మల పుణ్యఫలంగా మాత్రమే లభిస్తుందని మాకు తెలిసొచ్చింది. ఆర్.వి.ట్రావెల్స్ అందించిన సదుపాయాల వల్ల యాత్రలో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. - మోహన్రెడ్డి, హైదరాబాద్ 9515034951 సునాయాసంగా చేరుకోగలిగాం చార్ధామ్ కష్టతరమైన యాత్ర. కానీ, ఇప్పటికి మూడు సార్లు వెళ్లొచ్చాను. కిందటి సారి మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి బయల్దేరాం. గంగోత్రి, యమునోత్రి, బదిరానాధ్ రోడ్డు మార్గాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. కానీ, అర్.వి. ట్రావెల్స్ వారి గైడ్లైన్స్తో సునాయాసంగా ఈ ప్రాంతాలకు చేరుకోగలిగాం. భోజన, వసతి సదుపాయాలు చాలా బాగున్నాయి. - ఎమ్. సత్తిరెడ్డి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 8978253399 ఇబ్బందులు ఎదురుకాలేదు జీవితంలో తప్పనిసరిగా చూడాల్సిన యాత్ర చార్ధామ్. నేను, మా వారు ఈ యాత్రకు వెళ్ళొచ్చాం. దేనికదీ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన భోజన, వసతి సౌకర్యాలు పరిశుభ్రంగా, రుచిగా ఉండటంతోబాటు పద్ధతి ప్రకారం నడుచుకోవడం వల్ల ఎక్కడా ఇబ్బందులు రానివ్వలేదు - శ్రీమతి వెంకటరమణ, నర్సారావుపేట 9676393449 -
ఆకేరులో.. ఇసుకాసురులు
యథేచ్ఛగా సాగుతున్న దందా పచ్చని చెట్లు నేలమట్టం బోసిపోతున్న ఆకేరు వాగు కన్నెత్తి చూడని అధికారులు అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో.. ఇసుకాసురుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా జలధారలతో కళకళలాడాల్సిన ఆకేరు వాగు బోసిపోతోంది. ట్రాక్టర్లు, జేసీబీలతో వాగు నుంచి నిత్యం ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయూడు. దీంతో వర్ధన్నపేట మండలంలోని వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు అడుగంటారుు. ప్రకృతి సంపదను అక్రమార్కులు దర్జాగా కొల్లగొడుతున్నా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరు వాగులో ఇసుక దొంగల హల్చల్పై పరిశీలనాత్మక కథనమిది. - వర్ధన్నపేట వర్ధన్నపేట మండలంలోని నందనం, వర్ధన్నపేట, ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల మీదుగా సుమారు 20 కిలోమీటర్ల పొడవునా ఆకేరు వాగు ప్రవహిస్తుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం నష్కల్ నుంచి మొదలయ్యే ఆకేరు వాగు జఫర్గఢ్, వర్ధన్నపేట, పాలకుర్తి మహబూబాబాద్ , డోర్నకల్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తూ పాలేరు నదిలో కలుస్తుంది. ఆయూ పరివాహక ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఆకేరు ఎంతో దోహదం చేస్తోంది. అటువంటి వాగుపై అక్రమార్కుల కన్నుపడింది. జఫరగడ్ మండలం ఉప్పుగల్లులో మొదలుకొని కొత్తపల్లి, ల్యాబర్తి వరకు ఆకేరు వాగులో ఇసుక దందా సాగుతోంది. వాగు నుంచి ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఇసుకను వరంగల్ నగరానికి తరలించి విక్రరుుంచి జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిలదీసే అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి.. నోళ్లు మూరుుస్తున్నారు. ‘ఇసుకను తరలించడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నారుు?’ అంటూ నిలదీసే రైతులపై దాడులు చేసేందుకు ఇసుకాసురులు వెనుకాడటం లేదు. ‘భారీ వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నందున మా ఊరిలోని రోడ్లన్నీ పాడవుతున్నారుు?’ అని ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యుడు ఇంటి పన్ను, విద్యుత్తు బిల్లు వంటి కట్టడంలో ఆలస్యం చేసినా నానా రభస చేసే అధికారులకు ఇటువంటి వ్యవహారాల్లో నిబంధనలు గుర్తుకు రావా? ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించడం రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాల బాధ్యత కాదా? ఇటువంటి అంశాలపై ప్రజాసంఘాలు ఉద్యమించాల్సిన అవసరముంది. రోడ్లు ఛిద్రం.. భూగర్భజలాలు మాయం భారీ వాహనాల్లో అక్రమంగా ఇసుకను తరలించే మార్గాల్లోని అంతర్గత రహదారులు అనతికాలంలోనే దెబ్బతింటున్నారుు. రూ.కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు దెబ్బతింటుంటే పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. నందనం, కిక్కిరాలపెల్లి, ఇల్లంద, కొత్తపెల్లి, ల్యాబర్తిలలోని రోడ్లు ఇసుకను తరలించే వాహనాల కారణంగా అధ్వానంగా తయూరయ్యూరుు. ఏళ్ల తరబడి వాగు పరివాహక ప్రాంతం నుంచి భారీగా ఇసుకను తరలించే క్రమంలో పరిసరాల్లోని పచ్చని చెట్లు నేలకూల్చారు. ఇవన్నీ వెరసి భూగర్భజలాలు పూర్తిగా అడుగంటారుు. బోరు, వ్యవసాయ బావులు వట్టిపోతున్నాయి. ఫలితంగా సస్యశ్యామలంగా ఉండాల్సిన ఆకేరు పరివాహక ప్రాంతాల్లో.. ప్రజానీకం దాహం కేకలు వినిపిస్తున్నారుు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు కరువు ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లరుునా లేదు. కొంతకాలం క్రితం ల్యాబర్తి గ్రామంలో ఇసుక తోడుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. కొత్తపెల్లిలోనూ ఇసుక తీస్తున్న ఓ కూలీ ప్రమాదంలో గాయూలపాలయ్యూడు. ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాలు చూసీ చూడనట్లుగా వ్యవహరిసుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆకేరు పరివాహక ప్రాంతాల్లోని కొంతమంది కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఇసుకాసురుల ఇచ్చే ఆమ్యామ్యాలతో లక్షలకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలున్నారుు. రానున్న రోజుల్లోనూ ఇసుక దందాను పట్టించుకోకుంటే.. ఆకేరు వాగు ఆనవాళ్లు కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నారుు. ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు ఇప్పటికైనా నడుం బిగించాలి. -
గిరిజన దంపతుల ఏకలవ్య సేద్యం!
♦ ప్రత్యక్ష శిక్షణ పొందకుండానే ప్రకృతి వ్యవసాయంలోకి.. ♦ మిత్రుడు ఫోన్లో చెప్పిన సమాచారంతోనే ప్రకృతి సేద్యం ప్రారంభం ♦ రెండేళ్లుగా విజయవంతంగా వరి సాగు చేస్తున్న సోమ్లా నాయక్ దంపతులు ♦ ఎకరానికి 50 బస్తాల దిగుబడి సాధించిన వైనం.. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొందిన తర్వాత కూడా ప్రకృతి సేద్యం చేపట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఓ కుగ్రామానికి చెందిన గిరిజన రైతు దంపతులు సోమ్లా నాయక్, కోమటి బాయి విజయగాథ మాత్రం అందుకు భిన్నమైనది. ప్రకృతి సేద్యంపై వారు ఎక్కడా శిక్షణ పొందలేదు. కానీ, రసాయనిక సేద్యంతో అప్పులపాలైన సోమ్లానాయక్కు ఆయన మిత్రుడొకరు పాలేకర్ సేద్యాన్ని పరిచయం చేశారు. మిత్రుడు ఫోన్లో చెప్పిన మాటలే వారి ప్రకృతి సేద్యపు నావకు చుక్కాని అయ్యాయి. విజయవంతంగా ప్రకృతి వ్యవసాయంలోకి నడిపించాయి. మొదటి పంటలోనే ప్రకృతి వ్యవసాయ సూత్రాలన్నిటినీ శ్రద్ధగా అనుసరించడంతో ఎకరానికి 50 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది! రసాయనిక అవశేషాల్లేని ధాన్యాన్ని బంధుమిత్రులే పోటీపడి కొనుక్కెళ్తున్నారు.. ఈ గిరిజన దంపతుల ఆదర్శ సేద్యానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.. రసాయన సేద్యం చేసి అప్పులతో కుదేలైన రైతును ప్రకృతి సేద్యం ఆదుకొంది. జీవామృతాన్ని ఆసరాగా చేసుకొని వరిలో కళ్లు చెదిరే దిగుబడులు సాధిస్తున్నాడు మూఢావత్ సోమ్లా నాయక్. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామానికి చెందిన నాయక్కు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. అందులో ప్రకృతి సేద్యం చేస్తూ ఎకరాకు 50 బస్తాల ధాన్యం దిగుబడి సాధించాడు. వచ్చిన ఆదాయంతో అప్పుల కష్టాలకు స్వస్తి పలికాడు. సోమ్లా నాయక్ గతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతూ వ్యవసాయం చేసేవారు. ఆ పద్ధతుల్లోనే బత్తాయి తోటను సాగు చేశారు. తోటను ఆరేళ్లు పెంచినా సరైన దిగుబడి రాకపోవడంతో చెట్లను నరికేసి.. మిరప తోట వేశారు.. మళ్లీ నష్టాల పాలయ్యాడు. నష్టాలు రాని వ్యవసాయం చేయలేమా? అని అన్వేషిస్తున్న ఆ రోజుల్లోనే వెన్నుపూస సమస్య రావడంతో మంచం పట్టారు. స్నేహితుడి ద్వారా తెలుసుకొని.. ఆ సమయంలో సుభాష్ పాలేకర్ ప్రచారంలోకి తెస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి మిత్రుడి ద్వారా తెలిసింది. అనారోగ్యం వల్ల పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరుకాలేకపోయారు. అయితే, భీమవరానికి చెందిన మిత్రుడు వెంకటేశ్వరరావు ద్వారా సోమ్లా నాయక్ ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలను అనేక సార్లు ఫోన్లో విని, ఆకళింపు చేసుకున్నారు. వరి సాగులో అనుసరించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకున్నారు. మిత్రుడు ఫోన్లో చెప్పిన సలహాలతోనే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం విశేషం. తాను మంచంలో నుంచి లేవలేని స్థితిలో భార్య కోమటి బాయికి అతికష్టంపై నచ్చజెప్పి ప్రకృతి వ్యవసాయం ప్రారంభింపజేశారు. 2014 ఖరీఫ్లో 65 సెంట్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేయగా.. 33 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో ఈ గిరిజన దంపతులకు ప్రకృతి సేద్యంపై గట్టి గురి కుదిరింది. ఉత్సాహం పెల్లుబికింది. 2015 ఖరీఫ్లో తమకున్న మొత్తం (1.20 ఎకరాల్లో) పొలంలోనూ ప్రకృతి సేద్యం చేశారు. ఏకంగా 60 బస్తాల (బస్తా 75 కేజీలు) దిగుబడి వచ్చింది. ధాన్యం బస్తా రూ.2,500 చొప్పున తెలిసిన వాళ్లే అడ్వాన్స్గా బుక్ చేసుకొని మరీ కొనుక్కెళ్తున్నారు. ఖర్చులన్నీ పోను రూ. 50 వేల నికరాదాయం వచ్చింది. ప్రస్తుతం రబీలోనూ వరి సాగు చేస్తున్నారు. పంటకు జీవం జీవామృతం.. సోమ్లానాయక్ తన పొలంలో నాట్లు వేయటానికి 40 రోజుల ముందుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి దమ్ములో కలియదున్నుతారు. నారు మడులు పోసేముందు విత్తనాలను, నాట్లు వేసేముందు నారును బీజామృతంతో శుద్ధి చేస్తారు. తద్వారా మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని ఆయన చెప్పారు. పోషకాలను అందించేందుకు 200 లీటర్ల జీవామృతాన్ని 10 రోజులకు ఒకసారి బోరు నీటి ద్వారా పంటకు అందిస్తారు. 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 15 రోజులకోసారి పంటపై పిచికారీ చేస్తారు. 10 లీటర్ల నీటికి 2.5 లీటర్ల చొప్పున అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం కషాయాలను కలిపి అదొకసారి, ఇదొకసారి మార్చి పిచికారీ చేయడం ద్వారా దోమ, పురుగును నివారిస్తున్నారు. నేలకు, వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న సోమ్లానాయక్కు మార్కెటింగ్ సమస్య లేనే లేదు. బంధుమిత్రులు, స్నేహితులు నూర్పిడి సమయంలోనే ధాన్యానికి మంచి ధర ఇచ్చి కొనుక్కెళ్తున్నారు. సోమ్లానాయక్ తన పొలం చుట్టూ గట్లపైన టేకు చెట్లు పెంచుతున్నారు. ఆయన పొలానికి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కొత్త ఆకర్షణను తెచ్చిపెట్టింది. సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకుంటే వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చుకోవచ్చని సోమ్లానాయక్ దంపతులు రుజువు చేశారు. వీరి విజయగాథ ఆ ప్రాంత రైతుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. - వినుకొండ అజయ్కుమార్, సాక్షి, దాచేపల్లి, గుంటూరు జిల్లా కష్టం అనుకోకుండా చేశాం.. రసాయనిక ఎరువుల ద్వారా వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యాను. గడ్డి తప్ప ఏమీ మిగల్లేదు. అప్పుల పాలయ్యాను. భూసారం నాశనం అయ్యింది. ఇల్లు గడవక ఇబ్బంది పడ్డాను. ప్రకృతి వ్యవసాయంతో భూమికి బలం వచ్చింది. పాత అప్పులు తీర్చాను. ప్రకృతి సేద్యంలో అప్పులు చేయవలసిన అవసరం లేదు. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వచ్చింది. కష్టం అనుకోకుండా పాలేకర్ చెప్పిన పద్ధతులను పాటిస్తే రైతులకు మేలు కలుగుతుంది. స్నేహితుడు ఎన్నోసార్లు ఫోన్లో చెప్పింది విని అర్థం చేసుకున్నాను. భార్య తోడ్పాటుతో ఆచరణలో పెట్టాను. మంచి ఫలితాలు సాధిస్తున్నాం. భూసారం పెరిగింది. నికరాదాయం పెరిగింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం తినే వారి ఆరోగ్యమూ మెరుగవుతోంది. - మూఢావత్ సోమ్లానాయక్ (99087 40156), భట్రుపాలెం, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా 13న శాశ్వత వ్యవయసాయంపై శిక్షణ పొలంలో మట్టి తీరు, ఎత్తు పల్లాలను బట్టి వాన నీటి సంరక్షణ అనుసరించాల్సిన పద్ధతులు.. పంటలతోపాటు గట్లపైన నాటాల్సిన చెట్ల ఎంపిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవడానికి.. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారం దిశగా నిర్మాణాత్మక కృషి చేయడానికి పర్మాకల్చర్ (శాశ్వత వ్యవయసాయ) రైతులకు ఉపకరిస్తుంది. దీనిపై పరిచయ కార్యక్రమం ఈ నెల 13వ తేదీన నిజామాబాద్ జిల్లా వర్నిలో జరుగుతుంది. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ వ్యవస్థాపకుడు కొప్పుల నరసన్న శిక్షణ ఇస్తారు. ఫయాజ్ 85006 40590. అరటి, కూరగాయలు, మిరప పంటల ప్రకృతి సేద్యంపై శిక్షణ గత కొన్నాళ్లుగా రైతునేస్తం ఫౌండేషన్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై... రైతులకు వారంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 17న ప్రకృతి వ్యవసాయంలో అరటి, కూరగాయలు, మిరప పంటల సాగులో అనుసరించాల్సిన మెళకువలపై రైతులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటలోని రైతు శిక్షణ కేంద్రంలో శిక్షణనిస్తారు. హాజరవ్వాలనుకునే రైతులు 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు. కేరళ బడుల్లో సేంద్రియ పంటలపై పాఠాలు వ్యవసాయంలో వాడే విష రసాయనాల దుష్ఫలితాలను చవిచూసిన కేరళ రాష్ట్రం.. రేపటి తరానికి మట్టివాసనను, ఆకు పచ్చని పైరు నులివెచ్చని స్పర్శను పరిచయం చేస్తోంది. 2017 కల్లా సేంద్రియ రాష్ట్రం గుర్తింపు సాధన దిశగా కేరళ వ్యవసాయ శాఖ అడుగులేస్తోంది. ఈ లక్ష్యసాధన కృషిలో భాగంగా 200 పాఠశాలల్లో విద్యార్థులకు సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇస్తోంది. కొల్లాం సమీపంలోని అంచలుమూదు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అందుకు మచ్చుతునక. ఈ పాఠశాల విద్యార్థులు కుండీల్లో బాసుమతి వరిని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. గతేడాది జూన్ 17న పాఠ శాల ఆవరణలో 50 మట్టి కుండీల్లో బాసుమతి వరి మొక్కలను నాటారు. వారి కృషి ఫలించింది. నూర్పిడి కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులంతా పండగలా జరుపుకున్నారు. ఉత్తరాది పంటగా భావించే బాసుమతి వరిని కూడా సాగు చేయవచ్చని పాఠశాల విద్యార్థులు నిరూపించి చూపించారు! రైతుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఈ అనుభవం విద్యార్థుల మనోఫలకంపై మధుర స్మృతిగా నిలిచిపోయింది. -
ఆరు రుచుల ఆయురారోగ్య ఉగాది!
తెలుగు నెలల్లో మొదటిదైన చైత్రమాసం ప్రారంభమే శుద్ధ పాడ్యమి ఉగాది. దీనితోనే వసంత రుతువు మొదలవుతుంది. చెట్లు చిగురిస్తాయి. పచ్చదనం పల్లవిస్తుంది. ఆయుర్వేద సూత్రాల రీత్యా ఇది కఫ (శ్లేష్మ) ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి ‘తిక్త, కటు, కషాయ’రస ప్రధానమైన ఆహారం అవసరం. పాయసాల వంటి స్నిగ్ధ పదార్థాలు నిషేధం. వేడి కలిగించే (ఉష్ణ వీర్య ప్రధానం) పదార్థాలు మంచివి. దీనికి మద్దతుగా మనకు ప్రకృతి ప్రసాదించిన ద్రవ్యాలు ‘వేపపువ్వు (తిక్తరసం/చేదు), మామిడి పిందెలు (కషాయరసం/వగరు), తెలుగు కొత్త ఏడాది ప్రారంభానికి చిహ్నంగా ‘కొత్త బెల్లం, కొత్త చింతపండు, మిరియాలు’ కలిపి రుచిచూస్తారు. ఉగాది పచ్చడి: చిక్కటి చింతపండు రసంలో బెల్లం, వేపపువ్వు, మామిడిపిందెల్ని దంచి, కలిపి, పచ్చడిలా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొంచెం మిరియాల పొడి, సైంధవలవణం కూడా కలిపే ఆచారమూ ఉంది. స్థూలంగా చూస్తే అది షడ్రసాల సమ్మేళనం. పండగలో భాగంగా ఈ పచ్చడిని అందరూ పరగడుపున సేవిస్తారు. ఈ ద్రవ్యాల విశిష్టత వల్ల జీర్ణప్రక్రియ చురుగ్గా మారి కోష్ఠ శుద్ధి జరుగుతుంది. వేపపువ్వు ప్రాశస్త్యం: ఇది జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి ఆకలిని పుట్టిస్తుంది. కడుపులోని మంటను తగ్గిస్తుంది (అమ్లపిత్తహరం). పొట్టలోని హానికరక్రిములను సంహరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కంటి చూపునకు పదునుపెట్టి, కళ్లను తేజోవంతంగా ఉంచుతుంది. వివిధ రసాల గుణాల కర్మలు 1. మధుర రసం: ఇది అన్నిటికంటే శ్రేష్ఠమైనది. జన్మతః ఎల్లరకూ హితకరం. ధాతుపుష్టికరం. శరీరకాంతివర్థకం. బాలింతలలో చనుబాలు (స్తన్యం) కలగడానికి దోహదం చేస్తుంది. కేశవర్ధకం. ఓజస్సును పెంచుతుంది. ఆయుః వర్ధకం. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వారికి కూడా హితకరం. బరువును పెంచుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది. విషహరం కూడా. వాత పిత్తహరం. ‘‘ఆజన్మ సాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం... బాల వృద్ధ క్షతక్షీణ వర్ణ కేశేంద్రియ ఓజసాం... స్తన్య సంధానకృత్ ... ఆయుష్యో జీవనః ... అష్టాంగ హృదయం అతిగా సేవిస్తే: స్థౌల్యం, అగ్నిమాంద్యం, మధుమేహం, ఆంత్రకృములు, కంతులు, ఇతర కఫరోగాలు కలుగుతాయి. సన్యాసము (కోమా) కూడా శ్లోకం: కురుతే అత్యుపయోగేన సమేదః కఫజాన్, గదాన్, స్థౌల్య అగ్నిసాద, సన్యాస మేహగండ అర్బుదాదికాన్. 2. అమ్ల రసం: జిహ్వకు రుచిని పెంచుతుంది. ఆకలిని, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. ఉదరంలోని వాయువులను పోగొట్టి, విరేచనాన్ని సాఫీగా అయ్యేలా చేస్తుంది. శరీరంలో వేడిని కలిగిస్తుంది. లఘువు (సులభంగా జీర్ణమై, శరీరాన్ని తేలిక చేస్తుంది). మేదస్సును కరిగించి స్రోతావరోధాలను తొలగిస్తుంది. ధాతు పోషకం. కఫపిత్త వర్ధకం. శ్లోకం: ‘అమ్లో అగ్ని దీపకృత్ స్నిగ్ధో హృద్యః పాచన రోచనః ఉష్ణ వీర్యో హిమ స్పర్శః ప్రీణనో భేదనో లఘుః రోతి కఫపిత్తాస్రం మూఢవాతానులోమనం’’ అతిగా సేవిస్తే అనర్థాలివే: శరీరం శుష్కిస్తుంది. దప్పిక (తృష్ణ), మంట (దాహం), జ్వరం, తలతిరుగుడు (భ్రమ), తిమిర (దృష్టి తగ్గడం - క్యాటరాక్ట్), దురద (కండూ), నెత్తురు తగ్గడం (పాండురోగం), వాపులు (శోధ), చర్మంపై పొక్కులు (వీసర్ప), చర్మం పగలడం (విస్ఫోట) మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. శ్లోకం: ‘సోతి అధ్యస్తః తనోః కుర్యాత్ శైథిల్యం, తిమిరం, భ్రమమ్, కండూ పాంతుత్వ వీసర్ప శోఫ విస్ఫోట తృట్ జ్వరాన్’ 3. లవణ రసం: రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరిగేలా చూస్తుంది. శరీరంలోని కొవ్వును, కంతులను కరిగించి, జడత్వాన్ని పొగొడుతుంది. తీక్షణంగా ఉండి చెమటను కలగజేస్తుంది. శ్లోకం: ‘లవణః స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్నికృత్. స్నేహనః స్వేదనః తీక్ష్ణో రోచనః ఛేద భేదకృత్’ అతిగా సేవిస్తే అనర్థాలు: పిత్త ప్రకోపం కలుగుతుంది. బలాన్ని తగ్గిస్తుంది. దప్పిక పెరుగుతుంది. రక్తస్రావం పెరుగుతుంది. విషతుల్యం. జుత్తు నెరుస్తుంది (పాలిత్య), బట్టతల (గాలిత్య), చర్మంలో ముడుతలు (వలీ), ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. ఇది షడ్రసాలలో నింద్యం. కాబట్టి దీన్ని అత్యంత స్వల్ప ప్రమాణాలతో మాత్రమే తీసుకోవాలి. శ్లోకం: సోతియుక్తో అస్రపవనం, ఖలితం, పలితం వలిమ్, తృట్ కుష్ఠ విష విసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్. 4. తిక్త రసం (చేదు): ఇది రుచిగా ఉండదు. కానీ నాలుక తాలూకు అరుచిని పోగొడుతుంది. ఆకలిని పెంచుతుంది. విషహరం, కృమిహరం, జ్వర, మూర్ఛ, తృష్ణ, చర్మరోగాలను పోగొడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. పిత్త కఫహరం. మేధాకరం. స్తన్య దోషాలను తొలగిస్తుంది. కంఠరోగాలను పోగొడుతుంది. రూక్షకరం (పొడిగా ఉంటుంది). శ్లోకం: ‘తిక్తః స్వయం అరోచిష్ణుః అరుచిం కృమితృట్ విషం, కుష్ఠ మూర్ఛాజ్వర ఉత్క్లేశ దాహ పిత్త కఫాన్ జయేత్, క్లేవ మేదో వసా మజ్జా శకృత్ మూత్ర ఉపశోషణః లఘుః మేధ్యో హిమో రూక్షః స్తన్య కంఠ విశోధనః ’ అతిగా సేవిస్తే: ధాతు క్షయం, వాతరోగాలకు కలిగిస్తుంది. (ధాతుక్షయ అనిల వ్యాధీన్ అతియోగాత్ కరోతిసః) 5. కటు రసం (కారం): రుచ్యం, దీపనం, పాచనం (అంటే రుచిని పెంపొందించి, ఆకలిని పెంచి, జీర్ణం తేలిగ్గా అయ్యేలా చేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. మేధస్సును పెంచుతుంది. చర్మ కంఠ రోగాలను పోగొడుతుంది. వాపులను తగ్గిస్తుంది. శ్లోకం: ‘కటుఃగలామయ.... పోషజిత్; .... దీపనః పాచనో రుచ్యః.... అన్నస్య శోషణః... కఫావః’’ అతిగా సేవిస్తే: బలాన్ని, పుంసత్వాన్ని నశింపజేస్తుంది. తృష్ణమూర్ఛలు కలుగుతాయి. కండరాలు, కీళ్లలో నొప్పి, బాధ కలుగుతాయి. ‘‘కురుతే సోతియోగేన తృష్ణాం శుక్ర బలక్షయమ్, మూర్ఛాం ఆకుంచనం,..... వ్యాధాం’’ 6. కషాయ రసం (వగరు) : ఇది పిత్త కఫహరం, రక్తశోధకం. వ్రణరోపకం. శీతలం. కొవ్వును కరిగిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి ఉపకరిస్తుంది. చర్మసౌష్ఠవాన్ని కాపాడుతుంది. శ్లోకం: కషాయో రోపక్ష గ్రాహీ స్తంభన శోధన స్తధా, ...........అతి త్వక్ ప్రసాదనః అతిగా సేవిస్తే అనర్థాలు: ఉదరం ఉబ్బుతుంది. వికారంగా ఉంటుంది. తృష్ణ, గుండెలో నొప్పిగా అనిపిస్తుంది. దేహ శుష్కత్వం, మలబంధం, శృంగారసామర్థ్యం తగ్గుతుంది. ‘సోతి యుక్తో... ఆధ్మాన, హృద్ రుజః.... పౌరుషభ్రంశ.... మలగ్రహాన్’. ఉగాది పచ్చడి - రెండు విధాలు తెలంగాణాలో... కావల్సినవి: చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు - 3 టేబుల్ స్పూన్లు, వేప పూత - కొద్దిగ, పచ్చిమామిడి తురుము - కప్పు, కారం - పావు టీ స్పూన్ (రుచికి తగినంత), ఉప్పు - తగినంత, కొబ్బరి ముక్కలు - కొన్ని తయారీ చింతపండును 4-5 కప్పుల నీళ్లు పోసి నానబెట్టాలి మట్టి పాత్రలో చింతపండు రసం తీసి పోయాలి. దీంట్లో అన్ని పదార్థాలు వేసి కలపాలి. ఉగాది పచ్చడి తాగడానికి సిద్ధం. నోట్: దీంట్లో పుట్నాలపప్పు, చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, జీలకర్ర, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు. ఆంధ్రాలో.... కావల్సినవి: మామిడికాయ తురుము - 2 టేబుల్స్పూన్లు, నీళ్లు - కప్పు, వేప పువ్వు రేకలు - టేబుల్ స్పూన్, ఉప్పు - చిటికెడు, బెల్లం తరుగు - 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - చిటికెడు, చింతపండు గుజ్జు - టీ స్పూన్. మరికొన్ని: అరటిపండు, పుట్నాలపప్పు, జీడిపప్పు, కిస్మిస్ తయారీ: చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, నానబెట్టి, చిక్కటి గుజ్జు తీయాలి కప్పు నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. దీన్ని టీ జల్లితో వడకట్టాలి వడకట్టిన బెల్లం నీళ్లలో చింతపండు గుజ్జు వేసి, కలపాలి.దీంట్లో మిగతా పదార్థాలన్నీ వేసి కలపాలి. ఉగాది పచ్చడి రెడీ. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్ -
ఉగాది హృదయం
ఉగాది పచ్చడి తొందరగా చేసేయాలనే ఆరాటంలో ఏవి పడితే అవి వాడ టం సరియైంది కాదు. తొడిమలేని వేపపూత, టెంక పట్టని మామిడి పిందె ముక్కలు, మిరియాల పొడి, చెరకు రసం తీసుకోవాలి. రాళ్ల ఉప్పు, పిక్కతో ఉన్న చింతపండు కచ్చితంగా ఉండాలన్నది నియమం. తీపి, కారం సమానంగా, వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు, వీటికి సగభాగం ఉప్పు, చేదును కలపాలి.ఈ రుచులతో మనిషి జీవితంలో రానున్న భవిష్యత్తు కాలాన్ని విశ్లేషించుకోవచ్చు. చాంద్రమానం ప్రకారం ఏర్పరచుకొన్న ప్రభవ మొదలైన అరవై సంవత్సరాల క్రమంలో దుర్ముఖ నామ సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి నెల చైత్రమాసంలో మొదటి రోజున శుద్ధపాడ్యమినాడు మనం ఉగాది పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోబోతున్నాం. ఈ సంవత్సరం పేరులోనే కొంత తిరకాసు ఉంది. సంవత్సరాన్ని పురుషుడుగా చెబుతాం. ఇది దుర్ముఖ నామ సంవత్సరం. ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్న సంవత్సరాల పేర్లలో దీనిని దుర్ముఖ నామంతోనే చెప్పారు. వ్యవహార క్రమంలో ‘దుర్ముఖి’గా ప్రచారం పొందింది. ఈ రెండింటిలో ‘దుర్ముఖ’ అనటం సబబు అని శాస్త్రం చెప్పినా ఇప్పుడు ఎవరూ వినేటట్టు లేరు. ఏదయినా చెడుముఖం కలవాడు, చెడుముఖం కలది అని అర్థం. ఇక్కడ ముఖం అంటే నోరు అనే అర్థం చెప్పుకోవాలి. నోరు చెడ్డది అయితే ఊరు చెడ్డది అవుతుంది. ఈ ఏడాది అంతా ఈ పేరు తలచుకుంటాం కనుక నోటిని అదుపులో పెట్టుకోవాలని గుర్తు చేస్తూ ఉంటుంది. సంవత్సరాల పేర్లు మన మహర్షులు ఆలోచించే పెట్టారు. మానవజాతికి, ప్రకృతి పరిణామాలకు అవి మార్గదర్శకంగా ఉంటాయి. వాటి అంతరార్థాన్ని గ్రహించాలి. అందుకే శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేయాలి. పండుగలలో ప్రత్యేకమైనది ఉగాది. ఏ దేవుడికీ, దేవతకూ సంబంధం లేకుండా మానవజాతికీ కాలానికీ ప్రతీకగా ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. సహనానికీ, వ్యక్తిత్వ మనో వికాసాలకూ ఆలవాలమై ఆత్మీయతతో దారి చూపుతుంది. ‘చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని’(చైత్రమాసంలో మొదటి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు) బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కనుక ఉగాది పండగనాడు బ్రహ్మను పూజించాలని ధర్మశాస్త్ర నిర్ణయం. ఇక్కడ తప్ప సృష్టికర్తకు మరెక్కడా పూజలేదు. అరవై సంవత్సరాలలో ప్రతి అయిదు సంవత్సరాలను ఒక యుగంగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఒక అరవైలో పన్నెండు యుగాలు వస్తాయి. ఆ సంవత్సరం మొదటి రోజు యుగాది అవుతుంది. ఆ విధంగా ఈ పండుగను యుగాది అనటం వ్యవహారంలో స్థిరపడింది. ఉగ శబ్దానికి నక్షత్రం అనే అర్థం ఉంది. దానివల్ల అశ్వని మొదలైన కార్తెలు మొదలయ్యే ‘ఉగాది’ ఏర్పడింది. సంవత్సరంలో మొదటి రోజు మొదటి పండుగగా ‘సంవత్సరాది’ అయింది. ఉగాది పండుగ పునరుజ్జీవనానికి సంకేతం. అప్పటివరకు ఆకులన్నీ రాలి మోడుబారిన చెట్లు, తీగెలు మళ్లీ చిగురించి పూలతో కాయలతో కళకళలాడే ఈ పండుగ మానవ జాతికి ధైర్యాన్ని, ఆశను ఇస్తుంది. ఉగాది పండగనాడు తప్పకుండా అభ్యంగన స్నానం చేయాలి. నింబకుసుమ భక్షణం (వేపపూత) తప్పకుండా చేయాలి. ప్రపాదానం (చలివేంద్రం) చెయ్యాలి. పితృదేవతలకు తర్పణలు ఇవ్వాలి. పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఇవి ఉగాది పండుగనాడు ధర్మశాస్త్రం చెప్పిన ఆచార నియమాలు. చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం అనే మూడు కాలమానాలు ప్రధానంగా భారతదేశం అంతటా ఆయాప్రాంతాల్లో అనుసరిస్తున్నారు. వింధ్య పర్వతానికి ఉత్తరాన ఉత్తర భారతదేశంలో గురుగ్రహ గమనాన్ని బట్టి బార్హస్పత్యమానాన్ని పాటిస్తారు. చాంద్రమానం ప్రకారం ప్రకృతిలో వచ్చే మార్పులు ఆరు రుతువులుగా వసంతరుతువు మొదటిరోజు కొత్త సంవత్సరంగా ఉగాది జరుపుకోవడంలో తెలుగువారు ఎన్నో సాంఘిక సామాజిక ప్రయోజనాలను జతకలిపారు. ధర్మశాస్త్రం కేవలం వేపపూతను తినడం గురించి చెబితే తెలుగు నేలలో ఉగాది పచ్చడి ప్రత్యేక ప్రసాదంగా ఆరు రుచుల సమ్మేళనంగా మన పెద్దలు రూపొందించారు. ‘జిహ్వాగ్రే వర్తతే సర్వమ్’ (నాలుక చివరనే అంతా ఉంది) అని నీతిశాస్త్రం చెబుతోంది. నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యం తెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులూ సమానంగా భరించటం తన కర్తవ్యంగా నాలుక గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు కనుక దానికి ఇది ఒక హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా శత్రువు అవుతుంది. అందుకే వీటిని అరిషడ్వర్గం అంటారు. వాటికి లొంగిపోకుండా జయించగలగడమే మానవజన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం ఇదే. తీపి కామానికీ, కారం క్రోధానికీ ఉప్పు మోహానికీ, పులుపు లోభానికీ, చేదు మదానికీ, వగరు మాత్సర్యానికీ సంకేతాలు. మనం తినే పదార్థాలు ఏవైనా ఈ ఆరు రుచుల్లోకే వస్తాయి. ఏదో ఒక రుచి లేకుండా తినలేం. అన్ని రుచులను కలిపి సమీకరించుకుని తింటే మనం గెలిచినట్టు. ఏదో ఒక రుచిని మెచ్చుకుంటూ ఎక్కువ తింటే ఓడినట్టు. సంవత్సరంలో మొదటిరోజు ఏది చేస్తే ఏడాది అంతా అది చేస్తాం కనుక ఏడాది అంతా అన్ని రుచులను అట్లా చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాలు చేకూరతాయి. మంచినీటిని దానం చెయ్యడం సామాజిక బాధ్యత. ఉగాదినాడు అది ప్రారంభించాలి. మల్లెపూలు, మామిడిపండ్లు, కోకిల కూతలూ, పచ్చదనం, పరిశుభ్రత అన్నీ భగవంతుని రూపాలే. అవి దైవానికే సమర్పించాలి. మనలోని కామక్రోధాదులను పెంచుకోవడానికి కాదు అనే దైవీయ గుణాన్ని పెంచుకోవడానికి వసంత నవరాత్రోత్సవాలను ఉగాదినాడు ప్రారంభించాలి. దేవీ భాగవతంలో చెప్పినట్లు వసంత రుతువు యముని కోరలాంటిది. ఉద్రే కాలకూ, ఉద్వేగాలకూ లోనయితే యముని కోరల్లో చిక్కుకోక తప్పదు. కనుక ప్రశాంతమైన, ప్రమాద రహితమైన, పరోపకార సహితమైన, నిగ్రహంతో, నీతినియమాలతో కూడిన జీవితాన్ని గడపమని ఉగాది హృదయం చెబుతోంది. శారీరక మానసిక ఆరోగ్య పరమావధి ఉగాది. సర్వేజనాఃసుఖినోభవంతు - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యం తెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులూ సమానంగా భరించటం తన కర్తవ్యంగా నాలుక గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు కనుక దానికి ఇది ఒక హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా శత్రువు అవుతుంది. అందుకే వీటిని అరిషడ్వర్గం అంటారు. వాటికి లొంగిపోకుండా జయించగలగడమే మానవజన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం ఇదే. -
ముడతల్ని ఇలా మడతెట్టేద్దాం...
బ్యూటిప్స్ వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజమే అయినప్పటికీ చర్మం ముడతలను నివారించడానికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, పండ్లు, తేనెతో ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు కాని, పైనాపిల్ జ్యూస్ కాని ముఖానికి పట్టించి మర్దన చేస్తే చర్మం మీద మచ్చలు, జిడ్డు పోయి చర్మం మృదువుగా మారుతుంది. చిన్నవయసులోనే ముడతలు రావడాన్ని నివారిస్తుంది. ఇలా వారానికొకసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా ఫేషియల్ చేసుకుంటే ముడతలను, వార్ధక్య లక్షణాలను అదుపు చేయవచ్చు. అరకప్పు చెరకు రసంలో ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించుకుని ఆరిన తర్వాత కడిగితే చర్మం బిగుతుగా మారుతుంది, ముడతలు పడదు. ఇలా వారానికొకసారి చేయాలి. రాత్రి పడుకునే ముందు ఆముదంతోకాని, కొబ్బరి నూనెతో కాని అరగంటసేపు మర్దన చేసుకుంటే ముడతలు దరిచేరవు. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించుకుని అరగంట తరువాత శుభ్రపరచుకోవాలి. పొడి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది.