-
వరికి ని‘బంధనాలు’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది. ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్మల్లో వరితోపాటు, సోయా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది. మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం పంటల బీమా పథకం గ్రామం యూనిట్గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. -
గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గింజ సన్నబియ్యం కూడా కొనుగోలు చేయలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. సన్నబియ్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పైసా ఖర్చు చేయలేదన్నారు. అలాంటప్పుడు కుంభకోణానికి ఆస్కారమే ఉండదని వివరించారు. ఈ అంశంపై ఏమాత్రం అవగాహన లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అర్థరహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం కొనుగోలులో ఏకంగా రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ.లక్ష్మణ్, సంజీవరెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.30 రూపాయలకు కిలో ఉన్న సన్నబియ్యాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, సన్నబియ్యం రూ.42కు కిలో చొప్పున ఎంత స్టాక్ ఉన్నా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆమేరకు సమాచారం ఉంటే ఇవ్వాలని కేటీఆర్కు సూచించారు. పౌరసరఫరాల శాఖలో రూ.వెయ్యికోట్ల స్కామ్ జరిగిందంటూ చేస్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, సత్యదూరమైన వ్యాఖ్యలతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.58వేల కోట్ల అప్పుల భారం మోపిందని, రైస్మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.11వేల కోట్ల బియ్యం పెట్టిందని, వాస్తవానికి ఆ స్టాకు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. అత్యంత పారదర్శకంగా పాలన సాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని, తాము మిల్లర్ల దగ్గర బేరాలు, వసూళ్లకు పాల్పడే రకం కాదని స్పష్టం చేశారు. కొంతమంది మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించామని, కొన్నింటిని డిఫాల్టర్ జాబితాలో చేర్చామని, మరికొన్ని యాజమాన్యాలను అరెస్టు చేశామన్నారు. అరెస్టులు చేసి వేధించే విధానం తమ ప్రభుత్వానికి లేదని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కేంద్రీయ బండార్ను బ్లాక్ లిస్టులో పెట్టింది..ఆ తర్వాత తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదన్నారు. సరైన అవగాహనతో కేటీఆర్ మాట్లాడాలని హితువు పలికారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డిఅధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ఓవర్స్పీడుతో అర్థం లేకుండా మాట్లాడడం సరికాదని సూచించారు. బాధ్యతతో మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. ఢిల్లీలో డబ్బులు ఇచ్చి ఫ్లోర్లీడర్ పదవి తెచ్చుకున్నాడేమో...అందుకే దూకుడుతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. డీఫాల్టర్ అయిన రైస్ మిల్లుల తరఫున బీఆర్ఎస్, బీజేపీ పొటాపొటీగా మాట్లాడుతున్నాయని, దీనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు రావనే అక్కసుతో ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరే సమాధానమన్నారు.సూర్యాపేట సభకు అసలు కరెంటు కనెక్షన్ తీసుకోలేదని, జనరేటర్ల ఆధారంగానే ఆపార్టీ నేతలు ఏర్పాటు చేశారన్నారు. కరెంటు తీసుకోన్నప్పుడు కోతలు ఎలా జరుగుతాయని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయకుండా డిస్కంలను బద్నాం చేయొద్దన్నారు. గతేడాది వరంగల్ ఎంజీఎంలో 121 సార్లు పవర్ బ్రేక్డౌన్ అయ్యిందని, రోగులను ఎలుకలు పీక్కుతిన్నాయని, వాటిపై మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు డయాలసిస్ యూనిట్లో విద్యుత్ సమస్యపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. – ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్రెడ్డి బీజేపీలో చేరగానే ఆ పార్టీ చేసిన తప్పులు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాలన్నీ ఒప్పులు అయ్యాయా అని ప్రశ్నించారు. పౌరసరఫరాల సంస్థ అప్పులపాలు కావడానికి గత బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వాలే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే రుణమాఫీ చేయనుందని, ఎన్నికల కోడ్ ఉండడంతో జాప్యం జరిగిందని, ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. -
వరికి వడగళ్ల దెబ్బ
డొంకేశ్వర్ (ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్మి, కోటగిరి, పొతంగల్, బోధన్, మోస్రా, చందూర్ మండలాల్లో మొత్తం 2 వేల ఎకరాల వరకు వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కోతకు వచ్చిన వడ్లు పొలాల్లోనే నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి పంటనష్ట లెక్కలను బుధవా రం వెల్లడించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో అరకిలో సైజులో వడగళ్లు పడటంతో మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 15 నిమిషాల్లోపే కళ్ల ముందు పంట నేల రాలిపోయిందని రైతులు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. -
జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!
జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో క్రీమ్లు, కండిషనర్లు వాడి ఉంటారు. వాటన్నిటికంటే బట్టటకు పెట్టే గంజి బెటర్. ఇదేంటి గంజినా అనుకోకండి. ఎందుకుంటే బియ్యం వార్చిన గంజితో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే.. ఈ గంజిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. ఈ గంజినీరు జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మృదువుగా మెరిసేలా చేయడంలో గంజినీరుకి మించిది మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పొడి జుట్టువారికి ఈ గంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా స్ట్రాంగ్గా మారుతుంది. ఈ గంజి జుట్టుకి సహజమైన షైనింగ్ని, మృదుత్వాన్ని అందిస్తుంది. ఈ గంజినీటికి మెంతికూర, అలోవెర జోడించి, పులియబెట్టి అప్లై చేస్తే జుట్ట చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. ఇది వెంట్రుకలు నెరసిపోవడాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ జుట్టుని మృదువుగా మార్చే గుణం ఉటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!
మన భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. ఎన్ని వెరైటీ టిఫిన్లు తిన్నా.. నాలుగు మెతుకులు కడిపులో పడితేనే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు మంచి శక్తినిచ్చి ఎక్కువ సేపు పనిచేయగలిగే సామర్థ్యాన్ని అందించేది బియ్యం మాత్రమే. అలాంటి బియ్యాన్ని వండటానికి ముందు తప్పనిసరిగా కడగాల్సిందేనా? మరి నిపుణులు ఏమంటున్నారు..? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మంచి ఆహారం. కార్బోహైడ్రైట్లకు మూలం. పైగా శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పౌష్టికమైన ఆహారం కూడా. మనల్ని శక్తిమంతంగా ఉండేలా చేసేది, చక్కగా ఫిట్నెస్పై దృష్టిసారించి కసరత్తులు చేయడానికి తోడ్పడేది అయిన బియ్యంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫైబర్, బీ విటమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని వండడానికి ముందు కడగడం అవసరమా అంటే..? ఎందుకు కడగాలంటే.. నిపుణులు తప్పనిసరిగా బియ్యాన్ని వండటానికి ముందు కడగాల్సిందేనని చెబుతున్నారు. ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు ఉంటాయని, అందువల్ల కడగాలని తెలిపారు. నానాబెట్టి కడగడం ఇంకా మంచిదని, దీనివల్ల ఆ బియ్యంలో ఉన్న ఆర్సెనిక్, మట్టి వంటివి నీటిలో కరిగి సులభంగా కరిగి బయటకి వెళ్లిపోతాయని అన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ధూళి, గులకరాళ్లు, మిగిలిపోయిన శిథిలాలు వంటి అవాంఛనీయ పదార్థాలు ఏమైనా ఉన్నా కడగడం వల్ల నీళ్ల ద్వారా బయటకు వెళ్లిపోయి బియ్యం చక్కగా క్లీన్ అవుతాయని పేర్కొన్నారు. ఇలా కడిగితే ఆ బియ్యంపై ఉండే పిండిలాంటి పదార్థం బయటకు పోయి అన్నం చక్కగా అతుక్కోకుండా పొడిపొడిగా ఉటుందని చెప్పారు. అలాగే ఇలా వాష్ చేస్తే మైక్రో ప్లాస్టిక్లను ఈజీగా తొలగించగలమని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాలు, బొగ్గును కాల్చడం వంటి వాటివల్ల భూగర్భజలాల్లోకి ఆర్సెనిక్ సులభంగా ప్రవేశిస్తుంది. పలితంగా భారీగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఆ నీరు కాస్త పంట నీటి పారుదలకు, వంట కోసం ఉపయోగించే వాటిలోకి సరఫరా అవుతుంది. అందులోనూ వరి మరీ ఎక్కువగా ఆర్సెనిక్ కలుషితానికి గురవ్వుతుంది. ఎందుకంటే..? వరిపోలాలకు నీటి అవసరం ఎక్కువ, పైగా వరదల టైంలో ముంపునకు గురవ్వుతాయి కూడా. అలా.. ఈ ఆర్సెనిక్ వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ వల్ల వచ్చే సమస్యలు ఎరుపు లేదా వాపు చర్మం కొత్త మొటిమలు లేదా గాయాలు పొత్తికడుపు నొప్పి వికారం, వాంతులు అతిసారం అసాధారణ గుండె లయ కండరాల తిమ్మిరి వేళ్లు, కాలి జలదరింపు చర్మం నల్లబడటం గొంతు నొప్పి నిరంతర జీర్ణ సమస్యలు మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దీర్ఘకాలిక లక్షణాలు మొదట చర్మంపై కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా బహిర్గతం అయిన ఐదు ఏళ్లలోపు అందుకు సంబంధించిన కేసులు, మరణాలు నమోదవ్వుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తినాలనుకుంటే బియ్యాన్ని తప్పనిసరిగా శభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తుంచుకోవలసిన విషయాలు.. ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తయారీకి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వంటి వారు గ్లూకోజ్ కంటెంట్ తక్కువగా ఉండాలనుకుంటే.. నానాబెట్టి చక్కగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ వంటి వాటిని తినండి. బ్రౌన్రైస్ వైట్రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటుంది. (చదవండి: జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?) -
సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!
వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్ రైస్, లేదా పులియ బెట్టిన పెరుగున్నం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా పెరుగులో పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం చాలా అవసరం. పిల్లలు ఇది అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. టిప్: పచ్చిమిర్చి వేయకుండా నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు లాంటివి వేసి చక్కగా గార్నిష్ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. -
థైరాయిడ్ ఉంటే అన్నం తినకూడదా?
థెరాయిడ్ ఇటీవల చిన్నా, పెద్ద అందర్నీ వేధిస్తున్న సమస్య ఇది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు అంత ఇంత కాదు. విపరీతంగా బరువు పెరిగిపోయి నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఈ థెరాయిడ్ ఉన్నవారు అస్సలు అన్నమే తినకూడదంటున్నారు నిపుణులు. ఇదేంటి అన్నమే మనకు శక్తినిచ్చేది అలాంటి అన్నమే వద్దంటే ఎలా? అసలు థెరాయిడ్ ఉన్నవారు ఎందుకు అన్నం తికూడదు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా!. కొందరూ అన్నాన్నే మూడు పూటలా తింటుంటారు. ఇందులో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని ఇలా ఎక్కువగా తింటే మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. నిజానికి డైటింగ్ చేసి బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తీసుకుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూదట. ఒకవేళ అన్నం తినాలనుకున్నా వైట్రైస్ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. దాని బదులు బ్రౌన్రైస్ తీసుకోమని సూచిస్తున్నారు. బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ రోగులు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి, థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అన్నంలో ఉండే పిండి పదార్థం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండేదాక ఆబగా తింటుంటాం. కానీ ఇది బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులను అన్నం తినొద్దని అంటారు. నిపుణులు ఏమంటున్నారంటే.. థెరాయిడ్ రోగులు అన్నం ఇలా ఎక్కువగా తింటే థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం తదితర పరిమాణలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకున్నా బాగా నానబెట్టి వార్చి తినడం మంచిది. ఇలా చేస్తే గంజి రూపంలో బియ్యంలో ఉంటే కొన్ని విటమిన్లు వెళ్లిపోతాయి. కాస్త బెటర్గా ఉంటుంది. ఇక అలానే నానబెట్టి వండుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ రైస్కి ప్రిఫెరెన్స్ ఇవ్వండి. అదే సమయంలో తగు మోతాదులో తినేందుకు యత్నించండి. అంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ తక్కువగానూ, కూర కంటెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోమని చెబుతున్నారు. అన్నాన్ని ఎలా వండి తినాలి? అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. ఈ సూచనలు, సలహాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడని సంప్రదించి పాటించటం మంచిది. (చదవండి: రెడ్లైట్ థెరఫీతో షుగర్ తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మనకు భారత్ రైస్ భాగ్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన వారందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహత్తర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ ధరలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో కూడా భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించారు. ఆమెజాన్, జియో మార్ట్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా కూడా 5 కిలోలు, 10 కిలోల భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.29 కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. కేటాయింపులు జరిపినప్పటికీ... ఫిబ్రవరి 6వ తేదీ నాటికే రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది. ఎఫ్సీఐ ద్వారా బియ్యం సేకరించి 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్కు ఒక్కో సంస్థకు 2 వేల టన్నుల చొప్పున బియ్యం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బియ్యం బ్యాగ్లు రిటైల్ అవుట్లెట్లకు చేరలేదు. డిపోలలోని బియ్యం ఇతర రాష్ట్రాలకే! భారత్ రైస్ బ్యాగ్లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) నాఫెడ్కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్కు అవసరమైన మేర బియ్యాన్ని ఎఫ్సీఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలోని 52 ఎఫ్సీఐ డిపోలలో సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, ఆ బియ్యం మొత్తం సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ రైస్ కోసం నాఫెడ్కు ఎఫ్సీఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోవాలని ఎఫ్సీఐ వర్గాలు చెపుతున్నాయి. బియ్యం రాలేదు రిటైల్ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్ రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రోజూ ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావలసి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించాం.- రమణమూర్తి, ఆర్.ఎం,కేంద్రీయ భండార్ -
మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!
మాంసంతో బియ్యం తయారు చేయడం ఏంటిదీ! అనిపిస్తుంది కదూ. మీరు వింటుంది నిజమే గొడ్డు మాంసంతో సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. రానున్న కాలంలో ఎదురయ్య ఆహార సమస్యను ఈ సరికొత్త వంగడం తీరుస్తుందని చెబుతున్నారు. చూస్తే బియ్యపు గింజల్లానే ఉంటాయట. తింటే మాత్రం మాంసం రుచిని పోలి ఉంటుందని చెబుతున్నారు. ఏంటా వరి వండగం? ఎలా తయారు చేశారంటే.. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ పరిశోధకులు బృందం ఈ సరికొత్త బీఫ్ హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు. వాళ్లు సృష్టించిన బియ్యపు గింజల్లో గొడ్డు మాంసంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. చూడటానికి గులాబీ రంగులో ఉంటాయి ఈ బియ్యం. ఫిష్ జెలటిన్లో సాంప్రదాయ బియ్యం గింజలను కప్పి, వాటిని అస్థిపంజర కండరం కొవ్వు మూలకణాలతో ప్రయోగాత్మకంగా ల్యాబ్లో సాగు చేశారు. అలా తొమ్మిది నుంచి 11 రోజుల పాటు కండరాలు, కొవ్వు, జెలటిన్-స్మోటెర్డ్ బియ్యాన్ని సాగు చేసిన తర్వాత, ధాన్యాలు అంతటా మాంసం, కొవ్వును ఉంటాయి. చివరిగా ఉత్పత్తి అయ్యే వరి వంగడం మంచి పౌష్టికరమైన బియ్యంగా మారుతుంది. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ గొడ్డు మాంసం కల్చర్డ్ రైస్ను ప్రోఫెసర్ జింకీ హాంగ్ వండి రుచి చూశారు. చూడటానికి సాధారణ బియ్యం వలే గులాబీ రంగులో ఉంటాయి. కానీ మాంసపు లక్షణాన్ని కలిగి ఉందన్నారు. సువాసన కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ హైబ్రిడ్ బియ్యం కొంచెం దృఢంగా పెళుసుగా ఉందని అన్నారు. అయితే ఇందులో 8% దాక ప్రోటీన్, 7% కొవ్వులు ఉంటాయని అన్నారు. ఈ బియ్యం గొడ్డు మాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుందన్నారు. వండిన తర్వాత వెన్న, కొబ్బరి నూనె కూడిన వాసన వస్తుందన్నారు. ఈ వరి వంగడాన్ని సృష్టించడానికి కారణం.. ఒకవైపు వనరులు తగ్గిపోతున్నాయి, మరోవైపు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆ అవసరాలను తీర్చడం కోసం ఈ సరికొత్త వరి బియ్యాన్ని సృష్టించే ప్రయోగాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జంతువుల నుంచి మనకు అవసరమైన ప్రోటీన్ను అందుతుంది. అయితే జంతువులను పెంచడానికి చాలా వనరులు అవసరం. ఇది ఒకరకంగా వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు విడుదలను పెంచుతుంది. అలాగే వరి పండించటానికి ఎక్కువ నీరు, శ్రమ అవసరం అవుతాయి. బదులుగా తక్కువ శ్రమతో తక్కువ వనరులను ఉపయోగించి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కలయికలో ఆహారం ఉంటే అది అందరికీ వెసులుబాటుగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ సెల్-కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుంచి మనకు అవసరమైన అన్ని పోషకాలు పొందడం గురించి కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. పరిశోధకులు స్థానిక వధశాలలో వధించిన హన్వూ పశువుల నుంచి కండరాలు, కొవ్వు కణాలను తీసుకుని ఈ సరికొత్త వరి వండగాన్ని సృష్టించారు. ఇలా ఎక్కువ జంతువులు అవసరం లేకుండా ల్యాబ్లో నిర్వహించగల జంతు కణాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో మరిన్ని మార్పులు చేసి.. చేపల వంటి వాటిని కూడా వినియోగించి వివిధ రుచులగల ఆహారాన్ని తయారు చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ హైబ్రిడ్ బియ్యం అచ్చంగా మాంసం రుచిని పోలీ ఉంటాయి కాబట్టి మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రజలు వీటిని ఇష్టపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఈ సరికొత్త వరి వంగడం భవిష్యత్తులో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు మంచి ఆహార వనరుగా ఉంటుంది. అలాగే సైనికులకు అవసరమైన పౌష్టికాహారంగానూ, అంతరిక్ష ఆహారంగానూ పనిచేస్తుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. చెబుతున్నారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
సామాన్యులకు మోడీ సర్కారు ఊరట..
-
మాగాణుల్లో మిథేన్కు చిరు చేపలతో చెక్!
వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్, కార్బన్ డయాక్సయిడ్ కన్నా 86 రెట్లు ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్ వాయువులో 10శాతం మేరకు వరి పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్ షైనర్ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్ రెన్యువల్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. ‘ఫిష్ ఇన్ ద ఫీల్డ్స్’ పేరిట పైలట్ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్ ఇన్నోవేషన్ ప్రైజ్’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్.ఆర్.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్ కట్రానో. ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్ క్రెడిట్స్’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరికొన్ని సంగతులు ప్రపంచంలోని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ భూ వినియోగంనుంచి వస్తుండగా, 21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన గడ్డితినే పశువుల ద్వారా, పేడ నిర్వహణ ద్వారా ద్వారా మీథేన్ విడుదలవుతుంది. ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా. గ్రీన్హౌస్ వాయువులపై వ్యవసాయ ప్రభావాన్ని తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. -
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్తో సహా అన్ని చైన్ రిటైల్లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది. ‘వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ.. బియ్యం రిటైల్, టోకు ధరలు సంవత్సరానికి 13.8 శాతం నుంచి 15.7శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. భారత్ రైస్ను ఎక్కడ కొనుగోలు చేయాలి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్లలో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ అందుబాటులో ఉంచనుంది కేంద్రం. తొలి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ కిలో గోదుమ పిండిని రూ. 27.50, భారత్ దాల్ (చనా) కిలో రూ. 60కి విక్రయిస్తోంది . బియ్యంపై స్పష్టత ఇవ్వాల్సిందే ట్రేడర్ల వద్ద అన్నీ రకాల బియ్యం బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి ఇలా ఎంత మేరకు నిల్వ ఉన్నాయో తెలపాలని, ఇందుకోసం ప్రతి వారం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ పోర్టల్లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా చెప్పారు. -
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వలసొచ్చి.. వరి నాట్లు వేసి
దుబ్బాకటౌన్: జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. మొత్తం 48 లక్షల ఎకరాల్లో నాట్లు సిద్ధం కావడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. ఇప్పటికే సగం వరినాట్లు పూర్తి అయినా మరో 50 శాతం ఉండడంతో ఎకరానికి రోజుకు 8 నుంచి 10 మంది కూలీలు అవసరం పడుతున్నారు. కానీ, నాటు వేయడానికి కూలీలు దొరక్క బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పురుష కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5,500 వరకు గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కూలి పేరు సిద్దార్థ్. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో పెద్దగా చేసేందుకు ఉపాధి లేకపోవడంతో 30 రోజుల క్రితం ఆయనతోపాటు మరో 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి వంటలు చేస్తుండగా మిగతా 12 మంది నాట్లు వేస్తారు. ప్రతి రోజూ 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తామని సిదార్ధ్ చెప్పుకొచ్చాడు. గతేడాది ఏపీలో వేశామని, ఈసారి ఆంధ్రాకు చెందిన వ్యక్తి తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఇప్పటి వరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 130 ఎకరాల వరకు నాట్లు వేశామని చెప్పుకొచ్చాడు. బెంగాల్కు చెందిన 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. రైతుల పొలాల్లో నారు తీసి వారే వేసుకొని రోజు 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తున్నారు. పొలాల్లో సన్నటి తాడుతో మునుములు కట్టుకొని చూస్తుండగానే టకటకా నాట్లు వేస్తున్నారు. ఎకరం నాటుకు వీరిని తీసుకొచ్చిన మధ్య వ్యక్తి రైతుల నుంచి రూ.5,500 తీసుకుంటున్నాడు. ఇందులో నుంచి బెంగాల్ కూలీలకు రూ.3,500 ఇస్తూ మిగతా డబ్బులతో వీరు ఉండడానికి వసతి, భోజనాలు, వాహనం తదితర సౌకర్యాలు చూసుకుంటున్నాడు. సాధారణంగా ఇక్కడ మహిళలు ఎకరం నాటుకు రూ.6 వేల వరకు తీసుకుంటుండగా, నారు వేసేందుకు మరో రూ.2,000 పైగా రైతులకు ఖర్చు అవుతుంది. దీంతో ఎకరం నాటుకు రైతుకు రూ. 8 వేలు ఖర్చు అవుతుంది. అదే బెంగాల్ కూలీలతో నాటు వేయిస్తే రూ.5,500 మాత్రమే అవుతుంది. ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రైతులకు ఆదా అవడంతోపాటు కూలీల బాధ తప్పుతుంది. 1.80 లక్షల ఎకరాల్లో పూర్తి.. జిల్లాలో ఈ యాసంగిలో 3.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తారని వ్యవసాయాధికారుల అంచనా ఉంది. ఇప్పటి వరకు 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం జోరుగా వరినాట్లు పడుతుండడంతో ఈ నెలలోపు నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి నాట్లు పెరిగే అవకాశం.. జిల్లాలో ఇప్పటికే సగంకు పైగా వరినాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాసంగిలో 3.48 లక్షల ఎకరాల్లో వరినాట్లు అంచనా ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల వరకు నాట్లు పడ్డాయి. కూలీల కొరతతో రైతులు వెద పద్ధతిలో వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు, నాట్లేసే యంత్రాలు రావడంతో రైతులకు చాలా బాధలు తప్పాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉంది. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
ఎఫ్సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి..
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్పై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీలోపు బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి.. ఈనెలాఖరు నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, యాసంగి సీజన్కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరగకూడ దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు ఎఫ్సీఐకి బియ్యం పంపిణీ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని, జాప్యం జరిగితే కార్పొరేష న్కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. గత పదేళ్లలో రూ.58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వల్ల పౌరసరఫరాలపై భారం పడింద ని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడుతోందన్నారు. బియ్యం సరఫరాలో జాప్యంతో రాష్ట్ర కేటాయింపులపై ప్రభావం సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్ కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్సీఐకి బియ్యం సరఫరాలో జాప్యం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు వస్తాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల కార్పొరేషన్ భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్చేసి రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల రేషన్షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాలనీ, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాంః సీఎస్ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎఫ్సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీని ఆధార్, రేషన్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. -
దేశంలో భారీగా పెరిగిన బియ్యం ధరలు!
భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి, ఒక క్వింటాల్ బియ్యం ధరల గరిష్టంగా సుమారు రూ. 1500 పెరిగినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రూ. 4500 నుంచి రూ. 5000 వరకు ఉన్న క్వింటాల్ HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 6200 నుంచి రూ. 7500కు చేరాయి. క్వింటాల్ ధరలు గతం కంటే కూడా రూ. 1000 నుంచి రూ. 15000 పెరిగింది. బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా.. వారి సాగు కూడా బాగా తగ్గడం అని సమాచారం. -
ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం, భారీగా కూరగాయలు
ఛత్తీస్గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్పూర్లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్సాయి తన సోషల్ మీడియా ఖాతాలో ‘రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు’ అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్గఢ్ రైస్మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! राम काज करिबे को आतुर... आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की मूर्ति की प्राण प्रतिष्ठा होने वाली है, जिस पर हर सनातनी को गर्व है। मेरे प्रदेश के अन्नदाताओं ने भी राम काज के लिए अपने खेतों से उगाई गई 100 टन सब्जियां राम मंदिर निर्माण कार्य… pic.twitter.com/fD3OvLiod0 — Vishnu Deo Sai (@vishnudsai) January 2, 2024 -
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే కిలో బియ్యం?
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ. 25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలుజాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ. 43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్ రైస్’ను తీసుకురానున్నట్లు వినికిడి. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్లెట్, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్’ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో గోధుమ పిండిని రూ. 27.50, కిలో శనగ పప్పును . 60 చొప్పున వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్ రైస్’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. -
భారత్ రైస్ వస్తోంది.. కేజీ ధర ఎంతంటే?
రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారత్ బ్రాండ్తో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించినట్లు సమాచారం. భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ అట్టా, భారత్ దాల్ (పప్పు) వంటి వాటిని విక్రయిస్తున్న ప్రభుత్వం రైస్ విభాగంలోకి అడుగుపెట్టింది. బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. -
అన్నదాతకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వరి పంట కోతల సమయమిది. రాష్ట్రంలోని రైతులు పంట కోసం, కల్లాల్లో, రోడ్ల పైన ఆరబెట్టారు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం మిచాంగ్ తుపాను ప్రభావం మొదలవడంతో రైతాంగం వణికిపోయింది. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్ అధికారులతో సమీక్షించి, పలు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. గ్రామాల్లో రైతులు కల్లాలు, రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. నిబంధనలను సైతం సడలించి ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకే కొంటోంది. వెనువెంటనే మిల్లులకు తరలిస్తోంది. కేశవరావు లాంటి వేలాది రైతులను ఆదుకుంటోంది. గడిచిన 48 గంటల్లో ఏకంగా 1.07 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని తరలిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు చేర్చింది. ఇప్పటివరకు ఆన్లైన్లో 75 వేల మంది రైతుల నుంచి రూ.1,211.49 కోట్ల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 55 వేల మంది రైతులకు సుమారు రూ.750 కోట్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది. అత్యవసర నిధి కింద జిల్లాకు రూ.కోటి తుపాను నేపథ్యంలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆన్లైన్ ద్వారా సాంకేతికంగా వివరాల నమోదులో కొంత జాప్యం జరుగుతుంది. ఈలోగా వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా ఆఫ్లైన్లో కొనేలా నిబంధనలను సడలించింది. దీనిని మరింత వేగంగా చేపట్టేందుకు అత్యవసర నిధుల కింద అవసరమైన జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది. ఈ నిధులతో కలెక్టర్లు మిల్లర్లు పంపించే వాహనాలకు తోడు ఎక్కడికక్కడ ప్రైవేట్ వాహనాలను బుక్ చేసి ధాన్యం బస్తాలను శరవేగంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. కంట్రోల్ రూమ్ల ద్వారా పర్యవేక్షణ విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల సంస్థ ఎండీ, జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఎంలు, తహసీల్దార్లు కంట్రోల్ రూమ్ల ద్వారా కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ, మండల, ఆర్బీకేల్లో ప్రత్యేక అధికారులను సైతం నియమించి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలిస్తున్నారు. తుపాను సమయంలో రైతులు పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని మార్కెట్ యార్డుల్లో భద్రపరుస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమలో అత్యధికంగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా ఆన్లైన్లో 96,965 టన్నులు, ఆఫ్లైన్లో 48వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఆదివారం ఒక్కరోజే 40 వేల టన్నులకుపైగా కొనడం విశేషం. మాన్యువల్గా పుస్తకంలో రైతుల ధాన్యం వివరాలను నమోదు చేసుకుని మిల్లులకు తరలిస్తున్నారు. తేమ 18 శాతం ఉన్నప్పటికీ మిల్లర్లు సహకరిస్తున్నారు. ఈ ఖరీఫ్లో 2.40 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా ఇప్పటికే 1.43 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. అమలాపురం, కొత్తపేట డివిజన్లలో పంట కోతలకు సమయం ఉంది. ఆలమూరు, మండపేట, రాయవరం ప్రాంతాల్లో మొత్తం ధాన్యాన్ని తుపాను ప్రభావం కంటే ముందే సేకరించారు. ఇప్పుడు మద్దతు ధర ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో రైతుల వివరాలను వేగంగా ఆన్లైన్ చేస్తూ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీవో)లు జనరేట్ చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం ఎస్. సుధా సాగర్ చెప్పారు. ఇప్పటివరకు రైతులకు మద్దతు ధరకు సుమారు 15 వేల టన్నులకుపైగా ఎఫ్టీవోలు ఇచ్చామన్నారు. ‘14 ఎకరాల పంట. ఈసారి బాగా పండటంతో 30 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. యంత్రంపై కోయడంతో ధాన్యం పచ్చిగా ఉందని కల్లాల్లో ఆరబెట్టాను. చివరికొచ్చేసరికి తుపాను భయం పట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం పడితే ఎలా అనుకుంటున్న దశలో అధికారులు వచ్చారు. కంప్యూటర్లో ఎక్కించాల్సిన అవసరంలేదని, లోడును వెంటనే పక్కనున్న మిల్లులకు పంపించేద్దామని చెప్పారు. కూలీలను పిలిపించారు. గోతాల్లోకి నింపి.. నా ట్రాక్టర్లోనే ఆదివారం రాత్రి పంటను తీసుకెళ్లి మిల్లులో అప్పజెప్పాను. లేకుంటే సోమవారం కురిసిన చినుకులకు చేతికొచ్చిన లాభం తడిసిపోయేది’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరుకు చెందిన కౌలు రైతు శీర్ల వెంకట కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో వర్షంలోనూ తరలింపు ► కృష్ణా జిల్లాలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా, రవాణా వాహనాలపై కప్పేందుకు వీలుగా 700కుపైగా టార్పాలిన్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. తేమ శాతం నిబంధనలను సైతం పక్కనబెట్టి 20 వేల టన్నులకుపైగా ధాన్యాన్ని సేకరించింది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉండటంతో వెంటనే గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తోంది. ► ఏలూరు జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 10 వేల టన్నులు తరలించగా సోమవారం వర్షంలోనూ ధాన్యం సేకరణ కొనసాగింది. అయితే తుపాను భయంతో కొంత మంది రైతులు కోతలు చేపడుతున్నారు. మరికొందరు కోసిన ధాన్యాన్ని ఇళ్లలో, షెడ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ఆరబోసుకుని విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం భార్గవి తెలిపారు. వర్షాల్లో కోత మంచిది కాదని, తమ సిబ్బంది సహాయంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఆఫ్లైన్, ఆన్లైన్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం సేకరించామన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో కోతలు కోసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని దాదాపు మొత్తం సేకరించారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకూ వాహనాల్లో తరలించారు. ఆ ఒక్కరోజే సుమారు 24,000 టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అక్కడక్కడా మిగిలిన స్వల్ప మొత్తం ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 90 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తవగా 1.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం శివరామ్ చెప్పారు. ఇందులో 1.30 టన్నులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశామన్నారు. ► తూర్పు గోదావరి జిల్లాలో 6,367 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జేసీ తేజ్భరత్ తెలిపారు. ఇక్కడ అత్యధికంగా బహిరంగ మార్కెట్కు తరలిపోగా ఆర్బీకేల ద్వారా 15,272 మంది రైతుల నుంచి 1,04,917 టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావం పెద్దగా లేదు. విజయనగరం జిల్లాలో నూర్పిడి చేసిన ధాన్యం 1,242 టన్నుల వరకు ఉంది. దీనిలో 440 మెట్రిక్ టన్నులు సోమవారం ఆఫ్లైన్లో కొన్నారు. మంగళవారం మరో వెయ్యి టన్నులు కొనుగోలు చేయనున్నారు. శ్రీకాకుళంలో 700, పార్వతీపురం మన్యంలో 500 టన్నులు కొనుగోలు చేశారు. ► కాకినాడ జిల్లాలో కల్లాల్లో, రోడ్లపై ఉన్న 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ దేవీపట్నం, గంగవరం ప్రాంతాల్లో 300 టన్నులు కొన్నారు. ఆఫ్లైన్లో ఆదుకున్నారు.. నేను సొంతంగా, కౌలుకు కలిపి 70 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు వచ్చింది. ఆఫ్లైన్లో ఆదివారం 240 బస్తాలు ఆర్బీకేలో విక్రయించాను. ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసే అవకాశమున్నందున తేమ శాతం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం సవరించి కొనుగోలు చేయడం హర్షణీయం.– సేవా సత్యనారాయణ, లొల్ల గ్రామం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తేమతో సంబంధం లేకుండా.. ఒక్క రోజు ఆలస్యమైనా పంట మొత్తం వర్షార్పణమయ్యేది. చాలా ఇబ్బందులు పడేవాడిని. సకాలంలో అధికారుల సాయంతో నాలుగు ఎకరాల ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా నేరుగా మిల్లుకే చేర్చాను. ఫలితంగా 10 టన్నుల ధాన్యాన్ని నష్టపోకుండా ఒబ్బి చేసుకోగలిగా. – చిటికెన పెద సత్యనారాయణ, వడలి, పశ్చిమగోదావరి జిల్లా కోతలు వాయిదా వేయండి రైతులు వరికోతలను నాలుగు రోజులు వాయిదా వేస్తే మంచిది. వర్షాల సమయంలో పంట కోస్తే తడి ఆరక తేమ పెరిగిపోతుంది. త్వరగా మొలకలు వచ్చి ధాన్యం దెబ్బతింటుంది. కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే వాటిని డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు వర్షంలోనూ ప్రత్యేక జాగ్రత్తల నడుమ తరలిస్తున్నాం. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల్లో తీసుకునేలా అవకాశం కల్పిస్తాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ కల్లాల్లో స్వల్పంగానే.. తుపాను హెచ్చరికలతో వర్షం రాక ముందే ధాన్యాన్ని మిల్లులకు తరలించేశాం. ఇంకా అక్కడక్కడా కొద్దిగా ఉంది. దానిని కూడా తరలిస్తాం. కొందరు రైతులు ఆదివారం కూడా యంత్రంపై కోతలు ఎక్కువగా చేశారు. వాటిల్లో చాలా వరకు కొనుగోలు చేశాం. తేమ శాతం ఎక్కువ ఉంటే రైతులకు నష్టం జరగకుండా మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాల్లో ధాన్యం లోడును తరలించాలని కలెక్టర్లకు చెప్పాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వ చొరవ కాపాడింది ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. పంటను మిషన్తో కోయించి, ధాన్యం రోడ్డుపై రాశి పోశాను. తుపాను కారణంగా వర్షం పడుతుందని బరకాలతో కప్పి ఉంచాను. లేదంటే వర్షానికి ధాన్యం తడిసిపోయేది. జేసీగారు వచ్చి మా ధాన్యాన్ని వెంటనే మిల్లుకు పంపించారు. తేమ ఎక్కువ ఉంటే మిల్లరు ధాన్యంలో కోత వేస్తారు. కానీ, ధాన్యంలో ఎటువంటి కోతా పెట్టలేదు. ప్రభుత్వం తీసుకున్న చొరవే నన్ను కాపాడింది – వాసంశెట్టి అర్జునరావు, గొడ్డటిపాలెం, కాకినాడ జిల్లా మద్దతు ధర నష్టపోకుండా.. ఎకరాకు 30 బస్తాల పైనే దిగుబడి వచ్చింది. ఈ లోగా తుపాను భయపెట్టింది. ప్రైవేటుగా అమ్మేందుకు ప్రయత్నించా. మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు అడిగారు. ఇంతలోనే వానలు మొదలయ్యాయి. ధాన్యం నిల్వ చేయడానికి సరైన గిడ్డంగులు లేవు. తక్కువకు అమ్మితే బాగా ఆదాయం పోతుందని బాధ పడ్డాను. ఆర్బీకేలో చెబితే ఆఫ్లైన్లో నా 220 బస్తాల ధాన్యం కొని, మిల్లుకు తరలించారు. పూర్తిగా మద్దతు ధర వస్తుందని వీఏఏ చెప్పారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పంచిరెడ్డి రమణ, గండువల్లిపేట, నరసన్నపేట నిబంధనలు సడలించి ఆదుకున్నారు తుపాను హెచ్చరికలతో పంట కోత కోయించాను. ఆర్బీకే వాళ్లు తేమ 22 శాతం ఉందన్నారు. మద్దతు రేటు రాదేమో అనుకున్నా. కానీ ప్రభుత్వం నిబంధనలు మార్చి మేలు చేసింది. తేమ శాతం ఎక్కువ వచ్చినా మద్దతు ధర దక్కేలా చేసింది. కోత చేసిన 495 సారలు (40 కిలోల బస్తాలు) ఆదివారం ముసురులోనే ధాన్యం కాటా వేయించి లారీల్లో పంపించారు. – సాగి కోటేశ్వరరావు, కౌలురైతు, పునాదిపాడు, కృష్ణాజిల్లా -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్కు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్ను సూపర్ఫుడ్గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్లో 500కి పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
రైస్ అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతామని, అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిపోతాయని చాలామంది అనుకుంటారు. అందుకే రైస్ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు కూడా. కొందరు రాత్రి సమయంలో చపాతీలు, పుల్కాలు, సూప్లతో సరిపెట్టేస్తారు. అదేం అవసరం లేదంటున్నారు న్యూటిషియన్లు. దీనిపై అధ్యయనం చేసిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూటిషియన్లు కూడా రైస్ను హాయిగా తినొచ్చని అంటున్నారు. అదంతా కేవలం అపోహే అని తేల్చి చెబుతున్నారు. ఆ రైస్కి తాము చెప్పిన వాటిని జోడించి తింటే ఆ భయాలు కూడా ఉండవని నొక్కి చెబుతున్నారు. ఐతే మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా రైస్ని రెండుపూట్ల హయిగా తినేయొచ్చ? తదితరాల గురించే ఈ కథనం.! రైస్లో అత్యంత సాధారణ కార్బోహైడ్రేట్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూటిషియన్ పూర్ణిమ. ఆహారంలో రైస్ ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో కొద్దికొద్దిగానే తింటూ బాధపడుతుంటారు. కానీ అది నిజం కాదని చెబుతున్నారు న్యూటిషియన్ పూర్ణిమ. ఇది బరువు తగ్గడంలోనూ, చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పూర్ణిమ యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికర విషయాలు ఏంటంటే... ఎలా తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయంటే.. తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే రైస్కి వెనిగర్ కలిపి వండుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పెరుతాయన్న భయమే ఉండదు. బియ్యానికి వెనిగర్ని జోడించడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే రైస్కి పాలు చేర్చడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఆటోమెటిక్గా గ్లైసెమిడ్ ఇండెక్స్ తగ్గుతుందని సోయాబీన్ లేదా సోయాబీన్ ఉత్పత్తులతో కూడిన బియ్యంలో కూడా గ్లైసెమిక సూచిక తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. నిమ్మరసాన్ని జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. నిమ్మరసంతో అన్నం తినడం వల్ల ఎక్కువుగా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల తెలియకుండానే ఈజీగా బరువు కూడా తగ్గుతాం పులియబెట్టిన పదార్థాలను రైస్కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు తక్కువుగానే ఉంటాయి. ఉదాహరణకు కొబుచా, సౌర్క్రాట్, కిమ్చి, మిసో, పెరుగు తదితరాలు ప్రేగులకు మంచిది. ఎసిటిక్ యాసిడ్తో కలిగిన పదార్థాలు లేదా వెనిగర్ ఆధారిత పదార్థాలు, పచ్చళ్లు, సాస్లు, ఆవాలు, సలాడ్లు(మిక్సిడ్ కూరగాయాలు) తదితరాలు అన్నానికి జోడించి తీసుకుంటే మంచిది. ఇది కుదరనట్లయితే రైస్లో ఏదో రకంగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచి ఆప్షన్ని అని న్యూట్రిషియన్ పూర్ణిమ చెబతున్నారు. ఇలా తీసుకుంటుంటే బరువు తగ్గడమే గాక రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించగలం అంటున్నారు న్యూట్రిషియన్ పూర్ణిమ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Poornima Peri (@poornimahormonecoach) (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్ఫుల్ అంటున్న వైద్యులు!)
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
జిల్లాకో మెడికల్ కాలేజీ
South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
పేదల ఇళ్లకు పెద్దపీట
పిల్లల దత్తతకు డిమాండ్
మ్యూల్ సిమ్కార్డుల ముఠాగుట్టు రట్టు
కౌండిన్య.. గజరాజ్యం
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పు 5కు వాయిదా
నేడో, రేపో సీమలోకి ‘నైరుతి’!
Advertisement