Sammakka Saralamma Jatara
-
మేడారం జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
-
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలివే!
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే జాతరను ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభిస్తారు. దాదాపు పది నెలల ముందే జాతర తేదీలు.. మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈ సారి దాదాపు 10 నెలల ముందుగానే ప్రకటించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యాఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సమ్మక్క–సారలమ్మ పూజారులు కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకటనకు ముందు పూజలు.. మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం బుధవారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్కుమార్లు సమావేశం అయ్యారు. కాగా, సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు. జాతర తేదీలు ఇవే.. ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఫిబ్రవరి 22: చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక. ఫిబ్రవరి 23: సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ. ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు. ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ. చదవండి: ఢిల్లీ సిగలో ‘గులాబీ’.. -
మేడారం జాతర: దేవతలకు తిరుగువారం పండగ..
-
మేడారం జాతర.. ముగింపు ముంగిట మురిపెం
-
మేడారం సమ్మక్మ-సారలమ్మ గద్దెల వద్ద బంగారం తొలగింపు సబబేనా..?
పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు.. భక్త‘కోటి’ ఆరాధ్య దైవాలు.. ఇంటి ఇలవేల్పులు. వరాలిచ్చే దేవరలు.. చెంతకొచ్చినా.. మదిలో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు. రెండేళ్లకోసారి దర్శనభాగ్యం కల్పించేందుకు కళ్లెదుటే సాక్షాత్కరించగా.. జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లీ అంటూ మొక్కుల చెల్లింపునకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ, చీర సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరించారు. చల్లని చూపులను ప్రసాదిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చేందుకు అభయమిచ్చితిరి ఆ అమ్మలు. సాక్షి, మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): తల్లుల గద్దెలపై ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలను పూజారులు తప్పుబడుతున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ కొలువుదీరిన గద్దెలపై బెల్లం(బంగారం), ఒడిబియ్యం, కొబ్బరి కుడుకలు, పోక, ఖర్జూర, చీర సారె భక్తులు సమర్పించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇవన్నీ చుట్టూరా ఉంటేనే అమ్మవార్లు అక్కడ ఉన్నట్లు భావిస్తారు. అయితే.. జాతర పూర్తి కాకముందే ఎప్పటికప్పుడు కానుకలు తొలగించడం సంప్రదాయానికి విరుద్ధమని పలువురు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూజారిని అడగగా.. బంగారం తొలగించడాన్ని తాము తప్పుబడుతున్నామని, అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన నాటి నుంచి వనప్రవేశం చేసే వరకు రాశిగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. చదవండి: మేడారం జాతర: గట్టి మంత్రి.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. కాగా.. వనప్రవేశం ముందు ఆచారంగా ఆదివాసీలు, మేడారం ఆడబిడ్డలు, స్థానికులు గద్దెలపై ఉన్న బెల్లం, చీర సారెలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడంతా తొలగించడంతో ఈసారి ప్రసాదం స్థానిక ఆదివాసీలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని పూజారులు వాపోయారు. జాతరకు ముందు జరిగిన సమీక్షలో సైతం గద్దెలపై కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే తొలగించాలని పూజారులు సూచించారు. దీనిపై డీపీఓ వెంకయ్యను వివరణ కోరగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి జాతరలో ఇలానే తొలగిస్తామని, ఈసారి కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. -
Medaram Jatara 2022 : మేడారం మహాజాతర మూడో రోజు (ఫోటోలు)
-
వైభవంగా మేడారం జాతర మహోత్సవం
-
మినీ మేడారం.. 40 ఏళ్లుగా గోలివాడ సమ్మక్క జాతర
ఆహ్లాదకరమైన వాతావరణం.. సేద తీరేందుకు పచ్చటిచెట్లు.. మెరుగైన రవాణా సౌకర్యం.. గోదావరినది తీరప్రాంతంలో కొలువుదీరిన అమ్మవారు.. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే గోలివాడ సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు. – రామగుండం కుంకుమగా అవతరించి.. కలలో వచ్చి గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్రావు ఊరాఫ్ బయ్యాజీ గోదావరిలో స్నానానికి వెళ్లాడు. గోదావరి ఒడ్డున ఇసుకకుప్పలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణె మూట లభ్యమైంది. దానిని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో వనదేవతలు కలలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలో శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజుల గద్దెలు నిర్మించి ప్రతీ రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు వారు చెబుతుంటారు. అదే ఏడాది 1982లో గోదావరినది ఒడ్డున వనదేవతల గద్దెలను నిర్మించి జాతరను ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామానికి చెందిన 41మందితో వ్యవస్థాపక కమిటీ ఏర్పాటు చేసుకొని జాతరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు. బ్యాక్ వాటర్లోకి వనదేవతల గద్దెలు ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్వాటర్తో వనదేవతల గద్దెలు ముంపులోకి చేరా యి. నెలరోజుల క్రితం ఒడ్డునే నూతన గద్దెలు నిర్మించారు. భక్తులు విడిది చేసేందుకు, నాలుగు వైపుల పబ్లిక్ టాయిలెట్స్ తదితర ఏర్పాట్లకు 60ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ► జాతరకు గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల వారుకూడా వస్తారు. గతేడాది రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ► జాతరలో నాలుగు వైపుల నాలుగు బోర్లు, స్నానాలు చేసేందుకు షవర్స్, ప్రత్యేక టాయిలెట్స్, ఐదు సెంట్రల్ లైటింగ్స్, 400 అంతర్గత వీధి దీపాలు, పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు రైల్వేట్రాక్ వరకు రహదారి ఏర్పాట్లు చేశారు. ► గోదావరిఖని నుంచి బస్సులు, ప్రయివేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇత ర రాష్ట్రాలు, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి రైలు సౌకర్యం ఉంది. ఐదు లక్షల మంది వచ్చే అవకాశం గోదావరినదిలో బ్యాక్వాటర్తో మంచిర్యాల వైపు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. 2018లో ఐదు లక్షల మంది భక్తులు రాగా ఆదాయం రూ.30 లక్షలు సమకూరింది. 2020లో భక్తుల సంఖ్య 2 లక్షలకు పడిపోయి రూ.17లక్షలు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుండడంతో చేస్తుండగా.. ఐదులక్షల మంది వచ్చే అవకాశం ఉంది. – గీట్ల శంకర్రెడ్డి, జాతర కమిటీ చైర్మన్ ముస్తాబైన సమ్మక్క,సారలమ్మ గద్దెలు కొలనూర్లో 48 ఏళ్లుగా... ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం కొలనూర్లో సమ్మక్క, సారలమ్మ జాతరను 48 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి నాలుగు లక్షలకు పైగా భక్తులు వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. మేడారం నుంచి కోయపూజారులు వచ్చి నాలుగు రోజులపాటు పూజలు చేయడం ప్రత్యేకత. జాతర చుట్టూ మూడుగుట్టలు ఉన్నాయి. వాటి మధ్య జాతర ఆకర్షణీయంగా జరగుతుంది. అల్లీమాసాని చెరువులో స్నానాలు చేసే అవకాశముంది. జాతరకు కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి ఆటోలూ నడుస్తాయి. రైలులో వచ్చేవారు కొలనూర్ రైల్వే స్టేషన్లో దిగి జాతరకు రావొచ్చు. ఏర్పాట్లు చేశాం జాతరకు వచ్చే భక్తులకు నీడ, మంచినీటి సౌకర్యం, రహదార్లు ఏర్పాటు చేశాం. వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు మరగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశాం. – బండారి ఐలయ్య యాదవ్, జాతర చైర్మన్ -
మేడారం జాతరపై తెలంగాణ జాగృతి డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి పరిరక్షకులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమర్పణలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి రూపొందించిన ‘మేడారం సమ్మక్క–సారక్క జాతర’ డాక్యుమెంటరీని కవిత శనివారం తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యంలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని, బాలాజీని కవిత అభినందించారు. -
మేడారంలో భక్తజన సందడి
సాక్షి, ములుగు: ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
18న మేడారానికి సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిం చుకుంటారని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జాతరపై సందేహాలున్నాయని అయి తే మహాజాతర కచ్చితంగా జరుగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాకే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి, వసతులు పెరిగి నేడు దక్షిణ భారత కుంభమేళాగా సమక్క–సారలమ్మ జాతర మారిందని పేర్కొన్నారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం శనివారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ. 75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖలవారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, క రోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు రూ.కోటి కేటాయించామని చె ప్పారు. 2020 జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందునుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు. సీఎస్, డీజీపీ దిశానిర్దేశం సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6,400 టాయిలెట్లు, వెయ్యి ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 10 వేల మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉం చుతున్నామని తెలిపారు. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు దయాకర్, మాలోతు కవిత పాల్గొన్నారు. కాగా, సమీక్షకు ముందు ఇంద్రకరణ్రెడ్డి, సోమేశ్కుమార్, మహేందర్రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వచ్చే ఏడాది మాఘమాసంలో నాలుగురోజులపాటు జరగనుంది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహించనున్నట్లు మేడారం ఆలయపూజారులు ఇదివరకే ప్రకటించారు. ఈ జాతరకు జనవరి నుంచే భక్తుల రద్దీ పెరగనుంది. అయితే ఆ ప్రాంతంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చేవిధంగా అభివృద్ధి పనులు ఇంకా మొదలుకాలేదు. జాతరను పురస్కరించుకొని చేపట్టాల్సిన పనుల కోసం సుమారు రూ.114.95 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ.75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నెల 15 నాటికి టెండర్లు పూర్తిచేసి పనులు మొదలెట్టాల్సి ఉండగా, ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అరకొర నిధులు.. అత్తెసరు పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఈ మహాజాతర అభివృద్ధికి ప్రభుత్వాలు అరకొరగా నిధులు కేటాయించి తాత్కాలిక పనులు చేపట్టాయి. స్వరాష్ట్రంలో మహాజాతర అంటే ఇలా నిధుల కేటాయిం పు ఉండాలే అనేలా.. రూ.150.50 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మేడారం జాతర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. భక్తులకు కూడా తాగునీరు, శానిటేషన్, రోడ్ల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ–ప్రొక్యూర్ దశలో టెండర్లు... పెండింగ్లో రోడ్ల పనులు మేడారం జాతర పేరుతో 2016, 2018, 2020లలో వివిధ ప్రాంతాలకు మంజూరైన రోడ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో వన్–వే ట్రాఫిక్, వాహనాల రాకపోకల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది వన్–వే చేసిన క్రమంలో ఏటూరునాగారం, ఖమ్మం, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన ప్రైవేటు వాహనాలను కొండాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు. ఈసారి ఆ రోడ్లు గుంతలమయంగా మారడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈసారి రూ.75 కోట్ల విడుదలకు ముందు, తర్వాత ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్సింగ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష లు నిర్వహించారు. అయినా పనులన్నీ ఇంకా టెండర్ల దశ దాటకపోవడంతో అవి ఎప్పటికీ పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 15కల్లా మహాజాతర పనులు మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్నందున ఆయా శాఖల అధికారులు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల నియమావళి పాటిస్తూ నడుస్తున్న పనులకు టెండర్లు పిలిచి, 2022 జనవరి 15 కల్లా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్, ములుగు -
ఆ రోజు వీఐపీలకు అనుమతివ్వకండి
సాక్షి, హైదరాబాద్: ‘‘మేడారం.. శుక్రవారం.. సమ్మక్క, సారలమ్మ దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీ మరీ పెరిగిపోవటంతో దర్శించుకున్నవారిని వేగంగా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు అధికారుల సూచనతో ఆర్టీసీ బస్సులు బయలుదేరుతున్నాయి. నిమిషానికి 20 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు జరిగాయి. కానీ అదే సమయంలో కొందరు వీఐపీలు వస్తున్నా రన్న సమాచారంతో పోలీసులు ప్రధాన రోడ్డుపైకి బస్సులను రాకుండా ఆపేశారు. అలా 2 గంటలపాటు బస్సులు నిలిచిపోవటంతో, ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. భక్తుల్లో అసహనం పెరిగింది. క్యూలైన్లు అదుపుతప్పాయి. అంతా గందరగోళం.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిలసలాటకు దారితీస్తుండగా... అతికష్టమ్మీద అధికారులు అదుపు చేశారు’’ఇది గత జాతరలో నెలకొన్న పరిస్థితి.. ఉన్నత స్థానాల్లో ఉండీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన రాజకీయ నేతలు, వారికి దారి ఇప్పించే అత్యుత్సాహంతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. ఏమాత్రం అదుపుతప్పి తొక్కిసలాట జరిగినా... పర్యవసానం భయంకరంగా ఉండేది. రద్దీని నివారించేందుకు ముందస్తు సన్నాహాలు... ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకూడదంటే, సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీరిన రోజు వీఐపీలకు అనుమతివ్వొద్దని.. ఆర్టీసీ, పోలీసు అధికారులకు సూచించింది. వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న మేడారం జాతరకు మెరుగైన రవాణా వసతి కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారులు భేటీ అయి గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఈసారి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈసారి 4500 బస్సులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రెండో వారంలో గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందులో శుక్రవారం ఇద్దరు దేవతలు గద్దెమీద ఆసీనులై సంయుక్తంగా దర్శనమిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆ సమయంలో అక్కడే ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో రద్దీ పెరుగు తుంది. దర్శనం ముగిసిన వారిని వీలైనంత వేగంగా అక్కడి నుంచి తరలించటం ద్వారా, రద్దీని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పెద్దమొత్తంలో బస్సులను సిద్ధంగా ఉంచి, నిమిషానికి కనీసం వేయి మందిని తరలించాలని నిర్ణయించారు. ఇది జరగాలంటే ప్రధాన రోడ్డు క్లియర్గా ఉండాలి. గత జాతరలో సరిగ్గా అదే సమయంలో వీఐపీలు వచ్చారు. సాధారణ భక్తుల రాకపోకలపై రెండుగంటలపాటు పోలీసులు ఆంక్షలు విధించారు. అది సమస్యలకు కారణమైంది. ఈసారి ఆ కీలక తరుణంలో వీఐపీలు రాకుండా, వారు ముందుగానే దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. -
మేడారం జాతరలో సీఎం కేసీఆర్
-
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యక బస్సులు
-
సార్ హామీ.. నెరవేరదేమి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరొందిన మేడారం మహాజాతర అభివృద్ధి పనులు మళ్లీ అటకెక్కాయి. జాతర జరిగే నాలుగు రోజుల్లో ఇక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు ఎడాపెడా హామీలు గుప్పించడం, అంతకు ముందు రెండు నెలల పాటు పనుల పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్ప.. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడంపై ఎవరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వయంగా ఇచ్చిన హామీలు నాలుగున్నర నెలలు గడిచినా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటికి పైగా మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడో రోజు సీఎం రాక.. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర మూడో రోజున సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారాన్ని సందర్శించారు. వనదేవతల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం.. 2018–19 బడ్జెట్లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం.. జాతరకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటులో లేదు.. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి.. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరిస్తాం.. ఈ విషయాలపై చర్చించేందుకు జాతర ముగిసిన తర్వాత తాను 15 రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లా డతా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు జంపన్న వాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనందుకు తాను మొక్కులు చెల్లించానని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తిరిగి వనదేవతలను మొక్కుకున్నట్లు చెప్పారు. ఒక్కటీ జరగలేదు.. జాతర ముగిసి నాలుగున్నర నెలలు గడిచినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. 15 రోజుల్లో మళ్లీ మేడారం వచ్చి అ«ధికారులతో సమావేశం ఏర్పా టు చేస్తానన్న సీఎం.. ఇటువైపు కన్నెత్తి కూడా చూ డడం లేదు. దీంతో 200 ఎకరాల స్థల సేకరణ అంశం మరుగున పడిపోయింది. తర్వాత రాష్ట్ర బడ్జెట్ 2018–19లో మేడారం జాతరకు ఒక్క రూ పాయి కూడా కేటాయించలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్న అభివృద్ధి పెరి గింది. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో జాతర ప్రాధాన్యత పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ వంటి వీఐపీలు గత జాతరలో మేడారం వచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ మంత్రులు వస్తున్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారం వచ్చే భక్తు ల సంఖ్య పెరిగింది. సెలవుదినాల్లో వందల వాహనాలు మేడారం వైపు పరుగులు పెడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జాతర సమయంలో తప్పితే ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడక పోవడంతో అభివృద్ధి పనుల్లో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 2016 జాతర సమయంలో రూ. 14 కోట్లతో తలపెట్టిన నాలుగు చెక్డ్యామ్ల నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఒక్క ఎకరమే.. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఈ పల్లెలో 155.8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. సమ్మక్క–సారలమ్మకు కేవలం ఎకరం భూమి మాత్రమే ఉంది. మేడారం పరిసరాల్లో మొత్తం 155.08 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో 8 ఎకరాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాం కేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. జాతర జరిగే సమయంలో యంత్రాంగం ఈ భూముల ను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. అయితే శాశ్వతంగా వనదేవతలకు భూములను కేటాయించలేదు. జాతర సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని భక్తులు కోరుతున్నారు. -
‘మేడారానికి’ హోదా హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్తో పాటు పలువురు తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి జశ్వంత్సింగ్ బబోర్ ఇటీవల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.2 కోట్లు ఇచ్చిందని, వచ్చేసారి ఈ నిధిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మాత్రం పేర్కొన్నారు. రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం వల్లే.. సమ్మక్క–సారలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. గిరిజనులు, ఆదివాసీలతో పాటు వివిధ వర్గాలకు చెందిన కోటి మందికి పైగా భక్తులు జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరవుతున్న సందర్భంగా మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ అంశంపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సైతం మొదట్లో సానుకూలంగా స్పందించింది. జాతరకు రావాలన్న రాష్ట్ర ఆహ్వానాన్ని సైతం అంగీకరించిన కేంద్ర బృందం, ఉత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించింది. జాతర తీరును పరిశీలించి నిర్ణయాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్ర బృందం వచ్చే ముందు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వీఐపీ తాకిడి ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర బృందం పర్యటనకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో జాతరకు హాజరయ్యే నిర్ణయాన్ని మంత్రుల బృందం విరమించుకుంది. జాతీయ ఉత్సవమైతే... మేడారం జాతరకు జాతీయ ఉత్సవ హోదా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ నిబంధనల్లో భాగంగా పది లక్షలకు పైగా గిరిజనులు హాజరయ్యే ఉత్సవానికి జాతీయ హోదా అర్హతలుంటాయి. కానీ సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏకంగా కోటి మందికి పైగా హాజరవుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడంతో చేజేతులా అవకాశం వదులుకున్నట్లైంది. ఈ ఉత్సవానికి జాతీయ హోదా దక్కితే నిధులు, నిర్వహణ అంతా కేంద్రం చూసుకోవడమే కాకుండా, జాతరకు మరింత ప్రచారం దక్కేదని గిరిజన మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
మహాజాతర ఆదాయం రూ. పది కోట్ల పైనే..
హన్మకొండ కల్చరల్: మేడారం మహాజాతర ఆదాయం రూ.10,17,50,363గా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద పెట్టిన 452 ఇనుపరేకు హుండీలు, 24 వస్త్ర హుం డీలు, 3 ఒడిబాల బియ్యం హుండీలను ఏ ర్పాటు చేశారు. వాటిని ఫిబ్రవరి 5న హన్మకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపంలోకి చేర్చారు. అ నంతరం ఆరో తేదీన లెక్కింపు మొదలు పెట్ట గా.. సోమవారం ముగిసింది. మొత్తం జాతర ఆదాయం రూ.10,17,50,363 వచ్చింది. వాటిని ఆంధ్రా బ్యాంక్ నక్కలగుట్ట బ్రాంచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో జమ చేసినట్లు దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈవో తాళ్లూరి రమేశ్బాబు తెలిపారు. వందలాది అమెరికన్ డాలర్లతోపాటు సుమారు 32 దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు వివరించారు. అలాగే, 47 కిలోల 470 గ్రాముల వెండి, బంగారు బిస్కెట్లు, బంగారు కిడ్నీ రూపాలు, బంగారు బాసింగాలు, మూడంతస్తుల బంగారు ఇల్లు వంటి వాటిని కూడా కలుపుకొని మొత్తం 824 గ్రాముల బంగారాన్ని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు వెల్లడించారు. కాగా, గత జాతరలో 8.90 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ జాతరలో రూ. కోటికి పైగా ఆదాయం పెరిగింది. -
మేడారం హుండీ ఆదాయం రూ. 7 కోట్లు
హన్మకొండ కల్చరల్: జయశంకర్భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారక్క మహాజాతర హుండీల లెక్కింపు మూడో రోజు గురువారం కొనసాగింది. హన్మకొండ లష్కర్బజార్లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు రాత్రి 8 గంటల వరకు జరిగింది. దేవాదాయ శాఖ ఎస్జీఎఫ్ అధికారి శ్రీనివాస్రెడ్డి, దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈఓగా వ్యవహరించిన తాళ్లూరి రమేష్బాబు, దేవాదాయశాఖ జేఈఓ కట్టా అంజనీదేవి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాముల సునీత, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ బెయిల్సింగ్, మేడారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ధర్మకర్తలు జవహర్లాల్, సారయ్య, లింగయ్య, ట్రస్ట్ బోర్డు కోఆప్షన్ సభ్యులు, మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర వడ్డె చింతబోయిన నర్సింగరావు పాల్గొని పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు మూడో రోజు లెక్కింపు ముగించిన తర్వాత తాళ్లూరి రమేష్బాబు ఆదాయం వివరాలు ప్రకటించారు. మూడో రోజు 140 హుండీలను లెక్కించగా ఆదాయం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ.2,48,46,341 ) రూపాయలు లభించాయని, మొదటి రోజు ఆదాయం రూ. 1,72,40,000, రెండో రోజు ఆదాయం రూ. 3,15,00,000లతో కలుపుకుని ఏడు కోట్ల మూఫ్పై ఏడు లక్షల ఎనభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ. 7,35,86,341) ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా 342 హుండీలను తెరిచి లెక్కించామని పేర్కొన్నారు. గురువారం నగదును హెచ్డీఎఫ్ఫీ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు నక్కలగుట్ట బ్రాంచ్లో జమ చేశారు. పోలీస్ బందోబస్తు కొనసాగింది. 350 మంది సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల మొక్కుబడుల్లో వింతలు.. ఒకే భక్తుడు రూ.2 లక్షల యాబై వేల రూపాయలను.. రూ.2 వేలు, రూ.5 వందల నోట్ల కట్టలను మూటగా కట్టి వేశాడు. మరో భక్తుడు రూ.లక్ష పదహారువేలను హుండీలో వేసి ‘తన కూతురికి వివాహం కావాలని, మనవడు పుట్టాలని.. వచ్చే జాతర నాటికి తన భార్య కూతురు, అల్లుడు మనవడితో జాతరకు వస్తానని ఓ పేపర్పై రాశాడు. మరొకరు రూ.5 వందల నోటుపై ‘సేవ్ వాటర్, సేవ్ ట్రీస్’ అని రాశారు. అలాగే, ఒకే వ్యక్తి 400 అమెరికన్ డాలర్లు వేయడం విశేషం. కంబోడియా, నేపాల్ మలేషియా, అరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చాయి. -
ఆహ్వానం అనిర్వచనీయం
భూపాలపల్లి : వనం నుంచి జనంలోకి సమ్మక్క రాకను పురస్కరించుకుని చిలకలగుట్ట దగ్గర ప్రభుత్వం తరపున గాలిలో కాల్పులు జరిపి ఆహ్వానం పలకడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందని జయశంకర్ జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. ట్రైనీ ఐపీఎస్గా, భద్రాచలం ఓఎస్డీగా గతంలో రెండు సార్లు జాతరలో నిర్వహణలో పాల్గొన్నా.. తన కెరీర్లో 2018 జాతర ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. మహా జాతర విజయవంతంగా ముగిసిన సందర్భంగా.. జాతరలో తన అనుభూతులు, అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. టెక్నాలజీ సాయంతో.. గతంతో పోల్చితే ఈసారి జాతర నిర్వహణలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాం. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు పొందాం. ముఖ్యంగా రద్దీ నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో సహకరించాయి. గత జాతరలో ఐటీడీఏ గెస్ట్హౌస్ వైపు ఉన్న క్యూలైన్ ద్వారా ఎక్కువ మంది దర్శనం చేసుకునేవారు. ఆర్టీసీ క్యూలైన్ వైపు రద్దీ తక్కువ ఉండేది. దీంతో ఐటీడీఏ క్యూలైన్పై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఈ క్యూలైన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని గమనించిన వెంటనే హరిత హోటల్ దగ్గర ఉన్న చెక్పోస్టు సిబ్బందిని అలర్ట్ చేశాం. వారు జంపన్న వాగు నుంచి వచ్చే భక్తులను ఆర్టీసీ క్యూ లైన్ వైపు మళ్లించాం. డ్రోన్ కెమెరాల వినియోగంతో అన్ని రోడ్లను మానిటరింగ్ చేశాం. ఎక్కడైనా రద్దీ పెరిగిపోతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడికి అదనపు సిబ్బందిని పంపాం. వీడియో మానిటర్ స్క్రీన్లు ఉపయోగపడ్డాయి. వీటి ద్వారా 33 మంది తప్పిపోయిన వారిని వెతికి పట్టుకున్నాం. క్రౌడ్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలు సాధ్యమైనంత కచ్చితత్వంతో సేకరించాం. లైటింగ్ పెరగాలి... జాతర జరిగే మేడారం, ఊరట్టం, ఆర్టీసీ బస్స్టేషన్, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, రెడ్డిగూడెం, జంపన్నవాగు వంటి ప్రదేశాల్లో రాత్రి వేళ లైటింగ్ను పెంచాలి. అన్ని చోట్ల మంచినీటి సౌకర్యం కల్పించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి గట్టమ్మ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. గుట్ట మలుపులో ఈ ఆలయం ఉంది. పక్కన ఎక్కువ స్థలం అందుబాటులో లేదు. ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పార్కింగ్ ఏరియాను విస్తరించాలి. మేడారం జాతరను సందర్భంగా అనుమానితులుగా ఉన్న దొంగలను ముందుగానే అదుపులోకి తీసుకున్నాం. ఇలా సుమారు 70 మందిని అదుపులో ఉంచుకున్నాం. జాతర సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడుతున్న మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నాం. -
ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘గత జాతరలో ఐటీడీఏ పీఓ హోదాలో పనిచేశాను. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే విధుల్లో పాల్గొన్నాను. తల్లిని ఆలయం బయటకు తీసుకువచ్చే సమయంలో వచ్చే జాతరలో నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు అని మొక్కుకున్నా.. ఆ తర్వాత జిల్లాల విభజన కావడం జయశంకర్ జిల్లాకు నేను జాయింట్ కలెక్టర్గా నియమించబడ్డాను. అంతేకాదు జాతరకు ముందే నాకు ఐఏఎస్ హోదా వచ్చింది. ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. టీడీఏ పీఓగా, జాయింట్ కలెక్టర్గా రెండు సార్లు ఆయన జాతర విధులు నిర్వర్తించారు. ఈ జాతర అనుభవాలు, వచ్చే జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేసీ ‘సాక్షి’ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... కలిసికట్టుగా పని చేశారు... జాతర నిర్వహణకు సరిపడా ఉద్యోగులు జయశంకర్ జిల్లాలో ఉన్నారు. అయితే వీరికి జాతరలో పని చేసిన అనుభవం లేదు. అందువల్లే ఇతర జిల్లాల నుంచి అధికారులు, సిబ్బందిని రప్పించాం. అందరు ఇది మన జాతర అన్నట్లుగా పని చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వసతి, సమయానికి భోజనం అందించాం. ఎవరు ఏ విధులు నిర్వహించాలో చెప్పాం. అంతా కలిసికట్టుగా పని చేశారు. అంతేకాదు వచ్చే జాతరకు అనుగుణంగా జిల్లాలో ఉన్న 400 మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వచ్చే జాతర పూర్తిగా జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగంతో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. నెల రోజుల ముందే... గతంతో పోల్చితే మేడారం భక్తుల సంఖ్య పెరిగిపోయింది. జాతరకు నెల రోజు ముందు నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలన్నీ నెల రోజులు మందుగానే పూర్తి చేయాలి. అంతేకాదు ఇక నుంచి జాతరకు వచ్చే వీఐపీల సంఖ్య పెరుగుతుంది. వీఐపీల రాక సందర్భంగా భక్తుల క్యూ లైన్లను ఆపేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలు, భక్తులు ఒకే సారి దర్శనం చేసుకోవాల్సి వస్తే.. భక్తులు గద్దెల మీదకు బెల్లం విసరకుండా చూడాలి. దీని కోసం భక్తులకు అవగాహన కల్పించాలి. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమ్ కేటాయించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. సౌకర్యాలు పెరగాలి.. జాతర సందర్భంగా ప్రతీసారి తాత్కాలిక ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాం. ఇకపై శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలి. జాతర సమయంలో సిబ్బంది బస చేసేందుకు విరివిగా డార్మిటరీలు నిర్మించాలి. సాధారణ రోజుల్లో వీటిని భక్తులకు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వల్ల నీటి వృథాతో పాటు జాతర పరిసరాల్లో బురద ఎక్కువ అవుతోంది. దీన్ని నివారించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్ల ద్వారా నీటి సరఫరా చేయాలి. చెత్త నిర్వహణకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. కోళ్లు, మేకల వ్యర్థాల కోసం ఇన్సులేటర్లు అందుబాటులో ఉంచాలి. ఇంటింటికీ వైద్యం... గతంలో జాతర తర్వాత మేడారం పరిసర ప్రాంత ప్రజల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించే వాళ్లు. ఈసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడే చికిత్స అందిస్తున్నారు. జాతర తర్వాత 15 రోజుల వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. టాయిలెట్ల నిర్మాణం కోసం నిర్మించిన బేస్మెంట్లను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తొలగిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం. -
నేడు తిరుగువారం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో సమ్మక్క–సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్యేంత వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించనున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఒర్చుకుని తల్లుల చెంతకు వచ్చిన మొక్కులు చెల్లించిన భక్తజనాన్ని, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ తిరుగువారం పండుగ సందర్భంగా దేవతలను వేడుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా దేవతలను మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు తిరుగువారం పండుగా నిర్వహిస్తారు. పూజారులు గుడిని నీటితో శుద్ధి చేయనున్నారు. పూజారులు తలస్నానాలు అచారించి గుడిలో సమ్మక్క తల్లికి ధూప, దీపాలతో ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. యాటను బలిచ్చి నైవేద్యంగా పెడతారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో కూడా పూజారులు తిరుగువారం పండుగాను నిర్వహిస్తారు. ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. వడెరాల కుండాలను పసుపు, కుంకుమలతో అలకరిస్తారు. సారలమ్మకు ధూప, దీపాలతో పూజలు నిర్వహిస్తారు. తిరుగువారం పండుగతో తల్లుల పూజలు ముగిస్తాయి. మహా జాతరలో తల్లుల సేవలో తరించిపోయిన పూజారులు తిరుగువారం పండుగ పూజల అనంతరం మళ్లీ ఏడాది మధ్యలో నిర్వహించే మినీ జాతర వరకు సా«ధారణ వ్యక్తులుగా మారిపోతారు. పూజారుల ఇళ్లలో కూడా.. మేడారం కన్నెపల్లిలోని సమ్మక్క–సారలమ్మ పూజారులు, ఆదివాసీలు తమతమ ఇళ్లలో తిరుగువారం పండుగాను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసుకుని ఇంటిì గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అమ్మవార్ల గుడికి వెళ్లి కూడా పూజలు నిర్వహిస్తారు. కోళ్లు, యాటలను సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. పండుగ సంరద్భంగా సమ్మక్క గుడి వద్ద కూడా ఆదివాసీలు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా ఇంటికి ఆహ్వానించిన బంధువులు, ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పెట్టి సాగనంపుతారు. ఈ సందర్భంగా బంధువులు పూజారుల ఆశీస్సులు తీసుకుంటారు. మంగపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ముగిసి మూడు రోజులు అవుతోంది. నేడు తిరుగువారం పండుగ అయినప్పటికీ భక్తులు ఇంకా మేడారానికి వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించి గద్దెల సమీపం ప్రాంతాలు, ఆర్టీసీ బస్పాయింట్ వద్ద వంటలు వండుకుని భోజనాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. బుధవారం తిరుగువారం పండుగ రోజు సమక్క–సారలమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. ప్రయాణికుల చేరవేత ద్వారా అదనంగా ఆదాయం గడించింది. గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత మెరుగుపడింది. రీజినల్లో అన్ని డిపోలకు చెందిన అధికారులు నష్టాలను పూడ్చుకునేందుకు అందివచ్చిన జాతరపై ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బస్సులు నడిపించారు. మంచిర్యాల జిల్లా నుంచి మేడారం జాతరకు అత్యధికంగా భక్తులు వెళ్లడాన్ని గ్రహించిన యాజమాన్యం ఈ దఫా అక్కడి నుంచే బస్సులు నడిపించే ఏర్పాటు చేసుకుంది. రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ఆయా డిపోల మేనేజర్లతో సమన్వయం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మందమర్రి, శ్రీరాంపూర్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా డిపోల డీఎంలు పర్యవేక్షిస్తూ బస్సులు నడిపించారు. మొత్తం 294 బస్సులు నడిపి 68,975 వేల మంది ప్రయాణికులను ఆర్టీసీ చేరవేసింది. బస్సుల నడపడం ద్వారా రూ.2.08 కోట్ల ఆర్జించింది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పొల్చితే రూ.78 లక్షలు అదనంగా సాధించారు. డిపోల వారీగా.. మంచిర్యాల డిపోకు చెందిన 94 బస్సులను జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి నడిపించారు. లక్షా 61 వేల కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.60.16 లక్షల ఆదాయాన్ని సాధించారు. భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్ నుంచి నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. 83 వేలు కిలోమీటర్ల బస్సులు తిప్పి రూ.28,37,373 సంపాదించారు. ఆసిఫాబాద్ డిపో 60 బస్సులను బెల్లంపల్లి కేంద్రంగా నడిపి రూ.41,69,608 ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన 53 బస్సులను చెన్నూరు కేంద్రంగా 33 వేల కిలోమీటర్లు నడిపి ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.41.03 లక్షల ఆదాయం సాధించారు. నిర్మల్ డిపోకు చెందిన 52 బస్సులను మందమర్రి కేంద్రంగా నడిపారు. ప్రయాణికులను మందమర్రి నుంచి మేడారం చేరవేయడం ద్వారా రూ.36.18 లక్షల ఆదాయం సమకూరింది. మంచిర్యాల డిపో నుంచి 2016లో 127 బస్సులు నడిచాయి. 844 ట్రిప్పులతో 32,743 మంది భక్తులను చేరవేశారు. ఈసారి 94 బస్సులు 672 ట్రిప్పులతో 18,492 మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గత జాతర కంటే అధికం.. గత మేడారం జాతరతో పోల్చితే ఈసారి అదనపు ఆదాయం సమకూరింది. 2016లో అత్యధికంగా 364 బస్సులు కేటాయించారు. రూ.2.33 కోట్లు ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. మహదేవ్పూర్, కాళేశ్వరం, మంథని కేంద్రాలు రీజినల్ బస్సులు నడిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా లేకపోవడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకువచ్చి నడిపారు. బస్సు నడిచినా లేకపోయినా రోజుకు రూ.11.500 చెల్లించారు. ఈదఫా జాతర కంటే గతంలో 70 బస్సులను అదనంగా తిప్పారు. ఈ జాతర సందర్భంగా అద్దె బస్సులు, ఇతర జిల్లాల నుంచి బస్సులు నడపకపోవడం వల్ల అదనపు ఖర్చు తగ్గింది. ఈసారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలు నుంచి 294 బస్సులు నడిపి రూ.2.08 కోట్లు సాధించారు. మహా శివరాత్రి ఉత్సవాలపై దృష్టి మహా శివరాత్రి నేపథ్యంలో జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి వేలాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు బస్సులు నడపాలని యోచిస్తున్నారు. 25 బస్సులు నడిపి ప్రయాణికులను చేరేవేసేలా చర్యలు చేపట్టారు. కరీంనగర్కు బస్సులు నడపడంతోపాటు రద్దీ ఉంటే ఒకటి, రెండు బస్సులను వేములవాడకు తిప్పాలని చూస్తున్నట్లు డీఎం రజనికృష్ణ తెలిపారు. ఆసిఫాబాద్ డిపో నుంచి బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది. సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాం.. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, అధికారులంతా సమన్వయంతో పనిచేశారు. జాతర వెళ్లే భక్తులకు ఎక్కడ ఇక్కట్లు ఎదురుకాకుండా చూశాం. రీజియన్ నుంచి 294 బస్సులు నడిపి రూ.2.06 కోట్లు ఆదాయం సాధించాం. మంచిర్యాల–మేడారం–మంచిర్యాలకు 68,975 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. సాధారణ రోజుల కంటే రూ.78 లక్షల అదనపు ఆదాయం ఆర్టీసీకి సమకూరడం సంతోషాన్ని కలిగిస్తోంది. – రాజేంద్రప్రసాద్, రీజినల్ మేనేజర్ ఆదిలాబాద్ -
అప్పుడే తేలిపోయింది
ములుగు: మేడారం జాతరలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, నల్లాల పనితీరు తేలిపోయింది. రూ. కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. వాస్తవానికి సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినప్పటికీ, సంప్రదాయం ప్రకారం మరో వారంపాటు తిరుగు వారం పేరుతో వేలాది మంది అమ్మలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం అమ్మలు వన ప్రవే శం చేసినా.. ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల, మంచినీటి నల్లాలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్లు లేవు.. నీళ్లు రావు.. మహా జాతరను పురస్కరించుకుని ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఈసారి 10 వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఇందులో సుమారు 6 వేల మరుగుదొడ్లను ప్రధానంగా చిలుకలగుట్ట, జంపన్న వాగు స్నానఘట్టాలు, పడిగాపురం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, ఆర్టీసీ బస్ పాయింట్, కొంగల మడుగు, నార్లాపురం, చింతల్క్రాస్తో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మించారు. వాటికి నీటి సరఫరా విషయంలో మొదట్లో తడబడిన అధికారులు జాతర ముగింపు సమయంలో తేరుకుని భక్తుల అవసరాలకు అనుగణంగా అందించడంతో సఫలీ కతమయ్యారు. కాని, శనివారం రాత్రి నుంచి మరుగుదొడ్ల తీ రు అధ్వానంగా మారింది. అత్యవసరానికి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసిన భక్తులకు నిరాశను కల్పించిం ది. ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల ద్వారాలు, బేషన్లు పూర్తిగా ధ్వంసమై ఉం డడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జాతర పరిసరాల్లో మహిళాలు తంటాలు పడ్డా రు. జంపన్న వాగు పక్కన సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, శాశ్వ త ప్రాదిపదికన నిర్మించిన సులభ్ కాం పెక్స్లను ఆశ్రయిం చారు. మరుగుదొడ్ల సంగతి ఇలా ఉండగా.. వంటలు, ఇతర అవసరాల కోసం అధికారులు ఏర్పా టు చేసిన నల్లాలు అలంకార ప్రాయంగానే మారాయి. నల్లా ల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు నేలకొరిగి కనిపించాయి. మొత్తానికి జాతర జరిగిన నాలుగు రోజులు మాత్రమే పనికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని భక్తులు వాపోయారు. -
నాలుగు రోజులు.. మొక్కుల పరవళ్లు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం.. ఓ అద్భుతం.. సమ్మక్క–సారలమ్మ జాతర పేరుకే నాలుగు రోజుల పండుగ.. కానీ, ఈ మహా ఘట్టం నడక మాత్రం దాదాపు నెల రోజులకుపైగా సాగింది. జనవరి నెలలో సంక్రాంతి సెలవులతో ఊపందుకున్న భక్తుల రాకపోకలు తల్లుల వన ప్రవేశం ముగిసినా.. ఇంకా కొనసాగుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మహా జాతర ఎంతో కనుల పండువగా సాగింది. సంక్రాంతి పండుగ తర్వాత రోజుకు లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు జాతరకు ముందస్తుగా తరలివచ్చి మొక్కులు చెల్లించారు. గుడిమెలిగె, మండమెలిగె పండుగతో ప్రారంభమైన జాతర సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి వచ్చేంత వరకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివచ్చారు. ఆనాటి నుంచి జాతర నాలుగు రోజుల్లో కోటి మంది భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 31న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనంతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 1న వరాల తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరడంతో భక్తులతో మేడారం పోటెత్తింది. 2న సర్వత్ర మొక్కులు చెల్లించి మనసార అమ్మలను దర్శించుకున్నారు. 3న సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపెల్లికి వనమెళ్లగా, పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు వెళ్లారు. అయినప్పటికీ ఆదివారం రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన మొక్కులు చెల్లించారు. ఇబ్బందు పడిన భక్తులు... జాతర ప్రారంభానికి ముందుగా భక్తులకు అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లు భక్తుల రద్దీ పెరగడంతో కులాయి వద్ద నీళ్లు లేకపోవడంతో భక్తులు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడ్డారు. జాతరకు వారం రోజుల ముందే మేడారానికి తరలిచ్చిన భక్తులకు తాగునీటి సమస్య వెంటాడింది. అధికారులు మేల్గొనప్పటికీ అంతంతా మాత్రంగానే తాగునీటిని సరఫరా చేశారు. రెడ్డిగూడెం రోడ్లన్నీ కూడా బురదగా మారడంతో రోడ్లపై నడిచేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి బుధ, ఆదివారాల్లో సైతం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది చేసి అమ్మలకు మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. సెలవు రోజుల వచ్చిదంటే ఆ రోజు మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతోంది. మాయమైన మహా నగరం... తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులతో కుగ్రామంగా ఉన్న మేడారం మహా నగరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ప్రాంతంలో గుడారులు వేసుకుని అమ్మల రాక కోసం ఎదురుచూశారు. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు మొక్కులు చెల్లించారు. దేవతల వనప్రవేశంతోనే భక్తులు సైతం తమ గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో మహా నగరం ఒక్కసారి గా మాయమైనట్లుగా కనిపిస్తోంది. -
ప్రయత్నం.. మిశ్రమ ఫలితం
అమ్మల చెంత కిక్కిరిసి జనం మొక్కులు చెల్లించి తరించారు.. ఈ భక్తప్రవా హానికి తగిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర టూరిజం, ఎకో టూరిజం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు అందరిని ఆకట్టుకున్నాయి. వాటిలో సేదతీరిన వీఐపీ భక్తులు టూరిజం శాఖ సేవలు భేష్ అని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మిశ్రమ స్పందనను వెలిబుచ్చారు. ములుగు: మేడారం మహా జాతరకు రెండురోజుల ముందు నుంచి టూరిజం శాఖ ఆన్లైన్ పద్ధతిన అటవీశాఖ ఏకోటూరిజం సెల్ఫోన్ నంబర్ ద్వార బుకింగ్ ఆహ్వానించారు. తెలంగాణ టూరిజం తరఫున ఏర్పాటు చేసిన లగ్జరీ గుడారాలకు సౌకర్యాల విషయంలో మంచి స్పందన వచ్చింది. ఏకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. మొత్తానికి టూరిజం శాఖ భళా..అనిపించుకోగా, ఏకో టూరిజం శాఖ తరఫున ఏర్పాటు చేసిన గుడారాలు ఢీలా పడ్డాయి. ప్రత్యేక ఆకర్షణగా టూరిజం గుడారాలు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల, గిరిజన ఆదివాసీ మ్యూజియంల మధ్యలో ఈ జాతరలో భాగంగా 47 గుడారాలను ఏర్పాటు చేశారు. ఇందులో 20 లగ్జరీ గుడారాలు, 10 వీఐపీ, మరో 10 వీవీఐపీ గుడారాలు ఉన్నాయి. బుధవారం– 27, గురువారం –32, శుక్రవారం –44, శనివారం–45 గుడారాలు బుకింగ్ అ య్యా యి. ఇందులో రెండు లగ్జరీ గుడారాలను ఇంటర్నేషనల్ ప్రిలాన్స్ మీడియాకు కేంద్రం తరుపున బుకింగ్ చేయించారు. గుడారాల్లో ఏర్పాటు చేసిన బెడ్లు, ఫ్యాన్, కూలర్ల సౌకర్యాలు బాగున్నాయని వీవీఐపీ భక్తులు తెలిపారు. ఈ గుడారాలు మేడారం సమ్మక్క–సారమ్మల గద్దెలకు దగ్గరగా ఉండడంతో వీఐపీల దర్శనం సులువుగా మారింది. పైగా బుకింగ్ చేసుకున్న భక్తుల వాహనాలను నేరుగా గుడారాల వద్దకు పార్కింగ్ చేసుకునే విధంగా టూరిజంశాఖ తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో సఫలమయింది. అటవీశాఖకు ఆదరణ కరువు అటవీశాఖ ఏకోటూరిజం ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుక భాగంలో 100 గుడారాలను ఏర్పాటు చేశారు. 12 గంటల సమయానికి రూ.800, 24 గంటల పాటు ఉండడానికి రూ.1500లను కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా బుకింగ్కు ఆహ్వానించారు. గుడారాలను ఏర్పాటు చేసిన రెండోరోజు నుంచి బుకింగ్ ప్రారంభమైనా భక్తుల నుంచి ఆదరణ కరువైంది. కేవలం ఫోన్నెంబర్ల ఆధారంగా మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో అధికారుల ప్రయత్నం విఫలమైనట్లు తెలిసింది. జాతర జరిగిన బుధవారం–27, గురువారం–,80 శుక్రవారం–60 శనివారం– 30 గుడారాలు మాత్రమే బుకింగ్ అయినట్లు సంబంధిత శాఖ సిబ్బంది తెలిపారు. గుడారాల్లో రాత్రి పూట పడుకునే సమయంలో పొలాల్లోని మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డామని, ఆలయానికి సుదూరంగా గుడారాలను ఏర్పాటు చేయడంతో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని భక్తులు వాపోతున్నారు. పైగా జంపన్నవాగు సమీపంలో ఏర్పాటు చేయడంతో దర్శనానికి సాధారణ భక్తులతో పాటు కిలో మీటరుకు పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఫొటో షూట్ చేసి అంతర్జాతీయ మీడియాకు అందిస్తున్నాం. మేడారంలో జాతర జరుగుతుందని తెలిసి అంతర్జాతీయ మీడియా తరుపున గత నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. టూరిజం శాఖ తరుపున కేటాయించిన లగ్జరీ గుడారాలు బాగున్నాయి. రెండు బెడ్లు, ఫ్యాన్, కూలర్లు సౌకర్యంగా ఉన్నాయి. మరుగుదొడ్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. టూరిజం గుడారాలు ఏర్పాట్లు పూర్తిగా నచ్చాయి. – క్రిస్టియానా, జూలియట్ (బ్రెజిల్, జర్మనీ వాసులు) ఇబ్బందులు పడ్డాం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో 12 గంటల పాటు ఉండడానికి రూ.1000 చెల్లించి బుకింగ్ చేసుకున్నాం. వీఐపీ భక్తులుగా బుక్ చేసుకున్నా వాహనాలు కన్నెపల్లి పార్కింగ్ ప్రాంతంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి గుడారాలకు సామగ్రిని మోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డాం. టూరిజం శాఖ తరుపున బుకింగ్ చేసుకున్న వారికి గుడారాల వరకు అనుమతి ఇచ్చిన అధికారులు, ఏకో టూరిజం గుడారాలను బుకింగ్ చేసుకున్న మాకు అనుమతి ఇవ్వలేదు. – జీవన్ కుమార్, వరంగల్ పరుపులు లేక ఇబ్బంది పడ్డాం అటవీశాఖ తరుపున గుడారాలను ఏర్పాటు చేశారని తెలిసి 24గంటల పాటు ఉండడానికి రూ.1500 చెల్లించి ప్రకటించిన ఫోన్ నెంబర్ అధారంగా గుడారాన్ని బుకింగ్ చేసుకున్నాం. గుడారంలో ఎనిమిదిమంది పడుకునే విధంగా సౌకర్యం ఉంది. కాకపోతే పడుకోవడానికి వీలుగా గుడారంలో పరుపులు ఏర్పాటు చేస్తే బాగుండేది. పొలాల్లో గుడారాలు ఉండడంతో మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డాం. – గడ్డం శ్రీనివాస్,కొత్తగూడెం -
బోసిపోయిన మేడారం
మహా నగరంగా మారిన మేడారం ఖాళీ అవుతోంది. ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ శనివారం వన ప్రవేశం చేడయంతో జాతర వచ్చిన భక్తులు, వ్యాపారస్తులు ఇంటి దారి పట్టారు. దీంతో ఆదివారం జాతర ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. నిన్నమొన్నటి వరకు భక్తులతో కిటకిటలాడిన జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. ట్రాఫిక్ రోదనలు, భక్తుల కోలాహలం కనిపించిన మేడారం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. ఏటూరునాగారం: ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అశేష భక్తజనం తరలివచ్చారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన మహా జాతర శనివారం దేవతల వనప్రవేశంతో ముగిసింది. భక్తులంతా వచ్చిన దారికి తిరుగు పయనమయ్యారు. జనవరి 12 నుంచి ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు జాతరకు వచ్చి భక్తులకు తన వస్తువులను అమ్ముకుని వ్యాపారాన్ని సాగించుకున్నారు. ఆశించిన మేర వ్యాపారం సాగకపోవడంతో మిగిలిన సామానును వెనుకకు పట్టుకుపోలేక రూ. 50, వంద రూపాలయ విక్రయించడం మొదలు పెట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వీరికి బొమ్మలు, ఇతర వస్తువులను అగ్గువకు విక్రయించడం గమనార్హం. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చాయని, లాభాలు రాలేదని వాపోయారు. మిగిలిన సామానును తీసుకెళ్లే ట్రాస్టుపోర్ట్ భారం మీద పడుతుందని, ఇక్కడే తక్కువకు విక్రయిస్తున్నట్లు అన్నం కృష్ణ అనే వ్యాపారి తెలిపారు. కొంత మంది వ్యాపారులు వారి సామగ్రిని సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టారు. మేడారం జాతరలోని షాపులన్ని దాదాపుగా ఖాళీ కావడంతో అంతా బోసిపోయి కనిపిస్తోంది. మళ్లీ రెండేళ్లకు వస్తా.. తల్లీ సల్లంగా చూడు.. అని వ్యాపారులు వారివారి సొంత గ్రామాల దారిపట్టారు. దీంతో మేడారం అంతా ప్యాకప్ అయ్యింది. మ్యూజియం మూసివేత... మేడారం వచ్చే పర్యాటక భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆదివాసీ మ్యూజియాన్ని మూసివేశారు. మేడారం జాతర సందర్భంగా హడావుడి చేసి ప్రారంభించిన మ్యూజియానికి ఎవరు రావడం లేదనే సాకుతో మూసివేయడం బాధాకరం. సెలవు దినాలు, ఇతర సమయాలో కూడా మ్యూజియాన్ని ప్రదర్శనకు ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మేడారం వచ్చే వారికి దేవతలను దర్శించుకోవడమే కాకుండా ఇలాంటి పూర్వపు కాలపు చరిత్రలను తెలిపే మ్యూజియం పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. పేరుకుపోయిన ఖాళీ సీసాలు జాతరకు వచ్చిన భక్తులు తాగి పడేసిన బీరు సీసాలు, వాటర్ బాటిళ్లను ప్రతి ఒక్కటిని సేకరించే పనిలో పడ్డారు కొంత మంది పాతసామాను సేకరించే వ్యాపారులు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వేలాది బాటిళ్లు కుప్పలు తెప్పలు పేరుకుపోయాయి. వాటిని కొంత మంది పాతసామాను వ్యాపారులు పోగు చేసి రిసైక్లింగ్కు తరలిస్తున్నారు. ఇప్పటికే బస్తాల్లో నింపి బాటిళ్లు సుమారు పది లారీల, ఇతర వాహనాల్లో వరకు తరలించుకుపోయారు. -
వనంలోకి జనదేవత!
-
మేడారం జాతర సంపూర్ణం
-
వనంలోకి జనదేవత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: భక్తుల ఇలవేల్పు.. కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లులు.. భక్త కోటిని చల్లగా కాచిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు వన ప్రవేశం చేశారు. భక్తులను కాపాడేందుకు మళ్లీ రెండేళ్లకు వస్తామంటూ వీడ్కోలు పలికారు. దీంతో సమ్మక్క–సారలమ్మ నినాదాల హోరుతో మార్మోగిన మేడారం గిరులు నిశ్శబ్దంలోకి జారిపోయాయి. భక్తుల పాద స్పర్శతో రేగిన ధూళిమేఘాలు ఆగిపోయాయి. సమ్మక్క–సారలమ్మతో పాటే పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు పయనమయ్యారు. వచ్చే జాతర నాటికి వస్తామంటూ భక్తులు ఇంటిముఖం పట్టారు. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించేందుకు తులాభారం వేసుకుంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ మళ్లీ వస్తాం.. వనదేవతల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 6.30 గంటలకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజలు ప్రారంభమయ్యాయి. డోలు వాయిద్యాలు, బూరలు లయబద్ధంగా వాయిస్తూ గద్దెలపై పూజలు చేశారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత 6.50 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు గద్దె దిగారు. ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలకలగుట్టకు పయనమయ్యారు. సాయంత్రం 6.51 గంటలకు పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని మరికొందరు పూజారులు గద్దె దిగారు. చివరగా సాయంత్రం 6.55 గంటలకు సారలమ్మను తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. అమ్మల వనప్రవేశ కార్యక్రమం జరిగినంత సేపూ భక్తులు రెప్ప వాల్చకుండా తన్మయత్వంతో తిలకించారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. మేడారం జాతర తొలిరోజు వరంగల్–పస్రా మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అనేకచోట్ల టాయిలెట్లకు నీటి సరఫరా కాలేదు. తాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మేడారంలో 4 రోజుల పాటు బస చేసి స్వయంగా పర్యవేక్షించారు. జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు కోటి మంది భక్తులు వనదేవతలను సందర్శించుకున్నట్లు అంచనా. జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ కర్ణన్, జాయింట్ కలెక్టర్ అమయ్కుమార్, ఎస్పీ భాస్కరన్ నిరంతరం జాతరను పర్యవేక్షించారు. ప్రముఖుల తాకిడి ఆదివాసీలు, సామాన్యుల జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి వీఐపీల తాకిడి పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో డ్రోన్ కెమెరాలను వినియోగించారు. వీఐపీల తాకిడి పెరగడంతో పలుమార్లు క్యూలైన్లు గంటల పాటు నిలిపేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చత్తీస్గఢ్కు చెందిన భక్తులు తరలివచ్చి నాలుగు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర విశేషాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ మీడియా ఈసారి ఇక్కడే 4 రోజుల పాటు ఉంది. తొలిసారిగా ఇటలీ, అమెరికా, సింగపూర్తో పాటు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు 4 రోజుల పాటు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం, క్యూలైన్లలో కొబ్బరి చిప్పలు, బెల్లం ముద్దలు పేరుకుపోవడంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మళ్లీ రెండేళ్లకు.. జాతర ముగియడంతో తిరిగి 2020 మాఘమాసంలో మేడారం జాతర జరగనుంది. మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. ఆర్టీసీ బస్సులు నిర్విరామంగా సేవలందించాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య పస్రా–తాడ్వాయి–మేడారం మధ్య ట్రాఫిక్ రద్దీ పెరగడంతో వన్వే విషయంలో సడలింపు ఇచ్చారు. ప్రైవేట్ వాహనాలను పస్రా–మేడారం మార్గంలో అనుమతించారు. -
తనువంతా.. తన్మయం
కరీంనగర్ : డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య.. కోయపూజారులు వనంలోంచి తీసుకురాగా.. కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క, సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరారు. ఇద్దరు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లావ్యాప్తంగా జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. పల్లె, పట్నం తేడాలేకుండా భక్తులదారులన్నీ జాతరవైపే కదిలాయి. మదినిండా అమ్మవార్లను ఉంచుకుని మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనదేవతలైన తల్లీబిడ్డలకు ఒడిబియ్యం సమర్పించారు. పసుపు, కుంకుమతోపాటు ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. పోటెత్తిన జనం... జిల్లావ్యాప్తంగా 31 చోట్ల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. కరీంనగర్కు అనుకుని ఉన్న రేకుర్తి జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు, హుజూరాబాద్లోని రంగనాయకులగుట్ట జాతరకు రెండున్నర లక్షలు, చింతకుంట, నగునూర్, హౌసింగ్బోర్డు కాలనీ, ఇరుకుల్ల, బొమ్మకల్, జూపాక, సైదాపూర్, జమ్మికుంట, కేశవపట్నం, చొప్పదండి , ఆర్నకొండ, గుమ్లాపూర్, రాగంపేట, గంగాధర మండలం బూరుగుపల్లి, రామడుగు, తిర్మలాపూర్, గుండి, జమ్మికుంట, తనుగుల, వావిలాల, ఇల్లందకుంట, గన్నేరువరం, మానకొండూర్, దేవంపల్లి, కొండపల్కల, లింగాపూర్ జాతరకు సుమారు 50 వేల నుంచి లక్ష మధ్య భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పలుచోట్ల జాతరలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకుని భక్తుల ఏర్పాట్లు పరిశీలించారు. నేడు వనంలోకి.. నాలుగు రోజులపాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మ శనివారం సాయంత్రం కోయపూజారుల మధ్య వనం బాట పట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర ఘట్టం ముగిసినట్లవుతుంది. నగర రోడ్లు నిర్మానుష్యం.. ఎప్పుడూ వాహనాల రద్దీతో గజిబిజిగా ఉండే జిల్లాకేంద్రంలోని రోడ్లన్నీ నాలుగు రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రధాన చౌరస్తాలైన తెలంగాణచౌక్, కోర్టుచౌక్, కమాన్చౌక్, టవర్సర్కిల్, మంకమ్మతోట లేబర్ అడ్డా, మంచిర్యాల చౌరస్తా, రాంనగర్ చౌరస్తాలు సైతం బోసిపోయాయి. -
మేడారంలో పోటెత్తిన భక్తులు
సాక్షి, భూపాలపల్లి: చివరి రోజైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలివచ్చారు. అదేవిధంగా తెలంగాణ సీఎస్ ఎస్కె జోషి, డీజీపీ మహేందర్రెడ్డిలు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
నా జన్మ ధన్యమైంది...
మేడారం: మేడారం సమక్క–సారలమ్మలను వనం నుంచి జనంలోకి తీసుకువచ్చే బృహత్తర ఘట్టంలో అవకాశం లభించడంతో తన జన్మ ధన్యమైందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మేడారంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మలను తీసుకొచ్చే బృందంలో తనకు చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి చేరుకుని సేవలు అందించే భాగ్యం కలగడానికి కారణం అమ్మల ఆశీస్సులే అని అన్నారు. మేడారంలో ఉంటూ జాతరలో భక్తులకు సేవలు అందిస్తానని తాను ఊహించలేదన్నారు. మేడారంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లోని పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. మేడారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 56 స్వచ్ఛ ఆటోలు, 20 ట్యాంకర్లు, 600మంది పారిశుద్ధ్య కార్మికులు, 30మంది జవాన్లు, ఆరుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఒక సూపర్వైజర్తో పాటు ఎంహెచ్ఓలు జాతరలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారని మేయర్ చెప్పారు. ఇక నాలుగు రోజులుగా మేడారంలో సారలమ్మ, సమ్మక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తించినట్లు తెలిపారు. ఇక జాతరలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన, వసతులు ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్ట్ల్లో కార్మికులు జాతరలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారని, తాను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కాగా, గత పాలకుల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరలో భక్తులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకున్న భక్తులకు అదే తరహాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సేవలు అందిస్తోందని చెప్పారు. -
ఆర్టీసీ ఆదాయం రూ. 9 కోట్లు
మేడారం: మేడారం మహాజాతరకు భక్తులను చేర్చడంతో ఆర్టీసీ కీలకపాత్ర పోషించిందని ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నంనాటికి ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి జాతరకు సు మారు 5 లక్షల మంది ప్రయాణికులను, జాతర నుంచి గమ్యస్థానాలకు సుమారు 2 లక్షల మందిని చేర్చినట్లు తెలిపారు. ఇలా ఆర్టీసీకి సుమారు రూ.9 కోట్ల ఆదా యం వచ్చిందని ఆయన వెల్లడించారు. పాత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి సుమారు 2,200 బస్సులు నడుపగా ఇతర జిల్లాల నుంచి సుమారు 2000 బస్సులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఉచితంగా.... నార్లాపూర్ నుంచి జంపన్న వాగుకు భక్తులను చేర్చేందుకు ఆర్టీసీ తొలిసారిగా ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసింది. జంపన్నవాగుకు ఉచిత బస్సుల ద్వారా సుమారు 40 వేల మందిని చేర్చారు. మహారాష్ట్ర సిరొంచ ప్రాంతం నుంచి జాతరకు తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించారు. సుమారు 40 బస్సు సర్వీసులు నడిపారు. జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ములుగు రోడ్డులో దిగి వరంగల్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులను లింక్ బస్సుల ద్వారా ఉచితంగా చేర్చినట్లు ఎండీ రమణరావు తెలిపారు. దీంతోపాటు జాతరకు 6 వజ్ర 85 సూపర్ లగ్జరీ, 27 ఏసీ బస్సులు నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. సేవలు అమోఘం : రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి భూపాలపల్లి: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 8 లక్షలమందికిపైగా భక్తులను తరలించినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్లోని కంట్రోల్ కమాండ్ రూంలో ప్రయాణికుల క్యూరేలింగ్లను ఎండీ రమణారావు, ఈడీలు రవీందర్, పురషోత్తంనాయక్, సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎంలు సూర్యకిరణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలు భేష్.. మేడారం: మేడారం మహాజాతరకు అశేష భక్తజనాన్ని తరలిస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చిన ఆయన ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుకుని భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా అంతకు ముందు ఆయన వాహనం భక్తుల మధ్య ఇరుక్కుపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు చేరుకున్నారు. చైర్మన్ను కలిసిన వారిలో అధికారులు ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు, పురుషోత్తం, సత్యనారాయణ, వెంకట్రావు, సూర్యకిరణ్, మునిశేఖర్, రాములు తదితరులు ఉన్నారు. -ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ -
పోలీసుల ఓవరాక్షన్
ములుగు: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు దూకుడు ప్రదర్శిం చారు. నిబంధనల పేరుతో సామాన్య భక్తులను ము ప్పుతిప్పలు పెట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో గంటపాటు భక్తులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అప్పటికే అమ్మలను దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఉన్న భక్తులు తాగునీటి సౌకర్యం లేక, ఉక్కపోతతో తంటాలుపడ్డారు. ఉపరాష్ట్రపతి, సీఎంలు దర్శించుకొని తిరుగుపయనమైన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. భక్తులపై అరవడంతోపాటు వారిని నెట్టివేశారు. ముఖ్యంగా ఎగ్జిట్ గేటు వద్ద ఉన్న పోలీసులు తొందరగా ఖాళీ చేయాలంటూ మహిళలు, పురుషులు అని చూడకుండా పరుషభాషను ప్రయోగిస్తూ గేటు అవతలికి చొక్కాపట్టి మరీ లాగేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సింగరేణి రెస్క్యూటీం, కేయూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్ట్రెచర్ల ద్వారా బాటధితులను హుటాహుటిన టీటీడీ కళ్యాణ మండపంలోని 50పడకల ఆస్పత్రికి తరలించారు. ప్రముఖుల రాకతో నిలిచిన దర్శనాలు ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ్మవార్లకు మొక్కులు సమర్పించే క్రమంలో గద్దెల ప్రాంగణంలో భక్తులు ఎవరు లేకుండా పోలీసులు ఖాళీ చేయించారు. ఓపిక నశించిన భక్తులు క్యూలైన్ల నుంచే కేకలు వేశారు. పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం కాటారం: మేడారం జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీసుల తీరుపై శుక్రవారం ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీస్ సిబ్బంది భక్తులను అదుపుచేయాల్సింది పోయి గుంపులుగుంపులు గా గద్దెల వద్దకు వెళ్లి బంగారం తీసుకోవడాన్ని వారు గమనించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు పలుమార్లు మైక్సెట్లో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పోలీస్ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతోపాటు మంచె వద్దగల ఎమర్జెన్సీ గేట్ను తమ కుటుంబ సభ్యుల కోసం ఓ పోలీస్ అధికారి ఓపెన్ చేయించగా ఒకేసారి వందలాది మంది భక్తులు లోపలికి వెళ్లడానికి అక్కడికి చేరుకోవడంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఓ పోలీస్ ఉన్నతాధికారిని అప్రమత్తం చేసి గేట్ వెంటనే మూసి వేయాలని ఆదేశించారు. మొన్న కాళిదాసు.. నిన్న కంపాటి.. నేడు సాయి చైతన్య.. ప్రతి మహాజాతర సమయంలో జిల్లా పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. 2014 మహాజాతరలో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ కాళీదాసు ప్రణాళిక లోపంతో వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా వరకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 2016 జాతరలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ జాతరలో యువ ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి చైతన్య, మరో ఇద్దరు ట్రైనీ పోలీసు అధికారులు డీఎస్.చౌహాన్, చేతన కలిసి గద్దెల వద్ద వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులకు పాస్లు ఉన్నప్పటికీ నెట్టివేయడంతో ముగ్గురు రిపోర్టర్లు పడిపోయారు. దీంతో మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద ఉన్న వాచ్ టవర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఐజీ నాగిరెడ్డి వచ్చి మీడియా ప్రతినిధులకు నచ్చజెప్పినా శాంతించలేదు. ప్రతి జాతరలో పోలీసులు ఇదేతీరుగా వ్యవహరిస్తున్నారని ఆయనతో చెప్పారు. పోలీసులు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేయడాన్ని వనదేవతల దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గమనించారు. ప్రెస్మీట్ ఏర్పాటు చేస్తే మీడియా ప్రతినిధులు బహిష్కరించే అవకాశాలుండడంతో ఐజీ నాగిరెడ్డి వచ్చి ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినప్పటికీ మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద కవరేజీని బహిష్కరించారు. -
వనదేవతకు బంగారం సమర్పించిన కేసీఆర్
-
నిలువెత్తు బంగారం సమర్పించిన కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి: మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ప్రకటించారు. రానున్న బడ్జెట్లోనే రెండువందల కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దంపతులు శుక్రవారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన నిలువెత్తు బంగారంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పోరాట పటిమకు సమ్మక్క-సారలమ్మ నిదర్శనమన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం వనదేవతకు మొక్కుకున్నట్లు తెలిపారు. సమైఖ్య పాలనలో జాతర నిర్లక్ష్యానికి గురైందని, రాబోయే జాతరను కనివినీ ఎగరని రీతిలో నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్లకు ఆటంకాలు కలగకుండా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరను ఆయన దక్షిణ భారతదేశ కుంభమేళగా అభివర్ణించారు. ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి...సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రులు,అధికారులను సీఎం అభినందించారు. -
వనదేవతకు మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్
-
రాయల్ స్టాగ్ రూ.1,050 !
వరంగల్: మేడారం జాతరలో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. జాతరలో అధికారికంగా 22 మద్యం షాపులు ఏర్పాటుచేయగా.. యజమానులు సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సిండికేట్ వద్ద భారీ మొత్తంలో అధికారులు మాముళ్లు మాట్లాడుకున్నందునే పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జాతరలోని హోల్సేల్ షాపుల నిర్వహకులు ఎంఆర్పీ రూ. 560 ఉన్న రాయల్స్టాగ్ బాటిల్ను చిరు వ్యాపారులకు రూ. 900 – 950కు ఇవ్వగా వారు రూ.100 కలిపి విక్రయిస్తున్నారు. ఇక ఆఫీసర్స్ ఛాయిస్ ఎమ్ఆర్పీ 110 అయితే.. ఇద్దరు చేతులు మారాక రూ.150, బీరు ధర రూ.150 చేరినా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం. కొబ్బరికాయ రూ. 40 .. కొత్తిమీర రూ.50 ములుగు రూరల్/వెంకటాపురం(కె): మండలంలోని గట్టమ్మ వద్ద టెండరు దక్కించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇదంతా చూస్తూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు వెళ్తున్న భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా భక్తుల సంఖ్యలో పెరిగింది. ఇదే అదనుగా కొబ్బరికాయల దుకాణదారుడు ఉదయం రూ. 40 చొప్పున, సాయంత్రం వరకు రూ.35 చొప్పున విక్రయిస్తున్నాడు. కాగా మేడారం మహాజాతరలో కొత్తిమీర కట్ట రూ.50కు విక్రయిస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మేకలు, కోళ్లతో మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం మాంసం కూర వండుకుంటున్నారు. వాటిలో వేసుకునే కొత్తమీర కొనాలం టే ధర భారీగా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. అయినా తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. (కొత్తిమీర విక్రయిస్తున్న వ్యాపారులు ) ఏస్కో కల్లు సారా.. మేడారం జాతర అంటేనే కోళ్లు, యాటలు, కల్లు, మందుతో మజా చేసే ఉత్సవం. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూంటారు. తొలుత వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. అనంతరం విడిది చేసే ప్రాంతంలో కోళ్లు, యాటలు కోసుకుని సరదాగా గడుపుతుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారం సమీపంలోని కొంతమంది ప్రజలు చీప్లిక్కర్ మందు, తాటికల్లు, గుడాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. -
గద్దె వద్ద తొక్కిసలాట
ఏటూరునాగారం: గద్దెపైన సమ్మక్కను ప్రతిష్ఠించిన తర్వాత మొదటి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు గద్దెలపైకి ఎగబాకారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు కింద పడి పోలీసుల కాళ్లను పట్టుకుని పైకి లేచే ప్రయత్నిం చేశారు. ఈ క్రమంలో పలువురు భక్తులు తమ సెల్ఫోన్లు, పర్సులు పోగొట్టుకున్నారు. పోలీసుల ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని కొందరు గాయపడ్డారు. సమ్మక్కకు మొక్కుల పరవళ్లు మేడారం: వనదేవత సమ్మక్కకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమక్కను మేడారంలోని గద్దెకు తీసుకొచ్చే ఆపూర్వ ఘట్టంలో ఆదివాసీ, గిరిజన సంస్కృతి అడుగడుగునా ప్రతిబింబించింది. అడవితల్లి సమ్మక్కను స్మరించుకుంటూ చిలకలగుట్ట నుంచి గద్దె వరకు భక్తులు నీళ్లతో అలికి వివిధ రకాలు ముగ్గుల వేసి తరించారు. రోడ్డుపై కోళ్లు, గొర్రెలు, మేకలు బలిచ్చి కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మను మనసారా వేడుకున్నారు. కొందరు ముగ్గులపై పూలు వేసి, నిమ్మకాయలు పెట్టి పసుపు, కుంకుమ రుద్దీ కొబ్బరికాయలు కొట్టి అక్కడే మొక్కులు చెల్లించారు. మరికొంత మంది ఆనందంతో బాణాసంచి కాల్చి సమ్మక్కకు స్వాగతం పలికారు. చెట్లు, బస్సులు ఎక్కి.. చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్కను తీసుకొచ్చే అపురూప క్షణాలను కనులారా వీక్షించేందుకు భక్తులు వివిధ మార్గాలను ఆశ్రయించారు. రోడ్డు పక్కన ఉన్న పెద్దపెద్ద చెట్లను, రోడ్డు పక్కన నిలిచిన బస్సులను ఎక్కి జై సమ్మక్క.. జై జై సమ్మక్క అంటూ నినాదాలు చేశారు. భక్తుల ఈలలు, కేరింతలతో చిలకలగుట్ట నుంచి మేడారం మార్గమంతా మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు శివసత్తులు రోడ్డుపైన డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. మహిళలు పూనకంతో ఊగిపోయి సమ్మక్కను స్మరించారు. తల్లీ.. చల్లంగా చూడు అంటూ వేడుకున్నారు. -
సాహో సమ్మక్క
ఎస్ఎస్ తాడ్వాయి/ఏటూరునాగారం: కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవత.. వీరవనిత.. సమ్మక్క తల్లి అధికారిక లాంఛనాలు, భక్తుల జయజయధ్వానాలు, ఉయ్యాల పాటలు, ఒడిబియ్యపు జల్లులు, శివసత్తుల పూనకాల నడుమ చిలకలగుట్టను వీడి భక్తులను దీవించేందుకు మేడారంలోని గద్దెను అధిష్టించింది. తొలుత ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు, వడ్డెలు సమ్మక్కను గుట్ట నుంచి కిందకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జయశంకర్భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, ఎస్పీ ఆర్. భాస్కరన్ ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకు ఘనస్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెల వరకు 2.19 గంటల పాటు జరిగిన సమ్మక్క ప్రయాణం ఆద్యంతం కనుల పండుగగా, ఉద్విగ్నభరితంగా సాగింది. హోరెత్తిన చిలకలగుట్ట.. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తోడ్కొని వచ్చేందుకు పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్రావు, ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూప వడ్డే నాగేశ్వర్రావు, కొమ్ము బూర జనార్దన్ సాయంత్రం 4 గంటల సమయంలో చిలకలగుట్ట పైకి ఎక్కారు. ఈ సందర్భంగా అమ్మ రాక కోసం భక్తులు, ప్రభుత్వ అధికారులు గుట్ట కింద ఎదురుచూశారు. రెండు గంటల పాటు డప్పు వాయిద్యాలతో ఆది వాసీ నృత్యాలు చేశారు.జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ భాస్కరన్, జాయింట్ కలెక్టర్ అమయ్కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, జాతర చైర్మన్ కాక లింగయ్య నృత్యాలు చేశారు. గాలిలోకి నాలుగు సార్లు కాల్పులు.. సమ్మక్క ఆగమనం కోసం రెండు గంటలుగా అలుపెరుగకుండా భక్తులు చిలకలగుట్ట కింద ఎదురు చూశారు. ఈ క్రమంలో గుట్టపై నుంచి పూజారులు, వడ్డెలు దిగుతున్న ఆనవాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం సరిగ్గా 6:14 గంటలకు సమ్మక్కను తీసుకుని ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. ఆయనకు తోడుగా ప్రధాన పూజారులు, వడ్డెలు వచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా ప్రభుత్వ లాంఛనంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. గుట్ట నుంచి సమ్మక్క కొద్దిగా ముందుకు కదలగానే మొదటిసారిగా 6:15 గంటలు, రెండోసారి 6:17 గంటలకు, మూడోసారి 6.19, నాలుగోసారి చిలకలగుట్ట ఫెన్సింగ్ గేటు వద్ద 6:32 నిమిషాలకు గాలిలోకి కాల్పులు జరిపి అమ్మ రాకను భక్తులకు తెలిపారు. కాగా, రెండోసారి కలెక్టర్, ఎస్పీ ఇరువురు కలిసి గాలిలోకి కాల్పులు జరిపారు. దారిపొడవునా నీరాజనం.. మేడారంలోని గద్దెల వైపు సమ్మక్క ప్రయాణం ప్రారంభంకాగానే మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒడిబియ్యం విసిరారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క రాక అపురూప క్షణాలను పురస్కరించుకుని యాటలు, కోళ్లు బలిచ్చారు. సమ్మక్కను కనులారా వీక్షించేందుకు దారికి ఇరువైపులా ఉన్న గోడలు, ఇళ్లు, చెట్లు, వాహనాలు ఎక్కి వరుసగా నిలబడి చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి 8:33 గంటలకు గద్దెపైకి.. గద్దెల ప్రాంగణంలోకి 8:20 గంటలకు సమ్మక్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడ పది నిమిషాల పాటు పూజారులు రహస్య పూజ లు నిర్వహించారు. తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆలయ ప్రాంగణంలో వెలు గులు ప్రసరించే సమయానికి పగిడిద్దరాజు గద్దె వద్ద సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సరిగ్గా 8:33 గంటలకు సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిం చారు. అక్కడ పూజ లు నిర్వహించిన తర్వాత 8:40 గంటలకు సారలమ్మ గద్దె వద్దకు వెళ్లిన సమ్మక్క పూజారులు బిడ్డకు తల్లి ఆశీస్సులు అందించారు. నలుగురు ఒక్కచోట.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరా జు లు గద్దెలపై ఉండడంతో తల్లులను దర్శించుకునేందు కు భక్తులు పోటీపడ్డారు. జంపన్నవాగు, గద్దెల అన్ని దారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తొలి రోజు ట్రాఫిక్ జామ్ కారణంగా రాని భక్తులు గురువారం మేడారానికి పెద్దసంఖ్యలో వచ్చారు.తల్లులను దర్శిం చుకున్న భక్తులు తిరుగుపయనమయ్యారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించిన వెంటనే జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఐటీడీఏ పీఓ చక్రధర్రావు గద్దెపైకి చేరుకుని తొలి మొక్కులు చెల్లించారు. -
మేడారం జాతరకు వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మేడారం జాతరలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శిస్తారు. ఈ సందర్భంగా వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించి వెంకయ్య మొక్కులు చెల్లించుకోనున్నారు. -
మేడారంలో భారీ సంఖ్యలో భక్తులు
-
సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగిన సీఎం!
సాక్షి, వరంగల్ : మేడారం జాతరకు వచ్చిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే... సీఎం రమణ్సింగ్ గురువారం జారతకు వచ్చారు. ఆయన సమ్మక్కను దర్శించుకుని సారలమ్మ వద్దకు వెళుతుండగా మరోవైపు...క్యూలైన్లోని భక్తులు సమ్మక్క గద్దెపైకి కొబ్బరి కాయలు విసిరారు. అదే సమయంలో సీఎం రమణ్ సింగ్ అక్కడే ఉండటంతో కొబ్బరికాయలు వేగంగా వచ్చి పడ్డాయి. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన సురక్షితంగా అక్కడ నుంచి బయటపడ్డారు. దీంతో ఆయన సారలమ్మను దర్శించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,గవర్నర్ నరసింహన్, కేంద్ర కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఓరం తదితరులు శుక్రవారం మేడారం జాతరకు రానున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడే ఉండి, సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. -
పరిమితంగా బీఎస్ఎన్ఎల్ సేవలు
మేడారం: జాతరలో భక్తులకు ఉచితంగా ఇంటర్నెట్ డాటా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేసిన బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ సేవలు పరిమితంగా అందుబాటులోకి వచ్చాయి. జాతర జరిగే ప్రాంతాల్లో 20 హాట్స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసి ఒకరికి 500 ఎంబీ డాటా ఉచితంగా లక్షలాది మందికి అందిస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటించారు. కానీ ఐటీడీఏ, అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో తప్పా, రెడ్డిగూడెం, శివరాంసాగర్, కొత్తూరు, బస్టాండ్, నార్లాపూర్, కాల్వపల్లి తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉచిత డాటా సౌకర్యం అధికారులకు మాత్రమే ఉపయోగపడ్డాయి తప్పా భక్తులు వినియోగించుకోలేకపోయారు. ఇతర ప్రైవేట్ సంస్థలకు సైతం డాటా ప్రొవైడ్ చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. డాటా లేకున్నా కాల్స్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు ఆవేదన చెందారు. కాల్స్ కూడా అంతంతే... మేడారం జాతరలో పెద్ద సంఖ్యలో టవర్లు ఏర్పాటు చేసి భక్తులకు సిగ్నల్ అందిస్తామని ఊదర కొట్టిన సెల్ కంపెనీలు వాస్తవంలో ఎలాంటి సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యా యి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సుమారు 16 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు రోజూ ఒకేసారి 3.5లక్షల మంది మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేయగా, అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో భక్తులు సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. -
మేడారానికి పయనమైన గోవిందరాజులు
ఏటూరునాగారం: సమ్మక్క మరిది గోవిందరాజులు బుధవారం మేడారానికి బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. గుడిలో గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల జనార్దన్, వడ్డె పొదెం బాబు, దబ్బగట్ల కిష్టయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముం దుగా గోవిందరాజుల ఆలయం వద్ద తహసీల్దార్ నరేందర్ సమక్షంలో దబ్బగట్ల వంశస్తులు గోవిందరాజులను వడ్డెలకు అప్పగించారు. డప్పుచపుళ్ల నడుమ గోవిందరాజుల పడగను వడ్డె పొదెం బాబు ఎత్తుకొని నాగుల చుట్టూ ప్రదక్షిణలు చేసి బయలుదేరడంతో భక్తులు, గ్రామస్తులు బెల్లపు శాకను ఆరబోశారు. నీళ్లతో స్వాగతం పలుకుతూ మల్యాలలోని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. వడ్డె పాదాలకు పసుపు, కుంకుమ్మపూసి దూపం వేసి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కను సాదుకున్న మల్లెల మూర్తి ఇంటిలోకి కింద నేలను తాకకుండా చాపలు, చద్దర్లను వేసి లోనికి పూజారులు, వడ్డెలను పడగను పట్టుకొని వెళ్లడంతో వారి సంప్రదాయబద్ధంగా ముడుపులు చెల్లించి వడ్డెలకు పాలను ఇచ్చారు. పాలు తాగిన వడ్డెలు మళ్లీ గోవిందరాజులను కొండాయికి తీసుకువచ్చేవరకు ఇలా ఉపవాసంతో ఉండడం వారి ఆనవాయితీగా వస్తోంది. గోవిందరాజులు వెళ్లే క్రమంలో అందరు నేలపై పడుకుంటే వారిపై నుంచి ఆయన దాటిపోతే సకల సౌభాగ్యాలు కలుగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. అనంతరం అడవి మార్గంలో గోవిందరాజులను మేడారానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై బత్తుల సత్యనారాయణ, స్పెషల్ పార్టీ పోలీసులు భారీ బందోబస్తు నడుమ గోవిందరాజులను మేడారానికి సాగనంపారు. అంతేకాకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో గ్రేహౌండ్స్ దళాలు అడవిలో పెద్ద ఎత్తున మోహరించాయి. కాగా గోవిందరాజులను తీసుకెళ్లే రోడ్డు మార్గం బాగాలేదని పూజారి దబ్బగట్ల గోవర్ధన్, అట్టం నాగరాజు, దబ్బగట్ల రాజారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అన్న కుడితేనే చెల్లికి సంబురం
ఎస్ఎస్ తాడ్వాయి: కన్నెపల్లి జాబిలమ్మ సారలమ్మను గద్దెల మీదకు తీసుకువచ్చే ముందు ప్రధాన పూజారి కాక సారయ్యను సారలమ్మ రూపంలో అలంకరించి పట్టు చీరె, పట్టు జాకెట్ తొడిగించి ఆదివాసీ సంప్రదాయంగా తీసుకువస్తారు. ఈ వస్త్రాలను ప్రత్యేకంగా ఆదివాసీ బిడ్డ అయిన మంగపేటకు చెందిన మద్దెల పాపారావు కుట్టిన వస్త్రాలను తొడగడం ఆనవాయితీగా వస్తోంది. సారలమ్మ అవతారమెత్తిన కాక సారయ్యకు వరుసకు అన్న అయిన పాపారావు కుట్టిన దుస్తులనే ధరిస్తారు. అన్న కుడితేనే చెల్లెకు సంబురంగా పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పాపారావుకు సారలమ్మకు ప్రత్యేకంగా దుస్తులను కుట్టడంతో పాటు, హనుమాన్ జెండాను స్వయంగా పవిత్రంగా ఉపవాస దీక్షలతో తయారు చేయడం విశేషం. ఈ దుస్తులు కూడా కాక సారయ్య ఇంటి వద్దనే నియమనిష్టలతో కుట్టడం విశేషం. -
తొలిరోజే ట్రా‘ఫికర్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: సారలమ్మ గద్దెలపైకి రావడానికి ముందే భక్తులు మేడారం చేరుకోవడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం నుంచే మేడారం వచ్చే భక్తుల రాక మొదలై, మ«ధ్యాహ్నం సమయానికి రద్దీ పెరిగిపోయి సాయంత్రానికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఆర్టీసీ 2,450 బస్సులు మేడారానికి కేటాయించింది. మరోవైపు ప్రైవేట్ వాహనాల ద్వారా వరంగల్ నుంచి మేడారం వచ్చే భక్తుల రద్దీ సాయంత్రానికి పెరిగింది. దీంతో వరంగల్–మేడారం మధ్య వాహనాల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. మేడారం వెళ్లే భక్తులు తొలి మొక్కులు గట్టమ్మ వద్ద చెల్లించుకోవడం ఆనవాయితీ. మేడారం వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు గట్టమ్మ వద్ద ఆపారు. ఇక్కడ పార్కింగ్కు తక్కువ స్థలం కేటాయించడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేదు. దీంతో గట్టమ్మ నుంచి వరంగల్ వైపు వాహనాలు జాకారం వరకు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకే తొలిట్రాఫిక్ జామ్ ఎదురైంది. కొరవడిన వ్యూహం గట్టమ్మ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడ వాహనాలు ఆపకుండా ముందుకు వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. దీంతో గట్టమ్మ దాటి ముందుకు వెళ్లిన వాహనదారులు డిగ్రీ కాలేజీ సమీపంలో ఆపి, వెనక్కి వచ్చి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆప్పటికే హన్మకొండ, వరంగల్, కాజీపేట బస్స్టేషన్లలో భక్తుల తాకిడి పెరిగిపోవడంతో మేడారం వెళ్లిన బస్సులు త్వరగా రావాలనే ఆదేశాలు ఆర్టీసీ సిబ్బందికి అందాయి. దీంతో మేడారం వెళ్లే వాహనాలు.. మేడారం నుంచి తిరుగుప్రయాణమైన ఆర్టీసీ బస్సులు, గట్టమ్మ దర్శనం కోసం నిలిపిన వాహనాలతో ములుగు నుంచి గట్టమ్మ వరకు రెండోసారి ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ములుగు, గట్టమ్మ, మల్లంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. మధ్యాహ్నం వరకు అదే పరిస్థితి.. బుధవారం నుంచి జాతర మొదలవడంతో అన్ని వైపుల నుంచి వాహనాల రద్దీ పెరిగిపోయింది. మంగళవారం సాయంత్రం మేడారం బయల్దేరిన వాహనాలు అప్పటికీ రోడ్లపై ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జంగాలపల్లి క్రాస్రోడ్డు వరకు వచ్చాయి. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం అయింది. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ట్రాఫిక్ అదుపులోకి రాలే దు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టింది. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఉదయం 8 వరకు ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రణాళిక లేమి.. మేడారం జాతరలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. అయితే.. మేడారం వెళ్లే దారిలో హాల్టింగ్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హాల్టింగ్ పాయింట్లకు సంబంధించి కనీస ప్రచారం నిర్వహించలేదు. వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టలేదు. çహాల్టింగ్ పాయింట్లలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో మేడారం వెళ్లే వాహనదారులు మార్గమధ్యలో ఎక్కడా ఆగేందుకు ఆసక్తి చూపలేదు. మంగళవారం సాయంత్రం మేడారానికి పోటెత్తే వాహనాల రద్దీని అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ప్రణాళిక లేమి కారణంగానే ట్రాఫిక్ కష్టాలు వచ్చాయని భక్తులు అంటున్నారు. -
చిలకలగుట్టపై సమ్మక్క శక్తి
ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క. కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దేవత. చిలకలగుట్టపై కొలువైన సమ్మక్కను జాతర సందర్భంగా గద్దెల మీదకు తీసుకురావడం ఉద్విగ్న ఘట్టం. రెండేళ్లకోసారి సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి కిందకు తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు.. గురువారం సమ్మక్క రాకను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -సాక్షి ప్రతినిధి, వరంగల్ మేడారంలో ఆలయంలో సమ్మక్క తల్లి వడేరా కుండ రూపంలో కొలువై ఉంటుంది. సమ్మక్క పూజారులు, గ్రామస్తులకు ఈ దేవత దర్శనం ఉంటుంది. అదే.. సమ్మక్క తల్లి గద్దెలపై సకల జనులకు వెదురు రూపంలో దర్శనమిస్తుంది. పూజారులకు సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండని సమ్మక్క రూపం అత్యంత శక్తిభరితం. ఈ శక్తిని అన్ని వేళలా భరించడం సామాన్యులకు కష్టం. అందువల్లే పూజారులు అత్యంత రహస్య పద్ధ్దతుల్లో సమ్మక్కను చిలకలగుట్టపై ఉంచుతారు. ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం సందర్భంగా సమ్మక్క శక్తి స్వరూపాన్ని చిలకలగుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. ఇందుకోసం మొత్తం 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండు వారాల ముందుగా.. సమ్మక్క శక్తిని మేలుకొలిపే ప్రక్రియ జాతరకు రెండు వారాల ముందుగా మొదలవుతుంది. గుడిమెలిగె పండగ రోజు సమ్మక్క వడ్డెలు(పూజారులు), ఇంటి ఆడపడుచులు మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఒక్కడే చిలకలగుట్టకు చేరుకుని సమ్మక్కకు ఆదివాసీ పద్ధతుల ప్రకారం శక్తిని మేల్కొలిపే ప్రక్రియ చేపడతారు. అనంతరం మండె మెలిగే రోజు మరోసారి చిలకలగుట్టకు చేరుకుని రహస్య పూజలు నిర్వహిస్తారు. చిలకలగుట్టపై సమ్మక్క ఎక్కడ ఉంటుందనేది ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్కు సైతం తెలియదు. చిలకలగుట్ట సగం వరకు ఎక్కిన తర్వాత సమ్మక్క పూనుతుంది. ఆ తర్వాత సమ్మక్క ఆదేశాల ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో సమ్మక్క.. గుట్ట దిగేందుకు సిద్ధమవుతుంది. శాంతి ప్రక్రియ గద్దెలపైకి గురువారం సాయంత్రం చేరిన సమ్మక్క శుక్రవారం అక్కడే ఉండి జాతర నాలుగో రోజు శనివారం తిరిగి చిలకలగుట్టకు చేరుకుంటుంది. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్, వడ్డె కొక్కెర కృష్ణయ్య ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం రోజున తిరుగు వారం పండగ జరుపుతారు. ఈ రోజు గద్దెల ప్రాంగణం శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. సిద్ధబోయిన మునీందర్ మూడోసారి చిలకలగుట్టకు చేరుకుని శక్తి రూపం ధరించిన సమ్మక్క తల్లిని శాంతపరుస్తారు. మళ్లీ రెండేళ్లకు సమ్మక్కను మేలుకొలుపుతామని మాట ఇచ్చి తిరుగుపయనమవుతారు. సమ్మక్క గుడి, గద్దెపై ప్రత్యేక పూజలు ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలగుట్ట నుంచి గురువారం సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకురానున్న నేపథ్యంలో సమ్మక్క పూజారులు, వడ్డెలు సంప్రదాయ బద్దంగా సిద్దబోయిన మునేందర్ ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు, కుంకుమ వడేరాల కుండల్లో గద్దె మీ దకు తీసుకు వచ్చారు. అక్కడ గద్దెపైన అలికి సమ్మక్క ముగ్గులను వేసి పూజ నిర్వహించారు. సమ్మక్క బిడ్డ సారక్క గద్దెపై న కూడా ముగ్గులతో అలంకరించారు. అనంతరం నాగుల వి డిది వద్ద వెళ్లి అక్కడ పూజలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. శక్తి మేలుకోవడం.. సారలమ్మ గద్దెలపైకి చేరిన(బుధవారం) మరుసటి రోజు(గురువారం) సమ్మక్క పూజారులు, వడ్డెలు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేశ్(బాల పూజారి), దోబె పగడయ్య కుమారుడు నాగేశ్వర్రావు, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతోపాటు మేడారం గ్రామానికి చెందిన ఆదివాసీలు చిలకలగుట్టకు బయల్దేరుతారు. చిలకలగుట్టపైకి ఎక్కి దారిలో అందరూ ఆగిపోతారు. అక్కడి నుంచి సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేష్(బాల పూజారి), దోబె నాగేశ్వరరావు.. చిలకలగుట్టపై ఉన్న రహస్య ప్రాంతానికి చేరుకుంటారు. దోబె నాగేశ్వరావు ధూపం పడతారు. మిగిలినవారు అక్కడ రహస్య క్రతువులు నిర్వహించి సమ్మక్కను కిందకు తీసుకొస్తారు. సమ్మక్క రాక కోసం గుట్టపై ఎదురుచూస్తున్న కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతో పాటు మిగిలిన వడ్డేలు, పూజారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. జనసంచారం లేని వనంలో కొలువై ఉండే సమ్మక్క, కాళ్ల తొక్కుళ్లు ఉండే జనంలోకి వస్తుండడంతో.. దీనికి నివారణగా అక్కడ ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మరోసారి రహస్య పద్ధతిలో పూజలు చేస్తారు. తుపాకులగూడెం సమీపంలో ఉన్న ఇప్పచెట్ల నుంచి సేకరించిన ఇప్ప పువ్వుతో చేసిన సారాను సమ్మక్కకు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత ఆదివాసీ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి చేర్చే బాధ్యతను కొక్కెర కృష్ణయ్యకు సిద్ధబోయిన మునీందర్ అప్పగిస్తారు. అప్పటికే పూజా క్రతువు నిర్వహిస్తుండగానే కొక్కెర కృష్ణయ్యను దేవత ఆవహించగా... అచేతన స్థితిలోకి వెళ్తాడు. కొక్కెర కృష్ణయ్యను ఇద్దరు వడ్డెలు పట్టుకుని ముందుకు నడిపిస్తారు. మల్లెల ముత్తయ్య జలకం పట్టితో కృష్ణయ్య పక్కనే ఉంటూ ముందుకు సాగుతారు. దారి మధ్యలో ఎలాంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా జలకంలోని నీళ్లు చల్లుతాడు. వసంతరావు, స్వామి, జనార్దన్ కొమ్ముబూరలు ఊదుతూ వేగంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కింది వైపుకు తీసుకువస్తారు. కొమ్మబూరల శబ్దం వినగానే చిలకలగుట్ట పొదల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమవుతారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతారు. చిలకలగుట్ట కిందకు చేరిన సమ్మక్కకు ఎదుర్కోళ్ల పూజా మందిరం వద్ద మరోసారి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించకుంటే సమ్మక్క అస్సలు ముందుకు కదలదని చెప్తారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కను మేడారం గ్రామం వైపునకు వడివడిగా తీసుకొస్తారు. గ్రామ పొలిమేరలో మేడారానికి చెందిన 11 మంది మహిళలు బిందెలు, కుండల్లో నీళ్లు పట్టుకుని ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. బొడ్రాయికి కోడిపిల్లను తిప్పేస్తారు. -
కన్నుల పండువగా తెలంగాణ కుంభమేళా
-
గద్దెనెక్కిన సారలమ్మ
మేడారం నుంచి సాక్షిప్రతినిధి: వనమంతా జనంతో నిండిపోయింది. జంపన్నవాగు భక్తజన హోరుతో మార్మోగింది. అడవితల్లుల మహాజాతర మొదలైంది! కన్నెపల్లి నుంచి సారలమ్మ.. పూనుగొండ నుంచి పగిడిద్దరాజు.. కొండాయి నుంచి గోవిందరాజులు.. ఈ ముగ్గురి రాకతో బుధవారం మేడారం వన జాతర అంగరంగవైభవంగా షురూ అయింది. సుమారు రాత్రి 12.20 గంటల సమయంలో భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ గద్దెనెక్కింది. అంతకుముందు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8.12 గంటల సమయంలో గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పగిడిద్దరాజు–సమ్మక్క వివాహం కనులపండువగా సాగింది. అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ముగ్గురి రూపాలను అర్ధరాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. సంతాన ‘వరం’కోసం.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె(వెదురు బుట్ట)లో తీసుకొస్తుండగా ఆలయం ప్రహరీ నుంచి వంద మీటర్ల పొడవునా సంతాన భాగ్యం ఎదురు చూసే భక్తులు నేలపై పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అక్కడ్నుంచి జంపన్నవాగుకు సారలమ్మ చేరుకుంది. వంతెన ఉన్నా.. నీటిలో నుంచే నడుస్తూ సారలమ్మ పూజారులు వాగును దాటారు. ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ దుగ్యా ల అమయ్కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే సీతక్క పూజా కార్యక్రమాలను దగ్గరుండి వీక్షించారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారలమ్మ ప్రయాణించే సమయంలో చంద్రగ్రహణం ఉంది. అయినా ఆదివాసీ వడ్డెలు దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. గ్రహణం కొనసాగుతున్నా.. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జంపన్నవాగులో జనహోరు సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి. నేడు సమ్మక్క రాక మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ఘట్టం గురువారం జరుగనుంది. సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. అశేష భక్త జనులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా.. సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గర్భిణి, మరొకరి మృతి నిర్మల్ జిల్లా బాసర మండలం గాంధీనగర్కు చెందిన గర్భిణి సారాబాయి(33) మేడారం వస్తుండగా.. తాడ్వాయి వద్ద పురిటి నొప్పులు వచ్చాయి. ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. బాబు జన్మించాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో సారాబాయిని అంబులెన్స్లో వరంగల్కు తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో పస్రా–జంగాలపల్లి క్రాస్రోడ్డు వద్ద ట్రాఫిక్ జాంలో సుమారు 3 గంటలపాటు కాలయాపన జరిగింది. ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జంపన్న వాగు సమీపంలో సొమ్మసిల్లి పడిపోయిన భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన తాటికొండ రాజనర్సయ్య (50)ను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మరణించాడు. తీరని ట్రాఫిక్ చిక్కులు జాతర ప్రారంభానికి ముందే ట్రాఫిక్ సమస్యలు చుట్టుముట్టాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల పాటు వరంగల్–మేడారం మార్గం మధ్యలో మల్లంపల్లి, గట్టమ్మ, ములుగు, జంగాలపల్లి, పస్రాల వద్ద ట్రాఫిక్ జాం అయింది. వరంగల్ నుంచి మేడారం వరకు సగటున మూడు గంటల ప్రయాణం కాగా.. ఆరేడు గంటల సమయం పట్టింది. ట్రాఫిక్, బందోబస్తును డీజీపీ మహేందర్రెడ్డి పర్యవేక్షించారు. పోటెత్తిన భక్తజనం కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకువచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. మాజీ ఎమ్మెల్యే సీతక్క కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. రాత్రి 7:15 గంటలకు సారలమ్మ పూజారులు కాక సారయ్య, లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావు సారలమ్మ పూజా క్రతువులు ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి ఆలయం నుంచి మేడారం బయల్దేరారు. సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్సైట్ సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్సైట్ను గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఐ–యుగ సీఈవో రజిత్ ఆకుల, ప్రతినిధులు వెంకట్, రజనీకాంత్ తదితరులు ఈ వెబ్సైట్ను రూపొందించారు. దీనిలో మేడారం సమ్మక్క–సారక్క చరిత్ర, ముఖ్య ఘట్టాలు, భక్తులకు అందే సేవలు, అత్యవసర సమయంలో కావాల్సిన వివిధ శాఖల సమాచారం, అధికారుల ఫోన్ నంబర్లు, జాతరకు వెళ్లే మార్గాలు, గూగుల్ మ్యాప్ లింకులు, సమీప ప్రాంతాల్లో దర్శనీయ స్థలాల వివరాలుంటాయని మంత్రి పేర్కొన్నారు. 2006 నుంచి మేడారం జాతరకు ఐ–యుగ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుందని వివరించారు. -
మేడారం ప్రయాణంలో విషాదం: బాలింత మృతి
సాక్షి, వరంగల్: మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ బాలింత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని మృతి చెందింది. వివరాలు.. నిర్మల్ జిల్లా సాద్గం కు చెందిన కళాభాయ్ కుటుంబం సమ్మక్క- సారక్క జాతరకు వచ్చింది. కళా భాయ్ గర్భిణి కావడంతో ఆమెకు జాతర లో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆమెను ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చిన కలాభాయికి అధిక రక్త స్రావం కావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ వెళ్లాల్సిందిగా స్థానిక వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాలింతను అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్తుంగా.. జాతరకు వెళ్లే వాహనాలతో ములుగు నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు, మూడు గంటల పాటు ట్రాఫిక్జాం ఏర్పడటంతో మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
జాతరకు ముందే రూ. కోటి ఆదాయం
భూపాలపల్లి: జాతరకు ముందే ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. జాతర బుధవారం నుంచి జరుగనుండగా మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం వచ్చారు. 52 పాయింట్ల నుంచి వచ్చిన 2,490 బస్సుల్లో 1,04,000 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. కాగా, 48 వేల మంది భక్తులు మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 60 వేల మంది భక్తులు జాతరలోనే ఉన్నారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలకు రానున్న నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం నడిపిస్తున్న సుమారు 2,500 బస్సులతోపాటు అదనంగా మరో 2 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం సూర్యకిరణ్ తెలిపారు. అందుబాటులో అద్దె బండ్లు.. ఎస్ఎస్ తాడ్వాయి: జాతరకు వచ్చిన భక్తులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఎడ్ల బండ్లు మేడారానికి చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సులో మేడారం వచ్చే భక్తులను బస్టాండ్ వద్ద దింపుతున్నారు. ఇక ముల్లెమూటలతో వచ్చిన భక్తులు అద్దె బండ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు వరకు, అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులను తరలించి వారి నుంచి రూ.200 తీసుకుంటున్నారు. అద్దె బండ్లను తీసుకున్న భక్తులు వాటిపై హైహై నాయక అంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ( ఎడ్లబండ్లలో జంపన్నవాగుకు వెళ్తున్న భక్తులు ) -
మేడారం భక్తులకు కాంటెస్ట్
సాక్షి, వరంగల్ రూరల్: మేడారం జాతరలో ఎక్కడ చూసినా భక్తులు సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు.. ఏంటి ఈ సెల్ఫీ పిచ్చి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ఈసారి మేడారం జాతర కాంటెస్ట్–2018 పేరుతో సెల్ఫీ, ఫొటో, షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్కు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ఈ కాంటెస్ట్ను భక్తుల ముందుకు తీసుకొచ్చింది. విజేతలకు నగదు బహుమతులు.. పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తం రూ.4.25 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. సెల్ఫీ మొద టి బహుమతి రూ.25 వేల నగదు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, బెస్ట్ ఫొటోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతి రూ.75 వే లు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు, షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు అందించనున్నారు. ప్రచారం కోసమే.. జాతర విశేషాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్ ఇటీవల స్థానిక యువతతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో యువకులు షార్ట్ ఫిల్మ్లను రూపొందిస్తున్నారు. ఈ పోటీల ద్వారా జాతర ప్రచారం విశ్వ వ్యాప్తమవుతుందనే ప్రభుత్వం భావిస్తోంది. 12,561 మంది లైక్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాపై అందరూ దృష్టి పెట్టారు. దీంతో ప్రభుత్వం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 12,561 మంది ఫేస్బుక్ లైక్ పేజీకి లైక్ కొట్టారు. సెల్ఫీలు, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ల కాంటెస్ట్ కోసం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీలో పోస్ట్ చేయాలని పేర్కొన్నారు. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గద్దెల వద్ద, గంట కొడుతూ, ఎదురుకోళ్లను ఇస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానం చేస్తున్నవి, ఎడ్ల బండ్లలో జాతరకు వస్తున్న ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ వరకు పోటీలు ఇటీవల హైదరాబాద్లో వరంగల్కు చెందిన ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ దగ్గర సెల్ఫీ దిగి ప్రమాదం బారిన పడడంతో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ప్రయాణిస్తూ, గుట్టలు ఎక్కుతూ, విద్యుత్ తీగల దగ్గర, జంతువుల దగ్గర, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు దిగొవద్దని సూచించారు. ఫిబ్రవరి 5 వరకు ఫేస్బుక్ ద్వారా ఫొటోగ్రఫీ, సెల్ఫీ, షార్ట్ ఫిల్మ్లను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. జాతరకు ప్రచారం వస్తుంది.. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా సెల్ఫీలకు బహుమతులు పెట్టడం చాలా బాగుంది. అన్ని వయస్సుల వారు సెల్ఫీలు ఎక్కువగా దిగుతున్నారు. సెల్ఫీతోపాటు ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ కాంటెస్ట్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మా ఫ్రెండ్స్తో దిగిన ఫొటోను అప్లోడ్ చేశాం. చాలా మంది లైక్లు సైతం కొట్టారు. దీంతో జాతరకు చాలా ప్రచారం కూడా వస్తుంది. –మడిపెల్లి సుశీల్, వరంగల్ -
మేడారం బైలెల్లిన పగిడిద్దరాజు
గంగారం(ములుగు): మేడారం మహాజాతర వేదికగా సమ్మక్కను పరిణయమాడేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మంగళవారం బయల్దేరారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును గ్రామస్తులు అటవీమార్గంలో కాలినడకన సంప్రదాయ డోలు వాయిద్యాల మధ్య మేడారం తీసుకువెళ్తున్నారు. అంతకుముందు గ్రామంలో పెనుక వంశీయుల పూజారి తలపతి ఇంట్లో పగిడిద్దరాజును నలుగు పూజలతో పెళ్లికుమారుడిగా తయారుచేశారు. అనంతరం ఇక్కడి పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులైన పూజారులు బుచ్చిరాములు, సురేందర్, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు దర్శనమిచ్చారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తాకి తన్మయత్వం పొందారు. తలపతి ఇంట్లో నుంచి పానుపు (పూజా సామగ్రి) తీసుకువస్తుండగా, ఆలయంలో పూజల తర్వాత పడిగెను మేడారానికి తీసుకెళ్తుండగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు తెచ్చి పూజారుల కాళ్లు కడిగి సాగనంపారు. శివసత్తుల పూజనకాలతో మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకొని పెనుక వంశీయుల ఇంట్లో నిద్రిస్తారు. అక్కడి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య పస్రా, నార్లాపురం, కొండాయి మీదుగా మొత్తం 65 కిలోమీటర్లు కాలినడకన మేడారంలోని చిలుకల గుట్టకు చేరుకుంటారు. పానుపు తరలింపు నుంచి పడిగె వెళ్లే వరకు పూర్తి కార్యక్రమాలను స్థానిక సర్పంచ్ ఈసం కాంతారావు పర్యవేక్షించారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ ఇర్ప సూరయ్య, మర్రిగూడెం, ఎంపీటీసీ సభ్యురాలు వనిత, టీఆర్ఎస్ నాయకుడు ఈసం సమ్మయ్య, శ్రీనివాస్రెడ్డి పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జాతరలో అతి ముఖ్య ఘట్టం
ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తేవడం.. సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి చేరుకోక ముందే అక్కడికి కంకవనం చేరుకుంటుంది. అమ్మలతో పాటు గద్దెలపై కొలువై ఉండే కంకవనాలను ఆలోపే అక్కడ ప్రతిష్ఠిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. గద్దెలపై వనదేవతలతో పాటు ప్రతిష్ఠించే కంకవనాలను తెచ్చేందుకు పూజారులు, కుటుంబీకులు మంగళవారం సిద్ధమయ్యారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు, మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్తారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేసి, తెల్లవారుజామున 3 గంటల వరకు పూజలు నిర్వహించారు. ఈ పూజల వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. పూజా పద్ధతులను వంశపార్యంపరంగా ఒకతరం నుంచి మరో తరానికి నేర్పుతారు. పూజ ముగిసిన తర్వాత నాలుగు గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుని తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున అడవి నుంచి కంకలను గద్దెల వద్దకు తీసుకొస్తారు. మార్గ మధ్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు నిర్వహిస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. -
ధూపం వేస్తేనే తల్లి గుట్ట దిగేది..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పడిగాపూర్కు చెందిన దొబె నాగేశ్వర్రావు.. సమ్మక్క తల్లి ధూపం వడ్డెగా వ్యవహరిస్తారు. వయస్సు పైబడడంతో తండ్రి దొబె పగడయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2015 మినీ జాతర నుంచి ధూపం వడ్డెగా నాగేశ్వర్రావు కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఆయన తల్లి సేవలో తరిస్తున్నారు. తల్లికి ధూపం వేసే పెద్ద బాధ్యతను ఆయన యుక్తవయస్సులోనే భుజాన వేసుకున్నారు. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారు. నాగేశ్వర్రావు ధూపం వేస్తేనే సమ్మక్క తల్లి చిలుకలగుట్ట దిగుతుంది. డోలు దరువు తల్లులకు ఇష్టం జాతరలో డోలు వాయిద్య కళాకారులకు ప్రత్యేక కథ ఉంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. డోలు వాయిద్య కళాకారుల దరువుతోనే తల్లులు కదిలొస్తారు. డోలు దరువు అంటే తల్లులకు మహా ఇష్టం. దరువు కొట్టనిది తల్లులు ఆవహించిన ప్రధాన పూజారుల అడుగు ముందుకు కదలదు. దేవతలను గద్దెలపై తీసుకురావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు డోలులు వాయిస్తూనే ఉండాలి. చిలుకలగుట్ట దద్దరిలేలా కళాకారులు తన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి డోలును వాయించాలి. తల్లులను గద్దెలపై తీసుకువచ్చే క్రమంలో సమయం తెలియదని, తమకు ఏమాత్రం అలసట అనిపించదని, ఇదంతా తల్లుల మహిమేనని డోలు వాయిద్య కళాకారులు చెబుతున్నారు. అదేవిధంగా జాతరకు రెండు నెలలపాటు వచ్చిపోయే వందల మంది ప్రముఖులు, అధికారులకు డోలు వాయిద్య కళాకారులు స్వాగతం పలుకుతుంటారు. కానీ, వీరికి దేవాదాయశాఖ అధికారులు ఇచ్చే వేతనం అంతంత మాత్రమే. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డోలు వాయిద్య కళాకారులు కోరుతున్నారు. సమ్మక్కను తీసుకొస్తా జాతరకు పది రోజుల ముందే చిలుకలగుట్ట వనంలో లభించే ఔషధ మూలికలతో గుగ్గిలం తయారు చేస్తాం. ఆ గుగ్గిలంతోనే ధూపం వేస్తా. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను గద్దెకు రప్పిస్తా. తండ్రి నుంచి ధూపం వడ్డె బాధ్యతలను స్వీకరించి సమ్మక్క తల్లికి సేవ చేయడం నేను మహా అదృష్టంగా భావిస్తున్నా. –నాగేశ్వర్రావు, సమ్మక్క ధూపం వడ్డె -
నేడు సమ్మక్క కల్యాణం
సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల సాక్షిగా వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం వైభవంగా జరగనుంది. మాఘమాసంలో మేడారం గ్రామం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదీవాసీ సంప్రదాయం. ఇందుకోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వారికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంట లేని వారు కోళ్లు, మేకల వంటివాటిని సమర్పించుకునేవారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. సమ్మక్క ఆలయమే వేదిక.. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. ఈ సారి బుధవారం, పౌర్ణమి ఒకేరోజున(జనవరి 31) రావడం విశేషం. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. ప్రధాన పూజారి పెనక బుచ్చిరాములుతోపాటు ఇతర పూజారులు సురేందర్, మురళీధర్ పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని 65 కిలోమీటర్లు కాలినడకన మేడారానికి తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలో పెనక వంశీయుల ఇంట్లో మంగళవారం రాత్రి బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం కాలినడకన మేడారం బయల్దేరుతారు. ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారి కాక సారయ్య, కాక కిరణ్ ఇతర పూజారులు తీసుకొస్తారు. సమ్మక్కకు కల్యాణం.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న విడిది గృçహానికి వస్తారు. సమ్మక్క నుంచి ఆహ్వానం రాగానే వీరు మేడారంలోని ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెళ్లికొడుకు పగిడిద్దరాజు వచ్చాడంటూ సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. ఈ కబురు అందుకున్న సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును సమ్మక్క గుడిలోనికి ఆహ్వానిస్తారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. అనంతరం సమ్మ క్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలిసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతాడు. (ఎడ్లబండ్లపై మేడారానికి తరలివస్తున్న భక్తులు) లక్షలాది మంది రాక సమ్మక్క–పగిడిద్దరాజు వివాహం అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. అమ్మలను దర్శించుకుని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనేది వారి నమ్మకం. మరుసటిరోజు(గురువారం) శక్తి రూపంలో చిలకలగుట్టపై కొలువైన సమ్మక్క తల్లి.. మేడారం గద్దెల మీదకు చేరుకుంటుంది. దీంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. సారలమ్మ ఆగమనం నేడే.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యా ణం జరిగిన తర్వాత సారలమ్మతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. -
నేటి నుంచే మహా జాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క– సారక్క జాతర బుధవారం మహావైభవంగా ప్రారంభమవుతోంది. ఆదివాసీ పూజా క్రతువుల మధ్య సారలమ్మ తల్లి మేడారంలో గద్దెపైకి చేరుకోనుంది. మరుసటి రోజున (గురువారం) సమ్మక్క గద్దెపైకి చేరనుంది. రెండు రోజుల పాటు వన దేవతల దర్శనం అనంతరం.. శనివారం తల్లుల వన ప్రవేశం జరగనుంది. జాతర కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. భక్త జన సంద్రం మహా జాతర కోసం మంగళవారం సాయంత్రానికే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. మేడారం, జంపన్నవాగు, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్ ప్రాంతా లు భక్తుల గుడారాలతో నిండిపోయా యి. మేడారం వెళ్లే దారుల న్నీ కిక్కిరిసిపోయాయి. జాతర కోసం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తం గా 52 కేంద్రాల నుంచి 2,490 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు వస్తున్నారు. దీంతో నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. యథావిధిగా పూజలు.. బుధవారం సాయంత్రం 5.18 గంటల నుంచి 8.42 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. షెడ్యూల్ ప్రకారం సారలమ్మ ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి మేడారానికి బయలుదేరాలి. అయితే గ్రహణం నేపథ్యంలో పూజా క్రతువు సమయంలో మార్పులు ఉం టాయనే ఊçహాగానాలు వచ్చాయి. అయితే ఆదివాసీ పూజా విధానాల్లో గ్రహణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోమని పూజారులు స్పష్టం చేశారు. అయితే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో పూజా క్రతువులను మాత్రం గ్రహణానికి ముందే పూర్తి చేస్తామని చెప్పారు. జాతర ఇలా... తొలిరోజు (బుధవారం) సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. అదేరోజు పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం గద్దెలకు చేరుకుంటారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుంది. శుక్రవారం సమ్మక్క– సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉంటారు. జాతర చివరి రోజు (శనివారం) సమ్మక్క తల్లి వన ప్రవేశం చేస్తుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ ప్రాంతాలు ప్రయాణం కావడంతో జాతర ముగుస్తుంది. కాగా.. మహబూబా బాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు పడిగె రూపంలో మంగళవారమే మేడారం మహాజాతరకు బయల్దేరారు. పూజారులు గ్రామంలోని ఆలయంలో పెనుక వంశీయులు పూజలు చేసిన తర్వాత అటవీమార్గంలో కాలినడకన మేడారానికి బయల్దేరారు. మహాజాతరలో పగిడిద్ద రాజు సమ్మక్కను వివాహమాడతారు. ‘సాక్షి’ టీషర్ట్స్ను ఆవిష్కరించిన కలెక్టర్ కర్ణన్ ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో వలంటీర్ల కోసం ‘సాక్షి’యాజమాన్యం అందించిన టీషర్ట్స్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జేసీ అమయ్కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో జాతరలో వలంటీర్ల కోసం టీషర్ట్స్ను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సారలమ్మ ప్ర«ధాన పూజారి కాకసారయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్కుమార్ చేతుల మీదుగా గద్దెల ప్రాంగణంలో వలంటీర్లకు టీషర్ట్స్ను అందజేశారు. -
మేడారం.. కథ కాదు ఓ చరిత్ర
సాక్షి, హైదరాబాద్: కోయ, ఆదివాసీల వీరగాథలపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. సమ్మక్క – సారక్కపై ఎన్నో కట్టు కథలున్నాయని, ఇప్పుడు చారిత్రక దృక్కోణంలోంచి వాటిని చూడాల్సి ఉందన్నారు. మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో వారి గాథలపై అధ్యయనం చేసిన ఆయన ‘వీరుల పోరు గద్దె –మేడారం’ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం జయధీర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక్క కథ చరిత్ర సృష్టించింది.. సమ్మక్క–సారలమ్మ ఒక్క గాథే చరిత్రను సృష్టించింది. మరి మిగిలిన ఎనిమిది గాథల మాటేమిటి..? ఈ గాథలోనే కాదు పగిడిద్దరాజు, గడికామరాజు, ఎరమరాజు, గాదిరాజు, గోవిందరాజు, తోటుమనెడి కర్ర, గుంజేటి ముసలమ్మల కథలు కూడా ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సమక్క సారాలమ్మల చరిత్ర నుండి ప్రేరణ పొందినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పరిశోధనల వైపు దృష్టి సారించాలి. అప్పుడే అసలు గాథలు బయటికి వచ్చి ఆదివాసీలకు మేలు జరుగుతుంది. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తూ స్థానిక కోయ సంస్కృతి, పుజా విధానం మారకుండా కాపాడాలి. బ్రాహ్మణ పురోహితులు అక్కడ కన్పించకూడదు. చరిత్ర విషయంలో చరిత్రకారులు ఇలాంటి పరిశోధనలు చేసి ప్రజల పక్షం వహించినపుడే ఆ చరిత్రకు సార్థకత ఉంటుంది. ఇంతవరకు సమక్క–సారాలమ్మలకు సంబంధించి కాల్పానిక గాథలే ఉన్నాయి. ఇప్పుడు చారిత్రక ఘటనల క్రమం నుంచి వీరి చరిత్రను వెలికి తీశా. అంతేకాదు చరిత్ర ఆధారాలు కనిపించని చోట కోయల జ్ఞాపకాల్లోని మౌఖిక ఆధారాలే చరిత్రగా మార్చాలి. సమ్మక్క – సారక్క జాతరగానే పిలవాలి ఇప్పటి వరకు సమక్క – సారలమ్మ జాతరగా పిలుస్తున్నాం. ఇది సరికాదు. ‘సమ్మక్క–సారక్క’ జాతరగా పిలవడం సుమచితం. ఆదివాసీలకు అక్క దేవతలు ఉంటారు. ‘అక్కలు’ అని పిలవడం సరైన పద్ధతి. ఒకరు ఒకలాగా మరొకరు మరోలా కాకుండా.. అందరూ ఒకే తీరుతలో పిలవాలి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను సమ్మక్క – సారక్క జాతరగా పిలవడం ప్రాచర్యంలోకి తేవాలి. ఈ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. కోయ వీరుల పాటలకు ప్రాచుర్యం అవసరం ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారక్క జాతరకి ఎనిమిది మంది కోయ వీరుల పగిడె పాటలు తీసుకరావాలి. వాటికి జాతరలో నాలుగు రోజుల పాటు వారి గాథలు చెప్పించటం అవసరం. అప్పడే ఆ వనదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. చరిత్రకు న్యాయం జరుగుతుంది. గొప్ప చారిత్రక ప్రదేశం.. మేడారంలో సమ్మక్క – సారక్క జాతర జరిగే స్థలం గొప్ప చారిత్రక ప్రదేశం. అక్కడ యుద్ధం జరిగింది. పడిపోయిన తన భర్తను సమక్క మోసుకొని వచ్చింది. మేడారం వద్దకు రాగానే అలసిపోయి అక్కడే ఆగింది. ఆ తర్వాత ఆమె తన కూతురు సారక్క అక్కడే ఉండి, కొంత కాలానికి మరణించారు. కాబట్టి కోయలకు అది పవిత్ర స్థలం. నిజానికి అది ఓ చారిత్రక ప్రదేశం మాత్రమే. 14 ఏళ్ల అన్వేషణ ఇది.. ‘వీరుల పోరు గద్దె–మేడారం’ పేరుతో సమ్మక్క, సారక్కలపై కోయడోలీల కథ పుస్తకం తీసుకరావటానికి 14 ఏళ్లు పట్టింది. ఇది ఒకరితో సాధ్యమైంది కాదు. ప్రొఫెసర్ గూడూరు మనోజ, పద్దం అనసూయ.. వీరితో పాటు ఎంతో మంది శ్రమించారు. తొలుత ఖమ్మం జిల్లా తొగ్గూడెం ప్రారంభించి మేడారం వరకు చరిత్ర అన్వేషణ ప్రయాణం సాగించాం. అక్కడ పగిడె తీశారు. మౌఖిక కథనాలకి ఆధార భూతాలు పగిడెలు మాత్రమే. అవసరమైన చోట పాఠ్యగానం సకిన రామచంద్రయ్య బృందం అందించారు. -
ఇంటింటా సమ్మక్క..
సాక్షి, వరంగల్ రూరల్: సమ్మక్క జాతర నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొలంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ముందుగా ఇంట్లో సమ్మక్కను చేసి జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవడం అనావాయితీగా వస్తోంది. గత వారం పది రోజుల నుంచి గ్రామాల్లో ఎక్కడ చూసినా సమ్మక్క–సారలమ్మ పూజలే కనిపిస్తున్నాయి. కోరికలు నేరవేడంతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఎత్తు బంగారం (బెల్లం), కోడి, యాటలతో మొక్కులు చెల్లిస్తున్నారు. పండుగ సందర్భంగా తమ బంధువులందరిని పిలిచి విందు చేస్తున్నారు. జాతరలో సమ్మక్క–సారలమ్మల గద్దెల వద్ద మొక్కులు చెల్లించిన తర్వాత ఎత్తు బంగారాన్ని బంధువులు, ఇంటి చుట్టు ప్రక్కన వాళ్లను పంచిపెట్టడం అనవాయితీగా వస్తోంది. ఒడి బియ్యం కోరుకున్న కోరిక నేరవేరితే ఒడి బియ్యం పోస్తామని మొక్కుతారు. ఇలా మొక్కుకున్న వారు ఒక్కరి నుంచి తొమ్మిది మంది వరకు ఒడి బియ్యం పోస్తున్నారు. ఇంట్లో సమ్మక్కను చేసేప్పుడు జోగినికి (దేవుడు ఉన్న వ్యక్తి) ఒడి బియ్యాలు పోస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో బెల్లం, కొబ్బరి కాయలు, కోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కొబ్బరికాయ ధరలు కొండెక్కడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదపు రూ.60 కోట్లకు పైగా బెల్లం వ్యాపారం, రూ.2 కోట్లకు పైగా గొర్రెలు, కోళ్లు, కొబ్బరికాయల విక్రయాలు జరగనున్నాయి. -
మేడారంలో ఉచిత వైఫై షురూ...
వరంగల్: మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఉచితంగా వైఫై సేవలను సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం కందగట్ల నరేందర్ ప్రకటించారు. ఉచిత వైఫై సేవలు ఈనెల 31వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రం నుంచి సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జాతర ప్రాంగణంలో 13 టవర్లతో సిగ్నల్స్ అందిస్తున్నామన్నారు. 20 హాట్స్పాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హాట్స్పాట్లకు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ కల్పిస్తున్నామన్నారు. ఒక్కో హాట్స్పాట్తో ఒకేసారి 12 వేల మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. వైఫై సేవలు ఫ్రీగా అందించేందుకు ఎంపీ సీతారాంనాయక్ కృషితో ప్రభుత్వం రూ.20 లక్షలు బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెల్లించారని తెలిపారు. జాతర పరిసరాలకు వెళ్లడంతోనే సెల్లో లాగిన్ పేజీ వస్తుందని, దానిలో అప్షన్ ఎన్నుకుంటే వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్)తో కనెక్ట్అయి ప్రతి రోజు 500 ఎంబీ డాటాను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉచిత సేవలు అన్ని నెట్వర్కులతో సంబంధం లేకుండా కేవలం వైఫై ఆప్షన్తోనే డాటాను అందిస్తామని నరేందర్ తెలిపారు. -
దాహం.. దాహం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. తల్లుల దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్న వారు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జాతరలో తాగునీటి వసతి కల్పించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు ప్రభుత్వం రూ.19.80 కోట్లను కేటాయించింది. ఇందులో సుమారు రూ.10 కోట్ల వరకు తాగునీటి వసతికి వెచ్చించారు. కాగా, గత జాతరలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారానే నీళ్లను అందిస్తున్నారు. కేవలం మిషన్ భగీరథ నీళ్లపైనే ఆశలు పెట్టుకుని అధికారులు కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –ములుగు క్యూ లైన్లలో ఇబ్బందులు భక్తులు సోమవారం భారీగా గద్దెలకు చేరుకోవడంతో రద్దీ ఎక్కువై అమ్మల దర్శనం ఆలస్యమైంది. మధ్యాహ్నం కావడంతో ఎండ ఎక్కువగా ఉండి తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లల పరిస్థితి అగమ్యగోచరం. క్యూలో భక్తుల కోసం డ్రమ్ములు, నల్లాల ద్వారా నీటిని అందిస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వంటావార్పునకు.. భక్తులు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్పాయింట్, నార్లాపూర్, చింతల్క్రాస్, వెంగళాపురం, పడిగాపురం, కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం ప్రాంతాల్లో నీళ్లులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది ప్రైవేట్ వాహనాల ద్వారా సమీపంలోని బోరింగ్ పంపులు, ట్యాప్స్ల ద్వార నీటిని తీసుకొస్తున్నారు. మరి కొందరు వాగు నీళ్లను వంటలకు వాడుతున్నారు. మినరల్ వాటర్ క్యాన్కు రూ.70 ఆర్డబ్ల్యూఎస్ తరుఫున డిమాండ్ మేర మంచినీరు అందకపోవడంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మినరల్ వాటర్ క్యాన్ల ధరలను అమాంతంగా పెంచేశారు. 20 రోజుల క్రితం క్యాన్కు రూ.15 నుంచి రూ.20 ధర పలుకగా ప్రస్తుతం ఆ ధర రూ.50 నుంచి రూ.70 దాకా పలుకుతూ ఉండడం విశేషం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడారానికి వచ్చే భక్తులకు ఈ సారి శుద్ధమైన గోదావరి జలాలను అందించాలని ప్రభుత్వం యంత్రాంగం భావించింది. అనుకున్న విధంగానే పనులను వేగవంతం చేసింది. కానీ, అధికారుల ప్రయత్నం సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఇంగ్లిష్ మీడియం పాఠశాల సమీపంలో 4 లక్షల లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించింది. ఇదంతా బాగానే ఉన్నా అధికారులు నీటిని అందించని పక్షంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా భగీరథ పథకం ద్వార నీటిని అందిస్తే మేలని భక్తులు సూచిస్తున్నారు. మంచినీటికి ఇబ్బందులు పడుతున్నాం.. జాతరలో మంచినీటి సౌకర్యం ఉంటుంనే భావనతో ఇంటి నుంచి నీళ్లను తీసుకురాలేదు. తీరా ఇక్కడికి వచ్చాక నీళ్లు అందుబాటులో లేవు. మినరల్ వాటర్ ప్లాంట్కు వెళితే ఎక్కడా లేని ధరలు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. తాగడానికి, వంట చేయడానికి రెడ్డిగూడెం సమీపంలోని నల్లాల దగ్గరకు వచ్చాం. నీళ్లు బాగాలేకున్నా తాగుతున్నాం. విజయ, సికింద్రాబాద్ -
రారండోయ్.. రామప్పకు..
వెంకటాపురం(ఎం): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని రామప్ప ఆలయాన్ని సందర్శించే మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భక్తులు రామలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు గతంలో నిర్మించిన మినీవాటర్ ట్యాంకులకు మరమ్మతు చేసి వినియోగంలోకి తెచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం తహసీల్దార్ ఇరుకుల శివకుమార్, ఎస్సై పోగుల శ్రీకాంత్, రామప్ప ఈఓ చిందం శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రామప్ప ఆలయం ఎదుట ఉన్న కట్ట సమీపంలో 20 మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ వాటికి తడకలు అమర్చకపోవడంతో వినియోగంలోకి రాలేదు. సాయంత్రం 6 గంటలకే ఆలయ ప్రధాన గేట్లు మూసి వేస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్సు కట్టకు కాలినడకన... భక్తుల వాహనాలను పోలీసులు రామప్ప ఆలయ శివారులోనే నిలిపివేస్తుండడంతో ఆలయాన్ని సందర్శించిన భక్తులు కాలినడకన పిల్లపాపలతో కలిసి సరస్సుకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 300 మంది పోలీసులచే బందోబస్తు మేడారం జాతర సందర్భంగా రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 300 మంది పోలీసు సిబ్బందిచే సేవలు అందిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలిపారు. జంగాలపల్లి నుంచి గణపురం క్రాస్రోడ్ వరకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. రామప్పలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న భక్తజనం మేడారం జాతర దగ్గర పడుతున్నకొద్దీ రామప్పలో భక్తుల రాక పెరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు రామప్పను సందర్శిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో రామప్ప ఆలయ పరిధిలో మిఠాయి దుకాణాలు, బొమ్మల దుకాణాలు, కూల్డ్రింక్ షాపులు, హోటళ్లు తదితర దుకాణాలు వెలిశాయి. రామప్ప పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. -
మేడారం జాతరకు 4200 బస్సులు
సాక్షి, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 50 కేంద్రాల నుంచి 4200 లకు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ సందర్బంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేళ్ల క్రితం జాతర సందర్భంగా ఆర్టీసీ 3700 ప్రత్యేక బస్సులను నడపగా.. సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరకు అదనంగా మరో 500 బస్సులను నడపునున్నట్టు తెలిపారు. ఈసారి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరి ఖని, పెద్దపల్లి వంటి 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారని ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాట్లు చేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ కూడా ఏర్పాటుచేశామన్నారు. కాగా మేడారంలో ఏర్పాటు చేసిన వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. వరంగల్లో అధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. జాతరలో బస్సుల నిర్వహణ, ప్రయాణికుల కోసం ఏర్పాట్లు, బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్ఎంలు, డిపో మేనేజర్లు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. -
మేం చెప్పిందే రేటు!
బాబోయ్ ఏంటీ రేట్లు అనుకుంటున్నారా..? ఇదంతా మాఫియా మాయాజాలం. కృత్రిమ కొరత సృష్టించి, ఇసుకను గుప్పిటపట్టి వ్యాపారులు ఆడుతున్న నాటకం. సర్కారు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఈ నాటకంలో మాఫియాకు కోట్లు.. జనానికి పాట్లు!! మహమ్మద్ ఫసియుద్దీన్: రాష్ట్రంలో ఇసుక బంగారమైంది. ధరలను మాఫియా శాసిస్తోంది. సామాన్యులతోపాటు బిల్డర్లకూ చుక్కలు చూపుతోంది. మేడారం జాతర నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహా పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచ్లలో ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు ప్రభుత్వం తవ్వకాలను నిలిపేయడంతో.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న మాఫియా కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలను పెంచేసింది. హైదరాబాద్లో మూడ్రోజుల కింద రూ.1,150–1,200కు లభించిన టన్ను దొడ్డు రకం ఇసుక ఇప్పుడు అకస్మాత్తుగా రూ.1,500కు చేరింది. సన్న రకం ఇసుక రూ.1,250 నుంచి రూ.1,700కు పెరిగింది. లారీ ఇసుక (సగటున 30 టన్నులు) రూ.50 వేలకు పైనే పలుకుతోంది. ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం.. వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయిస్తున్నారు. రిటైల్ ధరలను వ్యాపారుల అభీష్టానికే వదిలేయడంతో వారు చెప్పిందే రేటుగా సాగుతోంది. తగ్గిన లభ్యత కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉప నదులు, జలాశయాల్లో ఉన్న ఇసుక తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కి బదలాయించింది. గతేడాది పాత 7 జిల్లాల పరిధిలో 56 చోట్ల ఇసుక తవ్వకాలకు టీఎస్ఎండీసీ ద్వారా అనుమతులిచ్చారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 18 రీచ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 రీచ్లు కలిపి 21 రీచ్లలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. మిడ్ మానేరుకు నీళ్లు వదలడంతో కరీంనగర్ జిల్లాలోని కాజీపేట్, కొత్తపల్లి రీచ్లు 8 నెలలుగా మూతబడ్డాయి. ఇసుక విక్రయానికి రాష్ట్రవ్యాప్తంగా 289 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయగా 50 పాయింట్లలోనే ఇసుక లభ్యత ఉంది. కృష్ణా నదిలో ఇసుక లభ్యత లేనందున తవ్వకాల్లేవు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వారికి పంట.. సామాన్యులకు తంటా ప్రభుత్వం రీచ్ల వద్ద ఇసుకను క్యూబిక్ మీటర్కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున విక్రయిస్తోంది. టీఎస్ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీ దు పొందితే బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతారు. ఇసుక వ్యాపారులే ఆన్లైన్లో బుక్ చేసుకొని హైదరాబాద్లో టన్నుకు రూ.1500– 1700లు, జిల్లాల్లో రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా విక్రయాలు జరుపు తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సామాన్యులకు ప్రయోజనం లేకుండా పోయింది. తాజా విధానంతో ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల ఆదాయం వస్తుండగా.. వ్యాపారులూ రూ.కోట్లల్లో సంపాదించుకుంటున్నారు. జిల్లాల్లోనూ అంతే.. మానేరు ఇసుక క్వారీ నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరం ఉంది. జిల్లా కేంద్రానికి ఇసుక తీసుకొచ్చేందుకు లారీ రవాణాకయ్యే డీజిల్, డ్రైవర్, కూలీల ఖర్చులు కలిపి గరిష్టంగా రూ.1,800 మించదు. ఇలా 21 టన్నుల ఇసుక ధర (రూ.7,425) రవాణా ఖర్చులు కలిపి రూ.9,225 అవుతుంది. ఈ లెక్కన వ్యాపారులకు టన్నుకు రూ.448 మాత్రమే లభిస్తుండగా, వినియోగదారులుకు మాత్రం రూ.1,000 నుంచి రూ.1200కు విక్రయిస్తున్నారు. దీంతో 21 టన్నుల ఇసుక లారీ వినియోగదారులకు చేరే సరికి రూ.25 వేలు అవుతోంది. వ్యాపారులకు రూ.15 వేల లాభం మిగులుతోంది. ఇదీ అడ్డగోలు దోపిడీ స్టాక్యార్డ్ల వద్ద టన్ను రూ.357.5 చొప్పున వ్యాపారులకు టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. లారీల్లో లోడింగ్ పరిమాణం ఆధారంగా క్వారీల్లో ధర 13.5 క్యూబిక్ మీటర్ల (21 టన్నులు)కు రూ.7,425.. 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775 గా ఉంది. ప్రభుత్వ ధరకు రవాణా ఖర్చులు కలిపి ఇసుకను విక్రయించాలి. ఇసుక లారీలు సగటున లీటరు డీజిల్కు 2–3 కి.మీ. ప్రయాణిస్తాయి. లీటర్ డీజిల్ ధర రూ.69 ఉండగా ఇసుకను హైదరాబాద్ తరలించేందుకు రాకపోకలు కలిపి గరిష్టంగా 600 కి.మీ.లు ప్రయాణించాలి. ఈ లెక్కన సగటున రవాణా వ్యయం రూ.13,800 నుంచి రూ.20,700 అవుతుంది. 30 టన్నుల ఇసుకకు ప్రభుత్వ ధర రూ.10,725 కాగా.. హైదరాబాద్కు తరలించేందుకు రవాణా, ఇసుక వ్యయం కలిపి రూ.24 వేల నుంచి రూ.30 వేల వ్యయం అవుతుంది. వ్యాపారులు రూ.45 వేల నుంచి రూ.51 వేలకు విక్రయిస్తున్నారు. హయత్నగర్లోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రిటైల్ పాయింట్ ప్రారం భించి రూ.950 (క్యూబిక్ మీటర్కు రూ.1,425) చొప్పున టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఎస్ఎండీసీ ద్వారా విక్రయ కేంద్రా లు ఏర్పాటు చేస్తే ఇసుక ధరలు సామాన్యులకు కాస్త అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర ఇసుక అవసరాలు నెలకు - 4లక్షల క్యూబిక్ మీటర్లు ఆన్లైన్ ద్వారా విక్రయాలు - లక్ష క్యూబిక్ మీటర్లు ప్రభుత్వ వార్షిక ఆదాయం - రూ.500 కోట్లు రీచ్ల వద్ద క్యూబిక్ మీటర్ ఇసుక ధర - రూ.550 రీచ్ల వద్ద టన్ను ఇసుక ధర - రూ.357.5 హైదరాబాద్లో టన్నుఇసుక ధర - రూ. 1,5001,700 హైదరాబాద్లో లారీ ఇసుక ధర (30 టన్నులు) - రూ.50 వేలకు పైనే జిల్లాల్లో టన్ను ఇసుక ధర - రూ. 1,000 - 1,200 జిల్లాల్లో 21 టన్నుల లారీ ఇసుక ధర - రూ.25 వేలు -
తొలిరోజు మేడారానికి 450 బస్సులు
హన్మకొండ: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన తొలి రోజు 450 బస్సులు నడిచాయి. వరంగల్ నగరంతో పాటు, జిల్లాలోని ఇతర ప్రత్యేక పాయింట్లు, ఇతర జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాత్రి 8 గంటల వరకు 450 బస్సులు 1800 ట్రిప్పుల ద్వారా 72 వేల మంది భక్తులను జాతరకు చేరవేశాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. భక్తుల రాక, సంఖ్యను బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వెంట వెంటనే పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
ఆదివాసీ ఆచారాలతోనే..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరను ఆదివాసీ ఆచారాలతోనే భక్తులు గౌరవంగా జరుపుకోవాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అన్నారు. జాతరలో ఆధునిక టెక్నాలాజీ అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లతోనే జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. వనదేవతలపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తున్నారన్నారు. భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు. జాతరలో భక్తులు, అధికారులు, ప్రజలు పాటించాల్సిన సమన్వయంపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తొక్కిసలాటకు గురికావొద్దు.. జాతర సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, మేడారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలను తీసుకువచ్చేటప్పుడు భక్తులు దూరం నుంచి దేవతలను తనవితీరా చూడాలి. కాని ఆరాటంతో రోడ్లపై వచ్చి తొక్కిసలాటకు గురికావొద్దు. పోలీసులు పనిభారంతో భక్తులపై దురుసుగా ప్రవర్తించొద్దు. గద్దెల వద్ద భక్తులకు అధికారులు సహకరించాలి. మనోభావాలు దెబ్బతీయొద్దు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఆదివాసీ సంస్కృతి, ఆచారాల మధ్య సాగుతుంది. ఆచారాలను భక్తులు, అధికారులు గౌరవించాలి. ఆచార పద్ధతి ప్రకారం జాతర నిర్వహించడం వల్లే రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులకు దేవతల చల్లని చూపుల కోసం వ్యయప్రయాసలకోర్చి మేడారం తరలివస్తున్నారు. పూజారుల మనోభావాలను దెబ్బతీయొద్దు. అధికారులను గౌరవించాలి.. జాతరలో భక్తులకు సేవలందించే అధికారులకు తల్లుల దీవెనలు ఉంటాయి. కోట్లమంది భక్తజనంలో నాలుగు రోజులు 24 గంటల పాటు ఓపికగా భక్తులకు సేవలందించడం.. అధికారుల పనితనం చాలా గొప్పది. జాతరలో సేవలందించే అధికారులను భక్తులు ఎంతో గౌరవంగా చూడాలి. భక్తులు అధికారుల సూచనలను పాటించి ప్రశాతంగా అమ్మలను దర్శించుకోవాలి. ఫ్రెండ్లీగా పనిచేస్తాం.. జాతరలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అధికారులు ఆదివాసీలు, పూజారులందరం ప్రెండ్లీగా పని చేసి జాతరను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తాం. జాతరలో విధులు పనిచేసే అధికారులతో మర్యాదపూర్వకంగా మెదలాలి. ఆదివాసీ యువకులకు, సంఘాల నాయకులకు పూజా రుల సంఘం తరఫున కోరినాం. జాతరలో ఎన్నో ఇబ్బందులు తట్టుకుని భక్తుల భద్రత, సేవల కోసం పని చేసే అధికారుల మనసు నొప్పించకుండా జాతరను విజయవంతం చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలని పూజారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. -
జాతరలో ఏం పనులు చేశారు ?
ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఏం పనులు చేశారు.. ఏం విధులు నిర్వర్తిస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్లో పది శాఖల సెక్టోరియల్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. వనదేవతలను దర్శించుకున్న ఆయన సాయంత్రం అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించి లోపాలను సరిచేయాలన్నారు. ఉదయం ఆయన జంపన్నవాగు నుంచి గద్దెల వరకు కాలినడకన తిరిగి అక్కడ నెలకొన్న సమస్యలు, భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యం లేక కంపుకొడుతున్నాయని, వాటి ని క్లీన్ చేయడంతోపాటు నీటి వసతి ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేసి మంచిగ లేకుంటే చర్యలు తీసుకుంటానని ఎస్ఈ రాంచంద్రు, ఈఈ నిర్మలపై మండిపడ్డారు. స్కావేంజర్లను ఏర్పాటు చేసి క్లీన్ చేయాలన్నారు. కరెంట్ పనులు ఇంకా చేయడం ఏమిటని ఎస్ఈ నరేష్ను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాళ కరెంటు పనులు ముగించుకొని తనకు రిపోర్ట్ చెప్పాలన్నారు. రేపటి నుంచి ఐజీ నాగిరెడ్డి, ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తారని కడియం అన్నారు. పది కిలోమీటర్ల వరకు భద్రత పోలీసులు గద్దెల వద్ద విధుల్లో ఉన్నా భక్తుల జేబులను దొంగలు కొట్టడం ఏమిటని డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అన్నారు. గద్దెల వద్ద దొంగలు లోపలికి వచ్చి జేబులు కొడుతున్నారని స్వయంగా భక్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారని కడియం అన్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, పోలీసుల రక్షణ చర్యలు అంతగా బాగాలేవన్నారు. ఈ నెల 30 నుంచి ఒక్క వాహనం కూడా జంపన్నవాగు, గద్దెల వద్ద కనిపించొద్దని డీఎస్పీని కడియం తీవ్ర స్వరంతో ఆదేశించారు. అమ్మలకు విశ్రాంతి భక్తులు వేసే బంగారం, కొబ్బరి ఇతర పదార్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచాలన్నారు. ఫైర్సిబ్బంది గద్దెలను నీటితో శుభ్రం చేయాలన్నారు. అమ్మలకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు విశ్రాంతి అని భక్తులకు చెప్పి ఆ ప్రాంగణమంతా శుభ్రం చేసి ఉంచాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్బాబును ఆదేశించారు. మురుగు నీరు తొలగించాలి జంపన్నవాగులో ఉన్న మురికి నీరు ప్రధాన జాతర సమయంలో తొలగించేలా చూడాలని ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణకుమార్ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ నెల 30 నుంచి భక్తులు తేట నీటిలో స్నానాలు చేసేలా చూడాలన్నారు. వాగులో క్లోరినేషన్ చేయించి భక్తులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూడాలని ఎస్ఈని ఆదేశించారు. మేడారం గద్దెల నుంచి పది కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా దుమ్ముదూళి ఉండొద్దని, రోజూ బ్లీచింగ్ చల్లించాలని, చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని డీపీఓ చంద్రమౌళిని ఆదేశించారు. ఫిబ్రవరి 2న సీఎం వస్తారు ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఆయన పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. ఆ సమయంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాగ్రత్తగా పనిచేసి జాతరను సక్సెస్ చేయాలన్నారు. అనంతరం గద్దెల వద్ద ఉన్న మంచెపైకి వెళ్లి అక్కడ భక్తుల దర్శనాలను పరిశీలించారు. సమీక్షలో కలెక్టర్ కర్ణన్, జేసీ అమయ్ కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్రావు, సబ్కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ ఆర్ఎం సూర్యకిరణ్, సీపీఓ కొమురయ్యతోపాటు అధికారులు ఉన్నారు. -
మొక్కుల మేడారం
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. మహాజాతరకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు 12 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అంచనా వేశారు. భక్తుల రాకతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ ఆర్టీసీ పాయింట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తోపులాట.. మేడారానికి భక్తులతోపాటు వీఐపీలు సైతం భారీగా వచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతారాం నాయక్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్తోపాటు వచ్చిన ప్రజాప్రతినిధులతో వీఐపీ గేటు వద్ద గందరగోళం ఏర్పడింది. వీఐపీలు అమ్మవార్లను దర్శించుకునేందుకు గద్దెలకు వెళ్లిన క్రమంలో తోపులాట జగింది. వీఐపీ గేటు పక్కనే సాధారణ భక్తులు అమ్మవార్లను దర్శించుకునే క్యూలైనన్లు ఉండడంతో రద్దీ ఎక్కువై ఓ బాలిక మోచేయికి తీవ్రగాయమైంది. భక్తుడి తలకు గాయాలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలను నేరుగా గద్దెల వద్దకు పంపించారు. ఈ సమయంలో గద్దెల బయట ఉన్న భక్తులు తమ మొక్కులో భాగంగా బంగారం(బెల్లం), కొబ్బరికాయల ముక్కలను గద్దెల లోపలికి విసరడంతో చాలామంది వీఐపీ భక్తులకు గాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన చంద్రారెడ్డి తలపై కొబ్బరికాయపడి రక్తస్రావమైంది. ఇక చిన్నపిల్లలతో వీఐపీ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగారం ముద్దలను సేకరించడానికి వచ్చిన ఆదివాసీ వలంటీర్ల వద్ద ఉన్న హెల్మెట్లను చిన్నారుల తలలపై ఉంచి అప్రమత్తమయ్యారు. తీరు మారని దేవాదాయ శాఖ.. గత మహాజాతరలో అమ్మలను దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో భక్తులు విసిరిన బంగారం ముద్ద తగిలి స్వయంగా తనకే గాయమైందని, ఈసారి వీఐపీ భక్తులకు గద్దెల వద్ద ఇబ్బందులు రాకుండా చూడాలని, వారం రోజుల క్రితం మేడారానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. భక్తులు సమర్పించేందుకు తమ వెంట తీసుకొచ్చే బంగారం, కొబ్బరికాయలను గద్దెలపై అమ్మవార్లకు అందేలా సులవైన మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని వీఐపీ భక్తులు వాపోతున్నారు. క్యూలైన్లు కిటకిట... భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి భక్తులకు క్యూలైన్ల ద్వారా అనుమతి ఇచ్చారు. రెడ్డిగూడెం వైపు నుంచి అమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గంటపాటు క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతోపాటు వీఐపీలు రావడంతో చాలా సేపు వేచిచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో మంచినీటి సౌకర్యం లేక అధికారుల ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. హెలీకాపర్ట్లో వచ్చిన ఎంపీలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో బాల్క సుమన్, గుత్త సుఖేందర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్ మేడారం పోలీస్ క్యాంపులోని హెలిప్యాడ్లో దిగారు. ఎంపీ సీతారాంనాయక్, జేసీ అమయ్కుమార్, చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు వారికి హెలీప్యాడ్ నుంచి స్వాగతం పలికారు. వారి వెంట ఎంపీ పసులేటి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్నాయక్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీలు వలీయాబీతోపాటు పలువురు అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరిని భారీ పోలీసులు బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. -
జాతర్లకే అమ్మ మేడారం జాతర
అది శతాబ్దాల నాటి వన జాతర. తరతరాల గిరిజన జాతర. రాచరికపు అహంకారాన్ని, అన్యాయాన్ని ఎదిరించి, జనం కోసం ప్రాణత్యాగం చేసిన అడవిబిడ్డలైన ఆడపడచులను తల్లులుగా భక్తజనకోటి ఆరాధించుకునే అపురూప జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారి కళకళలాడుతూ కన్నుల పండుగ చేసే అద్వితీయ జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా రికార్డులకెక్కిన అరుదైన జాతర మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మల జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తల్లీ కూతుళ్లయిన సమ్మక్క సారలమ్మల వీరగాథ కాకతీయుల కాలం నాటిది. అప్పట్లో దండకారణ్యంలోని మేడారంలో కోయగూడెం ఉండేది. ఆ గూడేనికి చెందిన కోయలు ఒకనాడు వేట కోసం అడవిలోకి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక అడవిలో ఒకచోట పులుల రక్షణ వలయంలో ఉన్న ఒక పసిబిడ్డ కనిపించింది. ఆ మహత్తర దృశ్యం చూసి వారు దిగ్భ్రమ చెందారు. భక్తిపారవశ్యంతో కళ్లు మూసుకుని కొండదేవరకు మొక్కారు. కళ్లు తెరిచి చూసేసరికి పులులు మాయమయ్యాయి. బోసినవ్వులొలికిస్తూ పసిబిడ్డ మాత్రం అక్కడే ఉంది. ఆ పసిబిడ్డను వారు పల్లకిలో గూడేనికి తీసుకొచ్చారు. వెదురు పందిళ్లు వేసి, ఆమెను గద్దె మీద కూర్చుండబెట్టి కొండదేవత కానుకగా కొలవసాగారు. అడవిలోని పెద్దపులులు అప్పుడప్పుడు పసిపాప ఉండే గద్దె వద్దకు వచ్చి బుద్ధిగా సాధుజంతువుల్లా ప్రవర్తించేవి. ఈ అద్భుతాన్ని తిలకించిన గిరిజనులు ఆమెను కొండదేవత అవతారంగా తలచి, సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. ఆమె కొన్ని మహిమలను చూపడంతో సమ్మక్కను గిరిజనులంతా దేవతగా ఆరాధించసాగారు. సమ్మక్క క్రమంగా యుక్తవయసులోకి వచ్చింది. కాకతీయ సామ్రాజ్యంలోని సామంతరాజ్యమైన పోలవాస రాజ్యాన్ని పాలించే మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం చేశారు. వివాహం తర్వాత సమ్మక్క, పగిడిద్దరాజు మేడారం ప్రాంతాన్ని సామంతులుగా పాలించడం ప్రారంభించారు. ఏటా క్రమం తప్పకుండా కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించేవారు. సమ్మక్క, పగిడిద్దరాజులకు సారలమ్మ, నాగులమ్మ అనే కూతుళ్లు, జంపన్న అనే కొడుకు పుట్టారు. కొన్నేళ్లు సజావుగానే గడిచాయి. కాలం అనుకూలించక కొన్నేళ్లు వరుసగా కరువు కాటకాలొచ్చాయి. కాకతీయ సేనలపై తిరుగుబాటు వరుస కరువుల వల్ల పగిడిద్దరాజు కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయాడు. ఆగ్రహించిన కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. సమ్మక్క, పగిడిద్దరాజు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. సమ్మక్క, పగిడిద్దరాజు, జంపన్న, పగిడిద్దరాజు సోదరుడైన గోవిందరాజు మేడారం సరిహద్దుగా ఉన్న సంపెంగవాగు దాటకుండా కాకతీయ సైన్యాలను నిలువరించి, వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. యుద్ధం అక్కడితో ముగిసిపోలేదు. కాకతీయ సేనలు మరింతగా వచ్చి, గిరిజన బలగాలపై విరుచుకుపడ్డాయి. యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు ప్రాణాలు కోల్పోయారు. సంపెంగవాగు వద్ద కాకతీయ సేనలను ఎదిరించిన జంపన్న ఆ వాగులోనే పడి వీరమరణం చెందాడు. జంపన్న నెత్తుటితో తడిసిన సంపెంగవాగుకు అప్పటి నుంచి జంపన్నవాగు అనే పేరు స్థిరపడింది. యుద్ధంలో కాకతీయులదే పైచేయి కావడంతో కోయలంతా సమ్మక్క వద్దకు వెళ్లి ‘నీ మహిమలేమైపోయాయి తల్లీ’ అంటూ విలపించారు. వారి బాధకు చలించిపోయిన సమ్మక్క తానే యుద్ధరంగంలోకి దూకింది. సమ్మక్కను ముఖాముఖి ఎదుర్కొనే సాహసం లేని సైనికుడు ఒకరు ఆమెకు బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు. ఆమె గాయాన్ని అదిమిపట్టి, ఈశాన్య దిశగా అడవిలో చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెదుకుతూ వెళ్లిన కోయదొరలకు చిలుకలగుట్ట మీద ఒక పెద్ద నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించింది. దానినే సమ్మక్కతల్లి గుర్తుగా భావించారు. తల్లి మళ్లీ అక్కడకు వస్తుందనే ఆశతో కొన్నిరోజులు ఎదురు చూశారు. ప్రతాపరుద్రుడి పశ్చాత్తాపం యుద్ధ వినాశనం తర్వాత కాకతీయుల ఇలవేల్పు ఏకవీరాదేవి ప్రతాపరుద్రుడికి కలలో కనిపించింది. మేడారంలో జరిగిన నాశనాన్ని వివరిస్తూ కంటతడిపెట్టింది. అశేష గిరిజనుల గుండెల్లో దేవతగా కొలువుదీరిన సమ్మక్క, ఆమె కుటుంబం చేసిన ప్రాణత్యాగానికి ప్రతాపరుద్రుడు ఎంతగానో ఆవేదన చెందాడు. కప్పం కోసం తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది, మేడారం చేరుకున్నాడు. జరిగిన దానికి గిరిజనులకు క్షమాపణలు వేడుకుని, మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. సమ్మక్క తల్లి పేరిట రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ముత్తయిదువుల జాతరగా జరుపుకోవాలని ఆదేశించాడు. అప్పటి నుంచి నెమిలినార చెట్టు కింద పుట్ట వద్ద దొరికిన కుంకుమ భరిణను సమ్మక్క, సారలమ్మలకు ప్రతిరూపంగా పూజిస్తూ గిరిజన జాతరను వైభవోపేతంగా జరుపుకొంటూ వస్తున్నారు. ఇదీ సమ్మక్క, సారలమ్మల గురించి భక్తుల్లో ప్రచారంలో ఉన్న గాథ. మేడారం ఒక జాతరే కాదు... చరిత్ర కూడా! మహాసామ్రాజ్యాల నిర్మాణాలు – చక్రవర్తులు చేసే యుద్ధాలు – ఇవి మాత్రమే చరిత్రలో నమోదవుతాయి. విజయస్తంభాల్లో శాసనాల్లో శిలాక్షరమై మనగ్గలుగుతాయి. ఆ సామ్రాజ్యాల నిర్మాణాల్లో రాళ్లెత్తిన వాళ్లు అనామకులై మట్టిగలిసిపోతారు. యుద్ధాల్లో పరాజితులు చరిత్రహీనులవుతారు. ప్రాణాలు కోల్పోయిన, త్యాగాలు చేసిన వీరులు విస్మృతికి గురవుతారు. కానీ అన్నిసార్లూ అలాగే జరగదు. ప్రజలు తమ జాతి మనుగడ కోసం నిలబడిన వీరులను దైవాల్లా పూజిస్తారు. వాళ్లకు తమ గుండెల్లో ‘గద్దె’ కడతారు. వారి మరణాన్ని ఉన్నతీకరిస్తూ పాటలు కడతారు. గాథలు నిర్మిస్తారు. వీరులకు ఒక్కోసారి అలౌకిక మహిమలను సైతం ఆపాదిస్తారు. అయితే మౌఖికంగా ప్రచారమయ్యే ఆ పాటల్ని, గాథల్ని– వాటిలో, కల్పన కారణంగా – పండిత చరిత్రకారులు అకడమిక్ విలువలు లేని అప్రామాణికాలనీ చరిత్రగా ఒప్పుకోరు. ‘పుక్కిటి పురాణాలు’ అని తిరస్కరిస్తారు. శతాబ్దాలుగా ఆదివాసీ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచి, యివ్వాళ ఏడెనిమిది రాష్ట్రాల గిరిజన జాతులకు ఆరాధ్య దైవాలుగా కొలువులందుకుంటున్న సమ్మక్క–సారలమ్మల చరిత్రను కూడా అదేవిధంగా అనుమాన దృక్కులతో చూస్తున్నాం. లిఖిత ఆధారాలతోనో, తారీఖులు, దస్తావేజులతోనో చరిత్ర నిర్మించే వాళ్లకు కోయరాజుల చరిత్ర మౌఖికంగా పాడి వినిపించే ‘డోలీ’ల గాథలు అంటరానివి అయ్యాయి. అసలు ‘డోలీ’ అనే కోయ ఉపజాతి కళాకారులు ఇటువంటి పాటలు పాడుతూ తమ జాతి చరిత్ర కాపాడుకొంటూ వస్తున్నారనే చాలామందికి తెలీదు. ఇప్పుడు తొలిసారిగా జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో కోయ చరిత్ర – సంస్కృతుల్ని అధ్యయనం చేయడానికి పూనుకున్న పరిశోధన బృందం దాదాపు పదిహేనేళ్లపాటు అన్వేషించి డోలీలు చెప్పే కోయవీరుల చరిత్రను ‘పోరువీరుల గద్దె మేడారం’ అనే పుస్తకరూపంలో తెస్తోంది. డోలీలు చెప్పే ఈ కథ రూపంలోనూ, సారంలోనూ అద్భుతమైంది. ఓరుగల్లు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి ‘కరువు కాలంలో కప్పం కట్టం’ – అని తేల్చిచెప్పిన పగిడిద్దరాజు, అతని భార్య సమ్మక్క చేసిన అపూర్వమైన పోరాటాన్ని తరతరాలుగా డోలీలు కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. అయితే ఈ కళాకారులు అంతరించబోయే జాతి అని తెలుసుకోవడమే భయంకర విషాదం. మేడారం జాతరలో నిర్వహించే క్రతుకాండద్వారా యెన్నో ప్రతీకల్లో డోలీలు తమ జాతి చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కథలో ప్రస్తావించే అనేక ప్రదేశాలు – కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు దొరువులు చెట్టుపుట్టా – అన్నీ చరిత్రకు ఆధారాలే. ప్రజలు నిర్మించే చరిత్ర ఎప్పటికైనా సమ్మక్క శౌర్యంలా గద్దెనెక్కి కూర్చుంటుంది. – ఎ.కె.ప్రభాకర్, రచయిత, సాహితీ విమర్శకులు చరిత్రకు ఆధారం... పగిడె చిత్రం! కోయల చరిత్రను దాచి ఉంచినవి పగిడెలు. కోయ పురుషుల చరిత్రను అద్దం పడతాయి. పగిడెలు చూసి కోయవీరుల చరిత్రను గానం చేసే సంప్రదాయం ఉంది. అందుకే ఈ పగిడె చిత్రం కోయల చరిత్రకు పురా ఆధారం అని అంటారు. పగిడె ఒక్కొక్కటి రెండు గజాల నుంచి నాలుగు గజాల పొడవు ఉంటుంది. ఒకవైపు మూడడుగులు, మరోవైపు గజంపైగా వెడల్పు కలిగి ఉంటుంది. ఇది దీర్ఘ త్రికోణాకృతి కలిగి ఉంటుంది. దీనిలో ఆదివాసీల బొమ్మలు వేసి ఉంటాయి. వీటిలో కోయల పుట్టుక, గోత్రాలు, గోత్రపురుషులు, ఇంటిపేర్లు, కోయ దేవరల ప్రాంతీయత తదితర వివరాలు ఉంటాయి. చేసిన పోరాటాలు, మహిమలు, దేవదేవతల వివరాలు కూడిన బొమ్మలు ఉంటాయి. – ప్రొఫ్రెసర్ గూడూరి మనోజ, పాలమూరు విశ్వవిద్యాలయం మేడారం జాతర చారిత్రక మూలాలు పేరంబోయిన రాజు సాంబశివరాజుకు, ఆయన భార్య తూలుముత్తికి నలుగురు కూతుళ్లు. వారిలో సమ్మక్క పెద్దది. చెడాలమ్మ, నాగులమ్మ, కొమ్మాలమ్మలు ఆమె చెల్లెళ్లు. వీరితో కలసి గుంజేటి ముసలమ్మ కూడా కాకతీయ రాజులతో పోరాడుతుంది. పినపాక మండలంలోని సొప్యాల గ్రామంలో ఆమె జాతర జరుగుతుంది. వెదురువనం ధ్వంసం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సమ్మక్కను వెదుక్కుంటూ పారెడుగట్టు రాజులు వస్తారు. తమ పెద్ద కొడుకు పగిడిద్దరాజుకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. అలా వారి పెళ్లి జరుగుతుంది. ఓరుగల్లు పట్టణం చూసి తిరిగి తాడ్వాయి ప్రాంతం వస్తారు. పగిడిద్దరాజుకు గోవిందరాజు, గడికామయ్య, కొండాయి అనే సోదరులు ఉన్నారు. వరుసగా వర్షాలు పడకపోవడం వల్ల కాకతీయ ప్రతాపరుద్రుడికి రకం (కప్పం) చెల్లించలేకపోతారు. ప్రతాపరుద్రుడు ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు చెట్లలో నక్కి ‘మూర్ఛబాణం’ వేయడంతో పగిడిద్దరాజు పడిపోతాడు. ఆ విషయం తెలుసుకుని, ‘బాణాలవరస’ సైన్యంలో ఉన్న సమ్మక్క ఒకవైపు శత్రుమూకలతో తలపడుతూనే వచ్చి, అతడిని తన వీపు మీద వేసుకుని పోతుంది. పోతూ పోతూ యుద్ధం జరిగిన ఊళ్లకు, ప్రదేశాలకు కొత్తగా పేర్లు పెట్టింది. చివరకు నందిమేడారం దగ్గర ఆగి కోయదొరలందరినీ పిలిచి తాను చిలుకూరిగుట్టకు పోయి వస్తానని చెప్పింది. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి ధూంధాంగా జాతర జరపాలని చెప్పింది. కోయ వీరనారీమణులను కోయేతరులు కూడా పూజించడం అప్పటి నుంచి ఆచారంగా మారింది. ఇంతవరకు పగిడిద్దరాజు, సమ్మక్కల పుట్టుపూర్వోత్తరాల సమాచారం సాధికారికంగా తెలియదు. అయితే, గిరిజన ప్రజల అధికారిక గాయకులైన డోలీలు, వడ్డెలు, పట్టెడ పూజారులు సమ్మక్క సారక్క జాతర గురించి కొన్ని ఉదంతాలను విడివిడిగా చెప్పారు. డోలీలు అనే కోయతెగ దేవర కొలుపులు చేసేవారు. వారు ‘పోరువీరుల గద్దె మేడారం’ అనే సమ్మక్క సారక్క పోరాటగాథను గానం చేస్తారు. దానివల్ల అక్కడ ఆనాడు జరిగిన యుద్ధ క్రమం, కోయరాజుల వివరాలు తెలుస్తాయి. సమ్మక్క బిడ్డ సారమ్మ. ఈమె తల్లి తరఫున నిలబడి పోరాడింది. ఈమె భర్త సూరే పాపయ్య. తమ్ముడు జంపన్న. వీరి చరిత్రలను వెలికితీయాలంటే, మరో ఆరు కథలను సేకరించాలి. ఎరమరాజు, ముసలమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు వంటి వారికి గల ‘పగిడె’లను విప్పి వారిపై పాడే గాథలను వినాలి. నిజానికి ఇవి కోయ పురాణాలు. వీటిలో ఎన్నో చారిత్రకాంశాలు సంకేతింపబడి ఉన్నాయి. వీటిలో పేర్కొన్న చరిత్రను తవ్వి తీయాల్సి ఉంది. ఏది ఏమైనా సమ్మక్క సారమ్మలు చారిత్రక వ్యక్తులు అని చెప్పవచ్చు. – ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కవి, పరిశోధకులు గద్దె దగ్గర పడుకోబెడితే జబ్బు తగ్గింది నాకు ఏడాది వయసప్పుడు విపరీతంగా జబ్బు చేసింది. ఒళ్లంతా వాపులు వచ్చాయి. తల బాగా ఉబ్బిపోయింది. ‘ఈ పిలగాడు ఇక బతకడు’ అని బంధువులంతా అనుకున్నారట. దిక్కుతోచని పరిస్థితిలో మా అమ్మా నాన్నలు అడవి తల్లులైన సమ్మక్క సారలమ్మలనే నమ్ముకున్నారు. మేడారం జాతరకు నన్ను 1956లో తీసుకు వెళ్లారు. జంపన్నవాగులో స్నానం చేయించి, నన్ను సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర పడుకోబెట్టారు. జాతర తర్వాత నా జబ్బు తగ్గిపోయింది. అప్పటి నుంచి మా అమ్మకు సమ్మక్క సారలమ్మల మీద విపరీతమైన భక్తి ఏర్పడింది. ఆమె ఉన్నన్నాళ్లూ ప్రతిసారీ జాతరకు వెళ్లేవాళ్లం. ఇప్పటికీ అదే ఆనవాయితీ పాటిస్తున్నాం. – ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యాయుడు, నర్సంపేట అవి సమ్మక్క పలుకులే జంపన్న వాగుకు వెళ్లగానే నాకు సమ్మక్క పూనుతుంది. జాతరకు వచ్చిన వాళ్లలో చాలామంది తమ సమస్యలు చెబుతుంటారు. వాళ్లకుబదులిస్తుంటాను. అప్పుడు నా నోట వచ్చేవి నా మాటలు కావు. అవి సమ్మక్క పలుకులే. అవి కచ్చితంగా జరుగుతాయని భక్తుల నమ్మకం. – చింతకుంట్ల నర్సమ్మ, ఏటూరునాగారం ఇలా జరుగుతుంది జాతర సమ్మక్క సారలమ్మల జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈసారి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటి ఇరవై లక్షల మంది వరకు భక్తులు తరలి రావచ్చని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచే కాకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఈ జాతరకు తండోప తండాలుగా తరలి వస్తారు. మన దేశంలో కుంభమేళా తర్వాత భారీసంఖ్యలో జనం గుమిగూడే వేడుక ఇదే. తొలిరోజు... తొలిరోజు బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకొస్తారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరిపి, సాయంత్రం ఆంజనేయస్వామి తోడు రాగా సారలమ్మ మేడారం బయలు దేరుతుంది. ఈసారి జనవరి 31న చంద్రగ్రహణం ఉన్నందున రాత్రి 8గంటల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మేడారానికి దక్షిణాన ఉన్న అడవిలోకి వెళ్లి, అక్కడ గద్దెలపై ప్రతిష్ఠించే కంకవనాన్ని ఎంపిక చేస్తారు. వేకువ జామున సుమారు మూడు గంటలకు కంకవనానికి పూజలు జరిపి, సూర్యోదయ సమయానికి కంకలను అడవి నుంచి మేడారంలోని గద్దెల మీదకు చేరుస్తారు. రెండోరోజు జాతర రెండోరోజైన గురువారం సాయంత్రం సమ్మక్క ఆగమనానికి గుర్తుగా వేలాది జంతువులను బలి ఇస్తారు. సమ్మక్కకు గౌరవ సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె మీదకు తీసుకొచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె (పూజారి) తన్మయత్వంతో ఒక్క ఉదుటన చిలుకల గుట్ట నుంచి మేడారం వైపు పరుగున బయలుదేరుతాడు. సమ్మక్క రాకకు సూచకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి తుపాకులు కాల్చి దేవతకు ఆహ్వానం పలుకుతారు. మూడోరోజు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నలుగురూ గద్దెల మీద ఆసీనులై ఉండే రోజు కావడంతో ఈ రోజు లక్షలాదిగా భక్తులు జాతరకు తరలి వస్తారు. కోర్కెలు తీర్చమని సమ్మక్క, సారలమ్మలను వేడుకుంటారు. కోర్కెలు తీరిన వారు కానుకలు సమర్పించుకుంటారు. వనదేవతలను ఆడపడచులుగా భావించి, పసుపు కుంకుమలు, చీర సారెలు పెట్టి, ఒడి బియ్యం పోస్తారు. మొక్కులు మొక్కుకున్న భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగోరోజు జాతర నాలుగోరోజు శనివారం సాయంత్రం ముగుస్తుంది. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకువెళతారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఈ తతంగమంతా పూర్తవుతుంది. దేవతలను గద్దెల మీదకు చేర్చే సమయంలో రక్షణ కల్పించే విధంగానే, వనప్రవేశం సమయంలోనూ పోలీసులు కట్టుదిట్టమైన రక్షణతో వనదేవతలను సాగనంపుతారు. ఇన్పుట్స్: కృష్ణ గోవింద్, సాక్షి వరంగల్ ప్రతినిధి యాత్రికుల కోసం ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం మేడారం వద్ద హరిత హోటల్ను నిర్మిస్తోంది. భక్తుల వసతి కోసం తాత్కాలికంగా లగ్జరీ టెంట్లను అందుబాటులోకి తెచ్చారు. జాతర ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో సెమీ పర్మినెంట్ టాయిలెట్లు, మంచినీరు యాత్రికులకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ సంస్థ 53 పాయింట్ల నుంచి దాదాపు నాలుగువేల బస్సులను నడిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి మేడారానికి జాతర రోజుల్లో ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. రైల్వేశాఖ వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, మేరా ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. మేరా ఈవెంట్స్, మేడారం జాతర అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
మేడారం భక్తులకు జియో ఆఫర్
మేడారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో డిజిటల్ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో సంసిద్ధమైంది. ఈ ఆదివాసీ మహా జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు 4జీ మొబైల్ సేవలను నిరంతరాయంగా అందించనున్నట్టు తెలిపింది. జాతర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో కూడా భక్తులకు జియో నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మేడారం జాతరలో జియో భాగస్యామ్యం పట్ల రిలయన్స్ జియో తెలంగాణా సీఈఓ కె.సి.రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఈ జాతరలో పాల్గొనేందుకు తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రానుండటంతో జియో సేవలను విస్తరిస్తున్నాం. దేశవ్యాప్తంగా 4జీ టెలికాం సేవలను అందిస్తూ రిలయన్స్ జియో బ్రాండ్ ఇప్పటికే ప్రతి ఒక్కరికీ చేరువైంది. డిజిటల్ విప్లవాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరువ చేయడం మా ప్రధాన ఉద్దేశం. మా సరికొత్త ఫీచర్ ఫోన్ 'జియోఫోన్' ద్వారా ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం'' అని అన్నారు. ఇటీవలే జియోఫోన్ వినియోగదారులకు ప్రవేశపెట్టిన సంచలన ఆఫర్ రూ.49ను జాతరలో ప్రత్యేక స్టాళ్లలో అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 49 చెల్లించి నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడేందుకు ఈ ఆఫర్ వీలు కల్పిస్తోంది. ఈ ప్లాన్ ఎంచుకునేందుకు, కొత్తగా జియోఫోనే కొనేందుకు జాతరలో జియో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ భారతంలో జియోఫోన్ సరికొత్త శకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ భారతంలో ఫీచర్ ఫోన్ వాడుతున్న 60 లక్షల మంది వినియోగదారులు ఇప్పడు జియో ఫోన్ అందించే జియో డిజిటల్ లైఫ్ను సాధికారికంగా వినియోగిస్తున్నారు. గతంలో కేవలం వాయిస్ నెట్వర్క్ను మాత్రమే వినియోగించే ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు అందుబాటు ధరలోని జియో ఫోన్, సరసమైన ధరలో ఉండే జియో ఎల్టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మధురానుభూతికి లోనవుతున్నారు. -
20 లక్షల మంది భక్తులు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల బస్సులు.. 11 వేల మంది సిబ్బంది.. 20 లక్షల మంది ప్రయాణికుల తరలింపు లక్ష్యం.. సీసీ కెమెరాలు, ఉపగ్రహం ద్వారా ట్రాకింగ్తో పర్యవేక్షణ.. గిరిజన కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక ఇది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్న ప్రయాణికులెందరు, వారికి ఎన్ని బస్సులు అవసరమన్నది క్షణాల మీద గుర్తించి.. అంతేవేగంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. కనీసం 20 లక్షల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చటం లక్ష్యంగా పెట్టుకున్నందున 4 వేల బస్సులను సిద్ధం చేసింది. మరో ఐదారు వందల బస్సులను స్పేర్లో పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి మేడారం వద్దకు బస్సును తరలించే వరకు మొత్తం 11 వేల మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేడారంలో పెద్ద పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రద్దీని తెలుసుకునేందుకు.. సీసీ కెమెరాలు జాతర జరిగే ప్రాంతంలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 20 సీసీ కెమెరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆర్టీసీ ప్రాంగణంవైపు వస్తున్న భక్తులు, బస్సుల కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ప్రయాణికుల సంఖ్యను క్షణక్షణం పర్యవేక్షిస్తూ బస్సులను సమాయత్తం చేయనుంది. ఏ బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు వీలుగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సులన్నింటినీ ఉపగ్రహం ద్వారా ట్రాక్ చేసే విధానంతో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. సిబ్బంది వద్ద వాకీటాకీలు ఉంటాయి. జంపన్నవాగు నుంచి ఉచిత బస్సులు జాతరకు వచ్చే వారు తమ వాహనాలను సమీపంలో ఉండే నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ యార్డులో నిలపాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో జాతర వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగుకు కూడా మినీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలోనూ ప్రయాణికులను ఉచితంగా తరలించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం: ఆర్టీసీ ఎండీ రమణారావు ‘ఈ సారి జాతరలో ఆర్టీసీ కీలక సేవలందించనుంది. దాదాపు 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు తరలించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను వాడుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నేను జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తాను’. -
మారని రైల్వే...
సాక్షి ప్రతినిధి, వరంగల్: కుంభమేళాను తలపించే మేడారం జాతరకు రైళ్లను ప్రకటించడంలో రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగే రద్దీకి అనుగుణంగా ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక రైలునూ ప్రకటించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో సగం మేడారం బాటపట్టనున్నాయి. ఈ మేరకు ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రైళ్లను నడిపించాలి. జాతర తేదీలు సమీపిస్తున్నా రైల్వేశాఖ నుంచి ఉలుకుపలుకు లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంత పెద్ద ఉత్సవానికి ప్రత్యేక రైళ్లు నడిపించడంలో రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. సంక్రాంతి, దసరా పండగల సందర్భంగా రైల్వేశాఖ నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. ఇందులో 90 శాతం రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుకు వెళ్తాయి. కానీ.. ఆసియాలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించే విషయంలో ప్రతిసారి తాత్సారం జరుగుతోంది. జాతరకు వారం రోజుల ముందు వరకు ప్రత్యేక రైళ్లు ఉంటాయా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. రోడ్డుమార్గంలో సరిపడా బస్సులు లేని వారు రైలుమార్గం ద్వారా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవచ్చు. కాజీపేట రైల్వేజంక్షన్ ఉత్తర–దక్షిణ–పశ్చిమ ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది రైళ్లు కిక్కిరిన ప్రయాణికులతో వెళ్తుంటాయి. జాతర సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే అదనపు భక్తులకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవు. ముఖ్యంగా ఖమ్మం–డోర్నకల్–కాజీపేట–బల్లార్షా, సికింద్రాబాద్–బల్లార్ష మార్గంలో రద్దీకి అనుగుణంగా రైళ్లను నడిపించాల్సి ఉంది. ఈ దిశగా రైల్వేశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడారం రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్ రైల్వేశాఖకు లేఖ రాసినా.. ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. బస్సులకేదీ ప్రత్యామ్నాయం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో 95 డిపోలు ఉండగా.. సుమారు 10,479 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను మినహాయిస్తే పూర్తిస్థాయి కండిషన్లో 8,000 బస్సుల వరకు ఉన్నాయి. 2018 జాతర సందర్భంగా వీటిలో దాదాపు 4,000 బస్సులను మేడారం జాతరకు నడిపించేందుకు సిద్ధమని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ బస్సులు జనవరి 28 నుంచి నుంచి ఫిబ్రవరి 4 వరకు జాతర కోసం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఉమ్మడి పది జిల్లాల పరిధిలో నిత్యం తిరిగే బస్సుల సంఖ్య తగ్గిపోనుంది. ఇందుకనుగుణంగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కాజీపేట–సికింద్రాబాద్–నిజామాబాద్, సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా, కరీంనగర్–సిర్పూర్ కాగజ్నగర్, భద్రాచలం రోడ్డు–డోర్నకల్–కాజీపేట, మహబూబ్నగర్–కాచిగూడ–కాజీపేట మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని రైళ్లను నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మహా జాతర
-
స్వయంపాలనను చాటే జాతర
యావత్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా జరిగే మహత్తర జాతర ఈ ఆదివాసీ జాతర. ఇంత పెద్ద ఆదివాసీ జాతర ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఆదివాసీలు, ఆదివాసీయేతరులు లక్షలాదిగా తరలివచ్చే ఎంతో ప్రకృతి రమణీయమైన జాతర. మేడారం జాతరలో విగ్రహ ఆరాధన ఉండదు. కేవలం ప్రకృతి ఆరాధన, పసుపు కుంకుమలు తప్ప మరే ఇతర ఆచా రాలు ఉండని జాతర మేడారం జాతర. ఏదో ఒక పేరుతో ఆదివాసీల్ని అడవినుండి వెళ్లగొ ట్టాలనే కుట్రలు మన పాలక ప్రభుత్వాల విధానాలుగా ఉన్నాయి. అందుకే ఆధ్యాత్మికతను జోడించి ప్రశ్నించే తత్వాన్ని పారదోలేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీల రాగా లాపన ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. ఆదివాసీల ప్రాకృతిక ఆరాధనకు, ఆధిపత్య ప్రతిఘటనకు ప్రతీకగా ఈ మేడారం జాతర నిలుస్తుంది. ఆధిపత్య సంస్కృ తుల్ని సవాల్ చేస్తూ ప్రత్యామ్నాయ సంస్కృతుల్ని రూపొందిం చుకునే క్రమానికి స్థానికంగా ఆదివాసీ సమాజం ఎది గింది. అందువలనే ప్రకృతిని తప్ప మరో మనిషి ముందు సాగిలపడే సంస్కృతికి ఆదివాసీ సమాజంలో స్థానం లేదు. ఇక్కడ ఫ్యూడల్ మంత్రతంత్రాల ప్రసక్తి లేదు. నిర ర్థకమైన క్రతువులకు చోటు లేదు. అంతటా ప్రకృతికి, మానవ ప్రత్యామ్నాయానికి పెద్ద పీట వేయటం ఈ జాత రలో కనిపించే దృశ్యం. మరోవైపు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించి, జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది. అదే గనుక జరిగితే ఆదివాసీల అస్తిత్వం అంతమవుతుంది. మేడారం జాతరపై పాలక వర్గాల ఒత్తిడి, ఆధిపత్యం ఎక్కువవుతుంది. ఆదివాసీలు జాతరకు దూరమవు తారు. గిరిజనేతరుల వలసలు, ఆధిపత్యం ఎక్కువై జాతర నిర్వహణ గిరిజనేతరుల చేతిలోకి, దేవాదాయ శాఖ చేతిలోకి పోతుంది. ఆదివాసీల పోరాట చరిత్ర కనుమరుగు అవుతుంది. ఆదివాసీల చట్టాలు, జీవోల రాజ్యాంగ రక్షణలు, భూములు ఎలాగో పోయాయి. ఆదివాసీల అస్తిత్వమైన మేడారం జాతరను సైతం ఆదివాసీలకు దూరం చేయా లని పాలకులు, గిరిజనేతరులు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా, ఆదివాసీలు కాక తీయులపై కత్తులు దూసి ఆదివాసీ స్వయంపాలన కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మల పోరాట వార సత్వాన్ని పుణికిపుచ్చుకొని మేడారం జాతరను కాపా డుకోవాలి. (జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో జరుగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా) – వూకె రామకృష్ణ దొర ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు 98660 73866 -
తెలంగాణ కుంభమేళాకు ప్రభుత్వం ఏర్పాట్లు
-
వనదేవతల ఆశీస్సులతో జగన్ సీఎం కావాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం కావాలని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తు(72 కిలోలు) బంగారాన్ని మొక్కుగా చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని తల్లులను వేడుకున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో జాతర అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేసి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వైఎస్ సీఎం హోదాలో జరిగిన రెండు జాతరలకు హాజరయ్యారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతరకు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డికి వనదేవతలపై ఎంతో నమ్మకం ఉందన్నారు. 2019లో ఏపీ సీఎం అయితే దర్శనం కోసం సమ్మక్క సన్నిధికి తీసుకుస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి నాడెం శాంతకుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ తదితరులున్నారు. -
తీరు మారలేదు..?
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల పనితీరు ఇంకా మారనేలేదు. సరిగ్గా నెలరోజుల క్రితం వివిధ విభాగాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆలయ పర్యవేక్షకుడు రాజేందర్ నివాసాలపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు సోదాలు చేసిన నిఘా విభాగం.. రాజన్న ఆలయ అధికారులు, ఇన్చార్జీల నుంచి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా, కొందరు ఉద్యోగులు దాందా సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. శుక్రవారం రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని ఆసరా చేసుకున్న స్పెషల్ కోడెల టికెట్ కౌంటర్లోని సిబ్బంది.. కోడెల టికెట్లపై లడ్డూ ప్రసాదం ఇవ్వకుండా నొక్కేశారు. కేవలం టికెట్లు మాత్రమే భక్తుల చేతికి ఇచ్చి దందా సాగించారు. రూ.200 విలువైన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వాల్సి ఉన్నా.. ఆపని చేయకుండా సిబ్బంది తమ జేబులో వేసుకున్నారు. స్పెషల్ కోడె భక్తులకు టికెట్పై ఇచ్చే ఉచిత లడ్డూను కౌంటర్ సిబ్బంది రీసైక్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇండెంట్ ప్రకారం ప్రసాదాల గోదాం నుంచి స్పెషల్ టికెట్ల సంఖ్యకు అనుగుణంగా లడ్డూలు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రసాదాల విభాగానికి లడ్డూలు అందజేస్తారు. ఈక్రమంలో భక్తులకు ఇవ్వని ఉచిత లడ్డూ ఎక్కడికి వెళ్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమ్మక్క– సారలమ్మ జాతర సమీపిస్తోంది. ఈక్రమంలో రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని వెనువెంటనే తిరుగుపయనమవుతున్నారు. ఈక్రమంలో రూ.200 విలువైన స్పెషల్ కోడె టికెట్ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈటికెట్ ఇచ్చే కౌంటర్ ఒకచోట ఉంటే... టికెట్పై ఉచితంగా ఇచ్చే లడ్డూ ప్రసాదం కౌంటర్ను మరోచోట ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలియని భక్తులు.. లడ్డూ తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. అయితే రూ.100 కోడె టికెట్లు ఇచ్చిన చోటనే లడ్డూ ప్రసాదం అందించడం గమనార్హం. కొందరు భక్తులు మాత్రం ఇదేమిటని ప్రశ్నిస్తే.. ప్రచార శాఖలో లడ్డూలు ఇస్తున్నారని ఆ తర్వాత సిబ్బంది చెప్పడం గమనార్హం. జెల్ది ఇంటికి పోదామని రెండువందల రూపాయల కోడెల టికెట్టు దీసుకున్నం. దీనిమీద ఉచితంగా లడ్డూ ఇస్తమని రాసిండ్రు. దీనిగురించి కౌంటర్ల అడిగితే.. అక్కడిత్తరని, ఇక్కడిత్తరని జెప్పిం డ్రు. ఎక్కడ తిరిగినా లడ్డూ ఇయ్యలే. మాలాంటోళ్లను గిట్ల గోసవెట్టుడు మంచిదిగాదు. అధికారులు స్పందించి అందరికీ లడ్డూలు ఇప్పించాలె. – రామవ్వ, భక్తురాలు, నర్సంపేట ఇండెంట్ ప్రకారం లడ్డూలు మాకు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం కౌంటర్లకు లడ్డూలు అందజేస్తాం. అక్కడివారు వాటిని ఏం ఎలా పంపిణీ చేస్తున్నారో మాకు తెలియదు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు వేరు. మేం కేవలం లడ్డూలు అందిస్తాం. అయితే కోడెల టికెట్ ఇచ్చే కౌంటర్ వద్ద కాకుండా మరోచోట ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారట. అలాగే ప్రచారశాఖలోనూ లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. కానీ భక్తులకు ఇది అందుబాటులో లేదు. ఉన్నతాధికారులు దీనిపై చర్య తీసుకోవాలి. – రాజేశం, ప్రసాదాల గోదాం ఇన్చార్జి -
మేడారం జాతరకు రండి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వానించారు. బుధవారం ప్రగతిభవన్ లో వారు సీఎంను కలసి ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మేడా రం జాతర పోస్టర్, సీడీని ఆవిష్కరించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎం మంత్రులను కోరారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను కడియం ముఖ్యమంత్రికి వివరించారు. ‘‘2016లో మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.140 కోట్లు, ఈ సారి రూ.80 కోట్లు మంజూరు చేశారు. వీటితో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాం. భూపాలపల్లి, పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వచ్చే మూడు ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చాం. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాం’’అని కడియం వివరించారు. -
నేడు మహాజాతరకు అంకురార్పణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరలో తొలిఘట్టమైన గుడిమెలిగె పండుగ బుధవారం జరగనుంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయాలతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ తంతుతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క– సారలమ్మ మహాజాతర జరగనుంది. ఈ జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఈ జాతర గుడిమెలిగె పండుగతోనే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్లుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలకు మరమ్మతులు చేసేవారు. గుడిసెలకు కొత్తగా పైకప్పు అమర్చడం(కప్పడం) చేసేవారు. దీన్ని గుడి మెలగడం అంటారు. ఈ ప్రక్రియతోనే జాతర తొలిపూజ కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడిసెలు లేవు. వీటి స్థానంలో భవనాలు కట్టారు. గుడిసెలు లేకున్నా.. జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగెను నిర్వహిస్తున్నారు. -
పక్కా ప్లాన్తో హత్య?
సాక్షి, వరంగల్ రూరల్,ఏటూరునాగారం: మేడారంలో ఆర్ఎం ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చి శనివారం రాత్రి హత్యకు గురైన ప్రసాద్ను పక్కాగా ప్లాన్ చేసి అతికిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం, ఆర్థికలావాదేవీల కారణంగా తమ బంధువే అతడిని హత్య చేసినట్లు మృతుడి సోదరి శిరీష ఆరోపించింది. ఆమె కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన పట్టెం ప్రసాద్(26) మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగుకు సమీపంలో ఆర్ఎం ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చాడు. తమకు వరుసకు బాబాయి అయిన శివనగర్కు చెందిన కంభంపాటి పూర్ణచందర్ శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి వచ్చి షాపు నుంచి ప్రసాద్ను బయటికి తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపినట్లు ఆమె వెల్లడించింది. పూర్ణచందర్ రక్త సంబంధీకురాలితో ప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షగట్టి గతంలో మడికొండకు చెందిన మహేష్ వద్ద పంచాయతీ పెట్టించి చితకొట్టించాడని తెలిపింది. అంతేగాక గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమందితో పూర్ణచందర్ అల్లుడికి ప్రసాద్ డబ్బులు ఇప్పించాడని చెప్పింది. ఆ డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ పలుమార్లు అల్లుడిని అడిగిన విషయంలో కూడా గొడవలయ్యాయని శిరీష విలేకరులకు తెలిపింది. పై విషయాలను మనసులో పెట్టుకొని ప్రసాద్ను చంపివేశారని బోరున విలపించింది. తన సోదరుడిని చంపినవారిని కఠినంగా శిక్షించాలని శిరీష పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న తాడ్వాయి పోలీసులు మృతదేహానికి ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. ప్రసాద్ను హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నాణ్యతకు పాతర
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలో మినీ మేడారంగా పిలిచే అగ్రంపహాడ్ జాతర పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. జాతరలో ప్రతి ఏడాది 10లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు వేస్తున్నారు. అటు నిర్మిస్తున్నారో లేదో.. ఇటు రోడ్డుకు పగుళ్లు ప్రారంభమయ్యాయి. అక్కంపేట నుంచి దుర్గంపేట వరకు 6.2 కిలో మీటర్లు ఉంటుంది. గతంలో అగ్రంపహాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు సింగిల్ రోడ్డు ఉండేది. దీంతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురయ్యేవారు. డబుల్ రోడ్డు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.9కోట్లు కేటాయించింది. రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాతర సమీపిస్తున్నా పనులు పూర్తి కాలేదు. సీసీ రోడ్డు పోసిన తరువాత మట్టితో కట్టలు కట్టి నీటి ద్వారా క్యూరింగ్ చేయాల్సిం ఉంటుంది. మట్టి కట్టలకు బదులు గోనెతట్లు వేసి నీటిని చల్లుతున్నారు. దీంతో క్యూరింగ్ సక్రమంగా కాకపోవడంతో అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రా క్టర్ ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించి నాణ్యతగా చేపట్టేలా చూడాలని కోరుతున్నారు. -
గద్దెలపై బంగారం పోగు పూజారులదే...
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం (బెల్లం) పోగు చేసుకునే హక్కు స్థానిక ఆదివాసీ యువకులు, పూజారులుదేనని పూజారులు సిద్దబోయిన ముణేందర్, లక్ష్మణ్రావు, భోజరావు, నర్సింగరావు, మహేష్ అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెలపై భక్తులు సమర్పించిన బెల్లాన్ని గతంలో పూజారులు, స్థానిక ఆదివాసీలు ఉచితంగా తీసుకెళ్లేవారమని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో గద్దెలపై బెల్లం భారీగా పేరుకుపోవడంతో తొలగించడం కోసం దేవాదాయ శాఖకు ఆర్థిక భారం పడుతుందన్నారు. గత రెండు మూడు జాతరల నుంచి గద్దెలపై బెల్లాన్ని పోగు చేసుకునేందుకు మెయింట్నెన్స్ ఖర్చుల కోసం దేవాదాయ శాఖకు టెండర్ రూపంలో డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్గా పని చేసిన వాకటి కరుణ హయాంలో రాష్ట్రంలో గుడుంబా నిషేధం ఉండడంతో అమె గద్దెలపై బెల్లం టెండర్ను పక్కా జిల్లాలో నిర్వహించాలని, అంతే కాకుండా పొరుగు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విక్రయించుకోవాలని అదేశించారన్నారు. అప్పటి నుంచి పక్క జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడంలోని మణుగూరులో దేవాదాయ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో టెండర్ నిర్వహించి స్థానిక ఆదివాసీ యువకులు, పూజారులకే ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల నిర్వహించిన గద్దెలపై బెల్లం టెండర్లో ఐటీడీఏ పీఓకు కానీ, ఇతర అధికారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆదివాసీల సంఘాల నాయకులు జాతరలో అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను పూజారులను సంప్రందించిన తర్వాతే ప్రకటనలు జారీ చేయాలని కోరారు. -
అంతర్జాతీయ స్థాయిలో మేడారం జాతర
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని, విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాకాటి కరుణను జాతర కోసం ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన ఎంపీలను ఆహ్వానించాలని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అత్యాధునిక మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. జాతర ఏర్పాట్లపై సాంస్కృతిక దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. యాత్రికులకు హెలికాప్టర్ సేవలను కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్ శివ శంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
భక్తులకు ‘భగీరథ’ నీళ్లు
ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకంలో భాగంగా తొలిసారిగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేస్తోంది. జాతరలోని ప్రధాన ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా నీటిని అందించనుంది. రోజుకు 20 లక్షల లీటర్లు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే వారం రోజులపాటు రోజుకు 20 లక్షల లీటర్ల చొప్పున తాగునీటిని అందించనున్నారు. ఇందుకుగాను ఇంగ్లిష్ మీడియం పాఠశాల వెనుకాల 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. నీటిని భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు క్యూలైన్లు, చిలుకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగువంటి ప్రధాన ప్రాంతాల్లో నల్లాల ద్వార సరఫరా చేయనున్నారు. దీంతోపాటు ఆలయం లోపలి భాగంలో ఉన్న క్యూలైన్లలో 50 డ్రమ్ములను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చనున్నారు. ఇందుకుగాను ఈ కూడళ్లను కలిపి 6 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్న సరఫరా చేసే నీటిని భక్తులు తాగునీటికి కాకుండా అన్ని రకాల అవసరాలకు వినియోగిస్తే పరిస్థితి ఏమిటని అధికారులు పునరాలోచిస్తున్నారు. నేడు ట్రయల్ రన్ మిషన్ భగీరథ పథకంలో భాగంగా వాజేడు మండలం పూసూరు వద్ద మెయిన్ పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నీళ్లను రొయ్యూరు సమీపంలో ట్యాంకుకు మళ్లిస్తారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అందిస్తారు. అయితే మిగతా మండలాలు కాకుండా ప్రస్తుతం కేవలం మేడారం జాతరకు వచ్చే భక్తులకు నీళ్లను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నీళ్లను ఇతర పాయింట్లకు వెళ్లకుండ రొయ్యూరు నుంచి చిన్నబోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారానికి మళ్లించనున్నారు. ఇందుకోసం అధికారులు గురువారం పూసూరు మెయిన్ పాయింట్ నుంచి ట్రయల్రన్ చేయడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మేడారానికి నీరందేలా చేసి 25వ తేదీలోపు జాతర పరిసరాల్లో ట్రయల్ రన్ చేయాలని భావిస్తున్నారు. మహాజాతర 31న ప్రారంభం కానున్న దృష్ట్యా లోపాలను ముందే సవరించుకోవాలని భావిస్తున్నారు. -
వన జాతరలో సత్వర వైద్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు తరలి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లిలోని మేడారంలో జనవరి 31 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. జాతర సమయంలో కోటి మంది భక్తులు మేడారానికి వస్తారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో జనం వస్తుండటంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందులతో అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతుంటారు. వీరికి సత్వర వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని జాతర సమయంలో అక్కడికి పంపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే 220 మంది వైద్యులు, 780 మంది పారా మెడికల్ సిబ్బంది జాతర సమయంలో అక్కడ విధులు నిర్వహించేలా కసరత్తు పూర్తి చేసింది. వరంగల్ ఎంజీఎం, జీఎంహెచ్, సీకేఎం, ప్రాంతీయ కంటి ఆస్పత్రులకు చెందిన 20 మంది వైద్య నిపుణులు మేడారంలో సేవలందిస్తారు. జనరల్ ఫిజీషియన్, సాధారణ శస్త్రచికిత్స నిపుణులు, స్త్రీలు, చెవి, ముక్కు, గొంతు, రేడియాలజిస్ట్, దంత, పిల్లల, కంటి, ఎముకల వైద్య నిపుణులు షిప్టుల వారీగా 24 గంటలు సేవలందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల నుంచి వైద్యులు, సిబ్బంది మేడారానికి వస్తారు. 50 పడకల తాత్కాలిక ఆస్పత్రి.. భారీగా వచ్చే భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు జాతర ప్రాంతంలోనే 50 పడకల సామర్థ్యంతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. మేడారం పరిసర ప్రాంతాలు, జాతరకు వచ్చే మార్గాల్లో సుమారు 70 కిలోమీటర్ల నుంచి ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు భక్తులకు కల్పించనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు విరేచనాలు, జ్వరం, జలుబు, తలనొప్పి, ఇతర అత్యవసర సేవలు అవసరమైన రోగాలకు మందులను ఇస్తారు. వైద్య పరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆక్సిజన్ లాంటి సౌకర్యాలను అందుబాటులో పెడతారు. వేగంగా వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 14 చోట్ల ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రహదారుల వెంట మరో 40 శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. 108 వాహనాలు 13, ఆర్బీఎస్కే వాహనాలు 5, 104 వాహనాలు 5, మొత్తం 26 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నారు. -
అమ్మలను దర్శించుకున్న భక్తజనం
తాడ్వాయి: మేడారానికి అప్పుడే భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడం, ఈనెల 31నుంచి జాతర నిర్వహించనుండడంతో భక్తజనులు సమ్మక్క, సారలమ్మ తల్లులను ముందస్తుగానే దర్శించుకున్నారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవతల గద్దెలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, గాజులు, ఒడి బియ్యం, కానుకలను సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా మేడారం తరలివచ్చారు. సుమారు 2 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అంచనా. భక్తులు ఇబ్బందులు పడకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
మేడారం జాతరకు విచ్చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆహ్వానించారు. బుధవారం ఈ మేరకు వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకొని ఆహ్వాన పత్రికను అందించారు. జాతరకు తప్పక హాజరవుతానని వెంకయ్య హామీనిచ్చారని మంత్రి వెల్లడించారు. అనంతరం జాతర విశిష్టతను, ఏర్పాట్ల గురించి వివరించారు. జాతరను జాతీయ పండుగగా గుర్తించే విషయమై కేంద్రానికి సూచించాలని కోరినట్టు ఇంద్రకరణ్రెడ్డి మీడియాకు తెలిపారు. జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ప్రత్యేకంగా హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉచిత వైఫై, మంచినీరు, స్వచ్ఛతా అంశాలపై దృష్టి సారించినట్టు వివరించారు. వెంకయ్యను కలిసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
మేడారం జాతరకు రండి
న్యూఢిల్లీ: మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతిని ఈ ఉదయం కలిసిన ఆయన జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నఈ మహా జాతరకు రావాల్సిందిగా కోరారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, పలువురు ఎంపీలు ఉన్నారు. -
'మేడారం'ను జాతీయ పండుగగా గుర్తించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, టీఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేష్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరంను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో గిరిజనులు హాజరవుతారని వివరించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిందని వివరించారు. ఉత్తర భారతంలో జరిగే వనజ్ జాతరను జాతీయ పండుగగా గుర్తించినట్టే గిరిజనులు ఎంతో ఆరాధించే సమ్మక్క–సారలమ్మ జాతరను సైతం జాతీయ పండుగగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సాయం చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరినట్టు సమావేశం అనంతరం ఇంద్రకరణ్రెడ్డి మీడియాకు తెలిపారు. అలాగే జాతరకు రావాల్సిందిగా మంత్రి జుయల్ను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానించామన్నారు. -
మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలి
హైదరాబాద్: గిరిజన కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి.. రాష్ట్ర ఎంపీలతో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ను కలవనున్నారు. కోట్లాది మంది సందర్శించే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. -
జాతర పనుల్లో జాప్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య ఇప్పటికే వేలల్లోంచి లక్షల్లోకి చేరుతోంది. మరోపక్క జాతర కోసం రూ. 80 కోట్లతో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు కోటిమంది భక్తులు వస్తారనే అంచనా. అభివృద్ధి పనులన్నీ జనవరి 15 నాటికి పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల ఆదేశాలు, కలెక్టర్ పర్యవేక్షణలెలా ఉన్నా పనులు ఆశించిన మేరకు వేగంతో జరగడం లేదు. జాతర భక్తుల కోసం రూ. 11.75 కోట్లతో పారిశుద్ధ్యపనులు చేపడుతున్నారు. వీటితో 4,000 సెమీ పర్మనెంట్, 1,350 తాత్కాలిక, 60 శాశ్వత, 60 వీఐపీ టాయిలె ట్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు. చేతులెత్తేసిన ఇరిగేషన్ శాఖ: జాతర పనులు సకాలంలో పూర్తి చేయలేక ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేశారు. జంపన్నవాగులో 4 చెక్డ్యామ్ల నిర్మాణాలకు రెండేళ్ల క్రితం రూ. 14 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కేవలం రెండు చెక్డ్యామ్లకు శంకుస్థాపన చేసి, పనులు మధ్యలో వదిలేశారు. దీంతో స్నానాలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా ఇసుకబస్తాలతో ఆనకట్టలు ఏర్పాటు చేస్తున్నారు. జంపన్నవాగు వెంట మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఐరన్ఫ్రేములతో గదు లు ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తుల కోసం ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లూ చేయటం లేదు. మేడారం జాతరకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ. 4 కోట్లు కేటాయించారు. విద్యుత్ పనులు వేగంగా సాగుతున్నాయి. -
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రతిపాదిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం తెలిపారు. జాతర విశిష్టతను అన్ని గిరిజన ప్రాంతాల ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేడారం జాతరకు జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి గిరిజనులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. దేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు సాంబమూర్తి, ప్రేమేందర్రెడ్డి, లింగయ్య దొర, వినాయక్ నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతర విశిష్టతను తెలిపేలా డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం బీజేపీ నేతలు 11 మంది కేంద్ర మంత్రులను కలసి జాతరకు ఆహ్వానించారు. జాతరకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్టు మురళీధరరావు మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. యునెస్కొ గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు సంబంధించి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను జాతరకు ఆహ్వానించాలని ఆయన కోరారు. -
మేడారం జాతరకు పక్కా ఏర్పాట్లు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జనవరి 31 నుంచి జరగనున్న మేడారం మహాజాతరకు జిల్లా పోలీసు అధికారులు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం భూపాలపల్లిలో జిల్లా పోలీసు కార్యాలయ భవనం నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమై జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మేడారం జాతరకు కోటికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున..సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రాఫిక్, శాంతిభద్రతల సమ స్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి జాతరను దిగ్విజయం చేయాలన్నారు. ఆయన వెంట కలెక్టర్ ఆకునూరి మురళి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, గ్రే హౌండ్స్ ఐజీ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్, వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఉన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుపుతాం సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ పోలీసు వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టే దిశగా ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో మంగళవారం పర్యటించారు. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలని పోలీసులకు సూచించినట్టు వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఆ దిశగా ముందుకెళుతున్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితుల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. డీజీపీతో పాటు నార్త్జోన్ ఐజీపీ నాగిరెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ ఐజీపీ నవీన్చంద్, ఐజీ కె.శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ఎస్ఐబీ ఎస్పీ నర్సింగరావు, భద్రాచలం ఏసీపీ సునీల్దత్ పాల్గొన్నారు. -
టార్గెట్ మేడారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం ‘సమ్మక్క సారక్క’జాతరకు వచ్చే నేతలను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ల్యాండ్మైన్లు బయటపడటంతో అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది, మావోయిస్టులు ఎవరి కోసం ల్యాండ్మైన్లు అమర్చారో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించాయి. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు జరిగే మేడారం జాతర భద్రతను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీలు, అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల భద్రతపై సమీక్ష గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యారేజీల భద్రతపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవల జరిగిన చండ్రపుల్లారెడ్డి దళ సభ్యుల ఎన్కౌంటర్ వ్యవహారంపైనా ఆరా తీసినట్లు సమాచారం. కీలక ప్రాజెక్టులు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించినా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని ఎస్పీలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను స్థానిక దళ సభ్యులు బెదిరిస్తున్నారన్న అంశాలపైనా డీజీపీ చర్చించినట్లు సమాచారం. వారికి అదనపు భద్రత: భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. కీలక పదవుల్లో ఉన్న వారితోపాటు స్థానిక అధికార పార్టీ నేతలకూ మరింత భద్రత కల్పించాల్సిన అవసరముందని ఉన్నతాధికారులకు ఎస్పీలు వివరించినట్లు సమాచారం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేతలు పర్యటించడం ఇబ్బంది తెచ్చేలా ఉందని ఎస్పీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. గ్రేహౌండ్స్తో జల్లెడ..! భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి, పసర, ఏటూరునాగారం, ములుగు, వాజేడు, వెంకటాపురం, మహదేవపూర్, కాటారం, మహాముత్తరం ప్రాంతాలపై పోలీస్ శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. 100–150 కి.మీ. దూరంలోని ప్రాంతాలను జల్లెడ పట్టేందుకు గ్రేహౌండ్స్ ప్రత్యేక బృందాలను రంగం లోకి దించనున్నట్లు తెలిసింది. జాతరకు ఎన్ని బలగాలు కావాలి, గతంలో ఎంత మందితో బందోబస్తు నిర్వహించారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది అవసరం తదితరాలను డీజీపీ చర్చించినట్లు సమాచారం. -
మేడారానికి పోటెత్తిన భక్తులు
జయశంకర్ భూపాలపల్లి : మేడారం సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. మేడారం గద్దెల వరకు వాహనాలు వెళ్లకుండా జంపన్నవాగు దాటినా తర్వాత వాహనాలను పంట పొలాల్లోకి మళ్లించారు. గద్దెల వద్ద దేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సందడి మొదలైంది. -
మేడారం ఏర్పాట్లపై కడియం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో శనివారం జరిగిన ఈ సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, సౌకర్యాలు, భక్తులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై చర్చ జరిగింది. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడియం సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగునుంది. 31 వ తేదీ తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 3న(శనివారం) అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. -
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ నేతలు కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు శుక్రవారం కేంద్ర పర్యాటక, గిరిజన శాఖ మంత్రులు కేజే ఆల్ఫోన్స్, జుయల్ ఓరంలను ఢిల్లీలో కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమక్క–సారలమ్మ జాతరకు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రమంత్రులను కోరారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించామన్నారు. జాతర జరిగే ప్రాంతాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తి వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రులకు అందించినట్లు వారు తెలిపారు. ‘కాళేశ్వరాని’కి నిధులివ్వండి: రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీసుకుంటున్న చొరవకు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు. హైదరాబాద్–విజయవాడ రహదారిని ఎక్స్ ప్రెస్ వేగా మార్చాలని కోరారు. అలాగే హైదరాబాద్–ఖమ్మం రహదారి మధ్య లో వచ్చే చందుపట్ల గ్రామానికి బైపాస్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు లక్ష్మణ్ తెలిపారు. అలాగే మేడారం జాతరకు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్టు తెలిపారు. -
మేడారం జాతరకు రాహుల్ గాంధీ?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ తొలుత తెలంగాణలోనే పర్యటించనున్నట్లు సమాచారం. జనవరి నుంచి రాహుల్ బహిరంగ సభలు ఉంటాయని, ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఆయనను ఆహ్వానిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే పార్టీలో మార్పులు : సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువున్న నేపథ్యంలో పార్టీలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మున్ముందు మరింతగా బలపడుతుందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిపారు. -
మేడారం జాతర యాప్, వెబ్సైట్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాశస్త్యం ఏడాదికేడాది విశ్వవ్యాప్తమవుతోంది. భక్తుల సౌకర్యార్థం యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అనంతమైన సమాచారం ఇందులో పొందవచ్చు. ‘సమ్మక్క–సారలమ్మ జాతర మేడారం’పేరుతో కాకతీయ సొల్యూషన్స్ సహకారంతో ఈ యాప్ రూపొందించారు. అందులో జాతరలో భక్తులకు సేవలందించే సెక్టార్ అధికారులు, జాతర జరిగే తేదీలు, సంస్కృతి, సంప్రదాయాలు, కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ, చూడదగిన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, స్నానఘట్టాలు, వైద్య శిబిరాలు, హెల్ప్లైన్, బస్సులు వెళ్లు, ఆగు స్థలాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ సిబ్బంది, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఎక్కడ ఉన్నాయనే సమాచారం ఆ యాప్లో పొందుపరిచారు. జాతరకు వచ్చే భక్తులకు దారి మధ్యలో చూడదగిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. గిరిజన జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమాచారం కోసమైనా ఈ యాప్తోపాటు వెబ్సైట్ను రూపొందించారు. www.medaramjathara.com వెబ్సైట్లో కూడా సమాచారం నిక్షప్తం చేయడం మూలంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ సమాచారం ఎంతగానో దోహదపడుతుంది. -
మేడారంలో ఉద్రిక్తత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ధర్మకర్తల మండలి ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ట్రస్టు బోర్డు నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు ఎండోమెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. జయశంకర్ జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సమ్మక్క–సారలమ్మ జాతర జరగనుంది. జాతర నిర్వహణకు సంబంధించి 14 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్తో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఆదివాసీలు ఎండోమెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన ఆదివాసీ యువకులు అక్కడున్న కుర్చీలను గాల్లోకి విసిరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ కారుపైకి రాళ్లు విసిరారు. మరో పది కార్ల అద్దాలు పగిలాయి. ఆదివాసీల డిమాండ్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జాతర కార్యనిర్వహణాధికారి రమేశ్బాబు హామీనివ్వడంతో ఆందోళన విరమించిన ఆదివాసీలు ర్యాలీగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగా అక్కడే ఉన్న ఐటీడీఏ అతిథిగృహం నుంచి పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. పెసా చట్టం ప్రకారం జాతర పాలకమండలిలో ఆదివాసీలనే నియమించాలని ఆం దోళన కారులు డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యమే కారణమా? మేడారం జాతర ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం రసా భాస కావడానికి రాజకీయ జోక్యమే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతర సందర్భంగా తలనీలాల సేకరణ, గద్దెలపై పోగైన బెల్లం అమ్మకాలు నామినేషన్ పద్ధతిపై కేటాయిస్తున్నారు. ఈ విషయంలో ట్రస్టుబోర్డు నిర్ణయమే కీలకం. దీంతో ట్రస్టు బోర్డులో తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికార పార్టీ నేతలు స్థానం కల్పించారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ట్రస్టు బోర్డులో 14 మంది సభ్యులకుగాను ఇద్దరు ఆదివాసీలకు చోటు కల్పి ంచడం ఇందుకు ఉదాహరణ అని వారు పేర్కొంటున్నారు. దీనిపై ఏడాదికాలంగా పూజా రుల సంఘం, దేవాదాయశాఖకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటీవల లంబాడీ–ఆదివాసీల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. -
ఆదివాసీ-లంబాడీల వివాదం హింసాత్మకం
-
ఆదివాసీల ఆందోళన హింసాత్మకం
సాక్షి, భూపాలపల్లి : ఆదివాసీ- లంబాడీల వివాదం హింసాత్మకంగా మారింది. మేడారం జాతర ట్రస్టు బోర్డులో ఉన్న ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని గత కొద్ది రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాతర కోసం తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వెళుతుండగా ఆదివాసీలు వారిని అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కొంతమంది ఆందోంళనకారులు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు. -
జుట్టు జగడం..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఓ కొలిక్కి రాలేదు. గత జాతరల్లాగే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగాæ. టెండర్తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. జాతరలో హుండీ ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తున్నారు. అదేవిధంగా.. జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు. ఈ తలనీలాల సేకరణ ద్వారా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత రెండు జాతరల (2014, 2016) నుంచి తలనీలాల సేకరణ పనులను నామినేషన్ పద్ధతిలో పూజారుల సంఘానికి అప్పగించడంపై దేవాదాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికి ఇవ్వకుండా.. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ «ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. టెండర్లు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో 33 శాతం పూజారుల సంఘానికి ఇస్తామని చెబుతోంది. చేదు అనుభవాలు.. టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో తలానీలాల సేకరణకు టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర రాలేదు. దీంతో దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోయింది. ఫలితంగా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతోందని పూజారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల పద్ధతిలో చేదు అనుభవాలు ఎదురుకావడంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది. మార్కెట్లో ఉన్న డిమాండ్కు తగ్గట్లుగా సరైన ధర చెల్లిస్తూ పనులు దక్కించుకుంటున్నామని వారు అంటున్నారు. 2016 జాతరకు రూ. 1.5 కోట్లు, 2014 జాతరలో కోటి రూపాయలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాధాన్యం తగ్గిస్తున్నారు మేడారం జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా హిందు మత ప్రభావానికి తోడు జాతరలో వ్యాపార ధోరణి పెరిగిపోతోందని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన ఆదివాసీల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమక్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తోందని, అందులో భాగంగా ఈ జాతరలో తలనీలాల పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా ఏ విషయం తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు. తలనీలాల సేకరణ విషయంలో 2014 జాతర సందర్భంగా దేవాదాయశాఖ, పూజారుల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. దీంతో తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ అప్పుడు పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. మరోసారి అదే తరహా పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. -
మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు కేవలం జాతర కోసమే కాకుండా శాశ్వతంగా ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా, గిరిజనాభివృద్ధి శాఖ కమిషనర్ లక్ష్మణ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, సబ్కలెక్టర్ గౌతం, డీఎఫ్వో రవికిరణ్, పీవో ఐటీడీఏ చక్రదర్, ములుగు డీఎస్పీ రఘువేందర్రెడ్డి పాల్గొన్నారు. -
జనవరి 31 నుంచి మేడారం జాతర
సాక్షి, తాడ్వాయి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం మహా జాతరకు తేదీలు ఖరారయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే జాతర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తిభావంతో సమ్మక్క, సారలమ్మ తల్లులను కొలుస్తారు. వారి దీవనెల కోసం ఈ జాతరకు తరలివస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర సమయంలో మేడారం అడవులన్నీ జనసంద్రంగా మారుతాయి. కాగా సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలను మేడారంలోని ఆలయ ప్రాంగణంలో పూజారులు మహా జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది (2018) జనవరి 31(బుధవారం) తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1(గురువారం) రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న (శుక్రవారం) భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 3న(శనివారం) అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుందని పూజారులు వివరించారు. గ్రహణం తర్వాతనే గద్దెలపైకి మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం రోజున( జనవరి 31) గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయించింది. 31వ తేదీ సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధత ఏర్పడటంతో గ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని పూజారుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొస్తామన్నారు. -
రోడ్లు బాగు చేయండి : డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: మేడారంలో వచ్చే ఏడాది జనవరి 31న జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతర దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రహదారుల శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు, ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ...ఈ జాతరకు దాదాపు కోటిమందికిపైగా భక్తులు వస్తారని, ఇందులో రోడ్లు అత్యంత ప్రాధాన్యమైనందున వాటిని పూర్తిస్థాయిలో బాగు చేయాలని కోరారు. సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్, జాతీయ రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, ఎస్.ఈ రాజిరెడ్డి, ఈఈ హఫీజ్, ఎల్ అండ్ టీ ప్రతినిధులు హాజరయ్యారు. -
సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసినందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన ఈ మేడారం జాతరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. -
మేడారం జాతరకు ‘గ్రహణం’
సాక్షి ప్రతినిధి, వరంగల్: రానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం రోజున గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం, దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మేడారం జాతర జరుగుతుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతరను ఈసారి 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్లో తేదీలు ప్రకటించింది. 2018 జనవరి 31 జాతర తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధం ఏర్పడింది. గ్రహణం తర్వాత: చంద్రగ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని సమ్మక్క–సారలమ్మ పూజా రుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహ ణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొ స్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు చెప్పారు. పూజారుల సంఘం నిర్ణయం ప్రకారమే మేడారం జాతర విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయం ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గ్రహణం విషయంలో పట్టింపులు లేవని పూజారులు చెప్పారు. కాబట్టి ముందుగా నిర్ణయించినట్లుగానే 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జాతర జరుగుతుంది. –రమేశ్బాబు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, వరంగల్ -
రూ.104కోట్లు ,104రోజులు
♦ సమీపిస్తున్న మేడారం మహాజాతర ♦ ఇంతవరకూ టెండర్లు దాటని పనులు ♦ ఎప్పటిలాగే జాతర ముందే ప్రారంభం ♦ నాణ్యత లేకుండా కొనసాగుతున్న వర్క్స్ ♦ కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా వచ్చినా మారని అధికారుల తీరు మహాజాతర గడువు సమీపిస్తోంది. జాతరకు మరో 104 రోజులు మిగిలి ఉండగా.. ఖర్చు చేయాల్సిన డబ్బులు రూ.104 కోట్లు ఖజానాలో మూలుగుతున్నాయి. ఎప్పటి పనులు అప్పుడే చేసి నిధులు వృథా చేసే అలవాటున్న అధికారులు ఈసారి కూడా అలాగే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజు ల్లోనూ భక్తులు వస్తున్నప్పటికీ శాశ్వత సౌకర్యాలు కల్పిం చడంపై మంత్రులు, అధికారులు దృష్టి సారించడం లేదు. తాత్కాలిక పనులతోనే ఎక్కువగా ‘మిగులు’ ఉంటుందని భావించిన అధికారులు ఇప్పుడు కూడా అలాగే చేపడుతున్నా రనే విమర్శలు వినిపిస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, వరంగల్ సాక్షి ప్రతినిధి, వరంగల్ : తమిళ్ సూపర్స్టార్ రజనీకాంత్ హిట్ సినిమాలో ‘అరుణాచలం’ ఒకటిగా పేరు సంపాదించింది. అందులో 30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు చేయాలనే చాలెంజ్ను రజనీ స్వీకరిస్తాడు. రోజుకు రూ. కోటి ఎలా ఖర్చు చేయాలో తెలియక ప్రతి వస్తువునూ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తుంటాడు. బాగానే ఉన్న ఇల్లు కూలగొట్టి మళ్లీ కట్టిస్తాడు. హోటల్ మొత్తాన్ని అద్దెకు తీసుకుంటాడు. నటన తెలియని మామను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. మొత్తంగా 30 రోజుల్లో రూ.30 కోట్ల డబ్బు వృథాగా ఖర్చు చేస్తాడు. ప్రస్తుతం మేడారం జాతరకు కేటాయించే నిధులు, చేపట్టే పనులు సైతం అచ్చం అరుణాచలం సినిమానే తలపిస్తున్నాయి. ఏడాది ముందుగానే జాతర జపం మొదలు.. అభివృద్ధి పనులకు రూ. వందల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు.. రెండు నెలలకోసారి సమీక్షలు.. ఇంత చేసి ముందుగానే పనులు ప్రారంభిస్తారని అనుకుంటే అది మన పొరపాటేనని గ్రహించాలి. జాతర సమయం దగ్గర పడిన తర్వాతనే అధికారులు పనులు మొదలుపెడుతున్నారు. గడువు సమీపిస్తోందని చివరకు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. జాతర పూర్తికాగానే రూ. వంద కోట్లతో చేపట్టిన పనులు, అందుకు సంబంధించిన ఫలితాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా ఏర్పడినా అధికారులు తమ పనితీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు దాటని పనులు ఈసారి 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జాతర నిర్వహిస్తామంటూ సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్లో ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 35 రోజుల ముందుగా అంటే 2017 డిసెంబర్ 31 వరకు జాతర పనులు పూర్తి కావాలి. ఇప్పటినుంచి లెక్కించినా ప్రభుత్వం కేటాయించిన రూ.104 కోట్ల వ్యయంతో చేపట్టే పనులు సుమారు 104 రోజుల్లో పూర్తి చేయాలి. జాతర తేదీలు ప్రకటించి ఐదున్నర నెలలు దాటినా.. ఇంతవరకు ఒక్క పని ప్రతిపాదనల దశ దాటుకుని ముందుకు సాగలేదు. జాతర పనుల్లో జంప్నవాగుపై చెక్డ్యామ్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, పదివేల మరుగుదొడ్లు, మేడారానికి వచ్చే మార్గంలో వంతెనలు, కల్వర్టులు, రోడ్డు మరమ్మతులు వంటి పనులు ఉన్నాయి. ఈ పనుల అంచనాలు ఖరారు చేసి, టెండర్లు నిర్వహించి, అగ్రిమెంటు పూర్తి చేసి, మెటీరియల్ తెప్పించి పనులు మొదలుపెట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. పనులు మొదలు కాగానే.. డిసెంబర్ మొదటివారం నుంచే భక్తుల రాక మొదలవుతుంది. ఈ లోపు సంక్రాంతి సెలవులు వస్తాయి. దీంతో భక్తుల రాక పెరుగుతుంది. రోజుకు వేల సంఖ్యలో వచ్చిపోతుంటారు. ఈ జాతర జపంలో ఎప్పటిలాగే నాణ్యతను పక్కకు తప్పించి హడావుడిగా పనులు చేపట్టి వందల కోట్ల రూపాయలు మమ అనిపిస్తారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగానే గత జాతరలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, డార్మిటరీ, టాయిలెట్లు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. నాలుగు చెక్డ్యాంలు నిర్మించాల్సి ఉండగా.. ఒక్కదానికే శంకుస్థాపన జరిగింది. ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. చిన్న జిల్లాలోనూ మారని తీరు పరిపాలనలో వేగం పెరిగి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో రాష్ట్రంలోని పది జిల్లాలను విభజించి 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరి«ధిలోకి వెళ్లింది. చిన్న జిల్లాలుగా మారినప్పటికీ.. జాతర ఏర్పాట్లలో అలసత్వం కొనసాగుతోంది. గత జాతర ఏర్పాట్ల తరహాలోనే ఈ సారి నిరంతర జాప్యం చోటుచేసుకుంటోంది. స్టడీ టూర్కు వెళ్లొచ్చినా.. తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క–సారలమ్మ జాతర జరుగుతుంది. మాఘశుద్ధపౌర్ణమి (దాదాపు ఫిబ్రవరి) సమయంలో ఈ జాతర నిర్వహిస్తారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరుణంలో జాతర పనులు ఏడాది ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. 2016 డిసెంబరులో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లలో అధునాతన పద్ధతులు తెలుసుకునేందుకు స్టడీ టూర్లో భాగంగా జిల్లా అధికారులు 2017 జనవరిలో శబరిమలైకు వెళ్లారు. ఆఖరికి 2017 ఫిబ్రవరిలో రూ.147 కోట్లతో జాతర ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 104 కోట్ల ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. ఆ తర్వాత 2017 జూన్ 8న సచివాలయం, హైదరాబాద్లో రాష్ట్ర గిరిజన శాఖమంత్రి ఆజ్మీరా చందూలాల్ సమీక్షించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జాతరకు సంబం«ధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
అప్పుడే..గుర్తుకొస్తాయి..
♦ జాతర నాలుగు రోజులే వినియోగం ♦ ఆ తర్వాత నిరుపయోగమేనా? ♦ శాశ్వత మరుగుదొడ్లు అధ్వానం ♦ భక్తులకు వినియోగంలోకి రాని వైనం ♦ నిరుపయోగంగా షాపింగ్ కాంప్లెక్స్ ♦ పట్టించుకోని అధికారులు మేడారంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే గుర్తుకొస్తాయి. 2016 జాతరలో మల విసర్జన కోసం శాశ్వత మరుగుదొడ్లు నిర్మించారు. అవి ఆ జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే వినియోగంలోకి రాగా జాతర ముగిసిన అనంతరం నిరుపయోగంగా మారాయి. మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి నిరంతరం భక్తులకు వినియోగంలోకి తీసుకురావాలని లక్షల నిధులు వెచ్చించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. ఎస్ఎస్తాడ్వాయి(ములుగు): మేడారంలో 2016 జాతరలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో 40 మరుగుదొడ్లు, ఐటీడీఏ క్యాంప్ ఆఫీసు ఆవరణలో 20 మరుగుదొడ్లు నిర్మించారు. ఆ జాతరలో నాలుగు రోజులు వినియోగంలోకి వచ్చిన టాయిలెట్లు జాతర తర్వాత నిరుపయోగంగా మారడంతోపాటు తలుపులు ఊడిపోవడంతోపాటు బేష న్లు పగిలిపోయాయి. జాతర తర్వాత కూడా వచ్చే భక్తులకు వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్ధేశ్యంతో నిర్మించిన మరుగుదొడ్లకు మెయింటనెన్స్ చర్యలు తీసుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మేడారాన్ని పారిశుద్ధ్య మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే అధికారుల లక్ష్యం నిర్లక్ష్యంగా నీరుగారిపోతోంది. మరుగుదొడ్లు నిర్మించి రెండేళ్లు గడవక ముందే అధ్వానంగా మారడంతో భక్తులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈ మరుగుదొడ్లకు మరమ్మతు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. జాతర నాలుగు రోజులే కాదా..? అన్నట్లు అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారే తప్పా. తర్వాత పట్టించుకున్న నాథులే లేరు. రూ.40లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్లు.. మేడారంలో నిర్మించిన చేసిన షాపింగ్ కాంప్లెక్స్ గదులు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. 2016 జాతరలో స్థానిక గిరిజనుల వ్యాపారాల షాపుల ఏర్పాటు కోసం రూ. 40 లక్షలతో 27 షాపింగ్ కాంప్లెక్స్ గదులు నిర్మించి జాతరలో వ్యాపారాలకు కేటాయించిన అధికారులు జాతర అనంతరం స్థానికంగా ఉండే వ్యాపారులకు కేటాయించలేదు. దీంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. కానీ వ్యాపారులు మాత్రం రోడ్ల పక్కన గుడిసెలు వేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వాటిని ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారోననే ప్రశ్న గిరిజన వ్యాపారుల్లో తలెత్తుతోంది. అధికారుల నిర్లక్ష్యంతోనే వినియోగంలోకి తీసుకురాలేదని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ గదులను పరిశీలిస్తే మేడారంలో భక్తుల కోసం నిర్మించిన శాశ్వత నిర్మాణాలు ఏమేరకు అధికారులు వినియోగంలోకి తీసుకువస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి వీటిని భక్తులకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఎంతైన ఉంది. -
మేడారం పెద్ద చెరువును పరిశీలించిన ఆర్డీఓ
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని మేడారం పెద్దచెరువును బుధవారం దేవరకొండ ఆర్డీఓ గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడారం పెద్ద చెరువు నిండడం శుభపరిణామమన్నారు. చెరువు కింద ఉన్న గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణశాఖ సూచన మేరకు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ధర్మయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
వరంగల్: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. మేడారం అమ్మల గద్దెల వద్ద దేవాదాయశాఖ అధికారులు 22 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో పూజారుల సమక్షంలో లెక్కింపును ప్రారంభించారు. అంతకు ముందు పూజారులు అమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఆర్టీసీకి నష్టాల ‘జాతర’
మేడారంతో ఖజానాకు చిల్లు.. రూ.4 కోట్లు నష్టం సాక్షి, హైదరాబాద్: జాతరలు.. పుష్కరాలు.. కోట్లలో జనం ఒకచోటికి చేరే ఇలాంటి వేడుకల్లో ఆర్టీసీ పాత్ర అంతాఇంతా కాదు. సందర్శకులను అక్కడికి చేర్చటం, తిరిగి సొంతూళ్లకు తరలించడంలో ఆర్టీసీ బస్సులదే కీలక భూమిక. ఆ సమయంలో ఏ బస్సును చూసినా కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తే ఆర్టీసీకి కాసులే... కాసులు అనుకుంటారు. కానీ చివరికి లెక్కలు తేల్చేసరికి ఆర్టీసీ నష్టమే మిగులుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకుండా చోద్యం చూస్తుండటంతో భారీ వేడుకలు ఆర్టీసీకి గుదిబండలుగా మారుతున్నాయి. ఇటీవలి గోదావరి పుష్కరాల్లో లక్షల మందిని తరలించి రికార్డు సృష్టించిన ఆర్టీసీ చివరికి చేతులు కాల్చుకోగా, తాజాగా మేడారం జాతర కూడా అదే పరిస్థితిని కల్పించింది. 2014లో మేడారం జాతరకు ఉమ్మడి ఆర్టీసీ విస్తృతంగా సేవలందించి 16 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ టీఎస్ఆర్టీసీ సొంతంగా 18 లక్షల మందిని తరలించి సత్తా చాటింది. గత జాతరలో రూ.20 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.22 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇంత ఆదాయం వచ్చినా అంతకు కోటిన్నర మించి ఖర్చు ఉండే అవకాశం ఉందని అధికారులు సూత్రప్రాయంగా తేల్చారు. గోదావరి పుష్కరాల తరహాలో భక్తులు అధికసంఖ్యలో పోటెత్తితే ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో ఈసారి చాలామంది జాతర ప్రారంభానికి ముందే మేడారం బాటపట్టారు. వారు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఆర్టీసీ జాతర వేళ భారీ సంఖ్యలో సమకూర్చిన ప్రత్యేక బస్సులను పూర్తిగా వినియోగించాల్సిన అవసరం రాలేదు. దీంతో దాదాపు 650 బస్సులు ఖాళీగా ఉండిపోయాయి. రోజువారీ వీటికి రావాల్సిన ఆదాయం రాకపోవడంతోపాటు, వీటికోసం ప్రత్యేకంగా వచ్చిన సిబ్బందికి అదనపు భత్యాల చెల్లింపు ఖర్చు మీదపడింది. దీనివల్ల రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. వెరసి ఈ జాతర రూ.4 కోట్ల మేర నష్టాన్నే మిగిల్చినట్టయింది. -
మేడారంలో భక్తులకు శాశ్వత సౌకర్యాలు
- మంత్రి చందూలాల్ హైదరాబాద్ రెండేళ్లకొకసారి వచ్చే జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడుగునా మేడారాన్ని సందర్శించే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలను సమకూర్చనున్నట్లు గిరిజనసంక్షేమ, పర్యాటకశాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజన పర్యాటకంలో భాగంగా మేడారంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలోని కాకతీయుల కాలం నాటి సుందరమైన చెరువులు, రమణీయ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి సమన్వయ మండలిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమ్మక్క,సారలమ్మలకు సీఎం కేసీఆర్ తరఫున మొక్కులు చెల్లించిన మంత్రి చందూలాల్ ఆదివారం సీఎంకు ఆయన నివాసంలో అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. జాతరను నిర్వహించిన తీరును, భక్తులకు కల్పించిన సౌకర్యాలను గురించి మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పాడ్డక తొలిసారిగా జరిగిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి చందూలాల్ను సీఎం కేసీఆర్ అభినందించారు. శాతావాహన,కాకతీయుల చారిత్రక, వారసత్వ సంపద కట్టడాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పర్యాటకకేంద్రాలుగా అభివృద్ధిచేయాలని తనను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు. రెండేళ్ల తర్వాత వచ్చే మేడారం జాతరను జాతీయపండుగగా జరుపుకుంటామన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలను పర్యాటకప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు మంజూరుచేస్తామని సీఎం హామీనిచ్చారని మంత్రి చందూలాల్ తెలిపారు. -
సీనియర్ జర్నలిస్టుపై పోలీసుల దాడి
మేడారం జాతరలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్కు దారి ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించినందుకు ఆయన కారును ముట్టడించి దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన యాదగిరి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సీనియర్ జర్నలిస్టు పాశంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ఈ చర్యకు పాల్పడ్డ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. -
మేడారం వద్ద హోం మంత్రి మొక్కులు చెల్లింపు
వరంగల్ జిల్లా మేడారం క్షేత్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం వచ్చిన ఆయన అమ్మవారి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చానన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర పండుగగా మేడారం జాతరను నిర్విహిస్తున్నామని... రెండేళ్ల తర్వాత వచ్చే జాతరను జాతీయ ఉత్సవరంగా నిర్వహిస్తామని చెప్పారు. -
పోదాం పద... వన జాతరకు
♦ నేటి నుంచి మేడారం జాతర ♦ సాయంత్రం గద్దెలపైకి రానున్న సారలమ్మ ♦ గోవిందరాజులు, పగిడిద్దరాజులు సైతం... ♦ ఇప్పటికే 32 లక్షల మంది మొక్కులు గత జాతరలో కోటి మంది 2014 జాతరకు కోటి మంది భక్తులు వచ్చారు. ప్రస్తుత జాతరలో ఇప్పటికే 32 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భారీగా భక్తులు రానున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: వనం జనంతో నిండుతోంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారం చేరుకుంటున్నారు. సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరే గడియలు దగ్గరపడుతున్నాయి. వన దేవతల వడ్డెలు(పూజారులు) దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసీ పూజారులు, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్, ములుగు ఏఎస్పీలు కలసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే... పూజారులు, అధికారులు కలిసి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల పడిగిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లిగా కొలిచే సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో శనివారం జాతర ముగుస్తుంది. భారీ ఏర్పాట్లు... మేడారం జాతరకు ఈసారి కోటీ పది లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,605 బస్సులను నడుపుతోంది. జాతర నిర్వహణ కోసం 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. జంపన్న వాగుకు ఇరు వైపులా 3.6 కిలో మీటర్ల పొడవున స్నానఘట్టాలను నిర్మించారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో.. దేవాదాయ శాఖ పలు కొత్త నిర్ణయాలను తీసుకుంది. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైను ఏర్పాటు చేసింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వచ్చే అన్ని వర్గాల భక్తులకు పూర్తి ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. రూ.100 ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసింది. మొత్తం ఐదు క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే ఉండనున్నాయి. వికలాంగుల కోసం, వీవీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. భక్తులు మొక్కుల రూపంలో వనదేవతలకు బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియను ఈసారి పూర్తిగా ఉచితం చేసింది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. ప్రస్తుత జాతరలో ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా మార్చారు. -
మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని 83 ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జోయస్ డేవిస్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో సమావేశం నిర్వహించారు. జాతరకు హాజరయ్యే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. అవసరమైతే ఎన్ఎస్ఎస్, వాలంటీర్లు, యూత్ సంఘాల సభ్యుల సేవలు వినియోగించుకుంటామన్నారు. మేడారం వెళ్లే వాహనాలకు ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్ వే , ఫోర్ వీలర్లకు ఒక దారి, బస్సులకు, భారీ వాహనాలకు మరో దారి ఏర్పాటు చేశామని తెలిపారు. -
జాతరకు ప్రత్యేక రైళ్లు
ఈ నెల 17 నుంచి 20 వరకు నడపనున్న దక్షిణమధ్య రైల్వే మూడు మార్గాల్లో 16 రైళ్లు హన్మకొండ : మేడారం జాతరకు వచ్చే భక్తుల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ‘మేడారం జాతరకు రైళ్లు లేవా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు రైల్వేశాఖ స్పందించింది. వరంగల్ జిల్లా మీదుగా వెళ్లే మూడు ప్రధాన మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు ఈ రైళ్లు సిర్పూర్కాగజ్నగర్, హైదరాబాద్, ఖమ్మం వైపు ప్రయాణిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లకు 14 బోగీలు ఉంటాయి. సికింద్రాబాద్-వరంగల్ ప్రత్యేక రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5:45 గంటలకు వరంగల్లో బయల్దేరి రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యంలో మౌలాలీ, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి, వంగపల్లి, ఆలేరు, పెం బర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘన్పూర్, పెండ్యాల, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. సిర్పూర్ కాగజ్నగర్-ఖమ్మం ప్రత్యేక రైలు ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉదయం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్లో బయల్దేరి ఉదయం 11:15 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5గంటలకు ఖమ్మంలో బయల్దేరి రాత్రి 11గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ చేరుతుంది. మార్గమధ్యంలో రాలపేట, ఆసిఫాబాద్రోడ్, రేపల్లెవాడ, రెచ్నీరోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూరు, ఓదెల, పొత్కపల్లి, బిసుగిర్షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్పర్తి, కాజీపేట టౌన్, వరంగల్, చింతల్పల్లి, ఎలుగూరు, నెక్కొండ, ఇంటికన్నె, కేసముద్రం, తాడ్లపూసపల్లి, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పాపటపల్లి, మల్లెమడుగు స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ ప్రత్యేక రైలు ఈ నెల 17న కాజీపేటలో రాత్రి 7 గంటలకు బయల్దేరి రాత్రి 11:30 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 20 సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్లో బయల్దేరి రాత్రి 9 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో పాలపేట, ఆసిఫాబాద్ రోడ్డు, రేపల్లెవాడ, రేచిని రోడ్డు, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచి ర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూరు, ఓదెల, పొత్కపల్లి, బిషిగిరి షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్పర్తి స్టేషన్లలో ఆగుతుంది. అరుుతే, ఈ రైలు రాకపోకలు సమయాలు జాతరకు వచ్చే ఆయా ప్రాంత ప్రయాణికులకు ఉపయోగకరంగా లేవనే విమర్శలు ఉన్నాయి. -
మేడారం జాతర సమయంలో బస్సులెలా?
♦ ‘స్పెషల్’ రూపంలో 2 వేల బస్సుల మళ్లింపు ♦ హైదరాబాద్ నుంచే వెయ్యి సిటీ బస్సుల తరలింపు ♦ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ♦ విభజనతో ఆంధ్ర నుంచి బస్సులు రాకపోవటమే కారణం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలి వెళ్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ జిల్లా మేడారానికి భక్తజనం చేరుకుంటుంది. జాతర జరిగే రోజుల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. అక్కడి జంపన్నవాగులో నీళ్లు కనిపించకుండా భక్తులు నిండిపోతారు. ఇంత రద్దీ ఉండే సమయంలో వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. కానీ ఈసారి అదనపు బస్సులు నడపటం ఇబ్బందిగా మారబోతోంది. జాతర మొదలు కాకముందు నుంచే శని, ఆదివారాల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈనెల 14 నుంచి ఆ సంఖ్య ఎక్కువ కానుంది. ఇక 17, 18 తేదీల్లో అది మరింతగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ దాదాపు రెండు వేల అదనపు బస్సులను మేడారం వైపు నడుపుతోంది. ఒక్క హైదరాబాద్ నుంచే వెయ్యి వరకు సిటీ బస్సులను నడపనున్నట్లు సమాచారం. తొలుత సిటీ బస్సుల్ని వివిధ జిల్లాలకు పంపి.. ఆయా ప్రాంతాల నుంచి మేడారం వరకు నడపనున్నారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే.. అదనపు బస్సులు నడపాలంటే ఇలాంటి ఇబ్బందులను ఇక ఎదుర్కొనక తప్పదని బదులిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో ఆంధ్ర నుంచి బస్సులను తెప్పించి స్పెషల్ సర్వీసులుగా నడిపేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో అక్కడి నుంచి ఒక్క బస్సు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాటిని తెప్పిస్తే ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అది టీఎస్ ఆర్టీసీ ఖజానాకు భారంగా మారుతుంది. దీంతో ఇక్కడి పది జిల్లాల నుంచే కొన్ని కొన్ని చొప్పున బస్సులను మళ్లించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జాతర జరిగే మూడు, నాలుగు రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా బస్సుల కొరత ఏర్పడబోతోంది. -
సమ్మక్క-సారలమ్మ వందనం అమ్మలు
మేడారం జాతర. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నమి) రోజుల్లో జరిగే జాతర. గిరిజన సంప్రదాయాలకు పట్టం కట్టే జాతర. ఆసియాలోనే అతి పెద్ద వనజాతర. ఈ జాతర సమయంలో కోటి మందికిపైగా వచ్చే భక్తులతో అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది. మొక్కులతో ముడుపులతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఈ నెల ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. గిరిజనుల గుడులు నిరాడంబరమైనవి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు కూడా గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం (గుడి మెలిగె) ఆనవాయితీ. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ను నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్ని ‘మండ మలిగె’ అంటారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ‘మండ మెలిగె’ మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండగ నిర్వహిస్తారు. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు. విగ్రహాలు లేని పూజ మేడారం జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. సమ్మక్క-సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండకపోవడమే ఆ ప్రత్యేకత. ఇక్కడున్న రెండు గద్దెల్లో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాల (నారేప)నే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంకమొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. వీరు పసుపు, కుంకుమల స్వరూపాలు. దేవతల గద్దెపై లభించే కుంకుమతో మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవతామూర్తులను తోడ్కొని వచ్చే వడ్డెలు తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తులు సాష్టంగపడతారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్త్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఇది దేవతలకు ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. మేడారం వచ్చే భక్తుల్లో గిరిజనులు, పేదలే ఎక్కువగా ఉంటారనే భావనతో విలువైన కానుకలు, మొక్కులు ఇక్కడ లేవని చెబుతుంటారు. మొక్కులు ఫలించి సంతానం కలిగినవారు జాతర వచ్చినప్పుడు ఎత్తు బంగారం సమర్పిస్తారు. కోర్కెలు తీరితే ఎడ్ల బండ్లు కట్టుకుని జాతరకు వస్తామని అమ్మవారి రూపంలో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడి బియ్యం), ఎదురు కోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా గాల్లోకి ఎగరవేసిన కోళ్లు), లసిందేవమ్మ మొక్కు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ ఉంటాయి. వనం నుంచి వనంలోకి సమ్మక్క-సారలమ్మ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) ఈశాన్య దిశగా ఉన్న చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం ప్రాంతం మొత్తం శివసత్తుల శివాలుతో, భక్తిపరవశంతో ఊగిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో లెక్కలేనంత మంది భక్తులు మేడారానికి వస్తారు. మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. - పిన్నింటి గోపాల్, సాక్షిప్రతినిధి, వరంగల్ సమ్మక్క కథ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కోయగిరిజనుల కథనం ఇలా ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లినప్పుడు అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. యుక్త వయసు వచ్చిన సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు-సమ్మక్కలకు సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజులతో పెళ్లి జరిగింది. మేడారం ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడున్న సారవంతమైన భూములును ఆక్రమించేందుకు కాకతీయరాజు రుద్రదేవుడు మేడారంపై దండెత్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విన్న సమ్మక్క ధైర్యం కోల్పోకుండా, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడింది. ఆమె దాటికి తట్టుకోలేని శత్రువర్గంలో ఒకడు వెనుక నుంచి బల్లెంతో పొడిచాడు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించగా నాగవృక్షపు నీడలో ఉన్న పాముపుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. గిరిజనులు ఈ భరిణే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ జాతర చేసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు. -
గ్రేటర్ పోరుకు రెడీ
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం వ్యూహ రచనల్లో రాజకీయ పార్టీలు కార్యక్రమాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. డివిజన్ల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల జీడబ్ల్యూఎంసీ అధికారులు మున్సిపల్ శాఖ కమిషనర్కు పంపించారు. ప్రభుత్వం వీటిని ఆమోదించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అరుుతే, మేడారం జాతర ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధమవుతుండగా... రాజకీయ పార్టీల్లోనూ గ్రేటర్ వరంగల్ ఎన్నికల వేడి మొదలైంది. నెల రోజుల్లోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో టీఆర్ఎస్ నాయకులు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు... రెండు రోజులుగా నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. గతంలో మొదలై పూర్తి కావచ్చిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం గ్రేటర్ వరంగల్లోని విలీన గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కాగా, మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ నేతల్లో పోటీ పెరుగుతోంది. టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్కు పార్టీ అధిష్టానం మేయర్ పదవిపై గతంలో హామీ ఇచ్చిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొత్తగా పలువురు నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన రిజర్వేషన్ల ప్రకారం వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే అప్పటి రిజర్వేషనే ఇప్పుడు అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఘోర పరాజంతో కుదేలైన కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో బలం చూపించాలని ప్రయత్నిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో మరింత బలహీనమైన ఈ రెండు పార్టీలకు గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. సంప్రదాయ ఓటు బ్యాంకు ఆధారంగా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి నుంచి బయటపడాలని బీజేపీ-టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇలా.. గ్రేటర్ వరంగల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని బలం చూపెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లు ఉన్నాయి. ప్రతిపాదనల ప్రకారం 13 డివిజన్లు అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి. జనరల్కు కేటాయించిన డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు సంబంధించిన మహిళలు, పరుషులు పోటీచేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మహిళలకు 15 డివిజన్లు రిజర్వు చేశారు. ఈ డివిజన్లలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీసీలకు 19 డివిజన్లు రిజర్వు చేశారు. ఇందులో బీసీ జనరల్కు 10, బీసీ మహిళకు 9 డివిజన్లు రిజర్వు చేశారు. ఎస్సీలకు 9 డివిజన్లు కేటాయించారు. వీటిలో ఎస్సీ జనరల్ కేటగిరీలో ఐదు, ఎస్సీ మహిళ కేటగిరీలో ఐదు డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకు రెండు డివిజన్లు కేటాయించారు. ఇందులో ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. -
మేడారానికి అదనపు బస్సులు
వరంగల్ జిల్లా మేడారంలో జరగనున్న జాతరకు సికింద్రాబాద్ నుండి 500 బస్సులను నడుపుతున్నట్లు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ కొమురయ్య తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16 నుండి ప్రారంభం అవుతున్న మేడారం జాతరకు ఈ నెల పది నుండే బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సులను మేడారానికి నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ, చార్జీల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కొమురయ్య వెల్లడించారు. ఆయా కాలనీల్లో బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే వారికి అనుకూలంగా రాను పోను బస్సును నడపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలంగాణా ఆర్టీసీ అధికారులు కోరారు. -
మేడారం..జనసంద్రం
సమ్మక్క-సారలమ్మ తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో మేడారం మురిసిపోయింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి ఆదివారం సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ములుగు గట్టమ్మ, మేడారం వద్ద నార్లాపురం-ఊరట్టం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. నార్లాపురం-ఊరట్టం క్రాస్ మధ్య 5 కిలోమీటర్లు వెళ్లడానికి 30 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వాహనాలను ఊరట్టం క్రాస్ వద్ద నిలిపివేశారు. హోల్డింగ్ పాయింట్ నుంచి భక్తులను స్థానిక ఆటోల ద్వారా ఆలయం వైపునకు అనుమతి ఇచ్చారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కొన్ని కనెక్షన్లు మాత్రమే ఇవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా సిద్ధం చేయకపోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో పనులు జరగుతున్నాయని శనివారం వరకు ఒకవైపు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బారికేడ్లను తొలగించారు. -
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లకు కృషి
-పయాణికులకు సౌకర్యాల కల్పనే ధ్యేయం -దక్షిణ మధ్య రైల్వే చీఫ్ క్లైమ్స్ ఆఫీసర్ కేపీ రావు కాజీపేట రూరల్(వరంగల్ జిల్లా): గోదావరి పుష్కరాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల మాదిరిగానే తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ క్లైమ్స్ ఆఫీసర్(సీసీఓ) కేపీ రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్లోని రైల్వేస్టేషన్, ప్లాట్ఫాంలను శుక్రవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేకు రోజుకు రూ.30 కోట్ల ఆదాయం వస్తోందని, వచ్చిన ఆదాయంతో ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లో లెవెల్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంలను హైలెవెల్ ప్లాట్ఫాంలుగా అభివృద్ధి చేసి ఆయా రైల్వేస్టేషన్ల్లో ప్రయాణికులకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైల్వే సేవలను మరింత ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు రిజర్వేషన్ టికెట్ కౌంటర్ కార్యాలయాలను ముఖ్య కేంద్రాలలో, పోస్టాఫీస్లలో ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్లో ఢిల్లీ-చెన్నై మధ్య నడిచే రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తె లిపారు. ప్లాట్ఫాంపై ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాజీపేటలోని నెలకొన్న ప్రయాణికుల సమస్యలను, చేయూల్సిన అభివృద్ధి పనుల వివరాలను స్థానిక అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సీసీఓ వెంట కాజీపేట స్టేషన్ మేనేజర్ ఆంజనేయులు, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ ఐఎస్ఆర్.మూర్తి తదితరులు ఉన్నారు. -
మేడారం జాతరకు మొబైల్ యాప్
ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్శర్మ సాక్షి, హైదరాబాద్: మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దర్శనం మరింత సులభతరం కానుంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరిగే జాతరకు రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు, స్నాన ఘట్టాలు, ట్రాఫిక్ జామ్ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వరంగల్ పోలీసులు మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరంగల్ నిట్ విద్యార్థుల సహకారంతో రూపొం దించిన ఈ యాప్ను శుక్రవారం డీజీపీ అనురాగ్శర్మ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.రవీందర్, విద్యార్థులు సాయితేజ, రాహుల్, దేవేంద్ర, శివం యాప్ పనిచేసే విధానాన్ని వివరించారు. జాతరపై వరంగల్ జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన వీడియోను డీజీపీ పరిశీలించారు. తెలంగాణ నార్త్జోన్ ఐజీ నవీన్ చంద్, వరంగల్ ఎస్పీ అంబార కిశోరే ఝా పాల్గొన్నారు. -
మొదలైన మేడారం జాతర సందడి
-
ఫిబ్రవరి మొదటి వారానికి అంతా సిద్ధం
♦ మేడారం జాతర ఏర్పాట్లపై కడియం ♦ చందూలాల్, ఇంద్రకర ణ్తో కలసి పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరగనున్న తొలి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా భావించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగే జాతరకు తెలంగాణతోపాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ల నుంచి కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నం దున ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలతో కలసి ఆయన మేడారం జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఆరు నెలల క్రితమే జాతర ఏర్పాట్లను ప్రారంభించామని, రూ.154 కోట్లతో పనులు చేస్తున్నామని కడియం వివరించారు. ప్రస్తుతం రోడ్లు, భక్తులు దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, లైటింగ్ ఏర్పాట్లు తదితర పనులు జరుగుతున్నట్లు చెప్పారు. వచ్చే నెల మొదటివారానికల్లా పనులు పూర్తవుతాయని, త్వరలో క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తామన్నారు. రూ.1.20 కోట్లతో గద్దెల వద్ద, ఆ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ చేయిస్తున్నామని, స్టీల్ బారికేడ్లతోపాటు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే పరిసరాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇటు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా వెళ్లే దారి, అటు తాడ్వాయి మీదుగా వచ్చే రోడ్డును రెండు లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం ఉత్సవాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకునే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు చెప్పారు. గురువారం నుంచి ఆహ్వానపత్రికలు పంపుతామన్నారు. మేడారం జాతరకు ఆసియాలోనే పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుందని మంత్రి చందూలాల్ అన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ఎస్సీ సెల్ చైర్మన్ రవి పాల్గొన్నారు. -
ఆసియాలోనే పెద్ద జాతరకు రైళ్లు లేవా?
కోటి మందికి పైగా భక్తుల రాక ప్రత్యేక రైళ్ల కోసం ఎంపీల వినతులు ఉలుకూ పలుకూ లేని రైల్వేశాఖ సాక్షి, హన్మకొండ : ఆసియాలోనే పెద్దదైన.. కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం గిరిజన జాతరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించడంలో రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహారిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగే రద్దీకి అనుగుణంగా ఒక్క ప్రత్యేక రైలును ప్రకటించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో సగం మేడారం బాటపట్టనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రైళ్లను నడిపించాల్సి ఉంది. పెరగనున్న రద్దీ 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తులు రైళ్ల ద్వారా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవచ్చు. ముఖ్యంగా కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర-దక్షిణ-పశ్చిమ ప్రాంతాలకు మధ్య వారధిగా ఉంది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది రైళ్లు కిక్కిరిన ప్రయాణికులతో వెళ్తుంటాయి. జాతర సందర్భంగా వచ్చే ఉండే లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవు. ఖమ్మం-డోర్నకల్-కాజీపేట-బల్లార్షా, సికింద్రాబాద్-బల్లార్ష మార్గంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపించాల్సి ఉంది. కానీ ఈ దిశగా రైల్వేశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడారం రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, పసూనూరి దయాకర్ ఇప్పటికే రైల్వేశాఖకు లేఖలు రాశారు. బస్సులకేదీ ప్రత్యామ్నాయం? 2014 జాతర సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థకు 22 వేల బస్సులు ఉండేవి. వీటిలో 3200 బస్సులను మేడారం జాతరకు కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పరిధిలో 95 డిపోలు ఉండగా 10,454 బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిటీ బస్సులు, ఇతరత్రా మినహాయిస్తే పూర్తిస్థాయి కండిషన్లో 8000 బస్సులుంటాయి. వీటిలో దాదాపు 4,000 బస్సులను మేడారం జాతరకు నడిపించేందుకు సిద్ధమని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ బస్సులన్నీ ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు జాతర కోసం కేటాయించనున్నారు. దీంతో వారం రోజులపాటు పది జిల్లాల పరిధిలో నిత్యం తిరిగే బస్సుల సంఖ్య తగ్గిపోనుంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైళ్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కాజీపేట- సికింద్రాబాద్-నిజామాబాద్, సికింద్రాబాద్-కాజీపేట-బల్లార్షా, కరీంనగర్-సిర్పూర్ కాగజ్నగర్, భద్రాచలం రోడ్డు-డోర్నకల్-కాజీపేట మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరికొన్ని రైళ్లను నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమంటే అటే.. సంక్రాంతి, దసరా పండగల సందర్భంగా రైల్వేశాఖ నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. ఇందులో తొంభై శాతం రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుకు వెళ్తాయి. కానీ ఆసియాలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రైల్వేశాఖ ఎలాంటి ముందస్తు సన్నాహాకాలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
మేడారం.. అందరికీ ఉచితమే..
రూ. 100 ప్రత్యేక దర్శనం రద్దు సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అధికార యంత్రాంగం పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ.. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైన్ల ఏర్పాట్లను చేస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మేడారం మహాజాతర జరుగనుంది. రెం డేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. ప్రస్తుత జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వన దేవతల దర్శనం గత జాతర వరకు రెండు రకాలుగా ఉండేవి. సామాన్య భక్తులకు ఉచిత దర్శనంతోపాటు రూ.100 టికెట్తో ప్రత్యేక దర్శనం ఉండేది. ప్రస్తుత జాతరలో ప్రత్యేకదర్శనం సేవలను రద్దు చేశారు. ఐదు క్యూ లైన్లలో మూడింటిని ఉచిత, రెండింటిని ప్రత్యేక దర్శనం కోసం కేటాయించేవారు. ఇప్పుడు అన్ని క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే వినియోగించనున్నారు. మరోవైపు భక్తులు మొక్కుల రూపంలో బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియ కూడా ఈసారి పూర్తి ఉచితంగానే ఉండనుంది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. తాజా జాతరలో ఈ ప్రక్రియనూ ఉచితంగా మార్చారు. మేడారం జాతరలో గతంలో లడ్డూ ప్రసాదం ఉండేది. వచ్చే జాతరలో ఇదీ ఉండడం లేదు. ప్రసాదం కోసం భక్తుల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండడంతో లడ్డూ ప్రసాదంను అధికారులు తొలగించారు. సౌకర్యాలకే ప్రాధాన్యం మేడారం జాతర కోసం ప్రభుత్వపరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక దర్శనం, బంగారం మొక్కులు, లడ్డూ ప్రసాదం టికెట్ల రూపంలో గతంలో కోటి రూపాయలకుపైగా ఆదాయం వచ్చేది. భక్తులకు సౌకర్యం కల్పించాలని ఈ రెండు ప్రక్రియలను పూర్తి ఉచితంగా మార్చాం. ఈసారి కోడె మొక్కులను కొంచెం దూరంలో పెడుతున్నాం. - తాళ్లూరి రమేశ్బాబు, మేడారం ఈవో -
మేడారం జాతరకు జాతీయ హోదా!!
హన్మకొండ: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర. ఈ జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం హన్మకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మేడారం జాతర ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేశామని, కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కూడా జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఈ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎంపీగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. జాతరపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందిస్తామని, ఈ డాక్యుమెంటరీ ద్వారా మేడారం జాతర విశిష్టతను, ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల పాలనలో జాతర పనులు సక్రమంగా జరిగేవి కావని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మందుగానే మంజూరుచేసి పనులు ముమ్మరం చేసిందన్నారు. జాతరకు 15 రోజుల ముందే పనులు పూర్తి కానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో గిరిజన విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై విచారణ పూర్తయితేనే వాస్తవాలు తెలుస్తాయని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థినుల తల్లిదండ్రులపై కేసు పెట్టిన అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్బాస్కర్ పాల్గొన్నారు. -
మేడారం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
మేడారం జాతర కోసం వస్తున్న భక్తుల ఏర్పాట్లపై ఆర్టీసీ ఆధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర కోసం 51 ప్రాంతాల నుంచి 3,700 బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మేడారం వెళ్లే బస్సులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. తెలంగాణలో బస్సురూట్ లేని 1300 గ్రామాలను గుర్తించామని.. త్వరలోనే ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
మేడారం జాతరకు శాశ్వత స్నాన ఘట్టాలు
చెక్డ్యామ్ల తరహా నిర్మాణం ఆయకట్టుకు నీరు, లీకేజీల నియంత్రణ లక్ష్యంగా నిర్మాణం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న స్నాన ఘట్టాలకు తుది రూపకల్పన జరిగింది. గతంలో మాదిరి ఇసుక బస్తాలను అడ్డంగా వేసి నీటిని నిల్వ చేసేలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చెక్డ్యామ్లను నిర్మించేలా ప్రణాళిక తయారైంది. జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్డ్యామ్లను నిర్మించి స్నానాలతోపాటు ఇరిగేషన్ అవసరాలకు ఉపయోగపడేలా వీటిని డిజైన్ చేశారు. రూ.20 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ పనులను పదిహేను రోజుల్లో ఆరంభించే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తగిన స్నాన ఘట్టాలను డిజైన్ చేసే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అప్పగించింది. దీనిపై అధ్యయనం చేసిన సీడీఓ జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్డ్యామ్లను ప్రతిపాదించింది. పడిగాపూర్ వద్ద 110 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుతో తొలి చెక్డ్యామ్ను ప్రతిపాదించారు. దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో రెడ్డిగూడెం వద్ద 110 మీటర్ల పొడవుతో 2 మీటర్ల ఎత్తుతో రెండో చెక్డ్యామ్ను ప్రతిపాదించారు. దీనికి 700 మీటర్ల దూరంలో మేడారం వద్ద మరో చెక్డ్యామ్, దీనికి 380 మీటర్ల దూరంలో ఊరట్టం వద్ద మరో చెక్డ్యామ్ను ప్రతిపాదించారు. ఇసుక బస్తాలకు బదులు చెక్డ్యామ్ల తరహా నిర్మాణం చేయడం వల్ల స్నాన ఘట్టాలకు తోడు 1,200 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిని అందించే వెసలుబాటు ఉంటుంది. దీనికి తోడు స్నానఘట్టాలకు ప్రతిసారి వదిలే 250 ఎంసీఎఫ్టీ నీటిలో లీకేజీ నష్టాలు ఉండేవి. ప్రస్తుతం చెక్డ్యామ్ల నిర్మాణంతో 150 ఎంసీఎఫ్టీల నీరు సరిపోతుంది. -
జాతర ట్రస్టుబోర్డు జాడలేదు
సమీపిస్తున్న మేడారం జాతర విడుదలైన నోటిఫికేషన్ గడువు ముగిసినా ఖరారు కాని సభ్యులు ట్రస్టుబోర్డు లేకుండానే గత జాతర నిర్వహణ ప్రభుత్వ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం హన్మకొండ రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం జాతర 2016 ఫిబ్రవరిలో జరగనుంది. ఈ జాతరకు సంబంధించిన ట్రస్టుబోర్డును నియమించేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయశాఖ అధికారులు 2015 జూలై రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇరవై రోజులలోపు ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించి తుది జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. గడువు ముగిసినా నేటికి ట్రస్టుబోర్డు నియామకానికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. నిబంధనల ప్రకారం ట్రస్టుబోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండాలి. వీరిలో కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఉండాలి. ఒకరు మహిళా సభ్యురాలు తప్పనిసరి. రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంపై జాప్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్లో ఎవరికి ట్రస్టుబోర్డులో స్థానం కల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఆలస్యం చోటు చేసుకుంటుంది. గత జాతర సమయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొనడంతో ట్రస్టుబోర్డు లేకుండానే జాతరను నిర్వహించారు. జాతర సందర్భంగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇబ్బందులు తెలుస్తాయి దాదాపు కోటిమందికి పైగా భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహాణ ఏర్పాట్లు ఆర్నెళ్ల ముందు నుంచి ప్రారంభమవుతాయి. వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతర సంప్రదాయాలు, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు జాతర ట్రస్టుబోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. ట్రస్టుబోర్డు ఎస్సీ, ఎస్టీ, మహిళా సభ్యులు కచ్చితంగా ఉండటం వల్ల అన్ని వర్గాలకు చెందిన భక్తుల అభిప్రాయాలు వెల్లడయ్యే వీలుంటుంది. భక్తుల సౌకర్యం పేరుతో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టే పనుల్లో ప్రజాభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన దశాబ్ధ కాలంగా ప్రతీ మేడారం జాతర సందర్భంగా ట్రస్టుబోర్డును ఏర్పాటు చేస్తున్నారు. కానీ 2014 జాతర సందర్భంగా ట్రస్టుబోర్డును నియమించకపోవడంలో పలు సమస్యలు తలెత్తాయి. భక్తులు సమర్పించే తలనీలాలు నామినేషన్ లేదా టెండర్ విధానం నిర్వహించాలనే అంశంపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. చివ రకు ఈ వ్యవహారం దేవాదాయశాఖ, వడ్డేలకు మధ్య ప్రచ్ఛన్న యుద్దానికి దారి తీసింది. అదేవిధంగా గద్దెల చుట్టూ ఏ ప్రాంతం వద్ద భక్తులకు ప్రసాదం అందించాలనే అంశంపై స్పష్టత రాలేదు. చివరి నిమిషంలో ప్రసాదం కోసం కేటాయించిన స్థలం కారణంగా క్యూలైన్ల వేగం తగ్గిపోయింది. దానితో రెండు రోజుల తర్వాత ప్రసాదం కేంద్రాలను ఎత్తివేశారు. ఆలయ ప్రాంగణం చుట్టూ దుకణాసముదాయాల కోసం కేటాయించిన స్థలాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. దానితో ఎక్కువ ధర చెల్లించి స్థలాలు పొందిన వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వరంగల్లో ఎన్కౌంటర్ : ఇద్దరు మావోయిస్టులు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాంతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఘటన స్థలంలోని 2 ఆయుధాలు, కిట్ బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు కేకేడబ్ల్యూ దళం సభ్యులని పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి 10 రోజుల క్రితమే సదరు మావోయిస్టులు వరంగల్ జిల్లాలో ప్రవేశించారని పోలీసులు చెప్పారు. పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
-
మైదానంలా మేడారం!
తగ్గిపోతున్న అటవీ సంపద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు హరితహారంలోనూ దక్కని ప్రాధాన్యం మాటలకే గిరిజన మ్యూజియం పరిమితం హన్మకొండ : ఒకప్పుడు మేడారం జాతర అంటే కంకవనాలతో కూడిన దట్టమైన అడవి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చేది. గడిచిన దశాబ్దకాలంగా భక్తుల సంఖ్య పెరగడం.. అందుకనుగుణంగా ఏర్పాట్ల కారణంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోరుుంది. వన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెంచడంలో జిల్లా అధికారుల శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు కారణం. మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జా ఇక్కడి అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే జాతర నాటికి మేడారం పరిసర ప్రాంతాల్లో రెండు లక్షల మొక్కలను పెంచుతామన్నారు. కానీ... గత జాతర సందర్భంగా ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో మేడా రం యాక్షన్ ప్లాన్కు చోటు దక్కలేదు. మరోవైపు ఇక్కడ నిర్మిస్తామని చెప్పిన గిరిజన మ్యూజియం నాలుగేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది.తాడ్వాయి, పస్రా అటవీశాఖ రెంజ్ల కిందికి మేడారం అటవీ ప్రాంతం వస్తుంది. తాడ్వాయి రేంజ్లో బొడగూడ బీట్ పరిధిలో 3,360 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. దీని పరిధిలోకి సమ్మక్క, సారలమ్మ గద్దెలు, ఆర్టీసీ బస్స్టాండ్, పోలీస్ అవుట్ పోస్టు, చిలకలగుట్ట తదితర ప్రాంతాలు వస్తాయి. జంపన్నవాగు, కన్నెపల్లి, ఊరట్టం, నార్లపూర్, కాల్వపల్లి ప్రాంతాలు పస్రా అటవీశాఖ రేంజ్లో నార్లాపూర్ బీట్ కిందకి వస్తాయి. దీని పరిధిలో 3,330 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. మెత్తంగా మేడారం చుట్టు పక్కల 6,630 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంటే... దీనిలో 2,500 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భక్తులు విడిది చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భక్తుల వసతికి పందిళ్లు, వంట చెరుకు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుకాణాలు, షెడ్లు, రోడ్లు తదితర అవసరాలకు నేరుగా అడవులపై ఆధారపడుతున్నారు. ఫలితంగా చెట్లను నరకడం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. అటవీశాఖ లెక్కల ప్రకారమే మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో 200 హెక్టార్ల అటవీ ప్రాంతం పూర్తి మైదానంగా మారింది. అటవీ విస్తీర్ణం పెంచడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే మేడారం వనజాతర కాస్త మేడారం-మైదాన జాతరగా మారిపోయే ప్రమాదం ఉంది. మరో ఆర్నెళ్లలో మేడారం జాతర వస్తున్న సందర్భంగా జాతర విశిష్టతలు, ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే కంకవనాల విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సంస్కృతి ప్రధానంగా మ్యూజియం గిరిజనుల సంస్కృతి సంప్రదాయలు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు ప్రతిబింబించేలా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి ఉంది. అయితే మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మేడారంలో గిరిజన మ్యూజియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2014లో వచ్చే జాతర కల్లా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు అందుబాటులోకి వస్తుందన్నారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నట్లు అప్పటి జిల్లా మంత్రి పొన్నాల లక్ష్మయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ.. 2014 జాతర సమయంలో టెండర్ల ప్రక్రియ జరుగుతోందంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఈ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పటితో పోల్చితే మేడారం జాతరకు ఏడాది పొడవునా భక్తులు వస్తున్నారు. ఆదివారం, సెలవు దినాల్లో వనదేవతలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటోంది. ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు మేడారం జాతర విశిష్టతలు, గిరిజన సంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలుగా గిరిజన మ్యూజియాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. -
అదృష్టంగా భావిస్తున్నాం: ఈటల
కరీంనగర్: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ శనివారం హైదరాబాద్లో తెలిపారు. గతంలో తెలంగాణలో పుష్కరాలు వివక్షకు గురయ్యాయన్నారు. స్వరాష్ట్రంలో పుష్కరాలను గొప్పగా నిర్వహించుకున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో ఆరు కోట్ల మంది భక్తులకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కొన్ని అపశ్రుతులు దొర్లినా భక్తులు ఇబ్బంది పడకుండా చూశామన్నారు. పుష్కరాల్లో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలను గుణపాఠంగా భావిస్తూ వచ్చే మేడారం జాతర, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు, పద్దతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పని చేస్తోందని తెలిపారు. -
మేడారం.. ఏర్పాట్లకు శ్రీకారం
ఫిబ్రవరి 4 నుంచి మినీ జాతర వసతుల కల్పనకు సన్నద్ధమైన అధికారులు స్నానఘట్టాల వద్ద షవర్ల నిర్మాణ పనులు షురూ గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు.. తాగు నీటి సరఫరాపై కసరత్తు మేడారం (తాడ్వాయి) : ఫిబ్రవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న మేడారం మినీ జాతరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానఘాట్టాల వద్ద స్నానాలు చేసేందుకు వీలుగా ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు. జంపన్నవాగులో వెల్ ఫౌండేషన్ బావి మోటా ర్ల ద్వారా తాత్కాలికంగా నీటి షవర్ల ఏర్పాటు కు సంబంధించి గురువారం రెండు మోటార్లు, ప్లాస్టింగ్ పైపులను మేడారానికి తీసుకువచ్చారు. 5 నిమిషాల్లో 60 మంది భకు ్తలు స్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మైనర్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయంకల్లా షవర్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తులకు నీడ కల్పించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తడుకలతో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగు నీటి వసతి కల్పించేందు కు చర్యలు చేపట్టినట్లు ఈఓ మల్లేశం తెలిపారు. నల్లాల ద్వారా తాగు నీరు సరఫరా అయ్యే లా ట్రైబల్ వేల్ఫేర్ శాఖ ద్వారా రెండు రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు ఏఈ అబిద్ఖాన్ తెలిపా రు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేతిపంపులకు హ్యాండిల్ బిగించడం పూర్తయ్యాయి. అదేవిధంగా జాతర ప్రాంతంలో విడిది చేసే భక్తులకు ట్యాంకుల ద్వారా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. మినీ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లకు సంబంధించి ఎస్సై సాంబమూర్తి పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. -
ఫిబ్రవరి 4 నుంచి మేడారం మినీ జాతర
తాడ్వాయి: వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ప్రతీ రెండోళ్లకోసారి ప్రధాన జాతర జరుగుతుండగా.. మధ్యలో వచ్చే ఏడాది మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. -
మహాజాతరలా పుష్కరాలు
రూ.13.56 కోట్లతో {పతిపాదనలు ఘాట్ల ఎంపిక పూర్తి చేసిన అధికారులు 410 మీటర్ల స్నానఘట్టాల నిర్మాణం 5 ఇన్ఫిల్టరేషన్ బావులు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటుకు సన్నాహాలు మేడారం తరహాలో భారీ ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు మేడారం మహాజాతర తరహాలో సకల ఏర్పాట్లు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చేయూల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కిషన్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇన్చార్జ్లుగా అధికారులను నియమిం చారు. ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ, స్పెషల్ ఎంఐ ఈఈలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించే నాలుగు చోట్ల స్నానఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదించారు. పుష్కర స్నానాలకు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాలుగు ప్రాంతాల్లో 410 మీటర్ల పొడవునా స్నానఘట్టాల నిర్మాణంతోటు ఇతర సదుపాయూలకు నీటి పారుదల శాఖ అధికారు లు రూ.13.56 కోట్లతో అంచనాలు రూపొం దించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నారుు. 2003లో 10 లక్షల మంది భక్తులు... 12 ఏళ్ల క్రితం (2003)లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. 12 రోజుల పాటు జరిగిన ఈ పుష్కరాల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. పుష్కరాల సందర్భంగా నీటి పారుదల శాఖ రామన్నగూడెం లాంచీల రేవు వద్ద తాత్కాలిక షెడ్లను మాత్రమే నిర్మించింది. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం వాహనాలు రెట్టింపు సంఖ్యల్లో పెరిగిపోవడంతో స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు. దీనికి తోడుగా వచ్చే మార్చి నాటికి గోదావరిపై నిర్మిస్తున్న ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు జరిగే అవకాశాలున్నాయి. మన జిల్లా మీదుగా ఖమ్మం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు వెళ్లే వారు ఈ రహదారిపై ప్రయాణిస్తారు. గత పుష్కరాల సమయంలోనే వరంగల్-ఏటూరునాగారం ప్రధాన రహదారిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారుల అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత అనుభవాల దృష్ట్యా పుష్కరాలకు తరలివచ్చే అశేషజనవాహినికి ఇబ్బందులు తలెత్తకుండా స్నానఘట్టాలు నిర్మించేందుకు అధికారులు ముందస్తుగా అంచనాలు సిద్ధం చేశారు. జూలైలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసమయంలో గోదావరి వరద ఉదృతంగా ఉంటే పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తుల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మిస్తున్నారు. మేడారం తరహాలో బ్యాటర్ ఆఫ్ ట్యాప్స్కు నిరంతరం నీటి సరఫరా చేసేందుకు స్నాన ఘట్టాల ప్రాంతాల్లో ఐదు ఇన్ ఫిల్టరేషన్ బావులు నిర్మించాలని అధికారుల ప్రతిపాదనల్లో ఉంది. స్నానఘట్టాలు ఇలా... రామన్నగూడెం : ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద లాంచీల రేవు ఉంది. ఇక్కడి నుంచి గోదావరి అవతలి ఒడ్డుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు లాంచీలు నడిచేవి. 2003 పుష్కరాలు రావడంతో తొలిసారి ఈరేవులో సిమెంట్ మెట్లు నిర్మించారు. ఈమెట్లకు పైభాగంలో స్నానాలు చేసేందుకు మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నల్లాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్లకు అదనంగా మరో 10మీటర్లు స్నానఘట్టాలు నిర్మించేందు కు నీటి పారుదల శాఖ ప్రాతిపాదించింది. అప్పటి పుష్కరాల్లో స్నానఘట్టాలు, నల్లాల ఏర్పాటు కోసం రూ.12లక్షలు వ్యయం చేశారు. ప్రస్తుతం రూ.22.53లక్షలు కేటాయించారు. ముల్లకట్ట : ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామ సమీపంలో 163 జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా గోదావరి నదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతోంది. పుష్కర సమయానికి రహదారిపై రాకపోకలు ప్రారంభమవుతాయని భావిస్తున్న అధికారులు... ఈ బ్రిడ్జికి రెండు వైపులా 100 మీటర్ల చొప్పున స్నానఘట్టాల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్తోపాటు గోదావరిలో రెండు ఇన్ఫిల్టరేషన్ బావులను నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.6.84 కోట్లతో అంచనాలు రూపొందించారు. మంగపేట : మంగపేట మండల కేంద్రానికి అనుకుని ఉన్న గోదావరి నది ఒడ్డున నూతనంగా 100 మీటర్ల స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుస్తులు మార్చుకునేందుకు కంపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక ఇన్ఫిల్టరేషన్ వెల్ను నిర్మిస్తున్నారు. వరంగల్ నుంచి భద్రాచలానికి పోయే ప్రధాన రహదారి మధ్యలో మంగపేట ఉండడం వల్ల ఇక్కడకు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. గత పుష్కరాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలే దు. ప్రస్తుతం ఇక్కడ స్నానఘట్టాలు నిర్మించేందుకు రూ.22.52 లక్షలు కేటాయించారు. మల్లూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీహేమచల నర్సింహస్వామి దేవాలయం మంగపేట మండలంలోని మల్లూరులో ఉంది. గోదావరి పుష్కరాల సందర్భంగాపుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ఈక్షేత్రాన్ని దర్శించే అవకాశాలున్నాయి. దీంతో ఈగ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున సుమారు 100మీటర్ల స్నానఘట్టాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. మల్లూరుకు వెళ్లే భక్తులు ఏటూరునాగారం వెళ్లకుండా గోదావరిలో స్నానాలు చేయడంతోపాటు దర్శనాలు చేసుకునే వీలుకలుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనుంది. ఇక్కడ నిర్మాణాల కోసం రూ.22.52లక్షలు కేటాయించారు. ముల్లకట్ట వద్ద రెండు, రామన్నగూడెం, మంగపేట, మల్లూరు స్నానఘట్టాల సమీపంలోని గోదావరి నదిలో మూడు ఇన్ఫిల్లరేషన్ వెల్స్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.20.58 లక్షలు ప్రతిపాదించారు. అందులో స్నానఘట్టాల నిర్మాణానికి రూ. 11.34 కోట్లు, క్లోరినేషన్కు రూ. 23.17లక్షలు, మహిళల దుస్తులు మార్చుకునేందుకు రూ.24లక్షలతో డ్రస్సింగ్ రూములు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.75లక్షలు, ఇతరత్ర ఏర్పాట్ల కోసం రూ.79.25లక్షలు కేటాయించారు. సౌకర్యాల కల్పనకు రూ.13.56కోట్లు గోదావరి పుష్కరాల సందర్భంగా నాలుగు ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మాణంతోపాటు సదుపాయాల కోసం రూ.13.56కోట్లతో ప్రాథమికంగా అంచనాలు రూపొందించాం. అందులో స్నానఘట్టాల నిర్మాణానికి రూ. 11.34కోట్లు, 5 ఇన్ఫిల్టరేషన్ బావుల కోసం రూ.20.58లక్షలు, క్లోరినేషన్కు రూ. 23.17లక్షలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు రూ.24లక్షలతో డ్రెస్సింగ్ రూములు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.75లక్షలు, ఇతరత్రా ఏర్పాట్లకు రూ.79.25 లక్షలు కేటాయించాం. ఈమేరకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. బడ్జెట్లో పుష్కరాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే పనులు ప్రారంభిస్తాం. - పద్మారావు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ -
సముద్రంలో పడవ బోల్తా
సొర్లగొంది సమీపంలో ప్రమాదం ఐదుగురు జాలర్లు సురక్షితం కొట్టుకుపోయిన వలలు, దెబ్బతిన్న పడవ ఇంజిన్ సొర్లగొంది (నాగాయలంక) : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సొర్లగొంది గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఐదుగురు జాలర్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. గ్రామం నుంచి గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో మేడా వేంకటేశ్వరరావుకు చెందిన చేపల పడవలో అతనితోపాటు, మేడా నాగబాబు, కొల్లాటి ఆంజనేయులు, విశ్వనాథపల్లి వీరబాబు, పెదసింగు వెంకటేశ్వరరావు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు. భారీ వలను చేపలకోసం జారవిడిచారు. అయితే వాతావరణంలో కనిపించిన మార్పులను గుర్తించిన ఈ జాలర్లు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో జారవిడిచిన వలను చేదుకుని పడవలో వేసుకుని తిరుగుముఖం పట్టారు. నదీ ముఖద్వారం సమీపంలోకి చేరుకునే సమయంలో ఒక్క ఉదుటున అలలు విరుచుకుపడటంతో పడవ తిరగబడింది. ఒడ్డునకు దగ్గరలో ఈ ఘటన జరగడంతో ఐదుగురు జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో రూ.60 వేల విలువైన వలలు కొట్టుకుపోయాయని, పడవ ఇంజిన్ దెబ్బతిందని మేడా వేంకటేశ్వరరావు తెలిపారు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి వేరే బోటు సాయంతో దెబ్బతిన్న పడవ, ప్రమాదంలో చిక్కుకుని బయటపడ్డ జాలర్లను సాయంత్రానికి సొర్లగొంది పడవల రేవుకు చేర్చారు. పడవ బోల్తాపడిన విషయాన్ని అవనిగడ్డ మత్యశాఖ అభివృద్ధి అధికారి చెన్ను నాగబాబు ధృవీకరిం చారు. జలర్లు సురక్షితమని జరిగిన సంఘటన, నష్టం వివరాలను మత్యశాఖ ఉన్నతాధికారులకు తెలియపర్చానని ఆయన తెలిపారు. -
జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్తేజ
- యాస అమ్మలాంటిది... నల్లగా ఉందని అమ్మని తరిమేస్తామా? - మట్టి చరిత్రను ఆవిష్కరిస్తేనే ఆవిర్భావానికి అర్థం - ఊరూవాడా వీధులన్నింటికీ త్యాగధనుల పేర్లు పెట్టాలి - సాక్షికి సుద్దాల అశోక్తేజ ఇంటర్వ్యూ... మన కల్చర్కు ప్రాధాన్యం ఇవ్వాలి... మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి.. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి.. బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: పుష్కరాలను ఎలా నిర్వహిస్తారో సమ్మక్క సారక్క జాతరను కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. బతుకమ్మ, బోనాల పండుగలు కూడా తెలంగాణ సంస్కృతికి ఐకా న్ వంటివి. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలి. తెలంగాణలో జాన పదం ఎక్కువగా ఉంటుంది. ఆట-పాట- మాట ఎవరికివారే రాసుకొని ట్యూన్ చేసుకుని ఆడుతూ పాడతారు. వీరినే వాగ్గేయకారులం టారు. వీటిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర జానపద సాంస్కృతిక అకాడమీని ఏర్పాటు చేయాలి. ఆ రంగంలో కృషిచేస్తున్న వారిని ఏడాదికి నాలుగుసార్లకు తగ్గకుండా కార్య క్రమాలను రూపకల్పన చేయాలి. అన్నమయ్య పీఠంలా జానపద పీఠాన్ని ఏర్పాటు చేయాలి. వృత్తికళాకారులను చేరదీయాలి. వారికి వేతనాలు ఇవ్వాలి. గౌరవ పారితోషకాలు అందజేయాలి. కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యంలో 25 శాతం వీటికి అన్ని ఛానళ్లలో ప్రాముఖ్యం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పుడుగానీ వీటికి గ్లామర్ రాదు. ప్రభుత్వం ఆదరిస్తే జానపద కళలకు కూడా గ్లామర్ వస్తుంది. ఒక రంగాన్ని పెంచిపోషి ంచాలంటే ముందుగా దాన్ని ఫోకస్లోకి తీసుకురావాలి. గ్లామర్ ఇవ్వాలి. టీఆర్ఎస్ ఉద్యమంతో వేలాదిమంది కళాకారులు పుట్టుకొచ్చారు. అలాగే కొన్ని టీవీల్లో జానపద కళారూపాలను ప్రదర్శించడం వల్ల ఆ కళాకారులకు గ్లామర్ పెరిగింది. అనేకమంది అమెరికా వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇచ్చారు. పాలకుర్తి సోమనాథుడు, పోతన, వేముల వాడ భీమకవి పేరుమీద పరిశోధనాలయాలు నిర్మించా లి. వారి పేర్లతో కళాపీఠాలు ఏర్పాటు చేయాలి. సుద్దాల హన్మంతు పేరుతోనూ కళాపీఠం ఏర్పాటు చేయాలి. కొమురం భీం, చాకలి ఐలమ్మ పేర్లమీద జిల్లాల్లో స్మారక మందిరాలు నిర్మించాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారు, తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి విగ్రహాలను ప్రతిష్టించాలి. వీధులకు, గ్రామాలకు, కూడళ్లకు వారి పేర్లు పెట్టాలి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటితరానికి తెలియనే తెలియదు. దాన్ని సిలబస్లో పెట్టాలి. అమెరికాకు వెళ్లి వివేకానందుడు ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. అతను ఉపన్యాసం ఇచ్చిన హాలును జ్ఞాపకార్థంగా పర్యాటక క్షేత్రంగా అమెరికా ప్రభుత్వం ఉంచి గౌరవిస్తోంది. దాన్ని వేలాది మంది సందర్శిస్తుంటారు. పరాయి దేశ వ్యక్తిని ఒక అగ్రరాజ్యం అలా గుర్తించినప్పుడు మన వీరులను మనం ఎందుకు గుర్తుంచుకోకూడదు? వరంగల్ జిల్లాలో బైరాన్పల్లిలో మరో జలియన్వాలాబాగ్ వంటి సంఘటన జరిగింది. వందల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అక్కడ చనిపోయా రు. ఈ విషయం ఎందరికి తెలుసు? తెలంగాణ వంటకాలను హోంసైన్స్లో పాఠ్యాంశాలు చేయాలి... తెలంగాణలో శిలాశాసనాలను వెతికి పట్టుకుని వాటిని గ్రంథాలుగా చేయాలి. పుస్తకాలు, సీడీలుగా మార్చాలి. తాళపత్ర గ్రంథాలను సీడీలుగా మార్చాలి. వెబ్సైట్లలో పెట్టాలి. వందలాదిగా ఉన్న ప్రజల ఆచారాలను బయటకు తీయాలి. జొన్న, సజ్జ రొట్టెలకు ఉన్న విలువెంతో తెలుసా? పచ్చి పులుసు, అరిసెలు, గారెలు వంటివాటిని తెలంగాణ సృష్టించింది. వాటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలను హోంసైన్స్లో సిలబస్గా పెట్టాలి. కల్చర్ అంటే మనం వేసుకునే బట్టలు, మనం నివసించే ఇళ్లు, మన ఆహారం, మన కళలు, మన భాష, మన సాహిత్యం, మన వ్యవసాయం, దాన్ని కాపాడుకునే విధానం, ఒక పద్ధతి కలిస్తేనే కల్చర్. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి. యాసను కాపాడుకోవాలి... తెలంగాణ మాట్లాడే విధానంలోని యాసల సోయగాన్ని సొంపులను పట్టుకొని కాపాడుకోవాలి. యాసను వెక్కిరించొద్దు. యాస అమ్మలాంటిది. అమ్మ నల్లగా ఉందని వెళ్లగొడతామా? యాసలోని సొంపు సోయగాలను సీడీలుగా మార్చాలి. గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడమంటే సీఎం పదవి తెలంగాణ వారికి రావడమేనా? గద్దెల మీద మనుషులను మార్చడం కాదు. తెలంగాణ మట్టి చరిత్రను ఆవిష్కరించాలి. అధికార మార్పిడి కాదు కావాల్సింది. సినిమా రంగం తెలుగు సంస్కృతికి దూరమైంది. సహజత్వానికి దూరమైంది. తెలుగు అనుబంధాలకు ఇంకా దూరమైంది. పురిటి నొప్పులను కూడా సెక్సీగా చూపించే దుస్థితి సినిమాల్లో దాపురించింది. తెలంగాణ కళాకారులను సినిమా రంగంవైపు ప్రోత్సహించేందుకు ఫిల్మ్లో శిక్షణ ఇవ్వాలి. అందుకు ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేయాలి. బాలచందర్, గిరీష్కర్నాడ్ వంటి వారిని తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాలి. ఈ పనిని ప్రభుత్వమే చేయాలి. -
మేడారం జాతర ఆదాయం రూ. 6,43,79,489
ముగిసిన హుండీల లెక్కింపు హెచ్డీఎఫ్సీ, ఆంధ్రా బ్యాంకుల్లో జమ చేసిన అధికారులు హన్మకొండ కల్చరల్, న్యూస్లైన్ : హన్మకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపంలో ఈ నెల 17న ప్రారంభమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుం డీల లెక్కింపు సోమవారంతో ముగిసింది. మొత్తం ఆదాయం రూ.6,43,79,489 వచ్చినట్లు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దూస రాజేశ్వర్ ప్రకటించారు. కుంకుమ భరిణలు, తొట్టెలు, కన్ను, చేతులు, ఇల్లు వంటి బొమ్మల రూపంలో 895 కిలోల 450 గ్రాముల వెండిని భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆదాయంతోపాటు వీటిని కూడా ఆంధ్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో జమచేసినట్లు వెల్లడించారు. గత ఏడాది కంటే రూ.1.30 కోట్లు ఆదాయం అధికంగా సమకూరినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా జాతరలో తలనీ లాల ద్వారా రూ.1.05 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా 69 లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన కానుకల్లో 50 పురాతన నాణేలు ఉన్నాయని, వీటిని దేవాదాయ శాఖ కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టనున్నామ న్నారు. 21 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని, వీటిని ఇంకా లెక్కించలేదని వెల్లడించారు. కాగా, ఏడు రోజులుగా సాగిన లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయశాఖ మల్టీ జోన్ జాయింట్ డెరైక్టర్ కృష్ణవేణి, దేవాదాయశాఖ ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ తాల్లూరి రమేష్బాబు, రెవెన్యూశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.శంకర్, ఆర్డీఓ మధుసూదన్, అసిస్టెంట్ కమిషనర్ జి.మల్లేషం పర్యవేక్షించారు. నోట్లు, ఆభరణాల లెక్కింపులో 250 మంది రెవెన్యూ, దేవాదాయశాఖ సిబ్బంది, 30 మంది బ్యాంక్ సిబ్బంది, చిల్లరనాణేల లెక్కింపులో టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 130 మంది శ్రీ శ్రీనివాస శరణాగతి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా, హుండీల్లో లభిం చిన బంగారం, వెండిని ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం లెక్కిస్తే మరో రూ.50 లక్షల దాకా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లెక్కింపు ఇలా... ఈ నెల 16వ తేదీన మేడారం నుంచి హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపానికి హుండీలను ఆర్టీసీ వ్యాగన్ బస్సుల్లో తరలించారు. 17న లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ కిషన్ ప్రారంభించారు. -
నేడు జాతర హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్, న్యూస్లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీలను సోమవారం ఉదయం 11గంటలకు హన్మకొండ టీటీ డీ కల్యాణ మండపంలో లెక్కించనున్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖ ఉద్యోగులు 200మందితోపాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల నుంచి వచ్చిన ఉద్యోగులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతర ఈఓ దూస రాజేశ్వర్ తెలిపారు. మొత్తం 410 హుండీలకుగాను 397 హుండీలను ఎనిమిది ఆర్టీసీ బస్సుల్లో తరలించామని, వీటిలో 51 క్లాత్ హుండీలు ఉన్నాయని తెలిపారు. మరో 13 హుండీలను తిరుగువారం ముగిసిన తర్వాత తీసుకొస్తామన్నారు. లెక్కింపు పర్యవేక్షణకు ఎనిమిది సీసీ కెమెరాలు, మూడు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్న హుండీలను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్బాబు, డీఆర్ఓ సురేంద్రకరణ్తో కలిసి ఈఓ రాజేశ్వర్ పర్యవేక్షించారు. హుండీలను భద్రపరిచే కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక హెడ్కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు భద్రతలో నిమగ్నమయ్యారు. లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. -
జాతరలో తూటా కలకలం
-
జాతరలో తూటా కలకలం
పేలిన తూటాపై అంతు చిక్కని పోలీస్ రహస్యం పేలింది జంపన్న వాగు వద్దనా..!చిలకలగుట్ట కాడనా...! హడావుడిగా బుల్లెట్ తీసుకున్న డీఎస్పీ ఎక్కడా చెప్పొద్దంటూ హెచ్చరికలు హన్మకొండ, న్యూస్లైన్ : మేడారం జాతరలో పోలీసుల తుపాకీ పేలింది.. పోలీసుల అత్యుత్సాహం కారణంగా జంపన్నవాగు వద్ద ఓ డీఎస్పీ గన్మెన్ తుపాకీ మిస్ ఫైర్ అరుుననట్లు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. చిలుకలగుట్ట వద్ద పైకి పేల్చిన తూటా కిందకు వచ్చి తాకిందని కొందరు, జంపన్న వాగు వద్ద మిస్ఫైర్ అయిందని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం మేడారం మహాజాతరలో అధికార వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మేడారం జాతరలో భాగంగా పోలీసుల తూటాకు గురువారం ములుగు మండలం అడవిమల్లంపల్లికి చెందిన ఆర్షం కొమురమ్మ(78) గాయపడింది. చీకటి పడుతున్న వేళ జంపన్నవాగు సమీపంలోని రెండు తాటిచెట్ల వద్ద వేసుకున్న గుడారం ఎదుట కొమురమ్మ సేద తీరుతుండగా తలకు బుల్లెట్ గాయమైంది. తలలోకి బుల్లెట్ కొంతమేర చొచ్చుకుపోయి చీల్చినట్లు తెలిసింది. ఆమెను మేడారం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అరుుతే అప్పటికే కొమురమ్మ కుమారుడు బుల్లెట్ను తీసుకోవడంతో ఎవరో కచ్చితంగా చెప్పినట్లుగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ముందుగా బాధితురాలి కుమారుడిని పిలిచి ‘ఇది పోలీసుల బుల్లెట్... మీ దగ్గర ఉండొద్దు... మేడం వస్తున్నారు...’ అంటూ ఆ బుల్లెట్ను తీసుకునే ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడుతుండగానే మహిళా డీఎస్పీ అక్కడకు చేరుకుని బుల్లెట్ తీసుకుని బాధితురాలిని తన వాహనంలోనే గద్దెల వద్ద ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కొమురమ్మకు చికిత్సచేసి తలకు నాలుగు కుట్లు వేశారు. కొద్దిసేపు అక్కడే ఉంచుకుని తిరిగి పంపించారు. గోప్యంగా ఘటన.. పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా దాచి పెడుతున్నారు. ఇప్పటి వరకూ పోలీసుల తుపాకీ ఎక్కడ పేలిందనే విషయాన్ని రహస్యంగా ఉంచారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా జిల్లా రూరల్ ఎస్పీ కాళిదాసు ప్రభుత్వపరంగా గౌరవ వందనం చేసే సందర్భంలో ఏకే-47 నుంచి బయటకు వెళ్లిన తూటా తాకిందని కొందరు పోలీసులు చెబుతున్నారు. జంపన్నవాగు వద్ద డీఎస్పీ గన్మన్ తుపాకీ పేలిందని మరికొందరు పేర్కొంటున్నారు. సదరు డీఎస్పీ జంపన్నవాగు వద్దకు వస్తున్న క్రమంలో గన్మెన్లు అత్యుత్సాహం చూపించారని, తుపాకులను ఎక్కుపెట్టి భక్తులను బెదిరించారని తెలుస్తోంది. దీంతో ఓ గన్మెన్ చేతిలోని తుపాకీ పేలడంతో రోడ్డు పక్కన గుడారంలో ఉన్న కొమురమ్మకు తూటా తగిలిందని ప్రచారం జరుగుతోంది. ఈ తూటా అంతే స్పీడ్తో తగిలితే... ప్రాణాలు పోయేవని అంటున్నారు. కొంతమంది పోలీసులు మాత్రం ఎస్పీ కాళిదాసు పేల్చిన తుపాకీ నుంచి తూటా కిందకు వచ్చి కొమురమ్మకు తాకిందని చెబుతున్నారు. కానీ.. చిలుకలగుట్టలో పేల్చిన తుపాకీ నుంచి తూటా కిందకు వచ్చి జంపన్నవాగు వద్ద గుడారం ముందున్న కొమురమ్మకు తాకిందంటే నమ్మశక్యంగా లేదు. అంతేగాక సమ్మక్కను తీసుకొచ్చిన నేపథ్యంలో ముందుగా సాయంత్రం 5.39 గంటలకు, రెండోసారి 5.42 గంటలకు, మూడోసారి 5.55 గంటలకు ఫైరింగ్ చేశారు. కానీ కొమురమ్మకు చీకటిపడిన తర్వాత తూటా తగిలిం దని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పోలీసులు చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదు. ఇదిలా ఉండగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసులు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక గద్దెల వద్ద ప్రభుత్వ వైద్యులకు కూడా ఇలాగే హెచ్చరికలు జారీచేయడంతో... వారు కూడా నోరు మెదపడం లేదు. గురువారం రాత్రి పోలీసు వాహనంలో ఓ ముసలావిడను తీసుకొచ్చారని, ఆమె తలకు బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయని, కుట్లు వేశామని కిందిస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు.