Science and Technology
-
రూ. 20,000 కోట్ల నిధులు వాడుకోండి..
పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై దేశీ కార్పొరేట్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తాజాగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన రూ. 20,000 కోట్లు నాణ్యమైన ప్రతిపాదనకు వినియోగించుకోవాలని సూచించారు.ప్రయివేట్ రంగ ఆధారిత ఆర్అండ్డీకి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని బడ్జెట్ తదుపరి సీఐఐ సభ్యులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది చివరికల్లా మొత్తం నిధులను వినియోగించుకునేలా అత్యుత్తమ ప్రతిపాదనలతో తరలిరావలసిందిగా ఆహ్వానించారు.పర్యావరణహిత ఇంధనాలవైపు ప్రయాణంలో ప్రయివేట్ రంగం చేయూత నివ్వాలని కోరారు. ఇదేవిధంగా అణు విద్యుత్ విషయంలో ప్రభుత్వం పరిశ్రమతో కలసి పనిచేయనున్నట్లు తెలియజేశారు.2025-26 బడ్జెట్ను ప్రకటిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక కార్పస్గా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.20,000 కోట్లు కేటాయించారు. గత జూలై బడ్జెట్లోనూ ఆమె రూ. లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
2027లో చంద్రయాన్–4
న్యూఢిల్లీ: చంద్రుడిపై శిలలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మిషన్లో భాగంగా రెండు వేర్వేరు ప్రయోగాలుంటాయన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా ఐదు రకాల సాంకేతిక వస్తు సామాగ్రిని కక్ష్యలోకి పంపి, అక్కడే వాటిని అసెంబుల్ చేయిస్తారని వివరించారు. వచ్చే ఏడాది గగన్యాన్ మిషన్లో ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకలో ఇద్దరు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపి, తిరిగి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో గగన్యాన్ మానవరహిత మిషన్ లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. దీంతోపాటు, 2026లో సముద్రయాన్లో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతులో సముద్రం అడుగు భాగానికి పంపిస్తామని వెల్లడించారు. వీరు సముద్రగర్భంలో వనరులు, కీలక, అరుదైన ఖనిజాల అన్వేషణతోపాటు, సముద్ర జీవజాలంపై పరిశోధనలు జరుపుతారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1969లో అవతరించగా మొదటి లాంఛ్ ప్యాడ్ రెండు దశాబ్దాల అనంతరం 1993లో కార్యరూపం దాల్చిందని చెప్పారు. మరో దశాబ్ద కాలం తర్వాత 2004లో రెండో లాంఛ్ ప్యాడ్ను నిర్మించామన్నారు. విస్తరణ, మౌలిక వనరుల కల్పన, పెట్టుబడుల విషయంలో ఇస్రో గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత అంతరిక్ష ఆర్థిక రంగ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని వివరించారు. దీనిని వచ్చే పదేళ్లలో 44 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
ఏఐ నామ సంవత్సరం
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది. స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లుభారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.స్మార్ట్ఫోన్ , ల్యాప్టాప్ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్ఫేక్లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.పునర్వినియోగ రాకెట్అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్షిప్ ప్రయోగంతో రుజువైంది. భవిష్యత్తులో ఈ సూపర్హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా. గత ఏడాది అమృత్ కాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి. 2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్యాన్ ప్రయోగాలు జరగనున్నాయి. చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది. జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది. సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. రెయిన్ కోట్లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.దినేశ్ సి.శర్మ వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొత్త డివైస్ : ఇది కట్టుకుంటే నొప్పులు మాయమట!
జిమ్లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవీ చదవండి : చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది! -
‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అభివృద్దిలో భారత్ కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని తెలిపారు. మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ ఘనత నిరూపిస్తోందని పేర్కొన్నారు.With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw— Narendra Modi (@narendramodi) September 26, 2024 ‘2015లో జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇది ఐటీ, తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్టప్లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.టెక్నాలజీలో పరిశోధనలు సామాన్యులకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశం పెద్ద విజన్ కలిగి ఉంటేనే ఉన్నత విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగలదు. పేదలకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి’ అని పేర్కొన్నారు. -
Narendra Modi: మనమే ప్రపంచ సారథులం
న్యూయార్క్: ‘‘అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా మారింది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తోంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్లో భారతీయ అమెరికన్లతో ప్రధాని భేటీ అయ్యారు. స్థానిక నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పోటెత్తారు. న్యూయార్క్, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు. సమావేశం ఆద్యంతం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించివేసిందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను’’ అని చెప్పారు. భారత, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండయన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం గంటా పది నిమిషాల పాటు సాగింది. ప్రసంగం పొడవునా సభికులు పదేపదే చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకుముందు వేదికపై ‘ద ఎకోస్ ఆఫ్ ఇండియా – అ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్’ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టాండన్, గాయక సంచలనం రెక్స్ డిసౌజా, తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు వీటిలో పాల్గొన్నారు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టడాన్ని మోదీ ప్రస్తావించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్నారు. భారత ప్రగతి కోసం ఈసారి అత్యంత భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ‘‘విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచి్చంది. అనుకోకుండా గుజరాత్కు సీఎం అయ్యాను. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. తర్వాత దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసి మరింత పెద్ద బాధ్యత కట్టబెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశ ప్రగతికి, సుపరిపాలనకు నా జీవితాన్ని అంకితం చేశాను. అధ్యక్షుడు జో బైడెన్ శనివారం నన్ను దగ్గరుండి ఆహా్వనించి మరీ తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆయన చూపిన గౌరవం నన్నెంతగానో కదిలించింది. అది 140 కోట్ల పై చిలుకు భారతీయులకు దక్కిన గౌరవం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి నిరంతర కృషికి దక్కిన గౌరవం’’ అన్నారు. దశాబ్దాల క్రితం తొలిసారి తాను అమెరికాకు వచ్చిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదని మోదీ అన్నారు. అయితే ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ‘అందరికీ సమ దూరం’ అన్నది పాత విధానం. ‘అందరితోనూ సమాన సాన్నిహిత్యం’ అన్నదే నవభారత నినాదం’ అని వివరించారు. ఇది యుద్ధాలకు సమయం కాదని పునరుద్ఘాటించారు. ‘‘భారత్ అంటే ఫైర్ కాదు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు’’ అన్నారు. బోస్టన్, లాస్ ఏంజెలెస్ నగరాల్లో నూతనంగా కాన్సులేట్లను ప్రారంభించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన సియాటెల్ కాన్సులేట్ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు. అమెరికాకు ఫార్మా, విద్యా రంగాల్లో రాజధానిగా బోస్టన్కు పేరుంది. ఇక లాస్ ఏంజెలెస్ హాలీవుడ్కు పుట్టిల్లన్నది తెలిసిందే.పుష్ప... వికసిత భారత్! ‘‘వికసిత భారత్ అంటే ‘పుష్ప’. ప్రోగ్రెసివ్, అన్స్టాపబుల్, స్పిరిచ్యువల్, హ్యుమానిటీ, ప్రాస్పరస్’’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహా్మండమైన స్పందన వచి్చంది. అలాగే, ‘‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్ ఇండియా. ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్’’ అని కొత్త నిర్వచనాలిచ్చారు.అమెరికాను మించిన భారత 5జీ మార్కెట్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. ఫలితంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత 5జీ మార్కెట్ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్ చిప్లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్ ఇండియా చిప్ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’’ అన్నారు. -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్షాపు లక్ష్యం. ఈ వర్క్షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్తోపాటు అమెరికా, యూరప్లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్పై ఆధారపడుతూంటాయి. పీహెచ్డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు!
సైన్స్ను సామాన్యుల దగ్గరికి తీసుకుపోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి ఫాల్కి. ‘సైంటిఫిక్ స్టోరీ టెల్లర్’గా దేశవిదేశాల్లో పేరు తెచ్చుకున్న జాహ్నవి సైన్స్కు సంబంధించిన డాక్యుమెంటరీలు తీసింది. పుస్తకాలు రాసింది. ‘అడగడం’ ‘తెలుసుకోవడం’ అనే ప్రక్రియ జాహ్నవికి ఎంతో ఇష్టమైనది. ఆమెకు బాగా నచ్చే మాట.. రైట్ క్వశ్చన్. రిసెర్చ్ వర్క్ నుంచి కెరీర్కు సంబంధించి డైరెక్షన్ను మార్చుకోవడం వరకు ‘రైట్ క్వశ్చన్’ అనేది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరకు తీసుకెళ్లింది. అక్కడ భారతదేశ శాస్త్ర సాంకేతిక చరిత్రను అధ్యయనం చేసింది. ఆ చరిత్రపై బాగా ఇష్టాన్ని పెంచుకుంది. తాను తెలుసుకున్న విషయాలను, తన అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడానికి వివిధ మాధ్యమాలను ఎంచుకుంది. 'బాంబే యూనివర్శిటీ’లో సివిక్స్ అండ్ పాలిటిక్స్ చదువుకున్న జాహ్నవి ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీలో డాక్టరేట్ చేసింది. సామాజిక శాస్త్రాల అధ్యయనం ద్వారా సామాజిక కోణంలో సైన్స్ను అర్థం చేసుకుంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘సైన్స్ అనేది ఒంటరి కాదు’ సైన్స్ను ప్రభావితం చేసే అంశాలు సమాజంలో ఎన్నో ఉంటాయి. ఆ అంశాలకు సైన్స్కు మధ్య ఉండే అంతః సంబంధాన్ని లోతుగా అధ్యయనం చేసింది. ‘ఆటోమిక్ స్టేట్ బిగ్ సైన్స్ ఇన్ ట్వంటీయత్ సెంచరీ ఇండియా సైన్స్’ పుస్తకం జాహ్నవికి ఎంతో పేరు తెచ్చింది. ‘కీ కాన్సెప్ట్స్ ఇన్ మోడ్రన్ ఇండియన్ స్టడీస్’కు కో–ఎడిటర్గా వ్యవహరించింది. ‘సైక్లోట్రాన్’ పేరుతో సైన్స్ డాక్యుమెంటరీ తీసింది. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కథలు చెప్పడం తనకు ఇష్టమైన పని. ‘మెనూ గురించి తెలుసుకోవాలంటే మనం మొదట ఉండాల్సింది టేబుల్ దగ్గర’ అంటున్న జాహ్నవి ‘సైన్స్’ అనే మెనూ గురించి తెలుసుకోవడానికి ‘సైన్స్ గ్యాలరీ’ అనే టేబుల్ దగ్గరికి ప్రజలను తీసుకువస్తుంది. లండన్లోని కింగ్స్ కాలేజీ ఫ్యాకల్టీగా పనిచేసిన జాహ్నవి 2018లో ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ఫౌండింగ్ మెంబర్గా నియమితురాలైంది. ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచానికి కాస్త దూరంగా.. సృజనాత్మకంగా ఆలోచించేలా, సైన్స్కు దగ్గరయ్యేలా యువతను ఆకట్టుకోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘మ్యూజియం’ వాతావరణం ఆమెకు కొత్త కాదు. ‘సైన్స్ మ్యూజియం లండన్’ ఎక్స్టర్నల్ క్యురేటర్గా పనిచేసి ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ‘మా టార్గెట్ ఆడియెన్స్ పదిహేనేళ్ల పైబడిన వారు అయినప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లపై కూడా దృష్టి సారిస్తాం. అంతరిక్షానికి సంబంధించి సమకాలీన, భవిష్యత్ విషయాలపై దృష్టి పెట్టేలా గ్యాలరీ తోడ్పడుతుంది’ అంటుంది జాహ్నవి. శాస్త్రీయ విషయాలతో యువత మమేకం కావడానికి డిజిటల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘బ్రేకింగ్ ది వాల్స్ బిట్విన్ సైన్స్ అండ్ కల్చర్’ శీర్షికతో నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ గ్యాలరీకి కూడా మంచి స్పందన వచ్చింది. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ జాహ్నవిని హ్యుమానిటీస్ విభాగంలో ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’తో సత్కరించింది. సైన్స్ను జాహ్నవి అర్థం చేసుకున్న కోణాన్ని, చేపడుతున్న కార్యక్రమాలను ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఇవి చదవండి: Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి.. -
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
Sia Godika: 'సామాజిక సేవ నుంచి సైన్స్ వరకు'..
'బెంగళూరుకు చెందిన సియా గోడికా పేరు వినిపించగానే ‘సోల్ వారియర్స్’ గుర్తుకు వస్తుంది. ‘సోల్ వారియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు పాదరక్షలను అందిస్తుంది సియా. ‘చేంజ్మేకర్’గా గుర్తింపు పొందిన సియా గోడికా చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ‘ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’ గురించి ఆమె చేసిన సైన్స్ వీడియో ‘బ్రేక్త్రూ జూనియర్ చాలెంజ్’లో బహుమతి గెలుచుకుంది'. సైన్స్, మ్యాథమెటిక్స్కు సంబంధించి క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్కు ఇచ్చే ప్రైజ్ ఇది. సేవామార్గంలో ప్రయాణించడంతో పాటు క్రియేటివ్ థింకింగ్ కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటుంది సియా. సైన్స్కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. ‘ఇంట్లో పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు’ అని చెప్పడానికి సియా ఒక ఉదాహరణ. సేవాకార్యక్రమాలకు తమ వంతుగా సహాయపడడం నుంచి సైన్స్ సంగతులు చెప్పడం వరకు సియా గోడికాకు ఎన్నో రకాలుగా ఆమె తల్లిదండ్రులు సహకారం అందించారు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
కైలాసగిరికి మరో మకుటం
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలోని కైలాసగిరిని రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న కైలాసగిరి.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని హంగులు సంతరించుకుంటోంది. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం పురుడుపోసుకుంటోంది. కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు ఎకరా విస్తీర్ణంలో రూ.4.69 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాయి. 3డీ ఆర్ట్ గ్యాలరీ, సిలికా విగ్రహాలు, సైన్స్ వర్కింగ్ మోడల్ ప్రదర్శనలు, శాస్త్రీయ థీమ్లు తదితరాలతో.. ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మ్యూజియం నిర్మాణానికి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసగిరిని ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మ్యూజియం గ్రాంట్æస్కీం కింద సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్సీఏపీ) ఆధ్వర్యంలో అధునాతనమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికి.. రూ.3.75 కోట్లను ఎస్సీఏపీకి కేంద్ర సాంస్కృతికశాఖ కేటాయించగా మిగిలిన సుమారు రూ.కోటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనుల్ని ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్ స్వాతి, ఎస్సీఏపీ సీఈవో డాక్టర్ కె.జయరామిరెడ్డి, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్యదర్శి బి.కీర్తి తదితరులు పాల్గొన్నారు. -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Kerala Stampede: కొచ్చిన్ వర్సిటీలో తొక్కిసలాట... నలుగురు విద్యార్థుల దుర్మరణం
కొచ్చి: కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఘోరం జరిగింది. వర్సిటీ టెక్ ఫెస్ట్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సంగీత విభావరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయిలు. మరో 64 మందికి విద్యార్థులు పైగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. వర్షం, మెట్లే కారణం! సంగీత విభావరి వర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఏర్పాటైంది. ప్రఖ్యాత నేపథ్య గాయని నికితా గాంధీ తదితరులు రావడంతో ఏకంగా 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దాంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. విభావరి ఊపులో ఉండగా ఉన్నట్టుండి వర్షం కురవడంతో వెనక వైపున్న వాళ్లంతా తల దాచుకునేందుకు ముందుకు తోసుకొచ్చారు. ఆ తాకిడిని తాళలేక వేదిక ముందున్న వాళ్లంతా బయటికి పరుగులు తీశారు. అదే సమయంలో బయట తడుస్తున్న వాళ్లు కూడా లోనికి తోసుకొచ్చారు. దాంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆడిటోరియంలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు ఒకటే ద్వారం ఉండటంతో చూస్తుండగానే అక్కడ తోపులాట పెరిగిపోయింది. పలువురు విద్యార్థులు ఎత్తయిన మెట్ల మీది నుంచి పడిపోయారు. వారిని మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు తీయడంతో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దారుణంపై కేరళ సీఎం పినరాయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులను వెంటనే వర్సిటీకి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. ఉదంతంపై లోతుగా దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. విద్యార్థులు భారీగా రావడం, ఆకస్మిక వర్షమే ప్రమాదానికి దారి తీసినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ శంకరన్ అభిప్రాయపడ్డారు. -
ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ 'ఎస్ సోమనాథ్' (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్' (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు. పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్పుట్స్గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్వాలా గురించి అనుకున్నారో? -
మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ!
సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా? నెదర్లాండ్లోని లైడెన్లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా సైన్స్, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్ బ్రెయిన్, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్ ( న్యూరోసర్జన్) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్ ఇంప్లాంట్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ బ్రిడ్జ్ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్పై లౌసాన్లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్ డివైజ్ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్ తరహా బ్రెయిన్ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. చదవండి👉 హైదరాబాద్లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? బ్రెయిన్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎలా జరిగింది ముందుగా ప్రొఫెసర్ బ్లోచ్...ప్యారలైజ్తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్లెస్ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్లను (డిజిటల్ బ్రిడ్జ్) బ్రెయిన్లో అమర్చారు. అవి జాన్ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్ చేయబడి బ్రెయిన్ ఇంప్లాంట్ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. ఇలా బ్రెయిన్తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్లు గుర్తించారు. ప్రాజెక్ట్కి నాయకత్వం వహించిన లౌసాన్లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఓస్కామ్ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
వారధి కట్టాల్సిన సమయమిది!
దేశంలో ఉన్న ఎన్నో సమస్యలకు సైన్స్, సృజనాత్మకతల సమర్థ మేళవింపుతో మంచి పరిష్కారాలు కనుక్కోవచ్చు. అయితే శాస్త్రవేత్తలు రూపొందించినవే కాదు, గ్రామీణ స్థాయిలో అతితక్కువ ఖర్చుతో కూడుకున్న, కేవలం అవసరానికి తగ్గ సృజనాత్మక పరిష్కారాలూ మనదగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ సాధారణ ప్రజలు వారి అవసరానికి తగ్గట్టు అభివృద్ధి పరిచారు. మరి ఈ అట్టడుగు స్థాయి పరిష్కారాలూ, డీప్ టెక్ వంటి అత్యాధునిక పరిష్కారాలూ వేర్వేరుగా ఎదగాల్సిందేనా? ఈ రెండింటినీ మేళవించలేమా? ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక ప్రయత్నం మొదలైంది. ఢిల్లీలో జరిగిన ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్’ ఇందుకు వేదికైంది. భారత్ కేవలం 140 కోట్ల జనాభా ఉన్న దేశం మాత్రమే కాదు, సవాలక్ష సమస్యలతో కూడినది కూడా. సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతల సమర్థ మేళవింపు, వినియోగాలతో ఈ సమస్యలకు పరిష్కారాలు కను క్కోవచ్చు. కూడు, గూడు, ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, సమాచార వినిమయం, విద్యుత్తు, విద్య, వ్యవసాయం వంటి అనేక మౌలిక అంశాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు అవ సరం. అలాగని వీటికి పరిష్కారాలు, సాంకేతిక పరిజ్ఞానాలు అస్సలు లేవని కాదు. ఉన్నవి అందరికీ అందుబాటులో లేవు, లేదా భరించ గలిగే స్థాయిలో లేకపోవచ్చు. ఈ రెండు సాధ్యమైనా అవి అంత సుస్థిరమైనవి కాకపోవచ్చు. ఒకవైపు మనకు సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారం ఉండ వచ్చు కానీ, కొత్త పరికరాలు, పరిష్కారాలన్నీ ఆధునిక టెక్నాలజీలతో కూడుకున్నవి. ఇప్పుడేమో అన్నింటికీ ‘డీప్ టెక్’ అన్నది అలవడి పోతోంది. ఇవన్నీ ఇంజినీరింగ్ రంగంలోని వేర్వేరు శాఖల్లో వచ్చిన తాజా మార్పుల ఆధారంగా రూపొందినవే. డీప్ టెక్ అన్నా అది కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హ్యాప్టిక్స్, రోబోటిక్స్, బ్లాక్చెయిన్, బిగ్ డేటా వంటి ఎదుగుతున్న ఇంజినీరింగ్ రంగ సాంకేతిక పరిజ్ఞానాలే. ఇంకోవైపు... గ్రామీణ స్థాయిలో అతితక్కువ ఖర్చుతో కూడు కున్న, కేవలం అవసరానికి తగ్గ సృజనాత్మక పరిష్కారాలూ ఉన్నాయి. వీటన్నింటినీ శాస్త్రవేత్తలు కాకుండా... స్థానిక సమస్యలకు సాధారణ ప్రజలు అభివృద్ధి చేసిన పరిష్కారాలు. ప్రశ్న ఏమిటంటే... ఈ అట్టడుగు స్థాయి పరిష్కారాలూ... డీప్ టెక్ వంటి అత్యాధునిక పరి ష్కారాలూ... వేర్వేరుగా ఎదగాల్సిందేనా? రెండూ కలిసి పనిచేయగల స్థితి ఉందా?. ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఇప్పుడిప్పుడే ఒక ప్రయత్నం మొదలైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్నాలజీ ఇన్క్యుబేటర్ ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్స్’; ప్రొఫెసర్ అనిల్ గుప్తా స్థాపించిన ‘గ్రాస్రూట్ ఇన్నొవేషన్స్ అగ్మెంటేషన్ నెట్వర్క్’ (జీఐఏఎన్) సంయుక్తంగా ఇటీవల ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్’ ఇందుకు వేదికైంది. అట్టడుగు స్థాయి సృజనాత్మక ఆవిష్కరణలు, శాస్త్రాధారిత ఆవిష్కరణలు రెండింటినీ ప్రదర్శించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఇరు పక్షాలు ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకునేందుకు, సామాజిక అవసరాల కోసం పరస్పర సహకారంతో కృషి చేసేందుకు అవకాశం కల్పించడం కూడా ఇందులో ఉన్నాయి. బహుళార్థక ఆహార శుద్ధి యంత్రాన్ని తయారు చేసిన ధరమ్వీర్‡ కంబోజ్ (యమునా నగర్), గ్యాస్బండను సులువుగా మోసుకెళ్లేం దుకు మడిచే యంత్రం సిద్ధం చేసిన ముష్తాక్ అహ్మద్ దార్(కశ్మీర్)... కుంగుబాటు సమస్య పరిష్కారానికి ఓ వేరబుల్ యంత్రాన్ని తయారు చేసిన స్టిమ్ వేదా న్యూరోసైన్సెస్కు చెందిన యల్లాప్రగడ రమ్య, లక్ష్య సహాని, సీలింగ్ ఫ్యాన్కు చిన్న పరికరాన్ని అమర్చడం ద్వారా వాయు కాలుష్యాన్ని తొలగించగల ‘స్వచ్ఛ.ఐఓ’ స్థాపకుడు కరణ్ రావులతో ఇక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తాం. ఇలాంటి వేదికలు ఇరు పక్షాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఒక వర్గం టెక్నాలజీ సంస్థలు, ఇన్క్యుబేటర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ వంటి అధికారిక సంస్థల నుంచి వచ్చే ఆవిష్కరణలు ఒక వర్గంగా ఉంటే... అట్టగు వర్గాల సృజనశీలుర సామాజిక, విద్య, ఆర్థిక నేపథ్యం వేర్వేరుగా ఉంటోంది. తమ ఆవిష్కరణలను పరిశీలించే, పరీక్షించే, నిర్ధారించే ఏర్పాట్లు వీరి వద్ద అస్సలు ఉండవు. చాలామంది పాఠశాల విద్య కూడా పూర్తి చేసి ఉండరు. అయితే ఇవి వాస్తవికంగా ఉంటాయి. బాగా అవసరం అనుకున్న సమస్యలకు పరిష్కారాలుగా ఉంటాయి. తగిన సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో వీటిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లుగా అట్టడుగు వర్గ సృజనశీలురకు జీఐఏఎన్ వంటి సంస్థలు సహాయ, సహకారాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు ధరమ్వీర్ కంబోజ్ ఫుడ్ ప్రాసెసర్ ఇప్పుడు వందల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేరింది. వారు మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఏటా కోట్లలో ఆదాయమూ సంపాదిస్తున్నారు. అంతేకాదు... ఈ ఫుడ్ ప్రాసెసర్ ఇప్పుడు ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి అవుతోంది కూడా. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో రిక్షా తొక్కిన ధరమ్వీర్ ఇప్పుడు ఈ స్థాయికి చేరడం నిజంగానే స్ఫూర్తిదాయకం. బంకమట్టితో చేసిన ఫ్రిడ్జ్లాంటి పరికరం ‘మిట్టీ కూల్’ కూడా ఇలాంటి ఓ గ్రాస్రూట్ ఉత్పత్తే. మార్కెట్లోనూ ఇది మంచి విజయం సాధించింది. సామాజిక అవసరాలకు టెక్నాలజీ ఆసరా.. సామాజిక అవసరాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొత్తేమీ కాదు. 1970లలోనే మొదలైంది. దేశంలోని సైన్స్ అండ్ టెక్నా లజీ సంస్థలు గ్రామీణ పేదలకు చేసిందేమీ లేదన్న స్పృహ కలిగిన శాస్త్రవేత్తలు కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి కొన్ని కార్య క్రమాలు చేపట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) అధ్యాపకుడు ఏకేఎన్ రెడ్డి ‘అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు రూరల్ ఏరియాస్’ (అస్త్ర) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అధిక సామర్థ్యమున్న పొయ్యి ఒకదాన్ని ఏకేఎన్ రెడ్డి అభివృద్ధి చేశారు. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. 1980లలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా సామాజిక అవస రాల కోసం టెక్నాలజీ వాడకాన్ని మొదలుపెట్టంది. రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ టెలిఫోన్ ఎక్సేంచీజీలు, వాతావరణ అంచనా కోసం సూపర్ కంప్యూటర్ల వాడకం అప్పుడే మొదలైంది. భారతీయుల సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారానికి ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ (సీ–డాట్) ఓ అద్భుత నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ల సంఖ్య తక్కువగా ఉండటం, నెట్వర్క్ కూడా అంత బాగా లేకపోవడం తెలిసిందే. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెలిఫోన్ ఎక్సేంచీజీలను వాడు తూండటం దీనికి కారణం. ఈ విదేశీ ఎక్సేంచీజీలు అధిక ఉష్ణో గ్రతలను, ఎక్కువ కాల్స్ను తట్టుకునేలా డిజైన్ చేయలేదు. ఎయిర్ కండీషనర్ ఉంటేనే వీటిని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. కాల్స్ సంఖ్య ఎక్కువైతే పని చేయడం ఆగిపోయేది. ఈ సమస్యలకు పరిష్కా రంగా అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే సర్క్యూట్ల ద్వారా సీ–డాట్ ఓ డిజిటల్ స్విచ్ను తయారు చేసింది. ఫలితంగా బయటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ దాటినా టెలిఫోన్ ఎక్సేంచీజీలు నిరాఘాటంగా పనిచేసేవి. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న సృజనశీలురను వెలికితీసేందుకు అహ్మదాబాద్ ఐఐఎం అధ్యాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. 1990లలో అట్ట డుగు వర్గాల అసలైన సృజనలను గుర్తించి, పరీక్షించి, నిర్ధారించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ సృజనశీలురను అధికారిక వ్యవస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలతో అనుసంధానించేందుకూ, తద్వారా వారి ఉత్పత్తులు, ఆవిష్కరణలను మరింత మెరుగు పరిచేం దుకూ ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా వేల మంది సృజనశీలురలను గుర్తించడం... వారి ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇన్నొవేషన్ ఫెస్టివల్ కూడా సృజన శీలురలను టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లతో అనుసంధానిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఏతావాతా... అడ్డంకులను బద్దలు కొట్టాల్సిన సమయమిది! దినేశ్ సి. శర్మ, వ్యాసకర్త విజ్ఞానశాస్త్ర వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శాస్త్ర,సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి సాధిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గతంలో రాకెట్ ప్రయోగాలు, డిజైన్, తయారీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లమని, ప్రస్తుతం సొంతగా రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నామని చెప్పారు. భారతదేశం త్వరలోనే అతిపెద్ద ఐటీ, మెడిసిన్ ఎగుమతిదారుగా మారనుందన్నారు. అనంతరం 22 మంది విద్యార్థులకు డాక్టరేట్లు, 17 మందికి బంగారు పతకాలు అందజేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున∙తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. సత్యసాయిబాబా 97వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్, మల్టీమీడియా షోను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఈ షో ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. -
సైన్సు అవార్డుల్లో కోతలా?
శాస్త్ర ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ విజేతల పేర్లను సాంప్రదాయికంగా ‘సీఎస్ఐఅర్’ ఫౌండేషన్ డే అయిన సెప్టెంబర్ 26న ప్రకటిస్తుంటారు. ఈసారి వారి పేర్లను అప్పుడు ప్రకటించలేదు. పైగా ప్రధాని చేతుల మీదుగా బహూకరించకుండా వారున్న చోటికే అవార్డు పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలన్న సిఫార్సులూ సాగాయి. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ అవార్డులను, ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డులను ఇవ్వవద్దని వారి ఫ్యాకల్టీలను ఆదేశించాయి. ఇలాగైతే 2047 నాటికి భారత్ శాస్త్ర ప్రగతిలో స్వావలంబన దేశంగా మారేనా? సృజనాత్మక కృషికి ప్రోత్సాహం ఇలాగేనా? శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్బీ) ప్రైజ్ను 1957లో నెలకొల్పారు. భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్) ప్రథమ డైరెక్టర్ పేరిట దీన్ని ఏర్పర్చారు. అనువర్తిత లేదా ప్రాథమిక పరిశోధనలో అసాధా రణ ప్రతిభ ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటుంది. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను సాంప్రదాయికంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ రోజైన సెప్టెంబర్ 26న ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్ విజేతల పేర్లను చివరిక్షణంలో ప్రకటించకుండా నిలిపివేశారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాల సెక్రటరీలు, మంత్రులు హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ మినిట్స్ని పంపించారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ అవార్డు ఎకో సిస్టమ్ మార్పు గురించి ఈ సమావేశం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది. ఒక్కొక్క ఎస్ఎస్బీ ప్రైజ్ విజేతకు ఇస్తున్న రూ. 15 వేల అదనపు నగదు ఉపకార వేతనం స్థానంలో భారీ మొత్తాన్ని ఒకేసారి అందించడం, లేదా నెలవారీ పారితోషికంపై గరిష్ఠంగా 15 సంవత్సరాల పరిమితి విధించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఈ సమావేశ మినిట్స్ బహిర్గత పరిచాయి. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్కి గరిష్ఠ అర్హతా వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాల వరకు ఉంటోంది. 15 సంవత్సరాల పరిమితి విధించడం వల్ల అది 60 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సంవత్సరం సీఎస్ఐఆర్ సంస్థాపక దినం రోజున ప్రకటించడానికి ప్రయత్నించారు. కానీ సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 15న ప్రధాని అధ్యక్షతన నిర్వహించినప్పుడు, తదుపరి ఎస్ఎస్బీ అవార్డు ప్రదాన ఉత్సవాలు జరిపే తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రకటించారు. మూడు వారాల తర్వాత 2019–21 సంవత్సరానికి గాను ఈ అవార్డులను 37 మందికి వారు ఉన్న చోటకే అవమానకరంగా పంపించారు. కాగా 2012–2015, 2016–2018 సంవత్సరాలకుగానూ 2016, 2019లలో ప్రధాని ఈ అవార్డును జాతీయ సైన్సు దినోత్సవం (ఫిబ్రవరి 28/29న) సందర్భంగా విజ్ఞాన్ భవన్లో బహూకరించారు. 2020లో ప్రచురితమైన సీఎస్ఐఆర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇంతవరకు ఎస్ఎస్బీ ప్రైజ్ని గెలుచుకున్న 560 మందిలో అప్పటికి 244 మంది మూడు జాతీయ సైన్సు అకాడమీలకు ఫెలోలుగా ఎంపికయ్యారు. 143 మంది ఇటలీలోని థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(టీడబ్ల్యూఏఎస్)కు ఫెలోలుగా ఎంపికయ్యారు. 64 మందికి టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వచ్చింది. 25 మంది రాయల్ సొసైటీ ఫెలోషిప్కి ఎంపికయ్యారు. మరో 15 మంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్స్గా ఎంపిక య్యారు. మరో 30 మంది ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ అందుకున్నారు. కనీసం 100 మంది పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ గెలుచుకున్న వారి ప్రతిభను ఈ డేటా తేటతెల్లం చేస్తోంది. భట్నాగర్ లారెట్స్ (1958–2018) అనే శీర్షికతో ప్రచురితమైన పుస్తకం ఎస్ఎస్బీ ప్రైజ్ చరిత్రను వివరిస్తుంది. ఈ ప్రైజ్ని 1958లో బహుకరించారు. తొలి గ్రహీతకు ఒక ఫలకం, రూ. 10,000 నగదును బహుమతిగా ఇచ్చారు. తొలి బహుమతి పుచ్చుకున్నది భట్నాగర్ సమకాలికుడు అయిన సర్ కేఎస్ కృష్ణన్ (1940). 60 ఏళ్ల వయసులో ఈయనకు తొలి ప్రైజ్ దక్కింది. రెండో సంవత్సరం అంటే 1959లో ఇద్దరు గణిత శాస్త్రజ్ఞులు కె చంద్రశేఖరన్, సీఆర్ రావులకు ఈ ప్రైజ్ దక్కింది. ఆనాటికి వీరి వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం, ఏడు రంగాలకు కలిపి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రైజ్ మొత్తం 2008లో రూ. 5 లక్షలకు పెరిగింది. ఒక సబ్జెక్టులో ఎంత మందికి అవార్డు ఇచ్చారనే దాంతో సంబంధం లేకుండా ఎంపికైన ప్రతి ఒక్కరికీ తలా రూ. 5 లక్షలను ఇస్తూ వచ్చారు. దీనికి తోడుగా, దశాబ్దం క్రితం బహుమతి గ్రహీతలందరికీ రూ. 15,000 ఉపకార వేతనం ఇవ్వడం మొదలెట్టారు. గత విజేతలకూ దీన్ని వర్తింపజేశారు. ఎస్ఎస్బీ అవార్డు గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు జరపాలనేది మెరుగైన ప్రతిభ కనబర్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనలోంచి వచ్చింది. నాలుగు నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ అకా డమీలలో కనీసం రెండింటిలో రీసెర్చ్ ఫెలోస్గా ఎంపికైన యూని వర్సిటీ టీచర్లకు నెలకు రూ. 15 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆసక్తి చూపాయి. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు జేసీ బోస్ ఫెలోషిప్ కింద మరొక రూ. 25,000లను అందించే మరొక పథకంతో డీఎస్టీ ముందుకొచ్చింది. అత్యంత ప్రతిభావంతుడైన భారత శాస్త్రవేత్తకు సీఎస్ఐఆర్ లేదా యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకం కింద, దాంతోపాటు డీఎస్టీ – జేసీ బోస్ ఫెలోషిప్ కింద అందే ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఇవే మరి. ఈలోగా, మెరుగైన ఐఐటీలు కొన్ని తమ సొంత చెయిర్ ప్రొఫెస ర్షిప్లను నెలకొల్పాయి. ఇవి కూడా ద్రవ్యపరమైన ప్రయోజనాలను అర్హులైన శాస్త్రవేత్తలకు ఇస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని పలు ఇతర సైన్స్ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తమతమ సొంత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహక పథకాలతో ముందు కొచ్చాయి. సెప్టెంబర్ 16న జరిగిన సమావేశం, ఇలాంటి అన్ని స్కీములను మదింపు చేస్తూనే, వీటిని కుదించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సంస్థల్లోని ప్రైవేట్ విరాళాల మద్దతు కలిగిన అవార్డులకు కూడా ఈ సమీక్షను వర్తింపజేశారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుతో సంప్రదించి, నోబెల్ అవార్డు ప్రమాణాల్లో ఒక అవార్డును ఏర్పర్చాలని చైర్మన్ చేసిన సూచనను కూడా మినిట్స్ పేర్కొంది. అయితే 2003లో రూ. 25 లక్షల నగదుతో ఏర్పర్చిన ఇండియన్ సైన్స్ అవార్డును 2010లో తీసేశారనే విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఏ ఒక్కరూ పేర్కొనలేదు. ఈలోగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2008లో రూ. 25 లక్షల మొత్తంతో తొలి సైన్స్ ప్రైజ్ని ఐఐటీ కాన్పూర్కి చెందిన గణిత శాస్త్ర జ్ఞుడు మణీంద్ర అగర్వాల్కు బహూకరించింది. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ పరిధిని విస్తృత పరిచి నగదు మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఆరు విభాగాల్లో వీటిని అందిస్తున్నారు. ఒక్కో ప్రైజు లక్షరూపాయల విలు వను కలిగి ఉంటుంది. దీనికి పన్ను కూడా మినహాయించారు. ఇటీవలి వారాల్లో, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరొక అడుగు ముందుకేశాయి. అత్యుత్తమ పరిశోధనా పత్రానికి, అత్యుత్తమ పీహెచ్డీ థీసెస్కి ఇస్తున్న అవార్డును సైతం నిలిపి వేయాలని వాటి ఫ్యాకల్టీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు అవార్డులూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. అన్నిటికంటే మించి డీఎస్టీ అందిస్తున్న కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్కాలర్ షిప్పులను కూడా ఉన్నట్లుండి రద్దుచేయడం దారుణమనే చెప్పాలి. 2047 నాటికి భారత్ని స్వావలంబన సాధించిన దేశంగా మార్చడానికి సృజనాత్మక కృషి జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కానీ శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ అవార్డులను చాలావరకు రద్దు చేయాలని ప్రధాని స్వయంగా ఆయా మంత్రిత్వ శాఖలను కోరారంటే నమ్మశక్యం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనల్లో ఉన్నదాన్ని కార్పొరేట్ రంగం ఇప్పటికే అమలు చేసేసిందని ప్రభుత్వం లెక్కించి ఉండవచ్చు. కాబట్టే ప్రభుత్వ రంగంలో ఉన్న అవార్డులను కూడా కుదించాలని అది నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అరుణ్ కుమార్ గ్రోవర్ మాజీ వైస్ చాన్స్లర్, పంజాబ్ యూనివర్సిటీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సును హైదరాబాద్ ఐఐటీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు శ్రీ విశ్వేశ్వర యోగా పరిశోధన సంస్థ (ఎస్వీవైఆర్ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధనలు చేసే రీసెర్చ్ స్కాలర్లకు ప్రతినెలా రూ.75 వేల పారితోషికంతో పాటు, విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, భారతీయ భాషలు, కళలు, అర్కిటెక్చర్, శిల్పం వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ కీలక మైలురాయిని అధిగమిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఐఐటీలో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సు ప్రవేశపెట్టామని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి మోహన్రాఘవన్ పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్ మూర్తి, ఎస్వీవైఆర్ఐ సంస్థ ప్రతినిధులు -
రాకాసి హస్తం కాదు.. విశ్వం ఆవిర్భావానికి కారణ భూతం..!
చూడటానికి అచ్చం రాకాసి హస్తంలా ఉంది కదూ! నిజానికిది ఈ విశ్వావిర్భావానికి కారణ భూతంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావించే ధూళి మేఘం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పట్లాగే కాలంలో వెనక్కు వెళ్లి భూమికి 7,000 కాంతి సంవత్సరాల దూరంలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ను ఇలా క్లిక్మనిపించింది. దీన్ని ఇంత స్పష్టంగా మనం చూడగలగడం ఇదే తొలిసారి. చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం -
She Is- Women In STEAM: స్ఫూర్తినిచ్చే సూపర్స్టార్స్.. ఆ 75 మంది మహిళలు..
అక్షరాలు అంటే వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలే కాదు... అగ్నిజ్వాలలు కూడా. ఆ వెలుగు ఎన్నో రకాల చీకట్లను పారదోలుతుంది. ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. స్ఫూర్తినిచ్చే ఎన్నో విజయాలు ఉన్నాయి... డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఎల్సా మేరి డిసిల్వా ‘షీ ఈజ్–ఉమెన్ ఇన్ స్టీమ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మాథమెటిక్స్)కు విస్తరణ ఈ స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమేటిక్స్). సైన్స్ నుంచి సమాజసేవ వరకు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన డెబ్భై అయిదు మంది మహిళలను ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారు డిసిల్వా. పరిచయం అనడం కంటే వారి పర్సనల్, ప్రొఫెషన్ స్ట్రగుల్ను కళ్లకు కట్టారు అనడం సబబుగా ఉంటుంది. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వివిధ రంగాల మహిళలు... అదితి చతుర్వేది–టెక్నాలజీ పాలసీ ఆనంది అయ్యర్–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్ అంజలి మల్హోత్ర–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ అను ఆచార్య–హెల్త్ సైన్స్ అనుపమ్ కపూర్–హ్యూమన్ రిసోర్స్ అనుశ్రీ మాలిక్–ఎన్విరాన్మెంట్ సైన్స్ అపూర్వ బెడెకర్–మెడికల్ డివైజ్ అర్చన చుగ్–బయోలాజికల్ సైన్స్ ఆర్తి కశ్యప్–డిజైన్ అండ్ టెక్నాలజీ అజ్రా ఇస్మాయిల్–డిజైన్ అండ్ టెక్నాలజీ విజయలక్ష్మీ బిస్వాల్–హెల్త్ సైన్సెస్ బినేష్ పయట్టటి–ఎన్విరాన్మెంట్ సైన్స్ బిను వర్మ–ఎడ్యుకేషన్ బృంద సొమయ–ఆర్కిటెక్చర్చర్ చంద నిమ్బకర్–బయోలాజికల్ సైన్స్ చెర్లీ పెరైర–ఎన్జీవో దీప్తి గుప్త–ఇంజనీరింగ్ దర్శన జోషి–ఫిజిక్స్ మనిషా ఆచార్య–ఇన్నోవేషన్ రాఖీ చతుర్వేది–బయోలాజికల్ సైన్స్ శుభాంగి వుమ్బర్కర్–కెమికల్ సైన్స్ అర్చన శర్మ–ఇంజనీరింగ్ భారతి సింఘల్–బయోలాజికల్ సైన్స్ కల్పన నాగ్పాల్–ఫార్మాస్యూటికల్ సైన్స్ ప్రీతి షరన్–ఇంజనీరింగ్ షమిత కుమార్–ఎన్విరాన్మెంట్ సైన్స్ దుర్బసేన్గుప్త– బయోకెమిస్త్రీ ఏక్తా వివేక్ వర్మ–జెండర్ బేస్డ్ వాయిలెన్స్ గాయత్రి జోలి–డిజైన్ అండ్ టెక్నాలజీ గీత మెహత–డిజైన్ అండ్ టెక్నాలజీ గీతారాయ్–బయోలాజికల్ సైన్స్ జీవన్జ్యోతి పండ–బయోలాజికల్ సైన్స్ కైయిత్కి అగర్వాల్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ కరణ్ శైవ–సస్టేనబుల్ డెవలప్మెంట్ కవితా గోంసాల్వేజ్–డిజైన్ అండ్ టెక్నాలజి కిరణ్ బాలా–ఎన్విరాన్మెంట్ సైన్స్ కిరణ్ మన్రల్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ లిజీ ఫిలిప్–సివిల్ ఇంజనీరింగ్ మాధవీలత గాలి–సివిల్ ఇంజనీరింగ్ మిథాలి నికోర్–ఎకనామిక్స్ మోనాలి హజ్ర–ఎన్విరాన్మెంట్ సైన్స్ మోనాలీసా ఛటర్జీ–ఫార్మాస్యూటికల్ సైన్స్ నమ్రత రాణా–క్లైమెట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ నందితాదాస్ గుప్త–ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నీలమ్–సోషల్ ఇంపాక్ట్ నిహారిక మల్హోత్ర–హెల్త్ సైన్స్ నిష్మ వాంగూ–నానోసైన్స్ అండ్ నానో టెక్నాలజీ పద్మ పార్థసారథి–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ప్రీతి అఘలయం–కెమికల్ ఇంజనీరింగ్ అర్పిత మోండల్–ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ జైదీప్ మల్హోత్ర–హెల్త్ సైన్స్, రాధిక–హెల్త్ సైన్స్ రంజని విశ్వనాథ్–కెమికల్ సైన్స్ రష్మీ పుట్చ–డిజైన్ అండ్ టెక్నాలజీ రీతూపర్ణ మండల్–సెమీ కండక్టర్స్ రుమ పాల్–హెల్త్ సైన్స్ సంఘమిత్ర బందోపాధ్యాయ–న్యూరోసైన్స్ షెలక గుప్త–కెమికల్ ఇంజనీరింగ్ శిలో శివ్–ఆర్ట్స్ అండ్ కమ్యునికేషన్ శిల్పి శర్మ–ఎన్విరాన్మెంట్ సైన్స్ షీతల్ కక్కర్ మెహ్ర–సోషల్ ఇంపాక్ట్ శ్రుతి పాండే–ఆర్కిటెక్చర్ శ్యామల రాజారామ్–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శిమ్మి దర్నిజ–ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజి శ్రీదేవి ఉపాధ్యాయుల–కెమికల్ ఇంజనీరింగ్ సుసన్–బయోలాజికల్ సైన్స్ స్వర్ణలత జె– కమ్యూనిటి సర్వీస్ తృప్తిదాస్–ఎన్విరాన్మెంట్ సైన్స్ వందన ననల్–ఫిజిక్స్ వనమాల జైన్–డిజైన్ అండ్ టెక్నాలజీ వర్ష సింగ్–సైకాలజి విశాఖ చందేరె–క్లీన్ ఎనర్జీ యమ దీక్షిత్– క్లైమేట్ సైన్స్ అండ్ కమ్యునికేషన్స్ జైబున్నిసా మాలిక్ – కంప్యూటర్ సైన్స్. ‘ఎన్నో ఏళ్లుగా కార్పొరేట్, డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసిన నేను వివిధ రూపాల్లో ఉండే పురుషాధిక్యతను చూశాను. మహిళ అనే కారణంతో వారి ప్రతిభను పట్టించుకోని వారిని చూశాను. రకరకాల అనుభవాలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం అయ్యాయి’ అంటోంది పుస్తక రచయిత్రి ఎల్సా మేరి డిసిల్వా. ‘షీ–ఈజ్’ బుక్సిరీస్లో ఇంకా ఎన్నో పుస్తకాలు రానున్నాయి. మహిళాశక్తిని ప్రపంచానికి చాటనున్నాయి. చదవండి: ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్ -
Scientific Literature: శాస్త్ర సాహిత్యం
మనకు శాస్త్ర సాహిత్యం కొత్తదేమీ కాదు. కాకుంటే, శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా మనకు ఆశించిన స్థాయిలో శాస్త్ర సాహిత్యం రాకపోవడమే శోచనీయం. క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సామాన్యులకు తేలికగా అర్థమయ్యేలా సాహిత్య రూపంలో అందించిన కవులు, రచయితలు తెలుగువాళ్లలో చాలామందే ఉన్నారు. తెలుగులో తొలి శాస్త్ర కావ్యం గణిత శాస్త్రానికి సంబంధించినది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన కవి పండితుడు పావులూరి మల్లన్న ‘గణితశాస్త్ర సంగ్రహం’ రాశాడు. మహావీరాచార్యుడు సంస్కృతంలో రాసిన గణిత గ్రంథాన్ని మల్లన్న పద్యాల్లో అనువదించాడు. ఆయన కృషికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నవఖండవాడ అనే అగ్రహారాన్ని బహూకరించాడట. ప్రజల్లో విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రం 1906లోనే మునగాల రాజా నాయని వేంకట రంగారావు పోషణలో విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పడింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిస్తూ, తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని అందించారు. విజ్ఞాన చంద్రికా మండలి చరిత్ర, శాస్త్ర విషయాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. ఆచంట లక్ష్మీపతి రాసిన ‘జీవశాస్త్రము’, ‘జంతుశాస్త్రము’, ‘కలరా’, ‘చలిజ్వరము’; మంత్రిప్రగడ సాంబశివరావు రాసిన ‘పదార్థ విజ్ఞానశాస్త్రము’, వేమూరి విశ్వనాథశర్మ రాసిన ‘రసాయన శాస్త్రము’ వంటి గ్రంథాలను విజ్ఞాన చంద్రికా మండలి అప్పట్లోనే వెలుగులోకి తెచ్చింది. ఇంచుమించు అదేకాలంలో కృష్ణా జిల్లా వ్యవసాయ సంఘం గోపిశెట్టి నారాయణస్వామి నాయుడు సంపాదకత్వంలో ‘వ్యవసాయము’ మాస పత్రికను ప్రారంభించింది. తెలుగులో అదే తొలి వ్యవసాయశాస్త్ర పత్రిక. తర్వాత కొంతకాలానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసే కాళీపట్నం కొండయ్య 1935లో ‘విజ్ఞానం’ మాసపత్రికను ప్రారంభించి, దాదాపు ఐదేళ్లు నడిపారు. అంతేకాదు, జేమ్స్ జీన్స్ రాసిన ‘యూనివర్స్ అరౌండ్ అజ్’ను తెలుగులో ‘విశ్వరూపం’ పేరిట తెలుగులోకి అనువదించారు. శాస్త్రవేత్తలు, విజ్ఞానశాస్త్ర విద్యార్థులు కాకుండా, సాధారణ పాఠకులకు అర్థమయ్యే శాస్త్రీయ అంశాలను వివరిస్తూ వెలువడే ఇలాంటి గ్రంథాలు జనరంజక శాస్త్ర గ్రంథాలుగా పేరుపొందాయి. శాస్త్ర సాంకేతిక అంశాలను సామాన్యులకు చేరవేయడాన్నే పనిగా పెట్టుకుని ఒక ఉద్యమంలా రచనలు సాగించిన రచయితలు మనకు ఉన్నారు. వీరిలో సాహిత్యరంగంలో దిగ్గజాలుగా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వసంతరావు వెంకటరావు ఒకరు. ఆయన 1949లో ‘ఆధునిక విజ్ఞానం’ రాశారు. శాస్త్ర విషయాలను పద్యాలు, పాటల రూపంలో పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో విరివిగా రాసి, ‘భౌతికశాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి’గా ప్రసిద్ధుడయ్యారు. విస్సా అప్పారావు ‘విజ్ఞానం–విశేషాలు’ పుస్తకం రాశారు. అలాగే ఆయన పిల్లల కోసం నక్షత్రాల గురించి పుస్తకం రాశారు. లండన్లో డాక్టరేట్ చేసిన శ్రీపాద కృష్ణమూర్తి ‘విజ్ఞాన సాధన’, ‘విజ్ఞాన వీధులు, ‘ఇంటింటా విజ్ఞాన సర్వస్వము’, ‘రాకెట్లు–ఆకాశయానము’, ‘వైజ్ఞానిక గాథాశతి’ వంటి పుస్తకాలను రాశారు. ఖగోళ శాస్త్రంపై ఏవీఎస్ రామారావు ‘వినువీధి’ పుస్తకం రాశారు. తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?’ వంటి శాస్త్ర పరిశోధన పుస్తకాలను రాశారు. డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’, ‘జంతుశాస్త్రం’ వంటి శాస్త్ర గ్రంథాలను రష్యన్ నుంచి తెలుగులోకి అనువదించారు. శాస్త్రీయ దృక్పథం గల తెలుగు రచయితల్లో ఒకరైన కొడవటిగంటి కుటుంబరావు ‘బుద్ధికొలత వాదాన్ని’ ప్రతిపాదించారు. మహీధర రామమోహనరావు ‘సైన్స్ ప్రపంచం’ పత్రికను నడిపారు. ఆయన కుమారుడు మహీధర నళినీమోహన్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో శాస్త్ర సాంకేతిక విషయాలపై ‘నిప్పు కథ’, ‘టెలిగ్రాఫు కథ’, ‘టెలిఫోను కథ’, ‘విద్యుత్తు కథ’, ‘ఆలోచించే యంత్రాలు’, ‘ఇతర లోకాల్లో ప్రాణులు’ వంటి అనేక పుస్తకాలు రాశారు. పాత్రికేయ రచయిత నండూరి రామమోహనరావు ఖగోళ, మానవ పరిణామ శాస్త్ర అంశాలపై ‘విశ్వరూపం’, ‘నరావతారం’ వంటి పుస్తకాలు రాశారు. పాల్ డి క్రూఫ్ రాసిన ‘మైక్రోబ్ హంటర్స్’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీనిని జమ్మి కోనేటిరావు తెలుగులో ‘క్రిమి అన్వేషకులు’ పేరిట అనువదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ పిల్లల కోసం‘ప్లాస్టిక్ ప్రపంచం’ వంటి పుస్తకాలు రాశారు. వృత్తిరీత్యా వైద్యులైన డాక్టర్ గాలి బాలసుందరరావు, డాక్టర్ జి.సమరం, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు వైద్య, ఆరోగ్యశాస్త్ర అంశాలపై విరివిగా పుస్తకాలు రాశారు. ఇదివరకు ‘భారతి’, ‘పుస్తక ప్రపంచం’ వంటి సాహిత్య పత్రికలు సైతం శాస్త్ర సాంకేతిక వ్యాసాలను విరివిగా ప్రచురించేవి. పూర్తిగా శాస్త్ర సాంకేతిక అంశాల కోసం తెలుగులో ‘సైన్స్వాణి’, ‘సైన్స్ ప్రపంచం’ వంటి పత్రికలు వెలువడేవి. ఇప్పుడవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికాలంలో ప్రధాన స్రవంతి సాహిత్యంలో గుర్తింపు పొందిన రచయితలెవరూ శాస్త్ర సాంకేతిక అంశాలపై రచనలు సాగించడం లేదు. చక్కని శైలి గల రచయితలు శాస్త్ర సాంకేతిక అంశాల రచనలు చేస్తే పాఠకులు ఆదరించకుండా ఉండరు. ఈ అంశాలపై ఇదివరకటి పుస్తకాలను ఎన్నిసార్లు పునర్ముద్రణ చేసినా పాఠకులు ఇంకా వాటిని కొంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. తెలుగులో శాస్త్ర సాంకేతిక రచనలు ఇంకా విరివిగా రావాల్సిన అవసరం ఉంది. దీనిని సాహిత్య అకాడమీలు, ప్రచురణకర్తలు, రచయితలే గుర్తించాల్సి ఉంది. -
శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి
అహ్మదాబాద్: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం ప్రారంభమైన సెంటర్–స్టేట్ సైన్స్ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్లో భారత్ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. -
మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్: డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డి
(గరికిపాటి ఉమాకాంత్) సాక్షి, తిరుపతి: ‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గత ఏడేళ్లుగా ఎంతో పురోగతి సాధించింది. మన అవసరాలకు మించి ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. ఇప్పటివరకు మేడ్ ఇన్ ఇండియా (దేశంలో తయారీ) దిశగా సాగాం. ఇప్పుడు ప్రపంచం కోసం తయారీ (మేక్ ఫర్ వరల్డ్) దిశగా మన ప్రయోగాలు, ఆవిష్కరణలు చేస్తున్నాం’ అని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి,సతీష్రెడ్డి వెల్లడించారు. ‘ప్రపంచ దేశాల అవసరాల కోసం తయారయ్యే ఉత్పత్తులకు మన దేశమే కేంద్రం కావాలి. ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి. రక్షణ శాఖ ఆ దిశగానే సరికొత్త ఆలోచనలు ఉన్నవారిని, పరిశోధనలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుంది. దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టింది. 5 బిలియన్ డాలర్ల (రూ.39 వేల కోట్ల) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా డీఆర్డీవో పని చేస్తోంది’ అని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా సొంతంగా రక్షణ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించాం. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్.. ఈ ఐదూ మూల సూత్రాలుగా భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా ఎదగడమే ప్రాజెక్టు లక్ష్యం, అందులో భాగంగా ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణిలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నింటినీ భారత్లోనే తయారు చేశాం. ప్రపంచంలోనే దీర్ఘ శ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)ను కూడా అభివృద్ధి చేయగలిగాం. సేవా రంగంలోనూ డీఆర్డీవో సేవలు దేశ రక్షణతో పాటు సామాజిక సేవా రంగంలోనూ డీఆర్డీవో విస్తృత సేవలు అందిస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో వైద్య రంగంలోని ఉత్పత్తులపై దృష్టి సారించాం. శానిటైజర్, గ్లౌజులు, పీపీఈ కిట్లు తయారు చేశాం. ప్రధానమంత్రి సూచన మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తయారు చేశాం. సాంకేతికతను పెంపొందించుకొని ఒక్క రోజులో 30 వేల వెంటిలేటర్లను తయారు చేసే స్థాయికి ఎదిగాం. మూడు నెలల్లోనే దేశ అవసరాలను అధిగమించాం. ఎన్నో దేశాలకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, కరోనా రక్షణ పరికరాలను పెద్దసంఖ్యలో ఎగుమతి చేశాం. డేర్ టు డ్రీం దేశంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు డీఆర్డీవో ‘డేర్ టు డ్రీం’ పేరిట వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోంది. మంచి స్టార్టప్లు, ఆలోచనలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇస్తోంది. ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, మెకానిజం కూడా డీఆర్డీవో అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచే లబ్ధ ప్రతిష్టులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులై ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య బంధం తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం వంటిది. నేను కూడా సర్కారు బడిలోనే చదివాను. నెల్లూరు జిల్లాలోని మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. స్కూలు టీచర్ ఎస్ఆర్ నరసింహం గారు లెక్కలు ఎక్కువగా నేర్పారు. ఆట పాటలతో పాటు క్రికెట్కు కూడా ఆయనే గురువు. అమ్మ కోరిక మేరకే ఇంజనీరింగ్ అప్పట్లో మా ఊళ్ళో మొదటి గ్రాడ్యుయేట్ నేనే. మా అమ్మ ఎప్పుడూ నువ్వు ఇంజనీర్ కావాలని అంటుంటేది. అమ్మ కోరిక మేరకే ఇంజనీర్ను అయ్యాను. అబ్దుల్ కలాం డీఆర్డీవో చైర్మన్గా ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. ఆయనే స్ఫుర్తి. దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి ప్రతి ఒక్కరికీ దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి. సైన్స్ను, సత్సంప్రదాయాలను సమానంగా గౌరవించాలి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను మన పురాణాలు, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. సైన్స్ అభివృద్ధి చెందక ముందే జీరోను కనుగొన్న చరిత్ర మన సొంతం. నంబర్ వన్గా నిలవడమే యువత లక్ష్యం శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో నంబర్ వన్గా నిలవడమే యువత ముందున్న లక్ష్యం. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలి. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న నిపుణులు 75 శాతం మంది విదేశా>లకు వెళ్లిపోయే వాళ్లు. ఇప్పుడు 75 శాతం మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనం. -
బైడెన్ కేబినెట్లో చరిత్ర సృష్టించనున్న భారతీయ సంతతి మహిళ
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో మహిళకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతీ ప్రభాకర్ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ (ఓఎస్టీపీ) సలహాదారుగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ చారిత్రాత్మకమైంది. ఓఎస్టీపికీ సెనేట్ ధృవీకరించిన డైరెక్టర్గా నామినేట్ చేసిన తొలి మహిళ, వలసదారు ప్రభాకర్ అని వైట్హౌస్ వ్యాఖ్యానించింది. దీనికి సెనేట్ ఆమోదం లభిస్తే చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రభాకర్. అలాగే బైడెన్ సర్కార్లో పనిచేయనున్న మూడవ ఆసియా అమెరికన్గా కూడా ఆమె నిలుస్తారు. ముఖ్య సలహాదారుగా, సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్కు కో-చైర్గా, ప్రెసిడెంట్ క్యాబినెట్ సభ్యునిగా ఉంటారని వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో ఇండో-అమెరికన్ ప్రభాకర్ చేరడం విశేషం. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఎరిక్ ల్యాండర్ రాజీనామా నేపథ్యంలో ప్రభాకర్ను ఈ పదవికి బైడెన్ నామినేట్ చేశారు. తెలివైన, అత్యంత గౌరవనీయమైన ఇంజనీర్, గొప్ప భౌతిక శాస్త్రవేత్త అని డాక్టర్ ప్రభాకర్ను అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ల ద్వారా అవకాశాలను విస్తరించేందుకు, కష్టతరమైన సవాళ్లను పరిష్కరించి, అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు భారతీయ అమెరికన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. కాగా ప్రభాకర్ కుటుంబం ప్రభాకర్ మూడేళ్ల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లింది. మొదట చికాగోకు వెళ్లి ఆపై ఆమె 10 సంవత్సరాల వయస్సులో టెక్సాస్లోని లుబ్బాక్లో స్థిరపడింది. ఆమె టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ ఫిజిక్స్లో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి మహిళ. ఇక్కడే లక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ కూడా చేశారు. ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్మెంట్లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో కరియర్ను ప్రారంభిచారు. డాక్టర్ ప్రభాకర్ రెండు వేర్వేరు ఫెడరల్ ఆర్ అండ్డీ ఏజెన్సీలకు నాయకత్వం వహించారు. అనేక రంగాలలో స్టార్టప్లు, పెద్ద కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ల్యాబ్లు, ఎన్జీవోతో కలసి పనిచేసి విశేష సేవలందించారు. ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టి)కి నాయకత్వం వహించిన మొదటి మహిళ కూడా ఆరతీప్రభాకర్. ఆ తరువాత డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరెక్టర్గా పనిచేశారు. -
విఠలాచార్య సినిమాల్లోలా..! నడుస్తాను..రివ్వున ఎగురుతాను!
ఫొటో కనిపిస్తున్నది విఠలాచార్య సినిమాల్లోని కంకాళంలా ఉంది కదూ! ఇది కంకాళం కాదు, మోడర్న్ గరుడావతారం. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) శాస్త్రవేత్తలు ‘లియోనార్డో’ పేరిట రూపొందించిన రోబో ఇది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిలా నేల మీద రెండుకాళ్లతో నడవగలదు. డేగలా ఆకాశంలో రివ్వున ఎగరగలదు. ఒకరకంగా ఇది రోబో ద్రోన్. ఎంత ఎత్తు ఎగిరినా, భూమ్మీద ఎలాంటి ఉపరితలంపైన అయినా ఇట్టే వాలగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు. అంగారకుని ఉపరితలంపై కూడా వాలేందుకు అనువుగా దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్లు ‘కాల్టెక్’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నిప్పులకొలిమిలా భగభగలు.. అయినా జీవరాశి ఉనికి!
మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు. పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా గ్రీన్ హౌజ్ ప్రభావం వల్ల హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై యాక్సైడ్తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్(863 డిగ్రీల ఫారన్హీట్) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు.. ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. 1. A new study has revealed that the sunlight passing through Venus' clouds could support the growth of photosynthetic microorganisms. Moreover, photosynthesis could even occur during the night time thanks to the planet's thermal energy! pic.twitter.com/j5NfFYmPF5 — The Weather Channel India (@weatherindia) October 11, 2021 సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్ పిగ్మెంట్స్ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేష్ మొఘల్ వెల్లడించారు. ఆమ్ల, ద్రావణ(వాటర్) చర్యల వల్ల మైక్రోబయాల్ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది. చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన -
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్క్రీమ్గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు దిశగా కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ) చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అటానమస్ ఇన్స్టిట్యూట్ల నుంచి ఆర్థిక సాయాన్ని పొంది అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. టెక్నాలజీ భవన్లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో భారత్ మూడో ర్యాంకులో ఉందన్నారు. అంతేగాక నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో 9వ స్థానంలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి టాప్-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలన్నారు. ప్రధాని మోదీ సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు. -
సాంకేతిక రంగాల్లో మనదే కీలక పాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయ యువత కీలకపాత్ర వహిస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువ శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నిపుణుల కొరత ఉన్నా.. మన దేశం మాత్రం 1.3 బిలియన్ జనాభాతో ఒక అత్యున్నత స్థాయి శక్తిగా ఆవిర్భవించే స్థాయికి చేరిందని తెలిపారు. (చదవండి: బస్సులో గవర్నర్ తమిళిసై ప్రయాణం) దార్శనికత, ముందు చూపు ఉన్న ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్తోందని, ఇందులో యువతే కీలకపాత్ర అని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’వేడుకలను గవర్నర్ తమిళిసై శుక్రవారం హన్మకొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశాక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్రావు, జెడ్పీ చైర్మన్ ఎం. సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్ పి. ప్రమోద్ కుమార్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. -
ఆనంద్.. మంచి కాఫీలాంటి శాటిలైట్
తన 50 ఏళ్ల చరిత్రలో ‘ఇస్రో’ తొలిసారిగా మన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్వాల్లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం... చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్లూప్ పోడ్ కాంపిటీషన్’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. ‘హైపర్లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్స్టార్ ఎలాన్ మాస్క్ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్. హైపర్లూప్ కాంపిటీషన్లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్ప్రైజ్ కాంపిటీషన్’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్ప్రైజ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్. బిట్స్పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్వాల్తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్లలో హైయెస్ట్ ఫండింగ్లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి 20 శాతం అధికం
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక శాఖకు కేంద్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో రూ.14,793.66 కోట్లు కేటాయించింది. 2020–21 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 20% అధికం కావడం విశేషం. అలా గే ఎర్త్ సైన్సెస్ శాఖకు ప్రత్యేకంగా రూ.1,897.13 కోట్లు కేటాయించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్ఐఆర్) ఉన్నాయి. దే శంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈ విభాగాలన్నీ కీలకంగా పనిచేశాయి. 2021–22 బడ్జెట్లో డీఎస్టీకి రూ.6,067.39 కోట్లు, డీబీటీకి రూ.3,502.37 కోట్లు, డీఎస్ఐఆర్కు రూ.5,224.27 కోట్లు కేటాయించారు. 2020–21 బడ్జెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.14,473.66 కోట్లు కేటాయించగా, తర్వాత దాన్ని రూ.11,551.86 కోట్లుగా సవరించారు. ఇండియాలో ‘డీప్ ఓషన్ మిషన్’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ఐదేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2021-22 రూ.14,793.66 2020-21 రూ.11,551.86 అంతరిక్ష విభాగానికి రూ.13,949 కోట్లు అంతరిక్ష విభాగానికి కేంద్రం రూ.13,949 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది గతేడాది రూ.8,228 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.4,449 కోట్లు ఎక్కువ కేటాయించడం గమనార్హం. ఈ మొత్తంలో రూ.700 కోట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’కు కేటాయించారు. గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా నలుగురు మానవులను అంతరిక్షంలోకి పంపడానికి రష్యాలోని జెనెరిక్ స్పేస్ ఫ్లయిట్ ఆస్పెక్ట్లో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిసెంబర్ 2021లో మానవరహిత అంతరిక్ష నౌకను పరీక్షిస్తామని వెల్లడించారు. హోం శాఖకు రూ.1,66,547 కోట్లు కేంద్ర హోంశాఖకు 2021–22 బడ్జెట్లో రూ. 1,66,547 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11.48 శాతం అధికం. ఇందులో మెజారిటీ నిధులు కేంద్ర సాయుధ బలగాల నిర్వహణకు, జనగణనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో హోం శాఖకు రూ.1,49,387 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.1,66,547 కోట్లకు పెంచారు. ఇం దులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లకు రూ.1,03,802.52 కోట్లు, జనాభా లెక్కలకు రూ.3,768.28 కోట్లు కేటాయించారు. -
ఐక్యరాజ్య సమితి సమర్పించు...
‘రీసెట్ ఎర్త్’ పేరుతో ఐక్యరాజ్య సమితి కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా 10 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారి కోసం ఒక మొబైల్ గేమ్ను రూపొందించారు. ఓజోన్ పొర విలువను తెలియజేసే గేమ్ ఇది. ‘ఓజోన్ పొర రక్షణకు సంబంధించిన ప్రచారం అనేది ఒక తరానికి సంబంధించిన విషయం కాదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అంటున్నారు ప్రాజెక్ట్ బాధ్యుల్లో ఒకరైన మెక్ సెక్. -
గాల్లోని తేమ నీరవుతుంది ఇలా..
భూమిపై నీటి వనరులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధకులు ఎప్పటినుంచో ప్రయోగాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గాల్లోంచి నీటిని ఒడిసిపట్టేందుకు ఇప్పటికే బోలె డన్ని యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటన్నింటికీ కరెంటు కావాలి. భారీ సైజు యంత్రాలూ కావాలి. పెద్ద పెద్ద తెరలు అవసరమవుతాయి. అయితే ఇవేవీ లేకుండానే గాల్లోని ఆవిరిని నీరుగా మార్చేయవచ్చని అంటోంది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్). ప్రత్యేకమైన ప్లాస్టిక్ పోగులు, సూక్ష్మ రంధ్రాలతో అత్యధిక ఉపరితలాన్ని కలిగిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లతో ఈ అద్భుతాన్ని సాధించవచ్చని ఎన్యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. కిలో ఏరోజెల్తో రోజుకు 17 లీటర్ల నీరు.. ఈ పద్ధతిలో ఒక కిలో ఏరోజెల్ పదార్థంతో రోజుకు 17 లీటర్ల నీటిని పొందొచ్చు. ఈ పదార్థం ఒక స్పాంజ్ మాదిరిగా గాల్లోని తేమను కాస్తా నీరుగా మారుస్తుంది. ఈ పదార్థం సేకరించిన నీటిని స్పాంజ్ మాదిరిగా పిండి సేకరించాల్సిన అవసరం లేదు. తగుమోతాదులో నీరు చేరిన వెంటనే దానంతట అదే నీరు బయటకు వచ్చేస్తుంది. ఏరోజెల్లోని పదార్థాలు నీటి అణువులను ఆకర్షించడం.. వికర్షించడం రెండూ చేయగలగడం దీనికి కారణం. ఏరోజెల్ను ఎండలో ఉంచినప్పుడు దాని పనితీరు మరింత మెరుగ్గా ఉందని, సేకరించిన ఆవిరిలో 95 శాతాన్ని నీరుగా మారుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ హో గిమ్ వీ తెలిపారు. పంటకు పూత.. చీడకు చెక్! చీడపీడలు ఆశిస్తే పంట నాశనమవుతుంది. రసాయనాలతో క్రిమికీటకాలను చంపేసి పంటను కాపాడుకుందామంటే.. పర్యావరణానికి ముప్పు కలుగుతుం ది. అయితే దీనికి క్రాప్కోట్(పంట పూత)ను ప్రత్యామ్నాయంగా పేర్కొంటోంది కాలిఫోర్ని యాకు చెందిన స్టారప్ కంపెనీ క్రాప్ ఎన్హ్యాన్స్మెంట్! ఈ కంపెనీ తయారు చేసిన పదార్థాన్ని పంటలపై పిచికారీ చేస్తే.. చీడపీడలకు పంట అస్సలు కనపడకుండా పోతుందట! క్రాప్ ఎన్హ్యాన్స్మెంట్ కంపెనీ చెట్ల నుంచి వెలికితీసిన ఒక పదార్థాన్ని నీటితో కలిపి వాడుతుందట. పంటలపై ఈ పదార్థాన్ని పిచికారి చేస్తే.. 12 నుంచి 24 గంటల్లో నీరు మొత్తం ఆవిరైపోతుంది. చెట్ల నుంచి వెలికితీసిన పదార్థపు పూత పంటలపై నిలిచిపోతుంది. ఈ పూత కాస్తా మొక్కలను చీడపీడలకు కనపడకుండా చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఎలా అన్న ప్రశ్నకు కంపెనీ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కానీ... ప్రత్యేక పదార్థపు పూత పూసిన మొక్కల ఉపరితలాలను ఆహారంగా, పునరుత్పత్తి కేంద్రాలుగా క్రిమికీటకాలు గుర్తించడం లేదన్న విషయం తమకు స్పష్టమైందని కంపెనీ సీటీవో దామియన్ హాడుక్ తెలిపారు. క్రిమి కీటకాలను బట్టి పరిస్థితి మారుతోందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి తాము అభివృద్ధి చేసిన పూత 6 వారాల పాటు పనిచేస్తుందని వివరించారు. మొక్కలకు, జంతువులకు నష్టం లేదు! ప్రత్యేక పదార్థపు పూత పూసినప్పటికీ మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హాడుక్ చెప్పారు. మొక్కకు, మనుషులకు, జంతువులకు ఈ పూత ద్వారా ఎలాంటి నష్టమూ ఉండదన్నారు. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఇండోనేసియా, ఆఫ్రికా, యూరప్లలో తాము క్షేత్ర స్థాయి పరిశీలనలు నిర్వహించామని చెప్పారు. -
5 కంపెనీలు.. లక్ష ఉద్యోగాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ పురోగతి మూలంగా అభివృద్ధిపథంలో తెలంగాణ అగ్ర భాగాన ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరా బాద్లో ఏర్పాటయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ద్వారా ప్రయోగశాలల్లో పురుడు పోసుకునే ఆవిష్కరణలు పౌరుల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఆధ్వర్యంలో నడిచే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ను శుక్రవారం కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రిచ్ ద్వారా రాష్ట్రంలోని జాతీయ పరిశోధనాసంస్థలు, స్టార్టప్లు, పౌర సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒకేతాటిపైకి తెచ్చి స్థానికంగా నెలకొన్న సంక్లిష్ట సవాళ్లకు పరిష్కారం చూపుతామన్నారు. తద్వారా స్థానికుల జీవితాల్లో పరివర్తన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహార, వ్యవసాయ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో రిచ్ ఆవిష్కరణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని చెప్పారు. పునరుద్ధరణీయ ఇంధనం, వ్వర్థాల నిర్వహణ, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలకు కూడా రిచ్ తన కార్యకలాపాలు విస్తరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. స్టియాక్ నిర్ణయం మేరకే మెగా క్లస్టర్ దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని మెగా క్లస్టర్లు సమర్థవంతమైన శాస్త్రీయ ఫలాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్గా భారత్ ‘దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో అత్యంత వినూత్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్గా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అగ్రస్థానానికి చేరే సత్తా భారత్కు ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణల మీద దృష్టిని కేంద్రీకరిస్తుండటంతో దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధిస్తోంది. అందుకే క్లస్టర్ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేశాం. హైదరాబాద్లో 200పైగా కంపెనీలతో కూడిన అతిపెద్ద బయో క్లస్టర్ జీనోమ్ వ్యాలీ ఉంది. మరోవైపు ఫార్మా రంగానికి రాజధానిగా పేరు సంపాదించింది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఇక్కడ నుంచే వస్తున్నాయి. విత్తన రాజధానిగా, డిజిటల్ టెక్నాలజీ హబ్గా పేరు సంపాదించడంతోపాటు 60కి పైగా ప్రభుత్వ, బహుళ జాతి, ప్రైవేటు పరిశోధన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి’అని విజయ రాఘవన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర శాస్త్రీయ విభాగం కార్యదర్శి డాక్టర్ అరబింద మిత్రా, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు. -
రక్తపోటు మందుతో దీర్ఘాయువు?
రక్తపోటు నివారణకు ఉపయోగించే మందు ఆయువును పెంచేం దుకు దోహదపడుతుందని జపాన్లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటోలజోన్ అనే ఈ మందును వాడినప్పుడు కణస్థాయిలో ఆయువును పెంచే ప్రక్రియలు జరుగుతాయని, ఏలిక పాములపై ఈ మందు ప్రయోగించామని, ఇవే ఫలితాలు మానవుల్లోనూ ఇస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైటోకాండ్రియా మన వయసు పెరిగే కొద్దీ సక్రమంగా పనిచేయదు. మైటోకాండ్రియాను మరమ్మతు చేసి ఆయువు పెంచేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే శరీర వ్యవస్థలో మరమ్మతు చేసేందుకు ఓ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియను మందుల ద్వారా ప్రారంభిస్తే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసి మనం ఎక్కువ కాలం సమస్యల్లేకుండా బతకొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏలికపాములపై జరిపిన పరిశోధనలకు ప్రాధాన్యమేర్పడింది. మైటోకాండ్రియా మరమ్మ తు ప్రక్రియ మొదలైనప్పుడు ఏలికపాము కాస్తా వెలుగులు చిమ్మేలా జన్యుమార్పులు చేసి.. పలు వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులను వాటిపై ప్రయోగించారు. మెటోలజోన్ అనే రక్తపోటు మందు వాడినప్పుడు ఏలికపాముల్లో మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైందని, వాటి జీవన కాలమూ పెరిగిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కేజ్ నకాడై తెలి పారు. మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియకు ఉపయోగపడే హెచ్ఎస్పీఏ–6 జన్యువు ఉత్తేజితం అవుతున్నట్లు తెలిసింది. చలిలో వ్యాయామం.. వేగంగా కరిగేను కొవ్వు! చలి ఎక్కువవుతున్న కొద్దీ మనలో చాలామంది దుప్పట్లు కప్పేసుకుంటాం. ఉదయా న్నే చేసే వ్యాయామానికి సెలవులు ప్రకటించుకుంటాం. కానీ చలి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతోంది కెనెడాలోని లారెన్షియన్ యూనివర్సిటీ పరిశోధన. మీరెప్పుడైనా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) గురించి తెలుసా..? వ్యాయామం చేసే తీరులో ఇదో పద్ధతి. కొన్ని నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం ఆ తర్వాత కొంత విరామం.. తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం ఇలా సాగుతుంది ఈ హెచ్ఐఐటీ. కొవ్వులను వేగంగా కరిగించేందుకు ఇది మేలైన వ్యాయామం అని ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాయామంపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏంటన్నది తెలుసుకునేందుకు లారెన్షియన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పరిసరాల ఉష్ణోగ్రత 21ల డిగ్రీ సెల్సియస్గా ఉన్నప్పుడు హెచ్ఐఐటీ చేస్తున్న వారితో పోలిస్తే సున్నా డిగ్రీ సెల్సియస్లో అంటే నీరు గడ్డకట్టే పరిస్థితుల్లో వ్యాయామం చేసే వారిలో కొవ్వులు ఆక్సీకరణం చెందే వేగం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీవక్రియల విషయంలోనూ చలి వాతావరణంలో చేపట్టిన హెచ్ఐఐటీ ప్రభావశీలంగా ఉందని, రక్తంలో చక్కెర మోతాదుల నియంత్రణకు, కొవ్వులు కరిగేందుకు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ తగ్గేందుకూ ఇది ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
శభాష్ షంషేర్.. నీ సేవలు అద్భుతం..
శోకం నుంచి శ్లోకం పుట్టిందట. షంషేర్ ఆవేదన, ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్ క్విట్పఫ్. పదమూడు సంవత్సరాల వయసు నుంచే అద్భుతాలు చేస్తున్న నిఖియ షంషేర్ పరిచయం... స్కూల్ప్రాజెక్ట్లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లింది పద్నాలుగు సంవత్సరాల నిఖియ షంషేర్. అక్కడ ఒక వార్డ్లో నోటిక్యాన్సర్ పేషెంట్ను చూసింది. అతడి దవడ సగం తీసేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను బతకడం కష్టమట...ఈ దృశ్యం షంషేర్ను కదిలించింది, చాలాకాలం వెంటాడింది. నోటి క్యాన్సర్ గురించి అధ్యయనం మొదలుపెట్టింది. కొత్త కొత్త విషయాలు తెలిశాయి. పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మన దేశంలో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, వక్క నమలడం....మొదలైనవి ఈ క్యాన్సర్కు ప్రధాన కారణాలవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి వారిని సమస్యల వలయంలో నెడుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం కోసం రొటిన్ చెకప్లకు వెళ్లే అలవాటు మనలో చాలామందికి లేదు. ప్రారంభదశలో గుర్తించగలిగితే వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు అంటున్నాయి పరిశోధనలు. ప్రమాదఘంటికలు మోగుతున్న దశలోనే జాగ్రత్తపడే సాధనాన్ని కనిపెడితే? అలా షంషేర్ పరిశోధనల్లో నుంచి పుట్టుకు వచ్చిన సాధనమే ‘క్విట్పఫ్’ అనే ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్. రిస్క్లో ఉన్నామా? ఉంటే ఈ ఏ దశలో ఉన్నాం? అనేది ఈ ‘క్విట్పఫ్’ కనిపెడుతుంది. దీనివల్ల మిడిల్ నుంచి హైరిస్క్ ఉన్నవాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వీలవుతుంది. ‘క్విట్పఫ్ లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం మాత్రమే కాదు అలవాట్లలో మార్పు తీసుకురావడం కూడా’ అని చెబుతోంది బెంగళూరులోని ‘గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్’ విద్యార్థి అయిన షంషేర్. అయితే ఈ ‘క్విట్పఫ్’ ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. ఎన్నోసార్లు ప్రయోగం విఫలం అయింది. ఒక దశలో నిరాశ కమ్మేసేది. మళ్లీ ఉత్సాహం కొని తెచ్చుకొని ప్రయోగాల్లో మునిగిపోయేది షంషేర్. మొత్తానికైతే సాధించింది! ప్రయోగదశలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. షంషేర్ మాటలు విని తేలిగ్గా తీసుకునేవాళ్లే. అనుమతి ఇచ్చే వాళ్లు కాదు. ఆమె చిన్నవయసులో ఉండడం దీనికి కారణం. ఎట్టకేలకు బెంగళూరులోని ‘విక్టోరియా హాస్పిటల్’లో అనుమతి దొరికింది. 500 మందికి పైగా క్రానిక్ స్మోకర్లు, నాన్స్మోకర్లపై పరీక్షలు నిర్వహించింది. ‘క్విట్పఫ్’ అనుకున్న ఫలితాలను ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది. ఈలోపు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఒక వైపు చదువు, మరోవైపు ‘క్విట్పఫ్’ ప్రాజెక్ట్పై పనిచేయడానికి షంషేర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రిసెర్చ్గ్రాంట్, తనకు వచ్చిన అవార్డ్ సొమ్మును ప్రాజెక్ట్ కోసం ఉపయోగించింది. ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఒకే పాఠ్యపుస్తకాన్ని షేర్ చేసుకోవడం, చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే విద్యార్థులు, స్కూలు బ్యాగు కొనలేని పేద విద్యార్థులను చూసింది షంషేర్. ప్రయోగసహితంగా పాఠ్యబోధన జరిగితే వచ్చే ఫలితం బాగుంటుందనేది నమ్మకం కాదు శాస్త్రీయ నిజం. దురదృష్టవశాత్తు చాలా స్కూళ్లల్లో ‘పాఠ్యబోధన’ అనేది ఏకధాటి ఉపన్యాసం అవుతుంది. క్లాసుల్లో ఒక్క ప్రయోగం కూడా జరగలేదు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరికి చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీని నుంచి మార్పు తీసుకురావడానికి పదమూడు సంవత్సరాల వయసులోనే ఫిలోంత్రపిక్ ప్రాజెక్ట్ ‘యెర్న్ టు లెర్న్’ చేపట్టింది. తల్లిదండ్రులు, స్నేహితులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్ల ఏర్పాటుకు కృషి చేసింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థుల చదువు మెరుగుపడింది. తన ఇ–కామర్స్ వైబ్సైట్ ‘క్నిక్నాక్స్’ ద్వారా వచ్చిన ఆదాయంలో వందశాతం సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. టీనేజర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్ సైన్స్ కాంపిటీషన్ ‘జూనియర్ ఛాలేంజ్’లో టాప్స్కోరర్గా నిలిచింది. తన ఫేస్బుక్ పేజీలో ‘స్పేస్టైమ్ అండ్ గ్రావిటీ’పై చేసిన వీడియో పోస్ట్కు అనూహ్య స్పందన వచ్చింది. తాను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ‘డయానా లెగసీ అవార్డ్’ ‘ఔట్స్టాండింగ్ యూత్ ఎకనామిక్ సిటిజన్షిప్’ (జర్మనీ) అవార్డ్...మొదలైన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్న షంషేర్కు అభినందనలు తెలియజేద్దాం. -
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది కరోనా..
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది, ప్రాణాంతకమైన వైరస్ విజృంభణ. అది సృష్టించిన కల్లోలం కారణంగా ప్రపంచం ఛిన్నాభిన్నమై సుమారు 15 లక్షల మంది మృత్యు వాత పడ్డారు. ప్రపంచం యావత్తూ కనీవినీ ఎరుగని ఆర్థిక వినాశనాన్ని చవిచూసింది. దాన్ని అదుపులోకి తేవడం, మానవాళిని కాపాడటం లక్ష్యంగా సైన్స్ ఎలా పరుగులు తీసిందో, పరిశోధన, అభివృద్ధికి ప్రపంచ భాగస్వామ్యాలు ఏవిధంగా దోహదపడ్డాయో మానవాళి గుర్తుంచుకుంటుంది. ఈ నేపథ్యంలో 2020ని సైన్స్ సంవత్సరంగా అభివర్ణించాలి. కోవిడ్–19 కారణంగా మానవాళి అత్యుత్తమ సామర్థ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వ్యాపిస్తున్న కొద్దీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశోధన ప్రయత్నాలు వేగం అందుకున్నాయి. మానవాళి భద్రతతో ఎలాంటి రాజీ పడకుండానే ఆ మహ మ్మారిని నిలువరించే చికిత్సలు, వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్ అభివృద్ధి చేయడంలో ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు ఏర్పాటైనాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, దాతృత్వ సంస్థలు చేయి కలిపి ఈ ప్రయత్నం అంతటికీ అవసరం అయిన వనరులు కూడగట్టడం ప్రారంభించాయి. అందుకే ఒక్క సైన్స్ మాత్రమే కాదు, అంతర్జాతీయ భాగ స్వామ్యాలు కూడా ఈ ఏడాదిలో చెప్పుకోదగినవని నేనంటాను. మానవాళి జీవితాలను కాపాడటానికి దోహదపడే విజయాలు సాధించినందుకు మాత్రమే కాదు, కనీవినీ ఎరుగని వేగంతో ప్రయత్నాలు చేసేందుకు అంకితభావం ప్రదర్శించినందుకు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను అభినందించాలి. శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత పురస్కారా లకన్నా బృందకృషికి పెద్దపీట వేశారు. ఎలాంటి వేగాన్నయినా మనం అందుకోగలమనీ, వేగం వల్ల నాణ్యత దెబ్బ తినదనీ శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్ర, ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యాల ఫలాలు అందరికీ సమానంగా అందాలని నేను భావిస్తాను. మనం మరింత సమానత్వం గల ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతీ ఒక్కరికీ ఆ ఫలాలు అందేలా చూడాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ హోదాలో నేను ఈ అంశంపై అన్ని దేశాలు, నిధులు అందిస్తున్న ఏజెన్సీలు, శాస్త్రవేత్తలు, దాతలతో చర్చిస్తున్నాను. ఇది మనందరి నిబద్ధత. ఈ మహమ్మారి సమయంలో సైన్స్ కమ్యూనిటీ యావత్తూ సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా అలుపు లేకుండా స్థిరమైన చర్యలు చేపట్టింది. గత ఆరున్నర సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో సాధించిన విజయం– శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇన్నోవేటర్ల ప్రయత్నాల ఫలమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ విజయానికి చిహ్నంగానే 2015 సంవత్సరం నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) నిర్వహిస్తున్నాం. మన జీవితాల నాణ్యత పెంచడానికి అవసరమైన పరిష్కారాలు అందించే విషయంలో ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలు’ (స్టెమ్) సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వా ములను చేయడం ఐఐఎస్ఎఫ్ నిర్వహణ లక్ష్యం. సైన్స్ అధ్యయనం మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా ప్రజల్లో ఉత్సుకతను పెంచడం కోసం విజ్ఞాన భారతి (విభా) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సుల మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశాయి. శాస్త్రీయ స్ఫూర్తిని ప్రజ్వరిల్లచేసేందుకు ప్రత్యేకంగా విద్యార్థి సమాజానికి చేరువ కావడం ఈ ఉత్సవం లక్ష్యం. ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మీడియా, సాధారణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, అందరూ ఎదురుచూసే ఒక వార్షిక శాస్త్రీయ సమ్మేళనంగా పరిణతి చెందింది. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలందరూ వచ్చి జీవశాస్త్రాల విభాగంలో జరుగుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వస్తున్న ఆవిష్కరణలపై ప్రత్యక్ష అనుభవం పొందేలా చేస్తున్న బహిరంగ ప్రజావేదిక ఇది. ప్రతీ సంవత్సరం ఇది మరింత పెద్దదిగా, మెరుగైనదిగా విస్తరిస్తూ ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే సైన్స్ కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది. ఇందులో జరుగుతున్న శాస్త్రీయ కార్యక్రమాలు ప్రపంచ రికార్డులను ఛేదించి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజీల్లో స్థానం సంపాదించాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ విధానంలో జరుగుతోంది. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఆధ్వర్యం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్ఐఆర్–నిస్టాడ్స్) ఈ భారీ ఆన్లైన్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించి, తద్వారా ప్రపంచ సంక్షేమానికి తోడ్పాటు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వయంసమృద్ధ భారత్, ప్రపంచ సంక్షేమం కోసం సైన్స్’ అనే ప్రధాన థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశానికి గల సున్నితమైన శక్తిని ప్రపంచానికి చాటడం కోసమే నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. యువ శాస్త్రవేత్తలను ఆకర్షించేం దుకు స్టెమ్ నిర్వహించే వివిధ కోర్సులకు చెందిన 41 విభిన్న కార్యక్రమాలను ఇందులో చేర్చడం జరిగింది. 2020 సంవత్సరం కోవిడ్–19 వ్యాక్సిన్ల పరిశోధన సంవత్సరం అయితే, ప్రపంచవ్యాప్తంగా అది అత్యంత అవసరం అయిన ప్రజలు దాన్ని ఏవిధంగా అధిగమించారో తెలియజేసే సంవత్సరం 2021. ఈ ఉత్సవం సందర్భంగా మనం ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయడానికీ, జీవితాలను కాపాడే సైన్స్లో సహకారాన్ని మరింతగా పెంచడానికీ ప్రతిజ్ఞ చేద్దాం. 2020 సంవత్సరం కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించివుండొచ్చు, అయినా శాస్త్రీయ విజయగాథకు కూడా అది ప్రతీక. మానవాళి ఎదుర్కొనే ముప్పును నిలువరించేందుకు శాస్త్రవేత్తలు ఎంత దీటుగా స్పందించారన్నది ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంది. కోవిడ్–19కి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లు అన్నీ అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చేరేలా చూడటమే ఇప్పుడు మన ముందున్న సవాలు. ఈ ఏడాది వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలపై శక్తియుక్తులన్నీ ధారపోసి కృషి చేసిన శాస్త్రవేత్తలందరినీ గొంతెత్తి అభినందిస్తున్నాను. డాక్టర్ హర్షవర్ధన్ వ్యాసకర్త కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి -
డయాబెటిస్కు.. టెస్టోస్టిరాన్కు లింకు!
ఆస్ట్రేలియా: పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లతో మధుమేహం బారిన పడకుండా నివారించొచ్చా..? అది సాధ్యమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు వెయ్యి మందిపై తాము ప్రయోగాలు నిర్వహించి ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఇదివరకు ఎన్నడూ ప్రయోగాలు జరగలేదని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పురుష హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్న వారు మధుమేహం బారిన పడొచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి. ఎముకలు గుల్ల బారడమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసి.. రెండు గుంపులుగా విడదీశారు. ప్రయోగాలకు ఎంపికైన వారందరూ అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారే. ఒక వర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెయ్యి మంది అనుసరించేందుకు కొన్ని వ్యాయామాలను సూచించారు. రెండేళ్ల పరిశీలనల తర్వాత పరిశీలించగా ఇరు వర్గాల్లోని వారు సగటున నాలుగు కిలోల బరువు తగ్గారు. సుమారు 22 శాతం మందిలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువయ్యాయి. రెండో గుంపు వారిలో 21 శాతం మంది మధుమేహం బారిన పడగా.. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 12 శాతం మందికి మాత్రమే మధుమేహం వచ్చింది. హార్మోన్ తీసుకున్న వారి రక్తంలో చక్కెర మోతాదు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మధుమేహం నుంచి తప్పించుకునేందుకు కొంతమందికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఓ మార్గం కావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సోలార్ సెల్స్ భలే! ఖరీదైన సిలికాన్తో తయారయ్యే సోలార్సెల్స్కు సమర్థమైన ప్రత్యామ్నాయం లభించింది.పెరోవెక్సైట్ అనే వినూత్న పదార్థంతో తయారు చేసిన సరికొత్త సోలార్ సెల్స్ ఏకంగా 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా స్పష్టమైంది. నిజానికి పెరోవెస్కైట్ అనేది ఇటీవలే గుర్తించిన పదార్థమేమీ కాదు. దశాబ్దకాలం కిందటే దీన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించొచ్చని గుర్తించారు. కాకపోతే అప్పట్లో ఈ పదార్థంతో తయారైన సోలార్ సెల్స్ సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. పెరోవెస్కైట్ ప్రత్యేకత ఏంటంటే.. చాలా చౌకగా లభిస్తుంది. దృశ్య కాంతి నుంచి పరారుణ కిరణాల వరకు అన్ని రకాల రేడియోధార్మికతను శోషించుకుని విద్యుత్తుగా మార్చగలదు. సిలికాన్ మాదిరిగా తయారీ కష్టం కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్మనీలోని హెల్మ్హోల్ట్ –జెంట్రమ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవెక్సైట్ సోలార్ సెల్స్ 30 శాతం సామర్థ్యాన్ని సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ల కింద ఈ సెల్స్ సామర్థ్యం 13.7 శాతం మాత్రం ఉంది. -
ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!
అమెరికా: ఉటా ఎడారిలో అకస్మాత్తుగా ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఎవరికీ తెలియదు కానీ.. ఇది సుమారు 12 అడుగుల పొడవుందని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ప్రకటించారు. ఎడారి ప్రాంతంలోని అడవి గొర్రెల సంతతిని లెక్కించేందుకు గత బుధవారం తాము హెలికాప్టర్లో సర్వే నిర్వహించిన ప్పుడు ఉటా నైరుతి దిక్కున ఎర్ర రాళ్ల మధ్య ఈ లోహపు దిమ్మె కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ దిమ్మెను అక్కడికి ఎవరు తెచ్చారో? ఎలా తెచ్చారో తెలియలేదని, అక్కడ పాతిన ఆనవాళ్లూ ఏవీ కనిపించ లేదన్నారు. ఈ దిమ్మె కచ్చితంగా ఎక్కడుందో చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు వెళ్లలేని ప్రాంతంలో అది ఉందని, ఒకవేళ ఎవరైనా వెళ్లినా వాళ్లను రక్షించేందుకు మళ్లీ తామే వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే... ఉటా ఎడారిలో గుర్తించిన లోహపు దిమ్మె అచ్చం 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్ ఒడెస్సీ’’ చిత్రంలో గ్రహాంతర వాసులకు చెందినదిగా చూపిన నిర్మాణం మాదిరిగానే ఉండటంతో ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఉటా హైవే ఫేస్బుక్ పేజీలో ఈ మిస్టరీ నిర్మాణంపై పలువురు హాస్యాన్ని జోడించి మరీ కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ నిర్మాణంపై అధికారులు స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకమని, తగిన అనుమతుల్లేకుండా ఇలా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయడం ఎర్త్ లాను ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తున్నారు. ఆ దిమ్మె ఏమిటి? అక్కడకు ఎలా వచ్చిందన్నది ప్రస్తుతానికైతే మిస్టరీనే! స్ప్రే చేస్తే చాలు.. కదులుతాయి! శరీరం లోపలి భాగాలకు నేరుగా మందులు అందించేందుకు హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత పదార్థపు స్ప్రేతో ఏ వస్తువునైనా మిల్లీ రోబోగా మార్చేయగలగడం ఇందులోని కీలక అంశం. పాలివినైల్ ఆల్క హాల్, గ్లుటెన్, ఇనుప రజనుతో తయారైన ఈ స్ప్రే చేసిన వస్తువును శరీరంలో కావాల్సిన చోటికి నడిపించవచ్చు లేదా దొర్లేలా చేయవచ్చు. పాక్కుంటూ కూడా వెళ్లగలదు. కేవలం మిల్లీమీటర్లో నాలుగో వంతు మందం ఉండే ఈ స్ప్రేను మాత్రలపై ఉప యోగించడం ద్వారా మందులను నేరుగా శరీర భాగాలకు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ షెన్ యాజింగ్ తెలిపారు. ఎం–స్ప్రే అని పిలిచే ఈ కొత్త పదార్థం శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవసరమైన సమయంలో తనంతట తానే నాశనమై వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది. గమనాన్నీ నియంత్రించొచ్చు.. అంతేకాదు.. ఎం–స్ప్రే కోటింగ్ ఉన్న వస్తువు ఏ రకంగా ప్రయాణించాలో నిర్ణయించవచ్చని, అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కోటింగ్పై కణాల అమరికను మార్చడం ద్వారా ఇది సాధ్యమని యాజింగ్ వివరిస్తున్నారు. కొన్ని మాత్రలకు తాము ఈ కోటింగ్ ఇచ్చి ఎలుకలపై ప్రయోగించామని, ఆ తరువాత ఇవి ఎలుకల శరీరంలో ఎలా ప్రయాణించాయో స్పష్టంగా గమనించగలిగామని, కావాల్సిన ప్రాంతానికి చేరుకోగానే కోటింగ్ కరిగిపోయి మందు మాత్రమే విడుదలైందని చెప్పారు. ఈ స్ప్రేను వైద్య రంగంలో ఉపయోగించడమే కాకుండా మిల్లీ రోబోల తయారీ ద్వారా కదిలే సెన్సర్లుగానూ వాడుకోవచ్చునని యాజింగ్ అంటున్నారు. గుండెజబ్బుల చికిత్స కోసం శరీరంలోకి చొప్పించే క్యాథిటర్ను కూడా ఈ కోటింగ్ ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. -
క్రిస్పర్ క్యాస్–9తో.. కేన్సర్కు చెక్
సాక్షి, హైదరాబాద్: కేన్సర్పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ క్యాస్–9 సాయంతో కేన్సర్ కణాలను విజయ వంతంగా మట్టుబెట్ట గలిగారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో ఇంకో రెండేళ్లలోనే ఈ కొత్త పద్ధతిని మానవ వినియో గానికి సిద్ధం చేస్తామని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాన్ పీర్ పేర్కొన్నారు. ఇదే జరిగితే కేన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ చరిత్ర పుటల్లో కలిసిపోతుందని అంచనా. దుష్ప్రభావాలు ఉండవు... మన జన్యువుల్లో అవసరానికి తగ్గట్లు మార్పుచేర్పులు చేసుకొనేందుకు క్రిస్పర్ క్యాస్–9 ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాన్ పీర్ ఈ టెక్నాలజీని కేన్సర్ చికిత్సకు ప్రయోగా త్మకంగా వాడి విజయం సాధించారు. పైగా ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని, కేన్సర్ కణాలు మాత్రమే మరణించేలా డీఎన్ఏలో మార్పులు చేయగలిగామని డాన్ పీర్ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఇదో అందమైన కీమోథెరపీ అని ఆయన అభివర్ణించారు. పరిశోధన వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమ య్యాయి. ఈ పద్ధతిని ఉపయోగించి కేన్సర్ కణాలను చంపేస్తే మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండదని డాన్ పీర్ తెలిపారు. ఆయుష్షు పెరుగుతుంది.. క్రిస్పర్ క్యాస్–9 సాయంతో తాము అభివృద్ధి చేసిన కేన్సర్ చికిత్స వల్ల కేన్సర్ రోగుల జీవితకాలం మరింత పెరుగుతుందని, మూడుసార్లు ఉపయోగిస్తే చాలు.. ఈ టెక్నాలజీ కేన్సర్ కణతిని నాశనం చేయవచ్చని డాన్ పీర్ చెబుతున్నారు. కేన్సర్ కణాల డీఎన్ఏను ఈ టెక్నాలజీ ద్వారా కత్తిరించవచ్చని, ఫలితంగా ఆ కణాలు మరణిస్తాయని తెలిపారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ఉపయోగించే కీమోథెరపీతో అనేక దుష్ప్రభావాలు ఉంటా యని, క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీతో ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. మెదడు, గర్భాశయ కేన్సర్లు ఉన్న వందలాది ఎలుకలపై తాము పరిశోధనలు చేపట్టామని, చికిత్స అందుకున్న ఎలుకల జీవితకాలం.. కంట్రోల్ గ్రూపులోని ఎలుకల కంటే రెండు రెట్లు ఎక్కువైందని పీర్ వివరించారు. అన్ని రకాల కేన్సర్లకు ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే రెండేళ్లలో ఇది మానవ వినియోగానికి అందుబాటులోకి వస్తుందని వివరించారు. రోగి శరీరం నుంచి సేకరించిన పదార్థం (బయాప్సీ) ఆధారంగా సాధారణ ఇంజెక్షన్ ద్వారా చికిత్స కల్పించవచ్చా? లేక కణతిలోకి నేరుగా ఇంజెక్షన్ ఇవ్వాలా? అన్నది తెలుస్తుందని వివరించారు. జన్యువుల సూచనలను ప్రొటీన్లుగా మార్చే ఎంఆర్ఎన్ఏను ఈ టెక్నాలజీలో కత్తెరల మాదిరిగా వాడుకుంటామని, కేన్సర్ కణాలను గుర్తించే నానోస్థాయి కొవ్వు పదార్థాలను కూడా కలిపి ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు. -
4జీ సేవలు.. డిజిటల్ భారతం
భారత్లో ఇంటర్నెట్ సేవలు పాతికేళ్ల కిందట ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే మొబైల్ఫోన్లూ వాడుకలోకి వచ్చాయి. తొలినాళ్లలో సంపన్నులకే పరిమితమైన ఇంటర్నెట్, మొబైల్ సేవలు అనతికాలంలోనే దేశంలోని సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. భారత్లో 2008 చివర్లో 3జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడంతో స్మార్ట్ఫోన్లు వాడుకలోకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లలోనే నేరుగా ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉండటంతో సోషల్ మీడియా శరవేగంగా విస్తరించడం మొదలైంది. కాలక్రమంలో 4జీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ‘డిజిటల్’ వేగం మరింతగా పెరిగింది. ప్రపంచమంతా డిజిటల్మయంగా మారుతుండటంతో భారత ప్రభుత్వం 2015లో ‘డిజిటల్ ఇండియా’ ప్రచారం ప్రారంభించింది. దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం కూడా మొదలైంది. గడచిన ఐదేళ్లలో దేశంలో డిజిటల్ పరుగు మరింతగా వేగం పుంజుకుంది. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి ప్రస్తుతం మన దేశంలో మొబైల్ఫోన్లు వాడుతున్న వారు 106 కోట్ల మంది ఉంటే, ఇంటర్నెట్ యూజర్లు 68.76 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో దాదాపు 78 శాతం మంది వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. గత ఏడాది జనవరి నాటితో పోల్చుకుంటే దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.50 కోట్లు (1.4 శాతం) తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది వ్యవధిలో దేశంలో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది సోషల్ మీడియా యూజర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లు (48 శాతం) పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. సోషల్ మీడియా యూజర్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ప్రజల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నింగి నుంచి నేల మీదకు... దేశంలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పుడు ధరలు విపరీతంగా ఉండేవి. తొలిసారిగా 1995లో ఈ సేవలు మొదలైనప్పుడు ప్రీపెయిడ్ సిమ్కార్డు కోసమే రూ.4,900 వెచ్చించాల్సి వచ్చేది. కాల్ ధర నిమిషానికి రూ.17 ఉండేది. ఔట్గోయింగ్కే కాదు, ఇన్కమింగ్ కాల్కు కూడా ఇదే ధర. తొలిసారిగా దేశంలో ఈ సేవలు ప్రారంభమైనప్పుడు కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్ (పశ్చిమ బెంగాల్ సచివాలయం) నుంచి అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఢిల్లీలోని సంచార్ భవన్లో ఉన్న నాటి టెలికం మంత్రి సుఖ్రామ్కు తొలి మొబైల్ ఫోన్కాల్ చేశారు. అప్పట్లో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సమాజంలోని అత్యంత సంపన్నులు మాత్రమే మొబైల్ఫోన్లతో కనిపించేవారు. తొలినాటి మొబైల్ ఫోన్లన్నీ బేసిక్ ఫోన్లే. వాటి ద్వారా కాల్ చేసుకోవడానికి, ఎస్ఎంఎస్ పంపుకోవడానికి తప్ప మరే వెసులుబాటూ ఉండేది కాదు. అయినా, అప్పట్లో వాటి ధరలు చుక్కలను తాకేవి. తొలినాటి మొబైల్ హ్యాండ్సెట్లలో భద్రతాపరమైన లోపాలూ ఉండేవి. వాటిలో ఎలాంటి ట్రాకింగ్ సౌకర్యం ఉండేది కాదు. చోరీలకు గురైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందటం కల్లగానే ఉండేది. దేశంలో క్రమంగా మొబైల్ఫోన్లకు, సిమ్కార్డులకు డిమాండ్ పెరుగుతూ వస్తున్న రోజుల్లో మొబైల్ఫోన్లు, సిమ్కార్డుల స్మగ్లింగ్ కూడా బాగానే జరిగేది. స్మగుల్డ్ హ్యాండ్ సెట్లు కస్టమ్స్ కళ్లుగప్పి మార్కెట్లోకి రావడంతో, సహజంగానే వాటి ధర సగానికి సగం తక్కువగా ఉండేది. ‘సిమ్’కార్డులతో జీఎస్ఎం సేవలు కొనసాగుతుండగానే, 2002లో ‘సిమ్’ అవసరం లేని సీడీఎంఏ సేవలు మొదలయ్యాయి. రిలయన్స్, టాటా, హచ్ వంటి సంస్థలు సీడీఎంఏ సేవలను అందిస్తూ, 2జీ టెలికం సేవల మార్కెట్లో 20 శాతం వాటాను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగాయి. సీడీఎంఏ సేవలు మొదలవడంతో మొబైల్ కాల్ ధరలు, ఎస్ఎంఎస్ ధరలు గణనీయంగా తగ్గి, దేశంలోని సామాన్యులకు సైతం ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరో రెండేళ్లు తిరిగే సరికి– అంటే 2004 నాటికి దేశంలో తొలిసారిగా మొబైల్ కనెక్షన్ల సంఖ్య ల్యాండ్ఫోన్ కనెక్షన్ల సంఖ్యను అధిగమించడం జరిగింది. దేశంలో 2008లో 3జీ సేవలు మొదలవడంతో స్మార్ట్ఫోన్లు వాడుకలోకి రావడం మొదలైంది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను అందించే సంస్థలు పోటాపోటీగా ధరలు తగ్గిస్తూ రావడంతో పాటు 2012 నాటికి 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో 2014 నాటికి మొబైల్ఫోన్ల డిమాండ్ దేశంలో తారస్థాయికి చేరుకుంది. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లకు దీటుగా కారుచౌక ధరల్లో చైనా స్మార్ట్ఫోన్లు కూడా కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి రావడం మొదలైంది. మొబైల్ సేవల ధరలు దాదాపు పూర్తిగా నింగి నుంచి నేలపైకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లు పల్లెలకు సైతం చేరడం ప్రారంభమైంది. రిలయన్స్ జియో 2016లో మొదలైన తర్వాత మొబైల్ సేవల్లో మరింత వేగం పుంజుకుంది. ఫలితంగా, గత ఏడాది నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా అవతరించింది. భారత్లో ఇంటర్నెట్ ప్రస్థానం... మన దేశంలో ఇంటర్నెట్ ప్రస్థానం తొలి ఐదేళ్లలో మందకొడిగానే సాగింది. దేశంలో 1995 నుంచి ఇంటర్నెట్ సేవలు మొదలైనా, 2000 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కేవలం 2 కోట్లు మాత్రమే ఉండేది. మరో పదేళ్లు గడిచే సరికి– అంటే 2010 నాటికి ఈ సంఖ్య 10 కోట్లకు, 2015 నాటికి 31.70 కోట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి, ఈ సంఖ్య గణనీయంగా పెరిగి, 62.7 కోట్లకు చేరుకుంది. గత ఏడాది చివరినాటి లెక్కల ప్రకారం ఇంటర్నెట్ సేవలను క్రియాశీలంగా ఉపయోగించుకునే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49.30 కోట్లుగా ఉంటే, వీరిలో పట్టణ ప్రాంతాల్లోని వారు 29.30 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు 20.00 కోట్లుగా ఉన్నట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ప్రకటించింది. కనీసం నెలకు ఒకసారైనా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే వారిని యాక్టివ్ యూజర్లుగా పరిగణనలోకి తీసుకున్నామని, వీరిలో 70 శాతం మంది దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్న వారేనని వెల్లడించింది. దేశంలోని యాక్టివ్ యూజర్లలో 43.3 కోట్ల మంది పన్నెండేళ్ల పైబడిన వయసు గలవారు కాగా, 7.1 కోట్ల మంది 5–11 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. గత ఏడాది మార్చి–నవంబర్ మధ్య కాలంలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో 5.30 కోట్ల పెరుగుదల నమోదైందని, దీంతో భారత్... అమెరికాను అధిగమించి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. అయితే, మన దేశంలోని యూజర్లలో పురుషులకు, మహిళలకు అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. యాక్టివ్ యూజర్లలో 71 శాతం మంది పురుషులైతే, మహిళలు 29 శాతం మంది మాత్రమే. ఇదిలా ఉంటే, దేశంలో అత్యధికంగా 97 శాతం మంది మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. మొబైల్ మాత్రమే కాకుండా పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకునే వారి సంఖ్య 30.3 కోట్లుగా ఉన్నట్లు ఐఏఎంఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో వృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగితే, 2025 నాటికి దేశంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 97.4 కోట్లను అధిగమించగలదని ఐఏఎంఐఐ అంచనా వేస్తోంది. సమాచారానికి ఆధారం సమాచారం కోసం వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంటర్నెట్పై ఆధారపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన రెండేళ్లలో మన దేశంలో వార్తా పత్రికల ప్రింట్ ఎడిషన్ల మార్కెట్లో 4.4 శాతం పెరుగుదల నమోదైంది. ఇదేకాలంలో సమాచారం కోసం ఇంటర్నెట్పై ఆధారపడే వారి సంఖ్యలో 19 శాతం పెరుగుదల నమోదైంది. న్యూస్ వెబ్సైట్లు, పోర్టల్స్ వృద్ధికి ఇదొక ఆశాజనకమైన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లలో స్థానిక భాషల్లో కంటెంట్ను వినియోగించుకునే వారు మన దేశంలో 60 శాతానికి పైగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ‘కరోనా’ మహమ్మారి తాకిడి మొదలైన తర్వాత వార్తల కోసం యూజర్లు ఇంటర్నెట్లో గడిపే సమయం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ‘కరోనా’ వ్యాప్తికి ముందు మూడు నెలలు– జనవరి నుంచి మార్చి వరకు చూసుకుంటే, యూజర్లు వారానికి సగటున 27 నిమిషాలు ఇంటర్నెట్లో వార్తల కోసం వెచ్చించేవారు. మార్చి చివర్లో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ సమయం 40 నిమిషాలకు పెరిగిందని ‘బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (బీఏఆర్సీ) వెల్లడించింది. వార్తలను చదువుకోవడం, వార్తలకు సంబంధించిన వీడియో క్లిపింగ్స్ను చూడటమే కాకుండా, నచ్చిన వార్తలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే వెసులుబాటు ఉండటంతో చాలామంది ఇంటర్నెట్లో వార్తల వెదుకులాట సాగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత దేశంలో న్యూస్ యాప్స్ వినియోగం ఏకంగా 50 శాతం మేరకు పెరిగిందని, న్యూస్ వెబ్సైట్స్ వినియోగం 42 శాతం మేరకు పెరిగిందని ‘బీఏఆర్సీ’–నీల్సన్ అధ్యయనంలో వెల్లడైంది. సామాజిక మాధ్యమ చైతన్యం ఇంటర్నెట్ సేవలు విస్తృతం కావడమే కాకుండా, స్మార్ట్ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో భారత యూజర్లలో సామాజిక మాధ్యమ చైతన్యం కూడా పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 40 కోట్లకు పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 79.3 శాతం యూజర్లు ఫేస్బుక్, 7.35 శాతం యూట్యూబ్, 5.32 పింటరెస్ట్, 3.9 శాతం ఇన్స్టాగ్రామ్, 1.91 శాతం ట్విట్టర్ వేదికలను వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా, స్మార్ట్ఫోన్లను వినియోగించుకునే వారిలో వాట్సాప్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 40 కోట్లను అధిగమించడం విశేషం. సామాజిక మాధ్యమాలను ఎక్కువగా సమాచారాన్ని, సామాజిక పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి, వినోదానికి, నైపుణ్యాల ప్రదర్శనకు ఉపయోగించుకుంటు న్నారు. కొంతమంది వీటిని వ్యాపార విస్తరణ వేదికలుగా, ఆదాయ మార్గాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. ‘యూట్యూబ్’ వీడియోలను స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకున్నవారు కూడా మన దేశంలో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సోషల్ మీడియా యూజర్లలో భారతీయులు గత ఏడాది రోజుకు సగటున 2.4 గంటల కాలం గడిపేవారు. ఏడాది వ్యవధిలోనే ఈ సమయం ఏకంగా 87 శాతానికి పెరిగి, రోజుకు 4 గంటలకు చేరుకుంది. ‘కరోనా’ లాక్డౌన్ కాలానికి ముందు రోజుకు సగటున 150 నిమిషాలు గడిపేవారు కాస్తా, లాక్డౌన్ కాలం మొదలైనప్పటి నుంచి రోజుకు 280 నిమిషాలు గడుపుతున్నట్లుగా ‘హ్యామర్కాఫ్ కన్జూమర్ స్నాప్చాట్ సర్వే’ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ‘కరోనా’ దెబ్బకు సినిమా థియేటర్లు మూతబడటంతో ఈ ఏడాది ఓవర్ ది టాప్ (ఓటీటీ) ద్వారా సినిమాలు చూసేవారి సంఖ్య ఏకంగా 71 శాతం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మొదలవడంతో వాట్సాప్, జూమ్ వంటి వాటి వినియోగం పెరగడం కూడా ఈ పెరుగుదలకు దోహదపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కరోనా’తో ఈ–కామర్స్కు ఊపు భారత రిటైల్ మార్కెట్ వార్షిక విలువ 800 బిలియన్ డాలర్లు (రూ.58.47 లక్షల కోట్లు). ఇందులో ఈ–కామర్స్ వాటా 3.5 శాతం మాత్రమే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ సంస్థలు నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు రకరకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తున్నా, ఆన్లైన్లో వీటిని తెప్పించుకునేవారు మన దేశంలో తక్కువే. నేరుగా దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయడానికే భారతీయులు మొగ్గు చూపుతారు. దుకాణాలకు, షాపింగ్ మాల్స్కు వెళ్లడం, కలియదిరగడం, బేరాలు చేయడం చాలామందికి కాలక్షేపం. ‘కరోనా’ ఈ పరిస్థితిలో పెను మార్పు తెచ్చింది. దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ఈ–కామర్స్ సంస్థల అమ్మకాలు ఏకంగా 90 శాతం మేరకు పెరిగాయి. ఈ–కామర్స్ రంగంలో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయని, రానున్న ఐదేళ్లలో ఈ రంగం సగటున 30 శాతం వృద్ధితో ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాజిక మాధ్యమాలకు అలవాటుపడిన యువతలో చాలామంది సమాచారం కోసం, వినోదం కోసం మాత్రమే వీటికి పరిమితం కాకుండా ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతున్నారనే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం పబ్జీ, టిక్టాక్ వంటి యాప్స్ను బ్యాన్ చేసింది గాని, వీటి వాడకం తారస్థాయిలో ఉన్నప్పుడు వీటి ద్వారా దుస్సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు, వీటి ఉచ్చులో చిక్కుకుని మానసిక కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు చాలామందే ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో మితిమీరి సమయం గడిపేవారిలో చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని పలు వార్తాకథనాలు, గణాంకాలు చెబుతున్నాయి. -
అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు...
న్యూఢిల్లీ: హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు. అదేంటి ట్రాన్స్ఫర్ అయితే అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయింది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ తన 28 ఏళ్ల సర్వీసు కాలంలో ఏకంగా 53 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. హరియాణా ప్రభుత్వం తాజాగా ఆయన్ను ఆర్కైవ్స్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆఖరి సారిగా క్రీడలు, యువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలపాటు పనిచేశాక ఆయన మార్చిలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ‘మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు, నియమాలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. సర్వీసులో ఆఖరు దశకు చేరుకున్నాను. నిజాయితీకి దక్కిన గౌరవం ఇది’అని బుధవారం అశోక్ ట్వీట్చేశారు. -
మేడకు నేర్పిన నడకలివీ..
నెమలికి నేర్పిన నడకలివీ’ అన్నాడు ఓ సినీకవి. దాన్ని ఇప్పుడు మనం ‘మేడకు నేర్పిన నడకలివీ’ అని అనుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఎటూ కదలని భవనాలు మొదలైన వాటిని ‘స్థిరా’స్తులుగా చెప్పుకొనేవారు. ఇప్పుడవి కదులుతూ ‘చరా’స్తులుగా మారాయి. దానికి ఉదాహరణగా నిలుస్తోంది రంగంపేటలో ఓ రెండంతస్తుల మేడ. అదేంటో తెలుసుకుందామా.. సాక్షి, రంగంపేట (తూర్పుగోదావరి) : పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ అబ్బురపరుస్తోంది. ‘స్థిర’ ఆస్తులుగా చెప్పుకొనే భవనాలు ‘చర’ ఆస్తులుగా మారి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. జీవరాశులే కాదు.. నేను కూడా నడుస్తున్నాను చూడండంటూ రంగంపేటలోని ఓ రెండంతస్తుల మేడ 26 అడుగులు వెనక్కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్డును ఆరులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఈ విస్తరణలో రంగంపేట మెయిన్ రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల భవనం తొలగించాల్సి ఉంది. అది ఇష్టం లేని ఆ భవన యజమాని పోతుల రామ్కుమార్ దాన్ని వెనక్కు జరపాలని నిశ్చయించుకున్నారు. దాంతో చెన్నైకి చెందిన ఏజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీకి, విజయవాడకు చెందిన ఒక సబ్ కాంట్రాక్టర్కు భవనాన్ని 33 అడుగులు వెనక్కి జరిపేందుకు కాంట్రాక్టు ఇచ్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన టెక్నిషియన్లు మేడను వెనుకకు జరిపే పనులు ప్రారంభించారు. ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి రెండు నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు రామ్కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు భవనాలు పక్కపక్కన ఉండేవి. వెనక్కి నడిచిన పెద్ద భవనం ఇప్పుడిలా.. ఇప్పటికి పనులు ప్రారంభించి 57 రోజులు కాగా 33 అడుగులకు గాను 26 అడుగులు మేడ వెనక్కి జరిగింది. మరో వారం రోజుల్లో మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి జరుగుతుందని రామ్కుమార్ తెలిపారు. ఈ భవనం కదులుతున్న తీరు గమనిస్తే.. భవనం ఫ్లోరింగ్ మొత్తం తవ్వి పిల్లర్లకు 350 రోలింగ్ జాకీలు అమర్చారు. ఆ జాకీలపై భవనాన్ని ఉంచి మరికొన్ని భారీ జాకీలను మేడకు దన్నుగా ఉంచి ఒక్కొక్క జాకీ వద్ద ఇద్దరు వ్యక్తులు జాకీలను తిప్పడంతో భవనం అతి సూక్ష్మంగా వెనక్కి కదులుతోంది. అలా ఇంతవరకూ 26 అడుగులు వెనక్కు జరిగింది. మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి నడిచిన తరువాత భవనాన్ని 2 అడుగుల ఎత్తు కూడా భవనాన్ని చేయిస్తామని రామ్కుమార్ తెలిపారు. మేడ వెనక్కి జరుగుతున్న తీరును తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం జనసందోహంతో కళకళలాడుతుంది. -
ప్రయోగాలపై పట్టింపేదీ..?
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది జిల్లాలో ఇన్స్పైర్ మానక్ పరిస్థితి. బాలశాస్త్ర వేత్తలను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై హెచ్ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులు దృష్టి పెట్టడంలేదు. ప్రాజెక్టుల తయారీకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నా.. జిల్లాలోని 841 పాఠశాలలకుగాను.. ఇప్పటివరకు మూడు పాఠశాలలే దరఖాస్తు చేశాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ‘ఇన్స్పైర్ మానక్’కు స్పందన కరువు సాక్షి, నల్లగొండ: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మానక్ (మిలియన్ మైండ్స్ ఆన్ మెంటింగ్ నేషనల్ అసిరెన్స్ నాలెడ్జ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించేందుకు విద్యార్థులను పాఠశాలస్థాయి నుంచే ప్రయోగాల బాట పట్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించని కారణంగా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమానికి జిల్లాలోని పాఠశాలల నుంచి స్పందన కరువైంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, కస్తూరిబా, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరిలో కేంద్రశాస్త్ర సాంకేతిక మండలి ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలోని రెండు మూడు పాఠశాలలు మినహా దరఖాస్తులు అందలేదు. అంటే ఉపాధ్యాయులు, అధికారులు ఇన్స్పైర్ మానక్పై ఎంత దృష్టి పెట్టారనేది స్పష్టమవుతోంది. బాలశాస్త్రవేత్తలను తయారు చేసేలా.. బాలలను చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగంవైపు మళ్లించాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల నుంచి సైన్స్ ప్రాజెక్టుల తయారీకి ఆన్లైన్లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాలల నుంచి 5 ప్రాజెక్టుల చొప్పున తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఏఏ ప్రాజెక్టులు తయారు చేస్తారు అనే దానిపై ఆన్లైన్లో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఆయా పాఠశాలల హెచ్ఎం, సైన్స్ ఉపాధ్యాయుడు కలిసి ప్రాజెక్టులను తయారు చేస్తామని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇందులో జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు గురుకుల, కస్తూరిబా, మోడల్ స్కూళ్లు, ప్రయివేట్, ఎయిడెట్ పాఠశాలలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో దరఖాస్తులకు ఆహ్వానం.. ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగంగా సైన్స్ ప్రాజెక్టుల తయారీకి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి సూచించింది. కాగా జిల్లాలోని 841 పాఠశాలలు ఉండగా అందులో కేవలం రెండు మూడు పాఠశాలలు మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇటు అధ్యాపకులగానీ, అటు విద్యాశాఖ ఉన్నతాధికారులుగానీ ఇన్స్పైర్ మానక్పై దృష్టి సారించని కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా నిర్లక్ష్యం ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుల తయారీకి ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయా విద్యార్థుల అకౌంట్లలోనే రూ.10వేలను జమ చేస్తుంది. అందులో రూ.5వేలు ప్రాజెక్టును తయారు చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉండగా, మిగిలిన రూ.5వేలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇన్స్పైర్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరిపైనా రూపాయి భారం పడని పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇచ్చినా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. నష్టపోనున్న విద్యార్థులు.. బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లను ఖర్చు చేస్తోంది. ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతోపాటు విద్యార్థులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఒకవేళ ఆయా పాఠశాల విద్యార్థులు పంపిన ప్రాజెక్టు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో ఎంపికైతే ఒక్కో ప్రాజెక్టుకు రూ.20వేల పైచిలుకే డబ్బులను కూడా కేంద్రమే చెల్లిస్తుంది. దానికితోడు రాష్ట్రపతిని కలిసే అవకాశం కలవడంతో పాటు జాతీయ స్థాయిలో శాస్త్రజ్ఞుల సలహాలను కూడా పొందే అవకాశం ఈ ప్రాజెక్టుల తయారీ ద్వారా లభించనుంది. ఇన్ని అవకాశాలను అధ్యాపకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా స్పందిస్తే మేలు.. విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల అధికారులు, సైన్స్ ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థుల ప్రయోగాల తయారీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ పక్క దేశం అన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతుంటే జిల్లా నుంచి బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు విద్యాశాఖ తనవంతు పాత్రగా జిల్లా నుంచి సైన్స్ ప్రయోగాల తయారీకి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఇన్స్పైర్ మానక్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు. చిన్నప్పటి నుంచే సైన్స్ ప్రయోగాలు చేయడం వల్ల వారు బాలశాస్త్రవేత్తలు అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్స్పైర్ మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల తయారీకి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమే. ఇంకా పాఠశాలలు ముందుకు వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ -
సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకం
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: యుగాలుగా గణితం మొదలుకొని లోహ శాస్త్రం వరకూ అనేక శాస్త్ర రంగాలపై తనదైన ముద్ర వేసిన భారతదేశం.. రేపటి తరం టెక్నాలజీలను అం దుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విజ్ఞానాన్ని సృష్టించే సంస్థలు కృషి, భాగస్వామ్యం కూడా అత్యవసరమని అన్నారు. శనివారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐఐఎస్ఎఫ్ సమావేశాలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల కుంభమేళాగా అభివర్ణించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన టీకా కార్యక్రమానికి శీతలీకరణ పరిజ్ఞానం సాయపడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో ఎంత పురోగతి సాధిస్తున్నా మౌలిక శాస్త్ర పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందు లో 100 గిగావాట్ల వరకూ ఉండే సౌరశక్తి సద్వినియోగానికి కూడా వినూత్న టెక్నాలజీ సాయపడుతోందని వెల్లడించారు. మహిళా ప్రాతినిధ్యం పెరగాలి..:దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్నా.. ఇందులో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. సైన్స్కు ఎల్లలు లేవని, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం దీనికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. డీఎన్ఏను వేరు చేయడం ద్వారా రికార్డు గిన్నిస్లో స్థానం సాధించిన లక్నో విద్యార్థులు లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. జీవమున్న ప్రతి ప్రాణిలో ఉండే డీఎన్ఏను 550 మంది విద్యార్థులు ఏకకాలంలో వేరు చేయడం ద్వారా ఈ రికార్డు ఏర్పడింది. గతేడాది అమెరికాలోని సియాటిల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్లో 302 మంది విద్యార్థులు ఓ పండు నుంచి డీఎన్ఏను వేరు చేయడం ద్వారా గిన్నిస్ రికార్డ్ నమోదు చేయగా.. ఈసారి 500కు పైగా ఈ ప్రయత్నం చేసి విజయం సాధించారు. లక్నో శివార్లలోని జి.డి.గోయాంక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు చెందిన రిషినాథ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రయోగం మొదలు కాగా.. ఫలితం వెల్లడయ్యేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 550 మంది విద్యార్థులను 13 గుంపులుగా విభజించి ఈ ప్రయోగం నిర్వహించారు. ముందుగా అందించిన కిట్లు, అరటిపండు ముక్కలతో విద్యార్థులు ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశారు. గిన్నిస్ రికార్డుల ప్రతినిధుల నిశిత పరిశీలన తర్వాత కొత్త గిన్నిస్ రికార్డు స్థాపితమైనట్లు రిషినాథ్ ప్రకటించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం, విజ్ఞాన భారతిల పేరుతో ఈ రికార్డు నమోదైంది. -
భారతీయ విద్యార్థులకు డేవిడ్సన్ ఫెలోషిప్
వాషింగ్టన్: సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు తమ సత్తా నిరూపిస్తున్నారు. తాజాగా ఆరుగురు విద్యార్థులు తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక డేవిడ్సన్ ఫెలోస్ స్కాలర్షిప్– 2018 అందుకున్నారు. డేవిడ్సన్ ఇన్స్టిట్యూట్ అందించే ఈ స్కాలర్షిప్ ప్రపంచంలో 10 అతిపెద్ద స్కాలర్షిప్ల్లో ఏడోది. ఏటా సైన్స్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంగీతం, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 18 ఏళ్లలోపు విద్యార్థులకు దీన్ని అందజేస్తారు. శుక్రవారం వాషింగ్టన్లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా వ్యాప్తంగా ఈ స్కాలర్షిప్కు ఎంపికైన 20 మంది విద్యార్థులు నగదును అందుకున్నారు. ఆ ఆరుగురు వీరే.. వర్జీనియాకు చెందిన కావ్య కొప్పరపు (18) కేన్సర్ చికిత్సలో నూతన ఆవిష్కరణలు చేసింది. కనెక్టికట్కు చెందిన రాహుల్ సుబ్రమణియన్ (17) దోమల్లో వచ్చే మార్పులతో ఆధారంగా ముందుగానే జికా వైరస్ను అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. వీరిద్దరు రూ.36.7 లక్షల చొప్పున నగదు అందుకున్నారు. న్యూజెర్సీకి చెందిన ఇషాన్ త్రిపాఠీ (16) కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఇండోర్లో గాలి నాణ్యత పెంచి లక్షలాది మంది జీవితాలను వ్యాధుల నుంచి కాపాడాడు. అరిజోనాకు చెందిన సచిన్ కోనన్ (17) భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను వేగంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. కణాల గమనంలో మార్పు వల్లే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిరూపించిన వర్జీనియాకు చెందిన మరిస్సా సుమతిపాల (18) వైద్యశాస్త్ర విభాగంలో స్కాలర్షిప్కు ఎంపికైంది. ఈ ముగ్గురికి రూ.18.3 లక్షల చొప్పున నగదు లభించింది. జన్యువులను మరింత మెరుగ్గా విశ్లేషించే వ్యవస్థను కనుగొన్నందుకు కాలిఫోర్నియాకు చెందిన రాజీవ్ మువ్వా (18) రూ.7లక్షలు అందుకున్నాడు. -
శాస్త్ర సాంకేతిక పరిశోధకులకు ఫెలోషిప్ పెంపు
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్ఎఫ్) కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధకులకు ఇస్తున్న ఫెలోషిప్ మొత్తాన్ని భారీగా పెంచడంతోపాటు దీనికి జాతీయ సమన్వయకర్త బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది. ఫెలోషిప్పై విద్యార్థులకు అవగాహన కలిగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2019 ఫెలోషిప్ ఎంపికలకు వర్తిస్తాయని వివరించింది. పరిశోధనాసక్తిని తెలియచేసేలా ప్రాజెక్ట్ అభ్యర్థి.. పరిశోధన చేయదలుచుకున్న అంశానికి సంబంధించి ప్రాజెక్టును రూపొందించుకొని సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శాస్త్ర, సాంకేతిక అంశాలకు చెందినదై, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉండాలి. ప్రాజెక్ట్ అభ్యర్థికి పరిశోధనపై గల ఆసక్తి, పరిశీలన సామర్థ్యాలకు దర్పణం పట్టేలా ఉండాలి. అంతేకాకుండా సెలెక్షన్ కమిటీ ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఈ ప్రాజెక్టుతోపాటు ఇద్దరు నిపుణుల పేర్లను రిఫర్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆయా అభ్యర్థులు ఎంచుకొనే సబ్జెక్టులకు ఒక్కోదానికి ఒక్కో విద్యా సంస్థను నోడల్ ఇన్స్టిట్యూట్గా కేంద్ర మానవ వనవరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. ఆ సంస్థలు ఆయా పరిశోధనాంశాలను పర్యవేక్షిస్తాయి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు ఈ పీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు సంబంధిత నోడల్ ఇన్స్టిట్యూట్లకు చేరతాయి. ఆయా నోడల్ ఇన్స్టిట్యూట్లు నియమించే నిపుణుల కమిటీలు ఇంటర్వ్యూలు చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాలను రూపొందిస్తాయి. ఇంటర్వ్యూలను అవసరమైతే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కూడా నిర్వహించనున్నారు. జాబితాల్లోని వారిని మరింత వడపోసేందుకు జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) రాతపరీక్షలు, చర్చాగోష్టులు తదితర మార్గాల ద్వారా ఫెలోషిప్కు అర్హులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి విద్యా సంస్థలను కేటాయించనున్నారు. ఎంపిక మార్గదర్శకాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్లు) రూపొందించనున్నాయి. అనుకున్న మేర పరిశోధన సాగితేనే మరుసటి ఏడాదికి రెన్యువల్ ఆశించిన మేర అభ్యర్థి పరిశోధన సాగిస్తేనే మరుసటి ఏడాదికి ఫెలోషిప్ రెన్యువల్ అవుతుంది. పరిశోధకుడు వారంలో ఒకరోజు తమకు సమీపంలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన చేయాలి. జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) పీఎంఆర్ఎఫ్ను అమలుచేసే వ్యవస్థగా ఉంటుంది. పరిశోధనలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులుచేర్పులు చేసే అధికారం ఎన్సీసీకి ఉంటుంది. ఎంతమందిని పరిశోధనలకు అనుమతించాలన్న నిర్ణయమూ ఎన్సీసీ పరిధిలోనే ఉంటుంది. ఫెలోషిప్ ఇలా.. పీఎంఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు 70 వేల చొప్పున, మూడో ఏడాది రూ.75 వేలు, చివరి రెండేళ్లు రూ 80 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతోపాటు రీసెర్చ్ గ్రాంట్ కింద ఏటా రూ.2 లక్షల చొప్పున ఐదేళ్లకు రూ.10 లక్షలు అందిస్తారు. ఈ పరిశోధనల కాలపరిమితి ఇంటిగ్రేటెడ్ కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్లు, బీటెక్ విద్యార్థులకు ఐదేళ్లు ఉంటుంది. ఎంటెక్, ఎంఎస్, ఎంఈ కోర్సులు పూర్తిచేసినవారికి కూడా నాలుగేళ్ల కాలపరిమితి వర్తిస్తుంది. -
పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు
లావేరు : లావేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైన్స్ల్యాబ్లో పరికరాలను కొందరు అపరిచిత వ్యక్తులు పగులగొట్టారు. అంతటితో ఆగకుండా గోడలు, కిటికీ తలుపులపై అశ్లీల పదజాలంతో రాతలు రాశారు. పాఠశాల ఆవరణలో అంసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం పాఠశాల హెచ్ఎం పట్నాన రాజారావు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సరికి గోడలపై అసభ్య రాతలు, వరండాలో మద్యం సీసాలు గుర్తించారు. కిటికీ తలుపులు పగులగొట్టి ల్యాబ్లోకి రాళ్లు విసిరినట్లు గుర్తించారు. దీనిపై హెచ్ఎం రాజారావు ఉపాధ్యాయులతో కలసి లావేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఐఐటీల్లో నయా జోష్..!
దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ‘గూగుల్’ సుందర్ పిచాయ్, ‘ఫ్లిప్కార్ట్’ సచిన్ బన్సల్, ‘సాఫ్ట్ బ్యాంక్’ నికేష్ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్ ఇంజనీరింగ్లతోపాటు కళలు, హ్యుమానిటీస్ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం... ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కలివిడిగా.. వడివడిగా... పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్లోనూ 2014లో కంబషన్ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్ బ్రెయిన్ రీసెర్చ్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది. ముందు వరుసలో ఐఐటీ బాంబే... ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్ టెలిస్కోప్ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్వేర్ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు. ఐఐటీ, ఐఐఎస్సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని... ► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్లో పీహెచ్డీ చేసిన మనన్ సూరికి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది. ► జల విద్యుత్ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన ప్రమోద్ కుమార్ కార్బన్ డయాక్సైడ్ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్ డయాక్సైడ్ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా. ► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్టాప్ సోలార్ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు. ► స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్కు కిరణ్తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. — సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉద్యోగాలు ఎందుకు మారుతున్నారో తెలుసా.?
లండన్: అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. అయితే కొత్తదనం కోరుకునే వారే తరచూ ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిచ్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగిలియా(యూఈఏ) శాస్త్రవేత్తలు.. ఇలా జాబ్లు మారడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధనలు చేశారు. ఎక్కువ మంది తమ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు మారుతుంటే, మరికొంత మంది కొత్తదనం కోసం మారుతున్నట్లు తేలింది. అయితే ఇలా మారే వారిలో వయసు తక్కువగా ఉండి, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారట. అవకాశాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. తమ విద్యార్హతల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు అంతకంటే మంచి పొజిషన్ కోసం వెతుకుతుండగా, ఉద్యోగుల్ని ఎంపిక చేసే సంస్థలు సైతం నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తుండడంతో ఉద్యోగులు సులభంగా ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నారని వివరించారు. -
కొబ్బరి పొట్టు.. సేంద్రియ కంపోస్టు!
పంట పొలంలో, కుండీ మట్టిలో నీటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడానికి శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియలో గతంలో రసాయనాలను వాడేవారు. అయితే, కేంద్ర కాయిర్ బోర్డు రసాయనాలు వాడకుండా కొబ్బరి పొట్టును శుద్ధి చేసి సేంద్రియ ఎరువులా పంటలకు వాడుకునే వినూత్న పద్ధతిని ఇటీవల రూపొందించింది. కృషీవల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ పద్ధతిలో సేంద్రియ కంపోస్టును తయారు చేస్తూ.. కొబ్బరి రైతులకు మంచి మార్గాన్ని చూపుతోంది. కొబ్బరి పంట రైతుకు అనేక విధాలుగా ఆదాయాన్ని అందిస్తుంది. కాయలతోపాటు కాండం, ఆకులు, ఈనెలు, చిప్పలు, డొక్కలు.. ఇలా అన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఆదాయాన్నందించేవే. కొబ్బరి డొక్కల నుంచి ‘పీచు’ తీసి.. ఆ పీచుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కేజీ పీచు తీసేటప్పుడు సుమారు 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఇలా వచ్చిన పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. దీనిలో కర్బనం–నత్రజని నిష్పత్తి మొక్కలకు అనుకూలంగా ఉండదు. ‘లెగ్నిన్’ అధిక మోతాదులో ఉండటం వలన దీన్ని నేరుగా మొక్కలకు వేస్తే పంటలకు హాని జరుగుతుంది. ఎలక్ట్రిక్ కండక్టవిటీ(ఈసీ)ని తగ్గించాలి. దీన్ని శుద్ధి చేసి కంపోస్టుగా మార్చి వేసుకుంటే పంటలకు మేలు జరుగుతుంది. కొబ్బరి పొట్టు రైతుకు మేలు చేసే విధంగా తయారు చేసుకోవడంలో వివిధ పద్ధతులు, విధానాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ కాయిర్ బోర్డు ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను అభివృద్ధి చేసింది. తొలినాళ్లలో ఈ శిలీంధ్రం, రాతి భాస్వరం పొరలు, పొరలుగా వేసి కుళ్లబెట్టేవారు. తరువాత కొద్దిపాటి యూరియాను పొరల మధ్య చల్లడం ద్వారా మరింత వేగంగా పొట్టును కుళ్లబెట్టవచ్చని తేల్చారు. ఈ కొత్త పద్ధతిలో రసాయనిక పదార్థాలకు బదులు.. ఫ్లూరోటస్ సాజర్ కాజూ, అజోల్లా, వేపపిండిలను వినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం అభివృద్ధి చేశారు. ఇటీవల కోనసీమలో కొంతమంది రైతులు ఏర్పాటు చేసుకున్న కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేసి రైతులకు, పట్టణాల్లో ఇంటిపంటల సాగుదారులకు అందించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నది. టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించింది), 10 కేజీల అజోల్లా, 30 కేజీల వేపపిండి, 5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ లను పొరలు, పొరలుగా వేసి తడపటం ద్వారా 30 రోజుల్లో మంచి నాణ్యమైన కొబ్బరి పొట్టు కంపోస్టును తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లాల్సి ఉంటుంది. అనంతరం ఈ కొబ్బరి పొట్టు బాగా కుళ్లి మంచి కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. శిలీంధ్రం, అజోల్లాలతో శాస్త్రీయ పద్ధతిలో కుళ్లబెట్టిన కొబ్బరి పొట్టు కంపోస్టు వాడటం వల్ల అనేక లాభాలున్నాయి. – నిమ్మకాయల సతీష్బాబు, సాక్షి, అమలాపురం కొబ్బరి పొట్టు కంపోస్టుతో ప్రయోజనాలు ► మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సేంద్రియ పదార్థం ► తక్కువ బరువు– విమానాల్లో సైతం రవాణాకు అనుకూలం ► విదేశాలకు ఎగుమతికి క్వారంటెయిన్ ఇబ్బందులు లేవు ► అధిక మోతాదులో పొటాషియంతోపాటు అనేక పోషకాలు కలిగిన సేంద్రియ ఎరువు ► జీవన ఎరువులు, శీలింధ్రనాశనులు కలిపి వినియోగానికి అనుకూల పదార్ధం ► అత్యంత తక్కువ ధరకు లభించే ఎరువు కొబ్బరి తోటలున్న ప్రాంతాల్లో లభించే వ్యర్థ పదార్థం ► సులువైన తయారీ విధానం నూతన ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడుతోంది ► ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందవచ్చు ► మిద్దె పంటలు, ఇంటి పంటలకూ అనుకూలమైన సేంద్రియ ఎరువు. భూమిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది కొబ్బరి పొట్టు కంపోస్టును వినియోగించడం ద్వారా పంట భూమిలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. మెట్ట, నీటి సౌలభ్యం తక్కువుగా ఉన్న మాగాణి భూముల్లో మంచి పంటలు పండించుకోవచ్చు. దీని తయారీ విధానం, ఖర్చు చాలా తక్కువ. మంచి పోషకాలు కలిగిన కంపోస్టును మొక్కలకు అందించేందుకు ఇది దోహదపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఖరీదైన ఉత్పత్తులకన్నా.. కొబ్బరి పొట్టుతో పెద్దగా ఖర్చులేకుండా సేంద్రియ పద్ధతిలో కంపోస్టును తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. – అడ్డాల గోపాలకృష్ణ (94402 50552), కన్వీనర్, రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు, అమలాపురం అజొల్లా -
ఇలా చేయకపోతే గుండెపోటు ఖాయం
మేరీల్యాండ్ : ఈ యాంత్రిక జీవితంలో డబ్బు సంపాదనపై ఉన్నంత ధ్యాస ఆరోగ్యంపై ఉండటం లేదు. ఏదైనా రోగం వచ్చేంత వరకు అలా ఉండిపోయి వచ్చిన తర్వాత ఆలోచించడం పరిపాటిగా మారింది. వ్యాయామాలు చేయడం మంచిదని తెలిసినా తీరికలేకో, బద్ధకం వల్లో చాలా మంది ఒళ్లు వంచడానికి దూరంగా ఉంటున్నారు. ఫలితంగా లేని పోని రోగాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కాదు గుండెపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. 6 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వ్యాయామం చేయని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువంటున్నారు. మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలన్నా శరీరానికి తగినంత పని చెప్పాలంట. నడక, పరుగు, సైకిల్ తొక్కడం లాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. మధ్య వయస్కులు ఎవరైతే ఆరు సంవత్సరాలు శారీరక శ్రమ చేస్తారో వారికి గుండెపోటు వచ్చే అవకాశం 23 శాతం తక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్త చియాడీ న్యుమేలే తెలిపారు. -
కదలకుండా కూర్చుంటే కష్టాలే!
టోక్యో : కాసేపు కదలకుండా ఒక చోట కూర్చున్నామంటే చాలు కాళ్లు చేతులూ తిమ్మిర్లు పట్టి ఇబ్బంది పెడతాయి. ఇక కొన్ని గంటలపాటు ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు కదలకుండా అలానే కూర్చుండిపోతాము. అలా కూర్చుంటే సిరల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు, చేతులు, పొత్తికడుపు కింది భాగాల్లో రక్తం గడ్డకడుతుందని జపాన్లోని కుమమోటో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇలా గడ్డకట్టడాన్ని వైద్య పరిభాషలో వీనస్ థ్రాంబోఎంబోలిసమ్స్(వీటీఈ) అంటారు. 2016 ఏప్రిల్లో జపాన్లో భూకంపం సంభవించిన తర్వాత చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో 21 మెడికల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రోగుల డేటాను పరిశోధన కోసం కేటాయించారు. వీరిలో దాదాపు 51 మంది వీటీఈ కారణంగా చికిత్స చేయించుకున్నారని గుర్తించి, వారి నుంచి వివరాలు సేకరించగా.. అందులో 42 మంది రోగులు ఒక రాత్రిమొత్తం కార్లలో ఉండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తేలింది. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని శాస్త్రవేత్తలో ఒకరైన సీజీ హోకిమోటో తెలిపారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయో చెప్పేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ అని, ఎక్కువ సమయం ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడప్పుడూ లేచి నడుస్తుండాలని సీజీ సూచించారు. -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, నెల్లూరు : జీఎస్ఎల్వీ -ఎఫ్8 రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డా.శివన్ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్ఎస్వీ-ఎఫ్8 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శివన్కు ఇది తొలి ప్రయోగం. -
నాసా లోకస్ ప్రాజెక్టుకు శ్రీచైతన్య విద్యార్థులు
అల్గునూర్(మానకొండూర్): నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడిస్ట్రేషన్(నాసా) అమెరికాలోని కాలిఫోర్నియా లోకస్ ప్రాజెక్టుకు తిమ్మాపూర్ మండలంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని చైర్మన్ శ్రీధర్రావు తెలిపారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని, పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను మంగళవారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. నాసా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చే అరుదైన అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ప్రీతిరెడ్డి, నిత్యారెడ్డి, స్నేహా, సంజన, హర్షిత, సాయిభార్గవి, ఐశ్వర్య, శివానీ, గోపిక, అశ్రిత్సాయిని అభినందించారు. పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం విజయలక్ష్మి, ఆర్ఐ మహిపాల్రెడ్డి, అకాడమిక్ కో–ఆర్డినేటర్ మహేశ్, ఏవో అమరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ విమలారెడ్డి, డీన్ కరుణాకర్రెడ్డి, నాసా ఇన్చార్జి ఇందిర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వడ వంటి ఆకారం నుంచి చందమామ!
బోస్టన్: వడ ఆకారంలో ఉండే రాయి నుంచి వచ్చిన మేఘాలతో చంద్రుడు ఏర్పడ్డట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సినెస్టియా అని పిలిచే ఈ రాయికి ఆవిరయ్యే గుణం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు భావిస్తున్నట్లు పేలుడు సంభవించడం వల్ల ఏర్పడలేదని ఓ అధ్యయనంలో తేలింది. ‘అరుణగ్రహం పరిమాణంలో ఉండే ఓ పదార్థం, పురాతన భూమిని ఢీకొనడం వల్ల చందమామ ఏర్పడిందని అందరూ నమ్ముతున్న సిద్ధాంతం’ అని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ లాక్ పేర్కొన్నారు. అయితే ఇదంతా తప్పు అని లాక్ చెబుతున్నారు. ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయని వివరించారు. వారి పరీక్షల ప్రకారం భూమి, చంద్రుడికి సంబంధించి ‘ఫింగర్ప్రింట్లు’ దాదాపు సారూప్యంగా ఉన్నాయని, దీంతో ఇవి రెండు ఒకే వస్తువు నుంచి ఏర్పడినట్లు భావిస్తున్నారు. -
2050 నాటికి మనిషికి మరణమనేది ఉండదు!
పుట్టిన వాడు గిట్టక తప్పదు...గిట్టిన వాడు పుట్టక తప్పదని కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధిస్తాడు. అంతే మరి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. మళ్లీ పుడతాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం పుట్టిన మనిషి చనిపోకుండా చిరకాలం జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మనిషికి మరణమనేది లేకుండా కాలాతీతంగా జీవించ వచ్చని అందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయని లాన్ పియర్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. కృత్రిమ మేధస్నును ఉపయోగించి, ల్యాబ్లో మనిషి అవయవాలు, కణాలను తయారు చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే 2050 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని పియర్సన్ వెల్లడించారు. 1970 తర్వాత పుట్టిన ప్రతి మనిషి చిరంజీవిలా మరణమనేది లేకుండా బతకవచ్చని తెలిపారు. ప్రతి మనిషి మరణం లేకుండా బతకాలని కోరుకుంటారనీ అన్నారు. కాకపోతే ఇది ధనిక, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2060 వచ్చేసరికి మధ్య తరగతి వర్గాల ప్రజలకు , 2070 కల్లా పేద దేశాల్లో సైతం ఈ పద్దతి అమల్లోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో హిబ (HIBA హైబ్రిడ్ ఇంటిలిజెన్స్ బయోమెట్రిక్ అవతార్)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు. మానవ మేధస్సు, కాన్షియస్నెస్ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్ తెలిపారు. మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి. ల్యాబ్లో శరీరఅవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం. రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్దతి. ఊహా జనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరచి కంప్యూటర్ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్ను స్టేక్(stack), దీన్ని మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం స్కిన్(skin) అంటారు. తద్వారా మనిషి చనిపోయినా... మళ్లీ తన జీవితం తనకే ఉంటుంది. -
రకుల్కు లక్కీచాన్స్
తమిళసినిమా: సినీ తారలకు ముఖ్యంగా కథానాయికలు ఇక్కడ లేకుంటే అక్కడ, అక్కడ కాకుంటే మరో భాషలో అవకాశాలను చేజిక్కింకుంటూనే ఉంటారు. వారికున్న అడ్వాంటేజ్ అదే. నటి రకుల్ప్రీత్సింగ్నే తీసుకుంటే మొదట్లో ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడిప్పుడు కాస్త డల్ అనుకుంటున్న సమయంలో కోలీవుడ్లో బిజీ అయిపోయింది. నిజానికి స్పైడర్ చిత్రం రకుల్ను చాలా నిరాశపరచింది. అంతే కాదు విజయ్తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది. దీంతో రకుల్ మరింత డీలా పడిపోయిందనే చెప్పాలి. అలాంటి సమయంలో సూర్య బ్రదర్స్ ఆదుకున్నారు. కార్తీతో నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విజయం రకుల్ప్రీత్సింగ్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇక సూర్యకు జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ అమ్మడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతే కాదు కార్తీతో మరోసారి కొత్త దర్శకుడు రజత్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించే చాన్స్ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే హిందీలో నటించిన అయారి చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఆజయ్దేవ్గన్తో మరో చిత్రం చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్లో మరో బిగ్ అవకాశం రకుల్ప్రీత్సింగ్ తలుపుతట్టింది. అదే వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్తో జత కట్టడానికి రకుల్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. శివకార్తికేయన్ ప్రస్తుతం పోన్రామ్ దర్శకత్వంలో సమంతతో కలిసి సీమరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తదుపరి ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్ప్రీత్సింగ్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇది సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం అట. ఇందులో రకుల్ప్రీత్సింగ్ పాత్ర చాలా డిఫెరెంట్గా ఉంటుందని చిత్ర దర్శకుడు అంటున్నారు. చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందట. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతబాణీలు కట్టనున్నారు. చిత్రం జూన్లోగానీ జూలైలో గానీ సెట్పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. -
‘విజ్ఞానా’నికి బూజు.!
వైరా : వంద అక్షరాల్లోని భావాన్ని ఒక్క చిత్రంలో చూపవచ్చు. వంద చిత్రాల సారాంశాన్ని ఒక ప్రయోగంతో వివరించవచ్చు. విద్యాశాఖలో మేధావులు నమ్మే విలువైన మాటలివి. ఆ దిశగా సత్ఫలితాలు సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక బోధన.. చివరకు ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. అంతంత మాత్రం నిధులు, అందీ అందని ప్రయోగ పరికరాలు, నిధులు దున్వినియోగం వెరసీ విద్యార్థులకు సైన్స్ విద్య అందడం లేదు. మౌఖిక బోధనతోనే పాఠాలు చెప్పి సరిపెడుతున్నారు. దీంతో విలువైన విజ్ఞాన పరికరాలకు దుమ్ము పడుతోంది. సులువుగా అర్థమయ్యేలా.. నియోజకవర్గంలో మొత్తం 37 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో వైరా మండలంలో 9, కొణిజర్ల మండలంలో 7, ఏన్కూరు మండలంలో 8, కారేపల్లి మండలంలో 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 6,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతోపాటు సులభంగా అర్థమయ్యే వీలుగా ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది. కొంతకాలం కిందట ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఈ మేరకు పాఠశాలలకు నేరుగా నిధులను విడుదల చేశారు. అందులో కొంత సొమ్ము వెచ్చించి పరికారాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశ్యం. అయతే ఎక్కడా ఆ లక్ష్యం నెరవేరలేదు. అందిన నిధులు అరకొర కావడం, ఆ నిధులతోనే మరిన్నీ కార్యక్రమాలు చేపట్టాల్సి రావడంతో అసలు సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల కొనుగోలు చేసిన పరికారలు వాడక మూలనపడ్డాయి. ఫలితంగా లక్ష్యం కుంటుపడటంతో పాటు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. నిధులున్నా పరికరాల్లేవ్.. 2009–10 విద్యాసంవత్సరం నుంచి 2018వరకు ఉన్నత పాఠశాలలకు ఇచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2009–10లో ఉన్నత పాఠశాలలకు రూ.4,687 చొప్పున, 2010–11లో రూ.17,125 చొప్పున, 2011–12లో రూ. 15వేల చొప్పున సైన్స్ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 2008 నుంచి 2010 వరకు ఆర్వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.10వేల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఏటా లక్షలాది రూపాయిల సొమ్ము పాఠశాలల నిర్వహణ, ప్రయోగ పరికరాల కోసం కేటాయిస్తున్నా.. ఆశించిన ఫలితం దక్కడం లేదు. ప్రయోగాత్మక బోధన కరువు... విద్యా బోధనలో కృత్యాధార, ప్రయోగాత్మక బోధనలు రెండూ కీలకం. ప్రస్తుత కృత్యధార బోధన జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే పదేళ్ల కిందట పాఠ్య పుస్తకాల్లో చిత్రాలు తక్కువగా ఉండేవి. ప్రయోగత్మక బోధన లేకపోవడంతో కేవలం పాఠ్యాంశాలను చదివి చిన్నారులు ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలను సమకూర్చడంతోపాటు, ఆ విధంగా బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సైన్స్ పరికరాలతో విద్యాబోధన చేయాలి.. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సైన్స్ పరికరాలతోనే విద్యాబోధన చేయాలి. మారిన పుస్తకాల్లోని అంశాలతో ప్రయోగాలు చేస్తే పాఠాలు బోధించే పరిస్థితి లేదు. ప్రతి పాఠశాలలో ప్రయోగశాల ద్వారా బోధన చేయాల్సిందే. – కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా -
తొలి ఆంగ్లేయుడు శ్వేతజాతీయుడు కాదా..?
లండన్ : పురాతన బ్రిటిషర్లు శ్వేతజాతీయులు కాదని డీఎన్ఏ పరీక్షల ద్వారా తేలింది. పదివేల సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి ఎముకలపై తొలిసారిగా నిర్వహించిన అత్యంతాధునిక జన్యు పరీక్షలు, ఫేషియల్ రీకన్స్ర్టక్షన్ టెక్నిక్స్ ద్వారా అసాధారణ విషయాలు వెలుగుచూశాయి. తొలితరం ఆంగ్లేయులు నలుపు వర్ణంతో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగిఉన్నారని తెలిసింది. బ్రిటన్లోని సోమర్సెట్ చెద్దార్ లోయలో లభించిన అతిపురాతన మానవ కళేబరంపై పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. తాము పరిశీలించిన మానవ కళేబరం జీవించి ఉంటే సదరు వ్యక్తి ‘బ్లాక్’ అని స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేతజాతీయులు కాదని, కాలక్రమేణా వారి చర్మం వర్ణం మారిఉండవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు వారు పేర్కొన్నారు. 1903లో సోమర్సెట్లోని చెద్దార్లో లభించిన కళేబరం, వాటి ఎముకలు అప్పటి నుంచి సంచలనంగానే మారాయి. వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలు ‘చెద్దార్ మెన్’ కథను వెలికితీసే పనిలో పడ్డారు. అతని ముఖకవళికలు, పూర్వాపరాలు, తన పూర్వీకుల గురించి ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయనేది ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన జన్యు పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయని మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్ టామ్ బూత్ చెప్పారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి అరకొర నిధులే..
ఆధునిక సాంకేతికతను వినియోగించే దేశంగానే భారత్ మిగిలిపోకూడదు.. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి’’ అని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. అయితే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అది అంతగా ప్రతిఫలించలేదు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పరిశోధనల కోసం అత్యున్నత స్థాయి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడం కొంత సానుకూల పరిణామం. అలాగే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంపైనా ఆర్థిక మంత్రి ఆసక్తి కనబరిచారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నిర్వహణలో బ్లాక్చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో లావాదేవీల నిర్వహణలో అవినీతి, అక్రమాల్ని పూర్తిస్థాయిలో అడ్డుకోగలమని కేంద్రం భావిస్తోంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అంటే.. ‘అన్ని లావాదేవీలను నమోదు చేసేందుకు ఉపయోగపడే ఒక పద్దుల పుస్తకం. ఇది ఒకే చోట కాకుండా.. నెట్వర్క్లో ఎన్ని కంప్యూటర్లు ఉంటాయో అన్నింటిలోనూ రహస్య సంకేత భాషలో నిక్షిప్తమై ఉంటుంది. అందరూ అనుమతిస్తేగానీ ఈ పద్దుల పుస్తకంలో చిన్న మార్పైనా చేయడం సాధ్యం కాదు. ఎవరైనా చేయాలనుకుంటే వెంటనే అందరికీ తెలిసిపోతుంది’. ప్రభుత్వ పథకాల అమలులో ఈ టెక్నాలజీని వినియోగించాలన్నదే కేంద్రం భావన. 1.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఇక దేశంలో జనాభా కంటే ఎక్కువ మొబైల్స్ అందుబాటులో ఉన్నా.. ఇంటర్నెట్ విషయంలో గ్రామీణ భారతం ఎంతో వెనుకంజలో ఉంది. ఈ లోటు భర్తీకి నేషనల్ నాలెడ్జ్ సెట్వర్క్ పేరుతో గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే లక్ష గ్రామ పంచాయతీల్ని అనుసంధానించినట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 1.5 లక్షల గ్రామాల్ని శరవేగంగా భారత్ నెట్లోకి చేర్చే చర్యలు ముమ్మరం చేస్తామని ఈ బడ్జెట్లో ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచేందుకు ఐదు లక్షల వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు ప్రకటన, డిజిటల్ ఇండియా పథకానికి కేటాయింపులు రెట్టింపు చేయడం, 5జీ మొబైల్ టెక్నాలజీ పరీక్షలకు చెన్నై ఐఐటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు. మొదటి నుంచి భారతదేశంలో పరిశోధనలకు బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రమే.. స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక్క శాతం నిధుల్ని పరిశోధనలకు కేటాయించాలని శాస్త్రవేత్తలు చాలాకాలంగా కోరుతున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో స్థూల జాతీయోత్పత్తిలో మూడు నుంచి నాలుగు శాతం నిధులు శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయిస్తుండగా.. మన వద్ద అవి అరశాతం దాటకపోవడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
ప్రాంతీయ భాషలోనే సైన్స్
కోల్కతా: శాస్త్ర సాంకేతికాంశాలను విస్తృతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్స్పై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోల్కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు తమ మేధస్సును దేశ ప్రజలకోసం, వారి సామాజిక–ఆర్థిక అవసరాల కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘మన యువతలో సైన్స్పై ఆసక్తిని, అభిరుచిని పెంచేందుకు సైన్స్ కమ్యూనికేషన్ను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భాష అడ్డంకి కారాదు’ అని అన్నారు. ‘2018లో ప్రతి భారతీయుడు మన పూర్వీకులు కన్న నవభారత స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతినబూనాలి. 2018 సంవత్సరాన్ని వాటర్షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలి. విద్యాసంస్థలు, పరిశోధన–అభివృద్ధి సంస్థలు ఒకే వేదికపైకి రావటం ద్వారా పరిశోధన మరింత విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశానికి గర్వకారణమన్న ప్రధాని.. ఇస్రో 100 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిందన్నారు. నీరు, విద్యుత్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకోసం ఎదురుచూస్తున్నామన్నారు. బెంగాల్ పవిత్రమైన గడ్డపై వివిధ రంగాల ప్రముఖులు పుట్టారని మోదీ ప్రశంసించారు. ఆచార్య జేసీ బోస్, మేఘనాథ్ సాహా, ఎస్ఎన్ బోస్ వంటి మహామహులు జన్మించారని.. ఇప్పటికీ వీరి ప్రయోగాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 1894, జనవరి 1న జన్మించిన భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1920ల్లో క్వాంటమ్ మెకానిక్స్లో విశేషమైన ప్రయోగాలు చేశారు. రెండు ఉప కణాలను నిర్వచించే విషయంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్తో కలిసి విస్తృత పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగంలో కనుగొన్న కణాలకు బోస్ పేరుతో ‘బోసాన్స్’గా పిలుస్తున్నారు. మన సైంటిస్టులే బెస్ట్: హర్షవర్ధన్ భారత శాస్త్రపరిశోధన సంస్థలు అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచంలోని ఉత్తమ జాబితాలో ఉన్నారని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. సత్యేంద్రనాథ్ బోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ నానో టెక్నాలజీలో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. -
ఆపిల్స్, టమాటాలతోఊపిరితిత్తులకు మేలు!
ధూమపానం మానేసిన వారికి ఎప్పుడూ ఓ సందేహం ఉంటుంది. కొద్దోగొప్పో పాడైన తమ ఉపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేయవచ్చా? అని. ఈ సందేహంపై జాన్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ ఆఫ్ ప్యారిస్ శాస్త్రవేత్తలు ఒక స్పష్టత ఇచ్చారు. తినే ఆహారంలో టమాటాలతోపాటు అధిక స్థాయిలో పండ్లు ముఖ్యంగా ఆపిల్స్ తింటే ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుందని వారు అంటున్నారు. దాదాపు పదేళ్లపాటు తాము పరిశీలన జరిపామని.. ఈ కాలంలో ఆపిల్స్, టమాటాలు ఎక్కువగా తిన్న మాజీ ధూమపాన ప్రియుల్లో ఊపిరితిత్తుల పనితీరు ఇతరులతో పోలిస్తే మెరుగ్గా ఉందని వెనెస్సా గార్షియా లార్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. జర్మనీ, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లకు చెందిన కొంతమందిపై ఈ పరిశోధన జరిగింది. వారు తీసుకునే ఆహారం, ఊపిరితిత్తుల పనితీరును పదేళ్ల అంతరంలో రెండు సార్లు పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని చెప్పారు. సగటున రోజుకు రెండు టమాటాలు లేదంటే మూడుకంటే ఎక్కువసార్లు పండ్లు తినేవారి ఊపిరితిత్తులు... ఒకటి కంటే తక్కువ టమాటాలు, పండ్లు తినే వారికంటే నెమ్మదిగా సమస్యలకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. టమాటాలు, పండ్లు ఊపిరితిత్తులకు మేలుస్తాయని, అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని తమ పరిశోధన చెబుతోందన్నారు. -
ఈగ.. యముడి మెరుపు తీగ
వాషింగ్టన్: దోమలు, బొద్దింకలు, ఇతర పురుగులు మన ఇంట్లోకి వస్తే వాటిని చంపడమో.. బయటకు తరమడమో చేస్తే గానీ మనకు నిద్రపట్టదు. అయితే ఇళ్లల్లోకి వచ్చే ఈగలను మనం అంతగా పట్టించుకోం. దీనికి కారణం అవి అంత ప్రమాదకరమైనవి కావని మనందరి అభిప్రాయం. కానీ మన అభిప్రాయం తప్పంటున్నారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులకు చెందిన హానికరమైన బ్యాక్టీరియాలను వందల సంఖ్యలో మన ఇళ్లల్లోకి ఈగలు మోసుకొస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విహారయాత్రల్లో ఈగల గోల ఎక్కువగా ఉంటుంది.. అక్కడికి తీసుకెళ్లిన ఆహారం, ఇతర వంట పదార్థాలపై అవి వాలిపోతాయి. అయితే ఇలా ఈగలు వాలిన ఆహారాన్ని తినవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 116 ఈగ జాతులపై పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఈగల కాళ్లు, రెక్కలను పరిశీలించగా.. కాళ్లపై అధిక శాతం హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈగలు వాలినప్పుడు ఇవి ఒకచోట నుంచి మరోచోటుకి వ్యాప్తి చెందుతున్నాయని వర్సిటీ పరిశోధకులు స్టీఫెన్ షుస్టెర్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
బుల్లి చేతులు.. బడా ఆవిష్కరణలు
విజయనగరంఅర్బన్ : వారంతా పదో తరగతిలోపు విద్యార్థులు. కానీ వాళ్ల ఆలోచనలు మాత్రం శాస్త్రవేత్తలను తలపించాయి. సందర్శకులను అబ్బుర పరిచాయి. విజయనరం ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక కోటలోని ఆదివారం నిర్వహించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో వివిధ పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు 66 వైజ్ఞానిక పరిశోధనా నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్షయానం వరకు అన్ని అంశాలకు చెందిన నమూనాలు ఆకట్టుకున్నాయి. గంట్యాడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘వ్యర్థ పదార్థాలతో ఇటుకల తయారీ’, లొట్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘చెరకు పంట–పొదుపైన సాగు’, న్యూ సెట్రల్ స్కూల్ విద్యార్థుల ‘పెరటి సాగు నీటి పొదుపు’, ఫోర్ట్ సిటీ స్కూల్ విద్యార్థుల ‘అంతరిక్షయానంలో శాటిలైట్స్’ ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకొన్నారు. తొలుబొమ్మల ద్వారా గ్రామీణ వాతారణలో ప్రజాజీవనం, మహారాజా అటానమస్ కళాశాల వివిధ విభాగాల ప్రయోగశాలను ప్రదర్శనలో ఉంచారు. ఫిజిక్స్ విభాగంలో భౌతిక శాస్త్రంలోని తాజా పరిశోధనలు పెట్టారు. కళాశాలకు చెందిన యంగ్ ఎంటర్ప్రైజెస్ బృందం తయారు చేసిన మహిళా అలంకార వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల బ్యాటరీ బైక్ నమూనా, ఎంఆర్పీజీ కళాశాల ఎకనమిక్స్ విద్యార్థుల జీఎస్టీపై అవగాహన సదస్సు, ఎంఆర్ అటానమస్ కళాశాల విద్యార్థుల కరెన్సీ నోట్ల ప్రదర్శన, విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన సందర్శులకు ఆహ్లాదాన్ని పంచాయి. ఆకట్టుకున్న టెర్రాకోట మట్టి కళాకృతులు పట్టణంలోని ఏటీకె సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధులు తయారు చేసిన టెర్రాకోట మట్టి కళాకృత్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఖలీలుల్లా ఫరీఫ్, ప్రధాన కార్యదర్శి ఎం.విజయభాస్కర్ ప్రోత్సహంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఈ కళాకృత్యాలను తయారు చేశారు. ఇంట్లో అలకంరణ వస్తువుల నుంచి విని యోగపు వస్తువుల వరకు పలురకాల ప్రదర్శనలో ఉంచారు. -
తెలంగాణావాసికి శాంతి స్వరూప్ పురస్కారం
హైదరాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన నరేశ్ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ శుక్రవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నరేశ్ పట్వారీ ప్రస్తుతం ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు పతకంతో పాటు రూ.5లక్షల నగదు అందజేస్తారు. 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.15 వేల నగదు అందజేస్తారు. -
కల్లూరుకు చేరిన పర్యావరణ రైలు
పామిడి : పర్యావరణ అంశాలతో కూడిన ఎగ్జిబిషన్ ట్రైన్ గుల్బర్గా నుంచి శనివారం ఉదయం 9 గంటలకు గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వేస్టేషన్కు చేరింది. ఈ సందర్భంగా 10 గంటలకు గుంతకల్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుబ్బరాయుడు రిబ్బన్ కట్చేసి ట్రైన్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. రైల్వే ఫ్యాకల్టీలు ట్రైన్లోని పర్యావరణ అంశాలతో కూడిన సైన్స్ ఎగ్జిబిషన్పై అవగాహన కల్పించారు. వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై వారు డెమో ఇచ్చారు. రెండురోజులపాటు కల్లూరులో ఈ ట్రైన్ ఎగ్జిబిషన్ ఉంటుందని స్టేషన్ మాస్టర్ రాజేంద్రనాయుడు తెలిపారు. -
మైండ్ను దొంగిలించే రోజులొస్తున్నాయి?
జెనీవా: మన మదిలో చెలరేగే ఆలోచనల్ని, భావాల్ని ఇతరులు తెలుసుకోగల, మార్చగల, దొంగిలించగల రోజులు రాబోతున్నాయి. ‘మైండ్ రీడింగ్ టెక్నాలజీ’తో పరిశోధకులు దాన్ని సుసాధ్యం చేయబోతున్నారు. మెదడు పనితీరును శాస్త్రీయంగా డీకోడ్ చేయడం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికా’ అనే మేగజీన్ ప్రచురించింది. అయితే, ఈ మైండ్ రీడింగ్ టెక్నాలజీ వాస్తవరూపం దాలిస్తే.. మానవాళికి పెనుముప్పని మరో వర్గం శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఆలోచనలను ఇతరులు నియంత్రించడం జరిగితే ఎదురయ్యే అనర్ధాలను అంచనా కూడా వేయలేమంటున్నారు. అందువల్ల ఇప్పటినుంచే మానవహక్కులకు సంబంధించిన కొత్త చట్టాలను రూపొందించాలని స్విట్జర్లాండ్లోని బాసెల్ వర్సిటీ చెందిన శాస్త్రవేత్త మార్సిలో ఐనెకా కోరుతున్నారు. -
అహింసా పరమోధర్మః
ఆత్మీయం ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిలోను అహింస సర్వోత్తమమైన ధర్మం. హింసను మించిన పాపం లేదు. కరుణను మించిన పుణ్యం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస అంటే మరో జీవిని చంపడం లేదా గాయపరచడం ఒక్కటే కాదు... ఒకరికి అయిష్టమైన పనులను వారితో బలవంతంగా చేయించడం కూడా హింస కిందికే వస్తుంది. అలాగే ఇతరుల మనసుకు బాధ కలిగించే మాటలను వాడటం కూడా హింసే. ఎవరికీ, ఎప్పుడూ ఏ రకమైన బాధని కలిగించకుండా ఉండగలగటమే అహింస. త్రికరణశుద్ధిగా అహింసను పాటించేవారి దగ్గర ప్రతి ఒక్కరు శత్రుత్వాన్ని వదిలి ప్రశాంతంగా ఉంటారని యోగసూత్రం చెబుతోంది. అంటే అహింసాచరణుల సన్నిధిలో కూడా ప్రశాంతంగా ఉండటమే కాదు – పులి, జింక కూడా కలసిమెలసి ఉంటాయి వారి ఆశ్రమంలో. యోగాంగాలలో ఒకటి అహింస. ఆయుధాలను వదిలేయడమే అహింస అనుకోవచ్చు. కానీ, అహింసే ఒక పదునైన ఆయుధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, గాంధీజీ ఆ విషయాన్ని రుజువు చేశారు. కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఎంతో ధైర్యం అవసరం. కానీ, అహింసను ఆయుధంగా స్వీకరించడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం అవసరమని గాంధీ మహాత్ముడు చెబుతాడు. -
ఒక్క క్లిక్తో.. విలువైన సమాచారం
నిడమర్రు: ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞాన సంపదను ‘భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ’ ద్వారా పొందవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఖరగ్పూర్ ఐఐటీ సమన్వయంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకూ అవసరమైన విలువైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలు, ఉమ్మడి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం. 70 భాషల్లో..జాతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా ఒక్క క్లిక్తో విలువైన విద్యా సంబంధిత సమాచారం ఎప్పుడైన ఎక్కడైనా చాలా సులువుగా పొందవచ్చు. ఈ విజ్ఙాన సంపదను 70 భాషల్లో 60 పైగా అంశాలపై 15 లక్షల ఈ– బుక్స్, వేలాది వీడియో పాఠాలు, 10 వేలకు పైగా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ తరగతులు, 2 లక్షల ఆడియో పాఠాలు, టెక్నాలజీ, సైన్స్, వ్యవసాయం, విలువలతో కూడిన విద్య వంటి ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ’టెక్నికల్ రిపోర్ట్స్, మోనోగ్రాఫ్, టెక్నికల్ మాన్యువల్, ఆల్బమ్స్, న్యాయ శాస్త్ర తీర్పులు వంటివి పలు డాక్యుమెంట్స్, వీడియోలు, సాఫ్ట్వేర్ రూపంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంగ్లభాషపై పట్టు సాధించొచ్చు..ఆంగ్ల భాషకు సంబంధించిన సంప్రదాయ పద్ధతులు, స్పీకింగ్ లెర్నింగ్, ఉచ్ఛారణకు సంబంధించిన ఆడియో/వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. భారత విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ఈ స్టడీ మెటేరియల్ బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు రాసే జీఆర్ఏ, టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఈ లైబ్రరీలోని ఈ– బుక్స్ చాలా ఉపయోగకరం..ఎన్నో భాషల్లో ..పలు భారతీయ భాషల్లో టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రం, గణితం, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన పాఠ్యాంశాలు, సైకాలజీ, తత్వశాస్త్రం, సోషల్ సైన్స్, రిలీజియన్, చరిత్ర, భూగోళ శాస్త్రాలకు సంబంధించిన వేలాది పుస్తకాలు, రికార్డ్స్, వీడియోలు, ప్రాక్టికల్స్ ఈ లైబ్రరీ ద్వారా పొందవచ్చు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు..జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకూ హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన ప్రతి పుస్తకం ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ – గ్రంథ్ నుంచి 50 వేలకు పైగా వ్యవసాయ రంగానికి సంబంధిత ఈ– బుక్స్, ఆర్టికల్స్, శాస్త్రవేత్తల కథనాలు పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ఇలా..భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు పొందాలంటే జ్టి్టpట://జీnఛీ .జీజ్టీజుజp.్చఛి.జీn అనే వెబ్సైట్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఈ– మెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ కాలం క్లిక్ చెయ్యాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకునేందుకు మీ ఈ–మెయిల్ ఇన్బాక్స్కి ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. ఇలా మీరు జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు ఉచితంగా పొందవచ్చు. -
భగ్గుమంటున్న సూరీడు
శివరాత్రితో చలి నిష్క్రమించాక తీరిగ్గా వచ్చే అలవాటున్న వేసవి పిలవని పేరంటంలా ముందే వచ్చి ఠారెత్తిస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరునుంచే ఎండలు మండుతున్నాయి. గత కొన్ని వారాలుగా అవి క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు లండన్, పెన్సిల్వేనియాలలోని శాస్త్రవేత్తలతోపాటు భారత వాతావరణ విభాగం చేస్తున్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఈసారి మాత్రమే కాదు...మున్ముందు కూడా భారత్లో భారీ వడగాడ్పులుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహానగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని వారంటున్నారు. ఈసారి వేసవిలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండొచ్చు గనుక అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను పాటించాలని భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంసీ) రాష్ట్రాలను కోరాయి. రెండేళ్లనాడు దేశంలో వడగాడ్పుల వల్ల దాదాపు 2,500మంది మరణించారు. అందులో దాదాపు 2,000 మరణాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించినవే. ఇవి అధికారిక గణాంకాలు. రికార్డుల కెక్కని మరణాలు కూడా కలుపుకుంటే ఇవి మరిన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. మృతుల్లో అధిక శాతంమంది రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద వర్గాలవారే. ఎండలు మండుతున్నా, వడగాడ్పులు వీస్తున్నా ఏదో ఒక పని చేస్తే తప్ప ఇల్లు గడవని జీవితాలు వారివి. ఆ వర్గాల్లో ఉండే నిరక్షరాస్యత వల్ల కావొచ్చు... వారికి పలుకుబడి అంతగా లేకపోవడంవల్ల కావొచ్చు ఆ మరణాల్లో చాలా భాగం వడగాడ్పుల జాబితాలో చేరవు. వడగాడ్పులు కూడా ఇతర ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాలు, చలిగాలులు వగైరాల వంటివే. అయితే ప్రభుత్వాలు మాత్రం ఇతర వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించినట్టుగా వడగాడ్పుల విషయంలో వ్యవహరించవు. వాటి దృష్టిలో అసలు ఈ గాడ్పులు ప్రకృతి వైపరీత్యమే కాదు. 2012 వరకూ చలిగాలుల్ని కూడా ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించలేదు. ఆ ఏడాది ఉత్తరాదిన చలిగాలులకు అధిక సంఖ్యలో ప్రజలు మరణించాక తొలిసారి అది కూడా ప్రకృతి వైపరీత్యాల జాబితాలోకి వెళ్లింది. వడగాడ్పుల తీవ్రత దక్షిణాదిలోనే ఎక్కువుంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లోనే అధికం. వడగాడ్పుల్ని ప్రకృతి వైపరీత్యంగా చూడాలన్న డిమాండు కొంతకాలంగా వినబడుతున్నా కేంద్రం ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే జరిగితే వడదెబ్బ తగిలినవారికి వైద్య సదుపాయం కల్పించడం, మరణాలు సంభవించిన పక్షంలో వారి కుటుం బాలకు లక్షన్నర చొప్పున పరిహారం ఇవ్వడం వీలవుతుంది. ఆ అవకాశం లేక పోవడం వల్ల ఆ కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. వడగాడ్పుల వల్ల కేవలం మరణాలే కాదు... ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా పుట్టుకొస్తాయి. ఇక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఆ సమస్యల తీవ్రత మరింత పెరుగుతుంది. తాగునీటి సమస్య లేకుండా చూడటం, పశు దాణా లభ్యమయ్యేలా చూడటం కూడా కీలకం. అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. ఉన్నంతలో వేసవి తాపం పెరుగుతున్న దశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్రాలను కదిలించడం మేలు కలిగించే విషయం. సాధారణ స్థాయి ఉష్ణోగ్రతకు మించి అయిదారు డిగ్రీలు మించితే వడగాడ్పుగా పరిగణిస్తారు. ఈసారి కూడా రాష్ట్రాలకు పంపిన కార్యాచరణ ప్రణాళిక అనేక చర్యలను సూచిం చింది. వడగాడ్పులపై వాతావరణ విభాగం అందజేసే సమాచారం ఆధారంగా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడం, ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువగా పెరిగితే రెడ్ అలెర్ట్ జారీ చేయడం వంటివి ఇందులో కొన్ని. దీన్ని అమల్లో పెట్టాక జాతీయ గ్రామీణ ఉపాధి పథకంకింద చేపట్టే పనుల్లో నిర్దిష్ట సమయాల్లో కూలీలతో పనిచేయించడాన్ని నిలిపేయిస్తారు. అలాగే నిర్మాణ రంగంలోనూ, ఇతరత్రా రంగాల్లోనూ పని స్థలాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన వన్నీ అందుబాటులో ఉంచడాన్ని తప్పనిసరి చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వగైరాల్లో రీహైడ్రేషన్ సౌకర్యం కల్పిస్తారు. ఆసుపత్రుల్లో అదనపు బెడ్ల ఏర్పాటు, కూలర్లు సమకూర్చడం వంటి చర్యలు తీసుకుంటారు. వడదెబ్బ మరణాలను ధ్రువీకరించేందుకు స్థానికంగా కమిటీల ఏర్పాటు, వడగాలుల సమాచారాన్ని అందించడంతోపాటు ప్రజానీకంలో చైతన్యం కలగజేసేందుకు, వడదెబ్బ మృతుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నోడల్ అధికారిని నియమిస్తారు. నాలుగేళ్లక్రితం అహ్మదాబాద్, నాగపూర్, భువనేశ్వర్ తదితర నగరాలను ఎంచు కుని వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి స్థానిక సంస్థలనూ, స్వచ్ఛంద సంస్థలనూ అందులో భాగస్వాముల్ని చేసి అమలు చేశాక మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక చోట్ల నిరుడు ఆ విధానాన్నే అనుసరించడంవల్ల వడదెబ్బ మృతుల సంఖ్య 50 శాతం తగ్గింది. నిజానికి ఈ శతాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డయింది. గాడి తప్పిన ప్రకృతిని సరిచేయడం ఏ ఒక్క దేశం వల్లనో సాధ్యం కాదు. అది సమష్టిగా జరగాల్సిన కృషి. పర్యావరణం క్షీణించడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న డిమాండుకు అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాలు తలొగ్గి ఎంతో కాలం కాలేదు. ఆ తర్వాత కూడా ఏ మేరకు కోత విధించుకుం టాయో చెప్పడంలోనూ తాత్సారం చేశాయి. ఈలోగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ సానుకూల దృక్పథాన్ని ధ్వంసం చేసే చర్యలకు దిగారు. వాతావరణ ఒప్పందాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసే కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. వెనకో ముందో ఇతర సంపన్న దేశాలు కూడా ఈ బాట పట్టే అవ కాశం లేకపోలేదు. కాబట్టి రానున్నది మరింత గడ్డుకాలం. కనుక ప్రకృతి వైపరీ త్యాల విషయంలో మరింత అప్రమత్తత, వాటివల్ల కలిగే నష్టం కనిష్ట స్థాయికి పరి మిత మయ్యేలా చూడటం తప్పనిసరి. -
ఫ్యూచర్ కోసం.. ఫీచర్ కార్లు
కొత్త కారు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. దాంట్లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? మైలేజీ బాగుంటుందా? ఇంటీరియర్ ఎలా ఉంది అనే విషయాలను మనం ఆసక్తిగా గమనిస్తాం. టెక్నాలజీ రోజు రోజుకూ మారిపోతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో వచ్చే అవకాశమున్న కార్ల గురించి మరీ ఎక్కువ ఆసక్తి ఉండటం సహజం. మరి.. ఒకేచోట కొన్ని పదుల సంఖ్యలో కొత్త కార్లు కొలువుదీరితే...? అబ్బో సూపర్ అంటున్నారా? నిజమే. ఇటీవలే ముగిసిన జెనీవా మోటర్ షోలో జరిగింది ఇదే. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని కార్లు, వాహనాల వివరాలను ఇప్పటికీ కొన్నిసార్లు ముచ్చటించుకున్నప్పటికీ మరికొన్ని ఫ్యూచర్కార్ల గురించి స్థూలంగా. స్కిల్లా : ఇటలీకి చెందిన రవాణా వాహనాల డిజైనింగ్ సంస్థకు చెందిన 16 మంది విద్యార్థులు సిద్ధం చేసిన కాన్సెప్ట్ కారు ఇది. వీరిలో ఐదుగురు భారతీయ విద్యార్థులూ ఉండటం విశేషం. 2030 నాటికల్లా ఇలాంటి కారును మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ లక్ష్యం. అయితే ఇందులో కేవలం ఇద్దరు మాత్రం ప్రయాణించగలరు. పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. బ్రష్లెస్ ఎలక్ట్రిక్ మోటర్ల సాయంతో నడవడం వల్ల అతితక్కువ విద్యుత్తుతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఐ–ట్రిల్ : టయోటా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాన్సెప్ట్ కారు ఇది. టాటా నానో కారును పోలిన డిజైన్ ఉన్నప్పటికీ ఎన్నో శక్తిమంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ మూడు చక్రాల వాహనంలో ముగ్గురు ప్రయాణించవచ్చు. వెనుకవైపున ఉన్న రెండు చక్రాలు... వంపులకు అనుగుణంగా పైకి, కిందకు కూడా కదులుతాయి. తద్వారా ఒకపక్కకు ఒరిగిపోయే అవకాశాలు ఏమాత్రం ఉండవు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ట్రంప్ నిర్ణయం శాస్త్రీయ పరిశోధనకు దెబ్బ
వాషింగ్టన్: హెచ్ -1 బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అమెరికా పరిశోధన సంస్థలకు పెద్ద దెబ్బ అని దేశంలోని టాప్ పరిశోధన బృందం వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు, పరిశోధకులపై ఆధారపడే సంస్థల పై ఈ ప్రభావం భారీగా పడనుందని అంచనా వేసింది. హెచ్-1 బి ప్రీమియం వీసాల సస్పెన్షన్పై తీసుకున్న నిర్ణయం ద్వారా పరిశోధన పని నెమ్మదించే అవకాశం ఉందని సెల్ బయాలజీ అమెరికన్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరిశోధన పని నెమ్మదించే అవకాశం ఉందని అలాగే ఆయా రంగాల్లో జరిగిన ఇతర ముఖ్యమైన పరిశోధనల గురించే తెలుసుకునే అవకాశం కూడా తగ్గిపోనుందని హెచ్చరించింది. పుట్టిన స్థలంతో సంబంధం లేకుండా పరిశోధనా ఫలితాలు పంచుకునే క్రమంలో పరిశోధకులకు కూడా తాకనుందని ఈ లోటును భర్తీ చేయలేమని వ్యాఖ్యానించింది. ట్రావెల్ కు సంబంధించిన చర్యలు ద్వారా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనిశ్చితి ,అసంతృప్తికరమైన వాతావరణాన్ని సృష్టించిందని సెల్ బయాలజీ అమెరికన్ సొసైటీ పేర్కొంది. వీసాల జారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో, అమెరికా బయట దేశాలలోని శాస్త్రీయ సమాజం(పరిశోధనా విద్యార్థులు, పరిశోధకులు) తమ తమ దేశాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పింది. ప్రధానంగా శాస్త్రీయ పరిశోధనలు పరస్పర సహకారంతో కూడుకున్నవని, ఆయా పరిశోధనల నైపుణ్యాలను నేర్చుకోవడం ఇకమీదట క్లిష్టంగా మారనుందని చెప్పింది. పరస్పర చర్చలు, ఆలోచనలు, అభిప్రాయాలు ముఖాముఖిగా పంచుకోవడం పైనే సైంటిఫిక్ సమావేశాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది. దేశ భద్రత అవసరాన్ని ట్రంప్ టీంతో తాము కూడా గుర్తించినప్పటికీ అమెరికా సైంటిఫిక్ లీడర్గా నిలవాలంటే కీలకమైన శాస్త్రీయ సూత్రాలు పరిరక్షించడం ముఖ్యమని సొసైటీ స్పష్టం చేసింది. -
రికార్డు ఉష్ణోగ్రత... పరిశోధకుల ఆందోళన
ఓస్లో: వాతావరణ మార్పుల మూలంగా ధృవప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిశోధకులను కలవరపెడుతున్నాయి. ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసెర్చ్ సెంటర్ ఎస్పరాంజా బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాంతంలోని వాండా స్టేషన్లో1982 జనవరి 5న నమోదైన 15 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్డును ఇది అదిగమించింది. ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల మార్పులను అధ్యయనం చేయడం ద్వారా భూమిపై వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థలో ప్రముఖ పరిశోధకుడు మైఖేల్ స్పారో వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అంటార్కిటికాలో ఉన్న మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శాస్త్రీయ ఆధారాలను తొక్కిపెడుతున్నదెవరు?
నందిగామ సమీపంలో జరిగిన బస్సు దుర్ఘటనలో శాస్త్రీయ ఆధారాలను తెరమరుగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేర స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లకపోవడం, భౌతిక ఆధారాలకు ఎంతమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ కేసులో కొన్ని లోపాలను ఫోరెన్సిక్ నిపుణులు లేవనెత్తుతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? ఈ విషయాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష చేసేది ఫోరెన్సిక్ లేబొరేటరీలోని టాక్సికాలజీ విభాగం (విష పదార్థాల నిర్థారణ). ఆసుపత్రికి వచ్చిన మృతదేహాన్ని భౌతికంగా పరిశీలించి, విస్రా (కాలేయం, కిడ్నీలు, గుండె)ను సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపాలి. ఈ విషయంలో ఆసుపత్రి వర్గాలు ఆలస్యం చేయడం వెనుక రహస్యం ఏమిటి? ఒకవేళ డ్రైవర్ మద్యం తాగితే మూడుగంటల వరకూ విస్రాలో ఆల్కహాల్ పదార్థాలు ఉంటాయి. దీన్ని సేకరించి లేబొరేటరీకి పంపితే ఆల్కహాల్ శాతం ఎంతో తేలిపోతుంది. ఈ ఘటనలో బస్సు గంట క్రితమే విజయవాడలో ఆగినట్టు తెలుస్తోంది. అంటే అక్కడ మద్యం తాగి ఉంటే అది ఫోరెన్సిక్ పరీక్షలో తేలిపోయేందుకు వీలుంది. విస్రాను మార్చేస్తారా? డ్రైవర్ వాస్తవ పరిస్థితిని బయటకు రానీయకుండా చేయడానికి... విస్రాను మార్చే అవకాశం ఉంది. గతంలో వర్థమాన నటి ప్రత్యూష కేసులో ఇదే జరిగినట్టు వివాదం చెలరేగింది. ఆమె అత్యాచారానికి గురైందని ఫోరెన్సిక్ వైద్యులు ముందే వెల్లడించారు. దీంతో విస్రాను మార్చివేసి, ఆమె విషం తాగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. ఆయన మంత్రివర్గ సహచరుల కుమారులపైనే అప్పట్లో అనుమానాలు వచ్చాయి. దీంతో లేబొరేటరీకి పంపిన విస్రాను డీఎన్ఏ టెస్టుకు పంపాలనే డిమాండ్ తెరమీదకొచ్చినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఘటనలోనూ ఇలా జరిగే వీలుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోస్టుమార్టం చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చనే అనుమానాలు విన్పిస్తున్నాయి. భౌతిక ఆధారాలు తీసుకున్నారా సంఘటనా స్థలం కీలకమైంది. ఇక్కడ భౌతిక ఆధారాలే కేసుకు బలం. సాధారణంగా బస్సు దుర్ఘటన సమయంలో టైర్ గుర్తులు (స్కిడ్ మార్క్స్) తీసుకోవాలి. దీనివల్ల బస్సు ఎంత వేగంతో వెళ్తుంది? ఆ బస్సు పటుత్వం (ఫిట్నెస్) ఎంత? అనే కీలకమైన అంశాలను గుర్తించవచ్చు. కానీ ఇక్కడ ఈ ఆధారాలు తీసుకున్న దాఖలాలే లేవు. ఇవన్నీ యాజమాన్యాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికతో జరిగాయా? అనే సందేహాలకు తావిస్తున్నాయి. -
చేయిచేయి కలిపితే అసాధ్యమేమీ లేదు
శాస్త్ర పరిశోధనలను వ్యాపారస్థాయికి అభివృద్ధి చేయడమే ‘రిచ్’ లక్ష్యం ⇒ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ⇒ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభం ⇒ ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లాభాలపై దృష్టి పెట్టాలి: సుజనా ⇒ ఇది వినూత్న ప్రయత్నం: ప్రఖ్యాత శాస్త్రవేత్త మషేల్కర్ సాక్షి, హైదరాబాద్: టీ–హబ్తో సృజనాత్మక తను, టీ–ఐపాస్తో ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలును సులభతరం చేసిన తెలంగాణ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల పరిశోధనల ఫలితాలను సామాన్యుల చెంతకు చేర్చేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని అన్ని పరిశోధన శాలలు, అత్యున్నత విద్యాసంస్థలు, పారిశ్రా మికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరు స్తూ.. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)ను ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంలో ఎదు రవుతున్న ఇబ్బందులను పరిష్కరించడం తోపాటు వ్యాపారస్థాయికి అభివృద్ధి చేయడం రిచ్ ప్రధాన లక్ష్యాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రిచ్ సంస్థ ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడి ఐఐసీటీలో జరిగిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మేథోసంపత్తికి కొరత లేదని, అయితే ఎవరికి వారు తమదైన పంథాలో ఒంటరిగా పనిచేయడం వల్ల దేశం అగ్రస్థానానికి ఎదగలేకపోతోందని, ఈ కొరతను తీర్చే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం రిచ్ను ఏర్పాటు చేసిందని, చేయిచేయి కలిపితే అసాధ్యమేమీ లేదని అన్నారు. ఐఐసీటీ, సీసీఎంబీ, ఇక్రిశాట్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టి ట్యూట్తోపాటు మేథోహక్కుల పరిరక్షణ కోసం నల్సార్, వ్యాపార అవకాశాల విస్తరణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రిచ్తో కలసి పనిచేస్తాయని వివరించారు. అత్యధిక యువశక్తి కలిగిన భారత్ ఆలోచించడం మొదలుపెడితే ఊహించని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయన్నారు. భాగ్యనగరంలో అందుబాటులో ఉన్న వృత్తినైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, ఫార్మా, రక్షణ రంగ పరిశ్రమల విస్తృతులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధిలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రిచ్ ఉపయో గపడుతుందని చెప్పారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు హైదరాబాద్లోనే దాదాపు వెయ్యి వరకూ ఉన్నాయని, వీటన్నింటి ద్వారా నగరానికి సమీప భవిష్యత్తులో రూ.30 వేల కోట్ల వ్యా పారం రానుందని అన్నారు. కేంద్రం అందించే నిధులతో పరిశోధనలు చేస్తున్న ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లాభాలపై దృష్టి పెట్టాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనాచౌదరి పేర్కొన్నారు. ‘రిచ్’ ఏర్పాటు చారిత్రాత్మకం.. ‘రిచ్’ ఏర్పాటు చారిత్రాత్మకమైన విషయమని, పారిశ్రామిక, పరిశోధన, వ్యా పార సంస్థలు కలసికట్టుగా చేపట్టే కార్యక్రమం ప్రపంచంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదని సీఎస్ఐ ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ఏ మషేల్కర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటవుతున్న రిచ్ ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను డిజైన్ చేయడం తోపాటు వాటిని ఇక్కడే తయారు చేయడం ద్వారా ఉపాధి కల్పనకు అవకాశం లభిస్తుందన్నారు. రిచ్ సంస్థలో రూ.50 కోట్లతో రీసెర్చ్ టు మార్కెట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమితులైన ఐఎస్బీ మాజీ ఉపకులపతి అజిత్ రంగ్నేకర్ మాట్లా డుతూ.. సీఎస్ఐ ఆర్, డీఆర్డీవో సంస్థలతో పాటు అనేక సంస్థలను భాగస్వాములను చేస్తామని, ఒకట్రెండు ఏళ్లలో మరిన్ని ఆవిష్కరణలు చేయడం తోపాటు వాటిని వాణిజ్య స్థాయికి చేరు స్తామన్నారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పాపారావు, రెడ్డీస్ ల్యాబ్స్, శాంతా బయోటెక్ అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్ర, సాంకేతికానికి.. నామమాత్రమే!
ఈ రంగాలకు కేటాయింపులు రూ.37,435 కోట్లు న్యూఢిల్లీ: శాస్త్రసాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.37,435 కోట్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో అంతరిక్ష పరిశోధన విభాగాని(డీఓఎస్)కి అదనంగా రూ.1,000 కోట్ల కేటాయింపులు జరిపినట్టు జైట్లీ తెలిపారు. గతేడాది డీఓఎస్– అణు శక్తి (డీఏఈ), శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖలు రెండింటికీ కలిపి కేటాయించిన మొత్తం రూ.32,030.72 కోట్లు. ► డీఓఎస్కు ప్రకటించిన రూ.9,093 కోట్లలో 4,155 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయింపులు జరిగాయి. ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ –2 వంటి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. గతేడాది (2016–17) బడ్జెట్లో డీఓఎస్కు రూ.8,045 కోట్లు, 2015–16లో రూ.6,920 కోట్లు ఇచ్చారు. ► అదేవిధంగా డీఏఈకి రూ.124.61 కోట్లు కేటాయించారు. ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్బీఆర్)తో పాటు రాజస్తాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (ఆర్ఏపీఎస్ 7, 8), కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు (3, 4 యూనిట్లు) తదితర ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగిస్తారు. ► అలాగే డీఏఈ పరిధిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్), రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్లకు రూ.3,062 కోట్లు (గతేడాదితో పోలిస్తే రూ.814.42 కోట్లు అదనం) కేటాయించారు. ► శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు రూ.4,446 కోట్లు (గతేడాది రూ.4,062 కోట్లు) ఇచ్చారు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ విభాగాలకు వరుసగా రూ.4,817.27, రూ.2,222.11 కోట్ల కేటాయింపులు జరిగాయి. ► భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.1,719.48 కోట్లు (గతేడాది రూ.1,576.14 కోట్లు) ఇచ్చారు. కనీసం ఒక శాతం నిధులుంటేనే.. భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు కేటా యింపులు నామమాత్రమే అన్నది గత బడ్జెట్లను చూస్తే స్పష్టమవుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీఎస్పీ)లో కనీసం ఒక శాతం నిధులు కేటాయి స్తేనే దేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఈ రంగాలకు కేటాయింపులు గరిష్టంగా జీఎస్పీలో 0.88 శాతమే ఉండటం గమనార్హం. దక్షిణ కొరియా, అమెరికా, చైనాలు ఈ రంగాలకు భారీగా నిధులిస్తుండడంతో ఆ దేశాల నుంచి కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నాయి. వారు తీసుకుంటున్న పేటెంట్లను చూస్తే ఇది తెలు స్తుంది. దక్షిణ కొరియాలో ప్రతి పది లక్షల జనాభా కు దాదాపు 4,451 పేటెంట్లు నమోదవుతోంటే.. భారత్లో ఈ సంఖ్య 17 మాత్రమే! -
వేధింపులు తాళలేక.. సైంటిఫిక్ ఆఫీసర్ అదృశ్యం
ముంబై : బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బార్క్)లో సైంటిఫిక్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న బబితా సింగ్ అనే 30 ఏళ్ల యువతి ఆచూకీ లభించడం లేదు. పని చేసే చోట వేధింపులపై తల్లిదండ్రులతో చర్చించిన కొన్ని రోజుల్లోనే ఇంట్లోనుంచి వెళ్లిన బబితా సింగ్ కనిపించకుండా పోయింది. నవీ ముంబైలోని నీరుల్లో నివాసముంటున్న అధికారిణి జనవరి 23 నుంచి కనిపించకుండా పోయిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చివరిసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలిపారు. దీంతో బబితా సింగ్ కోసం వెతకగా ఆచూకీ లభించకపోవడంతో ఆ మరుసటి రోజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. బార్క్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆమె తన తల్లిదండ్రులకు ఈ మెయిల్ చేసినట్టు సమాచారం. అయితే మెయిల్లో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడిచలేదు. మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఉద్యోగ నియామక పరీక్షలకు కీలకమైన కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి? – ఎం.రవికుమార్, విజయవాడ ముందు అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవాలి. ముఖ్యఅంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతోపాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కూడా సమర్థంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం. n కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతోపాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది. n పత్రికలను చదవడం వల్ల కరెంట్ అఫైర్స్పై పట్టుతోపాటు వివిధ రంగాల (ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ. -
విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి కలిగించాలి
- ఇంటర్ వరకు మాతృభాషలోనే బోధన చేయాలి - సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి - విశ్వవిద్యాలయాల్లో సైన్స్ పరిశోధనను ప్రోత్సహించాలి - తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు సూచన యూనివర్సిటీ క్యాంపస్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కల్పించాలని, సైన్స్ టీచర్లు ఈ బాధ్యత తీసుకోవాలని, ఇంటర్ వరకు మాతృభాషలోనే బోధన జరగాలని తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు పేర్కొన్నారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ ప్రైజ్లు సాధించే శాస్త్రవేత్తలకు రూ. 100 కోట్ల నగదు బహుమతి అందిస్తా మని ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. మనదేశంలో పుణే, ముంబై ఐఐటీ, మద్రాస్లోని సత్యభామ వర్సిటీకి చెందిన విద్యార్థులు ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించారని, ఎస్వీయూ నుంచి ఎందుకు ఉపగ్రహాలను ప్రయోగించలేకపోయారని ప్రశ్నించారు. భవిష్యత్లో ఎస్వీయూ విద్యా ర్థులు కూడా ఉపగ్రహాలను ప్రయోగించాలని, ఆ దిశగా ప్రభుత్వం వనరులు సమకూర్చాలని సూచించారు. మనదేశంలో ప్రధాన సమ స్యలైన పేదరికం, ఆకలి, అభద్రత, వ్యాధులకు సంబంధించిన నివారణపై శాస్త్రవేత్తలు పరి శోధనలు కొనసాగించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పరిశోధనలు ప్రోత్సహిస్తే నోబెల్ బహుమతులు సాధించ వచ్చని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు ప్రాధాన్యత పెంచాలని, ప్రతి విశ్వవిద్యాలయం ఏడాదికి ఒకసారి సైన్స్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు. అత్యంత ఖరీదైన బహుమతి గెలుచుకోండి నోబెల్ సాధించే ఏపీకి చెందిన శాస్త్రవేత్తకు రూ. 100 కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటిం చారని, ప్రపంచంలో ఎక్కడా ఇంతఖరీదైన నగదు బహుమతి లేదని కేంద్ర మంత్రి వై.సుజనా చౌదరి పేర్కొన్నారు. బహుమతి సాధించే అంశం(బంతి) శాస్త్రవేత్తల కోర్టులోనే ఉందని, గట్టి ప్రయత్నం చేసి సాధించాలని పిలుపునిచ్చారు. ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగిన సైన్స్ కాంగ్రెస్కు 6 మంది నోబెల్ శాస్త్రవేత్తలు వచ్చారని, అనేక అంశా లపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ 104వ సైన్స్ కాంగ్రెస్ ఎస్వీయూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా, బొజ్జల, ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు, ఎస్వీయూ వీసీ దామోదరం, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఉన్నత విద్యామండలి ముఖ్య కార్యదర్శి సునీతాదావ్రా పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో విజ్ఞాన జ్యోతిని వచ్చే ఏడాది సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించే ప్రొఫెసర్ అచ్చుత సమంతాకు అందజేశారు. డీఆర్డీవోకు బహుమతి ఎస్వీయూలో సైన్స్ కాంగ్రెస్ సంబంధించి నిర్వహించిన మెగా ఎగ్జిబిషన్లో అన్నిటికన్నా ఎక్కువ ఆకట్టుకున్న డీఆర్ డీవో ప్రదర్శనకు బహుమతి లభించింది. డీఆర్డీవో సంస్థ అగ్ని, శౌర్య, ఆకాశ్ తదితర క్షిపణులతోపాటు పలురకాల అంతరిక్ష నౌకలు, మిస్సైల్స్ను ప్రదర్శిం చింది. వీటికి ఎక్కువ మంది ఆదరణ లభించడంతో ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్త నాగేశ్వరరెడ్డి అవార్డు అందుకు న్నారు. ఈయన ఎస్వీయూ పూర్వ విద్యార్థి కావడం విశేషం. అలాగే ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డీఎస్టీ, విట్, నిట్, జీఐఎస్, మినస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎఫ్ఎస్ఎస్ఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు కూడా పలు అవార్డులు అందుకున్నాయి. -
వంద కోట్లు సరే.. సదుపాయాలేవీ!
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రం నుంచి నోబెల్ బహుమతి సాధిస్తే.. ఆ శాస్త్రవేత్తకు రూ.100కోట్లు బహుమతిగా ఇస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై యువ శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు. రూ.100కోట్లు కాదు.. ముందు ఆ మొత్తంతో ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థల్లో కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. సైన్స్ కాంగ్రెస్లో భాగంగా ఎస్వీయూలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవర్స్ మీట్’ జరిగింది. ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ నారాయ ణరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇక్రిశాట్ యువ శాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాకర్ అవార్డు గ్రహీత డాక్టర్ రాజీవ్ కుమార్ వార్సిని మాట్లాడుతూ.. పరిశోధ నలు చేసేందుకు గానూ మెరుగైన ప్రయోగ శాలలు, పరిశోధనా సంస్థల్ని అందుబాటు లోకి తెస్తే నోబెల్ సాధించడం కష్టమేమీ కాదన్నారు. నోబెల్ విజేతలకు అందిస్తామన్న రూ.100 కోట్లను ఇందుకు వినియోగించాల న్నారు. ప్రభుత్వ రంగాన్ని వదలివేసి ప్రైవేటు రంగాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,835 మంది నోబెల్ బహుమతులు అందుకుంటే అందులో భారత సంతతికి చెందిన వారు ఐదుగురేనన్నారు. దేశం వ్యవ సాయంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల పరిశోధనల్లో మన భాగస్వామ్యం తక్కువగా ఉందన్నారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి ఎక్కువ ఉండటంతో వారు రిస్క్ తీసుకో వడం లేదన్నారు. భారత్లో శాస్త్ర సాంకేతిక రంగాలకు కేటాయించే నిధులు జీడీపీలో 0.8 శాతం మాత్రమేనన్నారు. -
‘జి.పుల్లారెడ్డి’కి అరుదైన అవకాశం
– డీఎస్టీ ఫిస్టు–2016 నిధులు మంజూరు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కళాశాలలో పరిశోధన, అభివృద్ధి కోసం ఫండ్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–2016లో భాగంగా 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ బీ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ. 30 లక్షలు, రెండో విడతలో మరో 30 లక్షల రూపాయలు రానున్నట్లు వివరించారు. ఈ నిధులను సైన్స్ పరికరాల కొనుగోలు కోసం వినియోగించేందుకు వీలుందన్నారు. దేశంలోని అతికొద్ది కళాశాలలకు మాత్రమే ఫీస్టు నిధులు మంజూరవుతాయని, అందులో తమ కళాశాలకు స్థానం లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సంవత్సరమే కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని అర్అండ్డీ విభాగం సీపీఈ(కాలేజ్ విత్ పొటెన్సియల్ ఎక్సాలెన్స్) స్థాయిని ఇచ్చిందని. ఏపీఎస్ఎస్డీసీ, పీఎంకేవీవై కింద మూడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మంజరైన విషయం విదితమేనని ఆయన వివరించారు. -
రూ.35 లక్షల కొత్త కరెన్సీ దారిమళ్లింపు
విశాఖ: నోట్ల రద్దు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్యాంకులు, ఏటీఎం లు ఎక్కడికి వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరెన్సీ సరఫరా లేక దేశమంతా ఓ పక్క ఇక్కట్లు ఎదుర్కొంటుంటే.. మరో వైపు కొత్త కరెన్సీ దారి మళ్లుతోంది. విశాఖ కేంద్రంగా రద్దైన పెద్ద నోట్లను మార్పిడి చేసి కోత్త నోట్లను ఇచ్చే దందా నడుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు 10 మందిని గురువారం అరెస్టు చేశారు. అక్రమంగా కొత్త నోట్లను దారి మళ్లిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తద్వారా ఆ అంశంపై దృష్టి పెట్టిన పోలీసులు 10 మంది సభ్యుల గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ సిబ్బంది చేతివాటం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలలో నింపాల్సిన కరెన్సీని బహిరంగ మార్కెట్లోకి బ్లాక్ మనీ దందాకు తెరతీశారు. ఇప్పటి వరకూ కోటిన్నర కరెన్సీ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలలో నింపాల్సిన రూ.74 లక్షల కొత్త కరెన్సీని మాయం చేశారు. ఏడాది కాలంగా ఏటీఎంలలో నగదు చోరీ చేస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు దాసరి శ్రీనివాస్తో పాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సామర్లకోట స్టేషన్లలలో సువిధ ట్రైన్లో 15 లక్షల కొత్త కరెన్సీతో శ్రీనివాస్ పట్టుబడటంతో ఏటీఎం స్కాం వెలుగులోకి వచ్చింది. -
డిసెంబర్ 7 నుంచి సైన్స్ ఫెస్టివల్
హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని యువతకు పరిచయం చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ వి.ఎం.తివారీ తెలిపారు. ఢిల్లీలో డిసెంబరు 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ సైన్స్ ఫెస్టివల్ జరగనుందని హైదరాబాద్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. దేశ రాజధానిలో జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు, యువతకూ దగ్గర చేసే లక్ష్యంతో ఎన్జీఆర్ఐ కూడా ఈ నెల 15వ తేదీ ‘ఓపెన్ డే’ పేరుతో అలాంటి కార్యక్రమాన్నే నిర్వహించనుందని వివరించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలతో విద్యార్థుల ముఖాముఖి, సైంటిఫిక్ వర్క్షాపులు ఉంటాయని, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుక్కునేందుకు జాతీయస్థాయిలో విద్యార్థుల కోసం పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, వాటివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తామన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని తివారీ తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేయసి కౌగిలితో.. తగ్గే తలనొప్పి
బాగా తలనొప్పిగా ఉందా.. తల పగిలిపోతోందా.. వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే తగ్గిపోతుందని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ అసలు టాబ్లెట్లతో పని లేకుండానే తలనొప్పి తగ్గే మంచి మార్గం ఒకటి ఉంది తెలుసా.. అదే మంచి కౌగిలి. మనను బాగా ప్రేమించేవాళ్లు ఆప్యాయంగా ఒక్కసారి కౌగలించుకుంటే.. తలనొప్పి, చికాకు అన్నీ ఎక్కడికక్కడే మాయమైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు మన నొప్పులను తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని, దీన్నే 'లవ్ ఇన్డ్యూస్డ్ అనల్జేసియా' అంటారని చెబుతున్నారు. అయితే.. ఎవరుపడితే వాళ్లు పట్టుకుంటే మాత్రం ఇలాంటి నొప్పులు తగ్గవట. ఎందుకంటే, వాళ్ల పట్ల మనకు ఎలాంటి ఫీలింగులు ఉండవని చెప్పారు. నొప్పులను మర్చిపోయేలా మెదడుకు సిగ్నల్ పంపాలంటే అవతలివాళ్లు మనల్ని బాగా ప్రేమించేవాళ్లు అయి ఉండాలని తెలిపారు. బ్రిటన్ వాసులు ఇలాంటి తలనొప్పులు వచ్చినప్పుడు మెడికల్ షాపు వద్దకు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే మందుల విలువ దాదాపు ఏడాదికి 4071 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఇలా మందులు వాడటం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని, ప్రత్యామ్నాయం ఏంటన్న ఆలోచనలు బాగా పెరిగాయి. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు ఈ 'కౌగిలి' మందును కనిపెట్టారు. ఇందుకోసం ఇజ్రాయెల్లోని హైఫా యూనివర్సిటీ పరిశోధకులు కొందరు వాలంటీర్లను తీసుకుని వాళ్లతో ప్రయోగాలు చేశారు. కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు వేర్వేరు వ్యక్తులను ముట్టుకోవడం, తర్వాత వాళ్లు ప్రేమించేవాళ్లతో కౌగిలి ఇప్పించడం లాంటివి చేశారు. అప్పుడే వాళ్లకు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభించినట్లు తేలింది. 2011లో అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి పరిశోధన ఒకటి జరిగింది. ప్రేమికుడు లేదా ప్రేయసి ఫొటోవైపు తదేకంగా చూసినా కూడా నొప్పి 44 శాతం తగ్గుతుందని అప్పట్లో చెప్పారు. -
వైవీయూలో మల్టీ ఛానల్ సిస్టం ఏర్పాటు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం, విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో కుదిరిన ఎంఓయూలో భాగంగా వైవీయూలో మల్టీఛానల్ మల్టీ కాన్ట్సులేషన్ సిస్టంను ఏర్పాటు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను వీఎస్ఎస్సీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్చౌదరి, సార్క్ కో–ఆర్డినేటర్, వైవీయూ ఫిజిక్స్ ప్రొఫెసర్ డా. కె. కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. వైవీయూలోని సర్ సీవీరామన్ సైన్స్బ్లాక్ పై భాగంలో ఏర్పాటు చేస్తున్న పనులను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సిస్టం ఏర్పాటు చేయడం ద్వారా వైవీయూ నుంచి 22 కిలోమీటర్ల పరిధిలోని ల్యాండ్ను గుర్తించడం, హద్దులు కనుగొనడం వంటివి స్పష్టంగా ఇంటర్నెట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. దీని పరిధిలో ఎక్కడ ఏమి జరిగినా జీపీఎస్ సిస్టం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. వీరి వెంట వీఎస్ఎస్సీ టెక్నికల్ ఆఫీసర్ డా. మహమ్మద్ నజీర్ ఉన్నారు. -
శాస్త్రీయ అవగాహన అవసరం
బనగానపల్లె రూరల్: ప్రతి విద్యార్థికీ శాస్త్రీయ అంశాలపై అవగాహన ఉండాలని ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్, జిల్లా ఇన్స్పైర్ అవార్డ్సు పరిశీలకురాలు లక్ష్మీవాట్స్ అన్నారు. బనగానపల్లెలోని నెహ్రూ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్ సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం అలవాటు చేయడం వల్ల వారిలో కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. నమూనాల తయారీలో విద్యార్థులకు తోడ్పాటునందించిన ఉపాధ్యాయులను డోన్ డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా సైన్స్ ఆఫీసర్ రామ్మోహన్, ఎంఈవో నాగమణి, నెహ్రూస్కూల్ కరస్పాండెంట్ కోడూరు హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి 30 నమూనాల ఎంపిక జిల్లా స్థాయిలో జరిగిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో నంద్యాల, డోన్ డివిజన్ల నుంచి మొత్తం 300 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో 30 నమూనాలను రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్కు ఎంపిక చేసిన్నట్లు లక్ష్మీవాట్స్ తెలిపారు. -
సైన్స్పై అవగాహన పెంచుకోవాలి
విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ జెడ్పీ చైర్పర్సన్ పద్మ నమిలిగొండ (స్టేషన్ఘన్పూర్) : విద్యార్థులు చదువుతోపాటు సైన్స్ ప్రయోగాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జి. పద్మ అన్నారు. మండలంలోని నమిలిగొండ శివారు ఆదర్శ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి ఇన్స్పైర్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయని చెప్పారు. డీఈఓ పెగడ రాజీవ్ మాట్లాడుతూ ఇన్స్పైర్ నిర్వహణకు నాలుగు కేటగిరీల్లో 16 కమిటీలు పనిచేస్తున్నాయన్నారు. నిట్, కాకతీయ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మొదటి రోజు ప్రదర్శనకు జనగామ డివిజన్ నుంచి 107, ములుగు నుంచి 88, వరంగల్ నుంచి 76, నల్లగొండ నుంచి 16 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. అనంతరం ఇన్స్పైర్-2015 జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇచ్చిన నవ్యశ్రీ,, కుమార్, నితిన్, క్రాంతికుమార్కు జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు మెమోంటోలు అందజేశారు. అలాగే రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మొక్కల రక్షణ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కేశవరావు, జనగామ డిప్యూటీ ఈఓ యాదయ్య, జెడ్పీటీసీ సభ్యుడు స్వామినాయక్, ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, నమిలిగొండ సర్పంచ్ మల్కిరెడ్డి ఆగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పులి యాకయ్య, ఎండీ దస్తగిరి, రాజేందర్, రాంచంద్రారెడ్డి, సంపత్కుమార్, ప్రేమానందరెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంత్, మీడియా ఇన్చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శాస్త్రీయంగా దిగుబడులు పెంచాలి
సీఎస్ఐఆర్ వేడుకల్లో మోదీ న్యూఢిల్లీ: క్షీణిస్తోన్న సాగుభూమి, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని పంట దిగుబడి పెంచేందుకు శాస్త్రీయ పరిష్కారాలు అవసరమని ప్రధాని మోదీ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ప్లాటినం జూబ్లీ సందర్భంగా సోమవారం శాస్త్రవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందాలన్నారు. ‘ప్రతీ చుక్కకు మరింత పంట అని ఎప్పుడూ చెప్పేవాడిని. అంగుళం నేల, విస్తారమైన పంట నినాదంపైనా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. 21వ శతాబ్దం సాంకేతిక విప్లవ శతాబ్దమని, భారత అవసరాలు శాస్త్రీయ పరిష్కారంతో తీరాలని, విజ్ఞానంతో సామాన్య ప్రజల్ని అనుసంధానం చేయడం ముఖ్యమని చెప్పారు. డెంగీ,చికున్ గున్యా, మలేరియా వంటి దోమలతో వ్యాపించే వ్యాధుల నిర్ధారణకు తక్కువ ఖర్చయ్యే వైద్య పరికరాల్ని అభివృద్ధి చేయాలని కోరారు. వైద్య రంగంలో సీఎస్ఐఆర్ అనేక ఆవిష్కరణలు అందించిందన్నారు. వైద్యుల కంటే పరికరాలు అనారోగ్యాన్ని సులువుగా కనిపెట్టేస్తాయని చమత్కరించారు. యోగా, ఆయుర్వేదంలో పరిశోధనలు చేయాలి ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదం గురించి మాట్లాడుకుంటోందని, ఆ రంగాల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కశ్మీర్కు చెందిన రైతులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. భట్నాగర్ అవార్డుల ప్రకటన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కేంద్రం ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల్ని ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో సుధీర్ కుమార్ వెంపటి, అనంత రామకృష్ణలు, జీవశాస్త్రంలో రిషికేష్ నారాయణ, సువేంద్ర నాథ్ భట్టాచార్య, పార్థసారథి ముఖర్జీ(రసాయన శాస్త్రం) సునీల్ కుమార్ సింగ్(భూమి, వాతావరణం, అంతరిక్ష శాస్త్రం), అవినాశ్ కుమార్, వెంకట నారాయణ(ఇంజినీరింగ్ సైన్స్) నవీన్ గార్గ్( గణిత శాస్త్రం), నియాజ్ అహ్మద్(వైద్య శాస్త్రం)లు భట్నాగర్ అవార్డుకు ఎంపికయ్యారు. లైఫ్ సెన్సైస్ విభాగంలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్బీఆర్ఐ), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ, లక్నో)లు సీఎస్ఐఆర్ అవార్డుల్ని గెలుచుకున్నాయి. -
క్షిపణి విధ్వంసక నౌక మోర్ముగావో జలప్రవేశం
క్షిపణి విధ్వంసక నౌక మోర్ముగావో ప్రారంభం భారత నౌకా దళానికి చెందిన అధునాతన క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక మోర్ముగావోను నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా సెప్టెంబర్ 17న ముంబైలో ప్రారంభించారు. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధి చేసింది. మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకె ట్లను ప్రయోగించవచ్చు. ఇది 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. గస్తీ నౌక రాణి గెయిడిన్లీ.. తీర గస్తీ దళానికి అప్పగింత భారత తీర గస్తీ దళం కోసం విశాఖ షిప్యార్డ్ రూపొందించిన గస్తీ నౌక రాణి గెయిడిన్లీని సెప్టెంబర్ 14న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించారు. ఈ నౌక పొడవు 51.5 మీటర్లు, వెడల్పు 8.3 మీటర్లు. స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను ప్రయోగించిన చైనా అంతరిక్ష కేంద్రానికి అవసరమైన స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను చైనా సెప్టెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించింది. 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ల్యాబ్ను పంపింది. దీన్ని గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగించారు. అవార్డులు ఆర్థిక స్వేచ్ఛలో భారత్కు 112వ స్థానం ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించి భారత్ ప్రపంచంలో 112వ స్థానంలో నిలిచింది. ఎకనమిక్ ఫ్రీడం ఆఫ్ ది వరల్డ్-2016 వార్షిక నివేదిక.. 159 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో హాంకాంగ్ మొదటి స్థానంలో, సింగపూర్, న్యూజిలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పప్పుల మద్దతు ధర పెంపునకు కమిటీ సిఫార్సు దేశంలో పప్పుల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.1,000 చొప్పున పెంచాలని, ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సెప్టెంబర్ 16న నివేదికను సమర్పించిన కమిటీ.. దానిలో సాగు పెంపు, ధరల అదుపు దిశగా పలు సంస్కరణలను సూచించింది. యుద్ధ ప్రాతిపదిక న పప్పుల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరింది. ఆగస్టులో 3.74 శాతానికి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఆగస్టు నెలలో 3.74 శాతానికి చేరుకుంది. ఇది జూలైలో 3.55 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న విడుదల చేసింది. జూలైలో 11.82 శాతంగా ఉన్న ఆహార ధరల సూచీ ఆగస్టులో 8.23 శాతంగా నమోదైంది. సదస్సులు బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం ద క్షిణ గోవాలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 16న ముగిసింది. ఈ సమావేశంలో హరిత సంబంధిత అంశాలపై పరస్పర సహకారానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పారిస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు, సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ (ఇండిపెండెంట్ చార్జ) మంత్రి అనిల్ దవే తెలిపారు. వైజాగ్లో పట్టణీకరణపై బ్రిక్స్ సదస్సు విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పట్టణీకరణ ఆవశ్యతక, దాని వల్ల తలెత్తే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. పట్టణీకరణ సమస్యలపై ప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. కాలుష్య తగ్గింపుపై బ్రిక్స్- భారత్ ఒప్పందం వాయు, జల కాలుష్య నియంత్రణకు సంబంధించి బ్రిక్స్ దేశాలతో కలిసి భారత్ అవగాహన పత్రంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వ హణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలున్నాయి. వార్తల్లో వ్యక్తులు యూపీఎస్సీ చైర్మన్గా అల్కా సిరోహి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన ైచైర్మన్గా అల్కా సిరోహి సెప్టెంబర్ 18న నియమితులయ్యారు. ఆర్సీఐ డెరైక్టర్గా నారాయణ మూర్తి: ప్రముఖ శాస్త్రవేత్త బీహెచ్వీఎస్ నారాయణమూర్తి సెప్టెంబర్ 14న డీఆర్డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డెరైక్టర్గా బాధ్యతలు చేపట్టారు. పౌర హక్కుల నేత బొజ్జా తారకం మృతి: పౌర హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం (77) సెప్టెంబర్ 16న హైదరాబాద్లో మరణించారు. ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై దళితుల పక్షాన సుప్రీంకోర్టులో పోరాడి దోషులకు శిక్ష పడేలా చేశారు. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో ఇన్స్పైర్ అవార్డు 2016 రెండు జిల్లాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రెండోరోజు శనివారం అనూహ్య స్పందన లభించింది. కరీంనగర్, నిజామాబాద్ నుంచి 172 ఎగ్జిబిట్స్ను ప్రదర్శించినట్లు జిల్లా సైన్స్ఫేర్ అధికారి స్వదేశీ కుమార్ తెలిపారు. ప్రదర్శనను మండలంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు కరీంనగర్ నగరంలోని పాఠశాలలు, ఇతర పాఠశాలల విద్యార్థులు రావడంతో ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నిజామాబాద్ డీఎస్వో గంగాకిషన్, మండల విద్యాధికారి లక్ష్మణ్రావు, న్యాయనిర్ణేతలు, రిసోర్సు పర్సన్లు కిషన్రెడ్డి, వెంకన్న, నరేష్, సురేందర్, అనంతాచార్య, శర్మ, రవీందర్ పాల్గొన్నారు. -
15న శాస్త్ర సాంకేతిక ప్రదర్శన
మెదక్: ఈనెల 15వ తేదిన తమ పాఠశాలలో శాస్త్ర సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రధానాచార్యులు పురం చంద్రకళ శనివారం ఓప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించడానికి భారత ప్రభుత్వ సాంస్క ృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యా భారతి సంస్క ృతి శిక్షా సంస్థాన్, కురుక్షేత్ర ద్వారా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనలో పట్టణంలోని 12 పాఠశాలల నుంచి సుమారు 500మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. -
కొత్త జిల్లాల విభజనలో శాస్త్రీయత ఏదీ?
వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల విభజనలో పూర్తిగా శాస్త్రీయత లోపించిందని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వప్రయోజనాల కోసం జరిగే కొత్త జిల్లాల విభజన ను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ‘తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండి అన్న రీతిలో టీఆర్ఎస్ ప్రజల మధ్య జిల్లాల చిచ్చు పెట్టింది. 64 మండలాలుగా ఉన్న మహబూబ్నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా, ఆరు రెవెన్యూ డివిజన్లుగా చేశారు. అదే 46 మండలాలున్న మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా, ఏడు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. పది మండలాలున్న మల్కాజ్గిరిని ఒక జిల్లా చేశారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరినా చేయలేదు. 20 సంవత్సరాలుగా ప్రజలు కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో ప్రజలు జనగామను జిల్లాగా చేయాలని ధర్నాలు, నిరసనలు చేస్తూంటే అది కాదని ప్రజలు కోరని హన్మకొండను జిల్లా చేశారు’ అని వివరించారు. ఏ ప్రాతిపదికన చేశారు? జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన చేశారో అర్థం కావడం లేదని శివకుమార్ అన్నారు. ‘459 మండలాలను 505 మండలాలుగా, పది జిల్లాలను 27 జిల్లాలుగా చేశారు. తహసీల్దార్లకు తెలియకుండానే మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరిగిపోయిరది. జిల్లా ముసాయిదా ఎలాంటి కసరత్తు లేకుండానే విడుదల చేశారు. నగరంలోని హయత్ నగర్ ఎక్కడ.. శంషాబాద్ ఎక్కడ.. రెండింటినీ కలపడం ఏంటి? జిల్లాల ఏర్పాటు కోసం ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితిని సీఎం కేసీఆర్ కల్పించారు. ఐదు రోజుల క్రితం డ్రాఫ్ట్ను ప్రభుత్వం విడుదల చేస్తే.. ఆన్లైన్లో 6 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఇవి లక్షకు చేరుకునే పరిస్థితులున్నాయి. జిల్లాల వారీగా వచ్చిన ఫిర్యాదు కాపీలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేయాలి’ అని ఆయన కోరారు. జిల్లాల విభజనపై టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే.. ప్రజలు మాత్రం రోడ్లపైకి చేరుకొని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారని శివకుమార్ అన్నారు. -
ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బదులుగా పిల్స్..!
మధుమేహాన్ని తగ్గించే రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లకు బదులుగా పిల్ ను అభివృద్ధి చేశారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కొత్తరకం ఇన్సులిన్ పిల్ ను తయారు చేసినట్లు నయాగరా యూనివర్శిటీ ప్రొఫెసర్ మేరే మెక్ కోర్ట్ పరిశోధక బృందం వెల్లడించింది. తమ పరిశోధనలను ఇప్పటికే ఎలుకలపై పరీక్షించి విజయవంతమైన అధ్యయనకారులు మరిన్ని జంతు పరీక్షల అనంతరం అందుబాటులోకి తెస్తామంటున్నారు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని.. డయాబెటిస్ అనికూడా వ్యవహరిస్తారు. ఈ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడంవల్ల రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో ఓ రుగ్మతగా మారుతుంది. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, ఉన్నట్లుండి బరువు తగ్గిపోవడం, బద్ధకంగా ఉండటంవంటి లక్షణాలు ఈ వ్యాధిగ్రస్థుల్లో కనిపిస్తాయి. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం భారత్, చైనాలతోపాటు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వ్యాధి అత్యధికంగా ఉంది. 2014 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 422 మిలియన్ల ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతుంటే మరికొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన టైప్-2 డయాబెటిస్ కలిగి ఉన్నారు. అయితే ఇలా ఇంజెక్షన్ తరచుగా తీసుకోవడం వల్ల వచ్చే నొప్పినుంచీ బాధితులకు కొంత ఉపశమనం ఇచ్చే విధంగా పరిశోధకులు 'ఇన్సులిన్ పిల్' ను కనుగొన్నారు. ఈ 'పిల్స్' రక్తంలో కరిగి పోయేందుకు వీలుగా ఫ్యాట్ కోటింగ్ తో తయారు చేస్తున్నారు. నోటిద్వారా వేసుకునేందుకు వీలుగా తయారైన ఇన్సులిన్ పిల్స్.. ఇన్పులిన్ సరఫరా చేసే చిన్న వెసిల్స్ ఉపయోగించి నూతన మార్గంలో అభివృద్ధి చేస్తున్నట్లు న్యూయార్క్ నయాగరా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేరీ మెక్ కోర్ట్ తెలిపారు. కొలెస్టోసమ్ అనే కొత్త సాంకేతికతను వినియోగించి ఈ పిల్స్ తయారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మెక్ కోర్ట్ టీమ్ కొత్త పద్ధతిలో అభివృద్ధి పరచిన ఈ ఇన్సులిన్ పిల్ కు ల్యాబ్ లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. ఇన్సులిన్ లోడ్ చేసిన కొలెస్టోసమ్స్ ను ముందుగా ఎలుకలపై ప్రయోగించిన పరిశోధకులు... మరిన్ని జంతు పరీక్షలు నిర్వహించిన అనంతరం మనుషులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం తమ పరిశోధనా ఫలితాలను ఫిలడెల్ఫియా అమెరికన్ కెమికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ప్రదర్శించారు. -
ఎస్సీఎల్యూ భవితవ్యమేమిటి ?
టీబీజీకేఎస్లో విలీనమా.. l కలిసి పనిచేయడమా..! అయోమయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్(ఎస్సీఎల్యూ) వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా నియామకం కావడంతో ఎస్సీఎల్యూ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కొంత కాలం క్రితం గోదావరిఖనిలో జరిగిన యూనియన్ సమావేశంలో టీబీజీకేఎస్తో కలిసి పనిచేయడానికి వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తనతో కలిసి వచ్చే నాయకులతో సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన వెంట వెళ్లే నాయకులెందరనేది సంశయంగా మారింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెంకట్రావు వ్యవహరిస్తున్నందున ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఎస్సీఎల్యూను అందులో విలీనం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ భవిష్యత్లో టీబీజీకేఎస్ నుంచి బయటకు వచ్చినా.. తిరిగి ఎస్సీఎల్యూ ద్వారా సింగరేణి లో కార్యకలాపాలు నిర్వహించేందుకు కలిసి పనిచేయా లా? అనే మరో ఆలోచన సైతం చేస్తున్నట్లు సమాచారం. బలోపేతం కానున్న ఎస్సీఎస్డబ్ల్యూయూ సింగరేణిలో నిన్నటి వరకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి సింగరేణిలో రెండు యూనియన్లు పనిచేశాయి. వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్సీఎల్యూ, జనక్ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఎస్సీఎస్డబ్ల్యూయూ) కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే వెంకట్రావు టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెళ్లడంతో ఎస్సీఎల్యూలో కొనసాగే క్యాడర్, కాంగ్రెస్ అభిమానులు సహజంగా ఎస్సీఎస్డబ్ల్యూయూకే మద్దతు తెలుపుతారు. ప్రస్తుతం ఎస్సీఎల్యూ వర్కింగ్ కమిటీలో 63 మంది సభ్యులుండగా అందులో 43 మంది జనక్ప్రసాద్ యూనియన్లో చేరడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. అలాగే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఒకే యూనియన్ సింగరేణిలో పనిచేయనుండడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. 1998లో జరిగిన మొదటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ‘సాజక్’ పేరుతో పోటీచేసి ఆర్జీ–1, 2 డివిజన్లను గెలుచుకుంది. తర్వాత 2007 ఎన్నికల్లో వెంకట్రావుతో కలిసి పనిచేసి గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ను ఓడించడానికి సంజీవరెడ్డి సూచన మేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసి పోటీచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో గోదావరిఖనిలో జరి గిన ఐఎన్టీయూసీ మహాసభల్లో పాల్గొన్న యూనియన్ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఒకే యూనియన్ ఉంటుందని చెప్పారు. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతుండడంతో యూని యన్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. ‘మిర్యాల’తో మంతనాలు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మిర్యా ల రాజిరెడ్డిని యూనియన్లో స్థానం లేకుండా చేయడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ అనుబంధ యూనియన్లో చేర్చుకునేందుకు మాజీ మంత్రి శ్రీధర్బాబు, ఎస్సీసీడబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, బడికెల రాజలిం గం, గుమ్మడి కుమారస్వామి తదితర నాయకులు మిర్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి సెంటినరీకాలనీలోని నివాసంలో రాజిరెడ్డిని కలిసి యూనియన్లోకి రావాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని యూని యన్ నుంచి తొలగించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు సమావేశమై టీబీజీకేఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసురావాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ యూనియన్, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు వారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
యూనివర్సిటీలో ఎడ్యు‘కేట్లు’
– ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఇష్టారాజ్యం – ఇద్దరి అధికారుల కనుసన్నల్లో ఐదు బీపీఈడీ కళాశాలలు – అర్హత లేకున్నా మంజూరు చేయించిన వైనం – యూనివర్సిటీ పేర్కొన్న చోట ఓ కాలేజీ లేనేలేదు – ‘అవగాహన ఒప్పందం’తో ముందుకు సాక్షి ప్రతినిధి, తిరుపతి తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విశిష్టమైన పేరు ప్రతిష్టలున్నాయి. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగి, వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన గొప్పవారిని తీర్చిదిద్దిన విశాలమైన శారదా నిలయమిది. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన సమున్నత రాజకీయ శిక్షణాశాల కూడా. వీరు కాక మరెంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, సాహిత్య కోవిదులతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను పరిచయం చేసిన వర్సిటీ ఇది. ఇంతటి పేరున్న యూనివర్సిటీ ప్రాభవం నేడు మసకబారుతోంది. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది. పలు విభాగాల్లో నెలకొన్న తీవ్రమైన నిర్లక్ష్యం వర్సిటీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వసతులు కనుమరుగవుతున్నాయి. దీంతో ఏయేటికాయేడు వర్సిటీ అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఎస్వీయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగమే ఇందుకు ఉదాహరణ. ఈ విభాగాన్నీ, ఇక్కడున్న విద్యార్థులను దగ్గరగా పరిశీలిస్తే నోరు తెరవాల్సిందే. ఎవర్ని పలకరించినా ఆశ్చర్యం కలిగించే ఆసక్తికర విషయాలు చెవుల్లో గంట కొడతాయి. కళ్లు విప్పార్చి ఔనా !! అనాల్సిందే మరి. అక్రమార్జనలో వీరి రూటు సప‘రేటు’ సంపాదనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. కొందరు వ్యాపారం చేసి, మరికొందరు ఉద్యోగం చేసి...ఇంకొందరు తెలివి తేటలను ఉపయోగించి. కానీ....వర్సిటీలోని కొందరు టీచింగ్ స్టాఫ్ అడ్డదారిలో రెండు చేతులా సంపాదిస్తున్నారు. వసూల్ రాజాలుగా మారి విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై ఇటీవల బోలెడన్ని ఆరోపణలు హల్చల్ చేశాయి. వీరిపైనా ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలు కూడా విద్యార్థులు, అధ్యాపకవర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. ఇక్కడున్న ఆరోపణలను ఒక్కొక్కదాన్నీ విశ్లేషిస్తే..... వర్సిటీ పరిధిలోని ఐదు బీపీఈడీ కాలేజీలకు సరైన అర్హతలు లేకున్నా వర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏడాది కిందట అనుమతులు మంజూరు చేయించారు. ఓ బీపీఈడీ కళాశాల దరఖాస్తులో పేర్కొన్న చోటలేనే లేదు. దీంతో ఆ కళాశాల యాజమాన్యంతో సరైన ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకున్న వీరిద్దరూ తమకు అనుకూలమైన మరో కాలేజీలో విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించేలా సాయమందించారు. 2014–15 సంవత్సరంలో ఏస్వీయూ పరిధిలోని ఐదు బీపీఈడీ కాలేజీల్లో మొదటి రెండు సెమిస్టర్లు జరిగాయి. ఒక్కొక్క సెమిస్టర్లో 3 థియరీ, 2 ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఎస్వీయూ బీపీఈడీ మినహా మిగిలిన నాలుగు కాలేజీలకూ ఎక్సటర్నల్ ఎగ్జామినర్లుగా వీరిద్దరే వెళ్లి, ఆ తర్వాత ఆయా కాలేజీలకు చెందిన 3 వేల సమాధాన పత్రాలను వీరే దిద్దారు. అప్పట్లో 300 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేల చొప్పున సంభావన పుచ్చుకుని వీరందర్నీ పాస్ చేయించారన్న ఆరోపణలు ఇటీవల తెరమీదకొచ్చాయి. అప్పట్లో నాన్ టీచింగ్ స్టాఫ్గా ఉన్నవాళ్లు పేపర్ కరెక్షన్లు ఎలా చేస్తారన్నది ప్రశ్న. విచారణ జాడేలేదు.. మరో ముఖ్యమైన విషయమేమంటే... 2014లో ఓ విద్యార్థిని ఎంఫిల్ రెగ్యులర్ స్కాలర్గా ఎస్వీయూలో ప్రవేశం పొందింది. ఆ తరువాత రెండ్రోజులకే ఆమె దుబాయ్ వెళ్లింది. అయితే ఆ విద్యార్థినికి 2016లో ఎంఫిల్ పట్టా ఇచ్చి పీహెచ్డీ ప్రవేశాన్ని కల్పించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అక్రమాలు. వీరికంటే ముందు పనిచేసిన ఓ ‘బాబు’ తన ఉద్యోగ కాలమంతా అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు సర్వత్రా గుప్పుమంటున్నాయి. ఈయన ఘన కార్యాలను వివరిస్తూ ఈ మధ్యనే ఓ భారీ కరపత్రం విడుదలైంది. ఇందులో సదరు అధికారి అవినీతి అక్రమాల చిట్టా ఉంది. సమ్మర్ క్యాంప్ కోసం విడుదలైన సొమ్ము మింగేయడం దగ్గర నుంచి వేలకు వేలు లంచాలుగా తీసుకుని అడ్డదారిలో విద్యార్థులను పాస్ చేయించే వరకూ ఆరోపణలున్నాయి. వీటిపై విచారణలే లేకుండా పోయాయి. చీకటి గదుల్లో విద్యార్థులు వర్సిటీ బీపీఈడీ విద్యార్థుల దుస్థితి కడు దయనీయంగా ఉంది. సరైన వసతి సదుపాయాలు లేక వీరు నానా అవస్థలు పడుతున్నారు. ఉండేందుకు సరైన గదులు లేక వంటరూముల్లోనూ గడుపుతున్నారు. బాత్రూములు, తాగునీరు, ఫ్యాన్లు లేక నానా ఇక్కట్లకు గురవుతున్నారు. కరెంటు లేని రాత్రుల్లో కాలసర్పాల సాహచర్యంలో దినమొక గండంగా గడుపుతున్నారు. వర్సిటీ ఉన్నతాధికారులేం చేస్తున్నట్టు?? వర్సిటీలోని ఓ కీలక విభాగంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అన్నీ తెలిసి మిన్నకుంటున్నారా, లేకపోతే తెలియని పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా వర్సిటీని చక్కదిద్దే బాధ్యత వీరిపైనే ఉంది. -
ఉత్తమ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
హిందూపురం టౌన్ : విద్యార్థుల్లో ఉన్న ప్రేరణను ఉపాధ్యాయులు వెలికితీసి ఉత్తమ శాస్త్రవేత్తలుగా తయారు చేయాలని ౖఎస్సీఈఆర్టీ (హైదరాబాద్) అధికారి లక్ష్మిమిఠల్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని చిన్మయా పాఠశాలలో ప్రేరణ అవార్డులపై ఎంఈఓ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో ఒకరు లేదా ఇద్దరికి ప్రేరణ అవార్డులు వచ్చిన వారికి రూ.5 వేల చొప్పున నగదు అందించామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారి నాగభూషణం, జిల్లా సైన్స్ సెంటర్ అధికారి ఆనంద్భాస్కర్, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్లు సలీమ్, ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ భూమి కుంగింది
చింతకొమ్మదిన్నె: వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లెలో శనివారం మధ్యాహ్నం రైతు శ్రీనివాసులురెడ్డికి చెందిన పొలంలో దాదాపు పది అడుగుల వెడల్పు, ఏడు అడుగుల లోతుతో ఉన్నట్లుండి భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. మామిడి మొక్కలను పరిశీలించేందుకు వెళ్లిన రైతుకు శబ్దం వినిపించడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, అప్పటికే గుంతపడినట్లు చెబుతున్నారు. గతంలో ఈ రైతుకు సంబంధించిన పసుపు పంటల్లో దాదాపు 20 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో రెండు భారీ గుంతలు ఏర్పడ్డాయి. నాయనోరిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి,పెద్ద ముసల్రెడ్డిపల్లె గ్రామాల్లో గతంలో భారీవర్షం కురిసినప్పుడే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా ప్రస్తుతం రెండు రోజుల నుంచి మండలంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో మళ్లీ గుంతలు పడుతున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర శాస్త్రవేత్తల బృందం భూమి కుంగిన ప్రాంతాలను పరిశీలించి వాటి కొలతలను, మట్టిని సేకరించి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఎలాంటి నివేదికను అందించకపోగా ప్రస్తుతం తిరిగి గుంతలు పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా శబ్దం వచ్చింది శనివారం మధ్యాహ్నం మామిడి మొక్కలను పరిశీలించేందుకు పొలం వద్దకు వెళ్లాను. పొలంలో అటు ఇటు తిరుగుతుండగా ఒక్కసారిగా శబ్దం వచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే పెద్దపాటి గుంత ఏర్పడడంతో భయాందోళనకు గురయ్యాను. గతంలో పసుపు పంటలో ఇలాంటి గుంతలు భారీ తరహాలో ఏర్పడ్డాయి. ఎప్పుడు ఎక్కడ భూమి కుంగుతుందో అర్థం గాక పొలాల వద్దకు రావాలంటే భయమేస్తోంది. – శ్రీనివాసులురెడ్డి, రైతు, గూడావాండ్లపల్లె -
మురుగు నీళ్లతో సాగునీరు!
సాక్షి, న్యూఢిల్లీ: మురుగునీటిని శుద్ధి చేసి సాగుకు పనికొచ్చేలా మార్చే కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. భారత్, యూరోపియన్ యూనియన్లకు చెందిన 11 సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహకారంతో ‘వాటర్ ఫర్ క్రాప్స్’ ప్రాజెక్ట్ కింద పరిశోధనలు జరిపి దీన్ని రూపొందించాయని వెల్లడించారు. గత 4 ఏళ్లుగా ‘వాటర్ ఫర్ క్రాప్స్’ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్లోని ఇక్రిసాట్ సమన్వయంతో జరిపిన పరిశోధనలు, ప్రణాళికలను ఆయన బుధవారం సమీక్షించారు. మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడితే 40 శాతం అధిక దిగుబడి వస్తుందన్నారు. ఈ నీటిలో నత్రజని, భాస్వరం ఉంటాయని, అందువల్ల ఎరువుల వాడకం తగ్గుతుందని, సాగు చేసిన పంటలు సురక్షితమని తెలిపారు. రూ. 3 నుంచి 5 లక్షల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపించాయని, ఇక్రిసాట్ సహకారంతో ఏపీలో పైలట్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. -
సైంటిస్ట్లుగా సింగరేణి కార్మికుడి కుమారులు
ఆదిలాబాద్: సింగరేణి కార్మికుడి పిల్లలు వ్యవసాయ శాఖలో సైంటిస్ట్లుగా రాణిస్తున్నారు. పేదరికాన్ని జయించి చదివే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భూపాలపల్లి ఏరియా పరిధి కోల్హ్యాండ్లింగ్ ప్లాంట్లో సర్ఫేస్ జనరల్ మజ్దూర్ గోకినపల్లి వెంకటేశ్వర్లు కుమారులు ఇద్దరు వ్యవసాయశాఖలో పలు పరిశోధనలు చేపట్టారు. వెంకటేశ్వర్లు 1991లో కొత్తగూడెంలో సింగరేణిలో ఉద్యోగంలో చేరి నవంబర్ 2003లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 3లోకి వచ్చారు. ప్రస్తుతం కేటికే 5లో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసిన ఆయన కుమారులు శేషు, సతీష్ చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. పెద్దకుమారుడు శేషు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బీఎస్సీ(అగ్రి) చదివి, హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 2013లో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో పీహెచ్డీ చేసి సీఆర్ఐడీఏ హైదరాబాద్లో ఒక ఏడాది రిసెర్చ్ చేశాడు. 2014లో మహబూబ్నగర్లోని పాలెంలో ఆర్ఏఆర్ఎస్లో సైంటిస్ట్గా చేరి, ప్రస్తుతం అక్కడే పరిశోధనలు చేస్తున్నారు. ఆయన కృషిని చూసిన సంబందిత శాఖ బంగారు పతకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 4న కేంద్ర అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఫార్మల్ వెల్ఫేర్ కార్యదర్శి సీరాజ్ హుస్సేన్(ఐఏఎస్) చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రెండో కుమారుడు సతీష్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2012లో బీఎస్సీ, 2014లో ఎంఎస్సీ పూర్తి చేశారు. ప్రసుత్తం పశ్చిమ బెంగాల్లోని బిదాన్ చంద్ర క్రిషి విశ్వ విద్యాలయలో పీహెచ్డీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రజలకు సహాయ పడాలన్నదే తన ఆశయమని తెలిపారు. -
బెడ్ విధానంతో పసుపులో అధిక దిగుబడి
► హార్టికల్చర్ ఓఎస్డీ కిషన్రెడ్డి, డీడీహెచ్ సంగీత లక్ష్మి ► కోరుట్లలో పసుపు రైతులకు అవగాహన సదస్సు కోరుట్ల రూరల్ : బెడ్ విధానం సాగుతో పసుపు పంటలో అధిక దిగుబడి సాధించవచ్చని హార్టికల్చర్ ఓఎస్డీ, శాస్త్రవేత్త కిషన్రెడ్డి, డీడీహెచ్ సంగీతలక్ష్మీ అన్నారు. సోమవారం పట్టణంలోని వాసవీ కల్యాణ భవనంలో పసుపు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పసుపులో శాస్త్రీయ విధానం, విత్తనాల ఎంపిక తదితర అంశాలను రైతులకు వివరించారు. ఈ పద్దతిలో 4 అడుగుల వెడల్పులో బోజలు నిర్మించి విత్తనాలు వేయాలన్నారు. ఒక్కో ఎకరానికి 2 క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుందని, ఈ విధానం ద్వారా రైతులు ఒక్కో ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడి సాధించవచ్చన్నారు. ఈ విధానంలో తేమ శాతం తక్కువ అవసరమన్నారు. దీని కోసం డ్రిప్ సిస్టం తప్పని సరిగా వినియోగించాలన్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం డివిజన్లో మొదటి విడతలో 70 మంది రైతులను ఎంపిక చేసి, వీరికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు రూ.50వేలలో 70 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఒక్కో రైతుకు రూ.35 నుంచి రూ.38 వేల వరకు రాయితీ అందజేస్తామని వివరించారు. పంటకు ఏమైనా చీడపీడలు ఆశించి నష్టం చేస్తే ఫోటోలను వాట్సప్ ద్వారా తమకు పంపితే నివారణ పద్దతులు సూచిస్తామన్నారు. ఈ విధానాన్ని అమెరికాలో వాట్సప్ అగ్రికల్చర్ అంటారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఈ విధానాన్ని మరింత విస్తరించటానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలువురు రైతులు మాట్లాడుతూ డ్రిప్ పరికరాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుందని, ప్రభుత్వం తగినంత బడ్జెట్ కేటాయించి డ్రిప్ పరికరాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్-2 జగిత్యాల మరియన్న, హార్టికల్చర్ అధికారి జావిద్ పాషా, హెచ్ఈఓలు రమేష్, వాసవి, అన్వేష్, అనిల్, హార్టీకల్చర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
హడావుడి వద్దు.. శాస్త్రీయంగా చేయండి
♦ కొత్త జిల్లాలపై అఖిలపక్షాన్ని సమావేశపరచి ♦ అన్ని ప్రతిపాదనలపై చర్చించండి: సీఎల్పీ నేత జానారెడ్డి ♦ ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల వాదనలూ వినండి ♦ నియోజకవర్గాల విభజన తర్వాతే.. జిల్లాలను విభజిస్తే బాగుంటుంది ♦ జిల్లా పరిషత్ల విషయంలోనూ సమస్యలు వస్తాయి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని హడావుడిగా కాకుండా శాస్త్రీయంగా చేపట్టాలని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత కుందూరు జానారెడ్డి సీఎం కేసీఆర్కు సూచించారు. జిల్లాల విభజన విషయంలో ప్రజల డిమాండ్లను, పార్టీల అభిప్రాయాలను తీసుకుని సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. శనివారం నల్లగొండలో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జిల్లాల విభజనను పరిశీ లిస్తే.. పాలనా సౌలభ్యం కోసం ఒక రాష్ట్రం లోని కొన్ని జిల్లాలనే విభజించిన సందర్భాలున్నాయి కానీ, రాష్ట్రం మొత్తాన్ని విభజించిన సందర్భాలు లేవని అన్నారు. ‘ప్రజ లు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రతిపాదనల్ని సమగ్రంగా చర్చించండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ, 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాలను పునర్విభజించినప్పుడు కానీ అందరితో చర్చించిన తర్వాతే అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాల విషయంలో అలాగే చేయాలి’ అని జానా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల విభజన అంశాన్నీ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మరో 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేసుకునే వీలుంది. పార్లమెంటు స్థానాలకు అనుగుణంగా ఆ నియోజకవర్గాలను విభజించాలి. ఆ విభజన పూర్తయితేనే ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉంటుందో తేలుతుంది. అప్పుడే జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టా లి. అలాకాక ఫలానా మండలం ఫలానా నియోజకవర్గంలో ఉంటుందని, ఫలానా నియోజకవర్గం ఫలానా పార్లమెంటు స్థానంలో ఉంటుందని ఊహించుకుని చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి’ అని ఆయన అన్నారు. అదే విధం గా జిల్లా పరిషత్ల ఏర్పాటు విషయంలో రిజర్వేషన్ల సమస్య వస్తుందని, అన్ని విషయాలపై న్యాయకోవిదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జానారెడ్డి కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుంటే చేతికి చిప్పే గతి: ఎంపీ గుత్తా జిల్లాల విభజన విషయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ అసంతృప్తి ఉందని, వారు బయటకు చెప్పడం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మాట్లాడకపోతే.. ప్రజలు వారి చేతికి చిప్ప ఇస్తారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాలన్న దురాలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెళుతోందని, ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే అది మెడలో పామై పడుతుందని ఆయన హెచ్చరించారు. -
ఇక అంతా ఆటోమెటిక్
♦ సిటీలో కొత్త డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు! ♦ కేరళ తరహాలో వీడియో సెన్సర్ల ఏర్పాటు ♦ అమలు దిశగా రవాణాశాఖ సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో నగరంలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునికీకరించనుంది. డ్రైవింగ్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చెల్లోని డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. దీంతో సరైన నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లెసైన్సులు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజుల క్రితం కేరళలోని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లను అధ్యయనం చేసింది. అక్కడి పద్ధతిలో ఎంవీఐల జోక్యం ఉండదు. వీడియో సెన్సర్లు కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఈ సెన్సర్లు నమోదు చేస్తాయి. ఈ కదలికల ఆధారంగా సదరు వ్యక్తి నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసి సర్టిఫికెట్ ఇస్తారు. రవాణాశాఖ నిర్ధారించిన ప్రమాణాలకు విరుద్ధంగా వాహనాలు నడి పిన వారు ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్లు వస్తాయి. అమలు దిశగా సన్నాహాలు.. కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరుతూ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా ‘సాక్షి’తో చెప్పారు. కచ్చితమైన నిఘా.. ప్రస్తుతం లెర్నింగ్ లెసైన్సు, డ్రైవింగ్ లెసైన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ వంటి పౌరసేవల కోసం వినియోగదారులు ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ రకాల సేవల కోసం ఈ సేవ కేంద్రాల్లోనూ, ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించే పద్ధతి అందుబాటులోకి తెచ్చారు. డ్రైవింగ్ పరీక్షల్లో మాత్రం సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎంవీఐల పరిశీలనే ప్రధానంగా ఉంది. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే లెసైన్సులు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లు దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లోనే వీడియో సెన్సర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు వాహనం నడిపే తీరును సెన్సర్ల ద్వారా పరిశీలించి పాస్, ఫెయిల్ను నిర్థారిస్తారు. -
రాజీవ్గాంధీ సేవలు మరువలేనివి
డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మహబూబ్నగర్ అర్బన్ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపడంలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ పాత్ర ఎంతో కీలకమని, ఆయన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. శనివారం డీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ వర్దంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా స్థానిక అశోక్టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ విగ్రహానికి , డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్కే దక్కిందన్నారు. ఆయన కృషి ఫలితంగానే గ్రామీణాభివద్ది నిధులు నేరుగా మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అందుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సి.రాధాఅమర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, మీడియా సెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్, నాయకులు శ్రీనివాసాచారి,రంగారావు, చంద్రకుమార్ గౌడ; అల్తాఫ్ హుసేన్,హనీఫ్,అమరేందర్ రాజు, లక్ష్మణ్ యాదవ్,విఠల్రెడ్డి,లింగం నాయక్,నాగరాజు, మజీద్ అలీ, సారంగి లక్ష్మీకాంత్, పీర్ మహ్మద్ సాదిఖ్, ఆలీ ఉన్నారు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా సిద్ధమవ్వాలి? - టి.కృష్ణప్రియ, కరీంనగర్. సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో ఆర్థికాభివృద్ధి, టెక్నాలజీ, జీవవైవిధ్యం, పర్యావరణం, భద్రత, విపత్తు నిర్వహణ అనే అంశాలున్నాయి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేధో సంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు.. వీటి ద్వారా భద్రత ఏవిధంగా ప్రభావితమవుతుంది? తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై గత పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా.. సైబర్ వార్ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏవిధంగా తీవ్రమైంది? భారత్ ఏవిధంగా దాని ప్రభావానికి గురవుతోంది? భారత్లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉంది? వంటివాటిపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా అన్ని ప్రశ్నలు దాదాపుగా సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపై అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఉంటున్నాయి. అభ్యర్థి సమగ్ర ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నల కూర్పు ఉంటోంది. కాబట్టి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న వర్తమాన అంశాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం విస్తృతంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్ను తప్పనిసరిగా చదవాలి. -
ఉచితంగా నటిస్తా!
నడిగర్ సంఘం నిర్మించే చిత్రంలో ఉచితంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు సూర్య తెలిపారు. సూర్య మూడు పాత్రలలో నటించిన ‘24’ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. సమంత తదితరులు నటించిన ఈ చిత్రానికి విక్రమ్కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ మనసుకు నచ్చిన మంచి చిత్రాలలో నటించాలన్నదే తన ఆశయమని, కమల్ 30 ఏళ్ల ప్రాయంలో నటించిన తరహా కథలు ప్రస్తుతం తనను వెదుక్కుంటూ వస్తున్నాయన్నారు. ‘24’ సైంటిఫిక్ కథ అని, హీరో, విలన్తో సహా మూడు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో విలన్ పేరు ఆత్రేయ అని, చిత్రానికి ఈ పాత్ర వెన్నెముక వంటిదన్నారు. మేధావి విలన్గా ఈ ప్రాత్ర రూపొందిందన్నారు. ప్రస్తుతం తన చిత్రాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ డబ్ చేయబడుతున్నాయని, మలయాళంలో డెరైక్ట్గా రిలీజవుతున్నట్లు తెలిపారు. అందుచేత మూడు భాషల ప్రేక్షకులను సంతృప్తిపరచాల్సి ఉందన్నారు. సామాజిక బాధ్యతా కథా చిత్రాల్లో నటించాల్సి వస్తోందని, కొన్నేళ్లుగా తాను పొగతాగే సీన్లలో నటించడం లేదని, వీలైనంత వరకు మద్యం తాగే సీన్లను నిరాకరిస్తున్నట్లు తెలిపారు. పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం కొత్త భవనాన్ని నిర్మించి, దాని ద్వా రా నెలసరి రూ.50 లక్షలు ఆదాయం గడించేందుకు నడిగర్ సంఘం నిర్ణయిం చిందని, ఇందుకోసమే నడిగర్ సంఘం నిర్వహించిన క్రికెట్ పోటీలో తాను పా ల్గొన్నట్లు తెలిపారు. అవసరమైతే నడిగర్ సంఘం అభివృద్ధి కోసం విశాల్, కార్తీ ఉచితంగా నటించే చిత్రంలో తానూ ఉచితంగా నటిస్తానన్నారు. తన కుటుంబం అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సహాయాలు అందిస్తున్నామని, ఇంతవరకు 1,300 మంది విద్యార్థులకు పైగా విద్యా సహాయకాలు అందజేశామన్నారు. జలవనరుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సాయపడుతున్నామని తెలిపారు. -
ఐఫోన్ పాస్ వర్డ్ కోసం తిప్పలు..!
శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్ పాస్ వర్డ్ ను ఎంత ప్రయత్నించినా ఎఫ్బీఐ అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా చూసినా దాన్ని అన్లాక్ చేయలేకపోతున్నారు. ఘటన జరిగినప్పుడు కాల్పుల ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్ లోని సమాచారం సేకరించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పాస్ వర్డ్ అన్ లాక్ చేయడం కోసం యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఐఫోన్ అన్ లాక్ చేసేందుకు సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఉగ్రవాది ఐ ఫోన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఆ పాస్వర్డ్ ను మార్చివేసినట్లు అధికారులు గమనించారు. రిమోట్ గా కూడా పాస్వర్డ్ రీసెట్ చేసే అవకాశం ఉండటంతో... బ్యాకప్ తొలగించి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఎఫ్బీఐకి యాపిల్ సంస్థ సహకరించాలని వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సెక్యూరిటీ సాఫ్ట్వేర్ విషయంలో సహకరించాలని, వినియోగదారుల భద్రతపై రాజీ లేకుండా ప్రయత్నించాలని మేజిస్ట్రేట్ సూచించింది. అయితే కోర్టు ఆదేశాలను యాపిల్ సంస్థ సవాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐఫోన్ పాస్వర్డ్ ను అన్ లాక్ చేయాలంటే పాస్ కోడ్ తప్పనిసరిగా అవసరం. పాస్ కోడ్ ను పదే పదే తప్పుగా టైప్ చేస్తే ఫోన్ డేటా కూడా డిలీట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో రిజ్వాన్ ఐఫోన్ ను డేటా డిలీట్ కాకుండా అన్ లాక్ చేయాలని యాపిల్ సంస్థకు కోర్టు సూచించింది. ఫరూక్ ఫోన్ లోని డేటాను మరో ఫోన్ కు మార్చి, తర్వాత అన్ లాక్ చేసే ప్రయత్నం చేయమని చెప్పింది. అంతేకాక విభిన్న పాస్ కోడ్ లతో ఐఫోన్ తెరిచే ప్రయత్నానికి సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు కోరింది. ఫరూక్ నాలుగు నెంబర్ల పాస్ వర్డ్ వాడినట్లుగా ఎఫ్ బీ ఐ అంచనా వేస్తుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని కోర్టు చెప్పింది. అయితే విభిన్న పాస్ వర్డ్స్ తో అన్ లాక్ ప్రయత్నాలు చేయడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని, వినియోగదారుల భద్రతకు ప్రమాదమని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఏ రూపంలో పాస్ వర్డ్ అన్ లాక్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ను పూర్తిగా మార్చాలని, అది ప్రపంచంలోని ఐఫోన్ వినియోగదారులందరికీ అందించాలని చెప్తున్న సంస్థ... ఫెడరల్ జడ్జి ఆర్డర్ ను సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కోర్టు ఆర్డర్ ను బహిరంగ లేఖద్వారా విమర్శించారు. దీని వెనుక చట్టపరమైప చిక్కులెన్నో కలిగి ఉన్నాయని అన్నారు. కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినో కౌంటీ కి చెందిన ఆరోగ్య శాఖ ఉద్యోగి సయ్యద్ ఫరూక్ ఐఫోన్ వాడేవాడు. అతడు అతడి భార్య తష్ ఫీన్ మాలిక్ తో కలసి డిసెంబర్ 2న కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ఐ ఫోన్ వారితోపాటు తీసుకెళ్ళారు. అప్పట్లో ఘటనలో 14 మంది చనిపోగా, 22 మంది గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన దంపతులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాల్పుల ప్రదేశంలో దొరికిన ఐఫోన్ ద్వారా ఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ఇక మంచినీటికి భారత్లో కటకట
వాషింగ్టన్: భారత్, చైనా, అమెరికాతోపాటు పలు దేశాలు ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోనున్నాయి. నెల నుంచి మూడు నెలల పాటు ప్రపంచంలోని నాలుగు వందల కోట్ల మంది ప్రజలు మంచినీళ్లు దొరక్క అల్లాడిపోయే పరిస్థితి ఉందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రిక ప్రచురించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నాలుగు వందల కోట్ల మందిలో దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రజలు భారత్, చైనా దేశాలకు చెందిన వారే ఉంటారని, వారికే నీటి వనరుల లభ్యత కష్టమవుతుందని ఆ అధ్యయనం తెలిపింది. అలాగే అమెరికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నైజీరియాకు చెందిన దేశాల్లో మరో రెండు వందల కోట్ల మంది మంచినీళ్లు దొరక్క అలమటించాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని తేలింది. అలాగే ప్రపంచంలో దాదాపు యాభై కోట్ల మంది ప్రజలు ఏడాది పొడవునా నీటి ఎద్దడిని ఎదుర్కొంటారని, వారిలో కూడా జనాభాపరంగా ఎక్కువగా భారత్, పాకిస్తాన్లకు చెందిన వారే ఉంటారని అధ్యయనం సూచిస్తోంది. సౌదీ అరేబియా, యెమెన్ ప్రజలు కూడా ఏడాది పొడవున నీటి కరవును ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పరిస్థితి గతంలో వేసిన అంచనాలకన్నా తీవ్రంగా ఉంటాయని తేలింది. 170 కోట్ల నుంచి 300 కోట్ల మధ్య ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటారన్నది గతంలో వేసిన అంచనాలు. అప్పట్లో ఏడాది కాలాన్ని ప్రతిపాదికగా తీసుకొని అధ్యయనం చేయగా, ఈ తాజా అధ్యయనం నెలను ప్రాతిపదిక గా తీసుకొని 12 నెలలకు అంచనాలను వేసింది. రక్షిత మంచినీటి వనరులు క్షీణించడం, తాగునీటి అవసరాలు పెరగడం వల్లనే మంచినీటికి కటకటలాగే పరిస్థితి వస్తుందని అధ్యయన నిపుణులు తెలిపారు. దీనివల్ల మానవాభివృద్ధి గమనం మందగిస్తుందని చెప్పారు. మున్ముందు ఓ పక్క పర్యావరణాన్ని రక్షించుకుంటూ తాగునీటి వనరులను సమకూర్చుకోవడం మానవాళికి పెద్ద సవాల్గా పరిణమించనుందని వారు అభిప్రాయపడ్డారు. వాతావరణంలో ఊహించని మార్పులు సంభవించడం వల్ల రానున్న పదేళ్లకాలంలో ప్రపంచం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ కూడా జనవరిలో విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. -
స్మార్ట్ఫోన్లతో కేన్సర్ ముప్పు లేదట!
స్మార్ట్ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది. ఒకే కాల్ ఎక్కువ సేపు ఉండటం.. లేదా ఎక్కువ సంఖ్యలో కాల్స్ మాట్లాడటం వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ రావడం గానీ, అప్పటికే ఉన్న ట్యూమర్లు మరింత ఎక్కువగా పెరగడం గానీ జరగదని పరస్ ఆస్పత్రి సీనియర్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఇందు బన్సల్ అగర్వాల్ తెలిపారు. సెల్ఫోన్ల వల్ల కొంత వేడి పుడుతుంది గానీ, అది శరీర ఉష్ణోగ్రతను పెంచేంతగా ఉండదని బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన రేడియేషన్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హుక్కు చెప్పారు. అయితే స్మార్ట్ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల మెలటోనిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుందని, దానివల్ల భావి జీవితంలో న్యూరో డీజనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఏకాగ్రత తగ్గడం, కంటి సమస్యలు, ఒత్తిడి పెరగడం, దీర్ఘకాలం పాటు తలనొప్పి, మానసిక స్థితిపై దుష్ప్రభావాలు, గుండె సమస్యలు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం లాంటివి సెల్ఫోన్ అధిక వాడకం వల్ల వస్తాయని అగర్వాల్ చెప్పారు. -
రాతియుగం నుంచి ప్లాస్టిక్ యుగానికి..
పాత రాతి యుగం.. కొత్త రాతి యుగం.. ఇలాంటి దశల నుంచి క్రమంగా మనం ప్లాస్టిక్ యుగం వైపు వెళ్లిపోతున్నామట. దీని గురించి పరిశోధకులు మానవాళిని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ అంత తొందరగా నశించకపోవడం, భూమిలో కలవకపోవడం వల్ల భూగ్రహంపై తీవ్ర ప్రభావం, అది కూడా దీర్ఘ కాలం పాటు చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్వత శిఖరాల నుంచి సముద్ర అంతర్భాగాల వరకు ఎక్కడ చూసినా ప్లాస్లిక్ కనపడుతోందని, భవిష్యత్తుకు ఇది చాలా ముప్పుగా పరిణమిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్కు చెందిన జియాలజీ శాఖలోని పాలియోబయాలజీ ప్రొఫెసర్ జాన్ జలాసియావిజ్ హెచ్చరించారు. ప్రతి మూడేళ్లకు వంద కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారుచేస్తున్నామని, ఇది మొత్తం భూమ్మీద ఒక పొరలా వేసేందుకు సరిపడ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ శతాబ్ది మధ్యనాటికి అలాంటి పొరలు చాలా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. సముద్రాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా దూరం పాటు ప్రయాణిస్తాయని, మధ్యలో ఏమాత్రం పాడవ్వవని, చివరకు ఏదో ఒక బీచ్లో అవి తేలుతాయని వివరించారు. వీటివల్ల జలచరాలకు కూడా తీవ్ర స్థాయిలో ముప్పు ఉంటుందన్నారు. -
'రూ.వెయ్యికోట్లు ఇచ్చి సహాయం చేయరూ..'
హైదరాబాద్: రైతుల అవసరాలకోసం అత్యాధునిక గోదాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కు ఆయన లేఖ రాశారు. 2016 వ్యవసాయ సీజన్ పూర్తయ్యే సమయానికి రెండు దశల్లో 17 లక్షల మెట్రిక్ టన్నులను నిల్వచేసే సామర్థ్యం గల గోడౌన్లను నిర్మించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో చెప్పారు. మొత్తం అంచనా వ్యయం రూ.1024 కోట్లు కాగా, నాబార్డు రూ.972.79కోట్ల రుణాన్ని అందిస్తుందని చెప్పారు. అయితే గతంలో వ్యవసాయశాఖ ద్వారా గ్రామీణ భందరాన్ యోజన పథకం కింద ఇలాంటి నిర్మాణాలకు కేంద్రం సబ్సిడీ ఇచ్చేదని, దానిని కేంద్రం తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలిసిందని, అయితే, తాము రైతు సంక్షేమం కోసం ఇప్పటికే ప్రారంభించిన ఈ పని విజయవంతంగా పూర్తయ్యేలా కేంద్రం చూడాలని అన్నారు. రూ. వెయ్యి కోట్లు సహాయం చేసి తాము తలపెట్టిన ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. -
హిమాలయాల్లో త్వరలో భారీ భూకంపం?
హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు 8.2 తీవ్రత ఉండే ప్రమాదం టెక్టోనిక్ షిఫ్ట్ వల్లే ఈ పరిస్థితి న్యూఢిల్లీ హిమాలయ ప్రాంతంలో త్వరలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు తెలిపారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 వరకు ఉండే ప్రమాదముంది. మణిపూర్ ప్రాంతంలో సోమవారం సంభవించిన లాంటి భూకంపాలు మరిన్ని వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. టెక్టోనిక్ షిఫ్ట్ కారణంగా ఇటీవల మణిపూర్, నేపాల్, సిక్కిం ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. అది ఇప్పుడు మళ్లీ పాడైందని, దానివల్లే 8.0కు పైగా తీవ్రతతో భూకంపాలు సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఉత్తరభారతంలో, ముఖ్యంగా పర్వత ప్రాంతాలు అన్నింటా భూకంపం సంభవించే ప్రమాదాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో కేంద్రం ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో కూడా ఈ విషయాన్ని తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల మధ్య అనుసంధానం అయి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల చాలా ప్రమాదం ఉందని ఎన్ఐడీఎం డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బిహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలోనే భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు అంతర్జాతీయ భూకంప నిపుణులు కూడా రాబోయే భూకంపం గురించి హెచ్చరిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధమైన టైమ్ బాంబ్ అని, దీనిపై ప్రభుత్వ వర్గాలు జాగ్రత్త పడాలని కుమార్ తెలిపారు. -
అంతా మా ఇష్టం..
విజయనగరం అర్బన్: ఆదర్శ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడడం వల్ల నిధుల ఖర్చులకు లెక్కాపక్కా లేకుండా పోతోంది. అధిక ధరలకు సైన్స్ ల్యాబ్ సామగ్రి కొనుగోలు చేయడపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రయోగ పరీక్షలకు ల్యాబ్ సామర్థ్యాలపై ఇంటర్మీడియట్ పర్యవేక్షక బృందం చేపట్టిన పరిశీలనలో ఈ విషయూలు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ సామగ్రి పేరుతో కొనుగోళ్లు చేస్తున్నా.. చాలా పాఠశాలల్లో ఇవి కానరాకపోవడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నిధుల వ్యయంపై ఆరోపణలు జిల్లాలో 16 ఆదర్శపాఠశాలలు ఉండగా.. అన్నింటిలోనూ ఇంటర్మీడియట్ కోర్సును నిర్వహిస్తున్నారు. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 6,400 మంది, ఇంటర్మీడియట్లో 5,120 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలకు వస్తున్న నిధుల వ్యయంపై పలు ఆరోపణలున్నాయి. ఒక విధానమంటూ లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఖర్చు చేస్తున్నారు. 2013లో జిల్లాకు మొదటి విడతలో 16 విద్యాలయూలు మంజూరయ్యూరుు. ప్రారంభ సమయంలో టేబుళ్లు, కుర్చీలు, ల్యాబ్ సామగ్రి, మెడికల్ కిట్లు, మరమ్మతులు, క్రీడలు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు, రిజిస్టర్లు, ఇతరత్రా నిర్వహణకు ప్రభుత్వం 4,74,600 రూపాయలు విడుదల చేసింది. అలాగే 2014లో పరీక్షల నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.2.50 లక్షలు కేటాయించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 లక్షలు మంజూరు చేసింది. అయితే పాఠశాలలకే నేరుగా వచ్చే నిధుల వ్యయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సంబంధిత ప్రిన్సిపాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బిల్లుల్లో వ్యత్యాసం సైన్స్ ల్యాబ్లకు అవసరమైన సామాగ్రి కొనుగోళ్లలో ఒక్కో పాఠశాల ప్రిన్సిపాల్ ఒక్కో బిల్లు చూపడం విశేషం. కాంపౌండ్ మైక్రోస్కోప్ను ఒకరు 3,600 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చూపిస్తే, మరో పాఠశాల ప్రిన్సిపాల్ ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. సాధారణంగా సామగ్రి కొనుగోలు చేస్తే బిల్లులు తీసుకోవాలి. కానీ చాలా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇన్వాయిస్, కొటేషన్ బిల్లులే తీసుకోవడం విశేషం. అదే విధంగా సైన్స్ ల్యా బ్ల్లో వాడే మెజరింగ్ జార్స్ను రూ.50 నుంచి రూ.900 వరకు కొనుగోలు చేశారు. ఈ ధరల్లోని తేడాలను సమర్థించుకునేందుకు తమ వస్తువు మంచిదంటే తమ వస్తువు మంచిదని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. డిసెక్షన్ మైక్రోస్కోప్ను ఒకరు రూ.2 వేలు, మరొకరు 1,500 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇంత చేసినా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ల్యాబ్ సామగ్రి లేదు. ఇటీవల ఇం టర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సర్వేలో ఐదు పాఠశాలల్లో మాత్రమే 60 శాతం సామగ్రి మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన పాఠశాలల్లో పరికరాలు ఏమయ్యూయో సిబ్బందికే తెలి యూ లి. అలాగే విద్యార్థుల విజ్ఞాన, వినోత యాత్ర లు, క్రీడ ల నిర్వహణకు వస్తున్న నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరిశీలన ఏదీ..? ఆదర్శన పాఠశాలల పరిశీలన బాధ్యతను జిల్లా స్థాయిలో డీఈఓకు అప్పగించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల బాధ్యతలతో బిజీబిజీగా ఉంటున్న డీఈఓ వాటిపై దృష్టి సారించలేకపోతున్నారు. -
అందరికీ మంచండీ
అయుత చండీ మహాయాగం పూర్వం రాజులు, చక్రవర్తులు ప్రజాక్షేమం కోసం రకరకాల యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసేవారు. అలా చేయడం వల్ల సర్వజనులకు హితం కలిగేది. ఎందుకంటే శాస్త్ర ప్రమాణంగా హోమద్రవ్యాలను సరియైన పద్ధతిలో అగ్నికి ఆహుతిచ్చినప్పుడు, అవి నేరుగా సూర్యుడికి చేరతాయి. ఆ సూర్యుడి నుంచి వర్షాలు, ఆ వర్షాల నుంచీ పాడిపంటలు... అంటే అన్నం లభిస్తాయి. తత్ఫలితంగా సకల జనులు సుభిక్షంగా ఉంటారని వేదం చెబుతోంది. ఇక చండీ హోమానికి సంబంధించి నవచండీయాగం, శతచండీయాగం, సహస్ర చండీయాగం, అయుత చండీయాగం, లక్ష చండీయాగం ఉన్నాయి. ఇవన్నీ కూడా మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లందరికీ కలిపి నిర్వహించేవి. నవచండీయాగం: ఒక్కరోజులో చేసే యాగం. శతచండీయాగం: ఇది ఐదురోజులు చేసే యాగం. సహస్ర చండీయాగం: ఇది ఐదురోజులు చేసే యాగం. అయుత చండీ మహాయాగం: గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి ఈ మహాయాగం నిర్విఘ్నంగా జరగడానికి మహాగణపతికి అధర్వవేదోక్త రీతిగా సహస్రమోదక హోమాన్ని నిర్వహిస్తారు. తిరిగి గణపతిపూజ, పుణ్యాఃవచనం చేసి దేవనాంది, అంకురారోహణ, ఋత్విగ్వరణం చేస్తారు. కలశ స్థాపన, దీప స్థాపన, చండీ యంత్ర స్థాపన, కలశంలో, యంత్రంలో దేవతా ఆవాహన, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇది ఐదు రోజులు చేసే యాగం. 1000 మంది ఋత్విక్కులుంటారు. మొదటి నాలుగు రోజులల్లో ప్రతిరోజూ నవావరణ పూజ, చతుష్టష్టి యోగినీ దేవతల పూజ, దీపసహిత బలి, కల్పోక్త పూజతో పాటూ కుంకుమార్చన కూడా చేస్తారు. ఇవిగాక అవధారలు చేస్తారు. ఆఖరి రోజు - అగ్ని ప్రతిష్ట చేసి 70 లక్షల ఆహూతులతో (అయుతం అంటే 10 వేలు. సప్తశతి అంటే 700:10000), అమ్మవారికి పరమాన్న ద్రవంతో, 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్యహోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్యహోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తర్వాత యాగసమాప్తి చేస్తారు. తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ‘హుతసంఖ్యా సమానంస్యాత్ ఉత్తమం ద్విజభోజనం’... అంటే ఎన్ని ఆహూతులు అగ్నికి సమర్పణ చేస్తున్నామో అంతమందికి అన్న సమర్పణ చేయడం మంచిది. ఇది అమ్మవారిని, వారి గణాలను సంతృప్తిపరచడానికి చేస్తారు. ఈ ఐదు రోజుల్లో ప్రతిరోజూ చతుర్వేద స్వాహాకారాలు (అంటే నాలుగు వేదాల్లోని ప్రతి ఒక్క మంత్రంతో హోమం), దుర్గా హోమం, శ్రీసూక్త హోమం, గౌరీ హోమం, సరస్వతీ హోమం, మహాసౌరం, ముత్తయిదువులతో కుంకుమార్చనలు జరుగుతాయి. ఈ హోమాన్ని 100 హోమకుండాలతో చేస్తారు.దీనిలో 100 సృక్లు, 1000 సృవలతో చేస్తారు. 4 వేల కిలోల బియ్యం, 4 వేల కిలోల నెయ్యి తదితరాలతో శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమద్రవ్యాలను ఉపయోగిస్తారు. చండికాదేవి ప్రాధాన్యత చండికాదేవి చాలా ఉగ్ర స్వరూపంతో ఉంటుందని అపోహ పడుతుంటాం. అమ్మ కోపం ధర్మగ్రహం. పిల్లలను సన్మార్గంలో నడిపే తల్లి చూపే కోపం లాంటిదే అమ్మ కోపం. అమ్మ అనుగ్రహం పొందడానికి మరో ప్రధాన కారణం ఉంది. చండీ దేవత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని సమస్త శక్తులూ ఆమెను అంటిపెట్టుకుని ఉంటాయి. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయమయిపోవడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత. ఎక్కడైతే చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు, ఆ ప్రాంతంలో అకాలమరణాలుండవు. అతః సర్వార్థలాభాయ చండికాం బ్రహ్మరూపిణీ ఆరాధయేత్ పరాంశక్తిం స్వర్గస్థిత్యంతకారిణీం. లోక కళ్యాణార్థం, సర్వజనుల హితార్థం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. తన్మాచ్ఛక్తిః సదాసేవ్యా విద్వద్భిఃకృతనిశ్చయైః ధర్మార్థకామమోక్షాణాం స్వామినీ సా మహోదయా ఆ జగన్మాత ధర్మార్థ కామమోక్షాలను ఇస్తుంది కనుక, ఆమెను ఆరాధించడం, హోమం చేయడం శుభస్కరం, శ్రేయస్కరం, యశస్కరం, శత్రు నాశకరం. హోమాన్ని చూసినా, విన్నా, తెలుసుకున్నా హితం కలుగుతుందని పెద్దల వాక్కు. సర్వేజనాస్సుఖినోభవంతు - గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంకశర్మ అయుత చండీ మహాయాగ ఋత్విజులు ఫలం ఏమిటి? యజ్ఞయాగాదులు ఆచరించటం వల్ల మనం కోరిన కోరికలు అన్నీ సిద్ధించకపోవచ్చును గానీ, ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమం చేస్తే ప్రాణ వాయువు (ఆక్సిజన్) పెరుగుతుంది. హోమంలో ఉపయోగించే వివిధ ద్రవ్యాల వల్ల ప్రకృతిలోని సమస్త మూలకణాలూ శుద్ధి అయి, జీవశక్తి పెరుగుతుంది. యాగం లేదా హోమం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి. జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్య వృద్ధి (పంటలు) కలుగుతుంది. ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. ప్రమాదాలు తగ్గుతాయి. మానవుడికి చెడు ఆలోచనలు రావు. మానవుల కనీస అవసరాలు తీరతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితం. -
సవాళ్లను ఎదుర్కొనే ‘ఇంప్రింట్’
ప్రాజెక్టును ఆవిష్కరించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల సంయుక్త ప్రాజెక్టు అయిన ‘ఇంప్రింట్ ఇండియా’ను రాష్ట్రపతి ప్రణబ్ ఆవిష్కరించారు. ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల్లో ఎదురవుతున్న పెద్ద సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన పరిశోధనలకు రోడ్మ్యాప్ రూపొందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ, తరగతి గదులు, గ్రేడ్లకు అతీతంగా విద్యార్థుల్లో ఊహాశక్తిని పెంపొందించాలంటే వారిలో సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రణబ్పై మోదీ ప్రశంసలు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీలో ఒక విశ్వవిద్యాలయం దాగుందని ప్రధాని కితాబిచ్చారు. తనకున్న అనంతమైన విజ్ఞానంతో దేశానికి ఒక విద్యా భాండాగారంగా మారారన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ‘మన రాష్ట్రపతిలో ఒక యూనివర్సిటీ దాగుంది. ఆయనకు మహాసముద్రమంత విజ్ఞానముంది’ అని ప్రశంసించారు. మీకు లభించిన అతిపెద్ద ప్రయోజనమేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆయనకు దగ్గరయ్యేందుకు మంచి అవకాశం దొరకడమే అని చెబుతానన్నారు. కాలంచెల్లిన సిలబస్: సీఎన్ఆర్ రావు దేశంలోని 90 శాతం యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు కాలంచెల్లిన సిలబస్తో ఉన్నాయని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత సీఎన్ఆర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే ప్రపంచంలోని ఉత్తమ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. మన హైటెక్ తరగతి గదుల్లో బోధించే సబ్జెక్టులో ఎలాంటి మెరుగుదల లేదని చెప్పారు. -
పట్టణీకరణ-పరిణామాలు
స్వాతంత్య్రానంతరం భారత్ ప్రధానంగా పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటుతనం వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి అప్పటి ప్రధాని జవహర్లాల్నెహ్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించే భారత్లో ప్రైవేటు రంగం అభివృద్ధి చెందింది. దీని ఫలితంగా దేశంలో పట్టణీకరణ వేగవంతమైంది. 1901 జనాభా లెక్కల ప్రకారం భారత్ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 11.4 శాతంగా ఉంది. ఇది 2001 నాటికి 28.53 శాతానికి, 2011 నాటికి 31.6 శాతానికి పెరిగింది. స్వాతంత్య్రానంతరం దేశ స్థూలజాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా క్రమంగా తగ్గగా పారిశ్రామిక, సేవారంగాల వాటా క్రమేణా పెరుగుతూ వెళ్లింది. 1941 తర్వాత నుంచి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి నగరాల్లో వృద్ధి అధికమైంది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తద్వారా భారత్లో ఆర్థికవృద్ధి పెరగటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. పబ్లిక్ రంగంలో వృద్ధి కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా, రోడ్లు, వాటర్ సప్లై, విద్యుత్ వంటి అవస్థాపన సౌకర్యాలు మెరుగయ్యాయి. ప్రపంచబ్యాంకు-పట్టణీకరణ ఆర్థికవృద్ధి ప్రక్రియలో పట్టణీకరణ భాగమని ప్రపంచబ్యాంకు పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థలో పట్టణ ప్రాంతాల భాగస్వామ్యం విస్మరించలేనిది. భారత్ ఆర్థిక ఉత్పత్తిలో నగరాల వాటాను 2/3గా ప్రపంచబ్యాంకు పేర్కొంది. పెరుగుతున్న జనాభాకు ఆశ్రయం కల్పించటం, నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించటం వంటి అంశాల్లో భారత్లోని నగరాల పాత్రను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పట్టణ జనాభా 377 మిలియన్ల (2011లో) నుంచి 590 మిలియన్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. ఆర్థిక అవసరాల కారణంగా భారత్లోని గ్రామీణ జనాభా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దీంతో భారత్లోని పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయని ప్రపంచబ్యాంకు పేర్కొంది. 2050 నాటికి భారత్తో పాటు చైనా, ఇండోనేసియా, నైజీరియా, అమెరికాలలో పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. ప్రపంచ పట్టణ జనాభా ఒక అంచనా ప్రకారం 2011-50 మధ్యకాలంలో ప్రపంచ పట్టణ జనాభా 3.6 బిలియన్ల నుంచి 6.3 బిలియన్లకు పెరగనుంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. 2020 నాటికి ఆసియాలో సగం జనాభా, 2035 మధ్యనాటికి ఆఫ్రికాలో సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం 2011-30 మధ్యకాలంలో ప్రపంచ పట్టణ జనాభాలో 1.4 బిలియన్ల పెరుగుదల ఉండనుంది. ఈ మొత్తంలో చైనా వాటా 279 మిలియన్లు కాగా భారత్ వాటా 218 మిలియన్లుగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా పెరుగుదలలో భారత్ వాటా 15.5 శాతానికి పైగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి 2012లో తెలిపింది. పట్టణ జనాభా పెరుగుదలకు ముఖ్యకారణాలు 1. పట్టణ ప్రాంత జనాభాలో సహజ పెరుగుదల 2. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా తిరిగి వర్గీకరించటం 3. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు నికర వలసలు ఉపాధి రహిత వృద్ధి భారత్లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు అధికంగా నమోదవుతుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ఉపాధి రహిత వృద్ధిని చవిచూశాయి. గత దశాబ్దకాలంలో స్థూలదేశీయోత్పత్తి సగటు వార్షిక వృద్ధి 5 శాతానికి పైగా నమోదైంది. అదే సమయంలో ఉపాధివృద్ధిలో పెరుగుదల స్వల్పంగా ఉంది. 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో వ్యవసాయరంగంలో 23.3 మిలియన్లు, తయారీ రంగంలో 4.02 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారు. ఇతర రంగాల్లో కొత్తగా 1.74 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 1999-2000, 2009-2010 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో (గ్రామీణ మహిళలు మినహా) నిరుద్యోగిత రేటులో స్వల్ప తగ్గుదల నమోదైంది. అల్ప ఉద్యోగిత రేటు పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. భారత్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగిత రేటు శ్రామిక మార్కెట్ స్థితి, ఉపాధి అవకాశాలను కచ్చితంగా స్పష్టపరచటం లేదు. 2011లో ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ప్రకారం పురుషులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.9 శాతం, మహిళలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.5 శాతం మంది అదనపు పని కోసం ఆసక్తి ప్రద ర్శించారు. ఈ సర్వేలో శ్రామికుల్లో అనేక మంది ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా తగినంత ప్రతిఫలం లభించటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. 2005-06లో భారత ప్రభుత్వం ప్రారంభించిన జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ రెన్యువల్ మిషన్ కింద కేంద్రీకృత ప్రణాళికలో భాగంగా మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో గ్రామీణ పట్టణ సంబంధాలు మెరుగయ్యాయి. పట్టణ జనాభా భారత్లోని మొత్తం పట్టణ జనాభాలో 2011 లెక్కల ప్రకారం మహారాష్ట్రకు 13.5 శాతం, ఉత్తరప్రదేశ్కు 11.8 శాతం, తమిళనాడుకు 9.3 శాతం వాటా ఉంది. 2011లో పట్టణ ప్రాంతాల్లో 377 మిలియన్ల మంది నివసించగా, ఒక మిలియన్ జనాభాకు పైగా ఉన్న నగరాల్లో 43 శాతం మంది నివసిస్తున్నారు. 2001లో మిలియన్ జనాభా గల నగరాలు సంఖ్య 35 ఉండగా, 2011 నాటికి 53కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, కేరళల్లో చెరో 7 నగరాలు, మహారాష్ట్రలో ఆరు నగరాలు ఉన్నాయి. 53 పట్టణ పరిధి కలిగిన ప్రాంతాల్లో మూడు అతిపెద్ద మెగాసిటీలు (పది మిలియన్లకు పైగా జనాభా గల ప్రాంతాలు)గా గ్రేటర్ ముంబై (18.4 మిలియన్లు), ఢిల్లీ (16.3 మిలియన్లు), కోల్కతా (14.1 మిలియన్లు)లు నిలిచాయి. జనాభా పరంగా చెన్నై 8.7 మిలియన్లు, బెంగళూరు 8.5 మిలియన్లు కలిగి ఉన్నాయి. పది మిలియన్ జనాభాపైగా గల నగరాల్లో జనాభివృద్ధి, 2001-2011 మధ్యకాలంలో తగ్గింది. గ్రేటర్ ముంబై పట్టణ పరిధి జనాభివృద్ధి 1991-2001 మధ్య 30.47 శాతం కాగా, 2001-2011 మధ్య 12.05 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి సంబంధించి ఢిల్లీ పట్టణ పరిధి జనాభివృద్ధి 52.24 శాతం నుంచి 26.69 శాతానికి తగ్గింది. కోల్కతాలో 19.60 శాతం నుంచి 6.87 శాతానికి తగ్గింది. పట్టణీకరణ పెరగటానికి కారణాలు పట్టణీకరణ భారతీయ సమాజంలో సాధారణ లక్షణంగా కనిపిస్తుంది. పరిశ్రమల సంఖ్యలో వృద్ధి కారణంగా నగరాల సంఖ్య పెరిగింది. పారిశ్రామికీకరణ ఫలితంగా ప్రజలు ఉపాధి కోసం పారిశ్రామిక ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా పట్టణాలు, నగరాల సంఖ్య పెరుగుతోంది. పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలను విస్తృతపరిచింది. దీంతో పట్టణ జనాభా పెరుగుతూ వెళ్తోంది. సామాజిక అంశాలైన విద్య, ఆరోగ్య సౌకర్యాల అందుబాటు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లభ్యత కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.గ్రామీణ ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడాలి. భారత వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో వలసలు పెరిగాయి.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుతో పాటు మెరుగైన అవస్థాపనా సౌకర్యాల అందుబాటు కారణంగా సౌకర్యవంతమైన జీవనం సాగించవచ్చనే అభిప్రాయంతో గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. పట్టణాలు, నగరాల సంఖ్య ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు గ్రామీణ సమాజం పట్టణ సంస్కృతిని అలవర్చుకుంటోంది. పట్టణ ప్రజల వాణిజ్య సంస్కృతిని అవలంబించటం గ్రామీణ సమాజంలో కనిపిస్తోంది. విద్యావ్యాప్తి కారణంగా అక్షరాస్యత రేటు పెరిగి, గ్రామీణ ప్రజల్లో ఆధునికత పెరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం. మహిళల్లో ఆలోచనా పరిజ్ఞానం పెరగటం. ఆధునిక రవాణా, సమాచార సౌకర్యాల పెరుగుదల. రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనటం. బ్యాంకులు, అనేక విత్త సంస్థలు అందుబాటులో ఉండటం. గ్రామీణ వినియోగదారుల్లో అవేర్నెస్ పెరగటం. అధునాతన వస్తు ఉత్పత్తులకు డిమాండ్. భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయటంలో భాగంగా పట్టణీకరణ లక్ష్యాన్ని పదకొండో ప్రణాళికలో ఎంచుకోవటం. సంస్కరణల అమలు కాలంలో ప్రైవేటురంగ ప్రాధాన్యత పెరగటంతో పాటు ప్రైవేటు రంగ పెట్టుబడులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమవటం. దేశవిభజన సమయంలో ప్రజల వలస. సహజంగా పట్టణ జనాభా పెరగటానికి మరణరేటు తగ్గుదలతోపాటు జననాల రేటు ఎక్కువగా ఉండటం కారణమైంది. పట్టణీకరణ ప్రభావం ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ అంశాలు పట్టణీకరణపై ప్రభావం చూపుతాయి. సామాజికంగా, సాంస్కృతికంగా మీడియా పట్టణీకరణను ప్రోత్సహిస్తోంది. పెద్ద నగరాల్లో చెత్త పెద్ద సమస్యగా నిలిచింది. వాయు, నీటి, ధ్వని కాలుష్యం వంటి సమస్యలు పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలుగజేస్తాయి. మురికివాడలు పెరగటంతోపాటు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెరిగి ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది. అధిక పట్టణీకరణ కారణంగా నేరాల రేటు పెరుగుతోంది. నేరాల రేటు పెరుగదలకు పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ వైఫల్యం కారణమవుతోంది. పట్టణీకరణ ప్రయోజనాలు ఆర్థికవ్యవస్థలో వృద్ధిరేటు పెరుగుదల. వాణిజ్యకార్యకలాపాల్లో వృద్ధి. సాంఘిక, సాంస్కృతిక సమన్వయం (ఇంటిగ్రేషన్). సమర్థమైన సేవల అందుబాటు. వనరుల అభిలషణీయ వినియోగం. -
అతిపెద్ద ‘జన్యువుల’ జాబితా
వాషింగ్టన్: ఎప్పుడూ జలుబు, జ్వరం అంటూ బాధపడే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. మరి కొందరేమో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ చురుగ్గా ఉంటారు. అయితే దీనికి కారణాలను అన్వేషించే క్రమంలో 2,504 మంది జన్యువులను పరిశీలించి జన్యు వ్యత్యాసాలతో(జీనోమ్ వేరియేషన్స్) కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాబితాను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొందరికి మాత్రమే రోగ నిరోధక శక్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో కనుక్కునేందుకు ఈ జాబితా దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ఈ జన్యు రూపాంతరాల కారణంగా వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో పూర్తిగా తెలుసుకుంటే సులువైన చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుంది. అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, కెనడాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధన కోసం ఆఫ్రికా, తూర్పు, దక్షిణ ఆసియా, యూరప్, అమెరికాకు చెందిన 2,504 మంది జన్యువులను వారు పరిశీలించారు. మానవ జన్యు క్రమంలోని దాదాపు 8.8 కోట్ల ప్రదేశాల్లో తేడాలు ఉన్నట్లు ఈ బృందం కనుగొంది. వారికి అందుబాటులో ఉన్న డేటాబేస్ను ఆధారంగా చేసుకుని జన్యువుల మధ్య తేడాలతో ఈ జాబితాను తయారుచేశారు. -
కరెంట్ అఫైర్స
సైన్స్ అండ్ టెక్నాలజీ పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం ఖగోళ పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ-30 ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇస్రో 1,513 కిలోల బరువు గల ఆస్ట్రోశాట్ను సెప్టెంబరు 28న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. ఆస్ట్రోశాట్తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఇండోనేషియాకు చెందిన లపాన్-2 (76 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (14 కిలోలు), యూఎస్కు చెందిన లెమర్-2, 3, 4, 5 (28 కిలోలు) ఉన్నాయి. భారత్ తొలిసారి ఖగోళ పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించింది. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు 11 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. జీవశాస్త్రంలో బాలసుబ్రమణియన్ గోపాల్ (ఐఐఎస్సీ- బెంగళూరు), రాజీవ్ కుమార్ వర్షణే (ఇక్రిశాట్), భూ, వాతావరణ, సాగర, గ్రహ విజ్ఞాన శాస్త్రం: జ్యోతిరంజన్ శ్రీ చందర్ రే (ఫిజికల్ సైన్స్ లేబరేటరీ- అహ్మదాబాద్), ఇంజనీరింగ్ సెన్సైస్: యోగేష్ జోషి (ఐఐటీ- కాన్పూర్), గణిత శాస్త్రం: రితబ్రత మున్షీ (టీఐఎఫ్ఆర్- ముంబై), కె.సందీప్ (టీఐఎఫ్ఆర్- బెంగళూరు), భౌతిక శాస్త్రం: బేదంగదాస్ మొహంతీ (ఎన్ఐఎస్ఈఆర్- భువనేశ్వర్), మందర్ దేశ్ముఖ్ (టీఐఎఫ్ఆర్- ముంబై), వైద్యశాస్త్రం: విదితా వైద్య (టీఐఎఫ్ఆర్-ముంబై), రసాయన శాస్త్రం: డి.శ్రీనివాసరెడ్డి (సీఐఎస్ఆర్-పూణె), ప్రద్యుత్ ఘోష్ (ఐఎసీఎస్- జాదవ్పూర్). జాతీయం రాజస్థాన్లో 68 శాతానికి రిజర్వేషన్లు రాజస్థాన్ శాసనసభ సెప్టెంబరు 22న ఆమోదించిన రెండు బిల్లులతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 68 శాతానికి చేరాయి. ఇందులో ఒకటి స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్(ఎస్బీసీ)లో గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు కాగా మరొకటి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)లకు 14 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు. ఈ రెండు బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ రాజస్థాన్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. భారతీయ సంపన్నుల్లో ముకేశ్ అంబానీకి మొదటి స్థానం సెప్టెంబర్ 24న ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానంలో నిలిచారు. 100 మంది భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స మేగజీన్ రూపొందించింది. ముకేశ్ 18.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలువగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ 18 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, విప్రో అధినేత అజీం ప్రేమ్జీ 15.9 డాలర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అంతర్జాతీయం ఐరాస సుస్థిర అభివృద్ధి సభ ఐక్యరాజ్యసమితి (ఐరాస) సుస్థిర అభివృద్ధి సభ సెప్టెంబరు 25 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ప్రపంచ బ్యాంకు, ద్రవ్యనిధి సంస్థల అధిపతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ కొత్త అభివృద్ధి లక్ష్యాలను స్వాగతించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంపన్న దేశాలు టెక్నాలజీని ఇతర దేశాలకు అందజేయాలన్నారు. ఐరాసలో సంస్కరణలు అమలు చేస్తేనే దాని విశ్వసనీయత కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి అజెండాను ఐరాస జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 15న ఆమోదించింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యకర జీవనం, విద్యను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను అరికట్టడం వంటి 17 లక్ష్యాలను ఇందులో నిర్దేశించారు. వీటి సాధనకై ఏడాదికి 3.5 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల వరకు వెచ్చించనున్నారు. ఐరాస సంస్కరణలకు పిలుపునిచ్చిన జీ-4 దేశాలు భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాలతో కూడిన జీ-4 సదస్సు సెప్టెంబరు 26న న్యూయార్క్లో జరిగింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా జీ-4 దేశాలు ప్రకటించాయి. నిర్దేశిత కాలవ్యవధిలో భద్రతామండలిని సంస్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఖండాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భద్రతా మండలి విశ్వసనీయత, న్యాయబద్ధత కలిగి ఉంటుందని స్పష్టం చేశాయి. దశాబ్దం తర్వాత జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్లు పాల్గొన్నారు. హజ్ యాత్ర తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా మృతి సౌదీ అరేబియాలోని మినా వద్ద సెప్టెంబరు 24న జరిగిన తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా హజ్ యాత్రికులు మరణించారు.ఇందులో 35 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబరు 28న తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. మినాలో జమారత్ వద్ద సైతానును రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు భారీగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రాష్ట్రీయం ఛత్తీస్గఢ్-తెలంగాణల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మోగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో సెప్టెంబరు 22న ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 2014, నవంబరులో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగానే తాజా ఒప్పందం జరిగింది. వచ్చే 12 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. తెలంగాణకు మరో మూడు ఎంఎల్సీ స్థానాలు తెలంగాణకు మూడు ఎంఎల్సీ స్థానాలు కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానాలను స్థానిక సంస్థల కోటా కింద రంగారెడ్డి, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలకు ఒక్కొక్కటి కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 11 స్థానిక సంస్థల నియోజక వర్గాలు ఉన్నాయి. తాజాగా మరో మూడు స్థానాలు చేరడంతో ఆ సంఖ్య 14 కు చేరుకుంది. ఏపీ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.9,000 కోట్ల ఆర్ఈసీ రుణం ఆంధ్ర ప్రదేశ్లో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.9,000 కోట్లు రుణం ఇచ్చేందుకు గ్రామీణ విద్యుతీకరణ సంస్థ(ఆర్ఈసీ) అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ జెన్కో, ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీల మధ్య సంతకాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.3,000 కోట్లతో అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతారు. మిగిలిన మొత్తాన్ని సరఫరా, పంపిణీ నెట్వర్క్ల కోసం వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు రూ.1000 కోట్ల కేంద్ర సహాయం సెప్టెంబరు 25న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్ర, రాయలసీమల్లోని ఏడు వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 300 కోట్లు చొప్పున ఈ మొత్తాన్ని కేటాయించింది. కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్కు ఒప్పందం రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్కు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపీజీడీసీ), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), షెల్, ఇంజీ సంస్థలు ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో సెప్టెంబరు 25న విజయవాడలో దీనికి సంబంధించిన సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా రూ.1,800 కోట్ల వ్యయంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజీ, రీ గ్యాసిఫికేషన్ యూనిట్ను నెలకొల్పుతారు. క్రీడలు సానియా- హింగిస్లకు గ్వాంగ్జౌ ఓపెన్ టైటిల్ గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ను సానియా మిర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. చైనాలోని గ్వాంగ్జౌలో సెప్టెంబరు 26న జరిగిన ఫైనల్స్లో జు షిలిన్- యు జియోడి (చైనా) జోడీని ఓడించి వీరిద్దరు టైటిల్ను గెలుచుకున్నారు. 2015 సీజన్లో సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా హింగిస్కు ఆరో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్ను జెలెనా జంకోవిచ్ (సెర్బియా) గెలుచుకుంది. క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబరు 24న ఈ మేరకు ప్రకటన చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో క్యాబ్ పగ్గాలను గంగూలీ చేపట్టారు. 2016లో క్యాబ్ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)లో సెప్టెంబరు 27న జరిగిన ఫైనల్లో పీటర్ గిల్క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. ఇది పంకజ్కి 14వ టైటిల్. హామిల్టన్కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్ ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 27న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలువగా నికో రోస్బర్గ్ రెండో స్థానం, వెటల్ మూడో స్థానంలో నిలిచారు. సంక్షిప్తంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా తీర్చిదిద్దనుంది. ఈ మేరకు అక్టోబర్ 2న మొదట దశలో 104 పంచాయతీల్లో ఈ-సేవలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనర్ల కోసం ప్రవేశపెట్టిన ఉచిత వైద్య సేవల పథకం అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని జర్నలిస్టులకు కూడా అమలు చేయననున్నారు.స్వచ్ఛభారత్ నిధుల సమీకరణ కోసం టెలికాం సేవలు, పెట్రోలు, బొగ్గు, ఇనుప ఖనిజం వంటి వాటిపై సుంకం (సెస్సు) విధించాలని ముఖ్యమంత్రులతో కూడిన ఉపసంఘం సిఫార్సు చేసింది. -
‘టెక్నాలజీ’తోనే పట్టం
* ప్రతి రంగంలోనూ శాస్త్ర సాంకేతికత కీలకం * ఏ పోటీ పరీక్షలోనైనా దానిపై కచ్చితంగా ప్రశ్నలు * గ్రూప్-1లో ప్రత్యేకంగా 100 మార్కుల పేపర్ * టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొ. రాజేశ్వర్రెడ్డి * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సైన్స్ అండ్ టెక్నాలజీని రెండు రకాలుగా విభజించుకోవాలి. దాని పాత్ర, ప్రభావం మొదటి యూనిట్ కాగా, శాస్త్ర విజ్ఞానంలో వస్తున్న నూతన మార్పులను రెండో యూనిట్గా తీసుకోవాలి. మొదటి యూనిట్లోనూ ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. సాక్షి, హైదరాబాద్: ఏ అభివృద్ధయినా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ లేని రంగమంటూ లేదు. అందుకే ప్రతి అధికారికీ, ఉద్యోగికీ దానిపై అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా 20-30 ఏళ్ల పాటు సేవలందించాల్సిన అధికారులు పలు రంగాలు, వాటిలోని రోజువారీ మార్పులు, అభివృద్ధి తదితరాలను లోతుగా విశ్లేషించగలగాలి. అందుకే గ్రూప్-1లో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకంగా ఐదో పేపరుగా పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్లో రెండు యూనిట్లు దీనిపైనే ఉన్నాయి. వాటికే 100 మార్కులున్నాయి. డాటా ఇంటర్ప్రిటేషన్కు మరో 50 మార్కులుంటాయి. కాబట్టి అభ్యర్థులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే’’ అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ బి.రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్-1లోనేగాక గ్రూప్-2, 3, ఇతర పోటీ పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్లో భాగంగానూ సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయని గుర్తు చేశారు. కాబట్టి ఇందులో ఏయే అంశాలపై అవగాహన పెంచుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏయే పుస్తకాలు చదవాలన్న అంశాలపై ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... 1. దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తున్న కృషి, ప్రధాన ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నమోదవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవాలి. తాజా ఉపగ్రహ ప్రయోగాలు, వాటి ఫలితాలు, సామాజికాభివృద్ధికి వాటి దోహదం తదితరాలపై దృష్టి పెట్టాలి. రోజువారీ జీవితంలో అవి ఉపయోగపడే తీరును తెలుసుకోవాలి. 2. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై అవగాహన ఉండాలి. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో వాటి పాత్రను వివరించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కీలకమైన కంప్యూటర్ వినియోగం, రోబోటిక్స్, నానో టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. 3. భారత అంతరిక్ష విధానంలో దేశంలో జరుగుతున్న కొత్త ఉపగ్రహ ప్రయోగా లు, కొత్త కార్యక్రమాలపై (చంద్రయాన్, ఎడ్యూశాట్ తదితర) అవగాహన పెంచుకోవాలి. 4. స్పేస్ టెక్నాలజీ సమాజాభివృద్ధికి దోహద పడుతున్న తీరుపై అధ్యయనం అవసరం. విద్య, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, వరదలు, తుపాను, సునామీ, వాతావరణ మార్పులు తదితరాలను తెలుసుకోవాలి. ఎ. వ్యవసాయ రంగంలో ఎలాంటి నూతన విధానాలు తీసుకురాగలుగుతున్నామన్నది చదువుకోవాలి. ఉపగ్రహ ప్రయోగాలతో రైతులకు ఉపయోగాలేమున్నాయి? తెలంగాణలో వాతావరణ పరిస్థితులేమిటి? ఇక్కడ ఏ టెక్నాలజీ ఉపయోగించాలి? ఎలాంటి పంటలు వే యొచ్చు? ఆధునిక వ్యవసాయ విధానాలేమిటి? ఏ పంటలు వేయాలి, ఏ పురుగు మందులు వినియోగించాలి వంటివాటిపై అవగాహన ఉండాలి. బి. మరో ప్రధానాంశం నీటి విధానం. తెలంగాణలో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సైన్స్ టెక్నాలజీ వల్ల మేలు చేయవచ్చన్నది విశ్లేషించాలి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటన్నది చెప్పాలి. సి. తుపానులు, సైక్లోన్లు, వరదలు ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మార్పులేమిటి? వర్షాలు కురవాల్సిన సమయంలో ఎందుకు కురవడం లేదు? కారణాలేమిటి? సునామీ ప్రభావమేమిటి? ఎందుకొస్తోంది? ముందస్తు జాగ్రత్తలేం తీసుకోవచ్చు? ఇలాంటివి తెలుసుకోవాలి. వాతావరణ మార్పుల సమయంలో పంటల విధానం ఎలా ఉండాలన్నది చదువుకోవాలి. 5. జల, అణు శక్తి, వాటి వినయోగం, ప్రభుత్వ చర్యలను తెలుసుకోవాలి. బయో మాస్, వ్యర్థాల ఆధారిత ఇంధన వనరుల ఉత్పత్తి, సౌర, పవన విద్యుత్లపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా వ్యవసాయ రంగ ఉప ఉత్పత్తులేమిటి? గ్యాస్ ఆధారిత పరిశ్రమల పరిస్థితేమిటి? గోబర్ గ్యాస్, వర్మి కంపోస్ట్ ఎరువులను ఎలా వాడుకోవాలి, వాటి ప్రయోజనాలేమిటన్నది తెలుసుకోవాలి. వనరుల విషయానికి వస్తే... పెట్రోల్ పరిస్థితేమిటి? పెట్రో వనరులు అయిపోతే ప్రత్యామ్నాయమేమిటి? సమస్యను ఎలా అధిగమించాలి? నైట్రోజన్ గ్యాస్ వస్తున్నందున దాని వినియోగమెలా? కంప్రెస్డ్ గ్యాస్ పరిస్థితేమిటన్న అంశాలపై దృష్టి పెట్టాలి. విద్యుత్తు వాడకం తగ్గించడానికి వాడుతున్న నియాన్ బల్బుల ప్రత్యేకతేమిటో తెలిసుండాలి. సౌర, పవన విద్యుత్పై పెట్టాల్సిన పెట్టుబడులు, ప్రయోజనాలేమిటన్నది విశ్లేషించాలి. శాస్త్ర విజ్ఞానంలో నూతన మార్పులు.. 1. సైన్స్లో ప్రాథమికాంశాల నుంచి తాజా పరిణామాల వరకు అవగాహన పెంచుకోవాలి. వ్యాధులు, టీకాలు, సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణలు తెలుసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్ల స్వభావం తెలియాలి. నివారణ చర్యలపైనా అవగాహన ఉండాలి.మొక్కలు, అటవీ కీటకాలు, ఔషధ మొక్కల వినియోగాన్ని విశ్లేషించాలి. ఔషధ మొక్కల ఉపయోగం, వాటి పెంపకం, అందులో జాగ్రత్తలను విశ్లేషించాలి. 2. బయో టెక్నాలజీకి సంబంధించి ఆహార భద్రత, ఆ దిశగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు, వాటి అమలు తీరు, డీ-ఫ్లోరినేషన్ వంటివాటిని తెలుసుకోవాలి. తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య, కారణాలు, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఎందుకుంది వంటివాటిపై అవగాహన ఉండాలి. రాక్, సాయిల్ స్ట్రక్చర్ వల్ల ఇది వస్తుందన్న విషయం తెలియాలి. సమస్య నివారణకు ఏం చేయాలో సూచించగలగాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇందుకెలా దోహదపడుతుందో విశ్లేషించాలి. రెజిన్స్ (ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఇనార్గానిక్ మాలిక్యూల్స్) ద్వారా ఫ్లోరోసిస్ను కాస్త తగ్గించవచ్చని, ఫ్లోరైడ్, హార్డ్ వాటర్ను తగ్గించవచ్చని అవగాహన పెంచుకోవాలి. సముద్ర జలాల్లో ఏముంటుంది, బావి నీటిలో, మినరల్ వాటర్లో ఏముంటాయన్న కనీస విషయాలు తెలియాలి. 3. బయో టెక్నాలజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేయాలి. హ్యూమన్, ప్లాంట్, ఫార్మ్ బయో టెక్నాలజీల్లోని ముఖ్యాంశాలు, పూర్వాపరాలు తెలుసుకోవాలి. వ్యవసాయ రంగ అభివృద్ధిలో బయో టెక్నాలజీ పాత్రపై అధ్యయనం చేయాలి. బయో ఫెర్టిలైజర్ అంటే ఏమిటి, అదెలా పని చేస్తుంది. వ్యవసాయ అధికారుల సాయం ఎలా పొందాలన్న అంశాలను విశ్లేషించాలి. 4. నిత్యం జీవితంలో సైన్స్: వ్యాధులను తీసుకుంటే... డెంగీ జ్వరం ఎందుకొస్తోంది, దానిపై పరిశోధనలు ఏమున్నాయి, ఎలా నియంత్రించాలన్నది తెలియాలి. స్వైన్ ఫ్లూ, హెచ్ ఐవీ, రేబిస్, టీబీ, మలేరియా తదితరాల మౌలికాంశాలు కచ్చితంగా తెలిసుండాలి. గ్రూపు-2లో: గ్రూపు-2లో మొత్తం పది యూనిట్లున్నాయి. వాటిలో రెండు సైన్స్ టెక్నాలజీకి సంబంధించినవి. కాకపోతే గ్రూప్ 1 తరహాలో లోతైన విశ్లేషణ గ్రూప్-2, 3లకు అవసరం లేదు. ఏం చదవాలంటే... ఎన్ని రంగాలున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం. దీన్ని విస్మరిస్తే పురోగతి ఉండదు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోవాలి. కానీ ఇది ఏవో నాలుగు పుస్తకాలు చదివితే రాదు. క్రమం తప్పకుండా పత్రికలు చదువుతుండాలి. 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ పుస్తకాలు చదవాలి. అంతేగాక పదజాలంపైనా పట్టు సాధించాలి. పరీక్షలో సాంకేతిక పదాలనే రాయాలి. లేదంటే మార్కులు సాధించడం కష్టం. వాటిని కచ్చితంగా చూస్తారు. -
రెండవ విలువ.. విశ్వసనీయత
విద్య - విలువలు సైంటిఫిక్ డెవలపెప్మెంట్ని మీరు ఆపలేరు. టెలివిజన్ ఉంది. ఇప్పుడు వందల ఛానెళ్లు ఉన్నాయి. మిమ్మల్ని ఉదేకపరచేవి, మీ జీవితాన్ని తప్పుతోవ పట్టించేవి ఎన్నో ఉన్నాయి. మీ సెల్ ఫోన్కు మిమ్మల్ని తప్పుతోవ పట్టించే మెసేజీలెన్నో వస్తాయి. పుస్తకాలు, మేగజైన్లలో రంగురంగుల బొమ్మలతో చెడువైపు మిమ్మల్ని ఆకర్షించేవెన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆపగలరా? ఇది విమర్శకాదు. మీకు యథార్థం తెలియజెప్పడం. మీ మేనమామగా, పినతండ్రిగా చెప్తున్నా. మీ భద్రత కోరి చెప్తున్నా. వీటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మార్గం ఒక్కటే. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రిస్ట్రెయింట్. టెలివిజన్, సెల్ఫోన్, పత్రిక, పుస్తకాలలో మంచి అందించేవీ ఉంటాయి. రామకోటి రాస్తూ హత్యలు చేసేవారు ఉంటారు. రామాయణం రాసి తరించిన వాల్మీకీ ఉన్నాడు. తప్పు రామనామానిదా? అది అర్థం కాని వెర్రితనంలో ఉన్నవాళ్లదా? సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనమైపోవడమన్నది సహజం. ఇప్పుడు సమాజంలో వచ్చిన ప్రమాదకరమైన పోకడ ఏమిటంటే అందించే వాళ్లకు కూడా సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేకపోవడం. ఒకప్పుడు మనం ఇటువంటివి అందించకూడదు, సమాజాన్ని ఇంతలా పాడుచేయకూడదు అన్న బాధ్యత పెద్ద వాళ్లలో ఉండేది. ఇవాళ రోడ్డు మీదికి వెళ్లి చూడండి. భయంకరమైన వాల్ పోస్టర్లు. అవి చూస్తూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నారు. అట్లా చేయకూడదు. చేస్తే మనల్ని చూసి పిల్లలు ఇదే నేర్చుకుంటారు అన్న జ్ఞానం ఆ పెద్దమనిషికి లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఏ ఛానల్ ఏం ప్రసారం చేయాలి? ఏ పత్రిక ఎలా వార్త రిపోర్ట చేయాలి అన్న నియంత్రణ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నియంత్రిస్తే అది స్వేచ్ఛకు భంగకరం. ఎమోషన్ వాళ్ల వ్యాపారానికి ప్రధానాంశం. ఏది తక్కువ సమయంలో ఎక్కువమంది దృష్టిని ఆకర్షించగలదో అది వాళ్లకి గొప్ప అడ్వర్టయిజ్మెంట్. మీ మాటల్లో క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే ఆ మాటలకు ఏమీ విలువ ఉండదు. మీ జీవితానికి విలువుండదు. మీరు ఏమి మాట్లాడుతున్నా, మీరు ఏది చేస్తున్నా మీరు చేసే పనిలో క్లారిటీ ఉండాలి. యస్ నేనిది ఇందుకు చేస్తున్నా. నేనిది ఇందుకు చదువుకుంటున్నా అని చెప్పగలగాలి. నేనిది చేస్తా అని నమ్మకం ఉండాలి. నేనిది సాధిస్తా అన్న విశ్వాసం ఉండాలి. అందుకని మీ ఎమోషన్ని ఎవరినీ దోపిడీ చేయనీయకండి. మీరు సెల్ఫ్ రిస్ట్రెయింట్ అలవాటు చేసుకుంటే తప్ప చుట్టూ ఉన్న ఇంతమంది శత్రువులతో పోరాడలేరు. ఇప్పుడు ఎమోషన్కు లొంగిపోయి తర్వాత పశ్చాత్తాప పడడం వల్ల లాభం లేదు. అందువల్ల ఆ ఎమోషన్ని నియంత్రణలో ఉంచుకోవడం నేర్చుకోండి. అదే నా దృష్టిలో విద్యయొక్క నిజమైన విలువ. కారు చాలా వేగంగా పోగలదు. కాని దానికి బ్రేకుల్లేవంటే మనం ఆ కారు ఎక్కుతామా? కారుకు వేగం ఎంత ముఖ్యమో, ఆగడం అంత ముఖ్యం. లేకపోతే యాక్సిడెంట్ తప్పదు. ఈ బ్రేకే సెల్ఫ్ రిస్ట్రెయింట్. అన్నింటినీ చూసి, అన్నింటినీ తెలుసుకోగలగడం స్పీడ్. మీరు మీ బలహీనతను తెలుకోవడం గొప్పదనం. దాన్ని తెలుసుకొని ఎలా అధిగమించాలో కూడా తెలుకోవాలి. విద్య అన్నదానికి యథార్థమైన విలువ ఇది. అప్పుడు మీ ప్రవర్తన గొప్పదవుతుంది. విద్యకు తక్షణ ఫలితం ప్రవర్తనే. ఎంత చదివాడన్నదానికంటే ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడన్నది ముఖ్యం. కనీసంలో కనీసం సంతృప్తికరంగా ఉండాలి. మీరు ఎంత డిస్టింక్షన్లో పాసవ్వండి. మీకు గోల్డ్ మెడల్ ఉండనీ, మీ కాలేజీ పిన్సిపాల్ మీకిచ్చే కాండక్ట్ సర్టిఫికెట్లో మోస్ట్ అన్ డిపెండబుల్ అన్ శాటిస్ ఫ్యాక్టరీ. మిస్చువస్ అని రాసి సంతకం పెట్టి ఇచ్చాడు అనుకోండి. ఎంత గొప్ప చదువు చదివినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. మీ రేప్పొద్దున ఉద్యోగానికి వెళ్లినా మీ ఇమిడియెట్ బాస్ దగ్గర ట్రస్ట్ట్వర్థీనెసేనా అని అడుగుతారు. ఈ ట్రస్ట్వర్థీనెస్ అనేది ఎవరికి వారు తనంత తాను అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఇరవై వేలు వస్తున్నాయి. ఇరవై అయిదు వేలు ఎక్కడ వస్తాయని వెదుక్కుంటూ ఉన్నవాడు బాటసారి లాంటివాడు. అలా ఉండకూడదు. మనిషన్న వాడు ఎంతలో ఉన్నా అంతలో నిలబడాలి. ఆ సంస్థకి కీర్తి తేవాలి. మీ ఈ ట్రస్ట్ వర్థీనెస్ అన్నదాన్ని బాగా డెవలప్ చేసుకోండి జీవితంలో. ఒక్క మాట మీ మాట్లాడితే అందరూ శద్ధగా వినాలి. మీరు ఎక్కడ ఉన్నా అందరూ మీ పేరు చెప్పుకొని సంతోషించాలి. అదీ ట్రస్ట్ వర్థినెస్ అంటే, వాడు నాకొడుకని తండ్రి, మా అబ్బాయేనని తల్లీ, మా ఆయనే అని భార్య, మానాన్నగారని కొడుకు, మా స్టూడెంట్ అని కాలేజీ, మా ఊళ్లో ఉంటారని ఊరు, మా దేశంలో ఉంటారని దేశం సంతోషించాలి. దీనికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా? ఎంత పెద్ద రావి చెట్టయినా? చిన్న విత్తనంలో దాని వ్యూహం అంతా ఉన్న్టది. ఇదంతా ట్రస్ట్ వర్థీనెస్ డెవలప్ చేసుకోవడంలో ఉంటుంది. ట్రస్ట్ వర్థీనెస్ ఎక్కడుంటుందో తెలుసా. క్లారిటీ ఇన్ థాట్లో ఉంది. ది వాల్యూ ఇన్ ది ఎడ్యుకేషన్ ఈజ్ రిజెల్టెడ్ ఓన్లీ ఇన్ ది క్లారిటీ థాట్. వెయ్యిమందిలో 999 మంది సొల్లు మాట్లాడవచ్చు ఒక్కడుంటాడు. ఒకటే మాట మాట్లాడతాడు. కానీ ఎంత స్పష్టత ఉంటుందో. కంచి పరమాచార్య ఉండేవారు. వారి దగ్గరికి వెళ్లి మీరేదయినా పశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఓ రెండు మూడు నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించి జవాబు చెప్పేవారు. ఆయన ఒకసారి స్కూలు పిల్లలతో ఇరవై నిమిషాలపాటు మాట్లాడిన అనుగ్రహభాషణం 36 భాషల్లోకి తర్జుమా అయ్యింది. ఎందుకు తర్జుమా అయ్యింది... ఒక్కటే కారణం. క్లారిటీ ఇన్ థాట్. ఆలోచనలో స్పష్టత. ఎమోషనల్గా మాట్లాడటం అందరూ చేస్తారు. చాలామంది మాటలకు మూల సిద్ధాంతాలే ఉండవు. అందుకనే వాళ్లు మాట్లాడిన మాటలను చివరకు వాళ్లే ఖండించుకుంటారు. ఆలోచనలో స్పష్టతలేనిది ఎంత చదివి ఏం లాభం? మన దరిద్రమేమిటంటే నాయకులు కూడా వాళ్లకిష్టమైన వారినే పాఠ్య పుస్తకంలో వేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రిగారి పేరు ఇవాళ చాలామందికి తెలియదు. సర్దార్ పటేల్ జీవిత చరిత్ర చదివిన వాళ్లు ఎంతమంది ఉన్నారీవాళ? రాజారామ్మోహనాయ్, లాలాలజపతి రాయ్, మహాత్మాగాంధీ లాంటి వారి జీవిత చరిత్ర ఇవ్వాళ ఎంతమంది చదివారు. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కు మీ చదువుతున్న చదువు ఒక్కటే కాంట్రిబ్యూట్ చేయదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అన్నింటికన్నా జీవితంలో క్యారెక్టర్ మౌల్డింగ్ చాలా అవసరం. హైపర్ సెన్సిటివ్ అన్నది మనకు అంతర్గత శత్రువన్నది గుర్తించాలి. మన ధోరణి మనదే కానీ, అవతలి వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారన్నది ఆలోచించని వాడు ఎంత పెద్ద పొజిషన్కి వెళితే అంత ప్రమాదకరం. మనిషి ఎదుగుదలకు హేతువు ఎదుటివాడు ఏమి చెప్నాడన్నది వినడం. ముందు వినాలి. క్లారిటీ ఆఫ్ థాట్ నేర్చుకోవాలి. ఎదుటి వారి గురించి అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడమే వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సస్పెన్స్ థ్రిల్లర్
కథానాయిక ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘ఆమె ఎవరు’. అనీల్ కల్యాణ్, మిత్ర జంటగా రమేశ్ ముగడ దర్శకత్వంలో వీర గణేశ్, లక్ష్మీ సరోజ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ఫణీంద్ర, ఓం ప్రసాద్ వాకాటి, సంగీతం: చిన్నికృష్ణ. -
ఎక్కువ పనిచేస్తే స్ట్రోక్ వస్తుంది జాగ్రత్త!
మీకు అంకితభావం మరీ ఎక్కువైపోతోందా? రోజుకు 8 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారా? అలా చేస్తే.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. ఎన్ని గంటలు పనిచేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు శాస్త్రీయంగా తేల్చారు. వారానికి 55 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తే.. కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. అలా కాకుండా సాధారణంగా 8.. లేదా అంతకంటే తక్కువగా పనిచేస్తుంటే మాత్రం కాస్త తక్కువగా.. అంటే 13 శాతం మాత్రమే స్ట్రోక్ ముప్పు ఉంటుందట. అంటే, వారానికి 35 నుంచి 40 గంటలు మాత్రమే పనిచేయాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు మొత్తం 6 లక్షల మంది మీద పరిశోధనలు చేశారు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఒక్కొక్కరి మీద దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ పరిశోధనలు జరిగాయి. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేస్తే గుండెపోటు వచ్చే ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని చివరకు తేల్చారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మికా కివిమాకి నేతృత్వంలో పరిశోధన మొత్తం సాగింది. దీని వివరాలను లాన్సెట్ పత్రికలో ప్రచురించారు. -
ఇంటింటికీ గంగాజలం
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. జనం వద్దకు గంగాజలం తీసుకువచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇంటింటికీ గంగాజలాన్ని సీసాల్లో అందించే పథకానికి శ్రీకారం చుడుతోంది. గంగానదీ జలాన్ని శాస్త్రీయపద్ధతిలో శుద్ధి చేసి సీసాల్లో నింపి కోరినవారి ఇంటికే బట్వాడా చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ బాట్లింగ్ యూనిట్ను ఏర్పాటు చే సేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ప్రేరణ కలిగించింది మాత్రం ఇటీవలి గోదావరి పుష్కరాలే కావటం విశేషం. ‘గాడ్జల్’ సూపర్ సక్సెస్తో...: జూలై 14 నుంచి 25 వరకు జరిగిన గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని తపాలాశాఖ గోదావరి నీటిని శుద్ధి చేసి సీసాల్లో నింపి ‘గాడ్జల్’ పేరుతో కోరిన వారికి అందజేసింది. పుష్కరాలకు వెళ్లలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, దూరభారాన్ని మోయలేనివారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని నిర్ణయించి తపాలాశాఖ ఏపీ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) ఈ ఆలోచన చేసింది. ఇందుకోసం రాజమండ్రిలోని ఓ చిన్న బాట్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీనికి అనూహ్య స్పందన లభించింది. పుష్కరాలు మొదలయ్యేనాటికి ఏడున్నర లక్షల మంది ఆర్డర్ నమోదు చేసుకున్నారు. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా ఒత్తిడి రావటంతో ఆన్లైన్ ఆర్డర్లకు అవకాశం క ల్పించారు. గోదావరి పుష్కర నీటికి వచ్చిన డిమాండ్తో తపాలా శాఖకు కొత్త ఆలోచన తట్టింది. దేశవ్యాప్తంగా పుణ్యజలంగా భావించే గంగాజలాన్ని ఇంటింటికీ సరఫరా చేయాలని భావించింది. దీంతో గంగానది ప్రారంభమయ్యే గంగోత్రి వద్ద నీటిని సేకరించి శుద్ధి చేసి సీసాల్లో నింపి విక్రయించాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో చర్చించి సంయుక్తంగా సొంత ప్లాంట్ను ఏర్పాటు చేస్తే నిరంతరాయంగా వాటిని సరఫరా చేయొచ్చని భావిస్తోంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్రముఖ్యమంత్రితో త్వరలో తపాలాశాఖ అధికారులు భేటీ కాబోతున్నారు. తపాలాశాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్గా ఉన్న సుధాకర్ త్వరలోనే తపాలాశాఖ బోర్డు సభ్యుడిగా పదోన్నతిపై ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ గంగాజలం ప్రాజెక్టు బాధ్యతను ఆయన పర్యవేక్షించనున్నట్టు సమాచారం. ఆయనే స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. తపాలాశాఖ కేంద్రకార్యాలయం ముందు ఈ ప్రతిపాదనను ఉంచింది ఆయనే. -
షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంక్...
సైన్స్ అండ్ టెక్నాలజీ రూ.235 కోట్లతో సార్క్ ఉపగ్రహం సార్క్ దేశాల కోసం భారత్ ప్రయోగించనున్న ఉపగ్రహానికి రూ.235 మేర ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం జూలై 24న పార్లమెంటుకు తెలిపింది. 2014 నవంబరులో నేపాల్లో జరిగిన సార్క్ సదస్సులో ఈ ఉపగ్రహంపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. 12 కేయూ-బ్యాండ్ ట్రాన్స్పాండర్లతో ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎంకే-2 ద్వారా ఇస్రో ప్రయోగిస్తుంది. ఉపగ్రహం ద్వారా సార్క్ సభ్యదేశాలకు టెలీకమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్, విపత్తుల నిర్వహణ వంటివాటికి అవసరమయ్యే సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయ యుద్ధనౌకల నిర్మాణానికి 15 ఏళ్ల ప్రణాళిక భారత నౌకాదళం..స్వదేశీ నిర్మాణ ప్రణాళిక(2015-30) ను జూలై 20న ఆవిష్కరించింది. దేశీయంగా యుద్ధ నౌకలు, ఇతర ఆయుధాల నిర్మాణాన్ని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ద్వారా చేపట్టేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. దీన్ని ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుసంధానిస్తారు. భారతీయ పరిశ్రమను కూడా భాగస్వామ్యం చేస్తారు. గ్రహాంతర వాసుల అన్వేషణ ప్రారంభం గ్రహాంతర వాసుల అన్వేషణకు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అతి పెద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు లండన్లో జూలై 20న ప్రకటించారు. పదేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్టుకు రష్యాకు చెందిన బిలియనీర్ యూరీ మిల్నర్ 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేస్తారు. ఈ ప్రాజెక్టుకు ‘బ్రేక్ థ్రూ లిజన్’ అని పేరు పెట్టారు. దీనికోసం ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోపుల సహాయం తీసుకుంటారు. ఇతర గ్రహాల్లోని మేధో జీవులు వెలువరించే రేడియో సంకేతాల కోసం ఈ పరిశోధనలు చేపడుతున్నారు. జాతీయం దీనానగర్ పోలీస్ స్టేషన్పై ఉగ్ర దాడి పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్పై జూలై 27న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మరణించారు. వీరిలో ఒక ఎస్పీ, ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను సాయుధ దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు దీనానగర్లో రైలు పట్టాలపై బాంబులు అమర్చారు. క్రిడాకు సర్దార్ పటేల్ పురస్కారం హైదరాబాద్లోని జాతీయ మెట్ట పరిశోధనా కేంద్రం (క్రిడా)కు సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జూలై 25న పాట్నాలో క్రిడా సంచాలకుడు శ్రీనివాసరావుకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఏటా దేశంలో వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో ఉత్తమ పనితీరు కనబరచిన సంస్థకు ఈ పురస్కారం ప్రకటిస్తోంది. లోక్సభకు ఆంగ్లో ఇండియన్ ఎంపీలు బెంగాలీ నటుడు ‘జార్జ్ బేకర్’, కేరళకు చెందిన ‘రిచర్డ్ హే’లను లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. జార్జ్ బేకర్ ‘చమేలీ మేమ్సాబ్’ చిత్రానికి 1975లో జాతీయ చలనచిత్రోత్సవ అవార్డును పొందారు. రిచర్డ్ హే ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్. ఆయన దేశ, విదేశాల్లోని వివిధ అకడమిక్ సంస్థల్లో ఆర్థిక శాస్త్ర అంశాలను బోధిస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి కలాం అస్తమయం భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం (84) షిల్లాంగ్లో జూలై 27న మరణించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో లివబుల్ ప్లానెట్ అనే అంశంపై ఉపన్యసిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. ఆయన్ను సమీపంలోని బెథనీ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. అబ్దుల్ కలాం 1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక 1960లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో చేపట్టిన క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అగ్ని, పృథ్వీ క్షిపణుల రూపకల్పనకు కృషిచేశారు. దీంతో ఆయన మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. 2002 జూలై 25 నుంచి 2007 జూలై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయనకు 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న, 1997లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు, 1998లో వీర్ సావర్కర్ అవార్డు లభించాయి. టెరీ డీజీ పచౌరీ తొలగింపు ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టీఈఆర్ఐ) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీని తొలగిస్తూ ఆ సంస్థ పాలకమండలి జూలై 23న బెంగళూరులో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. పర్యావరణ పరిశోధన సంస్థ అయిన టెరీ వ్యవస్థాపకుడుగా పచౌరీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. పచౌరీ స్థానంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ను టెరీ పాలక మండలి నియమించింది. ఆర్థికం షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల న్యూడెవలప్మెంట్ బ్యాంకు చైనాలోని షాంఘైలో జూలై 21న ఆవిర్భవించింది. బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్ల ప్రాథమిక అధీకృత మూలధనంతో ఏర్పాటుచేసిన ఈ బ్యాంకు సభ్యదేశాల మౌలిక సదుపాయాల కోసం నిధులు అందిస్తుంది. పశ్చిమ దేశాల ఆధిపత్యం ఉన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) వంటి సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాల కూటమి ఏర్పాటుచేసిన తొలి బ్యాంకు ఇది. బ్యాంకుకు మొదటి అధ్యక్షుడిగా ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్ను భారత్ 2015, మే 11న నామినేట్ చేసింది. కామత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. టెక్నాలజీ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఒప్పందం దాదాపు 200 టెక్నాలజీ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) జూలై 24న తెలిపింది. అమెరికా, చైనా, ఐరోపా యూనియన్కు చెందిన 28 దేశాలతోపాటు మొత్తం 49 దేశాలు ఈ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో టెక్నాలజీ సంబంధ ఉత్పత్తులు వినియోగదారులకు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో జీపీఎస్ నావిగేషన్ పరికరాలు, మెడికల్ స్కానర్లు, కొత్త తరానికి చెందిన సెమీకండక్టర్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. క్రీడలు ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని ఢిల్లీ కోర్టు తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలతోపాటు 36 మందిపై నమోదైన అభియోగాలను జూలై 25న కోర్టు కొట్టేసింది. ఐపీఎల్లో స్పాట్ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013 మే 16న క్రికెటర్లతోపాటు కొందరు బుకీలు అరెస్టయ్యారు. ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీ ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. అస్తానా (కజకిస్థాన్) లో జూలై 26న ముగిసిన టోర్నమెంటులో మొత్తం తొమ్మిది పతకాలతో భారత్ రన్నరప్గా నిలచింది. కజకిస్థాన్ మొదటి స్థానం, మంగోలియా మూడో స్థానాల్లో ఉన్నాయి. స్క్వాష్ టాస్మేనియన్ ఓపెన్ టోర్నీ టైటిల్ టాస్మేనియన్ ఓపెన్ టోర్నమెంట్ స్క్వాష్ టైటిల్ను భారత్కు చెందిన కుష్ కుమార్ గెలుచుకున్నాడు. ఇది ఆయనకు తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిల్. జూలై 26న ఆస్ట్రేలియాలో ముగిసిన ఫైనల్లో జేమీ హేకాక్స్(ఇంగ్లండ్)ను కుష్ కుమార్ ఓడించాడు. వెటెల్కు హంగేరీ గ్రాండ్ప్రి టైటిల్ ఫార్ములా వన్ హంగేరీ గ్రాండ్ప్రి టైటిల్ను సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) గెలుచుకున్నాడు. బుడాపెస్ట్లో జూలై 26న ముగిసిన పోటీలో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, క్వియాట్ (రెడ్ బుల్) రెండో స్థానం పొందాడు. అంతర్జాతీయం అమెరికా, క్యూబా మధ్య సంబంధాల పునరుద్ధరణ అమెరికా, క్యూబాల రాజధానుల్లో రెండు దేశాల దౌత్య కార్యాలయాలు జూలై 20న తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 54 ఏళ్ల తర్వాత సంబంధాల పునరుద్ధరణ జరిగింది. వాషింగ్టన్లోని క్యూబా దౌత్యకార్యాలయంపై ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ జెండా ఎగరేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతాయని, 2014 డిసెంబరు 17న అమెరికా అధ్యక్షుడు ఒబామా.. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చల సందర్భంగా ప్రకటించారు. హిగ్స్కు రాయల్ సొసైటీ కొప్లే మెడల్ ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ కొప్లే మెడల్.. భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్కు లభించింది. పదార్థంలోని ఇతర ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని కలిగిస్తున్న మరో కణం ఉందని 1964లో హిగ్స్ ప్రతిపాదించారు. ఆ కణానికి హిగ్స్ బోసన్ అని పేరు పెట్టారు. హిగ్స్ ప్రతిపాదన సరైందేనని 2012లో రుజువైంది. స్విట్జర్లాండ్లోని లార్జ్ హాడ్రన్ కొలైడర్లో జరిపిన ప్రయోగాల్లో కణం ఉనికిని మొదటిసారి ధ్రువీకరించారు. శాస్త్రరంగంలో అత్యంత పురాతనమైన రాయల్ సొసైటీ పురస్కారాన్ని 1731లో తొలిసారిగా బహూకరించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో డార్విన్, ఐన్స్టీన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్నారు. రాష్ట్రీయం విప్లవ రచయిత చలసాని మృతి విప్లవ రచయితల సంఘం(విరసం) సహ వ్యవస్థాపకుడు, రచయిత చలసాని ప్రసాద్ (83) విశాఖపట్నంలో జూలై 25న మరణించారు. విప్లవ రచనలు, కవితలతో ఆయన సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు అరెస్టయ్యారు. శ్రీశ్రీ, రంగనాయకమ్మ, రావి శాస్త్రి వంటి అనేకమంది సాహితీవేత్తలకు ఆయన అత్యంత సన్నిహితుడు. రాజమహేంద్రవరంగా రాజమండ్రి రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జూలై 25న గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రకటించారు. రాజమహేంద్రవరాన్ని ఆధునిక పర్యాటక నగరంగా, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దీనికోసం తొలివిడతగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో గ్రామజ్యోతి కార్యక్రమం గ్రామాల సమగ్రాభివృద్ధికి గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జూలై 26న ప్రకటించారు. రూ.25 వేల కోట్లతో చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి రెండు నుంచి ఆరు కోట్ల రూపాయలు అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. గ్రామపంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం, గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, అమలుచేయడం వంటి చర్యలు చేపడతారు. ఈ కార్యక్రమం అమలు, విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. -
నెలముందే కృష్ణా పుష్కర పనులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిన నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరగనున్న కృష్ణా నదీ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. శనివారంతో గోదావరి పుష్కరాలు ముగియటంతో ఇక కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు అనుకున్నదానికి మించి భక్తులు పోటెత్తినప్పటికీ ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంతమంది భక్తులు పుణ్యస్నానాలాచరించారనే విషయంలో శాస్త్రీయ పద్ధతిలో లెక్కలు తేల్చనప్పటికీ... ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య 6.7 కోట్లుగా పేర్కొంటోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెల్లువెత్తటంతో అన్ని పుష్కర క్షేత్రాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు కూడా భక్తులు వెల్లువెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని ఆదేశించారు. సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నిజానికి గోదావరి పుష్కరాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. నిధుల విషయం తేల్చకపోవటం, సకాలంలో వాటిని విడుదల చేయకపోవటంతో పుష్కరాలు ప్రారంభం అయ్యాక కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. వానలు లేక నదిలో నీటి ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకోవటంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ అదే ఓ రకంగా వరంగా మారింది. పుష్కరాల సమయంలో భారీ వర్షాలు కురిసి ఉంటే అంతా గందరగోళంగా మారేది. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని చోట్లా భక్తులు అధిక సంఖ్యలోనే కనిపించారు. ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తే భక్తులకు తలదాచుకునే సౌకర్యం ఉండకపోయేది. భద్రాచలం, బాసర, కాళేశ్వరం, ధర్మపురిలాంటి ప్రధాన ఘాట్ల వద్దనే ఏర్పాట్లు చాలకపోగా మిగతా చిన్న ఘాట్ల పరిస్థితి దారుణంగా ఉంది. వానలు కురవకపోవటంతో ఇబ్బందులు తప్పాయి. కృష్ణా పుష్కరాలు కూడా వానాకాలంలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలు ప్రారంభమయ్యే నెల ముందే ఏర్పాట్లు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పుష్కర ఘాట్లకు ప్రాంతాలను గుర్తించే పని త్వరలో ప్రారంభించనున్నారు. మేడారంపై దృష్టి: ఇదిలా ఉండగా వచ్చే ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాల్సి ఉంది. ప్రధాన గిరిజన జాతర కావటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. మూడురోజుల జాతరలో భక్తుల సంఖ్య కోటిని మించుతుంది. గత రెండు జాతరల్లో ఏర్పాట్లు సరిగా లేక భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
సామాజిక, ఆర్థిక, కుల గణన-2011 విడుదల
సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్త సంజీవ్కు బిర్లా అవార్డు 2014 సంవత్సరానికి జి.డి.బిర్లా అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త సంజీవ్ గలాండే ఎంపికయ్యారు. ఈయన పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కణ జీవశాస్త్రం, ఎపిజెనిటిక్స్ రంగాల్లో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. తీర గస్తీ నౌక రాణి దుర్గావతి ప్రారంభం సముద్ర తీర గస్తీ నౌక రాణి దుర్గావతిని విశాఖపట్నంలో జూలై 6న తూర్పు నౌకదళాధిపతి అడ్మిరల్ సతీశ్ సోనీ ప్రారంభించారు. గోండు వంశానికి చెందిన వీరనారి రాణి దుర్గావతి పేరును ఈ నౌకకు పెట్టారు. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. క్రీడలు చిలీకి కోపా అమెరికన్ కప్ ఫుట్బాల్ కోపా అమెరికన్ కప్ను తొలిసారి చిలీ గెలుచుకుంది. ఈ కప్ను చిలీ 99 ఏళ్ల అనంతరం గెలుచుకోగలిగింది. జూలై 5న శాంటియాగో (చిలీ)లో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను చిలీ ఓడించింది. ఒలింపిక్స్కు మహిళల హాకీ జట్టు అర్హత హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్లో విజయం సాధించి భారత హాకీ మహిళల జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించింది. బెల్జియంలోని యాంట్వర్ప్లో జూలై 4న జరిగిన పోటీలో జపాన్ జట్టును ఓడించి భారత్ అయిదో స్థానం దక్కించుకుంది. దీంతో 35 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. భారత్కు ఎస్ఏబీఏ చాంపియన్షిప్ టైటిల్ 4వ దక్షిణాసియా బాస్కెట్బాల్ చాంపియన్షిప్ (ఎస్ఏబీఏ) టైటిల్ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో జూలై 5న జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ను నిలబెట్టుకుంది. మూడో స్థానంలో నేపాల్, నాలుగో స్థానంలో బంగ్లాదేశ్, అయిదో స్థానంలో మాల్దీవులు, ఆరో స్థానంలో భూటాన్ నిలిచాయి. దీంతో భారత్ ఈ ఏడాది చివర చైనాలో జరిగే ఆసియన్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. అమెరికాకు మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ టైటిల్ మహిళల ప్రపంచకప్ ఫుట్బాల్ టైటిల్ను అమెరికా గెలుచుకుంది. వాంకోవర్లో జూలై 5న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ను అమెరికా 5-2 తేడాతో ఓడించింది. ఈ కప్ను అమెరికా గెలుచుకోవడం ఇది మూడోసారి. గతంలో 1991, 1999లో గెలుచుకుంది. మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా అమెరికా నిలిచింది. జాతీయం జాతీయ నైపుణ్య విధానానికి కేబినెట్ ఆమోదం జాతీయ నైపుణ్య విధానానికి కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంచుతారు. తద్వారా సృజనాత్మక పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సరఫరాకు, డిమాండ్కు మధ్య సంతులనం సాధించడం, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను తొలగించడం, గుణాత్మకమైన పనితనం, సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానం కల్పించడం, శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన మధ్య ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 6న ఉజ్బెకిస్థాన్లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్తో ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు. అణు ఇంధన శక్తి, రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఉగ్రవాదం, అఫ్గానిస్థాన్ పరిస్థితి సహా పలు ప్రాంతీయ అంశాలపై ఇరు దేశాల నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంస్కృతి, పర్యాటక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు అత్యాచారం, అత్యాచార యత్నం కేసుల్లో మధ్యవర్తిత్వం, రాజీ కుదర్చడం వీలుపడదని సుప్రీంకోర్టు జూలై 1న పేర్కొంది. ఈ నేరాలు అపరాధ రుసుంతో సరిపోయేవి కావని, అందువల్ల రాజీ కుదర్చడం సరికాదని పేర్కొంటూ, కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు రాజీ చేసుకోవడానికి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతించడంపై ప్రభుత్వం అప్పీలు చేసిన కేసులో సుప్రీం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ కేసును తిరిగి పరిశీలించాలని హైకోర్టుకు తిప్పి పంపింది. డిజిటల్ ఇండియా వీక్ను ప్రారంభించిన ప్రధాని డిజిటల్ ఇండియా వీక్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 1న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అవినీతి నిర్మూలనకు, పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించేందుకు, పేద-ధనికుల మధ్య వ్యత్యాసాలను అంతం చేసేందుకు డిజిటల్ విప్లవం అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్స్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని రిలయన్స్, బిర్లా, మిట్టల్, విప్రో తదితర సంస్థల అధిపతులు పాల్గొని, 18 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు డిజిటల్ రంగంలో దాదాపు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారత్ నెట్, డిజిటల్ లాకర్, ఉపకారవేతనాల పోర్టల్, డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీధిబాలల గుర్తింపు కోసం ఆపరేషన్ ముస్కాన్ దేశవ్యాప్తంగా వీధిబాలలను సంరక్షించడం, తప్పిపోయిన వారి కుటుంబాలకు చేర్చడం కోసం ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి 31 వరకు కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులు, ప్రార్థనా స్థలాలు తదితర ప్రదేశాలలో వీధి పిల్లల ఫోటోలు తీసి వివరాలు సేకరిస్తారు. పీఎంకేఎస్వైకు కేబినెట్ ఆమోదం ప్రతి గ్రామానికి నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)కు కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం ప్రతి గ్రామానికి నీటి పారుదల సౌకర్యం కల్పిస్తారు. దీనికోసం వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఈ కార్యక్రమం కింద కేంద్రం రాష్ట్రాలకు 75 శాతం నిధులు గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్రాలు భరించాలి. ఈశాన్య, కొండ ప్రాంతాల రాష్ట్రాలకు ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. జాతీయ వ్యవసాయ మార్కెట్కు ఆమోదం జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. కొత్త విధానం ద్వారా రాష్ట్రం మొత్తం మార్కెట్ కార్యకలాపాలకు సింగిల్ లెసైన్స్, ఒకే రకమైన పన్ను విధానం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం జరుగుతుంది. దీంతో రాష్ట్రం మొత్తం ఒకే మార్కెట్లా మారుతుంది. దేశంలోని 585 హోల్సేల్ వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేస్తారు. ఆన్లైన్ జాతీయ వ్యవసాయ మార్కెట్కు రూ.200 కోట్లు కేటాయించింది. సామాజిక, ఆర్థిక, కుల గణన-2011 విడుదల సామాజిక, ఆర్థిక, కుల గణన - 2011ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ జూలై 3న విడుదల చేశారు. 1934 తర్వాత సామాజిక, ఆర్థిక, కుల గణనను విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ లెక్కల్లో కులాలకు సంబంధించిన వివరాలు లేవు. ముఖ్యాంశాలు: దేశంలో మొత్తం కుటుంబాల సంఖ్య: 24.39 కోట్లు; గ్రామీణ కుటుంబాలు: 17.91 కోట్లు; పేదరికంలో ఉన్న గ్రామీణ కుటుంబాలు: 10.69 కోట్లు; ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు: 3.86 కోట్లు; భూమి లేని, శారీరక కష్టంపై జీవించే గ్రామీణ కుటుంబాలు: 5.37 కోట్లు; నెల జీతం పొందే గ్రామీణ కుటుంబాలు: 2.5 కోట్లు; శారీరక శ్రమపై ఆధారపడే రోజువారీ కూలీలు: 9.16 కోట్లు; 18-59 ఏళ్ల వయసువారు లేని కుటుంబాలు: 65.15 లక్షలు; 25 ఏళ్ల వయసు పైబడిన నిరక్షరాస్య వయోజనులున్న కుటుంబాలు: 4.21 కోట్లు; గ్రామీణ జనాభాలో మహిళలు: 48 శాతం. ఆర్థికం బెయిల్ అవుట్ ప్యాకేజీ షరతుల తిరస్కరణ ఐరోపా యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బెయిలవుట్ ప్యాకేజీని కొనసాగించేందుకు విధించిన షరతులను జూలై 5న నిర్వహించిన రిఫరెండంలో గ్రీసు ప్రజలు తిరస్కరించారు. రిఫరెండంలో 61 శాతం మంది ప్రజలు షరతులను తిరస్కరించగా, 39 శాతం మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. బెయిలవుట్ ప్యాకేజీని కొనసాగించేందుకు ఈయూ, ఐఎంఎఫ్లు కఠిన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, వ్యయ నియంత్రణ చర్యలు వంటి షరతులను విధించాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న గ్రీసు జూన్ 30 నాటికి ఐఎంఎఫ్కు చెల్లించాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయిలను చెల్లించలేక డీఫాల్ట్ అయింది. ఎస్ఎంఎస్ల ఆలోచన రూపకర్త మృతి మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎస్ఎంఎస్ సమాచారం పంపే ఆలోచనను అభివృద్ధి చేసిన మట్టి మెకోనెన్ (63)లండన్లో జూన్ 26న అనారోగ్యంతో మరణించారు. ఫిన్లాండ్కు చెందిన మెకోనెన్ అభివృద్ధి చేసిన ఎస్ఎంఎస్ సాంకేతికతకు నోకియా సంస్థ ప్రాచుర్యం కల్పించింది. 1994లో ‘నోకియా 2010’ మోడల్ ఫోన్లో తొలిసారి ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించింది. రాష్ట్రీయం హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్ రాష్ట్రంలో మొక్కలు నాటే ఉద్యమానికి శ్రీకారం చుట్టే హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జూలై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కను నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 నుంచి 33కు పెంచుతారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచుతారు. చెరువు గట్లు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచుతారు. కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా ప్రభుత్వం చేపడుతోంది. ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు రాసిన ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్లో జూలై 3న ఆవిష్కరించారు. విద్యాసాగరరావు గతంలో వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. అవార్డులు సర్ ఫాజల్ హసన్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ బంగ్లాదేశ్కు చెందిన సర్ ఫాజల్ హసన్ అబెద్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను వాషింగ్టన్లో జూలై 1న ప్రకటించారు. అబెద్ బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి, మానవాభివృద్ధికి దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. ఆ సంస్థ 10 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆకలి బాధలు తొలగించేందుకు, ఆహార భద్రత సాధించడంలో కృషిచేసిన వ్యక్తులకు అందిస్తున్నారు. పాల్ సింగ్కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం భారతీయ అమెరికన్ ఆర్.పాల్ సింగ్కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం లభించింది. లెబనాన్లో 2015 జూన్ చివరి వారంలో జరిగిన వ్యవసాయ, జీవన ప్రమాణ శాస్త్రాలకు చెందిన ఉన్నత విద్యా సంఘాల ప్రపంచ సమాఖ్య-2015 సమావేశంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. పాల్ సింగ్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో గౌరవ ఆచార్యులుగా ఉన్నారు. విద్యుత్తు పొదుపు, ఆహార ఉత్పత్తుల సంరక్షణ, పంటల కోతల అనంతర టెక్నాలజీ వంటి అంశాలలో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. -
క్రీస్తుపూర్వమే వంటగ్యాస్..
చాలామంది వంటగ్యాస్ను ఆధునిక ఆవిష్కరణలలో ఒకటిగా భావిస్తారు గానీ, నిజానికి క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలోనే చైనాలో వంటగ్యాస్ వాడేవారు. అప్పట్లో హాన్ వంశీయుల హయాంలో చైనా వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించారు. సహజ వాయువు కోసం విరివిగా తవ్వకాలు జరిపి ఎట్టకేలకు సాధించారు. అప్పట్లోనే వంటగ్యాస్ను పైపులైన్ల ద్వారా సరఫరా చేసి, వంటచెరకుకు ప్రత్యామ్నాయంగా వాడటం ప్రారంభించారు. గ్యాస్ సరఫరా కోసం తొలినాళ్లలో వారు గ్యాస్ బావుల నుంచి నేరుగా వెదురు గొట్టాలను వాడేవారు. వెదురు గొట్టాలు తరచు ప్రమాదాలకు దారితీస్తుండటంతో కొంతకాలానికి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు. భారీ కొయ్య పీపాల్లో గ్యాస్ను బంధించి, వాటిని భూమిలో పాతర వేసి, వాటికి గొట్టాలను అమర్చి గ్యాస్ సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ పద్ధతి కాస్త సురక్షితంగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండటానికి పొడవాటి ఎగ్జాస్ట్ పైపును వాడేవారు. -
ఆధారే .. ఆధారం!
ఇక శాస్త్రీయంగా శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు భక్తుల ఆధార్కార్డుతో లింకు తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఇకపై శాస్త్రీయంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పిం చింది. టికెట్ల కేటాయింపుల్లో అక్రమాలను అరి కట్టడం, ఆలయంతోపాటు భక్తుల సెక్యూరిటీ, ఎక్కువసార్లు రాకుండా నియంత్రించడం, అం దరికీ దర్శనభాగ్యం కల్పించడం ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నారు. ముందుగానే రిజర్వ్ చేసుకుని కేటాయించిన సమయంలోనే స్వామివారిని దర్శంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చేవారందరికీ ఆధార్కార్డు వర్తింప చేసి సమగ్రడేటాను సేకరించాలని టీటీడీ భావిస్తోంది. తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికుల్లో ఐదు వేల మందికి ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దర్శనానికి ఒక సారి వచ్చినవారు తిరిగి మూడు నెలలులోపు రాకు ండా ఆధార్ నంబర్తో గుర్తించి నియంత్రించేం దుకు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఆధార్కార్డు వర్తింప చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. ఆధార్కార్డు సేకరణ వెనుక అసలు కథ స్వామి దర్శనంలో కోటా పద్ధతి దాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్థానికులకు అమలు చేసే కోటా దర్శన విధానమే భవిష్యత్లో యాత్రికులకు వర్తింప చేయాలని టీటీడీ భావిస్తోందని సమాచారం. దీనివల్ల ముఖ్యంగా టికెట్ల కేటాయింపు, లడ్డూల విక్రయాల్లో దళారులను అరికట్టడం, వీఐపీలతోపాటు ఇతరులు ఎక్కువసార్లు రాకుండా నియంత్రించడం వీలవుతుందన్న ఆలోచనలో ఉన్నారు. రద్దీ ఆధారంగా భక్తులను ఇష్టమొచ్చినట్టుగా దర్శన క్యూల్లోకి అనుమతించడం వల్ల ఆలయంలో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు రూ. 300 టికెట్ల దర్శనానికి అమలు చేసే టైంస్లాట్ను అన్ని రకాల దర్శనాలకు వర్తింపజేయాలని అధికారులు సంకల్పించారు. -
ఎర్రచందనాన్ని శాస్త్రీయంగా గణించాలి
ట్రైనీ ఎఫ్ఆర్ఓల సదస్సులో అడిషనల్ పీసీసీఎఫ్ సారంగి కడప అర్బన్ : జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్ల పరిధిలో అపారంగా విస్తరించిన ఎర్రచందనాన్ని శాస్త్రీయంగా గణన చేయాలని అటవీశాఖ ప్రణాళిక విభాగం రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి అన్నారు. సోమవారం కడప నగరంలోని పశుసంవర్దకశాఖ జేడీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ట్రైనీ ఎఫ్ఆర్ఓల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి, ఇన్ఛార్జి వర్కింగ్ ప్లాన్ సీసీఎఫ్ రాజేశ్వరి, అధికారులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ట్రైనీ ఎఫ్ఆర్ఓలు 43 మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎర్రచందనంపై సమగ్రంగా గణన చేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి మాట్లాడుతూ జిల్లాలో 3.14 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉందన్నారు. ప్రతి ఎఫ్ఆర్ఓ 0.1 హెక్టారు నుంచి తమ పరిధిలో విస్తరించిన ఎర్రచందనాన్ని శాస్తీయంగా గణన చేయాలన్నారు. ఎంత మేరకు ఎర్రచందనం విస్తరించి ఉంది? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఏ కేటగిరికి చెందినవి? అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి గణన చేయాలన్నారు. మూడు రోజులపాటు ఈనెల 24 నుంచి 26వ తేది వరకు సమగ్రంగా గణన చేసిన తర్వాత ఆయా డీఎఫ్ఓలకు నివేదిక పంపాలన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కడప డీఎఫ్ఓ నాగరాజు, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ శివశంకర్రెడ్డి, బద్వేలు సబ్ డీఎఫ్ఓ వెంకటేశు, జిల్లాలోని ఎఫ్ఆర్ఓలు, ట్రైనీ ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. -
శాస్త్ర, సాంకేతికానికి బూస్ట్!
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలకు ఊతం లభించేలా ఈసారి బడ్జెట్లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రాధాన్యం పెంచారు. శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం మొత్తం రూ. 7,288 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది 1,793 కోట్లు ఎక్కువ. శాస్త్ర, సాంకేతిక శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ), బయోటెక్నాలజీ(డీబీటీ) విభాగాలు, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన కేంద్రం(సీఎస్ఐఆర్) అనే మూడు ఉప విభాగాలున్నాయి. వీటిలో డీఎస్టీకి తాజా బడ్జెట్లో అత్యధికంగా రూ.3,401 కోట్లు, సీఎస్ఐఆర్కు రూ.2,281 కోట్లు, డీబీటీకి రూ.16,06 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను పెంచడం, లేదా తగ్గించడమూ చేయొచ్చంటున్నారు. అదేవిధంగా తాజా బడ్జెట్లో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ. 1,179 కోట్లు కేటాయించారు. సముద్ర అధ్యయనానికి రూ. 669 కోట్లు, వాతావరణ అధ్యయనానికి రూ. 425 కోట్లు కేటాయించారు. కాగా, 2014-15 బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ. 6,725 కోట్లు కేటాయించారు. అయితే, తర్వాత సమీక్షలో వాటిని రూ. 5,495 కోట్లకు కుదించారు. -
భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు: కవిత
హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగంలో అతి తక్కువ వ్యయంతో అద్భుతాలు సృష్టిస్తున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆదివారం ‘స్ట్రీట్ కాజ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన హైద్రాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పచ్చదనానికి, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే వైద్యసేవలకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు. వైద్యులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పని చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అలా పనిచేసే వైద్యులకు ప్రభుత్వం అదనపు వేతనం ఇస్తుందన్నారు. -
నేడు జిల్లాకు తొమ్మిదిమంది మంత్రులు రాక
కేంద్రమంత్రులు వెంకయ్య, వైఎస్ చౌదరి కూడా.. నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో ఈ నెల 7, 8 తేదీల్లో మంత్రులు పర్యటించనున్నారు. కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరరావుతో పాటు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరరావు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పీతల సుజాత, కేంద్ర సైన్స్అండ్ టెక్నాలజీ మంత్రి వైఎస్చౌదరి జిల్లాలో పర్యటించనున్నారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 7న ఉదయం 10.30 గంటలకు సోమశిల రాజ్వరాయర్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మంత్రులతో కలసి పాల్గొంటారు. మంత్రుల పర్యటనలో ప్రొటోకాల్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు. విగ్రహాల ఆవిష్కరణ రద్దు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు 7న కావలిలో ఛత్రపతి శివాజీ, 8న ఆత్మకూరులో తిరుపతినాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ జానకి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. -
‘సమస్య’ తీరుతోంది!
గ్రూప్1లో ‘డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’కు మంగళం సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్లో మార్పులు రాబోతున్నాయి. పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. సిలబస్లో మాత్రం మార్పులు తీసుకురావాలని సమీక్ష కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులకు ‘సమస్య’గా మారిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశానికి ప్రాధాన్యత తగ్గించాలని భావిస్తోంది. గ్రూప్-1 ఐదో పేపర్గా ఉన్న ఈ అంశం స్థానంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ని ప్రవేశపెట్టాలని... ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ను 50 మార్కులకు కుదించాలని యోచిస్తోంది. దీనిపై 5న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్ నాలుగో, ఐదో పేపర్లతో పాటు గ్రూప్-2లో పేపర్-2 సెక్షన్ 1లో, పేపర్-3 సెక్షన్-2లో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పుచేస్తూ గతంలో ఉన్న ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తేనే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేయనుంది. ఈ పరీక్షల్లో మార్పులకు సంబంధించిన సిఫారసుల నివేదికను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం లభించాక అమల్లోకి వస్తాయి. చరిత్ర, రాష్ట్ర వివరాలు:గ్రూప్-2 రెండో పేపర్లోని సెక్షన్-1లో ఉన్న ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర స్థానంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర సిలబస్ను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో శాతవాహనులు, కాకతీయులు, నిజాంల పాలన, ఆది హిందూ ఉద్యమం, నిజాం రాష్ట్ర జన సంఘం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ భాష, సాంస్కృతిక వికాసం తదితర అంశాలను చేర్చబోతోంది. అలాగే పేపర్-3లో ఏపీ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు స్థానంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు అంశాన్ని చేర్చేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ఇందులో వ్యవసాయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రణాళిక, వ్యవసాయం, నీటి పారుదల రంగం, ఆదాయ స్థితిగతులు, రవాణా, పర్యాటక రంగాల స్థితిగతులు తదితర అంశాలు ఉంటాయి. ప్రధాన మార్పులు వీటిలోనే.. గ్రూప్-1లో ఒకటో పేపర్గా ఉన్న ‘జనరల్ ఎస్సే’లో తెలంగాణకు సంబంధించిన అంశాలతో సిలబస్ను మార్చుతారు. రెండో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్లో వివిధ సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర’ స్థానంలో ‘తెలంగాణలో వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, వారసత్వం, భౌగోళిక స్థితిగతు’లను చేర్చనుంది. మూడో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్య్రం తరువాత సామాజిక మార్పులు, భూ సంస్కరణలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బలాలు-బలహీనతలు’ స్థానంలో ‘తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, భూ సంస్కరణలపై సిలబస్’ను పొందుపరుస్తారు. ఇండియన్ పాలిటీ, సమాజం, పాలన తదితర అంశాలను కూడా దీనిలోనే చేర్చనుంది. నాలుగో పేపర్లో ఇప్పటి వరకు ఉన్న ‘భారతదేశ అభివృద్ధి సైన్స్, టెక్నాలజీ పాత్ర దాని ప్రభావం, లైఫ్ సెన్సైస్లో ఆధునిక పోకడలపై సాధారణ అవగాహన, పర్యావరణ సమస్యలు, అభివృద్ధి’ తదితర అంశాల్లోని ప్రధాన అంశాలను ఐదో పేపర్లోకి మార్చనుంది. నాలుగో పేపర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ఇందులో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధి అంశాలను చేర్చనుంది. గత 15 ఏళ్లలో ఐదారు దఫాలుగా నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్లో చాలా మంది అభ్యర్థులు మొదటి నాలుగు పేపర్లలో మంచి మార్కులు సాధించినా... ఐదో పేపర్ అయిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’లో వెనుకబడి... ఇంటర్వ్యూకు వెళ్లలేకపోతున్నారని సమీక్ష కమిటీ పరిశీలనలో తేలింది. దీంతో ఐదో పేపర్లో ప్రస్తుతం ఉన్న ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ స్థానంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ను ప్రవేశపెట్టబోతోంది. లైఫ్ సెన్సైస్లో ఆధునిక పోకడలు తదితర అంశాలు ఉండనున్నాయి. అయితే ఈ పేపర్లోని 150 మార్కుల్లో 100 మార్కులను వీటికి కేటాయించి... మిగతా 50 మార్కులను ‘డాటాఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశాలకు కేటాయించే లా సిఫారసులను కమిటీ సిద్ధం చేసినట్లు తెలిసింది. -
అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి!
సైన్స్ కాంగ్రెస్లో కేంద్ర మంత్రి జవదేకర్ మన ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు తర్క సహితం ముంబై: భారత శాస్త్రవేత్తలంతా ప్రాచీన సంస్కృత విజ్ఞాన శాస్త్రాలను మదించాలని.. ఆ శాస్త్రాల్లోని సాంకేతిక నిధిని మానవాళి అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవ సారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. శాస్త్రీయ అంశాల్లో వందల ఏళ్ల పరిశీలనలు, అనుభవాలను అత్యంత సూక్ష్మస్థాయిలో అవగాహన చేసుకున్నాకే మన పూర్వీకులు ఆయా సిద్ధాంతాలను రూపొందించారన్నారు. శాస్త్రీయ పరికరాలు, యంత్రాలు పెద్దగా అందుబాటులో లేకున్నా.. సూక్ష్మస్థాయిలో పరిశీలనలు, అనుభవాలు, తర్కం ఆధారంగానే భారతీయ విజ్ఞానం ఆవిర్భవించిందని, ఆ విజ్ఞానాన్ని తప్పనిసరిగా గుర్తించాలన్నారు. ముంబై యూనివర్సిటీలో ‘102వ భారత సైన్స్ కాంగ్రెస్’లో రెండోరోజైన ఆదివారం ‘సంస్కృతం ద్వారా ప్రాచీన భారతీయ విజ్ఞానం’ అంశంపై జరిగిన గోష్టిలో మంత్రి ప్రసంగించారు. ‘మన సంస్కృతం, పురాతన సైన్స్ ఆధారంగా జర్మన్లు, ఇతరులు కొత్త ఆవిష్కరణలు చేసినప్పుడు మనం మాత్రం ఎందుకు చేయలేం?’ అని ప్రశ్నించారు. జర్మన్లు శ్రద్ధతో సంస్కృతాన్ని ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేశారని, భారత్కు నేడు సృజనాత్మక ఆవిష్కరణలు చేసే సంస్కృతి చాలా అవసరమన్నారు. వేదకాలంలోనే జంబో విమానాలు! భారత్లో పురాతన కాలంలోనే విమాన సాంకేతికత అందుబాటులో ఉండేదని పైలట్ శిక్షణ కేంద్రం రిటైర్డ్ ప్రిన్సిపల్, కెప్టెన్ ఆనంద్ జె బోదస్ వెల్లడించారు. రుగ్వేదాన్ని పేర్కొంటూ ఆయన ప్రాచీన విమానయానానికి సంబంధించిన ఆధారాలను వివరించారు. సదస్సులో ఆదివారం ‘వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత’ అంశంపై ఆనంద్ ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. ‘ఒక దేశం నుంచి మరో దేశానికే కాదు.. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సైతం వెళ్లగల విమానాల గురించి భరద్వాజ మహర్షి 7 వేల ఏళ్ల క్రితమే మాట్లాడారు. భారత్లో ప్రాచీన విమానయానానికి సంబంధించి 97 పుస్తకాల్లో ఆధారాలున్నాయి. అప్పటి విమానాల్లో 40 చిన్న ఇంజిన్లు ఉండేవి. ‘రూపర్కన్ రహస్య’ రాడార్ ద్వారా విమానం ఆకారం పరిశీలకుడికి కనిపించేది’ అని చెప్పారు. భారత ప్రాచీన సైన్స్పై చర్చించేందుకు ఐఎస్సీ వందేళ్లు ఎందుకు తీసుకుందని సదస్సులో ప్రసంగించిన పరమ్ సూపర్ కంప్యూటర్స్ రూపకర్తవిజయ్ భట్కర్ ప్రశ్నించారు. ఇది ప్రతి సదస్సులోనూ భాగం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, సదస్సులో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. మానవజాతికి వివిధ వ్యాధుల చికిత్సకు జెనెటిక్ ఇంజనీరింగ్ పరిష్కారం వంటి పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. -
మంగళయాన్ మన శాస్త్రజ్ఞుల జ్ఞానానికి నిదర్శనం: మోదీ
ముంబయి : భారత్ పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ముంబయిలో 102వ భారత సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ, మానవాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉందన్నారు. మన శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే మంగళయాన్ను కక్ష్యలో ప్రవేశపెట్టారని ఆయన ప్రశంసించారు. మంగళయాన్ మన శాస్త్రవేత్తల జ్ఞానానికి నిదర్శనమన్నారు. శాస్త్ర, సాంకేతికతతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. వ్యర్థాలను డబ్బు ఉత్పత్తి కేంద్రాలుగా మలచాలని మోదీ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉందని ఆయన ఉద్ఘాటించారు. చైనాలో అభివృద్ధి, శాస్త్ర సాంకేతికత సమానస్థాయిలో అభివృద్ధి చెందాయని మోదీ పేర్కొన్నారు. -
కా‘లేజి’ ప్రాక్టికల్స్
ఖమ్మం: ఇంటర్ విద్య జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ప్రయోగశాలలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇరుకు గదుల్లో ఒక మూలన విద్యార్థులు, మరో మూలన సైన్ల్యాబ్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలను ఉపయోగించుకోవాల్సిన అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. పలు కళాశాలల్లో సైన్స్ పరికరాలు బయటకు తీసిన పాపాన పోవట్లేదు. ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న కనీసం పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్నియర్ కాలిపస్ అంటే తెలియని విద్యార్థులున్నారంటే అతిశయోక్తి కాదు. తరగతి గదిలోనే సైన్స్ పరికరాలు ఉండటంతో కొన్ని కళాశాలల్లో ఆకతాయి విద్యార్థులు వాటిని పగులగొడుతున్నారు. కొన్ని కాలేజీల్లో చెట్లకింద ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కొన్నింటిలో సైన్స్ల్యాబ్లు శిథిలావస్థకు చేరాయి. కాలేజీల్లో కొనసాగుతున్న మొక్కుబడి ప్రాక్టికల్స్పై ‘సాక్షి’ మంగళవారం పరిశీలన జరిపింది. బూజుపడుతున్న పరికరాలు జిల్లాలో సగానికి పైగా కళాశాలల్లో బోధనోపకరణాల ఆధారంగా బోధన జరగడం లేదని తేలింది. కొన్ని కాలేజీల్లో ప్రయోగశాలల తలుపులు తీసిన దాఖలాలే లేవు. పరికరాలు, రసాయనాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఎంపీసీలో మొదటి సంవత్సరం 825 మంది. ద్వితీయ సంవత్సరంలో 990 మంది, బైపీసీ ప్రథమ సంవత్సరం 1,292 మంది, ద్వితీయ సంవత్సరం 1,204 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు మొత్తం 2,194 మంది ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కావాలి. కానీ వీరిలో సగం మంది ఇప్పటివరకు ల్యాబ్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇక ప్రాక్టిక ల్స్ ఎలా చేయాలని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదిలోనే ప్రయోగశాలలు బాటనీ, జువాలజీ ల్యాబ్స్లో జంతు కళేబరాలు, అవశేషాలు, స్పెసిమెన్స్ విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం అంతర్నిర్మాణం తెలుసుకునేందుకు మైక్రోస్కోప్లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ విశ్లేషణ, మూలకాలు, లవణాల ఘనపరిమాణం గురించి తెలియాలంటే రసాయనాలు కావాలి. వీటిలో కొన్ని ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ల్యాబ్స్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ జిల్లాలోని ఖమ్మం నయాబజార్, శాంతినగర్ కళాశాలలతోపాటు ఇతర ప్రాంతాల్లో తరగతి గదుల్లోనే ప్రయోగ పరికరాలు ఉన్నాయి. వైరా కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్లకు ఒక గది, బాటనీ, జువాలజీలకు కలిపి ఒక గదిని కేటాయించారు. కొత్త సిలబస్కు సంబంధించిన చార్టులూ ఏర్పాటు చేయలేదు. రసాయనాలు, పరికరాలు కొరతగా ఉన్నాయి. ఏన్కూరు కళాశాలలో ప్రత్యేకంగా ల్యాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు యాసిడ్స్ మీద పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారేపల్లి ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులు లేరు. పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో ల్యాబ్లు లేవు. అవసరమైనప్పుడు భారజల కర్మాగారం కళాశాలకు తీసుకెళ్లి ప్రయోగాలు చేయిస్తున్నారు. మణుగూరు, పినపాక, గుండాలలో ల్యాబ్లు ఉన్నా వాటిలో సరైన సౌకర్యాలు లేవు. బూర్గంపాడులో ప్రయోగశాల భవనం కురుస్తుండటంతో వాటిలో పరికరాలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో ప్రయోగశాల గదుల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరు చేశారు. 2013 జనవరిలో ఆరుగదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రాలేదని సంబంధిత కాంట్రాక్టర్ గదుల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి కొతులు ప్రవేశించి సైన్స్ల్యాబ్ పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలను శిథిలావస్థ భవనంలో నిర్వహిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోబీరువాల్లో ల్యాబ్ పరికరాలను భద్రపరచాల్సి వస్తోంది. లక్షలు వెచ్చించినా ప్రయోగాలు శూన్యం.. లక్షలు వెచ్చించినా ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. కళాశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలకు రూ. లక్ష నుంచి రెండు లక్షల మేరకు గ్రాంట్స్ విడుదల చేశారు. ఆ నిధులతో దాదాపు అన్ని కళాశాలల అధ్యాపకులు ప్రయోగశాలల పరికరాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నారు. అదే సంవత్సరం కాలేజీల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10వేల చొప్పున విడుదల చేశారు. ఈ నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నా.. కొనుగోలు చేసిన వస్తులు మాత్రం సగం కూడా కనిపించకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం కూడా ఒక్కో కళాశాలకు రూ. 37,000 ప్రభుత్వం విడుదల చేసింది. వీటినైనా సక్రమంగా ఖర్చు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సైన్స్ అభివృద్ధికి సహకరిస్తాం
‘నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. శనివారమిక్కడి బీజీఎస్ కళాశాలలో నిర్వహించిన ‘నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ రంగంలో అనేక అద్భుత విజయాలు సాధించిన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలకు అన్ని విధాలైన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పురోభివృద్ధికి గాను రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి చిన్నారులు అన్ని అంశాల్లోనూ ఎంతో శక్తి, సామర్థ్యాలను, చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అంతేకాక విభిన్న అంశాలను తెలుసుకునేందుకు వారికి ఎక్కువ అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రవేశించిన విద్యార్థులు తమ విజ్ఞానాన్ని దేశ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక బయోటెక్నాలజీ రంగంలో అత్యుత్తమ ప్రగతిని సాధించిందని, అయినా ఇంకా అభివృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ...సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. సైన్స్ అంశాల్లో నైపుణ్యాలు సాధించిన చిన్నారులకు ఉత్తమ కెరీర్ అవకాశాలు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజ్ఞాన రంగ అభివృద్ధిని అనుసరించే దేశ అభివృద్ధి కూడా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్షవర్థన్, ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. -
వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాంతిని ప్రతిఫలింపచేసే ప్రొటీన్ను ఉత్పత్తి చేసే వైరస్ కణాలను చొప్పించడం ద్వారా మెదడు కణాలు ఏదో ఒక రంగును వెదజల్లేలా చేయవచ్చని వారు తెలిపారు. అలా చేయడం ద్వారా మెదడు కణాల చర్యలను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహాలో అధ్యయనం భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన అనేక చికిత్సలకు దోహదపడుతుందని వారు తెలిపారు. వారి పరిశోధనల వివరాలు 'సైంటిఫిక్ రిపోర్ట్స్' అనే పత్రికలో ప్రచురించారు. -
నవ పరిశోధకులు
ఏ దేశ అభివృద్ధి అయినా శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఇందుకనుగుణంగా భావి ఇంజినీర్లు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్, ఎస్వీటీఎం ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు వివిధ పరిశోధనలతో తమ గమనాన్ని చాటుకుంటున్నారు. - కురబలకోట ⇒ సమాజ ప్రగతికి ఇవే మూలం ⇒ ప్రతిభ చాటుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు గుండెజబ్బును ఇట్టే పసిగట్టవచ్చు.. గుండెజబ్బుతో చాలామంది సతమతం అవుతున్నారు. ఇలాంటి జబ్బును పెద్దగా ఖర్చు లేకుండానే ఇట్టే పసిగట్టే యంత్రాన్ని ఎస్వీటీఎం ఇంజినీరింగ్ విద్యార్థి హరినాథ్ కనుగొన్నారు. సెల్ఫోన్, సిమ్కార్డు, ఏఆర్ఎం, మైక్రో కంట్రోలర్ పరికరాన్ని చేశారు. ఎంబెడెడ్ టెక్నాలజీతో జీఎస్కు అనుసంధానం చేశారు. ఈ పరికరాన్ని ఏ వ్యక్తికి తాకించినా హృదయ స్పందనలు తెలిసిపోతాయి. సెల్ఫోన్కు సందేశం పంపిస్తుంది. సెల్లో కూడా కన్పిస్తుంది. ఈప్రాజెక్టు కింద దీన్ని తయారు చేయడం ఆరు వేలు దాకా అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండానే ముందుగా గుండెజబ్బులు కనిపెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. - గుండెజబ్బులు కనుగొనే ప్రాజెక్టు గురించి చూపుతున్న హరినాథ్ బ్యాంకు లాకర్ సేఫ్ ఇటీవల కాలంలో దొంగలు ఎక్కువగా బ్యాంకులను కొల్లగొడుతున్నారు. వివిధ సెక్యూరిటీ విధానాలున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా లాకర్లును తెరచి సొమ్ము దోచుకెళుతున్నారు. ఫేస్ రికగ్జైజింగ్, లోకలెజైషన్ సిస్టమ్ ద్వారా లోపాలను సరి చేసి ప్రాజెక్టును రూపొందించారు మదనపల్లె సమీపంలోని అంగళ్లు ఎస్వీటీఎం ఎంటెక్ విద్యార్థి పి.హేమలత. దీని ద్వారా లాకర్లలోని సొమ్ము దొంగల చేతికి చిక్కకుండా రెండు విధాలుగా రక్షణ కల్పించవచ్చు. ఒకటి లాకర్ యజమాని ముఖాన్ని గుర్తించడం.. రెండోది శబ్దగ్రహణం. హెచ్ఎఆర్ఆర్ ఆల్లారిథం సాయంతో కొన్ని ముఖ కవళికలను పొందుపరుస్తారు. తర్వాత ఎప్పుడు అక్కడికి వెళ్లినా ముఖాన్ని గుర్తిస్తుంది. దీన్ని డేటాబేస్లో సరిపోల్చుతుంది. రెండు కలిస్తే జీఎస్ఎం ద్వారా మెసేజ్ పంపుతుంది. అప్పడు మనం మెసేజ్లో వచ్చిన దాన్ని పలికితే లాక్ తెరుచుకుంటుంది. దొంగలు తెరవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటివి బ్యాంక్ లాకర్స్, లై బ్రరీల్లో వాడుతారు. - ప్రాజెక్టు గురించి వివరిస్తున్న హేమలత చక్కెర శాతం లేని బియ్యం ముందు కాలంలో దంపుడు బియ్యం తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పడు బియ్యానికి పాలిష్ పెట్టడం, రసాయనిక ఎరువుల వల్ల విటమిన్లు లోపం వ్యాధులకు దారి తీస్తోంది. మిట్స్ ఎంటెక్ విద్యార్థి పి. మేఘశ్యామ్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ప్యాడీ ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో వడ్లను బియ్యంగా మార్చవచ్చు. నూకలు కూడా కావు. ఈయంత్రం నుంచి వచ్చిన బియ్యానికి పాలిషింగ్ కూడా ఉండదు. ఈ బియ్యంతో రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం. దీని ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆధాయం పొందవచ్చు. - వడ్లను బియ్యంగా మార్చే మిషన్తో మేఘశ్యామ్ నాణ్యమైన ఇంజెక్షన్ సిరంజీలు సాధారణంగా ఇంజెక్షన్ సిరంజీలు ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో తరచూ లోపాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టి నాణ్యత పెంచేందుకు మిట్స్ ఎంటెక్ విద్యార్థి కె.రాఘవేంద్ర కాశ్యప్ తన ప్రాజెక్టులో కనుగొన్నాడు. ఇంజెక్షన్ మోల్డింగ్లో పారామీటర్ యంత్రం ద్వారా ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఉన్న లోపాన్ని గుర్తించి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆ ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచుతుంది. దీన్ని ఎక్కువగా ఫాక్టరీలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో బ్యాటరీలను ఉంచి పంపడానికి ఎక్కువగా వాడుతారు. - ఇంజెక్షన్ మోల్డింగ్ యంత్రాన్ని చూపుతున్న రాఘవేంద్ర కాశ్యప్ మిట్స్ పరిశోధనలకు నిలయం మిట్స్ కళాశాలలో పరిశోధన (ఆర్అండ్డీ) ఏర్పాటు చేశాం. ఇసీఈ, మెకానికల్, సీఎస్సీ, ఎంబీఏ, ఇంగ్లిషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాధ్స్లపై పరిశోధనలకు అనువుగా ఉంది. పీహెచ్డీలు చేయాలనుకునే వారికి ఇది తోడ్పడుతుంది. అనంతపురం జేఎన్టీయూ పరిధిలోనే ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా మిట్స్ పరిశోధన కేంద్రం గుర్తింపు పొందింది. - ఎన్.విజయభాస్కర్ చౌదరి, కరస్పాండెంట్, మిట్స్ కళాశాల, అంగళ్లు ప్రపంచంతో పోటీ పడాలి అత్యాధునిక ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలి. నూతన ఆలోచనలతో ప్రపంచస్థాయిలో పోటీ పడాలి. నిరంతర సాధనతో భావి శాస్త్రవేత్తలుగా రాణిస్తారు. తద్వారా గుర్తింపు వస్తుంది. మానవాళి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వాటికి ఉపయోగపడే వాటికి ఆదరణ ఎక్కువ. దేశంలో పరిశోధకులను మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. - కె.శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఎస్వీటీఎం, విశ్వం విద్యా సంస్థలు, అంగళ్లు -
కుతూహలం రేపే దేవ రహ్యస్యం
దేవతల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రాముడు, కృష్ణుడు, గణపతి, శివుడు... వీరంతా ఎవరు, ఎక్కడ ఉంటారు, అసలు ఉన్నారా లేరా, ఉంటే ఆధారాలేమైనా ఉన్నాయా అనే కుతూహలం ఉండని మనిషి ఉండడు. పురాణాల్లోను ఇతిహాసాల్లోనూ ఉండే దేవతలకు ఆధారాలు నేరుగా కనిపించవు. కాని వాటినే చారిత్రక ఆధారాలతో, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించినప్పుడు దేవతల ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ అద్భుత శక్తులు మన కంటికి కనిపించకపోయినా ఇక్కడే ఎక్కడో నడయాడుతూనే ఉన్నాయి అనిపిస్తుంది. ‘దేవ రహస్యం’ పుస్తకంలో కోవెల సంతోష్ కుమార్ తన పరిశోధనలతో, ఇతరులు చేసిన పరిశోధనల ఆధారంతో అన్నింటికి మించి జ్ఞానంతో కాకుండా ఇంగితజ్ఞానంతో దేవతల సంభావ్యతనూ, వారి ఆకారాలూ వాహనాలూ నివాసాల వెనక ఉన్న సంకేతాల అర్థాలను, ఇతిహాసాలను రూఢీ పరిచే అనేక ఆసక్తికరమైన అంశాలను సామాన్య పాఠకునికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు శివుడి మూడో కన్నుకు మన మెదడులో ఉండే ఒక ప్రత్యేకమైన గ్రంధిని సంకేతంగా చూపుతూ సంతోష్ చేసిన వాదన ఆలోచింప చేస్తుంది. మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది అనీ, ఆ రోజులలో ఆ యుద్ధంలో 36 లక్షల మంది చనిపోయారని ఆయన వివరిస్తారు. రావణుడు పెద్ద ఇంజనీరు అనీ ఆ రోజులలో లంకలో అతడికి నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయనీ అందుకు ఆధారంగా నేటికీ ఆ విమానాశ్రయ మైదానాలు కనిపిస్తాయని అంటారాయన. పుష్పక విమానం ఒక మిత్ కాదని నిజంగానే ఆ విమానం ఉండేదని చెప్తారు. విఘ్నేశ్వరుడు వ్యవసాయానికి సంబంధించిన దేవుడని నిరూపించే ఆయన వాదనతో దాదాపుగా ఏకీభవిస్తాం. శివుడి గురించి రాసిన వ్యాసాలు తప్పక పరిశీలించదగ్గవి. దేవతలను వాస్తవిక దృష్టితో పరిశీలిం చాలనుకునేవారు ఈ పుస్తకం చదివితే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. సంతోష్ ఈ కృషిని కొనసాగించాలి. దేవ రహస్యం- కోవెల సంతోష్ కుమార్ వెల: రూ.150 ప్రతులకు: 9052116463 -
నింగికేగిన గళ యశస్వి
నేదునూరి మృతితో విషాదంలో మునిగిన సంగీతాభిమానులు సర్కారు లాంఛనాలతో అంత్యక్రియలు తరలివచ్చిన ప్రముఖులు విశాఖపట్నం-కల్చరల్: గాత్ర సంగీత నిధి నింగికెగసింది. కర్ణాటక సంగీతానికి వన్నెలద్దిన ఆ గళం శాశ్వతంగా మూగబోయింది. అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఆలపించి జనం హృదయాంతరాళల్లోకి చొచ్చుకుపోయిన నేదునూరి కృష్ణమూర్తి మృతి సంగీతాభిమానులను విషాదంలో ముంచెత్తింది. శాస్త్రీయ సంగీత రంగంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఈ స్వరబ్రహ్మది గాత్ర సంగీతంలో విశిష్ట స్థానం. కర్ణాటక సంగీతం ఆంధ్రకు వెళ్లిపోయిందా అనేంత భావన కలిగిం చిన నేదునూరి నగరంలోని ఎంవీపీకాలనీలో స్వగృహంలో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కట్టూ, బొట్టేకాదు..సంగీత పాండిత్యం,వ్యవహారం, భాషలో నమ్రతా అంతా సంప్రదాయాన్ని ప్రతిబిం బించిన ఈ స్వర మాంత్రికుడు మరణించారని తెలియగానే సంగీతప్రియులు దుఖసాగరంలో మునగిపోయారు. ప్రభుత్వలాంఛనాలతో నేదునూరికి అంత్యక్రియులు నేదునూరి భౌతికకాయానికి ప్రభుత్వం తరుపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు సోమవారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తరుపున మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, నేదునూరి ఇంటికి చేరి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. నేదునూరికి తనకున్న అనుబంధాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గుర్తు చేసుకున్నారు. చావుల మదుం వద్ద ఉన్న శ్మశనావాటికలో నేదునూరి అంతక్రియులు జరిగాయి. శాసనమండలి చైర్మన్ డాక్టర్.ఎ. చక్రపాణి, వైస్చైర్మన్ సతీష్ కుమార్రెడ్డి, శాసనసభ్యులు పి.వి.జి.ఆర్.నాయుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,మాజీఎంపీ సబ్బం హరి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర డాక్టర్.ఎస్. యువరాజ్,జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఆర్టీసీ ఎండీ పి. పూర్ణచంద్రరావు, మద్రాసు సంగీత అకాడెమీ కార్యదర్శి (చెన్నాయ్)పప్పుల వేణుగోపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి, డాక్టర్ పి.వి.రావు, ఏయూ విశ్రాంతి రెక్టార్ డాక్టర్. ఎ.ప్రసన్నకుమార్, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ కార్యదర్శి జిఆర్కె రాంబాబు,పేరాల బాలమురళీకృష్ణ తదితరులు నేదునూరి భౌతికకాయాన్ని సందర్శించి సంతపాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో సంగీతప్రియులు, అభిమానులు తరలి వచ్చారు. -
ఏపీలో పెట్టుబడులు లాభదాయకం:చంద్రబాబు
జపాన్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ(జైకా) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని మౌలిక వసతులు, వనరులకు సంబంధించి చంద్రబాబు వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నట్లు బాబు పేర్కొన్నారు. జపాన్ కంపెనీల ఇండస్ట్రియల్ పార్క్ స్పెషల్ అధారిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఆయన జైకా ప్రతినిధులకు తెలిపారు. అంతకుముందు ఇసుజ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీ శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉందని ఇసుజ ప్రతినిధులు బాబుకు తెలిపారు. ఇండియాలో ఇసుజ మార్కెట్ విస్తరించాలని ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు కోరారు. ఇసుజతో పాటు మరిన్ని కంపెనీలను తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీ కృష్ణపట్నంలను లాజిస్టిక్ హబ్ లుగా మార్చాలనుకుంటున్నట్లు బాబు వారికి తెలిపారు. ఏపీలో ఎక్కువ మానవ వనరులు ఉన్నాయని, ఇతర దేశాలకంటే భారత్ లో పెట్టుబడులు లాభదాయకమని, ఏపీలో మరింత లాభదాయకమన్నారు. నిరంతరం విద్యుత్ పై వారం రోజుల్లోగా అనుమతులు మంజూరు చేస్తామని వారికి బాబు హామి ఇచ్చారు.