Krishna Basin
-
బేసిన్లో ఒక పంటకైనా నీరివ్వండి
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరీవాహకంలోని (బేసిన్) తెలంగాణ ప్రాంతంలో పునరుత్పత్తి అయ్యే జలాలను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని cc ఏకరవు పెట్టింది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కంటే ముందే ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం కాలువ వ్యవస్థను చేపట్టి ఉంటే తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాలు అందేవని పేర్కొంది. ఏపీలో బేసిన్ ఆవలకు కృష్ణా జలాలను భారీగా తరలిస్తున్నారని.. తెలంగాణలో బేసిన్లో కనీసం ఒక్క పంటకు కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొందని పేర్కొంది.బేసిన్లోని రైతులకు ఒక్క పంటకైనా నీళ్లందించేలా కేటాయింపులు చేయాలని వాదించింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2లో రెండో రోజు గురువారం తెలంగాణ తరఫున సీనియర్ కౌన్సిల్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు విన్పించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. నీటి కొరత.. సరఫరా కంటే డిమాండ్లు ఎక్కువ.. వంటి పలు విషయాల్లో కృష్ణా, కావేరి బేసిన్ల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు. శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా పంట వాస్తవిక నీటి అవసరాన్ని అంచనా వేయాలని కావేరీ ట్రిబ్యునల్ సూచించిందని పేర్కొన్నారు. సాంబ వంటి దీర్ఘకాలిక రకాలను కాకుండా స్వల్పకాలిక, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండిస్తే నీటిని మిగిల్చి.. మిగతా ఆయకట్టుకు అందించవచ్చని కావేరి ట్రిబ్యునల్ పేర్కొందని వివరించారు. కృష్ణా బేసిన్లో కూడా స్వల్పకాలిక, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగుచేయడం ద్వారా వినియోగాన్ని తగ్గించి.. మిగిలిన నీటిని బేసిన్లోని రైతులకు కనీసం ఒక్క పంటకైనా అందించడానికి కేటాయించాలని వాదించారు. -
సాగుకే కాదు.. తాగు నీరూ ఉండదు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో, ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సర్కారు తీరు ఇలాగే ఉంటే కృష్ణా బేసిన్లో సాగు నీటికే కాదు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై విచారిస్తున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ట్రిబ్యునల్లో సమర్థవంతంగా వాదనలు విన్పించేలా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు న్యాయవాదులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని, జలాలను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుందంటూ 2013లో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను ఇప్పటి విచారణలో చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. దీనినీ వాదనల్లో వినిపించి ఉంటే ట్రిబ్యునల్ నిర్ణయం మరోలా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఆ ట్రిబ్యునలే ఉల్లంఘించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పలేకపోయిందని ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనల వల్లే సెక్షన్–3 కింద కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన అదనపు విధి విధానాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై ముందుగా వాదనలు వింటామని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేస్తున్నారు. నాడే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ను కేంద్రం ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై ముందుగా అధ్యయనం చేసిన ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తీర్పు ఇచ్చింది. ‘ఫస్ట్ ఇన్ టైమ్ ఫస్ట్ ఇన్ రైట్ (మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్న వారికే మొదటి హక్కు)’ న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రక ఒప్పందాలు, వినియోగాల ప్రాతిపదికగా 1951 నాటికే పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెపెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు, 1960 సెప్టెంబరు తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా వర్గీకరించి నీటిని కేటాయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్కకట్టింది. ఆ ప్రాతిపదికన మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో అప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. వాటిని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.పునఃపంపిణీ చట్టవిరుద్ధంబచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. దానిప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం ఆ ట్రిబ్యునల్ విచారణ చేయాలి. అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది. వీటిని మినహాయిస్తే మిగతా 165 టీఎంసీల కేటాయింపులో విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. ఇందుకు భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు.అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) – 1956 సెక్షన్ 6(2) ప్రకారం.. నదీ జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపుల జోలికి వెళ్లడంలేదు. ఆ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుంది.– కేంద్ర ప్రభుత్వానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టీకరణ -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. శనివారం సాయంత్రానికి 1,74,120 క్యూసెక్కులు వస్తోంది. దిగువ ప్రాజెక్ట్లకు 99,488 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.398 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.371 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రానికి జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. కాగా, నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,29,600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగుల వద్ద ఉంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. ఇక్కడ నుంచి కుడి కాలువకు 6,112, ఎడమ కాలువకు 6,173, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 29,597, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. కాగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి 84,297 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇందులో కేఈ మెయిన్కు 4,028, కేడబ్ల్యూ మెయిన్కు 2,519, డెల్టాలోని కాలువలకు 6,547 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు. -
కృష్ణాలో 3,048.37 టీఎంసీలా?
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఏటేటా నీటి లభ్యత తగ్గుతోందని.., బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునళ్లు అంచనా వేసినంత కూడా రావడంలేదని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతుంటే.. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చెబుతోంది. కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 వరకు 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై తాజాగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ బుధవారం ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం కృష్ణాలో 3,048.37 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ 2,130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీలు ఉన్నట్లు నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్లు నిర్ధారించిన దానికంటే అధికంగా 875 టీఎంసీల లభ్యత ఉన్నట్లుగా సీడబ్ల్యూసీ తాజాగా వెల్లడించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం.., బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునళ్ల సమయంలో పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో సీడబ్ల్యూసీ చెప్పినంతగా నీటి లభ్యత ఉండదని తేల్చిచెబుతున్నారు. కేవలం 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనాలకే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ ఇదీ..మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకునే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యంలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఆంధ్రప్రదేశ్లో 9.80 శాతం కృష్ణా బేసిన్ విస్తరించి ఉంది. నదిలో కోయినా, వర్ణ, పంచ్గంగా, దూద్గంగా, ఘటప్రభ, మలప్రభ, బీమా, తుంగభద్ర, కాగ్నా, మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉప నదులు కలుస్తాయి.తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 843.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం ఉంది. ఈ 38 ఏళ్లలో గరిష్టంగా 2005–06లో 1,169.70 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 10,716.60 టీఎంసీల ప్రవాహం ఉంది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 5,207.50 టీఎంసీల ప్రవాహం ఉంది.1985–86 నుంచి 2022–23 మధ్య కృష్ణాలో సగటున 3,048.37 టీఎంసీల లభ్యత ఉంది. 2025–26లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా.. 2018–19లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది.1985–2023 మధ్య బేసిన్లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీలను వినియోగించుకున్నారు.బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటు 96.06 టీఎంసీలు. -
కృష్ణా బేసిన్లోని జలాశయాలు ఖాళీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో జలాశయాలన్నీ ఖాళీ అయ్యాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి రాష్ట్రంలోని పులిచింతల ప్రాజెక్టు వరకూ అన్ని జలాశయాల్లోనూ నీటి నిల్వ కనిష్ట స్థాయికి చేరింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల పశ్చిమ కనుమలు, బేసిన్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆల్మట్టి డ్యామ్లోకి బుధవారం 7,490 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్లో 24.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇది నిండాలంటే 105.04 టీఎంసీలు అవసరం. ఇక ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 24.2 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే ఇంకా 13.42 టీఎంసీలు అవసరం. అంటే.. 118.46 టీఎంసీలు చేరితేగానీ ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లు నిండవు. ఆ రెండు జలాశయాలు నిండాక గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్కు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ప్రస్తుతం జూరాలలో 7.65 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 2.01 టీఎంసీలు చేరితే అదీ నిండుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 34.52 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం నిండాలంటే 181.29 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్లో 122.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే 189.2 టీఎంసీలు అవసరం. సాగర్ దిగువన రాష్ట్రంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజీ స్థాయిలో 0.77 టీఎంసీలున్నాయి. అది నిండాలంటే 45 టీఎంసీలు అవసరం. కృష్ణా నదికి ప్రధాన ఉప నది అయిన తుంగభద్రపై నిర్మించిన మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్లో 5.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర నిండాలంటే ఇంకా 100 టీఎంసీలు అవసరం. -
నీళ్లు.. నేలమట్టం.. డెడ్ స్టోరేజీలో జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది. కనీస నిల్వలూ కరువే! శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది. గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్ఫ్లో నమోదైంది. ఒకేసారి వచ్చి.. లాభం లేక.. గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది. మంజీరా వెలవెల సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు (24.08 అడుగులు) ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్ల (28.54 అడుగులు)కు పడిపోవడమే అందుకు కారణం. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల (4.46 అడుగుల) మేర భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే ఒక మీటర్ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భజల శాఖ రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. 11 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ... జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లకుపైన అనే కేటగిరీలుగా భూగర్భజలశాఖ వర్గీకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల (42.8 అడుగులు)కు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం జగిత్యాల జిల్లా 4.93 మీటర్ల (16.17 అడుగులు) భూగర్భ జలమట్టంతో 0–5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లకన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు (32.8 అడుగులు)పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. 30 జిల్లాల్లో క్షీణత నమోదు.. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్లగొండ జిల్లాపై తీవ్ర దుష్ప్రభావం పడినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాల్లో అత్యంత ప్రమాదకరం.. సిద్దిపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణమధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మోస్తారు లోతు (మోడరేట్లీ డీప్), 20 మీటర్లకుపైన తీవ్ర లోతు (వెరీ డీప్)ల్లో ఉన్నట్టు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8 శాతం ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24 శాతం ప్రాంతం పరిధిలో 10–15 మీటర్లు, 53 శాతం ప్రాంతం పరిధిలో 5–10 మీటర్లు, 15 శాతం ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. 170 మండలాల్లో దశాబ్ద కాల కరువు... రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల (2014–2023) సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 (28%) మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 (72%) మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
‘సీతారామ’పై సందేహాలు.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి యాజమాన్య బోర్డు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల ఉమ్మడి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలకు నష్టం జరగదని నిర్ధారించాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరింది. ప్రధానంగా 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఖరారు చేసిన మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద 561 టీఎంసీల లభ్యతకు రక్షణ కల్పించాలని సూచించింది. ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ గతంలో డీపీఆర్ను గోదావరి బోర్డుకు పంపించింది. బోర్డు ఏమందంటే.. ఏపీ, తెలంగాణ మధ్య సమ్మతి లేదు.. రాష్ట్రాలు, ప్రాజెక్టుల వారీగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నీటి కేటాయింపులు జరపలేదు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన గోదావరి జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చివరకు ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల లభ్యత, ప్రాజెక్టుల ద్వారా వినియోగం లెక్కలపై సైతం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తేల్చాలి.. ఇప్పటికే ఉన్న, నిర్మాణంలోని, నిర్మాణం ప్రారంభం కాని తమ ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ చెబుతున్నాయి. అయితే గోదావరిలో 1,743 టీఎంసీల మేరకు నీటి లభ్యత లేదని ఆయా రాష్ట్రాలే అంగీకరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం 1,486.155 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని తెలంగాణ అంటోంది. 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం కేవలం 1,360 టీఎంసీల లభ్యతే ఉందని, అలాగే 70 టీఎంసీల ఊట నీళ్ల లభ్యత ఉందని ఏపీ పేర్కొంటోంది. అయితే ఊట నీళ్లను పరిగణనలోకి తీసుకోరాదని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పేర్కొంటోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000–2020 మధ్యకాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంటోంది. ఈ అంశాల నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధ్యయనం జరగాలి. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా సీతారామ వద్ద గోదావరిలో 347.06 టీఎంసీల లభ్యత ఉందని ప్రాజెక్టు డీపీఆర్ పేర్కొంటోంది. దీనిపై అధ్యయనానంతరం సీడబ్ల్యూసీ నిర్ధారిత లెక్కలు పంపించాలి. గోదావరి జలాలను కృష్ణాకు ఎలా తరలిస్తారు? సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల ద్వారా 10.109 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించనున్నట్టు డీపీఆర్లో ప్రతిపాదించారు. అయితే తరలింపును సమర్థిస్తూ డీపీఆర్లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
నీటిలెక్కలు తేల్చడానికి రెడీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిలెక్కలు తేల్చి.. కోటాలో మిగిలిన నీటిని లభ్యత ఆధారంగా కేటాయించేందుకు బోర్డు చైర్మన్ శివ్నంద్కుమార్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అనువైన రోజును ఎంపిక చేయాలని రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులను కృష్ణాబోర్డు కోరింది. 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు దిగువ కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉందని.. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం) టీఎంసీలు, తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.72 టీఎంసీలను వాడుకున్నాయని తెలిపారు. అందులో ఏపీ 442.52 (52.2 శాతం) టీఎంసీలు, తెలంగాణ 404.20 (47.8 శాతం) టీఎంసీలు వాడుకున్నాయని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని, తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే అధికంగా 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుందని కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటా కంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 38.72 టీఎంసీలు వాడుకుందని, ఇకపై నీటిని వాడుకోకుండా కట్టడిచేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నీటిలెక్కలు తేల్చి వివాదానికి తెరదించడానికి కృష్ణాబోర్డు సిద్ధమైంది. -
10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా అన్ని ప్రాంతాల్లోను పడుతుండడం ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నా గతంలో అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి అన్ని జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధికం ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 10 రోజుల్లో 82.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 99.99 మిల్లీమీటర్ల వర్షం పడింది. 8 జిల్లాల్లో 50 నుంచి 90 శాతం అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధిక వర్షం పడింది. అక్కడ 84.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 161.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం, విజయనగరం జిల్లాలో 62.2 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61.2, ఏలూరు జిల్లాలో 66.4, కృష్ణాలో 51, గుంటూరు జిల్లాలో 64.5, పల్నాడు జిల్లాలో 50.4 శాతం అధిక వర్షం కురిసింది. ఒక్క నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షం పడింది. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లు కళకళ భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లలోకి బాగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గోదావరి బేసిన్లో లక్ష్మి, సమ్మక్క బ్యారేజీల నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో 10 రోజులుగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, సోమశిల రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో నీటిని కిందకు వదులుతున్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. నైరుతి మురిసింది.. ఈ నైరుతి సీజన్లో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 657 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 683.1 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 41.3 శాతం అధిక వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 36.6, బాపట్ల జిల్లాలో 30.6 మిల్లీమీటర్ల అధిక వర్షం పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లోను సాధారణ వర్షపాతం నమోదైంది. -
‘కృష్ణా’లో బోటింగ్ బంద్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్ కార్యకలాపాలు మళ్లీ బంద్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్లోని బోటింగ్ పాయింట్ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు. -
అన్నీ మంచి శకునములే
సాక్షి, అమరావతి: నీటి సంవత్సరం ప్రారంభమైన 6 రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్లోకి 4 టీఎంసీలు చేరాయి. ఆల్మట్టిలోకి 1.1, తుంగభద్ర డ్యామ్లోకి 2.2 టీఎంసీలు చేరాయి. ఎన్నడూ లేని రీతిలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలో అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నెల మూడు, నాలుగో వారాల్లో కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలానికి కృష్ణమ్మ ముందుగానే చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నీ మంచి శకునములే కనిపిస్తుండటంతో కృష్ణా బేసిన్లో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సంవత్సరం ముగిసే నాటికి అధిక నీటి నిల్వ కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్లో సోమవారం నాటికి 129.72 టీఎంసీలకు గాను 48.9 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్లో 37.64 టీఎంసీలకు గాను 30.49 టీఎంసీలు ఉన్నాయి. ఈ రెండు డ్యామ్లు నిండటానికి 87.97 టీఎంసీలు అవసరం. తుంగభద్ర డ్యామ్లో 100.86 టీఎంసీలకు గాను 39.48 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ డ్యామ్ నిండటానికి 61.38 టీఎంసీలు అవసరం. గతేడాది కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల దాదాపు 8 నెలలపాటు ప్రవాహం కొనసాగడంతో సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోగా నీటి సంవత్సరం ముగిసే నాటికి (జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమై మే 31తో ముగుస్తుంది) ఆల్మట్టి, నారాయణపూర్ తుంగభద్ర డ్యామ్లలో అధికంగా నీటి నిల్వ ఉండటం ఇదే ప్రథమం. ప్రారంభంలోనే వరద ప్రవాహం నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కృష్ణా బేసిన్లో ఎగువన జూన్ 1 నుంచి 3 వరకూ వర్షాలు కురిశాయి. దాంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆరు రోజుల్లోనే ఆల్మట్టిలోకి 1.1 టీఎంసీలు చేరగా.. దానికి దిగువన ఉన్న నారాయణపూర్లోకి 4 టీఎంసీలు చేరాయి. తుంగభద్ర డ్యామ్లోకి 2.2 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ప్రధానంగా పశ్చిమ కనుమల్లో ఈ నెల 3, 4 వారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు వర్షాలు కురిస్తే నెలాఖరు నాటికే ఆల్మట్టి, నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. అప్పుడు జూలై మొదటి లేదా రెండో వారం నాటికే శ్రీశైలానికి కృష్ణమ్మ చేరే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలై 17న ఎగువ నుంచి కృష్ణమ్మ శ్రీశైలానికి చేరగా.. ఈ ఏడాది అంతకంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
రాష్ట్రంలో ఇక బొగ్గు తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న చింతలపూడి సెక్టార్–1, కృష్ణా జిల్లాలోని సోమవరం వెస్ట్ బ్లాక్లో తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ.. సెక్టార్–1, సోమవరం వెస్ట్ బ్లాక్లను వేలం వేసేందుకు వీలుగా బిడ్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 99 బొగ్గు బ్లాక్ల వేలానికి బిడ్లు ఆహ్వానించగా వాటిలో ఏపీకి చెందిన ఈ రెండు ఉన్నాయి. విభజనతో ఏపీ కోల్పోయిన సింగరేణి బొగ్గు లోటును చింతలపూడి తీర్చనుంది. అత్యంత నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా బేసిన్లో అపారమైన బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వల కోసం సుదీర్ఘకాలం సర్వేలు, పరిశోధనలు జరిగాయి. 1964 నుంచి 2006 వరకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, తడికలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 1996–2001 మధ్య కాలంలో ఖనిజాన్వేషణ సంస్థ సర్వే నిర్వహించి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బొగ్గు నిల్వలున్నట్టు నిర్ధారించింది. తక్కువ లోతులో.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 3,000 మిలియన్ టన్నుల నాణ్యమైన డీ, ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నట్టు తేల్చింది. చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, రాఘవాపురంలో 997 మిలియన్ టన్నులు, సోమవరంలో 746 మిలియన్ టన్నులున్నట్టు నిర్ధారించింది. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పుష్కలంగా బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెం, రాఘవాపురం చుట్టు పక్కల గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు 1,000 అడుగుల మందంలో, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం గ్రామాల్లో 70 అడుగుల లోతులో నాణ్యమైన బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి సెక్టార్–1.. పట్టాయిగూడెం, నామవరం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో సుమారు 12.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే సోమవరం వెస్ట్ కోల్ బ్లాక్.. చాట్రాయి మండలం సూర్యాపల్లి, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట పరిధిలో 15.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలానికి బ్లాక్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని వివిధ బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. దీని కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కృష్ణా జిల్లా సోమవరం బ్లాక్ను కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. బిడ్లు దాఖలు కాకపోవడంతో సోమవరం బ్లాక్ కేటాయింపులు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 16న దేశంలోని 99 బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో చింతలపూడి సెక్టార్–1తో పాటు సోమవరం వెస్ట్ బ్లాక్ను కూడా చేర్చింది. బొగ్గు మైనింగ్పై వచ్చే రెవెన్యూలో వాటా ఆధారంగా వేలం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించే విషయం ఎటూ తేలడం లేదు. బోర్డుల భేటీలో నిర్ణయించిన మేరకు తొలిదశలో గుర్తించిన ప్రాజెక్టులను స్వాధీనం చేయాల్సి ఉన్నా తెలంగాణ తేల్చక పోవడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు వీలుగా గోదావరి బేసిన్లోని పెద్దవాగును అప్పగిం చాలని తెలంగాణకు గోదావరి బోర్డు ఇప్పటికే లేఖ రాసింది. కృష్ణా బేసిన్ ఔట్లెట్ల అప్పగింతపై ఒకట్రెండు రోజుల్లో కృష్ణా బోర్డు కూడా లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్లపై ప్రతిపాదించిన 15 ఔట్లెట్లలో 9 తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్పై ఉన్న 3 పవర్హౌస్లను అప్పగించేది లేదని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది. బచావత్ అవార్డుకు విరుద్ధం ఈ ఔట్లెట్ల ఆపరేషన్ ప్రోటోకాల్పై రాష్ట్రం ఓ కమిటీని నియమించింది. కాగా ఆ కమిటీ ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణా బోర్డు తెరపైకి తెచ్చిన మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. కమిటీ అభిప్రాయాలను రాష్ట్రం బోర్డుకు తెలియజేసింది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగం, ప్రాజెక్టుల ఆపరేషన్న్ ప్రొటోకాల్పై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ ఇప్పటికే స్పష్టీకరించిన నేపథ్యంలో దానినే బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేసింది. బోర్డు రూపొందించిన మార్గదర్శకాలు, నిర్వహణ విధానంలో అవసరమైన మార్పులు చేయాలని కోరింది. దీనిపై బోర్డులు ఎలాంటి వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవలే గోదావరి బేసిన్లోని పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్కుమార్కు లేఖ రాశారు. మరోవైపు ఔట్లెట్ల అప్పగింతపై కృష్ణా బోర్డు కూడా ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనున్నట్టు తెలిసింది. అనంతరం తెలంగాణ స్పందించే తీరునుబట్టి తదుపరి కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గత బోర్డు భేటీలో తీర్మానించిన మేరకు ప్రాజెక్టులను తమకు అప్పగించాలనే అంశంపై సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి, ఇతర సభ్యుల వద్ద కొంత కసరత్తు జరిగింది. ఆర్డీఎస్ హెడ్వర్క్స్ను బోర్డు పరిధిలోకి తెండి రాజోలిబండ హెడ్వర్క్స్ను సైతం కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల అప్పగింతపై కొన్ని ప్రాజెక్టులను గుర్తించినప్పటికీ అందులో తెలంగాణ, ఏపీలకు అవతలగా ఉందంటూ ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ను బోర్డు పరిధి లోకి తేలేదని లేఖలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ కింద 15.90 టీఎంసీల మేర తెలంగాణ రాష్ట్రానికి వాడుకునే అవకాశం ఉందని, దీనిద్వారా 87,500 ఎకరాల ఆయకట్టు పారాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే ఎన్నడూ తెలంగాణకు తగినంత నీరు రాలేదని, గడిచిన 15 ఏళ్లుగా కాల్వల ఆధునికీకరణ చేయాలని కోరుతున్నా.. ఏపీ సహకరించకపోవడంతో ఆ పనులు ముందుకు కదలడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రం వాటా ఇప్పించాలని కోరారు. -
సగానికి చేరిన ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు పెరుగుతున్నాయి. ఎగువ వర్షాలకు రాష్ట్ర పరిధిలోని పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. 92 వేల క్యూసెక్కులకుపైగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో నిల్వలు 90 టీఎంసీలకుగానూ 47.70 టీఎంసీలకు చేరగా, ఈ సీజన్లోనే ప్రాజెక్టులోకి కొత్తగా 30 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 33.98 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా, ఈ ఏడాది మాత్రం మరో 13 టీఎంసీలు అదనంగా ఉండటం ఆయకట్టు రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. గోదావరి బేసిన్లో ఇతర ప్రాజెక్టులకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నా యి. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో సింగూరు, లోయర్మానేరు, కడెం, మిడ్మానేరులో ప్రవాహాలు స్ధిరంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కడెం, లోయర్మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ఈ ప్రవాహాలు మరింత పుంజుకునే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు ఇంజనీర్లను అప్రమత్తం చేసింది. కృష్ణా బేసిన్లో అప్రమత్తం ఇక కృష్ణా బేసిన్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కృష్ణా నది జన్మస్థలి అయిన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో దిగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్లకు భారీ వరద ప్రవాహాలు నమోదయ్యే అవకాశముంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో భారీగా ప్రవాహాలు వచ్చే దృష్ట్యా ప్రాజెక్టుల నిల్వలపై దృష్టి పెట్టాలని, డ్యామ్ల్లో నీటి నిల్వలు నిండుగా ఉంచకుండా కొంత ఖాళీగా ఉంచేలా నిర్వహణ చేపట్టాలని సూచించింది. దీంతో ఆల్మట్టిలో 129 టీఎంసీలకుగానూ 93.83 టీఎంసీల నిల్వలు ఉంచి ప్రస్తుతం వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్కి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఆ నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నీరంతా జూరాలకు చేరనుంది. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేవలం వందల క్యూసెక్కుల్లో మాత్రమే నీటి ప్రవాహాలు వస్తున్నాయి. -
ఆధునికీకరణ ముసుగులో ‘కర్ణాటకం’
సాక్షి, అమరావతి: విస్తరణ, పునరుద్ధరణ, ఆధునికీకరణ (ఈఆర్ఎం) పథకం ముసుగులో నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి అక్రమంగా 15–20 టీఎంసీల కృష్ణాజలాలను అదనంగా తరలించడానికి కర్ణాటక సిద్ధమైంది. 2018–19 ధరల ప్రకారం రూ.2,794 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక (పీపీఆర్)ను శుక్రవారం కర్ణాటక జలవనరులశాఖ సీఈ ఎస్.రంగారాం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) సమర్పించారు. ఇప్పటికే అప్పర్ కృష్ణా మూడోదశ ద్వారా 130, అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలు వెరసి 159.90 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి సిద్ధమైన కర్ణాటక.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా 15 నుంచి 20 టీఎంసీలను మళ్లించేందుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సంవత్సరాల్లో దిగువ కృష్ణా బేసిన్లోని తెలుగు రాష్ట్రాలకు సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఏకపక్షంగా సాంకేతిక అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పర్ కృష్ణా మూడోదశతోపాటు తాజాగా కర్ణాటక చేపట్టిన నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ఆధునికీకరణ పనులకు సాంకేతిక అనుమతి ఇచ్చే విషయంలో సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు వ్యవహరిస్తుందా, లేదా.. అన్నది తేలాల్సి ఉంది. అదనంగా 1.49 లక్షల ఎకరాల ఆయకట్టు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు తొలి, రెండోదశల కింద నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కర్ణాటక ఇప్పటికే 22.40 టీఎంసీలను తరలిస్తూ రాయచూర్ జిల్లాలో 2,07,564 ఎకరాలకు నీళ్లందిస్తోంది. తాజాగా ఈ కాలువను ఈఆర్ఎం పథకం కింద ఆధునికీకరించడం ద్వారా 3,56,882 ఎకరాలకు నీళ్లందించడానికి పీపీఆర్ను రూపొందించింది. రూ.2,794 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అంటే నారాయణపూర్ కుడికాలువ ఆధునికీకరణ ముసుగులో కొత్తగా 1,49,318 ఎకరాలకు నీళ్లందించడానికి కర్ణాటక ప్రణాళిక రచించింది. ఇందుకు అదనంగా 15 నుంచి 20 టీఎంసీలు తరలించడానికి సిద్ధమవడం గమనార్హం. కేటాయింపులకు మించి వినియోగం కృష్ణాజలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. ఇప్పటికే కేటాయింపులకు మించి కర్ణాటక కృష్ణాజలాలను ఉపయోగించుకుంటోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతానికి, 65 శాతానికి మధ్యన లభ్యతగా ఉన్న 448 టీఎంసీల జలాలను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో కర్ణాటక వాటా 177 టీఎంసీలు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటివరకు కేంద్రం నోటిఫై చేయలేదు. కానీ.. కర్ణాటకకు ఉన్న కేటాయింపులు, వినియోగం, లభ్యత, మిగిలిన జలాలను ఏమాత్రం లెక్కించకుండా.. అంతరాష్ట్ర నదీజల వివాదాల చట్టాన్ని తుంగలో తొక్కి.. దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. నాలుగు నెలల కిందట అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ అప్పర్ కృష్ణా మూడోదశ డీపీఆర్ను సీడబ్ల్యూసీకి సమర్పించిన కర్ణాటక.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ విస్తరణ పీపీఆర్ను సమర్పించింది. -
ఇదేం లెక్క.. కృష్ణా?
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్)లో సరాసరి నీటి లభ్యత 3,144.42 టీఎంసీలని తాజాగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీలని లెక్కగట్టింది. అయితే కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేయగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీల లభ్యత ఉంటుందని వెల్లడించింది. సీడబ్ల్యూసీ 1993లో తొలిసారి నిర్వహించిన అధ్యయనంలో కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,069.08 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టింది. బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునళ్లు, సీడబ్ల్యూసీ తొలిసారి జరిపిన అధ్యయనాల్లో తేల్చిన దానికంటే కృష్ణాలో సుమారు 20 శాతం నీటి లభ్యత అధికంగా ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ తేల్చడం గమనార్హం. కృష్ణాలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోవడంతో ట్రిబ్యునళ్ల అంచనాల మేరకు కూడా నీళ్లు రావడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంస్థలు, ట్రిబ్యునళ్లు తేల్చిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించడంపై అపార అనుభవం కలిగిన ఇంజనీర్లు, అంతరాష్ట్ర జలవనరుల విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారు లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కించడం అశాస్త్రీయమని, వీటిని కచ్చితమైన లెక్కలుగా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు. బేసిన్లో కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యత లెక్కించడం శాస్త్రీయమని, బచావత్ ట్రిబ్యునల్, 1993లో సీడబ్ల్యూసీ ఇదే రీతిలో అధ్యయనం చేశాయని గుర్తు చేస్తున్నారు. వర్షపాతం పెరగడం వల్లే..!! దేశవ్యాప్తంగా 1985 నుంచి 2015 మధ్య వరద ప్రవాహాల ఆధారంగా నదుల్లో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీతో కలిసి అధ్యయనం చేసింది. కృష్ణా బేసిన్లో వర్షపాతం, వరద ప్రవాహం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆవిరి, ఆయకట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నీటి లభ్యత లెక్కగట్టింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ.. ► 1955–84 మధ్య కృష్ణా బేసిన్లో సగటు వర్షపాతం 842 మిల్లీమీటర్లు. 1965–84 మధ్య కాలంలో సగటు వర్షపాతం 797 మిల్లీమీటర్లకు తగ్గింది. 1985–2015 మధ్య బేసిన్లో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్లకు పెరిగింది. ► 2010–11లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో 9,607.85 టీఎంసీలు వచ్చాయి. ఇందులో నదిలో 4,164.81 టీఎంసీల లభ్యత వచ్చింది. 2002–03లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో 5,457.16 టీఎంసీలే వచ్చాయి. ఇందులో నదిలో 1,934.63 టీఎంసీల లభ్యత వచ్చింది. ► 1985–2015 మధ్య కాలంలో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్ల వల్ల ఏడాదికి 226 బిలియన్ క్యూబిక్ మీటర్లు (7,980.96 టీఎంసీలు) వచ్చాయి. ఇందులో కృష్ణా నదిలో సరాసరి సగటున 3,144.42 టీఎంసీల లభ్యత ఉంటుంది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ► గతంతో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం పెరగడం వల్లే కృష్ణాలో నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. 8,070 చ.కి.మీ. పెరిగిన బేసిన్ విస్తీర్ణం.. ► మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్కు సమీపంలో పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 1,337 మీటర్ల ఎత్తున జోర్ గ్రామం వద్ద పురుడు పోసుకునే కృష్ణమ్మ 1,400 కి.మీ. ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణాకు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, బీమా, వేదవతి, మూసీ తదితర 12 ఉపనదులున్నాయి. ► కృష్ణా పరీవాహక ప్రాంతం 2,59,439 చదరపు కిలోమీటర్లలో విస్తరించిందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. 1993లో సీడబ్ల్యూసీ అధ్య యనం జరిపినప్పుడు కృష్ణా బేసిన్ 2,51,369 చదరపు కిలోమీటర్లలో ఉంది. తాజాగా జియో స్పేషియల్ డేటా ఆధారంగా సర్వే చేయడం వల్ల బేసిన్ విస్తీర్ణం 8,070 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ► 1985–86లో కృష్ణా బేసిన్లో 70,72,365 హెక్టార్ల ఆయకట్టు ఉండగా 2014–15 నాటికి 81,69,157 హెక్టార్లకు పెరిగింది. ► బేసిన్లో ఏటా 72.39 టీఎంసీలు ఆవిరవు తాయి. ఇందులో గరిష్టంగా శ్రీశైలం, నాగార్జున సాగర్లోనే ఎక్కువగా ఆవిరవుతాయి. పదేళ్లలో ఏడేళ్లు తీవ్ర నీటి కొరత.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రపదేశ్కు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అయితే గత పదేళ్లలో ఏడేళ్లు ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు జలాలు రాలేదు. శ్రీశైలం జలాశయానికి 2011–12లో 733.935, 2012–13లో 197.528, 2014–15లో 614.07 టీఎంసీలు వస్తే 2015–16లో కేవలం 58.692 టీఎంసీలే వచ్చాయి. 2016–17లో శ్రీశైలం జలాశయానికి 337.95 టీఎంసీలు రాగా 2017–18లో 423.93, 2018–19లో 541.31 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అంటే 2011–12 నుంచి 2020–21 వరకూ గత పదేళ్లలో ఏడేళ్లు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొన్నట్లు స్పష్ట మవుతోంది. బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యున ల్లు కేటాయించిన మేరకు కూడా కృష్ణా జలాలు రాష్ట్రాన్ని చేరలేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే సీడబ్ల్యూసీ తాజాగా చేసిన అధ్యయనం శాస్త్రీయం కాదని నీటిపారుదల నిపుణులు చేస్తున్న వాదన వంద శాతం వాస్తవమని స్పష్టమవుతోంది. -
ఒక్కటి తప్ప అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహాలు నమోదు కావడంతో నాలుగేళ్ల తర్వాత బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ నీరంతా నిజాంసాగర్కు వెళ్తుండటంతో అక్క డా ప్రవాహాలు పెరిగాయి. నేడో రేపో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో నమోదవుతోంది. తెరుచుకున్న సింగూరు గేట్లు... సింగూరు ప్రాజెక్టులో బుధవారం ఉదయం మూడు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ 28.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో ఈ నీరంతా నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 41,851 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నిల్వ 17.80 టీఎంసీలకుగానూ 11.10 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నిల్వ 16 టీఎంసీలకు చేరి, ప్రవాహాలు ఇదే రీతిన ఉంటే గురువారంరాత్రిగానీ, శుక్రవారంగానీ గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీకి కాస్త ప్రవాహాలు తగ్గాయి. బుధవారం 24 వేల క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. లోయర్ మానేరుకు 96 వేల క్యూసెక్కులు, మిడ్మానేరుకు 29వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ ప్రాజెక్టులన్నీ నిండి ఉండటంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ప్రవాహ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలంలోకి 3.47 లక్షలు, సాగర్లోకి 2.73 లక్షలు, పులిచింతలకు 4.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఈ నీటినంతా దిగువకు విడిచి పెడుతుండటంతో బంగాళాఖాతం వైపు వెళుతోంది. అలుగు దుంకుతున్న 24,192 చెరువులు రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులకు జలకళ వచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లో 24,192 చెరువులు అలుగు దుంకుతున్నా యి. మరో 11,972 చెరువులు వందకు వంద శాతం నీటితో అలుగులు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణాబేసిన్లో 23,301 చెరువులకుగానూ 14,900 చెరువులు నిండగా, మరో 3,766 చెరువులు పూర్తిగా నిండాయి. అత్యధికంగా మెదక్ జిల్లా పరిధిలో 6,993 చెరువులు అలుగు పా రుతుండగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 4,644 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గోదావరి బేసిన్లో మొత్తంగా 20,111 చెరువులుండగా, ఇందులో 9,292 చెరువులు అలుగు పారుతున్నా యి. మరో 8,206 చెరువులు వంద శాతం మేర నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 2,795 చెరువులు, కరీంనగర్లో 2,578 చెరువులు, వరంగల్ జిల్లాలో 2,209 చెరువులున్నాయి. మంగళ, బుధవారం కురిసిన భారీ వర్షాలకు 152 చెరువులకు గండ్లు పడ్డాయి. మొత్తంగా ఈ సీజ న్లో 661 చెరువులకు గండ్లు, బుంగలు పడటం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. -
మహోగ్ర కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవాహం తోవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి 6,99,548 క్యూసెక్కులు రాగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు 7,79,221 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,963 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేసి 7,76,258 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద కారణంగా లంక గ్రామాల్లో పత్తి, మిరప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల్లో నీరు నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన పెరిగిన వరద కృష్ణా బేసిన్లో ఎగువన వరద పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ నిండుకుండల్లా మారడంతో వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.63 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీనివల్ల గురువారం జూరాల ప్రాజెక్టులోకి వచ్చే వరద పెరగనుంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న 2.73 లక్షల క్యూసెక్కులకు.. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొండవాగులు వరద ఉధృతి తోడవడంతో శ్రీశైలంలోకి 3.47 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. వంశధార ఉగ్రరూపం ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధార ఉగ్రరూపం దాల్చింది. గొట్టా బ్యారేజీలోకి 42,980 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేసి 46,916 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాగా, గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,21,804 క్యూసెక్కుల చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉగ్ర వేణి
సాక్షి, అమరావతి/ విజయవాడ/ మాచర్ల/ శ్రీశైలం ప్రాజెక్ట్/ పెదకూరపాడు/ కాకినాడ/ పోలవరం రూరల్: మూసీ, మున్నేరు, కట్టలేరు, వైరా, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చగా.. ఉప నదుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో 2.29 లక్షల క్యూసెక్కులు.. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తోడవడంతో 4.10 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. దీంతో 70 గేట్ల ద్వారా 3.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. ► కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ► సాగర్ జలాశయం వద్ద ఆదివారం సాయంత్రానికి 12 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,51,695 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద పర్యాటకులు రాకుండా 144 సెక్షన్ విధించారు. కేవలం కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లి రేడియల్ క్రస్ట్గేట్ల నుంచి స్పిల్వే మీదుగా దుమికే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గోదావరిలో మరింత తగ్గిన వరద ► గోదావరి నదిలో ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద వరద 9,68,666 క్యూసెక్కులకు తగ్గింది. నీటి మట్టం 45 అడుగులు ఉంది. ► మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తామని అధికారులు తెలిపారు. ► ఆదివారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 17,84,505 క్యూసెక్కులకు తగ్గింది. 175 గేట్ల ద్వారా 17,74,755 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు 17.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించే అవకాశం ఉంది. ► తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో ముంపునకు గురైన ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. 36 గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. కోతకు గురవుతున్న నెక్లెస్ బండ్ ► పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి వరద నుంచి రక్షణగా నిర్మించిన నెక్లెస్ బండ్ కోతకు గురవుతోంది. 6 మీటర్ల వెడల్పున నిర్మించిన బండ్ రెండు మీటర్లకు తగ్గిపోయింది. ► శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హుటాహటిన పోలవరం చేరుకుని యుద్ధ ప్రాతిపదికన గట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. పడవలపై కరోనా రోగుల తరలింపు ► తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో శనివారం ఓ వ్యక్తి కరోనా సోకింది. రాత్రివేళ బాలాజీ అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్పై సఖినేటిపల్లి బోను వద్దకు చేర్చి అక్కడి నుంచి ఆంబులెన్స్లో అల్లవరం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ► అప్పనరామునిలంక, మామిడికుదురు, అప్పనపల్లి, బి.దొడ్డవరం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పడవలపై తీసుకొచ్చి కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. -
శ్రీశైలం చేరిన కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో ఈ సీజన్లో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా జలాలు తాకాయి. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిరంతరం కొనసాగుతుండటం, జూరాల నుంచి కూడా వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం చేరుతోంది. మంగళవారం సాయంత్రం శ్రీశైలంలోకి 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తుండగా బుధవారం నుంచి ఆ ప్రవాహాలు మరింత పెరగనున్నాయి. ఎగువ నుంచి భారీగానే.. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్లకు భారీగానే నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి మంగళవారం ఉదయం 41,812 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఏకంగా 46,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలకు గానూ 96.50 టీఎంసీల నిల్వ ఉంది. అయినప్పటికీ సాయంత్రానికి 45 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో నారాయణపూర్లోకి 46,731 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 35.06 టీఎంసీలుగా ఉండటంతో దిగువకు 45,031 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలు రాగా అవి సాయంత్రానికి 22 వేలు, రాత్రికి 32 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకు గానూ 8.85 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతలు, జూరాల కాల్వలకు 3,973 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, పవర్హౌస్ల ద్వారా 23,501 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలం చేరుతోంది. శ్రీశైలానికి ప్రస్తుతం స్థానిక పరీవాహకం తోడు ఎగువ ప్రవాహాలు కలిపి నుంచి 15,394 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 215 టీఎంసీలకు గానూ 37.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండాలంటే మరో 178 టీఎంసీలు అవసరం. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో కేవలం 31.53 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది కాస్త మెరుగ్గానే ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీలకు గానూ 167.95 టీఎంసీల నీరుండగా, ఇక్కడ 8 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. -
కనీస మట్టం..ఇది నీటి కష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస నీటి మట్టానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు తమ అవసరాలకోసం నీటిని వినియోగిస్తుండటంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టు నిల్వలు కనీస నీటి మట్టం 834 అడుగులకు చేరింది. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకముందే నిల్వలు తగ్గడం ఇరు రాష్ట్రాలకు మున్ముందు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాల నేపథ్యంలో మున్ముందు వినియోగంపై నియంత్రణ అవసరమని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. సాగర్ ఒక్కటే దిక్కు..? ఈ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,784 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా 675 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 513, తెలంగాణ162 టీఎంసీల వినియోగం చేసినట్లు కృష్ణాబోర్డు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సైతం శ్రీశైలం ద్వారా వివిధ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలు 3,591 క్యూసెక్కుల నీటిని వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు గానూ కనీస నీటి మట్టం 834 అడుగులకు పడిపోయింది. నిల్వలు 215 టీఎంసీలకు గానూ 53.85 టీఎంసీలకు చేరాయి. కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని వినియోగించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే బోర్డు, శ్రీశైలంలో రోజుకు 440 క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని, దీంతో మట్టాలు మరింత వేగంగా తగ్గే అవకాశాలున్న దృష్ట్యా, శ్రీశైలం నుంచి నీటి విడుదలను తగ్గించాలని వారం కిందట సూచించింది. అయినప్పటికీ వినియోగం కొనసాగుతుండటంతో నిల్వలు కనీస నీటి మట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాగు అవసరాలకు నాగార్జున సాగర్పైనే అధారపడాల్సి ఉంటుంది. సాగర్లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ 551 అడుగుల్లో 212 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 86 టీఎంసీల మేర ఉంటుంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. మిషన్ భగీరథ మట్టాల్లో మార్పులు.. మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరా లకు ఏటా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించి, దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్లోని 15, గోదావరి బేసిన్లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను గతంలో నిర్ధారించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు తాగునీటికి 30 టీఎంసీల అవసరాలుంటాయని ఇప్పటికే సాగునీటి శాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల్లో రెండు సీజన్లకు సరిపడేంత నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి మట్టాలను పెంచాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు ప్రతిపాదించారు. జూరాలలో కనీస నీటి మట్టాలు గతంలో 313.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని 315 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీలో గతంలో 320.35 మీటర్లు ఉండగా..322.67 మీటర్లకు, కడెంలో 204.21 మీటర్లకు గానూ 206.89 మీటర్లు, కొమరంభీమ్లో 234.60 మీటర్లకు గానూ 236.10 మీటర్లకు పెంచుతూ ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయి. -
గోదావరి – కృష్ణా అనుసంధానంపై ముసాయిదా డీపీఆర్ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్లింపు కోసం నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్లు్యడీఏ) ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వివరించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు నీరు మళ్లించే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్æ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా సీఎం కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్డబ్లు్యడీఏ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్ట్లో ప్రధానంగా మూడు లింక్లు ఉంటాయని, ఆయా ప్రాజెక్ట్ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి–కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ రూపొందించి, చట్టపరమైన అనుమతులు పొందిన తరువాత పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్లు సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్ప్రాజెక్ట్లలో ఆంధ్రప్రదేశ్కు 32 రోడ్డు, 21 రైల్ప్రాజెక్ట్లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఏపీలోని 9 జిల్లాల్లో సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, క్వాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని చిత్తూరు (కలంకారీ), విజయనగరం (క్వాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (క్వాయర్ ఉత్పాదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పుగోదావరి (జొన్నాడ ఫుడ్ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
కాళేశ్వరం నీరు... ‘కృష్ణ’కు చేరు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంతో గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించి నీటి లభ్యతను పెంచే కొత్త ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు. కాళేశ్వరంలో భాగం గా నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గోదా వరి జలాలను సాగర్ ఆయకట్టు పరీవాహకానికి తరలించి నీటి లభ్యతను పెంచడం, ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యం గా అధ్యయనం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ దిశగా అప్పుడే కసరత్తు మొదలైంది. 3.50లక్షల ఎకరాల స్థిరీకరణ.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తుతం రెండు టీఎంసీల సామర్థ్యంతో చేపట్టగా, ఇందులో మిడ్మానేరు దిగువన ఒక టీఎంసీ, ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి మరో టీఎంసీ తరలించేలా ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలో ప్రతిపాదించిన బస్వాపూర్ వరకు నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు సింగూరు, నిజాంసాగర్ వరకు మరింత నీటిని అందుబాటులో ఉంచేందుకు అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ అదనపు టీఎంసీతో నీటి లభ్యత పెరుగుతున్నందున బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించేలా చూడాలని ఆయన ఆదేశించగా రిటైర్డ్ ఇంజనీర్లు ప్రాథమిక సూచనలు చేశారు. బస్వాపూర్ నుంచి 3 కిలోమీటర్ల కాల్వ తవ్వకం ద్వారా నీటిని శామీర్పేట వాగుకు తరలించవచ్చని, కనిష్టంగా 4వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వను వెడల్పు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. అక్కడి నుంచి మూసీ నది, ఆసిఫ్ నహర్కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని తేల్చారు. అక్కడి నుంచి నేరుగా పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తే, అక్కడి నుంచి సాగర్ కింద ఉన్న 3.70 లక్షల ఎకరాల ఆయకట్టులో కనిష్టంగా 3.50లక్షల ఎకరాలకు నీరందించి స్థిరీకరించవచ్చని తేల్చారు. రేపు పర్యటించనున్న రిటైర్డ్ ఇంజనీర్లు కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేలా సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దీనిపై రిటైర్డ్ ఇంజనీర్లు మంగళవారం నుంచి అధ్యయనం మొదలుపెట్టనున్నారు. ఇక దీనితో పాటు సాగర్ ఆయకట్టు పరిధిలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తోంది.ఇప్పటికే వరల్డ్బ్యాంకు నిధులతో సాగర్ కాల్వల ఆధునికీకరణ చేసిన నేపథ్యంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అవసరమన్న విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సాగర్ పరీవాహకంలో పర్యటించి అధ్యయనం చేయనుంది. వీటితో పాటే ఎస్సారెస్పీ పరిధిలోనూ కొత్త ఎత్తిపోతల పథకాలు అవసరమా? లేదా? అన్నది తేల్చనుంది. -
25 రోజుల్లోనే 865 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్లో ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పదేళ్ల తర్వాత అంతటి వరద కేవలం 25 రోజుల్లోనే శ్రీశైలాన్ని చేరింది. 2010–11లో 1,024 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం ఈ నెలలోనే 865 టీఎంసీల మేర వరద వచ్చింది. అయితే కృష్ణా బేసిన్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీనికితోడు అక్టోబర్లో తుపానుల ప్రభావం సైతం ఎక్కువగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే శ్రీశైలంలో ఈ ఏడాది వరద వెయ్యి టీఎంసీల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటిలో ఈ ఏడాది సాగర్కు 569 టీఎంసీల మేర నీరు చేరింది. ఇది సైతం ఈ పదేళ్ల కాలంలో ఇదే గరిష్టం. ఇక ఈ ఒక్క నెలలోనే 343 టీఎంసీల మేర నీరు సముద్రంలో కలిసింది. 2013–14లో 399 టీఎంసీల నీరు సముద్రంలో కలవగా ఆరేళ్ల తర్వాత ఇప్పుడే అంతమేర నీరు సముద్రానికి చేరింది. 2017–18లో సున్నా, 2018–19లో 39 టీఎంసీల మేర సముద్రంలో కలిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల్లోకి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మళ్లీ వర్షాలు కురిస్తేనే వరద మొదలు కానుంది. ఇక గోదావరి పరిధిలో ఇప్పటివరకు 1685 టీఎంసీల మేర నీరు సముద్రంలోకి వెళ్లినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి. -
గేట్లు దాటిన ‘కృష్ణమ్మ’
సాక్షి, అమరావతి/రెంటచింతల/శ్రీశైలం: పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. నదిలో ప్రవాహ ఉధృతి భారీగా పెరగటంతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. ప్రధాన ఉప నదులైన తుంగభద్ర, భీమా పోటాపోటీగా ఉప్పొంగుతుండటంతో తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్ల గేట్లు ఎత్తేశారు. జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం జలాశయంలోకి ప్రవాహ ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. దీంతో ఇక్కడ పది గేట్లను పూర్తిగా ఎత్తేశారు. నాగార్జున సాగర్లోకి ప్రవాహం పోటెత్తి వస్తుండటంతో జలాశయం గేట్లన్నీ పూర్తిగా ఎత్తేశారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్ట్పై రెండు గేట్లు తెరిచిన అధికారులు సోమవారం రాత్రికి మరిన్ని గేట్లు తెరవనున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు కూడా సోమవారం రాత్రి ఎత్తేయనున్నారు. సాగర్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సోమవారం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని ఆదేశించింది. ముంపు గ్రామాలను ముందే గుర్తించి అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా బేసిన్పై ప్రాజెక్టుల గేట్లన్నీ పాతికేళ్ల క్రితం ఒకసారి ఎత్తేశారు. ఆ తర్వాత అన్ని గేట్లు ఎత్తేయడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆల్మట్టి నుంచి 46.64 టీఎంసీలను, నారాయణపూర్ నుంచి 51.75 టీఎంసీలను వదులుతున్నారు. భీమా నది నుంచి ఉజ్జయిని డ్యామ్లోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో 9.15 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ 65 గేట్లను ఎత్తి 71.45 టీఎంసీలను విడిచిపెడుతున్నారు. సాగర్ గేట్లన్నీ ఎత్తివేత తుంగభద్ర నదిలో సోమవారం వరద ఉధృతి మరింతగా పెరిగింది. జలాశయంలోకి 2,44,003 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో.. 18.37 టీఎంసీలను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 8,19,254 క్యూసెక్కులు (70.79 టీఎంసీలు) వస్తుండగా.. 73.33 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లోకి 7,66,080 క్యూసెక్కులు (66.20 టీఎంసీలు) వస్తుండగా.. నీటి నిల్వ 246.54 టీఎంసీలకు చేరుకుంది. ముందుజాగ్రత్త చర్యగా సోమవారం ఉదయం 26 గేట్లు ఎత్తి దిగువకు 31.76 టీఎంసీల విడుదల చేశారు. 2009 తర్వాత సాగర్ గేట్లన్నీ తెరవడం ఇదే తొలిసారి. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఎగువ నుంచి భారీ వరద వస్తుందన్న కేంద్ర జల సంఘం హెచ్చరికల నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్ట్లో నీటిని నిల్వ చేసుకుంటూనే ముందుజాగ్రత్త చర్యగా నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 1.26 టీఎంసీలను విడుదల చేస్తున్నారు. పట్టిసీమ పంప్లు బంద్ కృష్ణా నదిలో భారీ ప్రవాహం ఉండటంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపులను సోమవారం మధ్యాహ్నం నిలిపేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజిలో 2.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి భారీ వరద వస్తుండటంతో రాత్రికి నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరనుంది. టెయిల్ పాండ్ వద్ద విద్యుత్ ఉత్పాదన నిలిపివేత గుంటూరు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్లో సోమవారం విద్యుత్ ఉత్పాదన నిలిపివేశారు. ఎగువ కృష్ణా నుంచి వస్తున్న సుమారు 5 లక్షల క్యూసెక్కులను దిగువ కృష్ణాలోకి వదులుతున్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 247 అడుగులు కాగా.. ప్రస్తుతం 238 అడుగులకు చేరింది. ఇదిలావుంటే.. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడిగట్టు కేంద్రంలో ఆదివారం నుంచి సోమవారం వరకు 14.352 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 18.145 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. శాంతించిన గోదావరి గోదావరిలో వరద తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఉదయం 6గంటలకు ధవళేశ్వరం బ్యారేజిలోకి 12.33 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. సాయంత్రం 6కు 5.73 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. గేట్లు ఎత్తి 5,71,149 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మంగళవారం వరద మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ముంపుబారిన హంపి హొస్పేట్/గంగావతి రూరల్/హొళగుంద: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చడంతో డ్యామ్ లోతట్టు ప్రాంతమైన హంపిలోని అనేక పురాతన స్మారకాలు, కట్టడాలు నీటి మునిగాయి. విరుపాపుర గడ్డలోకి నడుం లోతు నీరు చేరింది. అక్కడ వందలాది రెస్టారెంట్లు నీట మునగడంతో దేశ, విదేశీ పర్యాటకులకు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఉన్నతాధికారులు బెంగళూరు నుంచి మూడు వాయుసేన హెలికాప్టర్లను రప్పించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్, విజయవాడకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇదిలావుంటే.. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. కాలువలకు విడుదల చేస్తున్న 4,481 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,52,066 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. ఆదివారం 33 గేట్ల ద్వారా 2,25,274 క్యూసెక్కుల నీటిని నదికి వదిలిన బోర్డు అధికారులు సోమవారం కూడా అదే రీతిలో వదిలారు. ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో రాత్రి 8 గంటల సమయంలో 25 గేట్లను నాలుగు అడుగులు, మిగిలిన 8 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటి విడుదలను 1,47,210 క్యూసెక్కులకు తగ్గించారు. తుంగభద్ర డ్యామ్ సామర్థ్యం 1,633 అడుగుల నీటిమట్టంతో 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1,630.09 అడుగుల నీటిమట్టం వ్ద 90.04 టీఎంసీల నిల్వ ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాగర్ @202 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఎగువన కృష్ణా, భీమా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతుండటంతో రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలంకు వచ్చిన ఇన్ఫ్లోను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్కు వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. దీంతో సాగర్లో శనివారం నీటి నిల్వ 162 టీఎంసీలుగా ఉండగా.. అది ఆదివారం రాత్రికి 202 టీఎంసీలకు చేరింది. వరద ఉధృతి 8.60 లక్షల క్యూసెక్కులకు పెరిగే అంచనాల నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. నిండేందుకు రెండు, మూడ్రోజులే! మహారాష్ట్రలో నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్లోని చిన్నచిన్న వాగులు, ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్లకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నీరంతా దిగువ జూరాలకు వస్తోంది. జూరాల నుంచి శ్రీశైలానికి.. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు పెద్దెత్తున ప్రవాహం వస్తోంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క జూరాలకు ఎగువన భీమానదిపై ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయినీ జలాశయానికి ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం సాగర్లో 312 టీఎంసీలకు నిల్వ 202 టీఎంసీలకు చేరింది. ఆదివారం ఒక్క రోజే 40 టీఎంసీల మేర కొత్తనీరొచ్చి చేరింది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల అవసరాలకు, విద్యుదుత్పత్తి ద్వారా 38,016 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. సోమవారం నుంచి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రాజెక్టు రెండు, మూడు రోజుల్లోనే పూర్తి స్థాయి మట్టాలకు చేరుకోనుంది. ఇక గోదావరిలోని ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. -
వామ్మో నీటి లోటు..543 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : లోటు వర్షపాతం, ఎగువ నుంచి కరువైన ప్రవాహాల కారణంగా గడిచిన ఏడాది నిర్జీవంగా మారిన కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జూన్ నుంచి ఆరంభమైన కొత్త వాటర్ ఇయర్లో నీటి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదైనా నైరుతి కరుణిస్తుందనే గంపెడాశతో ఉన్నాయి. ప్రçస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 543 టీఎంసీల నీటి లోటు ఉండగా, అవి పూర్తి స్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వానలు కురవకపోతే మాత్రం రెండు బేసిన్ల పరిధిలో 26 లక్షల ఎకరాలపై ప్రభావం పడనుంది. నోరెళ్లబెట్టిన ప్రాజెక్టులు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు కూడా నీటి ప్రవాహాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ ప్రాజెక్టులకు నీటి రాక కరువైంది. దీని ప్రభా వం నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాలపై పడింది. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకు గానూ 372.46 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్లో 130 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా, ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇందులో గరిష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు 8 టీఎంసీలకు మించి వాడుకునే అవకాశం లేదు. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకు గాను 32 టీఎంసీల లభ్యతగా ఉండగా, ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నాయి. జూరాలలోనూ 2.31 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మొత్తంగా 12 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేదు. ఇక ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ తీవ్ర నీటి లోటు ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 223 టీఎంసీల నీరు చేరితే కానీ అవి నిండే పరిస్థితులు లేవు. ఎగువన 180 టీఎంసీల మేర నీరు చేరి తే గానీ దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థాయిలో నీటి రాక రావాలంటే జూలై, ఆగస్టు నెలలో ఎగువన వర్షాలు కురవాలి. లేకుంటే దిగువకు ప్రవాహాలు మొదలయ్యేందుకు సెప్టెంబర్, అక్టోబర్ కూడా పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జరిగితే జూరాల, సాగర్ల కింద ఖరీఫ్ పంటల సాగుపై స్పష్టత కొరవడుతుంది. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితుల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయ కట్టు పై ప్రభావం పడే అవకాశం ఉంది. గోదావరి నిర్జీవం.. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూ ర్, కడెం, ఎల్లంపల్లిలలో ప్రస్తుత లభ్యత జలం కేవలం 18 టీఎంసీలు మాత్రమే ఉండటం, 172 టీఎంసీల మేర నీటి లోటు ఉండటం కలవరపెడుతోంది. ఖరీఫ్లో ఈ ప్రాజెక్టుల కింద సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్భగీరథ అవసరాలకు రెండు బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్ల పరిధిలో లభ్యత జలం 30 టీఎంసీలకు మించి లేకపోవడం, మరో 30 టీఎంసీల నీరు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు అంతా వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
పాలమూరు, డిండికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: నీటి కొరతను ఎదుర్కొంటున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని మళ్లించాలన్న ఆలోచనలకు ప్రభుత్వం పదును పెడుతోంది. గరిష్ట నీటిలభ్యత, సముద్రంలో ఏటా వృథాగా పోతున్న గోదావరిజలాలను మళ్లించి కృష్ణాబేసిన్ లోని పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు తరలించడం ద్వారా నీటికొరతను అధిగమించవ చ్చని భావిస్తోంది. దీనిపై ఇంజనీర్లు ఇదివరకే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచగా, తాజాగా 100 టీఎంసీల గోదావరినీటిని పాలమూరు, డిండిలకు తరలించే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దీనితో ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయి నీటి లభ్యత అందుబాటులో ఉంచవచ్చని పేర్కొన్నారు. గోదావరి పరిష్కారం.. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 120 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 90 టీఎంసీ నీటిని పాలమూరు–రంగారెడ్డికి, మరో 30 టీఎంసీ డిండికి మళ్లించాలని నిర్ణయించారు. పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీటితో 12.3 లక్షల ఎకరాలకు, డిండికి 30 టీఎంసీ నీటితో 3.41లక్షల ఎకరా లకు నీరివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు మించి నీరివ్వడం సాధ్యంకాదు. ఈ నేపథ్యం లో 90 టీఎంసీలతో 12.3 లక్షల ఎకరాలకు నీరివ్వ డం దాదాపు అసాధ్యం. కృష్ణాలో 120 వరద రోజుల ఆధారంగా లెక్కలు కట్టగా, కృష్ణాబేసిన్లో వరద 30 రోజులకు మించి ఉండట్లేదు. ఈ వరద రోజుల్లో 60 టీఎంసీలకు మించి నీటిని తీసుకోలేం. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు 100 టీఎంసీల మేర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ నీటి కొరతను గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా మళ్లించడం ద్వారానే తీర్చుకోగలమని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం తేల్చింది. ఇలా మళ్లించొచ్చు.. కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కెనాల్ కాల్వ నుంచి పాలమూరు లో భాగంగా ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజనీర్ల సంఘం పేర్కొంది. దీనికోసం 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని సూచించింది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరి వ్వొచ్చని పేర్కొంది. కాళేశ్వరంలో చివరిదైన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించొచ్చని సూచించింది. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపింది. ఏదుల నుంచి పాత డిండి వరకు కృష్ణా నీటిని తరలించే పనులకు అయ్యే వ్యయం కన్నా, శివన్నగూడెం ద్వారా డిండి ఎత్తిపోతలకు గోదావరి నీటిని తరలించే వ్యయం తక్కువగా ఉంటుందని తేల్చిచెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, చర్చించాక నిర్ణయం చేసే అవకాశం ఉంది. -
మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశంపై కేంద్రం చేతులెత్తేసింది. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివరాలేవీ తమ వద్ద లేని నేపథ్యంలో ఈ అంశంపై తేల్చలేమంటూ తప్పించుకుంది. గడిచిన ఐదేళ్లుగా కమిటీలు, సమావేశాలంటూ కాలయాపన చేసిన కేంద్ర జల సంఘం తాజాగా గోదావరి నీటి లభ్యత అంశాలేవీ తమ వద్ద లేవన్న కారణాన్ని సాకుగా చూపెట్టి ఈ అంశాన్ని మరుగున పడేసే యత్నాలకు దిగింది. ఈ ఏడాది దక్కనట్లే.. గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువనున్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది. గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీల్లో ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయసముద్రానికి కేటాయించాలని రాష్ట్రం గడిచిన ఐదేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ సహా హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులోనూ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరింది. దీనిపై కేంద్రం మూడేళ్ల కింద ఏకే బజాజ్ కమిటీని నియమించినా, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. అనంతరం జరిగిన కృష్ణాబోర్డు సమావేశాల్లో దీన్ని తెలంగాణ ప్రస్తావిస్తున్నా.. బోర్డు సైతం ట్రిబ్యునలే పరిష్కారం చేయగలదని చెబుతోంది. వాటాలు తేల్చకుంటే నష్టమే.. ఇప్పటికే ఏపీ.. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించడం, జూన్ నుంచి సీజన్ ఆరంభమైతే మళ్లీ నీటిని తరలించే అవకాశం ఉండటంతో వాటాల అంశాన్ని తెలంగాణ గత నెలలో మరోమారు తెరపైకి తెచ్చింది. ట్రిబ్యునళ్లు తేల్చేవరకు నీటి వాటాలను ఇవ్వకుంటే నష్టపోతామని పేర్కొంది. మధ్యేమార్గంగా ఈ సీజన్ నుంచే 45 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశమివ్వాలని బోర్డును కోరింది. దీనిపై బోర్డు కేంద్ర జల సంఘాన్ని వివరణ కోరగా.. ఇటీవలే దానికి సమాధానం పంపింది. గోదావరిలో మొత్తంగా ఉన్న నీటి లభ్యత, సముద్రంలో కలుస్తున్న నీరు, ప్రధాన ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం, రాష్ట్రాలకు ఉన్న డిమాండ్ తదితరాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది. కనీసం ఈ వివరాలేవీ గోదావరి బోర్డు వద్ద సైతం లేవని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా మళ్లింపు జలాలపై తేల్చజాలమని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లైంది. దీంతో ఈ ఏడాది మళ్లింపు జలాల వాటా రాష్ట్రానికి దక్కడం గగనంగానే మారనుంది. -
ఎక్కడికక్కడే నీటి నిల్వ
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలోని నదీ జలాలతోపాటు పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలతో లభించే ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టేలా ప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గరిష్ట స్థాయిలో కృష్ణా, గోదావరి నీటిని మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ కట్టడి చేసేలా భారీగా చెక్డ్యామ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర మాదిరి చెక్డ్యామ్లు, తూముల నిర్మాణంతో నీటిని చెరువులకు మళ్లించడం ద్వారా నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాగులకు అడ్డుకట్ట.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటి కేటాయింపులుండగా ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్డ్యామ్ల నిర్మాణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా కృష్ణా బేసిన్లో చిన్న నీటివనరుల కింద వినియోగం 40 టీఎంసీలు దాటడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా అనుకున్న మేర నీరు చేరడం లేదు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వాటిని నీటితో కళకళలాడించే పనిలో పడింది. ఇందులో భాగంగా గోదావరి బేసిన్లో ప్రధాన నదీ ప్రవాహాలైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెనుగంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణా బేసిన్లో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై చెక్డ్యామ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. వాటి పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని చెక్డ్యామ్ల నిర్మాణాలకు అవకాశం ఉంటుందన్న దానిపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలవారీగా నిర్మాణానికి అనువయ్యే చెక్డ్యామ్ల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తంగా 1,200.. రూ. 4,825 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్డ్యామ్లు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో గోదావరి బేసిన్ పరిధిలోనే 840 చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. కృష్ణా పరిధిలో సుమారు 700 మేర ప్రతిపాదనలురాగా వాటిని 400కు కుదించే అవకాశం ఉంది. ఇక నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు, ప్రాజెక్టుల సమీప కాల్వల నుంచి చెరువులకు నీటిని తరలించేలా తూముల నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 400 తూములను నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. అన్ని నిర్మాణాలకు మొత్తంగా రూ. 4,825 కోట్లు ఖర్చు చేసేలా ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో తూముల నిర్మాణానికి రూ. 410 కోట్లు వెచ్చించనున్నారు. చెక్డ్యామ్లకు సంబంధించిన వ్యయ అంచనాలు పరిపాలనా అనుమతుల కోసం ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి చేరుతున్నాయి. ఒక్కో చెక్డ్యామ్ నిర్మాణానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 8 కోట్ల నుంచి వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రుణాలు తీసుకొనేలా ప్రభుత్వం యోచిస్తోంది. -
ప్రాజెక్టులకు వేసవి గండం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎండలు పుంజుకోకమందే గోదావరి, కృష్ణా బేసిన్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్రమేపీ అడుగంటుతుండగా, గోదావరిలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ వట్టిపోయాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో ఐదు నెలల పాటు నెట్టుకురావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు నీటి ఎద్దడి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గోదావరి బేసిన్లోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయి. నిజాంసాగర్లో 17.8 టీఎంసీల నీటి నిల్వలకు గాను ఇప్పుడు అక్కడంతా బురదే కనిపిస్తోంది. కనీసం పశువులు తాగేందుకు నీరు సైతం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా మైదానంలా కనిపిస్తోంది. గతేడాదిలో కనిష్టంగా 5.91 టీఎంసీల నిల్వలుండగా ఈ ఏడాది కేవలం 0.65 టీఎంసీలే ఉండటం, పరీవాహకంలో నీటి కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇక సింగూరులోనూ దారుణ పరిస్థితులున్నాయి. ఇక్కడ 29.31 టీఎంసీల నీటి నిల్వలకు గానూ కేవలం 1.17 టీఎంసీల నిల్వలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 9 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ ప్రభావం సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక ఎస్సారెస్పీ పరిధిలో రబీ అవసరాలకు తాగునీటిని విడుదల చేయడంతో అక్కడ ఉండాల్సిన 90 టీఎంసీల నిల్వలకు గాను ప్రస్తుతం 13 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం రబీ అవసరాల కోసం 6,805 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మట్టం మరింత తగ్గేలా ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలే ఉండగా, ఇక్కడి నుంచి నిత్యం 180 క్యూసెక్కులు తాగునీటికి, 1,422 క్యూసెక్కులు సాగునీటికి వినియోగిస్తున్నారు. శ్రీశైలంలో వేగంగా పడిపోతున్న మట్టం కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శ్రీశైలంలో 885 అడుగులకు గాను, కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 826 అడుగుల్లో 45.76 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి వెయ్యి క్యూసెక్కుల మేర నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.ఇప్పటికే 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకోవాలని ఇటీవలి కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించారు. 18 టీఎంసీల లభ్యత నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటే త్వరలోనే ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితులున్నాయి. ఇక సాగర్లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ,520.8 అడుగుల మట్టంలో 150 టీఎంసీల నీరుంది. కనీస నీటి మట్టం 510 అడుగులకు పైన వినియోగించుకునే నీరు కేవలం 15 టీఎంసీలే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు గానూ కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు వెళ్లి మొత్తంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత నీటితో మూడు నెలల అవసరాలు తీరినా, జూన్ నుంచి నీటి కష్టాలు తప్పవని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. -
మళ్లింపు జలాలపై నిపుణుల కమిటీ?
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశాన్ని తేల్చేందుకు మళ్లీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి కమిటీయే మార్గమని తేల్చింది. ఇదివరకే ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ ఏమీ తేల్చని నేపథ్యంలో కేంద్ర జల సంఘంలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన నిపుణులతో కమిటీని నియమించి దీనిపై నిర్దిష్ట సమయంలోనే నివేదిక ఇచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో గోదావరి నీటిని కృష్ణాబేసిన్కు తరలిస్తున్న దృష్ట్యా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుల మేరకు కృష్ణాలో ఎగువన ఉన్న తెలంగాణ అదనపు నీటి వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ 2017 ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీకి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని రాష్ట్రం కోరింది. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది. ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ఈ నేపథ్యంలో కమిటీ రద్దయిపోయింది. అప్పటి నుంచి ఈ అంశం మరుగునపడింది. అయితే ఇటీవల మళ్లీ ఈ అంశాన్ని తెలంగాణ తెరపైకి తేవడంతో కేంద్రం దీనిపై చర్చించేందుకు బుధవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో జరిగిన ఈ భేటీకి కృష్ణాబోర్డు ఇన్చార్జి చైర్మన్, గోదావరి బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, కృష్ణాబోర్డు సభ్యుడు హరికేశ్ మీనాలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మళ్లింపు జలాలపై ఇరు రాష్ట్రాలు వెల్లడిస్తున్న అభిప్రాయాలపై చర్చించారు. దీనిపై తేల్చేందుకు నిపుణుల కమిటీని వేద్దామని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ప్రతిపాదించగా, బోర్డు చైర్మన్ అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పాటే కృష్ణా, గోదావరి బోర్డుల వర్కింగ్ మాన్యువల్ను ఓకే చేసేలా రెండు రాష్ట్రాలను ఒప్పించాలని కేంద్రం బోర్డులకు సూచించినట్లుగా తెలిసింది. దీన్ని అంగీకరించాకే రెండు రాష్ట్రాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశమై చర్చిద్దామని తెలిపినట్లుగా సమాచారం. ఇక కృష్ణా బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేందుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. -
మిగులు నీళ్లన్నీ మావే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరంతా తమవేనని తెలంగాణ రాష్ట్రం కృష్ణాబోర్డుకు స్పష్టం చేసింది. శ్రీశైలంలో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లినందున, సాగర్లో కనీస మట్టాలకు ఎగువన ఉన్న 31.6 టీఎంసీల నీటి వాటా కింద తమకు దక్కేవని తెలిపింది. ప్రస్తుత లభ్యత నీటిలో ఏపీకి ఎలాంటి వాటా ఉండదని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. గతంలో బోర్డు చేసిన కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగాన్ని దాని దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు ఏపీకి 33.40 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటికే ఆ రాష్ట్రం 33.39 టీఎంసీల నీటిని వినియోగించిందని వెల్లడించారు. తెలంగాణకు 46.90 టీఎంసీల మేర కేటాయింపులు చేయగా, ఇందులో 31.71 టీఎంసీల మేర వినియోగించగా, మరో 15.19 టీఎంసీల మేర వాడుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఎలాంటి నీటి లభ్యత లేకపోగా, సాగర్లో మాత్రం 31.64 టీఎంసీల మేర ఉందని తెలిపారు. ఇందులో తెలంగాణ వినియోగించుకోవాల్సిన నీటి వాటాతో పాటు 13 టీఎంసీలను తెలంగాణ అవసరాలకు రిజర్వ్లో ఉంచారని, ఈ మొత్తాన్ని కలుపుకుంటే 28.19 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని లెక్కల ద్వారా తెలిపా రు. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఇప్పటి వరకు 577.99 టీఎంసీలకుగాను ఆంధ్రప్రదేశ్ 401.218 టీఎంసీలు (69.42 శాతం), తెలంగాణ 176.778 టీఎంసీలు (30.58 శాతం) వినియోగించుకుందని, రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ దామాషా ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతంగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కల దృష్ట్యా సాగర్లో లభ్యత నీరంతా తెలంగాణకే దక్కుతుందని పేర్కొంది. శ్రీశైలంలో తగ్గుతున్న నిల్వ శ్రీశైలంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇక్కడ 885 అడుగుల మట్టానికి గానూ ప్రస్తుతం 828.20 అడుగుల మట్టంలో 47.68 టీఎంసీల నిల్వలున్నాయి. నిజానికి శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా ఇప్పటికే దానికి దిగువన 5 టీఎంసీల మేర ఇరు రాష్ట్రాలు నీటి వినియోగం చేసేశాయి. మంగళవారం సైతం శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా ఏపీ 960 క్యూసెక్కులు, కల్వకుర్తి ద్వారా తెలంగాణ 2.400 క్యూసెక్కుల నీటిని తరలించుకున్నాయి. శ్రీశైలంలో నిల్వలు తగ్గుతున్నా ఇప్పటివరకు కృష్ణా బోర్డు భేటీపై స్పష్టత రాలేదు. -
‘పట్టిసీమ’ వాటా.. ఈ మారైనా సర్దండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై ఇప్పటికైనా తేల్చాలని తెలంగాణ కృష్ణాబోర్డును ఇటీవల కోరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమకు సంబంధించి తెలంగాణకు దక్కే 45 టీఎంసీల నీటి వాటాను ఈ ఏడాదైనా రాష్ట్రానికి సర్దాలని కోరింది. రాష్ట్ర అవసరాలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా, ట్రిబ్యునళ్లు తేల్చేవరకు చూడకుండా ఈ ఏడాది వర్షాకాలం నుంచే అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని మరోమారు బోర్డుకు రాసిన లేఖలో కోరింది. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువనున్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి.80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువన ఉన్నది తెలంగాణే.. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది. గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీలలో ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయ సముద్రానికి కేటాయించాలని ఇదివరకే బోర్డును, కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం ఏకే బజాజ్ కమిటీని నియమించినా, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. బోర్డు సైతం ట్రిబ్యునలే పరిష్కారం చేయగలదని చెబుతోంది. ఇప్పటికే ఏపీ.. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించడం, జూన్ నుంచి సీజన్ ఆరంభమైతే మళ్లీ నీటిని తరలించే అవకాశం ఉండటంతో వాటాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ట్రిబ్యునళ్లు తేల్చేవరకు నీటి వాటాలను ఇవ్వకుంటే నష్టపోతామని పేర్కొంది. మధ్యేమార్గంగా ఈ సీజన్ నుంచే 45 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశమివ్వాలని కోరింది. -
నేడు ‘కృష్ణా’ త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశంపై చర్చించేందుకు గురువారం కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖలు రాశారు. కృష్ణా బోర్డు చేసిన కేటాయింపులపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. కృష్ణా బేసిన్లోని లభ్యతగా ఉన్న జలాల్లో తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఏపీకి 33.40 టీఎంసీలను బోర్డు కేటాయించగా, ఏపీ అవసరాల కోసం సాగర్ ఎడమ కాల్వ కింద జోన్–3కి నీటిని కేటాయించడంపై రాష్ట్రం అభ్యంతరం చెప్పింది. తెలంగాణ పరిధిలోని జోన్–2కే నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో జోన్–3కి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీంతో పాటే తెలంగాణకు వాటా ప్రకారం 60 టీఎంసీలు రావాల్సిన పూర్తి స్థాయి కేటాయింపులు చేయకపోవడంపై నిలదీసింది. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరయ్యే అవకాశం ఉంది. -
కర్ణాటక ‘ఎత్తు’లు... తెలుగు రాష్ట్రాలకు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ, ఏపీల ప్రాజెక్టులకు నీళ్లు కరువవుతుంటే.. మరోపక్క ఎగువన ఉన్న కర్ణాటక మాత్రం కృష్ణా నీటిని మరింత కట్టడి చేసేందుకు యత్నిస్తోంది. దిగువకు చుక్క నీటిని కూడా వదలకుండా తన స్వప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే వ్యూహాలకు పదును పెడుతోంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపి, అది అమల్లోకి రాకుండానే డ్యామ్ ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేలా పావులు కదుపుతోంది. దీనికి బలమిచ్చేలా ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నట్లు, దీనికోసం రూ.30,143 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కర్ణాటక భారీ నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వాటాలు అధికారికం కాకముందే.. కృష్ణా జల వివాదాలపై తొలిసారిగా ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం డిపెండబిలిటీతో 2,130 టీఎంసీ నీటిలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీ, మహారాష్ట్రకు 585 టీఎంసీ, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుతం ఇదే వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీతో 2,578 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించి అందులో ఏపీకి 1,001, మహారాష్ట్రకు 666, కర్ణాటకు 911 టీఎంసీలు కేటాయించింది. ఈ తీర్పును వెలువరించిన సందర్భంగానే కర్ణాటకకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524.25 మీటర్ల ఎత్తు వరకు పెంచుకునే వీలు కల్పించింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్లు కాగా, 129 టీఎంసీల నిల్వ సామర్థ్యముండగా, మొత్తంగా 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. ఒకవేళ బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వచ్చి ఎత్తు పెరిగితే నిల్వ సామర్థ్యం 259 టీఎంసీలకు పెరుగుతుంది. నీటి వాడకం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరుగుతుంది. అదనంగా 130 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇప్పటివరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదు. అది అమలు కాకుండానే వాటాలు అధికారికం కాకుండా ఆల్మట్టి ఎత్తు పెంచుకునే వీలుండదు. అయినప్పటికీ ఎత్తు పెంచేలా కర్ణాటక తన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎన్నికల నుంచే తెరపైకి.. ఇటీవల కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆల్మట్టి ఎత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఎత్తు పెంచడంతోపాటు, పెంచితే అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకునేలా 9 ఎత్తిపోతలు చేపడతామని ప్రకటించాయి. ఈ మేరకు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ప్రకటన చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు నీళ్లు వచ్చేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సి వస్తోంది. ఎత్తు పెంచాక అక్టోబర్ తర్వాతే నీళ్లొచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పరిస్థితి దారుణంగా మారుతుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో చేపట్టిన.. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు, వీటి పరిధిలోని 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం కష్టతరమే కానుంది. ఈ నేపథ్యంలో ఎత్తు పెంపుపై మళ్లీ న్యాయస్థానాల్లో పోరాటమే తెలుగు రాష్ట్రాలకు శరణ్యం కానుంది. -
నీటి కేటాయింపుల తీరుపై తెలంగాణ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రానికి దక్కే వాటాకన్నా తక్కువ నీటి కేటాయింపులు చేసిందని శనివారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా బోర్డు తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 33.40 టీఎంసీలు కేటాయించిందని, అయితే న్యాయంగా తెలంగాణకు 51 టీఎంసీల మేర వాటా నీరు దక్కుతుందని తేల్చిచెప్పింది. ఇక బోర్డు సాగర్ ఎడమ కాల్వ కింద ఆంధ్రప్రదేశ్ అవసరాలకు 3.43 టీఎంసీల నీరు కేటాయించిందని, నిజానికి సాగర్ ఎడమ కాల్వ కింద ప్రస్తుత రబీ సీజన్లో జోన్–1 వరకు మాత్రమే నీటిని అందించాలని తెలంగాణ భావిస్తోందని తెలిపింది. సరిపడేంత నీరు లేక తెలంగాణలోని జోన్–2 ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదని వివరించింది. అలాంటప్పుడు జోన్–3లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఆయకట్టుకు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ఆ ఐదింటికి నికర జలాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమివ్వాలని జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణాజలాల్లో మిగులు నీటిని బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకే కేటాయించాలని కోరింది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల తాగు, సాగు అవసరాలను తీర్చేవిధంగా చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు 200 టీఎంసీల మేర నికర జలాలు కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో తెలంగాణ అవసరాలు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న సాగు డిమాండ్, ఏపీకి అక్రమంగా జరిగిన కేటాయింపుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రాజెక్టులు, తాగు, పారిశ్రామిక అవసరాలకు మొత్తం కలిపి 936.58 టీఎంసీల నీరు అవసరమని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ‘గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు పూర్తిస్థాయిలో ఖర్చుకావు, తిరిగి 80 శాతం వివిధ రూపాల్లో బేసిన్లోని జల వనరులకు చేరుతాయి. కావున నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా పేర్కొనాల’ని కోరింది. ఇతర బేసిన్లకు నీటి తరలింపు.. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్లో పరీవాహక ప్రాంతం తక్కువే అయినప్పటికీ, భారీ ఎత్తున కృష్ణాజలాలను ఏపీ వినియోగించుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. 397 టీఎంసీల కృష్ణాజలాలను పెన్నా, ఇతర బేసిన్లకు ఏపీ తరలిస్తున్నదని, శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఇతర బేసిన్లకు ఈ నీటిని తరలిస్తున్నదని తెలిపింది. కృష్ణా బేసిన్లోని తెలంగాణలోని 36.45 లక్షల హెక్టార్ల భూమి సాగు యోగ్యంగా ఉందని తెలిపింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ కేటాయింపుల్లో సర్దుబాటు చేసిన 299 టీఎంసీల ద్వారా 5.75 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగులోకొచ్చిందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా మరో 10.38 లక్షల హెక్టార్లు సాగులోకి రానుండగా, మరో 20.32 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి వసతి కల్పించాల్సి ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా ఏపీ బేసిన్ ఆవలకు తరలిస్తున్న నీటి నుంచి 75 శాతం డిపెండబిలిటీపై ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎస్ఎల్బీసీ)కు 33 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 34 టీఎంసీలు, నెట్టెంపాడుకు 19.38 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 84.85 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 29 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని కోరింది. వలసలకు నిలయమైన పాత మహబూబ్నగర్, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజల వెతలు ఈ ప్రాజెక్టుల ద్వారా తీరుతాయని తెలిపింది. ఈ అఫిడవిట్పై ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగనున్నాయి. -
రాష్ట్రాన్ని బానిస కానివ్వ
సాక్షి, సిద్దిపేట: ‘‘కృష్ణా బేసిన్లో ఉన్న కోదాడలో నిలబడి (మహాకూటమి బహిరంగ సభలో) కృష్ణా నదిలో నీళ్లు లేవు.. గోదావరి నీళ్లు పంచుకుందామని చంద్రబాబు మాయమాటలు మాట్లాడుతున్నడు. తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులను, వాళ్ల అధినేత రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఎండార్సీ ఇస్తున్నడు. ఇందుకు మన కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఊపుతున్నాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? మన వాటా లేదా? హరీశ్రావు పటపట పళ్లు కొరకాలె. తెలంగాణ యావత్తూ... బిడ్డా మా వాటా లేదంటావా? నీ కెంత ధైర్యం రా? అని ఓటుతోని సమాధానం చెప్పాలి’’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను దోచుకోవడంలో చంద్రబాబు దాహం తీరలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. కృష్ణాలో నీళ్లు లేవంటూ మాట్లాడిన చంద్రబాబు వద్ద నుంచి మైకు గుంజుకోవాల్సిన కాంగ్రెస్ దద్దమ్మలు... మొద్దన్నలు నోరు మెదపలేదని మండిపడ్డారు. మన నీళ్లు మనకు రాకుండా కుట్ర పన్నిన చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శించారు. ‘‘కేసీఆర్, టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడుతుంది. కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి. అదే చంద్రబాబు భాగస్వామ్యంతో ఉన్న కూటమి గెలిస్తే రాష్ట్రానికి శనేశ్వరమే. కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా... శనేశ్వరం కావాలా..? మీరే తేల్చుకోవాలి... విజ్ఞతతో ఓటు వేయాలి. దొంగ సర్వేలు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దు. 100కుపైగా స్థానాల్లో గెలిచి తెరాస మళ్లీ అధికారంలోకి వస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాను. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ రెండు పాడి గేదెలు ఇస్తాం’’అని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన బుధవారం తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించబోయే ముందు తన సమీప బంధువు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతారావుకు పాదాభివందనం చేశారు. సభలో మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, ఫారూక్ హుస్సేన్, కార్పొరేషన్ల చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, భూపతిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఉన్న తెలంగాణను పోగొట్టింది కాంగ్రెస్సే సకల సంపదలతో తులతూగిన తెలంగాణ ప్రాంతాన్ని పోగొట్టి ఏపీలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. హైదరాబాద్ స్టేట్ పేరు మీద తెలంగాణ ఉండె. 1956లో తెలంగాణ ప్రత్యేకంగా ఉండ కుండా బూర్గుల రామకృష్ణారావుతో నెహ్రూ మంతనాలు జరిపారు. తర్వాత ఉద్యమాలు చేసి నా తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చట్ట సభలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కరాఖండీగా చెప్పినా... కాంగ్రెస్ దద్దమ్మలు నోరు మెదపలేదు. అ«ధికారం కోసం లావాసపడే కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరం లేదు. వారికి కావాల్సింది కుర్చీ. అందుకోసమే ప్రాజెక్టులు ఆపేందుకు కుట్ర పన్నిన చంద్రబాబుతో చెయ్యి కలిపి తెలంగాణలో తిరుగుతున్నారు. కూటమికి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీకి, అమరావతికి తాకట్టు పెట్టాల్సి వస్తుంది. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు మాటలే ఒప్పుకుందామా? సంపద పెంచి పంచాలనేదే లక్ష్యం... దేశంలో నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా లేనివిధంగా ఆర్థికవృద్ధి 17.17 శాతం పెంచుకున్నాం. ప్రస్తుతం అది 19.86కు చేరింది. దేశంలోనే అత్యధిక విద్యుత్ వినియోగం తెలంగాణలో జరుగుతోందని భారతదేశ విద్యుత్ అథారిటీ సంస్థ చెప్పింది. సంపద పెంచి ప్రజలకు పంచాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా కేవలం రూ. 9.56 కోట్ల ఆదాయమొస్తే.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రూ. 2,056 కోట్ల ఆదాయం వచ్చింది. స్మగ్లింగ్, బ్లాక్ దందాను అరికట్టడం మూలంగానే ఇది సాధ్యమైంది. ఇలా కడుపుకట్టుకొని కూడబెట్టిన సంపదను సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం.. దేశంలో తెలంగాణ ఒక్కటే. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకూ ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మఒడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణను చూసి కేంద్ర ఆర్థిక మండలి నివ్వెరపోతోంది. ఒక్క కోరుట్లలోనే 68,758 మందికి పింఛన్లు ఇవ్వడాన్ని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యం... వ్యవసాయానికి సాగునీరు, కల్యాణలక్ష్మి, పింఛన్ సౌకర్యాలతోపాటు ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎర్రవల్లిలో వృద్ధుల ఇబ్బందులను గమనించి పుట్టిన పథకమే కంటి వెలుగు. ఒక్క కంటి వెలుగు పథకంతోనే ఆగదు. మళ్లీ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముక్కు, చెవి, గొంతు పరీక్షలు.. ఆ తర్వాత పళ్ల పరీక్షలు, అనంతరం పాథాలజీ సిబ్బంది ద్వారా ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య రికార్డును సిద్ధం చేస్తాం. ఆరోగ్య రికార్డు ఆధారంగా అత్యవసర చికిత్స కూడా అందుబాటులోకి వస్తుంది. వంద సీట్లకుపైగా గెలుస్తాం: కేకే పేదరికంతో అలమటిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచి పేదవారికి పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు తెలిపారు. రాష్ట్రమంతటా ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని.. ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. వంద సీట్లకుపైగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ గెలుపు పార్టీది కాదని.. ప్రజలదన్నారు. ఈ రాష్ట్రం ప్రజారాష్ట్రమని.. టీఆర్ఎస్ ప్రజాపార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగు, సాగునీరు కష్టాలు తీరుతున్నాయని, తెలంగాణ చీకటి రాష్ట్రంగా మారుతుందని ఎద్దేవా చేసిన ఆంధ్ర పాలకుల విమర్శలకు నిరంతర విద్యుత్తో సమాధానం చెప్పామన్నారు. కాగా, సభ విజయవంతం కావడంపై హరీశ్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. గాలిగాలి గత్తర కావొద్దు... తెలంగాణ రాష్ట్ర సాధనలో 58 సంవత్సరాలు తన్నులాట, కష్ట నష్టాలు, అవమానాలు, క్షోభలు చవిచూశాం. ఎంతో మంది తల్లులు వారి బిడ్డల ప్రాణాలు కళ్లముందే పోయినా చలించలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డదే కానీ... బిస్కెట్లాగా భిక్షమేస్తే వచ్చింది కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదల కంట కన్నీరు చూడొద్దనేదే నా స్వప్నం. దుఃఖం లేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణే నా లక్ష్యం. కోటి ఎకరాల మాగాణి కోసమే యజ్ఞం చేస్తున్నా. తెలంగాణ ఏర్పడ్డ నాలుగు సంవత్సరాల్లోనే అనేక రకాల మార్పులు తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొద్దు. గెలిచి నిలవాలి. ఓట్లు అంటేనే గాలిగాలి గత్తర కావొద్దు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగే ప్రయత్నంలో ఉంది. నేను పెట్టిన మొక్కలు పూత పూసి కాయ కాసే దశలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. గాలి మాటలు విని గాబరాపడి ఓటేస్తే ఐదు సంవత్సరాలు ఏడవాల్సి వస్తుంది. హరీశ్... ప్రాజెక్టుల వద్ద నిద్రచేసి పనులు చేయిస్తుండు.. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే సంకల్పాన్ని యజ్ఞంలా చేపడుతున్నం. మా మంత్రి (హరీశ్రావును ఉద్దేశించి) ప్రాజెక్టుల దగ్గర నిద్రచేసి వెంటపడి మరీ పనులు చేయిస్తుండు. గిట్లాంటి చరిత్ర కాంగ్రెసోళ్లకు ఉందా..? కాంగ్రెస్కు తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. ఏనాడూ వారు ప్రజాసమస్యల పరిష్కారాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ తెలంగాణ మంత్రివర్గంలో కీలకశాఖ నిర్వహిస్తున్న హరీశ్ తనదైన శైలిలో పనిచేసి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించగలిగాం. బాబు కుట్రలు సాగనీయం... చంద్రబాబు ఏం కోరుతున్నాడు. తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలనేది చంద్రబాబు లక్ష్యం. అధికారం పోయిందనే కడుపుమంటతో ఉన్న కాంగ్రెస్ నేతల అసమర్థతను చంద్రబాబు వాడుకుంటున్నాడు. అక్రమంగా సంపాదించిన సొమ్ములు తీసుకొని.. ఆంధ్రా నాయకులు, ఇంటె లిజెన్స్ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి ఇక్కడ మోహరించిండు. దానికి కాంగ్రెస్ నేతలు భజన పాడుతున్నారు. అందుకే ఆంధ్రాకెళ్లి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చారు. మీరు నాకు అవకాశం ఇస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానివ్వను. ఇప్పుడు ఎన్నికల్లో కొట్లాడాల్సింది మీరు. ఓటుతో దెబ్బ కొట్టాలి. కోటి ఎకరాల మాగాణి చేసేందుకు మనం ప్రయత్నిస్తుంటే గొడ్డలి భుజాన పెట్టుకొని అడ్డుకోవాలని చూస్తున్న కుట్రబాజి చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పి తరిమికొట్టాలి. తెలంగాణను దుర్మార్గులపాలు కాకుండా కాపాడుకోవాలి. తెలంగాణను కేసీఆర్ సాధించినప్పుడు.. మీరంతా సంబురపడ్డరు. తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, కవు లు, రచయితలు ఆలోచించి.. తెలంగాణకు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత ఉంది. మీ మద్దతు లేకపోతే నేనేం చేయలేను. మీరు ఆశీర్వదించి దీవిస్తే.. దేశమే నివ్వెరపోయే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది. -
16న కృష్ణాబోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలోని లభ్యత జలాలు, రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు ఈ నెల 16న జలసౌధలో భేటీ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల ఎగువన లభ్యతగా ఉన్న జలాల పంపిణీ, వాటాకు మించి ఏపీ చేసిన వినియోగం, భవిష్యత్ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు హాజరు కానున్నారు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంతో పాటు బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశాలను ఎజెండాలో చేర్చారు. -
మిగిలేది 155 టీఎంసీలే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 258.45 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఇందులో ఇప్పటికే జరిపిన కేటాయింపులు, వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఉండే అవసరాలను పక్కనబెడితే మిగిలేవి కేవలం 155 టీఎంసీలేనని తెలంగాణ కృష్ణాబోర్డుకు తెలిపింది. ఈ నీటిలో తెలంగాణకు 74.18 టీఎంసీ, ఏపీకి 80.86 టీఎంసీల మేర వాటా దక్కుతుందని తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఇరు రాష్ట్రాలకు 21 టీఎంసీల అవసరాలు ఉంటాయని వివరించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ కృష్ణాబోర్డుకు నీటి వినియోగ లెక్కలు, దక్కే వాటాలపై వివరణ ఇస్తూ లేఖ రాసింది. -
తెలంగాణకు 52.50 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాల్లో తెలంగాణకు 52.50 టీఎంసీలను కేటాయిస్తూ కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం గురువారం ఆదేశాలిచ్చారు. ఇందులో 33 టీఎంసీల నీటిని సాగర్ఎడమ కాల్వ కింది అవసరాలకు, మరో 12 టీఎంసీల నీటిని ఎంఆర్పీ కింద తాగు, సాగు అవసరాలకు, మరో 7.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించారు. ప్రస్తుతం సాగర్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 172 టీఎంసీలు, శ్రీశైలంలో 148.65 టీఎంసీలు కలిపి మొత్తంగా 320 టీఎంసీల మేర నీటినిల్వలు లభ్యతగా ఉన్న దృష్ట్యా అందులోంచే ఈ నీటిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి డేటాను తెలంగాణ, ఏపీలు ఆమోదించి బోర్డుకు పంపాలని తెలిపింది. 2015లో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ నీటి విడుదలలో బోర్డు ఆదేశాలు పాటించాలని సూచించింది. స్థిరంగా ప్రవాహాలు.. ఇక సాగర్లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. గురువారం సాగర్లోకి 26వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 312 టీఎంసీలకు గానూ 303.95 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులోంచే 19,213 క్యూసెక్కుల నీటిని దిగువ అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువన శ్రీశైలానికి స్థిరంగా 25వేల క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టు నుంచి 54వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. -
ఒక్క నెలలోనే 185 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను ఆగస్టు నెల పూర్తిగా ఆదుకుంది. ఈ నెలలో వచ్చి న ప్రవాహాలతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా, నాగార్జునసాగర్ దాదాపు నిండింది. ఈ నెలలో సాగర్లోకి 185 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. మరో 8 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనుంది. ఎగువ శ్రీశైలం నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగు తుండటంతో సాగర్కు గురువారం సాయంత్రం 73వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు గానూ 582 అడుగులకు చేరింది. నీటినిల్వ 312 టీఎంసీలకు గానూ 288 టీఎంసీలను దాటింది. మరో 24 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపిం చనుంది. రెండు రోజులతో పోలిస్తే శ్రీశైలం నుంచి ప్రవాహాలు తగ్గినా, అవి మళ్లీ క్రమంగా పుంజు కునే అవకాశం కనిపిస్తోంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్లకు నీటి ప్రవాహాలు క్రమంగా పెరిగాయి. గురువారం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక నారాయణపూర్ నుంచి 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు విడుదల చేశారు. దీంతో ఉదయం జూరాలకు 80 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, అది సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. దీంతో దిగువ శ్రీశైలానికి జూరాల నుంచి 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువా రం ఉదయం శ్రీశైలానికి కేవలం 29 వేల క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 1.02 లక్షల క్యూసెక్కులకు చేరింది. సాగర్కు 73,344 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా, శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉంది. సాగర్ నుంచి ఏపీ, తెలంగాణ అవసరాలకు 28,744 క్యూసెక్కు ల నీటిని సాగు, తాగుకు విడుదల చేస్తున్నారు. -
గేట్లు.. ఎత్తలేక పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నీటిపారుదల శాఖ అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాజెక్టులు, వాటి పరిధిలోని డ్యాముల భద్రత, గేట్ల నిర్వహణ, పరికరాల కూర్పు, సిబ్బంది అవసరాలపై పూర్తి అంచనా వేయలేకపోతోంది. ఆ దిశగా చర్యలు లేకపోవడం పెనుముప్పు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. వర్షాలకు ముందే ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ, సిబ్బంది నియామకాలపై శ్రద్ధ చూపకపోవడం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు, అంచనాలకు మించి వరద రావడంతో సాత్నాల, కడెం ప్రాజెక్టుల గేట్ల నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. పట్టింపులేని ధోరణి.. కృష్ణా బేసిన్లో 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 25 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద రాగా, గోదావరి బేసిన్లో 1983లో శ్రీరాంసాగర్ పరిధిలో 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి. 2009లోనే నాగార్జునసాగర్ గరిష్ట వరద 14.5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండగా, జూరాలకు 11.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. శ్రీశైలం వరదను ఎదుర్కొనే ముం దస్తు సన్నద్ధతలో విఫలం కావడంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రెండేళ్ల కింద ఏడాది సెప్టెంబర్లో ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు తక్కువ సమయంలో ఎక్కువ వరదొచ్చింది. వీటి నిర్వహణ నీటి పారుదల శాఖకు కత్తిమీద సాములా మారింది. 2016 సెప్టెంబర్లో సింగూరులో 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది. ఈ సమయంలో సింగూరు గేట్లు తెరుచుకోక నానా తంటాలు పడాల్సి వచ్చింది. ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా, అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ఇందుకు ప్రాజెక్టు గేట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్ను గాలికొదిలేయడం, రోప్ వైర్ల నిర్వహణ పట్టకపోవడమే కారణమని తేల్చారు. తాజాగా కడెంలోనూ అదే జరిగింది. ఈ నెల 16న కడెం ప్రాజెక్టు రెండో నంబర్ గేట్ కౌంటర్ వెయిట్ తెగిపోయిన కారణంగా నీటి ఒత్తిడికి పక్కకు ఒరిగి కిందకి దిగని పరిస్థితి తలెత్తింది. దీంతో గేటు వేయడం సాధ్యంకాక 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. ప్రాజెక్టు చీఫ్ఇంజనీర్ శంకర్ ఆధ్వర్యంలో ఇంజనీర్లు రెండ్రోజులు శ్రమించి గేటును కిందకి దించగలిగారు. సాత్నాల పరిధిలోనూ మూడు రోజుల కిందట 45 వేల క్యూసె క్కుల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులోకి 90 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే సమయంలో కరెంట్ పోవడం, జనరేటర్పై పిడుగు పడటంతో గేట్లు తెరవడంలో అయోమయం నెలకొంది. గేట్లు ఎత్తే ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తుల సాయంతో గేట్లు ఎత్తాల్సివచ్చింది. సిబ్బంది లేమి.. రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల పరిధిలో ఓఅండ్ఎంకు సరిపడనంతగా లేదని సిబ్బంది కొరతే శాఖకు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలో లష్కర్లు, వర్క్ఇన్స్పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్, పంప్, జనరేటర్ ఆపరేటర్లు కలిపి 5,674 మంది సిబ్బంది అవసరం ఉంది. ఇందు లో వర్క్ ఇన్స్పెక్టర్లు 1,058, లష్కర్లు 3,671, ఎలక్ట్రీషియన్లు 107, గేట్ల ఆపరేటర్లు 169, జనరేటర్ ఆపరేటర్లు 52 మంది అవసరం ఉం దని తేల్చింది. ప్రస్తుతం 1700 మందే ఉన్నారు. లష్కర్లు 1450 మందే ఉండగా, పంప్ ఆపరే టర్లు 180 మంది ఉన్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఒక్కరే ఎలక్ట్రీషియన్ ఉండగా, ఆపరేటర్ల కొరతతో కాల్వల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని డ్యామ్ సేవలకు వినియోగిస్తున్నా రు. అక్కడ పూర్తి స్థాయి సిబ్బందిని సమకూర్చడంపై గతేడాదిలోనే ప్రతిపాదన వచ్చినా నీటిపారుదల శాఖ అమలు చేయలేకపోయింది. సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లతో నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది వర్షాల సమయానికి ముందే గత పరిస్థితులు తలెత్తకుండా నీటిపారుదల శాఖ ముందుగానే మేల్కోవాల్సి ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. -
ప్రవాహాలు లేక గోదా‘వర్రీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయినిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ఏటా జూన్ చివరి వారానికే ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు కూడా నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇప్పటివరకు కేవలం 32 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. చూపంతా ఎగువ వైపే.. కృష్ణా బేసిన్తో పోల్చి చూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా అవి గోదావరి పరీవాహకంలో లేకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరుకు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి నెల రోజులవుతున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద మాత్రం ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా 3.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాలు నమోదయ్యాయి. అయితే ఈ ప్రవాహాలు ప్రాణహిత నుంచి వచ్చాయే తప్ప గోదావరి నుంచి కాదు. జూన్ చివరి వారం, జూలై తొలి వారంలో ప్రాజెక్టుల్లో కొంతమేర ప్రవాహాలు కొనసాగినా అవి ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయాయి. మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు గడిచిన నాలుగు రోజులుగా మాత్రమే ఇన్ఫ్లో ఉంది. దీంతో ఆ ప్రాజెక్టులో 102 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 50 టీఎంసీల నిల్వలున్నాయి. గతేడాదితో పోలిస్తే అక్కడ 10 టీఎంసీల నిల్వ తక్కువగా ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టులో కేవలం 9.82 టీఎంసీలు మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. సింగూరులో 29.91 టీఎంసీలకు వాస్తవ నిల్వకు గానూ గతేడాది 18.10 టీఎంసీల నిల్వ ఉండగా.. ఈ ఏడాది కేవలం 7.66 టీఎంసీల నిల్వలున్నాయి. ఎలాంటి ప్రవాహాలు రావడం లేదు. దీంతో దీనిపై ఆధారపడ్డ 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు నిండితే కానీ నిజాంసాగర్కు నీటి విడుదల కుదరదు. నిజాంసాగర్లో కేవలం 0.02 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు రావడంతో అక్కడ 17.80 టీఎంసీలకు గానూ 2.39 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. దీంతో ఖరీఫ్లో 2 లక్షల ఎకరాలకు నీరందడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వర్షాలు, ఎగువ నుంచి వచ్చే వరదతోనే ప్రాజెక్టులు, చెరువులు నిండే అవకాశం ఉంది. ఎస్సారెస్పీలో 15.9 టీఎంసీలే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 9.76 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.9 టీఎంసీల నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో దీని కింద 9.68 లక్షల ఆయకట్టు అంతా వర్షాలు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. గత రబీలో ఈ ప్రాజెక్టు కింద 4.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు 40 టీఎంసీ మేర నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటుందా అనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా ఈ సీజన్లో గోదా వరి ప్రాజెక్టుల్లోకి 32 టీఎంసీలు మాత్రమే కొత్త నీరువచ్చి ఆయకట్టును కలవరపరుస్తోంది. గోదావరి బేసిన్లో 20,121 చెరువులు ఉండగా 8,400 చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. 5,500 చెరువుల్లో 50 శాతం కన్నా తక్కువ నీటి లభ్యత ఉంది. -
తెలంగాణకు 30, ఏపీకి 25 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాల అవసరాలకు కేటాయిస్తూ కృష్ణాబోర్డు కీలక నిర్ణయం చేసింది. శ్రీశైలంలోకి వస్తున్న వరద దృష్ట్యా, తమ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న తెలంగాణ, ఏపీల అభ్యర్థన మేరకు తెలంగాణకు 30 టీఎంసీలు, ఏపీకి 25 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణకు శ్రీశైలం నుంచి కల్వకుర్తి ద్వారా 10 టీఎంసీలు, సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలు, మిషన్ భగీరథ అవసరాలకు 2 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వలకు 12 టీఎంసీలు కేటాయించగా, ఏపీకి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 9 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీలు, సాగర్ కింద కుడి కాల్వకు 7.5, ఎడమ కాల్వకు 3.5 టీఎంసీలు కేటాయించింది. ఇరురాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా ఆగస్టు వరకు మొత్తంగా 55 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ నిండటం, అక్కడి నుంచి దిగువ శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీశైలంలోకి ఈ వాటర్ ఇయర్లో కొత్తగా 120 టీఎంసీల నీరొచ్చి చేరింది. ఆగస్టు వరకు 25 టీఎంసీలు కావాలని ఏపీ, 30 టీఎంసీలు కావాలని తెలంగాణ ఇండెంట్లు సమర్పించాయి. ప్రస్తుతం శ్రీశైలంలో కనీస నీటిమట్టం 834 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 82.74 టీఎంసీలు ఉండగా, సాగర్లో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన 1.87 టీఎంసీల లభ్యత ఉంది. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాలకు అడిగిన మేర నీటిని పంచుతూ కృష్ణాబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్ ఎడమ కాల్వలకు నీటి సరఫరాకు వీలుగా ప్రాజెక్టులో 520 అడుగులు నిర్వహించాల్సి ఉందని, అందుకు వీలుగా శ్రీశైలం నుంచి ఆవిరి, సరఫరా నష్టాలను కలుపుకొని 52 టీఎంసీలు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది. విద్యుదుత్పత్తి చెరిసగం.. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 22 వరకు రోజుకు 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి సాగర్కు పవర్హౌజ్ల ద్వారా విడుదల చేయాలని సూచించింది. విద్యుదుత్పత్తిని చెరిసగం పంచుకోవాలని పేర్కొం ది. సాగర్ ఎడమ కాల్వల కింద నీరు చివరి వరకు చేరుకునేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి డేటాను ఇరు రాష్ట్రాలు ఆమోదించి బోర్డుకు పంపాలని తెలిపింది. 2015లో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ నీటి విడుదలలో బోర్డు ఆదేశాలు పాటించాలని సూచించింది. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్/గద్వాల: ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జల సవ్వడి మొదలైంది. ఎగువ కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ నిండటంతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. నారాయణపూర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో జూరాలకు 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. శ్రీశైలానికీ ప్రవాహాలు క్రమం గా పెరుగుతున్నాయి. ఎగువ నుంచి వరద మరిం త పెరగనుండటంతో శుక్రవారం ఉదయానికి ప్రవాహాలు జోరందుకోనున్నాయి. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్లను వరద ముంచెత్తుతోంది. ఆల్మట్టిలోకి గురువారం ఉదయం 1.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. రాత్రికి మరిం త పెరిగి ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 1.53 లక్షల క్యూసెక్కుల దాకా దిగువకు వదులుతున్నారు. దాంతో జూరాలకు గురువారం ఉదయం 27వేల క్యూసెక్కులున్న వరద సాయంత్రానికి 90 వేల క్యూసెక్కులకు, రాత్రికల్లా 1.2 లక్షలకు పెరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ కూడా 9.66 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.84 టీఎంసీలకు చేరుకుంది. దాంతో మొత్తంగా లక్ష క్యూసెక్కులను దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం సైతం నిండటంతో 68 వేల క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేశారు. దీంతో నేడో రేపో శ్రీశైలానికి భారీగా వరద చేరుకునే అవకాశం ఉంది.శ్రీశైలం డ్యామ్లో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 29.13 టీఎంసీల నిల్వలున్నాయి. గురువారం ఎగువ జూరాల జల విద్యుత్క్రేందంలో 6 యూనిట్లు ప్రారంభించి 240 మెగావాట్లు, లోయర్ జూరాలలో 4 యూనిట్లు ప్రారంభించి 160 మెగావాట్లు ఉత్పత్తి చేశారు. జూరాలకు భారీ వరద వస్తుండటంతో ప్రభుత్వం ఆదేశం మేరకు దాని పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెరువులకు నీరు విడుదల చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకూ 73,898 క్యూసెక్కుల వరద వస్తోంది. 68,643 క్యూసె క్కులు దిగువకు వదులుతున్నారు. దాంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
ఉధృతంగా ప్రాణహిత!
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలోనూ గడిచిన మూడు రోజులుగా స్థిరంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. దీంతో గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం ప్రాంతంలో వరద శనివారం ఏకంగా 84,900 క్యూసెక్కులకు చేరింది. మహారాష్ట్రలోని గడ్చిరోలీతోపాటు ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. గోదావరి ప్రాజెక్టులకు ఊపిరి: గోదావరి ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సారెస్పీలోకి శనివారం 6,160 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 11.50 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి 5.33 టీఎంసీల కొత్త నీరు చేరింది. కడెం ప్రాజెక్టులోకి 8,742 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో అక్కడ వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 5.53 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలోకి 1,068 క్యూసెక్కుల నీరు వస్తుండగా నిల్వలు 20 టీఎంసీలకు గానూ 6.07 టీఎంసీలకు చేరాయి. కృష్ణా బేసిన్లోని ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 32 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. తుంగభద్రకు 6 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అక్కడా నిల్వలు 41 టీఎంసీలకు చేరుకున్నాయి. ప్రాజెక్టుల పనులకు ఆటంకం ప్రస్తుత వాటర్ ఇయర్ మొదలయ్యాక జూన్ రెండో వారంలో ప్రాణహితలో భారీ ప్రవాహాలు నమోదయ్యాయి. అప్పటి నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నా.. 15 వేల క్యూసెక్కుల నుంచి 25 వేల క్యూసెక్కుల మధ్యే వరద ఉధృతి ఉంటోంది. అయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో తాజాగా కురుస్తున్న వర్షాలతో ప్రవాహం మరింత పెరిగింది. ఈ వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడుతోంది. ఇక్కడ శనివారం కేవలం 1,150 క్యూసెక్కుల మట్టి పని మాత్రమే జరిగింది. మొత్తంగా 85 గేట్లు ఉండగా 25 గేట్ల పనులను పూర్తిగా నిలిపివేశారు. మేడిగడ్డ పంప్ హౌజ్ పనులు కొనసాగుతున్నా, గ్రావిటీ కెనాల్ పరిధిలో మట్టి పని పూర్తిగా నిలిచిపోయింది. కాంక్రీట్ పని కేవలం 300 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. -
కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఇళ్లపై శుక్రవారం ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, కరీంనగర్ సహా ఏడుచోట్ల సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో సురేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను గుర్తించామని అన్నారు. కరీంనగర్లో విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవనం, హైదరాబాద్లో మూడు అసార్ట్మెంట్లు, 10 ఇళ్ల స్థలాలు గుర్తించినట్లు వెల్లడించారు. -
ప్రాజెక్టులు, చెరువుల అనుసంధానం
-
చెరువులతో ప్రాజెక్టుల చెలిమి!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, మరోవైపు చిన్న నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రణాళికకు పురుడు పోసింది. మిషన్ కాకతీయలో గుర్తించిన ప్రతి చెరువునూ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింది కాల్వలతో అనుసంధానం చేసి బీడు భూముల న్నింటికీ నీరు పారించే కార్యాచరణను రూపొందిం చింది. వచ్చే ఏడాది ఖరీఫ్కు ముందే వీలైనన్ని ఎక్కువ చెరువులను ఈ విధానం ద్వారా నింపాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన 7,500 గొలుసుకట్టు చెరువులను నింపి మిగతా వాటికి గల అవకాశాలను ‘టోపోషీట్’ల ద్వారా అధ్యయనం చేయనుంది. గరిష్ట వినియోగం.. గరిష్ట ఆయకట్టు నిజానికి చిన్న నీటివనరుల కింద భారీ నీటి కేటాయింపులు ఉన్నాయి. గోదావరి బేసిన్లో 165 టీఎంసీలు, కృష్ణాలో 89 టీఎంసీలు కలిపి మొత్తంగా 254 టీఎంసీల కేటాయింపులున్నా వినియోగం మాత్రం 100 నుంచి 130 టీఎంసీలకు మించడం లేదు. వీటి కింద 24.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా మిషన్ కాకతీయకు ముందువరకు 10 లక్షల ఎకరాల్లోపే సాగు జరిగేది. కాకతీయ ఆ తర్వాత అది 15 లక్షలకు చేరినా మరో 10 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. ఈ దృష్ట్యా మరింతగా నీటిని వినియోగించుకోవడంతో పాటు గరిష్ట ఆయకట్టుకి నీరు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే మిషన్ కాకతీయ కింద 44,928 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడతల్లో కలిపి 29 వేల చెరువుల పునరుద్ధరణకు అనుమతులొచ్చాయి. ఇందులో 20 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ డిసెంబర్ నాటికే మిగతా చెరువుల పనులు పూర్తి చేయనున్నారు. మిగిలిన వాటిని ఐదో విడతలో చేపట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. ఖరీఫ్ను త్వరగా మొదలుపెట్టొచ్చని.. పునరుద్ధరించిన చెరువులను నిత్యం నీటితో నింపడంపై దృష్టి సారించిన సర్కారు.. భారీ, మధ్యతరహా, ఎత్తిపోతల పథకాలతో వాటిని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖను ఇటీవల సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వలు పారుతున్న ప్రాంతాలను టోఫోషీట్లపై మొదట గుర్తించాలని.. తర్వాత వాటికి దగ్గరలోని చెరువులను మార్కింగ్ చేసి కాల్వల ద్వారా నింపే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. మొత్తం ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు ద్వారా వాటిని నింపే అవకాశం ఉందో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. చెరువుల్లో నీటి లభ్యత పెరిగితే జూన్లో వర్షాలకు ముందే చెరువు నీటితో నార్లు పూర్తవుతాయని, వర్షాలు కురిసే సమయానికి నాట్లకు వీలవుతుందని, తద్వారా ఖరీఫ్ను త్వరగా చేపట్టొచ్చని సీఎం భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 7,500 గొలుసుకట్టు చెరువులను గుర్తించామని, మిగతా వాటిని గొలుసుకట్టుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని నీటి పారుదల శాఖ వెల్లడించింది. కరువును జయించవచ్చు: హరీశ్ రాష్ట్రంలోని చెరువులను, కుంటలను నీటితో నింపితే కరువు పరిస్థితులను పారదోలవచ్చని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘చెరువుల్లో నీరు ఉండే ప్రాంతాల్లో సైక్లింగ్ విధానం వల్ల తిరిగి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు నీటితో నిండితే కరువును జయించడమే కాకుండా అకాల వర్షాలు, వడగండ్ల వానలను నివారించవచ్చు. పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. భూగర్భజలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్య తగ్గుతుంది. రాష్ట్రానికి పూర్థి స్థాయిలో నీటి భద్రత లభిస్తుంది’ అని హరీశ్రావు వివరించారు. -
ఎక్కడికక్కడ కట్టడి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బేసిన్లోని ఉప నదుల్లో లభ్యత నీటిని ఎక్కడికక్కడ కట్టడి చేసేలా చెక్డ్యామ్లు, ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. తద్వారా కృష్ణానది పునరుజ్జీవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాలేరు, మూసీపై 19 చెక్డ్యామ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మిగతా ఉప నదులపై చెక్డ్యామ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది. మహారాష్ట్ర మాదిరే.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీల మేర కేటాయింపులు ఉన్నాయి. అయితే ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలు లేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. ఇక ముఖ్యంగా కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్డ్యామ్ల నిర్మాణం చేయగా, కర్ణాటక ఎడాపెడా ఎత్తిపోతల పథకాలను చేపట్టి నీటిని వాడేస్తోంది. దీంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినా కేవలం 568 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ఇందులోనూ ఏపీ తన వాటా కింద 379 టీఎంసీల నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 189 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంది. ఇక రాష్ట్ర వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో 89 టీఎంసీల మేర చిన్ననీటి వనరుల కింద కేటాయింపులున్నాయి. ఇవన్నీ కృష్ణాసబ్ బేసిన్లోని చిన్న చిన్న ఉపనదులు, వాగుల నుంచి లభ్యమవుతున్న నీరే. అయితే ఈ నీటిని ఒడిసి పట్టుకోకపోవడంతో కేవలం 35 నుంచి 40 టీఎంసీల వినియోగం మాత్రమే ఉంటోంది. ఎక్కడికక్కడే చెక్డ్యామ్ల నిర్మాణం చిన్నచిన్న వాగుల పరిధిలో ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలోని ఆకేరు వాగుపై 8 చెక్డ్యామ్ల నిర్మాణం పూర్తి చేసింది. కొత్తగా ఇటీవలే సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మూసీనది, పాలేరు వాగుపై 19 చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సుమారు రూ.120.51 కోట్లతో పాలనా అనుమతులనిచ్చింది. కోదాడ పరిధిలోనూ పాలేరుపై మరో 5 చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, ఖమ్మం జిల్లా నుంచి సైతం ఇదే పాలేరుపై మరో 5 చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇక దీంతో పాటే మహబూబ్నగర్లోని ఆర్డీఎస్ పరిధిలోని పెద్దవాగుపై మునుపోడ్ మండలంలో మరో చెక్డ్యామ్ నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాగర్ కింద రెండు ఎత్తిపోతలు.. ఇక గరిష్ట ఆయకట్టుకు కృష్ణా నీటి మళ్లింపు లక్ష్యంగా నాగార్జున సాగర్ టెయిల్పాండ్లో కొత్తగా హాలియా ఎత్తిపోతలను రూ.191 కోట్లతో చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది.1.32 టీఎంసీల నీటిని తీసుకుని 12,400 ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రూపొందించారు. ఇదే టెయిల్పాండ్ కింద తుంగపాడు బంధం వద్ద 0.95 టీఎంసీల సామర్థ్యంతో 8 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.191 కోట్లతో మరో ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టనున్నారు. వీటికీ ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టనున్నారు. వచ్చే నెల రెండో వారానికల్లా అధికారిక అనుమతులు పూర్తి చేసి, జూలై నాటికి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ఇరు రాష్ట్రాల మధ్య టెలిమెట్రీ టెన్షన్ !
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి ప్రవాహ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఉద్దేశించిన టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. జూన్తో కొత్త వాటర్ఇయర్కు గడువు దగ్గరపడుతున్నా ఇంతవరకు టెలిమెట్రీల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. తొలి దశ టెలిమెట్రీ ఏర్పాటు ప్రాంతాలపై కొంత స్పష్టత వచ్చినా, రెండో దశపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండోదశకు గతేడాది 29 ప్రాంతాలతో జాబితాను రూపొందించారు. ఇందులో 14 పాయింట్లపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. మిగిలిన 15 పాయింట్లపై ఏపీ అభ్యంతరాలు తెలపగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. వర్షాలకు ముందు ఏర్పాటు చేసేనా?: శ్రీశైలం కుడి కాల్వల కింద బనకచర్ల పరిధిలో మూడుచోట్ల టెలిమెట్రీల అవసరం లేదని గతంలో బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. బేసిన్ పరిధిలో ఏపీ చేపట్టిన గురు రాఘవేంద్ర ఆఫ్టేక్, గాలేరు–నగరి, వైకుంఠపురం పం పింగ్ స్టేషన్ ఆఫ్టేక్ ఎత్తిపోతల పరిధిలో 100 క్యూసెక్కు లకు మించి నీటి వినియోగమున్నందునా అక్కడా టెలిమెట్రీల ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై ఏపీ వైఖరి స్పష్టం చేయలేదు. మరో 21 పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మొత్తం 36 టెలిమెట్రీలను జూన్ వర్షాలకు ముందే ఏర్పాటు చేయాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసినా అది ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. -
కృష్ణాలో 45 టీఎంసీల వాటా పెంచండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటివాటాను ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల మంత్రి టి.హరీశ్రావు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తెలంగాణకు ఉన్న నీటివాటా 299 టీఎంసీలకు అదనంగా పట్టిసీమతో దక్కే 45 టీఎంసీల నీటివాటాను కలిపి 2018–19 వాటర్ ఇయర్ నుంచి నీటి కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు హరీశ్ శుక్రవారం గడ్కరీకి లేఖ రాశారు. ‘1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పైరాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువరాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డులో ఉంది. ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది. పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45టీఎంసీల వాటా ఇవ్వాలి’అని లేఖలో పేర్కొన్నారు. పట్టిసీమతో దక్కే వాటాలపై కేంద్రానికి ఇదివరకే అనేక లేఖలు రాశామని, అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై తేల్చేందుకు ఏకే బజాజ్ కమిటీని నియమించినా ఆ కమిటీ ఏమీ తేల్చలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకొని 45 టీఎంసీల నీటిని కేటాయించి తెలంగాణ వాటాను పెంచాలని కోరారు. -
దశలవారీగా బోర్డు అధీనంలోకి ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా బోర్డుకే కట్టబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర జల వనరుల శాఖ తాజాగా మరో కీలక సూచన చేసినట్లుగా తెలిసింది. ప్రాజెక్టులన్నింటినీ ఒకేమారు నియంత్రణలోకి తెచ్చుకోవడం కాకుండా, దశల వారీగా తెచ్చుకోవాలని కృష్ణాబోర్డుకు సూచించినట్లుగా తెలిసింది. ఈ సూచనల మేరకు తొలివిడతగా 6 ప్రాజెక్టులను తన అధీనంలోకి తీసుకునేలా బోర్డు కసరత్తులు ఆరంభించింది. కృష్ణాబేసిన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్వహణను తమకు అప్పగించాలని తొలి నుంచీ బోర్డు పట్టుబడుతోంది. దీనికి అంగీకరించిన కేంద్రం, విడతల వారీగా ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్రం సూచించిన వాటిలో జూరాల ప్రాజెక్టు, సుంకేశుల బ్యారేజీ, ఆర్డీఎస్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ టెయిల్పాండ్లు ఉన్నాయి. శ్రీశైలం పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి, కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతోపాటు సాగర్ కింది కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్లు, ఏఎంఆర్పీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మాత్రం తొలి విడతలో చేర్చలేదు. ప్రాజెక్టుల నియంత్రణకు అవసరమయ్యే సిబ్బందిపై స్పష్టత రాగా, బోర్డు నిర్వహణకు 328 మంది సిబ్బంది అవసరం ఉంటుందని తేల్చింది. తొలివిడతలో బోర్డు అధీనంలోకి తెచ్చే అంశంపై ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చాక, బోర్డుకు సర్వాధికారాలు కట్టబెట్టే అంశంపై స్పష్టత రానుంది. -
ప్రాజెక్టులపై పెత్తనం బోర్డుకే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా బోర్డుకే కట్టబెట్టేలా కేంద్ర జల వనరుల శాఖ మంత్రాంగం నడుపు తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా కృష్ణా బోర్డు రూపొందించిన తుది వర్కింగ్ మ్యాన్యువల్ను ఆమోదించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నివారణకు ఇది ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ జాయింట్ సెక్రెటరీ సంజయ్ కుందూతో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో భేటీ అయిన బోర్డు చైర్మన్ వైకే శర్మ బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్పై చర్చించారు. బోర్డుకు ఎలాంటి అధికారాలివ్వకుండా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించమంటే సాధ్యమయ్యేది కాదని శర్మ స్పష్టం చేసినట్లు తెలిసింది. తమ నిర్ణయాన్ని ఇరు రాష్ట్రాలకు తెలియజేసి, వారి వివరణలు తెలుసుకున్నాకే, బోర్డుకు సర్వాధికారాలు అప్పజెప్పే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సంజయ్ తెలిపినట్లు సమాచారం. బోర్డుకే అధికారాలిస్తే అవసరమయ్యే సిబ్బంది, నిర్వహణ వ్యయం, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మార్గదర్శకాలివీ.. ♦ బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల విషయం లో ఏ పనులు చేయాలన్నా అనుమతి తప్పనిసరి. వాటి అంచనాలను బోర్డుకు అందించాల్సి ఉంటుంది. ♦ కృష్ణా బేసిన్లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చు. ♦ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. బ్రిజేశ్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకూ కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉంటుంది. ♦ తెలంగాణ, ఏపీ పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేయాలి. ♦ మార్గదర్శకాలపై ఏపీ కొంత సానుకూలంగా ఉన్నా, తెలంగాణ వ్యతిరేకి స్తోంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుం డా నియంత్రణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. -
45 టీఎంసీల కోటా పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను వచ్చే జూన్ వాటర్ ఇయర్ నుంచి అమలు చేయాలని పట్టుబట్టేందుకు తెలంగాణ సిద్ధమైంది. వాటాల విషయమై ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డులు చేతులెత్తేయడం, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యేవరకు పాత విధానమే అమల్లో ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపిన నేపథ్యంలో దీనిపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. బచావత్ అవార్డు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. అయితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే బచావత్ అవార్డులో పేర్కొ న్న మేరకు, పోలవరానికి అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాల ని తెలంగాణ అంటోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉండటంతో కర్ణాటక తన వాటా మేరకు 21 టీఎంసీల వినియోగం మొదలుపెట్టింది. అయితే తెలంగాణకు దక్కే వాటాల అంశం మాత్రం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను పేర్కొంటూ ఈ వాటర్ ఇయర్లో తెలంగాణకు 45 టీఎంసీల మేర కోటా పెంచాలని పట్టుబట్టనుంది. ఇవే అంశాలతో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. వాటర్ ఇయర్ ఆరంభానికి కేవలం 40 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందు నుంచే ఈ అంశంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. -
న్యాయమైన వాటా సాధించుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకుంటామని మంత్రి హరీశ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉందని, ఆ లెక్కన రాష్ట్రానికి అధిక నీటి వాటా దక్కాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో నదీ జలాల పంపకాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్లో జరుగుతున్న విచారణకు మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని హరీశ్రావు చెప్పారు. నది పరీవాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు నీటి కేటాయింపులు పెంచాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని, కోర్టు కేంద్రం నుంచి స్పందన కోరిందని తెలిపారు. కానీ కేంద్రం ఇంతవరకు స్పందించలేదని.. ఇప్పటికైనా స్పందించి సుప్రీంకోర్టుకుగానీ, ట్రిబ్యునల్కుగానీ అభిప్రాయం తెలపాలని విజ్ఞప్తి చేశారు. విచారణ వేగంగా జరగాలి.. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్రావు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని హరీశ్రావు పేర్కొన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ వేగవంతంగా జరగాల్సి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. నీటి తుది కేటాయింపులు జరిగితే.. తెలంగాణకు తాత్కాలిక సర్దుబాటు కింద ఉన్న 299 టీఎంసీల వాటా కంటే అధికంగా జలాలు వస్తాయని తెలిపారు. అందువల్ల విచారణను వేగిరం చేసేలా ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేయాలని న్యాయవాదులకు సూచించామన్నారు. విచారణ మార్చి 26కు వాయిదా.. నీటి పంపకాలకు సంబంధించి విచారణను బ్రిజేశ్ ట్రిబ్యునల్ వచ్చే నెల 26, 27, 28 తేదీలకు వాయిదా వేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా వ్యవసాయ రంగంపై ఏపీ తరఫున సాక్షి అయిన వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణను తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తెలంగాణ కోరుతున్న అదనపు నీటి కేటాయింపుల్లో కొత్తగా వరిసాగుపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదన్నది తెలుసని, ఏపీలోని కృష్ణా బేసిన్లో వరి అధికంగా సాగవుతోందని, తెలంగాణలో మెట్ట పంటలు సాగవుతున్నాయన్న విషయాలను సత్యనారాయణ అంగీకరించారు. నీరు ఇంకిపోవడమన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుందని.. ఏపీలోని పరీవాహక ప్రాంతంలో నీరు ఇంకడం 2 ఎంఎంగా, తెలంగాణలో భిన్నరకాల నేలల వల్ల 5 ఎంఎంగా ఉందని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి తాను ఎలాంటి అధ్యయనం చేయలేదని, సాగు అవసరాలకు సంబంధించి నీరు ఇంకిపోయే నష్టాలను ఐక్యరాజ్యసమితి ఎఫ్ఏవో మ్యాన్యువల్ నుంచి తీసుకున్నానని ఆయన వెల్లడించారు. -
జల జగడంపై ఏమీ తేల్చలేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. ఇరు రాష్ట్రాల పరిధిలోని వివాదాస్పద అంశాలపై అవగాహన తెచ్చుకునేందుకే కేంద్రం పరిమితమైంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తామంటూ కేంద్రం సూచన చేసినా దానిపై సఖ్యత కుదరకపోవడంతో నిర్ణయమేదీ తీసుకోలేదు. వీటిపై ఈ నెల 20న దక్షిణాది రాష్ట్రాల సాగునీటి మంత్రుల భేటీలో చర్చించాక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. వాటా తేల్చాకే బోర్డుల పరిధి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగిన ఈ కీలక భేటీలో రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, ఎస్ఈ కోటేశ్వరరావు, ఏపీ నుంచి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలో తేవాలని కేంద్రం, బోర్డు, ఏపీ ప్రతిపాదించాయి. దీనిపై సీఎస్ జోషి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నీటి విషయంలో తెలంగాణ 70 ఏళ్లుగా అన్యాయానికి గురవుతోంది. రాష్ట్రంగా అవతరించాక నాలుగేళ్లుగా కూడా అదే అన్యాయం కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో 37.19 లక్షల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమి ఉన్నా 6.39 లక్షల హెక్టార్లకు మించి సాగు చేసుకోలేకపోతున్నాం’’అని పేర్కొన్నారు. ‘‘పరీవాహకం, ఆయకట్టు, అవసరాల ప్రకారం చూస్తే 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీలు దక్కాలి. ఏపీకి 140 టీఎంసీలకు మించి కేటాయింపు అవసరం లేదు. ఈ దృష్ట్యా ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేదాకా తాత్కాలికంగా తెలంగాణకు 575 టీఎంసీలివ్వండి’’అని కోరారు. బచావత్ అవార్డు ప్రకారం సైతం పోలవరం, పట్టిసీమల ప్రాజెక్టుల కింద తెలంగాణకు 90 టీఎంసీలు కేటాయించాలన్నారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా ఏమీ తేల్చలేదన్నారు. తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వకుండా, పోలవరం వాటాలపై తేల్చకుండా, ప్రాజెక్టులవారీ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులు తలపెట్టింది ఏపీనే భేటీలో ఏపీ మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించింది. అది కొత్త ప్రాజెక్టేనని, దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని వాదించగా తెలంగాణ తిప్పికొట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల, తమ్మిడిహెట్టి రెండూ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, వీటిపై 2008లో ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 238 ప్రకారమే నడుచుకుంటున్నామంది. కాళేశ్వరం పాతదేనని కేంద్ర జల సంఘమూ తేల్చిందని గుర్తు చేసింది. నిజానికి ఏపీయే కొత్తగా వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు చేపట్టిందని పేర్కొంది. పోలవరం ముంపు, ఆర్డీఎస్ వాటాపై గరంగరం పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచల సీతారామాలయంసహా పలు గ్రామాలు, గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముంపునకు గురయ్యే ప్రమాదముందని కేంద్రం దృష్టికి జోషి తీసుకెళ్లారు. ముంపు సమస్యలపై అధ్యయనం చేయాల్సిందిగా పోలవరం అథారిటీని ఆదేశించాలన్నారు. తుంగభద్ర జలాల అంశాన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని కోరారు. కృష్ణా పరిధిలో టెలిమెట్రీ విధానం తెచ్చినా ఇంకా అమల్లోకి రాలేదన్నారు. దీంతో పోతిరెడ్డిపాడు కింద ఏపీ ఇష్టానికి వాడుకుంటోందన్నారు. -
‘మైనర్ ఇరిగేషన్’పై రంగంలోకి ఎన్ఆర్ఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలో మైనర్ ఇరిగేషన్ కింద తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రంగంలోకి దిగనుంది. ఈ నెల 30న కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులతో మొదటి సమావేశం నిర్వహించ నుంది. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని ఏ ప్రాతిపదికన లెక్కించాలన్న దానిపై సూచనలు తీసుకోనుంది. ఈ మేరకు ఎన్ఆర్ఎస్సీతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం అందించింది. గోదావరి ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది. -
జాగ్రత్తగా వాడుకోండి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి నిల్వలపై తెలుగు రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అప్రమత్తం చేసింది. సాగు, తాగు అవసరాలకు తగ్గట్టుగా ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవడంతో నిల్వలు పడిపోతున్నాయని హెచ్చరించింది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో కలిపి 133.75 టీఎంసీల నీరే ఉండటం.. రబీ అవసరాలు, ఆగస్టు వరకు ఈ నీరే వినియోగించుకోవా ల్సిన నేపథ్యంలో ప్రణాళికతో ముందుకెళ్లాల ని రెండు రాష్ట్రాలకు మంగళవారం లేఖలు రాసింది. ప్రస్తుతం ఉన్న 133.75 టీఎంసీల్లో వాటాల ప్రకారం తెలంగాణకు 60.33 టీఎంసీలు, ఏపీకి 73.42 టీఎంసీలు దక్కనున్నాయి. కానీ ఇరు రాష్ట్రాల అవసరాలు 170 టీఎంసీలకు పైనే ఉండటంతో నీటినెలా సర్దుకుంటారన్నది ప్రధాన అంశం. సాగర్ ఎడమ, కుడి కాల్వల కింది రబీ అవసరాలతో పాటు కృష్ణా డెల్టా, కల్వకుర్తి కింది అవసరాలకు మే 31 వరకూ ఈ నీరే వాడుకోవాలి. అలాగే ఆగస్టు చివరి వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కూ వినియోగించుకోవాలి. మరోవైపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ బుధవారం భేటీ కానుంది. జలసౌధలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరవనున్నట్లు బోర్డుకు సమాచారమిచ్చారు. రెండు రాష్ట్రాలకు జూన్ వరకు దక్కే వాటాలు, లభ్యత జలాలు, అవసరాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. -
రెండు రాష్ట్రాలవీ ఉల్లంఘనలే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్లలో లభ్యతగా ఉన్న జలాల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించాయని కేంద్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చేసిన కేటాయింపులకు భిన్నంగా రెండు రాష్ట్రాలూ అదనపు నీటిని వినియోగించాయని స్పష్టం చేసింది. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా ఇరు రాష్ట్రాలు బోర్డు ఆదేశాలను పాటించాలని సూచించింది. ఈ మేరకు గతంలో కృష్ణా బోర్డు వైఖరిని నిరసిస్తూ, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు రాసిన లేఖపై కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ స్పందించారు. హరీశ్రావు లేవనెత్తిన ఒక్కో అంశంపై వివరణ ఇస్తూ లేఖ రాశారు. బోర్డును సమర్థించిన కేంద్ర మంత్రి.. ఈ ఏడాది అక్టోబర్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై మంత్రి హరీశ్రావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బోర్డు సమర్థంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు నీటి విడుదల విషయంలో బోర్డు విఫలమైందని, దీనివల్ల ఓ పక్క సాగర్ ఆయకట్టుకు నీరందకపోగా... పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అధికంగా నీటిని తీసుకుందని హరీశ్రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు తీసుకుంటే దాన్ని బోర్డు ఉల్లంఘనగా పరిగణించడం సబబు కాదని వివరించారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ గణాంకాలను తారుమారు చేశారని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్ విన్నవించారు. కాగా, ఈ అంశాలన్నిటిపై కేంద్ర మంత్రి తన లేఖలో వివరణ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగంపై త్రిసభ్య కమిటీ చేసిన కేటాయింపులను ఉల్లంఘించి ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా, తెలంగాణ సాగర్ ఎడమ కాల్వ ద్వారా అధిక వినియోగం చేశాయని తెలిపారు. ఇక తాగు, సాగు అవసరాలకు నీటిని వాడుకున్నాకే విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోవాలని కమిటీ స్పష్టంగా చెప్పినా, దాన్ని ధిక్కరించి పవర్ గ్రిడ్ అవసరాలకు నీటిని తీసుకోవడం ఏమాత్రం సబబు కాదన్నారు. దీన్ని ఉల్లంఘన కిందే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఏజెన్సీలు నిర్ణీత కాలంలో వాటిని అమర్చే ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా వాటిని వినియోగంలోకి తీసుకురాలేకపోయారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. హడావుడిగా వాటిని అమలు చేయలేమని, ఆ పరికరాలకు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. పోతిరెడ్డిపాడు కింద టెలిమెట్రీ వివరాలను ట్యాంపరింగ్ చేశారనడం సైతం అసంబద్ధ విమర్శలని పేర్కొన్నారు. సాగర్కు సరైన సమయంలో నీటిని విడుదల చేయలేదన్న తెలంగాణ ఫిర్యాదుపై స్పందిస్తూ, చెన్నైకి తాగునీటి సరఫరా, శ్రీశైలం కుడిగట్టు కాలువ అవసరాలకు నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు కొనసాగించాల్సి ఉంటుందని, ఈ దృష్ట్యానే సాగర్కు నీటిని విడుదల చేయలేదని తన లేఖలో వివరించారు. ఇలా అన్ని అంశాల్లో బోర్డు తీరును సమర్థిస్తూనే కేంద్రం, రాష్ట్ర ఫిర్యాదుపై వివరణ ఇచ్చింది. వర్కింగ్ మాన్యువల్పై 10 లోగా అభిప్రాయాలు చెప్పండి కాగా బోర్డు నిర్వహణపై రూపొందించిన వర్కింగ్ మాన్యువల్ ఖరారుకు తెలుగు రాష్ట్రా లు అభిప్రాయాలను వచ్చే జనవరి 10లోగా తెలపాలని కృష్ణాబోర్డు కోరింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సూచనల మేరకు మార్పులు చేశామని, తుది అభిప్రాయం చెబి తే దాన్ని ఖరారు చేస్తామని వెల్లడించింది. -
‘తాగునీటి’ సరఫరాలో వినియోగమెంత?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో మరో కొత్త అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి తాగునీటికి వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకొని నీటి వినియోగాన్ని లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదన లేవనెత్తింది. కృష్ణా జలాల వినియోగంపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పులో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొందని, గృహ అవసరాలకు వాడే నీటి వినియోగంలో 20 శాతాన్నే వినియోగం కింద లెక్కించాలని తెలిపిందన్న వాదన వినిపిస్తోంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. నిజానికి ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటికి 15 టీఎంసీల మేర నీటిని కేటాయిస్తే, ఇందులో 4 నుంచి 6 టీఎంసీల మేర మాత్రమే వాస్తవ వినియోగముంటోంది. మిగతా నీరంతా డ్రైనేజీ రూపంలో తిరిగి మానేరు, మూసీ వంటి కృష్ణా ఉప నదుల్లోనే చేరుతోంది. దీంతో హైదరాబాద్, నల్లగొండ, మిషన్ భగీరథ కింద విడుదల చేసిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే తెలంగాణ నీటి వినియోగ ఖాతాలో వేయాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కృష్ణాబోర్డు శుక్రవారం బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఆనంద కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లెక్కతేలని నీటి వినియోగంపైనా కమిటీ.. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు విడుదల చేసిన నీటిలో 44 టీఎంసీల మేర లెక్కలోకి రాని నీటి అంశాన్ని తేల్చందుకు సైతం ఆనంద కుమార్ నేతృత్వంలో మరో కమిటీని బోర్డు ఏర్పాటు చేసింది. ఇప్పటికే లెక్కలో తేలకుండా ఉన్న 44 టీఎంసీల నీటిలో 20 టీఎంసీల నీటిని ఏపీ వినియోగం కింద లెక్కించాలని తెలంగాణ విన్నవించింది. శ్రీశైలం నుంచి విడుదల చేసినట్లు చూపిన నీటిలో 44 టీఎంసీలు ఎక్కడ వినియోగించారన్నది అయోమయంగా మారిందని, అయితే ఈ స్థాయిలో నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు మినహా మరే ఇతర మార్గం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. -
కృష్ణా జలాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయమై ఈ నెల 12 నుంచి జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు తిరిగి విచారణ మొదలు కానుంది. గురు, శుక్రవారాల్లో రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సమర్పించిన అఫిడవిట్పై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనేందుకు బుధవారం రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత ట్రిబ్యునల్పై ఉందని.. కృష్ణా జలాల్లో తమ కేటాయింపుల (299 టీఎంసీల)కు అదనంగా మరో 200 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ పేర్కొంది. రాష్ట్ర పరీవాహకం, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు పెంచాలని విన్నవించింది. అయితే తన అవసరాలపై అఫిడవిట్ సమర్పించిన ఏపీ, తమ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని పేర్కొంది. 1976లో బచావత్ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను పంచగా, ఇందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయని, మూడేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోందని తెలిపింది. ఆయకట్టు, ప్రాజెక్టుల కింది నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు లేవని, నీటి వాటాల్లో మార్పులు చేస్తే ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, 150 ఏళ్లుగా ఉన్న నదీ వ్యవస్థను మార్చే పనులు చేయరాదని కోరింది. ఇదే సమయంలో తెలంగాణ గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు 214.14 టీఎంసీలను తరలిస్తోందని, ఇందులో ఏపీ వాటా ఏమిటో తేల్చాలని విన్నవించింది. ఏపీ సమర్పించిన అఫిడవిట్ అంశాలపై గురువారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగనుంది. -
‘కృష్ణా’ వర్కింగ్ మాన్యువల్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నీటి నిర్వహణ, నియంత్రణ అంశాలకు సంబంధించి బోర్డు తయారు చేసి పంపిన వర్కింగ్ మాన్యువల్ చెల్లదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రిబ్యునళ్లు ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులను చేయనంత వరకు వర్కింగ్ మాన్యువల్ ఆచరణీయం, ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. బోర్డు పంపిన తుది వర్కింగ్ మాన్యువల్పై ఈ మేరకు బుధవారం రాష్ట్రం తన అభ్యంతరాలను తెలియజేసింది. బోర్డు తన మాన్యువల్లో, గతంలో వెలువడిన ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా 512:299 నిష్పత్తిన నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేయగా, ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నీటి వాటాల అంశాన్ని బోర్డు నిర్ణయిస్తుంది. కానీ 1956 అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం కృష్ణా జలాల వాటాలకు సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య ఎలాంటి అవార్డులు లేవు. అదీగాక కృష్ణా జలాల నీటి వాటాలు, కేటాయింపులకు సంబంధించిన అంశం అటు కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2( కేడబ్ల్యూడీటీ–2), ఇటు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కనుక ఈ అంశాన్ని న్యాయ పరిధిలో ఉన్న అంశంగానే పరిగణించాలి’అని రాష్ట్రం స్పష్టం చేసింది. ఇక విభజన చట్టంలోని సెక్షన్ 88లో కేవలం బోర్డు సమావేశాలు, చైర్మన్ అధికారాలు, అధికారుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు తప్ప, నీటి నిర్వహ ణ, ప్రాజెక్టుల నియంత్రణ, బోర్డు పరిధి ఏంటన్న అంశాలేవీ లేవని పేర్కొంది. ఇలా చాలా అంశాల్లో అస్పష్టత నెల కొన్న సమ యంలో ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు లేకుండా వర్కింగ్ మాన్యువల్ ఆచరణీయం కాదని స్పష్టం చేసింది. నీటి అవసరాలు చెప్పండి.. కృష్ణా నదీ బేసిన్లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి అవసరాల వివరాలను సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లను ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ప్రస్తుత 2017–18 వాటర్ ఇయర్లో సాగు, తాగు అవసరాలకు కలిపి ఇండెంట్ సమర్పించాలని బోర్డు కోరింది. ఇదే సమయంలో ఇప్పటికే ఉపయోగించిన నీటి వినియోగ లెక్కలు, ఇతర అంశాలు ఏవైనా ఉంటే ఈ నెల 10లోగా సమర్పించాలని తెలిపింది. ఆయా అంశాలను ఎజెండాలో చేర్చి చర్చిస్తామని స్పష్టం చేసింది. -
రాష్ట్రానికి 54 టీఎంసీలొస్తాయి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలకు సం బంధించి ప్రస్తుత నీటి లభ్యతలో తెలంగాణకు 54.23 టీఎంసీల వాటా ఉందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు కింద అదనపు నీటి వినియోగం ఆపాలని ఆంధ్రప్రదేశ్ను కృష్ణా బోర్డు ఆదేశించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులు, నీటి లభ్యత, రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగంపై మంగళవారం జలసౌధలో మంత్రి చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ, తెలంగాణకు కృష్ణా బోర్డు జరిపిన కేటాయింపులను ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి 243 టీఎంసీల మేర నీరు రాగా, వాటా ప్రకారం ఏపీకి 154.09, తెలంగాణకు 89.95 టీఎంసీలు దక్కుతాయని.. అయితే తెలంగాణ వినియోగం 35.72 టీఎంసీలను పక్కనపెడితే మరో 54.23 టీఎంసీలు ఉంటాయని మంత్రికి అధికారులు వివరించారు. పోతిరెడ్డిపాడు కింద ఏపీకి 10 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, అదనంగా 2.35 టీఎంసీల నీరు వినియోగించిందని.. దీనిపై బోర్డుకు లేఖ రాయగా, వినియోగం ఆపమని ఏపీని బోర్డు ఆదేశించిందని వివరించారు. కాగా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా మరింత నీటి కేటాయింపులు జరిగేలా బోర్డుతో చర్చించాలని అధికారులకు మంత్రి సూచించినట్లుగా తెలిసింది. భేటీలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈలు సునీల్, నరసింహారావు పాల్గొన్నారు. నేడు, రేపు పీఆర్పీ టెలిమెట్రీ ప్రాంత పర్యటన.. పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ విషయమై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడం తో నీటి ప్రవాహ లెక్కలను సరిచూ సేందుకు ముగ్గురు అధికారులను అక్కడికి పంపాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈఈ రవీందర్ నేతృత్వంలోని బృందం బుధ, గురువారాల్లో పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ ప్రాంతంలో పర్యటించి నివేదికివ్వాలని సూచించింది. -
దీపావళి తర్వాత అపెక్స్ కౌన్సిల్?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాల పరిష్కారానికి వీలుగా దీపావళి అనంతరం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్ర జల వనరుల శాఖ ప్రాథమిక నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు వెలువడినట్లుగా కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు అపెక్స్ భేటీ ఒక్కటే శరణ్యమన్న తమ వినతి మేరకు కేంద్రం ఆ దిశగా నిర్ణయం చేసినట్లుగా ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లోని వివాదాలపై గత రెండేళ్లలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన కేంద్రం.. ఇరు రాష్ట్రాల మధ్య ఓ అవగాహన కుదర్చడంతో తాత్కాలిక పరిష్కారం దొరికింది. ఈ ఏడాది ఎలాంటి భేటీ జరగలేదు. దీంతో జల వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ రీ–ఇంజనీరింగ్ చేస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులకు కేంద్రం, బోర్డు అనుమతులు లేవని ఏపీ అంటోంది. ప్రతిగా ఏపీ చేపట్టిన పులికనుమ, సిద్ధాపురం, గాజులదిన్నె, గుండ్రే వుల, శివభాష్యం సాగర్, మున్నేరు, ముచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడి కాల్వ అంశాలని తెలంగాణ తెరపైకి తెచ్చింది. ఈ వివాదాన్ని తేల్చే బాధ్యతను బోర్డులు కేంద్రం కోర్టులోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దీపావళి తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సుముఖత తెలిపినట్లు తెలిసింది. ఆలోపే బోర్డులతో భేటీ కావాలని సైతం ఆయన నిర్ణయించినట్లుగా సమాచారం. -
పెత్తనంపై మెత్తన!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునే అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మెత్తబడింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులు బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్ మాన్యువల్పై వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబట్టిన నేపథ్యంలో వాటిని రాష్ట్రాల పరిధిలోనే ఉంచేలా తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. దానిపై అభిప్రాయాలు కోరుతూ శుక్రవారం తెలంగాణ, ఏపీకి లేఖలు రాసింది. రాష్ట్రానికి ఉపశమనం... కృష్ణా బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమంటూ ఏపీ కేంద్రానికి లేఖలు సైతం రాసింది. ఇందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో కృష్ణా బోర్డు... శ్రీశైలం, సాగర్తోపాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీలను తమ పరిధిలోకి తెచ్చుకుంటామంటూ గతంలో డ్రాఫ్ట్ వర్కింగ్ మాన్యువల్ రూపొందించి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. అయితే బోర్డు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసి ప్రాజెక్టులవారీగా నీటి లెక్కలు తేలాక... బోర్డు వాటి నిర్వహణనే చూడాలని తేల్చిచెప్పింది. దీంతో తెలంగాణ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న బోర్డు... ప్రాజెక్టులపై ప్రత్యక్షంగా తమ నియంత్రణ ఉండదంటూ తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. ప్రాజెక్టులన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది. కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతి తప్పనిసరి కృష్ణా బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్తోపాటు తమ అనుమతి తప్పనిసరని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా ధిక్కరణలకు పాల్పడితే కేంద్రం విధించే ఆర్థిక, ఇతర జరిమానాలు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. కృష్ణా బేసిన్లో ఇప్పటికే చేపట్టిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చని సూచించింది. బోర్డు పరిధిలో పరిష్కారమవని ఏ అంశంపైనైనా ఇరు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరణ ఇచ్చింది. వర్కింగ్ మాన్యువల్కు ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
కృష్ణాలో ఎగువన పెరిగిన ప్రవాహాలు
ఆల్మట్టికి 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో సాక్షి, హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టిలోకి సోమవారం 20,792 క్యూసెక్కులు, నారాయణపూర్లోకి 10 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని ఆల్మట్టి నుంచి దిగువ నారాయణపూర్కు 11వేల క్యూసెక్కులు వదులుతుండగా, నారాయణపూర్ నుంచి 10వేల క్యూసెక్కులు కాల్వలకు వదులుతున్నారు. అయితే ఎగువన ప్రాజెక్టులు పూర్తి నిల్వలతో ఉన్నప్పటికీ దిగువకు చుక్క నీరు వదలడంలేదు. దీంతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు 2,546 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇందులో 1,950 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు. ఇక శ్రీశైలానికి 1,187 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉన్నా, సాగర్కు మాత్రం చుక్క నీరు కూడా రావడం లేదు. దీంతో ప్రాజెక్టు మట్టం 500 అడుగుల కనిష్టానికి పడిపోయింది. ఇక గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి స్థిరంగా ప్రవాహాలు వస్తున్నాయి. ఎస్సారెస్పీకి 17,642 క్యూసెక్కులు, సింగూరుకి 7,093 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎల్లంపల్లిలోకి సైతం 8,410 క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. -
మాకేమో నీళ్లు లేవు..
► వాళ్లేమో ప్రాజెక్టులు కడుతున్నారు ► లోక్సభలో జితేందర్రెడ్డి ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నీటి ఎద్దడి ఉంటే ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో కేంద్రం అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు కడుతోందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ప్రశ్నోత్తరాల సమ యంలో మాట్లాడుతూ.. రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారని, ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో పంటలు ఎలా ఎదుగుతా యని ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఆల్మట్టి నిండకపోవడంతో కిందికి నీళ్లు రాలేదన్నారు. ఏపీ.. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్రానికి ఇప్పటికే చెప్పామని, పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చెర్ల, గుండ్రే వుల రిజర్వాయర్, గాజులదిన్నె, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్ధాపురం తదితర ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలోనే కేంద్రం అనుమతులు అవసరమని జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బలియాన్ బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారన్నారు. నీటి వివాదం ప్రస్తుతం ట్రిబ్యునల్ పరిధిలో ఉందన్నారు. -
కృష్ణా బోర్డు సమావేశం వాయిదా
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో నెలకొన్న సమస్యలపై ఈనెల 18న జరగాల్సిన సమావేశాన్ని 22కు వాయిదా వేస్తూ కృష్ణా బోర్డు నిర్ణయించింది. 18న తెలుగు రాష్ట్రాల పరిధిలో పార్లమెంటరీ కమిటీ పర్యటిస్తున్న దృష్ట్యా, ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి సమీర్ ఛటర్జీ కొత్త సమావేశపు తేదీ, ఎజెండా అంశాలను పేర్కొంటూ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఈ సమావేశంలో తొలి విడత టెలీమెట్రీ పరికరాల అమరిక, 2017–18 వాటర్ ఇయర్ నీటి ప్రణాళిక, వర్కింగ్ మ్యాన్యువల్ ఆమోదం, నిధుల కేటాయింపుతోపాటు అత్యంత కీలకమైన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలంగాణ చేపట్టిన భక్తరామదాస, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ఎత్తిపోతల పథకాలను కొత్త ప్రాజెక్టులుగా చూపుతుండగా, ఏపీ చేపట్టిన శివభాస్యం సాగర్, మున్నేరు వంటి ప్రాజెక్టులు కొత్తవని తెలంగాణ అంటోంది. దీంతో పాటు పట్టిసీమ ద్వారా కృష్ణాబేసిన్కు తరలిస్తున్న నీటి వాటాల అంశాన్ని కృష్ణాబోర్డులో చర్చిద్దామని, ఇదివరకే గోదావరి బోర్డు సమావేశంలో నిర్ణయించారు. -
కర్ణాటక గుప్పిట్లో కృష్ణమ్మ !
-
ఒక్క చుక్కా వదలడం లేదు!
► కృష్ణా నీటిని మొత్తంగా వాడేస్తున్న ఎగువ రాష్ట్రాలు ► దిగువన తెలంగాణ, ఏపీ ప్రాజెక్టుల్లోకి రాని జలాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే... ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మాత్రం నీటిని అడ్డగోలుగా వాడేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టు విద్యుదుత్పత్తి, సాగు అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర అయితే కోయినా ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేస్తూ.. నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నది. కర్ణాటకకు గత పదిహేను రోజుల్లో 120 టీఎంసీల మేర నీరొచ్చినా చుక్క నీటిని దిగువకు వదలకుండా నిల్వ చేసుకోవడంతోపాటు.. కాల్వల ద్వారా సాగు అవసరాలకు మళ్లిస్తోంది. దీంతో దిగువకు చుక్క నీరు రాక తెలంగాణ, ఏపీలు విలవిల్లాడుతున్నాయి. ఒక్క చుక్క కూడా వదలడం లేదు మహారాష్ట్ర పరిధిలో ఉన్న 38 ప్రాజెక్టు (కృష్ణా నదిపై 13, భీమా నదిపై 25)లలో 65 నుంచి 80 శాతం వరకు నీటి నిల్వలున్నాయి. బేసిన్ ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న కోయినాలో కొద్దిరోజుల కిందే విద్యుదుత్పత్తి మొదలుపెట్టి.. 50 నుంచి 60 టీఎంసీల నీటిని వాడేసుకున్నారు. విద్యుదుత్పత్తి చేయగా దిగువకు వెళ్లే నీటిలో కొంత సాగు అవసరాలకు మళ్లించగా, మిగతా నీరు వృథాగా అరేబియా సముద్రంలోకి వెళుతోంది. ఇక కర్ణాటక కూడా ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను నింపుకొంటూ.. అటు విద్యుదుత్పత్తికి, సాగు అవసరాలకు వినియోగిస్తోంది. ఇలా ఎగువ రాష్ట్రాలు తమకున్న నికర జలాల కేటాయింపుల పేరిట వచ్చిన నీటిని వచ్చినట్లు వాడుకోవడంతో దిగువకు చుక్క నీరు చేరలేదు. దీనికితోడు ప్రస్తుతం ఎగువ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం తగ్గడంతో.. దిగువన మన ప్రాజెక్టులకు నీటి రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రాజెక్టులన్నీ ఖాళీ కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరలేదు. ప్రధానమైన సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం వినియోగార్హమైన నీరు ఒక టీఎంసీ కూడా లేకపోవడం ఆందోళనకరంగా మారింది. ఇక ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం ఇటీవలే శ్రీశైలం నుంచి 2 టీఎంసీలు వదిలితే అందులో సాగర్కు చేరింది 1.33 టీఎంసీలే. మిగతా 0.6 టీఎంసీల నీరు ఆవిరిగా నష్టమైంది. ఇప్పుడా నీటి కోసం కూడా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది. -
ఆల్మట్టికి రోజుకు 6 టీఎంసీలు
60 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు పుంజుకున్నాయి. గురువారం నాటికి రోజుకు 6 టీఎంసీల చొప్పున 64 వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 58.6 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 27,720 క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్కు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్కు 10,735 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 15.87 టీఎంసీల నిల్వ ఉంది. ఇక తుంగభద్రకు సైతం ప్రవాహాలు పెరిగాయి. దీనికి 15,464 క్యూసెక్కుల మేర నీరు చేరుతోంది. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత దిగువ జూరాలకు ప్రవాహాలు మొదలయ్యే అవకాశముంది. -
గోదా‘వరద’ ఏదీ?
- గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ప్రవాహాలు - గతేడాది కాళేశ్వరం వద్ద 102 మీటర్లలో ప్రవాహాలు, ప్రస్తుతం 95 మీటర్లలోనే - ఎగువ గైక్వాడ్ సహా రాష్ట్ర ప్రాజెక్టుల్లో నిరాశాజనకంగా నిల్వలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయనిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ప్రతి ఏటా జూన్ చివరి వారానికి ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులోనూ గతేడాదితో పోలిస్తే ఏకంగా 17 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. చూపంతా పైకే.. కృష్ణా బేసిన్తో పోల్చిచూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో ఇంతవరకు ఒక్క పెద్ద వర్షం నమోదు కాకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరు, శ్రీరాంసాగర్కు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి 20 రోజులు కావస్తున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద గత ఏడాది జూన్ 17, 18 తేదీల్లోనే గోదావరి 102 మీటర్ల మట్టంతో ప్రవహించింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండగా అది ఈ ఏడాది 40 వేల క్యూసెక్కులకే పరిమితం అయింది. ఈ ప్రవాహం కూడా ప్రాణహిత నుంచి వస్తోందే తప్ప, గోదావరి నుంచి కాదు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుధవారం కాళేశ్వరం వద్ద 80 వేల క్యూసెక్కులకు వరద పెరిగినట్లుగా తెలుస్తోంది. మిగులు జలాలూ అంతే.. ఇక ప్రతి ఏటా ధవళేశ్వరం దిగువన సముద్రంలో కలిసే గోదావరి మిగులు జలాల నీటి పరిమాణం సైతం తగ్గింది. ఈ ఏడాది సముద్రంలో కలిసిన నీరు 82.9 టీఎంసీలు ఉండగా, గతేడాది ఇదే సమయానికి 390 టీఎంసీలు, అంతకుముందు ఏడాది 710 టీఎంసీల మేర సముద్రంలో కలిసింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు రెండు రోజులుగా మాత్రమే ఇన్ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. ఇక కడెం, శ్రీరాంసాగర్లోనూ గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. వీటికి పెద్దగా ప్రవాహాలు సైతం రావడం లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎగువ మహారాష్ట్రలో కురిసే వర్షాలపైనే రాష్ట్ర ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఇంకో 90 వస్తే దిగువకు కృష్ణా.. కృష్ణా బేసిన్లోని ఎగువ ఆల్మట్టికి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 38 క్యూసెక్కుల మేర నీరొచ్చి చేరడంతో అక్కడ నీటి నిల్వ 129 టీఎంసీలకు గానూ 55.27 టీఎంసీల మేర ఉంది. దిగువ నారాయణపూర్కు ప్రవాహాలు లేకపోవడంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 14.69 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువన మరో 90 టీఎంసీలు వస్తే దిగువ జూరాలకు నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంది. -
మళ్లింపు జలాల లెక్క తేలుస్తారా?
పట్టిసీమ, పోలవరం వాటాలపై చర్చించనున్న బజాజ్ కమిటీ సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టి న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో.. ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. గతేడాది పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన వినియోగంలో వచ్చే వాటాలు ఇప్పటికీ తేలకపోవడం, ఈ ఏడాది మళ్లీ వినియోగాన్ని ప్రారంభించడం తెలం గాణకు మంట పుట్టిస్తోంది. ఈ ఏడాదైనా వాటాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో వివాదాన్ని తేల్చేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ గడువును మరో ఆరు నెలలు పొడగించడం, ఆ కమిటీ వచ్చే నెల మొదటి వారం రాష్ట్రం లో పర్యటించనుండటంతో మళ్లింపు లెక్కలు తేలుతాయా అనేది ప్రశ్నార్థంగా మారింది. ఏటా వాటర్ ఇయర్కు ముందుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నా ఇంతవరకు గోదావరి మళ్లింపు జలాల వివా దం తేలలేదు. ఈఏడాది ఫిబ్రవరిలో ఒకసా రి రాష్ట్రానికి కమిటీ రాగా.. పట్టిసీమ, పోల వరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా 73 (పోలవరం 43 టీఎంసీలు, పట్టిసీమ 30 టీఎంసీలు) టీఎంసీలు తమకు దక్కేలా చూడాలని తెలం గాణ కోరింది. కమిటీ స్పందిస్తూ, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చెతులెత్తేసింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో బజాజ్ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది. -
కృష్ణాలో ఏపీకి 155 టీఎంసీలు చాలు
- 512 టీఎంసీల నికర జలాల వాటాలో కోత పెట్టండి - బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు ఏపీ అఫిడవిట్కు రాష్ట్రం కౌంటర్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న నికర జలాల వాటాలో కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు విన్నవించింది. కృష్ణా బేసిన్లో మొత్తంగా ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని, ఆ మేరకు వారికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని కోరింది. ఈ మేరకు ట్రిబ్యునల్కు ఏపీ సమర్పించిన అఫిడవిట్పై రాష్ట్రం కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో వివరాలు.. ► కృష్ణా డెల్టా కింద ఏపీకి 152.20 టీఎంసీల కేటాయింపు ఉంది. రాజధాని ప్రాంతం సీఆర్డీఏ కారణంగా పరివాహకం తగ్గిపోతున్నందున మరో 16 టీఎంసీలు అవసరం లేదు. ఇక పోవలరం కాల్వల ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నందున మొత్తం వాటాలో దీన్ని తగ్గించాలి. మొత్తంగా కృష్ణా డెల్టాకి 17.55 టీఎంసీలు సరిపోతాయి. ► గుండూరు ఛానల్కు 4 టీఎంసీలున్నా, వాస్తవ అవసరాలు 1.48 టీఎంసీలకు మించవు. ► సాగర్ ఎడమ కాల్వల కింద వారికి 34.25 టీఎంసీల కేటాయింపుల్లో వాస్తవ అవసరాలు 20.22 టీఎంసీలే. అయితే అమరావతి రాజధాని కింద 3.05లక్షల ఎకరాలు ప్రభావితం అవుతున్నందున ఈ నీటి కేటాయింపులు కూడా అవసరం లేదు. ► సాగర్ కుడి కాల్వ కింద 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా, వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ కుడి కాల్వ పరిధిలోని 2.67లక్షల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున 26.71టీఎంసీలను తగ్గించి 75.77 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది. ► తుంగభద్ర లోలెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్ల కింద అవసరాలకు మించి కేటాయింపులున్నాయి. వాటిని తగ్గించాలి. ► మొత్తంగా 512 టీఎంసీల నికర జలాల కేటాయింపులను 155.40 టీఎంసీలకు పరిమితం చేయాలి. ► ఇక తెలంగాణకు కృష్ణా బేసిన్లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటా యింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలు ఏపీ బేసిన్ బయటే వాడుకుంటోందని తెలిపింది. బేసిన్ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03లక్షల హెక్టార్లు ఉంది. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో 78.29లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీల వరకు దక్కాలి. -
నేడు కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా నది బోర్డు త్రిసభ్య కమిటీ బుధ వారం భేటీ కానుంది. జలసౌధలో జరిగే ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో పాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరు కాను న్నారు. భేటీలో ప్రధానంగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపిణీ పై చర్చ జరగనుంది. సాగర్లో 502 అడుగులు, శ్రీశైలం లో 775 అడుగుల వరకు నీటిని ఇరు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంది. ఈ మట్టాల వద్ద ప్రస్తుతం 2 నుంచి 3 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం, ఆ నీరంతా ఏపీకే దక్కనుండటంతో తెలంగా ణ తన అవసరాల కోసం రెండు ప్రాజెక్టులో మరింత దిగువకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల మట్టం వరకు వెళ్లేందుకు అవకాశం ఇస్తే హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలు తీరుతా యని చెబుతోంది. నల్లగొండకు 2.25 టీఎంసీ, హైదరాబాద్కు 2 టీఎంసీలు ఇవ్వాలని ఇటీవలే విన్నవించింది. దీనిపైనా కమిటీ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. దీంతో పాటే టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ జరగనుంది. మొదటి విడతలో 18 పాయిం ట్లలో చాలా చోట్ల రాష్ట్రంలో పనులు పూర్త యినా ఏపీలో పూర్తవలేదు. రెండో విడతలో మరో 28 చోట్ల ఏర్పాటు చేయాల్సిఉన్నా, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన 17 పాయింట్లపైనా చర్చించనున్నారు.