Inspirational Stories
-
ఏకంగా 28 కేజీలు తగ్గింది : ఎలా ఉండేది..ఎలా అయ్యింది?!
అందరికీ తెలుసు బరువు తగ్గడం అంత ఈజీకాదు అని. కానీ ఆచరించడంలో విఫలమవుతూంటారు. అనుకున్నది సాధించాలంటే తగిన కృషి ఉండాలి. ఆ కృషిని కష్టంగా కన్నా ఇష్టంగా, పట్టుదలగా చేయడం ముఖ్యం. అలా దీక్షగా ప్రయత్నించిన పోషకాహార నిపుణురాలు దీక్ష బరువు తగ్గింది. నమ్మలేక పోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.వృత్తిపరంగా పోషకాహార నిపుణురాలు అయిన దీక్షఏకంగా 28 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్బంగా తీసుకున్న జాగ్రత్తలు, ఆహార నియమాలతో తన వెయిట్లాస్ జర్నీని ప్రభావితం చేసిన అంశాలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది.“మీరు ఇంటర్నెట్లో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దు; మీరు ఈ దినచర్యను అనుసరించడం ప్రారంభిస్తే బరువు తగ్గడం మొదలవుతుంది. నేను 28 కిలోల బరువు తగ్గాను, నేను మళ్ళీ చేయాల్సి వస్తే, నేను ఇలాగే చేస్తాను,” అంటూ ఒక రీల్లో వివరాలను తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన జర్నీని స్నిప్పెట్లను పంచుకోవడం దీక్షకు అలవాటు.ఇదీ చదవండి: కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు! అయిదు సూత్రాలువేగంగా బరువు తగ్గాలని ప్రయత్నించకండి. నెమ్మదిగా, స్థిరంగా తగ్గితేనే ఆ బరువు మెయింటైన్ అవుతుంది. లేదంటే ఎంత తొందరగా తగ్గితే.. అంత వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు.బ్యాలెన్స్ డైట్ ముఖ్యం. మధ్య మధ్యలో ఇష్టమైనవి తింటూనే, సుగర్ని దూరం పెట్టండి. రాత్రి పూట తొందరగా భోజనం ముగించండి.కచ్చితంగా ఉండాలి. బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఇది అవసరం. ఆహారం, వాకింగ్, వ్యాయామం, నీరు తీసుకోవడం, నిద్ర అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక వేళ కొంచెం ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ వ్యాయామం చేయాలని నిబంధనను మనకు మనం విధించుకోవాలి. View this post on Instagram A post shared by Diksha - Certified Nutritionist | Integrative Health Coach | (@a.l.i.g.n_) దీక్ష -ఆహారంఉదయం పానీయం: ధనియాలు, సెలెరీ గింజలు ,అల్లం, జీరాతో చేసిన వాటర్ అల్పాహారం: 2 గుడ్లు , కొన్ని ఉడికించిన పుట్టగొడుగులు, కూరగాయలు , పుదీనా చట్నీతో పెసరట్టుటిఫిన్కి, భోజనానికి మధ్య : బాదం పాలు కాఫీ. కొబ్బరి నీళ్లు ఇది కూడా ఆప్షనల్.లంచ్: చికెన్ , హమ్మస్ (ఉడికించిన బఠానీవెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం , ఉప్పు కలిపిన మిశ్రమంపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ చల్లాలి) సలాడ్.సాయంత్రం స్నాక్: అవసరం అనుకుండే గుప్పెడు వేయించిన శనగలు, ఏదైనా పండు, అయిదారు నట్స్డిన్నర్ : బాగా ఉడికిన చికెన్ . పాలకూర సూప్, 1/2 కప్పు ఉడికించిన మొలకలుబరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే విషయాల్లో ఆహారం ఒక్కటేకాదు. ఇతర అంశాలు కూడా ఉన్నాయంటూ దీక్ష చెప్పుకొచ్చింది. బరువు తగ్గే క్రమంలో ఆహారం ఒక భాగం. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సరైన నిద్ర చాలా అవసరం. వారానికి 4-5 రోజులు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయండి.రోజుకు 10 వేల అడుగులు నడవాలి. ప్రతిరోజూ 3 లీటర్ల దాకా కు నీరు త్రాగాలి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ముఖ్యమైనవి, పెద్దగా పట్టించుకోనివి నిద్ర ,ఒత్తిడి. నిజానికి ఇవి గేమ్ ఛేంజర్లు అంటుంది దీక్ష. -
హీరో అంటే ఇలా ఉండాలి చిన్నా..!
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం లేదు... ఈ పాఠాలు.. లెక్కలు.. కెమిస్ట్రీ ఇదేం నావల్లకావడం లేదు.. పైగా ఈ సీటు కోసం క్రికెట్.. సినిమాలు.. ఇవన్నీ మానేయాల్సి వస్తోంది.. అందుకే ఈ ఐఐటి వంటి పెద్ద గోల్స్ మానేద్దాం అనుకుంటున్నా.. ఇంకేదైనా చేస్తాను..’’ బాధపడిపోతూ చెప్పాడు శ్రీనాథ్.. కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకున్న గోపాల్ రావు 'అర్రర్రే.. అలగానీస్తే ఎలారా..కష్టంగా ఉందని మానేస్తే నీ టార్గెట్ ఏటవ్వాలి.. ఇదేకాదు ఏ పనిలో అయినా కష్టం ఉంటాది.. లక్ష్యానికి చేరాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి..అప్పుడే నీ ఆశయం నెరవేరుతాది అన్నాడు గోపాల్ రావు.. పెద్దపెద్ద డైలాగులు చెప్పడం సుళువేగానీ ఆ దారిలో వెళ్లడం కష్టం నాన్నా అంటూ మ్రాన్పడిపోతున్నాడు కొడుకు.. ఒరేయ్ అందరూ నీలాగే అనుకుంటే పెద్దపెద్ద లక్ష్యాలకు ఎలా చేరతారు. అంతెందుకు మన జగన్ను చూడు.. ఎన్ని బాధలు పడితేతప్ప సీఎం కాలేదు.. దీనికోసం ఎంత కష్టించాడో.. ఎన్ని ఇష్టాలను వదులుకున్నాడో తెలుసా అన్నాడు తండ్రి.. పళ్లకో నాన్న నువ్వన్నీ ఇచిత్రాలే చెప్తావ్.. జగనుకు యేటి కష్టం.. వాళ్ళనాన్న రాజశేఖర్ రెడ్డి సీఎం కాబట్టి ఈయనా సీఎం అయ్యాడు.. ఏం కష్టం పడ్డాడు చెప్పు అన్నాడు శ్రీనాథ్.. ఒరేయ్ అలాగనీకు యావత్ దేశంలోనే ఒక సంచలనం.. జగన్ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. నీలాంటి యువతకు ఒక రిఫరెల్ సక్సెస్ స్టోరీ అన్నాడు గోపాలం. ఏదీ అంత గొప్పేముందని అందులో.. అన్నాడు కొడుకు.. సరే పక్కన కూకో అంటూ.. గోపాలరావు చెప్పాడునువ్వనుకుంటున్నట్లు జగన్ జీవితం కొన్నాళ్లవరకు.. వడ్డించిన విస్తరే కానీ.. ఆ విస్తరి అక్కర్లేదు.. తనకోసం కొత్తబాట వేసుకుందాం అనుకున్నాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు అన్నాడు తండ్రి.. అదెలా అన్నాడు శ్రీనాథ్.. అవును వైఎస్సార్ కొడుకుగా జగన్ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్.. కానీ తండ్రి మరణం తరువాత తనకంటూ ఒక బాటవేసుకున్నాడు. తండ్రిని గుండెల్లో పెట్టుకున్న ప్రజలకోసం తానూ అండగా ఉండాలని భావించాడు..' అందుకే సీఎం అయిపోయాడు అన్నాడు శ్రీనాథ్.. నీ తలకాయ.. అయన అంత సులువుగా అవ్వలేదు.. దీనికోసం పడిన కష్టాలు వింటే నువ్వు పడుతున్న ఇబ్బందులు కూడా ఒక సమస్యేనా అంటావు.. అన్నాడు నాన్న ఏం కష్టాలు నాన్నా.. సులువుగానే సీఎం అయ్యాడు కదా అన్నాడు శ్రీనాథ్. కాదురా బాబు.. వైయస్ మరణం తరువాత పొలిటికల్ స్క్రీన్ మీద అయన పాత్రను ముగించేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. వైయస్సార్ పుణ్యాన మాంత్రులు అయినవాళ్లు.. ఎంపీలు అయినవాళ్లను సైతం జగన్ వెంట గోతులు తీశారు. అయినా ఈయనవెరవలేదు. నీలాగా భయం వేస్తోందని పారిపోలేదు.పరిస్థితులకు ఎదురీది.. సవాళ్లకు ఎదురేగి నిలబడ్డాడు.. కాలంతో కలబడ్డాడు... ఢిల్లీ పెద్దలతో తలపడ్డాడు.. అది కదా పోరాటం అంటే.. పోన్లే అలా చేసి గెలిచేసాడు.. సీఎం అయిపోయాడు అంతేనా అన్నాడు శ్రీనాథ్.. జగన్ జీవితం అంతవీజీగా అవ్వలేదురా... తన లక్ష్యసాధనకు అడ్డుగా ఉందని భావించిన ఎంపీ పదవిని వదిలేసాడు.. నువ్వు ఆఫ్ట్రాల్ సినిమాలు.. క్రికెట్ వదులుకోలేని అంటున్నావు ... లోకాన్ని తెలుసుకోవడానికి వేలకిలోమీటర్ల పాదయాత్రలు చేశాడు.. మొదటిసారి కూడా ప్రజలకు తానూ చేయగలిగేవే చెబుతాను తప్ప మోసం చేయలేను అంటూ సాధ్యాసాధ్యాలు పరిశీలించి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి పోటీ చేసాడు. మంచి సీట్లొచ్చాయి.. కానీ అధికారం రాలేదు.. నీలాగా నావల్ల కాదని పారిపోలేదు.. ఆ వచ్చిన సీట్లలో కొందరు పార్టీమారిపోయారు.. ఆ పరిణామాలను చూస్తూ నవ్వుకున్నాడు.. రాటుదేలాడు తప్ప ఇది కష్టం అని వదులుకోలేదు.. మళ్ళీ రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు పాదయాత్ర చేశాడు.. నువ్వు కూడా నే సిలబస్ మొత్తం ఆమూలాగ్రం ఇలాగె చదవాలి. ‘‘ఓహో.. ఒకే మరి నడిస్తే ఏమైంది..’’ అన్నాడు కొడుకు.. ఏముంది పాదయాత్రలో భాగంగా తాను చూసినా ప్రజల కష్టాలే అయన మ్యానిఫెస్టో అయింది. అదేమాట చెప్పాడు.. అఖండ మెజార్టీ సాధించాడు. రెండేళ్లు కోవిడ్ కాలంలోనూ ప్రజలను కాపాడుకుని దేశవ్యాప్తంగా పేరుపొందాడు.. రాష్ట్రంలో విద్యావైద్యరంగాలను పరుగులు పెట్టించాడు. పారిశ్రామికరంగం ఉరకలేసింది. అడిగాడా హీరో అంటే.. నీలాగా ఎప్పుడూ ఎక్కడా.. ఏనాడూ భయపడలేదు.. ఎవర్నీ లెక్కచేయలేదు.. అదిరా మగాడితనం అంటే.. అది కదా ఛాలెంజింగ్ అంటే.. నువ్వూ ఆలా ఉండాలి.. హీరోలా ఎదగాలి.. ఈ ఎగ్జామ్స్ నాకొలెక్కా అనేలా ఎదురెళ్లి మరీ నీ దమ్ము చూపాలి అన్నాడు.. ‘‘అవును నాన్న.. నిజమే.. జగన్ రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిమంతం. అయన గమనం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం’’ అన్నాడు.. సరే మరి ఇప్పుడేమంటావ్ అన్నాడు గోపాలరావు.. లేదు నాన్న నేను ఈసారి మరింత రెట్టించి చదువుతాను.. సీట్ సాధించి నేనేమిటో చేసి చూపిస్తాను అంటూ బుక్స్ తీసుకుని బయల్దేరాడు.. కొడుకు వంక ఆలా చూస్తూ నిలబడిపోయాడు.. తండ్రి గోపాల రావు .. ఒరేయ్ ఈరోజు జగన్ పుట్టినరోజు.. ఆయనకు విషెస్ చెప్పి నీ చదువు ప్రారంభించు.. ఖచ్చితంగా పాసవుతావు అని చెప్పాడు.. సరే నాన్నా అంటూ కదిలాడు శ్రీనాథ్ :::సిమ్మాదిరప్పన్న -
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
నిదానమే.. ప్రధానం!
మేధాతిథి అనే తాపసుని పుత్రుడు చిరకారి. అతడు ఏ పనిని తొందర పడి చేయడు. చక్కగా అలోచించి చేస్తాడు. అందువలన అందరూ అతనిని చిరకారి అని పిలిచేవారు. ఒకసారి మేధాతిథికి భార్యపై బాగా కోపం వచ్చింది. కొడుకును పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరకారి చాలా సేపు ఇలా ఆలోచించాడు..‘తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించటం మంచిది కాదు. అలాగని తల్లిని చంపటం యుక్తం కాదు. తల్లి నెలాగైనా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల మధ్య పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేనిదిగా ఉంది. నేను ఇద్దరికీ చెందినవాడను. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరిద్దరిలో ఎవరిని వదులుకోవాలి? కొడుకు ఏ వయ సులో ఉన్నా తల్లి ప్రేమ, రక్షణ బాధ్యత ఒకే విధంగా ఉంటాయి. తల్లి లేకపోతే లోకం శూన్యమై పోతుంది. ఇంతటి పూజ్యురాలైన తల్లిని వధించటానికి నాకు చేతులెలా వస్తాయి?’ అనుకుంటూ చిరకారి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.‘మాతృ దేవోభవ’ అనే సూక్తి కూడా తల్లినే ప్రథమ దైవంగా భావించమని బోధించింది. చిరకారి తండ్రి మాట కాదనలేక, తల్లిని చంపలేక కత్తి చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా, మేధాతిథిలో పశ్చా త్తాప భావన మొదలైంది. చిన్న తప్పుకు కోపించి భార్యను చంపమని కొడుకుని ఆజ్ఞాపించాను. చిరకారి ఏ పనైనా దీర్ఘంగా అలోచించి కాని చేయడు. మాతృ వధకు పూనుకోకుండా తన పేరు సార్థకం చేసుకుంటే బాగుండును అనుకుంటూ ఇంటికి వస్తాడు. చిరకారి చేతిలో ఖడ్గాన్ని వదిలి తండ్రి పాదాలకు నమస్కరించాడు. భార్య కూడా ఆయనకు నమస్కరించింది. ఆయన వారిద్దరినీ దీవించాడు. ఏ పనైనా తొందరపడక, ఆలోచించి ధీరత్వంతో చేసేవాడు సమస్త శుభాలు పొందు తాడని మేధాతిథి చెబుతాడు.ధర్మరాజు కార్యాచరణలో అవసరమైనది బహు దీర్ఘ సమయమా? అత్యల్ప సమయమా అని భీష్ముని అడిగినప్పుడు ఆయన చిరకారి కథ చెప్పి అలా చేయమని చెబుతాడు. ఏ పనినైనా తొందరపాటుతో చేస్తే అనర్థాలు కలుగుతాయి. అలోచించి చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అని సారాంశం. – డా. చెంగల్వ రామలక్ష్మి -
ఏది అత్యుత్తమ మార్గం?
మార్గాలన్నీ సమాన ప్రాముఖ్యం కలిగినవే. ఎందుకంటే జీవాత్మను పరమాత్మునిలో చేర్చడమే ఈ అన్ని మార్గాల లక్ష్యం. మంచితనం విషయంలో ఉత్తమం, మధ్యమం, అథమం అనేవి సాపేక్ష పదాలు మాత్రమే. ఏ వ్యక్తికి ఏ మార్గం సులభంగా, మనస్సుకు నచ్చినట్లు ఉంటుందో అదే అతనికి ఉత్తమ మార్గం.వివిధ నదులు అనేక దిక్కుల నుంచి వేగంగా ప్రవహిస్తూ చివరగా సముద్రంలో కలిసిపోతాయి. అలాగే భక్తి, జ్ఞాన మార్గాల్లో పయనించే వాళ్లందరూ చివరిగా చేసే ప్రయత్నం ఒక్కటే. జీవుడు ఏ మూలం నుండి వచ్చాడో, ఆ మూలం లోనికి జీవుణ్ణి చేర్చడమే భక్తి, జ్ఞాన మార్గాల లక్ష్యం. కారణం గుర్తించు నీవు, నీ అంతరాత్మతో పొందిక కలిగి ఉన్నట్లయితే బాహ్య ప్రపంచం నీతో పొందికను కలిగి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో నీకు విరోధం కనిపించినట్లయితే అది నీ లోపల గల కల్లోలాలను బహిర్గతపరుస్తుంది. అందువల్ల బయట కల్లోలాలు సృష్టించబడతాయి.ప్రకృతి మాత రచించిన గొప్ప ప్రణాళికలో ప్రతి వస్తువునకూ సముచితమైన విలువ, ఉపయోగాలు ఉన్నాయి. దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. వేదాంతాన్ని అనుసరించి చూస్తే... ప్రకృతి ఎక్కడా కల్లోలాలను కలిగించదని అర్థమవుతుంది. కేవలం మానవుని మనస్సు మాత్రమే ఇటువంటి కల్లోలాలను సృష్టిస్తుంది. కల్లోలాలను గురించి ఎంత సులభంగా మాట్లాడతావో, నీవు వాటికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన వాడవు అవుతావు.ప్రతి విషయానికీ ఏదో ఒక పరిణామం కారణం అనే విషయాన్ని గ్రహించి, ఏ కారణం వల్ల అది సంభవించిందో... అటువంటి మూల కారణాలను నీవు గుర్తించు. కారణం లేకుండగానే ఏదీ సంభవించదు అని గుర్తెరగాలి. నీవు జీవితంలో ఉన్నత ఆÔè యా లకు లోబడి నడచుకున్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమ యంలో నీవు ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి దృష్టిని ప్రక్కకు మళ్ళించకుండా, నీ జీవితాన్ని భక్తి, విశ్వాసాలతో భగవదర్పణ చేసి గడుపు. సదా భగవన్నామాన్ని స్మరించు.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
వర్తమానమే... నిజం!
అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్ -
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్ని ఇన్సెంటివ్గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్లో సెల్ ఫోన్ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్లోని డైమండ్స్ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
సాయపు చేతులు..!
యమదూతలు ఓ మనిషిని తీసుకొచ్చి యమలోకాన యమ ధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ మనిషి ఎంతో దిగాలు ముఖం వేసుకుని నిల్చున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు ఆ మనిషి ఖాతాను తరచి చూస్తున్నాడు. అతను ఏం తప్పు చేశాడని యమధర్మరాజు అడిగాడు. చిత్రగుప్తుడు అదే పనిగా అతని గురించి నమోదు చేసిన పేజీలను చదువుతుంటే తలతిరుగుతోంది. అంతా విన్నాడు యమధర్మరాజు.‘అతనిని నరకలోకంలో పడేయండి’ అన్నాడు యముడు. వెంటనే చిత్రగుప్తుడు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ‘అతను అన్ని పాపాలు చేసిన ప్పటికీ ఒకే ఒక్క పుణ్యం చేశాడు. ఓరోజు ఓ వృద్ధురాలు గుడికి వెళ్ళడా నికి దారి అడిగితే చూపుడు వేలుతో దారి చెప్పడమే కాకుండా ఆమె చేయి పట్టుకుని వెళ్ళి దిగబెట్టాడు’. ఆ మాటతో యముడు తన తీర్పుని అప్పటికప్పుడు మార్చు కున్నాడు. ‘అతని చేతికి గంధం పూసి ముందుగా స్వర్గానికి తీసుకుపోండి. అనంతరం అతనిని నరకానికి తరలించవచ్చు’ అని ఆదేశించాడు.కర్ణుడు వంటి పుణ్యాత్మునికీ మరణానంతరం ఓ సమస్య ఎదురయ్యింది. ఆయన మహాదాత. అయితే ఆయన ధన రాశులను, వస్తువులనే ఇచ్చాడు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చిన చరిత్ర ఆయనకు లేదు. నిర్యాణానంతరం కర్ణుడు స్వర్గానికే వెళ్లాడు. స్వర్గానికి వెళ్ళే వారికి ఆకలి అనేది ఉండదు. కానీ కర్ణుడికి ఆకలి వేసింది. ఓమారు కర్ణుడు ‘నాకు మాత్రమే ఎందుకు ఆకలి వేస్తోంది’ అని స్వర్గ లోక ద్వార పాలకుని అడిగాడు. అప్పుడతను ‘నువ్వు భూలోకంలో ఎవరికీ అన్నదానం చేయలేదు. అందుకే నీకు ఆకలి వేస్తోంద’ని చెప్పాడు. ‘మరిప్పుడు ఏం చేయాలి. ఆకలి ఎక్కువై భరించలేకపోతు న్నాను’ అన్నాడు కర్ణుడు. వెంటనే ద్వారపాలకుడు ‘కర్ణా, నీ చూపుడు వేలుని నోట పెట్టుకో. ఆకలి తగ్గిపోతుంది’ అన్నాడు. కర్ణుడు అలాగే చేశాడు. ఆకలి పోయింది. ఇందుకు కారణమేమిటి?ఓసారి కృష్ణుడి సన్నిహితులకు కర్ణుడు అన్నం తినడానికి ఓ చోటును తన చూపుడు వేలుతో చూపించాడట. అది కాస్తా ఓ పుణ్య కార్యంగా కర్ణుడి ఖాతాలో జమైంది. పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న ఇటువంటి కథలను నమ్మవచ్చా, అసలు స్వర్గ–నరకాలు ఉన్నాయా అంటూ చర్చోప చర్చలు ఇక్కడ అనవసరం. మనిషిగా పుట్టినవాడు సాటి మనిషికి సాయం చేయడం అతడి కనీస ధర్మం అని తెలియచేయడానికి ఇటువంటి కథలు వాహకాలుగా నిలుస్తాయి. మానవ విలువలను ప్రోది చేసే భారతీయ తత్త్వం సర్వదా ఆచరణీయం. – యామిజాల జగదీశ్ -
సుగుణ భూషణుడు... విభీషణుడు!
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అది... క్షీరసాగరమథనం!
మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంత్రి ఎన్నిక! చంద్రగిరి రాజ్యాన్ని..
చంద్రగిరి రాజ్యాన్ని విజయసింహుడు పాలించేవాడు. కొంతకాలంగా మంత్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో కొత్త మంత్రిని ఎన్నిక చేయాలనుకున్నాడు. అందుకు ఓ ప్రకటన చేయించాడు రాజు. అన్ని ప్రాంతాల నుంచి సుమారు పాతిక మంది దాకా మంత్రి పదవి పోటీకి వచ్చారు. వారికి నిర్వహించిన పోటీలలో గెలిచి చివరకు ధర్మయ్య, శివయ్య, సీతయ్య అను ముగ్గురు మిగిలారు. ‘వారిలో ఎవరు మంత్రి పదవికి సరిపోతారు?’ అని న్యాయనిర్ణేతను అడిగాడు రాజు. ‘ఆ ముగ్గురు మాసానికి ఎంత జీతం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నిర్ణయిద్దాం మహారాజా’ అని చెప్పాడు న్యాయనిర్ణేత.మొదటగా ధర్మయ్యను అడిగాడు రాజు ‘నీకు మాసానికి ఎంత జీతం కావాలి?’అని. ‘మహారాజా! నాకు మాసానికి పది వరహాలు కావాలి’ చెప్పాడు ధర్మయ్య. అలాగే మిగిలిన ఇద్దరినీ అడగగా శివయ్యేమో ఎనిమిది వరహాలు కావాలని, సీతయ్యేమో ఆరు వరహాలు చాలని చెప్పారు.ముగ్గురి జవాబులు విన్న తరువాత ‘ధర్మయ్యా.. నీకు కాస్త ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. మాసానికి పది వరహాలు అడిగావు. అవతల ఇద్దరేమో రెండేసి వరహాలు తగ్గించి చెప్పారు’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాకు ఈ మధ్యనే వివాహం అయ్యింది. నా తల్లిదండ్రులు నా మీదే ఆధారపడి ఉన్నారు. వారిని చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే. కుటుంబ పోషణ, ఇంటి అద్దె ఇవన్నీ పోనూ ఒక వరహా అటూ ఇటూగా మిగులుతుంది. అప్పు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంది. నేను కోరింది న్యాయమైన జీతం’ బదులిచ్చాడు ధర్మయ్య.‘నువ్వు రెండు వరహాలు తగ్గించి ఎనిమిది వరహాలని ఎలా చెప్పావు?’ అని శివయ్యను అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ వివాహం అయ్యింది, తల్లిదండ్రులూ ఉన్నారు. ఖర్చుదేముంది ఎంతైనా పెట్టవచ్చు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. అందుకే ఎనిమిది వరహాలే చెప్పాను’ చెప్పాడు శివయ్య. ‘నువ్వు కూడా మరో రెండు వరహాలు తగ్గించి ఆరు వరహాలే చెప్పావు. వివరణ ఇవ్వు’ అని సీతయ్యనూ అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది. ఎలాగోలా సర్దుకుంటాను. అందుకే ఆరు వరహాలు చాలు అన్నాను’ చెప్పాడు సీతయ్య.‘నువ్వేవిధంగా సేవలు అందిస్తావు?’ అడిగాడు ధర్మయ్యను న్యాయనిర్ణేత. ‘న్యాయపరంగా రాజుగారికి సలహాలు ఇవ్వడం, అవినీతి, లంచగొండితనానికి చోటు లేకుండా, ధర్మమార్గంలో నడుస్తూ అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తాను’ అన్నాడు ధర్మయ్య. శివయ్య, సీతయ్యలనూ అదే ప్రశ్న అడిగాడు న్యాయనిర్ణేత. తామూ మంచి దారిలోనే సేవలు అందిస్తామని చెప్పారు వారు.‘మహారాజా! ధర్మయ్య కోరింది న్యాయమైన జీతం. తక్కువ జీతం కోరిన శివయ్య, సీతయ్యలు కొలువు వస్తే చాలు అనే పద్ధతిలో రెండు వరహాలు తగ్గించి చెప్పారు. మంత్రి పదవి వచ్చాక కోటలో, బయట ఆ పదవికి భయపడే వారు ఎక్కువ. పక్కదారి పట్టి లంచాలు తీసుకుంటారు. కనుక ధర్మయ్యకే మంత్రి పదవి ఇవ్వండి’ అన్నాడు న్యాయనిర్ణేత.‘ధర్మయ్యా! మంత్రి పదవి నీకే ఇస్తున్నాను. చక్కగా కొలువు చేసుకో!’ చెప్పాడు రాజు. ‘మహారాజా! చాలా సంతోషం.. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఆ క్షణమే నా ఉద్యోగం నుంచి తొలగిపోతాను’ అన్నాడు ధర్మయ్య. చెప్పినట్టుగానే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ తన పేరును సార్థకం చేసుకున్నాడు ధర్మయ్య.ఇవి చదవండి: ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి.. -
Dr Vikram Raju: సనాతనమే.. సమాధానం!
సాక్షి, సిటీబ్యూరో: నిద్రలేమి నుంచి నిలకడ లేమి దాకా ఆధునిక సమస్యలన్నింటికీ సనాతనం సమాధానం చెప్పింది అంటున్నారు నగరానికి చెందిన ఇండియన్ వేదిక్ స్కూల్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. విక్రమ్రాజు.. కఠినమైన గణితం నుంచీ సంక్లిష్ట మానవ సంబంధాల దాకా విడమరిచి చెప్పాయనే పురాణాలను, శాస్త్రాలను స్తుతిస్తారు. ఆధునికులకు వాటిని అందించడం అంటే సమస్యల నుంచి విముక్తి కల్పించడమే అంటున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా తాను 2017లో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి కృషి చేసి సులభంగా అర్థమయ్యే రీతిలో వందలాది పుస్తకాలను, మెటీరియల్ను రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందిన ఈ పుస్తకాలు వచ్చే నెల్లో పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచుకున్నారిలా...దశావతారాన్ని మించిన మానవ పరిణామక్రమ సిద్ధాంతం లేదు. దీని ఆధారంగా మానవ పరిణామ క్రమానికి సంబంధించి 50 థియరీల పుస్తకంతో సహా విభిన్న కేటగిరీల్లో 150 బుక్స్ రూపొందించాం. ఆన్లైన్లో ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్లో 25 రకాల ప్రీ రికార్డెడ్ కోర్సులు తెలుగులో ఉండగా, కొన్ని ఇంగ్లిష్లో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు.‘చిరు’నవ్వుల యోగం..ఆరేళ్ల చిన్నారికి ఎలాంటి యోగా నేర్పాలి? ఎవరికీ తెలియని పరిస్థితిలో 1 నుంచి 10వ తరగతి దాకా ఉపయోగపడేలా యోగా, చక్రాస్, ముద్రాస్, ధ్యాన విశేషాలతో బుక్స్ తయారు చేశాం.వేదం.. నిత్యజీవన నాదం..వేదాలు, పురాణాలను సరిగా అర్థం చేసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో చిక్కుముళ్లు విడిపోతాయి. అయితే నేటి చిన్నారులకు ఇవేవీ అందుబాటులో లేవు. అందుకే రుగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం వంటివన్నీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం.మన గణితం.. ఘన చరితం..ప్రస్తుత ఇంగ్లిష్, మ్యాథ్స్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళితే.. వేదిక్ మ్యాథ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం. ఒక నిమిషం çపట్టే గణిత సమస్యను, వేదిక్ మ్యాథ్స్ వల్ల ఒక సెకనులోనే చేసేయవచ్చు. అందుకే క్లాస్–1 నుంచి క్లాస్–8 వరకూ ఈ కోర్సు మెటీరియల్ తయారు చేయించాం.పురాణం.. ఆభరణం.. మొత్తం 18 పురాణాలు క్లుప్తీకరించి ఒక్కొక్కటి 100 పేజీల చొప్పున చేయించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహాభారతం కథ దశరథుడితో ప్రారంభమైతే, మేం అంతకన్నా ముందున్న బ్రహ్మ నుంచి స్టార్ట్ చేశాం. అలాగే రాముడు 81వ రాజు ఆయన కన్నా ముందున్న గొప్ప రాజుల గురించి కూడా ఇచ్చాం. మహాభారతంలో కౌరవ పాండవుల భాగం కన్నా ముందున్న కథని కూడా కలిపి అందిస్తున్నాంమెటీ‘రియల్’ వర్క్ మొదలైంది..పలు ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఈ మెటీరియల్ అందుబాటులోకి తేవాలని ప్రయతి్నస్తున్నాం. ఆన్లైన్లోనూ అందుబాటులోకి తెచ్చాం. ఇవి చదివిన వారికి పరీక్ష నిర్వహించి పొట్టి శ్రీరాములు వర్సిటీ వారి సర్టిఫికెట్ అందిస్తున్నాం. చిన్నారులకు యోగా నేర్పేందుకు సెట్విన్తో కూడా ఒప్పందం చేసుకున్నాం.సహకరిస్తే.. సాధిస్తాం.. ప్రభుత్వం స్పందించి సహకారం అందిస్తే దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో భారీగా వేదిక్ స్కూల్ క్యాంపస్ పెడదాం అనుకుంటున్నాం. సీబీఎస్ఈ సిలబస్తో పాటు ప్రతి రోజూ 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకూ యోగా, వేదిక్ మ్యాథ్స్, వేదిక్ సైన్సెస్.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, క్రీడలు, వేదాలు ఒకే క్యాంపస్లో నేర్చుకుంటే భావితరం దృక్పథం చాలావరకూ మారిపోతుంది. కనీసం 100 మంది నిరుపేద చిన్నారులకు ఉచిత ఆశ్రయమిచ్చి ఆ తర్వాత వారినే అక్కడ టీచర్లుగా తయారు చేయాలి.. ఇలాంటి ఆలోచనలతో మా ఫౌండేషన్ పనిచేస్తోంది.బొమ్మరిల్లు.. కొత్తగా..మన చిన్నప్పుడు బొమ్మరిల్లు ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. మేం గత 2012లో బొమ్మరిల్లు పబ్లికేషన్స్ను సొంతం చేసుకున్నాం. ఆ కథల రీతిలో నైతిక విలువలు జొప్పించిన పురాణేతిహాసాల్లోని కథలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. అలాగే ముఖ్యమైన దేవతలు 50 మంది గురించి సింప్లిఫై చేసి 100 పేజీల్లో రాయించాం. -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
Shri Krishna Janmashtami: కృష్ణం వందే జగద్గురుం!
బాల్యంలో వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు. మన్నుతిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించినవాడు. బృందావనంలో వేణుగానం వినిపిస్తూ, గోపికలను రాసలీలలతో అలరించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ నెరవేర్చినవాడు. కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని, యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు. భగవద్గీతను బోధించినందున గీతాచార్యుడిగా, జగద్గురువుగా భక్తుల పూజలు అందుకొనే శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయన జగన్నాథుడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. శ్రీకృష్ణుడి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. మన దేశంలో బృందావనం, మథుర, ద్వారక సహా పలు శ్రీకృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి వేలాదిగా ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, విదేశాల్లోనూ శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విదేశాల్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాల విశేషాలు మీ కోసం...శ్రీకృష్ణుడి ఆరాధాన ప్రాచీనకాలంలోనే విదేశాలకు పాకింది. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలోనే ప్రాచీన గ్రీకులు శ్రీకృష్ణుడిని వాసుదేవుడిగా, దేవాదిదేవుడిగా కొలిచేవారు. గ్రీకు రాయబారి హిలియోడారస్ క్రీస్తుపూర్వం 113 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని విదిశా నగరంలో ఒక గరుడస్తంభాన్ని నాటించాడు. ఈ రాతి స్తంభంపై బ్రహ్మీలిపిలో ‘వాసుదేవుడు దేవాదిదేవుడు’, ఆయన అడుగుజాడలైన ఆత్మనిగ్రహం, జ్ఞానం, దానం అనుసరించడం వల్ల స్వర్గాన్ని చేరుకోవచ్చు’ అని రాసి ఉంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రస్తుతం ‘ఇస్కాన్’ శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్వహిస్తోంది.మన పొరుగు దేశాల్లో కృష్ణాలయాలు..బ్రిటిష్ పాలనలో ఒకటిగా ఉండి తర్వాత విడిపోయిన మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలలోను, నేపాల్లోను కృష్ణాలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే కృష్ణాలయాలతో పాటు కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. దినాజ్పూర్లోని ‘కళియా జుయె’ ఆలయం, జెస్సోర్లోని రాధాకృష్ణ మందిరం, పాబ్నాలోని జగన్నాథ ఆలయం బంగ్లాదేశ్లోని పురాతన కృష్ణాలయాల్లో ప్రముఖమైనవి. పాకిస్తాన్లోని క్వెట్టా, రావల్పిండి, హరిపూర్, ఫతేజంగ్ తదితర చోట్ల పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి. లాహోర్లో 2006లో కొత్తగా కృష్ణాలయాన్ని నిర్మించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అక్కడి ప్రభుత్వ అనుమతితో కొత్తగా కృష్ణాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పాటన్, నవల్పరాసీ, రాజ్బిరాజ్ తదితర ప్రాంతాల్లో పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి.ఖండ ఖండాంతరాల్లో కృష్ణాలయాలుమన పొరుగు దేశాల్లోనే కాకుండా, ఆసియా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్లో అక్కడ స్థిరపడిన తమిళులు నిర్మించిన కుయిల్ శ్రీకృష్ణాలయం, పెనాంగ్లో శ్రీకృష్ణాలయం, రాధాకృష్ణాలయం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి. సింగపూర్లో 1870 నాటి శ్రీకృష్ణాలయం ఉంది. దీనిని సింగపూర్ ప్రభుత్వం జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణంగా గుర్తించింది. మయాన్మార్లో రాధామండలేశ్వర ఆలయం, థాయ్లండ్లో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికే వైష్ణవారాధన ఉండేది. థాయ్లండ్లోని శ్రీథేప్లో పదమూడో శతాబ్ది నాటి వైష్ణవాలయంలో గోవర్ధనగిరి పైకెత్తిన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో స్థిరపడిన భారతీయులు రాధా శ్యామసుందర ఆలయాన్ని నిర్మించుకున్నారు. భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సెయింట్ మాడలిన్ నగరంలోని కృష్ణ మందిరం, డెబె పట్టణంలోని గాంధీగ్రామంలో రాధాకృష్ణ మందిరం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి.బ్రిటన్ రాజధాని లండన్లో కృష్ణయోగ మందిరం, రాధాకృష్ణ ఆలయాలతో పాటు లివర్పూల్, మాంచెస్టర్, ఓల్డ్హామ్, స్వాన్సీలలో రాధాకృష్ణ ఆలయాలు, గ్లోస్టర్షైర్, ష్రాప్షైర్, కాన్వెంట్రీ, డుడ్లీ, శాండ్వెల్, బోల్టన్లలో కృష్ణ మందిరాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవే కాకుండా, బ్రిటన్లో పలుచోట్ల కృష్ణారాధన జరిగే ‘ఇస్కాన్’ మందిరాలు, స్వామినారాయణ్ మందిరాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయిజ్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో హరేకృష్ణ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైదిక సంస్కృతీ కేంద్రం కూడా పనిచేస్తోంది. హాల్బ్రూక్లో ‘బ్రజమందిర్’ పేరిట కృష్ణాలయం ఉంది. ఆస్టిన్లో రాధామాధవధామ్ ఆలయం, మిల్క్రీక్ సాల్ట్లేక్ సిటీలో కృష్ణాలయం, స్పానిష్ఫోర్క్లో రాధాకృష్ణాలయం, మిల్వాకీలో రాధామాధవ మందిరంతో పాటు పలుచోట్ల ‘ఇస్కాన్’ నిర్వహిస్తున్న కృష్ణాలయాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్లి స్థిరపడిన హిందువులు ఎక్కువగా నివసించే గల్ఫ్ దేశాల్లోనూ కృష్ణాలయాలు దుబాయ్లో ‘శ్రీకృష్ణ హవేలి’, బహ్రెయిన్లో శ్రీనాథ ఆలయం, ఓమన్లో శ్రీకృష్ణాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో హరేకృష్ణ ఆలయంతో పాటు పలుచోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని మార్ల్బ్రోలో, శాండ్టన్లలో రాధేశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.ఇవే కాకుండా, ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కృష్ణాలయాలు ఉన్నాయి. అలాగే స్వామినారాయణ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు దేశ విదేశాల్లోని ఇతర వైష్ణవ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. -
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం?
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం, వైష్ణవాలయాల్లో, వైష్ణవుల నిత్య పూజల్లో దేశ విదేశాలలో ప్రతిరోజూ కొన్ని లక్షలసార్లు వినబడుతుంది. శ్రియః కాంతాయ (శ్రీదేవి వల్లభుడైన స్వామికి), కల్యాణ నిధయే (సమస్త కల్యాణ గుణాలకూ నెలవైన స్వామికి), నిధయే అర్థినామ్ (ప్రార్థ నలు చేసే అర్థి జనానికి పెన్నిధి అయిన స్వామికి), శ్రీ వేంకటనివాసాయ (శ్రీ వేంకటాద్రి నివాసుడికి), శ్రీనివాసాయ (లక్ష్మీ నివాసు డైన స్వామికి) మంగళమ్ (మంగళమగుగాక)! వేంకటేశ్వర సుప్ర భాతంతో పాటు రోజూ వినిపించే మంగళ ఆశాసన శ్లోకాల్లో ప్రప్ర థమ శ్లోకం ఇది. ఈ మంగళాశాసన శ్లోకాలు రచించిన ధన్యుడు 14వ శతాబ్దంలో జీవించిన ప్రతివాది భయంకర అన్నంగరాచార్యు లవారు అనే విద్వన్మణి. మనోహరమైన భావా లను, మధురమైన పదాలతో పొదిగి చెప్పే ఈ శ్లోకాలు ఆస్తికులకు సుపరిచితాలు.ఒక శ్లోకం... లక్ష్మీ– సవిభ్రమ – ఆలోక – సుభ్రూ విభ్రమ – చక్షుషే (లక్ష్మీదేవిని సంభ్ర మంతో కుతూహలోత్సాహాలతో రెప్పలారుస్తూ చూస్తున్నప్పుడు ముచ్చట గొలిపే కనుబొమల కదలికలు కలిగిన వాడినిగా వేంకటేశ్వరుడిని వర్ణిస్తే; మరొక శ్లోకం... సర్వావయవ సౌందర్య/ సంపదా, సర్వచేతసామ్/ సదా సమ్మోహనాయ (సకల అవయవ సౌందర్య సంపద చేత, సర్వ ప్రాణులకూ సదా సమ్మో హనకారుడు)గా ఆయనను అభివర్ణిస్తుంది. శ్రీ వేంకటాద్రి శృంగ అగ్రానికి మంగళకరమైన శిరోభూషణంగా నిలిచిన స్వామిని మరొక శ్లోకం కొనియాడింది.వైకుంఠం మీద విరక్తి కలిగి, తిరుమల క్షేత్రంలో స్వామి పుష్క రిణి తీరంలో స్వామి, లక్ష్మీదేవితో విహరిస్తున్నాడని ఒక శ్లోకం చమ త్కరిస్తే, భక్త పురుషులకు తన పాదాల శరణ్యత్వాన్ని, స్వామి స్వయంగా తన దక్షిణ హస్తం ద్వారా చూపుతున్నాడని మరొక శ్లోకం ఉత్ప్రేక్షిస్తుంది. ఈ మంగళాశాసన శ్లోకాల విశేష ప్రాచుర్యా నికి వాటి అసాధారణ సౌందర్యమే కారణం. – ఎం. మారుతి శాస్త్రి -
అసలైన ప్రార్థన అంటే?
మన శాస్త్రాల్లో సాధకులకు ఉపయోగపడే వందల కొలది మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వేల కొలది బోధకులు ఉన్నారు. మన సంప్రదాయాలను అనుసరించి భగవంతునికి కోట్లాది రూపాలున్నాయి. సాధకులు తమ మార్గాలను, గురువులను, వారు పూజించు దేవుళ్ళను మార్చుకోవడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం సరైనదే కావచ్చు, కాకపోనూ వచ్చు. కానీ లక్ష్యాలను చేరుకోవడానికి వారు చూపించే ఉత్సాహం మెచ్చుకోతగింది. అటువంటివారి దృష్టి అంతా ఎల్లప్పుడూ ఆదర్శమార్గం, ఆదర్శ గురువు, ఆదర్శప్రాయమైన భగవత్ స్వరూపం పైననే ఉంటుంది. వారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ, ప్రయాణం మాత్రం అంతరాత్మ లోనికే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.గురువులందనూ బోధించే సత్యం ఒకటే. భగవంతుని ఏ స్వరూపంలో పూజించినప్పటికీ, అది సర్వేశ్వరుని పూజించినట్లే. వారు ఎంచుకొనే మార్గం, అనుసరించే గురువు, ఆరాధించే భగవత్ స్వరూపం... ఇవన్నీ సాంకేతికంగా భగవంతుని సూచిస్తాయి. నీవు నీ మార్గాన్ని గంభీరంగా, భక్తిపూర్వకంగా నిశ్చిత బుద్ధితో అనుసరించడమే ముఖ్యం. ప్రపంచంలోని అన్ని మతాలవారికీ ప్రార్థన ఉంది. అయితే చేసే విధానాలు విభిన్నంగా ఉండవచ్చు. కాని ఇది అందరికీ ముఖ్యమైనది. కేవలం మానవులకు మాత్రమే ప్రార్థన అనేదాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. ప్రార్థన చాలా శక్తిమంతమైనది. మనకు ఆపదలు, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుని ప్రార్థిస్తాం.దీనిలో నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించడం అలవరచుకోవాలి. వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం, ఆత్మవికాసమే ప్రార్థన ముఖ్య ఉద్దేశాలుగా ఉండాలి. భౌతిక అవసరాలను లేక కోరికలను తీర్చు కోవడానికి భగవంతుని ప్రార్థించకూడదు. కాబట్టి నీవు చేసే ప్రార్థన బంధ విముక్తి కోసం చేయాలి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆ దేవదేవుని మరచిపోకుండా ఉండేట్లు ఉంచమని ఆయననే ప్రార్థించాలి. కొన్ని విషయాలు మనకు సంతోషం కలిగించవు. అందువలన బాధ కలుగుతుంది. అటువంటి విషయాలను ప్రార్థన ద్వారా దేవుని అడుగరాదు. అదే నిజమైన ప్రార్థన. నీ ప్రార్థన భగవంతుని నియమానుసారానికి లోబడి ఉండాలి. అందుకు తగినట్లు నిన్ను నీవు మలచుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
శోక జీవితం నిరాశామయం!
కష్టాలలో పడి బాధలను అనుభవిస్తున్న మనిషికి తన చుట్టూ చోటుచేసుకుంటున్న సుఖ సంతోషాలను గురించిన స్పందన, కాలం గడిచే కొద్దీ తగ్గిపోయి, చివరకు దాదాపుగా నశించిపోతుంది. బతుకంతా కష్టంతోనే కూడుకున్నట్లుగా కనబడి అంతులేని నిరాశకు, అయోమయానికి గురిచేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ విపరీత మానసిక స్థితిని ఎదుర్కొనని మనిషి దాదాపుగా ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. ఈ విపరీత మాన సిక స్థితిని ఒక సరసమైన సన్నివేశంలో చెప్పాడు కనుపర్తి అబ్బయామాత్యుడు ‘కవిరాజ మనోరంజనము’ కావ్యం ద్వితీయాశ్వాసంలో.మానవలోకంలో చంద్రవంశానికి చెందిన ప్రభువైన పురూరవుడిని ప్రేమించింది దేవేంద్రుడి సభలో నర్తకియైన ఊర్వశి. అయితే, లోకాలు వేరైన కారణంగా, పురూరవుడితో సాంగత్యాన్ని ఎలా పొందాలో తెలియని అవస్థలో పడింది. అలా పురూరవుడి ధ్యాసలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సర్వమూ మరిచి దుఃఖిస్తూ ఉన్న స్థితిని ఇలా వర్ణించాడు అబ్బయా మాత్యుడు.'పువ్వులు మానె దావి మెయిపూతలు మానె సఖీజనంబుతో నవ్వులు మానె గీరవచన ప్రతిభాషలు మానె మానె దానెవ్వియు నింపుగాక సుఖహేతువు లెల్ల మనోజబాధ నాజవ్వని ‘దుఃఖితే మనసి సర్వమసహ్యమ’ నంగ లేదొకో'పూవులు పెట్టుకోవడం మానేసింది; సుగంధ పరిమళాలు వెదజల్లే లేపనాలను శరీరంపై రాసుకోవడం మానేసింది; తోటివారితో నవ్వులు మానివేసింది; సరస మైన సంభాషణలతో సమాధానాలను మానివేసింది; ఈ శోకం కారణంగా, ఒకప్పుడు ఆహ్లాదంగా అనిపించినవి అన్నీ ఇప్పుడు సుఖం ఇచ్చేవిగా కనుపడడంలేదు ఊర్వశికి. భరింపరాని దుఃఖంలో మునిగిపోయిన మనిషికి లోకంలో అంతా దుఃఖమయంగానూ, సహింపరానిదిగానూ కనపడడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు కదా! అని పై పద్యం భావం. శోకంలో మునిగివున్న మనిషికి సర్వమూ సహింపరానిదిగా కనబడుతుందన్నది స్వతహాగా అనుభవించకపోయినప్పటికీ అందరూ గ్రహించగలిగే సంగతే! కష్టమే అయినప్పటికీ ప్రయత్నం చేసి శోకంలోంచి ఎంత త్వరగా బయటపడితే అంతగా మేలు జరుగుతుందన్నది అందరూ సారాంశంగా గ్రహించవలసిన విషయం. – భట్టు వెంకటరావు -
పులి మెచ్చిన చిత్రం!
సిద్ధారం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏరోజుది ఆరోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు ఆబ్బలేదు. రాసుకోటానికి ఇచ్చిన పుస్తకాలలోని కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాలలోని బొమ్మలు చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయటానికి ప్రయత్నించేవాడు.దాంతో చుట్టు పక్కలవాళ్లు ‘వీడికి చదువురాదు కానీ, ఏ చిత్రకారుడివద్దయినా చిత్రకళ నేర్పించండి’ అని వాడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. కళ నేర్పించటానికి డబ్బు లేకపోవటంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్ఫలో చక్కని చిత్రకళ దాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలతో ఒక అస్థిపంజరంలా బొమ్మను గీసి దానికి జీవం ఉట్టిపడేలా రంగులు, మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు.రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలు పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు ‘సిద్ధప్పా! రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పని చేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు!’ అని చెప్పాడు.గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేదేమీ లేదని.. తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధారం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి సొంతూరు సిద్ధారానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్దపులి గాండ్రిస్తూ అతని వెంటపడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గుహలోకి దూరి, దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏమిటంటే.. ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజ వణికిపోతూ ‘పులిరాజా! నన్ను విడిచిపెట్టు. నేను చిత్రకారుడిని. చక్కటి రంగులతో ఈ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను’ అన్నాడు.అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి.. తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి ‘సరే’ అంది. భుజానికున్న సంచిలోంచి కుంచె, రంగులు తీసి క్షణాల్లో పులి బొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో ఓర్పులేదు. చిత్రం ఏ కోణంలోనూ నాలాగా లేదు. అసలు నువ్వు చిత్రకారుడివే కాదు’ అంది.‘అయ్యో అలా కోప్పడకు పులిరాజా.. మరొకసారి వేసి చూపిస్తాను’ అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి పది నిమిషాల్లో మరో బొమ్మను వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో అసలు ఏమాత్రం నేర్పు లేదు. అది నా బొమ్మ కానే కాదు’ అంది. చేసేదిలేక మరో అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుడిని మనసులోనే నమస్కరించి, ఎదురుగా ఉన్న పులిని నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి.. వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చటపడింది పులి.‘శభాష్! నువ్వు గొప్ప చిత్రకారుడివే! కాకుంటే నీకు ఓర్పు తక్కువ. ఓర్పు లేకుంటే ఏ కళలోనూ రాణించలేరు’ అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహూకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువును చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకు బంగారు కడియం తొడిగాడు. కొద్దిరోజులకే గొప్పచిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. – కొట్రా సరితఇవి చదవండి: మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు! -
వింధ్యపర్వతాన్ని అణచిన అగస్త్యుడు..
బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు. సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు. మేరువు వైభవం వింధ్యపర్వతానికి అక్కసు కలిగించింది. సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం, దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం, మేరువును గౌరవించే వారెవరూ తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది.నారద మహర్షి ఒకనాడు ఆకాశమార్గాన వింధ్యను దాటుకుని కాశీనగరం వైపు వెళుతుండగా, వింధ్యుడు ఆయనను పలకరించి, ‘మహర్షీ! మా పర్వతాల్లో మేరువు గొప్పా? నేను గొప్పా?’ అని అడిగాడు. ‘ఇద్దరూ ఉన్నతులే! ఎవరి గొప్ప వారిదే!’ అని పలికి, నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు. నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు.ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి, ‘ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు. నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం? నీకిది ఏమైనా మర్యాదగా ఉందా?’ అని నిలదీశాడు. ‘సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే, జీవులకు మనుగడ అసాధ్యం’ అన్నాడు సూర్యుడు.సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింధ్యుడు ‘లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి. రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు’ అని హుకుం జారీ చేశాడు.‘అయ్యా! నేనేమీ చేయలేను. మేరుపర్వతం మహోన్నతమైనదే కాదు, సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది’ అంటూ సూర్యుడు చక్కా పోయాడు.అహం దెబ్బతిన్న వింధ్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనను తాను అంతకంతకూ పెంచుకుని, ఆకాశానికి అడ్డుగా నిలిచాడు. ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్యుడి విశ్వరూపం చూసి, దేవతలకు దిక్కు తోచలేదు. వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు.లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు. వెంటనే దేవతలను వెంటపెట్టుకుని, అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. వింధ్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి, ‘మహర్షీ! ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి’ అని ప్రార్థించాడు. ‘మరేమీ భయం లేదు. వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు. ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాక, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్యపర్వతం దిశగా బయలుదేరాడు. దేవతలు, మహర్షులు పట్టించుకోవడం మానేసిన తనవైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి, వింధ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి.‘మహర్షీ! నా జన్మ ధన్యమైంది. నేను తమ వద్దకు రాలేనని ఎరిగి, నా జన్మ పావనం చేయడానికే మీరిలా తరలి వచ్చినట్లున్నారు. మీకు ఏవిధంగా సేవ చేయగలనో ఆదేశించండి’ అంటూ అగస్త్యుడి ముందు మోకరిల్లాడు వింధ్యుడు.‘ఓ పర్వతరాజా! నేను అత్యవసరమైన పని మీద దక్షిణ దిశగా వెళుతున్నాను. నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు. అసలే పొట్టివాణ్ణి. నువ్వు కాస్త తలవంచి తగ్గావంటే, ఏదోలా నిన్ను దాటుకుని దక్షిణాపథం వైపు వెళతాను’ అని పలికాడు అగస్త్యుడు.‘ఓస్! అదెంత పని!’ అంటూ వింధ్యుడు తలవంచి, పూర్తిగా మోకరిల్లాడు.వింధ్యుడు శిరసు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు. ‘పర్వతరాజా! నాది మరో విన్నపం. పని పూర్తయ్యాక నేను ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే, నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను’ అన్నాడు. మాట నిలబెట్టుకోవడానికి వింధ్యుడు తలవంచుకుని అలాగే ఉండిపోయాడు. అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు. వింధ్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణచాడు. – సాంఖ్యాయన -
అంతా.. అర్థం చేసుకోవడంలోనే..!
శ్రీ రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పారు. అది ఇలా సాగుతుంది:‘‘ఊరి పొలి మేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులనేకమంది. ఒకరోజు వారందరినీ కూర్చో పెట్టి... ‘ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. దానిని మీరు అర్థం చేసుకుని నమస్కరించాలి’ అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు.ఓరోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలు దేరాడు. ఇంతలో ‘ఎవరెక్కడున్నా సరే పారిపోండి... మదమెక్కిన ఏనుగొకటి వస్తోంది. దాని కంట పడకండి’ అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడా ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారూ, అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా ‘నేనెందుకు పరుగెత్తాలి... నేనూ దేవుడు, ఆ ఏనుగూ దేవుడే! ఇద్దరం ఒక్కటే... ఏనుగు నన్నేం చేస్తుంద’నుకుని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తోంది.కానీ అతను ఉన్న చోటనే నిల్చున్నాడు. చేతులు రెండూ పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగుమీదున్న మావటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిగా భావించవచ్చు. కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా! అతను చేతులు రెండూ పైకెత్తి నిల్చోడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్ట చుట్టి కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి.విషయం తెలిసి ఆశ్రమానికి చెందినవారు అక్కడికి చేరుకుని కింద పడి ఉన్న అతనిని అతికష్టం మీద గురువుగారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగినదంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు ‘నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా! అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పు కోమని! ఆ మాటైనా పట్టించుకోవాలి కదా’ అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. ‘వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల వచ్చిన ప్రమాదమిది’ అంటూ గురువుగారు కథ ముగించారు.’’ – యామిజాల జగదీశ్ -
సమయోచిత జ్ఞానమే.. వివేచన!
వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు."పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ, మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.బెర్ట్రాండ్ రసెల్.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి. ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి -
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు -
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
నాన్న మాటల్లోని జీవిత సత్యం.. బోధపడిన ప్రవీణ్ ఆనాటి నుంచి..
వీరయ్య ఒక పేదరైతు. తనకున్న రెండెకరాల పొలంలో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్. కొడుకును బాగా చదివించి, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని వీరయ్య ఆశ. తనలా తన కొడుకు కష్టాలు పడకూడదు అనుకునేవాడు. చదువుకు తన పేదరికం అడ్డుకాకూడదని తల తాకట్టుపెట్టయినా కొడుకును చదివించాలని దృఢనిశ్చయానికి వచ్చాడు వీరయ్య. కొడుకును పట్నంలో మంచి బడిలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకుని మంచి మార్కులు సంపాదించాడు ప్రవీణ్. స్నేహితులు కూడా పెరిగారు.వాళ్లంతా చెప్పుల నుంచి బట్టల వరకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులనే వాడేవారు. వారిని చూసి ప్రవీణ్ కూడా తనకూ అలాంటి బ్రాండెడ్ వస్తువులు కావాలని తండ్రిని వేధించసాగాడు. దానికి వీరయ్య ‘చూడు నాయనా.. వారు ధనవంతుల బిడ్డలు. ఎలాగైనా ఖర్చుపెట్టగలరు. నీ చదువుకే నా తలకు మించి ఖర్చుపెడుతున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివికావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి’ అని నచ్చజెప్పాడు. అయినా కొడుకు చెవికెక్కించుకోలేదు. పైపెచ్చు స్నేహితుల తల్లిదండ్రులు.. వాళ్లకేది కావాలంటే అది కొనిస్తున్నారు, పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. తనకు మాత్రం తన తండ్రి ఏ సరదా తీర్చడం లేదని అలిగాడు ప్రవీణ్. ఫలితంగా చదువు మీద దృష్టిపెట్టక వెనుకబడిపోయాడు.ఒకసారి.. దసరా సెలవులకు ప్రవీణ్ వాళ్ల అక్క పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. ఒకరోజు ఆ పిల్లలు మట్టితో బొమ్మరిల్లు కట్టి ఆడుకోసాగారు. ఆ ఇల్లు మీద సూట్కేసులు పెద్దపెద్ద బరువైన వస్తువులు పెడదామని చూసింది చిన్నమ్మాయి. పెద్దమ్మాయేమో ‘వద్దు.. మనం అలాచేస్తే బొమ్మరిల్లు కూలిపోతుంది’ అని వారించింది. అయినా చిన్నమ్మాయి వినకుండా ‘ఏమీ కాదు.. తాతగారింటి డాబా మీద పెద్దపెద్ద వస్తువులు పెట్టడం లేదా.. అలాగే ఈ ఇంట్లోనూ పెట్టుకోవచ్చు’ అంటూ మొండికేసింది. ఇదంతా గమనించిన ప్రవీణ్ ‘మీరు కట్టుకుంది బొమ్మరిలు.్ల ఇది ఆడుకోవడానికే కానీ వాడుకోవడానికి కాదు. అందుకే ఇది పెద్ద వస్తువులను మోయలేదు. తాతగారిల్లు రాళ్లు, ఇటుకలు, ఇనుముతో గట్టిగా కట్టినిల్లు. ఆ ఇల్లు మోసే బరువులను ఈ బొమ్మరిల్లు మోయలేదు. కావాలంటే నీకు బొమ్మ సూట్కేసులు, బ్యాగులు చేసిస్తాను చూడు..’ అని చెప్పాడు. చెప్పినట్టుగానే వెంటనే మట్టితో ఆ బొమ్మలను చేసిచ్చాడు కూడా! వాటిని చూసి చిన్నపిల్ల భలే ముచ్చటపడింది.ఈ తతంగమంతా చూసిన వీరయ్య.. కొడుకుని మెచ్చుకున్నాడు. తర్వాత కొడుకుతో ‘మన పేద బతుకులు కూడా బొమ్మరిల్లు లాంటివే. ఏమాత్రం బరువెక్కువైనా కూలిపోతాయి. మన స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే చితికిపోతాం. ఆ చిన్నపిల్ల తెలియక మారాం చేసింది. నీవు తెలిసి తప్పటడుగులు వేస్తున్నావు’ అంటూ జ్ఞానదోయం చేశాడు. నాన్న మాటల్లోని జీవిత సత్యం బోధపడిన ప్రవీణ్ .. ఆనాటి నుంచి బుద్ధిగా చదువుకోసాడు. – జయరామ్ నాయుడు -
కాని ఈరోజు పొడిచిన సూర్యుడు రోజువారీ కంటే..
ఊరికి దక్షిణాన వున్న మాదిగ గూడెంలో ప్రతిరోజూ సూర్యోదయం ఎర్రగానే వుంటది. కాని ఈరోజు పొడిచిన సూర్యుడు రోజువారీ కంటే కాస్త భిన్నంగా రక్తమోడుతూ పైకి ఎగబాకిండు. దానికి నిశానీగా ఊర్లోని జనమంతా గగ్గోలు పెడుతూ ఆ దిక్కుకే పోతున్నారు. జనం ఆలోచనలు ఒక్కతీర్గ లేవు, కథలు, కథలుగా చెప్పుకుంట గూడెం దారి పట్టింది ఊరు.అది ఊరికి దక్షిణాన వున్న రైతుల చేన్లకు, గూడేనికి పోయే దారి. తెల్లవారు ఝాము నుంచి వచ్చీపోయే జనంతో రద్దీగా వుంది. గూడెంలోని జనం తెల్లారగట్టే లేచి సద్దిమూటలు కట్టుకొని రోజ్గార్ (పనికి ఆహార పథకం) మట్టి పనికి వెళ్ళిపోయారు. ఇళ్ళల్లో పిల్లలు, ముసలాళ్ళు మిగిలారు. గూడెం నిశబ్దంగా వుంది. ఆ నిశబ్దాన్ని ఊరి జనం ‘చేసినకాడికి చేసి, ఏమీ ఎరగనట్టే గుంబనంగా’ వుంది అనుకోసాగారు.మాదిగ గూడెంలోని వాళ్లు రోజు లాగానే పొద్దు పొడవక ముందే నిద్రలేచి పక్షుల్లాగా బతుకుతెరువు వెతుక్కుంటూ పనుల్లోకి పోతారు. వారి శరీరాలు సగం చెమటలో తడిశాకే పొద్దు పొడుస్తది. పొద్దు పొడుపును తీరుబడిగా చూసే ఫుర్సత్ ఎక్కడిది వాళ్ళకి! కడుపు మంట ఆర్పుట్లో ద్యాసే వుండదు. బారెడు పొద్దు ఎక్కాక తెచ్చుకున్న సద్దిబువ్వ మూటను కాళ్ళు బార్లచాపి కూర్చుని మూట విప్పిన టైమ్లో పొద్దు పొడుపు అందం ఏడ కనిపిస్తది! ఆ దిక్కు చూడబోతే ఎండ చిటపటల్తో కండ్లు మూతలు పడుతయై.మాదిగ గూడెం ఖాళీగా నిర్మానుష్యంగా వుంది. డొక్కలు పీక్కబోయి కాల్లీడ్సుకుంట తిరిగే కుక్కలు ఒకటి, రెండు కనిపిస్తున్నాయి. గూడెంలో వాకిళ్ళు ఊడ్సిన జాడ సుత కనిపిస్తలేదు. కావాలని ఇండ్ల ముంగట ఎవరు ముగ్గులు పెడతారింక! ఇళ్ళల్లో మిగిలిన ముసలీముతక, ఊళ్లో మోతుబరి ఆసాములు.. రిపేరు కోసం ఇచ్చిన వూసిపోయిన చెప్పుల గూడలు సరిచేస్తూ కనిపిస్తున్నారు. అదీ ఒక బతుకుతెరువు పనే! పొద్దు ఎర్రగ పొడిచిందో, సప్పగా పోడిచిందో వాళ్ళకేమవుసరం! కీళ్ళ నొప్పులు, కాళ్ళ పీకుడు మీదే ధ్యాస. నాలుగు అంగలు నడిచి ఊళ్ళోకి పోగలిగిన సత్తువ వుంటే చాలు అనుకునేవాళ్ళే! కుట్టిన చెప్పులు దొరల కాళ్ళ దగ్గరికి చేరిస్తే, నాలుగు డబ్బులో, కొన్ని గింజలు విదిలిస్తే చాలు అనుకునేవాళ్ళు వున్నారు. కడుపు మంటను చల్లార్చగలిగితే ఓ సముద్రం ఈదినంత సంతృప్తి. ఊళ్ళోని వార్తలతోని పనిలేని వాళ్ళే గూడెం గుడిసెల్లో మిగిలి వున్నారు.శవం ఒంటి మీద రక్తం అట్టగట్టి నల్లబడి ఎండిపోయింది. ఈగలు జిబ్బున ముసురుతున్నాయి, శవం దొరదైనా, బిచ్చగాడిదైనా ఒకటే వాటికి.. వ్యత్యాసం చూపవు. ఈ పని జరిగి కనీసం నాలుగైదు గంటలు దాటి వుంటుంది అని జనం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మట్లాడుకుంటున్నారు. ‘ఆ అపరాత్రి ఎందుకు బైటికి వచ్చిండో పాపం’ అంటున్నారు. ‘తన పనికోసమైనా సరే.. కూలోళ్లనే ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకునేటోడు.. తనే వెళ్ళాల్సిన పనేం పడిందో’.. అంటూ అనేకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.‘అహే.. నిన్నటి వరకు ఊళ్ళోనే లేడంట, పట్నం పోయిండంట. ఎప్పుడొచ్చిండో మరి.. పొద్దటికల్లా శవమై పోయిండు’, ‘ఎవరన్నా కొట్టిపడేసిన ఆనవాళ్ళు, ఒంటి మీద దెబ్బలు ఏమీ కనిపిస్తలేవు’ అంటూ పోస్ట్మార్టం చేయడం మొదలుపెట్టారు. తలో దిక్కు తోచింది మాట్లాడేసుకుంటున్నారు. ‘పోలీసులకు కబురు అందిందో లేదో?’ ఇంకొకళ్ళ అనుమానం.‘నువ్వు పోయి చెప్పిరాపో’ పక్కనున్నాయన కసురుకున్నాడు.. అనుమానపడిన వ్యక్తిని. పెళ్ళాం, పిల్లలు వచ్చినట్టున్నారు. శవం చుట్టూ చేరి ఏడుస్తున్నారు. జనం వాళ్ళ చుట్టూ మూగారు. ఆయనకిద్దరు అమ్మాయిలు. వయసు çపది..పదిహేనేళ్ళలోపే వుంటుంది. ‘పాపం ఏడ్సుడు సుతొస్తలేదు.. ఎట్ల బతుకుతరో.. ఏమో..!’ విచారం వ్యక్తం చేశారెవరో.కొద్దిసేపటికి ఎస్.ఐ, కొందరు కానిస్టేబుళ్ళతో వచ్చిండు. రావడంతోటే.. శవం చుట్టూ మూగి వున్న జనాన్ని దూరంగా తరిమారు కానిస్టేబుళ్ళు. ఇద్దరు పిల్లలు, ఆమె సన్నంగా ఏడుస్తున్నారు. ఏడుస్తూనే ‘పట్నం నుంచి రాత్రే వచ్చినం. మిర్చి తోటలో కాపలాగాల్లు వున్నరో.. లేదో చూసొస్తాని ఆగమాగం బైలెల్లిండు. వద్దని ఎంత మొత్తుకున్నా చెవినపెట్టలేదు. బయటనే ఇడిసి వున్న చెప్పులల్ల కాళ్ళుపెట్టి ఎల్లిపోయిండు’ ఎడుస్తూ చెప్పింది ఇల్లాలు. మళ్లీ తనే కొనసాగిస్తూ ‘ఇది ఆయనకు మామూలే. ఎప్పట్లాగే చేను కాడికి పోయి వస్తడుగదా అనుకొని పిల్లలు, నేను ఇంట్లనే పడుకున్నం. ఇగో తెల్లారేసరికి ఇట్ల శవమై పడున్నడు’ అని ముక్కు చీదుకుంది.పోలీసులు తమ పనిలో మునిగిపోయారు. ఏడుస్తూనే వాళ్లకు వాంగ్మూలం ఇచ్చింది ఆమె. తనకు ఎవరి మీదా అనుమానం లేదని, ఊర్లో వాళ్ళెవరితోనూ కక్షలు, పాత పగలు లేవని చెప్పింది. తొట్రుపాటేమీ లేకుండా, నింపాదిగా.. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చింది. ఊరి సర్పంచ్ వచ్చిండు. అన్ని పార్టీల పెద్ద మనుషుల సమక్షంలో పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ట్రాక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు.మండలస్థాయి అన్ని పార్టీల లీడర్లు, బంధుబలగం తరలి వచ్చారు. అంత్యక్రియలను సజావుగా జరిపించింది. కర్మకాండలు అన్నీ ఘనంగా ముగిశాయి. ఏ నోట విన్నా వాడి పేరే ట్రోల్ అవుతూ వుంది. ‘ఏమిటో విడ్డూరం భర్తను చంపిన వాడు ఎవరో తెల్సికూడా పేరు బయట పెట్టక పోవడం!’ అని ఊరంతా ముక్కున వేలేసుకుంది.రాత్రి చీకటి చిక్కబడుతోంది.. చంద్రుడు లేని రాత్రి. గూడెం వీధిలోనే వున్న వేపచెట్టు అరుగు మీద శేషు ఒక్కడే కూర్చొని వున్నాడు. అదే పగటి పూటైతే ముసలీ, ముతకా పిల్లాజెల్లా గోలీలు, అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళు. చెట్టు నీడ కింద నిండుగా కూర్చునుండే వారు. రాత్రి కావడం చేత ఆ చెట్టు అరుగు మీద శేషు ఒక్కడే.. తోడుగా పైన కోటానుకోట్ల నక్షత్రాలు.. పక్కన నవ్వుతూ చీకటి ‘నేను లేనా’ అంది. ఆ రోజు పైవాళ్ళు, పక్కనే వుండే చీకటి అంతా వున్నారు.‘ఆరోజు ఏం జరిగింది?’ పైవాళ్లే సాక్ష్యం, మరో పురుగంటూ లేదు. శేషులో రీల్ తిరగటం మొదలయింది. ఆరోజు తను గాఢ నిద్రలో వున్నాడు. ఆ నిద్రను చెడగొడుతూ పక్క గది నుండి గుసగుసల శబ్దం చెవున పడుతోంది. తరచుగా అప్పుడప్పుడు వినే శబ్దమే. తనకు వయసు పెరుగుతున్న కొద్ది ఆ శబ్దం చిరాకు పుట్టిస్తోంది. నిద్దర్లోను.. దీర్ఘంగా నిట్టూర్చి కప్పుకున్న దుప్పటిని పక్కన పడేసి, తలుపులు తెరచుకొని బైటికొస్తూ మళ్ళీ తలుపులు దగ్గరికి చేరవేసి, ఎక్కడిదాకో నడక, తెలియక పోయినా కొద్దిదూరం దాకా నడిచి చెట్ల నీడ కింద వున్న కల్వర్ట్ మీద కూర్చున్నాడు.తను గుర్తెరిగిన దగ్గరి నుంచి ఇంట్లో నడుస్తున్న క్రమం. అమ్మని కట్టడిచేయలేని నిస్సహాయత, అమ్మ అంటే ఆమెకు పెళ్ళి కాలేదు. తనని కన్నందుకు తల్లయింది. తన పెంపకం, చదువు, బట్టలు అన్నీ చూసుకుంటోంది. డిగ్రీ వరకు ఏలోటూ రాకుండా చదివించింది. ఇకపైన కూడా చూస్తుంది.. అనుమానమే లేదు. మొన్నటివరకు తాత రూపంలో కొండంత బలం తోడుగా వుండేది. ఆయన పోయాడు.. తను ఏకాకై పోయాడు. ఇక వచ్చిన ఇబ్బంది సమాజంతోటే. తన మానాన తనని బతకనీయడం లేదు. ఎదురౌతున్న అవమానాలు, ఈసడింపులు, అదుపు చేసుకోలేని, ఓర్చుకోలేని ఉక్రోషం రోజురోజుకీ ఎక్కువైపోతోంది.చాలాసేపు ఆ కల్వర్ట్ మీదనే కూర్చున్నాడు శేషు. ఇక లేచి ఏటో ఒక దిక్కుకు వెళ్లిపోదామని లేచే సమయానికి తను ఇంటి నుంచి నడిచి వచ్చిన దారి గుండా ఎవరిదో నీడ ఇటే వస్తూ కనిపించింది. లేచే ప్రయత్నాన్ని ఆపి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. నీడ రానురాను సమీపిస్తున్నది. నీడను పోల్చుకున్నాడు శేషు. అక్కడి నుంచి లేచి వెళదామనుకున్న వాడు అట్లానే కూర్చుండిపోయాడు.‘ఎంత కాలమిది, ఎంత కాలమిట్లా లేచి పరిగెత్తడాలు?’ ఆలోచనల నిండా వేధించే ప్రశ్నలు. సమాధానం రాబట్టాల్సిందిప్పుడే అనుకున్నాడు శేషు.నీడ ఎదురుగా నిలబడి ‘ఎవడ్రా, ఇక్కడ ఈ చీకట్లో కుర్చోని ఏం చేస్తున్నావ్?’ గద్దించింది. ‘నేనే’ అన్నాడు శేషు.‘నేనే అంటే?’ అంది నీడ. ఆ వెంటనే పోల్చుకొని గుర్తుపట్టి ‘నువ్వా, చీకట్లో ఏం పని, ఇంటికి పో’ అంది.‘ఇంకా ఎంత కాలమిలా’? శేషు నిలదీస్తున్నట్టు అడిగాడు. ఎదురుగా మౌనం. ఏం సమాధానమివ్వాలో తెలియక నిల్చుండిపోయాడు.‘ఎన్ని.. ఎన్నిసార్లు అడగాలి? అమ్మని పెళ్లి చేసుకొని, కొడుకుగా నాకు గుర్తింపు ఇవ్వమని! ఇంకా ఎంతకాలం అవమానాలు భరించాలి?’ అని నిలదీశాడు శేషు.‘అర్ధరాత్రివేళ ఈ మాటలొద్దు, ఇంటికి వెళ్ళిపో!’ అని గట్టిగా గదమాయించబోయాడు. శేషు వినే దశలో లేడు.‘ఏంటి.. వెళ్ళి పోయేది? నాకు ఇప్పుడే సమాధానం చెప్పాలి’ అని నిలదీశాడు. ఇట్లా మాటా, మాటా ఇద్దరి మధ్య పెరిగిపోయింది. ఆ మాటల్లోనే అవతలి నుంచి నన్నే నిలదీస్తాడా అనే కోపంలో శేషును అనరాని మాటలెన్నో అన్నాడు. చాలా చాలా అవమానపరచే మాటలనే జారాడు.‘నువ్వు నా కొడుకువని గ్యారంటీ ఏంటి?’ అన్నాడు. ‘నా అమ్మ’ ధీమాగా చెప్పాడు శేషు.‘రుజువు ఏది? మీ అమ్మ ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగిందో నీకు తెల్సా?’ అన్నాడు.శేషులో కోపం కట్టలు తెగిన ప్రవాహంలా ఉగ్రరూపం దాల్చింది. అంతే ఎదుటి మనిషి భుజాల మీద రెండు చేతులేసి విసురుగా, బలంగా నెట్టి పడేశాడు. ఊహించని దాడిని ప్రతిఘటించి నిలబడలేక వెనక్కి విసిరేసినట్టు వెల్లకిలా పడిపోయాడు. వెనక వున్న మోరీ అంచుకు విసురుగా కొట్టుకుంది తల. వెల్లకిలా పడిపోయిన మనిషి గిలగిలా కాళ్ళు, చేతులు కొట్టుకోవడం చూశాడు శేషు. కాళ్ళు, చేతులు కొట్టుకోవడం ఆగిపోయేంత వరకు నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నాడు. నిర్ఘాంతపోయి నిలుచున్నాడు. క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. తను ఏమి ఆశించాడు, తన ఆవేశం ఏ మలుపు తిప్పింది, తను ఏం కోరుకున్నాడు, చివరికి ఏమైపోయింది! దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖంలోనే ఏటో వెళ్ళి పోయాడు శేషు.గాలి విసురుగా వీస్తోంది. ఆ గాలికి వేపచెట్టు పళ్ళు, పూత కలసి నేల రాలుతున్నాయి. జీవితం కూడా నేలరాలిన పళ్ళలా పిగిలి వగరు, చెదు, తీపి, వెగటు వాసన వేస్తోంది. ముక్కు పుటాలు అదిరి జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడు శేషు. చంద్రుడు ఎప్పుడు పోడిచాడో చల్లటి తెల్లని వెన్నెల భూమంతా పరచుకొనుంది. శేషు చంద్రుడినే చూస్తున్నాడు.. లోలోన ‘చంద్రుడా అన్నీ చూస్తావ్, భలే మౌనం వహిస్తావ్. నీలోని నిబ్బరాన్ని కాస్త ఈ మనుషులకు కూడా పంచరాదు’ అనుకుంటూ విషాదాన్ని, దిగులును మోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు.‘పిలిపిస్తేనే రావాలా?’ అప్పుడు ఇల్లంతా స్వతంత్రంగా తిరిగేదానివి, ఇప్పుడు నా పర్మిషన్ కావాల్సి వచ్చిందా, ఏమిటి?’ నిష్ఠూరంగా అంది. తల్లీ, కొడుకు ఇద్దరూ వచ్చారు. వాకిట్లోనే నిలుచున్నారు. తల్లి, జరిగిందానికి దిగులుతో విచారంగా జీవం చచ్చిన కట్టెలా నిలబడి వుంది. కొడుకు తప్పు చేసిన భావనతో తల దించుకొని నిల్చున్నాడు. ఇంతకు తెగించిన వాడు ఇకముందు ఊరుకుంటాడా? ఆమె ఎందరినో సలహాలు అడిగింది. వారికి తోచిన పరిష్కారాలు సూచించారు. అందరూ తోడుగా వస్తామని, నిలుస్తామని ధైర్యాన్ని నూరిపొశారు. తనకు నమ్మకం కుదురట్లేదు.మళ్ళీ పుండును కెలికినట్టు అవుతుందని అనుకుంది. బజారున పడాల్సి వస్తుంది. పంచాయతీలు, పెద్ద మనుషుల వేడుకోళ్ళు.. ఎదుర్కోగల స్థితిలో వున్నానా అని ఆలోచించింది. అంత శ్రమపడ్డా పరిష్కారం ఏ మలుపు తీసుకుంటుందో.. అనుకూలంగా రాకపోతే? ఇద్దరు పాపల భవిష్యత్తు తన చేతుల్లోవుంది. ఇద్దరినీ చదివించి.. తీర్చిదిద్దాలి. ఈ ఆస్తులన్నీ ఉన్నాయనే ధీమాతో పిల్లల భవిష్యత్తు కోసమే సిటీలో కాపురం పెట్టించాడతను. సంవత్సరం నుంచి భూములు బీళ్ళను తలపిస్తున్నాయి. ఇలా వదిలేస్తే, ఇలానే మిగిలి వుంటాయని గ్యారంటీ లేదు. తనా ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దలేదు. అందుకే రాజీ మార్గాన్ని ఎంచుకుంది. ఈ స్థిరాస్తిని, ఫిక్స్డ్ డిపాజిట్లలోకి మార్చుకోవాలి. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి వాళ్ళని పిలిపించింది. ‘ఏమే, పలకవు?’ రెట్టించింది ఆమె. అవతల మౌనమే సమాధానం. ‘ఇట్రారా..’ అని పిలిచింది.కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు శేషు. దగ్గరికి వచ్చిన వాడి చేతుల్లో కొన్ని కాగితాలు పెట్టింది. ‘ఐదు ఎకరాల మిర్చి చేను, ఈ ఇల్లు నీ పేరున మండల ఆఫీసులో రిజిస్ట్రీ చేయించా. మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినంక ఇందులోకి వచ్చి ఉండండి’ అంది. మళ్ళీ తనే మాట్లాడుతూ.. ‘పూర్వాపరాలు నాకు తెల్సు. ఎంతైనా నువ్వు ఆయనకు పుట్టిన బిడ్డవనే ఇదంతా! అతగాడే చేసుంటే ఇక్కడిదాకా వచ్చుండేది కాదు. ప్రతిసారి అడ్డగించి ధైర్యంగా అడుగుతున్నాడు వాడు. ఎదో ఒకటి చేయడం మంచిదని చెప్పేదాన్ని. ఆ మనిషి వినలేదు. సంబంధం పెట్టుకునేప్పుడే పరువు, ప్రతిష్ఠాని ఆలోచించాలి అని కూడా చెప్పిన. చెవినెక్కించుకోలేదు. నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నీ జీవితం నాశనం చేస్తే ఏమొస్తదనిపించింది. క్షేమంగా బతుకు’ అని దీవించింది.అంచనాకు చిక్కని పరిణామం. శేషు బుర్రకు అర్థంకాలేదు. ఇప్పట్లో అర్థంకాదు కూడా! తల్లి అయోమయానికి గురయింది. నిప్పు మీద నీళ్ళు చిలకరించిన చర్య అనుకుంది. ‘మొత్తం భూములన్నీ అమ్మేయాలని, ఈ రెండూ నీ పేరున రాయించి. నీ హక్కు కిందనే ఇచ్చిన. వాటా కింద జమకట్టుకుంటావో, మా దయగా అనుకుంటావో.. ఎట్ల లెక్కిస్తావో నీ ఇష్టం’ అని విసురుగా ఇంట్లోకి వెళ్లిపోయింది.కొద్దిసేపు అక్కడే నిల్చున్నారు ఇద్దరూ. ఇంట్లో నుంచి ఏ స్పందన లేదు. చెల్లెళ్ళు ఏమన్నా బైటికి వస్తారేమో చూద్దామని ఆశపడ్డాడు శేషు. ‘తల్లులు వేరైనా, ముగ్గురికీ తండ్రి ఒక్కడే కదా’ తను చేసిన ఘోరానికి క్షమాపణ కోరుదామనుకున్నాడు. ఎదురుచూపు ఫలించక వెనుకకు మళ్ళాడు.. తల్లితో. గుప్పిట్లో కాగితాల్ని బిగించి పట్టుకున్నాడు. అవి బిగి గుప్పిట ఊరిన చెమటలో తడిసిపోయి, సగం వరకు నలిగిపోయాయి. తను అడిగింది నలిగిపోయే కాగితాల్లో ఆస్తి కాదు. తను, అతనికి పుట్టిన బిడ్డగా హక్కు. ఇవ్వలేక పెనుగులాటలోనే పోయాడు మహానుభావుడు. దయ అట.. దయ! భిక్షేం కాదు..! ఇది నా హక్కు. ఇప్పుడు ఈ చిరిగిపోయే కాగితాల రూపంలో నా వారసత్వ హక్కు. ఇది కూడా అవసరమే! దక్కిన హక్కే!’ అనుకున్నాడు శేషు. – హనీఫ్ -
ఉత్తంకోపాఖ్యానం: కృతయుగంలో గులికుడు అనే కిరాతుడు..
కృతయుగంలో గులికుడు అనే కిరాతుడు ఉండేవాడు. అడవిలో జీవించే కిరాతులకు అతడే రాజు. వేటలో ఆరితేరిన గులికుడు పరమ దుర్మార్గుడు. ఇతరులను నిష్కారణంగా హింసించి, వారిని దోచుకునేవాడు. గులికుడి పాపాలను చెప్పుకోవాలంటే ఎంత కాలమూ సరిపోదు. ఒకనాడు గులికుడు సంపదలకు నిలయమైన సౌవీర రాజ్యానికి వెళ్లాడు. ఐశ్వర్యంతో తులతూగే రాజధాని నగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బంగారు గోపురాలతో ధగధగలాడే శ్రీహరి మందిరాన్ని చూశాడు. ఎలాగైనా, ఆలయంలోని బంగారాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. చీకటి పడిన తర్వాత నెమ్మదిగా ఆలయంలోకి చొరబడ్డాడు.ఆలయంలోకి ప్రవేశించిన గులికుడు ఒక స్తంభం చాటున నక్కి పరిసరాలను పరిశీలించసాగాడు. గర్భగుడిలో శ్రీహరికి పరిచర్యలు చేస్తున్న ఒక మహాముని కనిపించాడు. ఆ మహాముని పేరు ఉత్తంకుడు. గర్భగుడిని ఆశ్రయించుకున్న ఉత్తంకుడు తన చౌర్యానికి అడ్డుగా ఉన్నందున గులికుడికి అసహనం పెరిగింది. ఉత్తంకుడిని చంపి అయినా, ఆలయంలోని సంపదను దోచుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కత్తి దూసి, ఉత్తంకుడి మీద దాడికి వెళ్లాడు.ఉత్తంకుడు కత్తితో దూసుకొస్తున్న గులికుడిని చూసి, ‘ఓ కిరాతుడా! నీవెందుకు నిష్కారణంగా నా మీద కత్తి దూశావు? నేను నీ పట్ల చేసిన అపరాధమేమిటి? సమర్థులు, వీరులు అపరాధులను శిక్షిస్తారు గాని, నిరపరాధులను కాదు. పరుల సొమ్మును దోచుకుని నువ్వు భార్యాబిడ్డలను పోషించుకుంటున్నా, అవసానకాలంలో నువ్వు ఒంటరిగానే మరణిస్తావు. నువ్వు దోచుకున్న సిరిసంపదలేవీ నీ వెంట రావు. నీ భార్యాబిడ్డలు కూడా నీ వెంట రారు. ఇహపరాలలో తోడుగా నిలిచేవి ధర్మాధర్మాలే తప్ప వేరు కాదు’ అని పలికాడు.ఉత్తంకుడి మాటలతో గులికుడికి జ్ఞానోదయమైంది. కత్తి పట్టుకున్న అతడి చేతులు వణికాయి. ఉత్తంకుడిని చంపుదామని ఎత్తిన చేయిని దించి, కత్తిని జారవిడిచేశాడు. వెంటనే ఉత్తంకుడి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించాడు. పశ్చాత్తాపం నిండిన హృదయంతో ఉత్తంకుడికి నమస్కరించి, ‘విప్రోత్తమా! ఇంత వరకు నేను ఎన్నో పాపాలు చేశాను. నేడు నీలాంటి మహాత్ముడి దర్శనంతో నాకు జ్ఞానోదయమైంది. నేను ఎన్నో ఘోరాలు, నేరాలు, అకృత్యాలు చేశాను. పూర్వజన్మలో నేనేదో భయంకరమైన పాపం చేసి ఉంటాను. అందువల్లనే ఈ జన్మలో కిరాతుడిగా పుట్టాను. ఈ జన్మలో కూడా లెక్కలేనన్ని పాపాలు చేశాను. ఇకపై నాకు ఏ గతి పడుతుందో?’అంటూ విలపిస్తూ ఉత్తంకుడి పాదాల మీద పడి గులికుడు ప్రాణాలు విడిచాడు.పశ్చాత్తాపం చెంది మరణించిన గులికుడిని చూసి ఉత్తంకుడు జాలి చెందాడు. పరమదయాళువు అయిన ఆ మహాముని తన కమండలంలోని విష్ణుపాదోదకాన్ని తీసి, గులికుడి కళేబరం మీద చల్లాడు. శ్రీహరి పాదోదకం కళేబరాన్ని తాకగానే, గులికుడి పాపాలన్నీ నశించిపోయాయి. అతడికి ప్రేతశరీరం పోయి, దివ్యశరీరం వచ్చింది. విష్ణులోకం నుంచి వచ్చిన విమానం ఎక్కి, తనకు ఉత్తమగతిని కల్పించిన ఉత్తంకుడితో గులికుడు ఇలా అన్నాడు:‘ఓ మహర్షీ! పాపాత్ముడినైన నా మీద జాలి తలచి, నాకు ఉత్తమగతిని కల్పించిన నీవే నా గురువు. నీ ఉపదేశంతో నాకు జ్ఞానోదయమైంది. దయామయా! నీ అపరిమిత దయ వల్లనే నేను హరిపదానికి చేరుకోగలుగుతున్నాను. దయచేసి, నా అపరాధాలను మన్నించి, ఆశీర్వదించు’ అని కోరి నమస్కరించాడు. వెంటనే విమానం అతడిని విష్ణులోకానికి తీసుకుపోయింది. ఈ అద్భుత దివ్యదృశ్యాన్ని చూసి, ఉత్తంకుడు ఆనంద పరవశంతో శ్రీహరిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పలికాడు.ఉత్తంకుడి స్తోత్రం పూర్తవుతూనే, శ్రీమహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట నిలిచిన శ్రీహరిని చూసి, ఉత్తంకుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆనందబాష్పాలతో శ్రీహరికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘శ్రీమన్నారాయణా! పరంధామా! పురుషోత్తమా! పరమాత్మా! శరణు శరణు’ అని ప్రార్థించాడు.శ్రీమన్నారాయణుడు ఉత్తంకుడిని ఆదరంగా లేవనెత్తాడు. తలపై అభయహస్తముంచి ఆశీర్వదించాడు. ‘వత్సా! ఏమి కావాలో కోరుకో!’ అన్నాడు. ‘స్వామీ! నన్నెందుకు మోహంలో పడేస్తున్నావు? నాకు వేరే వరాలతో పనిలేదు. ఎన్ని జన్మలెత్తినా నీ దివ్య పాదారావిందాలపై నిశ్చల భక్తి నిలిచి ఉండేలా అనుగ్రహించు. అదొక్కటి చాలు నాకు’ అని పలికాడు ఉత్తంకుడు.ఉత్తంకుడి నిష్కల్మష భక్తిని గ్రహించిన శ్రీమన్నారాయణుడు అతడి శిరసును తన శంఖంతో స్పృశించి, పరమయోగులకు కూడా సాధ్యంకాని దివ్యజ్ఞానాన్ని అనుగ్రహించాడు. ‘ఉత్తంకా! నరనారాయణులు తపస్సు చేసిన బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేయి. నీకు మోక్షం లభిస్తుంది. నీవు పలికిన నా స్తోత్రాన్ని త్రికాలాల్లో పఠించేవారికి నా అనుగ్రహం నిరంతరం లభిస్తుంది’ అని పలికి అంతర్ధానమయ్యాడు. – సాంఖ్యాయన -
కోరికలు – ఆత్మ సాధన! కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే..
మనస్సు నుండి అనేక కోరికలు జనిస్తూ ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తి అవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరి స్థితిలో రెండు రకాల ప్రశ్నలు మనముందు ఉంటాయి. అవి: ఒకటి ‘నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి?’రెండు ‘ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా?’ అయితే ఈ రెండూ మన చేతిలో లేవు. మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండడం వలన కోరికలు జనిస్తాయి. ఇటువంటి కోరికల వల్ల మనకు వస్తువులతో సంబంధం ఉన్నట్లు ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే... దానివలన కొంత అనుభవం వస్తుంది. ఒకవేళ కోరిక నెరవేర కపోతే అది ఒత్తిడికి లేక కలవరపాటుకు దారితీస్తుంది. అందువలన వేరొక రక మైన అనుభవం వస్తుంది. కోరి కలు నెరవేరినా లేక నెరవేర కున్నా, వాటిని గూర్చి మన స్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటు వంటి పరిస్థితిలో చిక్కుకొంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకొని ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా, ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. మనస్సులో ఆలోచనలు పుట్టక పోతే, అసలు ఆలోచనలనేవి ఉండనే ఉండవు. అలాగే కోరికలు కూడా ఉండవు. ఎవరైనా తన మనస్సును విచారించకుండా ఆపగలరా? ఎందుకంటే... ఎల్లప్పుడూ ఆలోచించడం మనస్సు సహజ లక్షణం. కాబట్టి (ఆత్మ) సాధకుడు తన సాధనల ద్వారా... ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసమై సాధకుడు తన దృష్టిని మళ్ళించకుండా, ఆధ్యాత్మిక లక్ష్యంపైనే మనస్సును కేంద్రీకరింప జేయాలి. దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలుగుతాడు. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అహంకారమనే మూడు తలల పాము.. బ్రహ్మానందమనే నీ సొత్తును..
‘గురువర్యా! మీరు అవధిలేని ఆనందం నాలోనే ఉందంటారు. అది నా స్వభావమూ, సొత్తూ అంటారు. కానీ నేను మాత్రం దాన్ని అనుభవించలేక పోతున్నాను. ఏం చేయాలి?’ ‘శిష్యా! ముందు, అలా అనుభవించలేక పోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలి. నిత్య, శుద్ధ, బుద్ధ, చైతన్య స్వరూపుడివైన నీకు, ఈ దేహం ఇంద్రియ–మనో–బుద్ధు లతో సంబంధం ఏర్పడి, ఆ శరీరాదులే నేను అనే తాదాత్మ్యతా, భ్రమా ఏర్పడ్డాయి. ఇలా నిన్ను ‘నేను–నాది’ అన్న పరిమితులలో బంధిస్తున్నది ‘అహంకారం’ అనే అజ్ఞానం. అది ఆనందమయ మైన నీ స్వస్వరూపాన్ని కప్పేస్తున్నది.’‘మరేం చేయాలి?’‘నీ దగ్గర పెద్ద పెట్టెలో నీ సొంత ధనరాశులు బోలెడున్నాయి. ఒక రోజు తెల్లారి చూసేసరికి, ఒక కాల సర్పం ఆ పెట్టెను చుట్టుకొని విషం చిమ్ముతూ, బుసలు కొడుతున్నది. అప్పుడు నువ్వేం చేయాలి? నిరుపేదనయి పోయానని బిచ్చమెత్తుకుంటూ ఊరంతా తిరుగుతావా? లేక, ఏదో ఒక విధంగా ఆ సర్పాన్ని చంపి నీ సొమ్ము స్వాధీనం చేసుకోవాలా?’‘ఏదో ఒక ఉపాయంతో సర్పాన్ని చంపడమే తెలివి.’ ‘అదీ విషయం! అహంకారం అనే మూడు తలల పాము, బ్రహ్మానందమనే నీ సొత్తును చుట్టుకొని కూర్చొని ఉంది. దాన్ని వేదాంత జ్ఞానం అనే ఖడ్గంతో నరికివేసి, నీ సొత్తు నువ్వు అనుభవించడం వివేకం!’‘కానీ ఆ సర్పాన్ని నరకగల సామర్థ్యం నాకెలా వస్తుంది?’‘చాలాసార్లు చెప్పాను. అది అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా అబ్బుతుంది. ఇంద్రియాలకు నువ్వు లొంగకుండా, వాటిని నువ్వే అదుపు చేసుకొని, ఇంద్రియ సుఖాలవల్ల లాభం స్వల్పం, క్షణికం; నష్టమే అపారం’ అని గ్రహించి, వాటిపట్ల అనాసక్తి పెంచుకోవడం వైరాగ్యం. ఈ నశ్వరమైన దేహాది జడ విషయాలు నీవు కాదనీ, నీవు చైతన్య స్వరూపు డివనీ, శాశ్వతుడివనీ, పరిమితులు లేని సర్వవ్యాపివనే సత్యాన్ని మననం చేస్తూ, ఆ సత్యం మీదే ఏకాగ్రత నిలిపే ప్రయత్నం అభ్యాసం.’ – ఎం. మారుతి శాస్త్రి -
క్షణికం! ట్రైన్లో అడుగు పెట్టి.. బెర్త్ కింద సూట్కేసు తోసి..
ట్రైన్లో అడుగు పెట్టి బెర్త్ కింద సూట్కేసు తోసి సీట్లో కూర్చున్నాను. ఢిల్లీకి వెడుతున్న ఈ రైలు టూ టైర్ ఏసీ కంపార్టుమెంట్లో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. విండో గ్లాస్లోంచి బయటకి చూస్తూ కూర్చున్నాను. సూర్యాస్తమయవుతోంది.. నెత్తురు రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి. టీలు, కాఫీలు అమ్ముకుంటున్న హాకర్స్, ప్రయాణికులతో ఫ్లాట్ఫారం హడావుడిగా ఉంది. కాళ్ళు పారజాపి చేతిలో వున్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను.రైలు కదిలే సమయంలో ‘ఎక్స్క్యూజ్ మీ’ అంటూ ఒకామె హడావుడిగా చేతిలో చిన్న సూట్కేసుతో వచ్చి పక్కనే నిలబడింది. కాళ్లు వెనక్కి లాక్కున్నాను. సూట్కేసు బెర్త్ కిందకు తోసి, ‘హుష్’ అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది. నుదుటన పట్టిన చెమటని కర్చీఫ్తో తుడుచుకుంది. ఆమెకు ఏభై ఏళ్లు దాటి ఉండవచ్చు. జుత్తు అక్కడక్కడ నెరిసింది. మొహంలో అలసట కనిపించింది. కిటికీ దగ్గరకు జరిగి కూర్చుంది. ఆమెకేసి తేరిపార చూశాను. ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.ఆమె కళ్ళలో ఏదో ఆందోళన లీలామాత్రంగా కనబడింది. ఆమె నాకేసి అభావంగా చూసి, తన మొబైల్ ఫోను చూసుకోవడంలో నిమగ్నమైంది. ఆమెకు ఎవరో చాలాసార్లు ఫోన్ చేశారు.. కానీ చూసీచూడనట్టుగా మొబైల్ పక్కన పెట్టేసింది. మరో ఫోన్ కాల్ మటుకు ఆన్ చేసి.. ‘అవునండి! అలా చేద్దాం .. నా నిర్ణయం మారదు’ అంటోంది.ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఢిల్లీ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని, బాధలని .. వెంట మోసుకుని వెడుతోంది వేగంగా. నా జీవితంలో ఆనందం ఆమడ దూరం. బాధ ఐతే మోయలేనంత బరువుగా! జీవితంలో పడిన కష్టాలకి మనస్సు కరడు కట్టేసింది.. చిన్నగా మొదలైన వాన ఉద్ధృతమైంది. కంపార్ట్మెంట్ పార్టిషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినబడుతున్నాయి.చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే.. ‘అర్జునా! ఫల్గుణా అని.. ప్రార్థిస్తే .. పిడుగులు పడవురా!’ అని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు సామాన్యుల, దీనార్తుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా .. ఎంత గొంతెత్తి ప్రార్థించినా .. కాపాడటానికి ఏ అర్జునుడు, ఫల్గుణుడు రావడం లేదు. అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాను.ఎదురుగా వున్నామె రైల్వే వారు ఇచ్చిన తెల్లని దుప్పటి ఒంటిమీద సగం వరకు కప్పుకుని కూర్చుని బయటకి చూస్తోంది. మళ్ళీ బుర్ర దొలచడం మొదలెట్టింది.. ఈమెని ఎక్కడ చూశాను? తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతలో టీసీ వచ్చి.. ‘టికెట్ చూపించండి..’ అంటూ మా పేర్లు, బెర్త్ నంబర్లు బయటకి చదివాడు. నేను నా టికెట్ను ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను. ‘ధరణీధరి’ అన్న పేరు చెవిన బడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే ఆమెని గుర్తుపట్టాను. అవును! ఆమే! ఆ ఘాతుకం జరిగి ఎంతో కాలమైనా.. ఆ కుటుంబసభ్యుల పేర్లు ఎలా మర్చి పోగలను? గుండె రగిలిపోయింది.. ఎస్ .. ఆరోజు అందరం మూకుమ్మడిగా కర్రలు, రాళ్ళు పుచ్చుకుని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఈమెను.పచ్చి మోసగాడు, పరమనీచుడు, ఎందరో అభాగ్యులను మోసం చేసిన .. ‘ధరణిధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ ఓనర్ దుర్గారావు గాడి భార్య ఈ ధరణి. చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిరు ఉద్యోగులు, రాత్రనకా పగలనకా ఎంతో కాయకష్టం చేసి చెమటోడ్చి రోజువారీ కూలి చేసుకునే వాళ్లు తమ పిల్లల చదువులకని,పెళ్ళిళ్ళకు పైసా పైసా కూడబెట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీ ఇస్తానన్న వాడి మాయ మాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు. కంపెనీలో పెట్టిన డబ్బులు మూడు ఏళ్లలో రెట్టింపు అయిపోతుందని మభ్యపెట్టాడు. ఆశల పల్లకి ఎక్కించాడు. ఊహల రంగుల ఇంద్రధనుస్సులు చూపించాడు.ఏజెంట్లను నియమించి వాళ్ళకి కమిషన్ ఆశ చూపి.. వ్యాపారాన్ని చుట్టు పక్కల ఊర్లకి విస్తరింప చేశాడు. అందర్నీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు. ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు. దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వెడితే, చెల్లించకుండా సాకులు చెప్పాడు. అనుమానం వచ్చి కొందరు నిలదీశారు. హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు. మాయ మాటలు చెప్పి తప్పించుకుపోతుంటే, అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. దుర్గారావుని పోలీసులు అరెస్ట్ చేశారు.కానీ క్షణంలో బెయిల్ మీద బయటకి వచ్చాడు. దాచుకున్న ‘అసలు’ కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక.. కొన ఊపిరితో వేచి చూస్తున్నారు. మరికొందరు కాలసర్పం కాటుకు అసువులు బాశారు. వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకు పోయింది. అక్క పెళ్ళి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది.చిన్నప్పటి నుండి.. ‘బంగారుతల్లి’ అంటూ ఎంతో మురిపెంగా పిలుచుకుని, గారంగా పెంచుకున్న అక్క కూడా ‘ఈ జన్మలో నా పెళ్ళి చేయలేవులే!’ అంటూ ఛీత్కారంగా మాట్లాడింది. అందరం తలో మాట అన్నాము. అది నాన్న జీర్ణించుకోలేక, ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలిస్తున్నాయి. అమ్మ.. నాన్న కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది. అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రాణంతో ఉందో లేదో తెలియదు. నా చదువు మధ్యలో ఆగిపోయింది. అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది. నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను.అనాథ శరణాలయంలో చేరి, ఎంతో కష్టపడి చదువుకుని.. మంచి కంపెనీ ఉద్యోగంలో నిలదొక్కుకున్నాను. కానీ నా ఉన్నతిని, అభివృద్ధిని చూడడానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది. మా చిన్నగూడుని చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో? బాధ, కోపం ఆజ్యాలై .. నా గుండెలో రగిలిన మంటలని మరింతగా రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ నీచులను ఏ చట్టాలు శిక్షించలేదు. నేనే అమలుపరిస్తే? ఆ ఆలోచన విత్తుగా మొలకెత్తి మహా వృక్షమై, వేళ్లూనుకుంది. అవును .. ఆ దుర్గారావు గాడిని మానసికంగా దెబ్బతీయాలి. వాడు కుళ్ళికుళ్ళి చావాలి.. దానికి మార్గం.. ధరణిని ఎవరికి తెలియకుండా చంపేస్తే? ఎన్నో కుటుంబాలని రోడ్డుకీడ్చి ఊపిరి తీసేసిన పాపానికి, వాడికి ఇదే సరైన శిక్ష. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.ఇంతలో ఆమె టాయ్లెట్ వైపు వెళ్ళింది. రెండు నిమిషాలు గడిచాయి. నేను కూడా టాయ్లెట్ వైపు నడిచాను. కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసి వుంది. పార్టిషన్ డోర్ పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరూ చూడటానికి అవకాశం లేదు. బయటకి చూశాను. కటిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకలా పులుముకుంది. ఆకాశం బద్దలైనట్టు, దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరున పడుతోంది. అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారిచూపిస్తున్నాయి. అంత వర్షంలోనూ చీకటిని, వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరుగెడుతోంది. ఒక తెలివైన ఆలోచన వచ్చింది.ఇదే సమయం.. ధరణి టాయ్లెట్ బయటకి రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్మెంట్ ద్వారంలోంచి బయటకి ఒక్క తోపు తోసేస్తే.. ఆమె అరిచినా ఈ గాలివాన హోరులో వినబడదు. ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెని నుజ్జునుజ్జు చేసేస్తాయి. శవం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయిపోతుంది.. ఒక వేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీస్తుంది. కసిగా అనుకుంటుంటే .. మనస్సుకి తృప్తిగా అనిపించింది. మూడో కంటి వాడికి కూడా తెలియదు.. చంపేయి! మనసు రెచ్చ కొడుతోంది. వద్దు పాపం. వాళ్ళ ఖర్మన వాళ్ళే పోతారు.. చంపొద్దని లోపలి మనిషి హెచ్చరిస్తున్నాడు. లోపల సంఘర్షణ మొదలైంది. ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మానాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి. నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది .. మనసు చెప్పినట్టే చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాను.ఇంతలో టాయ్లెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. నేను వెంటనే ఎడమ వైపున్న సింక్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కున్నట్టు నటిస్తున్నాను.. ధరణి బయటకి వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేను వేగంగా .. ఆమె వైపు దూసుకు వెళ్ళాను.. ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుంచి ఒకతను.. మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. నేను నిగ్రహించుకుని ఆగిపోయాను.ఆమె పార్టిషన్ డోర్ పుష్ చేసుకుని తన బెర్త్ వైపు వెళ్ళిపోయింది. ‘ఛ ఛ చాన్స్ మిస్ అయ్యింది!’ తలబాదుకుని.. నిరాశగా నా బెర్త్ వైపు నడిచాను. ‘ఆమె చేతిలో ఏదో ఫైల్.. కళ్లజోడు పెట్టుకుని చదువుతోంది. నేను బెర్త్ మీద దుప్పటి, తలగడ, సర్దుకుని.. కాళ్ళ షూస్ విప్పి.. వాటర్ తాగి.. కళ్ళుమూసుకున్నాను.ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్ తింది. ఒక గంట పోయాకా చేయి కడుక్కోవడానికి టాప్ దగ్గరకు బయలుదేరింది. కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఆపేసి ఉన్నాయి. అక్కడక్కడా ఉన్న ప్రయాణికులు పార్టిషన్ కర్టె¯Œ ్స వేసుకుని పడుకున్నారు. నేను మా బెర్త్ల దగ్గర కూడా లైట్లు ఆపేశాను. మొత్తం చీకటి అయిపోయింది. కానీ టాయ్లెట్ దగ్గర వెలుగుతున్నాయి. అయినా ఫర్వాలేదు. వేగంగా ఆమె వైపు వెళ్ళాను. ఆమె చేతులు కడుక్కుని, వెనక్కి రాబోతోంది. నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే.. ఆ హఠాత్పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.కంగారుపడి గట్టిగా అరవబోతుంటే, చేత్తో నోరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ డోర్లోంచి బలంగా రైలు బయటకి ఒక్క తోపు తోశాను. వేగంగా అప్పుడే పక్క పట్టాల మీద ఒక రైలు రావడం, ఆమె దాని కింద పడటం లిప్త పాటులో జరిగిపోయింది. ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది. భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే, భోరుభోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావు గాడి మొహం మనసులో మెదిలింది. ఈ శిక్ష పరోక్షంగా వాడికే! వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పెట్టుకుని, నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్టు వచ్చి బెర్త్ మీద పడుకున్నాను.. ∙∙ ఎవరో పిలుస్తున్నట్టు , తడుతున్నట్టనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేచాను. ఎవరూ లేరు.. రైలు ఆగినట్టుంది. బయట నుంచి చాలా మంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు. మెడ కింద పట్టిన చెమటని తుడుచుకున్నాను. గట్టిగా కొట్టుకున్న గుండె వేగం కాస్త తగ్గింది. మంచి నీళ్ళు తాగుదామని లైటు వేశాను. ఎదురుగా మెడ వరకు దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెని చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆమెని బయటకి తోసేశాను కదా.. ఎలా బతికింది? కళ్ళు నులుముకున్నాను. అంటే.. అంటే .. నేను నిద్రలోకి జారుకున్నానన్న మాట .. అంతా కలన్నమాట? అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను.చేతిని బర్త్ మీద కసిగా కొట్టుకున్నాను. నిద్రపట్టక కిటికీలోంచి బయటకి చూశాను నిరాశగా. నాగపూర్ స్టేషన్ అన్న పేరు కనబడింది. ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒకతను చిన్న సూట్కేసు పుచ్చుకుని ఎక్కాడు.. ధరణి బెర్త్ దగ్గరకు వచ్చి ‘ధరణి మేడమ్..’ అంటూ దూరంగా నిలబడి ఆమెని పిలిచాడు.‘ఆమె .. నిద్రలోంచి వెంటనే లేచి.. సారీ.. నిద్రపట్టేసింది లాయర్ గారు..’ అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనబడింది. అతను ‘నో ప్రాబ్లం మేడమ్’అంటూ వినయంగా ఆమెకి దూరంగా బెర్త్ చివర కూర్చున్నాడు. ఆమె జుట్టు సరిచేసుకుంది. కళ్ల జోడు పెట్టుకుంది. నేను వెంటనే పడుకుని, నిద్రపోతున్నట్టు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ, నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని, చెవులు రిక్కించి వినసాగాను.‘నాగపూర్ కోర్టులో పని అయి పోయిందా లాయర్ గారు? అడిగింది. ‘పోస్ట్పోన్ అయ్యింది మేడమ్! అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను.’ ‘థాంక్స్ అండి..’ అంది వినయం ఉట్టిపడే గొంతుతో. పక్కన ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె మొహం కనబడుతోంది. లాయర్ నెమ్మదిగా, లోగొంతుకతో ‘మేడమ్! రేపు మీరు జడ్జ్ గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు. మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాం. మీరు చేసిన పని హర్షించ తగ్గది’ అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఏంటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని.. వెటకారంగా అనుకుని వాళ్ళ మాటలను ఏకాగ్రతగా వినసాగాను.ధరణి విరక్తిగా నవ్వి ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది లాయర్ గారు. డబ్బు పాపిష్టిది అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. మనకి ఈ పాపపు సంపాదన వద్దండీ అన్నా కూడా నా మాటలు పెడచెవిన పెట్టి , అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలు చేయి పడిపోయి, మంచం మీద తీసుకుని తీసుకుని చనిపోయాడు. కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి. మరి కొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి. కొడుకులిద్దరూ నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. నాకు అన్నం పెట్టే దిక్కు లేదు. ఎందరో అమాయకుల ఉసురు మాకు తగిలింది. మాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండవచ్చు.అందుకనే, రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసుని ముగించమని, ప్రజలని మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి .. డిపాజిటర్స్కి చెల్లించమని వేడుకుంటాను. అప్పుడు గాని నాకు మనఃశాంతి ఉండదు’ అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క క్షణం ఆగినట్టనిపించింది. అయ్యో! ఎంత ఘోరం తలపెడదామనుకున్నాను? క్షణికావేశంలో ఆమెని చంపేసి ఉంటే.. నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడినై, జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది.ఆలస్యం అయినా.. ఇన్నాళ్ళకి మా అందరికీ న్యాయం జరగబోతోంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. నా కనుకొలనులోంచి కన్నీటి బొట్టు జారీ తలగడ మీద పడి ఇంకిపోయింది. లాయర్ అప్పర్ బెర్త్ మీద పడుకుని ఉన్నాడు. తెలతెలవారుతోంది. బెర్త్ దిగి రైలు కిటికీ గ్లాస్లోంచి చూశాను. వర్షం లేదు.. ఆకాశం స్వచ్ఛంగా ఉంది. పది నిమిషాలలో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైల్ స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది. ధరణి మేడమ్కేసి చూశాను. నిద్రపోతోంది. మొహంలో ప్రశాంతత. ఇంక అక్కడ ఉండలేక ఆమె పాదాలని దూరం నుంచి నమస్కరించుకుని .. ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గరకు చేరాను. – చాగంటి ప్రసాద్ -
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
చంద్రసేనుడి ఔన్నత్యం! స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య..
స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య తరతరాలుగా శత్రుత్వం ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రగిరి రాజు చంద్రసేనుడు ఇరుగుపొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఒకరోజు స్వర్ణగిరి రాజు సూర్యసేనుడికి ఒక లేఖ పంపాడు. ‘సూర్యసేన మహారాజులవారికి నమస్కారములు.నేను మీతో మైత్రి కోరుకుంటున్నాను. శత్రుత్వమనేది మన తండ్రుల మధ్య ఉండేది. మన మధ్య కాదు. ప్రజల మధ్య కాదు. ఆ శత్రుత్వం వారితోనే అంతమవనీ. మన రాజ్యాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను. మీరు అంగీకరించగలరని భావిస్తున్నాను’ అని లేఖలో కోరాడు.సూర్యసేనుడు అందుకు సమాధానంగా..‘మా నాన్న తన జీవితకాలమంతా మీ రాజ్యాన్ని శత్రురాజ్యంగానే భావిస్తూ వచ్చాడు. మీతో కలవలేదు. నేనూ మా నాన్నగారి మార్గంలోనే నడుస్తాను. మీతో స్నేహం నాకిష్టం లేదు’ అంటూ చంద్రసేనుడితో స్నేహాన్ని తిరస్కరిస్తూ లేఖ రాశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మంచిదని, వారు స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు తిరస్కరించడం మంచిది కాదని మంత్రి ఎంత చెప్పినా సూర్యసేనుడు ఒప్పుకోలేదు.ఒకసారి చంద్రగిరి రాజ్యంలో విపరీతంగా వర్షాలు కురవడంతో చెరువులు తెగి వరద వచ్చింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పేదల గుడిసెలు కొట్టుకొని పోయాయి. వరద వల్ల చాలా నష్టం వాటిల్లింది. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు,« దనం, ఔషధాలు మొదలగునవి అందించి వరద బాధితులను ఆదుకున్నారు. సూర్యసేనుడు మాత్రం మంత్రి చెప్పినా ‘శత్రురాజ్యానికి మనమెందుకు సాయం చేయాలి?’ అంటూ పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు.ఒకసారి సాయంత్రం సూర్యసేనుడు వనవిహారం చేస్తూ ఓ మొక్కపై అందంగా ఊగుతున్న ఓ పువ్వును చూశాడు. దాన్ని తుంచి వాసన చూశాడు. కొద్ది సేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. రాజ భటులు భవనానికి చేర్చారు. రాజ వైద్యుడు వైద్యం చేసి మెలకువ తెప్పించాడు. ఆ రోజు నుండి ఆయన తీవ్రమైన నరాల నొప్పితో బాధ పడసాగాడు. రాజవైద్యుడు.. అనేక రకాల ఔషధాలు వాడినా నరాల జబ్బు నయం కాలేదు. మంత్రి, రాజవైద్యుడు చుట్టు పక్కల రాజ్యాల నుండి రాజవైద్యులను పిలిపించి వైద్యం చేయించారు.రోజురోజుకీ నొప్పి పెరుగుతోంది కానీ తగ్గలేదు. రాజవైద్యుడు సూర్యసేనుడితో ‘మహారాజా! మీరు అంగీకరిస్తే ఒక మాట చెబుతాను. చంద్రగిరి రాజ్య వైద్యుడు సౌశీల్యుడిని మించిన వైద్యుడు ఈ చుట్టుపక్కల లేడు. వైద్యశాస్త్రంలో దిట్ట. ఆయనకు తెలియని వైద్యం లేదు. ఆయన మాత్రమే మీ జబ్బును నయం చేయగలడని నా నమ్మకం’ అని చెప్పాడు. సూర్యసేనుడు తటపటాయిస్తూ ‘చంద్రసేనుడు మనతో స్నేహం కోరితే తిరస్కరించాను. ఆ రాజ్యం వరదలతో అతలాకుతలమైతే నేను పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు. ఇప్పుడు నా కోసం వాళ్ళ వైద్యుడిని చంద్రసేనుడు పంపుతాడంటారా?’ అన్నాడు సందేహంగా.అక్కడే ఉన్న మంత్రి ‘ప్రయత్నిస్తే తప్పులేదు కదా! నేనే స్వయంగా వెళ్లి అడుగుతాను’ అన్నాడు. సూర్యసేనుడు అంగీకరించాడు. మంత్రి చంద్రగిరి రాజ్యానికి వెళ్లి చంద్రసేనుడితో విషయం చెప్పాడు. చంద్రసేనుడు మారుమాట్లాడకుండా తన వైద్యుడిని పంపడానికి సమ్మతించాడు. సౌశీల్యుడు.. మంత్రిని జబ్బు వివరాలు అడిగి రకరకాల ఔషధాలు తీసుకుని స్వర్ణగిరికి వచ్చాడు. సూర్యసేనుడిని పరీక్షించి కొంతకాలం ఆ రాజ్యంలోనే ఉండి తన వైద్యంతో జబ్బును నయం చేశాడు.చంద్రసేనుడి పట్ల తన ప్రవర్తనకు సూర్యసేనుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇరుగుపొరుగుతో శత్రుత్వం మంచిది కాదని, అందరితో కలసిమెలసి ఉండటమే ఉత్తమ లక్షణమని, పట్టింపులతో సాధించేదేమీ లేదని సూర్యసేనుడు గ్రహించాడు. చంద్రసేనుడి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ, స్నేహం కోరుతూ లేఖ రాశాడు. ఆనాటి నుంచి రెండు రాజ్యాల మధ్య స్నేహం చిగురించింది. – డి.కె.చదువులబాబుఇవి చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి? -
సుందరవనం అనే అడవిలో.. ఒక ముసలి అవ్వ..
సుందరవనం అనే అడవిలో ఒక ముసలి అవ్వ నివసించేది. ఆమె అడవిని చూడవచ్చిన వారికి ఇతర పనుల మీద అడవికి వచ్చిన వారికి అన్నం వండిపెట్టేది. ఆ అడవి దగ్గరలోని గ్రామాల్లో కొందరు ఆమెకు ధన రూపేణా, వస్తు రూపేణా కొంత విరాళంగా ఇచ్చేవారు. ఇలా ఉండగా ఒకరోజు కనకయ్య, గోవిందయ్య అనే ఇద్దరు మిత్రులు ఆమె ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నారు.ఆమె వారికోసం వంట మొదలుపెట్టింది. ఇంతలో మరో నలుగురూ వచ్చి తమకూ వండి పెట్టమని ఆ అవ్వను అడిగారు. ఆమె ‘సరే’అంటూ ఆ ఎసట్లో ఆరుగురికి సరిపోయే బియ్యం వేసింది. అది చూసి ఆ నలుగురూ వంటయ్యేలోపు సుందర వనం అందాలను చూసి వస్తామని వెళ్లారు. వంట పూర్తి కాగానే ఆమె ఆకలితో ఉన్న కనకయ్య, గోవిందయ్యలకు భోజనం వడ్డించింది. తిన్న తర్వాత వారూ అడవి అందాలు చూడడానికి వెళ్లారు.వాళ్లు వెళ్లగానే ఆ నలుగురూ కూడా అలా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. కాసేపటికి గోవిందయ్య, కనకయ్యలూ అడవి నుంచి తిరిగివచ్చారు. అప్పుడు గోవిందయ్య తన సంచీ చూసుకుంటే.. తనకు ఎప్పుడో కనకయ్య కానుకగా ఇచ్చిన బంగారు ఉంగరం కనిపించలేదు. దాంతో గోవిందయ్యతో ‘నీవిచ్చిన బంగారు ఉంగరం కనబడట్లేదు. తిరిగి తీసుకున్నావా?’ అని అడిగాడు. ‘ఇచ్చిన ఉంగరాన్ని తిరిగి తీసుకుంటానా?’ అన్నాడు కనకయ్య. ‘అయితే మరి నా ఉంగరం ఏమైనట్టు?’ అని కంగారుపడుతూ అవ్వను అడిగాడు తన ఉంగరమేమైనా కనిపించిందా? అని. దానికి ఆమె తనకే ఉంగరం కనిపించలేదని చెప్పింది. అంతలో గోవిందయ్యకు ఏదో అనుమానం వచ్చి వెంటనే బయటకు పరుగెత్తాడు. తిరుగుబాటలో ఉన్న ఆ నలుగురినీ చేరుకుని.. అవ్వ రమ్మంటోందని పిలుచుకు వచ్చాడు.తిరిగొచ్చిన ఆ నులగురినీ గోవిందయ్య బంగారు ఉంగరం గురించి ప్రశ్నించింది అవ్వ. తామసలు ఇంట్లోనే లేమని, తామెందుకు తీస్తామని నిలదీశారు వాళ్లు. అప్పుడు గోవిందయ్య ‘అవ్వా! నీవు తీయలేదు. నా మిత్రుడు కూడా తీయలేదు. కచ్చితంగా ఈ నలుగురిలో ఎవరో ఒకరు తీశారు. దీని గురించి నేను గ్రామపెద్దకు ఫిర్యాదు చేస్తాను’ అంటూ గ్రామపెద్ద వద్దకు వెళ్లాడు. ఉంగరం పోయిందని ఫిర్యాదు చేశాడు.గ్రామపెద్ద ముసలి అవ్వ కనకయ్యతో పాటు ఆ నలుగురినీ పిలిపించాడు. గ్రామపెద్దతో గోవిందయ్య తనకు కనకయ్య ఉంగరాన్నిచ్చాడని, అది తను భోజనం చేసేకంటే ముందు ఉందని.. భోజనం తరువాత చూసుకుంటే కనబడలేదని చెప్పాడు. గ్రామపెద్ద ఆ నలుగురినీ ప్రశ్నించాడు. వారు తాము తీయలేదని చెప్పారు. ‘మరి ఆ ఉంగరం ఏమైనట్టు?’ అని అడిగాడు గ్రామపెద్ద. ఆ నలుగురిలో ఒకడైన రంగడు ‘ఎక్కడికి పోతుందండీ? ఈ ముసలామే తీసుంటుంది’ అన్నాడు.వెంటనే గ్రామపెద్ద రంగడిని పట్టుకుని ‘నిజం చెప్పు? ఆ ఉంగరం తీసింది నువ్వే కదా?’ పొరుగూడి వాడివి అవ్వ గురించి నువ్వు మాకు చెప్పేదేంటీ? ఆమె అన్నపూర్ణ. అలాంటి ఆమెపై నిందలు వేస్తున్నావంటే కచ్చితంగా నువ్వే ఉంగరం దొంగవి’ అంటూ నిలదీశాడు.‘నేను తీయలేదండీ’ అన్నాడు రంగడు. గ్రామపెద్ద మిగతా ముగ్గురిని ఉద్దేశిస్తూ ‘మీరంతా అడవికి వెళ్లినప్పుడు రంగడు మిమ్మల్ని వీడి ఒక్కడే ఎక్కడికైనా వెళ్లాడా?’ అని అడిగాడు. దానికి వారు ‘అవునండీ.. వెళ్లాడు.మాతో పాటే నడుస్తూ మధ్యలో ‘‘ఇప్పుడే వస్తాను.. మీరు వెళ్తూ ఉండండి’’ అంటూ వెనక్కి వెళ్లి మళ్లీ కాసేపటికి వచ్చాడు’ అని చెప్పారు. ‘అయితే ఆ సమయంలో నువ్వు అవ్వ ఇంటికి వచ్చి.. ఉంగరం కాజేసి ఏమీ ఎరగనట్టు మళ్లీ మీ వాళ్లను కలిశావన్నమాట’ అంటూ రంగడిని గద్దించాడు గ్రామపెద్ద. తన తప్పు బయటపడిపోయిందని.. ఇంక తను తప్పించుకోలేనని తెలిసి.. నిజాన్ని ఒప్పుకున్నాడు రంగడు. తాను దాచిన ఉంగరాన్ని తీసి గ్రామపెద్ద చేతిలో పెట్టాడు.అదంతా విని ఆశ్చర్యపోతూ గోవిందయ్య ‘అయ్యా.. రంగడే ఉంగరం తీశాడని మీరెలా గుర్తించారు?’ అని అడిగాడు. దానికి గ్రామపెద్ద ‘ఏముంది? నీ మిత్రుడు నీకిచ్చిన కానుకను తిరిగి తీసుకునే సమస్యే లేదు. అవ్వ ఎలాంటిదో మాకు బాగా తెలుసు. మిగిలింది ఈ నలుగురే కదా! వీళ్లలో ముగ్గురూ నిజాయితీగా తమకు తెలియదని చెప్పారు. ఈ రంగడు మాత్రం నేరాన్ని అవ్వ మీదకు నెట్టడానికి ప్రయత్నించాడు. అక్కడే నాకు అనుమానం మొదలైంది. అందుకే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాడా అని అడిగా. వెళ్లాడని తేలింది. ఆ సమయంలో అవ్వ ఇంటికి దొంగచాటుగా వచ్చి.. గోవిందయ్య చిలక్కొయ్యకు వేసిన అతని చొక్కా జేబులోంచి ఎవరూ చూడకుండా ఉంగరాన్ని కాజేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ వెళ్లి ఆ ముగ్గురితో కలిశాడు’ అని చెప్పాడు. ఉంగరాన్ని గోవిందయ్యకు అప్పజెప్పి రంగడికి జరిమానా విధించాడు గ్రామపెద్ద. వెంటనే అవ్వ.. గ్రామ పెద్దతో ‘అయ్యా! ఉంగరం దొరికింది కదా! రంగడికి విధించిన జరిమానా రద్దు చేయండి. కష్టం చేసుకుని బతికే కూలీ. కాయకష్టమంతా జరిమానా కట్టేస్తే కుటుంబానికేం ఇస్తాడు? ఈ గుణపాఠంతో మళ్లీ తప్పు చేయడు’ అని వేడుకుంది. చేయనన్నట్టుగా కన్నీళ్లతో దండం పెడుతూ ‘అమ్మలాంటి దానివి. నువ్వు పెట్టిన అన్నం తిని నీమీదే నేరం మోపాను. అయినా పెద్ద మనుసుతో నువ్వు నాకు క్షమాభిక్ష పెట్టమని కోరావు. నేను పాపాత్ముడిని. నన్ను క్షమించు అవ్వా..’ అంటూ అవ్వ కాళ్ల మీద పడ్డాడు రంగడు. అవ్వ మంచితనాన్ని గ్రామపెద్దతో పాటు అక్కడున్న అందరూ ప్రశంసించారు. – సంగనభట్ల చిన్న రామకిష్టయ్య -
రైభ్యుడికి సనత్కుమారుడి దర్శనం..
రైభ్య మహర్షి ఒకసారి పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, వారిని తృప్తిపరచాడు. ఆ తర్వాత అక్కడే ఆయన కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. రైభ్యుడు తపస్సు చేస్తుండగా, ఒకనాడు అతడి ముందు ఒక దివ్యవిమానం నిలిచింది. అందులో ఒక యోగి నలుసంత ప్రమాణంలో ఉన్నాడు. అతడు గొప్పతేజస్సుతో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. అతడు ‘ఓ రైభ్యా! ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. రైభ్యుడు బదులిచ్చేలోగానే ఆ యోగి తన శరీరంతో భూమ్యాకాశాలంతటా వ్యాపించాడు. రైభ్యుడు విభ్రాంతుడయ్యాడు. ‘మహాత్మా! మీరెవరు? అని ప్రశ్నించాడు.‘నేను బ్రహ్మమానస పుత్రుణ్ణి. నా పేరు సనత్కుమారుడు. భూలోకానికి పైనున్న ఐదో ఊర్ధ్వలోకమైన జనలోకంలో నివసిస్తుంటాను. నాయనా రైభ్యా! నువ్వు ఉత్తముడివి, వేదాభిమానివి. పవిత్రమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతలను సంతృప్తిపరచినవాడివి. నీకు నేను ఈ పితృతీర్థ మహాత్మ్యం గురించిన ఒక వృత్తాంతం చెబుతాను విను’ అని ఇలా చెప్పసాగాడు.‘పూర్వం విశాలనగరాన్ని విశాలుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి పుత్రసంతానం లేదు. ఒకనాడు విశాలుడు విప్రులను పిలిపించి, పుత్ర సంతానం కోసం ఏం చేయాలో చెప్పండని అడిగాడు. ‘రాజా! పుత్రసంతానం కావాలంటే, మీరు గయాక్షేత్రానికి వెళ్లి అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, అన్నదానం చేయాలి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే తప్పక పుత్రసంతానం కలుగుతుంది’ అని విప్రులు సలహా ఇచ్చారు. విప్రుల సూచనతో సకల సంభారాలను తీసుకుని, పరివారాన్ని వెంటబెట్టుకుని విశాలుడు గయాక్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ మఖనక్షత్రం రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పిండ ప్రదానాలు చేయడం మొదలుపెట్టాడు.విశాలుడు అలా పిండప్రదానాలు చేస్తుండగా, ఆకాశంలో ముగ్గురు పురుషులు ఆయనకు కనిపించారు. వారు ముగ్గురూ మూడు రంగుల్లో– తెల్లగా, పచ్చగా, నల్లగా ఉన్నారు. వారిని చూసిన విశాలుడు ‘అయ్యా! తమరెవరు? ఎందుకు వచ్చారు? మీకేం కావాలి?’ అని అడిగాడు.వారిలో తెల్లగా ఉన్న పురుషుడు ‘నాయనా! విశాలా! నేను నీ తండ్రిని. నన్ను పితుడు అంటారు. నా పక్కన ఉన్న వ్యక్తి నా తండ్రి. అంటే, నీకు తాత. బతికి ఉండగా, బ్రహ్మహత్య సహా అనేక పాపాలు చేశాడు. ఇతడి పేరు అధీశ్వరుడు. ఇతడి పక్కనే నల్లగా ఉన్న పురుషుడు నా తండ్రికి తండ్రి. అంటే, నీకు ముత్తాత. బతికి ఉన్నకాలంలో ఎందరో మహర్షులను చంపాడు.నాయనా! విశాలా! నా తండ్రి, అతడి తండ్రి చేసిన పాపాల ఫలితంగా మరణానంతరం అవీచి అనే ఘోర నరకంలో భయంకరమైన శిక్షలను అనుభవించారు. నేను వారిలా పాపకార్యాలు చేయకపోవడం వల్ల, చేతనైన మేరకు పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇంద్రలోకం పొందాను. ఈనాడు నువ్వు శ్రద్ధగా పితృతీర్థమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతల సంతృప్తి కోసం సంకల్పించి, పిండప్రదానాలు చేయడం వల్ల వీరిద్దరూ నన్ను కలుసుకోగలిగారు. పిండప్రదాన సమయంలో నీ సంకల్పబలం వల్లనే మేం ముగ్గురమూ ఒకేసారి ఇలా కలుసుకోగలిగాం.ఈ తీర్థమహిమ వల్ల మేం ముగ్గురమూ ఇప్పుడు పితృలోకానికి వెళతాం. ఇక్కడ పిండప్రదానం చేయడం వల్ల ఎంతటి దుర్గతి పొందినవారైనా సద్గతులు పొందుతారు. ఇందులో సందేహం లేదు. నాయనా! నీ కారణంగా మాకు సద్గతులు కలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ, నిన్ను చూసి వెళ్లాలని వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. నీకు సకల శుభాలు కలుగుగాక!’ అని ఆశీర్వదించి పితృదేవతలు ముగ్గురూ అక్కడి నుంచి అంతర్థానమయ్యారు. పితృదేవతల ఆశీస్సుల ఫలితంగా విశాలుడు కొంతకాలానికి పుత్రసంతానాన్ని పొందాడు.‘రైభ్యా! నువ్వు కూడా ఈ పరమపవిత్ర గయాక్షేత్రంలో పితృదేవతలకు పిండప్రదానాలు చేశావు. వారికి ఉత్తమ గతులు కల్పించావు. అంతేకాకుండా, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని, గొప్ప తపస్సు చేస్తున్నావు. అంతకంటే భాగ్యమేముంటుంది? అందుకే నువ్వు ఉత్తముడివి, ధన్యుడివి అంటున్నాను. రైభ్యా! ఈ గయాక్షేత్రంలోనే గదాధారి అయిన శ్రీమహావిష్ణువు కొలువున్నాడు. నువ్వు ఆయనను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొందు’ అని చెప్పి సనత్కుమారుడు అంతర్థానమయ్యాడు.రైభ్యుడు సనత్కుమారుడి మాట ప్రకారం గదాధరుడైన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఆశువుగా ‘గదాధరం విభుదజనై రభిష్టుతం ధృతక్షమం క్షుదితజనార్తి నాశనం/ శివం విశాలాసురసైన్య మర్దనం నమామ్యహం హతసకలాశుభం స్మృతౌ...’ అంటూ గదాధర స్తోత్రాన్ని పలికాడు. రైభ్యుడి స్తోత్రానికి పరమానందభరితుడైన పీతాంబరధారిగా, శంఖచక్ర గదాధారిగా శ్రీమహావిష్ణువు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘రైభ్యా! నీ స్తోత్రానికి సంతోషించాను. నీకు ఏ వరం కావలో కోరుకో’ అన్నాడు శ్రీమహావిష్ణువు.‘స్వామీ! నీ సాన్నిధ్యంలో సనక సనందాది మహర్షులు ఉండే స్థానాన్ని అనుగ్రహించు’ అని కోరాడు.‘తథాస్తు’ అన్నాడు శ్రీమహావిష్ణువు.రైభ్యుడు వెంటనే సనక సనందాది సిద్ధులు ఉండే స్థానానికి చేరుకున్నాడు. – సాంఖ్యాయన -
స్థితప్రజ్ఞత: నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి..
మహావీరుడు, ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి సెయింట్ హెలీనా అనే దీవిలో యుద్ధ ఖైదీగా ఉన్న కాలమది. ఆయన ఆరోగ్యాన్ని గమనించడానికి ఓ డాక్టర్ని నియమించారు. ఓరోజు నెపోలియన్, డాక్టరూ కలిసి ఓ బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ పోతున్నారు.కాసేపటికి వారిద్దరూ ఓ ఇరుకు మార్గంలోకి చేరుకున్నారు. అప్పుడు ఎదురుగా ఒక సాధారణ మహిళ నడుచుకుంటూ వస్తోంది. పక్కకు తప్పుకుని నెపోలియన్ తనకు దారి ఇస్తారని అనుకుంది ఆ స్త్రీ. కానీ డాక్టర్ ఆమెతో ‘ఇదిగో ఆయన ఎవరనుకున్నావు... నెపోలియన్ చక్రవర్తి. పక్కకు తప్పుకో. ఆయన ముందుకు పోవడానికి నువ్వే పక్కకు తప్పుకోవాలి’ అన్నాడు.వెంటనే నెపోలియన్ ‘ఇప్పుడు మీతో ఉన్నది నెపోలియన్ చక్రవర్తి కాదు. ఓ మామూలు వ్యక్తి అయిన నెపోలియన్. ఇతరులు పక్కకు తప్పుకుని నాకు దారివ్వాల్సిన స్థితి కాదిప్పుడు నాది. ఓ మామూలు స్త్రీ కైనా నేనే పక్కకు తప్పుకుని దారివ్వక తప్పదు. అలా దారివ్వడం వల్ల నేనేమీ బాధ పడబోన’ని చెప్పాడు.నెపోలియన్ తన జీవితంలో హెచ్చుతగ్గులను ఒకేలా చూసి పరిస్థితికి తగినట్లే వ్యవహరించిన వ్యక్తి. ‘ఎప్పుడూ గెలుపు నా పక్షమే అని అనుకోను. ఓటమిని చవిచూడడం నాకు తెలుసు. గెలుపోటములను ఒకేలా చూసిన వ్యక్తిని నేను’ అని చెప్పాడు. ఈ మానసిక పరిపక్వత కలవారిని స్థితప్రజ్ఞుడిగా భగవద్గీత చెప్పనే చెప్పింది.విజయం సాధించినప్పుడు విర్రవీగలేదు. పరాభవం పొందినప్పుడు డీలా పడలేదు. రెండిటినీ సమానంగా చూశాడు. స్వీకరించాడు. ఈ మానసిక పరిపక్వత వల్ల జీవితంలో దేన్నయినా అధిగమించవచ్చు. అది మనిషిని దెబ్బతీయదు. పైపెచ్చు ఎప్పుడూ నిలకడగా ఉంచుతుంది. – యామిజాల జగదీశ్ -
భక్తిలో విశ్వాసం..!
భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి -
మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి..
ఓరోజు ఎలుకలన్నీ పెద్ద ఎలుక వద్దకు వెళ్లి ‘ఊర్లోని ఇంటి యజమానులంతా అప్రమత్తమయ్యారు, మనల్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి మనల్ని హతమార్చే ప్రయత్నాలు ప్రారంభించారు’ అంటూ గగ్గోలు పెట్టాయి. ‘ఇక మేము పల్లెల్లో నివసించలేం, పట్టణాలకు వెళ్లిపోతాం. అక్కడ బోనులో చిక్కకుండా మెలకువలు నేర్చుకొని చక్కగా బతుకుతాం’ అని భీష్మించుకున్నాయి.పెద్ద ఎలుక వాటిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయినా అవి ‘పల్లెల్లో ఉండం కాక ఉండం’ అంటూ మొండికేశాయి. ఇంతలో ఆ పల్లెకు, చుట్టపు చూపుగా ఓ ఎలుక రంగు గుడ్డలేసుకుని గెంతుతూ వచ్చింది. అన్ని ఎలుకలూ దానికి ఆహ్వానం పలికాయి. అదే సమయంలో ఓ మిద్దింటి నుంచి చేపల కూర వాసన గుప్పుగుప్పుమని వచ్చింది. పట్టణం ఎలుకకు నోరు ఊరింది. ‘ఎన్నాళ్లయ్యిందో చేపల కూర తిని.. నేను వెళ్లి తిని వస్తా!’ అని లొట్టలేసుకుంటూ బయలుదేరింది.‘ఆశపడి వెళ్లొద్దు.. ఇక్కడ అందరి ఇళ్లోల్లో బోనులు పెట్టి ఉన్నాయి. పొరపాటుగా నువ్వు బోనులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది’ అంటూ ఎలుక పెద్ద హెచ్చరించింది. పట్టణం ఎలుక ఎగిరెగిరి నవ్వింది.. ‘నేనేమైనా పల్లెటూరి ఎలుకనా.. వారు వేసే ఎరలకు ఇరుక్కుపోవడానికి?’ అంటూ మిద్దె ఇంటి వైపు దౌడు తీసింది. ‘ఏమి జరుగుతుందో చూద్దాం..’ అని ఎలుకలన్నీ దాని వెనుకే పరుగులు తీశాయి.మిద్దె ఇంటిలోకి వెళ్తున్న పట్టణం ఎలుకను చూసిన మరో పల్లె ఎలుకకు కూడా నోరూరింది. దాంతో అది ఆ మిద్దె ఇంటిలోకి పట్టణం ఎలుకకన్నా ముందే దూరింది. బోనులో పెట్టిన ఎండు చేప వాసనకి పల్లె ఎలుక పరవశించి పోయింది. ముందు వెనుకలు చూడకుండా నేరుగా వెళ్ళి చేపను లాగింది. డబుక్కున బోను మూత పడటంతో ఇరుక్కుపోయానని తెలుసుకుని ‘కుయ్ కుయ్’ అని అరుస్తూ రచ్చ చేసింది. ‘పట్టణం ఎలుక ఏమి చేయబోతుందో..’ అని, మిగిలిన పల్లె ఎలుకలన్నీ అటకెక్కి వేడుక చూడసాగాయి.పట్టణం ఎలుక ఒయ్యారంగా మరో బోను ముందర నిలబడి ‘ఇట్టాంటి బోనులు ఎన్ని చూడలేదు..’ అంటూ ఇంటి యజమాని తెలివిని ఎద్దేవా చేస్తూ పడీపడీ నవ్వింది. బోను పైకెక్కి నాట్యం చేసింది. బోనులోని ఎండుచేప ‘నన్ను తినకుండా వెళ్ళిపోతావా మిత్రమా’ అని అడిగినట్లు అనిపించింది దానికి. ‘అయినా పట్టణంలోని పెద్దపెద్ద బోనుల్లోనే చిక్కలేదు నేను. అలాంటి నాకు ఈ పల్లెటూరి బోను ఒక లెక్కా! కనురెప్పలు మూసి తెరిచేలోగా టపీమని వెళ్ళి బోనులోని చేపను నోటితో లాక్కొని రానూ..’ అంటూ బోనులోకి దూరి చేపను లాగింది. టక్కుమని బోను మూత పడిపోయింది. ఇరుక్కుపోయిన సంగతి తెలుసుకుని బోనును లోపలే ‘డిష్యుం డిష్యుం’ అని కొట్టడం ప్రారంభించింది.ఆ ఆపదను ముందే గ్రహించిన పెద్ద ఎలుక.. అటకెక్కి చూస్తున్న తోటి ఎలుకల గుంపును తోడ్కొని .. ఆ రెండు బోనుల వద్దకు వెళ్లింది. తమ బలమంతా ప్రయోగించి ఆ రెండు ఎలుకలను బయటకు తీసి వాటికి ప్రాణభిక్ష పెట్టాయి ఆ ఎలుకలన్నీ! వెంటనే పెద్ద ఎలుక.. మిద్దింటి ముందరి పూలతోటలో ఆ ఎలుకలన్నిటినీ సమావేశపరచి ‘మనం బోనులో పెట్టిన ఎరల అకర్షణలో పడి పెద్దప్రాణాలకే ప్రమాదం తెచ్చుకోకూడదు.ఆ ‘ఎరుక’ ఉంటేనే పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా ఎలుకలు బతికి బట్టకట్టగలవు. అసలు మనుషులు ఎలుకల్ని ఎందుకు బోనులో బంధిస్తారో తెలుసుకోవాలి. వారి విలువైన వస్తువులను, ఆహారాన్ని మనం నాశనం చేయడం వల్లనే వారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. బోనులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాల విశ్వంలో మనకెన్నో ఆహార పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి మనుషుల వస్తువులపై మన వ్యామోహం తగ్గించుకుంటే మనుషులు.. మనం.. ఇరువర్గాలం క్షేమంగా ఉంటాం’ అంటూ హితబోధ చేసింది.ఆ మాటలతో జ్ఞానోదయం చెందిన పల్లె ఎలుకలు తమ పట్టణ ప్రయాణాన్ని విరమించుకున్నాయి. ‘మంచి మాటలు చెప్పే పెద్ద దిక్కు మాకు లేదు. అందువల్ల అనేక ఎలుకలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి’ అని పట్టణం ఎలుక కొద్దిసేపు బాధపడింది. తర్వాత తన ప్రాణాలను రక్షించిన ఎలుకలన్నిటికీ ధన్యవాదాలు తెలిపి తనతో పాటు తీసుకొచ్చిన తీపి మిఠాయిలను అన్నిటికీ పంచి పెట్టింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజుఇవి చదవండి: మిస్టరీ.. అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది? -
మరణభయం పోవాలంటే..?
చాలామంది ‘మరణం’ గూర్చి భయపడుతూ ఉంటారు. మరణ తత్త్వాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ భయానికి కారణం. మరణం అంటే శరీర సాధారణ స్థితిలో కలుగు మార్పు. శైశవం వదలి బాల్యంలోకి, బాల్యం వదలి యవ్వనంలోకి, అత్యంత ప్రియమైన యవ్వనం నుంచి ముసలి తనానికి ఈ మార్పు కారణం అవుతుంది. చివరగా ముసలితనం మరణానికి దారితీస్తుంది.రాత్రి... గడచిపోయి సూర్యోదయానికి స్వాగతం పలుకుతుంది. ఉదయం గడచి మధ్యాహ్నానికి అవకాశమిస్తుంది. అదే విధముగా రాత్రి ప్రారంభం కాగానే మధ్యాహ్నం పోతుంది. ప్రకృతి తిరుగులేని నియమాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఆ నియమం అనుసరించి జన్మించిన ప్రతి జీవీ మరణించవలసిందే. అలాగే మరణించిన ప్రతి జీవీ తిరిగి జన్మించవలసిందే. ఈ విçషయాన్ని సరిగా అవగాహన చేసుకుంటే మరణం వల్ల భయం కలుగదు. ఈ భయ నివారణకు తిరిగి జన్మించకుండా ఉండటమే సరైన మార్గం. జననమే లేనప్పుడు మరణించే ప్రసక్తే ఉండదు కదా!ఎంతకాలం ‘ఈ దేహమే నేను’ అనే దేహాత్మ భావన ఉంటుందో అంతవరకు మరణ తప్పదు. ఏ క్షణం శారీరక స్పృహను దాటుతామో, అప్పుడే మనం నాశ రహితులం అవుతాం. పుట్టిన ప్రతి జీవీ గిట్టకతప్పదని తెలిసినా ఎవరికి వారు తమకు మరణం లేదని అనుకొంటూ ఉండటమే ఆశ్చర్య కరమైన విషయం అని ధర్మరాజు మహాభారతంలో ఒకచోట అంటాడు. ఇది ఆలోచించదగిన విషయం.ఒకానొక సందర్భంలో ఓ యక్షుడు ధర్మరాజును అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది? (కిం ఆశ్చర్యం?) అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు ధర్మరాజు ‘ప్రతి క్షణం లెక్కలేనన్ని జీవులు యముని (మృత్యుదేవత) రాజ్యాన్ని చేరుకొంటున్నాయి. అయినప్పటికీ జీవించి ఉన్నవారు మాత్రం తమకు మరణం ఉన్నదని తెలిసీ లేనివారివలె జీవిస్తారు’ అని సమాధానం ఇస్తాడు. మానవుని జీవితం క్షణభంగురం. మరణం అనివార్యం. కాబట్టి మానవులందరూ ప్రతిక్షణాన్నీ సద్వినియోగపరచుకోవాలి. కాలం గడచిన పిమ్మట గతంలోకి తొంగిచూచుకొని ‘అయ్యో! నేను కాలాన్ని సద్వినియోగపరచుకొనలేకపోయాన’ని బాధపడటానికి ఎలాంటి అవకాశం లేకుండా జీవితాన్ని గడపాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అనాథలు కాదు.. ఆటగాళ్లు!
నవీన్ (పేరు, వివరాలు మార్చాం) అనాథ బాలుడు. బంధువులు పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాల కారి్మకుడిగా మారాడు. కర్మాగారాల్లో, పరిశ్రమల్లో దుర్భర పరిస్థితుల్లో పనిచేశాడు. అధికారులు రెస్క్యూ చేయడంతో.. నాలుగేళ్ల కింద సైదాబాద్లోని ప్రభుత్వ బాలల సదనానికి చేరాడు. ఇప్పుడతను విలు విద్య (ఆర్చరీ)లో జాతీయస్థాయి క్రీడాకారుడు. స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలు దాటి గత నవంబర్లో గుజరాత్లో నిర్వహించిన జాతీయ బాలల ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాడు. అందులో 800 మంది పోటీపడితే 158వ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సదనంలోని ఆర్చరీ అకాడమీలో కోచ్ సాయంతో రాటుదేలుతున్నాడు. భవిష్యత్తులో చాంపియన్ అవుతానంటున్నాడు. - సైదాబాద్ఇది ఈ ఒక్క బాలుడి కథనంకాదు, అతడిలా దుర్భర పరిస్థితుల్లో జీవించి, రెస్క్యూ ఆపరేషన్లలో సదనానికి చేరుకున్న మరెందరో చిన్నారులు తమదైన ప్రతిభ చూపుతున్నారు. మరో ముగ్గురు బాలలూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, గుర్తింపు తెచ్చుకున్నారు.రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆర్చరీ అకాడమీ.. తల్లిదండ్రులు లేక రహదారులపై భిక్షమెత్తుతూనో, రైళ్లలో సంచరిస్తూ, బాలకారి్మకులుగానో పనిచేస్తున్న పిల్లలను అధికారులు రెస్క్యూ చేసినప్పుడు.. సైదాబాద్లోని ప్రభుత్వ బాలల సదనానికి తరలిస్తారు. అలా వచ్చిన పిల్లలు పెద్దయ్యేదాకా ప్రభుత్వమే చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ బాలల్లోని ప్రతిభను వెలికితీయడంపై అధికారులు దృష్టిపెట్టారు. స్వతహాగా క్రీడాకారుడైన జువెనైల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మీర్జా అలీ బేగ్ పలువురు బాలల్లో చురుకుదనాన్ని పసిగట్టారు.చక్కటి తరీ్ఫదు ఇస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని గుర్తించారు. తన ఆలోచనను ఉన్నతాధికారులకు చెప్పి ఒప్పించారు. ఎక్కడా జువెనైల్ విభాగంలో లేనిరీతిలో.. హైదరాబాద్లోని సైదాబాద్ జువెనైల్ హోంలో 2022 నవంబర్లో జువైనల్ ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఉదయం బాలికలకు, సాయంత్రం బాలురకు ఆర్చరీలో తరీ్ఫదు ఇస్తున్నారు.అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కోచ్గా..అకాడమీలో కోచ్గా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, యూత్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన, వరల్డ్ 7వ ర్యాంకర్ హేమలతా యాదవ్ను నియమించారు. ఆమె 15 రోజుల శిక్షణతోనే అకాడమీలోని ఒక బాలుడు జిల్లాస్థాయి పోటీల్లో రాణించి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం.. ఆ పోటీల్లోనూ ఏడో స్థానంలో నిలవడం విశేషం. తర్వాత ఇక్కడి బాలలు నలుగురు రాష్ట్రస్థాయిలో, ఒకరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించారు.చదువులోనూ రాణిస్తూ..ఒడిదుడుకుల బాల్యం నుంచి సదనానికి చేరిన తర్వాత బాలలు క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటుపడుతున్నారు. అధికారులు, సిబ్బంది సూచనలతో చదువులోనూ రాణిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాసి పాసవుతున్నారు. ఇద్దరు విద్యార్థులు సదనం నుంచి బయటికి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ఆ ఇద్దరూ ఆర్చరీ విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కగా రాణిస్తున్న వారే.చదువు, ఆర్చరీ రెండూ కొనసాగిస్తాం..కఠినమైన బాల్యాన్ని చూశాం. అప్పటి రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ బాధేస్తుంది. సదనానికి వచ్చిన తర్వాత క్రమపద్ధతిలో జీవిస్తున్నాం. చదువుతూనే ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాం. ఉన్నత విద్య పూర్తి చేయాలని, ఆర్చరీ పోటీల్లో చక్కటి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాం..’’ - ఆర్చరీలో ప్రతిభ చూపుతున్న బాలల మనోగతంఅంతర్జాతీయ ఖ్యాతి సాధించాలన్న..తెలంగాణ ప్రభుత్వ బాలల సదనంలోని పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి ఖ్యాతి గడించాలన్నదే మా ఆకాంక్ష. అందుకోసమే మరెక్కడా లేనట్టుగా సైదాబాద్లోని సదనంలో ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో అకాడమీ సాధ్యమైంది. ఆకాంక్షలకు అనుగుణంగా బాలలు రాణిస్తున్నారు. చదువులో, క్రీడల్లో వారు ఉన్నతులుగా ఎదిగేందుకు జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరక్షనల్ సరీ్వసెస్ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. - మీర్జా అలీ బేగ్, జువెనైల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్నా విద్యార్థులు ఒలింపిక్స్లో ఆడాలి.. నేర్చుకోవాలనే తపన, గెలవాలనే ఆకాంక్ష ఉన్న నా విద్యార్థులు ఎప్పటికైనా ఒలింపిక్స్లో ఆడుతారు. అకాడమీ ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులు ఎంతో ఇష్టంగా ఆర్చరీ నేర్చుకుంటున్నారు. ఏకాగ్రత, లక్ష్యంపై వారి గురి అబ్బురపరుస్తోంది. నేర్చుకున్న అనతి కాలంలోనే వారు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడమే దీనికి నిదర్శనం. – హేమలతా యాదవ్, ఆర్చరీ అకాడమీ కోచ్ -
నిరుపమాన దీక్షాశక్తి..
భారతీయ సంస్కృతిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతిధ్వనించేట్లు, ప్రతినిత్యం స్మరించేట్లు ప్రచారం చేసి యావత్ జాతినంతా మేల్కొలిపిన మహనీయుడు స్వామి వివేకానందుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు. ఆయన్ని ఆ రోజులలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు.1893 సెప్టెంబర్లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897లో స్వదేశానికి తిరిగి వచ్చి ‘రామకృష్ణ మిషన్’ స్థాపించారు.వివేకానందుని ప్రసంగాలు యుగయుగాలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఓ ప్రచార కర్త కాదు, ఓ మతం. ప్రతి మనిషి ఆత్మలో దైవత్వాన్ని చూడడం ఆ మత సూత్రం. పేదవాడి సేవే భగవంతుని సేవ అని చాటి చెప్పిన యుగకర్త. భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యుడాయన.1863 జనవరి 12న కలకత్తాలో జన్మించిన వివేకానందుని తొలినామం నరేంద్రుడు. ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను కలిగిన ఆయన చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితి కూడా పొందారు. దక్షిణేశ్వరంలోని రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడిన అనతి కాలంలోనే నరేంద్రుడు ఆయనకు ముఖ్య శిష్యులయ్యారు. ఆయన మనోహర గాన మాధుర్యం రామకృష్ణుని ఆనందసాగరంలో ముంచెత్తేది. 1886లో పరమహంస నిర్యాణం అనంతరం నరేంద్రుడు పరివ్రాజకునిగా యావత్ భారత పర్యటన చేశారు. వివేకానందనామం స్వీకరించారు. దేశ సముద్ధరణకు, భారతజాతి పునరుజ్జీవనానికి అహర్నిశలు తపించారు.‘బలమే జీవనం బలహీనతే మరణం’ అనే వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాతం. ‘దేశంలో పస్తున్న ప్రతి ప్రాణికీ ఆహారం పెట్టి రక్షించటమే పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే. నిరుపేదయైన సోదర భారతీయునీ, నా ఇష్టదేవతలనూ అర్చించటానికి ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్ని బాధలైనా ఓరుస్తాను’ అని ప్రకటించారాయన.1902 జూలై 4న తన 39వ ఏట బేలూరు మఠంలో ఆయన తనువు చాలించారు. అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాల రూపంలో ప్రజాసేవ చేస్తూ యావద్భారతంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన శ్రీ రామకృష్ణ మఠసేవా సంఘాలను స్థాపించిన ఘనత వివేకానందుడికే దక్కుతుంది.గొప్ప దేశభక్తుడు. ఆయన యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి. మానవునిలో లోపాలు వివరిస్తూ ‘మనం పని చేయం, చేసే వారిని చేయనీయం, వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతి పతనానికి ముఖ్యమైనదీ లక్షణమే’ అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమనీ... దేశ ప్రజలందరికీ ఆత్మవిశ్వాసం, క్రియా శూరత్వం అవసరం తనకు స్పష్టంగా కనిపిస్తున్నదనీ చెప్పారు. – నందిరాజు రాధాకృష్ణ; సీనియర్ జర్నలిస్ట్ ‘ 98481 28215 (రేపు స్వామి వివేకానంద వర్ధంతి) -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
మృగరాజు ఆంతరంగికుడు..
కేసరివనానికి రాజు సింహం. మంత్రి నక్క. మృగరాజు సింహానికి మారుతి అనే కోతి ఆంతరంగికుడిగా ఉండేది. మారుతి ఎప్పుడూ మృగరాజు వెన్నంటే ఉండేది. అడవిలో విహారానికి వెళ్లినా, వేటకు పోయినా, తోటి జంతువులు చేసుకునే శుభకార్యాలకు కదిలినా మారుతి.. మృగరాజు పక్కన ఉండాల్సిందే. మారుతి లేకుండా సింహం గుహదాటి బయటకు వచ్చేది కాదు.పక్క అడవుల రాజులు ఏనుగు, పులితో పాటు, ముఖ్యమైన విషయాలు చర్చించటానికి ఇతర జంతువులూ గుహకు వచ్చి సింహాన్ని కలిసేవి. ఒక్కోసారి సింహం కూడా పక్క అడవులకు వెళ్లేది. అక్కడ అవి మాట్లాడుకునే మాటలన్నీ మారుతి వినేది. అంతేకాదు గుహలో కూడా మృగరాజు కుటుంబం మాట్లాడుకునే కబుర్లు, రహస్యాలు కూడా మారుతి చెవిన పడేవి.దాంతో మారుతికి మృగరాజు బలాలు, బలహీనతలు అన్నీ తెలవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అడవిలో బాట వెంట సింహం నడుస్తుంటే మారుతి చెట్ల మీంచి గెంతుతూ, దూకుతూ చుట్టూ పరిసరాలను జాగ్రత్తగా గమనించేది. ఏదైన ప్రమాదం పొంచి ఉందనే అనుమానం వస్తే పైనుంచే సింహాన్ని హెచ్చరించేది.ఒకరోజు ఉదయాన్నే సింహంతో రహస్య సమావేశానికి పక్క అడవి రాజు ఏనుగు.. కేసరి వనానికి బయలుదేరింది. వనానికి చేరుకోగానే ఆ ఏనుగుపై గుర్తుతెలియని కొన్ని జంతువులు ఆకస్మికంగా దాడి చేశాయి. ఆ సమాచారం అందిన వెంటనే మృగరాజు సింహం, నక్క పరుగున వెళ్లి ఏనుగు ప్రాణాలను కాపాడాయి. తన రాజ్యంలో పక్క అడవి రాజు ఏనుగుపై దాడి జరగటం మృగరాజుకు అవమానంగా తోచింది. ‘మిత్రమా! నాకోసం నువ్వు వస్తున్నట్లు ఎవరికీ తెలీదు.ఈ దాడి ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా నా వైఫల్యమే.. నన్ను క్షమించు’ అని ఏనుగును వేడుకొని తన గుహకు తోడ్కొని పోయింది సింహం. ‘ప్రభూ! మీరు మారుతిని గుడ్డిగా నమ్మి అన్ని విషయాలు పంచుకుంటున్నారు. పక్క అడవి రాజు.. పులి స్వభావం మీకు తెలియంది కాదు. మాటుగా దాడిచేసి రెండు రాజ్యాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఈ సమాచారాన్ని అందించింది మారుతీయేమోనని నా అనుమానం’ అంది నక్క. ఆ మాట విని మౌనంగా ఉండిపోయింది సింహం.ఇంకోరోజు పక్క అడవి నుంచి కాకి వచ్చి ‘మృగరాజా! రేపు మా పులిరాజు పుట్టినరోజు. వేడుకకు రమ్మని ఆహ్వానం పంపారు!’ అంది. అది విన్న మారుతి చేతివేళ్లతో లెక్కలు వేసి అక్కడి నుంచి బయటకు వెళ్లింది. మరునాడు సింహం, నక్క, కోతి పక్క అడవి పులిరాజు పుట్టినరోజు వేడుకకు బయలుదేరాయి. మరో దిక్కు నుంచి ఏనుగు తన పరివారంతో వేడుకకు బయలు దేరింది. అవి రెండూ పులి ఉండే అడవి శివార్లలో కలుసుకున్నాయి.‘గజరాజా.. ఎక్కడికి ప్రయాణం?’ అడిగింది నక్క. ‘పులిరాజు పుట్టినరోజు వేడుకకు’ జవాబిచ్చింది ఏనుగు. ఆశ్చర్యపోయింది నక్క. నలుదిక్కులూ చూడసాగింది. ‘ఎవరికోసం మంత్రివర్యా వెతుకుతున్నారూ?’ అడిగింది మారుతి.‘ఏం లేదు! ఏం లేదు’ తడబడుతూ చెప్పింది నక్క. అంతలో బంధించిన పులిని లాక్కొచ్చింది ఎలుగుబంటి. ‘మహామంత్రీ! మీ ధైర్యసాహసాలు చాలా గొప్పవి’ అని అభినందించింది ఏనుగు.‘మిత్రులారా! నన్ను మన్నించండి. నక్క చెప్పుడు మాటలు విని మీపై దాడిచేసి రెండు రాజ్యాలను ఆక్రమించాలనుకున్నాను. కానీ మృగరాజు ఆంతరంగికుడు మారుతి ముందు మా ఎత్తులు చిత్తయినవి. గతంలో గజరాజు పై దాడి కూడా నక్క సహకారంతో నేనే చేయించాను. ఇప్పుడు ఈ పుట్టినరోజు ఎత్తు కూడా నక్క సలహానే. మీ రెండు రాజ్యాలు ఆక్రమించేలా నక్క సహకరించినందుకు ఒక రాజ్యాన్ని తనకు అప్పగించి దానికి రాజును చెయ్యమని కోరింది’ అని చెప్పింది పులి.‘మారుతి అఆనుమానంతో లెక్కలు వేసి నీ పుట్టినరోజు ఈరోజు కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని ముందుగానే పసిగట్టి గజరాజు సహకారం కోరింది. గజరాజు ముందుగానే మీ అడవికి ఎలుగుబంటిని పంపాడు. ఇదంతా నాపై దాడికి వేసిన ఎత్తని తేలింది!’ అంది సింహం.నక్క సిగ్గుతో తలవంచుకుంది. క్షమించమని వేడుకుంది. మంచిదానిలాæ నటించి మారుతిపై చాడీలు చెప్పిన నక్కను, కుట్రలో భాగమైన పులినీ బంధించి చెరసాలలో వేసింది సింహం. ఏనుగు, సింహం, ఎలుగుబంటి.. ఆంతరంగికుడు మారుతిని అభినందించాయి. పులి రాజ్యానికి ఎలుగుబంటిని రాజును చేశాయి మృగరాజు, గజరాజులు. – ముద్దు హేమలత -
శంకుకర్ణుడి కథ: వ్యాస మహర్షి శిష్యులతో కలసి..
వ్యాస మహర్షి శిష్యులతో కలసి కాశీ నగరంలో ఉన్న కాలంలో ప్రతిరోజూ అక్కడి తీర్థాలను, ఆలయాలను సందర్శించసాగాడు. ఒకనాడు కృత్తివాసేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలసి కపర్దీశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు. కపర్దీశ్వర లింగానికి సమీపంలోని పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, పితృతర్పణాలు విడిచి, కపర్దీశ్వరుడిని పూజించాడు.వ్యాసుడు, అతడి శిష్యులు అక్కడ ఉండగానే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక ఆడజింక కపర్దీశ్వర లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది. దానిని తినడానికి ఒక పెద్దపులి అక్కడు వచ్చింది. పెద్దపులి జింక మీద పడి, గోళ్లతో చీల్చి దానిని చంపేసింది. వ్యాసుడు, అతడి శిష్యబృందం అటువైపుగా వస్తుండటం గమనించిన పెద్దపులి, చంపేసిన జింకను అక్కడే వదిలేసి పారిపోయింది.అప్పుడే ఒక అద్భుతం జరిగింది. కపర్దీశ్వరుడి ముందు మరణించిన జింక గొప్ప కాంతితో ప్రకాశించింది. మూడు కళ్లతో, నల్లని మెడతో, తలపై నెలవంకతో ఒక వృషభాన్ని ఎక్కి, అదే ఆకారంలో ఉన్న మరో పురుషుడితో కలసి కనిపించింది. జింక చుట్టూ ఒక జ్వాల వెలిగి, గణేశుడి రూపం పొంది అదృశ్యమైంది. వ్యాసుడి శిష్యులు ఈ పరిణామానికి విభ్రాంతులయ్యారు. ‘మహర్షీ! ఏమిటి ఈ అద్భుతం? దీనికి కారణమేమిటి?’ అని అడిగారు.‘ఇదంతా కపర్దీశ్వరుడి మహాత్మ్యం. కపర్దీశ్వరలింగం మహా మహిమాన్వితమైనది. దీనిని సేవించినట్లయితే, సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఇక్కడే ఉన్న పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, కపర్దీశ్వరుడిని పూజిస్తే, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. ఈ మహాత్మ్యాన్ని వివరించాలంటే, మీకు శంకుకర్ణుడి కథ చెప్పాలి’ అన్నాడు వ్యాసుడు.‘ఎవరా శంకుకర్ణుడు? అతడి కథ ఏమిటి? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి గురుదేవా!’ అభ్యర్థించారు శిష్యులు.శిష్యుల అభ్యర్థనకు సాదరంగా తలపంకించిన వ్యాసుడు శంకుకర్ణుడి కథను ఇలా చెప్పసాగాడు:‘ఈ కపర్దీశ్వర క్షేత్రంలోనే లోగడ శంకుకర్ణుడనే మహాముని ఉండేవాడు. ఆయన నిరంతరం రుద్రమంత్రాలు జపిస్తూ కపర్దీశ్వరుడిని పూలు, పండ్లతో పూజిస్తుండేవాడు. జపతపాలతో యోగసాధనలో గడిపేవాడు. ఒకనాడు ఆయన యోగసాధనలో ఉండగా, ఆకలితో అలమటిస్తున్న పిశాచరూపంలో ఉన్న ఒక పురుషుడు వచ్చాడు. ఆ పిశాచాన్ని చూసి, శంకుకర్ణుడు ఎంతో జాలిపడ్డాడు.‘ఓ పిశాచమా! నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు?’ అని ప్రశ్నించాడు. శంకుకర్ణుడు తనను ఆదరంగా ప్రశ్నలు అడగటంతో ఆ పిశాచం కన్నీళ్లు పెట్టుకుని, తన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు.‘మునీశ్వరా! గత జన్మలో నేను సంపన్న బ్రాహ్మణుణ్ణి. ధనమదంతో బతికినన్ని రోజులూ ఎవరికీ ఎలాంటి దానధర్మాలూ చేయలేదు. మంచి పనులేవీ చేయలేదు. ఒకనాడు వారణాసికి వెళ్లి, అక్కడ కొలువైన విశ్వేశ్వరుణ్ణి పూజించాను. కొంతకాలానికి కాలధర్మం చెందాను. కాశీ విశ్వేశ్వరుణ్ణి ఒక్కసారి పూజించినందున నేను నరకానికి వెళ్లలేదు. అయితే, బతికి ఉన్నన్నాళ్లూ పుణ్యకార్యాలేవీ చేయకపోగా, పాపాలు చేయడంతో ఇలా పిశాచరూపంలో మిగిలాను. ఆకలిదప్పులకు అలమటిస్తూ దిక్కుతోచక ఇక్కడే సంచరిస్తున్నాను. మహాత్మా! నాకీ పిశాచరూపం నుంచి విముక్తి దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నువ్వే నాకు దిక్కు’ అని దీనంగా వేడుకున్నాడు.‘ఓ పిశాచమా! నువ్వు చాలా పుణ్యాత్ముడివి. లోకంలో నీవంటి పుణ్యాత్ములు చాలా అరుదు. పూర్వజన్మలో నువ్వు సకల విశ్వాధినేత అయిన విశ్వేశ్వరుణ్ణి స్వయంగా స్పృశించి పూజించావు. ఆ పుణ్యఫలం వల్లనే తిరిగి ఇదే క్షేత్రానికి వచ్చావు. నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇక్కడ కొలువై ఉన్న కపర్దీశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి, ఈ పుష్కరిణిలో స్నానం చేయి. నీకీ పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది’ అని ధైర్యం చెప్పాడు శంకుకర్ణుడు.శంకుకర్ణుడి సూచనతో ఆ పిశాచం కపర్దీశ్వరుణ్ణి స్మరిస్తూ, పుష్కరిణిలో స్నానం చేశాడు. పుష్కరిణిలో స్నానం చేయగానే అతడికి పిశాచరూపం పోయి, గొప్ప తేజస్సుతో దివ్యరూపం వచ్చింది. తనకు పిశాచరూపం నుంచి విమోచన కలిగించిన శంకుకర్ణుడి ముందు మోకరిల్లి, నమస్కరించాడు. వెంటనే దేవతలు పంపిన దివ్యవిమానమెక్కి, దివ్యలోకాలకు వెళ్లిపోయాడు.ఆ అభాగ్యుడికి పిశాచరూపం పోయినందుకు శంకుకర్ణుడు ఎంతో సంతోషించాడు. ఇదంతా కపర్దీశ్వరుడి మహిమేనని తలచి, కపర్దీశ్వరుణ్ణి స్తుతించాడు. తర్వాత ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అలాగే నేలకొరిగిపోయాడు. ప్రాణాలు కోల్పోయిన శంకుకర్ణుడి జీవాత్మ కపర్దీశ్వర లింగంలో ఐక్యమైపోయింది. మునులారా! ఇదీ శంకుకర్ణుడి వృత్తాంతం. మరణానంతరం పిశాచరూపం పొందిన బ్రాహ్మణుడికి ఆ రూపం నుంచి విముక్తి కలిగించడం వల్లనే ఈ పుష్కరిణి పిశాచమోచన పుష్కరిణిగా ప్రఖ్యాతి పొందింది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి, కపర్దీశ్వరుణ్ణి పూజించేవారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి’ అని ముగించాడు వ్యాసుడు. – సాంఖ్యాయన -
భగవత్ప్రసాదం! ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’..
ఈ విశ్వంలో ఆలోచనలు, భావనలను మనిషి మాత్రమే మాటల ద్వారా తెలుపగలడు. ఏ ఇతర జీవికీ మాట్లాడే శక్తి లేదు. మాట్లాడటం అనేది భగవంతుడు మానవునికి అనుగ్రహించిన వరప్రసాదం. మానవుడు తన జీవితాన్ని సంతోషమయం లేక దుఃఖమయం కావించుకోవడం అనేది దేవుడు ఇచ్చిన వరప్రసాదాన్ని ఉపయోగించుకొనే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మాటను సరిగా, విచక్షణతో ఉపయోగించుకొన్న మానవుడు... తాను ఆనందంగా ఉండడమే కాక ఇతరులను కూడా సంతోషపరచగలడు.దీనికి భిన్నంగా విచక్షణారహితమైన, అస్తవ్యస్తమైన మాటలు మాట్లాడుట వల్ల సమస్యలు వస్తాయి. ఫలితంగా మనిషి జీవితం దుఃఖమయం అవుతుంది. ఈ కారణం వల్లనే ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’ అని పెద్దలు చెప్పారు. మనం సర్వకాల, సర్వావస్థలయందు తియ్యగా, ఇంపుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మనం మాట్లాడే పద్ధతి ఇతరులను కోపోద్రిక్తులను చేయకుండా జాగ్రత్త పడాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. నియమాలను ఉల్లంఘించకుండా ఉండడమే వినయం. ఈ పద్ధతి భగవద్గీతలో ‘వాజ్మయ తపస్సు’అని తెలుపబడినది.మనం చేయు భౌతికపరమైన పనులన్నీ ఆలోచనలపైననే ఆధారపడి ఉంటాయి. ఆలోచించడం, మంచి– చెడులను తెలుసుకొనడం బుద్ధికి సంబంధించిన పని. బుద్ధిబలాన్ని ఉపయోగించి ‘ఏది ఉచితం, ఏది ఉచితంకాదు’ అని మనం తెలుసుకో గలుగుతున్నాం. మనం చేసే పనిని బట్టి మన ఆలోచన వ్యక్తమవుతుంది.ఉదాహరణకు ఒక వక్త ముందు మైక్ ఏర్పాటు చేసినా... ఆ వక్త ఆలోచన మాటల రూపంలో బయటికి రానంత వరకూ మైక్ మనకు వినిపింపచేయలేదు. అలాగే క్రియ అనేది దానంతట అది మంచి కాదు లేక చెడు కాదు. దీని (చర్య) మంచి, చెడులు దీనికి మూలాధారమైన ఆలోచనలోనే ఉంటాయి. అందువల్లనే మనం చేసే పని మంచిగానూ, గౌరవప్రదంగానూ ఉండాలి. మంచి ఆలోచనలకే తావునిచ్చి, వాటిని వృద్ధి చేసుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఆధ్యాత్మిక శక్తితో...
ఇవ్వాళ ప్రభుత్వాలూ, సంఘసేవకులూ మహిళా సాధికారత గురించి ఎంతగానో మాట్లాడుతున్నారు. కానీ, దాదాపు 140 సంవత్సరాల క్రితమే శ్రీ రామకృష్ణ పరమహంస స్త్రీ జనోద్ధరణపై దృష్టి పెట్టారు. సాక్షాత్తూ భార్యలోనే కాళీ మాతను దర్శించగలిగిన పరమహంస స్త్రీ జనోద్ధరణకు తన శిష్యులను ప్రోత్సహించారు.ఒకరోజు గౌరీమా అనే భక్తురాలు పువ్వులు సేకరిస్తుండగా గురుదేవులు ఒక నీటికుండతో అక్కడకు వచ్చి ఒక చేత్తో చెట్టుకొమ్మను పట్టుకొని మరో చేత్తో చెట్టుకు నీరు పోస్తూ ‘గౌరీ, నేను నీరు పోస్తూ ఉంటే నువ్వు మట్టిని కలుపు’ అన్నాడు. అప్పుడామే ‘ఇక్కడ బంక మట్టి లేదు. ఎలా మట్టిని కలప గలన’ని పలికింది.ఆ మాట విని గురుదేవులు ‘నేను ఏ అర్థంలో చెప్పానూ, నువ్వు ఏ రకంగా అర్థం చేసుకొన్నావూ? ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగానూ, బాధాకరంగానూ ఉంది. వారికోసం నువ్వు పాటుపడాలి’ అన్నారు. అంటే... తాను దేశ స్త్రీల అభివృద్ధికి నడుం బిగించి కృషి ఆరంభిస్తే, గురుదేవులు అందుకు తగిన తోడ్పాటు అందిస్తారన్నమాట అనుకున్నారు గౌరీమా. అప్పుడామె ‘కొద్ది మంది బాలికలను నాకు ఇవ్వండి. వారిని హిమాలయాలకు తోడ్కొని వెళ్ళి వారిని సౌశీల్యవంతులుగా తీర్చి దిద్దుతాను’ అంది. గురుదేవులు తన తలను అడ్డంగా ఊపుతూ, ‘కాదు, కాదు, నువ్వు నగరంలోనే ఉంటూ పని చేయాలి. నువ్వు అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలు చాలు. ఆధ్యాత్మిక శక్తితో నువ్వు స్త్రీలను సేవించాలి’ అన్నారు.గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించిన గౌరీమా కలకత్తాలో బాలికల నిమిత్తం ఒక పాఠశాలను స్థాపించి భారతీయ స్త్రీలను విద్యావంతులను గావించడంలోనూ, తద్వారా వారిని ఉద్ధరించడంలోనూ ఎంతో కృషి చేసింది. (పుటలు 248, 249 – శ్రీ రామకృష్ణ లీలామృతం). రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు కూడా మహిళా ఉద్ధరణకు ఎంతగానో కృషి చేయడం గమనార్హం. – రాచమడుగు శ్రీనివాసులు -
ఆచరణ ముఖ్యం..!
ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్ -
గురువు ప్రాశస్త్యం: గురువుని సాక్షాత్తు త్రిమూర్తుల రూపంగా..
గురువుని సాక్షాత్తు త్రిమూర్తుల రూపంగా భావించి పూజించే సంస్కృతి భారతీయులది. తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ ఈ జన్మకి సార్థకత, సాఫల్యం అందించే వ్యక్తి గురువు. మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే తల్లితండ్రుల తర్వాత గురువుకి ప్రముఖ స్థానమిచ్చింది మన సంస్కృతి. మనిషిని మనిషిగా తీర్చిదిద్దే శిల్పి గురువు. అందుకే మన విద్యాలయాల్లో, మన మందిరాలలో గురువుని స్మరిస్తూ ఈ శ్లోకాన్ని నిత్యమూ పఠిస్తున్నాము:"గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః!గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః!!"మనకు విజ్ఞానశాస్త్రం ఎంత తెలిసినా, జీవన విలువలు అందించేది గురువు మాత్రమే. అయితే నేర్చుకోవాలనే జిజ్ఞాస శిష్యునికి ఉండాలి. గురువు జ్ఞానాన్ని ఒసగినప్పుడు దానిని గ్రహించి ప్రయోజకుడు కావాల్సిన బాధ్యత ప్రధానంగా శిష్యునిదే. భారతీయ గురుపరంపర సమస్తం త్యాగం ద్వారానే నిర్మాణం అయ్యింది. త్యాగం, సమర్పణ అనే ఉన్నత భావాలతో సమాజాన్ని నిర్మించే పనిని భారతీయ ఋషులు చేశారు.వ్యాస, వాల్మీకి, వశిష్ఠ వంటివారు మొదలుకొని ఆది శంకరాచార్య, సమర్థ రామదాసు, రామకృష్ణ పరమహంస వరుసలో అబ్దుల్ కలాం వరకు సేవ, త్యాగం అనేవే ఆదర్శాలుగా జీవించారు. నేడు ఆ ఆదర్శలాతో కోట్లాది మంది జీవిస్తున్నారు. ‘నేను మాత్రమే బాగుండాలి’ అని కాకుండా ‘నాతో పాటు సమాజం బాగుండాలి’, అవసరం అయితే సమాజం కొరకు కష్టపడాలి అనే జీవనవిలువ మన సమాజాన్ని నేటికీ రక్షిస్తోంది. ఇదే ఈ దేశ సహజ గుణం. ఈ జీవన విలువను అందించేది గురువు.ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి విషయాల్లో మనుషులకు, పశువులకు తేడా లేదు. ధర్మం మాత్రమే మానవులకు అధికమైన విశేషణం. ధర్మంగా బతకాలి అనే జీవన విలువను కూడా మన గురువులు అందించారు. ఈ ధర్మం అనేది భారతీయ సమాజంలో మాత్రమే కనపడేది. ప్రకృతిలోని పంచభూతాలు వాటి సహజగుణాన్ని వదిలిపెట్టవు. కానీ మనిషి తన స్వభావాన్ని వదిలిపెడుతున్నాడు. జంతువు జంతువులాగానే, పక్షి పక్షిలాగానే జీవిస్తుంది. కానీ మనిషి మనిషిలా బతకడం లేదు. మనిషికి మాత్రమే మనిషిలా జీవించు అని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అలా చెప్పి సన్మార్గంలో నడిపే వ్యక్తి గురువు మాత్రమే. – సాకి -
బౌద్ధవాణి: ఆమెకు గుండె ఆగినంత పని అయింది..
ఆ ఇంట్లో ఇల్లాలు వంటచేస్తూ అందులో నిమగ్నమై పోయింది. ఆ రోజు భిక్షు సంఘాన్ని భిక్ష కోసం ఆహ్వానించారు ఆ గృహస్తులు. ఆమెకు ఒక నెలల బిడ్డ. ఆ బిడ్డడిని ఇంటిముందు దుప్పటి మీద పడుకోబెట్టారు. ఇద్దరు పిల్లలు ఆడిస్తున్నారు. ఆ పసివాడు వెల్లకిలా పడుకుని, కాళ్ళూ చేతులూ ఆడిస్తూ బోసినవ్వులు చిందిస్తున్నాడు.ఆమె వంటగదిలోంచి అప్పుడప్పుడూ ఆ పిల్లలకేసి చూస్తూనే ఉంది. కొంత సమయం గడిచింది. ఇంటి యజమాని కావడితో మంచినీరు తెచ్చి ఇంట్లో విశాలమైన మధ్య గదిలో ఉంచాడు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు పెద్దగా అరిచాడు.‘‘అమ్మా! భిక్షువులు వస్తున్నారు’’ అంటూ ఆ వీధి చాలా ΄÷డవైంది. ఆ వీధిలోకి అప్పుడే వచ్చారు భిక్షుగణం. భిక్షగా సమర్పించే ఆహార పదార్థాలన్నీ పూర్తయ్యాయి. వాటిని గిన్నెల్లోకి సర్దుతోంది. ఇంతలో బయట ఏదో శబ్దం వినపడింది. కోడె దూడ ఒకటి చెంగుచెంగున ఎగురుతూ, తోక ఎత్తి అటుకేసి వచ్చింది. పసి పిల్లవాణ్ణి అక్కడే ఉంచి, మిగిలిన ఇద్దరు పిల్లలూ ఇంట్లోకి పరుగు తీశారు. ఇల్లాలికి విషయం అర్థమై, వేగంగా బైటికి పరుగు తీసింది.కానీ... అప్పటికే ఆ గిత్తదూడ వచ్చేసింది. ఆరుబయట పడుకున్న పిల్లవాడి మీదగా దూకి వెళ్ళిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయింది. ఆమె వెళ్ళేసరికి... చిరునవ్వులు చిందిస్తూ బోసి నోటితో ఊ కొడుతున్నాడు ఆ బిడ్డ. కొంతసేపటికి భిక్షువులు వచ్చారు. వారు భిక్ష పూర్తి చేశాక ధర్మోపదేశం చేశారు. అప్పుడు వారికి ప్రమాదం తప్పిన పిల్లవాని గురించి తెలిసింది.‘‘చేశారా! ఆ బాలుడు స్థిరచిత్తుడు. స్థిత ప్రజ్ఞుడు. చావు ముందుకొస్తున్నా చిరునవ్వు చెదరనివాడు’’ అన్నాడు ఆ భిక్షువు. ‘‘అవును. కుశల సంపన్నుడు అజేయుడు’’ అన్నాడు మరో భిక్షువు. పాపకర్మలు చేయనివాడు, మోసపు మాటలు ఎరుగని వాడు, పాప సంకల్పాలు తెలియని వాడు. అందుకే స్థిరచిత్తుడు’’ అన్నాడు మొదటి భిక్షువు. వారు అలా వాద సంవాదాలు చేసుకుంటూ ఆరామానికి చేరారు. అక్కడా ఇదే సంఘటన చెప్పి, అదే చర్చ కొనసాగించారు. అలా చర్చించే వారంతా కొత్తగా వచ్చిన వారే. వారి మధ్య మాటలు జరుగుతూ ఉండగా బుద్ధుడు అక్కడికి వచ్చాడు. భిక్షువులందరూ నిశ్శబ్దం పాటించారు. ‘‘భిక్షువులారా! ఇపుడు మీరు వాదులాడుకుంటున్న విషయం ఏమిటి?’ అని అడిగాడు. విషయమంతా తెలుసుకున్నాడు.‘‘భిక్షువులారా! శరీరంతో పాప కర్మలు చేయని వారు, పాపపు మాటలు మాట్లాడనివారు, పాప సంకల్పాలు చేయని వారు, పాప జీవనం కొనసాగించనివారు ఈ నాలుగు ధర్మాల్ని పాటించేవారు కుశల సంపన్నులే. అజేయులే! అత్యున్నత స్థితిని పొందినవారే! అయితే పసివారు ఇవేవీ చేయరు కాబట్టి వారు అజేయులు కారు. ఎందుకంటే.... వారు వెల్లకిలా పడుకుని మాత్రమే ఉండగలరు. వారు తమ శరీరంతో ఏ కర్మలూ చేయలేరు. వారికి నోరుంటుంది.నవ్వు, ఏడుపులు ఉంటాయి తప్ప, తప్పు ఒప్పులు మాట్లాడలేరు. అంటే... మాటల ద్వారా కర్మలాచరించలేరు. అలాగే... అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆలోచనలు వారికి ఉండవు. కాబట్టి సంకల్పాలూ ఉండవు. ఇక, తాను అది తినాలి ఇది తినాలిఅని ఎలా ఉండదో... ఆ తిండిని ఏదో ఒక మార్గంలో, మంచిగానో చెడుగానో సంపాదించి తినాలి అనే కోరికా ఉండదు. తల్లిపాలు తాగడం తప్ప... మరే విధమైన జీవన కర్మలు చేయరు. పసిపిల్లవాణ్ణి కర్మలతో కొలవకూడదు.పెరిగి పెద్దయ్యాక కలిగే అనేక వికారాల నుండి, దోషాల నుండి, స్వార్థాల నుండి బైటపడిన వారినే కుశల సంపన్నులుగా, అజేయునిగా భావించాలి. అలాంటి నిస్వార్థ జీవనాన్ని కీర్తించాలి. అ నాలుగు ధర్మాల్ని ధరించిన వారికి అపజయం కలగదు. ప్రమాదం వచ్చి మీద పడుతున్నా చిరునవ్వు చెరగదు.’’ అన్నాడు. పాపకర్మలు చేసే అవకాశం ఉన్నా చేయని వారు పాపపు జీవన విధానం ఎదుటే ఉన్నా దాన్ని స్వీకరించని వారు... ఇలాంటి వారు మాత్రమే అజేయులు. ఎందుకంటే వారు తమని తాము జయించుకుంటారు కాబట్టి అనే విషయం వారికి అర్థమైంది. ఆ కొత్త భిక్షువులు బుద్ధునికి ప్రణమిల్లారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఒకసారి తన రాజ్యంలో..
విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే మారువేషంలో గుర్రం మీద దేశసంచారానికి బయలుదేరాడు.ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటు వైపు వెళ్లాడు. అక్కడ నలుగురు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే మరో ఇద్దరు గానం చేస్తున్నారు. ఆ గానం చేస్తున్న యువతీ,యువకుడు ఇద్దరూ అంధులే! మధురంగా పాడటం ఆపాక సంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు. తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవటం చూసి ఆశ్చర్యపోయాడు విజయేంద్రవర్మ. ‘రాజు గొప్ప కళాకారుడు! ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడుతాడు! మీరు ఇలా యాచించటం వింతగా ఉంది!’ అంటూ యువతిని అడిగాడు రాజు. ‘రాజు కళాకారుడైనందుకు మా బతుకులు బాగైతాయని సంతోషించాము. అతని మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం శూన్యం’ అన్నది ఆమె. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు. గుర్రం ఎక్కి మరో గ్రామం చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటే .. కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ డబ్బులిస్తున్నారు. నృత్యం ముగిశాక ‘చూడమ్మా! రాజు కళాప్రేమికుడు కదా! నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు?’ అడిగాడు విజయేంద్రవర్మ.‘రాజు కళాప్రేమికుడే. కాని కళాపోషకుడు మాత్రం కాదు. క్రియా శూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బతుకు ఉండక పోయేది!’ ఆవేశంగా అంది ఆమె. ఆ జవాబు విని మౌనంగా ముందుకు కదిలాడు రాజు. మరో గ్రామంలో ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు. ఇంద్రజాలికుడిని చూడగానే విజయేంద్రవర్మకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లతో అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడి ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపి తీసి దానం చేయమని అడిగాడు. ‘తాతా ! రాజు కూడా నీ వలె గొప్ప ఇంద్రజాలికుడు కదా! నువ్వేంటి ఇలా..!’ అడిగాడు రాజు.‘నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా? వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల ప్రయోజనం అటు శంఖానికి, ఇటు మనకు ఉండదు! రాజు గారి ప్రసంగాలు కూడా అంతే!’ అన్నాడు అతను.కళాకారులు తనని తోటి కళాకారుడిగా, కళల పట్ల విడువకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు విజయేంద్రవర్మ. ఆనాటి నుండి కళాకారులను గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగ కళాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు, వసతులు కల్పించాడు.పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకుని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. అలా కొద్ది రోజుల్లోనే విజయేంద్రవర్మ క్రియా శూన్యుడు కాదు.. క్రియా శూరుడిగా పేరు పొందాడు. – కొట్రా సరితఇవి చదవండి: ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం! -
ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం!
సుమిత్ర చెప్పిన కథ: వాసుకి పిచ్చి పిల్ల. నాకన్నా ఎనిమిదేళ్ళే చిన్నది. అయినా, నా కూతురు స్థానంలోకి వచ్చింది. పొరబాటుగా అంటున్నాను, ఆమె పీడకలలో కూడా ఊహించని మారుటి అమ్మ స్థానంలోకి నేనే బలవంతంగా చొరబడిపోయాను. నా దురదృష్ట జీవితం గురించి చెప్పుకోవటం నా అభిమతం కాదు. నా మూలంగా అతలాకుతలమైన అమాయకురాలు వాసుకి గురించి చెప్పటానికే నా ప్రయత్నం.తనకో బుల్లి తమ్ముడిని ఇచ్చే క్రమంలో, పసిగుడ్డుతో సహా ఆమె తల్లి పై లోకాలకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా వాసుకి పసి మనసు తల్లడిల్లిపోయిన ఘడియలు అవి. రెండేళ్లపాటు ఆమెకి ఇంక తన నాన్నతోనే లోకం అయిపోయింది. మాయమైపోయిన అమ్మ మీది ప్రేమ కూడా నాన్న మీదకి మళ్లించుకుని, నాన్న ఇంట్లో ఉన్నంతసేపూ వెన్నంటే ఉండేది. ధన్వంతరిగారు, అంటే వాసుకి నాన్న, ఉద్యోగరీత్యా తరుచూ టూర్లు తిరగవలసి ఉండేది. ఆయన ఊళ్ళోలేనన్ని రోజులూ భయంకరమైన ఒంటరితనం వాసుకిని వణికిస్తూ ఉండేది. అలాగని ఎవరినీ తోడు పిలుచుకోవటమూ ఇష్టం ఉండేది కాదు. ఒక్కతే తన లోకంలో తను బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉండేది. ధన్వంతరిగారు ఉద్యోగరీత్యా తరచూ వచ్చే ఊళ్ళలో మాదీ ఒకటి. నా మేనమామ నాగఫణి ఆయనకి సన్నిహితుడు. ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా యింట్లోనే ఉండేవారు. ఆయన మాటల్లో అస్తమానూ వాసుకి విషయాలే దొర్లేవి. వాసుకిని నేను చూడకపోయినా, ఆ విధంగా తన విషయాలన్నీ తెలుస్తూనే ఉండేవి. తల్లీ, తండ్రీ లేని నేను నా మేనమామ పెంపకంలో ఉండేదాన్ని. మొదటి నుంచీ చదువు సంధ్యల మీద శ్రద్ధలేకపోవటంతో, టెన్త్ఫెయిలయ్యాక ఇంటికే పరిమితమైపోయాను. చదువుకోవటం లేదనీ, పనీపాటా కూడా సరిగ్గా చేయటంలేదనీ ఎప్పుడూ విసుక్కుంటూ, అడపా దడపా చెయ్యి చేసుకుంటూ ఉండే మామయ్య, నైన్త్సెలవుల్లో నాలో శారీరకంగా మార్పులు చోటు చేసుకోవటం మొదలైనప్పటినుంచీ తిట్టటం, కొట్టటం తగ్గించాడు. నా పట్ల ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పుని, హద్దులు మీరిన చొరవనీ ‘అభిమానం’ అనే భావించాను. అయితే, అలా ఎన్నాళ్ళో సాగలేదు. ఒక రోజున జరిగిన పెద్ద గొడవ తరవాత మామయ్య దుబాయి పారిపోయాడు.ఆ విషయం కూడా ధన్వంతరిగారు చెబితేనే నాకు తెలిసింది. ఎప్పటిలాగానే ఏదో టూర్ వెళ్లాడనుకున్న మామయ్య నన్ను వదిలించేసుకుని వెళ్లిపోయాడని తెలిశాక, నేనున్న పరిస్థితికి ఆత్మహత్య తప్ప మరోదారి తోచలేదు. ధన్వంతరిగారే అడ్డు పడకపోతే, అదే నా దారి అయ్యేది. నెల రోజులపాటు తర్జన భర్జనలు పడ్డాక, ధన్వంతరిగారు నన్ను తన జీవితంలోకి తీసుకుపోయారు.ఇదేమిటీ, నా ప్రియమైన వాసుకి గురించి మొదలెట్టి, నా సొదలోకి వెళ్లిపోయాను?నేను వాళ్ళింట్లో ప్రవేశించటం, అదీ ఆమెకి అమ్మగా వెళ్ళటం వాసుకికి పెద్ద షాక్. ఆమెకి నా మీద ద్వేషంతో పాటూ, తన తండ్రి మీద కూడా అసహ్యం జనించింది. నేనూ, ధన్వంతరిగారూ ఏం చెప్పబోయినా వినిపించుకోనంతగా తన చెవులను శాశ్వతంగా మూసి వేసుకుంది. నాతో మాటలే ఉండేవి కావు. వాళ్ళ నాన్నతో కూడా అత్యవసరమయితేనే అతి క్లుప్తంగా మాట్లాడేది. ఇంట్లో తక్కువగా ఉండేలా చూసుకునేది. వెళ్తే కాలేజీ, లేదా ఫ్రెండ్స్ ఇళ్ళలో గడిపేస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా తనగదికే పరిమితమైపోయేది.ఆఖరికి వాళ్ళింటికి వెళ్ళిన కొద్ది నెలలకి, నేను చావు బతుకుల్లో హాస్పిటల్ పాలైనప్పుడు, నన్ను చూడటానికి కూడా వాసుకి రాలేదు. ఇంటికి వచ్చాక అయినా పలకరించలేదు. అందుకు నేను ఏమీ అనుకోలేదు, నేనది ఆశించలేదు గనుక. గతుకులబాటలో అతకని బతుకు అలాగే పదేళ్ళ పాటు గడిచింది. వాసుకి చదువు పూర్తయి ఉద్యోగం సంపాయించుకుంది. ఉద్యోగంలో చేరటానికి ఊరు వెళ్ళే ముందు రోజున తన పెళ్లి విషయం ప్రస్తావించారు ఈయన.‘నా పెళ్లి గురించీ, నా బతుకు గురించీ ఇంక మీరు ఆలోచించవద్దు. అసలు కల్పించుకోవద్దు’ అని కరాఖండిగా చెప్పేసింది వాసుకి. నేను మ్రాన్పడిపోయాను. ఆయన దిగులుపడిపోయారు. మర్నాడు వాసుకి వెళ్ళిపోయింది. ఏడాది గడిచింది. ఈ ఏడాదిలోనూ, వాసుకి ఒక్కసారి కూడా తొంగిచూడలేదు. ఫోన్ చేసినా తీసేది కాదు. నాది రాతి గుండె కాబోలు, ఇంకా బతికే ఉన్నాను. ఆయన గుండె మాత్రం అది తట్టుకోలేక ఆగిపోయింది. తండ్రి చివరి చూపుకోసం, చివరిసారిగా ఇంటికి వచ్చింది వాసుకి. దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది, ఇంక నేను చెప్పలేకపోతున్నాను, క్షమించండి. ...వాసుకి చెప్పిన కథ:నేను నాన్న గురించి చెప్తాను.. ముందు నేను అమితంగా ప్రేమించిన నాన్న, తరవాత అంతకన్నా ఎక్కువగా ద్వేషించిన నాన్న గురించి. నేను చేసిన దిద్దుకోలేని తప్పు గురించి! తమ్ముడిని తెస్తానని ప్రామిస్ చేసిన అమ్మ, హాస్పిటల్ నుంచి రాకుండా మోసం చేసి, తమ్ముడితో సహా పైకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ నేనూ, ఓదారుస్తూ నాన్నా మిగిలాం. అమ్మంటే నాకు ఆరోప్రాణం. అందరికీ అంతేనేమో! కానీ, అందరమ్మల్లా కాకుండా, తొందరగా వెళ్లిపోయిందని బాధ. అందుకే, అమ్మ మీది ఆరవ ప్రాణాన్ని నాన్న మీదికి మళ్లించుకున్నాను. ఇంక నాకు మిగిలింది నాన్నేగా! అమ్మ చనిపోతే నాన్న దిగులుపడ్డాడా? ఏమో! పడినట్టు కనిపించేవాడుకాదు. ‘నీ కోసమే మీ నాన్న దిగులు దిగమింగుకుని బతుకుతున్నాడు’ అనేవాళ్లూ చుట్ట పక్కాలూ, ఇరుగుపొరుగూ.‘అవునేమో’అనుకున్నాను నేనూనూ, కొన్నేళ్ళ దాకా. ‘ఏమంత వయసు మీరిపోయిందని ఇలా మిగిలిపోతావ్? ఆ పిల్లకయినా ఓ తల్లిని తెచ్చే ఆలోచన చెయ్యి’ అంటూ అయినవాళ్ళు ఇచ్చే సలహాలను నిర్ద్వంద్వంగా కొట్టిపారేసేవాడు నాన్న.‘దానికి అమ్మ చేతిలో పెరిగే యోగం ఉంటే, వాళ్ళమ్మ అర్ధాంతరంగా కన్ను మూసేది కాదు. మిగిలింది వాసుకి నేనూ, నాకింక వాసూ. ఇదే రాసిపెట్టాడు భగవంతుడు. ఇదే నిర్ణయం నాది కూడా’ అని చెప్పేసేవాడు మారు ఆలోచన లేకుండా. అలాంటి మాటలు వింటున్నప్పుడల్లా నేను నాన్నని గట్టిగా కౌగలించుకుని ఏడిచేసేదాన్ని.అటువంటి నాన్న హఠాత్తుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్లు కాదు, నాలుగేళ్ళు గడిచాయేమో, అంతే. ఉద్యోగం పని మీద అప్పుడప్పుడూ ఊరు వెళుతూ ఉండే నాన్న ఓసారి ఊరి నుంచి మా ఇద్దరి మధ్య నిలిచేలా ఓ పెద్ద అడ్డు గోడని తెచ్చాడు. అది ‘అమ్మ’ అని చెప్పాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. పట్టరాని ఏడుపు వచ్చింది. ఆ వ్యక్తి ముందర ఏడవటానికి కూడా అసహ్యం వేసింది.వెంటనే నాగదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాను. అంతటితో ఆగకుండా నా మనసు కూడా మూసేసుకున్నాను. ఆ రోజు నుంచీ నాన్నంటే కూడా అసహ్యం వేసింది. ‘భార్య పోయిన నాలుగేళ్ళకి మరో భార్య మీదికి మనసు పోయింది! మగాళ్ళంతా ఇంతేనా? నాన్నలాంటి మగాళ్లు కూడా ఇంతేనా? నేననుకునే లాగా ఏ నాన్నలూ ఉండరా? రామావతారంతోనే, రాముడి గుణాలూ లోకంలో అంతరించిపోయాయా?’ నాన్న అంత తేలికగా ఎలా బలహీనపడిపోయాడో అర్థం కాలేదు. గీత దాటాడని తెలిశాక, కారణాలు, సంజాయిషీలు వినాలన్న కోరిక కూడా మిగల్లేదు. ఆయన పెట్టిన అడ్డుగోడ మీద నుంచి తొంగి చూడాలని కూడా అనిపించలేదు. నేనే గనక మగపిల్లవాడినయి ఉంటే, ఆరోజే ఇంట్లోంచి పారిపోయేవాడిని. ఆడపిల్లగా నాకు కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయి గనుక, ఆ పని చేయలేదు. ఇంట్లోనే నా చుట్టూ ఇనుప చట్రాన్ని బిగించుకున్నాను. మూతికి చిక్కం కట్టుకున్నాను. అత్యవసరమైతే తప్ప వాటిని సడలించకుండా నెట్టుకు వచ్చాను.అయ్యో, నేను చెప్పదలుచుకుంది నాన్న గురించి కదా, అదే చెప్తాను. నా అభిప్రాయం మారి ఉండకపోతే, నాన్నని అసలు తలుచుకునేదాన్నే కాదు. నాన్న సుమిత్ర పిన్నిని మా ఇంట్లో ప్రవేశపెట్టినప్పుడు కలిగిన ద్వేషం ఆయన పోయాక కూడా తగ్గలేదు, ఇన్నేళ్ల వరకూ.. ఆ ఉత్తరం .. ఇన్నేళ్ళూ అజ్ఞాతంలో ఉండిపోయిన ఆ ఉత్తరం నా కంట పడేవరకూ!ఇప్పుడు నా తొందరపాటు, దురుసుతనం, పెడసరి ప్రవర్తనతో జీవితంలో నేనేం కోల్పోయానో, నన్ను అమితంగా ప్రేమించిన నాన్నకి ఎంత అన్యాయం చేశానో తెలుస్తుంటే, పశ్చాత్తాపంతో మనసు కాలిపోతోంది. నాన్నకి ఇప్పటికైనా ఆత్మశాంతి కలగాలంటే ఏం చేయాలో మాత్రం స్పష్టంగా బోధపడింది. ఆ బోధ కూడా అన్యాపదేశంగా తన ఉత్తరం ద్వారా నాన్న చేసినదే! ∙∙ ధన్వంతరి చెప్పిన కథ: నేనిలా మీతో మాట్లాడవచ్చో, మీకు నా మాటలు చేరతాయో లేదో తెలియదు. మనుషులు మాట్లాడుకుంటారు. నేనిప్పుడు మనిషిని కాదు. ఒకప్పటి మనిషికి ఆశలు తీరని ఆత్మని! అయినా, నా ప్రయత్నం చేస్తాను. నా మిగిలిన ఆశలేమిటో మీకు చెప్పుకుంటాను. నేను ముందుగా చెప్పబోయేది అభాగిని సుమిత్ర గురించి. సుమిత్ర నాకు పరిచయమయ్యింది నాగఫణి దగ్గర. నాగఫణి, తన ఊళ్ళో ఉన్న మా కంపెనీ బ్రాంచ్కి హెడ్. నేను కంపెనీ పని మీద తరచూ ఆ ఊరు కూడా వెళ్తుండటం మూలాన నాకు సన్నిహితుడయ్యాడు. సన్నిహితుడయ్యాక అతడి అలవాట్ల వలన దూరమయ్యాడు.. మానసికంగా!నాగఫణికి ఆ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది. తన ఇంట్లో ఒక గది మా కంపెనీకి గెస్ట్ రూమ్గా లీజుకి ఇచ్చాడు నాగఫణి. అందుకే ఆ ఊరు వెళ్ళినప్పుడు, కంపెనీ నిబంధనల ప్రకారం ఆ రూమ్లోనే నా బస. ఆ ఇంట్లోనే నాగఫణి మేనకోడలయిన సుమిత్ర పరిచయం అయింది. అమాయకంగా ఉండే సుమిత్రకి తల్లిదండ్రులు లేరని తెలిసి బాధ పడ్డాను. ఆమె మీద నాకు జాలిగా ఉండేది. మొదట్లో, నాగఫణి ఆమె చేత ఇంటిపనులన్నీ చేయిస్తూ కూడా, ఆమె మీద దాష్టీకం చలాయిస్తున్నట్టు తోచేది. సొంత మేనకోడలు, అతడి సంరక్షణలో ఉంది కనుక అది సహజం అనుకుని సరిపెట్టుకున్నాను. రెండు మూడేళ్ళ తరవాత ఆమె పట్ల నాగఫణి ప్రవర్తనలో కొంత వికృతి కనిపించసాగింది. అయితే, నాకు సంబంధంలేని విషయం అనుకుని ఊరుకుండిపోయాను. ఉన్నట్టుండి ఆఫీసులో దుమారం చెలరేగింది. నాగఫణి బ్రాంచ్ అకౌంట్ల విషయంలో పెద్ద మొత్తం తేడా కనబడింది. అ బ్రాంచ్ పరిధిలోకి వచ్చే కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు సవ్యంగా కంపెనీ అకౌంట్కి జమ కావటంలేదని తేలింది. యాజమాన్యం అతడి నుంచి తేడా వచ్చిన మొత్తం డబ్బు వసూలు చేయటమే కాక, అతడిని ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఆ ఆర్డర్స్ వచ్చేసరికి నేను అతడి ఇంట్లోనే ఉన్నాను. ఆ రాత్రి సుమిత్ర, నాగఫణి మధ్య ఏదో ఘర్షణ జరగటం వినపడింది. మర్నాడు ఉదయమే నేను బయలుదేరి వచ్చేశాను. ఒక వారం తరవాత ఆఫీస్లోని నాగఫణి సన్నిహితుల ద్వారా తెలిసింది, ముందునుంచే ప్రయత్నంలో ఉన్న నాగఫణి, ఇది జరగగానే దుబాయి వెళ్లిపోయాడని. సుమిత్ర విషయం తెలియలేదు. ‘ఆమెని కూడా తీసుకు వెళ్లాడేమో’ అనుకున్నాను. తరవాతి వారం ఆ ఊరు వెళ్లినప్పుడు తెలిసింది, నాగఫణికి ఆపాటి ఔదార్యం కూడా లేదని! సుమిత్రను కలిశాను. నాగఫణి ఉద్యోగం పోయిన విషయం గానీ, అతడు దేశం విడిచి వెళ్ళిన విషయం గానీ ఆమెకి తెలియదు! నేను చెప్పగానే భోరుమంది. అప్పుడు చెప్పుకొచ్చింది తన పరిస్థితి. సుమిత్ర అమాయకత్వాన్నీ, నిస్సహాయతనీ ఆసరాగా తీసుకుని, నాగఫణి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. తగిన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి, గత రెండేళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగించాడు. కష్టాలు కలిసికట్టుగా వస్తాయన్నట్టు, ఇప్పుడామె గర్భవతి. ఆ విషయం తెలిసి, జాగ్రత్తలు తీసుకోలేదని ఆమెనే నిందించి, ఆ రాత్రి ఘర్షణ పడ్డాడు. ఆమెకి చెప్పకుండా పలాయనమై పోయాడు. విషయం వినగానే నిర్ఘాంతపోయాను. ఏం చేయగలనో తోచలేదు. ‘తొందరపడి ఏమీ చేసుకోవద్దనీ, నేను మళ్ళీ పై వారం వస్తాననీ, ఆలోచించి ఒక దోవ చూపిస్తాననీ’ చెప్పి వచ్చాను.స్వంత ఇల్లు కాబట్టి, నాగఫణి వెళ్లిపోయినా గూడు మిగిలింది సుమిత్రకి. తరవాతి వారం వెళ్ళినప్పుడు, ఆమెను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాను. అప్పటికే సమయం మించిపోయిందనీ, సాధ్యపడదనీ చెప్పింది డాక్టర్. సుమిత్రని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ‘నా పరువు బజార్న పడిపోయింది. ఇంక నాకు చావు తప్ప గత్యంతరం లేదు’ అని హిస్టీరికల్గా ఏడ్చేసింది. నాతో వచ్చేయమన్నాను. ‘వచ్చి, ఏం చేయాలని?’ సూటిగా అడిగింది. వెంటనే సమాధానం దొరకలేదు. ఎంతో ఆలోచించాక చెప్పాను, ‘నిన్ను పెళ్లి చేసుకుంటాను.. బయటివాళ్ళ కోసం. నీ బిడ్డకి తండ్రిని అవుతాను.. నీ పరువు నిలవటం కోసం. అంతవరకే మన సంబంధం!’ఆమె అంగీకరించింది. మర్నాడు ఇంట్లోనే దేవుడి పటం ముందు ఆమె మెళ్ళో తాళి కట్టి, మా ఇంటికి తీసుకు వెళ్ళాను. చిన్నదైన వాసుకికి సర్దిచెప్పగలను అనుకున్నాను. ఎంత తప్పుగా ఆలోచించానో వాసుకి రియాక్షన్ చూశాక తెలిసివచ్చింది. సుమిత్రని ఆదుకున్నానుగానీ, నన్ను నేను నిప్పుల్లోకి నెట్టుకున్నాను. నా చిన్నారి వాసుకిని అంతులేని క్షోభకి ఆహుతి చేశాను.ఇంతా చేస్తే, సుమిత్రకి తన బిడ్డ కూడా దక్కలేదు. నెలలు నిండుతుండగా తెలియని ఆరోగ్య సమస్య ఏదో ముంచుకు వచ్చింది. ప్రాణాలతో బయటపడటమే గగనమైపోయింది. అంతవరకూ, ఆ తరవాతా కూడా సుమిత్ర నా యింట్లో మనిషిగా ఉందే గానీ, నా భార్యగా కాదు. ఒక్కనాడు కూడా ఆమె స్పర్శ నేనెరగను. ఆ విషయం నా కూతురికి ఎలా తెలుస్తుంది? నేనేదో వయసు ప్రలోభంలో పడి సుమిత్రని చేసుకున్నాననే ఆమె అభిప్రాయం మార్చలేక పోయాను. చివరికి ఉద్యోగం పేరుతో నాకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది నా ఏకైక ప్రాణం. తట్టుకోలేకపోయాను.నా నోరు కట్టేసింది. చేతులు కాదుగా! ఒకనాటి రాత్రి కూర్చుని, జరిగినదంతా వివరంగా పెద్ద ఉత్తరం రాశాను. మర్నాడు కొరియర్ చేయాలని అనుకున్నాను. ఉత్తరం మడిచి, టేబుల్ మీద ఉన్న పుస్తకంలో పెట్టాను. అది చదివితే, నా చిన్నారి తల్లి నన్ను అర్థం చేసుకుంటుందనే విశ్వాసం కలిగింది. మనసు తేలిక పడింది.‘ఈ పని ఇన్నాళ్ళూ ఎందుకు చేయలేదా’ అనిపించింది. ‘వెర్రివాడా, నీ మాటలే వినని నీ కూతురు నువ్వు రాసే రాతలు చదువుతుందని అనుకుంటున్నావా? అందగానే చించి పారేస్తుంది’ నా అంతరాత్మ వెక్కిరించింది. నిజమేనేమో!మళ్ళీ నా గుండె బరువెక్కింది. ‘అది తేలికపడితే, ఇక కలిసేది గాలిలోనే’ అని తెలిసే సరికి అంతపనీ జరిగింది. నా ఉత్తరం పుస్తకంలోనే నిక్షిప్తమైపోయింది. ముహూర్తం మంచిది కాదని, నా ఇంటిని ఏడాది పాటు మూసిపెట్టారు. మూసే ముందు కింది వస్తువులనీ, టేబుల్ మీది పుస్తకాలనీ తీసి అటకల మీద సర్దేశారు. నా చివరి ఆశ అక్కడే మూలబడిపోయింది. సుమిత్ర తన ఊరికి వెళ్ళిపోయింది.. వితంతువు హోదా అయినా దక్కిందిగదా!ఏడాది దాటాక ఇల్లు అమ్మకానికి పెట్టింది వాసుకి. అమ్మే ముందు అటకలు ఖాళీ చేస్తుంటే ఆ పుస్తకంలో నుంచి జారిపడిన నా ఉత్తరం, చివరికి చేరవలసిన చేతుల్లోకి చేరింది! ‘నాన్న దస్తూరీ’ అనుకుంటూ ఆబగా ఆ కాయితాలన్నీ చదివేసిన నా చిట్టితల్లి కళ్ళలో ధారాపాతంగా నీళ్లు! ఆత్మకి కనులుంటే నా కళ్ళలోనూ ఊరేవేమో నీళ్ళు!∙∙ రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది. పాలసంచీ బయటి గడియకు తగిలించి, తలుపు మూసేసి, తాళం పెట్టుకోబోతున్న సుమిత్ర కాంపౌండ్ గేటు కిర్రుమంటూ మోగిన చప్పుడుకి మూయబోతున్న తలుపు కొద్దిగా తెరిచి, ‘ఇంత రాత్రి వేళ తన ఇంటికి వచ్చేది ఎవరా’ అన్నట్టు ఆ చీకట్లోకి చూసింది.గేటుకీ, వరండాకీ ఉన్న దూరాన్ని దాటి, వరండాలో వెలుగుతున్న నైట్ బల్బ్ వెలుగులోకి వచ్చిన స్త్రీ మూర్తి వాసుకి! సుమిత్ర నివ్వెరపోయింది. తల వంచుకునే మెట్లెక్కి, వరండాలో నిలబడిపోయింది వాసుకి. మాటలు రాని సుమిత్ర ఓరగా తెరిచి ఉన్న తలుపు బార్లా తెరిచి, వాసుకికి దారి ఇస్తున్నట్టు తను ఒక పక్కకి ఒత్తిగిలింది. తడబడుతున్న అడుగులతో లోపలికి నడిచింది వాసుకి. తలుపు వేసుకుని వెనక్కి తిరిగిన సుమిత్ర భుజం మీదకు ఒక్క ఉదుటున వాలిపోయింది. ఆమె కన్నీళ్లతో సుమిత్ర భుజం తడిసిపోయింది. సుమిత్ర వాసుకిని రెండు చేతులతో చుట్టేసి, దగ్గరగా హత్తుకుంది. – పి. వి. ఆర్. శివకుమార్ -
కపిలుడికి.. హనుమంతుడి అనుగ్రహం!
గంగాతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు. దైవచింతనాపరుడు. హనుమంతుడికి పరమభక్తుడు. అయితే, అతడు నిరుపేద. భార్యా పుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు. రోజూ ఉదయమే గంగానదిలో స్నానం చేసి, నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే, సాయంత్రానికి ఏ కూరగాయలో, ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది.ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్లి స్నానం చేసి, జపానికి కూర్చున్నాడు. తదేకదీక్షలో జపంలో నిమగ్నుడై, కాలాన్ని మరచిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో, చతుర్భుజాకారుడై, గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు తదితర వానరయోధులందరూ ఉన్నారు.కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకజలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదికి పూజించి, హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి, హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. ‘వరం కోరుకో’ అన్నాడు హనుమంతుడు. భక్తిపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటిపడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతడి భార్య ‘అయ్యో! కనీసం ఆకుకూరైనా తేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండిపెట్టగలను. కూడు గుడ్డకు కటకటలాడుతున్నా, మీ జపతపాలు మీవే కదా!’ అని రుసరుసలాడుతూ పిల్లలకు మంచినీళ్లు తాగించి పడుకోపెట్టింది.మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగాతీరానికి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సణుగుడు ప్రారంభించింది. ‘ఎంత చెప్పినా వినరు కదా! మీ జపతపాల గోల మీదేగాని, కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండితిప్పల గురించి ఏమైనా ఆలోచించారా?’ అంది.‘ఊరుకో! అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం. అన్నట్లు చెప్పడం మరచాను. నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి! హనుమతో పాటు జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది. ఇంక నాకేం కావాలి’ అన్నాడు కపిలుడు.‘ఔను! హనుమంతుడూ గొప్పవాడే, మీరూ ధన్యులే! మీ కుటుంబానికి మాత్రం దారిద్య్రం తప్పదు’ కినుకగా అంది కపిలుడి భార్య. ఆమె ఇంకా తన సణుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడు ఇల్లు వదిలి, గంగాతీరం వైపు బయలుదేరాడు.కుటుంబ పరిస్థితిపై కపిలుడికీ బాధగానే ఉంది. అయినా హనుమంతుడి మీదనే భారం వేసి, గంగలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు.అతడు తదేక ధ్యానంలో ఉండగా, హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.‘కపిలా! నువ్వు నా భక్తుడవు. నీకు, నీ కుటుంబానికి క్షేమసౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లోని రేగుచెట్టు కింద ధనరాశుల బిందె పాతరవేసి ఉంది. దానిని తవ్వితీసి, నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు.‘ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుని మీద దయ ఉంటే, ఈ రాతినేలను తవ్వి, ధనపు బిందెను తీసి ఇవ్వవచ్చు కదా! శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకువచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు. ఈమాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతినేలను మీరు తవ్వగలరా? నేను తవ్వగలనా?’ అంది నిష్ఠూరంగా.కపిలుడికి భార్య మాటలు బాధ కలిగించాయి. ‘పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను. నా బాధ నేనే అనుభవిస్తాను’ అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు.మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలేవగానే, ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లంతా బంగారుకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలేపింది. హనుమంతుడి దయాభిక్షకు వివశుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసాగాడు. ఇన్నాళ్లూ హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతడి భార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకుని, మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..! -
సంతాపం.. సగం చేటు!
పుట్టెడు కష్టం వచ్చి శోకసంతాపాల్లో మునిగి ఉన్న వ్యక్తిని, ‘ఊరుకో, దుఃఖించకు!’ అంటే ఊరుకోడు. ఊరుకోలేడు. అనుకోకుండా తీవ్రమైన కష్టాలు ఎదురయినప్పడు మనిషికి సంతాపం, దిగులు, దుఃఖం కలగటం మామూలు విషయమే. కొన్ని పరిమితులలో ఉన్నవరకూ అది మానసిక ఆరోగ్యానికి మంచిది కూడా!అయితే ఘడియకో, గంటకో, రోజుకో, వారానికో ఎలాగోలా దాన్ని అధిగమించాలి. బాధే సౌఖ్యమనే భావన పట్టుకొని, శోకపు ఊబి నుంచి బయటపడే ప్రయాస చేయని దేవదాసు మనసు మీదా, జీవితం మీదా అదుపు కోల్పోయి మరింత శోకం కొని తెచ్చుకొన్నవాడయ్యాడు. సఫల జీవనం కోరేవాడికి సంతోషం సగం బలం. సంతాపం సగం చేటు.సందర్భానికి సరిపడని నవ్వులాగా, దీర్ఘకాలం కొనసాగే సంతాపం కూడా నాలుగందాల చేటు అంటుంది మహాభారతం. ‘సంతాపాత్ భ్రశ్యతే రూపం, సంతాపాత్ భ్రశ్యతే బలమ్’... దీర్ఘ శోకం వల్ల శరీరం చిక్కి, ముఖం నిస్తేజమై, ఆకారం వికారమవుతుంది. సంతాపం వల్ల బలం– అటు మనోబలమూ, ఇటు శరీర బలమూ– క్షీణించటం జరుగుతుంది. ‘సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాత్ వ్యాధిం బుచ్ఛతి’... దుఃఖం వల్ల వివేచనా, జ్ఞానమూ సన్నగిల్లుతాయి. మితిమీరిన సంతాపం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.శోకించటం వల్ల, కోల్పోయింది తిరిగిరాదు. తిరిగి రావాలంటే కావాల్సింది ప్రయాస. ఆ ప్రయాసకు శోకం ప్రతిబంధకం. శోకం వల్ల, శోకించేవాడికి లాభం శూన్యం. అతడి శత్రువులకు మాత్రం అతడి శోకం ఆనందాన్నిస్తుంది అంటాడు విదురుడు. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: సంగీతానికి ఆ శక్తి ఉందా? -
భిన్నత్వంలో.. ఏకత్వం!
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
'ఆజాదీ'కి.. ఓ పర్యాయపదం..
నియంతలకు భయమెప్పుడూయుద్ధమంటేనో, బాంబులంటేనో కాదు..ప్రశ్నలంటే, ప్రశ్నించే శక్తులంటేనే!నాగులు కోరల్లో విషముంచుకుని బుసకొట్టేదిబలముందని కాదు..కాలి చెప్పుల అదుళ్లకు అదిరిన భయంతోనే...అబద్ధాలతో రొమ్మిరిచి నిలబడొచ్చనుకునే వాళ్ళు సత్యం ముందు కురుచనవుతున్నామని తెలిస్తే...కుట్రల చిట్టా పేరుస్తారు నిన్ను చిన్నగా చూపడానికి!సముద్రం తన గర్భాన రేగు అగ్నిపర్వతాల అలజడులను..అగుపడకుండా దాచగలదేమో కానీ బద్దలవకుండా ఆపలేదు!ఎగిసి పడే లావాను అడ్డుకోనూ లేదు!!అరుంధతీ...నీ గొంతెప్పుడూ ఏకాకి కాదు,వేల గొంతులు నినదిస్తాయి ఆజాదీ కోసం..నీ భుజమెప్పుడూ ఒంటరీ కాదు,మా భుజాలను నీ భుజంతో అంటుకడతాం ఆజాదీ కోసం..నీ అడుగులెప్పుడూ ఖాళీగా ఉండవులక్షలాదిగా నీ అడుగుల్లో అడుగులేస్తూ ప్రవహిస్తాం!మానవత్వపు పరిమళాలను పంచే ఆజాదీ కోసం..అరుంధతీ...నీ పేరిపుడు ‘ఆజాదీ’కి..ఓ పర్యాయపదం!– దిలీప్. వి, 8464030808 (హక్కుల గొంతుక అరుంధతీ రాయ్కి మద్దతుగా...) -
పిల్లల కథ.. కోయిలమ్మ కొత్తగూడు!
గోదావరికి ఈవల ఉన్న వసంత విహారం అనే అడవికి కొత్తగా వచ్చింది కోయిలమ్మ. దాని దరికి చేరాయి మిగిలిన పక్షులన్నీ! అందులో నెమలి, పావురాలు, గోరువంకలు, గువ్వలు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలు, కాకులూ న్నాయి. వాటిని చూడగానే వినయంగా నమస్కరించింది కోయిల. ‘నేను ఇంతకు ముందు కృష్ణ తీరాన వున్న అడవిలో ఉండే దాన్ని. నా జోడీ ఒక ప్రమాదంలో మరణించడంతో ఇక అక్కడ ఉండలేక ఇలా వచ్చాను.మీరు ఆదరిస్తే ఇక్కడే ఉండి పోతాను. ఇప్పుడు నాకు గుడ్లు పెట్టే సమయం నన్ను ఆదరించండి’ అంటుంది కోయిల. ‘నీవు ఇక్కడ ఉండడానికి మాకే అభ్యంతరమూ లేదు’ అన్నాయి ఆ పక్షులు. ‘చాలా సంతోషం. అలాగే నాకు గుడ్లు పెట్టుకోవడానికి ఓ గూడు చూపించండి’ అని కోరింది కోయిల. ‘వేరే గూడు ఎందుకు? మా కాకమ్మ గూడు ఉందిగా’ అన్నది గోరువంక. ‘అయ్యో.. నా గూడు చాలా చిన్నది. ఇప్పటికే నేను నాలుగు గుడ్లు పెట్టున్నాను. ఖాళీ లేదు’ నొచ్చుకుంది కాకి. ‘అయితే.. వేరే పెద్ద గూడు కట్టుకుంటే సరి’ సలహా ఇచ్చింది గువ్వ. ‘ఇప్పటికిప్పుడు వేరే గూడు అంటే మాటలా?’ ఆందోళన చెందింది కాకి. ‘పని కోయిలమ్మది కనుక తాను సహాయ పడుతుంది’ తీర్మానించాయి మిగిలిన పక్షులు. ‘తనకి కొత్త కనుక మేం కూడా సహాయ పడతాం’ చెప్పాయి గువ్వ, గోరింకలు.గూడు కట్టడం మొదలయింది. ఎండిన పుల్లలు, నార, ఈనులను కోయిలమ్మ తీసుకురాగా.. కొత్త గూడు కట్టసాగింది కాకి. నాలుగు రోజుల్లోనే కోయిల గుడ్లు కోసం కొత్త గూడు తయారయింది. ‘నువ్వు వేరే చోట ఉండడం ఎందుకు ఈ కొత్త గూటిలోనే నీ గుడ్లనూ పొదుగు’ అంది కోయిల. దాంతో కాకమ్మ తన గుడ్లను కొత్త గూటికి చేర్చింది. కోకిల గుడ్లు, తన గుడ్లని తేడా లేకుండా రెండిటినీ పొదిగింది కాకి. నాలుగు కాకి పిల్లలు, మూడు కోయిల పిల్లలతో గూడు కళకళలాడింది.తన పిల్లలను చూసుకుంటూ మురిసిపోయింది కోయిల. పిల్లలన్నీ కాస్త పెరిగాక.. కాకి పిల్లలకి.. కోయిల పిల్లలు తమ జాతివి కావని తెలిసింది. ఒకరోజు అమ్మ లేని సమయంలో తెలిసీతెలియని వయసున్న కాకి పిల్లలన్నీ కోయిల పిల్లల్ని బయటకి నెట్టేశాయి. పాపం కోయిల పిల్లలు గూడు నుంచి కిందపడ్డాయి. చెట్టు కింద మెత్తని మట్టి ఉండటం వలన వాటికేమీ కాలేదు. తిరిగి వచ్చిన కాకి జరిగింది తెలుసుకుని తన పిల్లలని మందలించింది.కాకి పిల్లలు తల్లికి ఎదురు తిరిగాయి.. ‘ఎవరి పిల్లలనో మనమెందుకు ఆదరించాలి?’ అని! పిల్లల అమాయకత్వాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది కాకి. కిందపడిన తన పిల్లలను చూసి కన్నీరు పెట్టుకుంది కోయిల. పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలోకి వాటిని చేర్చింది. ఎదుగుతున్న కోయిల పిల్లలు కొత్త రాగాలు ఆలపించసాగాయి. కోయిలా వాటితో జత కలిపింది. వాటి పాటలు వినడానికి పక్షులన్నీ అక్కడికి వచ్చేవి. కొన్ని తమ పిల్లలకి పాటలు నేర్పమని కోయిలని బతిమాలాయి. అలా కోయిల పక్షులకి పాటలు నేర్పడం మొదలుపెట్టింది.కాకి పిల్లలూ పాటలు నేర్చుకోవాలని అనుకున్నాయి. కోయిలమ్మతో మాట్లాడి తమకు పాటలు నేర్పించమని తల్లిని పోరాయి. ‘ఏ మొహం పెట్టుకుని అడగాలి మీరు చేసిన పనికి?’ అని పిల్లల్ని కోప్పడింది కాకి. ‘తెలియక చేసిన తప్పు అది. నువ్వా రోజు మా తప్పును సరిదిద్ది ఉండాల్సింది’ అన్నాయి తల్లితో. ‘నిజమే.. అప్పుడు మీ మీద మమకారంతో నా కళ్లుమూసుకుపోయాయి. అందుకే నాకిప్పుడు మొహం చెల్లడం లేదు కోయిల దగ్గరకు వెళ్లడానికి!’ అని బాధపడింది కాకి.‘సరే అయితే.. మేమే అడుగుతాం.. మమ్మల్ని క్షమించమని’ అన్నాయి ఆ పిల్లలు ముక్త కంఠంతో! ‘శభాష్.. ఇప్పుడు నా పిల్లలు అనిపించుకున్నారు మీరు. చేసిన తప్పుని గ్రహించి.. క్షమాపణ అడగాడానికి సిద్ధమయ్యారు’ అంటూ పిల్లల పరిణతికి సంతోషపడింది కాకి. ఆ కొమ్మకు కాస్త దూరంలో ఉన్న కోయిల ఆ సంభాషణనంతా విన్నది. వెంటనే తన పిల్లల్ని పిలిచి కాకి పిల్లలను వెంటబెట్టుకుని రమ్మనమని వాటిని కాకి గూటికి పంపింది. అవి కాకి గూటికి వెళ్లి.. ‘మా అమ్మ మిమ్మల్ని మా గూటికి రమ్మంటోంది.మా గూడు కోసం మీ అమ్మ మాకు చాలా సాయం చేసిందట కదా.. అసలు మమ్మల్ని మీ అమ్మే పొదిగిందట కదా మా అమ్మ చెప్పింది. మనం అన్నదమ్ములమనీ.. పోట్లాడుకోకూడదనీ చెప్పింది’ అంటూ కాకి పిల్లలను తమ వెంట తీసుకెళ్లాయి. వాటి మాటలకు అబ్బురపడింది కాకి. ‘ఎంత మంచిదానవు కోయిలా.. పిల్లల్ని ఎంత బాగా పెంచావు!’ అంటూ కోయిలను ప్రశంసించింది. ‘ఊరుకో కాకమ్మా.. నువ్వు చేసిన సాయం గురించి చెప్పానంతే! మీ సహవాసం వల్ల నాకూ కాసింత మంచితనం అబ్బినట్టుందిలే. ఈ పొగడ్తలకేం కానీ.. పిల్లలకు పాటలు నేర్పనివ్వూ..’ అంటూ కాకిపిల్లలతో సాధన మొదలుపెట్టించింది కోయిల. – కూచిమంచి నాగేంద్ర -
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు -
శాంతాత్ముల సహనం..!
సీతమ్మను లంకాధిపతియైన రావణుడు అపహరించి తీసుకువెళ్ళి లంకలోని అశోకవనంలో దాచాడు. అది తెలుసుకున్న శ్రీరాముడు వెంటనే సముద్రాన్ని దాటి లంకకు చేరే ప్రయత్నం మొదలుపెట్టాడు. తెప్పలు కట్టుకుని దాటడానికి ఎదురుగా ఉన్నది చిన్న నది కాదు కాబట్టి, సముద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం అని విభీషణుడు సలహా ఇచ్చాడు. దాన్ని అంగీకరించాడు శ్రీరాముడు, సముద్రుడిని దారి వదలమని ప్రార్థించడానికి పూనుకున్నాడు.సముద్ర తీరంలోని ఇసుకపై దర్భలతో తయారుచేయబడిన చాపమీద తన కుడిభుజాన్ని తలగడగా చేసుకుని శయనించి ఏకాగ్ర చిత్తంతో సాగరుడిని ప్రసన్నం కమ్మని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా విభావరులొక మూడు గడిచాయట! అనగా మూడు రాత్రులు గడిచాయి శ్రీరాముడి జీవితంలో! మూడురోజులు ప్రార్థించినప్పటికీ సముద్రుడి నుండి సమాధానం రాకపోవడంతో సహనం కోల్పోయాడు శ్రీరాముడు.పక్కనే ఉన్న లక్ష్మణుడితో ‘తమ్ముడా, ఈ సముద్రుడు నన్ను అసమర్థుడిగా జమకట్టాడు. ఇతడితో సహనం పాటించడం వివేకంతో కూడుకున్న పని కాదు. ఇతడు దారికి రావాలంటే దండన ఒక్కటే ఇప్పుడు మిగిలున్న మార్గం. బాణాగ్ని చేత ఈ సాగరుడిని శోషింపజేసి, మన సైన్యం నడిచి వెళ్ళడానికి దారి కల్పిస్తాను!’ అని శక్తిమంతమైన ఒక బాణాన్ని సంధించి సముద్రుడి మీదికి వదిలాడు శ్రీరాముడు.దశదిశలలో దారుణ అగ్నిశిఖలను విరజిమ్ముతూ ఆ బాణం సముద్రంలో ప్రవేశించగానే, నిలువెల్లా వణికిపోతూ సముద్రుడు పరుగున వచ్చి శ్రీరాముడి ముందు నిలిచాడు. సుముద్రుడి అప్పటి అవస్థను ఏనుగు లక్ష్మణకవి తన ‘రామేశ్వర మాహాత్మ్యము’, ప్రథమాశ్వాసంలోని ఈ క్రింది కంద పద్యంలో అలతి మాటలలో వర్ణించాడు."కోపంబు సంహరింపుమునీ పదకమలములు గొలిచి నిల్చిన నన్నుంజేపట్టుము మ్రొక్కెద, నాచాపలము సహింపు రామ సద్గుణధామా!"‘కోపాన్ని ఉపసంహరించుకో శ్రీరామా! నీ పాదములపై వాలి వేడుకుంటున్న నన్ను సేవకుడిగా భావించి ఆదరించు! సద్గుణాలకు నెలవైన ఓ స్వామీ, నా తెలివితక్కువ చేష్టకు నన్ను దయతో మన్నించు!’ అని సముద్రుడు వేడుకున్నాడు. ధీరులు, శాంతాత్ములు, పరమాత్మ స్వరూపులుగా ఉండేవారి సహనాన్ని పరీక్షించే చాపల్యపు పనికి పూనుకుంటే, సముద్రుడంతటి వాడికైనా భంగపాటు తప్పదని పై సన్నివేశం బోధిస్తుంది. – భట్టు వెంకటరావు -
దేవుడు స్వతంత్రుడా?
ఈ సృష్టిలో నిజంగా స్వతంత్రులెవరైనా ఉన్నారా? లౌకిక ప్రపంచాన్ని గమనిస్తే... కుటుంబ సభ్యులు కుటుంబ యజమాని వశంలో ఉంటారు. ఆ యజమాని తనకు జీవనోపాధి ఇచ్చే మరో యజమానికి వశుడు. ఆ యజమాని కూడా చట్టానికీ, ప్రభుత్వానికీ లోబడవలసిందే. సవ్యమైన పాలన అందించే ప్రభువు కూడా ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలించాలి. పూర్తి స్వతంత్రుడు కాలేడు. ఇక ప్రజాస్వామ్యమైతే, ప్రజలే స్వాములని పేరులోనే ఉంది. పాలకులు సేవకులు!ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... జగత్తంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనడం కూడా జరగదని నమ్మకం. ‘నా వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది!’ – మత్తః సర్వ ప్రవర్తతే– అని గీతాచార్యుడి ప్రకటన. ‘పరమాత్మనైన నేను అధిష్ఠానంగా ఉంటుండగా, త్రిగుణాత్మకమైన నా మాయా శక్తి త్రిలోకాలను సృష్టిస్తుంది. భూతకోటి యావత్తూ ఈ మాయా శక్తి వశులై నడుస్తారు’ అంటాడు. అలాంటప్పుడు, ఇక ప్రాణులకు స్వాతంత్య్రం ఎక్కడ? ఏపాటి? పోనీ ఆ దైవం స్వతంత్రుడా అంటే, పూర్తి స్వతంత్రం ఆయనకూ లేదు. ఆ భగవంతుడిని తమ వశంలో ఉంచుకోగల వాళ్ళు కూడా ఉన్నారు.భాగవతంలో దుర్వాస మహర్షి అంబరీశుడిని అకారణంగా సంహరించబోగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, తనకున్న దుష్ట శిక్షణ కర్తవ్యాన్ని అనుసరించి, తనంతట తానే మునీంద్రుడిని తరుముతూ వెళ్తుంది. దాన్ని తప్పించుకునే మార్గం తెలియక, తిరిగి తిరిగి ముని చివరికి విష్ణుమూర్తినే ప్రార్థిస్తాడు.‘నీ ఆయుధాన్ని ఉపసంహరించుకుని నన్ను రక్షించ’మని. ‘అంత స్వతంత్రం నాకెక్కడిది?’ అంటాడు విష్ణుమూర్తి. ‘అహం భక్త పరాధీనః, అస్వతంత్రః ఇవ ద్విజ!– ఓ మునీంద్రా, నేను నా భక్తుల అధీనంలో ఉండేవాడిని. అక్కడ నాకు స్వతంత్రం లేదు. నా హృదయం వాళ్ళకు బందీ. సద్గుణవతులైన స్త్రీలు, సత్పురుషులైన తమ భర్తలను వశం చేసుకొన్నట్టు, ఆ సాధువులు నన్ను వశం చేసుకుంటారు. నా ఆయుధాన్ని ఆపగల శక్తి అంబరీషుడికే ఉంది. నాకు లేదు!’ – ఎం. మారుతి శాస్త్రి -
బ్రహ్మజ్ఞానం అంటే...
ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు బ్రహ్మజ్ఞానం తెలియాలని ఆశపడ్డారు. వారిద్దరినీ ఓ మంచి గురువు వద్దకు పంపారు. ఇద్దరూ గురుకులవాసం పూర్తి చేసుకుని ఇంటికొచ్చారు. తండ్రి తన పెద్దకొడుకుని చూసి ‘బ్రహ్మజ్ఞానం గురించి ఏం నేర్చుకున్నావు’ అని అడిగాడు. వెంటనే ఆ కొడుకు వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. వేదాల నుంచీ, శాస్త్రాల నుంచీ ఉదాహరణలు చెబుతున్నాడు. అతడి మాటలకు అడ్డు తగులుతూ ‘సరే ఆపు’ అని తండ్రి అన్నాడు.ఈసారి బ్రహ్మజ్ఞానం గురించి నువ్వేం నేర్చుకున్నావని చిన్న కొడుకుని అడిగాడు తండ్రి. అతను నోరెత్తలేదు. తల వంచుకుని నిల్చున్నాడు. తండ్రి అతని వంక చూశాడు. నీ వాలకం చూస్తుంటే నీకే బ్రహ్మజ్ఞానం గురించి అంతో ఇంతో తెలిసినట్లుందన్నాడు. ‘బ్రహ్మం గురించి పూర్తిగా తమకు తెలుసని పలువురు అనుకుంటూ ఉంటారు. అది ఎలాంటిదంటే బ్రహ్మాండమైన చక్కెర కొండ నుంచి ఒక్క రవ్వ చక్కెరను తీసుకుని పోతున్న చీమ మరోసారి వచ్చినప్పుడు ఈ మొత్తం కొండను తీసుకుపోతానని చెప్పడం లాంటి’దని రామకృష్ణపరమహంస చెప్పారు.బ్రహ్మం అనేది మన ఆలోచనలకు, మాటలకు అతీతమైనది. గొప్ప గొప్ప మహాత్ములను కూడా ఈ విషయంలో పెద్ద చీమలని చెప్పవచ్చు. వారందరూ ఓ ఏడెనిమిది చక్కెర రవ్వలను తీసుకుపోయి ఉంటారు. అంతే. బ్రహ్మం అనే మహాసముద్ర తీరాన నిల్చుని కాళ్ళు తడుపుకోవడం లాంటిదే వారు బ్రహ్మజ్ఞానం తమకు తెలుసునని చెప్పడం. నిజానికి వారందులో మునగలేదు. మునిగి ఉంటే వారు తిరిగివచ్చి ఉండరు.‘అనగనగా ఓ ఉప్పు బొమ్మ ఉండేది. సముద్రం లోతెంత అని తెలుసుకోవడంకోసం అందులోకి దూకాలన్నది దాని ఆశ. అలాంటి ఆశ పుట్టినప్పుడు అది ఉత్తినే ఉండగలదా! సరే, సముద్రం లోతెంత చూసేద్దామని నిర్ణయించుకుంది. వెంటనే అది సముద్రంలో దూకేసింది. కొంచెం దూరం వెళ్ళిందో లేదో... అంతే సంగతులు. ఉప్పుబొమ్మ సముద్రంలో దూకితే ఏమవుతుంది... కొంచెం కొంచెంగా కరగనారంభించింది. కాస్సేపటికే బొమ్మ మొత్తం కరిగిపోయింది.అది ఇంకేం కనిపెట్టగలదు సముద్రం లోతుని! అలాగే బ్రహ్మజ్ఞానం తనకొచ్చేసింది అనుకున్న మనిషి మౌనంగా ఉంటాడు. అది వచ్చేంతవరకూ మట్లాడుతూనే ఉంటాడు. తేనె తాగడం కోసం ఓ భ్రమరం తోటలోకి వెళ్ళింది. అది పువ్వు మీద వాలే వరకే ఝుమ్మని శబ్దం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పువ్వు మీద వాలిందో ఆ క్షణంలోనే అది మౌనమైపోతుంది. అలాటిదే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడ’మని పరమహంస అంటారు. – యామిజాల జగదీశ్ఇవి చదవండి: June11: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ -
సరైన చోటు..?
మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు. ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, తపస్సు చేసుకునేవాడు. ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు దట్టంగా ఉండేవి. ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు, పక్షులు అక్కడ సేదతీరడానికి ఇష్టపడేవి.ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. అవెప్పుడైనా జబ్బు చేస్తే, గాయపడితే వనమూలికలు, ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు. అలా మునికి, వాటికి మధ్య స్నేహం కుదిరింది. ముని ధ్యానంలో మునిగిపోతే తియ్యటి పండ్లు, దుంపలు, పుట్ట తేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి. ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు, పక్షులు జాతి వైరం మరచి కలసిమెలసి ఉండేవి.ఒక వర్షాకాలం.. ఉదయాన్నే నదికి వెళ్లిన ముని తిరిగి వస్తూండగా.. జారి గోతిలో పడిపోయాడు. ఎంతప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. బాధతో మూలుగుతూ చాలాసేపు గోతిలోనే ఉండిపోయాడు. స్నానానికి వెళ్లిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగిరాలేదని ఒక చిలుక గమనించింది. ఎగురుకుంటూ నది వైపు వెళ్లింది. గోతిలో మునిని చూసింది. ఆయన ముందు వాలింది. ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది.వెంటనే ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక, కోతి పరిగెడుతూ ముని ఉన్న గోతిని చేరాయి. ‘భయపడకండి మునివర్యా.. మిమ్మల్ని బయటకు తీస్తాము’ అని మునికి భరోసానిచ్చాయి. గోతి లోపలకి వెళ్ళడానికి దారి చేసింది ఏనుగు. తన తొండంతో మునిని లేపి గుర్రం మీద కూర్చోబెట్టింది. అలా ఆ జంతువులన్నీ కలసి మునిని ఆశ్రమానికి చేర్చాయి. వనంలోని మూలికలు, ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి. చిలుక వెళ్లి తియ్యటి పండ్లను, కుందేలు వెళ్లి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి.అలా అవన్నీ.. మునికి సేవలు అందించసాగాయి. నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు. అవి తనకు చేసిన సేవకు ముని కళ్లు ఆనందంతో చిప్పిల్లాయి. ‘నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు. మీ మేలు మరువలేను’ అన్నాడు శతానందుడు వాటితో. ‘ ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్యా..! మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరచిపోయి ఒక్కటయ్యాం. మీ ఆశ్రమ ప్రాంగంణంలో.. మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం. మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాల్ని కాపాడారు.కష్టంలో ఉన్న ప్రాణిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచే అలవర్చుకున్నాం. మీకు సేవలందించాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు. మీరు కోలుకున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్యా..’ అన్నది ఏనుగు. ‘అవునవును’ అంటూ మిగిలినవన్నీ గొంతుకలిపాయి. ఆప్యాయంగా వాటిని తడిమాడు శతానందుడు. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
పూర్వం ధ్రువసంధి అయోధ్యకు రాజుగా ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మనోరమ, రెండో భార్య లీలావతి. సద్గుణ సంపన్నుడైన ధ్రువసంధి యజ్ఞయాగాదికాలు చేస్తూ, బ్రాహ్మణులకు, సాధు సజ్జనులకు, పేదసాదలకు విరివిగా దానాలు చేస్తుండేవాడు.ధ్రువసంధికి మనోరమ ద్వారా సుదర్శనుడు, లీలావతి ద్వారా శత్రుజిత్తు అనే కొడుకులు కలిగారు. వారిద్దరూ గురుకులవాసంలో సకల శాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చి, అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. ధ్రువసంధి పెద్దకొడుకు సుదర్శనుడికి త్వరలోనే పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. వినయశీలుడు, వీరుడు అయిన సుదర్శనుడికి ప్రజామోదం కూడా ఉండేది. అయోధ్య ప్రజలందరూ సుదర్శనుడే తదుపరి రాజు కాగలడని అనుకునేవారు.సుదర్శనుడికి పట్టాభిషేకం చేయడానికి ధ్రువసంధి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని, అతడి రెండో భార్య లీలావతి తండ్రి, శత్రుజిత్తు మాతామహుడు యుధాజిత్తు సహించలేకపోయాడు. తన మనవడినే రాజుగా చేయాలని ధ్రువసంధిని కోరాడు. పెద్దకొడుకుకే పట్టాభిషేకం చేయడం ధర్మమని తేల్చి చెప్పిన ధ్రువసంధి అతడి కోరికను నిరాకరించాడు.సుదర్శనుడిపై అసూయతో రగిలిపోతున్న యుధాజిత్తు ఒకనాడు అకస్మాత్తుగా తన సేనలతో అయోధ్యపై విరుచుకుపడ్డాడు. ధ్రువసంధిని చెరసాలలో పెట్టి, తన మనవడైన శత్రుజిత్తుకు రాజ్యాభిషేకం చేసి, తానే అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. తన సేనలతో ఎలాగైనా సుదర్శనుడిని, అతడి తల్లి మనోరమను బంధించడానికి ప్రయత్నించాడు.అయితే, ప్రమాదాన్ని శంకించిన మనోరమ కొందరు మంత్రులు, ఆంతరంగికుల సాయంతో కొడుకు సుదర్శనుడితో కలసి అరణ్యాల్లోకి వెళ్లిపోయింది. అరణ్యమార్గంలో ముందుకు సాగుతుండగా, మార్గమధ్యంలో కనిపించిన భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. భరద్వాజ మహర్షి వారికి జరిగిన అన్యాయం తెలుసుకుని, జాలితో తన ఆశ్రమంలోనే వారికి వసతి కల్పించాడు.మనోరమ, సుదర్శనులను ఎలాగైనా పట్టి బంధించి, చెరసాల పాలు చేయాలని భావించిన యుధాజిత్తు వారిని వెదకడానికి రాజ్యం నలుమూలలకు, పొరుగు రాజ్యాలకు వేగులను పంపాడు. కొన్నాళ్లు గడిచాక వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు.సైన్యాన్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని యుధాజిత్తు ఒకనాడు భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ‘ఓ మునీ! నువ్వు అన్యాయంగా సుదర్శనుడిని, మనోరమను నీ ఆశ్రమంలో బంధించి ఉంచావు. వాళ్లను వెంటనే నాకు అప్పగించు’ అని దర్పంగా ఆదేశించినట్లు పలికాడు. అతడి మాటలకు భరద్వాజుడు కన్నెర్రచేసి కోపంగా అతడివైపు చూశాడు.భరద్వాజ మహర్షి ఎక్కడ శపిస్తాడోనని యుధాజిత్తు మంత్రులు భయపడ్డారు. వెంటనే యుధాజిత్తును వెనక్కు తీసుకుపోయారు. ‘మళ్లీ ఈ పరిసరాల్లో కనిపిస్తే నా క్రోధాగ్నికి నాశనమవుతారు’ అని హెచ్చరించాడు భరద్వాజుడు. ఆ మాటలతో యుధాజిత్తు పరివారమంతా వెనక్కు తిరిగి చూడకుండా అయోధ్యకు పరుగు తీశారు.భరద్వాజుడి ఆశ్రమంలో ఒక మునికుమారుడు మనోరమకు క్లీబ మంత్రాన్ని ఉపదేశిస్తుండగా, సుదర్శనుడు విన్నాడు. ఆ శబ్దం అతడికి ‘క్లీం’ అని వినిపించింది. క్లీంకారం దేవీమంత్రం. సుదర్శనుడు తదేక దీక్షతో క్లీంకారాన్ని జపించసాగాడు. సుదర్శనుడి నిష్కల్మష భక్తికి అమ్మవారు సంతసించి, అతడి ముందు ప్రత్యక్షమైంది. అతడికి ఒక దివ్యాశ్వాన్ని, గొప్ప ధనువును, అక్షయ తూణీరాలను ఇచ్చింది. ‘నువ్వు తలచినంతనే నీకు సాయంగా వస్తాను’ అని పలికి అదృశ్యమైంది.ఆనాటి నుంచి సుదర్శనుడు, మనోరమ నిరంతరం భక్తిగా దేవిని పూజించసాగారు. కొన్నాళ్లకు ఒకనాడు ఒక నిషాదుడు సుదర్శనుడిని చూడవచ్చాడు. అతడు ఒక రథాన్ని సుదర్శనుడికి కానుకగా సమర్పించాడు. అమ్మవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలు ధరించి, నిషాదుడు బహూకరించిన రథంపై సుదర్శనుడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అతడికి అమ్మవారి శక్తి తోడుగా నిలిచింది.సుదర్శనుడి ధాటికి యుధాజిత్తు సేనలు కకావిలకమయ్యాయి. అతడి ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణాలు తరుముకొస్తుంటే, వారంతా భీతావహులై పలాయనం చిత్తగించారు. యుద్ధంలో ఘనవిజయం సాధించిన సుదర్శనుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. – సాంఖ్యాయన -
హానికరమైన ఉపేక్ష!
కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తులను దురాశను వారల యవినయములునీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధకర్మమున ఫలమొందక కౌరవేంద్ర!‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావుఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర.. -
Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
కౌశంబీ ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌశంబీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్ణికకు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత.ఆరుగురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చలించింది. అయినా దూరం నుంచే ‘అమ్మాయీ.. దారి తప్పుకో.. మేము వాగు దాటి వెళ్ళాలి’ అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి ‘చీకటి పడుతోంది.. నేనూ వెళ్ళాలి. నన్ను వాగు దాటించండి’ అని అడిగింది. ‘మేము సర్వసంగ పరిత్యాగులం.పర స్త్రీని తాకము’ అంటూ ముందుకు కదిలారు ఆ ఐదుగురు. ‘బాబ్బాబులూ.. దయచేసి నన్ను వాగు దాటించండి’ అంటూ ఆ యువతి వేడుకుంది. ‘వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు’ అని చెప్పనైతే చెప్పారు కానీ.. ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్లు. ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం ‘నేను వాగు దాటిస్తాను రండమ్మా..’ అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన ఐదుగురు ‘ఆ పాపం మాకొద్దు’ అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. ‘అమ్మా.. వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మీరు నా భుజాల మీదకు ఎక్కండి’ అన్నాడు.మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి.. తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ ఐదుగురు మాత్రం కౌకర్ణిక దారెంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. ‘స్త్రీని తాకావు.. భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు’ అంటూ! విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు.ఆ ఆరుగురినీ చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చేప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ‘ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్నీ మరచిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు’ అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌశంబీకీ కబురుపెట్టాడు. – కనుమ ఎల్లారెడ్డిఇవి చదవండి: వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో.. -
వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
కాశ్మీర దేశాన్ని పూర్వం వసువు అనే మహారాజు పరిపాలించేవాడు. ధర్మాధర్మాలు ఎరిగిన వసువు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. నిత్యం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ దేవతలను తృప్తిపరచేవాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడినే మనసులో నిలుపుకొని ధర్మబద్ధ జీవనాన్ని కొనసాగించేవాడు.కొన్నాళ్లకు వసు మహారాజుకు మోక్ష కాంక్ష ఎక్కువైంది. రాజ్యభారాన్ని విడిచి, తపస్సు ద్వారా మోక్షాన్ని సాధించాలనే కోరిక పెరగడంతో, ఒకనాడు తన సోదరుల్లో సర్వసమర్థుడైన వివస్వంతుడిని పిలిచి, అతడి కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించాడు. తర్వాత బంధుమిత్ర పరివారాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కాలినడకన సాగుతూ దారిలో ఉన్న తీర్థాలన్నీ దర్శించుకుంటూ పరంధాముడైన శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడిగా కొలువైన పుష్కర తీర్థానికి చేరుకున్నాడు. తన తపస్సుకు అనువైన క్షేత్రం పుష్కర తీర్థమేనని తలచి, అక్కడ తగిన చోటు వెదుక్కుని తపోదీక్షలో కూర్చున్నాడు. శరీరం శుష్కించిపోయేలా కఠోర తపస్సు సాగించాడు. పుండరీకాక్షుడే పరమదైవంగా భావిస్తూ ఒకనాడు ఆశువుగా స్తోత్రాన్ని పఠించసాగాడు.‘నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన/ నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే/ విశ్వమూర్తి మహాబాహుం వరదం సర్వతేజసమ్/ నమామి పుండరీకాక్షం విద్యా విద్యాత్మకం ప్రభుం/ ఆదిదేవం మహాదేవం వేద వేదాంగ పారగం/ గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం..’ అంటూ వసు మహారాజు పుండరీకాక్ష పారస్తుతిని పఠిస్తుండగా, ఒక్కసారిగా అతడి ముందు ఒక భయంకరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. తుమ్మమొద్దులాంటి నల్లని దేహంతో, చింతనిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో ఉన్నాడు. అతడు ‘రాజా! ఏమి ఆజ్ఞ!’ అని అడిగాడు.ఈ పరిణామానికి వసు మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘ఓయీ కిరాతకా! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాడు. ‘రాజా! పూర్వం నువ్వు దక్షిణపథాన ధర్మప్రభువుగా ఉన్నావు. ఒకనాడు మృగయావినోదం కోసం అడవికి వెళ్లావు. అక్కడ జంతువులను వేటాడుతూ నువ్వు సంధించిన బాణం పొరపాటున ఒక మునికి తగిలింది. ముని ఆర్తనాదం విని నువ్వు హుటాహుటిన అతడి వద్దకు చేరుకున్నావు. అప్పటికే అతడు మరణించాడు. అనుకోని ఆ సంఘటనకు నీలో ఆందోళన కలిగింది. బ్రహ్మహత్యకు పాల్పడినందుకు బాధతో లోలోపలే కుమిలిపోయావు. రాజ్యానికి చేరుకున్న తర్వాత ఈ వృత్తాంతాన్ని నీ ఆంతరంగికుడికి చెప్పావు. అయినా అపరాధ భావన నీ మనసును తొలిచేయసాగింది. ఎలాగైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుదామని భావించావు. శ్రీమన్నారాయణుడిని మనసారా ధ్యానించి ద్వాదశినాడు ఉపవాసం ఉన్నావు. ఆ పుణ్యదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఒక బ్రాహ్మణుడికి గోదానం చేశావు. ఆ వెంటనే ఉదరశూలతో బాధపడుతూ నువ్వు ప్రాణాలు వదిలావు. ప్రాణాలు వదులుతున్న సమయంలో అప్పటి నీ భార్య ‘నారాయణి’ పేరును ఉచ్చరించావు. ఆ కారణంగా నీకు ఒక కల్పం వరకు విష్ణులోక నివాసయోగం లభించింది.రాజా! నేనొక బ్రహ్మరాక్షసుడిని. అత్యంత ఘోరమైన వాణ్ణి. నీ దేహంలోనే ఉన్న నాకు ఇదంతా తెలుసు. నేను నిన్నెలాగైనా పీడించాలని అనుకున్నాను. ఇంతలో విష్ణుదూతలు నన్ను బయటకు లాగి రోకళ్లతో చావగొట్టారు. ఇక లోపలికి ప్రవేశించలేక నీ రోమకూపాల నుంచి పూర్తిగా బయటపడ్డాను. నువ్వు స్వర్గంలోకి ప్రవేశించావు. నీలో నా తేజస్సును నింపి నేను కూడా నీతో పాటు స్వర్గానికి వచ్చాను. ఇదంతా గడచిన కల్పంలో జరిగిన చరిత్ర.ఈ కల్పంలో నువ్వు కాశ్మీర రాజకుమారుడిగా జన్మించావు. ఆనాటి నుంచి నేను నీ రోమకూపాల్లోనే ఉండిపోయాను. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యాగాలు చేశావు. అవేవీ నన్ను ఏమీ చేయలేకపోయాయి. అయితే, రాజా! ఇప్పుడు నువ్వు పుండరీకాక్ష పారస్తుతిని పఠించగానే నేను నీ రోమకూపాల నుంచి బయటపడి, ఇలా కిరాతుడిలా ఏకరూపాన్ని పొందాను. పరమాత్ముడి స్తోత్రాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి విముక్తిని పొందాను. నాకిప్పుడు ధర్మబుద్ధి కలిగింది’ అని చెప్పాడు. కిరాతుడి ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న వసు మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తన జన్మాంతర వృత్తాంతాన్ని చెప్పిన కిరాతుడిని వరం కోరుకోమన్నాడు. పరమాత్మ జ్ఞానం తప్ప తనకు వరమేదీ అక్కర్లేదన్నాడు కిరాతుడు. ‘ఓ కిరాతుడా! నీ వల్ల నా పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకున్నాను. నీకు అనేకానేక కృతజ్ఞతలు. ఇకపై నువ్వు నా అనుగ్రహంతో ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధి పొందుతావు. జ్ఞానమార్గంలో మోక్షం పొందుతావు. పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడే పరమదైవమని తలచి, భక్తిశ్రద్ధలతో ఈ పుండరీకాక్ష పారస్తుతిని పారాయణం చేసిన వారికి, ఆలకించిన వారికి పుష్కరతీర్థంలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది’ అని పలికాడు వసు మహారాజు. వెంటనే అతడి ముందు ఒక దివ్యవిమానం వచ్చి నిలిచింది. దేవదూతలు అతడికి సాదరంగా స్వాగతం పలికారు. తమతో పాటు విమానంలోకి ఎక్కించుకుని, వసు మహారాజును స్వర్గానికి తీసుకుపోయారు. – సాంఖ్యాయన -
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. -
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్ని మరచిపోయి వేసిన స్టెప్స్నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'? -
Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు. రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు. ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! -
'నిజాయితీ'..! ఒక రాజు.. అంతు చిక్కని రోగంతో..
అనగనగా ఒక రాజు. అతనో అంతు చిక్కని రోగంతో బాధపడసాగాడు. తానింక ఎన్నో రోజులు బతకనని అతనికి అర్థమైంది. అందుకే తను బతికుండగానే.. రాజ్యానికి నిజాయితీపరుడైన యువరాజును ఎన్నుకోవాలనుకున్నాడు. మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి.. యువరాజు ఎంపిక విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, దాన్ని నాటమని చెప్పి.. పదిరోజుల తర్వాత మొలకెత్తిన ఆ మొక్కను తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి యువరాజు అవుతాడు’ అని సెలవిచ్చాడు రాజు. ‘అలాగే రాజా..’ అంటూ అందరూ ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్లి మట్టి కుండల్లో వేశారు.పది రోజుల తర్వాత వాళ్లంతా ఆ మట్టికుండలను తీసుకుని రాజుగారి కొలువుకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. రాజు అందరి కుండలను పరిశీలించి.. ఖాళీ కుండ తెచ్చిన మహేంద్రనే యువరాజుగా ప్రకటించాడు. ఆ మాట విన్న మిగతా యువకులంతా విస్తుపోయారు. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి ‘రాజా! మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో వారే కదా యువరాజు! మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి. పోటీ మా మధ్యనే ఉండాలి. కానీ విత్తనమే మొలకెత్తని మహేంద్రను యువరాజుగా ఎలా ప్రకటిస్తారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. వాటి నుంచి మీ అందరి కుండల్లోకి మొక్కలు ఎలా వచ్చాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు రాజు. ఆ ఎదురు ప్రశ్నకు ఆ యువకులంతా బిత్తరపోయారు. తాము చేసిన మోసాన్ని రాజు గ్రహించాడని వాళ్లకు తెలిసిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నారు! వాళ్లంతా రాజు ఇచ్చిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను నాటారు. అందుకే అవి మొలకెత్తి ఏపుగా పెరిగాయి. మహేంద్ర మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్నే వేశాడు. అందుకే అది మొలకెత్తలేదు.అతని నిజాయితీని మెచ్చిన రాజు.. ఆ రాజ్యానికి సమర్థుడైన పాలకుడు మహేంద్రనే అని అతన్నే యువరాజుగా ప్రకటించాడు. తదనంతర కాలంలో ఆ రాజ్యానికి మహేంద్ర రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజలకు ఏ లోటూ రానివ్వకుండా పాలన సాగించాడు. – పుల్లగూర్ల శీర్షికఇవి చదవండి: 'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. -
'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై..
శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు. అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు. మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు. చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయనఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...! -
'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...!
‘‘ఆబ్రహ్మ పీపీలికాది పర్యంతం’’ అని సమస్తం అనే అర్థంలో ఉపయోగించటం చూస్తాం. చీమ అంటే అల్పజీవి అనే అర్థం ఇక్కడ. అంతేకాదు, చాలా చులకనగా చూడబడే జీవి, చిన్నప్రాణి. చీమ, దోమ అని కలిపి ఒకటిగా పరిగణించటం కూడా ఉంది. కానీ, మనిషి చీమ నుండి నేర్చుకో వలసినది చాలా ఉంది. అసలు చీమలు ఎన్ని రకాలో తెలుసా? ఎర్ర చీమలు, నల్లచీమలు, గండుచీమలు, బెదురు చీమలు, గబ్బుచీమలు, రెక్కలచీమలు... వీటి అన్నింటికీ సామాన్య లక్షణాలూ ఉన్నాయి, ప్రత్యేక లక్షణాలూ ఉన్నాయి. సామాన్య లక్షణాలు ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయాలు.అవిశ్రాంతంగా పని చేయటం చీమల సహజగుణం. నిరంతరం ఆహారాన్వేషణ చీమల లక్షణం. తిన్నంత తిని మిగిలినది జాగ్రత్త చేస్తాయి. చీమల పుట్టలని తవ్వి చూస్తే ధాన్యాగారంలో ఉన్నంత ధాన్యం ఉంటుందని చెపుతారు. అంత ధాన్యం తానే తిందామని దాచి పెట్టిందా? తన కోసమో, తన వారి కోసమో అంటే భవిష్యత్తు కోసం భద్రం చేయటం అనే సహజ గుణం అది. అందుకే కొద్ది కొద్దిగా కూడ పెడితే చీమలాగా కూడపెట్టారని అంటారు. అందుకే చిన్న మొత్తాల పొదుపుకి ఆదర్శం చీమలే.చీమలకి ఉన్న ఘ్రాణశక్తి అమోఘం. బెల్లం ముక్క పెడితే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు చీమలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఎవరు చెప్పి ఉంటారు? అవి వాసనతో పసి గడతాయి. ఒక్కటి పసిగడితే చాలు. స్వార్థరహితంగా తన వారందరికీ తీపివార్తని అందిస్తుంది అది. ఇది కూడా అనుసరించ తగిన లక్షణమే కదా! ఏదైనా తీపి పలుకుని ఒక చీమ మోయ లేకపోయినా, ఒక చీమ చనిపోయినా దానిని తీసుకు వెళ్ళటానికి మిగిలినవి అన్నీ సహాయ పడతాయి. కలిసికట్టుగా ఉండటం చీమలని చూసి మనిషి నేర్చుకోవాలేమో!క్రమశిక్షణ అంటే వెంటనే గుర్తు వచ్చేది చీమలే. చీమలు రెండు అయినా నాలుగు అయినా, వందలూ వేలూ అయినా ఒక వరుసలో మాత్రమే వెళ్ళటం గమనించవచ్చు. పైగా ఒక దానితో మరొకటిపోటీ పడవు, దారి తప్పవు. చీమలు నడచిన దారి కాలిబాట లాగా స్పష్టంగా కనపడుతుంది. చీమల క్రమశిక్షణ నడక లోనే కాదు, నడత లోనూ కనపడుతుంది. చీమలదండులో ఒకటి మిగిలిన వాటికన్న పెద్దదిగా ఉంటుంది. అదే ఆ దండుకి నాయకుడు. చీమలదండు తమ నాయకుని మాటనిపాటిస్తుంది.చీమల గృహనిర్మాణశక్తి అద్భుతం. అంత చిన్నప్రాణులు భూమిని తొలిచి, దారి చేసుకుని, భూమి లోపల ఆశ్చర్యకరమైన నివాసస్థలాలని తయారు చేసుకుంటాయి. వాటి ప్రవేశం భూమి పైన ఉన్నా, వెళ్ళేది లోపలికి. రంధ్రంలోపలికినీళ్ళువెళ్ళటం సహజం. కానీ, చీమలు పెట్టిన పుట్ట ద్వారంలోకి నీటిచుక్క కూడా వెళ్ళదు. జాగ్రత్తగా చీమల పుట్టని అనుసరించి తవ్వుకుంటే వెడితే, లోపల ఎంతో శుచిగా, హాయిగా, చల్లగా ఉంటుందిట!గోడలు నున్నగా ఉంటాయి. అందుకేనేమోపాములు ఆ పుట్టలని తమ నివాసస్థానాలుగా చేసుకుంటాయి. ‘‘చీమలు పెట్టిన పుట్టలుపాముల కిరవైన యట్లు ..’’ అనే మాటలు వినే ఉంటాం.చీమలు తయారు చేసుకున్న నివాసాన్ని ఆక్రమించినపాములని అవకాశం చూసుకుని, అవే చీమలు పట్టి బాధిస్తాయి. చంపి వేయవచ్చు కూడా! చీమలు తలుచుకుంటే ఎంతటి పదార్థాన్ని అయినా గంటల్లో మాయం చేయగలవు. ఉదాహరణకి, మనిషిప్రాణంపోయిన తరువాత అట్లాగే ఉంచితే తెల్లవారే సరికి చీమలు ఎముకలని మాత్రమే మిగులుస్తాయి. వాటికి మనిషి మాంసం చాలా ఇష్టమట! బతికి ఉన్నా కదలిక లేకపోతే చాలు, వాటి పని అవి చేసుకుంటాయి. అందుకే మంచంలో ఉన్నవాళ్ళని, శవాలని జాగ్రత్తగా చూసుకోవాలని చెపుతారు. చీమతోపోలిస్తే సంతోషించాలి సుమా! – డా. ఎన్. అనంత లక్ష్మి -
గేమింగ్ వరల్డ్కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’
చెన్నైకి చెందిన చరణ్య కుమార్కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...యూఎస్లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.తక్కువప్రాడక్ట్లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.ఇవి చదవండి: కాన్స్లో ఆ ముగ్గురు -
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు -
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు. ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు. విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు. ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు. ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు. ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు. ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయనఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'? -
ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది! ఒకరోజు..
పూర్వం అంగీరస మహర్షికి భూతి అనే శిష్యుడు ఉండేవాడు. భూతి ముక్కోపి, మహా తపస్సంపన్నుడు. అతడికి కోపావేశాలకు అందరూ భయపడేవారు. ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడి సక్రమంగా ప్రవర్తించేది. అంగీరసుడి వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక భూతి స్వయంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహం చేసుకుని, గృహస్థాశ్రమం చేపట్టాడు.భూతి మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకు వేదవేదాంగాలను బోధించేవాడు. అతడి ఆశ్రమం నిత్యాగ్నిహోత్రంతో వేదమంత్రాలతో కళకళలాడుతూ ఉండేది. భూతి కోపాన్ని ఎరిగిన శిష్యులు అతడికి కోపం రాకుండా వినయంగా మసలుకుంటూ, శుశ్రూషలు చేసేవారు. భూతి మహర్షికి సువర్చుడు అనే సోదరుడు ఉన్నాడు. సువర్చుడు ఒకసారి యాగాన్ని చేయాలనుకున్నాడు. యాగానికి రమ్మంటూ సోదరుడు భూతిని ఆహ్వానించాడు. సోదరుడి యాగానికి వెళ్లాలని నిశ్చయించుకున్న భూతి, తన శిష్యుల్లో శాంతుడు అనేవాణ్ణి పిలిచి ఆశ్రమ బాధ్యతలను అప్పగించాడు.‘నేను తిరిగి వచ్చేంత వరకు ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారకూడదు. అగ్నిహోత్రం చల్లారకుండా ఉండేందుకు నిత్య హోమాలు కొనసాగేలా చూడు’ అని ఆజ్ఞాపించి, సోదరుడి యాగాన్ని చూడటానికి బయలుదేరాడు. ఒకరోజు శాంతుడు, మిగిలిన శిష్యులు ఆశ్రమానికి సంబంధించిన వేరే పనుల్లో ఉండగా, అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది చూసిన శిష్యులు గురువు తిరిగి వస్తే తమను ఏమని శపిస్తాడోనని భయపడుతూ గజగజలాడారు. జరిగిన దానికి శాంతుడు మరింతగా దుఃఖించాడు. గురువు తనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించినా, అది సక్రమంగా నిర్వర్తించలేని తన అసమర్థతకు, నిర్లక్ష్యానికి విపరీతంగా బాధపడ్డాడు. ఇప్పుడు తాను తిరిగి హోమగుండాన్ని వెలిగించినా, గురువు దివ్యదృష్టితో జరిగిన తప్పు తెలుసుకుని, తనను శపించి భస్మం చేసేస్తాడనుకుని భయపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరకు అగ్నిదేవుడిని శరణు వేడుకుంటే, ఆయనే ఆపద నుంచి గట్టెక్కించగలడని తలచాడు. ‘నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మనే/ ఏక ద్విపంచధిష్ణ్యాయ తాజసూయే షడాత్మనే...’ అంటూ అగ్నిదేవుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. ‘ఓ అగ్నిదేవా! దేవతలందరికీ ముఖానివి నీవే! హోమ యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను, ఆజ్యాన్ని ఆరగించి దేవతలందరికీ తృప్తి కలిగిస్తున్నావు. దేవతలందరికీ నువ్వే ప్రాణస్వరూపుడివి. హుతాశనా! ‘విశ్వ’ నామధేయం గల నీ జిహ్వ ప్రాణులందరికీ శుభాలను ప్రసాదిస్తుంది. ఆ నాలుకతోనే మహాపాపాల నుంచి, భయాల నుంచి మమ్మల్ని రక్షించు. నా అశ్రద్ధ వల్లనే హోమగుండం చల్లారిపోయింది. నన్ను అనుగ్రహించు’ అని ప్రార్థించాడు.శాంతుడి ప్రార్థనకు అగ్నిదేవుడు సంతుష్టుడయ్యాడు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏమి నీ కోరిక? ఏ వరాలు కావాలో కోరుకో!’ అని అడిగాడు. ‘దేవా! నా అలక్ష్యం వల్ల హోమగుండం చల్లారిపోయింది. ఈ హోమగుండంలో పూర్వం నుంచి ఉన్న విధంగానే అగ్ని నిలిచి ఉండాలి. నా గురువుకు ఇప్పటి వరకు సంతానం లేదు. ఆయనకు పుత్రసంతానాన్ని అనుగ్రహించాలి. నా గురువు ఇకపై ప్రాణులపై స్నేహభావంతో ఉండాలి. నీ అనుగ్రహం కోసం నేను చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారిపై నీ అనుగ్రహాన్ని కురిపించాలి. ఇవే నేను కోరే వరాలు’ అన్నాడు శాంతుడు. శాంతుడి మాటలకు అగ్నిదేవుడు ముగ్ధుడయ్యాడు. అతడు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడు. ‘లోకంలో నువ్వు ఉత్తమ శిష్యుడివి. నీకోసం ఒక్క వరమైనా కోరుకోకుండా, నీ గురువు గురించే వరాలు కోరుకున్నావు. నీ గురువుకు పుట్టబోయే పుత్రుడు ‘మనువు’ అవుతాడు. నువ్వు చెప్పిన అగ్నిస్తోత్రం పఠించిన వారికి çసకల శుభాలూ జరుగుతాయి’ అని పలికి అదృశ్యమయ్యాడు. సోదరుడి యాగం పూర్తికావడంతో భూతి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో హోమగుండంలోని అగ్ని దేదీప్యమానంగా మండుతూ ఉండటంతో సంతృప్తి చెందాడు. శాంతుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘శిష్యా! ఎన్నడూ లేనివిధంగా నాకు అందరి మీద స్నేహభావం కలుగుతోంది. ఇదేదో వింతలా ఉంది. నాకు అంతుచిక్కడం లేదు. నీకమైనా తెలిస్తే చెప్పు’ అని అడిగాడు.గురువు ఆశ్రమాన్ని విడిచి వెళ్లినప్పటి నుంచి జరిగినదంతా శాంతుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే, శాంతుడు భయపడినట్లుగా భూతి మహర్షి కోపగించుకోలేదు. శపించలేదు. పైగా అంతా విని ఎంతో సంతోషించాడు. తన శిష్యుడైన శాంతుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకున్నందుకు గర్వించాడు. శాంతుడిని అభినందించాడు. నాటి నుంచి మరింత ప్రత్యేక శ్రద్ధతో శాంతుడికి సకల వేద శాస్త్రాలనూ, వాటి మర్మాలనూ క్షుణ్ణంగా బోధించి, తనంతటి వాడిగా తయారు చేశాడు.కొంతకాలానికి అగ్నిదేవుడి వరప్రభావంతో భూతి మహర్షికి కొడుకు పుట్టాడు. అతడే భౌత్యుడు. కాలక్రమంలో భౌత్యుడు పద్నాలుగో మనువుగా వర్ధిల్లాడు. అతడి భౌత్య మన్వంతరం ఏర్పడింది. – సాంఖ్యాయనఇది చదవండి: బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం -
Aditya Srivastava: యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. 'ఆదిత్య శ్రీవాస్తవ'?
యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్సీ పరీక్షలో టాప్ 1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ‘ఫెయిల్యూర్’ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ‘ఇది చాలదు’ అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. ‘కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి’ అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ.. ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలో ఒకటైన ‘గోల్డ్మాన్ శాక్స్’తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. ‘బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు’ అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్లోకి అడుగు పెట్టేవాడు కాదేమో. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్స్పైరింగ్గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది. పదిహేను నెలల తరువాత.. ఉద్యోగాన్ని, బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడంప్రారంభించాడు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు. 2021.. పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్–డెప్త్ ఎనాలసిస్తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్కుప్రాధాన్యత ఇచ్చాడు. 2022 యూపీఎస్సీ ఎగ్జామ్లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. యూపీఎస్సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. ‘టాప్ 70లో ఉండాలి’ అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. ‘సివిల్స్లో విజయం సాధించడానికి సెల్ఫ్–మోటివేషన్ అనేది ముఖ్యం’ అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ. పక్కా ప్రణాళిక.. ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్సీ ప్రిపేరేషన్కు ఉపయోగపడ్డాయి. ‘కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్’లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్ను రూపొందించుకున్నాడు. ‘కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం’ అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్...రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను’ ఇవి చదవండి: యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!