ntr health university
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై ఆగ్రహం.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, అమరావతి : ఓ విద్యార్థినికి సీటు అంశానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. సంచలన తీర్పును వెలువరించింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్ణయం వల్ల నెల్లూరు జిల్లాకు చెందిన రేవూరు వెంకట అశ్రిత అనే విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది. ఇదే అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రేవూరి వెంకట అశ్రితకు నష్టపరిహారం కింద ఏడు లక్షల రూపాయలు ఎన్టీఆర్ యూనివర్సిటీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో నష్ట పరిహారం విద్యార్థికి చెల్లించాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో వెంకట ఆశ్రిత కన్నా తక్కువ మెరిట్ ఉన్న విద్యార్థికి సీటు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆశ్రిత కన్న తక్కువ మెరిట్ ఉన్న మరొకరికి సీటు కేటాయించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎక్కువ మెరిట్ ఉన్న ఆశ్రితకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సీటు కేటాయించకుండా నిరాకరించినందుకు రూ.25000లను ఖర్చుల కింద చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో అశ్వితకు చెల్లించాలని ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
అంతా మీ ఇష్టమా?.. మంత్రి సత్యకుమార్ను నిలదీసిన టీడీపీ నేత!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల కూటమి నేతలను సొంత పార్టీ నేతలే ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. తాజా మంత్రి సత్యకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని టీడీపీ నేత ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.గుంటూరులో మంత్రి సత్యకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్పై మంత్రిని టీడీపీ నేత నిలదీశారు. మెడికల్ కాలేజీల్లో ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా పెడతారని సదరు నేత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్సిటీలో ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, సత్య కుమార్ మాత్రం విద్యార్థులు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కన్వినర్ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో మార్పులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మార్పుల ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వెబ్సైట్లను డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మారుస్తున్నారు. ఇకపై అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు, ఇతర కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం అనుబంధ కళాశాలలకు, నేషనల్ మెడికల్ కమిషన్కు సమాచారం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీ భవనాలపై ఉన్న పేర్లు సైతం మార్పుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పేరు మార్పు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం ఇప్పుడు కొత్తేమీ కాదని సీనియర్ వైద్యులు అంటున్నారు. తొలుత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (యూహెచ్ఎస్)గా ఉండేదని, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణ చేశారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారని పేర్కొన్నారు. అప్పట్లో వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని.. ఇప్పుడు కూడా ఏమీ ఉండవని వారంటున్నారు. వైఎస్సార్ సేవలకు గుర్తింపుగానే.. ఇక రాష్ట్రంలో వైద్య రంగానికి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని యూనివర్సిటీ డెంటల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలతో పాటు, కొత్తగా మూడు వైద్య కళాశాలలను ఏర్పాటుచేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నారని, వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంతో తప్పులేదని, విద్యార్థులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టంచేశారు. -
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ: చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ చేసిన చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు అసెంబ్లీ చేసిన చట్ట సవరణను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సవరించిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయగా, ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. -
ఏది సంస్కృతి? ఏది విశ్వాసం?
ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన పేరు కొనసాగించాలని కోరవచ్చు. కాని అతిగా ప్రభుత్వంపై, జగన్పై విమర్శలు చేయడం ద్వారా తమ పాత చరిత్ర అంతటినీ ప్రజల ముందుకు మరోసారి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఇక విశ్వాసం మాటకు వస్తే.. తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు బాలకృష్ణ ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి తండ్రిని పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది?! ఏపీలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సి టీగా మార్చడంపై ఎన్.టి.ఆర్. కుమారుడు, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆశ్చ ర్యకరంగా ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్ని చూస్తే అసలు ఎన్.టి.ఆర్. పట్ల విశ్వాసం ఉండవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికా? తెలుగుదేశం వారికా? అన్న ప్రశ్న వస్తుంది. ఒక్కసారి బాల కృష్ణ ట్వీట్ను పూర్తిగా చూద్దాం. ‘‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్.టి.ఆర్. అన్నది ఒక పేరు కాదు. అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు మార్చారు. కొడుకు గద్దె ఎక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కడ మహనీయుడి భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు. పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’.. ఇది ఆయన ట్వీట్. ఎంత అర్థరహితంగా ఉంది! ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించివేసినందుకు, ఆయనపై చెప్పులు వేసినందుకు టీడీపీ నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోతే పోయె, బాధపడినట్లు అయినా ఎక్కడైనా చెప్పారా! ఎన్.టి. రామారావు హృదయ విదారకంగా అందరి ముందు విలపించినప్పుడు; తనను తన పిల్లలు, అల్లుళ్లు కలిసి దారుణంగా అవమానించారని కుమిలిపోయినప్పుడు వీరంతా అధికారం లాగేసుకున్నామని పకపకా నవ్వుకున్నారే... అదేనా సంస్కృతి! ఎన్.టి.ఆర్. వేదనతో మరణించినప్పుడు ఆయన అభిమా నులు బాధపడ్డారు కాని ఆయన కుటుంబంగా భావించేవారిలో కొంతమంది లక్ష్మీపార్వతి వర్గంతో గొడవ పడడానికే ప్రాధాన్యం ఇచ్చారు! ఆమెపై రకరకాల వదంతులు సృష్టించే పనిలో పడ్డారు! చివరికి అక్కడ కూడా చెప్పులు విసురుకున్నారు. ఇదా తెలుగు జాతి సంస్కృతి? తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారని పరోక్షంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఎయిర్పోర్టు పేరు వ్యవహారం కేంద్రం పరిధి లోనిది. పోనీ బాలకృష్ణ చేసిన విమర్శ కరెక్టే అను కున్నా, 2014 నుంచి నాలుగేళ్లపాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే.. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర విమాన యాన శాఖ మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఎందుకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మి నల్కు ఎన్.టి.ఆర్.పేరు పెట్టలేదు? అంటే వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేనట్లే కదా! పోనీ విజయవాడ విమానాశ్రయానికి అయినా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు? రాజధాని ప్రాంతానికి ఎన్.టి.ఆర్. సిటీ అని పేరు పెట్టాలని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఏమి చేశారు? బుచ్చయ్య చౌదరిపైనే ఫైర్ అయ్యారు తప్ప ఎన్.టి.ఆర్. పేరు పెట్టారా? రామోజీ ఆదేశాల మేరకు చంద్రబాబు అమరావతి అనే పేరు పెట్టారు. అంటే రామోజీకి ఇచ్చిన విలువ ఎన్.టి.ఆర్.కు చంద్రబాబు ఇవ్వలేదనే కదా? ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా 1995 ప్రాంతంలో ‘ఈనాడు’ దారుణమైన కార్టూన్లు వేస్తే బాలకృష్ణ కాని, ఆయన సోదరులు కాని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నించారా? తనను తన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్. వివాహమాడితే ఆయనతో తగాదా పెట్టుకున్నది ఎవరు? అధికారం వచ్చాక లక్ష్మీపార్వతితో ఆదరణగా ఉన్నట్లు నటించింది ఎవరు? ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆమెను ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టించుకున్నారా? ఆమె ఉంటున్న ఇంటి నుంచి ఆమెను తరిమేశారే! మరి ఇదంతా తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని అనుకోవాలా? ‘‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఎన్.టి.రామారావు టీడీపీని స్థాపించి ప్రజలలో తిరుగు తున్నప్పుడు కాంగ్రెస్ వారిని ‘కుక్కమూతి పిందెలు’ అని విమ ర్శించేవారు. విశేషమేమిటంటే అప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో మంత్రిగా ఉండేవారు. ఎన్.టి.ఆర్. తన అల్లుడు మినహా మిగిలిన కాంగ్రెస్ వారికి ఆ తిట్టు వర్తిస్తుందని చెప్పలేదు. పోనీ బాలకృష్ణ చెప్పినట్లు చేరిన పార్టీలోనే ఉండడమే విశ్వాసం అయితే, తొలుత అది వర్తించవలసింది చంద్రబాబుకే కదా! రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ను కాదని, తన ఓటమి తర్వాత మామ ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు కదా. మరి దానిని బాలకృష్ణ ఏమని అంటారు? ఆ మాటకు వస్తే తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి ఆయనను పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది? అప్పుడు కుక్కలు వెక్కి రించలేదా? వాటి ముందు తెలుగుదేశం నేతలు ఎవరూ తలదించు కుని సిగ్గు లేకుండా బతకలేదా? తన సోదరి పురందేశ్వరి కాంగ్రెస్లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవులు అలంకరించారే... తదుపరి ఆమె బీజేపీలో ఎలా చేరారు? దీనిని విశ్వాసమే అంటారా? తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి, ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామిని చేశారే... తీరా చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటిని పరాభవించి బయటకు పంపేశారే... మరి బాలకృష్ణకు విశ్వాసం ఏమైంది? ఎన్.టి.ఆర్. పట్ల అందరికీ గౌరవం ఉంది. పేరు మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ తన కారణాన్ని వివరించారు. తమకు ఎన్.టి.ఆర్. అవసరం లేదని, ఆయనకు విలువలు లేవని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, జగన్ చాలా పద్ధతిగా మాట్లాడారు. తనకు ఎంతో గౌరవం ఉంది కనుకే ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టానని అన్నారు. అలా పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ కనీసం స్వాగతించలేక పోయారే? నిజానికి ఎన్.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ప్రత్యర్ధులు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు అయితే ఎన్.టి.ఆర్.తో అసలు సంబంధమే లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే మొత్తం జాతి అంతా తల్లకిందులవుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారే మరి చంద్రబాబు టైమ్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్.టి.ఆర్. పేరు పెట్టలేదా? రాజీవ్ పేరు మార్చినప్పుడు దేశానికి అంతటికీ అవమానం జరిగినట్లు అను కోవాలా? తెలం గాణలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినప్పుడు టీడీపీ వారు, బాలకృష్ట వంటి వారు కనీసం నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తు న్నారు. ఆ మాటకు వస్తే కాకాని వెంకటరత్నం పేరుతో ఉన్న మెడికల్ కాలేజీని యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆయన పేరును ఎన్.టి.ఆర్. ఎందుకు తొలగించారు? తెలుగుదేశం వారికి ఎన్.టి.ఆర్.పేరును వాడుకునే అర్హత లేద న్నది వాస్తవం. ఎన్.టి.ఆర్. తన అల్లుడు చంద్రబాబు నాయుడును దూషిస్తూ, ‘ద్రోహి, ఔరంగజేబు కన్నా నీచం’ అని అన్నారు. అలా తన తండ్రి దూషణలకు గురైన చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడుగా, విధేయుడుగా బాలకృష్ణ వ్యవహరించడం ఏమి సంస్కృతి అన్నదానికి ముందుగా ఆయన వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఎదుటివారిపై వ్యాఖ్యలు చేస్తే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కన్నీటి మడుగులో మొసళ్లు!
రాజీవ్గాంధీ మన దేశానికి ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న కొత్త గాలులకు ఆయన కాలంలోనే భారత్ తెరచాప లెత్తింది. నూతన ఆర్థిక పంథా వైపు అప్పుడే దేశం అడుగులు వేసింది. ఆ తొలి అడుగులే తదనంతర కాలంలో సంస్కరణల ప్రస్థానంగా మారాయన్న సంగతిని అందరూ అంగీకరిస్తు న్నారు. దురదృష్టవశాత్తు చిన్నవయసులోనే రాజీవ్ తీవ్రవాదుల రక్తదాహానికి బలయ్యారు. భారత క్రీడారంగంలో ఒక అత్యు న్నత పురస్కారాన్ని రాజీవ్ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘రాజీవ్ ఖేల్రత్న’ పేరుతో క్రీడారంగ పురస్కారాలకు తలమానికంగా ముప్ప య్యేళ్లపాటు ఈ అవార్డు కొనసాగింది. ఏడాది కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులో రాజీవ్ పేరును తొలగించి ధ్యాన్చంద్ పేరును చేర్చింది. భారతదేశ క్రీడారంగ కీర్తి పతాకాన్ని దేశదేశాల్లో సమున్నతంగా ఎగరేసిన హాకీ ఎవరెస్ట్ ధ్యాన్చంద్. ఈ పేరు మార్పు వల్ల దేశంలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికి, పోరాట పటిమను రగల్చ డానికి ధ్యాన్చంద్ పేరే సరైనదని బుద్ధిజీవులందరూ భావిం చారు. ఈ పేరు మార్పు వల్ల రాజీవ్గాంధీకి అవమానం జరిగినట్టుగా ఎవరూ అనుకోలేరు. ఆయన ప్రతిష్ఠ మసకబార లేదు. ఆయన ఘనతలకు మకిలంటలేదు. రాజీవ్గాంధీ ప్రత్యే కతలూ, విజయాలు చెక్కుచెదరలేదు. క్రీడారంగ మకుటంపైకి మాత్రం చేరవలసిన రత్నమే చేరింది. దాదాపుగా ఇటువంటి సన్నివేశమే ఈ వారం ఆంధ్ర ప్రదేశ్లో ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్ పేరు స్థానంలో రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును కూడా ఆమోదించింది. తెలుగుదేశం పార్టీ అధినాయ కత్వం అంతరాంతరాల్లో మాత్రం ఈ పరిణామం కొంత ఉప శమనాన్నీ, సాంత్వననూ కలిగించింది. ప్రవాహంలో కొట్టుకు పోయేవాడి చేతికి గడ్డిపరక దొరికితే కలిగే ఉపశమనం లాంటిది. ఆ పార్టీలో, దాని అనుబంధ ఎల్లో కూటమిలో సదరు గడ్డిపరక ఎన్నెన్నో భావాల్ని, ఊహల్ని ఎగదోసింది. ఈ గడ్డిపరకే బ్రహ్మాస్త్రమై మండి రాష్ట్రం రావణకాష్ఠమై కాలుగాక! ధర్నాలు, రాస్తారోకోలు, రైల్రోకోలతో జనజీవనం అట్టుడికిపోవుగాక! సప్త సముద్రాలు ఉప్పొంగి విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా పనికిరాకుండా చేయుగాక! జన సమ్మర్దం చెలరేగి తక్షణం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గద్దె దిగును గాక! మన చంద్రన్న అధికారం స్వీకరించాలనీ ఊరూ వాడా ఏకమై అర్జీలు పెట్టుగాక! ఈ రకమైన మంత్రాలు పఠించి వారు గడ్డిపరకను ప్రయోగించారు. ఒకరో ఇద్దరో మంత్రాలు చదవడం కాదు... వేద పఠనం మాదిరిగా సామూహిక మంత్ర పఠనాలు చేయించారు. పత్రికా కార్యాలయాల్లో, టీవీ చర్చల్లో ఈ సామూహిక మంత్ర పఠన, విలేఖన కార్యక్రమాలు జరి గాయి. ఇతర రాజకీయ పార్టీలను సమీకరించి వారి చేతనూ పఠింపజేశారు. తటస్థుల పేరుతో ఇంకొందర్ని అద్దెకు తెచ్చి చదివింపులు చేయించారు. మన సినిమాల్లో సతీసావిత్రి, సతీ సక్కుబాయి వంటి నాయికలు మంత్రతుల్యమగు ఇటువంటి శాపనార్థాలను పెట్ట డంలో ప్రసిద్ధి చెందారు. ఈ మంత్ర శాపాలకు ముందు వారు విధిగా ‘నేనే పతివ్రతను అగుదునేనీ’ అంటూ తమ మహత్తును షరతుగా విధించేవారు. ఎల్లో కూటమి ఈ షరతును పెట్టలేదు. ఎందుకో జడుసుకున్నట్టుంది. మంత్రాలకు చింతకాయలే రాల వంటారు. ఇక గడ్డిపరకలు బ్రహ్మాస్త్రాలవుతాయా? అవలేదు. అక్కడక్కడా ఒక్కపూట ధర్నాలకే శక్తులుడిగిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ను నిజంగా అవమానించింది ఎవరు అనే చర్చ మొదలైంది. అదేదో సినిమాలో ఓ కామెడీ రౌడీ ఉంటాడు. ఆ ముఠా మీద హీరో కాల్పులు జరుపుతాడు. అందరూ పడి పోతారు. ఈ కామెడీ రౌడీ ఒక్కడే నిలబడి ఉంటాడు. ‘అన్నియ్యా! అందర్నీ చంపేశావు, నన్నొక్కడినే వదిలేశావు ఎందుకన్నియ్యా?’ అని అడుగుతాడు కామెడీ రౌడీ. ‘ఒరేయ్! నీకు బాగా కొవ్వెక్కువై తెలియడం లేదు కానీ, నీకు బుల్లెట్ దిగి చాలాసేపైంద’ంటాడు హీరో. ఎన్టీఆర్కు అవమానం అనే విషయంలో బుల్లెట్ దిగింది తమకేనన్న విషయం రెండు రోజుల తర్వాత గానీ ఎల్లో కూటమికి అర్థం కాలేదు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే వివరణ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్రెడ్డి స్వయంగా వైద్యుడు. రాజకీయాల్లోకి రాకముందు పేదల వైద్యుడిగా ప్రసిద్ధికెక్కారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే రోగుల్ని పరీక్షించేవారు. అదీ ఇవ్వలేనివారిని ఉచితంగానే చూసే వారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆరోగ్య రంగంలో అప్పటికి అనూహ్యమైనటువంటి మార్పుల్ని తీసు కొచ్చారు. ఈ మార్పుల వెనుకనున్న ఆలోచనలకు ఆయన చేసిన పాదయాత్ర పాదు చేసింది. వైద్యరంగం కార్పొరేటీకరణ జడలు విప్పిన రోజులవి. ప్రభుత్వం అనధికారికంగా ఆ రంగాన్ని వదిలివేస్తున్న సమయమది. పెద్ద రోగమొస్తే ఆస్తులమ్ము కోవడం, అవీ లేకుంటే చావు కోసం ఎదురు చూడటం తప్ప మరో దారీతెన్నూ లేని దయనీయమైన కాలం అది. ఆంధ్ర ప్రదేశ్లో ఈ పాడుకాలపు కృతికర్త మరెవరో కాదు... నారా చంద్రబాబు నాయుడు! దైన్యాన్ని కళ్లారా చూసిన డాక్టర్ నాయకుని గుండెకు తట్టిన తక్షణ తరుణోపాయం – ఆరోగ్యశ్రీ. ప్రజారోగ్యానికి ఇది సంజీ వని మూలికలా పనిచేసింది. తదనంతర కాలంలో యావత్తు భారతావనికే ఆదర్శంగా నిలబడిపోయిన పథకమిది. అలాగే 108, 104 ఎమర్జెన్సీ సర్వీసులు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఏదో ఒక స్థాయిలో అమలుచేయక తప్పని పరిస్థితిని ఈ సర్వీసులు కల్పించాయి. ఈ కార్యక్రమాల అమలు ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి రోగుల పాలిటి ఆత్మబంధువుగా, పేదల పాలిటి పెన్నిధిగా అవతరించారు. అందువల్లనే ఆయన చనిపోయినప్పుడు తెలుగునాట ప్రతి ఇంటి గడపపై శోకదేవత బైఠాయించింది. అందుకే అన్ని వందల గుండెలు పగిలిపోయాయి. ప్రజారోగ్య రంగానికి డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు వాటికవే చాలు... హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడానికి! కానీ, అంతమాత్రం చేతనే మార్చలేదు. కథ చాలా ఉన్నది. వైఎస్సార్ పేరుతో ఏర్పడిన రాజకీయ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన ఇప్పుడున్న సమాజాన్ని సమూలంగా విప్లవీకరించి సమున్నతంగా నిలబెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందు కోసం వివిధ కీలక రంగాలతోపాటు ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో కూడా ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయ్యేళ్లలో రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ఇప్పుడు ఒకేసారి 17 కాలేజీలను జగన్ ప్రారం భించారు. 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ‘నాడు–నేడు’ పేరుతో ప్రజారోగ్య వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు. గ్రామాల్లో కొత్తగా 1032 వైఎస్సార్ విలేజి క్లినిక్స్ను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎమ్, ఆశా వర్కర్ నిరంతరం అందుబాటులో ఉంటారు. 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నవీక రించారు. ఆ కేంద్రాల్లో గతంలో ‘డాక్టర్ వస్తాడో రాడో’ అనే పరిస్థితి. ‘నర్సు ఉంటుందో ఉండదో’ తెలియని అనిశ్చిత వాతావరణం ఉండేది. అందువల్ల ఖర్చయినా సరే, చిన్న రోగాలకు సైతం జనం ప్రైవేట్ బాట పట్టేవారు. ఇప్పుడు నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరు డాక్టర్లు, నర్సులు సహా పన్నెండుమంది సిబ్బంది ఉంటారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలను ఇద్దరు డాక్టర్ల మధ్య విభజిస్తారు. ఒక డాక్టర్ కేంద్రంలో ఓపీని చూస్తుంటే, మరో డాక్టర్ 104 మొబైల్ సిబ్బందితో కలిసి తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తారు. పెద్ద రోగాలతో బాధపడుతున్న వారి గృహాలకు స్వయంగా వెళతారు. మిగిలిన వారిని మొబైల్ దగ్గర పరీక్షించి అవసరమైన మందులు, సలహాలు ఇస్తారు. కొంతకాలం గడిచేసరికి వారికి కేటాయించిన గ్రామాల్లోని రోగులకు సంబంధించిన సమస్త వివరాలు ఆ డాక్టర్కు తెలిసిపోతాయి. రోగుల హెల్త్ ప్రొఫైల్ కూడా తయారవుతుంది. ఆచరణలో ఈ ప్రజలందరికీ ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉంటే చాలా ప్రమాద కరమైన జబ్బులను మొగ్గదశలోనే గుర్తించి నయం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు వ్యయ ప్రయాసల భారం తగ్గుతుంది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో సైతం ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక మంచి ఫిజీషియన్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా మారింది. ముక్కు నొప్పి వస్తే ముక్కు డాక్టర్ దగ్గరికీ, మోకాళ్లు నొప్పిచేస్తే... చిప్పలు మార్చివేయాలని సలహాలిచ్చే ఆర్థోల దగ్గరికీ, గ్యాస్ట్రబుల్తో వెళితే ఇరవై రెండు పరీక్షలు చేసి గుండు గొరిగే పెద్దాసుపత్రుల దగ్గరికీ పరుగెత్తక తప్పడం లేదు. వ్యక్తి ఆరోగ్యాన్ని సమగ్ర దృష్టితో పరీక్షించే ఫిజీషియన్లే దొరక నప్పుడు ఇక ఫ్యామిలీ డాక్టర్ అనే వ్యక్తి ఒక గగన కుసుమం. ఆ గగన కుసుమాన్ని ఇప్పుడు ప్రతి మారుమూల పల్లెలో, నిరుపేదల ఇంటి ముంగిట్లో పూయించడం కోసం ఒక బృహత్తరమైన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపైకి ఎత్తుకున్నది. ఈ తరహా ప్రజారోగ్య ఉద్యమం భారతదేశంలో న భూతో! ఏ కార్యక్రమమైనా ఉద్యమ రూపు దాలిస్తేనే ప్రజలకు చేరువవుతుంది. ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతుంది. ఉద్యమ రూపు దాల్చాలంటే ఆ కార్యక్రమంలోని పాత్రధారు లను ఉత్తేజపరిచే అంశాలు అందుబాటులో ఉండాలి. ఏ ఉద్యమానికైనా తనవైన కొన్ని ప్రతీకలుండాలి. తనదైన కొంత పదజాలం ఏర్పడాలి. తనవైన కొన్ని పేర్లుండాలి. ఉద్యమంలో స్ఫూర్తి నింపగల మూర్తిమత్వం ఉండాలి. ప్రజారోగ్య రంగానికి సంబంధించిన వరకు ఆ మూర్తిమత్వం ఎన్టీఆర్లో దొరకదు. వైఎస్సార్లో దొరుకుతుంది. అందుకు కారణం ఈ నేపథ్య మంతా! ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి నంతమాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు, ఆయనకు అసలైన అవమానం జీవించి ఉన్నప్పుడే జరిగింది. ఆయన కళారంగంలో ఒక ధ్రువతార. మహానటుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. అది నిజమే! ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. పేదల సంక్షేమంలో, పాలనా సంస్కరణల్లో తన కాలానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన చనిపోయి 26 సంవత్స రాలవుతున్నది. ఇందులో 14 సంవత్సరాలపాటు ఆయన స్థాపించిన పార్టీయే అధికారంలో ఉన్నది. ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విశేషంగా ప్రభావితం చేసిన రంగాల్లో ఏదైనా సంస్థకో, పథకానికో తెలుగుదేశం పార్టీ ఆయన పేరు పెట్టి ఉండవలసింది. ఆ పని చేయలేదు. ఎమ్జీ రామ చంద్రన్కు లభించిన ‘భారతరత్న’ పురస్కారం ఎన్టీఆర్కు కూడా రావాలని ఆయన అభిమానుల ఆకాంక్ష. చంద్రబాబు రాష్ట్రపతులనూ, ప్రధానమంత్రులనూ నియమించగల స్థితిలో ఉన్నప్పుడు (ఆయనే చెప్పుకున్నట్టు) ఎన్టీఆర్కు ‘భారతరత్న’ ఇప్పించగలిగేవారు. కానీ ఎందుకు ఇప్పించలేదో ఇంతవరకూ ఆయన సంజాయిషీ ఇవ్వలేదు. ప్రజారోగ్య రంగంలో ఎన్టీఆర్ చేసిన కృషి స్వల్పం. హెల్త్ యూనివర్సిటీ మకుటంపైకి ఇప్పుడు అర్హమైన రత్నమే చేరింది. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం గౌరవించింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం 14 ఏళ్లలో ఆ పని కూడా చేయలేకపోయింది. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొల గించడంపై యాగీ చేసి లబ్ధి పొందాలనుకున్న తెలుగుదేశం ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడి చిందెవరు? ఆయన చావుకు కారకులెవరు? ఆయన పార్టీని అక్రమంగా లాక్కున్నదెవరు? ఆయన జెండానూ, బ్యాంకులో ఉన్న నిధులనూ స్వాధీనం చేసుకున్నదెవరు? ఆయనపై చెప్పులు వేయించిందెవరు? ఎన్టీఆర్కు నీతి నియమాలు లేవని ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూలు ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ పరువుప్రతిష్ఠలు దిగజార్చేలా నగ్న కార్టూన్లు వేసి దూషణలతో కూడిన రాతలు రాయించింది రామోజీరావు కాదా? దుర్మార్గులు, కపటులు, మోసగాళ్లని చంద్రబాబు, రామోజీలను ఎన్టీఆర్ విమర్శించలేదా? చంద్రబాబు ఒక మీడియా అధిపతితో మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఉద్దేశించి ‘వాడు వీడు’ అని అవాకులు చెవాకులు పేలిన వీడియో బయటకు రాలేదా? ఆ వీడియోపై ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదెందుకు? ఈ రకమైన ప్రశ్నలతో, నాటి పేపర్ల క్లిప్పింగులతో సోషల్ మీడియా నేడు హోరెత్తుతున్నది. ఎన్టీఆర్ పేరుతో బతికి బట్టకడదామనుకున్న ఎల్లో కూటమికి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నది. ఎన్టీఆర్ పేరు మార్పుపై సరిగ్గా స్పందిం చలేదని జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతులపై దాడికి దిగబోయిన ఎల్లో కూటమి బొక్కబోర్లా పడింది. వారిని అడుగ డుగునా అవమానించిన ఎల్లో కూటమి, జూనియర్ సినిమాలను దొంగ రివ్యూలతో, తప్పుడు ప్రచారాలతో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎల్లో కూటమి ధర్మపన్నాలను జనం అసహ్యించు కుంటున్నారు. సినీనటుడు బాలకృష్ణ ట్వీట్తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అనే నానుడి మరోమారు రుజువైందని చెప్పుకుంటున్నారు. ఎల్లో కూటమి ఎన్టీఆర్ పేరును జపించినంతకాలం... ఆయన ఆత్మ ఆ కూటమిని శపిస్తూనే ఉంటుంది! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వైఎస్సార్ గొప్పతనం భావితరాలకూ తెలియాలి
సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు సంబంధించిన బిల్లును మంగళవారం ఆమె అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, మంచితనం, గొప్పదనం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంలో తప్పేంటి? ఎన్టీఆర్ను వాడు, వీడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫొటో, పేరు కనిపించకూడదని మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎవరూ మర్చిపోలేదు. (2019 ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు) చంద్రబాబు, రాధాకృష్ణ మనసులో ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మాటలు చంద్రబాబువి కాదా? ‘ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీయే ఉందా ఇంకా.. అని రాధాకృష్ణ అడిగితే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాం.. అది ఎప్పుడో మరిచిపోయారు.. వాడిది అయిపోయింది.. వాడిది అప్పుడు’ అని ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడారు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పట్లో చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో ప్రచురితమైన పత్రికల్లో ఇది కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు ఎన్టీఆర్ మీదున్న గౌరవం. (ఆ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు) సీఎం వైఎస్ జగన్కు ఎన్టీఆర్ మీద అపార గౌరవం ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు’ అని చెప్పారు. ప్రజలతో విడదీయలేని బంధం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే తెలుగు ప్రజలకు విడదీయలేని ఒక బంధం.. ఒక భావోద్వేగం అని మంత్రి రజిని చెప్పారు. ‘వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన 800 మంది అందుకు సాక్ష్యం. ఒక మనిషి శాసిస్తే.. గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుందంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్సార్. వైఎస్సార్ గొప్ప మానవతావాది. పరిపాలన దక్షుడు. ప్రజల కోసమే బతికాడు. ప్రజల కోసం వెళ్తూనే మరణించాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 మెడికల్ కాలేజీలు ఉంటే.. వైఎస్సార్ 3 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడుగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు. మొత్తం మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి. వైఎస్సార్ ఎన్నో గొప్ప పనులు చేసినందున మనం క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదు’ అని చెప్పారు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు తేడా లేదు నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం చంద్రబాబు, ఔరంగజేబు ఒక్కటే. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. తమ్ముడిని కూడా మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశాడు. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు రావాలి. పేద వారిని దగ్గరకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందా? సత్య హరిశ్చంద్రుడిని వైఎస్ జగన్ రూపంలో చూశాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంది పలుకుతుంది. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంతో గౌరవం. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నాం. రాజకీయంగా ఏమీ లేక, టీడీపీ సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు అబ్బయ్య చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. స్పీకర్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతేనే టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అధికారంలో లేనప్పుడే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ‘ఎన్టీఆర్ పేరును ఆరోగ్యశ్రీ పథకంలో తీసేస్తా, వాడి పేరు కనబడకుండా చేస్తా, ఇక ఏ పథకానికి వాడి పేరు పెట్టను’ అని చెప్పింది చంద్రబాబే. ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టుకున్న వీళ్లు ఎన్టీఆర్పై ప్రేమ ఉన్నట్లు నటించడం తగదు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు. ఎన్టీఆర్ను మా పార్టీ గౌరవించింది. హెల్త్ వర్సిటీకి ఎందుకు వైఎస్సార్ పేరు పెట్టాలనుకున్నామో తెలుసుకోకుండా ఆందోళన చేయడం తగదు. వైఎస్సార్ పేరు ఆమోదయోగ్యం మంత్రి, మేరుగు నాగార్జున దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్గా వైఎస్సార్కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైఎస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహా్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం. ఇక టీడీపీ వాళ్ల బాగోతం గురించి ఎంత చెప్పినా తక్కువే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయులు, రామానాయుడులు సెక్యూరిటీ ఇన్చార్జ్ను బహిరంగంగానే కొట్టారు. వీధి రౌడీగా ఉండి మర్డర్ కేసు వల్ల విజయవాడ నుంచి వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడిన రామకృష్ణబాబు కూడా చేయి చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ సభలో రౌడీలా ప్రవర్తించారు. ఎన్టీఆర్ పట్ల బాబుకు గౌరవం లేదు మంత్రి, అంబటి రాంబాబు తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసరడం ఏమిటీ? ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చ కాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడి మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. ఎన్టీఆర్కు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు. మా ప్రభుత్వం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరును హెల్త్ వర్సిటీకి పెట్టాలని భావిస్తున్నాం. ఎన్టీఆర్ను అవమానించింది చంద్రబాబే. ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఐఎస్వో సర్టిఫికెట్
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకుగాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. వర్సిటీలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఐఎస్వో ఏపీ, తెలంగాణ ఇన్చార్జి శివయ్య చేతుల మీదుగా వీసీ డాక్టర్ పి.శ్యామ్ప్రసాద్ ఐఎస్వో సర్టిఫికెట్ను అందుకోనున్నారు. నెల రోజుల కిందట శివయ్య బృందం వర్సిటీని సందర్శించి మెడికల్, ఆయుష్, పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుపుతున్న తీరు, అకడమిక్ విభాగంలో పారదర్శక సేవలు, పరీక్షల నిర్వహణ వంటి అన్ని విషయాలను పరిశీలించింది. వర్సిటీలో పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ఐఎస్వో సర్టిఫికెట్ను అందించనున్నారు. కాగా ఇప్పటివరకు దేశంలోని ఏ ఆరోగ్య వర్సిటీ ఐఎస్వో సర్టిఫికెట్ను పొందలేదని, దీన్ని తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: తత్కాల్ టికెట్స్పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం) -
గడువులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ అడ్మిషన్స్లో ఈ ఏడాది సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని పరిష్కరిస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించిన సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీ యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను ఆయన గురువారం మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్లకు సంబంధించి పదేళ్లుగా ఒకే సాఫ్ట్వేర్ సంస్థను వినియోగిస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు తలెత్తాయని, దీంతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందని తెలిపారు. అపోహలకు తావులేదు.. యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,342 పీజీ/డిప్లమో సీట్లుండగా, వాటిలో 50 శాతం నేషనల్ పూల్కు పోను, రాష్ట్ర కోటాగా 38 స్పెషాలిటీల్లో 1,171 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ పీజీ, డిప్లమో సీట్ల భర్తీకి నవంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చినట్టు వీసీ తెలిపారు. వెబ్సైట్లో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులతో డిసెంబర్ 23న రీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మెరిట్ లిస్టును జనవరి 19న ప్రకటించి, నాన్ సర్వీసు కోటాకు సంబంధించి ఫిబ్రవరి 1న సీట్ల అలాట్మెంట్ చేశామన్నారు. కొన్ని లోపాలు తలెత్తినట్టు నిపుణుల కమిటీ గుర్తించి, వాటిని రద్దు చేసి, ఫిబ్రవరి 2న రీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 7న సీట్లు అలాట్ చేసి, 14లోపు జాయిన్ అవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. సర్వీసు కోటాకు సంబంధించి తెలంగాణ వారికీ సీట్లు కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లు నాన్ సర్వీస్ కోటాలో భర్తీ చేస్తామని తెలిపారు. మార్చి 7 నాటికి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇందుకోసం యూనివర్సిటీ సిబ్బంది పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం పనిచేస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని వీసీ వివరించారు. యూజీకి 14 వేల దరఖాస్తులు.. ఎంబీబీఎస్, ఎండీఎస్ అడ్మిషన్ల కోసం జనవరి 28న నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. నోటిఫికేషన్ గడువు ఫిబ్రవరి 8తో ముగిసిందని, ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ నెల 25తో పరిశీలన పూర్తి చేసి, 28న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తామని వీసీ వివరించారు. మార్చి మొదటి వారంలో మొదటి దశ, రెండో వారంలో రెండో దశ, మూడో వారంలో మూడో ఫేస్ యూజీ కౌన్సెలింగ్ నిర్వహించి మార్చి 19 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. -
AP: వైద్యుల సేవలు భేష్
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా సమయంలో రోగులకు వైద్యులు, వైద్య విద్యార్థులు మెరుగైన సేవలందిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భవిష్యత్లో కూడా సమాజానికి, పేదలకు తగిన సేవలందించాలని సూచించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవం గురువారం విజయవాడలో జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ హరిచందన్ రాజ్భవన్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించి.. ప్రమాదకర స్థితికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. వైద్య, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్ప్రసాద్ యూనివర్సిటీలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు. డాక్టర్ పళనివేలు, డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్లు.. కోయంబత్తూరులోని జెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి.పళనివేలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అలాగే ఐదుగురికి పీహెచ్డీలు, ఒకరికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అందజేశారు. 125 మంది విద్యార్థులకు 150 మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. రాగిణి అనే విద్యార్థిని అత్యధికంగా మూడు గోల్డ్మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు నగదు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాబ్జి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.పద్మావతి, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఇ.రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. జరిగేది అప్పుడే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ 22, 23వ స్నాతకోత్సవాలు జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్డీలు, మెడల్స్, బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. మెడల్స్, బహుమతులకు ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈ నెల 8న జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. టెన్త్ విద్యార్థులకు ‘సర్టిఫికెట్’ ఇవ్వాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంటర్లో లాంగ్వేజెస్తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్ అయిన వారికి ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు. -
వైఎస్సార్ కంటి వెలుగుతో ఎందరికో చూపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ (ఏపీవోఎస్) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్–2021ను శనివారం డాక్టర్ శ్యామ్ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలి
తిరుపతి తుడా : ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నారు. ఇందుకు యూనివర్సిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి, కళాశాలలోని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులు ఎంతో నమ్మకంతో చికిత్స నిమిత్తం డాక్టర్ల వద్దకు వస్తారని, వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయం చేసినట్లేనన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలని వీసీ సూచించారు. పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావనను విద్యార్థులు తొలగించుకోవాలని హితవు చెప్పారు. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండండి కోవిడ్ థర్డ్ వేవ్పై నిపుణుల హెచ్చరికలపట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజల్ని చైతన్యపరచాలని డాక్టర్ శ్యామ్ప్రసాద్ కోరారు. కోవిడ్–19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని.. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని కట్టడికి పరిశోధనలు చేయాలన్నారు. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఆర్ఎంవో డాక్టర్ జి.పద్మావతి, పీజీ రీడర్ డాక్టర్ రేణుదీక్షిత్తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి నీట్లో అర్హత సాధించినవారు ఈ నెల 21 సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల్లో కటాఫ్ స్కోర్, స్టేట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత స్టేట్ కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు, తదుపరి యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు. మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం (ఈ నెల 13) నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 147, ఎస్సీ ఎస్టీ, బీసీలకు 113, దివ్యాంగులకు 129గా కటాఫ్ మార్కులను నిర్ణయించారు. దరఖాస్తుకు వెబ్సైట్.. http://ntruhs.ap.nic.in/ అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు.. ► స్థానికులై ఉండటంతోపాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం, దివ్యాంగులకు 45 శాతం) మార్కులు వచ్చి ఉండాలి. ► అభ్యర్థికి 2020 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. వైకల్యం ఉన్నవారు నిర్ధారిత సర్టిఫికెట్ పొంది ఉండాలి. దరఖాస్తు ఫీజు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్, బీయూఎంఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.3,540 (జీఎస్టీతో కలిపి). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,950 (జీఎస్టీతో కలిపి). అభ్యర్థులు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. కావాల్సిన ధ్రువపత్రాలు ఆన్లైన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో కేబీల్లోనే ఉండాలి. ► నీట్ ర్యాంకు కార్డు ► ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ మార్కుల మెమోలు ► 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ► టీసీతోపాటు కులధ్రువీకరణ పత్రం,మైనార్టిలు, ఈడబ్ల్యూఎస్లకు సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాలు ► ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికెట్ కార్డు, పాస్పోర్టు ఫొటో, సంతకం, నివాస ధ్రువీకరణ పత్రం వంటివన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు ► సాంకేతిక సమస్యలకు: 9490332169, 9030732880, 9392685856 ► సలహాలు, సందేహాలకు: 08978780501, 7997710167 -
ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లు 3,662
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు కలిపి 3,662 ఉన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రభుత్వ పరిధిలో (ఆల్ ఇండియా కోటాతో కలిపి) 3,662 సీట్లు ఉన్నాయి. వీటికోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ర్యాంకులనుబట్టి చూస్తే 32 వేలమందికిపైనే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్కులు ఎక్కువగా వచ్చినందున గత ఏడాది కటాఫ్లతో బేరీజు వేయలేమని, అందువల్ల సీటు ఎక్కడొస్తుందనేని అంచనా వేయలేమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. వీరు వరుసగా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్యకళాశాల, కర్నూలు, తిరుపతి, కాకినాడ కాలేజీలను తమ ప్రాధాన్యతలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించడం, అధ్యాపకులను నియమించడంతో మిగతా కాలేజీల్లో సీటు వచ్చినా బావుంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఆన్లైన్ పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. -
నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల
సాక్షి, అమరావతి: నీట్లో రాష్ట్రస్థాయి ర్యాంకుల్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. టాప్ టెన్లో నలుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. మొదటి ర్యాంకు అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన గుత్తి చైతన్య సింధు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకర్గా నిలిచింది. జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన కోటా వెంకట్ ఇక్కడ రెండో ర్యాంకు సాధించారు. రాష్ట్రం నుంచి సుమారు 62 వేల మంది నీట్కు హాజరయ్యారు. వీరిలో అన్ని కేటగిరీలు కలిపి 35,270 మంది అర్హత సాధించారు. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మాత్రమే అని, త్వరలోనే ఒరిజినల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులుగా నిర్ధారించారు. జనరల్ పీహెచ్ కేటగిరీకి 129, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 113 కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. మెరిట్ జాబితా మేరకు త్వరలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలి ఐదు స్టేట్ ర్యాంకులు జనరల్ కేటగిరీ అభ్యర్థులే కాగా.. 6వ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థికి దక్కింది. ఎస్సీ కేటగిరీకి చెందిన చక్రధర్ జాతీయ స్థాయిలో 39వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. టాప్ 100 ర్యాంకుల్లో 45 మంది అమ్మాయిలుండగా, 55 మంది అబ్బాయిలు ఉన్నారు. జీవోలు రాగానే అడ్మిషన్లు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. కానీ ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. జీవోలు రాగానే ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. – డాక్టర్ శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
‘మేలు మరిచిపోలేం..రుణపడి ఉంటాం’
సాక్షి, విజయవాడ: ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకున్న సమయంలో అండగా నిలిచిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారుల సహకారం మరువలేనిదని పీజీ మెడికల్ విద్యార్థులు అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 37 రోజులుగా జీవో 56 అమలుచేయాలని ఆందోళన చేశామని, చివరకు హైకోర్టులో తమకు న్యాయం జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. జీవో 56 తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. పీజీ మెడికల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో చేరామని తెలిపారు. సహకరించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి మేలు మరిచిపోలేమని తెలిపారు. -
పీజీ మెడికల్ విద్యార్థుల ధర్నా
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్ యూనివర్శిటీ ఎదుట పీజీ మెడికల్ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను తక్షణమే చేర్చుకోవాలని ఆందోళన చేశారు. పీజీ అడ్మిషన్లు పొందినా విద్యార్థులను చేర్చుకోకుండా ప్రవేట్ మెడికల్ కళాశాలలు కోర్టు ను ఆశ్రయించాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 56 తక్షణమే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రవేట్ మెడికల్ కాలేజీలు వాదనల పై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 27 వరకు మాత్రమే కాలేజీలో చేరేందుకు గడువు ఉంది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో పీజీ మెడికల్ ఫీజులు తగ్గించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలిచిందని విద్యార్థులు తెలిపారు. -
పీజీ వైద్య ఫీజులపై కసరత్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు దాదాపు పూర్తయింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు కలిసి ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపి ఫీజులు ఎంతమేరకు నిర్ణయించాలి అన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ కోటాలో ఇచ్చే 50 శాతం సీట్లకు, యాజమాన్య, ఇన్స్టిట్యూషనల్, ఎన్ఆర్ఐకి ఉన్న 50 శాతం సీట్లకు ఎంత నిర్ణయించాలి అన్నదానిపై చర్చించారు. అలాగే.. వివిధ రాష్ట్రాల్లో ఫీజులు ఎలా ఉన్నాయి.. మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎన్ఆర్ఐ, యాజమాన్య కోటా సీట్లకు ఇక్కడే ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న విషయం అధికారులు గమనించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు, తమకు ప్రభుత్వ కోటాలో ఇస్తున్న సీట్లకు ఫీజులు పెంచాలని లేఖలు రాశాయి. దీంతో వీలైనంత త్వరలో ఫీజులు నిర్ణయిస్తామని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫీజులపై అధికారులిచ్చిన నివేదికలో ఇలా.. ► ఏపీలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 50 శాతం (స్పెషాలిటీల వారీగా) ప్రభుత్వ కోటా కింద భర్తీచేస్తున్నారు. ► మిగతా 50 శాతం సీట్లలో 25 శాతం నీట్ మెరిట్లోనూ, మిగతా 10 శాతం సీట్లు ఇన్స్టిట్యూషన్ కోటా కింద (కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు), 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటా కింద ఉన్నాయి. ► ఉత్తరప్రదేశ్లో కాలేజీ గ్రేడింగ్ను బట్టి ఫీజులు వసూలుచేస్తున్నారు. ► ఏపీతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఫీజులు తక్కువగా ఉన్నట్లు తేలింది. ► డీమ్డ్ వైద్య కళాశాలల్లోనూ ఫీజులు పరిశీలించారు. ► చాలా రాష్ట్రాల్లో జనరల్ మెడిసిన్ సీటుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ కోటా కింద సీట్లు లేవు. ► దీంతో సీట్ల కేటాయింపులు, ఫీజుల నిర్ణయంలో మార్పులు జరగాల్సి ఉందని అధికారులు తేల్చారు. -
సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో పెట్టేందుకు ప్రయత్నించగా కొంత మంది అడ్డుకుంటున్నారు. తన చాంబర్లో సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టాలని సాక్షాత్తు హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సీవీ రావు ఆదేశించినా సంబంధిత అధికారులు బేఖాతర్ చేయడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న కొంత మంది ఉద్యోగులు సీఎం ఫొటో పెట్టే విషయంలో తాత్సారం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా వర్సిటీలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన అధికారులే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టేందుకు మనసొప్పక అడ్డుకుంటున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఫొటో పెట్టే విషయమై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాలేదంటూ కొందరు అధికారులు సాకులు చెబుతున్నారు. అయితే యూనివర్సిటీ పక్కనే ఉన్న సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రిన్సిపాల్ చాంబర్లో, విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీఎం వైఎస్ జగన్ ఫొటో ఇప్పటికే ఏర్పాటు చేసి చాలా రోజలు కావడం గమనార్హం. వర్సిటీలోని పరిపాలన, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కీలక పోస్టుల్లో పనిచేసే కొంత మంది అధికారులు, ఉద్యోగులు గత ముఖ్యమంత్రి మీద అమితమైన మక్కువతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఆ ఐదు కాలేజీల వైపే విద్యార్థుల మొగ్గు..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నా అందులో ఐదు వైద్య కళాశాలల వైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. నీట్లో మంచి ర్యాంకులు సాధించినవారు జాతీయ పూల్ కింద వివిధ రాష్ట్రాల్లో మంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశమున్నా మన రాష్ట్ర కళాశాలల్లో చేరడానికే ఆసక్తిగా ఉన్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలల్లో చేరడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. గతేడాది చివరి ర్యాంకులు పొందిన అభ్యర్థుల కటాఫ్ మార్కులు చూసుకున్నా ఆ ఐదు కళాశాలల్లోనే ఎక్కువ మార్కులు సాధించినవారు ఉన్నారు. అక్కడ సీటు రాని అభ్యర్థులే మిగతా కళాశాలల వైపు చూస్తున్నారు. అధ్యాపకులు, మౌలిక వసతులే కారణం విద్యార్థులు ఆ ఐదు కళాశాలల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. వాటిలో అధ్యాపకుల కొరత లేకపోవడం, మిగతా వాటితో పోలిస్తే మౌలిక వసతులు మెరుగ్గా ఉండటమే. అన్నిటికీ మించి ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఆ కళాశాలలను ఎంచుకోవడానికి కారణంగా నిలుస్తోంది. గతేడాది జనరల్ కేటగిరీలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్లో సీటు పొందిన చివరి ర్యాంకు అభ్యర్థికి 538 మార్కులు వచ్చాయి. అంటే ఎంతగా పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే గుంటూరు మెడికల్ కళాశాలలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థికి 533 మార్కులు వచ్చాయి. ఇలా పైన పేర్కొన్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్క విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల మినహా మిగిలిన నాలుగింటిలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థులకు 500 మార్కులు పైనే రావడం విశేషం. కటాఫ్లు పెరిగే అవకాశం మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులు వస్తే ప్రభుత్వ సీటు వస్తుందనే దానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు వచ్చిన మార్కులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు వస్తుందా? రాదా? అనే దానిపై విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పైగా ఈ ఏడాది ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో కటాఫ్ మార్కులు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాలకు సీట్లు కేటాయించబోతున్నారు. నేడో, రేపో నీట్లో మెరిట్ విద్యార్థుల జాబితాను వెల్లడించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘స్వైన్ఫ్లూతో ఏపీలో 21 మంది మరణించారు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్వైన్ఫ్లూ బారినపడి 2018 నుంచి ఇప్పటివరకు 21 మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2018లో ఏపీలో 402 మంది స్వైన్ ఫ్లూ బారినపడగా 17 మంది మరణించారని పేర్కొన్నారు. 2019లో ఏపీలో ఇప్పటివరకు 77 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో నలుగురు మృత్యువాత పడ్డారని చెప్పారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 169 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో 66 కేసులు నమోదు కాగా, అందులో ఆరుగురిని ఈ వ్యాధి కబళించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ఆడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆడ్మిషన్లలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ఆయా రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జీవో నంబర్ 550ని ఉల్లంఘిస్తూ జరిపిన మెడికల్ సీట్ల భర్తీ కారణంగా రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయం మీ దృష్టికి వచ్చిందా అని మంగళవారం రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ దుబే మెడికల్ కాలేజీ అడ్మిషన్ల కోసం ప్రతి రాష్ట్రం సొంతంగా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆలిండియా కోటాలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : మెడికల్ కౌన్సిలింగ్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పెనుమలూరు పోలీస్ స్టేషన్కు తరిలించారు. -
మెడికల్ కౌన్సిలింగ్ నిలిపివేత: సీపీఐ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేతపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి పూర్తి రీకౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం సరికాదని, మొత్తం ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ రద్దు చేసి రీకౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 550 ప్రకారం, స్లయిడింగ్ విధానం అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు న్యాయం చేయాల్నారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ప్రకటించారు. బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వర్సిటీ వీసీతో చర్చించామన్నారు. త్వరలో మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లీలలు..
సాక్షి, విజయవాడ : చదువుకునే సమయంలో విద్యార్థులు క్లాసుల్లో కాక రోడ్లపై ఉన్నారు. దీనికి కారణం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లీలలు. హెల్త్ యూనివర్సిటీ వద్ద ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నానిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తమపై కక్ష్య కట్టారని తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము రాసిన ప్రశ్నలకు కనీస మార్కులు కూడా ఇవ్వకుండా, తక్కువ మార్కులు వేసి కావాలనే ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. పేపర్ వాల్యుయేషన్లో కూడా అన్యాయం చేశారని తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన చెందారు. రీకౌటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూయేషన్ ప్రవేశపెట్టి తమ భవిష్యత్తును కాపాడాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. పై అధికారులను స్పందిస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా యూనివర్శిటీ సిబ్బంది మాతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. మాట్లాడుతున్నారని, వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఆందోళన
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేపర్ వాల్యూవేషన్లో అన్యాయం జరిగిందని ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నా చేపట్టారు. తక్కువ మార్కులు ఇచ్చి, కావాలనే ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎటెంమ్ట్ చేసిన ప్రశ్నలకు కనీస మార్కులు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీస మర్యాద కూడా లేకుండా యూనివర్సిటీ సిబ్బంది అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూవేషన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో సీట్ల వివాదం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీజీ సీట్ల భర్తీపై వివాదం చెలరేగింది. పీజీలో మిగిలిన సీట్లను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ల తర్వాత మిగిలిపోయిన సీట్లను రిజర్వేషన్ పద్ధతిలో భర్తీ చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల డిమాండ్లను మాత్రం వర్సిటీ అధికారులు తిరస్కరించారు. జీవో నెంబర్ 68 ప్రకారం వర్సిటీకి సరెండర్ చేసిన సీట్లను ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తామంటూ అధికారులు తెలిపారు. -
సమాజ హితాన్ని కోరండి
కర్నూలు(హాస్పిటల్): ధనార్జనే ధ్యేయం కాకుండా సమాజ హితాన్ని కోరాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సి. వెంకటేశ్వరరావు వైద్యులు, వైద్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. కర్నూలు మెడికల్ కళాశాల 2012 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శనివారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 200 మెడికల్ సీట్లున్న ఏకైక కళాశాల కేఎంసీ మాత్రమేనన్నారు. ఈ కళాశాలకు దేశంలోనే ప్రత్యేకత ఉందని, ఇందులో అభ్యసించడం అదృష్టమన్నారు. గతంతో పోల్చితే వైద్యవిద్యలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయన్నారు. ఒక విధంగా ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కాస్త దూరం పెంచిందన్నారు. ఇప్పటి విద్యార్థులు ఎక్కువ శాతం సాంకేతికతపై ఆధారపడుతున్నారన్నారు. ఈ కారణంగా చాలా మందిలో నైతికత లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో రోగులు వేగవంతమైన చికిత్స కోరుకుంటున్నారని, ఇందుకు తగ్గట్టు వైద్యులు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. రోగుల ఇబ్బందులు పూర్తిగా తెలుసుకుని వైద్యం చేయాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈఎస్ఏ సత్తార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ మాట్లాడారు. చివరగా వివిధ సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు, స్నాతకోత్సవ పట్టాలను అతిథులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ రాంప్రసాద్, పెద్దాసుపత్రి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్లు పి. చంద్రశేఖర్, నరేంద్రనాథ్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి అందజేశారు. గోల్డ్మెడల్ సాధించిన వారు బి. మేఘనారెడ్డి, 2. సి. ప్రవల్లిక, 3. కె. జయసత్య(పీడియాట్రిక్స్), ఎ. కావ్యలహరి(గైనిక్, ఫార్మకాలజి, అనాటమి, ఫార్మకాలజి), జి. వైష్ణవి(జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, అన్నపూర్ణమ్మ మెమోరియల్ మెడల్), యు. శివ(ఈఎన్టీ, కమ్యూనిటీ మెడిసిన్, ఈ. శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ మెడల్ ), ఎన్. సాయిచరిత(ఆఫ్తమాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పాలుట్ల మహాలక్ష్మమ్మ మెమోరియల్ మెడల్), యాస్మిన్ షేక్(ఫార్మకాలజీ, ఫిజియాలజీ), ఎ. సాహితి, జి.సుమాంజలి(మైక్రోబయాలజి), కోనేటి శ్రీదేవి(బయోకెమిస్ట్రీ, సుబ్బారెడ్డి మెమోరియల్ మెడల్), కేబీ. నవనీత్యాదవ్(బయోకెమిస్ట్రీ, ముక్కామల ఈశ్వరరెడ్డి మెమోరియల్ మెడల్). -
పీజీ వైద్య సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ వైద్య సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఏప్రిల్ 20 లోగా తొలి దశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 (సోమవారం) నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి నాలుగైదు రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయిన వెంటనే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 10న వెబ్ ఆప్షన్లు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేస్తారు. మన రాష్ట్రంలో జాతీయ పూల్కు సీట్లు మినహాయిస్తే 428 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ ఏడాది అర్హత సాధించినవారు తక్కువగా ఉండటం, జాతీయ పూల్లో ఎక్కువ మందికి సీట్లు రాకపోవడం, వాళ్లంతా స్టేట్ సీట్లకు రావడంతో పోటీ మరింతగా పెరిగింది. ఒక్కో సీటుకు 15 మందికిపైనే పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్థోపెడిక్స్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ మెడిసిన్, ఎండీ గైనకాలజీ, ఎండీ రేడియాలజీ తదితర కోర్సులపై అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది నేషనల్ పూల్ నిలువునా ముంచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అర్హత మార్కులు సాధించినవారు చాలా తక్కువగా ఉన్నారని, కటాఫ్ మార్కుల శాతం తగ్గిస్తే మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. మే 31 నాటికి చివరి దశ కౌన్సెలింగ్ పూర్తి: రిజిస్ట్రార్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న అన్ని సీట్లకూ మే 31లోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం మే 31 నాటికి అన్ని కౌన్సెలింగ్లు పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నుంచి సీట్ల కేటాయింపు వరకూ అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 50 శాతం పీజీ వైద్య సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, మిగతా 50 శాతం జాతీయ పూల్ సీట్లకు సీబీఎస్ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని చెప్పారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ డిగ్రీలు చెల్లవు!
సాక్షి, అమరావతి: పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్న చందమిది. మనరాష్ట్రంలో వైద్యవిద్యలో పలు కోర్సులకు వేదికైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే కోర్సులకే విలువ లేదంటే పరిస్థితి ఏంటో అంచనా వేయచ్చు. తాజాగా హోమియోలో ఎండీ పూర్తిచేసిన అభ్యర్థులకు అధికారులు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజమండ్రి, గుడివాడ, కడపల్లో హోమియో వైద్య కళాశాలలున్నాయి. ఇక్కడ సిబ్బంది లేకపోవడంతో వైద్యవిద్యకు విఘాతం కలుగుతోందన్న కారణంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ హోమియోలో ఎండీ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నాలుగైదు బ్యాచ్లు ఇక్కడ ఎండీ పూర్తిచేసి ఆయా హోమియో కళాశాలల్లో పనిచేస్తున్నారు. తాజాగా డీపీసీ(డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ద్వారా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పదోన్నతులకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలో ఎండీ పూర్తి చేసిన వారు అర్హులు కాదని మూడు కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు ఆయుష్ కమిషనరేట్లో ఉన్న ఓ అదనపు సంచాలకులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్నే ప్రభుత్వం స్వీకరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొందరు అభ్యర్థులు పూణె, పాట్నా, మహరాష్ట్ర తదితర ప్రాంతాల్లో కళాశాలలకు వెళ్లకుండానే ఏడాదికోసారి వెళ్లి మేనేజ్ చేసుకుని సర్టిఫికెట్లు తెచ్చుకుని లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వాళ్లంతా కలసి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో చదివిన వారిని అనర్హులుగా చేసేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు అడిషనల్ కమిషనర్తో కుమ్మక్కై ఇలా చేశారని సొంత రాష్ట్రంలో చదివిన అభ్యర్థులు వాపోతున్నారు. వెంటనే పదోన్నతులు ఆపేయాలని, లేదంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు అంటున్నారు. -
ఎన్టీఆర్ వర్సిటీ నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర!
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ. 167 కోట్లు పక్కదారి పట్టించడం ద్వారా వర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 8ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. వర్సిటీ అభివృద్ధి, పరిరక్షణ సమితి ఫోరం పిలుపు మేరకు వర్సిటీ ఉద్యోగులందరూ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా వర్సిటీని సోమవారం పూర్తిగా స్తంభింపజేశారు. వర్సిటీ బయట బైటాయించి «ధర్నా చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన వర్సిటీ అభివృద్ధికి కించిత్ సాయపడని చంద్రబాబు ప్రభుత్వం.. దానిని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా విశాఖపట్నం గీతం మెడికల్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చినట్లుగానే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకూ ఇచ్చి పేద వర్గాలకు వైద్య విద్య అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యంగా నారాయణ మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదాను కట్టబెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వర్సిటీని అర్థికంగా బలహీనపరిచే చర్యలకు ప్రభుత్వం పూనుకుందని ఉద్యోగులు ఆరోపించారు. గీతమ్ మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వబోమని ఆనాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 1986 యూనివర్సిటీ శాసన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒకే ప్రామాణిక వైద్యవిద్య విధానం ఉండాలని నిర్ధేశించిన మేరకు వారు నిరాకరించాన్నారు. వాస్తవానికి గీతమ్కు డీమ్డ్ హోదా కట్టబెట్టడం ద్వారా ఒక్క సీటు కూడా కన్వీనర్ కోటాకు చెందదని, రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూరదని పేర్కొన్నారు. సొంత క్యాంపస్ లేదు.. ఉన్న నిధులూ లాగేసుకుంటారా? ఇప్పటికే యూనివర్సిటీ అనేక సమస్యలతో నిండి ఉందని, ఇలాంటి సమయంలో వర్సిటీ నిధులను వైద్య కాలేజీలకు కేటాయించి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీఎహెచ్) గుర్తింపు తెచ్చుకోవాలని సర్కారు భావించడాన్ని వర్సిటీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. వైద్య కళాశాలల్లో పనులను పలు ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగించారని, వీటి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. వైద్య కళాశాలలకు గుర్తింపు కొనసాగాలంటే ఎంసీఐ నిబంధనల ప్రకారం ఆసుపత్రులను నిర్వహించాలేకాని, ఎన్ఏబీహెచ్ గుర్తింపు అవసరం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీకి సొంత క్యాంపస్ ఇవ్వకపోగా.. ఉన్న నిధులను లాగేసుకోవడంపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. జీవో రద్దు చేసే వరకు ఎంతకైనా పోరాడతామని ఉద్యోగులు హెచ్చరించారు. -
మన్వితకు ఫస్ట్ ర్యాంకు
విజయవాడ: నీట్-2017 మెడికల్ లోకల్(ఏపీ) ర్యాంకులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసింది. ఏపీ నుంచి 32,392 మంది విద్యార్థులు ఉత్తీరణ సాధించారు. రాష్ట్ర స్థాయిలో నర్రెడ్డి మన్విత మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఆమెకు 14వ ర్యాంకు దక్కింది. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో సాయిశ్వేత(రెండు), ఫణి లాస్య(మూడు), మనోజ్ పవన్రెడ్డి(నాలుగు), వంశీకృష్ణ(ఐదు), చైతన్య గోపాల్(ఆరు), వీరమచనేని జైత్రి(ఏడు), నల్లమిల్లి సాత్వికారెడ్డి(ఎనిమిది), పవన్ కుమార్(తొమ్మిది), మోతీలాల్(పది) టాప్టెన్లో నిలిచారు. సీట్ల భర్తీకి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. కన్వీనర్ కోటాలో 2,927, మేనేజ్మెంట్ కోటాలో 730, ఎన్ఆర్ఐ కోటాలో 343 సీట్లు భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి తుది మెరిట్ లిస్టును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటిస్తుంది. -
జూలై తొలి వారంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. నీట్ మెడికల్ ఫలితాలు శుక్రవారం వెలువడిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నీట్ మెడికల్ ర్యాంకులు జాతీయ స్థాయిలో ప్రకటించారని, లోకల్ (ఆంధ్రప్రదేశ్) ర్యాంకులను పరీక్ష నిర్వహించిన సీబీఎస్ఈ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈమేరకు త్వరగా ర్యాంకుల జాబితాను ఇచ్చేలా సీబీఎస్ఈని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డెంటల్ పీజీ కోర్సుల ఫీజులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం యూనివర్సిటీ ఎదుట మోకాళ్ళ పై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేస్తూ.. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులపై పెనుభారం మోపే ప్రయత్నాలను విరమించుకోకపోతే విద్యార్థుల నుంచి ప్రతిఘటన తప్పదని విద్యార్థి నేతలు హెచ్చరిస్తున్నారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారం
-
గ్రేస్ మార్కుల గోల్మాల్!
- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారం - నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎంసీఐ - పీజీలో గ్రేస్ మార్కులకు అవకాశమే లేదంటూ లేఖ - ఎంసీఐ ఆదేశాలను అమలు చేస్తారా? అధికార పార్టీకి ఊడిగం చేస్తారా? సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ సారి ఆస్పత్రికి వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి..! స్పెషాలిటీ కోర్సులో పీజీ చేసిన వైద్యుడు గ్రేస్ మార్కులతో పాసయ్యారా? లేక నిజంగానే కష్టపడి చదివి పాసయ్యారా? అనే విషయాన్ని తెలుసుకోండి. పీజీ పరీక్షలు పాస్ కాలేక.. అధికార పార్టీ అండదండలు, పలుకుబడితో వర్సిటీ అధికార యంత్రాంగాన్ని ప్రభావి తం చేసి.. దొడ్డిదారిలో గ్రేస్ మార్కులు సంపాదించి పాసైన డాక్టర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. గత ఏడాది జరిగిన వివిధ స్పెషాలిటీ పీజీ కోర్సుల పరీక్షలో గట్టెక్కలేక పెద్ద సంఖ్యలో డాక్టర్లు ఫెయిల్ అయ్యారు. అందులో ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన నాయకుల, అధికార పార్టీ అండదండలున్న పిల్లలు చాలామందే ఉన్నారు. వారంతా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పీజీలోనూ గ్రేస్ మార్కులు కలపాలనే వివాదాస్పద నిర్ణయాన్ని గతేడాది సెప్టెంబర్లో తీసుకున్నారు. ఎంబీబీ ఎస్లో గ్రేస్ మార్కులు కలపడం అప్పుడప్పుడు జరిగేదే అయినా పీజీలో అలా చేయడం ఎన్నడూ జరగలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికార యంత్రాంగం తీసుకున్న వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేస్ మార్కులు కలిపే విధానం.. పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఇటీవల యూనివర్సిటీకి ఎంసీఐ లేఖ రాసింది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు దేశంలోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేయాలని నవంబర్ 22న జరిగిన మెడికల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎంసీఐ ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులను రద్దు చేసి.. ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా? అయిందేదో అయిందని, ఇక మీదట గ్రేస్ మార్కుల ప్రస్తావన తీసుకురాబోమని సరిపెడతారా? యూనివర్సిటీ పరువు నిలబెడతారో? అధికార పార్టీ నేతల ప్రాపకానికి తాకట్టు పెడతారో? చూడాలి’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎండీ హోమియో సీట్లకు కౌన్సెలింగ్ రేపే..
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో ఎండీ హోమియో కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 15న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 12న వర్సిటీ నిర్వహించిన ఎండీ హోమియో అన్లైన్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్కు అర్హులని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు 134 మంది హాజరవగా, 66 మంది అర్హత సాధించారు. వివరాలకు యూనివర్సిటీ (హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో పొందవచ్చు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ టీ రవిరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీ స్థాపించిన ఎన్టీఆర్ కారణ జన్ముడన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎన్నో వైద్య, దంత, పారా మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు ఆయన కారణమయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్ అనురాధ, సుబ్బారావు, పరీక్షల నియంత్రణ అధికారి విజయ్కుమార్, ముఖ్య ఇంజినీర్ కేఎల్ఆర్కే ప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-2 ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టులో నిర్వహించిన ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం పార్టు-2 పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. మార్కుల రీ-టోటలింగ్కు సబ్జెక్టుకు రూ. రెండు వేలు చొప్పున నవంబరు 7లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయ్కుమార్ తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్(హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్)లో పొందవచ్చు. -
పారా మెడికల్ డిగ్రీ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్
25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో పారామెడికల్ (నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ర్యాంకుల ప్రకారం ఏ హెల్ప్లైన్ కేంద్రాల్లోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చు. అన్ రిజర్వుడు 15 శాతం సీట్ల కోసం హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులు మాత్రం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న పీహెచ్ అభ్యర్థులు, పోస్టు బేసిక్ నర్సింగ్ (రెండేళ్ల) కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 28న విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరు కావాలి. మెరిట్ లిస్టు, ర్యాంకు కార్డులు, నోటిఫికేషన్ వివరాలు యూనివర్సిటీ ( హెచ్టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీఎన్టీఆర్యూహెచ్ఎస్.ఇన్, హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లలో పొందవచ్చు. అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైనప్పుడు వాడకంలో ఉన్న సొంత ఫోన్ నంబర్ను నమోదు చేయించుకోవాలి. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పెన్డౌన్
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగ జేఏసీ సోమవారం పెన్డౌన్ నిర్వహించింది. అడహక్ ఉద్యోగులకు 2010, 2015 పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా పెన్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో యూనివ ర్సిటీలో పాలన స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీకి పలు పనులపై వచ్చిన విద్యార్థులు అసౌకర్యానికి లోనయ్యారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా మరో పక్క యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం కూడా పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయించింది. అప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. -
కస్టోడియన్ సర్టిఫికెట్ సరిపోతుంది!
బీ నుంచి ఏ-కేటగిరీకి మారి కాలేజీలో చేరడంపై హెల్త్ వర్సిటీ వీసీ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): బీ-కేటగిరీ మెడికల్ సీట్లు పొందిన అభ్యర్థులు రెండో విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్లో ఏ-కేటగిరీ సీటు పొందితే ఆయా కళాశాలల్లో అడ్మిట్ అయ్యేందుకు, అభ్యర్థుల వద్ద (ధ్రువపత్రాల) కస్టోడియన్ సర్టిఫికెట్, సీటు అలాట్మెంట్ లెటర్ ఉంటేసరిపోతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి .రవిరాజు తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీ నుంచి ఏ-కేటగిరీ సీట్లు పొందిన అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాల అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన మేరకు ఈనెల 27న మధ్యాహ్నం 2గంటల్లోగా అభ్యర్థులు ఆయా కళాశాలల్లో అడ్మిట్ కావాలని సూచించారు. 28న మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 28న మూడో, తుది విడత మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈమేరకు వర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చే సింది. అభ్యర్థులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలన్నారు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొన్న అభ్యర్థులు కూడా తుదివిడతకౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని తెలిపారు. 29న రెండో విడత బీ-కేటగిరీ సీట్ల మెడికల్ కౌన్సెలింగ్ ఏపీలో ప్రైవేటు మెడికల్/డెంటల్ కళాశాలల్లోని బీ-కేటగిరీ సీట్ల భ ర్తీకి ఈనెల 29న డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ డా.జయరమేశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాలల అసోసియేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
సీట్లు అమ్ముకున్నారు!
ప్రైవేట్ వైద్య కాలేజీలపై తల్లిదండ్రుల ఆరోపణ - ‘బి-కేటగిరీ’లో రెండో రోజూ గందరగోళమే - 371-డి ప్రకారం సీట్లు భర్తీ చేయాలని ఆందోళన - నీట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నామన్న అధికారులు - తొలిరోజే ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ.. ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో జరుగుతున్న బి-కేటగిరీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ రెండో రోజు గందరగోళం మధ్య ఆలస్యంగా ప్రారంభమైంది. ఆదివారం కౌన్సెలింగ్ ప్రారంభం కావడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అండతో ప్రైవేటు కళాశాలలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు అమ్ముకున్నాయంటూ నినాదాలు చేస్తూ వారు కౌన్సెలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 371డీ ప్రకారం ఏపీ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ అభ్యర్థులకే కౌన్సెలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. ఒక దశలో కౌన్సెలింగ్ కన్వీనర్, వర్సిటీ అధికారులను నెట్టివేశారు. దీంతో ఏయే జీవోల ఆధారంగా కౌన్సెలింగ్ సాగుతుందో తెలిపేందుకు కౌన్సెలింగ్ కన్వీనర్ డాక్టర్ జయరమేశ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అప్పలనాయుడు ప్రయత్నించగా, అభ్యర్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. గంట అనంతరం సుప్రీంకోర్టు తీర్పులనుసరించి బి-కేటగిరీ సీట్లకు స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు వర్తించవని అధికారులు మైక్ ద్వారా వివరించారు. నీట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి రోజు జరిగిన కౌన్సెలింగ్లోనే ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయని, బీడీఎస్ సీట్లు మాత్రమే మిగిలాయని ప్రకటించారు. అభ్యర్థులెవరైనా బీ నుంచి ఏ కేటగిరీకి మారితే ఖాళీ అయిన సీట్లకు, కొత్త కళాశాలలు ఏమైనా ఉంటే వాటికి కలిపి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంబీబీఎస్ సీట్ల భ ర్తీ వివరాలను వెబ్సైట్తో పాటు వర్సిటీ నోటీసు బోర్డులో పెట్టినట్లు చెప్పారు. నీట్లో 91,087 ర్యాంకర్(స్థానికంగా 2,123) ఈ కౌన్సెలింగ్లో చివరి ఎంబీబీఎస్ సీటు పొందినట్లు తెలిపారు. అలాగే నీట్లో 91,989 ర్యాంకర్(స్థానికంగా 2,143) తొలి బీడీఎస్ సీటును తీసుకున్నట్లు వివరించారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లన్నీ తొలి రోజే భర్తీ అయినట్లు తెలుసుకున్న అభ్యర్థుల తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. పోలీసు బందోబస్తు నడుమ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ఏడున్నర గంటలకు ముగిసింది. రెండో రోజు అందుబాటులో ఉన్న 367 బీడీఎస్ సీట్లలో 245 సీట్లు భర్తీ అయ్యాయి. పీఆర్వో ఓవరాక్షన్ కౌన్సెలింగ్ జీవోలపై అధికారులు అవగాహన కల్పిస్తున్న సమయంలో అవసరం లేకపోయినా వర్సిటీ పీఆర్వో జోక్యం చేసుకుంటూ.. అభ్యర్థుల తల్లిదండ్రులను తిట్టడంతో మరింత గందరగోళం తలెత్తింది. పీఆర్వోపైకి అభ్యర్థుల తల్లిదండ్రులు దూసుకువచ్చారు. దీంతో అధి కారులు జీవో సంబంధిత వివరాలను చెప్పకుండానే పోలీసుల బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ హాల్కు చేరుకోవాల్సి వచ్చింది. అనంతరం అధికారులు మైక్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘371డీ’ రగడ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371డీ ఏయూ, తెలంగాణ, రాయలసీమ అనే మూడు పరిధులుగా ఉంటుంది. ఈ మూడు ఏరియాల్లో ఎక్కడ వైద్య కళాశాల ఉంటే అక్కడి స్థానికులకు 85 శాతం సీట్లు, మిగిలిన రెండు ఏరియాల్లోని అభ్యర్థులు అన్ రిజర్వుడ్ మెరిట్ కింద 15 శాతం సీట్లు కోసం పోటీపడవచ్చు. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతోపాటు ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా అయిన ఎ-కేటగిరీ సీట్లకు 371డీ వర్తిస్తోంది. ఇందులో స్థానిక, స్థానికేతర, కుల రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే , బి-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్లకు ఈ విధమైన స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు వర్తించవు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పులు కూడా ఉన్నాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. బి-కేటగిరీ సీట్లకు ఏరియా, లోకల్, నాన్లోకల్, కుల రిజర్వేషన్లు వర్తించవు. ‘నీట్’ ఆధారంగా బి-కేటగిరీ సీట్ల భర్తీ గతంలో ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం ఎ-కేటగిరీ, మరో 10 శాతం బి-కేటగిరీ సీట్లను కూడా యూనివర్సిటీ భర్తీ చేసేది. మిగిలిన సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద ఆయా కళాశాలలే ఇతర రాష్ట్రాల వారికి కేటాయించేవి. గతేడాది ప్రైవేట్ కళాశాలల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు, మిగిలిన 50 శాతంలో 35 శాతం బి-కేటగిరీ, మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. బి-కేటగిరీలోని 35 శాతం సీట్ల భర్తీకి ప్రైవేట్ మెడికల్ కళాశాలల అసోసియేషన్ పేరుతో గతేడాది దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా ఆ పరీక్షలో అర్హత సాధించిన అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ప్రత్యేక ప్రవేశ పరీక్ష కాకుండా ‘నీట్’ ఆధారంగా బి-కేటగిరీ సీట్లను భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే, కొంతమంది అభ్యర్థులు 371డీకి విరుద్ధంగా ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. 371డీని అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందంటూ యూనివర్సిటీ దృష్టికి తీసుకొచ్చినా తమకేమి ఆదేశాలు అందలేదని వర్సిటీ అధికారులు కౌన్సెలింగ్ కొనసాగించారు. ఒకవేళ 371డీ ప్రకారం సీట్లు కేటాయించాల్సి వస్తే కుల రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ కోటా 15 శాతం గతేడాదికి ముందు సంవత్సరాల్లో బి-కేటగిరీలో 10 శాతం సీట్లు ఉండేవి. వాటిని 371డీ ప్రకారమే యూనివర్సిటీ భర్తీ చేసేది. మిగిలిన 40 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింది ఇష్టమొచ్చిన వారికి, ఇతర రాష్ల్రాల వారికి కూడా ఇచ్చేవారు. అయితే, గతేడాది నుంచి బి-కేటగిరీలో 35 శాతం సీట్లు, సి-కేటగిరీలో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా పేరుతో యాజమాన్యాలు సీట్లు కేటాయిస్తున్నాయి. బి-కేటగిరీ సీట్లను యూనివర్సిటీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తుండగా, సి-కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. గతంలో మాదిరిగా 371డీ ప్రకారమే 35 శాతం సీట్లను స్థానికులు, స్థానికేతరులకు.. అంటే ఏపీ, తెలంగాణ అభ్యర్థులకే కేటాయించాలని కోరుతున్నారు. ఇలా స్థానిక, స్థానికేతరులకు సీట్లు కేటాయించాలన్నప్పుడు కుల రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 1,000 సీట్లు ఉంటే అందులో 677 సీట్లు బి-కేటగిరీ, అలాగే డెంటల్లో 367 బి-కేటగిరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గందరగోళానికి కారణం? ఎన్నడూ లేని విధంగా కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కాకుండా ప్రభుత్వం ఈ ఏడాది ప్రైవేట్ కళాశాలల్లోని బి-కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించింది. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ సమయానికి సుమారు 400 సీట్ల వరకు అదనంగా వస్తున్నాయని తెలిసినా ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని బి-కేటగిరీ సీట్లకు ప్రభుత్వం తొందరపడి కౌన్సెలింగ్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా బి-కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ల కంటే ముందుగానే ఏపీలో నిర్వహించారు. మరోపక్క తెలంగాణలో అసలు ఎంసెట్ పరీక్షే నిర్వహించలేదు. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఇప్పుటికిప్పుడు బి-కేటగిరీ సీట్లలోనైనా చేరాలనే ఆలోచనలోకి అభ్యర్థులను ప్రభుత్వం నెట్టింది. దీంతో ఇతర రాష్ట్రాల వారికి సీట్లు కేటాయిస్తున్నారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. -
బి-కేటగిరీ మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్లో బి-కేటగిరీ మెడికల్ సీట్ల భర్తీకి శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదటి రోజు 2,300 అభ్యర్థులను ఆహ్వానించగా, సాయంత్రం 6.30 గంటల సమయానికి 350 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయినట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ డాక్టర్ కొడాలి జయరమేష్ తెలిపారు. కౌన్సెలింగ్లో మొదటి సీటును నీట్లో 7,077 ర్యాంకు సాధించి, స్థానికంగా 16 ర్యాంకు పొందిన శ్రవణం జయసూర్య ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో సీటు తీసుకున్నాడు. -
నిలకడగా కంచి పీఠాధిపతి ఆరోగ్యం
అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. జయేంద్ర సరస్వత్రిని ఐసీయూ నుంచి మెడికల్ వార్డకు తరలించినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు తెలిపారు. జయేంద్ర సరస్వతి షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చాయన్నారు. గురువారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వివరించారు. -
'మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలి'
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద బీసీ సంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీ అధికారుల వైఖరితో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బీసీ సంఘాలు ధర్నాకు దిగాయి. యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు యాజమాన్యాలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నాయంటూ ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు. -
కార్డియాలజి విభాగ పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజి విభాగాన్ని శనివారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైద్యుల బృందం పరిశీలించింది. ఇటీవలే ఈ విభాగానికి రెండు డీఎం సీట్లు మంజూరైన నేపథ్యంలో ఇక్కడి వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు డాక్టర్ శ్రీనివాసులు(గుంటూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల), డాక్టర్ సుబ్బారెడ్డి(ఉస్మానియా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి) వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ వీరికి పూర్తి వివరాలు అందించారు. -
ఏపీ మెడికల్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ విడుదల
విజయవాడ (హెల్త్ యూనివ ర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం హాజరయ్యే ఎంసెట్ మెడికల్ అభ్యర్థులకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిర్దేశిత తేదీ ల్లో ఏ హెల్ప్లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటెస్ట్ చేసిన రెం డు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు రూ.1500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.800) రుసుము తో హాజరు కావాలి. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ చూడొచ్చు. -
బీపీటీ ఫలితాలు విడుదల
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ) పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ టోటలింగ్ కోసం జూలై 5లోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ విజయకుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 28 నుంచి 45వ కళాశాల కోడ్ వరకు జూలై 19న, 46 నుంచి 197 వరకు 20న కళాశాల గుర్తింపు కార్డు, హాల్ టికెట్తో ఉదయం 11 గంటలకు యూనివర్సిటీలో హాజరుకావాలని సూచించారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో చూడవచ్చు. -
ఇక ఎన్టీఆర్ వర్సిటీలో డిజిటల్ మూల్యాంకనం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇక నుంచి డిజిటల్ మూల్యాంకనం జరగనుంది. తొలివిడత పీజీ మెడికల్ పరీక్ష జవాబు పత్రాల దిద్దివేతలో ఈ పద్ధతి అనుసరించేందుకు వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. వర్సిటీలో వైస్ చాన్స్లర్ టి.రవిరాజు అధ్యక్షతన సోమవారం పాలకమండలి సమావేశం జరిగింది. వైద్య ప్రమాణాలు మరింత పెంచేందుకు సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బెంగళూరు రాజీవ్గాంధీ హెల్త్ వర్సిటీలో మాదిరి ఎన్టీఆర్ వర్సిటీలోనూ అన్ని కోర్సులకూ డిజిటల్ మూల్యాంకనం అమలు చేసేందుకు కసరత్తు చేయాలని తీర్మానించారు. తొలుత పీజీ మెడికల్ పరీక్షలకు డిజిటల్ మూల్యాంకనం చేయనున్నారు. అలాగే వర్సిటీ ప్రాంగణంలోని సిల్వర్జూబ్లీ బిల్డింగ్పై రూ.1.25 కోట్లతో మరో అంతస్తు నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో పీజీ మెడికల్ మూల్యాంకనం!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో చేపట్టేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వర్సిటీలో సోమవారం నిర్వహించనున్న పాలకమండలి 221వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తుండటంతో ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈవిధానంలో జవాబు పత్రాలను బార్కోడ్ చేసి భద్రపరిచి.. వాటిని ప్రొఫెసర్కు పంపించి ఆన్లైన్లోనే మూల్యాంకనం చేయించనున్నారు. దీనికి సంబంధించిన పాస్వర్డ్ ‘కీ’ని ప్రొఫెసర్కు ఇస్తారు. ఆన్లైన్ మూల్యాంకనం వల్ల ఫలితాలు త్వరగా విడుదల చే యొచ్చని చెబుతున్నారు. అలాగే ప్రతి సబ్జెక్టులో జవాబు పత్రాన్ని వేర్వేరు ప్రొఫెసర్లతో రెండు సార్లు మూల్యాంకనం చేయిస్తారు. ఇద్దరి మూల్యాంకనంలో తేడా 15 శాతం కంటే ఎక్కువ ఉంటే మూడోసారి వేరే ప్రొఫెసర్తో చేయిస్తారు. ఈ విధానంతో సత్ఫలితాలు వస్తే ఎంబీబీఎస్, బీడీఎస్కు కూడా ఆన్లైన్ మూల్యాంకనం చేయించాలనే యోచనలో అధికారులున్నారు. -
ఫెయిలైన వారిని పాస్ చేసేశారు!
పాలకమండలి నిర్ణయం గుట్టు చప్పుడు కాకుండా అమలు చేసిన ఎన్టీఆర్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా ప్రమాణాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాతరేసింది. పీజీ మెడికల్ - 2016 పరీక్షలు ఈనెల 24 న నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో.. కేవలం నాలుగు రోజుల ముందు (ఈనెల 20న) రహస్యంగా గ్రేస్ మార్కులు కలిపేసింది. తద్వారా వైద్యవిద్యలో ప్రతిభ, నైపుణ్యం లేని ఆ 8 మందిని పరీక్షల నుంచి గట్టెక్కించింది. ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు, వైద్య విద్యా ప్రమాణాలకు పాతరేయడమేనని వైద్య నిపుణులు మండిపడుతున్నారు. ప్రభు త్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో గ్రేస్ మార్కులు కలిపేం దుకు యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ నెల మూడో తేదీన ‘సాక్షి’ బట్టబయలు చేసింది. -
17నుంచి తెలంగాణలో రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నాన్ సర్వీస్ అభ్యర్థులకు ఈనెల 17,18 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. అదేవిధంగా సర్వీస్ అభ్యర్థులకు ఈనెల 18న కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరుకాని అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హెల్ప్లైన్ సెంటర్లకు హాజరుకావాలని పేర్కొన్నారు. మిగిలిన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ లేదా హెచ్టీటీపీ://టీఎస్పీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్) వెబ్సైట్లలో సంప్రదించాలన్నారు. -
వేలానికి వైద్య విద్య!
► సీమ మెడికల్ సీట్లు అమ్మేస్తున్నారు ► ప్రతిభావంతులను వెనక్కి నెట్టి.. వైద్యసీట్ల అమ్మకం ► ఒక్కో సీటుకు కోటి రూపాయల వరకు రేటు ► రెండో కౌన్సెలింగుకు ముందు బ్లాకవుతున్న సీట్లు వైద్య విద్య అంటే అందరికీ మక్కువే. మెడికల్ సీటు సాధించాలని అహోరాత్రాలు కష్టపడి చదివి మంచి ర్యాంకులు పొందిన తర్వాత కూడా సీటు రాకపోతే.. తమకు దక్కాల్సిన సీటు దొడ్డిదారిలో వేరేవాళ్లకు వెళ్లిపోయందని తెలిస్తే.. ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లిపోతాయి! రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు ఇప్పుడు ఇలాగే బాధపడుతున్నారు. ఎంసెట్లో తాము సాధించిన ర్యాంకుకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కచ్చితంగా సీటు వస్తుందని భావించినా చివరి నిమిషంలో అది కాస్తా చేజారిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆ చిన్నారులు చివరకు మెడిసిన్ చదవాలన్న ఆశను కూడా చంపేసుకుంటున్నారు. రాయలసీమ పిల్లల విషయంలో ఎందుకిలా జరుగుతోందని అనుమానం వచ్చిన ఆర్టీఐ కార్యకర్త మర్రి రమణ.. ఈ పుట్టను మొత్తం కదిలించారు. అక్కడ తీగలాగితే డొంకంతా కదిలింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పది వైద్య కళాశాలల మీద అడ్మిషన్ల విషయంలో ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ద్వారా ఖరారైంది. నాన్ మెరిట్ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయని, మెరిట్ అభ్యర్థులకు మొండిచెయ్యి చూపుతున్నారని ఆయన అన్నారు. తనకు వచ్చిన ర్యాంకుతో తిరుపతి పద్మావతి వైద్యకళాశాలలో సీటు రావడం గ్యారంటీ అనే భావించానని, కానీ అక్కడికెళ్తే.. కౌన్సెలింగ్ ప్రారంభమైన గంటకే సీట్లన్నీ అయిపోయినట్లు చెప్పారని విధుప్రియ అనే విద్యార్థిని వాపోయింది. తన సీటును వేరేవాళ్లకు అమ్మేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పింది. ఒక్క పద్మావతి కళాశాలే కాదు.. తనకు కచ్చితంగా సీటు వస్తుందని భావించిన చాలా కాలేజీలలో ఆమెకు చుక్కెదురైంది. కేవలం డబ్బు, రికమండేషన్లు ఉన్నవాళ్లకే మెడికల్ సీట్లు వస్తున్నాయి తప్ప ప్రతిభావంతులకు ఏపీలోని ప్రభుత్వ కళాశాలల్లో వైద్యవిద్య చదువుకునే అవకాశం దొరకట్లేదని ఆమె తల్లి స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవంతా ఎందుకని, ఇక వైద్యవిద్య చదవాలన్న ఆశను విధుప్రియ వదిలేసుకుంది. కర్నూలుకు చెందిన సాయిశ్రీ కూడా మెడికల్ సీట్ల కుంభకోణం బాధితురాలే. ఆమెకు వచ్చిన ర్యాంకుకు కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆమెకు దాదాపు సీటు ఖాయం అనుకుంటున్న సమయంలో వాళ్లు లేదు పొమ్మన్నారు. తర్వాత ఆమెకు ఎక్కడా సీటు రాలేదు. అయినా పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించాలని ఆమె భావిస్తోంది. ఇదంతా ఎలా జరుగుతోందని జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. దాంతో.. రెండో కౌన్సెలింగుకు ముందే సీట్లను బ్లాక్ చేస్తున్నారని తెలిసింది. వాటిని నాన్ లోకల్ విద్యార్థులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. స్థానిక విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చినా సీట్లు ఇవ్వకుండా, వాటిని ఎన్నారై కోటాలో అమ్ముకుంటున్నట్లు సమాచారం. దాదాపు వంద సీట్ల వరకు ఇలా అమ్ముడుపోయాయని, ఒక్కో సీటును 80 లక్షల నుంచి కోటి వరకు అమ్మారని అంటున్నారు. అయితే.. వైద్య సీట్ల కేటాయింపులో తాము చేసేది ఏమీ లేదని, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయమే రిజర్వేషన్ల ప్రకారం, ర్యాంకుల ప్రకారం సీట్లు కేటాయిస్తుందని కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణతోనే న్యాయం రాజ్యాంగంలోని 371 డి అధికరణ ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, మిగిలిన 15 శాతం స్థానికేతరులకు ఇవ్వాలి. కానీ, రాయలసీమ వైద్య కళాశాలల్లో మాత్రం స్థానిక విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉన్నా వాళ్లకు వైద్యసీట్లు ఇవ్వకుండా.. వాటిని అమ్మేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సీట్లు రాకపోవడంతో కొంతమంది హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లగా, వారికి మాత్రం న్యాయం జరిగిందని, అలా వెళ్లలేని విద్యార్థులకు వైద్యులయ్యే అవకాశం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
పీజీ మెడికల్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
విజయవాడ: ఏపీలో పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 11న సర్వీస్ అభ్యర్థులకు, 16, 17 తేదీల్లో నాన్-సర్వీస్ అభ్యర్థులకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరుకాని ఆయా అభ్యర్థులు పైన తెలిపిన తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని కోరారు. ఇంతకుముందు ఒరిజినల్ సర్టిఫికె ట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు నేరుగా ఆప్షన్లను పెట్టుకోవచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లలో పొందవచ్చు. తెలంగాణకు సంబంధించి రెండో విడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. -
ఎంబీబీఎస్ సెకండియర్ ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. విద్యార్థుల తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం మే 13వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ (http://ntruhs.ap.nic.in) వెబ్సైట్లో పొందవచ్చు. -
పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
♦ తెలంగాణలో మొదటిసారి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ ♦ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో వైద్య విద్యలో పీజీ సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్ను మొదటిసారిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. పీజీ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్పై శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గల కోర్సుల్లో 15 శాతం అన్ రిజర్వుడు సీట్ల కోసం ఈ నెల 22 నుంచి 24 వరకు, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలోని 85 శాతం సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వరకు తెలంగాణ విద్యార్థులు వెబ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు రెండుసార్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, నమోదు చేసుకున్న 48 గంటల అనంతరం వారి మొబైల్కు పాస్వర్డ్ వస్తుందని తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎన్నైనా ఇవ్వొచ్చని, వీటికి పరిమితి లేదని చెప్పారు. మొదటి దశలో కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మే 31 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంద న్నారు. 1,113 పీజీ వైద్య సీట్లు పీజీ వైద్య సీట్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో 37 బ్రాంచీల్లో 1,113 సీట్లు ఉన్నాయని డాక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. ఇందులో కన్వీనర్ కోటా కింద 827, మేనేజ్మెంట్ కోటా కింద 286 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన డాక్టర్లకు 30 శాతం చొప్పున పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఇన్సర్వీస్ వైద్యులు అన్ రిజర్వ్డ్ కోటా కింద 24న విజయవాడలో, లోకల్ సీట్ల కోసం 26న జేఎన్టీటీయూ, ఓయూకు రావాలని పేర్కొన్నారు. పీజీ వైద్య సీట్లలో ప్రభుత్వ పరిధిలో 529 సీట్లు ఉన్నాయన్నారు. ప్రైవేటు కళాశాలల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 50 శాతం మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్లో దాదాపు 4 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. కాళోజీ వర్సిటీ కోసం వరంగల్ సెంట్రల్ జైలుకు సంబంధించిన 35 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఇకముందు వైద్యానికి సంబంధించిన అన్ని కోర్సుల కౌన్సెలింగ్లను తామే చేపడతామని డాక్టర్ కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. -
తెలంగాణలో 24 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి... * 85 శాతం సీట్లు లోకల్ అభ్యర్థులకే * జూన్ 1కి ముగియనున్న కౌన్సెలింగ్ * ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజు వెల్లడి విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సులో అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ఏపీలో, 24 నుంచి తెలంగాణలో ప్రారంభంకానుంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణకు విడివిడిగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పీజీ మెడికల్ సీట్ల అడ్మిషన్లకు ఈ ఏడాది కొత్తగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు మే ఒకటో తేదీలోగా చేరాలని, రెండో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. 85 శాతం సీట్లు లోకల్: లోకల్ సీట్లు 85% స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. వీరితోపాటు అన్రిజర్వుడు (మెరిట్) కింద 15 శాతం సీట్ల కోసం ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆయా ర్యాంకుల వారీగా హెల్ప్లైన్ సెంటర్లకు హాజరైన అభ్యర్థులు సర్టిపికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యాక రెండ్రోజుల్లోగా (నిర్దేశించిన తేదీల్లోగా) వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. మరో ఒకటి, రెండు రోజుల్లో సీట్లు అలాట్ అవుతాయన్నారు. అభ్యర్థులు పెట్టుకున్న ఆప్షన్లను ప్రతిసారీ ప్రింటౌట్ తీసుకోవడం మంచిదని సూచించారు. మే నెల రెండో వారంలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జూన్ 1 నాటికి కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. అభ్యర్థులకు ర్యాంకుల ప్రకారం ఎన్నిసార్లయినా ఆప్షన్లు పెట్టుకోవచ్చన్నారు. నాన్ సర్వీస్ అభ్యర్థులకు.. ఏపీ అభ్యర్థులు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీయూలో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ అభ్యర్థుల కోసం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్ జేఎన్టీయూ, వరంగల్ కాకతీయ వర్సిటీలో హెల్ప్లైన్ సెంటర్లున్నాయి. ఇన్ సర్వీస్ అభ్యర్థులకు.. ఏపీకి చెందిన సర్వీస్ అభ్యర్థులందరూ ఈనెల 24న, తెలంగాణ అభ్యర్థులు 26న పైన తెలిపిన సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలి. వికలాంగుల కోటాకు చెందిన ఇరు రాష్ట్రాల అభ్యర్థులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో మాత్రమే ఈనెల 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలి. కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుకు కింద ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి. తేవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు హాల్టికెట్, పదోతరగతి సర్టిఫికెట్, ఇంటర్, ఎంబీబీఎస్, ఇంటర్న్షిప్, మొదటి నుంచి ఫైనలియర్ వరకు ఎంబీబీఎస్ మార్కుల మెమోలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ ఫస్ట్ టు ఫైనలియర్ స్టడీ సర్టిఫికెట్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెంది బయట రాష్ట్రాల్లో చదివిన అభ్యర్థుల తల్లిదండ్రులు పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్, శాశ్వత కులధ్రువీకరణ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలి. తొలిరోజు 1,500 ర్యాంకుల వరకు ఆంధ్రప్రదేశ్లో ఈనెల 22న ఒకటి నుంచి 1,500 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఆహ్వానించారు. వీరు ఈనెల 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 23న 1,501 నుంచి 4,500 ర్యాంకు వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరై 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 24న 4,501 నుంచి చివరి ర్యాంకు వరకు వెరిఫికేషన్కు హాజరై 25, 26 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. తెలంగాణ అభ్యర్థులు ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లలో ఈనెల 24న మొదటి నుంచి 1000 ర్యాంకుల వరకు హాజరై 25, 26 తేదీల్లో, 25న 1001 నుంచి 4 వేల ర్యాంకు వరకు అభ్యర్థులు హాజరై 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 26న 4001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. సీట్ల వివరాలు ఆంధ్రప్రదేశ్లోని ఏయూ ప్రభుత్వ కళాశాలల్లో 396 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 276 సీట్లుండగా, ఇందులో 430 నాన్సర్వీస్, 232 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎస్వీయూ పరిధిలో ప్రభుత్వ కళాశాలల్లో 235 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటాలో 119 సీట్లు అందుబాటులో ఉండగా, ఇందులో 227 నాన్సర్వీస్ అభ్యర్థులకు, 127 సర్వీస్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఓయూ ప్రభుత్వ కళాశాలల్లో 530 సీట్లు, ప్రైవేటు కన్వీనర్ కోటాలో 298 సీట్లున్నాయి. ఇందులో 533 సీట్లు నాన్సర్వీస్, 295 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో 61 సీట్లున్నాయి. మొత్తం పీజీ మెడికల్ 2,587 సీట్లుండగా, కన్వీనర్ కోటా కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 1,905 సీట్లు, మేనేజ్మెంట్ కోటా కింద 682 సీట్లున్నాయి. -
వైద్య విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజ్ విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించడంతోపాటు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందజేయాలన్న నిర్ణయానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి 220వ సమావేశం మంగళవారమిక్కడ జరిగింది. వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాల కొండయ్య, డీఎంఈ టి.వేణుగోపాలరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ సోమరాజు పాల్గొన్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. వైద్యవిద్యకు సంబంధించిన కోర్సును లోడు చేసిన ట్యాబ్లను ఫస్టియర్ నుంచి థర్డ్ ఇయర్ విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించామన్నారు. అన్ని వైద్య కళాశాలల్లో వైఫై సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై చర్చించామని, తుది నిర్ణయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ పోస్టుకు పదిమంది దరఖాస్తు చేసుకోగా, నలుగురికి తగిన అర్హతలున్నట్లు వెల్లడించారు. -
పీజీ మెడికల్లో పెరిగిన సీట్లు
తెలంగాణలో 36, ఏపీలో 20 విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఈ ఏడాది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొత్తగా 56 పీజీ మెడికల్ సీట్లు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లోని మొత్తం 39 కళాశాలల్లో తెలంగాణలో 1196, ఏపీలో 1393 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలంగాణలో 36 సీట్లు, ఏపీలో 20 సీట్లు అదనంగా పెరిగాయి. ఏయూ పరిధిలో కొత్తగా విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో 3 అనస్తీషియా, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో 6 అనస్తీషియా, ఎస్వీ పరిధిలోని నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో 2 ఆప్తమాలజీ, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో 6 జనరల్ సర్జరీ, 3 పిడియాట్రిక్స్ సీట్లు పెరిగాయి. ఓయూ పరిధిలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2 ఫోరెన్సిక్, 2 సైక్రియాటీ, 7 మైక్రోబయాలజీ, సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో 1 సైక్రియాటీ, 4 పాథాలజీ, 3 అనస్తీషియా, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 1 పిడియాట్రిక్స్, 2 జనరల్ మెడిసిన్, క రీంనగర్ సీఏఆర్ కళాశాలలో 6 జనరల్ సర్జరీ, 1 పిడియాట్రిక్స్, 3 జనరల్ మెడిసిన్, రంగారెడ్డి జిల్లా భాస్కర్ మెడికల్ కళాశాలలో 3 జనరల్ మెడిసిన్, 1 ఈఎన్టీ సీట్లు పెరిగాయి. 21 నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్: ఈనెల 21 నుంచి పీజీ మెడికల్ (వెబ్) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ టి.రవిరాజు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కౌన్సెలింగ్ షెడ్యూల్కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది నుంచి కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ కింద పీజీ మెడికల్ సీట్లు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి లేఖ అందినట్లు సమాచారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి పూర్తి సాంకేతిక సహకారంతో సీట్లు భర్తీ చేసుకుంటామని ఆ లేఖలో కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విడివిడిగా కౌన్సెలింగ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. -
మెడికల్ పీజీ అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్
♦ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు ♦ ఏయూలో షెడ్యూల్ విడుదల విశాఖ మెడికల్: ఈ ఏడాది నుంచి మెడికల్ పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో సీట్ల కేటాయింపునకు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.రవిరాజు చెప్పారు. శనివారం ఆంధ్రా వైద్య కళాశాలలో ఆయన 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలివిడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆన్లైన్ విధానంలో అభ్యర్థి ఎంపిక చేసుకొని వదిలేసిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ వరకూ ఎంపిక చేసుకొనే అవకాశం ఉండేది కాదని, వెబ్ కౌన్సెలింగ్ విధానంలో వాటిని ఎప్పటికప్పుడు ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. కౌన్సెలింగ్ సమాచారం... సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఈ నెల 20 నుంచి 23 వరకు. కేంద్రాలు: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, విశాఖపట్నంలోని ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ , హైదరాబాద్ జేఎన్టీయూ. సీట్లు: 2,587, కన్వీనర్ కోటా: 1,905, మేనేజ్మెంట్ కోటా: 682. వెబ్ ఆప్షన్ల నమోదు: 21 నుంచి 25 వరకు. మొత్తం కాలేజీలు: 39, ప్రభుత్వ కాలేజీలు:13, ప్రైవేటు కాలేజీలు:26 మొత్తం సీట్లు: ఏయూ పరిధిలో ప్రభుత్వ కోటా సీట్లు: 396, ప్రైవేటు కాలేజీల్లో: 545, ఎస్వీ పరిధిలో 235, 236, ఉస్మానియా పరిధిలో 530, 484 సీట్లు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ కోటా సీట్లు: 61, వీటిలో స్థానికులకు 85 శాతం సీట్లు. ఈ నెల 27వ తేదీన సీట్లు కేటాయించి విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తామని వీసీ రవిరాజు తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్లో సీటు అలాట్మెంట్ వివరాలు చూసుకోవచ్చని చెప్పారు. రెండో విడత డెంటల్ పీజీ కౌన్సెలింగ్ను మే 31 తరువాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, సామాజిక వైద్య విభాగాధిపతి ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
'డబ్బే ముఖ్యం కాదు'
విజయవాడ : గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు ఉండే చిరునవ్వు భవిష్యత్తులో రోగులను చూసేటప్పుడు కూడా ఉండాలని వైద్యులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.... డబ్బే ముఖ్యం కాదని వైద్యులకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. వైద్యులను రోగులు దేవుళ్లుగా భావిస్తారని తెలిపారు. వారి నమ్మకాలను వమ్ము చేయవద్దు అంటూ వైద్యులకు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లాలంటే సామన్య ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేయాలని పట్టా తీసుకున్న వైద్యులను అర్థిస్తున్నానని గవర్నర్ నరసింహన్ అన్నారు. -
పీజీ డెంటల్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
మొదటి మూడు ర్యాంకుల్లో మానస, పూజిత భావన, అశోక్ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పీజీ (ఎండీఎస్) డెంటల్ కోర్సులో అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈనెల 6వ తేదీన నిర్వహించిన ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో టాపర్గా బి.మానస (నెల్లూరు నారాయణ డెంటల్ కళాశాల) నిలిచారు. తరువాతి ర్యాంకుల్లో వరుసగా పూజిత భావన. పి.ఆర్. (కడప రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్), అశోక్ చాగంటి (సిబార్ డెంటల్ కళాశాల), బి.నీలిమ (ప్రభుత్వ డెంటల్ కళాశాల, హైదరాబాద్), కొల్లాబత్తుల కిరణ్ (విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం), చింతమరెడ్డి శోభ (కడప, రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కళాశాల), అబుదూర్ రెహమాన్ (చెట్టినాడ్ డెంటల్ కళాశాల), ఎ.మానస (హైదరాబాద్ ప్రభుత్వ డెంటల్ కళాశాల), టి.స్రవంతి (కడప రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్), మనీష సక్సేనా (ఆర్మీ డెంటల్ కళాశాల, సికింద్రాబాద్) మొదటి పది మందిలో నిలిచారు. మొత్తం 1,670 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,640 మంది హాజరయ్యారు. 1,134 మంది అర్హత సాధించారు. -
ఏప్రిల్లో పీజీ మెడికల్ కౌన్సెలింగ్..
వెబ్ కౌన్సెలింగ్కు సన్నాహాలు! విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ (డిగ్రీ/ డిప్లొమా) కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు ఏప్రిల్ మూడో వారంలో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్చాన్స్లర్ టి.రవిరాజు మంగళవారం తెలిపారు. పారా మెడికల్ కౌన్సెలింగ్ మాదిరిగా పీజీ మెడికల్కు ఈ ఏడాది వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులకు మే ఒకటో తేదీకి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మే 30వ తేదీకి పూర్తి చేస్తామన్నారు. -
28న పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్
2016-17 విద్యా సంవత్సరంలో పీజీ డిగ్రీ, డిప్లొమా (ఎండీ /ఎంఎస్) మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 28న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి అందుబాటులో ఉన్న సుమారు 2700 సీట్లలో 1840 సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రవేశ పరీక్షల ఆధారంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రవేశ పరీక్ష కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీలో 27, తెలంగాణలో 28 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఈ నెల 21 నుంచే హాల్టిక్కెట్లు డౌన్లోడు చేసుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. 29న ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. మార్చి 10న ఫైనల్ ‘కీ’తో పాటు ఫలితాలు విడుదల చేయనున్నారు. -
కొత్తగా 8 వైద్య కళాశాలలు
-
కొత్తగా 8 వైద్య కళాశాలలు
► తెలంగాణ ప్రభుత్వ పరిధిలో 2, ప్రైవేటులో 6 కాలేజీలు ► ఈఎస్ఐ, మహబూబ్నగర్ ప్రభుత్వ కాలేజీలకు ఎన్టీఆర్ ► హెల్త్ వర్సిటీ అఫిలియేషన్ ► ఏపీలో కొత్తగా నాలుగు ► వైద్య కాలేజీలకు అనుమతి ► చిత్తూరు ప్రభుత్వాసుపత్రి లీజుతో జాక్పాట్ కొట్టిన అపోలో ► 2 నెలల్లోనే కాలేజీకి అనుమతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 8 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. వీటివల్ల రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో 250 సీట్లు, ప్రైవేటులో 900 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రానున్నాయి. ఈ కాలేజీలకు ఎసెన్షియాలిటీ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్ర సర్కారు ఇప్పటికే మంజూరు చేయగా.. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) ఇచ్చింది. కొత్తగా అనుమతులు పొందిన కళాశాలల్లో తెలంగాణలో 8 ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి. ఒక్కో కళాశాలకు గరిష్టంగా 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇచ్చారు. ఈ కాలేజీలను భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) బృందం పరిశీలించి అనుమతించాల్సి ఉంది. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు కాలేజీలు తెలంగాణలో ఏర్పాటు కానున్న 8 మెడికల్ కాలేజీల్లో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా.. మిగతా ఆరు ప్రైవేటు కాలేజీలు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో సనత్నగర్లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు అనుమతి లభించింది. దీంతోపాటు మహబూబ్నగర్లోని జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా చేయాలని దరఖాస్తు చేశారు. దీనికి కూడా ఈ ఏడాది అనుమతి లభించింది. ఇక 6 ప్రైవేటు వైద్య కళాశాల్లో నాలుగింటిని మెదక్ జిల్లాలో, రెండింటిని రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో కొత్తగా 600 సీట్లు ఏపీలో అనుమతి లభించిన నాలుగూ ప్రైవేటు కాలేజీలే కావడం గమనార్హం. వీటిలో చిత్తూరు జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, కృష్ణా జిల్లాలో ఒక కాలేజీకి అనుమతి ఇచ్చారు. ఒక్కో కాలేజీకి గరిష్టంగా 150 సీట్ల చొప్పున ఏపీలో కొత్తగా 600 సీట్లు రానున్నాయి. రెండు నెలల కింద చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని లీజు తీసుకున్న అపోలో యాజమాన్యం జాక్పాట్ కొట్టింది. ఏపీ సర్కారు ఎసెన్షియాలిటీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కూడా తాజాగా అపోలో కాలేజీకి అఫిలియేషన్ ఇచ్చింది. ఈ కాలేజీలో 2016-17 నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రిని లీజుకు తీసుకుని తొలి దశలోనే అపోలో యాజమాన్యం 150 సీట్లను దక్కించుకోవడం గమనార్హం. కాగా, ఏపీ నుంచి ఒక్క ప్రభుత్వ కళాశాలకూ దరఖాస్తు రాలేదు. ప్రస్తుతం ఏపీలో 11 మెడికల్ కాలేజీలున్నాయి. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవు. విజయనగరం, ఏలూరు జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి వైద్య కళాశాలలుగా మార్చాలన్న ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.300 కోట్లు వెచ్చించే పరిస్థితుల్లో లేమని, దీనికంటే జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు కంపెనీలకు లీజుకివ్వడమే మేలని భావిస్తోంది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలోకు లీజుకిచ్చారు. ‘డీమ్డ్’ హోదా కింద గీతంకు అనుమతి ఏపీలో తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫిలియేషన్ లేకుండా గీతం వర్సిటీ వైద్య కళాశాలను ఏర్పాటు చేయనుంది. తాజాగా ఏపీ సర్కారు గీతంకు డీమ్డ్ హోదాకు అనుమతినివ్వడంతో ఇది సాధ్యపడింది. ఈ కాలేజీలో 2016-17లో 150 సీట్లను భర్తీ చేయనున్నారు. 1986 నుంచి ఇప్పటి వరకూ ఇలా డీమ్డ్ వర్సిటీ కింద వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. గత మూడు దశాబ్దాల్లో డీమ్డ్ హోదాతో అనుమతి పొందిన కాలేజీ ఒక్కటి కూడా లేదు. తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలివే.. కళాశాల ప్రాంతం సీట్లు ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఎర్రగడ్డ 100 ఆయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మొయినాబాద్ 150 మహవీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ శివారెడ్డిపేట, వికారాబాద్ 150 టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పటాన్చెరు, మెదక్ 150 మహేశ్వర మెడికల్ కాలేజీ పటాన్చెరు, మెదక్ 150 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహబూబ్నగర్ 150 ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ములుగు, మెదక్ 150 సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ సిద్దిపేట, మెదక్ 150 ఆంధ్రప్రదేశ్లో కొత్త కళాశాలలివీ.. గాయత్రీ విద్యా పరిషత్ విశాఖపట్నం 150 ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పూతలపట్టు, చిత్తూరు 150 నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ జూపూడి, కృష్ణా 150 అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ మురుకంబట్టు, చిత్తూరు 150 -
7న నర్సింగ్ సీట్లకు వెబ్కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సుల్లో అడ్మిషన్లకు జనవరి 7న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్ బాబూలాల్ తెలిపారు. ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకాని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఏడో తేదీన విజయవాడలోని హెల్త్ వర్సిటీలో, హైదరాబాద్లోని జేఎన్టీయూలో వెబ్కౌన్సెలింగ్కుహాజరుకావాలన్నారు. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వికలాంగ అభ్యర్థులకు 7న ఉదయం 9 గంటలకు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన అభ్యర్థులు నేరుగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని హెల్త్ వర్సిటీ తెలిపింది. జనవరి ఏడు, ఎనిమిది తేదీల్లో వెబ్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కలిపి బీఎస్సీ నర్సింగ్లో 4,104 సీట్లు భర్తీ కాగా, ఇంకా 2,332 సీట్లు, బీపీటీలో 852 సీట్లు భర్తీ కాగా, ఇంకా 222 సీట్లు, బీఎస్సీ ఎంఎల్టీలో 591 సీట్లు భర్తీ కాగా, ఇంకా 608 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి. -
తెలంగాణ ఆరోగ్య వర్సిటీ వీసీగా కరుణాకర్రెడ్డి
♦ ఎట్టకేలకు మొదలైన ప్రక్రియ... పోస్టుల భర్తీకి రంగం సిద్ధం ♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా డాక్టర్ బందె కరుణాకర్రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం శుక్రవారం సంతకం చేశారు. కరుణాకర్రెడ్డి ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. ఇక వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. ఇప్పటివరకు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి జరుగుతోన్న కార్యకలాపాలన్నీ దీని కిందకు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు 4, ప్రైవేటు వైద్య కళాశాలలు 12 ఉన్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 11 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి రానున్నాయి. వీసీ నియామకం జరిగాక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 80 పోస్టుల భర్తీకి సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీసీ ఆధ్వర్యంలో వాటి భర్తీ చేపడతారు. వరంగల్లో విశ్వవిద్యాల యానికి భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. -
ఐదుగురు వైద్య విద్యార్థులు అరెస్ట్
-
ఐదుగురు వైద్య విద్యార్థులు అరెస్ట్
తప్పుడు కులద్రువీకరణ పత్రాలను సమర్పించి మెడిసిన్ సీటు సంపాదించిన ఐదుగురు విద్యార్థుల తో పాటు.. వారి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో కౌన్సెలింగ్ సందర్భంగా తప్పుడు కుల ద్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. సోమవారం వీరిలో ఐదుగురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ విద్యార్థులకు దిక్కేదీ?
♦ మల్లారెడ్డి వైద్య కాలేజీ సీట్లపై గందరగోళం ♦ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అనుమతి లేకుండానే ప్రవేశాలు ♦ నోటిఫికేషన్ జారీ చేయకుండానే ‘బీ’, ఎన్నారై కేటగిరీల్లోని సీట్ల భర్తీ ♦ సుప్రీంకోర్టు స్టేతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో ఆటాలాడుకుంటున్నాయి. డబ్బే పరమావధిగా నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైవేటు మెడికల్ సీట్ల భర్తీ మొత్తం వివాదాల మధ్యే సాగింది. తాజాగా హైదరాబాద్లోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మరో అడుగు ముందుకేసింది. ఈ ఏడాది ఆ కాలేజీలోని 150 సీట్ల భర్తీని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ కాలేజీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి భర్తీకి అనుమతి తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా నిబంధనల ప్రకారం నడుచుకోలేదు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అనుమతి తీసుకోకుండానే, కన్వీనర్ కోటాలోని ‘ఏ’ కేటగిరీ సీట్లను భర్తీ చేయకుండానే.. ‘బీ’ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లు భర్తీ చేసుకుంది. దీనిపై ఎంసీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో ఆ సీట్లలో చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నోటిఫికేషన్ లేకుండానే! గత నెల 30న మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సీట్ల భర్తీ కోసం ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు అదే తేదీన గడువు ముగియడంతో సీట్ల భర్తీపై సాంకేతిక సమస్య ఎదురైంది. కానీ మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయలేదు. తీర్పు వచ్చిన మరుసటి రోజు ‘ఏ’ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలని.. ‘బీ’, ఎన్నారై కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతివ్వాలని ఎన్టీఆర్ వర్సిటీకి లేఖ రాసింది. గడువు ముగిసినందున వీలుపడదని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీన్ని లెక్కచేయని యాజమాన్యం.. ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ‘ఏ’ కేటగిరీ సీట్లను వదిలేసి, ‘బీ’, ఎన్నారై కోటాల్లో 75 సీట్లను సొంతంగా భర్తీ చేసేసుకుంది. అసలు ‘బీ’ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ వర్సిటీ, ప్రైవేటు యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలోని ఎంసెట్ కన్వీనర్ల అనుమతి కావాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి. అవేమీ చేయకుండానే ‘బీ’ కేటగిరీ సీట్లను ఎన్నారై కోటాలోకి మార్చుకొని ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకున్నారని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు చెప్పాయి. ఈ జాబితాకు తాము ఆమోదం తెలపలేదని వర్సిటీ వీసీ రవిరాజు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తతంగంపై ఎంసీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో తాము కట్టిన ఫీజు వెనక్కి ఇచ్చేయాలని కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. -
13న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఎమ్మెస్సీ (నర్సింగ్) కోర్సులో అడ్మిషన్ల కోసం ఈ నెల 13న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఆగస్టు 16న నిర్వహించిన ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1500 చొప్పున చెల్లించి కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. కళాశాలలు, సీట్ల వివరాలు కౌన్సెలింగ్కు ఒకరోజు ముందు యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతామని తెలిపారు. మరిన్ని వివరాలు ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్(Http://ntruhs.ap.nic.in) లో పొందవచ్చునని వివరించారు. -
తొలిసారి ఎంపీహెచ్ కోర్సు
నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సుకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. రెండేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కోర్సుకు ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. దీనికి వయోపరిమితి లేదు. 20 సీట్లు కన్వీనర్ కోటా కింద, 16 సీట్లు యాజమాన్యకోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా సీట్లకు రెండేళ్లకు కలిపి రూ.2.25 లక్షలు, యాజమాన్య కోటా సీట్లకు కలిపి రూ.2.55 లక్షలు చెల్లించాలి. దరఖాస్తుదారులు రూ. 3 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి. జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 18న ఆన్లైన్లో హైదరాబాద్, విజయవాడల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
కౌన్సెలింగ్లో గందరగోళం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైన రెండో, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్లో కస్టోడియన్ సర్టిఫికెట్ల విషయమై కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఏపీ, తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించగా, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే వేర్వేరుగా మెడికల్ కౌన్సెలింగ్లను నిర్వహించిన విషయం విదితమే. ఏపీ మెడికల్ కౌన్సెలింగ్లో భాగంగా తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియగా, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైంది. హెల్త్ వర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఎంసెట్లో అర్హత సాధించిన (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన) అభ్యర్థులు ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరుకావాలి. అదే విధంగా మొదటి విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్కు హాజరై... ప్రభుత్వ/ప్రైవేటు ఎ-కేటగిరీ (కన్వీనర్) సీట్లతో పాటు బి-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లు పొందిన అభ్యర్థులు కూడా హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన అడ్మిషన్ పత్రంతో (కస్టోడియన్ సర్టిఫికెట్గా పరిగణిస్తూ) మాత్రమే కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని హెల్త్ యూనివర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇటీవల ముగిసిన తుది విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్లో అప్పటికే సీట్లు పొందిన కొంతమంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్లో కూడా అర్హత సాధించి శుక్రవారం ప్రారంభమైన తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్కు నాన్-లోకల్ అన్ రిజర్వుడ్ కోటా కింద హాజరయ్యారు. వీరితో పాటు వెటర్నరీ, ఏజీ బీఎస్సీ కోర్సుల్లో చేరిన ఏపీకి చెందిన అభ్యర్థులు కూడా వారివారి ఒరిజినల్ సర్టిఫికెట్లకు బదులు ఆయా కళాశాలల నుంచి కస్టోడియన్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఇలా హాజరైన అభ్యర్థులను కౌన్సెలింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో కొద్దిసేపు అభ్యర్థుల తల్లిదండ్రులు కౌన్సెలింగ్ అధికారులతో వాదనకు దిగగా నోటిఫికేషన్లో ఇచ్చిన కస్టోడియన్ సర్టిఫికెట్ అర్థాన్ని వివరించి చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ఇటీవల ముగిసిన తుది విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్లో కూడా ఇదే నిబంధనను అమలు చేశామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ విధంగా సై ్లడింగ్ అవుతూపోతే ప్రైవేటు కళాశాలల్లోని మిగిలిపోయిన కన్వీనర్ కోటా (ఏ-కేటగిరీ) సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో బదలాయింపునకు గురయ్యే ప్రమాదం ఉందని యూనివర్సిటీ వర్గాలు వివరించాయి. -
ఎన్సీసీ కోటా సీట్ల భర్తీని వాయిదా వేయండి
ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎన్సీసీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీని వాయిదా వేయాలని హైకోర్టు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఆదేశించింది. ఎన్సీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రాధాన్యత విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో వారంరోజులపాటు కౌన్సెలింగ్ వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్సీసీ కోటా సీట్ల భర్తీ విషయంలో ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు నిర్దిష్ట విధానాన్ని అనుసరించట్లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన మర్రి సాయిశ్రీ, హైదరాబాద్కు చెందిన మాళవిక.. మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్ సుభాష్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. అండమాన్ నికోబార్లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో పాల్గొన్న విద్యార్థులకే సీట్ల భర్తీలో ప్రాధాన్యమిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. అంతేగాక ఎన్సీసీ డెరైక్టరేట్లు స్పాన్సర్ చేయని గెస్ట్ కాడెట్లకు సైతం సీట్లు ఇస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఒక్కో రాష్ట్రప్రభుత్వం ఒక్కోవిధంగా ప్రాధాన్యతను రూపొందించిందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసలు ప్రాధాన్యతలను తమ ముందుంచాలని కేంద్రప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
అవయవదానంపై అవగాహన ర్యాలీ
కృష్ణా: విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు గురువారం అవయవదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీర పాండ్యన్ ప్రారంభించారు. అవయవదానం చేయండి-ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకొని వైద్య విద్యార్థులు నగర వీధులలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజుతో పాటు వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
12 నుంచి ఎంసెట్-ఏసీ కౌన్సెలింగ్
అందుబాటులో సుమారు 665 సీట్లు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) 12 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా((వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్)-కళాశాలల అసోసియేషన్(ఏసీ)) సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఆగస్ట్ 5న కౌన్సెలింగ్ మొదలై 11న ముగుస్తుంది. అనంతరం 12 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 35 శాతం యాజమాన్యకోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది యాజమాన్యకోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష(ఎంసెట్-ఏసీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1900 సీట్లున్నాయి. వీటిలో 35 శాతం అంటే సుమారు 665 సీట్లు యాజమాన్యకోటా కింద భర్తీ చేస్తారు.కాగా యాజమాన్య కోటా కింద భర్తీచేసుకొని ఎన్నారై కోటా కింద మారిస్తే ఊరుకోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.