TET
-
డీఎస్సీ సిలబస్తో డీలా!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిగో డీఎస్సీ.. అదిగో డీఎస్సీ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డీఎస్సీ సిలబస్ను మాత్రమే విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సిలబస్తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు ఎప్పుడూ లేని రీతిలో ఇంటరీ్మడియెట్ వరకు సిలబస్ను ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులు 3–10 తరగతుల సిలబస్ను మాత్రమే చదవాలని చెబుతూనే.. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ను ఇవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. 2018 డీఎస్సీలోనూ ఇలాగే చెప్పిందొకటి, పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు. 2014 డీఎస్సీలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి టీడీï³ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో డీఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు, విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. హైసూ్కల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు. అలాగే పరీక్షల నిర్వహణపైనా విజ్ఞప్తులు చేశారు. బోధించే తరగతులకు మించి సిలబస్..టెట్ సిలబస్సే డీఎస్సీ పరీక్షలకు కూడా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డీఎస్సీ సిలబస్లో ప్రకటించారు. కానీ, సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియెట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలిక పెట్టారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధన చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డీఎస్సీ సిలబస్ ఉండేది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు 6 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది. దీన్ని ఆధారం చేసుకునే ప్రశ్నపత్రాలను రూపొందించేవారు. కానీ, 2014, 2018 డీఎస్సీల్లో మాత్రం సిలబస్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు, విద్యా రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఊస్టింగేనా?ఎస్జీటీ, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పాఠశాల విద్యా శాఖ సిలబస్ను ప్రకటించింది. కానీ హైసూ్కళ్లల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్ను ప్రకటించలేదు. అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెబుతున్నట్టుగానే భావించాల్సి వస్తోంది. 2018 ఫిబ్రవరి స్పెషల్ డీఎస్సీలో ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు 852 పోస్టులను గుర్తించి సుమారు 602 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈసారి వారికి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ విద్యావిధానం–2020 నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ పరీక్షపైనా అభ్యంతరాలు..జూలైలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మాదిరిగానే డీఎస్సీని కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సెషన్లలో రోజుల తరబడి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ.. జిల్లా స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లాలవారీగా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై గతంలో అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను అభ్యర్థించారు. నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో అది కూడా టెట్ మాదిరిగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పది రోజులు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
టెట్ ఫీజు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్–1 లేదా పేపర్–2 పరీక్ష రాసేందుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 750కి తగ్గించింది. పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 2 వేలుగా ఉన్న ఫీజును రూ. తాజాగా వెయ్యికి తగ్గించింది. అలాగే టెట్ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్ను విద్యాశాఖ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది.దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టెట్ పేపర్లో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వాటికి 150 మార్కులుంటాయి. చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు ఇతర రిజర్వేషన్ కేటగిరీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు.టెట్ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. çహాల్టికెట్లను డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 20 మధ్య డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది ఈ నెల 20వ వరకు కొనసాగుతుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకంలో టెట్కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. -
జనవరి 1 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఈ ఏడాది టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్ క్యాలెండర్లో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్ రాసే అవకాశం కలి్పంచారు. తాజా టెట్కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్తో కూడిన సమాచార బులిటెన్ మంగళవారం https:// schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెట్ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. పేపర్–2లో తక్కువ ఉత్తీర్ణత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్–1, బీఈడీ అర్హులు పేపర్–2తో పాటు పేపర్–1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్–1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు. పేపర్–2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్–2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
-
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రేపట్నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ నవంబర్ 20న చివరి తేదీ విధించింది. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. -
మంత్రి లేక టెట్ ఫలితాలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జూలై–2024) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రకటించాల్సి ఉండగా, విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన ఫలితాలకు అడ్డంకిగా మారింది. అక్టోబర్ 3 నుంచి 21వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.వాస్తవానికి గతనెల 27న ప్రకటించాల్సిన ఫైనల్ కీ సైతం రెండు రోజులు ఆలస్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా టెట్ ఫలితాలను సోమవారం ప్రకటించి, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెల 6న విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, మంత్రి వచ్చాక టెట్ ఫలితాలు, డీఎస్పీ నోటిఫికేషన్పై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. -
టెట్పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. స్కూల్ అసిస్టెంట్ (2ఏ) ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఈ పేపర్లో పార్ట్–2లో మాతృభాష ఎంపిక పైనా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులో తలెత్తిన సమస్యను పరిష్కరించకపోవడంతో పరీక్ష సమయంలో మాతృభాష స్థానంలో ఇంగ్లిష్ మాత్రమే వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.టెట్ ఎస్ఏ–2 ఇంగ్లిష్ పేపర్ రెండో సెక్షన్లో అభ్యర్థుల మాతృ భాషకు అనుగుణంగా తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా తదితర భాషలు ఉంటాయని, అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న భాషనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఇక్కడ మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుంటే ఇంగ్లిష్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలిపారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అనుసరించిన విధానాలనే ఇప్పుడూ అనుసరించామని కృష్ణారెడ్డి వివరించారు. -
AP: హామీ గాలికి.. ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే!
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది. టెట్, డీఎస్సీ మధ్య కనీసం 90 రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్ షెడ్యూల్ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి కూడా అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది. అయితే నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం టెట్ను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించనుంది. టెట్ ఫలితాలను నవంబర్లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మరో 8 నెలలపాటు డీఎస్సీ శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు. దీంతో అన్నాళ్లపాటు ఉపాధి లేకుండా ఉండటం ఎలా అనే బెంగ వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలుచుకుని తల్లడిల్లుతున్నారు. ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని.. చివరకు తూచ్తొలుత చంద్రబాబు డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టులో టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సెప్టెంబర్లోనే డీఎస్సీ కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు టెట్ (జూలై) పరీక్షలను అక్టోబర్కు మార్చారు. ఈ ఫలితాలను నవంబర్లో విడుదల చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన మేరకు టెట్కు, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఇచ్చినట్టయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్, జూలైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది.సంఘాల పేరుతో కాలయాపనగత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటే టెట్ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించగా 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను జూన్ 25న ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ లేకుంటే ఏప్రిల్లోనే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డీఎస్సీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల 2న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, టెట్కు, డీఎస్సీకి మధ్య కనీసం 90 రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్ను మళ్లీ మార్చారు. వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డీఎస్సీ నిర్వహించి, ఈ ఏడాది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి మరో డీఎస్సీలో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను 2025 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే డీఎస్సీని ప్రకటిస్తే పోస్టులను భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎవరూ అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం, ఇచ్చిన తొలి నోటిఫికేషన్నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.ఇది ముమ్మాటికీ మోసమే..అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10 వేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే. మెగా డీఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండిచేయి చూపించారు. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉంది. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఆ ఉద్యోగాలు వదులుకుని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే లక్షలాదిమందికి ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో నం.117ను తక్షణమే రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. – రామచంద్ర ఎంబేటి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
టెట్ వాయిదా
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫలితాలను నవంబర్ 2న వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు https://cse.ap.gov.in/ లో చూడొచ్చని తెలిపింది. మారిన టెట్ షెడ్యూల్ ఇదీ.. ⇒ ఫీజులు చెల్లించేందుకు గడువు: 03–08–2024⇒ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు: 03/08/2024⇒ ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహణ: 19/09/2024 నుంచి..⇒ హాల్టికెట్ల డౌన్లోడ్: 22/09/2024 నుంచి పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు⇒ ప్రాథమిక ‘కీ’: 04/10/2024 నుంచి⇒ ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి 21/10/2024 వరకు⇒ ఫైనల్ ‘కీ’ విడుదల: 27/10/2024 ⇒టెట్ ఫలితాల వెల్లడి: 02/11/2024 -
ఏటా రెండుసార్లు టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో ఒకసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈమేరకు సవరణ ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు. ఒక అభ్యర్థి టెట్ పరీక్షను ఎన్నిసార్లు అయినా రాయొచ్చని, మెరుగైన మార్కుల కోసమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడితో పాటు ఎస్సీఈఆర్టీ సంచాలకులను ఆయన ఆదేశించారు. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం(జూన్25) మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఉత్తీర్ణత శాతం 58.4 శాతం ఉండగా మొత్తం 1,37,903 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఎస్జీటీ రెగ్యులర్ పేపర్-1 కు 78,142 అభ్యర్థులు అర్హత సాధించగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ -1కు 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ -2 కు 60,846 అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్- 2కు 1,125 మంది అర్హులయ్యారు. -
మరోసారి ‘టెట్’తో డీఎస్సీ ఆలస్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించింది. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో నిర్వహించిన టెట్కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ) అర్హత పరీక్ష పేపర్–1ఏని 1,13,296 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్–1బి, పేపర్–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్లో ప్రకటించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టుల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.తద్వారా ఆ పోస్టులను తామే భర్తీ చేశామన్న క్రెడిట్ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేందుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇదే కోవలో మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
టెట్లో పెరిగిన ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం విడుదల చేశారు. డీఎడ్ అర్హతతో నిర్వహించే పేపర్–1లో 57,725 మంది (67.13%), బీఈడీ అర్హతతో రాసే పేపర్–2లో 21,842 మంది (34.18%) అర్హత సాధించారు. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం పేపర్–1లో 30.24 శాతం, పేపర్–2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టేందుకు గత ఏడాది నుంచి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రెండేళ్లుగా టెట్ రాసేవారి సంఖ్య పెరుగుతోంది. టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు ఉండేలా సవరణ చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో టెట్కు వెయిటేజ్ ఇస్తారు. ఈసారి ఇన్సర్విస్ టీచర్లు కూడా ఈ పరీక్ష రాశారు. ప్రతీ పేపర్లోనూ దాదాపు 5 వేల మందికిపైగా హాజరయ్యారు. వాస్తవానికి 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత పొందాల్సి ఉంది. కానీ 2010కి ముందు నియమించిన టీచర్లకు పదోన్నతుల్లో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో టెట్ రాసే ఇన్ సర్విస్ టీచర్ల సంఖ్య తగ్గింది. మొత్తం 7 భాషల్లో పరీక్ష నిర్వహించినా, తెలుగు మీడియం నుంచే ఎక్కువమంది హాజరయ్యారు. మళ్లీ రాస్తే ఫీజు ఉండదు: రేవంత్రెడ్డి టెట్ ఫీజు పెంపుపై పరీక్ష సమయంలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని చెప్పింది. కంప్యూటర్ బేస్డ్గా టెట్ నిర్వహించడంతో ఫీజు పెంచారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు.ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటం వల్లే టెట్ ఫీజు తగ్గించలేకపోయామన్నారు. టెట్లో ఫెయిల్ అయిన వారికి మరోసారి రాసేప్పుడు ఫీజు నుంచి ఉపశమనం ఇస్తామన్నారు. 2024 టెట్ ఉత్తీర్ణులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇస్తామని చెప్పారు. -
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు! -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్కు హరీష్రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్తో పోల్చితే డబుల్గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్రావు తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్కు ఒక్కో పేపర్కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
అంతా సిద్ధం!
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు విద్యా శాఖ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తొలి రోజు గురువారం దాదాపు 10 వేల దరఖాస్తులు అందాయి. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనున్న టెట్కు సుమారు 5.50 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రంలో 185 సెంటర్లు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలలో 22 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో టెట్ నిర్వహణలో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మందికి రాష్ట్రం వెలుపల కూడా సెంటర్లు కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయారు. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సెంటర్లలో 12 రోజుల్లో రెండు సెషన్స్ కింద స్లాట్లను సిద్ధం చేశారు. రోజుకు 60 వేల మంది చొప్పున 7.20 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోని అభ్యర్థులు వారికి దగ్గరలోని సెంటర్లో స్లాట్ను ఎంచుకుంటే అక్కడే పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 14 నాటికి పోస్టింగులు! సోమవారం డీఎస్సీ–2024 నోటిఫికేషన్కు కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. డీఎస్సీకి కూడా 185 సెంటర్లలో రెండు సెషన్స్లో స్లాట్లు సిద్ధం చేసింది. ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటించి, తర్వాత వారం రోజుల్లో ఏప్రిల్ 14 నాటికి పోస్టింగులు ఇచ్చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టులను ప్రకటించగా, రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గత పరీక్షల మాదిరిగానే ప్రకటించిన షెడ్యూల్ మేరకు టెట్తో పాటు డీఎస్సీ కూడా పూర్తిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నియాకమ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2019 జూన్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు కూడా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసి, మినిమం టైమ్ స్కేల్తో పోస్టింగ్లు ఇచ్చింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు సైతం భర్తీ చేయడంతో పాటు మొత్తం 14,219 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ టీచర్లు ఎంతో ప్రత్యేకం గతంలో నిర్వహించిన డీఎస్సీల్లో ఎంపికైన వారికి, ఈసారి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించే అభ్యర్థులకు ఎంతో తేడా ఉంటుంది. ఈసారి టీచర్లకు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ – 2020) ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ను అమలు చేస్తోంది. ఈ బోధనకు అనుగుణంగా ఈ డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైనవారికి ఇంటర్నేషనల్ బాకలారియెట్, టెక్నాలజీ వినియోగం, టోఫెల్, టీచింగ్ ఎఫిషియనీ్సపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. గతంలో ఈ తరహా శిక్షణ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అవసరానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం తప్ప, ప్రాథమిక స్థాయి నుంచే పూర్తిస్థాయి శిక్షణ లేదు. టెట్ నిబంధనలు సడలింపు టెట్ అభ్యర్థులకు మేలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధనను తొలగించి, ఈ మార్కులను 40 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎక్కువ మంది టెట్ రాసేందుకు అవకాశం వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసేందుకు ఇంటర్లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్/సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటరీ్మడియట్, రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపునిచ్చిది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెట్.. ఇదేమి టెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పని సరి అనుకుంటే కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఎన్ని లింకులో..: టెట్లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు. టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డీఎస్ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన క న్పిస్తోంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్విస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మేథ్స్ చెప్పే టీచర్కు సైన్స్, సైన్స్ చెప్పే టీచర్కు మేథ్స్లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతు న్నారు. జనరల్ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్గా పనిచేయాలనుకునే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది. టెట్ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు. టెట్పై ఉద్యమిస్తాం ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలి. కానీ టెట్నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తాం. - పి.నాగిరెడ్డి (టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ప్రభుత్వమే ఆలస్యం చేసింది టెట్పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. శాఖపరమైన టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్ లేకుండా ముందుకెళ్ళడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి) డిపార్ట్మెంటల్ పరీక్షలా నిర్వహించాలి టెట్ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్మెంటల్ టెస్ట్లా చేపడితే మేలు. – పింగిలి శ్రీపాల్రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
TS TET 2024: ఏప్రిల్లో టెట్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వ హించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకూ ఈ నిబంధనను అమలు చేయలేమని పే ర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మిన హాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. మెగా డీఎస్సీకీ టెట్ ఆటంకం రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డీఎస్సీ చేపట్టాలంటే, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి 22 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెట్ ఎవరికి? రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా, ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాసయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలి. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. టెట్ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. రిలీవర్ వస్తేనే స్థాన చలనం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. అంటే రిలీవ్ అయ్యే టీచర్ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్ 8 ఏళ్ళు, హెచ్ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,139 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ♦మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. హాల్టికెట్ లేకుండా పరీక్షకేంద్రంలోని ప్రవేశం ఉండదు. అభ్యర్థులు ఓఎమ్మార్ పత్రంలో వివరాలు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. అభ్యర్థుల హాల్టికెట్లో పేరులో ఏమైనా స్వల్ప అక్షరదోషాలు, వివరాలు సరిగ్గా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్టికెట్పైన ఫొటో, సంతకం సరిగా లేకున్నా ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవడంతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఇతర ఫొటో ఐడీ కార్డులతో సంబంధిత డీఈఓలను సంప్రదించాలి. వారి అనుమతితోనే పరీక్షకు అనుమతిస్తారు. -
టెట్పై పట్టు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్ విద్యార్హతతో రాసే పేపర్–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం. ప్రభు త్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తా మని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్తోపాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని.. టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందని అర్హత గీటురాయి: టెట్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్–1 (డీఎడ్ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్–2 (బీఎడ్ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు. మేథ్స్, ఇంగ్లిష్ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నా రు. ఇక ఇంగ్లిష్లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్–1 ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్ టీచింగ్ మెథడ్స్పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. నాలుగున్నర లక్షల మందిలో.. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్లో పేపర్–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)’ పోస్టులకు.. పేపర్–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది. డీఎడ్ పూర్తిచేసినవారు పేపర్–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్ వారు పేపర్–1, పేపర్–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్ వారు పేపర్–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లిష్, మేథ్స్కు కష్టపడాలి కేవలం 45 రోజుల్లోనే టెట్కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్ నోటిఫికేషన్ రాకపోవడం నిరాశగా ఉంది. – స్వాతి, టెట్ అభ్యర్థి, భూపాలపల్లి నియామకాలుంటేనే ఉత్సాహం టెట్ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. – ఇఫ్రాన్ పాషా, టెట్ అభ్యర్థి, ములుగు జిల్లా -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
త్వరలో టెట్ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. భర్తీ కోసం ఎదురుచూపులే..! రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్ పరీక్ష సమయంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. 22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తరగతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారితీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేకుండా టెట్ దేనికి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. – చావా రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి పాతపట్నం బాలాజీ నగర్కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు అక్కడ సూసైడ్ నోట్తో పాటు సెల్ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్ బహదూర్ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
AP TET Notification 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్–ఆగస్టు 2022)ను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు టెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. aptet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులకు సహకరించేందుకు ఈనెల 13 నుంచి విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్కును ఏర్పాటు చేస్తున్నారు. జూలై 26వ తేదీ నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తారు. జూలై 25 నుంచి హాల్టిక్కెట్లు జారీ చేస్తారు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తును నింపిన తర్వాత అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. టెట్ సిలబస్ను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పొందుపరిచింది. పరీక్షలిలా.. పరీక్షలు పేపర్ 1ఏ, పేపర్ 1 బీ, పేపర్ 2 ఏ, పేపర్2 బీలుగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేస్తారు. దానిపై సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీని సెప్టెంబర్ 12న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. డీఎస్సీలో వెయిటేజి టెట్లో అర్హతకు నిర్ణీత మార్కులను పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఆ మార్కులు సాధిస్తేనే టెట్లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60 శాతం రావాలి. బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కుల స్కోరుకు ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీలో) 20 శాతం మేర వెయిటేజీ కల్పిస్తారు. వీరు అర్హులు డీఎల్ఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు, 2020–22 బ్యాచ్లోని అభ్యర్థులు ఈ టెట్కు అర్హులు. గతంలో ఏపీ టెట్లో ఉత్తీర్ణులైన వారిలో మార్కుల స్కోరును పెంచుకోవాలనుకొనే వారు కూడా ఈ టెట్కు హాజరుకావచ్చు. 1 నుంచి 5 తరగతుల బోధనకు సంబంధించిన టీచర్లు పేపర్ 1–ఏకు హాజరుకావాలి. 6 నుంచి 8వ తరగతుల బోధనకు పేపర్–2ఏ రాయాలి. 1 నుంచి 5 తరగతులలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్ధులు పేపర్–1బీ రాయాలి. 6 నుంచి 8వ తరగతుల స్పెషల్ ఎడ్యుకేషన్ బోధనకు పేపర్–2బీకి హాజరుకావాలి. 1 నుంచి 8 తరగతుల బోధన అభ్యర్ధులు పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీలను రాయాలి. అభ్యర్ధులు వారు హాజరుకాబోయే పేపర్లకు వేర్వేరుగా రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. పరీక్షలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిసాలలో నిర్వహిస్తారు. -
ఏపీ టెట్–2022 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం తదితర వివరాలకు aptet.apcfss.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 నుంచి ఈ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
తెలంగాణలో కష్టాల టెట్.. అభ్యర్థులకు తిప్పలు, పరీక్ష రాసేదెలా?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, అభ్యర్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో తికమక, హాల్ టికెట్లలో ఫొటో ఉంటే సంతకం ఉండటం లేదని, సంతకం ఉంటే ఫొటో కనిపించడం లేదని పలువురు అభ్య ర్థులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖాధికారుల చుట్టూ తిరిగినా వాళ్లు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సొంత ప్రాంతంలో కాకుండా, పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయితే, హాల్టికెట్లలో ఫలానా కాలేజీ అని మాత్రమే పేర్కొ న్నారు. ఒకే పేరుతో జిల్లా కేంద్రంలో రెండు మూడు కాలేజీలున్నాయి. దీంతో ఏ కాలేజీలో పరీక్ష రాయాలో తెలియని గందరగోళంలో అభ్యర్థులు న్నారు. పరీక్ష కేంద్రం ఫోన్ నంబర్లు అందు బాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా, ఆ నంబర్లకు ఫోన్ చేస్తే స్పందన ఉండటం లేదని, ఎక్కువ సేపు ఎంగేజ్లో ఉంటోందని పలువురు అభ్యర్థులు తెలిపారు. పరీక్షకు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగు తోంది. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం మొత్తం 6,29,352 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తప్పుల సవరణకు అవకాశమేది? టెట్ పరీక్ష నిర్వహణపై అధికారులు మొదటినుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో చాలా రోజులు సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దరఖాస్తు సమయంలో సంతకం, ఫొటోలు సరిగా అప్లోడ్ అవలేదని అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. దరఖాస్తులు అప్లోడ్ చేసిన తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. అయితే టెట్ నిర్వహణ అధికారులు ఇవేవీ పట్టించుకోలేదని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తంచేశారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ తర్వాత ఫొటోలు, సంతకాలు లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఫొటో అంటించి, సంతకాలు చేసి, గెజిటెడ్ ధ్రువీకరణ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారిని కలిస్తే పరిశీ లించి న్యాయం చేస్తారని వెసులుబాటు కల్పించారు. అయితే, డీఈవోలు ఇతర అధికార పనుల్లో ఉండటం, సవరణల కోసం వచ్చే అభ్యర్థులు ఎక్కు వగా ఉండటంతో సవరణలు పరిశీలించే అవకాశం ఉండటం లేదని అభ్యర్థులు అంటున్నారు. కింది స్థాయి అధికారులకు ఈ బాధ్యత అప్పగించినా, రోజుల తరబడి తిరిగితే తప్ప పనిజరగడం లేదని చెబుతున్నారు. స్పష్టత లేక గందరగోళం.. ►ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పక్క జిల్లాల్లో పరీక్ష కేం ద్రాలు కేటాయించారు. వరంగల్ పట్టణంలో ఒకే పేరుతో 3 కాలేజీలు (బ్రాంచీలు) ఉన్నాయి. కాలేజీ పేరు ఇచ్చి.. వరంగల్ అంటూ హాల్ టికెట్లో పేర్కొన్నారు. అయితే ఏ బ్రాంచ్ అనేది స్పష్టం చేయలేదు. హాల్ టికెట్లో ఇచ్చిన ఫోన్ నంబర్కు కాల్ చేస్తే స్పందన కన్పిం చలేదు. ►ఖమ్మంకు చెందిన ఓ అభ్యర్థి హాల్ టికెట్పై తన సంతకం పడలేదు. మళ్లీ ఫొటో, సంతకం అం టించి, గెజిటెడ్ అధికారి చుట్టూ తిరిగి ధ్రువీ కరణ చేయించారు. డీఈవో కార్యాలయంలో అధికారులు రెండు రోజులైనా స్పందించలేదని ఆ అభ్యర్థి తెలిపారు. సంతకం కోసం రెండు రోజులా? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్ డౌన్ లోడ్ చేశాక చూసుకుంటే ఫొటో పక్కన ఉండాల్సిన సంతకం లేదు. దీంతో రెండు రోజుల పాటు హనుమకొండలోని డీఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి డీఈఓ కార్యాలయం ఏడీ పర్మిట్ చేస్తూ హాల్ టికెట్పై సంతకం చేశారు. –ఎండీ ఖరీముల్లా, టెట్ అభ్యర్థి, హనుమకొండ -
AP: ఆగస్టులో ‘టెట్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సినా గత సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్ ఎలిజిబులిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టెట్ కమ్ టెర్ట్) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్ నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది. డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్ టెట్ 2021 విధివిధానాలు, సిలబస్ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరిచింది. టెట్లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు. ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే.. ► రెగ్యులర్ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 – 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ► టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ తరువాత డీఎస్సీపై దృష్టి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే వెను వెంటనే కరోనా రావడంతో రెండేళ్లుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించేందుకు సన్నద్ధమవుతోంది. -
ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్లో ప్రత్యేక పేపర్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందనరాలేదు. విజ్ఞప్తులు, విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 12తో ముగిసింది. మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయని, ఇందులో పేపర్–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభించే వీలుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ జరుగుతుంది. తమకు తెలియని సిలబస్తో టెట్ రాయడం కష్టమనే భావనలో భాషా పండితులున్నారు. హిందీ, తెలుగు భాషాపండిట్ కోర్సు పూర్తి చేసిన ఈ అభ్యర్థులు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులు. (చదవండి: బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!) అయితే, వీరు ప్రధానంగా సంబంధిత భాషపైనే శిక్షణపొంది ఉంటారు. 60 శాతం భాషాపరమైన సిలబస్ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్లో పోటీ పడగలమని వీరు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం గణితం, సైన్స్సహా మిగతా సిలబస్తో వీళ్లు టెట్ రాయాల్సి వస్తోంది. ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి వాదన. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు పండిట్లు, 10 వేల మంది హిందీ పండితులున్నారు. ఆన్లైన్ అవస్థలు.. టెట్ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తుపై కొంతమంది ఫొటోలు ఆప్లోడ్ అయినా, సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపర్చలేకపోయామని, సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు. సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్లైన్లో చూపించలేదని ఎల్బీనగర్కు చెందిన చైతన్య, రఘురాం అనే అభ్యర్థులు తెలిపారు. అయితే, దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో లేని పక్షంలో తిరస్కరిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ తరహాలో పేపర్–3 ఉండాలి భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – సి.జగదీశ్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు) (చదవండి: టెట్ పరీక్ష కేంద్రాలు బ్లాక్) -
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
టెట్ అభ్యర్థులకు గుడ్న్యూస్! ఒక్కసారి రాస్తే చాలు..
సాక్షి, హైదరాబాద్: టెట్కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. జూన్ 12న టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్టెట్. సీజీజీ.జీవోవీ.ఇన్’వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కాగా టెట్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. (చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు) -
Teacher Eligibility Test: టెట్–2021 విధానం, సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్ను ‘హెచ్టీటీపీఎస్://ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్ తెలిపారు. రాష్ట్రంలో టెట్ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. టెట్లో రెండు పేపర్లు.. ► టెట్లో 2 పేపర్లు (పేపర్–1, పేపర్–2) ఉంటాయి. పేపర్ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు. ► రెగ్యులర్ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్ పోస్టులకు పేపర్ 1–ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూల్స్లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్ 1–బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2–బీలో అర్హత తప్పనిసరి. ఆయా పేపర్ల పరీక్ష విధానం ఇలా.. -
Teacher Eligibility Test: టెట్ పాసైతే జీవితకాలం అర్హత
సాక్షి, అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన తరువాత అభ్యర్థులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను ప్రవేశపెట్టడంతో పాటు ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు రూపొందించింది. జాతీయస్థాయిలో ప్రత్యేకంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)ని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును తప్పనిసరిగా నిర్వహించాలని, ఏడాదికి కనీసం రెండుసార్లు ఈ టెట్ పరీక్ష పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. టెట్ అర్హత ధ్రువపత్రాల అర్హత కాలపరిమితిని ఏడేళ్లుగా ఎన్సీటీఈ చేసింది. 2011 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్లు మాత్రమే ఉండడంతో ఆ గడువు ముగిసిన అభ్యర్థులు మళ్లీ టెట్ను రాయవలసి వచ్చేది. ఇప్పుడు ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలం చేయడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. 2011 నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నామని, ఇప్పటికే ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారికి ఇచ్చిన ధ్రువపత్రాల కాలపరిమితి ముగిసి ఉంటే వాటిని జీవితకాలానికి పునరుద్ధరించడమో, కొత్త ద్రువపత్రాలు జారీ చేయడమో చేయాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గతంలో ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారు ఆ సర్టిఫికెట్ల పరిమితి ఏడేళ్లు దాటినా నిశ్చింతగా ఉండవచ్చు. వాటి కాలపరిమితి జీవిత కాలానికి పెంచడంతో మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. అయితే డీఎస్సీలో టెట్ అర్హత మార్కులకు 20 శాతం మేర వెయిటేజి ఇస్తున్నారు. దీనివల్ల టెట్ వెయిటేజి స్కోరును పెంచుకోవడానికి అభ్యర్థులు టెట్ను పలుమార్లు రాస్తున్నారు. చదవండి: పరీక్షల రద్దుతో హ్యాపీనా? -
Teachers Eligibility Test: టెట్ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు..
న్యూఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కీలక ఆదేశాలను జారీచేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ -
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా.. ఉండదా?
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా? అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు టీచర్ పోస్టులున్నాయి. అయితే వాటి భర్తీ విధానమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్ను నాలుగేళ్లుగా నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పడేసిన విద్యాశాఖ.. ఇప్పుడు టెట్ నిర్వహిస్తుందా.. లేదా? అన్నది గందరగోళంగా మారింది. ఓవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెబుతూనే మరోవైపు టెట్ నిర్వహిస్తామని సమాధానమిస్తోంది. దీంతో టెట్ పరిస్థితేంటి? టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది. మంత్రిది ఓ మాట.. విద్యాశాఖది మరో మాట టెట్, టీఆర్టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ నియామకాలను పాత పద్ధతిలో ఒకే పరీక్ష ద్వారా చేపడతామని అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే టెట్ ఉండదా? లేదంటే టెట్ను కలుపుకొని టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు) నిర్వహిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్రంలో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు టెట్ వ్యాలిడిటీ విషయంలో ఎన్సీటీఈ తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తామని విద్యా శాఖ వెల్లడించింది. ఈ లెక్కన టెట్ ఉంటుందా.. ఉండదా? లేదంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. టెట్ లేదా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే.. రాష్ట్రంలో 2017లో టెట్ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టెట్ నిర్వహించలేదు. దీంతో గతంలో టెట్లో అర్హత సాధించినా, ఆ తర్వాత ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీని నిర్వహించే అంశంపై ఆలోచనలు చేస్తోంది. అది నిర్వహిస్తే పాత టెట్లలో అర్హత సాధించి ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగిన 3 లక్షల మంది విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలక అంశం. మరోవైపు పాత టెట్లలో అర్హత సాధించి ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన మరో 3 లక్షల మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ప్రధానమే. వ్యాలిడిటీ కోల్పోయిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుని విధానపర నిర్ణయం ప్రకటిస్తామని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏపీలో నిర్వహించినా.. ఆంధ్రప్రదేశ్లో టెట్ కమ్ టీఆర్టీ కలిపి నిర్వహించారు. అయితే ఆ నియామకాల్లో గతంలో టెట్లో అర్హత సాధించిన వారి స్కోర్ను పరిగణనలోకి తీసుకున్నారు. టెట్ కమ్ టీఆర్టీలో భాగంగా 50 మార్కులకు నిర్వహించిన టెట్కు సంబంధించిన పార్ట్–ఏలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని, లేదంటే పాత టెట్లో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టారు. ఇక గతంలో టెట్లో అర్హ్హత సాధించని వారి విషయంలో మాత్రం టెట్ కమ్ టీఆర్టీలోని పార్ట్–ఏలో అర్హత సాధిస్తే టీఆర్టీకి సంబంధించిన పేపరును మూల్యాంకనం చేసి నియాకమల్లో పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్లో అర్హత సాధించి ఉండాలని ఎన్సీటీఈ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే ప్రైవేటు టీచర్లకు టెట్ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో రెండూ కలిపి నిర్వహించిన సందర్భమూ లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో టెట్ను వేరుగానే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 17న జీవో 23ని జారీ చేసింది. సెంట్రల్ స్కూళ్లకు టెట్ తప్పనిసరి జాతీయ స్థాయిలో కేంద్రం ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) నిర్వహిస్తోంది. అందులో అర్హత సాధించిన వారిని మాత్రమే సీబీఎస్ఈ స్కూళ్లు, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇంతవరకు టెట్ను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించే ఆలోచన చేయలేదు. రెండింటినీ వేర్వేరుగానే చూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాల్సిందే. వివాదాల్లోకి వెళ్లొద్దు.. టెట్ నిర్వహించాలి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగంగా జరగాలంటే ప్రభుత్వం వివాదాల్లోకి వెళ్లొద్దు. వెంటనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజుల్లో టీఆర్టీ పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించే వీలున్నా వివాదాలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. 2017 వరకు నిర్వహించిన టెట్లలో అర్హత సాధించిన వారి విషయంలో వెయిటేజీ ఇవ్వడం, లేదా పాత, కొత్త టెట్లలో ఎందులో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదీ సమస్యాత్మకమే. మరోవైపు ప్రైవేటు టీచర్గా పని చేయాలన్నా టెట్లో అర్హత సాధించి ఉండాల్సిందే. కాబట్టి వారికోసం టెట్ను నిర్వహించక తప్పదు. ఇలాంటప్పుడు సులభ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంటే సమస్య ఉండదు. - పి.శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా విభాగం సామర్థ్యాలను నిర్ణయించేదెలా? రెండున్నర గంటల్లో టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహించి 30 ఏళ్ల పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడి సామర్థ్యాలను నిర్ణయించడం సాధ్యమా? టెట్ వేరు. టీఆర్టీ వేరు. ఉపాధ్యాయుడు కావాల్సిన అర్హతలు ఉన్నాయా? లేదా? నిర్ణయించేందుకు నిర్వహించేది టెట్. ఉపాధ్యాయులుగా నియమించేందుకు నిర్వహించేది టీఆర్టీ. అలాంటప్పుడు రెండింటినీ కలిపి ఎలా నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకొని, బిట్స్ బట్టీ పట్టి వచ్చే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు. అందుకే టెట్ వేరుగానే ఉండాలి. నియామక పరీక్షను కఠినతరం చేయాలి. డిస్క్రిప్టివ్ విధానం ఉండాలి. క్లాస్రూం డెమాన్స్ట్రేషన్, ఇంటర్వ్యూ పద్ధతిలో టీచర్లను నియమించాలి. అప్పుడే వారికి సామర్థ్యాలు ఉన్నాయా.. లేదా? తెలుస్తాయి. - ఉపేందర్రెడ్డి, ఎస్సీఈఆర్టీ రిటైర్డ్ ప్రొఫెసర్ చదవండి: ఆదమరిస్తే అంతే! -
టెట్, డీఎస్సీ, బదిలీలు, భర్తీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. రన్నింగ్ వాటర్తో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కుర్చీలు, బెంచీలు, ర్యాకులు, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు మరమ్మతులు, రంగులు ఇలా పలు రకాల సదుపాయాలు కల్పిస్తుండగా మొదటి దశ కింద 15 వేలకు పైగా స్కూళ్లలో పనులు మార్చి ఆఖరుకు పూర్తిచేయనున్నారు. ఇతర దశల పనులకు సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ‘టెట్’ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటించటానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్ రెండుసార్లు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. డీఎడ్ పూర్తిచేసిన కొత్త బ్యాచ్ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వారు డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతంలో రాసినవారితోపాటు ఏడేళ్ల కాలపరిమితి దాటిన వారు (గతంలో ఉత్తీర్ణులు) ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో టెట్కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు పైగా ఉండే అవకాశముంది. ఆంగ్ల నైపుణ్యాలకు పరీక్ష టెట్, డీఎస్సీ సిలబస్లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఇంగ్లీషులో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి టెట్లో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కింద అదనంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్లోనూ మార్పులు జరగనున్నాయి. మరోసారి బదిలీలకు అవకాశం! టెట్ –2021 నిర్వహించిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీలన్నిటినీ భర్తీ చేసేలా పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చే ముందు మరోసారి టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఇటీవల బదిలీల సందర్భంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీల్లోని పాఠశాలల్లో టీచర్ స్థానాలు ఖాళీ అయిపోకుండా విద్యాశాఖ దాదాపు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసి ఉంచింది. ఈ పోస్టులను ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న, సర్వీసులో ఉన్న టీచర్లతో సీనియార్టీని అనుసరించి భర్తీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా బదిలీలకు అవకాశం కల్పిస్తారు. ఈ బదిలీల ప్రక్రియ అనంతరం డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ప్రత్యేక కేటగిరీ పోస్టుల భర్తీ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం 2018లో నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీలో 403 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని మాత్రమే భర్తీ అయ్యాయి. వాటికి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2018 జనరల్ డీఎస్సీకి సంబంధించి పలు న్యాయవివాదాలు తలెత్తడంతో ఆ పోస్టుల భర్తీ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. వివాదాలను ఒక్కొక్కటే పరిష్కరిస్తూ దాదాపు అన్ని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
టెట్ ఇంకెప్పుడో..! అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష (టీఆర్టీ) రాయాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై అడుగులు ముందుకు పడట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసి నెల కావొస్తున్నా టెట్ నిర్వహణపై ఉన్నత స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు అవసరమైన కార్యాచరణ ఒక్కటీ మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాకముందే టెట్ నిర్వహించాలని అభ్యర్థులకు కోరుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను విద్యా శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఇప్పటివరకు వాటికి ఇంకా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ ఆమోదం వస్తే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం టెట్ నిర్వహించకుండా ముందుకు పోతే లక్షల మంది పోస్టుల భర్తీకి దూరం అయ్యే ప్రమాదం నెలకొంది. నెలన్నరలో వ్యాలిడిటీ ముగింపు.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు. 2011 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన ఆరు టెట్లలో మూడు టెట్ల (2011 ఒకసారి, 2012లో రెండుసార్లు) వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసిపోయి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ అర్హత కోల్పోయారు. ఇక 2014 మార్చి 16న నిర్వహించిన టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి 16వ తేదీతో ముగియనుంది. అందులోనూ మరో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతారు. మరోవైపు రాష్ట్రంలో 2015లో ఒకసారి టెట్ నిర్వహించగా, 2017లో చివరి టెట్ను నిర్వహించారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలోనూ మరో 1.5 లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు అసలు టెట్ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెలలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో వెంటనే టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ నిర్వహించకుండా టీఆర్టీ నోటిఫికేషన్ వస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు అవసరం.. రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు టీఆర్టీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు. మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్? టీఆర్టీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇప్పటివరకు ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికిప్పుడు 8 వేల పోస్టులు భర్తీ చేయొచ్చని పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించింది. అందులో 8 వేలకు పైగా పోస్టుల్లో పదోన్నతులు కల్పించొచ్చని పేర్కొంది. పదోన్నతులు చేపట్టాక టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే 15 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే వీలుంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి విద్యా శాఖకు ఇంకా ఆమోదం రాలేదు. ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపినా పదోన్నతులు ఇచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫిబ్రవరిలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ కుదరదు. ఇక మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా టెట్ నిర్వహిస్తే తాము టీఆర్టీకి సిద్ధం అయ్యేందుకు సమయం దొరుకుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
2021లో ఉద్యోగ జాతర
సాక్షి, అనంతపురం విద్య: 2021లో నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ జాతర చేయనుంది. ముచ్చటగా స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీ, రెగ్యులర్ డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ) అనంతరం రెగ్యులర్ డీఎస్సీ జారీ చేయనుంది. స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీల నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) అర్హత తప్పనిసరి. ఒక సారి టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది. గతంలో 20 శాతం టెట్కు, 80 శాతం వెయిటెజీ డీఎస్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా ఎన్సీటీఈ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయాలను అనుసరిస్తోంది. ఈక్రమంలో ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సిలబస్ను అధికారికంగా ప్రకటించనున్నారు. టెట్లో ఈ దఫా ఇంగ్లిష్కు అధికంగా వెయిటేజీ కల్పించనున్నారు. దీంతో నూతన సిలబస్ను రూపకల్పన చేశారు. ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డీఎస్సీ.. గత డీఎస్సీలో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులభర్తీకి లిమిటెడ్ డీఎస్సీ పేరుతో ఫిబ్రవరిలోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నా రు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కొన్ని కేటగిరీల్లో భర్తీకి నోచుకోని దివ్యాంగ, ఓసీ మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో పోస్టులను జిల్లాలో భర్తీ చేస్తున్నారు. లిమిటెడ్ డీఎస్సీకి సంబంధించి మోడల్ స్కూల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మోడల్ స్కూల్లో జోన్ వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో నాలుగో జోన్లో టీజీటీలో 4, పీజీటీలో 68 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు రెండు రోజుల్లో నిర్ధారించనున్నారు. మోడల్ స్కూళ్లలో మొత్తం 72 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ డీఎస్సీ.. దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు బోధించడానికి స్పెషల్ బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు స్పెషల్ డీఎస్సీ రాయడానికి అర్హులు. ఈ నేపథ్యంలో గతేడాది స్పెషల్ డీఎస్సీ నిర్వహించారు. ఇందులో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులు స్పెషల్ డీఎస్సీలో భర్తీ చేస్తారు. గతేడాది నిర్వహించిన స్పెషల్ డీఎస్సీలో 10 పోస్టులు భర్తీ కాలేదు. ఈ 10 పోస్టులకు స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. స్పెషల్ బీఈడీ/స్పెషల్ డీఈడీ చేసిన వారు మాత్రమే స్పెషల్ డీఎస్సీ రాయడానికి అర్హులు. -
టీఆర్టీ కంటే ముందే టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు. చదవండి: (ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!) లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
టెట్టా.. టెట్ కమ్ టీఆర్టీనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్ రిక్రూట్మెంట్తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. టెట్ను రిక్రూట్మెంటును కలిపేసి.. ఏటా రెండుసార్లు టెట్ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్టీఆర్టీని పెట్టారు. కాలపరిమితి ముగుస్తుండడంతో.. ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్లలో అర్హత సాధించలేని వారు టెట్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి తాము అర్హత సాధించి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్పోస్టుల ఎంపికకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి. టెట్ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్ను, 2012 జనవరిలో రెండో టెట్ను, అదే ఏడాది జూన్లో మూడో టెట్ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్లో పేపర్1లో 40,688 మంది, పేపర్2లో 115510 మంది అర్హత సాధించారు. -
టెట్ నిర్వహణకు చర్యలు చేపడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా టెట్ను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 2 టెట్ల వ్యాలిడిటీ ముగిసిపోయిందని, జూన్ గడిస్తే మరో టెట్ వ్యాలిడిటీ ముగిసిపోతుందని, ఇక టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లలు అనే వారే ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్, ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ లేకుండా చూడాలన్నారు. బడి మానేసే వారు ఎందుకు మానేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలుగా ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుంటుందన్నారు. గురుకులాల్లో సీట్లు లేకపోయినా అలాంటి వారిని చేర్చుకునేలా సీఎం కేసీఆర్తో చర్చించి ప్రత్యేక ప్రవేశాలకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రమాణాల పెంపునకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. మన విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. ఇతర దేశాలతో పోల్చినా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:17 ఉందన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు.. నాలుగేళ్లలో పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చామని, ఈసారీ పరీక్షలను పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశాల్లో విద్య కూడా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మంత్రులు, ఎంఎల్ఏల కాలేజీలను మూసేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తప్పవన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలని, అందుకు అవసరమైన మార్పులను సిలబస్లో తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెరిగాయన్నారు. ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలపై స్పందిస్తూ అవి కాలేజీల వారీగానే ప్రవేశాలు ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.ప్రైవేటు వర్సిటీల చట్టం తెచ్చామని, నిబంధనలను రూపొందించి ప్రైవేటు వర్సిటీలకు అనుమతిస్తామన్నారు. ఇంటర్మీడియట్ హాల్టికెట్లలో తప్పుల విషయంలో స్పందిస్తూ ఎవరైనా విద్యార్థులకు నష్టం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామన్నారు. డిగ్రీలు పూర్తయ్యాక కూడా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు. మీడియంపై లోతుగా పరిశీలన తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటుండగా, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న వాదనలు ఉన్నాయని, దీనిపై ఉన్నతస్థాయిలో మరింత లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి మరోసారి సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపడతామన్నారు. మహిళా యూనివర్సిటీ విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యకు బడ్జెట్లో ఎక్కువ నిధులే కేటాయించామని, అయితే అవి విద్యాశాఖ పేరుతో రానుందున అలా భావిస్తున్నారన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలకు మంచి నీటి కనెక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్కుమార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పరిశీలనలో టెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 2011లో నిర్వహించిన మొదటి టెట్ వ్యాలిడిటీ గతేడాదితో ముగిసిపోయింది. 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ కూడా గత నెలతోనే ముగిసిపోయిం ది. ఇక 2012 జూన్లో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ వచ్చే జూలై నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కనుక అనుమతిస్తే వార్షిక పరీక్షల తరువాత వచ్చే మే నెలలో టెట్ను నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడితే టెట్లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్లో అర్హత సాధించి ఉండాల్సిందే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 2011 టెట్, 2012 జనవరి, జూన్లలో నిర్వహించిన టెట్లకు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినందున తెలంగాణ విద్యార్థులు కనీసంగా 6 లక్షల వరకు ఉంటారు. వారిలో తమ టెట్ 7 ఏళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు కనీసంగా 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్కు వెయిటేజీ ఉంది. దీంతో తమ స్కోర్ను పెంచుకునేందుకు టెట్కు హాజరయ్యే వారు మరో 2 లక్షల మందికిపైగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం టెట్కోసం దాదాపు 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. -
స్పెషల్ డీఎస్సీ కోసం ఆందోళన
పాడేరు రూరల్: ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరుకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్కుమార్ డిమాండ్ చేశారు. టెట్ క్వాలీఫైడ్ డీఎడ్ అభ్యర్థులు బుధవారం పాడేరులో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడారు. బీఎడ్ చది విన వారికి కూడా ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పి స్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోట్ను వెనక్కి తీసుకోవాలని, స్పెషల్ డీఎస్సీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఇన్చార్జీ పీవో డీకే బాలాజీకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు కె.వై.కుమార్, కార్యదర్శి టి.విజయ్కుమార్, నాయకులు కె.కుస్టో, సోమేష్, డి.ధనురాష్, శ్యామ్యుల్, ఏజెన్సీ 11 మండలాల నుంచి డీఎడ్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
టెట్ను రద్దు చేస్తారా.. దూకేయమంటారా ?
ఒంగోలు: అక్రమాల టెట్ను రద్దు చేస్తారా..లేక ఓవర్హెడ్ ట్యాంక్పై నుంచి కిందకు దూకేయమంటారా..అంటూ దాదాపు 100 మంది పీఈటీ టెట్ అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో స్థానిక అద్దంకి బస్టాండ్లోని ఓవర్హెడ్ ట్యాంక్పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో ఒన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని దిగిరావాలంటూ సూచించారు. టీడీపీ నాయకురాలితో వాగ్వాదం ఓవర్హెడ్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేయడం సరికాదని, సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు అందరు దిగి రావాలంటూ సీఐ సురేష్కుమార్రెడ్డి సూచించారు. ఈ సందర్భంలో అభ్యర్థులు ససేమిరా అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకురాలు ఒకరు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడుదాం రండి.. అంటూ సూచించారు. ఈ క్రమంలో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. తమ ఓట్ల కోసం ఇళ్లకు వస్తారు.. ఇంతమందిమి ఆందోళన చేస్తుంటే వచ్చి తమ సమస్యను వినేందుకు ఓపిక లేదా.. ఎమ్మెల్యే అయినా.. ఎమ్మెల్సీ అయినా.. మంత్రి అయినా ఇక్కడకే రావాలంటూ పట్టుబట్టారు. జిల్లాలో 1200 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. నిజంగా తమ సమస్య పరిష్కారం కోరుకునే వారే అయితే తమకు సంఘీభావంగా తమతో పాటు బైఠాయించి ప్రజానాయకులను రప్పించి హామీ ఇప్పించాలని పట్టుబట్టారు. ముందస్తు జాగ్రత్తలో పోలీసులు ఒక వైపు మహిళా నాయకురాలితో అభ్యర్థులు మాట్లాడుతుండగానే పోలీసులు ఓవర్హెడ్ ట్యాంక్పైకి చేరుకున్నారు. అభ్యర్థులకు నచ్చజెప్పి కిందకు దింపేందుకు యత్నించారు. అభ్యర్థులు మెట్ల మీదనే బైఠాయించి దిగకపోవడంతో పోలీసులు కూడా చేసేది లేక దిగువవున ఉన్న వారితో చర్చలు మొదలు పెట్టారు. అభ్యర్థులు మీడియా ఎదుట తమ సమస్యను ఏకరువు పెట్టారు. ఎస్సీఈఆర్టీ ప్రకారం పీఈటీ అభ్యర్థులకు టెట్ ఉండదన్నారు. కేంద్రం స్థాయిలో సైతం కేవలం సిటెట్ మాత్రమే ఉంటుందని, ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే మరోమారు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నూతనంగా టెట్ అనే పరీక్ష తీసుకొచ్చి దానికి వెయిటేజీ నిర్ణయించి నిరుద్యోగులను దగా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని, దానికి వెయిటేజీ కేటాయించడంలోనే అక్రమాలకు మార్గం సుగమం అయిందన్నారు. వెయిటేజీ కోసం టెట్ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ నిరుద్యోగి రూ.500 పరీక్ష ఫీజు, అప్లోడింగ్ కోసం కంప్యూటర్ సెంటర్లలో వంద రూపాయలతో పాటు కోచింగ్ కోసం కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి రావడం, మరో వైపు ఉపాధి కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు ఈ నెల 19న జరగాల్సిన పీఈటీ టెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు మీడియాలో రావడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రధానంగా ఒక పీఈటీ రింగ్ లీడర్గా వ్యవహరించి ఎవరైతే అక్రమంగా పరీక్షలో పూర్తిస్థాయి మార్కులు రావాలని భావించారో వారికి తమిళనాడులో ఒకే సెంటర్ వచ్చేలా చేశారని, తద్వారా తాము ఎంత బాగా రాసినా లీకైన పేపర్ ద్వారా వారు పూర్తి మార్కులు సాధించి డీఎస్సీలో ఉద్యోగాలన్నీ కైవసం చేసుకోవడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, బెంగళూరు, తెలంగాణలోని సెంటర్లకు దరఖాస్తు చేసుకున్న ఏపీ పీఈటీ అభ్యర్థులకు ఏపీలోని సెంటర్లనే కేటాయించాలని, గతంలో కేటాయించిన ప్రశ్నపత్రాన్ని మార్చి వేసి నూతన ప్రశ్నపత్రాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. టెట్కు వెయిటేజీని రద్దు చేయాలన్నారు. టెట్ నోటిఫికేషన్, టెట్ పరీక్షకు మధ్య సమయం కూడా పెంచాలంటూ నినాదాలు చేశారు. ఎట్టకేలకు ఆందోళన విరమణ సీఐ సురేష్కుమార్రెడ్డి జరిపిన చర్చలు చివరకు ఫలించాయి. తొలుత జేసీతో మాట్లాడించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తీరా ఆమె కూడా అందుబాటులో లేరని తెలియడంతో మరోసారి అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు పోలీసులు కూడా గ్రీవెన్స్లో కలెక్టర్తో మాట్లాడించేందుకు అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఓవర్ హెడ్ ట్యాంక్పై నుంచి దిగి వచ్చారు. -
టెట్ రాసి వస్తూ..
కోట: టెట్ రాసి వస్తూ.. అనుమానాస్పదస్థితిలో ఓ యువతి మృతి చెందగా, ఆమెకు తోడుగా వెళ్లిన అత్త తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మండలంలోని చిట్టేడు వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, యువతి బంధువుల సమాచారం మేరకు.. చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామానికి చెందిన బొమ్మిళ్ల పెద్దసుబ్బయ్య,లక్ష్మమ్మ కుమార్తె నాగరాజమ్మ (25) ఎంఏ, బీఈడీ చేసి ఉద్యోగ వేటలో ఉంది. గురువారం కావలి సర్వోదయ కళాశాలలో టెట్ రాసేందుకు ఆమె అత్త సుబ్బమ్మను తోడుతీసుకుని వెళ్లింది. మధ్యాహ్నం పరీక్ష రాసిన అనంతరం నెల్లూరులో వాకాడు డిపో ఎక్స్ప్రెస్ సర్వీసు ఎక్కారు. చిట్టేడు వరకు బస్సు టికెట్ తీసుకున్నారు. చిట్టేడులో బస్సు దిగి అన్నంబాకకు వెళ్లాల్సి ఉంది. అయితే చిట్టేడు స్టాపింగ్ వద్ద బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. ఆలస్యంగా గుర్తించిన కండక్టర్ వారిని చంద్రశేఖరపురం వద్ద దించి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే రాత్రి 10 గంటలు అయింది. దీంతో నాగరాజమ్మ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి చిట్టేడు వద్దకు వచ్చి తమను తీసుకెళ్లాలని చెప్పింది. అయితే 10.30 గంటల సమయంలో చిట్టేడు ప్రధాన రహదారిపై మహిళ అరుపులు వినపడడంతో స్థానికులు గుమికూడారు. రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజమ్మను గుర్తించారు. ఆమె కు కొద్ది దూరంలోనే ఆమె అత్త సుబ్బమ్మ పడి ఉంది. వారిని వెంటనే ప్రైవేట్ వాహనంలో నెల్లూరుకు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజమ్మ మృతి చెందగా ఆమె అత్త సుబ్బమ్మ అపస్మారకస్థితిలో ఉంది. ఘటనపై పలు అనుమానాలు చిట్టేడు దాటి రెండు కిలో మీటర్లు వచ్చేసిన వీరు చంద్రశేఖరపురం వద్ద దిగారు. వెనక్కి వెళ్లేందుకు రోడ్డుపై వెళ్లే వ్యాన్ వంటి వాహనం ఆపి అందులో ఎక్కినట్లు తెలుస్తోంది. చిట్టేడు వద్ద వాహనంలో నుంచి ఆ ఇద్దరిని గెంటి వేసినట్లు ప్రమాదం తీ రును బట్టి తెలుస్తోంది. కింద పడటంతో నాగరాజమ్మ తలకు తీవ్రగాయమైంది. ఆగకుండా వెళ్తున్న వాహనంలో నుంచి ఇద్దరు కింద పడడాన్ని చూశామని చిట్టేడు గ్రామస్తులు చెబుతున్నా రు. వాహనంలో ఏం జరిగింది.. వారిని ఎందుకు నెట్టేశారు అనేది అంతుపట్టడం లేదు. ప్రమాదంలో గాయపడిన సుబ్బమ్మ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆమె నోరు విప్పితే ప్రమాదం జరిగిన తీరుపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. చిట్టేడు నుంచి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన సంబంధీకులు రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని చూసి స్థానికుల సాయంతో నెల్లూరుకు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాగరాజమ్మ మృతి చెందినట్లు ఆమె బాబాయ్ నాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. నాగరాజమ్మ మృతితో అన్నంబాకలో విషాదఛాయలు అలముకున్నాయి. -
‘టెట్’ ఇదేం పని!
పాడేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీఎస్సీ అర్హత కోసం ముందుగా నిర్వహించే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 3 వేల మంది అభ్యర్థులు పేపర్–1(ఎస్జీటీ), పేపర్–2(స్కూల్ అసిస్టెంట్), పేపర్–3 (లాంగ్వేజ్ పండిట్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తు చేసుకున్న సమయంలో గతంలో మాదిరిగా పరీక్షకు హాజరయ్యే జిల్లా పేరును ఎంచుకోవాలని ప్రస్తావించలేదు. పరీక్ష కేంద్రం జిల్లా కోసం తర్వాత ఆప్షనల్ ఎంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయం ముందుగా ప్రకటించకపోవడం తో అభ్యర్థులు పెద్దగా పట్టించుకోలేదు. దరఖాస్తు గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 29 వరకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సెల్ఫోన్లకు మెసెజ్లు పంపించింది. సెల్ సిగ్నల్ అందుబాటులో ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి పరీక్ష కేంద్రాలను ఎంచుకున్నారు. కానీ ఏజెన్సీలో సమాచార వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో మారుమూల గ్రామాల్లో అభ్యర్థులకు ఈ విషయం తెలియలేదు. చివరి రోజు కొంతమంది ఆన్లైన్ సెంటర్లకు వచ్చి సెంటర్లకు ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించగా విశాఖ జిల్లాల్లో పరీక్ష సెంటర్లు ఖాళీగా లేవని కర్ణాటక, చెన్నై, హైదరబాద్ వంటి ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నాయి.దీంతో అభ్యర్థులు షాక్ తిన్నారు. దూరం కారణంగా చాలా మంది అభ్యర్థులు ఆ సెంటర్లను ఎంపిక చేసుకోలేదు. ఈ విషయాన్ని పలువురు అభ్యర్థులు పాడేరు ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసి విశాఖ జిల్లాలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ అన్నారు. టెట్కు దరఖాస్తు చేసుకున్న కొందరు గిరిజన అభ్యర్థులు మంగళవారం ఆయనను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. -
ముగిసిన టెట్ దరఖాస్తు గడువు
అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మొత్తం 3,97,957 దరఖాస్తులు వచ్చాయని, ఈ గురువారంతో టెట్ దరఖాస్తు సమర్పణ గడువు ముగిసిందని ఏపీ ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ..పేపర్1కు 1,69.085 మంది, పేపర్ 2ఏ(సోషల్)కు 66,063, పేపర్2ఏ(మ్యాథ్స్,సైన్స్)కు 76,180 మంది, పేపర్ 2ఏ(ఇంగ్లీషు)కు 11,015 మంది, పేపర్ 2ఏ లాంగ్వేజ్ టీచరల్కు 59,469 మంది, పేపర్ 2బీకు 16,145 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చామని తెలిపారు. 4 పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించి అభ్యర్థుల మొబైళ్లకు సంక్షిప్త సందేశాలు పంపామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి29 వరకు ఆన్లైన్లో తమకు నచ్చిన జిల్లా కేంద్రాన్ని అభ్యర్థులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సదరు జిల్లాల్లో అభ్యర్థులు పరిమితికి మించితే తదుపరి జిల్లా కేంద్రం ఎంపిక చేసుకునే వీలు కల్పించినట్లు చెప్పారు.ఇంప్రూవ్ మెంట్ కోసం ఇంతకుముందు టెట్ ఉత్తీర్ణులైన వారు అత్యధికంగా తిరిగి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో మాక్టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా వివరించారు. -
అయోమయం..ఆందోళన
కడప, బద్వేలు : డిప్లొమో ఇన్ ఎడుకేష్యన్ (డీఎడ్) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఏడాది విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2016–17 ఏడాదిలో మొదటి సంవత్సరం అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది వారికి నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలు చేపట్టలేదు. ప్రస్తుతం వారంతా రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇవి ముగిసిన మరో మూడు నెలల్లోనే రెండవ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల అనంతరం టెట్కు చదవాలా.. రెండవ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధం కావాలా.. అనే సందేహంలో విద్యార్థులు ఉన్నారు డీఎడ్ ప్రవేశాలు 2016–17 విద్యా సంవత్సరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా జూన్ నెలలో జరగాల్సిన అడ్మిషన్లు నవంబరులో జరగడంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో వారికి వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా చదవి పరీక్షలు రాయడం వల్ల ఫలితాల్లో ప్రభావం పడుతుందని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 78 డీఎడ్ కళాశాలలుండగా, వీటిలో 6,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల్లో ఆందోళన.. 2017–18 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు తమకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో అని ఎదురు చూస్తున్నారు. తమ కంటే ముందు చేరిన విద్యార్థులే ప్రస్తుతం మొదటి ఏడాది పరీక్షలు రాస్తున్నారని, తమకు ఎప్పుడు నిర్వహిస్తారో అని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా వీరిలానే ఒకే ఏడాది రెండు పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొంది. రెండవ సంవత్సరం తరగతులు జరుగుతుండగా.. తాము చదివి వదిలేసిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి రావడంతో సన్నద్ధానికి సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉందని వాపోతున్నారు. మండే ఎండలోనే సన్నద్ధం.. సరైన ప్రణాళిక లేకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటిం చడం.. వాటిని కూడా వేసవిలో నిర్వహించడం వి ద్యార్థులకు ఇబ్బందిగా మారింది. మండుటెండల్లో ç పరీక్షలు రాయడం ఫలితాలపై ప్రతికూల ప్రభా వం చూపుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ ఎలా..! ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గతంలో టెట్ అవకాశం కల్పించారు. ప్రస్తుతమూ కల్పించాలని వారంతా కోరుతున్నారు. అవకాశం కల్పిస్తే టెట్కు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఆయోమయంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభించి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావని వారు పేర్కొంటున్నారు. -
ఇక డీఎస్సీ హడావుడి
జిల్లాలో ఖాళీల వివరాలుజిల్లాలో 2020 వరకు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయుల ఖాళీలను ప్రభుత్వం సేకరించింది. గత డీఎస్సీలో జిల్లావ్యాప్తంగా మూడు వందల లో పు పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ 104 పో స్టులు, ఎస్జీటీ 206, భాషోపాధ్యాయులు 40, పీఈటీలు 6 ఖాళీలు ఉన్నా యి. ప్రస్తుతం చేపట్టనున్న డీఎస్సీలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కడప ఎడ్యుకేషన్ :రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేయుటకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు జులై 6న ప్రకటన విడుదల కానుంది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో హడావుడి నెలకొంది. ఎలాగైన ఉపాధ్యాయ పోస్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి విద్యావ్యవస్థను పరిపుష్టి చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే పాఠశాలల్లో సమగ్ర కనీస వసతుల కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,300 కోట్లు కేటాయించనున్నారు. అలాగే విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లాకు ఇరువురు డీఈఓలను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఒకరు ప్రాథమిక, మరొకరు ఉన్నత విద్య బాధ్యతలను చూడనున్నారు. అలాగే టెట్, డీఎస్సీ ప్రకటనలకు సంబంధించి షెడ్యూల్ను కూడా ప్రకటించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. టెట్ పరీక్షల షెడ్యూల్ టెట్ ప్రకటనను మే 4న ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫీజును మే 5నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చు. దరఖాస్తులను మే 5 నుంచి 23వ తేదీ వరకూ సమర్పించవచ్చు. నమూనా పరీక్షల (మాక్ టెస్టు) ఏప్రిల్ 25న ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను జూన్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ 10, 11,12 తేదీల్లో పేపర్ 1, పేపర్–2ఏ పరీక్ష 13,15,17,19 తేదీల్లో, పేపర్ 2బీ పరీక్ష 21న ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ ప్రాథమిక కీ జూన్ 22న, తుది కీ 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. డీఎస్సీకి సంబంధించి డీఎస్సీకి సంబంధించి జూలై 6 ప్రకటన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబం ధించి జూలై 6 నుంచి ఆగష్టు 8 వరకు ఫీ జు చెల్లించవచ్చు. దరఖాస్తులను జూలై 7 నుం చి ఆగష్టు 9 వరకు సమర్పించవచ్చు. నమూనా పరీక్ష (మాక్ టెస్ట్) ఆగష్టు 1వ తేదీ నుం చి ఆన్లైన్లులో అందుబాటులో ఉండనుంది. సంబంధిత పరీక్షకు కావల్సిన హాల్టికెట్లను ఆగష్టు 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. టీఆర్టీ పరీక్షను ఆగష్టు 23 నుంచి 30 వరకు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత పరీక్షలను కూడా రెండు పూటల నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీ ఆగష్టు 31న విడుదల కానుంది. తుది కీ సెప్టెంబర్ 10న విడుదల చేసి, 15వ తేదీ ఫలితాలను ప్రకటించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సిలబస్ను ప్రకటించాలి డీఎస్సీ ప్రకటన విడుదలపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిలబస్ను కూడా ప్రకటిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతోపాటు గతంలో పాఠశాల విద్యాశాఖ వారే పరీక్షను నిర్వహించేవారు. దీంతో సిలబస్పై అభ్యర్థులకు కొంత అవగాహన ఉండేది. అలాంటిది ఈ సారి డీఎస్సీని ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. వీరు నిర్వహించే పరీక్షకు సిలబస్ ఏ విధంగా ఉంటుందోనని అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అలాగే సిలబస్ రూపకల్పనలో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యతనిస్తూ నూతన సాంకేతిక సమాచార అంశాలను పొందుపరచాలని అభ్యర్థులు సూచిస్తున్నారు. డీఎడ్ అభ్యర్థులకు మే 17 నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి గడువు చాలా తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస త్వరగా ప్రకటిస్తే మంచిదని సూచిస్తున్నారు. -
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ప్రకటన చేశారు. మే 4న టెట్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసకమిషన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు. ఆరు కేటగిరీల్లో(ఎస్జీటీ, ఎస్ఏ, పీఈటీ, ఎల్పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెట్, డీఎస్సీల సిలబస్ను వారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ : 6-7-2018 దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ హాల్ టికెట్స్ : 15-08-2018 పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు ) ప్రాథమిక కీ : 31-08-2018 అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ ఫైనల్ కీ :10-09-2018 తుది ఫలితాలు : 15-09-2018 ఖాళీల వివరాలు ఎస్జీటీ - 4,967 ఎస్ఏ - 2978 లాంగ్వేజ్ పండిట్స్ - 312 పీఈటీ - 1056 మ్యూజిక్, డాన్స్ - 109 మోడల్ స్కూల్స్ - 929 -
ఏపీలో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..!
సాక్షి, విజయవాడ: ఈ నెల 29న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం విజయవాడలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డీఎస్సీ ఇప్పట్లో లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. డీఎస్సీ కంటే ముందు మరో టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జూన్ 18న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామన్నారు. మంత్రి తాజా ప్రకటనతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారికి ఈ ఏడాది కూడా నిరాశ మిగిలింది. -
త్వరలో టెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ జారీపై విద్యా శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాది విద్యా శాఖ జూలై 23న టెట్ నిర్వహించింది. అయితే ఈసారి అంతకుముందే టెట్ నిర్వహించాలని భావిస్తోంది. అంతేకాదు ఈసారి ఆన్లైన్లో టెట్ను నిర్వహించే యోచన కూడా చేస్తోంది. అయితే అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ఆన్లైన్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది టెట్లో పేపర్–1 పరీక్ష రాసేందుకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 98,848 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 56,708 మంది (57 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్–2 పరీక్ష రాసేందుకు 2,56,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో కేవలం 45,055 మంది (19.51 శాతం) అర్హత సాధించారు. అంటే రెండు పేపర్లలో కలిపి దరఖాస్తు చేసిన వారిలో ఇంకా 2.5 లక్షల కంటే ఎక్కువ మంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ఫైనలియర్ చదువుతున్న మరో 25 వేల మంది అభ్యర్థులు టెట్ రాయనున్నారు. -
తప్పులు... తిప్పలు...
విజయనగరం అర్బన్:ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహిస్తున్న పరీక్ష(టెట్)లో మొదటినుంచీ గందరగోళం చోటు చేసుకుంటోంది. నిర్వాహకుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికే ప్రకటించిన మార్కులు తారుమారయిన విషయంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు వాటి సవరణ ప్రక్రియలోనూ తిప్పలు తప్పడం లేదు. జవాబులు, మార్కులు చూసుకొని తప్పులుంటే అభ్యర్థులు సవరణకు విన్నవించుకోవడానికి వీలుగా టెట్ నిర్వాహకులు వెబ్ సైట్ను రూపొందించి ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు ఫిర్యాదు ఇచ్పుకోవాలని షెడ్యూల్ ప్రకటించారు. ప్రకటించి నాలుగు రోజులవుతున్నా సంబంధిత వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టెట్ హెల్ప్లైన్(ఫోన్ నంబర్: 9121148061) కేంద్రం నుంచి సందేహాలను తీర్చడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్కి సంబంధించిన పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరై తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు. పనిచేయని వెబ్సైట్... నెల్లిమర్లకు చెందిన పేపర్–3 హిందీ సబ్జెక్ట్ అభ్యర్ధి పి.సునీత ప్రాధమిక ‘కీ’ అభ్యంతరాలపై విడుదల చేసిన ‘కీ’ అనుసరించి 100 మార్కులకు పైగా రావాల్సి ఉన్నా ఆమె క్వాలిఫై కానట్టు తేల్చారు. దీనిపై ఆమె టెట్కు సంబంధించిన వెబ్సైట్లో ఫిర్యాదు చేయగా వారు పంపించిన మార్కులుగాని, జవాబు పత్రంగానీ తనకు సంబంధించినది కాకుండా వేరేది ఇచ్చారు. ఈ సమస్యను తిరిగి చెప్పుకోవడానికి నిర్వాహక వ్యవస్థ అందుబాటులో లేదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నవారు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయంలో టెట్ నిర్వాహక హెల్ప్లైన్ సెంటర్కు తెలియజేసినప్పటికీ వారి నుంచి స్పందన లభించలేదని వాపోతున్నారు. రెండురోజులుగా ప్రయత్నిస్తే ఎట్టకేలకు కొందరికి అదృష్ట వశాత్తూ ఫోన్ పలికినా అటునుంచి అసహన సమాధానం వచ్చిందని చెబుతున్నారు. ఫిర్యాదుల సవరణకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో సమస్య ఎలా పరిష్కారం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు దిద్దలేనపుడు టెట్ మరలా జరపాలి పేపర్–3 హిందీ సబ్జెక్ట్ టెట్ రాశాను. ప్రాధమిక ‘కీ’కి వెబ్సైట్లో పెట్టిన నా జవాబు పత్రానికి సంబంధం లేదు. ఈ తప్పిదాన్ని సవరించాలని కోరుతూ నిబంధనల మేరకు రూ.200లు ఆన్లైన్లో రుసుం చెల్లించాను. ఈ నెల 31లోపు గడువుగా ప్రకటించారు. ఇంత వరకు సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కావడంలేదు. హెల్ప్లైన్ సెంటర్లో టెట్ నిర్వాహకుల సమాధానాలు నిర్లక్ష్యంగా వస్తున్నాయి. అభ్యర్థుల సందేహాలు తీర్చలేకపోతే టెట్ని మరలా జరిపి న్యాయం చేయాలి. – పి.సునీత, టెట్ అభ్యర్థిని, నెల్లిమర్ల -
టెట్ పాసైన గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఒంగోలు సెంట్రల్: గత ఏడేళ్లలో టెట్లో అర్హత సాధించి 2018 డీఎస్సీ పరీక్ష రాయబోయే గిరిజన యువతీ, యువతకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్చార్జి అధికారి బి.శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, వెంకటాచలం మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో 2 నెలల పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26న నెల్లూరు ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రంతో అభ్యర్థులు రావాలని సూచించారు. ఇతర వివరాలకు 81878 99877 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. -
‘టెట్’ ర్యాంకుల్లో గందరగోళం!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష ర్యాంకుల్లో గందరగోళం నెలకొంది. పేపర్–1, పేపర్–2, పేపర్–3 పరీక్షల్లో మీడియంల వారీగా అత్యధిక మార్కులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పేపర్–3 ఇంగ్లిష్లో రాష్ట్ర వ్యాప్తంగా 122 మార్కులే టాప్గా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని మంగళవారం పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. కాగా అనంతపురం నగరంలోని తేజ కోచింగ్ సెంటర్ విద్యార్థి అంకే వెంకటేష్ పేపర్–3 ఇంగ్లిష్లో 125 మార్కులు సాధించాడు. ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలో 122 మార్కులే అధికమని ప్రకటించిందని, తాను 125 మార్కులు సాధించానని వెంకటేష్ పేర్కొన్నారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ ప్రతి అంశంలోనూ గందరగోళమేనని అభ్యర్థులు వాపోయారు. చివరకు ఫలితాలు వచ్చిన తర్వాత మార్కుల ప్రకటించడంలోనూ అదే గందరగోళం నెలకొందని అభ్యర్థులు మండిపడుతున్నారు. -
టెట్లో జిల్లా సూపర్హిట్
శృంగవరపుకోట రూరల్ : ధర్మవరం మేజరు పంచాయతీకి చెందిన వేమన కుసుమ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 150/139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జిటి) టెట్ ఫలితాల్లో పేపర్ 1లో 139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. డైట్ పోటీ పరీక్షల్లో కూడా ఈమె జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా శిక్షణ పొందింది. తండ్రి అప్పలరాజు ధర్మవరంలో టైలర్గా పనిచేస్తుండగా తల్లి సన్నమ్మడు గృహిణి. ఈ సందర్భంగా అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ తనకు ముగ్గురు కుమార్తెలున్నారని,, రెండో కుమార్తె కుసుమ చిన్నప్పటి నుంచి చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తూ అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానాలు సాధించిందని తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్థానికులు అభినందించారు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షకు అర్హత కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)లో జిల్లా అభ్యర్థులు భారీ సంఖ్యలో అర్హత సాధించారు. పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరయ్యారు. తాజాగా అందిన సమాచారం మేరకు 80 శాతం అర్హత సాధించి ఉంటారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వివిధ శిక్షణ కేంద్రాల అభ్యర్థులు అధికసంఖ్యలో అర్హత సాధించారు. తాజాగా అందిన సమాచారం మేరకు పేపర్–1 కి సంబంధించి అధిక మార్కులు సాధించిన వారి వివరాలివి. వినెక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అల్లాడ లావణ్య (137), రొబ్బి జ్యోతి (132), మెయిద కృష్ణవేణి (130), బాలి కుమారి (130) ఉన్నారని ఆ సంస్థ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తమ విద్యార్థులు అయ్యప్ప (135), హేమ (133), పిళ్లా జగదీశ్వరి (133), బి.బిందుకుమారి (131), ఎస్.విజయ (131), టి.రోజారమణి (130) ఉన్నారని శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ శ్రీనివాసరావు తెలిపారు. అధిక మార్కులు సాధించిన అభ్యర్ధుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. శ్రీసాహితీ కోచింగ్ సెంటర్, తెలుగు స్టడీ సర్కిల్లకు చెందిన అభ్యర్థుల్లో వాడపల్లి నాగమణి (132), శెట్టి తేజస్వరి (129), లోపింటి రవికుమార్ (129), జి.చిరంజీవి (119) ఉన్నారని ఆ కోచింగ్ సెంటర్ రైరెక్టర్లు రెడ్డిపల్లి రమేష్కుమార్, సారిపల్లి గౌరీశంకర్ తెలిపారు. పరీక్షకు హాజరయిన 1200 మందిలో శతశాతం అర్హులయ్యారని తెలిపారు. -
అటెండర్ కుమార్తె స్టేట్ ఫస్ట్
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో ఓ అటెండర్ కుమార్తె రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు. టెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కర్నూలు నగరంలోని పూలబజార్కు చెందిన సి.పద్మాజీరావు, హేమ దంపతుల కుమార్తె సి.భారతి పేపర్–1లో 150 మార్కులకు 141 సాధించారు. తద్వారా మొదటిర్యాంకు కైవసం చేసుకున్నారు. పద్మాజీరావు చేనేత, జౌళి శాఖలో అటెండర్గా పనిచేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె సి.భారతి 2014–16 విద్యా సంవత్సరంలో డీఎడ్ పూర్తి చేశారు. టెట్ పరీక్షకు మొదటిసారి హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాన్ని రాబట్టారు. ఈమె ప్రాథమిక, సెకండరీ విద్య అంతా కర్నూలులోని కింగ్ మార్కెట్ దగ్గర ఉన్న ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ హజీరా కాలేజీలో పూర్తి చేశారు. పద్మాజీరావు తనలా పిల్లలు ఉండకూడదని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూస్తున్న భారతి చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్నారు. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. టెట్ కోచింగ్ను స్థానిక నంద్యాల చెక్పోస్టు సమీపంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్లో తీసుకున్నారు. ఆరు నెలల పాటు రోజుకు పది గంటల పాటు ప్రిపేర్ అయ్యారు. టెట్ ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు.. పేపర్–1లో జిల్లా అభ్యర్థులు సి.అష్మా (136 మార్కులు), సన శైలజ (133), బోయ శివ (133), కంబహం రోహిణి (132), కురువ హరిప్రసాద్ (132) అత్యుత్తమ మార్కులు సాధించారు. విశ్వవాణి విజయభేరి టెట్ ఫలితాల్లో విశ్వవాణి కోచింగ్ సెంటర్ అభ్యర్థులు విజయభేరి మోగించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్కే మద్దిలేటి తెలిపారు. టెట్–3లో ఆర్.ప్రసన్న లక్ష్మి (118 మార్కులు), పి.వెంకటేశ్వరి (118), మైమున్సీ (116), రామకృష్ణ (115), గోపీనాథ్ (118), సుజాత (116), ప్రసాదరావు (115)తో పాటు మరో పది మంది రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించారని ఆయన వెల్లడించారు. టీచర్స్ అకాడమీ... టీచర్స్ అకాడమీలో టెట్ శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 90 శాతం అర్హత సాధించారని ఆ సంస్థ డైరెక్టర్ పి.శ్రీరామ్ తెలియజేశారు. 400 మందికి పైగా 125 మార్కులు సాధించారన్నారు. ఎంతో అనుభవం ఉన్న అవనిగడ్డ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం వల్లే సంస్థ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. విజేత కోచింగ్ సెంటర్... స్థానిక విజేత స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో టెట్ శిక్షణ తీసుకున్న వారిలో పేపర్–1లో 130 నుంచి 140 మార్కుల మధ్య 8 మంది, 100 నుంచి 130 మార్కుల మధ్య వంద మందికి పైగా సాధించినట్లు ఆ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఎం.వి.రమణ, అకడమిక్ డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 92 శాతం మంది అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. -
టెట్ 'కీ'పై 16 వేల అభ్యంతరాలు
సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ప్రాథమిక కీపై 16వేల అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. తుది కీ విడుదలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా, ఈ నెల 16న ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
విధి పరీక్షలో ఓడి..
స్వప్నం చెదిరిపోయింది.. ఆశలు ఆవిరయ్యాయి..రోజులు బాగుపడతాయన్న నమ్మకం వమ్ము అయింది..ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయన్న వారి ఎదురుచూపులు నిరర్థకమయ్యాయి..పేదరికాన్ని ఎదిరించి జీవనపోరాటం చేస్తున్న ఆ కుటుంబం చివరకు విధి పరీక్షలో చిక్కుకుని విషాదసాగరంలో మునిగిపోయింది. టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసేందుకు వెళ్తున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు పొట్టన పెట్టుకుంది. అతడి కుటుంబాన్ని వీధిపాలుజేసింది. సబ్బవరం(పెందుర్తి): జిల్లాలోని మాకవరపాలెం మండలంలోని పైడిపాల గ్రామానికి చెందిన ముంజేటి పోతురాజు(34), అదే మండలంలోని చినరాజుపల్లికి చెం దిన దుంగల నాగరాజు(34) స్నేహితులు. వీరిద్ద రూ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసి బతుకు తెరువు కోసం మాకవరంలోని అన్రాక్ అల్యూమినియం కంపెనీలో పనిచేస్తున్నారు. చినముషిడివాడలోని ఆయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసేందుకు కోటి ఆశలతో వీరిద్దరూ మంగళవారం ఉదయం బైక్పై బయలుదేరారు. సబ్బవరం మండలం ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బొర్రమ్మగెడ్డ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో పెందుర్తి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న వ్యాన్ వీరి వాహ నాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై వెనుక కూర్చున్న పోతురాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం నడుపుతున్న దుంగల నాగరాజు స్వల్పగాయాలతో బయటపడ్డా డు. ఎస్ఐ ఎన్.ప్రభారరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోతురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పైడిపాలలో విషాదం మాకవరపాలెం: టెట్ రాసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముంజేటి పోతురాజు(34)స్వగ్రామమైన పైడిపాలలో విషాదఛాయలు అలముకున్నాయి. పోతురాజు మరణవార్త వినగానే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బీఈ డీ పూర్తి చేసిన పోతురాజు అన్రాక్లో ప్రోసెస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇతనికి మే14, 2015లో వివాహం జరిగింది. పోతురాజుకు భార్య సుధామాధురి, ఏడాదిన్నర పాపతో పాటు తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. భార్య, తల్లి ఇతనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తల్లి రెక్కల కష్టంతోనే చదువు.. 18 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందడంతో ఏ ఆధారం లేని తల్లి మంగమ్మ కూలి పనులు చేస్తూ పోతురాజును చదివించింది. చిన్నపాటి ఉద్యోగం చేస్తున్న ఇతడి కష్టంతోనే కుటుంబ పోషణ జరుగుతోంది. ఇంతలో రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు వు పోతురాజును కబళించడంతో ఈ కుటుంబానికి దిక్కుతో చని పరిస్థితి ఏర్పడింది. వివాహమైన రెండేళ్లకే భర్తను కోల్పోయిన భార్య, ఏడాదిన్నరకే తండ్రి ఆలనకు దూరమైన ఆ చిన్నారిని చూసిన వారంతా కంటతడి పెట్టారు. మృతుడి నివాసం వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
అర్హత పరీక్ష!
ఈమె పేరు కళావతి. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామానికి చెందిన టెట్ అభ్యర్థినికి పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని కేటాయించారు. ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకుంది. గురువారం రోజునే ఎంటెక్ విద్యార్థులకు పరీక్ష ఉండటంతో విద్యార్థులు కళాశాలఆవరణలోనే నిరీక్షిస్తున్నారు. వారంతా టెట్కే వచ్చారని భ్రమించిన కళావతి 9.45గంటలు దాటినా అక్కడే ఉండిపోయింది. చివరకు అనుమానంతో విచారించగాఅసలు విషయం తెలుసుకొనిపరీక్ష హాలులోకి వెళ్లగా అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు ససేమిరాఅన్నారు. ‘సార్.. కాళ్లుపట్టుకుంటా అనుమతించండి’అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రెండవ రోజు గురువారం కూడా అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. జిల్లా కేంద్రంలోని పీవీకేకే కళాశాల కేంద్రంలో ఆలస్యం కారణంగా ఓ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. రెండో రోజు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురం, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 1,468 మంది అభ్యర్థులకు గాను 1,405 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు పీవీకేకే, షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా పరిశీలకులు జనార్దనరెడ్డి, ఆయా కేంద్రాల పరిశీలకులు కేంద్రాలను తనిఖీ చేశారు. బెంగళూరులో పరిశీలకులు సాయిబాబా వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండోరోజూ ఆ కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలు ఉండగా రెండోరోజూ రెండు కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ రాయలేదు. అలాగే షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ రెండు పూటలా కేవలం 71 మందిని మాత్రమే కేటాయించారు. వెంటాడిన సాంకేతిక సమస్య హిందూపురం సప్తగిరి కళాశాలలో రెండో రోజూ సాంకేతిక సమస్య తలెత్తింది. 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.15 గంటలకు మొదలైంది. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఆన్లైన్ నిర్వహణపై అవగాహన లేకనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ అభ్యర్థులు వాపోయారు. -
బిక్కమొహం
టెట్ అభ్యర్థులంతా బిక్కమొహం వేశారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడంతో అవగాహన లేనివారంతా ఇబ్బందులు పడ్డారు. చాలా మందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. ఇక హిందూపురం కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో ఆరు కేంద్రాలతో పాటు బెంగళూరు నగరంలోని 9 కేంద్రాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. తొలిరోజు 79 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,639 మంది అభ్యర్థులకు గాను 1,560 మంది హాజరయ్యారు. వీరిలో అనంతపురం జిల్లాలో 703 మందికి గాను 681 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే బెంగళూరులో 936 మందికి గాను 879 మంది హాజరయ్యారు. 57 మంది గైర్హాజరయ్యారు. హిందూపురంలో గంటన్నర ఆలస్యంగా... హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొందరి విద్యార్థులు గంటన్నర ఆలస్యంగా పరీక్ష మొదలు పెట్టారు. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వీరికి గడువు సమయం పొడిగించి రాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు, జిల్లా పరిశీలకులు జనార్దన్రెడ్డి, కేంద్రాల పర్యవేక్షులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండు కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలుండగా తొలిరోజు రెండు కేంద్రాల్లో అభ్యర్థులనే కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ పరీక్ష రాయలేదు. షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ కేవలం 50 మందిని మాత్రమే కేటాయించారు. -
టెట్ రాస్తున్నారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)–2018కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధంకావాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో బుధవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు. ♦ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి. ♦ హాల్ టిక్కెట్పై ఉన్న పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రిజిస్టర్ నంబరు సరిచూసుకోవాలి.. ♦ అడ్మిట్ కార్డుపై ఉన్న పాస్వర్డ్ను ఉపయోగించి ‘లాగిన్’ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కంప్యూటర్లో ఉన్న వివరాలు సరిచూడాలి. అన్నీ సరిగా ఉంటే ‘కన్ఫర్మ్’ అని, లేకుంటే ‘ఐ డెనీ’ అని క్లిక్ చేయాలి. ♦ కంప్యూటర్ బాగా పనిచేస్తుందని, వివరాలు అందుబాటులో ఉన్నాయని క్లిక్ చేయాలి. ♦ అనంతరం నేను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాను అని క్లిక్ చేయాలి. ♦ ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన దాన్ని ఎన్నుకొని క్లిక్ చేయాలి. ♦ పరీక్ష రాస్తున్నప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్లో పరిశీలించవచ్చు. ♦ జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ, పునఃపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు, జవాబు ఇచ్చిన ప్రశ్నలు ఊదా రంగులలో కనిపిస్తాయి. ♦ ప్రశ్నకు జవాబు రాసిన అనంతరం ‘సేవ్’ తర్వాత ‘నెక్స్›్ట’ బటన్ నొక్కాలి. ♦ కుడివైపు సెక్స్న్ బటన్ నొక్కడం వల్ల జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునఃపరిశీలన ప్రశ్నలు కనిపిస్తాయి. ♦ కంప్యూటర్లో ఇచ్చిన అక్షరాల సైజు కనిపించకపోతే వెంటనే ఇన్విజిలేటరు దృష్టికి తీసుకెళ్లాలి. ♦ పరీక్ష సమయం 2.30 గంటలు పూర్తి కాగానే ‘సబ్మిట్’ అని బటన్ యాక్టివేట్ చేయాలి. ♦ దృష్టి లోపం ఉన్నవారికి, అంగవికలాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు. -
పకడ్బందీగా టెట్
నెల్లూరు(పొగతోట): టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన ఏపీ టెట్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. విట్స్ కావలి, శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (నార్త్రాజుపాళెం), నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ (ముత్తుకూరు రోడ్డు), ఐమాన్ డిజిటల్ జోన్ కాలేజీ (కొడవలూరు), ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విద్యానగర్), ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీ, గూడూరు (రెండు సెంటర్లు), రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ (కడనూతల) సెంటర్లలో టెట్ నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నిర్వహించే కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీల్లో ఉన్న సభ్యులు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, నివేదికలను డీఈఓకు అందజేయాలని సూచించారు. టెట్కు హాజరయ్యే అభ్యర్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష నిర్వహించే సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్విజిలేటర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదన్నారు. టెట్కు హాజరయ్యే అభ్యర్థుల వద్ద బ్లూటూత్, సెల్ఫోన్లు ఉండకుండా పరిశీలించాలన్నారు. వాటర్ బాయ్స్ సెల్ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లకుండా ఇన్విజిలేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ శామ్యూల్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ విజయకుమార్, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వరసుందరం, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టెట్ హాల్టికెట్ల జారీలో నిర్లక్ష్యం
ఒంగోలు: టీచర్స్ ఎలిజబిలిటీ టెస్టు (టెట్) హాల్ టికెట్ల జారీలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దీని అనంతరం డీఎస్సీలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థులకు ఈ వ్యవహారం పిడుగుపాటుగా మారింది. స్థానికంగా కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ 6వ లైనులో నివాసం ఉంటున్న ఎస్.సాయి పద్మిని టెట్ పరీక్షకు దరఖాస్తుచేసుకోగా ఇటీవల హాల్ టికెట్ నంబర్ 1710714314404 జారీ అయింది. అయితే ఆమెకు పరీక్ష కేంద్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరి పేట రోడ్డులో కేశనపల్లిలో ఉన్న కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ను కేటాయించారు. దీంతో ఆ సెంటర్ను విచారించుకునేందుకు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. తీరా ఎంత విచారించినా ఆ పేరుతో ఎటువంటి పరీక్ష కేంద్రం అక్కడ లేదు. దీంతో తమ కుమార్తె ఎలా పరీక్ష రాయాలో ఎలో రాయాలో తెలియక ఆందోళనతో బు«ధవారం రాత్రి మీడియాను ఆశ్రయించారు. పలువురు విద్యార్థులకు కూడా ఇలానే తప్పులు దొర్లాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలి: విద్యార్థిని తల్లి జ్యోతి టెట్ పరీక్ష రాయడం ద్వారా నాలుగేళ్లలోపు జరిగే టీచర్ పరీక్షలకు అర్హత ఉంటుంది. అయితే పరీక్ష కేంద్రం అడ్రెసే లేకపోతే పరీక్ష ఎలా రాయాలి? మేము ఇప్పటికే సెంటర్కోసం అనేక విధాలుగా తిరిగాం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మాత్రమే ఉంది. కానీ నరసరావుపేట , గుంటూరు జిల్లా అని హాల్టిక్కెట్లో ఇచ్చారు. తక్షణమే సెంటర్కు సంబంధించి స్పష్టత తెలియజేయాలి. -
టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి
నల్లగొండ రూరల్ : టెట్తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ రో డ్డులోని పాల్టెక్నిక్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. ప్రస్తుతం ఖాళీగా లిగా ఉన్న 2లక్షల 60 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులపై పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఈనెల 24, 26 తేదీల్లో నిర్వహించే టీఆర్టీ íపరీక్షలను సిలబస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చుక్క సైదులు, నర్సింహ, పరుశురాం, హరీష్, నాగరాజు, శ్రీలత, నాగలక్ష్మి, సంధ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కడప, వైవీయూ : కడపలోని శ్రీసాయి బ్రహ్మేంద్ర ఎడ్యుకేషనల్ అండ్ కెరీర్ గైడెన్స్ సెంటర్లో టెట్ అభ్యర్థులకు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉచిత ఆడియో క్లాసులు నిర్వహిస్తున్నట్లు సంస్థ సమన్వయకర్త ఎస్.మహమ్మద్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీషు గ్రామర్, సైకా లజీ సబ్జెక్టులకు సంబంధించి ఈ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను సంస్థ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9618299345 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
‘టెట్’ కష్టాలు!
అనంతపురం ఎడ్యుకేషన్: రాయదుర్గానికి చెందిన ఎం. అలేఖ్య టెట్ పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అమ్మాయికి ఒంగోలులో టెట్ కేంద్రం వేశారు. తండ్రి రమణ ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఆయన కూతురును తీసుకుని ఒంగోలుకు వెళ్లి పరీక్ష రాయించాలంటే రెండు రోజులు సెలవు పెట్టాలి. పైగా వేలాది రూపాయలు ఖర్చు. ♦ అనంతపురం నగరానికి చెందిన బి.మదన ప్రతాప్రెడ్డి పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేశాడు. దరఖాస్తు సమయంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇవేవీ లేకుండా బెంగళూరు నగరంలో కేంద్రం వేశారు. ♦ యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి ప్రతాప్రెడ్డి అనే అభ్యర్థి టెట్ పేపర్–2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్లైన్లో హాల్టికెట్ కనిపించడం లేదు. పుట్టినరోజు, దరఖాస్తు ఐడీ నంబరు, ఆధార్నంబరు నమోదు చేసినా ‘డిటైల్స్ నాట్ఫౌండ్) అని వస్తోంది. దీంతో ప్రతాప్రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ♦ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 1వ తేదీ వరకు టెట్ 1, 2, 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసలే ఆన్లైన్పై అవగాహన లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే... సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు తమ హాల్టికెట్లు ఆన్లైన్లో కనిపించడం లేదని వాపోతున్నారు. రాయదుర్గం పట్టణంలోనే సుమారు వందమంది అభ్యర్థులు పేపర్–1, 2, 3 పరీక్షలు రాస్తుంటే వీరిలో 80 మందికిపైగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కేంద్రాలు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థినులకు తప్పని ఇక్కట్లు సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడిన మహిళా అభ్యర్థినులు తీవ్ర ఇక్కట్లు పడనున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ప్రయాణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. దీనికితోడు ఖర్చు కూడా భారీగా వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో పాటు మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లో కేంద్రాలకు మహిళా అభ్యర్థులు వెళ్లాలంటే కచ్చితంగా తోడుగా కుటుంబీకులను తీసుకెళ్లాలి. అందులోనూ ముందు రోజు వెళ్లాల్సి ఉంటుంది. పోను,రాను ప్రయాణం, భోజన, వసతి ఖర్చులన్నీ కలిపితే వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ తలచుకుని ఆర్థిక ఇబ్బందులున్న కొందరు పరీక్ష రాసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. కాగా టెట్ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. హాల్టికెట్లు రాని కొందరు ఇక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు.