zaheerabad
-
ఈ వర్ణం సహజం
వస్త్ర తయారీ ప్రక్రియలో రంగుల అద్దకం అంతర్భాగం. రంగులు వేసే పద్ధతులుప్రాంతాన్ని బట్టీ మారుతుంటాయి. అయితే అసలు సమస్య... రసాయన రంగులతోనే. ఈ సమస్యకు పరిష్కారంగా జహీరాబాద్లోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సహజ వర్ణాలకు పెద్ద పీట వేస్తోంది. మోదుగు, తంగేడు, నీలగిరి బెరడు... మొదలైన వాటి రంగులను దుస్తుల అద్దకంలో వాడేలా మహిళలకు శిక్షణ ఇచ్చింది.రసాయన రంగులతో తయారైన దుస్తులు చర్మానికి హానికరంగా మారుతున్నాయి. కొందరికి రసాయన రంగుల బట్టలు అసలు పడవు. హానికరమైన రంగులతో ఒక్కోసారి చర్మ సంబంధిత క్యాన్సర్కు సైతం దారితీసే అవకాశాలుంటాయి. వీటిని అధిగమించేందుకు సహజసిద్ధమైన రంగులతో ‘టై అండ్ డై’ పద్ధతిలో కృషి విజ్ఞాన కేంద్ర (కేవీకే)తో కలిసి మహిళలకు శిక్షణ ఇస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ.మిల్లెట్ సాగునుప్రోత్సహించే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంస్థ ఇప్పుడు మారుమూలప్రాంతాల్లోని మహిళల్లో రకరకాల నైపుణ్యాలను పెంపోందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో సహజ రంగులతో అద్దకం కళ కూడా ఒకటి.ఈ టై అండ్ డై (అందమైన డిజైన్ల అద్దకం)లో ఉండే వివిధ రకాల పద్ధతులను గ్రామీణ మహిళలకు వివరిస్తున్నారు. లహరియ, చెవ్రాన్, ప్లీటింగ్, బండ్లింగ్, క్లమ్పింగ్, బాందిని వంటి వివిధ రకాల ‘టై అండ్ డై’ పద్ధతులలో శిక్షణ ఇస్తున్నారు.‘మనకు నిత్యం అందుబాటులో ఉండే వాటితో రంగులు తయారు చేయడం, వాటితో బట్టలపై అద్దకం (టై అండ్ డై) నేర్చుకోవడం సంతోషంగా ఉంది. రంగుల తయారీ, అద్దకంపై ప్రతి దశలోనూ మాకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పారు. మేము సొంతంగా డిజైన్ లు చేయడం గర్వంగా ఉంది’ అంటుంది శ్రీవాణి.‘చెట్ల వేర్లు, కాండం నుంచి రంగులు ఎలా తీయవచ్చు అనేది నేర్చుకున్నాను. ఆ రంగులను బట్టలకు ఎలా అద్దాలి అనే దాని గురించి శిక్షణ పోందాము. ఇలాంటి విధానం పర్యావరణానికి మేలు చేస్తుంది. హానికరమైన రసాయనాల కంటే ప్రకృతి సిద్ధమైన రంగులు ఎంతో మేలు’ అంటుంది విజయలక్ష్మి.దేశవ్యాప్తంగా వస్త్ర తయారీ పరిశ్రమలో సహజ రంగులప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రతిప్రాంతంలో వస్త్ర పరిశ్రమ తనదైన మూలాలను వెదుక్కుంటుంది. ఈ నేపథ్యంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలు ఒకవైపు ప్రకృతికి మేలు చేస్తున్నాయి. మరోవైపు మహిళలలోని సహజ సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతున్నాయి. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిసృజన ప్లస్ ఉపాధికృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మహిళల్లో స్వయం ఉపాధిని పెంపోందించడానికి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ‘టై అండ్ డై’పై గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మహిళలు ఉత్సాహంగా నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – హేమలత, శాస్త్రవేత్త -
హైవేపై కంటైనర్లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
జహీరాబాద్లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్పూర్ ఇండ్రస్టియల్ కారిడార్లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్కు 19 కిలోమీటర్లు, మెటల్కుంట రైల్వేస్టేషన్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్కు కొత్త రైల్వే లైన్ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
-
తెలంగాణలో ‘డబుల్ ఆర్’ ట్యాక్స్.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
జహీరాబాద్,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ వ్యవస్థకు షాక్ ఇవ్వకపోతే రానున్న ఐదేళ్లలో తెలంగాణ మరింత పతనమవుతుందని హెచ్చరించారు. జహీరాబాద్లో మంగళవారం(ఏప్రిల్30) జరిగిన బీజేపీ ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్హిట్ సినిమా ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోంది. డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. డబుల్ ఆర్ ట్యాక్స్ సొమ్ము ఢిల్లీకి చేరుతోంది. ప్రజలు భవిష్యత్ కోసం దాచిన సొమ్మును కాజేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను విధిస్తారు. మీ సందపదలో 50 శాతం కాంగ్రెస్ కాజేస్తుంది. కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ చాలా మాట్లాడింది. అధికారంలోకి వచ్చి మౌనంగా ఉంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే’అని మోదీ అన్నారు. -
బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కండువా కప్పి ఆహ్వానించిన ఛుగ్, లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లు పాటిల్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్సభ టికెట్పై పాటిల్కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్నగర్- డీకే అరుణ, నాగర్కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజా ర్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాంహౌస్కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్కు బైబై చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేపర్ లీకేజీలు అయ్యాయని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండూ ధనిక పా ర్టీలని, ఈ డబ్బంతా ప్రజలదేనన్నారు. ప్రధానికి రెండు విమానాలు ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విమానాలను కొనుగోలు చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశంలో రైతు రోజుకు రూ. 27 సంపాదిస్తున్నాడని, మోదీ స్నేహితుడు అదానీ మాత్రం వేల కోట్లు సంపాదించారని చెప్పారు. అయినప్పటికీ అదానీకి వేలకోట్ల రూపాయల రుణాలను ప్రధాని మాఫీ చేయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో అవసరం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతునిస్తోందని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిస్తోందన్నారు. రాహుల్పైనే ఒవైసీ విమర్శలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్, బీజేపీలను విమర్శించరని, కేవలం రాహుల్గాం«దీపైనే విమర్శలు చేస్తారని ప్రియాంక తెలిపారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోందని, తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీకి దిగిందన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకోసం ఆరు గ్యారంటీలు.. తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు తెచ్చామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామ ని ప్రియాంక గాంధీ అన్నారు. ధాన్యంపై ప్రతి క్వింటాలుపై రూ.500 బోనస్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ఆమె వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద స్థలంతో పాటు రూ.5 లక్షల అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ యోజన కింద రూ.10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. నీతి, నిజాయి తీగల తమ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. సభలో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, నియోజకవర్గం కో–ఆర్డినేటర్ ఎన్.గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్ కామెంట్స్..
సాక్షి, జహీరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, మంత్రి హరీశ్ రావు జహీరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతులతో పేగుబంధం మాది. కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నేను మీటింగ్లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతమ్ కావాలి. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తాం. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. కేసీఆర్ వస్తే పెన్షన్ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రేషన్కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం’ అని తెలిపారు. -
కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రికెట్లో వెస్టిండీస్ టీం మాదిరిగా తయారైందని.. ఒకప్పుడు వరల్డ్కప్ గెలిచిన ఆ టీం ఇప్పుడు ఇదే వరల్డ్కప్కు క్వాలిఫై కూడా కాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా క్వాలిఫై కాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని.. బీజేపీ డకౌట్ అవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో హరీశ్రావు పర్యటించారు. ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబి్ధదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్రావు ప్రసంగించారు. రాష్ట్రంలో 30 స్థానాల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం తాగునీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో అధికారం కోసం అమలుకు వీలు కాని హామీలను ఇస్తోందని హరీశ్రావు విమర్శించారు. హంగ్ కాదు.. హ్యాట్రిక్... బీజేపీ తీరును కూడా మంత్రి హరీశ్ తూర్పారబట్టారు. రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణలో హంగ్ రాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో గెలువలేని జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ‘కాళేశ్వరం’ముంపునకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హరీశ్రావు హామీనిచ్చారు. మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో ప్రాణహిత, గోదావరి వరదలతో నష్టపోకుండా సర్వే చేయిస్తామని చెప్పారు. వరద ముంపు సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్రావుకు బాల్క సుమన్ వేదికపైనే పాదాభివందనం చేశారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్రావు, ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది కాంగ్రెస్ గురించి రేవంత్రెడ్డికి ఏం తెలుసని హరీశ్రావు అన్నారు. టీడీపీలో ఉండి సోనియాగాం«దీని బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అని పొగుడుతున్నాడని విమర్శించారు. నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి చెప్పుల గుర్తుతో పార్టీ పెట్టీ బీజేపీలో చేరారని, నాటి పీసీసీ అధ్యక్షుడు బొత్స వైసీపీలో చేరారని, నువ్వు ఏబీవీపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్లో చేరావని, రేపు ఏ పార్టీలోకి వెళ్తావని రేవంత్ను ఉద్దేశించి ప్రశ్నించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గోదావరిపై నిర్మిస్తున్న పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం, 33/11కేవీ సబ్స్టేషన్, చెన్నూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం, దోభిఘాట్కు శంకుస్థాపన, సుద్దాల వంతెనను మంత్రి ప్రారంభించారు. దోనబండ సభ, చెన్నూరు పట్టణంలో రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్బ్లాక్ అవుతుందన్నారు. మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు దివాకర్రావు, బాల్క సుమన్ను భారీ మెజారీ్టతో గెలిపించాలన్నారు. -
పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడంతో ఏసీఆర్ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ కాంగ్రెస్లో చేరింది మొదలు ఏసీఆర్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు. కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారినా దక్కని ఫలితం మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో వికారాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం చరిత్ర ఇదే...
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిని 37773 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్ నుంచి రెండుసార్లు, గజ్వేల్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు నిర్వహించారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన జంగం గోపీకి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్ లలో మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. జహీరాబాద్ జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు రెడ్లు గెలవగా, ఒకసారి బిసి(ముదిరాజ్) వర్గానికి చెందిన నేత గెలుపొందారు. రెండుసార్లు ముస్లింలు గెలిచారు. గీతారెడ్డి ప్రముఖ మహిళానేత, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు. జె. ఈశ్వరీబాయి కుమార్తె. జహీరాబాద్లో అత్యధికసార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి. ఎమ్.బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుంచి వరుసగా ఏడుసార్లు 1985 వరకు గెలిచారు. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు నాలుగుసార్లు మెదక్ నుంచి లోక్సభకు గెలిచారు. బాగారెడ్డి గతంలో చెన్నా, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్లో రెండుసార్లు గెలిచిన ఫరీదుద్దీన్ 2004లో డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో సభ్యునిగా ఉన్నారు. 2009లో ఈ స్థానం రిజర్వుడ్ కావడంతో హైదరాబాద్ నగరంలోని అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
50 రకాల విత్తనాలను ప్రదర్శించిన మహిళలు
-
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్లు మాయం
సాక్షి, జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటాలకు ఎంతో డిమాండ్ ఉందో తెలిసిందే. కొన్ని కిలో టమాటాల ధర ఏకంగా రూ.200లకు పైనే పలికింది. ఈ క్రమంలో కొందరు టమాట రైతులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక, టమాటకు భారీ ధర పలుకుతున్న నేపథ్యంలో తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్కు చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్కు తాను పండించిన టమాటాలను తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే, శనివారం తెల్లవారుజామునే వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు టమాటా ట్రేలు కనిపించలేదు. అవి దొంగతనానికి గురయ్యయాయని గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు గుర్తించారు. ఇక, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురైన ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే.. మహారాష్ట్రలోని పుణెలో అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, తమిళనాడులో కూడా విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి. ఇది కూడా చదవండి: 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇకలేరు..
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్గా పిలుస్తారు. అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్లోని దూరదర్శన్లో డైరెక్టర్గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్లో జరుగనున్నాయి. -
బీఆర్ఎస్ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు వేసిన పిటిషన్ను కొట్టివేయాలని పాటిల్ హైకోర్టులో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పాటిల్ పిటిషన్ను కొట్టివేసింది. మెయిన్ పిటిషన్(మదన్మోహన్ దాఖలు చేసిన)లో రోజూవారీగా వాదనలు వింటామని పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావుపై 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే జార్ఖండ్లో పాటిల్పై ఓ క్రిమినల్ కేసు నమోదైందని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని మదన్మోహన్రావు హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి 2022 జూన్లో ఆ పిటిషన్ను కొట్టివేశారు. అయితే దీన్ని మదన్మోహన్రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు జూన్ 15న మౌఖిక తీర్పు ఇచ్చిందని, 3 నెలలైనా తీర్పు ప్రతిని బహిర్గతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు ప్రతులు ఇవ్వకపోవడం సరికాదని, తీర్పు ఉత్తర్వులు లేకుండా తాము వాదనలు వినలేమని, ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. దీంతో విచారణను సీజే ధర్మాసనం చేపట్టింది. -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
‘బీబీ పాటిల్ ఎన్నిక’ పిటిషన్ పునఃవిచారించండి
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్ను పునః విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది. చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన హైకోర్టు జూన్ 15న మౌఖికంగానే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడంతో విచారణ, వాదనలు వినడం వృథా అని ధర్మాసనం స్పష్టంచేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని ఆదేశించలే మని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పునఃవిచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు సీజే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబర్ 10న అన్ని పార్టీలు హైకోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన పాటిల్ తన అఫిడవిట్లో క్రిమి నల్ కేసుల వివరాలు పొందపరచలేదని మదన్మోహన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. -
పంచాయతీ లెక్కలు అడిగినందుకు.. విద్యుత్ తీగలు పట్టుకున్న సర్పంచ్
న్యాల్కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
వేరే వర్గానికి చెందిన యువకుడితో కూతురు ప్రేమ.. ప్రియుడితో కలిసి తల్లి..
సాక్షి, జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన దళిత బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో జరిగిన ఈ సంఘటనను పోలీసులు సవాలుగా తీసుకుని రెండు రోజుల్లోనే ఛేదించారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో పడిందన్న కోపంతో కన్నతల్లే తన ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హుగ్గెల్లికి చెందిన గడ్డం బుజ్జమ్మకు కూతురు మౌనిక (16), కొడుకు సురేశ్(22) ఉన్నారు. కూతురు జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె తమ గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లి, అన్నకు తెలియడంతో ఆమెను మందలించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం వల్ల పరువు పోతుందని ఆమెకు నచ్చజెప్పారు. అయినా ఆ బాలిక ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దాంతో పరువు పోతుందని భావించిన బుజ్జమ్మ కూతురిని హతమార్చాలనుకుంది. చదవండి: 10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య అంతా పథకం ప్రకారమే..: ఈ నేపథ్యంలో బుజ్జమ్మ కాశీంపూర్కు చెందిన తన ప్రియుడు నరసింహులుతో చర్చించి ఇద్దరూ కలసి కూతురిని హత్య చేయడానికి పథకం రచించారు. ప్రియుడితో పెళ్లి జరిపిస్తామని తల్లి బుజ్జమ్మ, నరసింహులు మౌనికకు చెప్పి ఆదివారం రాత్రి గ్రామ శివారులోని మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత అనుకున్న పథకం ప్రకారం.. తల్లి బాలిక కాళ్లపై కూర్చోగా నరసింహులు బాలిక మెడకు చున్నీ బిగించి ప్రాణం తీశాడు. అనంతరం గ్రామస్తులను నమ్మించేందుకు కూతురు తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. తర్వాత మౌనిక మృతి విషయం వెలుగులోకి రావడంతో తన కూతురును ప్రేమించిన యువకుడే హత్య చేశాడని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తల్లే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నరసింహులు, బుజమ్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ రవిగౌడ్ను డీఎస్పీ అభినందించారు. చదవండి: రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా? -
10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య
సాక్షి, జహీరాబాద్: అత్తింటి వారి అదనపు కట్నం వేధింపులు తాళలేక మూడు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం డీఎస్పీ శంకర్రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కల్కోడె గ్రామానికి చెందిన మంజూల, బస్వరాజ్ దంపతుల కుమార్తె నిఖిత వివాహం పది నెలల క్రితం దామస్తపురం గ్రామానికి చెందిన సాయికుమార్తో జరిగింది. వివాహ సమయంలో రూ.2 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు. వివాహమైన రెండు నెలల తర్వాత భర్త సాయికుమార్, అత్త అనుసూజ, మామ యాదప్ప అదనపు కట్నం కోసం వేధించేవారు. ఐదు నెలల క్రితం జహీరాబాద్లో కాపురం పెట్టారు. అయినా వరకట్న వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నిఖిత ఉరేసుకుంది. మృతురాలి తల్లి మంజూల ఫిర్యాదు మేరకు డీఎస్పీ, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్, తహసీల్దార్ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి పంచనామ నిర్వహించారు. నిందితులు సాయికుమార్, అను సూజ, యాదప్పను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మృతదేహాన్ని పోర్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సహా 8నెలల చిన్నారి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. బైక్ పైన ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, చిన్నారి అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు( 8నెలలు)గా పోలీసులు గుర్తించారు.కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25)గా గుర్తించారు. మృతదేహలు జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్డ్యాం
జహీరాబాద్: సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెక్డ్యాంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సజ్జారావుపేట తండాలో బుధవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వీర్శెట్టి పెద్ద కొడుకు అరవింద్(11), విజయ్పవార్ రెండో కొడుకు శ్రీనాథ్ (9) మధ్యాహ్నం ఈత కోసం తండా శివారులోని చెక్డ్యాంలోకి దిగారు. లోతుగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా నీట మునిగారు. ఒడ్డుపై ఉన్న మరో బాలుడు ప్రేంసింగ్ విషయాన్ని గమనించి కేకలు వేయడంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు మునిగిన ఇద్దరినీ బయటకు తీశారు. వైద్యం కోసం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలురిద్దరూ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. -
Photo Feature: ట్రాఫిక్ తిప్పలు.. చిన్నారుల సాహసం
ఆ ఊరి పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో చెరకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్లోని విజయనగర్ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు. – కోహెడరూరల్ (హుస్నాబాద్) హైదరాబాద్లో ట్రాఫిక్ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం ఇది. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ముంబై నుంచి లక్షద్వీప్కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు. మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్ రద్దీ. భారత్లో అత్యంత పురాతనమైన చేరమాన్ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాసాయ్ బీచ్లో బుధవారం కనిపించింది. తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం. -
హౌసింగ్ పెట్టుబడులకు రన్వే.. ముంబై హైవే
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులకు భద్రతను, రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా వెంచర్లను అభివృద్ధి చేస్తుంది యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా. అందుబాటు ధరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ముంబై జాతీయ రహదారిలో పలు లే–అవుట్లను నిర్మిస్తోంది. ఆయా ప్రాజెక్ట్ వివరాలను కంపెనీ ఎండీ గణాది కమలాకర్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ► సదాశివపేటలోని ఆరూర్లో ధరణి పేరిట 32 ఎకరాల లే–అవుట్ను అభివృద్ధి చేస్తున్నాం. ముంబై హైవే ఫేసింగ్ వెంచర్లో 300 ఓపెన్ ప్లాట్లుంటాయి. ఒక్కో ప్లాట్ 165 నుంచి 500 గజాల్లో ఉంటుంది. డీటీసీపీ అనుమతి పొందిన ఈ వెంచర్ ప్రారంభమైన రెండు నెలల్లోనే 60 శాతానికి పైగా అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పటికే బ్లాక్టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, పార్క్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెమీ క్లబ్హౌస్ వంటి అన్ని రకాల వసతుల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. ► సదాశివపేటలోని ఎన్కాపల్లిలో 11 ఎకరాల్లో నీల్ గార్డెన్స్ వెంచర్ను చేస్తున్నాం. ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇందులో 140 ప్లాట్లుంటాయి. ఒక్కోటి 165 గజాల నుంచి 300 గజాల మధ్య ఉంటాయి. ప్రస్తుతం భూగర్భ విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. రెండు నెలల్లో అన్ని రకాల వసతుల నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. తొలి హౌసింగ్ ప్రాజెక్ట్.. సంగారెడ్డిలోని కొత్లాపూర్లో 5 ఎకరాల్లో ఎస్ఎస్ఆర్ గ్రీన్ మెడోస్ పేరిట హెచ్ఎండీఏ వెంచర్ను అభివృద్ధి చేయనున్నాం. వచ్చే రెండేళ్లలో నగరంలో 200 ఎకరాల్లో సుమారు ఐదు వెంచర్లను ప్రారంభించనున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి పశ్చిమ హైదరాబాద్లో తొలి గృహ నిర్మాణ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నాం. 2016 సెప్టెంబర్లో యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాను ప్రారంభించాం. అమరావతిలోని మోతడక, ఇబ్రహీంపట్నంలో వంద ఎకరాలలో పలు వెంచర్లను అభివృద్ధి చేశాం. ముంబై హైవేలోనే ఎందుకంటే? హైదరాబాద్ గుండా వెళ్లే ఇతర జాతీయ రహదారుల వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించాలంటే రాయితీలు, ప్రోత్సాహక పథకాల వంటివి ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ముంబై హైవే అలా కాదు. సహజసిద్ధంగానే అభివృద్ధి చెందింది. ఎన్హెచ్ 65 ఎగుమతి, దిగుమతుల కేంద్రంగా, లాజిస్టిక్ హబ్గా డెవలప్మెంట్ ఉంది. జహీరాబాద్లో సుమారు 13 వేల ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) రానుంది. ఇందులో డిఫెన్స్, ఎయిరోస్పేస్, లాజిస్టిక్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్, మెటల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ వంటి రంగాల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇక్కడ చదవండి: ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం ఏదో తెలుసా? పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు! -
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే మృతి
జహీరాబాద్: జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న (82) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించారు. ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.నర్సింహారెడ్డిపై 35 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాజకీయ ముఖచిత్రం.. బాగన్న జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాగా, 1994 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెసేతర పార్టీ తరఫున విజయం సాధించిన మొట్ట మొదటి వ్యక్తి బాగన్నే. 1999 ఎన్నికల్లో బాగన్న తిరిగి ఎమ్మెల్యే టికెట్ను ఆశించి భంగపడ్డారు. ఆయన స్థానంలో టీడీపీ జి.గుండప్పకు టికెట్ కేటాయించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తిరిగి బాగన్నకు టికెట్ కేటాయించింది. అప్పుడు బాగన్న ఓటమిని చవిచూశారు. 2008లో బీజేపీలో చేరి 2009 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిచెందారు. అనంతరం అధికార టీఆర్ఎస్లో చేరారు. బాగన్న మరణంతో జహీరాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం బాగన్న అంత్యక్రియలు జహీరాబాద్లో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. బాగన్నకు ఇద్దరు కుమారులు గోపాల్, రాజశేఖర్, ఇద్దరు కుమార్తెలు పద్మమ్మ, అనూశమ్మ ఉన్నారు. సీఎం సంతాపం.. మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న మృతిపై సీఎం కె.చంద్రశేఖరరావు త్రీవ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ కోసం జీవితం అంకితం చేసిన చెంగల్ బాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్హౌస్ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’
సాక్షి, సంగారెడ్డి: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్షరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మెజారిటీ రైతులు స్పష్టంచేశారు. ‘ఒక్కో కుటుంబానికి ఉన్న రెండు, మూడెకరాల సాగు భూమిని ఇవ్వడం కుదరదు. భూమి తల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి బతుకుతున్నాం.. ఉన్న భూమిని కూడా లాక్కుంటే మేము ఎలా బతకాలి. చావనైనా చస్తాం గాని.. భూములను మాత్రం ఇచ్చే ప్రసక్తేలేదు’అని మెజారిటీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘నిమ్జ్’కోసం టీఎస్ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్ గ్రామ శివారులో బుధవారం ‘పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ’కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికోసం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. అయితే నిమ్జ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడతారనుకున్న గ్రామాల ప్రజలను, సామాజిక సేవా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వేదికవద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అనేకమందిని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపించారు. చదవండి: ‘ఆటో’మేటిక్గా బతుకు‘చక్రం’ తిరిగింది సమీప గ్రామాల ప్రజలు కొందరిని మాత్రమే వేదిక వద్దకు అనుమతించారు. అక్కడకూడా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వెంటనే వారిని బయటకు పంపించివేశారు. కాగా, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిమ్జ్ను వ్యతిరేకిస్తున్న వందలాది మంది రైతులు పోలీసులకు చిక్కకుండా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెజారిటీ రైతులు, ప్రజలు నిమ్జ్కు వ్యతిరేకంగానే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు మాట్లాడారు. భూములు కోల్పోతున్న వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజలకు నచ్చజెప్పారు. భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, భూములు కోల్పోతున్న వారి కుటుంబంలో ఒకరికి, అవకాశం ఉంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించాలని వారు అధికారులకు సూచించారు. రైతులు, ప్రజలు అపోహ పడవద్దని, కాలుష్య రహిత ఫ్యాక్టరీలే ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రం దేశానికే తలమానికం కాబోతున్నదని టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి అన్నారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. -
ఈ చలాన్తో దొరికిన ఆచూకీ
జహీరాబాద్ టౌన్: ఈ చలాన్ ద్వారా తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ లభించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటు చేసుకుంది. డీఎస్పీ శంకర్రాజు కథనం ప్రకారం.. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన ముల్లపూడి సతీశ్ (35) సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాగా, లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా ఏపీ10ఏయూ 9252 నంబర్ బైక్పై తిరుగుతున్న ఓ వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని వద్ద బైక్కు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో జరిమానా విధించి ఈ చలాన్లో పొందుపరిచారు. ఈ వివరాలు రిజిస్టర్ ఫోన్ నంబర్కు మెసేజ్ ద్వారా వచ్చింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు తప్పిపోయిన సతీశ్.. జహీరాబాద్లో ఉన్నట్లు తెలుసున్నారు. వెంటనే డీఎస్పీ శంకర్రాజును కలిశారు. పట్టణంలో అమర్చిన కెమెరాల ఆధారంగా జహీరాబాద్ టౌన్ ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్ హనీఫ్లు సతీశ్ ఆచూకీ కనుగొని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
జహీరాబాద్లో కాల్పుల కలకలం
సాక్షి, మెదక్: జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి పరిధిలోని జహీరాబాద్ మండలంలోని గోవిందపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సుమారు 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన కమల్ కిశోర్ పల్లాడ్ గోవిందపూర్ శివారులోని జీడిగడ్డతాండ గ్రామంలోని 104 , 105 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల భూమిలో 15 మంది కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్కు చెందిన అలీ అక్బర్, అస్రద్లు జీడిగడ్డతాండకు వెళ్లారు. సర్వే నంబర్ 109లో అలీ అక్బర్ భూమి ఉంది. అయితే కమల్ కిశోర్ పల్లాడ్ కడీలు వేయించే భూమిలో కూడా తమ ల్యాండ్ ఉందంటూ అలీ అక్బర్ వర్గం గొడవకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగింది. (చదవండి: వివాదం ఉందంటే అక్కడ వీరి కన్ను పడుద్ది!) ఈ నేపథ్యంలో అలీ అక్బర్ జహీరాబాద్కు చెందిన లాయక్ అనే రౌడీ షీటర్కు ఫోన్ చేసి పిలిపించాడు. స్కార్పియో వాహనంలో ఆయుధాలతో జీడిగడ్డతాండకు చేరుకున్న లాయక్.. కర్రలు, కత్తులతో కమల్ కిశోర్ వర్గంపై దాడి చేశాడు. తుపాకీతో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఒక్కరికి గాయాలు అయ్యాయి. ఇక కమల్ కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అలీఅక్బర్, అస్రద్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక రౌడీ షీటర్ లాయక్ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. లాయక్పై జహీరాబాద్ రూరల్ పీఎస్లో రౌడీషీట్ తెరిచారు. ఇక 2018లో జరిగిన ఓ హత్యకు సంబంధించి లాయక్పై కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు. అంతేకాక కమల్ కిషోర్, అక్బర్ అలీ మధ్య దాదాపు పదేళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
నిమ్జ్ భూ సేకరణ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాతీయ పెట్టుబడులు, మౌలిక వనరుల ప్రాజెక్టు (నిమ్జ్) కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్జ్ కోసం 12,635 ఎకరాలను సేకరించేందుకు శుక్రవారం జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణను ఆపాలని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణకు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటిఫికేషన్ను నయాల్కల్ గ్రామానికి చెందిన ఎం.రాజిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో సవాల్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని పిటిషనర్ న్యాయవాది అర్జున్కుమార్ వాదించారు. రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేసే నిమ్జ్ వల్ల 10వేల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుందని తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని, కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే చేయాలని హైకోర్టు పేర్కొంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది. సంగారెడ్డిలో కూడా పాజిటివ్ కేసులున్నాయని చెప్పింది. నిమ్జ్ ప్రాజెక్టు వల్ల 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్రం మార్గదర్శకాలు జారీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేయవద్దంటూ రిట్పై విచారణను ముగించింది. -
ఆలుగడ్డ సాగు ఎలా ఉంది?
జహీరాబాద్: ‘ఆలుగడ్డ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. పంట దిగుబడులు ఎలా ఉన్నాయి. గిట్టుబాటు అవుతుందా?’అని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఆలుగడ్డ, అల్లం పంటల సాగు విధానం, రైతులు సాధిస్తున్న దిగుబడులు, మార్కెటింగ్ విధానం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్లో కొందరు రైతులు కేసీఆర్ను కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు వారు సీఎంతో గడిపారు. జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతులు వెంకట్రాంరెడ్డి, నాగేశ్వర్రెడ్డి, బద్ది రామ్రెడ్డి, బద్రేశ్, కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన రైతు వై.జయసింహారెడ్డి సీఎంను కలసిన వారిలో ఉన్నారు. అయితే.. ముఖ్యమంత్రే స్వయంగా వారిని పిలిపించుకున్నట్లు తెలిసింది. రైతులతో పాటు సంగారెడ్డి జిల్లా ఉద్యానవన అధికారి సునీత, జహీరాబాద్ అధికారి అనూషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ప్రాం తంలో సాగవుతున్న పంటల గురించి ముఖ్యమంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆలుగడ్డ సాగుపై ఆరా తీసిన కేసీఆర్.. ఈ పంట మరింత విస్తరించాల్సిన ఆవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. గత సంవత్సరం తగినంత మేర వర్షాలు లేక ఆలుగడ్డ పంట సాగు భారీగా పడిపోయిందని రైతులు సీఎంకు వివరించారు. కాగా, ఆలుగడ్డ, అల్లం పంటలను మార్కెట్కు తరలిస్తే కమీషన్ ఏజెంట్లు 10 శాతం మేర కమీషన్ వసూలు చేస్తున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ.. రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకే క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో రైతులకు రానున్న రోజుల్లో తగిన మేలు కలుగుతుందని చెప్పినట్లు తెలిసింది. రెండేళ్లలో రైతుల కష్టాలకు చెక్ రైతులను దళారీ వ్యవస్థ నుంచి బయట పడేసేందుకు వీలుగా క్లస్టర్ వ్యవస్థ పని చేస్తుందని, రానున్న రెండేళ్లలో రైతుల కష్టాలు తీరుతాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. రైతులు పండించిన పంటను నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుందని చెప్పినట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఆలుగడ్డ పంట చేతికి అందివచ్చినప్పుడు ధరలు ఉండడం లేదని, తమ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తే పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీల సౌకర్యం కల్పించాల్సి ఉందని, ఈ దిశలో తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని సీఎం పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో నీటి వసతులు లేవని, దీంతో తగిన మేర పంటలను సాగుచేయలేకపోతున్నట్లు రైతులు వివరించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. సింగూరు నుంచి జహీరాబాద్తో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు సాగునీటి వసతులను కల్పించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం రైతులతో చెప్పారు. చెరకు పంట సాగుపై ఆరా కాగా, చెరకు పంట సాగు ఏ మేరకు ఉంది.., ఎంత వరకు దిగుబడులు వస్తున్నాయని కేసీఆర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు సుమారుగా 40 నుంచి 50 టన్నుల మేర పంట దిగుబడి వస్తున్నట్లు వారు వివరించారు. జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నా యనే విషయమై సీఎం ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అరటి, బొప్పాయి, కూరగాయల సాగుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము పండించిన అల్లం, పసుపు పంటను రైతులు సీఎం కేసీఆర్కు అందజేశారు. రైతులు పండించిన అల్లం పంట నాణ్యత బాగా ఉందని సీఎం మెచ్చుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో సీఎం కేసీఆర్ను కలసిన జహీరాబాద్ ప్రాంత రైతులు -
లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
జహీరాబాద్: మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ గణపత్ జాదవ్ తెలిపారు. గురువారం కేసు వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులైన ఒంగోలు జిల్లా కొమురోలు మండలం ఎడమాకుల గ్రామానికి చెందిన బండి పవన్కుమార్ (29), కాజీపేట పట్టణం దర్గా ఫాతిమానగర్కు చెందిన బ్రహ్మచారి (38)లను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చారు. పవన్కుమార్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఉప్పల్లో సిర్థపడిన ఖాజిపేటకు చెందిన బ్రహ్మచారిపై పలు కేసులు ఉన్నాయి. గతంలో ఓ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సోమాచారి (45) బుధవారం రాయికోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేసులో ఏ–1 నిందితుడు పవన్కుమార్ను గంగ్వార్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా విషయాన్ని గమనించి తమ వెంట తెచ్చుకున్న కారులో బ్రహ్మచారి, సోమచారిలు రాయికోడ్ వైపు పరారయ్యారు. కారును వేగంగా నడపడంతో బోల్తా పడి సోమాచారి అక్కడికక్కడే మరణించగా బ్రహ్మచారి గాయపడ్డాడు. దీంతో బ్రహ్మచారికి ఆస్పత్రిలో చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్ పాల్గొన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన సోమాచారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
పోలీసులమంటూ అత్యాచారం
జహీరాబాద్: మహిళతో పరిచయం పెంచుకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసునని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ క్రాస్రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. కోదాడ నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన మహిళ(35) భర్త మరణించడంతో కిరాణం కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. తన కొడుకుతో కలిసి వ్యాపారం నిమిత్తం నిషేధిత గుట్కాలు కొనేందుకు సోమవారం కర్ణాటకలోని బీదర్కు వెళ్లింది. మంగళవారం ఉదయం వాటిని కొనుగోలు చేసి కోదాడకు బయలుదేరింది. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఆమె బస్సు దిగింది. అతనితోపాటు అతని స్నేహితుడు సైతం బస్సు దిగాడు. అయితే మొదటి వ్యక్తి తాము పోలీసులమని, బ్యాగ్ను తనిఖీ చేయాలని చెప్పడంతో ఆమె భయపడింది. తాము చెప్పినట్లు వినాలని, లేదంటే కేసు పెడతామని హెచ్చరించడంతో నిందితుడు చెప్పినట్లు చేస్తానని ఒప్పుకుంది. దీంతో బాధితురాలిని పస్తాపూర్ క్రాస్రోడ్డు వద్ద గల దుకాణాల సముదాయం వెనుకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో వచ్చిన మరో వ్యక్తిని, ఆమె కుమారుడిని పస్తాపూర్ క్రాస్రోడ్డు వద్ద గుట్కాకు కాపలా ఉంచాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం మహిళను అక్కడే వదిలిపెట్టి ఆమె తీసుకువచ్చిన గుట్కాతో వారు పరారయ్యారు. బాధితురాలు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రజాస్వామ్యం అంటే ఏంటి?
న్యాల్కల్ (జహీరాబాద్): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మరోసారి టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు, డప్నూర్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులను పిలిచి 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంటర్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? రాష్ట్ర అసెంబ్లీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? అని హరీశ్రావు ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వం కళాశాల భవనాన్ని నిర్మించిందని, కాని విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని, నాణ్యమైన విద్యనందించాలని అధ్యాపకులను కోరారు. ఎంత ఖర్చయినా చదివిస్తా: ఓ విద్యార్థిని చదువుకోసం ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హరీశ్రావు భరోసా ఇచ్చారు. గంగోత్రి అనే విద్యార్థిని మంత్రి వద్దకు వెళ్లి ‘మాది బీద కుటుంబం, మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. నేను చదువుకుంటానో లేదో’ అని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన ఆయన ‘నీవు ఎక్కడ చదువుకుంటావు.. చెప్పు! పూర్తి ఖర్చును నేనే భరిస్తాను’అని హామీ ఇచ్చారు. -
లాడ్జీలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం ఆత్మహత్య
సాక్షి, జహీరాబాద్: మతి స్థిమితం సరిగ్గా లేక మానసికంగా బాధపడుతున్న వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జహీరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ– 2 విఠలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన మోసీన్ (34) అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి కొన్ని రోజుల నుంచి మతి స్థిమితం సక్రమంగా లేక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వికారాబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి జహీరాబాద్కు చేరుకున్నాడు. అక్కడ బస్టాండ్కు ఎదురుగా ఉన్న తిరుమల లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్ పెట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న అబ్దుల్ మోహిజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య బషీరాబాద్ ఉర్దూ మాధ్యమం పాఠశాలలో వలంటీర్గా పని చేస్తోంది. కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు బషీరాబాద్: జహీరాబాద్లో మోసీన్(38) ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి స్వగ్రామం క్యాద్గిరలో విషాదం అలుముకుంది. జహీరాబాద్లో పోలీసులు మృతదేహం అప్పగించడంతో గురువారం రాత్రి క్యాద్గిరకు చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యతో బషీరాబాద్ మండల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని మోసీన్కు నివాళులర్పించారు. -
జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు
జహీరాబాద్ : స్థానిక రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుధీర్ఘ కాలం తర్వాత పెండింగ్ పనులు చేపట్టారు. జిల్లాలోనే ఏకైక అతిపెద్దది కావడంతో మోడల్ రైల్వే స్టేష¯Œ గా తీర్చిదిద్దేందుకు 2010 సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. అప్పట్లో స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు చేపట్టినా ప్రధాన పనులను మాత్రం పెండింగ్లో పెట్టారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పెండింగ్ పనులకు మోక్షం కలిగింది. ప్రస్తుతం సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్ జహీరాబాద్ పట్టణం నడి బొడ్డున ఉండడంతో రెండు వైపుల ప్రాంతాలకు వెళ్లి, రావడం కష్టంగా మారింది. అండర్ బ్రిడ్జిలను నిర్మించినా అవి ఏ మాత్రం సౌకర్యంగా లేకపోవడంతో ప్రజలు స్టేషన్ కు ఇరు వైపులా వెళ్లేందుకు రైల్వే ట్రాక్ను దాటుతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకల్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్ఫాంలను ప్రారంభించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు పనులు చురుకుగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో 26 రైళ్లు ఆగుతున్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి ఇప్పుడు నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్ఫాం సౌకర్యంగా మారనుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో తీరనున్న ఇబ్బందులు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో జహీరాబాద్ పట్టణ ప్రజల, ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. పట్టణంలోని రెండు వైపులా ప్రాంతాలకు రాక పోకలు సాగించే ప్రజలకు ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగపడనుంది. నిలుచున్న రైళ్ల కింద నుంచి దాటుకుని వెళ్లే ఇబ్బందులు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధి కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారనుంది. రెండో ప్లాట్ఫాంతో సౌకర్యం ప్రస్తుతం స్టేషన్ లో ఒకే ప్లాట్ ఫాం ఉండడంతో రెండో ప్లాట్ఫాంపై నిలిచే రైళ్లలో నుంచి కిందిగి దిగే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీని తీసుకుని కిందికి దిగే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. రెండో ప్లాట్ఫాం నిర్మాణం జరగనందునే ఈ పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం రెండో ప్లాట్ఫాం పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తయితే ప్రయాణికులు రైలులో నుంచి కిందికి దిగేందుకు సౌకర్యంగా మారనుంది. ఆకట్టుకుంటున్న బొమ్మలు జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు రంగులద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది కళాకారులు స్టేషన్ లో గోడలపై రంగులు, బొమ్మలు వేసే పనులు చేపట్టారు. పర్యావరణం, నీటి పొదుపు, ప్లాస్టిక్ వాడకం వద్దు, స్వచ్ఛ భారత్, పచ్చదనం తదితర వాటి ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా చిత్రాలు, నినాదాలతో తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపయోగపడే జంతువులు, పక్షుల చిత్రాలను ప్లాట్ ఫాం గోడలు, స్టేషన్ గోడలపై తీర్చిదిద్దుతున్నారు. రేల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను ఆయా చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్ఫాం నిర్మాణం పనులు త్వరలో పూర్తై వినియోగంలోకి రానున్నాయి. వీటిని పూర్తి చేయించేందుకు నేను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడా. రైల్వే శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి పనులను ప్రారంభించారు. పనులు త్వరలో పూర్తి చేయించి ప్రారంభింపజేసి ప్రజలకు ఉపయోగంలోకి తెస్తాం. ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది. –బీబీ పాటిల్,జహీరాబాద్ ఎంపీ -
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
సాక్షి, జహీరాబాద్ : జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు. మదన్ మోహన్ రావు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ పార్టీలను పిటిషన్లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదన్ మోహన్రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. -
ఈ ఆటో డ్రైవర్ రూటే సెపరేటు
సాక్షి, జహీరాబాద్ : మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బరూర్బాబు తన ఆటో ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాకుండా తన ఆటోపై సమాజానికి ఉపయోగపడే సందేశాలను రాయించుకుని అందరిరికీ ఆదర్శంగా నిలిచారు. ఆటో ద్వారా పేదలకు సేవలు సైతం అందిస్తున్నారు. ఇచ్చినంతే తీసుకుని.. ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాలకు వెళ్లే రోగులు ఇచ్చినంతనే డబ్బు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని వారికి వత్తిడి చేయడం లేదు. గ్రామంలో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం ఆటో అవసరం అయినా వెంటనే అంగీకరించి ఆస్పత్రికి చేర్చుతున్నాడు. ఇచ్చినంతమే డబ్బు తీసుకుంటున్నాడు. పేదరికంలో ఉన్న వారు డబ్బులు ఇవ్వకున్నా సేవలు అందిస్తున్నారు. రహదారిపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే స్పందించి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చుతుంటాడు. హరితహారంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సైతం తన ఆటో ద్వారా సుమారు 5 కిలో మీటర్ల వరకు నర్సరీ నుంచి ఉచితంగా సరఫరా చేస్తుంటాడు. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం అయినా తన వంతు సహాయ పడతాడు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు సైతం చేసి శభాష్ అనిపించుకుంటాడు. తను పేదరికంలో ఉన్నా ఇతరుడు సహాయపడడంలో ఉన్న తృప్తి మరి దేంట్లో ఉండదంటారు బాబు. డ్రైవర్ వృత్తిని నిర్వహిస్తూ తనవంతు అయిన సహాయం చేయడంలో ముందుటాడు. -
చిన్నారి మృతికి క్షుద్ర పూజలే కారణమా?
సాక్షి, జహీరాబాద్: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని సుమారు నాలుగు నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ బాలస్వామి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం పశువులు మేపేందుకు వెళ్లిన పశువుల కాపరులు గ్రామ శివారులో గుట్ట సమీపంలో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూశారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియ జేశారు. గ్రామ వీఆర్ఓ సంజీవ్ హద్నూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఐ బాలస్వామి సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. మృతిపై పలు అనుమానాలు నాలుగు నెలల చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు నెలల చిన్నారి శరీరంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, తల కూడా తెగిపోవం వల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుప్త నిధుల కోసం గుట్ట ప్రాంతంలో కొందరు క్షుద్ర పూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృత దేహం గుర్తు పట్టని విధంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కంట తడి పెట్టారు. చిన్నారి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను లారీ కింద తోసిన భర్త
సాక్షి, ఝరాసంగం(జహీరాబాద్): భార్యపై అక్రమ సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న భర్త ఆమెను లారీ కిందకు తోసేసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన శంకర్కు నాగమణి(38)తో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే ఇటీవలి కాలంలో గ్రామంలోనే ఇతర వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను వదిలించుకుందామని అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్తో కలిసి పథకం వేశాడు. పథకం ప్రకారం భార్యను వదిలించుకునేందుకు సోమవారం రాత్రి ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి దర్శనానికి ఆటోలో డ్రైవర్ హకీంతో కలిసి వచ్చారు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో కుప్పానగర్ గ్రామ శివారులోకి రాగానే ఆటో పంక్చర్ అయ్యిందని పక్కకు తోయాలని చెప్పడంతో నాగమణి ఆటో దిగింది. ఆటోను తోస్తున్న క్రమంలో లారీ డ్రైవర్ ఝరాసంగం నుండి జహీరాబాద్ వైపు లారీని తీసుకువస్తున్నాడు. పథకం ప్రకారం వస్తున్న లారీ కిందికి శంకర్ నాగమణిని తోసేశాడు. లారీ చక్రాలు ఆమె తలపై నుండి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. ముందు రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అసలు విషయాన్ని వెలికి తీశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతురాలి తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి, ఎస్ఐ ఏడుకొండలు వివరించారు. -
నవల్గాలో మద్యం నిషేధం!
సాక్షి, బషీరాబాద్(సంగారెడ్డి): యువతను పెడదారి పట్టిస్తున్న మద్యంను కట్టడి చేయడానికి బషీరాబాద్ మండలం నవల్గా గ్రామ పంచాయతీ నడుం బిగించింది. గ్రామంలో నడుపుతున్న బెల్టు షాపుల భరతం పట్టాలని నిర్ణయించింది. దీని కోసం సర్పంచ్ డి. నర్సింహులు బుధవారం పంచాయతీ కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. జులై ఒకటి నుంచి గ్రామంలోని మద్యపానం నిషేధిస్తూ పంచాయతీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇకపై బెల్టు షాపులన్నీ మూసి వేయాలని నోటీసులు జారీకి రంగం సిద్ధం చేశారు. జులై ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందున ఇకపై బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులకు సర్పంచ్ లేఖ రాశారు. బషీరాబాద్ మండలం నవల్గా మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ యువత, కార్మికులు ఎక్కువగా ఉంటారు. అయితే సాయంత్రం అయితే చాలు మద్యం ప్రియులు మద్యం తాగి రోడ్లమీద హల్చల్ చేస్తున్నారు. మద్యం మత్తులో తరుచూ గొడవలు జరుగుతుండటమే కాకుండా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్ పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. అయితే గ్రామంలో జరుగుతున్న గొడవలకు ప్రధాన కారణం బెల్టు షాపులని భావించిన సర్పంచ్ డి.నర్సింహులు మద్యం బంద్ చేస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తూ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల వలన యువత పెడదారి పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారన్నారు. అలాగే గని కార్మికులు కూడా ఎక్కువగా ఉండడంతో మద్యానికి బానిసై కాపురాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో బెల్టు షాపులు పూర్తిగా బంద్ చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులకు కూ డా లేఖ రాసినట్లు సర్పంచ్ వెల్లడించారు. లేఖ మరోవైపు సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని మహిళలు, విద్యావంతులు, విద్యార్థులు స్వాగతించారు. సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి ఆయన్ని అభినందనలు తెలిపారు.. అలాగే గ్రామంలో స్వచ్ఛతపై కూడగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సర్పంచ్ చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలక్రిష్ణ, ఉప సర్పంచ్ మాల లాలప్ప, కార్యదర్శి లక్ష్మీకాంత్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ్కుమార్, మహేష్, వార్డు సభ్యులు సిద్దయ్య, ఆనంద్, మొగులమ్మ, పార్వతమ్మ, మొగులమ్మ, రాములమ్మ, లక్ష్మీ, అంగన్వాడీ టీచరు పాల్గొన్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
జహీరాబాద్: తన ప్రియురాలిని కలుసుకునేందుకు భర్త అడ్డంకిగా మారాడని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్యచేయించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన సయ్యద్ కరీం(26)ను ఈనెల 2వ తేదీన మహ్మద్ ముబీన్(26) అనే నిందితుడు తన స్నేహితుడికి సుపారి ఇచ్చి హత్య చేయించాడు. నిందితుడు ముబీన్ మృతుడి భార్యతో కలిసి 1నుంచి 8వ తరగతి వరకు జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ముబీన్ అప్పటి నుంచి మృతుడి భార్యను ప్రేమిస్తున్నాడు. మృతుడు కరీం బతుకుదెరువు గురించి సౌది దేశం వెళ్లిన సమయంలో అతడి భార్య జహీరాబాద్లోని తల్లిగారింటికి వచ్చింది. దీంతో ముబీన్ ఆమెతో కలిసేవాడు. సుమారు 8 నెలల క్రితం మృతుడు కరీం సౌదీ దేశం నుంచి పూర్తిగా తిరిగి వచ్చాడు. ఆరు నెలల క్రితం జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా సమీపంలో హైటెక్ ఎస్.ఎస్ రేయిలింగ్ షాపును పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ముబీన్ తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కరీంను ఎలాగైనా చంపించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు పథకం వేసి తన స్నేహితుడు అయిన జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ సమద్(30)ని ఆశ్రయించాడు. సమద్ స్కూల్ బ్యాగులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అతడు వ్యాపారం సక్రమంగా చేయనందున అప్పుల పాలయ్యాడు. మద్యంకు బానిసగా మారాడు. ముబీన్ సమద్ బలహీనతలను గమనించి తన బాధలను చెప్పుకున్నాడు. కరీంను చంపినట్లయితే రూ.3లక్షలు సూపారి కింద ఇస్తానని, ఈ డబ్బుతో అప్పులు తీర్చుకోవడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోమని నమ్మబలికాడు. దీంతో సమద్ తన అప్పులు తీరుతాయని భావించి ముబీన్ సూచన మేరకు కరీంను హత్యచేసేందుకు నిర్ణయించుకున్నాడు. సమద్కు రూ.10వేలు ముట్టచెప్పాడు ముబీన్. ముబీన్ను నమ్మి ఈనెల 2వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముబీన్ తన పల్సర్ మోటారు సైకిల్పై సమద్ను కూర్చోబెట్టుకుని ఆదర్శనగర్ క్రాసింగ్ వద్ద విడిచి పెట్టాడు. సమద్ తన వెంట కొబ్బరి బొండాం నరికే కత్తిని ప్యాంట్లో పెట్టుకుని కరీం దుకాణం వద్దకు వెళ్లాడు. వెళ్లి ఖాశీంపూర్ గ్రామంలో గల దర్గా వద్ద రేయిలింగ్ చేయాలని కరీంను రమ్మని కోరాడు. అతడిని బయటకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై రెండు సార్లు నరికాడు. ఇంకా కొట్టబోగా చేతులు అడ్డం పెట్టాడు. దీంతో దాడిలో కరీం రెండు చేతులు, భుజానికి గాయాలయ్యాయి. కుడికాలుపై కూడా వేటు వేశాడు. దీంతో అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కరీం చనిపోయాడని నిర్దారించుకున్నాక వారు వేసుకున్న పథకం ప్రకారం.. బీదర్ క్రాస్ రోడ్డువద్ద ముబీన్, సమద్లు కలుసుకున్నారు. అనంతరం మోటారు సైకిల్పై కర్ణాటకలోని మన్నా ఎక్కెల్లికి పారిపోయారు. శుక్రవారం ఇరువురు తమ ఇళ్ల వద్దకు రాగా అరెస్టు చేసి మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. మృతుడు కరీంకు 4 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె ఉంది. ఈ సంఘటన మూడు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్సై రాజశేఖర్లు పాల్గొన్నారు. -
‘దొరతనానికి చరమగీతం పాడాలి’
సంగారెడ్డి: ఇందిరా గాంధీని ప్రధానిని చేసిన ఘనత జహీరాబాద్ ప్రజలదని, నాయకులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఓట్లు ఎటూ పోవని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుతో కలిసి మునిపల్లి వచ్చారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు కార్యకర్తలే బలమన్నారు. విద్యా, సమాచార హామీ హక్కులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. 14 మంది ఎంపీలతో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల గురించి ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం పార్లమెంటులో ఏ ఒక్క రోజు మాట్లాడని వారు, ఇప్పుడు 16 ఎంపీ స్థానాలు గెలిపించమని అడగడానికి సిగ్గు అనిపించడం లేదా అని అన్నారు. 30 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని విమర్శించారు. నిజామాబాద్లో టీఆర్ఎస్పై నామినేషన్లతో రైతులు తిరగబడ్డారని అన్నారు. దొరతనం, దురహంకారానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్లో అభద్రత ఉంది.. అందుకే కాంగ్రెస్ నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఎన్నిక ప్రజాస్వామ్యానికి ఊపిరి అని వ్యాఖ్యానించారు. పెన్షనర్లను భయపెట్టడం, రైతుబంధు పథకం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్కు సిద్ధాంతం ఉందని, కార్యకర్తలకు ధైర్యం ఉందని చెప్పారు. సింగూరు నుంచి 16 టీఎంసీల నీటిని కూతురు కోసం తీసుకెళ్లాడని ఆరోపించారు. కారు..సారు.. పదహారు కాదు..దోచుకో..దాచుకో..దాటిపో అన్నదే కేసీఆర్ సిధ్ధాంతమన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటారా.. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..ప్రాజెక్టులు కట్టిందని వ్యాఖ్యానించారు. ఏటా రూ.72 వేల సహాయం: మదన్ కాంగ్రెస్ బడుగుల పార్టీ అని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు కొనియాడారు. కనీస ఆదాయ పథకం ద్వారా ఏటా రూ.72 వేల సహాయం అందిస్తామన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్, రైతు రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. బీబీ పాటిల్ పనికి రాని అసమర్థ ఎంపీ అని మండిపడ్డారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయలేని అసమర్థ ఎంపీ బీబీపాటిల్ అని విమర్శించారు. ప్రజల సమస్యలు తీర్చడం మరిచి తన సొంత వ్యాపార పనులు చక్కదిద్దుకున్నాడని ఆరోపించారు. నిరుద్యోగులు లేని జహీరాబాద్ను చూడాలనేదే తన కల అన్నారు. అద్దంలా జహీరాబాద్ను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. -
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి
జహీరాబాద్: బీజేపీ కేంద్ర అధిష్టానవర్గం విడుదల చేసిన రెండో జాబితాలో జహీరాబాద్ లోకసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు. ఎల్లారెడ్డికి చెందిన బాణాల లక్ష్మారెడ్డి పేరును శనివారం సాయంత్రం అధిష్టానవర్గం అధికారికంగా ప్రకటిం చింది. బీజేపీ మొదటి జాబితాలో దేశంలోని 184 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో తెలంగాణకు సంబంధించి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో జహీరాబాద్కు చోటు లభించలేదు. శనివారం విడుదల చేసిన జాబితా లో జహీరాబాద్కు చోటు కల్పించారు. ఈమేరకు బాణాల లక్ష్మారెడ్డికి టికెట్ను ఖరారు చేశారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సోమాయప్పకు దక్కని అవకాశం జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గాను బీజేపీ టికెట్ కోసం సోమాయప్ప తీవ్రంగా కృషి చేశారు. మొదట్లో అధిష్టానవర్గం సోమాయప్పకే టికెట్ను ఖరారు చేసే విషయాన్ని పరిశీలించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పేరు ఖరారు కావడంతో బీజేపీ అధిష్టానవర్గం సోమా యప్ప అభ్యర్థిత్వం పట్ల ఆసక్తి చూపలేదని తెలి సింది. పాటిల్, సోమాయప్పలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే. దీంతో ఒకే ప్రాంతం, ఒకే సామాజిక వర్గం వారు కావ డంతో టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసినట్లు తెలిసింది. పాటిల్ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే అంతగా ఫలితం ఉండదని భావించిన అధిష్టాన వర్గం చివరి నిమిషంలో బాణాల లక్ష్మారెడ్డి వైపు మొగ్గుచూపిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పేరు : బాణాల లక్ష్మారెడ్డి తండ్రిపేరు : భీంరెడ్డి తల్లి : సాయమ్మ భార్య : సావిత్రి కుమార్తెలు : రాగిణి, మోగన గ్రామం : ఎండ్రియాల్ మండలం : తాడ్వాయి నియోజకవర్గం: ఎల్లారెడ్డి జిల్లా : కామారెడ్డి విద్యార్హత : బీకాం రాజకీయ ప్రవేశం : 1993, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి బీజేపీలో చేరిక : 2010, నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి 32 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
చెరకు తోటలో పోటీ.. ఎవరి నోరు తీపి?
చెరుకు సాగుకు ప్రసిద్ధి చెందిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆ అంశమే ప్రధాన ప్రచారాస్త్రం కానుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చెరకు సాగు సమస్యలతో పాటు సింగూరు నీటి వ్యవహారం ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. ఏటా చెరుకు క్రషింగ్, మార్కెటింగ్, గిట్టుబాటు, రవాణా, బకాయిల పెండింగ్ వంటి సమస్యలతో చెరకు రైతులు సతమతం అవుతున్నారు. అలాగే, ఈ నియోజకవర్గాలన్నీ కూడా సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోనివే కావడంతో సాగునీటి అంశం కూడా ప్రధాన ప్రచారాంశం కానుంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఇదీ.. ముచ్చటగా మూడో ఎన్నిక.. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో 2009లో ఆవిర్భవించిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం 3వ లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలను పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ స్థానం పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా యి. సిట్టింగ్ ఎంపీ భీమ్రావు బస్వంత్రావు పాటిల్కు టీఆర్ఎస్ వరుసగా రెండోసారి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ సురేశ్షెట్కార్ పోటీకి దూరంగా ఉన్నారు. కాగా, 2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన మదన్మోహన్రావు తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. మరో ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీ.. ఓ ఎన్ఆర్ఐ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి మినహా అన్నీ ‘గులాబీలే’.. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మిన హా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు (జాజుల) సురేందర్ టీఆర్ఎస్ కీలక నేత ఏనుగు రవీందర్రెడ్డిపై గెలుపొందారు. కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగున్నర వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ విజయం సాధించారు. నారాయణఖేడ్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆ ర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఇరు పార్టీల నడుమ 1.32 లక్షల ఓట్ల తేడా ఉంది. ఏడుసెగ్మెంట్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థులకు మొత్తం 5,76,433 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 4,43,468 ఓట్లు వచ్చాయి. 2014 లోక్స భ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (టీఆర్ఎస్).. సురేశ్ షెట్కార్(కాంగ్రెస్)పై 1.44 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్మోహన్రావు 1.57 లక్షల ఓట్లు సాధించారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరింట టీఆర్ఎస్ గెలిచింది. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు వచ్చిన మెజార్టీ 1.36 లక్షలు ఉండగా, ఒక్క నారాయణఖేడ్ పరిధిలోనే 56 వేల పైచిలుకు ఉంది. ఈ నేపథ్యంలో మదన్మోహన్రావు గెలుపు అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ఫలితం సాధ్యమవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. సామాజికవర్గ సమీకరణాలే కీలకం.. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 4 జనరల్ అసెంబ్లీ సెగ్మెం ట్లు, 3 ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్లు ఉన్నాయి. లింగాయత్ సామాజిక వర్గం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని 2009 లోక్సభ ఎన్నికల నాటి నుంచే పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా, ప్రజారాజ్యం పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి చెంది న మల్కాపురం శివకుమార్కు టికెట్ ఇచ్చింది. చివరి నిముషంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సయ్యద్ యూసుఫ్ అలీపై సురేశ్ షెట్కార్ 17 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, టీఆర్ఎస్ లింగాయత్ సామాజిక వర్గానికే చెందిన బీబీ పాటిల్ను బరిలోకి దించింది. ప్రస్తుత ఎన్నికల్లో బీబీ పాటిల్ మరోమారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఖరారు కాగా, కాంగ్రెస్ మాత్రం అన్ని లెక్కలు వేసుకొని మదన్మోహన్రావును ఎంపిక చేసింది. ఇక, బీజేపీ పరిశీలనలో ఉన్న ఎన్ఆర్ఐ కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చెరకు, సాగునీటి సమస్యలే ఎజెండా.. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉండటంతో సాగునీరు అంశం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశాలున్నా యి. గత ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కోసం సింగూరు నుం చి 16 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో పాటు.. ప్రస్తుతం సింగూ రు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 29.91 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సింగూరులో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉండటంతో.. అందోలు, నారాయణ్ఖేడ్, జహీరాబాద్ పరిధిలోని పలు మండలాల్లో నీటి ఎద్దడి నెలకొంది. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం సింగూరు అడుగంటడంతో ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. దీనినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు దేశ రక్షణ, జాతీయ అంశాలు తనకు అనుకూలిస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇక, చెరకు సాగు సంబంధ అంశాలు సైతం ఎన్నికల్లో ప్రాధాన్యం వహించనున్నాయి. టీఆర్ఎస్ మాత్రం పార్టీ బలంగా ఉండటం, ప్రభుత్వ పథకాల అమలుపై ఆశలు పెట్టుకుంది. సన్నాహక సమావేశాల్లో బిజీ.. లోక్సభ ఎన్నికల దిశగా పార్టీ కేడర్ను సమాయత్తం చేసేందుకు రాజకీయ పక్షాలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల నిజామాబాద్లో జహీరాబాద్ లోక్సభ పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 13న నిజాంసాగర్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ.. లోపాలను సరిదిద్దుకుని భారీ మెజారిటీ సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ఆలోచనలో ఉంది.- కె.రాహుల్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు సంగారెడ్డి జిల్లా:జహీరాబాద్ (ఎస్సీ), అందోలు (ఎస్సీ), నారాయణఖేడ్. కామారెడ్డి జిల్లా:కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ (ఎస్సీ),బాన్స్వాడ. తొలి రెండు ఫలితాలు ఇలా.. 2009:ఎస్.సురేశ్ షెట్కార్(కాంగ్రెస్–17,407) 2014:బీబీపాటిల్(టీఆర్ఎస్–1.44,631) లోక్సభ ఓటర్లు పురుషులు 7,36,528 మహిళలు:7,58,889 ఇతరులు:62 మొత్తం:14,95,479 -
3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్
రాష్ట్రంలోని ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి లేని విధంగా విభిన్న సంçస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు, భాషల సమ్మిళితం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సరిహద్దుగా కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో ఆయా రాష్ట్రాల ఆచార వ్యవహారాలు ఈ ప్రాంతం పరిధిలో మిళితమై ఉన్నాయి. జహీరాబాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాలకు కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గానికి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాల్లో కన్నడ భాష మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. దీంతో జుక్కల్లో మరాఠీ భాషను మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మరాఠీ భాష పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కరీంనగర్ యాసతో కూడిన భాషను మాట్లాడతారు. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడే కోస్తాంధ్రా వారూ ఉన్నారు. ఆచారాలు అనేకం.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, లింగాల మండలాల్లో గిరిజనులు అధికం. ఆయా మండలాల్లో లంబాడీ భాషను అధికంగా మాట్లాడతారు. గాంధారిలో మథురాల తెగ కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి ఎక్కువ. అంతేకాక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా లింగాయత్ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో బసవేశ్వరుడి ఆచార వ్యవహారాలు అధికంగా ఉంటాయి. ముస్లిం మైనార్టీలు సైతం జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో చెరకు, వరి, అల్లం, ఆలుగడ్డ, జొన్న, కంది, మినుము, పెసర, పత్తి, గోధుమ తదితర పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. జీవన వైవిధ్యం.. జహీరాబాద్, నారాయణ్ఖేడ్ ప్రాంతాల్లో తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆచార వ్యవహారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కట్టూబొట్టూ దగ్గరి నుంచి సంస్కృతీ సంప్రదాయాల వరకు అన్నింటా ఇక్కడ జీవన వైవిధ్యం కనిపిస్తుంది. జహీరాబాద్ లోక్సభ స్థానం 2008లో ఆవిర్భవించింది. దీనికి ముందు జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్ నియోజకవర్గాలు మెదక్ లోక్సభ పరిధిలో ఉండేవి. జహీరాబాద్ లోక్సభ ఆవిర్భావంతో జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్తో పాటుగా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్ ప్రాంతంపై బీదర్ ప్రభావమూ ఎక్కువ ఉంటుంది. జహీరాబాద్, నారాయణ్ఖేడ్ ప్రాంతాల వారు ఎక్కువగా పనులపై కర్ణాటక, మహారాష్ట్రలోని పట్టణాలకే వెళ్లి వస్తుంటారు. నారాయణ్ఖేడ్లో మహారాష్ట్ర సంప్రదాయాలు అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ గల పండరి భక్తులు వేల మంది ఏటా పండరినాథుని దర్శనానికి కాలినడకన ‘దండుయాత్ర’గా మహారాష్ట్రలో గల పండరి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆధ్యాత్మిక పాలు కూడా ఈ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువ. నిత్యం సప్తాహాలు, భజనలు వంటివి జరుగుతుంటాయి. ఇక్కడ కనిపించే ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు తలపై టోపీలతో మహారాష్ట్ర ఆచార వ్యవహారాలను తలపిస్తారు....::: దివాకర్ రెడ్డి కొలన్, సంగారెడ్డి -
రియల్ జోరు
సాక్షి, జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ‘రియల్’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది. పట్టణానికి హైదరాబాద్ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మహీంద్ర అండ్ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు. రియల్ వ్యాపారంపై ఆసక్తి వ్యాపారులు జహీరాబాద్ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్– హైదరాబాద్, జహీరాబాద్–బీదర్, జహీరాబాద్ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నిబంధనలు ఇలా.. పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు. సంబంధిత భూ యజమాని వెంచర్ కోసం 40 ఫీట్స్తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్ యార్డు, అంగన్వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే.. జహీరాబాద్ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్– హైదరాబాద్ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
13న నిజాంసాగర్కు కేటీఆర్ రాక
నిజాంసాగర్: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 13న నిజాంసాగర్ మండలానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేటీఆర్ రాక, సభ నిర్వహణకు గాను సోమవారం నిజాంసాగర్ మండలం మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్బంగా అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్షిండే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తనయుడు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల నుంచి 20వేల మంది ముఖ్యనేతలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మొట్టమొదటిసారిగా జహీరాబాద్ పార్ల మెంట్ నియోజకవర్గ సమావేశాన్ని నిజాంసాగర్ మండలంలో నిర్వహించడం అదృష్టమన్నారు. జహీరాబాద్ పార్లమెంట్తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, అసెంబ్లీ స్పీకర్ తనయుడు సురేందర్రెడ్డి, ఎంపీ పాటిల్, జిల్లా ప్రతినిధులు శంకర్ పటేల్, గంగాదర్, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి మండల టీఆర్ఎస్ నాయకులు గైని విఠల్, దుర్గారెడ్డి, కమ్మరికత్త అంజయ్య, రమేష్గౌడ్, పీరని సాయిలు, వాజిద్ అలీ, మహేందర్, ఇప్తాకర్, కాంత్రెడ్డి, చింతకింది రాములు తదితరులు ఉన్నారు. నేడు మంత్రి ప్రశాంత్రెడ్డి రాక.. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం నిజాంసాగర్ మండలానికి రానున్నట్లు ప్యానల్ స్పీకర్ హన్మంత్షిండే తెలిపారు. ఈ నెల 13న కేటీఆర్ రానుండటంతో మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని, ఇక్కడి ఏర్పాట్లను మంత్రి పరిశీలిస్తారన్నారు. మధ్యాహ్నం రెండున్న రకు మంత్రి రానుండటంతో మంత్రి పర్యటనకు నాయకులు తరలిరావాలని ఆయన సూచించారు. -
ఎంపీ టికెట్టు సిట్టింగ్కేనా?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీల్లో అభ్యర్థిత్వాలపై కసరత్తు సాగుతోంది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈనెల 13న జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్న దానిపై క్యాడర్లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలోలాగే సిట్టింగ్ ఎంపీలకే తిరిగి టికెట్లు ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, కామారెడ్డి: పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. లోక్సభ నియోజక వర్గాల వారీగా సన్నాహక సభలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న జహీరాబాద్ నియోజక వర్గ సభను నిజాంసాగర్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఎంపీ టికెట్టు ఎవరికి అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బీబీ పాటిల్ విజయం సాధించారు. తిరిగి పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. అయి తే బీబీ పాటిల్ను వ్యతిరేఖిస్తున్న కొందరు నేతలు తెరపైకి పలువురి పేర్లను తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్న పాటిల్కే టికెట్టు వస్తుందని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే టికెట్టు ఖరారు అయ్యిందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీం దర్రెడ్డి ఎంపీ టికెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఎంపీ పాటిల్కు ఒకరిద్దరు తప్ప మిగతా వారితో అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం ప్రచారంలో ఉంది. దీంతో అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. సన్నాహక సభతో స్పష్టత! జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఈనెల 13న నిజాంసాగర్ ప్రాజెక్టుకు సమీపంలోని మాగి వద్ద టీఆర్ఎస్ సన్నాహక సభ నిర్వహించనున్నారు. ఈ సభతో ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నా రు. పార్లమెంట్ ఎన్నికల టీం లీడర్గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయన స్పష్టత ఇస్తా రని పార్టీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ను కలిసన పాటిల్ సీఎం కేసీఆర్ను ఇటీవల ఎంపీ బీబీ పాటిల్ కలిశారని, ఈ సందర్భంగా ఎంపీ టికెట్టుపై సీఎంనుంచి భరోసా లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఎల్లారెడ్డిలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎమ్మె ల్యే ఓటమి చెందినప్పటికీ అక్కడ టీఆర్ఎస్ బలం గానే ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణ్ఖేడ్, జహీరాబాద్, ఆంధోల్ నియోజక వర్గాల్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు సులువవుతుందని ఎంపీ పాటి ల్ అనుచరులు చెబుతున్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఆయన విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు -
ఆ హక్కు కేసీఆర్, హరీష్కు ఎవరిచ్చారు
సాక్షి, సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్కు తీసుకుపోయే హక్కు కేసీఆర్కు, హరీష్కు ఎవరిచ్చారని శాసన మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..వర్షాలు లేటైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకోవాలన్న రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్ అలీ తప్పుపట్టారు. రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు, రీ నోటిఫికేషన్లు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదని, రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల కంటే భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్తోమత ఉన్న రైతులకు, సాగు చేయని భూస్వాములకు లబ్ది జరిగితే ఫలితం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రానికి మంజూరైన నిధులను కూడా దారి మళ్లించారని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. -
మున్సిపల్ కౌన్సిలర్ బూతు పురాణం
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు అభివృద్ధి పనుల్లో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కు నడుమ జరిగిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మున్సిపల్ ఇంజనీర్పై కౌన్సిలర్ బూతు పురాణానికి దిగిన ఘటన 4 రోజుల క్రితం జరగ్గా, మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసింది. కౌన్సిలర్ తీరుపై మున్సిపల్ ఉద్యోగులు ఆందోళనకు దిగగా, సదరు కౌన్సిలర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. జహీరాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టరుతో ఒప్పందం కుదిరినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ రాములు ఈ నెల 5న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ అవినాశ్రెడ్డికి ఫోన్ చేశారు. పనులు ఎందుకు ప్రారంభించడం లేదని కౌన్సిలర్ రాములు ప్రశ్నించగా, 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కాంట్రాక్టు పొందిన వ్యక్తులు చెప్పారని ఏఈ సమాధానం ఇచ్చారు. దీంతో ఫోన్ సంభాషణ గాడి తప్పి.. కౌన్సిలర్ రాములు బూతు పురాణం ఎత్తుకున్నారు. పత్రికలో రాయలేని భాషలో ఏఈని దుర్భాషలాడారు. ‘చేతనైతే పనులు చేయండి. లేదంటే వెళ్లిపోండి. ఆర్అండ్బీకి సంబంధించిన బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని’గద్దించారు. పనితీరు నచ్చక పోతే కమిషనర్కు ఫిర్యాదు చేయాలని ఏఈ చెప్పినా, బూతు పురాణం ఆపలేదు. ఈ వ్యవహారంపై ఏఈ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జైత్రాంకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్పై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనివ్వగా, పనులు ప్రారంభం కాకపోవడంతో వార్డు ప్రజల నుంచి ఒత్తిడితోనే సహనం కోల్పోయానని కౌన్సిలర్ అన్నారు. -
మరుగుదొడ్డి గుంతలో పడి యువకుడి మృతి
జహీరాబాద్ టౌన్: మరగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందినట్లు జహీరాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ (24) బంధువుల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. బంధువుల ఇంటిలో పెళ్లి ఉండగా మృతుడు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగి పనులు చేస్తున్న సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి పరిసర ప్రాంతం చీకటిగా ఉండడంతో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతను గమనించక అందులో పడిపోయాడు. తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఫరిదొద్దీన్ విషయం తెలుసుకుని జహీరాబాద్ ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పొలం డబ్బుల వివాదంతోనే హత్య
జహీరాబాద్ : మండలంలోని దిడిగి గ్రామంలో మ్యాతరి పుణ్యమ్మ(47) హత్యకు గురైన కేసులో ఆదివారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ నాగరాజు కథనం మేరకు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని స్థితిలో హత్యకు గురైన పుణ్యమ్మ మృతదేహం ఈ నెల 9న ఆమె సొంత చెరుకు తోటలో లభ్యమైంది. దీంతో కుమార్తె జయశీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 7న పుణ్యమ్మ కనిపించకుండా పోయింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం.డి.రజాక్(35)ను నిందితుడిగా గుర్తించారు. రజాక్ పుణ్యమ్మ పొలాన్ని సగం వాటా కింద సాగు చేస్తున్నాడు. పొలంలో పండించిన ఆలుగడ్డ పంట విక్రయించగా వచ్చిన రూ.50వేలలో సగం వాటా రజాక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై ఎన్ని మార్లు అడిగినా ఆమె రజాక్కు డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలో 7న మధ్యాహ్నం పుణ్యమ్మ, రజాక్లు పొలం వద్ద ఉన్నారు. ఇంతలోనే చింతకాయల వ్యాపారి జిలానీ అక్కడకు వెళ్లి చింతచెట్టు లీజు డబ్బులు రూ.5వేలు పుణ్యవతికి ఇచ్చి వెళ్లాడు. అప్పుడు ఆమె ఆ డబ్బులను దగ్గర పెట్టుకోమని రజాక్ చేతికి ఇచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని పుణ్యమ్మ రజాక్ను కోరింది. తనకు ఆలుగడ్డల డబ్బులు రావాల్సి ఉంది, అందుకే ఈ డబ్బులు ఇవ్వనని రజాక్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రజాక్ తన చేతిలో ఉన్న గొడ్డలితో పుణ్యమ్మపై దాడి చేసి నరికి హత్యకు పాల్పడినట్లు సీఐ వివరించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలితోపాటు రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దిడిగి గ్రామ క్రాస్రోడ్డు వద్ద గల ఓ హోటల్లో ఉన్న నిందితుడు రజాక్ను పట్టణ ఎస్ఐ ప్రభాకర్రావుతో కలిసి వెళ్లి పట్టుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడన్నారు. హత్య కేసును ఛేదించినందుకు పోలీసు సిబ్బంది వెంకటేశం, అమర్నాథ్రెడ్డి, సురేందర్, శ్రీనివాస్, జైపాల్రెడ్డి, సామెల్ల పేర్లను రివార్డు కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య
జహీరాబాద్: విదేశాల నుంచి ఫోన్లో భర్త బెదిరింపులతో పాటు ఇంట్లో అత్త, మామలు పెట్టే బాధలను భరించలేక మంజుల(36) అనే వివాహిత సోమవారం రాత్రి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ప్రభాకర్రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన కుల్కర్ణి సురేందర్ కుమార్తె మంజులకు ఇబ్రహీం పట్నానికి చెందిన శేషవర్ధన్తో 18 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భర్త ఉద్యోగం నిమిత్తం కెనడా వెళ్లాడు. దీంతో మంజుల అత్త శ్రీదేవి, మామ రాఘవరావులతో కలిసి ఉండేది. దీంతో అత్త, మామలు ప్రతినిత్యం వేధింపులకు గురి చేసేవారు. భర్త సైతం ఫోనులో దూషిస్తూ మానసికంగా వేధించేవాడు. విషయం తెలుసుకున్న తండ్రి తన కుమార్తెను పెళ్లి అయిన ఏడు నెలలకే తన దగ్గరకు తీసుకెళ్లాడు. భర్త తరచూ ఫోన్చేసి భార్యను బెదిరిస్తూ వేధించేవాడు. ఆరు నెలల క్రితం అత్త, మామలు, పెద్ద మనుషులు జహీరాబాద్ వచ్చి పంచాయతీ నిర్వహించారు. ఈ మేరకు భార్యా భర్తలు ఇరువురు విడాకులు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. జహీరాబాద్ కోర్టులో విడాకుల కోసం మంజుల పిటిషన్ వేసింది. ఈ కేసు పెండింగ్లో ఉంది. జీవితంపై విరక్తి చెందిన మంజుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. కుటుంబ సభ్యులంతా దైవ దర్శనం కోసం ఝరాసంగం ఆలయానికి వెళ్లారు. ఇంట్లో మంజుల ఒక్కతే ఉంది. రాత్రి ఇంట్లో నుంచి పొగలు రావడం చూసిన చుట్టుపక్కల వారు సురేందర్ కుల్కర్ణికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో అతడు ఇంటికి వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా కుమార్తె మంజుల ఆత్మహత్య చేసుకుని ఉంది. అనంతరం సీఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
నా భర్త సంసారానికి పనికిరాడు
-
మా ఆయన అదో టైపు
-
మా ఆయన చాలా ‘తేడా’
సాక్షి, సైదాబాద్: సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్కు చెందిన అంకుష్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి మానేశారు. అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్పై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూయార్క్ సదస్సులో జహీరాబాద్ కుర్రోడు
జహీరాబాద్: తెలంగాణ బిడ్డ సాయిప్రణీత్రెడ్డి న్యూయార్క్ సదస్సులో ప్రసంగించారు. ఈ నెల 9 నుంచి 12 వరకు న్యూయార్క్లో నిర్వహించిన ‘సమ్మర్ యూత్ అసెంబ్లీ– 2017’ సదస్సులో మన దేశం తరఫున పాల్గొని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ప్రస్తావించారు. యువతలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని తెలిపారు. పేదరికం ఉత్తమ విద్యార్జనకు అడ్డు కాకూడదని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చివరి రోజున జరిగిన సదస్సులో సాయిప్రణీత్రెడ్డి భారత దేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని తన ప్రసంగంలో చాటి చెప్పారు. దేశ, రాష్ట్ర సంస్కృతిని చాటే చేనేత వస్త్రాలను ధరించి హాజరయ్యాడు. సదస్సులో భాగంగా పలువురు ప్రముఖులను ఆయన కలుసుకున్నాడు. సాయిప్రణీత్రెడ్డి కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన వాడు. -
జహీరాబాద్లో కార్డెన్ సెర్చ్
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్లోని భరత్నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ తనిఖ్లీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలతో పాటు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. -
రిపోర్టుల్లో దాగిన మిస్టరీ
దివ్య కేసు దర్యాప్తులో తీవ్రజాప్యం 100 రోజులు దాటినా కొలిక్కి రాని వ్యవహారం ఆందోళన చెందుతున్న మృతురాలి తల్లిదండ్రులు కోహీర్: జహీరాబాద్ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని దివ్య మరణం మిస్టరీ 100 రోజులు దాటినా వీడలేదు. కేసు విచారిస్తున్న రైల్వే పోలీసులు రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. హత్యగా భావిస్తున్న తల్లిదండ్రులు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీకి వెళ్లి మృతి కోహీర్ మండలం మద్రి గ్రామానికి చెందిన దివ్య జూన్ 30 తేదిన కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తర్వాత రోజు ఉదయం మద్రి శివారులో రైలుపట్టాలపై దివ్య శవం పడిఉంది. విషయం తెలుసుకొన్న విద్యార్థి, మహిళా సంఘాలు దివ్య మరణం ముమ్మాటికీ హత్యేనని, దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. అధికారులకు వినతిపత్రాలు సైతం అందించారు. దివ్య తల్లిదండ్రులు ఎస్పీని కలిసి.. ఆమె మరణంపై పలు అనుమాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తె చదువులో చురుకైందని, ఎస్సెస్సీలో స్కూల్ ఫస్టు వచ్చిందని, ఎంతో ధైర్యవంతురాలని.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రించడానికి రైలుపట్టాలపై పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసును సివిల్ పోలీసులకు అప్పగించి, దర్యాప్తు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దివ్య జూన్ 30 తేది రాత్రి 8.20 గంటల వరకు జహీరాబాద్లో ఉన్నట్లు ప్రత్యక్షసాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది. రోడ్డు మరమ్మతుల కారణంగా జహీరాబాద్– కోటమర్పల్లి వయా మద్రి, గురుజువాడ బస్సు రద్దు చేశారు. దీంతో రాత్రి సమయంలో దివ్య జహీరాబాద్ నుంచి మద్రికి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. బహుశా తెలిసిన వ్యక్తుల వెంట వచ్చి మోసపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఎవరితో వచ్చిందో తెలిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైలు పట్టాలపై శవం లభించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను, స్థానికంగా కొందరిని విచారించారు. అయితే, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలంటే పోస్టుమార్టం నివేదికలు తప్పనిసరి అవసరమని రైల్వే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
సర్పంచ్ స్థాయి నుంచి.. ఎమ్మెల్సీ స్థాయికి..
అంచెలంచెలుగా ఎదిగిన ఫరీదుద్దీన్ జహీరాబాద్: మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ గురువారం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపంసహరణ గడువు ముగియడంతో ఒకే ఒక నామినేషన్ దాఖలైనందున ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రం అందజేశారు. జహీరాబాద్కు చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ పేరును ముందస్తుగానే ఎమ్మెల్సీ పదవికి టీఆర్ఎస్ అధిష్టాన వర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్ స్థాయి నుంచి జహీరాబాద్ మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన ఫరీదుద్దీన్ గ్రామ సర్పంచ్ పదవి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985 నుంచి 1990 సంవత్సరం వరకు సర్పంచ్గా, ఎంపీపీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1990 నుంచి 1999 వరకు జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1990 నుంచి 1995 వరకు ఇప్పపల్లి ఏపీసీఎస్ ఛైర్మన్గా పని చేశారు. 1999 సంవత్సరంలో మొదటి సారిగా జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఫరీదుద్దీన్కే ఎమ్మెల్యే టికెట్ను కేటాయించగా గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో స్థానం పొందారు. మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ, ఫిషరీస్, సహకార శాఖల మంత్రిగా పని చేశారు. ప్రముఖుల శుభాకాంక్షలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్కు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ రాష్ర్ట కార్యదర్శి దేవేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్, మాజీ జడ్పీటీసీ ఆర్.అరవిందరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వైజ్యనాథ్, జి.విజయకుమార్, పాండురంగారెడ్డి, షేక్ ఫరీద్లతో పాటు పలువురు హైదరాబాద్లో ఫరీదుద్దీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్లో సంబరాలు ఫరీదుద్దీన్ స్వస్థలమైన జహీరాబాద్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం పార్టీ నాయకులు పట్టణంలోని భవానీ మందిర్ క్రాస్ రోడ్డు వద్ద బణ సంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సంబరాల్లో మున్సిపల్ మాజీ ఛైర్మన్ అల్లాడి నర్సింహులు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. -
బలహీన వర్గాల అణిచివేతకు ప్రభుత్వ కుట్ర
బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట కార్యదర్శి జగన్ జహీరాబాద్ టౌన్: రాష్ర్ట ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు కుట్రపన్నుతోందని బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొండాపూర్ జగన్ ఆరోపించారు. బుధవారం ఆయన జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను విలీనం చేయాలని, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను ఒకే గొడుగు కిందని తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పొద్దుటూరి శ్రీనివాస్గుప్తా, మున్సిపల్ సెల్ కన్వీనర్ సుధీర్బండారీ, ఐటీ సెల్ కన్వీనర్ ఆశోక్బెల్కేరి తదితరులు పాల్గొన్నారు. -
గోరు చిక్కుడు.. లాభాలు బోలెడు
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి జహీరాబాద్ ప్రాంతంలో అనువైన నేలలు ఏడీఏ వినోద్కుమార్ జహీరాబాద్ టౌన్: తక్కవ పెట్టుబడితో ఆదాయనిచ్చే పంటల్లో గోరుచిక్కుడు ఒకటి. జహీరాబాద్ ప్రాంతం నేలలు అనుకూలం కావడంతో ఇక్కడి రైతులు ప్రతి సంవత్సరం గోరు చిక్కడు పండిస్తారు. ఖరీప్ సీజన్ చివరి వరకు పంట సాగుచేసుకోవచ్చు. ఖరీఫ్, వేసవి పంటలకు గోరుచిక్కుడు అనుకూలం. మురుగునీరు పోయే సౌకర్యం కలిగిన సారవంతమైన నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. గొరు చిక్కుడు సాగు యాజమాన్య పద్ధతులను జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్కుమార్ (7288894426)వివరించారు. పూసా నవబహర్, పూసా మౌసమి అనువైన రకాలు. పూసా నవబహార్ రకం ఖరీఫ్, వేసవి పంటలకు అనువైనవి. కొమ్మలు లేకుండా ఉంటాయి. విత్తనాలు ,కాయలు పూసా మౌసమిలా ఉంటాయి. ఈ రకం విత్తనాలు ఖరీఫ్ సీజన్ ఆఖరి వరకు సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 12-18 కిలోల వరకు విత్తనం అవసరం. విత్తేముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పొలంలో మొదిటిసారి విత్తుతే రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించాలి విత్తనాకి విత్తనానికి 60/15 దూరం చూసుకోవాలి. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను సగం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగం ఎరువులను 30-40 రోజులకు వేయాలి. పైసా మౌసమి రకం ఖరీఫకు అనుకూలం. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది. పంటలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. పొలంలో గింజలు విత్తగానే మూడు రోజులకు నీర పారించాలి. తర్వాత వారం రోజులకు ఓ సారి నీటి తడులు ఇవ్వాలి లేత కాయలు కోసి మార్కెట్కు పంపాలి. కాయ ముదురు కాకుండా చూడాలి. ముదరవుతే పీచు శాతం అధికమై నాణ్యత తగ్గుతుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గోరు చిక్కుడు అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు పసుపు, మిరప, బెండ తదితర పంటల్లో వేయవచ్చు -
సెమీఫైనల్కు చేరిన జంటనగరాల జట్లు
జహీరాబాద్: స్థానిక బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్లో స్టుడెంట్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 అంతర్ జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్లో జంటనగరాలకు చెందిన జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారం లీగ్, నాకౌట్ దశలో జరిగిన పోటీల అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జట్లతో పాటు వరంగల్, మహబూబ్నగర్ జిల్లా జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. సోమవారం జరిగనున్న సెమీ ఫైనల్ పోటీల్లో రంగారెడ్డి జట్టుతో మహబూబ్నగర్ జట్టు, హైదరాబాద్ జట్టుతో వరంగల్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఫైనల్ పోటీ నిర్వహిస్తారు. లీగ్ పోటీల నుంచి ఫైనల్ పోటీల వరకు ఆయా జిల్లాల క్రీడాకారులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. టోర్నమెంట్ను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫెడ్రిక్, అబ్జర్వర్ రవికుమార్లు పర్యవేక్షించారు. పీడీలుగా గోపిసింగ్, మచ్చేందర్, ధన్రాజ్, అజిమొద్దీన్లు వ్యవహరించారు. -
ఆవుపై నుంచి దూసుకెళ్లిన లారీ
కాలికి తీవ్రగాయం జహీరాబాద్ టౌన్: పట్టణంలోని రహదారిపై సేదతీరుతున్న ఆవు కాలిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కొందరు పశువైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి చికిత్స చేశారు. పట్టణంలోని మోర్ ముందు జాతీయ రహదారిపై కొన్ని ఆవులు సోమవారం సేదతీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబాయి వైపు వెళ్లుతున్న ఓ లారీ చక్రాలు ఆవు కాలిపై నుంచి వెళ్లడంతో గాయపడింది. దీంతో ఆవు కాలినుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కొందరు పశువైద్యాధికారులకు సమాచారమిచ్చారు. పశువైద్యాధికారులతో పాటు బీజేపీ నాయకులు పూల సంతోష్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆవుకు చికిత్స నిర్వహించారు. -
‘నారింజ’కు భారీగా వరదనీరు
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో బుధవారం మోస్తారుగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జహీరాబాద్ మండలంలో 2.6 సెం.మీ, కోహీర్ మండలంలో 3.6 సెం.మీ, ఝరాసంగం మండలంలో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకే జహీరాబాద్ సమీపంలో గల నారింజ ప్రాజెక్టులోకి సామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు షటర్ల పైనుంచి కొద్ది మేర నీరు బయటకు పోయింది.మంగళవారం రాత్రి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో కురిసిన వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి తిరిగి కొంత నీరు వచ్చి చేరింది. వచ్చి చేరిన నీరు ప్రాజెక్టు గేటు షటర్ల పైనుంచి ప్రవహిస్తుంది. సుమారు రెండు అంచుల మేర నీరు బయటకు పోతుంది. మయటకు పోతున్న నీరు నారింజ జలం కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి పోయింది. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాభావంతో నారింజ ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో సామర్థ్యం మేరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతం నుంచి నారింజ జలాలు కర్ణాటక ప్రాంతంలోకి పోతుండడంతో అ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కూడా గతంలో కురిసిన వర్షాలకు సామర్థ్యం మేర నీటితో నిండింది. దీంతో అదనపు నీరు కర్ణాటకకు పోతుంది. -
అల్లం.. సస్యరక్షణతో మేలు
- తెగులు నివారిస్తే అధిక దిగుబడి - ఎనిమిది నెలల పంట - పెట్టుబడి అధికం - ఏడీఏ వినోద్కుమార్ సలహాలు, సూచనలు జహీరాబాద్ ప్రాంతంలో రైతులు అల్లం పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సారవంతమైన ఎర్ర నేలల్లో అల్లం దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్ల రేగడిలోనూ పండుతుంది. ఎనిమిది నెలలకు చేతి కొచ్చే ఈ పంట సాగుకు ఖర్చు అధికం. దిగుబడి కూడా అంతేస్థాయిలో ఉండడంతో రైతులు అల్లం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్కుమార్ (సెల్: 72888 24499) తెలిపారు. - జహీరాబాద్ టౌన్ విత్తన రకాలు: - అల్లంలో మారన్, మెదక్, సుపభ్ర, సురచి, సురభి, వైనాడ్, నదియా వంటి రకాలున్నాయి. - జహీరాబాద్ ప్రాంత నేలలకు మారన్ రకం అనుకూలం. - ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి. - విత్తనం పొడుగు 4.5 సె.మీ., 30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులండాలి. - 500 గ్రాముల ఎం 45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి. - విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజులపాటు ఆరబెట్టాలి. - ఎకరానికి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. సాగు విధానం: - సారవంతమైన ఎర్ర, నల్ల రేగడి నేలలు అల్లం సాగుకు అనుకూలం. - పొలాన్ని లోతువరకు దున్ని దుక్కిచేసుకోవాలి. - ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ) ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్ సూపర్ ఫాస్పేట్ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్ కలిపి తయారు చేసిన బెడ్పై వేయాలి. - బెడ్ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి. - క్రమం తప్పకుండా నీటి తడులు పెడుతుండాలి. - డ్రిప్ విధానం చాలా మంచిది. యాజమాన్య పద్ధతులు: - విత్తనం నాటిన 25-40 రోజుల మధ్య 3 కిలోల అమోనియా సల్ఫేట్, 0.5 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్లను కలిపి డ్రిప్ పైపుల ద్వారా నీటిలో వదలాలి. - 40-100 రోజుల వ్యవధిలో 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్ కలిపి రెండు నెలల పాటు పంటకు అందించాలి. - 100-150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్ 1 కి.గ్రా, మ్యారిట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. - 150-180 రోజుల మధ్య మ్యారిట్ ఆఫ్ పొటాష్ ఒక గ్రాము వేయాలి. తెగులు నివారణ: రైజోమ్వాట్: ఈ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్ ఎక్సిల్ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైజోమాప్లే: ఈ తెగులు సోకితే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరేడ్ గ్రానివల్స్ను వేయాలి. లీఫ్ బైట్: ఈ తెగుల కారణంగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్డిజమ్ కిలోను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అల్లం పంటలో అంతర పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవచ్చు. మామిడి తోటల్లో కూడా అల్లం పంటను సాగుచేసుకోవచ్చు. -
వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండపాల్లో కొలువైన గణనాథుడికి భక్తులు పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే అన్నదానాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు. -
వేధిస్తున్నాడనే హత్య
వీడిన కేసు మిస్టరీ ఐదుగురు నిందితుల రిమాండ్ సీఐ నాగరాజు వెల్లడి జహీరాబాద్ టౌన్: వేధింపులను భరించలేకే కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని హతమార్చారు. వివాహేతర బంధాన్ని నిలిపివేయాలని చెప్పినా వినకపోవడంతో సదరు వ్యక్తులు అంతమొందించినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు మంగళవారం రిమాండ్కు పంపారు. జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.నాగరాజు వెల్లడించిన హత్య కేసు వివరాలు ఇలా... మండలంలోని మన్నాపూర్కు చెందిన వెంకటవిజయ్ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటూ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పట్టణంలోని బాగారెడ్డి పల్లికి చెందిన బుజ్జమ్మను భర్త వదిలేయడంతో ఆమెతో వెంకట్విజయ్ వివాహేతర సంబధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బుజ్జమ్మ సోదరులు అక్కను మందలించారు. దీంతో ఆమె వెంకట్విజయ్తో కొంతకాలంగా దూరంగా ఉంటుంది. వెంకట్విజయ్ అప్పుడప్పుడు తాగి ఆమె ఇంటికి వచ్చి అల్లరిచేస్తుండగా మందలించి పంపించేవారు. ఈ క్రమంలో వెంకట్విజయ్ ఈనెల 2వ తేదీ రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. బుజ్జమ్మ ఆమె తమ్ముళ్లు శ్రీనివాస్, కుమార్, అరుణ్కుమార్తో పాటు బేగరి సురేష్, గడికి చెందిన చిలపల్లి అరుణ్కుమార్లు ఇంటి వద్ద రాత్రంతా చితకబాదారు. మరుసటి రోజు పట్టణ సమీపంలోని రాంనగర్ ప్రాంతంలో గల దాల్మిల్ వద్ద గల అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లారు. అక్కడే మద్యం తాగి కర్రలతో వెంకట్విజయ్ను చితకబాది హత్య చేశారని సీఐ తెలిపారు. శవంపై చెట్టు కొమ్మలు వేసి పరారైనట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశామన్నారు. అయితే సురేష్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. -
బ్రదర్స్ ట్రస్ట్ తో జహీరాబాద్లో నయ మోసం
-
బీజేపీ తిరంగయాత్ర
జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి గ్రామంలో బీజేపీ నాయకులు తిరంగ యాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పండరి ఆధ్వర్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బసవేశ్వరుడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలే వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా, జిల్లా మున్సిపల్ సెల్ కన్వీనర్ సుధీర్ బండారీ, నాయకులు విశ్వనాత్ యాదవ్, ప్రభాకర్రెడ్డి, అల్లాడి బక్కయ్య గుప్తా, వేణు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్.. దేవీసింగ్
డ్రాపౌట్ లేని గిరిజన బడి హరిత వనంలా పాఠశాల.. విద్యార్థుల్లో క్రమశిక్షణ హెచ్ఎం కృషి ఫలితం.. జహీరాబాద్ టౌన్:చుట్టూ పచ్చని మొక్కలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఉపాధ్యాయుల అంకిత భావం.. గిరిజన విద్యార్థుల్లో క్రమశిక్షణ.. అంతా కలగలిపి.. రాయిపల్లి(డి) తండా బడి..ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృషితో పాఠశాల ప్రగతి వైపు పయనిస్తోంది. జహీరాబాద్ మండలంలో 20కి పైగా గిరిజన తండాలున్నాయి. చాలా వరకు బడులన్నీ మొక్కుబడిగా నడుస్తున్నాయి. హెచ్ఎం. దేవిసింగ్ కృషి వల్ల రాయిపల్లి(డి) పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. వెయ్యి జనాభా ఉన్న ఈ తండాలో ఒకటి నుంచి 5 వరకు తరగతులు ఉన్నాయి. హెచ్ఎంగా దేవీసింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత రూపురేఖలు మారాయి. పాఠశాలలో 60 మంది వరకు విద్యార్థులు ఉంటే ఇంటింటికెళ్లి డ్రాప్ అవుట్లను గుర్తించి వారిని బడిలో చేర్పించారు. ప్రస్థుతం విద్యార్థుల సంఖ్య 112కు చేరింది. ఇప్పడు తండాలో డ్రాప్అవుట్ పిల్లలు లేకపొవడం గమన్హరం. శుభ్రత కోసం వారానికి రెండు సార్లు పాఠశాల ఆవరణలో కల్లాపి చల్లుతారు. తరగతులను చక్కగా నిర్వహిస్తూ క్రమశిక్షణలో విద్యార్థులు నడుచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ప్రార్థన చేయిస్తారు. నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. బోరు చెడిపొతే వెంటనే సొంత డబ్బుతో మరమ్మతులు చేయించి నీటి సమస్య రాకుండా చూసుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో పండ్లు, కూరగాయాలు, ఇతర మొక్కలను పెంచుతూ హరిత హారంగా మార్చారు. బాల బాలికలకు వేరు వేరుగా మరుగుదొడ్ల ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణ కోసం ఆయాను నియమించారు. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నారు. పాఠశాల గోడలకు మహాత్ముల బొమ్మలను పెయింటింగ్ చేయించారు. రూ.60 వేల ఖర్చుతో హెచ్ఎం పాఠశాల అభివృద్ధి కోసం పలు రకాల పనులను చేయించి తండా వాసులతో శభాష్ అనిపించుకుంటున్నారు. అందిరి సహకారంతో... పాఠశాల ఉపాధ్యాయులు, తండావాసుల సహకారంతో పాఠశాలను ప్రగతి పథం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా. తాను పదవీ బాధ్యతలు తీసుకోక ముందు తరగతి గదుల్లో మందుబాటిళ్లు, చెత్త చెదారం, పశువుల నిలయంగా ఉండేది. అందరి కృషితో హరిత క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నా. పలు శాఖల అధికారులు పాఠశాలను సందర్శించి అభినందిచడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.సదుపాయలతో పాటు విద్యాప్రమాణాలు పెంచేందుకు తన వంతు కృషి చేస్తా. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందన అదనపు తరగతి అవసరం ఉంది. -
8న జాతీయ లోక్ అదాలత్
జహీరాబాద్: ఈనెల 8వ తేదిన జిల్లా జడ్జి ఎం.వి.రమణనాయుడు ఆధ్వర్యంలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించడం జరుగుతుందని జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజి స్రే్ట్ డి.దుర్గప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ఆదాలత్ను జహీరాబాద్ కోర్టు యందు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
చినుకు పడితే చెరువే!
సక్రమంగా లేని డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లపై ప్రవహిస్తోన్న మురుగు పట్టించుకోని అధికారులు ఇబ్బందులుపడుతున్న ప్రజలు జహీరాబాద్ టౌన్: దశాబ్దాల క్రితం నిర్మించి మురికి కాల్వల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. అంతేకాకుండా వ్యాపారులు కూడా మురికి కాల్వలపై శ్లాబులు వేయడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేకపోవతున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు శీతకన్నువేయడంతో మురికినీటిలో ప్రజలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజలసమస్యను పరష్కరించాల్సిన అవసరం ఉంది. కొద్దిపాటి వర్షానికి జహీరాబాద్ పట్టణంలోని పలు రోడ్లు జలమయం అవుతున్నాయి. పట్టణంలోని బ్లాక్ రోడ్డు. సుభాష్గంజ్, బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు ఇలా ఏ దారి చూసినా వర్షం కురిస్తే చెరువులను తలిపిస్తాయి. నిత్యం జనసమ్మర్దంగా ఉండే ప్రధాన రోడ్లు జలమయం అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలయమం అవుతున్న రోడ్లలో ప్రధానంగా బ్లాక్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వర్షం కురిస్తే అటు వర్షపునీరు ఇటు మురికినీటితో నిండిపోతోంది. గత్యంతరం లేని పరిస్థితిలో స్థానికులు ఈ దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు. కాల్వల నిర్మాణం చాలినంతగా లేకపోవడంతో మురుగునీరు కాల్వలోకాకుండా రోడ్లపై ప్రవహిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు వ్యాపారులు కూడా దశాబ్దాల క్రితం నిర్మించిన కాల్వలపై శ్లాబువేయడంతో డ్రైనేజీ శుభ్రం చేయలేకపోతున్నారు. దీంతో చెత్తచెదారం నిండిపోయి మురుగు నీరు ముందకు పారడంలేదు. బ్లాక్రోడ్డులోని ఇరువైపులా ఉన్న శిథిలమైన మురికి కాల్వల స్థానంలో కొత్తవి కట్టించాలని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ కరువు జహీరాబాద్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పలు సందర్భాల్లో పాలకులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మురికి నీటితో పాటు వర్షపునీరు కూడా సాఫీగా ప్రవహిస్తుంది. నీరు రాకుండా కట్టలను కట్టాం వర్షంపడితే బ్లాక్ రోడ్డు వర్షపునీటితో నిండిపోతుంది. నీరు దుకాణాల లోపలి వరకు వస్తుంది. వాన నీరు లోపలికి రాకుండా వ్యాపారులంతా తమ తమ దుకాణాల ముందు ఎత్తుగా కట్టలను కట్టించాం. మురికి కాల్వలు సరిగ్గా లేకపొవడంతో నీరు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి. - సురేష్ , వ్యాపారి రాకపోకలకు ఆటంకం వర్షం పడితే రోడ్డు ఎటవాలుగా ఉండటంతో ఎగువ ప్రాంతంలోని నీరు బ్లాక్రోడ్డుకు చేరుతుంది. వాననీరు ముందుకు పారేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో రోడ్డులో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చాలా రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కరించలేదు. - దత్తాత్రి, జహీరాబాద్ ఫిర్యాదులు వస్తున్నాయి బ్లాక్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల ప్రజలు, వ్యాపారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నిధుల లేక డ్రైనేజీ పనులను చేపట్టడంలేదు. పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం. ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే రోడ్లపై నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకుంటాం. - జైత్రాం, మున్సిపల్ కమిషనర్ -
'బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి'
- మోదీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి - తెలుగు రాష్ట్రాల సీఎంలను డిమాండ్ చేసిన ఆర్.కృష్ణయ్య జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పుడే తగిన న్యాయం చేకూరుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం మెదక్ జిల్లా జహీరాబాద్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 70వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నా దేశంలోని 70కోట్ల మంది బీసీలకు తగిన ఫలాలు దక్కలేదన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తప్ప ఇతర రంగాల్లో కోటా దక్కడం లేదన్నారు. బీసీలకు సరైన వాటా కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని అఖిలపక్షం, బీసీ సంఘాలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలకు ఏ రంగంలో కూడా తగిన న్యాయం జరగడం లేదన్నారు. రాజకీయ రంగంలో కేవలం 12 శాతం మంది ఉన్నారన్నారు. ఉద్యోగ రంగంలో 9 శాతమే దక్కిందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్లో ఇండియన్లకు ఇస్తున్నట్లుగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను అత్యంత వెనుకబడిన కులాల వారిని నామినేట్ చేయాలని కోరారు. 90 శాతం కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. బీసీలకు పారిశ్రామిక పాలసీని ప్రకటించాలని, 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. 12 బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నా బీసీలకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు బీరయ్య యాదవ్, జి.గుండప్ప, ఎంజీ రాములు, జి.భాస్కర్, శ్రీనివాస్ ఖన్న, సుభాష్, విశ్వనాథ్ యాదవ్, రమేష్ బాబు, సుధీర్ భండారీ పాల్గొన్నారు. -
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
జహీరాబాద్: జహీరాబాద్ హనుమాన్ మందిరంలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాఘవేంద్రస్వామి 345వ జయంతిని పురస్కరించుకుని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆరాధనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయిత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో భజనలు చేశారు. రాఘవేంద్రస్వామి ఆరాధన, అభిషేకం, పూజ, మంగళహారతి జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, జహీరాబాద్ తాలూకా అధ్యక్షుడు సుభాష్ కుల్కర్ణి, సహా అధ్యక్షుడు గిరిష్ జోషి, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్జోషి, డాక్టర్ సురేష్ కులకర్ణి పాల్గొన్నారు. -
ఘనంగా ఫ్రెషర్స్ డే
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని శ్రీగాయత్రీ, మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలల్లో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినియర్ విద్యార్థులు జూనియర్స్కు ఆటపాటలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమానికి జహీరాబాద్ టౌన్ సీఐ నాగరాజు , ఎస్ఐ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుతోనే మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాయని స్వరూప, ప్రిన్సిపాల్ బి.శాంతకుమార్, కరస్పాండెంట్ విఠల్, డైరక్టర్లు ఎం.మహేష్, డి. మహేష్, డైరక్టర్లు పి.నాగరాజు, కృష్ణ, అధ్యాపకులు మహేష్, వెంకట్, సాయిబాబా, సరస్వతి, సంగీత, లక్ష్మి, కరుణ, క్రాంతి, కిష్టయ్య, అయూబ్ఖాన్, రాజు, సంతోష్ పాల్గొన్నారు. మాస్టర్ మైండ్ కళాశాలలో... పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎంపీడీఓ రాములు, జహీరాబాద్ టౌన్ సీఐ, ఎస్ఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిని చదువును నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, డైరక్టర్లు షీలా రమేష్, డాక్టర్ చంద్రశేఖర్, నారాయణరెడ్డ తదితరులు పాల్గొన్నారు. -
‘జై’హీరాబాద్
కొత్త రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదన? వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం మొగుడంపల్లి కేంద్రంగా కొత్తగా మండలం జహీరాబాద్: జహీరాబాద్ కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సాకారం కానుంది. సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించినందున అందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ కేంద్రాలనూ ప్రతిపాదించింది. జహీరాబాద్ కొత్త రెవెన్యూ డివిజన్ కిందకు నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడనున్న మొగుడంపల్లి మండలం చేరనుంది. జహీరాబాద్ పాత తాలూకా పరిధిలో ఉన్న రాయికోడ్ కూడా ఇదే డివిజన్ కిందకు రానుంది. ప్రస్తుతం ఈ మండలం ఆందోల్ నియోజకవర్గంలో ఉంది. ఇదే నియోజకవర్గంలోని మునిపల్లి మండలం కూడా జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ కేంద్రం పరిధిలో చేరనుంది. ఈ రెండు మండలాలు జహీరాబాద్ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్నాయి. దూరాభారమైన సంగారెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో పనుల నిమిత్తమై ప్రజలు సంగారెడ్డికి వెళ్లి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ మండలంలోని గుడుపల్లి గ్రామం సంగారెడ్డికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోహీర్ మండలం మనియార్పల్లి గ్రామం 65 కిలో మీటర్లు, న్యాల్కల్ మండలంలోని హుసేన్నగర్ 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవేకాకుండా అనేక గ్రామాల ప్రజలు సంగారెడ్డి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సాధన కోసం 50 రోజుల దీక్ష జహీరాబాద్ కాకుండా మరో ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ కేంద్రం తరలిపోతున్నదనే ప్రచారం నియోజకవర్గ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో అఖిల పక్షాల నేతలు దీక్షలకు పూనుకున్నారు. 48 రోజుల పాటు రిలే దీక్షలు, రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కొత్త మండల కేంద్రంగా మొగుడంపల్లి జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి గ్రామం కొత్త మండల కేంద్రంగా అవతరించనుంది. గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. జహీరాబాద్ మండలం 66 గ్రామాలతో అతి పెద్ద మండలంగా ఉన్నందున దీన్ని రెండుగా విభజించేందుకు నిర్ణయించారు. కాగా, మొగుడంపల్లి మండల కేంద్రంలో చేరేందుకు జహీరాబాద్కు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏయే గ్రామాలను కొత్త మండల కేంద్రంలో చేర్చుతారనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది. -
బొప్పాయితో లాభాలు బోలెడు
తోటల్లో సస్యరక్షణ చర్యలు, తెగుళ్లను నివారిస్తే అధిక దిగుబడులు జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో రైతులు వాణిజ్యపంటగా బొప్పాయిని పండిస్తున్నారు. బొప్పాయిని అంతరపంటతో పాటు విడిగాను పండిస్తారు. నీరు నిల్వలేని నల్ల , ఎర్రనేలలు ఇందుకు అనుకూలం. బొప్పాయికి తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. వీటి నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్ కుమార్ (7288894426) తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. బొప్పాయికి మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. నీరు నిలిచే భూముల్లో కాండం కుళ్లు ఆశిస్తుంది. నీరు నిల్వ ఉండని నల్ల గరప, ఎర్ర నేలలు అనుకూలం నేల ఉదజని సూచిక 6.5 నుంచి 8.0 వరకు ఉండాలి. పొలంలో బొదెలు తీసి నీరు వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. మొదళ్ల వద్ద నీరు ఎక్కువగా నిలిస్తే మొదలు కుళ్లు తెగులు ఆశిస్తాయి. దీంతో మొక్కలు దెబ్బతిని పసుపు రంగు మారుతాయి. తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటి చొప్పున కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. బొప్పాయి మొదళ్ల దగ్గర మట్టి ఎగదొసి డబుల్ రింగ్ పద్ధతిలో నీరు పెట్టాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఇంకా మంచిది. బొప్పాయి తొటలకు ఆకు మచ్చ తెగులు ఆశిస్తే ఆకులపై తెల్లని గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. వీటి నివారణకు2.5 గ్రాముల డైథేన్ ఎమ్-45 లీటరు నీటి చోప్పున కలిపి ఆకులు తడిసేలా పిచికారి చేయాలి. మాడు తెగులు ఆశిస్తే కార్బండజిమ్ ఒక గ్రాము లీటరు నీటి చొప్పున కలిపి చెట్టు తడిసేలా పిచికారి చేయాలి. ఎరువుల వాడకం మొక్కలు నాటేటప్పుడు పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 500 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులను మొక్కలు నాటిన రెండో నెల నుంచి 45 రోజులకు ఒక సారి ఆరు దఫాలుగా వేయాలి. మొక్క వయసును బట్టి 25 నుంచి 50 సెం. మీ దూరంలో గాడి తీసి ఎరువులను వేసి మట్టితో కప్పాలి. ఒక్కొక్క మొక్కకు ప్రతి సారి 100 గ్రాముల యూరియా, 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్.140 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. -
చెరకు.. కిరికిరి!
పంట మద్దతు ధరపై ఏటా ఇదే పరిస్థితి సకాలంలో ప్రకటించని ట్రైడెంట్ యాజమాన్యం క్రషింగ్కు సమీపిస్తున్న గడువు టన్నుకు రూ.2,600 చెల్లిస్తామంటూ లీకులు రూ.2,723 చెల్లించాలని రైతుల డిమాండ్ స్పష్టత కరువు..ఆందోళనలో రైతులు జహీరాబాద్: చెరకు మద్దతు ధర నిర్ణయంలో ఏటా ఇదే పరిస్థితి. క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా జహీరాబాద్లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం మద్దతు ధర ప్రకటించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టన్నుకు రూ.2,600 చెల్లిస్తామంటూ లీకులిచ్చింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు రైతులు. గత ఏడాదికి సంబంధించి సరఫరా చేసిన చెరకు పంటకు ఇప్పటికీ మద్దతు ధరను నిర్ణయించకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ధరలో కోత విధించడం, బకాయిలు పేరుకుపోవడం వంటి సమస్యలతో ఈ ప్రాంత రైతులు సతమతమవుతున్నారు. చెరకు మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో 8.5 చక్కెర శాతంపై కనీస మద్దతు ధరను ప్రకటించేవారు. 2010లో ఈ విధానాన్ని మార్చారు. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కింద 9.5 శాతం రికవరీపై కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. కర్మాగారంలో రికవరీ శాతం పెరిగితే దానికి అనుగుణంగా ధరను లెక్కకట్టి యాజమాన్యాలు రైతులకు చెల్లించాలి. ఇంతకన్నా తక్కువ ధరకు కొనడానికి యాజమాన్యం, ఏజెంట్లు ఒప్పందం చేసుకోరాదని క్లాస్ 3(2) చట్టం చెబుతోంది. 1961 షుగర్ కేన్ రెగ్యులేషన్ ఫర్ పర్చేజ్ అండ్ సప్లై యాక్టు ప్రకారం ఫాం 3లో రైతులతో, రైతు సంఘాలతో యాజమాన్యం చేసుకున్న చెరకు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర గాని, రైతులు చేసుకున్న ఒప్పందంలో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్ని అమలు చేయాలి. 2015-16 క్రషింగ్ సీజన్కు గాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే కర్మాగారానికి వచ్చిన రికవరీ ఆధారంగా కొనుగోలు పన్ను రూ.60 కలుపుకుని రైతులకు టన్నుకు రూ.2,723 మేర ధరను యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. ఇప్పటివరకు రైతులకు టన్నుకు రూ.2,455 మాత్రమే యాజమాన్యం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నికరంగా రూ.208 రావాలని, పర్చేజ్ ట్యాక్సు కలుపుకుంటే టన్నుకు రూ.268 మేర యాజమాన్యం చెల్లించాలని వారంటున్నారు. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్ యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుని రికవరీ ఆధారంగా చెరకు ధరను చెల్లించిందని వారు గుర్తు చేస్తున్నారు. రూ.8 కోట్ల మేర బకాయిలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే రైతులకు ట్రైడెంట్ యాజమాన్యం రూ.8 కోట్ల మేర బకాయి పడింది. 2015-16 క్రషింగ్ సీజన్కు కర్మాగారం 3 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. ఈ సీజన్కు కర్మాగారం 11శాతం చక్కెర రికవరీ సాధించింది. బకాయిల చెల్లింపులో మాత్రం ఏటా యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు వాపోతున్నారు. 2014-15 సీజన్కు సంబంధించిన బకాయిలను 2015-16 క్రషింగ్ సీజన్ను ప్రారంభించిన అనంతరమే చెల్లించిందని వారు గుర్తుచేశారు. ఇలా బకాయిలను ఏడాది పొడుగునా చెల్లించకుండా ఉంటే తామెలా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బిల్లుల చెల్లింపులోనూ జాప్యం క్రషింగ్ నిమిత్తం చెరకును కర్మాగారానికి తరలించినా నెలల తరబడి బిల్లులను చెల్లించకుండా యాజమాన్యం దాటవేస్తోందని రైతులు చెబుతున్నారు. 2015-16 క్రషింగ్ సీజన్ అక్టోబర్లో ప్రారంభిస్తున్నా బిల్లులను చెల్లించే విషయానికి వస్తే ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. చెరకును సరఫరా చేసిన 14 రోజుల్లోగా యాజమాన్యం బిల్లులు చెల్లించాలని క్లాజ్ 3ఏ నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. బిల్లులను సకాలంలో చెల్లించని పక్షంలో 15శాతం వడ్డీ లెక్కకట్టి ఇవ్వాలని షుగర్ కేన్ చట్టం చెబుతోంది. జనవరిలో మొదటి విడత కింద టన్నుకు రూ.2,225 మేర బిల్లులను చెల్లించిందని, వడ్డీని మాత్రం ఎగ్గొట్టిందని వారంటున్నారు. క్లాజ్ 8 ప్రకారం భూమి శిస్తు మాదిరిగా యాజమాన్యం వద్ద వసూలు చేసే వీలుందని రైతులు గుర్తుచేస్తున్నారు. పన్ను విషయంలో స్పష్టతేదీ? చెరకు కొనుగోలు పన్ను విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. కొనుగోలు పన్ను కింద ప్రభుత్వం రైతులకు ప్రభుత్వం టన్నుకు రూ.60 చెల్లిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు జీఓ విడుదల కాలేదు. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా యాజమాన్యం చెరకు ధరను చెల్లించాలి. ఇప్పటివరకు పర్చేజ్ ట్యాక్సును కలుపుకుని యాజమాన్యం చెరకు ధరను చెల్లిస్తూ వస్తోంది. ప్రభుత్వం ఈ బాధ్యతను యాజమాన్యానికి ఇవ్వడం వల్లే ఇలా చేస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వమే నేరుగా పర్చేజ్ ట్యాక్సును తమ ఖాతాలో జమచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి బిల్లులను సాధించుకుంటాం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు కర్మాగారం సాధించిన రికవరీ ఆధారంగా చెరకు బిల్లలను సాధించుకుంటాం. యాజమాన్యం తక్కువ ధర చెల్లించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. అధికారుల అసమర్థత వల్లే రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రైతులు అప్పులు చేసి పంటలను పండించుకుంటున్నారు. దీన్ని యాజమాన్యం గుర్తించి షుగర్ కేన్ చట్టం ప్రకారం బిల్లులు చెల్లించాలి. - ఎం.పాండురంగారెడ్డి, రైతు సంఘం నాయకుడు, జహీరాబాద్ చట్ట ప్రకారం ధర చెల్లించాల్సిందే షుగర్ కేన్ యాక్టు ప్రకారం యాజమాన్యం రైతులకు ధర ఇవ్వాల్సిందే. ఇందులో మినహాయింపు ఉండదు. యాజమాన్యానికి రూ.45 మేర సబ్సిడీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చక్కెర ధర బాగానే ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుని, కర్మాగారం సాధించిన రికవరీ మేరకు రైతులకు బిల్లులు చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యంపై గత జూన్లో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. - రాజశేఖర్, కేన్ రెగ్యులేటర్ ఇన్స్పెక్టర్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం, జహీరాబాద్ -
రౌడీషీటర్ దారుణ హత్య
మెదక్ : మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణం బృందావన్ కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్ నగరంలోని మూసాపేట రాజీవ్గాంధీ నగర్కు చెందిన రౌడీషీటర్ వాహేద్గా పోలీసులు గుర్తించారు. అతడి అనుచరుడు ఫిరోజ్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. -
తగ్గిన టమాట ధర
జహీరాబాద్ టౌన్: నిన్నటి వరకు మండిపోయిన కూరగాయల ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. పట్టణంలో నిర్వహించే వారాంతపు సంతతో పాటు కూరగాయల మార్కెట్లో ప్రధానంగా టమాట ధర తగ్గింది. మొన్నటి వరకు కిలో రూ.40 పలికిన టమాట ప్రస్తుతం కిలో రూ.20కే లభిస్తోంది. మిగతా కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. చిక్కుడు, బెండ, బీరకాయ, వంకాయ, దొండకాయ కిలో రూ.40 చొప్పున పలుకుతుండగా కాలీఫ్లవర్, క్యారట్, బిన్నిస్ మాత్రం కిలో రూ.60కి లభిస్తున్నాయి. తోటకూర కట్ట రూ.10కి విక్రయించారు. ఉల్లి ధర కిలో రూ.20-30 మధ్య పలుకుతోంది. -
అరటి.. దిగుబడిలో మేటి
సస్యరక్షణ తప్పనిసరి.. తెగుళ్ల బెడద అధికం నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి అప్పుడే అధిక దిగుబడులు సాధ్యం ఏడీఏ వినోద్కుమార్ సలహా సూచనలు జహీరాబాద్ టౌన్: అరటికి అన్ని కాలాల్లో డిమాండ్ ఉంటుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో రైతులు అరటిని పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ప్రధానంగా ఈ పంటకు నులి పురుగు, కాయముచ్చిక కుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్కుమార్(7288894426) తెలిపారు. వీటి నివారణకు, ఇతరత్రా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తెగుళ్ల నివారణ చర్యల గురించి ఆయన రైతులకు ఇస్తున్న సలహా సూచనలు.. నులి పురుగులు వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వివిధ రకాల తెగుళ్ల కారణంగా పంటకు నష్టం ఉంటుంది. నులి పురుగు తేలికపాటి నేలల్లో ఉంటూ అరటికి నష్టం కలిగిస్తుంటాయి. వేర్లపై బుడిపెలు వంటి కాయలను కలుగచేస్తాయి. వీటి తీవ్రత కారణంగా అరటి ఆకులు వాలిపోయి ఆకుల అంచులు నల్లగా మాడినట్లు ఉంటాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. అరటి సాగుకు ముందు విత్తన శుద్ధి చేసుకోవడమే దీనికి మార్గం. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ + 2.5 మి.లీ మోనోక్రాటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారుచేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. ద్రావణంలో ముంచి నాటుకొన్నట్లయితే నులి పురుగుల దాడి తగ్గుతుంది. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోప్యురాన్ 3జీ గుళకలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు తీశ్రతను తగ్గించవచ్చు. కాయముచ్చిక కుళ్లు ఈ తెగుళ్ల ఉదృతి ఎక్కవగా వర్షాకాలంలో ఉంటుంది. అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇలా పిచికారి చేసి తెగులును పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆకుమచ్చ తెగులు వర్షాకాలంలో వచ్చే ప్రధాన తెగులు ఇది. ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి తరువాత బూడిద రంగులోకి పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారిపోతాయి. ఈ తెగులు నియంత్రణ కోసం తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయాలి. అలాగే ఒక మిల్లీలీటరు ట్రైడిమార్ఫ్ లేదా ప్రాపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు పిచికారి చేయాలి. -
స్నేహితులతో కలిసి బాగారెడ్డి స్టేడియం సందర్శన
జహీరాబాద్:ప్రముఖ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు బుధవారం జహీరాబాద్లో సందడి చేశారు. సాయంత్రం ఆయన స్థానిక బాగారెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తూ జహీరాబాద్లో తన మిత్రుడు, మాజీ కౌన్సిలర్ కె.సునీల్కుమార్ ఇంటివద్ద కొద్దిసేపు ఆగారు. అనంతరం స్టేడియానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పలువురు యువకులు అతనితో మాట్లాడేందుకు ఆసక్తికనబరిచారు. మొదట్లో ఆయన జహీరాబాద్లోని బాగారెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. ఆ తరువాతే భారత జట్టులో స్థానం పొందాడు. గతంలో అర్షద్ అయూబ్, వెంకటపతి రాజులు సైతం జహీరాబాద్ స్టేడియాన్ని సందర్శించిన తరువాతే జాతీయ జట్టులో స్థానం లభించిందని చెబుతారు. ఇదే సెంటిమెంటును నమ్మే అంబటి రాయుడు తాజాగా మరోమారు ఈ స్టేడియానికి వచ్చారు. మళ్లీ జట్టులో స్థానం పొందాలనే ఉద్దేశంతో ఈ మైదానానికి వచ్చినట్టు అతని మిత్రులు తెలిపారు. జాడీ మల్కాపూర్లోని జలపాతాన్ని కూడా పలుమార్లు సందర్శించారని, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి వచ్చారని వారు పేర్కొన్నారు. -
భక్తిమార్గమే మిన్న
జహీరాబాద్ టౌన్: అనేక మార్గాలున్నా భక్తి మార్గమే గొప్పదని కర్నాటకకు చెందిన ప్రముఖ వక్త చెన్న బసవరాజ్ స్వామి అన్నారు. జహీరాబాద్ దత్తగిరి కాలనీలోని బసవమంటపంలో మంగళవారం రాత్రి రాష్ర్టీయ బసవదళ్ ఆధ్వర్యంలో శ్రావణ మాస ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. నెల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో చెన్న బసవరాజ్ స్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరిపై విశ్వాసం కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విశ్వాసం అధికంగా ఉండాలని, అప్పుడే జీవితం సుఖంగా సాగుతుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ సీఐ. నాగరాజ్, రాష్ర్టీయ బసదళ్ అధ్యక్షుడు శంకర్పాటిల్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం బసవమంటపంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సీఐ.నాగరాజ్ ప్రారంభించి బసవేశ్వరుడి పుస్తకాలను కొనుగోలు చేశారు. -
జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలి: వైఎస్ఆర్ సీపీ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్గా చేయాలని వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు ముర్తుజా డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. అయితే జహీరాబాద్ పట్టణం రెవెన్యూ డివిజన్కు అన్ని విధాల అనుకూలంగా ఉందన్నారు. జాతీయ రహదారిపై పలు ప్రాంతాలకు మధ్యలో ఉందన్నారు. సీనియర్ సివిల్ కోర్టు, పలు శాఖల ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయన్నారు. నారాయణ ఖేడ్ రెవెన్యూ డివిజన్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బాల్రాజ్, నాయకుడు ఫసీ పాల్గొన్నారు. -
ఆహారభద్రత పథకం పరిశీలన
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత పథకం అమలవుతున్న విధానాన్ని పథకం సలహాదారు డాక్టర్ కోల్ హట్కర్ పరిశీలించారు. శనివారం అర్జున్ నాయక్ తండాలోని భూములను పరిశీలించారు. ఈ పథకం అమలవుతున్న తీరును చూశారు. రైతులు శేనిబాయి, రాజీబాయి పొలాల్లోని పంటలను పరిశీలించి, ఈ పథకం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్య పంటలైన కొర్ర, సజ్జ, జొన్న, సామ వంటి పంటలను సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న డీడీఎస్ రైతులతో మాట్లాడారు. పంటలను సాగు చేస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పస్తాపూర్లోని డీడీఎస్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్ వీపీ సతీష్తో సమావేశమయ్యారు. ఆయన వెంట జాతీయ ఆహార భద్రత పథకం జిల్లా సలహాదారు రాజిరెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్కుమార్, ఏఓ ప్రవీణ, కేవీకే శాస్ర్తవేత్త వరప్రసాద్, డీడీఎస్ మహిళా రైతులు సమ్మమ్మ, చంద్రమ్మ, లక్ష్మమ్మ, అనుసూయమ్మ, అర్జున్నాయక్ తండా రైతులు అమీర్బాయి, చాందిబాయి, డీడీఎస్ ప్రతినిధులు తేజస్వి, మంజుల, నర్సమ్మలు పాల్గొన్నారు. -
14 మంది బాలకార్మికుల గుర్తింపు
జహీరాబాద్ టౌన్: పలు శాఖల అధికారులు కలసి గురువారం పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాలకార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, కార్మికశాఖ అధికారి యాదయ్య, సీడబ్ల్యూసీ సభ్యుడు మహరాజ్, డీసీపీయూ సభ్యుడు గోపాల్, ఏఎస్ఐ మల్లయ్య తదితర శాఖల అధికారులు అశోక్, మోతిరాం, సత్తిరెడ్డి తదితరులు పట్టణంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలను తనిఖీలు నిర్వహించారు. 14 మంది బాలకార్మికులను గుర్తించి వారిని సంగారెడ్డిలోని దివ్యదిశ హోంకు తరలించారు. ఈ సందర్బంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
బండ నేలల్లో పచ్చని పంటలు
చెరువు మట్టిని తరలించుకున్న రైతులు ఎర్రరేగడి నేలల్ని మాగాణిగా మార్చుకున్న వైనం జహీరాబాద్ టౌన్:జహీరాబాద్ నియోకవర్గంలో ఎర్ర, నల్లరేగడి భూములున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎర్రబండతో కూడిన పొలాలు ఉన్నాయి. ఎర్రబండ భూములు సాగుకు ఏమాత్రం అనుకూలం కావు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం బండ భూములు కలిగిన రైతులకు వరంగా మారింది. ఈ పథకం కింద పూడిక తీయగా వచ్చిన మట్టిని పంటలు పండని రాతి నేలల్లోకి తరలించుకుని నల్లరేగడి భూములుగా మార్చుకున్నారు ఈ ప్రాంత రైతులు. బండనేలలను సాగుకు యోగ్యంగా చేసుకుని పంటలు పండిస్తున్నారు. వర్షాలు కూడా పడడంతో సాగుచేసిన పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అనుమతులివ్వడంతో ఆసక్తి కలిగిన రైతులు ముందుకు వచ్చి సారవంతమైన చెరువు మట్టిని తమ బండ రాతి భూముల్లోకి తరలించి నల్ల రేగడి భూములుగా మార్చుకుంటున్నారు. మట్టితో నింపిన పొలాల్లో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు తమ ఆర్థిక స్తోమతను బట్టి మట్టిని తరలించారు. మిషన్ కాకతీయ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కో టిప్పరుకు రూ.300- రూ.500 వరకు ఖర్చుచేసి నల్లరేగడి మట్టిని తరలించారు. ఎకరానికి వంద నుంచి 150 ట్రిప్పుల మట్టిని నింపారు. ఎత్తుపల్లాలు ఉన్న చోట చదును చేశారు. ఎకరాకు రూ. 50 వేల వరకు ఖర్చుచేసి బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. ఊహించని విధంగా బండ భూములు సారవంతమైన నల్ల రేగడి పొలాలుగా మారండంతో రైతులు ఉత్సాహంతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. కొందరు చెరకు పంట వేయగా మరి కొందరు అల్లం పంటను సాగు చేస్తున్నారు. మరి కొందరు రైతులు ఖరీఫ్ పంటలైన సోయాబీన్, పెసర, కంది తదితర పంటలు వేశారు. మట్టి తరలించిన పొలాల్లో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు అంటున్నారు. -
బిల్లులు ఎప్పుడిస్తరో?
ఆశగా ఎదురుచూస్తున్న రైతులు క్రషింగ్ ముగిసి ఐదు నెలలవుతున్నా అందని డబ్బులు టన్నుకు రూ.145ల వంతున బకాయిపడిన ట్రైడెండ్ యాజమాన్యం జహీరాబాద్: క్రషింగ్ ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా బిల్లులు చెల్లించకుండా ట్రైడెంట్ యాజమాన్యం జాప్యం చేస్తోంది. దీంతో తాము సాగు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్(బి) గ్రామంలోని ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 2015–16 క్రషింగ్ సీజన్కు గాను 3లక్షల టన్నులు గాను గాడించింది. టన్నుకు రూ.2,600ల మేర చెరకు ధరను చెల్లించేందుకు నిర్ణయించింది. రైతులు చెరకును సరఫరా చేసినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులను చెల్లించలేదు. టన్నుకు రూ.145వంతున యాజమాన్యం రైతులకు బకాయి పడింది. క్రషింగ్ చేసిన మేరకు కర్మాగారానికి చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.3.35 కోట్ల మేర యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో యాజమాన్యం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బిల్లులను బకాయి పడుతోందన్నారు. 2014–15 క్రషింగ్ సీజన్కు సంబంధించిన బిల్లులను ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైన అనంతరమే చెల్లించిందన్నా చెరకు సాగు కోసం అప్పులు తెచ్చి పెడుతున్నట్లు, సకాలంలో బిల్లులు రాక పోవడంతో వడ్డీ కట్టక తప్పడం లేదంటున్నారు. దీంతో పంటపై వచ్చే లాభం కూడా అప్పుల రూపంలో రాకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా కర్మాగారం యాజమాన్యం, అధికారులు స్పందించి చెరకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెట్టుబడుల కోసం ఇబ్బందులు వ్యవసాయం కోసం పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వస్తోందని, దీంతో బయట నుంచి అప్పులు తెచ్చుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంట సాగు కోసం విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టక తప్పడం లేదంటున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం తమ బిల్లులను చెల్లిస్తే పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుందన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో యాజమాన్యం సరిగా స్పదించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
పిల్లలతో కలిసి ఏఎన్ఎమ్ల సమ్మె
జహీరాబాద్ టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. పిల్లలతో కలసి ఆందోళనకారులు సమ్మెలో కూర్చున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.21,300 వేతనం చెల్లించాలని, ఉద్యోగాలు పర్మినెంట్ చేసి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమ్మెలో యూనియన్ నాయకురాలు కృష్ణవేణి, రోజారాణి, శ్యామల, అరుణ, సుధారాణి, సుజాత, సరళ తదితరులున్నారు. -
జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలి
జహీరాబాద్: జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటిని 26వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలలో గోవింద్పూర్ గ్రామ సర్పంచ్ బి.రాజు, పార్టీ నాయకులు ఎస్.నారాయణ, జి.అంజన్న, ఎస్.హన్మంతు, పి.నారాయణ, కృష్ణారెడ్డికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి వై.నరోత్తం సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు డాక్టర్ చంద్రశేఖర్, జలాలుద్దీన్, సుధీర్ భండారి, రాచప్ప, నేత్రయ్య, జగన్మోçßæన్రెడ్డి, మోహన్రెడ్డి, మల్లయ్యస్వామి, రాంచంద్రారెడ్డి, టి.రాములు, మాజీద్, ఆర్.రాజు, వీర్శెట్టి, ఎన్.జి.నర్సింహులు, ఓంప్రకాష్, జగన్, అంజయ్య, జనార్ధన్రెడ్డి, టి.శివన్న, బి.రాములు, వెంకట్లు పాల్గొన్నారు. -
వర్షం కురిస్తే రాకపోకలు బంద్
జహీరాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిలో నిలుస్తున్న వరద నిర్వహణ లోపంతో ప్రజల ఇబ్బందులు జహీరాబాద్: వర్షం కురిస్తే చాలు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు గగనమే. కిందికి పూర్తిగా వరద చేరడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి. జహీరాబాద్ ప్రజల సౌకర్యార్థం ఐదేళ్ల క్రితం భవానీ మందిర్ వెనుకవైపు రోడ్డుకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించారు. దీంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్వహణ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్కు పడమర వైపు నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వర్షం నీరు వచ్చి చేరుతోంది. వర్షం పడితే వచ్చే వరద బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో వర్షానికి బ్రిడ్జి కిందకు వచ్చి చేరే నీటిని ఎప్పటి కప్పుడు డీజిల్ ఇంజన్లతో తోడాల్సి వస్తోంది. భారీ వర్షం కురిస్తే చాలు వరద నీరు అధిక మొత్తంలో బ్రిడ్జి కిందకు వచ్చి చేరుతోంది. ఒక్కోసారి 24 గంటల పాటు రాకపోకలు నిలిచిన పోయిన సందర్భాలున్నాయి. బ్రిడ్జి కిందకు చేరే వర్షం నీటిని డీజిల్ ఇంజన్ల సాయంతో బయటకు తోడాల్సి ఉంటుంది. వర్షం పడితే అప్పటి కప్పుడు మున్సిపల్ సిబ్బంది డీజిల్ ఇంజన్లు తెచ్చి నీటిని తోడడం ఇబ్బందికరంగా మారింది. తప్పని దూర ప్రయాణం బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరి రాకపోకలు స్తంభించడంతో దూర ప్రయాణం చేయక తప్పడం లేదు. బాగారెడ్డిపల్లి, శాంతి నగర్, హమాలీ కాలనీ, డ్రైవర్స్ కాలనీలు రైల్వే స్టేషన్కు దక్షిణం వైపున ఉన్నాయి. ఉత్తరం వైపున ఉన్న రాచన్నపేట, సుభాష్గంజ్, హనుమాన్ వీధితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల మధ్య దూరం తక్కువే. రైల్వే స్టేషన్ మాత్రమే ఉంది. అండర్ బ్రిడ్జిలో వర్షం నీరు వచ్చి చేరితో రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద నుంచి రాక పోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో సుమారు కిలో మీటరు దూరం ప్రయాణం చేయాల్సిందే. ఇబ్బందులు పడుతున్నం రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు వచ్చి చేరుతున్నందున రాకపోకలు ఇబ్బందులు వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. – ఎన్.నిజాముద్దీన్ పటేల్, శాంతినగర్ కాలనీ కాలినడకన వెళ్తున్నాం వర్షపు నీరు రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. మోటారు సైకిల్పై వెళ్లేందుకు అధిక ప్రయాణం చేయాల్సి వస్తున్నది. రైలు పట్టాలపై నుంచి కాలినడకన వెళుతున్నాం. – బి.సంగమేశ్వర్, బాగారెడ్డిపల్లి కాలనీ ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నాం రైల్వే బ్రిడ్జి కిందకు చేరుతున్న వర్షం నీటిని ఎప్పటికప్పుడు తోడేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేనందున ఇంజన్ల ద్వారా తోడివేయిస్తున్నాం. అయినా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. – శ్రీధర్రెడ్డి, మున్సిపల్ ఏఈ -
స్మశాన వాటిక కబ్జా
- దళితుల ఆందోళన జహీరాబాద్ టౌన్: తమకు ప్రభుత్వం ఇచ్చిన స్మశాన వాటిక స్థలం కబ్జా అవుతోందంటూ గ్రామస్తులు ధర్నాకు పూనుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్లో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని బుర్దిపాడ్ గ్రామంలోని దళితులకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మూడెకరాల స్థలాన్ని సర్వే నంబర్ 83లో స్మశాన వాటిక కోసం కేటాయించింది. అయితే, ఈ స్థలం ఆనుకుని ఉన్న రైతులు దానిని కొద్దికొద్దిగా కలుపుకుంటున్నారు. దీనిపై దళితులంతా కలసి శుక్రవారం మధ్యాహ్నం జహీరాబాద్కు తరలివచ్చారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. స్మశాన వాటికను కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి ఇస్తామని డిప్యూటీ తహశీల్దార్ దశరథ్ హామీ ఇచ్చారు. సోమవారం తహశీల్దార్ అనిల్, ఆర్ఐ. షఫీ, సర్వేయర్లు గ్రామానికి వస్తారని తెలపటంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. -
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖాళీ బిందెలతో రాస్తారోకో తాండూరు రోడ్డుపై స్తంభించిన రాకపోకలు జహీరాబాద్ : చిన్నహైదరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాంనగర్ కాలనీ, జహీరాబాద్ మున్సిపల్ పరిధి కింద ఉన్న 12వ వార్డులో గల డ్రైవర్స్ కాలనీ ప్రజలు మంచినీటి సమస్య తీర్చాలని ఆందోళనకు దిగారు. ఆదివారం జహీరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రోడ్డుపై గంట పాటు మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో వాహనాల రాక పోకలకు ఆటంకం కలి గింది. తమ కాలనీల్లో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తీర్చాలని పలు మార్లు ప్రజా ప్రతినిధులను కోరినా ఫలితం లేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. నీటి సమస్యను తీర్చేందుకు గాను కొత్తగా బోరును తవ్వించాలని డిమాండ్ చేశారు. అంత వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. లేనట్లయితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆయా కాలనీలకు చెందిన ముఖ్యులు సూచించడమేకాకుండా.. వారు ఫోన్లో అధికారులను సంప్రదించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. -
మహిళ నుంచి 48 కేజీల గంజాయి స్వాధీనం
మెదక్ : మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమె వద్ద నుంచి 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయిని సీజ్ చేసి... సదరు మహిళను పోలీసు స్టేషన్కి తరలించారు. పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారు'
మెదక్: తెలంగాణ సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. ఆమె శనివారం విలేకర్లతో మాట్లాడుతూ జహీరాబాద్ టీఆర్ఎస్ నేతలు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజక వర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళిత మహిళా ఎమ్మెల్యే అయినందుకే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. -
'ఊళ్లకు వెళ్లేవాళ్లు మాకు చెప్పి వెళ్లండి'
జహీరాబాద్ (మెదక్) : దసరా పండుగ సందర్భంగా సొంత ప్రాంతాలకు, బంధువుల వద్దకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్.ఐ. శివలింగం సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లడంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున సదరు ఇంటివారు పక్క ఇళ్లలోనివారికి చెప్పి వెళ్లాలని సూచించారు. కాలనీలకు సంబంధించి ఉండే కమిటీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నారు. తాళం కనబడకుండా డోర్ కర్టన్ వేయాలని ఆయన సూచించారు. ఎక్కువ రోజులు ఊరికి వెళ్లినట్లయితే పోలీసు స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు వీలుపడుతుందన్నారు. ఊరికి వెళ్లినట్లయితే ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బులు పెట్టుకోవద్దన్నారు. వాటిని తమ వెంట తీసుకెళ్లాలని, లేనట్లయితే బ్యాంకులో వేసుకోవాలన్నారు. అనుమాన వ్యక్తులు ఎవరైనా కాలనీల్లో సంచరించడం, బట్టల వ్యాపారం పేరుతో వచ్చే వారిపై అనుమానం ఉన్నా నంబర్-100 లేదా పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. అనామకులు ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వివరాలు అడిగితే చెప్పరాదని సూచించారు. వారితో ఎక్కువగా మాట్లాడకుండా బ్యాంకులో వచ్చి కలుస్తాం అని సమాధానం చెబితే సరిపోతుందన్నారు. మహిళలు మెడలో బంగారం ఆభరణాలు వేసుకుని ఉంటే బయటకు వెళ్లే సమయంలో మెడను కొంగుతో కప్పుకోవాలని సూచించారు. మోటారు సైకిల్పై దొంగలు బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన సంఘటనలు ఇటీవల చోటు చేసుకున్న సందర్భంలో ఎస్సై ఈ మేరకు పలు సూచనలు చేశారు. ప్రతి కాలనీలో పోలీసులు గస్తీ కూడా తిరుగుతారన్నారు. అయినా సెలవులో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు బంగారం, డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
జహీరాబాద్ (మెదక్) : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం ఈదులపల్లికి చెందిన బుచ్చయ్య.. కుటుంబసభ్యులకు చెందిన భూమి పట్టా మార్పిడి కోసం వీఆర్వో సంగయ్యను సంప్రదించాడు. అయితే రూ.3, 500లు ఇస్తేనే పని అవుతుందని వీఆర్వో మెలికపెట్టారు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు జహీరాబాద్లోని మండల కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం బుచ్చయ్య రూ.3, 500లు అందజేస్తుండగా పట్టుకున్నారు. సంగయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దృష్టి మరల్చి.. డబ్బు బ్యాగుతో మాయం
మెదక్ : బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకువస్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. అతని చేతిలో ఉన్న డబ్బుల బ్యాగు లాక్కెళ్లిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్బీఐ ఎదుట గురువారం మధ్యాహ్నం జరిగింది. బ్యాంకు నుంచి రూ.1.80 లక్షలు డ్రా చేసుకువస్తున్న మక్సూద్ అనే వ్యక్తిని 'ఈ డబ్బులు మీవేనా..?' అని పలకరించి అతను వాటిని తీసుకోవడానికి ప్రయత్నించేలోపే అతని చేతిలోని డబ్బుల బ్యాగుతో గుర్తుతెలియని దుండగులు ఉడాయించారు. దీంతో మక్సూద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘నారింజ’పై నిర్లక్ష్యమేలా?
నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ‘నారింజ’ ప్రాజెక్టు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ప్రాజెక్టు కింద ఉన్న భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు వీలుగా కాలువల నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.5.77 కోట్లు మంజూరయ్యాయి. ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాలువల నిర్మాణంతో ప్రయోజనమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా నారింజ ప్రాజెక్టు ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వృథాగా తరలిపోతున్న నీటిని జహీరాబాద్ ప్రాంత రైతులు వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు-కం-బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో నారింజ బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. కాగా ఈ పథకం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే గత నాలుగు దశాబ్దాలుగా నారింజ జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. ఎక్కడ పుట్టింది... నారింజ వాగు కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వార్ మైల్స్గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు నిర్మించారు. దీనికింద ప్రధాన కాలువలు తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాలువలు తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాలువలను అప్పట్లోనే రైతులు పూడ్చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్టీ)గా ఉంది. పూడిక తీస్తేనే మేలు.. ప్రాజెక్టులో పూడిక తీస్తేనే మేలు జరుగుతుందని పరిసర గ్రామాల రైతులంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండుతుందని, మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తుందని వారంటున్నారు. పూడిక తీయిస్తే మరింత అధికంగా నీరు నిల్వ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భూమిలోకి అవసరం మేరకు నీరు ఇంకిపోయి పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. తద్వారా వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలంగా నీరు వచ్చి ఆశించిన మేర పంటలు సాగయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పూడికతీతకే మొదటి ప్రాధాన్యత నివ్వాలని వారంటున్నారు. అడ్డుకున్న రైతులు గతంలో తమకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు పరిహారం చెల్లించి కాలువలు తవ్వాలని బూర్దిపాడ్ గ్రామ రైతులు అంటున్నారు. గ్రామంలో 26 మంది రైతులు కాలువల కింద పోతున్నాయి. దీంతో వారు కాలువ తవ్వకం పనులను నిలిపి వేయించారు. సాగులో ఉన్న చెరకు పంటలో నుంచి కాలువను తవ్వడంతో తాను నష్టపోయానని రైతు సంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు స్వరూపం ప్రాజెక్టు : నారింజ ఆయకట్టు : 3వేల ఎకరాలు కుడి కాలువ పొడవు : 2.కి.మీటర్లు కుడి కాలువ కింద ఎకరాలు : 550 ఎకరాలు కుడి కాలువ కింద గ్రామాలు : న్యాల్కల్ మం: మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మం : కొత్తూర్(బి) ఎడవ కాలువ పొడవు : 13 కి.మీటర్లు ఎడమ కాలువ కింద ఎకరాలు : 2,450 ఎకరాలుగా ఎడవ కాలువ కింద గ్రామాలు : జహీరాబాద్ మం: కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్పల్లి, మాడ్గి పరిహారం ఇప్పించాలి.. గతంలో మాకు పరిహారం అందలేదు. పరిహారమిచ్చిన తరువాతే కాలువలను తవ్వే పనులు చేపట్టాలి. పెద్ద కాలువల కోసం మేం అధికంగా భూములను కోల్పోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు తోటల్లో నుంచి కాలువలు తవ్వుతున్నందున పంటకు కూడా పరిహారం అందించాలి. - కమాల్రెడ్డి, రైతు, బూర్దిపాడ్ నారింజ ప్రాజెక్టు... లక్ష్యం ఘనం... ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంది. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్టు నీటితో సెంటు భూమి తడవలేదు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో నీరు నిలిచే పరిస్థితి లేదు. ఒక్క వర్షానికే మిగతా నీరంతా పక్క రాష్ట్రానికి పోతుంది. పూడిక తీయాల్సిన పాలకులు కాలువలు తవ్వుతూ నిధులు, విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. రైతుల మొరను ఆకలించరు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి నెలకొంది. -జహీరాబాద్ -
జాతరలో ఇరువర్గాల ఘర్షణ
మనూరు : ఆటోల పార్కింగ్ విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తులు, వేటకొడవళ్లు, రాళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనను నివారించేందుకు యత్నించిన ఏఎస్ఐ, వీఆర్ఏలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని బోరంచ నల్లపోచమ్మ జాతరలో గురువారం చోటు చేటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామం, కర్ణాటకలోని సిరికంగ్టి గ్రామాలకు చెందిన భక్తులు గురువారం జాతరకు హాజరయ్యారు. కాగా.. వీరు పక్క పక్కనే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆటోల పార్కింగ్ విషయం లో వీరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు ఒక్కసారిగా ఝరాసంగం గ్రామానికి చెందిన భక్తులపై దాడులకు పాల్పడ్డారు. వారి వెంట తీసుకువచ్చిన కత్తులు, వేట కొడవళ్లు, రాళ్లతో దాడులు జరపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోచమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ముజీబుద్దీన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్ల, వీఆర్ఏ ముక్తర్లు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను నివారించే ప్రయత్నం చేయ గా.. వారిపై కూడా కర్ణాటకకు చెందిన భక్తులు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏఎస్ఐ, వీఆర్ఏలు గాయపడ్డారు. వీరి తో పాటు ఝరాసంగానికి చెందిన పెం టమ్మ (45), ఆటోడ్రైవర్ దశరథ్ (25), నిర్మల, మల్లేశంలకు తీవ్రగాయాలయ్యా యి. కాగా.. ఝరాసంఘానికి చెందిన పెంటమ్మ బంగారు ఆభరణాలు సైతం లాక్కున్నట్లు సమాచారం. పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు? మద్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన గొడువ అరగంట తర్వాత అదుపు తప్పడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ విషయాన్ని మనూరు స్టేషన్కు సమాచారం అందించారు. అ యితే రెండు గంటల తరువాత కానిస్టేబుళ్లను జాతర వద్దకు వచ్చి ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఆహ్లాదాన్ని పంచుతున్న గుల్మోహర్ పుష్పాలు
జహీరాబాద్: సువాసన వెదజల్లే గుణం లేకపోయిన అందాన్ని చూపించే గుణం ఉన్న గుల్మోహర్ పుష్పాలు అందరి ఆకట్టుకుంటున్నాయి. అల్లాదుర్గం-మెటల్కుంట రోడ్డు కు ఇరువైపుల హద్నూర్, న్యాల్కల్లోని ఆర్టీసీ బస్టాండ్, జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ముంగి గ్రామాల శివారులో గల గుల్మోహర్ చెట్లకు కాసిన ఎర్రని పుష్పాలు రోడ్డుపై వచ్చి పోయేవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. (న్యాల్కల్) -
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కండక్టర్
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కండెక్టర్ చంద్రయ్య(42) శుక్రవారం తెల్లవారుజామున ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి చంద్రయ్యను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో జహీరాబాద్ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన డిపో వద్దకు చేరుకుని పహారా కాస్తున్నారు. -
జహీరాబాద్ చెక్ పోస్టుపై విజిలెన్స్ దాడులు
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్పోస్టుపై బుధవారం ఉదయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రామచంద్రాపురం విజిలెన్స్ సీఐ జాన్విక్టర్, ఎస్ఐ సదాఖలీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రఘునందన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సంవత్సరాంతం జరిగే కార్యక్రమంలో భాగంగా దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల సందర్భంగా చెక్పోస్టు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. -
ప్రాణం పోసేది పాతపంటలే!
నిలువునా రైతుల ప్రాణాలు తీసే పంటలు మాకొద్దు.. మెట్ట పాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల ప్రాణాలు నిలిపేవి సంప్రదాయ పాత పంటలేనని మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చిన్న, సన్నకారు మహిళా రైతులు ఎలుగెత్తి చాటారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 16వ పాత పంటల(అంటే.. అనాదిగా స్థానికంగా పండిస్తున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు) పండుగ జాతర ముగింపు ఉత్సవం జహీరాబాద్ సమీపంలోని మాచునూర్లో ఇటీవల కన్నుల పండువగా జరిగింది. సంక్రాంతి రోజు నుంచి నెల రోజుల పాటు పాత పంటల ప్రాధాన్యాన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తూ బయోడైవర్సిటీ ఫెస్టివల్ సాగింది. ఈ ఏడాది ముగింపు ఉత్సవంలో వినూత్నంగా నిర్వహించిన ‘ప్రాణం తీసే పంటల’ దిష్టిబొమ్మ దహనం, ‘ప్రాణం పోసే పంటల’కు ఊయల సేవ అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షాధారంగా పాతకాలం నుంచి మెట్ట రైతులు సొంత విత్తనాలతో పండిస్తున్న జొన్న, సజ్జ, కొర్ర వంటి చిరుధాన్యాలు, కందులు, మినుములు, పెసలు, అలసందలు, కుసుమ వంటి జీవ వైవిధ్య పంటలే అన్నదాతల ప్రాణాలను కాపాడుతాయని మహిళా రైతులు చెప్పారు. అధిక పెట్టుబడి, అధిక నీరు అవసరమయ్యే పత్తి, సోయాబీన్, చెరకు, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు రైతుల ‘ప్రాణాలు తీసే’ పంటలను నిరసిస్తూ పత్తి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విశేషం. కరువును తట్టుకొని బడుగు రైతుల చింత తీర్చే చిరుధాన్యాల రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించాలని డీడీఎస్ మహిళా రైతు సంఘాలు ఇటీవల ప్రభుత్వానికి సూచించాయి. -
మియాపూర్ నుంచి జహీరాబాద్కు రైల్వేలైన్
* రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు * సంగారెడ్డి నుంచి నాందేడ్ అకోల వరకు నాలుగు లేన్ల రోడ్డు * జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ వెల్లడి సదాశివపేట: మియాపూర్ నుంచి సంగారెడ్డి వయా సదాశివపేట మీదుగా జహీరాబాద్ వరకు రైల్వే లైన్ వేసేందుకు రూ. 450 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు బీబీ పాటిల్ వెల్లడించారు. అందులో భాగంగానే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాజుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కవలాస్ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, రెండవ విడతగా మెదక్ జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం గ్రామాన్ని దత్తత తీసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సంగారెడ్డి నుంచి నాందేడ్, అకోలా వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పంటల పండుగకు 16 ఏళ్లు!
మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు సంక్రాంతితోపాటు పాత పంటల పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ నెల 14న న్యాల్కల్ మండలం హోసెల్లి నుంచి వ్యవసాయ జీవవైవిధ్య పండుగ-2015 ప్రారంభమవుతుంది. ఈ ప్రాంత మహిళా రైతులు డీడీఎస్ ఆధ్వర్యంలో సంఘాలుగా ఏర్పడి.. అనాదిగా చిరుధాన్యాలతో ముడిపడిన తమ స్వయం సమృద్ధ ఆహార సంస్కృతిని పరిరక్షించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు. వ్యవసాయ జీవవైవిధ్యం ఉట్టిపడేలా ఒకటికి పన్నెండు చిరుధాన్య, పప్పుధాన్య, నూనెగింజల పంటలను ఒకే పొలంలో కలిపి పండించడం వీరి ప్రత్యేకత. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ రైతుకు జీవన భద్రతను కలిగించే తమ సేంద్రియ పంటల సాగు నమూనాను ఊరూరా ప్రచారం చేయడానికి ఈ పండుగను గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తమ సంప్రదాయ విత్తనాల పరిరక్షణకు కొత్త ఉత్సాహంతో పునరంకితమవుతుంటారు. అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ బయోడైవర్సిటీ ఫెస్టివల్ ఫిబ్రవరి 13న పస్తాపూర్లో కన్నుల పండువగా ముగుస్తుంది. వివరాలకు 040 27764577, 27764744 నంబర్లలో సంప్రదించవచ్చు. -
దళితులను చీల్చేందుకు సీఎం కుట్ర
జహీరాబాద్ టౌన్: దళితులను చీల్చేందుకు సీఎం చంద్రశేఖర్రావు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని ఉత్తం గార్డెన్లో నిర్వహించిన సంఘం నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీరుగారుతున్న సమయంలో కేసీఆర్కు తాము అండగా నిలిచామని తెలిపారు. ఆయన ఆమరణ దీక్ష చేసిన సందర్భంలోనూ దళితులు వెన్నంటి ఉన్నారన్నారు. ప్రతిపక్షాలకు ఆయనను ఎదిరించే శక్తిలేదని, కేవలం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకే ఆ దమ్ముందని తెలిపారు. తెంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ అధికారం వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చిన కే సీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రస్తుతం సీఎంలుగా ఉన్నారన్నారు. వారికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇరువురు కలసి అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ నెల నుంచి ఉద్యమాన్ని చేపడుతామన్నారు. అందుకని గ్రామ మండల స్థాయి కమిటీలను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ నరోత్తం, ఎమ్మార్పీఎస్ నాయకులు భూమన్ మధు మాదిగ, ఆనంద్, నర్సింలు, యువరాజ్, పవన్, పద్మారావు, బుడగ జంగం నాయకులు కె.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘ట్రైడెంట్’లో క్రషింగ్ ప్రారంభం
జహీరాబాద్: జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. దీంతో రైతులు చెరకు ఉత్పత్తులను క్రషింగ్ నిమిత్తం కర్మాగారానికి తరలిస్తున్నారు. బుధవారం పలువురు రైతులు చెరకు పంటను ట్రాక్టర్లలో కర్మాగారానికి తరలించారు. చెరకు ధరను పెంచక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది చెల్లించిన ధరకంటే ఎక్కువ ధర చెల్లించే అవకాశమే లేదని ఇప్పటికే కర్మాగారం ప్రతినిధులు ప్రకటించారని రైతులు వాపోతున్నారు. చక్కెరకు మార్కెట్లో ఏ మాత్రం డిమాండ్ లేనందున గత ఏడాది చెల్లించిన విధంగానే ప్రస్తు క్రషింగ్ సీజన్లో కూడా టన్నుకు రూ.2,600ల మేర చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం రెట్టింపైనందున టన్ను చెరకు ధరను రూ.3,500లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మెట్టు దిగడం లేదు. ఇది రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. భారీగా చెరకు సాగు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జహీరాబాద్ జోన్ పరిధిలో చెరకు పంట అధికంగానే సాగులో ఉంది. ప్రస్తుతం జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 24వేల ఎకరాల మేర చెరకు పంట సాగులో ఉంది. అయినా ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నందున దిగుబడులు బాగా పడిపోయే అవకాశం ఉంది. గత సంవత్సరం ఎకరాకు 24 టన్నుల సగటు దిగుబడి రాగా, ఈ సంవత్సరం 19 టన్నులకు పడిపోయే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడుల వ్యయం మాత్రం అధికమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాదిరిగానే ధరను చెల్లించాలని యాజ మాన్యం నిర్ణయించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చెరకు కోత, రవాణా సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పాడి రైతులకు గుర్తింపు కార్డులు
జహీరాబాద్ టౌన్: పాడి రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జిల్లా ప్రత్యేకాధికారి పవన్ కుమార్ తెలిపారు. జహీరాబాద్లోని పాలశీతలీకరణ కేంద్రంలో శనివారం నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను దాని వెనుక భాగం లో ముద్రించామని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని చెల్లిస్తోందన్నారు. దీనికోసం నిధులను కూడా మంజూరు చేసిందని చెప్పారు. లీడ్ బ్యాంక్ లీకేజీ ద్వా రా పాడి రైతులకు డైరీ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ముందుగా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్లో యూనిట్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా (9493173769) నంబర్కు ఫోన్ చేయొచ్చని సూచించారు. జిల్లా డిప్యూటీ డైరక్టర్ కామేష్, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ శంకర్సింగ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు రాంరెడ్డి, మాణిక్రెడ్డి, సామల నర్సింలు పాల్గొన్నారు. -
జలం.. దక్కని ఫలం!
జహీరాబాద్: మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని పెద్దవాగు జలమంతా పక్క రాష్ట్రానికి పరుగులు పెడుతోంది. సాగునీరు కళ్లముందే కర్ణాటకకు వెళుతున్నా, ఏం చేయలేని దుస్థితి జిల్లా రైతన్నలది. పెద్దవాగుపై ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మిస్తే సుమారు రెండు వేల ఎకరాల మేర వ్యవసాయ భూములను సాగులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయినా ఈ విషయంలో పాలకులు పట్టించుకోకపోవడంతో సిరులు కురిపించాల్సిన భూములు బీళ్లుగా మారుతున్నాయి. జాడి మల్కాపూర్ గ్రామ శివారులోని తూర్పు దిశలో త మ్మలి గడ్డ ప్రాంతంలో ప్రాజెక్ట్ను నిర్మించేందుకు పూర్తిగా అనువుగా ఉన్నప్పటికీ పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వాగుకు ఇరువైపులా కొండలు ఉండడంతో ప్రాజెక్ట్ను నిర్మించి, ఎత్తి పోతల పథకం ద్వారా పొలాలకు నీటిని అందించవచ్చని స్థానిక రైతులు చెబుతున్నారు. ఎత్తిపోతల నిర్మాణం ద్వారా జాడి మల్కాపూర్, సజ్జారావుపేట తండాకు నీరందించే అవకాశం ఉంది. జాడి మల్కాపూర్ గ్రామంలో 3 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 1,600 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించే వీలుంది. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే సజ్జారావు పేట తండాలో 1,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 700 ఎకరాలకు నీరందించే వీలుంటుంది. ప్రభుత్వం, అధికారులు ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుని ఎత్తిపోతల ద్వారా పొలాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. జలమంతా వృథాయే కోహీర్ మండలంలోని గొటిగార్పల్లి గ్రామంలోనిపెద్దవాగు ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే పూర్తిగా నిండి.పోతోంది. దీంతో అదనపు జలమంతా జహీరాబాద్ మండలంలోని మల్చల్మ, జాడీమల్కాపూర్ గ్రామాల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోకి చేరుకుంటోంది. కర్ణాటకలోని చండ్రంపల్లి ప్రాజెక్ట్కు ఇదే వాగు ప్రధాన వనరుగా ఉంటోంది. కృష్ణా బెసిన్ కింద దీనిని గుర్తించారు. వేసవి కాలంలోనూ ఈ వాగు ప్రవహిస్తూ చండ్రంపల్లి ప్రాజెక్టుకు జీవ వనరుగా ఉంది. ఈ వాగుపై ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మిస్తే మన జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. చుక్క నీటిని కూడా నిల్వచేయలేని పరిస్థితి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం మాట ఎలా ఉన్నా, కనీసం చుక్క నీటిని కూడా సద్వినియోగం చేసుకునే దిశలో అధికార యంత్రాంగం కృషి చేయడం లేదు. పెద్దవాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా, ప్రభుత్వం శ్రద్ధ చూపలేక పోతోంది. నీటిని కొంత మేరకైనా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా వాగుపై మూడు ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మాణం కోసం నీటి పారుదల శాఖ దశాబ్ద కాలం క్రితం ప్రతిపాదించినా, ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. పెద్ద వాగుపై అవసరం ఉన్న చోట కనీసం చెక్డ్యాంలను నిర్మించినా భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పాడి పశువుల పరిరక్షణ అందరి బాధ్యత
జహీరాబాద్ టౌన్: రోజురోజుకూ తగ్గిపోతున్న పాడి పశువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజకీయపార్టీల నాయకులు పేర్కొన్నారు. పాడి గేదెల పరిరక్షణపై రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేందాస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అతిథి గృహంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి నరోత్తం, వైఎస్సార్ సీపీ జహీరాబాద్ అధికార ప్రతినిధి కిష్టోఫర్, బీజేపీ జిల్లా నాయకుడు సుధీర్ బండారీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, టీఆర్ఎస్ నాయకుడు, కౌన్సిలర్ రాములు నేత, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శేషుబాబు తదితరులు మాట్లాడుతూ, పలు కారణాల వల్ల పాడిగేదెల సంపద తగ్గిపోతుందన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ సమీపంలోని ‘అల్లానా’ వధ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పాడి పశువులను వధిస్తోందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ‘అల్లానా’పై ఉద్యమించాలని తీర్మానం చేశారు. వట్టిపోయిన పశువులను మాత్రమే పరిశ్రమ సేకరించాలని, లారీల్లో గేదెలను తరలించరాదని, నిర్ధారిత సమయాల్లోనే పశువులను తరలించాలని, పశు వైద్యాధికారుల అజమాయిషీ ఉండాలని తీర్మానాలు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నేత భాస్కర్, టీడీపీ నేత కృష్ణ, శ్రీకాంత్, పాడి గేదెల పరిరక్షణ సంఘం నాయకులు సునీల్కుమార్, రాజ్కుమార్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
తెల్లారిన బతుకులు
జహీరాబాద్ : తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారాయి. పీర్ల పండుగకు హాజరయ్యేందుకు ముంబై నుంచి వరంగల్కు వస్తుండగా.. మృత్యువు కంటెయినర్ రూపంలో ముగ్గురిని బలిగొంది. మృతుల్లో ఇద్దరు మంబై వాసులు కాగా మరో వ్యక్తి వరంగ ల్ జిల్లా వాసి. ఈ సంఘటన మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (26) ముంబైలోని ఓ ప్రాంతంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన హసన్అలీ (48), అన్వర్ అన్సారి (43)లు మిత్రులు కాగా ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చే సేవారు. కాగా వీరికి గోవర్ధన్ తో పరిచయం ఏర్పడింది. అయితే గోవర్దన్ తన సొంత గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హసన్, అన్సారీలను ఆహ్వానించాడు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లికి కారులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న హసన్అలీ, పక్కనే కూర్చొన్న వరంగల్కు చెందిన గోవర్ధన్లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చొన్న అన్వర్ అన్సారి తీవ్రంగా గాయపడి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న జహీరాబాద్ సీఐ సాయి ఈశ్వర్గౌడ్, చిరాగ్పల్లి ఎస్ఐ విజయకుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన రూ.3 లక్షలను పోలీసులు భద్రపర్చారు. ప్రమాద స్థలంలో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
ఆందోళనలో చెరకు రైతులు
జహీరాబాద్: ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగార యాజమాన్యం ఈ సారి కూడా చెరకు రైతుకు చేదును మిగిల్చింది. సామర్థ్యం పెంచి కర్మాగారం పరిధిలో సాగైన పంటనంతా కొనాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, 2014-15 క్రషింగ్ సీజన్ సామర్థ్యం పెంచే యోచనను యాజమాన్యం దాదాపుగా విరమించుకుంది. రైతుల కోరిక మేరకు తొలుత సామర్థ్యం పెంచాలనుకున్న యాజమాన్యం ఆ తర్వాత పలు కారణాలతో సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500 టన్నుల మేర కలిగి ఉంది. దాన్ని సీజన్కు గాను 3,300 టన్నులకు పెంచాలని యోచించింది. నవంబర్ రెండో వారంలో క్రషింగ్ ఉన్నందున ఇప్పటికిప్పుడు విస్తరణ పనులు ప్రారంభిస్తే సీజన్ ఆరంభానికల్లా పూర్తి చేయలేని పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో అయితే ఆఖరు నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో రైతులు తమ చెరకును వ్యయప్రయాసల కోర్చి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వచ్చే సీజన్కు సామర్థ్యం పెంచేలా చర్యలు ప్రస్తుతం కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500ల టన్నులుగా ఉంది. దీన్ని ప్రస్తుతం రోజుకు 3,800 టన్నులకు పెంచాలని, ఆ తర్వాత 2015-16 క్రషింగ్ సీజన్కు 4,200 టన్నుల మేరకు చేర్చాలని యాజమాన్యం పరిశీలించినట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం కర్మాగారం ఎం.డి రాజశ్రీ జహీరాబాద్ వచ్చిన సందర్భంగా రైతులు సామర్థ్యం పెంచే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె సుముఖత కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్కు కాకుండా 2015-16 క్రషింగ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్మాగారం సామర్థ్యాన్ని మొక్కుబడిగా పెంచితే ఏ మాత్రం ప్రయోజనం ఉండబోదని, 6 వేల టన్నులకు పెంచే విషయాన్ని యాజమాన్యం సీరియస్గా పరిశీలించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. సాగు పెరిగినా...పెరగని క్రషింగ్ 1973 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్-3 కర్మాగారాన్ని జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో నిర్మించి ప్రారంభించింది. అప్పట్లో రోజుకు 1,250 టన్నుల సామర్థ్యం మేర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. పలు దశల్లో కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ప్రతి ఏటా జోన్ పరిధిలో చెరకు పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతుండడంతో కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ వస్తున్నారు. సంగారెడ్డిలోని గణపతి, మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట కర్మాగారాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాలకు కూడా రైతులు చెరకును తరలించుకుంటున్నారు. కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు చెరకును విక్రయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్మాగారం సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయినా యాజమాన్యం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో ప్రస్తుతం అధికారికంగా 24వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. అనధికారికంగా ఇది 28 వేల ఎకరాల్లో ఉంటుందని అంచనా. పూర్తిస్థాయిలో జరగని క్రషింగ్ ప్రస్తుతం జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరకు పంటను ట్రైడెంట్ కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయడం లేదు . గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి నెలకొంటూ వస్తోంది. జోన్ పరిధిలో సుమారు 9 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇందులో ట్రైడెంట్ కర్మాగారం సుమారు 4.75 లక్షల టన్నుల చెరకును మాత్రమే క్రషింగ్ చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 4.65 లక్షల టన్నుల మేర చెరకును క్రషింగ్ చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు చెరకును ఇతర కర్మాగారాలకు తరలించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం వర్షాభావం కూడా ఏర్పడడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత మేర ఇతర కర్మాగారాలకు చెరకు పంటను తరలించుకునేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆలస్యం చేస్తే కూలీ, రవాణా చార్జీల రేట్లు భారీగా పెరిగి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి వస్తుందంటున్నారు. జహీరాబాద్లోని ట్రైడెంట్ కర్మాగారం సామర్థ్యాన్ని రోజుకు 6 వేల టన్నుల మేర పెంచినట్లయితేనే ప్రయోజనం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో యాజమాన్యం ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
కరెంటు కోతలపై బీజేపీ నిరసన
జహీరాబాద్ టౌన్: కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. జహీరాబాద్ సబ్స్టేషన్ ధర్నా నిర్వహించి ఏడీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీ సులు వీరిని స్టేషన్కు తరలించారు. వివరాలు.. కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున్పాటిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు జహీరాబాద్ సబ్ స్టేషన్ ధర్నా నిర్వహించాయి. అంతకు ముం దు స్థానిక అతిథి గృహం నుంచి సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్పాటిల్ మా ట్లాడుతూ.. మండల పరిధిలోని రైతులు వందల ఎకరాల్లో చెరకు, అల్లం, పసు పు, అరటి తదితర పంటలను సాగుచేశారని తెలిపారు. అయితే కరెంట్ కోతల వల్ల ఇవి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి రెండు మూడు గంటలకు మించి కరెంట్ ఇవ్వడంలేదన్నారు. రాత్రీపగలు లేకుండా కోతలు విధిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్కో ఏడీఈ తులసీరాం నాయకులతో ఫోన్లో మాట్లాడుతూ... వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలో కరెంట్ సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ధర్నాలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బస్వరాజ్పాటిల్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు శివ, కార్యదర్శి అజయ్, నాయకులు ప్రభాకర్రెడ్డి, విశ్వనాథ్ యాదవ్, నరేష్, బండి వెంకట్ పాల్గొన్నారు. -
నిఘా నిద్దరోతోంది!
- జహీరాబాద్ కమర్షియల్ టాక్స్ చెక్పోస్టు అధికారుల నిర్లక్ష్యం - వేబిల్లులు లేకుండానే రాష్ట్రంలో ప్రవేశిస్తున్న సరుకులు - సిగరెట్ల వ్యాన్ పట్టివేతతో తేటతెల్లం సంగారెడ్డి క్రైం: జిల్లా సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టు నిద్రపోతోంది. మామూళ్లపై శ్రద్ధ చూపుతున్న ఆ శాఖ అధికారులు అక్రమ రవాణాను నిలువరించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు ఎటువంటి వే బిల్లులు లేకుండానే లక్షల రూపాయల సరుకులను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సర్కార్ ఖజానాకు చేరాల్సిన సొమ్ములు పక్కదారి పడుతున్నాయి. జహీరాబాద్ పట్టణ శివారులో అధికారులు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టును ఏర్పాటు చేశారు. అయితే నిఘా తీవ్రం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడింది ఆటా పాడింది పాటగా మారింది. చెక్పోస్టుపై సంబంధిత శాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు జహీరాబాద్ చెక్పోస్టు వద్ద ఎటువంటి వే బిల్లులు లేకుండా సిగరెట్ల లోడ్లతో వెళ్తున్న డీసీఎం (ఏపీ 09టీ 0849)ను పట్టుకున్నారు. ఆ వ్యాన్లో మొత్తం 53 కాటన్లలో ఇండోనేషియా సిగరెట్లు ఉన్నాయి. ఈ వ్యాన్ ముంబాయ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని సంగారెడ్డిలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వే బిల్లులు లేకుండా తరలిస్తున్న ఈ వ్యాన్ సంగారెడ్డిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఆధీనంలో ఉంది. వాహనంలో ఉన్న సిగరెట్ల విలువ ఎంత ? ఈ వాహనం వే బిల్లులు లేకుండా ఎక్కడికి వెళ్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలా వెళ్లాయా? అనే విషయాలపై ఆరా తీయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రపోతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవంటూ కాలయాపన చేశారు. సోమవారం నిపుణులను పిలిపించి డీసీఎంలోని సిగరెట్ల విలువ ఎంతో నిర్ణయిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ చెక్పోస్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా సరిహద్దు దాటుతున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్పోస్టువద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. -
బకాయిలు వచ్చేదెన్నడో?
జహీరాబాద్: స్థానిక ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం యాజమాన్యం.. చైరకు బకాయిలను చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా రెతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సాగు పెట్టుబడుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీ అమలైతే తిరిగి రుణాలు పొందవచ్చనే ఆశ నీరుకారడంతో.. ట్రైడెంట్ యాజమాన్యమైనా బకాయిలు చెల్లిస్తే పెట్టుబడుల కోసం కొంత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలవుతుందని ఆశించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్రావు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయినా.. రుణమాఫీ అమలు కాక పోవడంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టక తప్పడం లేదు. మరో పక్షం రోజులు గడిస్తే రబీ పంటల సాగు కోసం కూడా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండడంతో చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం యాజమాన్యం చెరకు బకాయిలనైనా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు అంటున్నారు. తిరిగి క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు సమయం దగ్గర పడుతున్నా బకాయిలను చెల్లించే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2013-14 సీజన్కు గాను ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 4.65 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. క్రషింగ్ ప్రారంభం నుంచి యాజమాన్యం పూర్తి బిల్లులను చెల్లించలేదు. క్రషింగ్ సీజన్కు గాను యాజమాన్యం టన్నుకు రూ.2,600 ధరను నిర్ణయించింది. క్రషింగ్ సీజన్ ఆరంభం నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు టన్నుకు రూ.2,400 బిల్లులను చెల్లిస్తూ వచ్చింది. అయితే మిగతా 200 రూపాయలను క్రషింగ్ ముగిసిన అనంతరం చెల్లించడం జరుగుతుందని యాజమాన్యం క్రషింగ్ ఆరంభంలో ప్రకటించింది. క్రషింగ్ ముగిసి ఆరు నెలలు కావస్తున్నా బిల్లుల బకాయిలను పెండింగ్లో పెడుతూ వచ్చింది. బకాయిలను ఇంత వరకు రైతులకు చెల్లించలేదు. ఈ బిల్లుల కింద యాజమాన్యం రైతులకు రూ.9.30 కోట్లు బకాయి పడింది. వీటిని చెల్లించే విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా యాజమాన్యం బకాయి పడిన చెరకు బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలు తక్షణమే చెల్లించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. -
అప్పులబాధతో ఇద్దరి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్/మెదక్ మున్సిపాల్టీ : అప్పుల బాధలు భరించలేక జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బుధవారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు యువ రైతు కాగా మరొకరడు స్వర్ణకారుడు. వివరాలు ఇలా ఉన్నాయి.. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి తండాకు చెందిన రాథోడ్ సంతోష్ (32) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న ఎకరం పొలంలో బోరు వేసి చెరకు పంట సాగు చేస్తున్నాడు. అయితే కుటుంబ పోషణ, పొలంలో బోరు వేయడానికి ఇతరత్రా ఖర్చులకు సుమా రు రూ. 2.50 లక్షలు అప్పు చేశాడు. అ యితే రుణదాతల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిళ్లు వచ్చాయి. ఈ క్రమంలో సంతోష్ భార్య గంగుబాయి కర్ణాటకలో ని చిడుగుప్పలో ఉన్న పుట్టింటికి వెళ్లిం ది. దీంతో బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్వర్ణకారుడు ఆత్మహత్య అప్పులబాధతో స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేటకు చెందిన సంతోష్కుమార్ చారి (28) కొంతకాలంగా భార్యా పిల్లలతోపట్టణంలోని బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్నాడు. కులవృత్తి అయి న అవుసుల పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వృత్తి పని సరిగా నడవక అప్పులు పెరిగిపోయా యి. మరోవైపు కుటుంబ పోషణ భారం గా మారింది. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్కుమార్ బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతలోనే బయటకు వెళ్లిన సంతోష్కుమార్ భార్య సరిత ఇంటికి చేరుకుని చూడగా లోపల గడియ పెట్టి ఉండడంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా సంతోష్ కుమార్ ఉరేసుకుని కనిపిం చాడు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ మృతదేహాన్ని మెదక్ తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కొమురయ్య తెలిపారు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
‘ముత్తూట్’ మరవకముందే మరో చోరీ
జహీరాబాద్ : పట్టణంలో ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి గురైన సంఘటనను మరవక ముందే హనుమాన్ మందిర్ రోడ్డు లో గల రఫీ జ్యూవెలర్స్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో 50 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. అయితే దోపిడీలో ఆరి తేరిన వారే బంగారు దుకాణంలో దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుకాణం గురించి అంచనా వేసిన అనంతరమే చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యూవెలర్స్ షాప్లోని పై అంతస్తులో బట్టల దుకాణం కూడా నిర్వహిస్తుండడంతో దొంగలు ముందుగానే దుకాణం గురించి పూర్తిగా అవగాహన పొంది న అనంతరమే దోపిడీకి పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని పలువు రు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ గా.. ముత్తూట్ ఫైనాన్స్లో అప్పట్లో భారీగా దొంగతనం జరిగింది. అంత కు ముందు కూడా జహీరాబాద్ ప్రాంతంలోని పలు బ్యాంకులలో దొంగతనం, దొంగతనం యత్నం జరిగింది. 2013 మార్చి 18న కొత్తూర్ (బీ) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75 లక్షల నగదును అపహరించారు. 2013 మార్చి 28న కోహీర్ మండలం కవేలి సిండికేట్ బ్యాంకు ను దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో అప్పటి ఎస్ఐ వెంకటేష్ గాయపడిన విష యం తెలిసిందే. 2013 జూన్ 25న జహీరాబాద్ మండలం మల్చల్మ సిండికేట్ బ్యాంకులో దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగల కోసం ప్రత్యేక టీంలు దొంగలను పట్టుకునేందుకు గాను పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దొంగతనం జరిగిన తీరు ను బట్టి ఎక్కడి గ్యాంగ్ పని అయి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో జార్ఖం డ్ ప్రాంతానికి చెందిన వారిగా అప్ప ట్లో పోలీసులు గుర్తించారు. వారిలో కొందరు ఇప్పటికే పట్టుబడ్డారు. జూయలర్స్ దుకాణం దోపిడీకి సంబంధించి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు ఉండి ఉంటారా అనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
వైద్య శిబిరానికి విశేష స్పందన
జహీరాబాద్: లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. 1,357 మంది రోగులు తరలివచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారు. దీని లో భాగంగా మొదటి రోజు చెవి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించారు. 517మంది రోగులు చెవి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆపరేషన్ల కోసం గుర్తిం చిన వారిలో 15 మందికి సర్జరీలు చేశారు. గ్రహణం మొర్రికి సంబంధించి 7గురు పేర్లు నమోదు చేయించుకున్నారు. కంటి శుక్లాలకు సంబంధించి 12వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేం దుకు నిర్ణయించినా రోగులు అధికంగా రావడంతో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. 834 మంది కంటి వైద్యం కోసం వచ్చా రు. మంగళవారం నుంచి దంత వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నా రు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు జహీరాబాద్లోని రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులో ఉం చిన రైలులో వైద్య పరీక్షలు, అవసరమైన వారికి ఆపరేషన్లను నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు దంత వైద్య పరీక్షలు జరుగుతాయని తెలిపా రు. చెవి ఆపరేషన్ల కోసం గుర్తించిన వారిలో మిగిలిపోయిన రోగులకు మంగళవారం ఆపరేషన్లను నిర్వహించనున్నట్లు వారు వివరించారు. పలువురికి ఉచితంగా మిషన్లు ఇచ్చారు. -
జహీరాబాద్ చేరిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ రైలు
- 6 నుంచి 21వ తేదీ వరకు ఉచిత వైద్య సేవలు - అత్యాధునిక వసతులతో ఆపరేషన్లు జహీరాబాద్ : జిల్లాలో మొదటి సారిగా లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా వైద్య శిబిరం నిర్వహించేందుకు రైల్వే శాఖ తలపెట్టింది. జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం సహకారంతో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్లో సెప్టెంబర్ 6 నుంచి 21వ తేదీ వరకు జహీరాబాద్ రైల్వేస్టేషన్లో మారుమూల గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక రైలు బోగీలు స్థానిక రైల్వే స్టేషన్కు చేరుకున్నాయి. ప్రత్యేక రైలులో అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. జహీరాబాద్లో నిర్వహించేది 155వ ఉచిత వైద్య శిబిరం అవుతుందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. శిబిరంలో ఆర్థోపెడిక్, కంటి, చెవి, పంటి, గ్రహణమొర్రి, మూర్చ రోగాలకు వైద్య సేవలందించనున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తామని అధికారులు చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా వైద్య సేవలను ప్రారంభించిందని తెలిపారు. రైళ్ల రాకపోకలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా గూడ్స్ రైళ్లను నిలిపే ప్లాట్ఫాంపై ప్రత్యేక రైలును నిలిపి రోగులకు వైద్య సేవలందించనున్నారు. వైద్య శిబిరం నిర్వహణ ఏర్పాట్లను మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం ప్రతినిధులు గిల్రాయ్, ప్రదీప్గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ శిబిరంలో ఆపరేషన్లు నిర్వహించేందుకు రోగులకు గుర్తించేందుకు ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 6వ తేదీన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. -
ప్రభుత్వం మారినా తప్పని రైతన్న కష్టాలు
బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్రావు జహీరాబాద్ టౌన్: ప్రభుత్వం మారిన రైతులకు కష్టాలు తప్పడంలేదని బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్రావు పేర్కొన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం శనివారం జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా స్థానిక అతిథి గృహంలో బీజేపీ నియోజవర్గం ఇన్చార్జి మల్లికార్జున్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింగ్రావు మాట్లాడుతూ వర్షాలు ముఖం చాటేయడంతో వేల రుపాయాల పెట్టుబడితో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోరుబావుల్లోని నీటిని పంటలకు మళ్లించుకుందామంటే విద్యుత్ కోతలు అవరోధంగా మారాయన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా మారిందన్నారు. రూ.లక్ష లోపు రుణ మాఫీలో స్పష్టతలేకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. జిల్లాలో కరువు ఛాయలున్నందున కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొవాలన్నారు. సమావేశంలో మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, నాయకులు హన్మంత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, చంద్రారెడ్డి, రాఘవేంద్ర నాయక్, విశ్వనాథ్యాదవ్, వేణుపల్లోడ్, కాశప్ప, నాగరాజు తదితరలు పాల్గొన్నారు. -
అసంపూర్తిగా రైల్వే అండర్ బ్రిడ్జి పనులు
జహీరాబాద్: రైల్వే అండర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండడంతో పట్టణ ప్రజలు రాక పోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతుండడంతో ప్రజలు మరో రోడ్డు గుండా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జహీరాబాద్ పట్టణం మధ్యలో రైల్వేస్టేషన్ ఉండడంతో ప్రజలు ఇరు వైపుల నుంచి ఆయా కాలనీలకు కాలినడకన, వాహనాలపై రాక పోకలు సాగించేందుకు అవస్థలకు గురవుతున్నారు. గతంలో ఉన్న రైల్వే గేటును మూసి వేయడంతో రైల్వే అండర్బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మూడు సంవత్సరాల క్రితం రైల్వే అండర్ బ్రిడ్జిని మంజూరు చేయించి పనులు చేపట్టారు. పనులు చివరి దశలో అర్ధంతరంగా నిలిచి పోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాకుండా జాప్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వర్షం కురిస్తే బ్రిడ్జినిండా నీరు నిలిచి రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోతున్నది. వర్షం నీటిని తోడేందుకు వీలుగా రెండు బావులను నిర్మించాల్సి ఉంది. అయినా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక బావిని మాత్రమే నిర్మించి అసంపూర్తి పనులతో వదిలి పెట్టారు. మరో బావిని నిర్మించాల్సి ఉంది. బావులను తవ్వించి, సీసీ పనులు చేపట్టాల్సి ఉంది. వర్షం నీరు బావుల్లోకి చేరే విధంగా ఏర్పాట్లు చేసి, ఆ నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపాల్సి ఉంటుంది. అయినా పనులను పూర్తి చేయించే విషయంలో జాప్యం జరుగుతుండడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు కాలువల ద్వారా బావుల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పైపు లైను వద్దకు మట్టి చేరి నీరు బావుల్లోకి చేరే అవకాశం లేకుండా పోతోందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.64 లక్షలు కేటాయించగా, సీసీ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా సీసీ గోడల నిర్మాణం, బావుల తవ్వకం పనుల కోసం రూ.1.20 కోట్లు మంజూరు చేసింది. కరెంటు మోటార్లకు బదులు డిజిల్ ఇంజన్లను వినియోగించి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొనుగోలు చేసిన డీజిల్ ఇంజన్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించి రాక పోకల ఇబ్బందులను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పోలీసు వ్యవస్థ పటిష్టతకు చర్యలు
జహీరాబాద్ టౌన్: సంఘ విద్రోహశక్తులను అరికట్టడానికి.. నేరాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్కు వచ్చిన సందర్భంగా స్థానిక అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరాల సంఖ్య పెరుగుతోందని, నేరం జరిగిన వెంటనే దోషులను పట్టుకునేందుకు ఆధునిక పరిజ్ఞానంతోకూడిన వాహనాలను సమకూరుస్తున్నామన్నారు. ఈ మేరకు 1650 ఇన్నోవా కార్లు,1,500 మోటారు సైకిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. హైదారాబాద్, సైబరాబాద్తో పాటు జిల్లాలకు కూడా ఈ వాహనాలను అందజేస్తామన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య లేదని, సరిహద్దులో ఉన్నందున పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వాల కారణంగా కరెంట్ సమస్య తలెత్తిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. వారు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లవరకు కరెంట్ కష్టాలుంటాయని ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. కరెంట్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు చత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొనుగోలుకు ప్రయత్నాలు జరుతున్నాయని చెప్పారు. చత్తీస్గఢ్లో కొత్త గ్రిడ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రూ. లక్షలోపు రైతు రుణాలను తప్పకుండా మాఫీ చేస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. రుణాల రీ షెడ్యూల్పై రిజర్వు బ్యాంకు మెలికలు పెట్టడం సరికాదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణ మాఫీ చేసి తీరుతామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలన్న ఉద్దేశంతోనే ఈ నెల 19న సర్వే నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను దోపిడీ చేశాయని ఆరోపించారు. హోంమంత్రి మొదటిసారి జహీరాబాద్ కు రావడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
‘నారింజ’ కోసం నయా ప్లాన్
జహీరాబాద్: నారింజ... జహీరాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. మూడు వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో కోటి రూపాయలు వెచ్చించి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు. కానీ సెంటు భూమిని తడపకపోవడంతో పేరుకే ప్రాజెక్టుగా నిలిచిపోయింది. అట్టహాసంగా ప్రాజెక్టు ప్రారంభించినా, నీరు పారక రైతులే కాల్వలు పూడ్చేశారు. పాలకుల అలసత్వంతో ప్రాజెక్టు పూడికతో నిండిపోయింది. దీంతో నాలుగు దశాబ్దాలుగా నారింజ నీళ్లు రైతన్నలను ఊరిస్తూనే ఉన్నాయి. కళ్లు తెరచిన కొత్త సర్కార్ సాగునీటికి కటకటలాడుతున్న మెతుకుసీమ రైతాంగానికి సాగునీరిచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్న కొత్త సర్కార్కు నారింజ ప్రాజెక్టు కళ్లముందు కనిపించింది. పైగా జిల్లాకు చెందిన హరీష్రావే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడంతో నారింజ నీళ్లను సాగుకు తరలించేందుకు ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నారింజ ప్రాజెక్టును ఉన్నతాధికారులతో సర్వే చేయించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే పలువురు పలు రకాల సూచనలు చేస్తుండడంతో సర్కార్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విషయమై సాధ్యాసాధ్యాలను నిర్ధారించేందుకు వీలుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్తో సర్వే చేయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులో నీటిని ఏ మేరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర నీరు నిల్వ ఉంటుంది, పూడిక తీయించినట్లయితే ఎంత మేర ప్రయోజనం ఉంటుంది, పూడికతీత కోసం ఏ మేరకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుం దనే విషయాలపై ప్రభుత్వం సమాచారం సేకరించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి లో ఉన్నతాధికారులతో సర్వే చేయించిన అనంతరమే నారింజ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. నారింజ నీటిని రైతులకు అందించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వెంటనే కాల్వలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.5.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాల్వల నిర్మాణంతో ప్రయోజనమేమిటనే వాదనలు తెరపైకి రావడంతో ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడడంతో కాల్వలు నిర్మాణానికి నోచుకోలేదు. కళ్లముందే తరలిపోతుంటే... జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా ఉన్న నారింజ వాగు కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. అయితే ఈ నీరంతా వృథాగా కర్ణాటకకు తరలి వెళ్తుండడంతో, జహీరాబాద్ ప్రాంతం రైతులు కూడా నారింజ జలాలను వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు కం బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి రాష్ర్ట ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే గత నాలుగు దశాబ్దాల కాలంగా నారింజ జలాలు రైతులకు అందని ద్రాక్షలా మారాయి. లక్ష్యం ఘనం...ఫలితం శూన్యం నారింజ ప్రాజెక్టు లక్ష్యం ఘనంగా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ప్రాజెక్టు కింద 3 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కూడి కాల్వ కింద 550 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 2,450 ఎకరాలుగా గుర్తించారు. 2 కిలోమీటర్ల మేర పొడవున్న కుడి కాల్వ కింద న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామాలున్నాయి. 13 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ కింది జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్పల్లి, మాడ్గి గ్రామాలను గుర్తించారు. అయినప్పటికీ ఏ ఒక్క కాల్వ కూడా సాగుకు అనువుగా లేకుండా పోయింది. దీంతో ఆయా గ్రామాల్లోని గుంట భూమి కూడా సాగులోకి రాలేదు. ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వలను తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాల్వలను తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాల్వలను అప్పట్లోనే రైతులు పూడ్చి వేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్టీ)గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న రెంటు తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని తొలగించి కొత్తగా తూములను ఏర్పాటు చేయాల్సి ఉంది. మట్టితో నిండిపోయిన కాల్వలను తిరిగి తవ్వించాల్సిన అవసరం ఉంది. కాల్వలు అక్కడక్కడ మాత్రమే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పూడిక తీస్తేనే ప్రయోజనం ప్రస్తుతం నారింజ ప్రాజెక్టు పూడికతో నిండిపోయి ఉంది. పూడికను తీస్తేనే ఉపయోగకరంగాా ఉంటుందని పరిసర గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండిపోతోందనీ, దీంతో మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తోందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టులోని పూడికను తీయించినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, అంతే కాకుండా పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బోర్ల కింద సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రాజెక్టులోని పూడిక తీసేందుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ తర్వాతే కాల్వల ద్వారా నీటిని అందించేందుకు వీలుగా నిర్మాణం పనులు చేపట్టాలంటున్నారు. -
జహీరాబాద్లో రైల్వే లైఫ్లైన్!
జహీరాబాద్: స్థానిక రైల్వేస్టేషన్లో రైల్వే శాఖ లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ సేవలకు ప్రతిపాదించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు వీలు కలగనుంది. సెప్టెంబర్ 6 నుంచి 21వ తేదీవరకు రైల్వేస్టేషన్లోని గూడ్స్ ఫ్లాట్ఫాంపై ప్రత్యేక రైలు ద్వారా రోగులకు ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. జిల్లాలోనే రైల్వే శాఖ మొదటి సారిగా లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా వైద్యశిబిరం నిర్వహించేందుకు ప్రతిపాదించింది. మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం సహకారంతో జహీరాబాద్లోని మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయించింది. జహీరాబాద్లో నిర్వహించేది 155వ ఉచిత వైద్య శిబిరం అవుతుందని రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో ప్రత్యేక శిబిరం కొనసాగుతోందని, అక్కడి నుంచి జహీరాబాద్కు తరలించి వైద్య సేవలు అందించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సుమారు 9 లక్షల మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించినట్టు వివరించాయి. శిబిరంలో ఆర్థోపెడిక్, కంటి, చెవి తదితర సమస్యలతో పాటు ఖరీదైన వైద్య సేవలందించనున్నట్టు, అవసరమైన వారికి ఆపరేషన్లకు కూడా నిర్వహిస్తారని వివరించాయి. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ వైద్య సేవలను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం కోసం అవసరమైన విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలను కల్పించేందుకు రైల్వే శాఖ, మహీంద్రా అధికారులు కృషి చేస్తున్నారు. రైళ్ల రాకపోకలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా గూడ్స్రైళ్లను నిలిపే ప్లాట్ఫాంపై ప్రత్యేక రైలును నిలిపి రోగులకు వైద్యసేవలందించేందుకు అధికారులు నిర్ణయించారు. -
ఆధార్ నంబర్ ఇస్తేనే రేషన్: డీఎస్ఓ
జహీరాబాద్ టౌన్: రేషన్ డీలర్లకు కార్డుదారులు ఆధార్ నంబరు ఇస్తేనే ఇకపై రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఏసురత్నం చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీ లోపు వారివారి రేషన్ డీలర్లకు అందజేయాలని సూచించారు. లేకుంటే ఇంటింటా సర్వే చేసి కార్డును శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. ఆధార్ కార్డు లేనివారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకొందని, ఇలాంటి కార్డులుంటే రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయాలన్నారు. కార్డుదారుడు మరణించినా, ఒకరి పేరిటే రెండు కార్డులు ఉన్నా, గ్రామాల్లో ఉండని వారి కార్డులను కూడా బోగస్విగా గుర్తిస్తామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ కేంద్రాల్లో సన్నబియ్యం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కిలో రూ. 30 చొప్పున 30 కిలోలు పొందవచ్చని సూచించారు. నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అర కిలో చక్కెర అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మండలంలోని డీలర్లతో సమావేశమయ్యారు. బోగస్ కార్డులు ఉంటే అందజేయాలని డీలర్లకు సూచి ంచారు. కార్డుదారులు కోరిన సరుకులనే పంపి ణీ చేయాలని సూచించారు. బలవంతంగా అవసరం లేని సరుకులు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాప్లను తెరచి ఉంచాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్లు చంద్రశేఖర్, జనార్దన్, డీలర్లు పాల్గొన్నారు. -
హత్యకేసును ఛేదించిన పోలీసులు
ఝరాసంగం : మండలంలోని జొన్నెగావ్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన బేగారి సంగయ్య (52) కేసు ను పోలీసులు ఛేదించారు. హత్యకేసు విషయాన్ని మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో జహీరాబాద్ రూరల్ సీఐ ఆంజనేయులు విలేకరులకు వివరించారు. గ్రామానికి బేగారి సంగయ్య అదే గ్రామానికి చెందిన కనకయ్యతో స్నేహం చేసి మద్యానికి బానిస చేయడంతో పాటు అతడి భూములన్నీ విక్రయించేలా చేశాడు. ఈ నేపథ్యంలో కనకయ్య కుటుం బం ఆర్థికంగా చితికిపోయింది. దీనిని జీర్ణించుకోలేని కనకయ్య కుమారుడు ధన్రాజ్.. బేగారి సంగయ్యను చంపాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే బేగారి సంగయ్య లింగంపల్లికి వెళుతున్న విషయాన్ని తెలుసుకుని హత్య చేసేందుకు పథకం పన్నాడు. తాట్పల్లి నుంచి జొన్నెగావ్కు ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బేగారి సంగయ్య గ్రామ శివారులో గల కోమటికయ్య వద్దకు రాగానే ధన్రాజ్ అతడిపై కట్టితో దాడి చేశాడు. అనంతరం పక్కనే ఉన్న గుంతలో పడేశాడు. అనంతరం కల్వర్టుకు ఉన్న రాళ్లను తీసుకుని సంగయ్య ముఖంపై వేసి తనకేమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ధన్రాజ్పై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు అదేశించినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ, పోలీసులను సీఐ అభినందించారు. -
దా‘రుణం’!
సాక్షి సంగారెడ్డి,సంగారెడ్డి: అరవై ఏళ్ల కల సాకారమైనా.. రైతన్న మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. ‘మన రాజ్యం.. మన పాలన’కోసం ఆశగా కొట్లాడిన అన్నదాతలు.. ఇప్పుడెందుకో కలవరపడుతున్నారు. తెలంగాణ ‘సంబురాలు’ కూడా ఒడిసిపోక ముందే మెతుకుసీమ రైతింట్లో ‘సావు’ దరువేస్తోంది. కొత్త సర్కారు అస్పష్ట మాటలు.. మీడియా లీకులు.. రుణాల మాఫీపై ఆంక్షలు.. అన్నీ కలిసి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘అప్పులు తీరుతాయో లేదోనని.. ఎట్టా బతికేదని’ దిగులు చెందుతూ మృత్యువాత పడుతున్నారు. మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో యువరైతు ముత్యాల సంగయ్య గుండెపోటుతో చనిపోగా.. తాజాగా శుక్రవారం జహీరాబాద్ మండలం కాశీంపూర్లో బోయిని దత్తాత్రి గుండె ఆగి చనిపోయారు. దత్తాత్రికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. కాలం కలిసిరాక, పంటలు పండక అప్పులు కావడం...దానికి తోడు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడంతో దాదాపు 6 ఎకరాల భూమి అమ్మేశాడు. ఆరు నెలల కిందట మరో ఆడపిల్ల పెళ్లి చేశాడు. దాదాపు రూ.2 లక్షలు అప్పు అయింది. గత ఏడాది గ్రామీణ వికాస బ్యాంకు జహీరాబాద్ శాఖ నుంచి రూ. 65 వేల పంట లోను తీసుకున్నాడు. ఇప్పుడది వడ్డీతో కలుపుకొని రూ.72 వేల వరకు అయింది. ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ప్రకటించడంతో దత్తాత్రి నెత్తి మీద ఉన్న భారం దిగినట్లు అయింది. అయితే బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ప్రచారం జరగడంతో అప్పు తీరేది ఎట్టా అని మదనపడ్డ దత్తాత్రికి గుండెపోటు వచ్చి చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జోగిపేట మండలం పోల్కంపల్లిలో గురువారం మరణించిన యువ రైతు సంగయ్య గుండెపోటుకు గల కారణాలను శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. వివరాల ప్రకారం 2011 నుంచి 2013 మధ్యకాలంలో సంగయ్య కుటుంబం దాదాపు రూ 2.12 లక్షల పంట రుణం తీసుకుంది. ఎస్బీహెచ్ బ్యాంకు మునిపల్లి శాఖ నుంచి వీరు రుణాలు పొందారు. సంగయ్య పేరు మీద రూ. 50 వేలు, ఆయన తండ్రి ఆశయ్య పేరు మీద రూ. 90 వేలు, తల్లి బాలమ్మ పేరు మీద రూ. 72 వేల రుణం ఉంది. ఒక్కొక్కరి పేరు మీద రూ. లక్ష లోపే రుణాలు ఉన్నాయి. అన్ని రుణాలు మాఫీ అవుతాయని సంగయ్య ఆశపడ్డారు. కానీ రుణాలు మాఫీ అయ్యే అవకాశం లేకపోవడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని అధికారులు వాంగ్మూలం సేకరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల్లో 3,65,787 మంది రైతులు రూ. 2,404 కోట్ల పంట రుణాలు తీసున్నారు. 1,90,406 మంది సన్నకారు రైతులు రూ.1,130 కోట్లు, 86,272 మంది చిన్నకారు రైతులు రూ. 633 కోట్ల రుణాలు తీసుకున్నారు. గడిచిన మూడేళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు తొమ్మిది లక్షలకు పైగా మంది రైతులు ఉన్నారు. రూ. 4.500 కోట్ల పంట రుణాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కేవలం సన్నకారు రైతుల రుణాలు రూ.1,130 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకు అధికారుల గణాంకాలను చూస్తే దాదాపు ఐదు లక్షల మంది రైతులకు రుణ మాఫీ అయ్యే అవకాశం లేదు. దీంతో రుణమాఫీ మీద కోటి ఆశలు పెట్టుకున్న రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. -
పరిహారం కొన్ని పంటలకే
జహీరాబాద్, న్యూస్లైన్: ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. నిండా అప్పుల్లో మునిగి పోయారు. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన అధిక వర్గాలు, పైలిన్ తుపాను కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడులు పడిపోయాయి. ఇది మరచిపోకముందే మార్చినెల మొదటి వారంలో కురిసిన భారీ వడగళ్ల వర్ష బీభత్సానికి పంటలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దెబ్బతీసిన వడగళ్ల వాన జహీరాబాద్, కోహీర్ మండలాల్లో వడగళ్ల బీభత్సానికి అరటి, కంది, మొక్కజొన్న, జొన్న, గోధుమ, శనగ పంటలు దెబ్బతిన్నాయి. జరిగిన పంట నష్టాన్ని అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. అయినా ఇంతవరకూ పంట నష్టం పరిహారం మంజూరుకాక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పత్తి పంటకు మాత్రం పరిహారం చెల్లించే అవకాశం లేదని వారు వెల్లడిస్తున్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు మాత్రం త్వరలోనే పరిహారం మంజూరు కానుందని వారంటున్నారు. దీంతో వడగళ్లవాన బాధిత రైతులంతా పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వడగళ్ల వర్షానికి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో అరటి పంట సుమారు వేయి ఎకరాలకు పైగానే దెబ్బతింది. సుమారు 400 ఎకరాల్లో కంది పంట, 800 ఎకరాల్లో శనగ, 270 ఎకరాల్లో మొక్కజొన్న, 1,200 ఎకరాల్లో జొన్న, 200 ఎకరాల్లో గోదుమ పంటలు దెబ్బతిన్నాయి. అరటి రైతులు సైతం భారీగా నష్టాలను చవి చూశారు. భారీ పెట్టుబడులతో అరటిసాగు చేపట్టిన రైతులు వడగళ్ల వానతో ఎకరాకు రూ.50 వేల మేర నష్టపోయారు. ఆ సమయంలో నివేదికలు తయారు చేసి ఆదుకుంటామన్న అధికారులు ఇంతవరకూ పరిహారం మంజూరు చేయకపోవడంతో రైతులంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ’పైలిన్’తో పత్తికి తీవ్రనష్టం గత సంవత్సరం కురిసిన అధిక వర్షాలతో పాటు అక్టోబర్ మాసంలో వచ్చిన పైలిన్ తుపాన్ కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. కొంత మేర ఆశాజనకంగా కనిపించిన పత్తి పంటపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పైలిన్ తుపాన్ వారి ఆశలపై నీళ్లు పోసింది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో 12,927 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేసుకున్నారు. ఎకరా పత్తి పంట సాగు కోసం సుమారు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేయగా, పైలిన్ తుపాను ప్రభావంతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ఇక లోతట్టు ప్రాంతాల్లో పత్తిసాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా పత్తిరైతు ఆదుకోవడంలో మెలిక పెట్టింది. చేతికి అందివచ్చిన పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ అప్పట్లో నిబంధన విధించడంతో పత్తి రైతులు దిగ్భ్రాంతికి చెందారు. అక ఇప్పుడేమో పత్తి రైతులెవరికీ పరిహారం ఇవ్వమంటూ తేల్చిచెబుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడుతున్న సర్కార్ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
మాస్టర్ప్లాన్ అమలులో జాప్యం
జహీరాబాద్, న్యూస్లైన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణకు ప్రతిపాదించినా అమలు విషయం లో తీవ్ర జాప్యం జరుగుతోంది. టౌన్ప్లానింగ్ నుంచి అనుమతి లభించినా అధికారులు పను లు చేపట్టడంలేదు. అయితే రాజకీయ నాయకు లు సైతం ఈ విషయంపై మౌనం వహిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ ఆక్రమణలకు గురి కావడంతో పలు రోడ్లు కుంచించుకు పోయాయి. దీంతో రోడ్లపై రాక పోకలు సాగిం చాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నా యి. గత దశాబ్ద కాలంతో పోల్చి చూస్తే మూ డింతలకంటే ట్రాఫిక్ పెరిగింది. దీంతో రోడ్లపై రాక పోకలు సాగించడం పాదచారులు, వాహ న చోదకులకు కష్టతరంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2011లో టౌన్ ప్లానింగ్ అధికారులు జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిర్రోడ్డు విస్తరణకు మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రతిపాదించింది. హైదరాబాద్లోని టౌ న్ అండ్ కంట్రి ప్లానింగ్ డెరైక్టరేట్ను సంప్రదిం చింది. మున్సిపల్ అధికారుల ప్రతిపాదనకు టౌన్ ప్లానింగ్అధికారుల నుంచి అనుమతి లభించింది. ఈ రోడ్డును 50 ఫీట్ల మేర విస్తరించేందుకు వీలుగా అనుమతిచ్చింది. అనుమతి లభించి రెండేళ్లైనా మాస్టర్ ప్లాన్ను అమ లు పర్చే విషయంలో మున్సిపల్ అధికారులు సాహసించడం లేదు. ఇప్పటికే రైల్వే స్టేషన్కు పడమర వైపున రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ రోడ్డుపై ఇప్పటికే ట్రాఫిక్ పెరిగింది. ఈ బ్రిడ్జి నుంచి 9వ జాతీయ రహదారికి రాక పోకలను సాగించాలంటే భవానీ మందిర్ రోడ్డు నుంచి ప్రయాణించాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మా స్టర్ ప్లాన్ కోసం ప్రతిపాదించారు. కానీ రోడ్డు వెడల్పు పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. పలు సాకులను చూపుతూ మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వాయిదా వేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవానీ మందిర్రోడ్డుతో పాటు హనుమాన్మందిర్రోడ్డు, బ్లాక్ రోడు, సుభాష్గంజ్ రో డ్డు కుంచించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా రోడ్లను కూడా విస్తరించేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం భవానీ మందిర్ రోడ్డు విస్తరణలోనే తీవ్ర జాప్యం జరుగుతున్నా మిగతా రోడ్ల విషయంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా భవానీ మందిర్ రోడ్డును విస్తరించే విషయమై వివిధ రాజకీయ పార్టీల నేతలు మౌనం వహిస్తున్నారు. రోడ్డు విస్తరణ చేపడితే వ్యాపార వర్గాల నుంచి ఎక్కడ వత్తిడి వస్తుందోననే ఉద్దేశంతోనే ఆయా పార్టీల నేతలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ విషయాన్ని ఆయా పార్టీల నేతలు, అధికారులు మరుగున పడవేశారనే విమర్శలున్నాయి. మా జీ మంత్రి గీతారెడ్డితో పాటు తెలుగుదేశం, టీ ఆర్ఎస్, బీజేపీ నేతలు సైతం రోడ్డు విస్తరణకు గాను మాస్టర్ ప్లాన్ను అమలు విషయాన్ని ప్రస్తావించక పోవడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ అమలు పర్చుతారనే ఆశాభావాన్ని పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. -
ఫలితాలపై పోస్టుమార్టం
జహీరాబాద్, న్యూస్లైన్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం అనాదిగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీ అభ్యర్థి జె.గీతారెడ్డి కేవలం 842 ఓట్ల మెజార్టీతో బయటపడి పరువు నిలుపుకుంది. నియోజకవర్గంలోని ఏయే మండలాల ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారు, ఏయే మండలాల్లో అనుకూలంగా ఓట్లు లభించలేదనే దానిపై ప్రధానంగా ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు. పోలింగ్ బూత్ల వారీగా తమకు పోలైన ఓట్ల లెక్కలు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచినా, జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావు స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డి చేతిలో పరాజయం పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు నియోజకవర్గంలో జీరోగా ఉన్న టీఆర్ఎస్ ఒక్క సారిగా బలపడి కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మండలాల వారీగా విశ్లేషిస్తే కోహీర్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావుకు కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డిపై 5,283 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్కు 13,562 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్కు 8,755 ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ అభ్యర్థి వై.నరోత్తంకు 5,202 ఓట్లు లభించాయి. మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలోనే టీఆర్ఎస్కు కాంగ్రెస్పై 1,436 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 2,992 ఓట్లు లభించగా, కాంగ్రెస్కు 1,556 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి కేవలం 747 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఝరాసంగం మండలంలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థికే 459 ఓట్ల ఆధిక్యత లభించింది. ఝరాసంగం మండలం అనాదిగా కాంగ్రెస్కు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావు ఝరాసంగం మండలానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆధిక్యతకు కారణంగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్కు 9,273 ఓట్లు లభించగా, కాంగ్రెస్కు 8,814 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థికి 5,143 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్పై స్వల్ప ఆధిక్యత లభించింది. 1,054 ఓట్లతో గీతారెడ్డి ఆధిక్యం కనబర్చారు. టీఆర్ఎస్కు 16,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్కు 18,022 ఓట్లు లభించాయి. ఈ మండలంలో టీడీపీ అభ్యర్థి సైతం 14,623 ఓట్లు పొంది ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. జహీరాబాద్ పట్టణంలో సైతం టీఆర్ఎస్పై కాంగ్రెస్కు 444 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 7,673 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 8,117 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీకి 5,963 ఓట్లు లభించాయి. న్యాల్కల్ మండలం మాత్రం మాజీ మంత్రి జె.గీతారెడ్డికి భారీ ఆధిక్యతనిచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గీతారెడ్డికి 4,582 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇదే గీతారెడ్డి విజయానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఝరాసంగంలో టీఆర్ఎస్ ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పట్టణంలో వచ్చిన ఆధిక్యతతో పూడ్చుకుంది. కోహీర్లో టీఆర్ఎస్కు వచ్చిన భారీ ఆధిక్యతను న్యాల్కల్లో సాధించిన భారీ ఆధిక్యతతో కాంగ్రెస్ పూడ్చుకుంది. జహీరాబాద్ మండలంలో వచ్చిన స్వల్ప ఆధిక్యతతోనే గీతారెడ్డి బయటపడింది. ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు మూకుమ్మడిగా టీఆర్ఎస్ను బలపర్చడం మూలంగానే టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి దగ్గరగా వచ్చారని వివిధ పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు. గీతారెడ్డి...కాంగ్రెస్ సీనియర్ నేత ఫరీదుద్దీన్ను విస్మరించడం వల్లే మైనార్టీలు మూకుమ్మడిగా టీఆర్ఎస్వైపు మొగ్గు చూపారనే ప్రచారం సాగుతోంది. టీడీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానిపై ఆ పార్టీ నేతలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఏయే వర్గాలు దూరం అయ్యాయనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించినా, ఎందుకు మెజార్టీ తగ్గిందని గీతారెడ్డి సైతం ఫలితాలపై పోస్టుమార్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఏయే వర్గాల ప్రజలు దూరం అయ్యారని, అందుకు గల కారణాలు ఏమిటనే దానిపై ప్రధానంగా విశ్లేషించుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు సైతం ఏఏ సామాజిక వర్గాలు తమను దూరంగా ఉంచాయన్న దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు. -
ఖాతాదారుల సేవే లక్ష్యం
జహీరాబాద్, న్యూస్లైన్: ఖాతాదారులతో పాటు రైతులు, వ్యాపారులకు సేవలందించే లక్ష్యంతో తమ బ్యాంకు ముందుకు సాగుతోందని ఆంధ్రాబ్యాంకు నిజామాబాద్ జోనల్ మేనేజర్ మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మొగుడంపల్లి ఆంధ్రాబ్యాంకులో ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు సైతం సేవలందించేందుకు వీలుగా తమ బ్యాంకు ఆధ్వర్యంలో నూతనంగా ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. దీంతో ఈ ప్రాంత ఖాతాదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ జోన్పరిధిలో 66 ఏటీఎంలు ఉన్నాయన్నారు. రూ.2.45 లక్షల కోట్ల వ్యాపారంతో ఆంధ్రాబ్యాంకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశ ప్రజల అవసరాలను తీరుస్తోందన్నారు. 2115 శాఖలు, 1893 ఏటీఎంలతో 25 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరింపబడి 20 మిలియన్ల పైబడి ఖాతాదారులకు సేవలందిస్తోందన్నారు. నిజామాబాద్ జోన్ పరిధిలో 66 శాఖలు, 66 ఏటీఎంలు సేవలందిస్తున్నాయన్నారు. రూ.819 కోట్లు వ్యవసాయ రంగానికి, రూ.597 చిన్న తరహా పరిశ్రమల రంగానికి రుణసహాయం అందించామన్నారు. నవశక్తి పేరిట 24 గంటలు ఈ-బ్యాంకింగ్ సేవలను అందించేందుకు, ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా బ్యాంకు శాఖలను ఆధునీకరిస్తున్నామన్నారు. ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆంధ్రాబ్యాంకు జీవిత బీమా సౌకర్యంతో ‘ఏబీజే -ప్లస్’ అనే కొత్త సేవింగ్స్ పథకాన్ని, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ‘అభివృద్ధి’ పేరిట కొత్త రుణ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. తమ బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రజలు, రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు శివ్వంపేట: గ్రామీణ స్థాయిలో తమ బ్యాంకు సేవలను విసృ్తత పరిచేందుకు కృషి చేస్తునట్లు ఆంధ్రాబ్యాంక్ నిజామాబాద్, మెదక్ జోనల్ మేనేజర్ మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం మండల దొంతి ఆంధ్రా బ్యాంక్ శాఖ వద్ద ఎటీఏం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు ఆధ్వర్యంలో రూ. 3500 కోట్ల పైబడి లావాదేవిలు జరుగుతున్నాయన్నారు. అధికంగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తున్నామన్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తేనే బ్యాంకులు మనుగడ సాధిస్తాయన్నారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ విద్యాసాగర్, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పిట్ల లక్ష్మీసత్యనారాయణ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా
జహీరాబాద్, న్యూస్లైన్: టీఆర్ఎస్ తరఫున జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన భీంరావు బస్వంత్రావు పాటిల్ సోమవారం జహీరాబాద్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు రాజేష్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జాతీయ రహదారిపై ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కుమార్ హోటల్ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ టాపులేని జీపులో పార్టీ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ఆయన ప్రజలకు అభివాదం చేశారు. ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు డప్పు, వాయిద్య కళాకారులు నృత్యం చేశారు. పలువురు కళాకారులు కూడా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు కె.మాణిక్రావు, ఎం.శివకుమార్, సి.బాగన్న, డి.లక్ష్మారెడ్డి, గౌని శివకుమార్, పి.నర్సింహారెడ్డి, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, ఎండీ యాకూబ్, అలీ అక్బర్, నామ రవికిరణ్, మురళీకృష్ణాగౌడ్, గౌసొద్దిన్, రాములు నేత, మంజులా కౌలాస్, రమాదేవి, రాములునేత, బండి మోహన్, లక్ష్మణ్ నాయక్, శంకర్నాయక్తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అన్నివిధాల అభివృద్ధి చేస్తా విజయోత్సవ ర్యాలీకి ముందు బీబీ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం తనకు ఆధిక్యతను ఇచ్చిందన్నారు. ప్రజల మద్దతను ఎన్నటికీ మర్చిపోనన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ , ఉపాధి రంగాలపై కూడా దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు మూలంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఆయన హయాంలోనే తెలంగాణ పునర్నినిర్మాణం సాధ్యపడుతుందన్నారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పేరుకే మార్కెట్ రోడ్డుపైనే బీట్
జహీరాబాద్ టౌన్, న్యూస్లైన్: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్మాణం పనులు పూర్తయి నాలుగు సంవత్సరాలవుతున్నా దుకాణాలు వినియోగంలోకి రావడంలేదు. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన దుకాణాల షెటర్లు దెబ్బతింటున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే సాగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో రహదారిపైనే బీట్లు జరుగుతున్నాయి. జహీరాబాద్ పట్టణంలోని పశువుల సంత ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో 2009లో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.28 లక్షలు మంజూరు కాగా అప్పటి మార్కెట్ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యాపారుల కోసం 23 దుకాణాలను నిర్మించారు. సిమెంట్ రోడ్డు వేసి విద్యుత్ దీపాలు అమర్చారు. పండ్ల మార్కెట్ యార్డుకు గేటు నిర్మించారు. పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా దుకాణాలను వ్యాపారులకు కేటాయించడం లేదు. పశువుల పంత పక్కనే పండ్ల మార్కెట్ సముదాయం ఉండడంతో పశువులపాకగా మారిం ది. వ్యాపారులు కొనుగోలు చేసిన పశువులను ఇక్కడే కట్టేస్తున్నారు.దీంతో చెత్తాచెదారం,పశువుల పేడ పేరుకపోయి ఆధ్వానంగా మారింది. పశువుల వ్యాపారులు,రైతులు దుకాణాల్లో ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణాల షెటర్లను ధ్వంసం చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ కూడా దెబ్బతిం టోంది. ఇప్పుటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని పండ్ల మార్కెట్ను ప్రారంభించి వినియోగంలోనికి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డుపైనే మామిడి పండ్ల బీట్లు ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో పండిన మామిడి పండ్ల బీట్లు జరుగుతున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో జాప్యం కారణంగా రోడ్లపై అమ్మకాలు చేపడుతున్నారు. తెల్లవారుజాము నుంచి పెద్ద మొత్తంలో పట్టణానికి పండ్లురావడం..అక్కడే బీట్లు జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. -
అధికార పీఠం టీఆర్ఎస్దే
జహీరాబాద్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ర్టంలో అధికార పీఠంపై కూర్చునేది టీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి భీంరావు బసంత్రావు పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థి కె.మాణిక్రావులు ధీమా వ్యక్తం చేశారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమగు స్థానాలను టీఆర్ఎస్ సాధించనుందని పేర్కొన్నా రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిం చిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. గత 14 ఏళ్లుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు చేపట్టి ఉద్యమం మూలంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కెసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ సరళి పూర్తిగా టీఆర్ఎస్కు అనుకూలంగా సాగిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు సంపూర్ణంగా వద్దతు పలికినందున తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు అధికారానికి అవసరమైన స్థానాలు లభించనున్నాయన్నారు. ఎవరి మద్దతు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే అధికారాన్ని చేపట్టనుందన్నారు. ప్రజలంతా కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ఆయనే సీఎం అని పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన కేసీఆర్తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందన్నారు. ఆయన హయాం లోనే అన్ని వర్గాల ప్రజలకు తగిన మేలు జరుగుతుందన్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానంతోపాటు పార్లమెం ట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను సైతం టీఆర్ఎస్ గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గాను తమ వంతు పాటు పడతామన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి గాను తగిన చర్య లు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, మాజీ ఎమ్మె ల్యే సి.బాగన్న, నాయకులు పి.నర్సిం హారెడ్డి, మురళికృష్ణాగౌడ్, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, గౌని శివకుమార్, నామ రవికిరణ్గుప్తా, ఎం.డి.యాకూబ్, అలీ అక్బర్, మొయిజొద్దీన్, గోరేమియా సికిందర్, మోతిరాం, బండిమోహన్, కలీం, శశికాంత్లు పాల్గొన్నారు. -
జహీరా‘బాద్షా’ ఎవరో...
రాజకీయ, భౌగోళిక వైవిధ్యాలకు చిరునామా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం. రెండు జిల్లాల అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడిన ఈ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులో ఉంది. ఓ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండగా, మరో జిల్లాలో బలహీనంగా ఉండడంతో ఇక్కడి ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంత బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలపైనే గురిపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. లోక్సభ నియోజకవర్గం: జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది : 2009 ఎవరెన్ని సార్లు గెలిచారు : కాంగ్రెస్- 1 ప్రస్తుత ఎంపీ : సురేష్ షెట్కార్ ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు : 12 మంది మొత్తంఓటర్లు : 14,30,413 పురుషులు : 7,03,823 స్త్రీలు : 7,26,516 ఇతరులు : 74 నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు : జహీరాబాద్, అందోలు, నారాయణ్ఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ (నిజామబాద్ జిల్లా ) ప్రధాన అభ్యర్థులు : సురేష్ షెట్కార్(కాంగ్రెస్), మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్సీపీ), బీబీ పాటిల్(టీఆర్ఎస్), మదన్మోహన్ రావు(టీడీపీ) మహమ్మద్ ఫసియొద్దీన్- సంగారెడ్డి: నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో సిద్దిపేట లోక్సభ స్థానం రద్దయి, జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. మెదక్ జిల్లాలోని మూడు, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్కు చెందిన ఆయన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్లలో ఆయన అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, టీఆర్ఎస్ అభ్యర్థి భీంరావు బస్వంత్రావు పాటిల్, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి కె. మదన్ మోహన్రావు నుంచి సురేష్ షెట్కార్కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఉద్యమం మీదే భారం.. నిజామాబాద్ జిల్లా సిర్పూర్కు చెందిన పారిశ్రామికవేత్త బీబీ పాటిల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు చివరి నిమిషంలో టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణుల నుంచే విమర్శలొచ్చాయి. ఉద్యమ ప్రభావం పాటిల్కు ఎంత వరకు ఉపకరిస్తుందన్నది అనుమానమే. ఆయనకు తెలుగు భాష రాదని.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్ఎస్ బలంగానే ఉన్నా.. మెదక్ జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలపై ఏమాత్రమూ పట్టు లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారవచ్చు. పొత్తుపైనే ఆశలు.. టీడీపీ తరఫున నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఐటీ కంపెనీ అధినేత కె.మదన్ మోహన్ రావు బరిలో ఉన్నారు. ఆయన టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సమీప బంధువు. ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉన్నా, బీజేపీతో పొత్తు- నరేంద్ర మోడి గాలిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ పథకాలే అండ.. హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ మొహియొద్దీన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోవడం విశేషం. వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. సమస్యలతో సహవాసం.. - ఎగువ ప్రాంతంలో మంజీరానది పారుతున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం తాగు, సాగునీరుకు నోచుకోలేకపోయారు. - తాగునీటి కోసం పల్లె ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉండే చెలమలు, వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి. - మద్దతు ధర లభించక చెరకు రైతు నష్టపోతున్నారు. - పరిశ్రమలు లేక స్థానికంగా ఉపాధి అవకాశాల్లేవు. వందల సంఖ్యలో గిరిజన తండాలుండగా.. ఏటా గిరిజన కుటుంబాలకు వలసబాట తప్పదు. ఏడాదిలో సగభాగం తండాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. - కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వేల మంది గల్ఫ్ బాధితులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. - గణనీయ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికుల బతుకులు పొగ చూరుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసి బీడీలు చుట్టినా పూట గడవని స్థితిలో ఉన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు. క్షయ, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) అనుకూలం.. - కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే ప్రచారం - మృదు స్వభావి..వివాదాలకు దూరంగా ఉండడం - ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం - బరిలో ఉన్న ప్రత్యర్థుందరూ కొత్తవాళ్లే కావడం ప్రతికూలం... - సమస్యలు పరిష్కారం కాక ప్రజల్లో వ్యతిరేకత - స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం - జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండడం - సొంత పార్టీలో అంతర్గ కుమ్ములాటలు నే గెలిస్తే... - ప్రతి గ్రామానికి మంజీర నీటి సరఫరా - పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి - బోధన్-బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు - కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి మదన్ మోహన్ రావు (టీడీపీ) అనుకూలం.. - ఆర్థికంగా బలంగా ఉండడం - సామాజిక సేవా కార్యక్రమాలు - సైకిల్ యాత్రతో గ్రామాల్లో పర్యటించడం - నరేంద్ర మోడి అంశం ప్రతికూలం... - రాజకీయాలకు కొత్త కావడం - టీడీపీ సంస్థాగతంగా బలహీనపడడం - బీజేపీ పొత్తుతో మైనారిటీ ఓట్లు దూరం కావడం నే గెలిస్తే... - వలసల నివారణ కోసం పరిశ్రమల స్థాపనకు కృషి - బోధన్ నుంచి బీదర్ వరకు జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్ల మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు - గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు పునరావాసం - మంజీర నుంచి ప్రతి గ్రామానికి తాగునీరు - పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తా బీబీపాటిల్ (టీఆర్ఎస్) అనుకూలం.. - తెలంగాణవాదం బలంగా ఉండడం - వ్యాపారవేత్తగా గుర్తింపు - తెలుగు కన్నడిగుల మద్దతు ప్రతికూలం... - తెలుగు భాష రాకపోవడం - చివరి నిమిషంలో పార్టీ టికెట్పై బరిలో దిగడం - ప్రజల్లో ప్రచారం లేకపోవడం - బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేశారనే ఆరోపణలు నే గెలిస్తే... - గిట్టుబాటు ధరతో పాటు రైతుల ఇతర సమస్యల పరిష్కారం - కాలుష్య రహిత పరిశ్రమల స్థాపన ..యువతకు ఉపాధి కల్పన - రైల్వే లైనుల ఆధునికీకరణ మహమ్మద్ మొహియొద్దీన్ (వైఎస్సార్సీపీ) అనుకూలం... - దివంగత సీఎం వైఎస్ పథకాల ప్రభావం - మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉండడం - గత ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం - వ్యాపారవేత్తగా ప్రజలతో సత్సంబంధాలు ప్రతికూలం.. - తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం - ప్రత్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా బలహీనమే నే గెలిస్తే... - స్థానిక కంపెనీల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు - కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెద్దాస్పత్రి నిర్మాణం - ప్రతి పల్లెకు మంజీర నీటి సరఫరా - రైతు ఆత్మహత్యల నివారణకు కృషి - ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్ల నియామకం -
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్షో
జహీరాబాద్, న్యూస్లైన్: వైఎస్సార్ సీపీ జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి మొహియొద్దీన్, అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్లు శనివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని హమాలీ, బాలాజీ కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతోమంది పేదలు లబ్ధి పొందారన్నారు. దీంతో పేదలు రాజశేఖరరెడ్డి తనయుడు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వహీద్తోపాటు ఆయా కాలనీల నాయకులు పాల్గొన్నారు. -
10 లక్షల ఎకరాలకు సాగు నీరు
నారాయణఖేడ్/జహీరాబాద్/జోగిపేట, న్యూస్లైన్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటలలో జరిగినబహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. నారాయణఖేడ్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు నీరు కాల్వల ద్వారా వ్యవసాయ భూములకు అందాల్సి ఉందన్నారు. నల్లవాగు డైవర్షన్తో మరో ఐదు వేల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం మాయం కావాలన్నారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు వ్యవసాయం కోసం వాడుకునే యంత్రాలకు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇక పని లేదన్నారు. ఈసారి ఖేడ్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి ఎం.భూపాల్రెడ్డిలను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జహీరాబాద్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సింగూరు, నారింజ ప్రాజెక్టుల నీటిని జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జహీరాబాద్కు పక్కనే ఉన్న సింగూరుతో పాటు సాగుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్న నారింజ ప్రాజెక్టు నీటిని, స్థానికంగా ఉన్న బడంపేట, ఏడాకులపల్లి, జీర్లపల్లి ప్రాంతాల్లోని చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావచ్చన్నారు. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. జహీ రాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ను వీడి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతం బాగా వెనుకబడి ఉందన్నారు. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జహీరాబాద్ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను పేదలకు కట్టించి ఇస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి భీంరావు బసంత్రావు పాటిల్, అసెంబ్లీ స్థానం నుంచి కె.మాణిక్రావులను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. జోగిపేటలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. జోగిపేట ప్రజలు కూడా బస్సు మిస్సు కావద్దని, అధికార పార్టీలో ఉంటేనే లాభపడతామని, లేకుంటే నష్టపోతామని అన్నారు. మన తలరాత మనమే రాసుకుందామని సూచించారు. జోగిపేటను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. తాను మొదట్లో బాబూమోహన్ను అందోల్ నియోజకవర్గంలో పోటీ చేయించినప్పుడు. ఇక్కడేమి గెలుస్తారంటూ చాలా మంది వెటకారం చేశారని, అయినా అందరం కలిసి గెలిపించుకుని రూ.100 కోట్ల అభివృద్ధి చేశామన్నారు. రైతులకు రుణ మాఫీ, పక్కాఇళ్ల నిర్మాణం వంటి పథకాలను పకడ్బంధీగా అమలు చేస్తామన్నారు. అందోల్ అసెంబ్లీ అభ్యర్థి పి.బాబూమోహన్, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. దామోదర ఊసెత్తని కేసీఆర్ మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ ప్రతిరోజూ ప్రచారంలో కేసీఆర్పై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్ మాత్రం పల్లెత్తుమాట అనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏ పార్టీని కానీ, అభ్యర్థులను కానీ విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించారు. -
భాషరాని వారు..ఏం సేవచేస్తారు!
టీఆర్ఎస్ను వ్యాపారసంస్థగా మార్చిన కేసీఆర్ జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ కోటగిరి, న్యూస్లైన్ : భాషరాని బీబీపాటిల్కు జహీరాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని వ్యాపార సంస్థగా మార్చారని జహీరాబాద్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్షెట్కార్ విమర్శించారు. శుక్రవారం ఆయన కోటగిరిలో విలేకరులతో మాట్లాడారు. డబ్బులున్న వారికి టికెట్లు ఇస్తూ, జెండాలు మోసిన వారికి అన్యాయం చేసిన కేసీఆర్కు ఇతర పార్టీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో బీబీపాటిల్ బీజేపీలో చేరినట్లు ప్రకటనలు చేసి, ఆ పార్టీ కండువాను కూడా వేసుకున్న ఆయనను కేసీఆర్ దరిచేర్చుకొని డబ్బులకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. రెండు లోక్సభ సీట్లున్న కేసీఆర్ తెలంగాణ ఎలా సాధిం చారో, ఎవరివల్ల తెలంగాణ వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కృషిచేసిన సోనియాగాంధీని ఆకాశానికి ఎత్తి వారి ఇంటికి వెళ్ళిన కేసీఆర్ అనంతరం సోనియాను దెయ్యం,భూతం అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బులిస్తే కేసీఆర్ దేనికైనా సిద్ధమేనని విమర్శించారు. చంద్రబాబు ఊసరవెల్లి తెలంగాణపై రెండు ప్రాంతాల్లో రెం డువిధాలుగా వ్యవహరించిన టీ డీ పీ అధినేత చంద్రబాబు ఊసరవె ల్లి అని విమర్శించారు. అధికార దా హంతో తెలంగాణలో,సీమాంధ్రలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే తపనతో మతతత్వపార్టీ అయిన బీజేపీతో జతకట్టడం శోచనీయమన్నారు. తెలంగాణలో తమ పార్టీ లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకుంది మొదటి నుంచి తమపార్టీయేనని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. చంద్రబాబును రెండు ప్రాంతాల ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఈ ప్రాంత ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి కృతజ్ఞతలు తెలుపాలన్నారు. సమావేశంలో బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్రాజ్, కాంగ్రెస్ నాయకులు పవన్,మహ్మద్,రాజ్దేశాయ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
‘గీత’ వూరేనా?
1.మాజీ మంత్రి జె. గీతారెడ్డి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ స్థానం నుంచి 11 వుంది పోటీలో ఉన్నారు. 2. అనవసరంగా మాజీ మంత్రి ఫరీదుద్ధిన్తో గిల్లికజ్జాలు పెట్టుకొని కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఈ వర్గం వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. ఆధిపత్యపోరు గీతారెడ్డి అదృష్ట గీతపై ప్రభావం చూపనుంది. 3. స్థానికేతరురాలైన గీతారెడ్డి గ్రామాలు తిరగలేదని గుర్రుగా ఉన్నారు. 4. కాంట్రాక్టర్లను తప్ప సాధారణ కార్యకర్తలను ఆమె దగ్గరకు రానివ్వలేదనే విమర్శలు ఉన్నాయి. 5. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ క్రిస్టియన్, మైనార్టీల ఓటతో పాటు వైఎస్సార్ సంక్షేవు పథకాలే అండగా ఉంటాయుని భావిస్తున్నారు. 21న జహీరాబాద్లో షర్మిల బహిరంగసభపై వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ అంచనాలు పెట్టుకున్నారు