Funday special
-
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం. -
ఈ వారం కథ.. వైతరిణికి ఈవల
నేను చనిపోయాను రాత్రి రెండుగంటలప్పుడు నీళ్లు తాగటానికని లేచి, తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమీ ముసలోణ్ణి కాదు ఆయుష్షు తీరిపోవటానికి. యాభై ఐదు మొన్ననే దాటింది. అయినా అదికాదు నేనాలోచించేది. నేను మందు ముట్టను. సిగరెట్టు తాగను. మాంసం పెద్దగా తినను. పేకాట ఆడను. ప్రతిరోజు వాకింగ్, యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు మూడొందల రోజులు ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకిలా జరిగింది? ఏమో తెలీదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలీదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే వుంది నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్ర లేస్తుంది. అప్పటివరకూ నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలీకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతడి తలరాతని బట్టి వుంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా? లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగులుందా?మందు, విందు లాంటి బయటికి కనపడేవే చెడ్డ అలవాట్లు, పాపాలుగా పరిగణిస్తే .. నేను అవి చేసి వుండకపోవచ్చు. మరి అవతలి వాళ్ళను పరోక్షంగా బాధపెట్టటం, అసూయగా ఆలోచించటం, ఒంటరిగా వున్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు/ అలవాట్లు పాపాలు కాదా? తెలిసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేట్టు చేసిన నా స్నేహితులు (పదప్రయోగానికి క్షమించాలి.. బంధువుల, స్నేహితుల ఉన్నతికి నేను పడిన ఈర్ష్య అసూయలు) మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి, పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేనో పామునో, కప్పనో చంపితే అది చెడ్డ పనా? తప్పు పనా? దాన్ని తప్పుగా భావించి దేవుడు నాకు శిక్ష వేస్తాడా? లేక, పోయిన జన్మలోనో, వచ్చే జన్మలోనో.. దానికీ నాకూ ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి వుంటుందా? మరైతే ఒకపని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసానమా అనేది ఎలా తెలుస్తుంది?అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులనాడు మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్లమాటేమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదనీ, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దాని వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో/ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాల్లో మరొకరికి వాటా ఉంటుందా? అసలలా జరిగే వీలుంటుందా? ఏమో.. ఈసారి స్వర్గంలోనో, నరకంలోనో.. ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి.సమయం కొంత గడిచి, ఉదయం ఐదున్నర అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దణ్ణం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటినించీ నిద్ర లేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కనే ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజూ ఐదింటికల్లా వాకింగ్కి వెళ్లే నేను ఈ రోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవటం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ‘ఏమండీ..’ అంది. శరీరం అటు ఇటు కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరకొచ్చి ‘ఏమండీ..’ అని తోసినట్టు గట్టిగా కుదిపింది. ఉలుకు లేదు పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. రెండో నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి.. అక్కడ వందమంది దాక గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో(?) మాట్లాడుకుంటున్నారు. చిత్రమేమిటంటే.. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది వాళ్లెవరో కూడా నాకు తెలీదు.ఒక మహానుభావుడు చెప్పినట్టు ‘నువ్వు హాస్పిటల్లో వున్నప్పుడు, కనీసం వందమంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే, ఆ వందమందికి బాలేనప్పుడు నువ్వెళ్ళి పరామర్శించి ఉండాలి’. కానీ, నేనా బాపతు కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను కానీ, వాళ్లొచ్చి మళ్ళీ నా దగ్గిర అటెండె¯Œ ్స వేయించుకోవాలి అని నేనెప్పుడూ ఎదురుచూడను. చూడలేదు. అసలలాంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను కూడా. అంతదాకా వస్తే నేనెప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడూ ఉండేది కాదు. అలా తిరగటం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి ఆలోచనలు, పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవే తప్ప.. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు. నా ఆలోచన, జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరు అనుకుంటారేమో.. నాకు తెలీదు.ఇంకో అరగంటకి.. పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నించి ఒక చిన్న బల్ల మీదకు మార్చారు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యలో దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తున్నారు. ‘పిల్లలకి ఫోన్ చేశారా?’ అని ఎవరో అడుగుతుంటే, ‘చేశాం. రాత్రికల్లా వస్తాం అన్నారు’ అంటున్నారు మరెవరో.అన్నట్టు చెప్పటం మరిచా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పుణెలో వుంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా.. అడుగు కింద పెట్టనీయకుండా.. లాంటివి కాదు కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా చేశాను. అలాని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు. నీతి సూక్తులు చెప్పలేదు. ధర్మం తప్పకుండా జీవించమని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే, చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సెలర్లు చెప్పగా విని, పాటించాను. ఒక అనుభవం.. అది మంచైనా, చెడైనా వాళ్ళు దాన్నించి నేర్చుకోవాలనేది నా సంకల్పం. ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.నిజం చెప్పొద్దూ ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్గా నేనిలా వచ్చేస్తే.. తను ఎలా బతుకుద్ది? ఆ భారం తను మోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ, ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, ఎవరికి ఎంత అప్పుంది.. లాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేనెప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదే. మరిప్పుడెలా?పెళ్ళైనప్పటినించీ నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్లి మాత్రం తనిష్టప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తనూ మావాడూ ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనే మావాడి పెళ్ళిచేసింది. ఆ సంసారం నాలుగైదేళ్లు సజావుగా సాగింది. ఏమైందో ఏమో గాని మనస్పర్థలు మొదలయ్యాయి. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నించీ, మా వైపు నించీ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు.. మా వియ్యపురాలు నన్నూ, నా కుటుంబాన్నీ తిట్టని తిట్టులేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది. నడిరోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితేంటని నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటికి గెంటేస్తే .. ఆ పాపం ఊరికే పోదనీ, దాని ఉసురు కచ్చితంగా తగులుతుందని శపించింది. చివరగా.. నీక్కూడా ఒక కూతురుందనీ దానికి కూడా ఇలాంటిది జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధేమిటో తెలుస్తుందని దుమ్మెత్తి పోసింది. ఐతే అదృష్టవశాత్తూ అలాంటివేం జరగలేదు. కానీ, ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించటం అది రెండోసారి (మొదటిసారి.. శ్రుతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది). చేయని తప్పుకి శిక్ష అనుభవించాలా? అయినా తప్పెవరిదో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనేం.. జరగకూడనిది జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఎదో దిగులు. మానసిక వ్యథ. కాస్తో కూస్తో పరువుగా బతుకుతున్న వాళ్ళం. ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనటానికి ఇవన్నీ రుజువులేమో. కావొచ్చు కానీ ఎక్కడో జరిగితే మనం దానిమీద చర్చించొచ్చు, సులభంగా తీర్మానం చెయ్యొచ్చు. కానీ అది మనింట్లోనే జరిగితే..? మనసు ఏ పని మీదా లగ్నం కావటం లేదు. నిద్ర రాదు. ఆకలి వేయదు. ఒకటే అంతర్మథనం. దాదాపు మూడు నెలలు. మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో రెండు అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని ఒత్తిన ఫీలింగ్. కాలమే అన్ని గాయాల్ని మాన్పుతుందన్నట్టు కొన్నాళ్ళకు నేను తేరుకున్నాను.. తేరుకుని చూస్తే.. మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది. ఇప్పటివరకూ లేని ఒక చిన్న జలదరింపు. నేనూహించినట్టుగానే నలుగురైదుగురు కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది. కానీ నేనే బయట ఉండలేకపోతున్నా. అప్పటివరకూ అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా నన్నూ, నా శరీరాన్నీ విడదీస్తున్నారన్న భావన. పావుగంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను. ‘మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తచ్చట్లాడుతుంటుంది. తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళటం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిశాక ఇక ఏ దారీ లేక అక్కణ్ణించి నిష్క్రమిస్తుంది’ నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి.. ఇప్పుడు నా పరిస్థితేంటి? మొదటిసారిగా నాకు భయం వేసింది. ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్లకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికెక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకే వెళ్లాలని వుంది. కానీ దాన్ని ఫ్రీజర్లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్లే మార్గమే కనపడటం లేదు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేక పోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా?ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. అప్పడు.. మొదటిసారిగా నాకు అనుమానం కలిగింది. ఇకమీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో! తిరిగి నేను మనిషిని కాలేనేమో! ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ‘ఆ శరీరం నాది. నన్ను అందులోకి వెళ్లనివ్వండి’ అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలటం లేదు. శబ్దం బయటికి రావటం లేదు. నాకేమీ పాలుపోవటం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధమూ లేదా? ఇలా నాకొక్కడికేనా? సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు.. వీళ్లందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటల తరబడి ఉంచుతారే? వీలయితే రోజుల తరబడి కూడా ఉంచుతారే మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది? నా ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసిన పాపాలేనా? మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా?పాపం అనగానే నాకు శ్రుతిలయ గుర్తొచ్చింది.శ్రుతిలయ నా కాలేజ్మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి, ప్రేమకు అందమే తొలిమెట్టు ఐతే.. నేనామెను ఇష్టపడ్డా. విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్నిష్టపడింది. ఎన్నో ఉత్తరాలు.. ఎన్నెన్నో కబుర్లు.. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికొచ్చింది. పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరొకర్ని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవటం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధురస్మృతిగా వుంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్ళిలో రాదేమో! అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరిరోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్లో.. ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకున్నాం. చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలి లేవనుకున్నాం. కాని, జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రుతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన. చెరుకు మిషన్లో గుండెను పెట్టి తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించటం అదే మొట్టమొదటిసారి నాకు ( రెండోసారి మా వాడి విడాకులప్పుడు). కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమకథ ముగిసింది. కాని, అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి సరిగ్గా ఇప్పుడీ బాధలాగానే. ఇంత బాధలోనూ నాకు శ్రుతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏపాటిదో మీకు అర్థమయ్యేవుంటుంది. జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి చూస్తే చీకటిపడి ఎంతసేపయ్యిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవళ్లు, మనవరాళ్లు వాళ్లతో వున్నారు. నా భార్య వాళ్ళని దగ్గరకు తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి వున్నాయి. ఎంతగా ఏడ్చివుంటుందో. రాగానే నా శరీరం మీదపడి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా? నేనేమంత గొప్ప పని చేశానని.. నా కోసం ఈ ఏడుపులు? చరిత్ర గతిని మార్చిన గొప్పగొప్ప వాళ్ళు తమ ఆనవాలు వదిలివెళతారు. వాళ్ళకోసం వుంచుకోమ్మా నీ కన్నీళ్లు. అల్పుడినైన నా కోసం ఎందుకు వృథా చేసుకుంటావు? అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలని వుంది. కానీ, వీలవడం లేదు.దేవుడా! ఎందుకయ్యా నాకీ కష్టాలు? ఓ దేవా.. మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయం అన్నట్టు.. మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వల్ల ఏర్పడేట్లు చేస్తావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగిపోయినట్లు ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మబ్బు.. వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నిటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది. ఓ ఈశ్వరా! నీ సృష్టి ఎంత విచిత్రం? నువ్వే సృష్టిస్తావు. జ్ఞానమో, అజ్ఞానమో అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏదీ శాశ్వతం కానట్టు, నువ్వే తీసుకెళతావు. ఓ ప్రభూ .. మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషీ ఈ చట్రంలో బిగుసుకోవాల్సిందేనా? ఈ బంధాలనించీ, పునరావృతమయ్యే నీ లీలలనించీ ఎప్పుడయ్యా మాకు విముక్తి?మనసు ధారాపాతంగా రోదిస్తూనే వుంది. తర్వాతరోజు ఉదయం పది గంటల వేళ.. శరీరం అగ్నిలో దహనమయ్యింది. బంధాల్ని తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమయ్యింది. నడ్డా సుబ్బారెడ్డి(మిత్రుడు వైవీకే రవి చెప్పిన మాటల సౌజన్యంతో ) -
పిల్లల కథ: మారిన కల్పకి
రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది. అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది. అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య. మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది. -
Pregnancy: గర్భిణీలు బరువు పెరగడం మంచిదేనా.?
నేను 85 కేజీల బరువున్నాను. ఇప్పుడు ఐదవ నెల. 3 కేజీల బరువు మాత్రమే పెరిగాను. మా స్నేహితులు 10 కేజీలు పెరగాలి అంటున్నారు. నా బరువు నియంత్రణలో ఉండటానికి మా డాక్టర్ నన్ను డైట్ ఫాలో అవ్వమన్నారు. దీని వల్ల నాకు ఏదైనా నష్టం ఉందా? – మౌళి, కోరంగిగర్భధారణలో బరువు తగ్గడం కష్టం, ఇది మంచిది కూడా కాదు. గర్భంతో ఉన్నప్పుడు సుమారు 8–10 కేజీల బరువు పెరుగుతారు. అంతకంటే ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే, గర్భం ధరించినపుడు, ఆ తరువాత కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ లాంటివి చూస్తున్నాము. మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఒబేసిటీ, దానితో వచ్చే ఇతర ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. డైటీషియన్ ఇచ్చే సలహాలతో అన్ని రకాల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్లతో కూడిన ఆరోగ్యకమైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని, తీసుకోవాలి. జంక్ఫుడ్ పూర్తిగా మానేయాలి. గర్భధారణ సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. నడిచేటప్పుడు అనువైన షూస్ ధరించండి. నడక, వ్యాయామాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని స్విమింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య ఆక్వా నాటల్ క్లాసెస్ అని కొన్ని స్విమింగ్ సెంటర్లలో నడుపుతున్నారు. అలాంటి స్విమింగ్ ఏ నెలలో అయినా చేయొచ్చు. ఇప్పటి వరకు వ్యాయామం చెయ్యనివారు నడక, ప్రాణాయామంతో మొదలుపెట్టండి. ఆఫీస్, ఇంట్లో లిఫ్ట్కి బదులు మెట్లు వాడటం, ఇంటిపనులు చేసుకోవడం, నడవడం లాంటివి చేయండి. సైకిలింగ్, జాయింట్ స్ట్రెచెస్, ఫిట్నెస్ వ్యాయామాలు చెయ్యకూడదు. ఒకవేళ వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం వచ్చినా, ఊపిరి ఆడనట్టు ఉన్నా, ఛాతీలో, కడుపులో నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం లాంటివి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని కలవండి. మీ చుట్టపక్కల ఎవరైనా పొగ తాగుతుంటే దూరంగా ఉండండి. గర్భధారణ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. మానసిక సమస్యలకు సంబంధించి ఏమైనా మందులు వాడటం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మీ కోసం కొంత సమయం తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యడం, మీకు కావలసిన వ్యక్తులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, అవసరమైతే వారి సహాయం కోరడం చేయాలి. మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామం సమంగా ఉండేటట్లు చూసుకుంటే ఏ విధమైన ఇబ్బందులూ ఉండవు. హెల్త్ ట్రీట్ఎండోమెట్రియాసిస్తో గుండెజబ్బుల ముప్పు!చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్తో బాధపడుతుంటారు. దీని వల్ల మహిళలు నానా సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతంగా బాధపడుతుంటారు. ఎండోమెట్రియాసిస్ సమస్య కేవలం గర్భాశయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని డేనిష్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కోపన్హేగన్ యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ఇవా హావెర్స్ బార్గర్సెన్ నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సదస్సులో డాక్టర్ ఇవా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. డెన్మార్క్లో 1977–2021 మధ్య కాలంలో ఎండోమెట్రియాసిస్ బాధితులైన 60 వేల మంది మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, వైద్య నిపుణులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. -
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్ఫుడ్కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ కన్సల్టంట్ -
ఇవీ.. వానాకాలం జాతరలు! ‘త్షెచు’ అంటే అర్థమేంటో తెలుసా?
హిమాలయాలకు చేరువలో ఉన్న భూటాన్లో ఏటా పలు పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఎక్కువ మంది బౌద్ధమతానికి చెందిన వారే అయినా, వారు తమ వేడుకలను పురాతన సంప్రదాయాల ప్రకారం నేటికీ జరుపుకుంటూ ఉండటం విశేషం. ఏటా వేసవి ముగిసి వానాకాలం వచ్చే రోజుల్లో వానాకాలానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ జరుపుకొనే రెండు వేర్వేరు జాతరలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.వీటిలో మొదటిది ‘నిమాలుంగ్ త్షెచు’. ‘త్షెచు’ అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డు ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలను ఘనంగా మూడురోజుల పాటు జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి 16 వరకు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో సంప్రదాయ నృత్య గానాలతో కోలాహలంగా నిమాలుంగ్ బౌద్ధారమం వరకు ఊరేగింపులు జరుపుతారు. తర్వాత ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.ఇదేకాలంలో జరుపుకొనే రెండో జాతర ‘కుర్జే త్షెచు’. ఇది భూటాన్లోని కుర్జే పట్టణంలోని కుర్జే బౌద్ధారామంలో ఏటా జూన్ 16న జరుగుతుంది. కుర్జేలోని బౌద్ధారామాన్ని భూటాన్ బౌద్ధులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భూటాన్లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన తొలిగురువు పద్మసంభవుడు ఇక్కడ ఎనిమిదో శతాబ్ది ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తనువు చాలించిన తర్వాత ఇక్కడ ఆయన భౌతికకాయం ముద్రను రాతిపై శిల్పంగా చెక్కారు.‘కుర్’ అంటే శరీరం, ‘జే’ అంటే ముద్ర. గురువు శరీర ముద్రను రాతిపై చెక్కి శాశ్వతంగా పదిలపరచడం వల్ల ఈ ప్రదేశానికి కుర్జే అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆరామాన్ని పదిహేడో శతాబ్దిలో నిర్మించారు. ‘కుర్జే త్షెచు’ జాతరలో జనాలు రకరకాల కొయ్య ముసుగులు ధరించి సంప్రదాయ నృత్య గానాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత ఆలయం వద్ద ప్రార్థనలు జరుపుతారు. కొయ్యముసుగులు ధరించి ఊరేగింపు జరపడం వల్ల వానాకాలంలో మంచివానలు కురుస్తాయని, తమ పంటలకు దుష్టశక్తుల బెడద ఉండదని నమ్ముతారు.ఇవి చదవండి: వానా.. వానా.. వల్లప్పా! -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్లో రెస్టారంట్ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా? -
డెలివరీ టైమ్లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్లు అందరూ సపోర్టివ్గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్స్టిక్ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్స్టయిల్కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్కి ప్రసిద్ధి. -
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గానూ తన టాలెంట్ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్స్టా కంటెంట్ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్లవర్ ఎట్సెట్రా! ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది. మోటర్సైకిల్ రైడ్ చేస్తుంది. బైక్ రిపేర్ చేస్తుంది. ఇలా పనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తోన్న ప్రతిభ ఆమెది.అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్ మూడ్ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్ అయినా సూటయ్యే ఇన్స్పైరింగ్ గర్ల్ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్ స్పెషల్’ పేరుతో యూట్యూబ్ చానెల్నూ పెట్టింది.ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి... -
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్ చిన్ వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది వి షేప్ ఫేస్ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్.ఈ ఎర్గోనామిక్ ఫేస్ లిఫ్టింగ్ మసాజర్.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్ చిన్ రెడ్యూసర్ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్తో పాటు సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కంఫర్టబుల్ కోర్డ్ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్ ని చేత్తో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్ను చెవులకు బిగించుకుంటే చాలు.. గడ్డం కింద మెషిన్ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్మెంట్ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
May-5: 'జపాన్లో బాలల దినోత్సవం'! ఎలా జరుగుతుందో తెలుసా!
జపాన్లో బాలల దినోత్సవం ఏటా మే 5న జరుగుతుంది. జపాన్ రాచరిక సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఐదు వార్షిక ఉత్సవాలలో ఇది ఒకటి. జపాన్లో దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు. జపాన్లో బాలల దినోత్సవం పన్నెండో శతాబ్దిలో పరిపాలించిన కమకురా వంశస్థుల హయాం నుంచి జరుగుతూ వస్తోంది.తొలినాళ్లలో బాలల దినోత్సవాన్ని ఏటా చాంద్రమానం ప్రకారం ఐదో నెలలోని పున్నమి తర్వాత వచ్చే ఐదో రోజున జరుపుకొనేవారు. తర్వాత పంతొమ్మిదో శతాబ్ది నుంచి ఈ వేడుకను గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఏటా మే 5న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలో ఊరూరా ఆరుబయట ఎత్తుగా నిలిపిన స్తంభాలకు కట్టిన దండాలకు చిత్ర విచిత్రమైన రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. వీటిని ‘కొయినొబొరి’ అంటారు.అలాగే, ఇంటింటా బయటి ఆవరణల్లో గాని, పెరటి స్థలాల్లోగాని నిలిపిన స్తంభాలకు సంప్రదాయకమైన ‘నొబోరి’, ‘ఫుకునుకె’ జెండాలను ఎగురవేస్తారు. బహిరంగ వేదికల మీద సమురాయ్ బొమ్మలను ప్రదర్శనతో పాటు చిన్నారుల విచిత్ర వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జనాలు ఆరుబయట విందుభోజనాలు చేస్తారు.ఈ విందుభోజనాల్లో ఓక్ ఆకుల్లో చుట్టిన రెడ్బీన్స్ జామ్ నింపిన బియ్యప్పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించిన వంటకం ‘కషివామొచి’, గంజితో తయారు చేసే మద్యం ‘సాకె’లను తప్పనిసరిగా వడ్డిస్తారు. ఓక్ ఆకులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ వేడుకల్లో ఓక్ ఆకుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.ఇవి చదవండి: రేటే 'బంగారమాయెనే!' -
Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!
30 నవంబర్, 2017.. అండర్–11 జాతీయ చాంపియన్గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్లో ప్రపంచ చాంపియన్ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్ చాంపియన్ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.పిన్న వయసులో భారత గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్కు సవాల్ విసిరే చాలెంజర్గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.క్యాండిడేట్స్తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్ లారెన్తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 37 ఏళ్లుగా భారత నంబర్వన్గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్ తండ్రి రజినీకాంత్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో..అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్ అన్నారు. గుకేశ్ క్యాండిడేట్స్ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు గుకేశ్ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.అంచనాలకు అందకుండా రాణించి..కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్ గెలవడం కష్టమంటూ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్సన్ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.సాధారణంగా గుకేశ్ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్ చేసేవాడు. గేమ్ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.రెండోసారి ఈ మెగా టోర్నీలో ఏడో రౌండ్లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్ పాయింట్గా మారింది. క్యాండిడేట్స్ టోర్నీ 14 రౌండ్లలో ఈ ఒక్క గేమ్లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్ ఓడితే ఆ తర్వాతి రౌండ్లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.ఆత్మవిశ్వాసంతో..గుకేశ్ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.తల్లిదండ్రులతో..ఒత్తిడిని అధిగమించి..గుకేశ్కు ఇది తొలి క్యాండిడేట్స్ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్ చెప్పాడు. అయితే గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.అండర్ 12 వరల్డ్ చాంపియన్గా.. , క్యాండిడేట్స్ టోర్నీ గోల్డ్ మెడల్తో.. సవాల్కు సిద్ధం..గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో తొలి 8 గేమ్లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్ లారెన్తో గుకేశ్ తలపడతాడు.31 ఏళ్ల డింగ్కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
'అతిగా దాచుకోవడం కూడా జబ్బే..' అని మీకు తెలుసా!?
రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇల్లంతా ఆ ఫైల్స్తోనే నిండిపోతే? వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే? ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే? వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే? ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే? భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే? దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే. హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు.. హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు. టీనేజ్ లో మొదలు.. హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది. ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.. తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం.. అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం.. అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం.. వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం.. మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం.. అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం.. దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు.. అస్పష్టమైన కారణాలు.. హోర్డింగ్ డిజార్డర్కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది. తక్షణ చికిత్స అవసరం.. కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి. ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి. డెసిషన్ మేకింగ్ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి. గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి. ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్లో చేరాలి. ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. హోర్డింగ్ డిజార్డర్కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
ఫన్డే: ఈ వారం కథ: 'లెఫి బొ'
"ఆఫీస్కి వెళ్ళబోతున్న భర్తకు ‘బై’ చెప్పడం కోసం గడపదాటి వసారాలోకొచ్చి, నవ్వుతూ చేయి వూపింది ఆద్విక. అతిలోకసౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్కి. అతను కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాడు. ‘లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగొచ్చేవరకు తలుపు తీయకు’ అన్నాడు. ‘నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా?’ చిలిపిగా నవ్వుతూ అంది. ‘దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాలకన్నా విలువైనదానివి’ అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది." అందం, అణకువ ఉన్న ఆద్విలాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి, సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు, కొన్ని మార్పులు చేర్పులు చేసి, అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగేవరకు చూసి, లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి.. అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు. నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. ముప్పయ్యేళ్ళకు మించని వయసు, నవ్వుతున్నట్టు కన్పించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం.. అతన్ని యింతకు ముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కన్పించలేదు. మెల్లగా యింటిలోపలికి నడిచి, తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి, ధడాల్న తలుపు మూసి, గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో.. యింటివైపు చూస్తున్నాడేమో.. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడేమో.. అతని కళ్ళలో కన్పించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తోంది. దొంగ కాదేమో.. ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో.. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో.. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో? మొదట నిషిత్కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకతన్ని మరింత ఒత్తిడికి లోనుచేయడం? సాయంత్రం యింటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ యింటికి తిరిగొచ్చేలోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి, ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. ఐనా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా. ఎలా వస్తాడు? అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనే నేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి, తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. పదహారంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కన్పించింది. అతనే.. తన భర్త ఆఫీస్కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి.. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. ‘భువీ.. నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ.. రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్ భువీ.. నీకు చాలా విషయాలు చెప్పాలి’ అతని గొంతులో ఆవేదన.. కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. ‘మీరేదో పొరబడినట్టున్నారు. నాపేరు భువి కాదు. ఆద్విక.. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి యిక్కణ్ణుంచి వెళ్ళిపోండి’ అంది. ‘అయ్యో భువీ.. నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడ్తానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని.’ ‘క్షమించాలి.. నా భర్త పేరు నిషిత్. మరొకరి భార్యని పట్టుకుని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపొండి. లేకపోతే మీపైన సెక్యూరిటీ సెల్కి కంప్లెయింట్ చేయాల్సి వస్తుంది.’ ‘నన్ను నమ్ము భువీ. ఒక్కసారి తలుపు తెరువ్. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క పది నిమిషాలు చాలు. ప్లీజ్ తలుపు తెరువు’ అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం .. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి, ‘లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు’ అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూచున్నాక, అతనికి గ్లాసునిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి, గ్లాస్ని టీపాయ్ మీద పెట్టాక, అతని ఎదురుగా కూచుంటూ ‘ఇప్పుడు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో’ అంది. ‘నా పేరు రియాన్. ఎనిమిదేళ్ళ క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినపుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే. అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెల్సుగా. సిఓవై కాయ్.. కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ’ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. ‘తెలుసు. మూడేళ్ళ క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడినుంచే’ అంది ఆద్విక. ‘నాకు మొదట కాయ్ని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, ఒకర్నో యిద్దర్నో పిల్లల్ని కని.. ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ళ కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారుచేసి, అమ్మకానికి పెడ్తున్నారని విన్నప్పుడు, ఎంత అందమైన ఆడవాళ్ళని తయారుచేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర యాభైలక్షల పైనే ఉండింది. మనక్కావల్సిన ఫీచర్స్ని బట్టి కోటి రూపాయల ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంతడబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన పాతిక్కి పైగా ఉన్న ఆడవాళ్ళలో నిన్ను చూశాక, చూపు తిప్పుకోలేక పోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని! అందుకే ఎనభై లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన ఐదేళ్ళ కాపురంలో ఎన్ని సుఖాలో.. ఎన్ని సంతోషాలో.. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది.’ ‘ఐదేళ్ళ కాపురమా? నాకేమీ గుర్తులేదే.. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమొరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టు కథలా ఉంది’ అంది ఆద్విక. ‘నేను చెప్పేది నిజం భువీ.’ ‘నా పేరు భువి కాదని చెప్పానా.. అలా పిలవొద్దు. ఆద్విక అనే పిలవండి.’ ‘సరే ఆద్వికా. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమొరీని పూర్తిగా ఎరేజ్ చేసి, మళ్ళా నిన్ను ఫ్రెష్గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు.’ ‘నా మెమొరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు?’ ‘ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర కోటిన్నర వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి, మెమొరీ మొత్తాన్ని తుడిచేసి, కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లను నమ్మించి కోటిన్నరకు అమ్ముకుంటారు.’ ‘అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు?’ అంది ఆద్విక. ‘నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు. ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువీ నేను ప్రేమలో పడింది.. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు..’ ‘ఇవేమీ నమ్మశక్యంగా లేవు.’ ‘నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు’ అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కన్పించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో ‘యిది నువ్వే భువీ..’ అన్నాడు రియాన్. ‘మీరు చూపించిన ఫొటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంతమాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? యిప్పుడున్న టెక్నాలజీతో ఎన్నిరకాల మాయలైనా సాధ్యమే. యిక మీరు వెళ్ళొచ్చు’ అంది లేచి నిలబడుతూ. ‘నువ్వు నా భువివే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమొరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకో అవకాశం యివ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బైటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బైటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స ఎక్స్పర్ట్ దగ్గరకు పిల్చుకెళ్తాను. జస్ట్ వన్ అవర్. ప్లీజ్ నాకోసం.. కాదు కాదు. మనకోసం..’ ‘మీరు మొదట బైటికెళ్ళండి’ కోపంగా అంది. ‘నిజమేమిటో తెల్సుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను’ అంటూ అతను వేగంగా బైటికెళ్ళిపోయాడు. ∙∙ రాత్రి పన్నెండు దాటినా నిషిత్కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోక ముందు రియాన్ తో ఐదు సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమొరీని ఎరేజ్ చేసి, తనకు అమ్మారా? ఎంత మోసం.. ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటివాళ్ళని ఎంతమందిని మోసం చేసి, పాత ఆండ్రాయిడ్లని అంటగడ్తున్నారో! కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ ఇరవై యేళ్ళ వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. ఇరవై యేళ్ళే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా.. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో.. అతనికి పాతికేళ్ళ వయసులో జోషికతో పెళ్ళయింది. యిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. పెళ్ళయిన ఏడాదివరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట.. ఎంత ఓపికతో భరించాడో.. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు .. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్ళయినా జోషికలో మార్పు రాలేదు. పోనుపోను మరింత మొండిగా, మూర్ఖంగా తయారైంది. యిద్దరు పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అన్పించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. తర్వాత రెండేళ్ళ వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అన్పించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలుదువ్వే రకమైతే.. నో.. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ రెండేళ్ళు యింటిపని, వంటపని యిబ్బంది అన్పించలేదు. ప్రతి పనికీ రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పులాంటి అవసరమైన దినుసులూ వేసి, వండి హాట్ బాక్స్లో పెట్టేస్తుంది. కాని యిబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడం. మనసులోని భావాలు పంచుకోడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తొచ్చింది. అప్పటికే కాయ్ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. కోటి కోటిన్నర పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్ళయినా వన్నె తరగని, వయసు పెరగని ఇరవై యేళ్ళ అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోడానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. ‘గొడవలూ కొట్లాటలూ లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అణకువ గల ఇరవై యేళ్ళ ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది. భార్యగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా లేదా ఆల్ ఇన్ వన్ నెరజాణ కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్ అవసరం లేని, మెయింటెనెన్ ్సకి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు.. ఇరవై యేళ్ళ అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటూ లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. మీ మనశ్శాంతే మా లక్ష్యం’ అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనిక్కావల్సింది కూడా అదే. భార్యగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ, మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా నేరుగా కాయ్ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్మనిపించేలా అధునాతనంగా అలంకరించిన పదంతస్తుల భవనం.. యం.డి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీక్కావల్సిన అమ్మాయిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే, వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి, మీకు అందచేస్తాం’ అన్నాడు. ‘నాదో సందేహం. నేను మొత్తం ఎమౌంట్ కట్టేసి, అమ్మాయిని యింటికి పిల్చుకెళ్ళాక, ఏదో ఓ సందర్భంలో నాతో గొడవపడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు’ అన్నాడు నిషిత్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ ఐనట్టు యం.డి పెద్దగా నవ్వాడు. ‘దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగడం, ఎదురుచెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్నెస్.. ఇవేవీ మీకు కన్పించవు. రెండు వందల యేళ్ళ క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసలుతూ, దాసిలా సేవలు చేస్తూ, రంభలా పడగ్గదిలో సుఖాలు అందిస్తూ.. యిక అందంలో ఐతే అప్సరసల్తో పోటీ పడ్తారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు ‘లెఫి బొ’ అని పేరు పెట్టాం. ఫ్రెంచ్లో లెఫి బొ అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉన్న ప్రాడక్ట్ మాది. మీరు రిగ్రెట్ అయ్యే చాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో, అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారుచేయించాను’ చెప్పాడు. ‘ఖరీదు ఎంతలో ఉంటుంది?’ ‘మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్ని చూశాక, ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్ ్స కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను’ అన్నాడు. అతనికి ఆద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు.. ‘గుడ్ చాయిస్ సర్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్’ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతనడిగినంత ధర చెల్లించి, ఆద్వికను యింటికి తెచ్చుకున్నాడు. ఆద్విక యింటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే.. కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే.. దుఃఖాలు లేవు. అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పడం ఏమిటి? అతని మనసునిండా అలజడి.. ఆందోళన.. అశాంతి. కాయ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజుముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనల్తో నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీస్కెళ్ళిన పది నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక, నిజమేమిటో తెల్సుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో, ఆద్విక ఇంటికి తాళం వేసి, అతన్తోపాటు బయల్దేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో, ఆద్విక తలలో అమర్చి ఉన్న చిప్ని బైటికి తీసి, ఎరేజ్ చేయబడిన మెమొరీని రిట్రీవ్ చేసి, మళ్ళా చిప్ని లోపల అమర్చాడు. ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్.. తన భర్త.. ఐదేళ్ళు అతన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భార్యగా ఐదేళ్ళు గడిపాక, ఇప్పుడు మూడేళ్ళ నుంచి నిషిత్కి భార్యగా కొనసాగుతోంది. ‘భువీ.. నేను చెప్పింది నిజమని యిప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువీ. నువ్వోరోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చిపట్టినట్టు నీకోసం ఎన్ని వూళ్ళు తిరిగానో.. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కల్సుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువీ. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువీ’ అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ‘ఆలోచించుకోడానికి నాక్కొంత సమయం ఇవ్వండి’ అంది. ‘యిందులో ఆలోచించడానికి ఏముంది భువీ. నువ్వు నా భార్యవి. మనిద్దరం ఐదు సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. యిందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావడానికి యింకా సంశయం దేనికి?’ అన్నాడు రియాన్. ‘నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి’ అంది ఆద్విక. మరునాడు రియాన్ రావడంతోటే ‘అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా’ అన్నాడు. ‘సారీ.. నేను నా భర్త నిషిత్ని వదిలి రాను’ అంది ఆద్విక. ‘నీకో విషయం అర్థం కావడం లేదు. నిషిత్కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి. నా ఆరాధ్య దేవతవి. నా ప్రేమ సామ్రాజ్ఞివి. మన ప్రేమను తిరిగి బతికించుకోడానికి నువ్వతన్ని వదిలి రాక తప్పదు భువీ’ అన్నాడు. ఆద్విక మెత్తగా నవ్వింది. ‘మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం, అన్యాయాలు చేయడం మాకు చేతకాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవీ మా సిస్టంలో లోడ్ అయి లేవు. యిక ప్రేమంటారా? కాయ్ కంపెనీతో నిషిత్కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాల్ని తీర్చాలి. అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్ని ఉల్లంఘించడం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు.’ ‘భువీ.. నేను నిన్ను ప్రేమించాను.’ ‘మీతో కాపురం చేసిన ఐదేళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను.’ ‘అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి?’ ‘మీ వద్దనుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమొరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మడంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు ఆండ్రాయిడ్ని’ ఆద్విక లేచి, తలుపు తీసి, ‘యిక వెళ్ళండి’ అనేలా అతని వైపు చూసింది.+ – సలీం. ఇవి చదవండి: Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..! -
పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా!
‘కోటి విద్యలు కూటి కోసమే’ అని లోకోక్తి. కానీ, ‘కూటి విద్యను నేర్చుకున్నాకే కోటి విద్యలూ’ అనేది ఈతరం సూక్తి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అందుకు స్వయంపాకమైతే దీ బెస్ట్ అనే సలహా ఇస్తారు ఆరోగ్య స్పృహ కలిగినవాళ్లెవరైనా! చదువు, కొలువుల కోసం ఉన్న ఊరును వదిలి.. పరాయి చోటుకు పయనమయిన.. అవుతున్న వారంతా ఆ సలహాకే పోపేస్తున్నారు. ఎసట్లో నాలుగు గింజలు ఉడికించుకుంటున్నారు. వర్కింగ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకూ ఇది అవసరంగా మారుతోంది. పిల్లల చేతికి గరిటెనందిస్తోంది. రకరకాల వంటకాలను నేర్చుకునేందుకు ప్రేరేపిస్తోంది. అలా పిల్లలు ఆడుతూ పాడుతూ వండుకునే మెనూస్నీ.. వంటింటి చిట్కాలనూ తెలుసుకుందాం! వంట చేయడం ఓ కళైతే.. దాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం అంతకు మించిన కళ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను యుక్తవయస్సు దాటేవరకు వంట గదివైపే రానివ్వరు. కానీ.. ఏ విద్యలోనైనా అనుభవజ్ఞులు నేర్పించే పాఠం కంటే అనుభవం నేర్పించే పాఠం ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని వంట పనుల్లో, ఇంటిపనుల్లో భాగం చేయడం అవసరం. సలాడ్స్ చేయడం.. రెసిపీలు కలపడం వంటి చిన్న చిన్న పనులతో పాటు.. ఏ కూరగాయ ఎలా ఉడుకుతుంది? ఏ బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టాలి? ఏ వంటకానికి ఎలా పోపు పెట్టాలి? వంటి వాటిపై అవగాహన కల్పించాలి. సాధారణంగా వంటింట.. పదునైన కత్తులు, బ్లేడ్లు, ఫ్లేమ్స్.. వేడి నూనెలు, నెయ్యి ఇలా చాలానే ఉంటాయి. అందుకే పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు పేరెంట్స్. నిజానికి వంటగదిలోకి రానివ్వకుండా ఆపడం కంటే.. పర్యవేక్షణలో అన్నీ నేర్పించడమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతివాళ్లకూ ఏదో ఒకరోజు తమ వంట తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనే విషయం తెలిసే వయసులోనే పిల్లలు ఉప్పుకారాల మోతాదులు అర్థంచేసుకుంటే మంచిది అంటున్నారు కొందరు పెద్దలు. దీనివల్ల సెల్ఫ్డింపెడెన్సే కాదు.. జెండర్ స్పృహా కలుగుతుందని అది అత్యంత అవసరమనీ పెద్దల అభిప్రాయం. అందుకే పాఠ్యాంశాలతోపాటు పాకశాస్త్రాన్నీ సిలబస్లో చేర్చాలని.. ఒకవేళ సిలబస్లో చేర్చలేకపోయినా హోమ్వర్క్లో మస్ట్గా భాగం చెయ్యాలని అనుభవజ్ఞుల సూచన. ఎందుకంటే..? ► వంట పనుల్లో భాగం అయినప్పుడు పిల్లలకు అది ఒక ప్రాక్టికల్ శిక్షణలా ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్ నేర్చుకోవడానికి.. ఒక మార్గం అవుతుంది. ఎలా అంటే.. కొలతలు, వినియోగం వంటి విషయాల్లో ఓ లెక్క తెలుస్తుంది. అలాగే నూనె, నీళ్లు ఇలా ఏ రెండు పదార్థాలను కలపకూడదు? ఏ రెండు పదార్థాలు కలపాలి? అనే విషయం వారికి అర్థమవుతూంటుంది. ► చిన్న వయసులోనే వంట నేర్చుకోవడంతో.. ఓర్పు నేర్పు అలవడుతాయి. శుచీశుభ్రత తెలిసొస్తుంది. అలాగే ప్రిపరేషన్, ప్రికాషన్స్ వంటివాటిపై క్లారిటీ వస్తుంది ► బాల్యంలోనే రెసిపీల మీద ఓ ఐడియా ఉండటంతో.. ఒక వయసు వచ్చేసరికి వంట మీద పూర్తి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ► తక్కువ సమయంలో ఏ వంట చేసుకోవచ్చు.. ఎక్కువ సమయంలో ఏ కూర వండుకోవచ్చు వంటివే కాదు.. కడుపు నొప్పి, పంటినొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు చిట్కాలూ తెలుస్తాయి. ► రెసిపీలు విఫలమైతే పిల్లలు.. విమర్శలను సైతం ఎదుర్కోవడం నేర్చుకుంటారు. వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని బోధపడుతుంది. గెలుపోటములను సమంగా తీసుకునే మనోనిబ్బరాన్ని అలవరుస్తుంది. ► స్కూల్లో, బంధువుల ఇళ్లల్లో.. ఇతరులతో కలిసేందుకు ఈ ప్రయోగాలన్నీ పిల్లలకు ప్రోత్సాహకాలవుతాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వంట నేర్చుకోబోయే పిల్లల్ని.. వయసు ఆధారంగా చేసుకుని.. నాలుగు రకాలుగా విభజించుకుంటే.. వంట నేర్పించడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. 3 – 5 ఏళ్ల లోపున్న పిల్లలు మొదటి కేటగిరీకి చెందితే.. 5 – 7 ఏళ్లలోపు పిల్లలు రెండో కేటగిరీలోకి వస్తారు. ఇక 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు మూడో కేటగిరీలోకి, 13 ఏళ్ల తర్వాత పిల్లలంతా నాలుగో కేటగిరీలోకి వస్తారు. మొదటి రెండు కేటగిరీల్లో పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే.. ఎదిగే కొద్దీ వాళ్లలో నైపుణ్యం పెరుగుతుంది. సాధారణంగా మూడు నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో.. పెద్దలు చేసే ప్రతి పనినీ తామూ చేయాలని.. పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం కనిపిస్తూంటుంది. వంటగదిలో కొత్త పనిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే వారికి చేతుల్లో ఇంకా పట్టు.. పూర్తి అవగాహన ఉండవు కాబట్టి.. అలాంటి పిల్లలకు చిన్నచిన్న పనులను మాత్రమే చెప్పాలి. వారికి నెమ్మదిగా అలవాటు చేయడానికి వీలుండే పనులను, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేని వాటిని వారి చేతుల్లో పెట్టొచ్చు. ఎక్కువగా కూర్చుని చేసే పనులను వారికి అప్పగించాలి. చేయించదగిన పనులు.. - పండ్లు, కూరగాయలు కడిగించడం, చపాతీ పిండి కలపడంలో సాయం తీసుకోవడం. - పాలకూర వంటివి కడిగి.. తురుములా తెంపించడం. - బనానా వంటివి గుజ్జులా చేయించడం.(ఆ గుజ్జు బ్రెడ్, ఐస్క్రీమ్ వంటివి తయారుచేసుకోవడానికి యూజ్ అవుతుంది) ఐదేళ్లు దాటేసరికి.. పిల్లల్లో మోటార్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా ఫర్ఫెక్ట్నెస్ పెరుగుతూంటుంది. అలాంటివారికి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మెలకువలు నేర్పించొచ్చు. అప్పుడప్పుడే చదవడం, రాయడం ప్రారంభిస్తుంటారు కాబట్టి.. వారికి వంటకాలను పరిచయం చేయడానికి ఈ వయసే మంచి సమయం. వంటలో వాళ్లు మనకు సహాయపడగలిగే సులభమైన రెసిపీలను చెబుతుండాలి. వారు ఉపయోగించగలిగే చాప్ బోర్డ్స్, ఇతరత్రా చిన్నచిన్న కిచెన్ గాడ్జెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. చేయించదగిన పనులు.. - పొడి పదార్థాలను నీళ్లు పోసి కలపడం - ఇన్గ్రీడియెంట్స్ని కొలవడం, లేదా లెక్కించడం ∙డైనింగ్ టేబుల్ని సర్దించడం - గుడ్లు పగలగొట్టించడం (పెంకుల విషయంలో కాస్త దగ్గరుండాలి) - పిండి వంటల్లో కానీ.. స్నాక్స్లో కానీ ఉండలు చేసే పనిని వారికి అప్పగించడం - మృదువైన పండ్లు, కూరగాయలను కట్ చేయించడం - రెసిపీని పెద్దగా రెండు మూడు సార్లు చెప్పించడం.. ఖాళీ సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆ వివరాలను గుర్తుచేయడం - చిన్న చిన్న చపాతీలు చేయించడం ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లల్లో స్వతంత్ర ఆలోచనలు పెరుగుతుంటాయి. తమ పనులను తాము చేసుకుంటూంటారు. ఈ వయసు వచ్చేసరికి వంట గదిలో వారికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం ఉండదు. సొంతంగా ఎవరి సాయం లేకుండానే వీరు చిన్నచిన్న ఫుడ్ ఐటమ్స్ సిద్ధం చేయగలరు. తిన్న ప్లేట్ లేదా బౌల్ కడిగిపెట్టడం, లంచ్ బాక్స్ సర్దుకోవడం, కిరాణా సామాన్లు జాగ్రత్త చేయడం వంటివన్నీ వాళ్లకు అలవాటు చేస్తూండాలి. చేయదగిన పనులు.. - కూరగాయలు లేదా పండ్ల తొక్క తీసుకుని, కట్ చేసుకుని సలాడ్స్ చేసుకోవడం - శాండ్విచెస్, బ్రెడ్ టోస్ట్లు చేసుకోవడం, ఆమ్లెట్స్ వేసుకోవడం - జ్యూసులు తీసుకోవడం ∙మరమరాలు, అటుకులతో పిడత కింద పప్పు, పోహా వంటివి చేసుకోవడం, ఇన్స్టంట్గా తీపి లేదా కారం రెసిపీలు చేసుకోవడం చిన్నప్పటి నుంచి కుకింగ్ మీద అవగాహన ఉన్నవారికి.. సుమారు 13 ఏళ్లు వచ్చేసరికి కిచెన్లోని ప్రతి వస్తువును ఎలా వాడాలి? ఏది ఎప్పుడు వాడాలి? అనేది తెలుస్తూంటుంది. వీరిలో తగు జాగ్రత్తే కాదు చక్కటి నైపుణ్యమూ ఉంటుంది. ఇప్పటి తరానికి స్మార్ట్ గాడ్జెట్స్ పైన బీభత్సమైన కమాండ్ ఉంది. కాబట్టి ఓవెన్ని ఉపయోగించడం, ఇండక్షన్ స్టవ్ వాడటం వంటివి వీరికి ఈజీ అవుతాయి. చేయదగిన పనులు.. - గ్యాస్ స్టవ్పై ఆమ్లెట్స్ వేసుకోవడం - ఎలక్ట్రిక్ కుకర్లో జొన్నకండెలు, చిలగడ దుంపలు, గుడ్లు వంటివి ఉడికించుకోవడం - పదునైన కత్తులు జాగ్రత్తగా వాడటం - పెద్దల సమక్షంలో బ్లెండర్, ఫుడ్ ప్రాసెసర్, గార్లిక్ ప్రెస్, కాఫీ మేకర్, వాఫిల్ మేకర్ వంటి వివిధ కిచెన్ గాడ్జెట్ల వాడకాన్ని నేర్చుకోవడం, మైక్రోవేవ్పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఐస్క్రీమ్ వంటివి సిద్ధం చేసుకోవడం - కిచెన్ క్లీనింగ్ నేర్చుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ కల్పించాలి. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?
శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రాన దివ్యమైన ముహూర్తంలో అర్చారూపంలో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీవేంకటేశ్వరునిగా వెలశాడు. శ్రీస్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్త ప్రియుడు. కోరినవారికి కొంగు బంగారమై కోర్కెలు నెరవేర్చే ఆ శ్రీవేంకటేశ్వరుని 'వైభోగం న భూతో న భవిష్యతి!'. వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. • దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. • సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయమే. • వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా ఉత్సవాలను అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదవ నాడు.. మహారథానికి (చెక్కరథం) బదులు ముందు వరకు వెండి రథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుండి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై ఊరేగింపు సాగింది. 2012లో దాని స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం.. వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)– శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. • శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది. అంకురార్పణం (14–10–2023) (రాత్రి 7 నుండి 9 గంటల వరకు): వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారికి ఆలయ మాడ వీథుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవం (15–10–2023) (ఉదయం 9 గంటలకు): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. పెద్దశేషవాహనం (15–10–2023) (రాత్రి 7 గంటలకు): మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. చిన్నశేషవాహనం (16–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి. హంస వాహనం (16–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు. సింహ వాహనం (17–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం. ముత్యపుపందిరి వాహనం (17–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం (18–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీ«థుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సర్వభూపాల వాహనం (18–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (19–10–2023) (ఉదయం 8 గంటలకు): బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు. గరుడ వాహనం(19–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు. హనుమంత వాహనం (20–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది. పుష్పకవిమానం (20–10–2023) (సాయంత్రం 4 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి పుష్పకవిమానంపై విహరిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. గజవాహనం(20–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం (21–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీ«థుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం (21–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాలలో అనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. స్వర్ణరథం (22–10–2023) (ఉదయం 7.15 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అశ్వవాహనం (22–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం (23–10–2023) (ఉదయం 6 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. -లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!? -
శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. తొమ్మిదిరోజుల పాటు సప్తగిరులు గోవిందనామ ధ్వనులతో మారుమోగనున్నాయి. అసలు వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి, బ్రహ్మోత్సవాలు ఎందుకు జరిపేవారు, ఎన్నివాహనాలపై గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు.. బ్రహ్మోత్సవాల చరిత్రను తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం. లోక కల్యాణం కోసం తనకు ఉత్సవాలు జరపమని ఆ గోవిందుడే బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించారట! వెంకన్న ఆదేశాలమేరకే బ్రహ్మదేవుడు ఏటా ఈ ఉత్సవాలు జరుపుతాడని ప్రతీతి. కన్యామాసం (అశ్వయుజం) లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు ముందు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. బ్రహ్మే స్వయంగా ఉత్సవాలను నిర్వహించారు కాబట్టే ఈ ఉత్సవాలకు ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలను ఒకదశలో నెలకొకటి వంతున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు జరిగేవట! స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలను జరుపుతాడని చెప్పడానికి ప్రతీకగా ప్రతిరోజూ వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే పగ్గాలు స్వీకరించి రథం నడుపుతాడని చెబుతారు. అంకురార్పణతో మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, చినశేషవాహనం, పెద్దశేషవాహనం, సింహవాహనం, ముత్యాలపందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహినీ అవతారం, గరుడవాహనం, గజవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, రథోత్సవం, బంగారు తిరుచ్చి వంటి వాహనాలపై దేవదేవుడు కొలువై భక్తకోటికి దర్శనమిస్తారు. క్రీస్తుశకం 614లో పల్లవరాణి సమవాయి.. మనవాళ పెరుమాళ్ అనే భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది. అప్పట్లో ఈ విగ్రహాన్ని ఊరేగించి బ్రహ్మోత్సవాలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తుశకం 1254 చైత్రమాసంలో తెలుగురాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడితిరునాళ్లు పేరిట త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవ రాయలు ఉత్సవాలు జరిపారు. అలాగే 1429లో ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహర రాయలు. 1530లో అచ్యుతరాయలు బ్రహ్మోత్సవాలు జరిపారు. ఇలా 1583 ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు ఏడాదిలో ప్రతినెలా జరుగుతుండేవి. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఈ ఉత్సవాలు అర్ధంతరంగా ఆగిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఏడాదికి పన్నెండుసార్లు జరిగే ఈ ఉత్సవాలు క్రీస్తుశకం 1583 నాటి వరకు కొనసాగాయి. అయితే కాలక్రమేణా మార్పులు జరిగి ఏడాదికి పది రోజుల పాటు నిర్వహించడం మొదలుపెట్టారు. బ్రహ్మోత్సవాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది గరుడ వాహనం. అంత పేరున్న గరుడ వాహనాన్ని క్రీ.శ 1530కి ముందు వాడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. సూర్యప్రభ వాహనం, గజవాహనం క్రీ.శ 1538లో ప్రారంభించారు. సింహవాహనం క్రీ.శ 1614లో మొదలైంది. మట్ల కుమార అనంతరాజు క్రీ.శ 1625లో శ్రీవారికి బంగారు అశ్వవాహనం, వెండి గజవాహనాన్ని, సర్వభూపాల వాహనాన్ని బహూకరించారు. ఇటివల టీటీడీ సర్వభూపాల వాహనాన్ని కొత్తగా తయారు చేయించింది. ప్రస్తుతం ఈ వాహనాన్నే వినియోగిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవు తున్నాయి అని ప్రకటించే విధానం అప్పట్లో విచిత్రంగా ఉండేది. శ్రీవారి ఆలయం ముందు పెద్ద పేలుడు సంభవించినట్టు శబ్దం చేసి మంటను వేసేవారట. ఈ పద్ధతిని ఆదిర్వేది అనేవారు. తొలిసారిగా ఈ విధానాన్ని క్రీ.శ 1583లో ప్రారంభించినట్టు శాసనాధారం ఉంది. ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని వైదిక ఆచారాలతో శుద్ధి చేసేందుకు క్రీ.శ 1583లో ప్రవేశపెట్టిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం నేటికీ సాగుతోంది. 2020, 2021లో కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నుంచి బ్రహ్మోత్సవాలను యథాప్రకారం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. గత నెల సెప్టంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలను కూడా గొప్పగా జరపడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. - తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి -
సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా
ఏడాది క్రితం.. స్పెయిన్లో మాడ్రిడ్ ఓపెన్.. కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్లే కోర్టుపై అప్పటికే అతను చెప్పుకోదగ్గ విజయాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. క్వార్టర్స్ సమరంలో ప్రత్యర్థి ఎవరో తెలియగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. దిగ్గజ ఆటగాడు, తాను ఆరాధించే, అభిమానించే రాఫెల్ నాదల్ ఎదురుగా ఉన్నాడు. ఇద్దరు స్పెయిన్ స్టార్ల మధ్య వారి సొంతగడ్డపై పోరు అనగానే ఆ మ్యాచ్కు ఎక్కడ లేని ఆకర్షణ వచ్చింది. చివరకు నాదల్పై సంచలన విజయంతో తన 19వ పుట్టిన రోజున అల్కరాజ్ తనకు తానే కానుక ఇచ్చుకున్నాడు. అతను అంతటితో ఆగలేదు. సెమీస్లో జొకోవిచ్నూ మట్టికరిపించి ఒకే క్లే కోర్టు టోర్నీలో ఆ ఇద్దరినీ ఓడించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అక్కడే అతను ఏమిటో ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్తులో సాధించబోయే ఘనతలకు అది సూచిక అయింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వింబుల్డన్ గెలవడం, వరల్డ్ నంబర్ వన్ కావడం తన కల అని చెప్పుకున్నాడు. క్లే కోర్టు వేదిక ఫ్రెంచ్ ఓపెన్ చాలా ఇష్టమైనా, వింబుల్డన్కు ఉండే ప్రత్యేకత వేరని అన్నాడు. 17 ఏళ్ల వయసులో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతలన్నీ సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. నాదల్ దేశం నుంచి వచ్చి.. నాదల్ తరహాలోనే బలమైన షాట్లు ఆడుతూ, అతనిలాగే క్లే కోర్టును ఇష్టపడే అల్కరాజ్ను అందరూ నాదల్కు సరైన వారసుడిగా గుర్తించారు. బేబీ నాదల్ అంటూ పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం వింబుల్డన్ గ్రాస్ కోర్టుల్లో ఫెడరర్తో కలసి ప్రాక్టీస్ చేసిన అతను ఇప్పుడు అదే వింబుల్డన్ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించాడు. అసాధారణంగా.. సమకాలీన టెన్నిస్లో అల్కరాజ్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. తండ్రి గొన్జాలెజ్ అల్కరాజ్ మాజీ టెన్నిస్ ఆటగాడు. ఒకప్పుడు స్పెయిన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. సహజంగానే తండ్రి వల్లే అతనికి ఆటపై ఆసక్తి పెరిగింది. ముర్షియా పట్టణంలో గొన్జాలెజ్ ఒక టెన్నిస్ అకాడమీకి డైరెక్టర్గా ఉండటంతో అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు అల్కరాజ్. సహజ ప్రతిభ ఉన్న అతను ఆటలో వేగంగా దూసుకుపోయాడు. దిగువ స్థాయి జూనియర్ టోర్నీలలో అతను రెగ్యులర్గా ఆడాల్సిన అవసరమే లేకపోయింది. 15 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్గా మారి వరుస విజయాలు సాధించడంతో సర్క్యూట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత యువాన్ కార్లోస్ ఫెరీరోను కోచ్గా పెట్టుకోవడం అతని కెరీర్లో కీలక మలుపు. ముడి పదార్థంలా ఉన్న అల్కరాజ్ను ఫెరీరో మెరిసే బంగారంగా తీర్చిదిద్ది.. అద్భుతమైన అతని ఆటలో తన వంతు పాత్ర పోషించాడు. అన్నీ సంచలనాలే.. ఏటీపీ టూర్లో అల్కరాజ్ ఎన్నో అరుదైన విజయాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం పిన్న వయస్సులోనే సాధించిన ఘనతలుగా గుర్తింపు పొందాయి. టీనేజర్గా ఉండగానే 9 టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఏటీపీ 500 స్థాయి టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ను సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. తనపై ఉన్న అంచనాలను అతను ఎప్పుడూ వమ్ము చేయలేదు. వాటికి అనుగుణంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ, తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. అతని కెరీర్లో అన్నింటికంటే అత్యుత్తమ క్షణం ప్రపంచ ర్యాంకింగ్స్లో ఉన్నత స్థానాన్ని పొందడం! వరల్డ్ నంబర్ వన్గా నిలిచిన చిన్న వయస్కుడిగా, మొదటి టీనేజర్గా అల్కరాజ్ ఘనత వహించాడు. ఈ మైలురాయిని దాటాక అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. కేవలం అతని ఆట, అతను సాధించబోయే టైటిల్స్పైనే అందరి చూపులు నిలిచాయి. గ్రాండ్గా విజయాలు.. 17 ఏళ్ల వయసులో తొలిసారి అల్కరాజ్ వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఇదే అతనికి మొదటి గ్రాండ్స్లామ్ టోర్నీ. అయితే క్వాలిఫయింగ్ దశను అధిగమించలేకపోయాడు. తర్వాత ఏడాదికే యూఎస్ ఓపెన్లో ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. 1963 తర్వాత ఎవరూ 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించలేకపోవడం అతని విజయం విలువను చూపించింది. 2022లో తనకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్ వరకు చేరిన అల్కరాజ్ ఏడాది చివరికల్లా గ్రాండ్స్లామ్ చాంపియన్గా అవతరించడం విశేషం. యూఎస్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకొని మొదటిసారి అతను మేజర్ విజయాన్ని చవి చూశాడు. అప్పటికే వరల్డ్ నంబర్ వన్గా గుర్తింపు తెచ్చుకున్న అల్కరాజ్ అదే స్థానంతో ఏడాదిని ముగించాడు. అనూహ్య గాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరం చేయగా.. గాయం కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మళ్లీ రివ్వున పైకి ఎగిశాడు. పూర్తి ఫిట్నెస్ను సాధించిన తర్వాత గ్రాస్ కోర్టు టోర్నీ క్వీన్స్ క్లబ్ విజేతగా.. వింబుల్డన్పై గురి పెట్టాడు. గ్రాస్ కోర్టుపై తన ఆట కాస్త బలహీనం అని తాను స్వయంగా చెప్పుకున్నా.. పట్టుదల ఉంటే ఎక్కడైనా గెలవొచ్చని ఈ స్పెయిన్ కుర్రాడు నిరూపించాడు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ను ఓడించి చాంపియన్గా నిలిచిన తీరు కొత్త శకానికి నాంది పలికింది. గత రెండు దశాబ్దాల్లో ముగ్గురు దిగ్గజాలు మాత్రమే శాసించిన వింబుల్డన్ను గెలుచుకొని తాను టెన్నిస్ను ఏలడానికి వచ్చానని సూత్రప్రాయంగా చెప్పాడు. పదునైన ఆటతో.. అల్కరాజ్ ఆటలోకి వచ్చినప్పుడు అతను క్లే కోర్టు స్పెషలిస్ట్ మాత్రమే అన్నారు. అతను ఆరంభంలో అతను సాధించిన టైటిల్స్, నాదల్ వారసుడిగా వచ్చిన గుర్తింపు ఒక్క సర్ఫేస్కే పరిమితం చేసేలా కనిపించింది. కానీ ఏడాది తిరిగే లోపే అది తప్పని నిరూపించాడు. తొలి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు కాగా, ఇప్పుడు సాధించిన వింబుల్డన్ గ్రాస్ కోర్టు. ఇక క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ బాకీ ఉంది. దాన్ని సాధించేందుకూ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడతను ఆల్రౌండ్ ప్లేయర్. పదునైన ఫోర్హ్యండ్ అతని ప్రధాన బలం. అతని డ్రాప్ షాట్లు నిజంగా సూపర్. ఆ షాట్ బలమేమిటో తాజాగా వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ రుచి చూశాడు. ఫిట్నెస్, ఫుట్ స్పీడ్, దృఢమైన శరీరంతో అతను యువ నాదల్ను గుర్తుకు తెస్తున్నాడు. అల్కరాజ్ ఇప్పటికే తన ఆటతో ప్రపంచ టెన్నిస్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. కెరీర్లో ఒక్క గ్రాండ్స్లామ్ టైటిల్తోనే జీవితకాలం సంతృప్తి పొందే ఆటగాళ్లతో పోలిస్తే రెండు పదుల వయసులోనే అతను రెండు గ్రాండ్స్లామ్లు సాధించాడు. మున్ముందు గాయాల బారిన పడకపోతే పెద్ద సంఖ్యలో టైటిల్స్ అతని ఖాతాలో చేరడం ఖాయం. 2021లో క్రొయేషియా ఓపెన్ గెలిచి తన తొలి ట్రోఫీని అందుకున్న అల్కరాజ్ తర్వాతి ఏడాది వచ్చేసరికి 5 టైటిల్స్ గెలిచాడు. 2023లో ఇప్పటికే 6 టైటిల్స్ అతని ఖాతాలో చేరాయంటే అతను ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో అర్థమవుతోంది. ముగ్గురు దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ తర్వాత టెన్నిస్ను శాసించగల ఆటగాడిగా అతని పేరు ముందుకొచ్చేసింది. దాంతో సహజంగానే ఎండార్స్మెంట్లు, బ్రాండ్లు అతని వెంట పడ్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కంపెనీలు నైకీ, బబోలట్, రోలెక్స్, ఎల్పోజో, బీఎండబ్ల్యూ, కెల్విన్ క్లీన్, లూయీ విటాన్ అతనితో జత కట్టాయి. ఆటలో ఇదే జోరు కొనసాగిస్తే అల్కరాజ్ ఆల్టైమ్ గ్రేట్గా నిలవడం ఖాయం. చదవండి: #StuartBroad: రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్లు, 48 పరుగులు! వీడియో వైరల్ -
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్లో ఆల్టైమ్ గ్రేట్గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్హ్యాండ్ను, ఇటు బ్యాక్హ్యాండ్ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్హ్యాండ్కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్హ్యాండ్పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్కు ‘ఐస్బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్లో ఆడే అవకాశం బోర్గ్కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్ను మలుపు తిప్పింది. ఆక్లాండ్లో గ్రాస్కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్స్లామ్ చాంప్గా కూడా అవతరించాడు. రోమ్లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్ను తన కోర్ట్లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్స్లామ్లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్కు చేదు అనుభవం.. -
అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..!
వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్గా మారి తర్వాతి రోజుల్లో భారత్లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్. 1987.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్టేబుల్తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన. సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్కి శ్రీకారం చుట్టారు. ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది. అడవి బిడ్డ నుంచి ఆర్చర్గా.. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు. అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి. సరైన చోట, సరైన శిక్షణతో.. స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్ని ప్రోత్సహించారు. దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్లో విజేతగా నిలవడంతో లింబా రామ్పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్లో లింబా రామ్కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ప్రపంచ రికార్డు కూడా.. 1989లో స్విట్జర్లాండ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్లో భారత్కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్లో అత్యుత్తమ దశ. బీజింగ్లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు. అచ్చిరాని మెగా ఈవెంట్.. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్కి వరుసగా మూడు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం. ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై
1998.. ముప్పైరెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. 10 గోల్స్తో సత్తా చాటి కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన టీమ్కి అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఘనాతిఘనమైన స్వాగతం సంగతి దేవుడెరుగు.. దేశంలో ఆటను నడిపించే భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్)కు చెందిన అధికారులైనా కనీసం విమానాశ్రయానికి వచ్చి తమ ఆటగాళ్లను కలవలేదు. అన్నింటికి మించి ఎటువంటి కనీస ఏర్పాట్లూ చేయకపోవడంతో ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా భారత ఆటగాళ్లు ఎయిర్పోర్ట్లో నేలపై పడుకోవాల్సి వచ్చింది. దాంతో ధన్రాజ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఐహెచ్ఎఫ్ మొత్తాన్ని తిట్టిపడేసి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాతి ఫలితం ఊహించిందే. అప్పట్లో కంటిచూపుతో ఐహెచ్ఎఫ్ని శాసిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్.. తర్వాతి సిరీస్కి ఎంపిక చేయకుండా పిళ్ళైపై చర్య తీసుకొని తన బలాన్ని చూపించాడు. మళ్లీ టీమ్లోకి వచ్చేందుకు ధన్రాజ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఇదంతా ఊహించిందే. ‘తప్పు నాది కానప్పుడు దేనికైనా తెగిస్తాను.. న్యాయం కోసం పోరాడేందుకు సిద్ధం’ అనే లక్షణం ధన్రాజ్లో ఎప్పటినుంచో ఉంది. అద్భుతమైన ఆటగాడిగా మాత్రమే కాకుండా అవసరమైతే వ్యవస్థను ప్రశ్నించేందుకూ సిద్ధపడే తత్వమే ధన్రాజ్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత హాకీ దిగ్గజాలలో ఒకడిగా తనకంటూ విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఘనత ధన్రాజ్ది! ధ్యాన్చంద్, బల్బీర్ సింగ్, మొహమ్మద్ షాహిద్ వంటి దిగ్గజాల తర్వాతి తరంలో తన దూకుడైన ఆటతో ధన్రాజ్ పిళ్లై భారత హాకీలో ప్రత్యేకంగా నిలిచాడు. 90వ దశకంలో వేర్వేరు కారణాలతో కునారిల్లిన భారత హాకీ సాధించిన కొన్ని చెప్పుకోదగ్గ ఫలితాల్లో తన ఆటతో అతను శిఖరాన నిలిచాడు. హాకీ స్టిక్తో మైదానంలో ధన్రాజ్ చూపించిన మ్యాజిక్ క్షణాలెన్నో. టర్ఫ్పై వేగంగా దూసుకుపోవడం, ప్రత్యర్థి డిఫెండర్లను దాటి సహచరులకు పర్ఫెక్ట్ పాస్లు అందించడం, అతని డ్రిబ్లింగ్, రివర్స్ హిట్లు, ఫార్వర్డ్గా కొట్టిన గోల్స్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి పెనాల్టీలను విఫలం చేయడంలో డిఫెండర్గా కూడా ధన్రాజ్ ఆట అత్యుత్తమంగా సాగింది. ఆటలో ప్రతిభ మాత్రమే కాదు.. స్టిక్ చేతిలో ఉంటే అతనికి పూనకం వచ్చేస్తుంది. ఒక రకమైన కసి, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అతని ఆవేశానికి మరింత బలాన్నిస్తాయి. దశాబ్దంన్నర అంతర్జాతీయ కెరీర్లో ధన్రాజ్ భారత హాకీకి పోస్టర్ బాయ్గా నిలిచాడు. భారత్ తరఫున 339 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అతను 170 గోల్స్ సాధించడమే కాదు, మరెన్నో వందల గోల్స్లో తన వంతు పాత్రను పోషించాడు. ఆటపై మమకారంతో.. పుణే శివారులోని ఖడ్కి.. ధన్రాజ్ స్వస్థలం. అతని తండ్రి ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో లేబర్గా పని చేస్తుండేవాడు. ఆర్మీ అధికారుల ప్రాబల్యం ఉండే ఆ కంటోన్మెంట్ ఏరియాలో చాలామంది ఏదో ఒక ఆడుతూ కనిపించేవారు. క్రీడలపై అమితాసక్తి ఉన్న తండ్రి తన నలుగురు కొడుకులను కూడా ప్రోత్సహించాడు. వారిలో చిన్నవాడు ధన్రాజ్ని హాకీ ఆకర్షించింది. అక్కడ ఉండే మట్టిలో, పేడతో అలికిన టర్ఫ్పై విరిగిన పాత స్టిక్లతో హాకీ ఆడుతూ ఉండే ధన్రాజ్కి ఆ ఆటపై మరింత ఆసక్తి పెరిగింది. ఒకనాటి భారత దిగ్గజం మొహమ్మద్ షాహిద్ని అతను విపరీతంగా అభిమానించేవాడు. అతని శైలిలోనే ఆడి చూపించేవాడు. చివరకు అది పూర్తిస్థాయి ప్రొఫెషనల్గా మారే వరకు చేరింది. అధికారికంగా ఆ సమయంలో హాకీలో వేర్వేరు వయో విభాగాల్లో పోటీలు లేకపోయినా.. అందరికీ ధన్రాజ్లో ఏదో ప్రత్యేకత కనిపించింది. అదే మలుపు.. ధన్రాజ్లో ప్రతిభను పూర్తిగా వాడుకొని సరైన దారిలో నడిపించాలని అన్నయ్య రమేశ్ భావించాడు. తాను అప్పటికే ముంబైలో హాకీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ్ముడిని తన వద్దకు తెచ్చుకొని సరైన రీతిలో దిశానిర్దేశం చేశాడు. అక్కడే ప్రముఖ కోచ్ జోకిమ్ కార్వాలోను కలవడం పిళ్లై జీవితాన్ని మార్చేసింది. ఈ కుర్రాడిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన ఆయన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆటను తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా అప్పట్లో యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న మహీంద్ర అండ్ మహీంద్ర క్లబ్లో తన సిఫారసుతో ప్రవేశం ఇప్పించి ఆ జట్టు తరఫున ఆడే అవకాశం కల్పించాడు. దాంతో ధన్రాజ్ హాకీలో మరింత దూసుకుపోయాడు. చివరకు భారత జట్టులో స్థానం సంపాదించే వరకు అతను ఆగలేదు. 1989లో తొలిసారి దేశం తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ధన్రాజ్ 2004 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సాధించిన ఘనతలెన్నో.. 15 ఏళ్ల పాటు ధన్రాజ్ భారత హాకీలో అంతర్భాగంగా ఉన్నాడు. మన జట్టు సాధించిన ఎన్నో గుర్తుంచుకోదగ్గ విజయాల్లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆసియా కప్లో ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో 2 రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్న జట్టులో.. ఆసియా క్రీడల్లో స్వర్ణం, 3 రజతాలు సాధించిన టీమ్లలో సభ్యుడైన అతను 2001లో చాంపియన్స్ చాలెంజ్ టోర్నీని గెలుచుకున్న జట్టులో కూడా ఉన్నాడు. హాకీలో 3 మెగా ఈవెంట్లలో కనీసం నాలుగు సార్లు పాల్గొన్న ఏకైక ఆటగాడు ధన్రాజ్ కావడం విశేషం. నాలుగు ఒలింపిక్స్లలో, నాలుగు చాంపియన్స్ ట్రోఫీలలో, నాలుగు వరల్డ్ కప్లలో అతను భాగమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి చాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన క్షణం ధన్రాజ్ని అందరికంటే అగ్రభాగాన నిలబెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు అతనే. 1994 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవన్ని ఎంపిక చేసినప్పుడూ ధన్రాజ్కి చోటు దక్కింది. క్లబ్లలోనూ మేటి.. ఒకప్పుడు మట్టి మైదానాల్లో సత్తా చాటిన భారత హాకీ తర్వాతి రోజుల్లో ఆస్ట్రోటర్ఫ్ దెబ్బకు చతికిలపడింది. సంప్రదాయ శైలికి పూర్తి భిన్నమైన యూరోపియన్ శైలి ప్రపంచ హాకీలోకి ప్రవేశించడంతో మన జట్టు ప్రమాణాలు బాగా పడిపోయాయి. యూరోపియన్ల ఫిట్నెస్తో పోలిస్తే భారత ఆటగాళ్లు ఆ స్థాయిని అందుకోలేని పరిస్థితి. ముఖ్యంగా 90వ దశకంలో మన జట్టు పరాజయాలకు ఇదీ ఒక కారణం. అలాంటి సమయంలోనే ధన్రాజ్ తాను కొత్తగా మారేందుకు సిద్ధమయ్యాడు. జట్టులో అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను తన ఆటనూ మార్చుకుంటే అది భారత జట్టుకు మేలు చేస్తుందని భావించాడు. అందుకే యూరోపియన్ క్లబ్లలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ధన్రాజ్ స్థాయి ప్లేయర్ గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రతిజట్టూ అతడిని కోరుకుంది. అందుకే పెద్ద ఎత్తున అతడికి చాన్స్ దక్కింది. స్టట్గార్డ్ కికర్స్ (జర్మనీ), హెచ్సీ లయన్ (ఫ్రాన్స్), ఇండియన్ జింఖానా (లండన్) క్లబ్లకు అతను ప్రాతినిధ్యం వహించాడు. వివాదాలతో సహవాసం చేస్తూనే.. ఆటగాడిగా గొప్ప స్థాయికి చేరినా అతని మాటతో, దూకుడుతో ధన్రాజ్ చాలా మంది దృష్టిలో రెబల్గా మారాడు. అయితే తన తిక్కకూ లెక్క ఉంటుందని అతను పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. విమానాశ్రయ ఘటనలోనే కాకుండా ఆటగాళ్లకు కనీస ఫీజులు కూడా ఇవ్వడం లేదని పలుమార్లు ఫెడరేషన్తో గొడవలు, అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా నాసిరకం ఆహారం ఇస్తున్నారంటూ స్పోర్ట్స్ అథారిటీ కేంద్రలో కుక్పై దాడి, మ్యాచ్ జరిగినంతసేపూ భారత్ని అవమానించాడంటూ స్టాండ్స్లోకి వెళ్లి మరీ ప్రేక్షకుడిని కొట్టిన తీరు అతని ఆవేశాగ్రహాలను చూపించాయి. అయితే అతను ఏనాడూ ఇలాంటి వాటి వల్ల తన స్థానానికి ముప్పు వస్తుందని భయపడలేదు. ఆసియా గేమ్స్ పతకం తర్వాత ఫెడరేషన్తో గొడవతో కోల్పోయిన స్థానాన్ని ఆరునెలల్లో మళ్లీ దక్కించుకున్నాడు. ‘నాకు తెలుసు.. నా ఆటపై నాకు నమ్మకముంది. మరొకరు నా స్థానాన్ని భర్తీ చేయలేరు’ అని చెప్పడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. నిజంగానే మైదానం బయట ఘటనలు అతని స్థాయిని తగ్గించలేదు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ధన్రాజ్.. ఖేల్రత్న అవార్డు స్వీకరించిన తొలి హాకీ క్రీడాకారుడు. అది మాత్రం దక్కలేదు.. హాకీ ఆటగాడిగా ఎన్నో సాధించినా.. ఒలింపిక్స్ పతకం మాత్రం ధన్రాజ్కి కలగానే మిగిలిపోయింది. ఏకంగా నాలుగు ఒలింపిక్స్లలో పాల్గొన్నా ఆ అదృష్టం లభించలేదు. 1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్లలో పిళ్లై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో జట్టు మొత్తం పేలవ ప్రదర్శనే కనబర్చింది. పతకం కాదుకదా కనీసం చేరువగా కూడా రాలేక వరుసగా 7, 8, 7, 7 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో జట్టుపై కాస్త ఆశలు ఉండేవి. అందుకే ఈసారి ఎలాగైనా పతకంతో తిరిగొస్తాం అని ధన్రాజ్ అందరికీ చెప్పాడు. పోలండ్తో చివరి లీగ్ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. ఆఖరి వరకు ఆధిక్యంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న స్థితిలో అనూహ్యంగా గోల్ ఇవ్వడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో తర్వాతి నాలుగు రోజుల పాటు ధన్రాజ్.. తన గేమ్స్ విలేజ్ గదిలోనే ఉంటూ రోధించాడు. తనతో మాట్లాడేందుకు తల్లి ఫోన్లో ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. మాట తప్పినందుకు మన్నించమని తల్లికి చెప్పమంటూ తన సహచరులకు సూచించాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే అతని జీవిత విశేషాలతో కూడిన బయోగ్రఫీకి ఫర్గివ్ మి అమ్మా అని పేరు పెట్టారు. -
దిగ్గజాలకు సైతం ముచ్చెమటలు పట్టించిన భారత టెన్నిస్ యోధుడు
1989 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ.. వరల్డ్ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ మాట్స్ విలాండర్ మరోసారి ఫేవరెట్గా బరిలో నిలిచాడు. తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేసిన విలాండర్ ముందుకు దూసుకుపోవడంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఎప్పటిలాగే రెండో రౌండ్ మ్యాచ్కి అతను సిద్ధమయ్యాడు. ఎదురుగా భారత్కి చెందిన రమేశ్ కృష్ణన్ ప్రత్యర్థిగా ఉన్నాడు. విలాండర్తో పోలిస్తే రమేశ్ స్థాయి చాలా చిన్నది. కాబట్టి మ్యాచ్ ఏకపక్షమే అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ టెన్నిస్ కోర్ట్లో చెలరేగిపోయాడు రమేశ్. పవర్ఫుల్ ఆటతో కదం తొక్కిన అతను భారత టెన్నిస్ సింగిల్స్ చరిత్రలో అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేశాడు. వరుస సెట్లలో విలాండర్ను చిత్తు చేసి ఔరా అనిపించాడు. అలా దశాబ్దన్నర పాటు సాగిన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన రమేశ్ భారత టెన్నిస్పై తనదైన ముద్ర వేశాడు. తండ్రి బాటలో ఆటను ఎంచుకున్న అతను నాటితరంలో పురుషుల సింగిల్స్లో భారత్ తరపున ఏకైక ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన దాదాపు దశాబ్ద కాలం వరకు కూడా టెన్నిస్లో మన వైపు నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. 1960ల్లో రామనాథన్ కృష్ణన్ రాకతో పరిస్థితి కాస్త మారింది. వింబుల్డన్ బాలుర టైటిల్ని గెలిచిన ఆసియా తొలి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రామనాథన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ నిలకడగా రాణించాడు. 1966లో భారత డేవిస్ కప్ జట్టు మొదటిసారి ఫైనల్ చేరడంలో కూడా ఆయనదే కీలక పాత్ర. ఆయన కొడుకైన రమేశ్ కృష్ణన్ కూడా తండ్రి బాటలోనే టెన్నిస్ని ఎంచుకున్నాడు. ఆటపై రమేశ్ ఆసక్తిని చూసిన రామనాథన్ ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. దాని ఫలితాలు వెంటనే కనిపించాయి. జూనియర్ స్థాయిలో సత్తా చాటిన రమేశ్ టెన్నిస్లో దూసుకుపోయాడు. జూనియర్ గ్రాండ్స్లామ్స్లో వరుస విజయాలతో తన రాకెట్ పదును చూపించాడు. 1979లో వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీలలో చాంపియన్ గా నిలవడంతో రమేశ్ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్లో కూడా ముందంజ వేసిన రమేశ్ వరల్డ్ నంబర్వన్ గా ఎదిగాడు. గ్రాండ్స్లామ్లోనూ సత్తా చాటి.. జూనియర్ స్థాయిలో మంచి ఫలితాలతో వెలుగులోకి వచ్చిన రమేశ్ సీనియర్ విభాగంలోనూ ఎన్నో ప్రతికూలతలను అధిగమించి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాడు. 80వ దశకంలో అంతర్జాతీయ టెన్నిస్ మరింత ఆధునికంగా మారుతూ వచ్చింది. పవర్ గేమ్తో పాటు కొత్త తరహా శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో యూరోపియన్ సర్క్యూట్కి చెందిన ఆటగాళ్లతో పోలిస్తే భారత టెన్నిస్ ఎంతో వెనుకబడి ఉంది. ఇలాంటి స్థితిలోనూ రమేశ్ సింగిల్స్లో తన ప్రభావం చూపడం విశేషం. సాధారణ టోర్నీలతో పోలిస్తే గ్రాండ్స్లామ్లకు మరింత సాధన అవసరమని అతను భావించాడు. కోచ్ హ్యారీ హాప్మన్ శిక్షణలో అతని ఆట మరింత పదునెక్కింది. ఈ కోచింగ్తో పట్టుదలగా పోటీలకు సిద్ధమైన అతను తన సత్తా చూపించాడు. కెరీర్లో మూడుసార్లు అత్యుత్తమంగా గ్రాండ్స్లామ్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరాడు. 1981, 1987లలో యూఎస్ ఓపెన్ , 1986 వింబుల్డన్ లో చివరి ఎనిమిది మందిలో ఒకడిగా సఫలమయ్యాడు. 1986లో యూఎస్లో ఒక చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచిన సమయంలో అప్పుడే కెరీర్ ఆరంభంలో ఉన్న ఆండ్రీ అగస్సీని ఓడించాడు. రమేశ్ కెరీర్లో విలాండర్తో పాటు మరో ఇద్దరు దిగ్గజాలపై సాధించిన విజయాలు ఉన్నాయి. జపాన్, హాంకాంగ్ ఓపెన్లలో అతను జిమ్మీ కానర్స్, ప్యాట్ క్యాష్లను ఓడించి సంచలనం సృష్టించాడు. డేవిస్ కప్ విజయాల్లో.. భారత జట్టు తరఫున డేవిస్ కప్ విజయాల్లోనూ రమేశ్ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. 1987లో మన బృందం ఫైనల్కి చేరడానికి రమేశ్ ఆటనే ప్రధాన కారణం. తండ్రి రామనాథన్ భారత్కి డేవిస్ కప్ ఫైనల్ చేర్చిన 21 ఏళ్ల తర్వాత కొడుకు రమేశ్ నేతృత్వంలో భారత్ మరోసారి తుది పోరుకు అర్హత సాధించడం విశేషం. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అతని అత్యుత్తమ ఆటే జట్టును ఫైనల్కి చేర్చింది. జాన్ ఫిట్జ్గెరాల్డ్పై నాలుగు సెట్ల పోరులో అతను సాధించిన అద్భుతమైన విజయమే జట్టును ముందంజలో నిలిపింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డ.. సిడ్నీలో 3–2 తేడాతో ఓడించి ఫైనల్కి చేరడం అప్పట్లో పెద్ద వార్తాంశంగా మారింది. ఫైనల్లో మన టీమ్ స్వీడన్ చేతిలో ఓడినా భారత టెన్నిస్ చరిత్రలో ఈ డేవిస్ కప్ విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో అప్పటి కొత్త కుర్రాడు లియాండర్ పేస్తో కలసి రమేశ్ డబుల్స్ బరిలోకి దిగగా, ఈ జోడి క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. అత్యుత్తమ ర్యాంక్.. రమేశ్ కృష్ణన్ కెరీర్లో సింగిల్స్ విభాగంలో ఎనిమిది ఏటీపీ టైటిల్స్ ఉన్నాయి. దీంతో పాటు మరో 4 చాలెంజర్ టోర్నీలను కూడా అతను గెలుచుకున్నాడు. న్యూయార్క్ (యూఎస్), ఆక్లాండ్, వెల్లింగ్టన్ (న్యూజిలాండ్), టోక్యో (జపాన్ ), హాంకాంగ్, మెట్జ్ (ఫ్రాన్స్), స్టట్గార్ట్ (జర్మనీ), మనీలా (ఫిలిప్పీన్స్).. ఇలా వేర్వేరు దేశాల్లో అతను ట్రోఫీలు గెలవడాన్ని చూస్తే భిన్న వేదికలపై రమేశ్ ప్రదర్శన, రాణించిన తీరు అతని ఆట ప్రత్యేకత ఏమిటో చూపిస్తాయి. రమేశ్ తన కెరీర్లో అత్యుత్తమంగా వరల్డ్ ర్యాంకింగ్స్లో 23వ స్థానానికి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్లో నాడు అతను సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. రమేశ్ కృష్ణన్ తర్వాత 2007లో మహిళల సింగిల్స్లో సానియా మీర్జా (27వ ర్యాంక్) మాత్రమే దానికి సమీపంగా రాగలిగింది. 1985లో రమేశ్ 23వ ర్యాంక్ సాధించగా, 38 ఏళ్లయినా పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి ఎవరూ దరిదాపుల్లోకి రాలేకపోయారంటే ఆ ఘనత విలువేమిటో అర్థమవుతుంది. కెరీర్లో ఒక దశలో ఆరేళ్ల వ్యవధిలో నాలుగేళ్లు టాప్–50లో కొనసాగిన అతను, వరుసగా పదేళ్ల పాటు టాప్–100లోనే ఉండటం విశేషం. భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న రమేశ్ కృష్ణన్ ఇప్పుడు తన స్వస్థలం చెన్నైలోనే టెన్నిస్ అకాడమీ నెలకొల్పి కోచ్గా ఆటగాళ్లను తయారు చేస్తున్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఈ సూపర్ మామ్స్కి కుడోస్.. మదర్స్ డే స్పెషల్
కోవిడ్ టైమ్లో.. ఇటు ఆఫీస్ బాధ్యతలు.. అటు పెరిగిన ఇంటి బాధ్యతలతో సతమతమవుతూ 51 శాతం వర్కింగ్ మదర్స్ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డారు.కోవిడ్ తర్వాత.. దాదాపు ఎనిమిదివేల మంది వర్కింగ్ మదర్స్ను కదిలిస్తే.. అందులో 38.6 శాతం మంది తమకు అనుకూలంగా ఆఫీస్ పనివేళలను మార్చుకునే వీలుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు. 32.3 శాతమేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను కంటిన్యూ చేస్తే తాము ఉద్యోగం వదిలే ప్రసక్తి ఉండదని చెప్పారు. 17 శాతమేమో ఆఫీసుల్లో పిల్లలను చూసుకునే కేర్ సెంటర్స్ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చారు.12.1శాతం వర్కింగ్ మదర్సేమో ఇటు వర్క్, అటు కుటుంబం.. రెండూ తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో మరింత ముందుకు వెళ్లడానికి సైకలాజికల్ కౌన్సెలర్స్ సపోర్ట్ అవసరమని స్పష్టం చేశారు. అది జాబ్స్ ఫర్ హర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే వివరం. కోవిడ్ తర్వాతే.. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ కూడా ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశంలోని వర్కింగ్ మదర్స్ కోవిడ్ సమయంలో పిల్లల సంరక్షణకోసం అదనంగా 360 గంటలు వెచ్చించారు. ఇది సగటు భారతీయ పురుషులు వెచ్చించే సమయానికన్నా పదింతలు ఎక్కువన్నమాట. అంటే వర్కింగ్ మదర్స్ తమ ఉద్యోగాల్లో.. లేదా కెరీర్లో నిలదొక్కుకోవాలంటే అదనంగా అన్ని గంటలు పనిచేయాలన్నమాట! ‘ప్రిడిక్మెంట్ ఆఫ్ రిటర్నింగ్ మదర్స్’ పేరుతో అశోక యూనివర్సిటీ చేసిన మరో సర్వేలో దేశంలో 30 ఏళ్ల వయసున్న దాదాపు 50 శాతం వర్కింగ్ మదర్స్ పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగాలు వదిలేసినట్టు తేలింది. మిగిలిన 50 శాతంలో 48 శాతం వర్కింగ్ మదర్స్.. మెటర్నిటీ లీవ్, పాండమిక్ తర్వాత ఉద్యోగంలో చేరి.. కేవలం నాలుగు నెలలే పనిచేసి విధులకు రాజీనామా చేశారు. కుటుంబంలో.. పనిచేసే చోట కావల్సిన సపోర్ట్ దొరక్క! అయినా పనిచేస్తున్న ఆ రెండు శాతం తల్లులు కూడా పనిచేసే చోట.. బంధువుల్లో.. కుటుంబాల్లో వివక్షకు గురవుతున్నారు.. పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టక.. ఉద్యోగం, కెరీర్ అంటూ ఊరేగుతున్నారనే కామెంట్స్తో. ఇన్ని లెక్కలతో ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది పాఠకులకు! ఎస్.. ఈ రోజు మదర్స్ డే! ఆ సందర్భంగా వర్కింగ్ మదర్స్ ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టట్లేదు. కానీ వాళ్లకున్న ప్రతికూల వాతావరణాన్ని ఆ సర్వేల ఫలితాల ద్వారా తెలియజేసి.. ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకుంటూ.. ఉద్యోగిగా కాకపోతే అంట్రప్రెన్యూర్గా డిఫరెంట్ కెరీర్కి స్విచ్ ఆన్ అయిన వర్కింగ్ మదర్స్ పరిచయ ప్రయత్నమే ఈ కథనం.. మమీయూ ఇదో మెటర్నిటీ గార్మెంట్స్ బ్రాండ్. శాలినీ శర్మ బ్రెయిన్ చైల్డ్. మార్కెట్లోకి వచ్చి రెండేళ్లవుతోంది. మమీయూ కంటే ముందు శాలినీ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్గా పనిచేసేది. తను తల్లి కాబోతున్నానని తెలియగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో చాలా అసౌకర్యం ఫీలైంది. ఎంతటి వదులు దుస్తులు వేసుకున్నా సౌకర్యంగా అనిపించలేదుట. ప్రసవమయ్యాకా అదే పరిస్థితి. ఆన్లైన్.. ఆఫ్లైన్ మార్కెట్ అంతా గాలించింది. ఆమెకు అనువైన దుస్తుల కోసం. పెద్ద పెద్ద బ్రాండ్స్లోనూ వెదికింది. ఫారిన్ బ్రాండ్స్లో ఉన్నాయి. కాని అవి తనకు నప్పే సైజుల్లో లేవు. ఆశ్చర్యపోయింది.. మన దగ్గర గర్భిణీకి.. బాలింతకు సౌకర్యంగా ఉండే దుస్తులే లేవా? అని. ఆ అసహనమే తల్లి అయిన శాలినీ శర్మలో కొత్త కెరీర్ ఆలోచనను రేకెత్తించింది. ‘మమీయూ’ను సృష్టించింది. ఈ రోజు ఆమెను ఓ అంట్రప్రెన్యూర్గా నిలబెట్టింది. ఆ ప్రయాణానికి ముందు మార్కెట్ రీసెర్చ్ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతంలోని 150 మంది గర్భిణీలను కలసి.. మెటర్నిటీ దుస్తుల అవసరం.. సౌకర్యం.. కొనుగోలు చేసే ఆర్థిక స్థితి వంటివన్నిటి మీదా ఆరా తీసింది. దాదాపు 87 శాతం మంది గర్భిణీలు దేశీ మెటర్నిటీ గార్మెంట్స్ అవసరం ఉందని చెప్పారు. తమకు నప్పే సైజుల్లో దొరికితే కొంటామనీ తెలిపారు. ఆ సమాధానాలు విన్నాక తన ఆలోచన సరైనదేననే నమ్మకం కుదిరింది శాలినీకి. ముందుకు కదిలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఇటు గుజరాత్ నుంచి మిజోరమ్ దాకా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేనేత మహిళా కార్మికులు అందరి చేనేత కళను తన సృజనలో భాగస్వామ్యం చేసింది. మమీయూను కమ్యూనిటీ బేస్డ్ క్లాతింగ్ బ్రాండ్గా మలచి.. తాలుకా, మండల, జిల్లా కేంద్రాల నుంచి మెట్రో నగరాల దాకా కొనుగోలుదార్లను క్రియేట్ చేసుకుంది. ఇలా గ్రామీణ మహిళా చేనేత కార్మికుల నైపుణ్యంతో పట్టణ మహిళల అవసరాన్ని తీర్చుతూ భారతీయ మార్కెట్లో మెటర్నిటీ గార్మెంట్స్కి కొరత లేకుండా చేసింది. ‘ఇలా బ్రాండ్ను లాంచ్ చేయగానే అలా లాభాలు వచ్చిపడలేదు. చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్గా దేశంలోని డిఫరెంట్ సిటీస్లో పనిచేయడం వల్ల.. ఎక్కడ ఏ స్కిల్ దాగుంది.. దాన్ని ఎలా వాడుకోవాలి వంటివన్నీ తెలియడం.. నా ఈ కొత్త కెరీర్కు చాలా హెల్ప్ అయింది. చాలెంజెస్ను హ్యాండిల్ చేయడమూ ఈజీ అయింది. నేను హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పెరగడం వల్ల నా వర్క్ ప్లేస్నీ అక్కడే పెట్టుకున్నాను. ప్రస్తుతం మా బ్రాండ్ కోసం హిమాచల్, సోలన్ జిల్లాలోని పందొమ్మిది గ్రామాలకు చెందిన దాదాపు 450 మంది మహిళా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా 21 నుంచి 68 ఏళ్ల లోపు వారు. డిఫరెంట్ వర్క్ స్కిల్స్.. డిఫరెంట్ వర్క్ టైమింగ్స్లో పనిచేస్తూ మమీయూ బ్రాండ్ సక్సెస్కి తోడ్పడుతున్నారు’ అంటుంది అంట్రప్రెన్యూర్గా మారిన మదర్ శాలినీ శర్మ. జాబ్స్ ఫర్ హర్.. ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన వర్కింగ్ మదర్స్ మీద సర్వే చేసిన సంస్థే ఇది. దీన్ని స్థాపించింది కూడా ఓ వర్కింగ్ మదరే. పేరు నేహా బగారియా. స్వస్థలం బెంగళూరు. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, ఎడ్యుకేషన్ అంట్రప్రెన్యూర్ కూడా! ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను చూసుకోవడానికి మూడేళ్లు విరామం తీసుకుంది. ఆ టైమ్లోనే.. లాయర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, ఎంబీఏస్గా సక్సెస్ఫుల్ కెరీర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు పుట్టగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం.. వాళ్లు కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించి విఫలమవడం చూసింది. ఆ వైఫల్యానికి కారణాలను వెదికింది.. అధ్యయనం చేసింది. ‘తల్లులు అయ్యాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడానికి.. లేదా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేయడానికి వాళ్లకు ఇంటి నుంచి సమాజం దాక ఎక్కడా సపోర్ట్ లేదు. అంతటా వాళ్లను ఓ గిల్ట్లోకి నెట్టే వాతావరణం.. వివక్షే! ఇంటి పట్టున బిడ్డ ఆలనా పాలనా చూసుకోక.. ఉద్యోగాలు ఏంటీ అని వాళ్లలో ఓ అపరాధభావాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని లెక్కచేయకుండా ఉద్యోగాలు చేస్తున్న తల్లులను పంక్చువాలిటీ, పెర్ఫార్మెన్స్ పేరుతో ఆత్మన్యూనతకు, వివక్షకు గురిచేస్తున్నారు. దీంతో వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమకున్న నైపుణ్యాలను పట్టించుకోవట్లేదు. జాబ్, కెరీర్కి సంబంధించి అప్టు డేట్ కాలేకపోతున్నారు. అందుకే తల్లులు అవగానే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగానికి ఓ దండం పెట్టేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వీటిని అధిగమించడానికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం.. స్కిల్స్ని పెంపొందించుకోవడం.. వివక్షను ఎదుర్కోవడానికి సంసిద్ధమవడం వర్కింగ్ మదర్స్కి తప్పనిసరి అని అర్థమైంది’ అంటుంది నేహా. దానికి తగిన శిక్షణ కావాలనీ గ్రహించింది. అలా వాళ్లను ట్రైన్ చేసి.. వాళ్ల చేత సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయించాలనీ నిశ్చయించుకుంది. అటు వైపుగా రెండు అడుగులు వేస్తూ తనూ సెకండ్కెరీర్ను స్టార్ట్ చేసింది. అదే జాబ్స్ ఫర్ హర్ సంస్థ. మాతృత్వంతో ఉద్యోగం లేదా కెరీర్కి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఎంటర్ కావాలనుకునే వాళ్లకు అన్నిరకాలుగా తర్ఫీదునిచ్చి.. దేశంలోని ఉద్యోగ అవాకాశాల గురించీ ఎరుకనిచ్చి వాళ్లు మళ్లీ ఆర్థికస్వావలంబన సాధించేలా కృషి చేస్తుందీ జాబ్స్ ఫర్ హర్ సంస్థ. దీన్ని మొదలుపెట్టే ముందు నన్ను నేను కూడా అన్ని ప్రతికూలతలకు సిద్ధం చేసుకున్నా. ఇటు అత్తిల్లు, అటు పుట్టిల్లు నుంచి బంధువులు, స్నేహితులు, నా ఇరుగు, పొరుగులతో ఒక సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తున్నంత తేలికగా సాగలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. నా సంస్థలో ఉద్యోగులకు.. తర్ఫీదు కోసం వచ్చే వారికీ ఇదే చెబుతా. ముందు మనకున్న భయాలను గుర్తిస్తే.. వాటిని ఎదుర్కొనే దారి దొరుకుతుంది. అదే మన విజయానికి మార్గం. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. భయమే గనుక లేకపోతే మీరేం సాధించాలనుకుంటున్నారు అని’ అంటూ వర్కింగ్ మదర్స్కి ధైర్యాన్నిస్తోంది నేహా బగారియా. మిష్రీ డాట్ కామ్ జర్నలిజంలో తనూ గంగూలీకి 20 ఏళ్ల అనుభవం. ఎన్డీటీవీ ఫుడ్ చానెల్కి పదేళ్లపాటు ఎడిటర్గా పనిచేసింది. ఆమెకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి అనుకునేది.. కెరీర్ మారాలి అని. ఎక్కడో ఉద్యోగం కంటే తనే సొంతంగా ఏదైనా మొదలుపెడితే.. ఇటు మాతృత్వాన్నీ ఆస్వాదించవచ్చు.. అటు ఆర్థిక స్వేచ్ఛనూ కాపాడుకోవచ్చు అని. తను ఫుడ్ చానెల్తో అసోసియేట్ అయ్యుండడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఫుడ్కి సంబంధించి తనను ఎన్నో సలహాలు అడిగేవారు. ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు. వాళ్లందరికీ ఆమె మీదున్న ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకోవాలని యోచించింది. తర్వాత అది ఫుడ్ రివ్యూ వెబ్సైట్గా డిసైడ్ అయింది. అదే మిష్రీ డాట్ కామ్ . మొదలై నాలుగేళ్లవుతోంది. గృహిణులు, మదర్హుడ్ కారణంగా జాబ్ వదిలేసిన తల్లులు తమ కిచెన్ స్కిల్స్కు సానబెట్టుకునే అవకాశాన్ని కల్పించే వేదిక అది. దేశంలోనే.. ఫుడ్ ప్రొడక్ట్స్ని రివ్యూ చేసే తొలి వెబ్సైట్ కూడా! ‘మన ఎక్స్పీరియెన్సే మన ఆలోచనలకు ఓ రూపమిస్తుంది. అలా ఫుడ్ చానెల్లోని నా వర్కింగ్ ఎక్స్పీరియెన్స్నే నా ఈ ఫుడ్ రివ్యూ వెబ్సైట్ మీద ఇన్వెస్ట్ చేశా. సక్సెస్ చూస్తున్నా. ఈ వెబ్సైట్లో దాదాపు 90 శాతం ఉద్యోగులు మహిళలే. వాళ్లకు అనుకూలమైన టైమ్లోనే పనిచేస్తారు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు’ అంటుంది తనూ గంగూలీ. వీళ్లు సరే... సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను తమ మదర్ హుడ్తో ఇన్ఫ్లుయెన్స్ చేసి.. మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా వేల.. లక్షల ఫాలోవర్స్తో సోషల్ మీడియా సెలిబ్రిటీలుగా మారిన అమ్మలూ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇక్కడ.. అనుప్రియ కౌర్.. ఆమె ఇన్స్టాగ్రామ్ చూడగానే అర్థమవు తుంది.. ఆమె యాక్టివ్ అండ్ ఫిట్ అని! కార్పొరేట్ ఉద్యోగిని. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఫిట్నెస్, శారీ ఫ్యాషన్ వరకు చాలా విషయాల మీద పోస్ట్లు పెడుతుంది. రిద్ధి డోరా సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్. ముఖ్యంగా తొలి చూలు తల్లులకు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇస్తూంటుంది. తన ఈ సేవలను సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా కార్పొరేట్స్ కోసం బయట కూడా వర్క్షాప్స్ నిర్వహిస్తుంటుంది. ‘న్యూ మదర్స్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా.. సంతోషంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను’ అంటుంది. చావి మిత్తల్ ‘మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్’విన్నర్. కంటెంట్ క్రియేటర్. ‘బీయింగ్ ఉమన్ (b్ఛజీnజఠీౌఝ్చn)’ వ్యవస్థాపకురాలు కూడా అయిన చావి.. పేరెంటింగ్కి సంబంధించి అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సరు ముఖర్జీ శర్మ ‘డైపర్స్ అండ్ లిప్స్టిక్స్’ పేరుతో పేరెంటింగ్ నుంచి ఫ్యాషన్, ఫిట్నెస్ దాకా అన్ని విషయాల మీద పోస్ట్లు పెడుతుంది. ‘అమ్మ అవగానే అన్నిటినీ వదిలేయాల్సిన అవసరం లేదు. మన మీద మనకూ శ్రద్ధ చాలా అవసరమని’ చెప్తుంది సరు .. తన బ్లాగ్లోని ‘బికాజ్ యూ ఆర్ మోర్ దాన్ జస్ట్ ఏ మామ్’ అనే స్టేట్మెంట్తో! శ్రద్ధ సింగ్.. యూట్యూబ్లో చాలా పాపులర్. ఇన్స్టాలో కూడా బ్యూటీ, ఫ్యాషన్, పేరెంట్హుడ్కి సంబంధించిన వ్లాగ్స్, పోస్ట్లను షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఓ కూతురు.. పేరు.. కైనా... కికీగా ఇన్స్టాలో ప్రసిద్ధి. తన పేరు, తన కూతురు పేరుతో కికి అండ్ శ్రాడ్స్తో ఇంకో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అందుతో రోజూ తన కూతురు చేసే అల్లరి.. ముద్దు ముచ్చట్లను పోస్ట్ చేస్తూంటుంది. మదర్స్ డే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన మరో సెలబ్రిటీ.. ‘మామ్.. షెఫ్.. బైకర్ గర్ల్.. స్కూబా డైవర్ అండ్ యాక్టర్’ సమీరా రెడ్డి! ఈ టైటిల్స్ అన్నీ ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్లో ఉంటాయి. అన్నిట్లోకి మామ్ అంటూ తనకున్న ‘అమ్మ’ అనే హోదానే ముందు పెట్టుకుంది సమీరా. ఒకప్పుడు గ్లామర్ వరల్డ్లో మెరిసిన ఈ తార.. తల్లి అయిన తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పుల దగ్గర్న నుంచి వయసుతో పాటు వచ్చే మార్పుల వరకూ ఎలాంటి ఫిల్టర్లు.. మేకప్ లేకుండా తనను తనలాగే ఇన్స్టాలో ప్రెజెంట్ చేసుకుంటుంది. గ్లామర్ రంగంలో వైట్ స్కిన్ పట్ల ఉన్న అబ్సేషన్ తనను బాధించినా.. తనకున్న డస్కీ స్కిన్ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకుని బాడీ పాజిటివిటీకి ప్రతీకగా నిలిచింది. అందంగా కనిపించడం కోసం మేకప్ నుంచి కాస్మెటిక్ సర్జరీల దాకా వెళ్తున్న కాలం ఇది. దానికి సమీరా రెడ్డి ఫక్తు వ్యతిరేకి అని ఆమె ‘ఇంపర్ఫెక్ట్లీపర్ఫెక్ట్’ అనే హ్యాష్ట్యాగ్ క్యాంపెయినే చెప్తోంది. ఇవన్నీ సరే.. మానసిక అనారోగ్యాల పట్లా అంతే బోల్డ్గా పోస్ట్లు పెట్టి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి కేస్ స్టడీలో తీసుకోకుండా తొలి ప్రసవం తర్వాత తాను అనుభవించిన పోస్ట్పార్టమ్ డిప్రెషన్ గురించే రాసి.. చర్చను లేవనెత్తింది. ‘మానసిక అస్వస్థత కనిపించదు.. అది ఉంటుంది అంతే. దాన్ని ఎదుర్కొని ఆరోగ్యవంతులం కావాలంటే ముందు ఆ మానసిక రుగ్మతల మీద మనకు అవగాహన రావాలి. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నేను పోస్ట్పార్టమ్ స్ట్రెస్ నుంచి అంత త్వరగా బయటపడలేక పోయాను. కారణం దాని మీద నాకు సరైన అవగాహన లేకపోవడమే’ అంటుంది సమీరా రెడ్డి. ఇవన్నిటితోపాటు తన పిల్లలతో ఆమె చేసే రీల్స్కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి, పిల్లలు కాగానే అప్పటిదాకా హీరోయిన్గా వెలిగిన నటికి తల్లి పాత్రలు.. కాస్త నాజూగ్గా ఉంటే అక్క, వదిన పాత్రల అవకాశాలు వస్తుంటాయి. అలాంటి స్టీరియోటైప్ క్యారెక్టర్లకు కాల్షీట్స్ ఇవ్వకుండా.. తల్లి అయిన తర్వాతా అభినయానికి అవకాశమున్న ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న నటీమణులూ ఉన్నారు. రెండు డైలాగులు, నాలుగు పాటలకు పరిమితమయ్యే హీరోయిన్లుగా కాకుండా కథను ప్రభావితం చేసే ఇంకా చెప్పాలంటే కథానాయకుడి కన్నా ప్రాధాన్యమున్న భూమికల్లో నటిస్తున్నారు. గ్లామర్ గ్రామర్ని మార్చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ ముందుంది. అందులో కాజోల్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్ వంటివారు కనిపిస్తున్నారు. ఈ సూపర్ మామ్స్కీ కుడోస్.. బాక్సర్ మేరీ కామ్ అంటే తెలియని వాళ్లుండరు! 2012లో ఒలింపిక్స్లో బ్రాంజ్ అందుకుంది తను తల్లి అయ్యాకే! 2007లో సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన మరుసటి ఏడాదే అంటే 2008లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ప్రసవం తర్వాత తను మళ్లీ బరిలోకి దిగుతాను అని మేరీకామ్ ప్రకటించగానే.. ఏదో ఉత్సాహపడుతుంది కానీ.. ఏం సాధిస్తుందిలే అని పెదవి విరిచిన క్రీడా విశ్లేషకులు.. క్రీడాభిమానులూ ఉన్నారు. వాళ్లందరికీ తన విజయాలతో సమాధానం చెప్పిందీ సూపర్ మామ్ మేరీ కామ్. ఈ వరుసలోనే సానియానూ కొనియాడాలి. ప్రసవానంతర మార్పులకు ఏ మాత్రం బెదరక అదే ఆట తీరుతో లాన్ టెన్నిస్ కోర్ట్లో సాధించిన విజయాలతో తన కొడుకు దోసిళ్లు నింపింది. ఆ స్ఫూర్తికి హ్యాట్సాఫ్! ఈ గెలుపు కథలు మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి విజేతలైన అమ్మలు మనింట్లో.. మన చుట్టూరా ఉంటారు. కాకపోతే మనం చూడం! ఒకసారి తలెత్తి చూసి.. తలవంచి గౌరవించమనే ఈ కథన సారాంశం. -
బీచ్లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్చేస్తే 'పరుగుల రాణి'గా
దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందటి మాట.. పయ్యోలి బీచ్లో ఆ అమ్మాయి పరుగు తీస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. ఆమె ఎటు వైపు వెళితే అటు వైపు వారు ఆమెను అనుసరించేవారు. కొందరు చిన్న పిల్లలయితే ఆట పట్టించేవారు కూడా. షార్ట్స్లో ఒకమ్మాయి పరుగెత్తడం అదో వింతగా అనిపించింది. అసలు ఆ సమయంలో ఎవరూ క్రీడలను సీరియస్గా పట్టించుకోనేలేదు. తర్వాతి రోజుల్లో ఆ అమ్మాయి భారత అథ్లెటిక్స్కు కొత్త దారి చూపించింది. ఎవరూ అందుకోలేని రీతిలో చిరస్మరణీయ ఘనతలు నమోదు చేసింది. దాదాపు ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్ప్రింటర్గా, హర్డ్లర్గా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీనేజర్లు దూసుకొచ్చిన సమయంలోనూ 35 ఏళ్ల వయసులో కొత్త జాతీయ స్ప్రింట్ రికార్డును నెలకొల్పగలిగింది. అంటే ఆ ప్లేయర్ సత్తాను అర్థం చేసుకోవచ్చు. ఆ స్టార్ పేరే పిళవుళకంది తెక్కెరపరంబిల్ ఉష.. అందరికీ తెలిసిన పీటీ ఉష. పరుగెత్తుతూ కనిపించిన ప్రతి అమ్మాయికి ఒక దశలో సర్వనామంగా మారిపోయిన పేరు. అథ్లెటిక్స్లో ప్రతిభావంతులను గుర్తించడంలో కోచ్ మాధవన్ నంబియార్కు మంచి పేరుంది. ఎయిర్ఫోర్స్లో పని చేసిన ఆయన వద్ద క్రమశిక్షణ కూడా అదే తరహాలో ఉండేది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిలో అపార, సహజ ప్రతిభ ఉందని గుర్తించాడు. దానికి తన శిక్షణ, క్రమశిక్షణ తోడైతే అద్భుతాలు సాధించవచ్చని గ్రహించాడు. నిజంగా కూడా అదే జరిగింది. ఆయన ఎంపిక చేసిన పీటీ ఉష ఆయన అంచనాను వాస్తవంగా మార్చింది. నంబియార్–ఉషల కోచ్–ప్లేయర్ జోడీ సూపర్ సక్సెస్గా నిలిచింది. ఆ సమయంలో ఉష వయసు తొమ్మిదేళ్లు. పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్లో తనకంటే మూడేళ్లు పెద్ద అయిన సహచర విద్యార్థులను అలవోకగా ఓడించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రాబోయే కొన్నేళ్లలో ఈ అమ్మాయి దేశం గర్వించదగ్గ అథ్లెట్ అవుతుందన్న విషయం అప్పుడు ఎవరికీ తెలీదు. కానీ కొద్ది రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ మొదటి మ్యాచ్లో చేరిన ఉష రివ్వుమని దూసుకుపోయింది. కోళికోడ్ జిల్లా కూతలిలో పుట్టిన ఉష ఆ తర్వాత సమీపంలోనే పయ్యోలిలో స్థిర పడింది. అక్కడి నుంచే అగ్రస్థానానికి ఎదిగిన ఆమె ‘పయ్యోలి ఎక్స్ప్రెస్’ పేరుతో తన పేరుకు, ఊరి పేరుకు శాశ్వత కీర్తిని కల్పించుకుంది. అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు ఎన్ని అందుకున్నా ఏనాడూ వివాదంగా మారకుండా, దరిచేరనివ్వకుండా అందరికీ ఆత్మీయురాలిగా, స్ఫూర్తిగా నిలుస్తూనే ఆమె కెరీర్ను ముగించింది. అలా మొదలు.. రాష్ట్రస్థాయి విజయాల తర్వాత ఉష ఆట స్థాయి మరింత పెరిగింది. 14 ఏళ్ల వయసులో ఇంటర్ స్టేట్ జూనియర్ మీట్లో పాల్గొన్న ఉష 4 స్వర్ణ పతకాలు గెలుచుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసింది. కేరళ కాలేజ్ మీట్లోనైతే ఏకంగా 14 పతకాలు ఆమె ఖాతాలో చేరాయంటే ఆధిపత్యం ఎలాంటిదో ఊహించవచ్చు. మరో ఏడాది తర్వాత జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణాలతో ఉష మెరిసింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏ పోటీలు ఉన్నా సరే.. అది ఇంటర్ స్టేట్ మీట్ కానీ, ఓపెన్ నేషనల్ చాంపియన్షిప్ కానీ.. అథ్లెట్లు ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే ఉష ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఉష సన్నిహితులు, కోచ్లు ఎట్టకేలకు ఎదురు చూసిన క్షణం 1980లో వచ్చింది. మాస్కో ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో 16 ఏళ్ల ఉషకు చోటు దక్కింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో 100 మీటర్ల పరుగులో ఉష ఫైనల్స్కు చేరడంలో విఫలమైనా.. తొలి ఒలింపిక్స్లో తగినంత అనుభవాన్ని ఆమె దక్కించుకుంది. ఆసియా క్వీన్గా.. అంతర్జాతీయ వేదికపై ఉష గొప్పగా చెప్పుకోగలిగే తొలి విజయం 1983లో వచ్చింది. 19 ఏళ్ల వయసులో అమితోత్సాహంతో ఆసియా చాంపియన్షిప్ (కువైట్ సిటీ)లో పాల్గొన్న ఉష 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకంతో మెరిసింది. అది మొదలు 1998 (ఫుకోకా) వరకు దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా చాంపియన్షిప్లో ఉష హవా కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఆమె ఈ ఈవెంట్లో ఏకంగా 14 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం. దీంతో పాటు మరో 6 రజతాలు, 3 కాంస్యాలు కూడా సాధించడంలో ఉష సఫలమైంది. మొత్తం 23 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఆమె నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఉష పతకాలు గెలుచుకోవడంలో సఫలమైంది. కెరీర్ ఆరంభ దశలో 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజత పతకాలు సాధించి ఉష ఆసియా వేదికపై మొదటి సారి తన ముద్రను చూపించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో మూడు రజతాలు గెలుచుకున్న ఉష.. కెరీర్ చివర్లో 1994 హిరోషిమా ఏషియాడ్లో కూడా మరో రజతాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే వీటన్నింటినీ మించి ఉష పేరును భారత్లో ఇంటింటికీ చేర్చిన ఘనత, అథ్లెటిక్స్లో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన ఘట్టం 1986 సియోల్ ఆసియా క్రీడలే. ఈ పోటీల్లో ఉష ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించి సంచలనం సృష్టించింది. 200 మీ., 400 మీ. పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్, 4X400 మీ. రిలేలో ఆమె పరుగు పసిడి కాంతులు అందించింది. 100 మీటర్ల పరుగులో త్రుటిలో స్వర్ణం చేజారగా వచ్చిన రజతంతో ఐదో పతకం ఉష మెడలో వాలింది. ముగింపు ప్రస్థానం.. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ప్రదర్శనను మరో నాలుగేళ్ల తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్లో ఉష పునరావృతం చేయలేకపోయింది. ఆ తర్వాత వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 1990లోనే ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే కబడ్డీ మాజీ ఆటగాడైన భర్త శ్రీనివాసన్ ప్రోత్సాహంతో మళ్లీ ప్రాక్టీస్ చేసి ట్రాక్పై అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్షిప్స్లో పతకాలతో తనేంటో చూపించింది. చివరకు 2000 సిడ్నీ ఒలింపిక్స్కు కొద్ది రోజుల ముందు ఆటకు శాశ్వతంగా గుడ్బై చెప్పింది. ఒలింపిక్స్ పతకం మినహా తాను అన్నీ సాధించానని, వాటితో సంతృప్తి చెందానని ఉష వెల్లడించింది. సెకన్ లో 1/100 వంతు తేడాతో.. ఉష కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని క్షణం 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో వచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ఒక వైపు ఆనందం, మరో వైపు బాధ కలగలిసిన సమయం అది. ఆ సమయంలో ఉష అత్యుత్తమ ఫామ్లో, అద్భుతమైన ఫిట్నెస్తో ఉంది. ఒలింపిక్స్లో ఆమెకు పతకం ఖాయం అనిపించింది. 400 మీటర్ల హర్డిల్స్లో 55.42 సెకన్లతో ఆమె భారత్ తరఫున అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. అయితే సెకనులో వందో వంతు తేడాతో కాంస్యపతకం చేజారింది. ఫాల్స్ స్టార్ట్ చేసినా దానిని అధిగమించి చివరి 100 మీటర్ల పరుగును స్ప్రింట్ తరహాలో పరుగెత్తినా, ఫినిష్ లైన్ వద్ద తన ఛాతీ భాగాన్ని ముందుకు వంచడంలో విఫలం కావడంతో ‘ఫోటో ఫినిష్’లో నాలుగో స్థానమే దక్కింది. ‘అది నా అత్యుత్తమ ప్రదర్శన. అతి స్వల్ప తేడాతో నేను ఒలింపిక్స్ పతకం కోల్పోయానంటే నమ్మలేకపోతున్నాను. ఆ రేస్ తర్వాత చాలా ఏడ్చేశాను’ అని ఉష తర్వాత చెప్పుకుంది. చెరగని రికార్డు 1985లో జకార్తాలో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో ఉష ఏకంగా ఐదు స్వర్ణాలు (100మీ., 200మీ., 400మీ., 400మీ.హర్డిల్స్, 4X400మీ. రిలే) గెలుచుకుంది. ఒకే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళగా ఉష రికార్డు నమోదు చేసింది. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగానే ఉండటం విశేషం. - మహమ్మద్ అబ్దుల్ హాది -
బంగారు చేప.. చరిత్రలో నిలిచిపోయిన ఆల్టైమ్ గ్రేట్ స్విమ్మర్
ఒకటి, రెండు, మూడు, నాలుగు.. ఆ సంఖ్య పెరిగుతూనే ఉంది.. పది దాటాయి, ఇరవై కూడా చిన్నదిగా మారిపోయింది.. చెబుతోంది అల్లాటప్పా విజయాల సంఖ్య కాదు..అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ పతకాల గురించి.. ప్రపంచ క్రీడా సంబరంలో ఒక్క పతకం సాధిస్తే జీవితం ధన్యమయినట్లుగా భావించే ఆటగాళ్లు ఎందరో! ఏకంగా 28 ఒలింపిక్స్ పతకాలు.. అందులో 23 స్వర్ణాలు అంటే అతను సాధించింది మహాద్భుతం! నీటి కొలనును.. రికార్డులను మంచినీళ్ల ప్రాయంలా మార్చుకున్న అతనే మైకేల్ ఫెల్ప్స్ .. ప్రపంచ స్విమ్మింగ్ చరిత్రలో ఆల్టైమ్ గ్రేట్ స్విమ్మర్!! ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఇయాన్ థోర్ప్ను టీనేజ్లో ఫెల్ప్స్ ఎంతగానో అభిమానించాడు, ఆరాధించాడు. ఒలింపిక్స్ స్విమ్మింగ్లో 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు థోర్ప్ సొంతం. సరిగ్గా థోర్ప్ ముగించిన చోటునుంచే ఫెల్ప్స్ కొనసాగించాడు. థోర్ప్లాంటి స్విమ్మర్ మళ్లీ రాకపోవచ్చని అనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి ఫెల్ప్స్ దూసుకొచ్చాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో థోర్ప్తో పోటీ పడి పతకాలు గెలుచుకున్న అతను.. ఆ తర్వాతి మూడు ఒలింపిక్స్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ పతకాల పంట పండించాడు. ఫెల్ప్స్ ఎంత అద్భుతమైన స్విమ్మర్ అయినా ఒకే ఒలింపిక్స్లో ఎనిమిది స్వర్ణాలు గెలవడం అసాధ్యమని థోర్ప్ పోటీలకు ముందు వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో ఈ వ్యాఖ్యను తన గది లాకర్పై రాసుకున్న ఫెల్ప్స్.. దానిని చూస్తూ ప్రతిరోజూ స్ఫూర్తి పొందాడు. చివరకు దానిని చేసి చూపించాడు. ఏకంగా ఎనిమిది స్వర్ణాలతో సంచలనం సృష్టించాడు. వాటన్నింటిలోనూ అతను ఒలింపిక్స్ రికార్డులను నెలకొల్పి మరీ పతకాలు కొట్టాడు. తాను ఎనిమిదో స్వర్ణం గెలిచిన చివరి రేసు 4X100 మీటర్ మెడ్లీ రిలేలో ఫెల్ప్స్ రేస్ పూర్తి కాగానే స్విమ్మింగ్ పూల్ బయట అతడిని అందరికంటే ముందుగా అభినందించింది థోర్ప్ కావడం విశేషం. ‘మీరు కనే కలలు కూడా చాలా పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే నా దృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. నేనిప్పుడు అలాంటి కలల ప్రపంచంలో ఉన్నాను’ అని తన విజయాల అనంతరం 23 ఏళ్ల ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు. గురువు తోడుగా.. తొమ్మిదేళ్ల వయసులో ఫెల్ప్స్ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది తర్వాతి రోజుల్లో తనపై, తన ఇద్దరు అక్కలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించిందని అతను చెప్పుకున్నాడు. ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తే వచ్చే మానసిక వ్యాధి (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కి కూడా ఒక దశలో ఫెల్ప్స్ గురయ్యాడు. అయితే అతడి అన్ని బాధలకు స్విమ్మింగ్పూల్లో ఉపశమనం లభించింది. సరదాగా ఈత నేర్చుకుంటే బాగుంటుందని సన్నిహితులు కొందరు చెప్పడంతో పూల్లోకి దిగిన అతనికి అప్పుడు తెలీదు దానితో తన జీవితమే మారిపోనుందని. తన స్వస్థలం బాల్టిమోర్లోని ఒక అక్వాటిక్ క్లబ్లో అతని ఈత మొదలైంది. అయితే అక్కడి కోచ్ బాబ్ బోమన్ ఈ కుర్రాడి ఈతలో అసాధారణ ప్రతిభను గుర్తించాడు. కేవలం సరదాగా ఆడుకొని వెళ్లిపోకుండా ఆ స్విమ్మింగ్ టైమింగ్ను నమోదు చేసి పోటీతత్వాన్ని పెంచాడు. దాంతో పదేళ్ల వయసులోనే ఫెల్ప్స్ పేరిట కొత్త జాతీయ రికార్డు నమోదైంది. అది మొదలు లెక్కలేనన్ని రికార్డులు అలవోకగా అతని వెంట వచ్చాయి. నీటి కొలనులో అలసట లేకుండా సాగిన ఆ ఈత అద్భుతాలను చూపించింది. ప్రపంచాన్ని శాసించే వరకు సాగిన ఈ మొత్తం ప్రయాణంలో అతను తన కోచ్ బోన్ను ఏనాడూ వీడలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఎక్కడ కోచ్గా ఉంటే అక్కడికి వెళ్లి తన ఆటను కొనసాగించాడు. తనకు స్విమ్మర్గా అనుమతిలేని చోట కూడా కోచ్కు అసిస్టెంట్గా, స్వచ్ఛందంగా వెళ్లిపోయి ఆయనతో కలసి నడిచాడు. ఒలింపిక్ ప్రయాణం.. 15 ఏళ్ల వయసులోనే ఫెల్ప్స్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ ప్రస్థానం మొదలైంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో అమెరికా స్విమ్మింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో పతకం నెగ్గలేకపోయినా ఆ సమయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ కుర్రాడు తర్వాతి ఒలింపిక్స్ సమయానికి మండుతున్న అగ్నికణికలా మారాడు. 2004 ఏథెన్స్లోనే ఆరు స్వర్ణాలతో అగ్రస్థానాన నిలిచిన అతను మరో నాలుగేళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచాడు. ఫేవరెట్గానే బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహాలు లేకున్నా.. ఎనిమిది స్వర్ణాల ఘనత అందుకుంటాడా అనే సందేహాలు అందరిలో ఉండేవి. కానీ తానేంటో బీజింగ్ ఒలిపింక్స్లో చూపించాడు. ఆ జోరు 2012లో లండన్ ఒలింపిక్స్ మీదుగా 2016 రియో ఒలింపిక్స్ వరకు సాగింది. 2012 ఒలింపిక్స్ తర్వాత ఇక చాలు అంటూ రిటైర్మెంట్ ప్రకటించినా.. తనలో సత్తా తగ్గలేదని చూపిస్తూ మళ్లీ తిరిగొచ్చి ఒలింపిక్స్లో అదరగొట్టడం విశేషం. ఎట్టకేలకు రియో క్రీడల తర్వాత 31 ఏళ్ల వయసులో సగర్వంగా అతను పూల్కు గుడ్బై చెప్పాడు. రికార్డులే రికార్డులు.. మైకేల్ ఫెల్ప్స్ సాధించిన, సృష్టించిన రికార్డుల గురించి ఒక ప్రత్యేక అధ్యాయామే చెప్పవచ్చు. ఫ్రీస్టయిల్, బటర్ఫ్లయ్, బ్యాక్ స్ట్రోక్.. ఇలా ఈవెంట్ల పేర్లు మారవచ్చు.. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు.. పూల్లో దూరాల మధ్య తేడా ఉండవచ్చు. కానీ ఏ రికార్డు ఉన్నా వాటిపై ఫెల్ప్స్ పేరు మాత్రం ఘనంగా లిఖించి ఉంటుంది. ప్రపంచ స్విమింగ్ సమాఖ్య (ఫెనా) అధికారికంగా గుర్తించిన రికార్డులను చూస్తే.. ఫెల్ప్స్ ఖాతాలో ఒక దశలో 39 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. తాను రికార్డు సృష్టించడం, కొద్ది రోజులకు తానే వాటిని స్వయంగా బద్దలు కొట్టడం.. ఇదంతా ఫెల్ప్స్ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాయి. వరల్డ్ స్విమ్మర్ ఆఫ్ ద ఇయర్గా ఎనిమిదేళ్లు అతను తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఒలింపిక్స్లో 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు, ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్షిప్లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో 26 స్వర్ణాలు సహా మొత్తం 33 పతకాలు, పాన్ పసిఫిక్ చాంపియన్షిప్లో 16 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు.. ఈ జాబితాకు ఫుల్స్టాప్ లేదు. అతని ఆటలాగే అతని ఆటోబయోగ్రఫీ ‘బినీత్ ద సర్ఫేస్’ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది పాశ్చాత్య దేశపు అగ్రశ్రేణి అథ్లెట్లలో కనిపించే చిన్న చిన్న వివాదాలు (ఆల్కహాల్ డ్రైవింగ్, స్పీడింగ్)వంటివి ఫెల్ప్స్ ఖాతాలోనూ ఉన్నా.. అవేవీ అతని గొప్పతనాన్ని తగ్గించేవి కావు. -
మనుషులే ఉండని ఊరు
ఊరన్నాక మనుషులు ఉండాలి కదా! మనుషులే ఉండని ఊరేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! ఆ ఊళ్లో మనుషులు ఉండరు. పాడుబడిన కట్టడాలే తప్ప అక్కడ నరమానవుల జాడ కనిపించదు. ఆ ఊరి పేరు కుల్ధారా. ఇది రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉంది. పదమూడో శతాబ్ది నాటికి ఈ ఊళ్లో ఒకప్పుడు పాలీవాల్ బ్రాహ్మణులు ఉండేవాళ్లు. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఇక్కడి మనుషులంతా ఊరిని విడిచి, వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఇక్కడి జనాలు ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి దారితీసిన కారణాలపై స్పష్టమైన సమాచారం లేదు గాని, ఈ పరిణామంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి జైసల్మేర్ మంత్రి సలీం సింగ్ ఆకృత్యాలను భరించలేకనే ఇక్కడి జనాలు ఊరు ఖాళీచేసి వెళ్లిపోయారని చెబుతారు. ఈ ఊరు నిర్మానుష్యంగా మారిన తర్వాత ఇక్కడ ప్రేతాత్మలు సంచరిస్తుంటాయనే వదంతులూ వ్యాప్తిలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చాలాకాలం దీన్ని పట్టించుకోలేదు. రాజస్థాన్ ప్రభుత్వం 2010లో ఈ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. పెద్దగా సౌకర్యాలేవీ అభివృద్ధి చేయనప్పటికీ, అడపా దడపా ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి శిథిలాల మధ్య తిరుగుతూ ఫొటోలు దిగుతుంటారు. -
వింత వింతల ఊళ్లు
దేశంలోని ఊళ్లన్నీ కాస్త హెచ్చుతగ్గులుగా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇళ్లూ వాకిళ్లూ పొలాలూ పశువులూ, అరకొర సౌకర్యాలు, ఇక్కట్లతో ఈదులాడే జనాలు దాదాపు అన్ని ఊళ్లలోనూ ఉంటారు. అరుదుగా కొన్ని ఊళ్లు మాత్రం మిగిలిన ఊళ్లకు భిన్నంగా ఉంటాయి. కొన్ని ఊళ్లు వాటి వింతలు విడ్డూరాలతో మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇంకొన్ని ఊళ్లు పట్టణాలను తలదన్నే అభివృద్ధి సాధించి, అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ఏదో ఒక రీతిలో ప్రత్యేకత నిలుపుకొనే ఇలాంటి ఊళ్లే వార్తలకెక్కి, విస్తృత ప్రచారం పొందుతాయి. ఇలాంటి ఊళ్లు ప్రపంచంలోని అక్కడక్కడా ఉన్నాయి. అలాగే మన దేశంలోనూ కొన్ని వింత వింతల ఊళ్లు ఉన్నాయి. మన దేశంలో ఉన్న కొన్ని వింత వింతల ఊళ్ల కథా కమామిషూ తెలుసుకుందాం... ప్రాచీన జీవనశైలి కాలంతో పాటే లోకం ముందుకు పోతుంది. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులను అందిపుచ్చుకుంటుంది. కాల గమనంలో ఇది సహజ పరిణామం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఫలితంగా కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక, పాతవాటి వినియోగం క్రమంగా కనుమరుగవుతుంది. కాలంతో కలసి ముందుకు పయనించడమే మానవ స్వభావం. అందుకు భిన్నంగా వెనుకటి కాలానికి వెళ్లి ఎవరైనా జీవించాలనుకుంటే, అది కచ్చితంగా విడ్డూరమే! అలాంటి విడ్డూరం కారణంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం ఇటీవల విస్తృతంగా వార్తలకెక్కింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గ్రామం గురించి, అక్కడి జనాలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్న ప్రాచీన జీవనశైలి గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఫలితంగా దేశ విదేశాలకు చెందిన కొందరు సంపన్నులు కూర్మ గ్రామంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎగబడుతున్నారు. కూర్మ గ్రామంలో ఇళ్ల నిర్మాణం కూడా ప్రాచీన పద్ధతిలోనే ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, కాంక్రీటు వాడరు. ఇక్కడివన్నీ సున్నం, బెల్లం, మినుములు, మెంతులు, కరక్కాయలు, గుగ్గిలం మిశ్రమంతో నిర్మించుకున్న మట్టి ఇళ్లే! ఈ గ్రామంలో విద్యుత్తు ఉండదు. విద్యుత్తుతో పనిచేసే ఏ వస్తువూ ఇక్కడ కనిపించదు. ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్ల కిందట ఇక్కడ గ్రామాన్ని నెలకొల్పుకున్నారు. వేకువ జామున నాలుగు గంటలకే నిద్రలేవడం, ‘హరేకృష్ణ’ నామ కీర్తన సాగిస్తూ ఊరంతా పదహారుసార్లు తిరగడం, ఆధ్యాత్మిక సాధన, వేదాధ్యయనం చేయడం, పాత పద్ధతుల్లోనే వ్యవసాయం ద్వారా గ్రామానికి అవసరమైన పంటలు పండించు కోవడం వంటి జీవనశైలి ఈ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. ఇక్కడ పన్నెండు కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ నడిపే గురుకులంలో పదహారుమంది విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు. మరో ఆరుగురు బ్రహ్మచారులను కలుపు కొని ఈ గ్రామ జనాభా యాభైఆరు మంది. వీరంతా తమ ఇళ్లను తామే స్వయంగా నిర్మించుకుంటారు. తమ దుస్తులను తామే నేసుకుంటారు. ఈ గ్రామాన్ని తిలకించడానికి విదేశీయులు కూడా వస్తుంటారు. జీవితాలను యాంత్రికంగా మార్చేసిన అధునాతన సాంకేతికత కంటే, ఇక్కడి ప్రాచీనమైన గ్రామీణ జీవనశైలి ఎంతో హాయిగా ఉంటుందని పలువురు చెబుతుండటం విశేషం. సంస్కృతమే వారి భాష ప్రాచీన భాష అయిన సంస్కృతం మృతభాషగా మారిందని ఆధునికులు చాలామంది తీసిపారేస్తున్నా, ఆ గ్రామ ప్రజలు మాత్రం సంస్కృతాన్ని ఇప్పటికీ సజీవంగా బతికించుకుంటున్నారు. దేశంలోనే ఏకైక సంస్కృత గ్రామంగా పేరుపొందిన మత్తూరు గ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రజలు సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకుని, ఇప్పటికీ దాన్ని కాపాడుకుంటున్నారు. పిల్లలూ పెద్దలూ అందరూ ఇక్కడ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మత్తూరు సంస్కృత గ్రామంగా మారడానికి వెనుక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ‘సంస్కృత భారతి’ సంస్థ ఈ గ్రామంలో 1981లో సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించింది. దీనికి హాజరైన ఉడిపి పెజావర మఠాధిపతి సంస్కృతం పట్ల గ్రామస్థుల ఆసక్తిని గమనించి, ఈ గ్రామాన్ని సంస్కృత గ్రామంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పడంతో గ్రామస్థులు ఆ ఆలోచనను స్వాగతించారు. నాటి నుంచి సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకున్నారు. సంస్కృతాన్ని మాతృభాషగా చేసుకున్నప్పటికీ ఈ గ్రామస్థులు ఆధునికతకేమీ దూరం కాలేదు. ఇక్కడి నుంచి ఉన్నత చదువులు చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారూ ఉన్నారు. సంస్కృతంపై ఆసక్తిగల వారెవరికైనా ఆ భాషను నేర్పడానికి వీరు నిత్యం సంసిద్ధంగా ఉంటారు. పక్షులే నేస్తాలు ఆ ఊరి ప్రజలకు పక్షులే నేస్తాలు. ఏటా నవంబర్ నుంచి జూలై మధ్య కాలంలో ఆ ఊళ్లో పక్షుల సందడి కనిపిస్తుంది. దేశ దేశాలు దాటి వచ్చే పక్షులు చనువుగా మనుషుల భుజాల మీద వాలే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ ఊరు కొక్కరెబెళ్లూరు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. వలసపక్షుల సీజన్లో ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శతాబ్దాలుగా ఇక్కడకు వలస పక్షులు వస్తున్నా, ఇక్కడి మనుషులు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. సీజన్లో వచ్చే వలస పక్షులు యథేచ్ఛగా చెట్లపై గూళ్లు పెట్టుకునేవి. ఒక్కోసారి వేగంగా గాలులు వీచేటప్పుడు గూళ్లు నేల రాలేవి. వాటిలో పక్షులు పెట్టుకున్న గుడ్లు పగిలిపోయేవి. ఇంకా రెక్కలురాని పక్షిపిల్లలు పిల్లులకు, కుక్కలకు ఆహారంగా మారేవి. ‘మైసూర్ అమెచ్యూర్ నేచురలిస్ట్స్’ వ్యవస్థాపకుడు మను 1994లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిని గమనించారు. పక్షుల రక్షణ కోసం గ్రామస్థులు చొరవ తీసుకుంటే బాగుంటుందనుకుని, వారితో చర్చించారు. గ్రామంలో ‘హెజ్జర్లె బళిగె’ (కొంగలతో నేస్తం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులంతా ఇందులో భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి ఈ గ్రామస్థులకు ఇక్కడకు వచ్చే వలసపక్షులతో స్నేహం మొదలైంది. అవి ఇక్కడ పెట్టుకునే గూళ్లు, వాటిలోని గుడ్లు, పక్షిపిల్లలు సురక్షితంగా ఉండేందుకు అన్ని సేవలూ చేస్తారు. అందుకే వలసపక్షులు ఈ గ్రామస్థులతో చాలా చనువుగా ఉంటాయి. -
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్స్టార్ హోటల్ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది. -
గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. 'టైగర్ వుడ్స్' పేరు ఎలా వచ్చింది
‘అతను సాధిస్తున్న విజయాలు ఆటకు మంచిది కాదు. అసలు పోటీ అనేది లేకుండా పోతోంది. ఇలా అయితే కష్టం..’ ఆ ఆట గురించి విశ్లేషకులు చెప్పిన మాట ఇది! ‘అతను బరిలో ఉంటే ప్రత్యర్థులు తమ అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆ ప్లేయర్ లేని సమయంలో ఎంతో గొప్పగా ఆడేవాళ్లు కూడా ఎదురుగా అతను ఉంటే తడబడుతున్నారు..’ ఒక యూనివర్సిటీ అధ్యయనంలో తేలిన విషయం ఇది. ‘ఆ ప్లేయర్ జోరును తగ్గించేందుకు అవసరమైతే నిబంధనలు కూడా మార్చాల్సిందే. అతని బలహీనతలను గుర్తించి అలాంటి నిబంధనలు చేర్చాలి.. మరికొందరి సలహా! ఇదంతా ఒక్కడి గురించే! ఒక ఆటగాడు సాధిస్తున్న విజయాలు, ఘనతలు కూడా ఆటకు చేటు చేస్తాయని అనిపించడం చూస్తే సదరు ఆటపై అతని ముద్ర ఏమిటో స్పష్టమవుతుంది. వారు వీరని తేడా లేకుండా ప్రత్యర్థులంతా మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారంటే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. అలాంటి అద్భుతం పేరే టైగర్ వుడ్స్.. గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. ఆర్జనలో ఆకాశాన్నందుకున్నా, కీర్తి వెంట అపకీర్తి వచ్చి చేరినా ఈ ‘టైగర్’ విలువ ఏమాత్రం తగ్గలేదు! - మొహమ్మద్ అబ్దుల్ హాది టైగర్ వుడ్స్ కెరీర్ అంతా ఒక సినిమాను తలపిస్తుంది. ఆసక్తికరమైన మలుపులు, డ్రామాలకు కొదవే లేదు. గోల్ఫ్ ప్రపంచంలో గెలుచుకున్న టోర్నీలు, సాధించిన సంపద మాత్రమే కాదు.. మత్తు పదార్థాలు వాడి పోలీసులకు చిక్కడం, పరాయి స్త్రీలతో సంబంధాల వల్ల కుటుంబ బంధాల్లో కుదుపు, కారు ప్రమాదంలో చావుకు దగ్గరగా వెళ్లి బతికిపోవడం.. ఆపై అన్నింటినీ దాటి మళ్లీ పూర్వ వైభవం సాధించడం కూడా అసాధారణం. అతను సాధించిన విజయాలను అంకెల్లో తూచలేం. టోర్నీల సంఖ్య, వరల్డ్ నంబర్వన్ ర్యాంక్, అవార్డులు, రివార్డులు.. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ అంతకు మించిన ఒక కరిష్మా, గోల్ఫ్ మైదానాన్ని తాను ఏకఛత్రాధిపత్యంతో శాసించిన తీరు అతడిని అందనంత ఎత్తులో నిలబెడతాయి. పసిప్రాయంలోనే.. గోల్ఫ్కు సంబంధించి వుడ్స్ బాల మేధావి! రెండేళ్ల వయసులోనే తొలిసారి అతని చేతికి తండ్రి గోల్ఫ్ స్టిక్ను అందించాడు. ఆ తర్వాత ప్రతి వయో విభాగంలోనూ ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా అతను విజేతగా నిలుస్తూ వచ్చాడు. ఎనిమిదేళ్ల వయసులో అరుదైన ‘80 పాయింట్ల స్కోర్’ను సాధించిన వుడ్స్.. ఆరుసార్లు వరల్డ్ జూనియర్ చాంపియన్ గా నిలవడంతోనే అతని అసలు సత్తా ఏమిటో గోల్ఫ్ ప్రపంచానికి తెలిసింది. స్కూల్, కాలేజీ.. అమెచ్యూర్ స్థాయిల్లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయాడు. సరిగ్గా చెప్పాలంటే ఆ దశలో అతను పాల్గొన్న ఏ ఒక్క టోర్నీలోనూ వుడ్స్కు ఓటమి ఎదురు కాలేదు. దాంతో ఈ కుర్రాడు చరిత్రను తిరగరాయగలడని అంతా భావించారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అందరికీ అర్థమైంది. ప్రొఫెషనల్గా.. 19 ఏళ్ల వయసులో వుడ్స్.. గోల్ఫ్ ప్రొఫెషనల్గా మారాడు. అప్పటికి అతని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు కాబట్టి నైకీ, టిట్లీస్ట్లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు వెంటనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2000 సంవత్సరంలో వుడ్స్ రికార్డు స్థాయిలో 15 స్ట్రోక్ తేడాతో యూఎస్ ఓపెన్ ను గెలుచుకున్నాడు. ‘గోల్ఫ్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన’ అంటూ దీనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. 2007లో మోకాలి గాయంతో వుడ్స్ ఆటకు దూరంగా ఉండగా.. ఆ సీజన్ మొత్తం టీవీ రేటింగ్ భారీగా పడిపోయి అతని విలువేంటో చూపించింది. పుష్కర కాలానికి పైగా గోల్ఫ్ మైదానాన్ని అతను శాసించాడు. ఈ క్రమంలో ఎన్నో అద్భుత విజయాలు అంది వచ్చాయి. అతను బరిలో ఉంటే చాలు మిగతా గోల్ఫర్లంతా రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి. అయితే ఆ తర్వాతి కొన్ని పరిణామాలు, వ్యక్తిగత అంశాలు ఆటపై ప్రభావం చూపించాయి. ఐదు సార్లు వెన్నుకు జరిగిన శస్త్రచికిత్సలు కూడా వుడ్స్ జోరుకు బ్రేకులు వేశాయి. 2013 వరల్డ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తర్వాత వరుస పరాజయాలు పలకరించాయి. ఇక వుడ్స్ ఆట ముగిసినట్లేనని, అతను మళ్లీ కోలుకోవడం కష్టమని గోల్ఫ్ ప్రపంచం మొత్తం నిర్ణయించేసుకుంది. అదే జరిగితే అతను టైగర్ ఎందుకవుతాడు! ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ మెల్లగా మళ్లీ స్టిక్ పట్టిన వుడ్స్ ఒకప్పటి తన ఆటను చూపించాడు. మరోసారి వరల్డ్ నంబర్వన్ కావడంతో పాటు మరో మాస్టర్స్ టోర్నమెంట్ను తన ఖాతాలో వేసుకొని శిఖరాన నిలిచాడు. గోల్ఫ్ కోర్సు బయట... 2009లో అనూహ్యంగా జరిగిన ఒక కారు ప్రమాదం కారణంగా ఇతర మహిళలతో వుడ్స్కు ఉన్న సంబంధాల విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగా వాటిని వ్యక్తిగత అంశం అంటూ తిరస్కరించినా.. ఆ తర్వాత దానిని అంగీకరించక తప్పలేదు. క్షమించాలంటూ అతను బహిరంగ ప్రకటన చేశాడు. దాంతో అసెంచర్, గెటరాడ్, జనరల్ మోటార్స్, జిల్లెట్వంటి సంస్థలన్నీ అతనితో తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. ఇదే కారణంతో కొద్ది రోజులకే వుడ్స్ భార్య ఎలిన్ నార్డెగ్రెన్ అతనికి విడాకులు ఇచ్చింది. మద్యం, డ్రగ్స్ సేవించి కారు నడుపుతున్నాడంటూ 2017లో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన వుడ్స్ కోలుకునేందుకు సమయం పట్టింది. అయితే ఇలాంటివన్నీ అధిగమించిన అతను మరోసారి అసలు వేదికపై తానేంటో చూపించగలిగాడు. ఆ పేరు అలా వచ్చింది.. వుడ్స్ తండ్రి ఎర్ల్ డెన్నిసన్.. ఆర్మీ అధికారిగా వియత్నాం యుద్ధంలో పాల్గొన్నాడు. తల్లి కుల్టిడా థాయ్లాండ్ దేశస్తురాలు. అయితే అతని తల్లిదండ్రుల నేపథ్యాలు కూడా చాలా భిన్నమైనవి కావడంతో వుడ్స్ గురించి ‘అతను పావు వంతు థాయ్, మరో పావు చైనీస్, ఒక పావు కకేషియన్ , మిగతా పావులో సగం ఆఫ్రికన్ అమెరికన్, మిగిలిన సగం మాత్రమే అసలు అమెరికన్ ’ అని విమర్శకులు చెబుతారు. అసలు పేరు ఎల్డ్రిక్ టాంట్ వుడ్స్ అయితే..‘టైగర్’గా పిలిచే వియత్నాం యుద్ధవీరుడు, తన తండ్రి స్నేహితుడి పేరును గౌరవంగా తన పేరుకు ముందు జోడించుకున్నాడు వుడ్స్. నాకూ నత్తి ఉండేది కొన్నేళ్ల క్రితం డిల్లాన్ అనే స్కూల్ అబ్బాయి తన బాల్కనీ కిటికీలోంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ అతనికి ప్రాణాపాయం తప్పింది. తనకు నత్తి ఉందని, అందరూ ఎగతాళి చేస్తున్నారని, స్కూల్ స్పోర్ట్స్ టీమ్లో కూడా తనను తీసుకోవడం లేదని అతను కారణం చెప్పాడు. ఈ విషయం వార్తల ద్వారా వుడ్స్కు తెలిసింది. ఆ కుర్రాడు తన ఆటను చూస్తాడని కూడా సన్నిహితులు చెప్పారు. దాంతో వుడ్స్ ఆ చిన్నారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశాడు.. ‘అందరిలాగా ఉండలేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడూ నేనూ నీ తరహా సమస్యతో బాధపడ్డాను. ఆ సమయంలో దానిని దూరం చేసుకునేందు నేను నా కుక్కతో మాట్లాడుతూ ఉండేవాడిని. అది పడుకునేవరకు ఆపకపోయేవాడిని. చివరకు నత్తి దూరమైంది. ఆ సమస్యను ఎలాగైనా అధిగమించవచ్చు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి’ అంటూ! భావోద్వేగంతో రాసిన ఆ లేఖ వుడ్స్ సహృదయాన్ని చూపించింది. సాధించిన ఘనతలెన్నో.. మేజర్ చాంపియన్షిప్స్ – 15 సార్లు విజేత వరల్డ్ గోల్ఫ్ చాంపియన్షిప్ – 18 సార్లు విజేత మొత్తం పీజీఏ టూర్ విజయాలు – 82 పీజీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు – 11 సార్లు అత్యుత్తమ వరల్డ్ ర్యాంకింగ్ – 1997లో జూన్ 15న తొలిసారి వరల్డ్ నంబర్వ¯Œ .. ఏకంగా 683 వారాల పాటు అగ్రస్థానంలో నిలిచిన రికార్డు వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ అందుకున్న ఘనత చదవండి: 'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది' -
ఒకే ఏడాది 4 గ్రాండ్స్లామ్లతో పాటు ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన ఆల్టైమ్ గ్రేట్
ఒక ఏడాదిలో ఒక గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిస్తే కొందరికి అదే జీవితకాలపు ఘనత.. రెండు గెలిస్తే ఆనందం రెట్టింపు.. మూడు గెలిస్తే గొప్ప ఆటగాళ్ల సరసన చోటు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు ప్రతిష్ఠాత్మక గ్రాండ్స్లామ్లు గెలిస్తే అది టెన్నిస్ చరిత్రలో ఐదుగురికి మాత్రమే సాధ్యమైన అసాధారణ ప్రదర్శన.. ఈ నాలుగుతో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా గెలిస్తే ఆ అద్భుతం పేరే స్టెఫీ గ్రాఫ్.. సుదీర్ఘ కాలం ఆటపై తనదైన ముద్ర వేసి పలు రికార్డులతో కెరీర్ గ్రాఫ్ను ఆకాశాన నిలిపి ‘ఆల్టైమ్ గ్రేట్’ అనిపించుకున్న ఈ జర్మన్ స్టార్ సాధించిన ఘనతలెన్నో! 1999లో స్టెఫీగ్రాఫ్ ఆటకు గుడ్బై చెప్పినప్పుడు టెన్నిస్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆమెకు 30 ఏళ్లే! అప్పటి ఆమె ఫిట్నెస్ స్థాయి, ఆటపరంగా చూస్తే అదేమీ పెద్ద వయసు కాదు. పైగా అంతకు రెండు నెలల క్రితమే ప్రతిష్ఠాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో ఆమె విజేతగా నిలిచింది. 19 ఏళ్ల వయసులో ఉత్సాహంగా చెలరేగుతున్న మార్టినా హింగిస్ను ఫైనల్లో ఓడించి మరీ టైటిల్ చేజిక్కించుకుంది. అనంతరం వింబుల్డన్ లోనూ ఫైనల్ చేరింది. మరికొన్నాళ్లు కొనసాగి ఉంటే మరింత ఘనత ఆమె ఖాతాలోకి చేరేదేమో! అయితే తాను అనుకున్న సమయంలో అనుకున్న తరహాలో ఆటను ముగించింది స్టెఫీ. ‘టెన్నిస్లో నేను సాధించాల్సిందంతా సాధించేశాను. ఇంకా ఏం మిగిలి లేదు. ఆటను ఇంకా ఆస్వాదించలేకపోతున్నాను. గతంలో ఉన్న ప్రేరణ కూడా కనిపించడం లేదు. మైదానంలోకి దిగుతున్నప్పుడు ఒక టోర్నీలో ఆడుతున్న భావనే రావడం లేదు’ అని ప్రకటించింది. నిజమే.. ఆమె కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్టెఫీ కెరీర్ గ్రాఫ్ను చూస్తే అంతా అద్భుతమే కనిపిస్తుంది. సీనియర్లను దాటి.. స్టెఫీ కెరీర్లో పెద్దగా ఒడిదుడుకుల్లేవ్. ఆరంభంలో సహజంగానే వచ్చే కొన్ని అడ్డంకులను దాటిన తర్వాత విజయప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. 13 ఏళ్ల వయసులో తొలి ప్రొఫెషనల్ టోర్నీ ఆడినప్పుడు ఆమె ప్రపంచ ర్యాంక్ 124. అయితే స్టెఫీ తండ్రి, తొలి కోచ్ పీటర్ గ్రాఫ్ ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. తర్వాతి రెండేళ్లు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా ఆట మెరుగుపర్చుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టింది. అదే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. 1985 వచ్చే సరికి నాటి దిగ్గజాలు మార్టినా నవత్రిలోవా, క్రిస్ ఎవర్ట్ల కెరీర్ చరమాంకంలో ఉంది. వీరిద్దరి తర్వాత ఎవరు అంటూ చర్చ మొదలైన సమయంలో అందరికంటే ముందుగా వినిపించిన పేరు స్టెఫీగ్రాఫ్దే. 1986 ఫ్యామిలీ సర్కిల్ కప్ ఫైనల్లో ఎవర్ట్నే ఓడించి తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలుచుకోవడంతో కొత్త శకం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మయామీ ఓపెన్ లో క్రిస్ ఎవర్ట్తో పాటు మార్టినా నవ్రతిలోవాపై కూడా విజయం సాధించడంతో ఇక కొత్త టెన్నిస్ రాణి ఎవరనే ప్రశ్నకు సమాధానం లభించింది. 22లో మొదటిది.. ఒకే ఏడాది ఎనిమిది డబ్ల్యూటీఏ టైటిల్స్తో మహిళల టెన్నిస్లో స్టెఫీ గ్రాఫ్ ఆధిపత్యం మొదలైంది. అయితే అసలు ఆటలోకి ఆమె ఇంకా అడుగు పెట్టలేదు. అదే గ్రాండ్స్లామ్ విజయం. ఎన్ని ట్రోఫీలు అందుకున్నా, గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకోకపోతే వాటికి లెక్క లేదనేది స్టెఫీకి బాగా తెలుసు. ఆ చిరస్మరణీయ క్షణం 1987లో వచ్చింది. ఆ ఏడాది అప్పటికే ఆరు టోర్నీలు గెలిచి అమితోత్సాహంతో ఉన్న గ్రాఫ్కు ఫ్రెంచ్ ఓపెన్లో ఎదురు లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో మార్టినా నవ్రతిలోవాను 6–4, 4–6, 8–6తో ఓడించి తొలి గ్రాండ్స్లామ్ను స్టెఫీ ముద్దాడింది. పశ్చిమ జర్మనీలో టెన్నిస్ క్రీడపై ఆసక్తి పెరిగి, ప్రధాన క్రీడల్లో ఒకటిగా ఎదిగేందుకు ఈ విజయం కారణంగా నిలిచిందని అప్పటి మీడియా స్టెఫీ ఘనతను ప్రశంసించింది. అదే సంవత్సరం ఆగస్టు 17న తొలిసారి వరల్డ్ నంబర్వన్ గా మారిన ఘనత.. మొత్తంగా 1302 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. ఆల్టైమ్ గ్రేట్గా.. స్టెఫీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టిన ఏడాది 1988. హార్డ్ కోర్టు, క్లే, గ్రాస్.. ఇలా మూడు రకాల కోర్ట్స్లో చెలరేగిపోతున్న స్టెఫీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఏ టోర్నీ కోసం బరిలోకి దిగినా ఆమెదే విజయం అన్నట్లుగా మారిపోయింది. ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్స్లామ్లు గెలిస్తే అదో గొప్ప ఘనతగా భావించే సమయమది. అప్పటికి టెన్నిస్ చరిత్రలో నలుగురు మాత్రమే దీనిని అందుకున్నారు. పురుషుల విభాగంలో డాన్ బడ్జ్, రాడ్ లేవర్ (రెండు సార్లు), మహిళల విభాగంలో మౌరీన్ కనోలీ, మార్గరెట్ కోర్ట్లకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇందులో ఆఖరిది 1970లో వచ్చింది. మారిన టెన్నిస్, పెరిగిన పోటీ నేపథ్యంలో ఎవరూ అంత నిలకడగా అన్ని గ్రాండ్స్లామ్లలో గెలవలేని పరిస్థితి. అయితే స్టెఫీ మాత్రం తానేంటో చూపించింది. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లు గెలిచి ఐదో ప్లేయర్గా తన పేరు ముద్రించుకుంది. అంతకు ముందు మరో అరుదైన ఘనతతో ఉన్నత స్థానంలో నిలిచింది స్టెఫీ. అదే ఒలింపిక్స్ స్వర్ణపతకం. సియోల్ ఒలింపిక్స్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి గాబ్రియెలా సబటిని (అర్జెంటీనా)ని ఓడించి ‘గోల్డెన్ స్లామ్’ అనే నామకరణానికి తాను కారణమైంది. ఇప్పటికీ 34 ఏళ్లు ముగిసినా మరెవరికీ అది సాధ్యం కాలేదంటే స్టెఫీ ప్రతిభ ఎంతటిదో అర్థమవుతోంది. మరో దిగ్గజంతో జత కట్టి.. 1999 ఫ్రెంచ్ ఓపెన్ .. మహిళల విభాగంలో స్టెఫీ విజేత కాగా, మరో వైపు పురుషుల సింగిల్స్లో అమెరికన్ స్టార్ ఆండ్రీ అగస్సీ చాంపియన్ . టైటిల్ గెలిచిన తర్వాత ఆటగాళ్లకు ఇచ్చే ‘డిన్నర్’లో ఇద్దరూ కలిశారు. స్టెఫీకి అది చివరి గ్రాండ్స్లామ్ (22వది) కాగా, అగస్సీకి నాలుగోది మాత్రమే. సర్క్యూట్లో పరిచయం ఉంది. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టెఫీ అంటే గౌరవం కూడా ఉంది అతనికి. కానీ ఈ సారి మాత్రం కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నారు. దాంతో స్నేహం కాస్త బలపడింది. టెన్నిస్ జగత్తులో ఇద్దరు స్టార్ల మధ్య అనుబంధం అంత సులువు కాదు. అహం, ఆర్జన వంటివి తోడుగా వస్తాయి. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ బంధంగా మారింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత స్టెఫీ, అగస్సీ పెళ్లి చేసుకున్నారు. చివరకు ఎనిమిది గ్రాండ్స్లామ్లతో అగస్సీ ఆట ముగించాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జర్మనీని వదిలి యూఎస్లో ఆమె స్థిరనివాసం ఏర్పరచుకుంది. స్టెఫీగ్రాఫ్ విజయాల్లో కొన్ని.. 22 గ్రాండ్స్లామ్ల విజేత (7 వింబుల్డన్, 6 ఫ్రెంచ్ ఓపెన్, 5 యూఎస్ ఓపెన్, 4 ఆస్ట్రేలియన్ ఓపెన్ ). ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్స్లామ్స్ గెలిచిన జాబితాలో రెండో స్థానం. కెరీర్లో మొత్తం సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 107 (ఓవరాల్గా అత్యధిక టైటిల్స్ జాబితాలో మూడో స్థానం) ప్రతి గ్రాండ్స్లామ్ను కనీసం 4 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ వరల్డ్ నంబర్వన్ గా అత్యధిక వారాల (377) పాటు సాగిన ఘనత. (ఇందులో వరుసగా 186 వారాల రికార్డు) ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు -
సంబరాల సంక్రాంతి..
నెల రోజులపాటు జరుపుకొనే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి. ప్రత్యేకతలెన్నో ఉన్న పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకునేవే! సంక్రాంతి పండుగ మాత్రం అందుకు భిన్నం. దీనిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. ఈ పండుగ ప్రత్యేకించి ఒక దేవుడికో, దేవతకో సంబంధించినది కాదు. పంటల పండుగ. కళాకారుల పండుగ. రైతుల పండుగ. కొత్తల్లుళ్ల పండుగ. పెద్దల పండుగ. రంగవల్లుల పండుగ. వినోదాల పండుగ. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కనకనే అందరికీ పెద్ద పండుగ అయ్యింది. ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న తమ పంట పండి ఇంటికి వచ్చిన సంబరంతో చేసుకునే పండుగ ఇది. పంట వేసినప్పటినుంచి çకోతకోసి ఇంటికి వచ్చేదాకా ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు వివిధ చేతివృత్తుల వాళ్లు, కళాకారులు అండగా నిలబడతారు. రైతుల అవసరాలు తీర్చి, వినోదం పంచి మానసికోల్లాసం కలిగిస్తారు. ప్రతిఫలంగా రైతులు వారికి ధాన్యం కొలిచి ఇస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే శుభాల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి పండుగ. ఉత్తరాయణం సకల శుభకార్యాలు జరుపుకొనేందుకు యోగ్యమైన కాలం. ఇంతకీ ఉత్తరాయణమంటే ఏమిటో చూద్దాం. సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయనం రాత్రి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక తన దిశ మార్చుకుని ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాప కాలం అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే! అయితే ఉత్తరాయణం విశిష్ఠత వేరు. భూమిపై రాత్రి, పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని, సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాయణం నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య పై ఒరిగిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. శాస్త్ర ప్రకారం ప్రతి సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే, మిగిలిన పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రమణ దానాలు... సర్వపాపహరాలు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్ఠమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం. సంక్రాంతి అనేది నెలరోజుల పండుగ. ధనుర్మాసంలో వచ్చే పండుగ. ధనుర్మాసం అని పండితులంటారు కానీ, వాడుకభాషలో చెప్పాలంటే సంక్రాంతి నెల పట్టటం అంటారు. ఈ నెల పట్టిన దగ్గరనుంచి తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో పండుగ వాతావరణం వస్తుంది. ఆడపడచులు ఇంటిముందు ఊడ్చి, కళ్లాపి చల్లి రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యప్పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. హరిదాసుల ఆగమనం వెనక... లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ , ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీకృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ, కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి సందర్భంగా కనిపించే సంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చును. సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనపడతారు. వీరి తలపై ఉండే పాత్రకు అక్షయ పాత్ర అని పేరు. హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అందుకే పిల్లలు, పెద్దలు పోటీలు పడి మరీ హరిదాసుల తలపై ఉండే అక్షయ పాత్రలో బియ్యం, కూరగాయలు వంటివి ఉంచుతారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవిని శ్రీకృష్ణుడిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుంచి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమా రమణ గోవిందో హరీ అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉత్త చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాలలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని ఆ శ్రీమహా విష్ణువుకు కానుకలు బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసులతోపాటు, ఈ పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు, పగటి వేషధారులు, గారడీవాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులు కన్నుల పండువుగా తమ కళాకౌసలాన్ని ప్రదర్శిస్తారు. సంక్రాంతి పర్వదినంతో ఈ కళా ప్రదర్శనలన్నీ ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు. సంక్రాంతి పండుగలో మరిన్ని ప్రత్యేకతలు... పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేయడంతో కపిలముని వాళ్లందరినీ తన కంటిచూపు నుంచి వెలువడిన క్రోధాగ్ని జ్వాలలతో భస్మం చేశాడు. దాంతో వారికి మోక్షం లభించక అధోలోకాలలో పడి ఉన్నారని, వారికి సద్గతులు కలగాలంటే వారి భస్మరాశుల మీద గంగ ప్రవహించాలని తెలుసుకున్న వారి వంశీకులు చాలామంది గంగను భువికి రప్పించాలని పరిపరివిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టకేలకు భగీరథుడు తన కఠోర తపస్సు, ఎడతెగని ప్రయత్నాలతో ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. అందుకే సంక్రాంతి నాడు చేసే స్నానం గంగాజలంలో మునక వేసినంత సత్ఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాద్యాన్ని పట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు వెళ్లి అత్యంత అద్భుతంగా గంగిరెడ్ల విన్యాసం చేయించారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! నీ పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు దేవతలు చేసిన విన్యాసాలే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. ప్రతి ఆచారానికీ ఓ కథ... కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే! పక్షులు కూడా రైతన్న నేస్తాలే! అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాం. కానీ ఈ కనుమ రోజున మాత్రం ర«థం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివరి వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట. దాంతో కోపం వచ్చిన శివుడు ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. అందుకే కనుమ రోజు పశువులను ముఖ్యంగా ఎడ్లను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. డుబుక్కు డుబుక్కు... బుడబుక్కలవాళ్లు ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది. పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిజాములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ కొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా డుబుక్కు డుబుక్కుమని శబ్దం చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ కొత్తవారిని కట్టడి చేస్తారు బుడబుక్కలవాళ్లు. వీరు తొలిజామంతా పంటకు కాపలా కాసి రెండోజాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతారు. శంఖనాదాల జంగందేవర సాక్షాత్తూ శివుని అవతార అంశగా భావించే ఈ జంగందేవర శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర! జంగందేవర రాకను గ్రామీణులు శుభంగా భావిస్తారు. పిట్టలదొరలు గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక చిత్ర విచిత్ర వేషధారణలో మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు, కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. ఇతడి మాటలే కాదు, ఆహార్యమూ వింతగా ఉంటుంది. పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు. అందుకే ఏమాత్రం పొసగని దుస్తులు ధరించేవారిని, డంబాలు పోయేవారిని పిట్టలదొరతో పోల్చుతుంటారు. సోదెమ్మ ‘సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను. ఉన్నదున్నట్టు చెబుతాను. లేనీదేమీ చెప్పను తల్లీ!’ అంటూ మన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర, రవికలగుడ్డ పెట్టించుకుని చల్లగా ఉండమని ఆశీర్వదించి వెళ్లిపోతుంది సోదెమ్మ. ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మనం బాగుంటే తామూ బాగుంటామని, మన క్షేమసౌఖ్యాలలో తామూ ఉంటామని భావిస్తూ, అందుకు తగ్గట్టే గ్రామస్థులకు మనోల్లాసం కలిగిస్తారు. మనకింత సాయం చేసిన వాళ్లు మననుంచి కోరుకునేది కాసిన్ని బియ్యం, కాసిని చిల్లర పైసలు, కాసిన్ని పాత దుస్తులే కదా... అందుకే లేదని కసిరికొట్టకుండా వారు కోరినది ఇచ్చి మన ముంగిటికొచ్చే చిరుకళాకారులను ఆదరించాలి. అందరికీ మంచిని పంచాలి. అందరి మంచిని పెంచాలి. సంక్రాంతి అల్లుడి ఘనత ఏమిటంటారా ? ఏ పండగకైనా ఇంటి అల్లుడి హాజరు తప్పని సరిగా ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి శాస్త్రం విశిష్టమైన స్థానాన్ని ఇచ్చింది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదేవిధంగా సూర్యుడిని సూర్య నారాయణ మూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడి మకర రాశి ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకరరాశి పదో రాశి. ఇది అత్తగారిల్లు అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంటిలోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పని సరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. ఈ రోజున అల్లుడి చేత గడ్డపెరుగును తినిపిస్తారు. ఇలా చేయడం వలన అల్లుడి వంశం వృద్ధి చెందుతుందని, అల్లుడు లేని వారు ఈ రోజున పండితులకి పెరుగును దానం చేయాలని పరాశర సంహిత చెబుతోంది. పూలూ–పిండి వంటల వెనుక సైతం సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్ర వచనం. ఎందుకు చెప్పిందంటే, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు కనుక. ఇందులో ఒక్క గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరచి పుష్యమాసపు చలి నుంచి శరీరాన్ని రక్షించే పదార్థాలు. ఇక గుమ్మడికాయ స్త్రీ–పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్యదోషాలను నివారించే గొప్ప ఔషధం. ఈ కాలంలో స్త్రీలు వాడే బంతి, చేమంతి, డిసెంబర్ పూలు, మునిగోరింట పూలు అన్నీ చలిని తట్టుకునే వేడిని ఇచ్చేవే. సంక్రాంతి సందర్భంగా చేసుకునే పిండివంటలు అన్నీ ఆరోగ్యాన్ని, ఒంటికి సత్తువనూ ఇచ్చేవే. కనుమ రోజు ప్రయాణం ఎందుకు చేయకూడదంటే..? సంక్రాంతి అంటే పంటల పండుగ కదా! కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులను వేలాడదీస్తారు. ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున చనిపోయిన పెద్దలను తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చే మినుములతో తయారు చేసిన గారెలు తినాలంటారు. గారెలు, మాంసంతో ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలని నియమం. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. కొన్ని పల్లెటూళ్లలో కనుమరోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడంలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ రోజు కూడా ఆగి, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని, మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. సంక్రాంతి రోజున శబరిమలలో జరిగే మకర జ్యోతి దర్శనం, తిరుమలలో జరిగే పారువేట, శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలు గోదావరి జిల్లాలో జరిగే ప్రభల తీర్థం ఈ పండుగ ప్రత్యేకతను చాటి చెబుతాయి. ఈ ఉత్తరాయణంలో అందరికీ శుభాలు జరగాలని ఆశిద్దాం. -డి.వి.ఆర్. భాస్కర్ కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయడం ఆచారం. దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతి నెల రోజులూ నాడు దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. అందుకే వారికి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు ఈ పండగ సమయంలో గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. చాకచక్యంగా గాలిపటాన్ని ఎగురవేసిన వారికి జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించే సామర్థ్యం కలుగుతుందని, తెగిన గాలిపటాలతో పాటే దురదృష్టం కూడా మనల్ని వీడి వెళ్లిపోతుందనీ పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువు సంక్రాంతి సంబరాలలో భాగమే బొమ్మల కొలువు కూడా. బొమ్మల కొలువును దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా పెడతారు. ఇళ్లలో, ఆలయాలలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. గృహిణులు తమ వద్దనున్న బొమ్మలననుసరించి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మెట్ల వరసలలో బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. ఇలా బొమ్మల కొలువులు పేర్చడంలో కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నాయి. భగవంతుడి దశావతారాల సూత్ర ప్రకారం ఈ సృష్టి పరిణామ క్రమాన్ని మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కింది మెట్టునుంచి పై మెట్టువరకు వివిధ వర్ణాలు, వివిధ ప్రమాణాలలో బొమ్మలను అమరుస్తారు. గంగిరెడ్లు ‘అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు! బాబుగారికి దండంపెట్టు! పాపగారికి దండం పెట్టు!’ అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి, రైతు బతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటిముంగిట్లో ఎడ్లను ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించే గంగిరెద్దుల వాళ్ళు ఊదే సన్నాయి సన్నాయి కూడా మంగళవాద్యమే. -
Mystery: ఆ కుటుంబాన్ని కడతేర్చిందెవరు..?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్గ్రౌండ్కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్గ్రౌండ్కి వెళ్లి, తనవాళ్ల టెంట్ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్గ్రౌండ్కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. అతనే.. సెప్టెంబర్ 1న క్యాంప్గ్రౌండ్లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్కి 3 జీవిత ఖైదులను విధించింది. అంగీకరించలేదు విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Saina Nehwal Successful Journey- Interesting Facts In Telugu: ‘మళ్లీ అమ్మాయేనా.. నేను దాని మొహం కూడా చూడను పో’.. ఆ వృద్ధురాలు చేసిన కటువైన వ్యాఖ్యకు ఉన్నత విద్యావంతుడైన ఆమె కుమారుడు కనీసం జవాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ఇంట్లో ఏడేళ్ల క్రితం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మనవడు కావాలని నానమ్మ ఆశించింది. అయితే అది జరగలేదు. పురుషులు, మహిళల నిష్పత్తిలో దేశంలోనే ఎక్కువ అంతరం ఉండే, ఆడపిల్లల పట్ల తీవ్ర వివక్ష చూపించే రాష్ట్రం హర్యానాలో.. అదీ అమ్మాయిలు పుట్టగానే నొసలు చిట్లించడమనేది ఎక్కువ మందికి అలవాటుగా ఉన్న హిస్సార్లో ఆమె ప్రవర్తన కొత్తగా అనిపించలేదు. చివరకు నెలరోజుల తర్వాత కొడుకు బతిమాలితే గానీ తన మనవరాలిని ఆమె చూడలేదు. కానీ అందులో ప్రేమ లేదు! ఆ సమయంలో తల్లికి ఏమీ చెప్పలేకపోయిన ఆ పాప తండ్రి మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెండో కూతురును మాత్రం అందరికంటే ప్రత్యేకంగా పెంచాలని, ఆమెను చూసి మున్ముందు అందరూ గర్వపడాలని భావించాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం క్రీడలు! ఆ హిస్సార్ బిడ్డ తర్వాతి రోజుల్లో హైదరాబాదీగా మారి ప్రపంచ బ్యాడ్మింటన్పై తనదైన ముద్ర వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమే సైనా నెహ్వాల్... భారత మహిళల బ్యాడ్మింటన్కు టార్చ్బేరర్లా నిలిచిన స్టార్ షట్లర్. అమ్మా నాన్న అండతో.. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరడంతోనే సైనా ఆటకు పునాది పడింది. సరదాగా కరాటే నేర్చుకున్నా.. స్విమ్మింగ్, సైక్లింగ్ ఎన్ని చేసినా అవి ఆమెను ప్రొఫెషనల్ ప్లేయర్గా మార్చలేవని తండ్రికి అనిపించింది. పైగా కరాటే నేర్చుకుంటున్న సమయంలో ఒక మోటార్ బైక్ను కొందరు విద్యార్థుల చేతుల మీదుగా తీసుకుపోవాలని ఇన్స్ట్రక్టర్ సూచించాడు. అది తన వల్ల కాదంటూ కరాటేను వదిలేసేందుకే సైనా సిద్ధమైంది. దాంతో కెరీర్లో ఎదిగే ఆటను ఆయన గుర్తించాడు. ఎనిమిదేళ్ల వయసులో సైనా చేతికి బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు. షటిల్ ఆటపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి కూడా అందుకు కారణం కావచ్చు. సైనా తల్లి ఉషారాణికి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడిన అనుభవమూ ఉండటంతో ఇంట్లోనే అదనపు ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో ఆట మొదలైంది. ఫలితాల గురించి ఆలోచించే పరిస్థితి ఎనిమిదేళ్ల పాపకు రాకూడదని భావించిన హర్వీర్ ఏ దశలోనూ విజయాలు, పరాజయాల గురించి ఆ చిన్నారితో మాట్లాడలేదు. నువ్వు ఆడుతూ ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అనే భరోసాను మాత్రం కల్పించాడు. ‘ఒక ప్లేయర్ పెద్ద స్థాయికి చేరాలంటే ఆ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడనేది కాదు. ప్లేయర్తో పాటు కూడా తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తారనేది ముఖ్యం. మీరు మీ పిల్లల కోసం ఎంత సమయం ఇవ్వగలరు’.. ఏదైనా ఆటలో శిక్షణ కోసం అకాడమీకి వెళితే కోచ్ల నుంచి సాధారణంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. హర్వీర్కూ ఇదే ఎదురైంది. నేను ఎంత సమయమైనా ఇస్తానని ఆయన చెప్పాడు. రాజేంద్రనగర్లోని తన ఇంటి నుంచి ఎల్బీ స్టేడియం వరకు కోచింగ్కు వస్తూ, పోతూ సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణంలో చేతక్ స్కూటర్పైనే నిద్ర కూడా! ఇదే తరహాలో ఆమె శిక్షణ సాగింది. సైనా ప్లేయర్గా ఎదుగుతున్న సమయంలో తన ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి రావడంతో తండ్రి వాటిని వదులుకున్నాడు. కూతురు కోసం దేనికైనా సిద్ధపడిన ఆయన ఆశలను సైనా వమ్ము చేయలేదు. ఎవరి వల్లా కాలేదు కోట్లాది రూపాయల ఆదాయం, ఇళ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం.. సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆటగాళ్ల గురించి అందరిలో ఉండే భావనే ఇది. కానీ ఆ స్థాయికి చేరేందుకు వారు పడిన కష్టం, శ్రమ మాత్రం బయటకు కనిపించదు. సైనా నేపథ్యం పేదదేమీ కాకపోవచ్చు. అయినా సరే ఒక ప్లేయర్గా మారే కోణంలో చూస్తే ఆర్థికపరమైన అడ్డంకులు తలుపు తడుతూనే ఉంటాయి. రాకెట్ కొనుగోలు మొదలు టూర్లు, ఎక్కడో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు చూస్తే పరిధి దాటుతూనే ఉంటాయి. సైనాకు 9 ఏళ్ల వయసులో ఓ అండర్ 10 టోర్నీలో ఆడేందుకు మొదటిసారి ఖరీదైన రాకెట్ను (1999లో రూ. 2,700) కొనిచ్చాడు తండ్రి. అయితే చెన్నైలో జరిగిన ఈ టోర్నీ సందర్భంగా దానిని ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో భోరున ఏడ్చేసిన సైనాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందుకే స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన రూ. 700 స్కాలర్షిప్, కొన్నాళ్ల తర్వాత పెట్రోలియం బోర్డు అందించిన రూ. 2,500 స్కాలర్షిప్ కూడా ఆమెకు బంగారంలా అనిపించాయి. తన భార్య ఆరోగ్యం బాగా లేదంటూ హర్వీర్ ఆరు సార్లు పీఎఫ్ ఖాతానుంచి సైనా ఆట కోసమే డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా కాలేదు. నడిచొచ్చిన విజయాలు సైనా విజయప్రస్థానంలో ఎప్పుడూ పెద్దగా ఆటుపోట్లు ఎదురు కాలేదు. అద్భుతమైన ఆట, కఠోర శ్రమ, తొందరగా నేర్చుకునే తత్వం, తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటు సైనాను శిఖరానికి తీసుకెళ్లాయి. జూనియర్ స్థాయిలో సైనా పదునైన ఆట గురించి ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే. ప్రత్యర్థులకు అందనంత రీతిలో, తిరుగులేని ప్రదర్శనతో ఆమె దూసుకుపోయింది. 15 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో న్యూఢిల్లీలో తొలి టైటిల్ (ఆసియా శాటిలైట్) గెలిచిన తర్వాత సైనా ఎక్కడా ఆగలేదు. తర్వాతి ఏడాది ప్రతిష్ఠాత్మక 4 స్టార్ ఫిలిప్పీన్స్ ఓపెన్ గెలిచిన తర్వాత సైనా సత్తా ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి తెలిసింది. 2008లో వరల్డ్ జూనియర్ చాంపియన్గా నిలిచిన తర్వాత ప్రతిష్ఠాత్మక విజయాలు సైనా ఖాతాలో వచ్చి చేరాయి. చాలెంజర్ టోర్నీలు, గ్రాండ్ ప్రి, గ్రాండ్ ప్రి గోల్డ్, సూపర్ సిరీస్, సూపర్ సిరీస్ ప్రీమియర్... ఇలా పేరు ఏదైతేనేం విజేత సైనా మాత్రమే. తన అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో 24 అంతర్జాతీయ టైటిల్స్ సైనా గెలుచుకుంది. ఇందులో 10 సూపర్ సిరీస్లే ఉన్నాయి. ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్, ఇండియన్ ఓపెన్.. వేదికలు మారడమే తప్ప విజయాలు మాత్రం తనవే. కొన్ని ఘనతలు... ►ఒలింపిక్ కాంస్య పతకం ►వరల్డ్ చాంపియన్షిప్లో ఒక రజతం, ఒక కాంస్యం ►కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు ►ఆసియా క్రీడల్లో కాంస్యం ►ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం ► సూపర్ సిరీస్ ఫైనల్స్లో రజతం భారత ప్రభుత్వం పౌర పురస్కారాలు ► పద్మశ్రీ, పద్మభూషణ్లతో పాటు క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్రత్నలతో సైనా నెహ్వాల్ను గౌరవించింది. ఆ పతకం ఒక మణిహారం.. 2012 ఆగస్టు 4.. సైనా నెహ్వాల్ ఉజ్వల కెరీర్ను శిఖర స్థాయిలో నిలిపిన విజయం. లండన్ ఒలింపిక్స్లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా బ్యాడ్మింటన్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వ్యక్తిగతం.. 2018లో.. సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ను సైనా వివాహమాడింది. ఆమె కెరీర్ విశేషాలతో ‘సైనా’ అనే బయోపిక్ కూడా వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైనా పాత్రలో పరిణీతి చోప్రా నటించింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
వెంటాడే దృశ్యం
హేమంతం! చుట్టూరా ఎత్తైన కొండలు.. మధ్యలో పచ్చటి లోయ.. ఆకు పచ్చటి కొండల మీద తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లు ఆలోయ కనిపిస్తోంది.. నేను తెల్లవారి బయలుదేరి ఆ లోయకి చేరుకున్నాను. నాతోపాటు నా స్నేహితుడు జగదీష్ కూడా వచ్చాడు.ఇలా ఈ లోయకి రావడానికి కారణం.. వారం రోజుల క్రితం నేను ఏనిమల్ ప్లానెట్ చానెల్లో చూసిన ఓ గగుర్పాటు కలిగించిన దృశ్యం. అది ఇంకా నన్ను వెంటాడుతోంది.‘ఒక లోయలో ఓ గద్ద ఆకాశంలోంచి వాయువేగంతో ఎగురుతూ వచ్చి మేకపిల్లను ఎత్తుకు పోయే దశ్యం’ అది. ఆ దృశ్యం చూసి స్థాణువయ్యాను... నమ్మలేకపోయాను. గద్దలు సాధారణంగా కోడిపిల్లలను, పాముల్ని నోటకరచుకొని పోవడం నేను చూశాను. కానీ దానికన్నా ఆకారంలో, బరువులో పెద్దదైన ఓ మేక పిల్లను గద్ద కాళ్ళతో ఎత్తుకుపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పట్నుంచీ నాలో ఆందోళన మొదలైంది. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ మర్నాడు గ్రంథాలయానికి వెళ్ళి ఆ ఫొటోని తీసిన ఫొటోగ్రాఫర్ గురించి పేపర్లలో చదివాను. ఆ ఫొటోని ఏనిమల్ ప్లానెట్ చానెల్ కోసం ప్రపంచంలోని అతి గొప్ప ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెకర్రీ తన డిజిటల్ కెమెరాతో తీశాడు. అందుకోసం అతను లోయలోకి వెళ్ళి చాలా పెద్ద సాహసమే చేశాడు. ఆ ఫొటోని చూసిన తరువాత నాక్కూడా అటువంటి ఫొటోని నా కెమెరాలో బంధించాలన్న కోరిక కలిగింది. అందుకే ఈరోజు ఈ లోయకి వచ్చాం. దేశంలోని అతి గొప్ప కెమేరా అయిన నికోన్ డిజిటల్ని నాతో తెచ్చాను. ఈ లోయకే ప్రత్యేకంగా రావడానికి ఓ ముఖ్యకారణం ఉంది. నా స్నేహితుడు జగదీష్ తండ్రి ప్రముఖ ఫొటోగ్రాఫర్... నేను చెప్పిన ఫొటో గురించి వినీ అతను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు. ‘గద్ద మేకపిల్లని ఎత్తుకుపోతున్న దృశ్యాన్ని మెకర్రీ మనదేశంలో అందునా మన రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో గాలికొండ లోయలో తీశాడనీ చెప్పడంతో ఆ లోయని చూడటానికి ఈ రోజు వచ్చాం. సూర్యుడు తూర్పు దిక్కు నుదుటన సిందూర తిలకంలా మెరిసిపోతున్నాడు. రాను రాను నీహారికా బిందుసమూహాలు కరిగి లోయంతా హరిత వర్ణంగా పరావర్తనం చెందుతున్న దృశ్యం మనోహరంగా కనిపిస్తోంది. నేను, జగదీశ్ ఇద్దరం లోయలోకి దిగాం. చుట్టూ ఎల్తైన సిల్వర్ ఓక్ వృక్షాలు, వాటి మీద పక్షుల కిలకిలారావాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి. ఎక్కడి నుంచో కోకిల కలకూజితం లోయలో ప్రతిధ్వనిస్తోంది. సూర్యుడు వెలుగు రేఖలు లోయలో పరుచుకుంటున్నాయి. ఆ సమయంలో నేనూ జగదీశ్ లోయలోకి దిగి ఓ చెట్టు కింద నిలబడ్డాం. ఇప్పుడా లోయని చూస్తుంటే ఆ రోజు నేను చూసిన ఫొటో గుర్తుకు వచ్చింది. ఆకాశం నీలంగా స్వచ్ఛగా ఉంది. లోయలో తెల్లటి కొంగలు ఎగురుతూ మల్లెదండని గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పుడు నా చూపులన్నీ ఆకాశం వైపు గద్దల కోసం ఆశగా చూస్తున్నాయి. జగదీశ్ కెమెరాని బయిటకు తీసి నాకు అందించాడు. ‘వంశీ! మొన్న నువ్వు చూపించిన గద్ద మేక పిల్లని ఎత్తుకుపోతున్న ఫొటో లాంటి వాటిని మన వాళ్ళు తీయ్యలేరా?’ అని అడిగాడు. ‘ఎందుకు తియ్యలేరు? మనదేశంలో కూడా అద్భుతమైన ఫొటోగ్రాఫర్లున్నారు! ఉదాహరణకు సుధీర్ శివరాం, రఘునా«థ్ చౌదరి లాంటి గొప్ప ఫొటోగ్రాఫర్లున్నారు! వాళ్ళు ఎన్నో అద్భుతమైన ఫొటోలు తీసి ఎన్నో అంతర్జాతీయి బహుమతులు గెల్చుకున్నారు’ అని చెప్పాను. అప్పటికి సమయం 7 గంటలైంది. చలి కాస్త తగ్గుముఖం పట్టింది. జగదీశ్ ఫ్లాస్క్లో తెచ్చుకున్న టీని నాకిచ్చాడు. అది తాగిన తరువాత శరీరం కాస్త వేడెక్కి ఉత్సాహం వచ్చింది. సమయం గడిచిపోతున్నా ఆకాశంలో గద్దలు కనిపించటం లేదు. ఫొటోగ్రఫీలో ఈ సమస్యలు తప్పవు. మంచి ఫొటో కోసం నిరీక్షించక తప్పదు. ఒక మంచి అద్భుతమైన ఫొటో కోసం ఎంతో నిరీక్షణ అవసరం. రెండు గంటలు గడిచాయి. ఎండ తీక్షణ ఎక్కువైంది. నేను మాత్రం నిరాశ చెందకుండా ఆకాశం వైపు చూస్తునే ఉన్నాను. సరిగ్గా తొమ్మిదిన్నర సమయానికి ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఒక విమానం చిన్నగా కదులుతూ వస్తోంది. నేను ఆశ్చర్యంతో దాని వైపే చూస్తున్నాను. క్రమక్రమంగా అది దగ్గర కాసాగింది. అదే విమానం అయితే లోయంతా దాని ‘ధ్వనితో ప్రతి ధ్వనించేది. కానీ ఏవిధమైనా శబ్దమూ వినిపించటం లేదు. రానురాను అది కిందకు దిగుతోంది. నాలో ఉత్కంఠ పెరిగింది. నేను జగదీశ్ వైపు తిరిగి దానివైపు చూపించాను. అతను కూడా ఉద్విగ్నతతో ఆకాశంలోకి చూడసాగాడు. కొద్ది నిమిషాల తరువాత ఆ దిగుతున్న దేమిటో నాకు స్పష్టత వచ్చింది. అది విమానం అయితే కాదు. విమానం అలా ఓ లోయలో కిందకు దిగదు. అది ఎత్తులో సమాంతరంగా ప్రయాణిస్తుంది. కచ్చితంగా అది గద్దపక్షే అయి ఉంటుందనీ నా సిక్త్సెన్స్ చెప్పింది. ‘జగదీశ్! ఆ కిందకు దిగుతున్నదేమిటో పోల్చుకున్నావా?’ అది గద్ద. ఆ పక్షి తప్ప అంత ఎత్తున ఏ పక్షీ ఎగురలేదు’ అని వాడికి చెప్పి కెమెరాని మెడలో నుంచి తీశాను. అది హై మేగ్నిఫైడ్ లెన్స్ జపాన్ తయారీ కెమెరా. కిలోమీటరు దాకా జూవ్ు చేసి స్పష్టమైన ఫొటో తియ్యవచ్చు. ‘వంశీ! ఎంత గద్దపక్షి అయితే మాత్రం అంత ఎత్తు నుంచి కింద లోయలో ఏ జంతువుందో చూడగలదా? అసలే దాని కళ్ళు చిన్నవి’ అన్నాడు జగదీశ్. జగదీశ్ ప్రశ్నలు నాలో అసహనాన్ని కలిగించాయి. ‘గద్ద అంటే ఏమనుకున్నావ్? దాని చూపు చాలా తీక్షణమైనది. కిలో మీటరు ఎత్తు నుంచి అది భూమి మీద చిన్న కోడిపిల్లను కూడా స్పష్టంగా చూడగలదు. అంతటి మహత్తర చూపు గల కళ్ళు దానివి. దేవుడు దాని కళ్ళకు అంతటి తీ„è ణతని వరంగా ఇచ్చాడు. అందుకే ఎక్కడ నుంచి వస్తుందో తెలియకుండా వేగంగా వచ్చి కోళ్ళను, పాముల్ని నోట కరుచుకొని వెళ్ళిపోగలదు. దాని రెక్కల్ని టెలాన్స్ అంటారు. దాని రెక్కల్లో గొప్ప శక్తి ఉంటుంది. అందువల్ల వాయు వేగంతో కిందకు దిగి వాటిని నోట కరుచుకొని మళ్ళీ ఎగిరిపోగలదు’ అంటూ వాడికి చెప్పాను. కొద్ది నిమిషాల తరువాత అది మాకు స్పష్టంగా కనిపించేటంతటి ఎత్తుకు దిగింది. ఇప్పుడది మాకు స్పష్టంగా కనిపిస్తోంది. నిశ్చయంగా అది గద్దపక్షే. అది లోయలోకి దిగుతుంటే మా ఇద్దరిలో చెప్పలేని ఉత్కంఠత. మేము లోయకి ఒక వైపున ఉండటం వల్ల లోయ పూర్తిగా కనిపించటం లేదు. రానురాను అది కిందకు దిగి పోతోంది... నేను కెమెరాని చేతిలోకి తీసుకొని ఫొటో కోసం ఎదురు చూస్తున్నాను. గద్దపక్షి లోయలోకి దిగుతోందంటే అది ఏ జంతువునో చూసి ఉంటుంది. అది జంతువో లేక కోడి పిల్లో కావచ్చు. సమయం గడుస్తోంది. లోయంతా నిశ్శబ్దంగా ఉంది. గద్దపక్షి కిందకు దిగుతూ కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి దాకా ఏ జరుగుతోందో తెలియటం లేదు. ఇంతలో ఎగురుతూ వస్తున్న గద్దపక్షి కనిపించింది. నా దగ్గర ఉన్న బైనాక్యులర్తో ఆ దృశ్యాన్ని చూశాను. మొదట్లో అస్పష్టంగా, కొన్ని క్షణాల తరువాత స్పష్టంగా కనిపిస్తోంది అది. వాయువేగంతో ఎగురుతూ అది మావైపే వస్తోంది. దాని రెండు కాళ్ళ మధ్య గిలగిలా కొట్టుకుంటూ చిరుత పులి పిల్ల! ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో పాటు అనుమానం కలిగింది నాకు! అంత పెద్ద చిరుత పిల్లను ఒక చిన్న గద్దపక్షి.. అంత ఎత్తుకి తీసికెళ్ళడమా? అది సాధ్యమా? అన్న సందేహం వచ్చింది. వెంటనే ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాలని కెమెరా తీశాను. రానురాను ఆ గద్దపక్షి మా వైపే వస్తూ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో గగుర్పాటు కలిగించే ఒక సంఘటన జరిగింది. గద్దపక్షి కాళ్ళ మధ్య కొట్టుకుంటున్న చిరుత పిల్ల తప్పించుకొని కిందకు జారిపోసాగింది. గద్దపక్షి కాళ్ళ పట్టు తప్పడం వల్ల అలా జరిగి ఉంటుంది. గాల్లో ఎగురుతున్న ఆ పక్షి లోయలోకి జారిపోతున్న చిరుతపిల్ల. ఆ దృశ్యం కనిపిస్తోంది. అంతలోనే గద్దపక్షి తేరుకుంది. ఒక్కసారిగా రెక్కలను టపటపలాడిస్తూ కిందకు దిగడం మొదలు పెట్టింది. వెంటనే నేను కెమెరాని క్లిక్ మనిపించాను. ఒకటి కాదు.. రెండు కాదు.. పదిసార్లు క్లిక్ మనిపించాను. అలా నేననుకున్న ఫొటో తీయగలిగాను. వారం రోజుల తరువాత స్టూడియో నుంచి ప్రింట్లు వచ్చాయి. కేబినెట్ సైజులో ఆ ఫొటోలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గద్దపక్షి.. దాని కింద లోయలోకి జారిపోతున్న చిరుత పిల్ల. ‘సార్! ఎక్కడ తీశారు ఈ ఫొటోల్ని. అద్భుతంగా, గగుర్పాటు కలిగించేటట్లున్నాయి’ అన్నాడు ఆ ఫొటోలను తెచ్చిన స్టూడియో కుర్రాడు. అతనికి ఏం చెప్పాలో తెలియక ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. వారం రోజుల తరువాత ఆ ఫొటోలు అన్ని దిన, వార, పత్రికల్లోనూ వచ్చాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ పాఠకుల నుంచి వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఈ ఫొటోతో నా చిరకాల వాంఛ తీరిందనిపించింది. అద్భుతమైన ఫొటోలను ఎక్కడ చూసినా నేనూ ఇలాంటి వాటిని తియ్యాలనీ కలలు కనేవాడిని. ఆ కల ఈ రూపంలో తీరింది. నెల రోజుల తరువాత ఢిల్లీలోని ‘బర్డ్స్ ఆఫ్ ఇండియా’ సంస్థ వారు ఒక పోటీని ప్రకటించి అద్భుతమైన నమ్మలేని ఫొటోలను పంపాలనీ కోరారు. ప్రథమ బహుమతి 10 లక్షలు. నేను ఆ పోటీకి నా ఫొటోని పంపాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. నెల రోజుల తరువాత ఓ అనుకోని సంఘటన జరిగింది. ఒక రోజు నేను మా వూళ్ళోనే ఉంటున్న మా అక్కను చూద్దామని బయలుదేరాను. ఈ మధ్యన అక్కకు ఒంట్లో బాగుండటం లేదు. వీధికి కొద్ది దూరంలో అక్క రెండేళ్ళ కూతురు మృదుల ఇంటి ముందర ఆడుకుంటోంది. నేను నడక వేగం పెంచాను. ఇంతలో ఆకాశంలో ఏదో అలజడి. నా దృష్టి ఆకాశంవైపు మళ్ళింది. ఆకాశంలో ఒక పెద్ద గద్దపక్షి ఒకటి వాయువేగంతో కిందకు దిగుతోంది. ఆ వేగానికి గాల్లో శబ్దం కలుగుతోంది. నేను దాన్ని గమనిస్తూ నిలబడ్డాను. కొద్ది క్షణాల తరువాత అది మా అక్క కూతురు మృదుల వైపు దిగడం కనిపించింది. నాకు వెంటనే నేను తీసిన ఫొటో ఆ ఘటన గుర్తుకు వచ్చింది. ఆ లోయలో చూసిన ఆ బీభత్స దృశ్యం నా కళ్ళ ముందు కదలాడి ఒక్కసారిగా పరుగు మొదలెట్టాను. రెండు క్షణాల్లో ఒక అద్భుతం జరిగింది. నేను అక్కడకు చేరి బృదులను ఎత్తుకొని ఇంట్లోకి పరిగెత్తడం, ఆ గద్దపక్షి భూమి మీదకు దిగడం ఒకేసారి జరిగాయి. నేను మృదులను ఇంట్లోకి తీసికెళ్ళి తలుపేసి వీధిలోకి వచ్చాను. గద్దపక్షి నిరాశతో మళ్ళీ ఎగిరిపోతూ కనిపించింది. అది ఇప్పుడు గట్టిగా అరవడం వినిపించింది. నాకు ఆ దృశ్యం చాలా ఆనందం కలిగించింది. నేనే గాని ఆ లోయకి ఫొటో కోసం వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మృదుల ఆ గద్దపక్షికి బలైపోయి ఉండేది. ఆ విషయం తలపునకు రాగానే నా ఒంట్లో వణుకు మొదలైంది. పెళ్ళైన పదేళ్ళకు పుట్టిన మృదులకు ఏం జరిగినా అక్క తట్టుకోలేదు. ఇంక నా ఫొటోకి పోటీలో బహుమతి రాకపోయినా నేను బాధపడను. కానీ మృదులను కాపడినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మృదులను కాపాడిన దృశ్యం పదేపదే నా కళ్ళముందు కదలాడసాగింది. -గన్నవరపు నరసింహమూర్తి -
కీడు గుడిసె.. మనసును కదిలించే కథ
తూర్పు కనుమలు ఆ చలికాలపు ఉదయాన మంచుముసుగు కప్పుకున్నాయి. చెట్టూపుట్టలూ, పశుపక్ష్యాదులూ మంచులో తడిసిముద్దయి చలికి వణుకుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో, దట్టమైన కీకారణ్యంలో ఎతై ్తన కొండలమీదుంది ఆ గూడెం. నాగరికతకు చాలా దూరంగా వున్న ఆ గూడెంలో ఒక గిరిజన తెగకు చెందిన ఇరవైమూడు కుటుంబాలు.. అనాదిగా వస్తున్న ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తూ జీవనం సాగిస్తున్నాయి. గూడేనికి కాస్త ఎడంగా, చుట్టూ రక్షణగోడలా వున్న వెదురుతడికల మధ్య వుంది ఆ గుడిసె. అందులో వెదురుబొంగులతో కట్టిన అటకమీద ముడుచుకుని పడుకున్న సోము చలికి గజగజా వణికిపోతున్నాడు. చలిపులి గుండెల్లోకి దూరి గిలిగింతలు పెడుతుంటే... భార్య సిసిరి గురించిన ఆలోచనలు అతని మనసును ముసురుతుంటే... నిద్రెలా పడుతుంది? హఠాత్తుగా ఏదో ఆక్రందన చెవికి సోగ్గానే దిగ్గున లేచి, అటక దిగాడు సోము. బయట మంచు తప్ప ఏం కనిపించ లేదు, వినిపించ లేదు. ‘అంత నా బెమ’ అనుకున్నాడు. గుడెసెలో ఓ మూలనున్న పొయ్యి దగ్గరికెళ్లి ముట్టించాడు. చిన్న మంట వెచ్చగా తగిలి ప్రాణం లేచొచ్చింది. చలి కాగుతుంటే అతడికి సిసిరి గుర్తుకొచ్చింది మళ్లీ. ‘యీ సలిలో అదెట్టావుందో ఏటో?’ అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు. ‘ఆలుమగలను ఇడదీసే యీ ఆసారమేటి? దాన్నట్టుకుని గూడెం పెద్ద యాలాడ్డమేటి?’ అనుకుంటూ మొహం చిరాగ్గాపెట్టాడు. పక్క పక్క గూడేలకు చెందిన సోము, సిసిరి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇరు గూడేల పెద్దలను తమ మనువుకు ఒప్పించారు. ఆచారం ప్రకారం మనువుకు ముందు గుడిసెకట్టి ఆనక మనువాడారు. ఆ కొత్తగుడిసెలో కాపురం పెట్టి యేడాదిన్నరయింది. నిరంతరం ఒకరినొకరు అంటిపెట్టుకునుండే వారిద్దరినీ, సిసిరి నెలసరి సమయంలో తమ కీడు ఆచారం విడదీసేది. దాంతో ఆ ఆచారం పట్ల సోముకు ఎక్కడలేని కోపమూ వచ్చేది. సిసిరిని ఆచారం తప్పమనేవాడు. ‘గూడెం కట్టుబాటు దప్పితే తొప్పు గట్టాలి గదా మావ’ అని నచ్చచెప్పేది సిసిరి. కీడు గుడిసెకు వెళ్ళి, అక్కడ మూడ్రోజులుండి వచ్చేది. ప్రస్తుతం సిసిరి నిండు చూలాలు! దాంతో ఆమె మకాం కొద్దిరోజులక్రితం కీడు గుడిసెకు మారింది మళ్లీ. రెండునెలలు అక్కడే వుంటుంది. కొన్ని గిరిజన తెగల్లో వుండే ఆ ఆచారం.. సోము వాళ్ల తెగలోనూ వుంది. స్త్రీలు నెలసరి అయితే మూడ్రోజులు, గర్భిణీలు, రజస్వలైనవాళ్లు రెండునెలలు గూడేనికి కాస్త దూరంలో వుండే కీడు గుడిసెలో వుండాలి. వారు గూడెంలో వుంటే వారి కీడు (మైల) గూడేనికి అశుభం కలిగిస్తుందని భావిస్తారు. వారు ఆ కీడు గుడిసెలోనే వుంటూ, వారికి కేటాయించిన దారుల్లోనే బయటకెళ్లి రావాలి. వారికి వారి బంధువులైన స్త్రీలు తింటానికి పట్టుకెళ్లిస్తారు. ఎవరైనా ఆచారం తప్పితే శిక్షలు కఠినంగా వుంటాయి. గూడెం నుంచి నిర్దాక్షిణ్యంగా వెలివేస్తారు. పురుడుకోసం కీడు గుడిసెలోకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా గూడేనికి తిరిగొస్తారన్నది సందేహమే! కీడు గుడిసెలో మంత్రసాని పురుళ్లు పోస్తుంది. ఒక్కోసారి కాన్పు కష్టమై ప్రాణాలమీదకు వచ్చినా సరే ఆసుపత్రికి తీసుకెళ్లరు. బలవంతంగా మోటుపద్ధతుల్లో కాన్పు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కీడు గుడిసెలోనే కన్నుమూసిన అభాగ్యులెందరో? సోము అలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు. మరెన్నో విన్నాడు. అందుకే అతడు భయపడుతున్నాడు. చలి కాగుతూ సిసిరికి ఏం కాకూడదని కొండదేవతను వేడుకుంటున్నాడు. తమ ఆచారాల్లో కొన్నింటిని మూఢాచారాలుగా భావిస్తాడు సోము. అడవిలో తాము సేకరించినవి అమ్మి కావలసిన సరుకులు తెచ్చుకోవడంకోసం.. అప్పుడప్పుడు అతడు సమీప పట్టణంలోకి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా పట్టణ ప్రజల జీవనవిధానాన్ని పరిశీలించేవాడు. అక్కడ కీడు గుడిసె ఆచారంతోపాటు తాము పాటిస్తున్న మరికొన్ని ఆచారాలూ లేవని గ్రహించేవాడు. ఆ విషయాలను తన నేస్తాలతో చెప్పి బాధపడేవాడు. ఓ రోజు గూడెం పెద్ద గుర్రప్ప, కీడు గుడిసెకు మరమ్మత్తులు చేయడానికి మనుషులను పురమాయిస్తుంటే సోము ధైర్యంచేసి, ‘పట్నంల యాడ ఇట్టాంటి కీడు ఆసారం నేదు. మనంగూడ మానుకుందాం’ అన్నాడు. గుర్రప్ప గుర్రుగా చూసి ‘నక్కబుట్టి నాలుగువోరాలు గానేదు, యీ గాలీవోన యెన్నడు సూడనేదన్నదంట. అట్టాగుంది నీ యెవ్వారం. మూతిమీద మీసమే సరిగ్గ రానేదు పెద్దకొబుర్లు ఆడేతున్నవు’ వెటకారంగా అన్నాడు.‘ఆడోల్ని ఇబ్బందెట్టే, ఆల్ల పేనంమ్మీదకు దెచ్చే ఆసారం యెంతసెడ్డదో తెల్డానికి మీసమే రానొవసరం నేదు’ అన్నాడు సోము ఆవేశంగా. గుర్రప్ప అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. ‘ఏట్రా... ఇప్పసారా తల కెక్కేసినదేటి? ఏటేటో వోగుతున్నవు. గూడెం బాగు కోసరం మన పెద్దోల్లెట్టిన ఆసారం మనం పాటించల. మానుకుంతే కొండదేవతకు కోపమొస్తది. ఆసారం దప్పినప్పుడల్ల గూడెంల పీనుగులెగుతున్న ఇసయం నీకుతెల్ద? మల్ల ఇట్టాగ ఆసారాన్ని ఎటకారంసేత్తే గూడెం పెద్దగ ఏటిసేయాల్నో అదే సేస్తను’ అంటూ హెచ్చరించాడు. అందుకే సోము మళ్లా ఆ మాట ఎత్తలేదు. ‘ఒరే సోముగే... లెగిసినవ... గుర్రెట్టుకొని నిద్రోతున్నవ?’ అంటూ గుడిసెలోకి దూరాడు సోము అయ్య కన్నప్ప. చలి కాగుతున్న సోము ‘నిద్రడితేనే కదర నిద్రోడనికి... సిసిరికి ఎట్టుందో తెలిసినదేటి?’ ఆత్రుతగా అడిగాడు. ‘అది సెప్పడనికే వొచ్చినను. సిసిరి పెరిస్తితి ఏం బాగోనేదంట. కాన్పుసేయడం కట్టమని మంత్రసాని అందంట. కోడలికేటవుతాదోనని మీయమ్మ రాగాలుదీత్తు నెత్తిబాదుకుంతున్నది’ చెప్పాడు కన్నప్ప. అది విని సోము భయంతో వణికిపోయాడు. సిసిరికి ఏం కాకూడదని తమ దేవతలకు మొరపెట్టుకుని ‘ఒరే అయ్య... మరిప్పుడేటి సేయడం?’ అన్నాడు బేలగా. ‘సేసేదేటుందిర. సిసిరికి ఏటిగాకుండ కాన్పయితే కొండదేవతకు అడవిపందిని బలిత్తమని మొక్కీసుకోడమే! అంతకుమించి మనం సేసేది ఏటినేదు’ అన్నాడు కన్నప్ప విచారంగా. ‘ఒరే అయ్య... అలాగనకుర. సిసిరి నా పేనం! అది సావగూడదు. ఆలిస్యెం సెయ్యకుండ ఆసుపెత్రికి దీస్కుపోదం. దాన్ని బతికించుకుందం’ అన్నాడు సోము ఏడుస్తూ. ‘నీకేటి మతిపోనదేటిర... గూడెం ఆసారం నీకు తెల్దేటి? కిందటేడు కాసమ్మ కాన్పు జెరక్క గిలగిల కొట్టుకుంతుంటే, దాని పెనిమిటి కొండప్ప ఆసుపెత్రికి దీస్కుపోతన్నడు. గుర్రప్ప ఒప్పుకున్నడేటి? ఆసారం దప్పుతావేట్ర ఎదవనాయాలంటు గయ్యిన లేసినడు గద...’ ‘పేనం కంటే ఆసారం గొప్పదేటి? నాకు సిసిరికంటే మరేటి గొప్పది గాదు. దాన్ని బతికించుకుందానికి నాను ఆసారం దప్పుతను. గుర్రప్ప ఏటిసేస్తడో సేసుకోమను’ తెగింపుగా అన్నాడు సోము. ‘గుర్రప్ప దయదాచ్చన్యంనేనోడు. గూడెం కట్టుబాటు దప్పితే సిచ్చేసి, ఎలేస్తడు. గూడెం ఇడిసి మనం బతకలేం. దేవతమీద బారమేసి వొల్లకుండడమే’ నచ్చజెప్తూ అన్నాడు కన్నప్ప. ‘ఎలేస్తడని బయిపడితే సిసిరి సస్తది. సిసిరికి ఉసురుంతే ఈడగాకబోతే ఏడన్న బతుకుతం. ఒరే అయ్య... నా మాటిని సాయం సెయ్య. సిసిరిని డోలీగట్టుకుని ఆసుపెత్రికి దీస్కుపోదం’ దీనంగా బతిమాలాడు సోము. గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్ప ఆగ్రహానికి గురికావడమే! అయితే కొడుకు బాధను చూడలేకపోయాడు కన్నప్ప. ఆచారం కోసం కోడల్ని చంపుకోవడం ఆయనకూ ఇష్టం లేదు. ‘సరే బయిలెల్లయితే’ అంటూ డోలీ కట్టడానికి దుప్పట్లు, పొడవైన వెదురుబొంగు అందుకున్నాడు. సోము గాబరాగా అటకెక్కి పెట్టెలో దాచుకున్న డబ్బులను మొల్లో దోపుకున్నాడు. డోలీ ముందు కొమ్ము కన్నప్ప, వెనుక కొమ్ము సోము భుజాలమీద వుంచుకుని మోసుకుపోతున్నారు. మంచును చీల్చుకుంటూ, రాయీరప్పను దాటుకుంటూ, తుప్పలు డొంకలను తప్పించుకుంటూ దూసుకుపోతున్నారు. డోలీకి పక్కగా సోము అమ్మ నారమ్మ కంగారుగా నడుస్తోంది. ఏ క్షణంలో గుర్రప్పొచ్చి తమను అడ్డుకుంటాడోనని ఆమె భయపడుతోంది. మరోపక్క సిసిరిని ఆపదనుంచి గట్టెక్కించమని కొండదేవతకు పదేపదే మొరపెట్టుకుంటోంది. సిసిరి మూలుగు తప్ప మరే శబ్దమూలేని ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయాసపడుతూ అడుగులేస్తున్న కన్నప్ప, సోము హఠాత్తుగా ఆగిపోయారు. ఓ అమ్ము వారిపక్క నుంచి రివ్వున దూసుకొచ్చి ఎదురుగా ఉన్న జువ్విచెట్టుకు గుచ్చుకుంది. వెనక్కి తిరిగి చూసి హడలిపోయారు. ముంచుకొస్తున్న విపత్తును చూసి నారమ్మ గుండెలు బాదుకుంటూ కూలబడిపోయింది. అల్లంత దూరంలో గుర్రప్ప, విల్లంబులు పట్టుకుని, గూడెం ప్రజలను వెంటేసుకుని వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు. ఆ దృశ్యం చూసి కన్నప్ప, సోము జడుసుకుని డోలీని కిందకు దించారు. గుర్రప్ప వస్తూనే కన్నప్పను మెడపట్టుకొని పక్కనున్న డొంకలోకి తోసేశాడు. నారమ్మ వైపు కొరకొర చూసి బండబూతులు తిట్టాడు. సోమును పట్టుకొని చెంపలు వాయించేశాడు. ‘ఏరా గుంటనాయాల... గూడెం కట్టుబాటును దప్పే దయిర్యం వొచ్చేసిందన్న మాట నీకు’ అంటూ నిప్పులు కక్కాడు. సోము గుర్రప్ప కాళ్ళమీద పడిపోయాడు ‘నీకు దన్నం పెడత గుర్రప్ప. సిసిరికి వయిద్యమందకబోతే సచ్చిపోద్ది. ఈ పాలికి మా తొప్పుకాసి ఒగ్గియ్యి’ అంటూ. ‘ఒగ్గియ్యిడానికేట్ర... మామంత పరుగు పరుగునొచ్చింది? ఆసారం కాపాడుకోటానికి’ గుర్రప్ప కోపంగా అన్నాడు. సోము ధైర్యం కూడగట్టుకొని ‘ మడిసి పేనాలు తీసే ఆసారం మాకొద్దు. కాలం మారినది గుర్రప్ప. దిగువున సాన గూడేలు మార్నయి. మనము మారదం’ అన్నాడు. ‘గుంటడు సెప్పే కొబుర్లు ఇనీడానికి నానేమి ఎర్రి మేకనుగాదు, మేకల్ని నమిలేసే పెద్దపులిని! గూడెం పెద్దగ ఆసారాన్ని రచ్చించడం కోసరం ఎంతకైన తెగిత్తను.’ డొంకలో పడ్డ కన్నప్ప నెమ్మదిగా లేచి.. ‘గుర్రప్ప... కోపమిడిసి సాంతంగ ఆలోసించు. ఇంతవొరకు ఆసారం కోసరం ఎందరో ఆడకూతుర్ల ఉసురోసుకున్నం. పురుడు రాక గిలగిలకొట్టుకుంతున్న సిసిరిని బతికించుకుందం. కూస్త పెద్దమనుసు సేసుకుని మమ్ము ఆసుపెత్రికి అంపు’ బతిమాలుతూ అన్నాడు. ‘అరే కన్నప్ప... ఉప్పుడువొరకు కట్టుబాట్లకు అడ్డుసెప్పని నువ్వు, నీవొరకు వొచ్చేసరికి ఆటిని దప్పమంతన్నవు. నీకో నాయం, మరోల్లకింకో నాయం సేయమంతున్నవు? ఇలగయితే రేపు మరోడు మరో ఆసారం దప్పుతడు. అప్పుడు గూడ నాను సూస్తు కూకోవల? గూడెం ఆసారాలు, కట్టుబాట్లు అందరు ఆచెరించాల్సిందే!’ అన్నాడు గుర్రప్ప కళ్ళెర్రజేసి. మంచు క్రమంగా తొలగిపోతోంది. సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి విచ్చుకుంటున్నాయి. ప్రసవ వేదనతో సిసిరి గింజుకుంటోంది. గుర్రప్ప సిసిరిని సమీపించి ‘నొప్పులోర్సుకుని కులదేవతకు మొక్కుకోయే. నీకేటిగాదు’ అంటూ ధైర్యం చెప్పి, డోలీని కీడు గుడిసెకు చేర్చమని ఓ ఇద్దరు యువకులకు పురమాయించాడు. వారు డోలీని భుజాలకెత్తుకుంటుంటే సోము, కన్నప్ప ఏడుస్తూ అడ్డుపడ్డారు. వారిని అక్కడున్న మగోళ్ళు తలోమాటతో దూషిస్తూ పక్కకు లాగారు. ఆడోళ్ళు చోద్యం చూస్తూ నిల్చున్నారు. అంతలో ఆ ఆడోళ్ళ మధ్యనున్న గుర్రప్ప పెళ్ళాం చుక్కమ్మ, జుట్టు విరబోసుకుని గట్టిగా అరుస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఆమెకు తమ కులదేవత పూనిందని, ఎవరో వేపకొమ్మలు విరిచి ఆమె చేతిలో పెట్టారు. ఆమె తల గుండ్రంగా ఊపుతూ, రాగాలు తీస్తూ ‘నాను కొండదేవతన్రో గుర్రప్ప... నువ్వు తొప్పు సేత్తున్నవ్రో... తొప్పు సేత్తున్నవు’ అంటూ గుర్రప్పను వేపకొమ్మలతో కొడుతోంది. ఆడోళ్ళు చుక్కమ్మను గట్టిగా పట్టుకుని ‘తల్లీ... అమ్మా... తొప్పేటో సెప్పు తల్లీ. సెప్పు...’ అని అడుగుతున్నారు. చుక్కమ్మ రౌద్రంగా మొహంపెట్టి ‘సిసిరి నా బిడ్డరో బిడ్డ. అది పాపం పున్నెం దెలీని పిల్లరో... అది గూడేనికి ఎలుగురో... దాని కడుపులో బిడ్డ అడ్డం దిరిగినదిరో... దాన్ని ఆసుపెత్రికి దీసుకుబోనివ్వడ్రో... అది సస్తే గూడేనికి సేటుకాలమొస్తదిరో... గూడెం వొల్లకాడవుద్దిరో... నా మాటినికొండ్రో...’ అంటూ రాగాలు తీసి చెప్తూ, హఠాత్తుగా సొమ్మసిల్లి కింద పడిపోయింది. అది విని గుర్రప్పతో సహా అంతా కొయ్యబారిపోయారు. ఏనాడూ చుక్కమ్మ మీదకు రాని కులదేవత, ఇప్పుడిలా వచ్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. సిసిరి చచ్చిపోతే గూడేనికి అరిష్టమని అంతా ఊసులెట్టుకున్నారు. గుర్రప్ప తెగ భయపడిపోయాడు. ఆకాశంలోకి చూసి దండం పెడుతూ ‘తప్పైపోనది, సెమించు తల్లీ... గూడెమ్మీద గుర్రెట్టుకోకు. దయిసూపు తల్లీ... నువ్వు సెప్పినట్టే సిసిరిని ఆసుపెత్రికి దీస్కుబోతం’ అని లెంపలేసుకున్నాడు. సిసిరిని ఆసుపత్రికి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. అంతే.. సోము, కన్నప్ప వేగంగా కదిలి డోలీని భుజాలకెత్తుకొని పరుగందుకున్నారు. నారమ్మతోపాటు గూడెంలోని కొందరు .. సాయంగా డోలీవెంట నడిచారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సిసిరిని చేర్చారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించారు. ఆపరేషన్ చేసి, తల్లీబిడ్డను కాపాడారు. చలికాలం గడిచి, ఎండాకాలం ఆఖరుకొచ్చింది.. ఓ రోజు ఉదయం సోము గుడిసెలో ఒంటరిగా కూర్చుని, మూడ్రోజుల కిందట కీడు గుడిసెకెళ్లిన సిసిరికోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి తలారా స్నానంచేసి బిడ్డను చంకనేసుకుని వచ్చింది సిసిరి. సోము పక్కన కూర్చుని ‘ఎవురుతోటి సెప్పనంటే నీకో రహస్యెం సెప్పుతను!’ అంది నెమ్మదిగా. ‘సెప్పనుగనీ ఏటా రహస్యెం?’ అడిగాడు ఆత్రుతగా సోము. ‘సుక్కమ్మ నిన్న కీడు గుడిసెకొచ్చినది. ఎవురుతోటి సెప్పొద్దని రేత్రి ఓ రహస్యెం సెవినేసింది. ఆ రోజున సుక్కమ్మమీదన నిజెంగ కొండదేవత పూన్లేదంట. నా పేనాలుగాపాడానికి ఇంకో మార్గంనేక దేవతకు సెమాపన సెప్పి అట్టా నాటకమాడినదంట. ఇన్నాక నా కల్లమ్మట నీల్లొచ్చిసినయి. సుక్కమ్మ కాల్లమీద పడిపోనను’ చెప్పింది ఉద్విగ్నంగా. అది విని సోము ఆశ్చర్యపోయాడు. చుక్కమ్మ చేసిన సాయానికి అతడి మనసు పులకించింది. గూడెం ఆచారాలకు, కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఇక తమ మూఢాచారాలకు త్వరలోనే చెల్లుచీటి పడుతుందని భావించాడు. సిసిరి ఒళ్ళోని బిడ్డను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ‘సిట్టితల్లీ... మీయమ్మడుతున్న ఇక్కట్లు సూసి, ఆడబుట్టుక బుట్టినానని బెంగెట్టుకోకు... నువ్వు పెద్దయ్యేసెరికి యీ ఆసారాలేం వుండవునే. గూడెం పెద్దతోనే కీడు గుడిసెకు అగ్గెట్టేసే రోజు తొందర్లోనే వస్తది. ఆ రోజు కోసరం నాను పోరాడతనేవుంట’ అన్నాడు దృఢంగా, ఆశగా. ఆ చంటిబిడ్డకు ఏమర్థమయిందో తండ్రివైపు చూస్తూ బోసినవ్వు నవ్వింది. -బొడ్డేడ బలరామస్వామి -
మిస్టరీ.. ఎలిసా లామ్ డెత్ స్టోరీ
సరైన సాక్ష్యాధారాలు లేని నేరాలన్నీ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. ఆత్మలు, దెయ్యాలు అంటూ హారర్ కోణాన్ని తలపిస్తాయి. ఎలిసా లామ్ అనే 21 ఏళ్ల అమ్మాయి మరణోదంతం కూడా అలాంటిదే. అది 2013, ఫిబ్రవరి 19.. లాస్ఏంజెలెస్ (అమెరికా)లోని సెసిల్ అనే హోటల్ రిసెప్షన్కి.. వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చేస్తోంది ఎవరో కాదు.. ఆ హోటల్లో దిగిన గెస్టులే. ‘హోటల్ సర్వీస్ అంతా బాగానే ఉంది కానీ.. ట్యాప్ వాటర్ మురికిగా, కాస్త కుళ్లిన వాసనతో వస్తున్నాయి’ ఇదే వారందరి కంప్లైంట్. దాంతో హోటల్ సిబ్బంది రంగంలోకి దిగింది. 14 ఫ్లోర్లు, 700 గెస్ట్ రూములతో ఉన్న తొంభై ఏళ్లనాటి సెసిల్ హోటల్కి దేశవిదేశాల టూరిస్టులు, పెద్దపెద్ద బిజినెస్ మేగ్నెట్స్ చాలా మంది వస్తూపోతూ ఉంటారు. ఉన్న నాలుగు ట్యాంకుల్నీ ఒక్కోటిగా చెక్ చేస్తూ వస్తున్నారు సిబ్బంది. వాటిలో ఒక ట్యాంక్ మూత తీయగానే గుప్పుమంది దుర్గంధం. తొంగి చూస్తే.. అందులో బాగా కుళ్లిన యువతి శవం తేలియాడుతోంది. ఆ దుర్వార్త మీడియాను చేరింది. అప్పటికే ఆ హోటల్ మీద యువతి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో అక్కడికి చేరుకోవడానికి.. పోలీసులకు, మీడియాకి ఎంతో సమయం పట్టలేదు. ట్యాంక్లో దొరికన శవం చైనా సంతతికి చెందిన కెనడా దేశస్తురాలిదని గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆ అమ్మాయి పేరు ఎలీసా లామ్. ఎవరీ ఎలిసా? ఎలిసా లామ్.. 1991, ఏప్రిల్ 30న కెనడా, బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్లో.. డేవిడ్, యెన్నా లామ్ దంపతులకు జన్మించింది. ఆమెకు సారా అనే ఒక సోదరి కూడా ఉంది. ఉద్యోగానికి ముందే ప్రపంచాన్ని చుట్టిరావాలనేది ఎలిసా కల. అదే విషయాన్ని తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఇంట్లో చెప్పింది. మొదట వాళ్లు ససేమిరా అన్నారు. ‘ప్రతి రోజు కాల్ చేస్తుంటాను’ అనే ఒప్పందం మీద ఎలిసా ఒంటరిగానే లాస్ ఏంజెలెస్ బయలుదేరింది. 2013 జనవరి 26న లాస్ఏంజెలెస్లోని సెసిల్ హోటల్లో దిగింది. నాలుగు రోజుల పాటు ప్రతి చిన్న విషయాన్ని ఫోన్లో తల్లిదండ్రులతో పంచుకునేది. అలా జనవరి 31 ఉదయం పూటా చాలాసేపు మాట్లాడింది. ఆ తర్వాతే ఆమె నుంచి ఫోన్కాల్స్ లేవు. తల్లిదండ్రులు ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. రోజులు గడుస్తున్నా ఎలిసా నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎలిసా అదృశ్యం కేసు నమోదైంది. వెంటనే సెసిల్ హోటల్ వైపు తిరిగాయి పోలీస్ జీప్లు, మీడియా ఓబీ వ్యాన్లు. విదేశీ యువతి ఎలిసా మాయం అంటూ వార్తా కథనాలు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలోనూ ప్రచారం విస్తృతమైంది. అప్పుడే ఓ వీడియో ప్రపంచాన్ని వణికించింది. అది సెసిల్ హోటల్ లిఫ్ట్లోని సీసీ ఫుటేజ్. పోలీసుల దర్యాప్తులో ఫిబ్రవరి 13న బయటపడిన ఆ వీడియో ఎలిసా చివరి క్షణాలను కళ్లకు కట్టింది. ఆ వీడియోలో.. ఎలిసా పరుగున ఎవరో తరుముతున్నట్లు లిఫ్ట్లోకి వచ్చింది. బయటికి తొంగి తొంగి చూస్తూ.. మళ్లీ లిఫ్ట్ లోపలకు వచ్చేస్తూ.. అక్కడ నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంతో లిఫ్ట్లోని అన్ని అంతస్తుల బటన్లు నొక్కేసింది. ఎంతసేపటికీ లిఫ్ట్ కదలకపోయేసరికి.. చాలా సేపు లిఫ్ట్ గోడలకు ఆనుకుని, దాక్కుంది. అదేమిటో చిత్రం.. లిఫ్ట్ తలుపుల్ని ఏదో అతీంద్రియ శక్తి ఆపుతున్నట్లుగా వెంటనే మూతపడలేదు. దాంతో ఎలిసా లిఫ్ట్ బయటికి వెళ్లి.. ఎదురుగా ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లుగా స్పందించింది. చేతులు తిప్పుతూ, కంగారుపడుతూ.. ఏదో మాట్లాడుతూ.. కనిపించింది. ఎలిసా లిఫ్ట్ నుంచి బయటకి వెళ్లిపోవడంతో కొన్ని క్షణాల్లోనే లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. ఆ తర్వాత ఎలిసాకు ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ వీడియో చూసిన చాలా మంది ఆమెను దెయ్యం వెంబడించిందని నమ్మారు. అయితే కొందరు మాత్రం ఆమె మానసిక స్థితి సరిగా లేదని వాదించారు. సరిగ్గా 6 రోజులకు వాటర్ ట్యాంక్లో ఎలిసా శవమై తేలడంతో.. బాడీ పోస్ట్మార్టమ్కు వెళ్లింది. ఎలిసా బైపోలార్ డిజార్డర్తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు కొన్ని మందులు వాడుతోందని తేల్చాయి రిపోర్టులు. అయితే చనిపోయిన రోజు ఆమె ఆ మందులను తీసుకోకపోవడం వల్ల, ఆ సమస్య ఎక్కువై, ఎవరో తనని వెంటాడుతున్నట్లు భావించి లిఫ్ట్లో దాక్కోడానికి (సీసీ ఫుటేజ్లో చూసినట్లు) ప్రయత్నించి ఉంటుందని, ఆ భయంతోనే వాటర్ ట్యాంక్లో దూకి ఉండొచ్చని, ఈత తెలియక పైకి రాలేక అందులోనే మునిగి చనిపోయి ఉండవచ్చని అంచనా వేశారు నిపుణులు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. హోటల్ వాటర్ ట్యాంక్ని ఎవరు తెరిచినా రిసెప్ష¯Œ లో అలారం మోగుతుంది. మరి ఎలిసా ట్యాంక్లో పడినప్పుడు అలా ఎందుకు జరగలేదనే ప్రశ్న తలెత్తింది. ఇదే ప్రశ్న హోటల్ చీఫ్ ఇంజినీర్ పెడ్రో తోవర్ను వేసినప్పుడు .. ‘అలారం మోగకుండా డియాక్టివేట్ చేసి.. వాటర్ ట్యాంక్ మూతను తెరవడం మా సిబ్బందికి మాత్రమే సాధ్యం. మూత తెరవగానే రిసెప్ష¯Œ తో పాటు పైరెండు ఫ్లోర్లలో కూడా అలారం మోగి.. అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ప్రతిసారి మూత తెరిచే సిబ్బంది వివరాలు కచ్చితంగా రికార్డ్ అవుతాయి’ అని చెప్పాడు. దాంతో రికార్డులు పరిశీలించారు పోలీసులు. ఏ ఆధారం దొరకలేదు. పైగా అంత ఎల్తైన ట్యాంక్ ఎక్కాలంటే ఇంకొకరి సాయం లేనిదే సాధ్యం కాదని అక్కడి సిబ్బంది మాట. హోటల్ పక్కనే ఉన్న బుక్ స్టోర్ యజమాని కాటీ ఆర్పాన్.. ‘ఎలిసాని నేను చూశాను. వాళ్లింట్లో వారి కోసం కొన్ని పుస్తకాలు, మ్యూజిక్ సీడీలు మా షాప్లోనే కొన్నది’ అని తెలిపాడు. కాటీ మాటల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో లేదని స్పష్టమైంది. ఎలిసా గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ హోటల్ సెసిల్ చరిత్రను తవ్వారు. అప్పుడే తెలిసింది.. ఆ హోటల్కు ‘అమెరికన్స్ హోటల్ డెత్’ అనే మరో పేరుందని. 1920లో స్థాపించిన ఈ హోటల్ చరిత్రలో హత్యలు, ఆత్మహత్యలు కలుపుకుని మరణాల సంఖ్య పదహారుకు పైమాటేనట. 1927లో పెర్సీ ఆర్మాండ్ అనే వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఆ హోటల్లో ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉందట. 1944లో 19 ఏళ్ల బాలింత అప్పుడే పుట్టిన తన బిడ్డను ఈ హోటల్ కిటికీలోంచి విíసిరేసిందని అప్పట్లో ప్రతికలు రాశాయి. బ్లాక్ డాలియా అనే నటి ఈ హోటల్కు వెళ్లి రాగానే హత్యకు గురైంది. ఆ కేసు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. రిచర్డ్ రామిరేజ్ అనే సీరియల్ రేపిస్ట్ 1980లో చాలాకాలం ఈ హోటల్లోనే తలదాచుకున్నాడట. అనంతరం పోలీసులకు భయపడి మారిన్ హెల్త్ మెడికల్ సెంటర్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మ ఈ హోటల్లోనే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఆత్మే ఎలిసాని చంపేసిందనీ అంటారు. ఏదిఏమైనా ఎలిసా ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? హత్యా? ఆత్మహత్యా? అనే ప్రశ్నలు నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన -
హార్ట్ క్రాఫ్ట్.. 'కళ'పోసిన చేతులు
రెండు చేతులు జట్టు కడితే బలం. ఆ చేతులకు భావుకత జత కూడితే అది అందమైన కళారూపం. ప్రకృతి అందాలను సందర్శించినప్పుడు బ్రహ్మ సృష్టి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కళలను కనులారా కాంచినపుడు మానవ సృష్టి గురించి అంతే ఘనంగా చాటుతాం. భారతీయతను ఎవరికి పరిచయం చేయాలన్నా మన హస్తకళలను చూపితే చాలు, సంస్కృతీ సంప్రదాయాలతో నిండిన చారిత్రక వైభవం కోటి కథల పందిరై కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ‘కళ’పోసిన చేతులను ఆకాశమే హద్దుగా కీర్తిస్తుంది. ఇప్పుడు ఆ చేతుల చేతలను స్మరించుకునే సందర్భం.. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటీవల ప్రదానం చేసిన ‘ సన్మాన్ ’ పురస్కారాలే! గౌరీదేవి నలుగుపిండితో ముచ్చటైన బొమ్మను చేసి, ప్రాణం పోసిందని పురాణ కథ. కృష్ణుడు.. రాధ కోసం బంగారు జరీతో వస్త్రాలను రూపొందించాడని ఇతిహాసం. జానపద కథలను చిత్రాలుగా రంగులద్దారని చారిత్రకం. ఏ దేశమేగినా మన హస్తకళలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. అగ్గిపెట్టెలో పట్టేటంత చీర, బంగారు దారాలతో అల్లిక, ఎటువైపు చూసినా ఒకేలా అనిపించే నైపుణ్యం, కాలాన్ని పలికించే బొమ్మలు, రాళ్ల రంగుల చిత్రాలు... నేటి హస్త కళా నైపుణ్యానికి అడ్డుగీతలు లేనే లేవని చాటుతూ భారతీయ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు కళాకారులు. హస్తకళలన్నీ ఒకే తాటిపైకి వచ్చేలా వారధులుగా నిలుస్తున్నారు వ్యాపారులు. నడతను మార్చే సృజన కళలకు పాఠ్యాంశాలు అక్కర్లేకపోవచ్చు కానీ, కళలు జీవన పాఠాలు నేర్పుతాయి. సమాజంలో బాధ్యతను, నడవడికను ఒంటపట్టేలా చేస్తాయి. ముఖ్యంగా రేపటి పౌరుల పెంపకంలో హస్తకళలు ఎనలేని ఆలోచనను పెంపొందిస్తాయి. మనిషిని సున్నితత్వంవైపు పయనింపజేస్తాయి. చూస్తున్న కంటికి, చేస్తున్న చేతికి వారధిగా నిలిచిన కళ ‘శ్రద్ధ’ అనే దారాలను అల్లుతూనే ఉంటుంది. ఏకాగ్రత, క్రమశిక్షణతో పాటు జీవనగమనానికి దారి అవుతుంది. ఒకప్పుడు ఎందుకూ పనికిరావనుకునే కళలు, వృత్తులు ఈ టెక్నాలజీ యుగంలోనూ కొత్త ఉపాధికి మార్గాలు అవుతున్నాయి. ఉన్న ఆదాయానికి అదనపు వెసులుబాటుగా మారుతున్నాయి. కరోనా నేర్పిన పాఠం నుంచి మనిషి పల్లెజీవనం వైపుగా దృష్టి సారించినట్టే.. ఆ పల్లె అందించిన కళలను ఔపోసన పట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది నేటి యువత. కనీసం ఒక్క కళారూపాన్నయినా కళ్ల ముందు నిలిపేందుకు తాపత్రయపడుతోంది. దగ్గరగా ఉన్న పదార్థాలే పనిముట్లు కొన్ని సాధారణ, తేలికైన పనిముట్లను మాత్రమే వాడి కేవలం చేతులతో రూపొందించే వస్తువులు హస్తకళలుగా విరాజిల్లుతున్నాయి. చేతులతో బట్టలు, అచ్చులు, కాగితాలు, మొక్కలకు సంబంధించిన పదార్థాలను వాడి తయారు చేసే సృజనాత్మక రూపాలన్నీ హస్తకళల కిందికి వస్తాయి. వ్యక్తిగత అవసరాలకు, వ్యాపారం చేసుకోవడానికి చేత్తో తయారుచేసే అలంకార వస్తువులన్నీ హస్తకళలుగానే ప్రాచుర్యం చెందుతున్నాయి. ఈ కళల మూలాలన్నీ గ్రామీణ కళల్లోనే ఉన్నాయి. ప్రాచీన నాగరికతల నుంచి మనిషి తన వివిధ రకాల అవసరాల కోసం వీటిని కొత్తగా కనుక్కుంటూ వస్తున్నాడు. కొన్ని కళలు శతాబ్దాల నుంచీ ఉండగా, మరికొన్ని అధునాతనంగా రూపుదాల్చుతున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కళలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. హస్తకళల్లో చాలా వరకు తమకు దగ్గరలో ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్థాలనే వాడినా, కొన్నింటిలో సంప్రదాయేతర పదార్థాలనూ వాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ దేశ ఆర్థిక వ్యవస్థలో హస్తకళల రంగం ముఖ్య భూమికను పోషిస్తోంది. అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగాల్లో ఒకటిగా ఉండటమే కాదు, ఎగుమతుల్లోనూ గణనీయమైన వాటా కలిగి ఉంది. రాష్ట్ర, ప్రాంతీయ బృందాలు హస్తకళారూపాల ఎగుమతికి కృషిచేస్తున్నాయి. భారతీయ హస్తకళల పరిశ్రమలో 70 లక్షలకు పైగా కళాకారులు ఉన్నట్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గణాంకాలు చెబుతున్నాయి. 2021 సంవత్సరానికి వివిధ విభాగాలలో భారతదేశం నుంచి హస్తకళల ఎగుమతులు కోట్లాది డాలర్లలో ఉన్నాయి. వీటిలో కలప సంబంధితమైవి 84.5 కోట్ల డాలర్లు, ఎంబ్రాయిడరీ, క్రొచెట్కి సంబంధించినవి 60.4 కోట్ల డాలర్లు, ఆర్ట్ మెటల్ వస్తువులు 46.8 కోట్ల డాలర్లు, హ్యాండ్ప్రింటెడ్ టెక్స్టైల్స్ 33.9 కోట్ల డాలర్లు, ఫ్యాషన్ ఆభరణాలు 18.6 కోట్ల డాలర్లు, ఇతర హస్తకళలు 82.6 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి. అమెరికా, కెనడా, యూరప్లోని ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, లాటిన్ అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా వంటి అగ్రదేశాలకు భారతీయ హస్తకళారూపాలు ఎగుమతి అవుతున్నాయి. ప్రాంతీయ వైభవం అయినప్పటికీ, కొన్ని కళలు ఆధునికతను అందుకునే శక్తిలేక కునారిల్లుతున్నాయి. మరికొన్ని సరైన ఉపాధి ఇవ్వలేక అంతరించిపోతున్నాయి. కానీ, కొంతమంది కళాకారులు మాత్రం తమ హస్తకళలకు కొత్త ఊపిరిపోస్తున్నారు. ఆ సేతు హిమాచలం వరకు ఒక్కోరాష్ట్రం తమవైన ప్రాంతీయ హస్తకళలతో విరాజిల్లేలా చేస్తున్నారు. భారతమాత మెడలోని హారాలై మెరుస్తూనే ఉన్నారు. ఆ హారంలోని మేలిమి రత్నాలను ఇటీవల ‘సమ్మాన్’ అవార్డులతో సత్కరించింది తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కౌన్సిల్. కన్నుల పండువ చేసే చేర్యాల పెయింటింగ్ కళలల్లో మెరుగైన జీవనాన్ని వెతుక్కోవడానికి ఈ కాలం సరైన సమాధానంగా వచ్చి నిలిచింది. అందుకు నకాషి కళగా పేరొందిన చేర్యాల పెయింటింగ్స్ను చెప్పుకోవచ్చు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేర్యాల గ్రామంలో పురుడు పోసుకుంది ఈ కళ. నాలుగువందల ఏళ్ల నాటి ఈ కళకు జానపద కథలు మూలాధారంగా నిలిచాయి. ఇతిహాసాలు, పురాణ కథలూ ఈ చిత్రకళలో కొత్తగా ఊపిరిపోసుకుంటున్నాయి. ఈ కళను కులవృత్తిగా సాన పట్టిన సాయికిరణ్ నేటి యువత అవసరాలకు అనుగుణంగా వినూత్నంగా ఆలోచించి కళ్లద్దాల హోల్డర్లు, పెన్ స్టాండ్లు, పేపర్ బాక్సులు తయారుచేస్తున్నాడు. ఒకప్పుడు నకాషి కళతో తయారుచేసిన పెయిటింగ్స్, తోలు బొమ్మలతో పల్లెల్లో కథలు చెప్పి అలరించేవారు. కథల గానంలో ఈ కళ ముఖ్య పాత్ర పోషించేది. ‘సంప్రదాయ మహిళ తన రోజువారీ జీవితం’ కథతో సాయి కిరణ్ బొమ్మను తయారుచేశాడు. చింతపండు మిశ్రమం, రంపపు పొట్టు, రాళ్ల నుండి తీసిన ఎరుపు రంగును ఉపయోగించిన ఈ బొమ్మ తయారీకి ఇరవై రోజులు పట్టింద’ని వివరించాడు సాయి కిరణ్. ఈ అద్భుతమైన కళాఖండానికి హ్యాండీక్రాఫ్ట్స్ విభాగంలో పింగళి కమలారెడ్డి సమ్మాన్ అవార్డు లభించింది. ఎల్లలు చెరిపేసిన జమ్దానీ పశ్చిమబెంగాల్ చేనేతకారుడు జ్యోతిష్ దేబ్నాథ్ పూర్వీకులు బంగ్లాదేశ్లోని జమ్దానీలో ఉండేవారు. దేశ విభజన సమయంలో పెద్ద సంఖ్యలో హిందూ నేతకార్మికులు భారతదేశానికి వలస వచ్చారు. రెండువేల సంవత్సరాల ఘనత ఉన్న జమ్దానీ కళను సాధన చేసిన జ్యోతిష్ దేబ్నాథ్ నూలు వస్త్రాల నేతకళలో క్లిష్టమైన నేర్పును చూపిస్తాడు. వస్త్రాలను అందంగా నేయడంలో ప్రవీణుడిగా పేరొందాడు. ‘జమ్దానీ చీరను పిట్ లూమ్లో పూర్తి చేయడానికి 45 రోజులు పట్టింది. నూలుదారాల్లో అన్నీ సహజ రంగులనే వాడటంతో పాటు జరీ దారాన్ని కూడా ఉపయోగించి చీరను నేశాను’ అని వివరిస్తాడు జ్యోతిష్. రూ.30 వేల ధర పలికే ఈ చీర అద్భుతమైన హస్తకళకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఏడాది జ్యోతిష్కు చేనేత విభాగంలో కళాంజలి సమ్మాన్ అవార్డు లభించింది. చరకసంస్థ కన్నడ నాటక రంగానికి మార్గదర్శకులుగా ఉన్న ప్రసన్న.. దేశీ చరక సంస్థలకు వ్యవస్థాపక ధర్మకర్త. చరక సంస్థ అనేది దక్షిణ భారతదేశంలోని çపడమటి కనుమల్లోని భీమన్కోన్ గ్రామంలో ఉన్న మహిళల మల్టీపర్పస్ ప్రారిశ్రామిక సహకార సంఘం. ఈ సంస్థలో తయారుచేసిన రెడీమేడ్ వస్త్రాలు బెంగళూరు, మైసూరు, ధార్వాడ్, శివమొగ్గ వంటి నగరాల్లో దేశీ బ్రాండ్తో రిటైల్ ఔట్లెట్లలో అమ్ముతారు. సహజమైన రంగుల్లో చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తుందీ సంస్థ. శివమొగ్గ, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో దాదాపు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. చేనేత రంగంపై ఎన్నో పుస్తకాలను రాసిన ప్రసన్నకు ఈ ఏడాది తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. రెండువైపులా అందమైన అనుభూతి.. మీర్జాపూర్ మీనాకారి పశ్చిమ బెంగాల్లోని మీర్జాపూర్కు చెందిన సంప్రదాయ కళకు అంతర్జాతీయ పేరుంది. క్లిష్టమైన అల్లికలతో కూడిన ఈ ఆర్ట్కు మీనాకారి అని పేరు. బెంగళూరు నుంచి వచ్చే çపట్టుచీరలపై మాల్దా ప్రాంతం నుంచి వచ్చే బంగారు దారంతో అల్లే మీనాకారి అసామాన్యమైన కళగా పేరొందింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా ఈ కళను అందిపుచ్చుకున్నాడు పలాశ్ మునియా. పదమూడేళ్లు శ్రమించి క్లిష్టమైన డిజైన్లు, అల్లిబిల్లి అల్లికలను సృష్టించాడు. ఆ నైపుణ్యంతోనే చీరకు రెండు వైపులా ఒకే రకంగా కనిపించే అందమైన అల్లికను తీసుకొచ్చాడు. భారతదేశ ప్రాచీన కళను కాపాడుతున్నందుకు గాను పలాశ్ మునియాకు ఈ ఏడాది హ్యాండ్లూమ్ విభాగంలో ఇంజమూరి శ్రీనివాసరావు కన్సొలేషన్ అవార్డును ప్రదానం చేశారు. కళావారధి : మోరి ఆధునిక బ్రాండ్లు ఎన్ని వచ్చినా ప్రపంచం చూపు హస్తకళలవైపే అనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ప్రాచీన కళను ఆధునిక కాలానికి తీసుకురావడానికి ఓ వారధిగా కృషి చేస్తోంది. గుజరాత్ వాసి అయిన బృందా దత్. భారతీయ హస్త కళల సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘దేశంలో కళాకారులు ఏ మూల ఉన్నా అక్కడ నేనుంటాను’ అంటుంది ఈ యూత్ ఐకాన్. భారతీయ హస్తకళల పట్ల అపారమైన గౌరవం, ఆధునిక భావాల అభిరుచితో భూత భవిష్యత్తుల కలయికగా ‘మోరి డైనమిక్ డిజైన్ స్టూడియో’ను గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించింది బృందా దత్. దేశం నలుమూలలనున్న క్రాఫ్ట్స్ కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తూ, తన అనుభవాన్ని మెరుగుపరచుకుంటూ కళ ఎప్పటికీ నిలిచేలా వినూత్నమైన డిజైన్లను రూపొందిస్తోంది ఆమె. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలూ కల్పిస్తోంది. భారతీయ హస్తకళలను ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా ‘మోరి’సంస్థను ఏర్పాటు చేసిన బృందా దత్కు క్రాఫ్ట్ప్రెన్యూర్ అవార్డు లభించింది. చిన్నారి కళనేత గద్వాల తెలంగాణలోని గద్వాల నేత కళల కాణాచి. గద్వాల పేరు వింటేనే అక్కడి చేనేత కళ్ల ముందు నిలుస్తుంది. చేనేతకారుల కుటుంబం నుంచి అతి పిన్న వయసులో నైపుణ్యం సాధించిన మెట్ట స్వాతిలక్ష్మి బాలకళాకారిణిగా పేరొందింది. పదేళ్ళ వయసు నుంచే నేత పనితో కుటుంబానికి సాయంగా ఉంటోంది స్వాతిలక్ష్మి. ఆమె పనిలో నైపుణ్యం, అంకిత భావం చెప్పుకోదగినది. కుటంబానికి ఆమే ఏకైక ఆర్థిక ఆధారం. చిన్న వయసులోనే ఆమె సాధించిన నైపుణ్యంతో పాటు కుటుంబానికి అండగా ఉంటున్న స్వాతిలక్ష్మి ఈ ఏడాది చైల్డ్ ఆర్టిసన్గా గుర్తింపు పొందింది. బంగారు నైపుణ్యం: వెంకటగిరి వెంకటగిరి చేనేత చీరలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీయులనూ ఆకర్షిస్తున్నాయి. ఈ చీరలకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వెండి జరీ, హాఫ్ ఫైన్ జరీ వంటి రకాలతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. చక్కటి నైపుణ్యంతో నేసిన ఈ చీరలకు ఆంధ్రాలోనే కాదు తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ గొప్ప గిరాకీ ఉంది. ఆధునిక డిజైన్లతో మగ్గంపై నేసే ఈ చీరల్లోని జామ్దానీ వర్క్కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్లా కనబడటం జామ్దానీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇలాంటి నైపుణ్యం మరెక్కడా కనపడదు. కాటన్లో చెంగావి రంగు చీరల తయారీ ఇక్కడి కార్మికుల నైపుణ్యానికి నిదర్శం. ఈ ప్రాంతంలో తరతరాలుగా కుటుంబ జీవనాధారంగా చేనేత పని నడుస్తోంది. వీరిలో పట్నం మునిరాజు కుటుంబాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మునిరాజు చేనేత విభాగంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నారు. మల్బరీ పట్టు చేనేతలో గ్రాము బంగారు దారాన్ని ఉపయోగించి, 30 రోజుల్లో చీరను నేసిన మునిరాజు అత్యద్భుతమైన కళానైపుణ్యానికి చేనేత విభాగంలో శ్రీమతి లలిత ప్రసాద్ సమ్మాన్ అవార్డ్ లభించింది. దంతపు చెక్క బొమ్మ : చెన్నపట్నం బెంగళూరు, మైసూరు నగరాల మధ్య ఉన్న చెన్నపట్నంలోని ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కౌసర్ పాషా తరతరాలుగా వస్తున్న కుటుంబకళను ఔపోసన పట్టాడు. కనీసం ఇరవై మందికి ఉపాధి కల్పించేలా వర్క్షాప్ను నిర్వహిస్తున్నాడు. అంకుడు చెట్టు నుంచి మెత్తని మృదువైన కలపను ఈ కళలో ఉపయోగిస్తారు. దీనిని ఆలేమారా అంటే ‘దంతపు చెక్క’ అని కూడా పిలుస్తారు. ఇది మంచి తెలుపు రంగులో ఉంటుంది. తేలికగా వంగుతుంది. సులభంగా అచ్చు వేయవచ్చు. అవసరమైన ఆకారాన్ని రూపొందించవచ్చు. బొమ్మ పూర్తయిన తర్వాత సహజ రంగులతో పెయిటింగ్ వేస్తారు. ఇది పిల్లలు ఆడుకోవడానికి చాలా సురక్షితమైనదిగా పేరొందింది. పాఠశాలల్లో ముఖ్యంగా మాంటిస్సోరిలో నర్సరీ పిల్లలకు ఉపయోగించే పరికరాలు, అబాకస్, సైజ్ వెరిఫికేషన్ బ్లాక్స్, లూప్ నిచ్చెనలు, కౌంటింగ్ సెట్లు, విజిల్స్, గిలక్కాయలు, కిచెన్ సెట్స్, అనేక ఇతర బొమ్మలనూ వీరు తయారుచేస్తారు. చెన్నపట్నం పల్లెటూరి జీవితంపై అత్యద్భుతమైన హస్తకళతో రూపొందించిన కౌసర్ పాషాకు ప్రోత్సాహక సమ్మాన్ అవార్డు లభించింది. ఏ కళ బతకాలన్నా సంప్రదాతకు ఆధునికత కూడా తోడవ్వాలి. కాలానుగుణమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. ప్రాచీన కళలోని సూక్ష్మాలను వెలికి తీయాలి. వేల ఏళ్ల చరిత్రను ముందు తరాలకు పరిచయం చేస్తున్న కళాకారుల కృషికి తగిన గుర్తింపు దక్కాలి. వారి జీవనం సంపన్నంగా ఉంటేనే భారతీయ కళలు సుసంపన్నం అవుతాయి. గత కాలపు కళ వేళ్లు పట్టుకొన్న ఈతరం చేతులు మరిన్ని కొత్త నైపుణ్యాలను దిద్దుకుంటాయి. -నిర్మలారెడ్డి జీవమున్న బొమ్మ.. ఏటికొప్పాక ఆంధ్రప్రదేశ్లోని ఏటికొప్పాక బొమ్మలను ఒకసారి చూస్తే చాలు మనసులో సున్నితమైన భావాలు కలుగుతాయి. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలంలోని గ్రామం ఏటికొప్పాక. లక్క బొమ్మల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఏటికొప్పాక బొమ్మలంటేనే ఓ బ్రాండ్. అక్కడి కళాకారుల సృజనాత్మక శక్తికి తిరుగులేదు. పూలు, చెట్ల బెరడుల నుంచి చేసిన రంగులను ఇక్కడ బొమ్మలకు ఉపయోగిస్తారు. ఏటికొప్పాక బొమ్మ చేయడమంటే ఓ జీవికి ప్రాణం పోసినంత పని. ఎందుకంటే ప్రతి బొమ్మనీ విడిగా తయారుచేయాల్సిందే. మూస పోసి ఒకే పోలికున్న బొమ్మలు చేయడానికి అచ్చులు ఉండవు. దేనికదే ప్రత్యేకం. అడవుల్లో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి, ఎండబెట్టి, ఆ కలపతో ఈ బొమ్మలను తయారుచేస్తారు. ఫ్యాషన్ ఆభరణాలను, గృహాలంకరణ వస్తువులనూ ఈ అంకుడు చెట్ల కలప నుంచే తయారుచేస్తున్నారు. ఈ గ్రామంలో సీవీ రాజు, శ్రీశైలపు చిన్నయాచారికి బొమ్మల తయారీలో రాష్ట్రపతి అవార్డులు కూడా లభించాయి. చిన్నయాచారితో కలిసి పదహారేళ్లుగా సంప్రదాయ చెక్క, లక్కబొమ్మల తయారీలో నైపుణ్యం సాధించాడు బి.సూరిబాబు. 2018లో వృత్తి పరమైన ఎక్స్లెన్స్ అవార్డును అందుకున్నాడు. ఈ యేడాది ‘మెకనైజ్డ్ లేడీస్ ఎట్ వర్క్ బొమ్మ’ను ప్రత్యేకంగా రూపొందించాడు. ‘ఈ బొమ్మ వారం రోజులు పట్టింది. పసుపు, నీలి రంగు, బెల్లం, లక్కతో కలిసిన సహజ రంగులను వాడాను’ అని చెప్పాడు. సూరిబాబుకు యశ్వంత్ భారతి రామ్మూర్తి కన్సోలేషన్ సన్మాన్ అవార్డు వచ్చింది. డిజిటల్ మార్కెట్ అనేక హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెంచడానికి దేశంలోని కళాకారుల అందరూ ఆన్లైన్ను వేదికగా మార్చుకుంటున్నారు. ఈ–మార్కెట్ ప్లేస్ వల్ల దేశ, విదేశాల్లోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులను పంపేందుకు వెసులుబాటు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక ప్రదర్శన శాలల్లోనే కాకుండా హైటెక్ విధానాలతోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. సాంస్కృతిక వైభవం: కిన్హాల్ బొమ్మ కర్ణాటక రాష్ట్రంలోని ‘కిన్హాల్’ క్రాఫ్ట్ సంప్రదాయ వైభవంతో అలరారుతుంటుంది. చేతితో రూపొందించిన కిన్హాల్ చెక్క బొమ్మలు దేవతా మూర్తులకు ప్రసిద్ధి. రంగురంగుల ఈ బొమ్మలు చూపు తిప్పుకోనివ్వవు. ఈ బొమ్మల ఆభరణాల కోసం వెండి రేకును పెయింటింగ్గా ఉపయోగిస్తారు. ఈ కళాఖండాలు ఇళ్లు, బడుల్లో అలంకారంగానే కాదు పిల్లల దృష్టికోణంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తున్నాయి. టేకు చెక్కను చెక్కి, మరవజ్ర చెట్టు గమ్తో కిన్హాల్కు చెందిన సంతోష్ అందమైన కళాఖండాన్ని రూపొందించాడు. అందుకుగాను సంతోష్కు శ్రీ జాస్తి రామయ్య సమ్మాన్ అవార్డు లభించింది. -
Ramadan 2022: రమజాన్ విశిష్టత.. సంప్రదాయం.. మరిన్ని విశేషాలు!
సృష్టిలోని విభిన్న జీవరాశులకు విభిన్నమైన పేర్లు ఉన్నట్లుగానే, మానవ సంతతిని మనిషి లేక మానవుడు అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషివేరు, మానవత్వం వేరు. మనిషి అనబడే ప్రతివారిలోనూ మానవత్వం ఉండాలన్న నిబంధనేమీ లేదు. ప్రాణులుగా, జీవులుగా అంతా సమానమే! మానవులైనా, జంతువులైనా లేక మరే జీవి అయినా... కనుక జీవం కలిగి ఉండడం అనేది జంతుజాలంపై మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమీ కాదు. జంతువూ ఒక ప్రాణే మనిషి కూడా ఒక ప్రాణే అయినప్పుడు జంతువుపై మనిషికి ఏ విధంగానూ ప్రత్యేకత, శ్రేష్ఠత, ప్రాధాన్యతా ఉండవు. జంతువులపై మనిషికి విశిష్ఠత, ప్రత్యేకత ప్రాప్తం కావాలంటే మనిషిలో మానవత్వం, మానవీయ విలువల సుగంధం ఉండాలి. ఇవి మాత్రమే మానవుడికి ప్రత్యేకతను ప్రసాదించి, మానవ ఔన్నత్యాన్ని పెంచుతాయి. మనిషిలో మానవీయ విలువలు లేకపోతే, అతడు మానవ సంతతి అయినప్పటికీ, మానవ సమాజంలోనే ఉంటున్నప్పటికీ అలాంటి వాణ్ణి మనం మనిషి అని సంబోధించడానికి వెనుకాడతాం. లోలోపల ఎక్కడో ఏహ్యభావం పాదుకొని ఉంటుంది. అలాంటివాణ్ణి మానవ రూపంలోఉన్న దానవుడు అనుకోవచ్చు. మరి మానవత్వం అంటే ఏమిటి, మానవీయ విలువలు అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా చాలామంది చాలా అభిప్రాయాలు చెబుతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కొలమానం, ఒక్కొక్క ప్రమాణం. కాని మానవత్వం, మానవీయ విలువల అసలు కొలమానం దైవ గ్రంథంలో, ప్రవక్తవారి జీవితంలో మనకు లభిస్తుంది. సమాజంలో మానవత్వాన్ని జాగృతం చేయడానికి, మానవుల హృదయాల్లో దాన్ని పాదుగొల్పడానికి దైవం కొన్ని నియమాలను ఏర్పరచాడు. ఆ దైవదత్తమైన మార్గదర్శక తరంగాల్లోంచి పెల్లుబికి వచ్చేదే అలౌకికమైన మానవీయ ఆధ్యాత్మిక ఆనందం. నిత్య నూతనత్వాన్ని, మానసిక ఆనందాన్ని పొందడం కోసం, మనిషి మనిషి కలిసి, సామూహిక నైతికతను సమాజంలో పాదు గొల్పడానికే వ్రతాలు, నోములు, పండుగలు, పబ్బాలు. కొద్దికాలంపాటు మనిషి తన శరీరంలో, దైనందిన జీవనక్రమంలో కొన్ని అనూహ్యమైన మార్పులను ఆహ్వానించి తద్వారా నూతనోత్తేజ ఆధ్యాత్మిక భావ తరంగాల్లో తేలిపోతాడు. పవిత్ర రమజాన్ పండుగను మనం ఆ దృష్టికోణం నుంచి చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే రెండు ప్రధాన పండుగల్లో ‘ఈదుల్ ఫిత్ర్ ’ మొట్టమొదటిది, అత్యంత ప్రాముఖ్యం కలది. ఇస్లామీయ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న ‘రమజాన్’ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్ ఫిత్ర్ . సాధారంగా దీన్ని రంజాన్ పండుగ అని వ్యవహరిస్తుంటారు. రమజాన్ పేరువింటూనే ప్రతి ఒక్కరికీ సేమియా, షీర్ ఖుర్మా గుర్తుకు వస్తాయి. పట్టణ వాసులకైతే ‘హలీమ్’, ‘హరీస్’లాంటి వంటకాలూ నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లింలు ఇంత నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులపాటు ఆనందంగా, ఆరాధనా భావతరంగాల్లో తేలియాడుతూ జరుపుకొనే ముగింపు ఉత్సవం. ఈనెల రోజులూ ముస్లింల ఇళ్లు, వీధులన్నీ సేమియా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీల ఘుమఘుమలతో, అత్తరు పన్నీర్ల పరిమళాలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో కళకళలాడుతూ ఉంటాయి. సహెరి, ఇఫ్తార్ల సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, అహ్లాదాల సమ్మేళనాన్నే ‘పండుగ’ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. అదే రమజాన్ పండుగ. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, విలువలకు లోబడి, హద్దులను అతిక్రమించకుండా, దుబారాకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు చోటీయ కుండా, దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండుగ. నిజానికి పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, సమైక్యతకు, సంస్కృతీ సంప్రదాయ వికాసాలకు దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మత ధర్మానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం, ఒక స్ఫూర్తి ఉంటుంది. పండుగ మానవాళి హితం కోరుతుంది, హితం బోధిస్తుంది. ముస్లిములు అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకొనే ఈదుల్ ఫిత్ర్ (రమజాన్) పర్వం సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ప్రాచీనకాలం నుంచి ప్రతిదేశంలోనూ, ప్రతిజాతిలోనూ పండుగల సంప్రదాయం చలామణీలో ఉంది. మానవులకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, వ్యక్తిగతంగా కాని, సామూహికంగా కాని ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకొచ్చి బహిర్గత మవుతుంది. ఇది చాలా సహజం. అలాంటి మానవ సహజ భావోద్రేకాల ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే. అసలు రమజాన్ పేరు వినగానే ఎవరికైనా ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుంది. మనసు, తనువు తన్మయత్వంతో పులకిస్తాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. గుండెలనిండా ఆనందం ఉప్పొంగుతుంది. ఆనందం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది. మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ముఖ్యమైనవి. మనిషికి ఏదైనా మేలు జరిగినప్పుడు అంతరంగం ఆనందంతో పులకించడం, హృదయం ఉల్లాసభరితమవడం, మదిలో మధురానుభూతులు సుడులు తిరగడం సహజం. అసలు రమజాన్ అన్నది పండుగ పేరుకాదు. అదొక నెల పేరు. సంవత్సరంలోని పన్నెండునెలల్లో తొమ్మిదవది రమజాన్. అయితే దైవం పవిత్ర ఖురాన్లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింప జేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన ‘రోజా’ను విధిగా చేయడానికి ఈనెలను ఎన్నుకున్నాడు. అందుకే దీనికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్తోను, ఆనవాయితీగా పాటించే రోజాలతో ఈనెలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ విషయాన్ని దైవం ఇలా ప్రకటించాడు: ‘ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇది సమస్త మానవాళికీ సంపూర్ణ మార్గదర్శిని. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి (2 – 185). మనం ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తే, మానవులపై దేవుని అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన తన అపార ప్రేమానురాగాలతో మానవ మనుగడకోసం అనేక ఏర్పాట్లు చేశాడు. శిశువు మాతృగర్భం నుంచి భూమిపై పడగానే అతని/ ఆమె ఊడిగం చెయ్యడానికి సృష్టి మొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు సృష్టి సమస్తం మానవుడి కోసమేనంటే అతిశయోక్తికాదు. అపారమైన ఆయన కారుణ్యానుగ్రహాలను వర్ణించడం ఎవరివల్లా అయ్యేపనికాదు. సృష్టిలోని వృక్ష సంపదనంతా కలాలుగా మార్చి, సముద్ర జలాలన్నింటినీ సిరాగా చేసి దైవానుగ్రహాలను రాయదలచినా, వృక్షాలు అంతరించిపోతాయి, జలాలన్నీ ఇంకిపోతాయి కాని ఆయన కారుణ్యానుగ్రహాలు ఇంకా అనంతంగా మిగిలే ఉంటాయి. ఇంతటి అనుగ్రహశీలి కనుకనే దేవుడు మానవుల ఆధ్యాత్మిక వికాసం కోసం, నైతిక, మానవీయ విలువల మార్గదర్శనం కోసం పవిత్ర ఖురాన్ లాంటి మహదానుగ్రహాన్ని ప్రసాదించాడు. రోజా లాంటి మహత్తర ఆరాధనను పరిచయం చేశాడు. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాలను, నైతిక సుగుణాలను, మానవీయ విలువలను జనింపజేయడానికి నెల్లాళ్లపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడమే రమజాన్ శిక్షణలోని అసలు ఉద్దేశం. నెల్లాళ్లపాటు నియమబద్ధంగా, నిష్ఠగా సాగే ఆరాధనా విధానాలు మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి, బాధ్యతాయుత జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడిన జీవన విధానానికి అలవాటు చేస్తాయి. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే రమజాన్ దీక్షలను పరాత్పరుడైన దైవం తమకు అనుగ్రహించినందుకు, వాటిని వారు శక్తివంచన లేకుండా చిత్తశుధ్ధితో ఆచరించగలిగినందుకు సంతోషంగా, దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవక్త మహనీయుల వారి సంప్రదాయం వెలుగులో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. దైవ ప్రసన్నతను చూరగొనడానికి వ్రతం పాటించడంతోపాటు, ఫర్జ్, సున్నత్, నఫిల్, తరావీహ్ నమాజులు ఆచరిస్తూ, అనేక సదాచరణలను ఆచరిస్తారు. ఆర్థికంగా కలిగిన వాళ్లు ఈ రోజుల్లోనే జకాత్ చెల్లిస్తారు. నిల్వ ఆదాయంలోంచి రెండున్నర శాతం చొప్పున ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి. ఇస్లామ్ మూలసూత్రాల్లో ఇది ఒక మౌలిక విధి. రమజాన్ శుభాల కారణంగా ఇది కూడా ఈ నెలలోనే నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఫిత్రాలు చెల్లిస్తారు. ఫిత్రా కచ్చితంగా పండుగకు ముందే చెల్లించాలి. ఫిత్రాలకు ఆర్థిక స్థోమతతో సంబంధంలేదు. కాస్తోకూస్తో కలిగిన వాళ్లు తమ నిరుపేద సోదరులను ఆదుకోడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ జరుపుకునే స్థోమతలేని వారికి ఫిత్రాలు ఎంతగానో తోడ్పడతాయి. ఫిత్రా పైకంతో వారుకూడా పండుగ సామగ్రో, కొత్తబట్టలో కొనుక్కుని పండుగ సంతోషంలో పాలు పంచుకో గలుగుతారు. ఉపవాసం పాటించినా, పాటించక పోయినా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తరఫునా ఫిత్రాలు చెల్లించాలి. ముస్లిం, ముస్లిమేతర అన్న తారతమ్యం లేకుండా అర్హులైన పేదసాదలకు ఇవ్వాలి. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర కార్యక్రమాల్లో, వినోదాలకు, భోగవిలాసాలకు ధనం వృథా చేయకుండా నలుగురికీ మేలు జరిగే మంచి పనుల్లో ఖర్చుపెట్టాలి. సత్కార్యాలకు, సమాజ సంక్షేమానికి వినియోగమయ్యే ధన వ్యయాన్నే దైవం స్వీకరిస్తాడు. ఈ విధంగా రమజాన్ నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాస దీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటు కొనసాగి షవ్వాల్ చంద్రవంక దర్శనంతో ముగుస్తాయి. ‘షవ్వాల్ ’ మొదటి తేదీన జరుపుకునే పండుగే ‘ఈదుల్ ఫిత్ర్ ’. నిజానికిది దేవుని మన్నింపు లభించే మహత్తరమైన రోజు. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే అలాంటి వారిని దైవం తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయము అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం సత్యం. ఈ అశాశ్వత దేహం నుంచి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పులను సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ముస్లిములందరూ పండుగపూట పెందలకడనే లేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు ఆచరిస్తారు. అనంతరం నూతనవస్త్రాలు ధరించి, అత్తరు పన్నీరులాంటి సుగంధ పరిమళం వినియోగించి, ఆనందోత్సాహాలతో ఈద్ గాహ్కు వెళతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజావ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింప జేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు. తరువాత ఇమామ్ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలిసి అల్లాహ్ గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమ కోసం, తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, తమ దేశం కోసం, దేశవాసుల సుఖ సంతోషాల కోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాల కోసం ఆయనను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపి వంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ విధంగా ‘ఈదుల్ ఫిత్ర్ ’ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం , త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. కనుక రమజాన్ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెల్లాళ్ల శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రమజాన్ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. అల్లాహ్ సమస్త మానవాళినీ సన్మార్గ పథంలో నడిపించాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఈద్ రోజు సంప్రదాయం రమజాన్ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశ పాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒక మనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ‘ఈదుల్ ఫిత్ర్’ రూపంలో బహిర్గతమవుతాయి. ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు ఒకవిధిని నియమానుసారం నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో ముస్లింలు ఈసంబరాలు జరుపుకుంటారు. పండుగనాడు ఇలా చేయడం సున్నత్ గుసుల్ చేయడం: ముహమ్మద్ ప్రవక్త (స)సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్కు వెళ్లే ముందు గుసుల్ (స్నానం) చేయాలి. సుగంధ ద్రవ్యాలు వాడడం: ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి. మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి. ఈద్ గాహ్కు వెళుతూ బిగ్గరగా తక్బీర్ పలకడం: ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ , లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్’ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి. కాలినడకన ఈద్ గాహ్కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్ గాహ్కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి, మరోదారిన తిరిగి రావాలి. ఖర్జూరాలు తినడం: ఈద్ గాహ్కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి, లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినే ప్రవక్త మహనీయులు ఈద్ గాహ్కు వెళ్లేవారు. ఈదుల్ ఫిత్ర్ ఇలా.. పండుగ నమాజును ముహమ్మద్ ప్రవక్త (స) వారు ఈద్ గాహ్లో చేసేవారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించి ‘ఈద్ ’ నమాజును ఊరిబయట బహిరంగ ప్రదేశంలో (ఈద్ గాహ్లో) నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచదేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం. అయితే అనివార్య పరిస్థితుల్లో ఈద్ నమాజును మస్జిద్లోనే చేసుకోవచ్చు. ప్రవక్తవారు, ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్ గాహ్లో పండుగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించడంతో పాటు, సుగంధ ద్రవ్యాలు వాడడంకూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్ గాహ్కు వెళ్ళేముందు కొద్దిగా అల్పాహారం తీసుకోవాలి. బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్ గాహ్కు వెళ్లాలి. ఈదుల్ ఫిత్ర్ (రమజాన్ )నమాజును కాస్త ఆలస్యంగా, ఈదుల్ అజ్ హా (బక్రీద్ ) నమాజును చాలా తొందరగా చేయాలి. ఈదుల్ ఫిత్ర్లో సదఖా, ఫిత్రా.. ఈదుల్ అజ్ హాలో ఖుర్బానీ ముఖ్యవిధులు. యావత్ ప్రపంచంలో ఈ పండుగను అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఇదిలా ఉంటే, కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండుగ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తారు. ఎందుకంటే, సంపన్నులు, స్థితిమంతులు సదఖా, జకాత్, ఫిత్రా తదితర దానధర్మాల పేరుతో తమలాంటి పేదవారిని ఆదుకుంటారనే కొండంత ఆశతో. కనుక కలిగినవారు, స్థితిమంతులు సమాజంలోని నిరుపేద సోదరుల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండుగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా అభాగ్యులు, అగత్యపరులకు సహాయం చేసివారి ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నం చెయ్యాలి. దీనివల్ల లబ్ధిదారుల సంతోషం, వారి దీవెనలతో పాటు, దేవుని ప్రసన్నత, పరలోక సాఫల్యం సిధ్ధిస్తుంది. పేదసాదల దీవెనలూ తోడుగా నిలుస్తాయి. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం ధన దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులని చెప్పింది. అవసరార్థులకు, పేదసాదలకు ధనసహాయం చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. స్వీయ ఆనందంతోపాటు, సమాజమంతా ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నది ముహమ్మద్ ప్రవక్త(స) వారి ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఈవిధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. సేమియా, షీర్ ఖుర్మాల తీపితోపాటు, కులమతాలకు అతీతంగా, అందరిమధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధాలను ప్రోదిచేస్తుంది. (అందరికీ ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు.) -యండి. ఉస్మాన్ ఖాన్ -
Crime Story: ఇంట్లోకి ఎలా రాగలిగారో..!
పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు లక్ష్మీకాంత్. ‘చెప్పాగా. మీరు వెళ్ళండి’ చెప్పాడు అతడితో వచ్చిన అతను. బెరుకు బెరుకుగా లోపలికి వెళ్లాడు లక్ష్మీకాంత్. అతడు తొలిసారిగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. ఇన్స్పెక్టర్ని కలిశాడు. ‘చెప్పండి’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘నేను లక్ష్మీకాంత్... నేను...’ చెప్పుతున్నాడు లక్ష్మీకాంత్. ‘ముందు వచ్చిన పని చెప్పండి’ అడ్డుపడ్డాడు ఇన్స్పెక్టర్. ‘మరండీ’ లక్ష్మీకాంత్ తొట్రుబాటు శుభ్రంగా తెలుస్తోంది. ‘ఏమైంది’ ఇన్స్పెక్టర్ అడిగాడు. ‘మా ఇంట్లో దొంగలు పడ్డారు’ చెప్పాడు లక్ష్మీకాంత్. ‘బంగారం నగలు... వెండి వస్తువులు... నగదు పోయాయి’ వెంటనే చెప్పాడు. ‘ఎప్పుడు? ఎలా?’ విచారణ మొదలెట్టాడు ఇన్స్పెక్టర్. ‘రాత్రి. ఎలా అంటే...’ ‘పూర్తిగా వివరంగా చెప్పాలి’ చెప్పారు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ తంటాలు పడుతున్నాడు. అతడ్నే చూస్తూ, ‘చెప్పండి’ అన్నాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ. ‘నేను నా భార్య రమణి ఇక్కడ అంటే విశాఖపట్నంలో ఉంటున్నాం. మా సొంత ఇల్లు, చాలా వరకు మా బంధువులు ఇక్కడే ఉంటున్నారు. అబ్బాయి శ్రీకాంత్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో, అమ్మాయి శ్రీవల్లి పెళ్లి రీత్యా బెంగుళూరులో ఉంటున్నారు. నేను.. రమణి నిన్న ఉదయం గుంటూరు వెళ్లాం. అక్కడ రమణి అన్నయ్య గుణశేఖర్ కుటుంబం ఉంటుంది. వాళ్లింట్లో గుణశేఖర్ రెండవ కూతురు భామ పెళ్ళికి ముహూర్తం తీసే కార్యక్రమం కావడంతో మేము వెళ్లాం. అక్కడ పని కాగానే బయలుదేరి ఉదయం తిరిగి ఇంటికి వచ్చాం. మెయిన్ గేట్ తలుపు తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లాం. గదిలోకి వెళ్తే బీరువా తెరిచి ఉంది. దానిలో దాచిన నగలు, నగదు కనిపించడంలేదు. మేము వెళ్లేటప్పుడు గడియ పెట్టిన పెరటి వైపు తలుపు దగ్గరగా మూసి ఉంది. ఆ గడియ మాత్రం తీసి ఉంది. మా హైరానాకి ఇరుగు పొరుగు వారు వచ్చారు. మా పొరుగాయన ఎకాఎకీన లాక్కొస్తేనే నేను మీ దగ్గరకి వచ్చాను. ఆయన బయటే ఉండిపోయాడు. పోలీసులంటే భయమట’ తలాడిస్తూ ఇన్స్పెక్టర్ ‘మీకు అనుమానాలేమైనా ఉన్నాయా’ అడిగాడు. ‘దొంగలు ఇంట్లోకి ఎలా రాగలిగారో తెలియడం లేదండీ’ ‘లక్ష్మీకాంత్గారూ అది మేము తేలుస్తాం. నేను తెలుసుకోవాలనుకుంటుంది దొంగతననాకి కారకులు వీరై ఉండొచ్చు అన్న అనుమానితులు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా అని’ ఆగాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ అయోమయమయ్యాడు. తల గొక్కున్నాడు. నిముషం తర్వాత – ‘బీరువాలో నగలు, నగదు సర్దడం మాతో పాటు మా ఇంటి పని మనిషి కాంతానికీ తెలుసు’ చెప్పాడు లక్ష్మీకాంత్. ‘ఆ కాంతం మీతో పాటే ఉంటుందా?’ వెంటనే ఇన్స్పెక్టర్ అడిగాడు. ‘లేదు. కాంతం కుటుంబం మాకు దగ్గరలోనే ఉంది. కాంతం మాత్రం ఉదయం ఆరింటికి వస్తుంది. రాత్రి ఎనిమిది వరకు మాతోనే ఉంటుంది. తన రోజు వారీ టిఫిన్, భోజనాలు మాతోనే చేస్తుంది. నా భార్య అనారోగ్యం కారణంగా కాంతాన్ని ఇంటి, వంట పనులకి నియమించాను’ లక్ష్మీకాంత్ చెప్పుతున్నాడు. ‘కాంతం మీద మీకు అనుమానమా?’ ఠక్కున అడిగాడు ఇన్స్పెక్టర్. ‘ఏమో. కాంతం నమ్మకస్తురాలుగా తిరిగేది’ లక్ష్మీకాంత్ గొంతు వణుకుతోంది. ‘మీరు ఊరు వెళ్లేక కాంతానికి ఇంటి పనులు ఏమైనా చెప్పారా. కాంతానికి ఇంటి తాళాలు ఏమైనా ఇచ్చారా’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘లేదు. కానీ బీరువా తాళాలు బీరువా వెనుక గోడ మేకుకి పెట్టేశాం ఎప్పటిలాగే’ ‘కాంతానికి అలా మీరు తాళాలు పెట్టడం తెలుసా? మీరు ఎప్పుడు వచ్చేది కూడా కాంతానికి తెలుసా?’ ఇన్స్పెక్టర్ అడిగాడు. ‘తనకి అన్నీ తెలుసు. ఈ రోజు ఉదయం ఏడు ఎనిమిది మధ్య తిరిగి వచ్చేస్తామని కాంతానికి చెప్పాం’ అన్నాడు లక్ష్మీకాంత్. ఇన్స్పెక్టర్ తన రిస్ట్ వాచీ వైపు చూసుకున్నాడు. ‘పదవుతోంది. మరి కాంతం మీరు చెప్పిన టైమ్కి మీ ఇంటికి వచ్చిందా? అన్నట్టు మీరు ఎన్ని గంటలకి వచ్చారు?’ ‘బస్సులో వచ్చాం. ఆలస్యమైంది. మేము ఇంటికి చేరేసరికి తొమ్మిది దాటింది’ చెప్పాడు లక్ష్మీకాంత్. ‘మీ కంప్లయింట్ పేపరు మీద రాసి ఇవ్వండి. తదుపరి చర్యలు చేపడతాం’ లక్ష్మీకాంత్ ఆ పనికి తటపటాయిస్తుండగా అతడి సెల్ఫోన్ రింగయ్యింది. ‘చెప్పు’ అన్నాడు. అటు రమణి. ‘కంప్లయింట్ ఇచ్చేశారా?’ సర్రున అడిగింది రమణి. ’ఆ.. లేదు. ఇంకా లేదు’ తడబడుతున్నాడు లక్ష్మీకాంత్. ‘అయ్యో...! ఏమిటి మీరు చేస్తుంది? నాతో చెప్పకుండా పొరుగాయన లాక్కుపోతే స్టేషన్కి పోవడమేనా? ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కంప్లయిట్ ఇవ్వకండి. వచ్చేయండి’ గట్టిగానే చెప్పింది రమణి. నీళ్లు నములుతున్నాడు లక్ష్మీకాంత్. ఇన్స్పెక్టర్ వైపు చూపు తిప్పాడు. అప్పటికే లక్ష్మీకాంత్ చేష్టల్ని ఇన్స్పెక్టర్ గమనిస్తూ ఉన్నాడు. ‘ఏమైంది?’ అడిగాడు. లక్ష్మీకాంత్ తలని అస్థిరంగా ఆడించి ‘సరే రమణీ.. కంప్లయింట్ ఇవ్వను. నేను వచ్చేస్తాను’ అంటూ ఆ ఫోన్ కాల్ని కట్ చేసేశాడు. ఇన్స్పెక్టర్నే చూస్తున్నాడు. ‘చెప్పండి.. ఏం జరుగుతోంది? అటు మాట్లాడింది ఎవరు?’ టకటకా అడిగాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ వెంటనే చెప్పలేకపోయినా ఇన్స్పెక్టర్ గుచ్చి గుచ్చి అడగడంతో – ‘నా భార్య. కంప్లయింట్ ఇవ్వొద్దంటుంది. నన్ను వచ్చేయమంటుంది’ చెప్పేశాడు. ‘వాట్ వాట్’ రియాక్టయ్యాడు ఇన్స్పెక్టర్. ‘బిలబిలా పోగైన వాళ్ళు తలో మాటతో నన్ను తొందర చేయడంతో నేను ఇలా వచ్చేశాను’ నొచ్చుకుంటున్నాడు లక్ష్మీకాంత్. ‘బాగుంది. బాగుంది. జరిగింది చాలా పెద్ద నష్టం. ఇక్కడ మీ భార్య అభిప్రాయం ఏమిటి? ఎందుకు? ఆ’ ఇన్స్పెక్టర్ చిరాకవుతున్నాడు. లక్ష్మీకాంత్ హైరానా పడుతున్నాడు. అతడ్ని ఇన్స్పెక్టర్ చిత్రంగా చూస్తున్నాడు. ‘నేను ఇంటికి వెళ్ళిపోతాను. కంప్లయింట్ ఇవ్వను’ చెప్పేశాడు లక్ష్మీకాంత్. ‘అవునా. అది మీ ఇష్టం. సరే. ఈ మాత్రం మీరు ఓరల్గా చెప్పింది మాకు చాలు. కావాలనుకుంటే మేము మా వైపు పని మొదలు పెట్టవచ్చు’ సూటిగా మాట్లాడేడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ గింజుకుంటూనే – ‘నేను నా భార్యతో మాట్లాడి వస్తాను’ ఎలాగో చెప్పగలిగాడు. ‘నేనేమీ మిమ్మల్ని ఆపలేదే’ ఇన్స్పెక్టర్ సీరియస్గా ఉన్నాడు. లక్ష్మీకాంత్ మెల్లిగా లేచాడు. బయటికి నడిచాడు. లక్ష్మీకాంత్ చేష్టలకి ఇన్స్పెక్టర్లో కుతూహలం, అనుమానం పొడచూపాయి. దారిలో తనతో వచ్చిన పొరుగింటతనితో ఏమీ మాట్లాడక లక్ష్మీకాంత్ ఇంటికి చేరిపోయాడు. ఇంట్లో కొద్ది మందే ఉన్నారు. కాంతం కూడా ఉంది. లక్ష్మీకాంత్ నేరుగా రమణిని చేరి ఆమెను తనతో గదిలోకి తీసుకుపోయాడు. ‘పోలీస్ కంప్లయింట్ వద్దనుకున్నాంగా’ ఠక్కున అంది రమణి. ‘అవును... కానీ... ’ లక్ష్మీకాంత్ ఇంకా తంటాల్లోనే ఉన్నాడు. ‘ఇప్పుడు మనం ఏం చేయాలి?’ విసురుగా అడిగింది రమణి. అప్పటికే అక్కడకి చేరిన ఇన్స్పెక్టర్, ‘నేను తేలుస్తాగా’ అన్నాడు. లక్ష్మీకాంత్ దంపతులు గతుక్కుమన్నారు. ఇన్స్పెక్టర్ని చూస్తూ నోట మాట రాక ఉండిపోయారు. ఆ వచ్చిన ఇన్స్పెక్టర్ తన సహచరుల సహాయంతో తన చర్యల్ని ముమ్మరం చేశాడు. గంట గడవక ముందే ఆ కేస్ను ఒక కొలిక్కి తెచ్చేశాడు. ‘మీ పిల్లలకి తెలియకూడదని మీ ఇద్దరూ కూడబలుక్కుని ఏ మాత్రం ఏమిటి మీ గుణశేఖర్కి ముట్టచెప్పేశారు?’ అడిగాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్, రమణిలు మాట్లాడం లేదు. ‘మీ పిల్లలకు నగలు, నగదు దొంగతనంలో పోయాయని నమ్మంచడానికి మీరు ప్లాన్ చేయడం భలేగా ఉంది’ నవ్వేడు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్, రమణి మొహాలు చూసుకున్నారు. ‘పెరటి వైపు నుండి దొంగలు దొంగతనం చేసినట్టు నమ్మించడానికి ఇటు తలుపు గడియ తీసి పెట్టారా. అబ్బో. హు. మీ అడ్డ దారే మిమ్మల్ని అడ్డంగా దొరకపుచ్చింది’ చెప్పాడు ఇన్స్పెక్టర్. ‘మా అన్నయ్య బాగా చితికిపోయాడు ...’ రమణి చెప్పుతోంది. ‘అవునవును’ అన్నాడు లక్ష్మీకాంత్. ‘అందుకు చనిపోయిన నీ మొదటి భార్య పిల్లల్ని మోసం చేస్తావా లక్ష్మీకాంత్! నీ రెండో భార్య రమణి మీద నీకు బోలెడు అనురాగం ఉండొచ్చు. కానీ మరీ ఇంత బ్లండర్గా దానిని ప్రెజెంట్ చేయకూడదు’ చెప్పుతున్నారు ఇన్స్పెక్టర్. లక్ష్మీకాంత్ భయం తెలుస్తుంది. ‘నీ కడుపు పిల్లలు కాకపోయినా వాళ్ళు నీ భర్త పిల్లలే కదమ్మా రమణి!’ రమణి అలజడి తెలుస్తోంది. ‘మంచి పనిని నిర్భయంగా చేపట్టాలి. లేకపోతే అది ఎంత మంచిదైనా వ్యర్థమే. తగ్గ శిక్ష అనుభవించక తప్పదు’ లక్ష్మీకాంత్, రమణి తలలు దించుకున్నారు. -బివిడి ప్రసాదరావు -
Mystery: లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ..
అత్యంత క్రూరమైన జంతువు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కొందరు మనుషుల క్రూరమైన ఆలోచనల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే, అనుకున్నది జరిగేంత వరకూ.. వాళ్లు పన్నే వ్యూహాలు.. వేసే ఎత్తుగడలు.. ఎవరి ఊహలకూ అందవు. ఎలాంటి అనుమానాలకూ తావివ్వవు. దాదాపు 93 ఏళ్ల క్రితం జరిగిన.. ‘లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ’ చదివితే.. తోటి మనిషిపైన, రేపటి రోజుపైన క్షణకాలం పాటు నమ్మకం సడలుతుంది. \అది 1929, డిసెంబర్ 25 మధ్యాహ్నం.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని జర్మన్టన్లో ప్రజలు క్రిస్మస్ సంబరాల్లోంచి ఇంకా బయటకు రాలేదు. ఉన్నట్టుండి చార్లెస్ డేవిస్ లాసన్ అనే పొగాకు రైతు ఇంట్లో వరుసగా తుపాకీ కాల్పులు వినిపించాయి. ఊరు ఊరంతా అటు పరుగుతీసింది. ఇంటినిండా ఛిద్రమైన శవాలు. రక్తపు చారలు. పెనుగులాడిన ఆనవాళ్లు. వంట గదిలోని క్రిస్మస్ కేక్ ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఆ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పోలీసులు, ప్రజలు చుట్టుపక్కలంతా గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కొన్ని గంటల తర్వాత పక్కనే ఉన్న అడవిలోంచి మరో తుపాకీ గుండు పేలిన శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే చార్లెస్ శవమై ఉన్నాడు. చార్లెస్ డేవిస్ లాసన్.. నార్త్ కరోలినాలోని లాస¯Œ విల్లేలో 1886, మే 10న జన్మించాడు. 1911లో ఫెన్నీ మాన్రింగ్తో పెళ్లి తర్వాత జర్మన్టన్లో స్థిరపడ్డాడు. 18 ఏళ్ల కాపురంలో ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. అయితే మూడో సంతానమైన విలియం 1920లో అనారోగ్యంతో చనిపోయాడు. 1927 నాటికి ఆర్థికంగా బలపడిన చార్లెస్ కుటుంబం.. బ్రూక్ కోవ్ రోడ్లో సొంత పొలాన్ని కొనడానికి సరిపడా డబ్బులు పోగు చేసుకుంది. అంతా సజావుగానే సాగుతుందనుకునే సమయంలో.. 1929 డిసెంబర్ 25 ఉదయాన్నే కుటుంబాన్ని తీసుకుని దగ్గరలోని పట్టణం వెళ్లాడు చార్లెస్(43). పండుగ పేరుతో భార్యబిడ్డలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. నిజానికి ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి అవన్నీ అతి ఖరీదైన దుస్తులు. ఆ తర్వాత అంతా కలిసి ఒక గ్రూప్ ఫొటో కూడా దిగారు. అదే ఆ కుటుంబానికి చివరి ఫొటోగా మిగిలింది. ఇంటికి వచ్చాక చార్లెస్ తన పెద్దకొడుకు ఆర్థర్(17)తో కలిసి.. సమీపంలోని అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ బుల్లెట్స్ అన్నీ అయిపోవడంతో.. వాటిని కొని తెమ్మని ఆర్థర్ని పట్టణానికి పంపించి.. ఇంట్లో మారణహోమానికి సిద్ధమయ్యాడు చార్లెస్. తన కుమార్తెలు క్యారీ(12), మేబెల్(7)లు మేనత్త ఇంటికి వెళ్లిరాగానే.. తుపాకీ గుళ్లతో విరుచుకుపడ్డాడు. ముందుగా క్యారీ, మేబెల్లను కాల్చి చంపి.. పొగాకు కుప్పల పక్కన దాచిపెట్టాడు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న భార్యపై(37) కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కొడుకులు జేమ్స్(4), రేమండ్(2)లను, వారిని కాపాడటానికి ప్రయత్నించిన పెద్ద కూతురు మేరీ(16)నీ చంపేశాడు. చివరికి మూడు నెలల పసి బిడ్డ మెర్రీ లూని కూడా విడిచిపెట్టలేదు. అతి కిరాతకంగా నేలకేసి కొట్టికొట్టి కడతేర్చాడు. అయితే పెద్దకొడుకు ఆర్థర్ని తనంతట తానే ఎందుకు వదిలిపెట్టాడనేది అంతుబట్టని రహస్యంగా మారింది. ఆర్థర్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు శ్మశానంగా మారిపోయింది. అడవిలో ఆత్మహత్య చేసుకున్న చార్లెస్ జేబులో ఏవో రెండు లేఖలు దొరికాయి. అయితే అందులో తన తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం తప్ప.. వీళ్లందరినీ ఎందుకు చంపాడనే వివరం లేదు. ఈ దుర్ఘటనపై చాలా ఊహాగానాలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అవే ఈ కేసుపై ఆసక్తి చూపించినవారిని సమాధానపరచాయి. ఈ ఘటన జరడగానికి సరిగ్గా నెల రోజుల ముందు చార్లెస్ తలకి బలమైన దెబ్బ తగిలిందని, మానసిక స్థితి దెబ్బతినడం వల్లే అలా హత్యలకు పాల్పడి ఉంటాడని కొందరు వాదించారు. అయితే చార్లెస్ మెదడుపై చేసిన వైద్య పరీక్షల్లో అలాంటి తేడాలేం గుర్తించలేదు. మరొక కథనం అతి ఘోరమైనది. చార్లెస్ తన పెద్ద కుమార్తె మేరీతో అనుచిత సంబంధం కలిగి ఉన్నాడని.. అతడి కారణంగా ఆమె గర్భవతి అయ్యిందని, అందుకు సాక్ష్యం.. కుటుంబమంతా ఉన్న ఆ చివరి ఫొటోనే అని, అందులో మేరీని గమినిస్తే తను కడుపుతో ఉందన్న విషయం స్పష్టమవుతుందని, ఆ నిజం ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతోనే కుటుంబం మొత్తాన్ని చార్లెస్ చంపేశాడనేది మరి కొందరి వాదన. మేరీ గర్భవతన్న విషయం.. తమతో మేరీ తల్లి ఫెన్నీ చెప్పిందని, చార్లెస్, మేరీల ప్రవర్తనపై ఆమె ఆందోళనగా ఉండేదని.. బంధువుల్లో, స్నేహితుల్లో కొందరు సాక్షులుగా ముందుకొచ్చారు. వారితో అలా ఎవరైనా చెప్పించారా అనేది కూడా ప్రశ్నే. పైగా, మేరీ గర్భవతని నిర్ధారించే వైద్యపరమైన ఏ అధికారిక నివేదికా రాలేదు. ఇది ఇలా ఉండగా.. చార్లెస్సే హత్యలు చేశాడనడానికి బలమైన కారణాలుగా అదే రోజు భార్యబిడ్డలకు ఖరీదైన దుస్తులు కొనివ్వడం, వారితో కలిసి ఫొటోదిగడం.. ఇవేమీ యాదృచ్ఛికం కాదంటారు చాలా మంది. పథకం ప్రకారమే చార్లెస్ తన కుటుంబాన్ని కడతేర్చాడు అనేది వారి వాదన. మరోవైపు.. చార్లెస్కి ఏ పాపం తెలియదని, చార్లెస్తో సహా ఆ కుటుంబాన్ని మొత్తం ఎవరో చంపేసి ఇలా చిత్రీకరించి ఉంటారనేది ఇంకో కోణం. మొత్తానికి ప్రాణాలతో మిగిలిన చార్లెస్ పెద్ద కొడుకు ఆర్థర్ లాసన్ ఏకాకిగా పెరిగి, పెద్దయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతడికి నలుగురు పిల్లలు పుట్టారు. ఏవో ఆస్తి తగాదాల్లో తన భూమిని కూడా కోల్పోయాడు. దురదృష్టవశాత్తు, అతని 32వ ఏట 1945లో కారు ప్రమాదంలో చనిపోయాడు. నార్త్ కరోలినా, మాడిస¯Œ లోని ‘మాడిసన్ డ్రై గూడ్స్ కంట్రీ స్టోర్’లో చార్లెస్ లాసన్ కుటుంబానికి గుర్తుగా ఒక చిన్న మ్యూజియం ఉంది. ఇప్పటికీ ఈ భయంకరమైన విషాదాన్ని తెలుసుకోవడానికి అక్కడి ప్రజలు ఆ మ్యూజియానికి వస్తుంటారు. ఆ రోజు ఎవరూ తినకుండా మిగిలిపోయిన చార్లెస్ ఇంట్లోని క్రిస్మస్ కేక్ని కూడా కొన్నాళ్లపాటు ప్రజల సందర్శనకు ఉంచారు. చివరికి లాసన్ బంధువుల్లో ఒకరు గొయ్యితీసి దాన్ని పూడ్చేశారు. ఈ ఉదంతాన్ని కథనాంశంగా తీసుకుని ఎన్నో పుస్తకాలు, సిరీస్, కథలు ఇలా చాలానే వచ్చాయి. అయితే చార్లెస్ నిజంగానే ఈ కుట్రకు పాల్పడ్డాడా? లేక మరెవరైనా ఈ కుట్రకు పాల్పడి, చార్లెస్ని ఇరికించారా? అనేది నేటికీ మిస్టరీనే. ఏది ఏమైనా ఒక ఘోరమైన నిందతోనే ఈ కుటుంబ కథ ముగిసింది. ∙సంహిత నిమ్మన -
డబ్బవాలా జిందాబాద్..
ఒకరికి అందాల్సిన లంచ్బాక్స్ ఇంకొకరికి అందుతుంది. అందులోని భోజనం మహాద్భుతంగా ఉంటుంది. ఆ ప్రశంసనే ఓ కాగితం ముక్క మీద రాసి.. ఖాళీ అయిన ఆ డబ్బాలో పెడతాడు ఆ వ్యక్తి. ఆ డబ్బా యజమానికి చేరుతుంది. టిఫిన్బాక్స్ ఖాళీ అవడం ఒక ఆశ్చర్యమైతే .. తన వంటకు కితాబు రావడం ఒక సంభ్రమం ఆమెకు. ఎందుకంటే ఆ భోజనం డబ్బా తిరిగి ఆమె ఇంటికి ఖాళీగా ఎప్పుడూ రాదు. పెట్టిన భోజనం పెట్టినట్టే తిరిగొస్తుంది. అలాంటిది ఆ రోజు భోజనం ఖాళీ కావడంతోపాటు ప్రశంస కూడా. ఆమె మనసులో ఎక్కడో శంక.. ఇంతకీ డబ్బా చేరాల్సిన వాళ్లకే చేరిందా.. పొరపాటున ఇంకెవరికైనా చేరిందా అని. ఆమె అనుమానించినట్లుగానే ఆ భోజనం వేరేవాళ్లకు చేరుతుంది. ఓ ప్రేమ కథ మొదలవుతుంది.. ఇది లంచ్బాక్స్ సినిమా సారాంశం. అయితే ఈ కథనం దాని గురించి కాదు. భోజనం డబ్బాల బట్వాడా అనే ఇన్నేళ్ల చైన్ ప్రాసెస్లో ..అసలెప్పుడూ జరగని..లేదంటే చాలా చాలా అరుదుగా జరిగే ఒక్కటంటే ఒక్కటే పొరపాటును ఆధారంగా చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న చక్కటి చిత్రం లంచ్బాక్స్. రీల్కి ఆవల..ఈ బట్వాడా పద్ధతి.. ఫోర్బ్స్ సిక్స్ సిగ్మా ప్రావీణ్యంగా పరిగణించే వంద శాతం ఉత్తమ సామర్థ్యాన్ని కనబరుస్తూ శతాబ్దానికి పైగా కొనసాగుతున్న విచిత్రం ‘డబ్బావాలా!’ ఆ వ్యవస్థ గురించే ఈ కథనం.. డబ్బావాలా పుట్టిల్లు.. ముంబై. ఆ మహానగరం పేరు చెప్పగానే అరబిక్ కడలి.. దాని ఒడ్డునున్న గేట్ వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్, ఆకాశహార్మ్యాలు, బాలీవుడ్ కళ్లల్లో మెదులుతాయి. వీటితోపాటు డబ్బావాలాల ఫొటోలు కళ్ల ముందుకు వస్తాయి. క్రమశిక్షణలో భాగమైన సమయపాలన, నిబద్ధత, జీవన నైపుణ్యాల్లో ఒకటైన చక్కటి నిర్వహణా కౌశలమే ఈ డబ్బావాలాల విజయానికి మూలం. అదే వాళ్ల యూఎస్పీ. అవన్నీ సరే కానీ ఇప్పుడెందుకింత అకస్మాత్తుగా ఆ డబ్బావాలాల గురించి చెప్పుకోవడం అని అడిగితే జవాబు.. కరోనా మహమ్మారే. ఆ వైరస్ ఈ రెండేళ్లు అన్ని రంగాలను కుదేలు చేసినట్టే డబ్బావాలాలకూ పని లేకుండా చేసింది. దాదాపు వలస కార్మికులు పడ్డ కష్టాలే వీరూ పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టారు. కెరటంలా నేల కరిచినా మళ్లీ లేచి నిలబడుతున్నారు. డబ్బాల్లో ఇంటి భోజనాన్ని మోసుకుంటూ వేలాది మంది ఆకలిని తీరుస్తున్నారు.. ఆ కుటుంబాల ఆత్మీయతానుబంధాలను పదిలం చేస్తున్నారు. ఇది సేవ కాదు.. జీతం తీసుకునే పనే. కానీ దానికి సేవాతత్పరతను జోడిస్తున్నారు. ఆ అంకితభావమే కరోనా పరచిన సవాళ్లను చుట్టచుట్టేసి సముద్రంలో విసిరేసేలా చేస్తోంది. డబ్బావాలాల కోసం ముంబై ముంగిళ్లు ఎదురుచూసేలా చేస్తోంది. 2020.. మార్చి.. ప్రపంచం అంతా అల్లల్లాడినట్టే మన దేశమూ.. దానికి పారిశ్రామిక రాజధాని అయిన ముంబై కూడా కుదేలయిపోయింది. నిత్యం దాదాపు రెండు లక్షల పై చిలుకు మందికి లంచ్ బాక్స్లను అందించడంలో తీరిక లేకుండా ఉండే డబ్బావాలాలకు మొదటిసారి పనిలేకుండా పోయింది. లాక్డౌన్ వల్ల కార్యాలయాలు, కర్మాగారాలు, బడులు, కాలేజీలు, రవాణా.. అన్నీ బంద్. వర్క్ ఫ్రమ్ హోమ్తో కొంత మందికి పని ఉన్నా.. టిఫిన్ డబ్బాలను తెప్పించుకునే అవసరం లేకుండా పోయింది. కాళ్లకు చక్రాలు కట్టుకుని గడియారం ముళ్లతో పోటీపడే డబ్బావాలాలు.. దాదాపు ఎనిమిది నెలలు ఆ పందెంలోంచి తప్పుకున్నారు. అది వాళ్లెన్నడూ కనీవినే కాదు కనీసం కలలో కూడా ఊహించనిది. ఆ పరిస్థితిలో వాళ్లను వాళ్లే ఆదుకున్నారు. ‘నూతన్ టిఫిన్ బాక్స్ సప్లయర్స్’ గా ఉన్న వాళ్ల అసోసియేషనే కరోనా కాలంలో వాళ్లకు అండగా ఉంది. ఈ అసోసియేషన్లో చేరేప్పుడు వాళ్లు 30 వేల రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాంతో వాళ్లకు నెలకు అయిదువేల రూపాయల జీతం, జీవితకాలపు కొలువును ఇస్తుంది అసోసియేషన్. ఆ భరోసాతోనే పూర్వపు స్థితి కోసం ఎదురుచూడసాగారు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కాలం ఒళ్లు విరుచుకుంటోంది. ఆ ఉదయాలు డబ్బావాలాలకు బోలెడు ఆశనిస్తున్నాయి. ఆ కాసింత నమ్మకంతోనే మూలకు పడ్డ చక్రాలను తీసి కాళ్లకు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భమే డబ్బావాలాల మీద ఈ కవర్ స్టోరీకి ఆసక్తి కలిగించింది. వాళ్ల పుట్టుపూర్వోత్తరాలను మీతో పంచుకునే ఉత్సాహాన్ని రేకెత్తించింది. మళ్లీ సున్నా నుంచి మొదలు.. కరోనా ఆంక్షల సడలింపు తర్వాత డబ్బావాలాలు తమ విధుల్లోకి చేరి యేడాదిన్నర (2020, అక్టోబర్) కావస్తోంది. అయినప్పటికీ మునుపటిలా పుంజుకోలేకపోతున్నారు. కరోనాకు ముందు సుమారు రెండు లక్షల టిఫిన్ డబ్బాలను బట్వాడా చేసేవారు. ఈ డిమాండ్ చూసి రైల్వే శాఖ వీరికి ముంబైలోని లోకల్ రైళ్లల్లో ఓ బోగిలో కొంత స్థలం కేటాయించింది టిఫిన్ డబ్బాలను పెట్టుకోవడానికి. అంతటి సప్లయ్ ఇప్పుడు10 శాతానికి పడిపోయింది. వీరి సేవల పునఃప్రారంభం తర్వాత టిఫిన్ బాక్స్ పంపే ఖాతాదారుల నుంచి వీరికి ఊహించినంత స్పందన లభించలేదు. మొదట్లో అయితే కేవలం 200లోపు లంచ్ బాక్స్లే అందాయి. ఇది ‘డబ్బావాలా’ అనే సర్వీస్ తొట్టతొలి సంఖ్యకు కాస్త ఎక్కువ. అంటే దాదాపు మళ్లీ సున్నా నుంచి మొదలైనట్టే లెక్క. ఇందుకోసం ఏడెనిమిది వందల మంది డబ్బవాలాలకు మాత్రమే పని దొరికింది. ఇప్పుడిప్పుడే మెల్లగా ఖాతాదారులు పెరుగుతున్నారు. ప్రస్తుతం డబ్బావాలాలు 10 నుంచి 15 వేల మందికి లంచ్బాక్స్లను అందిస్తున్నారు. కారణాలు.. అనుకున్నంత వేగంగా ఖాతాదారుల సంఖ్య పెరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కరోనానే ముఖ్య కారణం. డబ్బావాలాలకున్న లంచ్బాక్స్ ఖాతాదారుల్లో 85 శాతం మంది ఉద్యోగులు, వ్యాపారులు, 15 శాతం మంది విద్యార్థులున్నారు. చాలా సంస్థలు ఇంటి నుంచే పని చేసే సౌకర్యాన్నే ఇంకా కొనసాగించడం, కరోనా ప్రభావంతో చాలా మంది వ్యాపారులు దివాలా తీయడం, కాస్త మెరుగ్గా ఉన్న వారు ఇంకా తమ వ్యాపారాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకోలేకపోవడం వంటి వాటి వల్ల ఆయా రంగాల సంబంధిత ఉద్యోగులు ఇప్పటికీ సెలవు మీదే ఉండడమో, ఇంటి నుంచే తమ సేవలను అందిచడమో జరుగుతోంది. చాలా చోట్ల విద్యాసంస్థలూ ఆన్లైన్ క్లాసెస్నే కొనసాగించడం వల్ల విద్యార్థులూ స్కూళ్లకు వెళ్లడం లేదు. లంచ్ బాక్స్ల గొడవ ఉండడం లేదు. వీటన్నిటి ప్రభావం డబ్బావాలాల మీద పడి టిఫిన్ డబ్బాల బట్వాడా అనుకున్నంతగా పెరగలేదు. మరో కారణంగా.. స్విగ్గీ, జొమాటోలను చూపొచ్చు. ఆఫీసులకు వెళుతున్న అరకొర ఉద్యోగులు, కొంత మంది విద్యార్థులు స్విగ్గీ, జొమాటోల మీద ఆధారపడుతున్నారు. నిజానికి స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్లు మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో.. అంతెందుకు కరోనా కంటే ముందు వరకూ అవి డబ్బావాలాల సేవల మీద పెద్దగా ప్రభావం చూప లేదు. ఐటీ, సర్వీస్ సెక్టార్లోని కొంతమంది ఉద్యోగులు మాత్రమే స్విగ్గీ, జొమాటోలను ఆశ్రయిస్తున్నారు. మిగిలిన వాళ్లంతా తమ ఇళ్ల నుంచి భోజనాన్ని మోసుకొచ్చే డబ్బావాలాల మీదే ఆధారపడ్డారు.. పడుతున్నారు.‘ స్విగ్గీ, జొమాటో కంపెనీలు కేవలం రెస్టారెంట్లు, హోటళ్లలో ఇచ్చిన ఆర్డర్లను మాత్రమే చేరవేస్తాయి. అది కూడా ఒకసారికి మాత్రమే. ఇంకో రోజు కావాలంటే మళ్లీ ఆర్డర్ ఇవ్వాల్సిందే. మేమలా కాదు ఇంట్లో వేడివేడిగా వండిన భోజనాన్ని .. ఇంట్లో వాళ్ల ప్రేమానురాగాలతో సహా తీసుకెళ్లి అందిస్తాం. హోటల్కు వెళ్లినా ఇంట్లో దొరికే రుచి, శుచి, శుభ్రత గురించే వెదుక్కుంటాం కదా. వాటిని మేం బట్వాడా చేస్తున్నాం.. ఇంటి నుంచి సరాసరి ఆ ఇంటి సభ్యులకు. అందుకే స్విగ్గీలు, జొమాటోలు మా డిమాండ్ను తగ్గించలేదు’ అంటున్నారు డబ్బావాలాలు. 2023 నుంచి పూర్తిస్థాయిలో.. ముంబైలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు దీపావళి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దీంతో వచ్చే యేడాది.. 2023 నుంచి అంతటా పూర్తిస్థాయిలో ఉద్యోగులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రానున్న యేడాది నుంచి తమకు వెనకటి మంచి రోజులు మొదలుకాబోతున్నాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు డబ్బావాలాలు. ముంబైకే గుర్తింపుగా మారిన ఈ డబ్బావాలాలు నిన్నా మొన్నా మొదలు కాలేదు. వీరి సేవలకు నూట ముప్పైమూడేళ్ల చరిత్ర ఉంది.. 1800 శకం చివర్లో దేశం నలుమూలల నుంచి ముంబైకి వలసలు పెరిగాయి. హోటళ్లు, మెస్లు, క్యాంటీన్లు, సత్రాలు అంతగాలేని కాలం అది. ఉదయమే పనులకు వెళ్లేవారు మధ్యాహ్నమయ్యేసరికి ఆకలితో నకనకలాడిపోయేవారు. దొరికింది తిని కడుపు నింపుకోవడమే గగనమవుతుంటే ఇంటి భోజనం మాటెక్కడిది? ఆ పరిస్థితిని బాగా గమనించాడు మహాదేవ్ హవాజీ బచ్చే అనే వ్యక్తి. ఇతనూ ముంబై వలస వచ్చినవాడే ఫుణె దగ్గర్లోని భీమాశంకర్ అనే ప్రాంతం నుంచి. అతనికి అనిపించింది.. వీళ్లందరికీ వాళ్ల వాళ్ల ఇళ్ల నుంచి టిఫిన్బాక్స్లు అందించే పనిపెట్టుకుంటే సరి అని! ఆ అందరితో తన ఆలోచనను పంచుకున్నాడు. వాళ్లంతా సంతోషంగా సరే అన్నారు. కానీ అది తన ఒక్కడివల్ల అయ్యే పని కాదే అని విచారించి.. వెంటనే తన ఊరెళ్లి బంధు వర్గంతో విషయం చెప్పి.. సమ్మతించిన వంద మందిని వెంటపెట్టుకుని తిరిగి ముంబై చేరాడు. తెల్లవారి నుంచే టిఫిన్ డబ్బాలను బట్వాడా చేసే పని మొదలుపెట్టాడు. అలా వందమందితో 1890లో ఈ డబ్బావాలాల ప్రస్థానం ప్రారంభమైంది. నేటికి అంచెలంచెలుగా ఎదిగి.. ముంబై వాసుల జీవనంలో భాగమైంది. డబ్బావాలాల్లో దాదాపు అందరూæ బంధువర్గీయులే. మూడు, నాలుగు తరాలుగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. ఈ తరం ఈ కొలువులోకి రావడానికి పెద్దగా ఇష్టపడ్లేదట.. డబ్బావాలాల లాల్చీ పైజామా, తల మీద గాంధీ టోపీ వంటి డ్రెస్ కోడ్ వల్ల. డ్రెస్ కోడ్ అంటే గుర్తొచ్చింది.. ఈ వ్యాసం మొదట్లో డబ్బావాలాలకు 30 వేల రూపాయల అసోసియేషన్ ప్రవేశ రుసుము, దాంతో వారికి నెలకు అయిదు వేల రూపాయల వేతనం, జీవతకాలపు కొలువు తథ్యమని చెప్పుకున్నాం కదా. ఆ రుసుముతోపాటు డబ్బావాలాలు రెండు సైకిళ్లు, ఈ యూనిఫామ్, డబ్బాలు పెట్టుకోవడానికి చెక్క క్రేట్లు కూడా అసోసియేషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. అసోసియేషన్.. ట్రస్ట్ ఒకసారి ఓ ఖతాదారు .. ఒక డబ్బావాలాతో అమర్యాదకరంగా ప్రవర్తించడంతో డబ్బావాలాలంతా ఒక్కటై పోరాడారట. అప్పుడే అనిపించిందట ఇలాంటివి భవిష్యత్లోనూ ఎదురవ్వొచ్చు.. కాబట్టి ఒక అసోసియేషన్గా ఏర్పడాలి అని. అలా 1943లో అనధికారికంగా డబ్బావాలాల అసోసియేషన్ మొదలైనా రిజిస్టర్ అయింది మాత్రం 1968లో ‘నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ అసోసియేషన్’గా. ఖాతాదారులతో వచ్చే ఇబ్బందులనే కాకుండా వాళ్లలో వాళ్లకు తలెత్తే సమస్యలు, వివాదాలనూ ఈ అసోసియేషన్ ద్వారే పరిష్కరించుకుంటారు. దీనికి ఎన్నికలూ ఉంటాయి ప్రతి ఆరేళ్లకు ఒకసారి. అదే పేరుతో వీళ్లకు ట్రస్ట్ కూడా ఉంది. దీనికి అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలుంటాయి. వీళ్లు భీమాశంకర్లో ఓ ధర్మశాలను నిర్మించుకున్నారు. దానికోసం ఫండ్ను ఏర్పాటు చేయడమే ఈ ట్రస్ట్ ముఖ్య విధి. కరోనా నుంచి డబ్బావాలాలకు కావాల్సిన నిత్యావసర సరకులన్నిటినీ అసోసియేషనే అందిస్తోంది ఉచితంగా. దీనికి యునైటెడ్ వే, శ్రామిక్ ఫౌండేషన్, మేకింగ్ ది డిఫరెన్స్ మొదలగు సంస్థలు సహాయం చేస్తున్నాయి. సమావేశాలు.. సేవా కార్యక్రమాలు డబ్బావాలాలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ ప్రణాళికను ఏర్పాటుచేసుకున్నారు. ప్రతినెల 15వ తేదీన సమావేశమై ఎదురైన సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులను పరిష్కరించుకుంటారు. ఈవృత్తిలో కొనసాగుతున్న వాళ్లలో అత్యధిక శాతం పుణెతోపాటు కొంకణ్లోని çసహ్యాద్రి పర్వత పరిసర ప్రాంతాలవారే. ఈ డబ్బావాలాల బృందాలు ఏటా అనేక సేవా, జనజాగృతి కార్యక్రమాలూ చేపడతాయి. ఎలా పని చేస్తారు? ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంటింటికి వెళ్లి భోజనం డబ్బాలు సేకరించి, వాటిని ప్రత్యేకంగా చేయించుకున్న తమ సంస్థ డబ్బాల్లో పెట్టుకుంటారు. ఎవరిడబ్బా ఏదో గుర్తుపెట్టుకోవడానికి వాటి మీద పెయింట్తో మార్క్ చేసుకుంటారు. ఇలా సేకరించిన డబ్బాలను సైకిళ్లు, తోపుడు బండ్లు లేదా భుజాన (దూరాన్ని బట్టి) వేసుకుని సమీపంలోని లోకల్ రైల్వే స్టేషన్లకు చేరవేస్తారు. అక్కడున్న టీమ్ వాటిని ప్రాంతాలవారీగా వేరు చేసి.. స్టేషన్ల వారిగా డెలివరీ చేయాల్సిన టీమ్కు అందచేస్తారు. ఆ టీమ్ ఆ డబ్బాలతోపాటు ఆయా స్టేషన్లు చేరుకొని అక్కడున్న మరి కొందరు డబ్బావాలాల సహకారంతో సైకిళ్లు, తోపుడు బండ్లతోపాటు భుజానా వేసుకుని భోజన సమయానికల్లా అంటే మధ్యాహ్నం ఒంటి గంటలోపు సంబంధిత వ్యక్తులకు ఆ డబ్బాలను అందిస్తారు. అయితే గమ్యస్థానం చేరేందుకు ఒక్కో లంచ్బాక్స్ 20 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో రైలు ప్రయాణంతో పాటు సైకిల్, తోపుడు బండ్లు, కాలినడకా ఉంటాయి. ఇలా భోజనం డబ్బాలు అందించడమే కాదు మళ్లీ ఖాళీ అయిన డబ్బాలనూ ఇదే తీరుగా వారి వారి ఇళ్లకు చేరవేస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగుతుంది. కరోనాకు ముందు అయిదు వేల మంది డబ్బావాలాలు జెట్ స్పీడ్ వేగంతో సుమారు 100 రైల్వేస్టేషన్ల ద్వారా ప్రయాణించి సంబంధిత వ్యక్తులకు లంచ్బాక్స్లను చేరవేసేవారు. బ్యాకప్ టీమ్ విధి నిర్వహణలో డబ్బావాలాలకు అనుకోని ఇబ్బంది ఎదురైనా, ప్రమాదం జరిగినా వెంటనే బ్యాకప్ టీమ్ రంగంలోకి దిగి విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటుంది. ఈ బ్యాకప్ టీమ్లోని సభ్యులు చాలా చురుగ్గా ఉంటారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడి పరిస్థితిని బట్టి చకచకా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా ఏ అవాంతరం వచ్చినా ఆ ప్రాంతపు బ్యాకప్ టీమ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇటు ఖాతాదారుడికి, అటు తమతోటి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. ఇదంతా కూడా కాగితం ముక్క మీద ఎలాంటి ప్రణాళిక లేకుండానే సాగుతుంది అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఇంకో మాట.. ఈ డబ్బావాలాలెవ్వరూ చదువుకున్న వారు కాదు. తక్కువలో తక్కువంటే మూడో తరగతి, ఎక్కువలో ఎక్కువ అంటే ఎనిమిదో తరగతి. అది కూడా చాలా చాలా తక్కువ మంది. అయినా ప్రపంచంలోని పేరున్న ఏ బిజినెస్ స్కూళ్లూ, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లూ, యూనివర్శిటీలూ నిర్వహించలేనంత అద్భతంగా నిర్వహిస్తున్నారు. ఇంకో మాట.. నిత్యం ఘుమఘుమలాడే ఇంటి భోజనాన్ని నిష్టగా తీసుకెళ్లే ఈ డబ్బావాలాల లంచ్ వెన్యూ ఎక్కడో తెలుసా? పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద, సమీప రైల్వేస్టేషన్లు, బస్సు షెల్టర్లు.. వాకవే పార్క్లు! కఠోరనిష్టాగరిష్టులు.. విధి నిర్వహణలో వీరు మద్యం సహా ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోరు. బీడీ, సిగరెట్ వంటి ధూమపానం చేయరు. క్రమశిక్షణ, పనిపట్ల నిబద్ధత, అంకిత భావమే వీరి విజయ రహస్యం. అందరూ సమానమే.. డబ్బావాలాల్లో నౌకర్లు, యజమానులంటూ ఉండరు. అందరూ కలిసికట్టుగా టీమ్ వర్క్ చేస్తారు. 10 మంది చొప్పున టీమ్గా ఏర్పడి సమన్వయంతో పని చేస్తారు. ఈ పది మందిలో ఇద్దరు బ్యాకప్ టీమ్లో ఉంటారు. మిగతా ఎనిమిది మంది డెలివరీ చేస్తారు. ఇలా అయిదు వందల టీమ్లు ఉన్నాయి. ఈ టీమ్స్కి సమన్వయకర్తలుగా ఉండేవారిని మొకద్దాం(లీడర్)గా పిలుస్తారు. ఈ మొకద్దామ్లే ప్రతి ఇంటికి వెళ్లి ఫీజులు వసూలు చేస్తారు. దూరాన్ని బట్టి ఫీజు ఉంటుంది. ప్రస్తుతం ఒక లంచ్బాక్స్కు కనిష్ఠంగా రూ. 900 నుంచి గరిష్ఠంగా రూ. 1200 వరకు తీసుకుంటున్నారు. వచ్చే ఆదాయంలో అందరికీ సమాన వాటా ఉంటుంది. అందరికీ ఆరోగ్యబీమా ఉంది. ప్రకటనలు.. ముంబైలో డబ్బావాలాలు వాణిజ్య ఉత్పత్తుల ప్రచారకులు కూడా. మిగిలిన ప్రాంతాల్లో వార్తాపత్రికల్లో కరపత్రాలను పెట్టి ప్రచారం చేసుకున్నట్టే ముంబైలో ఈ డబ్బావాలాల డబ్బాల్లో కరపత్రాలను పెట్టి తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. ముఖ్యంగా ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ సంస్థలు. దీని ప్రభావం చాలా సానుకూలంగా ఉంటుందనీ చెప్తున్నారు ఆయా సంస్థల సిబ్బంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లోనూ తమ టిఫిన్డబ్బాల బట్వాడా నిర్వహణను మొదలుపెట్టాలనుకుంటున్నారు డబ్బావాలాలు. ఇంకొన్ని వివరాలు.. ∙అయిదు వేల మంది డబ్బా వాలాల్లో 12 మంది మహిళలూ ఉన్నారు. వీళ్లు 2013లో ఈ విధుల్లోకి వచ్చారు. ∙డబ్బావాలాల నిబద్ధతను, వేగాన్ని రికార్డ్ చేసేందుకు బీబీసీ టీమ్ ఒకసారి ప్రయత్నించింది. కానీ డబ్బావాలా గమ్యం చేరిన గంటన్నరకు కానీ బీబీసీ కెమెరా టీమ్ గమ్యానికి చేరలేకపోయింది. ∙ఐఐఎమ్లు వంటి పలు జాతీయ సంస్థలు, హార్వర్డ్ యూనివర్శిటీ సహా పలు అంతర్జాతీయ సంస్థలు, విద్యార్థులు, వ్యక్తులు డబ్బావాలాలపై రిసెర్చ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ∙డబ్బా వాలాల కొలువులోకి ఎక్కువగా వారి ప్రాంతాలకు చెందినవారినే తీసుకుంటారు. చాలా అరుదుగా డబ్బావాలాలెవరైనా తమకు తెలిసిన వ్యక్తిని సూచిస్తే.. తీసుకుంటారు. వారికి అయిదు రోజుల శిక్షణతోపాటు వారి పనితీరును చూశాక.. నచ్చితేనే తమలో ఒకరిగా కలుపుకుంటారు. ∙ప్రిన్స్ చార్ల్స్ ముంబైకి వచ్చినప్పుడు డబ్బావాలాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. వాళ్లు బహుకరించిన గాంధీ టోపీని ధరించాడు. ఇది ఎందుకు విశేషం అయిందంటే అంతకుముందు రాజస్థాన్ సందర్శించిన ప్రిన్స్కు అక్కడ తలపాగా బహుకరిస్తే అది ధరించేందుకు ఆయన అంతగా ఇష్టపడలేదు. అంతేకాదు 2007లో తన వివాహానికి డబ్బావాలాలను ఆహ్వానించాడు ప్రిన్స్ చార్ల్స్. ఆ వేడుకలకు వెళ్లేందుకు డబ్బావాలాలకు అయిన ఖర్చును బ్రిటిష్ హై కమిషనే పెట్టుకుంది. సెంట్రలైజ్డ్ కిచెన్.. మిగిలిన ప్రాంతాలకూ ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న మేమంతా నాలుగో తరం. మాకున్న చదువు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ డబ్బావాలా మేనేజ్మెంట్ను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కరోనా వల్ల ఆలస్యమవుతోంది. పాండమిక్లో మా వాళ్లు కొంతమంది పుణె ఎంఐడీసీలో, సెక్యూరిటీ గార్డులుగా, డ్రైవర్లుగా ఇలా ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి కాబట్టి మళ్లీ వాళ్లంతా వస్తారు. మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. అలాగే తొందర్లోనే సెంట్రలైజ్డ్ కిచెన్నూ ఏర్పాటు చేస్తాం. ఇంటి సభ్యులు అందరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రాజెక్ట్ను చేపడతున్నాం. వాళ్లకు వాళ్లింటి భోజనంలాంటి భోజనాన్ని అందించడమే మా కిచెన్ లక్ష్యం. అలాగే మా ఈ బట్వాడా పద్ధతిని దేశంలోని ఇతర నగరాల్లోనూ ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నాం. – రితేష్ ఆంద్రే (స్పోక్స్ పర్సన్) గుండారపు శ్రీనివాస్ సాక్షి, ముంబై -
లా ల్లోరోనా.. రాత్రి వేళ చూస్తే పగబడుతుంది..!
ప్రేమ.. నమ్మకం.. మోసం.. వేదన.. క్షణికావేశం.. పశ్చాత్తాపం.. ఇంచుమించుగా ఇవే ప్రతి కథకు అంశాలు. అయితే అసంపూర్ణంగా, తీరని ఆవేదనతో ముగిసిన కొన్ని జీవితాలు.. చరిత్రనే వణికించిన కథలుగా మారతాయి. అంతులేని మిస్టరీలుగా మిగిలిపోతాయి. ‘లా ల్లోరోనా’ ఈ పేరు వింటే మెక్సికోలో పిల్లలే కాదు పెద్దలు కూడా భయంతో పరుగుతీస్తారు. ‘లా ల్లోరోనా’ అంటే స్పానిష్లో ‘ఏడ్చే మహిళ’ అని అర్థం. ఏళ్ల కిందటి ఓ కన్న తల్లి ఆక్రందనలే ఈ కథకు మూలం. శాంటాఫె నది తీరంలో రాత్రి పూట నేటికీ ఆమె ఏడుపు వినిపిస్తుందనేది స్థానికుల నమ్మకం. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా ఏడుస్తుంది? మెక్సికన్లు.. ఆమె పేరు విన్నా, ఆమె ఏడుపు విన్నా ఎందుకు భయపడుతుంటారు? ఈ వారం మిస్టరీలో చూద్దాం. కొన్ని శతాబ్దాల క్రితం.. మెక్సికోలో ఓ పేద కుటుంబంలో మారియా అనే ఓ అందగత్తె ఉండేది. పొడవాటి జుట్టు, చక్కటి మోము, ఆకట్టుకునే చిరునవ్వుతో అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె వీధిలో అలా నడిచి వెళ్తుంటే దేవకన్య వెళ్తుందని అంతా పొగిడేవారు. ‘కనీసం రోజుకు ఒక్కసారైనా ఆమెను చూస్తే చాలు’ అన్నట్లు కుర్రాళ్లు ఆమె రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసేవారు. దాంతో మారియా.. పని లేకున్నా ఆ పొగడ్తల కోసమే ఎక్కువ సార్లు వీధుల్లో తిరిగేదట. ఆమె తెల్లటి గౌన్లే ఎక్కువగా ధరించేదట. ఓ రోజు మారియా అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు గుర్రం మీద వచ్చిన ఓ యువకుడు. పొగడ్తలతో మాటలు కలిపి.. ఆమెను తన ప్రేమలో పడేసుకున్నాడు. అబ్బాయి అందగాడూ ఆస్తిపరుడూ కావడంతో పేదవాళ్లైన మారియా తల్లిదండ్రులు.. ‘తమ బిడ్డకు మంచి సంబంధం దొరికింది’ అని ఎంతగానో సంతోషించారు. అతడితోనే అంగరంగవైభవంగా మారియా పెళ్లి జరిపించారు. ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అప్పుడే మారియా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రోజూ ఇంటికి రావాల్సిన భర్త.. మూడు నాలుగు రోజులకోసారి రావడం మొదలుపెట్టాడు. ‘ఎందుకు ఈ మార్పు?’ అంటూ ఓ రోజు మారియా భర్తను నిలదీసింది. ‘నువ్వు గతంలో మాదిరిగా లేవు.. వీలైతే పెళ్లికి ముందులా మారు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు భర్త. మారియా గుండె ముక్కలైపోయింది. ‘అందం శాశ్వతం కాదుగా’ అని వాదించింది. ఎన్నో విధాలుగా భర్తని మార్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. పైగా తన భర్తకు అందంగా ఉండే స్త్రీలంటే మోజనీ, కోరుకున్న అమ్మాయిలకు డబ్బును ఎరగా వేసి.. మోజు తీరాక వదిలించుకుంటాడనీ తెలుసుకుంది. దాంతో మరింత కుమిలిపోయింది. రోజులు గడుస్తున్నాయి. భర్త రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. భార్యపై ప్రేమ తగ్గినంత సులభంగా.. పిల్లలపై మమకారాన్ని చంపుకోలేకపోయాడు మారియా భర్త. కేవలం పిల్లల కోసమే ఇంటికి వస్తూపోతూ ఉండేవారు. దాంతో మారియా మరింత రగిలిపోయింది. భర్తపై కోపం పిల్లలకు శాపంగా మారింది. క్రమంగా పిల్లలపై పగ పెంచుకుంది మారియా. వాళ్లను చంపి.. భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే పిల్లల్ని లాక్కెళ్లి సమీపంలోని శాంటాఫె నదిలో ముంచేసింది. అయితే నదిలో కొట్టుకుపోతున్న పిల్లల అరుపులు.. మారియాలోని తల్లిప్రేమను గుర్తు చేశాయి. ‘అమ్మా కాపాడు..’ అనే పసివాళ్ల ఏడుపులు మాతృ హృదయం తల్లడిల్లేలా చేశాయి. వెంటనే పిల్లల్ని కాపాడాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే నీటి ఉధృతి ఎక్కువ కావడటంతో పిల్లలు నదిలో కొట్టుపోయారు. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పటి నుంచి ఆ నది ఒడ్డునే పిల్లల్ని వెతుక్కుంటూ.. ఏడుస్తూ.. అరుస్తూ.. ఉండిపోయింది మారియా. అదే బెంగతో కొన్ని రోజులకు ఆ నది ఒడ్డునే ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఆత్మగా మారి... ఇప్పటికీ పిల్లల కోసం వెతుకుతూ కనిపిస్తుందనేది మెక్సికో అంతటా వినిపించే కథ. ఇక్కడి దాకా సెంటిమెంట్ యాంగిల్లోనే నడిచిన ‘లా ల్లోరోనా’కు.. హారర్ ట్విస్ట్లను జోడించి కథలు కథలుగా చెబుతుంటారు మెక్సికన్స్. తన పిల్లలు తనకు దూరమయ్యారు కాబట్టి మారియా ప్రేతాత్మలా మారిందని, ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా మాయం చేస్తుందని, ఆమెను రాత్రివేళ చూస్తే పగబడుతుందని, ఆమె ఏడుపు విన్నా దురదృష్టం తప్పదనీ ఏళ్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ చాలా మంది మెక్సికన్లు.. ‘మేము ఆమె ఏడుపుని విన్నాం’ అని చెబుతుంటారు. అక్కడి ప్రజలు రాత్రి వేళ నదులు, సరస్సుల దగ్గరకు వెళ్లాలంటే నేటికీ భయపడతారు. 2019లో, ఆమె ఆచూకీ కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో.. పారానార్మల్ ఫైల్స్ బృందం ప్రయోగాత్మకంగా కొన్ని వీడియోలు చేసింది. అందులో ఘోస్ట్ ఫైండర్ సాయంతో.. ఆమె స్వరాన్ని గుర్తించామంటూ కొన్ని భీకరమైన అరుపుల్ని వినిపించారు. ఇదే కోణంలో చాలా హారర్ మూవీస్ వచ్చినప్పటికీ.. 2019లో వచ్చిన ‘ది కర్స్ ఆఫ్ లా ల్లోరోనా’ అనే సినిమా ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో వణికించింది. ఇప్పటికీ మెక్సికోలో కొందరు చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి.. నది సమీపంలో నివాసం ఉండే సాహసం చేయరు. మొత్తానికి ‘లా ల్లోరోనా’ కథ మెక్సికో చరిత్రలో మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
స్వర్గం వద్దన్న ముద్గలుడు
ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్య, కుమారుడితో కలసి ఉండేవాడు. ఏడాదిలోని మూడువందల అరవై రోజులూ ఏదో ఒక వ్రతదీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ, భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష చేపట్టాడు. ఉభయ పక్షాల్లోనూ పాడ్యమి నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవపూజ, పితృపూజ చేసేవాడు. ఆ పద్నాలుగు రోజులూ ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమినాడు, కృష్ణపక్షంలో అమావాస్యనాడు అతిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్యా కొడుకులతో కలసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు. ముద్గలుడు ఇలా కాలం గడుపుతుండగా, ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానాదికాలు చేసి ఎన్నాళ్లో అయినట్లుగా అతి అసహ్యకరంగా ఉన్నాడు. జుట్టు విరబోసుకుని, మురికి కౌపీనంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సోలిపోతూ ఉన్నాడు. అతణ్ణి చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని, మిగిలినది ఒళ్లంతా పూసుకుని, మాటా పలుకూ లేకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు. ముద్గలుడి ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. చక్కగా విస్తరివేసి భోజనం పెడితే, తిన్నంత తినడం, మిగిలినదంతా ఒంటికి పూసుకుని వెళ్లిపోవడమే! దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు. పరుషంగా మాట్లాడటం కాదు కదా, కనీసం మందలించనైనా లేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారీ ముద్గలుడు అతణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోపమూ లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు దుర్వాసుడు. ‘ముద్గలా! నీ తపస్సుకు, సహనానికి, శాంతానికి, ధర్మనిష్ఠకు నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీవంటి తాపసులు ముల్లోకాల్లో ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్యవిమానం ఇప్పుడే వస్తుంది. స్వశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు’ అని చెప్పి వెళ్లిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్లుగానే ముద్గలుడి ముందు దివ్యవిమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగివచ్చి, ముద్గలుడికి వినమ్రంగా ప్రణమిల్లాడు. ‘మహర్షీ! అనన్యమైన నీ తపశ్శక్తి ఫలితంగా స్వశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచెయ్యి. నాతో కలసి విమానాన్ని అధిరోహించు. నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను’ అన్నాడు. ‘మహాత్మా! స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది? అక్కడి మంచిచెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది. కుతూహలం కొద్ది అడుగుతున్నానే గాని, నిన్ను పరీక్షించడానికి కాదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ముద్గలుడు. ‘ఈ మర్త్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వదిశలో ఉంది స్వర్గలోకం. సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాలంకార భూషితమై, దివ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్లు, సత్యనిష్ఠతో జీవితం గడిపినవాళ్లు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాలను జయించిన ఉత్తములు మాత్రమే స్వర్గార్హత సాధించగలరు. అలాంటి వాళ్లు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నెలవుల్లో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరా వ్యాధి మరణాలేవీ ఉండవు. ఆకలి దప్పులుండవు. వేడీ చలీ ఉండవు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాలన్నీ నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి’ చెప్పాడు దేవదూత. ‘అయినా, స్వర్గం మంచిచెడులు అడిగావు కదూ! ఇప్పటివరకు స్వర్గంలోని మంచివిషయాలన్నీ ఏకరువు పెట్టాను. ఇక స్వర్గానికీ పరిమితులు ఉన్నాయి. అవి కూడా చెబుతాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్నే మనుషులు స్వర్గంలో అనుభవిస్తారు. అక్కడ మళ్లీ పుణ్యం చేయడానికి అవకాశం ఉండదు. భూమ్మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే, స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్లీ భూమ్మీద జన్మించవలసిందే! అలవాటైన సుఖాలను వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో! పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమ్మీద పుడతాడు. బ్రహ్మలోకం తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమ్మీదకు తరిమివేయడబడ్డ మనిషి సుఖవంతుడిగానే పుడతాడనుకో! ఎందుకంటే భూలోకం కర్మభూమి, మిగిలిన పుణ్యలోకాలన్నీ ఫలభూములు. ఇదీ సంగతి. మంచివాడివని ఏదో నీ మీద ఆదరంతో ఇవన్నీ నీతో చెప్పాను. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక దయచెయ్యి. స్వర్గానికి బయల్దేరుదాం’ అన్నాడు దేవదూత. అంతా విని కాసేపు ఆలోచించాడు ముద్గలుడు. ‘అలాగైతే, ఆ స్వర్గం నాకొద్దు. ఏదో రమ్మని ఆదరంగా పిలిచావు. అదే పదివేలు అనుకుంటాను. ఆ స్వర్గసౌఖ్యాలేవో దేవతలకే ఉండనీ. జపతపాలు చేసుకునే నాకెందుకవన్నీ? వెళ్లు. నీ విమానం తీసుకుని వచ్చినదారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్లీ తిరిగి భూమ్మీదకు రాకుండా ఉంటాడో అలాంటి ఉత్తమలోకం కావాలి నాకు. అంతేగాని, పుణ్యఫలాన్ని కొలతవేసి, అంతమేరకు మాత్రమే దక్కే తాత్కాలిక స్వర్గమెందుకు నాకు? శాశ్వతమైన ఉత్తమలోకమే కావాలి నాకు. అలాంటిదానికోసమే ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాను’ అన్నాడు ముద్గలుడు. దేవదూత ఎంత బతిమాలినా పట్టించుకోకుండా, అతణ్ణి సాగనంపాడు. దేవదూతను సాగనంపిన తర్వాత ముద్గలుడు యాచకవృత్తిని కూడా వదిలేశాడు. పరమశాంత మార్గం అవలంబించాడు. నిందాస్తుతులకు చలించడం మానేశాడు. మట్టినీ బంగారాన్నీ ఒకేలా చూసేటంతగా ద్వంద్వాతీత స్థితికి చేరుకున్నాడు. పూర్తిగా తపస్సులోనే మునిగిపోయాడు. నిర్వికల్ప జ్ఞనాయోగంతో తుదకు మోక్షం పొందాడు. - సాంఖ్యాయన -
ఆనందాన్ని నింపే బబుల్స్
గడప ముందు వేసే డోర్ మ్యాట్ నుంచి టేబుల్ మ్యాట్స్ వరకు.. రూఫ్కి వేలాడే షాండ్లియర్ నుంచి క్యాండిల్ వరకు.. ఫ్లవర్ వేజ్ నుంచి సోప్కేస్ వరకు .. ఇంట్లోని అలంకరణ వస్తువులన్నీ బబుల్స్లా ఒకదానితో ఒకటి జత కలిసినట్టుగా కొత్తందాన్ని సంతరించుకుంటున్నాయి! చిన్నపిల్లలు సబ్బు ద్రావకాన్ని బుడగలుగా ఊదుతూ ఆనందాన్ని పొందే విధానం చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఆ రంగురంగుల బుడగలు గాలిలోకి ఎగిరినప్పుడు వెలువడి కాంతి ఎప్పుడూ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే... ఆ ఆలోచనే హోమ్ డెకార్ నిపుణులను మరింతగా ఆకర్షించి ఉంటుంది. అందుకే, ఇప్పుడు ఇంటి అలంకరణలో ‘బబుల్’ ప్రధాన ఆకర్షణ అయ్యింది. బుడగల్లో ఇంద్రధనస్సు రంగులను ఇంటి గోడలపైనే కాదు, ఇతర అలంకరణ వస్తువుల్లోనూ చూపుతున్నారు హోమ్ డెకార్లు. కాంతులు వెదజల్లే బబుల్స్ పువ్వుల అమరికకే కాదు మంచినీళ్ల బాటిళ్లూ బబుల్ షేప్తో అలరిస్తున్నాయి. పూల కుండీలు, పెన్ హోల్డర్లు, ఇతర టేబుల్ అలంకరణ గ్లాస్ వస్తువులన్నీ బుడగల షేప్తో ఆకర్షిస్తున్నాయి. గాజు బుడగల వస్తువుల మీదుగా పడే కాంతి కూడా గది అందాన్ని పెంచడంతో అవీ ప్రధాన అలంకరణ జాబితాలోకి చేరిపోతున్నాయి. కాదేదీ అనర్హం టేబుల్ టాప్స్, ల్యాంప్ స్టాండ్స్, షెల్ఫ్స్... కాదేదీ అనర్హం అన్నట్టు సిరామిక్తోనూ, ప్లాస్టిక్తోనూ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి. గోడకు అలంకరించే వాల్పేపర్స్ లేదా పెయింటింగ్స్లో కూడా బబుల్ షేప్ మరింత ఆహ్లాదంగా మారిపోయింది. పిల్లల గదులనే కాదు మెట్ల మార్గంలోనూ బబుల్ అలంకరణ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. కలిసి జతకట్టు వేసవి వేడి తీవ్రతను తట్టుకునేందుకు ధరించే దుస్తులే కాదు ఇంటి వాతావరణమూ ఆహ్లాదంగా ఉండాలి. అందుకు లేత రంగుల బబుల్ డిజైన్స్ మనసుకు హాయినిచ్చే అలంకరణ అవుతుంది. ‘అంతే కాదు, ఒకదానితో ఒకటి కలిసికట్టుగా ఉండే బబుల్స్ కుటుంబ సభ్యుల మధ్య మమతానుబంధాన్ని బలం చేస్తాయి’ అంటున్నారు డెకార్ నిపుణులు. అందుకే, ఇంటి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా ఈ సీజన్ని మరింత ఆహ్లాదంగా మార్చేస్తున్నాయి బబుల్స్. -
రాజుగారి మూడు ప్రశ్నలు
పూర్వకాలంలో విజయపురి అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు మంచివాడే కానీ అహంకారం మెండు. సభలో ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వాడు. రాజుగారి ధోరణి మంత్రి కట్టప్పకి నచ్చేది కాదు. ఎలాగైనా రాజులోని ఆ చెడు లక్షణాన్ని దూరం చేయాలనుకున్నాడు మంత్రి. ఒకరోజు ఆస్థానంలో సభ జరుగుతుండగా మళ్ళీ రాజుగారు సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే మంత్రి ‘మహా ప్రభూ..! మీ తెలివితేటల గురించి సభలోని వాళ్లందరికీ బాగా తెలుసు. కానీ మన రాజ్యం పొలిమేరలో ఉన్న అవంతిపురంలో అందరూ తెలివైన వారేనని ఒక ప్రచారం ఉంది. వారి ముందు మీ తెలివితేటలను ప్రదర్శిస్తే మీ ప్రతిభ పొరుగు రాజ్యాలకు కూడా విస్తరిస్తుంది’ అని సూచించాడు. సరేనంటూ మరునాడే మారువేషంలో మంత్రిని వెంటబెట్టుకొని అవంతిపురం బయల్దేరాడు రాజు. ఆ ఊరు చేరగానే ఒక పశువులకాపరి కనిపించాడు. తన తెలివితో ముందుగా అతడిని ఓడించాలని అనుకున్నాడు రాజు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి ‘నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెబుతావా?’ అన్నాడు. వెంటనే ఆ పశువుల కాపరి సరే అన్నట్టు తలూపాడు. మొదటి ప్రశ్నగా ‘సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది ఏది?’ అని అడిగాడు. ‘గాలి’ అంటూ సమాధానం వచ్చింది. ‘పవిత్రమైన జలము ఏది?’ అని ప్రశ్నించాడు. ‘గంగా జలం’ అని టక్కున సమాధానం చెప్పాడు. ముచ్చటగా మూడో ప్రశ్న... ‘అన్నింటికన్నా ఉత్తమమైన పాన్పు ఏది?’ అనగానే ‘మంచి చందనంతో చేసిన పాన్పు’ అని పశువులకాపరి జవాబిచ్చాడు. ‘బాగా చెప్పావు.. సరిగ్గా నా మదిలో కూడా అవే జవాబులు ఉన్నాయి’ అన్నాడు రాజు. అప్పుడు ఆ పశువుల కాపరి విరగబడి నవ్వడంతో రాజుకు కోపం వచ్చింది. రాజు పట్టరాని కోపంతో ‘ఎందుకు ఆ నవ్వు?’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘నేను చెప్పిన తప్పుడు సమాధానాలన్నీ మీరు ఒప్పు అని అంటుంటే మరి నవ్వక ఏం చేయాలి?’ అని మొహం మీదే అనేశాడు పశువులకాపరి. అయితే సరైన సమాధానం ఏమిటో చెప్పమని గర్జించాడు విక్రమసింహుడు. ‘సృష్టిలో అన్నింటికన్నా వేగమైంది మనసు, విలువైన జలం ఎడారిలో దొరికే జలం, ఉత్తమమైన పాన్పు అమ్మ ఒడి’ అని పశువులకాపరి బదులిచ్చాడు. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడుతూ ఊళ్లోకి వెళ్లకుండానే వెనుదిరిగాడు రాజు. అప్పటి నుంచి తన అహంకారాన్ని వదిలి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండసాగాడు. -
రజిత కొండసాని: రవ్వల ముద్దులు...కథ
పొద్దు బారడెక్కినాది చ్యాటలో బియ్యం వేసుకుని సెరుగుతా దొండ్లోకి తొంగిసూసినాను.. కూసానిక్కట్టేసిన గొర్రిపొట్లి నెమరేత్తాండాది. మా నాయన పట్టించిన పిల్లగొర్రెది బాగా మేసి బలిసినాది. దేవర్లకు,పండగలకి సానామంది రేటును కట్నారు ఐనా ఇయ్యలేదు. మా ఆయనేమో ‘లాభమొత్తాంటే అట్నే పెట్టుకుంటావేందే ఎర్రిదాన అమ్మితగలెట్టు’ అంటా ఈసడిత్తాన్నా నేను మాత్రం ఊకొట్లే..అమ్మేసి రవ్వల దుద్దులు కొనుక్కోవాలని సిన్నప్పట్నుంచి కోరిక. ఒకతూరైనా ఎట్టకపోతానా అని పట్టుపట్నాను. ‘కూలోళ్ళు సేనికాడికిపొయ్యి పెదింత పొద్దయింది.. ఇంగా చ్యాట పట్టుకున్యావా.. పొయ్యిలో అగ్గెప్పుడేస్తావు కూడెప్పుడు సేస్తావు’ అంటా ఎనకమాలే మా ఆయన శీనయ్య గెంతులేస్తా వచ్చినాడు. బిరబిరా పొయ్యికాడికి పోయి నిప్పులెగేసి ఎసురు పెట్టేసినాను. పొద్దెలగా లెయ్యాల.. కసుఊడ్చాల.. గొడ్లు మార్సికట్టేసి ఉట్లగడ్డి కింద ఇదిలియ్యాల.. ఇయన్నీ నేనే సెయ్యాల.. మా ఆయన పగలంతా పనికిపొయ్యి రెక్కలిరగా కట్టపడి మాపట్యాళకు ఇంటికొత్తే కాళ్లు ముఖం కడిగి.. నాల్గు పిడచలు కడుపుకేసి తొంగుంటే.. పొద్దు బారడెక్కాక లేస్తాడు. పొయ్యిలో కట్లెగేస్తాంటే పక్కింటి సూరమ్మత్త సక్కా వచ్చినాది ‘సూడే లచ్చిమీ.. మనం యాళపొద్దు మీరేదంకా రెక్కలిరుసుకున్నా..రవ్వంత బంగారం ముఖం సూడకపోతిమి. పక్కింటి అక్కమ్మ సూడూ.. ఆళ్ళాయనతో పట్టుపట్టి రవ్వల దుద్దులు కొనించుకుందంట’ అంటానే ప్యాణం సివుక్కుమన్నాది. రాతిరి కల్లో కూడా దుద్దులే కానస్తాండాయి. గొర్రెపొట్లి పెద్దయ్యాక అమ్మేసి తెచ్చుకోవల్లా.. మనసు గట్టిగా నిలగట్టుకున్నాను. ఎట్లైనా సరే అనుకుంది సాదించాల.. అనుకుంటా గంపకు సద్దెట్టి సేన్లోకి ఎళ్ళబార్నాను. కూలోళ్ళు కలుపుతీస్తాండారు. గనెంపై గంప దించినాను. తింటానికొచ్చినారు కూలోళ్ళు. ఆళ్ళలో అచ్చమ్మక్క సెవులవంకే నా సూప్పోయినాది. దుద్దులు ధగధగా మెరుస్తాండాయి. రెప్పార్పకుండా సూస్తాండాను. ‘దుద్దులొంక అట్టా సూస్తావేంటే దిష్టి తగుల్తుంది’ అన్యాది అచ్చమ్మక్క. ‘దుద్దులెంతా’ అనడిగాన్నేను. ‘కూలిసేసిందంతా దీన్లకే ముదలార్చినాను. వయసు సందేళై వాలిపోతాంటే ఇయన్నీ దేనికే అంటా నెత్తి పొడిసి పొడిసి తీసిచ్చాళ్ళే మా సచ్చినోడు’ అంటా అచ్చమ్మక్క అంటాంటే పక్కుమన్యారందరూ. ‘సానా బాగుండాయి.. నిగనిగలాడ్తాండాయి. తెచ్చేసుకుందామని ఆపొద్దున్నుంచి యోచన సేస్తాండానే కానీ ఏసింది లేదు పోయింది లేదనుకో’ సింతాకంత ముఖం పెట్టి అన్యాను. అందరూ తిని నడుమొంచినంక సద్దిగంప ఎత్తుకుని గట్లంటి నడుస్తాన్నానన్న మాటేగానీ అచ్చమ్మక్క సెవికేలాడ్తున్న దుద్దులొంకే మనసు పీకుతుండాది. పుట్టింటోళ్ళిచ్చిన గొడ్డు గోదా అమ్మరాదని ఎవరో సెప్తే.. గుటకలు మింగినాను. రవ్వల దుద్దుల కోరిక తీరాలంటే అదొక్కటే దారి. ఊళ్ళో సున్నపురాళ్ళ సినెంగట్రాముడు మూనాళ్ళ నుంచి బంగపోతాండాడు గొర్రిపొట్లినియ్యమని. రేప్పొద్దున్నే రమ్మని సెప్పాల. యాదోఒగ రేటు కూసేస్తే ఆడికే కొలబెట్టాలనుకుని,తిని పడకేసినాను. ఆరుబయట పడుకుని జాముసుక్క ఎప్పుడు పొడుస్తాదాని సూస్తా మేల్కొన్నా.. నిద్ర ఇంచుక్కూడా రాలేదు. ఎట్లైనా పొట్లినమ్మేసి రవ్వల దుద్దులు కొనుక్కోవాల. ఏసుకుని బజారెంట పోతాంటే ఈది ఈదంతా నోట్లోకేలెట్టుకోవల్లా.. అబ్బురుపోవల్లా.. ఇలా ఆలోచిస్తాంటే సూరిమీద కోడి రెక్కలు పటపటా కొట్టి కూతేసినాది. బిరక్కన లేసి పాకలోకి పరిగెత్తినాను గొర్రిపొట్లి కనపల్లే. ‘ఇక్కర్రారయ్యో.. గొర్రిపొట్లి కనపల్లే’ అంటా కూతెట్టినాను. పరిగెత్తొచ్చినాడు మా ఆయన ఇసురు కట్టి చేత్తో ఎట్టుకుని పాక సుట్టూర సూసినాం.. యాడా కనపల్లే. దొంగలెత్తుకు పోయారేమో.. రవ్వల దుద్దులు కొనుక్కుందామంటే బండెడంత ఆశ బట్టబయలైపాయే! ∙∙ ఏడుస్తా కూకున్నాను కంట్లో నీళ్లు తుడిసే కొంగుకు లోకువైనట్లు తెల్లార్లు ముద్ద మింగకుండా కూచున్నాను. ‘నీ దుద్దులు మీద బండపడా. అట్లా ఏడుస్తా కూకోద్దే పంట ఇంటికొస్తే తీసిస్తాలే. పోయి కాసింత ఎంగిలి పడు’ అంటాండాడు మా ఆయన. ఈసారి గింజలింటికొస్తే రవ్వల దుద్దులు కొనుక్కోవాల.. బాగా కాళ్ళిరగా కట్టపడితే పంట బాగా ఇదిలిస్తాదని నేను కూడా సేన్లోకి ఉరికురికిపోయినాను. సెనక్కాయలసెట్లు మోకాలెత్తు పెరిగి, సీకు పొదల్లా సిక్కగా కాసింటే దిష్టిబొమ్మ నడిమి సేన్లో పెట్టినాము. హమ్మయ్య ఈతూరైనా రవ్వల దుద్దులు ఏసుకోచ్చనే ఆనందం అటకెక్కించినాను. దీపావళి పండగ సానా ఇదిగా చేసినాం. అమ్మవారికి నైవేద్యం పెట్టినాం. సీర కట్టినాం. నా దుద్దుల సంగతి మర్చిపోకని సెవిలో ఊదినా.. ఆయమ్మే నా ఆశ తీర్చాలా..! సెనగసెట్లు పీకి ఒదులేస్తాంటే కుచ్చులు కుచ్చులు కాసిన కాయిల్ని చూసి కండ్లు మెరుపులైనాయనుకో. బాగా ఎండనిచ్చి కుప్పేద్దామని రొండు దినాలుండినాం. రేప్పొద్దున్నే కుప్పెయ్యాల. ఆ రాతిరి సంతోసం సుక్కలంటి కన్రెప్పెయ్యనే లేదు. సరిగ్గా అర్ధరేత్రి పొద్దుకాడ తూరుపక్కన మెరిసినాది. ఒక్కొక్క సినుకు రాల్తాంటే గుండె సెరువైనాది. ‘అయ్యో.. భగవంతుడా.. సెట్టు నానిపోతే కాయలు బూజొస్తాయి.. రేటు పోవు’ అనుకుంటా ఎట్లసేయాలో పాలుపోలేదు. పొయ్యింట్లోకి బయటింట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరగతాండాను. ఫెళఫెళమంటా ఉరుములొచ్చేసరికి ఆశల మీద మన్ను కప్పెట్టేసాను. వాన జోరుగా కురిసినాది. సెరువులు, కుంటలు ఏకమైపోయినాయి. నెత్తిన గుడ్డేసుకుని సేనుకాడికి పరిగెత్తినాము. ‘ఒసేయ్.. నువ్వింటికాడే పడుండు నేన్చూసొత్తా’ అని మా ఆయన అంటాన్నా నావల్ల కాలే ఎనకాల్నే సిన్నగా పోయినా. పంటంతా మునిగిపోయినాది. శాడకేసిన మడికెయ్యల్లాగా సెలకలన్నీ నీళ్ల సెలమలైపోయినాయి. రవ్వల దుద్దులు ఈ పంటకైనా తెచ్చుకుందామని ఉవిల్లూరినా.. అంతా నీళ్లపాలైనాది. సెట్టుకింద ఒక్కత్తే కూకుని ఆలోసిస్తాన్నా ఎట్లైనా సరే రవ్వల దుద్దులు ఏసుకోవల్ల. అచ్చమ్మక్క సూడు కూలినాలి పోయి తెచ్చుకున్నాది. నేను కూడా కూలి పోతా అనుకుని మాప్పొద్దున్నే వాళ్ళెనకంటి సాలమ్మత్త మడికెయ్యి కోసేకి ఎళ్ళబారినా. మా ఆయన సూసి.. ‘నీ రవ్వల దుద్దులు మోజు కూలికాడ దాకా తీసుకుపోతాంటే. .ఏందే ఇది వయసు యాళపొద్దు దాటేసింది, ఇంగా ఈ ముదనష్టపు కోరికేందే..’ అంటా ఆడిపోసినాడు. ఐనా ఇన్లే. రవ్వల దుద్దులు కోసమై ఆ పని ఈ పని అనకా అన్ని పన్లూ చేసినా. ఎట్లైనా తిరునాళ్ళ లోపు రవ్వల దుద్దులు నా సెవులకు ఏలాడ్తా మెరిసిపోవాల. దుడ్లు బాగా కూడబెట్నా. ‘కొడుకు సూరిగాడు సదువు సంకనెక్కి బేకార్గా తిరగతాండాడు. ఆడికి సేద్యంగీద్యం వచ్చిసావదు. యాపారం చేసే తలకాయున్నోడు కాకపాయే. ఆడి సంగతి కాట్లోకేసి ఇదేం పిచ్చే..’ అంటా మా ఆయన ఎగర్తాన్నా.. కొనసెవిల్లోక్కూడా ఎయ్యలా. సంకరాత్రికి తీయిచ్చిన సుక్కలసీర సింగారించి పెద్దమ్మని తోడ్కొని రవ్వల దుద్దులు తీసుకోటానికి పట్నం ఎళ్ళబారినాం. నా ఆనందం అంతా ఇంతా కాదనుకో. ఇంటి ఎనకాలే సీల్తోవలో పోతే పట్నం సానా దగ్గిర. ఇద్దరం నడుత్తా పోతాండాము. ‘ఏమే లచ్చీ.. సిన్నప్పట్నుంచి దుద్దులు దుద్దులంటాండావు.. ఒకతూరైనా తీసీలేదా మీ నాయనా’ అనంది పెద్దమ్మ. ‘దుడ్లుంటే కదా నాయనకాడ రవ్వల దుద్దులు తీసిచ్చేకి! రాత్రిపవళ్లు దుమ్ము నెత్తిన పోసుకున్నా దమ్మిడీ ఆదాయం లేదు. కూలికింత నాలికింతపోను గానిగెద్దులా గిరగిరా తిరిగి పన్జేసినా సింతాకంత మిగల్కపాయే’ అని అంటూ నడుత్తున్నాము దారెంటి. ‘సర్లే.. అనుకుంటే తీర్తాయా పోతాయా’ అనంది పెద్దమ్మ. దావమొత్తం పరిక్కంపలే. సూసి సూసి అడుగెయ్యాల. సింతోపు దాటి రెండడుగుల్నేసినాం అంతే.. నా కొడుకు సూరిగాడు పరిగెత్తుతా వస్తాన్నాడు.. ‘అమ్మా..అమ్మోయ్’ అంటా! బిరబిరా వచ్చి ‘నాయనకి నోట్లో బురుగొచ్చింది కొక్కరతేవులొచ్చిన కోడిలా తండ్లాడతాన్నాడు భయమేసి నీకాడకు పరెగెత్తుకొచ్చినా’ అనన్నాడు కొడుకు. ఓలమ్మో మల్లా అట్లనే ఐందా పెండ్లైనప్పట్నుంచి అట్టా ఏపొద్దూ కాలే. అంతకుముందు అయ్యేది, మాయవ్వ పసురు పెట్టి మేల్జేసినాది. మల్లా రోగం తిరగబెట్టిందా అనుకుంటా.. దుద్దుల సంగతి దేవుడెరుక.. పరిగెత్తుతా ఇంటికిపోయినా. మంచం మీద ఎల్లకిలా పడున్నాడు. శర్మం బాగా సెగ పుట్టినాది. నాటువైద్యుని దగ్గర్కి తీస్కుపోతే బాగా పసురు కలియబెట్టి తాపించి రెండేసి వేలు తీస్కున్నాడు. ఇంగిలీసు మందు మింగమంటే నాకొద్దంటాడు. రవ్వల దుద్దులకని దాపెట్టుకున్న పైసలు మా ఆయన రోగాన్కే ఎళ్ళిపాయే. తిరునాళ్ళింక సానా దినాల్లేదు దగ్గర పన్యాది. ఎట్ల సెయ్యాలో ఏందో దిక్కుతోచలే. ఎట్లైనా సరే రవ్వల దుద్దులు తిరునాళ్ళకు పెట్టాల, దేవుడు ఎన్నడు దావిత్తాడో ఏందో అనుకుంటా కూకున్నాను. ఇంట్లో కూసాన్కి ఆనుకొని. ఎవరో భుజం తట్టినట్లైతే తలెత్తి సూసినా. మా ఆయన ‘అట్టా దిగులెట్టి కూకోమాకే. పాపం నీ బాధ సూత్తాంటే ప్యాణం తరుక్కుపోతాంది. రవ్వల దుద్దులు పెట్టుకోవల్లనే ఆశ తీరకపోతాండాది. సంతోసంగా ఎళ్ళబారుతావ్ తీరా ఆశ తీర్తాదనంగా ఏందో ఒకటి అడ్డొచ్చి పడ్తాది. దేవుడున్నాడే పో.. పోయి అన్నంకడి తిను యాళపొద్దు దాటిపోతాండాది’ అనంటుంటే కండ్లలో నీళ్లు తిరిగినాయి. నాకే కాదు ఆయనక్కూడా! నేను రవ్వల దుద్దులెట్టుకుని తిరునాళ్ళకు పోతాంటే సూడాలనుంది అందుకే అంతలా బాధ పడ్తాన్నాడు. ∙∙ ఆపొద్దు పొద్దుగాలే లేసి పన్లన్నీ చేసేసి. బువ్వ చేసి మా ఆయన్కి, కొడుక్కి పెట్టి ఆళ్ళు తినినాక పుట్టింటికి పోయ్యెద్దామని బయల్దేరినాను. ‘వాళ్ళగ్గానీ ఎక్కనుంచి వత్తాయి లెక్కలు, రవ్వల దుద్దుల కోసం అంతదూరం పోవాల్నా.. నేనే ఏదోటి చేసి కొనిత్తాలే. శీనయ్య పెండ్లాం రవ్వల దుద్దులేసినాదంటే నాగ్గానీ పేర్రాదా సెప్పు’ మా ఆయన మాటకి ప్యాణం లేసొచ్చినాది కన్నుల్లో ఆనందం ఎగజిమ్మినాది. మా ఆయన సావుకారి బసప్పతాకి పోయి వడ్డీకి దుడ్లు తెచ్చినాడు. ‘ఇదిగో తీసుకో పోయి తెచ్చుకో’ అంటా దుడ్లు నా చేతికి ఇస్తాంటే ఇంగ నా కోరిక తీరిపోయినాదని దండిగా సంబరపన్యాను. పెద్దమ్మని తోడ్కొని పట్నం ఎళ్ళబారినాను. పట్నమంతా తిరిగి తిరిగి రవ్వల దుద్దుల కోసం పోయింతావల్లా తిప్పి తిప్పి సూసినాం. నచ్చక ఇంగోతాకి పోయినాం. సుమారు పది అంగళ్ళు తిరిగినాం. యాడా కుదర్లే. ‘పెద్దమ్మ.. నచ్చింది సిక్కేదే బొరువు. వద్దనుకునేవి దండిగా వుంటాయి ఏందో’ అనంటే ‘అవునే.. ఇన్నాళ్ళంతా దుద్దులు కొనుక్కోవల్లని నానాయాతన పన్యావు. ఇప్పుడైతే సరైన దుద్దులు సిక్కేదే కట్టమైనాది’ అనుకుంటా నడుత్తాండాము. బాగా తిరిగి నీళ్ళు దప్పిగ్గొని ఒకతావ నిలబన్యాము. చిరుతిండ్లమ్మె గుడిసెల్లో నీళ్ళడిగితే గుటకడు నీళ్ళు కావాలంటే ఏందైనా కొనుక్కోవాలంట.. ఏం కాలమొచ్చిందో ఏమో..అనుకుంటా పోయినాం. ఒక శేటు దగ్గిర రవ్వల దుద్దులు కుదిర్నాయి. రేటు కట్టి సరిపోతాయో లేదోనని ఏసి సూసి తీసేసినా. ‘రవ్వల దుద్దులు ఎట్టుకుంటే ఎంత బాగా కానత్తాండావే లచ్చీ మీ ఆయన సూడల్లా.. మురిసిపోతాడు’ పెద్దమ్మనగానే సిగ్గు సింతసెట్టెక్కినాదనుకో. బేరమాడి కొనుక్కొని ఇంటికి బయల్దేరినాం. మొదట మా ఆయనకే సూపించాల. మొదట మొదట్నే ఊళ్ళో వాళ్ళ కండ్లు పడ్తే దిష్టి తగుల్తాది. రేపే తిరునాళ్ళు. దేవుడు నా బాధ సూల్లేక.. కోరిక తీర్చినాడు. బిరిగ్గా రవ్వల దుద్దులు పెట్టుకుందామని బిరబిరా ఇంటికి పోయినాను. ఇంటి ముందర జనాలు గుంపుగా నించోనుండారు. ‘మా ఇంటికాడ ఇంతమంది గుమికూడ్నారెందుకు’ అనుకుంటా పోయి సూసినా. కొడుకు తాళ్ళమంచం కోళ్లు పట్టుకుని ఏడుస్తాన్నాడు. మా ఆయన మంచంపై పడుకున్నాడు. నన్ను సూడగానే కొడుకు ఎక్కిళ్లు పట్టి ఏడుస్తా పరిగెత్తుకొచ్చినాడు ‘అమ్మా... నాయనా సచ్చిపొయ్యాడు..’ ఈ మాట కొడుకంటానే కండ్లెంటి నీళ్లు కారిపోయినాయి. కొనుక్కొచ్చిన రవ్వల దుద్దులు ఆడనే జార్నిడ్చి మా ఆయనపైబడి బోరున మొత్తుకున్నాను. ‘పాపం రవ్వల దుద్దులు పెట్టుకోవల్లని ఎంత ఆశ పెట్టుకుందో పిచ్చిది. కడసారికి తీరకుండానే పాయే’ అంటా పెద్దమ్మ ఏడుత్తాంటే ఊరాళ్ళందరూ కండ్లలో నీళ్ళెట్టుకున్నారు. మొగుడే పొయ్యాకా రవ్వల దుద్దులు ఉంటేనేం ఊడితేనేం అనుకుంటా.. ఒకతూరి రవ్వల దుద్దులకేసి సూసినాను. మట్లో పడిపోయిన దుద్దులు నిగనిగా మెరుత్తాంటే కన్నులు తేలేసినాను. ‘పాపం.. రవ్వల దుద్దుల మోజు తీర్కపాయే. ఏసుకునే భాగ్యంల్యాకపాయే. అప్పులు తీర్తాదా మొగున్కి దినాల్సెత్తాదా ఒట్టి పిచ్చిది’ అన్యారెవరో.. - రజిత కొండసాని -
సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్గా కనిపిస్తాం
సెట్స్ మీద స్క్రిప్ట్లోని పాత్రల పట్లే కాదు ఆఫ్సెట్స్లో అటెండ్ అవబోతున్న అకేషన్స్కి ధరించబోయే అవుట్ ఫిట్స్ మీదా అంతే శ్రద్ధ పెడుతుంది శ్రద్ధా కపూర్! అందుకే హీరోయిన్గా ఆమెకు ఎంత క్రేజో... ఫ్యాషన్ దివాగానూ ఆమె పట్ల అంతే అభిమానం సినీప్రియులకు. ఆమెను దివానీగా మార్చిన బ్రాండ్స్ ఇవే.. సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడతా. సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్గా కనిపిస్తాం. అందుకే నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యం. ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. – శ్రద్ధా కపూర్ ఐవరీ లెహెంగా డిజైనర్: అనీతా డోంగ్రే ధర:రూ. 1,99,000 త్యానీ బంగారు, వజ్రాభరణాలను భారతీయులు ఇష్టపడ్డంతగా ప్రపంచంలో ఇంకెవరూ ఇష్టపడరు. నగలు చేయించడమంటే ఒకరకంగా ఆస్తిని కూడబెట్టడమే మన దగ్గర. అదో ఆనవాయితీగానూ స్థిరపడింది. ఈ పాయింటే ‘త్యానీ’ బ్రాండ్ స్థాపనకు ప్రేరణనిచ్చింది. దీని వెనకున్న వ్యక్తి కరణ్ జోహార్. మీరు సరిగ్గానే చదివారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహారే. తన సృజన తృష్ణకు మరో విండోనే ఈ ‘త్యానీ’. భారతీయ సంప్రదాయ నగలను ఆధునిక మహిళ అభిరుచికి తగ్గట్టుగా మలుస్తోందీ త్యానీ. అదే దాని మార్క్.. బ్రాండ్ వాల్యూనూ! 27 వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతుంది త్యాగీ జ్యూయెలరీ. అనీతా డోంగ్రే బాల్యంలోని సెలవులను జైపూర్లోని అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో గడపడం వల్ల స్థానిక సంప్రదాయ కుట్లు, అల్లికలను చూస్తూ పెరిగింది అనీతా డోంగ్రే. దాంతో చిన్నప్పుడే ఫ్యాషన్, డిజైనింగ్ పట్ల మక్కువ పెంచుకుంది. అందుకే పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ చేసింది. సంప్రదాయ కళకు ఆధునిక హంగులను జోడించి సరికొత్త డిజైన్స్ను రూపొందించింది. ఆ సృజనే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. అంతేకాదు ఎంతో మంది గ్రామీణ మహిళలకు చక్కటి ఉపాధినీ ఇస్తోంది. ఆమె ప్రత్యేకతల్లో ఇంకో మాటా చేర్చాలి. అనీతా డోంగ్రే డిజైన్స్ పర్యావరణ ప్రియంగా ఉంటాయి. రసాయన రంగులు, లెదర్, ఫర్ వంటివి ఉండవు. -
ది ఐస్ బాక్స్ మర్డర్స్.. నేటికీ మిస్టరీగానే!
ఉన్మాద చర్యలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. నిర్ఘాంతపోయే నిజాలతో గజగజా వణికిస్తాయి. నెత్తుటిధారలతో చరిత్ర పేజీలను తడిపేస్తాయి. ఆ జాబితాలోనివే అమెరికాలోనే అతి భయంకరమైన ఐస్ బాక్స్ మర్డర్స్. సుమారు 56 ఏళ్లు దాటినా నేటికీ తేలని ఆ కథేంటో ఈ వారం మిస్టరీలో చూద్దాం. 1965, జూన్ 23.. చార్ల్స్ ఫ్రెడరిక్ రోజర్స్ అనే పేరు అమెరికా మొత్తం మారుమోగిన రోజు. అతడి ఫొటోలు నాటి పత్రికల మొదటి పేజీల్లో పడ్డాయి. మోస్ట్ పాపులర్గా కాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా. అసలు ఎవరీ రోజర్స్.. అతడు చేసిన నేరమేంటీ? ఫ్రెడ్ క్రిస్టోఫర్, మరియా ఎడ్వినా.. దంపతులకు 1921 డిసెంబర్ 30న జన్మించాడు రోజర్స్. 1942 నాటికి హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్ నేవీలో పైలట్గా ఉంటూనే.. నేవల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో గుఢచారిగానూ పనిచేశాడు. యుద్ధం తర్వాత తొమ్మిదేళ్ల పాటు షెల్ ఆయిల్కు భూకంప శాస్త్రవేత్త గా సేవలందించాడు. 1957లో ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ‘రోజర్స్ ఏడు భాషలను అనర్గళంగా మాట్లాగలడు. చాలా తెలివైనవాడు. చమురు, బంగారం వెలికి తియ్యడంలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది అతడికి’ అనేది అతడి సన్నిహితుల మాట. 1963 తర్వాత రోజర్స్ నిరుద్యోగిగానే ఉన్నాడు. హ్యూస్టన్ లోని మాంట్రోస్ పరిసరాల్లో నివసిస్తున్న వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే తెల్లవారకముందే వెళ్లి.. అర్ధరాత్రికి తిరిగి వచ్చే రోజర్స్ అక్కడే ఉంటున్నాడనే విషయం చుట్టుపక్కల వాళ్లక్కూడా పెద్దగా తెలియదు. ఏళ్లు గడిచాయి.. 1965, జూన్ 23న ఫ్రెడ్ మేనల్లుడు మార్విన్.. ఆందోళనగా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. గత కొన్ని రోజులుగా తన అత్తా, మామ(ఫ్రెడ్, మరియా)ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, ఇంటికి వెళ్తే తాళాలు వేసి ఉన్నాయని.. అసలే ముసలివాళ్లు.. ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమోనని అనుమానంగా ఉందని, తక్షణమే వెతకాలని కోరాడు. దాంతో హ్యూస్టన్ పోలీసులు రంగంలోని దిగారు. మార్విన్ని తీసుకుని మాంట్రోస్ పరిసరాల్లో ఉన్న ఫ్రెడ్ ఇంటికి బయలుదేరారు సోదా చెయ్యడానికి. తలుపుమూసి ఉండటం చూసి.. బలవంతంగా తెరిచారు. తలుపు తీస్తే లోపలంతా సాధారణంగా ఉంది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. డైనింగ్ టేబుల్ మీద ఏవో వంటకాలు కనిపించాయి. చుట్టూ చూశారు పోలీసులు. ఒక్కొక్కరూ ఒక్కో గది వెతికారు. ఎక్కడా ఏమీ అసాధరణమైనవి కంటపడలేదు. మనుషులూ కనిపించలేదు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్కి ఓ అనుమానం వచ్చింది. ‘ఈ ఇంట్లో ఎన్నిరోజులుగా మనుషులు ఉండటం లేదు? రోజువారి అసవరాల కోసం ఏమైనా తెచ్చి పెట్టుకుంటున్నారా లేదా?’ అనుకుంటూ ఫ్రిజ్ ఓపెన్ చేసి చూశాడు. ఫ్రిజ్ నిండా శుభ్రంగా కడిగిపెట్టిన మాంసం కనిపించింది. అడివి దున్న మాంసం కాబోలు అనుకుని తలుపు వెయ్యబోతుంటే.. కింద ఉండే ట్రాన్స్పరెంట్ కూరగాయల టబ్లో రెండు మనిషి తలలు కనిపించాయి. అవి ఎవరివో కాదు.. ఫ్రెడ్, మరియాలవే. ఫ్రిజ్ డోర్ తీసిన ఆఫీసర్ నుంచి ఒక గావుకేక వినిపించింది. మిగిలిన వాళ్లు అతడి దగ్గరకు పరుగుతీశారు. అక్కడ పరిస్థితి చూసి గజగజా వణికారు. టాయిలెట్ ఫ్లష్ దగ్గర.. ఆ దంపతుల అవయవాలు తొలగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అవశేషాలు దొరికాయి. రోజర్స్ గదిలో రక్తంతో తడిసిన రంపాన్ని బయటికి తీశారు. అయితే ఆ రోజు నుంచి రోజర్స్ కనిపించలేదు. అసలు ఎక్కడున్నాడో ఈ ప్రపంచానికి తెలియలేదు. నేరం చేసింది ఎవరు? కన్నకొడుకే తల్లిదండ్రులను ఇంత కిరాతకంగా కడతేర్చాడా? అనే వార్తలు యావత్ అమెరికా వ్యాపించాయి. అంతకు రెండు రోజుల ముందే ఫ్రెడ్ దంపతులు హత్యకు గురైనట్లు రిపోర్ట్లు వచ్చాయి. రెండు రోజుల ముందంటే జూన్ 20న ఈ ఘోరం జరిగింది. అంటే ఆ రోజు ఫాదర్స్ డే కావడంతో ఈ వార్త మరింత సంచలనం అయ్యింది. శవపరీక్షల్లో ఫ్రెడ్(81), మారియా(72)లని తలపై సుత్తితో కొట్టి చంపినట్లు తేలింది. చనిపోయిన తర్వాతే ఫ్రెడ్ కాళ్లు, జననాంగాలు తొలగించారని, మారియా శరీరానికి నిప్పు పెట్టి, మిగిలింది ఫ్రిజ్లో దాచిపెట్టారని వెల్లడైంది. అయితే రోజర్స్.. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సి.ఐ.ఏ)కి సంబంధించిన ఏజెంట్ అని.. మెక్సికో నగరంలో ‘లీ హార్వే ఓస్వాల్డ్’గా చలామణీ అయ్యాడని.. చార్ల్స్ హారెల్సన్, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీల హత్యల్లో నిందితుడని, అతడి రహస్యాలు తెలుసుకున్నందుకే తల్లిదండ్రులను చంపేశాడని.. కథలు కథలుగా రాశారు కొందరు ఔత్సాహిక రచయితలు. అయితే ఈ వాదనను పలువురు విచారణాధికారులు కొట్టిపారేశారు. రోజర్స్ కోసం గాలింపు చర్యలు ఎంత ముమ్మరం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి 1975లో ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి.. చట్టప్రకారం రోజర్స్ చనిపోయాడని ప్రకటించడంతో ఈ కేసు అధికారికంగా ముగిసింది. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. ఫోరెన్సిక్ అకౌంటెంట్ హ్యూస్టన్, అతడి భార్య మార్తా ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు. రోజర్స్ తల్లిదండ్రులను హత్య చేసిన తరవాత తను కూడా హోండురాస్ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యాడని, సీ.ఐ.ఏ సిబ్బందితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవని నిర్ధారించారు. మరోవైపు ఫ్రెడ్ దగ్గర పని చేసే తోటమాలి మాటల ప్రకారం.. రోజర్స్ ఎప్పుడూ తల్లిదండ్రులను ఏడిపిస్తూనే ఉండేవాడని, దుర్భాషలాడి బాధపెట్టేవాడని.. జూదం, దొంగతనం అంటూ చట్టవిరుద్ధమైన పనులకు తెగబడేవాడని, చాలా సార్లు ఫ్రెడ్ దగ్గర డబ్బులు దొంగలించాడని చెప్పాడు. అంతేకాదు రోజర్స్ ముందే ప్లాన్ చేసుకుని తల్లిదండ్రుల్ని చంపి ఉంటాడని, ఎవరో నమ్మకమైన స్నేహితుల సాయంతోనే దొరక్కుండా తప్పించుకోగలిగాడని, చివరికి హోండురాస్లో మైనర్ల వేతనాల వివాదంలో హత్యకు గురయ్యి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇదే కథనాన్ని బేస్ చేసుకుని ‘ది ఐస్ బాక్స్ మర్డర్స్’ అనే పుస్తకం కూడా వచ్చింది. అయితే అన్ని అనుమానాలు, అంచనాలే కానీ అసలు ఏం జరిగిందో చెప్పేవాళ్లు లేకపోవడంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
ఎదురు చూపులు
లోపలికి చొరబడిన శింశుపాచెట్టు నీడలకింద కోమావార్డు వరండాలో ఇనుప అమడకుర్చీలో చేరగిలబడి పిలుపుకోసం ఎదురుచూస్తోంది యశోద. దూరంగా వరండా అటు చివర పెద్దడాక్టరు రూము కనిపిస్తోంది. పెద్దడాక్టరు రౌండ్సు నుంచి రాగానే యశోదను పిలుస్తానని నర్సమ్మ మాటయిచ్చింది. యశోద భర్త గంగారామ్ అప్పటికి నెలరోజులుగా మనతెలివిలో లేకుండా కోమావార్డులో తొమ్మిదో నెంబరు మంచం మీద ఉన్నాడు. కోమావార్డు.. ఆసుపత్రి వెనుకవైపు రెండో అంతస్తులో ఉంది. వరండాను ఆనుకుని చిట్టడవిలాగా అన్నీ చెట్లే. పక్షుల అరుపులు తప్ప మరో చప్పుడు లేదు. వార్డులోపల గంగారామ్కు, బయట వరండాలో యశోదకు నెలరోజులుగా కాలం స్తబ్దుగా అయిపోయింది. ఉదయం పది దాటింది. పక్కన మరో అమడకుర్చీలో కూర్చున్న పోలమ్మ వక్కాకు సంచీలోంచి తమలపాకులు తీసి తొడిమలు తుంపుతోంది. పోలమ్మ భర్త ట్రాక్టరు నుంచి పడి తలకు దెబ్బతగిలింది. పదిరోజుల కిందట కోమావార్డుకి మార్చారు. ‘కాలం యెట్లమారిందో సూసినావా? అమ్మానాయన వయసైపోయి యింగ యింటికి పనికిరాకపోతే వాళ్లను సచ్చినోళ్లల్లో జమజేసేస్తారు. ఆల్ల బిడ్డలు గూడా ఆ మనిసి సావుకోసం యెదురుసూస్తారు. లోపల అంతమంది పేసెంట్లుంటే బయిట వొరండాలో మనిద్దరం తప్ప యెవురూ లేరు’ అంది పోలమ్మ.. యశోదవైపు చూసి విరక్తిగా. యశోద తల అడ్డంగా వూపి ‘చిచ్చీ.. మనిషి చావుకోసం అట్లా యెవరూ యెదురుచూడరు. యెట్లావున్నా మన పెద్దవాళ్లను బాగా చూసుకోవాల. జీవితం విలువైంది, వొక్కసారే వొస్తుంది. మన శత్రువైనా బతకాలనే కోరుకోవాల అంటాడు మా ఆయన’ అంది. పోలమ్మ వెనక్కి తగ్గకుండా ‘వొకమనిసి ఖాయిలాపడి యింగ బాగవడని తెలిసినా అంతే. డాకటర్లు తప్ప తక్కినోళ్లందరూ యెప్పుడు పోతాడా అని సూస్తారు. యిదే యిప్పుటి దిక్కుమాలిన లోకరీతి’ అంది. యశోదకు చేదువిషం తిన్నట్టయింది. తలవెనక్కి వాల్చి కళ్లుమూసుకుంది. నెలరోజుల్నుంచి రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, రోజూ తెల్లవారు జామున్నే లేచి పనంతా చేసుకుని ఆటోలో రావడం వల్ల యశోదకు ఒళ్లంతా పోటుగావుంది. అది ఒక మఠం నిర్వహించే ధర్మాసుపత్రి. గంగారామ్ నాన్న బతికి వున్నప్పుడు పెద్దస్వామీజీకి శిష్యుడు. గంగారామ్ను శ్రద్ధగానే చూసుకుంటున్నారు. వాళ్ల నాగులూరు నుంచి ఆసుపత్రికి అరగంట ప్రయాణం. యశోద రోజూ పొద్దున వచ్చి సాయంత్రం వరకూ ఎదురుచూసి వెళ్తోంది. ఇంటి దగ్గర అత్త మణెమ్మ పిల్లలను చూసుకుంటూ స్కూలుకు పంపిస్తోంది. పొద్దున రాగానే లోపలికెళ్లి గంగారామ్ను చూసొచ్చింది యశోద. ఎప్పటిలాగే స్పృహలో లేడు. చేతికి, ముక్కుకు, తలకు పెట్టిన ట్యూబులు అలాగే వున్నాయి. వెనుక మిషన్లో ఏవేవో గీతలు మారుతూనే వున్నాయి. భర్త ప్రాణాలు భూమికి, ఆకాశానికి మధ్యలో తీగలుపట్టుకుని వేలాడుతున్నట్టుగా అనిపించింది ఆమెకు. లోపల ఎక్కువసేపు ఉండనీరు. వరండాలో కూర్చోనో, పడుకోనో కాలం గడపాలి. పెద్దడాక్టరు కోసం ఎదురుచూస్తూ పొద్దున్నించీ ఆమె ఏమీ తినలేదు. కడుపులో ఆకలి అటూఇటూ కదిలింది. ‘యీ ఆకలొకటి, బతికినంతకాలం వొదిలిపెట్టదు. ఆకలేస్తేనే మనిషి బతికివున్నట్టా? గంగారామ్కి ఆకలేస్తే బావుండును’ అనుకుంది. ఒక రెక్కలపురుగు శబ్దం చేస్తూ యశోద తలచుట్టూ తిరిగింది. నర్సు వరండాలోకి వచ్చి ఆమెను రమ్మని చెయ్యి వూపింది. యశోద లేచి గబగబా వెళ్లింది. ‘గంగారామ్లో పెద్దగా మార్పేమీ లేదు. పెద్దస్వామీజీగారు నిన్న వచ్చి చూశారు. యెన్నాళ్లైనా సరే బాగయ్యేవరకు మనమే చూసుకోవాలన్నాడు’ అన్నాడు పెద్దడాక్టరు చేతులు కట్టుకుని నిలబడ్డ యశోదతో. ‘మా ఆయనకు బాగవుతుందా సార్’ ఆశగా అడిగింది యశోద. ‘చికిత్సవల్ల అతని మెదడులో కణితి పెరగడం ఆగిపోయినా అది మెదడును కొంత దెబ్బతీసింది. కోమాలోకి వెళ్లిపోయాడు. మిగతా అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. యిలా వున్నవాళ్లలో వందమందిలో వొకరు కోలుకుంటారు. యీ చికిత్స కొనసాగిద్దాం. కోలుకునే అవకాశం వుంది. మనం యెదురుచూడక తప్పదు!’ అని నిట్టూర్చి తనముందున్న పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు పెద్దడాక్టరు. యశోద అతనికి నమస్కారం చేసి బయటకు వచ్చింది. ‘ఒక్క నెలలోనే తన బతుకులో ఎంతమార్పు’ అనుకుంది వెయిటింగ్ కుర్చీలకేసి నడుస్తూ. ఎమ్మే చదివిన గంగారామ్ది ఒక పెద్ద ఎరువుల కంపెని ఫీల్డాఫీసులో గుమాస్తా ఉద్యోగం. జీతభత్యాలు మంచివే. ఒళ్లొంచి పనిచేసే వాడు. మరో వ్యాపకం ఉండేదికాదు. భార్యాపిల్లల్తో ప్రేమగా గడిపేవాడు. అతనికున్న ఒకే ఒక బలహీనత తరచుగా సెలవుపెట్టి ఆశ్రమాలు, మఠాలకు వెళ్లిరావడం. అది అతనికి తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వం. ఇద్దరాడపిల్లలు పుట్టాక కూడా దాచుకోకుండా తండ్రిలాగే డబ్బంతా అలా తగలేస్తున్నాడని తల్లి మణెమ్మ వాపోయినా పట్టించుకునేవాడు కాదు. అతనికి తాతల కాలం నుంచి వచ్చిన చిన్న ఇల్లు తప్ప మరో ఆస్తిలేదు. మూడునెలల కిందటి వరకూ గంగారామ్ బాగానే వున్నాడు. క్రమంగా తలనొప్పి రావడం, వస్తువులు రెండుగా కనపడ్డం మొదలైంది. అప్పుడప్పుడూ స్పృహ తప్పేది. మఠం ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలన్నీ చేసి మెదడులో కణితి పెరుగుతోందని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. మూడోరోజున తెలివొచ్చి భార్యాపిల్లలను పలకరించాడు. నాలుగురోజులు బావున్నాడు, ఏడోరోజున కోమాలోకి వెళ్లిపోయాడు. నెలరోజులైనా ఇక తెలివి రాలేదు. అప్పట్నుంచి యశోద నాగులూరికీ మఠం ఆసుపత్రికీ మధ్య తిరుగుతూనేవుంది. ఆ వార్డు నుంచి కోలుకొని బయటికి వెళ్లేవాళ్లు తక్కువ. చుట్టాలు మొదట్లో వచ్చినంతగా తరువాత రారు. పగలంతా ఒక నైరాశ్య నిశ్శబ్దం కమ్ముకుని వుంటుంది.. యశోద సంచిలోంచి టిఫిన్ డబ్బా తీసింది. తినాలనిపించక మూత పెట్టేసింది. ‘తినమ్మా నీరసంగా అగపడతా వుండావు. మీ ఆయనకు లోపల టూబుల్లో అన్నం పెడతానే వున్నారు గదా. తినక నువ్వూ పడిపోతే యిల్లూ, ఆసుపత్రి యెవురు జూసుకుంటారు’ అంది పోలమ్మ కుర్చీలోకి కాళ్లు ముడుచుకుని. పోలమ్మది పెద్ద వయసు. కాస్త దూరంలోని పల్లెటూరు, రైతుకుటుంబం. అన్నీ తెలిసినట్టుగా కబుర్లు చెబుతూ అందరి వివరాలూ సేకరిస్తూంటుంది. తన భర్త విషయంలో ఆమె నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతుంది. వాళ్ల వూరి పూజారి ఇచ్చిన కుంకాన్ని భర్త నుదిటి మీద రాస్తుంది. ‘బెమ్మరాతను యీ కుంకమ మారస్తాదా’ అని నిర్లిప్తంగా తనే అంటుంది. ‘జనమ యెత్తినట్టే సావుగూడా మామూలు యిసయమేగదా’ అంటుంది. ఒకవేళ భర్త చనిపోతే అతని మరణాన్ని హుందాగా తీసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉండడం యశోదకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘నిన్నరేత్రి మూడో నెంబరు మంచమామె కాలంజేసింది. బైట వొరండాలో వొచ్చినోల్ల యేడుపులు జాస్తిగా వుండినాయి. లోపలున్న పేసంట్లకు యివేమీ తెలీదు, అదొక సుకం’ అంది పోలమ్మ. అలాంటి వార్త విన్నప్పుడంతా యశోద గుండె ఆగినట్టవుతుంది. రాకూడని ఆలోచనని అణచేసినట్టుగా చెట్లవైపు చూస్తుంది. నలుగురు మధ్యవయస్కులు పెద్దడాక్టరు రూము నుంచి వచ్చి వార్డులోకి వెళ్లి మూడునిముషాల్లో బయటికి వచ్చారు. ఇద్దరు మగవాళ్లూ అలసిపోయినట్టుగా కూర్చున్నారు. ఆడవాళ్లు వాళ్లెదురుగా నిలబడ్డారు. నలుగురూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల నాన్న కోటయ్య తలలో రక్తనాళాలు చిట్లి కొన్నిరోజులుగా ఐదోనెంబరు మంచంలో ఉంటున్నాడు. ఆయన భార్య పోయి చాలాకాలమైంది. పిల్లలందరూ స్థిరపడ్డారు. ‘యెట్లుంది మీ నాయనకు?’ వాళ్లను అడిగింది పోలమ్మ.‘పొద్దున కొంచెం సీరియస్సైందంట, ఆస్పత్రివాళ్లు రమ్మంటే పరిగెత్తుకొచ్చాం. యిప్పుడు ఫరవాలేదంటున్నారు. డాక్టర్లేదీ సరిగ్గా చెప్పడంలేదు’ అంది ఆడవాళ్లలో పెద్దగావున్నావిడ. కాసేపటి తరువాత వాళ్లు వెళ్లిపోయారు. ‘యీళ్లసంగతి గమనించినావా? ఆయనెప్పుడుపోతాడా అని సూస్తన్నారు. ఆస్తికోసమనుకుంటా’ అంది పోలమ్మ మొహం గంటుపెట్టుకొని. ‘అదంతా నీ భ్రమ. అట్లెందుకనుకుంటారు. వాళ్లు వున్నోళ్లు’ అంది యశోద. ఆ ఊహే ఆమెకు కష్టంగా, భయంగా ఉంది. ‘అది మనిషిని బట్టి వుంటాది, యీళ్లట్లాటోళ్లే. నిజం సేదుగానే వుంటాది’ అని ‘శానా ఆలెస్సమైంది, నాష్టాజెయ్యిపోమ్మా’ అంది పోలమ్మ. సంచి తీసుకుని వరండా చివర వాష్ బేసిన్ దగ్గరికెళ్లింది యశోద. ఆమె ఎంగిలిపడి వచ్చి కూర్చోగానే వీర్రాజు వచ్చాడు. ‘అన్నకెట్లుంది?‘ అనడిగాడు. ‘అట్లేవుంది, యింగా టైం పడుతుందంట’ అంది యశోద. లోపలికి వెళ్లి గంగారామ్ను చూసొచ్చాక నాలుగైదు నిముషాలు మాట్లాడి ‘యేది కావాల్సొచ్చినా ఫోన్ చెయ్యి’ అని చేప్పి వెళ్లిపోయాడు వీర్రాజు. ‘సోగ్గా వుండాడు, యెవురతను?’ అడిగింది పోలమ్మ ‘వరసకు మా అత్తకొడుకు, మావూళ్లో సినిమాహాలు మేనేజరు’ జవాబిచ్చింది యశోద. పోలమ్మ ఆసక్తిగా వివరాలు అడగబోయిందిగాని యశోద తలతిప్పుకుంది. ఆమెకు వీర్రాజంటే చిన్నప్పట్నుంచి ఇష్టంలేదు. వీర్రాజు మంచివాడే గాని సినిమాల పిచ్చితో థియేటర్ల చుట్టూ తిరిగి ఇంటర్ తప్పి చదువు వదిలేశాడు. యశోద బియ్యే పాసైంది. యశోదకు గంగారామ్తో పెళ్లికాక ముందు ఆమెను చేసుకోవాలని వీర్రాజు శతవిధాల ప్రయత్నించాడు. ఒకప్పుడైతే అసలు మాట్లాడేదిగాదు. భర్త జబ్బుపడ్డాక ఆమె గట్టిదనం తగ్గిపోయింది. వీర్రాజుకు పెళ్లైంది గాని పిల్లల్లేరు. పెళ్లి తర్వాత అతను యశోద దగ్గరికి రావడం తగ్గించేశాడు. గంగారామ్కి బాగలేనప్పట్నుంచి మళ్లీ వస్తున్నాడు. గంగారామ్ ఆసుపత్రిలో చేరిన నెలరోజుల తర్వాత ఇంకా యశోదను పట్టించుకుంటున్న ఏకైక చుట్టం అతనే. సాయంత్రం ఇంటికొచ్చింది యశోద. ఆసుపత్రిలో స్తబ్దుగా ఉండిన కాలం ఇప్పుడు ముల్లుకర్రలా గుచ్చుకుంటోంది. ఇంట్లో సరుకులన్నీ దాదాపు నిండుకున్నాయి. చేతిలో వున్న డబ్బంతా అయిపోయింది. అత్త ఎవరి దగ్గరో అప్పుకోసం వెళ్లినట్టుంది. అన్నానికి పెట్టి వరండాలో గోడకానుకుని కూర్చొని గేటు బయట ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది. చిక్కిపోయి నీరసంగా ఉన్నారు. ఆమె కళ్లు నీళ్లతో నిండాయి. వీర్రాజు వచ్చాడు. పిల్లలను పలకరించి లోపలికొచ్చి స్టూలు మీద కూర్చున్నాడు. ‘ఆఫీసులో గంగారామ్కు రావల్సిన డబ్బులు వుంటాయి. అంతేగాదు, వుద్యోగస్తుడు ఖాయిలాపడితే బాగయ్యేదాకా భార్యకు వుద్యోగమిస్తారంట. ఆఫీసుకు పొయ్యి మేనేజరుసారును కలుద్దాం’ అని ‘అర్జెంటు పనుంది, రేప్పొద్దునొస్తా’ అంటూ వెళ్లిపోయాడు. మరుసటిరోజు పదిగంటలకు వీర్రాజు వచ్చేసరికి యశోద తయారుగా ఉంది. తన మోటారుసైకిలు వెనుక సీటు మీద యశోదను కూర్చోమన్నాడు. యశోద కదల్లేదు. ‘వెళ్లిరామ్మా’ అంది తలుపు వరకు వచ్చిన మణెమ్మ. ఇక తప్పదన్నట్టు ఎక్కింది. మేనేజరు కలుపుగోలు మనిషి. రైతుల బాధలు వినీవినీ అతని మొహం ముడతలు పడి విచారంగా మారిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది. ఆయన యశోదను పలకరించి, గంగారామ్ స్థితిపట్ల విచారం వెలిబుచ్చాడు. ‘గంగారామ్ లేకపోవడంతో నాకు కుడి భుజం విరిగినట్టుంది. మొన్నాదివారం మేమంతా వెళ్లి గంగారామ్ను చూసొచ్చాం. కోలుకునే అవకాశాలు బాగా వున్నాయని చెప్పాడు డాక్టరు. గంగారామ్ మంచివాడు, తప్పకుండా తిరిగొస్తాడు’ అన్నాడు. గంగారామ్ ఇంటి పరిస్థితి, యశోదకు ఉద్యోగం ఇవ్వడం గురించి వీర్రాజు ప్రస్తావించాడు. మేనేజరు వీర్రాజువైపు తిరిగి కంపెనీ రూల్సు చెప్పి ‘గంగారామ్కి యివ్వగలిగినవన్నీ యిప్పటికే ఇచ్చేశాం. అతను ప్రాణాలతో వుండగా అతని బదులు భార్యకు వుద్యోగం రాదు. ఆమెకు మరోచోట ప్రయత్నిద్దాం.. యేదోవొకటి దొరక్కపోదు’ అని చెప్పలేక చెప్పాడు. అతని మాటలు విన్న యశోద మొహం పాలిపోయింది. కిటికీ వైపు తల తిప్పుకుంది. ఇంటికొచ్చాక జరిగిందంతా అత్తతో చెప్పి ఏడ్చింది యశోద. మరోవారం గడిచింది. గంగారామ్లో మార్పు లేదు. యశోదకు వీర్రాజు ద్వారా ఒక స్కూటర్ల డీలరు వర్కుషాపులో పొద్దున షిఫ్టులో క్లర్కుగా చిన్న వుద్యోగం దొరికింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆసుపత్రికి వెళ్తోంది. మణెమ్మ పిండి మిషనులో పనికి కుదిరింది. కానీ అనారోగ్యంతో అడపాదడపా మానేస్తోంది. అవసరాన్నిబట్టి వీర్రాజు తన మోటారుసైకిల్ మీద యశోదను ఇంటి దగ్గర దింపడమేకాక ఆసుపత్రిక్కూడా తీసుకెళ్తున్నాడు. ‘ఇరుగుపొరుగు తన గురించి ఏమనుకుంటున్నారో’ అని అత్త దగ్గర బాధపడింది యశోద. అలాంటివన్నీ పట్టించుకోవద్దని ఆమె ధైర్యం చెప్పింది. ఆ సాయంత్రం ఆసుపత్రి వరండాలో యశోద, పోలమ్మ ఇద్దరే ఉన్నారు. ‘మా ఆయన గురించి యీరోజు పెద్దడాక్టరు ముందు మాదిరి నమ్మకంగా చెప్పలేదు’ అంది యశోద ఆందోళనగా. ‘యీ వ్యాధి అట్లాటిది. యేమాటా చెప్పలేం. నువ్వు గుండెను రాయి జేసుకోవాల బిడ్డా. నీ మొగుణ్ణి దేవుడే తీసుకోనిపోతే అది నీ మంచికోసమే జేసినట్టు అర్థంజేసుకో. నువ్వు మీ ఆయన వుద్యోగంలో జేరి పిల్లల్ని వుర్దిలేకి తీసుకోనిరావాలని దేవుడి నిర్నయమనుకో, అంతే. నీ మొగుణికి బాగైనా కాళ్లూసేతులూ పని జెయ్యకపోతే యిద్దరాడబిడ్డలను పెట్టుకోని యెట్లబతుకుతావు? సక్కటి మనిసివి, యింగా యెంతో బతుకుండాది నీకు’ అంది పోలమ్మ నిర్వికారంగా. ఆమె మాటలు వినలేనట్టుగా యశోద చేతులతో చెవులు మూసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చాక కూడా యశోద స్థిమితపడలేదు. ఆరాత్రి చిన్నకూతురు తలను వొళ్లో పెట్టుకుని ఆలోచిస్తూ గోడకానుకుని కూర్చుంది. చిన్నవుద్యోగంతో రోజు గడిచేది కష్టంగా వుంది. పిల్లలను చూస్తే ఆమెకు బాగా బతకాలన్న కోరిక పెరుగుతోంది. ‘బతికేదానికి కోరికే మూలమ’నేవాడు గంగారామ్. అతనికి కోరిక తగ్గిపోయి అట్లా ఐపోయినాడా?’ తన ఈ పరిస్థితికి ముగింపెప్పుడో, ఎలా వుండబోతోందో ఆమెకు అంతుబట్టలేదు. వొళ్లు నొప్పులతో నిద్రపట్టక కదులుతున్న మణెమ్మ లేచివెళ్లి మంచినీళ్లు తాగి కోడలి దగ్గరికొచ్చింది. ‘జరిగేదాకా సత్తెమేదో యెవురికీ తెలీదు. సెడాలోశనలకు దుడుకెక్కువ, వొద్దన్నా వస్తాయి. ఐనా మంచిమాటే అనుకోవాల’ అంటూ కోడలి తలమీద చేత్తో రాసింది మణెమ్మ. యశోద చివుక్కున తలెత్తి చూసింది. ‘దేవుడెట్టా రాసిపెట్టి వుంటే అట్టా జరుగుతుంది తల్లీ’ అంది మణెమ్మ వెళ్లి పడుకుంటూ.యశోదను ఆలోచనలు వదల్లేదు. ‘పోలమ్మ చెప్పింది సరైందేనా? బతకడం బరువైనప్పుడు యెవరైనా అట్లాగే ఆలోచిస్తారా? నిజంగా తను దేనికోసం ఎదురుచూస్తావుంది?’ ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె తలలో కదులుతున్న చిత్రమాలికలో మధ్యమధ్యన వీర్రాజు మోటారుసైకిలు మీద వచ్చిపోతున్నాడు. చేతులతో తలను నొక్కిపట్టుకుని పడుకుంది. ఆ తరువాతెప్పుడో గాని ఆమెకు నిద్రపట్టలేదు. రెండువారాలు గడచిపోయాయి. ఈ మధ్యలో ఒకరోజు కోమావార్డులో ఐదోనెంబరు మంచం మీదుండిన కోటయ్యకు తెలివొచ్చి జనరల్ వార్డుకు మార్చారు. ఆయన పిల్లలు సంతోషంగానే కనబడ్డారు. ‘అందురికోసం పైకి సంతోసంగా కనబడినా మొదుట్లో యిసుక్కున్నారు, నేను జూసినా’ అని చెప్పింది పోలమ్మ. ఆ తరువాత రెండురోజులకు పోలమ్మ భర్త చనిపోయాడు. ఆసమయంలో యశోద అక్కడలేదు. ఆమె తన భర్త మరణాన్ని ఎలా తీసుకుందో తెలియలేదు. కాలక్షేపంగా వుండిన పోలమ్మ వెళ్లిపోయినందుకు యశోదకు దిగులేసింది. గంగారామ్ పైకి బాగానే కనపడుతున్నా రోజురోజుకీ డాక్టర్లు అతని గురించి ఆందోళనగా మాట్లాడ్డం పెరిగింది. నిస్పృహలోకి జారిపోకుండా పంటి బిగువున ఆపుకోవాల్సి వస్తోంది యశోదకి. ఒక మధ్యాహ్నం వర్క్షాపులో మిగిలిపోయిన పని చేసుకుంటున్న యశోదకు వెంటనే రమ్మని ఆస్పత్రి నుంచి ఫోనొచ్చింది. కాళ్లుచేతులు ఆడక వీర్రాజుకు ఫోన్ చేసింది. అరగంటలో వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే గంగారామ్ ప్రాణాలు పోయాయి. గుండె ఆగి చనిపోయాడని చెప్పారు. యశోద కుప్పకూలిపోయింది. పెద్ద డాక్టరు, పెద్దస్వామీజీ వచ్చి ఆమెకు ఓదార్పు మాటలు చెప్పారు. యశోద అచేతనంగా ఐపోయింది. వీర్రాజే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. పదహైదురోజులు పోయాక ఒక సాయంత్రం వీర్రాజు కొన్ని కాగితాలు తీసుకుని యశోద యింటికొచ్చాడు. యశోద ఇంకా అన్యమనస్కంగానే ఉంది. ‘గంగారామన్న డెత్ సర్టిఫికెట్టు, కావలసిన యితర కాగితాలన్నీ తీసుకొచ్చినాను. ఆయన వుద్యోగాన్ని నీకిమ్మని అడుగుతా మేనేజరు సాయంతో యీ దరఖాస్తు తయారు చేసినాను. నువ్వు సంతకం పెట్టిస్తే మూణ్ణెల్ల లోపలే నీకు వుద్యోగం వచ్చేట్టు చూస్తాను’ అని పేపర్లు యశోదకిచ్చాడు వీర్రాజు. యశోద కళ్లల్లో నీళ్లు బొటబొటా కారాయి. చివుక్కున తలపైకెత్తి ‘ఆయన పోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు, ఆ వుద్యోగం నాకొద్దు’ అంటూ వీర్రాజువైపు పేపర్లు విసిరేసి ‘నేనేదన్నా వేరేపని చూసుకుంటా. యింకెప్పుడూ నన్ను కలవొద్దు’ అని మొహం తిప్పుకుని లోపలికి వెళ్లిపోయింది యశోద. మణెమ్మ వొంగి పేపర్లన్నీ ఏరుకుని ‘రేపు నేను నచ్చజెప్పి సంతకం జేయించి పంపిస్తా, నువ్వేమనుకోవద్దు బాబూ’ అంది అనునయంగా. వీర్రాజు చాలాసేపు కొయ్యబారిపోయినట్టుగా అలా నిలబడేవుండిపోయాడు. - డాక్టర్ కెవి రమణరావు -
పెళ్ళయిన ఏడాదిన్నర నుంచి ఆమెకి ఇదే అనుమానం.. ఆ క్షణం కూడా..
అతను ఉదయాన్నే లేచాడు. అదీ ఓ ప్రత్యేకతేనా అంటే ఈ రోజుల్లో కచ్చితంగా ప్రత్యేకమే. అర్ధరాత్రుళ్ళ వరకూ పార్టీలు, విదేశాల్లోని ఫ్రెండ్స్తో చాటింగ్లు– తెల్లవారు ఝాము సమయాల్లో అశ్లీల వీడియోలు చూసుకుంటూ, నిజమో, అబద్ధమో తెలియని నకిలీ ప్రొఫైల్స్, చాటింగ్తో డొంక తిరుగుడు ప్రపోజల్స్ పెట్టి, విచిత్రమైన ఎమోజీలతో సమాధానాలు అందుకుని– ఆపై పడుకుని ఆఫీస్కి టైమ్ అయ్యే వేళలో హడావుడిగా లేచి, పరుగులెత్తే బిజీ జీవితాల్లో తెల్లవారు ఝామునే లేవడం విశేషం కాక మరేమిటి? లేవగానే దిండు కింద ఫోన్ తీసుకున్నాడు. తీసుకునే ముందు పక్కకి చూశాడు. అతని భార్య అటువైపు తిరిగి పడుకుంది. ఆమె శరీరాన్ని మెత్తటి రగ్గు కప్పుకుని ఉంది– జింకని మింగే కొండ చిలువలా. లేవగానే మొబైల్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఫొటో చూసుకున్నాడు. నిద్రమొహంలా లేదు కానీ– నిరాభావంగా ఉంది. చిరునవ్వు పెదాల్లోకి, కళ్ళల్లోకి, ముఖం మీద ముడతల్లోకి తెచ్చుకుని నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వు ముఖాన్ని సెల్ఫీగా రికార్డు చేసుకున్నాడు. బెడ్ రూమ్లో నుంచి నడుచుకుంటూ వచ్చి, హాల్లోని సోఫాలో కూర్చున్నాడు. సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లోని అందమైన అమ్మాయిల ఫొటోలకి లవ్ సింబల్ నొక్కాడు. హాట్, ఆసమ్, హార్ట్ బర్నింగ్ లాంటి కామెంట్స్ పెట్టాడు. ట్విట్టర్లో ట్రెండ్ పరిశీలించాడు. ఫేస్ బుక్లో కరెంట్ ఎఫైర్స్ మీద కామెంట్ పెట్టాడు. మళ్ళీ చదువుకుంటూ భయం వేసింది. ఎవరైనా హర్ట్ అయితే– తలనొప్పి, ట్రోల్ చేస్తారు. పోస్ట్ తీసి, ఓ జోక్ పెట్టాడు. నిమిషాల్లోకి లైకులు వస్తున్నాయి. తనలాగే ఈ ప్రపంచం ఎంత పనీపాటా లేకుండా ఉంది? ఎవరో చనిపోయిన పోస్ట్ చూశాడు. లైక్ కొట్టి, రిప్ పెట్టాడు. స్నాప్ చాట్ చూశాడు. ఆఫీస్లో ఉండే అమ్మాయికి తను పెట్టిన మెసేజ్ ఆటోమెటిక్గా డిలీట్ అయి ఉంది. అంటే చూసింది! మరి రిప్లై? ఓ కొంటెనవ్వు ఎమోజీ కనబడింది. అతని ముఖం వికసించింది, హృదయం విశాలమైంది. ‘ఈ రోజంతా నాకు శుభమే, లేవగానే నీ మెసేజ్ చూశాను’ అని అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే.. గుమ్మం ముందు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు, పాల ప్యాకెట్లు. అదే సమయంలో ఎదురింటాయన పెంపుడు కుక్కతో తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. ‘పొద్దున్నే లేవగానే కుక్క మొహమా?’ అని లోపల తిట్టుకున్నాడు. పైకి– ‘జిమ్మి ఎంత పంక్చువలో ఆరు కాగానే షిట్కి రెడీ అయి ఉంది’ అన్నాడు. ఎదురింటాయన కూడా ‘మనకే టైమింగ్స్ సరిగ్గా ఉండవు.. ప్రతిరోజు జిమ్మిని చూసి నేర్చుకోవాలనుకుంటాను’ అన్నాడు. ‘నేర్చుకోరా– కుక్కనుంచి అన్నీ నేర్చుకో– చెత్త నాయాలా’ మనసులో తిట్టుకున్నాడు. ‘మీతో మాట్లాడితే అదే.. ఎంత హాయిగా, ఆహ్లాదంగా ఉంటుందో’ అన్నాడు. బాత్రూమ్లో పాట్ మీద కూర్చుని, అందమైన గుడ్ మార్నింగ్ మెసేజ్లు వెదికాడు.. ఇమేజ్లతో సహా. వాటిని తన వాట్సాప్, టెలిగ్రామ్లోని పనికొచ్చేవాళ్ళకి ఫార్వర్డ్ చేశాడు. తను ఎవర్ని అయితే కాకా పట్టాలనుకుంటున్నాడో. వాళ్ళకి కూడా పంపించాడు. కొందరు మాత్రమే ప్రతిస్పందించారు. మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదు. స్నానం చేయబోతుండగా, నీళ్ళు మధ్యలో ఆగిపోయాయి. సగం తడిసిన ఒంటి మీదే టవల్ చుట్టుకున్నాడు. ఫ్లాట్స్ సూపర్వైజర్కి, వాచ్మన్కి ఫోన్ చేశాడు. ఎవరూ తీయలేదు. ఆ టవల్తోనే సూపర్ వైజర్ ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. సూపర్వైజర్ కంగారు పడ్డాడు. నీళ్ళు రావడం లేదని ప్రత్యక్షంగా చూపించడానికి వచ్చాడో, లేక ఆ వంకన ఇంట్లో ఆడవాళ్ళ ముందు అతను తన శరీరాన్ని ప్రదర్శించడానికి వచ్చాడో.. అర్థం కాక బెంబేలెత్తి పోయాడు. తనే వెళ్లి మోటర్ ఆన్ చేసి వచ్చాడు సూపర్వైజర్. ‘రక్షాబంధన్ రోజున సిస్టర్ ఇంట్లో ఉంటారు కదా.. వచ్చి రాఖీ కట్టించుకుంటాను’ అని అతను చెప్పగానే సూపర్వైజర్ మనసు కుదుటపడింది. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి భార్య అప్పటికే లేచి ఉంది. కాఫీ పెడుతోంది. ఊరందరికీ శుభోదయాలు చెప్పిన అతను భార్యని చూసి, పలకరింపుగా కూడా నవ్వలేదు. ఆమె కూడా దానికోసం ఎదురు చూస్తున్నట్లు లేదు. కాఫీ తీసుకొచ్చి అతని చేతికి ఇచ్చింది. నిన్న ఇంట్లో జరిగిన సంఘటనలు ఏవో చెప్పబోయింది. అతను కేవలం ఆమెకి దొరికేది ఈ కాఫీలు, టీల టైమ్లోనే.. లేదంటే తినేటప్పుడు. ‘తినేటప్పుడు నోర్మూసుకుని ఉంటామనేనా ఆడవాళ్ళు ఎప్పుడూ ఈ సమయాల్లోనే కంప్లయింట్లు, కబుర్లు చెబుతుంటారు’ అని చాలాసార్లు కసురుకున్నాడతను. ఆమె చెప్పింది అతను విన్నాడో.. లేదో తెలియదు. ‘సాయంత్రం మాట్లాడుకుందాం. ఊ– ఆఫీస్కి టైమవుతోంది’ అని బయల్దేరాడతను. ఏదన్నా అదృశ్యశక్తి, గాల్లోకి ఎగిరే శక్తి ఉంటే– భర్తకి తెలియకుండా అనుసరించాలనే ఆమెకి చాలాసార్లు అన్పిస్తుంటోంది. తనతోనే ఇలా ముభావంగా ఉంటాడా? ప్రపంచంతో కూడా ఇలాగే ఉంటాడా? పెళ్ళయిన ఏడాదిన్నర నుంచి ఆమెకి ఇదే అనుమానం. ఆ క్షణం కూడా అలాగే అనుకుంది. అది తథాస్తు దేవతల టైమ్ అయి ఉంటుంది, నిజమై కూర్చుంది. ఆమెకి ఆ రెండు శక్తులూ వచ్చాయి. తనకీ తెలియకుండా ఆశ్చర్యంగా అతడ్ని అనుసరిస్తోంది. లిఫ్ట్ దిగిన అతను.. వాచ్మన్ భార్యని నవ్వుతూ పలకరించాడు... ‘ఎప్పుడు వెళ్తున్నావు ఊరు? అన్నిరోజులు నాగాయేగా.. నీ బదులు వేరే పనిమనిషిని చూడు.. డబ్బులేదన్నా కావాలంటే తీసుకో’ అని కార్లో కూర్చుకున్నాడు. పక్కకారు అతడ్ని నవ్వుతూ పలకరించాడు. ఆమె అతని వెనక సీట్లోనే కూర్చింది. కానీ ఆ విషయం అతనికి తెలియలేదు. ఏవేవో ఫోన్లు వస్తున్నాయి. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, జోక్లు వేస్తున్నాడు. ఈ మనిషిలో ఇంత సరదా స్వభావం ఉందా అని ఆశ్చర్యపోతోంది. ఆఫీస్కి చేరుకున్నాడు. కొలీగ్స్ని నవ్వుతూ పలకరిస్తున్నాడు. కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గర నిలబడి, కాఫీ తాగుతూ, వాళ్ళ వ్యక్తిగత విషయాలు చర్చిస్తున్నాడు. ఈలోగా బాస్ పిలిచాడు. ఆమె వెనకే వెళ్ళింది. బాస్ అతడ్ని దారుణంగా తిట్టాడు. బూతులు ఒకటే తక్కువ. ‘గౌరవప్రదంగా వినబడే ఇంగ్లిష్ మాటలతో కూడా ముఖం మీద అలా ఉమ్మేయ వచ్చా?’ అన్పించింది ఆమెకు. భర్త రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాఫీ డికాక్షన్లో తేడా వచ్చినా, వంట రుచుల్లో ఏదన్నా తగ్గినా ముఖం మీదే విసిరేస్తాడతను. ఇప్పుడేం చేస్తాడు మొగుడు? పేపర్ వెయిట్ బాస్ ముఖం మీద విసిరేస్తాడా? ఈ ఉద్యోగం నాకొద్దు అని రిజిగ్నేషన్ లెటర్ మెయిల్ చేస్తాడా? ‘ఏమీ జరగలేదు. అతని శరీరంలో చీమూ– నెత్తురూ లేనట్లుగా, ఒక బానిసత్వం లాంటి నటన మాత్రమే అతని నరనరాన ప్రవహిస్తున్నట్లుగా– బాస్కి పదేపదే క్షమాపణలు చెప్పుకున్నాడు. బాస్కి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టే – తమ తప్పులు వెదకగలిగాడన్నాడు’ తగిన సమయం ఇస్తే తప్పు సరిదిద్దుకుంటానన్నాడు. ఆ రోజు తన భార్య బర్త్ డే కాబట్టి బాస్కి పార్టీ ఇద్దామనుకుంటున్నట్లు చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. నిజంగానే ఆ రోజు తన పుట్టినరోజు, తమ పెళ్ళిరోజే గుర్తుండదు అతనికి. ఇక పుట్టిన రోజుకి ఎక్కడ అవకాశం ఉంది! ఇంట్లో కాకుండా పబ్లో పార్టీ చేసుకుందామన్నాడు బాస్. ఆమెకి భర్తమీద జాలి వేసింది. చంద్రమతి మాంగల్యంలా భర్తల వెన్నెముకలు, పురుషాహంకారాలు భార్యలకి తప్ప మరెవరికీ కనబడదేమో. ఆ తర్వాత అతని బావమరిది ఆఫీస్కి వచ్చి కలిశాడు. లోగడ ఏవో ఆస్తుల విషయంలో మోసం చేశాడని ఆ బావమరిదిని దూరం పెట్టాడు. ఇప్పుడు ఆ బావమరిది కొంటున్న కోటిన్నర విల్లాకి ష్యూరిటీ పెట్టమని వచ్చాడు. ఆ మోసం, ద్రోహం ఏ మాత్రం గుర్తులేనట్లు అతను బావమరిది తీసుకొచ్చిన కాగితాల మీద సంతకం పెట్టాడు. ఆమెకి కోపం వచ్చినా, తమాయించుకుంది. కర్ణుడికి కవచ కుండలాలు లాగా– నవ్వుని ముఖానికి మొగుడు ఎలా కుట్టేసుకున్నాడో అర్థం కావడంలేదామెకి. తనతోనేనా ఈ రుసరుసలు? తెలియని బాధ ఆమెలో సుడులు తిరిగింది. ఆ తర్వాత ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎవరెవరో కలుస్తున్నారు. రకరకాల భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. అధిక శాతం, కోపం, చిరాకు, అసహనం– వెటకారం, అవహేళన, అవమానించడం. కానీ అతనిలో చిరునవ్వు చెక్కు చెదరడం లేదు. ముఖానికి ఎంత బలమైన ముసుగు వేసుకుని ఉన్నాడంటే– అతనిలో ప్రేమ, శాంతం, దయాగుణం, సహనం తప్ప మరేమీ తెలియనట్లుగా ఉన్నాడు. ఆఫీస్ అయింది. ఆ తర్వాత బాస్తో పబ్లో పార్టీ అయింది. ఆమె అతనికి తెలియకుండానే ఇంటికి వచ్చేసింది. జరిగిందంతా నిజమేనా అన్పిస్తోంది. ఎప్పుడో రాత్రి పదకొండు గంటలకు అతను ఇంటికొచ్చాడు. రాగానే ఆమె మీద అరిచాడు. అన్నం ప్లేటు విసిరేశాడు. ప్రతిరాత్రి అతని ప్రవర్తనకి ఆమెకి భయం వేసేది, అసహ్యం వేసేది. అతను ఒక కోపిష్టిలా, శాడిస్ట్లా కన్పించేవాడు. కానీ అతనికి మరో రూపం ఉంది. అందరితో అంత మృదువుగా, మర్యాదగా ఉండే అతను తనతోనే ఇంత కరుకుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అదే అడిగింది– ‘అందరితోనూ బాగానే ఉంటారు కదా.. నాతోనే ఎందుకిలా?’ అని నిలదీసింది. తను ఆ రోజంతా గమనించిన విషయాలు చెప్పింది. అతను మొదట ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ తర్వాత తేరుకుని ‘అదంతా నటన.. ఏ ఒక్క మాటా, చేత, భావం– ఏదీ నిజం కాదు. నన్ను నేను ఈ దిక్కుమాలిన ప్రపంచం నుంచి కాపాడుకోవడానికి వేసుకున్న ముసుగులు’ అన్నాడు. ‘ఆ ముసుగుతోనే నన్నూ కాస్త ప్రేమించరాదూ నటన అయినా ఫర్లేదు. ఈ నిజమైన కోపం కన్నా నాటకమైన ప్రేమకావాలి’ అని అర్థించింది ఆమె. అతనికి కన్నీళ్ళు ముంచుకొచ్చాయి. ‘రోజంతా.. లోకమంతా నా నటనే. కనీసం నా ఇంట్లో అయినా, నేనెంతో ప్రేమించే నీ ముందు అయినా నన్ను నన్నులా ఉండనివ్వవా? నీకూ నా ముసుగు ముఖమే కావాలా’ అని రోదించాడు. ఆమె బదులు చెప్పలేదు. అతను కోరుకుంటున్నది ఆమె భరించలేదు. ఆమె కోరుకుంటున్నది అతను ఎన్నడూ ఇవ్వలేకపోవచ్చు. ఎప్పటిలానే– కొన్ని వందల రొటీన్ రాత్రుల్లాగే– ఆ పరాయి జీవితాలు ఓ పక్కకి చేరాయి. ఇద్దరూ చెరోవైపు తిరిగి పడుకున్నారు. ఇద్దరి మధ్య ఆ దూరం అలాగే ఉంది. -తోట ప్రసాద్ చదవండి: The Bellaire House: నిజంగా నిజమిది.. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయంటే! -
సినీ ఇండస్ట్రీలో జెండా పాతిన స్త్రీలు, ఆ కథేంటో చూద్దామా?
హీరోల చాటు హీరోయిన్లు... కొడుకు డిగ్రీ పాసై వస్తే ఆనందబాష్పాలు రాల్చే తల్లులు... గయ్యాళి అత్తగార్లు.. క్లబ్సాంగ్స్ చేసే వ్యాంప్లు.. మహిళా ప్లేబ్యాక్ సింగర్లు.. గ్రూప్ డాన్సర్లు.... ఇంతకు మాత్రమే ప్రవేశం ఉన్న భారతీయ సినిమా నేడు క్రమంగా స్త్రీలు శాసించే స్థితికి చేరింది. ఇన్నాళ్లయినా ఇంకా మగ ప్రపంచపు లక్షణాలు ఉన్న సినీ ఇండస్ట్రీలో స్త్రీలు తమ జెండా పాతేశారు. రాబోయే రోజుల్లో సినిమా యూనిట్ అంటే పురుషులు ఎంతమందో స్త్రీలు అంతేమంది కనిపించనున్నారు. కోట్ల విలువ చేసే గ్లామర్ ఇండస్ట్రీలో స్త్రీల సృజనాత్మక సమర్థ భాగస్వామ్యం కనిపిస్తున్నది. ఇప్పుడు ‘యాక్షన్ సీన్’ వారిది కూడా. ముందు ‘రైటింగ్ విత్ ఫైర్’కు బెస్ట్ విషెస్ చెబుదాం.. ఎందుకంటే మార్చి 27న జరగనున్న ఆస్కార్ వేడుకలో ఈ డాక్యుమెంటరీకి అవార్డు వస్తే భారతీయ సినిమా రంగంలో అదో గొప్ప మహిళా విజయం అవుతుంది. ఘన చరిత్రగా నిలుస్తుంది. ఉత్తర్ప్రదేశ్ బుందేల్ఖండ్ ప్రాంతంలో కొంతమంది దళిత మహిళలు స్మార్ట్ఫోన్లు ఉపయోగించి ‘ఖబర్ లెహరియా’ పేరుతో న్యూస్ బులెటిన్ను, న్యూస్పేపర్ను వెలువరించడాన్ని డాక్యుమెంటరీగా తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్కు నామినేట్ అయిన సందర్భంలో ఈ మహిళా దినోత్సవం జరగడం ఒక విశేషం. ఈ డాక్యుమెంటరీకి ఒక దర్శకురాలు రింతు థామస్. కార్యదర్శులు సూపర్స్టార్కు మేనేజర్ అంటే మహరాజుకు మంత్రితో సమానం. ఒకప్పుడు మంత్రులూ ఆ తర్వాత మేనేజర్లూ అంతా మగవారే. కాని మీరు షారూఖ్ ఖాన్తో సినిమా తీయాలని బయలుదేరండి... ముందు అతని మేనేజర్ పూజా దద్లానీని కలవాలి. 2012 నుంచి షారూఖ్ ఖాన్ మేనేజర్గా ఉన్న దద్లానీ అతని కుటుంబ సభ్యురాలన్నంతగా కలిసిపోయింది. షారూఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసులో ఆందోళనలో ఉన్నప్పుడు ఆమే సకల వ్యవహారాలు చూసింది. జీతాలు, భత్యాలు కలిపి నేటికి ఒక 50 కోట్లు ఆమె రాబడి పొంది ఉంటుందని అంచనా. ప్రేక్షకులు స్టార్ మీద ఆధారపడితే స్టార్ ఒక మహిళా మేనేజర్ మీద ఆధారపడే సినిమా యుగం ఇది. అయితే ఆమిర్ ఖాన్ మేనేజర్ ఎవరు? బింకీ మెండెస్. ఆమె అతని పక్కనే ఉండి నిమిష నిమిషం అతనేం చేయాలో చెబుతుంటుంది. సరే.. మీకు కరీనా కపూర్ డేట్స్ కావాలా? ఆమె మేనేజర్ పూనమ్ దమానియాను కలవాలి. రణ్వీర్ సింగ్ యాడ్ చేయాలన్నా, సినిమాకు సైన్ చేయాలన్నా అతని మేనేజర్ సుశాన్ రోడ్రిగ్స్ను దాటి రావాలి. ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్... వీళ్లందరి మేనేజర్లు ఇప్పుడు స్త్రీలే. ఒకప్పుడు బాలీవుడ్లో మేనేజర్లుగా మగవారు రాజ్యం ఏలారు. కాలక్రమంలో వారు ప్రొడ్యూసర్లుగా కూడా మారారు. కాని స్త్రీలే తమ కెరీర్ను మెరుగ్గా మలచగలరని స్టార్లు భావిస్తున్నారు. నేటి ముఖ్యమైన మార్పు ఇది. కార్యనిర్వాహకులు టాప్ ప్రొఫెషనల్ ప్రొడక్షన్ హౌస్లు తమ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా మహిళలనే ఇప్పుడు నియమించుకుంటున్నాయి. యశ్రాజ్ ఫిల్మ్స్ వంటి సంస్థల్లో ఒక సినిమా ప్రపోజల్ గట్టెక్కాలంటే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లను ఒప్పించాలి. ముంబైలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మహిళా కంటెంట్ హెడ్స్తో నిండి ఉన్నాయి. కంటెంట్ను తీసుకెళ్లి వీరి ముందు పెట్టి ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అపర్ణా పురోహిత్ అమెజాన్ ఒరిజినల్స్కు హెడ్గా ఉంది. మోనికా షేర్గిల్ ‘నెట్ఫ్లిక్స్’లో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉంది. ఇక ఏఎల్టీ బాలాజీ ప్రొడక్షన్స్ని ఏక్తా కపూర్ చూస్తుందన్న సంగతి తెలిసిందే. ‘స్త్రీలు ఎంత సమర్థంగా ఇంటిని నడపగలరో అలాగే ప్రొడక్షన్ హౌస్ అనే ఇంటిని కూడా నడపగలరు’ అనే భావన రావడం వల్లే స్త్రీలకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతోంది. ఆ బాధ్యతలను స్వీకరించాక వారు గొప్పగా పని చేస్తున్నారు కూడా. బిహైండ్ ది స్క్రీన్ సినిమా రంగంలో నేటికీ ‘స్పాట్ బాయ్’, ‘లైట్ బాయ్’ ఉన్నారు తప్ప ‘స్పాట్ గర్ల్’, ‘లైట్ గర్ల్’ లేరు. సినిమా ఇంతకాలం పురుష ఆధారిత రంగంగానే పురుషుల నియంత్రణలోనే ఉంది. ప్రొడక్షన్ హౌస్ల అధిపతులుగా మగవారే ఉన్నారు. దశాబ్దాల పాటు మగ ప్రొడ్యూసర్ల, హీరోల, డైరెక్టర్ల దయాదాక్షిణ్యాల మీద, మెహర్బానీ మీద స్త్రీలు ఆ రంగంలో మనుగడ సాగించాల్సి వచ్చింది. అయితే అందరూ కాదు. ఏం మాకేం తక్కువ... మేమూ చేసి చూపించగలం అని మగవారినీ ఉలిక్కిపడేలా చేసిన ధీరలూ వీర వనితలూ ఉన్నారు. మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకుని శోభనాచల స్టూడియో బాధ్యతలు చూస్తూ హిట్ సినిమాల నిర్మాతగా ఉన్న చిత్తజల్లు కృష్ణవేణికి ‘మన దేశం’లో ఏకంగా ఎన్టీఆర్కు అవకాశం ఇచ్చిన ఘనత ఉంది. స్టూడియో స్థాపించడమే కాదు నటిగా, గాయనిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా చక్రం తిప్పిన తెలుగు మూర్తి భానుమతి రామకృష్ణను యావత్ దక్షణాది పరిశ్రమ నెత్తిన పెట్టుకుంది. హిందీలో దాదాసాహెబ్ ఫాల్కేకు దీటుగా 1926–28 మధ్య సినిమాలు తీసిన తొలి మహిళ ఫాతిమా బేగమ్ కీర్తి బయటకు రాలేదు. ఆ ప్రింట్లు అందుబాటులో లేకపోవడమే కారణం. లండన్లో సినిమా కళను చదువుకొని వచ్చిన దేవికా రాణి ‘బాంబే టాకీస్’ స్థాపించి దేశానికి దిలీప్ కుమార్ వంటి హీరోని ఇచ్చింది. సరస్వతి దేవి, జద్దన్ బాయి (నర్గిస్ తల్లి) హిందీ రంగంలో తొలిగా బాణీలు కట్టిన మహిళా సంగీతకారులు. ఇస్మత్ చుగ్తాయ్ స్క్రిప్ట్లు రాసింది. జొహ్రా సైగల్ కొరియోగ్రఫీ చేసింది. స్త్రీలు సగర్వంగా తమ ప్రాతినిధ్యం చూపారు. కాని ఈ కొద్దిమంది ప్రతిభను మించిన మగవారి ప్రాతినిధ్యం వారిని వెనుకగానే ఉంచింది. తెరమరుగవుతున్న స్టీరియోటైప్ సినిమా రంగం అనేది ఒక విచిత్రమైన పని తీరు ఉన్న రంగం. మగవాళ్లు ఉన్న గదిలో మరో మగాడు సులభంగా దూరి పనికి సంబంధించిన చర్చను సాగిస్తాడు అక్కడ. కథ కోసం సిట్టింగ్కు ఎక్కడికో కొందరు మగవాళ్లు వెళతారు. లొకేషన్స్ వెతకడానికి కొందరు మగవాళ్లు వెళతారు. మ్యూజిక్ సిట్టింగ్స్లో కొందరు మగవాళ్లు కూచుంటారు. సినిమా వ్యాపార లావాదేవీల్లో కొందరు మగవాళ్లు కూచుంటారు. స్త్రీలు సులువుగా అతి మామూలుగా ఈ చోట్లలోకి వెళ్లే పరిస్థితులు ఆ కాలంలో లేవు. పైగా పెద్దగా చదువు లేని దిగువ సిబ్బంది చాలామంది లొకేషన్లో పని చేస్తారు. వారికి ‘మగవారి మాట’ వినాలనే కండిషన్ ఉన్న మైండ్సెట్ ఉంటుంది. దానికి భిన్నంగా స్త్రీ నిర్మాతనో, స్త్రీ దర్శకురాలినో, సినిమాటోగ్రాఫర్నో వారు అంగీకరించరు. అదే కాక పని నేర్పించడానికి కూడా మగ సీనియర్లు సిద్ధంగా ఉండరు. ఇవన్నీ స్త్రీలు సినిమా రంగంలోని వివిధ క్రాఫ్ట్స్లలో ప్రవేశించడానికి నిన్న మొన్నటి వరకూ అడ్డంకిగా నిలిచాయి. ఇప్పుడూ నిలుస్తూ ఉన్నా స్త్రీలు గేట్లు తోసుకుని వెళ్లి తాము కూచుంటున్నారు. ఓనర్ ఆఫ్ ది షిప్ భానుమతి, అంజలీ దేవి, బి.శాంతకుమారి తో మొదలెట్టి జయసుధ, జీవిత, మంచు లక్ష్మి వరకూ నటీమణులు నిర్మాతలుగా మారడం సినీ పరిశ్రమలో ఆనవాయితీ. స్త్రీలు ఇవాళ నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా సినిమాలను డిసైడ్ చేస్తున్నారు. ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంతో పాటు సినిమా రంగంలో కూడా ప్రొడ్యూసర్గా ఒక బలమైన శక్తిగా నిలిచింది. దీపికా పడుకోన్, అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా నిర్మాతలుగా మారి చాలా సీరియస్గా సినిమాలను నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ బ్యానర్లో జూహీ చావ్లాతో పాటు గౌరీ ఖాన్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ తరఫున కిరణ్ రావు మేలిమి సినిమాలు తీస్తున్నారు. ‘లంచ్ బాక్స్’ సినిమా నిర్మించిన గునీత్ మోంగా మరో ముఖ్య నిర్మాత. తెలుగులో ఇప్పుడు యువ మహిళా నిర్మాతలు ఉత్సాహంగా సినిమాలు తీస్తున్నారు. సునీత తాటి (ఓ బేబీ, శాకినీ డాకినీ, దొంగలున్నారు జాగ్రత్త), పరుచూరి ప్రవీణ (కేరాఫ్ కంచరపాలెం), కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య (నేను మీకు బాగా కావాల్సినవాడిని), సుస్మిత కొణిదెల (సేనాపతి, శ్రీదేవి శోభన్బాబు), నాగబాబు కుమార్తె నిహారిక (ముద్దపప్పు ఆవకాయ, సూర్యకాంతం), కృష్ణంరాజు కుమార్తె ప్రసీద (రాధేశ్యామ్), దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ (శాకుంతలం), అమలా పాల్ (తెలుగు–తమిళ ‘కడవేర్’) వీరంతా సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే సుప్రియా యార్లగడ్డ, స్వప్నా దత్, ప్రియాంకా దత్లు నిర్మాతలుగా ప్రూవ్ చేసుకున్నారు. తెలుగులోనే నిత్యా మీనన్ ‘స్కైల్యాబ్’ను, కాజల్ అగర్వాల్ ‘మను చరిత్ర’ను నిర్మించారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. మన విజయనిర్మల 40కి పైగా కమర్షియల్ సినిమాలకు దర్శకత్వం వహించడం, కెప్టెన్లా సమర్థంగా యూనిట్ను నడపడం ఒక పెద్ద ఘనత. ఈ కెప్టెన్ స్థానాన్ని స్త్రీలు ఇప్పుడు మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ పని అన్ని భాషల్లోనూ జరుగుతోంది. 1980లలో సాయి పరాంజపే, కల్పనా లాజ్మీ, మీరా నాయర్, అపర్ణాసేన్ వచ్చి మహిళా దర్శకుల ఉనికిని దేశమంతా చాటారు. ఆ తర్వాత దీపా నాయర్ అంతర్జాతీయ ఖ్యాతి పొందుతూ భారతీయ మహిళా దర్శకుల మేధను చాటింది. నిజానికి స్త్రీలు పారలల్ సినిమాలు మాత్రమే తీస్తారు అనే ముద్ర నుంచి నేడు జోయా అఖ్తర్ వంటి మహిళా దర్శకులు హిందీ సినిమాను బయట పడేశారు. ఆమె తీసిన ‘గల్లీ బాయ్’, ‘జిందగీ నా మిలేగీ దుబారా’ వంటి సినిమాలు కలెక్షన్ల రికార్డులు తిరగరాశాయి. ఆమె అడిగితే సూపర్స్టార్లు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెలాగే ఎందరో యువ మహిళా దర్శకులు సినిమాలు తీస్తున్నారు. గౌరి షిండే (డియర్ జిందగీ, ఇంగ్లిష్ వింగ్లిష్), అలంకృతా శ్రీవాస్తవ (లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా), మేఘనా గుల్జార్ (తల్వార్, రాజీ, చపాక్), రీమా కాగ్తీ ( తలాష్, గోల్డ్), నందితా దాస్ (మంటో), ఫర్హా ఖాన్ (మై హూనా, ఓమ్ శాంతి ఓమ్), అశ్విని అయ్యర్ తివారీ (నీల్ బత్తి సన్నాట, బరేలీకి బర్ఫీ), తనూజా చంద్ర (కరీబ్ కరీబ్ సింగిల్), అనూష రిజ్వీ (పీప్లీ లైవ్)... బాలీవుడ్లో తమ వాటా సినిమాలను పొందుతున్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు పొందిన రేవతి ఇంగ్లిష్ చిత్రం ‘మిత్ర్ మై ఫ్రెండ్’తో దర్శకురాలిగానూ నిరూపించుకున్నారు. ప్రస్తుతం కాజోల్తో ‘సలామ్ వెంకీ’ తెరకెక్కిస్తున్నారు. దక్షిణాదిలో సుధా కొంగర (గురు, ఆకాశమే నీ హద్దురా), అంజలీ మీనన్ (బెంగళూరు డేస్) గుర్తింపు పొందారు. తెలుగులో నందినీ రెడ్డి (అలా మొదలైంది, ఓ బేబీ), సుజనా రావు (గమనం), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), గౌరీ రోణంకి (పెళ్లి సందడి), గంటా దీప్తి (మీట్ క్యూట్ వెబ్ ఆంథాలజీ), నటి కల్యాణి తదితరులు ఉన్నారు. అలాగే తెలుగులో స్క్రిప్ట్, పాటలు, డైలాగులు రాస్తున్న స్త్రీలు ఉన్నారు. చైతన్య పింగళి, శ్రేష్ఠ, చల్లా భాగ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియాంక, కడలి సత్యనారాయణ వంటి లిరిసిస్ట్లు ఇప్పటికే పదుల కొద్దీ పాటలు రాయడం విశేషం. స్క్రీన్ప్లేస్ కాలం చాలా మారింది. స్త్రీల ఉద్యమాలు, విద్య, ఉపాధి స్త్రీలను సినిమా రంగంలో కూడా ప్రయత్నం చేయమంటున్నాయి. స్త్రీల విజయగాధలు ఇప్పుడు కథాంశాలు అయ్యాయి. ‘మేరీ కోమ్’, ‘సైనా నెహ్వాల్’, ‘మిథాలీ రాజ్’ వంటి క్రీడాకారిణుల కథలు తెరకు ఎక్కుతున్నాయి. కరణం మల్లీశ్వరి గుర్తుకు వస్తోంది. ‘మిషన్ మంగళ్’లో ఆడవారి భాగస్వామ్యం సినిమా అవుతోంది. ‘పింక్’ వంటి కథాంశాలతో స్త్రీల హక్కులను చర్చిస్తున్నారు. మగవాడికి ఒక్క చెంపదెబ్బ కొట్టే అధికారం కూడా లేదని ‘థప్పడ్’ వంటి సినిమాల్లో చూపిస్తున్నారు. వారి లైంగిక ఉద్వేగాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ స్త్రీలను సినిమా కథాంశంలోనే కాదు సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకునే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక్క అమ్మాయిని పెట్టుకోవడానికి ఇష్టపడని సినిమా ఆఫీసులు ఇవాళ ప్రతి సినిమాకు ఒకరో ఇద్దరో అమ్మాయిలకు జాబ్ ఇస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్లుగా, కాస్ట్యూమ్ డిజైనర్లుగా, మేకప్ విమెన్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా స్త్రీలు తమ ఉనికి ప్రదర్శించేంత స్పేస్ను తీసుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. చిన్న విజయం కాదు. అయినప్పటికీ... అయితే సినిమా పరిశ్రమ స్త్రీలకు పూలదారిగానే ఉందా? అలా చెప్పలేము. ఇటీవలి ‘మీటూ’ ఉద్యమం సినిమా రంగంలో చాలా మందినే వేలెత్తి చూపింది. స్టూడియోల్లో, ఔట్డోర్స్లో స్త్రీలకు వారి అవసరాలకు సున్నితత్వాలకు తగినట్లుగా ఏర్పాట్లు జరగడం లేదు. వారి మాటకు విలువ రావాలంటే వారు ఎంతో ప్రతిభ చూపించాల్సి వస్తోంది. నేటికీ పది మంది నిర్మాతల్లో ఇద్దరే మహిళా దర్శకురాళ్ల మీద నమ్మకం ఉంచి ప్రాజెక్ట్లు ఇస్తున్నారు. హీరోలు కూడా మరింత ఎరుకతో మహిళా టెక్నిషియన్లను ఎంకరేజ్ చేయాల్సి ఉంది. కాని ఇప్పటికి చాలానే జరిగినట్టు లెక్క. స్త్రీలు సినిమా ఆవరణంలో ఉన్నారు. వారు మరింతమంది స్త్రీలను ఆవరణంలోకి తెచ్చుకుంటారు. భారతీయ సినిమా రంగంలో స్త్రీల జయకేతనం కొనసాగుతుంది. షీరోస్ సమాజానికి ప్రతిబింబమే సినిమా. అది ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. సమాజం ఫలానా విధంగా ఉంటే అదీ ఫలానా విధంగానే ఉంది. దేశానికి పెద్ద, రాష్ట్రానికి పెద్ద, ఆఫీసుకు పెద్ద, ఇంటికి పెద్ద మగవాడు అయినప్పుడు సినిమాకి పెద్ద కూడా మగవాడే అవుతాడు. నాయకుల కథలే ప్రజలు వింటున్నప్పుడు సినిమాలు కూడా నాయక పాత్రల కథలే చెప్పాయి. అయినప్పటికీ శక్తిమంతమైన స్త్రీ పాత్రలను భారతీయ సినిమా రంగం హిందీలోకాని, దక్షణాదిలోగాని నిలబెట్టుకోగలిగింది. ప్రతిభావంతమైన నటీమణుల వల్లగాని, కుటుంబ మనుగడకు ఆధారం స్త్రీ గనుక స్త్రీ ప్రేక్షకులను కూడా ‘వినిమయ వర్గం’గా చూడటం వల్లగాని సినిమాల్లో స్త్రీ ఉనికి నిలబడుతూ వచ్చింది. మహబూబ్ ఖాన్ తీసిన ‘మదర్ ఇండియా’ ఈ మేరకు ఒక ఉదాత్త సందేశం ఇచ్చింది. దక్షిణాదిలో ఈ స్థాయి కథలు లేకపోయినా స్త్రీని సెంటిమెంట్కు మూలకారణంగా తీసుకుంటూ వందల సినిమాలు తయారయ్యాయి. ‘చరణదాసి’, ‘సుమంగళి’, ‘నాదీ ఆడజన్మే’, ‘మూగనోము’, ‘దేవత’, ‘చిట్టిచెల్లెలు’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘అమ్మ కడుపు చల్లగా’... వంటివి స్త్రీ కథలుగా వచ్చాయి. కాని అదే సమయంలో టాలెంట్ను గ్లామర్ను రంగరిస్తూ హీరోలతో సమానంగా సినిమాను శాసించగల స్థితికి హిందీలో నర్గిస్, నూతన్, మధుబాల, మీనాకుమారి, వైజయంతి మాల దక్షిణాదిలో సావిత్రి, జమున, జయలలిత, బి.సరోజాదేవి, వాణిశ్రీ తదితరులు ఎదిగారు. ఒక దశలో టాప్ హీరోయిన్ల డేట్ల కోసం హీరోలు పడిగాపులు గాచే స్థితి వచ్చింది. ‘ఇగో’ క్లాషెస్ వంటివి దారి తీసి జమునతో ఇద్దరు సూపర్స్టార్లు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ నటించము అనే నిర్ణయం తీసుకునే వరకు పరిస్థితులు వెళ్లాయి. ఇవన్నీ స్త్రీలు సినిమా పరిశ్రమలో తమ ఉనికిని ప్రతిపాదించడానికి తొలినాళ్లలో చేసిన పెనుగులాటగా చూడాలి. కెమెరా కన్నులు సీనియర్ దర్శకుడు బి.ఆర్.పంతులు కుమార్తె బి.ఆర్.విజయలక్ష్మిని భారతదేశంలో తొలి మహిళా సినిమాటోగ్రాఫర్గా చెప్పుకోవచ్చు. ఆమె కె. భాగ్యరాజా హీరోగా నటించిన ‘చిన్నవీడు’ (చిన్నిల్లు) వంటి సినిమాలకు పని చేసింది. 40 ఏళ్ల క్రితం ఒక మహిళా సినిమాటోగ్రాఫర్ ఉండటం చాలా వింత. ఇవాళ అన్ని భారతీయ సినిమా పరిశ్రమల్లో కలిపి కెమెరా అసిస్టెంట్లుగా, కెమెరా విమెన్గా, డీఓపీలుగా పని చేస్తున్న స్త్రీలు కనీసం వందమంది ఉన్నారు. వీరంతా ‘ఇండియన్ విమెన్ సినిమాటోగ్రాఫర్స్ కలెక్టివ్’ (ఐడబ్ల్యూసీసీ)గా ఒక గ్రూప్గా పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఇవాళ బాలీవుడ్లో భారీ సినిమాలకు మహిళా సినిమాటోగ్రాఫర్లు పని చేస్తున్నారు. ప్రియా సేథ్ (ఎయిర్ లిఫ్ట్, చెఫ్), సవితా సింగ్ (హవాయిజాదా), ఫౌజియా ఫాతిమా (మిత్ర్– మైఫ్రెండ్), దీప్తి గుప్తా (హనీమూన్ ట్రావెల్స్ ప్రయివేట్ లిమిటెడ్), తమిళంలో ప్రీతా జయరామన్... వీళ్లందరూ తమ కన్నుతో సినిమా చూపిస్తున్నారు. ఏ మాత్రం జంకక క్రేన్ షాట్స్ను షూట్ చేస్తున్నారు. -
ఆల్రెడీ పెళ్లైన క్రికెటర్తో నటి సీక్రెట్ మ్యారేజ్, బాలీవుడ్కు గుడ్బై!
‘మంచి సినిమా.. భవిష్యత్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పక్కన రోల్.. ఇంకోసారి ఆలోచించండి మేడం..’ కాస్టింగ్ అసిస్టెంట్ నుంచి ఫోన్. ‘సారీ.. డేట్స్ క్లాష్ అవుతున్నాయి. భవిష్యత్ సూపర్ స్టార్ కోసం ఆల్రెడీ సూపర్ స్టార్గా ఉన్న హీరో సినిమాను వదులుకోలేను కదా..’ అని ఆ హీరోయిన్ సమాధానం. ఆమె వదులుకున్న సినిమా.. బాజీగర్. విలక్షణ నటుడు కమల్హాసన్ పక్కన చేయబోతున్న సినిమా కోసం. ఇది 1990ల నాటి సంగతి. ఆ హీరోయిన్.. ఫర్హీన్ ఖాన్. హిందీ నటే అయినా తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ‘జాన్ తేరే నామ్’తో తారాపథంలోకి దూసుకెళ్లింది. బాలీవుడ్ను మాధురీ దీక్షిత్ ఏలుతున్న కాలంలో అడుగుపెట్టింది ఫర్హీన్. అదే కను, ముక్కు తీరు.. అదే నవ్వు.. అదే గిరిజాల జుట్టు ఉండడంతో ఫర్హీన్ను మాధురీకి జిరాక్స్గా పోల్చారు. స్టార్డమ్లో కూడా మాధురీకి పోటీ వస్తుందని జోస్యమూ చెప్పారు. నిజానికి ఆ అవకాశాలు మెండుగా కనిపించాయి. కానీ హఠాత్తుగా పెళ్లి చేసేసుకొని అంతర్థానమైపోయింది. ఆ వరుడెవరు? క్రికెట్ సంచలనం.. మనోజ్ ప్రభాకర్. ఒక పార్టీలో కలుసుకున్నారిద్దరూ. అతనికి ఫర్హీన్ నచ్చింది. మాటామాటా కలిపాడు. పరిచయం పెరిగింది. ప్రేమ మొదలైంది. అయితే అప్పటికే మనోజ్ వివాహితుడు, ఒక కొడుకు కూడా. అదేమీ అభ్యంతరంగా అనిపించలేదు ఫర్హీన్కు. అతను ఆమె జీవితంలోకి వచ్చాక ఆమె తెర మీద మెరవలేదిక. ఇంకా చెప్పాలంటే అదృశ్యమైపోయింది. కుతూహలం కలవారు కూపీ లాగితే.. మనోజ్ను రహస్యంగా నిఖా చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయిందని తెలిసింది. ఇంచుమించుగా బాలీవుడ్తో సంబంధాలు తెంచేసుకుంది. చదవండి: వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే? విడిపోయారని.. కాలం సాగిపోతోంది. మనోజ్, ఫర్హీన్ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. నాలుగేళ్లు గడిచాయి. ఇంతలోకే ఓ వార్త.. మనోజ్ మీద అతని మొదటి భార్య సంధ్య వరకట్న వేధింపుల కేస్ పెట్టిందని.. ఢిల్లీ హైకోర్ట్లో అది సెటిల్ అయిందని.. ఆ తీర్పు ప్రకారం మనోజ్.. ఫర్హీన్ను వదిలేసి సంధ్య దగ్గరకు వెళ్లిపోయాడు అని. బాలీవుడ్ దృష్టి మళ్లీ ఫర్హేన్ మీదకు మళ్లింది. వివరాలేమీ అందలేదు. ఇంకొన్నాళ్లకు.. ఫర్హీన్ ఢిల్లీలోనే ఉంటున్నట్టు తెలిసింది. ‘మిర్రర్ ’ ప్రతినిధి.. ఆమెను సంప్రదిస్తే ఇంటర్వ్యూ ఇచ్చింది. తను.. మనోజ్తో కలిసే ఉంటున్నట్టు చెప్పింది. వాళ్లు విడిపోయినట్టు వచ్చినవన్నీ వదంతులేనని తేల్చింది. ‘నిజానికి మేమిద్దరం (ఆమె, మనోజ్) ముందు ఫ్రెండ్స్గానే ఉన్నాం. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం.. రెండింటిలో అతను గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నా ఆసరా కోరాడు. సోలేస్గా నిలిచాను. అప్పుడే కలిసి జీవిద్దామనుకున్నాం. బహుశా ఆ టైమ్లోనే మా మాధ్య ప్రేమ మొదలై ఉండొచ్చు. మనోజ్ను లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నాను. కెరీర్ను వదిలేశాను’ అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి వివరించింది. ‘అందరూ అనుకున్నట్టు నేనేం అదృశ్యమైపోలేదు. మా మకాం ఢిల్లీకి మారింది అంతే. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లాడి బాధ్యతల్లో పడిపోయి సినిమాల గురించి ఆలోచించలేదు. అలాగని ఖాళీగా కూడా లేను. హెర్బల్ స్కిన్కేర్ బిజినెస్ పెట్టాను. బాలీవుడ్తో కనెక్షన్ కంటిన్యూ చేయకపోయినా.. కట్ కూడా చేసుకోలేదు. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన దీపక్, ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, శక్తి కపూర్తో టచ్లో ఉన్నాను. సినిమాల్లో నటించొద్దని మనోజ్ చెప్పలేదు. నేనే విరామం తీసుకుందామనుకున్నా. ఇప్పుడు పిల్లాడు పెద్దాడైపోయాడు. బాధ్యతలూ ఓ కొలిక్కి వచ్చాయి. కావాల్సినంత టైమ్ దొరుకుతోంది. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నా. ఇంపార్టెంట్ రోల్స్ దొరికితే కచ్చితంగా చేస్తాను. జాన్ తేరే నామ్ సినిమా సీక్వెల్ కోసం అడిగారు. ఓకే అన్నాను’ అని చెప్పింది ఫర్హీన్. త్వరలోనే ఫర్హీన్ను తెర మీద చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఆమె అభిమానులు. - ఎస్సార్ -
క్రికెటర్ను ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే?
ఇది గాయని లతా మంగేష్కర్ ప్రేమ కథ. ‘ఇంటికి పెద్ద కూతురు.. చిన్న వయసులోనే తోబుట్టువుల మంచి,చెడులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతకే జీవితాన్ని అంకింతం చేసి ఒంటరిగా మిగిలిపోయింది’ అని లతా మంగేష్కర్ గురించి తెలిసిన కొందరు చెబుతారు. ‘సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ల చేష్టలు .. వాటి పర్యవసానాలు పిల్లలకు పాఠాలవుతాయి. కానీ లతా విషయంలో అది రివర్స్ అయింది. ప్రేమ, పెళ్లికి సంబంధించి లతా చెల్లెలు ఆశా భోంస్లే తీసుకున్న తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు.. వాటి తాలూకు ఫలితాలు లతాను జీవితాంతం అవివాహితగానే ఉంచాయి’ అనేది ఇంకొందరు సన్నిహితుల అభిప్రాయం. ‘ఆమె ఇష్టపడ్డ మనిషి.. ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లకపోవడంతో ఏ తోడు లేకుండానే జీవితాన్ని గడిపేసింది’ అని మరికొందరి ఆప్తుల మాట. లతా మంగేష్కర్ ప్రేమించిన వ్యక్తి.. క్రికెటర్, దుంగార్పూర్(రాజస్థాన్) సంస్థానాధీశుడు లక్ష్మణ్ దుంగార్పూర్ కుమారుడు.. రాజ్ సింగ్ దుంగార్పూర్. రంజీల్లో రాణించాడు. బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కు ప్రెసిడెంట్గా పనిచేశాడు. అభిమాని.. లతా మంగేష్కర్ను, రాజ్ సింగ్ దుంగార్పూర్ను కలిపింది క్రికెటే. ఆమెకు క్రికెట్ మీద చక్కటి అవగాహన ఉంది. ఆ ఆటకు వీరాభిమాని కూడా. లతా ఒక్కరే కాదు మంగేష్కర్ కుటుంబమంతా క్రికెట్ అభిమానులే. దాంతో ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్కి రాజ్ సింగ్ దుంగార్పూర్ మధ్య స్నేహం బలపడింది. అలా మంగేష్కర్ కుటుంబానికే ఆత్మీయుడిగా మారిపోయాడు అతను. ఆ సాన్నిహిత్యమే లతా, రాజ్ సింగ్ ఒకరంటే ఒకరు ఇష్టపడేలా చేసింది అంటారు ఇద్దరినీ ఎరిగిన మిత్రులు. పెళ్లిదాకా ఎందుకు రాలేదు? ‘మా తాత, మా అమ్మ, పిన్ని ఒప్పుకోకపోవడం వల్లే’ అంటుంది రాజ్ సింగ్ దుంగార్పూర్ మేనకోడలు రాజశ్రీ కుమారి. ‘సినిమా గాయని రాజ కుటుంబపు కోడలెలా అవుతుందనేది వాళ్ల అభ్యంతరం. నాకింకా గుర్తు.. నా చిన్నప్పటి విషయం ఇది.. ఒకసారి బాంబేలోని బికనీర్ హౌస్కి లతా మంగేష్కర్ని పిలిచారు. మా అమ్మ, పిన్ని.. తమ తమ్ముడిని వదిలేయమని, అప్పుడే అతను తమకు తగినట్టుగా ఏ రాజ్పుత్ అమ్మాయినో లేదంటే ఏ రాజవంశస్తురాలినో చేసుకుంటాడు అని లతాకు చెప్పారు. కానీ లతాతో రిలేషన్షిప్ వదులుకోవడానికి మామయ్య ఇష్టపడలేదు’ అని రాజశ్రీ కుమారి తన ‘ది ప్లేస్ ఆఫ్ క్లౌడ్స్’ అనే పుస్తకంలో రాసింది. ఆమె రాసిన ఈ విషయాన్ని దుంగార్పూర్ వంశస్తులు ఖండించారు. రాజ్ సింగ్ కుటుంబ సభ్యుడొకరు ‘రాజ్ సింగ్ మొదటి నుంచీ సర్వస్వతంత్రుడిగానే ఉన్నాడు. ఎవరో కట్టడి చేస్తే ఆగే మనిషి కాదు అతను. రాజ్ సింగ్ కన్నా లతా ఆరేడేళ్లు పెద్ద. వాళ్లది లేట్ వయసు ప్రేమ. బహుశా ఈ కారణాలతో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోకపోయుండొచ్చు’ అంటాడు. ఇలా వాళ్ల ప్రేమ గురించి వాళ్లిద్దరి సన్నిహితులు చెప్పడమే కానీ ఇటు లతా మంగేష్కర్ కానీ.. అటు రాజ్ సింగ్ కానీ ఎప్పుడూ నిర్ధారించలేదు. అయితే తనకు అత్యంత ఆప్తుల్లో రాజ్ సింగ్ దుంగార్పూర్ ఒకరని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో లతా మంగేష్కర్ చెప్పారు. ఆమె కోసం రాజ్ సింగ్ లార్డ్స్ స్టేడియం గ్యాలరీలోని సీట్ను పర్మినెంట్గా రిజర్వ్ చేయించారనేది ప్రచారంలో ఉంది. ‘నిజమేనా?’ అని లతాని అడిగారు నస్రీన్ కబీర్ మున్ని.. ‘లతా మంగేష్కర్ .. ఇన్ హర్ ఓన్ వాయిస్’ పుస్తక రచయిత. దానికి లతా నవ్వుతూ ‘కాదు. లార్డ్స్లో నాకెలాంటి రిజర్వేషన్ లేదు. సామాన్య ప్రేక్షకుల్లాగే ఆ స్టేడియంలో మ్యాచ్లు చూస్తా’ అని జవాబిచ్చారు. ‘రాజ్ సింగ్, లతా మంగేష్కర్లది పరిణతి చెందిన ప్రేమానుబంధం. దానికి లేనిపోని కల్పనలు జోడించొద్దు. ఆమెకు అతని ఆస్తి అవసరం లేదు. అతనికి ఆమె కీర్తితో సంబంధం లేదు. ఆ ఇద్దరికీ వాళ్లకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలున్నాయి. వాళ్ల సహజీవనానికి ఉన్న అడ్డంకులను అర్థం చేసుకున్నారు. ఒకరికొకరు బలమయ్యారు.. పెళ్లితో కలవకపోయినా.. ప్రేమకు గౌరవమిచ్చారు ’ అని చెప్తారు ఇరు కుటుంబ సభ్యులు. రాజ్ సింగ్ కూడా అవివాహితుడిగానే నిష్క్రమించాడు. ప్రపంచానికేం అవసరం? ‘చాలా కాలంపాటు నేను డైరీలు రాశాను. కొన్ని కథలు, పాటలూ రాశాను హిందీలో. కానీ ఓ రోజు అనిపించింది.. అలా రాయడం వల్ల ఉపయోగమేంటీ అని. అందుకే వాటన్నిటినీ చించేశాను. ఆత్మకథ రాసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆత్మకథ రాసేప్పుడు నిజాయితీగా ఉండాలని నమ్ముతాను. అయితే ఆ నిజాయితీ చాలా మందిని బాధపెట్టొచ్చు. ఇతరులను బాధపెట్టే రాతలెందుకు? నా జీవితం.. అదిచ్చిన అనుభవాలు నా వ్యక్తిగతం. వాటిని రాయడమెందుకు? నా వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా!’ అని చెప్పారు లతా మంగేష్కర్. - ఎస్సార్ -
హూలా హూప్.. ఇక మీ సోకు నాజూకు
అందంగా తయారవడానికి పార్లర్లో ఐబ్రోస్, ఫేషియల్, వ్యాక్సింగ్ ఇలా చాలానే చేయించుకోవచ్చు కానీ.. సన్నగా అవ్వాలంటే మాత్రం వ్యాయామం ఒక్కటే మార్గం. నాజూకు నడుము ఇచ్చే లుక్కే వేరు. ఎన్ని డైటింగ్ చిట్కాలు పాటించినా తగ్గని నడుము, పొట్ట భాగాలు.. ‘హూలా హూప్ గేమ్’ ఆడితే వేగంగా తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. ‘హూలా హూప్’.. గుండ్రటి పెద్ద రింగ్ని నడుము భాగంలో ఉంచి.. మనిషి కదలకుండా నడుముని మాత్రమే తిప్పుతూ.. రింగ్ కిందపడకుండా ఆడే ఆట. గుర్తొచ్చిందా? చిన్నప్పుడు మీరూ ఆడే ఉంటారు ఈ ఆట. అమ్మో చాలా కష్టం అంటారా? అందుకే దీనికి టెక్నాలజీని జోడించి.. కింద పడిపోకుండా నడుముకి పట్టి ఉండే ‘వెయిటెడ్ హూలా స్మార్ట్ హూప్’ అనే డివైజ్ని మార్కెట్లోకి తెచ్చాయి పలు కంపెనీలు. ఈ స్మార్ట్ రింగ్ 47.2 ఇంచులు ఉంటుంది. మొత్తం 16 మసాజ్ హెడ్స్తో ఈ రింగ్ని రెడీ చేసుకోవచ్చు. ఒక్కో హెడ్ 2.95 ఇంచులు ఉంటుంది. శరీరతత్వాన్ని బట్టి, నడుము సైజుని బట్టి.. ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ రింగ్ మాదిరి మార్చుకోవచ్చు. అంటే 10 మసాజ్ హెడ్స్ కలిపితే 24.7 ఇంచులు, 12 మసాజ్ హెడ్స్ కలిపితే 32.1 ఇంచులు, 14 మసాజ్ హెడ్స్ కలిపితే 39.6 ఇంచులు, 16 మసాజ్ హెడ్స్ కలిపితే 47.2 ఇంచులు లూజ్ ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రింగ్కి పొడవుగా వేలాడే వెయిట్ బాల్ ఒకటి అటాచ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ డివైజ్ని నడుముకి సరిగ్గా బిగించుకుని, గిర్రున తిరుగుతున్నంత సేపు.. వెయిట్ బాల్ 360 డిగ్రీస్ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతున్న సమయంలో ఒక్కో మసాజ్ హెడ్ని ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దాంతో వేగంగా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అయితే అనుభవం మీద.. కొన్ని మసాజ్ హెడ్స్ తగ్గించి ఈ రింగ్ని తొడ, చేతులు వంటి భాగాల్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. -
హనీ ట్రాపింగ్.. ఐఎస్ఐ ఏజెంట్ పట్టించిన రా ఏజెంట్ నిధి!
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్. మూడు అంతస్తుల భవనం. ఆ భవనంలోని మూడవ అంతస్తులో ఒక సౌండ్ ప్రూఫ్ గది. ఆ గదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి మొహాలలో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ముగ్గురిలో ఒకరు ‘రా చీఫ్’ శ్రీకర్ అగర్వాల్ .. మిగిలిన ఇద్దరు రా ఏజెంట్స్.. తుషార్ సింగ్, ఆకాష్ వర్మ. చీఫ్ మిగిలిన ఇద్దరినీ చూస్తూ .. ‘మనదేశానికి సంబంధించిన రహస్యాలను సేకరించిన ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ ఇప్పుడు ఎక్కడున్నాడు?’ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ఆకాష్ వర్మ ‘బాస్ ఆ జుబ్బార్ అలీ ఇప్పుడు మారుపేరుతో తిరుగుతున్నట్టు కనిపెట్టాం. ఇంకో నాలుగైదు రోజులలో అతడు ఇస్లామాబాద్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. అతడితో పాటే మన దేశ రహస్యాలు కూడా వెళ్లిపోతాయి’ ఆందోళనగా వివరించాడు. చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత .. వారిని చూస్తూ ‘జుబ్బార్ అలీ ప్రతి కదలికని జాగ్రత్తగా గమనించండి. అతడు ఇస్లామాబాద్ ఎప్పుడు బయలుదేరుతున్నాడో సమాచారం సేకరించండి’ అని చెప్తూ ఎవరికో ఫోన్ చేశాడు. చీఫ్ ఫోన్లో చెప్తున్న విషయం వింటుండగానే ఆకాష్ వర్మ .. తుషార్ సింగ్ మొహాల్లో ఉన్న ఆందోళన ఒక్కసారిగా మాయమైపోయింది. లేచి నిలబడి తమ చీఫ్కు విష్ చేసి వారిద్దరూ బయటకు నడిచారు. ముంబై ... ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ .. ముంబై నుండి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వెళ్ళవలసిన జెట్ ఎయిర్ వేస్ విమానం సిద్ధంగా ఉంది. విమానం ఎక్కుతున్న ప్రయాణికులందరినీ ఎయిర్ హోస్టెస్ నిధి.. చిరునవ్వుతో లోపలకు ఆహ్వానిస్తోంది. చిన్న సూట్కేసు పట్టుకుని అటూ ఇటూ గమనిస్తూ విమానం ఎక్కుతున్న జయంత్కు ‘స్వాగతం’ అంటూ నమస్కరించింది నిధి. నిధిని చూడగానే ఆమె అందం జయంత్ను ఆకర్షించింది. ఆమెతో పరిచయం పెంచుకోవాలని మనసులో తహతహలాడిపోయాడు. తాను ఇస్లామాబాద్ వెళ్ళడానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది. ఈ లోపు ఆమెతో పరిచయం పెంచుకుని తనకున్న ఒకే ఒక్క బలహీనతను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. నిధి కూడా జయంత్ని చూసి నవ్వుతూ చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. కూల్ డ్రింక్స్ అందించింది. ఆమె నవ్వులు చూస్తూ తనను తాను మరచిపోయాడు జయంత్. తానొక బిజినెస్ మాగ్నెట్ని అని అత్యవసర పని మీద ఇస్లామాబాద్ వెళ్ళవలసి ఉందని తనను తాను పరిచయం చేసుకున్నాడు జయంత్. విమానంలో వడ్డించే ఆహార పదార్థాలన్నింటినీ తన వలపువన్నెలతో కలిపి వడ్డించింది. నిధిని చూస్తూ తినబోతున్న జయంత్కు అతడు కట్టుకున్న వాచీలో ఏదో మెసేజ్ వచ్చింది. అది చదువుతూ ఉన్న జయంత్ లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. తినడం ఆపేసి ఆలోచిస్తున్న అతడిని నిధి గమనిస్తోంది. వెంటనే అతడి వద్దకు వచ్చి ‘ఏమైంది?’ అని అడుగుతూ చనువుగా తినిపించడం ప్రారంభించింది. నిధి చనువు అతడిలో ఏవో అలోచనలను రేపుతోంది. నిధిని చూస్తూ అతడు.. ‘నిధీ వచ్చే ఎయిర్ పోర్ట్ దోహా ఎయిర్ పోర్ట్ కదా!’ అని అడిగాడు. ఔనని తలాడిస్తూ ఎందుకన్నట్టు చూసింది నిధి. ‘అక్కడ విమానం ఎంతసేపు ఆగుతుంది?’ అని అడిగాడు మళ్లీ. ‘దాదాపు మూడు గంటలు ఆగుతుంది’ అని చెప్పింది నిధి. ‘అక్కడ నాకు చిన్న సహాయం చేస్తావా?’ అభ్యర్థించాడు జయంత్. ‘ తప్పకుండా! మీరు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను’ భరోసా ఇచ్చింది నిధి. ఖతార్లోని దోహా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ... విమానం నుండి దిగిన జయంత్ , నిధి.. ఇద్దరూ బయటకు వచ్చారు. జయంత్ చూడకుండా తన మణికట్టుకున్న వాచీ లాంటి దాంట్లో ‘స్టార్ట్’ అని మెసెజ్ పంపింది నిధి. ఇద్దరూ కలసి ముందుకు నడుస్తున్నారు. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ ఏమీ తెలియనట్టు అడిగింది నిధి. అందుకు జయంత్ ‘ఇక్కడ ఒక నెట్ సెంటర్లో చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి వెళ్దాం’ అన్నాడు.. నిధితో గడపబోయే క్షణాలను ఊహించుకుంటూ. ‘ఇంకో రెండుగంటల్లో విమానం తిరిగి బయలుదేరబోతుంది కదా.. మనం ఆ లోపే వెళ్ళాలి కదా!’ అన్నది నిధి అమాయకంగా కళ్ళు ఆర్పుతూ. ‘కేవలం గంటలో తిరిగి వెళ్ళిపోదాం’ అన్నాడు అతడు. ‘సరే’ అంటూనే ‘ఇప్పుడు మనం నెట్ సెంటర్కి వెళ్లి తీరాలా? టైం వేస్ట్ కదా! మనం ఇక్కడ నుండి ఇటే హోటల్ రూమ్కి వెళ్లి.. తిరిగి ఎయిర్ పోర్ట్కి వచ్చేద్దాం’ క్రీగంట అతడిని గమనిస్తూ సూచించింది నిధి. ఆ మాటలు వినగానే గతుక్కుమన్నాడు జయంత్. ‘నెట్ సెంటర్లో చాలా అత్యవసరమైన పని ఉంది’ అని చెప్పాడు. ‘నాకంటే అత్యవసరమైన పనా?’ గోముగా ప్రశ్నించింది నిధి. ఆమె మాటలకు ఉలిక్కిపడి సర్దుకుంటూ ‘అలా కాదు డియర్ .. నా బ్రీఫ్కేసులో కొన్ని ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లలో ఉన్న సమాచారాన్ని మొత్తం ఒక చిప్లో కాపీ చేసుకోవాలి. అందుకే’ అంటూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. ‘సరే అయితే పదండి వెళ్దాం’ అంటున్న నిధితో కలసి చిన్న సందులో.. లోపలికి ఉన్న ఒక నెట్ సెంటర్లోకి అడుగుపెట్టాడు జయంత్. లోపల ఎవరూ లేరు. తనకు బాగా అలవాటు ఉన్నట్టుగా లోపలికి వెళ్ళాడు జయంత్. ఒక సిస్టం ముందు కూర్చుని తన బ్రీఫ్కేసు తెరిచాడు. అందులో ఉన్న పేపర్లను బయటకు తీశాడు. అందులో ఉర్దూలో రాసి ఉంది. ఆ పేపర్లను జాగ్రత్తగా పట్టుకుని ఒక చిప్ బయటకు తీశాడు. అదంతా గమనిస్తున్న నిధిని దగ్గరకు తీసుకుంటూ తన పని చేసుకుంటున్నాడు జయంత్. ఇంతలో నిధి లేచి స్పీడ్గా బయటకు వెళ్ళింది. నిధి కదలికను నిశితంగా గమనిస్తున్న జయంత్ కంగారుగా పైకి లేచాడు. అక్కడ నుండి బయటకు వెళ్ళేలోపు ... ఒక పక్కగా దాక్కుని ఉన్న తుషార్ సింగ్, ఆకాష్ వర్మ.. జయంత్ను చూడగానే తమ చేతిలో ఉన్న తుపాకిని పేల్చారు. వెంటనే కిందపడిపోయాడు జయంత్. అతడి చేతిలోని చిప్ను తీసుకుంటూ..‘ఈ రోజుతో నీ ఆట కట్టింది.. మిస్టర్ జయంత్ అలియాస్ జుబ్బార్ అలీ’ అంది నిధి. ఆ మాటలకు జుబ్బార్ అలీ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆకాష్ వర్మ, తుషార్ సింగ్లిద్దరూ జుబ్బార్ అలీని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆకాష్ వర్మ తమ చీఫ్కు ఫోన్ చేశాడు. ‘బాస్ .. మన యంగ్ అండ్ డైనమిక్ ఏజెంట్ నిధి అలియాస్ సోహానా.. మీరు అప్పగించిన టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం జుబ్బార్ అలీ మా వద్దనే ఉన్నాడు. మనదేశ రహస్యాలు జుబ్బార్ అలీ చేతి నుండి సోహానా చేతిలోకి వచ్చి భద్రంగా ఉన్నాయి. మేము వెంటనే ఇండియా బయల్దేరుతున్నాం’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అంతా వింటున్న ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ మొహం పాలిపోయింది. తనకున్న బలహీనత మాత్రమే ఈ రోజు తాను దొరికిపోవడానికి కారణం అయింది అనుకుంటూ చింతిస్తూ వారి వెంట నడిచాడు. రా ఆఫీస్ ... చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఎదుట ఉన్నారు సోహానా.. తుషార్ సింగ్.. ఆకాష్ వర్మ. సోహానా తనకు అప్పగించిన చిప్లో ఏమున్నాయో చూస్తున్నాడు చీఫ్. ‘సోహానా.. వాడిని దోహాలో విమానం దింపి నెట్ సెంటర్కి ఎలా తీసుకొచ్చావు?’ అంటూ సోహానాను ప్రశ్నించాడు ఆకాష్ వర్మ. ‘అతడు కట్టుకున్న వాచీకి నేనే మెసేజ్ పంపించాను. నీ మీద నిఘా ఎక్కువగా ఉంది. నువ్వు వెంటనే నీ వద్ద ఉన్న సమాచారాన్ని చిప్ రూపంలో ఉంచడం మంచిది అని. వాడు వెంటనే నన్నే సహాయం చేయమని అడిగాడు’ అని నవ్వుతూ చెప్పింది సోహానా. విమానం ఎక్కగానే జుబ్బార్ అలీ దృష్టిలోపడి అతడిని ఆకర్షించాను. జయంత్గా వేషం వేసినా అతడి పోలికలను కనిపెట్టాను. అతడికి అనుకూలంగా మాట్లాడుతూ చనువుగా ఉన్నట్టు నటించాను. ఇస్లామాబాద్ వెళితే మనకి అతడు దొరకడని అర్థమైంది. అందుకే దోహా ఎయిర్ పోర్ట్లో దిగేటట్టు చేశాను’ అని చెప్తూ ముగించింది సోహానా. ‘వెరీ గుడ్ డియర్ సోహానా.. మీరందరూ మనదేశ పరువు ప్రతిష్ఠలను కాపాడారు’ అంటూ ఆ ముగ్గురినీ అభినందించాడు రా చీఫ్ శ్రీకర్ అగర్వాల్. రాటుదేలిన సైనికాధికారి అయినా .. కాకలు తీరిన కార్పొరేట్ దిగ్గజమైనా ఆ గూఢచర్య వ్యూహంలో.. ఆ తీయని తంత్రంలో చిక్కుకుని రహస్యాలు కక్కాల్సిందే. వేయి ఫిరంగులు, వంద శతఘ్నులు కలిస్తే... ఒక మహిళా గూఢచారి. చాణక్యవ్యూహం, శకుని తంత్రం కలిస్తే ‘ది... ట్రా... ప్...’ ఈ హనీ ట్రాపింగ్లో ఇప్పటివరకు చాలామంది చిక్కుకుని ఎన్నో రహస్యాలను అవలీలగా అవతలివారికి అందచేశారని సమాచారం. -
కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!
‘ధనమేరా అన్నిటికీ మూలం...ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం’ అంటాడు ఓ సినీకవి. అక్షర సత్యమే. కానీ ఇప్పుడంటే బ్యాంకులు ప్రభుత్వాలు ఇన్ని నోట్లు ముద్రించి.. వాటికి విలువను నిర్దేశిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఇవేవీ లేవు. వస్తువులకు, సేవలకు విలువ కట్టి అంతకు సమానమైన విలువ అని భావించి మార్పిడి చేసుకున్న దశ నుంచి... బంగారం తదితరాలను విలువకు ప్రమాణంగా చేసుకోవడం.. తరువాతి కాలంలో బ్యాంకు నోట్లు.. క్రెడిట్/డెబిట్ కార్డుల వరకూ ధనం అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ పరిణామక్రమంలో తాజా మజిలీ క్రిప్టో కరెన్సీ!! బిట్కాయిన్ అనండి.. ఎరిథ్రియం అనండి.. లేదా ఇంకోటి అని పిలవండి... అన్నీ హైటెక్ యుగపు డిజిటల్ టెక్నాలజీ ప్రతిరూపాలే! పలుదేశాల్లో ఇప్పటివకే విస్తృత వాడకంలో ఉన్న ఈ క్రిప్టో కరెన్సీ.. దాంతో చేసే వ్యవహారాలపై దేశాద్యంతం చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారి.. దీని గతం.. వర్తమానం.. భవిష్యత్తులను సమీక్షిస్తే... ఈమధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ గురించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. తక్కువకాలంలో ఎక్కువ లాభాలకు ఇవి మేలు మార్గాలన్న ప్రచారం జరుగుతోంది. స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల మాదిరిగానే క్రిప్టో వ్యవహారాల కోసం ఎక్సే్చంజీలూ పుట్టుకొచ్చాయి. బోలెడన్ని టీవీ, న్యూస్ పేపర్ ప్రకటనలూ కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అతితక్కువ మందికి మాత్రమే తెలుసు. అబ్బే.. అదంతా హైటెక్ వ్యవహారం. మనకర్థం కాదులే అనే వాళ్ల మాటేమో కానీ.. ఈ కథనం పూర్తయ్యేలోపు ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థను మీరు ఎంతో కొంత అర్థం చేసుకోవడం గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి మరి.. చిన్నప్పుడు కాగితపు నోట్లతో ఆడుకున్న గుర్తుందా మీకు? క్రిప్టో కరెన్సీ కూడా దాదాపు ఇలాంటిదే. కాకపోతే డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. పైగా ఈ కరెన్సీని చూడవచ్చు. వాడుకోవచ్చు కానీ.. అసలు నోట్లు, నాణేల మాదిరిగా ముట్టుకోలేము. పర్సుల్లో దాచుకోలేము. అన్నీ ఇంటర్నెట్లోనే! ఇంకో సంగతి. వంద రూపాయల నోటు విలువ... ప్రభుత్వం రద్దు చేయనంత వరకూ అంతే ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీకి ఉండే విలువ మాత్రం.. చెల్లించే వారిపై ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఫలానా క్రిప్టో కరెన్సీకి డిమాండ్ బాగా ఉంది.. కానీ సరఫరా తక్కువ ఉందీ అంటే విలువ పెరుగుతుంది. అలాగే మైనింగ్ పద్ధతి ద్వారా ఒక క్రిప్టో నాణేన్ని ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై కూడా దాని విలువ ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో ఉన్న ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా ఒక్కోదాని విలువను నిర్ణయిస్తూంటాయి. డాలర్, యూరో... ఎన్, యాన్, రూపాయిల మాదిరిగానే క్రిప్టో ప్రపంచంలో బిట్కాయిన్, ఎరిథ్రియం, రిపుల్, లైట్కాయిన్, కార్డానో బిట్కాయిన్ క్యాష్ అని బోలెడన్ని వేర్వేరు కరెన్సీలు ఉన్నాయి! ప్రహేళికలు పరిష్కరిస్తే.. కాయిన్ బహుమతులు! రూపాయిలు, డాలర్లంటే.. ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం. మరి డిజిటల్ కరెన్సీ క్రిప్టో రూకల మాటేమిటి? ఇందుకోసం ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈ–కామర్స్ వ్యవహారాలకు సాధారణ నగదును స్వీకరించి అందులో కొంత భాగాన్ని మనకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తున్నాయి కూడా. ఇంకో పద్ధతి ఏమిటంటే.. అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా సృష్టించిన ఒక గణితశాస్త్రపు చిక్కుముడిని విప్పడం. దీన్నే మైనింగ్ అంటారు. ఇక మూడో పద్ధతి. ఎవరో మైనింగ్ ద్వారా సంపాదించుకున్న కరెన్సీని ఎక్సే్చంజీల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడం. దాని విలువ పెరిగితే మనకూ లాభాలొస్తాయని వేచిచూడటం. అచ్చం స్టాక్ ఎక్సే్చంజీల మాదిరిగా అన్నమాట. మైనింగ్ వ్యవహారం మొత్తం బిట్కాయిన్తో మొదలైనప్పటికీ ఇప్పుడు దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలూ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలు మొత్తం పనిచేసేది బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే. సమాచారం అత్యంత భద్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఈ బ్లాక్చెయిన్ టెక్నాలజీని క్రిప్టో కరెన్సీలను తవ్వి తీసుకునేందుకు మాత్రమే కాకుండా.. ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు. క్రిప్టో కరెన్సీతో లాభాలేమిటి? మోసాలకు తావే లేదు: క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్ వ్యవహారం. పైగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ సాయంతో నడుస్తుంది. కాబట్టి ఇందులో మోసాలకు అస్సలు తావు ఉండదు. చెల్లింపులైనా, ఒప్పందాలైనా డిజిటల్ ప్రపంచపు నెట్వర్క్లో అందరికీ అందుబాటులోనే ఉంటాయి కానీ.. ఏ ఒక్కరు కూడా అందులో మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తే ఆ మార్పుకు నెట్వర్క్లోని మిగిలిన వారందరూ ఓకే అనాలి కాబట్టి మోసం చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యం కాదు. పైగా మార్పులు చేసేందుకు చేసిన ప్రయత్నం కూడా డిజిటల్ రూపంలో భద్రంగా నిక్షిప్తమవుతుంది కాబట్టి.. దొంగ ఇట్టే దొరికిపోతాడు!! వ్యక్తిగత వివరాలు భద్రం క్రెడిట్/డెబిట్ కార్డుతో ఏం చేసినా మన కొనుగోళ్ల వ్యవహారాలు మొత్తం అవతలివైపు వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి. క్రిప్టో కరెన్సీతో ఈ సమస్య ఉండదు. కార్డు ద్వారా డబ్బు తీసుకునేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలు ‘పుల్’ అంటే డబ్బు కావాలని అడగడం.. అకౌంట్ నుంచి లాక్కోవడం జరగుతుంది. క్రిప్టో వ్యవహారం దీనికి భిన్నం. డబ్బు కావల్సిన వ్యక్తి/సంస్థకు ‘పుష్’ పద్ధతిలో మన అకౌంట్ నుంచి తగిన విలువ మాత్రమే అందుతుంది. మిగిలిన వివరాలేవీ ఉండవు. మధ్యవర్తుల్లేకుండా ఇల్లు, పొలం లేదా ఇంకేదైనా స్థిరాస్తి కొన్నప్పుడు సహజంగా డీలర్లు, బ్రోకర్లు, న్యాయవాదులు (ఒప్పందం రాసుకునేందుకు) వంటి మధ్యవర్తుల ప్రమేయం వచ్చేస్తుంది. క్రిప్టో వ్యవహారాల్లో వీరి అవసరం ఏమాత్రం ఉండదు. అమ్మే, కొనేవాళ్లు ఇద్దరి మధ్య మాత్రమే వ్యవహారం ఉండిపోతుంది. అదే సమయంలో సాక్షుల మాదిరిగా నెట్వర్క్లోని వారందరూ ఒప్పందాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. అందరికీ అందుబాటులో క్రిప్టో వ్యవహారాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 466 కోట్ల మంది ఈ వ్యవహారాలను నడపవచ్చునన్నమాట. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్/డెబిట్ కార్డులు వంటివేవీ లేకుండానే! అంతా ఉచితమే ప్రస్తుతానికి క్రిప్టో వ్యవహారాలకు సంబంధించినంత వరకూ ఎలాంటి ఛార్జీలూ లేవు. ప్రాథమికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యవహారం కావడం దీనికి కారణం. అయితే క్రిప్టో కరెన్సీలను మార్చుకోవడం వంటి విషయాల్లో ఇటీవలే మొదలైన కొన్ని ఎక్సే్చంజీల్లో మాత్రం కమిషన్ల రూపంలో కొంత విలువను చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇబ్బందులేవీ లేవా? బోలెడు. ముందుగా చెప్పుకున్నట్లు క్రిప్టో కరెన్సీ వ్యవహారాలన్నీ ప్రైవేట్ వ్యక్తులతో కూడిన నెట్వర్క్లలోనే జరుగుతూంటాయి. పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు అధికారిక సంస్థలంటూ ఏవీ ఉండవు. దీనివల్ల లాభాలెన్నో... నష్టాలూ అన్నే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది హెచ్చుతగ్గుల గురించి... బిట్కాయిన్ కానివ్వండి, ఇంకో క్రిప్టోకరెన్సీ ఏదైనా కానివ్వండి.. ప్రతిరోజూ విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఒక రోజు లక్షల్లో పలికిన క్రిప్టో విలువ మరుసటి రోజే రూపాయిల్లోకి పడిపోవచ్చు. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడులతో లక్షలు, కోట్లు ఆర్జించేయవచ్చు అనుకునేవారు కొంచెం జాగ్రత్త వహించడం మేలు. ఈ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందరికీ మాత్రం కాదు. వందలో 90 శాతం మంది నష్టపోయేందుకే అవకాశాలు ఎక్కువని కొంతమంది నిపుణులు చెబుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బోలెడన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉన్న స్టాక్మార్కెట్లోనూ స్కామ్లు జరుగుతున్నట్లే క్రిప్టో వాణిజ్య ప్రపంచం లోనూ మోసగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బిట్కాయిన్ వ్యవహారాలు నడిపేవారిలో 25 శాతం మంది అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అలాగే 46 శాతం వ్యవహారాలు అక్రమాలకు సంబంధించినవి. మత్తుపదార్థాలు, ఆయుధాల విక్రయం వంటివన్నమాట. అన్ని రకాల క్రిప్టో కరెన్సీలను పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంచుతారన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. బిట్కాయిన్ల సంఖ్య 2.1 కోట్లు మించదని ఇందుకు తగ్గ పద్ధతులు బ్లాక్చెయిన్ అల్గారిథమ్లోనే ఉన్నాయని చెబుతారు. అయితే మఖలో పుట్టి పుబ్బలో చచ్చినట్లు ఇప్పటికే ప్రతిరోజూ కొన్ని కొత్త కరెన్సీలు పుట్టుకొస్తూండగా.. మరికొన్ని గిట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అపరిమిత కాయిన్లు అందుబాటులోకి వస్తే వాటి విలువ పడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆర్బీఐ వంటి ప్రభుత్వ సంస్థలు తమదైన క్రిప్టో కరెన్సీలు అందుబాటులోకి తెస్తే ప్రైవేటు రంగంలో ఉన్న బిట్కాయిన్, లైట్కాయిన్, డాగే కాయిన్ వంటి వాటి విలువ పడిపోయే అవకాశం ఉంది. పుట్టిందిలా... ఇప్పుడంటే బోలెడన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి కానీ.. ఇదంతా మొదలైంది బిట్కాయిన్తో. 2008 ఆగస్టులో బిట్కాయిన్.ఓఆర్జీ పేరుతో ఓ డొమైన్ నమోదుతో క్రిప్టో వ్యవహారాలకు శ్రీకారం పడింది. అదే ఏడాది అక్టోబరులో సతోషి నకమోటో పేరుతో ఈ వెబ్సైట్లో ఒక లింక్ ప్రత్యక్షమైంది. ‘‘బిట్కాయిన్: ఈ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్’’ శీర్షికతో బ్యాంకుల్లాంటి కేంద్రీకృత వ్యవస్థలేవీ లేకుండా ఇంటర్నెట్, బ్లాక్చెయిన్ టెక్నాలజీల ఆధారంగా డబ్బు ఎలా పంపిణీ చేయవచ్చో వివరించారు. నకమోటో బిట్కాయిన్ సాఫ్ట్వేర్ను అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్కోడ్గా 2009లో విడుదల చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నకమోటో ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమంది ఒక వ్యక్తి అంటూంటే.. కొందరు వ్యక్తుల బృందమన్నది మరికొందరి అంచనా. 2009 జనవరి మూడున నకమోటో తన సాఫ్ట్వేర్ అల్గారిథమ్ మైనింగ్ ద్వారా బ్లాక్చెయిన్లోని తొలి బ్లాక్ను సిద్ధం చేశారు. ఈ బ్లాక్ను జెనిసిస్ బ్లాక్ అంటారు. ‘ద టైమ్స్’ మ్యాగజైన్లో ప్రచురితమైన ఒక శీర్షికను ఈ బ్లాక్ తాలూకు కాయిన్బేస్లో పొందుపరచారు. తొలి బిట్కాయిన్ వ్యవహారం.. రెండు పిజ్జాల కొనుగోలు 2010లో ఓ కంప్యూటర్ ప్రోగ్రామర్ పదివేల బిట్కాయిన్లతో రెండు పిజ్జాలు కొనుగోలు చేయడం ప్రపంచంలో తొలి క్రిప్టో వ్యవహారంగా నమోదైంది. ఈ రోజుల్లో పదివేల బిట్కాయిన్ల విలువ కొంచెం అటు ఇటుగా నలభై లక్షల రూపాయలు!! అప్పట్లో బిట్కాయిన్ విలువ లక్షల్లోకి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రమైన ఘటనను గుర్తుంచుకునేందుకు ఇప్పటికీ ఏటా మే 22వ తేదీని ‘బిట్కాయిన్ పిజ్జా డే’ గా జరుపుకుంటూంటారు. మైక్రోసాఫ్ట్, హోండిపో, నేమ్చీప్, హోల్ఫుడ్స్, న్యూఎగ్స్, స్టార్బక్స్ వంటి కంపెనీలు, కొన్ని దేశాల బ్యాంకులు కూడా క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల కొనుగోళ్లకు అంగీకరిస్తున్నాయి. బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఎల్ సాల్వడార్. ఈ ఏడాది జూన్ తొమ్మిదిన బిట్కాయిన్ను దేశంలో అన్ని రకాల వ్యవహారాలకూ వాడవచ్చునని ఆ దేశం ప్రకటించింది. ప్రధాన కరెన్సీ ఇప్పటికీ అమెరికన్ డాలరే! బిట్కాయిన్లను వాడుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు ‘వ్యాలెట్లు’ ఉపయోగపడతాయి. యూపీఐ ఆధారిత డిజిటల్ వాలెట్లు గూగుల్పే, ఫోన్ పే, పేటీఎం మాదిరిగా అన్నమాట. నిషేధమా? నియంత్రణా? క్రిప్టో కరెన్సీలపై భారత్లో కొన్నేళ్లుగా తర్జనభర్జనలు నడుస్తున్నాయి. 2016లో వీటిపై పూర్తి నిషేధం విధించగా ఆ తరువాత సుప్రీంకోర్టు జోక్యంతో పరిమిత స్థాయిలో లావాదేవీలు నడిచాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ‘ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ బిల్లుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిట్, లైట్ ఎరిథ్రియం వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం ఉంటుందని, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై నిషేధం ఉండదని ఒక వర్గం వాదిస్తూండగా... ఇంకోవర్గం వ్యవహారాలను గుర్తించేందుకు వీలైన పబ్లిక్ లెడ్జర్ (పద్దు) లేని క్రిప్టో కరెన్సీలపై మాత్రమే నిషేధం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లు వివరాలు పూర్తిగా తెలిస్తేగానీ అసలు విషయం ఏమిటన్నది స్పష్టం కాదు. దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించే అవకాశం లేదని చెప్పడం గమనార్హం. భారత్లో టాప్–10 క్రిప్టో కరెన్సీలు... బిట్కాయిన్ ఎరిథ్రియం కార్డానో రిపుల్ యూఎస్డీ కాయిన్ పోల్కాడాట్ డాగే కాయిన్ షిబా ఇనూ లైట్కాయిన్ యునీస్వాప్ నవంబరు 2021 నాటికి 7557ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీలు 20,000 + పైగా 2021 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిట్కాయిన్ ఏటీఎంల సంఖ్య 10.7 కోట్లుభారత్లో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య రూ. 75,000 కోట్లు భారతీయుల క్రిప్టో పెట్టుబడుల మొత్తం నవంబరు 24నాటికి ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ! 2.4 లక్షల కోట్ల డాలర్లు – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
Children's Day 2021 Special: పరమానందయ్య కాళ్లు నరకబోయిన శిష్యులు.. కథ!
పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. ఆయన భార్య సుందరమ్మ. వాళ్లకు పిల్లల్లేరు. ఆయన దగ్గర దద్దమ్మల్లాంటి శిష్యులు ఉండేవారు. పిల్లల్లేకపోవడంతో వాళ్లెంత దద్దమ్మలైనా పరమానందయ్య దంపతులు వాళ్లను సొంత పిల్లల్లాగానే చూసుకునేవాళ్లు. వాళ్ల చేష్టలు పరమానందయ్యకు తరచు చిక్కులు తెచ్చిపెడుతుండేవి. ఒకసారి పరమానందయ్య భార్యతోను, శిష్యులతోను కలసి పొరుగూరుకు బయలుదేరాడు. దారి మధ్యలో ఏరు దాటాల్సి వచ్చింది. చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించడమే కాకుండా, ఏరు కూడా దాటి ఊరికి చేరుకోవలసి రావడంతో పరమానందయ్య బాగా అలసిపోయాడు. ఆయన భార్య పరిస్థితీ అలాగే ఉంది. విపరీతమైన ప్రయాణ బడలిక వల్ల ఒళ్లునొప్పులతో బాధపడసాగాడు. శిష్యులను పిలిచి, ‘నాయనలారా! ప్రయాణ బడలిక వల్ల ఒళ్లంతా నొప్పులుగా ఉంది. కాస్త ఒళ్లు పట్టండి’ అని చెప్పాడు. గురువుగారు ఆజ్ఞాపించడమే తడవుగా, ఆయన ఒళ్లు పట్టడానికి నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఒక్కొక్క అవయవాన్నీ వంతులు వేసుకున్నారు. ఒకడు కుడిచెయ్యి, ఇంకొకడు ఎడమచెయ్యి, ఒకడు కుడికాలు, మరొకడు ఎడమకాలు పట్టనారంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్లుపడుతుండటంతో పరమానందయ్యకు కొంత బడలిక తీరి నిద్ర ముంచుకొచ్చింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో కాళ్లు పట్టే శిష్యుల మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిదంటే, నా కాలే మంచిదంటూ వాదనకు దిగారు. ఒకడు పట్టే కాలిని మరొకడు కొట్టుకునే వరకు వచ్చింది వ్యవహారం. అప్పటికీ గొడవ చల్లారలేదు. ‘నీ కాలిని నరికేస్తా’ అన్నాడొకడు. ‘నేనూరుకుంటానా! నేనూ నీ కాలిని నరికేస్తా!’ బదులిచ్చాడు ఇంకొకడు. ఇల్లంతా గాలించి, ఇద్దరూ చెరో గొడ్డలీ తీసుకొచ్చి, గురువుగారి కాళ్లను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్ల వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు ప్రారంభించారు. ఈ గలాటాకు గురువుగారికి తెలివి వచ్చింది. చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరు కనిపించగానే, ఆయన నిద్ర దెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి, నిజంగానే తన కాళ్లను ఎక్కడ నరికి పారేస్తారోనని భయం పట్టుకుంది. ‘ఒరే! వెధవల్లారా! మీరూ మీరూ తగవుపడి నా కాళ్లు నరుకుతారేమిట్రా? మీకేం పోయేకాలమొచ్చింది?’ అంటూ లేవబోయాడు. చేతులు పడుతున్న శిష్యులిద్దరూ, గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, ‘గురువుగారూ! ఈ వెధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవపడుతుంటారు. మీరేమీ వాళ్ల గొడవ పట్టించుకోకండి. మేం మీ చేతులు పడుతున్నాం కదా!’ అని సర్దిచెప్పసాగారు. ఈలోగా కాళ్లు పట్టే శిష్యులిద్దరూ, గొడ్డళ్లు పట్టుకుని ఆవేశంగా గురువుగారి కాళ్లు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేలుమంది. వెంటనే, ‘సుందరీ! ఒకసారి ఇలారా!’ అంటూ లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు. భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి, ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ‘మూర్ఖపు వెధవల్లారా! మీరు గొడవపడి, గురువుగారి కాళ్లు నరికేస్తార్రా! ఉండండి మీ పని చెబుతాను’ అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని, వాళ్లను చావబాది, ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండిపెట్టలేదు. మర్నాడు ఉదయం కూడా వాళ్లకు తిండిపెట్టలేదు. మర్నాడు మధ్యాహ్నం ఇంటి బయట చెట్టుకింద కూర్చుని, ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి, పరమానందయ్యకు వాళ్ల మీద జాలి పొంగుకొచ్చింది. భార్య మనసు కరిగితే గాని, వాళ్లకు ఆ పూట కూడా తిండిపుట్టదని ఆయనకు తెలుసు. అందుకే, వెంటనే ఇంట్లోకి వచ్చి, భార్యకు నచ్చచెప్పడం ప్రారంభించాడు. ‘వాళ్లు ఉత్త అమాయకపు వెధవలు. మనల్నే నమ్ముకుని మన ఇంట్లో పడి ఉంటున్నారు. ఏ పని చెప్పినా, కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివితక్కువతనంతో పిచ్చిపనులు చేస్తుండవచ్చనుకో! అంతమాత్రాన వాళ్లకు తిండిపెట్టకుండా మాడ్చిచంపడం సరైన పనికాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్లను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలు ఉండి, వాళ్లే ఇలాంటి పిచ్చిపనులు చేస్తే వాళ్లను వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చెయ్యి’ అన్నాడు. భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. నాలుగు కేకలేస్తే సరిపోయేదానికి, అనవసరంగా దుడ్డుకర్రతో బాదిపారేశానే అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపు రావడంతో శిష్యులు మెల్లగా లోపలకు చేరుకుని, సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురుమంటూ భోంచేశారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!
పాపం ఈ పెద్దవాళ్లెపుడూ యింతే. ముందస్తుగా వాళ్ల మాట వినాలి అంటారు గదా. పోనీలే మనం అల్లరి చేస్తే అప్పుడు మన్ని రష్చించరు. మళ్లీ అల్లరి చెయ్యను.. అంటే చెయ్యి అంటారు. చేస్తానూ అంటే ఒద్దూ అంటారు. ఎప్పుడూ మనమే వాళ్ల మాట వినాలి అంటారు. ఒక్కసారేనా వాళ్లు మన మాట వినరు. అంతెందుకు.. యిప్పుడు పాపం బాఘా చిన్న పిల్లలుంటారా.. వాళ్లకి కుంచెం తెలుగు వస్తుంది చూడు.. అప్పుడేమో.. ఎవరూ లేకుండా కుంచెం మాటాడుతారు. యీ అమ్మా.. నాన్నా.. బామ్మ.. యిలాటివాళ్లు ఎలాగో వినేస్తారు. అప్పుడు పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. వాళ్ల ముగుడూ అలాటి వాళ్లు మనింటికొస్తారు.. అప్పుడేమో ఈ పాపాయిని కూచోబెట్టి నీ పేరు చెప్పూ అంటారు. పాపం పాపాయికి బాఘా తెలుగురాదు గదా.. దానికి భయంవేసి చెప్పదు. అప్పుడేమో ఈ పెద్దవాళ్లందరూ చూట్టూ నించుని చెప్పుచెప్పు చెప్పూ అని కేకలు వేస్తారు గదా.. పాపాయికి కోపం వచ్చేస్తుంది. దాన్ని రష్చించడానికి నేను చెప్తాననుకో పేరు! వాళ్లు వినరుగా నన్ను కొఠేస్తారు. దాని పేరు అదే చెప్పాలిట. అది చెప్పదుగా మరి. అప్పుడు వాళ్లమ్మా నాన్న దాన్ని కొఠేస్తారు మొండి పిల్లా అని. వాళ్లకి మొండి పిల్ల అంటే అసలు అర్థం తెలీదు. నాకు తెలుసనుకో. పక్కింటి లావుపాటి పిన్నిగారు ఒకసారి పేరంటానికెళ్లి వాళ్ల పాపను ఎత్తుకుంటుంది కదా.. అప్పుడు పాప చంక దిగనంటుంది కదా.. వాళ్లమ్మ పిలిచినా వాళ్లనాన్న, బామ్మ పిలిచినా రాను పో అంటుంది. ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి ఉంగా భాషలో ఆలుకుందా వత్తావే అని పిలిచినా సరే లాను పో అంతుందే అదీ మొండి పిల్ల. ఏవిటో ఈ పెరపంచకంలో బోల్డుబోల్డు రకాల పిల్లలు. బోల్డురకాల పెద్ధవాళ్లు. అప్పుడప్పుడూ నేను హాచర్యపడి పోయేస్తుంటాను. బుడుగూ, మరేమోనేం మా అమ్మావాళ్లూ రోజూ నన్ను బళ్లోకి వెళ్లమంటున్నారు. లాపోతే కొట్టుతాను అంటున్నారు ఎలాగ? ముందస్తుగా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నాడు కదా. నా పేరు బుడుగు అయినా వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ? అందుకే. అయినా వాడి ఖష్టాలు చూస్తే జాలి వేస్తోంది గదా మనకి. అసలు నీ చిన్నప్పటినించీ, మీ తాతయ్య చిన్నప్పటినించీ చిన్న పిల్లలు ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉన్నారు. అందరు చిన్నపిల్లలినీ ఇలా బళ్లో పెట్టెయ్యడమే. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట. మళ్లీ యీ పెద్దవాళ్లందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్లో పెఠేస్తున్నారు. అంతెందుకులే.. పాపం నన్ను కూడా రేపో మూడ్రోజులుకో బళ్లోపెట్టాలని చూస్తున్నారు గదా. నన్నేం చెయ్యలేరనుకో. అయినా చిన్నవాళ్లూ బళ్లోకెళ్లకుండా ఉండడానికని కొన్ని సంగతులు చెప్తాను. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. ఒకటి: జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా.. అందికని యేం చెయ్యాలంటే ముందస్తుగా చొక్కా యిఫ్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద .. పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేసుకుని అమ్మ దగ్గిరికి వెళ్లాలి. అమ్మోయి జెరం జెరం గబగబా చూడూ.. బళ్లోకి వెళ్లద్దని చెప్పూ అని చెప్పాలన్నమాట. ఇంకోటి: జెరం రాగానే పరిగేసుకు కెళ్లి చెప్పాలి తెలుసా.. లాపోతే జెరం చల్లారిపోతుంది. ఉంకోటి కూడాను.. ఇలాంటి దానికి అసలు బామ్మ మంచిది. బామ్మకి చెప్పేస్తే చాలు.. అప్పుడు అదే అమ్మకి చెప్తుంది. రెండు: కుంచెం మంది పిల్లలు కడుపునొప్పి అని అంటారు కాని అది మంచిదికాదులే. రెండుసార్లో.. ఫదిసార్లో అయాకా అమ్మావాళ్లూ కారప్పూసా పకోడీలు చేసుకుని మనకి పెట్టకుండా తినేస్తారు. యిప్పుడు లేదుగదే అమ్మా అని చెప్పినా సరే.. పెట్టరు. ఇప్పుడు లేకపోతే రేపోప్పదిరోలుకో వస్తుందిగా అందుకని వద్దూ అని అంటారు. అందుకని, తలనొప్పి అన్నింటికన్నా మంచిది. ముందస్తుగా అమ్మ నమ్మదు అనుకో. అయినా సరే మనం తలనొప్పి తలనొప్పి అని పదిసార్లో వందసార్లో చెబితే కుంచెం నమ్ముతారు. ఇది కూడా ముందస్తుగా బామ్మకే చెప్పాలి. అమ్మకి చెబితే లాబంలేదు. అసలు ఏం చేసినా లాబంలేదు. ఎలాగేనా బళ్లోకి వెళ్లాలిలే. అందుకని కుంచెం ఎలాగో చాలా కష్టపడి రోఝూ బళ్లోకే పోవడం మంచిది. గబగబా గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా. అప్పుడు ఇంచక్కా ఎప్పుడూ బడి మానేయొచ్చు. యింకోటి.. మా బాబాయంత పెద్దవాళ్లు అయ్యాకా.. అసలు ఇంక బళ్లోకి వెళ్లద్దంటారులే. మా బాబాయి అంతేగా.. బళ్లోకి వెళ్తాను వెళ్తాను అంటాడు. బామ్మా, నాన్న..యింక చాల్లే, ఆఫీసుకి వెళ్లిపో అంటారు. అదన్నమాట. ఈ పెద్దవాళెపుడూ యింతే. మనం వెళ్తాం అంటే వద్దూ అని అంటారు. మనం వెళ్లను ఒద్దూ అంటే, వెళ్లూ వెళ్లూ బళ్లోకెళ్లూ బడి దొంగా అంటారు యెలాగ? ఇంకో ఉత్తరం చూడు.. వీడు కుంచెం పెద్ద కుర్రాడిలా వున్నాడు. వురేయ్ వురేయి బుడుగూ మలేమోన మా అమ్మా నాన్నా డబ్బులు అసలు ఈటంలేదూ ఎలాగరా మరీ అని రాశాడు గదా.. ఇది కూడా చాలా కష్టమే. అసలు డబ్బులు అంటే చాలామందికి చాలా యిష్టంట. నాక్కూడా కుంచెం యిష్టమేననుకో. కాని ఏం చేస్తాం. చిన్న పిల్లలికీ, కాలేజీకి వెళ్లే బాబాయిలకీ డబ్బులు చాలా యివ్వరు. అడిగినా సరే. కాని అబద్ధం చెప్తే చాలా డబ్బులు ఇస్తారుట. బాబాయి యిలాగే చేస్తాడుట. మళ్లీనేమో నాన్నకి అమ్మ డబ్బులు ఇవ్వదు కదా. ఎందుకూ అంటుంది. అప్పుడు నాన్న కుంచెం అబద్ధాలు చెప్పుతాడుట. చిన్న పిల్లలు మాత్తరం అబద్ధం చెప్పకూడదుట. చెప్పితే కొట్టుతారు. కాని మనం నిజెం చెప్పుతాను అంటూ కుంచెం మంది పెద్దవాళ్లు డబ్బులిస్తారులే. పక్కింటి లావుపాటి పిన్నిగారి ముగుడు లేడూ.. వాడేం.. బీడీలు కాలుస్తాడులే. బీడీలు కాలచడం అంటే తప్పు కదా ఊరికే జెటకా తోలడానికి దాచుకోవాలి అంతే. వాడు నిజెంగా కాలిచేస్తాడు గదా. పక్కింటి లావుపాటి పిన్నిగారు అతనికి చెప్పిందిలే వురేయ్ ముగుడూ అలా బీడీలు కాలచకూడదూ అని. అయినా వాడు మా యింటికి వచ్చి నాన్న దగ్గర కూచుని కాలుచుతాడు గదా. అప్పుడేమో నేను వురేయ్ నీ సంగతి చెప్పుతా ఉండు అని అంటాను గదా. వాడు ఘబుకుని నన్ను ముద్దు పెఠేసుకుని ఓ కాణీయో ప్పదణాలో యిచ్చేసి చెప్పకమ్మా బుడుగు తప్పమ్మా ఒద్దమ్మా యిలాని ఏడుచుతాడు. అప్పుడు నేనేమో పోనీలే అని.. యేవండీ పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. మరేమోనూ మీ ముగుడేమో మా నాన్నతో కలసి బీడీలు కాలచలేదండీ అని అబద్ధాలు చెపేస్తాను. ఏవిటో నేను యెప్పుడు ఇలా అందరినీ రష్చించుతానులే. - ముళ్లపూడి వెంకటరమణ చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి..
తమలపాకులు, కొబ్బరి తురుము, నెయ్యి.. లతో స్వీట్ పాన్ లడ్డు ఏవిధంగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: ►తమలపాకులు – 15 సుమారుగా ►కస్టర్డ్ మిల్క్ – పావు కప్పు ►గ్రీన్ ఫుడ్ కలర్ – కొద్దిగా ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి కోరు – అర కప్పు+3 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి లౌజు – పావు కప్పు (ముందుగా సిద్ధం చేసి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో తమలపాకులు, కస్టర్డ్ మిల్క్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో గ్రీన్ ఫుడ్ కలర్ చేసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో నెయ్యి వేసుకుని.. అర కప్పు కొబ్బరికోరు దోరగా వేయించుకోవాలి. అందులో తమలపాకు జ్యూస్ వేసుకుని తిప్పుతూ బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. ఆపైన గ్రీన్ కలర్ కొబ్బరి–తమలపాకుల మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని.. మధ్యలో కొద్దికొద్దిగా కొబ్బరి లౌజు ఉంచి, ఉండల్లా చేసుకోవాలి. మిగిలిన 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి కోరు బాల్స్కి పట్టించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: భలే రుచిగా బీట్రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే.. -
భలే రుచిగా బీట్రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే..
బీట్రూట్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక రొయ్యలు సంగతి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ రెండింటి కాంబినేషన్లో రుచి కరమైన కబాబ్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: ►పెద్ద రొయ్యలు – అర కప్పు (శుభ్రం చేసి, ఉప్పు, కారం, పసుపు పట్టించి కుకర్లో 3 విజిల్స్ వేయించి పెట్టుకోవాలి) ►కిడ్నీ బీన్స్ (రాజ్మాగింజలు) – 1 కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకోవాలి) ►బీట్రూట్ ముక్కలు – అర కప్పు (ముక్కలు కట్ చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) ►అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ చొప్పున, మిరియాల పొడి – కొద్దిగా, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు ►ఆల్మండ్ పొడి – 1 టేబుల్ స్పూన్ ►కారం – 2 టీ స్పూన్లు, బంగాళదుంప – 1 (ఉడికించి గుజ్జులా చేసుకోవాలి) ►రోజ్ వాటర్ – 1 టీ స్పూన్, నువ్వులు – గార్నిష్కి ►చీజ్ – పావు కప్పు(ముక్కలుగా) ►నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా ఉడికిన రొయ్యలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. అందులో కిడ్నీ బీన్స్ మిశ్రమం, బీట్రూట్ గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, శనగపిండి, ఆల్మండ్ పొడి, కారం, బంగాళదుంప గుజ్జు, రోజ్ వాటర్ వేసుకుని గరిటెతో బాగా కలపాలి. మూతపెట్టి 20 నిమిషాల పాటు చిన్న మంటపైన మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం చల్లారనిచ్చి.. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని, మధ్యలో చిన్న చీజ్ ముక్క పెట్టుకుని మళ్లీ బాల్లా చేసుకుని కట్లెట్ మాదిరి ఒత్తుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి.. కొద్దిగా నూనె పూసిన చేతులతో ప్రతి కట్లెట్కి నువ్వులు అతికించి బేక్ చేసుకుంటే భలే రుచికరంగా ఉంటాయి. చదవండి: నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి.. -
దేశ దిమ్మరిలాగా తిరక్కూడదు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని..
‘ఈ పేషెంట్ని ఉంచడానికి ఎక్కడా ఖాళీలేదు డాక్టర్ ! అన్ని వార్డులూ ఇప్పటికే నిండిపోయాయి’ అన్నది నర్స్. ‘అయితే ఒక ప్రైవేట్ గదిలోకి మార్చండి’ తన తెల్ల కోటుని విప్పుతూ అన్నాడు సర్జన్. ‘ప్రైవేట్ గదులూ నిండిపోయాయి. ఆ పెద్దాయన మెక్లియాడ్ వున్న సెమీ ప్రైవేట్ గదిలో మాత్రం ఒక్క బెడ్ ఖాళీగా వున్నది. అతడు కూడా ఆక్సిజన్ మీద వున్నాడు. బహుశా అతనికి ఈ రాత్రి గడవక పోవచ్చు. ఆ కుటుంబం వారు ఆందోళన పడుతున్నారు’ ‘ఆ బెడ్ మీదకే చేర్చు. ఇతడివల్ల ఆ ముసలాయనకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. ఈ రాత్రి ఇతడు తెలివిలోకి రాకపోవచ్చు’ అంటూ తన మామూలు కొటువేసుకొని బయటికి వచ్చేశాడు సర్జన్. ఈసరికి అర్ధరాత్రి అయింది. ఆ యువకుడికి సుమారు ఇరవై సంవత్సరాలుండొచ్చు. ఎముకల గూడులాగా పీలగా నిటారైన శరీరం. పలుచని ముఖం. జుట్టు పొడవుగానూ చింపిరిగానూ ఉన్నది. చూడ్డానికి పోకిరీలాగా కనపడుతున్నాడు. జీవితంపట్ల బాధ్యతా లక్ష్యమూ లేనట్టున్నాడు. ప్రమాదాల్లో దెబ్బలు తగిలించుకోవడం కొత్తేమీ కాదు అన్నట్టున్నాడు. ఒంటినిండా బ్యాండేజీలతో నిరుత్సాహంగా కనపడుతున్నాడు. అతడెవరో ఎవరికీ తెలీదు. ఇతడ్ని గాయపరిచిన కారు యజమాని పరారయ్యాడు. రోడ్డుమీద అపస్మారకస్థితిలో పడివుంటే ఎవరో తెచ్చి ఈ ఆసుపత్రిలో చేర్చారు. ఈ చిన్న నగరంలో ఇదొక్కటే ఆసుపత్రి. మరీ చిన్నదీకాదు..పెద్దదీకాదు. ‘ఇతడ్ని ఇరవైమూడో గదిలో పెట్టండి’ అన్నది నర్స్ అక్కడి పనివాళ్ళతో. వారు స్ట్రెచర్ని తీసుకెళ్లి అతడ్ని బెడ్ మీదకు చేర్చారు. ఈ సమయంలో ఆసుపత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒక్క పసివాడి ఏడుపుగానీ ఒక్క రోగి మూలుగుగానీ వినపడటం లేదు. ఆ రాత్రికి ఇవ్వాల్సిన చివరి ఇంజక్షన్ చేస్తూ ‘ఈ యువకుడికి మత్తుమందులు ఏమీ ఇవ్వొద్దు సుమా!’ అని నర్సుతో చెప్పి డాక్టరు బయటికి వెళ్ళాడు. హాల్లో టెలిఫోన్ మోగింది. నర్స్ వెళ్లి రిసీవర్ అందుకుంది. ‘హలో’ అంటూనే అవతలి వైపున్న స్పష్టమైన గొంతుని గుర్తించింది.. ‘చెప్పండి మిసెస్ మెక్లియాడ్ ?’ ‘మాకు ఆందోళనగావుంది. నిద్ర పట్టడంలేదు. ఒక్కసారి ఆయన పరిస్థితి చూసి చెప్పగలవా?’ ‘తప్పకుండా’ అంటూ రిసీవర్ పెట్టేసి, గదిలోనికి వెళ్ళింది. ఈ సరికి పక్క బెడ్ యువకుడి శ్వాస కాస్త మెరుగుపడింది. కానీ నర్స్ అతడ్ని గమనించ లేదు. మెక్లియాడ్ పల్స్ చూసింది. ఏమీ బాగాలేదు. వెంటనే టెలీఫోన్ వద్దకు పరుగెత్తింది.. ‘మిసెస్ మెక్లియాడ్! మీరింక రావడం మంచిది’ అని చెప్పింది. ‘వెంటనే వస్తున్నాం’ అవతలి గొంతు పైకే వినపడింది. నర్స్.. డాక్టరుకి ఫోన్ చేసింది.. ‘డాక్టర్! మెక్లియాడ్ పరిస్థితి బాగాలేదు. వారి కుటుంబాన్ని రమ్మన్నాను’ ‘నేనొస్తున్నాను’ పక్కబెడ్ యువకుడు కూడా కదల్లేదు. కానీ అతడి శ్వాస బాగా మెరుగు పడింది. నర్స్ ముసలాయనకు ఆక్సిజన్ ప్రవాహాన్ని కొంచెం పెంచింది. గదిలో మరోబల్బుని వెలిగించి రెండు అదనపు కుర్చీలను తెచ్చింది. ఆయన మరొక్కరోజు మాత్రమే బతకగలడని నిన్ననే ఆ కుటుంబంవారికి వివరించారు. డ్యూటీ డాక్టరు వచ్చి పల్స్నీ, గుండెకొట్టుకునే రేట్నీ చూశాడు. ‘దాదాపుగా ఈ ముసలాయన జీవితం ముగిసి పోయింది. వాళ్ళొచ్చిన వెంటనే ఇంజక్షన్ చేస్తాను’ అన్నాడు. ‘అదికూడా సిద్ధంగానే వుంచాను డాక్టర్!’ అన్నది నర్స్. ‘ఈ ఇంజక్షన్ ఇతన్ని బతికిచేస్తుందని కాదు.. ఒక అరగంట, తప్పితే గంట.. బంధువులు తుది వీడ్కోలు చెప్పడానికి పనికొస్తుంది. అంతే. అదిసరే ఈ రెండో పేషెంట్ ఎవరు?’ అడిగాడు డ్యూటీ డాక్టర్. ‘యాక్సిడెంట్ కేసు. స్పృహలో లేడు’ అంతలో మెక్లియాడ్ కుటుంబం వారొచ్చారు. ‘ఈయనకు నేనొక ఇంజక్షన్ చేస్తాను. కొద్దిసేపు మాత్రం స్పృహ లోనికి వస్తాడు’ అన్నాడు డాక్టరు. నలుగురు లోనికొచ్చారు. మెక్లియాడ్ భార్యకు అరవై ఏళ్లకు పైగానే ఉంటాయి. విషాదంగా ఉన్నప్పటికీ నిబ్బరం కోల్పోలేదు. కుమారుడు జార్జి పొడవైన యువకుడు. తండ్రి స్థితిపట్ల బాధ కనపడుతున్నది. అతని భార్య రత్ సన్నంగా వున్నది. కుమార్తె మేరీ తండ్రిలాగే కాస్త చామనఛాయ. జార్జి పక్కబెడ్ వైపు చూపుతూ ‘అతడెవరు?’ అన్నాడు. ‘యాక్సిడెంట్ కేసు. స్పృహలో లేడు.. హాస్పిటల్లో ఎక్కడా ఖాళీలేక ఇక్కడ ఉంచాం. మీరతడ్ని పట్టించుకోనవసరం లేదు’ అన్నది నర్స్. మెక్లియాడ్ వదులైన చర్మంకింద డాక్టరు ఒక ఇంజక్షన్ చేశాడు.. ‘మిసెస్ మెక్లియాడ్! సుమారు అరగంటవరకూ మీరు అతనితో మాట్లాడుకోవచ్చు. మేం బయటే ఉంటాం’ ‘థాంక్యూ డాక్టర్!’ అన్నది మెక్లియాడ్ భార్య. డాక్టరూ, నర్సూ బయటకు వెళ్లే వరకూ ఆమె వేచి ఉన్నది. ఆ తరువాత మిగిలినవారికి సైగచేసి భర్త బెడ్ వద్దకు రప్పించింది. ఆమె ముసలాయన తలవద్ద కూర్చున్నది. జార్జీ, రత్ ఇంకా దగ్గరగా వచ్చారు. మేరీ తల్లి పక్కనే మోకాళ్ల మీద కూర్చున్నది. ‘హాల్! మేమందరమూ నీ దగ్గరేవున్నాం’ అన్నది మెక్లియాడ్ భార్య.. భర్తతో. మెక్లియాడ్ రెప్పలు కదులుతున్నాయి. పక్క బెడ్ యువకుడు నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నాడు. ‘హాల్! మనతోటలో మీకిష్టమైన సన్నజాజులు గుత్తులుగుత్తులుగా పూస్తున్నాయి. మధ్యాహ్నం మీ ఫేవరెట్.. క్యారెట్ కూర చేశాను.‘ ‘డాడీ! రత్ కూడా మెల్లగా వంటచెయ్యడం నేర్చుకొంటున్నది’ అన్నాడు జార్జి. ‘మన పెళ్ళికాగానే నేను చేసిన చెర్రీ కలగూర మీకు గుర్తుందా హాల్! పైన ఉడకలేదు. కింద మాడిపోయింది. నాకు ఏడుపొచ్చినంత పనైంది. మీరేమో నవ్వారు. కలగూర చెయ్యడం కోసమే నిన్ను పెళ్లిచేసుకోలేదు అని బుజ్జగించారు..’ ‘ఈ సంవత్సరం కూడా చెర్రీ చెట్టునిండా పళ్ళున్నాయి నాన్నా! అవి బాగా పక్వానికి వస్తే మీకోసం జార్జి వాటిమీద వలపరుస్తాడు.’ జార్జి నవ్వుతెచ్చుకుంటూ ‘వల వేసినందుకు పక్షులు మనల్ని తిట్టుకుంటాయని మీరనేవారు..’ అన్నాడు. మేరీ ఆర్ద్రత నిండిన కంఠంతో ‘కలగూరతో వనభోజనాలు భలేగా వుంటాయి కదా నాన్నా!’ అంది. ‘వయసు మీదపడినా వనభోజనాల్లో ఏదో మజా వున్నదని మీరు అంటూంటారు కదా..’ మెక్లియాడ్ భార్య.. అతనిచేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ‘నాన్నా! గత జూలైలో మనం వెళ్లిన పిక్నిక్ గుర్తుచేసుకోండి. అక్కడే ఫిడేల్ శ్రుతి చెయ్యడం ఎలాగో నాకు నేర్పారు మీరు’జార్జి . ‘నాకు వేసవి సెలవులంటే ఇష్టం. స్కూలన్నా ఇష్టమే. నావైపు చూడకు అన్నయ్యా! నీకే స్కూలంటే ఇష్టం ఉండేదికాదు’ ఏదో లోకంలో ఉన్నట్టు అన్నది మేరీ. ‘పోట్లాడుకోకండీ’ మెక్లియాడ్ భార్య నవ్వడానికి ప్రయత్నించింది. పక్కబెడ్ యువకుడి కనురెప్పలు కదుల్తున్నాయి. అతడ్ని ఎవరూ గుర్తించట్లేదు. మెదడు పొరల్లోంచి పక్కవారి మాటల్ని అస్పష్టంగా వినగలుగుతున్నాడు. మేరీ అంటున్నది.. ‘నిజానికి నాకు మళ్ళీ చిన్నదాన్నయిపోవాలనీ, మీతోనూ, అమ్మతోనూ ఆడుకోవాలనీ అనిపిస్తోంది నాన్నా!’ అని. ‘ఆగు .. ఆయనేదో చెబుతున్నాడు..’ అన్నది మెక్లియాడ్ భార్య. వారంతా ఆసక్తిగా ఆయన మీదకు వంగారు. ఆ చిరుకాంతిలో వారి దృష్టి ఆ వృద్ధుని ముఖం మీద నిశ్చలంగా వున్నది. వృద్ధుడి పెదవులు కదిలాయి. ఏదో సైగ చేయబోయాడు. నెమ్మదిగా కళ్ళూ తెరిచాడు. వరుసగా అందరివైపూ చూశాడు. వృద్ధుడు తన తలని భార్య వైపు తిప్పాడు. నీరసంగా పిలిచాడు ‘మార్తా!’ ఒక అస్పష్టమైన మూలుగు, ఒక నిట్టూర్పు కలగలుపుగా ఆ పిలుపు అధోలోకాల్లోంచి వెలికి వచ్చినట్టుంది. ‘హాల్! నేనిక్కడే వున్నాను. మిమ్మల్ని చూడాలని పిల్లలూ వచ్చారు’ ‘మీ మనుమలు కూడా మిమ్మల్ని చూడాలనుకున్నారు. కానీ వాళ్లు ఈ టైమ్లో నిద్రపోతారు. చిట్టి హాల్ వాడి మూడుచక్రాల సైకిల్ని మీకు చూపించాలని తెగ ఆత్రపడ్డాడు’ అన్నది రత్. ‘తాతగారు ఒక హార్న్ కొని తెచ్చిస్తే దాన్ని ఆ సైకిలుకు బిగించుకుంటాడట’ అన్నాడు జార్జి. ‘నాకు క్రిస్టమస్ అంటే చాలా ఇష్టం నాన్నా!’ మేరీ ఏదో స్వప్నలోకపు గొంతుతో అంటున్నది.. ‘ఆరోజు పరుపు మీంచి లేచేసరికే మధురమైన పాటలు వినపడుతుంటాయి’ అంటూ మంద్రంగా ఒక పాటనూ అందుకుంది. పక్క బెడ్ యువకుడి కళ్ళు సగం తెరుచుకున్నాయి. వారి మాటలూ స్పష్టంగా వినపడుతున్నాయి. అయినా కళ్ళు మూసుకునే మేరీ పాటను విన్నాడు. ముసలాయన ‘నాకన్నీ గుర్తున్నాయి’ అన్నాడు. ‘మీరే మా సర్వస్వం నాన్నా!’ అన్నది మేరీ. ‘నాన్నా! నేను కూడా మీలాగా మంచి నాన్ననౌతాను’ అన్నాడు జార్జి. పక్క బెడ్ యువకుడికి పరిస్థితి బాగా అర్థమౌతోంది. తన పక్కనే వృద్ధుడొకాయన ఉన్నాడనీ అతని చుట్టూ కుటుంబసభ్యులున్నారనీ తెలుస్తున్నది. ‘మీరు చాలా మంచి పిల్లలు’ ముసలాయన మగతగా అన్నాడు. ‘నాకు పదిహేనేళ్లున్నప్పుడు క్రిస్టమస్ చెట్టుమీద నాకోసం మీరు ఒక ఉంగరం పెట్టారు. నాకు ఎమరాల్డ్ మనసులో ఉన్నదని మీకెలా తెలిసిందో ఇప్పటికీ నాకు అర్థంకాదు నాన్నా!’ అన్నది మేరీ. ‘నాకప్పుడు పన్నేండేళ్లనుకుంటా.. మంచుమీద జారే స్టిక్స్.. ఖరీదు ఎక్కువని నేను అడగలేదు. కానీ నా మనసు తెలుసుకొని మీరే కొనిచ్చారు’ అన్నాడు జార్జి. ‘మీ నాన్నకు ఇటువంటివన్నీ ఎవరూ చెప్పకపోయినా అడక్కపోయినా తెలుస్తూంటాయి, ముఖ్యంగా క్రిస్టమస్ రోజుల్లో’ అన్నది మెక్లియాడ్ భార్య. ‘పిల్లల మనసు తల్లిదండ్రులకు గాక ఇంకెవరికి తెలుస్తుంది!’ అన్నాడు వృద్ధుడు. అతని గొంతు వెనక్కు పోతున్నది.. కనురెప్పలూ కొట్టుకొంటున్నాయి. పక్కబెడ్ యువకుడికి బాగా తెలివి వచ్చింది. ఆయా వ్యక్తుల్ని చూడాలనీ, వారి ముఖ కవళికల్ని పరిశీలించాలనీ అనిపించింది. పక్కకు తిరగబోతే మెడ నొప్పెట్టింది. ఇవి క్రిస్టమస్ రోజులని అతనికి గుర్తేలేదు. గుర్తుపెట్టుకొని కూడా చేసేదేమీ లేదు. ‘వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ. ఈ ఏడు ఆరు లిల్లీపువ్వులున్నాయి. ఇంతకుముందెప్పుడో మూడుపువ్వులు ఒక్కసారి పూసినట్లుగుర్తు. అంతేకదా హాల్!’ అన్నది మెక్లియాడ్ భార్య. ‘ కాదు, అయిదు’ అన్నాడు వృద్ధుడు ‘సరిగ్గా చెప్పారు’ అంటూ పిల్లల వైపు తిరిగి ‘చూశారా.. మీ నాన్నకు అన్నీ గుర్తుంటాయి’ అంది. పక్కబెడ్ యువకుడి చెవిలో ఈస్టర్ అన్నమాట పడింది. అవును. జనం కొత్తదుస్తులు వేసుకొని చర్చికి వెళ్తారు. అతడికి కొత్త దుస్తులు కుట్టించేవారు లేరు, కొనుక్కోవడానికి డబ్బూ లేదు. మెక్లియాడ్ కనురెప్పలు వాలిపోతున్నాయి. ఆయన భార్య కుమారుడికి సైగ చేసింది. జార్జి ద్వారం వద్దకు వెళ్లి డాక్టర్ని పిలిచాడు. అతడు వచ్చి మెక్లియాడ్ పల్స్ చూసి.. పెదవి విరిచాడు. మెక్లియాడ్ భార్య ముఖం పాలిపోయింది. ‘పిల్లలూ మీరింక ఇంటికి వెళ్ళండి. నేను మీనాన్నతో పాటు వుంటాను’ అన్నది. ఏదో అర్థమైనట్లు వారు ముఖాలు చూసుకున్నారు. ‘గుడ్ నైట్ నాన్నా!’ అన్నాడు జార్జి. ‘నాన్నా! గుడ్ నైట్ ’ మేరీ తండ్రి పైకి వంగి అతని చెక్కిళ్ళను ముద్దాడింది. అందరూ బరువుగా.. విషాదంగా వెళ్లిపోయారు. వృద్ధులిద్దరూ మిగిలారు. మెక్లియాడ్ కళ్ళు మళ్ళీ నెమ్మదిగా తెరుచు కున్నాయి. కానీ అతడేమీ మాట్లాడలేదు. పక్కబెడ్ యువకుడికి బాగా తెలివి వచ్చింది. ఇద్దరు వృద్ధుల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఇప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారు? వృద్ధురాలు ముసలాయనతో ‘హాల్! ఇవన్నీ పాత జ్ఞాపకాలు. ఒకనాటి మధురస్మృతులు. పిల్లల సమక్షంలో కాకుండా కేవలం మనిద్దరం మాత్రమే నెమరు వేసుకోదగ్గవి. మీరొక అపురూపమైన భర్త హాల్! ఒక ఆదర్శ పురుషుడిగా నన్నొక ఆనందమయ ప్రపంచంలోనికి తోడుకెళ్లారు. ఒక బాధ్యతగల స్త్రీమూర్తిగా తీర్చిదిద్దారు. మనం సంతోషంగా గడిపాం. మన సంతానాన్ని మంచి పౌరులుగా తయారుచేశాం’ అంటూ ఆమె ఆగింది. తన గాద్గదిక స్వరాన్ని వినపడనివ్వకుండా తమాయించుకుంది. ‘ఆనాడు ఆ తోటలో ఆ చెర్రీ చెట్టునీడలో నా చేతిని మీ చేతిలోకి తీసుకొని.. ‘‘మనం పెళ్ళిచేసుందామ’’ని మీరు ప్రతిపాదించిన మధుర క్షణాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను హాల్! ఆక్షణమే నా జీవితానికి గతినీ గమ్యాన్నీ సమకూర్చిపెట్టింది. మీ వెనుకనే అడుగులో అడుగేసుకొంటూ ఆనందధామాలవైపు పయనించేటట్టు చేసింది.’ ఆమె అలా మాట్లాడుతుండగానే అతని చెయ్యి ఆమె చేతికోసం వెతికింది. ఆ చేతిని ఆమె తన రెండుచేతుల్లోనికీ తీసుకొని హృదయానికి హత్తుకుంది. ‘నేనిక్కడే వున్నాను ప్రియతమా!’ ఆమె గొంతు జీరబోయింది. ఒక్కసారిగా బిగ్గరగా ఏడవాలనిపించింది. కానీ పెదవుల్ని బిగబట్టుకున్నది. ‘మార్తా!’ ఆ పిలుపు ఏ దిగంతాలనుండో శూన్యాన్నీ గాలినీ మేఘాల్నీ చీల్చుకొని ప్రతిధ్వనించినట్టు అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ‘అవును హాల్! నేనిక్కడే వున్నాను. మీ తోనే వున్నాను’ మెక్లియాడ్ హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. ఆమెని చూసి చిరునవ్వు నవ్వాడు. ‘మార్తా... మార్తా.. నువ్వు.. నువ్వు.. నాకొక.. అద్భుతమైన జీవితాన్ని..’ అతని మాట, గది బయటి నిశీధిలోనికీ నిశ్శబ్దంలోనికీ శోషణ చెంది పోయింది. ఆమె చేతిలోంచి అతనిచెయ్యి కిందకు జారిపోయింది. కనురెప్పలు వాలిపోయాయి. ముసలాయన చనిపోతున్నాడు. పక్కబెడ్ యువకుడికి ఏడుపొస్తున్నది. వ్యక్తులతో పరిచయంలేకపోయినా మరణానికి సాక్షిగా ఉండవలసివస్తే దుఃఖంకట్టలు తెంచుకొంటుంది. అతనిది నిర్లిప్తమైన జీవితం. తండ్రి ఎవరో తెలీదు. పసికందుగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. అనాథాశ్రమంలో వందలమంది పిల్లలమధ్య ఒంటరిగా పెరిగాడు. అనురాగమూ ఆప్యాయతా మొదలైన స్పందనలు అసలే తెలీవు. ఎవరో తిండిపెడితే ఎందుకో పెరిగాడు. అంతే! ఆమె మౌనంగా ఏడుస్తోంది. భర్త చేతిని నెమ్మదిగా కిందపెట్టి తన చేతిసంచి లోంచి చిన్నపుస్తకాన్ని తీసి చదవటంమొదలు పెట్టింది ‘దేవుడే నా రక్షకుడు. నేనింకేమీ కోరను’ పక్కబెడ్ యువకుడు ఈమాటల్ని ఒకనాటి అనాథాశ్రమం సండే స్కూల్లో తరచుగా వినేవాడు. ఆనాడు అవి అర్థంతెలీని విడి విడి పదాలు మాత్రమే. ఇప్పుడు హఠాత్తుగా ఆ మాటలకు అర్థమూ అన్వయమూ అతడికి స్ఫురించింది . ‘మృత్యుగహ్వరపు నీడలో నడిచినా నేను భీతిల్లను. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం.. నువ్వు మాతోనే ఉంటావు.. మాలోనే ఉంటావు’ స్వర్గద్వారంలో ప్రవేశిస్తున్న భర్తకు భరోసా ఇస్తున్నది. అంతేకాదు గతంలో ఇద్దరి జీవన గమనానికీ, మనసు లోతులకు మాత్రమే సంబంధించిన ఎన్నో అంశాల్ని స్మరించుకొంటున్నది. పంచుకొన్న కష్టసుఖాలనూ, భరించిన కలిమి లేములనూ తలచుకొని విలపిస్తున్నది. ఆమె గ్రంథాన్ని మూసివేసి, కొంతసేపు కనులు మూసుకొని మౌనంగా కూర్చున్నది. పక్కబెడ్ యువకుడు దిండుపైన ఒత్తిగిల్లాడు. ఇప్పుడతనికి ఏడవాలనిపించడంలేదు. ఆమె లేచి భర్త శరీరంపై వొంగి, అతడి పెదవుల్ని ముద్దాడింది.‘ప్రియతమా.. నీకు వీడ్కోలు.. మనం పైలోకంలో కలుసుకునే వరకూ..’ కనులు తుడుచుకొని ద్వారం వద్దకు వెళ్లి డాక్టర్ని పిలిచింది. డాక్టరు వచ్చిమరోసారి పల్స్ చూశాడు. ‘అంతా అయిపోయింది. మీరు చాలా ధైర్యవంతులు’ అన్నాడు. ‘దేవుడే ధైర్యాన్నిస్తాడు డాక్టర్’ ‘అవును. నిజంగా అంతే!’ ‘అంబులెన్సు వస్తే ఫోన్ చెయ్యండి. మాఇల్లు దగ్గరే’ అని చెప్పి ఆమె వదల్లేక వదల్లేక తడబడుతూ వెళ్ళిపోయింది. పక్కబెడ్ యువకుడు వెల్లకిలాపడుకొని నిదానంగా పైకప్పు వైపు చూస్తున్నాడు. గతంలో అతనికెప్పుడూ జీవితమంటే ఏమిటో ఎందుకో ఎవరికోసమో తెలీలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. ఒకర్ని ప్రేమించి కలసి జీవించి ఒక కుటుంబాన్ని నిర్మించడమే జీవితానికి సార్థకత అనిపిస్తున్నది. ఆది మానవుడి గుహాంతర జీవనసరళి మొదలు ఈనాటి గ్రహాంతరవాసం వరకూ అదే మనిషికి గమ్యం. బంధాలూ అనుబంధాలూ ఆత్మీయతలూ ఒడిసి పట్టుకున్న సుదీర్ఘమైన జీవనయానంలో అనుభూతుల విలువలే వెలుగులు. కన్నీళ్లూ చిరునవ్వులే మైలురాళ్లు. డ్యూటీ డాక్టరు వచ్చి యువకుడు తెలివిగా ఉండటాన్ని గమనించి ‘ఓయ్ అబ్బాయ్.. ఎంత సేపటి నుంచి మేలుకొని ఉన్నావ్?’ అని అడిగాడు. యువకుడు చిరునవ్వు నవ్వుతూ ‘ఒక అరగంట కావచ్చు’ అని బదులిచ్చాడు. డాక్టరు గాభరా పడ్డాడుతూ ‘నువ్వు ఇదంతా చూడటం ఏమీ బాగాలేదయ్యా!’ అంటూ వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. నర్స్ వచ్చింది. ‘ఇక్కడొక తెర కట్టు’ అని పురమాయించాడు డాక్టర్. ఆమె వెళ్లి తెర తెచ్చి కట్టింది. అంతలోనే ఇద్దరు మనుషులు స్ట్రెచర్ తెచ్చి వృద్ధుడి శవాన్ని వెలుపలికి తీసుకుపోయారు. యువకుడి మెదడులో ఆలోచనల కల్లోలతరంగాలు కదలాడసాగాయి. ‘ఇంట్లో ఈసరికి జార్జి తల్లిని ఓదారుస్తుంటాడు. మేరీ తండ్రి లేని వెలితికి కుంగిపోతూ ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా వృద్ధురాలు భర్తని మరచిపోలేదు. ఎన్నో దశాబ్దాల దాంపత్య బంధం.. అంత త్వరగా చెరిగిపోతుందా! అసలు ప్రేమే అమరమైంది..’ అలా.. అలా.. ఆలోచిస్తుండగా యువకుడికి నిద్రపట్టేసింది. యువకుడు ఉదయం ఆలస్యంగాలేచాడు. గది పరిశుభ్రంగా ఉంది. తెరనీ తీసివేశారు. ఇప్పుడతని పక్కబెడ్ ఖాళీగా ఉన్నది. దానిమీద కొత్త బెడ్ షీట్లు పరచారు. కొద్దిగంటల కిందట ఆ బెడ్ మీద తుదిశ్వాస విడిచిన ఒక ముసలాయన.. ఆయనచుట్టూ పెనవేసుకున్న బంధాలూ బాంధవ్యాలూ జ్ఞాపకాలూ.. చివరకు మిగిలేవి.. ఇవే! జీవితానికి గతినీ గమ్యాన్నీ ఇచ్చేవి.. ఇవే! కిటికీలోంచి ఉదయకిరణాలు యువకుడి బెడ్ మీద పడుతున్నాయి. జీవితంలో తొలిసారిగా తాను ఒంటరి వాడిననే భావం తొలిగిపోయింది. ఇక సోమరిగా విచ్చలవిడిగా దేశ దిమ్మరిలాగా తిరక్కూడదనే నిశ్చయానికి వచ్చాడు.. భవిష్యత్ మీద ఆశలు చిగురించాయి. తనొక ఉపాధిని సంపాదించుకోవాలి. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. అప్పుడెప్పుడో తనబాల్యంలో అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఒక మూడు చక్రాల సైకిలు కోసం అహోరాత్రాలూ పరితపించాడు. ఒక్కసారంటే ఒకే ఒక్కసారి దానిమీద కూర్చొని తొక్కాలనే కోరిక ఇప్పటికీ తీరనే లేదు. ఆ వెలితి, గుండె మీది వ్రణంలాగా ఇన్నేళ్ల తరువాత కూడా నొప్పిగానే ఉంటుంది. అటువంటి చిరుకోరికలు తీరాలన్నా తీర్చాలన్నా ఆత్మీయులుండాలి. ఒక కుటుంబంలో సభ్యుడై ఉండాలి. జీవితానికొక గమ్యమూ అర్థమూ పరమార్థమూ ఉండాలి. నర్స్లోని కొచ్చింది. రాత్రి డ్యూటీ చేసినప్పటికీ ఆమె ఉత్సాహంగా ఉంది. ‘అబ్బాయీ! అల్పాహారం తీసుకుంటావా?’ ఆప్యాయంగా అడిగింది. యువకుడు నవ్వాడు. ‘నాకిప్పుడు బాగానేవుంది సిస్టర్! దయచేసి మంచి భోజనమే తెప్పించండి. చాలా ఆకలిగావుంది’ అన్నాడు. అతనికళ్ళల్లో ఆమెకొక స్పష్టమైన కాంతిరేఖ కనపడింది. -మూలం : పెర్ల్ ఎస్ . బక్ - అనువాదం: టి . షణ్ముఖ రావు -
క్రైంస్టోరీ: మన రహస్యాలు లీకైపోతున్నాయి.. జాగ్రత్త.. ఎట్టకేలకు
‘ఏమిటి పరిస్థితి? వాడు దొరికాడా?’ ఫోన్లో అడిగాడు సీఐ మహంకాళి. ‘ఇంకా లేదు సార్. బ్యాంక్కి ఎదురుగానే కాచుకొని ఉన్నాం’ చెప్పాడు వినయంగా ఎస్సై ఆత్మారాం. ‘నీతోపాటు ఇంకెవరున్నారు?’ సీఐ మహంకాళి. ‘ఇద్దరు పీసీలు ఉన్నారు సార్. వాళ్లకు ఈ విషయం తెలియదు. ఏదో రొటీన్ డ్యూటీ అనుకుంటున్నారు’ ‘గుడ్. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నీకు తెలుసుగా.. మన రహస్యాలు లీకయి పోతున్నాయి. ఎవరినీ నమ్మలేకపోతున్నాం. జాగ్రత్త. వాడు మహా కన్నింగ్ ఫెలో. ఇన్నాళ్ళకు వాడిని పట్టుకునే అవకాశం దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో వాడు తప్పించుకోకూడదు’ అంటూ హెచ్చరించాడు సీఐ. ఆత్మారాం చాలా ఎలెర్ట్గా ఉన్నాడు. ఒకవైపు ఫోన్ మాట్లాడుతున్నా అతని చూపులు బ్యాంక్ మీద నుంచి మళ్లడం లేదు. అతను పనిచేసే ప్రాంతం చుట్టూ ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యక్రమాలు బాగా ఎక్కువయ్యాయి. ఎన్నడూ లేనిది ఆ అడవి ప్రాంతంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని నిర్ధారణ కావడంతో తన పోలీస్ స్టేషన్పై ఒత్తిడి పెరిగింది. ఒక ముఖ్యమైన మావోయిస్టు బ్యాంకులో ఉన్నాడని పక్కా సమాచారం అందడంతో అతన్ని పట్టుకునే బాధ్యత ఆత్మారాం మీద పడింది. ఎవరయినా తమని గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూస్తూ, తన పనిలో నిమగ్నమయ్యాడు ఆత్మారాం. కాస్తంత దూరంలో నడచివస్తున్న ఒక మనిషి, అతన్ని ఆకర్షించాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ తన లోకంలో తాను ఉన్న ఆ మనిషి తన కుడి కాలిని ఈడ్చుకుంటూ నడవడం, అప్పుడప్పుడు ఎడమ చెవిని రుద్దుకుంటూ ఉండడం ఆత్మారాంని ఏవో జ్ఞాపకాల్లోకి నెట్టేశాయి. ‘ఇలా కాలు ఈడుస్తూ నడవడం, చెవినలా రుద్దుకోవడం ఎవరో చేసేవారే? ఆ అలవాట్లు ఉన్న ఇతన్ని ఎక్కడో చూశానే? ఎక్కడ? ఎక్కడ?’ అనుకుంటూ పరధ్యానంలో పడినా, వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి, బ్యాంక్పై దృష్టి నిలిపాడు. అయినా ఆత్మారాం మనసు నిలకడగా ఉండడం లేదు. ఆ వ్యక్తి కారణంగా అతను బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. అతను దగ్గరవుతున్న కొలదీ ఆత్మారాం ఏకాగ్రత చెదరసాగింది. ఆ వ్యక్తి.. ఆత్మారాంను దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు వెలిగింది ఆత్మారాంకి.. అతను చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న క్లోజ్ ఫ్రెండ్ భాస్కర్ అని. వెంటనే అనాలోచితంగా అతని నోటిమ్మట ‘బాచీ’ అన్న పదం వెలువడింది. ఆ వ్యక్తి ఆగిపోయి, వెనక్కి తిరిగి చూసి, ఎవరు పిలిచారో తెలియక దిక్కులు చూశాడు. తన ఊహ కరెక్టే అని అనుకోగానే ఆత్మారాం ఆనందానికి అంతే లేదు. ‘నేను రా బాచీ.. ఆత్మారాంని’ అంటూ అరిచాడు. ‘సారీ.. మీరెవరో నాకు తెలియదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో?’ అంటూ ఒక్క అడుగు వెనక్కివేశాడు. ‘అరే.. నన్ను గుర్తుపట్టలేదా? రామచంద్రపురం హైస్కూల్లో కలిసి చదువుకున్నాం. ఎలా మర్చి పోతావ్రా ఈ ఆత్మని?’ అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఓ.. ఆత్మారాంవా? నిజంగా? అయితే మాత్రం ఎలా గుర్తుపడతాను? అప్పుడు సన్నగా పుల్లలా ఉండే నువ్వు ఇలా వస్తాదులా మారిపోతే ఎలా గుర్తుపట్టగలను?’ అంటూ నవ్వి, ‘థైరాయిడ్ వల్ల నా ముఖం కూడా బాగా మారిపోయింది. చిన్నప్పటి స్నేహితులెవరూ గుర్తుపట్టలేక పోతున్నారు. నువ్వెలా ఎలా గుర్తుపట్టావురా? అంటూ ఆశ్చర్యపోయాడు. ‘వాళ్ళకీ నాకూ తేడా లేదా? నేను పోలీసోడిని కదా?’ అంటూ గర్వంగా నవ్వుతున్న ఆత్మారాంకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. ఆందోళనగా బ్యాంక్ వైపు చూశాడు. ‘అయ్యో ఎంత ఏమరుపాటుగా ఉన్నాను? కొంపదీసి వాడు ఈ గ్యాప్లో తప్పించుకు పోలేదు కదా?’ అని కంగారు పడ్డాడు. ‘వాడు అసలే నక్కజిత్తుల మారి. వాడు తప్పించుకోవడానికి రెండు నిమిషాలు చాలు. నేను ఎక్కువ టైమే ఇచ్చేశాను. ఎంత పొరపాటు అయిపోయింది!’ అని గాభరా పడ్డాడు. ‘ఏమిటా కంగారు? ఎనీథింగ్ రాంగ్?’ అని అడిగాడు భాస్కర్. దానికి సమాధానం చెప్పకుండా ‘ఒక్క క్షణం ఇక్కడే వెయిట్ చేయి. ఇప్పుడేవస్తాను’ అంటూ హడావిడిగా బ్యాంక్ వైపు నడిచాడు. బ్యాంక్లోకి అడుగు పెడుతూనే సెక్యూరిటీ గార్డ్ని పిలిచి, గేట్ వేసేయమని ఆర్డర్ చేశాడు. జనం మధ్యలో తిరుగుతూ తీవ్రవాది కోసం తీక్షణంగా గాలించడం మొదలుపెట్టాడు. అతని జాడ లేకపోవడంతో చెమటలు పట్టాయి. మేనేజర్ని కలిసి, సిసి కెమెరా ఫుటేజ్ చూశాడు. కొద్దిసేపటి కిందటే అతను వెతుకుతున్న మనిషి గేట్లోంచి బయటకు పోయినట్లు రికార్డ్ అయింది. అతను గేటు దాటిన టైమ్ చూశాడు. సరిగ్గా అదే సమయంలో తను భాస్కర్తో మాట్లాడుతూ కర్తవ్యాన్ని మర్చిపోయినట్లు గ్రహించాడు. ‘ఛ.. ఎంత పొరపాటు జరిగిపోయింది?’ అనుకుంటూ కుమిలిపోయాడు. ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయని ఆత్మారాంకి చాలా బాధ కలిగింది. మావోయిస్ట్ కోసం బయట పడిగాపులు కాచే బదులు, బ్యాంక్లోకే వెళ్లి అతన్ని పట్టుకోవాలని ముందు ప్లాన్ చేసుకున్నాడు. అయితే సీఐ అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే పెద్ద పబ్లిసిటీ అయిపోతుందని, మీడియాతో నానా ఇబ్బందులు వస్తాయని, కస్టమర్ను అడ్డుపెట్టుకొని, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని, అప్పుడు వాడిని పట్టుకోవడం కష్టం అవుతుందని అడ్డు చెప్పాడు సీఐ. బయటకు వచ్చిన తీవ్రవాదిని గుట్టుచప్పుడు కాకుండా బంధించి, జీపెక్కించడమే ఉత్తమమని సలహా ఇచ్చాడు. ‘ఛ.. నా ప్లాన్ని ఫాలో అయ్యుంటే ఈ తప్పు జరిగి ఉండేది కాదు’ అని విచారపడ్డాడు. ఇప్పుడు జరిగినదంతా దాచి మావోయిస్ట్ చాలా తెలివిగా తన కన్ను గప్పి తప్పించుకున్నాడని సీఐతో చెప్పాడు. సీఐ ఉగ్రుడైపోయి చెడామడా తిట్టేశాడు. అలా తిట్లు కాయడం మొదటిసారి కావడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు ఆత్మారాం. బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆత్మారాంని చుట్టుముట్టారు కానిస్టేబుళ్లు. ‘ఏమయిందిసార్? ఒక్కసారిగా అలా బ్యాంక్లోకి పరిగెత్తారు? మమ్మల్ని పిలిస్తే, మేమూ కూడా వచ్చేవాళ్ళం కదా?’ అన్నాడొక కానిస్టేబుల్. ఏమి జరిగిందో.. ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు భాస్కర్. ‘ఏం లేదు. చిన్న ఎంక్వైరీ అంతే. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి మీరు స్టేషన్కి వెళ్ళిపొండి’ అంటూ అబద్ధమాడి భాస్కర్ వైపు తిరిగి ‘నీకు అర్జెంట్ పనేమీ లేదుగా? మా ఇంటికి వెళ్దాం. కాస్త రిలీఫ్గా ఉంటుంది’ అన్నాడు. తలూపి జీపు ఎక్కాడు భాస్కర్ అలవాటుగా తన ఎడమ చెవిని రుద్దుకుంటూ. ∙∙ ఇంటి తాళం తీసి హాల్లోకి నడుస్తూ ‘సారీ.. ఇంతసేపూ నీతో సరిగ్గా మాట్లాడలేక పోయాను. ఎన్నో ఏళ్ల తర్వాత కలిశావన్న ఆనందం ఆవిరి అయిపోయింది. మా ఉద్యోగాలింతే. నిత్యం టెన్షన్, టెన్షన్. అలా కూర్చో. కాఫీ చేసి తెస్తాను. మా ఆవిడ, పిల్లలు ఊరెళ్ళారు’ అంటూ భాస్కర్ కి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా కిచెన్లోకి నడిచాడు. నవ్వుకుంటూ సోఫాలో కూలబడి.. టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ అందుకున్నాడు భాస్కర్. కాఫీ చేసుకొచ్చిన ఆత్మారం కాఫీ కప్పు భాస్కర్కు అందిస్తూ ‘ఇప్పుడు చెప్పు. ఎక్కడుంటున్నావ్? ఏమి చేస్తున్నావ్?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘రామచంద్రపురంలోనే సెటిల్ అయ్యాను. ఓ స్కూల్లో పని చేశాను చాలాకాలం. ప్రజాసేవ చేయాలని బుద్ధి పుట్టడంతో ఉద్యోగం వదిలేశాను. బతకడానికి ఇబ్బంది లేదు. మా నాన్న నాకోసం బాగానే ఆస్తిని వదిలి పెట్టాడు. టీచర్గా నా అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాను. ఈ ఏరియాలో ‘ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు, హాస్టళ్ళు చాలా బాగా కట్టినా, ఫుడ్తో సహా అన్నిరకాల సౌకర్యాలు చక్కగా అమర్చినా, విద్యాబోధన కుంటు పడిందని తెలిసింది. పర్మినెంట్ టీచింగ్ స్టాఫ్ పాతిక శాతం కూడాలేరని, పాఠాలు చెప్పడానికి మంచి టీచర్లు కరువయ్యారనీ చెవిన పడింది. అందుకే నా అంతట నేను ఫ్రీగా పాఠాలు చెప్పడానికి ముందుకొచ్చాను. ఆ హాస్టల్లోనే వసతి, భోజనం. అలా గడిచిపోతుంది’ చెప్పాడు భాస్కర్ నవ్వుతూ. ‘వెరీ గుడ్ మంచి పనిచేస్తున్నావు. మరి నువ్వు ఊళ్లు పట్టుకు తిరుగుతుంటే నీ భార్య, పిల్లల సంగతి?’ అడిగాడు ఆత్మారాం. ‘ఆ జంజాటం పెట్టుకోలేదు. సమాజసేవ చేయాలంటే ఆ బంధాలు అడ్డం కదా? అందుకే పెళ్ళే చేసుకోలేదు’ అంటూ చిన్నగా నవ్వాడు భాస్కర్. ‘ఎంత ఎదిగిపోయావు? హ్యాపీగా ఉంది.. నీ ఆదర్శ జీవితం గురించి వింటుంటే. ఈ రోజే నీ మకాం ఇక్కడికి మార్చేయ్. మా వాళ్ళు నెలరోజుల దాకా రారు. ఆ తర్వాత సంగతి తర్వాత’ చెప్పాడు ఆత్మారాం. ‘వద్దొద్దు. అక్కడ టీచర్లు పడుకునే చోట నాకో మంచం ఇచ్చారు. భోజనం హాస్టల్లో తినేస్తున్నాను. బాగానే ఉంది’ అంటూ అడ్డు చెప్పాడు భాస్కర్. కానీ ఆత్మారాం ఊరుకోకుండా పట్టు పట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు అతనికి. సాయంత్రం భాస్కర్ తన సామాను పట్టుకొని ఆత్మారాం ఇంటికొచ్చేశాడు. అప్పటి క్లాస్మేట్స్ను, టీచర్లను తలుచుకొని.. ఆనాటి ముచ్చట్లతో ఆ సాయంకాలం కాలక్షేపం చేశారు. మర్నాడు ఉదయం భాస్కర్.. ఆత్మారాంకన్నా ముందే లేచి ఉప్మా, కాఫీ సిద్ధం చేసి.. ఆత్మారాంను నిద్రలేపాడు. ఆ ఏర్పాట్లకు ఆశ్చర్యపోతూ ‘ఎందుకురా శ్రమ పడడం? మా పనిమనిషి లక్ష్మి వచ్చి చేస్తుంది కదా?’ అంటూ మందలించాడు ఆత్మారాం . ‘అమ్మనాయనోయ్.. నిన్న రాత్రి తిన్నానుగా ఆమె చేతి వంట. నా వల్ల కాదు. ఆ వంటేదో నేనే చేస్తాను. అంట్లు తోమి, ఇల్లు శుభ్రం చేయమను చాలు. ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా. కాఫీ తాగుదాం. టిఫిన్ చేయడం అయిపోయాక నీకు లంచ్ కూడా చేసేస్తాను. నేను హాస్టల్లో తింటానులే. రాత్రికి ఇద్దరికీ చపాతీలు చేస్తాను. నువ్వేమీ అనొద్దు. నేను చెప్పిందే ఫైనల్’ అంటూ స్నేహితుడిని మాట్లాడనివ్వలేదు. చేసేదేం లేక నవ్వుతూ భుజాలు ఎగరేశాడు ఆత్మారాం. ∙∙ ‘ఈపది రోజులూ మాట్లాడుకుంటున్నా జానీ గురించి గానీ, జాహ్నవి గురించి గానీ తలుచుకోలేదు. ఇంతకూ జానీ ఎలా వున్నాడురా? ఎప్పుడయినా కలిశావా?’ అని అడిగాడు ఆత్మారాం. పెదవి విరిచాడు భాస్కర్. ‘అందరూ చెల్లాచెదురై పోయారు. జానీగాడు జాహ్నవికి లవ్ లెటర్ రాసి సస్పెండ్ అయిపోయిన సంగతి నీకు గుర్తుందా?’ అడిగాడు భాస్కర్. గుర్తుంది అన్నట్లు తలూపి ‘జానీగాడు చాలా మంచివాడురా. వాడా పనిచేశాడంటే నమ్మకం కలగడం లేదు’ అన్నాడు. ‘వాడే ఒప్పుకున్నాడు. ఇంకా నీకు అనుమానం ఏమిటి?’ అన్నాడు విస్తుపోతూ. సమాధానం చెప్పకుండా తల పంకిస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు ఆత్మారాం. ‘జానీ ప్రస్తావన రాగానే, వీడేమిటి ఇలా అయిపోయాడు? అనుకుంటూ అలవాటు ప్రకారం ఎడమ చెవిని రుద్దుకోవడం మొదలుపెట్టాడు. ∙∙ ‘ఇదేమిటి నన్ను అరెస్ట్ చేశావు? నీకేమయినా పిచ్చి ఎక్కిందా?’ అంటూ గావుకేకలు పెడుతున్న ఆదివిష్ణు ఉరఫ్ భాస్కర్ని చూసి గట్టిగా నవ్వాడు ఆత్మారాం. ‘అన్నన్నా.. ఎంత టోకరా వేశావురా? భాస్కర్గాడిలా కాలు ఈడ్చడం, చెవిరుద్దు కోవడం చేసి ఈ పోలీసోడినే బుట్టలో వేసేశావే? ఎంత తెలివైనోడివిరా? నువ్వు కూడా మాతో చదువుకున్నా ఆ రోజుల్లో నిన్ను పట్టించుకునే వాళ్ళం కాదు మేము. అందుకే నిన్ను నేను గుర్తుపట్టలేనని, ఈ సాహసం చేశావు. నీ వల్ల ఎంత నష్టపోయానురా? మీ వాడు బ్యాంకులోంచి సులువుగా తప్పించుకునేలా చేశావు. మా ఇంట్లోనూ, తోటలోనూ సీక్రెట్ మైక్రోఫోన్లు అమర్చి, నా ఫోన్ సంభాషణలు వింటూ, మా ప్లాన్లు ముందే తెలుసుకున్నావు. నీ వల్ల మా చేతికి దొరకబోయిన మీ వాళ్ళు తప్పించుకు పారిపోయారు. మా ఇన్ఫార్మర్ ఎవరో తెలిసిపోవడంతో, అతన్ని దారుణంగా హత్యచేసేశారు మీ వాళ్ళు. ముందు నాకు నీమీద ఏ అనుమానమూ రాలేదు. వచ్చాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నీ బండారం బట్టబయలు చేసేదాకా నిద్రపోలేదు. రోజూ నువ్వు వాడుతున్న మాత్రల్లో థైరాయిడ్ మాత్రలు లేకపోవడంతో నా అనుమానం కొట్టిపారేసేది కాదని తెలిసిపోయింది. దాదాపు నలభై ఏళ్లుగా ఈడుస్తూ నడుస్తున్న వాడి కాలు సన్నగా ఉండి, ఫ్లెష్ తక్కువగా ఉండాలి. కానీ నీ కాళ్ళు రెండూ మామూలుగా ఉండేసరికి, నువ్వు నాటకం ఆడుతున్నావని అర్థమైపోయింది. నువ్వు తోటలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నపుడు, మా వాడి చేత ఒక పామును లోపలికి పంపాను. పాముని చూసి నువ్వు గంతులేయడం చూసిన వాడు ఎవడైనా నువ్వు కుంటి వాడివి కాదని కనిపెట్టేస్తాడు. అందుకే ఆ సమయంలో నేను ఇంట్లో లేనని నిన్ను నమ్మించాను. ఫైనల్ పరీక్షలో కూడా నువ్వు దొరికిపోయావు. జాహ్నవికి లవ్ లెటర్ రాసింది జానీ కాదు. వాడి బావ చలపతి. జానీ తల్లితండ్రులు చనిపోతే చలపతి తండ్రే వాడిని పెంచాడు. అందుచేత వాడికి చలపతి అంటే ప్రాణం. అందుకే ఆ నింద తన మీద వేసుకున్నాడు. ఆ నిజం నాకూ, భాస్కర్కి కూడా తెలుసు. నీకు ఆ విషయం తెలియకపోవడంతో తేలికగా దొరికిపోయావు’ అంటూ గట్టిగా నవ్వేసరికి సిగ్గుతో తలదించుకున్నాడు ఆదివిష్ణు. -కొయిలాడ రామ్మోహన్రావు -
పురిట్లోనే కన్నుమూసిన తల్లి, మళ్లీ పెళ్లి చేసుకున్న తండ్రి
మనవరాలు వసంత అన్న మాటకి నారాయణమ్మ మారు పలకలేకపోయింది. కాలుతున్న బొగ్గుల మీద నీళ్లు చల్లినట్లయింది. ‘‘చెప్పాను కదా. అతనికి వీలైనప్పుడు వస్తాడు. అట్టా గిలగిల్లాడతావేం?’’ అన్నది. ఈసడింపు! రక్త నమూనా తీసుకువెళ్లే మనిషి వచ్చి తీసుకుపోవాలి. అసలు ఐదుగంటలకి కాఫీ తాగే అలవాటు. దాన్ని ఆరు చేసింది. ‘‘నీకోసం నేను తెల్లవారుజామునే లేవలేను’’ అని నిక్కచ్చిగా చెప్పేసింది. గత్యంతరం లేక ఆ గంటసేపూ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, లేకపోతే రమణ మహర్షిని చదువుకోవటం–అలవాటు చేసుకున్నది. ఇదొక సాధన! ‘‘అతను ఆరింటికే వచ్చేవాడుగా?’’ తనను తానే ప్రశ్నించుకున్నట్లు పైకి అన్నది. హాల్లో దినపత్రిక చదువుకుంటున్న సుధాకర్ విన్నాడు. ‘‘ ఆ ల్యాబ్ని వసంత మార్చింది అమ్మమ్మగారూ. వాళ్లు బాగా రేట్లు పెంచారట’’ అన్నాడు. ‘‘అహా’’ అన్నది. మనసులో మాత్రం– నా పైసలేగా! అయినా దీనికి కాపీనం ఎక్కువైంది–అనుకున్నది. – ఆ కుర్రాడు వచ్చాడు. ‘వీన్ దొరకటం లేదండీ’ అని రెండు మూడు చోట్ల నొక్కాడు, పొడిచాడు, కుట్టాడు. చివరికి అయింది. ‘అందరూ రక్తం ఎరుపంటారు. కానీ, తన రక్తమేమిటో నల్లగా వుంది! సుగరూ, బీపీ, ఆస్తమా కలిస్తే ఇలా అవుతుందేమో!’ నవ్వుకుంది. అతను వెళ్లిపోయాడు. ‘‘వసంతా, కాఫీ ఇస్తావామ్మా’’ అడిగింది. ‘‘అదేగా చేస్తున్న ఉద్యోగం’’ అంటూ వచ్చింది. కప్పూ, గ్లాసూ టీపాయ్ మీద ఉంచి విసురుగా వెనక్కి తిరిగి వెళిపోయింది. వెళ్తూ వెళ్తూ ‘‘ నీ డ్యూటీ మీదే ఉంటాను తల్లీ. పదే పదే అరవక్కర్లేదు’’ అని ఓ గుండుసూది గుచ్చింది! కాఫీ అయింది. ‘డ్యూటీ..!’ నవ్వొచ్చింది నారాయణమ్మకి. ‘నేను ఎన్నెన్ని డ్యూటీలు చేస్తే ఇంతదయింది ఈ పిల్ల?’ అనిపించింది. చేత్తో కణతలు గట్టిగా నొక్కుకుంది. కళ్ల ముందు చిత్రవర్ణ దృశ్యాలు.. శేఖరంకి ఐఐటీలో బీటెక్ కాగానే, అమెరికా యూనివర్సిటీ ఆహ్వానం. కొడుకు ప్రతిభకూ, విజయానికీ పొంగిపోయారు తానూ, భర్త మౌళీ. ఆయనైతే–‘నేను ప్రైవేటు గుమాస్తానే గానీ, నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్’ అని ఛాతీ పెంచుకున్నాడు. ఒకటే సంబరం. శేఖరం వెళ్లిపోయాడు. నెలలోపలే–ఒకరోజు! ప్రకాశంతో కలసి ఇంటికొచ్చింది కూతురు–వరలక్ష్మి! తనకూ మౌళికీ చలిపిడుగులాంటి సంభవం అది. మౌళి తట్టుకోలేకపోయాడు. కులాంతరమని కొంత ఆవేదనా, తనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటమేమిటని ఆక్రోశం, ఉద్రేకం కొంతా–ఆయన గుండె కొట్టుకోవటాన్ని ఆపేసినై! శేఖరం రాలేని పరిస్థితి. అన్ని దుఃఖాల్నీ గరళంగా భరించింది తాను. టీచర్ ఉద్యోగ వ్యాపకం, సాహిత్యం చదువు–తనకు ఊరట. నడకని సాగించింది. ఏడాది గడిచిందో లేదో– ఓ అర్ధరాత్రి– ప్రకాశం ఫోను. అర్జంటుగా ఫలానా హాస్పిటల్కి రమ్మని. పరిగెత్తుకుపోయింది. బిడ్డను కని చావుబతుకుల్లో ఉన్నది వరలక్ష్మి. కడచూపులోనే–పశ్చాత్తాపమూ, బిడ్డ ఆలనాపాలనా నీ బాధ్యత అనే వేడికోలూ– కన్నుమూసింది. పసికందుని తనకప్పజెప్పి పోయి, మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ప్రకాశం. ఆ పసికందే– ఈ వసంత! తన దినచర్యంతా నిలువీతా, మునుగీతగానే అయింది. పనిమనిషి వెంకమ్మే ఇంట్లో వుండి తనకు పెద్దదిక్కయింది. అబ్బనాకారి వసంతతో ఎన్ని అవస్థలు పడింది తాను? ఎప్పుడూ ఏదో ఒక రోగమూ, రొష్టూ ఈ పిల్లకి. విజయవాడ దాటిపోకుండా, అధికారుల్ని వేడుకుని ట్రాన్స్ఫర్ల గండాన్ని తప్పించుకుంటూ ఉండేది. నాళ్లూ ఏళ్లూ గడచిపోతున్నై. శేఖరం అమెరికా వాసి అయిపోయాడు. నెలకోసారి ఫోన్లో పరామర్శ. అడపాదడపా–అడక్కుండానే డబ్బు పంపేవాడు. మధ్యలో ఒకసారి ఆ ‘వార్త’ని అందించాడు. తన కొల్లీగ్ కన్నడం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు! వసంతదంతా వానాకాలపు చదువే. బుర్రకి జ్ఞానం ఎక్కలేదుగానీ, శరీరానికి వయసొచ్చింది. తనకు తెలిసిన మాష్టారి కొడుకు– సుధాకర్ దొరికాడు. ఇన్సూరెన్స్ ఏజంటు. పెళ్లి చేసింది. కొందరు ఆడపిల్లలు పెళ్లికాగానే ఆరిందలవుతారు. రెండేళ్లు అత్తగారింట్లో ఉండి, మూడో ఏట అక్కడ వీరంగం చేసి ఇక్కడికొచ్చేసింది. సుధాకర్నీ తెచ్చింది. మూడుసార్లు గర్భస్రావాలు ఆమె దూకుడుకి మరిన్ని గంతులు నేర్పాయి. నోరు పెద్దదయింది. జీతం రాగానే, తన చేతికవివ్వాలి. ‘నీ ఖర్చులకు ఉంచుకో’ అని తన ‘వితరణ’ని అందుకోవాలి. సుధాకరమేమో ఒక సాధుజీవి. మితభాషి. తనపట్ల మాటామన్ననా వినయంగా ఉంటాడు. ‘అమ్మమ్మగారూ, అమ్మమ్మ గారూ’ అని నిండుగా, నిష్కల్మషంగా పిలుస్తాడు. –రిటైరయిన తర్వాత పెన్షన్ వ్యవహారాలన్నీ సుధాకరే చూశాడు. అంతా అయిన తర్వాత, ఏటీఎం కార్డు తెప్పించి, తన దగ్గర పెట్టుకుంది వసంత. శేఖరం పంపించే డబ్బు విషయాలూ చెప్పదు. తాను అడిగినా, ‘‘నీ సొమ్మేమీ తినన్లే తల్లీ’’ అని ఆ ప్రసక్తిని పక్కకి తోసేస్తుంది. –అమెరికా నుంచీ ఫోన్! ఆలోచన ఆపి ప్రస్తుతంలో కొచ్చింది నారాయణమ్మ. తల్లి ఆరోగ్యం గురించి వివరాలన్నీ అడిగాడు శేఖరం. ఆ తర్వాత అతని భార్య సుధ పలకరించింది. అప్పుడు మనవరాలు ప్రమీల గలగల మొదలైంది. నానమ్మతో తుళ్లుతూ, నవ్వుతూ మాట్లాడింది. అమెరికా ఉద్యోగాల గురించి కబుర్లు చెప్పింది. అంతా అయిన తర్వాత ‘‘నువ్ దిగులుపడకు నానమ్మా. ధైర్యంగా ఉంటే, ఏ అనారోగ్యమూ మనల్నేంచెయ్యలేదు’’ అని భరోసా పలుకు పలికింది. ముగ్గురూ–వసంతతో కూడా చనువుగానే మాట్లాడారు. సుధాకర్నీ పరామర్శించారు. చివర్లో–‘‘అటెండెంట్ వస్తున్నదా?’’ అని వసంతని అడిగింది ప్రమీల. ‘‘ఏం రావటమో ఏమో. ఒకరోజు వస్తే రెండు రోజులు సెలవంటుంది’’ అని ‘‘దూరంగా వున్న వాళ్లకేం తెలుస్తయ్లే–ఈ అవస్థలన్నీ’’ అని ఫోన్ కట్చేసింది వసంత. నారాయణమ్మకి బాధ కలిగింది. అటు తిరిగీ, ఇటు తిరిగీ ఏ ప్రస్తావననైనా–చివరికి తనకు సేవ చేయటం ఎంత కష్టంగా ఉన్నదో చెప్పి– దాన్ని కట్టె విరిచి పొయ్యిలో పెట్టటం పద్ధతిలోనే ముగిస్తుంది వసంత–అనిపించింది. మళ్లీ తలపులు ముసిరినై. అంతా తన దురదృష్టం. తన దినచర్య అంతా రోజూలాగానే అంతా సవ్యంగా జరుగుతోంది–ఆ రోజు కూడా. స్నానం, ధ్యానం, స్తోత్రపఠనం.. అయి, బయట తులసికోటలో నీళ్లు పోద్దామని వెళుతుంటే–కాలు జారి పడింది. తుంటి దగ్గర విరిగింది. ఆస్పత్రిలో నెల.. ఆ తర్వాత మంచం పాలయింది. లేవలేదు. కూర్చోలేదు. ఉన్నదుండగా ఉపాకర్మ అన్నట్లు, అది జరిగిన నాలుగు నెలలకే పక్షవాతం! అమెరికా నుంచీ అన్ని ఏర్పాట్లూ శేఖరమే చేశాడు, నెట్ ద్వారా. మాణిక్కెంనీ సహాయకురాలిగా తానే కుదిర్చాడు. వైద్యం విషయమూ, డాక్టర్తో సంప్రదింపులు– ప్రమీల చొరవగా, జాగ్రత్తగా చూస్తున్నది. పరోక్షంగా ఎన్ని జరిపినా, వసంత అన్నట్టు–ప్రత్యక్షంగా ఈ ‘సేవ’లు తప్పవు కదా! పది గంటలవుతుంటే గదిలోకొచ్చింది వసంత. అమ్మమ్మకి చీరె మార్చి, డైపర్ మార్చి ‘‘ఇవ్వాళ్టికి ఈ పక్క నిట్టా ఉండనీ. రేపా మాణిక్కెం వస్తే మార్పిస్తా. నిన్ను నేను లేపలేను’’ అని వెళ్లింది. ఆ తర్వాత అర్ధగంటకి టిఫెన్ పెట్టింది. కాఫీ ఇచ్చింది. ఎదురుగా కుర్చీలో కూచుంది. వసంతకి మనసులో చాలా ఆలోచనలు ఉన్నై. పేరుకి ఇన్సూరెన్స్ ఏజెంటేగానీ, సుధాకర్కి రాబడి తక్కువ. అమ్మమ్మ పెన్షన్లో మిగిలేవీ, శేఖరం మామయ్య పంపేవీ జాగ్రత్త చేసుకుంటూ ‘ముందుచూపు’తో వ్యవహరిస్తోంది. అమ్మమ్మ ఇల్లు ఆమె స్వార్జితం. దీన్ని తనపేర రాయమని కన్నీళ్లతో చాలాసార్లు అడిగింది. ఆమె నవ్వేసి ఊరుకుంటున్నది. ఇవ్వాళ ఆ సంగతి తేల్చుకోవాలనే, ఇప్పుడు స్థిమితంగా ఇలా వచ్చి కూచుంది. ‘‘ఎంతగా పైసలిచ్చి మచ్చిక చేసుకున్నా–ఈ పని మనుషులింతే’’ అంటూ మొదలెట్టింది సంభాషణని. ‘‘ఏవో అవస్థలుంటై వాళ్లకీనూ’’ ‘‘అవుననుకో. ఇక్కడ నీ పరిస్థితి చూడు. కదల్లేవు. అన్నీ మంచంలో నాయె. ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదూ. నన్ను కష్టపెడుతున్నాననే బాధా వుంటుంది కదా నీకు. అదో మనస్తాపం..’’ అమ్మమ్మ మీద ‘దయ’ మెల్లగా ప్రవహిస్తోంది! ‘‘ఏదో నేనుండబట్టి రోజులు గడుస్తున్నై’’ ‘‘అవునమ్మా.. నేనూ అదే అనుకుంటూ ఉండేది’’ ‘‘అవునూ.. ఇంటి సంగతి చెప్పనేలేదు నువ్. ఆ కాగితాలూ గట్రా చాలా తతంగముంటుంది కదా.. ఈయనా కనుక్కోమంటున్నారు..’’ పాపం, అమాయకుడు. అతనికిట్టాంటి ఆలోచనా ఉండదు; తొందరా ఉండదు; ఆరాటమూ ఉండదు... అనుకున్నది నారాయణమ్మ. ‘‘చూద్దాం కానీ..’’ అన్నది. ప్రసన్నంగా వసంతని చూసింది. వసంతకి ఆమె మాట ప్రసన్నంగా అనిపించలేదు! ‘‘నీ మనసులో మాట చెబితే మా ఏడుపేదో మేం ఏడ్చుకుంటాం కదా’’ అన్నది ఠక్కున. కంఠస్వరం వికటంగానే రొద చేసింది. క్షణంలో సగం సేపు ఆగి బయటపడింది–నారాయణమ్మ, ‘‘ఎప్పటికైనా ఇల్లు మాత్రం ప్రమీలకేనే’’ అని ‘‘నీకిచ్చేది ఎటూ నీకిస్తాను. అయినా ఎన్నడన్నా నిన్ను నా పెన్షన్ డబ్బు గురించి గానీ, మావయ్య పంపే డబ్బు గురించి గానీ అడిగానుటే?’’ అన్నది. నివ్వెరపోయింది వసంత. మొహం మాడ్చుకుంది. నేల చూపులు చూస్తూ కుర్చీని కిరకిరలాడించింది. ‘ఈ ముసల్ది ఘటికురాలు. కాలాంతకపు మనిషి’ అనుకుంది. ‘ఈవిడగారి ఉచ్చలూ పెంటలకయితే నేను కావాలి. ఆస్తి కట్టబెట్టటానికైతే అదెవరో కావాలి. ప్రమీల, ప్రమీల అని ప్రేమ కారిపోతోంది, కలవరిస్తోంది’ అని తిట్టుకుంది. మనసంతా వికలమైంది. ఠక్కున లేచి ‘‘సరే.. సరే.. కానీ.. నీ ఇష్టం’’ అని వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నై.. ఆమె ఆగ్రహం మనసులో చాలా వికృతపు ఆలోచనల్ని రేపింది. వాటి ప్రభావం బయటి ప్రవర్తనపై పడింది. మాటల్లో పనుల్లో ఎంతో మార్పునీ తెచ్చింది. ఏది అడిగినా– ‘నేనీ చావు చావలేను’ అని విసిరికొట్టటం, ఉదయపు పనుల్లో ‘ఎన్నాళ్లు పడాలో ఈ యాతన.. కంచి గరుడసేవ’ అని వేష్ట పడటం, పాటికి పదిసార్లు ముక్కు చీదుకోవటం, పళ్లు కొరుక్కోవటం... ఒకసారి శేఖరం ఫోన్ చేస్తే, నిష్ఠూరంగా ‘‘మావయ్యా–నువ్వేం డబ్బు పంపుతున్నావో మీ అమ్మకీ చెప్పు’’ అన్నది. ప్రమీల పరామర్శిస్తే–‘‘దూరంగా కూచుని ఎంతైనా ప్రేమని కురిపించొచ్చు. దగ్గర నిలబడి చేస్తేనే తెలిసొచ్చేది’’ అని ఒక విసురు విసిరింది. నానమ్మకి విడిగా ఫోన్ చేసింది ప్రమీల. ‘‘ఏవిటి నానమ్మా. వసంత వదిన బాగా ఏడుస్తోంది, ఏం జరిగింది?’’ అని అడిగింది. నారాయణమ్మ ఏమీ చెప్పకుండా ‘‘నన్నెక్కడన్నా ‘కేర్హోమ్’లో పడెయ్యవే–ప్రమీ– నీకు పుణ్యముంటుంది’’ అన్నది గద్గదికంగా. నానమ్మని చాలాసేపు ఊరడించి అన్నది ప్రమీల. ‘‘ప్రతి సమస్యకీ ఎక్కడో ఏదో పరిష్కారం ఉంటుంది నానమ్మా. నువ్వేం కలతపడకు. అంతా సర్దుకుంటుంది’’ అని ఉపశమింపచేసింది. వేసవికాలపు ఎండ చిరచిరలాడిస్తోంది. ఉదయం ఎనిమిదైంది. నారాయణమ్మ మంచంలో ఆపసోపాలు పడుతున్నది. హఠాత్తుగా ఇంటికొచ్చిన ప్రమీలని చూసి–దాదాపుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది వసంతకు. ప్రమీల పక్కన ప్రశాంత్. ఆమె భర్త! పరిచయాలు అయినై. వారిద్దరినీ చూసి చాలా తత్తరపడింది వసంత. గదిలోకి వెళ్లి నానమ్మని పలకరించింది ప్రమీల. కలో, నిజమో తెలీని సంభ్రమంలో– కన్నీళ్లొచ్చాయి నారాయణమ్మకు. మంచం పట్టెమీద కూచుని, ఆమె పైకి వంగి రెప్పలతడిని తుడిచింది ప్రమీల. భర్తని పిలిచి చూపింది. ‘‘ఈ వూరి వాళ్లే. మనకు దూరపు చుట్టరికం కూడా ఉన్నదిట. మేమిద్దరం ఒకే కంపెనీ’’ కాఫీలు వచ్చినై. వసంతకి కంగారుగా ఉంది. అకాలంలో జడివాన!! మాటలు సాగినై. ‘‘సవాలక్ష పనులు. ముందు వెనుకలు చూసుకుని చెయ్యాలి కదా. మాణిక్కెం రాలేదు. అందుకనే ఈవిడ పనికాలేదివ్వాళ’’ అంటూ గ్లాసులు తీసుకుని వెళ్లింది వసంత. ప్రశాంత్ హాల్లోకి నడిచాడు. ‘‘ఏం ఫర్వాలేదు. నేవచ్చానుగా..’’ అంటూ నిలబడి, పైట సర్దుకుని నడుముకు చెక్కుంది. సత్యభామ జడలాంటి జుట్టు సవరించుకుని ముడివేసుకుంది ప్రమీల. మనవరాలిని రెప్పలార్చకుండా చూసుకుంది నారాయణమ్మ. ‘పిల్ల బాగా ఎత్తరి. అమెరికాలో పుట్టినా జుట్టు కత్తిరించుకోలేదు. పైగా చక్కగా జడల్లుకుంది. కట్టూబొట్టూ, మాటతీరూ–అన్నీ మన పద్ధతుల్లో ఉన్నై. బంగారు బొమ్మ! ఆ మొగుడు పాత షావుకారు సినిమాలో రామారావులా ఉన్నాడు’ అనుకుని మురిసింది. అప్పటికప్పుడే నానమ్మని మంచంలో పైకి జరిపి, నిదానంగా కూచోబెట్టింది ప్రమీల. ‘‘ఇదేంటీ–నీకెందుకీ పన్లు? నే జూసుకుంటానుండు’’ అంటూ తత్తరలాడుతూ వచ్చింది వసంత. అనూహ్యంగా ప్రమీల రావటంతోనే అట్టిట్టవుతుంటే– ఆమె ఇలా సరాసరి ముసలావిడ పనుల్లోకీ దిగేసరికీ– కాళ్లూ చేతులూ వణుకుతున్నట్టయింది వసంతకు. ‘‘డోన్ట్వర్రీ వదినా! నేచూస్తాగా. మన పనులు మనం చేసుకోకపోతే ఎట్టా’’ అని ‘‘ ఈ పని నువ్ చూసుకో’’ అని పంపించిందామెను. గది తలుపు వేసి వెళ్లింది వసంత. నానమ్మకి ముందు డైపర్ మార్చింది ప్రమీల. జుట్టు చక్కజేసి, ఉన్న నాలుగు పోచల్నీ కలిపి, వేలిముడి వేసి, దానికో రబ్బరు బేండ్ వేసింది. ఒళ్లంతా తడిబట్టతో తుడిచి శుభ్రం చేసేసింది. ముసలామెని బెడ్లోనే జరిపి, పక్కకి వత్తిగిల చేసి, బెడ్షీట్నీ మార్చేసింది! వసంత వచ్చింది. చూసింది. అంతా పొందిగ్గా ఉంది. ‘ఇదేమిటీ–అమెరికా పిల్ల ఈ పనులన్నిటినీ ఇంత చకచకా, ఇంత తేలిగ్గా, క్షణాల్లో చేసేయగలిగింది’ అనుకుంటూ ప్రమీలని తేరిపారజూస్తూ నిలబడింది. ప్రమీల వెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చి కూచుంది. ‘‘ఇప్పుడు చెప్పు విశేషాలు’’ అన్నది. వసంత వైపు చూస్తూ నెనరుగా నవ్వింది. అంతా అర్థమవుతూ ఏమీ అర్థం కానట్టు ఉన్నది వసంతకు. తన మామూలు ఘోషనే వినిపించింది. గొంతులో బరువూ, నిరాశా! ప్రశాంత్ని ‘‘మీరు రండి’’ అని పిల్చింది ప్రమీల. అతను వచ్చి కూచున్నాడు. ‘చక్కగా మొగుణ్ణి ‘మీరు’ అని పిలుస్తోంది. సంప్రదాయం తెలుసుకుంది’ అనుకుని లోలోపల మురిసిపోయింది నారాయణమ్మ. అతనితో పాత చుట్టరికాల్ని తిరగేసింది. వసంతకైతే ఇదంతా ఏమిటో, అక్కడేమవుతున్నదో అర్థం కాలేదు. ఉన్నట్టుండి, ‘‘నేను పాటలు బాగా పాడతానంటారు అమ్మా నాన్నా. పాడనా?’’ అని అడిగింది ప్రమీల– నానమ్మతో. ‘‘బలే.. బలే.. పాడు.. పాడు..’’ అన్నదామె చిన్న పిల్లలా ఉత్సాహంగా, సంబరపడుతూ. ముందుగా ‘పాటపాడుమా కృష్ణా..’ పాడింది. ‘‘ఎంత మధురంగా పాడావే ప్రమీ. కమ్మెచ్చున తీగె లాగినట్టుంది స్వరం’’ అని మెచ్చుకుంది నారాయణమ్మ. సుధాకరయితే చప్పట్లు కొట్టి ‘‘ఫైన్ ఫైన్’’ అన్నాడు. వసంతకీ ప్రమీల గొంతు నచ్చింది. చెప్పింది. ఆ తర్వాత–‘మరుగేలరా ఓ రాఘవా’ పాడింది. ఈసారి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ‘యూ ఆర్ గ్రేట్’ అన్నాడు ప్రశాంత్, భార్య వైపు కొంటెగా చూస్తూ! ‘ఐనో.. ఐ నో’ అని సరదాగా అన్నది. –వంటపనిలోనూ చొరవగా చేయి కలిపింది ప్రమీల. ఆమెని చూస్తూ బెరుకుబెరుకుగా మాట్లాడుతూ చాలా మానసిక సంఘర్షణని అనుభవిస్తోంది వసంత. గాలీ, పొగా కలసిన రసాయనిక క్రియ ఏదో లోపల్లోపల జరుగుతున్న భావనతో ఉద్విగ్నమైంది మనస్సు. ప్రమీలా ప్రశాంత్– పదిహేను రోజులు విజయవాడలోనే ఉన్నారు. అటు అత్తవారింట్లోనూ, ఇటు నానమ్మతోనూ చాలా సంతోషంగా గడిపింది ప్రమీల. ఆవేళ– అందరూ నారాయణమ్మ గదిలో ఉన్నారు. ‘‘నేనూ, మా వారూ కూడా వచ్చే వారం హైదరాబాద్లో కొత్త ఉద్యోగాల్లో చేరాలి. ఇక్కడ ఒక కంపెనీలోనే దొరికాయి’’ చెప్పింది ప్రమీల. ‘‘అదేమిటీ–అమెరికా వెళ్లరా?’’ ఆశ్చర్యంతో అడిగింది వసంత. ‘‘వెళ్లటం లేదు. మేము ఇక్కడ స్థిరపడాలనే అన్ని ఏర్పాట్లూ చేసుకుని వచ్చాం. నిజానికి హైదరాబాద్లో ఒక విల్లా కొనుక్కున్నాం. బుధవారమే మా ప్రయాణం–నానమ్మతో సహా’’ అన్నది ప్రమీల. అయోమయంగా దిక్కులు చూసింది వసంత. ఆమెకిది మరో అనూహ్య పరిణామం! బుధవారం. మధ్యాహ్నం– వసంతనీ, సుధాకర్నీ పిలిచింది నారాయణమ్మ. తన చేతిలోని కాగితాలు వసంతకిస్తూ– ‘ఇది నా వీలునామా. నా తర్వాత ఇల్లు మీదేనే. ప్రమీల ఇట్టా రాయమన్నది’ అని చెప్పింది. వసంతకి నోటమాట రాలేదు. వాటిని తీసుకుని, మెరుస్తున్న కళ్లతో ప్రమీలని చూసింది. అంబులెన్స్ వచ్చింది. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు. ప్రమీలకు పసుపూకుంకుమా, పండూ తాంబూలం, చీరే జాకెట్ ఇస్తుంటే– కళ్లనీళ్లు తిరిగినై వసంతకి. ప్రమీల మృదువుగా ఆమె భుజం తట్టి, ‘నానమ్మకి నువ్ చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువే చేశావ్. నువ్వంటే నాకిష్టం’ అని ఆర్ద్రంగా దగ్గరకి తీసుకుంది. వెక్కుతూ గుండె బరువుని తేలిక చేసుకుంది వసంత! అందరూ ముసలామె కాళ్లకి నమస్కారం చేశారు. వాళ్లని ‘దీర్ఘాయురస్తు’ అని దీవించింది. వాళ్లని మార్చిమార్చి చూస్తూ సంతృప్తిగా నవ్వింది నారాయణమ్మ. మనుషుల్నీ, మనసుల్నీ ఆహ్లాదంగా స్పృశిస్తూ చల్లని తెమ్మెర వీచింది!! - విహారి -
కవితల పండుగ: ఫేమస్ కవితలు చూసేద్దామా!
‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా కవితాభిమానులకు తీరే దాహం కాదది. కవిత్వం ఒక వాక్కళ. బహుశ వాక్కు పుట్టినప్పుడే కవిత్వమూ పుట్టి ఉంటుంది. కవిత్వం ఒక చిత్కళ. కవిత్వంలేని భాష లేదు, కవిత్వానికి అందని భావమూ లేదు. కవిత్వం గురించి సవివరంగా చెప్పుకోవాలంటే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. కవిత్వాన్ని సంక్షిప్తంగా చవిచూపడానికి ఒక్క పదునైన వాక్యమైనా సరిపోతుంది. కవిత్వం గురించి ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, నేడు (మార్చి 21న) ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వానికి గల సమస్త పార్శవాలనూ స్పృశించడం సాధ్యమయ్యే పనికాదు గాని, ఈ సందర్భంగా ఆధునిక తెలుగు కవుల చమత్కారాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యులలో ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కర్త అయిన కందుకూరి తన కాలంలోని సాంఘిక దురాచారాలను ఖండించడానికి తన కలానికి పదునుపెట్టారు. సమాజంలోని పెద్దమనుషుల దుర్మార్గాలపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. కందుకూరి రాసిన ప్రహసనాలు ఆయన చమత్కార ధోరణికి అద్దం పడతాయి. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే ప్రహసనప్రాయమైన నవల రాశారు. అందులో ఆడుమళయాళాన్ని గురించి వర్ణనలో ఆయన హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’లోని ‘ఆడుమళయాళం’ పూర్తిగా మహిళల రాజ్యం. అక్కడివారు ‘పత్నీవ్రత ధర్మబోధిని’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో మచ్చుకొకటి... ‘పురుషుండు గార్దభమునున్ స్థిరమగు దండనము లేక చెడిపోదురిలన్ గరుణ దలంపక నెలకొక పరిౖయెనం గొట్టవలయు పత్ని పురుషునన్’ ఇదంతా ఇప్పటితరం పాఠకులకు ‘జంబలకిడి పంబ’ సినిమాను తలపిస్తుంది. కందుకూరి ప్రహసనాల్లో ‘కలిపురుష శనైశ్చరవిలాసం’ ఒకటి. అందులో మద్యానికి ఎంగిలి లేదంటూ వ్యంగ్యంగా చెప్పిన పద్యం... ‘పొగచుట్టకు సతిమోవికి అగణితముగ మద్యమునకు అమృతమునకున్ తగ నుచ్చిష్టము లేదని ఖగవాహను తోడ కాలకంఠుడు బలికెన్’ గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఇదే పద్యాన్ని వెంకటేశం నోట పలికిస్తారు. అంతేకాదు, ఇదే పద్యాన్ని అనుకరిస్తూ, గిరీశం పాత్రతో ఇలా చెప్పిస్తారు: ‘‘ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచుటై్ట జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’’ ‘కన్యాశుల్కం’ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానే సాగుతూ, ఆనాటి సమాజంలోని దురాగతాలను కళ్లకు కడుతుంది. హాస్యానికి మారుపేరైన కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలు కూడా రాశారు. ఆయన రాసిన ‘అద్భుత కవిత్వ ప్రహసనం’లో ప్రాచీన కవిత్వం పాషాణమని, నవీన కవిత్వం గొప్పదని గురువుతో చెబుతారు శిష్యులు. వారు వెలగబెట్టిన నవీన కవిత్వానికి ఒక మచ్చుతునక... ‘తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన బెట్టి కుదమగాను కింద మంటబెట్ట ఉడకకేం జేస్తుంది దాని కడుపు కాల ధరణిలోన’ ఇక చిలకమర్తివారు రాసిన పకోడి పద్యాలు సుప్రసిద్ధాలు. అయితే, తిరుపతి వేంకట కవులు కూడా పకోడిపై ఒక చమత్కార పద్యం చెప్పారు. కరకరలాడే ఆ పద్యం ఇదీ: ‘కరకరలాడు కొంచెమగు కారము గల్గు బలాండు వాసనా హరమగు గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా దరమున బల్కుచుందు రదితాదృశమే యగునంచు దోచెడిన్’ ఇలాంటివన్నీ ఆధునిక సాహిత్యం తొలినాళ్లలోని చమత్కారాలకు ఉదాహరణలు. ‘మహాప్రస్థానం’తో శ్రీశ్రీ కవనరంగంలో కదం తొక్కడం ప్రారంభించాక కొత్త ఊపు వచ్చింది. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ ‘సిప్రాలి’లో చమత్కార కవిత్వంతో పాటు పేరడీ గారడీలూ చేశాడు. ‘సిరిసిరిమువ్వ’ మకుటంతో కంద పద్యాలు, ‘ప్రాసక్రీడలు’, ‘లిమరిక్కుల’తో కలిపి ‘సిప్రాలి’గా తీసుకొచ్చిన పుస్తకంలో శ్రీశ్రీ కవితా చమత్కారం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ‘పంచపదుల్లో’ శ్రీశ్రీ కవితా హాస్యం చూడండి... ఇవి నిజంగా ‘పంచ్’పదులు. ‘అరవ్వాడి దోసై మీద తోచించి వ్రాశై ఏవో విట్లు వేశై ఏవో ఫీట్లు చేశై తర్వాత చూసుకుందాం ప్రాసై...’ ‘పెరిగితే వ్యాపార దృష్టి మరిగితే లాభాల సృష్టి దొరికితే అమెరికా ముష్టి మిగిలేది విగ్రహపుష్టి నైవేద్య నష్టి!’ ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పజ్యాలు’లో చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది. ఆరుద్ర చమత్కారానికి ఓ రెండు మచ్చు తునకలు ‘కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు వడివడిగ దిగిరాడు ఓ కూనలమ్మా!’ ‘బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మా!’ పేరడీ గారడీలు ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘నవకవిత’ శీర్షికన... ‘‘సిందూరం, రక్తచందనం బందూకం, సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురూ ఎగరేసిన ఎర్రనిజెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి...’’ అంటూ ఉద్వేగభరితంగా రాసిన కవితకు ‘జరుక్ శాస్త్రి’గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు. ‘‘మాగాయీ కందిపచ్చడీ ఆవకాయ, పెసరప్పడమూ తెగిపోయిన పాతచెప్పులూ పిచ్చాడి ప్రలాపం, కోపం వైజాగులో కారా కిల్లీ సామానోయ్ సరదాపాటకు...’’ శ్రీశ్రీ ఒరిజినల్ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, జరుక్ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు జరుక్ శాస్త్రితో పాటు మాచిరాజు దేవీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారెందరో పేరడీలు రాశారు. మహాప్రస్థానంలో శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగ...’ అంటూ రాసిన కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇలా పేరడీ రాశారు: ‘అవాకులన్నీ చవాకులన్నీ మహారచనలై మహిలో నిండగ ఎగబడి చదివే పాఠకులుండగ విరామమెరుగక పరిశ్రమిస్తూ అహోరాత్రులూ అవే రచిస్తూ ప్రసిద్ధికెక్కే కవి పుంగవులకు వారికి జరిపే సమ్మానాలకు బిరుదుల మాలకు దుశ్శాలువలకు కరతాళాలకు ఖరీదు లేదోయ్...’ పేరడీ కవులు కొందరు ప్రాచీన పద్యాలకు సైతం పేరడీలు రాశారు. పోతన భాగవతంలో రాసిన ‘వారిజాక్షులందు వైవాహికములందు’ అనే శుక్రనీతి పద్యానికి డాక్టర్ వెలుదండి నిత్యానందరావు పేరడీ పద్యం చూడండి... ‘పదవి వచ్చు వేళ పదవి పోయెడు వేళ ప్రాణమైన పదవి భంగమందు కూడబెట్టినట్టి కోట్ల రక్షణమందు బొంగకవచ్చు నఘము పొందడధిప’ పోతన భాగవత పద్యాలకు పేరడీలు రాసిన వారిలో పులికొండ సుబ్బాచారి ఒకరు. ‘కలడు కలండనువాడు కలడో లేడో..’ అనే పద్యానికి ఆయన రాసిన పేరడీ ఇది: ‘కలదందురు మంజీరలొ కలదందురు గండిపేట కాలువలందున్ కలదందురు పంపులలో కలదు కలందనెడు నీరు కలదో లేదో!’ శ్రీశ్రీకి గురుతుల్యుడైన అబ్బూరి రామకృష్ణారావు కూడా పోతనను పేరడీ చేశారు. భాగవతంలో పోతన రాసిన ‘అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై...’ అనే పద్యానికి అబ్బూరి వారి పేరడీ ఇదీ... ‘వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియాం పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్, బోండాపయిన్, సేమియా సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!’ శ్రీశ్రీ కవితలకు పేరడీలు రావడం ఒక ఎత్తయితే, శ్రీశ్రీ తానే స్వయంగా పేరడీ గారడీలు చేయడం విశేషం. శ్రీశ్రీ తన ‘సిప్రాలి’లో సుమతీ శతకంలోని ‘ఏరకుమీ కసుగాయలు...’ పద్యానికి చేసిన పేరడీ... ‘కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకులు చెవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా!’ వేమన పద్యాలకైతే పేరడీలు కొల్లలుగా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రసిద్ధులే కాకుండా, కొందరు అజ్ఞాత కవులు కూడా వేమన పద్యాలకు చమత్కారభరితమైన పేరడీలు రాశారు. వేమన పద్యాలకు కొన్ని ఆధునిక పేరడీలు చూడండి... ‘కల్లు సారా బ్రాండి కడుపార త్రాగరా జంకు గొంకు లేక పొంకముగను ఏది దొరకనపుడు ఎండ్రిను ద్రాగరా విశ్వదాభిరామ! వినుర వేమ! ‘గంగిగోవు పాలు గంటెడే చాలునా కడివెడేడ దొరుకు ఖరముపాలు భక్తి కలుగు కూడు పట్టెడే చాలునా విశ్వదాభిరామ! వినుర వేమ!’ ఈ రెండూ వేమన పద్యాలకు అజ్ఞాత కవుల పేరడీలు. వేమనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరడీ మచ్చుకొకటి... ‘వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె గారె బూరె పప్పుచారె మిగిలె బుర్ర కరిగి బొర్రగా మారెరా విశ్వదాభిరామ వినురవేమ’ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అజ్ఞాతకవి నీచుల రాజ్యం వచ్చినందుకు బాధపడుతూ వ్యంగ్యంగా చెప్పిన ఈ పద్యాలు నవ్వులు పూయించక మానదు... దాదాపు ఉర్దూలోనే రాసిన ఈ పద్య సంభాషణనుు చూడండి... ‘లుచ్ఛా జమాన ఆయా అచ్ఛోంకో హాథ్ దేన హర్ ఏక్ సీకా అచ్ఛా జమాన ఫిర్ కబ్ వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబూ!’ (నీచుల రాజ్యం వచ్చింది. మంచివాళ్లకు చెయ్యిచ్చే పద్ధతిని ప్రతివాడూ నేర్చాడు. మళ్లీ మంచికాలం ఎప్పుడొస్తుందోయ్ వలీ సాహెబు) అని అడిగితే, ‘బందేనవాజ్ బుజురుగ్ జిందాహై ఆజ్తో న జీతే హం ఖుదా బందాహి జానె వహసబ్ గందరగోళం జమాన ఖాజాసాబూ! (చేసిన మంచి పనుల వల్ల దేశసేవకులు, పుణ్యపురుషులు అలా ఉన్నారు. మనం అలా జీవించలేం. ఇప్పటికీ భగవద్భక్తుడు సేవకుడే ఈ విషయాలను తెలుసుకోవాలి. అయినా ఖాజా సాహెబూ! ఇప్పుడంతా గందరగోళం కాలం వచ్చింది కదా) అని బదులిచ్చాడు. తెలుగు కవిత్వంలో ఇలాంటి చమత్కారాలు కోకొల్లలు. ఆధునిక కవులలో వికటకవులుగా, హాస్యకవులుగా పేరుపొందిన వారు మాత్రమే కాదు, సంప్రదాయకవులుగా, భావకవులుగా, విప్లవకవులుగా ముద్రపడినవారు సైతం తమ కవిత్వంలో చమత్కారాలూ మిరియాలూ తగుపాళ్లలో నూరారు. స్థలాభావం కారణంగా ఇక్కడ ప్రస్తావించలేకపోయిన కవులలో కూడా ఎందరో మరెందరో పాఠకులకు చవులూరించే కవితలు చెప్పి భళాభళి అనిపించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందుకోండి ఈ కవనవ్వుల నజరానాలు. ఆధునిక చాటువులు స్వతంత్ర కావ్యాలు రచించి ప్రసిద్ధులైన ఆధునిక కవులు కొన్ని సందర్భాలలో హాస్యరసభరితమైన చమత్కార చాటువులు చెప్పారు. వాటిలో కొన్ని... ‘శివతాండవం’తో ప్రసిద్ధులైన పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీనాథుడికి తీసిపోని రీతిలో చెప్పిన చిలిపి చాటువుల్లో మచ్చుకొకటి... ‘గజగమన గాదు ఇయ్యది గజసదృశ శరీర సీటు కంతయు తానై అజగరమై కూర్చున్నది గజిబిజిౖయె పోయె మనసు కన్నులు గూడన్’ ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వతంత్ర కావ్యాల్లో హాస్యం తక్కువగానే ఉన్నా, ఆయన సందర్భోచితంగా సంధించిన చమత్కార చాటువులు లేకపోలేదు. ఆయన చెప్పిన ఒక చమత్కార పద్యం... ‘చదువురాని వేళ ‘చంకరుండ’న్నాడు చదువుకొనెడి వేళ ‘సంకరుండ’నె చదువు ముదిరిపోయి షంకరుండనెనయా స్నిగ్ధ మధురహాస! శ్రీనివాస! మిశ్రభాషా కవనవినోదం ఆధునిక కవుల్లో ఇంగ్లిషు, ఉర్దూ భాషలను తెలుగుతో కలగలిపి మిశ్రభాషా కవిత్వం చెప్పి నవ్వులు పూయించిన వారు ఉన్నారు. బ్రిటిష్ పాలనలోని ఆంధ్ర ప్రాంతంలోని కవులు తెలుగు పద్యాల్లో యథేచ్ఛగా ఇంగ్లిషును వాడుకుంటే, నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంత కవులు తమ ఉర్దూ పాటవాన్ని ప్రదర్శించారు. మిశ్రభాషా కవనవినోదానికి కొన్ని ఉదాహరణలు... సామాజిక దురాచారాలను నిరసిస్తూ్త నాటకాలు రాసిన ప్రముఖులలో కాళ్లకూరి నారాయణరావు ఒకరు. మధుపానాసక్తత మితిమీరిన ఆధునిక జీవనశైలిని వెటకరిస్తూ ‘మధుసేవ’ నాటకంలో ఆయన హాస్యస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచే పద్యం... ‘మార్నింగు కాగానె మంచము లీవింగు మొఖము వాషింగు చక్కగ సిటింగు కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు గడగడ డ్రింకింగు గ్లాసులు గ్రంబులింగు భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు క్లబ్బును రీచింగు గాంబులింగు విత్తము లూసింగు చిత్తము రేవింగు వెంటనే డ్రింకింగు వేవరింగు మరల మరల రిపీటింగు మట్టరింగు బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు దారిపొడుగున డాన్సింగు థండరింగు సారె సారెకు రోలింగు స్రంబలింగు’ నవ్వులను విశ్లేషించి వివరించిన హాస్యరచయిత భమిడిపాటి కామేశ్వరరావు కూడా తెలుగులో ఇంగ్లిషును రంగరించి... ‘ది స్కై ఈజ్ మబ్బీ... ది రోడ్ ఈజ్ దుమ్మీ మై హెడ్ ఈజ్ దిమ్మీ...’ అంటూ కవిత చెప్పారు. -
అంతరిక్షంలో ఆతిథ్యం, ఎప్పటినుంచంటే..
ఫొటోలో కనిపిస్తున్నట్లు అంతరిక్షంలో జెయింట్ వీల్ ఉందని అనుకుంటున్నారా! అది ఓ హోటల్. నిజంగానే అంతరిక్షంలో ఉండనుంది. గ్రూప్ ఆర్బిటల్ అసెంబ్లీ సంస్థ భూ కక్ష్యలో రోబోలను ఉపయోగించి ఓ స్పేస్ హోటల్ నిర్మించనుంది. ఇది చక్రం ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం అంచులకు అటాచ్ పాడ్ రూపంలో హోటల్ గదులు ఉంటాయి. ఇందులో ఒకేసారి 400 మంది ఆతిథ్యం పొందచ్చు. వినోదం కోసం అందులో ఒక సినిమాహాల్, బార్, లైబ్రరీ.. ఫిట్నెస్ కోసం జిమ్, స్పాలు కూడా ఉంటాయి. వీటిని ఏ ప్రైవేటు సంస్థలైనా నెలకొల్పుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ హోటల్లో 20 × 21 మీటర్ల విస్తీర్ణంలో ఉండే గదులను కొనుగోలు చేసి, వ్యక్తిగత గెస్ట్హౌస్లా కూడా మార్చుకోవచ్చు. అంతరిక్షంలో ఏ వస్తువూ స్థిరంగా నిలబడదు. మరి ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.. వెర్నెహర్ వాన్ బ్రాన్ అనే శాస్త్రవేత్త.. కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని స్పష్టించి, అంతరిక్షంలో స్థిరమైన ఆవాసాన్ని ఏర్పరచుకోవచ్చునని ప్రతిపాదించాడు. దీని ఆధారంగా రోబో సహాయంతో ఒక పెద్ద వాయేజర్ స్టేషన్ను తయారు చేస్తారు. దాన్ని ఒక పెద్ద వృత్తాకారంలో తిప్పుతూ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని పుట్టిస్తారు. ఇక అక్కడ గదులను నిర్మించి ఆతిథ్యం ఇస్తారు. అంతేకాదు, చక్రం వేగాన్ని ఉపరితలం ఆధారంగా తగ్గిస్తూ, పెంచుతూ.. మరో రెస్టారెంట్ను చంద్రుడు లేదా మార్స్లో నిర్మించే ఆలోచన కూడా ఉంది. ఇది కాస్త ఫలిస్తే.. త్వరలోనే మనమందరం అంతరిక్షంలో ఆతిథ్యం పొందగలం. అయితే, అక్కడ ఆతిథ్యం పొందాలంటే, రోజుకు ఎంత ఖర్చు అవుతుందో ఇంకా చెప్పలేదు. కానీ, రెస్టారెంట్ పనులను 2025లో ప్రారంభించి, 2027లో స్వాగతం పలుకుతామని సంస్థ తెలిపింది. -
బ్రెడ్ రోల్స్ విరిగిపోకుండా రావాలంటే ఇలా చేయండి..
బ్రెడ్ రోల్స్ కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 10(అంచులు తొలగించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – 1 కప్పు, పనీర్ తురుము – పావు కప్పు, ఉల్లిపాయ – 1(సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 2(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – పావు టీ స్పూన్, వెన్న – 1 టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో వెన్న వేసుకుని, కరిగిన వెంటనే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం పనీర్ తురుమును కూడా వేసి వేయించుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకుని, ఒక నిమిషం పాటు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఒక్కో బ్రెడ్ స్లైస్లో వేసుకుని రోల్లా చుట్టుకోవాలి. రోల్ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. బీట్రూట్ పకోడా కావలసినవి:బీట్రూట్ తురుము – అర కప్పు, పచ్చి శనగపప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి), జీలకర్ర – పావు టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – 2(చిన్నగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బీట్ రూట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి శనగపప్పు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని.. పకోడాలు వేసుకోవాలి. వెజిటబుల్ పనియారం కావలసినవి:దోసెల పిండి – 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ గుజ్జు, బీట్రూట్ గుజ్జు – పావు కప్పు చొప్పున, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. దోసెల పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ గుజ్జు, బీట్రూట్ గుజ్జు, పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం– వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని.. పొంగనాల పాన్లో అడుగున నూనె రాసుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం పెట్టుకుని, కుక్కర్లో లేదా ఓవెన్లో ఉడికించుకుంటే వెజిటబుల్ పనియారం సిద్ధం. -
ఎనిమిది 12 అయితే ఆమెకు ఎదురీతే..
ఈ కాలం అమ్మాయిలు.. చదవని డిగ్రీ లేదు.. చేయని ఉద్యోగం లేదు.. పొందని అవకాశం లేదు.. రాష్ట్రాలూ ఏలుతున్నారు..అరే.. స్పేస్లోకీ వెళ్తుంటే!! వాళ్లకు అండగా ఎన్ని చట్టాలు? 498 (ఏ), డొమెస్టిక్ వయొలెన్స్, నిర్భయ..! బస్సుల్లో వాళ్లకు సీట్లు.. స్థానిక పాలనాసంస్థల్లో సీట్లు.. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్.. ఇంకా.. ఆగొచ్చు అక్కడితో! ఎంత చదువుకుంటున్నా.. ఎన్నో కొలువుల్లో ఉన్నా.. ఆఖరికి అంతరిక్షంలోకి వెళ్లినా ఎక్కడా నాయకత్వంలో లేరు. మహిళాపాలకులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు! ఎన్ని చట్టాలు వచ్చినా వాళ్ల మీద హింస మాత్రం ఆగట్లేదు. బస్సుల నుంచి స్థానిక పాలనా సంస్థల దాకా ఉన్న సీట్లూ వాళ్లను నాయకులుగా నిలబెట్టేవి కావు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ ఆడవాళ్లను బాసులుగా చేయట్లేదు. అన్నీ నేర్చుకొని.. లేదా నేర్చుకోవాలనే తపన చూపించి నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకుంటే... ‘నేను డ్రైవింగ్ నేర్చుకోనా?’ ఉత్సుకతో అడిగిన భార్యకు ‘ముందు పరాఠా చేయడం నేర్చుకో.. డ్రైవింగ్ సంగతి తర్వాత’ అని భర్త చెప్పే సీన్ల (థప్పడ్ అనే బాలీవుడ్ సినిమాలోనిది)వంటివే ఎదురవుతుంటాయి. తప్ప ‘మిష్టర్ పెళ్లాం’ సినిమాలో లాగా ‘మీ సరకుల్లో చచ్చులు, పుచ్చులు ఉండవని.. ఉంటే చూపించమని సవాల్ చేయండి.. క్వాలిటీనే మీ బ్రాండ్గా మార్చుకోండి.. సేల్స్ ఎందుకు పెరగవో చూద్దాం’ అని సలహా ఇచ్చిన మహిళలోని ప్రతిభను మెచ్చి, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాన్నీ గుర్తించి మేనేజర్ స్థాయి ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం.. అలాంటి సీన్లు కనిపించవు. చర్విత చర్వణంలాంటి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యూఎన్ విమెన్ ఈ ఏడు ప్రకటించిన థీమ్.. ‘‘విమెన్ ఇన్ లీడర్షిప్: అచీవింగ్ ఏన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ కోవిడ్–19 వరల్డ్’’. మహిళలు నాయకత్వం వైపు అడుగులేస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించాలని యూఎన్ విమెన్ వింగ్ ఏటా ఒక్కో థీమ్తో ప్రపంచాన్ని చైతన్య పరుస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకుంటున్న దేశాలున్నాయి. ఆ ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించిన దేశాలూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న దేశాలూ లేకపోలేదు. మనం ఏ జాబితాలో ఉన్నామో మహిళలకు సంబంధించి తాజా పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలను బట్టి అర్థమవుతూనే ఉంది. సందర్భం కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ చేసిన పన్నెండు పని గంటలు, మూడు రోజుల సెలవులు అనే ప్రతిపాదనను మహిళా కోణంలోంచి చూద్దాం. ప్రభుత్వాలు ఎలాంటి ప్రతిపాదన చేసినా.. చేయాలనుకున్నా దాని ప్రభావం స్త్రీల మీద ఎలా ఉంటుందో.. ఎలా ఉండబోతుందో ఒకటికిపదిసార్లు చర్చించి, తరచి చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలుగా తేవాలి. ప్రతిపాదన దశలో మహిళా వర్గం నుంచి వస్తున్న స్పందన, ప్రతిస్పందనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కార్మికశాఖ ప్రతిపాదించిన ఈ పనిదినాల మార్పు మీద మెట్రో నగరాల్లో చర్చ మొదలై పోయింది. ‘రోజూ పన్నెండు గంటల చొప్పున వారానికి నాలుగు పనిదినాలు, మూడు వారాంతపు సెలవులు లేదా ఇప్పుడెలా ఉందో అలాగే అంటే రోజుకి ఎనిమిది గంటల చొప్పున వారానికి ఆరు పనిదినాలనే అనుసరించడం. ఇది ఐచ్ఛికం. ఈ రెండింటిలో ఉద్యోగి ఏ పద్ధతినైనా అవలంబించవచ్చు’ అనేదే ఆ ప్రతిపాదన. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదుకదా.. ఉద్యోగులు అందరికీ కదా? అవును. కానీ ప్రభావం మాత్రం మొత్తం స్త్రీల మీదే ఉంటుంది. అన్నేసి గంటల పనివేళలు ఎవరికైనా ఇబ్బంది. మగవాళ్లు రోజంతా ఆఫీస్లో గడిపితే ఇంట్లోని మహిళలు అదనపు భారాన్ని మోయాలి. ఆఫీస్కెళ్లే ఆడవాళ్ల తిప్పలైతే చెప్పక్కర్లేదు. విలువలేని ఇంటి చాకిరీతోపాటు ఎంతోకొంత విలువ చేసే ఆఫీస్ చాకిరీ కలసి రోజుకు 24 గంటలూ సరిపోవు. ‘ఎనిమిది, తొమ్మిది గంటల పనివేళలకే ఇంట్లోంచి ఉదయం బయలుదేరితే రాత్రికి గానీ ఇల్లు చేరని పరిస్థితి. నగరాల్లోని ట్రాఫిక్ ఇక్కట్లు ఆ సమయాల్ని మరింత సాగదీస్తాయి. రోజుకి పన్నెండు గంటలంటే ఊహించుకోవడానికేమీ లేదు. ‘అయినా ఇది ఐచ్ఛికమే అంటున్నారు కదా?’ అని కొంతమంది ఉద్యోగినులు, ఉద్యోగులనూ అడిగితే.. ‘ముందు ఆప్షన్గానే ఇస్తారు తర్వాత అది తప్పనిసరి నిబంధనగా మారుతుంది. సపోజ్.. మా ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయం)లో కొంతమందిమి ట్వల్వ్ అవర్స్, త్రీ డేస్ వీకెండ్ను ఆప్షన్గా తీసుకున్నాం అనుకోండి. ఇంకొంతమంది వన్ డే వీకెండ్ ఆప్షన్లో ఉన్నారనుకోండి. ఒక పనికి సంబంధించి ఆ టూ కేటగిరీస్ మధ్య కో ఆర్డినేషన్ ఎలా కుదురుతుంది? యూనిఫార్మిటీ ఉన్నప్పుడే పనులు సవ్యంగా జరగడం కష్టం.. ఇక ఒకే సెక్షన్లో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో పనిచేసే వాళ్ల మధ్య ఎలా కుదురుతుంది? దాంతో అందరికీ పన్నెండు గంటల పనివేళలే తప్పనిసరి చేసేస్తారు’ అని చెప్పారు. ఉద్యోగినులు, అందులోనూ వర్కింగ్ మదర్స్ను కదిలిస్తే.. ‘ట్వల్వ్ వర్కింగ్ అవర్స్ కన్నా త్రీ డేస్ వీకెండే అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా. అబ్బా.. మూడు రోజులు హాలీడేస్ అనిపిస్తుంది. కానీ దానికి మొత్తం నాలుగు రోజులను పణంగా పెడుతున్నామన్న ధ్యాస రాదు. ఒకవేళ ఉద్యోగులుగా మనం లాజికల్గా ఉండి వన్ డే వీకెండ్ ఆప్షన్కి వెళితే ఇంట్లో ప్రెజర్ మొదలవుతుంది. మూడు రోజులు సెలవులిస్తుంటే హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండక ఒక్క రోజు సెలవుకి వెళ్లడం ఎందుకు? అని. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్లో.. ప్లస్ నాలుగ్గంటలు ట్రాఫిక్లో ప్రయాణాలతో పదహారు గంటలు బయటే గడిపితే ఇంటి పని ఎప్పుడు చేసుకోవాలి? ఎన్నింటికి నిద్రపోవాలి? ఉదయం ఎన్నింటికి లేవాలి? పిల్లలను ఎవరు చూసుకోవాలి? వాళ్ల తిండీతిప్పలకు అత్త, అమ్మ మీదో.. లేకపోతే సర్వెంట్ మెయిడ్ మీదో ఆధారపడ్డా.. వాళ్ల చదువుసంధ్యలు ఎవరు పట్టించుకోవాలి? దీని బదులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ వెసులుబాటైనా కల్పించేలా లేవు కదా పెరిగిన ధరలు. మొండికేసి ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే ఏదోకరోజు రోగాల కుప్పై సంపాదించుకున్నదంతా మెడికల్ బిల్లులకు పే చేయాల్సి వస్తుంది. అమ్మో... తలచుకుంటేనే భయంగా ఉంది’ అంటున్నారు. నిజమే.. ఇంకా చట్టంగా రాకుండా.. కేవలం చర్చల్లోనే ఈ ప్రతిపాదన ఇంతగా వణికిస్తోంది. బయట పనుల్లో స్త్రీలు భాగస్వాములైనంత చొరవగా, వేగంగా ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కాలేదు. మనకది నేటికీ వింత సంస్కృతే. అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంట్లో పనీ చూసుకోవాలి. పిల్లల పెంపకమూ ఆమె బాధ్యతే. అసలు మహిళా దినోత్సవం వచ్చిందే పనివేళల కుదింపు, శ్రమకు తగ్గ వేతనం, ఓటు వేసే హక్కు కావాలనే డిమాండ్తో. వందేళ్ల పైబడ్డ చరిత్ర ఆ విప్లవానిది. ఈ వందేళ్లలో సాధించిన నాగరికత ఆధునిక స్త్రీ సవాళ్లను గుర్తించాలి.. సమానత్వాన్ని చేకూర్చాలి. శ్రమకు తగ్గ వేతనం నుంచి సమాన వేతన లక్ష్యానికి చేరాలి. కానీ సాంకేతిక యుగంలో కూడా స్త్రీ విషయంలో ఇంకా ప్రాథమిక దశే మనది. మహిళలు గడప దాటితే ఎక్కడికి వెళ్తున్నారో పోలీస్స్టేషన్లో చెప్పి, వివరాలు నమోదు చేసి వెళ్లాలనే నిబంధన (మధ్యప్రదేశ్లో) పెట్టే స్థితిలో ఉంటే సమానత్వం మాటెక్కడిది? పాశ్చాత్య దేశాలు మనకు భిన్నంగా ఉన్నాయి. ఫ్రాన్స్లో వారానికి 35 గంటల పని నియమం. అమెరికాలో వారానికి 40 గంటలు. మన దగ్గర వారానికి 48 గంటలు. లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి తొమ్మిది గంటలు గరిష్ట పరిమితి. ఏ రోజైనా తొమ్మిది గంటలకంటే ఎక్కువ పనిచేయించుకుంటే దాన్ని ఓటీగా పరిగణించి రెట్టింపు డబ్బులు చెల్లించాలి. స్వీడన్లో ఎనిమిది గంటల పనివేళలను ఆరు గంటలకు మార్చారు. దీనివల్ల ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకపోగా పని సామర్థ్యం పెరిగినట్టుగా గమనించారు. అంతేకాదు ఉద్యోగుల ఇళ్లల్లోనూ ఆరోగ్యకర వాతావరణం నెలకొందని అధ్యయనాలు తెలిపాయి. కాలక్రమేణా ఈ పనిగంటల విధానాన్ని ఇలా సరళం చేసేలా ఆలోచించాలి కాని క్లిష్టతరం చేయడమేంటి? పారిశ్రామిక విప్లవ పూర్వకాలానికి వెళ్తున్నామా అనిపిస్తోంది కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆలోచనలు వింటూంటే’ అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు. తలనొప్పి వ్యవహారంగా.. సాంకేతికత తెచ్చిన ఆధునికత ఎంత విస్తృతమైనా ఇంటా, బయటా మహిళల భద్రత విషయంలో మనం అనాగరికంగానే ఉన్నాం. ఆడవాళ్లకు ఉద్యోగాలిస్తే అన్నీ సవాళ్లే అని విసుక్కునే యాజమాన్యాలే ఎక్కువ. అమ్మాయిలకు ఉద్యోగాలంటే ఆఫీస్ డెకొరమ్ను డిసిప్లిన్లో పెట్టాలి, రాత్రి తొమ్మిది దాటితే రవాణా సౌకర్యం కల్పించాలి, యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ సెల్ను ఏర్పాటు చేయాలి, మెటర్నిటీ లీవ్ను ఇవ్వాలి.. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా భావించే యాజమాన్యాలు చాలానే ఉన్నాయి. దీని కన్నా మహిళలను తీసుకోకుండా ఉంటేనే నయం కదా అనే ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందులను అరికట్టే సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడీ పనిగంటల పెంపు మహిళల ఉద్యోగ జీవితాన్ని మరింత అభద్రతలోకి నెట్టడమే కదా! మా ఉద్యోగ హక్కును, అవకాశాలను హరించేయడమే కదా? అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమే.. మహిళలు లీడర్షిప్ వైపు రావాలి. ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అని ఉపన్యాసాలు ఇస్తున్నాం.. వింటున్నాం. ఇలా మహిళా దినోత్సవాల పేరిట స్ఫూర్తినీ పంచుతున్నాం. ఇంకో వైపు ఈ గంటల పెంపు వంటివాటినీ అమలు చేయచూస్తున్నాం. మహిళా కోణంలోంచి చూస్తే పొమ్మనలేకుండా పొగబెట్టే కార్యక్రమంగానే తోస్తోంది. వాళ్లంతట వాళ్లు ఉద్యోగాల నుంచి తప్పుకునేలా చేసే ప్రణాళికే ఇది. యాజమాన్యాల కోసం చేస్తున్న ప్రతిపాదన. ఇలాంటి అడ్డంకులను పేరుస్తూ కమాన్ లేడీస్.. మీరు సాధించగలరు.. అన్నిరంగాల్లో మీరు లీడర్స్గా రావాలి అని ప్రోత్సహించడంలో అర్థం ఉందా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా ఇది .. అని అభిప్రాయపడుతున్నారు నాయకత్వ బరిలో ఉన్న చాలా మంది మహిళలు. ఈ అభిప్రాయం అపోహ కాదనే అనిపిస్తోంది. దీని మీద చర్చలు విస్తృతం కావాలి. పురుషులూ పాలుపంచుకోవాలి. ఇంట్లో అయినా బయట అయినా శ్రమలో స్త్రీ, పురుషుల సమభాగస్వామ్యం ఉండాలి. మహిళలు ఐచ్ఛికంగా ఉద్యోగాలు వదులుకోవడం కాదు.. ఇన్నాళ్లుగా ఈ సమాజం పురుషుడికి ఇచ్చిన నాయకత్వ వరాన్ని వాళ్లు వదులుకోవాలి. స్త్రీలకూ ఆ అవకాశం ఉండాలని గ్రహించాలి. ఆ హక్కును మహిళలూ తీసుకోవాలి. దీని కోసం మహిళల పరిధిని కుదించే నిబంధనలు కాదు.. వాళ్ల స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజ్ఞ, సామర్థ్యాలను గౌరవించే ప్రతిపాదనలు, చట్టాలు కావాలి. సవాళ్లు.. అవకాశాల తీరు ► మన చట్టసభల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే మహిళలు. ► పారిశ్రామిక సంస్థల విషయానికి వస్తే పేరున్న అయిదు వందల కంపెనీల్లో కేవలం అయిదు శాతం స్త్రీలు మాత్రమే సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలో మనం ► 193 దేశాల్లోని చట్టసభల్లో స్త్రీల భాగస్వామ్యం లెక్క తీస్తే మనం 150వ స్థానంలో ఉన్నాం. భద్రత స్కేలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2018తో పోల్చితే 2019లో మహిళల మీద నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దళితుల మీద నేరాల విషయానికి వస్తే ఆ స్థానాన్ని రాజస్థాన్ తీసుకుంది. ► 2019లో మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య 4,05,816 (నమోదైన కేసులు). 2018లో ఈ సంఖ్య 3,78,236. ► లైంగిక దాడుల విషయానికి వస్తే 5వేల 997 కేసులతో రాజస్థాన్ ఆ అపఖ్యాతిని మోస్తోంది. ఆ వరుసలో 3,065 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలబడింది. ► పోక్సోయాక్ట్ కింద నమోదైన నేరాల్లో 7,444 కేసులతో ఉత్తరప్రదేశ్ ముందుంది. తర్వాత మహారాష్ట్ర. అక్కడ నమోదైన కేసుల సంఖ్య 6,402. ► వరకట్న కేసుల్లోనూ ఉతర్తప్రదేశ్కే అపకీర్తి కిరీటం. నమోదైన కేసుల సంఖ్య 2,410. తర్వాత బిహార్. కేసుల సంఖ్య.. 1,220. ► యాసిడ్ దాడుల్లోనూ ఉత్తరప్రదేశ్దే ప్రథమ స్థానం. నమోదైన కేసులు 42. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. నమోదైన కేసులు 36. ( ఎన్సీఆర్బీ 2019 ) 12 గంటల పనిదినం అకాల మరణమే! ఉద్యోగుల చేత వారానికి 4 రోజులే పని చేయించి, రోజుకి 8 గంటల బదులు 12 గంటలు పని చేయించుకోవచ్చుననే ప్రతిపాదన వల్ల ప్రధానంగా స్త్రీలకు జరిగే నష్టం.. స్త్రీలు నాయకత్వ స్థానాల్లోకి ఎదగడానికి కావలిసిన పరిస్థితులు.. స్త్రీ–పురుష సమానత్వ సాధనకు పురుషులు చేయాల్సిన కృషి.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని తీసెయ్యడమే. అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు కాబట్టి, తాత్కాలిక పరిష్కారాల గురించి ఆలోచించాలి. ప్రస్తుతం నూటికి 90 శాతం పని స్థలాల్లో, 8 గంటల పని దినం అయినా అమలులో లేదు, కాయితాల మీద తప్ప. రోజుకి 8 గంటల చొప్పున వారంలో 6 రోజుల పని అయినా, రోజుకి 12 గంటల చొప్పున వారంలో 4 రోజులే పని అయినా, పని చేసేది 48 గంటలే గదా? అని ప్రభుత్వమూ, యజమానులూ వాదించవచ్చును. కానీ, 12 గంటల పని దినంలో, 8 గంటల పని దినంలో కన్నా శ్రమ తీవ్రత ఘోరంగా వుంటుంది. యజమానులు ఉత్పత్తి సాధనాలను, ఎప్పటికప్పుడు మార్చివేసి, ఉద్యోగులు (కార్మికులు) సృష్టించే అదనపు విలువని పెద్ద ఎత్తున గుంజు కోగలుగుతారు. 12 గంటల పని దినంలో వుండే శ్రమ తీవ్రత, మార్క్స్ తన ‘కాపిటల్’ పుస్తకం లో చెప్పినట్టు ‘‘అది కార్మికుని వాస్తవ ఆయుష్షును తగ్గించడం ద్వారా ఒక నిర్ణీత కాల పరిమితిలో అతని ఉత్పత్తి కాలాన్ని పొడిగిస్తుంది.’’ అది క్రమంగా ‘‘అకాల అశక్తతనీ, మరణాన్నీ ఉత్పత్తి చేస్తుంది.’’ కాబట్టి, కార్మికులు 8 గంటల పనిదినం అనే నియమాన్ని యజమానులు కచ్చితంగా అమలు పరచాలని డిమాండు చేయడమే తాత్కాలిక పరిష్కారం. ఇంటి పని అనేది ఇప్పటికీ ప్రధానంగా స్త్రీల బాధ్యతగానే వుంది కాబట్టి, 12 గంటల పని దినం వల్ల, బైటికి వెళ్ళి పనులు చేసే స్త్రీల మీద, శారీరకం గానూ, మానసికంగానూ ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్త్రీలు పిల్లలకెప్పుడు తిండి పెడతారు? పిల్లల్ని ఎప్పుడు బడికి పంపుతారు? ఇంట్లో వుండే వృద్ధుల్ని ఎలా చూసుకుంటారు? రోజుకి 12 గంటల చొప్పున కాక, 24 గంటల చొప్పున అయితే, 2 రోజుల్లోనే కార్మికులు ఇళ్ళకు వెళ్ళకుండా 48 గంటలు పని ఇచ్చేస్తారు గదా! అది యజమానులకు ఎంత మేలు! స్త్రీలు నాయకత్వ స్థానాలలోకి ఎదగడం అంటే, ఉద్యోగాలలో, పని స్థలాల్లో, శారీరక శ్రమలు చేసే వారిపైనా, కొన్ని రకాల మేధా శ్రమలు చేసే వారి పైనా‘అధికార’ స్థానాల్లో వుండడమే! ఇప్పుడు ఆ స్థానాల్లో మొగవాళ్ళే ఎక్కువగా వున్నారు కాబట్టి. ఆ అధికార స్థానాల్లో, పురుషులకైనా, స్త్రీలకైనా ‘పర్యవేక్షణ’ అనే సహజంగా అవసరమయ్యే పనీ వుంటుంది. ‘పెత్తనం’ అనే అసహజ కార్యమూ వుంటుంది. పర్యవేక్షణ శ్రమలు చేసే అవకాశం కోసం స్త్రీలు డిమాండు చెయ్యవచ్చును. పెత్తనం శ్రమ చేసే అవకాశం ఎవ్వరికీ వుండకూడదు. కానీ, ‘తప్పుడు సామాజిక సంబంధాల’(‘‘ఫాల్టీ సోషల్ రిలేష¯Œ ్స’’) వల్ల ఆ స్థానాలు అవసరం అయ్యాయి. స్త్రీ–పురుష సమానత్వం కోసం స్త్రీలూ, పురుషులూ కృషి చేయవలిసింది, సమసమాజం కోసమే! అంటే, స్తీలకీ, పురుషులకీ ఇద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనీ అనే శ్రమ విభజన అమలు జరిగే సమాజం కోసం కృషి చెయ్యాలి. భిన్నంగా ఉంటుందని ఊహించలేం ఆడవాళ్ల జీవితాలు ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఇంటి, వంట పని దగ్గర్నుంచి భర్తకు, పిల్లలకు లంచ్ బాక్స్లు సర్దివ్వడం వరకు ఒత్తిడి అంతా ఆడవాళ్లే భరించాల్సి వస్తోంది. కాబట్టి పన్నెండు గంటల ఆఫీస్ పనివేళల వల్ల రోజూ వారి జీవితం మరింత భారమవుతుంది. లాక్డౌన్ టైమ్లో మహిళల మీద పెరిగిన హింసను గమనిస్తే వారానికి మూడు సెలవులు ఆ హింసకు భిన్నంగా గడుస్తాయని ఊహించలేం. అలాగని పన్నెండు గంటల సమయాన్ని ఆఫీస్కూ వెచ్చించలేరు కదా. ఇంటి, వంట పనిలో మగవాళ్లు విధిగా భాగస్వాములైతే తప్ప మహిళలపై భారం, హింస తగ్గే సూచనలు లేవు. మారిన కాలానికి అనుగుణంగా మగవాళ్ల మనస్తత్వం మారకుండా ఎంతకాలం నిర్లజ్జగా, స్తబ్ధుగా, కటువుగా ఉంటుందో అంతకాలం స్త్రీ, పురుషుల సంబంధాలు హింసాపూరితంగానే ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ కోణంలో ఆలోచన చేయకుండా తెచ్చే ఎలాంటి పాలసీలైనా మహిళా సాధికారతకు అడ్డంకులే తప్ప వాళ్ల లీడర్షిప్ను పెంచే ప్రయత్నాలు కావు. – అంకురం సుమిత్ర, సామాజిక కార్యకర్త వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ప్రతిపాదన వింటుంటే ఆ మధ్య జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది. ఆడవాళ్లు ఆటోలు నడుపుతుంటే మేల్ ఆటోడ్రైవర్లంతా స్ట్రయిక్ చేశారు. ఇదొక్కటే కాదు గ్లోబలైజేషన్ తొలినాళ్లనాటి సంఘటనలూ గుర్తొస్తున్నాయి. అప్పుడూ ఇంతే.. అసంఘటిత రంగంలో ఉన్న ఆడవాళ్లంతా పనులు మానేసేట్టు చేశారు. దానికి అతీతంగా ఏమీ ఉండబోదు ఈ పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవు దినాల ప్రతిపాదన. ఆర్గనైజ్డ్ సెక్టార్లోంచి కూడా మహిళలను వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం ఇది. మళ్లీ మహిళలను నాలుగు గోడలకే పరిమితం చేసే కుట్ర ఇది. ఎన్టీఆర్ ఇలాగే ఇష్టం వచ్చినట్టు పనిగంటలను మార్చాడు. ప్రభావం ఆడవాళ్ల మీదే పడింది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. కుటుంబంలోని స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి అవగాహన, అండర్స్టాండింగ్ పెంచే వాతావరణం కల్పించకుండా ఇలాంటి చట్టాలు తెస్తే బలయ్యేది మహిళలే. పురుషాధిపత్య మైండ్సెట్ను మార్చకుండా నాయకత్వం దిశగా మహిళలు నడవాలి అనడం మీనింగ్ లెస్. – కొండవీటి సత్యవతి, భూమిక ఎడిటర్ మానవ హక్కుల ఉల్లంఘనే.. పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవులు అనేది కచ్చితంగా రాంగ్ డైరెక్షనే. ఉద్యోగినులకే కాదు, ఇంట్లో ఉన్న స్త్రీలకూ ఇది భారమే. నిజానికి ఇప్పుడున్న వారానికి 48 గంటల పనివేళలన్నదే చాలా బర్డెన్. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాని రోజులో శ్రమ భారాన్ని పెంచే ప్రయత్నం ఏంటి? ఇదంతా ఉద్యోగుల కోణంలోంచి జరుగుతున్న మేలు కాదు.. యాజమాన్యాలకు చేయాలనుకున్న మేలుగానే అనిపిస్తోంది. ఒకరంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రభావం తప్పకుండా మహిళ మీదే పడుతుంది. మహిళలు నాయకత్వం వైపుగా రావడానికి సహజంగా ఉండే అడ్డంకులే సవాలక్ష. వాటి దృష్ట్యా మహిళలకు వెసులుబాటు కల్పించాల్సింది పోయి ఇలాంటి ప్రతిపాదనలతో మరింత క్లిష్టం చేస్తున్నాం. ఈ ప్రతిపాదన ఆప్షన్ అంటున్నారు కాని ఒకసారి మొదలైతే అది ఆప్షన్గా ఉండదు. అనివార్యంగా మారుతుంది. తప్పనిసని అవుతుంది. ఈ సందర్భంగా గృహిణుల శ్రమనూ చర్చించాలి. – విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు. లీడర్షిప్ ప్రతిబంధకాలు ఇప్పటికే వర్క్ప్లేస్లో ఉన్న సెక్సువల్ హెరాస్మెంట్స్కి ఈ పని గంటల పెంపు కూడా తోడైతే ఆ స్ట్రెస్ తట్టుకోలేక మహిళలు ఉద్యోగాలు మానేసే అవకాశాలే ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్ల పనినీ అన్పెయిడ్ లేబర్గా చూస్తున్నాం. ఆఫీస్ పని చేసినా ఇంటి పనీ ఆమె బాధ్యతే అన్నట్టుగా ఉంటుంది మన ధోరణి. ఈ క్రమంలో ఈ ప్రపోజల్, రిఫార్మ్స్ అన్నీ కూడా విమెన్ లీడర్షిప్కు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయే తప్ప వాళ్లను ప్రోత్సహించేలా ఉండట్లేదు. ట్వల్వ్ అవర్స్ వర్కింగ్ అనేది అయితే కచ్చితంగా కంపెనీలకు లాభమయ్యేదే. – స్వేచ్ఛ, న్యాయవాది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానం ఈ ప్రతిపాదన చాలా అశాస్త్రీయమైంది. ఇది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానంగా ఉందే తప్ప ఉద్యోగులకు ఒరగబెట్టేదేం లేదు. ముఖ్యంగా మహిళల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ల మానసిక, శారీరక అరోగ్యాన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్ పనితోనే సరిపోతే మిగిలిన వ్యక్తిగత పనుల సంగతేంటి? వాటికి వాళ్లెప్పుడు సమయం వెచ్చించాలి? అలాగే భద్రతా ప్రశ్నార్థకమే. – గౌతమ్, న్యాయవాది -
పొగిడితే పోయేదేముంది డ్యూడ్..
పొగడ్త అగడ్త అని గిట్టనివారు అనవసరంగా ఆడిపోసుకుంటారు గాని, నిజానికి పొగడ్తలను ఇష్టపడనివారు లోకంలో ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. పొగడుపూలవాన కురిపిస్తే, ఎంతటి ధీరగంభీరవదనులైనా పెదవులపై చిరునవ్వులొలికించక మానరు. పొగడ్తల శక్తి అలాంటిది మరి! మామూలు భాషలో పొగడ్త. పొగడ్తను కాస్త నాజూకుగా ప్రశంస అని, ఆధ్యాత్మిక పరిభాషలో స్తుతి అని కూడా అంటారు. పొగడ్తకు మన తెలుగు భాషలోనే దాదాపు అరవై వరకు పర్యాయపదాలు ఉన్నాయి. పొగడ్తనే ఇంగ్లిష్లో ‘కాంప్లిమెంట్’ అంటారు. ఈ మాటకు ఇంగ్లిష్లో నలభైకి పైగా పర్యాయపదాలు ఉన్నాయి. అంటే, పొగడ్తల్లో మన తెలుగువాళ్లదే పైచేయి అని ఒప్పుకోక తప్పదు. ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేన’ని కొందరి ప్రగాఢ విశ్వాసం. ఎంతటి అపర దుర్వాసులనైనా పొగడ్తలతో అవలీలగా పడగొట్టవచ్చనేది వారి సిద్ధాంతం. ‘కన్యాశుల్కం’లో గిరీశం ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి అగ్నిహో్రత్రావధానుల్లాంటి ప్రథమకోపిని చులాగ్గా బురిడీ కొట్టించగలిగాడు. అకాలంలో ఈ పొగడుపూల వానేంటని అయోమయం చెందుతున్నారా? మరేమీ లేదు– రేపు ‘వరల్డ్ కాంప్లిమెంట్ డే’– అనగా, ప్రపంచ ప్రశంసా దినోత్సవం. అందువల్లనే ఈ పొగడ్తల కథా కమామీషూ... పొగడ్త పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన జాడ చరిత్రలో ఎక్కడా కనిపించదు గాని, బహుశ మాటలు పుట్టినప్పుడే పొగడ్తలు కూడా పుట్టి ఉంటాయని భావించవచ్చు. ‘ఆదియందు అక్షరము ఉన్నది. అక్షరము దైవము వద్ద ఉన్నది. అక్షరమే దైవమై ఉన్నది’ అని బైబిల్ చెబుతోంది. కాలక్రమమున దైవమై ఉన్న అక్షరమే దైవమును పొగడనేర్చినది. ఇది ఒక సృష్టి వైచిత్రి. పొగడ్తలు, స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు దైవానికి మాత్రమే పరిమితం కాలేదు. అవి మనుషులకూ విస్తరించాయి. జీవాత్ములైన మనుషులందరూ సమానులేనని అటు ఆధ్యాత్మికవాదులు, మనుషులంతా ఒక్కటేనని ఇటు సామ్యవాదులు ఏదో మాటవరసకు అంటుంటారు గాని, మనుషుల్లో కొందరు ఎక్కువ సమానులు ఉంటారు. సమాజంలో ఆస్తులూ అంతస్తులూ అధికారాలూ ఈ ఎక్కువ సమానుల సొంతం. ఎక్కువ సమానులను ప్రసన్నం చేసుకుని, వారి కరుణా కటాక్ష వీక్షణాలను పొందడానికి తక్కువ సమానులు ఎప్పటికప్పుడు ‘పొగడు’పూల మాలలను అల్లుతుంటారు. పురాతన కళ పొగడ్త ఒక పురాతన కళ. వాంగ్మయారంభం నుంచే ఇది ఉనికిలో ఉంది. వేదపురాణాది పురాతన వాంగ్మయమంతా దైవాన్ని వేనోళ్ల పొగడటంతోనే వ్యాప్తిలోకి వచ్చాయి. రాచరికాలు ఏర్పడిన తర్వాత కవిపండితులు దైవంతో పాటు రాజులను కూడా పొగడటాన్ని అలవాటు చేసుకున్నారు. దైవాన్ని పొగిడితే చాలదా? మానవమాత్రులైన రాజులనెందుకు పొగడాలనే ధర్మసందేహం కొందరికి కలగవచ్చు. అలాంటి సందేహానికి ఆనాటి బతకనేర్చిన కవిపండితులు ‘నా విష్ణుః పృథ్వీపతిః’ అని సమర్థించుకున్నారు. అంటే, భూమినేలే రాజు సాక్షాత్తు మహావిష్ణువుతో సమానుడు. అందువల్ల రాజును పొగడటం తప్పుకాదనేది వారి వాదన. ఈ వాదనతో ఏకీభవించి, రాజులను పొగడనేర్చిన కవిపండితులు, వాగ్గేయకారులు, విదూషకులు వంటి వారందరూ సునాయాసంగా సుభిక్షంగా సువిలాసంగా బతుకుతూ, సమాజంలో ఎక్కువ సమానులుగా చలామణీ అయ్యేవారు. పొగడటానికి ఇంతమంది ఉన్నా, తనివితీరని రాజులు కేవలం తమను పొగడటానికే ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని, వారిని పెంచి పోషించేవారు. రాజులు ఎలాంటి వారైనా వారిని పొగడక తప్పని దుస్థితి ఆ రాజోద్యోగులది. ఎక్కడో తెనాలి రామకృష్ణుడిలాంటి తెలివైన కవులు రాజులను పొగుడుతున్నట్లే అనిపించే పద్యాలు చెబుతూ చురకలంటించేవారూ చరిత్రలో లేకపోలేదు. అలాంటి పద్యాల్లోని శ్లేషాలంకార మర్మాన్నెరుగని తెలివితక్కువ మారాజులు వారికి ఘనసన్మానాలూ చేసేవారు. పొగుడుతున్నట్లే చురకలంటించే ఆనాటి కవుల నైపుణ్యానికి ఒక ఉదాహరణ: శ్రీకృష్ణదేవరాయల చిన్నల్లుడు తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడితో పొగిడించుకోవాలనే కోరిక పుట్టింది. రామకృష్ణుడికి కబురు పంపి సభకు పిలిపించుకుని, తనను పొగుడుతూ పద్యం చెప్పమన్నాడు. తిరుమలరాయడు ఏకాక్షి. శ్లాఘించవలసిన లక్షణాలేవీ పెద్దగా లేనివాడు. పొగడనని మొండికేస్తే తిక్క మారాజు ఎలాంటి శిక్ష విధించడానికైనా వెనుకాడడు. సమయస్ఫూర్తిమంతుడైన తెనాలి రామకృష్ణుడు కాసేపు ఆలోచించి, ఆశువుగా ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం: అన్నాతిగూడ హరుడవె అన్నాతి గూడకున్న నసురగురుడవె అన్నా తిరుమలరాయా! కన్నొక్కటి మిగిలెగాని కౌరవపతివే! తిరుమలరాయడు భార్యతో కలసి సభలో కొలువుదీరాడు. భార్యతో కలసి ఉంటే, ఆమె రెండు కన్నులూ అతడి ఒంటికన్నూ కలసి మూడు కన్నులు. అందువల్ల ‘ఆమెతో కలసి ఉన్నప్పుడు సాక్షాత్తు ముక్కంటి అయిన పరమశివుడివేనని పొగిడాడు. పక్కన ఆమె లేనప్పుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడంతటి వాడివన్నాడు. వామనావతారంలో శ్రీమహావిష్ణువు దర్భపుల్లతో గుచ్చడంతో శుక్రాచార్యుడు ఒంటికంటితో మిగిలాడనే పురాణం అందరికీ తెలిసినదే. చివరి పాదంలో చెప్పినది వీటన్నింటినీ మించిన చమత్కారం. కన్నొక్కటి మిగిలిపోయింది గాని, లేకుంటే సాక్షాత్తు ధృతరాష్ట్రుడివేనన్నాడు. మహాభారతంలో గుడ్డిమారాజైన ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తిరుమలరాయడికి తెనాలి రామకృష్ణుడి శ్లేష అర్థంకాలేదు కాబట్టి సరిపోయింది. రామకృష్ణుడు తనను నిజంగా పొగిడాడనే భ్రమలో మురిసిపోయాడా పిచ్చిమారాజు. తిరుమలరాయడికి అసలు విషయం అర్థమై ఉంటే రామకృష్ణుడి కథ వేరేలా ఉండేది. అధికార పీఠాలపై ఉన్నవారిని తప్పనిసరిగా పొగడాల్సిన పరిస్థితులు తటిస్థిస్తే తెనాలి రామకృష్ణుడి మార్గమే సురక్షితమైనది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నమయ్య అనుసరించిన మార్గం అత్యంత ప్రమాదకరం. పెనుగొండ పాలకుడు సాళువ నరసింహరాయలు తన ఆస్థానంలో అన్నమయ్యకు ఆశ్రయం కల్పించాడు. అన్నమయ్య ఎంతసేపూ శ్రీనివాసుడిపైన కీర్తనలను గానం చేయడమే తప్ప ఏనాడూ తనకు ఆశ్రయం ఇచ్చిన రాజును పొగిడిన పాపాన పోలేదు. ఒకసారి సాళువ నరసింహరాయలకు ఎందుకో అన్నమయ్య చేత తనను పొగిడించుకోవాలనే దుగ్ధ కలిగింది. తనను పొగుడుతూ కీర్తనలను గానం చేయాలంటూ హుకుం జారీ చేశాడు. తిరుమలేశుని పరమభక్త శిఖామణి అయిన అన్నమయ్య అందుకు నిరాకరించాడు. ‘నరహరి పొగడగ నానిన జిహ్వ.... నరుల నుతింపగ నోపదు జిహ్వ’ అంటూ కరాఖండిగా మొండికేశాడు. ఈ నిరాకరణకు రాజైన సాళువ నరసింహరాయడి అహం దెబ్బతిన్నది. అన్నమయ్యను గొలుసులతో బంధించి, చెరసాలలో పెట్టించాడు. దైవకృప వల్లనో, మరెందు వల్లనో అన్నమయ్య ఆ తర్వాత సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది. అందువల్ల అధికారపీఠాన్ని అధిష్ఠించినవారిని పొగడక తప్పని పరిస్థితే ఏర్పడితే అన్నమయ్య మార్గం కంటే తెనాలి రామకృష్ణుడి మార్గమే మేలని వారి తర్వాతి తరాల బతకనేర్పరులందరూ ఏనాడో గ్రహించారు. అలాంటి బతకనేర్పరులు ఆనాటి రాచరిక కాలంలోనే కాదు, నేటి కార్పొరేట్ కాలంలోనూ ఉన్నారు. ఏ బాసుకు తగిన తాళాలను ఆ బాసు దగ్గర వాయిస్తూ ఇంచక్కా పబ్బం గడిపేసుకునే గడసరులు వారు. పొగడ్తలతో పనులు చక్కబెట్టుకోవడం కూడా ఒక కళ. ముఖస్తుతి కళలో ఆరితేరినవారిని మిగిలినవారంతా తప్పక ప్రశంసించి తీరాల్సిందే! సామాజిక బహుమతి ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి అర్ధసత్యం మాత్రమే! డబ్బును, డబ్బుతో కొనగలిగే వస్తువులను బహుమతులుగా ఇచ్చే ఆనవాయితీ చిరకాలంగా ఉన్నదే. ఇవన్నీ భౌతిక బహుమతులు. సామాజిక సామరస్యానికి ప్రశంసలే సోపానాలు. ప్రశంసకు డబ్బుతో పనిలేదు. ఎదుటివారిలోని సుగుణాలను, వారి ప్రతిభా పాటవాలను గుర్తించగలిగే సహృదయం ఉంటే చాలు. మనిషి సామాజిక జీవి. ప్రశంస ఒక సామాజిక కానుక. డబ్బుతో ముడిపడిన భౌతిక కానుకలు ఇవ్వలేని సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి మంచి ప్రశంసకు మాత్రమే ఉంది. ఒకవేళ భౌతిక కానుకలు ఇచ్చినా, వాటికి కొన్ని ప్రశంసలను జతచేరిస్తే కానుకలు ఇచ్చేవారికి తృప్తి, పుచ్చుకునేవారికి ఆనందం కలిగిస్తాయి. ‘అదిగో వినరా ఆ చప్పట్లు– ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సంఘటన’– సృజనాత్మక రంగంలోని కళాకారుల్లో మోతాదుకు మించి ఉండే గుర్తింపు కాంక్షకు అద్దంపట్టే డైలాగు ఇది– భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలోనిది. ప్రశంసలంటే మాటలే కాదు, చప్పట్లు కూడా. రసజ్ఞుల ఆమోదాన్ని వ్యక్తం చేసే కరతాళ ధ్వనులు కడుపు నింపవుగాని, కళాజీవుల మనసులు ఉప్పొంగేలా చేస్తాయి. ఎవరినైనా పొగడాలంటే భాషలో మాటలకు కరువులేదు. మరి పొగడటానికి మొహమాటమెందుకు? ఎదుటివారిలోని మంచిని గుర్తించి, మనసారా పొగడండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే హుందాగా స్వీకరించండి. ప్రశంసలూ ప్రయోజనాలూ... ప్రశంసలు విన్నప్పుడు ప్రశంసలు పొందినవారికి సంతోషం కలుగుతుంది. వారిలో తమను ప్రశంసించిన వారిపై సానుకూల భావనలు కలుగుతాయి. ఒకే చోట చదువుకునే సహాధ్యాయులు, ఒకే చోట పనిచేసే సహోద్యోగులు– అంతెందుకు, ఒకే ఇంట కాపురం చేసే భార్యాభర్తలు సందర్భోచితంగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉన్నట్లయితే, వారి మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, వారి పనితీరు కూడా మెరుగుపడుతుంది. పొగడ్తలకు జ్ఞాపకశక్తిని మెరుగుపరచే శక్తి ఉన్నట్లు జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన మనస్తత్వశాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొత్తగా కళలు, శాస్త్ర విషయాలు నేర్చుకునే వారికి తొలి దశలో పొగడ్తలు టానిక్లా పనిచేస్తాయని, మెదడులో అవి కలిగించే జీవరసాయన చర్యలు వారి జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రశంసల వల్ల మనుషుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. మనుషుల్లో పరస్పర సహకార ధోరణి అలవడుతుంది. ‘ఒక మంచి ప్రశంస చాలు, నేను రెండు నెలలు బతికేస్తాను’ అన్నాడు మార్క్ ట్వేన్. ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే గొప్పగా మరెవరూ చెప్పలేరు. తోటివారిని ప్రశంసించే సంస్కృతి సమాజంలో శాంతి సామరస్యాలకు దోహదపడుతుంది. ప్రశంసలు చిన్నపిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఏదైనా కొత్త పాఠం నేర్చుకున్నప్పుడు, ఏదైనా మంచిపని చేసినందుకు పిల్లలను ప్రశంసించడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రశంసలు పొందిన వారికి సంతోషం కలగడం సహజమే అయినా, ప్రశంసలు పొందిన వారి కంటే ప్రశంసలు కురిపించిన వారికే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగిడితే పోయేదేమీ లేదు... పొరపొచ్చాలు తప్ప! పొగడ్తలు పొందడాన్ని దాదాపు అందరూ ఆస్వాదిస్తారు గాని, ఇతరులను పొగడటానికి మాత్రం కొందరు తెగ ఇబ్బందిపడిపోతుంటారు. ఇంకొందరు అవసరం ఉన్నా, లేకున్నా ఎదుటివారిపై ఎడాపెడా పొగడ్తలు కురిపించేస్తుంటారు. అనవసరంగా పొగిడే అలవాటు ఉన్నవారు ఎక్కువగా అధికారంలో ఉన్నవారి చుట్టూ, అందగత్తెల చుట్టూ, అపర కుబేరుల చుట్టూ చేరుతుంటారు. పొద్దస్తమానం జోరీగల్లా వారి చెవుల్లో పొగడ్తల రొద పెడుతుంటారు. పొగడ్తలకు అలవాటు పడిన వారు ఒక్క పొగడ్త అయినా వినిపించని రోజున నిద్ర పట్టక, తిన్న తిండి సయించక నానా యాతన పడతారు. శ్రుతిమించితే పొగడ్త అగడ్తే అవుతుంది. అలాగని పొగడ్తలను తీసిపారేయడానికి లేదు. పొగడ్తలకు గల ప్రయోజనాలపై శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పొగిడితే పోయేదేమీ లేదు... మనుషుల మధ్య పొరపొచ్చాలు తప్ప. పొగడ్తలు మనుషుల మధ్య సఖ్యతను, సామరస్యాన్ని, పరస్పర సహకార ధోరణిని పెంచుతాయి. పిల్లలూ పెద్దలూ... మహిళలూ పురుషులూ... ఎలాంటి వారైనా పొగడ్తల ప్రభావానికి అతీతులు కారు. ప్రశంసలను ఎందుకు కోరుకుంటారు? సామాజిక జీవి అయిన మనిషి సమాజంలో ఒకరిగా మనుగడ సాగిస్తున్నా, తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటాడు. తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి, తన ప్రత్యేకతకు తగిన గుర్తింపును ప్రశంసల ద్వారా పొందడానికి అహరహం ప్రయత్నిస్తుంటాడు. మనిషి స్వభావమే అంత. గుర్తింపు కాంక్ష కొందరిలో కాస్త మోతాదుకు మించి ఉంటుంది. మోతాదుకు మించిన గుర్తింపుకాంక్ష ఉన్నవారే ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారు తిండి లేకపోయినా, పెద్దగా బాధపడరు గాని, ప్రశంసలు లేకపోతే తెగ కుంగిపోతారు. -
చపాతీ వెజ్ రోల్స్ చేయడం ఇంత సులువా?
చపాతీ వెజ్ రోల్స్ కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, టమాటో కెచప్ – 1 టీ స్పూన్, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్ వేసి ఉడికించాలి. అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. డేట్స్ హల్వా కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక బౌల్లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రింజాల్ రోల్స్ కావలసినవి: వంకాయలు (బ్రింజాల్) – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్ స్పూన్లు, క్యారెట్ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆలీవ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్రూట్ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా (థిన్ స్లైస్లా) కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్ చేసుకుని, టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మ -
ఆ విషయంలో భారత్దే తొలి స్థానం
ఇదివరకటి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి నామమాత్రంగా ఉండేది గాని, ఇటీవలి కాలంలో ఈ రంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో సైతం మహిళలు రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విద్యాభ్యాసంలో భారత మహిళలు ప్రపంచంలోనే ముందంజలో ఉంటున్నారు. అయితే, ఈ రంగాల్లో ఉపాధి పొందడంలో మాత్రం కొంత వెనుకబడి ఉండటమే నిరాశ కలిగిస్తోంది. అయినా, అడుగడుగునా ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమిస్తూ మన దేశానికి కొందరు మహిళలు శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తూ యువతరానికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశంలోని మహిళల స్థితిగతులు, ఈ రంగాల్లో రాణిస్తున్న కొందరు మహిళల గురించి తెలుసుకుందాం... శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న వారిలో ఎక్కువ సంఖ్యలో మహిళలు గల దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న మహిళలకు ఉపాధి కల్పించడంలో మాత్రం 19వ స్థానంలో ఉండటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) రంగాలలో సుమారు 2.80 లక్షల మంది శాస్త్రవేత్తలు ఉండగా, వీరిలో మహిళలు 14 శాతం మాత్రమే ఉన్నారు. ఈ రంగాల్లో పట్టాలు తీసుకుంటున్న మహిళలు పరిశోధనలకు దూరమవుతున్నారు. ఇది భారత్ ఒక్క దేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్తా చాటుకోవడానికి మహిళలకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా, వాటిని అధిగమించి తమ ప్రతిభ నిరూపించుకుంటున్న మహిళలూ ఉంటున్నారు. అలాంటి వారిలో మన దేశానికి చెందిన కొందరు నవతరం మహిళా శాస్త్రవేత్తల సంక్షిప్త పరిచయం... మురికివాడ నుంచి పరిశోధనల వైపు: షాలినీ ఆర్య ముంబై మురికివాడలో పుట్టి పెరిగిన షాలినీ ఆర్య ఆహార శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలోని ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సామాన్యులు చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటకాల్లో పోషకాలను మరింత పెంచడమే కాకుండా, అవి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉపకరించే సాంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతులను సామాన్యులకు మరింత చేరువ చేసే దిశగా ఆమె తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఆహార పదార్థాల్లో పోషకాల పెంపుదల, ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వచేసే సాంకేతిక పద్ధతులపై ఆమె రాసిన పరిశోధన వ్యాసాలు వివిధ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె శాస్త్రవేత్తగా ఎదిగిన తీరు శాస్త్ర సాంకేతిక విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది. షాలినీ తండ్రి రోజు కూలి. ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండేవారు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. తండ్రి షాలినికి ఐదేళ్ల వయసు వచ్చినా బడిలో చేర్చకుండా, ఆమె తమ్ముడిని బడిలో చేర్చాడు. తమ్ముడు రోజూ బడికి వెళుతుంటే తనకూ బడికి వెళ్లాలని ఉండేది. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తమ్ముడి వెనకే అనుసరిస్తూ బడికి చేరుకుంది. పాఠాలు వినాలనే ఆశతో తమ్ముడి తరగతి గదిలో టీచర్ టేబుల్ కింద నక్కింది. టీచర్ ఆమెను గమనించి, ఆమె తండ్రికి కబురు చేసింది. షాలినీని కూడా బడిలో చేర్చమని చెప్పింది. టీచర్ మాటపై షాలినీని బడిలో చేర్పించాడు. బడిలో చేరినా, షాలినీకి ఇంటి పనులు ఎప్పటి మాదిరిగానే ఉండేవి. ఇంటిల్లిపాదికీ వంట చేయడం ఆమె డ్యూటీనే. ఇంటి పనులన్నీ పూర్తయ్యాక చదువుకునేది. హైస్కూలు చదువు పూర్తయ్యాక ఇంజినీరింగ్ చదవాలనుకుంది. ఇంజినీరింగ్ మగపిల్లల కోర్సు, అది చదవొద్దన్నాడు తండ్రి. చివరకు తండ్రి ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేర్పించడానికి ఒప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తుండటంతో తనకు వంటావార్పు అంటేనే విసుగుపుట్టిందని, అయిష్టంగానే ఫుడ్ టెక్నాలజీలో చేరానని, అయితే, ఇందులో చేరిన తర్వాత త్వరలోనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, పూర్తిగా పరిశోధనల వైపు దృష్టి పెట్టానని చెబుతారు షాలినీ. బాల్యంలో పోషకాహార లోపంతో బాధపడిన తాను ఆహార శాస్త్రవేత్తను కాగలిగానని, ఇది తనకెంతో సంతృప్తినిస్తోందని అంటారామె. ఫుడ్ టెక్నాలజీ రంగంలో షాలినీ ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ నుంచి ‘మలాస్పినా స్కాలర్స్ అవార్డు’, భారత్లోని అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ నుంచి ‘యంగ్ సైంటిస్ట్ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను దక్కించుకున్నారు. రాయల్ సొసైటీలో దక్కిన చోటు: డాక్టర్ గగన్దీప్ కాంగ్ లండన్లోని ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా డాక్టర్ గగన్దీప్ కాంగ్ రెండేళ్ల కిందట ఈ అరుదైన రికార్డు సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఇంటస్టైనల్ విభాగం ప్రొఫసర్గా, వైరాలజీ నిపుణురాలిగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఆమె సాగించిన పరిశోధనలకు జాతీయంగా, అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు లభించింది. డయేరియా, రోటావైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె విశేషమైన కృషి చేశారు. రోటావైరస్ వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడంతో పాటు నోటి ద్వారా తీసుకునే పలు రకాల వ్యాక్సిన్ల పనితీరును మెరుగుపరచడంలో సత్ఫలితాలను సాధించి, ‘ఇండియాస్ వ్యాక్సిన్ గ్రాండ్మదర్’గా గుర్తింపు పొందారు. ప్రజారోగ్యం, వైరాలజీ, ఇమ్యూన్ రెస్పాన్స్ తదితర అంశాలపై ఆమె దాదాపు మూడువందలకు పైగా పరిశోధన వ్యాసాలను రాశారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో అవి ప్రచురితమయ్యాయి. గగన్దీప్ కాంగ్ సిమ్లాలో పుట్టారు. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి రైల్వేలో మెకానికల్ ఇంజినీర్. ఉద్యోగరీత్యా తండ్రికి తరచు బదిలీలు అవుతుండటంతో ఆమె చదువు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. చిన్న వయసు నుంచే ఆమెకు సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి ఉండేది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి ఇంట్లోనే చిన్నసైజు లాబొరేటరీని ఏర్పాటు చేశారు. పన్నెండేళ్ల వయసులోనే ఆమె ఇంట్లోని ల్యాబ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇంటర్ తర్వాత వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, మైక్రోబయాలజీలో ఎండీ, పీహెచ్డీ పూర్తి చేశారు. వైద్య పరిశోధనల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ పీఎన్ బెర్రీ ఫెలోషిప్, ఇన్ఫోసిస్ ప్రైజ్ సహా పలు అవార్డులు, సత్కారాలు దక్కాయి. కట్టుబాట్లను దాటి కోడింగ్ ప్రపంచంలోకి: కోమల్ మంగ్తానీ కోమల్ మంగ్తానీ కోడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టే మహిళలకు, బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ‘ఊబెర్’ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కోమల్ గుజరాత్లోని సూరత్లో కట్టుబాట్లతో నడుచుకునే సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. వారి కుటుంబాల్లో మగపిల్లలే ఉన్నత చదువులకు వెళ్లరు. ఇక ఆడపిల్లల పరిస్థితి వేరే చెప్పేదేముంది? అయితే, కోమల్ తల్లిదండ్రులు కూతురి కోసం తమ సామాజికవర్గం నుంచి ఎదురైన విమర్శలకు వెరవకుండా ఆమెను ఉన్నత చదువులు చదివించారు. సూరత్లోని ధరమ్సిన్హ్ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కోమల్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరారు. కొన్నాళ్లకు మంచి అవకాశాలు రావడంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఒరాకిల్, వీఎం వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆరేళ్ల కిందట క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ‘ఊబెర్’లో చేరారు. ఆ సంస్థ కోసం ‘ఊబెర్ ఈట్స్’, ‘ఊబెర్ రైడ్స్’, ‘ఊబెర్ ఫ్రైట్’, ‘జంప్ బైక్స్’ వంటి బిజినెస్ యాప్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోడింగ్ పరిజ్ఞానంలో మహిళలను, బాలికలను ప్రోత్సహించేందుకు ‘విమెన్ హూ కోడ్’, ‘గర్ల్స్ హూ కోడ్’ వంటి కార్యక్రమాలను ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఔత్సాహిక మహిళలకు, బాలికలకు కోడింగ్లో మెలకువలు నేర్పిస్తున్నారు. భట్నాగర్ పురస్కారం అందుకున్న తొలి మహిళ: అదితి సేన్ దే అదితి సేన్ దే దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు. భౌతికశాస్త్రంలో ఆమె పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రస్తుతం ఆమె అలహాబాద్లోని హరీశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీలో ఆమె విశేషమైన కృషి కొనసాగిస్తున్నారు. కోల్కతాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన అదితి చిన్ననాటి నుంచే సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తల్లి స్కూల్ టీచర్, తండ్రి పశ్చిమబెంగాల్ రాష్ట ప్రభుత్వోద్యోగి. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని బెథూనే కాలేజీ నుంచి మ్యాథమేటిక్స్ ఆనర్స్తో బీఎస్సీ పూర్తి చేసిన అదితి, తర్వాత అదే యూనివర్సిటీ పరిధిలోని రాజాబజార్ సైన్స్ కాలేజీ నుంచి అప్లైడ్ మ్యాథమేటిక్స్లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ చదువుకుంటుండగానే క్వాంటమ్, స్టాటిస్టికల్ ఫిజిక్స్పై పరిశోధనలు ప్రారంభించారు. భారత్లో కొన్నాళ్లు పరిశోధనలు కొనసాగించాక, పోలండ్లోని దాంజిగ్ వర్సిటీలో అవకాశం దొరకడంతో, అక్కడ చేరి పీహెచ్డీ పూర్తి చేశారు. తర్వాత జర్మనీలోని లీబ్నిజ్ యూనివర్సిటీలో కొంతకాలం, ఆ తర్వాత స్పెయిన్లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటానిక్ సైన్స్లో కొంతకాలం రీసెర్చ్ ఫెలోగా పరిశోధనలు సాగించారు. భారత్ తిరిగి చేరుకున్నాక ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కోరిలేషన్స్ అంశాల్లో అదితి చేసిన పరిశోధనలకు విశేషమైన గుర్తింపు లభించింది. సమాచార సాంకేతికతకు కొత్త పుంతలు: సునీతా సరావాగీ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో తనవంతు పాత్ర పోషించిన శాస్త్రవేత్త సునీతా సరావాగీ. ప్రస్తుతం ఆమె ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలోని సెంటర్ ఫర్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా లెర్నింగ్లో ఇన్స్టిట్యూట్ చైర్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దిశానిర్దేశం చేసిన కొద్దిమంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సునీతా సరావాగీ డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్ట్స్రాక్షన్ టెక్నిక్స్కు రూపకల్పన చేసిన తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ డేటాలోకి చేరిన పేర్లు, అడ్రస్ల డూప్లికేషన్ను తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను రూపొందించారు. సునీతా ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్డీ చేశారు. డేటాబేస్ మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో కీలకమైన మెషిన్ లెర్నింగ్కు సంబంధించిన అంశాలపై సునీతా సాగిస్తున్న పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఆమె ‘గూగుల్ రీసెర్చ్’కు విజిటింగ్ సైంటిస్ట్గా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా సేవలందిస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో సాగించిన పరిశోధనలకు గుర్తింపుగా ఆమెకు ‘ఇన్ఫోసిస్’ పురస్కారం సహా పలు అవార్డులు, బహుమానాలు దక్కాయి. బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న వైద్యురాలు: డాక్టర్ రోహిణీరావు చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో అత్యంత పిన్నవయస్కురాలైన వైద్యురాలు డాక్టర్ రోహిణీరావు. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఆమె వృత్తిగా ఎంచుకున్న వైద్యరంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడమే కాదు, తనకు గల రకరకాల అభిరుచుల కోసం కూడా ఆమె సమయం కేటాయిస్తారు. బోట్ సెయిలింగ్, భరతనాట్యం, రంగస్థల నటన, గుర్రపుస్వారీలోనే కాకుండా ‘భైరవముష్టి’ అనే ఒకరకమైన సంప్రదాయ యుద్ధక్రీడలో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ నైపుణ్యమే ఉంది. చెన్నైలోని చెంగల్పట్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువు సాగిస్తూనే సెయిలింగ్లో ఏడు చాంపియన్ షిప్లు సాధించారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక కావేరీ హాస్పిటల్లో ఇంటర్న్గా చేరారు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ రావడంతో అక్కడ ఎమ్మెస్సీ ఇంటర్నల్ మెడిసిన్ కోర్సులో చేరారు. అక్కడ చదువు పూర్తయ్యాక తిరిగి కావేరీ హాస్పిటల్లో చేరి, కిడ్నీ సమస్యలపై డాక్టరేట్ చేశారు. రోగులకు ఉల్లాసం కలిగించేందుకు ఆమె ‘మెడికల్ క్లౌనింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభించారు. నవ్వుతో చాలా సమస్యలు దూరమవుతాయని, రోగులను నవ్వించగలిగితే వారు త్వరగా కోలుకుంటారని రోహిణి చెబుతారు. మెడికల్ క్లౌనింగ్ నిపుణురాలిగా ఆమె అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. మారుమూల ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తూ, అక్కడి వైద్యసేవలు మెరుగుపరచేందుకు కూడా ఆమె తన కృషిని కొనసాగిస్తున్నారు. -
త్వరలో సంపన్నులకు మరణమే ఉండదు!
జీవితంలో మనుషులకు ఉండే నానా భయాల్లో ఎక్కువగా భయపెట్టేవి జరామరణ భయాలే! జరామరణాలనేవి లేకపోతే ఇక దేనికీ భయపడాల్సిన అవసరమే ఉండదనే భావన జనాల్లో చిరకాలంగా ఉంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఎంతగా అభివృద్ధి చెందినా, జరామరణాలను జయించే సాధనాలేవీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. కొంతకాలంగా వార్ధక్యాన్ని జయించే దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటి ఫలితాలు కొన్ని ఆశలనూ రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఇక చావుకు చెల్లుచీటీ రాసి పారేయొచ్చునని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు అమెరికన్ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్. మరో ముప్పయ్యేళ్లలోనే ప్రపంచంలోని సంపన్నులు మరణాన్ని జయించగలుగుతారని, ఆ తర్వాత ఇంకో ముప్పయ్యేళ్లకు పేద దేశాల్లోని ప్రజలు కూడా దీనిని సాధించగలుగుతారని చెబుతున్నారు. జరామరణాలపై తరతరాలుగా కొనసాగుతున్న భావనలు, వాటిని జయించడానికి జరుగుతున్న శాస్త్ర పరిశోధనలు, వాటిపై శాస్త్రవేత్తల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం... జరామరణాలను జయించడం మానవమాత్రుల వల్ల కాదనే ఇప్పటి వరకు మనకు తెలుసు. వివిధ మతగ్రంథాలు, పురాణాలు కూడా ఇదే సంగతి చెబుతున్నాయి. మృత్యువును జయించలేరు గనుకనే మానవులను మర్త్యులు అంటారు. జరామరణాలు లేని దేవతలు అల్లక్కడెక్కడో స్వర్గంలో ఉంటారని, అమృతపానం కారణంగా మృత్యువు వారి దరిచేరదని, అందువల్లనే వారు అమర్త్యులని ప్రస్తుతించాయి మన పురాణాలు. జరామరణాలకు సంబంధించి మన పురాణాల్లో అనేక ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మం మృతస్య చ‘ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి‘‘’’ – అంటే ‘పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం శోకించడం తగదు’ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ‘గీత’బోధ చేశాడు. స్వర్గంలో ఉండే దేవతలే కాదు, భూమ్మీద పుట్టిన వారిలోనూ కొందరు వరప్రభావంలో చిరంజీవులుగా ఉన్నట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. ‘‘అశ్వత్థామా బలిర్వా్యసో హనుమానశ్చ విభీషణః‘ కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః‘‘’’ అనే శ్లోకం ప్రకారం మన పురాణాలు పేర్కొన్న చిరంజీవులు ఏడుగురు. వారు: అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. పురాణాల సంగతి పక్కనపెడితే, ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం మనుషులను అత్యంత తీవ్రంగా భయపెట్టేది మరణ భయమేనని గుర్తించారు. మరణాన్ని జయించడానికి మనుషులు తరతరాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ప్రాచీన గ్రీకు రసవాదులు కొందరు మరణాన్ని నివారించగల ‘ఫిలాసఫర్స్ స్టోన్’ (వేదాంతుల శిల) తయారీకి విఫలయత్నాలు చేశారు. ‘లాపిస్ ఫిలాసఫోరమ్’గా గ్రీకు గాథలు ప్రస్తావించిన ఈ శిలకు నానా మహత్తులు ఉంటాయట. దీనిని తాకిస్తే, పాదరసం వంటి అల్పలోహాలు బంగారంగా మారిపోతాయట. దీని మహిమతో జరామరణాలను జయించడమూ సాధ్యమవుతుందట. గ్రీకుగాథలు ప్రస్తావించిన ఈ ‘వేదాంతుల శిల’ ఎవరి చేతికీ అందిన దాఖలాల్లేవు. అలాగే, దీని మహిమవల్ల చిరంజీవులైన వారు ఉన్నట్లు కూడా దాఖలాల్లేవు. పురాణగాథలు, వాటిలోని కల్పనలు ఎలా ఉన్నా, త్వరలోనే మనుషులందరూ చిరంజీవులు కావచ్చని ఆధునిక శాస్త్రవేత్తలు తమ భవిష్యత్ అంచనాలతో ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు మరణం అనివార్యం... పురాణాలు మొదలుకొని ఆధునిక శాస్త్ర పరిశోధనల ఇప్పటి వరకు చెబుతున్నదేమిటంటే, జీవులకు మరణం ఒక అనివార్యమైన దశ. పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. అనివార్యమైన మరణానికి కారణాలు సవాలక్ష. వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటి వాటి వల్ల కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, వీటిన్నింటినీ తప్పించుకున్న వారు వార్ధక్యం కారణంగా శరీరం వడలిపోయి, ఏదో ఒక సమయంలో రాలిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. జీవితంలో వార్ధక్యం ఒక సహజ పరిణామంగానే ఇటీవలి కాలం వరకు వైద్యనిపుణులు పరిగణిస్తూ వచ్చారు. అయితే, ఇరవయ్యో శతాబ్దిలో కొందరు వైద్య నిపుణులు వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని, దీనిని నయం చేయవచ్చనే వాదన లేవనెత్తారు. వార్ధక్యాన్ని నివారిస్తే, దాని వల్ల సంభవించే మరణాన్ని నివారించడం కూడా సాధ్యమేనని వారి వాదన. రాబర్ట్ ఎం పెరిమాన్ అనే అమెరికన్ వైద్యుడు తొలిసారిగా ఈ వాదన లేవనెత్తుతూ, 1954లో ‘ది ఏజింగ్ సిండ్రోమ్’ పేరిట రాసిన వ్యాసం ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ గేరియాట్రిక్ సొసైటీ’లో ప్రచురితమై, వైద్యరంగంలో చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా రేగిన ఈ చర్చతో కొందరు శాస్త్రవేత్తలు వార్ధక్యానికి మూలకారణం కనుగొనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో మొదటిగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన అనాటమీ ప్రొఫెసర్ లియొనార్డ్ హేఫ్లిక్ 1962లో కృతకృత్యుడయ్యాడు. మానవ శరీరంలోని ఒక్కో జీవకణం అంతరించిపోయేలోగా అది పొందే విభజనకు ఒక నిర్దిష్టమైన పరిమితి ఉంటుందని గుర్తించాడు. జీవకణాలు విభజన పొందే ప్రతిసారీ క్రోమోజోమ్ల చివర క్యాప్లా ఉండే ‘టెలోమెరిస్’ కుంచించుకు పోతూ ఉంటుందని, ఇది పూర్తిగా కుంచించుకు పోయాక జీవకణం మరిక విభజన చెందదని, ఈ ప్రక్రియ కారణంగానే వార్ధక్యం సంభవిస్తోందని వివరించాడు. హేఫ్లిక్ పరిశోధనతో వెలుగులోకి వచ్చిన వాస్తవాల నేపథ్యంలో మానవుల జీవకణాల్లోని క్రోమోజోమ్లను అంటిపెట్టుకుని ఉండే ‘టెలోమెరిస్’ కుంచించుకు పోవడాన్ని నిలువరించగలిగితే నిత్య యవ్వనం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అప్పట్లో ఈ దిశగా పరిశోధనలు సాగించేందుకు ప్రభుత్వాలేవీ నిధులు ఖర్చు చేయడానికి సుముఖత చూపకపోవడంతో ఈ అంశమై స్తబ్దత ఏర్పడింది. దాదాపు ఆరు దశాబ్దాల స్తబ్దత తర్వాత 2015లో ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వార్ధక్యాన్ని వ్యాధిగా పరిగణించడమే కాకుండా, దీనిని అధికారికంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఫలితంగా 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ‘వార్ధక్య సంబంధ వ్యాధుల’కు ఒక ఎక్స్టెన్షన్ కోడ్ కేటాయించింది. వార్ధక్యాన్ని వ్యాధి అనలేం వార్ధక్యం కూడా వ్యాధేననే వాదన కొందరు శాస్త్రవేత్తలు వినిపిస్తుంటే, వార్ధక్యాన్ని వ్యాధి అనలేమని ఇంకొందరు చెబుతున్నారు. భూమ్మీద ప్రస్తుతం నివసిస్తున్న సుమారు 770 కోట్ల మంది మనుషులూ తప్పించుకోలేని దశను వ్యాధిగా నిర్వచించడం సాధ్యం కాదని డెన్మార్క్లోని అర్హర్స్ యూనివర్సిటీ సెల్యులర్ ఏజింగ్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సురేశ్ రత్తన్ చెబుతున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం– వార్ధక్యం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, కొన్ని రకాల కేన్సర్లు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వయసు మళ్లే దశలో సర్వసాధారణంగా ఎదురవుతాయి. దాదాపు అరవై అయిదేళ్ల వయసు దాటిన తర్వాత చాలామంది ఇలాంటి వ్యాధుల బారిన పడతారు. అలాగని, వయసు మళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ జబ్బులు కచ్చితంగా వస్తాయని కూడా చెప్పలేం. ఒక్కోసారి యవ్వనంలో ఉన్నవారిలో సైతం ఈ జబ్బులు కనిపించడమూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల వార్ధక్యాన్ని వ్యాధిగా పరిగణించడం సాధ్యమయ్యే పనికాదు. గెరాంటలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా 2019లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, రకరకాల కేన్సర్లు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వార్ధక్యంలో కొంత సర్వసాధారణంగా తలెత్తేవే అయినా, నేరుగా వీటికి వార్ధక్యంతో సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. కేవలం వార్ధక్యం కారణంగానే ఈ వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయనడానికి కూడా ఇదమిత్థమైన ఆధారాలేవీ లేవని కూడా వారు వెల్లడించారు. శరీరంలో జరిగే జైవిక ప్రక్రియలు వార్ధక్యానికి మూలకారణం అవుతుంటే, ఇలాంటి వ్యాధులన్నీ వాటివల్ల తలెత్తే పర్యవసానాలు మాత్రమేనని వారంతా అభిప్రాయపడ్డారు. మనిషి మరణాన్ని జయించే కాలం ఎంతో దూరంలో లేదనే అంచనాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వార్ధక్యం, దాని ఫలితంగా సంభవించే మరణం సహజ పరిణామాలేనని బలంగా నమ్ముతున్న శాస్త్రవేత్తలు కూడా తమ వాదనను వినిపిస్తుండటం గమనార్హం. గేరియాట్రిక్ నిపుణులు చెబుతున్న దానిబట్టి మనుషులు గరిష్ఠంగా నూట ఇరవై ఏళ్ల వరకు బతకగలుగుతారు. భారతీయ జ్యోతిషశాస్త్రంలోని వింశోత్తరి పద్ధతిలో జీవితంలో ఎదురయ్యే గ్రహ దశల పూర్తి నిడివి కూడా నూట ఇరవై ఏళ్లే. నానా రకాల వ్యాధులను జయించి మనుషులు గరిష్ఠ ఆయుర్దాయం వరకు జీవించగలుగుతారో, ఫ్యూచరాలజిస్టుల అంచనా మేరకు చిరంజీవులుగా మారుతారో వేచి చూడాల్సిందే! 2045 ఈనాటికి మెదడును యంత్రాలకు అనుసంధానించడం సాధ్యమవుతుంది. 2050 ప్రపంచంలోని సంపన్నులు తమ మెదళ్లను రోబోలతో, కంప్యూటర్లతో అనుసంధానం చేయించుకోగలుగుతారు. 2060 సంపన్న దేశాల్లోని మధ్యతరగతి ప్రజలు, కార్మిక వర్గాల వారు కూడా తమ మెదళ్లను రోబోలతో, కంప్యూటర్లతో అనుసంధానం చేయించుకోగలుగుతారు. 2070 పేద దేశాల్లోని సామాన్యులు సైతం తమ మెదళ్లను కంప్యూటర్లతో అనుసంధానించ గలుగుతారు. 2080 మనుషులందరూ మరణాన్ని జయిస్తారు. రోబో శరీరాల్లో జీవితాన్ని కొనసాగించగలుగుతారు. రోబో శరీరాలకు ప్రభుత్వాలే సబ్సిడీ కల్పిస్తాయి. ‘ప్రపంచంలో నిశ్చయమైనవి రెండే రెండు. ఒకటి: చావు, రెండు: ప్రభుత్వం విధించే పన్నులు’ అని అమెరికన్ రాజనీతిజ్ఞుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏనాడో చమత్కరించాడు. పన్నులనేం చేయలేం గాని, చావుకు చెల్లుచీటీ రాసేయడానికి ఇంకెంతో కాలం వేచి చూడక్కర్లేదంటున్నారు ఫ్యూచరాలజిస్టులు. మరణాన్ని జయించగలిగే మార్గాలను కూడా వారు ప్రతిపాదిస్తున్నారు. మరణాన్ని జయించడానికి ముచ్చటగా మూడు దారులు ఉన్నాయని చెబుతున్నారు అమెరికన్ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్. అవి: శరీర అవయవాలకు పునర్యవ్వనం కల్పించడం, ఆండ్రాయిడ్ రోబో శరీరాలను ఆశ్రయించుకుని జీవితాన్ని కొనసాగించడం, జెనెటిక్ ఇంజనీరింగ్లో వివిధ పద్ధతుల ద్వారా జీవకణాలు వయసుమళ్లడాన్ని నిరోధించడం ద్వారా శరీర అవయవాలకు పునర్యవ్వనం కలిగించడం సాధ్యమవుతుందని, దీని ద్వారా మరణాన్ని జయించడం సాధ్యమవుతుందని డాక్టర్ పియర్సన్ చెబుతున్నారు. శరీరంతో యథాతథంగా నవయవ్వనంగా ఉంటూ, మరణాన్ని జయించడం సాధ్యం కాకుంటే, మన మెదళ్లను ఆండ్రాయిడ్ రోబోలకు అనుసంధానించడం ద్వారా రోబో శరీరాల్లో జీవితాన్ని కొనసాగించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇలా కాకుంటే, మెదళ్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా వర్చువల్ జీవితాన్ని చిరకాలం కొనసాగించవచ్చు. చావుకు చెల్లుచీటీ రాసే ప్రక్రియలో డాక్టర్ పియర్సన్ అంచనా ఇదీ... - ఈ లెక్కన డాక్టర్ పియర్సన్ అంచనా నిజమైతే, మరో అరవయ్యేళ్లకు ప్రపంచంలోని మనుషులందరూ చిరంజీవులే అవుతారు. ఇదివరకటి విఫలయత్నాలు మెసపొటేమియన్ పురాణగాథల ప్రకారం గిల్గమేష్ అనే వీరుడికి ఎన్కిడు అనే మిత్రుడు ఉండేవాడు. వయసు తీరకుండానే ఎన్కిడు మరణించాడు. ఎన్కిడు మరణం తర్వాత గిల్గమేష్ తనకు అలాంటి దుస్థితి వాటిల్లకూడదనే ఉద్దేశంతో మరణాన్ని జయించడానికి కఠోర ప్రయత్నాలే చేశాడు. ఈ క్రమంలో ఎదురైన రెండు పరీక్షల్లో అతడు విఫలమవడంతో మరణాన్ని జయించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఈ కథ క్రీస్తుపూర్వం 2600 నాటి ‘ఎపిక్ ఆఫ్ గిల్గమేష్’లోనిది. మరణాన్ని జయించేందుకు మనుషులు చేసే ప్రయత్నాలను వర్ణించిన తొలి గాథ ఇదే. పురాణగాథల సంగతి సరే, పురాతన చరిత్రను తరచిచూస్తే, మరణాన్ని జయించే యత్నాలు చేసినవారు లేకపోలేదు. చైనా తొలి చక్రవర్తి కిన్ షి హువాంగ్ వయసు మళ్లిన దశలో జరామరణాలను జయించడానికి విఫలయత్నాలు చేశాడు. తన ఆస్థానంలోని జుఫు అనే రసవాది ఆధ్వర్యంలో నవయవ్వన ఔషధాన్ని అన్వేషించడం కోసం వందలాది మందిని ప్రపంచం నలుమూలలకూ పంపాడు. వార్ధక్యంలో జ్ఞాపకశక్తి క్షీణించడంతో అతని ఆస్థాన వైద్యుల సలహాపై పాదరసంతో కూడిన మాత్రలను అతిగా వాడటం వల్ల అర్ధంతరంగానే కన్నుమూశాడు. మరణాన్ని జయించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తిగా క్రీస్తుపూర్వం 259–210 కాలంలో చైనాను పరిపాలించిన కిన్ షి హువాంగ్ చరిత్రలో నిలిచిపోయాడు. -
నేనేం క్షుద్ర పూజలు చేయలేదు..
‘‘ప్రెసిడెంట్ గారూ... ప్రెసిడెంట్ గారూ...’’ ఆయాసపడుతూ పిలిచింది యాభైయేళ్ళ లలిత. ‘‘ఏమైంది? ఎందుకిలా కట్ట కట్టుకొచ్చారంతా?’’ సైన్యంలా దండెత్తినట్లు వచ్చిన కాలనీ స్త్రీలను అడిగాడు ఆ కాలనీ ప్రసిడెంట్ ప్రసాదరావు. ‘‘అంత సింపుల్గా ఏమైందంటారేంటండి? మీకు చీమైనా కుట్టినట్లు లేదు...’’ అంది గృహిణి నీలిమ. ‘‘ఈయన పట్టించుకోడని నేనెప్పుడో అన్నా... మీరు ఇంటేగా!’’ గుంపుల్లోంచి అన్నారెవరో. ‘‘దేని గురించో చెప్తేనే కదా తెలిసేది’’ తన్నుకొస్తున్న ఆవేశాన్ని తమాయించుకుని అడిగాడు ప్రసాదరావు. ‘‘దిష్టి తీసిన నిమ్మకాయల్ని ఎవడో ఇంట్లో విసిరేస్తున్నాడని చెప్తే పట్టించుకున్నారా? ఇవాళేం జరిగిందో తెలుసా...’’అంటూ భద్రకాళి అయిపోయింది లలిత. ‘‘ఏం జరిగిందండి?’’ విస్మయం చెందాడు ప్రసాదరావు. ‘‘మా మందార చెట్టు వాడిపోయిందండీ... మా పిల్లలకు జ్వరం కూడా వచ్చింది...’’ అంటూ భోరుమంది. నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి అందులో పసుపు, కుంకుమ, ఉప్పు, ఎండు మిరపకాయలను కలిపి ఎవరో రోజూ కొన్ని బాల్కనీల్లో విసిరేసి వెళ్తున్నారు. లలిత ఈ విషయాన్ని కాలనీ ప్రెసిడెంట్ ప్రసాదరావు కు ఫిర్యాదు చేసింది. అదేమంత సమస్య కాదనుకొని పట్టించుకోలేదతను. ‘‘ఏ మూల నిమ్మకాయలు విసిరేశాడోనని పొద్దున్నే లేవాలంటే భయం వేస్తుంది’’ కన్నీళ్లు తెచ్చుకుందో బామ్మ. ‘‘ఏ మంత్రాలు చదువుతున్నాడో, క్షుద్ర పూజలు చేస్తున్నాడో తెలీక వణుకొచ్చేస్తుందనుకోండి. మా పని మనిషైతే రాలేనని మొండికేసింది.’’ తన బాధ చెప్పుకుంది ఒకామె. ‘‘ఇదిట్టా తేలే వ్యవహారం కాదుగాని పోలీస్ కంప్లయింట్ ఇద్దాం...’’ అన్న మాటకు కంగుతిన్నాడు ప్రసాదరావు. ‘‘మన మోడల్ కాలనీకో సంఘం ఉందని మర్చిపోయారా? ఏ సమస్యొచ్చినా విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామన్న సంగతి తెలుసుకదా?’’ అంటూ గుర్తు చేశాడు. ‘‘అవన్నీ మాటలకేనండి... ఇవాళ మా ఇంట్లో చెట్టు వాడిపోయింది, పిల్లలకి జ్వరం వచ్చింది. రేపు ఇంకెవరన్న ఇంట్లో ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు?’’ పైట కొంగును బొడ్డులో దోపుకుంటూ కోప్పడింది లలిత. ఇంతలో, ‘‘ఏవండీ...’’ అనే గావుకేక వినిపించడంతో ఇంట్లోకి పరిగెత్తాడు ప్రసాదరావు. ఏమైందోనని ఆడవాళ్ళంతా అతను వెళ్ళినవైపే అయోమయంగా చూస్తుండిపోయారు. ఈశాన్యం దిక్కు చూస్తూ నిలబడిన భార్యవైపు దృష్టి సారించాడు. అక్కడ దిష్టి తీసిన దండ ఒకటి పడుండడాన్ని చూసి భీతిల్లాడు. దేవుని పటానికి పెట్టిన పువ్వు కింద పడినప్పుడో, పటం కొద్దిగా పగిలినప్పుడో, దిష్టి తీయడానికి వేరుగా పెట్టిన నిమ్మకాయల్ని తన భార్యకు తెలీకుండా వాడినప్పుడో అతని భార్య కీడుని శంకించిన సంఘటనలు అతని స్మృతిపథంలో మెదిలాయి. వాళ్ళ ప్రమేయం లేకుండా దిష్టి తీసిన నిమ్మకాయలు ఇంట్లో కనిపించడంతో ఈ సమస్యెంత జటిలమైందో అర్థమైందతనికి. ‘‘నేనిలా అవుతుందనుకోలేదు. మన సమస్యను మనమే పరిష్కరించు కుందాం.’’ స్థిర నిర్ణయానికొస్తూ చెప్పాడు. ‘‘ఆడెవడో కచ్చితంగా పట్టుకుని తీరాలి. ఏం చేద్దామో చెప్పండి...’’ అంది నీలిమ. ‘‘ఉదయమే నాలుగు గంటలకల్లా లేచి పేపర్ బాయ్స్పై కన్నేసి ఉంచుదాం. ఇంటి అద్దెల కోసమంటూ తిరిగే వాళ్ళ మీద నిఘా పెడదాం. రోజూ మన కాలనీ స్ట్రీట్ కెమెరాల డేటా చూద్దాం. అప్పుడు వాడెవడో తెలిసిపోతుంది.’’ ఎవరెవరు ఏమేమి చేయాలో ప్రసాదరావు పురమాయించడంతో మహిళలంతా అక్కణ్ణుంచి నిష్క్రమించారు. వాడెవడో పట్టుకోవాలని, వాడెందుకు ఈ పని చేస్తున్నాడో తేల్చేయ్యాలన్న కసితో కాలనీ స్త్రీలు వారం రోజులపాటు కాపలా డ్యూటీ చేశారు. వారి నిరీక్షణకు తెర దించుతూ అతను సుబ్బారెడ్డిగారి స్ట్రీట్ కెమెరాలో చిక్కాడు. అతన్ని గుర్తుపట్టిన సుబ్బారెడ్డి గారు, ఎవరింట్లో అద్దెకు ఉంటాడో సమాచారం ఇచ్చారు. అతని రెక్క పట్టుకుని కమ్యూనిటీ భవనం వద్దకు తీసుకురావడంతోఆత్రుతగా కమ్యూనిటీ భవనం దగ్గరకు జనం చేరుకున్నారు. హరీష్ అనే పాతికేళ్ల కుర్రాడు ఈ పని చేస్తున్నాడంటే కాలనీ వాసులెవ్వరికీ నమ్మబుద్ధి కాలేదు. అతని వెనక ఎవరో ఉండి చేయిస్తున్నారనే అనుమానం మొగ్గ తొడిగింది. నిమ్మకాయలు విసురుతున్న దృశ్యాలను అతనికి చూపించారు. వాటి వంక చూసి నవ్వాడు హరీష్. అతనెందుకు నవ్వాడో అర్థంకాక, ‘‘దొంగ సచ్చినోడా! నిమ్మకాయలు విసురుతావా?’’ అంటూ లెంపకాయ వేసింది లలిత. ‘‘నీ పాడె కట్ట! కుక్కలు నీ పీనుగెత్తుకెళ్ళ! నాశనమైపోతావురా...’’ అంటూ శాపనార్థాలు పెట్టింది ఒకామె. ఆవేశపడొద్దని వాళ్లని శాంతపరిచిన ప్రసాదరావు, ‘‘అందరూ ఎంత కోపంగా ఉన్నారో చూశావుగా... నేను ‘ఊ’ అంటే వీళ్లందరూ నిన్ను కొట్టి చంపేస్తారు. చెప్పు, ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు?’’ అని బెదిరించాడు. ‘‘ఎవ్వరూ చేయించలేదండి! నేనే చేశానండి!’’ బెదరకుండా నిర్భయంగా చెప్పాడు హరీష్. ‘‘చేతబడి ఏమైనా చేస్తున్నావా? లేక క్షుద్ర పూజలు చేస్తున్నావా? నిజం చెప్పు... ఈ కాలనీ వాళ్లేం చేశారు?’’ ద్వేషంతో సాధించలేనిది ప్రేమతోనే సాధించగలమని భుజంపై చేయి వేసి, ప్రేమగా హరీష్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సుబ్బారెడ్డి. ‘‘మీరందరూ చేస్తే తప్పు లేదుకాని నేను చేస్తే తప్పొచ్చిందా?’’ హరీష్ మాటలు వాళ్ళను ఆశ్చర్యపోయేలా చేశాయి. ‘‘అంటే...’’ అర్థంకాక అడిగాడు సుబ్బారెడ్డి. ‘‘ఏదన్నా శుభకార్యం జరిగినా, పండుగొచ్చినా, కారు కొన్నా, బైక్ కొన్నా, హాస్పిటల్ నుంచి తిరిగొచ్చినా ఎందుకు గుమ్మడి కాయల్ని పగలగొడతారు? పసుపు, కుంకుమ కలిపిన నిమ్మకాయల దండను బయటెందుకు పారేస్తారు?’’ప్రశ్నించాడుహరీష్. ‘‘దిష్టి తీయడానికలా చేస్తారు... ఆ మాత్రం తెలీదా?’’ అన్నాడు సీనియర్ సిటిజన్ నారాయణ. ‘‘ఎందుకు తీస్తారు తాతగారు?’’ చేతులు కట్టుకుని అడిగాడు హరీష్. ‘‘ఎందుకు తీయడమేంటిరా... చెడు జరక్కూడదని, పాపిష్టి కళ్లు మన మీద పడకూడదని, అంతా మంచే జరగాలని చేస్తారు. నీకెవ్వరూ చేయలేదా ఏంటి?’’ కఠినంగా స్పందించాడు నారాయణ. ‘‘నేను చేసిందీ అదే కదండీ! నాకు చెడు జరగకూడదని దిష్టి తీసుకున్నాను.’’ వినయంగా అన్నాడు హరీష్. ‘‘ఒరేయ్ వెధవా! నీ దిష్టి మీ ఇంట్లో తీసుకో... అంతేకాని నిమ్మకాయలు విసురుతావా? నువ్వు చేసే క్షుద్ర పూజలకు మాఇంట్లో మందార చెట్టు వాడిపోయిందిరా...’’ అంటూ హరీష్ జుట్టు పట్టుకున్నాడు లలిత భర్త సూర్యం. ‘‘నేనేం క్షుద్ర పూజలు చేయలేదు. నీళ్లు లేకే వాడిపోయిందది.’’ విడిపించుకునే ప్రయత్నం చేశాడు హరీష్. ‘‘సూర్యం గారూ! మీరాగండి! వాడి మాటల వెనకేదో ఆంతర్యం ఉంది. చూడు హరీష్... నా కొడుకూ నీయంతే ఉంటాడు. వాడిలాగే చేస్తే నేనెంతో బాధపడతాను. మనం చేసిన పనికి కన్నవాళ్ళను దోషుల్ని చేస్తుంది సమాజం. ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు హరీష్...’’ సూర్యం బందీ నుంచి అతన్ని విడిపించి ప్రేమగా అడిగాడు ప్రసాదరావు. ఉత్కంఠగా చూడసాగారు జనం. హరీష్ నోరు విప్పాడు. ‘‘ఈ కాలనీలో రెండేళ్ల నుంచి ఉంటున్నా సార్. హైదరాబాదుకు రాగానే చిన్న ప్రైవేటు కంపెనీలో జాయిన్ అయ్యాను. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని సంవత్సరం తర్వాత మానేశాను. ప్రభుత్వ ఉద్యోగం మా అమ్మ కల! అందుకనే దాచుకున్న జీతం డబ్బులతో పరీక్షలకు సిద్ధమవుతున్నాను. కోచింగు కోసమని వీధిగుండా వెళ్ళేటప్పుడు దిష్టి తీసిన దండలు కాళ్లకు అడ్డంగా తగిలేవి. నాకెందుకొచ్చిందని మరో వీధిగుండా వెళ్ళేవాడిని. ఏ వీధిగుండా వెళ్లినా రోజూ ఇలానే ఉండేది. మొన్న పండక్కయితే ప్రతి ఇంటిముందు, షాపుముందు బోల్డన్ని గుమ్మడికాయలు నేలకేసి కొట్టి ఉన్నాయి. అందరి ఇళ్లల్లోని కార్లు నిమ్మకాయాల్ని తొక్కేశాయి. రోడ్డును రెండుపక్కలా వాటి చెత్తతో నింపేశారు. అంటే మీ ఇళ్లల్లో ఉండే దిష్టేమో బయటికి పోవాలి. మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి. బయటోడు ఏమైపోయినా ఫర్వాలేదు, అంతేగా...’’ అన్న హరీష్ మాటలకు కొంతమంది భుజాలు తడుముకున్నారు. ‘‘తర్వాతి రోజైనా వాటిని డ్రైనేజీలోగాని, పబ్లిక్ డస్ట్బిన్లోగాని వేస్తారా? లేదే! మున్సిపాలిటి వాళ్లొచ్చి తీసేంత వరకు ఎవ్వరికీ పట్టదు. అవి మీ ఇంట్లో కనిపిస్తే భయపడిపోతున్నారే... నాలాగా రోడ్డు మీద తిరిగేవాళ్లెంత భయపడాలి? మీ చెడు అంతా బయటోళ్లకు అంటుకుపోవాలి. ఇవేం తెలీనట్లు మీరు కార్లలో తిరుగుతారు!’’ చుట్టూ చూశాడు హరీష్. జనం గుసగుసలాడుకోసాగారు. ‘నిజమే కదా’ అనికొందరు,‘ఈ విషయం ఆలోచించదగినదే’ అని కొందరు అనుకోవడంతో వాతావరణమంతా అతనికి అనుకూలంగా మారింది. ‘‘సంవత్సరం నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా సార్. సెలెక్ట్ కావడం లేదు. నా నెత్తిమీద ఏదో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చొంది. ఆ దరిద్రాన్ని తరిమేయ్యాలని, నాకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని రోజూ దిష్టి తీసుకుంటున్నా సార్’’ అతనెందుకలా చేస్తున్నాడో వివరించాడు హరీష్. సమాజాన్ని పీడించే సమస్య అందరిళ్లల్లో జరుగుతున్నప్పుడు ఎవ్వరూ నోరు మెదపరు. ఏదో ఒక సందర్భంలో దిష్టి తీసి గుమ్మడికాయల్ని పగలకొట్టడమో, నిమ్మకాయల్ని తొక్కించడమూ చేసిన వాళ్లే కావడంతో వాదించడానికి ధైర్యం చేయలేదెవరూ... హరీష్ చెప్పింది విన్నాక, ‘‘చూడు హరీష్! నీకు నీవు మీ ఇంటిముందు దిష్టి తీసుకో! ఎవ్వరూ కాదనరు. ఎప్పుడో ఒకసారి దిష్టి తీసుకుంటారుకాని ఎవరూ రోజూ తీసుకోరు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకోసారి చేశావంటే కటకటాల వెనక్కి వెళ్తావ్, గుర్తుంచుకో!’’ అంటూ హెచ్చరించాడు ప్రసాదరావు. ‘‘మీకింకా అర్థంకాలేదు సార్! నేను దిష్టి తీసుకుని, ఆ నిమ్మకాయల్ని మీ ఇళ్లల్లో వేయడం లేద్సార్. ఎవరింటి ముందు వాళ్లు దిష్టి తీసి పడేసిన వాటినే మళ్లీ వాళ్ల ఇంట్లోకే విసిరేస్తున్నాను. అదృష్టమైనా, దురదృష్టమైనా ఎవరిది వారిదే కదా సార్!’’ అసలు రహస్యం చెప్పడంతో అందరూ మిన్నుకుండిపోయారు. వాళ్ళ ఇంట్లో తీసిన దిష్టే మళ్లీ వాళ్లింట్లోకి వస్తుందనేసరికి తమ గతాన్ని తడుముకున్నారు. కొందరిలో పశ్చాత్తాప భావన గోచరించి అతనిని పనిని అభినందించారు. ‘‘నువ్వు చెప్పెంతవరకూ నాకూ తట్టలేదు. ఇంత ధైర్యానికెలా ఒడిగట్టావ్?’’ అడిగాడు సీనియర్ సిటిజన్ నారాయణ. ‘‘తాతయ్యగారూ! నేనే డైరెక్ట్గా చెప్తే ఎవ్వరూ నా మాట వినరు. తిట్టి పంపించేస్తారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి. కాని నేను చెప్పింది మాత్రం ఆలోచించండి...’’ చేతులు రెండూ జోడిస్తూ అభ్యర్థించాడు హరీష్. విషయమంతా బహిర్గతం కావడంతో, ‘‘హరీష్ చెప్పిన దాంట్లోనూ నిజముంది. చిన్న వాడైనా చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం చెప్పండి!’’ కాలనీవాసుల అభిప్రాయాన్ని అడిగాడు కాలనీ ప్రెసిడెంట్ ప్రసాదరావు. తమ తప్పును ఎవరైనా వేలెత్తి చూపితే భుజబలం చూపించడం మానవ నైజం! అదే మానవుడు, సమాజంవైపు వేలెత్తి చూపితే మౌనమే సమాధానమవుతుంది. ‘తెలిసో తెలియకో చేస్తున్న పనిని తప్పుగా పసిగట్టిన హరీష్ మాటలను అనుసరించాలా? లేక తమ అభిమతాల్నే నేరవేర్చుకోవాలా?’ అనేది చాలామంది తేల్చుకోలేకపోయారు. ‘‘మన నమ్మకాలను వదలొద్దు. మూఢనమ్మకాలను వదిలేద్దాం. ఏమంటారు?’’ హరీష్కి సపోర్ట్ చేశాడు నారాయణ. ‘‘ఈరోజు నుంచి ఎవరికున్న పరిధిలలో వారు పూజలూ, శుభకార్యాలు చేసుకుందాం. విశాలమైన మన వీధుల్ని అపవిత్రం చేయకుండా ఉందాం.’’ అంటూ ముందుకొచ్చాడు సుబ్బారెడ్డి. ‘‘దిష్టి తీసుకున్నాక వాటిని మన ఇంటి ఆవరణలోనే ఓ మూలాన చిన్న గొయ్యి తవ్వి అందులో వేసుకుందాం. అప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.’’ పరిష్కారం సూచించాడు సూర్యం. ‘‘మన కాలనీ సఖ్యత దృష్ట్యా ఇతనికే నా ఓటు! నాతోపాటు ఓటు వేసే వాళ్లెవరో చేయి ఎత్తండి...’’ అన్న ప్రసాదరావు అభ్యర్థనకు కాలనీ వాసులంతా తమ సమ్మతిని తెలియజేయడంతో మార్పుకు సంకేతంగా హరీష్ పెదవులు విచ్చుకున్నాయి. - దొండపాటి కృష్ణ -
పాతిక శాతం పాపం అమెరికాదే!
భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ఓ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి అనంతమైనది. అత్యద్భుతమైనది. ప్రకృతి వనరులే ఏ జీవికైనా ప్రాణప్రదాలు. భూగోళం అంటే మట్టి మాత్రమే కాదు. శతకోటి జీవరాశులకు.. జీవవైవిధ్యానికి పుట్టిల్లు. మనుషులకు మాత్రమే కాదు.. మొక్కలు, జంతువులు, చేపలు, పక్షులు, వానపాములు, పురుగులు, సూక్ష్మజీవులు.. ఇంకా ఎన్నెన్నో జీవజాతులకు ఇదే ఆవాసం. మానవ జాతి సంతతి పెరుగుతున్న కొద్దీ.. ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ప్రకృతి వనరుల వినియోగం విచక్షణారహితంగా పెరిగిపోతోంది. ఈ లోటును ఏ యేటి కాఏడు తిరిగి పూడ్చుకునే శక్తిని సైతం భూగోళం కోల్పోయింది. 1970 నుంచి గాడి తప్పింది. ప్రకృతి వనరులపై మనుషుల వత్తిడి 1970–2014 మధ్యకాలంలో రెట్టింపైంది. ఎండలు, తుపానులు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాల సంఖ్య, తీవ్రత ఏటేటా పెరిగిపోతున్నాయి. జీవవైవిధ్యం గతమెన్నడూ లేనంత వేగంగా నశిస్తోంది. పక్షులు, చేపలు, ఉభయచరాలు తదితర జీవుల సంతతి ఇప్పటికే 68%కి పైగా ఈ కాలంలో నశించిందని ఒక అంచనా. ఇప్పటి మాదిరిగా ప్రకృతి వనరుల వాడకం తాకిడిని తట్టుకోవటానికి ఒక్క భూగోళం చాలదు, 1.6 భూగోళాలు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మూలుగను పీల్చేయటం ఇదే రీతిలో కొనసాగితే 2050 నాటికి మనకు మూడు భూగోళాలు అవసరం అవుతాయి. కానీ, ఉన్నది ఒక్కటే! అందుకే, పెను ప్రమాదంలో పడిన పుడమిని రక్షించుకోవాలి. భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ‘పుడమి సాక్షిగా..’ పేరిట చిరు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ముచ్చటా మూడు లక్ష్యాలు.. 1. భూతాపం పెరగటం వల్ల కలుగుతున్న దుష్ఫలితాల గురించి తెలియజేయటం. 2. పర్యావరణ సంబంధమైన ముప్పు నుంచి బయటపడటానికి ఎవరి వారు చేయదగిన పనులను సూచించడం, సాధించగల లక్ష్యాలతో పనిచేయడానికి ప్రజలను ప్రేరేపించటం. 3. చేపట్టిన పనుల్లో పురోగతిని గురించి అందరం నిరంతరం అనుభవాలను పంచుకుంటూ, పరస్పరం ప్రోత్సహించుకునేందుకు దోహదపడటం. ఈ కృషిలో భాగమే మీ చేతుల్లో ఉన్న ప్రత్యేక ‘ఫన్డే’ సంచిక. పుడమిని ప్రభావితం చేసే వివిధ ఆలోచనలను, ప్రకృతికి అనుకూలమైన కొన్ని పనుల గురించి ఇందులో చర్చిస్తున్నాం. ‘సాక్షి’ టీవీలో ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్ కార్యక్రమం ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రసారం అవుతుంది. భూగోళం క్షేమం కోసం పాటుపడే ఎందరో ఎర్త్ లీడర్స్, నిపుణులు, ప్రముఖులు, ప్రకృతి ప్రేమికులు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకుంటారు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా దీక్షతో కొనసాగించాలని ‘సాక్షి’ కంకణం కట్టుకుంది. www.pudamisakshiga.com వెబ్సైట్ ప్రారంభమైంది.. మీరూ పాలుపంచుకోండి.. రండి.. ‘పుడమి సాక్షిగా..’ ప్రణామం చేద్దాం.. మన కోసం మారుదాం.. కలసి కట్టుగా కదులుదాం.. భూతాపం పెచ్చుమీరటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించుకోవటానికి ఉన్నంతలో పూనికతో పనిచేయాలని ప్రపంచ దేశాలు ప్రతిన బూని ‘పారిస్ ఒడంబడిక’ చేసుకొని ఐదేళ్లు గడచిపోయాయి. ఆ లక్ష్యాలు కూడా అరకొరే. అవి కూడా అమలవుతున్నది అంతంత మాత్రమే. తత్ఫలితంగా 2019 వరకు గడచిన ఐదేళ్లూ ఏటేటా భూతాపం అత్యధిక స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కరోనా వచ్చి మనల్ని నెలలకొద్దీ ఇళ్లకే పరిమితం చేసింది కాబట్టి, 2020లో భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు అంతకుముందు ఏడాది కన్నా 7% తగ్గాయి. అయితే, ఇది తాత్కాలికమే. ఈ గండం గడిస్తే, భూతాపోన్నతి కథ మళ్లీ మామూలేనా? వ్యక్తులు, ప్రభుత్వాల ప్రవర్తనలో ఏమైనా గుణాత్మకమైన మార్పు వచ్చే వీలుందా?? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పారిస్ ఒడంబడికకు మించి.. పారిశ్రామిక విప్లవ యుగానికి ముందు అంటే.. 1880ల నుంచి ఇప్పటికి 1.2 డిగ్రీల సెల్షియస్ మేరకు భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగింది. పారిస్ ఒడంబడికలో కుదిరిన అంగీకారం మేరకు ప్రపంచ దేశాలు ప్రకృతి వనరుల వాడకం తగ్గించుకుంటే ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు మించదని భావించారు. అయితే, వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను బట్టి చూస్తే 2100 నాటికి 2.6 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరుగవచ్చంటున్నారు. అయితే, ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాల్లో విప్లవాత్మక మార్పు తేకుండా ఇలాగే కొనసాగితే వచ్చే 80 ఏళ్లలో భూతలంపై ఉష్ణోగ్రత 3.2% (2.9–3.9%) వరకు పెరిగే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరి పాపం ఎంతెంత? 2020లో వెలువడిన ఉద్గారాలు కొంచెం తక్కువైనా.. ఇప్పటికే వాతావరణంలో పోగు పడి ఉన్న హరిత గృహ వాయువులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్లనే, గడచిన ఏడాది కూడా అడవులు తగలబడటం, కరువులు, తుపానులు, మంచుకొండలు కరిగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగిందే గానీ తగ్గలేదు. అడవుల నరికివేత వంటి భూమి వినియోగ పద్ధతి మార్చటం వల్ల వెలువడిన ఉద్గారాలను ఇందులో కలపనే లేదు. ఎంత ‘అభివృద్ధి’ చెందిన వారమైతే ప్రకృతికి అంత ఎక్కువగా చేటు చేస్తున్నాం. ప్రపంచ జనాభాలో 50% ఉన్న పేదల మూలంగా వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల కన్నా.. జనాభాలో 1% ఉన్న అతి సంపన్నులు చేస్తున్న ప్రకృతి వ్యతిరేక పనుల వల్ల వెలువడే ఉద్గారాలే ఎక్కువ అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (యుఎన్ఇపి) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ నివేదిక చెబుతోంది. 2019 ఉద్గారాలు 59 బిలియన్ టన్నులు యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ నివేదిక 2020 ప్రకారం.. 2019లో భూగోళం ఉపరితల వాతావరణంలోకి చేరిన (బొగ్గు పులుసు వాయువుతో సమానమైన) కర్బన ఉద్గారాలు 59.1 గిగా టన్నులు. 59.1 గిగా టన్నులంటే 59.1 బిలియన్ టన్నులు (ఇంకా విడమర్చి చెప్పాలంటే.. 5,910 కోట్ల టన్నులు). 2019లో ప్రపంచ ఉద్గారాలలో మన దేశం వాటా 7%. గత పదేళ్లలో విడుదలైన ఉద్గారాలలో 55% మన దేశంతోపాటు చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలే కారణమని యుఎన్ఇపి నివేదిక తెలిపింది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. కరోనా నేర్పిన గుణపాఠంతోనైనా ఇది సాధ్యమవుతుందా? ప్రకృతికి హాని కలిగించే నాలుగు పనుల్లో కనీసం ఒక్కదాన్నయినా మానుకోగలుగుతామా అని పర్యావరణ శాస్త్రవేత్తలు మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2050 నాటికి ఉద్గారాలను భూగోళానికి, మన జీవనానికి ప్రమాదం లేని స్థాయికి తగ్గించుకోవటానికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని 51% ఉద్గారాలను వదులుతున్న 127 దేశాలు చెబుతున్నాయి. అయితే, ఈ మాటలు ఆయా దేశాల పారిశ్రామిక, ఇంధన, వ్యవసాయ తదితర తక్షణం అమల్లోకి తేగల విధానాల్లోకి ఎంతవరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. ఏం చెయ్యగలం? ఆశ ఇప్పటికీ బతికే ఉంది. భారత్ సహా కాలుష్య కారక దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో పెనుమార్పులు చేసుకొని ఇప్పటికైనా ఏటా 7.2% మేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలి. 2030 నాటికల్లా వార్షిక ఉద్గారాలు 25% తగ్గించుకోవాలి. తద్వారా వచ్చే పదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతను 3.2 డిగ్రీల నుంచి 2 డిగ్రీలకు పరిమితం చేసుకోగలిగే అవకాశాలు 66% మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జరగాలంటే.. ప్రపంచ దేశాలు విద్యుత్తు వాడకంలో నైపుణ్యం పెంచుకోవాలి. సౌర, పవన విద్యుత్తుల వినియోగం వైపు మళ్లాలి. పరిశ్రమలు పునరుత్పాదక ఇంధనాల వాడకం దిశగా కదలాలి. మీథేన్ విడుదల తగ్గించాలి. వాహన కాలుష్యం తగ్గించడానికి రవాణా రంగంలో విద్యుత్తు, సౌర విద్యుత్తుతో నడిచే వాహనాల సంఖ్య పెంచాలి. వ్యవసాయ, నిల్వ పద్ధతులు ప్రకృతికి అనుగుణంగా మారాలి. ఆహార వృథాను తగ్గించాలి. మాంసాహారం తగ్గించి శాకాహారంపై ఎక్కువ ఆధారపడటం నేర్చుకోవాలి. అడవుల నరికివేత ఆపి, అడవుల విస్తీర్ణం పెంచాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి. ప్రతి టెర్రస్పైనా సేంద్రియ ఇంటిపంటల సాగు విస్తరించాలి.. ఇలా చేస్తే నగరాల్లో గాలి నాణ్యత, నీటి లభ్యత పెరుగుతాయి. జీవవైవిధ్యం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతాయి. ఏతావాతా చెప్పేదేమంటే.. ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగా ప్రతి ఒక్కరి ఆలోచన, జీవనశైలి ప్రకృతికి అనుకూలంగా మారాలి. మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవికమైన ఉద్గారాల తగ్గింపు చర్యలను తక్షణం అమల్లోకి తేగలగాలి. అప్పుడే మనతోపాటు భూగోళంపై సమస జీవుల మనుగడ మరీ అధ్వాన్నమైపోకుండా మిగులుతుంది. ఇందుకోసం ‘పుడమి సాక్షిగా’ ప్రతిన బూని, పూనికతో కదులుదాం. - పంతంగి రాంబాబు భూతాపోన్నతి అంటే? మనం చేసే పనుల వల్ల పంచభూతాలు కలుషితం అయిపోతున్నాయి. బొగ్గు, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించటం వల్ల కలుషిత వాయువులు (కర్బన ఉద్గారాలు) వాతావరణంలో విడుదలై భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలోకి చేరిన ఉద్గారాలకు ప్రతి ఏటా మరికొన్ని ఉద్గారాలు తోడవుతున్నాయి. వాటి పరిమాణం అంతకుముందు ఏడాది కన్నా ఎక్కువగానే ఉంటున్నది. వాతావరణంలోకి చేరిన ఈ హరిత గృహ వాయువులు భూతాపానికి కారణమవుతున్నాయి. భూమి పై నుంచి వేడిని అనంత విశ్వంలోకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటూ ఉన్నాయి. అందువల్ల భూగోళం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఉష్ణోగ్రత అసహజంగా పెరిగిపోతోంది. దీన్నే భూతాపోన్నతి (క్లైమెట్ ఛేంజ్) అంటున్నాం. మనుషులందరూ భూతాపం పెరుగుదల నిదానించేలా చేయగలిగితేనే భవిష్యత్తులో మనతోపాటు సకల జీవరాశి మనుగడా బాగుంటుంది. ప్రకృతికి హాని కలిగిస్తున్న పనులేవో గుర్తించి, వాటిని తగ్గించుకోవటం ఒక్కటే మార్గం. కాలుష్య ప్రతాపం కనీసం 300 ఏళ్లు మనిషి సగటు జీవిత కాలం మహా అయితే వందేళ్లు. కానీ, మనిషి వల్ల భూమ్మీద ఏర్పడుతున్న కలుషిత వాయువుల జీవిత కాలం అంతకు 3 నుంచి 10 రెట్లు ఎక్కువ. ఏ ఏడాది భూతల వాతావరణంలోకి చేరే కర్బన ఉద్గారాలు ఆ యేడాదే అంతమైపోవు. కనీసం 300 నుంచి 1,000 ఏళ్ల పాటు వాతావరణంలోనే తిష్ట వేసి భవిష్యత్తు తరాలకు చుక్కలు చూపిస్తాయి. పారిశ్రామిక యుగం (క్రీ.శ.1750) ప్రారంభమైనప్పటి నుంచి కర్బన ఉద్గారాల విడుదల మొదలైంది. తొలి పారిశ్రామిక దేశం యునైటెడ్ కింగ్డమ్. కాలుష్య కారక తొలి దేశం కూడా ఇదే. క్రీ.శ. 1751లో మొదటి ఏడాది వాతావరణంలోకి యు.కె. వెలువరించిన కర్బన ఉద్గారాలు దాదాపు కోటి టన్నులు. ప్రపంచ దేశాలన్నిటి ఇప్పటి ఉద్గారాల కన్నా 3,600 రెట్లు తక్కువ. అప్పటి నుంచీ పారిశ్రామికీకరణ అన్ని దేశాలకూ విస్తరించింది. జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలూ పెరుగుతున్నాయి.. ఏటేటా అంతకు ముందెన్నడూ లేనంతగా కర్బన ఉద్గారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పాతిక శాతం కాలుష్య పాపం అమెరికాదే! యు.కె.తో ఉద్గారాల జాతర మొదలైనా ఆ తర్వాత కాలంలో పారిశ్రామికీకరణలో అమెరికా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అతి ఎక్కువగా కాలుష్య కారక వాయువులను విడుదల చేస్తూ వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ క్రీ.శ. 1751 నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకూ విడుదల చేసిన (క్యుములేటివ్ ఎమిషన్స్) ఉద్గారాల్లో 25% బాధ్యత అమెరికాదే. ఈ 269 ఏళ్లలో అమెరికా అత్యధికంగా దాదాపు 400 బిలియన్ టన్నుల ఉద్గారాలను వాతావరణంలోకి వదిలింది. అమెరికా ఉద్గారాల్లో సగం మేరకు వదిలిన చైనా రెండో స్థానంలో ఉంది. 22%తో 28 ఐరోపా దేశాల కూటమి మూడో స్థానంలో ఉంది. కాలుష్య పాపం చారిత్రకంగా చాలా తక్కువే అయినప్పటికీ, ఇవ్వాళ ఎక్కువగా ఉద్గారాలు వదులుతున్న దేశాల జాబితాలోకి భారత్, బ్రెజిల్ కూడా చేరుకున్నాయి. చైనా, అమెరికా, ఐరోపా యూనియన్లోని 28 దేశాల తర్వాత మన దేశమే అత్యధికంగా ఉద్గారాలను వెలువరిస్తోంది. గత దశాబ్ద కాలంలో వెలువడిన ఉద్గారాల్లో 55% ఈ 31 దేశాల నుంచి వెలువడినవే. అప్పుడు, ఇప్పుడూ కూడా అతి తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న ఖండమేదైనా ఉందీ అంటే అది ఆఫ్రికా మాత్రమే. -
మగపిల్లాడు ఏడ్వాలి, ఆడపిల్ల విరగబడి నవ్వాలి
కొడుకును, కూతురుని సమానంగా పెంచితే రేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకుంటారు. ‘ఏంటా ఏడుపు ఆడపిల్లలా?’ ‘యెస్.. నేను అబ్బాయిని అయితే ఏంటి? నాకూ ఏడ్వాలని ఉంటుంది’ ‘అమ్మాయిలు కార్లు, బైక్ల గురించి ఆలోచించరు’ ‘తప్పు.. కార్లు, బైకుల బొమ్మలతో నాకూ ఆడుకోవాలనుంటుంది’ ‘పింక్ మా ఇద్దరికీ ఫేవరెట్ కలర్ అవచ్చు కదా! చిల్ ఇట్స్ జస్ట్ ఏ కలర్!’ ‘మా ఇద్దరికీ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఓడిపోయినా.. కిందపడి కాళ్లు కొట్టుకుపోయినా!’ ‘ఇంటి పని నేనూ నేర్చుకోగలను’ ‘మా ఇద్దరికీ ఒకే రకమైన కలలు ఉండొచ్చు కదా.. ఆకాశంలో పైపైకి ఎగరాలని.. నడుము తిప్పుతూ డాన్స్ చేయాలని.. సూపర్ హీరో కావాలని.. స్టయిల్గా ఉండాలని..!’ ‘మేమిద్దరం ఒకరితో ఒకరం పోటీ పడగలం.. గెలవచ్చు.. ఓడిపోనూవచ్చు. అయితే మాత్రం ఇద్దరిలో ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ కాదు కదా.. ఇద్దరం సమానమే!’ డియర్ పేరెంట్స్.. ఇవన్నీ ఒప్పుకోవడం మీక్కొంచెం కష్టంగా ఉండొచ్చు. కాని మా మనసులో మాటలవి. కాబట్టి మీరు రూల్స్ పెట్టాలనుకుంటే మా ఇద్దరికీ సమానమైన రూల్స్ పెట్టండి. మీరు పెరిగినట్టుగా కాకుండా మేం పుట్టినట్టుగా మమ్మల్ని సమంగా పెంచండి.’ ఇది పిల్లల (కూతురు, కొడుకు) వినతి పెద్దలకు. జెండర్ ఈక్వాలిటీ మీద ‘ఫ్లిప్కార్ట్’ యాడ్ అది. ‘జాతీయ బాలికా దినోత్సవం’ అంటే పరోక్షంగా లింగ వివక్షను రూపుమాపే కార్యక్రమం. అబ్బాయిని అమ్మాయి సరసన నిలబెట్టడం. అన్నింట్లో ముందు ఉండాలనే స్ఫూర్తి అమ్మాయికి సహజం. వెసులుబాటు దొరకాలేగానీ అబ్బాయిల అచీవ్మెంట్స్ను అమ్మాయిలు అలవోకగా అందుకోగలరు. వ్యోమగామిగా రోదసీ యాత్రలో పాలుపంచుకోవడాన్ని ఉదహరించుకోవచ్చు. కాని అమ్మాయిలు చేసే పనులనే అబ్బాయిలు అందుకోవడం లేదు. ఇది అలవాటు చేసి, వాళ్లకు ఆ వెసులుబాటు కల్పించే అవగాహన కోసమే ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ అయినా ‘జాతీయ బాలికా దినోత్సవం’ అయినా! మగపిల్లాడు ఏడ్వాలి.. ఆడపిల్ల విరగబడి నవ్వాలి. వంట పని అమ్మ పేటెంట్ కాదు అని అబ్బాయి గ్రహించగలడు. నాన్న సహాయంతో ఇంటి పనీ నేర్చుకోగలడు. సైకిల్ వేసుకొని అమ్మాయి బయటి పనులు చక్కదిద్దుకొస్తుంది. నీటి వసతిలేని చోట కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోయడానికి అమ్మాయి చదువును కట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కండబలం ఉన్న కొడుకు ఆ నీళ్లు తేగలడు. కోడిగుడ్లు వంటి పౌష్టికాహారం అమ్మాయికీ కావాలి. ఇంటి పనిలో అబ్బాయికి, ఆస్తిలో అమ్మాయికి వాటాలు ఉండాలి. వీటన్నిటి సాధనకు దశాబ్దాలు వేచే సమయం లేదు. గంటలు సెకన్లుగా పరిగెడుతున్న కాలం. ‘తెలియదు’, ‘మా వరకు రాలేదు’ అని తప్పించుకునే వీలున్న వర్తమానం కాదు. సమస్త సమాచారాన్ని, కనీస అవగాహనను అందరికీ సమంగా పంచుతున్న టెక్నాలజీ యుగం. ఈ నాగరికతలో కుల, మత, వర్ణ, ప్రాంత భేదాలతోపాటు లింగ వివక్షా తీవ్రమైన నేరం, అనాగరికం. ఆ జ్ఞానాన్ని లెక్కచేయక ఛాందసాన్ని అనుసరిస్తూ ఆడపిల్లను అడుగున పెడితే చక్కదిద్దే బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది. కరోనా బాధితుల్లో మగవాళ్లే ఎక్కువ ఉన్నట్టుగా. మానవజాతి మనుగడకు ప్రాణం పోసేది మహిళే కాబట్టి.. ఆ మహిళలను రక్షించుకోవడం ప్రకృతికి బాగా తెలుసు. అపోహ కాదు ఇది శాస్త్రీయ అధ్యయనాలు రుజువు చేసిన సత్యం. దీన్ని గ్రహించి కొడుకును, కూతురుని సమానంగా పెంచితే రేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకుంటారు. -
అమ్మా.. ఎండెప్పుడొస్తుందమ్మా?
మన ఊరిచివర (కిందటేడు వ్యాపారం గురించి కలకత్తాకి వెళ్తూ వెళ్తూ దార్లో అకస్మాత్తుగా చచ్చిపోయిన) మనూరి పాత మొఖాసాదార్గారి తోటలో ట్రంకురోడ్డుకి పక్కగా. చీకటిమర్రి చెట్టుకింద ఒంటిగా నిల్చున్న పాడుపడ్డ గదిలో కాపరం ఉంటూ, ఊళ్ళో ఇంటింటికి తిరిగి తిరిగి అప్పడాలు ఒడియాలు అమ్ముకు బతికే శారదమ్మగారి ఆరేళ్ళ కూతురు–సుందరం–ఓ రోజు సాయంకాలం వాళ్ళమ్మని... ‘‘అమ్మా, అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది. సాయంకాలం చాలా చీకటిగా, చాలా భయంగా, మరో ఘడియలోనో క్షణంలోనో మనింటికి రాబోయే చావులా ఉంది. మూడ్రోజుల పాటు మన్నూ మిన్నూ ఏకమైపోయినట్టనిపించి ఇవాళ నాలుగోరోజు ఉదయానికి కాస్త తెరపిచ్చిందే కాని ఆకాశం మాత్రం రవ్వంత మేరయినా విడవకుండా మబ్బుతో దట్టంగా మూసుకుపోయే ఉంది. వర్షంతో పాటు ఈ మూడ్రోజులు చలిగాలి కూడా ప్రచండంగా వీచివీచి నానా భీభత్సం చేసింది. ఈరోజు మాత్రం గాలి బాగా సద్దుమణిగింది. శారదమ్మ గది వెనక నున్న పాతతోటలో చెట్లన్నీ కూడా పగవాడు తెరిపివ్వకుండా తీసిన పిడుగు దెబ్బకి తట్టుకోలేక చెల్లాచెదురైపోయి అలిసిపోయిన మరింక కదల్లేక శవాల్లా ఉండిపోయిన బీదవాళ్ళ కోటలోని పేదజనంలా ఉన్నాయి. ‘‘అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది సుందరం. కూతురు వేసిన ప్రశ్న శారదమ్మ వినిపించుకోలేదు. ఆవిడ, ఆ కిటికీల్లేని చీకటిగది గుమ్మం ముందున్న సన్నపాటి నడవలో కూర్చొని పాత హరికెన్లాంతరు చిమ్నీ బీటలు విడిపోకుండా నెమ్మదిగా భద్రంగా తుడుస్తోంది. సుందరం తన ఆరేళ్ళ జీవితంలోనూ కూడా ఇంత గాలీవర్షం ఎన్నడూ ఎరగదు. మొదటిరోజున సరదా పడ్డది కాని రెండో రోజు రాత్రికల్లా ఆ పిల్లకి భయం పట్టుకుంది. మూడోరోజల్లా ఈ వర్షం మరింక తగ్గదు కాబోలు. ఎండ మరింక రాదు కాబోలు అనుకొని బెంగ పెట్టేసుకొని ఏడుస్తూ కూర్చుంది. ఈరోజు పొద్దున్నించీ కూడా వర్షం లేకపోవడంతో ఆమెక్కొంచెం ధైర్యం వచ్చింది. కాని, ఎండ తప్పక రేపొస్తుందని అమ్మ కూడా చెప్తే కాని ఆ పిల్లకి పూర్తిగా నమ్మకం కదురదు. ‘‘అమ్మా! ఎండమ్మా ఎండ! ఎండ ఎప్పుడొస్తుందమ్మా?’’ అని మళ్ళీ అడిగింది సుందరం. సుందరానికి ఎండంటే ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్న పైనింకా ఉన్నప్పుడు, రెండేళ్ళ కిందట, కార్తీక మాసంలో వాళ్ళ నాన్నతోనూ అందరితోనూ కలిసి సుందరం వనసంతర్పణకి వెళ్ళింది. నాన్నతో మిల్లులో పన్చేసే మిగతా పనివాళ్ళూ, వాళ్ళ ఆడవాళ్ళూ, పిల్లలు అంతా కూడా వచ్చేరారోజున. బంగారంలాంటి ఎండని ఆ ఒక్కరోజే చూసింది. అక్కడ కొండవార రాజుగారి పువ్వులతోటలో అంతా చీకటిలోనే వెళ్ళి దిగి అక్కడ వండుకొని తినుకొని, ఆడుకొని, పాడుకొని రోజు రోజుల్లా హాయిగా గడిపేరు. ఆవేళ పొద్దున్నే కొండ మీంచి నెమ్మదిగా కిందికి జారిన ఎండ నీలపు పొగమంచుతో కలిసిపోయి నెమ్మదిగా పురివిప్పగా మెరిసే నెమలిపింఛంలా మెరిసింది. పదిగంటలకి ఎండ వెచ్చగా వెచ్చగా ఉంటూ కమ్మగా వండిన వంటవాసనల్తో కలిసిపోయి అన్నం తినిపించే అమ్మచూపులా హాయిగా ఉంది. ఒంటిగంటకి బాగా తళుకెక్కిన ఎండ కొత్త వెండిగిన్నెలా తళతళ మెరిసింది. ఎండంటే సుందరానికి ఎంతో ఇష్టం. కాని, ఎండని సరిగ్గా చూడ్డానికి ఆ పిల్లకి ఎప్పుడో కాని అవకాశం ఉండదు. శారదమ్మ ఊళ్ళోకి పోకపోతే ఆవిడకి దినం గడవదు. అంచేత, సుందరం ఇంటిపట్టునే ఉండితీరాలి. ఇంటి కాపలా ఉండి, చెల్లెల్ని చూసుకోవాలి. అన్నయ్య ఎక్కడికీ పారిపోకుండా చూసుకోవాలి. వాళ్ళుండే గది వెనక కొండదాకా కొండదాకా ఉన్న పాతమామిడితోట ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. నాలుగైదేళ్ళయి ఆ తోట పూతా లేదు. కాపూ లేదు. ఎదరగా ఉన్న రోడ్డెక్కూడా రెండు వైపుల్నించీ ఎత్తుగా దట్టంగా కుమ్ముకున్న చెట్లతో అదో పొడవాటి గుహలా ఉంటుంది. సుందరం ఉండే పాతగదికి వీధి వైపుకి ఒక్క గుమ్మం తప్ప కిటికీల్లేవు. గదంతా చాలా చీకటిగా ఉంటుంది. గదికి ఎదురుగా కొంచెం పక్కగా ఉన్న పాతమర్రిచెట్టు. కదల్లేని ముసలిరాక్షసిలా చీకటిగా భయంకరంగా ఉంటుంది. కిందనున్న గదిలోకి ఒక్కచుక్కయినా రానీకుండా ఎండను అదే మింగేస్తుంది. ఇంట్లో ఎంతగా రాదో అంతగా రావాలి సుందరానికి. చుట్టుపక్కల మైలు దూరంలో ఎక్కడా ఇళ్ళులేవు. రోడ్డు మీద జనసంచారం కూడా అట్టే ఉండదు. అమ్మ లేనప్పుడు వీధి గుమ్మంలో చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకొని బితుకూ బితుకూ కూర్చుంటుంది సుందరం. ఆ పిల్ల ముఖంలో స్పష్టంగా కనిపించేవి కళ్ళే. మర్రిచెట్టుకి చాలా అవతల మిగిలిపోయిన ఎండ ఆ కళ్ళలో బలహీనంగా మెరుస్తుంది. ఆ పిల్లనోరు, చలిగాలికి ముడుచుకుపోయిన గులాబి మొగ్గలా చాలా చిన్నదిగా ఉంటుంది. గట్టిగా గెంతినా నవ్వినా ఆమెకు దగ్గొస్తుంటుంది. ప్రాణంతో ఉన్న సుందరానికి నీడగా పడిన సుందరంలా ఉంటుంది సుందరం. అందుకే ఆ పిల్లని చూస్తూ చూస్తూ ‘ఈ నీడ ఎప్పుడు మాయమైపోతుందో’నని శారదమ్మ అప్పుడప్పుడు భయపడుతూ ఉంటుంది. వర్షం పడిన మూడ్రోజులూ ఎక్కడికీ పోకుండా శారదమ్మ ఇంటిపట్టునే ఉండిపోయింది. సుందరానికి అది కొంచెం నయం అనిపించింది. ఇవాళ వర్షం పళ్ళేదు. రేపు ఎండ రాదా అనుకొంది సుందరం. ఆకాశంలోని మబ్బులు కొత్త బలాన్ని తెచ్చుకొంటున్నాయని ఆ పిల్ల గ్రహించుకోలేదు. కాని, ఆకాశం వైపు చూస్తే మాత్రం ఆమెకి బెంగ తగ్గడం లేదు. ‘‘అమ్మా! అమ్మా! ఎప్పుడొస్తుందమ్మా ఎండా?’’ అంటూ తల్లి భుజం పట్టుకు ఊపుతూ మళ్ళీ అడిగింది సుందరం. ‘‘రేపు రావచ్చు తల్లీ!’’ అంది శారదమ్మ చిమ్నీ నెమ్మదిగా తుడుస్తూనే. ‘‘ఎండొస్తుందమ్మా?’’ ‘‘ఎందుకు రాత్తల్లీ?’’ శారదమ్మ అలా అనగానే సుందరం ఎగిరి గంతేసి, తల్లి పక్కనే కూర్చున్న నాలుగేళ్ళ చెల్లెలు సరూతో, ‘‘చెల్లీ! చెల్లీ! రేపు ఎండొస్తుందిటే. ఎండ!! మరంచేత దేవుడికి దండం పెట్టమ్మా!’’ అంది. సరూ, అక్కమాట వినగానే ఆ పిల్ల వీధి వైపు తిరిగి ముద్దుగా ఓ దండం పెట్టింది. సుందరం చెల్లెల్ని ముద్దాడి, అక్కణ్నుంచి గదిలోకి పరిగెట్టింది. ఆ చీకట్లో గోడవార కర్రపెట్టె మీద కూర్చున్న అన్న దగ్గరికి వెళ్ళి, ‘‘అన్నా! ఒరే! ఎండరా ఎండ! ఎండ రేపొస్తుందిట!’’ అంటూ సంతోషంతో కేకలు వేసింది. అన్న–అంజిగాడు సుందరం కంటే రెండేళ్లు పెద్ద. వాడికి కాళ్లూ చేతులూ పెద్దవిగా ఉంటాయి. తల మాత్రం చెంబులా చిన్నదిగా ఉంటుంది. వాడు ఎండా, నీడా అంటే తెలుసుకోలేడు. అన్నం కలుపుకు తినలేడు. వాడికి మాటలు రావు. వాడు వెర్రివాడు. వాడెప్పుడూ ఆ కర్ర పెట్టె మీదే కూర్చుంటాడు. లేపోతే దాని మీదే పడుకుంటాడు. ఎప్పుడూ నోట్లో వేలు పెట్టుకు కనిపిస్తాడు. సుందరం గెంతుకుంటూ తడిపరికిణీ పరపరలాడించుకుంటూ సరూ దగ్గిర కొచ్చి, ‘‘లేవే సరూ! రేపు ఎండొచ్చేదాకా ఆటకుందాం రావే’’ అంటూ చెల్లెల్ని చెయ్యిపట్టుకు లేవదీసింది. ఇద్దరూ రంయిమంటూ నడవ మీంచి వాకిట్లోకి గెంతి, అక్కడ నిలవనీళ్లలో చప్పట్లు కొడుతూ ఆడ్డం మొదలుపెట్టేరు. ‘‘ఎండొస్తుందీ. రేపు ఎండొస్తుందీ! నెమిలికన్నులా. వెండిగిన్నెలా ఎండొస్తుందీ! ఎంతోచక్కని ఎండోస్తుందీ!’’ అంటూ సుందరం పాడే పాట శారదమ్మ చెవిలో పడుతోందేకాని, ఆవిడ అదేదీ సరిగా వినడం లేదు. శారదమ్మకి దేవుడి యెడల భక్తెక్కువ. ఎన్ని విషయాల్లో భగవంతున్ని ఎంత ఎడం పెట్టినా, ఆవిడ మాత్రం ఆయన ముగింట కదలకుండా మొండిగా కూర్చుంది. ఏడాది కిందట, ఆవిడ పెనిమిటి తను పనిచేసే మిల్లు తాలుకు లేబర్ వ్యవహారాల్లో కూలివాళ్ల తరపున తగువుల్లో ఇరుక్కొని దెబ్బలాటల్లో చిక్కుకొని, ఖూనీ కేసుల్లో అక్రమంగా ఈడవబడ్డ, యావజ్జీవ కారాగారవాసశిక్ష అనుభవించడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకు దేవుడంటే కొంచెం–అతి కొంచెం చిరుకోపం వచ్చింది. ‘‘మీ అల్లుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. పిల్లలకి తిండి పెట్టాలంటే ఇంట్లో చీకటి తప్ప ఇంకేంలేదు. మాయందు దయ ఉంచి ఒక్కసారి రా నాన్నా!’’ అంటూ ఎందరి చేత ఎన్ని కబుర్లు పంపినా, ఎన్ని అర్జంటు టెలిగ్రాములు కొట్టినా ఎంతకీ రానట్టి డబ్బుగల తండ్రి మీద పేదింటి కోడలైన ఆడకూతురికి కోపం వచ్చి అలిగినట్టు ఆమె ఆ రాత్రి భగవంతుడి మీద కోపం తెచ్చుకుని అలిగింది. కాని ఆ కోపంలో కాఠిన్యం లేదు. మర్నాటికల్లా ఆమె సర్దుకుంది. ∙∙ ఆవిడ రాత్రికి దీపం సంపాదించడంలో గొడవలో మునిపోయింది. లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టి బాగా నానిపోయింది. పుల్లలు చూస్తే మూడే ఉన్నాయి. అందులో రెండప్పుడు వెలక్కుండా ఒట్టిపోయి విరిగిపోయేయి. మూడోది–దేవుడి దయుంటే వెలుగుతుంది. లేకపోతే లేదు. ఈరోజుకి దేవుడికి శారదమ్మ యెడల దయలేదు. ఈ రాత్రికి ఈ ఇల్లంతా చీకట్లో ఉండవలసిందనే అతని అభిప్రాయం. అంచేత, చీకటి మరీ ఎక్కువ కాకుండా పిల్లలకి అన్నాలు పెట్టేస్తే అందరూ వేగిరం కళ్లు మూసుకొని పడుకోవచ్చు. తెలివున్నంతసేపే కాని తెలివి తప్పిపోయేక దీపం ఉన్నా ఒకటే, లేపోయినా ఒకటే. పాత మొఖాసాదార్గారి భార్యకి తమ యెడల భగవంతుడి దయవల్ల–కరుణ కలగబట్టి ఇందులో ఈపాటి తలదాచుకోనిచ్చింది. వారానికి వంద అప్పడాలు పుచ్చుకోవడం తప్ప, అద్దిచ్చినా పుచ్చుకొంది కాదు. రెండుపూట్ల వంట చేసి పిల్లలకి కాస్త వేడన్నం రెండు పూట్లా పెడదామంటే ఈ వర్షం వల్ల ఎక్కడా ఓ కాణీ అయినా పుట్టకుండా ఉంది. వర్షాల వల్ల కూరా నార దొరకని ఈరోజుల్లో అప్పడాలూ, వడియాలూ పేరయ్య కొట్టు మీద వేడివేడి పకోడిల్లాగ జోరుజోరుగా చెల్లిపోను. కాని ఏంచేస్తాం? ఇంట్లో పిండి లేదు. ఎండ లేదు. ‘‘అమ్మ! కంచాలేసుకున్నాం అన్నం పెట్టమ్మా!’’ అంది సుందరం. మధ్నాహ్నం భోజనాలవగా మిగిలిన అన్నం వీధి వరండాలోకి గిన్నెతో పట్టుకొచ్చింది శారదమ్మ. ‘‘అటు చూడమ్మా! ఎంత చీకటిగా ఉందో!’’ అంది సుందరం. ఆకాశంకేసి చూసేసరికి శారదమ్మకి నిజంగా చాలా భయం వేసింది. ‘‘అమ్మా! అలా చూస్తున్నావేంటమ్మా? ఎండ రేపు రాదా?’’ అని అడిగింది సుందరం. ‘‘ఏమోనమ్మా? ముందు మీరంతా భోంచేసి వేగిరం పడుకోండి!’’ ‘‘ఎండరాదేంటమ్మా?’’ అని మళ్ళీ అడిగిన సుందరం కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అమ్మ ముఖంలో ఎండ రేపోచ్చే సూచన్లు కనిపించలేదాపిల్లకి. ‘‘ఎందుకమ్మా నీకా బెంగ? ఎండ తప్పక రేపొస్తుంది. ముందు భోంచెయ్యి. బెంగపెట్టుకోక!’’ అంది శారదమ్మ. ‘‘నేను భోంచేయనమ్మా!’’ ‘‘అల్లరి చేయకమ్మా. సుందరం!’’ ‘‘రేపు ఎండొస్తుందా?’’ ‘‘ఒస్తుంది. భోంచెయ్యి’’ ‘‘నాన్నొస్తాడన్నావు. రానేలేదు. నువ్విలాగే ఉత్తుత్తి మాటల్చెప్తావమ్మా’’ ‘‘మన చేతుల్లో ఏవుందమ్మా? దేవుడి దయకలగాలి. నాన్న రావాలి’’ ‘‘దేవుడికి దయెప్పుడు కలుగుతుందమ్మా?’’ ‘‘కలుగుతుంది తల్లీ! బెంగపడక భోంచెయ్యి!’’ అంది శారదమ్మ. అంతలో సరూ, ‘‘అమ్మా అగ్గి! ఆమ్మ! అగ్గి!’’ అని కేకలు వేసింది. చూస్తే అవి చీమలు. శారదమ్మకి ఏంచేయాలో పాలుపోక అలా చూస్తూ నిల్చుంది. వీధిలో సుమారు రెండువందల మంది ముష్టివాళ్ళు గోనెలూ, జోలెలూ, డొక్కులూ, కుండలు, కంపలు పట్టుకొని మోసుకొని తొందర తొందరగా ఊరి వైపు నడుచుకుంటూపోతున్నారు. వాళ్ళంతా శారదమ్మ కాపురం ఉండే గదికి కొంతదూరంలో ఉండే సాధూమఠంలో ఉంటూంటారు. ఇవాళ పొద్దున కాబోలు, మఠం గోడొకటి వర్షానికి నానిపోయి కూలి పోయిందన్నారు. రాత్రికి వర్షం తిరిగి వచ్చే సూచన్లు చూసి వాళ్ళంతా మరెక్కడైనా తలదాచుకొందికి పోతున్నట్టున్నారు. వాళ్ళనలా చూస్తూ శాదమ్మ మౌనంగా నిల్చుండి పోయింది. ‘‘అమ్మా! వాళ్ళెందుకు అలా పారిపోతున్నారు?’’ అని అడిగింది సుందరం. ‘‘భయం చేత అలా పారిపోతున్నారమ్మా’’ ‘‘ఎందుకమా వాళ్ళకి భయం?’’ ‘‘వాళ్ళ బతుకులకి ఎండ లేదమ్మా! అందుకు భయం!’’ ‘‘మరి, మనకి ఎండ ఉంటుందా అమ్మా!’’ ‘‘దేవుడికి దయుంటే అందరికీ ఉంటుంది తల్లీ!’’ ‘‘దేవుడికి మనందరి మీద కోపమా అమ్మా?’’ ‘‘లేత్తల్లీ!’’ అంది శారదమ్మ. శారదమ్మ మూడు కంచాల్లోనూ ఉన్న అన్నం మళ్ళీ గిన్నెలోకి ఎత్తి, మూడుసార్లు నీళ్ళతో కడగ్గా చీమలన్నీ తేలిపోయాయి. పిల్లలకి అన్నం పెట్టడం కోసం చీమల కడుపులు కొట్టవలసొచ్చిందనేసరికి ఆమెకెందుకో కాని కడుపులో దేవేసినట్టయింది. తడి అన్నంలో మజ్జిగనీళ్ళు వేసి ముగ్గురు పిల్లల చేతా శారదమ్మ భోజనాలు చేయిస్తుండగా వర్షం యథాప్రకారం నిన్నా మొన్నా అటు మొన్నట్లాగే పట్టుకొంది. పిల్లల భోజనాలయాక, శారదమ్మ గిన్నె కంచాలు కడిగేసి గదిలోకి వెళ్ళిపోయిన పిల్లల్ని బుద్దిగా పడుకోమన్చెప్పి కేక వేసింది. వర్షం జోరుగా తెగ జోరుగా పడుతోంది. వర్షం చేసేచప్పుడికి, కేకలు వేస్తేగాని నడవలో మాట గదిలోకి వినిపించడం లేదు. వెర్రిపిల్లడు నోట్లో వేలు పెట్టుకుని గోడవార కర్రపెట్టె మీద ముణుచుకు పడుక్కున్నాడు. ఆ పిల్లాడి మీద తడి పూర్తిగా ఆరని పాతచీరె మడతలు పెట్టి కప్పింది శారదమ్మ. మరోవార పొట్టి మడతమంచం మీద సరూ, సుందరాలు తడారని పాతబొంత కప్పుకు పడుకున్నారు. గదంతా యథాప్రకారం కురవడం ప్రారంభించింది. బాగా చీకటిపడి గంటే అయిందో, రెండు గంటలే అయిందో, నడవ పక్క వీధి గుమ్మానికి చేర్లబడి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది శారదమ్మ. ఆమెకు నిద్ర రావడం లేదు. వర్షంలోకి అలా రెప్ప వెయ్యలేకుండా అదేపనిగా చూస్తూ ఆలోచిస్తోంది. చీకట్లో వర్షధారలు చాలా అస్పష్టంగా కనిపించడంచేత ఆకాశానికి, భూమికి మధ్య నీరు తప్ప మరేం ఉన్నట్టు అనిపించడం లేదు. శారదమ్మ కళ్ళంట నీరు తిరగడం ఆ చీకట్లో కనిపించడం లేదు. తన మట్టుకు తనకి, శారదమ్మకి, తనెక్కడో ఏదో లోతు దొరకని సముద్రం లోపల గులకరాళ్ళు గుహలో తేలలేక కూలబడి కూర్చున్న రీతిగానే తోస్తోంది. ఎంతటి ప్రకాశవంతమైన సూర్యరశ్మయినా ఇంత లోతు నీటిలోకి ఇంత లోతుకి దిగదు. దిగజాలదు. ఈ మహాసముద్రపు విషపు నీటి అట్టడుక్కి ఏ యెండా, ఏ వెలుగు ఎన్నటికీ రాదు. రాజాలదు. ఈ వాదమ్మ మరింక భూమ్మిదికి తేలడానికి ఏ అవకాశం అయినా సరే ఎక్కడా లేదు. ఉండదు. ఉండబోదు. ఆ సమయంలో శాదమ్మకి–ఎండ లేని తన బాల్యం, చలి కాలపు సాయంకాలపు ఎండలాంటి తన యవ్వనం, నీరెండయినా చోరని రాతిగోడల మధ్య ఇరుక్కున్న తన పెనిమిటి రూపం, మెదడంతా చీకటితో నిండిన తన వెర్రికొడుకు జీవితం, ఎండ కోసం పాకులాడుతూ తనతో పాటు ఈ సముద్రపు అట్టడుగున, సముద్రమంత బరువు కిందా, ఈ చీకటి నీట్లో ఈదలేక, తేలలేక, చావలేక ఉక్కిరి బిక్కిరయి కొట్టుమిట్టాడే తన అతిచిన్న ఆడపిల్లల ఘోర పరితాపం అన్నీ గుర్తుకొచ్చి ఆమెని కుంగతీసి కలచివేయగా ఆమె కళ్ళంట జారిన కన్నీళ్ళు నడవలో రాతిగచ్చు మీద పడి, అక్కడ కురుస్తున్న నీటితో కలిసి వాకిట్లోకి కుంటుకొంటూ పోయి, అక్కణ్ణుంచి రోడ్డు మీదికి తేలి, అక్కణ్నించి కాలవలోకి దూకి ఆ రాత్రి ఆ చీకట్లో ఆ వర్షంలో ఎక్కడో ఏ చీకటి సముద్రంలోకో కాని కొట్టుకుపోయి కలిసిపోయేయి. వెర్రిపిల్లడు కర్రపెట్టె మీద వింత జంతువులా పడుకున్నాడు. ‘‘ఎండంతా చచ్చిపోయిందంటే అక్కా? నిజం చెప్పవే!’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సరూ చివరికి నిద్దరనే చీకట్లో మెల్లి మెల్లిగా కలిసిపోయింది. పిల్లల ఏడుపు వినిపిస్తే రాక్షసులొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారని సుందరాన్ని ఎప్పుడో ఎవరో జడిపించేరు. ఆ జడుపు ఇప్పటికీ ఆమెని వదల్లేదు. అందుచేత, రాక్షసులెవరికీ వినిపించకుండా, బెంగతో, బాధతో చెప్పజాలని ఆవేదనతో ఆ రాత్రి అతి రహస్యంగా ఏడ్చి ఏడ్చి అలిసలిసిపోయిన సుందరాన్ని చూసిచూసి మరింక చూడలేక దయదాల్చిన చావులాంటి నిద్ర, ఆ పిల్ల కప్పుకున్న తడిబొంతలా. ఆఖరి కెలాగైతేనేం ఆమెని అతిచల్లగా కప్పింది. చీకట్లో తెరిపి లేకుండా పడే వర్షం, కళ్ళు లేని గుండెలేని కారు నల్లని గీతల గీతల భూతంలా ఉంది. - రాచకొండ విశ్వనాథశాస్త్రి -
ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం లేదు. నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకున్నా, ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన దేశంలోనైతే మహిళా శాస్త్రవేత్తల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది. మహిళలు చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురీది మరీ శాస్త్రవేత్తలుగా తమ సత్తా చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వారు మైలురాళ్లలా నిలిచిపోయే విజయాలను సాధించారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దేశానికి చెందిన కొందరు తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి... ఈ ఏడాది థీమ్ విమెన్ ఇన్ సైన్స్ వైద్యంలో పట్టా సాధించిన తొలి భారతీయురాలు ఆనందీబాయి జోషి మన దేశంలో పాశ్చాత్య విద్య ప్రాచుర్యంలోకి వస్తున్న తొలి రోజుల్లోనే వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన తొలి మహిళ ఆనందీబాయి జోషి. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని (ఇప్పటి మహారాష్ట్ర) కల్యాణ్ పట్టణంలో 1865 మార్చి 31న బతికి చెడిన భూస్వాముల కుటుంబంలో జన్మించారామె. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తపాలా గుమస్తాగా పనిచేసే గోపాలరావు జోషితో పెళ్లి జరిగింది. గోపాలరావు జోషి మొదటి భార్య అప్పటికే మరణించింది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్లకు పైనే తేడా. గోపాలరావు జోషి కొంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో భార్యకు చదువు చెప్పించారు. గోపాలరావు జోషికి కలకత్తా బదిలీ కావడంతో కుటుంబం అక్కడకు చేరుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆనందీబాయి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తగిన వైద్యం అందనందున ఆ బిడ్డ పట్టుమని పదిరోజుల్లోనే కన్నుమూయడం ఆనందీబాయిని తీవ్రంగా కలచివేసింది. మహిళలకు ఇలాంటి దుస్థితి నుంచి తప్పించడానికి తానే స్వయంగా వైద్యశాస్త్రం అభ్యసించాలని నిశ్చయించుకుంది. ఆ కృతనిశ్చయమే ఆమెను వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలైన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిపింది. ఆనందీబాయి నిశ్చయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. తన భార్య వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటోందని, అందుకు తగిన సహాయం చేయమని కోరుతూ ప్రముఖ అమెరికన్ మిషనరీ రాయల్ వైల్డర్కు గోపాలరావు జోషి లేఖ రాశారు. వైల్డర్ ఆ లేఖను తాను నడిపే ‘ప్రిన్స్టన్స్ మిషనరీ రివ్యూ’ పత్రికలో ప్రచురించారు. దానిని చూసిన థియోడిషియా కార్పెంటర్ అనే సంపన్నురాలు ఆనందీబాయికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. కలకత్తాలో ఉంటున్న ఆనందీబాయికి నేరుగా లేఖ రాసింది. అప్పటికి ఆనందీబాయి అనారోగ్యంతో బాధపడుతుండేది. థియోడిషియా ఆమెకు అమెరికా నుంచి మందులు కూడా పంపేది. ఈలోగా గోపాలరావుకు బెంగాల్లోని సీరమ్పూర్ బదిలీ అయింది. పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోమని థియోడిషియా సూచించడంతో ఆనందీబాయి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఒక సందర్భంలో ఆనందీబాయి సీరమ్పూర్ కాలేజీలో ప్రసంగం చేసింది. అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నానంటూ ఆమె చేసిన ప్రసంగానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. ఆమె చదువు కోసం సంపన్నుల నుంచి విరాళాలు వచ్చాయి. పెన్సిల్వేనియా లోని విమెన్స్ మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కలకత్తా నుంచి ఆనందీబాయి ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకుంది. పెన్సిల్వేనియా విమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి 1886లో విజయవంతంగా ఎండీ పూర్తి చేసింది. అకుంఠిత దీక్షలో చదువులో మునిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఆనందీబాయికి క్షయ సోకింది. పట్టాపుచ్చుకుని ఏడాదైనా గడవక ముందే 1886 ఫిబ్రవరి 26న కన్నుమూసింది. అమెరికా నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్డీ పొందిన తొలి మహిళ జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ 1897 నవంబరు 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలిచెర్రిలో జన్మించారు. ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఇ.కె.కృష్ణన్ సబ్జడ్జిగా పనిచేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులను కొనసాగించగలిగారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం మిషిగాన్ వెళ్లారు. అక్కడ బార్బర్ స్కాలర్షిప్ పొంది 1926లో బోటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి, మద్రాసులోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి, పరిశోధనల కోసం మళ్లీ మిషిగాన్ చేరుకున్నారు. మిషిగాన్ వర్సిటీ నుంచి 1931లో పీహెచ్డీ పొందారు. అమెరికాలోనే వృక్షశాస్త్రంలో పీహెచ్డీ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. చెరకు, వంకాయలు వంటి పంటల కణనిర్మాణంపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. తోటల్లో పెంచుకునే మొక్కలు, వర్షారణ్య వృక్షాలపై ఆమె విస్తృతంగా పరిశోధనలు సాగించి, అంతర్జాతీయంగా మన్ననలు పొందారు. మిషిగాన్ వర్సిటీ ఆమెకు 1956లో ఎల్ఎల్డీ గౌరవ పట్టాను ఇచ్చింది. భారత ప్రభుత్వం 1977లో జానకి అమ్మాళ్ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. జమ్ములోని రీజియనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కాలంలో 3,254 వృక్షజాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాండ్ బ్రీడింగ్, బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు అధ్యక్ష పదవిలో కొనసాగిన తొలి మహిళగా కూడా జానకి అమ్మాళ్ అరుదైన చరిత్ర సృష్టించారు. అనారోగ్యంతో ఆమె 1984 ఫిబ్రవరి 7న మద్రాసులో కన్నుమూశారు. సైన్స్లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయురాలు అసీమా ఛటర్జీ బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ. ఆమె కలకత్తాలో 1917 సెప్టెంబరు 23న జన్మించారు. ఆమె తండ్రి నారాయణ ముఖర్జీ కలకత్తాలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు. ఆధునిక భావాలు గల ఆయన కుమార్తెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో అసీమా కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు. తర్వాత 1938లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ‘ఫైటోమెడిసిన్స్’పై ఆమె సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పరిశోధన ఫలితంగా మూర్ఛ వ్యాధిని, మలేరియాను నయం చేసే మందుల తయారీకి, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ మందుల తయారీకి మార్గం సుగమమైంది. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తయ్యాక ఆమె అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పరిశోధనలు సాగించారు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని లేడీ బ్రాబర్న్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించిన ఘనత అసీమాకే దక్కుతుంది. పలు శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన అసీమా, 1982–90 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగారు. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. రామన్పైనే సత్యాగ్రహం ప్రకటించిన ధీర కమలా సోహనీ శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల పట్ల వివక్ష ఈనాటిది కాదు. తొలి రోజుల్లో వివక్ష మరింత ఎక్కువగా ఉండేది. కేవలం మహిళ అయిన కారణంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు నిరాకరణ ఎదురైంది. ఆమె దరఖాస్తును తోసిపుచ్చినది ఎవరో కాదు, అప్పట్లో ఆ సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్న ‘నోబెల్’ గ్రహీత సీవీ రామన్. మహిళలు శాస్త్ర పరిశోధనను కొనసాగించలేరంటూ ఆమె దరఖాస్తును రామన్ తోసిపుచ్చారు. పరిశోధన సాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా సోహనీ ఈ తిరస్కారాన్ని తేలికగా తీసుకోలేదు. రామన్ నిర్ణయానికి నిరసనగా సత్యగ్రాహం చేపట్టింది. దెబ్బకు రామన్ దిగివచ్చి, ఆమెను రీసెర్చ్ ఫెలోగా చేర్చుకోక తప్పలేదు. కమలా సోహనీ మధ్యప్రదేశ్లోని (అప్పటి సెంట్రల్ ప్రావిన్స్) ఇండోర్లో 1912 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్, పినతండ్రి మాధవరావు భగవత్– ఇద్దరూ రసాయనిక శాస్త్రవేత్తలే! వారిద్దరూ బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పట్టభద్రులు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ తర్వాతి కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్గా (ఐఐఎస్సీ) మారింది. ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కమలా సోహనీ బాంబే యూనివర్సిటీ నుంచి 1933లో కెమిస్ట్రీ ప్రధానాంశంగా, ఫిజిక్స్ ద్వితీయాంశంగా బీఎస్సీ, 1936లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిస్టింక్షన్తో పూర్తి చేశారు. కమలా సోహనీ పోరాట ఫలితంగా ఐఐఎస్సీలో మహిళల ప్రవేశానికి 1937 నుంచి మార్గం ఏర్పడింది. ఐఐఎస్సీలో శ్రీనివాసయ్య మార్గదర్శకత్వంలో కమలా సోహనీ పాలు, పప్పుధాన్యాలు, గింజధాన్యాల్లోని ప్రొటీన్లపై పరిశోధన సాగించారు. ఆమె పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు కొనసాగించడానికి ఆమెను ఆహ్వానించింది. అక్కడ ఆమె ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ హిల్ నేతృత్వంలో పద్నాలుగు నెలల్లో పరిశోధన పూర్తి చేసి, సమర్పించిన కేవలం 40 పేజీల సిద్ధాంత వ్యాసానికి పీహెచ్డీ లభించింది. డాక్టరేట్ పూర్తయిన వెంటనే 1939లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితులయ్యారు. తాజా తాటికల్లు (నీరా) పోషక విలువలపై ఆమె జరిపిన పరిశోధన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ను ఎంతగానో ఆకట్టుకుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వవచ్చని, నీరాను తాటిబెల్లంగా తయారు చేసినట్లయితే, పోషక విలువలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చని ఆమె నిరూపించారు. ‘నీరా’పై పరిశోధన చేసినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 1998లో ఆమెను ఘనంగా సత్కరిస్తుండగా వేదికపైనే కుప్పకూలిపోయిన ఆమె కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు. దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి చేరుకున్న అన్నా మణి మద్రాసు ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లా పారంకుడిలో 1918 ఆగస్టు 23న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు, కళలపై అన్నా మణికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆమెకు వజ్రాల చెవిరింగులు బహుమతిగా కొని తేవడానికి తండ్రి బజారుకు వెళ్లడానికి సిద్ధపడుతుంటే, తనకు వజ్రాల రింగులు వద్దని, వాటికి బదులు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని కోరింది. బాల్యంలో ఆమెకు నాట్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్తకి కావాలనుకుంది కూడా. కాలేజీలో చేరిన తర్వాత మాత్రం నాట్యం బదులు పరిశోధనల్లోనే తన భవితవ్యాన్ని తీర్చిదిద్దుకుంది. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ నుంచి 1939లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది. మరుసటి ఏడాదే ఆమెకు పరిశోధనలు కొనసాగించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్కాలర్షిప్ లభించింది. అక్కడ ప్రొఫెసర్ సాల్మన్ పాపయ్య మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపులకు గల కాంతిపరావర్తన లక్షణాలపై పరిశోధన సాగించి, పీహెచ్డీ కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. అయితే, ఆమె అప్పటికి ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనందున ఆమెకు పీహెచ్డీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చేరారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు సాగించాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమె చివరకు వాతావరణ శాస్త్ర పరిశోధకురాలిగా తేలారు. స్వదేశానికి 1948లో తిరిగి వచ్చాక, పుణేలోని వాతావరణ శాఖ కార్యాలయంలో చేరారు. వాతావరణ పరికరాలపై ఆమె అసంఖ్యాకమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. చాలా పరికరాలను ఆమె ప్రామాణీకరించారు. పుణేలో ఆమె ఐదేళ్ల వ్యవధిలోనే వాతావరణ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. ఆమె కింద 121 మంది పురుషులు సిబ్బందిగా పనిచేసేవారు. తర్వాత ఆమె 1968లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. కొంతకాలం ఈజిప్టులో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కన్సల్టంట్గా పనిచేశారు. జీవితాంతం పరిశోధనలకే అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. 1994లో పక్షవాతం బారినపడిన ఆమె 2001లో కన్నుమూశారు. సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు దక్కాయి. ఆమె శత జయంతి సందర్భంగా 2018లో డబ్ల్యూఎంవో తన జర్నల్లో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రను, ఇంటర్వ్యూను ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టు రూపాబాయి ఫర్దూన్జీ రూపాబాయి ఫర్దూన్జీ హైదరాబాద్లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టారు. ఆమె జనన మరణ వివరాలేవీ తెలియవు గాని, నాటి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో (ఇప్పటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) 1885లో చేరిన ఐదుగురు మహిళా విద్యార్థుల్లో ఆమె ఒకరు. హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ‘హకీం’ పట్టా తీసుకున్నాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బాల్టిమోర్లోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు. అప్పట్లో అమెరికా, ఇంగ్లాండ్లలో సైతం చాలా వైద్య కళాశాలలు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. మహిళలకు ప్రవేశం కల్పించే అతి కొద్ది సంస్థల్లో బాల్టిమోర్లోని జాన్స్హాప్కిన్స్ హాస్పిటల్ ఒకటి. బాల్టిమోర్లో చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లోని తొలి రెండు క్లోరోఫామ్ కమిషన్లలో (1888, 1891) కీలక పాత్ర పోషించారు. తర్వాత 1909లో స్కాట్లాండ్ వెళ్లి, అక్కడ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో చేరారు. అప్పటికి అనెస్థీషియాలో ఏ యూనివర్సిటీలోనూ స్పెషలైజేషన్ కోర్సులు లేవు. అయినా ఆమె ఒకవైపు అనెస్థెటిక్స్లో పరిశోధనలు సాగిస్తూనే, మరోవైపు ఎడిన్బర్గ్ వర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో డిప్లొమాలు పూర్తి చేశారు. అనెస్థెటిక్స్లో అనుభవజ్ఞానం ఉన్నవారి సేవలను శస్త్రవైద్యులు తమకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేవారు. అలా రూపాబాయి ఫర్దూన్జీ కూడా పలువురు శస్త్రవైద్యులకు అనెస్థటిస్టుగా సేవలందించారు. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టుగా గుర్తింపు పొందారు. ఎడిన్బర్గ్లో పరిశోధనలు పూర్తయ్యాక ఆమె స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని చాదర్ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసి, 1920లో రిటైరయ్యారు. -
ముచ్చటగా మూడు స్నాక్స్ మీకోసం..
బనానా–వాల్నట్ మఫిన్స్ కావలసినవి: అరటిపండ్లు – 8, ఖర్జూరం పేస్ట్ – 1 కప్పు, వాల్నట్ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు, బటర్ – అర కప్పు, మైదాపిండి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 4, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా బటర్ కరింగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు అరటిపండ్లను అడ్డంగా అంగుళం పొడవులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని, మిగిలి ఉన్న 6 అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఖర్జూరం పేస్ట్, గుడ్లు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చల్లారిన బటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండి, మొక్కజొన్న పిండి, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాల్నట్స్ పేస్ట్ వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మఫిన్స్ బౌల్స్లో కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని పెట్టుకుని వాటిపైన అరటిపండు ముక్కలు చిత్రంలో ఉన్న విధంగా పెట్టుకుని, 20 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. పీనట్ పాన్కేక్ కావలసినవి: వేరుశనగలు – ఒకటిన్నర కప్పులు(దోరగా వేయించినవి), పంచదార – 2 కప్పులు, మైదాపిండి – 1 కప్పు, బియ్యప్పిండి – ముప్పావు కప్పు, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత, నెయ్యి – అర టేబుల్ స్పూన్ తయారీ: ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, కొబ్బరిపాలు, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, ఆ మిశ్రమాన్ని ఏడెనిమిది గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. పాన్ కేక్స్ సిద్ధం చేసుకునే ముందు పల్లీలు, ఒక కప్పు పంచదార మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో కొబ్బరి తురుమును బాగా వేయించి అందులో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండి మిశ్రమంతో మందంగా దోసెల్లా వేసుకుని, దానిపైన కొద్దిగా పల్లీ–కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని బెల్లం పాకంలో వేసిన ఆపిల్ ముక్కలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. పనీర్ హల్వా కావలసినవి: పనీర్ తురుము – 1 కప్పు, పాలు – 2 కప్పులు (కాచి చల్లార్చినవి), పంచదార – అర కప్పు, సొరకాయ ముక్కలు – 2 కప్పులు (పైతొక్క తొలగించి), బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10 లేదా 15, వేరుశనగలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందు స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక బౌల్ పెట్టుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేరుశనగలు, జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అందులో సొరకాయ తురుము వేసుకుని మూడు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పాలు వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పనీర్ తురుము, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం మొత్తం పొడిపొడిలాడుతున్నట్లుగా మారిన సమయంలో.. చివరిగా అభిరుచిని బట్టి ఏలకుల పొడి కూడా వేసుకుని గరిటెతో బాగా కలిపి స్టవ్ మీద నుంచి ఆ పాన్ను దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, వేరుశనగలు వేసుకుని, ఒకసారి అటూ ఇటూ కలిపి.. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. -
కోకిల గొంతు పడిపోయింది!
ఐసీయూలో ఉన్న కోకిల మెల్లగా కళ్లు తెరిచింది. చుట్టూ చూడటానికి ప్రయత్నిస్తూ పైకి లేవబోతుంటే లేవకుండా నోటికి ముక్కుకి తగిలించిన పైపులు అడ్డం పడ్డాయి. ‘తనెక్కడుంది...తను ఇక్కడెందుకుంది?’ సమాధానం తెలియని ప్రశ్నలతో వున్న కోకిల హఠాత్తుగా ఒక విషయం గమనించింది. గుండె గొంతుకలో ఏదో అపశ్రుతి. తన జీవితాన్ని మృతప్రాయంగా మార్చినట్టు...ఏదో అడ్డం పడినట్టు మాట బయటకు రావడం లేదు. మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా మాట గొంతు దాటి బయటకు రానంటూ భీష్మించుకుంది. అప్రయత్నంగా తన ప్రమేయం లేకుండా మాటకు బదులు కళ్లలోని కన్నీరు ఉబికి వస్తోంది. పిలుస్తున్నాననుకుంటూ కోకిల ఐసీయూ బయట ఉన్న తండ్రిని పిలిచింది. పిలిచానని అనుకుంది. మాట కదలలేదు. కోకిల కదులుతుండటం చూసిన తండ్రి ఆదుర్దాగా లోపలికి వచ్చాడు. తన తండ్రిని ఏదో అడగాలని ఆరాటంగా ప్రయత్ని స్తోంది కోకిల. కానీ సైగలు తప్ప మాటలు బయటకు రాలేమంటున్నాయి. అప్పుడు అర్థమైంది. తను...మా...ట్లా... డ...లే...క...పో...తోం...ది. తన గొంతు మూగబోయింది. ‘ఎప్పుడూ మనూరి సముద్రంలా గలగలా వినిపించే నీ మాటలు ఇక సముద్రానికి వినిపించవమ్మా ...ఉదయమే వీధి వీధంతా వినిపించే నీ కంఠం, కోకిలమ్మ పాడితే దేవుడిగుడిలో గంటలా వినిపిస్తదని చెప్పే నీ కంఠం మూగపోయింది తల్లీ’ అని చెప్పే భావాలూ కూడా పలకలేని నిరాసక్తుడు...తనకు తెలిసిన మాటల్లోనే చెప్పాడు. ‘నీ గొంతు పడిపోయింది తల్లీ’ అని. కూతురు కంఠం పోయిన బాధలో అతని ప్రాణం ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఒక నిశ్శబ్దం వేనవేల విషాదాలను తనలో కలుపుకుంది. గతం ఆమె ప్రపంచాన్ని చివరిసారి చూపించింది. కోకిల పుడుతూనే రాగాన్ని ఆలపించింది. ఆ వూళ్ళో వున్న సంగీతం మాస్టారూ చెప్పినప్పుడు ఆ గిరిజన గూడేనికి అర్థం కాలేదు. కానీ ఆ గూడెంలో గాలికి ధూళికి చెట్టుకు,చేమకు, పచ్చని పైరులకు అర్థం అయ్యింది. కోకిల పాడితే చెట్టు మీద కోయిలలు గుంపుగా చేరేంత శ్రావ్యంగా ఉంటుంది. దేవుడి పాటలు, పల్లెపదాలు, అమ్మోరిని స్తుతించే పద్యాలూ అలా అలవోకగా పాడేస్తుంది. ఒక్కసారి వింటే గుర్తుంచుకుంటుంది. సంగీతం తెలియదు. సంగతులు తెలియదు అది ఏ రాగమో కూడా తెలియవు. విన్నది విన్నట్టుగా, వున్నది వున్నట్టుగా పాడుతుంది. గమకాలు పలుకుతుంది. సరిగమలు పలికిస్తుంది. నిరక్షరాస్యత పీడించే ఆ గూడెంలో అక్షరమ్ముక్క రాని కోకిలకు కోయిలలు సుస్వరాలు చెప్పేవేమో! కోకిల ఆ గూడేనికి ఆ పర్వతప్రాంతాలకు వచ్చే టూరిస్టులకు గైడ్గా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతం కోకిలకు కొట్టినపిండి. తన మాటలనే పాటలుగా మలుస్తుంది. రాగయుక్తంగా చెబుతుంది. ఆ అడవిలో పులులు సంచరిస్తాయి. కోకిల పాట పాడితే పులులు కూడా ఏ హానీ చేయకుండా వెళ్తాయని అంటుంటారు! కోకిలకు చిన్ననాటి స్నేహితురాలైన కమ్లి తన కుటుంబంతో కోకిల వాళ్లింటి పక్కనే ఉండేది. కమ్లికి కోకిల పాడే పాటలంటే ఎంతో ఇష్టం. కోకిల పాటలకు ఆ గిరిజనగూడెపు జనులందరూ మైమరిచిపోయేవారు. ఆ గూడెంలో కమ్లి ఒక్కర్తే కొద్దిగా చదువుకుంది. కమ్లి కోకిలకు అక్షరాలు నేర్పిస్తానంటే, చదువు చెబుతానంటే ‘వద్దు బాగా చదువుకుంటే నాకు మొగుడెలా దొరుకుతాడు’ అమాయకంగా అనేది కోకిల. ఒకరోజు ఒక ఫారినర్ ఆ గూడేనికి వచ్చింది. అక్కడ ఆ గూడేన్ని చూపించడానికి టూరిస్ట్ గైడ్ లా పనిచేసింది కోకిల. పర్వతాలు, అడవులు, గూడెం కొట్టినపిండి కోకిలకు. అలా అన్నీ చూపిస్తూ ఎప్పుడూ ఏదో ఒక పాట పాడుతూ వుండే కోకిల గొంతులోని మాధుర్యానికి భాష తెలియకపోయిన ఆ ఫారినర్ ముగ్దురాలైంది. కోకిల పాటను రికార్డు చేసింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టింది. అంతే ఒకేరాత్రి కోకిల పాట వైరల్ అయ్యింది. కోకిల పాడిన పాటలు అన్నీ రికార్డు చేసింది ఆ ఫారినర్. చెటు ్టమీద చేమ మీద, కొండ మీద ఇలా తన మనసుకు నచ్చిన, తనకు వచ్చిన పదాలతో పాడిన పల్లెపదాల జావళి అమృతవాహిని అయ్యింది. ఆ గొంతు ఎల్లలు దాటింది. సంగీతానికి భాషాభేదాలు లేవు. కులమతాలు లేవు. వేల షేర్స్, లెక్స్ లక్షల్లో... ఆ గొంతును విని మనఃస్ఫూర్తిగా అభినందించేవారు కొందరైతే, ఆ గొంతుకు వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకునేవాళ్ళు ఇంకెందరో! వ్యాపార ప్రపంచంలో కోకిల కంఠం వినియోగ వస్తువు అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్లు గూడేనికి క్యూ కట్టారు. టీవీ ఛానెల్స్ లైవ్లు ఇచ్చాయి. బ్లాంక్ చెక్స్ కోకిల చేతిలోకి వచ్చాయి. కోకిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆమె ఆనందం అంబరమైంది. తనకొచ్చిన పాపులారిటీ చూసి కాదు. తన గొంతు ప్రపంచమంతా వినిపిస్తూ ఉండడం చూసి. తన స్వరం గాలిలో విహరిస్తోంది ఆమె మనసులా! తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఫారినర్కు చేతులెత్తి దండం పెట్టుకుంది. ఇంటర్వ్యూస్ అభినందనలు... తెల్లవారితే తన పాట గాలిలో కలిసి ప్రపంచాన్ని పలకరిస్తుంది. తమ గూడెంలో వున్న ఒకే ఒక పెద్ద కరెంట్ రేడియోలో ఆ పాట వినొచ్చు అనుకుని మురిసిపోయింది కానీ ఆ కరెంట్ ఆమె పాలిట శత్రువు అయ్యింది. వర్షానికి ట్రాన్స్ఫార్మర్ పేలింది. గూడేనికి నిప్పంటుకుంది. కోకిల ఆ మంటల్లో ఎక్కువశాతం కాలిన శరీరంతో హాస్పిటల్లో చేరింది. కానీ..విధిరాతను మార్చడం విధాత తలపులను తెలుసుకోవడం ఎవరితరం? ఒక్కరాత్రిలో తన ప్రపంచం చీకటిలో కలిసిపోయింది. ఆమె గొంతు మూగబోయింది. ఆ వార్త సినిమా ప్రపంచంలో గుప్పుమంది. కోకిల పాట తమ సినిమాకు ఇక వ్యాపారంగా, ప్రచారంగా పనికిరాదు...అని తెల్సిన మరుక్షణమే మొహం చాటేసింది. కోకిల జీవితానికి విషాదం ముసుగేసింది. రారే హితుల్...సుతుల్ సన్నిహతుల్...స్మశాన నిశ్శబ్దం... హస్పిటల్ బిల్లు కట్టడం కూడా కనాకష్టమైంది. చెక్కులు స్టాప్ పేమెంట్తో చిత్తు కాగితాలు అయ్యాయి. గూడెంలో కోకిలకు వున్న గూడు హాస్పిటల్ బిల్లులకు సరిపోయింది. చిన్న గుడిసెలో ఓ చెట్టు కింద ఉంటుంది. కోకిలకు మంచి అవకాశాలు వచ్చాయన్న వార్త తరువాత మళ్లీ ఎటువంటి వార్తలు రాకపోవడంతో ఆ ఫారినర్ కమ్లిని సంప్రదించింది. జరిగిన విషయం చెప్పింది కమ్లి. ఫారినర్ బాధ పడింది. వెంటనే స్పందించింది. హుటాహుటిన ఇండియాకు వచ్చింది. గూడేనికి వెళ్ళింది. నిస్త్రాణంగా చెట్టుకింద పడుకుని వున్న కోకిలను చూసి ఆ ఫారినర్ మనసు ద్రవించింది. కోకిలకు మెరుగైన చికిత్స చేయిస్తానని అంది. సైగలతోనే వద్దని వారించింది కోకిల. మానవత్వమే మూగబోయినవేళ...తన గొంతు ఎవరికీ అవసరం లేదు అన్నది. ఫారినర్ కోకిల తల మీద చేయి వేసింది. చెట్టు మీద వున్న కోయిలలను చూపించింది. ‘అవి ఎందుకు తమ స్వరాలను వినిపిస్తున్నాయి. పక్షుల కువకువలు ఏం ఆశిస్తున్నాయి? ఈ గొంతు ప్రపంచం వినాలి. మాటలొచ్చిన కోయిలను ఈ ప్రపంచం పాట ద్వారా చూడాలి.’ అని చెప్పింది. కోమాలోకి వెళ్లిన ఆమెలోని ఆశ మళ్ళీ ఊపిరిపోసుకుంది. తన కోసం కాదు...‘తాను పాడితే వినాలని, తన గొంతును పరిచయం చేయాలనీ దూరతీరాల నుంచి వచ్చిన ఆ ఫారినర్ కోరిక తీర్చాలి. తాను పాడాలి. కానీ సినిమా కోసం కాదు. ప్రపంచంలో నిద్రపోతున్న మానవత్వానికే మేలుకొలుపుగా వినిపించే పల్లెపదాలు, జానపదాలు మనుష్యుల్లోని ఆర్ద్రతను ప్రపంచానికి తెలిసేలా పాడాలి...ఓ ప్రక్క ట్రీట్మెంట్ జరుగుతుంది. మరోప్రక్క సాధన. ఆ చెట్టు మీద వున్న కోకిలే తన డాక్టర్, తన గురువు. తన మౌనాన్ని ఏ క్షణమైనా శ్రావ్యంగా మారుస్తుందన్న ఆశ. డాక్టర్లు పెదవి విరిచారు. కమ్లి అప్పుడప్పుడు స్నేహితురాలిని పరామర్శించి పోతుంది. ఫారినర్ తనను అంటిపెట్టుకునే వుంది. సాధన...సాధన...సాధన తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగునీటిలో గొంతువరకు మునిగి... ‘బ్రహ్మదేవుడా! ఈ బొమ్మకు ప్రాణం వద్దు...స్వరం ఇవ్వు’ అని వేడుకుంది. సాధనమున సమకూరు... సంగీతానికి రాళ్ళూ కరుగుతాయో లేదో కానీ కోకిల కన్నీటి వేదనకు దేవుడు కరిగిపోయాడో...స్వరం చలించిపోయిందో...మెల్లిమెల్లిగా గమకాలు పలుకుతోంది! ఫారినర్తో పాటు గూడెం అంతా కలియతిరిగింది. కోకిలలను పిలిచింది. గాలిని పిల్చింది. వర్షాన్ని పిలిచింది. మేఘాలను పిలిచింది. సృష్టిలోని సమస్తాన్ని ఆవాహన చేసుకుంది ఆమె కంఠస్వరం. ఆ రాత్రి కోకిల ఆ ఫారినర్ ఒడిలో తలపెట్టి పడుకుంది. దేశం కాని దేశం నుంచి వచ్చిన ఫారినర్ ఆమె కళ్ళకు స్వరాలమ్మలా, తన అమ్మలా కనిపించింది. ఆ రాత్రంతా పాడుతూనే ఉంది. ఫారినర్ రికార్డు చేస్తూనే వుంది. ప్రపంచాన్ని నిద్రలేపే పాటలు. మానవత్వాన్ని తట్టిలేపే పాటలు. సృష్టిని అపురూపంగా ఆవిష్కరించే పాటలు. స్వరాలు తెలియదు. గమకాలు తెలియదు. సంగతులు తెలియదు. తెలిసిందల్లా మనసులోని పాటను గొంతులో నుంచి ప్రపంచానికి పంచడమే. వ్యాపార విలువలను ప్రశ్నిస్తూ, మానవతాధర్మాన్ని చెబుతూ, మనిషి విలువను తెలియచెప్పే పాటలు. తెల్లవారు జామున చివరి పాట వరకూ పాడుతూనే వుంది. ‘కోకిలా ఇక చాలు రాత్రి అంతా పాడి పాడి అలిసిపోయావు’ అంటోంది ఫారినర్. కానీ ఆమె ప్రశ్నకు కోకిల బదులివ్వలేదు. ఆమె చివరిశ్వాస వీడ్కోలు స్వరం పలికించింది. చెట్టుమీద కోకిలలు మౌనం పాటించాయి. పక్షులు తమ రెక్కలు తెగినట్టు విలవిలలాడాయి. తన చివరికోరికగా ఆ పాటలను ఫారినర్కు అంకితం చేసి, ఆ గూడెంలో కోకిల స్వరాలయం ప్రారంభించమని చెప్పింది. - శ్రీ సుధామయి -
మా ఊరి మేధావులు!
ఊళ్లో రచ్చబండ మీదో, టీస్టాల్ టేబుళ్ల దగ్గరో జరిగే టైంపాస్ ముచ్చట్లను ఎవరూ సీరియస్గా తీసుకోరు. అలా అని ‘సీరియస్’ విషయాల మీద డిస్కషన్ జరగదు అనుకుంటే తప్పులో కాలేసినట్లే! మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన నుంచి మొదలు ‘నాసా’ వరకు రకరకాల విషయాలపై డీప్గా చర్చ జరుగుతుంది. అందులో నిజం ఉందా? ఊహ మాత్రమే ఉందా? అనేది వేరే విషయంగానీ... వినబడానికి మాత్రం ఈ టైంపాస్ ముచ్చట్లు బహు కమ్మగా ఉంటాయి. సాయంత్రం అలవాటు ప్రకారం ఎప్పటిలాగే నా మిత్రుడితో కలిసి మా అమ్మమ్మ వాళ్ల ఊరు మద్దూరుకు వెళ్లాను. ఆ ఊళ్లోని ఏకైక రాజస్థాన్ హోటల్లో నా మానాన నేను మాడిపోయిన పకోడీలు తింటున్నాను. బయట జోరుగా వర్షం కురుస్తోంది. ఇంతలో నలుగురు గొర్రెల కాపరులు వర్షంలో తడుస్తూ హోటల్లోకి వచ్చారు. వీళ్లలో భిన్న వయస్సులకు చెందిన వారున్నారు. మా టేబుల్ పక్కనే వారూ కూర్చున్నారు. వారు కూడా పకోడీలు టీ ఆర్డర్ చేశారు. వాళ్ల సంభాషణ సాగిందిలా... ‘‘ఇదేమి వానరా దేవుడా.. ఆగుతనే లేదు. వాన పాడుగాను. అప్పుడేమో రాకేడ్తిమి. ఇప్పుడేమో పోక ఇంకో బాధ మోపైంది. పత్తి సేను ఇరగ కాసింది. తెంపుదామంటె గింత కూడ గెరువిస్తలేదు. పంటంత పాడుగావట్టె రా వారి. ఇంత అద్దుమానం కాలం నేనుప్పుడూ చూడలేదు’’ అన్నారు అందులో ఒకరు. వారందరిలో కెల్లా చిన్నవాడైన వాడనుకుంటా చాలా క్రియేటివిటీతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘‘ఇక ఈ వానలు తగ్గవు. మీకు తెలియదా ఏంది!’’అన్నాడు. మిగిలిన ముగ్గురు ‘‘ఎందుకు?’’ అని అడిగారు ఆత్రంగా. ‘‘మీకు తెల్వదనుకుంట అసలు ముచ్చట. వానలిలా ఆగకుండా పడడానికి గా ఇస్రో శాస్త్రవేత్తలే కారణం’’ అన్నాడు. వాళ్లతో పాటు నాకూ ఫీజులు ఎగిరిపోయాయి. ‘‘అవునా..!!’’ అని అందరూ నోరెళ్ల బెట్టారు. చెవులు రిక్కబెట్టారు. నాకు గొంతులో పకోడీ ఇరికినంత పనైంది. వారితో పాటు నేనూ ఆత్రంగా వింటున్నా. అప్పడికే నా పకోడీలు అయిపోయినయ్..‘‘భయ్యా.. ఔర్ దో ప్లేట్ పకోడీ, దో చాయ్’’ అని అతి చిన్నగా వెయిటర్కు సైగ చేశా. ముందు పకోడీలున్నా మనసు మాత్రం అతను చెప్పే మాటల మీదే కేంద్రీకృతమైంది. అతను చెప్పడం మొదలు పెట్టాడు.. ‘‘ఈ మధ్య మన శాస్త్రవేత్తలు చంద్రుడి మీదికి ఒక రాకెట్ను పంపిడ్రు.తెలుసా? గది ఫేలైంది. అందుకే ఈ వానలు’’. ‘‘అరెయ్ కాస్త అర్థమయ్యేట్టు చెప్పురా బై’’ అని అడిగారు ఇంకొకరు. ‘‘అవును రా అయ్యా.. ఈ శాస్తవేత్తలు ప్రయోగించిన రాకెట్ మన ఊరికి పదింతలుంటది. దీనికి వేల కోట్లు రూపాలు ఖర్సు కూడా అయినై. అది బై మిస్టేక్లో చంద్రుడి మీదకు వెâే ్ల బదులు తొవ్వ తప్పి పైన మొగులుకు బొక్క పెట్టింది. అరె పైన మొగులు అంటే ఏమనుకున్నార్రా మీరు. అది మొత్తం ఐస్ గడ్డ. మీకు అల్కగ చెప్పాలంటే కుండకు బొక్క పడ్డది రా వారి. అందుకే రోజూ ఈ కారుడు కథ’’ ‘‘ఎట్ల మరి ఈ వానలు ఆగయా. ఇక అంతేనా?’’ అడిగాడు అందులోని ముసలాయన కాస్త భయం భయంగా. ‘‘ఆగయ్.. ఎవ్వరూ ఏమీ చేయలేరు. కుండకు బొక్క పడితే ఏమైతది.. నీళ్లు ఒడిసె దాకా కార్తది.. ఇçప్పుడు గా ఆకాశానికే బొక్క పడ్డది. ఇక మంచు గడ్డలు పూరాగా కరిగేదాకా వానలు పడ్తనే ఉంటయ్. ఆçపుడు ఎవ్వరి వశం కాదు’’. ‘‘ ప్రభుత్వం ఏం చేయలేదా ?’’ అన్నారు కాస్త కోపంగా ఇంకొకరు. ‘‘అరెయ్ నీకో విషయం తెలుసా.. రాకెట్ ప్రయోగం ఫేలైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శానా కోపమొచ్చింది. మనోడికి ఓసారి గిట్లే కోపం వస్తే ఏమైందో యాదికుందా గా.. పాకిస్థాన్ ఉగ్రవాదుల గుడారాల మీద ఓరాత్రి పూట బాంబులేసి ఆదేశ మోళ్లందరికీ ఉచ్చవోయిచిండు. ఈసారి కూడా మోదీ శాస్త్రవేత్తల మీద శానా గరమైండు. ఢిల్లీ నుంచి ఆగమాగం శాస్త్రవేత్తల ఆఫీసుకు పోయిండు. అక్కడున్న అందరికంటే పెద్ద శాస్తవేత్త తప్పయింది క్షమించమని ప్రధానిని పట్టుకొని ఏడ్చిండు. టీవీలళ్ల చూడలేదా మీరు’’. ‘‘అరె ఆయన ఏడిసింది అందుకా నేను ఎందుకో అనుకున్నరా వారి’’ అన్నాడు మరొకాయన అమాయకంగా. ‘‘మరి ఏమనుకున్నర్ మీరు సైన్స్ అంటే తమాశాలా! దానితో మంచి ఎంత ఉంటదో చెడు కూడా అంతే ఉంటది.’’ అని అతను ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. అప్పటికే రెండు ప్లేట్ల పకోడీలు తిని, చాయ్లు కూడా తాగిన నాలో ఓపిక, సహనం చచ్చింది. ‘‘అన్నా ఏ ఊరే నీది?’’ అని అడిగా. అతను మహామేధావిలాగా ముఖం పెట్టి ‘‘మాది ఈ ఊరే తమ్మి’’ అన్నాడు. ‘‘అన్నా.. వానలిలా కురవడానికి కారణం మనమే. మనం వాతావరణాన్ని చాలా కలుషితం చేస్తున్నాం. అందుకే ఈ అకాల వర్షాలు. కరువు కాటకాలు. చలికాలం ఉక్కపోత. కాలం పోయినంక కూడా గిట్ల కుండపోత. అంతటికీ కారణం మనమే. అంతేకానీ నువ్వు అన్నట్టు శాçస్త్రవేత్తలు, చంద్రయాన్ ప్రయోగం కాదు. అన్నా ఇవన్నీ నీకు ఎవరైనా జెప్పిన్రా లేక నువ్వే పుట్టించినవా?’’ అని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు. ‘‘ఈయన చెప్పినవన్ని గాలిముచ్చట్లు. మీరు నమ్మకండి’’ అని అక్కడున్న వాళ్లందిరికీ సర్ది చెప్పే సరికి నాతల ప్రాణం తోకలోకొచ్చింది. ఈ టెన్షన్లో ఎన్ని పకోడీలు తిన్నానో.. ఎన్ని చాయ్లు తాగానో తెల్లారితే గానీ నాకు అర్థం కాలేదు..ఇంత క్రియేటివిటీనా దేవుడా! – ఇప్పకాయల రమేష్, చేర్యాల, సిద్దిపేట జిల్లా -
రుచుల జాడ వేరు
‘మాధవీలత వొస్తుందా..’ అనుకున్నాడు బాలూ. అప్పటికి పదోసారో పదిహేనోసారో అనుకున్నాడు. మొబైల్ తీసి.. వాట్సప్లో వచ్చిన మెసేజీని చూసుకున్నాడు. ‘తనక్కూడా మెసేజీ వెళ్లి ఉంటుందా? ఎక్కడ ఉందో.. అసలు ఎవరికైనా తెలుసా? ఎలా ఉందో? ఛ.. ఈ డౌటు కరెక్టు కాదు. అలాగే ఉంటుంది. తప్పకుండా.’ అని కూడా అనుకున్నాడు. ‘వొస్తే బావుణ్ణు’ అని ఆశపడ్డాడు. రెండ్రోజుల కిందట ఓ చిన్ననాటి ఫ్రెండు ఫోన్చేశాడు. ‘దసరా సెలవుల మధ్యలో వచ్చే ఆదివారం అనుకుంటున్నాం.. కుదురుతుంది కదా’ అన్నాడు. ఇవాళ వాట్సప్లో మెసేజీ వచ్చింది. అందరికీ ఈ మెసేజీ పంపినట్లుంది. గ్రూప్ క్రియేట్ చేసి ఉంటే.. ఆమె నెంబరు అందులో దొరికే చాన్సుండేది. ఆరోజు దాకా ఎదురుచూడాల్సిందే. ప్రత్యేకించి ఆమె గురించి వీడిని అడిగేంత ధైర్యం లేదు. అడిగితే తప్ప ఆరా తెలియదు. ఇరుకులో పడింది మనసు. ‘దసరా దాకా ఆగగలను’ అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ‘వొస్తే సరే... రాకపోతే..’ ఆలోచనకే, డీలాపడిపోయాడు కూడా. అప్పట్లో– మాధవీలత... పదోక్లాసులో కొత్తగా వచ్చి చేరింది. బాలాజీ ఉరఫ్ బాలూ కళ్లు మెరిశాయి. అలా మెరవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బాలు చేతివేళ్లలో ఓ ఇంద్రజాలం ఉండేది. అది అతనికి జన్మతః వచ్చింది. అతని చేతివేళ్లలో ఇమిడే కుంచెలు– కదనరంగంలో విచ్చలవిడిగా దౌడుతీసే అశ్వాల విహారాలు అయ్యేవి.. చుట్టుముట్టే శత్రుసేనను చెల్లా చెదరు చేయడం లక్ష్యంగా మెరిసే ఖడ్గ ప్రహారాలు అయ్యేవి...! ఆ కుంచెల కింద రంగులు– అశ్వ విహారాలలో రేగే ధూళిలాగా.. ఖడ్గ ప్రహారాలలో మెరిసే కాంతుల లాగా.. నానా వయ్యారాలు పోయేవి, ఒద్దికను దిద్దుకునేవి. అంతిమంగా ఓ అద్భుత సౌందర్యం ఆవిష్కృతమవుతుండేది. బొమ్మలు గీయడం అతినికి బాగా ఇష్టం. వచ్చిన విద్యకు వన్నె అద్దుకోవడానికి ఓ గురువు దగ్గర చేరాడు బాలూ. ఆయన వాడిలో సత్తా ఎంతో పలువిధాలుగా పరీక్షించాక... రవివర్మ వర్ణచిత్రాల ఫోటోలు ఇచ్చి.. వాటిని యథాతథంగా కాపీ చేసి ‘కలరింగ్’లో పరిణతి పొందే పని అప్పగించాడు. ఆ క్రమంలో అతని ఎదుటకు... హంసతో మౌన సరాగాలాడుతున్న ‘దమయంతి’ వొచ్చింది... తన బుగ్గలను చూసి చిన్నబోతున్న ఫలాలు, తన నీలికనుల ఎదుట వెలతెలబోతున్న ద్రాక్ష గుత్తితో మాద్రి వొచ్చింది... వెన్నెల కురుస్తోంది, చందమామ కూడా వొచ్చేశాడు, నీవింకా రావేలరా కృష్ణా అంటూ సెలయేటిఒడ్డు రాతి తిన్నె మీద విరహోద్ధితయై నిరీక్షిస్తున్న రాధ వొచ్చింది... వారికి కొనసాగింపుగా, యిదిగో యిప్పుడిలా, యెల్లో ఓకర్ రంగు చుడీదార్ తొడుక్కుని... తరగతి గదిలోకి మాధవీలత వొచ్చింది! తన కళ్లలోని మెరుపును అలాగే దాచిపెట్టుకున్నాడు. ఆ తరగతిలో ఉన్న అనేకమందితో పోలిస్తే.. మాధవీలత గొప్ప సౌందర్యరాశి కాదు. కానీ వాడి కళ్లకు ఆమె రవివర్మ చిత్రం. ఆ అబ్బురాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. నిజానికి తను నకలు చేసిన ‘వెన్నెల్లో రాధ’ను చూపించి.. ‘చూశావా నీ బొమ్మగీశాను, నెలకిందటే’ అని ఉంటే గనుక, కలిగే దిగ్భ్రమలో ఆమె వాడిని సులువుగా ఇష్టపడి ఉండేదే! కానీ అలాంటిదేమీ జరగలేదు. అలాగని, వాడి యిష్టాన్ని గుర్తించలేదని కాదు. కానీ యిద్దరి మధ్యా అవ్యక్తంగా ఉండిపోయింది. స్కూలు పూర్తయి, వాళ్లు దూరమయి, దశాబ్దాలు గడిచాయి. తలపుల్లోంచి బయటకు వచ్చి... చేతివేళ్లకేసి చూసుకున్నాడు బాలాజీ. ఒకప్పుడు నిస్తేజంగా ఉండే కేన్వాసుకు ప్రాణాలు పోసి వర్ణరంజితం చేసిన వేళ్లు! కంప్యూటరు కీబోర్డు మీద టకటకలతో గిడసబారినట్లు కనిపిస్తున్నాయి. పెర్సీ షెల్లీ– ఒజీమాండియాస్ గుర్తొచ్చింది. అంతా గతించిన వైభవం. ‘కొత్త ఊపిరులూదగలనా’ అనుకున్నాడు. ఎదురుగా స్క్రీన్ మీద టాస్క్ బార్ లో తేదీ చూశాడు. ఎంత దూరముందో లెక్క వేసుకున్నాడు. అప్పట్లో లోపల దాచుకున్న.. ‘ఇష్టం’ ఓసారి ఒళ్లు విరుచుకుంది. సురేంద్ర రాజు బక్కపలచటి వాడు. పీలగా పొట్టిగా ఉంటాడు. రంగువెలిసిపోయిన ఒక ఖాకీరంగు ప్యాంటు తొడుక్కున్నాడు. అది వాడి కంటె చాలా పెద్ద సైజుది. పాదాల వద్ద జాస్తి పొడుగుంటే కత్తిరించేసి.. మడిచి కుట్టించటానికి కూలీ దండగని అలాగే వదిలేశాడు. దారపు పోగులు ఊడుతూ, వేలాడుతూ ఉందది. బాగా వదులుగా ఉంటే, నడుముదగ్గర ప్యాంటును మొలతాడు కిందికి దోపి జారిపోకుండా భద్రత కల్పించాడు. చొక్కా కూడా ఇంచుమించు అలాగే ఉంది. అది తెల్లదే కానీ, కొన్నేళ్లుగా ఉతుకులు పడి గోధుమ రంగులోకి వచ్చింది. కాళ్లకి హవాయి చెప్పులున్నాయి. అవి జారిపోతాయేమోనని వేళ్లతో గట్టిగా బిగించి పట్టుకుని నడుస్తుంటాడేమో.. బొటనవేలి దగ్గర గుంటలు పడి... నీలం రంగు తేలి ఉన్నాయి. ‘‘ఐస్.. ఐస్...’’ అన్నాడు, బడి ఎదురుగా ఉన్న బండి వద్ద నిల్చుని. ఆ మాట వాడి అబ్బసొత్తు! అనువంశికంగా సంక్రమించింది వాడికది. ఒకటిన్నర అక్షరాలున్న ఆ ఒక్కపదాన్ని రెండుసార్లు జంటగా పలకడంలో వాడు రకరకాల చిన్నెలు చూపించగలడు. వాడి నాయిన కూడా ఐసు అమ్మేవాడు. మూత ఉన్న ఒక డబ్బాకు చక్రాలు బిగించి దాన్ని తోసుకుంటూ నడుస్తూ పల్లెలన్నీ తిరిగేవాడు. ఇప్పుడు ఆ డబ్బా రూపు కాస్త మారింది. కాపోతే.. తోపుడు బండిలాగా కాకుండా రిక్షా బండిలాగా తయారైంది. కాస్త పెద్దది. కొన్ని చిన్నెలు కొత్తగా వచ్చాయి. కానీ ఆ బండి వాడిది కాదు.. వాడు ఆ బండివాడి వద్ద కూలికి పనిచేస్తాడు. బడి ఎదురుగా ఉన్న ఆ ఐస్ బండికి ఇంటర్వెల్ సమయాల్లో వ్యాపారం బాగుంటుంది. లంచ్బ్రేక్లో పిల్లల్ని గేటు బయటకు పంపరు. కాబట్టి రెండు ఇంటర్వెళ్లకు మధ్య ఖాళీలో బండి ఓనరు ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. ఆ టైములో బండి దగ్గర సురేంద్ర రాజు ఉరఫ్ రాజు కూర్చుని ఉంటాడు. రోజుకు ఇరవై రూపాయలొస్తాయి కూలీగా. మధ్యాహ్నం అయిదురూపాయల కూడు తింటాడు. రాత్రి పెళ్లాన్ని పీక్కుతింటాడు. అదీ జీవితం. ఈలోగా– ఓ మోటారు సైకిలు రోడ్డు వారగా ఉన్న తనవైపు వస్తుండడం చూసి.. కొంటాడేమో అనుకుని.. మరోసారి ‘‘ఐస్.. ఐస్...’’ అని పొలికేక పెట్టాడు రాజు. ఆ మోటారు సైకిలు శాల్తీ సరిగ్గా వచ్చి బండి పక్కనే ఆగింది. తన దగ్గర దొరికే ఐసు నామావళి ఎత్తుకోగానే.. అవతలివాడు చేత్తో వారించి.. మొహానికున్న హెల్మెట్ ముసుగు తీశాడు.. ఎక్కడో చూసినట్టే ఉంది గానీ గెమనంలోకి రాలేదు. ‘‘ఎంతలో ఈమంటావు నా’’ అన్నాడు. ‘‘నీయబ్బా.. నన్ను గుర్తు పట్టలా’’ అన్నాడా శాల్తీ. వాడిని గుర్తు పట్టాక రాజు కళ్లు మెరిశాయి. వచ్చినవాడు– కాసేపు అవీ ఇవీ వాకబు చేశాడు. ‘‘ఆరోతేదీ ఆదోరం.. మనోళ్లంతా వొస్తారు.. పొద్దన్నే వొచ్చేయ్.. సాయంత్రం దాకా అక్కణ్నే... బోజనాలు గూడా...’’ అని, బండిస్టార్ట్ చేశాక ‘‘చిల్లరేమైనా ఈమంటా’’ అంటూ ఓ యాభైనోటు తీసి జేబులో పెట్టి చక్కాపోయాడు. రాజు కళ్లు మళ్లీ మెరిశాయి. ఎన్నిరోజులైంది? నాలిక తడుపుకుని గుటకలేశాడు. ఆదివారం రమ్మన్న సంగతి గుర్తొచ్చింది.. ‘ఆరోజు పెదపెద్దగా ఎదిగిన మనోళ్లంతా వొస్తారు. యివి గాదుగానీ.. యింకో ప్యాంటు యింకో సొక్కా యేస్కోని రావాల’ అనుకున్నాడు. ‘అప్పుటోళ్లంతా వొస్తారేమో..’ అనుకున్నాడు రాజు.. మోటారు సైకిలు వాడి పిలుపును గుర్తు చేసుకుని.. ఆశెగా. వాడికి స్వీట్సంటే చానా ఇష్టం. బంధుజనంలో అవి పెట్టేంత పెద్ద విందులు ఇచ్చేవాళ్లు వాడికి లేరు. ఆ తాహతు ఉన్నవాళ్లు వీడిని దూరం పెడతారు. ‘అందుకే.. ప్రతిబతుక్కీ సావాసగాళ్లుండాల. వాళ్లయితే తాహతూ, తద్దినమూ జూసుకోకుండా... పలకరిస్తారు.’ అనుకున్నాడు కసిగా. ‘ఆదివారం రానీ.. మహరాజులు తినే కూడు తింటా.. స్వీట్లు, గడ్డ పెరుగూ, వేపుళ్లూ, అప్పడాలూ, ఐస్ క్రీమూ కిళ్లీలూ...’ మోటారు సైకిలు వాడి పిలుపు గెమనంలోకి వొస్తేనే వాడికి నోరూరుతోంది. ఆరోజు ఎంత దూరముంది యింకా..? వేళ్ల మీద లెక్కపెట్టాడు. ఆదివారానికి ప్రత్యేకంగా సిద్ధమవుతూ... ‘ఆకలి’ ఇప్పుడే ఒళ్లు విరుచుకుంది!! టెంకాయలోకి నీళ్లెట్టా వొస్తాయంటే ఏం జెప్తాం? మనకు తెలీని వాటికి బగమంతుడి లీల అని సరిపెట్టుకోవాల్సిందే. సంపదలు కూడా అంతే. అది ప్రభాకర్ విషయంలో మాత్రం నిజం. వాడి దగ్గరకు డబ్బు అనే పదార్థం ఎలా వచ్చి చేరింది అనేది ఇదమిత్థంగా ఎవ్వరికీ తెలియదు. కానీ.. వాడొక కాంట్రాక్టరు. అదనంగా చాలా డీల్స్ చేస్తుంటాడు. ఎవడైనా వెళ్లి పది రూపాయలు చందా అడిగితే ఇరవై ఇస్తాడు. తాను గ్లాసు పట్టుకునే సమయానికి తన వెంట ఎవరుంటే, ఎందరుంటే... వారందరినీ లెక్కలోకి తీసుకుని... సరిపడా ఫుల్ బాటిళ్లకు ఆర్డరిస్తాడు. అదే బళ్లో చదివాడు.. అత్తెసరుగానే గట్టెక్కాడు. ఏదో మాయ జరిగి, ఉన్నపళంగా చేరిన సంపదను పెంచుకుంటూ పోతూ.. కుబేరావతారం ఎత్తడంలో ప్రతిభ మాత్రం వాడిదే. తన పట్ల వక్రించకుండా... విధిని చెరపట్టి, సిరిని చేపట్టాడు. విజయవాడలో ఒక డీల్ ఉంది. కానీ.. దానిని చక్కబెట్టగల కీలకం హైదరాబాదులో ఉంది. అయిదునక్షత్రాల హోటల్లో దిగాడు. బల్లమీదికి బ్లూ లేబుల్ రాగానే.. మూతవిప్పి గ్లాసులోకి ఒంపేసి.... ‘మీకు ఇంకో రూం వేశాను.. మీరు తొందరగా వెళ్లాలి. మొదలెట్టేయండి’ అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అవతలివ్యక్తి ‘ఇంకో రూం’లోని భావాన్ని గ్రహించాడు. ఆశెగా.. చీర్స్ మర్యాదలేవీ పట్టించుకోకుండా... తనంత తాను నాలుగు పెగ్గులు తాగేసి ‘ఇంకో రూం’కు వెళ్లిపోయాడు. ప్రభాకర్ ఒక్కడే మిగిలాడు గదిలో! అప్పుడు మోగింది సెల్ ఫోను. ‘‘అన్నా బిజీనా...’’ అవతలి వాడు మిత్రుడే.. కానీ, వీడి సంపద పట్ల సహజంగా ప్రదర్శించి తీరవలసిన అణకువతో అడిగాడు. ‘‘లేదులే చెప్పు..’’ అన్నాక పది నిమిషాలు సాగిందా సంభాషణ. ఆదివారం గురించే. కానీ.. ఆ ఫోనులో ప్రభాకర్కు వచ్చింది ఆహ్వానం కాదు– నివేదిక! ఎందుకంటే... ఈ కార్యక్రమాన్ని మొత్తం మొదలెట్టిందే వాడు. కాగల ఖర్చు మొత్తం తాను భరిస్తానన్నాడు. కార్యభారం మోయగల వారికి పురమాయించాడు. వారిలో ఒక మిత్రుడే ఇప్పుడు ఫోన్ చేసి ఏర్పాట్లు ఎంతదాకా వచ్చాయో... మిత్రుల్లో ఎవరెవరు ఇంకా అందుబాటులోకి రాలేదో.. సాంతం నివేదిక సమర్పించేశాడు ప్రభాకర్కి. ప్రభాకర్ తలచినదానికి, వలచిన దేనికీ కొదవలేదు. కానీ తన సంపదను ప్రదర్శించాలనే దాహం. అందరూ ఆహాఓహో అనాలి. ఇప్పుడు కూడా అంటున్నారు.. అది చాలడం లేదు. అందరినీ పిలిచి అనిపించుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. కాగల ఖర్చు ఓ లెక్కలోది కాదు. ‘‘ఇబ్బందేం లేదు. శనివారం సాయంత్రానికి నేనక్కడ ఉంటా.. కాస్త ప్లాన్ చేసుకుందాం... అంతా అదిరిపోవాలి’’ పురమాయింపు పూర్తిచేశాడు ప్రభా. ఐశ్వర్యంతో తీరక లోలోపల రగులుతున్న... ‘దాహం’ కూడా ఒళ్లు విరుచుకుంది. నది ఒడ్డునే నాగరికతలు వెలుస్తాయని చరిత్ర చెబుతుంటుంది. నది ఒడ్డునే గుడులు వెలుస్తుంటాయి. ఆ ఊర్లో నది ఒడ్డునే బడికూడా వెలిసింది. సువర్ణముఖి గట్టునే రాజా పానుగంటి బంగారమ్మ సీతారామరాయనింవారి ఉన్నతపాఠశాల ఉంటుంది. విశాలమైన పాఠశాల. ఒకప్పుడు దాని ప్రాభవం చాలా పెద్దది. పొరుగు జిల్లానుంచి వొచ్చి ఎస్పీ బాలూ లాంటివాళ్లు కూడా చదివిన బడి అది. బ్రహ్మోత్సవాలకు గతిలేకపోయినా... నిత్య దీపారాధనకు కొరతలేని గుడిలాగా, ఇప్పుడు కాస్త కళ తగ్గినా.. పేదలకు చదువు చెప్పేందుకు మిగిలుంది. ఆదివారం అందరూ చేరారక్కడ. అందరూ పిల్లలైపోయారు. స్థాయులు తాహతులు– కులాలు మతాలు అన్నీ మరచిపోయారు. బతుకు గమనంలో మరుగున పడిపోయిన జ్ఞాపకాలు. మనసు అట్టడుగు పొరల్లో పడిపోయి ఉండేవి.. తవ్వుకుంటున్నారు. దోసిళ్లతో జవురుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వెదజల్లుకుంటున్నారు. ఆ జల్లులో తడుస్తున్నారు. ఆనందిస్తున్నారు. కోలాహలం కొలువవుతోంది. అందరూ– కోపం, అలకలు తప్ప ద్వేషం తెలియని వయసునాటి మిత్రులు. ఆప్తులతో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. యిడుములు పంచుకుంటున్నారు. తెలియకుండానే కళ్లు చెమర్చుకుంటున్నారు. కళ్ల తడిలో గుండె చిక్కబెట్టుకుంటున్నారు. చిక్కనైన గుండె బరువు దించుకుంటున్నారు. తెరపి పడుతున్నారు. కోలాహలంలో హాలాహలం మాయమవుతోంది. మధ్యాహ్నం విందుభోజనం కూడా అనుకున్నట్లే అదిరిపోయింది. స్టార్ హోటల్ స్థాయిలో ఉంది విందు. వాళ్లలో చాలా మంది, జీవితంలో ఎన్నడూ ఎరగని వంటకాలు... బెంగాలీ స్వీట్లు, విదేశీ పలహారాలు, విదేశాల నుంచి తెప్పించే పళ్లు ఏంటేంటో ఉన్నాయక్కడ. వచ్చినవారిలో ఏ పదిమందో తప్ప... తతిమ్మా ఎవ్వరూ అంత వైభవమైన విందును ఎరగరు. ఇంత విందులోనూ స్పెషల్ ఎట్రాక్షన్ వాసూగాడి కోవా జాంగ్రీ. మామూలుగా అయితే... ఆ మెనూలోకి రాగలిగేది కాదు అది. విందులో అందరికీ కోవాజాంగ్రీ పెడతానన్నాడు వాసు. ‘నిర్వహణ భారం మొత్తం ఒకడే మోస్తున్నాడు గనుక.. ఇది వద్ద’న్నారు కొందరు. ‘మన బాల్యం దానితో ముడిపడి ఉంది గనుక ఉండాల్సిందే’ అన్నారు మరికొందరు. చివరకు అది మెనూలో చేరింది. వాసూ వాళ్లందరితో పాటూ ఆ బడిలోనే చదివాడు. మిఠాయి దుకాణం వాళ్ల కుటుంబ వ్యాపారం. సెలవురోజుల్లో మధ్యాహ్నం వేళల్లో షాపులో తానే కూర్చునేవాడు. ఆ సమయంలో స్నేహితులొస్తే మకన్పేడా తినిపించేవాడు. కోవాజాంగ్రీ ధరెక్కువ. ఆ ఊరే కోవాకు పేరుమోసింది. కాళాస్తి కోవా అంటే బెంగుళూరు, హైదరాబాదులాంటి సిటీల్లో కూడా పేరే. రోజూ కొన్ని వందల కిలోల కోవాని.. ఆ సిటీలకి ఎగుమతి చేస్తుంటారు. ఆ ఊరోళ్లంతా... బంధువులు, మిత్రులకి కానుకగా ఇవ్వడానికి పాలకోవానో, వాసుగాడి దుకాణంలో కోవా జాంగ్రీనో తీసుకువెళుతుంటారు. అంత పేరు. కనుకే మెనూలోకి వచ్చేసింది. మొత్తానికి విందును అందరూ ఆస్వాదించారు. చాలా మంది చాలా ఆశలతో ఎదురు చూసిన ఆ ఆదివారం... వారందరి జీవితాల్లోకీ మరికొన్ని కొత్త అనుభూతులను నింపి.. జారుకుంది. పొద్దు వాలిపోయింది. ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయారు. వాసూ, నేనూ మిగిలేం. బడిలో ఉండే సభా వేదిక ‘భువనవిజయం’ మెట్ల మీద కూర్చున్నాం కబుర్లు చెప్పుకుంటూ. మసక చీకట్లలోంచి.. ఒక ఆకారం వచ్చింది మా వైపు. చూడబోతే– సురేంద్రరాజు! వచ్చి, వాసన తగలకుండా కాస్త ఎడంగా, దిగువ మెట్టు మీద కూర్చున్నాడు. ‘‘ప్రోగ్రాం బలే జరిగింది నా’’ అన్నాడు. ‘‘అన్నలెవురున్నార్రా యిక్కడ.. పేర్లు మరిసిపొయినావా’’ అన్నాన్నేను. నవ్వాడు. ఉన్నట్టుండి... ఓ మెట్టు పైకి జరిగి.. వాసుగాడీ చేతుల్ని, తన రెండు చేతుల్తో పట్టుకున్నాడు. ‘‘యింక నిమ్మలంగా సచ్చిపోతాన్రా..’’ అన్నాడు. అదిరిపోయాం మేం. ‘‘సిన్నప్పుట్నించీ మీ అంగట్లో కోవా జాంగిరీ తినాలని వుండేది నాకు. అప్పుట్లో రూపాయే.. ఆ రూపాయికి దోవెక్కడ. వారంలో ఏదో ఒకరోజు మా అయ్య అయిదు పైసలిస్తే ఎక్కవ. బడిబయట యీదిలో ఉప్పూకారం రాసిన మామిడి బద్దలు, రేగుపళ్లు వూరిస్తాంటే ఆటికి తగలేయకుండా ఆ అయిదు పైసలు దాసేదెట్టా? దాస్తినే బో.. ఎన్నాళ్లు దాస్తే నా దగ్గిర రూపాయి రావాల... నీ కాడికొస్తే నువు మకనపేడా పెడ్తావు.. యిది అడగడానికి దైర్నం రాదు..’’ కాస్తంత ఆగాడు. కళ్లలో ఊరుతున్నవాటిని గొంతులోకి జార్చుకుని మింగుతున్నట్టు ఆగి, మళ్లీ అన్నాడు. ‘‘ఒరేయ్ వాసూ.. బతుకు ఇన్ని సమ్మత్సరాలు అయిపోయింది.. ఎప్పుడూ తిన్లా.. ఆ గెవనమే లేకుండా బోయింది. ఇయ్యాల తిన్నా.. బలే వుండాదిరా... అమ్రుతంగూడా యిట్నే వుంటాదేమో.. సిన్నప్పుడు కోరికరా.. తీరిపోయింది! యింత పెద్ద కోరికలేం లేవురా యింక... సాలు.. జనమ సాలించేస్తా...’’ రెణ్నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాసేపాగి లేచాడు.. చేయెత్తి దణ్నం పెట్టాడు. అడుగు తూలకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ‘‘అదేంది మామా.. వీడింత బాగుందని అంటాంటే.. ఆ ప్రభాకర్ గాడు నన్ను కొట్టందొకటే తక్కవ. కోవాజాంగ్రీ నోట్లో పెట్టుకుని ఒక్క ముక్క కొరికి మింగేసి, ‘సెండాలంగా ఉండాది.. మొత్తం డిన్నరంతా సెడగొట్టినావు గదరా.. సెత్త నాకొడకా’ అని తిట్నాడు మామా’’ అని అయోమయంగా చెప్పాడు వాసు నాతో. ‘‘మా మాస్టరుతో స్పెషలుగా జెప్పి, కోవా జాస్తిగా దట్టించి చేయించా మామా.. ఒకేసారి కలిపి, ఒకే బాణల్లోంచి దించినవే.. వోడికంత సెండాలంగా యెందుకునిందీ.. యీడికిట్టా అమ్రుతం మాదిరిగా యెందుకనిపించిందీ...’’ మళ్లీ పొడిగించాడు అదే అయోమయంలో. రుచుల జాడ వేరంటే ఎలా నమ్మడం? ‘‘అంతేలేరా... నీ కోవాజాంగ్రీకి ఒక రేంజి వుండాదనుకో.. దానికి దిగవన వుండేటోడికి అది అద్భుతం.. ఎగవన వుండానని అనుకునేవోడికి అది చెత్త.. పదార్థం ఒకటే. దాని రుచి మాత్రం మనిషి మనిషికీ, వాడి లెవిలును బట్టి మారిపోతుంది’’ అన్నాన్నేను. పగలబడి నవ్వాడు వాడు. ‘‘దేవుడొక్కడే.. ఒక్కోడికీ ఒక్కోమాదిరి కనపడ్తాడని.. వరదరాజసోమి గుడి మండపంలో సాములు జెప్పినట్టు జెప్పినావు మామా...’’ అన్నాడు. కాసేపు నెమ్మదించి.. ‘‘యింకో సంగతి జెప్పేదా’’ అన్నాడు. నా బదులుతో నిమిత్తం లేకుండానే.. ‘‘ఆ బాలూ గాడైతే టేస్టు జెప్పమని యిచ్చిన జాంగ్రీ తినేసి ‘సేదుగా వుండాది రా యెదవా’ అన్నాడు. రొవంత సేపే..! ఆనక బోజనాల కాడ ఇంకో జాంగ్రీ పెట్టించుకోని తిని... ‘సూపర్రా వాసూ.. అంగడికి ఫోన్జేసి రెండు కిలోలు పొట్లాలు కట్టించరా డబ్బులిచ్చేస్తా’ అన్నాడు మామా... యిదేందిది..’’ అన్నాడు నవ్వుతూనే. వాడికి ఏం చెప్పడం? వచ్చినప్పటి నుంచీ– మనసుని, బడి ప్రహరీ గేటుకే తగిలించి పెట్టి... ఒక రకమైన నిరీక్షణలో మాటిమాటికీ అటుకేసి పరికిస్తూ... అదెప్పుడు ఉలిక్కిపడుతుందో అని ఎదురుచూస్తూ ఉండిపోయిన బాలూ... అప్పటికి ఈ లోకంలో లేడని... ఎలా చెప్పడం? భోజనాలకు క్షణాల ముందే... మాధవీలత వచ్చిందని, అచ్చం అప్పటిలాగానే.. దయమంతిలా, మాద్రిలా, వెన్నెల్లో రాధలా ఉన్నదని... రాగానే అందరినీ నవ్వులతో పలకరిస్తూనే, కళ్లతో దేవులాడి... నేరుగా బాలూ దగ్గరకెళ్లి ‘ఏం బాలూ బాగున్నావా’ అని అడిగిందనీ... ఆ తర్వాత ఉన్నంతసేపూ వాడితోనే కూర్చుందనీ, కలిసే భోజనాలకూ వెళ్లారనీ... కోవాజాంగ్రీ రెండో కిలో పొట్లం తనకేనని... ఎందుకు చెప్పడం? ‘‘అదంతేలేరా.. రుచి ఒక్కోసారీ ఒక్కో మాదిరి ఉంటాది’’ అన్నాను. ‘‘యేందో మామా... మా ముత్తాతల కాణ్నించీ మిఠాయి యాపారమే జేస్తండాం. మనం జేసే స్వీటు ఒక్కొక్కరికీ ఒక్కో రుచి ఎందుకుంటాదో.. ఒకే మనిసికి ఒక్కోసారి ఒక్కోమాదిరి ఎందుకుంటాదో.. నా మట్టిబుర్రకి తెలియదులే మామా?’’ అనేశాడు తేల్చేస్తున్నట్లుగా నవ్వి. -
నల్ల పులి
నేను అతి పేదవాడిని. మా నాన్న బతికినన్నాళ్ళు కులాసాగా కాలం గడిపి నా జీవనోపాధికేమీ ఏర్పాటు చేయకుండా కాలం చేశాడు. ఎవరార్డ్ కింగ్ మా నాన్న మేనల్లుడు. అతనొక్కడే మా దగ్గరి బంధువు. మా నాన్న అన్నగారైన సదరన్టన్ బ్రహ్మచారి. పెద్ద ఎస్టేటుకు యజమాని. నాకు బొత్తిగా ఆదాయం లేదు. ఖర్చులెక్కువైపోయాయి. రోజురోజుకూ జీవితం దుర్భరం కాసాగింది. అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వాళ్ళు పీక్కుతినసాగారు. ఎవరార్డ్ కింగ్ నా తండ్రికి స్వయానా మేనల్లుడు. నా పెదతల్లి సోదరుడు. అతడు ఇంతకుముందు బ్రెజిల్లో సాహసోపేత జీవితాన్ని గడిపి ప్రస్తుతం స్థిరనివాసమేర్పరుచుకోదలచి ఇంగ్లాండుకొచ్చాడు. సఫోక్ లో, క్లిప్టన్ దగ్గర గ్రేల్యాండ్స్ అనే పెద్ద ఎస్టేట్ కొన్నాడు. నా గురించి ఈషణ్మాత్రం పట్టించుకోని అతని నుండి గ్రేల్యాండ్స్ రమ్మని నాకు ఆహ్వానమందింది. నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే బయలుదేరి అక్కడికి రైల్లో చేరుకున్నాను. నేనొక బండిని బాడుగకు మాట్లాడుకున్నాను. బండి చోదకుడు మిస్టర్ ఎవరార్డ్ కింగ్ దాతృత్వం గురించి చాలా గొప్పగా పొగిడాడు. దానగుణసంపత్తిలో అతనికి సాటిరాగల వాడెవ్వరూ ఆ ప్రాంతంలో లేరని చాలా మంచిగానే చెప్పాడు. పర్యావరణహితం కోరి ఆ గొప్పవ్యక్తి చాలా రకాల జంతువులను, వివిధజాతుల పక్షులను ఇంగ్లండులో పెంచి ఆయా జాతులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్టు చెప్పాడు. గ్రేల్యాండ్స్ పార్క్ గేటువద్దకొచ్చింది బండి. ఇంటి గడప మెట్ల మీద నిలబడి ఉన్న వ్యక్తే అంకుల్ అని ఊహించాను. ఇంతకుముందెన్నడూ అతన్ని చూసి ఉండలేదు. అంకుల్ కూడా నేనేనని ఊహించాడు. అంకుల్ వయస్సు సుమారు నలభై ఐదేళ్ళుండొచ్చు. పొట్టిగా లావుగా ఉన్నాడు. గుండ్రని ముఖం, నవ్వుతున్న కళ్ళు. ముఖం నిండా ముడతలు. తెల్లని దుస్తులు ధరించాడు. పెదవుల మధ్య సిగార్. తలవెనుక వేళ్ళాడుతున్న పనామా టోపీ. పిల్లర్ల మీద, రాతితో కట్టిన విశాలమైన బంగళా. నన్ను చూడగానే అతనిముఖంలో సంతోషతరంగాలు లేచాయి. ఉత్సాహం పరుగులు తీసింది. అంకుల్ ఎవరార్డ్ భార్యకు నా రాక బొత్తిగా ఇష్టం లేదని నేను తక్షణమే లండన్కు తిరిగివెళితే బాగుంటుందనే ఉద్దేశం ఆమె మనసులో దాగుందని ఆమె ముఖకవళికల్నిబట్టి అన్యాపదేశంగా ఆమె చెబుతున్న మాటల్నిబట్టి గ్రహించాను. అయితే నేనక్కడికి వెళ్ళిన నా లక్ష్యం ఏమంటే భరించలేని అప్పులతో సతమతమౌతున్న నేను మిస్టర్ ఎవరార్డ్ కింగ్కు విన్నవించి ఎంతో కొంత ఆర్థికసహాయం పొందాలని. కానీ, ఆయన భార్యకు నేనక్కిడికిపోవడం సుతరామూ ఇష్టం లేదు. నన్నక్కడ్నుంచి వెళ్లగొట్టాలనే ఆలోచిస్తుండేది. ఎవరార్డ్ కింగ్ మాత్రం నాకు మద్దతుగా నిలిచాడు. ఆమె దురుసుతనానికి జడిసి లండన్కు వెనుదిరిగిపోదలచుకోలేదు. ‘‘మా ఇద్దరిమధ్యకు మూడో మనిషి ఎవరొచ్చినా నా భార్య ఓర్చుకోలేదు. అది ఆమె తత్వం. ఆమె మాటల్ని పట్టించుకోకు. ఈ సిగార్ వెలిగించు. నావెంట రామరి. నా జంతు ప్రదర్శనశాలను చూద్దువుగానీ.’’ అన్నాడు. ఆ మధ్యాహ్నమంతా జంతుప్రదర్శనశాలను చూడ్డంతోనే సరిపోయింది. ఎన్నో జాతులపక్షులు, క్రూరమృగాలను విదేశాలనుంచి తెప్పించాడు మిస్టర్ ఎవరార్డ్. కొన్ని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కొన్ని బోన్లలో మరికొన్ని పంజరాలలో బంధించబడి ఉన్నాయి. చిట్టచివరకు ఒక పొడవైన నాపరాళ్ళ నడవాలోకి తీసుకెళ్ళాడు నన్ను. దానికి చివరలో పక్కలకు జరుపబడేటటువంటి ఒక బరువైన తలుపుంది. దానిపక్కనే ఇనుపచక్రానికీ డ్రమ్ముకూ అనుసంధానించబడి గోడలోనుండి పొడుచుకువచ్చిన ఇనుప హ్యాండిల్ ఉంది. నడవాకు అడ్డంగా లావుపాటి ఇనుపకమ్మీలు నిలువునా అమర్చబడి ఉన్నాయి. ‘‘ఇప్పుడు నీకు నా సేకరణలోకెల్ల అత్యుత్తమమైన ‘బ్లాక్ డైమండ్’ని చూపించబోతున్నాను. చూద్దువు గానీ రా’ అని నవ్వుతూ...లోపలికి చూడు.’’ అన్నాడు. చూశాను. లోపల విశాలమైన గది. రాతిపలకలు పరచబడిన నేల. మధ్యలో సూర్యకాంతి పడుతున్న చోటులో భారీ శరీరంగల నల్లపులి. సూర్యరశ్మిలోని వెచ్చదనాన్ననుభవిస్తూ ముడుచుకొని పడుకొని ఉంది. అచ్చం పిల్లిలాగే. దాని మీదనుండి చూపులు మళ్ళించుకోలేకపోయాను. ‘‘కొంతమంది దీన్ని చీటా అని అంటారు. కానీ అది చీటా కాదు. అది తలనుంచి తోకవరకూ దాదాపు పదుకొండు అడుగుల పొడవుంటుంది. నాలుగేళ్ళక్రితం దీన్ని కొన్నప్పుడు ఇది చిన్న నల్లని మెత్తని బొచ్చు ఉండలాగా ఉండేది. అందులోనుండి రెండు పసుపురంగు కళ్ళు కనబడుతుండేవి. ఇదిచాలా భయంకరమైనది. ఇంతవరకూ నెత్తురు రుచి చూడలేదు. ఒకసారి రుచిచూస్తే మాత్రం మహా క్రూరంగా మారిపోతుంది. ప్రస్తుతం నేను తప్ప దాని ముందర మరెవరూ నిల్చోలేరు. నేనే దానికి తల్లీతండ్రీ, అన్నీను. అది నన్నేమీ చేయదు.’’ అలా మాట్లాడుతూ, మాట్లాడుతూనే అకస్మాత్తుగా బోనులాంటి ఆ గది ఇనుప ఊచల తలుపు పక్కకు జరిపి లోపలికెళ్ళి మళ్ళీ మూసేశాడు. అతని స్వరం విని ఆ మృగం పైకి లేచి, ఆవులించి, దాని గుండ్రని, నల్లని తలను ప్రేమగా అతనికానించింది. అతడు దాన్నిచేత్తో తట్టి ముద్దుచేశాడు. ‘‘టామీ! ఇక వెళ్ళు’’ అని ఆజ్ఞాపించాడు. అది బుద్ధిగా గదిలో ఒకపక్కకెళ్ళి ముడుచుకొని కూర్చుంది. ఎవరార్డ్ కింగ్ బయటికొచ్చి ఇంతకుముందు పేర్కొన్న ఇనుప హ్యాండిల్ని తిప్పనారంభించాడు. అప్పుడు ఆ గది తలుపుకున్న లోహపు కడ్డీలు గోడకున్న రంధ్రాల్లోకి చొచ్చుకుపోయాయి. ఆ తలుపును చేత్తోకూడా కమ్మీలను పక్కకు జరిపి తెరవవచ్చు. ‘‘టామీ అటూ ఇటూ నడవడానికని కొంత స్థలం వదిలేశాను. కావాలంటే నువ్వు కూడా ఈ హ్యాండిల్ని తిప్పి టామీని బయటకు వదలొచ్చు. నేను చేసినట్లుగానే దాన్ని తిరిగి బోనులోకి పంపించవచ్చు కానీ నువ్వాపని చేయొద్దు.’’ నేను ఇనుపవూచల మధ్యకు చేయిపోనిచ్చి నున్నగా మెరుస్తున్న దాని మెడ పక్కభాగాన్ని నిమరబోయాను. అతను వెంటనే నన్ను వెనక్కి లాగాడు. నాకేసి కోపంగా చూస్తూ, ‘‘ఈ సమయంలో దాని మూడ్ బాగాలేదు. టామీ నాతో ఉన్నట్లుగా అందరితోనూ చనువుగా ఉండదు. జాగ్రత్త.’’ అంతలో నడవా మీద అడుగుల చప్పుడు చేస్తూ బాల్డ్ విన్ అనే బలిష్టమైన వ్యక్తి చేతిలో ఒక ట్రే పట్టుకొచ్చాడు. ఆ ట్రేలో జంతువు తొడమాంసం ఉంది. ఆకలితో ఉన్న నల్లపులి బోనులో అటూ ఇటూ అసహనంగా తిరుగుతూ ఉంది. పసుపురంగు కళ్ళు మెరుస్తున్నాయి. నోటినుండి వేళ్ళాడుతున్న ఎర్రని నాలుక జొళ్ళు కార్చుతూ ఉంది. తెల్లటి కోరపళ్ళు భయం గొల్పుతున్నాయి. ఆ వ్యక్తి మాంసాన్ని ఐరన్ బార్స్ సందులో నుండి లోపలికి తోశాడు. అది మాంసాన్ని నోట కరచుకొని మూలకెళ్ళి కూర్చుని, పంజాల మధ్య ఇరికించుకొని చీల్చి తినసాగింది. అప్పుడప్పుడు ముట్టె పైకెత్తి మా వంక చూస్తూ ఉంది. ఆ దృశ్యం భయంగొల్పుతున్నా మనోహరంగానే ఉంది. ‘‘నేను నల్లపిల్లిని అమితంగా ప్రేమిస్తున్నా డియర్ మార్షల్ కింగ్! జూ వాళ్ళు దీన్ని ఇమ్మని అడుగుతున్నారు. కానీ నాకిష్టమైన దాన్ని నేను వదలుకోలేను. సరే. భోజనానికి వెళ్దాం పద.’’ ఆరు రోజులున్నానక్కడ. ఆ సమయంలో అంకుల్కు ఎన్నో టెలిగ్రాములొచ్చేటివి. అవి ఎక్కడ్నుంచి వస్తున్నాయో, ఏ వ్యాపార లావాదేవీల గురించి వస్తున్నాయో నాకు తెలిసేది కాదు. ఆ ఆరురోజుల్లోనూ అంకుల్తో మంచిసంబంధాలే ఏర్పరుచుకోగలిగాను. అతడు తాను అమెరికాలో ఉన్నప్పడు చేసిన సాహస కృత్యాలగురించి కథలుకథలుగా చెప్పేవాడు. సమయం చూసుకొని నేను ఎదుర్కొంటున్న ఆర్థికసమస్యల గురించి ప్రస్తావించాను. అంకుల్ శ్రద్ధగా విన్నాడు. ‘‘అన్నట్టు నువ్వు మన బంధువు లార్డ్ సదరన్ టన్ ఆస్తికి వారసుడివట కదా!’’ అడిగాడు సిగార్ పీలుస్తూ. ‘‘అలా అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇంతవరకూ అతను నాకు సహాయం చేసింది లేదు.’’ ‘‘అతని పిసినారితనం గురించి నేనూ విన్నానులే. ఏదేమైనా నీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఔనూ, అతని ఆరోగ్యమెలా ఉందో ఏమైనా కనుక్కున్నావా మార్షల్?’’ ‘‘ఆయన ఆరోగ్యం చాలా అందోళనకరంగానే ఉందని నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను.’’ అన్నాన్నేను. ‘‘సరిగ్గా చెప్పావు. వచ్చే ప్రాణం, పొయ్యే ప్రాణం లాగుంది ఆయన పరిస్థితి. అతని ఆస్తి నీ చేతికెప్పుడు దొరుకుతుందో చెప్పలేము. పాపం! నువ్వెంతటి కష్టాల్లో ఉన్నావు?’’ సానుభూతి చూపించాడు. ‘‘మీకన్ని విషయాలు తెలుసు. అతి త్వరలోనే ఆస్తి నా స్వాధీనంలోకొస్తుందనే నేను నమ్ముతున్నాను. అందుకని...ఆ లోపల ఏమైనా సహాయం చేస్తారేమోనని...’’ ‘‘ఆ విషయంలో నన్నంతగా ప్రాధేయపడాలా? ఈ రాత్రికే అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. నా శక్తి కొలది నిన్ను ఆపదనుండి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తాను.’’ మరుసటి ఉదయం నేను అక్కడినుంచి నిష్క్రమించవలసి ఉంది. చివరిసారిగా అంకుల్ను కలసి నా కష్టాలు తీర్చే ఏర్పాటు చేయాలని అడగాలనుకున్నాను. కానీ ఆ రోజు పగలంతా అంకుల్కు ఎప్పుడూ రానన్ని టెలిగ్రాములొచ్చాయి. రాత్రి భోజనం ముగించుకొని అంకుల్ స్టడీ రూం కెళ్ళాడు. అలవాటు ప్రకారం అందరూ నిద్రపోయాక గదులకు తాళాలు వేసి ఆఖరుకు బిల్లియర్డ్స్ రూములో నన్ను కలుసుకున్నాడు. డ్రెస్సింగ్ గౌన్ ధరించి ఈజీ చెయిర్లో విశ్రాంతిగా కూర్చుని విస్కీ పుచ్చుకున్నాడు. నా సమస్యల జాబితా ఒక పేపర్ మీద రాసివ్వమన్నాడు. అప్పటికి సమయం రాత్రి ఒంటిగంటైంది. ‘‘పడుకోబోయేముందు నేను నా పెంపుడు పిల్లిని చూడాలి’’ అని చెప్పాడు. నన్నూ రమ్మని పిలిస్తే వెంట వెళ్ళాను. హాలును దాటుకొని నడుచుకుంటూ వెళ్ళాము. రాతి నడవా చీకటిగా ఉంది. ఒక లాంతరు గోడకు తగిలించి ఉంది. మిస్టర్ ఎవరార్డ్ లాంతరును దించి వెలిగించాడు. తలుపు తెరుస్తూ ‘లోపలికి రా!’ నన్ను పిలిచాడు. అంకుల్ ఉన్నాడనే ధైర్యంతో లోపలికి వెళ్ళాను. లోపలున్న మృగం గుర్రుమంది. లాంతరు గుడ్డి వెలుగులో చూశాము. అది ఒక మూలలో పెద్ద నల్లనిముద్దలా ముడుచుకొని పడుకొని ఉంది. లాంతరు పట్టుకొని చూసి– ‘‘టామీ చాలా కోపం మీదున్నట్లుంది. ఇప్పుడు రాత్రి భోజనం పెట్టి దాని కోపం తగ్గించాలి. దయచేసి ఈ లాంతరు పట్టుకో మార్షల్!’’ నేను లాంతరును చేత్తో పట్టుకున్నాను. అతను లోహపుకడ్డీల తలుపు కేసి నడిచాడు. ‘‘మాంసం నిలవ ఉంచే కప్ బోర్డ్ బయట ఉంది. ఇప్పుడే వస్తాను.’’ అని చెబుతూ బయటికెళ్ళాడు. వెంటనే అతని వెనకే లోహపుకడ్డీల తలుపు మూసుకుపోయింది–క్లిక్ మనే చిన్న శబ్దంతో. ఆ శబ్దం స్పష్టంగా వినబడింది. భయంతో నా తనువెల్లా వొణికిపోయింది. వొళ్ళు మంచులా చల్లబడింది. ఒక్క గంతులో తలుపు వద్దకు చేరుకున్నాను. లోపలివైపు నుంచి తలుపుకు హ్యాండిల్ లేదు. తలుపు తెరువుమని ఆక్రందించాను. అది అరణ్యరోదనమైంది. లాంతరు వెలుతుర్లో చూశాను. లోహపు కడ్డీలు మెల్లగా గోడలోని గాడివైపు కదులుతున్నాయి. అప్పటికే చిట్టచివర ఒక అడుగుమేర తెరుచుకొని ఉంది. నేను గట్టిగా అరుస్తూ ఆ చిట్ట చివరి ఊచను చేతులతో నాకున్న బలమంతా ప్రయోగించి అడ్డుకొన్నాను. ఒకట్రెండు నిముషాలు అది కదలకుండా ఆపగలిగాను. బయట అతను చక్రాన్ని శక్తినంతా కూడదీసుకొని తిప్పుతున్నాడు. నా చేతులు, వేళ్ళు నొప్పిపెడుతున్నాయి. గాయాలు కూడా అయ్యాయి. లోహపు కడ్డీల తలుపు పూర్తిగా గోడకు అతుక్కుపోతుందని తెలుసు. నా ప్రాణాలు కాపాడమని వేడుకున్నాను. అతని హృదయం కరగలేదు. తలుపు మూసుకోకుండా నిలువరించే ప్రయత్నంలో విఫలమై విసురుగా వెనక్కి పడిపోయాను. తలుపు మూసుకుపోయింది పెద్ద శబ్దంతో. ఎవరార్డ్ వెళ్ళిపోయాడు. నేనలా పడ్డంతో ఆ మృగం నా వంక తీక్షణంగా చూసింది. అప్పటికే నా చేతిలోని లాంతరు నేలమీద పడి వుంది. అయినా వెలుగుతూనే ఉంది. లాంతరు నా చేతిలో ఉంటే మంచిదని దాన్నందుకోవాలని కొంచెం కదిలాను. అది గుర్రుమంది. నేను నిలబడిపోయాను. నా శరీరంలోని అణువణువూ ప్రాణ భయంతో వొణికిపోతూ ఉంది. ఆ నల్లపులి నాకు పది అడుగులదూరంలో ఉంది. ఆ చీకట్లో దానికళ్ళు వెలుగుతున్న రెండు గుండ్రని దీపాల్లాగున్నాయి. అది కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నట్టుండి మూసుకుంది. బహుశా అది నిద్రపోతూవుండొచ్చు. అది తక్షణం నా మీద దాడి చేస్తుందనుకోవడం లేదు. ఒకటి మాత్రం నిజం. రాత్రంతా నేనూ ఆ మృగం ఆ బోనులో కలిసుండకతప్పదు. ఉచ్చుబిగించి నన్ను ఈ బోనులో రాత్రంతా ఉండేట్టు కుట్రపన్నిన ఆ దుర్మార్గునికన్నా ఈ నల్లపులి ఇంకా క్రూరమైనది. ఉదయం దాకా ఒక రాత్రంతా ఎలా గడపాలి? కిటికీల ఊచలు చాలా దగ్గరదగ్గరగా బిగించబడి ఉన్నాయి. తలదాచుకొనడానికెక్కడా స్థావరం లేదు. ఎంత అరచినా ఎవ్వరికీ వినబడదు. ఈ గుహకు అనుసంధానించబడిన నడవా, ఔట్ హౌస్కు కనీసం వంద అడుగుల దూరంలో ఉంటుంది. గుహబయట వీస్తున్న హోరుగాలిలో నా అరుపులు బయటికి వినిపించవు. ఇప్పుడు నా స్వంత బలం, గుండె ధైర్యమే దిక్కు. తరువాత నా దృష్టి లాంతరు మీద పడింది. దాని వత్తి ఊగిసలాడుతూ ఉంది. పదినిమిషాల్లో అది ఆరిపోవడం ఖాయం. తరువాత చీకట్లో నేనేమీ చేయలేను. ఆ లోపల నేను ఏదో ఒకటి చేయాలి. భయాన్నంతా కళ్ళల్లో దాచుకొని ఆ మృత్యుగహ్వరం కేసి చుట్టూ చూశాను. అప్పుడు ఒక చోటు మీద నా చూపులు ఆగాయి. లోహపుకడ్డీల డోర్ పక్కనే గోడవారగా కొంచెం ఎత్తులో ఇనుప ఊచలతో చేసిన షెల్ఫ్ మాదిరి నిర్మాణమొకటి కనబడింది. అది భద్రమైన చోటు కాకపోవచ్చు. కానీ, నేలమీదఉండడం కన్నా అది కొంచెం నయం. కడ్డీకి కడ్డీకీ మధ్య రెండుమూడంగుళాల ఎడం ఉంది. షెల్ఫును కింద బలమైన ఇనుపస్తంభాలు మోస్తున్నాయి. పైకప్పుకూ షెల్ఫుకీ మధ్య అంతరం రెండుమూడడుగులుంటుంది. నేను దానిపైకి చేరుకుంటే? దీపం ఆరిపోకముందే ఆ పని చేయాలి. ఒక్కసారి గుండెలనిండా ఊపిరితీసుకుని క్షణంలో స్ప్రింగులా పైకి ఒకే ఒక ఎగురు ఎగిరాను. షెల్ఫ్ యొక్క ముందుభాగపు ఇనుప కమ్మీ అంచును పట్టుకుని అలాగే శ్వాస బిగబట్టాను. నా ముఖం షెల్ఫ్ ముందువైపుకు వచ్చేలా నా శరీరాన్ని చుట్లు తిప్పాను. నన్ను చూసి వొళ్ళువిరుచుకొని ఆవలిస్తున్న ఆ నల్లపులి కళ్ళల్లోకి చూశాను. అది నా వైపు కోపంగా కాక ఆసక్తిగా చూసింది. దాని నుంచి వెలువడిన దుర్గంధపు వాయువు గుప్పున కొట్టింది. వొళ్ళువిదిలించుకొని అది నా వైపు వచ్చింది. వెనుక కాళ్ళ మీద నిలబడి ఒక పంజాను గోడకానించి తరువాత రెండో కాలును కూడా ఎత్తి నా కిందున్న అడ్డం నిలువు ఇనుపతీగల చట్రాన్ని గోళ్ళతో గోకింది. అప్పుడు నేనింకా సాయంకాలం దుస్తుల్లోనే ఉన్నాను. తెల్లని గోరుతో నా ట్రౌజరు పర్రున చింపేసింది. ఫలితంగా నా మోకాలు గీసుకుపోయింది. నొప్పికి తాళలేక గట్టిగా కేకవేశాను. దాంతో అది కాళ్లను కిందకు దించింది. నేనింకా వెనక్కి జరిగి సర్దుకున్నాను. నేను పడుకున్న చిన్న పడక కింద అది అటూ ఇటూ పచార్లు చేస్తూ అప్పుడప్పుడు నా వైపు చూడసాగింది. దీపం పూర్తిగా ఆరిపోయింది. ఆ నల్లపులితో నల్లని చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాను. అప్పటికి రాత్రి రెండుగంటలైవుంటుందని ఊహించాను. నాలుగ్గంటలకు పూర్తిగా వెలుగొచ్చేస్తుంది. ఆ నల్లని చీకటిలో నల్లపులి సవ్వడి వినరావడం లేదు. అదెక్కడుందో అంచనాకందడం లేదు. నా కజిన్ దుర్మార్గాన్నీ, వంచననూ, కాపట్యాన్నీ, కుట్రనూ తలచుకుంటుంటే రక్తం మరిగిపోతూ ఉంది. అతని నవ్వు ముఖం వెనుక నా పైన ఇంత ద్వేషం దాగిఉందా? మధ్యయుగ కాలంలో ఇంత ఘోరమైన హత్యలు చేయించేవారని విన్నాను. నిద్రపోవడానికి అతని గదికి వెళ్తుండగా చూసిన సాక్షులున్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయమేమంటే...వాళ్ళు చూడకుండా నన్ను పులిబోనులో వదలి తలుపు బిగించి చల్లగా జారుకోవడం. అతను ప్రజలకు చెప్పబోవు కథ అందరినీ నమ్మించేట్టుగా ఉంటుంది. ‘మార్షల్ కింగ్ సిగారు పీల్చడం కోసం బిలియర్డ్స్ గదిలోకి వెళ్ళి ఆసక్తిని అణచుకోలేక అతను చివరిసారిగా పులిని చూడాలని వెళ్ళాడు. ఆ సమయంలో బోను తెరుచుకోవుందని తెలియక లోపలికి వెళ్ళిన అతన్ని పులి చంపేసింది.’ అటువంటి ఘోరహత్య చేసి తేలిగ్గా తప్పించుకోగలడు. ఒకవేళ ఎవరికైనా అనుమానం కలిగినా రుజువులు దొరకడం అసాధ్యం. తెల్లారడానికి మిగిలిన రెండు గంటలు చాలా భారంగా భయంకరంగా గడిచిపోయాయి. నల్లపులి తన వొంటిమీదున్న బొచ్చును నాలుకతో నాకుతున్నట్లుందేమో? ఆ శబ్దం వినిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి దాని రెండు పచ్చని కళ్ళు చీకట్లో నా వైపే చూస్తున్నట్లు అనిపించినా నన్నే లక్ష్యంగా చేసుకున్నట్లనిపించలేదు. కాబట్టి అది నా ఉనికిని అది గుర్తించలేదని నాకు అర్థమవటంతో నా గుండె దడ తగ్గింది. అబ్బ! ఎలాగైతేనేం? తెల్లారిన సూచనగా కిటికిలోంచి సన్నగా వెలుతురు లోపలికి ప్రసరించింది. అప్పుడు నల్లపులిని స్పష్టంగా చూడగలిగాను. ఇంతకుముందుకన్నా దాని కోపం హెచ్చుస్థాయిలో ఉంది. ఉదయపు చల్లదనం దానిలో అసహనం రేగించింది. పైగా ఆకలితో ఉంది. భయంకరంగా గర్జిస్తూ నాకు దూరంగా అటూ ఇటూ వేగంగా పచార్లు చేయసాగింది. దాని మీసాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. తోకను విపరీతంగా ఝాడిస్తూ ఉంది. అలా తిరిగేటప్పుడు అకస్మాత్తుగా అది నా వైపు చూసింది. అంతే. నేను భయంతో బిగుసుకుపోయాను. నా పైప్రాణాలు పైన్నే పోయాయి. అది నన్ను చంపాలని నిశ్చయించుకున్నట్టు నాకర్థమై పోయింది. అది చేసే ఎడతెరిపిలేని గర్జనలు తీవ్రమయ్యాయి. ఆ ఇరుకైన కటాంజనాల మీద ముడుచుకొని పడుకున్నాను. నేను ధరించిన వదులు దుస్తులు చలినుండి నన్ను కాపాడలేకపోతున్నాయి. అక్కడ్నుంచి తప్పించుకోడమెలా? అని ఆలోచిస్తున్నాను. ఒక విషయం మాత్రం స్పష్టమైంది. బోను యొక్క ఇనుప ఊచల తలుపు ముందరిభాగం మొత్తం చక్రాలమీద నడుస్తుంది. దాని చివరి కడ్డీ నేనున్న షెల్ఫుకు తలవైపునే వుంది. నా చేతికందుబాటులో ఉంది. దాన్ని కొంచెం వెనక్కి లాగితే? నాకది సాధ్యమౌతుందా? అసలు కడ్డీ జరిపితే జరుగుతుందా? రాకపోతే? అయినా ఒకసారి ప్రయత్నిస్తే? కదిలే ధైర్యం చేయలేను. అలా కదిలితే వెంటనే నల్లపులి నా మీద దాడి చేస్తుంది. మెల్లమెల్లగా నా చేతిని ముందుకు జరపసాగాను. ఆవలిగోడ అంచును ఆనుకొని ఉన్న చివరి ఇనుపకమ్మీ చేతికి తగిలేవరకూ. అది సులభంగానే వెనక్కి జరగడంతో నేను ఆశ్చర్యపోయాను. ఇంకా వెనక్కి లాగాను. మూడు అంగుళాలమేర ఇవతలికి జరిగింది. ఆ గేట్–చక్రాలమీద నడుస్తుందని ముందుగానే చెప్పాను కదా. ఇంకొకసారి లాగాను. అయితే ఆ క్రూరప్రాణి నా వైపుకు ఊహించని వేగంతో లంఘించింది. నేను భీతిల్లిపోయాను. దాని ఉధృతధాటికి నేను పడుకున్నషెల్ఫు ఊగులాడింది. అగ్నిగోళాల్లా రగిలే దాని కళ్ళు, సమతలంగా ఉన్న పెద్ద తల, దవడలమధ్య వేలాడుతున్న ఎర్రని నాలుక, తెల్లని కత్తుల్లాంటి కోరలు నాకు అతి దగ్గరగా ఉన్నాయి. ఇనుపషెల్ఫ్ ఊడి కిందికి పడిపోతుందేమోనని అనుమానం కలిగింది. అది షెల్ఫ్ అంచుమీద ముందరి కాళ్ళు ఆనించి కొన్ని క్షణాలు నిలబడింది. వెనుకకాళ్ళు రాతి నేలపై పట్టు చిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలోవిఫలమై అంత భారీ శరీరం దబ్బున కిందకు పడిపోయింది. అది ఊరుకోలేదు. శరీరాన్ని వెనక్కి వంచి మళ్ళీ ఎగరడానికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాలవ్యవధిలో నా చావో, ప్రాణాలతో బతికి బయటపడడమో నిర్ణయమౌతుంది. ఈ సారి దాని గురి తప్పదు. ప్రాణాలకు తెగించాలి. అప్పటికప్పుడే పథకం రచించుకున్నాను. వెంటనే నా కోటును తీసేసి చేత్తోపట్టుకున్నాను. నా మీదకు ఎగురబోతున్న ఆ మృగం ముఖం మీదకు పడేట్టు కిందకు విసిరేశాను. అదే క్షణంలో షెల్ఫ్ అంచుమీదనుంచి కిందకు దుమికి గేటు చివరి కమ్మీని పట్టుకొని పిచ్చిపట్టినట్లు లాగాను. గేటు చివరిలో ఏర్పడ్డ సందులోంచి నా శరీరాన్ని దూర్చి బయటికురికాను. కానీ క్షణంలో వెయ్యోవంతు ఆలశ్యమైంది. ఆ వ్యవధిచాలు ఆ క్రూరమృగానికి. కోటు ముఖం మీద పడ్డంతో కొన్ని క్షణాలు గుడ్డిదైపోయిన నల్లపులి దాన్ని పక్కకు విదిలించి కొట్టింది. సందులోంచి దూరి అవతలకు దాటుకుంటూ గేటును మూసేశాను. కానీ నా దేహం పూర్తిగా బయట పడకముందే పులి–పంజాతో నా పిక్కమీద కొట్టింది. ఆ దెబ్బతో కత్తితో చెక్కను చెక్కినట్లు పిక్కకండ ఊడొచ్చింది. విపరీతంగా రక్తం కారిపోయింది. నేను ఏదో విధంగా బయటికొచ్చేశాను. ఇప్పుడు నా క్షతగాత్ర దేహం బయట గేటు ఇనుపకమ్మీల అవతల దుర్గంధపూరితమైన ఎండుగడ్డిలో పడిఉంది. ప్రస్తుతం నాకూ పులికీ మధ్య అడ్డుగా ఇనుప ఊచల గేటు నిలిచిఉంది. వెనుక కాళ్ళమీద నిలబడి ముందు రెండు పంజాలతో ఊచలను వొళ్ళు తెలియని ఉన్మాదంతో విపరీతంగా బాదుతూ ఉంది నల్లపులి. విపరీతంగా గాయపడిన నేను చచ్చానో బతికానో నాకే తెలీదు. బోను లోపలున్న పులి నా కోటును చీలికలు పేలికలకింద మార్చింది. బోనులో చిక్కుకున్న ఎలుకను చూస్తూ చెలరేగిపోతున్న పిల్లిలా ఉంది లోపలున్న పులి. దాని నల్లని ముఖం, ఎర్రటి నాలుక నా కళ్ళముందే మెదులుతూ ఉన్నాయి. తరువాత, రెండుగంటలపాటు నేను తెలివితప్పి పడున్నాను. ఏదో శబ్దం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. నా కజిన్ తలుపు తీసి లోపలికి తొంగి చూశాడు. ఏం జరిగిందో చూసి అవాక్కయ్యాడు. బోనులోపల పులి ముందరికాళ్ళ మీద తలపెట్టుకొని కూర్చొని ఉంది. అంకుల్ నా వైపు పదేపదే చూశాడు. తలుపు మూసి నా వద్దకొచ్చాడు–నేను నిజంగా చచ్చిపోయానా లేదా అని చూడ్డానికి. తరువాత నేనేమీ గమనించే స్థితిలో లేను. నాకు ఉన్నట్టుండి స్పృహ వచ్చి చూసేసరికి అతని వీపు నాకు కనిపిస్తూ ఉంది. ‘‘సెభాష్ టామీ! సెభాష్! చాలా మంచిపనిచేశావు.’’ అంటూ బోను కమ్మీలదగ్గరికి వెళ్ళాడు. అంతే... ‘‘నేను టామీ! నేను నీ మాస్టర్ ని. నన్నే గుర్తుపట్టలేదా? వదులు. నన్నొదులు... ’’ అని భయంకరంగా కేకలు పెట్టాడు. ఆ సమయంలో అంకుల్ చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చాయి. ‘‘ఒకసారి ఆ నల్లపులి రక్తం రుచిచూసిందంటే అది మనకు శత్రువుగా మారిపోతుంది’’ అని. నా రక్తాన్ని అది అప్పటికే రుచిచూసిఉంది. కానీ అతడు ఖరీదు చెల్లించవలసివచ్చింది. ‘‘దూరంగా వెళ్ళిపో రాక్షసీ! బాల్డ్ విన్..బాల్డ్ విన్..’’ అతను పెడుతున్న చావుకేకలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. చివరకు అవి మెల్లగా గాలిలో కలిసిపోయాయి. అతడు చనిపోయాడనుకుంటాను. అతని శరీరం రక్తంలో ముంచితీసినట్టుంది. అతడు ఆ గదంతా పిచ్చిపట్టినట్టు తిరిగి పడిపోయాడు. అదే అతన్ని చివరిసారి చూడడం. కొన్ని క్షణాల తరువాత తెలివితప్పి పడిపోయాను. నేను నా జీవితపు చివరి రోజు దాకా చేతికర్ర సహాయంతోనే బతికాను పులితో గడిపిన ఆ రాత్రి గుర్తుగా. నల్లపులి సంరక్షకుడైన బాల్డ్ విన్, ఇతర పనివాళ్లు చెప్పిన ప్రకారం... యజమాని చావుకేకలు వినబడగానే అందరూ బోను దగ్గరికి పరుగెత్తారు. నేను ఊచల వెనుక పడుండడం చూశారు. చిందరవందరగా విసిరేసినట్టు పడి ఉన్నయజమాని ఛిద్రమైన శరీర భాగాల్ని చూశారు. తాను ఎంతో మక్కువతో పెంచుకొన్న నల్లపులే అతని ప్రాణాల్ని తీసింది. ఇనుప ఊచల గుండా పులిని తుపాకితో కాల్చి చంపేశారు. నన్ను నా పడకగదికి చేర్చి డాక్టర్ను, నర్సును పిలిపించి చికిత్స ఇప్పించారు. నేను కొన్నివారాల పాటు చావుబతుకుల మధ్య పోరాడాను. ఒక నెల తరువాత నేను తిరిగి లండన్ చేరుకున్నాను. ఒకరోజు రాత్రి మిస్టర్ ఎవరార్డ్ భార్య నన్ను కలుసుకుంది. ‘‘ఒంట్లో కులాసాగా ఉందా?’’ అని అడిగింది. నేను నెమ్మదిగా తల ఊపాను. ‘‘మొదట్నుంచీ లండన్ తిరిగి వెళ్ళిపొమ్మని నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. నా భర్త పన్నిన కుట్రకు బలికాకుండా నిన్ను కాపాడాలనుకున్నాను. నిన్నెప్పటికీ తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశమేలేదు అతనికి. నన్ను కూడా చంపాలనుకున్నాడు. అతని కబంధహస్తాల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక యమయాతన పడ్డాను. అతని చావు కారణంగా నేను స్వేచ్ఛాగాలులు పీల్చుకోగలిగాను.’’ ఆమె చరచరా వెళ్ళిపోయింది. తరువాత మిగిలి ఉన్న భర్త ఆస్తిని వెంట తీసుకొని స్వదేశానికెళ్ళిపోయింది. చావు నుంచి తప్పించుకున్నా అప్పులబాధ వదల్లేదు. అంతలో వకీలు సమ్మర్స్ వచ్చాడు. మొదట అభినందనలు తెలిపాడు. ‘‘ఇంగ్లాండ్ లో అత్యంత ధనికులలో ఒకరైన లార్డ్ సదరన్ టన్ ఆస్తికి మీరు యజమానైపోయారు. ఈ విషయం మీకు ముందుగా తెలిస్తే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మీ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తుందేమోనని చెప్పలేదు.’’ ఆ వార్త విని నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. తరువాత ఇంకొక ఆలోచన తట్టింది. ఆరు వారాల కిందట! అంటే నేను గాయాలపాలైంది కూడా ఆరునెలలు కిందటే కదా? ఈ రెండు సంఘటనలు ఎలా ఒకేసారి సంభవించాయి? కాకతాళీయమా? ‘‘అలా ఐతే నేను గాయపడిన సమయంలోనే లార్డ్ సదరన్ టన్ చనిపోయి ఉండాలి.’’ ‘‘అవును. అదే రోజే లార్డ్ సదరన్ టన్ చనిపోయాడు.’’ అని చెబుతూ, ‘‘ మీకు తెలుసు కదా మీ తరువాతి వారసుడు మీ కజిన్ ఎవరార్డ్ కింగ్ అని. అతనికి బదులుగా మీరు పులివాత పడి ఉంటే, అతనికే సదరన్ టన్ ఆస్తి దక్కి ఉండేది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం లార్డ్ సదరన్ టన్ సేవకునికి డబ్బిచ్చి సదరన్ టన్ ఆరోగ్య పరిస్థితిని గురించి కొన్ని గంటలకొకసారి టెలిగ్రాముల ద్వారా తెలియజేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ ప్రక్రియ మొదలైంది. ఆ విధమైన సమాచారం తెలుసుకోవడం వెనుక ఉన్న కారణమేమంటే...అంకుల్ ఎవరార్డ్ ప్రథమశ్రేణి వారసుడు కాకపోవటమే.’’ ‘‘మిస్టర్ సమ్మర్స్! నేను చెల్లించాల్సిన బాకీలకు సంబంధించిన పత్రాలు తీసుకురండి. అలాగే కొత్త చెక్ బుక్ కూడా. వాటిని పరిష్కరిద్దాం.’’ అని చెప్పాను. -
అగ్నిలో సీత
రావణ సంహారం జరిగింది. లంకాయుద్ధం ముగిసింది. రాముడి ఆజ్ఞపై లక్ష్మణుడు విభీషణునికి లంకాధిపతిగా పట్టం కట్టాడు. రామచంద్రుని ఆశీస్సులు అందుకున్న అనంతరం విభీషణుడు సీతాదేవిని రాముని సన్నిధికి తీసుకువస్తున్నాడు. ఇంకొన్ని అడుగులలో రాముని చేరుతుందనగా రాముడి కంఠం కంగున మోగింది. ‘‘సీతా! నీ కోరిక మేరకు యుద్ధంలో రావణుని సంహరించాను. అయితే ఇంతకాలం పర పురుషుని నీడలో ఉన్నావు. ఇప్పుడు కూడా నీవు కావాలంటే విభీషణుడి పాలనలో ఉన్న లంకానగరంలో ఉండిపోవచ్చు లేదంటే కిష్కింధాధిపతి అయిన సుగ్రీవుడి సంరక్షణలో ఉండవచ్చు... ఈ ఇరువురూ కాదంటే సొంత మరుదులైన లక్ష్మణ భరత శత్రుఘ్నుల వద్ద కూడా ఉండవచ్చు. అంతేకానీ నేను మాత్రం నిన్ను యథాతధంగా ఏలుకోలేను’’ అన్నాడు. ఈ మాటలు శరాఘాతంలా తగిలాయి సీతమ్మకు. ఒక్కక్షణం కన్నులెత్తి రాముని వైపు తదేకంగా చూసి, తర్వాత లక్ష్మణునితో–‘‘లక్ష్మణా! నేను అపనిందకు గురయ్యాను. ఇక నేను జీవించి ఉండవలసిన అవసరం లేదు. నీవు ఇక్కడ తక్షణం అగ్నిని రగుల్కొల్పు’’ అంది సీత. లక్ష్మణుడు బాధతో అన్నయ్యవైపు చూశాడు. రాముడు మౌనంగా తలదించుకున్నాడు. అన్నయ్య మౌనాన్నే అంగీకారంగా భావించిన లక్ష్మణుడు అక్కడ చితిపేర్పించాడు. మండుతున్న చితిని చూసింది సీత. రాముని చుట్టూ ప్రదక్షిణ చేసింది. అనంతరం జ్వాజ్వల్యమానంగా రగులు తున్న అగ్నితో ‘‘ఓ అగ్నిభట్టారకా! నా హృదయం సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరాముని యందే ఉంటే గనుక నన్ను రక్షించు. నేను దోషరహితురాలనైతే గనుక నన్ను కాపాడు. నా ప్రవర్తనలో తేడా ఉన్నా, మనసులో ఎటువంటి చెడు తలంపులు ఉన్నా నన్ను వెంటనే నీలో ఆహుతి చేసుకో’’ అని పలికి అక్కడున్న వారందరూ హాహాకారాలు చేస్తూండగా అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూడలేనట్టు అందరూ కన్నులు మూసుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాయి. ఉన్నట్టుండి అక్కడ కన్నులు మిరుమిట్లు గొలిపేంత వెలుగు వచ్చింది. చితాగ్ని నుంచి అగ్నిదేవుడు పైకి వచ్చాడు. ఆయన వడిలో పుత్రికలా సీత కూచుని ఉంది. మునుపటికన్నా ఆమె మరింత కాంతిమంతంగా ఉంది. ఆమె సౌందర్యం మరింత పవిత్రంగా ఉంది. అగ్నిదేవుడు సీతను నడిపించుకుంటూ రాముని వద్దకు తీసుకు వచ్చాడు. రామా! ఈమె నిష్కళంకురాలు. నిరపరాధి. పరమ పతివ్రత. ఈమెయందు ఏ దోషమూ లేదు. నీవు ఈమెను నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. ఈమెవల్ల నేను పునీతుడనయ్యాను.’’ అంటూ ఆమెను రామునికి అప్పగించాడు. ‘‘అగ్నిదేవా!’’ ఈమారు రాముని కంఠం గద్గదమైంది. ‘‘నా అర్ధాంగి సీత అమలిన చరిత అనీ, సాధ్వీమణి అనీ నాకు తెలుసు. నా ప్రాణేశ్వరి హృదయం ఆమె ప్రాణనాథుడనైన నాకు తెలియదా! అయితే ఆమె ఇంతకాలం పరాయి రాజ్యంలో మహా కాముకుడైన రావణుని ఏలుబడిలో ఉంది. ఆమెను వెంటనే నేను స్వీకరిస్తే నన్ను లోకం తప్పుగా అనుకోదా? ఆమెను గురించిన ఒక్క నిందనైనా నేను కలలో కూడా సహించలేను. ఆమె పాతివ్రత్యం, పవిత్రత అందరికీ తెలియాలనే నేను ఈ పరీక్ష పెట్టాను. ఇక ఆమెను నా నుండి ఎవరూ వేరుచేయలేరు’’ అంటూ ముందుకు నడిచి ఆమె చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు. రాముడు సీతను అనుమానించాడనేది అపప్రథ మాత్రమే. ఆమె పాతివ్రత్యం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోనే రాముడామెకు అగ్నిపరీక్ష పెట్టాడన్నది యథార్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
శివోహం..శివోహం
వైశాఖ శుద్ధ షష్ఠి ఘడియలు ప్రవేశించాయి. పదహారేళ్లు నిండి శంకరుడు పదిహేడులో అడుగు పెట్టాడు. అది కలియుగాది 2609కి (క్రీ.పూ. 492) సరియైన శ్రీకీలక నామ సంవత్సరం. అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. శంకరుడు గంగాస్నానంలో ఉన్నాడు. తల్లి మనసులా సరళంగా సాగిపోతున్న గంగలో మునకలేస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలేవో చుట్టుముడుతున్నాయి. ‘నీ కొడుకు ఆయుష్షు నిజానికి పదహారేళ్లే. కానీ...’ అన్న మాట దగ్గర ఆనాడు అగస్త్య మహర్షి భవిష్యవాణి ఆగిపోయింది. అదివిన్న పిచ్చితల్లి ఎంతగా తల్లడిల్లిపోయిందో కదా. గర్భశోకాన్ని అనుభవించలేకనే కాబోలు... తన ఆయుష్షు కూడా బిడ్డకు పోసి ముందుగా వెళ్లిపోయింది. వ్యాస భగవానుడు స్వయాన వచ్చి వరమిచ్చి దీవించాడు. మహాభారతంలోని సనత్సు జాతీయానికి కూడా భాష్యం రచించమని చెప్పి అంతర్థానమయ్యాడు. అజాగ్రత్తయే మృత్యువు. నిజానికి మృత్యువు అనేది లేనే లేదు.. అని బ్రహ్మమానస పుత్రుడైన సనత్సుజాతుడు ఇచ్చిన మహత్తర సందేశమది. దాన్ని అద్వైతానికి అన్వయించాడు శంకరుడు. నేటితో రచన పూర్తయింది. శంకరుడింకా గంగ నుంచి లేచి బయటకు రాకముందే అతడికో లేఖ వచ్చింది. ప్రతిష్ఠాన పురం నుంచి ప్రభాకరుడు పంపించాడు... ‘మా గురువుగారైన భట్టపాదులు త్వరలో ప్రయాగ సమీపంలోని రుద్రపురానికి విజయం చేయబోతున్నారు. తమరు వారిని కలుసుకోవాలనుకుంటే వెనువెంటనే బయలుదేరగలరు’ అన్నది సందేశ సారాంశం. హుటాహుటిన బయలుదేరాడు శంకరుడు. వారణాసి నుంచి పాతిక యోజనాల దూరంలో ఉన్న రుద్రపురానికి మరి కాసేపటిలో చేరుకోబోతున్నాడు. రుద్రపురంలో ఆనాడు... కుమారిల భట్టు తన ప్రాయోపవేశానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఒక హోమగుండాన్ని తవ్వించుకున్నాడు. శ్రోత్రియులందరూ హోమంలోని అగ్ని చల్లారకుండా ఉండేందుకు ఉపయోగించే ధాన్యపు పొట్టును పెద్దమొత్తంలో సేకరించాడు. అగ్నిహోత్రంతో సహా హోమగుండంలోకి వెళ్లి కూర్చున్నాడు. విరజాహోమ మంత్రాలు పఠిస్తున్నాడు. శిష్యులు ఊక నింపుతున్నారు. భట్టపాదుడు గొంతు వరకూ కప్పబడ్డాడు. కొద్దిసేపటిలోనే పొగ చెలరేగింది. అగ్నిహోత్రం తన సహజ ప్రభావాన్ని చూపుతోంది. ఊక మధ్యలో ఆ మహానుభావుని చర్మం కనలిపోతోంది. వేడిమి క్షణక్షణానికి తీవ్రమవుతోంది. ఇంతలో శంకరుడు పొలిమేరలో అడుగుపెట్టాడు. అప్పటిదాకా విజృంభించిన నిప్పు కాస్తా చల్లగా చందనసేవలా మారిపోయింది. శంకరుని రాకను భట్టపాదుడు గుర్తించాడు. మహాపండితుడైనా వేద ప్రామాణ్యాన్ని నిరూపించడానికి సరైన శాసనం చేయని కారణంగా కుడికన్ను పోగొట్టుకున్న వాడాయన. మిగిలినవున్న ఎడమ కన్నెత్తి శంకరుణ్ణి తేరిపార చూడడానికి పాపం సంకోచించాడు. ‘‘భట్టపాదా!’’ ఆదుర్దాగా పిలిచాడు శంకరుడు. ఆ పిలుపుతో భట్టపాదుడు కన్ను తెరిచాడు. ‘‘తండ్రీ! మీకు చేయెత్తి నమస్కరించలేని అసహాయ స్థితిలో ఉన్నాను. మన్నించండి’’ అన్నాడు. ‘‘ఏమిటీ పని? ఎందుకు చేస్తున్నట్లు?! మీ వంటివారిలా ప్రాయోపవేశంతో బలవన్మరణానికి పూనుకోవడం సమంజసమేనా? దయచేసి బయటకు రండి’’ అన్నాడు శంకరుడు. ‘‘తండ్రీ! మీ దయవల్ల నాకు హిమగిరి శిఖరంపై ఉన్న అనుభూతి కలుగుతోంది. బయటికి వస్తే అగ్నితప్తమైన నా దేహాన్ని చిటికెలో బాగు చేయగలరని తెలుసు. కానీ నేనందుకు ఒప్పుకోలేను. ఈ జీవితం ఇలా అంతమైపోవాల్సిందే. ఇది నాకుగా నేను విధించుకున్న ప్రాయశ్చిత్తం’’ అని సమాధానమిచ్చాడు భట్టపాదుడు. ‘‘ప్రాయశ్చిత్తమా ఎందుకు?’’ ‘‘గురుద్రోహం చేసిన నేరానికి. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి నాస్తిక గురువుల వద్ద శిష్యరికం చేశాను. ఆ నిషిద్ధ గురువులను ఆశ్రయించకూడదని తెలిసినా ఆశ్రయించాను. వారి సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని వారిపైనే తిరుగుబాటు చేశాను. బోధించిన అంశమేదైనా వారు గురువులు. వారిపట్ల కృతఘ్నత చూపడం నేను చేసిన ఘాతుకం. అందుకు ఇదే సరైన శిక్ష.’’ ‘‘అలా అనవద్దు. ధర్మరక్షణ కోసం నడుం కట్టి, మీరు చూపిన సాహస పరాక్రమాలు అనుపమానం. మిమ్మల్ని ఏ పాపమూ అంటదు. కర్మబలం చేత మీరు ఎప్పటికైనా ఉన్నతినే సాధిస్తారు కానీ, ఎన్నటికీ పతనం చెందరు. ఈ ప్రయత్నం విరమించండి.’’ ‘‘అంటే యజ్ఞయాగాలు స్వతంత్రంగా కర్మఫలాన్ని అనుగ్రహిస్తాయని మీరు ఒప్పుకోబోతున్నారా? వద్దు స్వామీ! కర్మభ్రష్టులై, ధర్మదూరులై చరించే మానవులకు... యజ్ఞప్రభావం అప్రమేయమని చెప్పడానికే జైమిని మహర్షి పూర్వమీమాంసను రచించారు. కామ్యకర్మలతో అయినా సరే పరమాత్మతో ప్రమేయం కలిగించుకుని నిర్గుణోపాసన వైపుకు మళ్లాలన్నదే మా ఆశయం. చిట్టచివరి మెట్టుమీద మీరు ఉన్నారు. మొదటి మెట్టు నుంచి జీవుణ్ణి పైకి చేర్చే ఉపాయం మేము బోధిస్తున్నాం. సర్వత్ర మీ స్థానమే ఉన్నతం. నిజం చెప్పాలంటే మీ భాష్యాలను చూసింది మొదలు వాటికి వార్తికాలు రచించాలని ఎంతగానో తపన పడ్డాను. కానీ విధి నన్ను మరోవైపుకు నడిపిస్తోంది’’ ఆవేదనగా చెప్పాడు భట్టపాదుడు. శంకరునితో పాటు అక్కడున్న వారందరి కన్నులూ చెమర్చాయి. ‘‘కనీసం నా భాష్యాలకు వివరణాత్మకమైన వార్తికాలు రచించేందుకైనా ఈ ప్రాయోపవేశాన్ని విరమించండి’’ అడిగాడు చివరిగా శంకరుడు. భట్టపాదుడు సుతరామూ అంగీకరించలేదు. ‘‘తండ్రీ! ఈ మందభాగ్యుణ్ణి మన్నించండి. కానీ ఈ అవకాశం నా శిష్యునికి ఇప్పించండి. పూర్వమీమాంసలో నా తరువాత అంతటివాడతను. సృష్టికర్త బ్రహ్మ ఏరికోరి అతని అవతారంలో దిగివచ్చాడని అనిపిస్తుంది. అతడి భార్య సాక్షాత్తూ శారదాంబయే కనుక అది నిజమే అని దృఢపరుచుకున్నాం కూడా. అతడు మీ భాష్యాలకు వార్తికాలు రచిస్తాడు. కానీ, పూర్వమీమాంసలో అతడు గట్టి నమ్మకం ఉన్నవాడు. ఒకపట్టాన మీ జ్ఞానమార్గాన్ని అంగీకరించడు. మీరు చాలానే శ్రమపడవలసి రావచ్చు. అయినా మంచిదే... అటువంటివారు ఇప్పటి మానవులలో దొరకడం దుర్లభం అని మాత్రం చెప్పగలను. దయచేసి మీరు మాహిష్మతీ నగరానికి వెళ్లండి. మండన మిశ్రుణ్ణి కలుసుకోండి’’ అని సలహా ఇచ్చాడు భట్టపాదుడు. శంకరుడు సాలోచనగా తల పంకించాడు. సరేనని చెప్పడానికి సంకోచిస్తున్నాడు. మౌనాన్ని ఆశ్రయించాడు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ‘‘తండ్రీ! నాకు అనుమతినివ్వండి. మీ కరుణను దయచేసి ఉపసంహరించండి. ఈ అగ్నిహోత్రాన్ని తన పని తాను చేసుకోనివ్వండి. నాకు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించండి. ఈ అంతిమ ఘడియల్లో మీ ఉపదేశంతో నాకు సద్గతిని ప్రసాదించండి’’ అని వేడుకున్నాడు భట్టపాదుడు. శంకరుడు అతడి కోరిక మన్నించాడు. నిర్వాణషట్కాన్ని ప్రారంభించాడు. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుర్వా్వ్యప్య సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః చిదానందరూపః శివోహం శివోహం – సత్యదర్శనంతో ద్వైధీభావాన్ని విడిచిపెట్టాను. కనుక నాలో వికల్పాలన్నీ మాయమయ్యాయి. నేను అనగా ఆత్మను... సర్వవ్యాపిని కనుక నాకో ఆకారమంటూ లేదు. సమస్తాన్నీ సమదృష్టితో చూసే నన్ను కట్టి ఉంచేది ఏదీ లేదు. ఏ బంధాలకూ లొంగను కనుక నాకు బంధమోక్షాలు లేవు. జ్ఞానమనే ఆనందమే రూపమైన శుభంకరుణ్ణి... శివుడినే నేను – అని మొదటిశ్లోకం చెప్పాడు. భట్టపాదుడు కన్ను మూసుకున్నాడు. అగ్నిహోత్రుడు తన పని ప్రారంభించాడు. రెండోశ్లోకం ఇలా వచ్చింది.... నాకు మృత్యువు లేదు. మరణం నన్ను నశింప చేస్తుందనే భయమూ లేదు. జాతిభేదాలు లేని సార్వజనీనుణ్ణి నేను. ఈ జన్మకు రాకముందు నుంచి ఉన్నాను, ఇకముందు కూడా ఉంటాను. కనుక నన్ను పుట్టిస్తున్నది ఎవరో కాదు, నేనే. నాకు బోధించే గురువులు, అనుసరించే శిష్యులు, అంటిపెట్టుకుని బంధుమిత్రులంటూ ఏ బాదరబందీ లేదు. నేను జ్ఞానమే రూపమైన వాడిని. శివుణ్ణి.... భట్టపాదుని ఇహలోక బంధాలు సడలిపోతున్నాయి. నిర్వాణషట్కం ఆత్మావిష్కారం చేస్తూ ముందుకు సాగింది. పుణ్యపాపాల హెచ్చుతగ్గులతో నాకు ప్రమేయం లేదు. వాటివల్ల కలిగే సద్గతులు, పతనావస్థలు నాకు పట్టవు. సుఖదుఃఖాలకు అతీతంగా సంచరించే నన్ను అనిత్య వస్తువులు ఎల్లకాలమూ సుఖపెట్టనూ లేవు, దుఃఖాన్ని కలిగించనూ లేవు. నేనెవరో తెలిపే సిసలైన మంత్రం కనిపించదు. ఏ తీర్థంలో వెతికినా దొరకదు. వేదాలు, యజ్ఞాలు నా స్వరూపాన్ని వివిధ రీతుల్లో వివరించి చెబుతాయి. కానీ నన్ను తెలుసుకోవాలంటే ఎవరికి వారే ఉద్యమించాలి. ఎందుకంటే నేను కర్మఫలాన్ని కాను. కర్మరూపాన్ని కాను. కర్మ చేస్తున్న వాణ్ణి కాను. నేను జ్ఞానానంద శివుణ్ణి.... భట్టపాదునిలో కలిగిన సంచలనం కైలాసాచలం వరకూ పరివ్యాప్తమయింది. తదుపరి శ్లోకాన్ని శంకరుని కంఠం ఇలా వెలువరించింది... ఒకరిపై ద్వేషం లేదు. వేరొకరిపై అనురాగమూ లేదు. అనిత్య వస్తువులు నాకే చెందాలనే లోభమూ, వాటిని విడిచిపెట్టి ఉండలేని మోహమూ లేవు. నేను అందరికంటే గొప్పవాడిననే మదమూ, ఇతరులతో మాత్సర్యమూ లేవు. దేహాన్ని ధరించి దేహినయ్యాను కనుకనే కానీ, నాకు పురుషార్థాల సాధన కోసం పాటుపడే పని లేదు. దేహంలో ఉన్నంతవరకూ ఈ ఉపాధిని నిలబెట్టుకోవడమే ధర్మం. దీనిని అనుసరించి వచ్చే కర్మలను పాటించడమే అర్థం. ఇది చిట్టచివరి దాకా కొనసాగించడమే నాకు కామం. అయినా దేహంతో నాకెలాంటి సంబంధమూ లేదు కనుక, దీనినుంచి మోక్షం నేను కోరుకోను.....మహావిహంగం ఒకటి తన విస్తారమైన రెక్కలను అత్యంతమూ వేగంగా కదుపుతూ భూమిపైకి దూసుకువస్తున్నట్లుంది. కుమారిలభట్టు నిలబడివున్న తుషాగ్ని నుంచి నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయి. శిష్యులు మరింత ఊకను దానిపై పోశారు. భట్టపాదుడు పూర్తిగా కప్పబడి పోయాడు. శంకరుడు కొనసాగించాడు. ‘నేను ప్రాణాన్ని కాదు. త్రేనుపు, రెప్పపాటు, తుమ్ము, హృదయస్పందన, ఆవులింతలనే ప్రాణ సంకేతాలేవీ నేను కాదు. సూక్ష్మగతిలో సంచరించే ప్రాణవాయువు, అధోముఖంగా పయనించే అపానం, ఉష్ణోగ్రతలను సరిచేసే సమానం, గుటక వేయనిచ్చే ఉదానం, అంతటా నిండివుండే వ్యానవాయువులనే పంచప్రాణాలు నన్ను నియంత్రించలేవు. సప్తధాతువుల్లో ఏ ఒక్కటీ నన్ను పోషించడం లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశాలలో సంచారం చేస్తున్నది కర్మానుభవం పొందుతున్న దేహియే కానీ నేను కాదు. వాక్కు, కాళ్లు, చేతులు, పాయువు, ఉపస్థలనే ఇంద్రియాలు నిర్వహించే కర్మలతో నాకు ప్రమేయం లేదు’ అన్నాడు. ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్ని కుండం నుంచి పెద్దపెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం సంకల్ప వికల్పాలకు కారణమయ్యే మనస్సు నా చలనాన్ని అరికట్టలేదు. జ్ఞాపకాల ప్రోగు అయిన బుద్ధి నన్ను గుర్తించలేదు. కర్తృత్వాన్ని తనకు ఆపాదించుకునే అహం స్ఫురణకు నిజానికి నేనెవరో స్ఫురించదు. కంటితో చూసిన ప్రతిదాన్ని దృశ్యబద్ధం చేసి మనస్సుకు చేరవేసే చిత్తం నా రూపాన్ని ముమ్మాటికీ చిత్రించలేదు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే ఈ నాలుగు అడ్డుగోడలను దాటుకుని నన్ను వినాలంటే చెవులు, వర్ణించాలంటే నాలుక, పసిగట్టడానికి ముక్కు, చూడటానికి కన్నులూ చాలవు. నేను ఆకాశంలో ఉండను. వట్టి మట్టిని కాను. హోమాగ్నియందు జనించేది నేను కాదు. ఉందని తెలుసు కానీ ఎక్కడుందో, ఎలాగుందో తెలుపడానికి వీలులేని వాయువులాంటి వాణ్ణి కాను. నేను జ్ఞానరూపాన్ని ధరించిన శివుణ్ణి... అని ముగించాడు శంకరుడు. పొగమబ్బు ఆకాశమంతా దట్టంగా పట్టేసింది. చూస్తుండగానే అది నెమలిపింఛపు ఆకారాన్ని ధరించింది. కుమారిల భట్టుగా నేలపై సంచరించిన సుబ్రహ్మణ్య తత్త్వానికి నమస్కరించాడు శంకరుడు. శిష్యులతో కలిసి అక్కడి నుంచి కదిలాడు. మాహిష్మతి దిశగా అడుగులు వేస్తున్నాడు. దారిమధ్యలో వీలుచూసుకుని, ‘‘ఆచార్యదేవా! ఏమిటీ స్తోత్రం? ఇంత అసంబద్ధంగా ఉంది?!’’ అడిగాడు విష్ణుశర్మ. అందరూ అతనికేసి వింతగా చూశారు. (సశేషం) ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్ని కుండం నుంచి పెద్దపెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది. ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర నేతి సూర్యనారాయణ శర్మ -
పార్శిల్
ఎవరూ? అమెజాన్ నుంచి పార్శిల్ మేమ్... ఓహ్....... ఉండు.... తను బిల్ తీసుకుంటూ....‘అసలు శనివారం డెలివరీ మేమ్. టూ డేస్ ముందే ఇచ్చేశాం చూశారా!’ చిన్న గర్వపు నవ్వుతో చెప్పి వెనుదిరిగాడు. నాకపుడు తెలిస్తేగా... నా ‘ఆ’ ప్రయాణం రెండురోజులు ప్రీ పోన్ అయిందనీ, అతను చింపి ఇచ్చింది దాని తాలూకూ ‘చెల్లు చీటీ’ అనీనూ. నా ఏకైక పుత్రుడికి నేనివ్వబోతున్న పుట్టినరోజు కానుకిది... వాడు మా ఇద్దరి బర్త్ డేలకీ ఏదో సర్ర్పైజ్ ప్లాన్ చేస్తాడెపుడూ. మా ఆఫీసుల్లో తనకు చనువున్న ఆంటీతోనో అంకుల్తోనో కుమ్మౖకై వీడి సర్ర్పైజ్ ప్లాన్లు అమలుచేయించి మమ్మల్ని ఆశ్యర్యపరచటం అలవాటు. మరి నేనూ వాడికివ్వాలిగా... ఎంతో కొంత సర్ర్పైజ్! అందుకే ఇది ఆర్డరు పెట్టా. కానీ ఆ గిఫ్ట్ ఓ జీవితకాలపు సర్ర్పైజ్ తిరిగి నాకే ఇవ్వబోతుందని తెలియటానికి నాకో ఆరుగంటల టైం పట్టింది. టెన్త్ నుంచే సెల్ఫోన్ కొనమని నస మొదలుపెట్టినా సునీలూ, నేనూ ఒకే మాట మీదుండి తర్వాత చూద్దాం అంటూ గడిపేశాం. ఇంటర్ మధ్యలో మళ్ళీ యాగీ మొదలుపెట్టేసరికి నువు బాగా చదివి నైన్ పాయింట్స్ తెచ్చుకో కొంటానని మాట ఒదిలేశాడు సునీల్. ‘ఏడ్చినట్టుంది వాడికి ఆ కెపాసిటీ ఉంది. అది కాస్తా తుంగలో కలుపుద్దనేగా సెల్ ఒద్దనేది.. ఇంటర్ పూర్తి చేయనీ అనలేవా సునీల్?’ అని తను మొత్తుకుంది. అందరికీ ఉంది మమ్మీ క్లాస్లో... ఈ కష్టం పగోడిక్కూడా రాకూడదన్నంత ‘ఫీల్’తో ముఖం మాడ్చుక్కూర్చున్నాడు. ఇక సునీలెక్కడ ఆగుతాడూ... వెంటనే సెల్ఫోన్ రెడీ! తనకి సమకూర్చడమే తెలుసు గానీ కంట్రోల్ చేయడం తెలీదు. మా సుపుత్రుడు ముఖానికి దాన్ని అమర్చుకుని, సెల్లుకు సొంత కవల సోదరుడిలాగా తిరగటం మొదలెట్టాడు. ఎదురుగా నించొని ఏదైనా మనం అడుక్కోవచ్చు. మరేదైనా చెప్పుకోవచ్చు. వాడు మాత్రం అందులోంచి తలెత్తేదే లేదు. ఊ...ఊ..అనటమే. కదిలేదే లేదు. చివరకు టాయిలెట్లోక్కూడా తీసుకుపోతుంటే సహించలేక నాలుగు పద్ధతైన తిట్లు తిట్టాగానీ అవి కూడా సెల్లు దాఖలా అయిపోయాయ్. నా ఎనర్జీ వేస్ట్ అని తెలిశాక వాడిని మానేసి మా గదిలో మేం ఇద్దరం తిట్టుకునేవాళ్ళం. ‘కష్టపడి ఇల్లుకట్టి కల్లుతాగి కూలగొట్టాడట ఎవడో నీలాగే ఏం ఫోన్లో ఏంటో’ అని సునీల్ని సతాయించేదాన్ని. ఓ నెల కాగానే వాడికి సైటు కళ్ళద్దాలు సమకూర్చి పెట్టింది తన బాధ్యతగా ఫోను. వీడికి క్రమంగా వినే అలవాటు పోతే డిగ్రీ ఎలా పూర్తి చేస్తాడూ? అని నాకొకటే దిగులు. బాగా ఆలోచించి ‘ఇది’ ఆర్డరు పెట్టానందుకే! నాకర్థం అయిపోయింది ఇక నా ప్రాణం పోక తప్పదనీ...మూడు బారల దూరంలో అటుతిరిగి కూర్చున్న ముద్దుల కొడుకు తనను ‘చెవులారా’ సాగనంపబోతున్నాడనీనూ. ‘అరే నాన్నా’ వినపడదు పాపం! పొద్దున్నుండి చూస్తున్నదేగా తంతు. కళ్ళు మూసుకుని తలూపుతూంటాడంతే. అబ్బా.. గుండెలపై చేతితో గట్టిగా అదుముకున్నా... అయ్యో..సాయంత్రం మేనకోడలి పెళ్లికి వెళ్ళాలే. ఇక అంతా ఇటే వస్తారేమో! ‘ఒరేయ్...బాబూ...డ్రెస్సింగ్ టేబుల్లోంచి నాలుక కింది మాత్తర్లు తీసీయరారేయ్... అబ్బా....ప్రాణం పోయేట్టుందిరా....నేను నా కంటే నీకే ఎక్కువ అవసరంరో’...ఊ....మ్. నాలో నేనా...పైకా నేను మాట్లాడుతుంటా?! ఏమో. ‘ఒరేయ్..సన్యాసి..ఒక్కసారి ఇటు చూడ్రా’.. బలహీనమైన గొంతు... బలహీనమైన ఆలోచనలూ. బలవంతంగా లేచే ప్రయత్నం.. అబ్బే...ఉహూ... ఇందాకటి వరకూ ఆ అద్దం దగ్గరే కదా చచ్చానూ..ఏ మాత్రం చేయిలాగినా బిళ్ళ చప్పరిద్దునే. నోట్లో నిజంగా మందుబిళ్ళ స్పర్శ...ఒళ్ళు తేలిపోతుందేవిటీ...ఓహో పిల్లాడు చేతులపై ఎత్తుకుని అంబులెన్స్ ఎక్కిస్తున్నందుకా....హమ్మయ్య సేఫబ్బా నేను...ఎంతైనా మా వాడుకూడా నాలాగే వెంట వెంటనే స్పందించి నిర్ణయాలు తీ...సు...కు...ని....అరె..మా సీలింగ్ ఫేన్ నా ముఖం మీదికొచ్చి మరీ తిరుగుతుందెందుకూ. నిజమా...కలా..ఊహా...ఆశా...తెలీలా... ఇంకా ఇక్కడే ఉన్నానేంటీ? హూ... సాయంత్రం నా చుట్టూ చేరి వంటచేసి, నడుం వాల్చి హాయిగా నిద్రలోనే వెళిపోయిందంటమ్మా...ఎంత గొప్ప చావో! అని చెప్పుకుంటారైతే అంతా. ఔను.. వంటచేసే పోవటం...గొప్పేగా మరి.. ఏడుపు నిండిన నవ్వు వచ్చింది. ఆఖరి ప్రయత్నంగా మోచేతిపై లేచే ప్రయత్నం చేస్తూ...చేతికి దొరికిన రిమోట్ వాడికి విసురుదామను...కుంటూండ...గానే...రెండు నిమిషాలు కుదిపేసి జాలీగా భుజాలెగరేసుకుంటున్న కొడుకుని కళ్ళనిండా ‘జాలి’గా చూస్తూండగా....పోయింది.. ఎన్నిటికోసమో ప్రాకులాడిన ప్రాణం! పరుగులెత్తిన ప్రాణం! పిల్లల మీద పెట్టిన ప్రాణం...పువ్వులనీ, పుస్తకాలనీ, భానుమతనీ, శ్రీ శ్రీ అనీ, వెన్నెల్లో ఆడపిల్లా, అమావాస్య చంద్రుడూ... ఎన్నింటినో ప్రేమించిన ప్రాణం...ఆఖరుసారి అంతులేని నిస్సత్తువనూ, నొప్పినీ కలిగించి, తెలియని తీరాలకై వేగంగా బయటపడింది. కోడలితో, మనుమలతో పరిచయం లేకుండానే... వియ్యపోళ్ళని చూడకుండానే... కొడుకు పెళ్లికి పట్టుచీర రెప రెపతో సందడిగా సంతోషంగా తిరగకుండానే...పో..యిం...ది. అరె... ఎంతఖాళీ ఎంత తీరికెంత శాంతీ! ఊహ తెల్సాక ఇంత పనిలేకుండా ఎన్నడూ లేను. ఎత్తులో కూర్చొని కాళ్ళూపుకుంటూ అదే గదిలో ఉన్నా. నా నిర్జీవదేహం మంచంపై పడుంది. కర్రవాటు దూరంలో వాడింకా తలూపుతూ అలాగే కూర్చుని ఉన్నాడు. ఎంజాయ్ చేస్తూ. ఐనా నాకు బుద్ధుండాలి...బర్తడే గిఫ్ట్... బర్త్ డేకివ్వాలిగానీ ముందే చూపిస్తే వీడాగే రకమా?! ఎంజాయ్మెంట్ అంతుచూస్తూ అమ్మ ‘అంత’ మయేది చూడకుండానే కూర్చున్నాడు. ఒక్కసారిగా నాలో బాధ.. ఇపుడొకసారి పోయి ‘దీన్ని’ కనిపెట్టినోడిని రెండు పీకివస్తేనో.. మొన్న వీటిని ధరించి వినపడక రైలు పట్టాలు దాటుతా చనిపోయిన ఒక్కగానొక్క రమగారి పిల్లాడు గుర్తొచ్చాడు. వీడినీ, మా వెధవనీ కూడా పన్లోపని రెండు పీకుతా.. ఎలాగూ కనపడను గాబట్టి. వావ్..మా ఎదవ లేచాడు. ఇప్పుడదిరి, బెదురుతాడు చూడూ...పాపం పిచ్చికన్న! నన్నెంత మిస్ అవుతాడో... వాడు మంచం దగ్గరకొచ్చి ‘మమ్మీ..అన్నం తిందామా?’ ఒక్కసారే అడిగాడు చెవిలోంచి ఒక వైరే తీసి. నేను పలక్కపొయే సరికి ‘సర్లె..నువు పడుకోలే..నేను పెట్టుకుంటాలే’ మళ్ళీ వైరు చెవిలో ఇరికించుకుని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఒరే నీ యయ్య...తట్టిలేపరా..నీయమ్మ కట్టెకాల... నీ అడ్జస్ట్మెంట్ తగలెయ్య.. ఇంత తెలివిలేని వెధవనా నేను కన్నదీ... ఇహ బ్యాంక్ నుండి సునీల్ రావల్సిందేనా..నా అతీ,గతీ తేలాలంటే...ప్చ్. నా శరీరం అలా అంతసేపు ఏ ఐడీ లేకుండా, చచ్చిన మనిషికి తప్ప చచ్చినట్టు ఎవరికీ తెలీక ...ఫ్యాన్ గాలికి ముంగురులు ఊగుతూ పడుంది. నా ఆత్మ జలదరించింది. కానీ ఏదో తెలియని రిలీఫ్...ఎవరితోనూ చేయించుకోకుండా, తల్లిగా, భార్యగా, ఎంప్లాయిగా... క్లీన్ చిట్తో బయటపడ్డాను. ఇదీ మంచిదేలే. ఊహూ... కానేకాదు.. వీడి పెళ్ళి ఆదర్శంగా చేస్తానన్నదీ... కోడలితో ఫ్రెండ్లీగా ఉంటానన్నదీ... మనమరాలికి అంజలి అని పేరు పెడతానన్నదీ...అన్నీ ‘ఆన్లైన్ యమపాశాలు’ తీసుకుపోయాయి. కానీ ఇంత సిల్లీగా.. సింపుల్ గానా పోయేది? సాయంత్రం సునీల్ ‘టీ...టీ.’ అంటూ మంచం చుట్టూ తిరిగి ఎప్పటికో గమనించాక...ఆపై నేనూహించిందే. మేనకోడలి పెళ్ళిజనం అంతా ఖర్చులు కలిసొచ్చి...ఆనందం నుండి విషాదానికీ, సన్నాయి నుండి షహనాయికీ షిఫ్ట్ అయ్యారు. ‘గుత్తొంకాయ చేసిందంటమ్మా వాళ్ళాయన కిష్టమని’ ఒదిన కన్నీళ్ళతో! హు.. చావెవరిదైనాకానీ... గుత్తొంకాయనొదల్రే.. హ..హ...హ’. ‘వాషింగ్ మెషీన్లో బట్టలలాగే ఉన్నాయమ్మా.. మధ్యాహ్నం వేసుకుంది గావునూ.’ పిన్ని ఇంట్లో ఓ రౌండేసొచ్చి ముక్కు పిండుకుంది. కాదెహే...లేవంగానే వేసేసా...మధ్యాహ్నం ఏడుందీ చాకిరేవుకీ...చావురేవైపోతేనూ! ఇంతలో నాకు ఓ షాక్..నా పుత్ర రత్నం కాసేపటికో... కూసేపటికో జరిగిన సీన్లు రివైజై..రియలైజ్ అవటం చూసి తరిద్దామనుకుంటే...వాడు నా పార్థివ శరీరంపై పడి– ‘ఇవిగో అమ్మ నాకోసం కొన్న లాస్ట్ మెమరబుల్ గిఫ్ట్’ అంటూ ఆ నల్లని యమపాశపు ‘ఇయర్ ఫోన్స్’ అందరికీ చూపించి, ముద్దాడుతూ గావురుమంటూ ‘వాటిని’ అతి జాగ్రత్తగా జేబులో దాచుకున్నాడు. అరే..ఒద్దురా...పాపిష్టివిరా...హెడ్ ఫోన్స్ కావవి...హెడ్ కొరివి రా నాకూ! ఎంత శ్రద్ధగా తీసుకున్నానురా వాట్నీ! పగోడిని పంచాంగమడిగితే, మధ్యాహ్నానికే మరణం అన్నాట్ట. అయ్యో...వీడు పూజించేసేట్టున్నాడే. ‘ఏవీ ఇలా చూపించూ. మేమంతా చూస్తాం మీ అమ్మిచ్చిన గిఫ్ ్ట‘పిన్నికి ఏదొక న్యూస్ లేటెస్ట్ ది కావాలి. వాడు తీసిస్తున్నాడు...ఇక నా గురించి మానేసి వాటి గురించే ఈ పూటంతా చెప్పుకుంటారు గావును. ఛ...ఖర్మ..ఖర్మ! హూ..ఇక పొండి. కర్మ కాండలు చేసుకోండి. మీ ఖర్మ... ఇక నా సమయం అయిందో, లేక అక్కడ ఉండాలనిపించలేదో తెలియదు, ఆలోచనారహితమైన నా ఆత్మ ప్రయాణం నా భర్తనీ, కొడుకునీ ఆర్తిగా చూసుకుంటూ ముందుకు సాగింది. ‘అరరే...అరరే...నేడు కన్నీట తేనె కలిసే’ ఎవరి టీవీలోంచో ఇష్టమైన పాట వినపడుతోంది. ►మనూ -
ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర
‘‘అంత్యేష్టి సంస్కారం ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు. సన్యాసులైన మీకు శ్రాద్ధాదులు నిర్వహించే అవకాశం ఎలాగూ లేదు. అయినా ఇంటి బాధ్యతలు విడిచిపెట్టి ఏనాడో సన్యసించిన మీకు ఇప్పుడు మాత్రం ఎందుకింత ఆరాటం? ఇందులో మీకెందుకింత పట్టుదల?’’ తీవ్రంగా ప్రశ్నించారెవరో. శంకరుడు ఒక్కక్షణం కన్నులు మూసుకున్నాడు. దేహత్యాగం తరువాత కూడా తల్లి మనసులోని కోరికలో ఏ మార్పూ లేదని గ్రహించాడు. కన్నులు తెరిచి అందరివంకా చిరునవ్వుతో చూస్తూ ఇలా సమాధానం చెప్పాడు... ‘ఆత్మయందు అగ్నిని ఆరోపించుకున్న సన్యాసిని నేను. అగ్నిలాగే సర్వత్ర పూజనీయుణ్ణి. అగ్నిలాగే సన్యాసి సమక్షంలో సమస్తమూ శుద్ధత్వాన్ని పొందుతుంది. పుణ్యక్షేత్రము, పుణ్యసమయము, సన్యాసి సన్నిధి తపస్సులకు రెట్టింపు ఫలాలనిస్తాయి. యతి సమక్షంలో నిర్వహించిన క్రతువులు దేవతానుగ్రహాన్ని శీఘ్రంగా సంపాదించి పెడతాయి. తల్లిదండ్రులు, బంధువులు నాకెవరూ లేరు. లౌకిక బంధాలేవీ నాకు లేవు. తోటి సన్యాసులు తప్ప ఇతరులు నాకు నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేయాల్సిన అవసరం కూడా లేనివాణ్ణి. అయినప్పటికీ జీవులందరిలాగే నాకు కూడా తల్లిని మించిన దైవం లేదు. ఈ యతిజీవితానికి రాకముందు జన్మనిచ్చిన తల్లి కోరిన కోరిక తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది. శాస్త్రవిరుద్ధమైనా అది నెరవేర్చక తప్పదు.’’ ‘‘మీరు చేస్తారు సరే... రాబోయే తరాల్లో ఎవరైనా శంకరుడే చేసిన పనిని మేమెందుకు చేయరాదు అని పూనుకుంటే ఏమని సమాధానం చెప్పాలి’’ గుంపులో నుంచి మరోప్రశ్న వచ్చింది. ప్రశ్న అడిగిన వ్యక్తివంక పరమ అసహనంగా చూశాడు కారుణ్య శంకరుడు. ‘‘అల్పప్రజ్ఞావంతుడు సాహస కార్యాలకు పూనుకోక పోవడమే మంచిది. అయినా మన సమాజంలో అనుకరించే వారే కానీ, అనుసరించే వారు చాలా అరుదు. అటువంటి వారికి సమాధానం చెప్పవలసి వస్తే ఇదిగో ఇది వినండి.... పరంపరగా అపరాధాలు చేస్తూవుండే కుపుత్రుడినైనా తల్లి తప్పక చేరదీస్తుంది. అజ్ఞానం కొద్దీ అపమార్గం తొక్కినా తిరిగి తన చరణాల వద్దకు చేర్చుకుంటుంది. నేను సన్యాసిగా మారేందుకు ఒకనాడు నా తల్లిని మోసపుచ్చాను. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకామె ఇలా కల్పించిందని భావిస్తాను. బలీయమైన కోరికను నెరవేర్చుకునేందుకు అపమార్గాన్ని తొక్కినవారెవరైనా సరే తదుపరి జరగబోయే పరిణామాలకు కూడా సిద్ధంగానే ఉండాలి. నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. వెనుకడుగు వేసేది లేదు.’’ శంకరుని పలుకులు కొదమసింహం గర్జించినట్లున్నాయి. పూర్వాచార పరాయణత్వమే ఆరోవూపిరి అయిన కాలటి ప్రజలు వెనక్కి తగ్గలేదు. శంకరుని కోరిక మన్నించలేదు. ‘‘మేము కూడా మీలాగే సిద్ధపడి ఉండాలి కదా! మీరు మా గుడికి వస్తే మీ చేతికి హారతిని అందిస్తాం. మీ చేతిమీదుగా నీరాజనమిస్తే దైవం సానుకూల పడతాడని భావిస్తాం. దీపం అందిస్తాం. మీరు వెలిగించిన మరోదీపం సాక్షాత్తూ భగవత్ స్వరూపమేనని మొక్కుతాం. కానీ మీ భోజనానికి వంటచెరుకు ఇవ్వడానికి సైతం అంగీకరించం కదా! మీ తిండికే ఇవ్వని నిప్పుని....తల్లికి తలకొరివి పెట్టేందుకు మాత్రం ఇస్తామని ఎలా అనుకుంటున్నారు? మా వంశాలను ఉద్ధరించే పవిత్ర అగ్నిహోత్రాన్ని ఒక సన్యాసి చేతికి....అందులోనూ ఇటువంటి కార్యానికి ఏ ధైర్యంతో అందించమని శాసిస్తున్నారు?’’ అంటూ మొండిగా తమ వాదన కొనసాగించారు. అక్కడ శంకరుని జ్ఞాతులున్నారు. శంకరుని వల్ల, అతడి తల్లిదండ్రుల వల్ల అనేక విధాలుగా సాయాలు పొందినవారున్నారు. ఈ సమయంలో మాత్రం వంశాచారం భ్రష్టమైపోతున్నదనే బెంగే తప్ప...సాటిమనిషి పట్ల ఏమాత్రం జాలిలేదు వారిలో. శంకరుడు వాదన కట్టిపెట్టి, మౌనంగా లేచి పెరటి వైపు నడిచాడు. ఎదురుగా పూర్ణానది ఒడ్డులొరుసుకుంటూ హోరున ప్రవహిస్తోంది. అందుబాటులో ఉన్న కలపను ఒకచోట చేర్చి స్వయంగా చితిపేర్చాడు శంకరుడు. లోనికి వచ్చి తల్లి పార్థివ దేహాన్ని రెండు చేతులా పైకెత్తాడు. భుజంపై మోసుకుని వెళ్లి చితిపై పరుండబెట్టాడు. శంకరుని ప్రయత్నానికి ఒక్కసారిగా అందరూ అడ్డుపడ్డారు. ‘‘ఏమిటిది? ఇళ్ల మధ్యలో మనిషిని తగలబెడితే ఇక ఈ ఊళ్లో మేమంతా ఎలా ఉండాలి? తీసేయండి...’’ అంటూ గోలపెట్టసాగారు. మంచిగంధం చెట్టు చల్లగా ఉంటుంది. సుగంధం వెదజల్లుతుంది. కానీ దానిని అదే పనిగా మధిస్తే దానియందున్న అగ్ని వెలికివచ్చి దహించి వేస్తుంది. ఇప్పుడు శంకరుని స్థితి సరిగ్గా అదే. ఊరివారి నైజం అతడి మనసును తీవ్రంగా గాయపరిచింది. ‘‘నేటి నుంచి మీ శ్మశాన భూములు మీ ఇళ్లలోనే ఉండుగాక! మీరు వేదబాహ్యులు అగుదురు గాక! వైదికకర్మలకు దూరమైపోదురు గాక! నిజమైన సన్యాసులు ఇక్కడ భిక్ష గ్రహించకుందురు గాక!’’ అన్నాడు ఆవేదనతో జన్మభూమిని శపిస్తూ. ఆ మహాపురుషుని శాపవచనం అక్కడున్న వారందరినీ అప్రతిభులను చేసింది. చేష్టలు దక్కి అందరూ ఎక్కడి వారక్కడే నిలుచుండి పోయారు. శంకరుడు విష్ణుస్మరణ చేస్తూ చితిని సమీపించాడు. చేతిలోని జ్ఞానదండాన్ని పైకెత్తి మాతృమూర్తి కుడిభుజానికి తాటించాడు. ఆ దండం నుంచి పుట్టిన విద్యుత్తు తల్లి చితిని రగిలించి మోక్షమిచ్చింది. వేడిమిపాలు ఒక్కింత కూడా లేని మృతదేహాన్ని ఒక ఎండుపుల్లతో మథిస్తే నిప్పు రాజుకున్న వింతను అక్కడున్న వారంతా అచ్చెరువు పడుతూ చూశారు. జన్మనిచ్చిన తల్లికి అంత్యేష్టి సంస్కారంలో భాగంగా ఒక కొడుకు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ శంకరుడు నెరవేర్చాడు. తిరుగు ప్రయాణమయ్యాడు. తలచుకున్న వెంటనే యోగశక్తిచేత కాలటికి చేరుకున్నట్లే... మళ్లీ మహాశ్మశానమని పిలిచే కాశీకి కూడా అదే శక్తిచేత తిరిగి చేరుకున్నాడు. శంకరుడు తిరిగివచ్చే సమయానికి సరిగ్గా కొద్దిసేపటి ముందు ఒక అద్భుత సంఘటన చోటు చేసుకుంది. దానికి పద్మపాదుడు సాక్ష్యంగా నిలిచాడు. అసలేం జరిగిందంటే...శంకరుడు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించడానికి వ్యాస భగవానుడు స్వయంగా వచ్చాడు. వృద్ధబ్రాహ్మణునిగా మారురూపుతో వచ్చిన వ్యాసునితో కలిసి, శంకరుడు వ్యాసకాశీకి సమీపంలోని ఒక గుహలో ప్రవేశించాడు. ‘‘మా అంతట మేమే బయటకు వచ్చేవరకూ మీరెవరూ లోనికి రావద్దు’’ అని ముందుగా శంకరుడు శిష్యులను హెచ్చరించాడు. ఆచార్యుని ఆజ్ఞమేరకు ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేదు. ఇది జరిగి మూడురోజులైంది. తల్లి మరణంతో శంకరుడు అకస్మాత్తుగా కాలటికి ప్రయాణమైన విషయం శిష్యులెవరికీ తెలియదు. అపరిచితుడైన ఒక వృద్ధమూర్తితో రోజుల తరబడి తమ గురువు ఇలా చర్చల్లో కూరుకుపోవడం వారిలో ఆందోళన నింపింది. చివరకు పద్మపాదుడు తెగించి గుహలోనికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మసూత్రాలలోని దేవతాధికరణంపై చర్చ జరుగుతోంది. ‘‘యోగి తన యోగబలం చేత అనేక శరీరాలను ఏర్పరుచుకోవచ్చు. వాటన్నింటితోనూ భూమండలం మీద సంచరించవచ్చు. కొన్ని దేహాలతో విషయభోగాలను అనుభవించవచ్చు. అన్నింటితో ఉగ్రమైన తపస్సు చేయవచ్చు. తరువాత వాటన్నింటినీ సూర్యుడు తన కిరణాలను ఉపసంహరించుకున్నట్లు ఉపసంహరించుకోవచ్చు’’ అని స్మృతిని ప్రమాణంగా చూపాడు శంకరుడు. మరింత ముందుకు చెబుతూ, ‘‘యోగులే ఇలా చేయగలిగినప్పుడు పుట్టుక నుంచి సిద్ధులైన దేవతల మాట వేరే చెప్పనక్కర లేదు కదా! ఒక్కో దేవతకు ఒకే సమయంలో అనేక రూపాలు ఉంటాయని శ్రుతి చెబుతోంది. ఒక దేవత అనేక రూపాలుగా తోచవచ్చు. అనేక రూపాలు కలిసి ఒక్కటిగానూ మారవచ్చు. మొత్తంమీద ఒకే దేవత అనేక రూపాలచేత తనను తాను విభజించుకుని ఒకే పర్యాయం అనేక యాగాలలో అంగత్వం పొందుతుంది. అంతర్థానశక్తి ఉండడం వల్ల ఇతరులు ఆ దేవతను చూడలేరు...’’ శంకరుని భాష్య వివరణ ఇంకా పూర్తికాలేదు. అంతలో పద్మపాదుడు అందుకున్నాడు. ‘‘గురుదేవా! నా అంచనా తప్పు కాకపోతే... ఇప్పుడు మనముందు ఉన్న వృద్ధబ్రాహ్మణుడు మరెవరో కాదు, సాక్షాత్తూ వ్యాసభగవానుడే’’ అన్నాడు. శంకరుడు అతడిని చూసి చిరునవ్వు నవ్వాడు. ‘‘అది నిజమే’’ అన్నాడు శంకరుడు పెదవులు కదలకుండానే. ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూశాడు పద్మపాదుడు. పై మాటలు చెప్పిన శంకరుడు గుహద్వారంలో నిలబడి ఉన్నాడు. వృద్ధబ్రాహ్మణుని స్థానంలో వ్యాసభగవానుడు స్వస్వరూపాన్ని ధరించి కనిపిస్తున్నాడు. అప్పటివరకూ తనను తాను రెండుగా విభజించుకుని, శంకరునిగా కూడా తానే అయి భాష్య పరిశీలన చేస్తున్నాడాయన. ఆ రెండో రూపాన్ని ఇప్పుడు ఉపసంహరించాడు. శంకరుడు, అతడి వెనుకనే పద్మపాదుడు కూడా వ్యాసభగవానునికి పాదాభివందనం చేశారు. త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే మానావమాన సదృశాః సమదర్శినశ్చ కర్తారమన్యమవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మపరిపాక ఫలాని ధన్యాః – నాది, నేను అనే బంధాలను విడిచిపెట్టినవాడే ధన్యుడు. దూషణ, భూషణలను సమానంగా స్వీకరిస్తూ, సర్వత్ర సమస్వరూపమైన ఆత్మనే వీక్షించువాడు ధన్యుడు. ఈశ్వరుడినే కర్తగా తీసుకుని, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నిర్వర్తించేవాడు ధన్యుడు. శంకరుడు గురుసమక్షంలో ధన్యాష్టకం చెబుతున్నాడు. ‘‘ఇంద్రియ సుఖాలకు అతీతంగా, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని పరమార్థ తత్త్వాన్ని నిర్ణయించడానికి పూనుకున్నవాడే ధన్యుడు. మిగిలినవారంతా భ్రమల లోకంలో తిరుగాడుతూ ఉంటారు. అరిషడ్వర్గాలను నిర్జించిన వాడికి యోగరాజ్యం కైవసం అవుతుంది. ఆత్మవిద్యను వరించి, లోకాలయాన్ని త్యజించిన ధన్యుడు వానప్రస్థుడవుతున్నాడు. హృదయంలో పరంజ్యోతి వీక్షించాలని యత్నిస్తున్నవాడు ధన్యుడు. సదసత్తులు, అణుమహత్తులు, చివరకు స్త్రీ పురుష నపుంసకులలో ఎవరూ కాని బ్రహ్మమును ఏకాగ్రచిత్తంతో ధ్యానించేవాడు ధన్యుడు. బ్రహ్మసాక్షాత్కారం జరిగితే జగత్తే నందనవనం అవుతుంది. అన్ని చెట్లూ కల్పవృక్షాలవుతాయి. జలమంతా గంగయే అవుతుంది. సమస్త కార్యాలూ పుణ్యక్రియలే... పలికిన మాటలు వేదవాక్యాలు అవుతాయి. భూమండలమంతా కాశీక్షేత్రమే అవుతుంది. అటువంటి జ్ఞాని ఏ రూపంలో ఉన్నా సాక్షాత్ బ్రహ్మమే అవుతున్నాడు’’ అన్నాడు శంకరుడు. వ్యాసభగవానుడు పరమానంద భరితుడయ్యాడు. అర్ధనిమీలిత నేత్రాలతో, ‘‘జగద్గురూ!’’ అని పిలిచాడు. ‘‘సరిగ్గా మీరు వచ్చే సమయానికి బ్రహ్మసూత్రాలలోని దేవతాధికరణం పరిశీలిస్తున్నాను. అందులో ఒకచోట ‘స్వాధ్యాయాదిష్ట దేవతాసం ప్రయోగః’ అన్న పతంజలి సూత్రాన్ని గురించి చెప్పారు. ఆ సందర్భంలోని మీ అభిప్రాయాలను ఒకసారి వినిపించండి’’ అడిగాడు వ్యాసుడు. ‘‘స్వాధ్యాయం అంటే మంత్రజపం వల్ల ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. దేవతతో మాట్లాడడమూ సాధ్యమవుతుంది. దేవతలకు మంత్రమే శరీరం. దేవతలను మనస్సు చేతనే ధ్యానించాలి అంటూ వారికి ప్రత్యేక రూపాలను శ్రుతులు చెప్పలేదు. కానీ ఇతిహాస పురాణాలు చెప్పాయి. దేవతలకు అవి విగ్రహాలను కల్పించాయి. శ్రుతులలోని మంత్రాలు, అర్థవాదాలే ఇతిహాస పురాణాలకు మూలం కావచ్చు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణాలూ ఉంటాయి’’ చెబుతున్నాడు శంకరుడు. పద్మపాదుడు అందుకుని, ‘‘వ్యాసుని వంటి మహనీయులు దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారని పురాణాలు చెబుతున్నాయి’’ అన్నాడు. కొనసాగింపుగా శంకరుడు, ‘‘ఇప్పటి వాళ్లలా ప్రాచీనులకు కూడా దేవతలతో వ్యవహరించే నేర్పు లేదు అని వాదించేవాడికి జగత్తులోని వైచిత్రి బోధపడలేదని అర్థం. ఇప్పుడు జగదేక సార్వభౌముడు లేడు కనుక, గతంలోనూ లేడని వాడు వాదించవచ్చు. గతంలో కూడా ఇప్పటిలాగే వర్ణాశ్రమ ధర్మాలన్నీ అస్తవ్యస్తంగానే ఉండేవని, పాతతరంవారు మనకంటే తీసికట్టుగా ఉండేవారని వదరుబోతుతనంతో వాగవచ్చు. అది తెలియని వారిని మోసపుచ్చే మాటలు. అవే నిజమైతే మన మహర్షుల ధర్మప్రబోధం వల్ల యుగాలనాడే వ్యవస్థీకృతమైన మన మహోన్నత వారసత్వమంతా కేవలం గ్రంథాల్లో చేసిన కల్పనే అవుతుంది. ఇది మేధను వృథా పరుచుకోవడం తప్ప మరేమీ కాదు. – తస్మాత్ ధర్మోత్కర్షవశాత్ చిరంతనా దేవాదిభిః ప్రత్యక్షం వ్యవజహ్రురితి శ్లిష్యతే – అందువల్ల మన ప్రాచీనులు ఉత్కర్షమైన ధర్మబలం సహాయంతో దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించారని చెప్పడం మంచిది. అలాగే దేవతలకు విగ్రహాలు లేవు అని వాదించే వాడి వాదనలో పస లేదు. శ్రుతులు క్రమముక్తిని చెప్పాయి. మరణించిన వ్యక్తులు ఆయా దేవలోకాలకు వెళ్లి, అక్కడ కొంతకాలం ఉండి తరువాత క్రమముక్తికి వెళతారు. దేవతలకు విగ్రహాలే లేకపోతే ఇవన్నీ కుదరనే కుదరవు’’ అన్నాడు శంకరుడు. వ్యాసుడు సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఇంతకూ దేవతలు ఎంతమంది అని యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నిస్తే ముప్పై ముగ్గురు అని సమాధానం చెప్పాడట. మళ్లీమళ్లీ ప్రశ్నించినప్పుడల్లా సంఖ్య మారుస్తూ ఆరుగురు, ముగ్గురు, ఇద్దరు, ఒకరు అని సమాధానాలు చెప్పాడట. నిజానికి దేవత ఒక్కటే ఉంది...అదే ప్రాణం. దేవతలందరూ ఆ ప్రాణం యొక్క రూపాలే. ఆ ఒక్క ప్రాణమే ఒకే సమయంలో అనేక దేవతా రూపాలలో ఉన్నది. అనేకమంది ఒకేసారి సమర్పిస్తున్న హవిస్సులను స్వీకరిస్తోంది. స్వాధ్యాయ పరునికి మంత్రఫలాన్ని, అర్థవాదులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది’’ అనే అర్థం వచ్చే భాగాలను శంకరుని బ్రహ్మసూత్ర శారీరక భాష్యం నుంచి పద్మపాదుడు పఠించాడు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః – ‘శంకరుడే భాష్యరచన చేసిన శంకరాచార్యుడు. అంతకుముందు సూత్రాలను అందించిన ఈ వ్యాసుడు సాక్షాత్తూ విష్ణు భగవానుడే. ఈ భగవంతులిద్దరి కలయిక ప్రతియుగంలోనూ జరుగుతూనే ఉంటుంది...’ అని పలికింది ఆకాశవాణి. (సశేషం) ∙నేతి సూర్యనారాయణ శర్మ -
‘మీ అక్క ఒక్కతే కూసోని కాళ్లెట్ల గడుతదయ్యా’
‘‘ఎప్పుడడిగినా ఇగో అస్తడు.. అగో అస్తడంటిరి? ఏడి? లగ్గం మూర్తం టైముకి కూడా జాడలేకపాయే?’’ కోపాన్ని తమాయించుకుంటూ అతను. ‘‘నిజంగనే అస్తడనుకున్నం. చూస్తుండ్రు గదా.. మా బావ కోసం మేం జేయని ప్రయత్నం లేదు’’ పరిస్థితిని అర్థం చేయించే ప్రయత్నంలో అంజయ్య. ‘‘ఎంత సౌదిల ఉంటే మాత్రం ఒక్కగానొక్క ఆడివిల్ల పెండ్లికి రాకుంట ఉంటడా ఏ తండ్రి అయినా?’’ నిష్టూరంతో అతను. ‘‘నువ్వన్నది నివద్దే. మా బావకు సుత రావాల్ననే ఉంటది కదా అన్నా. గాయన లేకుండ పెండ్లి జేసుడు మాకు మాత్రం గమ్మతా చెప్పు! గివన్నీ మాట్లాడుకుంట జిలకర్రబెల్లం మూర్త ఎత్తిపోగొట్కోవద్దన్నా.. ఈడిదాకా ఓపిక వట్టిండ్రు.. గాయింత గీ అక్షింతలు వడేదాకా సబర్ వట్టుండ్రి జెర’’ బతిమాలుకున్నడు అంజయ్య. ‘‘మీ అక్క ఒక్కతే కూసోని కాళ్లెట్ల గడుతదయ్యా?’’ రాజీకొచ్చేస్తూ అతను. ‘‘అవునుల్లా..!’’ ఆలోచనల్లో పడ్డాడు అంజయ్య. అంతలోకే ఏదో తట్టినట్టయి ‘‘మేనమామను నేను కడుగుతా నా భార్యతో కూసోని’’ అంటూ లోపలికి వెళ్లాడు వాళ్లక్కకు చెప్పడానికి. పంచాయతీ ఆఫీస్నే పెళ్లి కోసం ఫంక్షన్ హాల్గా తీసుకున్నారు. ఆవరణలో పందిరి వేశారు. పంచాయతీ ఆఫీస్లోని రెండు గదులు, హాలును విడిదిగా చేసుకున్నారు.∙∙ ‘‘ఊకో బిడ్డా.. మీ నాన్న అస్తడు’’ అంటూ తన మేనకోడలిని బుదిరికిస్తున్న తన అక్కను పిలిచాడు అంజయ్య.. ‘‘అక్క ఒకపారిట్రా’’ అంటూ! ‘‘ఏమైందిరా అంజిగా..’’ ఉలిక్కిపడ్డట్టు ఒక్కసారిగా బిడ్డ మీద నుంచి తమ్ముడి మీదకు దృష్టిమరల్చింది లక్ష్మమవ్వ. ‘‘మీ ఇయ్యంకుడు కాళ్లెవరు కడ్గుతరు అని అడుగుతుండు’’ చిన్నగా చెప్పాడు అక్కకు. ‘‘అమ్మా..! నాన్న లేకుండా నేను ఈ పెండ్లి జేసుకోనే!’’ కుమిలి కుమిలి ఏడ్వసాగింది పెళ్లికూతురు. ‘‘అట్లనకు బిడ్డా! నోరెట్లాడితే నొసలట్లాడ్తదంటరు! నీ కాళ్లు మొక్కుతా’’ కూతురి తలను తన ఛాతిలో దాచుకుంటూ ఓదార్చింది లక్ష్మవ్వ. ‘‘సూడ్రా.. ఏం జెప్పాలే మీ బావ కథ. పిల్ల లగ్గం కుదరంగనే అస్తా అన్నడు. పదిహేర్రోజులల్లనే పెండ్లి జేసేద్దమే.. ఎక్వతక్వ ఛుట్టీలు దొర్కయ్ నాకు అని జెప్పిండు. ‘‘ఏమాయె ఎప్పుడొస్తున్నవ్’’ అని పోరంగా పోరంగా..‘‘ రేపే ఎల్తున్ననే.. సేటు ఆపిండు అర్జెంట్ పనుందని’’ అని జెప్పినోడు జిలకరబెల్లం టైమ్ దాకా కూడా పత్తా లేకపోతే ఏమనుకోవల్రా? ఇద్దరు కొడుకుల నడుమ పుట్టిన పిల్లని ఎంత పావురంతో పెంచుకున్నడు! బిడ్డ మంచి ఇంట్ల వడాల్నని ఎంత కష్టవడ్డడు! బిడ్డ పెండ్లి ఇట్ల్ల జేద్దమే.. అట్ల జేద్దమే.. ఆళ్లను విలుద్దం.. ఈళ్లను విలుద్దమని.. అస్సల్ టైమ్కి ఆయననే రాకపోతే ఎట్లరా? ’’ అంటూ లక్ష్మవ్వా కన్నీళ్లొత్తుకుంది. చివుక్కుమంది అంజయ్య మనసు. ‘‘ఊకోవే అక్కా.. మేమంతా లేమా? ’’ అంటూ లక్ష్మవ్వ వీపు నిమిరాడు ఓదార్పుగా. ఇంకోవైపు పెళ్లికూతురూ ఏడుస్తూనే ఉంది..తన సెల్ ఫోన్లో స్క్రీన్సేవర్గా ఉన్న వాళ్ల నాన్న ఫోటోను చూసుకుంటూ! లక్ష్మవ్వ తేరుకుని చీర కొంగుతో కళ్లు తుడుచుకుంటూ ‘‘ ఇయ్యంపులోల్లేమన్నా లొల్లి వెడ్తుండ్రా?’’ తమ్ముడిని అడిగింది ‘‘ఆ..! బిడ్డ పెండ్లికి మించిన పన్లేముంటయ్ అయ్యకు? కాళ్లెవలు కడ్గుతరు? అని అడుగుతుండు మీ వియ్యంకుడు’’ చెప్పాడు అంజయ్య. ‘‘నా బిడ్డ పెండ్లికి నేను కడ్గగ ఇంకోల్లు కడ్గుతరుల్లా..’’ పైట అంచును బొడ్లో దోపుకుంటూ గదమాయించింది ఆమె. ‘‘బావ లేకుండా నువ్వెట్లా కాళ్లు కడ్గుతవే?’’ అయోమయంతో అంజయ్య ‘‘ఎట్లేంది?ఆయన తువ్వాలు బొడ్ల చెక్కుకుంటా. ఇంకొక కొనను నా కొంగుకు ముడేసుకుంటా. ఇంకా మాట్లాడ్తే... పక్కపొంటి పీట మీద ఆయన ఫోటో వెట్కుంట’’ కచ్చితంగా చెప్పింది లక్ష్మవ్వ. అక్క తాపత్రయం ఆ తమ్ముడి కంట నీరు తెప్పించింది. ఆ మాటవిన్న పెళ్లికూతురైతే తల్లిని, మేనమామను పట్టుకొని ఏడ్చేసింది. ‘‘నడువుండ్రి.. నడువుండ్రి.. మూర్తం ఎత్తిపోదిక్కి! పంతులు లొల్లివెడ్తడు మల్ల..’’ అంటూ అక్క, మేనకోడలి భుజాలు పట్టుకొని ముందుకు నడిపించాడు అంజయ్య. అప్పటికే పందిట్లో బ్రాహ్మడి హడావిడి మొదలైంది.. ‘‘లక్ష్మవ్వా కన్యాదానం చెయ్యాలే..’’అంటూ తొందరపెట్టాడు పంతులు ‘‘అస్తున్న పంతులూ ’’ అంటూ మళ్లీ లోపలికి పరిగెత్తి.. భర్త ఫోటో, పెళ్లికోసమని అతనికి తెచ్చిన కొత్తబట్టల్లోని ఉత్తరీయాన్ని గబగబా తెచ్చింది లక్ష్మవ్వ. ఈలోపు పెళ్లి కూతురును పందిట్లోకి తీసుకొచ్చాడు మేనమామ అంజయ్య. పీట మీద భర్త ఫొటో పెట్టుకొని, బొడ్లో ఉత్తరీయం కొసను దోపుకొని, మరో కొసను కొంగుకు ముడివేయించుకొని కన్యాదాన కార్యక్రమానికి ఉపక్రమించింది లక్ష్మవ్వ. మండపంలో ఉన్న వాళ్లందరి మనసులూ భారమయ్యాయి ఆ దృశ్యం చూసి.. అందరి కళ్లలో నీటి చెమ్మ. ఆ వేడుకకు ఆవల.. కొంత దూరంలో.. ఓ వ్యక్తి.. పెళ్లికూతురు అన్నకు ఒక బ్యాగ్ ఇస్తూ ‘‘బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నవా? పెండ్లయిపోయినంక ఒకసారి కాల్ చేయమన్నడు సేటు’ అని చెప్తున్నడు ఆ వ్యక్తి. ‘‘ఊ... ’’ అంటూ బ్యాగ్ అందుకుంటున్న పెళ్లికూతురి అన్నకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. బ్యాగ్లో మొహం దాచుకుని గుండెపగిలేలా ఏడ్వసాగాడు. ఆ కుర్రాడిని ఎలా ఓదార్చాలో అర్థంకావట్లేదు వచ్చిన వ్యక్తికి. ‘‘మీ చెల్లె కోసమని సేఠ్ భార్య బంగారం పంపింది’’ అంటూ బ్యాగ్ని తడిమాడు అందులో ఆ బంగారం భద్రంగా ఉంది అన్నట్టుగా. ‘‘ఏడ్వకు పిల్లగా.. నువ్వే గిట్లయితే మీ అమ్మ, చెల్లె, మీ తమ్ముడ్ని ఎవరు ఊకోవెడ్తరు చెప్పు..’’ అంటూ ఆ పిల్లాడిని సముదాయించ చూశాడు. ఆ మాటతో మరింత దుఃఖం పెరిగింది ఆ పిల్లాడికి. ‘‘ఏడ్వకు పొల్లగా.. అందరికి అనుమానమొస్తది. ఎట్ల జెప్పాల్నో తెలుస్తలేదు.. శ..వం.. రాతందుకు పదిహేను రోజులైనా..’’ అని ఆగిపోయాడు ఆ వ్యక్తి. అంతే ఆ మాటకు బ్యాగ్ కిందపడేసి ఆ వ్యక్తిని పట్టుకొని మళ్లీ బోరుమన్నాడు ఆ అబ్బాయి. ‘ ‘రేపు ఇండియాకస్తడనంగా సైట్కి వోయిండు.. పై నుంచి కిందవడ్డడు.. నెత్తివగిలి ఆడ్దాన్నే ప్రాణమిడ్శిండు. ఈ సంగతి మీ చెల్లె పెండ్లి అయ్యేదాకా బయటవెట్టొద్దని సేఠే జెప్పిండు మీ ఊరోళ్లతోని’’ అంటూ జరిగింది మరోసారి చెప్పాడు ఆ వ్యక్తి.. అక్కడ పందిట్లో జీలకర్ర బెల్లం తంతు అయిపోయి.. అంక్షితలు పడ్తున్నాయేమో ఒక్కసారిగా బాజాభజంత్రీలు మోగసాగాయి గట్టిగా! -సరస్వతి రమ -
గరుడుని సమయస్ఫూర్తి
ఒకరోజున ఇంద్రసభలో రకరకాల ఉత్పాతాలు ఎదురయ్యాయి. ‘‘ఏమైంది? ఏమిటి ఈ అపశకునాలు?’’ అడిగాడు ఇంద్రుడు దేవగురువుని ఆందోళనగా. ఆయన దివ్యదృష్టితో చూసి ‘‘తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన పాములు తమకి అమృతం కావాలన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకువెళ్లి తన తల్లిని దాస్యం నుంచి బయట పడేయాలని గరుడుడు వస్తున్నాడిక్కడికి. మహాబలుడు, వీరుడు అయిన గరుత్మంతుడు నీకు తమ్ముడైనా నువ్వు అతన్ని గెలవలేవు’’ అన్నాడు బృహస్పతి. గురువు మాటలతో అంతా అప్రత్తమయ్యారు. కవచాలూ, ఆయుధాలూ ధరించి, అమృత భాండం చుట్టూ రక్షక వలయంలా నిలిచారందరూ. అంతలో అక్కడకి రానే వచ్చాడు గరుత్మంతుడు. నేరుగా అమృత భాండం దగ్గరే వాలి దాన్ని అందుకోబోయాడు. రకరకాల ఆయుధాలతో అతనిమీద దాడి చేశారు రక్షకులు. గరుత్మంతుడు రెక్కలొక్కసారి బలంగా జాడించాడు. ఆ గాలి ఉధృతికి దేవసైన్యమంతా ఎండుటాకుల్లా ఎగిరి అల్లంతదూరాన పడ్డారు. గరుడుని మీదికి ఉరికిన అగ్ని, వాయు, యమ, కుబేర, వరుణాది దిక్పాలురు కూడా పక్షీంద్రుని పరాక్రమానికి తల వంచక తప్పలేదు. అదను చూసి అమృత కలశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు పక్షీంద్రుడు. అయితే భాండం చుట్టూ ఆకాశాన్నంటేలా మహాగ్ని కీలలు లేచాయి. రివ్వున వెళ్లి నదుల నీళ్ళన్నీ పుక్కిట బట్టి వచ్చి ఆ నీటిని ఆ అగ్ని మీద కుమ్మరించడంతో ఆరిపోయిందది. అంతలో అమృతం చుట్టూ తిరుగుతూ కత్తులు దూస్తున్నట్టుగా యంత్రచక్రం కనిపించడంతో గరుడుడు వెంటనే సూక్ష్మదేహం ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలకి ప్రవేశించాడు. భాండాన్ని చుట్టుకుని రెండు మహాసర్పాలు పడగ విప్పి, కోరలు సాచి పైకి లేచాయి. రెండు పాములమీదా చెరో పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపెట్టి, ముక్కుతో అమృతభాండాన్ని అందుకుని ఆకాశానికి ఎగిశాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. పాములు అడిగినందుకు అమృతం తీసుకుని వెళ్తున్నాడు పక్షీంద్రుడు. రుచి చూద్దామన్న తలంపు కూడా లేదు. ఎంత బలవంతుడో అంతటి నీతిమంతుడితను అనుకున్నాడు విష్ణువు. వెంటనే అతని ముందు సాక్షాత్కరించాడు. ‘‘ఖగరాజా! నీ సాహసానికీ మెచ్చాను, నీకు ఓ వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో!’’ అన్నాడు విష్ణువు. కనులముందు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువుకు తలవంచి నమస్కరించాడు. ‘‘నిత్యం నీ సాన్నిధ్యం కంటే కావాల్సిందేమీ లేదు స్వామీ. కాకపోతే జరామరణాలు దుర్భరం కాబట్టి అవి లేకుండా అమరత్వం ప్రసాదించు స్వామీ’’ అడిగాడు సమయస్ఫూర్తితో గరుత్మంతుడు. మరింత సంతోషించాడు విష్ణువు. ‘‘నాకు వాహనంగానూ, నా రథానికీ పతాకం గానూ ఉండు గరుడా’’ అన్నాడు అనుగ్రహ పూర్వకంగా చూస్తూ.. ‘‘ధన్యుణ్ణి స్వామీ!’’ అంటూ కైమోడ్చాడు గరుత్మంతుడు. నీతి, నిజాయితీ, ధైర్యం, సాహసం, సమయస్ఫూర్తి అనేవి పెట్టని కవచాలు. అడగని వరాలు. ఆ పంచాయుధాలుంటే ఇక విజయమే! – డి.వి.ఆర్. భాస్కర్ -
ఎంత పనిజేసిండు.. పాపిష్టోడు
‘‘ప్రభాకరన్నా.. ఆడ మా అన్న తాన పైసలున్నయో లెవ్వో.. ఎన్ని తిప్పలువడ్తున్నడో ఏమో.. ఏం దెలుస్తలేదు. మా అమ్మకు దెల్వకుండ గీ పైసలు దాస్కొని తెచ్చిన.. ఎట్లనన్న జేసి మా అన్న జాడ వట్టి గీ పైసలియ్యి, ఫోన్ చెయ్మని జెప్పు’’ అంటూ వాళ్లమ్మ చూడకుండా కర్చీఫ్ మూటను తన చేతిలో పెట్టిన సవిత మాటలే గుర్తొస్తున్నాయ్ ప్రభాకర్కి. నిద్రపట్టక పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. బలవంతంగా కళ్లు మూసుకున్నాడు.. ‘‘ప్రభాకర్.. మా పిల్లిచ్చిన పైసలు పైలం. మొన్న యూరియా కాడ లైన్ల నిలవడి నిలవడి దస్కిదిని ఆల్ల బాపు పానం ఇడ్శిండు. నా మెడల పుస్తెల్తాడుంటి ఏం జేస్తదని అమ్మిన. లగ్గంకొచ్చిన పిల్లకు వనికొస్తయని కాపాయం జేసిన పైసలవి. నాకు దెల్వదనుకొని నీ షేతిల వెట్టింది. మావోడి అతపత దొరికితే మా కష్టం జెప్పుజరా..’’ కఠినంగా అన్న అనసూయవ్వ మాటలు ఛెళ్లున చరిచి.. దిగ్గున కూర్చోబెట్టాయి. బయట జోరు వాన.. కిటికీలోంచి ఈదర ఇంట్లో వాతావరణాన్ని చల్లబరుస్తున్నా... చెమటతో తడిసి ముద్దయిపోయాడు ప్రభాకర్. లేచి.. వాల్ హ్యాంగర్కున్న షర్ట్ జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసుకొని.. ఆ చీకట్లోనే దారి తడుముకుంటూ.. శబ్దం రాకుండా తలుపు తెరిచి.. వసారాలో నిలబడ్డాడు. పళ్ల కింద సిగరెట్ను నొక్కి పట్టి.. కసిగా అగ్గిపుల్ల వెలిగించి సిగరెట్కు అంటించాడు.. పశ్చాత్తాపాన్ని కాల్చిబూడిద చేసేయాలన్నట్టుంది.. సిగరెట్ పొగను ఎగబీలుస్తునప్పుడు అతని ముఖ కవళిక. పొగను ముక్కులోంచి.. నోట్లోంచి వదులుతూ పైజామా జేబులోంచి కర్చీఫ్ మూటను బయటకు తీసి గుప్పిటి తెరిచాడు. రెండు వేల నోట్ల మధ్యలో కొన్ని వందల నోట్లు.. వాటి మధ్యలో అయిదు వందల నోట్లు.. మడిచిన కట్ట. అవి ఎన్నున్నాయో కూడా లెక్కబెట్టుకున్నట్టు లేరు.. కర్చీఫ్లో కుక్కి మూటగట్టి తన చేతిలో పెట్టారు. ప్రభాకర్ కళ్లల్లో నీళ్లు.. చటుక్కున్న గుప్పిటి మూసి ఆ కర్చీఫ్ మూటను జేబులో పడేశాడు. సిగరెట్ పొగను పూర్తిగా బయటకు వదలకుండా.. గుక్క మీద గుక్క పొగను పీల్చి కాలిపోయిన ఆ పీకను బొటనవేలు, మధ్యవేలును రింగులా చుట్టి సిగరెట్నూ అల్లంత దూరంలోకి విసిరాడు. వాన చినుకులు పడి దాని సెగ ఆరిపోయింది. రెండు చేతులు పైకెత్తి చూరుకింద ఉన్న గుంజలను పట్టుకుని బయటపడ్డ సిగరెట్కేసి చూడసాగాడు తదేకంగా. మనసు గతాన్ని కళ్లముందుకు తెచ్చింది... మస్కట్లో ఒక ఫ్రెండ్ కలిపించిండు సురేష్ను. ఇంటర్ పాసై తను పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్లోకే కార్ డ్రైవర్గా వచ్చిండు. ‘‘ఇంటర్ పాసయినవ్.. ఆడ్నే సదుకోకుండా గీడికొచ్చినవ్ తమ్మీ’’ అడిగిండు తను. ‘‘యెవులసంతోని బగ్గ అప్పులయినయ్.. షెల్లెకు పెండ్లి జెయ్యాలే.. గందుకే’’ చెప్పిండు. ‘‘పిల్లగాడు మస్తు మంచోడ్రా.. మా ఊరే. ఈడ సుత మా రూమ్లనే ఉంచుకున్నం’’ చెప్పిండు తన దోస్త్.. సురేష్ భుజం మీద చేయివేసి ప్రేమగా కొడుతూ! గట్ల సురేష్ తనగ్గూడా దగ్గరైండు. అటెన్కల నెలకే గా దోస్త్ ఇండియాకొచ్చి.. మల్లా సౌదీకి వోయిండు. గాని జాగల.. గా రూమ్లకు తను వొయిండి. సురేష్ మాలెస్సనే క్లోజ్ అయిండు. ఆల్ల బాపు, అమ్మ, సవిత ఫోన్ జేస్తే అడ్పదడ్ప తనగ్గూడ ఇస్తుండే మాట్లాడమని. ‘‘అరే.. ప్రభాకరన్నా.. మీది మా పక్కపొంటి ఊరే’’అని సవిత సంబర పడ్తుండె. ఒకసారి శుక్రవారం దేవుళ్లకు జేసుకుంటే ఊరికి వొయ్యి తన పెండ్లాం, పిల్లలనూ పండుక్కి తెచ్చుకున్నడు బాపు... ఈ తలపులతో ప్రభాకర్ కళ్లలోని నీటి ఊట చెంపల మీద నుంచి జారుతోంది. పట్టించుకునే స్థితిలో లేడు. ఎంత పనిజేసిండు.. పాపిష్టోడు.. పాపం పోరడొచ్చి ఆర్నెల్లన్న కాలే.. ఈ షేతులతోనే జైలుకి వట్టిచ్చిండు... కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుంది. ఏం జేస్తడు? తనగ్గూడా పైసలు కావాలే.. ఇంటికాడ జేసిన అప్పులు తీరాలే.. మస్కట్కొయ్యి మూడేండ్లయిందన్న ముచ్చట్నే గానీ.. యేడాద్దాకా కరెక్ట్గా పనే లేకుండే.. అగో గప్పుడే ‘‘ఖబ్రీ’’ గురించి దెల్సింది. ముందుగల్ల తన ఇలాఖా మనుషుల జోలికివోనేలేదు.. పాకిస్తానోల్లను, బంగ్లాదేశోల్లనే వట్టిచ్చిండు. పైస.. ఏ పాపమన్నా జేయిస్తది.. బాపు ఖీసాలకెంచి చారాణా, ఆఠాణా దొంగతనం జేసినప్పుడల్లా బాపమ్మ గొణుగుతుండే.. పైసా.. పైసా ఏం జేస్తవే అంటే అయినోడిని పగజేస్తా అన్నదట అని. నిజంగనే.. పైస మీద పావురం.. గా పిల్లగాన్ని పగ జేసింది. ఆ పిల్లగాడికి దెల్వదు.. తలనొప్పి గోళీలు గల్ఫ్ల బ్యాన్ అన్న సంగతి. తనకు దెల్సు అయినా చెప్పలే. రెండుమూడు పాకెట్లు దెచ్చుకున్నడు. ఎయిర్పోర్ట్ల కెంచి ఎట్ల దప్పిచ్చుకున్నడో మరి! గా పైసల ఆశ గోళీల గురించి పోలీసులకు ఖబర్ ఇచ్చేదాకా మనసునవట్టనియ్యలే. నాలుగునెల్లయితుంది సురేష్ జైల్లవడి. గా పొల్లగానిగ్గూడా దెల్వదు.. గా పనిజేసిన ఖబ్రీ ఎవరో! థూ.. గీ బతుకుల మన్నువడా... దుఃఖం ఆగలేదు ప్రభాకర్కు. ఏడుస్తూ కూలబడిపోయిండు. ఆ చప్పుడుకి లోపల్నుంచి బయటకు వచ్చింది అతని భార్య సువర్ణ. కళ్లు నులుముకుంటూనే.. ‘‘అయ్యో.. ఏమైందే గిట్ల కూలవడ్డవ్?’’ అంది భర్తను లేపుతూ! ‘‘గింత రాత్రి గీడున్నవ్.. మల్లా సిగరెట్టా?’’ నిద్రమత్తు పోయి కోపం వచ్చింది ఆమెకు. కాదు అన్నట్లు తలూపుకుంటూ కళ్లు తుడుచుకున్నాడు ప్రభాకర్. ఆ చీకట్లోనూ భర్త పరిస్థితి అర్థమైంది ఆమెకు. ‘‘ఏందే.. ఏడుస్తున్నవా?’’ అంది అతని దగ్గరకు వస్తూ! ‘‘ఉహ్హూ.. ఏం లేదు నువ్ పో.. పోయ్యి పండుకో’’అన్నడు మొహం ఆమెకు కనిపించకుండా పక్కకు తిప్పుకుంటూ! కానీ ఆమె వెళ్లలేదు.. నిజం తెలుసుకునే పట్టూ వీడలేదు. ‘‘మాపటికెంచి చూస్తూన్న.. గా పొల్ల, అనసూయవ్వ అచ్చిపోయిన్నుంచి నువ్వు మంచిగలేవు. నాకు అర్థమైతలేదనుకున్నవా?’’ గట్టిగానే అడిగింది. అంతే ఆమెను పట్టుకొని ఏడ్చేశాడు అతను. ‘‘అయ్యో.. ఏందే.. సురేష్కేమన్నా అయిందా ఏందీ?’’ గాభరాగా అడిగింది. ‘‘నేనే... జేష్న’’ రెండు చేతులతో గుండె మీద బాదుకుంటూ ఏడ్చాడు. బిక్కమొహం వేసింది సువర్ణ. సవిత ఇచ్చిన కర్చీఫ్ మూటను జేబులోంచి తీసి భార్య చేతిలో పెడ్తూ ‘‘గా పిల్లకు మొహం ఎట్ల జూపియ్యాల్నే’’ అన్నాడు బాధ నిండిన గాద్గదిక స్వరంతో. ఆ మూటను, భర్తను అయోమయంగా చూస్తూ అడిగింది.. ‘‘సంగతేందో నా మైండ్లవల్లేదస్సలు?’’ అని. ‘‘గా పొల్లగాడ్ని నేనే జైలుకివట్టిచ్చిన. నాలుగునెల్లైంది. ఆల్ల బాపు వోయిండని గూడా ఆడికి దెల్వదింకా!’’ అంటూ భార్యను పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు ప్రభాకర్. ‘‘ఎంత పనిజేసినవ్? మనకిద్దరాడవిల్లలున్నరు మర్శిపోయినవా? అసలు ఎందుకు వట్టిచ్చనవ్?’’ భర్త భుజాలు పట్టుకుని నిలదీస్తోంది సువర్ణ. జవాబుగా దుఃఖమే వస్తోంది అతణ్ణించి. - సరస్వతి రమ -
నేటి ధ్వజస్తంభం కన్నడిగుల కానుక
తిరుపతి వెంకన్న సన్నిధిలోకి ప్రవేశించగానే ఎంతటి అధికారి అయినా సరే, ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయడం ఆనవాయితీ. ఎందుకంటే అది కూడా స్వామి రూపమే. లోపలుండే మూలవిరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. ధ్వజస్తంభానికి నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించడం ఆచారం. ఆలయంలో ఏవయినా ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. తిరుమల ఆలయంలో నూతన ధ్వజ స్తంభ పునః ప్రతిష్ఠ వెనుక ఆసక్తికర అంశాలున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో నేల నుంచి 50 అడుగుల ఎత్తుండే ధ్వజస్తంభానికి పై భాగాన గంటల వంటి అలంకరణలుంటాయి. 1982లో టీటీడీ ఇంజినీర్లు ధ్వజస్తంభానికి మరమ్మతులు చేపడుతున్న సమయంలో స్తంభంలో పుచ్చు కనిపించింది. వెంటనే ఆ విషయాన్ని అప్పటి కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్కు తెలియజేశారు. ఆయన పతాక భాగాన అలంకరణలను తొలగించి చూశారు. కింది భాగాన ఉండాల్సిన మాను పూర్తిగా లేదు. ధ్వజస్తంభం చుట్టూ ఏర్పాటుచేసిన బంగారు రేకు మాత్రం బయటకు కనిపిస్తోంది. లోపలి భాగం చాలావరకు పుచ్చిపోయింది. ఈవో వేదపండితులు, ఆగమ నిపుణులతో చర్చించారు. ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి వాడే మానుకు ఎలాంటి తొర్రలు, కొమ్మలు, పగుళ్లు ఉండకూడదు. వంకర లేకుండా దాదాపు 75 అడుగుల ఎత్తు ఉండాలి. కర్ణాటక రాష్ట్రం దండేరి అడవుల్లో కనీసం 300 సంవత్సరాల వయసున్న చెట్టు ఇందుకు అనుకూలంగా ఉంటుందని ఓ భక్తుడి ద్వారా తెలుసుకున్నారు.కన్నడిగుల కానుకఅప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు తిరుమల దర్శనానికి వచ్చారు. ధ్వజ స్తంభ పునః ప్రతిష్ఠ విషయాన్ని ఆయనకు తెలియజేశారు పి.వి.ఆర్.కె. ప్రసాద్. ఆయన కన్నడిగుల కానుకగా ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. టీటీడీ అధికారులు, కర్ణాటక అటవీశాఖ అధికారులు దండేరి అడవుల్లో వెదుకులాట ప్రారంభించారు. దాదాపు 16 టేకు చెట్లను గుర్తించారు. ధ్వజస్తంభానికి ఉపయోగపడే మానును సిద్ధంచేశారు. దాన్ని ఆ అడవుల నుంచి తరలించేందుకు పేపరు మిల్లు కార్మికులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భారీ ట్రాలీలో ఎక్కించారు. ఘాట్ రోడ్డు దాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరుండి జెండా వూపి తిరుమలకు సాగనంపారు. అదే తరహాలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు ఆ భారీ వాహనం తిరుపతి అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో తిరుమల చేరుకుంది. మొత్తం మీద అప్పటి టీటీడీ కార్యనిర్వహణాధికారి చొరవ, ఇంజినీరింగ్ అధికారుల నైపుణ్యంతో ధ్వజస్తంభం తయారైంది. వేద మంత్రోచ్చారణల మధ్య 1982వ సంవత్సరం జూ¯Œ 10న తిరుమల ఆలయంలో నూతన ధ్వజస్తంభాన్ని వైభవంగా ప్రతిష్టించారు. – యెండ్లూరి మోహ¯Œ , సాక్షి, తిరుపతి -
ఏడు నడకదారులు
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారు అంజనాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి అనే ఏడుకొండలపై వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకోవడానికి అత్యాధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, గతంలో భక్తులు తిరుమల చేరుకోవడానికి నడకదారి మాత్రమే వుండేది. ఏడుకొండలపై వెలసిన వెంకన్నను దర్శించుకోవడానికి ఏడు నడకదారులు వుండేవి. కాలక్రమేణా వీటిలో నాలుగుదారులు మరుగున పడిపోగా రెండుదారుల్లో మాత్రం భక్తులు ఇప్పటిగచ తిరుమల చేరుకుంటున్నారు.అడపాదడపా ట్రెక్కింగ్కు వెళ్లే భక్తులు మాత్రం మరోమార్గమైన అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల చేరుకునేందుకు శతాబ్దాల కిందట ఉన్న ఏడుదారుల గురించి వివరాలు తెలుసుకుందాం.. ఆపద మొక్కుల వాడు, భక్తజన ప్రియుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు దేవుడైన శ్రీనివాసుడు భక్తులకు కలియుగ దైవం. వైకుంఠంలో శ్రీవారిపై అలిగిన శ్రీమహాలక్ష్మి భూలోకానికి రావడంతో ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి తన శయనపాన్పుగా ఉన్న ఆదిశేషుడితో సహా భూలోకానికి విచ్చేశారని, ఆదిశేషుడే కొండగా మారడంతో శ్రీవారు భూలోకంలో తనకు అనువైన స్థలంగా తిరుమలను ఎంచుకున్నారని పురాణ కథనం. శ్రీవారు వెలసి వున్న ఏడుకొండలు తిరుమల నుంచి శ్రీశైలం వరకు 370 కిలోమీటర్లు పొడవుతో 30 కిలోమీటర్లు వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. గతంలో రోడ్డు మార్గాలు లేకపోవడం భక్తులు కాలి నడకనే తిరుమలకు చేరుకునేవారు. ఇలా కాలక్రమేణా ఏడుకొండలకు ఏడుదారులు ఏర్పడ్డాయి. కొన్నింటికి చారిత్రాత్మక నేప«థ్యం ఉండగా, మరికొన్ని భక్తులు తమ అవసరాల దృష్ట్యా ఏర్పరచుకున్నవి. ప్రస్తుతం ప్రధానంగా వాడుకలో ఉన్న నడకదారి నిత్యం వేలాది భక్తులు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే అలిపిరి నడకదారి. శ్రీకృష్ణదేవరాయులు బావ మరిదిౖయెన మట్లి కుమార అనంతరాయులు ఏర్పాటు చేసిన మార్గం ఇది. 1625వ సంవత్సరం శ్రీవారి దర్శనార్థం తమిళరాష్ట్రం నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నడకదారిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం విచ్చేసేభక్తులు పెద్దసంఖ్యలో ఈ మార్గం గుండానే తిరుమలకు చేరుకుంటుండడంతో టీటీడీ కూడా ఈ మార్గం అభివృద్ధికి అన్ని ఏర్పాట్లూ చేసింది. 3650 మెట్లు, ఎనిమిది కిలోమీటర్లు వుండే ఈ నడకదారిలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ సన్షేడ్స్ నిర్మించడం, మార్గం పొడవునా తాగునీటి సౌకర్యం, భద్రత ఏర్పాట్లు, భక్తు్తలను ఉల్లాసపరచడానికి జింకల పార్కు, నెమళ్ళ పార్కు వంటివి ఏర్పాటు చేసింది. గతంలో పాలకమండలి నడకదారి మధ్యలో దశావతారాల విగ్రహాలను ఏర్పాటు చేసింది. వాడుకలో వున్న రెండవ దారి శ్రీవారి మెట్టు మార్గం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ దారిన తిరుమల చేరుకున్నాడట. నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత శ్రీవారు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు ప్రాంతం మీదుగా తిరుమలకు చేరుకున్నారు. పురాణాల ప్రకారం ఇదే మొట్టమొదటిది, ప్రాచీనమైనది. తరువాతి కాలంలో సాళువ నరసింహరాయలు ఈ మార్గం గుండా తిరుమలకు చేరుకోవడానికి గల దూరాన్ని తగ్గించి, ఆధునికీకరించారు. శ్రీకృష్ణదేవరాయులు ఈ మార్గం గుండా ఏడుసార్లు తిరుమలకు చేరుకుని స్వామి వారికి విలువైన ఎన్నో వజ్రవైఢూర్య ఆభరణాలు సమర్పించాడట. చంద్రగిరి వైపున వున్న ఈ మార్గం కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. 2100 మెట్లు ఉండే ఈ మార్గం గుండా గంటలోపే తిరుమలకు చేరుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ మార్గం గుండా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో టీటీడీ ఈ మార్గం పొడవునా సన్షేడ్స్ ఏర్పాటు చేసింది. ఇక మూడవది 15వ శతాబ్దంలో తాళ్ళపాక నుంచి కుక్కలదొడ్డి మీదుగా పార్వేటి మండపం వరకు ఉన్న దారి. శ్రీవారిని తన పద కవితలతో అర్చించిన అన్నమయ్య తాళ్ళపాక నుంచి ఈ మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారట. ఇప్పటికీ ఏటా అన్నమయ్య జయంతి రోజున ఈ మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ మార్గంలో ఆ కాలంలో ఏర్పాటు చేసిన మండపాలు శిథిలావస్థలో ఉన్నాయి. కొద్ది సంవత్సరాల కిందట కొందరు భక్తులు ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా టీటీడీ దృష్టికి తీసుకువచ్చినా, భద్రత కారణాల దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పటికీ ఈ మార్గం ద్వారా కొందరు ట్రెక్కింగ్కు వెళ్తుంటారు. ఇక నాలుగవది తుంబురతీర్థం నుంచి కుక్కలదొడ్డి మీదుగా కడపజిల్లా సోమేశ్వరాలయం వరకు ఉన్నది. రెడ్డిరాజుల కాలంలో సోమశిల రాజులు ఏర్పాటు చేసిన ఈ మార్గం చాలాకాలంగా వాడుకలో లేకపోవడంతో ఈ మార్గం ఒకటి ఉందనే సంగతి ఇప్పటి జనాల్లో చాలామందికి తెలియదు. ఇక ఐదవది తరిగొండ వెంగమాంబ మార్గం. శ్రీవారికి పరమ భక్తురాలైన వెంగమాంబ తన స్వస్థలమైన తరిగొండ నుంచి తిరుమలకు చేరుకోవడానికి భాకరాపేట అడవుల గుండా తలకోన మీదుగా మొగలిపెంట, యుద్ధగళ్ళతీర్థం ద్వారా ప్రస్తుతం టీటీడీ ఏర్పాటు చేసిన వేద పాఠశాల వద్ద కలుస్తుంది. ఈ మార్గం ప్రస్తుతం వాడుకలో లేకపోవడం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కనీస భద్రత ఏర్పాట్లతో 30 మందికి పైగా భక్తులతో బృందంగా వెళ్ళవచ్చు. ఇక ఆరవది యుద్ధగళ్ళతీర్థం నుంచి పాలకొండల వరకు వున్న మార్గం. గడికోట రాజులు ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్వారు 1801లో శ్రీవారి ఆలయాన్ని తమ అజమాయిషీలోకి తీసుకోవడంతో ఆదాయం కోల్పోయిన పాలెగాళ్ళు ఈ మార్గం గుండా వచ్చే భక్తులపై దాడులు చేసి, వారిని దోచుకునే వారట. ప్రస్తుతం ఈ దారి వాడుకలో లేదు. ఇక చివరిది ఏడవది తొండమాన్ చక్రవర్తులు ఏర్పాటు చేసిన మార్గం. కరకంబాడి నుంచి అవ్వాచారి కోన మీదుగా తిరుమలకు చేరుకుంటుంది. బ్రిటిష్ వారి కాలంలో పలువురు సామంతులు శ్రీవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ మార్గం గుండానే దండయాత్రలు చేశారట. కష్టతరమైన మార్గం కావడంతో కాలక్రమేణా ఈ మార్గం కూడా వాడుకలో లేకుండాపోయింది. ప్రస్తుతం ఈమార్గం పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతమైపోయింది. -
నేలమాళిగలో లిటిల్ డెవిల్
ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. నైట్ ల్యాంప్ వెలుగుతోంది. నా బెడ్ పక్క కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది! కన్నులు నులుముకుని చూశాను. ఓ చిన్నపాప! అయిదేళ్ళు ఉండవచ్చును! తెల్లటి ఫ్రాక్లో ఉంది. ఉలికిపడి, ‘‘ఎవరది?’’ అనడిగాను. జవాబు లేదు. రెప్పవేయకుండా నన్నే చూస్తోంది. గోడవైపు తిరిగి స్విచ్ నొక్కడంతో గదిలో ట్యూబ్ లైట్ వెలిగింది. వెనక్కి తిరిగేసరికి పాప అక్కడ లేదు! గతుక్కుమన్నాను. తలగడ పక్కనున్న సెల్ ఫోన్ తీసి ఆన్ చేసి టైమ్ చూశాను. అర్ధరాత్రి కావస్తోంది. నిద్రపోతూన్న నన్ను ఎవరో తట్టిలేపినట్టయి మెలకువ వచ్చింది. ఆ చిన్నారి ఎవరు? ఆ వేళప్పుడు గదిలోకి ఎలా వచ్చింది? అంతలోనే ఎలా అదృశ్యమయింది?... అన్నీ ప్రశ్నలే! జవాబులు దొరకడంలేదు. ఒకవేళ అది కలఅయ్యుంటుందేమోనని చేతి మీద గిల్లుకున్నాను. నొప్పిపుట్టింది. అంటే, అది వాస్తవ చిత్రమేనన్నమాట! భ్రమ కూడా కాదు. బెడ్ దిగి గదంతా చూశాను. ఎవరూ లేరు. గది తలుపులు మూసినవి మూసినట్టే ఉన్నాయి. కిటికీ వద్ద నిలుచుని బయటకు చూశాను. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. దూరంలో ‘జింజీ ఫోర్ట్’ లీలగా కనిపిస్తోంది. మళ్లీ బెడ్ మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడంలేదు. ఆ పసిపాప ఆకారమే కళ్ళ ఎదుట కనిపిస్తోంది. మూసి ఉన్న గదిలోకి ఆ పాప ఎలా వచ్చింది? ఎలా మాయమయింది? అసలు ఆ పాప ఎవరు? మనిషేనా??– ఆ తలంపే ఉలికిపాటుకు గురిచేసింది నన్ను. ఆర్కిటెక్చర్లో పీహెచ్డీ చేస్తున్నాను నేను. ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా వివిధ ప్రాచీన దుర్గాలు, కోటలను దర్శించి వాటి ఆర్కిటెక్చర్ని అధ్యయనం చేసి థీసిస్ రాయాల్సి ఉంది. ఆ పనిమీదే రెండు రోజుల క్రితం తమిళనాడులో విల్లుపురం జిల్లాలో ఉన్న ‘జింజీ ఫోర్ట్’కి వచ్చాను. సమీపంలో ఉన్న ‘సెంజి’ టౌన్ ని బట్టి దాన్ని ‘సెంజీ ఫోర్ట్’ అని వ్యవహరించడం కూడా కద్దు. ఫోర్ట్ దిగువను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన వసతిగృహం ఉంది. అలనాటి రాజదుర్గానికి చెందిన పురాతన కట్టడం అది. కొద్ది మార్పులతో టూర్స్లో వచ్చే డిపార్ట్మెంట్ సిబ్బందికి బసగా మార్చబడింది. రెండే రెండు పోర్షన్స్ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఒక్కో పోర్షన్లోనూ రెండు గదులు, ఓ హాలూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ వెనుకనున్న గదిలో వుండే ముసలి వాచ్మేన్ దాన్ని కనిపెట్టుకుని వుంటాడు. అతని కుటుంబం గ్రామంలో ఉండడం వల్ల ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో అక్కడ దిగకుండా సమీపంలో ఉన్న ‘తిండివనం’ టౌన్లోని హోటల్స్లో బసచేయనారంభించారట డిపార్ట్ మెంట్ సిబ్బంది. హైదరాబాదులో బైలుదేరినప్పుడే అక్కడ బసచేయడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి సంపాదించాను. కనీసం రెండు వారాల పాటైనా అక్కడ ఉండవలసివస్తుంది. వాచ్మేన్కి డబ్బులు ఇచ్చి మూడు పూటలా వండిపెట్టేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకుంటూంటే రాత్రి సంఘటన మదిలో మెదిలింది. నా మనసంతా ఆశ్చర్యంతో, రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. గబగబా బ్రేక్ ఫాస్ట్ ముగించి ఫోర్ట్ కి బయలుదేరాను. అక్కడ నేను అధ్యయనం చేయవలసినవి పలు అంశాలు ఉన్నాయి. అప్పటికే పర్యాటకుల సందడి మొదలయింది. మెట్లు, రాతిగుట్టలూ అధిరోహించి కోటను చేరుకునేసరికి చాలా సమయం పట్టడమేకాక, అలసట కూడా ఆవరించుకుంది. సాయంత్రం ఐదు గంటలు అయేసరికి కోట ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వుంటుంది. పరిసరాలను పర్యవేక్షిస్తూ, పర్యాటకులతో సంభాషిస్తూ పైకి ఎక్కసాగాను నేను. జింజీ ఫోర్ట్ అద్భుతమైన పురాతన రాజదుర్గం. తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మింపబడ్డ ఓ చిరుదుర్గాన్ని, పదమూడవ శతాబ్దిలో కురుంబార్ మోడిఫై చేయడమూ, అనంతరం పదిహేను–పదహారు శతాబ్దాలలో ‘జింజీ’ నాయక్స్ దాన్ని విస్తరింపజేయడమూ జరిగాయి. మూడు పెద్ద గుట్టల పైన పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ కోటను బ్రిటిష్ వారు ‘ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్’ అని పిలిచేవారు. ఆ హెరిటేజ్ ఫోర్ట్ ప్రస్తుతం – వాతావరణపు ఆటుపోట్లకు గురయి, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా శిథిలావస్థలో రాతిగుట్టల నడుమ రెక్కలు తెగిపడ్డ పక్షిలా మిగిలి ఉంది. కోట భవంతులు పూర్వవైభవాన్ని కోల్పోయినా చూడచక్కగా ఉన్నాయి. గ్రానైట్ స్టోన్, లైమ్ మోర్టార్ ల కలయిక అవి. వాటి ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఆకట్టుకుంటూ విస్మయానికి గురిచేస్తుంది. సాయంత్రం వరకూ ఆ శిథిలాలలో తిరుగాడుతూ అవసరమైన నోట్స్ రాసుకుంటూ, వీడియో, ఫొటోలు తీస్తూ గడిపేశాను. బసకు చేరుకుని ఫ్రెషప్ అయి, వాచ్మేన్ తాత ఇచ్చిన టీ తాగుతూంటే గతరాత్రి అనుభవాన్ని అతనితో పంచుకుందామా అనిపించింది. అంతలోనే మనసు మార్చుకున్నాను, నవ్విపోతాడేమోనని. ఆ రాత్రి మెలకువగా ఉండి ఆ పాప మళ్ళీ వస్తుందేమో చూడాలనుకున్నాను. కానీ, రోజంతా అలసిసొలసి ఉండడంతో మంచం ఎక్కగానే గాఢంగా నిద్రపట్టేసింది. ఆ రాత్రి పాప వచ్చిందో లేదో తెలియదుగానీ, నాకు మాత్రం అసలు మెలకువే రాలేదు. అయితే, ఆ మర్నాటి రాత్రి మళ్ళీ మెలకువ వచ్చేసింది. ఎవరో కాలు పట్టుకుని కదుపుతున్నట్టయి కళ్లు తెరచాను. అదే పాప! తెల్లటి ఫ్రాక్ లో. కాళ్ళ దగ్గర. నన్నే చూస్తోంది. అయితే, నేను ట్యూబ్ లైట్ వెలిగించేసరికి అదృశ్యమయిపోయింది! మూసి ఉన్న గదిలోకి ఆ చిన్నారి ఎలా వస్తోంది? ఎలా మాయమవుతోంది?... నాలో అయోమయం అధికమయింది. మర్నాడూ అదే అనుభవం! ఆ రోజు సాయంత్రం నేను ఫోర్ట్ నుంచి తిరిగివచ్చేసరికి వాచ్ మేన్ కూతురట – నలభయ్యేళ్ళ స్త్రీ. పేరు కర్పగం అట. నాకు ఎదురువచ్చింది. ‘‘ఇంద గెస్ట్ హౌస్ లో ఇరకరది నీంగె దానా?’’ (ఈ గెస్ట్ హౌస్ లో ఉంటున్నది మీరేనా?) అనడిగింది అరవంలో. తమిళం కొంతవరకు అర్థంచేసుకోగలను నేను. ఔనన్నాను. పేరు అడిగితే చెప్పాను. ‘‘ఇంద కోటత్తిలే పేయి ఇరుకుదని సొల్లువాంగ. ఉన్నోడె వేలై శీఘ్రమా ముడుచికిటు పోయిడు. అంద తొల్లై నమ్మకెన్నదుకు!’’ (ఈ కోటలో దయ్యాలు ఉన్నాయంటారు. నీ పని త్వరగా పూర్తిచేసుకుని వెళ్ళిపో. ఆ గొడవ మనకెందుకు!) అంది. ఆమె ‘కోటలో దయ్యాలు’ అనేసరికి నా గుండె గతుక్కుమంది. ‘నా గదిలో కనిపించేది దయ్యమా!? కోట నుంచి నన్ను వెన్నంటి వచ్చిందా??’ అన్న తలంపు హఠాత్తుగా మదిని తాకడంతో గుండె ఝల్లుమంది. ఆ రాత్రి పడుకుంటే అదే ఆలోచన మదిని తొలిచేస్తూంటే నిద్ర పట్టలేదు. ఏదో తెలియని భయం కమ్ముకుంది. నిజానికి దయ్యాలు, భూతాల ఉనికి పట్ల నాకు నమ్మకంలేదు. అదంతా పురాతన కాలపు ఫాంటసీ అని నా అభిప్రాయం. అయితే, నాలుగు రోజులుగా అవుతూన్న నా అనుభవానికి సంజాయిషీ ఏమిటి? పగటివేళ కోటలో తిరుగుతూ నోట్స్ రాసుకుంటూ బిజీగా ఉన్నా, మధ్యలో ఆ చిన్నారి గుర్తుకు రాకమానడంలేదు. కోటలో దయ్యాలు తిరగడం గురించి ఫోర్ట్ వాచ్మేన్ని కదిపాను. అది నిజమేననీ, నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాటిని చూస్తాననీ చెప్పాడు. వాళ్ళు చెబుతున్నది నిజమైతే, ‘కోటలోని దయ్యాలు గెస్ట్ హౌస్ వరకు వస్తాయా!?’. ఆ సంగతి ఏమిటో తేల్చుకోవాలన్న పట్టుదల కలిగింది నాలో. ఆ రోజు రాత్రి –మనిషి పడుకున్నట్టు తలగడలను పక్కమీద పేర్చి పైన దుప్పటి కప్పేసాను. నైట్ ల్యాంప్ వెలిగించి, మంచం పక్కన దాక్కున్నాను. అర్ధరాత్రి అయేసరికి – ఆ ‘లిటిల్ డెవిల్’ బెడ్ దగ్గర ప్రత్యక్షమయింది. దీక్షగా బెడ్ మీది శాల్తీ వంక చూసింది. తరువాత తన బుల్లి చేత్తో మెల్లగా కుదిపింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టుంది, కప్పిన దుప్పటిని లాగేసింది. మంచం మీద ఉన్నది మనిషి కాదని తెలియడంతో అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయింది. చటుక్కున బయటకు వచ్చి ఆ చిన్నారి చేయి పట్టుకున్నాను. ‘‘ఎవరు నువ్వు? మనిషివా, దయ్యానివా?’’ అనడిగాను. ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల, ‘‘నాన్ పేయి ఇల్లే, అక్కా!’’ అని అరవంలో అంటూ. ట్యూబ్ లైట్ వేసి, బెడ్ మీద నా పక్కన కూర్చోబెట్టుకుని దాని ఏడ్పు ఆపడానికి ప్రయత్నించాను. బిస్కెట్స్ ఇచ్చి తినమన్నాను. కుదుటపడ్డాక ఆ పిల్ల చెబుతూన్న సంగతులు వింటూంటే నా బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఆ చిన్నారి పేరు జయంతి. మదురైకి చెందిన అరవపిల్ల. యూకేజీ చదువుతోంది. బయట ఆడుకుంటూంటే ఎవరో ‘ఆంటీ’ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానంటూ తీసుకువెళ్ళి, ఎత్తుకువచ్చేసింది. ఆ బిల్డింగులో నేలమాళిగలో ఉన్న ఓ గదిలో బంధించి ఉంచింది. తనలాంటి పిల్లలు మరికొందరు ఉన్నారక్కడ. ఓ పురుషుడు, స్త్రీ రోజూ రాత్రివేళ వచ్చి తమకు చాలీచాలని తిండి పెట్టి వెళ్ళిపోతారు. అమ్మనాన్నలు కావాలని ఏడిస్తే కొడతారు. తాము అక్కడ ఎన్ని రోజులుగా ఉన్నారో ఆ పిల్లలకు తెలియదు. ‘జయంతి స్మార్ట్ గాళ్. పిల్లలందరూ పడుకున్నాక నేలమాళిగను పరిశీలిస్తూంటే, గోడలో ఉన్న రహస్యపు మీట చేతికి తగలడమూ, అక్కడ ఉన్న రహస్యమార్గం తెరచుకోవడమూ జరిగాయి. ఆ మెట్లగుండా ధైర్యంగా పైకి వెళ్ళిందా పిల్ల. పైన ద్వారం వద్ద కప్పబడి ఉన్న డోర్ మ్యాట్ ని ఎలాగో తొలగించి గదిలో ప్రవేశించింది. అది నేను ఉన్న గదే కావడం విశేషం. నిద్రిస్తూన్న నా వద్దకు వచ్చి, నన్ను లేపాలనీ, బూచోళ్ళ గురించి చెప్పాలనీ అనుకునేది. కానీ, నేను కూడా వాళ్ళ మనిషినేమోనన్న భయంతో పారిపోతోంది. పూర్వం రాజుల కాలంలో సెక్యూరిటీ కోసం ప్రతి కట్టడంలోనూ ఓ రహస్యమార్గాన్ని ఏర్పాటుచేసుకోవడం కద్దు. ఆ రహస్యమార్గం గురించి ఎవరికీ తెలిసినట్టులేదు. నన్ను నా పోర్షన్లోని యాంటీరూమ్కి తీసుకువెళ్ళింది జయంతి. ఆ గదిలో ఓ పెద్ద, పాత చెక్కబీరువా ఉంది. అందులో సామాన్లు పెట్టుకోవడమే తప్ప దాని వెనుకపక్క ఎప్పుడూ చూళ్ళేదు నేను. బీరువాకీ, గోడకూ మధ్య తగినంత ఖాళీస్థలం ఉంది. అక్కడ ఓ డోర్ మ్యాటూ, దాని క్రింద రహస్యమార్గమూ కనిపించాయి! జయంతిని తీసుకుని సెల్ ఫోన్ టార్చ్ సాయంతో ఆ ఇరుకు మార్గం గుండా క్రిందకు దిగాను. నేలమాళిగలోని ఆ హాల్లో నేలపైన పరచియున్న జంబుఖానా మీద పడుకుని నిద్రపోతున్నారు సుమారు డజనుమంది చిన్నారులు. బాలబాలికలు – రెండు నుండి ఎనిమిదేళ్ళ వయసులవాళ్ళు అంతా. ఓ మూలగా బాత్ రూమ్ ఉంది. చెక్కస్టాండు పైన పిల్లల బట్టలు, తువాళ్ళూ ఉన్నాయి. ఓ బల్ల మీద ఏవో తినుబండారాలు ఉన్నాయి. హాల్లోంచి ఉన్న సన్నటి నడవా ఓ చిన్న గదికి దారితీసింది. ఆ గదిలో ఓ మూల చెక్కబీరువా, రెండు మడతమంచాలూ తప్ప ఇంకేమీ లేవు. ఆ గదికి తలుపు ఉంది. అది బైటనుండి మూసివున్నట్టు తెలుస్తోంది. ‘బూచోళ్ళు’ ఆ గదిలోంచే వచ్చి వెళతారని చెప్పింది జయంతి. అలికిడికి నిద్రలేచిన పిల్లలు నన్ను చూసి భయంతో ఏడుపు లంకించుకున్నారు. అందరూ అరవపిల్లలే. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ఎత్తుకురాబడ్డవాళ్ళు. వారిని సముదాయించి, భయం పోగొట్టి, నా గదికి చేర్చాను. అమ్మనాన్నల దగ్గరకు చేర్చుతానని చెప్పడంతో వారి వదనాలు వెలిగిపోయాయి. నాదగ్గర ఉన్న బిస్కెట్స్, బ్రెడ్, పళ్ళూ ఇస్తే ఆవురావురుమంటూ తిని మంచినీళ్ళు తాగారు. వాళ్ళను పడుకోమని చెప్పి, ‘హండ్రెడ్’ కి ఫోన్ చేసి పోలీసులను ఎలర్ట్ చేసాను. పోలీసులు వెంటనే వచ్చి వాచ్ మేన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ’కొన్ని నెలల క్రితం ఓ దంపతులు వచ్చి తనతో పరిచయం చేసుకున్నారనీ, పైన ఫోర్ట్లో ఏదో పనిచేస్తున్నట్టు చెప్పారనీ, వచ్చినపుడల్లా డ్రింక్ బాటిల్స్ తెచ్చిచ్చి తనచేత బాగా తాగించేవారనీ, అంతకు మించి తాను ఏ పాపమూ ఎరుగననీ’ చెప్పాడు అతను. నేలమాళిగ సంగతి తాను ఎరుగననీ, వెనుకపక్క పాడుబడ్డ తలుపుకు ఎప్పట్నుంచో తాళంకప్ప వ్రేలాడుతుంటుందనీ, దాని విషయం తాను ఎన్నడూ పట్టించుకోలేదనీ అన్నాడు. పిల్లల్ని నా గదిలోనే ఉంచి, టాస్క్ఫోర్స్ సిబ్బంది కిడ్నాపర్స్ కోసం నేలమాళిగలో ఓ రోజంతా మాటువేసారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి తాళం తెరచి లోపల ప్రవేశించిన ‘దంపతులను’ పట్టుకున్నారు. నలభైలలో ఉంటారు ఇద్దరూ. భార్యాభర్తలేనని తెలిపారు. మొదట తమకేమీ తెలియదంటూ బుకాయించినా, పోలీసులు తమదైన శైలిలో ఇంటారాగేట్ చేయడంతో నిజం కక్కకతప్పలేదు వాళ్ళు... అంతర్రాష్ట్ర కిడ్నాపర్స్ గ్యాంగ్కు అనుబంధంగా పనిచేస్తూన్న తమిళనాడుకు చెందిన గ్యాంగ్ సభ్యులు వాళ్ళు. చిన్నపిల్లలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తుకువచ్చి, పోలీసుల గాలింపు సద్దుమణిగే వరకు అక్కడ దాచి వుంచుతారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా వారిని అక్కణ్ణుంచి తరలించి అంతర్రాష్ట్ర ముఠాకి అప్పగిస్తారు. ఆ దంపతులు ఇచ్చిన సమాచారంతో, పోలీసులు ఆ చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, ఇతర ముఠాసభ్యులను, అంతర్రాష్ట్ర ముఠాకి చెందిన కొందరినీ అరెస్ట్ చేయడమూ జరిగిపోయాయి. చిన్నారి జయంతి ధైర్యసాహసాలను మెచ్చుకుని, ప్రభుత్వం ఆమె పేరును ‘బ్రేవరీ అవార్డ్’కు కేంద్రానికి సిఫారసు చేసింది. ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావమ్మా?’ అనడిగితే, ‘పోలీసునవుతాను’ అంటూ జయంతి తడుముకోకుండా జవాబిచ్చింది. దాంతో, ప్రభుత్వపు ఖర్చుతో ఆ చిన్నారిని చదివించి, పోలీస్ ఆఫీసర్ ని చేస్తామంటూ హోమ్ మినిస్టర్ ప్రకటించారు. డాక్టరేట్ని పొందడం కంటే ఎక్కువ ఆనందం కలిగింది నాకు. ‘షి ఈజ్ రియల్లీ ఎ లిటిల్ డెవిల్!’ అనుకున్నాను మురిపెంగా, జయంతిని తలచుకుంటూ. - తిరుమలశ్రీ -
లోహ విహంగాల నీడల్లో..
రాత్రి పన్నెండు గంటల సమయం ఊరు అలసి పడుకుంది. కానీ ఊరికి దూరంగా ఉన్న ఆ విమానాశ్రయం నిశాచరుళ్లా ఒళ్లు విరుచుకుని ఉత్సాహంగా పని మొదలు పెట్టింది. అంతఃపురానికి రెక్కలొచ్చాయేమో అనిపించే పెద్ద విమానాలు గర్వంగా దివికి భువికి మధ్య తమ ఖో ఖో ఆటను ప్రారంభించాయి. ఇద్దరు మనుషులు పట్టేటటువంటి రెండు పెద్ద సూట్కేసులు వెంట తెచ్చిన భారీకాయురాలు ఒకావిడ కౌంటర్లోని సుకుమారితో గొడవ మొదలుపెట్టింది. 60 కేజీల కంటే ఎక్కువ లగేజీ అనుమతించరని ఆ కౌంటర్ సుకుమారి ఈవిడకి నచ్చజెపుతోంది. ‘‘హన్నా! అమెరికాలో విమానాల్లోనే మారుమాట్లాడకుండా ఈ సూట్కేసులు ఎక్కించారు. ఇక్కడేంటి?’’ అంటూ జగడ, జగడ, జగడం చేసేస్తోంది. క్యూలో నిల్చున్న నిద్రకళ్ల ప్రయాణికులు విసుక్కుంటున్నారు. ఆవిడకి ఏదో సర్దిచెప్పడానికి వెళ్లిన ఒకరు, ‘మైండ్ యువర్ బిజినెస్’ అన్న అక్షింతలతో వెనక్కి వచ్చారు. బిజినెస్ క్లాసులో ప్రయాణించే బడాబాబులకు ప్రత్యేక కౌంటర్ ఉందిగా. అక్కడ ఏ గొడవా లేదు! కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గరున్నామెకి నిద్ర ముంచుకొస్తోంది. అంతలో ఎవరో వచ్చి కాఫీకి ఆర్డరిచ్చారు. కప్పులో కాఫీ నింపాక, ‘నో షుగర్ ప్లీజ్’ అన్నారు. ఆమెకి మండినా కస్టమర్ ఫారినర్ తెల్లదొరగారు! రాని నవ్వును తెచ్చిపెట్టుకుని, ‘నో ప్రాబ్లవ్ు’ అంటూ ఇంకో కప్పు రెడీ చేస్తోంది. ఇలా మేకప్లూ అవీ చేసుకుని రాత్రి డ్యూటీలు చెయ్యడం ఇష్టం లేదంటూ ఆ సాయంత్రం భర్తతో జరిగిన గొడవ ఇంకా మనసులో గుచ్చుకుంటూనే ఉంది! కానీ, ఇల్లు గడవాలంటే ఎయిర్పోర్టులో గడపాల్సిందే. తప్పదు అనుకుంటూ కాఫీ రెడీ చేస్తోంది. ఎయిర్పోర్టులో కుర్చీలన్నీ నిండిపోగా, నేలపై కూర్చొని తన ల్యాప్ట్యాప్లో ఈమెయిల్ పంపుతున్న ఆ సుబ్బారావుకి ఈ ప్రయాణం ఇష్టం లేకపోయినా తప్పడం లేదు. ఇంట్లో అబ్బాయికి ఒంట్లో బాలేదు. భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఇంక ఎయిర్పోర్టుకి ఎవరొస్తారు? ఇప్పటికే ఆయన ప్రయాణాలతో మూడు పాస్పోర్టు పుస్తకాలు నిండిపోయాయి.అదీగాక ఇప్పుడు ఎక్కవలసిన విమానం నాలుగ్గంటలు లేటట! ఇష్టంలేని ప్రయాణం, ఈ ఒంటరితనం అతన్ని చుట్టుముట్టేస్తున్నాయి. కానీ, అంతలోనే ఏదో గుర్తోచ్చింది. అప్పుడప్పుడు ఎయిర్పోర్టులో కనిపించి పలకరింపుగా నవ్వే ‘ఆమె కోసం’ కళ్లు వెదుకుతున్నాయి! అటు పక్క ఎక్కణ్నుంచో వచ్చి విమానం భూమిపై వాలింది. దీని కెప్టెన్ (పైలెట్) తన పర్సులోంచి దేవుడి ఫొటో తీసి భక్తితో దండం పెట్టుకున్నాడు. అది చూసిన ‘గగన సఖి’ (ఎయిర్ హోస్టెన్) అతనికి కళ్లతోనే థాంక్స్ చెప్పి, ప్రయాణికులకు చిరునవ్వుతో వీడ్కోలు చెప్పడానికి నిలబడింది. ఇంకాసేపట్లో ఇంటికెళ్లి విశ్రాంతిగా పడుకోవచ్చునన్న ఆలోచన ఆమెకు హాయిగా వుంది. ఆ విమానం ల్యాండ్ అయిన విషయాన్ని కంప్యూటర్కి తెలియజేశాడు ఓ గుమాస్తా. ఇంటర్నెట్ ద్వారా ఆ విషయం కాలిఫోర్నియాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్ గారికి ఈమెయిల్ ద్వారా చేరింది. వెంటనే ఆయన బళ్లారిలోని తన సోదరికి ఫోన్ చేసి, అమ్మా నాన్న ఇద్దరూ బెంగళూరు చేరినట్టు చెప్పాడు. వాళ్ల నాన్నగారేమో ఇక్కడ విమానంలోని లగేజ్ని తీసుకురావడంలోనే ఇంకా నిమగ్నమయున్నారు. సిల్కు చీర, స్లీవ్లెస్ బ్లౌజ్, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నావిడ విమానంలోంచి గబగబా దిగింది. బయట లాంజ్లో ఆవిడ భర్త, సుపుత్రుడు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. ఈవిడేమో పరుగులాంటి నడకతో ఓ మూలకెళ్లి అటూ ఇటూ చూసి సిగరెట్ వెలిగించింది. చిన్నపిల్లలు జీళ్లులాగించినట్టు ఆత్రంగా దమ్ము లాగి, అది పూర్తవ్వకముందే ఇంకో సిగరెట్ వెలిగించింది. గ్రీన్ చానెల్ గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రయాణికుడు కస్టమ్స్ వాళ్ల చేతికి చిక్కాడు. పర్మిట్ కంటే ఎక్కువ ఉన్న డీవీడీ ప్లేయర్లు, హ్యాండ్ కెమెరాలు, ల్యాప్టాప్, నాలుగు విస్కీ బాటిళ్లు, సూట్కేసులో ఉండడంతో ఎనిమిది వందల డాలర్లు ఫైన్ కట్టమంటున్నారు. ఆయన బతిమాలి బామాలి టేబుల్ కింద రెండు వందల డాలర్లు సమర్పించి సర్దుకుంటున్నాడు. కష్టపడి దక్కించుకున్న వస్తువులతో బయటికి రాగానే ఏదో బట్టల కంపెనీ ప్రచార సుందరి ఇండియాకి సుస్వాగతం అంటూ అతనికి ఓ గులాబీతో స్వాగతం పలికింది. ఏవేవో పేర్లున్న బోర్డులతో ట్యాక్సీవాలాలు ‘ఈయనా లేక ఆయనా’ అన్న చూపులతో ఆత్రంగా వెదుకుతున్నారు. ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేని ఎయిర్ పోర్టు పనివాళ్లు కొందరు అక్కడ చకచకా పనులు చేస్తున్నారు. కన్వేయర్ బెల్టుపై వచ్చిన లగేజీని విమానంలోకి చేరుస్తున్నారు. అలసివచ్చిన అతిథికి మంచినీళ్లిచ్చినట్టు ఎయిర్పోర్ట్కి చేరిన విమానానికి ఇంధనం నింపుతున్నారు ఇంకొందరు. రకరకాల తినుబండారాలను విమానంలోకి పంపి, అంతకుముందు ప్రయాణికులు వాడిన పాత్రలు గట్రా క్లీన్ చేయడానికి పంపుతున్నారు. విమానం నుంచి దిగిన ప్రయాణికులందరినీ తడిమి తడిమి చూసి ఏ అపాయం లేదని నిర్ధారిస్తున్నారు కొందరు. ఇంకొందరు బూట్ల వల్ల పడిన మరకలను మళ్లీ మళ్లీ శుభ్రం చేస్తున్నారు. రెండేళ్ల పాటు జర్మనీలో ఉండి, ఇప్పుడే ఇండియాలో దిగిన కుర్రోడొకడు విమానాశ్రయం నుండి నేరుగా దగ్గర్లోని ఉడిపి హోటల్కెళ్లి ఇడ్లీ, వడ, దోశ అన్నీ తెప్పించుకుని గబగబా తినడం మొదలుపెట్టాడు. కానీ సర్వర్ తెచ్చిన నీళ్లు వద్దని, ‘మినరల్ వాటర్’ కావాలని అడుగుతున్నాడు. విదేశీ ప్రయాణికుడొక్కరు బాత్ రూవ్ులో టాయ్లెట్ పేపర్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కొళాయి కింద ఓ మగ్గు ఉండటం చూసి దాన్ని ఉపయోగించడం సరిగ్గా రాక, ఒంటిమీదంతా నీళ్లు చల్లుకున్నాడు. అక్కడింకో విదేశీయుడు ఉట్టి పాస్పోర్ట్తో దిగాడు. వీసా లేకపోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ని ఆపేశారు. బయట పంచతారా హోటల్ నుండి పంపిన లగ్జరీ కారు ఈ విదేశీయుడికై వేచి ఉంది. ఇంగ్లిష్ రాని ఆ విదేశీయుడు ఏదో భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన్ను వాపస్ పంపడానికి ఏర్పాటు జరుగుతోంది. బహుశా! మొదటిసారి విమానం ఎక్కిన కొత్త ప్రయాణికుడొక్కడు సీటు బెల్ట్ ఎలా కట్టుకోవాలో తెలీక తికమక పడుతున్నాడు. ఇదేమీ పట్టని పక్కసీటతను అప్పుడు ప్రయాణంలో చూడ్డానికి సినిమాల పట్టీని సీరియస్గా చదువుతున్నాడు. అదెలాగో కొన్ని దోమలు విమానంలోకి దూరాయి. అప్పుడే ప్రయాణికులను పరిశీలించటం మొదలెట్టాయి. డెబ్బయ్యేళ్ల తుంటరి ముసలాయన అందమైన ఎయిర్ హోస్టెన్ను టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తమ తలపైని లగేజ్ కంపార్ట్మెంట్లో ఇంకెవరో తమ సామాన్లు సర్దేశారని ఒక చిన్న సైజు పొట్లాట మెల్లగా మొదలైంది. లోపల ‘లగేజీల కొంప’లో కొత్త కొత్త లేబుళ్లు తగిలించుకున్న కొత్త, పాత సూట్కేసులు మాటా మంతీ లేకుండా మౌనంగా పక్కపక్కనే పడున్నాయి. మూలని సూట్కేస్లోంచి ఓ బొద్దింక మెల్లిగా బయటికి వచ్చింది. వీసా, పాస్పోర్టు గొడవేమీ లేకుండా తెలీని కొత్త దేశంలో ఎవరింటికో చేరడానికి తయారవుతోంది. మొదటిసారి ఆఫీస్ పనిమీద ఫారిన్ ఛాన్స్ వచ్చిన కుర్రాడు తన బ్యాగ్కి వెయ్యాల్సిన ట్యాగ్ ఎలా వేయాలో తెలీక, తబ్బిబ్బవుతున్నాడు. దాన్ని వేయకపోతే విమానంలో ఎక్కనివ్వరేమోనన్న చిన్న అనుమానం! తన బ్యాగ్కి ట్యాగ్ వేస్తున్న తోటి ప్రయాణికుడికి దగ్గరగా జరిగి, తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తే ఆయన అనుమానంగా చూస్తూ దూరంగా వెళ్లాడు. అప్పుడే విమానంలోంచి దిగిన ఆ ఇరవై అయిదేళ్ల అందగాడు, తన ఫియాన్సీకి మొబైల్ ద్వారా ‘హాయ్’ చెప్పాడు. బయట లాంజ్లో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఈ వరుడి కోసం ఎదురుచూస్తోంది. అతనితో ఇంటర్నెట్లో మాట్లాడి ఒప్పేసుకుంది. ‘చూడకుండా ఎలాగమ్మా ఓకే చెప్పేది’ అని గొణుక్కుంటూనే ఈయనగారూ పెళ్లికి ఒప్పుకున్నాడు. అందుకని విమానం దిగగానే బాత్రూమ్కెళ్లి డ్రెస్ మార్చుకుని లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో కొన్న ఖరీదైన సెంటు రాసుకుని, ఉత్సాహంగా ‘చూపులు కలిసే శుభవేళ’కు తయారవుతున్నాడు. విమానంలో ప్రయాణానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కరు తప్ప. ‘కోమల్ కులకర్ణి’ అని మైక్లో పిలుస్తున్నారు. వాకీ టాకీలతో సిబ్బంది అటూ ఇటూ తిరుగుతూ ‘ఇంకా కనపడని ఆ కోమల్ కులకర్ణి’ కోసం వెదుకుతున్నారు. ఇంతలో చురుకైన ఓ అమ్మాయి ఆ కోమల్ కులకర్ణిగారిని కనిపెట్టేసింది! ఎనభై యేళ్ల ఆ ముసలాయన్ని ‘ఎవ్రీ బడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ అంటూ గద్దిస్తోంది. ‘‘క్షమించండి. నాకు ఇంగ్లిష్ రాదమ్మా. మా అబ్బాయి టికెట్ చేతిలో పెట్టి, ఎటో వెళ్లాడు’’ అంటూ ఆయన పరుగులాంటి నడకతో ఆమెను అనుసరించాడు. అటు పక్క ఇంకో వృద్ధుడు నెమ్మదిగా మోకాళ్లపై కూర్చొని టోపీ పెట్టుకొని ప్రశాంతంగా నమాజు మొదలుపెట్టాడు. ఓ పక్క కొత్త దంపతులు తమ మొదటి విదేశీ ప్రయాణానికి బంధుమిత్రులతో వచ్చారు. ‘‘అమ్మాయి అడుగుపెట్టిన వేళా విశేషం చాలా బావుంది. అప్పుడే అబ్బాయికి ఫారిన్ ఛాన్స్ వచ్చిందని’’ పొగడ్తలు వినపడుతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రుల కళ్లలో కనపడీ కనపడని కన్నీళ్లు. వెళ్లగానే ఫోన్ చేయమని చెప్పింది అమ్మాయి తల్లి. కన్నీళ్లు నిండిన కళ్లతో తలూపింది ఆ కొత్త పెళ్లికూతురు. భారంగా విమానంలోకి అడుగుపెట్టగానే లోపల కనపడ్డ తన ఫేవరేట్ సినీతారని చూడగానే దుఃఖం మరచిపోయి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. బయట ఆమె వదిలిపెట్టిన లగేజ్ ట్రాలీ అనాథగా మిగిలిపోయింది, ఆమె పుట్టింటి జ్ఞాపకాల్లాగ. చేతిలో చిన్న పొట్లాన్ని పట్టుకుని ఓ ముసలాయన ‘‘షికాగోకి వెళ్తున్నారా? మా అమ్మాయికి పంపాలండి. హోమియోపతి మందులు. చాలా అర్జెంట్ సార్. తనే ఎయిర్పోర్ట్కి వస్తుంది. ప్లీజ్’’ ఒకరిద్దర్ని బతిమాలుకుంటున్నాడు. ఆ చిన్ని సీసాల్లో తెల్ల మాత్రల్ని ఏదో డ్రగ్స్ అన్నట్టు అనుమానిస్తున్న వాళ్లు మొహాలు తిప్పుకుంటున్నారు. పాపం, ఆ ముసలాయన ఆదుర్దాగా, పరుగులాంటి నడకతో మరొకర్ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్లాడు. కుడివైపుకు కొంగు కప్పుకున్న ఓ గుజరాతీ మహిళ దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. వెక్కిళ్లతో కదిలిపోతోంది. ఆమె చుట్టూ ఉన్న బంధువులు ఆమెను ఓదార్చుతున్నారు. ఫ్రాంక్ ఫర్ట్లో దిగి ఇంకో విమానంలో ఎక్కడం గురించి ఓ బంధువు ఆమెకు జాగ్రత్తలు చెపుతున్నాడు. అంత దుఃఖంలోనూ ఆమెను ఈ ప్రయాణం భయపెడుతోంది. ఇంతవరకు ప్రతి సంవత్సరం అబ్బాయే ఇండియాకు వచ్చి అమ్మని చూసి వెళ్లేవాడు. కానీ దూర దేశంలో జరిగిన కారు ప్రమాదంలో అబ్బాయిని పొట్టన పెట్టుకుంది. ఇక ఎన్నడూ రాని కొడుకుని చూడ్డానికి కొండంత దుఃఖాన్ని తోడు తీసుకుని వెళుతోంది ఒంటరైపోయిన ఆ ‘అమ్మ’. బహుశా ఇది ఆమెకు మొదటి ‘ఒంటరి ప్రయాణం’. రయ్మనే శబ్దంతో విమానం తన భారీ దేహాన్ని రన్వే వైపుకి మెల్లిగా కదిలించింది. నిదానంగా వేగంగా పుంజుకుంటోంది. లోపల ప్రయాణికుల రణగొణ ధ్వనులు సర్దుకున్నాయి. ఇంకా ఇంకా వేగం పెంచుకుంటూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. ఒక్కసారిగా ఒళ్లు తేలికై, ఎన్నోసార్లు ప్రయాణించిన వారికైనా చిన్నపాటి భయం, గగుర్పాటు కలిగించింది. అంతా సవ్యంగా జరిగింది. ధైర్యంగా, పక్షులే నివ్వెరపోయేలా హాయిగా ఎగురుతోంది విమానం. కానీ అంత భారీ విమానం కూడా చిన్న ‘పక్షి దెబ్బ’కు తట్టుకోలేదని పాపం చిన్న పక్షులకి అస్సలు తెలీదు. అందరి ఆదుర్దాలు, భయాలు, సంతోషాలు, జ్ఞాపకాలు అన్నీ వెనక్కి వదిలినా, ఆ వృద్ధుడు కూతురికై పంపిన హోమియోపతి మందులను, అతని మమకారాన్ని, చివరగా కన్నకొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి దుఃఖాన్ని వదలలేక తనలోనే మోస్తూ భారంగా దూరంగా ఎగురుతోంది ఆ లోహ విహంగం. కన్నడ మూలం : వసుధేంద్ర తెలుగు: బదరి రూపనగుడి -
ది గ్రేట్ ఇంటర్వ్యూ
‘‘విక్రమార్కా...ఒకడు జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లాడు. కాని ఆఫీసర్ అడిగిన ఫస్ట్ కొచ్చెన్ నుంచి లాస్ట్ కొచ్చెన్ వరకు ఏది అడిగినా కేవలం రెండక్షరాలతోనే మేనేజ్ చేశాడు. ఇది ఎలా సాధ్యం?’’ అడిగాడు భేతాళుడు. ‘‘ఎందుకు సాధ్యం కాదు భేతాళా! అదిగో అటు చూడు...’’ అని సీన్ చూపించాడు విక్రమార్కుడు. అనగనగా ఒక కార్యాలయం. ఆ కార్యాలయంలో... ఆఫీసర్: నీ పేరేమిటి? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: పూర్తి పేరు? క్యాండిడేట్:మనోహర్ పీడ సార్. ఆఫీసర్: మీ నాన్నగారి పేరు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: పూర్తి పేరు? క్యాండిడేట్: మంగయ్య పీడ సార్. చనిపోయారు. ఆఫీసర్: ఎలా? క్యాండిడేట్: ఎంపీ ఆఫీసర్: అంటే? క్యాండిడేట్:మందు ప్రాబ్లం సార్. ఆఫీసర్: మీ నేటివ్ ప్లేస్? క్యాండిడేట్:ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మధ్యప్రదేశ్ సార్ ఆఫీసర్: ఏం చదువుకున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మెట్రిక్ పాస్ సార్. ఆఫీసర్: ఈ జాబు ఎందుకు చేయాలనుకుంటున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మనీ ప్రాబ్లం సార్. ఆఫీసర్: నీ పర్సనాలిటీ గురించి చెప్పు... క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మైండ్ బ్లోయింగ్ –పర్సనాలిటీ సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన కూర? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మునక్కాడ పప్పు సార్. ఆఫీసర్: ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్:మెహదీపట్నం సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన పుస్తకం? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మహాప్రస్థానం సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన డ్రింక్? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మంచి పాలు సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన సినిమా? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మెషిన్గన్ ప్రీచర్ (హాలివుడ్ సినిమా–2011, డైరెక్టర్: మార్క్ ఫోస్టర్) ఆఫీసర్: హాలివుడ్ సంగతి సరే, నచ్చిన తెలుగు సినిమా? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మంచు పల్లకి సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన క్రికెటర్? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మనోజ్ ప్రభాకర్. ఆఫీసర్: ఇక నువ్వు వెళ్లవచ్చు... ఏమిటీ ఏదో అడగాలనుకుంటున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మై పెర్ఫార్మెన్స్? ఆఫీసర్: ఎంపీ. క్యాండిడేట్: అంటే? ఆఫీసర్: నువ్వో మెంటల్ పేషెంట్ అని నా అభిప్రాయం. క్యాండిడేట్: ఎంపీ. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మై ప్లెజర్ సార్. – యాకుబ్ పాషా -
అటుకుల వడ.. తింటే ఆహా అనాల్సిందే!
ఆపిల్ రింగ్స్ కావలసినవి: ఆపిల్ రింగ్స్ – 12 లేదా 15 (ఆపిల్ కాయను శుభ్రం చేసుకుని కొద్దిగా మధ్యలో భాగం తొలగించి రింగ్స్లా సిద్ధం చేసుకోవాలి), చిక్కటి మజ్జిగ – 1 కప్పు, గుడ్లు – 3, మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, పంచదార పొడి – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీ స్పూన్, దాల్చినచెక్కపొడి – అర టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదాపిండి, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ వేసుకుని బజ్జీల పిండిలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆపిల్ రింగ్స్ని మైదా మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పంచదార పొడి వాటిపైన వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్ సమోసా కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 10 లేదా 15, శనగపిండి – 1 కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బంగాళదుంపలు – 3(ఉడకబెట్టి ముద్ద చేసుకోవాలి), ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – 3 రెమ్మలు, పచ్చ బఠానీలు – పావు కప్పు(ఉడకబెట్టుకోవాలి), పసుపు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, వేడి కాగానే ఆవాలు, కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత బంగాళదుంపల ముద్ద, బఠానీలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, ఉçప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని, నలువైపులా లైట్గా తొలగించి.. ఒకసారి నీళ్లలో తడిపి, నీళ్లుపోయేలా ఒత్తుకుని.. దానిపైన కొద్దిగా ఆలూ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. దానిపై నలువైపులా తొలగించి తడిపిన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి సమోసాలా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అటుకుల వడ కావలసినవి: అటుకులు – 1 కప్పు(నీళ్లలో తడిపి పిండుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి – 1 టేబుల్ స్పూన్, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము –3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడల్లా ఒత్తుకుని నూనెలో డీప్ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మన -
భారతీయ ఆత్మను కదిలించినవాడు
• ధ్రువతారలు చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా చరిత్రలో నమోదు కావడం అసాధారణ ఘట్టం. భారత స్వాతంత్రోద్యమ చర్రితను మలుపు తిప్పిన వ్యక్తిగా తృటిలో అవకాశం తప్పిపోయిన వారు చక్రవర్తి రాజగోపాలాచారి. క్విట్ ఇండియా పిలుపు తరువాత స్వాతంత్రోద్యమంలో ఏర్పడిన దారుణమైన నిశ్శబ్దాన్ని ఛేదించినవారు రాజాజీయే. పాకిస్తాన్ ఏర్పాటును ఆపడం ఎవరితరమూ కాదని మహమ్మద్ అలీ జిన్నా అప్పటికే ప్రకటించాడు. అందులోని అనివార్యతను మొదటిసారి బాహాటంగా చెప్పిన వారు కూడా రాజాజీయే. ఈ ప్రతిపాదనే రాజాజీ ప్రణాళిక పేరుతో చరిత్రలో ఒక మూల దాక్కుని ఉంది. గాంధీజీ అనుమతితో రాజాజీ ఈ అంశాన్ని జిన్నాతో చర్చించాలని అనుకున్నారు. జిన్నా ముందుకు రాకపోవడంతో, 1944, సెప్టెంబర్లో గాంధీజీయే ఈ ప్రణాళిక గురించి జిన్నాతో చర్చించారు. 19 రోజుల పాటు జిన్నా స్వగృహంలో జరిగిన చర్చలలో ఇదే ప్రధానాంశం. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలన్న డిమాండ్కు ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించడం ఐదు సూత్రాల రాజాజీ ప్రణాళికలో తొలి అంశం. మిగలిన నాలుగు సూత్రాలు ఎలా ఉన్నా, దీనిలో అంతరార్థం ఒకటే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ విభజన గురించి ఆలోచించాలంటుంది ఆ సూత్రం. జిన్నా దీనిని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు. జాతీయ కాంగ్రెస్ కంటే ఆంగ్లేయుల మీదనే ఆయనకు నమ్మకం ఎక్కువ కూడా. రెండో ప్రపంచ యుద్ధం వేళ మద్రాస్ నగరం మీద జపాన్ బాంబు దాడులకు పాల్పడిన సందర్భమే రాజాజీని అప్పుడున్న ఆ ప్రమాదకర నిశ్శబ్దాన్ని ఛేధించడానికీ, యథాతథ స్థితి మీద దండెత్తడానికీ ప్రేరేపించింది. ఒకటి నిజం. అవిభాజ్య భారత్గా ఉండగానే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉంటే ఆ పరిణామం చరిత్రలో మలుపు అని పిలవడానికి అర్హమైనదిగా ఉండేదేమో! కానీ ‘ఏమో’, ‘అయితే’ వంటి ఊహాగానాలను చరిత్ర అనుమతించదు. చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబర్ 10,1878–డిసెంబర్ 25,1972) ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. తండ్రి వెంకటరాయన్ అయ్యంగార్ థోరాపల్లి (తమిళనాడు, కృష్ణగిరి జిల్లా) మున్సిఫ్. తల్లి సింగారమ్మ. రాజాజీ, సీఆర్ అని కూడా పిలుచుకునే రాజగోపాలాచారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే జరిగింది. తరువాత మైసూరు రాష్ట్రం (నేటి కర్ణాటక) లో కొంతకాలం చదివారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని, 1900 సంవత్సరంలో సేలంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కొద్దికాలంలోనే పెద్ద న్యాయవాదిగా కీర్తి సంపాదించారు. 1906 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంతో రాజాజీ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. అంటే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నేపథ్యంలోనే రాజాజీ స్వరాజ్య సమరం వైపు నడిచారు. నిజానికి ఆయన ఆనాటికి లోకమాన్య బాలగంగాధర తిలక్ అనుచరుడు. రాజాజీ అటు ఉద్యమాన్ని, ఇటు అధికార పదవులనూ సమానంగానే స్వీకరించారు. 1911లోనే సేలం మునిసిపాలిటీలో సభ్యుడయ్యారు. 1917లో తాను అధ్యక్షునిగా ఎన్నికై, ఒక దళితుడిని కూడా సభ్యునిగా ఎంపిక చేసిన ఘనతను దక్కించుకున్నారు. గాంధీజీ హరిజనోద్ధరణ ఆరంభించడానికి చాలా ముందే రాజాజీ ఇలాంటి అడుగు వేశారు. మునిసిపల్ చైర్మన్ పదవీ కాలం ముగిసిపోతున్న కాలంలో, అంటే 1919 లో మొదటిసారి ఆయనను గాంధీజీని కలుసుకున్నారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో కలసి నడిచారు. ఇటు గాంధీ పథంలో ఉన్నప్పటికీ తిలక్ అనుచరుడు, తీవ్ర జాతీయవాది ఓవీ చిదరబరం పిళ్లై అంటే ఎంతో అభిమానించేవారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, పూర్తిస్థాయి ఉద్యమకారునిగా మారారు. అప్పుడే న్యాయవాద వృత్తి వదిలేశారు. 1924–25లో తమిళనాడులో జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించారు. అంటరాని కులాల వారిని దేవాలయాలలోకి అనుమతించాలన్న ఆశయంతో ఈ ఉద్యమం ఆరంభమైంది. 1930లో గాంధీజీ దండిలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభిస్తే, నాగపట్నం దగ్గరి వేదారణ్యంలో రాజాజీ ఆరంభించారు. జైలు జీవితం తరువాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయ్యారు. 1937 ఎన్నికలలో రాజాజీ మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రతినిధిగా శాసనసభలో ప్రవేశించారు. మద్రాస్ తొలి ప్రధాని అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మధుర మీనాక్షి ఆలయంలో అంటరానివారి ప్రవేశం (1939) జరిగింది. ఆలయాలలో అంటరానివారి ప్రవేశం కోసం ఆయన చట్టాన్ని తెచ్చారు. రైతు రుణ విమోచన చట్టం కూడా ఆయనదే. మద్యపాన నిషేధం విధించి, దీని ద్వారా వచ్చే లోటును భర్తీ చేసుకోవడానికి అమ్మకం పన్ను పెంచారు. అయినా లోటు తప్పలేదు. దీనితో కొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. కింది వర్గాల వారి విద్యాభివృద్ధికి రాజాజీ ఈ విధంగా కావాలనే భంగం కలిగించారని ఆయన వ్యతిరేకులు, అంటే ద్రవిడ పార్టీలు విమర్శలకు దిగడం విశేషం. అలాగే హిందీని పాఠ్య ప్రణాళికలో చేర్చాలన్న రాజాజీ నిర్ణయం కూడా వ్యతిరేకులు రాజకీయం కోసమే ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీ మీద యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా 1940లో కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు. రాజాజీ కూడా ప్రధానమంత్రి పదవికి (నాటి ముఖ్యమంత్రులను ఇలాగే పిలిచేవారు) రాజీనామా చేశారు. ఇందుకు ఇంగ్లిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలుకు పంపించింది. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. కానీ ఆ ఉద్యమాన్ని రాజాజీ సమర్థించలేకపోయారు. అంతకంటే బ్రిటిష్ వారితో చర్చించి, వారు దేశాన్ని విడిచిపోయేందుకు ఒప్పించాలని ఆయన అభిప్రాయం. అప్పటికే జపాన్ మద్రాస్, విశాఖల మీద బాంబులు వేసింది. ఇంగ్లిష్ వాళ్లు వెళ్లిపోయిన తరువాత జర్మనీ లేదా జపాన్ భారత్ మీద ఆధిపత్యం సంపాదించే పరిస్థితిని కల్పించకూడదన్నదే రాజాజీ అభిప్రాయం. అందుకే ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ముస్లింలీగ్తో కూడా చర్చలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇందుకు జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. రాజాజీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ను, గాంధీ–నెహ్రూ నాయకత్వాన్ని రాజాజీ నిరాకరించినా, రాజాజీ అవసరాన్ని నాటి పరిస్థితులలో గుర్తించకుండా తప్పుకునే అవకాశం లేకపోయింది. 1946లో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందులో భాగస్వామి కావలసిందంటూ ఆయనను ఆహ్వానించక తప్పలేదు. అత్యంత కీలకమైన నాలుగు శాఖలు– పరిశ్రమలు, రవాణా, విద్య, ఆర్థిక వ్యవహారాలు రాజాజీకి అప్పగించారు. 1948లో మళ్లీ ఆయన అవసరం అనివార్యమైంది. 1947, ఆగస్టు 15న బెంగాల్లోని తూర్పు బెంగాల్ పాక్లో భాగమైంది. నాటి బెంగాల్ పరిస్థితిని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. హిందూ–ముస్లిం ఘర్షణలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముస్లిం లీగ్ నాయకుడు సుహ్రావర్ధి నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యథేచ్ఛగా రక్తపాతం సృష్టించారు. నౌఖాలి వంటి ఘటనలన్నీ అప్పుడే చోటు చేసుకున్నాయి. ఆ స్థితిలో నెహ్రూ పూర్తి మద్దతుతో రాజాజీని ఆ రాష్ట్ర గవర్నర్గా పంపించారు. కానీ సుభాష్ బోస్ను విమర్శించిన వ్యక్తిగా రాజాజీ అంటే బెంగాలీలు తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. అయినా తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన శరణార్థుల పునరావాసం, శాంతి స్థాపన ధ్యేయంగా రాజాజీ గట్టి కృషి జరిపారని పేరుంది. కొన్ని మాసాల తరువాతే అక్కడ నుంచి వెనక్కి తిరగవలసి వచ్చింది. ఆఖరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్బాటన్ రెండేళ్లు సెలవులో వెళ్లారు. తన మేనల్లుడు ప్రిన్స్ ఫిలిప్కు, యువరాణి ఎలిజబెత్కు వివాహం. ఆ సమయంలో మౌంట్బాటన్ తాత్కాలిక వైస్రాయ్గా రెండు పేర్లు సూచించారు. ఒకటి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్, రెండు రాజాజీ. కానీ పటేల్ పేరును నెహ్రూ అంగీకరించలేదు. అలా రాజాజీ భారతీయుడైన తొలి, మలి వైస్రాయ్గా (జూన్ 1948–జనవరి 26,1950) పదవిని అలంకరించి, కీర్తి పొందారు. అంత పెద్ద వైస్రీగల్ భవనంలో ఆయన (నేటి రాష్ట్రపతి భవన్) అతి సాధారణ జీవితం గడిపారు. వైస్రాయ్ పదవిని అలంకరించారు కాబట్టి, స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి పదవికి రాజాజీ అభ్యర్థిత్వమే సహజంగా ముందుకు వస్తుందని అంతా ఆశించారు. నెహ్రూ కూడా ఆయనకే మద్దతు ఇచ్చారు. రాజాజీ కూడా బరిలో దిగాలని ఆశించినా, తరువాత నిర్ణయం మార్చుకున్నారు. కారణం, ఉత్తరాది ఎంపీల ఆధిపత్యం ఒకటని చెప్పినా, క్విట్ ఇండియా ఉద్యమాన్ని రాజాజీ వ్యతిరేకించిన విషయాన్ని విస్మరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజాజీ కాకుండా బాబూ రాజేంద్రప్రసాద్ వైపు జాతీయ కాంగ్రెస్ ఎంపీలు మొగ్గారు. తరువాత మళ్లీ నెహ్రూ ఆహ్వానం మేరకు రాజాజీ కేంద్ర మంత్రి వర్గంలో ఏ శాఖా కేటాయించని మంత్రిగా చేరారు. డిసెంబర్ 15, 1950న పటేల్ మరణంతో హోంశాఖ బాధ్యతను రాజాజీ స్వీకరించారు. కానీ పదిమాసాల తరువాత బయటకు వచ్చేశారు. కారణం– నెహ్రూతో విభేదాలు. చైనా విస్తరణ కాంక్ష గురించి, టిబెట్ సమస్య గురించి పదే పదే రాజాజీ నెహ్రూను హెచ్చరించేవారని చెబుతారు. నిజానికి ఆ ఇద్దరి అభిప్రాయాలకు పొంతన లేదు. నెహ్రూ ఉద్దేశం హిందూ మహాసభ దేశానికి పెద్ద బెడద. కానీ రాజాజీ నమ్మకం, దేశానికి అతి పెద్ద ప్రమాదం కమ్యూనిస్టులు. అంటే సోవియెట్ రష్యా వైపు నెహ్రూ మొగ్గడం ఆయన ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. ఇక్కడ ఒక పరిణామాన్ని గమనించాలి. నాటికి నెహ్రూ జీవించి ఉన్నా ఇది జరిగింది. 1952 మద్రాస్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్కు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు దక్కలేదు. కమ్యూనిస్టుల నాయకత్వంలోని కూటమి ఆధిపత్యం సాధించింది. ఆ కూటమి, అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా నాటి గవర్నర్ శ్రీప్రకాశ్ రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ ఎన్నికలలో పోటీ చేయకున్నా, అటు ప్రధాని నెహ్రూకు గాని, ఇటు రాష్ట్ర నాయకులకుగాని తెలియకుండా గవర్నర్ రాజాజీని ఎంఎల్సిగా నామినేట్ చేసి, ముఖ్యమంత్రిగా నియమించారు. తరువాత విపక్షాల ఎంఎల్ఏలను చేర్చుకుని రాజాజీ బలం నిరూపించుకున్నారు. కానీ ప్రత్యేక ఆంధ్రోద్యమం ఆయన కాలంలోనే వచ్చింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అప్పుడే జరిగింది. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తరువాత ఆయన కాంగ్రెస్ను విడిచిపెట్టి స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమం మీద, పరిపాలన మీద రాజాజీ ముద్ర చెరిపివేయలేనిది. అంటే ఆరు దశాబ్దాల చరిత్ర మీద ఆయన జాడ సుస్పష్టం. ఆయన మౌంట్బాటన్ వారసుడు. సర్దార్ పటేల్ వారసుడు. గాంధీగారి వియ్యంకుడు. గాంధీజీ∙నాల్గవ కుమారుడు దేవదాస్ గాంధీకి, తన కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. ఇంగ్లిష్లో 26 అక్షరాలతో కూడిన చక్రవర్తి రాజగోపాలాచారి పేరేను రాజాజీ అని క్లుప్తీకరించినవారు గాంధీజీయే. గాంధీజీకి ఐదుగురు గొప్ప సన్నిహితులు ఉన్నారని తాతగారి జీవిత చరిత్రలో రాజ్మోహన్గాంధీ (మనుమడు) రాశారు. పటేల్, నెహ్రూ, అబుల్ కలామ్, రాజేంద్ర ప్రసాద్.. ఆ ఐదో సన్నిహితుడు రాజాజీ. వ్యక్తి స్వేచ్ఛలో, పాలనలో ప్రభుత్వం ప్రమేయం కనిష్టంగా ఉండాలని ఆయన ఆనాడే భావించారు. స్వేచ్ఛా విపణి అవసరమని కూడా వాదించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాట ఆయన ప్రతిభ ముందు చిన్నదే. రామాయణం, భారతం, భాగవతం కూడా ఆయన మళ్లీ రాశారు. సంగీతంతో పరిచయం ఉంది. ఆయన రచనలకు సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా దక్కింది. 1954లోనే ఆయన భారతరత్నకు ఎంపికయ్యారు. ఆయన జీవితంలోని వెలుగు చూడని మరొక కోణం, అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా ఆయన చేసిస కృషి. 1962లో ఈ అంశం మీద అమెరికా ప్రభుత్వంతో మాట్లాడడానికి గాంధీ శాంతి మండలి తరఫున వెళ్లిన బృందానికి నాయకుడు రాజాజీ. అప్పుడే అక్కడ ఉన్న దౌత్యవేత్త కె. నట్వర్సింగ్ రాజాజీతో ముచ్చటించారు. మంచి ప్రశ్నలే రాజాజీని ఆయన అడిగారు. దేశ విభజనకి మొదట గాంధీజీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా, తరువాత ఎందుకు వెనక్కి తగ్గారు? ఆయన అలా వెనక్కి తగ్గడం అప్పుడు నాలాంటి యువకులందరికీ పెద్ద షాక్ అన్నారు నట్వర్. గాంధీజీ చాలా గొప్పవారు. కాదనలేం. కానీ తరువాతి పరిణామాలతో ఆయన చాలా నిరాశలో కూరుకుపోయారు. చివరికి మీరంతా అంగీకరిస్తే, మీతో పాటే నేను అనేశారు అని చెప్పారు రాజాజీ. ఆపై,‘మీరు జీవిత చరిత్ర ఎందుకు రాయలేదు?’ అని అడిగారు నట్వర్సింగ్. ‘ఖాళీ ఎక్కడ దొరికింది?’ అన్నారు రాజాజీ. వైస్రాయ్గా ఉన్నప్పుడు బోలెడు సమయం దొరికి ఉండాలి మీకు అని అన్నారు నట్వర్సింగ్. అందుకు నవ్వుతూ సమాధానం చెప్పారు, రాజాజీ. ‘నిజమే, అక్కడ చాలా వెసులుబాటు దొరికిన మాట నిజం. కానీ ప్రధానికీ, ఉప ప్రధానికీ (నెహ్రూ, పటేల్) మధ్య నిత్యం జరిగే కీచులాటలు పరిష్కరించడానికే నా సమయమంతా గడచిపోయింది’ అన్నారు రాజాజీ. ‘అప్పుడే, నీవు నాతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఉండాల్సింది’ అన్నారు నట్వర్తో. ‘అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా చురుకుగా కనిపించారు. వాళ్లు నన్ను అర్థవంతమైన ప్రశ్నలు అడిగారు. అందులో ధర్మం అంటే ఏమిటి; కర్మ అంటే ఏమిటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. ధర్మం అంటే, ప్రపంచ ప్రజలందరి బాధ్యత, అలాగే సహజ ఆదేశం అని చెప్పాను. అందుకు వాళ్లు, అంటే సోషలిజమే కదా అన్నారు. సోషలిజమే, కానీ అది స్వచ్ఛందంగా ఉండాలి. భారత్లో సోషలిజం మాదిరిగా కాదు అని చెప్పాను’ అన్నారు రాజాజీ. మళ్లీ, అది బహిరంగ సమావేశం కాదులే, అందుకే అలా చెప్పాను అన్నారాయన. ఉద్యమం, సంస్కృతి, సంస్కరణ, సాహిత్యం, పాలనా దక్షత మేళవించిన అరుదైన నాయకుడు రాజాజీ. ఆయన ప్రభావం కాదనలేనది. గాంధీజీ ఉద్దేశంలో రాజాజీ అంటే భారతీయ ఆత్మను కదలించినవారు. - డా. గోపరాజు నారాయణరావు -
అది ఫిల్మ్నగర్; ఏదైనా జరగొచ్చు..
అదిగో ఫిల్మ్నగర్ బస్స్టాప్లో నిల్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడే... అతని పేరు లక్కీవర్మ. చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. పే....ద్ద డైరెక్టర్ కావాలనేది అతడి చిన్న ఆశ. కానీ... క్యాలెండర్లు మారుతున్నాయి, కాలం మారుతోంది, హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు, ఆ యువ హీరో తముళ్లు హీరోలు అవుతున్నారు. లక్కీవర్మ మాత్రం ఎక్కడ వేసిన బ్లాంకెట్ అక్కడే అన్నట్లుగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే ‘లక్కీ’ దగ్గర కిలోల కొద్ది టాలెంట్ ఉంది. కానీ, ఒక్క గ్రాము ‘లక్’ కూడా కలిసిరావడం లేదు. ఎటు వెళ్లినా ‘బ్యాడ్లక్’ అనేది అప్పులోడు తగులుకున్నట్లు తగులుకుంటోంది. ‘లక్కీ’ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో ప్రేమకథల హవా నడిచేది. ఆ సమయంలో ‘ప్రేమ అంటే దోమ కాదురా’ పేరుతో పవర్ఫుల్ లవ్స్టోరీ తయారుచేసి ఒక నిర్మాతకు వినిపించడం, అది ఓకే కావడం జరిగిపోయింది. కానీ అది పట్టాలెక్కే సమయానికి ఫ్యాక్షన్ కథల ట్రెండ్ మొదలైంది. దీంతో ‘మనం అనుకున్న కథ వద్దు. మాంచి ఫ్యాక్షన్ కథ రాయ్... బడ్జెట్ ఎక్కువైనా చేద్దాం’’ అన్నాడు నిర్మాత. దీంతో ‘ప్రేమంటే దోమ కాదురా’ సబ్జెక్ట్ అటకెక్కింది. చాలా ఊళ్లూ తిరిగి... గ్రౌండ్ వర్క్ చేసి, రీసెర్చ్ చేసి, ఇంకా ఏదేదో చేసి గొప్ప పవర్ఫుల్ ఫ్యాక్షన్ కథ తయారు చేసి నిర్మాతని కలిశాడు లక్కీవర్మ. నిర్మాత: ఏమయ్యా కథ ఎక్కడి వరకు వచ్చింది? వర్మ: డైలాగులతో సహా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాను. సినిమా పేరు ‘నువ్వు ఒక్కసారి నరికితే... నేను వెయ్యి సార్లు నరుకుతా’ నిర్మాత: టైటిల్ పవర్ఫుల్గా ఉందయ్యా... వర్మ: కథ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది సార్ వినండి.......... ............... ......... ........ నిర్మాత: అబ్బ! ఎంత గొప్పకథ రాశావయ్యా! డౌటే లేదు, మన సినిమా అన్ని రికార్డ్లను బ్రేక్ చేస్తుంది. వచ్చే నెలలోనే సినిమా స్టార్ట్ చేద్దాం. సంతోషం తట్టుకోలేక తబ్బిబ్బై పోయాడు లక్కీవర్మ. ‘ఇది కలా నిజమా!’ అంటూ తనను తాను రక్తం వచ్చేట్లు గిల్లుకున్నాడు. నిర్మాత చెప్పిన ‘వచ్చే నెల’ రెండు సంత్సరాలు దాటినా రాలేదు. క్యాలెండర్ మారింది, కాలం మారింది. ట్రెండ్ కూడా మారింది...‘ఫ్యామిలీ డ్రామా’ ట్రెండ్ మొదలైంది. ప్రేక్షక మహాశయులను ఎంత ఏడిపిస్తే, సినిమా అంత పెద్ద హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో రెండు నెలలు కష్టపడి ‘పితృదేవోభవ’ అనే కథ రాశాడు లక్కీవర్మ. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత డా.సున్నిత కుమార్ను కలిశాడు. అదేమిటి ప్రొడ్యూసర్ని కలవాలి కాని డాక్టర్ను కలవడమేమిటి? అనే కదా మీ డౌటు... అసలు విషయం ఏమిటంటే ఈ డాక్టర్గారికి సినిమాల పిచ్చి. అందుకే తొలిసారిగా నిర్మాతగా మారి మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ డాక్టర్గారి గురించి ఒక విషయం చెప్పాలి... ఈయన చాలా సున్నితమనస్కుడు. అందుకే వాళ్ల నాన్నగారు ‘సున్నిత కుమార్’ అని పేరెట్టాడు. ఇక మళ్లీ లక్కీవర్మ దగ్గరికి వద్దాం. వర్మ: సార్... మీరు చెప్పినట్లే ట్రెండ్కి తగ్గ కథ తయారుచేశాను. సినిమా పేరు ‘పితృదేవోభవ’. ఈ కథ వింటే కఠిన రాళ్లు సైతం కన్నీరవుతాయి సార్. వినండి..... ....... ........ ........ ........ .... వర్మ కథ చెప్పడం పూర్తికాగానే సున్నిత కుమార్ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్లు సరిపోక ఏకంగా టవల్స్తోనే తుడుచుకుంటున్నాడు. ‘‘సార్ కథ నచ్చిందా?’’ అడిగాడు వర్మ. ‘నచ్చిందా లేదా’ అని చెప్పకుండా ఏడ్చాడు సున్నిత కుమార్. ఏడుస్తూనే ఉన్నాడు... రాత్రి ఏడు దాటినా... ఏడుస్తూనే ఉన్నాడు... అలా అలా సున్నిత కుమార్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఒక చీకటిగదిలో కూర్చుని అదేపనిగా ఏడుస్తూనే ఉన్నాడు. అతడిని మామూలు మనిషిని చేయడానికి ఇంటిల్లిపాదికి హెడ్డు ప్రాణం టెయిల్కు వచ్చింది. ఒక నెల తరువాత డాక్టర్గారి ఇంటి గేట్ తట్టాడు వర్మ. ‘‘ఎవరు మీరు?’’ ‘‘నేను డైరెక్టర్ లక్కీవర్మ. సార్కి బాగా తెలుసు. నా కథ నచ్చిందో లేదో తెలుసుకుందామని వచ్చాను’’ ‘‘నువ్వేనా లక్కీ అంటే... ఏసేంయండిరా వీడ్ని... నీ కథ వినే మా సార్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు... కుమ్మండి రా వీడ్ని...’’ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అక్కడి నుంచి బయటపడ్డాడు లక్కీవర్మ. ఆ తరువాత ఆ ఇంటి దగ్గరే కాదు... హైదరాబాద్లోనే కనిపించలేదు. సరిగ్గా అయిదు సంవత్సరాల తరువాత... ప్రదేశం: అమెరికాలోని న్యూయార్క్ సిటీ. ‘లింకన్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ ఆడిటోరియంలో ‘ఎన్ఆర్ఐ’ల సమావేశం. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ అమెరికా వచ్చి... ‘చపక్ చిపక్ స్కూల్ ఆఫ్ డ్రామా’ అనే ఇన్స్టిట్యూట్ను స్థాపించి... వందల మంది నటులను, డైరెక్టర్లను, సాంకేతిక నిపుణులను తయారు చేశాడు. ఇవ్వాళ ప్రపంచంలో వంద మంది గొప్ప డైరెక్టర్లు, గొప్ప హీరోలు, గొప్ప నటులు ఉంటే అందులో తొంబైతొమ్మిది మంది ఈ ‘చపక్ చిపక్’ నుండే రావడం గొప్ప విషయం. ఆ వ్యక్తి మన తెలుగువాడు కావడం గర్వకారణం. వెల్కమ్ టు మిస్టర్ లక్కీవర్మ... ఫౌండర్ ఆఫ్ ‘చపక్ చిపక్ స్కూల్ ఆఫ్ డ్రామా’. ఆ సన్మానభలో శ్రీ లక్కీవర్మ ఇలా మాట్లాడారు... ‘‘టెన్త్ క్లాసు కూడా పాస్ అవ్వని వ్యక్తులు స్కూళ్లు పెట్టి లక్షలు గడిస్తున్నారు. ఈ స్కూళ్లలో చదివిన వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు... అవుతున్నారు. ఈ ఫార్ములా బాగుంది అనిపించింది. డైరెక్టర్ కాకపోతేనేం... ఎంతో మంది డైరెక్టర్లను తయారుచేస్తాను... అనుకుంటూ అష్టకష్టాలు పడి అమెరికా చేరుకున్నాను. ‘వీనస్ కె డెకో’ అని పేరు మార్చుకున్నాను. ‘పందెంలో కప్పు గెలుచుకోలేదని బాధపడుతూ కూర్చోకు... కప్పులు అమ్మే దుకాణం పెట్టి కసి తీర్చుకో’ అన్నది నా థియరీ.’’ చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లింది. – యాకుబ్ పాషా -
అంతరిక్షం నుంచి అద్భుత ప్రదర్శన
అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్) ఒక అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఆ అద్భుత ప్రదర్శన దృశ్యాన్ని మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక నౌకలోని ప్రయాణికు లకు లైవ్గా ప్రసారం చేశారు. నౌకలోని దాదాపు మూడువేల మంది ప్రయాణికులు ఆ దృశ్యాన్ని తిలకిస్తూ కేరింతలు కొట్టారు. ‘యూరోన్యూస్’ స్పేస్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న వ్యోమగామి లూకా పార్మిటానో చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 13 రాత్రివేళ అంతరిక్ష వేదికపై డీజే ప్రదర్శన చేశారు. డీజే మ్యూజిక్కు అనుగుణంగా ఆయన డ్యాన్స్ చేశారు. దాదాపు ఇరవై నిమిషాలు సాగిన ఈ కార్యక్రమం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. -
ఆయన భారతదేశానికి ప్రతీక
• ధ్రువతారలు ఏప్రిల్ 10, 1917. చంపారన్ రైతు నాయకుడు రాజ్కుమార్ శుక్లా ఒక వ్యక్తిని తీసుకుని తమ కేసును వాదిస్తున్న న్యాయవాది ఇంటికి వెళ్లారు. నీలిమందు పంటనే పండించాలంటూ ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ బిహార్లోని ఆ ప్రాంత రైతాంగం ఉద్యమిస్తున్నది. పట్నాలో ఉన్న న్యాయవాది ఇంటికి శుక్లా తీసుకువెళ్లిన ఆ నల్లటి వ్యక్తి రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చూడ్డానికి రైతులాగే ఉన్నారు. తీరా న్యాయవాది పొరుగూరు వెళ్లారు. మహారాష్ట్ర నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణించి బిహార్ వచ్చిన ఆ నల్లటి వ్యక్తి తమ బావి వద్ద స్నానం చేయడానికి న్యాయవాది నౌకర్లు అంగీకరించలేదు. పాయఖానాలు ఉపయోగించడానికి కూడా అనుమతించలేదు. శుక్లా, ఆ నల్లటి వ్యక్తి, వీరి వెంటే ఉన్న రైతు బృందం మరొకరి ఇంటికి వెళ్లిపోయారు. ఆ నల్లటి వ్యక్తి మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ. అప్పటికే దైవంతో సమానంగా ఆరాధిస్తున్న గాంధీజీ తన ఇంటిని సందర్శించినప్పుడు పొరుగూరు వెళ్లిన ఆ న్యాయవాది బాబూ రాజేంద్రప్రసాద్. బాబూ రాజేంద్రప్రసాద్ (డిసెంబర్ 3, 1884–ఫిబ్రవరి 28, 1963) స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి (1950–1962). స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీతో ఏ విషయంలోను విభేదించకుండా ఉన్న అనుచరుడు బహుశా రాజేంద్రప్రసాద్ (రాజేన్బాబు) కావచ్చు. స్వరాజ్య సమరయోధులలో ప్రముఖులంతా గాంధీజీతో ఏదో ఒక అంశంలో విభేదించినవారేనన్నది చారిత్రక సత్యం. అందుకు రాజేంద్రప్రసాద్ రాసిన ‘గాంధీజీ పాదాల వద్ద’ అన్న పుస్తకమే నిదర్శనం. మనసా వాచా గాంధీజీ సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడు రాజెన్బాబు. ఆయన మేధస్సు, ఆదర్శవంతమైన జీవితం ఎందరినో ప్రభావితులను చేశాయి. వారిలో రాహుల్ సాంకృత్యాయన్ కూడా ఒకరు. రాజెన్బాబు బిహార్లోని జెరదాయి అనే చోట పుట్టారు. సంపన్న కుటుంబం వారిది. తండ్రి మహదేవ సాహే, తల్లి కమలేశ్వరీదేవి. ఈమెకు రాజెన్బాబు ఆఖరి సంతానం. ఆయన చిన్నతనంలోనే కన్నుమూశారు. దీనితో పెద్దక్క పెంపకంలో పెరిగారు. ఆనాటికి వారి స్వగ్రామంలో పాఠశాల లేదు. ఒక ముస్లిం మత గురువును నియమించి పర్షియన్, హిందీ, అర్థమేటిక్ ఇంటి దగ్గరే తండ్రి చెప్పించారు. సాహే కూడా మంచి పండితుడు. ప్రాథమిక విద్య పూర్తయిన తరువాత చాప్రా జిల్లా పాఠశాలలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష రాసి ప్రథమ స్థానంలో నిలిచారు. దీనితో నెలకి రూ. 30 విద్యార్థి వేతనం కూడా లభించేది. 1902లో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1904లో ఎఫ్ఏలో ఉత్తీర్ణులయ్యారు. 1905లో ప్రథమ శ్రేణితో పట్టభద్రుడయ్యారు. రాజేన్బాబు సైన్స్ విద్యార్థి. అప్పటి ఆయన గురువులు జగదీశ్చంద్ర బోస్, ప్రఫుల్లచంద్ర రాయ్. పరీక్షలలో రాజేన్బాబు ఇచ్చిన జవాబు పత్రాన్ని చూసి ఒక పరీక్షకుడు ఇచ్చిన కితాబు ఇది, ‘పరీక్షకుని కంటే పరీక్ష రాసిన విద్యార్థే మెరుగ్గా ఉన్నారు.’ అప్పుడే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం మొదలయింది. రాజేన్బాబు, ఆయన సోదరుడు ఈడెన్ హిందూ విద్యార్థి వసతిగృహంలో ఉండేవారు. అక్కడ ఒక విద్యార్థి విదేశీ వస్తు దహనం నిర్వహించాడు. ఆ రోజున తన వద్ద వెతికితే ఒక్క విదేశీ వస్తువు కూడా రాజేన్కు దొరకలేదు. అది ఆ కుటుంబానికి ఉన్న నిబద్ధత. తరువాత అక్కడే ఎంఏ అర్థశాస్త్రం చదువుకున్నారు. గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, డాన్ సొసైటీ ఆఫ్ ఇండియా (దీనిని ఆంగ్లేయులకు విశ్వవిద్యాలయాల మీద అసాధారణ అధికారాలు కట్టబెట్టే 1902 చట్టానికి వ్యతిరేకంగా సతీశ్చంద్ర ముఖర్జీ స్థాపించిన ఉద్యమ సంస్థ)లలో కూడా ఆయన పనిచేశారు. డాన్ సొసైటీలో రవీంద్రనాథ్ టాగోర్, అరవింద్ ఘోష్, రాజా సుబోద్ చంద్రమల్లిక్, రాయ్చౌదరి వంటివారు సభ్యులుగా ఉండేవారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరవలసిందని స్వయంగా గోఖలే ఆయనను కోరారు. నిజానికి రాజేన్బాబు నాయకత్వ జీవితానికి ప్రెసిడెన్సీ కళాశాలలోనే బీజాలు పడినాయి. అక్కడ విద్యార్థి సంఘానికి ఆయన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1906లో న్యాయశాస్త్రం మీద దృష్టి పెట్టినప్పుడు బెంగాల్ విభజన వ్యతిరేకరోద్యమం మొదలైంది. కలకత్తా సిటీ కాలేజీలో అర్థశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తూనే ఆయన నాటి రిప్పన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. 1911లో ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా నమోదైన తరువాత విభజన నిర్ణయం వెనక్కి వెళ్లింది. అంటే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి ఆయన ప్రత్యక్షసాక్షి. అదే ఆయన రాజకీయ వ్యక్తిత్వం మీద గట్టి ప్రభావమే కనిపించింది. 1915లో న్యాయశాస్త్రంలోనే పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. 1916లో న్యాయవాద వృత్తిని స్వీకరించారు. 1937లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలోనే పరిశోధన పూర్తి చేశారు. ఉద్యమం, చదువు రాజేన్బాబు జీవితంలో రెండుకళ్లలా కనిపిస్తాయి. బెంగాల్ విభజన వేడి మొదలయ్యాక 1906లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఆ సభలలో ఆయన స్వచ్ఛంద సేవకుడు. మళ్లీ 1911లో కలకత్తాలోనే వార్షిక సమావేశాలు జరినప్పుడు లాంఛనంగా ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1916 నాటి లక్నో కాంగ్రెస్ సమావేశాలలో గాంధీజీతో తొలిసారి సమావేశమయ్యారు. అప్పుడే చంపారన్ రైతుల ఉద్యమం కోసం గాంధీజీ ముందుకొచ్చారు. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ఆమోదించిన తరువాత రాజేన్బాబు అటు ఆచార్య పదవిని, ఇటు న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి గాంధీ వెంట ఉండిపోయారు. అప్పటికే ఆ రెండు వృత్తులతో ఆయన విశేషంగా ఆర్జిస్తున్నారు. గాంథీజీ ప్రవచించిన స్వదేశీ విద్య నినాదాన్ని తన కుటుంబంలో అమలు చేశారు. తన కుమారుడు మృత్యుంజయ ప్రసాద్ను బిహార్ విద్యాపీఠంలో చేర్పించారు. రెండు పర్యాయాలు రాజేన్బాబు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. మొదటిసారి 1934 నాటి బొంబాయి కాంగ్రెస్కు అధ్యక్షుడు ఆయనే. 1939లో నేతాజీ బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పదవిని అలంకరించినవారు రాజేన్బాబు. చివరిసారి క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన రాజేన్బాబు 1945లో విడుదలయ్యారు. 1946 లో నెహ్రూ నాయకత్వంలో పన్నెండు మందితో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సంవత్సరం డిసెంబర్ 11న ఆయనకు మరొక ప్రతిష్ఠాత్మక బాధ్యతను భారతదేశం అప్పగించింది. అదే– స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడానికి ఏర్పడిన రాజ్యాంగ పరిషత్కు అధ్యక్ష పదవి. ఆపై భారత తొలి రాష్ట్రపతి పదవి. తొలి భారత రాష్ట్రపతి ఎంపిక వివాదం కాకుండా ఆ కాలమే జాగ్రత్త పడిందని అనిపిస్తుంది. భారత ఆఖరి వైస్రాయ్ భారతీయుడైన రాజాజీ. ఆయనను రాష్ట్రపతిని చేయాలన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయం. కానీ రాజాజీ క్విట్ ఇండియా ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆ పరిణామం చాలామంది ఎంపీలకు గుర్తుంది. దీనితో బాబూ రాజేంద్రప్రసాద్ వైపు మొగ్గారు. ఆయన సర్దార్ అభ్యర్థి అన్న పేరుంది. కాబట్టి మెజార్టీ అభిప్రాయాన్ని అనుసరించి నెహ్రూ కూడా రాజేన్బాబు అభ్యర్థిత్వానికి అంగీకరించారు. కానీ వారిద్దరి మధ్య తరువాత ఒక అవాంఛనీయమైన వాతావరణమే కొనసాగింది. జనవరి 26,1950న రాజేన్బాబును రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. ఆ జనవరి 26 శుభదినం కాదని రాజేన్బాబు విశ్వాసం. కానీ నెహ్రూ దేశాన్ని నడపవలసింది జ్యోతిష్కులు కాదని కరాఖండిగానే చెప్పేశారు. కానీ దురదృష్టవశాత్తు 25వ తేదీ రాత్రి రాజేన్బాబు సోదరి భగవతీదేవి కన్నుమూశారు. రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన చేసిన తొలి కార్యక్రమం సోదరికి అంత్యక్రియలు. సోమనాథ్ దేవాలయం అంశం మరొకటి. జునాగఢ్ సంస్థానం భారత్లో విలీనమైన తరువాత సోమనాథ్ దేవాలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలలలోనే ఆ పని పూర్తయింది. ఈ పని కోసం ఏర్పాటు చేసిన ఆధికారిక సంఘానికి అధ్యక్షుడు కెఎం మున్షీ. ఆ సమయంలో లింగ ప్రతిష్ఠాపన కూడా చేయాలని ఆలోచించారు. ఇందుకు రాజేన్బాబును ముఖ్య అతిథిగా పిలవాలని మున్షీ ఆకాంక్ష. కానీ ఉన్నత రాజ్యాంగ పదవులలో ఉన్నవారు మత ఉత్సవాలకు వెళ్లరాదన్నది నెహ్రూ నిశ్చితాభిప్రాయం. అయినా మున్షీ ఆహ్వానించడం, నెహ్రూ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజేన్బాబు హాజరు కావడం జరిగిపోయాయి. రాజేన్బాబు నిర్ణయాన్ని సోషలిస్టులు, కమ్యూనిస్టులు విమర్శించారు కూడా. అలాగే హిందూ కోడ్ బిల్లును తీసుకురావడానికి రాజేన్బాబు వ్యతిరేకి. అయినా నెహ్రూ ఆ బిల్లును రూపొందించారు. అది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లింది. ఈ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ ప్రజలు నేరుగా ఎన్నుకున్నది కానందున, ఆ సభ ఆమోదించిన బిల్లు మీద తాను సంతకం చేయబోనని రాజేన్బాబు ప్రకటించారు. నెహ్రూ దీని మీద రాష్ట్రపతి కంటే పార్లమెంటే సమున్నతమైనది లేఖ రాశారు. ఇలా విభేదాలు ఇంకా ఎన్నో! 1955లో నెహ్రూ సోవియెట్ రష్యా పర్యటన చరిత్రాత్మకమైనది. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తరువాత ఆయనను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంలో రాజేన్బాబు, ‘జవాహర్ అంటేనే వాస్తవంగా భారతరత్నమే. ఇక ఆయనను లాంఛనంగా భారతరత్న ఎందకు చేయకూడదు?’ అని శ్లాఘించారు. అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఆగలేదు. రాజేన్బాబు పదవీ కాలం పూర్తయిన తరువాత రెండో దఫా అవకాశం ఇవ్వడానికి నెహ్రూ సుముఖంగా లేరు. అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును ముందుకు తీసుకువచ్చారాయన. మళ్లీ మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించి రెండో దఫా కూడా రాజేన్బాబు రాష్ట్రపతి కావడానికి నెహ్రూ అంగీకరించారు. ఆయన హయాంలోనే మొదటిసారి సామాన్యులు రాష్ట్రపతి భవన్లోకి వెళే అవకాశం లభించింది. అందులోని ప్రఖ్యాతి వహించిన మొగల్ గార్డెన్స్ను చూసేందుకు రాజేన్బాబు అనుమతి మంజూరు చేశారు. నిజమే ఆయన విశ్వాసాలు ఆయనకు ఉన్నాయి. వాస్తవానికి ఆయన జీవితం మొగల్ గార్డెన్లోని పూల సమాహారమంతా వైవిధ్యమైనది. గాంధీజీని జనవరి 30, 1948న నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. కానీ చాలామంది తెలియని ఒక చారిత్రక రహస్యాన్ని రాజేన్బాబు తాను రాష్ట్రపతి అయిన తరువాత వెల్లడించారు. ఆనాటి సంఘటనలో ఒక వంటవాడు నిజాయితీగా వ్యవహరించి జరిగిన విష ప్రయోగం గురించి వెల్లడించి ఉండకపోతే భారత చరిత్ర వేరే విధంగా ఉండేది. 1917లోనే ఇది జరిగింది. దీనికి ప్రత్యక్షసాక్షి రాజేన్బాబు. చంపారన్ కె స్వతంత్ర సేనాని అనే పుస్తకంలో ఈ ఘటనను నమోదు చేశారు. చంపారన్ సత్యాగ్రహం కోసం ఆ సంవత్సరం ఏప్రిల్లో గాంధీజీ అక్కడకు వెళ్లారు. 15వ తేదీన మోతీహరి రైల్వే స్టేషన్ దగ్గర వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అందులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. వారందరి ఉద్దేశం ఒకటే. తాము తెచ్చిన గుర్రపు బగ్గీలో గాంధీజీని తీసుకువెళ్లాలి. ఆ బండిని గుర్రాలు కాకుండా తాము లాగాలి. అలాగే తీసుకువెళ్లారు. గాంధీకి ఇంతటి ప్రాచుర్యం రావడం, చంపారన్ రైతుల ఉద్యమంలో కలగ చేసుకోవడం ఆంగ్లేయులకు సహజంగానే కన్నెర్రగా ఉంది. ఆ సమయంలోనే ఎడ్విన్ అనే ఆంగ్లేయుడు గాంధీజీని ఒక రాత్రి విందుకు పిలిచాడు. అతడు ఒక నీలిమందు ఎస్టేట్ మేనేజర్. అతడి దగ్గర వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి బాతక్ మెయిన్. గ్లాసుడు పాలలో అతడి చేత విషం కలిపించాడు. ఇదంతా ఏమీ ఎదిరించకుండానే మెయిన్ చేశాడు. కానీ గాంధీకి విషం కలిపిన ఆ పాలగ్లాసు అందిస్తూ విషయం చెప్పేశాడు. గాంధీజీ విష ప్రయోగం నుంచి బయటపడ్డాడు. తరువాత మెయిన్ నరకం చూశాడు. ఏదో కేసులో ఇరికించి అతడిని ఎడ్విన్ కారాగారం పాల్జేశాడు. స్వగ్రామంలోని అతడి ఇంటిని శ్మశానం కోసం ఇచ్చేశారు. దీనికి సాక్షి రాజేన్బాబు. రాజేన్బాబు దేశాధ్యక్షుడైన తరువాత చంపారన్ వెళ్లారు. ఒక వ్యక్తి పోలీసు వలయాన్ని తప్పించుకుని తన వద్దకు రావాలని ప్రయత్నిస్తున్న సంగతి రాజేన్బాబు గమనించారు. ఆ వచ్చిన వ్యక్తి మెయిన్ అని గుర్తు పట్టి రాజేన్బాబు స్వయంగా అతడి దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకుని, తన వెంటే వేదిక మీదకు తీసుకువెళ్లారు. పక్కనే ఉన్న ఆసనంలో కూర్చోపెట్టారు. అప్పుడు గాంధీజీపై జరిగిన విష ప్రయోగం, మెయిన్ సాహసాల గురించి చెప్పారు. మెయిన్ కోల్పోయినదంతా తిరిగి పొందడానికి వీలుగా 24 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ను ఆదేశించారు రాజేన్బాబు (ఆ కలెక్టర్ ఆ ఆదేశాన్ని అమలు చేయలేదు. ప్రతిభా పాటిల్ వచ్చిన తరువాత ఆమె కూడా కలగేచేసుకుని తొలి రాష్ట్రపతి ఆదేశాలను గౌరవించాలని చూశారు. ఇప్పటికీ సాధ్యం కాలేదు). బాబూ రాజేంద్రప్రసాద్ భారతదేశ మహోద్యమానికి సాక్షి. మారుతున్న కాలంతో పాటు మారిన మనిషి. స్వతహాగా మానవతావాది. 1914లో వరదలు వచ్చి బెంగాల్, బిహార్ అతలాకుతలమైనప్పుడు కోర్టుకు వెళ్లడం మానేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి బాధితులకు ఇచ్చారాయన. ఒక భూస్వామిక కుటుంబం నుంచి వచ్చి జీవితపు చరమాంకంలో ఆ హోదాను పూర్తిగా మరచిపోయిన కర్మయోగి రాజేన్బాబు. గాంధీజీని ఆనాడు ఆయన ఇంటి నౌకర్లు లోపలికి అనుమతించకపోవడానికి కారణం ఆయనను కింది కులాల నుంచి వచ్చిన వ్యక్తి అని భావించడమే. తరువాత సాటి మనిషిని అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయడం ఎంత ఘోరమో ఆయన గుర్తించారని అనిపిస్తుంది. అంటరానితనం నిర్మూలన కోసం పనిచేశారు. తన నివాసాన్ని తనే శుభ్రం చేసుకునేవారు. తన వంట తనే చేసుకునేవారు. పాత్రలు శుభ్రం చేసుకునేవారు. ఇదంతా గాంధీ ప్రభావమే. 1962లో రాజేన్బాబు సతీమణి రాజవంశీదేవి కన్నుమూశారు. తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. నెహ్రూ గురించి రాజేన్బాబు అభిప్రాయం 1950లోనే మారడం మొదలయింది. 1962 నాటి చైనా యుద్ధం తరువాత నెహ్రూ అభిప్రాయాలు, దృష్టికోణం మొత్తం మారాయి. అందులో రాజేన్బాబు మీద ఆయనకు ఉన్న అభిప్రాయం కూడా మారింది. నిజానికి చైనా దురాక్రమణ తొలి రాష్ట్రపతిని, తొలి ప్రధానిని కూడా కలచివేసింది. రాజేన్బాబు కన్నుమూసినప్పుడు నెహ్రూ అన్నమాటే అందుకు నిదర్శనం, ‘ఆయన భారతదేశానికి ప్రతీక. రాజేన్బాబు కన్నుల ద్వారా మనం సత్యాన్ని దర్శించవచ్చు.’ - డా. గోపరాజు నారాయణరావు -
రారా కృష్ణయ్య..!
బృందావనమది అందరిదీ అవునో కాదోగాని, గోవిందుడు అందరివాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీమద్భాగవత పురాణంలో, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించిన విపులమైన గాథలు ఉన్నాయి. బాలకృష్ణుడిగా చేసిన చిలిపిచేష్టలు, ఆ చిన్నారి వయసులోనే తనను చంపడానికి మేనమామ కంసుడు పంపిన పూతన, శకటాసుర, ధేనుకాసురాది రాక్షసుల హననం, చివరకు తనను చంపదలచిన మేనమామ కంసుడినే వధించడం శ్రీకృష్ణుడి అవతార మహిమకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. మన్ను తిన్నావెందుకని నిలదీసిన తల్లి యశోదకు తన నోట చతుర్దశ భువనభాండాలను చూపిన బాలకృష్ణుడు తనను తాను సర్వంతర్యామిగా ఆనాడే ప్రకటించుకున్నాడు.యవ్వనారంభంలో రాధా మనోహరుడిగా, గోపికా మానస చోరుడిగా చేసిన రాసలీలలు, అష్టమహిషుల ప్రభువుగా అలరారిన శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవ పక్షపాతిగా, అర్జునుని సారథిగా, యుద్ధానికి వెనుకంజ వేసిన అర్జునుడికి గీతబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. గోపాలుడైన గోవిందుడు ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకున్నవాడు. అందుకే గోవిందుడు అందరివాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 24) సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా జిల్లెడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో! మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే! శ్రీకృష్ణుని రూపురేఖల గురించి శ్రీమద్భాగవతంలో పోతనామాత్యుడు చేసిన వర్ణన ఇది. నల్లనివాడు కావడం వల్లనే అతడికి కృష్ణుడనే పేరు వచ్చింది. కృష్ణుడు ఉత్త నల్లనివాడేనా? చాలా అల్లరివాడు కూడా. బాల్యావస్థలో చిన్నికృష్ణుని అల్లరి చేష్టలను కూడా పోతనామాత్యుడు కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. చిన్నప్పుడు అల్లరి చేష్టలతో పెరిగిన కృష్ణుడే మహాభారతంలో రాజనీతి చతురుడైన పార్థసారథిగా, లోకానికి గంభీరంగా కర్తవ్యబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. అల్లరి కృష్ణుడిగానే అవతార మహిమలు అల్లరి కృష్ణుడిగా పేరుమోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపరయుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మపరిరక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమ్మీద అవతరించదలచాడు. దేవకీ వసుదేవులకు జన్మించదలచాడు. అప్పుడు యాదవ క్షత్రియుడైన శూరసేన మహారాజు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకితో వసుదేవునికి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత చెల్లెలిని అత్తవారింట దిగవిడచడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతాడు. రథం మార్గమధ్యంలో ఉండగానే ‘నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు’ అని అశరీరవాణి పలకడంతో ఆగ్రహోదగ్రుడైన కంసుడు చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా తన కత్తికి బలిచేస్తాడు. దేవకి ఏడోగర్భంలో ఉండగా విష్ణువు తన మాయతో ఆ పిండాన్ని నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. రోహిణికి కొడుకుగా బలరాముడు పుడతాడు. దేవకికి చెరసాలలోనే గర్భస్రావం అయి ఉంటుందని కంసుడు సరిపెట్టుకుంటాడు. కొన్నాళ్లకు దేవకి ఎనిమిదోసారి గర్భందాలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని పొత్తిళ్లలో పట్టుకుని వసుదేవుడు చెరసాల దాటి బయలుదేరుతాడు. దారిలో ఉన్న యమునా నది రెండుగా చీలి అతనికి దారి ఇవ్వడంతో నందుని ఇంటికి చేరుకుంటాడు వసుదేవుడు. నందుని మరో భార్య యశోద పక్కనున్న శిశువును తీసుకుని, ఆమె పక్కన కృష్ణుడిని విడిచిపెట్టి, తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. ఉదయాన్నే దేవకి శిశువును ప్రసవించిందన్న వార్త విన్న కంసుడు బిడ్డను చంపడానికి చెరసాలకు వెళతాడు. పుట్టినది కొడుకు కాదు, ఆడశిశువు అంటూ దేవకీ వసుదేవులు వారిస్తున్నా, కంసుడు ఆ శిశువును లాక్కును నేలకేసి కొట్టబోతాడు. శిశువు యోగమాయగా పైకెగసి, ‘నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులను కంసుడు ఇంకా చెరసాలలోనే ఉంచుతాడు. మరోవైపు వ్రేపల్లెలోని నందుని ఇంట కృష్ణుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంటాడు. తనను చంపబోయే బాలుడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకుని చంపాలంటూ కంసుడు తన చారులను నలువైపులా పంపుతాడు. కంసుడు పంపిన వారిలో పూతన తొలుత కృష్ణుడి జాడ కనుక్కుంటుంది. విషపూరితమైన పాలు ఇవ్వబోయిన పూతనను పాలుతాగే వయసులోనే కృష్ణుడు పరిమార్చుతాడు. దోగాడే వయసులో కృష్ణుడి అల్లరి ఎక్కువవడంతో యశోద అతణ్ణి రోకలికి కట్టేస్తుంది. రోకలిని ఈడ్చుకుంటూ దోగాడుతూనే వెళ్లి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు. బుడిబుడి నడకల ప్రాయంలోనే కంసుడు పంపిన బక, ధేనుక, శకటాసురాదులను సంహరిస్తాడు. ఆరుబయట ఆటలాడుకుంటూ ఒకసారి బాలకృష్ణుడు మన్నుతినడంతో తోటి గోపబాలకులు యశోదకు ఫిర్యాదు చేస్తారు. తినడానికి ఇంట్లో వెన్న మీగడలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే, నోరు తెరిచి తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించి, ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. తనను పూజించడం మానేసినందుకు గోకులంపై ఆగ్రహించిన ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి, అల్లకల్లోలం సృష్టించినప్పుడు చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, ఆ కొండ నీడన వ్రేపల్లె వాసులకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. కాళింది నదిని విషపూరితం చేస్తూ, జనాలను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుని పడగపైకెక్కి తాండవమాడి కాళీయుని మదమణచి తాండవకృష్ణుడిగా చిన్నారి వయసులోనే జేజేలందుకుంటాడు. చిన్న వయసులోనే ఇన్ని మహిమలు చూపినా, మళ్లీ ఏమీ ఎరుగని వానిలాగానే తోటి గోపబాలకులతో కలసి ఆలమందలకు కాపలాగా వెళతాడు. వాళ్లతో కలసి అల్లరి చేస్తూ ఆటలాడుతాడు. ఎవరూలేని గోపాలుర ఇళ్లలోకి చొరబడి వెన్నమీగడలను దొంగిలిస్తాడు. ఇంటి మీదకు తగవులు తెచ్చి, మామూలు అల్లరిపిల్లవాడిలాగానే తల్లి యశోదతో చీవాట్లు తింటాడు. అరుదైన గురుదక్షిణ అల్లరిగా ఆటపాటలతో గడిపే కృష్ణబలరాములకు విద్యాభ్యాసం జరిపించాలనుకుంటాడు నందుడు. సాందీపని మహర్షి గురుకులంలో చేరుస్తాడు. కృష్ణబలరాములు సాందీపని మహర్షి గురుకులంలో చేరేనాటికి ఆయన పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటాడు. బాల్యంలోనే ఆయన కొడుకు ప్రభాస తీర్థంలో మునిగిపోతాడు.. గురువుకు శుశ్రూషలు చేసి మిగిలిన శిష్యుల మాదిరిగానే బలరామ కృష్ణులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయి, గురుకులాన్ని విడిచిపెట్టే సమయంలో గురుదక్షిణగా ఏమివ్వమంటారని అడిగాడు కృష్ణుడు. గురుపత్ని విలపిస్తూ ప్రభాసతీర్థంలో మునిగి కనిపించకుండా పోయిన తమ కుమారుడిని తెచ్చివ్వగలరా అని అడుగుతుంది. బలరామకృష్ణులు ప్రభాసతీర్థానికి చేరుకుంటారు. ప్రభాసతీర్థంలో గురుపుత్రుడిని అపహరించుకుపోయిన పాంచజన్యునితో పోరాడి, అతనిని తుదముట్టించి, గురుపుత్రుని సురక్షితంగా తీసుకువచ్చి, అతడిని గురుదక్షిణగా సమర్పించి, గురుకులం వీడి ఇంటికి చేరుకుంటారు కృష్ణబలరాములు. కృష్ణుడిని ఎలాగైనా తుదముట్టించాలన్న పట్టుదలతో కంసుడు పథకం పన్నుతాడు. ఉద్ధవుడిని దూతగా పంపి కృష్ణ బలరాములను మథురకు రప్పిస్తాడు. వారిని చంపడానికి చాణూర ముష్టికులనే మల్లులను ఉసిగొల్పుతాడు. కృష్ణుడు చాణూరుడిని, బలరాముడు ముష్టికుడిని సంహరిస్తారు. తర్వాత కృష్ణుడు కంసుడిని తుదముట్టించి, చెరలో ఉన్న తాత ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుడిని చేసి, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను కూడా చెర నుంచి విడిపిస్తాడు. గురుకులంలో చెలికాడైన నిరుపేద బ్రాహ్మణుడు సుదాముడు పెద్దయిన తర్వాత తన ఇంటికి వస్తే, సముచిత రీతిలో ఆతిథ్యమిచ్చి, అతడి దారిద్య్రబాధను కడతేరుస్తాడు. అష్టమహిషులు కృష్ణుడు ఎనిమిదిమంది భార్యలను వివాహమాడాడు. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడు ఆమె సోదరుడు రుక్మి. బలవంతపు పెళ్లి ఇష్టంలేని రుక్మిణి రహస్య సందేశం పంపడంతో కృష్ణుడు ఆమెను ఎత్తుకుపోయి రాక్షసవివాహం చేసుకుంటాడు. అడ్డు వచ్చిన రుక్మికి సగం శిరస్సు, సగం మీసాలు గొరిగి బుద్ధిచెబుతాడు. సత్రాజిత్తు వద్దనున్న శమంతకమణి పోయి, అతడి సోదరుడు ప్రసేనుడు సింహం నోటపడి మరణించడంతో ఆ నింద కృష్ణునిపై పడుతుంది. శమంతకమణిని జాంబవంతుని గుహలో కనుగొన్న కృష్ణుడు అతడిని యుద్ధంలో గెలవడంతో జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణుడికి సమర్పిస్తాడు. శమంతకమణిని తిరిగి తెచ్చివ్వడంతో సత్రాజిత్తు తన కూతురు సత్యభామతో కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. వసుదేవుడి చెల్లెలైన శ్రుతకీర్తి కూతురు భద్రను, మరో మేనత్త కూతురు అవంతీ రాజపుత్రిక మిత్రవిందను స్వయంవరంలో పెళ్లాడతాడు. కోసలరాజు నగ్నజిత్తు వద్ద ఏనుగులంత బలం ఉండే ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి కూతురునిస్తానని ప్రకటించడంతో, కృష్ణుడు ఏడు రూపాల్లో ఏడు వృషభాలనూ నిగ్రహించి, నగ్నజిత్తు కూతురు నాగ్నజితిని వివాహమాడతాడు. మద్ర దేశాధిపతి కూతురు లక్షణ స్వయంవరంలో కృష్ణుడిని వరిస్తుంది. ఈ ఎనిమిదిమంది ద్వారా కృష్ణుడికి పదేసిమంది చొప్పున కొడుకులు కలిగారు. మహాభారతంలో కృష్ణుడు మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడికి మొదటి నుంచి స్నేహబాంధవ్యాలు ఉండేవి. ముఖ్యంగా పాండవ మధ్యముడైన అర్జునుడితో శ్రీకృష్ణుడిది విడదీయరాని బంధం. నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని ప్రతీతి. పాండవపత్ని ద్రౌపదిని సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. శ్రీకృష్ణుడి సలహాల మేరకే ధర్మరాజు మొదలుకొని పాండవులంతా నడుచుకునేవారు. ద్యూత వ్యసనుడైన ధర్మరాజు కృష్ణుడి సలహా తీసుకోకుండానే శకుని ఆహ్వానించగానే మాయజూదంలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతాడు. జూదంలో ధర్మరాజు పణంగా ఒడ్డిన ద్రౌపదిని దుశ్శాసనుడు కురుసభలోకి ఈడ్చుకొచ్చి వలువలు వలిచే ప్రయత్నం చేసినప్పుడు ఆమె తలచినంతనే చీరలు ప్రసాదించి, మానసంరక్షణ చేస్తాడు. మాయజూదంలో ఓటమిపాలై అరణ్య, అజ్ఞాతవాసాల్లో ఉన్న పాండవులకు శ్రీకృష్ణుడు అడుగడుగునా అండగా నిలుస్తాడు. తన రాజ్యానికి బెడదగా ఉన్న జరాసంధుని భీముడి సాయంతో తుదముట్టిస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయం చేసినప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిస్తాడు. శిశుపాలుడు దీనిని ఆక్షేపించి, శ్రీకృష్ణుడిని దూషిస్తాడు. మేనత్తకు ఇచ్చిన వరం మేరకు శిశుపాలుడి వందతప్పులను సహించిన శ్రీకృష్ణుడు, అతడు వందతప్పులనూ పూర్తి చేయడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించక తన చక్రాయుధంతో అతడిని సంహరిస్తాడు. పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత వారి తరఫున రాయబారిగా కురుసభకు వెళతాడు. దుర్యోధనుడు మొండికేసి సూదిమొన మోపినంత చోటైనా పాండవులకు ఇవ్వననడమే కాకుండా, కృష్ణుడిని బంధించడానికి తెగబడటంతో నిండుసభలోనే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తాత్కాలికంగా చూపునిస్తాడు. యుద్ధం అనివార్యమైనప్పుడు తాను పాండవులపక్షా నిలిచి, అర్జునుడికి సారథిగా కురుక్షేత్ర రణరంగానికి వెళతాడు. రణరంగంలో అయినవారిని చూసి, తాను వారిని తన చేతులతో సంహరించలేనంటూ అర్జునుడు వెనుకాడినప్పుడు కురుక్షేత్రంలో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతబోధ చేసి, అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బారి నుంచి ఉత్తర గర్భస్థ శిశువును తన చక్రాన్ని అడ్డువేసి కాపాడతాడు. ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షిత్తు పాండవుల తర్వాత రాజ్యభారం వహిస్తాడు. అవతార పరిసమాప్తి కురుక్షేత్రం యుద్ధంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్న గాంధారి, దీనంతటికీ కృష్ణుడే కారణమని తలచి అతడిపై ఆక్రోశం పెంచుకుంటుంది. యుద్ధంలో కురువంశం నాశనమైనట్లే యదువంశం కూడా నాశనమవుతుందని గాంధారి శపిస్తుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు యాదవ యువకులు కొందరు కృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన సాంబుడికి ఆడవేషం కట్టి, నిండుచూలాలి మాదిరిగా అలంకరిస్తారు. అటుగా వచ్చిన మునులను అడ్డగించి, ఆడవేషంలోని సాంబుడిని చూపి, పుట్టబోయేది ఆడబిడ్డో, మగశిశువో చెప్పాలంటూ ఆటపట్టిస్తారు. ఆగ్రహించిన మునులు యదుకులాన్ని నాశనం చేసే ముసలం పడుతుందని శపిస్తారు. సాంబుడికి వేషం తీసేశాక, అతడి దుస్తుల్లోంచి లోహపు ముసలం ఒకటి బయటపడుతుంది. దానిని చూసి యాదవులు భయపడతారు. దానినేం చేయాలని పెద్దలను అడిగితే, అరగదీసి సముద్రంలో కలిపేయమని సలహా ఇస్తారు. వీలైనంత వరకు దానిని అరగదీసి సముద్రంలో కలిపేస్తారు. చిన్న ములుకులాంటి భాగం మిగిలిపోవడంతో దానిని ఒడ్డున పడేస్తారు. ముసలాన్ని అరగదీసిన ప్రదేశంలో రెల్లుగడ్డి మొలుస్తుంది. ములుకులాంటి భాగం ఒక నిషాదుడికి దొరకడంతో, అతడు దానిని తన బాణానికి ములుకులా అమర్చుకుంటాడు. కొన్నాళ్లకు యాదవులు తప్పతాగి వారిలో వారే కొట్లాడుకుని ఒకరినొకరు చంపుకుంటాడు. జరిగిన దారుణానికి తల్లడిల్లిన బలరాముడు యోగమార్గంలో దేహత్యాగం చేస్తాడు. కృష్ణుడు ఒంటరిగా ఒక చెట్టునీడన కూర్చుని వేణువూదుతూ కాలిని ఆడిస్తుండగా, అక్కడేదో మృగం ఉందని భ్రమించి నిషాదుడు బాణం సంధిస్తాడు. ఆ బాణం వల్లనే కృష్ణుడు దేహత్యాగం చేశాడని, బాణాన్ని సంధించిన నిషాదుడు గతజన్మలో వాలి కొడుకైన అంగదుడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వాలిని రాముడు చెట్టుచాటు నుంచి వధించడం వల్లనే ద్వాపరయుగంలో నిషాదుడిగా జన్మించిన అంగదుడు చెట్టుచాటునున్న కృష్ణుడిపై బాణం సంధిస్తాడని కొన్ని పురాణాల కథనం. శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపరయుగం అంతరించి కలియుగం ప్రారంభమైందని కూడా పురాణాలు చెబుతాయి. అయితే, శ్రీకృష్ణుడు జరామరణ రహితుడని రామానుజాచార్యులు మొదలుకొని గౌడీయ వైష్ణవ గురువుల వరకు పలువురు ఆచార్యలు చెప్పారు. పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు ఆదిమధ్యాంత రహితుడని, పాంచభౌతిక దేహానికి అతీతుడని వైష్ణవుల విశ్వాసం. పురాణాలు... చారిత్రక ఆధారాలు... శ్రీకృష్ణుని ప్రస్తావన పురాణాల్లోనే కాకుండా, ఉపనిషద్వాంగ్మయంలోనూ కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాచీనమైనదని భావిస్తున్న ‘ఛాందోగ్యోపనిషత్తు’లో కృష్ణుడి ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఇదే. ఇందులో శ్రీకృష్ణుడు దేవకీసుతుడని, ఘోర అంగీరసుడికి శిష్యుడని ఉంది. ‘నారాయణ అధర్వశీర్ష’, ‘ఆత్మబోధ’ వంటి ఉపనిషత్తులు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పాయి. హరివంశం, విష్ణుపురాణం వంటి పురాణగ్రంథాల్లో కూడా కృష్ణుని గురించిన గాథలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో మగధ రాజ్యానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన రచనల్లో కృష్ణుడిని ‘హెరాకిల్స్’గాను, బలరాముడిని ‘అగాథకిల్స్’గాను ప్రస్తావించాడు. మధుర రాజైన శూరసేనుడు ‘హెరాకిల్స్’ను పూజించేవాడని మెగస్తనీస్ రాశాడు. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది నాటి గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశ ప్రాంతంలోని బేస్నగర్లో నెలకొల్పిన స్థూప శాసనంలో ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం’ ఆ గరుడ స్తంభాన్ని భక్తుడైన తాను వేయించినట్లు పేర్కొన్నాడు. ఇండో–గ్రీకు పాలకుడైన అగాథోక్లెస్ క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో కృష్ణబలరాముల బొమ్మలున్న నాణేలను ముద్రించాడు. ఆ కాలంలోనే వృష్టివంశానికి చెందిన ఐదుగురు వీరులు: కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు పూజలందుకునేవారు. మధుర సమీపంలోని మోరా వద్ద లభించిన శాసనంలో ఈ ఐదుగురు వృష్టివంశ వీరులకు పూజలు జరిపేవారనేందుకు ఆధారాలు బయటపడ్డాయి. సుమారు అదేకాలంలో వ్యాకరణకర్త పతంజలి రచనల్లో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల పేర్లు కనిపిస్తాయి. కృష్ణుని ఆరాధన... ఆలయాలు... దేశం నలుమూలలా కృష్ణుని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడిగా, కేరళలోని గురువాయూర్లో గురువాయూరప్పగా, గుజరాత్లోని నాథద్వారలో శ్రీనాథుడిగా, ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావనాలలో శ్రీకృష్ణుడిగా, గుజరాత్లోని ద్వారకలో ద్వారకాధీశునిగా, మహారాష్ట్రలోని పండరిపురంలో పాండురంగ విఠలునిగా, తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాలునిగా ఆరాధిస్తారు. మీరాబాయి, చైతన్య మహాప్రభువు, సూరదాసు, భక్త జయదేవుడు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారు కృష్ణభక్తుల్లో సుప్రసిద్ధులు. భారతీయ సంప్రదాయ సంగీత సాహిత్యాలలో కృష్ణునికి విశేషమైన స్థానం ఉంది. కృష్ణుని గురించిన అనేక కీర్తనలు, కృతులు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. భక్తజయదేవుని గీతగోవిందం, అష్టపదులు, సూరదాసు గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట కచేరీల్లో వినిపిస్తూనే ఉంటాయి. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని వర్ణన నిరుపమానమైనవి. తెలుగునాట అన్నమయ్య వంటి పలు వాగ్గేయకారులు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద ‘హరేకృష్ణ’ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ (ఇస్కాన్) స్థాపించారు. ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో దేశ దేశాల్లో ఆలయాలు నడుస్తున్నాయి. ధార్మిక జీవనశైలి, భగవద్గీత, కృష్ణతత్వం ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ‘హరేకృష్ణ’ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది. పలువురు విదేశీయులు సైతం ‘ఇస్కాన్’ ఆలయాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. వైష్ణవ సంప్రదాయం పాటించేవారు ఇళ్లలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి పాటలు పాడుతారు. ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను తీర్చిదిద్దుతారు. ఆ పాదముద్రలనే ఆనవాలు చేసుకుని బాలకృష్ణుడు తమ నట్టింట నడయాడుతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఇంట్లోని పూజమందిరంలో కృష్ణుని ప్రతిమను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పాలు, అటుకులతో తయారుచేసిన మధుర పదార్థాలను, వెన్న మీగడలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి, బంధుమిత్రులతో కలసి ఆరగిస్తారు. కృష్ణాష్టమి రోజున పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీకృష్ణ లీలలను పఠించడం లేదా ఆలకించడం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించితే చతుర్విధ పురుషార్థాలూ ప్రాప్తిస్తాయని ‘స్కందపురాణం’ చెబుతోంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో చిన్నారులు ఉంటే కృష్ణుడిలా, గోపికల్లా వారికి వేషాలు కడతారు. కొన్ని చోట్ల ఉట్టికొట్టే వేడుక జరుపుతారు. భాగవత పారాయణ, భగవద్గీత పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ, కృష్ణాష్టక పారాయణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. -
తేనెటీగలు అంతరిస్తే..?
ఊరకే రొదపెడుతూ తిరిగే తేనెటీగలను చూస్తే చాలామంది చిరాకుపడతారు. ఒక్కోసారి అవి మనుషులను కుడుతుంటాయి కూడా. తేనెటీగలు కుట్టిన చోట దద్దుర్లు ఏర్పడి విపరీతంగా మంట పుడుతుంది. అందువల్ల తేనెటీగలను చూస్తే చాలామంది భయపడతారు కూడా. ఎప్పుడైనా ఒక చెంచాడు తేనె రుచి చూస్తే మాత్రం తేనెటీగల మీద చిరాకు, భయం, కోపం వంటివన్నీ ఆ క్షణానికి మాయమవుతాయి. తేనెలోని ఔషధ గుణాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం తేనెటీగల మీద కృతజ్ఞతా భావం కూడా ఏర్పడుతుంది. తేనెటీగలు నిరంతరం శ్రమించి పొందికగా అల్లుకున్న గూళ్లలో భద్రపరచిన తేనెను మనుషులు వారి అవసరాల కోసం కొల్లగొడుతున్నారు. తేనెటీగల శ్రమను దోచుకుంటున్న మనుషులు వాటి పట్ల రవ్వంతైనా కృతజ్ఞత చూపుతున్నారా అంటే, లేదనే సమాధానం చెప్పాలి. అజ్ఞానంతో, అహంకారంతో, నిర్లక్ష్య ధోరణితో మనుషులు కన్నూ మిన్నూ కానకుండా తేనెటీగలకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. ఇష్టానుసారం పంటలపై పురుగుమందులు చల్లుతూ తేనెటీగలు భూమ్మీద మనుగడ కొనసాగించలేని దారుణమైన పరిస్థితులను కల్పిస్తున్నారు. ఆఫ్టరాల్ తేనెటీగలు... అవి ఈ భూమ్మీద ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే ధోరణిలో మనుషులు తమ పద్ధతులను ఏమాత్రం మార్చుకోవడం లేదు. ఎడాపెడా వాడుతున్న పురుగుమందుల కారణంగా అరుదైన కొన్నిజాతుల తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ‘హవాయిన్ యెల్లో ఫేస్డ్ బీస్’ రకానికి చెందిన ఏడు ఉపజాతుల తేనెటీగలు, ‘రస్టీ ప్యాచ్డ్ బంబ్లీ బీ’ జాతికి చెందిన తేనెటీగలు ప్రమాదం అంచులకు చేరుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతోందని ‘గ్రీన్పీస్’ సంస్థ ‘బీస్ ఇన్ డిక్లైన్’ అనే పుసక్తం ద్వారా దశాబ్దం కిందటే ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులేవీ రాలేదు సరికదా, తేనెటీగలు మరింతగా ప్రమాదానికి చేరువవుతున్నాయి. తేనెటీగలు చేసే పని గూళ్లు కట్టుకుని, తేనెను సేకరించడం మాత్రమే కాదు. చాలా పంటలు ఎదగడానికి కూడా అవి ఇతోధికంగా దోహదపడతాయి. మనుషులు ఆహారంగా ఉపయోగించే చాలా పంటల్లో– కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 35 శాతం ఆహార పంటల్లో పరపరాగ సంపర్కం జరగడానికి ఇవి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. తేనెటీగల శ్రమను పట్టించుకోని మనుషులు, వాటికి ముప్పు కలిగిస్తూ, తమ ముప్పును తామే కొని తెచ్చుకుంటున్నారు. రెండో ప్రపంచయుద్ధ కాలం నుంచే వ్యవసాయం కోసం పురుగుమందులు వాడటం మొదలైంది. పురుగు మందుల వాడకం పెరుగుతున్న కొద్దీ తేనెటీగల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే, అవి అంతరించిన మరో నాలుగేళ్లకు ఈ భూమ్మీది మనుషులు కూడా అంతరించిపోతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తేనెటీగలను కాపాడుకోకుంటే మానవాళి సొంత ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వారు చెబుతున్నారు. -
విప్లవ విద్యార్థి
• ధ్రువతారలు ‘హిందువులు ఇప్పుడు హింసావాదానికి బానిసలుగా మారిపోయారంటే అందుకు కారణం వారు గతంలోను అందుకు బానిసలు కాబట్టే. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. ప్రేమకు సంబంధించి మానవాళిలో అంతర్గతంగా ఉండే సమున్నత సత్యాన్ని వారు గుర్తించడం లేదు.....’ ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో తొలొస్తయ్ 1908 సంవత్సరంలో ఒక లేఖలో రాసిన వాక్యాలివి. ‘హిందువుకో ఉత్తరం’ పేరుతో ఈ లేఖ రాశారాయన. ‘భారతదేశంలో బ్రిటిష్ జాతి చేస్తున్న అరాచకాల గురించి ప్రపంచానికి చాటేందుకు జరుగుతున్న కృషిలో సహచరించండి!’ అని ఒక భారతీయ విప్లవకారుడు కెనడా నుంచి రాసిన లేఖకు జవాబుగా అది రాశారు తొలొస్తయ్. కానీ ఆ భారతీయ విప్లవకారుడు ఆ మహా రచయిత నుంచి ఆశించిన అభిప్రాయం ఇది కాదు. ప్రతిఫలం అసలే కాదు. అణచివేత గురించి రచయితలు గళం విప్పితే ఎక్కువ మందికి చేరుతుందన్నదే ఆ విప్లవకారుడి అభిప్రాయం. ఆ లేఖకు ప్రత్యుత్తరం రాశాడు యువ విప్లవ నాయకుడు. కెనడా నుంచి తాను నడుపుతున్న పత్రిక ‘ఫ్రీ హిందుస్తాన్’ పత్రికలో బహిరంగ లేఖగా దానిని ప్రచురించాడు. ఆ యువకుడి పేరు తారక్నాథ్ దాస్. తొలొస్తయ్కి దాస్ రాసిన సమాధానంలో కొన్ని మాటలు. ‘అహింస అనేది కేవల అంధ విశ్వాసం. మేం హింసారాధకులం కాదు. మా అభిమతం పురోగతి సాధించడం, మానవాళి సౌఖ్యం. మాది వసుధైక కుటుంబకం అన్న భావన. అలా అని వేరే దేశం, జాతి, సమాజం, కుటుంబం, లేదా వ్యక్తులు మమ్మల్ని దోచుకోవడానికి చేసే ప్రయత్నాలని సహిస్తూ మిన్నకుండిపోయేవాళ్లం మాత్రం కాదు.’ మంచి రచయిత కూడా అయిన దాస్ రచనలలో ఈ లేఖకు ఉన్నత స్థానం కూడా దక్కింది. తరువాత ఆ ఇద్దరి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను ధారావాహికంగా ఆ పత్రికలోనే దాస్ ప్రచురించారు. వంగదేశంలో పుట్టి విద్యార్థి దశలోనే అనుశీలన్ సమితి సభ్యునిగా పోలీసుల దృష్టిలో పడి అరెస్టు కాకుండా జపాన్కు మారు వేషంలో తప్పించుకు వెళ్లిన యోధుడు దాస్. వ్యవసాయ కూలీగా, విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో ఉద్యోగిగా, ప్రవాస వ్యవహారాల కార్యాలయంలో అనువాదకునిగా, గదర్పార్టీ నాయకునిగా, పత్రికా రచయితగా, చివరికి కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యునిగా దాస్ ఎదిగారు. ఆయన జీవితమంతా అటు విప్లవం, ఇటు విద్య అన్న పంథాలోనే సాగింది. దాస్ స్వరాజ్య సమరయోధుడే కాదు, అంతర్జాతీయ స్థాయి విద్యావంతుడు. భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన తొలితరం భారతీయులలో ఒకరు. ఆనాడు అక్కడకు వచ్చిన భారతీయులను స్వరాజ్య ఉద్యమం కోసం తమ వంతు సేవ చేసే విధంగా వారిని ఏకం చేసిన నాయకుడాయన. కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడు. పలు ఇతర విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా సేవలు అందించారు. తారక్నాథ్ దాస్ (జూన్ 15, 1884–డిసెంబర్ 22, 1958) నాటి వంగదేశంలోని 24 పరగణాల జిల్లాలో మాఝిపురా అనే గ్రామంలో పుట్టారు. తండ్రి కాళీమోహన్ కలకత్తాలోని సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో గుమాస్తా. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే దాస్లో చైతన్యం తొణకిసలాడేది. తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో తిరిగారు. అక్కడ ఆర్థిక, సామాజిక పరిస్థితులకు స్పందించారు. తన వంతుగా కూలీవారి కుటుంబాల పిల్లల కోసం చిన్న చిన్న పాఠశాలలు నెలకొల్పారు. ఆ వయసులోనే దాస్ రచనా వ్యాసంగంలో ప్రతిభ చూపించారు. పాఠశాలలో ‘దేశభక్తి’ అనే అంశం మీద వ్యాస రచన పోటీ జరిగితే ప్రధానోపాధ్యాయుడి ప్రోత్సాహంతో దాస్ పాల్గొన్నారు. ఆ పోటీకి న్యాయనిర్ణేతగా వచ్చారు బారిస్టర్ పి. మిట్లర్. నాడు బెంగాల్ ప్రాంతంలో ఇంగ్లిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలలో ఒకటైన అనుశీలన సమితి వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. పదహారేళ్ల బాలుడు చూపించిన రచనా సామర్థ్యానికి ముగ్ధుడైన ఆ బారిస్టర్ దాస్ను అనుశీలన్ సమితిలో చేర్చించాలని భావించారు. తన సహచరుడు సతీశ్చంద్ర బసు ద్వారా దాస్ను సమితిలో సభ్యుడిని చేశారాయన. కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో దాస్ ఎంతో ప్రతిభ చూపించారు. అదే సమయంలో తండ్రి కన్నుమూయడంతో ఉన్నత విద్య అక్కడ సాగలేదు. కానీ కలకత్తాలో ఎంతో ఖ్యాతి గాంచిన జనరల్ అసెంబ్లీ విద్యా సంస్థలో చేరారు. చదువుకుంటూనే విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయనకు పెద్దక్క గిరిజ నుంచి మంచి మద్దతు ఉండేది.\ బెంగాలీలలో జాతీయ చైతన్యం తిరిగి తెచ్చేందుకు రాజా సీతారాం రాయ్ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను సామాజికోత్సవాలుగా ఆనాడు నిర్వహించేవారు. మహమ్మద్పూర్ ప్రాంతంలోని జెస్సోర్లో సీతారాం రాయ్ ఉత్సవం నిర్వహించినప్పుడు బాఘా జతీన్ (జితేంద్రనాథ్ ముఖర్జీ, మరొక బెంగాలీ యోధుడు)తో కలసి దాస్ హాజరయ్యారు. దీనికే శ్రీష్ చంద్రసేన్, సత్యేంద్ర సేన్, అధర్ చంద్ర లస్కర్ కూడా హాజరయ్యారు. తరువాత ఈ నలుగురు కూడా ఒకరి తరువాత ఒకరు చదువు పేరుతో విదేశాలకు వెళ్లిపోయారు. వీరంతా ఏ ఉద్దేశంతో వెళ్లారో 1952లో గాని భారతీయులకు తెలియలేదు. ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అదేదో మామూలు విషయమన్నట్టు దాస్ నాటి సాహస కృత్యాలను గుర్తు చేసుకున్నారు. కానీ దాస్ జీవితం, విప్లవ కార్యకలాపాలు స్వరాజ్య సమర చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా మిగిలి ఉంటాయి. దాస్ ఉపన్యాసాలకు కూడా ఎంతో ఖ్యాతి ఉండేది. వివేకానందుడు, బిపిన్చంద్ర పాల్ జాతీయ భావాల మీద ఎంత గొప్పగా ప్రసంగించేవారో, ఆ ఇద్దరి తరువాత అలా భారతీయుల గుండెలను కదిలించేటట్టు ఉపన్యసించే సామర్థ్యం దాస్కు ఉండేది. అప్పటికే పోలీసుల దృష్టిలో పడిన దాస్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మొదట జపాన్ పారిపోయారు. తారక్ బ్రహ్మచారి పేరుతో, ఒక హిందూ సన్యాసి వేషంలో దేశాన్ని దాటారాయన. ఉపదేశాలు ఇవ్వడానికి అని చెప్పి మద్రాస్ వచ్చి అక్కడ నుంచి విదేశాలకు వెళ్లారు. ఇది 1905లో జరిగింది. అంటే వందేమాతరం ఉద్యమంతో బెంగాల్ ఊగిపోతోంది. నాటికే జపాన్లో పలువురు భారతీయ విప్లవకారులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. జపాన్, ఇంగ్లండ్ దేశాల మధ్య బంధాలు బాగుండేవి. భారతీయ విప్లవకారులను అప్పగించాలని ఇంగ్లండ్ జపాన్ను కోరింది. దీనితో మీజీ ప్రభుత్వం భారతీయ విప్లవ సంస్థల కోసం, నాయకుల కోసం వేట ఆరంభించింది. దాస్ జపాన్ వీడి జూన్ 18, 1906 నాటికి అమెరికాలోని సియాటెల్ నగరంలో ప్రత్యక్షమయ్యారు. బతకడానికి రైల్రోడ్డు పనిలో చేరారు. ఆసుపత్రులలో, లాండ్రీలలో, గ్రంథాలయాలలో పనిచేశారు. కొద్దికాలం వ్యవసాయ కూలిగా కూడా పనిచేశారు. చివరికి బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగశాలలో ఉద్యోగం దొరికింది. ఇంత శ్రమపడి డబ్బు సంపాదించడం వెనుక దాస్కు ఒక ధ్యేయం ఉంది. అదే విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరారాయన. పోటీ పరీక్షలు రాసి వాంకోవర్ నగరం (కెనడా) లో ప్రవాసుల వ్యవహారాల చూసే కార్యాలయంలో అనువాదకుడు, సమన్వయ కర్త ఉద్యోగానికి (జూలై 5, 1907) ఎంపికయ్యారు. అదే సమయంలో పాండురంగ ఖాంఖోజె కెనడా వచ్చారు. ఆయన బాలగంగాధర తిలక్ అనుయాయుడు. మరొక మిత్రుడు అధర్ లస్కర్ కూడా కలకత్తా నుంచి కొంత డబ్బుతో వచ్చారు. కెనడాలో స్థాపించవలసిన పత్రిక కోసం బాఘా జతీన్ సేకరించి పంపిన నిధి అది. ఆ విధంగా ‘ఫ్రీ హిందుస్తాన్’ పత్రిక ఆవిర్భవించింది. ఖాంఖోజె పర్యవేక్షణలోనే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను కూడా దాస్ స్థాపించారు. దాస్ ఇంకా హిందుస్తానీ అసియేషన్ పేరుతో మరొక సంస్థను కూడా స్థాపించారు. శ్యామ్జీ కృష్ణవర్మ, మేడమ్ కామాలతో పాటు, లియో తొలొస్తయ్ కూడా దాస్ను ప్రోత్సహించేవారు. ఉత్తర అమెరికాలో భారతీయ విప్లవకారులు స్థాపించిన ఆ పత్రిక ఉద్దేశం మాతృదేశానికి స్వాతంత్య్రం కావాలని కోరడం, అలాగే స్వదేశంలో రావలసిన రాజకీయ, సామాజిక, ఆర్థిక సంస్కరణల గురించి అమెరికా, కెనడాలలో ఉన్న భారతీయులను చైతన్యవంతం చేయడమే. బాంబులు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న ప్రొఫెసర్ సురేంద్రమోహన్ బోస్ కూడా ఈ పత్రికకు సేవలు అందించేవారు. ఇది ఆంగ్ల పత్రిక. కెనడాలో విశేషంగా ఉన్న పంజాబీల కోసం గుర్ముఖిలో కూడా పత్రికను అప్పుడే ఆరంభించారు. కలకత్తాకే చెందిన గురన్ దత్ కుమార్ ‘స్వదేశ్ సేవక్’ అనే పత్రికను అక్కడే నెలకొల్పారు. ఎన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నా దాస్ అందరికీ విద్య అన్నది మౌలికాంశంగా తీసుకున్నారని అనిపిస్తుంది. కెనడాలోని మిల్సైడ్కు దగ్గరగా ఉన్న న్యూ వెస్ట్మినిస్టర్ ప్రాంతానికి ఎక్కువగా పంజాబీలు వచ్చేవారు. వారిలో చాలామంది నిరక్షరాస్యులు. అలాంటి వారి కోసం దాస్ స్వదేశీ సేవక్ హోమ్ను స్థాపించారు. భారతీయులకే కాకుండా ఆసియా దేశాల నుంచి వచ్చిన కూలీల పిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. పెద్దలకి సాయంకాల బడులు నిర్వహించారు. అక్కడ ఆంగ్లం, గణితం ప్రధానంగా నేర్పేవారు. దీనితో కూలీలకు అధికారులతో ఇంగ్లిష్లో సంప్రతింపులు జరిపే అవకాశం వచ్చింది. 1908లో నార్విచ్ విశ్వవిద్యాలయం నుంచి దాస్ మెట్రిక్యులేషన్ పట్టా అందుకున్నారు. ఇందుకోసం ఆయన నార్విచ్ను ఎన్నుకోవడం కూడా ఒక లక్ష్యంతోనే జరిగింది. అది అమెరికాలో అత్యంత పురాతన ప్రైవేట్ మిలటరీ విశ్వవిద్యాలయం. మాతృదేశంలో సాయుధ పోరాటం జరపాలన్న లక్ష్యమే దాస్ను అక్కడకు నడిపించింది. ఆ విశ్వవిద్యాలయం పత్రిక ది రెవిల్లేతో పాటు, ఇతర అమెరికా పత్రికలకు కూడా దాస్ వ్యాసాలు రాసేవారు. కానీ మెట్రిక్యులేషన్ తరువాత కూడా అక్కడే ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన మీద ఉన్న బ్రిటిష్ వ్యతిరేకత ముద్ర కారణంగా ఆయనను బయటకు పంపేశారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు విలియం సి హాప్కిన్స్. ఇతడు బ్రిటిష్ ఇండియా గూఢచారి. కెనడా వచ్చి కేంద్రంగా భారతీయ యువకులు, విద్యార్థులు జరుపుతున్న కార్యకలాపాల గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు పంపేవాడు. ఇతడు కూడా దాస్ మాదిరిగానే వాంకోవర్లో అనువాదకుడు, హిందీ, గుర్ముఖి భాషలను వివరించే ఉద్యోగిగా నటిస్తూ ఈ సమాచారం పంపేవాడు. దాస్ వంటి విప్లవకారుల పేర్లు, బేలా సింగ్ వంటి బ్రిటిష్ అనుకూల భారతీయ యువకుల గురించి హాప్కిన్స్ నివేదికలు పంపేవాడు. లంచాలు ఇచ్చి ఎవరినైనా లోబరుచుకునే సామర్థ్యం ఉన్న హాప్కిన్స్ కెనడా అధికారులకు కూడా లంచం ఇచ్చి దాస్ను వెళ్లగొట్టేందుకు కుట్ర పన్ని విజయం సాధించాడు. ఇతడిని తరువాత ఒక సిక్కు యువకుడు హత్య చేశాడు. విప్లవ కార్యకలాపాలు, విద్యార్జన అనే రెండు ధ్యేయాలతో దాస్ నడిచారు. 1909లో సియాటెల్ వచ్చి అప్పటికే అక్కడ లాలా హరదయాళ్ నాయకత్వంలో జరుగుతున్న గదర్ పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు. 1910లో వాష్టింగ్టన్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం ప్రధాన అంశంగా పట్టభద్రులయ్యారు. ఆపై ఎంఎ చేశారు. బోధనకు అర్హత సాధించారు. అలాగే 1914లో అమెరికా పౌరుడయ్యారు. ఆ సంవత్సరంలోనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా చేరారు. ఎంఎ విద్యార్థిగా కూడా ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్న కాస్మొపాలిటన్ క్ల»Œ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఫిట్జ్గెరాల్డ్ ప్రోత్సాహంతో ఫ్రీహిందుస్తాన్ను న్యూయార్క్ నుంచి కొద్దికాలం ప్రచురించారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది. యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టడానికి అవకాశం వచ్చిందని భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న తీవ్ర జాతీయవాద సంస్థలు భావించాయి. అందులో గదర్ పార్టీ ముందు ఉంది. దాస్ అదే సమయంలో జర్మనీ వెళ్లి వచ్చారు. ప్రవాస భారతీయుల నుంచి ఇందు కోసం నిధులు సేకరించే పనిలో కూడా ఆయన ఉన్నారు. సూయెజ్ కాలువ వెంబడి ఉన్న రైల్వే లైన్ను ధ్వంసం చేయడం వీరి ఉద్దేశం. ఇది బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఆసియా అంతటికీ ప్రాతినిధ్యం వహించే విధంగా పాన్ ఆసియాటిక లీగ్ను నిర్మించడం, భారత స్వాతంత్య్రం గురించి ప్రచారం చేయడమే ధ్యేయంగా దాస్ చైనా, జపాన్లలో కూడా పర్యటించారు. ఇది కూడా ఇండోజర్మన్ కుట్ర కేసులో భాగంగానే చూస్తారు. అమెరికాలో ఉంటూ జర్మనీ సహకారంతో భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారంటూ దాస్, మరో 16 మంది మీద కేసు నమోదు చేశారు. దీనికే ఇండో జర్మన్ కుట్ర కేసు అని పేరు. దీనితో 1918లో దాస్కు 22 మాసాల జైలు శిక్ష పడింది. లీవెన్వర్త్ జైలులో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ చైతన్యం మసకబారలేదు. భారతదేశంలో తన మిత్రదేశం ఇంగ్లండ్ దారుణమైన హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ అమెరికా మౌనం వహించడం పట్ల ఆయన విమర్శలు కురిపించేవారు. ‘భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడడమంటే, ప్రపంచం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటమే. ప్రపంచ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటమే’ అని దాస్ గట్టిగా విశ్వసించేవారు. భారత్ మీద హక్కును కోల్పోతే ఇంగ్లండ్ కుప్పకూలిపోతుంది. అదే జరిగితే ఇండియా, చైనా, రష్యా, మధ్య ప్రాచ్య దేశాలు కలసి ప్రపంచంలోనే బలమైన కూటమిగా ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పేవారు. ఇంగ్లండ్ కుప్పకూలిపోతే సరైన విధానం ఎంచుకుని న్యాయబద్ధమైన కూటమిలో ఉండవలసిందని ఆయన అమెరికాను కోరేవారు. జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ ఆయన జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు చేరారు. తన చిరకాల మిత్రురాలు మేరీ కీటింజ్ మోర్సేను వివాహం చేసుకున్నారు. ఆమె రాజకీయవేత్త. నేషనల్ ఉమెన్స్ పార్టీ సభ్యురాలు. తరువాత ఆయన కొలంబియా, జార్జిటౌన్ విశ్వవిద్యాలయాలలో బోధించారు. వాటర్మల్ ఫౌండేషన్ సాయంతో నలభయ్ ఏళ్ల ప్రవాసం తరువాత, మాతృదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్లకి దాస్ 1952లో భారత్కు విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చారు. ఆరేళ్లు ఉన్నారు. తరువాత మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. అక్కడే తన 74వ ఏట కన్నుమూశారు. భారత స్వాతంత్య్రం పోరాటం ఖండాంతరాల నుంచి కూడా శక్తిమంతంగా సాగింది. అందుకు గొప్ప ఉదాహరణ తారక్నాథ్ దాస్. ఇలాంటి వారి సేవలను ఇప్పటికైనా భారతీయ సమాజం, భారతీయ చరిత్రకారులు గుర్తించడం అవసరం కాదా! - డా. గోపరాజు నారాయణరావు -
చందా అడగటమంటే భిక్షమడగటమే కదా!
ఇంతకు ముందు ఎన్నోమార్లు అతనిని నేను చూశాను కానీ ఆరోజు అతనిని చూసి కలవరపడిపోయాను. ఆశ్చర్యచకితుడినయ్యాను. అదనుగాని సమయంలో కాసిన పండునో, పూసిన పువ్వునో చూసినట్లు అనిపించింది. శ్రావణ భాద్రపద మాసాల్లో నిరంతరం వర్షం కురుస్తున్న ఈ చిత్తడి రోజుల్లో ఎక్కడినుంచి ఊడిపడ్డాడో, ఏమో? నేనే కాదు, అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. కొంతమందైతే అతని టేబుల్ వద్దకు వెళ్లి ఏమో అడుగుతున్నారు. దానికి అతను మామూలుగా క్లుప్తంగా జవాబిస్తున్నాడు. ‘ఫార్బిస్గంజ్లోని ఈ చిన్న టీకొట్టులో ఒక చెయ్యివిరిగిన కుర్చీలో కూర్చున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులవడం నేను గమనిస్తున్నాను. ఎందుకో? నేను కారణాన్ని వెతుక్కుంటూ ఆలోచించసాగాను– దాదాపు ముప్పయి ఏళ్ల కిందట నేను మొట్టమొదటిగా ఈ వ్యక్తిని చూశాను– బహుశ అది 1929 సంవత్సరం కావచ్చు. అదే సంవత్సరం ప్రప్రథమంగా ‘గులాబ్బాగ్’ ఉత్సవంలో చాలా కిందుగా పోతున్న విమానాన్ని చూశాను. అందువల్లనే ఆ సంవత్సరం నాకిప్పటికీ గుర్తు. 1929 సంవత్సరం అంటే అప్పుడు నా వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుంటుంది. ఆ సంవత్సరమే కలకత్తా నుంచి పేరు పొందిన నాటక కంపెనీ గులాబ్ బాగ్ ఉత్సవానికి వచ్చింది. ఎక్కడ చూసినా జనమే– ఇసుకవేస్తే రాలనంత జనం! రంగస్థలంపైనే రైలుబండి వస్తూ పోతూ ఉంది. ఇంజను పొగ వదులుతూ, విజిలేస్తూ నడుస్తుంది. రంగురంగుల కాంతుల్లో దేవకన్యలు నాట్యం చేశాయి... ఆహా! జీవితంలో మొట్టమొదటిసారి నాటకం చూసి ఎంత ఉత్తేజితుడినయ్యానో– ఈరోజు కూడా నాకు ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టుంటుంది. ఎంత అద్భుతం! ఎంత ఆశ్చర్యం! స్కూలు తెరిచిన తర్వాత నాతో పాటు చదువుకునే బకుల్ బెనర్జీ తన మాటలతో నన్ను కించపరచాడు. అతను కూడా ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వాడు. కాని చాలా చలాకీగా ఉంటాడు. జన్మతః ‘ఆర్ట్ క్రిటిక్’గా ఉండేవాడు. అతనేమన్నాడంటే– ‘పోయిన సంవత్సరం నాగేశర్బాగ్ తిరనాళ్లకి వచ్చిన అసలైన నాటక కంపెనీ నుంచి వెళ్లగొట్టబడిన వాళ్లే ఈ నకిలీ కంపెనీలోకి వచ్చి చేరారు’ అని! నేను చిన్నబుచ్చుకోవడం చూసి బకుల్ మళ్లా అందుకున్నాడు– ‘‘అయినా, ఈ కంపెనీలో ప్రత్యేకత ఉందిలే! ఈ కంపెనీ నాటకంలో రైల్వే పోర్టరుగా నటించినవాడు నాగేశరబాగ్ తిరనాళ్లకి వచ్చిన కంపెనీలో కూడా ఇదే పాత్ర ధరించాడు. అంటే వెయిటింగ్ రూమ్లో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడు. ఇతన్ని నకిలీ అనలేము!’’ ఇప్పటికీ ఆనాటి మాటలు నాకు గుర్తున్నాయి– గులాల్బాగ్ తిరానళ, పంజాబ్ మెయిల్లోని రైల్వే పోర్టరు– హత్య– బకుల్ మాటలన్నీ. నాలుగైదు సంవత్సరాల తర్వాత ‘సింహేశ్వర్’ తిరనాళకి వచ్చిన ‘ఉమాకాంత్ ఝా’ కంపెనీలో మరలా ఈ వ్యక్తిని చూడగలిగాను. ‘బిల్వమంగళ’ నాటకంలో చింతాబాయి బృందంలో బోథియా బాబాగారి వేషంలో– ‘కాయాకా పింజరా డోలేరే, సాంస్కా పంఛీ బోలే’ (దేహపంజరంలో ఊగిసలాడే ఊపిరి పక్షి) అంటూ! చాలా మధురంగా పాడాడు. గులాల్బాగ్ తిరనాళలో ప్రదర్శించిన నాటకంలోని అమ్మాయిని హత్య చేసినవాడు, హంతకుని పాత్ర ధరించినవాడు, కాషాయ వస్త్రాలతో బాబాగా దర్శనమిచ్చాడు. కాని అతను తన మాటల సరళిని చాలాసేపు దాచుకోలేకపోయాడు– అతని మాటలను బట్టి నేను అతన్ని కనుక్కోగలిగాను. పారశీ నాటక కంపెనీలోని ఒక దృశ్యంలో కవిత్వం పాడుతున్నప్పుడు– మృదంగం ‘దిల్తై అంటుంటే అందెలు ఎవరికి ఎవరికి?’ అని మోగుతుండగా అప్పుడు వేశ్య నాట్యం చేస్తూ, ‘ఇతనికి ఇతనికి’ అంటూ ఉంటే అప్పుడు నిస్సందేహంగా అతనే ఇతనని తెలిసిపోయింది. ఈ బాబాగారిని గుర్తుపట్టాను. గులాల్బాగ్ తిరనాళ్లలోని కంపెనీ నాటకంలో, వెయిటింగ్ రూములో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తున్నప్పుడు తన చెయ్యి వణకటం చూసి పిచ్చివాని మాదిరి గొణిగాడు– ‘‘ఏమిటి నా చేతులిలా వణుకుతున్నాయి? ఈ చేతులు యజమాని ఆజ్ఞ ప్రకారమే పని చేయాలిగదా! వణకకే నా కత్తీ! సమయాన్ని వృథా చేయకు. ఎవర్ని చంపాలో వాడు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. నీ పని నువ్వు చేసెయ్యి’’ ఇంతలోనే డోలు గట్టిగా మోగింది. అందరూ ఉలిక్కిపడ్డారు. అంతా క్షణంలో అయిపోయింది. తర్వాత మూడోసారి ఆద్యాప్రసాద్ నాటక కంపెనీలో ‘శ్రీమతి మంజరి’ నాటకంలో ఇంగ్లిష్ జడ్జి వేషం ధరించి టేబులుపై సుత్తిని కొడుతూ ‘ఆర్డర్, ఆర్డర్!’ అంటూ వెల్, మంజరీబాయి మేము నీకు ‘శ్రీమతి మంజరి’ అని బిరుదు ఇస్తాము. ఈరోజు నుంచి నిన్ను శ్రీమతి మంజరి అని పిలుస్తాము. నేను పిలిస్తే అందరూ నిన్ను అలాగే పిలుస్తారు’ అంటాడు. ఈ దృశ్యం ముగిసిన కొద్ది క్షణాలకు అతడే ‘ఈ శరీర పంజరం ఊగిసలాడెలే’ అని పాత టోనులో పాడుకుంటూ స్టేజిపైన కనపడతాడు. అతన్ని గుర్తుపట్టడంలో నేనెక్కడా పొరబడలేదు. అన్నిచోట్లా అతన్ని పసిగట్టాను. టీ దుకాణంలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు కాని, ఏదో ఎక్కడో ఆలోచిస్తూ అన్యమనస్కుడై చాలా దిగాలుగా కూర్చున్నాడు. ఆకాశంపైన మేఘపంక్తిని కన్నార్పకుండా చూస్తున్నాడు. అతను పోర్టరు వేషంలోని హంతకుడు– బాబాగారు– ఇంగ్లిష్ జడ్జి– ఉపదేశకుడు– పోలీసు సిపాయి– గజదొంగ– గుడ్డోడు– ఫకీరు వంటి వేషాలెన్నో ధరించిన ఏకైక వ్యక్తి! కొద్దిసేపటికి నా దృష్టి అతను తొడుక్కున్న బుష్షర్ట్పై పడింది. రంగు వెలిసిన బుష్షర్ట్ మట్టి కొట్టుకుపోయి ఉంది. తెగిపోయిన కొత్త డిజైను చెప్పులు. అతను ఉన్నట్టుండి టీ ఇచ్చేవానివైపు చూసి, ‘ఒక టీ ఇక్కడ’ గట్టిగా అరిచాడు. అతని అరుపు విని పోర్టరు వేషంలో ఉండే హంతకుడు, కంపరం కలిగించే గజదొంగ, పవర్ఫుల్ ఇంగ్లిష్ జడ్జి, ప్రశాంతచిత్తుడైన ఉపదేశకుడిగా నటించిన అతను ఇప్పుడు ముసలివాడయ్యాడని స్పష్టంగా తెలిసిపోతుంది. ఫార్బిస్గంజ్ తిరనాళ్లలోని నాటక కంపెనీకి చెందిన నటుల వెనుక నేను నడుస్తున్నాను. ఒక కిళ్లీ దుకాణం దగ్గర అందరూ నిలబడగా నేను వాళ్ల వెనుక నిలబడ్డాను. నటులు చాలామంది అక్కడ గుమిగూడి ఉన్నారు. లైలా–మజ్నూ, ఫర్హాద్, రాజు, గజదొంగ భార్య నుంచి రాజకుమారిని విడిపించిన రాకుమారుడు, అవసరం వచ్చినప్పుడు ఉరితీసే వాడి వేషం వేసేవాడు, వీరందరితో పాటు ‘ఈ శరీరపంజరము ఊగిసలాడెలే’ అని పాడేవాడు. నేను వాళ్ల వెనుక నడవడం చూసి ‘‘ఏమిరా! మా వెంట ఎందుకు పడుతున్నావు? జేబులు కొట్టాలని చూస్తున్నావా?’’ అని అతను నన్ను గద్దించాడు. ఆ చిన్న వయసులో కూడా అతని మాటలు నా ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టాయి. నాకు పౌరుషమొచ్చింది. ‘‘ఏ జేబులో ఏముందనీ, నీ జేబు కొట్టేయడానికి?’’ అని నేను అతన్ని ఎదిరించాను. అతను గాభరాపడి ‘‘నీకు ఎలా తెలుసురా, నా జేబు ఖాళీ అని’’ అన్నాడు. ఆ రోజుల్లో మాస్కూల్లో నేను ఫైనల్ క్లాసులో చదువుతూ ఉండేవాడిని. మా టీచరు ఆజ్ఞ మేరకు ప్రతి అపరిచితునితోనూ ఇంగ్లిష్లో మాట్లాడేవాడిని, కాని అతనికి నేను హిందీలోనే జవాబిచ్చాను– ‘‘నాకెందుకు తెలీదు. రాత్రి నువ్వు అడుక్కుంటున్నావు కదా, ‘బాబూ ధర్మం చేయండి’ అని’’ అంటూనే అందరూ బిగ్గరగా నవ్వి ‘‘ఫర్వాలేదే ఈ పిల్లోడు!’’ అన్నాడు. అప్పుడు నేను ఇంగ్లిష్లో మొదలుపెట్టాను– ‘‘యూ సీ మిస్టర్– రైల్వేపోర్టర్ యాక్టర్– డోంట్ సే మీ పిల్లోడు, ఐయామ్ మెట్రిక్ స్టూడెంట్ యూ నో?’’ ఎన్నో ఏళ్ల కిందటి ఈ సంఘటన గుర్తుకు రాగానే నాకు నవ్వొచ్చింది. ఇప్పుడు అతను ఏ కంపెనీలో పని చేస్తున్నాడో? ఇప్పుడు కూడా అప్పటి మాదిరే బ్రహ్మాండమైన డైలాగులు చెప్పగలడా? అదే మాదిరి వెయిటింగ్ రూములో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడా? ముందుమాదిరే! ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. నేను తేరుకొనేలోగానే అతను టీ తాగేసి నా టేబులు వద్దకు వచ్చి నిలబడి ‘‘ఏం సేఠుగారూ! నన్ను మీరు గుర్తుపట్టారా?’’ అన్నాడు. ‘‘నేను సేఠ్ను కాను. మామూలు మనిషిని. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? నాటకాల సీజనుగాని ఈ రోజుల్లో ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ అతని చేతులు పట్టుకుని కూర్చోబెట్టాను. ‘‘బాబుగారూ! ఇప్పుడెక్కడున్నాయి కంపెనీలు? ఎక్కడున్నాయి ఆ నాటకాలు? సినిమా అన్నింటినీ మింగేసింది’’ అంటూ పెదవి విరిచాడతను. ‘‘మీరు ఇంతవరకు ఎన్ని కంపెనీల్లో పనిచేశారు?’’ ‘‘ఎన్ని కంపెనీలంటారా? పదిహేను కంపెనీలు’’ అతని వాలకం చూస్తే పాత సంగతులన్నీ దాచుకుంటూ ఉన్నట్లుంది. నిమిషం ఆగి శూన్యంలోకి చూస్తూ మళ్లీ ‘‘తొమ్మిదేళ్ల ప్రాయంలో తొలిసారి నాటకాల్లో ప్రవేశించాను బాలకృష్ణుని వేషంలో..’’ అని అన్నాడు. గడచిన కాలంలోని ఒక కాలఖండం నా ముందర నిలబడ్డట్లు నాకనిపించింది– పారశీ నాటక కంపెనీకి చెందిన శిథిలమైన ఒక నటుడు! సిగరెట్టు అతనికందిస్తూ, ‘‘అయితే ఇప్పుడేం చేస్తుంటావు?’’ అన్నాను. కొంతసేపు నన్ను చూస్తూ అతను ఊరుకున్నాడు. సిగరెట్టు వెలిగించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఏముంది చెయ్యడానికి బాబుగారు? ఎవరో ఒక కవి అన్నాడు చూడు: ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ అన్నట్లు నాటక కంపెనీలో పడి పాడైపోయాను. పదేళ్ల తర్వాత ఈ ప్రాంతానికొచ్చాను. ఈ ప్రాంతాన్ని ఏమో అంటారట– ఆ! మిథిలాప్రదేశ్! బాబుగారూ! ఇక్కడ నాటకాలంటే మోజున్న వాళ్లున్నారు కదా... నేను సినిమాల్లో కూడా నటించాను. కానీ అక్కడ మనసొప్పలేదు’’ ఈ మాటలు చెప్పి అటూ ఇటూ ఓరకన్నుతో పరికించి తిరిగి నావైపు దీనంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ‘‘బాబుగారూ! ఎక్స్క్యూజ్మీ.. ఫర్ లాస్ట్ టూడేస్ అయామ్ హంగ్రీ, వెరీ హంగ్రీ! ఎవరినైనా అడగాలంటే ధైర్యం చాలడంలేదు.’’ అతని ఈ ఇంగ్లిష్ డైలాగు నాటకీయంగా లేదు. నేను మాట్లాడేలోపలే అతను నా ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లు దీనంగా మొదలుపెట్టాడు– ‘‘మీ ఆజ్ఞ అయితే నా విద్యను మీ ముందు ప్రదర్శిస్తాను. ఇప్పుడు నా వద్ద మిగిలిందల్లా ఈ విద్య ఒక్కటే. అప్పుడప్పుడూ నాటకాలంటే అభిమానించే వాళ్లు కనబడతారు. నా డైలాగ్సు ప్రదర్శించి తృప్తిపడతాను. నాకు కొద్దో గొప్పో ఇస్తే..’’ అతను తన వాక్యాన్ని ముగించకుండానే ఒక మూల ఉంచిన తన సూట్కేసును పరుగున వెళ్లి తీసుకొచ్చాడు. ఒక నల్లని లుంగీ బయటకు తీసి ముఖానికి కప్పుకున్నాడు. లుంగీ ముసుగు తొలగించగానే కోరమీసాలతో ఒక విచిత్రవేషం కనిపించింది. ‘భగ్న ప్రేమికుడైన యువకుని డైలాగిది’ అని నెమ్మదిగా అంటూ గొంతు సవరించుకుని డైలాగు చెప్పసాగాడు: ‘‘నమ్మకద్రోహి! చపలా!! నీకిది తగునా? నీవు నా హృదయాన్ని వెయ్యి ముక్కలుగా చీల్చి చెండాడావు! నమ్మకద్రోహీ!! ఎంత అనర్థం చేశావే! చపలా.. చపలా నన్ను వదిలి వెళ్లిపోయావటే! నన్ను దిక్కులేనివానిగా చేసి వెళ్లిపోవుట తగునా..!!’’ తర్వాత వెక్కివెక్కి ఏడుస్తూ మరి కొన్ని డైలాగులు వల్లె వేశాడు. అతను చెప్పిన డైలాగ్సును నేనిక్కడ వెల్లడించలేను. టీకొట్టులో జనం మూగారు. నాలుగు వైపుల నుంచి అందరూ తొంగి తొంగి చూస్తున్నారు. అందరి ముఖాల్లో ఏదో కుతూహలం! కానీ అందరూ స్తబ్దులై తమాషా చూసేవాళ్లే. బయట మేఘాలు గర్జిస్తున్నాయి. మరల అతను లుంగీలో తన ముఖాన్ని కప్పుకున్నాడు. తను గ్రీన్రూములోకి ప్రవేశించినట్లు.. ఈసారి లుంగీని తొలగించుకుని పెద్ద గడ్డం, మీసాలు గల సర్దారు బయటికొచ్చాడు. లుంగీ కింద పడిన వెంటనే అతను గర్జించాడు. ‘‘ఏమిరా దుర్మార్గుడా! రాకుమారులెక్కడ? ఎక్కడున్నాడు ఆ నికృష్టుడు?’’ భావావేశంతో చెప్పిన ఈ డైలాగు వల్ల నోట్లో ఉన్న కట్టుడు పండ్ల సెట్టు విరిగి కింద పడింది. ఈ విధంగా అతను ఎన్నో వేషాలు వేశాడు. ఎన్నో డైలాగులు చెప్పాడు. ఆఖరులో తన టోపీని భిక్షాపాత్ర మాదిరి చాపి అందరి వద్దా ‘‘బాబూ! దానం చేయండి. అణా, బేడా, పైసా–పరకో దానం చేయండి బాబూ! మీకు పుణ్యం ఉంటుంది’’ అని అడుక్కున్నాడు. నాకు ఏదో లోకం నుంచి ఊడిపడ్డట్లనిపించింది. ఈ మనిషి తన కళానైపుణ్యంతో ఎన్నో సంవత్సరాల వెనక్కు నన్ను తీసుకువెళ్లాడు. నేను మళ్లీ వర్తమానానికి తిరిగి వచ్చాను. బకుల్ బెనర్జీ నావైపు తదేక దృష్టితో చూస్తున్నాడు. లోలోపల నవ్వుకుంటూనే. బకుల్ అతన్ని గద్దించి అడిగాడు– ‘‘ఏం యాక్టరు మహాశయా! నిన్న చాలా శ్రమపడి సంపాదించిన చందా పైసలేమయ్యాయి? అన్నీ రాత్రి ఏ బట్టీలో కాల్చేశావు. భలే గొప్పోడివే?’’ పుట్టుకతోనే ఆర్ట్క్రిటిక్గా పేరుపొందిన నా సహాధ్యాయి బకుల్ బెనర్జీ ఇప్పటికీ కళను, కళాకారులను గుర్తించే పని చేస్తున్నాడు. మొదటి నుంచి ఇంతే వీడు. ‘‘ఏమోయ్! నీవు కూడా వీడి మాటల్లో చిక్కుకున్నావా? ఇతను నిన్న నాతో కూడా ఫర్ టూ డేస్ అయామ్ హంగ్రీ అన్నాడు’’ బకుల్ నావైపు చూసి అన్నాడు. ఎందుకో బకుల్ మాట నాకు అప్పుడు నచ్చలేదు. వాణ్ణి అడ్డుకుని అతని చెవిలో ‘‘బకుల్! ఊగిసలాడే ఈతని శరీర పంజరంలో ఉన్న పక్షి ఏమంటుందో వినగలవా? అది విని నీకు ఏమనిపిస్తోందో నాకు స్పష్టంగా వివరించి చెప్పు’’ అని అన్నాను. బకుల్ నిశ్చేష్టుడయ్యాడు. నిమిషం సేపు ఊరుకుండి మళ్లీ ఇలా అన్నాడు. ‘‘ఏమీ అనిపించకపోతే నిన్నంతా అతని వెంట తిరిగి భిక్షాటన ఎందుకు చేశాను? చందా అడగటమంటే భిక్షమడగటమే కదా! ఒక నిట్టూర్పు వదిలి మళ్లీ ఏం చెప్పను? ఏమనిపించిందని? నీతో, నీలాంటి ఇతర స్నేహితులతో కలిసి హాస్టలు నుంచి తప్పించుకుని పారిపోయి రాత్రంతా నాటకం చూసినట్టు అనిపించింది’’ అన్నాడు. ‘‘నిజంగానే బకుల్ నాకూ అలాగే అనిపించింది’’ అన్నాను. ఇంతలో ఆ ముసలి నటుడు తనకిష్టమైన పాత పాటలోని మొదటి పంక్తులను ఆలపించడం ప్రారంభించాడు. ‘‘తెల్లవారగానే చుక్కలన్నీ మటుమాయమయ్యాయి– అయిన వాళ్లంతా నన్ను వదిలిపోయారు’’ అకస్మాత్తుగా మళ్లీ మా స్మృతిపథంలో తిరనాళ్ల సంబరం మెదలసాగింది. - హిందీ మూలం : ఫణీశ్వరనాథ్ రేణు - తెలుగు: పి.విజయరాఘవ రెడ్డి -
వేట మొదలైంది..
చీకటి. కాటుకలాంటి చీకటి. పిరికివాడి భయంలా చిక్కగా ఉండి. అడవిలో నిశ్శబ్దం చూసుకొని మరింత నల్లగా నవ్వుతోంది. ప్రమాద పరిస్థితిలో పసివాడి చిరునవ్వులా నింగిన చుక్కలు అమాయకంగా మెరుస్తున్నాయి. మొహం చెల్లక, కడుపులో ప్రమాదాలు దాచిపెట్టుకున్న చీకటి కూడా మిణుగురులతో ఇకిలిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు రూపు ధరించిన చీకట్లలా లీలగా కనబడి మాయమవుతున్నాయి. మంచు కురుస్తోంది. చలి కరుస్తోంది. గాలి సన్నగా, వాడిగా రంపపు కోతలా ఒరుసుకుపోతోంది. చెవుల మీద నుంచి చోటు దొరికిన చోటాల్లా గాఢంగా గుచ్చుకుంటోంది. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయి...భయం...భయంగా.... ఇలకోడి ఎగురుతాళంలో కూస్తోంది. భయసందేహాల వల్ల లయ లేకుండా పడుతున్న మా అడుగుల సవ్వడిని కాబోలు ఆగి ఆగి అలకిస్తోంది. మెయిన్రోడ్డు మీద నడిచిన అలవాటు వల్ల కాబోలు దారి నిండా ఇన్ని గతుకులేమిటని విసుక్కుంటున్నాయి పాదాలు. వెనక మేమున్నామన్న ధీమాతో బ్యాటరీలైటు కాంతికిరణం ఒకటి మా ముందు చెంగు చెంగున ఎగురుతూ పోతోంది. సాక్షాత్తు మృత్యువులాంటి పెద్దపులులు పచ్చటి ఎర్రటి కనుపాపలు పెద్దవి చేసుకొని ఊపిరి బిగబట్టి పొంచి ఉండే పొదలలోకి కూడా తొంగి చూసి వస్తోంది ఆ కిరణం. ఒక్క క్షణం ఆగాను. ఇంత చలిలోనూ కూడా చిరుచెమట పోసింది నొసట...అలసట చేత...భయం చేత కూడాను. రుమాలుతో మొహం తుడుచుకొని డబుల్ బారెల్ గన్ను ఆ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకున్నాను. ఆటవిక నిశ్శబ్దం నన్ను చెవిటివాణ్ణి చేసింది. నా వెనక వస్తున్న నా మిత్రుడు పొడిదగ్గాడు. ఉలిక్కిపడ్డాను. ‘ఊ?’’ అన్నాను వెనక్కితిరక్కుండానే. ‘అబ్బే’ అన్నాడు అతడు. ‘చలా?’ ‘ఉహు’ ‘‘భయమెందుకోయ్’’ అన్నాను భయం అణుచుకుంటూ. అతను నవ్వాడు–ధైర్యం తెచ్చుకొంటూ (అతనికిదే తొలిసారి) నాది భయమా? భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి? ధైర్యముంటే అతనెందుకు భయపడాలి? మేము అడవిని చూసి భయపడితే అడవి మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? అడవిలో పులులు ఎందుకు ముందుకురావు? చీకటి నిశ్శబ్దంలో, నిశ్శబ్దం చీకట్లో ఎందుకు దాక్కున్నాయి? కుట్ర చేస్తున్నట్లుగా ఎందుకు నిశ్శబ్దం? పొంచి ఉన్న ఈ ‘ప్రమాదాల’ మధ్య, మృత్యుపరికరాల మధ్య, అణగి ఉన్న ఈ ప్రకృతిశక్తి చైతన్యాల మధ్య రంగారావుకు చోటెంత? అణువంత. కాని అణువులోని శక్తి ఎంత? ఆ సంగతి తెలిసే ధైర్యముగా అడవిలోకి ఆరుమైళ్ళ దూరం వచ్చానా? ఏ ధైర్యం నన్ను ముందుకు నడిపించింది? స్వతహాగా పిరికివాణ్ని గదా...చేతిలో తుపాకి ఉన్నదన్న ధైర్యంతో కాబోలు. కాని ‘మృత్యువు’ గాండ్రుమని గర్జించి మీదికి లంఘించినప్పుడు ఎదిరించి కాల్చే సాహసమెంత? ఈ రంగారావులో భయమూ వుంది. సాహసం ఉంది. భయం కోరి తెచ్చుకున్నది. సాహసం ఆవహింపజేసుకున్నది. శత్రువు(?)ని కొట్టేవరకూ ‘ప్రమాదం’ ఎక్కడ పొంచి ఎట్నించి మీద పడుతుందోనని భయం. ఆ భయం–అప్పటి ఉత్కంఠ ఒక అద్భుతమైన అనుభూతి. అనిర్వచనీయమైన సుఖం. అదే వేటగాడి కష్టానికి తెగింపుకూ ప్రతిఫలం. ప్రాణం పణంగా ఒడ్డి గెల్చుకున్న మధురఫలం. అందుకోసమే, ఆ భయం కోసమే, సుఖం కోసమే షికారీ వేటకెళ్తాడేమో. ‘‘ప్రమాదం తన పచ్చటి ఎర్రటి కళ్ళతో అమేయమైన శక్తితో తన వేపు గురి చూసి ఉన్న తుపాకీకేసీ, ఆ వెనుక ఉన్న మనకేసి చూసి–గాండ్రుమంటూ అడవి జడుసుకేలా అరచి దూకినప్పుడు– తుపాకి ట్రిగ్గర్ నొక్కి, అందులో నుంచి గుండు బయల్దేరి ముందుకు వెళ్తున్నప్పుడు– పులిపంజా, తెరచిన నోరు, తొమ్మిది అడుగుల భారీ శరీరం, చిన్న తుపాకి గుండుకు ఎదురుగా వస్తున్నప్పుడు– ఆ పులికీ, ఈ బుల్లెట్కీ భేటి కుదరకపోతే? ఆ అరక్షణం తరువాత ఏమి జరుగుతుందీ అని అర క్షణంసేపు షికారీ నరాలను మెలిపెట్టి దహించివేసే విద్యుదాఘతంలాంటి ఆలోచన– అదే భయం– ఆదే సుఖం– ఆ క్షణమే స్వర్గం– ఆ క్షణమే భరింపరాని నరకం. అదే అంతవరకూ వేటగాడు ఎదురుచూచిన ముహుర్తం. సాధారణంగా వేటకు వెళ్తే మనం ఎక్కడో భద్రంగా కూర్చుని, పులి వచ్చే వరకూ కాసుకుని కొట్టేస్తాం. అది చూచినా దానికి అందని పద్దతిలో ఉంటాం. విశాఖజిల్లా మన్యపా్రంతాలలో అడ్డతీగెల, ఎర్రకుండి, మర్రిపాకల అడవులలోనే, తూర్పుగోదావరిలో జిడ్డంగి, కాకరపాడు దగ్గర మంప వగైరా ప్రాంతాలలోనూ నేను నా మిత్రులు అప్పుడప్పుడు వేటకు వెళ్తునే ఉంటాం. ఒకసారి అడ్డతీగలలో–పెద్ద వేటగాళ్లుతో పోల్చుకుంటే ఏమి అనుభవం లేని నాకు, అప్పటికి అనుభవం అనదగ్గ సంఘటన ఒకటి జరిగింది. భోజనాలు చేసి, జెర్కిన్లు బిగించి, స్వెట్టర్లు తొడిగి, మఫ్లరీలు చుట్టి ఒక జీపులో బయల్దేరాం నలుగురం. రాత్రి పదకొండున్నర అయింది. నేను ముందు సీట్లో కూర్చున్నాను తుపాకి దట్టించి. గతుకుల్లో జీప్ నెమ్మదిగా వెళ్తోంది. ఎదుట చీకటి. కాటికలాంటి చీకటి. అంతటా నిశ్శబ్దం. మధ్య మధ్య అపశ్రుతిగా ఎక్కడో నక్కలు అరుస్తున్నాయి. ఇలకోడి ఎదురు తాళంలో కూస్తోంది. జీపు కారు శబ్దాన్నీ ఇవీ మిగతా నిశ్శబ్దమూ కలిసి మింగేశాయి కాబోలు, వినబడటమే లేదు. అంతలో నా మిత్రుడు జీపుకు బ్రేక్ వేశాడు. ‘ష్’ అన్నాడు నిష్కారణంగా. ఎదర 15 గజాల దూరాన చోటు తెరిపిగా ఉంది. జీపు హెడ్లైట్ల కిరణాలు నీరసించి మసకమారిపోతున్న చోట లీలగా జంతువు కదలిక కనిపించింది. నేను ఆలోచించే స్థితిలో లేను. కొత్త ఉత్సాహం. గబుక్కున తుపాకి గురి చేసి ట్రిగ్గర్ నొక్కాను. అడవీ, నిశ్శబ్దమూ, నా గుండే, పొదల్లో కుందేళ్ళూ, చెట్ల మీద పక్షులు దడదడలాడిపోయాయి తుపాకి మోతకి. ఒక్క క్షణం నిశ్శబ్దం. అంతలో గర్జనలతో అరణ్యం మళ్ళీ మారుమోగింది. నేను గబుక్కున జీపులోంచి కిందకు దూకాను. క్లియరింగ్ వేపు బయల్దేరాను. నా మిత్రులు గట్టిగా వారించారు. వెనుక్కులాగారు, విదిలించుకుపోయాను. నిజానికి అది చాలా మూర్ఖమైన పని...అని ఇప్పుడు తెలుసు. ఆచూకీ తెలియకుండా పొంచి ఉన్నప్పుడు అలా దిగిఅటు వేపు పోకూడదు. నేను మొండిధైర్యంతో–బహుశా అది అజ్ఞానం వల్ల నిలబడ్డ ధైర్యంతో అనుకొంటాను–అలా ముందుకు పోతున్నాను. వెనకాల జీపు వస్తోంది నెమ్మదిగా పది అడుగుల తరువాత ఆగిపోయినట్టుంది. నేను వెనక్కి చూడలేదు. తుపాకిని పొజిషన్లో పట్టుకొని దాని మీద క్లాంప్ వేసిన లైట్ను వెలిగించి సర్వేంద్రియాలకూ హెచ్చరిక చెప్పి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంకా ముందు వెళ్లాను. నేల మీద ఒకచోట నల్లటి డాగు కనబడింది. పెద్ద డాగు. ఆగి పరీక్షగా చూశాను. రక్తం. అంత భయంలోనూ గర్వం. గురి తప్పక కొట్టగలిగానని. ఆనందంతో గర్వంతో వెనక్కు చూశాను. అంతలోనే నేను ఉన్న స్థితి గుర్తుకు వచ్చింది. చిరుతపులి నాకు కుడివైపు నుండి ఎడమవైపుకు పోతూ ఉండగా కొట్టాను. బహుశా దెబ్బతిని ఎదర ఉన్న పొదలలోకి దూకి ఉంటుంది. ఎక్కడా అలికిడి లేదు. ఆయాసంగా ఊపిరి తీస్తున్న సవ్వడి కూడా లేదు–నాది తప్పు. క్లాంప్లాంప్ను పొదల మీదకు ప్రసరించి నెమ్మదిగా జరుపుతూ పరిశీలిస్తున్నాను. అంతలో హఠాత్తుగా నా కుడి వైపు దగ్గరగా బాటరీలైటు కిరణం పడింది. పరాకుగా ఉన్న వాడి పక్కన బాంబు పేలినట్లయింది. చిక్కటి చీకటిలో ఆ వెలుగు కిరణం అలా పగలడంతో గుండె ఝల్లుమంది. కదలకుండానే ఎటూ తిరక్కుండానే పక్కకు వాల్చి ఆ కిరణం కేసి చూశాను. అది నా పాదాల దగ్గర నుండి కుడివేపుకు వెళ్ళి మళ్లీ వెనక్కువచ్చి మళ్ళీ కుడివైపుకు వెళ్తోంది. నాకేదో చెప్పాలని నానా హైరానా పడుతూ–నా వెనక జీపులోంచి నా మిత్రుడు వేస్తున్న లైటు అని తెలుసు. గట్టిగా అరవవచ్చుననీ తెలుసు. అరవడానికి కంఠం పెగల్లేదు. ఒకడు అలా గాయపడ్డ జంతువును వెదుకుతూ ఉండగా వెనకనించి మరొకడు అలా లైటు వెయ్యకూడదు. అలా చేస్తే పొంచి ఉన్న జంతువుకు ఇతను స్పష్టంగా కనబడి పోతాడు. అది ప్రమాదమని నా మిత్రులకు నా కన్న బాగా తెలుసు. గత్యంతరం లేకనే ఈ పని చేస్తూ ఉండి ఉండాలి. నేను నిలబడ్డ చోటు వైశాల్యం పది చదరపు గజాల లోపు. శాంతి కిరణాన్ని అనుసరిద్దామని ఆ వెంటే వెనక్కి తిరిగి, నా తుపాకీ మీద బాటరీ లైటు పొదలవైపు వేసి చూశాను. అంతే, ఇప్పుడంతా అర్థమైంది. ఆలోపలే గుండె ఝల్లుమంది. క్షణంలో ఒళ్ళు కొయ్యబారి పోయింది. ఒక్కసారిగా నిడివడింది. అంత చలిలోనూ ముచ్చెమటలు పోసేశాయి. నా ఎదురుగుండా 20 అడుగుల దూరంలో పొద పక్కన కూర్చుని ఉంది–దెబ్బ తిన్న చిరుపుతి. దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు కూర్చుంది. నాకేమీ తోచలేదు. ఆలోచనకు అవకాశమే లేదు. నన్నెవరూ ఆ క్షణంలో ఆదుకోలేరు. కాపాడలేరు. ఆ క్షణంలోనే ఒళ్లు తెలియకుండా ఆలోచన లేకుండా బాటరీ దాని మొహం మీద వేశాను. ఆ కాంతికి చిరుతపులి ఒక్క మాటు కళ్లు ముడుచుకున్నది. కళ్లు చీకట్లు కమ్మి ఉండాలి. అది కళ్ళు తెరిచి తమాయించుకుంటే తరువాత ఆ దెబ్బతిన్న పులిని అడ్డేవాడుండడు. నా దగ్గర తుపాకిలో ఇంక ఒక్కటే గుండు ఉన్నదన్న ఊహ కూడా స్ఫురించింది. అయితే ఒకటే ధైర్యం. గుండు గురి తప్పి, అది మీదకు ఉరికినా ఒక్క ఆశ ఉంది. అంది పెద్దపులి కాదు. చిరుతపులి కాబట్టి కలియబడవచ్చు. అప్పుడు జయపజయాలు–ఏమో. ఒక పక్క చెమటలు పోస్తున్నాయి. మరోపక్క ఒళ్ళు గజగజ వణికిపోతుంది. తెగించి, గురి పెట్టి కాల్చారు. తుపాకి శబ్దానికి అడవి మారుమోగింది...కాని దానికి ప్రతిధ్వనిగా గర్జన రాలేదు. మూలుగులాటిది వినబడింది. పులి నా మీద కురక లేదు. పొద అదిరిపోలేదు. ఇక ఫరవాలేదు అది దెబ్బతింది అనుకున్నాను. గబగబ పెద్దపెద్ద అంగలు వేస్తూ జీపు వేపు నడిచిపోయాను. నా మిత్రులు ముగ్గురూ ఆమాంతం ఎదురువచ్చి కౌగిలించుకున్నారు. కారులో కూర్చోబెట్టి మొహం తుడిచారు. కాంగ్రాచ్యులేషన్స్ కురిపించారు. ఫ్లాస్కులోంచి వెచ్చటి టీ తీసి ఇచ్చారు. అది తాగి సిగరెట్ ముట్టించాను. కసితీరా రెండు పీల్పులు పీల్చాక ప్రాణం కుదుటపడింది. ఎవరితోను మాట్లాడ బుద్ధి కావటం లేదు. చెప్పరానంత ఆనందగా గర్వంగా హాయిగా వుంది, కన్నులరమూసి కూర్చున్నాను. పావుగంట తరువాత, వాళ్ళతో వెళ్లి నేను చంపిన చిరుతపులిని సాయం పట్టి జీపు బాలెట్ పడేశాను. తృప్తిగా కూర్చున్నాను. జీపు అడ్డతీగెల గ్రామం వేపు సాగిపోతుంది నెమ్మదిగా, మిత్రులు, నేనెంత మూర్ఖపుపని చేయబోయానో, ఎంతటి గండం తప్పిందో చెబుతున్నారు. క్రమంగా అవన్నీ వినబడడం మానేశాయి. వాళ్ళ సంతోషం పంచుకోలేకపోతున్నాను. నేను సాధించిన విజయం ఏమిటి? పగ సాధించానన్న ఈ తృప్తి ఎందుకు కలగాలి? పగ ఎందుకు వచ్చింది? పులికి నా మీద కోపం ఉన్నట్లు ఎవరూ చెప్పలేదు. నాకు దాంతో పరిచయం లేదు. పనిమల్లె నేను ఇక్కడికి దాని రాజ్యంలోకి ప్రవేశించాను. నేనే శత్రువుని. దాని దారిన అది పోతూ ఉంటే, హెచ్చరించకుండా దెబ్బ కొట్టాను. నాకన్న అది బలమైనదని తెలుసు. ధైర్యం ఎక్కువని తెలుసు. నాకు అదంటే భయమని తెలుసు. మరొక్కటి తెలుసు. అది జంతువని దానికి బుద్దిబలం లేదనీ, వంచనా శిల్పం బాగా తెలీదనీ, నేను నాగరిక మానవుడిననీ, దానికి లేని బుద్ధిబలం నాకు ఉండదనీ పైగా వంచనా శిల్పం, ఆయుధసంపద నా అధీనంలో ఉన్నాయనీను. అదే, పంజా ఎత్తిన పులికాక. తుపాకి పట్టిన మరో మనిషి లాగే ఆ పొదలో నిలిచి ఉంటే? నేనూ అతడూ సమానస్థాయిలో ఉందుము. అపుడు ఎవరేమయ్యేవారో! నేను నిరాయుధుడనై వెళ్తే పులి నన్ను బలి చేస్తుందని ఊహించి. నాకన్న అది బలశాలి అని గుర్తించి, దానికి తెలీకుండా, అది నాతో సవాలు చేసినట్టు అనుకుని, ప్రతీకారం కోసం అయినట్టు పనిమల్లె వెళ్ళి చంపాను. కాని ఇది ప్రతీకారమా, నాలో అహంకారానికి ఉపశమనమా? ఏమో. తెలీదు...తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అది తెలుసుకుంటే, నేను చాలా ధైర్యశాలిని అని వెన్ను చరుచుకోవడానికి అవకాశం ఉండదనా? ఏమో... ‘‘వాట్ రంగారావ్...ఏమిటలా ఉన్నావు?’’ అంటున్నారెవరో. ‘‘కొత్తగదయ్యా...పోను పోను అతనే సర్దుకుంటాడు’’ అంటున్నారింకెవరో. జీపు ఊరివేపు, నాగరికత వేపు, సంస్కారం వేపు ముందుకు సాగిపోతుంది. - ఎస్వీ రంగారావు -
విప్లవోద్యమంలో బెంగాల్ బెబ్బులి
1908 నాటి ఘటన ఇది. జరిగిన చోటు– బెంగాల్లోని సిలిగుడి రైల్వే స్టేషన్. కొందరు ఇంగ్లిష్ అధికారులని ఒక భారతీయుడు చావగొట్టి వదిలిపెట్టాడు. దీని మీద కేసు నమోదైంది. ఒకే ఒక్క భారతీయుడు కొందరు శ్వేతజాతీయులకి ఒంటి చేత్తో కళ్లు బైర్లు కమ్మేటట్టు చేశాడంటే ఎంత పెద్ద వార్త. పత్రికలు పోటీపడి ప్రాధాన్యం ఇచ్చాయి. విచారణ జరుగుతున్నంత కాలం అదే పనిలో ఉన్నాయి. ఇదంతా చూశాక పరువు తక్కువ అని కేసు మూయించేశారు అధికారులు. ఎందుకంటే ఒంటరి భారతీయుడి చేతిలో అంతమంది అధికారులు చావు దెబ్బలు తిన్నారంటే రవి అస్తమించని సామ్రాజ్యానికి, బ్రిటిష్ చక్రవర్తికి ఎంత అప్రతిష్ట! పైగా దెబ్బలు తిన్న వాళ్లంతా సైనికాధికారులు కావడం మరొక విశేషం. మహిళలకు ఇబ్బంది కలిగించవద్దని సగౌరవంగా కోరినా జాత్యహంకారం చూపినందుకు, అవమానకర భాషతో తనను దూషించినందుకు ఆ యువకుడు ఆ సాహసం చేశాడు. ఇంతటి దేహబలం కలిగిన ఆ భారతీయుడి పేరు ‘బఘా’ (పెద్దపులి) జతీన్. పూర్తిపేరు జతీంద్రనాథ్ ముఖర్జీ. జతీన్ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వేగుచుక్క. విప్లవ స్రష్ట, ద్రష్ట. బ్రిటిష్ పాలన మీద విప్లవించడానికి మొత్తం భారతదేశాన్ని కదిలించాలని మొదటిసారి ఆలోచించినవారు జతీన్. ఈ పనిలో జర్మనీ సాయం తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం చిరస్మరణీయమైనది. రామకృష్ణ పరమహంస, వివేకానంద బోధనలు, శిష్యరికంతో ఆయన తన జాతీయవాద దృష్టిని మలచుకున్నారు. ఆధ్యాత్మికత ఆధారంగా సాంస్కృతిక జాతీయవాదాన్ని ఆశించారాయన. అరవిందుల ఆదేశంతో విప్లవ సంస్థను స్థాపించారు. రాస్ బిహారీ బోస్, ఎంఎన్ రాయ్ వంటివారి సాహచర్యంతో జతీన్ విప్లవ పంథాలో నడిచారు. ఆర్థిక పరిపుష్టితో, రాజకీయ స్వేచ్ఛతో, మౌఢ్యం లేని ఆధ్యాత్మిక చింతనతో ఈ దేశం పరిఢవిల్లాలని ఆకాంక్షించారాయన. జతీంద్రనాథ్ ముఖర్జీ (డిసెంబర్ 7, 1879–సెప్టెంబర్ 10, 1915) ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న కయాగ్రామ్ (నాడియా జిల్లా)లో పుట్టారు. తండ్రి ఉమేశ్చంద్ర ముఖర్జీ, తల్లి శరత్శశి. ఈమె కవయిత్రి. తన పిల్లలను ఎంత ప్రేమగా చూసేవారో, అంత అదుపులోనూ ఉంచేవారు. ఆమె నుంచి జతీన్ చిన్నతనంలోనే పురాణ కథలను విన్నాడు. బహుశా తల్లి మాటలలోనే మాతృభూమికి పట్టిన దుస్థితికి గురించి ఆయనకు అవగాహన కలిగి ఉండాలి. పురాణ గాథలతో పాటు బంకిమ్చంద్ర ఛటోపాధ్యాయ గొప్పతనం కూడా అమ్మ నోటి నుంచే జతీన్ విన్నాడు. అలాగే మరొక ప్రముఖ రచయిత యోగేంద్ర విద్యాభూషణ్ (ఇటలీ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డి జీవితాలను బెంగాలీలకు పరిచయం చేసినవారు) గురించి కూడా తల్లి చెప్పేది. మేనమామ బసంత్కుమార్ ఛటోపాధ్యాయ న్యాయవాది. రవీంద్రనాథ్ టాగోర్ ఆయన క్లయింట్. అప్పటికే టాగోర్ స్త్రీలకు సమాన స్థానం కల్పించడం గురించి ప్రజలలో చైతన్యం రేకెత్తించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఐదో ఏటనే జతీన్ తండ్రిని కోల్పోయారు. అయినా ఒక అందమైన, ఆదర్శనీయమైన బాల్యాన్ని ఆయన గడిపారు. బొమ్మలు గీసేవారు. పెద్దలు, వృద్ధుల పట్ల ఉదారంగా ఉండేవారు. పౌరాణిక నాటకాలు, ఆ పాత్రలు అంటే ఆరాధించేవారు. కిషన్నగర్లోని ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్లో చదువు అయిన తరువాత కలకత్తా సెంట్రల్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ చదవడానికి చేరారు. అప్పుడే బెంగాల్లో ప్లేగు వ్యాధి వచ్చింది. సిస్టర్ నివేదిత బాధితుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవకులను పిలిచి సేవలు చేసేవారు. అలా బాధితులకు సేవ చేయడానికి వెళ్లినప్పుడే నివేదిత జతీన్ను వివేకానందకు పరిచయం చేశారు. ఈ దేశానికి సేవలు అందించడానికి ‘ఇనుప కండరాలు,ఉక్కు నరాలు’ కలిగిన యువకుల బృందాన్ని సిద్ధం చేయమని నేరుగా వివేకానందులే యువ జతీన్కు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆంగ్లేయ విద్యా విధానం మీద సహజంగానే ఏవగింపు ఆరంభమైంది. చదువు వదిలి పెట్టి 1899లో ముజఫర్పూర్ వెళ్లిపోయారు. అక్కడ రచయిత, ‘త్రిహూత్ కొరియర్’ పత్రికా సంపాదకుడు, చరిత్రకారుడు, బారిస్టర్ ప్రింగీల్ కెన్నెడీ దగ్గర కార్యదర్శిగా చేరారు. కెన్నెడీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే ఆంగ్లేయుడు. తన పత్రిక సంపాదకీయాలలోను, జాతీయ కాంగ్రెస్ సభలలోను కూడా భారత్లో జరుగుతున్న బ్రిటిష్ దోపిడీ గురించి, భారత జాతీయ సైన్యం ఏర్పడవలసిన అవసరం గురించి మాట్లాడేవారు. ఇది కూడా జతీన్ను ఉత్తేజపరిచేది. 1900 సంవత్సరంలో జతీన్, ఇంకొందరు యువకులు కలసి ‘అనుశీలన్ సమితి’ సంస్థను ఏర్పాటు చేశారు. 1903లో అరవిందులను కలసినప్పుడు రహస్య సంస్థలను స్థాపించమని ఆయన నుంచి సలహా అందింది. ‘జుగాంతర్’ అలాంటి సంస్థే. ‘అనుశీలన్ సమితి’ పైకి వ్యాయామశాలలు నిర్వహించే సంస్థ. కానీ అసలు ఉద్దేశం బ్రిటిష్ పాలన మీద సాయుధ పోరాటం చేసే యువతను సమీకరించడమే. బీరేంద్ర ఘోష్తో కలసి దేవ్గఢ్ అనేచోట బాంబుల నిర్మాణ కేంద్రం కూడా స్థాపించారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాలను దోచేవారు. ఆయన మీద పెట్టిన హౌరా–శిబ్పూర్ కేసు ఇందుకు సంబంధించనదే. కానీ సరైన ఆధారాలు లేక కేసు కొట్టేశారు. 1900 సంవత్సరంలో ఇందుబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు– అతీంద్ర, ఆశాలత, తేజేంద్ర. కానీ 1903లో పుట్టిన పెద్దకొడుకు మూడేళ్లకే కన్నుమూయడంతో » ఘా జతీన్ తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయారు. అదే తరుణంలో భార్య, సోదరితో కలసి తీర్థయాత్రలు చేశారు. హరిద్వార్లో పరిచయమైన స్వామి భోలానందగిరి సాంగత్యంలో పోయిన మనశ్శాంతి మళ్లీ చేకూరింది. జతీన్ నేపథ్యం తెలిసిన ఆ స్వామి మళ్లీ ఉద్యమం ఆరంభించమని, తన సాయం ఉంటుందని ఆశీర్వదిచారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన తరువాత మానవ రక్తం రుచి మరిగిన ఒక చిరుత తిరుగుతోందని తెలిసింది. దీనిని పట్టుకునే క్రమంలో జతీన్ బంధువుల తుపాకీ కాల్చాడు. కానీ గురి తప్పింది. కానీ జతీన్ చిరుతతో బాహాబాహీ తలపడ్డారు. ఒళ్లంతా గోళ్లు దిగి జతీన్ శరీరం విషపూరితమైంది. అయినా తన వద్ద ఉన్న గూర్ఖాలు వాడే ఖుక్రీ కత్తితో పొడిచి చంపారు. దీనికి ప్రభుత్వం జ్ఞాపిక ఇచ్చి, ‘బఘా (పెద్దపులి) జతీన్’ అని పేర్కొంది. అప్పటి నుంచి ఆయన పేరు బఘా జతీన్గా మారింది (ఆ ఖుక్రీ ఇప్పటికీ ఆయన కుటుంబీకుల దగ్గర భద్రంగా ఉంది. పండుగలలో దేవతా విగ్రహాలతో పాటు దానిని కూడా పూజిస్తున్నారు. జతీన్ మరణ వార్త విన్న కుటుంబం మిగిలిన సామానుతో పాటు ఆ ఖుక్రీని కూడా వెంట తీసుకుని అప్పుడు తమ ఇల్లు విడిచి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయింది). ‘మనం మరణిద్దాం! జాతి మేల్కొంటుంది’ అన్న నినాదంతో జతీన్ ఉద్యమాన్ని ఆరంభించారు. జాతీయ కాంగ్రెస్ స్వరాజ్యం అన్నమాట పలకడానికి సిద్ధంగా లేని రోజులలోనే ఆయన సంపూర్ణ స్వరాజ్యం గురించి ఆలోచించారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. బ్రిటన్ పరిపాలనను కూల్చడానికి ఈ యుద్ధ పరిస్థితులను ఉపయోగించుకోవాలని భారతదేశంలోని తీవ్ర జాతీయవాదులంతా ఆలోచించారు. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూక్తిని అనుసరించి జర్మనీతో మంతనాలు ఆరంభించారు. ఆ క్రమంలోనే జతీన్కు ఒక అవకాశం కాళ్ల వరకు వచ్చింది. జర్మనీ యువరాజు 1912లో కలకత్తా వచ్చారు. జతీన్ ఎలాగో ఆయనను కలుసుకోగలిగాడు. భారతదేశం నుంచి ఇంగ్లండ్ జాతిని తరిమికొట్టేందుకు, సామ్యవాద దేశంగా ఏర్పాటు చేయడానికి సహకరించాలని; ఇందుకు సాయుధ పోరాటానికి ఆయుధాలు ఇప్పించాలని కోరారు. ఆయుధాలు పంపించడానికి ఆయన దగ్గర ప్రమాణం కూడా తీసుకున్నారు. అప్పటికే ఇక్కడ ఆయుధ సేకరణకు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని సేకరించే బాధ్యత జతీన్ ఎంఎన్ రాయ్కి అప్పగించారు. జర్మనీ నుంచి ఆయుధాలతో వచ్చే నౌకను ఒడిశాలోని బాలసోర్ జిల్లా తీరంలో ఆపాలని నిర్ణయించారు. ఈ నౌక కోసం జతీన్ ఆయన సహచరులు ఎంతో ముందే కప్తిపడా అనే గ్రామం చేరుకుని రహస్యంగా జీవించారు. కానీ నౌక రాలేదు (ఈ ఉదంతం కూడా ఇండో జర్మన్ కుట్రకేసులో భాగం). జర్మనీ నుంచి ఆయుధాలు పంపాలన్న ఆలోచనలో, ఆ నౌక తూర్పు తీరంలో బాలసోర్ జిల్లా తీరంలో ఆగాలన్న నిర్ణయంలో లోపం లేదు. కానీ ఈ పథకం గురించి ఇ.వి. వోస్కా అనే చెక్ గూఢచారికి తెలిసిపోయింది. అతడు ఈ రహస్యాన్ని బ్రిటిష్ అధికారులకు అమ్ముకున్నాడు. ఈ బాలసోర్ పంపడానికి ఆయుధాలు అమ్మిన వ్యాపారి కూడా ఇలాగే వ్యవహరించాడు. నిజానికి ఆయుధాలతో జర్మనీ నుంచి నౌక బయలుదేరిన సంగతి కూడా జతీన్కు తెలిసింది. దీనితో జతీన్ బృందం కొండల మార్గంలో రెండురోజుల పాటు నడిచి మయూర్భంజ్ చేరుకుంది. బాలసోర్ దగ్గరే చషాఖండ్ అనే గ్రామంలో ఒక చిన్న కొండ ఎక్కి నౌక కోసం చూస్తున్నారు. అప్పుడే బలగాలు చుట్టుముట్టాయి. కలకత్తా, బాలసోర్లలో ఉండే పోలీసులు, భద్రక్ దగ్గరి చాంద్బలి నుంచి ఒక ఆర్మీ బృందం అందులో ఉన్నాయి. విప్లవకారుల దగ్గర మాసెర్ రివాల్వర్లు తప్ప పెద్ద ఆయుధాలు ఏమీ లేవు. కానీ బ్రిటిష్ బలగాలు శక్తిమంతమైన ఆయుధాలతో వచ్చాయి. రెండు గంటలే యుద్ధం జరిగింది. జతీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరునాడే బాలసోర్ ఆస్పత్రిలో చనిపోయారు. కొద్దిమందే అయినా జతీన్ బృందం కూడా వీరోచితంగా పోరాడి కొందరు బ్రిటిష్ సిబ్బందిని మట్టుపెట్టగలిగింది. జతీన్ వంటి గొప్ప యోధుడు, చింతనాపరుని గురించి కూడా సరైన సమాచారం చరిత్ర పుస్తకాలలో దొరకకపోవచ్చు. కానీ నాటి కథనాలు, అందులో జతీన్ గురించి వ్యక్తమైన అభిప్రాయాలు గమనిస్తే ఆయన ఎంతటి సమున్నతుడో తెలుస్తుంది. మింటో, హార్డింజ్ అనే ఇద్దరు గవర్నర్ జనరళ్లు కూడా ఆయన కార్యకలాపాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చార్లెస్ అగస్టస్ టెగ్రాట్ నాటి ప్రముఖ పోలీసు అధికారి. ఇతడు, ఇంగ్లండ్లో కనుక పుట్టి ఉంటే, ట్రెఫాల్గర్ కూడలిలో అతడి విగ్రహాన్ని నెల్సన్ విగ్రహం పక్కన నెలకొల్పేవారు అని వ్యాఖ్యానించాడు. జతీన్ ఉత్తర, తూర్పు భారతాలలో విప్లవ కార్యకలాపాల కోసం పునాదులు వేసుకుంటూ, ఆగ్నేయాసియా, అమెరికా, ఐరోపాలలో భారతీయులు జరుపుతున్న బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలను సమన్వయం చేయడానికి కృషి చేశారు. జర్మనీ నుంచి సాయం అందిన తరువాత దేశమంతటా ఒకేసారి తిరుగుబాటు చేయాలని స్నేహితుడు రాస్ బిహారీ బోస్తో కలసి ఆయన ఆలోచించాడు. ఈ తరం త్యాగాలు చేస్తేనే భవిష్యత్తరాలు తలెత్తుకు బతకగలవన్న సిద్ధాంతంతోనే జతీన్ ముందుకు న డిచారని ఆయన మనుమడు, జీవిత కథ రచయిత పృథ్విన్ ముఖర్జీ రాశారు. జతీన్ బాహాబాహా తలపడి ఒక క్రూరమృగాన్ని చంపారు. మనిషి రూపంలో ఉన్న ఈ బెంగాల్ టైగర్ను చుట్టుముట్టి చంపవలసి వచ్చింది. - డా. గోపరాజు నారాయణరావు -
నిజం చెప్పండి.. మీకు స్నేహితులు ఉన్నారా?
మైత్రీబంధానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉండదంటారు. ఆ బంధం గురించి రాయడం, చెప్పడం కూడా అలాంటిదే. మొదలు పెట్టడం సులభమే. అదేమిటో, ఎవరెలా అర్థం చేసుకున్నారో, వ్యాఖ్యానించారో చెప్పుకుంటూ వెళ్లిపోవచ్చు. ముగింపు మాత్రం అందదు. పైగా స్నేహమనే భాషలో ఉండేవి పదాలు కాదు, అర్థాలేనట. కాబట్టి స్నేహమంటే ఏమిటో ఆవిష్కరించేటప్పుడు పదాలు పలాయనం చిత్తగిస్తాయి. ఒకే ఒక్క గులాబీ నా పూదోట కాగలదు. ఒక్క మిత్రుడే నా యావత్ప్రపంచం కూడా కాగలడు అన్నారొకాయన. మహాకవి కాల్రిట్జ్ ఏమన్నాడు, ‘ప్రేమ ఒక పుష్పం వంటిదైతే, స్నేహం నీడనిచ్చే చెట్టు’ అని. ఎవరు చెప్పినా మైత్రీబంధం అంటే రెండు గుండెల మధ్య భాషణమేననే, పెదవుల మీద నుంచి అలవోకగా జారిపోయే మాట కాదు అనే. అదెలాగంటే, నా హృదయ గీతం ఏదో తెలిసినవాడే మిత్రుడు, ఆ గీతాన్ని మరచినప్పుడు నా కోసం పాడి వినిపించేవాడే మిత్రుడు’ అన్నారొకాయన. రక్తబంధానికి మించిన గాఢత్వం, కేవల బంధుత్వానికి అతీతమైన దగ్గరతనం, అంతరాలూ అంతస్తులూ పట్టించుకోని స్వచ్ఛత స్నేహంలో ఉంటాయంటారు. మార్టిన్ లూథర్ కింగ్ (జూ), ‘శత్రువుల మాట కాదు, మిత్రుల మౌనం గురించే మనం అంతిమంగా గుర్తు చేసుకుంటాం’ అన్నారు. స్నేహంలోని గొప్పతనమంతా ఆ మౌనమే. అయినా, ‘స్నేహబంధాలు చాలా ఉన్నాయి, కొన్నింటిలో స్వార్థం కూడా సహజం’ అంటాడు మన చాణక్యుడు. దీనిని మాత్రం కొట్టి పారేయలేం. జీవితకాలంలో చాలామంది కలుస్తారు. బాల్యంలో, కళాశాలలో, ఉద్యోగ జీవితంలో మనకి ఎన్నెన్నో పరిచయాలు అవుతాయి. ఇరుగు పొరుగు కూడా ఉంటారు. స్నేహం ఏ క్షణంలో మొదలవుతుందో, పరిచయం స్నేహమై వికసిస్తుందో లేదో ఆ క్షణంలో తెలియదు కూడా. ఈ ప్రయాణంలో ఏదో ఒక మైలురాయి దగ్గర లేదా మలుపులోను ఎందరో నిష్క్రమిస్తారు. ఎవరో మిత్రులుగా మిగులుతారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి సంతోషాలు, ఇద్దరి విషాదాలు ఉమ్మడి సహజాతాలుగా మారిపోతాయి. మారిపోవాలి. అలాంటి వారే స్నేహితులు. మనుషులు ఎక్కడ ఉన్నా, ఎంతదూరంలో ఉన్నా మనసులు మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఇద్దరి మనుషుల మధ్య ఉన్న స్నేహం అనే ఆ భావనకి రూపం లేదు. అది వర్ణనకి అందేది కూడా కాదు. దాని గాఢత, స్వచ్ఛత అనుభవించాలి తప్ప, మాటలకు అందేది కూడా కాదు. అందుకే కొన్ని ఉదాహరణల ద్వారానే మైత్రీతత్వం గురించి, గొప్పతనం గురించి చెప్పుగలుగుతాం. మిత్రత్వానికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవమే కనిపిస్తుంది. ఏ కాలంలో అయినా స్నేహబంధం విలువైనదే. పురాణకాలంలో, చరిత్రలో వర్తమానకాలంలో స్నేహబంధం ఔన్నత్యం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. స్నేహితులలో దాదాపు ఎవరూ సమ హోదాలో ఉన్నవారు కానరారు. స్నేహానికి అంతరాలు ఉండవన్నది కూడా పురాతన కాలం నుంచి వస్తున్న పరమ సత్యమే. రామాయణంలో శ్రీరామచంద్రుడు ప్రభువు. క్షత్రియుడు. సూర్యవంశీయుడు. ఆయనకు ఆప్తమిత్రులైనవారంతా సర్వసాధారణమైనవారు. సుగ్రీవుడు, గుహుడు రాముని మిత్రులు. సుగ్రీవుడు వానరరాజు. గుహుడు పడవ నడిపే అదివాసి. రాక్షసరాజు రావణుడు, వానరవీరుడు వాలి కూడా మిత్రులు. వీరి స్నేహం విచిత్రమైనది. వైరం జాడ కూడా అందులో ఉంది. వాలి అంటే రావణునికి ఒకింత భయం కూడా. నన్ను చాటు నుంచి కొట్టావెందుకు? నాతో ఒక్కమాట అంటే రావణుని ఆదేశించి, అతడి చెరలో ఉన్న సీతమ్మకు క్షణాలలో విముక్తిని కల్పించేవాడిని కదా రామా! అని కూడా రాముడిని వాలి నిష్ఠురమాడతాడు. రాముని వైరి శిబిరంలోని త్రిజట జానకితో స్నేహం పెంచుకుంటుంది. ధైర్యం చెబుతుంది. తరువాత రావణాసురుని సోదరుడు విభీషణుడు కూడా రాముని మిత్రబృందంలో ఒకడవుతాడు. అంటే తామున్న వర్గంలోని చెడును, వైరిపక్షంలోని మంచిని గ్రహించి, దానిని స్నేహం ద్వారా వ్యక్తం చేసిన పాత్రలు ఇవి. కృష్ణుడు ద్వారక ప్రభువర్గంలోని ప్రముఖుడు. యాదవరాజు బలరాముని సొంత సోదరుడు. కానీ సాందీపుని ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆయనకు సుధాముడు మిత్రుడయ్యాడు. ఆశ్రమం నుంచి ఎవరి ఊరికి వారు వెళ్లిపోయారు. కానీ పేద బ్రాహ్మణుడైన సుధాముడు తనకు సాయం చేయమని ద్వారక వెళ్లి కృష్ణుడిని కలుసుకుంటే సాయమందించాడు. అది ముష్టి వేయడం కాదు. గొప్ప ఆదరంతో, గౌరవంతో చేసిన సాయం. మహాభారతంలో స్నేహానికి నిర్వచనం చెప్పే పాత్రలు ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ ప్రధాన పాత్రలే కూడా. సుయోధనుడు–కర్ణుడు, కృష్ణుడు–అర్జునుడు గొప్ప మిత్రులు. కృష్ణార్జునులకు బావాబావమరిది బంధం ఉన్నప్పటికీ స్నేహమే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. సూతపుత్రుడైన కర్ణునికి అంగరాజ్యం అప్పగించి క్షత్రియుల సరసన నిలిచి యుద్ధ విద్యలలో పోటీ పడే అవకాశం కల్పించాడు దుర్యోధనుడు. ఇందుకు కర్ణుడు చూపిన కృతజ్ఞతా భావం ఆ పాత్ర పట్ల ఎవరికైనా గొప్ప గౌరవాన్ని పెంచుతుంది. దీనికి ప్రాతిపదిక స్నేహమే. ద్రుపద మహారాజు, ద్రోణుల స్నేహ బంధం మరొక రకమైనది. ఆ ఇద్దరూ ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించినప్పుడు స్నేహితులయ్యారు. తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్య పాలకుడయ్యాడు. ద్రోణుడు గొప్ప యుద్ధ విద్యల గురువుగా పేర్గాంచినా, పేదరికం నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో సాయం కోరి వెళ్లిన ద్రోణుడిని బాల్య సఖుడు ద్రుపదుడు అవమానించి పంపుతాడు. తరువాత అర్జునునికి విద్య నేర్పి ద్రుపదుని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. భారతదేశంలో, చింతనలో స్నేహానికి ఎంతటి విలువ ఉండేదో ఈ పాత్రల ద్వారా తెలుస్తుంది. స్నేహితుల మధ్య బాంధవ్యాన్ని చెప్పేవి కొన్ని. స్నేహధర్మాన్ని విడనాడిన వారికి పట్టిన గతిని వెల్లడించేవి ఇంకొన్ని. గొప్ప మిత్రులకు ఈ లోకంలో లోటు లేదనే చెప్పాలి. మనుషులకు సాటి మనుషులతో మైత్రి నెరపవలసిన అవసరం అలాంటి కూడా. కానీ సాధారణ ప్రజలు స్నేహానికి ఎంత విలువను ఇచ్చారో లోకమంతటికీ తెలిసే అవకాశం లేదు. స్నేహబంధానికి విలువను ఇచ్చి ఇక్కట్లు పడుతున్న స్నేహితుడినీ, అతడి కుటుంబాన్నీ అక్కున చేర్చుకున్న సాధారణ ప్రజల సంఖ్య అపారంగానే ఉంటుంది. కానీ లోక ప్రసిద్ధులైన వారి స్నేహబంధం గురించే అందరికీ తెలుస్తుంది. రాజకీయ నాయకులు, చలనచిత్ర రంగ ప్రముఖులు, క్రీడారంగంలో ఖ్యాతి ఉన్న వారి మైత్రీబంధం గురించిన కథనాలు అందరికీ అందుతూ ఉంటాయి. ఎలుగు ఏం చెప్పింది? ఒకసారి సాయం అందుకుంటే సాయం చేసినవారు, ఆ సాయం అందుకున్నవారు మిత్రులవుతారు. ఈ నీతిని చెప్పే కథలు మన సాహిత్యంలోను, బయటి ప్రపంచంలోని సాహిత్యంలోను విశేషంగా కనిపిస్తాయి. మిత్రునిగా నటించేవారికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పే చక్కని కథ ఇది. ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి వెంబడి పొరుగూరు వెళుతున్నారు. కొంతదూరం నడిచాక అలసిపోయారు. చుట్టూ పరిశీలించి అడవి జంతువులు వచ్చే అవకాశం ఏదీ లేదని నమ్మి ఒక చెట్టు కింద పడుకున్నారు. నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి ఏదో అలజడి అయి ఒక మిత్రుడికి మెలకువ వచ్చింది. చూస్తే ఏముంది! ఒక భయంకరమైన ఎలుగు సమీపంగా వచ్చేసింది. మెలకువ వచ్చిన ఆ మిత్రుడు చటుక్కున లేచి ఒక కొమ్మ అందుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. మిత్రుడిని లేపలేదు. ప్రమాదం నుంచి తప్పించే యత్నం కొంచెం కూడా చేయలేదు. ఎలుగు నిద్రట్లో ఉన్న మిత్రుడి మీదకు వచ్చేసింది. కానీ ఏమీ చేయలేదు. అతడి చెవి దగ్గర మూతి పెట్టి ఏదో వెతికింది. మొహం వాసన చూసింది. కొద్దిసేపటికి తన దారిన తాను పోయింది. నేల మీద ఉన్న మిత్రుడు చటుక్కున లేచి, ‘హమ్మయ్య’ అనుకున్నాడు. ‘ఇక చెట్టు దిగిరా, వెళదాం!’ అన్నాడు. ‘నేను చెట్టెక్కినట్టు నీకెలా తెలుసు?’ అడిగాడు ఆ మిత్రుడు కిందకి దిగుతూ. ‘ఎలుగ్గొడ్డు రావడం, క్షణంలో నీవు చెట్టెక్కడం నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ నేను ఒక్క నిమిషం ఆలస్యం చేశాను. అప్పుడు లేచి ఉంటే ఎలుగు చంపేసేదే!’ అన్నాడు ఆ మిత్రుడు. ‘పడుకుని ఉంటే చంపదా?’ సందేహం వ్యక్తం చేశాడు చెట్టు దిగినవాడు. ‘ఊపిరి బిగపట్టి, నేల మీద చచ్చినట్టు పడి ఉంటే ఏం చేయదని ఎవరో చెప్పారు. అదే చేశాను.’ అన్నాడు ఈ మిత్రుడు. ‘మరోక ప్రశ్న.’ నడక మొదలుపెడుతూ అడిగాడు రెండో మిత్రుడు. ‘నీ చెవిలో ఎలుగుబంటి ఏదో గుసగుసలాడిందేమిటి?’ అన్నాడు హాస్యమాడుతూ. సరిగ్గా దొరికాడు, దొంగమిత్రుడు. చురక వేశాడతడు. ‘నీలాంటి మిత్రుడితో కలసి ఎప్పుడూ ప్రయాణం చేయవద్దని చెప్పిందిలే!’ స్వాత్రంత్రోద్యమంలో మిత్రులు భారత స్వాతంత్య్రోద్యమంలో మిత్రులైన వారు, మొదట మిత్రులుగా ఉండి తరువాత ఉద్యమంలో ప్రవేశించినవారు చాలామందే ఉన్నారు. ఫిరోజ్షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, మహమ్మద్ అలీ జిన్నా మంచి మిత్రులుగానే ఉండేవారు. గణేశ్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు ఆరంభించిన బాలగంగాధర తిలక్, జిన్నా మధ్య కూడా స్నేహభావమే ఉండేది. తిలక్ మీద వచ్చిన దేశద్రోహం కేసును తిలక్ మీద గౌరవంతోనే జిన్నా వాదించారు. జిన్నా తనకు ఆప్తమిత్రుడని సరోజినీ నాయుడు అనేక సందర్భాలలో ప్రకటించారు. ఆసియాలోనే గొప్ప న్యాయవాదులుగా పేర్గాంచిన జిన్నా, తేజ్బహదూర్ సప్రూ మధ్య సాన్నిహిత్యం ఉండేది. కానీ జిన్నా, గాంధీ మంచి మిత్రులుగా ఉండలేకపోయారు. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప స్నేహితులు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్, గణేశ్శంకర్ విద్యార్థి వంటి వారి మధ్య మంచి మైత్రి ఉండేది. మన్యంవీరుడు అల్లూరి శ్రీరామరాజు, నేతాజీ అనుచరుడు మద్దూరి అన్నపూర్ణయ్య బాల్య స్నేహితులు. ఈ ఇద్దరూ కాకినాడలో పిఠాపురం రాజావారి విద్యాసంస్థలో సహాధ్యాయులు. ఆధునిక రాజకీయాలలో ఒకే పార్టీలో శత్రువులుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా మైత్రిని నెరపుతున్నవారు కూడా ఉన్నారు. రాజకీయాలలో, అది కూడా ఒకే పార్టీలో ఉంటూ 65 సంవత్సరాల పాటు స్నేహితులుగా ఉండడం ఎవరికైనా సాధ్యమా? కానీ సాధ్యమేనని నిరూపించారు అటల్ బిహారీ వాజపేయి, లాల్కృష్ణ అడ్వాణి. వారిద్దరి స్నేహబంధాన్ని భారత రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా చెబుతూ ఉంటారు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేకపోలేదు. రాకపోలేదు. ‘చాలామంది నీతో కలసి నడుస్తారు. ఒకచోట ఆగిపోతారు. కానీ గుండెలో అడుగుజాడలు వేసేది మాత్రం నీ మిత్రులే’ అంటారు ఎలినార్ రూజ్వెల్ట్. ఆ ఇద్దరి గుండెలలోను అలా పరస్పరం అడుగుజాడలు మిగుల్చుకున్నారని అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం, రాజకీయ చింతన విషయంలో ఇద్దరిదీ చాలావరకు ఒకే అభిరుచి. ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం ఉంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. జనసంఘ్లో రాజకీయనేతలుగా ఎదిగారు. ఎమర్జెన్సీ కాలంలో ఒకేసారి అరెస్టయ్యారు. బీజేపీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చారు. చివరికి అడ్వాణి చిరకాలమిత్రుడు వాజపేయిని ప్రధాని పదవి అభ్యర్థిగా స్వయంగా ప్రకటించారు. హోలీ పండుగను అడ్వాణి నివాసంలో, ఆయనతో కలసి చేసుకోవడం, తనకు ఎంతో ఇష్టమైన కుల్ఫీని మిత్రునితో కలసి తీసుకోవడం వాజపేయికి దశాబ్దాలుగా ఉన్న అలవాటు. వాజపేయి ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరం తన నివాసానికి ఆప్తమిత్రుడు వస్తాడని, ఇద్దరూ కలసి రంగులు అద్దుకుంటారని అడ్వాణీ అనుకోలేదు. పైగా సాధారణంగా వాజపేయి హోలీ రోజు రివాజుగా వచ్చే సమయం కూడా దాటిపోయింది. తరువాత హఠాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్. వాజపేయి అడ్వాణీ ఇంటికి బయలుదేరుతున్నారని. యథాప్రకారం మిత్రునితో కలసి రంగులు పూసుకున్నారు. కలసి కుల్ఫీ తీసుకున్నారు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు, తాను ప్రధానిని అయినా, మిత్రధర్మం విస్మరించలేనని చెప్పక చెప్పారు వాజపేయి. అలాగే పీవీ నరసింహారావుతో కూడా. కాంగ్రెస్ను సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించేవారు వాజపేయి. పీవీ ఆ పార్టీలో ప్రముఖుడు. అయినా ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఉండేది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ, ప్రఖ్యాత సినీ నటుడు అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులు. నిజానికి వారి రెండు కుటుంబాల మధ్య గతం నుంచి ఉన్న బంధమే వీరిద్దరి మధ్య కొనసాగిందని చెప్పాలి. అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ నెహ్రూకు సన్నిహితంగా ఉండేవారు. తరువాత వీరి బాటలు వేరయ్యాయి. అమితాబ్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు. అమితాబ్ అసలు రాజకీయాలనే వదిలేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ మంచి స్నేహితులు. ఇద్దరూ లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రేరణతో రాజకీయాలలోకి వచ్చారు. తరువాత వీరి పంథాలు మారాయి. రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా బాల్య స్నేహితులు. ఇటీవలి కాలంలో క్రీడలు రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడంలో కీలకపాత్ర వహించగలవని నిరూపించుకుంటున్నాయి. ఆ పని క్రికెట్ చాలాసార్లు చేసింది. టి–20 వచ్చిన తరువాత ఖండాంతరాలలో ఉన్న క్రీడాకారులను కూడా సన్నిహిత మిత్రులను చేసింది. సచిన్ టెండూల్కర్–షేన్ వార్న్, యువరాజ్సింగ్–కెవిన్ పీటర్సన్ మంచి మిత్రులయ్యారు. వెస్టిండీస్ క్రీడాకారుడు క్రిస్ గేల్–విరాట్ కోహ్లీ స్నేహితులే. ప్రపంచ చరిత్రలో కూడా మిత్రులైన ప్రముఖులకు కొదవలేదు. అమెరికా స్వాతంత్య్రం పోరాటం తరువాత ఆ దేశానికి రాజ్యాంగ వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినవారు ఇద్దరు– జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్. సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉన్నా, మైత్రీబంధం మాత్రం దృఢమైనదే. ఇద్దరూ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఇంకా చిత్రం– ఇద్దరూ ఒకే తేదీన కన్నుమూశారు–జూలై 4న. స్నేహంతోనే మానసిక ఆరోగ్యం పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా స్నేహితులు ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం సజావుగా ఉంటుంది. తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఎన్నో సంగతులను స్నేహితులతో మనసు విప్పి చెప్పుకుంటారు చాలామంది. స్నేహితులతో కలసి కబుర్లాడుతూ కాలక్షేపం చేయడం వృథా కాలహరణం కానేకాదు. మనసులోని మాటలను పంచుకోగలిగే స్నేహితులు ఐదారుగురైనా ఉన్నవాళ్లు తేలికగా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనల నుంచి బయటపడగలుగుతారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా మనసులోని మాటలు చెప్పుకునే స్నేహితులు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం చక్కగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించగలుగుతారు. చిన్న వయసులోనే పిల్లలు స్నేహబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు. బిడియం వల్ల, సామాజిక భీతి వల్ల కొందరు తేలికగా స్నేహితులను పెంచుకోలేకపోతారు. అయితే, మొహమాటాలను పక్కనపెట్టి స్నేహితులను ఏర్పరచుకుంటేనే మంచిది. స్నేహితులు లేని వాళ్లు ఒంటరితనంతో కుమిలిపోతూ మానసికంగా కుంగిపోతారు. – డాక్టర్ పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ స్నేహగుణమే సామర్థ్యానికి కొలమానం స్నేహబంధం విషయంలో భారతీయులది విశాలమైన దృక్పథమే. ఒక మనిషి సామర్ధ్యానికి కొలబద్ద అతనిలోని స్నేహగుణమే అన్నారు డార్విన్. స్వదేశీయులు ఎవరు పైకి వచ్చినా చూడలేనివాళ్లు భారతీయులు అన్న నింద మధ్య ఈ అధ్యయనం మనకి ఆనందాన్ని ఇచ్చేదే. మనవాళ్లకి జీవితకాలంలో కనీసం ఆరుగురు ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అవుతారట. కానీ ప్రపంచంలో చూస్తే మాత్రం సగటున ఒక వ్యక్తికి 4.3 వంతునే బెస్ట్ మిత్రులు ఉంటారని ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. కానీ సౌదీ అరేబియాలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. అక్కడ ప్రతి మనిషికి సగటున 6.4 లేదా 6.6 మంది మిత్రులు ఉంటారని తేలింది. వీరంతా ఆప్తమిత్రులు. ‘ది ఫ్రెండ్షిప్ రిపోర్ట్’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో చాలా విషయాలే ఉన్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, భారత్, మలేసియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్ దేశాలలో మొత్తం పదివేల మందిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో 13 ఏళ్ల వాళ్ల నుంచి 75 సంవత్సరాల పెద్దల వరకు ఉన్నారు. కానీ ఇందులో ఒక అవాంఛనీయమైన విషయం కూడా తేలింది. 13–23 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎక్కువ మంది మిత్రబృందాన్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు విముఖ చూపుతున్నారట. 40–54 మధ్య వయసువారు ఏడుగురి వరకు ఆప్తమిత్రులను తయారు చేసుకుంటూ ఉంటే 13–23 వయసుల వారికి ఐదుగురు వరకు మాత్రమే ఆప్తమిత్రులు ఉంటున్నారు. జీవిత సహచరితో చేసే ప్రయాణంలో కూడా స్నేహం పరిమళించాలి. ప్రేమ ఉంటేనే చాలదు. వారి మధ్య మైత్రీబంధం కూడా అవసరమే. ‘వివాహాలు విఫలం కావడానికి కారణం వారి మధ్య ప్రేమ లేకపోవడం కాదు, స్నేహబంధం లేకపోవడం’ అంటాడు ఫ్రెడ్రిక్ నీషే. స్నేహం అంటే గౌరవం, నమ్మకమే కదా! పిల్లలతో ఒక వయసులో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలన్న ఆధునిక సత్యాన్ని కూడా గౌరవించి తీరాలి. మారుతున్న కాలంలో గురువులకు శిష్యులకు మధ్య కూడా గౌరవ ప్రదమైన స్నేహబంధం వెల్లివిరియడం అవసరమన్న వాదన కూడా గమనించదగినదే. కాబట్టి స్నేహం ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోను గుబాళించవలసిందే. కానీ ఆధునిక యుగంలో ప్రపంచం కుగ్రామమైంది. మనసుల మధ్య మాత్రం వేల మైళ్ల దూరం పెరిగింది. అందుకే పెంపుడు జంతువులతో మనుషులు స్నేహం చేయవలసిన పరిస్థితి నెలకొంటున్నది. ఈ బంధాన్ని కించపరచడం ఇక్కడ ఉద్దేశం కాదు. గతం నుంచి మూగజీవాలకు, మనుషులకు మధ్య ఉన్న మౌన మైత్రీ బంధం ఇప్పుడు ఇంకొంత బలపడింది. కొత్త రూపు సంతరించుకుంది. స్నేహం ఏర్పడిన తరువాత అంతరాలు అదృశ్యం కావాలి. లేని పక్షంలో అది స్నేహం అనిపించుకోదు. స్నేహం మాటున ఉన్న అవసరమే అవుతుంది. స్నేహానికీ, మాటకీ మధ్య బంధం ఉందంటుంది రుగ్వేదం. మాటలు ఆపేసినా, అబద్ధాలు ఆడినా స్నేహం చెడిపోతుందని కూడా చెప్పింది. మహాభారతంలో భీష్మాచార్యులు నాలుగు రకాల మిత్రుల గురించి ప్రస్తావించాడు. వారు– సహజ మిత్రులు, పురాతన కాలం నుంచి వస్తున్న మిత్రులు, వ్యవహారాలలో మిత్రులు, స్నేహితుల్లా గౌరవం అందుకునే ఉద్యోగులు. ఇక్కడ అల్బర్ట్ కామూ స్నేహబంధంలో సమానత్వం గురించి చెప్పిన ఒక్కమాట గుర్తు చేసుకోవచ్చు. ‘నా వెనుక నడవొద్దు! నేను దారి చూపలేకపోవచ్చు! నా ముందూ నడవొద్దు! నేను అనుసరించలేకపోవచ్చు! నా పక్కనే అడుగులో అడుగెయ్యి! నా మిత్రునిగా ఉండు!’ – డా. గోపరాజు నారాయణరావు -
శ్రీరామ పట్టాభిషేకం
పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకుని రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల వెంట నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని ‘ఇంతకుముందు మేము నలుగురం, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురం అన్నదమ్ములం సుగ్రీవా’ అన్నాడు. పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రలు ఆ వానర కాంతలందరికీ తలస్నానం చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ‘కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో‘ అని ఆజ్ఞాపించాడు. అప్పుడా పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ‘మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్లావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను.‘అన్నాడు. భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. రాముడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత అందమైన పట్టు వస్త్రాలను ధరించి, మంచి అంగరాగాలను పూసుకొని, దివ్యాభరణాలు ధరించి బయటకి వచ్చాడు. కౌసల్యాదేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. సుగ్రీవుడితో సహా వానరులందరూ అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తు్తన్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనకాల వేదపండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నెపిల్లలు, ఆ తరువాత సువాసినులు చేత మంగళద్రవ్యాలతో వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. వానరాలు తీసుకొచ్చిన ఆ జలాలని రాముడి మీద పోసి కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు. ధర్మాత్ముడైన రాముడి పాలనలో ప్రజలకు దొంగల భయం, శత్రు భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండిపోయి ఉండేవి. అందరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్లు గడిచినా ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాను. – డి.వి.ఆర్. భాస్కర్ -
సిరా చుక్క.. నెత్తుటి మరక...
మార్చి 23, 1931... భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను లాహోర్ జైలులో ఉరి తీశారు. ఉరి వార్తతో భారతదేశమంతా ఉలికిపడింది. ఆగ్రహించిన ప్రజానీకం పలుచోట్ల గట్టిగా నిరసనలు తెలిపింది. సరిగ్గా రెండు రోజులకి కాన్పూర్లో ఘోరమైన మత కల్లోలాలు జరిగాయి. ఆ ముగ్గురి ఉరితీతకు నిరసనగా మొదలైన నిరసన కార్యక్రమం మత కల్లోలంగా పరిణ మించడమే పెద్ద విషాదం. పది మందో పాతిక మందో కాదు.. నాలుగు వందల మంది వరకు చనిపోయారు. అలాంటి సమయంలో ఆ రక్తపాతం నుంచి, ఆ మౌఢ్యం నుంచి అటు హిందువులను, ఇటు ముస్లిం మతానికి చెందిన అమాయకులను రక్షించడానికి ఒక జాతీయ కాంగ్రెస్ నాయకుడు, గాంధీజీ అనుచరుడు నేరుగా రంగంలో దిగారు. అదే అదనుగా ఒక మూక ఆయన మీద పడి, కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసింది. రెండురోజులకు గాని ఆయన మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆయనే గణేశ్శంకర్ ‘విద్యార్థి’. ఆ మార్చి 9న జరిగిన గాంధీ–ఇర్విన్ ఒప్పందంలో భాగంగా గణేశ్శంకర్ను సీతాపురి జైలు నుంచి విడుదల చేశారు. వైస్రాయ్ ఇర్విన్తో గాంధీ జరిపిన ఆ చర్చలలోనే భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ల ఉరిశిక్ష అమలు నిలిపివేత అంశాన్ని కూడా చేర్చాలని, అందుకు జవాహర్లాల్ నెహ్రూ సాయం తీసుకోవాలని విద్యార్థి సలహా కూడా ఇచ్చారు. ఆ ఫిబ్రవరి చివర విద్యార్థి నుంచి ఇలాంటి సలహా తీసుకున్న మహనీయుడే చంద్రశేఖర ఆజాద్. కానీ, విద్యార్థి సలహా మేరకు అలహాబాద్ వెళ్లి నెహ్రూను కలుసుకున్న ఆజాద్కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంకా విషాదం– అలహాబాద్లోనే ఆనందభవన్ నుంచి అల్ఫ్రెడ్ పార్కుకు రహస్యంగా చేరుకున్న ఆజాద్ ఆచూకీ పోలీసులకు తెలిసిపోయింది. చుట్టుముట్టి కాల్చి చంపేశారు. అంటే మొదట ఆజాద్, తరువాత భగత్సింగ్ విప్లవ త్రయం, చివరిగా విద్యార్థి చనిపోయారు. ఇదొక గొలుసుకట్టు కుట్ర అంటారు సమకాలీకులు, విద్యార్థి కుమార్తె విమల. గాంధీజీ చర్చించి బయటకు తెచ్చిన విద్యార్థినీ, చర్చించకుండా విడిచిపెట్టిన ఆ విప్లవ త్రయాన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వమే మట్టుపెట్టింది. ఇదొక చారిత్రక వైచిత్రి. గణేశ్శంకర్ ‘విద్యార్థి’ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడా? హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో విప్లవ కార్యకలాపాలు సాగించిన ఆజాద్, భగత్సింగ్ తదితరుల ఆలోచనల పట్ల సంఘీభావం ఉందా? ఆనాటి ఉద్యమ నేపథ్యాన్ని బట్టి ఈ రెండు అంశాలు భిన్నధ్రువాలే అయినా, ఆ రెండింటికీ ఒక్కటే జవాబు, అవుననే. విద్యార్థిలో జాతీయ కాంగ్రెస్ పట్ల భక్తి, తీవ్ర జాతీయవాదం పట్ల సంఘీభావం, కార్మిక–రైతు సమస్యల మీద పోరాటం త్రివేణీ సంగమంలా కనిపిస్తాయి. అందుకే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విద్యార్థి స్థానం విశిష్టంగా కనిపిస్తుంది. గణేశ్శంకర్ విద్యార్థి (అక్టోబర్ 26,1890–మార్చి 25, 1931) ఒక పేద కుటుంబంలో పుట్టారు. అలహాబాద్ సమీపంలోన అట్టార్సుయి ఆయన జన్మస్థలం. తల్లి గోమతీదేవి. తండ్రి జయనారాయణ్, ఉపాధ్యాయుడు. ఆయన మంగౌలి (నేటి మధ్యప్రదేశ్, అశోక్నగర్ జిల్లా)లో, విదిశలలో పనిచేశారు. విద్యార్థి తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసినా, పేదరికం వల్ల ఉన్నత పాఠశాల పరీక్షను 1907లో ప్రైవేటుగా రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత కాయస్థ ఉన్నత పాఠశాలలో చేరినా అక్కడ కూడా పేదరికంతోనే కొనసాగలేకపోయారు. మొదట టంకసాలలో గుమాస్తాగా చేరారు. ఆపై కాన్పూర్ వచ్చి ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేశారు. కానీ ఆయన ఆ ఉద్యోగాలలో ఇమడలేకపోయారు. ఆయన అభిరుచి అంతా పత్రికా రచనే. 16వ ఏటనే ‘హమారీ ఆత్మోగసర్గర్’ అనే పుస్తకం రాశారాయన. ప్రపంచ ప్రఖ్యాత రచయిత విక్టర్ హ్యూగో ‘93’ నవలను అనువదించారు. ఆ రోజులలో పత్రికా రచన, జాతీయోద్యమం వేరు చేసి చూడలేనివిగా ఉండేవి. ఆ సమన్వయమే విద్యార్థిలో కూడా కనిపిస్తుంది. మొదట ఆయన ‘కర్మయోగి’ (గదర్వీరుడు పండిట్ సుందర్లాల్ స్థాపించారు), ‘స్వరాజ్య’ పత్రికలకు పంపిణీదారుగా పనిచేశారు. ఆ పని చేస్తూనే రచనలు పంపించడం కూడా ఆరంభించారు. ఆ రచనల కోసం ఆయన పెట్టుకున్న పేరు ‘విద్యార్థి’. విద్యార్థి అని తన పేరు చివర ఎందుకు తగలించుకున్నారో కూడా వివరించారు. జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. అలాంటి సమయంలోనే పండిట్ మహావీర్ ప్రసాద్ ద్వివేది దృష్టిలో పడ్డారు విద్యార్థి. ఆధునిక హిందీ పత్రికా రచనకు ఆద్యునిగా ద్వివేదీని గౌరవిస్తారు. ఆయనే విద్యార్థిని పిలిచి తన సాహిత్య పత్రిక ‘సరస్వతి’లో ఉప సంపాదకునిగా(1911) నియమించారు. విద్యార్థికి హిందీభాషా సాహిత్యాలంటే ఎనలేని ఇష్టమే ఉన్నా, భారతీయులు జరుపుతున్న రాజకీయ, సామాజికోద్యమాలను వ్యాఖ్యానించడమంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారు. ఇదే ఆయనను ఆనాడు పేర్గాంచిన రాజకీయ పత్రిక ‘అభ్యుదయ’లో చేరేటట్టు చేసింది. చివరికి 1913లో కాన్పూర్ వచ్చి ‘ప్రతాప్’ వారపత్రిక ఆరంభించారు. అరకొర ఆదాయంతోనే అయినా చివరికంటా ఆ పత్రిక సంపాదకునిగానే పనిచేశారు. ‘అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిని నేను. ఉద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదారులు, కులీనులు ఎవరు ఈ పనికి పాల్పడినా నేను వారిపై పోరాడతాను. అమానవీయతకు వ్యతిరేకంగా నా ప్రాణమొడ్డి పోరాడతాను. అందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడని కాంక్షిస్తున్నాను’ అని ఒక సందర్భంలో విద్యార్థి చెప్పారు. ఆయన పత్రిక విధానం దాదాపు ఇదే. రాయబరేలీ రైతాంగ సమస్యల మీద, కాన్పూరులోని మిల్లు కార్మికుల వెతల గురించి ప్రతాప్ వారపత్రిక పోరాడింది. విద్యార్థి కార్యక్ష్రేతం కాన్పూరే. హిందుస్తానీ బిరాదారి అనే సంఘం పేరుతో మత సామరస్యం కోసం ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించారాయన. కాన్పూర్ మజ్దూర్ సభ ఆయన నాయకత్వంలోనే నడిచింది. గాంధీజీ 1916లో లక్నోలో పర్యటించారు. అప్పటి నుంచి విద్యార్థికి గాంధీజీ అంటే భక్తి ఏర్పడింది. 1919లో గానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం గాంధీజీ చేతికి రాలేదు. కాంగ్రెస్ అంటే కేవలం విద్యావంతుల సంస్థ కాదనీ, సాధారణ ప్రజలకు కూడా ఇందులో స్థానం ఉండాలనీ గాంధీజీ ఆశించి, అమలు చేశారు. కానీ జనవరి 11, 1915లో విద్యార్థి చెప్పిన ఈ మాటలు పరిశీలిస్తే విస్తుపోతాం. ‘మన రాజకీయ సిద్ధాంతం, మన ఉద్యమం ఇంగ్లిష్ చదువుకున్న ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదన్న వాస్తవం గుర్తించవలసిన సమయం ఆసన్నమైంది. ఇవి సామాన్య ప్రజల చెంతకు చేరాలి. ఎవరో కొందరి వ్యక్తిగత అభిప్రాయాలే మొత్తం భారతీయలందరి అభిప్రాయంగా పరిగణించలేం. ప్రజాభిప్రాయం ఏదో అదే ప్రజాస్వామ్య నిబంధన అవుతుంది’ అన్నారు విద్యార్థి. అలాగే రైతుల ప్రాధాన్యం గురించి విద్యార్థికి సమున్నత అభిప్రాయం ఉండేది. హోమ్రూల్ సభ్యునిగా 1917–18 మధ్య ఆయన మొదటిసారి కాన్పూర్లో జౌళి కార్మికుల చేత సమ్మె చేయించారు. 1920లో ప్రతాప్ను దినపత్రికను చేసి, రాయ్బరేలీ రైతాంగ ఉద్యమాన్ని సమర్థించినందుకు జైలుకు వెళ్లవలసి వచ్చింది. జీవితంలో ఐదుసార్లు ఆయన కఠిన కారాగారం అనుభవించారు. చట్టసభలకు పోటీ చేయాలని 1925లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యార్థి మధ్య పరిగణాల కౌన్సిల్కు ఎన్నికయ్యారు. మార్చి 9, 1931న విడుదలైన విద్యార్థి కరాచీలో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశాలకు బయలుదేరే సన్నాహంలో ఉన్నారు. ఇంతలోనే భగత్సింగ్ త్రయాన్ని ఉరి తీయడం, అందుకు నిరసన పేరుతో కాన్పూర్లో అల్లర్లు చెలరేగడం జరిగిపోయాయి. భగత్సింగ్ విప్లవ త్రయాన్ని ఉరి తీసిన తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కానీ కాన్పూర్లో పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. అందుకు కాన్పూర్లోని చైతన్యం, అక్కడి కార్మికోద్యమం, కాంగ్రెస్ ఉద్యమం, విప్లవకారుల కదలికలు కారణం. వీటన్నిటిని అనుసంధానం చేసిన వారు విద్యార్థి. 1924లో మౌలానా హస్రత్ మొహానీ అనే వ్యక్తి ద్వారా విద్యార్థి భగత్సింగ్ను కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయులయ్యారు. భగత్సింగ్కు కొన్ని మాసాల పాటు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, తన పత్రికలో కాలమ్ కూడా ఇచ్చారు విద్యార్థి. తరువాత చంద్రశేఖర ఆజాద్తో పరిచయం ఏర్పడింది. కాంగ్రెస్లో తనకున్న పరిచయాలను బట్టి నెహ్రూతో ఆజాద్ సమావేశం కావడానికి అవకాశం కల్పించారు. ఇర్విన్తో చర్చల సమయంలో భగత్సింగ్ అంశం కూడా గాంధీ లేవనెత్తేటట్టు నెహ్రూ ద్వారా ఒప్పించాలన్నదే ఆజాద్, విద్యార్థిల ఆశయం. కానీ అది సాధ్యం కాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఉపన్యాసం ఇచ్చి జైలు శిక్ష అనుభవిస్తున్న విద్యార్థిని విడుదల చేశారు. భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్లను ఆదరాబాదరాగా ఉరి తీశారు (నిజానికి తీర్పు ప్రకారం మార్చి 24న భగత్సింగ్, మిగిలిన ఇద్దరినీ ఉరి తీయాలి. కానీ దానిని 11 గంటలు ముందుకు జరిపారు). కాన్పూర్ గొడవలు మొదలయ్యాయి. ఇది ఒక సీఐడీ కుట్ర అని విద్యార్థి కుమార్తె విమలా విద్యార్థి వెల్లడించారు (విద్యార్థి భార్య చంద్రప్రకాశవతి). విద్యార్థి రచనల ప్రచురణకు సంపాదకత్వం వహించిన సురేశ్ సలిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కాన్పూర్ సింహం ఇవాళ చస్తుంది’ అంటూ ఒక సంకేతం ఆ రోజు అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న కొందరి నోటి నుంచి వినిపించినట్టు, అప్పుడే కొన్ని ఆయుధాలు సరఫరా అయినట్టు తనకు విశ్వసనీయంగా తెలిసిందని విమల తెలియచేశారు. ‘రామకథను మసీదు ముందున్న ఖాళీ మైదానాలలో ప్రదర్శించే సంప్రదాయం ఉండేది. కానీ ఆంగ్లేయులు వచ్చి హిందువులు, ముస్లింల మధ్య చీలిక తెచ్చారు’ అని విద్యార్థి నమ్మారు, అదే రాశారు. కానీ మత సామరస్యం కోసం తామంతా చేసిన కృషి అలా తన కళ్లెదుటే నిర్వీర్యం కావడం ఆయనను బాధించి ఉండాలి. ‘గుళ్లూ మసీదులు తగలబడుతుంటే పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. దుకాణాలను దోచుకుంటున్నారు’ అని ఆ సమయంలో ఒక మిత్రునికి రాసిన లేఖలో విద్యార్థి వాపోయారని కాన్పూర్ అలజళ్ల మీద నియమించిన కమిషన్ తెలియచేసింది. ఇదంతా కాన్పూర్లో బలపడుతున్న బ్రిటిష్ వ్యతిరేకతకు లభించిన క్రూరమైన జవాబు. విద్యార్థి మరణించేనాటికి ఆయన వయసు 40 ఏళ్లు. భారత జాతీయ కాంగ్రెస్లో పని చేస్తున్నా, గణేశ్శంకర్ విద్యార్థికి పరిచయం ఉన్నంతమంది విప్లవకారులు మరొక నేత ఎవరికీ లేరని ఆనాడు ఒక మాట ఉండేది. కానీ చరిత్రలో ఆయన స్థానం చూస్తే ఒక ప్రశ్న వేసుకోకతప్పదు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో స్థానం కావాలంటే జాతీయ కాంగ్రెస్లో పనిచేయడంతోనే సరిపోదు, జాతీయ కాంగ్రెస్కు బయట ఉండి పోరాడినవారిని, త్యాగాలు చేసిన వారిని కూడా దూరంగా ఉంచాలా? - డా. గోపరాజు నారాయణరావు -
రైటర్ కాపీరోవా ఆండ్రూ కథనం ప్రకారం..
‘‘ఏమయ్యా రైటరు!.. ఏ సినిమా చూశావూ... ఏ కథ రాశావూ?’’ అడిగాడు దున్నపోతు రత్తయ్య. నిజానికి ఆయన ఇంటి పేరు ‘దున్నపోతు’ కాదు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా ‘దున్నపోతు’. దీంతో ‘దున్నపోతు రతయ్య’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం రైటర్ కాపీరోవా ఆండ్రూ నికోల్ గురించి చెప్పుకుందాం... పేరు చూసి కాఫీ పొడిలో కాలెయ్యవద్దు. వీరు పదహారణాల ఆంధ్రులు. వీరి స్వగ్రామం మండపేట తాలూకలోని లింగపేట. వీరి అసలు పేరు మల్లెల డొల్లయ్య. పై చదువుల కోసం తల్లిదండ్రులు పట్నానికి పంపిస్తే... తెలుగు సినిమా చరిత్రను తిరగరాయాలనే కసితో కాలేజీ ఎగ్గొట్టేవాడు. ప్రతి తాజా సినిమా చూసి విశ్లేషించేవాడు. ‘‘ఆడు అలా తీశాడు కాని... నేను డైరెక్టర్ అయితే ఇలా తీసేవాడిని’’ అని కొత్త స్క్రీన్ప్లే చెప్పేవాడు. ‘‘డైరెక్టర్ కావడం అంత వీజీ కాదు... ముందు రైటర్ అవ్వు. ఒక్క సినిమా హిట్ అయినా చాలు డైరెక్టరై పోవచ్చు’’ అని ఎవరో సలహా ఇచ్చారు. ‘‘నా జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు... రైటర్ ఎలా అవుతాను?’’ సమంజసమైన డౌటు అడిగాడు డొల్లయ్య. ‘‘రైటర్ కావడానికి చదవాల్సింది పుస్తకాలు కాదు... చూడాల్సింది యూట్యూట్లో సినిమాలు’’ అని సలహా ఇచ్చాడు హితుడు. అలా డొల్లయ్య చూడని సినిమా లేదు. హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు అన్నిటినీ కంటితో నమిలి మింగేశాడు. న్యూమరాలజిస్ట్ సలహాతో తన పేరును ‘కాపీరోవా ఆండ్రూ నికోల్’గా మార్చుకున్నాడు. ‘‘సార్ మొన్న క్రిమినల్ సినిమా చూసి... కొత్త కథ తయారుచేశానండీ...’’ అని గొంతు సవరించాడు కాపీరోవా ఆండ్రూ నికోల్. ‘‘తెలుగు సినిమా చూసి ఏం కాపీ కొట్టావయ్యా బాబు!’’ ఆశ్చర్యంగా అడిగాడు దున్నపోతు రత్తయ్య. ‘‘నేను చూసింది నాగార్జున, మనీష కోయిరాలా, మహేష్భట్టు క్రిమినల్ కాదండీ! అమెరికన్ యాక్షన్ థ్రిల్లరండీ’’ అన్నాడు అరనవ్వుతో నికోల్.. ‘‘అందులో ఏం దొబ్బేశావు?’’ ఆసక్తిగా అడిగాడు దున్నపోతు. ‘‘ఒక బ్రెయిన్ నుంచి మరొక బ్రెయిన్కు మెమొరీస్ ట్రాన్స్ఫర్ చేయడం’’ అని కథ చెప్పడం మొదలుపెట్టాడు కాపీరోవా ఆండ్రూ నికోల్. మన సినిమాలో హీరో పేరు అప్పారావు. పీయంపీ డాక్టరండీ. ఒక్క పేషెంట్గా కూడా ఈయన క్లీనిక్కు రారండి. ఈ డిప్రెషన్లో సైంటిస్టుగా మారి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అలా చేస్తున్న క్రమంలో ‘క్రిమినల్’ సినిమాలో డా.ఫ్రాంక్లాగా మెమోరీ ట్రాన్స్ఫర్ ఫార్ములా కనుగొంటాడు. అంతే... మన అప్పారావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ ఫార్ములా కోసం వేలంపాట మొదలవుతుంది. ఈ వేలంపాటలో ‘శ్రీకాఠిన్య’ అనే విద్యాసంస్థ అత్యధికంగా డబ్బు చెల్లించి ఈ ఫార్ములాను సొంతం చేసుకుంటుంది. ఇక్కడ మనం ‘శ్రీకాఠిన్య’ గురించి చెప్పుకోవాలి. ‘చావో రేవో ర్యాంకో’ (సీఆర్ఆర్) అనే కొత్త విద్యాసంస్థ ధాటికి ‘శ్రీకాఠిన్య’ ప్రాభవం తగ్గిపోయింది. చదువు విషయంలో ‘సీఆర్ఆర్’ ఎంత స్ట్రిక్ట్ అంటే... ఏ విద్యార్థి అయినా సరిగ్గా చదవకపోతే ఒక గదిలో వేసి కొన్ని తెలుగు సీరియల్స్ చూపించి శిక్షించేవాళ్లు. అందుకే తమ పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలని కలలు కనే పేరెంట్స్ ‘ఇక్కడైతేనే బాగుంటుంది’ అని ‘చావో రేవో ర్యాంకో’లో చేర్పించడం ప్రారంభించారు. ఈ దెబ్బకు ‘శ్రీకాఠిన్య’ దివాలా తీసింది. తమ విద్యాసంస్థలను కోళ్లఫామ్లుగా మార్చాలనుకుంటున్న సమయంలో అనుకోని వరం దొరికింది ‘శ్రీకాఠిన్య’కు! అదే మెమొరీ ట్రాన్స్ఫర్!! ‘‘సార్... సిగరెట్ తాగి మిగతా కథ కంటిన్యూ చేస్తాను’’ అని సిగరెట్ ముట్టించాడు రైటర్. ‘‘నాకో డౌటు... అసలే శ్రీకాఠిన్య వాడు దివాలా తీశాడు. ఉప్పుడు ఈ ఫార్ములాతో ఆడేం చేసుకోగలడు?’’ డౌటు అడిగాడు దున్నపోతు రత్తయ్య. ‘‘మంచి డౌటు అడిగారు. ఇంటర్వెల్లో ప్రేక్షకులు దీని గురించే ఆలోచిస్తూ టీలు తాగుతూ, సిగరెట్లు కాలుస్తుంటారు. కథ ఎప్పుడూ సాఫీగా సాగవద్దని మా గురువుగారు చెబుతుంటారు. ప్రేక్షక మహాశయుడు వీలైనంత ఎక్కువగా జట్టు పీక్కునేలా చేయాలట! ఇది కూడా అలాంటి మెలికే! మళ్లీ కథలోకి వద్దాం... ఫార్ములా చేజిక్కించుకున్న వెంటనే పెద్ద ప్రకటన ఇస్తుంది శ్రీకాఠిన్య... ‘‘పేరెంట్స్ మహాశయులకు... నా పిల్లాడు డాక్టర్ కావాలి... ఇంజనీర్ కావాలని ఎవరికి మాత్రం ఉండదు? కలలు ఊరకే రావు. మన కష్టాల్లో నుంచే వస్తాయి. మనలాగా పిల్లలు కష్టపడవద్దనేది ఆ కల. ఆ కలను నిజం చేసుకోవడానికి... మా విద్యాసంస్థలో చేర్పించండి. అవును. మీ డౌటు మాకు అర్థమైంది. ‘మా వాడు చదువులో దద్దమ్మండీ... మా వాడు టెన్త్లోనే అత్తెసరు మార్కులతో పాసయ్యాడు... మావాడు చదువు అనే మాట వినగానే పారిపోతున్నాడు... ఇంకా డాక్టరేం అవుతాడు? ఇంజనీర్ ఏం అవుతాడు... మా బొంద!’ అనే కదా మీ డౌటు! ఇవి పాతరోజులు కావండి. కొత్త టెక్నాలజీ వచ్చిన కొత్తరోజులు. మీ వాడు చదువులో రత్నమా? రాయా? అనేది మాకు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయిని మా కాలేజీలో చేర్పించడమే. అంతే... మీ అబ్బాయిని డాక్టర్నో, ఇంజనీర్నో చేసి మీ చేతిలో పెడతాం. రండి... గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి’’ అంతే...‘శ్రీకాఠిన్య’ కాలేజీలో పుంఖానుపుంఖాలుగా విద్యార్థులు చేరారు. చదువులో వెనకబడినవాడా, ముందు పడినవాడా? అనేదానితో సంబంధం లేకుండా అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు’’ అని కథ ముగించాడు రైటర్ నికోల్. ‘‘హౌ?’’ ఆశ్చర్యంగా అడిగాడు రత్తయ్య. ‘‘ఏం లేదండీ... పరీక్షలకు ఒక రోజు ముందు చదువులో వెనకబడిన విద్యార్థులకు బాగా చదివే విద్యార్థుల మెమొరీస్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంతో జీరో విద్యార్థి సైతం హీరోలా ఆన్సర్పేపర్ రాసి ర్యాంకు తెచ్చుకుంటాడు’’ అసలు విషయం చెప్పాడు రైటర్ నికోలస్. – యాకుబ్ పాషా -
గడ్డిపరకా..! నీకు కూడా చులకనయ్యానా?!
ఎన్టీ రామారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు చాణక్యుడిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘ఆ అలెగ్జాండర్ దేవుడి పుత్రుడట... జగజ్జేత అట కదా!’’... శిష్యుడి నోట ఈ మాట విన్న చాణక్యుడి ముఖం కోపంతో ఎర్రబారింది. ‘‘ఎవడు కూశాడురా ఆ కూత?’’ అని గర్జించాడు. ‘‘అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించి వస్తున్నాడట కదా... మన మగధకే వస్తే’’ ఆందోళనగా అడిగాడు మరో శిష్యుడు. ‘‘నేనిప్పుడు నందరాజుల్ని చూడలిరా’’ అంటూ దేవి ప్రసాదంతో బయలుదేరాడు చాణక్యుడు. ఒకవైపు ప్రమాదం పెనుతుపానులా ముంచుకొస్తోంది. మరోవైపు రాకుమారులు తాగితందనాలు ఆడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ‘‘మహారాజా మహారాజా!’’ అంటూ రాజమందిరంలోకి దేవిప్రసాదంతో వచ్చాడు చాణక్యుడు. ఆ మహానుభావుడు ఎందుకోసం వచ్చాడో కూడా చూడకుండా ఇట్లా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు... ‘‘అరుస్తుంది కుక్క... మన ఆనందాన్ని పాడు చేయడానికి’’ ‘‘నీ అవతారం చూడడానికి మా కళ్లు ఉన్నాయి. భౌభౌ అని అరుస్తావేం బాపడు’’ అంతేకాదు... ఒకడు ‘‘మందు కాదు ఫలరససౌరభం చూస్తావా’’ అంటూ తన గ్లాసులోని మద్యాన్ని చాణక్యుడి ముఖంపై విసిరికొట్టాడు. నవ్వులు! ‘‘ఓయి వెర్రిబాపడా! వీరు భావి సమ్రాట్టులు. వీళ్ల కులాసాను పాడు చేసి శాస్త్రాలు చదివిన నీ కంఠాన్ని ఉరిపాలు చేసుకోవద్దు’’ అని చాణక్యుడిని హెచ్చరించాడు ఆ మదాంధ రాకుమారుల మామ. ‘‘ఏయ్...బుద్ధి లేదా? అలా విస్తుబోయి నుంచోక త్వరగా ఇక్కడి నుండి వెళ్లు..’’ అని చాణక్యుడిని మెడ పట్టి గెంటేడు ఒక రాకుమారుడు. ‘‘మహారాజులారా! ఆ బుద్ధే నన్ను ఇక్కడికి నడిపించింది. నాకింత ఘోర అవమానం జరుగుతున్నా మీకు నచ్చచెప్పమని పంపించింది’’ ఆగ్రహావేదనలతో అన్నాడు చాణక్యుడు. ‘‘ఏది? ఏదది కనిపించదే?’’ వ్యంగ్యంగా అడిగాడు ఒకడు. ‘‘నీకిప్పుడు ఏదీ కనిపించదు గనుకనే జ్ఞానదృష్టిని ప్రసాదించాలని వచ్చాను. కనులు తెరవండి. రానున్న ఘోరవిపత్తును గ్రహించి లెండి. స్వదేశ సంరక్షణకు సంసిద్ధులు కండి. మీ ప్రజలను, ధర్మాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోండి’’ అంత ఘోర అవమానంలోనూ శత్రువుల ముప్పు గురించి హెచ్చరించాడు చాణక్యుడు. మళ్లీ ఎగతాళి మాటలు మొదలుపెట్టారు రాకుమారులు. అయినా వాటిని పట్టించకుకోకుండా... ‘‘రాకుమారులారా సావధాన్! ప్రజలు మిమ్మల్ని రాజులుగా పరిగణించింది ఇలా తప్పతాగి తందనాలాడడానికి కాదు. ఇకనైనా మీ మత్తు, మైకం వదిలించుకోండి. అటు చూడండి... రక్తారుణ కాంతిపుంజములు. అది స్వదేశవీరుల రక్తం’’ అంటూ– ‘‘దేవీప్రసాదం స్వీకరించండి’’ అని ఇవ్వబోయాడు. అంతే! ఒకడు కాలితో ఆ ప్రసాదాన్ని తన్నాడు!! చాణక్యుడి గుండె వెయ్యి ముక్కలైంది. ‘‘నాకురా అవమానం! చూడండి. ఈ సృష్టికి మూలశక్తుల్లారా పంచభూతల్లారా! చూసిరా ఈ దారుణం. ఏమి ఈ వికృత పరిణామం? ఏమి ఈ విలయం? నిరంతరం ధర్మనిష్ఠమైన శరీరం! అహర్నిశలు దేశసేవకై, మానవాళి సుఖశాంతులకై ఆరాటపడుతున్న హృదయం ఎట్టి నీచనికృష్ట దుర్భర అవమానానికి గురైనదో చూసినారా?... దుష్టులు, దుర్మార్గులు, పిరికిపందలు, క్షుద్రులై స్వార్థపిశాచ అవతారముల వలె రేగి ప్రజాద్రోహం చేస్తుంటే, ఆ సమస్త సృష్టికి మూలములైన పంచభూతములైన మీరు ప్రకోపించరేమి? ఆదిశక్తులు... మహాప్రళయంలో వీరిని రూపుమాపరేమి? వేదవిజ్ఞాన వైభమునకు ప్రతినిధి అయిన ఒక విప్రునకు కనివిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దారుణ పరాభవం చూసి దిగ్భ్రాంతి చెంది మ్రాన్పడేవారేమో! కాని ఈ పవిత్ర ఆత్మ సహించదు. ఘోరతి ఘోరంగా ప్రతీకారం చేయక వీడదు. ఇదే నా శపథం. పరమ పవిత్రమైన రాజధర్మాన్ని విస్మరించి ప్రజాద్రోహమునకు పాల్పడిన ఈ కలుష, కర్కశ పాపజాతిని సమూలంగా సర్వనాశనం గావించినగాని ఈ కురులను ముడువను. నా ప్రతికారేచ్ఛ దుర్భర కాదు. అసహాయ కాదు. నా ప్రతికారేచ్ఛ నెరవేరుతుంది. ఇది తథ్యం!’’ అన్నాడు దిక్కులు ఆదిరేలా చాణ్యక్యుడు. చాణక్యుడు ఉదయం ఉన్న చోట మధ్నాహ్నం కనిపించడం లేదు. సాయంత్రం మాత్రం శ్మశానంలో కనిపిస్తున్నాడు. కాసేపు వణుకుతాడు. కాసేపు పిచ్చిగా మాట్లాడుతాడు. ఆ శ్మశానంలో ఒక కపాలం పట్టుకొని తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు... ‘‘ఏ ఘనుడిదో? ఏ జటిల రాజకీయ దురంధరుడితో ఈ కపాలం? చివరకు ఈ వల్లకాటిలో మట్టిపాలు కాకతప్పదు. ఎప్పటికైనా విధి నిర్ణయం ఇదని తెలిసి కూడా మానవుడు అధికార పదవి పటాటోపంతో సుఖభోగ కేళీవిలాస లాలసుడై పశుప్రాయుడు, లోకకంటకుడు అవుతున్నాడు. బుద్ధి అనే ప్రత్యేక పదార్థాన్ని మానవుని తలలో ప్రతిష్ఠించడం ఆ భగవంతుని ఘనత. ఆ బుద్ధిని లోకక్షేమానికి కాకుండా దురహంకారంతో స్వార్థానికి వినియోగించడం మానవుడి ఆధిక్యత. ఇన్ని ఆలోచనలు ఉన్నా అణుమాత్రమైనా వివేకం ఈ జనుడికి ఎందుకు ఉండదు! ఆ వివేకమే ఉంటే ఈలోకం స్వర్గతుల్యమయ్యేదే! అయ్యయ్యో! అలా అయితే ఎలా? ఈ చాణక్యుడికి లోకోద్ధరణ కోసం ఈ ప్రళయాన్ని సృష్టించాల్సిన పరిస్థితి పట్టేది కాదు’’ అంటూ ఆ కపాలన్నీ వేళ్లతో కొట్టాడు. ‘ఖంగ్...ఖంగ్’ అంటూ శబ్దం వినిపించింది. ‘‘కాల్చి పుటం పెట్టినా నీ పాపం వదిలినట్లు లేదు. మహాగంభీర శరీరాన్ని ఏ రాజ కిరాతకుడి మెడపై నువ్వు నిక్కి నిల్చినన్నాళ్లు, రత్నకిరీటం ధరించి శాసనాధికారం చలాయించిన్నాళ్లు, రాజదండం ధరంచి సర్వమానవుల అదృష్టచక్రాన్ని గిరగిరా తిప్పినన్నాళ్లు, ఇచ్ఛా విహారంలో ఎగిరిపడినావే... ఇప్పుడు ఏమైనది? బూడిద... బూడిద... ఆ బూడిద గతి ఏమైనది? ఆ నందుల గతి కూడా ఇంతే కావాలి. ఆ నందుల తలలు కూడా ఇలాగే ఫెళఫెళమంటూ ముక్కలు చెక్కలు కావాలి’’ అంటూ నడుస్తున్న చాణక్యుడి కాలికి ఏదో గుచ్చుకుంది. ‘‘దర్భగరిక! గడ్డిపరకకు కూడా పొగరే! తలబిరుసే! చూడు... ఈ నేరానికి నీ గతి ఏమవుతుందో చూడు’’ అంటూ కోపంతో ఆ దర్భగరికను మంటల్లో వేశాడు చాణక్యుడు. ఆ తరువాత గట్టిగా నవ్వి... ‘‘నన్ను నా ధర్మాన్ని నా దేశాన్ని పరాభవించిన ఆ పాపాత్ముల గతి కూడా ఇంతే’’ అని శాపం పెట్టాడు. సమాధానం: చాణక్య చంద్రగుప్త -
ఔషధం కురిసే వేళ..
• కవర్ స్టోరీ వానాకాలం వచ్చేసింది. మిగిలిన కాలాలతో పోలిస్తే వానాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఈ కాలంలో మరింతగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. మామూలు జలుబు, దగ్గులతో మొదలుకొని దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు, నీటి కాలుష్యం వల్ల తలెత్తే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలోని చల్లదనం వల్ల దీర్ఘకాలంగా ఆర్థరైటిస్తో బాధపడేవారికి కీళ్లనొప్పులు మరింతగా ఇబ్బందిపెడతాయి. వానాకాలంలో సహజంగానే అరుగుదల తక్కువగా ఉంటుంది. కడుపులో ఇబ్బందులు మొదలవుతాయి. కాసేపు ఎండ, కాసేపు వాన.. కొన్నాళ్లు తెరిపి లేకుండా కురిసే వానలు.. వాతావరణంలో ఇలాంటి తేడాల వల్ల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇంటి వద్దనే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో వచ్చే చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇంటిపట్టునే పాటించదగ్గ కొన్ని చిట్కాలు మీకోసం... జలుబు, దగ్గులకు... వానాకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టేవి జలుబు దగ్గులే. జలుబు మొదలైతే ఏ పని చేయాలన్నా తోచదు. ముక్కుదిబ్బడతో సరిగా ఊపిరాడదు. ఇక గొంతులో గరగర మొదలై దగ్గు కూడా పట్టుకుంటుంది. ఈ పరిస్థితి నుంచి తేలికగా ఉపశమనం పొందాలంటే... ► జలుబు దగ్గుల నుంచి ఉపశమనానికి మిరియాల కషాయం చాలా ప్రశస్తమైన మార్గం. మిరియాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే... మిరియాలను బాగా దంచుకుని పొడి చేసుకోవాలి. టీస్పూన్ మిరియాల పొడిని రెండుకప్పుల నీళ్లలో వేసి నీరు సగానికి సగం ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల తేనె కలుపుకొని, గోరువెచ్చగా అయిన తర్వాత మెల్ల మెల్లగా తాగాలి. మిరియాల కషాయం తీసుకోవడం వల్ల జలుబు దగ్గుల నుంచి తేలికగా ఉపశమనం లభిస్తుంది. ► దాల్చినచెక్క పొడి, శొంఠిపొడి సమపాళ్లలో కలుపుకోవాలి. ఈ పొడి మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకుని, రెండు టీస్పూన్ల తేనెతో కలుపుకుని తీసుకున్నట్లయితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ► టీస్పూన్ నిమ్మరసంలో రెండు టీస్పూన్ల తేనె, పావు టీస్పూన్ దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే జలుబు, ముక్కు దిబ్బడల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ► పిప్పళ్లను, బెల్లాన్ని సమభాగాలుగా తీసుకోవాలి. పిప్పళ్లను పొడిగా తయారు చేసుకుని, అందులో బెల్లం కలిపి చిన్న చిన్న ఉసిరికాయల పరిమాణంలో ఉండల్లా తయారు చేసుకోవాలి. జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటిని బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఉంటే కొంత ఉపశమనం ఉంటుంది. ► అర టీ స్పూన్ కరక్కాయ పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే, దగ్గు నుంచి, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ► ముక్కుదిబ్బడ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వేడినీట్లో కొన్ని చుక్కల నీలగిరి తైలాన్ని, చెంచాడు పసుపును వేసి, ఆ నీటి ఆవిరిని పట్టించడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. జలుబు దగ్గులకు తోడు తలనొప్పి కూడా ఉంటే, గుప్పెడు నీలగిరి ఆకులను ముద్దలా నూరి ఒక గుడ్డలో వాటిని మూటలా కట్టి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. ► తులసి రసం అర టీస్పూన్, అల్లం రసం అర టీస్పూన్ కలిపి ఒక టీస్పూన్ తేనెతో తీసుకున్నట్లయితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే రావి చిగుళ్ల రసాన్ని తేనెలో కలుపుకుని తీసుకున్నా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ సమస్యలకు వానాకాలంలో వాతావరణం స్థిరంగా ఉండదు. కాసేపు ఎండ, కాసేపు వాన.. వాతావరణంలో పెరిగే తేమ.. చర్మం తీరులో నానా మార్పులకు దారితీస్తాయి. కొందరికి ముఖం జిడ్డుగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లకయితే ముఖంపై చర్మం కూడా మరింత పొడిబారిపోయి కాంతిహీనంగా తయారవుతుంది. సరైన చెప్పులు లేకుండా వాననీరు పారుతున్న నేలపై ఎక్కువకాలం నడవాల్సి వస్తే, కాలి వేళ్లు ఒరిసిపోయి ఇబ్బంది పెడతాయి. ► చర్మం జిడ్డుగా మారుతున్నట్లయితే, సబ్బుబదులు సున్నిపిండిని స్నానానికి వాడటం మంచిది. ఆయుర్వేద సున్నిపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసలు, మినుములు సమభాగాలుగా తీసుకుని పొడి మూకుడులో దోరగా వేయించుకోవాలి. బావంచాలు, గంధకచ్చూరాలు, నాలుగు పసుపుకొమ్ములు వీటికి జతచేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. వానాకాలంలో స్నానానికి ఈ పొడిని ఉపయోగంచడం క్షేమం. ► తెరిపిలేని వానల వల్ల బయటి వాతావరణం మరీ చల్లగా ఉన్నట్లయితే, స్నానానికి గంట ముందు ఒంటికి ఆవనూనె పట్టించి, ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయడం మంచిది. ఇలా చేస్తే బయట ఎంత ముసురు పట్టినా, అంతలోనే ఎండ వచ్చినా చర్మం తాజాగా ఉంటుంది. ► ముఖం జిడ్డుగా మారి, మొటిమలు వంటివి కూడా ఇబ్బంది పెడుతున్నట్లయితే, గుప్పెడు వేపాకులు, నాలుగైదు పసుపుకొమ్ములు కలిపి నూరుకోవాలి. ఇలా నూరుకున్న ముద్దకు చెంచాడు నిమ్మరసం జోడించి, ఫేస్ప్యాక్లా ముఖానికి పట్టించుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని తేలికపాటి పొడి కాటన్ టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ► వర్షాకాలంలో వీలైనంత వరకు సాక్స్ బిగించి, షూస్ ధరించకపోవడమే మంచిది. నీటి మడుగులను తలపించే రోడ్లపై నడవాల్సి వస్తే, షూస్లోకి నీరు చేరి, సాక్స్ పూర్తిగా తడిసిపోతాయి. దీనివల్ల పాదాల వేళ్లు ఒరిసిపోయి, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వేళ్లు ఒరిసిపోయినట్లయితే, ఒరిసిపోయిన చోట వేపాకు, పసుపు ముద్దను పట్టించి, అరగంట తర్వాత పాదాలను గోరువెచ్చని నీట్లో కడిగి, పొడిగా ఆరనివ్వాలి. పాదాలకు గాలి ఆడే చెప్పులు ధరిస్తే వేళ్లు ఒరిసిపోయేంత పరిస్థితి రాదు. ► ముఖం పొడిబారి కాంతిహీనంగా తయారవుతున్నట్లయితే, తాజా వేపాకులు, కలబంద ఆకులు ముద్దగా నూరుకుని ఫేస్ప్యాక్లా ముఖానికి పట్టించండి. ఆరగంట సేపు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి. దీనివల్ల ముఖంపై తేమ ఆరిపోకుండా ఉంటుంది. ► బాగా వానలో తడిసిపోయే పరిస్థితులు ఎదురైతే, గోరువెచ్చని నీటితో సున్నిపిండి ఉపయోగించి స్నానం చేయండి. ఒంటిని జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. దీని వల్ల చర్మం తాజాగా ఉంటుంది. జుట్టు సమస్యలకు వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం కొంచెం కష్టమే. తరచు తడిసే పరిస్థితులు ఉంటే తలకు చుండ్రు పట్టడం, జుట్టు బాగా రాలిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. జుట్టు బలహీనపడి, కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాపాడుకోవాలంటే వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్కోట్ తీసుకువెళ్లాల్సిందే. అయినప్పటికీ కొన్ని సమస్యలు తప్పవు. ► తలస్నానానికి రసాయనాలతో తయారైన షాంపూల బదులుగా కుంకుడుకాయలను వాడండి. తలస్నానానికి గంట ముందు భృంగామలక తైలంతో జుట్టు కుదుళ్లకు పట్టేలా నెమ్మదిగా మర్దన చేయాలి. స్నానం తర్వాత తలను బాగా తుడుచుకుని, పొడిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. ► జుట్టుకు చుండ్రు పట్టినట్లయితే తాజా వేపాకులు, మెంతులు, ఉసిరికాయలు మెత్తగా నూరుకుని, అందులో చెంచాడు నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తల స్నానం చేయాలి. ► వారానికి కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తలస్నానం చేయాలి. చుండ్రు నివారణ కోసం తలస్నానానికి ముందు నువ్వులనూనెలో కొన్నిచుక్కల వేపనూనె కలిపి తలకు పట్టించుకోవాలి. అరగంట సేపటి తర్వాత తలస్నానం చేయాలి. ► తలకు చుండ్రుపట్టి ఇబ్బందిగా ఉన్నట్లయితే, తలస్నానానికి గంట ముందు కాస్త పెరుగులో నిమ్మరసం పిండుకుని తలకు బాగా పట్టించాలి. తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి. ► అనుకోకుండా వర్షంలో తడిసినట్లయితే, కేవలం జుట్టు తుడిచేసుకుని అక్కడితో వదిలేయకుండా, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. జుట్టు బాగా ఆరిన తర్వాత కొద్ది చుక్కల వేపనూనె కలిపిన నువ్వులనూనె లేదా ఆమ్లాతైలాన్ని జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య దాదాపు దరిచేరదు. ► జుట్టు పొడిబారి రాలిపోతున్నట్లయితే, తలస్నానానికి అరగంట ముందు జుట్టుకు తాజా కలబంద గుజ్జును పట్టించండి. కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయండి. తలకు మామూలు నూనెల బదులు భృంగామలక తైలాన్ని వాడండి. జుట్టు దృఢంగా, కాంతివంతంగా తయారవుతుంది. ► జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు వానాకాలంలో ఇబ్బందిపెడుతుంటే, వస కొమ్ములతో చక్కని పరిష్కారమార్గం ఉంది. వసకొమ్ములను రాత్రంతా నానబెట్టి, తర్వాత వాటిని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఒక టీస్పూన్ వస కొమ్ముల పొడిని కప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి. జీర్ణ సమస్యలకు వర్షాకాలంలో వాతావరణంలోని హెచ్చుతగ్గుల వల్ల జీర్ణప్రక్రియ కొంత మందగిస్తుంది. వర్షం కురుస్తుంటే చాలామంది జిహ్వచాపల్యాన్ని ఆపుకోలేక వేడివేడి బజ్జీలు, పకోడీలు వంటివి ఎక్కడపడితే అక్కడ లాగించేస్తూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు మరింతగా ఇబ్బందిపెడతాయి. జీర్ణప్రక్రియను సజావుగా కాపాడుకుంటే, వర్షాకాలాన్ని ఆనందంగా ఆస్వాదించవచ్చు. ► వర్షాకాలంలో వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడమే మేలు. విపరీతంగా మసాలాలు, ఎక్కువ నూనె వాడి తయారు చేసే వంటకాలకు దూరంగా ఉంటే జీర్ణ ప్రక్రియ సజావుగా ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, ఉడికించిన గింజలు వంటివి తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ► జీర్ణప్రక్రియ మందగించి, ఆకలి తగ్గిపోయినట్లయితే, భోజనం చేసేటప్పుడు అన్నంలోని మొదటి ముద్దలో నేతిలో దోరగా వేపిన చెంచాడు వాముగింజలను కలుపుకుని తినండి. వానాకాలంలో దొరికే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకోండి. ► శొంఠి, మిరియాలు, పిప్పళ్లు సమభాగాలుగా తీసుకుని పొడిగా తయారు చేసుకోండి. ఈ పొడిని ఒక టీస్పూన్ తీసుకుని, అందులో అంతే పరిమాణంలో బెల్లం, నెయ్యి కలుపుకుని మధ్యాహ్న భోజనంలో మొదటి ముద్దను తీసుకోండి. రాత్రివేళ భోజనం తర్వాత త్రిఫలా చూర్ణం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి. దీనివల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ► కడుపు ఉబ్బరం ఇబ్బంది పెడుతున్నట్లయితే, పలచని మజ్జిగలో తగినంత ఉప్పు, టీ స్పూన్ మెంతిపొడి కలిపి తీసుకున్నట్లయితే ఉపశమనంగా ఉంటుంది. అల్లం కషాయం తీసుకున్నా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ► ఆకలి మందగించి కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్లలో ఈ పొడిని కలుపుకొని సేవిస్తే ఉపశమనంగా ఉంటుంది. ► రాత్రి నీట్లో నానబెట్టిన ఖర్జూరాలు లేదా ఎండుద్రాక్షలను ఉదయాన్నే అల్పాహారానికి ముందు తీసుకున్నట్లయితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనానికి ముందు అరగ్లాసు పుదీనారసంలో, చెంచాడు అల్లం రసం కలిపి తాగితే జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ► ఆకలి మందగించినట్లయితే పసుపు, శొంఠిపొడి, ఉప్పు, నెయ్యి అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తిన్నట్లయితే, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒంటి కీళ్ల నొప్పులకు దీర్ఘకాలంగా కీళ్లనొప్పులతో బాధపడేవారికి వానాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉండేవారిని సైతం ఈ కాలంలో సర్వసామాన్యంగా వచ్చే జలుబు దగ్గులు జ్వరాలతో పాటు ఒంటినొప్పులు బాధిస్తాయి. వయసు మళ్లినవారికైతే ఈ నొప్పులు మరింతగా బాధిస్తాయి. ► మార్నింగ్ వాక్ అలవాటున్న వారు బయట వర్షం కురుస్తున్నప్పుడు వాక్కు బ్రేక్ చెప్పేస్తారు. దీనివల్ల కీళ్లు పట్టేసినట్లవుతాయి. ఉదయపు నడక సాగనప్పుడు ఇంటి పట్టునే వ్యాయామాలు, యోగా వంటివి చేయడం ద్వారా కీళ్ల ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ► వానాకాలంలో ఒంటినొప్పులు బాధిస్తున్నట్లయితే అశ్వగంధ, తానికాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని, ఆ చూర్ణాల మిశ్రమంలో అంతే పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుముఖం పడతాయి. ► శొంఠి, మిరియాలను సమభాగాలుగా తీసుకుని, వాటిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ► అశ్వగంధ వేరును మెత్తగా పొడిలా తయారు చేసుకుని, కప్పు నీరు లేదా కప్పు పాలలో వేసి అవి సగానికి సగం ఇగిరేలా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ రెండుపూటలా తీసుకున్నట్లయితే నడుం నొప్పి, వెన్నునొప్పి తగ్గుతాయి. ► ఇంగువ, పసుపు ఒక్కో టీస్పూన్ చొప్పున తీసుకుని, బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మిశ్రమంగా మారిన ఈ పొడిని కాగితంలో వేసి కాల్చి, ఆ వాసనను పీలిస్తే వానాకాలంలో వేధించే పార్శ్వపు తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ► పావులీటరు నీటిలో గుప్పెడు పారిజాతం ఆకులను వేసి, ఆ నీటిని సన్నటి మంటపై మరిగించాలి. సగానికి సగం ఇగిరిపోయేలా నీరు బాగా మరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టుకుని, ఆ నీటిలో అర టీస్పూన్ శొంఠిపొడి, ఒక టీస్పూన్ పటికబెల్లం కలిపి రోజూ తాగుతున్నట్లయితే నడుంనొప్పి, వెన్నునొప్పి, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ► మునగాకులను, నీలగిరి ఆకులను సమభాగాలుగా తీసుకుని ఒక కప్పు ఆముదంలో మగ్గించి, ఆ మిశ్రమంతో నొప్పులు ఉన్న చోట కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. -
దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు
♦ ధ్రువతారలు మన దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. స్వాతంత్య్రానికి దశాబ్దాల ముందే జాతీయ జెండా కోసం కలలుగన్న ఆయన ‘భారత దేశానికొక జాతీయ జెండా’ పేరిట ఇంగ్లిష్లో ఒక పుస్తకాన్ని 1916 లోనే రాశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ‘యూనియన్ జాక్’ జెండా ఉన్నప్పటికీ నాటి బ్రిటిష్ పాలకులు సైతం తమ అధీనంలోని ‘భారత సామ్య్రాజ్యానికి’ ఒక జెండా ఉంటే బాగుందని భావించి, జెండా రూపకల్పన కోసం నానా ప్రయత్నాలు చేశారు. అదేకాలంలో మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా యావద్దేశానికి జాతీయ జెండా ఒకటి ఉండాలని గట్టిగా సంకల్పించారు. చాలా ప్రయత్నాల తర్వాత పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను 1947 జూలై 21న కాంగ్రెస్ ఆమోదించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎర్రకోటపై ఈ జెండానే రెపరెపలాడింది. పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ. తండ్రి హనుమంతరాయుడు దివి తాలూకా యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉండేవారు. వెంకయ్య మాతామహులు అడవి వెంకటాచలం చల్లపల్లి సంస్థానానికి ఠాణేదారు. ఆయనకు పెద్దకళ్లేపల్లికి బదిలీ కావడంతో వెంకయ్య ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తర్వాత మచిలీపట్నం ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే వెంకయ్య చురుకైన విద్యార్థి. సాహస ప్రవృత్తి ఆయనను సైన్యం వైపు నడిపింది. పంతొమ్మిదో ఏట బొంబాయి వెళ్లి సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న కాలంలోనే ఆయన తొలిసారిగా మహాత్మాగాంధీని కలుసుకున్నారు. అప్పటి నుంచే వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. యుద్ధం ముగిసి స్వదేశానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో అరేబియా, అఫ్ఘానిస్తాన్లను చూసి వచ్చారు. అప్పట్లో ప్లేగు మహమ్మారి ప్రపంచాన్నే వణికించేది. సైన్యం నుంచి తిరిగి వచ్చాక పింగళి వెంకయ్య మద్రాసు వెళ్లి ప్లేగు ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందారు. అక్కడ శిక్షణ పూర్తయ్యాక బళ్లారిలో కొంతకాలం ప్లేగు ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఉద్యోగం ఆయనకు సంతృప్తినివ్వలేదు. ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. సీనియర్ కేంబ్రిడ్జి కోర్సు చేయడానికి కొలంబో వెళ్లారు. అక్కడి సిటీ కాలేజీలో చేరి, పొలిటికల్ ఎకనామిక్స్ ప్రధానాంశంగా సీనియర్ కేంబ్రిడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత కొంతకాలం రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్లోని డీఏవీ కాలేజీలో చేరారు. లాహోర్లో చదువుకుంటున్న కాలంలో ఆయన సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషలలో ప్రావీణ్యం సాధించారు. జపాన్లో అనర్గళంగా మాట్లాడేవారు. దాంతో ఆయనను సన్నిహితులంతా ‘జపాన్ వెంకయ్య’ అని పిలిచేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీని కలుసుకున్నప్పటి నుంచే వెంకయ్యలో జాతీయ పతాకం ఆలోచన మొదలైంది. ఇక అప్పటి నుంచి అదే ఆయన అభిమాన విషయమైంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సభల్లోనూ వెంకయ్య పాల్గొనేవారు. కాంగ్రెస్ నాయకులతో జాతీయ పతాకం రూపకల్పనపై సుదీర్ఘ చర్చలు జరిపేవారు. అప్పట్లో బ్రిటిష్ ‘యూనియన్ జాక్’ ఉన్నా, దేశంలోని చిన్న చిన్న సంస్థానాలకు వేర్వేరు జెండాలు ఉండేవి. అందుకే బ్రిటిష్ పాలకులు సైతం తమ అధీనంలోని ‘భారత సామ్రాజ్యానికి’ ప్రత్యేక పతాకం ఉండాలని భావించేవారు. అదే కాలంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా మనకంటూ ఒక స్వతంత్ర పతాకం ఉండటం అవసరమని భావించేవారు. నిజానికి 1857 సిపాయిల తిరుబాటు నాటి నుంచి బ్రిటిష్ పాలకులు తమ అధీనంలోని భారత సామ్రాజ్యానికి ప్రత్యేక పతాకం అవసరమని భావించారు. ఏడో ఎడ్వర్డ్ పట్టాభిషేకం తర్వాత పతాక రూపకల్పన కోసం బ్రిటిష్ పాలకులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో వినాయకుడు, కాళీమాత, గోమాత చిహ్నాలకు జనాదరణ ఉండేది. పతాకంలో బ్రిటిష్ ‘యూనియన్ జాక్’ చిహ్నంతో పాటే ఈ చిహ్నాల్లో దేనినైనా వాడవచ్చనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇవి హిందువులకు మాత్రమే సంకేతంగా ఉంటున్నాయనే కారణంతో వీటిని తోసిపుచ్చారు. దేశంలోని సర్వమతాలకు ప్రాతినిధ్యం ఉండేలా పతకాన్ని తీర్చిదిద్దాలుకున్నారు. వందేమాతర నినాదంతో పతాకం 1905లో బెంగాల్ విభజన తర్వాత కులమత ప్రాంతాలకు అతీతంగా పతాకాన్ని రూపుదిద్దాలనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ‘వందేమాతరం’ జెండా. బ్రిటిష్ ఆకుపచ్చ రంగుపై ఎనిమిది తెల్లకలువలు (అప్పట్లో దేశంలో ఉన్న ఎనిమిది ప్రావిన్సులకు ప్రతీకగా, మధ్యన పసుపు రంగులో ‘వందేమాతరం’ నినాదం, దిగువన ఎరుపు రంగుపై ముస్లింలకు ప్రతీకగా ఎడమవైపు నెలవంక, హిందువులకు ప్రతీకగా సూర్యుడి చిహ్నాలతో రూపొందించారు. స్వదేశీ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో రూపొందించిన ఈ పతాకానికి జనాదరణ లభించలేదు. కలకత్తాలో ఈ పతాకాన్ని ఆవిష్కరించినా, అప్పటి పత్రికలేవీ దాదాపు ఆ పతాకావిష్కరణ సంఘటనను పట్టించుకోలేదు. తర్వాత సోదరి నివేదిత మరో పతాకాన్ని ప్రతిపాదించారు. ఇందులోనూ వందేమాతర నినాదం ఉంటుంది. పతాకం మధ్యలో మెరుపుతీగ, నూట ఎనిమిది దీపపు ప్రమిదలతో రూపొందించిన ఈ పతాకాన్ని 1906 కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టినా, ఆమోదం పొందలేదు. ఆ తర్వాత కూడా చాలామంది రకరకాల ప్రతిపాదనలతో రకరకాల పతాక నమూనాలను ముందుకు తెచ్చినా, అవేవీ ఆకట్టుకోలేకపోయాయి. బాల గంగాధర్ తిలక్, అనీబిసెంట్ కూడా ఒక జాతీయ పతాకాన్ని ప్రతిపాదించారు. పతాకం పైభాగంలో ఎడమవైపు యూనియన్ జాక్, కుడి వైపు నెలవంక నక్షత్రం, దిగువభాగంలో కుడివైపు ఏడు నక్షత్రాలు ఉండి, జెండా నేపథ్యంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ చారలు ఉంటాయి. ఈ పతాకాన్ని అప్పట్లో కోయంబత్తూరు మేజిస్ట్రేట్ నిషేధించాడు. దీనిపై సుదీర్ఘ వాదోపవాదాలు కూడా జరిగాయి. వెంకయ్య రూపొందించిన జెండాను 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో తొలిసారిగా ఎగురవేశారు. జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని జలంధర్కు చెందిన నాయకుడు లాలా హన్స్రాజ్ 1919లో చేసిన సూచనను గాంధీజీ అంగీకరించారు. బెజవాడలో 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ వెంకయ్యను పిలిపించుకుని, పైన కాషాయం, దిగువన ఆకుపచ్చ రంగులున్న జెండా మధ్యలో రాట్నం చిహ్నం ఉండేలా రూపొందించమని కోరారు. వెంకయ్య అదే తీరులో జెండాను రూపొందించారు. జెండా మధ్యలో శాంతికి చిహ్నంగా తెలుపు రంగు ఉంటుందనే ఆలోచన వచ్చింది గాంధీజీకి. ఆయన మధ్యలో తెలుపు రంగు కూడా ఉంటే బాగుంటుందని వెంకయ్యకు చెప్పడంతో ఆయన ఈసారి మధ్యలో తెలుపు రంగును చేర్చి, తెలుపు రంగుపై రాట్నం చిహ్నం వచ్చేలా రూపొందించారు. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 21న వెంకయ్య రూపొందించిన జెండా నమూనాను ఆమోదిస్తూ, ఇందులో చిన్న మార్పు తెచ్చింది. రాట్నం స్థానంలో మన ప్రాచీన ధర్మ చిహ్నమైన అశోకచక్రాన్ని ఇముడ్చుతూ జాతీయ పతాకాన్ని ఆమోదించినట్లు జూలై 22న జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. నిష్కళంక దేశభక్తుడైన పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 మధ్య కాలంలో భారత జాతీయోద్యమంలోని కీలక ఘట్టాల్లో పాల్గొన్నారు. ‘వందేమాతరం’ ఉద్యమం, హోమ్రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఉద్యమాల్లో ఆయన తన వంతు పాత్ర పోషించారు. సైన్యంలోను, రైల్వేలోను ఉద్యోగాలను వదిలేసి ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత వెంకయ్య కొంతకాలం బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్ర పాఠాలు చెప్పడంతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనక శిక్షణ ఇచ్చేవారు. అంతులేని జ్ఞానతృష్ణతో ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరమై శాస్త్ర పరిశోధనలపై దృష్టి సారించారు. మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు సాగించి డిప్లొమా తీసుకున్నారు. తర్వాత 1924 లో నెల్లూరు చేరుకుని, అక్కడ అభ్రకం గురించి విశేషమైన పరిశోధనలు సాగించారు. వజ్రకరూరు, హంపి ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి నేలల్లో దొరికే వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలు చేసి, అప్పటి వరకు ప్రపంచానికి వెల్లడికాని అనేక విశేషాలను వివరిస్తూ ‘వజ్రపుతల్లి రాయి’ అనే గ్రంథాన్ని 1955లో ప్రచురించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయనను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆయన ఆ పదవిలో 1960 వరకు కొనసాగారు. అప్పటికే ఆయన వయసు 82 ఏళ్లు నిండాయి. ఖనిజ పరిశోధక శాఖలో పదవీకాలం పూర్తయ్యాక వెంకయ్య విజయవాడ చేరుకున్నారు. సైన్యంలో పనిచేసినందుకు ప్రభుత్వం ఆయనకు విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో కొద్దిపాటి స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో గుడిసె వేసుకుని, అందులో శేషజీవితాన్ని గడపాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో దుర్భరమైన ఆర్థిక కష్టాలు ఆయనను చుట్టుముట్టాయి. జాతీయ పతాక రూపకర్తలను ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు అమితంగా గౌరవిస్తాయి. మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడం దారుణం. అవసాన కాలంలో పింగళి వెంకయ్య తిండికి కూడా మొహంవాచిన పరిస్థితుల్లో నానా అగచాట్లు పడ్డారని ‘త్రివేణి’ సంపాదకుడు డాక్టర్ భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. ఆయన కష్టాలను గమనించిన కొందరు పెద్దలు ఆయనకు ఏదో రూపంలో కొంత నిధిని సమకూర్చి అందించాలని సంకల్పించారు. డాక్టర్ కె.ఎల్.రావు, డాక్టర్ టీవీఎస్ చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు వంటి పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సన్మానించి, కొంత నిధిని అందించారు. సన్మానం జరిగిన ఆరునెలలకే– 1963 జూలై 4న ఆయన తుదిశ్వాస విడిచారు. చివరి దశలో ఆయన ‘నాకు అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత నా భౌతికకాయం మీద త్రివర్ణ పతాకాన్ని కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకాన్ని తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి’ అని తుది కోరికను కోరారు. -
చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుందేలేమైనా ఉందా? అక్కడ లేకుంటే భూమ్మీద నుంచి కుందేలును పంపితే– ఆ కుందేలు అక్కడ సంతోషంగా ఉంటుందా? చంద్రుని గురించి మనకు కొంత తెలుసు. చాలా తెలీదు. చంద్రుడి మీద మానవుడు అడుగుమోపి ఐదు దశాబ్దాలు గడిచాయి. అయినా, చంద్రుడి గురించి తెలుసుకోవలసిన సంగతులు కొండంత. నేడు చంద్రయాన్–2 ప్రయోగం సందర్భంగా... అందిన చందమామను మరోసారి అందుకోవడానికి సిద్ధపడుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామ మీద అందీ అందని రహస్యాలను అందిపుచ్చుకోవడానికి నేడు ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెడుతున్నారు. ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో ఇదివరకు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలోనే ‘చంద్రయాన్–2’ ప్రయోగం జరుగుతోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుంది. రష్యా అంతరిక్ష సంస్థ (రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ–రాస్కాస్మోస్) సహకారంలో ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు మరోసారి చంద్రుడి మీద పరిశోధనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ‘చంద్రయాన్–2’ మిషన్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసెంట్రిక్ లాంచ్ వెహికల్–మార్క్3 (జీఎస్ఎల్వీ–మార్క్3 ) వాహనం ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను నేడు చంద్రుని దిశగా అంతరిక్షంలోనికి పంపనున్నారు. ఇందులో మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తయారు చేసిన లూనార్ ఆర్బిటర్, రోవర్లతో పాటు రష్యా అంతరిక్ష సంస్థ తయారు చేసిన ల్యాండర్ను ప్రయోగించనున్నారు. ఇందులో చక్రాలు కలిగిన రోవర్ యంత్రం సౌరశక్తితో పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై సంచరించి, అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, వాటి రసాయనిక విశ్లేషణ జరిపి, ఆ సమాచారాన్ని ‘చంద్రయాన్–2’ ఆర్బిటర్ ద్వారా భూమిపైనున్న ‘ఇస్రో’ పరిశోధన కేంద్రానికి చేరవేస్తుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగం కోసం దాదాపు పుష్కరకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగంలో కలసి పాల్గొనాలని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు, రష్యా అంతరిక్ష సంస్థ (రాస్కాస్మోస్) 2007 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి 2008 సెప్టెంబర్ 18న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేబినెట్ బృందం ఆమోదం తెలిపింది. ‘ఇస్రో’, రాస్కాస్మోస్ల ఒప్పందం ప్రకారం రోవర్, ఆర్బిటర్ల తయారీ బాధ్యతను ‘ఇస్రో’ తీసుకోగా, ‘రాస్కాస్మోస్’ ల్యాండర్ తయారీ బాధ్యతలను చేపట్టింది. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్ చంద్రునికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ‘రాస్కాస్మోస్’ తయారు చేసిన ల్యాండర్.. ‘ఇస్రో’ తయారు చేసిన రోవర్ను చంద్రుని ఉపరితలంపైకి దిగవిడుస్తుంది. వీటిని అంతరిక్షంలోకి చేరవేసే జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనం ఆకృతిని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2009 ఆగస్టులోనే సిద్ధం చేశారు. దీని బరువు 2650 కిలోలు. ల్యాండర్, రోవర్ల బరువు దాదాపు 1250 కిలోలు. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్లో ఐదు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో మూడు కొత్తగా రూపొందించినవైతే, మిగిలిన రెండూ చంద్రయాన్–1లో ప్రయోగించిన పాత ఉపగ్రహాలే. అయితే, మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు వీటిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు. అన్నీ స్వదేశీ పరికరాలే... చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనాన్ని భారతీయ కాలమానం ప్రకారం జూలై 14న వేకువ జామున 2.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులోని ల్యాండర్ ద్వారా రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలం మీదకు సెప్టెంబర్ 6న చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్ ద్వారా ఐదు, ల్యాండర్ ద్వారా నాలుగు, రోవర్ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు. చంద్రయాన్–2లో భాగంగా, అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) కూడా కొన్ని సాంకేతిక పరికరాలను పంపాలని భావించినా, బరువు పరిమితుల కారణంగా విదేశీ పరికరాలనేవీ ఈ ప్రయోగంలో పంపరాదని ‘ఇస్రో’ బృందం నిర్ణయించింది. చంద్రయాన్–1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్న సాంకేతిక పరికరాల ద్వారా చంద్రుని ఉపరితలాన్ని రోవర్ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, ఒకవేళ చంద్రునిపై నీటి అణువుల జాడ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్కు అమర్చిన టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2), మినియేచర్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ–సార్) పరికరాలు చంద్రయాన్–1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ–2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్లను ఆర్బిటర్లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ–సార్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. చంద్రుని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలోని అత్యంత ఎగువ పొర అయిన ‘అయానోస్ఫియర్’లోని ఎలక్ట్రాన్ల సాంద్రతను ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్’ (డీఎఫ్ఆర్ఎస్) పరికరం విశ్లేషిస్తుంది. ఐఆర్ స్పెక్ట్రోమీటర్ పరికరం చంద్రునిపై నీటి అణువుల జాడను, ఖనిజాలను గుర్తించి, ఆ సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. ఆర్బిటర్కు అమర్చిన హైరిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైన నిర్దేశిత ప్రదేశానికి సురక్షితంగా చేరుకోగానే త్రీడీ ఫొటోలు తీసి, వాటిని భూమిపైకి పంపిస్తుంది. చంద్రయాన్–2లోని ‘సోలార్ ఎక్స్రే మానిటర్’ చంద్రుని వాతావరణానికి ఎగువన ఆవరించి ఉన్న ‘కరోనా’ ప్రాంతంలో సూర్యకిరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ కొలవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో సంచరించనున్న రోవర్ తెలుసుకునే సమాచారాన్ని ఆర్బిటర్ ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది. ఇది చంద్రుని కక్ష్యలో ఏడాది పాటు పరిభ్రమిస్తుంది. చందమామ అందిన రోజు చంద్రుని చుట్టూ ఎన్నో పురాణాలు ఉన్నాయి. అభూత కల్పనలు ఉన్నాయి. అందరాని చందమామను అందుకోవాలనే తపన మానవుల్లో చాలా ఏళ్లుగానే ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఈ తపన మరింత ఎక్కువైంది. మానవుడికి సంకల్పబలం ఉండాలే గాని, అసాధ్యమైనదేదీ లేదని నిరూపిస్తూ అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 16న భూమిపై నుంచి చంద్రునిపైకి ప్రయాణించాడు. చందమామ మానవుడి చేతికందిన అద్భుతమైన రోజు అది. అపోలో–11 వ్యోమనౌకలో బయలుదేరిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగు మోపిన తొట్టతొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. చంద్రుడి ధూళిని సేకరించి భూమిపైకి విజయవంతంగా తిరిగివచ్చాడు. అయితే, అంతకు పదేళ్ల ముందే, 1959లో రష్యా చంద్రునిపైకి లూనా–2 వ్యోమనౌకను విజయవంతంగా పంపింది. చంద్రుడిపైకి మానవులు పంపిన వస్తువు ఒకటి చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. చంద్రునిపైకి వ్యోమనౌకలను పంపడానికి రష్యా అంతకు ముందు మూడుసార్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. రష్యన్ శాస్త్రవేత్తలు 1958 సెప్టెంబర్ 23, అక్టోబర్ 12, డిసెంబర్ 4లలో పంపిన వ్యోమనౌకలేవీ చంద్రునిపైకి చేరుకోలేకపోయాయి. వరుస వైఫల్యాల తర్వాత ‘లూనా’ ప్రయోగాలకు రష్యా నడుం బిగించింది. ఇందులో భాగంగా 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ చంద్రునికి 5,965 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని తప్పింది. తిరిగి లోపాలను దిద్దుకుని అదే ఏడాది సెప్టెంబర్ 13న పంపిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రునిపైకి చేరుకోగలిగింది. అయితే, చంద్రునిపైకి మనిషిని తొలిసారిగా పంపిన ఘనత మాత్రం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దక్కించుకోగలిగింది. ‘నాసా’ ఆధ్వర్యంలో జరిపిన ప్రయోగంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 20న చంద్రునిపై తొలి అడుగు మోపి, అక్కడి నుంచి ‘చంద్రుని మీద మనిషి మోపిన తొలి అడుగు మానవాళికే ముందడుగు’ అంటూ సందేశం పంపాడు. చంద్రునిపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మోపిన తొలి అడుగు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే చాలా దేశాలు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు చంద్రుడి వద్దకు ఉపగ్రహాలు, వ్యోమనౌకలు పంపుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ ఏనాటికైనా మానవులకు ఆవాసం కాకపోతుందా అనే ఆశతో చేస్తున్న ప్రయోగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సాధించాయి. చంద్రునిపై పంటలు పండించడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక ప్రయత్నం చేసింది. చంద్రునిపై పత్తి విత్తనాలను మొలకెత్తించింది. చంద్రుని ఉపరితలంపై రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మొలకెత్తిన విత్తనం జీవాన్ని పుంజుకోకుండానే అంతరించిపోయింది. ‘చంద్రయాన్–1’ సాధించిందేమిటంటే..? చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్–1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ–సీ 11) ద్వారా పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది. దీని నుంచి 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ (ఓహెచ్), నీరు (హెచ్2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం ‘చంద్రయాన్–1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్–1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్–1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. చంద్రునిపై ఆసక్తి ఏనాటిదంటే? గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో చంద్రునిపై మనుషుల్లో ఆసక్తి ఆధునిక పరిశోధనలు మొదలు కావడానికి వేల సంవత్సరాల ముందు నుంచే ఉండేది. నాగరికతలు మొదలు కాక ముందు నుంచే భూమ్మీద నివసించే మనుషులు సూర్యచంద్రులను గమనిస్తూనే ఉన్నారు. నాగరికతలు మొదలైన తొలినాళ్లలో సూర్యచంద్రులను దేవతలుగా ఆరాధించడం మొదలైంది. శాస్త్రీయంగా సూర్యచంద్రుల స్వరూప స్వభావాలను తెలుసుకోవాలనే ఆసక్తి క్రీస్తుపూర్వమే మొదలైంది. సూర్యచంద్రులు రెండూ అంతరిక్షంలోని భారీ రాతిగోళాలని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్ తొలిసారిగా ప్రకటించాడు. శాస్త్రీయమైన దృష్టితో తన పరిశీలనకు తోచిన సంగతి చెప్పిన పాపానికి నాటి గ్రీకు పాలకులు మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణతో ఆయనను ఖైదులో పెట్టారు. నిండు పున్నమినాడు భూమ్మీద మనుషులకు చంద్రుడు పూర్ణ కాంతులతో దర్శనమిస్తాడు. ఎంత పూర్ణకాంతులతో ధగధగలాడుతున్నా చంద్రుడిపై అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలను సైతం నాటి మనుషులు నిశితంగా పరిశీలించారు. చంద్రుడిపై కుందేలు ఆకారంలోని నీడను చూసి అనేక అభూత కల్పనలను ఊహించుకున్నారు. చంద్రుడిపై భారీస్థాయి ఎత్తు పల్లాలు ఉన్నందు వల్లనే చంద్రుడి ఉపరితలంలోని కొన్ని ప్రదేశాలకు సూర్యకాంతి చేరుకోలేకపోతోందని, అందుకే మనకు అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నాయని మొట్టమొదటిసారిగా క్రీస్తుశకం రెండో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ప్లూటార్క్ తన ‘ఆన్ ది ఫేస్ ఇన్ ది మూన్స్ ఆర్బ్’ గ్రంథం ద్వారా తెలిపాడు. చంద్రుడిపై పడి పరావర్తనం చెందిన సూర్యకాంతి కారణంగానే చంద్రుడు మనకు వెన్నెల వెలుగులతో కనిపిస్తున్నాడని క్రీస్తుశకం ఐదో శతాబ్దికి చెందిన మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట తొలిసారిగా ప్రకటించాడు. కొంతకాలానికి మనుషులు ఖగోళ విశేషాలను మరింత నిశితంగా తెలుసుకోవడానికి దుర్భిణుల వంటి సాధనాలను రూపొందించుకున్నారు. గ్రహాలు, నక్షత్రాల తీరుతెన్నులను తెలుసుకునే ఉద్దేశంతో వేధశాలలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో బాగ్దాద్లో ఏర్పాటు చేసిన వేధశాల నుంచి పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త హబాష్ అల్ హసీబ్ అల్ మర్వాజీ చంద్రుని వ్యాసం 3,037 కిలోమీటర్లు ఉంటుందని, భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,46,345 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. ఆయన అంచనాలు అధునాతన పరిశోధనల్లో నిగ్గుతేలిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో శక్తిమంతమైన టెలిస్కోప్ను రూపొందించి, దాని ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, గ్రహచలనాలను ఏళ్ల తరబడి పరిశీలించి, అనేక విషయాలను వెల్లడించాడు. అంతరిక్షంలో భారతీయుడు సోవియట్ రష్యా 1984 ఏప్రిల్ 2న ప్రయోగించిన సోయజ్ టీ–11 రాకెట్ ద్వారా భారత పైలట్ రాకేశ్ శర్మ చంద్రమండలానికి చేరువగా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాడు. అంతరిక్షంలో అడుగు మోపిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన రాకేశ్ శర్మ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది రోజులు గడిపాడు. తిరిగి భూమిపైకి చేరుకున్న తర్వాత రష్యన్ బృందంతో కలసి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు, ఇందిరాగాంధీ ఆయనను ‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపించింది?’ అని అడిగారు. ఆమె ప్రశ్నకు రాకేశ్ శర్మ ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలోనే అత్యుత్తమంగా) కనిపించిందని బదులిచ్చాడు. ప్రచ్ఛన్న యుద్ధంతో అందిన చందమామ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకరకంగా చంద్రునిపై ఆధునిక పరిశోధనల పురోగతికి దోహదపడింది. ఇరవయ్యో శతాబ్దిలో నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రెండు దేశాలూ అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చంద్రునిపై ప్రత్యేకించి దృష్టి సారించాయి. ఎలాగైనా చంద్రునిపైకి చేరుకోవాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, భారీ స్థాయి పరిశోధనలకు నడుం బిగించాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో కొన్ని విఫలయత్నాల తర్వాత 1959లో లూనా–2 ప్రయోగం ద్వారా రష్యా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత లూనా–3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేసింది. చంద్రుని ఉపరితలం ఫొటోలను తీసి ప్రపంచానికి చూపింది. రష్యాను మించిన స్థాయిలో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపాలని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తలచాడు. జాతీయ సత్వర అవసరాల సభలో ఆయన ఈ అంశాన్ని ముందుకు తెచ్చాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీగా నిధులు మంజూరు చేశాడు. ఫలితంగా రష్యా చేపట్టిన లూనా–2 ప్రయోగానికి పదేళ్ల తర్వాత 1969లో అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుమోపగలిగాడు. వేగం పుంచుకున్న ‘ఇస్రో’ చంద్రునిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్లతో పోల్చుకుంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రునిపై చేపట్టిన తొలి ప్రయోగం 2008 నాటి ‘చంద్రయాన్–1’. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘చంద్రయాన్–2’ కోసం అప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. చంద్రునిపై ‘ఇస్రో’ ప్రయోగాలు ‘చంద్రయాన్–1’ నుంచి వేగం పుంజుకున్నాయి. ‘చంద్రయాన్–2’ పూర్తయిన తర్వాత 2024లో ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపట్టడానికి ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించారు. -
ద్రవిడ తుపానులో ఉదార ధీరుడు
తమిళ రాజకీయాలకి దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. అది– రాజకీయాలకీ, సినిమా రంగానికీ మధ్య అవినాభావ సంబంధం. గడచిన ఐదు దశాబ్దాల తమిళనాడు చరిత్రలో ఒకటి రెండు సందర్భాలలో తప్ప సినీ రంగం నుంచి వచ్చినవారే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ద్రవిడ పార్టీలు, వాటి నాయకులు దాదాపు అంతా సినీ కళాకారులు, రచయితలే. ఈ రకమైన సంస్కృతిని తరువాత కొన్ని పార్టీలు అలవరచుకున్నాయి కానీ, తమిళ రాజకీయాలను నేటికీ శాసిస్తున్న ఈ ధోరణికి ఆద్యుడు ఒక భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఆయనే సత్యమూర్తి. రంగస్థల నటులు, గాయకుల సాయంతో ఆయన 1937లో జరిగిన ఎన్నికలలో తమిళనాడు అసెంబ్లీలో 215 స్థానాలకు 159 జాతీయ కాంగ్రెస్ ఖాతాలో వేయించగలిగారు. కళాకారుల సాయంతో సత్యమూర్తి సాధించిన విజయం చరిత్రాత్మకమైనది. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడించినది జస్టిస్ పార్టీని. నిజానికి సత్యమూర్తి తమిళనాట నటీనటులనీ, గాయకులనీ స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములను చేశారు. జాతీయ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వారు పాడినవన్నీ దేశభక్తి గీతాలే. అవన్నీ స్వాతంత్య్ర సాధన గురించి ప్రబోధించినవే. సుందరశాస్త్రి సత్యమూర్తి (ఆగస్ట్ 19, 1887–మార్చి 28, 1943) పుదుక్కోటై సంస్థానంలో తిరుమయ్యమ్ అగ్రహారంలో జన్మించారు. పుదుక్కోటై మహారాజా కళాశాలలో చదివిన తరువాత, మద్రాస్ క్రైస్తవ కళాశాలలో చేరారు. ఆపై మద్రాస్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 1916–1920 మధ్య మద్రాస్ ప్రెసిyð న్సీ అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన ఎస్. శ్రీనివాస అయ్యంగార్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. అయ్యంగార్ కూడా భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడే. గౌహతి కాంగ్రెస్ సభలకు అధ్యక్షత వహించిన ఉద్దండుడు కూడా. న్యాయశాస్త్రంలో మెలకువలు, జాతీయ స్పృహ కూడా ఆ సమయంలోనే సత్యమూర్తికి గురువు గారి దగ్గర నుంచి వరాలుగా వచ్చాయి. సాధారణంగా రాజకీయవేత్తలలో, ఉద్యమ దిగ్గజాలలో కనిపించని అరుదైన లక్షణాలు సత్యమూర్తిలో మేళవించి ఉంటాయి. ఆయన విద్యార్థిగా ఎంతో ప్రతిభ చూపించారు. ఇది చాలామంది రాజకీయవేత్తలలో సహజమే. ఆంగ్లం, తమిళ భాషలలో నిష్ణాతుడు. ఆ రెండు భాషలలోనూ మహావక్త. ఇది కూడా రాజకీయనాయకులకి కొత్తకాదు. ఉద్యమంలో తలమునకలై ఉన్నా స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడడం ఒకటి కనిపిస్తుంది. కానీ కళల మీద ఆయన చూపించిన ఆసక్తి చిత్రంగా ఉంటుంది.సత్యమూర్తి రాజకీయ ప్రస్థానం విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్నిక కావడంతో ఆరంభమైంది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ఉద్యమంలో (1906) మూర్తి పాల్గొన్నారు. 1908లో మద్రాస్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు స్వచ్ఛంద సేవకునిగా హాజరయ్యారు. దీనితో చాలా చిన్న వయసులోనే ఆయన సామాజిక, రాజకీయ జీవితంలో ప్రవేశించినట్టయింది. శ్రీనివాస అయ్యంగార్ శిష్యరికంతో జాతీయ కాంగ్రెస్ దక్షిణాది నేతలలో ఒకరిగా గుర్తింపు పొందారు. పైగా గురువే రాజకీయాలలో ప్రవేశించమని చెప్పడంతో ద్విగుణీకృతోత్సాహంతో సత్యమూర్తి పనిచేశారు. 1919లో వచ్చిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, ఆ తరువాత జరిగిన జలియన్వాలా బాగ్ దురంతానికి నిరసనగా దేశ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలలో సత్యమూర్తి పాల్గొన్నారు. అప్పుడే వచ్చిన మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల గురించి, రౌలట్ చట్టం గురించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (ఇంగ్లండ్) ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించాలని కాంగ్రెస్ నిశ్చయించింది. ఈ బృందంలో సత్యమూర్తి ఒకరు. అటు పార్లమెంటరీ కమిటీ ఎదుట వాదనలు వినిపిస్తూనే, మరొక క్లిష్టమైన పనిని కూడా సత్యమూర్తి చేశారు. సరిగ్గా అప్పుడే ‘ది హిందు’ పత్రిక ప్రతినిధి పదిరోజులు సెలవు పెట్టారు. ఆయన బాధ్యతలను సత్యమూర్తి స్వీకరించి, పత్రికా రచయిత అవతారం ఎత్తారు. అది అక్కడితో ఆగిపోలేదు. చాలా సందర్భాలలో ఆయన ‘ది హిందు’ పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఇంగ్లండ్లో చేసిన వాదనలను బట్టి, ఆయన వ్యక్తం చేసిన భావాలను బట్టి సత్యమూర్తి గొప్ప ఉదారవాద రాజకీయవేత్త అనిపిస్తారు. రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగబద్ధ విధానాలలో స్వరాజ్యం తెచ్చుకోవాలని ఆనాడు భావించిన ఉదారవాద నేతలలో ఆయన కూడా ప్రముఖంగా కనిపిస్తారు. నిజానికి విఎస్ శ్రీనివాసశాస్త్రి, తేజ్బహదూర్ సప్రూ వంటివారు ఈ వర్గానికి చెందుతారు. అందరికీ సమానావశాకాలు, మత సామరస్యం, సమానత్వం గురించి, ఈ ధోరణి స్వాతంత్య్రోద్యమంలో ప్రతిబింబించడానికి వీరు తమ వంతు కృషి చేశారు. అందుకే సంస్థల దృక్పథాలతో సరిపడనప్పడు నిస్సంకోచంగా విడిచిపెట్టేవారు. సత్యమూర్తి హిందూధర్మంలోని కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. 1920 నుంచి గాంధీజీ భారతీయులు చట్టసభలను బహిష్కరించాలన్న అభిప్రాయంతో ఉండేవారు. 1919 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం భారతీయులకు పరిమితంగానే అయినా ఆ అవకాశం బ్రిటిష్ వారు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నదే సత్యమూర్తి అభిప్రాయం. ఇటు ఉద్యమం, అటు చట్టసభలలో బలంగా వాణిని వినిపించడం రెండూ సమాంతరంగా జరగాలన్నదే సత్యమూర్తి వంటి వారి నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తుంది. ఈ విషయంలో సత్యమూర్తి అనుభవం గాఢమైనది. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జస్టిస్ పార్టీ బ్రిటిష్ జాతీయుల తొత్తు. అంటే భారతీయులను తమ కన్ను తామే పొడుచుకునే వికృత క్రీడకు చట్టబద్ధత కల్పించారు. ఇందుకు అవకాశం గాంధీజీ వైఖరితోనే ఇంగ్లండ్కు వచ్చింది. అయినా సత్యమూర్తి కౌన్సిల్కు పోటీ చేశారు. అలా అని సత్యమూర్తి తిలక్ వలే సంపూర్ణ స్వాతంత్య్ర భావనను వ్యక్తం చేసినవారు కాదు. పాక్షిక స్వాతంత్య్రమే ఆయన లక్ష్యం. దీనినే డొమీనియన్ స్టేటస్ అనేవారు. 1925 వరకు కాంగ్రెస్లో ఈ ధోరణి బలంగానే ఉండేది. చట్టసభలకు దూరంగా ఉండాలన్న గాంధీజీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ను సమర్ధించాలన్న అనీబిసెంట్ నిర్ణయంతో ఆమెతో కూడా సత్యమూర్తి విభేదించారు. ఆయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి (ఢిల్లీ)కి కూడా ఎన్నికయ్యారు. ఉదారవాదుల వల్ల భారతదేశానికి జరిగిన గొప్ప మేలు– పార్లమెంటరీ విధానానికి పునాదులు పడ్డాయి. ఒక దశలో చిత్తరంజన్దాస్, మోతీలాల్ నాయకత్వంలో నడిచిన స్వరాజ్య పార్టీలో సత్యమూర్తి సభ్యునిగా ఉన్నారు. ఆ విధంగా గాంధీజీ వాదాన్నీ, ఉద్యమాన్నీ సత్యమూర్తి నిరాకరించారు. అప్పటికే గాంధీజీ ప్రభావం భారతదేశంలో విశేషంగా ఉంది. అందుకే ఆయనను ‘ధీర’ సత్యమూర్తి అని కూడా అంటూ ఉండేవారు. 1937 ఎన్నికలలో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కాంగ్రెస్కు ఆధిక్యం సంపాదించి పెట్టినవారు సత్యమూర్తి. అప్పటికి సి. రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం వంటివారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ విజయం కోసం పాటు పడడానికి అనేక మంది కళాకారులు ముందుకు వచ్చారు. వీరిని సత్యమూర్తి సాదరంగా ఆహ్వానించారు. ‘మాకు పాడటమే తెలుసు. ఆ విధంగా కళ ద్వారా మేం కూడా జాతీయ కాంగ్రెస్ కోసం పనిచేస్తాం’ అని చెప్పారు వారు. ఎన్నో కాంగ్రెస్ ప్రచార సభలలో కళాకారులు పాల్గొన్నారు. అప్పుడు టీకేఎస్ సోదరుల నాటక బృందానికి చెందిన టీకే షణ్ముగం కళాకారులకు, కాంగ్రెస్కు మధ్య వారధిలా పనిచేశారు. ఎన్ఎస్ కృష్ణన్ అనే హాస్యనటుడు కూడా సత్యమూర్తి ప్రోద్బలంతో కాంగ్రెస్ కోసం శ్రమించారు. కేబీ సుందరంబాళ్ అనే గాయని, నటి ఉండేవారు. ఆమె భర్త కేజీ కిట్టప్ప, ఆయన అకాల మరణంతో విరక్తి చెంది కళలకు దూరంగా వెళ్లిపోయింది. ఆమెను కూడా ఆ సమయంలో సత్యమూర్తి ఒప్పించి, నందనార్ చలనచిత్రంలో ఆమె కోసం వేచి ఉన్న పాత్ర ధరింపచేశారు. ఆ చలనచిత్రం ఇతివృత్తం పురాణమే అయినా, ఆ చిత్రం నిండా దేశభక్తి గీతాలు ఉన్నాయి. ఘన విజయం సాధించింది. ఇద కాంగ్రెస్కు ఎంతో ఉపయోగపడింది. కానీ కళాకారులతో కాంగ్రెస్ ప్రచార సభలు నిర్వహిచడం పార్టీకి నచ్చలేదు. అప్పుడు మద్రాస్ ప్రధానమంత్రి (ముఖ్యమంత్రి) రాజాజీ. ఆయన కూడా వ్యతిరేకించారు. కానీ సత్యమూర్తి ఆలోచనను అప్పటికి బలపడిన ద్రవిడ పార్టీలు సొంతం చేసుకున్నాయి. ద్రవిడ పార్టీల మాతృసంస్థ జస్టిస్ పార్టీయే. అంటే సత్యమూర్తిని నిలువెల్లా ద్వేషించిన సంస్థ కొమ్మలే ఆయన ఆలోచనను దివ్యంగా స్వీకరించాయి. సీఎన్ అన్నాదురై, కె. కరుణానిధి నాటి ద్రవిడ పార్టీలో ప్రముఖులు. ఆ ఇద్దరూ పేరుగాంచిన నాటకకర్తలే. రంగస్థల నటులు కూడా. తరువాత సినీ రంగంలో ప్రవేశించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని రాజ్యాధికారంగా మార్చేశారు (కళాకారుల అండతో ద్రవిడ పార్టీ సాధించిన విజయాన్ని చూసి కూడా కాంగ్రెస్ పార్టీ తన మంకు పట్టును వీడలేదు. రంగుపూసుకునే వాళ్లతో రాజకీయం ఏమిటన్నదే వారి వాదన. ఇది సత్యమూర్తి కన్నుమూసిన తరువాత కూడా కొనసాగింది. 1952 నాటి తొలి సాధారణ ఎన్నికలలో పైన పేర్కొన్న హాస్యనటుడు కృష్ణన్ను దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రోత్సహించి అభ్యర్థిత్వం ఇప్పించారు. కానీ రంగు పూసుకుని రోడ్ల మీద గంతులు వేసే వాళ్లు –కూతైడిగల్– చట్టసభలకు రానక్కరలేదు అని నాయకులు అన్నారు. మనస్తాపం చెందిన కృష్ణన్ అభ్యర్థిత్వం వదులుకున్నారు. తరువాత డీఎంకేలో ఆయన పనిచేశారు). 1939లో సత్యమూర్తి మద్రాస్ మేయర్గా ఎన్నికయ్యారు. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమై కొద్దికాలమే అయింది. మద్రాస్ నగరానికి బాంబుల భయంతో పాటు, నీటి కటకట కూడా పట్టుకుంది. అలాంటి పరిస్థితిలో బ్రిటిష్ అధికారులను ఒప్పించి మద్రాస్కు యాభయ్ కిలోమీటర్ల దూరంలో పూండి రిజర్వాయిర్ నిర్మాణం కోసం పునాది రాయి వేయించారు. ఆ రోజులలో మేయర్ పదవీ కాలం సంవత్సరమే. అయినా ఇంత పెద్ద పథకానికి పదవి చేపట్టిన ఎనిమిది మాసాలలోనే పునాది రాయి వేయించారు. కానీ పూర్తయిన జలాశయం చూసేందుకు ఆయనకు అవకాశం లేకపోయింది. తరువాత దానికి సత్యమూర్తి జలాశయం అని పేరు పెట్టారు కూడా. సత్యమూర్తిని మరొక కోణం నుంచి కూడా తమిళనాడు గుర్తుంచుకుంటుంది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వ్యవస్థాపకులు ఆయనే. అంతరించిపోయే దశకు చేరుకున్న భరతనాట్యానికి తిరిగి జీవం పోయడానికి ఇ. కృష్ణఅయ్యర్ నడుం కట్టినప్పుడు సత్యమూర్తి ఆయనకు అండదండలిచ్చారు. దీనిని పునరుద్ధరించేందుకు సహకరించి, 1935లో కా్రంగెస్ సభలు జరిగినప్పుడు అందులో ప్రదర్శన ఇప్పించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా ఆయన ఎన్నో మంచి పనులు చేయించారు. సత్యమూర్తి ఎన్నోసార్లు అరెస్టయ్యారు. 1930లో పార్థసార థి ఆలయం మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసే యత్నంలో ఒకసారి అరెస్టయ్యారు. తరువాత 1942లో వ్యక్తి సత్యాగ్రహం చేసి కూడా అరెస్టయ్యారు. అప్పటికే ఆయన వెన్నుకు దెబ్బతో బాధపడుతున్నారు. ఆ స్థితిలో నాగపూర్లోని అమరావతి జైలులో ఉంచారు. పరిస్థితి విషమించడంతో మద్రాస్ తీసుకువచ్చి జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన కన్నుమూశారు. ‘ది హిందూ’ వ్యాఖ్యానించినట్టు సత్యమూర్తి ‘పుట్టుకతోనే స్వాతంత్య్ర సమరయోధుడు’. - డా. గోపరాజు నారాయణరావు -
దోచేవారెవరురా..!
తొలిసారిగా దేశంలోని దొంగలందరూ సమావేశమయ్యారు. చారల టీషర్ట్ వేసుకున్న సీనియర్ దొంగ చోరకుమార్ మైక్ అందుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు... ‘‘దొంగమిత్రులందరికీ దొంగాభివందనములు. దేశ నలుమూలల నుంచి వచ్చిన దొంగమిత్రులారా!... ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియజేయడానికి ముందు... తెలుగు సినీ పరిశ్రమకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం..’’ ‘‘వాళ్లకు మన మీద ప్రేమ ఎందుకుంటుందండీ బాబూ... నారు పోశారా? నీరు పోశారా? బీరు పోశారా... కనీసం కల్లు అయినా పోశారా?’’ పాయింట్ లేవనెత్తాడు వర్ధమాన దొంగ రాకెట్కుమార్. ‘‘ప్రేమ లేదని ఎందుకనుకోవాలి. ఎన్నో సినిమాలకు మన పేర్లు పెట్టుకున్నారు. మచ్చుకు కొన్ని...’’ అంటూ ఇలా లిస్ట్ చదివాడు చోరకుమార్. దొంగ దొంగలకు దొంగ దొంగ మొగుడు దొంగల దోపిడి దొంగ రాముడు దొంగపెళ్లి దొంగలు బాబోయ్ దొంగలు దొంగోడొచ్చాడు దొంగగారు స్వాగతం యమదొంగ అమ్మదొంగా మంచిదొంగ జేబు దొంగ అడవి దొంగ కొండవీటి దొంగ టక్కరి దొంగ ఘరానా దొంగ భలే దొంగ ఇద్దరు దొంగలు తోడు దొంగలు...’’ ‘‘సరే...ఈ పేర్ల సంగతి పక్కన పెడితే అసలు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే... ఇన్నాళ్లుగా మనం అసంఘటిత రంగంలో ఉన్నాం. ఇప్పుడిక సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. మన హక్కుల్ని సాధించుకోవాలి... అవి సాధించుకోవాలంటే మనకంటూ ఒక జాతీయసంఘం ఉండాలి. మన తొలి జాతీయ మహాసభ వచ్చేవారం బిహార్లోని చోర్గంజ్లో జరుపుకోబోతున్నాం. ఆ సభలలో కొన్ని తీర్మానాలు చేయడం, ప్రతిభావంతులైన దొంగలకు సన్మానం చేయడం, ప్రతిభా పురస్కాలరాలను ఇవ్వడం, లేటెస్ట్ దొంగ గాడ్జెట్స్ను పరిచయం చేయడం జరుగుతుంది’’ అని ప్రకటించాడు చోరకుమార్. బిహార్లోని చోర్గంజ్. దేశం నలుమూలల నుంచి దొంగలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకుడు డొనాల్డ్ థీఫ్ మైక్ అందుకున్నాడు... ‘‘మిత్రులారా... అనివార్యకారణాల వల్ల విజయ్మాల్యా, నీరవ్ మోడీలు ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు వర్తమానం పంపారు. సభ జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు. వారు స్వదేశానికి రాగానే మన సంఘంలో గౌరవ పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన సభ తరపున కొన్ని తీర్మానాలు చదువుతాను... ► స్కూళ్లలో దొంగతనాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి ► సాటి విద్యార్థుల పెన్నులు, బుక్స్, బ్యాగ్లు కొట్టేసే చిన్నారి దొంగలకు ఉపకార వేతనాలు ఇవ్వాలి. ► అత్యుత్తమ దొంగలకు ప్రతి యేడు ‘దొంగశ్రీ’ అవార్డ్లు ప్రకటించాలి. ► వయసు మీద పడిన దొంగలకు ఫించన్లు ఇవ్వాలి. ఒకటా రెండా... ఇలా ఎన్నో తీర్మానాలను ఆమోదించారు. తరువాత ‘అత్యుత్తమ దొంగ’ అనే కార్యక్రమం మొదలైంది... దొంగల్లోని అరుదైన ప్రతిభావిశేషాలను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... ‘‘ఈయన పేరు ఏబీసీడీ. స్క్రిన్ నేమ్ లాగా ఇది ఈయన చోర్ నేమ్. 24 గంటల్లో 84 చోరీలు చేసి దొంగీస్ రికార్డ్ల్లోకి ఎక్కాడు’’ ‘‘ఈయన పేరు ఘోటక బ్రహ్మచారి. పేరు చూసి మోసపోవద్దు. ఇప్పటి వరకు పదికి పైగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. మామూలుగానైతే పెళ్లిళ్లలోకి బయటివారు దూరి దొంగతనం చేస్తారు. కాని ఈ బ్రహ్మచారి మాత్రం... తన పెళ్లికి వచ్చిన అతిథులను నిలువుదోపిడీ చేస్తాడు. ఎంత కొమ్ములు తిరిగిన డిటెక్టివ్ అయినా...పెళ్లికుమారుడిని పొరపాటున కూడా అనుమానించడనేది ఇతని సిద్ధాంతం. ఈ థియరీకీ కళ్యాణం కట్ కట్... అనే పేరు కూడా పెట్టాడు.’’ ఇలా కొన్ని పరిచయాలైన తరువాత... ‘‘మన దొంగల్లో సైంటిస్ట్లు ఉన్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన పేరు టెక్ శ్రీను. మన దొంగజాతి కోసం ఎన్నో ఉపకరణాలు తయారుచేశాడు. ప్రసుత్తం సంచలనాత్మకమైన, చరిత్రను తిరగరాసే మెషిన్ను తయారు చేశాడు. ఇదిగో... ఫ్రిజ్లా కనిపిస్తున్న దీని పేరు ‘జాం ఝటక్ హాం ఫటక్’. ఈ మెషిన్తో ఇంట్లో కూర్చొనే, కడుపులో చల్ల కదలకుండా ఎంచక్కా దొంగతనాలు చేసుకోవచ్చు. చిన్న దొంగతనాలైతే... గంటకు అయిదు, ఒక మాదిరి దొంగతనాలైతే... గంటకు రెండు. పెద్ద దొంగతనాలైతే... రోజుకు రెండు చొప్పున చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెషిన్ను వేలం వేస్తున్నాం. అయితే ఎంత ఎమౌంట్ అయితే పాడుతారో ఆ మొత్తాన్ని ఒక కవర్లో వేసి, తమ పేరు రాసి అప్పటికప్పుడు ఈ మెషిన్ మీద పెట్టాలి’’ అని పాట మొదలుపెట్టాడు పరిచయకర్త. ‘నా పాట కోటి నలభై అయిదు లక్షలు’ అని పాడి ఆ మొత్తాన్ని పెద్దసంచిలో వేసి ‘జాం ఝటక్.. హాంఫటక్’ మెషిన్ మీద పెట్టాడు బెంగాల్ నుంచి వచ్చిన డొంగర్ బెనర్జీ. ‘నా పాట రెండు కోట్ల నలభై లక్షలు’ అని పాడి అట్టి మొత్తాన్ని గోనెసంచిలో వేసి మెషిన్ మీద పెట్టాడు రాజస్థాన్ నుంచి వచ్చి చోర్లాలాచౌహాన్. పాట పదికోట్లు దాటి ఆగిపోయింది. ఈలోపు కరెంట్ పోయింది. కొద్దిసేపట్లోనే పోయిన కరెంట్ వచ్చింది. కానీ ‘జాం ఝటక్’ మెషిన్ను కనిపెట్టిన టెక్ శ్రీను మాయమయ్యాడు. ఆయన కనిపెట్టిన మెషిన్ మాయమైంది. ఆ మెషిన్పై ఉన్న డబ్బు మాయమైంది. సభ గందరగోళమైంది! – యాకుబ్ పాషా -
గజాసుర గర్భంలో శివుడు!
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు శివుడు, వాణిశ్రీ పార్వతిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన అచంచలమైనది’’ అన్నాడు శివుడు తన భక్తుడైన గజాసురుడి గురించి. ‘‘స్వామీ! అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు’’ అన్నది పార్వతి. ‘‘మంచిచెడులు ఎంచుకొని వరాలు ఇవ్వడం ధర్మం కాదు’’ అన్నాడు శివుడు. ‘‘ఒకరికి ఇచ్చిన వరం మరొకరికి శాపం కారాదు’’ అన్నది పార్వతి. ‘‘ఆరాధించే భక్తులను అనుగ్రహించకపోవడం మాకు వీలుకాదు’’ అన్నాడు శివుడు. ‘‘దానివల్ల లోకం నాశనమైతే?’’ అడిగింది పార్వతి. ‘‘నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయం నుండి నవయురాగారంభం అవుతుంది’’ అన్నాడు శివుడు. ‘‘అయితే మీ అర్ధాంగి మాట...’’ పార్వతి. ‘‘మన్నించలేదని మథనపడకు. అకుంఠితదీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తున్ని చూడు...’’ అన్నాడు శివుడు. భూలోకంలో... ‘‘ఓం...నమశ్శివాయ’’ అంటూ గజాసురుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో... ‘‘పరమేశ్వరా! భక్తవత్సలుడవని కరుణామయుడవని అంటారే! ఈ దాసునిపై నీకు ఇంకా దయ రాలేదా! నీ మనసు కరగలేదా? ఈ దాసునికి నీ దివ్యమంగళ రూపం దర్శించే భాగ్యం కలిగించవా ప్రభూ! నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు...’’ అని ఖడ్గంతో గజాసురుడు శిరచ్ఛేధనం చేసుకోబోతుండగా శివుడు ప్రత్యక్షమై...‘‘ఆగు గజాసురా!’’ అని వారించాడు. శివుడిని చూడగానే గజాసురుడి కళ్లల్లో వెలుగు నిండింది. ‘‘స్వామీ! ముక్కంటి దేవరా! గౌరీ మనోహరా... గంగాధరా! కరుణించవా స్వామీ!’’ భక్తి పారవశ్యంతో అన్నాడు గజాసురుడు. ‘‘అనితరసాధ్యమైన నీ ఆరాధననకు సంతసించాను. నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఏం కావాలో కోరుకో!’’ భక్తుణ్ణి అడిగాడు శివుడు. అప్పుడు గజాసురుడు తన మనసులో మాట సూటిగా అడిగాడు... ‘‘ప్రభూ! నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువుండాలి’’ ‘‘గజాసురా! ఏమి ఈ విపరీతమైన కోరిక. అనంతమూ, సకల జనాదరణీయమైన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా?’’ అడిగాడు శివుడు. ‘‘స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామీ! నా కోరికను మన్నించవలె’’ అని తన విపరీత కోరికను సమర్థించుకున్నాడు గజాసురుడు. ‘‘గజాసురా! దుర్భరమైన ఈ వరం ఏ విపరీతాలకు దారి తీస్తుందో తెలుసా?’’ హెచ్చరించాడు శివుడు. ‘‘నీ చరణాలను నమ్ముకున్న నేను ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను స్వామీ!’’ అన్నాడు పట్టు వదలని గజాసురుడు. ఇక చేసేదేమీ లేక శివుడు గజాసురుడు అడిగిన వరాన్ని ఇచ్చాడు. గజాసురుడి ముందు జంగమయ్యలు ప్రదర్శన ఇచ్చారు. ‘‘మీ ప్రదర్శనకు మెచ్చినాము. ఏమి కావలెనో కోరుకోండి’’ అన్నాడు గజాసురుడు. పక్కనే ఉన్న నారదుడు మాత్రం– ‘‘గజాసురా! తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరుతారో ఏమో’’ అని హెచ్చరించాడు. ‘‘ఏం కోరినా ఇస్తా నారదా! మేము అపరపరమేశ్వర అవతారులం. వరాలను అనుగ్రహించడంలో ఆ శివునికి ఏమీ తీసిపోం’’ అన్నాడు. ఆ మాటల్లో గర్వం ప్రతిధ్వనిస్తోంది. ‘‘అది నిజమే. ఈ అపరపరమేశ్వరుడు ఆడిన మాట తప్పనివాడు. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనకు తగిన బహుమానం లభిస్తుంది. కోరుకోండి. సందేహించకండి’’ అన్నారు వందిమాగధులు. ‘‘మేము అందరిలాంటి యాచకులం కాదు జంగమయ్యలం. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి’’ అని అడిగారు జంగమయ్యలు. ‘‘ఏమిటి ఈ విపరీతమై కోరిక!’’ ‘‘వీరు గంగిరెద్దుల వారు కాదు. కపట వేషధారులు... బ్రహ్మ, విష్ణువులు..’’ అంటున్నారు గజాసురుడి పరివారం. నిజమే... వారు గంగిరెద్దుల వారు కాదు... బ్రహ్మ, విష్ణువులు. ‘‘ఎంత మోసం!’’ అన్నాడు గజాసురుడు. ‘‘మోసం కాదు గజాసురా! లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయాల్సి వచ్చింది. అందరివాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా?’’ ‘‘అందరి హృదయంలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా! ఆదిదంపతులను వేరు చేయుట దురుద్దేశం కాదా!’’... అన్నారు బ్రహ్మ, విష్ణువులు. ‘‘నారాయణ! మాట ఇచ్చేముందు నా మాట విని ఉంటే ఇంతవరకు వచ్చేదా?’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమంటావు గజాసురా! అపరపరమేశ్వరుడిలా ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే. ఇప్పుడేమంటావు ఆడిన మాట తప్పుతావా?’’ ఎత్తిపొడిచారు బ్రహ్మ, విష్ణువులు. ‘‘అన్నమాట కాదన్నమాట మేమెరుగం. అయినా చేతులతో తీసివ్వడానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే ఫాలలోచనుడిని బయటికి రప్పించి తీసుకెళ్లండి’’ అన్నాడు గజాసురుడు. ‘‘శివున్ని రప్పించడం అంటే కుప్పిగంతులు వేసినట్లు కాదు. తీసుకెళ్లమనండి చూద్దాం’’ అని రెచ్చగొట్టారు వందిమాగధులు. ‘సాంబ సదాశివ శంభోశంకర పరమ దయాకర భక్త వశంకర నంది వాహన నాగభూషణ భయవిమోచన... కాలలోచన... కడుపు చీల్చుకొని రా’ అంటూ గానం చేస్తున్నారు బ్రహ్మ, విష్ణువులు. అంతే... గజాసురుడి కడుపులో భరించలేని నొప్పి మొదలైంది. కొద్దిసేపట్లోనే... అతడి కడుపును చీల్చుకుంటూ శివలింగం బయటికి వచ్చింది. ‘‘భక్త వశంకరా! సుర పక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా! వరం ఇచ్చినట్లే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామీ!’’ మరణశయ్యపై ఉన్నాడు గజాసురుడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై... ‘‘గజాసురా! విపరీతమై వరాలు విపత్కరాలని ఆనాడే నిన్ను హెచ్చరించాను’’ అంటూ గతాన్ని గుర్తు చేశాడు. ‘‘నిజమే స్వామీ! అజ్ఞానంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని గ్రహించలేకపోయాను. కాని దానికి ఇంత శిక్ష విధిస్తావా! అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకారబంధురం చేసి వెళ్లిపోతావా!’’ అని దుఃఖిస్తున్నాడు మృత్యువుకు చేరువులో ఉన్న గజాసురుడు. సమాధానం - శ్రీ వినాయక విజయం -
నేలమాళిగ
ఒంటిగంట రాత్రి... గడ్డకట్టే చలి.. నిర్మానుష్యంగా ఉంది అంతా! ఆ ఇంట్లో నేల.. ఉన్నట్టుండి శబ్దం చేయసాగింది. ఫ్లోరింగ్లో లోపలి నుంచి ఎవరో బలంగా కొడ్తున్న శబ్దం... అంతకంతకూ ఎక్కువై... మార్బుల్ ఫ్లోర్ మీదున్న మంచం కిందపడిపోయింది. మంచం పడిపోగానే నేల సద్దుమణిగింది. గాఢ నిద్రలో ఉన్న నరేంద్ర.. తలకు దెబ్బతగలడంతో టక్కున కళ్లు తెరిచాడు. చూసుకుంటే .. పక్కకు ఒరిగి పోయిన మంచం నుంచి జారి ఉన్నాడు. తలకిందులుగా కనిపించింది గది.. తలంతా దిమ్ముగా ఉంది. ‘‘ఎలా పడ్డాను?’’ .. ‘‘ఇదేంటి?’’ అన్న ఆశ్చర్యం కించిత్తు కూడా లేదు అతని మొహంలో. 62 ఏళ్ల అతను లేచి.. రెండు చేతులతో తలను పట్టుకొని కాసేపు అలాగే కూర్చున్నాడు. కాస్త స్థిమితపడ్డాక.. మంచానికి కాస్త దూరంగా మూలన ఉన్న గది లైట్ స్విచ్వేసి.. . వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చాడు. ఆ గదిలోకి వచ్చేసరికి లైట్ ఆరిపోయి ఉంది. మళ్లీ నేల లోపలి నుంచి చప్పుడు మొదలైంది. అది తనకు అలవాటే అన్నట్టుగా ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. బలమంతా ఉపయోగించి ఒరిగిన మంచాన్ని నాలుగు కాళ్ల మీద నిలబెట్టాడు. ఆ మంచం మీద అతను కూర్చోబోతుంటే.. నరేంద్ర కాళ్లను కింద నుంచి తన్నింది నేల. మళ్లీ లైట్ వేయడానికి మంచం దగ్గర్నుంచి కదిలాడు నరేంద్ర. నేలలోపల ఓ ఆకారం .. అది గమనించి.. అతని కంటే ముందే గబగబా లోపలి నుంచే గది ఆ మూలకు వెళ్లింది.. దానితో పోటీ పడుతున్నట్టుగా అతనూ వెళ్లి స్విచ్ వేశాడు.. వెలగలేదు. మళ్లీ ట్రై చేశాడు. వెలగలేదు. ‘‘ఏయ్ వదులు..’’ అన్నాడు కిందకు కాస్త వంగి నేల లోపలి ఆకారాన్ని ఉద్దేశిస్తూ! ‘‘నేను చెప్పింది విను మరి’’ అంది ఆ నేలమాళిగలోని ఆకారం. తల పంకించి ఆ చీకట్లోనే వచ్చి మంచం మీద కూర్చున్నాడు అతను. ‘‘అలా చీకట్లోనైనా కూర్చుంటావ్ కాని.. నేను చెప్పింది చేయవ్ అన్నమాట’’ అంది లోపలి ఆకారం. ఏమీ మాట్లాడకుండా.. మాళిగలోని ఆ ఆకారం వైపే చూడసాగాడు. చిత్రంగా... అక్కడంతా వెలుగు. ఆ ఆకారం ఉన్న మేరా! కాళ్లు కిందకు వేసి... తల కాస్త కిందకు వంచి.. మోకాళ్ల మీద మోచేతులు ఉంచి... కుడి అరచేత్తో ఎడమ అరచేతిని మడుస్తూ చుబుకం దగ్గర పెట్టుకొని ఆలోచనల్లో పడ్డాడు నరేంద్ర.. నేలమాళిగలోని ఆకారం కూడా సైలెంట్ అయిపోయి.. అతణ్ణే పరిశీలిస్తూ ఉంది. నరేంద్ర రిటైర్ అయ్యి రెండేళ్లవుతోంది. పిల్లలిద్దరూ యూరప్లో ఉన్నారు వాళ్ల కుటుంబాలతో. ఇండియాకు వచ్చే ఆలోచన కూడాలేదు.. కనీసం చుట్టపుచూపుగా కూడా. భార్య పోయాక.. సొంతూళ్లో.. అంత పెద్ద ఇంట్లో.. ఒంటరిగా.. భార్య జ్ఞాపకాలతో బతకడం కష్టమనిపించింది. అందుకే ఆ ఇంటికి.. ఆ ఊరికి.. తన వాళ్లకు దూరంగా.. హిల్స్టేషన్లాంటి ఈ చోటికి వచ్చేశాడు. ఇప్పుడుంటున్న చిన్న ఇల్లు కొనుక్కున్నాడు.. కొంచెం వాలు మీద.. చుట్టుపక్కల ఏ ఇల్లూ లేక.. ఏకాంతంగా.. ఉందని. కొనేటప్పుడు ఆ ఊళ్లోని చాలా మంది హెచ్చరించారు.. ఆ ఇంటి జోలికి వెళ్లొద్దని. ముప్పై ఏళ్ల నాటిది ఆ ఇల్లు. అంతకుముందెప్పుడో .. ఓ యాభై ఏళ్ల కిందట ఓ జమీందారు అక్కడ వేసవి విడిది కట్టుకున్నాడట. కోటలా ఉండేదట అది. అక్కడ ఆయనకు అన్నీ చూసిపెట్టడానికి ఒక వ్యక్తి ఉండేవాడట. ప్రతి వేసవిలో అక్కడికి వచ్చేవాడట జమీందారు. జమీందారీ రద్దతువుతున్నప్పుడు తన దగ్గరున్న డబ్బు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు అన్నీ తెచ్చి.. ఇక్కడ కోటలో పాతి పెట్టాడట. ఒకసారి.. వాటికి ఆశపడ్డ ఆ కోటలోని జమీందారు బాగోగులు చూసుకునే వ్యక్తి ... వాటిని పెద్ద మూటలో కట్టి.. తీసుకెళ్లబోతూ జమీందారుకు పట్టుబడ్డాడని.. వాటితోనే అతణ్ణి.. ఆ జమీందారు అదే గొయ్యిలో సజీవ సమాధి చేశాడనీ.. తర్వాత జమీందారు పాము కుట్టి చనిపోయాడని.. ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి చాలా ఏళ్ల దాకా.. ఆ కోటను పట్టించుకునేవారే లేకుండిరట. ఆ బంగారం కోసం.. డబ్బు కోసం తవ్వకాలూ జరిగాయట. అలా తవ్వకాలు జరిపిన వాళ్లు .. కొన్ని రోజులకు ఆ చుట్టుపక్కలే ఏదో రకంగా మృత్యువాత పడ్డారని పుకారు. ఏదేమైతేనేం.. కొన్నాళ్లకు.. ఓ ఫ్రెంచ్ వ్యక్తి .. జమీందారు కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి ఆ కోటను కొనుక్కున్నాడు. దాన్నంతా పడగొట్టించి.. చుట్టూ ప్లేస్ అలాగే పెట్టి.. చిన్న ఇల్లు కట్టించుకొని అందులో ఉండసాగాడు. ఆ ఫ్రెంచ్ వ్యక్తి ఆ జాగను కొనుక్కున్నాడని తెలిశాక.. ఊర్లో చాలామంది గుసగులు.. అతనికి ఆ నేలమాళిగలోని బంగారం బయటకు తీయడం తెలిసిందని. కానీ.. కొన్నాళ్లకే ఆ ఫ్రెంచ్ వ్యక్తి ఇంట్లోని బెడ్రూమ్లో మంచం మీద నుంచి కిందపడి.. తలకు బలమైన దెబ్బ తగిలి చనిపోయాడు. తర్వాత ఆ ఫ్రెంచ్ వ్యక్తి కుటుంబీకులు వచ్చి ఆ ఇంటిని ఇంకెవరికో అమ్మేశారు. ఆ కొనుక్కున్న వ్యక్తీ అలాగే చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు భయపడి ఆ ఇంటిని వేరే ఊరి వాళ్లకు అమ్మేసి వెళ్లిపోయారు. ఆనక వచ్చిన వాళ్లదీ అదే అనుభవం. వాళ్లు నరేంద్రకు అమ్మారు. అప్పుడు నరేంద్రను ఊళ్లో వాళ్లంతా భయపెట్టారు... నచ్చజెప్పారు.. హెచ్చరించారు ఇల్లు కొనద్దని. అయినా అలాంటివి నమ్మని నరేంద్ర ఇల్లు కొన్నాడు. కొన్ని మరుసటి రోజు నుంచే నేలమాళిగలోంచి చప్పుళ్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో భయపడ్డాడు. యేడాదిగా అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఆ ఆకారంతో మాట్లాడుతున్నాడు కూడా. చాలాసార్లు ఆ ఆకారం అతనికి తన దగ్గరున్న బంగారం.. వెండి.. వజ్రాలను ఆశ చూపింది.. తనను బయటకు తీస్తే వాటిని ఇస్తానని. నవ్వుతూ దాటవేస్తూనే ఉన్నాడు నరేంద్ర. ‘‘నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో?’’ లోపలి నుంచి ఆకారం అతని మౌనాన్ని, ఏకాంతాన్ని భంగపరిచింది. ‘‘ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడే నా మొండితనం నీకు అర్థమై ఉంటుంది. ఇంకా నీ సహనాన్ని ఎందుకు పరీక్షించుకుంటావ్ చెప్పు?’’ అన్నాడు సౌమ్యంగా అతను. ‘‘అర్థమైంది కాబట్టే.. నిజంగా నీకు ఈ సంపదనంతా ఇచ్చి గాల్లో కలిసిపోదామనుకుంటున్నా’’ అంది ఆ ఆకారం. ‘‘అది నాది కాదు.. నాది కానిది ఏదీ నాకు వద్దు. నువ్ ఇప్పుడు గాల్లోనే ఉన్నావ్!’’ అన్నాడు అంతే నింపాదిగా అతను. ఆ ఆకారం అహం దెబ్బతిన్నది. మళ్లీ దబదబా నేలను బాదింది.. గదంతా కలియతిరుగుతూ.. గదిలోని టేబుల్, కుర్చీ.. బట్టల అలమరా కాళ్లు గుంజింది. ఒకొక్కటిగా అవన్నీ కింద పడిపోయాయి. అయినా అతను కదల్లేదు.. బెదరలేదు. ‘‘ నన్ను ఒక్కసారి బయటకు రానివ్వవా ప్లీజ్.. .. ఆ జమీందారిగాడి కుటుంబంలోని ఒక్కొక్కళ్లను చావగొడ్తా.. తర్వాత నువ్వు ఉండమన్నా ఉండను’’అంటూ కాళ్లబేరానికి వచ్చింది. నవ్వుతూ అన్నాడు అతను‘‘ఏ కాలం సంగతి నువ్వు మాట్లాడేది. అతనికి పుట్టిన వాళ్లంతా పోయారు’’అన్నాడు. ‘‘ఆయన మనవలు.. మునిమనవలు ఉంటారు కదా.. ’’ అంది అదే కసితో. ‘‘మనవలూ పోయారు. మునిమనమడు ఒక్కడే. ఉన్నాడు.. నీ ముందే’’ అన్నాడు నరేంద్ర. ఆకారం నుంచి మాట లేదు. కదలికా లేదు. ‘‘చెప్పాగా.. నాకు నీ దగ్గరున్న సంపద మీద ఆశలేదు. దాని మీద ఆశపడింది నువ్వు. దానితోనే ఉండిపో’’అని చెప్పి గది బయటకు నడిచాడు నరేంద్ర. - సరస్వతి రమ -
దేవుడు కనిపించిన రోజు...
రాఘవరావు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయిన వాడు. నిజాయితీగా పనిచేసి సంసార బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని, నెమ్మదిగా దైవచింతన వైపు మనసు మళ్ళించుకుని, కాలక్షేపం చేస్తున్నాడు. తనకొచ్చే పింఛనుతో జాగ్రత్తగా తనకీ, తన భార్యకి కావాల్సిన అవసరాలు తీర్చుకుని కాలం గడుపుతున్నాడు. పొద్దున్నే సంధ్యావందనం, గాయత్రీ చేసుకోవడం, విష్ణు సహస్రవో, హనుమాన్ చాలీసానో చదువుకోడం...అలా మొత్తానికి పూజా, పురస్కారాలన్నీ అయితేనే గానీ కాఫీ కూడా తాగక పోవడం..అలా ఏదో నియమాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడు. కానీ ఆయనకి కొన్ని జవాబు దొరకని ధర్మ సందేహాలు అంతర్గతంగా ఉండిపోయాయి. ఆయనకి ఒకటే గట్టి కోరిక. ‘ఎలాగైనా సరే దేవుడితో ఒకసారి మాట్లాడగలిగితే!’ అసాధ్యం అని తెలిసినా ఎందుకో గానీ ఆ కోరిక నెమ్మది, నెమ్మదిగా పెరిగి పెద్దదై అదొక అబ్సెషన్లా తయారయింది. ఎంతో మందికి తన కోరిక గురించి చెప్పాడు. అడిగాడు, తన కోరిక సాధ్యపడాలంటే ఏం చెయ్యాలని. ‘ఇదేం పిచ్చి రాఘవరావ్, నీకు? మానవ మాత్రులం మనం. కొన్ని జన్మలు తపస్సు చేసినా ఇది సాధ్యపడేదేనా! అదృష్టం కొద్దీ నీకు భగవంతుడి మీద మనసు మళ్ళి..పూజ అవీ నిష్ఠగా చేసుకోడం అలవాటైంది. అంతే ..అంతకు మించి అత్యాశ పడకు. ఈ పిచ్చి ఆలోచనలు మానేయ్’ అని స్నేహితులూ.. ‘మేం నిత్యం భగవరాధనలోనే మునిగి ఉంటాం. ఆయనకి మన కోరికలు చెప్పుకుని అవి జరిగేలా చూడమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోడం తప్ప ..ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదండీ. ఎప్పుడైనా ఆయనకి మనమీద దయ కలగాలని, కోరుకోవడం తప్ప, మీరనుకుంటున్నట్టుగా, జరగడం అసాధ్యం’ అని చీవాట్లు పెట్టిన పూజారిగారు.. ‘అలా అనుకోవడం దుస్సాహసం, దురాశ , దుర్మార్గం’ ఆవేశంగా రొప్పుతూ అన్న కొందరు ప్రవచనకర్తలు... మొత్తానికి చీవాట్లు, మొట్టి కాయలు పడి, రాఘవరావు సైలెంట్ అయిపోయాడు కానీ,మథన పడ్డం ఆపలే... ∙∙ ఎందుకో ఆరోజంతా అన్యమనస్కంగా, ఆదుర్దాగా అనిపించింది రాఘవరావుకి. అలాగే అలవాటు ప్రకారం రాత్రి తొందరగా భోజనం చేసి పడుకున్నాడు. ఎంతో సేపు దొర్లిన తర్వాత కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలోనే ఒక బ్రహ్మాండమైన కల...ఆ కలలో.. ఆజానుబాహుడు, విశాల నేత్రాలతో స్ఫురద్రూపియైన ఓ మహానుభావుడు కనిపించాడు. ఆయన్ని చూడగానే అప్రయత్నంగానే చెÄðæ్యుత్తి నమస్కరించాడు రాఘవరావు. ‘ఏం రాఘవయ్యా నిద్ర పట్టట్లే ?’ అడిగాడాయన. ఎంతో మృదుమధురంగా ఉంది ఆయన గొంతు. ‘లేదు,స్వామీ..ఎందుకో తెలియదు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా?’ ‘అదేంటీ, నన్ను చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానవు కదయ్యా! అందుకే వచ్చాను’ చిద్విలాసంగా అన్నాడు ఆ మహనీయుడు. ‘తండ్రీ నువ్వా! ధన్యుడ్ని...నన్ను కనికరించావా స్వామీ’ రాఘవరావు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘అవునయ్యా, నేనే! నన్నేదో అడగాలనుకున్నావుగా అడుగు’ ‘అదేంటి స్వామీ, ఇలా ఉన్నారు? నాలుగు చేతుల్తో శంఖం, చక్రం, గద, బాణాలతో ఉండాలి? ఇంత సింపుల్గా ఉన్నారేంటీ?’ ఆశ్చర్యంగా అడిగాడు రాఘవరావు. ‘ఇదేనయ్యా మీతో వచ్చిన గొడవ. నన్ను,నన్నుగా చూడకుండా, ఏవేవో ఆపాదించి, ఇలా ఉండాలి, అలా లేడేవిటీ? అంటూ ,అనుమానపడ్తూ ఆస్వాదించాల్సినది వదిలేసి, బాధ పడుతూ ఉంటారు. నేను కూడా హాయిగా రెండు చేతులూ,రెండు కాళ్ళు, ఒకే ముఖంతో ఉంటాను. మిగతావన్నీ..సింబాలిజంగా, మీ ఊహని జోడించి మీరు తయారుచేసిన నా రూపాలు.అంతే’ నవ్వుతూ అన్నాడు దేవుడు. ‘స్వామీ విశ్వం అంతా నిండి ఉన్న వాడివీ...ఆది అంతం లేని వాడివి..నీకు పుట్టిన రోజు ఏవిటి స్వామీ? నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే!’ ‘ మీ ఏడాది, మాకు ఒక రోజుతో సమానం గదా.. అందుకే మీరు నన్ను రోజూ పలకరించడం కోసమేగదా, ఈ పుట్టినరోజు వేడుక. అది మీకు ఓ సరదా. మాకు వినోదం’ ‘నువ్వు నిద్రపోవడం. మేము నిన్ను సుప్రభాతంతో లేపడం..చోద్యంకాపోతే !! నువ్వు నిద్రపోవడం ఏవిటి స్వామీ?’ ‘నాకు అర్థం అయినదేవిటంటే..అది మిమ్మల్ని మీరు ప్రచోదనం చేసుకుంటున్నారు.. జాగృతం చేసుకుంటున్నారు అని. అయినా నాక్కూడా హాయిగా ఉంటుందయ్యా అవి వింటుంటే. తెల్లవారుజామునే మీరు లేచి, నా ముందర కూర్చుని,శ్రుతిగా నన్ను కీర్తిస్తుంటే...’ ‘స్వామీ మీక్కూడానా?’ ‘ఎందుకుండదూ ? మీరు లేనిపోనివన్నీ ఆపాదించుకుంటూ..అబద్ధాలని, నిజాలు చేస్తూ, సొంత డబ్బా కొట్టుకోగాలేంది..నేను చేసినవి, మీరు చెపుతూంటే, వినడానికి బావుండదా ? ఆ ఇంకా ?’ ‘నేను అప్పుడప్పుడు ఆఫీస్ నించి ఇంటికి వెళ్తూ , గుడి మూసే టైం అయ్యింది అని, ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోకుండా, అలానే వచ్చి నీ దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి స్వామీ. నన్ను ఇంట్లోనూ, బయట కూడా తిడుతూ ఉంటారు. నీ గుడికొచ్చినపుడు, స్నానం చేసి మడిగానే రావాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉంటే బావుంటుంది కదా’ ‘ఇది మరీ బావుంది,రాఘవయ్యా! నేను రమ్మన్నానా? మీకు అవసరమై వస్తున్నారా? అయినా మీ భాషలో చెప్పాలంటే అది ఓ డ్రెస్ కోడ్. దేనికయినా అది అవసరం కదా? ఎవరింటికైనా శుభకార్యాలకి వెళ్తున్నప్పుడు మంచి దుస్తులు వేసుకెళ్తారు. ఆడవారు నగలుపెట్టుకుని అలంకరించుకుని వెళ్తారు. ఆ కార్యక్రమానికి అలా వెళ్ళడం సబబు. అదే ఎవరింటికైనా సంతాపం తెలియచెయ్యడానికి అలా వెళ్తారా? ఒక పనిమీద వెళ్లేటప్పుడు నీ వస్త్రధారణ కూడా చాలా ముఖ్యం. అది నువ్వు ఆ పనికీ,ఆ వ్యక్తికీ ఇచ్చే గుర్తింపు, గౌరవం, విలువ అన్నీ ప్రతిబింబిస్తాయి. ఒక ప్రవిత్రమయిన కార్యాక్రమానికి, వెళ్ళేప్పుడు మనసా, వాచా, కర్మణా చెయ్యాలని చెపుతారు..అదే ఈ డ్రెస్ కోడ్ ముఖ్య ఉద్దేశం. కానీ ఒక విషయంలో నాకు తృప్తిగా ఉందయ్యా. ఈ కొత్త జనరేషన్ వాళ్ళు, చిన్న వాళ్ళు అయినా కాస్త భక్తి,పూజా, పునస్కారం లాంటివి అలవాటు చేసుకోడం.. అవీ చూస్తుంటే ముచ్చటేస్తోంది! ఒక మంచి పని చేయాలనుకోవడం, చెయ్యడం ముఖ్యం. ఎలా చేసారు, చేస్తున్నారనేది తరువాతి దశ. కానీ ఒకటి! చెయ్యగలిగీ, చెయ్యకపోవడం తప్పు. అది ఒక జాడ్యం లా తయారవుతుంది. అందుకే కొన్ని రూల్స్ పెట్టడం అయింది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక్కసారి రవ్వంత వెసులుబాటు ఇస్తే, ఇంక అదే అలవాటుగా చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచించే, మీ పెద్దలు ఈ రూల్స్ పెట్టారు.’ ‘ఇంకో విషయం స్వామీ..చాలాసార్లు ఆఫీస్కి వెళ్తూ, ఏదో ఒక స్తోత్రం చదువుతూ ఉండడం అలవాటు. ఆ టైం లో బండి నడుపూతూనో, బస్, ట్రైన్ లలో వెళ్తూనో ఉంటాను. అందువల్ల షూస్,చెప్పులూ తీసి చదవడం కుదరదు. నువ్వేవనుకుంటావో అని మనసు పీకుతూ ఉంటుంది.’ ‘ఇంతకు ముందు చెప్పినట్లుగా, నువ్వు చెయ్యడం ముఖ్యం. చెడు ఆలోచనలు రాకుండా, ఎవరి గురించీ, తప్పుగా ఆలోచించకుండా, ఊరికే చెత్త మాట్లాడకుండా, నాగురించి ఆలోచిస్తూ, నా స్తోత్రం చదవడం కంటే కావాల్సిందేం ఉందయ్యా! ఎ స్మాల్ డీడ్ ఈస్ బెటర్ దాన్ ఎ గ్రాండ్ ఇన్టెన్షన్. మంచి పని చేస్తున్నావు. తప్పులేదు’ ‘ఏవనుకోక స్వామీ, ఈ ప్రశ్న అడుగుతున్నందుకు..ద్వాపర యుగంలో నీకు తెలిసీ, నీ ముందరే ఎన్నో దారుణాలు జరిగాయి...నువ్వు తలుచుకుంటే అవి ఆపగలిగేవాడివి కదా ! ఎందుకు వదిలేసావు?’ ‘మాయా జూదంలో పాండవులు ఓడిపోవడం, ద్రౌపది వస్త్రాపహరణం, లక్కఇల్లు దహనం.. భీష్మ,ద్రోణాచార్యుల మౌనం..అభిమన్యుడి చావు, ఉపపాండవుల వధ.. ఇవన్నీ చాలా అన్యాయంగా అనిపిస్తాయి. నువ్వు వారి పక్కనే ఉన్నావు.. వారితోనే తిరిగావు..నీ ప్రభావం వారిమీద ఉండాలిగా? వద్దనుకున్నా సరే..నీతో మాట్లాడగానే వాళ్ళు మారాలిగా? ఎందుకలా జరగలే ? భీష్ముడు, ద్రోణుడు కూడా ఏంచెయ్యలేక పోవడం ఆశ్చర్యం. వాళ్ళు కూడా కర్ణుడిలాంటి వాళ్ళే కదా? నువ్వేమో కర్ణుడుని ఎక్కువ శిక్షించావనిపిస్తుంది, స్వామీ! ఎందుకా పక్షపాతం నీకు ?’ దేవుడు కాసేపు ధీర్ఘాలోచనలో పడి మౌనంగా ఉండిపోయాడు..‘ఏవో అనుకున్నాను,రాఘవయ్యా! నువ్వు ఘటికుడివే!! మంచి ప్రశ్నే. దీనిని కొంచెం నీకు అర్థం అయ్యేలా సింపుల్ గా చెప్పాలి. నా ప్రతి అవతారానికి ఒక పరమార్థం, ఒక అవసరం ఉందని ఒప్పుకుంటావా? ప్రతి యుగం లోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేదే నా ఎజెండా. జరిగినవన్నీ, జరిగే వన్నీ, జరగబోయేవీ నా అధీనంలోనే ఉంటాయి..నేను పొందుపరిచే టైం టేబుల్ ప్రకారం నడుస్తాయి. అధర్మం మీద ధర్మం చేసే యుద్ధంలో కొన్ని సార్లు అమాయకులు, వాటితో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు బలి అవడం జరుగుతూంటుంది. ఇది ఆనాటి నించి ఈనాటి దాకా చూస్తునే ఉన్నాం కదా. కొన్ని కొన్ని పాత్రల నిడివి చాలా తక్కువ ఉంటుంది ఈ జగన్నాటకంలో ! ఇక భీష్ముడు, ద్రోణుడు నుంగతి, నువ్వు వినే ఉంటావు.. చాలాసార్లు ధృతరాష్ట్రుడికీ, దుర్యోధనుడుకీ హితబోధ చేసారు..కానీ వాటిని వాళ్ళిద్దరూ పెడచెవిన పెట్టడం కూడా నీకు తెలుసు. కాకపోతే వాళ్ళిద్దరూ, తమ తమ కర్తవ్యాలకి బద్ధులై,బాధ్యులై ఉండి రాజుకి ఎదురు చెప్పలేక అసహాయులై ఉండి పోయారు. కర్ణుడు అలా కాదు. దుర్యోధనుడు అతనిని చాలా నమ్మాడు. అతని సలహాలు తీసుకున్నాడు. కర్ణుడు, దుర్యోధనుడికి ఎప్పుడూ మంచి చెప్పలే. తనని ఆదరించాడు, ఒక ఐడెంటిటీ కల్పించాడనే ఒక కారణంతో అన్ని తప్పుడు పనుల్లోనూ సహకరించాడు. తనూ చేసాడు. ఈ ఒకే ఒక్క వీక్ నెస్ వల్ల అతని మిగతా మంచి లక్షణాలు అన్నీ మరుగున పడిపోయాయి. భీష్ముడు అలా కాదు. మొదటినించీ ధర్మాన్నే పాటించాడు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలే. నామీద నమ్మకం ఉంచాడు. తన కర్తవ్యాన్ని పాలించాడు’ ‘స్వామీ.. ఈ సృష్టినంతా నువ్వే డిజైన్ చేసావు. నువ్వు ఇందాక చెప్పినట్లుగా అంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నడిపిస్తున్నావు. అలాంటప్పుడు, ఈ అసమానతలు,రంగుల భేదాలు..కట్టుబాట్ల తేడాలు, భిన్నవైన ఆలోచనలు, విభిన్నమైన. అలవాట్లు..ఆవేశాలు, ద్వేషాలు, చంపుకోడాలు, మోసాలు..ఇవన్నీ ఎందుకు స్వామీ? అంతా ఒకేలాగా, హాయిగా, ఆనందంగా ఉండేటట్లు ఎందుకు చెయ్యలే?’ కొంచెం ఉద్వేగంతో అడిగాడు రాఘవరావు. దేవుడు ముందు ఆశ్చర్య పోయాడు. ఏదో సరదాగా నడుస్తున్న ప్రశ్నలు– జవాబుల కార్యక్రమం కాస్త గాంభీర్యాన్ని సంతరించుకునే సరికి! తర్వాత కాసేపు ఆలోచించాడు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత, నెమ్మదిగా,మృదువుగా ఒక చిన్న పిల్లవాడిని సముదాయిస్తున్నట్టు, ఒక లేగదూడని నిమురుతున్నట్టూ..ఒక లేత గులాబీని స్పృశిస్తున్నట్టూ చెప్పాడు! ‘చూడు రాఘవరావు..ఈ సృష్టినంతా తయారు చేసేటప్పుడు..నేనొక రకమైన తన్మయత్వం చెందానయ్యా! ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. నేను సృష్టించే ఈ ప్రాణికోటిని చూసి నేనే ఆచ్చెరువొందాను! నా చేతుల్లోంచి ప్రాణం పోసుకుంటున్న అద్భుతాన్ని చూసి గర్వపడ్డా! ఎన్ని ఆకృతులూ, ఎన్నెన్ని వర్ణాలు, ఎంత అందం, ఎంతెంత రమణీయం! ఇన్ని కోట్ల ప్రాణుల్ని సృష్టించిన ఏ రెండిటికీ పోలిక లేకుండా ప్రతి ఒక్కటీ ఒక అపు‘రూపంగా’..దానికదే సాటిగా.. అలా ఒక్కొక్క శిల్పం,ప్రాణం పోసుకుంటున్నకొద్దీ..నా భావావేశాలు పుణికి పుచ్చుకుని నా ప్రతిరూపాలుగా, వాటిని చూసుకుంటున్న కొద్దీ..నేను మైమరచి పోయేవాణ్ణి..నా ముందు ఆవిష్కరింపబడుతున్న అద్భుతాన్ని చూసి ఓ శిల్పకారుడు, ఓ చిత్రకారుడిలా మురిసి పోయే వాడ్ని..కించిత్తు గర్వం కూడా కలిగేది. ఒకే రకంగా మూస పోసినట్టుగా తయారు చెయ్యడానికి, నేనెందుకయ్యా..మీరు, మీ ఫాక్టరీలు ఉన్నారుగా? నేను సృష్టించిన మనిషి మారిపోయాడు..పాడైపోయాడు. నేను ఇచ్చిన వాటితో సంతృప్తి చెందడం మానేసాడు. పంచభూతాలతో చెలగాటం ఆడడం మొదలుపెట్టాడు. నా సహనాన్నే పరీక్షించడం మొదలెట్టాడు. నేను ఎన్నో రకాలుగా వార్నింగ్ ఇచ్చాను. వినలేదు. నన్ను మించిపోయి, నాకంటే గొప్పవాడని అనుకోవడం మొదలు పెట్టాడు. తన నాశనానికి ,తానే కారణం అవుతున్నాడు’ ‘నువ్వు మా అందరికీ ఒక ఎక్సై్పరీ డేట్ కూడా ఇచ్చి పంపిస్తే ఏ సమస్యా లేకుండా పోతుంది కదూ స్వామీ’ ‘నేను మీకిచ్చిన జీవితం అనే వరానికి ఉన్న గొప్ప విశేషం మీ పుట్టుక, మీ చావు రెండూ కూడా ఊహించినట్టుగా జరగకపోవడమే!! దాన్లో నే మీ జీవితం యొక్క మిస్టరీ దాగుంది. అవి తెలిసిపోతే ఇంకేవుందీ? నేనుకూడా మీలాగే సిజేరియన్ చేసి అనుకున్న టైంకి డెలివరీ చేయడం, మెర్సీ కిల్లింగ్తో కావల్సినప్పుడు ప్రాణం తీయడం చేస్తే ఇంక తేడా ఏముంటుంది? అన్ని దశలూ దాటుకుంటూ, ఛేదిస్తూ, ముందు కెళ్తున్నప్పుడు ఉండే ఉత్తేజం,ఆనందం, ఆ ఆశాభావం మీ జీవితం ఇంకొన్నాళ్ళలో ముగిసిపోతుంది అని తెలిసినప్పుడు ఇంకెక్కడ ఉంటాయి?’ ‘స్వామీ, ఇంకొక్కటి..సత్యప్రమాణంగా ఇది చివరిది..నేను నిన్ను మళ్ళీ చూడగలనో లేదో... నాకోసం నువ్వొస్తావో రావో’ ‘సరే, కానీ’ అన్నాడు దేవుడు.. ‘నాకొకసారి, కలొచ్చింది. ఆ కలలో నా జీవితంలోని ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు .అన్నీ ప్రతిబింబిస్తున్నట్టు..ఆ నా జీవనగమనంలో నాలుగు పాదాల ముద్రలు కనిపించాయి. రెండు నావి, రెండు నీవి, అని అనుకుని ఎంతో ముచ్చట పడ్డాను.. నువ్వు నా పక్కనే ఉండి నడిపిస్తున్నావని! కానీ, చాలా చోట్ల రెండు పాదాల గుర్తులే కనిపించాయి..అవన్నీ కూడా నేను గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను భయంకరమైన సమస్యల్లో ఉండి, ఇంక జీవితం చాలిద్దాం అనుకున్నప్పుడు! నాకు చాలా బాధేసింది.. సరిగ్గా నీ సహాయం నాకు అవసరం అయినప్పుడే నువ్వు నా పక్కన లేవు. అలా ఎందుకు స్వామీ, నన్ను ఎందుకు వదిలేసాను?’ దీనంగా అడిగాడు రాఘవరావు. ‘పిచ్చివాడా, నువ్వు అలిసి,సొలిసి పోయుంటే జాలేసి..నిన్నెత్తుకున్నా.. నువ్వు సేద తీరుతూ ఆ చెడు కాలాన్ని దాటేవరకూ, నువ్వు నా చేతుల్లో ఉన్నావయ్యా!’ నవ్వుతూ అతన్ని కౌగిలించుకొని చెప్పాడు దేవుడు. ‘అయ్యో స్వామీ నేనెంత మూర్ఖుణ్ణి..నిన్ను అర్ధం చేసుకో లేకపోయా’ బావురుమన్నాడు రాఘవరావు! ‘అదే రాఘవయ్యా నేను ఇందాకటి నుంచీ చెప్పేది. నేనంటే ఒక నమ్మకాన్ని. నేనంటే ఒక విశ్వాసాన్ని. నేను ఒక సదుద్దేశాన్ని. ఒక ఆలోచనని.పసిపిల్లవాడు నువ్వు పైకెగరేసినప్పుడు, నువ్వు మళ్ళీ తిరిగి పట్టుకుంటావనీ, పట్టుకోగలవనీ.. ఎంత దృఢవిశ్వాసంతో ఉంటాడో.. మీరు అలా నామీద విశ్వాసం ఉంచినప్పుడే నేను మీకు కనిపిస్తాను కానీ ఇలా కాదు. కొన్ని నమ్మకాలకి తార్కాణాలే ఉంటాయి...భౌతికంగా కనిపించాల్సిన అవసరంలేదు!’ ‘స్వామీ, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావ్ ?’ ‘చూద్దాం..నేను రాలేకపోతే, నువ్వే నాదగ్గరికి వద్దుగానివిలే’ గుంభనంగా నవ్వుతూ అంతర్ధానం అయిపోయాడు దేవుడు. ∙∙ ‘ఏవండీ,లేవండీ...బారెడు పొద్దెక్కింది. ఎప్పుడూ లేంది, ఏవిటివాళ్ళ?’ అంటూ మర్నాడు పొద్దున్నే రాఘవరావు భార్య, ఆయన ఇంకా లేవకుండా పడుకునే ఉంటే కదుపుతూ ఆయన్ని లేపే ప్రయత్నం చేసింది. ఎందుకో అనుమానం వచ్చి ఆయన్ని తేరిపారా చూసింది. ఆయన మొహంలో మునుపెన్నడూ లేని ప్రశాంతత..చేతులు రెండూ జోడించి గుండెలమీద పెట్టుకునున్నారు. ఆయన తనకికలేరు అని అర్థం అయిందావిడకి! దేవుణ్ణి దర్శించి, దేవుడితో మాట్లాడి, తన దేవుడి దగ్గరకే వెళిపోయాడు రాఘవరావు. సమాధానంలేని ప్రశ్నలా మిగిలి ప్రశ్నించాల్సిన, అవసరంలేని,సమాధానాన్ని వెతుక్కుంటూ! - అశోక్ కుమార్ సోమంచి -
దేవదారు శిల్పమా!
కామెడీ సినిమా ‘ఫగ్లీ’ తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కియరా ఆడ్వాణీ... ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘వినయ విధేయ రామ’తో మరోసారి పలకరించిన కియారా, తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్రెడ్డి’కి హిందీలో రిమేక్గా వస్తున్న ‘కబీర్సింగ్’లో కథానాయిక. ఆమె అంతరంగ తరంగాలు ఈవారం... బయోపిక్లో... సినిమాల్లో నటించాలనేది నా చిన్నప్పటి కోరిక. సినిమాలు కాకపోతే ఏమిటి? అనేదాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా చాయిస్ ఎప్పుడూ సినిమాలే! సినిమాలే లోకంగా ఉండడం కావచ్చు...‘సినిమాల్లో నటించాలి’ అనే కోరిక బలంగా పెరిగింది. శ్రీదేవి అద్భుతమైన నటన, మాధురి దీక్షిత్ తిరుగులేని నాట్యం...నాకు బాగా ఇష్టం. సినిమాలో ఒక డైలాగు కావచ్చు, పాట కావచ్చు...అద్దం ముందు నిల్చొని వారిని ఆవాహన చేసుకునేదాన్ని.ప్రతి రంగంలో మంచీచెడూ ఉంటాయి. ఒకేవైపు చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ‘బయోపిక్’లలో నటించాలనే కోరిక ఉంది. నా మొదటి ప్రాధాన్యత...మధుబాల బయోపిక్. ఈ సినిమా ద్వారా ఆమె వ్యక్తిగత జీవితం చలనచిత్ర జీవితం కళ్లకు కట్టినట్లుగా ఉండాలి. అద్దం మనలోని ప్రతిభ వెలుగులోకి రావాలంటే, అవకాశం, అదృష్టం కూడా కలిసి రావాలనేది నమ్ముతాను. సినిమా అనేది సమాజానికి దర్పణంలాంటిది. సమాజంలోని సంఘటనలు, సామాజిక ధోరణులు సినిమాల్లో ప్రతిబింబిస్తాయి. బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రలు పోషించాలని ఉంది. ఫలితం జీవిత పరమావధి అంటే నా దృష్టిలో ఆస్తులు, అంతస్తులు, కీర్తి కాదు. ఎప్పుడూ సంతోషంగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్లను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయడం. సంతోషం మన వెంట ఉంటే కొత్త విజయాలు సాధించవచ్చునని నమ్ముతాను. నా విషయానికి వస్తే... పనిలోనే సంతోషాన్ని వెదుక్కుంటాను. ‘ఫలనా పని చేయబోతున్నాను. ఫలితం ఎలా ఉంటుందో ఏమో’ అని ఆలోచిస్తూ ఒత్తిడికి గురికాను. కష్టానికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తాను... ఫలితం సంగతి తరువాత! సవాలు ఏది ఎప్పుడు వర్కవుట్ అవుతుందో ఎవరికీ తెలియదు. అలా అని విధిపై భారం వేయలేము కదా! అందుకే స్క్రిప్ట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు శ్రద్ధగా వింటాను. ఒక ప్రేక్షకురాలిగా అందులో పూర్తిగా లీనమైపోతాను. -
కొత్త ఇల్లు
నెత్తి మీద ఏదైనా ఆపద వచ్చిపడితేనేగాని మనిషికి భగవంతుడు జ్ఞాపకానికి రాడు. మతగురువు ఎన్నిసార్లు విషయ లంపటత్వం కూడదని చెప్పినా వినక, ఆయూబ్ఖాన్ నవయవ్వనంలో ఉన్న కూతురూ, పదేళ్ల వయసు గల కొడుకూ వారం తిరగకుండా చనిపోయి, తన గడ్డంలో తెల్లవెంట్రుక కనపడిన తర్వాత తన జీవితాన్ని మార్చుకునే అందుకు ప్రయత్నం ప్రారంభించాడు. జీవిత విధానం మార్చుకున్న నాటి నుంచి ఆయూబ్ఖాన్ తాను ప్రస్తుతం నివసిస్తూ ఉన్న ఇల్లు కూడా మార్చాలి అని నిశ్చయించుకున్నాడు. ఆయూబ్ఖాన్ పెద్దలందరూ ఆ ఇంట్లో నివసించి అతనిలాగానే విషయ లంపటులై జీవితం గడిపారు. అందువల్ల ఆ ఇంటిలో నివసించినంత కాలమూ భగవదారాధన వైపు దృష్టిపోదని అతని అభిప్రాయం. అందువల్ల తాను ఒక వేరే ఇల్లు అద్దెకు తీసుకుని, తనకు పైతృకంగా సంక్రమించిన ఇంటిని తన చివరి ఉంపుడుగత్తె నాజియాకు ఇచ్చి వేశాడు. నాజియాకు కూడా తన సౌందర్యం మీద పూర్వం ఉన్నంత నమ్మకం లేకపోవడం వల్ల ఆ ఇంటితోనే సంతోషించి, చేపను వలలో నుంచి వదిలిపెట్టింది. ఆయూబ్ఖాన్ తన నివాసార్థం కొత్త ఇల్లు కట్టించడం ప్రారంభించాడు. నమాజు చేసిచేసి అలసిపోయి విశ్రాంతి అవసరమని తోచగానే కొత్త ఇల్లు ఎంతవరకు తయారైందో చూడటానికి బయలుదేరేవాడు. అందువల్ల అతని మనసుకు చాలా కులాసా చిక్కేది. ఇల్లు తొందర తొందరగా తయారవడం చూసి భగవంతుడు తన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడని అనుకున్నాడు. తన భుజాల మీద ఉన్న పాపభారం తేలిక అయిపోయిందనుకున్నాడు. ఆ కొత్త ఇంటికీ, అతని ఆత్మిక జీవితానికీ ఒకరకపు అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. అందుకు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఉండేవాడు. తొందరగా ఇల్లు కట్టించే భారాన్ని తన ఏజెంటు ముమిద్ఖాన్కు అప్పగించాడు. శరవేగంతో ఇల్లు పూర్తి చేయించాలని చెప్పాడు. ‘‘ముమిద్ఖాన్! డబ్బు కోసం నువ్వు వెనుకాడవద్దు. ఎంత డబ్బు కావాలన్నా, అప్పు తెచ్చి అయినా సరే ఇస్తాను. ఫకీరు జీవితం గడపడం కోసం నేను ఈ ఇల్లు కట్టించుకుంటున్నాను. ఒక్కరోజు ఆలస్యమైనా నా మనసుకు ఎంతో బాధ కలుగుతుంది’’ అని చెప్పాడు. ప్రతిరోజూ సాయంత్రం ఆయూబ్, ముమిద్ఖాన్లు ఇలాంటి మాటలే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ‘‘కప్పు వేయించడానికి ఎన్ని రోజులు పడుతుంది?’’ ‘‘పదిహేను రోజులు’’ ‘‘గోడలకు సున్నం వేయించడం? తొందరగా పూర్తి చెయ్యాలి.’’ ‘‘చిత్తం. అలాగే..’’ ఆయూబ్ఖాన్ చీకటి పడిన తర్వాత మోటరెక్కి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన మర్నాడు ఆయూబ్ఖాన్ మళ్లీ మామూలుగా ఇల్లు చూడటానికి వచ్చాడు. ‘‘నవాబ్గంజ్లో ఒక ఇల్లు పూర్తి చేసిన కొందరు మేస్త్రీలనూ, కూలీలనూ మన పనికి పిలిచాను. వాళ్లు చాలా తెలివైన వాళ్లు. పది రోజుల్లోనే ఇల్లు పూర్తి చేస్తారు’’ అని ముమిద్ చెప్పాడు. ‘‘మంచి పని చేశావు’’ అంటూనే ఆయూబ్ఖాన్ ఇంటి చుట్టూ తిరగడం ఆరంభించాడు. నిన్నటికీ, ఈ రోజుకీ మధ్య జరిగిన అభివృద్ధి గురించి ముమిద్ బోధపరుస్తూ, పక్కన ఉన్న మేస్త్రీలను చూపించి ‘‘వీళ్లు ఈ రోజున కొత్తగా పనిలోకి వచ్చినవాళ్లు’’ అని పరిచయం చేశాడు. మేస్త్రీలు యజమానికి వంగి సలామ్ చేశారు. ‘‘తమ ఆరోగ్యం బాగా ఉన్నదా?’’ ఒక మేస్త్రీ కుశల ప్రశ్న వేశాడు. ఆయూబ్ఖాన్ అతనికేమీ జవాబు చెప్పలేదు. అతని దృష్టి అంతా ఇంకొకవైపు ఉంది. ఆ మేస్త్రీలకు కొంచెం దూరంలో ఒక నవ యవ్వనవతి కూలి పని చేస్తోంది. తనవంక తదేకధ్యానంగా చూస్తూ ఉన్న ఆయూబ్ను చూసి ఆ పిల్ల చిరునవ్వు నవ్వింది. ఆయూబ్ఖాన్ శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లనిపించింది. ముఖం ఎర్రబారింది. ‘‘ఈ సున్నం బాగాలేదని మేస్త్రీలు తగాదా పెడుతున్నారు. మంచి సున్నం ఇంకొక కంపెనీలో తెప్పిస్తే బాగుంటుంది’’ అన్నాడు ముమిద్. ఆయూబ్ఖాన్ అందుకేమీ జవాబు చెప్పలేదు. ఇల్లు కూడా పూర్తిగా చూడలేకపోయాడు. ఎటు చూసినా అతనికి ఆ పిల్ల సౌందర్యమే కనిపించసాగింది. మేస్త్రీలూ, ఆ పిల్లా అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయూబ్ఖాన్ శరీరం స్వాధీనం తప్పిపోసాగింది. గుండెల్లో తుఫాను రేగింది. ఆ తుఫాను ముందు తన పరిస్థితి గడ్డిపరకలా ఉందని తెలుసుకున్నాడు. ‘‘కాని దీనికంతకూ కారణం? నేను అనేక వందలమంది నవయువతుల సౌందర్యాన్ని అనుభవించిన వాణ్ణి. మరి ఈ సైతాను– ఈ కూలిపిల్లను చూసినప్పుడు నాలో కలిగిన మార్పు కొత్తగా ఉందే. ఇది ప్రేమ కాదు. ఇది సౌందర్యం కాదు. ఇది కామవాసనా జనితమైన హృదయోద్వేగం కాదు’’ అనుకుంటూ గబగబా ఇంటికి వెళ్లిపోయాడు. రెండుసార్లు నమాజ్ చేశాడు. భగవద్ధ్యానం ప్రారంభించాడు. ఆ కూలిపిల్ల మాత్రం అతని కళ్లకు కట్టినట్టు కనబడుతూనే ఉంది. అయితే అంతమాత్రంచేత అతని ధ్యానం భగ్నం కాలేదు. అందువల్ల అది భగవంతునికి కూడా ఇష్టమే అనుకున్నాడు. కళ్ల వెంట నీళ్లు కార్చాడు. ‘‘ఆశ్చర్యం, ఆశ్చర్యం’’ అని పెద్దగా అరిచాడు. ఉదయం నిద్రలేచాడు. తాను మారిపోయాననుకున్నాడు. సాధారణ దుస్తులు ధరించడం అంతకు పూర్వం శిక్షగా భావించేవాడు. కాని, ఆనాడు అతనికి ఆ దుస్తులు చాలా అందంగా కనిపించాయి. మనసుకు కులాసాగా ఉందనుకున్నాడు. ఫలహారం తెచ్చిన నౌకరును ప్రేమగా పలకరించాడు. అందుకు నౌకరు కూడా ఆశ్చర్యపడ్డాడు. చీవాట్లు లేకుండా అతను ఎప్పుడూ తిరిగి పోలేదు. ఆ రోజు తనతో పని ఉండి వచ్చిన వారందరితోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. సాయంత్రం కొత్త ఇల్లు చూడటానికి బయలుదేరాడు. ఆ రోజు కూలీల దగ్గరకుపోయి కూర్చున్నాడు. కూలీలతో తానే మాట్లాడటం ఆరంభించాడు. తాను కూడా ఆ కూలీలలో ఒకడినే అనుకున్నట్లుగా ప్రవర్తించాడు. ఒక ముసలి మేస్త్రీ కష్టపడి పని చేస్తూ ఉంటే చూశాడు. అతనంటే మరీ జాలిపడ్డాడు. అతని పక్కకు చేరి కూర్చున్నాడు. ‘‘ఏమోయి నవ్వు కూడా ఇక్కడికి ఇవాళే పనికి వచ్చావా?’’ ‘‘కాదు బాబూ! చాలా రోజుల్నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను.’’ ‘‘మరి నువ్వు ఇవాళే కనబడుతున్నావేం?’’ ‘‘బీదవాళ్లను ఎవరు చూస్తారు బాబూ!’’ ముసలివాడన్న మాటకు ఆయూబ్ఖాన్ను కోసం రాలేదు. తాను కూడా వాళ్లలో ఒకడనైపోదామనుకున్నాడు. కూలీలకూ, తనకూ మధ్యనున్న ఇనుపగోడను పగలగొట్టేయాలనుకున్నాడు. ‘‘పాపం, నువ్విక్కడ నెల్లాళ్ల నుంచి పనిచేస్తున్నా నేను ఇవాళే నిన్ను చూస్తున్నాను. ధనవంతుడు స్వర్గానికి పోవడం, ఒంటె సూదిబెజ్జంలో నుంచి దూరిపోవడం వంటిదని మహమ్మద్ సాహెబ్ ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు బోధపడుతోంది. ఇంతవరకు నా జీవితాన్ని చాలా విశృంఖలంగా గడిపాను. ఈ మధ్య నా ఇద్దరు బిడ్డలూ ఒకే వారంలో గతించారు. ఆనాటి నుంచి భగవంతుని ధ్యానించడం ప్రారంభించాను. భగవంతుని మరచిపోయినవాడి గతి గురించి ఏం చెబుతాం?’’ ‘‘నిజం బాబూ! ఈ లోకమే భగవంతునిది. అట్టి భగవంతుణ్ణి మరచిపోతే ఈ లోకంలో ఉండడమెలా?’’ ‘‘అందువల్లనే ఆ పాత ఇల్లు కూడా వదిలేసి, ఈ కొత్త ఇంట్లో కాపురముండి భగవద్ధ్యానం చేసుకుందామనుకుంటున్నాను. ఈ ఇంట్లో బీదతనాన్ని అనుభవిస్తూ జీవితం గడపాలనుకుంటున్నాను.’’ అంటూ ఆయూబ్ఖాన్ ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ముసలివాడు తన పని ప్రారంభించాడు. ముసలివాడూ, ఆయూబ్ఖాన్ ప్రాణస్నేహితులైపోయారు. అక్కడి నుంచి మెల్లగా లేచి ఆ కూలిపిల్ల దగ్గరకు పోయాడు. ఆ పిల్ల ఆయూబ్ఖాన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేయసాగింది. ఆ చిరునవ్వు అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ చిరునవ్వులో ప్రేమా, సహానుభూతీ అతనికి కనిపించాయి. ‘‘ఆ చిరునవ్వులో ఉన్న శక్తి భాషలో ఎక్కడ ఉంటుంది? అయినా ఆ కూలిపిల్లను నేను ప్రేమించడమేమిటి?’’ అని ఆలోచించాడు. ప్రాణిమాత్రులనల్లా ప్రేమించడం నేర్చుకోవాలని కూడా అనుకున్నాడు. ఆనాటి నుంచి కూలీలతో మనసువిప్పి మాట్లాడటం అలవరచుకున్నాడు. ఆ మాటల్లో అతనికొక ఆనందం కలిగేది. ఆ ఆనందంతోనే భగవంతుని ఎదుట నమాజు చేసేవాడు. ఆ కూలిపిల్లను చూసినప్పుడల్లా అతనిలో ఏదో ఒక విచిత్రానుభూతి కలుగుతూ ఉండేది. ఇల్లు కట్టడం పూర్తయింది. గోడలకు సున్నం వేస్తున్నారు. ఆయూబ్ఖాన్ ఇల్లు చూడటానికి వచ్చాడు. ముసలి మేస్త్రీ ‘‘ఏమి బాబూ! ఇంట్లో ఐదు గదులు కట్టిస్తున్నారు. మీరు ఎప్పుడూ నమాజు చేసుకుంటూ ఉంటారు. మీకు రెండు గదులు చాలు. మిగతా గదుల్లో ఎవరుంటారు? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’’ అని అడిగాడు. ఆయూబ్ఖాన్ నవ్వాడు. జవాబివ్వలేదు. ఆయూబ్ఖాన్ భార్య ఐదేళ్ల కిందట చనిపోయింది. అప్పట్లో ఆయూబ్ఖాన్కు పెళ్లి చేసుకోవలసిన అవసరం కూడా లేకపోయింది. మేస్త్రీ అన్న మాట కూడా నిజమే. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? మొదటి భార్యను కష్టపెట్టాను గనుక రెండో భార్యను సంతోషపెడితే– కూలిపిల్ల కనబడింది. ఆయూబ్ఖాన్ ఆ పిల్లను పలకరించి మాట్లాడటం ఆరంభించాడు. లేచి ఆ పిల్ల పని చేస్తూ ఉన్న చోటికి వెళ్లాడు. ఆ పిల్ల తన భార్య అయితే ఎలా ఉంటుందో చూద్దామని అతనికి అభిలాష కలిగింది. ఆ మాటలూ, ఈ మాటలూ మాట్లాడుతూ ఆ పిల్లవంక తదేక ధ్యానంగా ఒక అరగంటసేపు చూశాడు. అతని కళ్ల ముందు కొత్త ఇల్లూ కొత్త జీవితం తాండవమాడసాగాయి. తను నమాజు చేస్తూ ఉంటే తన భార్య ఉండి ఉండి గదిలోకి వచ్చి చూసి పోతూ ఉంటుంది. అప్పుడామె కళ్లు ఎలా ఉంటాయోనని ఆమె కళ్ల వంక చూశాడు. ఇద్దరూ కలసి కులాసాగా షికారుకు పోతే అక్కడ సూర్యాస్తమయం అయితే ఆమె ఆనందంతో తన భుజం మీద చెయ్యి వేస్తుంది. అప్పుడు ఆ చెయ్యి శోభ ఎలా ఉంటుందోనని ఆ పిల్ల చేతి వంక పదినిమిషాలు చూశాడు. రకరకాల మధుర భావాలు! మధుర స్మృతులు! తీయని తలపులు! మెల్లగా ఇంటికి వెళ్లాడు. నమాజు చెయ్యబోతే మనస్కరించడం లేదు. ఏదోవిధంగా నమాజు బలవంతాన పూర్తి చేశాడు. భగవద్ధ్యానం చెయ్యబోతే మనసు ఏకాగ్రంగా లేదు. కొత్త ఇల్లు, కొత్త జీవితం, కొత్త భార్య తలపులే. మంచం మీద శరీరం వాల్చాడు. ‘ఏమిటి ఈ మార్పు? ధ్యానమగ్నుణ్ణి కాలేకపోతున్నాను. ఈ కొత్త తుపానులో భగవంతుణ్ణి మరచిపోతానా?’ అనుకుంటూ కళ్లు మూశాడు. ఆ కూలిపిల్ల రెండు కళ్లూ తనను ఆహ్వానిస్తున్నాయి. ఆమె స్మరణ మాత్రం చేతనే నమాజు చెయ్యలేకపోతున్నాను. తీరా రేపు ఆమె దగ్గరకు వస్తే, అని ఆలోచించాడు. ఆమెను తాను స్వీకరించడం భగవంతునికి ఇష్టం లేదేమోనని ఇంకో ఆలోచన. మనసు ఆగడం లేదు. ఆవేశం అధికమైపోతోంది. కళ్లు మూస్తే... ఆ పిల్ల కళ్లు... ‘ఆ పిల్లను వివాహం చేసుకోవడమా లేదా... అది ఒక సమస్య. ఆమెను వివాహమాడటమే మంచిది. అయితే, బంధువులందరూ అంగీకరిస్తారా? కూలిపిల్ల కదూ? బంధువుల కోసం ఆలోచిస్తే బంధువులు సమాజం పేరుతో నిర్దోషులను కూడా రోజూ కొరత వేయిస్తున్నారు. అందువల్ల వాళ్ల కోసం లెక్క చెయ్యకూడదు. కూలిదాన్ని పెళ్లి చేసుకున్నాడని ఇంటి నౌకర్లు కూడా ఎగతాళి ప్రారంభిస్తారేమో! బహుజనాభిప్రాయం మార్చడం ఎలా? లాఠీ చూపించి అభిప్రాయం మార్పించగలమా? ఒకరు ఎగతాళి చేస్తారని మనం ఏ పని మానేస్తున్నాం? ఆత్మశుద్ధిగా మనం చేసే పనికి ఇంకొకరి అభిప్రాయంతో పనేమిటి?’ ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు. నౌకరు టీ తీసుకురావడం ఆలస్యమైంది. నౌకరును పిలిచి టీ తీసుకుని రమ్మన్నాడు. నౌకరు టీ తీసుకు రాలేదు గనుక, ఈ వివాహం సుఖకరం కాదనుకున్నాడు. ఏవేవో ఆలోచనలు!! అర్ధరాత్రిదాకా అలాగే కాలం గడిపి చివరకు నిద్రపోయాడు. తెల్లవారింది. కొత్త ఇల్లు చూడటానికి పోవాలి. కూలీలు పనిని ప్రారంభించి ఉంటారు. తన కొత్త జీవితం ఎలా ఉండాలో, ఉంటుందో, అది కూడా ఆలోచించుకోవాలి. ఏమీ ఆలోచన తెగడం లేదు. మోటారు కొత్త ఇంటికి చేరింది. కూలీలంతా పెద్దపెద్దగా నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆయూబ్ఖాన్ కారు దిగి ముసలి మేస్త్రీ దగ్గరకు వెళ్లాడు. ముసలి మేస్త్రీ ‘‘ఆ పిల్ల వెళ్లిపోయింది బాబూ! రెండు రోజులు కూలి కూడా వదిలేసి వెళ్లిపోయింది’’ అన్నాడు. ఏ పిల్ల? ఆయూబ్ఖాన్కు ఆ పిల్ల పేరు కూడా తెలియదు. అయినా ఆ కూలిపిల్లేనేమో అనుకున్నాడు. ‘‘ఆ పిల్లేనండి. తమను చూసి నవ్వుతూ ఉంటుంది.’’ ‘‘ఎలా వెళ్లిపోయింది?’’ ‘‘మిఠ్ఠూగాడు తనకు కాన్పూరులో ఇల్లుందనీ, కూలి చేసి తిండి సంపాదించి పెడతాననీ చెప్పాడు. దానికి వాడి మీద ఆసక్తి కలిగింది. వాడితో అది లేచిపోయింది బాబూ!’’ ముసలి కూలి జవాబు చెప్పాడు. ‘‘కూలి ఎందుకు వదిలిపెట్టింది?’’ ‘‘మాకేం తెలుసు బాబూ!’’ ఆయూబ్ఖాన్ తల తిరిగిపోయింది. ముఖం వెలవెలబోయింది. మెల్లగా వెళ్లి తన కారులో కూర్చున్నాడు. ‘‘ఇంటికి నడుపు’’ అన్నాడు డ్రైవరుతో. కారు ముందుకు సాగింది. ఆయూబ్ఖాన్ వెనక్కు తిరిగి కొత్త ఇంటివైపు చూశాడు. ఉర్దూ మూలం : మహమ్మద్ ముజీబ్ తెలుగు : వేమూరి ఆంజనేయశర్మ -
అడవిపువ్వు
‘దేవుడా!.....’ మొబైల్ ఫోన్లో ఒక ఆర్టికల్ చదువుతున్న నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చిందీ మాట. ఇల్యుషన్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడ్డ ఆర్టికల్ అది. నేను దేనికోసం ఇల్యుషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానో, ఆ విషయం పక్కకు వెళ్లి పోయి, రమణి జ్ఞాపకం వచ్చింది. నేను, రమణి ఒకే బ్రాంచ్లో రెండు సంవత్సరాలు కలిసి పని చేశాం. ఆ మరుసటి సంవత్సరమే రమణికి వాసుతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లిలో వాసూను చూసిన నాకు కొంత నిరాశ కలిగిందనే చెప్పాలి. రమణి అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి. అయినా చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంది. ఆత్మాభిమానం కల అమ్మాయి. హుందాగా ప్రవర్తించేది. వాసు ఆమెకు తగినవాడని అనిపించలేదు నాకు. చాలా నిరాడంబరంగా వాళ్ల పెళ్లి జరిగిపోయింది. వాసు వాళ్ళది గుంటూరు కావడంతో రమణి ట్రాన్స్ఫర్ చేయించుకొని గుంటూరు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మళ్లీ రమణిని చూశాను. సడన్గా ఊడిపడింది నెలల బిడ్డను ఎత్తుకుని. వాసు రాలేదేమని అడిగిన నాకు, రమణి ముభావంగా ఏదో సమాధానం చెప్పింది. రమణి కబుర్లు వినాలని, నేను ఆఫీసుకు సెలవు పెట్టేసాను. తనకు ఇష్టమైన బంగాళాదుంప వేపుడు, టమోటా పప్పు చేసి పెట్టాను. చాలా ఆకలితో ఉన్న దానిలా తినింది తను. నాలో ఎన్నో ప్రశ్నలు. కానీ రమణి ఎలా తీసుకుంటుందో అని మొహమాట పడి మిన్నకుండి పోయాను. బాబు పేరు రాజా. రమణి లాగే చాలా చురుగ్గా ఉన్నాడు. మెరుస్తున్న కళ్ళతో ఉన్న వాడితో ఆడుతూ రోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. వాసు గురించి మళ్లీ అడగడంతో ‘వదిలేయ్ అన్నూ ....వాసు తల్లిదండ్రులు స్వీపర్స్, అందుకని వాళ్లంటే నాకు చులకనట. మా అమ్మ కూడా స్వీపరే కదా.. నేనెందుకు మా అత్తామామలను చులకన చేస్తాను?’. నాకు విషయం కొంచెం అర్థమైంది. ‘రమణి.. నువ్వు చాలా చురుగ్గా ఉంటావు. తెలివి గల అమ్మాయివి. నువ్వు తక్కువ చేసి చూడకపోయినా, వాళ్ళకే ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అంతా సర్దుకుంటుందిలే.’ అన్నాను. ఆ తర్వాత పదేళ్ల వరకు నాకు రమణి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఉత్తరాలు రాసుకునే అలవాటు మా మధ్య లేదు. మళ్ళీ సడన్గా ఒక రోజు రమణి నుండి ఫోన్ వచ్చింది. సంతోషం ఆశ్చర్యం కలగలిపి ,‘హాయ్ రమణి... నా నెంబర్ ఎలా దొరికింది?’ అని అడిగాను. ‘మనస్సు ఉందమ్మా... మార్గం దొరికింది’ రమణిలో అదే చురుకుదనం తొణికిసలాడుతుంది. ‘ఎక్కడున్నావ్ ఇప్పుడు?’ అడిగాను నేను. ‘ఉయ్యూరు.... ప్రమోషన్ వచ్చిందోయ్. ఇల్లు కూడా కట్టాను’. ‘కంగ్రాట్స్... ఫ్యామిలీ అంతా షిఫ్టయి పోయారా?’ ‘ఆ... కొత్త ఇంట్లోనే ఉన్నాం. నేను ..రాజా.. మా అమ్మ.’ ‘వాసు ఎక్కడున్నాడు ?’ అడిగాను. ‘ఎక్కడ ఉంటాడు... విడాకులిచ్చినా దరిద్రం వదల్లేదు. నా చుట్టూ తిరుగుతూ శని గ్రహంలా పట్టి పీడిస్తున్నాడు’. ఇంతకాలం తర్వాత రమణి నాకు ఎందుకు ఫోన్ చేసిందో నాకు అర్థం అయింది. వాసు వల్ల ఆమెకి ఏదోప్రాబ్లం. అది చెప్పుకునేందుకు నాతో మాట్లాడుతోంది. ‘ఏమంటున్నాడు రమణి?’....అనునయంగా అడిగాను. ‘ఏముంది ...నాకు ప్రమోషన్ వచ్చింది. అతగాడికి ఉన్న ఉద్యోగం ఊడింది. మగ పొగరు చూపించేవాడు. ఇల్లు కట్టుకున్నాను. నేను సంతోషంగా ఉంటే చూడలేకపోయాడు. విడాకులు ఇచ్చి పడేసా... అమ్మ.. నేను.. బాబు, అంతే’ ‘మరైతే ప్రాబ్లం ఏంటి?’ ‘ఎక్కడ... దరిద్రం వదిలితే కదా?...నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. నా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు’. ‘అయ్యో... విసిగిస్తున్నాడా?’ ‘ విసిగించడం ఏంటి అన్నూ ...ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఎత్తకపోయ్యాననుకో ఫోన్ ఎత్తే వరకు చేస్తూనే ఉంటాడు’. ‘ఫోన్ రిసీవెర్ తీసి పక్కన పెట్టలేక పోయావా?’ ‘ ఫోన్ తీసి పక్కన పెడితే కూడా ఫోన్ మోగే టెక్నిక్ ఏదో అతని దగ్గర ఉంది’ ‘రిసీవర్ పక్కన తీసి పెట్టినా రింగ్ అవుతుందా?’,. ఎంత దాచి పెట్టాలన్నా, నా గొంతులోని అపనమ్మకం రమణికి అర్థం అయింది. ‘అన్నూ.. నువ్వు నన్ను నమ్మడం లేదు. నీకు చెప్తే అర్థం కావడం లేదు. అతడికి నన్ను నాశనం చేయడమే పని. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు’. ‘సరే ఫోన్ చేసి ఏం మాట్లాడుతాడు ?’. ‘ఏంమాట్లాడుతాడూ?...భయపెడతాడు..క్షణం క్షణం నా గురించి అన్ని తెలుసుకుంటాడు. నా శరీరం మీద ఏదో బగ్ పెట్టుంటాడు. లేదంటే ఎలా తెలుస్తుంది? వాడంటాడూ ..’ ఇప్పుడే స్నానం చేశావు కదా... సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావు... నాకు అంతా తెలుసు. నీ గురించి అన్నీ తెలుసు. నువ్వు నాశనం అవుతావు’ అంటాడు. ‘బయట ఉండి గమనిస్తున్నాడేమో రమణీ’. ‘ లేదు ఆన్నూ.. నీకు అర్థం కావడం లేదు. నేను ఇంట్లో ఏం చేస్తున్నానో కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఎలా కూర్చున్నాను ...ఎక్కడ కూర్చున్నాను ...ఏం తింటున్నాను ..అంతా. ఎక్కడో కెమెరాలు పెట్టాడు. బయటికి వెళ్తే చాలు, నలుగుర్నేసుకుని జీప్లో ఫాలో అవుతాడు’. ‘రమణీ, వాసూకు డబ్బు, హోదా, తెలివితేటలు ఉన్నాయా?’. ‘ లేవు.. లేవు. సోంబేరి వెధవ.’ ‘రమణీ.. నిదానంగా ఆలోచించు.. అతడి దగ్గర డబ్బులేదు. సో..జీపు, నలుగురు మనుషులను మైన్టెన్ చెయ్యలేడు. తెలివితేటలు లేవు. ప్లాన్ చెయ్యలేడు. అతని ఇవన్నీ చేయలేడు. అతడు గెస్ చేసి చెప్పినాటివి యాక్సిడెంటల్గా నీకు సరిపోయి ఉంటాయి’. ‘అయ్యో ...నీకు ఎలా చెప్పాలి అన్నూ...వాడు నా నాశనం చూస్తాడు. వాడు నన్ను వదిలి పెట్టడు. వాడు నా చుట్టూ చుట్టూ తిరుగుతున్నాడు. నలుగురు గుండాలని పెట్టుకున్నాడు. తెలివితేటలు లేకపోవచ్చు, చావు తెలివి ఉంటుందిగా..అప్పైనా చేస్తాడు. వాడు నాశనమైనా సరే, నన్ను నాశనం చెయ్య న్దే వదల్డు’ రమణి చెప్పింది నిజం కాదని నాకు బలంగా అనిపిస్తుంది. ఏం చెప్పి కన్విన్స్ చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి పరిస్థితి గురించి నాకు దిగులుగా అనిపించింది. నేను నమ్మడం లేదని రమణికి అర్థం అయింది. ‘మా ఊరికి ఒకసారి రా... కొంచెం స్థలం మార్పిడి ఉంటుంది’ అనే లోపు ఫోన్ కట్ చేసింది. ఆమెకు లాజిక్ అవసరం లేదన్న విషయం నాకు గ్రహింపుకు రాలేదు. కారణం ఏదైనా ఆమె బాధ నిజం. ఆమె భయం నిజం కాకపోవచ్చు. ఆ భయం నుండి వచ్చిన సంఘర్షణ నిజం. ఆ అమ్మాయి చాలా హర్ట్ అయ్యింది అని నాకు అర్థమయింది. ఇంతలో మేనేజర్ దగ్గర నుండి పిలుపు రావడంతో తాత్కాలికంగా రమణి ఆలోచనలను వాయిదా వేశాను. ఆ వాయిదా పడ్డం పడ్డం మళ్లీ ఇల్యుషన్స్ గురించిన ఆర్టికల్తో రమణి గుర్తొచ్చింది. ‘ఎవరికీ వినబడని శబ్దాలు వినబడతాయి... కనబడని రూపాలు కనబడతాయి.. లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తారు.. ఇదీసారాంశం. భ్రమలా..లేని రూపాలు కనబడతాయా? ఇంతకంటే నరకం ఉంటుందా. ఆ నరకాన్నే చూసిందా రమణి! గూగుల్ సెర్చ్ ఇంజన్ అప్పట్లో అంత ప్రాచుర్యం కాదు. ఒకవేళ ఉన్నా, రమణి ప్రాబ్లం ఇదని పోల్చుకోలేక పోయి ఉంటాను. రమణి నెంబర్ నా దగ్గర లేదు. మేనేజర్ పిలిచిన హడావుడిలో, నేను నెంబర్ సేవ్ చేసుకోలేదు. తర్వాత ఇక ప్రయత్నించలేదు. అది భార్యాభర్తల గొడవలు గానే చూశాను. ఆమె ఉన్న బ్రాంచ్కి ఫోన్ చేద్దాం.. అనుకుంటూనే పోస్ట్ పోన్ చేశాను. తర్వాత రమణి ఆలోచనలు మరుగునపడిపోయాయి. సమస్యల్లో ఉన్న స్నేహితురాలు ఫోన్ చేస్తే, నేను చేసింది ఏమిటి?.. గబగబా మురళి కి ఫోన్ కలిపాను. ‘మురళి.. రమణి ఫోన్ నెంబర్ ఉందా?’ ‘ఎందుకు ఇప్పుడు నీకు?’ , అయోమయంగా అడిగాడు మురళి. ‘రమణితో మాట్లాడాలి. రేపు వుయ్యూరుకు వెళ్తున్నాను.’ ‘ రమణి చనిపోయిన విషయం నీకు తెలియదా? నేనే చెప్పానే.’ మతి పోయింది నాకు. ‘నాకు తెలీదు ...రమణి చనిపోయిన విషయం నాకు తెలీదు.‘ ‘అనఘా... నేనే చెప్పాను నీకు.‘ ‘షటప్....చెప్తే మర్చిపోయే విషయమా ఇది?..చనిపోయింది, నా స్నేహితురాలు. విషయం విని ఉంటే ఎలామర్చిపోతాను?‘ ‘సారీ’ చెప్పాడు, మురళి. ‘ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు నేను వెళ్తాను.’ ‘రమణి చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నువ్వెళ్లి ఏం చేస్తావు?’ ‘ వెళ్ళాలి ...నంబర్ ఇవ్వు’. మురళి దగ్గర నెంబరు తీసుకొని మరుసటి రోజు ఉదయమే ఉయ్యూరుకు బయలు దేరాను. దారిలో రమణి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాను. రమణి కొడుకు రాజా ఫోన్ ఎత్తాడు. నేను వస్తున్నట్లు చెప్పాను. ‘కాలేజీ కి వెళ్ళు ..సాయంత్రం కలుస్తా’ అని చెప్పాను. చిన్న ఊరే అవ్వడంతో రమణి ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు. ఇల్లు చిన్నదే అయినా రమణి టేస్ట్ కనపడుతోంది. కాంపౌండ్ అంతా మొక్కలు, చెట్లు. కాంపౌండ్ లోనికి వెళ్లి, కాలింగ్ బెల్ కొట్టాను. ఒక ముసలావిడ తలుపు తీసింది’ఎవరూ?’ అంటూ. ‘నా పేరు అనఘ... రమణి స్నేహితురాలిని’ ముసలావిడ కు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ముసలావిడ వెనకాలే లోనికి నడిచాను. సోఫా చూపించి, ‘కూర్చో’ అంది, ఆమె. లోనికి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక కొంత సేపు మౌనంగా కూర్చున్నాను. ‘మా రమణితో కలిసి పనిచేసావామ్మ?’ ముసలావిడే సంభాషణ ప్రారంభించింది. ‘అవునండి ...నేను రమణి పెళ్లికి కూడా వచ్చాను. రమణి ఎలా చనిపోయిందండీ’ ఇబ్బంది పడుతూనే అడిగాను. ముసలావిడ కళ్ళు పెద్దవి చేసింది.‘దెయ్యమమ్మా దెయ్యం.... రమణి కి దెయ్యం పట్టింది. గాలితో మాట్లాడేది. గాలిలో వేటి వేటినో చూసేది. నిద్ర పోదు. తినదు. ఒక్కోసారి తినడం మొదలుపెడితే ...ఇద్దరి తిండి తినేది. మంత్రగాడిని పిలిపించా. యాప మండలెత్తి ధభి దభి బాదుతె దెయ్యం దార్లోకొచ్చింది. ఐనా ఏం లాభం? అప్పటికే నష్టం జరిగిపోయింది. దయ్యం రమణిని లొంగ తీసుకుంది. పీల్చిపిప్పి చేసింది. కొద్దిరోజులకే పీల్చక పోయి,మంచంలో పడిపోయింది’. నాకు వస్తున్న ఆవేశానికి ఆ ముసలిదాని చెంపలు టపిటపిమని వాయించాలనిపించింది. ఆ మంత్రగాడు దొరికితే, ఇంకే అభాగ్యురాలి వుసురూ తీయకుండా రెండు చేతులూ విరిచేయాలనిపించింది. రమణి శారీరకంగా, మానసికంగా ఎంత క్షోభ అనుభవించింది! కళ్ళ ముందర లేని ఆకారాలు తిరుగుతూ, శబ్దాలు వినబడుతూ ఉంటే, ఎలా భరించిందో! భయానికి నిద్ర రాక , తిండి సహించక కృశించి పోయివుంటుంది. దీనికి తోడు వేపమండలు తగిలి శారీరకబాధ. నాకు ముసల్దానితో మాట్లాడాలనిపించ లేదు. బైట మెట్లమీద కూర్చుని రాజా కోసం కళ్ళలో నీళ్ళతో ఎదురుచూడసాగాను. సాయంత్రం ఆరు అవుతోండగా రాజా వచ్చాడు. ముమ్మూర్తులా తల్లి పోలిక. కొనదేలిన ముక్కు, కర్లీ హేర్..పొడవుగా ఉన్నాడు. ‘ఎంత సేపయ్యింది ఆంటీ వచ్చి’ అంటూ పలకరించాడు. ’ఎంత సంస్కారం ఈ అబ్బాయికి ’ అనుకున్నాను నేను. ‘‘ఇక్కడ కూర్చున్నారేమిటి? లోపలికి వెళ్దాం రండి,... భోంచేసారా?’ ’ముసలిదానికి రాలేదు ఈ ఆలోచన’ అనుకుంటూ, ‘లేదు బాబు.. నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రా. నాకు ఇక్కడే బాగుంది’ అన్నాను. రాజా తలూపి లోపలికి నడిచాడు. ఐదు నిమిషాల్లో మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ‘కూర్చో రాజా...’ నాపక్కన స్థలం చూపాను. ‘మీరు మా అమ్మ ఫ్రెండా ఆంటీ?’ నా పక్కన కూర్చుంటూ అడిగాడు రాజా. రాజా చేతిని నా చేతి లోకి తీసుకున్నాను. ‘బాబు... మీ అమ్మ, నేను మంచి స్నేహితులం. సినిమాలకు, షాపింగ్లకు కూడా తిరిగే వాళ్ళం. మీ అమ్మ ఒంటరిగా ఉండేది. అందుకని మా అమ్మ వంటలు అప్పుడప్పుడు రుచి చూపించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ స్నేహం పరిహాసం అయింది. మీ అమ్మ చనిపోయిన విషయం నాకు నిన్న తెలిసింది. నాకు ఆమె సమస్య గురించి అవగాహన లేదు. నేను ఆమెకు కొంతైనా సపోర్టు ఇచ్చి ఉంటే బ్రతికుండేదేమో!. ఆ గిల్టినెస్ నన్ను బాధిస్తోంది’ దుః ఖంతో గొంతు పూడుకపోవడంతో ఆగిపోయాను. దూరంగా ఉన్న గన్నేరు పూలను చూస్తూ రాజా చెప్పసాగాడు. ‘నేను అప్పటికి చిన్నవాడిని ఆంటీ... నాకు పూర్తిగా తెలిసేది కాదు. అమ్మ తన సమస్యను ఇంట్లో వారికి, స్నేహితులకు చెప్పటానికి ప్రయత్నించేది. పూర్తిగా వినకుండానే, అర్థం చేసుకోకుండానే వాళ్లు సలహాలు ఇవ్వ చూపేవారు. సర్దుకు పొమ్మనేవారు. ఆమ్మ పట్ల వారికి సానుభూతి ఉందని, నాకు అనిపించేది కాదు. చదువు, ఉద్యోగం ఉందని... అందుకే నాన్నతో గొడవలు వస్తున్నాయనీ వాళ్ళు నమ్మారని అనిపిస్తుంది. తర్వాత తర్వాత ఆమె తన భావాలను చెప్పుకోవడం కూడా మానేసింది. లోలోపల మధనపడేది. తన దారిన తను బ్రతుకుదాం అనుకున్నా ఎవరో ఒకరు పనిగట్టుకుని వచ్చి బుద్ధులు చెప్పేవారు. నాన్నకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఆమె మొదట వివరించడానికి చూసేది. తర్వాత మానేసింది. సంవత్సరాల తరబడి జరిగిన గొడవలు ఆమెను క్రుంగదీసాయి. ‘దెయ్యం పట్టిందని ఎందుకనుకున్నారు రాజా?...’ ఆవేదనతో అడిగాను నేను. ‘అమ్మకు గాలిలో పెద్ద పెద్ద ఆకారాలు కనిపించే వంట ఆంటీ.. భయపడి పోయేది. చేతిలో ఉన్న వస్తువు విసిరి కొట్టేది. వీధుల వెంబడి పరిగెత్తేది లేదా గదిలో ఓ మూల ముడుచుకుని కూర్చునేది. ఒక్కో రాత్రి గుమ్మంలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనబడేది. ‘అమ్మ’ అని పిలిచి కుదుపుతే వచ్చి పడుకునేది. రాను రాను ఆమెకు నిద్ర కరువైంది. నిద్రపోవడానికి భయపడేది. ఆమె బాధ ఎవరైనా అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. కనీసం తగ్గి ఉండేది. నిద్రలేమీ ఆమెను కృంగదీసింది. పక్కనే మొద్దు లాంటి శరీరం పడుతుందని గాల్లోనే విసురుగా కాలితో తన్నేది. పట్టపగలు.. ’ చీకటి చీకటిగా ఉంది’ అంటూ అరిచేది. గది మూలల్లో వింత ఆకారాలు ఎగురుతున్నాయి... అనేది. గది పైకప్పు చూసి పెద్ద బస్టాండు అక్కడున్నట్లు మాట్లాడేది. జనంలో నేను తప్పిపోయినట్లు.... రాజా అని పిలుస్తుంటే జనఘోషలో ఆమె పిలుపు కలిసిపోయినట్లు.. నాకు ఆమె పిలుపు వినబడనట్లు, ఆరాటపడేది. ఎక్కడికో పారిపోవాలని గింజుకునేది. ఎక్కడుందో ఆమెకు అర్థం కాదు. చుట్టూ ఎవరున్నారో ఆమెకు తెలియదు. భయంతో ముడుచుకు పోయేది. నెమ్మది నెమ్మదిగా ఆమె తినడం కూడా మానేసింది. మంచినీళ్లు తాగించాలి అని చూసినా, మూతి బిగించేది. అమ్మమ్మేమో, దెయ్యం పట్టిందని మంత్రగాడిని పిలిపించి, పూజలు చేయించింది. వాడు కొట్టిన దెబ్బలకు అమ్మ శరీరం హూనం అయ్యింది. అందరూ కలిసి అమ్మను చంపేశారాంటీ‘. నా శరీరం అణువణువు నిస్సత్తువ ఆవరించింది. రమణి ఇంత మానసిక క్షోభ అనుభవించిందని ఊహిస్తేనే వళ్ళు గగుర్పాటు పొందుతోంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. నా కంటి నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మానేశాను. రమణి అనవసరంగా ఊహించుకుంటుంది, అనుకున్నానే కానీ... అది మానసిక వ్యాధి అని నాకు తెలియలేదు. రాజా చెయ్యి మీద చెయ్యి వేస్తూ అడిగాను ‘రాజా... నాతో వచ్చెయ్యి. మా ఇంట్లోనే ఉందువు.’ ‘అమ్మమ్మను చూసారు కదా ఆంటీ... ముసల్ది... ఆమెకు నేను తోడుగా ఉండాలి కదా.’ తల్లి మరణానికి కారణమైన వాళ్ళ బాగోగులు కూడా ఈ చిన్ని మనస్సు ఆలోచిస్తోంది. రమణి సంస్కారమే ఇతడికి వచ్చింది. కాసేపు రాజాతో మాట్లాడిన తర్వాత,‘రాజా బస్టాండ్లో వదలి పెడతావా..’ అంటూ లేచాను. మార్గంలో కనబడిన వ్యక్తులను చూస్తూ వెళుతున్నాను. చాలామంది నిర్వికారంగా ఉన్నారు. వీళ్లలో ఎంతమంది ఆలంబన కోసం అర్రులు చాస్తున్నారో! ఎంతమంది పిలుపు ఆత్మీయుల చెవులను చేరుతుందో!? సాయం కోసం చాచిన చేతులను ఎంతమేరకు ఆపన్న హస్తాలు అందుకున్నాయో?! ఎంతమంది చిత్తభ్రమలకు దగ్గరగా ఉన్నారో?! ఎవరు గుర్తించగలరు? అజ్ఞానమో..అవివేకమో... నిండు ప్రాణాలు అడవి పువ్వులు అవుతున్నాయి. బాధను చెప్పుకుంటే.. అర్థం చేసుకునే నిండు హృయాలు వారికి దొరకాలని ఆశపడుతూ తిరుగు ప్రయాణం అయ్యాను. ♦ యస్వియం నాగగాయత్రి -
అటు అమెరికా ఇటు ఇరాన్... మధ్యలో జిన్నీ!
చీటికి మాటికి తమ మీద ఆంక్షలు విధిస్తున్న అమెరికా ప్రెసిడెంటు ట్రంపు మీద ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రోహానీకి పీకలలోతు కోపం వచ్చింది. తనకు కోపం వచ్చినప్పుడల్లా కలం కాగితం తీసి కవితలు రాయడం రోహానీ అలవాటు. ఇది హైస్కూల్ రోజుల నుంచి ఉంది. ఈసారి కూడా అలాగే చేశాడు. కాగితం తీసి కలంతో ఇలా కవిత రాశాడు: ‘బాంబులు విసిరినా బరిసెలతో పొడిచినా తెలుగు టీవీ సీరియల్స్ చూపించినా అక్కుపక్షి అమెరికాకు నో సరెండర్...నో సరెండర్ వాహ్వా...వాహ్వా!’ కవిత రాసి పావుగంట దాటినా కోపం అట్లాగే ఉంది. అంతే వేడితో ఉంది. ఈసారి స్కెచ్పెన్తో డ్రాయింగ్ పేపర్ మీద ట్రంపు బొమ్మ గీసి ముక్కలు ముక్కలుగా చింపేసి వికటాట్టహాసం చేశాడు. అయినా కోపం తగ్గలేదు. వేడి తగ్గలేదు. ఈసారి ట్రంప్ మైనపు బొమ్మను తయారుచేసి టెహరాన్ గ్రౌండ్లో నిలబెట్టి దూరం నించి ఒక రాయి విసిరాడు. గురి చూసి కొట్టడంలో మనోడు కాస్త వీక్. అది వెళ్లి ఎక్కడో పడింది. ఎక్కడో కాదు... పిచ్చి పొదల మాటున ఉన్న ఒక దీపం మీద పడింది. అది మామూలు దీపం కాదు... అక్షరాలా అల్లావుద్దీన్ దీపం! ఆవులిస్తూ అంతెత్తున లేచింది జిన్నీ భూతం. ‘‘ఏంది నీ లొల్లి. మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేశావు! ఏం కావాలో అడిగిచావు’’ అన్నది జిన్నీ భూతం మణికట్టు గడియారంలో టైమ్ చూసుకుంటూ. జిన్నీ భూతాన్ని చూడగానే సంతోషంతో ఒడలు పులకించాయి ఇరాన్ ప్రెసిడెంట్కు. ‘యురేకా తకామికా నీ ముద్దూ తిరేదాకా దొరికెరా మజాగా ఛాన్సు..’ అని చిరంజీవి సినిమాలోని పాట అందుకున్నాడు. ‘‘పాట సంగతి తరువాత....ముందు వరం అడిగి చావు’’ అని గద్దించింది జిన్నీ భూతం. ‘‘అయ్యా జిన్నీ భూతం... మీకు తెలియంది కాదు...మా దేశానికి ప్రధాన ఆధారం ఆయిల్. ఆ అమెరికా ట్రంపు ఉన్నాడు చూశారూ... మా మీద ఆంక్షలు విధించాడు. గ్రీస్, ఇటలీ, తైవాన్, టర్కీ... ఇవేమీ మా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ కూటమిలో ఇండియా కూడా చేరింది. టాప్ బయర్స్ మా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం లేదు’’ అని బాధ పడిపోయాడు ఇరాన్ ప్రెసిడెంటు. ‘‘మరిప్పుడు నన్నేటి సేయమంటావు? ట్రంపు తల తీసి నీ చేతుల్లో పెట్టమంటవా?’’ అని అడిగింది జిన్నీ భూతం. ‘‘ఆడి తలతో నేనేం చేసుకునేది! అందులో ఏముంది గనుక!’’ వాపోయాడు ఇ. ప్రెసిడెంట్. ‘‘అతడిని ఏమీ చేయనక్కర్లేదు. టాప్బయర్స్ మళ్లీ మా ఆయిల్ను దిగుమతి చేసుకునేలా చేస్తే అదే పది రియాల్లు’’ అని దీనంగా అడిగాడు ప్రెసిడెంట్. ‘‘చూడు రోహానీ... నేను చెప్పినట్లు చేస్తే నీ ప్రాబ్లం తొలిగిపోతుంది’’ అన్నది జిన్నీ భూతం. ‘‘ఏంచేయంటారు?’’ మర్యాదతో కూడిన ఆసక్తితో అడిగాడు ప్రెసిడెంటు రోహానీ. ‘‘సింపుల్... మీ ఆయిల్ను ఏ దేశాలైతే దిగుమతి చేసుకోవడం లేదో... ఆ దేశాల్లో నన్ను వదులు చాలు’’ అన్నది జిన్నీ భూతం. ‘‘అలాగే’’ అన్నాడు ప్రెసిడెంటు. ∙∙ ‘‘విక్రమార్కా... చాలా రోజుల తరువాత టఫ్ క్వచ్చన్ అడుగుతున్నాను. ఇంతకీ జిన్నీ భూతం ఏం చేసింది? టాప్బయర్స్ మళ్లీ ఇరాన్ ఆయిల్ను దిగుమతి చేసుకొనేలా చేసిందా? నా ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో మటాష్...’’ అని అరిచాడు విక్రమార్కుడి భుజం మీది భేతాళుడు. అప్పుడు చిరునవ్వుతో విక్రమార్కుడు అలా చెప్పడం మొదలుపెట్టాడు.... ∙∙ ఇటలీ... పర్మ సిటీ...రోడ్డు నంబర్: 2 తన ఇంటి పెరట్లో ఒక మూలన పడి ఉన్న పాతదీపాన్ని చూసి... ‘‘కొంపదీసి ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం అయితే కాదు కదా’’ అని బుర్రగొక్కున్నాడు నలభైనాలుగు సంవత్సరాల ఇంజనీర్ బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘కొంపదీసి ఏమిటయ్యా బాబూ... నేను నిజంగానే అద్భుతదీపాన్ని’’ అరిచింది జిన్నీ. ‘‘నాకు ఒకే ఒక కోరిక ఉంది. అది తీర్చు జిన్నీ’’ అని దీనంగా అడిగాడు బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘మణులా మాణిక్యాలా? మందుబాటిళ్లా? కమాన్ అడుగు’’ ఆఫర్ ఇచ్చింది జిన్నీ భూతం. ‘‘అవేం అక్కర్లేదు’’ నసిగాడు జుమ్ జుమ్. ‘‘మరి ఏం కావాలి?’’ అడిగింది జిమ్మి. ‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్లేలా చూడు... నాకు వక్కపొడి కూడా తినే అలవాటు లేదనేది మా ఆవిడకు ఉన్న భ్రమ. ఆమె భ్రమ నా పాలిటి భయమై... నన్ను మందుకు దూరం చేసింది. ఆమె ఒక వారం రోజులు పుట్టింటికి పోతే నాన్స్టాప్గా మందుకొట్టాలనేది నా చిరు కోరిక’’ లొట్టలు వేస్తూ అన్నాడు బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘అదిసరేగానీ, దీపంలో ఏం ఉంటుంది?’’ అని అడిగింది జిన్నీ భూతం. ‘‘ఆయిల్’’ అని ఆన్సర్ చెప్పాడు జుమ్ జమ్. ‘‘ప్రస్తుతం మా దీపంలో అయిల్ అయిపోయింది. మళ్లీ పోస్తేగానీ పని చేయదు’’ అన్నది జిన్నీ. ‘‘ఓసే అంతేగా... ఇప్పుడే తీసుకొస్తాను...’’ అని జుమ్జుమ్ అనేలోపు జిన్నీ భూతం ఇలా అన్నది... ‘‘నాయనా జుమ్ జుమ్... మా దీపంలో ఇరాన్ ఆయిల్ పోస్తేనే పని చేస్తుంది’’ ‘‘ఇరాన్ ఆయిల్ని బ్యాన్ చేశారు కదా’’ అని తల పట్టుకున్నాడు బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘అలా తలపట్టుకుంటే కుదరదు. ఇరాన్ ఆయిల్ పోస్తేగానీ దీపం పనిచెయ్యదు. అప్పుడుగానీ నీ కోరిక నెరవేరదు’’ మరోసారి అన్నది జిన్నీ. అల్లావుద్దీన్ దీపం రోజుకో దేశంలో, రోజుకో ఇంట్లో ప్రత్యక్షమయ్యేది. ‘‘నీ కోరిక తీరుస్తానుగానీ ముందు మా దీపానికి ఇరాన్ ఆయిల్ కావాలి’’ అని అడిగేది. ఇలా ‘ఇరాన్ ఆయిల్’కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇరాన్ ఆయిల్ దిగుమతి మీద నిషేధం తొలిగించాలని ఉద్యమాలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వేడి తట్టుకోలేక టాప్ బయర్స్ దేశాలు ఇరాన్ ఆయిల్ మీద నిషేధాన్ని తొలిగించాయి. ఇరాన్ ప్రెసిడెంటు కోరిక అలా నెరవేరింది! – యాకుబ్ పాషా -
ఉత్తమ విలన్స్
ఉదయిస్తున్న సూర్యుడి నులివెచ్చటి కిరణాలు భూమిని తాకుతున్న వేళ. నేలపై రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్య శవాన్ని ఒళ్లోకి తీసుకున్నాడతను. గుండె బద్ధలయ్యే బాధను పంటి బిగువన నొక్కిపట్టి, గట్టిగా భార్య శవాన్ని గుండెలకు హత్తుకున్నాడు. ‘‘నిన్ను నా నుంచి దూరం చేసిన వాళ్లను వదిలిపెట్టను! వదిలిపెట్టను!!’’ అతడి అరుపులతో ఆ ప్రాంతం మార్మోగింది. ‘‘కట్!.. షాట్ ఓకే!’’ అన్న అరుపు వినపడగానే కెమెరా ముందు నుంచి పక్కకు వచ్చాడు అనురాగ్. ‘‘షాట్ అద్భుతంగా వచ్చింది. వెల్డన్ అనురాగ్!’’ మెచ్చుకోలుగా అన్నాడు డైరక్టర్ సురేంద్ర. అనురాగ్ చిరునవ్వుతో అక్కడ నుంచి పక్కకు వచ్చి, సెల్ఫోన్లోకి తల దూర్చాడు. ’’ఏం కొత్త పెళ్లికొడుకా!’’ అన్న మాటలు వినపడగానే తలపైకెత్తి చూశాడు. ఎదురుగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవీంద్ర నిల్చుని ఉన్నాడు. ఇద్దరిదీ పదేళ్ల స్నేహం! ఒరేయ్! అని పిలుచుకునే చనువు. ‘‘పెళ్లై ఆరునెలలు దాటింది! ఇంకా కొత్తపెళ్లి కొడుకునేనా?’’ నవ్వుతూ అడిగాడు అనురాగ్. ‘‘కాదా మరి!... ఎంతైనా నీలాంటి భర్త దొరకటం నీ భార్య నిశిత అదృష్టంరా!’’ ‘‘ఏం? ఎందుకు?’’ ‘‘పెళ్లైన నెల రోజులకే భార్యల నుంచి దూరంగా పరిగెత్తే మొగుళ్లను చాలామందిని చూశాను. నువ్వు అలా కాదు! పెద్ద పెద్ద ఆఫర్లను కాదని, భార్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నావ్. పెళ్లైన తర్వాత అసలు కొత్త సినిమాలకు సైన్ చేయటమే మానేశావు. మొత్తానికి భార్య కొంగుచాటు కృష్ణుడివయ్యావు’’ అన్నాడు రవీంద్ర. అనురాగ్ నవ్వుతూ ‘‘భార్యంటే వస్తువు కాదు! వాడుకుని, అవసరం తీరాక దూరంగా పడేయటానికి! కన్నవాళ్లను వదిలి, మనల్ని నమ్మి వచ్చిన భార్య మన నుంచి ఆశించేది విలువైన బహుమతులు కాదు, ప్రేమగా నాలుగు మాటలు.. ఆమెతో సరదాగా గడపటానికి నాలుగు నిమిషాలు. అదే నేను చేస్తున్నాను’’ అన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసి, ‘హలో..’ అన్నాడు. ఆవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే నిశ్చేష్టుడయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని, ‘‘ఎప్పుడు జరిగింది? ఎలా? సరే నేను వస్తున్నాను’’ అంటూ కళ్లనిండా నీళ్లతో హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరాడు. అనురాగ్ ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. అతడలా ఇంట్లోకి నడుచుకుంటూ వెళుతుంటే అందరూ అతని వైపే జాలిగా చూస్తున్నారు. అనురాగ్ భయం భయంగా బెడ్ రూమ్లోకి అడుగుపెట్టాడు. రక్తపు మడుగులో అచేతనంగా పడిఉన్న భార్యను చూసిన వెంటనే గుండెలు బాదుకున్నాడు. ∙∙ హత్య జరిగిన మరుసటి రోజు.. ప్రముఖ నటుడి భార్య దారుణ హత్య ‘‘చూశారా సార్! ఫ్రంట్ పేజీ, రెండు కాలాల వార్త, అదృష్టవంతురాలు. మనం ఎంతమంది క్రిమినల్స్ను పట్టుకుని ఉంటాం. ఏనాడైనా మన గురించి సింగిల్ కాలమ్ వార్త రాశారా. పాస్పోర్టు సైజ్ ఫోటోయైనా వేశారా? దేనికైనా పెట్టిపుట్టుండాలి సార్!’’ వార్తా పత్రికను ఎస్ఐ అంజన్కు చూపిస్తూ.. తన గోడు వెళ్లబోసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం. ఎస్ఐ అంజన్ పేపరువైపు ఒక్కక్షణం చూసి, గట్టిగా ‘‘భద్రం..’’ అనగానే గమ్మునుండిపోయాడు అతను. అంజన్ కారు నడుపుతున్నా! అతడి ఆలోచనలు మాత్రం నిశిత హత్య కేసు మీదే ఉన్నాయి. ఎస్ఐ అంజన్కు.. పోస్టుమార్టమ్ రిపోర్టు రాకముందే చాలా కేసులను ఛేదించిన అనుభవం ఉంది. ఎటువంటి కేసునైనా నెలరోజుల్లోగా సాల్వ్ చేయగలడని డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. ఈ కేసును కూడా వీలైనంత తొందరగా ముగించేయాలన్న ఆలోచనలో ఉన్నాడతను. కొద్దిసేపట్లోనే వాళ్లు ప్రయాణిస్తున్న కారు అనురాగ్ ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ ఇంటి లోపలికి నడిచారు. సోఫాలో కూర్చుని, ఇంగ్లీష్ పేపరు చదువుతున్నాడు అనురాగ్. అడుగుల చప్పుడు వినపడి, పేపరులోంచి తల పైకెత్తి చూశాడు. ఎదురుగా పోలీసులు కన్పించటంతో పైకి లేచాడు. ‘‘ఇక పాయింట్కు వద్దాం మిస్టర్ అనురాగ్! మీ భార్య హత్య జరిగిన రోజు రాత్రి మీరెక్కడున్నారు?’’ ప్రశ్నించాడు అంజన్. అతడలా సూటిగా ప్రశ్నించే సరికి మొదట కంగారుపడినా, సర్దుకుని, ‘‘ఆ రోజు, అంతకు క్రితం రోజు నేను ఇంట్లో లేను, షూటింగులతో బిజీగా ఉండి ఇంటి వైపు రావటమే కుదరలేదు’’ చెప్పాడతను. ‘‘ఈ నెంబరు ప్లేటు గల కారు మీదేనా?’’ ప్రశ్నించాడు వీరభద్రం. ‘‘ఆ! నాదే, ఏమైంది?’’ అమాయకంగా తిరిగి ప్రశ్నించాడు అనురాగ్. ‘‘హత్య జరిగిన రాత్రి నువ్వు కారులో ఈ ఏరియాలోకి రావటం వీధి చివరన ఉన్న సీసీ కెమరాల్లో రికార్డైంది. నీ సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా నువ్వు ఆ రాత్రి ఈ ఏరియాలోనే ఉన్నావని చెబుతున్నాయి. అంటే ఆ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. మర్యాదగా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు! లేదంటే మా స్టైల్లో విచారించాల్సి ఉంటుంది. జాగ్రత్త!’’ హెచ్చరిస్తున్నట్లు అన్నాడు అంజన్. ‘‘నా భార్యంటే నాకు ప్రాణం. అలాంటిది తనను నేనెందుకు చంపుతాను’’ అన్నాడు. ‘‘నీది నంది అవార్డు నటనని మాకు తెలుసు! మేము ఇక్కడికి వచ్చే ముందు నిశిత తల్లిదండ్రులు మా స్టేషన్కు వచ్చారు. నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ల కూతుర్ని తరుచూ హింసించే వాడివని, కన్నవాళ్లతో మాట్లాడటానికి కూడా ఫోన్ ఇచ్చేవాడివి కాదని, నువ్వో అనుమానపు పిశాచివి.. కలియుగ కీచకుడివని, నిశితను నువ్వే చంపుంటావని ఆ కంప్లైంట్ సారాంశం’’ వెటకారంగా అన్నాడు వీరభద్రం. ఇక తప్పించుకోవటానికి ఎటూ దారిలేని పరిస్థితుల్లో చేసిన నేరం ఒప్పుకున్నాడు అనురాగ్. ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు.. ‘‘నిశితకు ఎఫైర్ ఉందని, పెళ్లిచూపుల టైమ్లోనే తెలిసినా డబ్బు కోసం తనను పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన తర్వాతైనా మారుతుందని అనుకున్నాను. కానీ ఏ మార్పు రాలేదు! మరీ బరితెగించింది. నేను ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడు ఇంటికి వచ్చిపోతున్నాడనిపించింది. అందుకే షూటింగులు మానుకుని మరీ! ఇంటి దగ్గర ఉండేవాణ్ని. ఈ మధ్య నా భార్య నిశిత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నా మీద ఎప్పుడులేని ప్రేమ ఒలకబోస్తోంది. ఓ రోజు ఉదయం ఇంటి బయట ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటం చూసి, నిలదీస్తే! అలాంటిదేమీ లేదని బుకాయించింది. అందుకే మరుసటి రోజు రాత్రి ఫుల్లుగా మందు కొట్టివచ్చి! నిశితను కసితీరా పొడిచినప్పుడు ఏదో తెలియని ఆనందం కలిగింది నాకు...’’ ∙∙ రెండవ రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో.. తన చాంబర్లో కూర్చుని, విశ్రాంతిగా క్రైమ్ మ్యాగజైన్ చదువుతున్నాడు అంజన్. ఇంతలో వీరభద్రం! ఓ సీల్డ్ కవర్ తెచ్చిచ్చాడతనికి. కవర్లో ఉన్న కాగితాలు బయటకు తీసి, అంజన్ చదవటం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. అంజన్ ముఖంలో చోటు చేసుకున్న మార్పులను గమనించిన వీరభద్రం ‘‘ఏంటి సార్! ఏమైంది’’ అని అడిగాడు కంగారుగా. అంజన్ ఆ కాగితాలను అతడి చేతికందించాడు. కొద్దిసేపటి తర్వాత అతడి పరిస్థితి కూడా అదే! బుర్ర గోక్కుంటూ ‘‘ఇదేంటి సార్! పోస్టుమార్టమ్ రిపోర్టు ఇలా వచ్చింది’’ అన్నాడు. ఊహించని ట్విస్ట్తో ఆలోచనల్లో పడ్డ అంజన్ పోస్టుమార్టమ్ రిపోర్టు ప్రకారం అనురాగ్! నిశితను హత్య చేయలేదు. ఆమెను ఇంకెవరో గొంతు నులిమి చంపేశారు. అనురాగ్! నిశితను.. అదే ఆమె డెడ్బాడీని పొడిచింది రాత్రి 8గంటల ప్రాంతంలో.. కానీ! ఆ హత్య అంతకు 5 గంటలముందు.. అంటే! మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు రిపోర్టు చెబుతోంది. నిశిత గొంతుపై హంతకుడి 9 వేలి ముద్రలే దొరికాయి. ఎడమ చేతి బొటనవేలి ముద్రలు దొరకలేదు. దానర్థం ఆ హంతకుడికి ఎడమ చేతి బొటన వేలు లేకుండా అన్న ఉండాలి లేదా బొటన వేలి ముద్రలు పడక పోవడానికి వేరే కారణమేదైనా ఉండాలి. ఎవరా హంతకుడు?’’ అంటూ భద్రం వైపు చూశాడు. ‘‘సార్! నిశితకు ఓ లవర్ ఉన్నాడని అనురాగ్ చెప్పాడుగా! బహుశా అతడే ఈ హత్య చేసుంటాడేమో!’’ అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రం. ∙∙∙ ‘‘ఎంబీఏ చదువుతున్నపుడు నేను, నిశిత ప్రేమించుకున్న మాట నిజం! కానీ పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మేము కూడా స్నేహపూర్వకంగానే విడిపోయాము. తర్వాత కొద్దిరోజులకు ఆమెకు పెళ్లైందని తెలిసింది. ఈలోగా నేను ఈ రెడ్ అండ్ రెడ్ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేరాను. పని ఒత్తిడిలో ఆమె సంగతే మర్చిపోయాను. మొన్న ఓ రోజు అనుకోకుండా రోడ్డుమీద కనిపిస్తే దగ్గరకెళ్లి పలకరించాను. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నేనే తనను కారులో ఇంటిదగ్గర దింపాను. అర్జంట్ ఫంక్షన్ ఉండటంతో ఆ ఇంట్లోకి కూడా వెళ్లకుండా రెస్టారెంట్కు వచ్చేశాను. బర్త్డే ఫంక్షన్ ఈవెంట్ పనుల్లో బిజీగా ఉండటంతో నేను ఆ పనిలో మునిగిపోయాను. రాత్రి పది వరకు రెస్టారెంట్లోనే ఉన్నాను. ఆ రాత్రే తను హత్యకు గురైంది! ఆ విషయం ఉదయం పేపర్లో చదివి తెలుకున్నాను. మీకు నా మీద అంత అనుమానం ఉంటే మా కోలీగ్స్ను నా గురించి విచారించుకోండి’’ ధీమాగా అన్నాడు సంజయ్. సంజయ్ మాట్లాడుతున్నంతసేపు ఇద్దరూ అతడి ఎడమచేతివైపే పరిశీలనగా చూస్తున్నారు. అతడు మాట్లాడుతూ ఎడమ చేత్తో జేబులో ఉన్న సెల్ఫోన్ను తీసి, టేబుల్ మీద పెట్డాడు. అతడి ఎడమ చేతి బొటనవేలు స్పష్టంగా కనపడుతోంది. అప్పుడప్పుడూ బొటనవేలితో ముఖంపై ఉన్న చింతపిక్కంత పుట్టుమచ్చను స్టైల్గా గోక్కుంటున్నాడు. పైగా అతడి మాటల్లో ఎలాంటి బెరుకూ, తప్పుచేశానన్న భయం లేదు. అంజన్కు.. ఇక అతన్ని విచారించటం వృథా అనిపించింది. ఓ కన్ఫర్మేషన్కోసం వీరభద్రాన్ని అతని వెంట పంపి, అతడు రెస్టారెంట్ బయటకు వచ్చేశాడు. కాసేపట్లో తిరిగొచ్చిన వీరభద్రం! సంజయ్ చెబుతున్నది నిజమేనని ధ్రువపరిచాడు. ∙∙ కేసు మళ్లీ మొదటికొచ్చింది... ఇరవై రోజులు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది కేసు పరిస్థితి. కేసును ముందుకు నడిపించే బలమైన ఆధారమేదీ దొరకటం లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వారం రోజుల నుంచి హత్య జరిగిన ఇంటి ముందు గస్తీ కాస్తున్నారు. ఓ రోజు మధ్యాహ్నం అనురాగ్ ఇంటి దగ్గరలో అంజన్! వీరభద్రం మఫ్టీలో నిల్చుని ఉండగా ఓ ముసలి బిచ్చగాడి ప్రవర్తన ఆశ్చర్యంగా తోచింది. ఆ ఇంటి దగ్గర కొచ్చిన బిచ్చగాడు దాదాపు 15 నిమిషాలు అక్కడే కదలకుండా నిలబడ్డాడు. ఇంటివైపు చూస్తూ ఏడవటం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన అంజన్, వీరభద్రం అతణ్ణి విచారించారు. ఆ ముసలి బిచ్చగాడు తరుచూ ఆ వీధిలోకి అడుక్కోవటానికి వచ్చేవాడు. ఎవరు అన్నంపెట్టినా పెట్టకపోయినా అనురాగ్ భార్య నిశిత తప్పక పెట్టేది. పండగరోజు ఇంట్లో చేసుకున్న వంటకాలన్నీ అతడికి పెట్టేది. ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు సహాయం చేసిన రోజులున్నాయి. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం బిచ్చగాడు ఇంటి బయట నిలబడి, చాలాసార్లు నిశితను పిలిచాడు. ఆమె రాలేదు! కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి కంగారుగా, చెమటలు పట్టి తడిసిన బట్టలతో ఇంట్లో నుంచి బయటకు రావటం అతడు చూశాడు. అదే సంగతి వాళ్లకు చెప్పాడు. ‘‘తాతా! నువ్వు ఆ వ్యక్తిని చూస్తే గుర్తుపట్టగలవా?’’ అడిగాడు అంజన్ ‘‘ఖచ్చితంగా!.. బాబు! ఆ మనిషి ఫోటో ఇందాకే పేపర్లో చూశాను’’ అన్నాడు ముసలాయన. నిమిషాల మీద అతడు చెప్పిన పేపర్ తెప్పించారు. ఆ ముసలాయన! ఆ రోజు తను చూసిన మనిషి ఇతనేనంటూ ఓ వ్యక్తి ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే అంజన్, వీరభద్రాల కళ్లు పెద్దవయ్యాయి. అతడు అనురాగ్ మిత్రుడు, ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ రవీంద్ర. బిచ్చగాడు ఇచ్చిన సమాచారంతో సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళుతున్న రవీంద్రను ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు.ఇంటరాగేషన్ సెల్లోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు రవీంద్ర. అతడి ముందు నిలబడి ఉన్న అంజన్! రవీంద్ర ఎడమ చేతి బొటనవేలికి కట్టి ఉన్న బ్యాండేజీని చూస్తూ ‘‘ఆ వేలికి ఏమైంది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నెల రోజుల క్రితం షూటింగ్లో ప్రమాదం జరిగి, వేలు బాగా చితికిపోయింది. అందుకే ఇది’’ వేలు పైకి చూపిస్తూ సమాధానమిచ్చాడు రవీంద్ర. అంజన్! నిశిత ప్రస్తావన తేగానే అప్పటి వరకు మామూలుగా ఉన్న అతను కంగారుపడ్డాడు. మెల్లగా చెమటలు పట్టడం ప్రారంభమైంది. మొదట నిశిత తనకు అనురాగ్ భార్యగానే పరిచయమన్నాడు. ఆమెను ఎప్పుడూ పర్సనల్గా కలవలేదని, అలాంటిది ఆమెను చంపాల్సిన అవసరం తనకు ఏముంటుందని ఎదురు ప్రశ్నించాడు. గట్టిగా నాలుగు తగిలించేసరికి అసలు ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించాడు. ‘‘చాలా రోజులుగా నాకు నిశిత మీద కన్నుంది. ఎలాగైనా ఆమెను నాదాన్ని చేసుకోవాలనుకున్నాను. అందుకే అనురాగ్ ఇంట్లోలేని సమయంలో ఆమె దగ్గరకు వెళ్లేవాణ్ని. ఆమెను మంచి చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నించేవాణ్ని. ఆ రోజు మధ్యాహ్నం కూడా అక్కడికి వెళ్లాను. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. నాకు భయం వేసింది! హత్యానేరం నామీద కొస్తుందని భావించి వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను’’ అన్నాడు రవీంద్ర. కొద్దిసేపటి తర్వాత ఇంటరాగేషన్ సెల్లోకి వచ్చిన వీరభద్రం! రవీంద్ర వేలి ముద్రలు హంతకుడి వేలిముద్రలతో మ్యాచ్ అవ్వలేదని అంజన్తో చెప్పాడు. ఆ వార్త వినగానే అంజన్ దిమ్మ తిరిగిపోయింది. కేసును ఎలా దర్యాప్తు చేయాలో అర్థంకాక తల పట్టుకున్నాడు. ఓ రోజు సాయంత్రం అంజన్ స్టేషన్లో ఉన్న సమయంలో అనురాగ్ అక్కడికి వచ్చాడు. అతడు నిన్న ఉదయమే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. మళ్లీ పోలీస్ స్టేషన్ వైపు ఎందుకొస్తున్నాడా అని అంజన్ ఆలోచనల్లో పడ్డాడు. పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న సమయంలో తనకు పొదల మధ్య ఓ వస్తువు దొరికిందని, అది తప్పకుండా హంతకుడిదే అయ్యుంటుందని, తన భార్యను హత్య చేసిన వాణ్ని ఎలాగైనా పట్టుకోండని చెప్పి, ఓ కవర్ అంజన్ చేతిలోపెట్టి వెళ్లిపోయాడతను. అనురాగ్ ఉద్దేశంలో హంతకుడిని పట్టుకోవటం అంటే భార్యకు అక్రమ సంబంధం ఉందని నిరూపించటం. ఇన్డైరక్టుగా నిశితను అతడు చంపాలనుకోవటం తప్పుకాదని చెప్పటం. అనురాగ్ ఇచ్చిన కవర్లో ఓ కీచైన్ ఉంది. దానికి బైక్ తాళం చెవి బిగించి ఉంది. ఆ కీచైన్కు ఉన్న పొడవాటి ప్లాస్టిక్ దబ్బపై ఓ వైపు లవ్ యూ గీత అని, మరో వైపు ఓ ఫోన్ నంబర్ అచ్చువేసి ఉంది. ఫోన్ నంబర్ ఆధారంగా అడ్రస్ సేకరించి, వీరభద్రాన్ని వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాడు అంజన్. అడ్రస్లో ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారిద్దరూ. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంటికి ఎదురుగా కొద్ది దూరంలో నిల్చున్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ కుర్రాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. పోలీస్ డ్రస్లో ఉన్న ఇద్దరినీ చూసి, పరుగు లంకించుకున్నాడు. ఆ కుర్రాడిని వెంబడించి పట్టుకోవటానికి అంజన్, వీరభద్రాలకు తల ప్రాణం తోకలోకి వచ్చింది. అప్పటికే సగం బిక్కచచ్చిపోయి ఉన్న ఆ కుర్రాడు! అంజన్ గట్టిగా గదమాయించేసరికి ఏడ్చుకుంటూ ‘‘సార్! నాపేరు ప్రేమ్సాగర్. బీటేక్ ఫైనలియర్ చదువుతున్నాను. అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాను. కొన్ని రోజులు ఆ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాక, ఇంట్లో ఎవరూ లేరని తెలిసి, ఆ రోజు మధ్యాహ్నం దొంగతనానికి వెళ్లాను. బెడ్రూమ్లోని బీరువాను ఓపెన్ చేస్తుండగా చప్పుడై పక్కనే ఉన్న బాత్రూంలో దాక్కున్నాను. తలుపు సందులోనుంచి బయట ఏం జరగుతుందో చూస్తుండగా.. ఓ ఆడమనిషి లోపలికి వచ్చింది! ఆ వెంటనే ఓ మగమనిషి వచ్చి, ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ మగమనిషి వెళ్లిపోగానే నేను పారిపోయి వచ్చేశాను’’ చెప్పాడతను. ‘‘అతను ఎలా ఉంటాడో కొంచెం చెప్పగలవా?’’ ఆ కుర్రాడిని అడిగాడు అంజన్ ‘‘సార్! అతడి ఎడమ చేతి బొటన వేలు సగం కట్అయి ఉంది... ఆ!! అతడి ముఖంపై చింత పిక్కంత పుట్టుమచ్చ ఉంది సార్!’’ ‘‘చింతపిక్కంత పుట్టుమచ్చా!!’’ అంజన్ భృకుటి ముడిపడింది. హత్య జరిగిన 30వ రోజు అర్ధరాత్రి పోలీసు జీపు ఓ ఇంటి ముందు ఆగింది. అంజన్, వీరభద్రం, ఆ కుర్రాడు గేటు తీసుకుని ఇంట్లోకి నడిచారు. ఇంటి తలుపు తట్టగానే బయటకు వచ్చిన అతను! వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఏంటి సార్! మళ్లీ వచ్చారు. నా మీద అనుమానం వచ్చిందా ఏంటి?’’ అన్నాడు నవ్వుతూ. అతడిని చూడగానే ఆ కుర్రాడు ‘‘ఆ!! ఈయనే సార్! ఆమె గొంతు నులిమి చంపింది. ఈయనే!’’ అన్నాడు అరుస్తూ. ‘‘చెప్పు సంజయ్! నిశితను ఎందుకు హత్య చేశావ్? తప్పించుకోవాలని చూడకు. నువ్వు హత్యచేయటం ఈ కుర్రాడు కళ్లారా చూశాడు. చేసిన నేరం మర్యాదగా ఒప్పుకుంటే మంచిది! దెబ్బలైనా తప్పుతాయ్’’ బూతులు తిడుతూ ఊగిపోయాడు అంజన్. ‘‘అవును నిశితను నేనే చంపాను. డబ్బుకోసమే నేను తనను ప్రేమించాను. కోట్ల ఆస్తి నా సొంతం అవుతుందని కలలు కన్నాను. మా పెళ్లికి వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకోలేదు! లేచిపోయి పెళ్లిచేసుకుందాం అన్నాను. తను ఒప్పుకోలేదు. కన్నవాళ్లను కష్టపెట్టలేనని ఓ డైలాగ్ చెప్పి, వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. తర్వాత నా ఫోనుక్కూడా దొరకలేదు. ఆ రోజు మధ్యాహ్నం రెస్టారెంట్కు వెళుతున్న దారిలో తను రోడ్డుపై కనిపించింది. నిశితను చూడగానే నాలో నిద్రపోతున్న రాక్షసుడు మేల్కొన్నాడు. నేనే తన దగ్గరకు వెళ్లి పలకరించాను. ఇద్దరం కొద్దిసేపు అలా రోడ్డుపై నడుస్తూ మాట్లాడుకున్నాం. మా ప్రేమ సంగతులేవీ గుర్తులేనట్లు మాట్లాడింది. నా కోపం రెట్టింపైంది. నన్ను తన ఇంటికి తీసుకెళ్లేలా కన్విన్స్ చేసి, ఇంట్లోకి వెళ్లాక గొంతునులిమి చంపేశాను’’ అంజన్ ఆవేశాన్ని గుర్తించిన సంజయ్ నిజం చెప్పక తప్పలేదు. ‘‘మరి ఆ బొటనవేలు సంగతి’’ అడిగాడు వీరభద్రం. బొటనవేలు తీసి, వీరభద్రం చేతిలో పడేస్తూ ‘‘ప్రాస్థటిక్ ఫింగర్.. హత్య చేసిన తర్వాత కొన్నా’’ చెప్పాడు సంజయ్. ♦ బండారు వెంకటేశ్వర్లు(వెబ్ డెస్క్) -
బాల్య యవ్వనాలు , తొలి నాళ్ళ జీవితం
కందుకూరి వీరేశలింగం తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం. ఏడు కొండలున్న తెలుగు వారికి ఎనిమిదో కొండలా తాను భాసిల్లాడు. పందొమ్మిదో శతాబ్దంలో భూస్వామ్య యుగ లక్షణాల ప్రపంచం, మరింత ప్రజా చైతన్య దాయకం అయిన పారిశ్రామిక యుగం దిశగా అడుగులు వేస్తున్నది. 1852, 1854 ప్రాంతాలలో బ్రిటిష్ పాలిత భారతదేశంలో మొదలైన రవాణా, వార్తా సౌకర్యాలుగా, రైలు బళ్లు, తపాలా శాఖ వంటివి యావద్దేశాన్ని కలుపుతున్నాయి. పూటకూళ్ల ఇళ్లు వెలుస్తున్నాయి. అంతవరకూ గ్రామీణ జీవనంలో ఉన్న యువతకి, ఆంగ్ల చదువులతో మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇవన్నీ ఏర్పడడానికి ముందే, ఇంకా కచ్చితంగా చెప్పాలీ అంటే, 1857 మొదటి స్వాతంత్య్ర పోరాటానికి తొమ్మిదేళ్ల ముందే కందుకూరి వీరేశలింగం పుట్టుక. పేరు బాగా స్థితిమంతులైన తమ తాతగారిదే. వారి ఇల్లు ఒక వీధిలో గుమ్మం ఉంటే, మరొక వీధిలో పెరటి గుమ్మం ఉండేంత విశాలం. బాల్య యవ్వనాలు – తొలి నాళ్ళ జీవితం తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, పెదతండ్రి పెంపకంలో పెరిగారు. బాల్య వివాహాలను తాను పెద్దయ్యాక వ్యతిరేకించినా, ఆయనకు పదమూడో ఏటనే అద్దంకి వారి తొమ్మిదేళ్ల అమ్మాయి బాపమ్మతో పెళ్లి జరిగింది. వీరేశలింగం గారి తల్లి ఆధునిక స్వభావం, ఎటువంటిది అంటే, బాపమ్మ అనే పేరు కన్నా రాజ్యలక్ష్మి అన్న పేరు తన కోడలికి బాగుంటుందని, అలా పేరు మార్చిన అత్తగారు. వీరేశలింగం చదువు అంతా వీధిబడుల్లోనే నడిచింది. ఇంటినిండా, తాత వీరేశలింగం అప్పట్లో ప్రత్యేకంగా వ్రాయసగాళ్ళచే రాయించి పెట్టిన తాటాకు గ్రంథాలుగా ప్రాచీన సాహిత్యం చూరుకి వేలాడదీసి భద్రంగా దాచిన మూటల్లో ఉండేది. ఇలా తమ ఇంట ప్రాచీన సాహిత్యం ఉండేదని, 1873లో తాను రాసిన ‘రాజశేఖర చరిత్రము’లో మూడు పేజీలకు పైగా వర్ణించిన రాజశేఖరుని గృహం, తమ ఇల్లే్ల అని తన ‘స్వీయ చరిత్ర’లో చెప్తారు. ఈ పుస్తకాలన్నీ చిన్నప్పుడే తమ ఇంటికి వచ్చే పౌరాణికుల సహాయంతో చదివేసిన బాల కందుకూరి ఏకసంథాగ్రాహి. చదివినది బాగా గుర్తు పెట్టుకుంటారు. తమ ఇంట ఉన్న గ్రంథాల్లో ‘వసుచరిత్ర’ లేదని, అది తను చదువుతానని తల్లి పున్నమ్మని అడుగుతారు ఒకసారి. ఆమె తెలివైన మహిళ కావడంతో, కొడుకుని ఒక ప్రశ్న వేస్తుంది. ‘నాయనా, ఆ గ్రంథం నీకు పాఠ్య పుస్తకమా?’ అని. కాదని చెప్తారు. మరి రెండు రూపాయలు పెట్టి ఇప్పుడా పుస్తకం కొనడం ఎందుకని ఆమె అందుకు అంగీకరించదు. ఆ రోజుల్లో తల్లి, బాల వీరేశలింగానికి నెలకు అర్ధరూపాయి జేబు ఖర్చుగా ఇచ్చేది. ఎలాగైనా ‘వసుచరిత్ర’ చదవాలి అన్న పట్టుదల గల బాల కందుకూరి, ఆ పుస్తకాల షాపు యజమానితో, తను నెలకు అర్థ రూపాయి ఇస్తాను అని, బదులుగా ఆ పుస్తకాన్ని ఇక్కడే షాపులో కూచుని చదువుకునేందుకు అనుమతించాలని కోరి, ఆ పని చేస్తూ ఉంటారు. ఇలా షాపులో కూచుని ‘వసుచరిత్ర’ చదువుతున్న సంగతి, తను, తన స్నేహితులు ఇంట్లో తెలీనివ్వరు. కానీ కొన్నాళ్ళకు, కొడుకు స్కూలుకి సరిగా వెళ్ళడం లేదన్న సంగతి తల్లికి తెలిసి, అడిగే సరికి, నిజం చెప్తారు కందుకూరి. తల్లి, అతనికి అప్పుడా పుస్తకం కొని ఇచ్చింది, అలా ఉండేది చదువు విషయంలో కందుకూరి పట్టుదల. కందుకూరి వారింట, కొన్నేళ్లకు పెదతండ్రి మరణించాక, ఈయనే ఇంటి పెద్ద. ఇంటి వద్ద తమ నాయనమ్మ, అమ్మ, పెద్దమ్మ, తన భార్య నలుగురు స్త్రీలు. నాలుగు భిన్న స్వభావాలు, ఇవన్నీ వీరేశలింగం గారికి చిన్నతనం నుంచే అనుభవంలో ఉన్నాయి. తర్క బుద్ధి, శాస్త్రీయ వివేచన ఏర్పడుతున్న సమాజంలో బాలుడు, యువకుడు కందుకూరి. భూత వైద్యాల మీద తగని గురి వారి తల్లి పున్నమ్మకి. ప్రజారోగ్య వ్యవస్థలు ఏవీ ఇంకా ఏర్పడలేదు, గోసాయి చిట్కా వైద్యాలు, పూతలు, భస్మాలు, రక్షరేకులు, ఇదీ కందుకూరి బతికిన పంధొమ్మిదో శతాబ్దపు సమాజం. ఒకసారి వారి తోటలో అరటిచెట్టు సరిగా బోదె నడుమ గెల వేసింది. అలా వేసిన గెల తింటే ఇంటి యజమానికి అరిష్టం అంటే, వినకుండా, ఆ గెల బాగా ఎదిగాక, రోజూ, ఆ గెల అయిపోయిందాకా, ఆ అరటి కాయలే వండించుకుని తింటూ, పైగా వచ్చే పోయే వారికి అందరికీ, ఈ విషయాన్ని చెప్పి, అటువంటి అరిష్టాలు ఏమీ ఉండవు అన్న శాస్త్రీయ దృష్టిని రోజూ ప్రచారం చేసే వారు. ఇటువంటి సంఘటనల వల్ల తెలిసేదేమిటి అంటే, యువ కందుకూరి వ్యక్తిత్వం, మూఢాచారాల పట్ల ఆయనలో ఏర్పడుతున్న వ్యతిరేకత. తాను కోరంగిలోని ఆంగ్ల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా చేరవల్సి వస్తే, సరిగ్గా అమావాస్య రోజునే వెళ్ళి ఉద్యోగంలో చేరుతానని బలవంతం చేసి, అలాగే పంతం నెగ్గించుకున్న యువకుడు కందుకూరి. ఇవాళ మనం సీవీ రాసి ఉద్యోగాలకు దరఖాస్తుగా పంపుతున్నాము. అలానే అప్పట్లోనే ఒక పద్య రూప సీవీ రాశారు యువ కందుకూరి. వారి ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీక. ‘‘వివేక వర్ధని’’ ప్రారంభ సంచికలో ఇది అచ్చు వేశారు పాతికేళ్ళ కందుకూరి. దీనికి అనుగుణంగానే వారి సాహిత్య, సాంఘిక జీవితం గడిచింది. ‘‘బ్రాహ్మణుడను హూణ భాష నేరిచి యందు నే బ్రవేశ పరీక్షనిచ్చినాడ నాంధ్రమున నొకింత యభిరుచిగలవాడదేశాభివృద్ధికై లేశమైన బ్రాలుమాలక పాటుపడ నిచ్ఛ గలవాడగవితా పటిమ కొంత గలుగువాడ నోపిక సర్వ జనోపయోగములైన విషయమ్ములను, నీతి విషయములును సులభ శైలి నందరకు తెలియునట్టు కఠిన సంధులు లోనుగా గలవి విడిచివ్రాయుదు నొక్కప్పుడన్య దేశీయములను లోనుగా గల వానిని బూని గూర్తు’’ తమ ఇంటి దగ్గరి గోపాలకృష్ణ స్వామి ఆలయ విరాట్ పేరిట , వేణుగోపాల శతకము, మార్కండేయ శతకము తన ఇరవై రెండేళ్లకే రాశారు కందుకూరి (ఈ శతకాలు నష్టమై పోయాయి కానీ, వారి ‘అభాగ్యోపాఖ్యానం’ అనే ఆక్షేప ప్రబంధంలో ఈ శతక పద్యం కొంత భాగాన్ని ఉదహరించారు. కానీ ఇటువంటి రచనల వల్ల ప్రయోజనం ఉండదు అని గ్రహించడానికి ఆయనకు అట్టే కాలం పట్టలేదు. 1873 కాలానికి పాతికేళ్ల కందుకూరి, నవల రాయడానికి పూనుకున్నారు. ఆలివర్ గోల్డ్స్మిత్ నవల ‘వికార్ ఆఫ్ ద వేక్ ఫీల్డ్’ చదివి, దాని అనువాదం చేద్దామనుకుని, చివరికి, కొంత ప్రేరణ ఉన్నా, 1870ల్లో గోదావరి జిల్లాల జీవితం చెప్పే ఒక వాస్తవిక జీవన చిత్రణను రాయడం విశేషం. కందుకూరి నవల ‘రాజశేఖర చరిత్రము’ను ఆయన 1874లో మొదలుపెట్టి నడిపిన ‘‘వివేక వర్ధని’’ పత్రికలోనే ధారావాహికగా అచ్చు అయింది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుతున్న కారణంగా, చదివిన పద్ధతుల్లో తానూ రచనా చేయాలన్న అభిలాష సహజంగానే యువ కందుకూరిలో ఏర్పడింది.. దానికి తగిన రచనా ప్రణాళిక, వారి ‘రాజశేఖర చరిత్రము’. ఈ నవలలోనే గోదావరి జిల్లాల జీవితం సహజ వర్ణనలతో నడిపారు. తన ప్రవర్ధమాన దశలోనే రాసిన ఈ నవలలో తొలిసారిగా సమాజంలో స్త్రీల దుస్థితి, వారి సమస్యలు, సంప్రదాయ సమాజపు వెనుకచూపు ఇవన్నీ చిత్రిస్తారు. వ్యవహరిక భాషలో 1883లో వారు రాసిన రెండో రచన ‘సత్యవతీ చరిత్రము’ అనే నవలిక కొంచెం చదువుకున్న అమ్మాయి సత్యవతి రెండో కోడలుగా వస్తే, ఆ గ్రామీణ కుటుంబాలలో వచ్చే మార్పులు, అత్తగార్లు తెచ్చిపెట్టే సమస్యలు చిత్రిస్తూ, ఇలా చిన్న నవలికలో , శాస్త్రీయ దృష్టి, తర్క బుద్ధి చదువుకున్న తరాల వారు స్వీకరించి, ఎలా పాత సమాజంతో సంఘర్షిస్తున్నదీ వ్యవహారిక భాషలో చెప్పిన తొలి కాల్పనిక వచన నవలా రచన. మన కాలపు ఏ ప్రయాణ సాధనాలు, సమాచార సాధనాలు ఏర్పడని ఒక పాత కాలంలో, ఎంత మన రాజధాని అయినా మదరాసు వెళ్ళి రావడం అంటే, రైలు బళ్లు లేని కాలంలో ఓడ మీద మదరాసు వెళ్లిన పట్టుదల, శ్రమకి ఓర్చగల స్వభావం గల వాడే అయినా తల్లి చిన్నప్పుడు భూత వైద్యాల పేరిట చేయించిన అనేక స్నానాలు, చిట్కా వైద్యాల వల్ల చిన్నప్పట్నుంచీ అనారోగ్యవంతుడు. మదరాసు వెళ్ళాలి అంటే, పడవ మీద ధవళేశ్వరం నుంచి కాకినాడ వచ్చి, అక్కడ నుంచి మరొక పడవలో కాకినాడ సముద్రం లో ఉండే పెద్ద ఓడ (యాంకరేజి పోర్ట్ అంటారు– అక్కడ సాధారణమైన ఓడ రేవు ఉండదు ఎందుకంటే, కాకినాడ సముద్రం సహజంగా లోతు తక్కువ)లో వెళ్లాలి. మదరాసు వెళ్లడం కోసం తన ప్రయాణ వివరాలు స్వీయచరిత్రలో చెప్తారు. అలాంటి కష్టతరమైన ప్రయాణాల కాలంలోనే విశాల మానవ సంబంధాలు నిర్మించుకున్న బుద్ధి కుశలుడు కందుకూరి. రచనా ప్రతిభ – సామాజిక దృష్టి 1900 నుంచి 1917 దాకా మనకు మహా భారత కథను ప్రదర్శన యోగ్య నాటకాలుగా రాయడం ఒక కవిద్వయం వల్ల జరిగింది. వారే తిరుపతి వెంకట కవులు. అంతకు ముందరి తెలుగు మహా భారత ఇతిహాస రచన, చదువుకునే, లేదా చదివి చెప్పే పౌరాణిక పద్ధతికి చెందినది. కవిత్రయం రాసిన చదువుకోదగిన మహా భారత తెలుగు రచన తరువాత, చూసే వారి కోసం మహా భారత నాటక రచనోద్యమం చేసిన కవిద్వయం తిరుపతి వెంకట కవులు, అయితే వీరి ప్రామాణిక కృషికి ముందరే, కందుకూరి, తొలిసారిగా, మహాభారత కథ తీసుకుని ‘‘దక్షిణ గోగ్రహణము’’ అన్న నాటకం రాశారు. నాటకాలు రాయడం వీరికి శక్తివంతంగా అలవడ్డది. గురజాడ, కందుకూరి కన్నా పద్నాలుగేళ్లు చిన్నవారు. పద్నాలుగేళ్లు తరువాత పుట్టి, కందుకూరి కన్నా నాలుగేళ్లు ముందరే కన్ను మూసిన గురజాడ ఆధునిక సాహిత్య వైతాళికత్వానికి ఉదాహరణ అయిన తన 1892 కన్యాశుల్కం నాటకంలో ముందు మాటలోనే కందుకూరి వారి నాటకం (1876–80) బ్రాహ్మ వివాహము లేదా పెద్దయ్యగారి పెళ్లి ని ప్రస్తావించి, ఆ నాటకానికి, తన నాటకానికి పోలికలు లేవు అంటారు. కానీ తొలి కన్యాశుల్కం వరకూ చూస్తే, ఇద్దరికీ సమాన దృష్టి వేశ్యా వ్యతిరేకత. వేశ్యలు ఉండకూడదు అన్నది కందుకూరి జీవితకాల దృష్టి, అయితే వేశ్యలు సంఘంలో ఏర్పడే క్రమాన్ని మార్చే శక్తి వారికి లేదు. ఆ వృత్తిలో స్త్రీలు ఉండరాదు అన్నది వారి దృష్టి కాగా, మొదటి కూర్పు కన్యాశుల్కంలో ఇంచు మించు గురజాడ దృష్టి కూడా అదే. ప్రసంగాలు, ప్రదర్శన రచనలుగా, నాటకాలు, ప్రహసనాలు, తన సొంత రచనలే కాక ప్రాచీన భారతీయ, పాశ్చాత్య సాహిత్యం నుంచి కూడా అనువాదాలు చేసిన తీరిక లేని రచయిత కందుకూరి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, శ్రీ హర్షుని రత్నావళి, షేక్సి్పయర్ నాటకాలు, షేక్సి్పయర్ నాటకాలకు చార్లెస్ అండ్ లాంబ్ దంపతులు కథలుగా రాసిన వాటికి తెలుగు అనువాదాలు, ఆర్. బి. షెరిడన్ నాటకాలు, విలియం కౌపర్ కవిత్వం, జొనాథన్ స్విఫ్ట్ గలివర్ ట్రావెల్స్ ఆధారంగా సత్యరాజా పూర్వ దేశ యాత్రలు, జాన్ అక్సేన్ ఫర్డ్, చార్లెస్ షెల్బీ కామెడీ నాటికలకు ప్రహసన రూప తెలుగు అనువాదాలు, సంప్రదాయ ధిక్కారం చేసే అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద విలాపము, మహారణ్య పురాధిపత్యము, ఏసప్ కథలు, ఇలా ఇటు భారతీయ, అటు ప్రపంచ సాహిత్య చదువరిగా, రచయితగా కందుకూరి సృజన, ధారణ, పాండిత్యం అపారం. ఆధునిక తెలుగు వచన వికాసానికి పలు రంగాలలో పునాదులు వేసిన కారణంగా, కందుకూరి వారిని, పింగళి లక్ష్మీకాంతం గారు గద్య తిక్కన అని పిలిచారు. పద్యానికి పదమూడో శతాబ్దంలో తిక్కన చేసిన విశేష సేవ పదిహేను పర్వాల మహాభారతంలో వేల పద్యాలుగా ఉన్నది. మళ్లీ అయిదు వందల ఏళ్ల తరువాత, పంతొమ్మిదో శతాబ్దంలో అవసరమైన వచన రచనా ( సాహిత్య, సామాజిక, పత్రికా, వ్యవహారిక, నాటక రంగాలలో) వికాసానికి అంతటి కృషి చేసిన వారిగా కందుకూరిని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గౌరవించి ఇలా సంబోధించారు. అందుకే, వందకు పైగా వారి సమగ్ర రచనల్లో పద్య కావ్యాలు, అనువాద పద్య కావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, ఆంగ్ల నాటకానువాదాలు, నవలలు, కథా రచన, పత్రికా నిర్వహణ, వ్యాసాలు, ఆరోగ్య సంరక్షణ సూత్రాలు, కవుల చరిత్ర, జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ, చిన్నయ సూరి రచించిన సంధి, విగ్రహము, వ్యాకరణం సరళ తెలుగు సేత, దేశ చరిత్రలు, తెలుగు వాచకాలు, లక్షణ గ్రంథాలు, శాస్త్రీయ విషయ రచనలు – ఎటు చూసినా కందుకూరి ఆలోచన, ఆధునికత, అభ్యుదయ ముద్రలు కనిపిస్తాయి. కందుకూరి – గురజాడ నాటక సాంఘిక వచనానికి ఆద్యులుగా గురజాడని స్వీకరించడం చేయాల్సి ఉంది. వచన నవలా రచనలో కందుకూరి 1883కి రాసిన సత్యవతీ చరిత్రంలోనే చెప్పికోదగ్గ వ్యవహరిక భాష ఉందని, మనం ఇప్పుడు చెప్పాలి. అంతకు పదేళ్లు ముందరే వెలువడిన , కందుకూరి వారి సాంఘిక నాటకాలు అయిన ‘బ్రాహ్మ వివాహము లేదా పేరయ్యగారి పెళ్లి’లో గానీ, ‘వ్యవహార ధర్మ బోధిని’లోని సాంఘిక నాటక వచనాన్ని, అలాగే సాంఘిక నవలల్లో ( ముఖ్యంగా 1883 నాటి సత్యవతీ చరిత్రములో కందుకూరి భాష) వీటిని మనం సక్రమంగా పరిశీలిస్తే, 1940ల నుంచీ మనం ఏర్పరచుకుంటూ వచ్చిన గురజాడ అంటే సాహిత్య ఆధునికత, కందుకూరి అంటే సాంఘిక సంస్కరణ అన్న మూస ఆలోచన పద్ధతులు అంత సరైనవి కావు అని తెలుస్తుంది. ఇక గురజాడ వారికి కందుకూరి పట్ల గౌరవ భావం ఉన్నది. అందుకే కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలోనే వెంకటేశం వేసంగి సెలవుల్లో చదువుకోవడానికి ఉపవాచకంగా ‘రాజశేఖర చరిత్రము’ గిరీశం డిక్టేషన్ ఇచ్చిన పుస్తకాల జాబితాలో ఉంటుంది. ఇక వీరయ్య గారు, రాజమంద్రంలో వితంతువుల మఠం, వంటి ప్రస్తావనలు కూడా గురజాడ నాటకంలో కనిపిస్తాయి. 1892 కన్యాశుల్కం నాటకం కన్నా ముందరే, కందుకూరి వారి బ్రాహ్మ వివాహము, అలాగే కోర్టు కెళ్లే న్యాయవాదుల వంచనా వ్యవస్థను వ్యవహార ధర్మ బోధిని (1879–80)లో స్పష్టమైన వ్యవహరిక భాషలో చెప్పారు కందుకూరి. నిజానికి, కందుకూరి రాసిన బ్రాహ్మ వివాహము, వ్యవహార ధర్మబోధిని నాటకాలలోని ఘట్టాలే, కొంత కలిసిపోయి గురజాడ సృజనలో కొత్త వెలుగులతో, కన్యాశుల్కం నాటకంలో కనిపిస్తాయి. ‘ఆబోరు’ వంటి మాటలు ఇద్దరి నాటకాల్లోనూ ఉన్నవి. ( ఈ మాటకి అర్థం చాలాకాలం ఎవరూ చెప్పలేక పోయారు. ఇది ‘ఆబ్రూ’ అనే హిందూస్తానీ మాట, దీని అర్థం ప్రతిష్ట, గౌరవం అని). ఒకప్పుడు నవాబులు పాలించిన దృష్టాంతాలుగా, భారత దేశపు అనేక భాషల్లో మనకు హిందూస్తానీ పదాలు ఇలా కలిసిపోయి కనిపిస్తాయి. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఈ వాడుక ఇప్పటికీ ఉన్నది. కావ్యవాది – కార్య వాది కందుకూరి ఈ రచనలు జరుగుతున్న కాలానికే, పసితనంలో ఆడపిల్లల పెళ్లిళ్లు, ముసలి భర్తలు కొద్ది కాలంలో చనిపోవడంవల్ల సమాజంలో ఏర్పడే బాల వితంతువుల సమస్య కందుకూరి వారి మనసులో ఒక పరిష్కారం దిశగా రూపం తీసుకుంటున్న సంగతి తెలుస్తుంది. రచనా రూపంగా సంస్కరణ కోరడం వీరేశలింగం గారి స్వభావంలో ఒక భాగం మాత్రమే. అసలు విషయం కార్యాచరణ. 1879 సంవత్సరంలో ఆగస్ట్ 3, అక్టోబర్ 12 తేదీల్లో, రాజమండ్రిలో గల విజయనగరం మహారాజావారి బాలికా పాఠశాలలో, ‘‘అతి బాల్య వివాహము’’ విషయంపై పిల్లల వయసు రీత్యా ఎందుకు చేయకూడదో చెప్పడమే కాక, అవి శాస్త్ర సమ్మతం అని చెప్పే వారికి, కాదు అంటూ, ఆ శాస్త్రాల నుంచే ఎన్నో ఉదాహరణలు చూపి, ఛాందస సమాజానికి గొంతులో వెలక్కాయ పడ్డ ప్రసంగం చేశారు, ముప్ఫైఒక్కేళ్ళ కందుకూరి. ఈయన కేవలం భావ విప్లవం మాత్రమే కాకుండా, ఆచరణ శీలి కూడా కావడం వల్ల సంస్కరణ ప్రణాళిక వేగం పెరిగింది. ఇదే 1881లో కందుకూరి రాజమండ్రి ఇన్నీసు పేటలో బాలికా పాఠశాల స్థాపించారు. ఒక నాటక సమాజం మొదలు పెట్టి, అంతకు ముందు ధార్వాడ నాటక సమాజం వారు ప్రదర్శించిన చోటనే, ‘చమత్కార రత్నావళి’ రచించి, ప్రదర్శనలు చేయించారు. తెలుగు ప్రాంతాల్లో తొలి నాళ్ల నాటక ప్రదర్శనల్లో ఇవి భాగం. ఇదే ఏడాది డిసెంబర్ 11న కందుకూరి తమ మిత్రులతో కలిసి, దక్షిణ భారత దేశంలోనే తొలి వితంతు వివాహం చేశారు. సానుకూల భావనలున్నా, మదరాసు అంటే ఉమ్మడి మదరాసు రాష్ట్ర రాజధానిలో కూడా, వితంతు వివాహం జరిపించే సాహసం ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితుల్లో, సంఘ సంస్కరణ గోదావరిగా రాజమండ్రిని, యావత్ దక్షిణ భారత దేశానికే మార్గదర్శకంగా నిలిపారు కందుకూరి. వారి పట్టుదల, చిన్నప్పుడు తల్లి వీలు కాదన్న పుస్తకం ఎలా అయినా చదివినట్టే, వద్దన్న అరటికాయలు మొత్తం గెల అంతా తానే తిన్నట్టే, ఈ వితంతు వివాహాల విషయంలో కూడా వారిది అంతే మంకు పట్టు. బాల్య వివాహాలు చేయవచ్చు, వితంతు వివాహాలు చేయరాదు అనే సంప్రదాయ సమాజనికి వాదానికి వాదంతో, వేదాలు, పురాణాలు, స్మృతులు, శ్రుతుల నుంచే ఎలా ఈ బాల్య వివాహాలు కూడదో, వితంతు వివాహాలు సంప్రదాయ సమ్మతమో చెప్పడంలో, కందుకూరి, అక్కడ బెంగాల్ సమాజంలో, మన తెలుగు నాటకన్నా దశాబ్దాల ముందే ఈ వివాహాలు జరిగినప్పుడు, అక్కడ రాజా రామ్మోహన్ రాయి, ఈశ్వర చంద్ర విద్యా సాగర్ వంటి వారు ఉదహరించిన భారతీయ ప్రాచీన రచనలైన మనుస్మృతి, పరాశర çస్మృతి, యాజ్ఞవల్క్య çస్మతృతి నుంచి ఉదాహరణలు ఇచ్చారు. ఇంత మౌలిక ప్రతిఘటన ఓ పక్క జ్ఞానపరంగానూ, మరోపక్క ఆచరణపరంగానూ ఎదుర్కోవడం, తెలుగు సంప్రదాయ సమాజానికి సాధ్యం కాలేదు. మొదటి వితంతు వివాహం జరిగిన మూడు రోజులకే రెండో వితంతు వివాహం, మూడో వివాహం అక్టోబర్ 1882లో జరిపిన కార్య ధీర శూర వీరేశలింగం, ఏ మహారాజో, సేనానో, యుద్ధ వీరుడో కాదు, కేవలం సామాన్య తెలుగు పండితుడు. అదీ మనం ఇవాళ చూస్తున్న చిత్రంలోని వయసుమళ్లిన మనిషి కారు– తను ముప్ఫై మూడేళ్ళ నిండు యవ్వనుడు. అక్షర వ్యూహాలు పేర్చి, సమాజ దుష్ట శక్తులను ఎదుర్కొన్న సాంఘిక పోరాట తంత్రజ్ఞుడు. రాజ్యలక్ష్మమ్మ గారి సహచర్యం ఈ సాంఘిక పోరాటంలో, భర్తకి తగిన భార్య రాజ్యలక్ష్మమ్మగారు. తన భర్త చేస్తున్నది సమాజ హితం కోసం అని ఎరిగిన ఆమె బంధువుల బెదిరింపులు, బహిష్కారాలు, ఆంక్షలు లక్ష్య పెట్టలేదు. ఆమె పట్ల కందుకూరి వారికి చాలా గౌరవం. జీవితకాల కృషిలో అడుగులో అడుగు వేసి నడిచిన వీరిద్దరికీ పిల్లలు లేరు. ఆయనకి అన్నివిధాలా దన్నుగా నిలిచిన రాజ్యలక్ష్మమ్మ 1910లో కన్ను మూశారు. అది వీరేశలింగం గారికి తీరని నష్టం. ఆమె సమాధి తన సమాధి కన్నా ఎత్తుగా ఉండాలని అలా కట్టించి, అక్కడ ఆమెకి ఇష్టమైన పూల మొక్కలు పెంచిన ప్రేమపూర్ణుడు కందుకూరి. తన స్వీయ చరిత్రను ఆయన ఆమెకే అంకితం ఇచ్చారు. ఆ అంకిత రచన చాలు ఆయన హృదయంలో ఆమె స్థానం ఏమిటో తెలియచెప్పడానికి. ( వారి చేతి రాతలోనే దీనిని పొందు పరుస్తున్నాను). ‘‘నేను చేసిన సమస్త ప్రయత్నములలోను ఛాయ వలె నాతోడ ఉండి నన్ను ప్రోత్సాహపరచుచు ధర్మ మార్గానుసరణమునందు నా తోడ గూడ సకల కష్టములను సంతోషపూర్వకముగాసహించుచు సత్యమైన సహధర్మచారిణియయి తల్లి బిడ్డకు వలె నవ్యాజానురాగము తోడసహస్ర హస్తములతో సదా నాకు సంరక్షణము చేయుచు ఏబది సంవత్సరముల కాలము నా ప్రాణమునకు ప్రాణమయి యుండిన నా యర్ధాంగ లక్ష్మి యైన రాజ్యలక్ష్మికి దీనిని నేనంకితము చేయుచున్నాడను’’జాతీయ సాంఘిక సంస్కరణ మహాసభలు 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పడినాక, సాంఘిక సంస్కరణ, రాజకీయ స్వాతంత్య్రం కన్నా ముందే అవసరం అన్న చైతన్యం దేశం ఎల్లెడలా ఏర్పడసాగింది. ఇలా అఖిల భారత సాంఘిక పరిస్థితులు చర్చించిన జాతీయ సంస్కరణ మహాసభలు 1889లో మొదలై, దేశంలో పలు ముఖ్య నగరాలలో జరుగుతూ వచ్చాయి. జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడె, జస్టిస్ కె. టి. తెలాంగ్, బాబు నరేంద్రనాథ్ సేన్, డా. మహేంద్రలాల్ సర్కార్, జి.ఎస్. ఖర్పడే, జస్టిస్ ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్ , ఆర్.జి.భండార్కర్, రావుబహదూర్ వామనరావు ఎం. కోలాత్కర్ , రాయ్ బహదూర్ లాలా బైజ్ నాథ్, మన్మోహన్ ఘోష్, జస్టిస్ ఎం..జి. చందావర్కర్ వంటి జాతీయ స్థాయి సంస్కరణరంగ నాయకులు పాల్గొన్నారు. వారితో కలిసి పనిచేశారు కందుకూరి. సోషల్ రిఫార్మ్ కాంగ్రెస్ వార్షిక మహాసభలు 1898లో మద్రాసులో జరిగాయి. ఆ మహాసభలకు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ కందుకూరి, మదరాసుకు వచ్చిన తెలుగేతర భిన్న ప్రాంతాల సంస్కరణోద్యమ నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఇంగ్లిష్లో ప్రసంగం చేశారు. శాస్త్రీయ ఆవిష్కరణల కన్నా, సాంఘిక సంస్కరణ చాలా కష్టమైనది అన్న ప్రధాన అభిప్రాయం ఈ ఆంగ్లోపన్యాసంలో కందుకూరి తెలిపారు. ఇంతవరకూ ఇలా ఒక ఆంగ్ల ప్రసంగం కందుకూరి వారు చేసినది ఒకటి ఉన్నది అన్నది బయటికి రాలేదు. కందుకూరి శతవర్ధంతి కృషిలో భాగంగా, మొజాయిక్ సాహిత్య సంస్థ పరిశోధనలో ఇది లభించింది. ఈ ఏడాదే, కందుకూరి వారి ఈ నూత్న లభ్య రచన, ఆంగ్ల మూలమూ, తెలుగు అనువాదమూ కూడా పత్రికలలో ప్రచురితమయ్యాయి. సమగ్ర రచనలు – గౌరవాలు తన యాభై ఏళ్ల వయసుకే, తన సమగ్ర రచనలు, పది సంపుటాలుగా ప్రచురించి, దీని కోసమై మదరాసులో రెండేళ్లు కాలం ఉద్యోగానికి సెలవు పెట్టి గడిపి, ఈ సమగ్ర సంపుటాన్ని ఆ రోజుల్లో పదిహేను రూపాయలకు విక్రయం చేసేవారు ఆయన. తెలుగు పండితుని నెల జీతం ముప్ఫై రూపాయలు కాగా, తన రచనలు పత్రికల తపాలా ఖర్చులకు అంత సొమ్మూ, ప్రతి నెలా వారికి ఖర్చు అయ్యేది. 1893కే వారికి రావు బహదూర్ బిరుదు లభించింది. 1898లో ‘దక్షిణభారత విద్యాసాగరులు’ అని జస్టిస్ రనడె, ఇతర సంఘ సంస్కర్తలు, సోషల్ రిఫార్మ్ జాతీయ మహాసభల్లో కందుకూరి వారికి బిరుద ప్రదానం చేశారు. తన కాలపు సాహిత్యంలోనే తన ప్రస్తావనలు 1899 నుంచి 1904 వరకూ రాజమండ్రి నుంచి బదిలీ మీద వెళ్లి, మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా పని చేశారు. కందుకూరి ప్రస్తావనలు తన కన్యాశుల్కం నాటకంలో గురజాడ వారు చేయగా, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి, ఏకంగా, కందుకూరి, రాజ్యలక్ష్మమ్మ దంపతులను వారి జీవితకాలంలోనే, సజీవ పాత్రలుగా, తన అసంపూర్తి నవల ‘చంద్రిక కథ’లో 1900 ప్రాంతాల్లో రాయడం విశేషం. దీన్ని 1970 ప్రాంతాల్లో తెలుగు సాహిత్య పరిశోధకుడు బంగోరె తన మిత్రులతో కలిసి తెలుగు అనువాదం చేసి అందించారు. ఇలా ఇటు తెలుగు మహాకవి గురజాడ తన కన్యాశుల్కంలోనూ, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తన చంద్రిక కథలోనూ వీరేశలింగంగారి ప్రస్తావనలను వారి జీవితకాలంలోనే చేశారు. ఇటువంటి గౌరవం, ప్రపంచ సాహిత్యంలోనే అరుదు. కడపటి దశ హితకారిణీ సమాజం ట్రస్ట్ డీడ్ రాయడం, తన యావదాస్తినీ ట్రస్ట్కి అప్పగించడం అనారోగ్యం, ముసలితనం, కొన్ని కోర్ట్ కేసులు ఇలా సతమతమవుతూ ఉన్నా, కవుల చరిత్ర ప్రచురణ, వారికి పట్టుదలతో కూడిన లక్ష్యం. ఈ లక్ష్యం కోసం పని చేస్తూనే, వారు వెళ్ళిపోయారు. మదరాసు పరసువాక్కంలో వేదవిలాస్ అని కొమర్రాజు లక్ష్మణరావుగారిల్లు. ఎప్పుడు కందుకూరి వారు మదరాసు వెళ్లినా వారి బస అక్కడే. యువకులైన కొమర్రాజు కూడా తెలుగు సాంఘిక చరిత్రలో చాలా ఆసక్తి గల వారు. కవుల చరిత్ర మూడో భాగం ప్రూఫులు సరి చూస్తూ, కందుకూరి, 27 మే 1919న మదరాసులోనే కన్ను మూశారు. మరణ సమయంలో వారి వద్ద ఉన్నది, మృతి ప్రకటన చేసినది డాక్టర్ అచంట లక్ష్మీపతి. అంత్య క్రియల సమయాన దగ్గర ఉన్నది అప్పటికి యువకులైన కాశీనాథుని నాగేశ్వర రావు, అక్కిరాజు ఉమాకాంత విద్యా శేఖరులు తదితర మదరాసు తెలుగు ప్రముఖులు. శతవర్ధంతి ఉత్సవాలు ఇక వర్తమానానికి వస్తే, విశాఖలో మొజాయిక్ సాహిత్య సంస్థ, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కల్నల్ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు మద్దతుతో ఈ శతవర్ధంతి ప్రారంభ సభలు గత సంవత్సరం మే 27న పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సాహిత్య వేత్తలతో ఒకరోజు సభగా జరిపింది. సాహితీ స్రవంతి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఇతర నగరాల్లో కందుకూరి వైతాళిక పాత్రకు గుర్తింపుగా శతాధిక సంస్థల సమన్వయంతో భారీ సభలు నిర్వహించారు. చెన్నై తెలుగు వాణి పేరిట, చెన్నైలోని తెలుగు సమాజం ఈ శతవర్ధంతి తమ కర్తవ్యం అని కూడా భావించి, ఈ విశాఖ సభలకు వచ్చిన డా. తూమాటి సంజీవరావు, తమ సంస్థ అధ్యక్షులు తిరునగరి భాస్కర్ తదితర మిత్రులతో కలసి కృషి చేసి, ఈ వర్ధంతి సంవత్సరంలో, పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్నారావు, పుదుచ్చేరి ప్రభుత్వం పాక్షిక ప్రోత్సాహంతో, దాదాపు కందుకూరి వారి గురించిన సమాచారం అలభ్యంగా ఉన్న రోజుల్లో, ఏడువందల యాభై పేజీలుగా రెండు పుస్తకాలుగా విçస్తృత సమాచారాన్ని అందుబాటులోని తెచ్చారు. వీటిలో మొదటి పుస్తకం చెన్నైలో గత ఏడాది అక్టోబర్లో విడుదల కాగా, రెండో పుస్తకం, ఈ ఏడాది మే 25న విడుదలైంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు, లక్ష రూపాయల చొప్పున కందుకూరి శత వర్ధంతి సభలు జరపడానికి నిధులు అందజేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ, విశాఖలో మొజాయిక్ సంస్థ ద్వారా కందుకూరివారి కృషి గురించిన లిటరరీ ఫోరం నిర్వహణకు సహకారం అందించారు. ఈ ఏడాది జూన్ 1న సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ, మొజాయిక్ సాహిత్య సంస్థ నిర్వహణలో జరిగే శతవర్ధంతి ముగింపు సభలో, విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రాయన గిరిధర్ గౌడ్ గీసిన చిత్రపట ఆవిష్కరణ, కందుకూరి శతవర్ధంతి చిత్రమాల, సత్యవతీ చరిత్రం ఆంగ్లానువాదం ఆవిష్కరణలు, కందుకూరి ఏకాంకిక ‘అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం’ ప్రదర్శన ఈ సభలో చోటు చేసుకుంటున్నాయి. కొత్త అంచనాల అవసరం స్త్రీల పట్ల తండ్రి ప్రేమతో, తల్లి మనసుతో కందుకూరి తన సమస్త రచనల్లో వారి విద్య, చక్కని పెళ్లి, తల్లి, బిడ్డల భద్రత, సంఘంలో మూఢాచారాల వల్ల వారి అభివృద్ధికి కలిగే అవరోధాల పట్ల ఆగ్రహం, అలాగే భాషకి, భావాలకు శాస్త్రీయత నేర్పిన పునరుజ్జీవన ప్రదాతగా మనం కందుకూరి వీరేశలింగాన్ని దర్శించాలి. కందుకూరి అంటే ఒక సంస్కరణ మూస, గురజాడ అంటే సాహిత్య మూసగా, మనం దాదాపు 1940ల నుంచి ఆలోచనలు చేస్తున్న తీరులో మార్పు అవసరం ఉన్నది. నరహరిసెట్టి గోపాలకృష్ణమ్మగారిలా శ్రీ రంగరాజ చరిత్ర (1872) పేరిట, ఒక నవల రాసిన వారో, కవి జీవితములు (1893) ముందు రాసిన గురజాడ శ్రీరామ మూర్తి గారో, ఏదో ఒక రంగంలో తప్పక కందుకూరి కన్నా ముందుగా అడుగులు వేసి ఉంటారు. ఎందుకంటే, ఇది పలు ప్రతిభలు ఏక కాలంలో పనిచేసే మానవ సమాజం కాబట్టి. కానీ, కందుకూరి వారిలా, భిన్న రంగాలలో (పద్యం, ప్రహసనం, నవల, అనువాదం, జీవిత చరిత్ర, విద్యాలయాల స్థాపన, మహిళలకు ఆరోగ్య బోధినులు, కవి చరిత్రలు, వ్యాకరణ పరిష్కరణం, తెలుగు, ఆంగ్ల ప్రసంగాలు, పత్రికా రచన, సంపాదక ప్రచురణ కర్త బాధ్యతలు, నాటక ప్రక్రియకు తొలి అడుగులు, తర్క చింతన, శాస్త్రీయ దృష్టి, బ్రహ్మ సామాజికునిగా ఏకేశ్వరోపాసన, భాష ఆధునీకరణ, సాంఘిక సంస్కరణ కార్యాచరణ, తొలి వితంతు వివాహాలు, అంతే కాక ఆంగ్లానువాదం జరిగి లండన్ సమాజం మెచ్చుకున్న తొలి భారతీయనవల ‘రాజశేఖర చరిత్రం’ ( 1878లోనే ‘ఫార్చ్యూన్స్ వీల్’ పేరిట అన్న ఖ్యాతి కూడా వీరిదే) సమాజాన్ని ఇలా సమూలంగా ప్రభావితం చేసిన వ్యక్తులు అరుదు. కందుకూరి వారి సమాజ సంక్షేమకర భావనలకు, ఆచరణకు, వందేళ్ల కాలం గడిచిన సందర్భంలో, నేడు కొన్ని కొత్త సమస్యలు వచ్చినా, ఆన్ని రంగాలలో వారు ఆశించిన ప్రగతి నెలకొన్నది. అందుకే విజయవంతమైన వారి భావాచరణలకు సమాజం జయమాల సమర్పిస్తున్నది. వారు కన్నుమూసిన ఈ శతాబ్ది కాలంలో, వారికి నివాళి అర్పించని తెలుగు సాహితీవేత్త, సాంఘిక ప్రముఖులు లేరు. అదీ కందుకూరి ప్రజాస్వామిక స్వభావం. ఆ విధంగా కందుకూరి తన సమూల కార్యాచరణ ద్వారా తెలుగు వారికి పునరుజ్జీవన ప్రదాత. వారి శతవర్ధంతి సందర్భంగా వారు ప్రాతః స్మరణీయులు అని తలచి, రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో వారి అధీకృత (అఫిషియల్) ఛాయాచిత్రాన్ని ఏర్పరచి, విద్యార్థులకు నిరంతర స్ఫూర్తి, అలాగే వారి సర్వ రచనల పునర్ముద్రణ, ఆ రచనలపై జరిగే పరిశోధనలకు తగిన సహాయం అందించే సానుకూల దృక్పథంతో తెలుగు ప్రజలు, ఎన్నికైన ప్రభుత్వాలు పని చేస్తే, ఉత్తమ సామాజిక చైతన్యం నేటి తరాలకు అందడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. – రామతీర్థ -
సాయి చేసిన మంత్రోపదేశం!
సాయి చరిత్రని ఎంతగా విన్నా, ఎంతగా చదివినా– ఇంకా ఇంకా వినాలీ ఇంకా ఇంకా తెలుసుకోవాలీ అనే అనిపిస్తుంది తప్ప– ఇక చాల్లే! అని అనిపించనే అనిపించదు. ఒట్టిగా నీటిని ఎన్నింటినో తాగలేం! అదే మరి ద్రాక్షరసం పంచదార ఖర్జూరరసం.. ఇలా కలిపిన పానీయమైతేనో.. మరికాస్త మరికాస్త.. అంటూ తాగమూ? అలా ఒట్టి నీళ్లలో మధురపదార్థాలు కలిసి రుచికరంగా మారి పానీయమైనట్లుగా, సాయి యదార్థకథలో సాయి మంత్ర మనన(తపశ్శక్తి) శక్తి చేరి ఉన్న కారణంగా ఈ చరిత్రని ఎంతకాలం విన్నా చదివినా విసుగు రాదు, చాలు అనిపించదు. ఈ నేపథ్యంలో మసీదులో జరిగిన ఓ వింత సంఘటనని తెలుసుకుందాం! వృద్ధురాలి ఆమరణ నిరాహార దీక్ష దేశ్ముఖ్ అనే ఇంటి పేరు కల ఓ ఇల్లాలు ‘రాధాబాయ్’ అనే ఆమె తన స్నేహితురాళ్లతో కావాలని షిర్డీ దర్శనం కోసం వచ్చింది. ఆమె అతి వృద్ధురాలు. అందుకే కొంతమందిని తోడు చేసుకుని కూడా వచ్చిందామె. షిర్డీకొచ్చాక అక్కడి భక్తులూ– వాళ్ల భక్తి పారవశ్యం– ఆ భజనలూ.. సాయి దర్శనం కోసం ఆ భక్తులంతా నిరీక్షిస్తూ కనిపిస్తూ, దర్శనం కాగానే– చెట్టుకి నీరు పోసిన మరుక్షణంలో ఆ చెట్టు ఆకులు ఎలా విస్తరిస్తాయో అలా వెలిగిపోతున్న ముఖాలతో కనిపిస్తున్న తీరూ– మళ్లీ ఆ భక్తులే దర్శనానంతరం తిరిగి వెళ్లిపోతూ– ‘మళ్లీ ఎన్నాళ్లకి దర్శనమౌతుందో అనే నిరాశతో ఎదురుచూపుతో ఆనందాశ్రువులని పెట్టుకుంటూ ఉన్నవిధానమూ’.... ఆమెని మరింత ఉత్సాహపరిచాయి. వరుసలో తన వంతురాగానే సాయి ముఖంలోనికి, చూస్తూ చెప్పలేని భక్తి పారవశ్యాన్ని పొంది తన శిరసుని సాయి పాదాల మీద పెట్టి తన్మయత్వాన్ని పొందింది. వర్షం వస్తూన్న కొద్దీ తనలోకి ప్రవాహపు నీరు వస్తున్న కొద్దీ ఎలా ఓ చెరువు తనకున్న పూర్వపు నీటిమట్టాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తుందో, అలాగే ఆ రాధాబాయ్లో భక్తిభావం మరింత పెరిగిపెరిగి పోసాగింది. ప్రారంభంలో పదిమందీ వెళ్తున్నారు కదాని వాళ్లతో బయల్దేరింది. తోవ నిండుగా అటూ ఇటూ ఉన్న భక్తులూ వాళ్ల అనుభవాలూ విని మరింత ఆత్రుతతో షిర్డీని ఎప్పుడెప్పుడు చేరుతామా? అనే ఉత్సాహంతో ఊగిపోయింది. షిర్డీకొచ్చాక ఆ ఆత్రుతా ఎదురుచూపూ ఉత్సాహం... ఇలా అన్నీ కలిసి, సాయి ఆశ్రమంగాని ఏదైనా ఉంటే అక్కడే తన శేషజీవితాన్ని గడపాలనే నిర్ణయానికొచ్చేసింది. ఇక భక్తుల వరుసలో కదులుతూ సాయిని దర్శించడం తన శిరసుతో ఆయన పాదాలని స్పృశించడం ఎప్పుడైతే జరిగిందో దాంతో ఆమెకి మరో ఆలోచన ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్లవాళ్లకి కలుగుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. మళ్లీ కొంతసేపో లేదా కొంత కాలమో అయ్యేసరికి పాలమీద నీళ్లు చల్లగా ఆ పొంగు తగ్గిపోయినట్లుగా– కుటుంబం బాధ్యతా అపరిష్కృత సమస్యలూ... వంటివి గుర్తుకి రాగానే మళ్లీ మామూలైపోతూ ఉండటం సర్వసాధారణం. అయితే ఈమె మాత్రం అలాంటి తాత్కాలిక భావానికి గురైనది కానేకాదు. వయసు పెద్దది కావడం, కుటుంబానికి సంబంధించిన జంజాటం లేకపోవడం, ఎక్కడో ఓ చోట నిరామయంగా జీవిస్తూ దైవం పిలిస్తే చాలు వెళ్లిపోదామనుకునే ఆలోచనతో ఉండటం కారణంగా ఆ శేషజీవిత నివాసాన్ని షిర్డీకే అంకితం చేయాలని భావించింది. ఆ ఊహతోనే మళ్లీ మసీదులో సాయి దర్శనానికని బయల్దేరింది. అంతలోనే సాయి మరోప్రదేశానికి వెళ్తున్నారనీ దర్శనం సాధ్యం కాదనీ తెలిసి వెనక్కొచ్చేసింది. దాంతో ఆమెతో మరింతయింది భక్తి భావం. ధర్శసూత్రాల్లో ఓ మాట ఉంది. ‘పునర్విశ్లేష భీరుత్వం పరమా భక్తి రుచ్యతే’– అని. చక్కగా కలిసి ఉన్న ఆత్మీయంగా ఉన్న ఏ ఇద్దరో ఏదో కారణంగా గాని తాత్కాలికంగా దూరదూరంగా ఉండాల్సొచ్చి ఉండి– మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో? అనే తీరు నిరుత్సాహం ఎదురుచూపుల కలయికతో గాని విడిపోతే దాన్ని ‘పరమభక్తి’ అంటారని పై వాక్యానికర్థం. త్యాగరాజస్వామి ప్రతి నిత్యం పూజ ముగించి, అప్పటికప్పుడు భక్త్యావేశంతో వచ్చిన కీర్తనలని పాడి సీతారామచంద్రప్రభువుకి విన్నవించుకుని ఇంటి నుండి బయటికి వెళ్లిపోబోతూ ‘రామా! నన్ను విడువవుగా! వెంటనే దర్శనానికి రప్పించుకుంటావుగా!’ అని చిరుకన్నీళ్లతో వెళ్తూ ఉండేవాడట. ఆ స్థాయి భక్తీ తన్మయత్వమూ లేని తన కుటుంబ సభ్యులకి మాత్రం శ్రమించిన రైతు ధాన్యాన్ని పండించి, ఆ ధ్యాన్యాన్ని మళ్లీ పొలంలో చల్లుతూంటే – తెలియనివాడు ఎలా ఈ రైతుకి పిచ్చి పట్టిందేమో! అనుకుంటాడో, తిరిగి పంటకోసం ధాన్యాన్ని విత్తనాలుగా చల్లుతున్నాడనే ఆలోచనకే రాలేకపోతాడో అలా త్యాగరాజుని గురించి కుటుంబసభ్యులు అనుకుంటూ ఉండేవారు. చిత్రమేమంటే నిజమైన వ్యక్తి–ఏకాగ్రత దృష్టి ఉన్నవాడు ఇలాంటి వారెవరినీ పట్టించుకోడు, తన పనిలోనే తానుండిపోతాడు. సరిగ్గా అలాగే ఈ వృద్ధురాలైన రాధాబాయ్ కూడా శేషజీవితాన్ని సాయి నామస్మరణలోనే గడిపెయ్యాలని దృఢమైన నిర్ణయానికొచ్చేసింది. ఈమెతో వచ్చిన అందరూ ఒకరొకరుగా వెళ్లిపోయినా, ఈమె మాత్రం అక్కడే ఉండిపోయింది. సాయినామాన్ని జపించుకుంటూ షిర్డీలో ఉన్న ఆమెకి మరో గట్టి ఆలోచన వచ్చింది తన భక్తి ఏకాగ్రత కారణంగా ‘సాయి వద్ద ఓ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుంటేనో?..’ అని. ఇదంతా తాత్కాలిక ఆవేశంతో చేసుకుంటున్న నిర్ణయం కానేకాదు. దాంతో ఆమె సాయిని దర్శించాలనీ మంత్రోపదేశానికి ప్రార్థించాలనీ మంత్రాన్ని పొందాక షిర్డీలోనే ఉంటూ శరీరాన్ని విడిచెయ్యాలని నిశ్చయించుకుని ప్రతినిత్యం మసీదుకి వెళ్లి దర్శనానికి ప్రయత్నిస్తూ ఉండేది. అదేం చిత్రమో కానీ ఎన్నిమార్లు ప్రయత్నించినా సాయి ఎంతో దూరంలో ఉండటం, లేదా భక్తులంతా చుట్టు ముట్టి ఉండటం, పూజల్లో రద్దీగా ఉండటం, సమీపించి మంత్రోపదేశం గురించి అడుగుదామనేలోగా సాయి బయల్దేరి ఎక్కడికో వెళ్తూ ఉండటం.. ఇలాగే జరిగింది అన్ని సార్లూ కూడా. ఆమరణ నిరశన దీక్ష ఇన్నిమార్లు ఇన్ని విధాలుగా ప్రయత్నించిన ఆమెకి– పట్టుదలతో కాదు, నిరాశతో కూడిన అసహనం– వచ్చేసింది. దాంతో మసీదు మందు ఆమరణ(మరణించేంతవరకూ, నిర్+అశన= తిండి తినకుండా ఉండే నియమం కల దీక్ష– ఓ పవిత్ర వ్రతం) నిరశన దీక్ష చేయాలనే నిశ్చయానికొచ్చింది. అంతే! ఓ దర్భాసనం నేల మీద పరుచుకుని, దాని మీద కూర్చుని సాయినామాన్నే జపిస్తూ కూచుండిపోయింది. మొదటిరోజులో మొదటి పూట ఎవరూ అంత పట్టించుకోలేదు గాని, రెండవపూట మాత్రం ఆమె అందరినీ తన చిత్రమైన ఈ నిరశనదీక్షాచేష్టతో ఆకర్షించడంతో అందరూ గమనించసాగారు ఆమెని. ‘శరీరమాద్యం ఖలు సాధనమ్’ అంటుంది ధర్మశాస్త్రం. ఎంతటి దీక్షని ఉపవాసాన్ని యాగాన్ని యజ్ఞాన్ని హోమాన్ని వ్రతాన్ని చేయదలిచినా ఈ శరీరం నిలబడేందుకు కావాలసినంత ఆహారాన్ని (అన్నానికి బదులుగా, అన్నం కంటే తక్కువ పరిమాణంలో, అనేక పర్యాయాలు కాకుండా రెండు పూటలు మాత్రమే, అది కూడా శరీర ఆరోగ్యస్థితిని గమనించుకుంటూ) తీసుకోవాల్సిందే! అని పై వాక్యానికర్థం. ‘నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానతః’ –ఆహారం అనేదాన్ని ఆరోగ్యభంగం కాకుండానూ శరీరం నీరసంతో లేకుండా నిలబడేంతగానూ తీసుకోవాలని పై వాక్యానికర్థం వైద్యశాస్త్రపరంగా. ఈ వృద్ధురాలు మాత్రం కొద్ది మూర్ఖతతో అన్నాన్ని కనీసం నీటినీ కూడా తీసుకోవడం మానేసింది. భక్తుల్లో అర్ధభక్తిపరులుంటారు కొందరు. అటు సాయి మీద విశేషమైన భక్తితోనూ ఉంటారు– ఇలాంటివేమైనా దైవానికి (ఇక్కడ సాయి విషయంలో) ఏదైనా ఇలాంటి వ్యతిరేకత జరుగుతూ ఉంటే.. ఏం జరుగబోతోంది’ అన్నట్లు వీలైనన్ని ఎక్కువమార్లు పరిశీలిస్తూ పరామర్శిస్తూ ఉంటారు విషయాన్ని. అందుకే వీళ్లు అర్ధభక్తులు. నిజమైన భక్తిపరులుంటారు. వాళ్లు మాత్రం ఈ తీరు దీక్ష ఎలా దీక్షే అనిపించుకోదో, ఇలా చేయడం ఎందుకు సరికాదో చెప్పి, ఆ తీరు వ్యక్తులకి అర్థమై వాళ్లంతట వాళ్లే మానేలా చేస్తారు. ఇలా ఉండే భక్తులు ఆమెతో స్పష్టంగా చక్కని అవగాహనతో అనుభవంతో చెప్ప ప్రారంభించారు. ‘అమ్మా! నువ్వా వృద్ధురాలివి. శరీరంలో ఉండే అవయవాలన్నీ క్రమంగా బలక్షీణతకి గురయ్యే స్థితిలో ఉన్నదానివి. ఆ కారణంగా నీ వాళ్లెవరి దగ్గరో అక్కడుండటం సబబు. పోనీ! భక్తిపూర్వకమైన మనసుతో ఇక్కడి కొచ్చావు. మంచిదే! దర్శనాన్ని పొందావు. మాక్కూడా అప్పుడప్పుడు అసాధ్యమవుతూ ఉండే తీరులో నీ నుదుటిని ఆయన పాదాల మీద ఉంచి నమస్కరించుకున్నావు. ఎంతో అదృష్టం నీకు లభించింది. ఈ వయసులో– నీ వాళ్లెవరూ లేని ఈ స్థలంలో కనీసం నీకంటూ పరిచితులెవరూ కూడా మసీదులో లేని కారణంగా వాళ్ల వెంట నీ అసలు ప్రదేశానికి వెళ్లిపోవడం మంచిది. పైగా ఇక్కడికొచ్చే సందర్భంలో లేని ఆలోచన, నీకు ఇక్కడికొచ్చాక వచ్చిందనేది సుస్పష్టం కదా! ఈ అభిప్రాయాన్ని నువ్వు నీ ఇంటికెళ్లి చెప్పిన పక్షంలో నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్లు కూడా నీకు తగిన ఏర్పాట్లని నీకిక్కడ చేసే ఆలోచనతో ఓ మనిషిని తోడుగా ఉంచేవారేమో? సరే! ఇదంతా అలా ఉంచితే.. మాకు తెలిసి సాయి ఎవ్వరికీ ఏనాడూ మంత్రాన్ని ఉపదేశించిన జాడ లేదు. ఆయనకాయన అల్లా మంత్రాన్ని జపించుకుంటూ ఉండడాన్నే గమనిస్తున్నాం. ‘ఏమైనా సాయి నీకు మంత్రోపదేశాన్ని చేస్తే తప్ప దీక్షని విరమించనంటూ చెప్తూ భక్తులందర్నీ నువ్వు ఆయోమయానికి గురి చేస్తూ ఉంటే, మా అంతట మేమే స్వయంగా వచ్చి చెప్తున్నాం! సాయి ఏ ఒక్కరికీ మంత్రోపదేశాన్ని చేయలేదు– చేయడు– చేయబోడు. చివరికి అభాసుపాలు కాకుండానూ, నీ పెద్దరికానికి తగినట్లూనూ ఈ (మొండి) పట్టుదల పట్టకుండా ఈ దీక్షని విరమించవలసింది’ అని. ఆమె వీరి మాటల్ని వింటూ కూడా మౌనంగానే ఉండి వీళ్లని అసలు పట్టించుకోనేలేదు. చూస్తూ ఉండగానే 3 రోజులయ్యాయి. ఆమె మరింతగా క్షీణించింది. ఎప్పుడైనా ఆమెకి ఏదైనా జరుగుతుందేమో? అనే భయం కలగజేస్తోంది అందరికీ ఆమె శారీరక స్థితి. వెంటనే శ్యామా, సాయి వద్దకి వెళ్లి పాదాభివందనం చేసి నేల మీదే కూర్చుని సాయితో వృద్ధురాలి గురించీ ఆమె శారీరకస్థితిని గురించీ వివరించి ‘సాయి భగవాన్! నీకంతా ప్రశాంతంగా కనిపించవచ్చు. మాకు మాత్రం గుండెల్లో మేఘాలు గర్జిస్తూన్నట్లే ఉంది ఆమె విషయం. జరగరానిదేదైనా జరిగితే మసీదుకీ నీకూ మాకూ...’ అంటూ తన కంఠం గద్గదమైపోగా మౌనంగా ఉండిపోయాడు మాట రాక. సాయి ఒక్కసారి శూన్యంలోకి చూసి ‘శ్యామా! ఆమెని పిలిపించు!’ అన్నాడు. తన ఆశ నెరవేరుతోందనే అభిప్రాయంతో ఆమె అంత నీరసంలోనూ కూడా చెంగుచెంగున సాయిని చేరి పాదాభివందనం చేసి ఆయన ముందు కూర్చుంది. సాయి చెప్పడం ప్రారంభించాడు. ‘తల్లీ! అని సంబోధించి.. ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ... ‘అమ్మా! నిన్ను ఓ స్త్రీగా భావించి ఇలా పిలవడం లేదు.. నిజంగా నేను నీ బిడ్డణ్ణి. నా అదృష్టమేమంటే ఎందరో తల్లుల బిడ్డణ్ణి నేను. ‘భవతీ భిక్షాం దేహి!’ అని అడిగితే అమ్మ పెడుతుందంటారు. అయితే ఈ పిలుపే అవసరం లేకుండా వాళ్లంతట వాళ్లే అంటే ఆ అందరు అమ్మలే నాకు బిచ్చాన్ని ఏదో బిచ్చంలా కాకుండా నా జోలెలో వేస్తూంటే బతికే పకీరుని. ఎక్కడైనా బిడ్డడు బాధని అనుభవిస్తూ ఉంటే తల్లి వాడి కన్నీళ్లని తుడిచి ఓదారుస్తుంది. నువ్వేమిటమ్మా? ఆత్మహత్య దిశగా ఈ నిరశన దీక్షకి దిగావు? మంత్రోపదేశం కావాలంటున్నావట! నాకో గురువుండేవాడు. ఆయన్ని 12 సంవత్సరాల పాటు సేవించాను. సరిగ్గా నీలాగే మంత్రోపదేశం చేయవలసిందని ప్రార్థించాను. ఆయన తనకి 2 పైసలు కావాలన్నాడు. మంత్రం వస్తోంది కదా అని ఇచ్చాను. ఆయన నన్ను చూస్తూ ఈ రెండు పైసలూ ఏమిటో తెలుసా? శ్రద్ధా సబూరి(సహనం) అన్నాడు. ఆ క్షణంలో నాకర్థం కాలేదు కానీ.. ఓ రోజు పాటు నాలో నేను తర్కించుకున్నాక తెలిసింది – ఒక పని పట్ల శ్రద్ధగా తిరిగి ప్రారంభించి పూర్తి చేసి తీరాలనే సబూరీ (సహనం) అనేది ఉంటే జీవితానికి చాలు అని. ఆయన శ్రద్ధా సబూరీ అనే ఈ రెండూ తన ఉపదేశాలన్నాడు. తల్లి తాబేలు సముద్రపు ఒడ్డున ఉండే తన పిల్లలైన తాబేళ్లని ఏనాడూ చూడలేదు. చూసినా ఏవి తన పిల్లలో అన్ని వేల తాబేళ్లలో గుర్తుపట్టలేదు కూడా. అయినా భగవంతుడెంత గొప్పవాడంటే.. ఆ తల్లి తాబేలు తన పిల్లల్ని అలా ఒక్కసారి గుండెనిండుగా తలుచుకోగానే ఆ పిల్లలైన తాబేళ్లన్నీ తల్లిని తలుచుకుంటాయి. కడుపులు నిండిపోయిన ఆనందంతో నడిచేస్తాయి. ఈదులాడుతాయి. అలా నా మీద నీకు అంతటి ఇష్టమే ఉంటే నన్ను తలుచుకో కన్నతల్లీ! ఇంతకీ విశేషమేమంటే ఈ మాటల్ని చెప్పిన నా గురువు ఏ మంత్రాన్నీ నాకే ఉపదేశించలేదు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన నేను– నాకే మంత్రం లేనప్పుడు ఎలా ఉపదేశం చేయగలనమ్మా? దయచేసి బిడ్డణ్ణి కనిపెట్టమ్మా!’ అన్నాడు. ఆమె కళ్ల వెంట ధారాపాతంగా కన్నీరు రాసాగింది. ‘సాయీ! అంటూ ఆయన పాదాలమీద పడి ‘తప్పైపోయింది’ అంటూ వినమ్రంగా మెట్లు దిగిపోయి తన ఊరికి వెళ్లింది. పైవారం– విరిగిన ఇటుక చెప్పిన విశేషం. -
అతడే వీరేశలింగం..
బలిపీఠం చిత్రంలోని ‘‘కలసి పాడుదాం తెలుగు పాట/కదలి సాగుదాం వెలుగు బాట/తెలుగువారు నవ జీవన నిర్మాతలని/తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని’’ పాటలో వీరేశలింగం పంతులు గారిని మన కళ్లకు కట్టినట్లు చూపారు శ్రీశ్రీ. మన పూర్వీకులు చేసిన తప్పుడు పనులకు ఎంతో మంది అభాగ్యులు బలైపోయారు. బాల్య వివాహాల కారణంగా ఆడపిల్లలు చిన్నతనంలోనే వైధవ్యం అనుభవించారు. ఇటువంటి తప్పుడు పనులకు పరిష్కారం చూపాలనే ఆలోచన ఎవ్వరికీ కలగలేదు. అలా ఎవరికీ రాని ఆలోచన కందుకూరి వీరేశలింగంగారికి వచ్చింది. ఆయన అనేక రకాలుగా సంఘంలో మార్పు తీసుకు రావడానికి నడుం బిగించారు. సంఘంలో వేళ్లూనుకున్న దురాచారాలను ఆయన కూకటి వేళ్లతో లాగేసి, సమాజానికి సందేశాన్నిచ్చి, అందరికీ ధైర్యాన్ని కలిగించాడు. అటువంటి పంతులు గారి గురించి శ్రీశ్రీ ‘‘కార్యశూరుడు వీరేశలింగం/ కలం పట్టి పోరాడిన సింగం/దురాచారాల దురాగతాలను తుద ముట్టించిన అగ్ని తరంగం/అదిగో వీరేశలింగం’’ అని ఆయన వ్యక్తిత్వాన్ని హృద్యంగా చూపారు. పంతులు గారు ఈ ఒక్క విషయం మీదే కాకుండా, చాలా సమస్యల గురించి తెలుసుకున్నారు. స్నేహితులను కలిసినప్పుడు వారితో మాట్లాడి, వారు చెప్పిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించి ఆచరణలోకి తెచ్చారు. ఆయన చేసిన వితంతు పునర్వివాహం వెనుక ఎంతోమంది ఆలోచన ఉందని ఆయనే స్వయంగా చెప్పేవారని పెద్దలు చెప్పగా విన్నాను. నేను కూడా ఆయన పుట్టిన రాజమండ్రిలోనే ఉండటం నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆయనని తలచుకుంటే, ఆయన పుట్టిన ఊరిలో మేమున్నామన్న ఆనందం కలుగుతుంది. కించిత్తు గర్వం కూడా కలుగుతుంది. వితంతు పునర్వివాహాల మీదే ఎక్కువ పనిచేశారంటే కారణం వారి బాధను దగ్గరగా చూసి తెలుసుకోవడమే. ‘‘మగవాడెంతటి ముసలాడైనా మళ్లీ పెళ్లికి అర్హత ఉంటే/బ్రతుకే తెలియని బాల వితంతువులకెందుకు లేదా హక్కంటాను/చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు/మోడువారిన బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు’’ అని పంతులుగారు బాల వితంతువుల కోసం చేసిన పోరాటాన్ని శ్రీశ్రీ అలతి పదాలలో మనసుకు హత్తుకునేలా రచించారు. పంతులు గారి గురించి మాట్లాడటం నా జీవితానికి గొప్ప అదృష్టం. ఆయన జీవిత చరిత్ర కాని, ఆయన జీవిత సంఘటనలు కాని తెలుసుకునే కొద్దీ ఒళ్లు పులకిస్తుంది. ఆయన దేవుడు పంపిన దూత, యుగపురుషుడు. పంతులు గారి భార్య రాజ్యలక్ష్మి కూడా ఎంతో సహకరించారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల రాజమండ్రిలో ఇన్ని సంవత్సరాలుగా నడుస్తోందంటే అదంతా ఆయన గొప్పదనమే. అంత ఛాందసనంగా ఉన్న రోజుల్లోనే ఈయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. ఆ రోజుల్లో ఆయనను వ్యతిరేకించిన వారు చాలా మందే ఉన్నారు. అదేవిధంగా ఆయనను బలపరిచిన వారూ లేకపోలేదు. ఇప్పటికీ చాలామంది వితంతువులు గర్వంగా తిరుగుతున్నారంటే అది ఆయన గొప్పతనమే. దారుణమైన దురాచారాలు రాజ్యమేలుతున్న రోజుల్లో, స్త్రీల తరఫున పోరాడారు. ఈరోజు ముత్తయిదువ, వితంతువు తేడా లేకుండా ఉండటానికి ఆయన చేసిన కృషి చెప్పరానిది. ఆ రోజుల్లో ఆయన విప్లవం తీసుకుని రాకపోయి ఉండకపోతే, ఎంతోమంది ఆత్మహత్య చేసుకునేవారు. ఆయన శతవర్థంతి సందర్భంగా పంతులుగారిని స్మరించుకోవడం నాకు చాలాసంతోషంగా ఉంది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ జిత్ మోహన్ మిత్రాసినీ నటుడు -
ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సమయంలో ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగం నాది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్సర్సైజ్లు చేయడంలాంటివి చేయాలా? – కె.పల్లవి, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే గర్భిణులు ఒకే పొజిషన్లో కూర్చుని ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయకుండా రెండు గంటలకొకసారి లేచి అటూ ఇటూ తిరగడం చెయ్యాలి. ఎక్కువ ముందుకు వంగి పని చెయ్యకుండా నడుమును కుర్చీకి మంచిగా ఆన్చి కూర్చుని పని చేసుకోవాలి. లేకపోతే నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. గర్భం పెరిగే కొద్దీ బరువు పెరగడం, తర్వాత కాళ్ల వాపులు రావడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి టేబుల్ కింద చిన్న స్టూల్ వేసుకుని, లేదా డస్ట్బిన్ మీద కాళ్లు ఎత్తుగా పెట్టుకుని కూర్చోవాలి. మంచినీళ్లు బాగా తాగాలి. మధ్యలో పండ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. చిన్నగా కాళ్లను తిప్పడం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చెయ్యాలి. డాక్టర్ సలహా మేరకు చిన్నగా మెట్లు ఎక్కి దిగడం, కింద కూర్చుని మెల్లగా లేవడం వంటివి కొద్దిగా చెయ్యవచ్చు. హెల్త్ఫైల్ కాపీ ఫొటో తీసి మీ ఫోన్లో పెట్టుకోవాలి. ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే, వెంటనే నేరుగా హాస్పిటల్కి వెళ్లి మీ ఫోన్లోని కాపీ చూపించవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) గురించి వివరంగా తెలియజేయగలరు. ఇది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుందా? ఈ ఇండెక్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? – పి.మాలిక, టంగుటూరు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటే ఒకరి బరువును కేజీల్లో చూసి, ఎత్తును మీటర్లలో కొలిచి, బరువులో మీటర్లను రెట్టింపు చేసి భాగించడం ద్వారా లెక్కిస్తారు. ఎవరైనా ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఇదొక సూచిక. బీఎంఐ 18.5 ఉంటే బరువు తక్కువ ఉన్నట్లు, 18.5 నుంచి 24.9 వరకు ఉంటే తగిన బరువు ఉన్నట్లు, 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు ఉన్నట్లు, 30 కంటే ఎక్కువ ఉంటే మరీ అధిక బరువు లేదా ఒబేసిటీ ఉన్నట్లు అంచనా. ప్రపంచం మొత్తం మీద బీఎంఐ లెక్క, వాల్యూ ఒకే విధంగా ఉంటుంది. బీఎంఐ ఆధారంగా ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో చూడటం జరుగుతుంది. బీఎంఐ తక్కువగా ఉంటే బరువు పెరగమని, ఎక్కువగా ఉంటే బరువు తగ్గమని సూచించడం జరుగుతుంది. బీఎంఐ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఎంఐ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవడం మంచిది. మా వారి ఉద్యోగం షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. కొన్నిసార్లు పగలు, కొన్నిసార్లు రాత్రి ఉంటుంది. బయటి తిండి ఎక్కువగా తినడం వల్ల ఆయన లావు అవుతున్నారు. దీనివల్ల ఈస్ట్రోజెన్ సమస్య ఏర్పడి పిల్లలు కలగకపోవచ్చునని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – ఆర్జీ, విజయనగరం అధిక బరువు ఉండటం వల్ల కొందరు మగవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఈస్ట్రోజెన్గా మార్పు చెంది, టెస్టోస్టిరాన్ మోతాదు తగ్గిపోతుంది. దీనివల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం, కోరికలు సరిగా లేకపోవడం, కలయికలో ఇబ్బందులు వంటి సమస్యల వల్ల సంతానం కలగడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల స్క్రోటమ్లో వృషణాలకు గాలి ఆడక, వాటి ఉష్ణోగ్రత పెరిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల బీపీ, సుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి మీవారు ఏదో రకంగా బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చెయ్యడం, వదులుగా ఉండే లోదుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వీర్యపరీక్ష చేయించుకుని, డాక్టర్ను సంప్రదించడం మంచిది. డా‘‘ వేనాటి శోభబర్త్రైట్ బై రెయిన్బోహైదర్నగర్ హైదరాబాద్ -
తల్లి మనసు
మాతృత్వం ఒక అద్భుతమైన వరం.సృష్టి కొనసాగాలంటే, తల్లుల వల్లనే సాధ్యమవుతుంది. తల్లిమనసు గురించిన ప్రస్తావన మన సాహిత్యంలో చాలానే ఉంది. తల్లుల మనసులో మమకారం మాటలకందనిది. అయితే, తల్లుల మనసుల్లోనూ ఆటుపోట్లు ఉంటాయి. అలజడులు ఉంటాయి. ఆందోళనలు ఉంటాయి. మహిళలు తల్లులయ్యేటప్పుడు వారిలో తలెత్తే మానసిక సమస్యలు, వాటి నివారణ, చికిత్స పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. గర్భం దాల్చాలంటే మహిళలు శారీరకంగా, మానసికంగా పరిపక్వతను కలిగి ఉండాలి. పద్దెనిమిదేళ్ల లోపు, ముప్పయి ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, శారీరక, మానసిక వైకల్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పయి ఐదేళ్ల వయసు దాటిన మహిళలు గర్భం దాల్చినట్లయితే, గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. ప్రసవం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణులకు పోషకాహారం ముఖ్యం. ప్రొటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభించే రాగులు, బెల్లం, జీడిపప్పు, బాదం వంటి నట్స్, ఖర్జూరాల వంటి డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నట్లయితే, గర్భం దాల్చడానికి ముందే వాటిని మానుకోవాలి. గర్భిణుల్లోని దురలవాట్లు పుట్టే పిల్లల్లోని శారీరక, మానసిక, జన్యు లోపాలకు కారణమవుతాయి. మహిళలు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం, నరాలకు సంబంధించిన ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో థైరాయిడ్ లోపాలు, శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. శారీరక, మానసిక లోపాలతో బాధపడే మహిళలకు కుటుంబం మొత్తం ఆసరాగా నిలవాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యవంతులైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు. ఎంతో శక్తితో, ఉత్సాహంతో తమ పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భం దాల్చిన మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పైకి కనిపించే మార్పులతో పాటు శరీరంలోని హార్మోన్ల స్థాయి, రక్త పరిమాణం, గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భధారణకు అవసరం. అలాగే, ప్రసవం తర్వాత కూడా అనేక రసాయనిక, హార్మోన్ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రసవానంతరం చోటు చేసుకునే మార్పులు శిశువు పోషణకు, లాలనకు అవసరం. గర్భిణి దశలోను, ప్రసవం తర్వాత చోటు చేసుకునే రసాయనిక మార్పుల ఫలితంగా తల్లుల మానసిక స్థితిలోనూ మార్పులు ఏర్పడతాయి. గర్భం దాల్చిన సమయంలోనూ, ప్రసవం తర్వాత కూడా తల్లులకు పోషకాహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆత్మీయత, సహకారం ఎంతో అవసరం. అలాగే, ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా అవసరం. గర్భం దాల్చిన తొలి మూడు నాలుగు నెలలూ ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో గర్భంలోని శిశువు శరీర నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. ఎదుగుతున్న ఈ శిశువుపై రసాయనాలు, మందులు, మద్యం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైన పదార్థాల ప్రభావాన్ని ప్లాసెంటా ఆపగలిగినా, అది సంపూర్ణమైన రక్షణ కవచం కాదు. అందువల్ల ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదు. శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు వారు వాడుతున్న మందుల గురించి వైద్యులకు తెలియజేసి, వారు సూచించిన మేరకు తగిన మార్పులు చేసుకోవాలి. అప్పటి వరకు వాడుతున్న మందులకు బదులుగా గర్భస్థ శిశువులపై ప్రభావం చూపని లేదా తక్కువ ప్రభావం చూపే మందులను ఇస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వాస్తవానికి శారీరక, మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న మహిళలు గర్భధారణకు సిద్ధపడే ముందే వైద్యులను సంప్రదించి, అప్పటి వరకు వాడుతున్న మందుల్లో మార్పులు చేయించుకోవడం మంచిది. మానసిక సమస్యలు ఉన్నవారు అసలు గర్భం దాల్చకూడదనేది అపోహ మాత్రమే. అయితే, వైద్యుల పర్యవేక్షణలో ముందుగా ప్లాన్ చేసుకుని, గర్భం దాల్చినప్పుడు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మందులు వాడుతూ గర్భం దాల్చినప్పుడు శిశువులో శారీరక లోపాలు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగానే వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మందులు వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని మందులు తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి, దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల వైద్యుల సలహాతో మందుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మహిళల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు అంతకు ముందు మానసిక సమస్యలేవీ లేని సాధారణ మహిళలు కొందరిలో కూడా గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కొందరు సాధారణ మహిళల్లో సైతం గర్భధారణ సమయంలో డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, యాంగై్జటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలి. కొన్ని సమస్యలకు కాగ్నిటివ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు. పరిస్థితిని బట్టి కొందరికి మందులను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా వీలైనన్ని తక్కువ మందులు, తక్కువ మోతాదులు సూచించడం జరుగుతుంది. ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు, రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం తలెత్తే మానసిక సమస్యలను ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’గా వ్యవహరిస్తారు. దాదాపు 80 శాతం మంది మహిళల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసవం తర్వాత చిరాకు, కోపం, దిగులు, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు తాత్కాలికంగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ పరిస్థితి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. కొద్దిమందిలో ఈ మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాంటప్పుడు వీటిని పోస్ట్పార్టమ్ మానసిక వ్యాధులుగా గుర్తించాలి. ప్రసవం తర్వాత కొద్ది మందిలో ఆందోళన, పానిక్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పోస్ట్పార్టమ్ డిప్రెషన్ లేదా సైకోసిస్ తీవ్రస్థాయిలో కలిగినప్పుడు కొందరు తల్లుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, పుట్టిన బిడ్డకు హాని కలుగుతుందనే నిష్కారణమైన భయం కలగడం సంభవించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులు తల్లికి, బిడ్డకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి కాన్పులో పోస్ట్పార్టమ్ మానసిక సమస్యలు తలెత్తిన వారికి, తర్వాతి కాన్పులోనూ అలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మానసిక సమస్యలకు ఒక్కోసారి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే, వ్యాధి రాకుండా ఆపడానికి, ఒకవేళ వచ్చినా లక్షణాల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి, ఆత్మహత్య, ఇతరత్రా ప్రమాదకర పరిణామాలు సంభవించకుండా నివారించడానికి సాధ్యమవుతుంది. మన దేశంలో ప్రసవానంతరం మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు 22 శాతం వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా అధ్యయనం వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దక్షిణాదిలో 26 శాతం మంది తల్లులు ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. జనాల్లో అవగాహన లేమి, పల్లెల్లో వైద్య సౌకర్యాల కొరత వంటి పలు కారణాలు మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళల పరిస్థితిని మరింత జటిలంగా మారుస్తున్నాయని డబ్ల్యూహెచ్వో అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్లో ప్రసవానంతరం మహిళల్లో తలెత్తే మానసిక సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్న కొన్ని ముఖ్యమైన కారణాలు... కుటుంబంలో కలతలు, కుటుంబ సభ్యుల అనాదరణ - గర్భం దాల్చక ముందే ఉన్న మానసిక సమస్యలకు తగిన చికిత్స పొందకపోవడం - ఆడ శిశువును ప్రసవించడం - పుట్టిన శిశువులో లోపాలు లేదా మృతశిశువు జననం - మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన భర్త - భార్యా భర్తల మధ్య అనుబంధంలో అపశ్రుతులు - తగిన ప్రణాళిక లేకుండా గర్భం దాల్చడం గర్భం దాల్చాలంటే మహిళలు శారీరకంగా, మానసికంగా పరిపక్వతను కలిగి ఉండాలి. పద్దెనిమిదేళ్ల లోపు, ముప్పయి ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, శారీరక, మానసిక వైకల్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పయి ఐదేళ్ల వయసు దాటిన మహిళలు గర్భం దాల్చినట్లయితే, గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. ప్రసవం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణులకు పోషకాహారం ముఖ్యం. ప్రొటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభించే రాగులు, బెల్లం, జీడిపప్పు, బాదం వంటి నట్స్, ఖర్జూరాల వంటి డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నట్లయితే, గర్భం దాల్చడానికి ముందే వాటిని మానుకోవాలి. గర్భిణుల్లోని దురలవాట్లు పుట్టే పిల్లల్లోని శారీరక, మానసిక, జన్యు లోపాలకు కారణమవుతాయి. మహిళలు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం, నరాలకు సంబంధించిన ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో థైరాయిడ్ లోపాలు, శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. శారీరక, మానసిక లోపాలతో బాధపడే మహిళలకు కుటుంబం మొత్తం ఆసరాగా నిలవాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యవంతులైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు. ఎంతో శక్తితో, ఉత్సాహంతో తమ పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భం దాల్చిన మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పైకి కనిపించే మార్పులతో పాటు శరీరంలోని హార్మోన్ల స్థాయి, రక్త పరిమాణం, గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భధారణకు అవసరం. అలాగే, ప్రసవం తర్వాత కూడా అనేక రసాయనిక, హార్మోన్ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రసవానంతరం చోటు చేసుకునే మార్పులు శిశువు పోషణకు, లాలనకు అవసరం. గర్భిణి దశలోను, ప్రసవం తర్వాత చోటు చేసుకునే రసాయనిక మార్పుల ఫలితంగా తల్లుల మానసిక స్థితిలోనూ మార్పులు ఏర్పడతాయి. గర్భం దాల్చిన సమయంలోనూ, ప్రసవం తర్వాత కూడా తల్లులకు పోషకాహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆత్మీయత, సహకారం ఎంతో అవసరం. అలాగే, ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా అవసరం. గర్భం దాల్చిన తొలి మూడు నాలుగు నెలలూ ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో గర్భంలోని శిశువు శరీర నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. ఎదుగుతున్న ఈ శిశువుపై రసాయనాలు, మందులు, మద్యం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైన పదార్థాల ప్రభావాన్ని ప్లాసెంటా ఆపగలిగినా, అది సంపూర్ణమైన రక్షణ కవచం కాదు. అందువల్ల ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదు. శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు వారు వాడుతున్న మందుల గురించి వైద్యులకు తెలియజేసి, వారు సూచించిన మేరకు తగిన మార్పులు చేసుకోవాలి. అప్పటి వరకు వాడుతున్న మందులకు బదులుగా గర్భస్థ శిశువులపై ప్రభావం చూపని లేదా తక్కువ ప్రభావం చూపే మందులను ఇస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వాస్తవానికి శారీరక, మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న మహిళలు గర్భధారణకు సిద్ధపడే ముందే వైద్యులను సంప్రదించి, అప్పటి వరకు వాడుతున్న మందుల్లో మార్పులు చేయించుకోవడం మంచిది. మానసిక సమస్యలు ఉన్నవారు అసలు గర్భం దాల్చకూడదనేది అపోహ మాత్రమే. అయితే, వైద్యుల పర్యవేక్షణలో ముందుగా ప్లాన్ చేసుకుని, గర్భం దాల్చినప్పుడు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మందులు వాడుతూ గర్భం దాల్చినప్పుడు శిశువులో శారీరక లోపాలు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగానే వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మందులు వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని మందులు తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి, దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల వైద్యుల సలహాతో మందుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మహిళల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు అంతకు ముందు మానసిక సమస్యలేవీ లేని సాధారణ మహిళలు కొందరిలో కూడా గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కొందరు సాధారణ మహిళల్లో సైతం గర్భధారణ సమయంలో డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, యాంగై్జటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలి. కొన్ని సమస్యలకు కాగ్నిటివ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు. పరిస్థితిని బట్టి కొందరికి మందులను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా వీలైనన్ని తక్కువ మందులు, తక్కువ మోతాదులు సూచించడం జరుగుతుంది. ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు, రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం తలెత్తే మానసిక సమస్యలను ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’గా వ్యవహరిస్తారు. దాదాపు 80 శాతం మంది మహిళల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసవం తర్వాత చిరాకు, కోపం, దిగులు, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు తాత్కాలికంగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ పరిస్థితి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. కొద్దిమందిలో ఈ మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాంటప్పుడు వీటిని పోస్ట్పార్టమ్ మానసిక వ్యాధులుగా గుర్తించాలి. ప్రసవం తర్వాత కొద్ది మందిలో ఆందోళన, పానిక్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పోస్ట్పార్టమ్ డిప్రెషన్ లేదా సైకోసిస్ తీవ్రస్థాయిలో కలిగినప్పుడు కొందరు తల్లుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, పుట్టిన బిడ్డకు హాని కలుగుతుందనే నిష్కారణమైన భయం కలగడం సంభవించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులు తల్లికి, బిడ్డకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి కాన్పులో పోస్ట్పార్టమ్ మానసిక సమస్యలు తలెత్తిన వారికి, తర్వాతి కాన్పులోనూ అలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మానసిక సమస్యలకు ఒక్కోసారి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే, వ్యాధి రాకుండా ఆపడానికి, ఒకవేళ వచ్చినా లక్షణాల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి, ఆత్మహత్య, ఇతరత్రా ప్రమాదకర పరిణామాలు సంభవించకుండా నివారించడానికి సాధ్యమవుతుంది. -
దోదో!
‘‘భేతాళా! ఏమీ మాట్లాడకుండా అలా వడదెబ్బ తగిలినట్టు ఫేసు పెట్టావేమిటీ? క్వశ్చన్ అడుగు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘ఈ ఎండల్లో కొచ్చెన్ ఏం అడుగుతానుగానీ...నువ్వు విన్నవి కన్నవి చల్లని రెండు జోక్లు చెప్పు చాలు’’ అన్నాడు నీరసంగా భేతాళుడు. ‘‘ఓకే’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు విక్రమార్కుడు: అనగనగా ఒక మగదోమ, ఒక ఆడదోమ. మగదోమ రెండు వారాల పాటు ఏదో పని మీద బిహార్ వెళ్లి వచ్చింది. ‘‘ఎలా ఉన్నావు డియర్!’’ అడిగింది ఆడదోమ. ‘‘నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టు....నీకోసం ఏమైనా చేస్తాను. సింహాన్ని వేటాడి తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘సరేలే’’ అన్నది తేలికగా ఆడదోమ. ‘‘సరేలే కాదు. నిన్ను నా భుజాల రెక్కలపై కూర్చోబెట్టుకొని ప్రపంచమంతా తిప్పుతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏడ్చినట్టే ఉంది’’ అన్నది ఆడదోమ. ‘‘ఏడ్చినట్లే ఉండడం కాదు...ప్రియా! స్వర్గాన్ని నీ కోసం ఆన్లైన్లో తెప్పిస్తాను’’ ‘‘సరేలేగానీ....కాస్త రెస్ట్ తీసుకోండి...ప్రయాణ బడలికతో వచ్చారు’’ అన్నది ఆడదోమ. ‘‘రెస్ట్ సంగతి సరే...ఆ ఎవరెస్ట్ను నీ పాదాల దగ్గర తెల్లకుక్క పిల్లలా కూర్చోబెడతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏమైంది మీకు? ఎందుకు ఇలా కోతలు కోస్తున్నారు?!’’ అని ఆశ్చర్యంగా అడిగింది ఆడదోమ. ‘‘కోతలు కాదు ప్రియా! తాజ్మహల్ దగ్గరకు ఎవరైనా వెళతారు. కాని ఆ తాజ్మహల్నే నీ దగ్గరకు తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘ఇవన్నీ కాదుగానీ నా కోసం ఒకచోటుకి రావాలి’’ గోముగా అడిగింది ఆడదోమ. ‘‘సరే దానిదేముంది!’’ అంటూ ఆడదోమతో పాటు వెళ్లింది మగదోమ. ‘దోమల మానసిక చికిత్స కేంద్రం’ అని బోర్డ్పై రాసి ఉన్న హాస్పిటల్లోకి రెండు దోమలు వెళ్లాయి. ‘‘ఇంతకీ ఏమిటి మీ సమస్య?’’ డాక్టర్ దోమ ఆడదోమను అడిగింది. ‘‘సమస్య నాకు కాదు...మా ఆయనకు’’ అన్నది ఆడదోమ. ‘‘చూస్తే దుక్కలా ఉన్నాడు. ఏమిటి సమస్య!’’ అని గోడ కూలినట్లు నవ్వింది డాక్టర్ దోమ. ‘‘మా ఆయన రెండు వారాల పాటు టూరు వెళ్లారండీ. అప్పటి నుంచి చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయిన తొడకొడుతున్నారు. మీసం మెలేస్తున్నారు. ఒక దగ్గర రెండు దోమలు కనబడితే చాలు ఉపన్యాసమిస్తున్నాడు. ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు....’’ చెప్పుకుంటూ పోయింది ఆడదోమ. డాక్టర్ దోమకు ఏమీ అర్థం కాలేదు. కాసేపు స్కెతస్కోప్తో తలకొట్టుకొని ఆలోచించింది. ఏమీ స్ఫురించలేదు. లైబ్రరీకి వెళ్లి సీరియస్గా బుక్స్ తిరిగేసి నోట్స్ రాసుకొని వచ్చింది. ‘‘అయ్యా! హాస్పిటల్కు వచ్చి అరగంటవుతోంది. ఇంతవరకు సమస్య ఏమిటో చెప్పలేదు’’ అసహనంగా అన్నది ఆడదోమ. ‘‘దాని గురించే ఆలోచిస్తున్నాను’’ అని పెన్నును నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచించసాగింది డాక్టర్ దోమ. ‘‘అయ్యా కేసు నన్ను టేకప్ చేయమంటారా?’’ ఆతృతతో అడిగింది కంపౌండర్ దోమ. ‘‘చేసి చావు...’’ అని నిద్రలోకి జారింది డాక్టర్ దోమ. ‘‘ఏమయ్యా ఇలా వచ్చి కూర్చో’’ అని ఆర్డరేసింది కంపౌడర్ దోమ. ‘‘అలాగే’’ అంటూ బుద్ధిగా కూర్చుంది మగదోమ, ‘‘ఏమయ్యా...నీ పేరేమిటి?’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘దోసకొండ దోమప్ప... అందరూ ముద్దుగా దోదో అని పిలుస్తారు’’ అని చెప్పింది మగదోమ. ‘‘చూడు దోదో...ఇప్పుడు నేను నిన్ను ట్రాన్స్లోకి తీసుకువెళతాను. ఓకేనా!’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘ఓకే’’ అన్నది దోదో. ‘‘ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్లు మూసుకుంటున్నావు. నీకు చెవులు ఉన్నాయి... కానీ నేను మాట్లాడింది తప్ప ఏ సౌండూ నీకు వినబడడం లేదు. నీకు మైండ్ ఉంది. కానీ నేను చెప్పిందాన్ని గురించి తప్ప దేని గురించి...అది ఆలోచించడం లేదు. వెళుతున్నావు.... లోలోనికి వెళుతున్నావు. నీదైన ప్రపంచంలోకి... ఇప్పుడు చెప్పు...అసలు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?’’ అడిగింది కంపౌడర్ దోమ. ‘‘పని మీద బిహార్కు వెళ్లానండి. అక్కడ ఎలక్షన్ హడావిడి కనిపించింది. ఒకరోజు బిహార్లో ఒకచోట బాగా ఆకలైంది. ఎటుచూసినా చెట్టుచేమలే తప్ప మనుషుల జాడ కనిపించలేదు. దూరంగా ఏదో చప్పుడు వినిపిస్తే వేగంగా అటు వెళ్లాను. అక్కడ ఎన్నికల సభ జరుగుతోంది. నాయకుడు మాంచి జోరుమీద ఉన్నాడు. ‘‘మీ కోసం నా ప్రాణం ఇస్తాను’’ అంటున్నాడు. ‘‘ప్రాణం ఎందుకుగానీ...రక్తం ఇవ్వు చాలు’’ అని వెళ్లి కుట్టాను. దీంతో నా మైండ్ దెబ్బతింది. నేనేమి మాట్లాడుతున్నానో....నాకే తెలియడం లేదు.’’ అని అసలు విషయం చెప్పింది దోదో!! 2 సుబ్బారావు అప్పారావుకు లక్షరూపాయలు అప్పు ఇచ్చాడు. కాని అప్పారావు ‘ఇదిగో అదిగో’ అంటున్నాడే తప్ప అప్పు తీర్చడం లేదు. విసుగెత్తిన సుబ్బారావు ఒక లాయర్ దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. ‘‘అప్పారావుకు లక్ష రూపాయాలు అప్పు ఇచ్చినట్లు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా?’’ అడిగాడు లాయర్. ‘‘లేదు’’ అని భోరుమన్నాడు సుబ్బారావు. ‘‘అయితే ఇలా చెయ్’’ అని సుబ్బారావు చెవిలో ఏదో చెప్పాడు లాయర్. పావుగంటలోనే సుబ్బారావుకు గట్టి సాక్ష్యం దొరికింది. ‘‘భేతాళా! ఈరోజు నేను నిన్ను కొచ్చెన్ అడుగుతాను. ఇంతకీ లాయర్ అతడి చెవిలో ఏం ఊదాడు?’’ అడిగాడు విక్రమార్కుడు. భేతాళుడు చెప్పిన జవాబు: సుబ్బారావు అప్పారావుకు ఫోన్ చేసి...‘‘నీకు అప్పుగా ఇచ్చిన అయిదు లక్షలు నాకు అర్జంటుగా కావాలి’’ అన్నాడు. ‘‘అయిదు లక్షలా...ఏం మాట్లాడుతున్నావు సుబ్బారావు. మతిగానీ పోయిందా’’ మండిపడ్డాడు అప్పారావు. ‘‘నువ్వు ఇలా మరిచిపోతే ఎలా అప్పారావు! అక్షరాల అయిదు లక్షలు ఇచ్చా’’ అన్నాడు సుబ్బారావు. ‘‘నువ్వు నాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చావు. ఇంతకంటే నువ్వు ఒక్క పైసా నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’’అన్నాడు అప్పారావు. ‘‘అంటే నువ్వు తీసుకుంది లక్షరూపాయలేనంటావు’’ ‘‘కచ్చితంగా లక్షరూపాయలే’’ ‘ఓకే’అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. అప్పారావు వాయిస్ రికార్డయింది. ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది! – యాకుబ్ పాషా -
సదాశివా...చంద్రమౌళి!
ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, దేవిక, రాజశ్రీ...నటించిన, ఆరుద్ర పాటలు, మాటలు రాసిన చిత్రంలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహాదేవా...మహాదేవా! దక్షప్రజాపతి ఉగ్రనేత్రుడై వస్తున్నాడు. పాల ముంచినా నీట ముంచినా మీదే భారం స్వామి’’ అంటూ మహాశివుడి శరణుజొచ్చాడు చంద్రుడు. ‘‘భయపడకు చంద్రా’’ అంటూ అభయమిచ్చాడు శంకరుడు. ఇంతలో దక్షప్రజాపతి పట్టలేనంత ఆవేశంగా అక్కడికి దూసుకు వచ్చాడు. ‘‘ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు! ముల్లోకాలలో నీ మాటకు తిరుగుండదని బాస చేసి నీచాతి నీచమైన చంద్రుడికి ఆశ్రయం ఇస్తావా!’’ అంటూ కోపంతో ఊగిపోతున్నాడు దక్షప్రజాపతి. ‘‘దక్షా! ఆవేశం చెందకు. జరిగింది సావధానంగా విను. కూర్చో’’ అన్నాడు శంకరుడు. ‘‘కూర్చోవడానికి రాలేదు. ముందు ఆ శాపగ్రస్తుడిని విడిచిపెట్టు’’ చంద్రుడిని ఉద్దేశించి అన్నాడు దక్షప్రజాపతి. ‘‘నువ్వు శాపం ఇచ్చిన సంగతి తెలియక చంద్రుడికి అభయం ఇచ్చాను. శరణు ఒసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు’’ చెప్పాడు శంకరుడు. శంకరుని మాటలు దక్షుడి ఆవేశానికి ఆజ్యం పోశాయి. ‘‘అల్పునికి ఆశ్రయమిచ్చి నావంటి అధికుడికి ఇచ్చిన మాట తప్పడం సముచితమా?’’ అడిగాడు దక్షుడు. ‘‘ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు, అధికుడు అనే తారతమ్యాలు పాటించడం పాడి కాదు’’ అన్నాడు శివుడు. ‘‘ప్రజాపతులలో ప్రముఖుడైన నన్ను పరాభవించడం పాడియా?’’ అడిగాడు దక్షుడు. ‘‘దక్షా! నువ్వు నా భక్తుడివి. నిన్ను పరాభవించెదనా?’’ అన్నాడు శాంతస్వరంతో శివుడు. ‘‘పరాభవం కాక ఇంకేమిటి! అభిమానవంతుడిని అలక్ష్యం చేసింది చాలక అవమానిస్తావా?’’ అంటూ రుసరుసలాడాడు దక్షుడు. ‘‘దక్షా! యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపం ఇచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి, నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను’’ అన్నాడు శివుడు. ‘‘నా కుమార్తెల గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదులే’’ అని శివుడు చెప్పినదాన్ని తోసిపుచ్చుతూ... ‘‘శుష్కవాదాలతో కాలయాపన చేయక తక్షణం చంద్రుడిని విడిచి పెట్టు లేదా నా శక్తిని ప్రదర్శించక తప్పదు’’ అని శివుడికి హెచ్చరిక చేశాడు దక్షుడు. ‘‘దక్షా! అహంకారం అనర్థదాయకం సుమా!’’ హితవు చెప్పాడు శివుడు. ‘‘ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం. నా శక్తిసామర్థ్యాలతో చంద్రుడిని ఎలా శిక్షిస్తానో నీవే చూడు’’ అన్నాడు దక్షుడు. ‘‘నీ చేతనైతే ప్రయత్నించు’’ అని దక్షుడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు శివుడు. ‘‘శంకరా! మరోసారి హెచ్చరిస్తున్నాను. మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టు. లేదా నా గదాదండంతో నిన్ను ఖండఖండలుగా చండాడగలను’’ కన్నూమిన్నూ కానకుండా అన్నాడు దక్షుడు. శివుడి కోపం ఆకాశాన్ని అంటింది. ‘‘మదాంధా! కండకావరంతో కళ్లు మూసుకుపోయి... నాపైనే గదాదండం ఎత్తెదవా! ఈ ఫాలాక్షుడి త్రిశూల ధాటికి గురికాక ముందే క్షమాపణ వేడుకో’’ ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు శివుడు. ‘‘ఛీ...ఈ దక్షప్రజాపతి నీవంటి నీచుణ్ణి క్షమాభిక్ష కోరేంత నీచుడు కాదు. నిన్నే పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభావంతుడు’’ అన్నాడు దక్షుడు అహంకరిస్తూ. ఇరువైపుల ఆవేశాగ్నులు ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమై... ‘‘దక్షా! నీకు ఈ దురహంకారం తగదు. ఫాలక్షుడితో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం. కాని విరోధం సమంజసం కాదు’’ హితువు పలికాడు విష్ణువు. శివుడి ఆగ్రహాన్ని చల్లర్చడానికి... ‘‘శాంతించు మహాదేవా! మీ ఇరువురి ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లకుండా చేస్తాను. సమ్మతమేనా?’’ అని ఇరువురినీ అడిగాడు. ‘‘నేను ఇచ్చిన అభయం ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్ఫలం కాకూడదు’’ అన్నాడు శివుడు పట్టుదలగా. ‘‘కాదు...కానే కాదు’’ అన్నాడు విష్ణువు. ‘‘ఆ శాపం అప్రతిహతం కావల్సిందే’’ అన్నాడు దక్షుడు గట్టి పట్టుదలతో. ‘‘అవుతుంది’’ అన్నాడు విష్ణువు. ఆ తరువాత... ‘‘వినండి. నా ప్రభావంతో చంద్రుడిని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్షప్రజాపతి శాపఫలితం అనుభవించేదిగానూ, రెండో భాగం పరమేశ్వరుడి అభయఫలాన్ని అనుభవించేదిగానూ చేసెదను. ఇది మీకు సమ్మతమే కదా!’’ అడిగాడు విష్ణువు. ‘‘ఉభయతారకం నాకు అంగీకారమే’’ అన్నాడు శివుడు. ‘‘ఏం దక్షా!’’ అంటూ దక్షుడి అభిప్రాయం అడిగాడు విష్ణువు. ‘‘సరే’’ అన్నాడు దక్షప్రజాపతి. అప్పుడు... ‘‘చంద్రా ఇటురా’’ అంటూ పిలిచాడు విష్ణువు. ‘‘నమస్కారం దేవా!’’ అంటూ భయభక్తులతో అక్కడికి వచ్చాడు చంద్రుడు. అలా వచ్చిన చంద్రుడిని ఇద్దరిగా చేశాడు విష్ణువు. ‘‘చంద్రా మీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమున ఒక నక్షత్రకాంతతో కాపురం చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెను వెంటనే దినదినాభివృద్ధి నొందుచుండగలవు. అదే శుక్లపక్షం–కృష్ణపక్షం పేరున నీయందు వర్తించును’’ ఆదేశించాడు విష్ణువు. ‘‘తమ ఆదేశం శిరసావహిస్తాను స్వామి’’ అన్నాడు చంద్రుడు. ‘‘దక్షా! నీ మాట చెల్లుబాటు అయినందుకు సంతోషమే కదా’’ అడిగాడు విష్ణువు. ‘సంతోషమే’ అన్నట్లుగా ఉన్నాయి అతడి హావభావాలు. ‘‘చంద్రా! బాలచంద్ర రూపమున నీవు సదా శివ సాన్నిధ్యంలో ఉందువుగాక’’ ఆజ్ఞ ఇచ్చాడు మహావిష్ణువు. ‘‘మహాప్రసాదం’’ అంటూ శివుడి కాళ్లకు నమస్కరించి కూర్చున్నాడు చంద్రుడు. ‘‘చంద్రా...నువ్వు ఉండాల్సిన చోటు అది కాదు’’ అంటూ నెలవంకగా మారిన చంద్రుడిని శిరస్సున ధరించాడు శివుడు. అది చూసి... ‘‘సదాశివా! ఇప్పుడు నవ్వు చంద్రమౌళివై విలసిల్లు’’ ఆనందంగా అన్నాడు మహావిష్ణువు. -
బిడ్డ చాటు తల్లి
అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోసింది.ఊపిరి బిగబట్టి మనకు ప్రాణం పోసింది.పంటి మధ్య ప్రాణాన్ని నొక్కిపట్టి ఊపిరిని ఉగ్గులా పట్టించింది.తను పునర్జన్మ పొందుతూ మనకు జన్మనిచ్చింది. కనురెప్పలు వాల్చకుండా జోలపాట పాడింది. పీడకల మనకొస్తే.. తను ఉలిక్కిపడి లేచింది. అక్షరం తెలిసినా, లేకున్నా... మనకు వీరగాథలు చెప్పింది. నీళ్లు తాగిందో, కష్టాల కన్నీళ్లు తాగిందో...అమ్మ తన రక్తమాంసాలను పాల చుక్కలుగా మనకు పట్టించింది. అమ్మను మనం చిన్నచూపు చూసినా...అమ్మ కళ్లల్లో మాత్రం మన గొప్పతనమే కనపడేది. ‘అమ్మా...’ అని విలవిల్లాడినప్పుడు...‘కన్నా...’ అని వెక్కివెక్కి ఏడ్చింది. ఆనందంతో మనం నవ్వినప్పుడు... అమ్మ ఆకలి మరిచింది.ఓటమి మనల్ని కుంగదీస్తే ఒక్కసారి గాల్లో ఎగరేసి పట్టుకుంది.మనం గెలిచినప్పుడూ అమ్మ ప్రార్థించింది!మనది పసితనం.. అహంకారం కాదని దేవుడికి చెప్పింది. నిజమే. మనం తల్లి చాటు బిడ్డలం. ఎప్పటికీ తల్లిచాటు బిడ్డలం. చరిత్రలో ఎందరో బిడ్డలు. ఆ బిడ్డల్లో ఎందరెందరో ఘనులు... రాజులు... చక్రవర్తులు... మీరు... నేను... మనం...మరి మనం ఏ దేశానికి రాజులం?ఏ దేశానికి రాజులం కాలేకపోయినా అమ్మకు మనం ఎప్పుడూ మారాజులమే. ఇవాళ.. అమ్మని గుర్తుచేసుకుందాం. ఇంతకంటే గొప్ప పని కూడా చేయొచ్చు. ఇవాళ.. అమ్మని పలకరిద్దాం. మన చాటున, మన మాటున కనపడకుండా పోయిన అమ్మ మనసు తెలుసుకుందాం.మనసారా అమ్మను ప్రేమిద్దాం. ప్రేమ ఇద్దాం. మీ రామ్ ఎడిటర్, ఫన్డే – ఫ్యామిలీ -
మిల మిల మెరిసే మీనాక్షి!
సోనాక్షి సిన్హా నటి మాత్రమే కాదు...చక్కగా బొమ్మలు గీస్తుంది. అంతకంటే చక్కగా పాడుతుంది. ‘దబాంగ్–3’లో ‘రజ్జో పాండే’గా మరోసారి అలరించనుంది. ‘సంతోషం సగం బలం... ఆ బలం పనిలోనే ఉంది’ అంటున్న సోనాక్షి చెప్పిన కొన్ని ముచ్చట్లు... గొప్ప ఔషధం ఎలాంటి సమస్య నుంచి బయట పడడానికైనా ఒక ఔషధం ఉంది. అదే పని! పనిలో తలమునకలైపోతే ఎలాంటి సమస్యను అయినా అధిగమించవచ్చు. ఇది నేను సొంత అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో జిమ్లో గడపడం, పెయింటింగ్, స్కెచ్చింగ్ వేయడం, సినిమాలు చూడడంలాంటివి చేస్తుంటాను. ఆత్మవిశ్వాసం వుమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ‘అకిరా’ సినిమా తరువాత ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్నాను. టైటిల్ రోల్ పోషించిన నా సోలో ఫిల్మ్ ఇది. ఇది నాలోని ‘స్కిల్స్’ని నాకు తెలియజేసిన సినిమా. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది. చాలెంజింగ్గా ఉండే స్క్రిప్ట్లను ఇష్టపడతాను. అప్పుడు మనలో మరోకోణం పరిచయమవుతుంది. మల్టీస్టారర్ సినిమాలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వల్ల నటులలో అభద్రతాభావం తలెత్తితే...హాలీవుడ్లోగానీ, బాలీవుడ్లోగానీ ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండేవి కావు. నాకు అలాంటి భయాలేమీ లేవు. ‘కళంక్’ సినిమాలో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, ఆలియా భట్, వరుణ్లతో నటించడం మంచి అనుభవం! సంతోషం జీవితంలో నా మొదటి ప్రాధాన్యత...ఎప్పుడూ సంతోషంగా ఉండడం! నేను సంతోçషంగా ఉండడం ఎంత ముఖ్యమో అవతలి వ్యక్తిని సంతోషంగా ఉంచడం అంతే ముఖ్యమని నమ్ముతాను. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రభావం చేసే పని మీద పడి చురుగ్గా ఉండగలుగుతాం. చదువు చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. నటి కావడానికి ముందు మూడు సంవత్సరాలు ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది ఇప్పుడు ఏదో ఒకచోట ఉపయోగ పడుతూనే ఉంది. ఉదాహరణకు సెట్లో ఉన్నప్పుడు ‘క్విక్ అల్టరేషన్’ అవసరమైంది అనుకోండి... సై్టలిస్ట్లు, డిజైనర్లకు ఏంచేయాలో చెబుతాను. ఇది నా వృత్తిలో భాగం అనుకుంటాను. -
రెక్కల పుస్తకం
పసితనంలో పిల్లలు జోలపాటలను ఇష్టపడతారు. మాటలు నేర్చి, ఊహ తెలిశాక ఎన్నెన్నో ఊసులు చెప్పడం మొదలుపెడతారు. అలా ఊసులు చెప్పే దశలోనే వాళ్లు కథలకు చెవులొగ్గుతారు. పిల్లల కథలు ఈనాటివి కాదు, భాషలు ఊపిరి పోసుకున్నది మొదలు పిల్లల కథలు ప్రచారంలో ఉన్నాయి. తల్లులు చెప్పే కథలను పిల్లలు ఊ కొడుతూ వింటారు. కథలు వింటూ వాళ్లు తమ ఊహలకు పదునుపెట్టుకుంటారు. లోకంలోని మంచి చెడులను ఆకళింపు చేసుకుంటారు. అచ్చు యంత్రం అందుబాటులోకి వచ్చాక నానా ఉద్గ్రంథాలతో పాటు పిల్లల పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. టీవీలు, ట్యాబ్లు, స్మార్టఫోన్లు వంటి ఆధునిక వినోద సాధనాలు అందుబాటులో లేని కాలంలో కథల పుస్తకాలే పిల్లలకు వినోద సాధనాలు. వీడియోగేమ్స్లో తలమునకలయ్యే మీ పిల్లలకు ఈ వేసవి సెలవుల్లో చక్కని కథల పుస్తకాలనివ్వండి. వాళ్లే గనుక ఒకసారి కథల రుచి మరిగితే, ఇతరేతర వినోద సాధనాల జోలికి ఇక వెళ్లాలనుకోరు. అనగనగా ఓ తాతా బామ్మా! 2000–2020 ‘రండర్రా పిల్లలూ మీ కోసం కథల పుస్తకాలు తెచ్చాను’ అని ముసలావిడ ఆందో లేదో, ‘అబ్బా నీ కధల పిచ్చితో చంపుతున్నావు, నేను పబ్జీ ఆడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నానా’ అని బుడుగు గాడి అరుపు. ‘నానమ్మా! నీ పేదరాశి పెద్దమ్మ కథ, లేదంటే రామాపురంలో సోములు అనే రైతుండేవాడు అని బోరు కొడతావు, ఎంచక్కా టీవీలో షించేన్ చూస్తూంటే’ అని బుజ్జి చిరాకుపడుతోంది. ‘అమ్మా వాళ్ళని వదిలేయేవే, అలా బలవంతంగా పుస్తకాలు చదివిస్తే వాటి మీద ఆసక్తి పోతుంది, యూట్యూబ్లో బోల్డు వినోదాత్మక విజ్ఞానంతో కూడిన వీడియోలున్నాయి చూసుకుంటారులే’ అని కొడుకు విసుక్కొంటున్నాడు. 1970–1990 ’ఏమర్రా పిల్లలూ ఎందుకు దెబ్బలాడుకొంటున్నారు’? ’చూడు బామ్మా! చందమామ చదువుతుంటే లాగేసుకొని చదువుతున్నాడు అన్నయ్య’. ‘నిన్న బాలమిత్ర వచ్చిన వెంటనే చెల్లే మొదట చదివింది. ఇవాళ నా వంతు బామ్మా.’ సెల్ ఫోన్లు, సామజిక మాధ్యమాలు రాకముందు పిల్లల పుస్తకాలు లేని గడప ఉండేది కాదు, గ్రంథాలయాకు వెళ్లని పిల్లలుండేవారు కాదు. బుడి బుడి అడుగులేస్తున్నప్పుడే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు పురాణాలు, ఇతిహాసాల నుంచి కథలు చెప్పి, వారికి పుస్తకాలను అలవాటు చేసేవారు. పంచాయతీ నుంచి పట్టణం వరకు ఊరూరా గ్రంథాలయాలుండేవి. ఎన్నో పిల్లల మాస పత్రికలు ప్రచురణలో ఉండేవి. కొత్త మాసపత్రిక చేతికందగానే చదవడానికి ఎగబడేవారు. చదువుతున్నంతసేపూ ఆకలి దప్పులను కూడా మరచేవారు. మంచి సాహిత్యం చదివితే మెదడు చైతన్యవంతమవుతుంది. రేవులోని నావలకు దారి చూపించే దీప స్థంభాల్లాంటివి పుస్తకాలు. అవి పిల్లల బంగారు భవిష్యత్తుకు పూల బాట వేస్తాయి. కాబట్టి పిల్లలకు చిన్నతనంలోనే పుస్తక పఠనం అలవాటు చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్లతో కూర్చుని కథలు చెబుతూ, వాళ్ల చేత కథలు చదివించాలి. 2013 లో జపాన్లో తోహోకూ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో ఒక విద్యా విషయ కార్యక్రమం పిల్లలకు టీవీలో చూపించారు. అదే అంశంపై రాసిన పుస్తకమిచ్చి మరో వర్గం పిల్లలచేత చదివించారు. మర్నాడు టీవీ చూసిన పిల్ల్లలు కంటే పుస్తకం చదివిన పిల్లల పదకోశం, విజ్ఞానం ఎన్నో రెట్లు మేలుగా ఉందని నిరూపించారు. బాల్యం నుంచి తరచు పుస్తకాలు చదివేవారికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 2.5 రెట్లు తక్కువగా ఉంటుంది. టెలివిజన్ నరాలను ఉద్వేగానికి లోనుచేస్తే, పుస్తకపఠనం ఉద్వేగాన్ని అదుపులో పెడుతుంది. ఇంగ్లాండ్ లో సస్సెక్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం ఆరు నిమిషాల పుస్తక పఠనం ఒత్తిడి స్థాయిని 68 శాతం మేరకు తగ్గిస్తుంది.బాలల సాహిత్యానికి నాంది మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి వివిధ భాషలలో, మాండలికాలలో లాలిపాటలు, జానపద కథలు గేయాలు, లయబద్ధమైన పద్యాలూ మనుగడలో ఉండేవి, కాకపోతే అక్షరరూపం దాల్చలేదు. పిల్లల సాహిత్యం ప్రజాదరణ పొందుతున్న కొద్దీ క్రమేపి ప్రపంచంలోని వేర్వేరు భాషల్లో పుస్తకరూపం దాల్చాయి. పిల్లల సాహిత్యంలో ఆదిగ్రంథం ‘పంచతంత్రం’ అని చెప్పుకోవచ్చు. క్రీస్తుపూర్వం 200 ప్రాంతంలో కాశ్మీర్ రాజ్యంలో విష్ణు శర్మ చేత పంచతంత్ర ప్రాణం పోసుకుంది. భారతదేశ సుగంధ ద్రవ్యాల పరిమళం పర్షియన్లు, అరబ్బులు, రోమన్లు, పోర్చుగీసులు, డచ్చు వారి ముక్కుపుటాలకు తగిలి వాటి కోసం ఎగబాకారు. సముద్ర మార్గం గుండా వాణిజ్యం ఆరంభించారు. ఎగుమతులు, దిగుమతుల ద్వారా వస్తుమార్పిడితో పాటు మన పిల్లల సాహిత్యం కూడా పట్టుకెళ్లారు. భారతదేశం నుంచి పంచతంత్ర పర్షియాకు, అరేబియాకు అక్కడ నుంచి జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆఫ్రికా, చివరికి అమెరికాకు వ్యాప్తి చెందిందని ప్రముఖ వ్యాకరణవేత్త మాక్స్ ముల్లర్ తన అధ్యయనం ‘మైగ్రేషన్ ఆఫ్ ఫేబుల్స్’లో వెల్లడించాడు. పశ్చిమ దేశాల వారి ‘టామ్ అండ్ జెర్రీ’కి గాని, ‘లయన్ కింగ్’కి గాని, మరో జంతు విషయ పుస్తకమేదైనా వాటికి మూలం మన పంచతంత్రమే. అందుకే అత్యధిక దేశాల్లో పిల్లలు మనదేశంలో మాదిరిగానే కోతి బావ, జిత్తులమారి నక్క మామ, కపట మొసలి ప్రధానాంశంగా ఉండే నీతి కథలు చదివేవారు. క్రమేపి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు నేపథ్యాలతో పిల్లల సాహిత్యం రూపుదాల్చింది. భారతదేశంలో సుమతీ, వేమన శతకాలు, రామాయణ, భారత గాథలు, ఐరోపా దేశాల్లో ’సిండ్రిల్లా’ లాంటి కథలు, పశ్చిమాసియా ప్రాంతంలో ‘ద అరేబియన్ నైట్స్’ కథలు, ఉత్తర అమెరికాలో ‘ది నెర్గో ఫోక్ స్టోరీస్’, ’అంకుల్ రేమూస్’ వంటి కథలు 17వ శతాబ్ది నాటికి పుట్టుకొచ్చాయి. ఆధునిక బాల సాహిత్యానికి నాంది 17వ శతాబ్దంలో పడింది. పారిశ్రామిక విప్లవం పుట్టుకొచ్చినప్పుడు నిరుపేద కుటుంబాల పిల్లలను బొగ్గు గనులలో, కర్మాగారాల్లో, బాల కార్మికులుగా నియమించుకొనేవారు. అగ్ర రాజ్యం అమెరికాలో సైతం నాలుగేళ్ల ప్రాయమున్న పిల్లలను ఫ్యాక్టరీ చిమ్నీలోకి పంపి లోపల శుభ్రం చేయించేవారు. బాల కార్మిక చట్టాలు లేని 19వ శతాబ్దంలో పిల్లలను బానిసలుగా భావించే వారు తప్ప పిల్లల కోసం సాహిత్యం రాసేంత గొప్ప ఆలోచన అప్పటికి కలగలేదు. ఏడాదిలో 50 పుస్తకాలు వివిధ దేశ భాషల్లో ముద్రణయితే గొప్పే. 19వ శతాబ్దం చివరిలో ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ బాలకార్మికుల చట్టాలను పటిష్ఠంగా తీర్చిదిద్ది, పిల్లలకు అన్ని హక్కులతో పాటూ విద్యాహక్కు కల్పించి, నిర్బంధ విద్యను ప్రోత్సహించాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తెచ్చిన సామాజిక మార్పుల క్రమంలో గణనీయంగా అభివృద్ధి చెందిన పిల్లల సాహిత్యం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చతికిలబడింది. అధిక ముద్రణ ఖర్చు, తగ్గిన గిరాకీ, కాగితం కొరత వలన ప్రచురణకర్తలు పిల్లల సాహిత్యంపై ఆసక్తి కోల్పోయారు. అయితే 1950లు నుంచి మొదలు పిల్లల సాహిత్యంలో ఆధునిక పోకడలు విస్తృతంగా చోటుచేసుకున్నాయి. 1990 ల వరకు రేడియో, టెలివిజన్ల ప్రభావం పిల్లలపై పడలేదు, పుస్తకాలకు ఆటంకం ఏర్పడలేదు. బాల సాహిత్యం వైపు మొగ్గుచూపిన ప్రముఖ రచయితలు 1936లో ఒక తాత మరో ఊళ్లో పెరుగుతున్న తన మనవడికి రెండు కథలు రాసి పంపాడు. ఆ మనవడు పెద్దవాడయ్యాక తన తాత జేమ్స్ జోయిస్ చిన్నప్పుడు పంపిన ‘ది క్యాట్ అండ్ ది డెవిల్‘ కథల పుస్తకంగా అచ్చు వేయించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రచయితయిన జేమ్స్ జోయిస్ అద్భుతమైన బాల సాహిత్యం కూడా రాశాడు. వేలాదిగా పద్యాలు, పెద్ద సంఖ్యలో నవలలు రాసిన ఇ. ఇ. కమ్మింగ్స్ తన బంగారు పట్టి కోసం నాలుగు కథలు రాశాడు. తండ్రి జ్ఞాపకార్థం కుమార్తె నాన్సీ వాటిని 1965లో ‘ఫేరీ టేల్స్’గా పుస్తకం వేయించింది, ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం పాఠకాదరణ పొందింది.ప్రముఖ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే తన ప్రేయసి మేనల్లుడి కోసం రాసిన ‘ది గుడ్ లయన్ అండ్ ది ఫెయిత్ఫుల్ బుల్’ కథను 1951లో మొదటిసారి హాలిడే మ్యాగజైన్ ప్రచురించింది. ‘బ్రేవ్ న్యూ వరల్డ్’ రాసిన ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లే 1944లో తన ఐదేళ్ల మేనకోడలి కోసం రాసిన కథానికను ‘ది క్రోస్ ఆఫ్ పియర్బ్లోసమ్’గా 1967లో ర్యాండమ్ హౌస్ ప్రచురించింది. డజన్ల కొద్దీ నవలలు వ్రాసి సాహిత్యంలో రెండుసార్లు పులిట్జర్ బహుమతి గెలుచుకున్న జాన్ అప్డైక్ తన కూతురు ఎలిజబెత్ కోసం రాసిన కథలు ‘ఏ చైల్డ్స్ క్యాలండర్’, ‘ది మేజిక్ ఫ్లూట్’, ‘బాటమ్ డ్రీమ్’, ఏ హెల్ప్ఫుల్ ఆల్ఫాబెట్ అఫ్ ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్స్’ వంటివి ప్రాచుర్యం పొందాయి. తన సోదరి కొడుకుని ముఖ్య పాత్రధారిగా చేసుకొని బాల్యం ఎంత మధురమైంది అనే అంశాన్ని ప్రతిబింబించే ‘లిటిల్ బోయ్ లిటిల్ బోయ్’ అనే పిల్లల పుస్తకాన్ని జేమ్స్ బాల్డ్విన్ రాశాడు. ఇరవయ్యో శతాబ్దపు ప్రఖ్యాత కవులలో ఒకరైన టి. ఎస్. ఇలియట్ తన ప్రేయసి పిల్లల కోసం మారు పేరుతో కథలు రాశాడు. ఆ కథలను ‘ఓల్డ్ పాసమ్స్ బుక్ ఆఫ్ ప్రాక్టికల్ క్యాట్’ పేరిట ఫేబర్ – ఫేబర్ ప్రెస్ వారు 1939లో ప్రచురించారు. అతంత్య వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీ 1980ల్లో రాసిన ‘సెటానిక్ వెర్సస్’ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూంటే, తొమ్మిది ఏళ్ల కొడుక్కి బాధనిపించి ‘ఈ సమస్యాత్మక రాతలు మానేసి పిల్లల కథలు రాయొచ్చు కదా నాన్న మా స్కూల్లో స్నేహితులందరూ నిన్ను విలన్గా అభివర్ణిస్తున్నారు’ అని వాపోతే రష్డీ రాసిన పుస్తకం ‘హారూన్ అండ్ ది సీ ఆఫ్ స్టోరీస్’. కథలు రాసే నైపుణ్యం, ఇచ్ఛ, సామర్థ్యాన్ని కోల్పోయి, మానసికంగా కుంగిపోయిన ఒక ప్రముఖ రచయితని తన పదేళ్ల కొడుకు సాహసయాత్రకు తీసుకువెళ్లి తండ్రి కోలుకునేలా శతవిధాలా ప్రయత్నిస్తాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని అత్యద్భుతంగా చెప్పి స్ఫూర్తినిస్తుంది ఈ కథ. దీనికి అనుబంధంగా టీనేజ్ పిల్లల కోసం 2010లో, ‘లూకా అండ్ ఫైర్ ఆఫ్ లైఫ్’ పుస్తకాన్ని రాశాడు సల్మాన్ రష్డీ. ప్రముఖ నవల ‘ఫౌకాల్ట్స్ పెండ్యూలం’తో ప్రసిద్ధికెక్కిన ఇటలీ తత్వవేత్త ఉంబెర్టో ఎకో అత్యద్భుత సైన్స్ ఫిక్షన్ రాసి అంతరిక్షం, అణుబాంబు వంటి అంశాల పై పిల్లలకు ఆసక్తి పెంపొందించేటట్టు చేశాడు. అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ముగ్గురు వ్యోమగాములు తమ దేశాల నుంచి ఒకరికి తెలియకుండా ఒకరు బయలుదేరి మార్స్ గ్రహం మీద తామే ముందు అడుగిడాలని ప్రయత్నిస్తారు, చివరికి ముగ్గురూ ఒకే సమయంలో మంగళగ్రహం మీదకు చేరుకొనే నేపథ్యంలో ఎకో రాసిన పుస్తకమే ‘ది త్రీ ఆస్ట్రోనాట్స్’ చిన్నపిల్లలకు అణువు పరమాణువుని విశదీకరించి చెప్పడమే కాకుండా యుద్ధం వలన కలిగే నష్టాన్ని, శాంతి సందేశాన్ని బొమ్మలను జోడించి మరీ వివరించాడు ఎకో ‘ది బాంబ్ అండ్ ది జనరల్’ అనే పుస్తకంలో. కయ్యానికి కాలుదువ్వే మిలిటరీ జనరల్ అణుబాంబులు ప్రయోగించి యుద్ధం చేద్దామనుకొంటూండగా, ప్రజలను చూసి జాలిపడి ఆ దుష్పరిణామం ఊహించుకోలేక అణువులన్నీ కూడగట్టుకొని బాంబుల్లోంచి బయటకు వచ్చేస్తాయి. పేలుడు జరగదు. కథ సుఖాంతం. లియో టాల్స్టాయ్కి పిల్లలంటే ప్రేమ. తన ఎస్టేట్లో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు. అయ్యో ఇప్పటి వరకు పిల్లల కోసం ఏమీ రాయలేదే అని అనుకున్నదే తడవుగా రాయడం మొదలెట్టి ‘ఏబీసీ బుక్’, ‘న్యూ ఏబీసీ బుక్’ బాల కథాసంపుటాలను ప్రచురించాడు. – సునీల్ ధవళ సీఈఓ, ద థర్డ్ అంపైర్ మీడియా పుస్తకాలే మార్గదర్శి మంచి పుస్తకాల కంటే పిల్లలకు గొప్ప స్నేహితులుండరు. విజ్ఞానాన్ని అందించడంలో పుస్తకాలు కల్పవృక్షాల్లాంటివి. బుద్ధి బలాన్ని పెంచి మనోవికాసాన్ని కల్పించడంలో పుస్తకాలకు మించిన అక్షయపాత్ర ఉండదు. పిల్లల ప్రవర్తనకి మూలం ఆలోచనలయితే, వాటికి ప్రతిబింబం చదివిన సాహిత్యమే. పిల్లల స్వభావం పాక్షికంగా వారు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. పుస్తకాలలోని పాత్రధారులు, సన్నివేశాలు ప్రేరణనిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. మంచి సాహిత్యం, పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతూ, పుస్తకపఠనాన్ని దినచర్యగా చేసుకొంటే మేధస్సు వికసిస్తుంది. పుస్తకాలు సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికి దొహదపడతాయి. టీవీ, వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, సామజిక మాధ్యమాలు మానసిక వ్యాకులతకు దారితీస్తే, పుస్తకాలు ఆ వ్యాకులతను తరిమికొడతాయి. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అనూహ్యం, అమోఘం. -
చుక్కలాంటి చక్కనమ్మ!
చక్కనమ్మ చిక్కకపోతే కష్టమే...లాంటి కామెంట్స్ను సీరియస్గా తీసుకొని, ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గి సన్నబడి ఆశ్చర్యంలో ముంచెత్తింది పరిణీతి చోప్రా. తాజాగా బాలీవుడ్ సినిమా ‘కేసరి’లో జీవనిగా మెరిసిన చోప్ర రేపోమాపో తెలుగు సినిమాల్లో కూడా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘పక్కా యాక్షన్ సినిమాలో నటించాలని ఉంది’ అంటున్న పరిణీతి మనసులో మాటలు... అలా చేశాను! మూడురోజులు వార్తల్లో లేకపోతేనే ‘ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే’ అని గుసగుసలాడుకునే ఇండస్ట్రీ మనది. అలాంటిది ఆ మధ్య పదినెలలు బ్రేక్ తీసుకునేసరికి ఎన్నో గాసిప్స్ వినిపించాయి. అవకాశాలు లేక తీసుకున్న విరామం కాదు అది. నిజం చెప్పాలంటే... నా కెరీర్ గురించి సింహావలోకనం చేసుకోవడానికతీసుకున్న విరామం. ఎలాంటి పాత్రలు నాకు నప్పుతాయి, ఏవీ కావు అనే దాని గురించి విశ్లేషించుకున్నాను. ఈ విషయంలో ఆదిత్యచోప్రా, మనీష్శర్మ సహకరించారు. ఫిట్నెస్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.ఇప్పుడు నేను ఛార్జ్ కావడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి ఆ విరామమే కారణం. చబ్బీగా ఉంటేనే ఇష్టపడే అభిమానులకు బరువు తగ్గడం నచ్చలేదు అనుకోను. నా బరువులో మార్పే కాని వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు కదా! మిక్సింగ్! ఫిట్నెస్ అంటే ప్రతిరోజూ, ప్రతిపూటా మనల్ని మనం సవాలు చేసుకోవడం. ఈ సవాలులో మజా అనుభవించకపోతే వర్కవుట్స్ అంటేనే బోర్కొడుతుంది. అందుకే ఎప్పుడూ ఒకేరకమైన వర్కవుట్స్ కాకుండా మిక్స్ చేస్తుంటాను. నా విషయానికి వస్తే గంట నుంచి రెండు గంటల వరకు డ్యాన్స్ చేస్తాను. స్విమ్మింగ్ చేస్తాను. కేరళ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు సాధన చేస్తాను. పాడుతా తీయగా... సినిమా చూశాం అంటే చూశాం అన్నట్లు కాకుండా ఆ సినిమాలో నుంచి ఏదో ఒక విషయంలో మనం ఇన్స్పైర్ కావాలి. ఫలానా స్కర్ట్ ధరించాలనో, ఫలనా హెయిర్స్టైయిల్ ఫాలో కావాలనో, ఇలాంటి గుణాలున్న వ్యక్తిని జీవితభాగస్వామిగా ఎంచుకోవాలనో... ఇలా ఏదైనా కావచ్చు.కామెడీ సినిమాలో నటించాలనే కోరిక ‘గోల్మాల్’తో తీరినా మంచి యాక్షన్ సినిమాలో నటించాలనే కోరిక బలంగా ఉంది.మ్యూజిక్ అంటే మొదటి నుంచి ఆసక్తి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే రోజుల్లో కూడా ఫస్ట్ఫ్లోర్లో అటు ఇటూ నడుస్తూ పాడేదాన్ని. మ్యూజిక్ను సీరియస్గా తీసుకుంటాను. ఎన్నో పాటలు పాడాలని, లైవ్ షోలు చేయాలనే కోరిక ఉంది. -
మంచి కోరే మనిషి
కర్పూర కు ఆ కాలనీలో మొదట పరిచయమైంది శ్యామలి. పక్కపక్క ఇళ్లు కావడం వల్ల అయిన పరిచయం కాదది. కర్పూర, శ్యామలి వేర్వేరు వీధుల్లో ఉంటారు. ఎప్పుడైనా.. కాలనీ బయట మెయిన్ రోడ్డులో ఉన్న సూపర్ మార్కెట్లో ఒకరికొకరు కనిపిస్తుంటారు. అప్పుడైన పరిచయం. ‘కర్పూర.. పేరు బాగుంది’ అంది శ్యామలి.. పరిచయం కాగానే. ‘శ్యామలి పేరు కూడా కొత్తగా ఉంది. శ్యామల, కోమలి కలిసినట్లు’ అని నవ్వింది కర్పూర. కాలనీలో కోమలి తప్ప కర్పూరకు మరొక పరిచయం లేదు! ∙∙ నెలక్రితమే కర్పూర ఆ కాలనీకి వచ్చింది. ఆమె భర్త రోహిత్. భార్యకు చూపించకుండానే రోహిత్ రెంట్ అడ్వాన్స్ కట్టేసి, ఆ కాలనీకి ఆమెను తీసుకొచ్చాడు. నమ్మకం. కాలనీ గానీ, ఇల్లు గానీ తనకు నచ్చిందంటే భార్యకూ నచ్చుతుందని. అతడికున్న నమ్మకాన్ని మించి కర్పూరకు ఆ ఇల్లు చాలా నచ్చింది. రోహిత్కి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం. కర్పూర పెళ్లికి ముందే చెప్పేసింది.. తనకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదని. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఈ మధ్యలో ఒకట్రెండుసార్లు అడిగాడు రోహిత్.. ‘‘మంచి కంపెనీ అట. నీ క్వాలిఫికేషన్స్కైతే నిన్ను కళ్లకద్దుకుని తీసుకుంటారు’’ అని. ‘‘ఎంత కళ్లకద్దుకుని తీసుకున్నా.. నేను ఉద్యోగం చెయ్యనని’’ చెప్పేసింది కర్పూర. ‘‘హాయిగా ఇంట్లోనే ఉంటాను రోహిత్’’ అంటుంది ఎప్పుడూ కర్పూర. భవిష్యత్తును చక్కబెట్టుకోవడం కన్నా ఇల్లు చక్కబెట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఆ సంగతిని మొదట్లోనే గ్రహించాడు రోహిత్. అందుకే ఆమెను బలవంతపెట్టడు. పిల్లలు అప్పుడే వద్దనుకున్నారు కాబట్టి.. వాళ్లిద్దరి మధ్య డబ్బూ కాకుండా.. పిల్లలూ కాకుండా.. ఆ వయసులో ఉండే సరదా కబుర్లే ఉండేవి. ఇలా సరదాగా కబుర్లతో సాగిపోతున్న కర్పూర జీవితంలోకి అకస్మాత్తుగా శ్యామలి కాకుండా ఇంకో కొత్త వ్యక్తి ప్రవేశించడం జరిగింది. ఆ వ్యక్తి స్త్రీ కాదు. పురుషుడు! ‘‘మీతో కాస్త మాట్లాడొచ్చా?’’ అన్నాడు ఆ వ్యక్తి, కర్పూర దగ్గరకు వచ్చి. కంగారు పడింది కర్పూర. అది చీకటి పడబోతున్న సాయంత్రం కానీ, తెల్లారబోతున్న చీకటి కానీ కాదు ఆమె కంగారు పడడానికి. మిట్ట మధ్యాహ్నం. ఆ టైమ్లో కాలనీలో బయటెవరూ ఉండకపోవడం కాలనీకి వచ్చిన మొదట్లోనే గమనించింది కర్పూర. ఉద్యోగాలు చేసేవాళ్లంతా ఆఫీసులకు వెళ్లిపోయాక, పిల్లల్ని స్కూల్లో వదిలొచ్చిన ఆడవాళ్లు ఇంట్లో పనిలో పడిపోయాక, కాలనీ వీధులు నిశ్శబ్దంగా అయిపోతాయి. బహుశా ఆ కాలనీ కొత్తది కావడం వల్ల కావచ్చు.. జన సంచారం ఉండదు.‘‘మీతో కాస్త మాట్లాడొచ్చా’’ అని అతడు అడిగాక.. కంగారుపడి, బిత్తరపోతున్నట్లుగా అతడిని చూసింది కర్పూర. ‘‘భయపడకండి. మీ మంచి కోరేవాడిని. ఊదా రంగు ఇంట్లోనే కదా మీరు ఉంటారు’’ అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటకు కర్పూర మరింత భయపడింది. అంటే.. ఎప్పటి నుంచో గమనిస్తున్నాడన్నమాట! ‘మీరెవరు? నా మంచి కోరడం ఏంటి?’ అని ఆమె అడగొచ్చు. కానీ అతడికి ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వదలచుకోలేదు. అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. మెయిన్ రోడ్డు మీదకు చేరుకుంటుండగా.. ఆమెకు అనిపించింది.. ‘వెనక్కు తిరిగి చూస్తేనో..’ అని. కానీ చూడలేదు. తను చూస్తే, తను చూడ్డం అతను చూస్తే.. మాట్లాడేందుకు అతడు మళ్లీ అవకాశం తీసుకుంటే!! సూపర్ బజార్లో కావలసినవేవో తీసుకుని తిరిగి అదే దారిలో వస్తూ ఉంటే.. ‘మళ్లీ రాడు కదా’ అనుకుంది. రాలేదు! ఊపిరి పీల్చుకుంది. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకుంటూ మేల్కొనే ఉన్నారు కానీ.. ఆ మధ్యాహ్నం తారసపడిన ఆ మంచికోరే మనిషి గురించి కర్పూర రోహిత్కి చెప్పలేదు. ఆ తర్వాత ఆమె కూడా ఆ సంగతి దాదాపుగా మర్చిపోయింది. అలా మర్చిపోతున్న సమయంలో.. మళ్లీ అదే చోట, అదే సమయంలో అతడు ఓ రోజు ప్రత్యక్షమయ్యాడు! గుండె గుభేల్మంది కర్పూరకి. ‘‘భయపడకండి. మీ మంచి కోరేవాడిని’’ అన్నాడతను. మళ్లీ అదే మాట!‘‘చూడండి. మీరు నాకేం చెప్పనవసరం లేదు. నేనేం వినే అవసరం లేదు. సాయంత్రం నా భర్త వస్తాడు. మీరు చెప్పదలచుకుంది ఏమైనా ఉంటే ఆయనకు చెప్పండి’’ అని చెప్పి.. వేగంగా కదిలి వెళ్లిపోయింది. అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్లకుండా.. నేరుగా పక్క వీధిలోని శ్యామలి ఇంటికి వెళ్లింది. శ్యామలి ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూసింది. ‘‘మీరేంటి.. ఇలా?’’ అంది. కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చింది. గటగటా నీళ్లు తాగేసింది కర్పూర. ఆ తర్వాత.. ఆ మంచి కోరే వ్యక్తి గురించి చెప్పింది. ‘‘వాడేంటట.. నీ మంచి కోరేది’’ అంది శ్యామలి చిరాగ్గా. ‘‘రోహిత్కి చెప్పేదా?’’ అంది కర్పూర.‘‘చెప్పడమే మంచిది. ఇప్పటికే రెండుసార్లు ఇలా అయింది కదా. మూడోసారి కాకూడదనేముందీ’’ అంది శ్యామలి. ఆ రాత్రి రోహిత్కి బాగా దగ్గరకి జరిగి, అతడి గుండె మీద చెయ్యి వేసింది కర్పూర. సాధారణంగా అతడే ఆమెవైపు జరుగుతాడు. ఆ రోజు కర్పూరే అతడి వైపు జరిగింది. ‘‘కాలనీ మారిపోదాం రోహిత్’’ అంది. రోహిత్ నవ్వాడు. ‘‘ఏంటిది సడెన్గా?’’‘‘నాకంతా చికాకు చికాకుగా ఉంది రోహిత్. అతనెవరో.. నా మంచి కోరతానని.. కాలనీలో నా వెంట పడుతున్నాడు’’.. చెప్పింది కర్పూర. ‘‘అవునా!’’ అన్నాడు అశ్చర్యంగా. ‘‘ఈసారి నీతో మాట్లాడ్డానికి ట్రై చేస్తే ఫోన్ కలిపి అతనికివ్వు’’ అన్నాడు. ఆ తర్వాత కర్పూర నిశ్చింతగా నిద్రపోయింది.రోహిత్కే నిద్రపట్టలేదు. రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తనని ఓ వ్యక్తి ఆపడం రోహిత్కి గుర్తొచ్చింది. ‘మీది ఊదా రంగు ఇల్లే కదా అన్నాడు. మీ మంచి కోరి ఓ విషయం చెప్తాను’ అన్నాడు. చెప్పమన్నాడు రోహిత్. అతడు చెప్పాడు! ఉదయం ఆఫీస్కి బయల్దేరేముందు ఇంటి ఓనర్కి ఫోన్ చేసి.. ‘‘ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిపోయిన టెనెంట్ ఫొటో ఉందా మీ దగ్గర? ఉంటే వాట్సాప్ చేస్తారా?’’ అని అడిగాడు. ‘‘ఎందుకు?’’ అటువైపు నుంచి ప్రశ్న. ‘‘వెంటనే ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నాడు మమ్మల్ని. మా మంచికేనట’’ చెప్పాడు రోహిత్. ‘‘సరే పంపిస్తాను’’ అన్నాడు ఇంటి ఓనర్. ఆ లోపే ఇంట్లోంచి పెద్దగా అరుస్తూ బయటికి వచ్చింది కర్పూర. ‘‘ఇదిగో.. ఇతనే.. ఇతనే..’ అంటూ భయంగా ఒణికిపోతోంది. ఆమె చేతిలో ఎవరిదో గ్రూప్ ఫొటో ఉంది. అటక మీద నుంచి ఫ్యాన్ గాలికి బూజుతో పాటు రాలి పడిన ఫొటో అది. ఫొటో తీసుకుని చూశాడు రోహిత్. ‘‘ఇతనే.. కాలకనీలో నాతో మాట్లాడాలని ట్రై చేస్తోంది’’ చెప్పింది కర్పూర. బయటికి వచ్చాక ఇంటి ఓనర్కి ఫోన్ చేసి.. ‘‘ఫొటో పంపక్కర్లేదు’’ అని చెప్పాడు రోహిత్. చెప్పి, అటక మీద నుంచి రాలి పడిన ఫొటోలో ఆ మంచి కోరే మనిషిని మాత్రం ఫొటో తీసి ఇంటి ఓనర్కి వాట్సాప్ చేశాడు. వెంటనే రిప్లయ్ వచ్చింది.‘ఇతనే ఆ టెనెంట్. చనిపోయి చాలాకాలం అయింది’ అని. ఆ సంగతి కర్పూరకు చెప్పలేదు రోహిత్. ఆ తర్వాత కొద్దిరోజులకే కాలనీ మారిపోయారు రోహిత్, కర్పూర. ఇల్లు మారితే సరిపోతుంది కదా అంటే.. కర్పూరే.. ‘‘వద్దు.. కాలనీనే మారిపోదాం’’ అంది. -
పదేళ్ల ఫన్
అన్ని పేపర్లూ ఒక ఆదివారం సంచిక ఇస్తున్నాయి కాబట్టి, అది ఇచ్చితీరాల్సింది అయిపోయింది. కానీ ఏం ఇవ్వాలి? దానికి ఏం పేరు పెట్టాలి? కేవలం ‘సాక్షి ఆదివారం’ అంటే సరిపోదు. దానికో బ్రాండింగ్ ఇవ్వాలి. దానికో ఫిలాసఫీ ఉండాలి. ఫన్ ఉండాలి, లైట్ రీడింగ్ కావాలి, ఎమోషన్ ఇవ్వాలి... ఈ ఆలోచనల ఆలంబనగా ‘ఫన్డే’ పురుడు పోసుకుంది. 2008 మార్చి 30న ఫన్డే తొలిసంచిక వచ్చింది. 25.36 సెంటీమీటర్లు ఎత్తు, 19.23 సెంటీమీటర్లు వెడల్పు, 44 పేజీలు, గ్లేజ్డ్ కవర్ మీద హీరోయిన్ ముఖచిత్రం, మూడు సీరియళ్లు, కిసుక్కులు, కార్టూన్లు, కాలమ్స్తో మార్కెట్లోని వీక్లీలను తలదన్నేలా ముస్తాబై వచ్చింది. ‘హావ్ ఫన్’ అంటూ ఫీచర్స్ ఎడిటర్ రేపటికి ముందడుగు వేశారు. ‘హోమ్ థియేటర్’లో పిడుగులు తెగ అల్లరి చేశారు. ‘ముచ్చటైన ఆశ’ అంటూ భార్యాభర్తలు ఒకరినొకరు ఈ ‘అనుబంధం’ వేదికగా తమ అనుబంధాల్ని చాటుకున్నారు. ‘చిన్నారి కళ’ అంటూ పిల్లలు వారి బొమ్మలతో వాళ్ల వాళ్ల స్కూళ్లలో సెలబ్రిటీలు అయిపోయారు. ‘మా ఊరి ముచ్చట’ అంటూ ఎంతోమంది తమ ఊరిమూలాల్ని తడుముకున్నారు. ‘జనపదం’ అంటూ వారి ప్రాంతానికే ప్రత్యేకమైన మాటలను రాసిపంపారు. తెరమరుగైన నటులు ఇప్పుడేం చేస్తున్నారో ‘అజ్ఞాతవాసం’ గుర్తుచేసింది. సులభమైన అర్థ వివరణతో ‘వేమన్న వెలుగులు’ మరింత చేరువయ్యాయి. ‘అన్నమయ్య అన్నమాట’ ఆయన భావాల్ని మరింత సుకరం చేసింది. ‘యుద్ధక్షేత్రం’ సైనికుల జీవితాల్లోని గొప్ప అనుభవాలను అందించింది. పోలీస్ అధికారుల వృత్తిజీవితంలో ఛేదించిన ‘బెస్ట్ కేస్’ ఏమిటో తెలిసేలా చేసింది. పురాణాల్లోని చక్కటి నీతి కథలను ‘పురానీతి’గా అందిస్తోంది. అలనాటి మేటి కథకులతోపాటు నేటి ‘కొత్త కథలోళ్ల’కు కూడా పెద్దపీట వేస్తోంది. ఈ పదేళ్లలో ఇంకా ఎన్నో కాలమ్స్ ఫన్డేను పాఠకులు తమ గుండెలకు హత్తుకునేలా చేశాయి. నా మొదటి సినిమా, ప్రకృతి వైద్యం, నామవాచకం, నో ప్రాబ్లమ్, బేతాళ ప్రశ్నలు, పదశోధన, రాలిన మొగ్గలు, పదాలు పెదాలు, ఆజన్మం, రియాలిటీ చెక్, గ్రేట్ లవ్స్టోరీస్, మెడికల్ మెమరీస్, మీరే పారిశ్రామికవేత్త, నిజాలు దేవుడికెరుక, సినిమా వెనుక కథ, సత్వం, శ్రీకారాలు శ్రీమిరియాలు, రిలేషణం, సీన్ మాది టైటిల్ మీది, తెలుగు జాతీయాలు, సినిమా వెనుక కథ, లేడీస్ టైలర్, ఫన్టైమ్, ఉత్తమ విలన్, కిర్ర్ర్, కొత్త పదం... పదేళ్లలో ఎన్నో ప్రత్యేక ఫన్డే సంచికలు వచ్చాయి. వాలెంటైన్స్ డే స్పెషల్, న్యూ ఇయర్ స్పెషల్, సరళీకరణ 20 ఏళ్ల స్పెషల్, పచ్చళ్ల స్పెషల్, అనుబంధాల మీద సినిమా పాటల స్పెషల్, యోగా స్పెషల్, ముగ్గు ముచ్చట్ల మీద స్పెషల్. తిరుమల బ్రహ్మోత్సవాల సంచిక ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాం. 100వ సంచిక సందర్భంగా ‘తప్పక చూడాల్సిన 100 సినిమాలు, వినాల్సిన 100 పాటలు, చదవాల్సిన 100 పుస్తకాలు’ ఒక గ్రాండ్ సక్సెస్. లైబ్రరీ ఎడిషన్ లాంటి ఈ కాపీలు దొరక్క జిరాక్సులు చేసిపెట్టుకున్నవాళ్లున్నారు. ఫన్డే వేదికగా వచ్చిన టార్గెట్ 8, తాడంకి, ది థర్డ్, డేగ రెక్కల చప్పుడు, లోయ నుంచి శిఖరానికి, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఆకుపచ్చ సూర్యోదయం, రామానుజ మార్గం సీరియల్స్ ప్రత్యేక ఆదరణను చూరగొన్నాయి. మిగతా ఆదివారం అనుబంధాలకు భిన్నంగా, కాలానుగుణంగా పాఠకుల అభిరుచికి అద్దం పడుతూ, రూపాన్ని మార్చుకున్నప్పటికీ సారంలో ఏ ఆలోచనతో మొదలైందో అదే ‘ఫన్’థాలో ఈ పదేళ్లుగా సాగుతోంది ఫన్డే! రొటీన్ ఆదివారం అనుబంధాలకు భిన్నంగా, కాలానుగుణంగా పాఠకుల అభిరుచికి అద్దం పడుతూ, రూపాన్ని మార్చుకున్నప్పటికీ సారంలో ఏ ఆలోచనతో మొదలైందో అదే ‘ఫన్’థాలో ఈ పదేళ్లుగా సాగుతోంది ఫన్డే! -
జస్ట్ మ్యారీడ్
పెళ్లి చూపులు అయ్యాయి. అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చేశాడు. ‘అమ్మాయికి నచ్చితే చాలండీ, ఈ పెళ్లి జరిగిపోతుంది’ అని అబ్బాయి తండ్రి.. ముందే చెప్పేశాడు కాబట్టి అబ్బాయికి అమ్మాయి నచ్చిందా లేదా అన్నది ప్రశ్నే కాదసలు. తల్లి లేని బిడ్డ. ఒకడే బిడ్డ. చేతనైనంత త్వరగా వాడికో తోడును జత చేయడం తన బాధ్యత అనుకున్నాడు ఆ తండ్రి. అంతే తప్ప ‘నా కొడుకు నచ్చకపోతాడా’ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాదది. పెళ్లిచూపులు అయ్యాక, వరుడు చిరంజీవి అలోక్, వధువు చి.ల.సౌ. అఖిల అని శుభలేఖలు ప్రింట్ అవడానికి ముందు.. అలోక్ తండ్రి అలోక్కి తెలియకుండా మళ్లీ ఒకసారి అఖిల తల్లిదండ్రులను కలిశాడు. అప్పుడు అక్కడ అఖిల లేదు. ‘‘కడుపులో దాచుకుంటానంటే మీకొక విషయం చెబుతాను. చెప్పడం నా ధర్మం అనుకున్నాను. దాచుకోవడం మీ ధర్మం అనుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు భారంగా. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ‘‘అలోక్ ఇప్పటికీ నా గదిలోనే పడుకుంటాడు’’ అన్నాడు. ‘అందులో ఏముందీ’ అన్నట్లు చూశారు వియ్యంకులు. ‘‘ఇప్పటికీ వాడు నా పక్కనే పడుకుంటాడు’’ అన్నాడు.‘‘గారాబంగా పెరిగినట్లున్నాడు.. తల్లి లేని బిడ్డ కదా’’ అని నవ్వారు.‘‘గారాబం కాదు చెల్లెమ్మా’’ అన్నాడు అలోక్ తండ్రి.. అఖిల తల్లి వైపు చూసి. ఆమె తన భర్త వైపు చూసింది. ఇద్దరూ కలిసి మళ్లీ అలోక్ తండ్రి వైపు చూశారు. ‘‘మావాడికి.. దెయ్యాలంటే భయం. రాత్రి పూట ఒక్కడే పడుకోలేదు’’ అన్నాడు ఆయన.. కాస్త ఇబ్బంది పడుతూ. రాబోయే నవ్వును ఆపుకున్నారు అలోక్కి కాబోయే మామగారు. నవ్వితే బాగుండదని అలా ఉండిపోయింది అలోక్కి కాబోయే అత్తగారు. ‘‘అన్నయ్యా.. అసలిది విషయమే కాదు. మీరు మాకేం చెప్పలేదు. మేమేమీ వినలేదు. మీ అబ్బాయికీ తెలియనివ్వకండి. మా అమ్మాయికీ తెలియనివ్వం’’ అంది అఖిల తల్లి. ఆ వెంటనే ఇంకో మాట కూడా అంది ఆవిడ. ‘‘దెయ్యాలకు భయపడడం అంటే.. ఉన్నాయని భయపడతాడా? ఉన్నాయేమోనని భయపడతాడా?’’ అని. ‘‘తను నిద్రపోతున్నప్పుడు రోజూ రాత్రి ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుందని భయపడతాడు చెల్లెమ్మా’’ అన్నాడు. ‘‘ఎప్పట్నుంచి ఆ భయం మొదలైంది’’. ‘‘గుర్తులేదు బావగారూ.. ఓసారెప్పుడో మెలకువ వచ్చి చూస్తే, పెద్దగా ఎవరితోనో పోట్లాడుతున్నాడు. ఆ అరుపుకే నేను లేచింది. ‘‘ఏమైంది అలోక్..’’ అని దగ్గరికి వెళ్లి అడిగితే.. ఇంట్లోనే ఓ మూలకు చెయ్యి చూపిస్తూ భయంతో వణికిపోతున్నాడు’’. ‘‘ఆ తర్వాత?’’ ‘‘ఆ తర్వాతెప్పుడూ వాడు అరవలేదు. ఎందుకంటే.. ఆ తర్వాత ఎప్పుడూ వాడు ఒంటరిగా పడుకోలేదు’’ అని చెప్పాడు అలోక్ తండ్రి. అలోక్, అఖిల పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో చాలాసార్లు అల్లుడి ముఖం చూశారు అఖిల తల్లి, తండ్రి. దెయ్యాలకు భయపడే అబ్బాయిలా అనిపించలేదు. ∙∙ ఫస్ట్ నైట్ ముగుస్తుండగా..తెల్లవారు జామునే అఖిల నుంచి ఫోన్! ‘‘మమ్మీ.. మమ్మీ.. డాడీ.. డాడీ..’’ అంటోంది కానీ, ఏమీ చెప్పలేకపోతోంది. ఆమె తల్లిదండ్రుల ఆలోచన అల్లుడి మీదకు మళ్లింది. ఫోన్ స్పీకర్ ఆన్ చేశారు. ‘‘చెప్పమ్మా అఖీ.. ఏమైంది? నువ్వెలా ఉన్నావ్? అల్లుడుగారు ఎక్కడ?’’ అని అడిగారు. ‘‘అలోక్.. అలోక్..’’ – అఖిల చెప్పలేకపోతోంది. ఆయాస పడుతోంది.‘‘ఊ.. అలోక్కి ఏమైందమ్మా...’’‘‘అలోక్.. అలోక్.. అలోక్.. అలోక్వాళ్ల డాడీ చనిపోయారమ్మా.. చనిపోయారు’’.వెంటనే బయల్దేరారు అఖిల తల్లిదండ్రులు అఖిల దగ్గరకు. సిటీలోనే వాళ్లది ఆ మూల, వీళ్లది ఈ మూల. అలోక్ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ‘‘రాత్రి నాకు.. పక్క గదిలోంచి ‘అలోక్.. అలోక్’ అని నాన్న అరవడం వినిపించింది. కలలా అనిపించింది. అప్పుడే వెళ్లుంటే ఇంతపని జరిగి ఉండేది కాదు’’ అంటున్నాడు. ‘‘ఏం జరిగింది బాబూ’’ అని భుజం మీద చెయ్యేసి అడిగారు అత్తమామలు. ‘‘డాక్టర్ హార్ట్ ఎటాక్ అంటున్నారు. కాదని నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఆయన్ని దెయ్యం చంపేసింది. ఇన్నాళ్లూ నేను నాన్న పక్కన పడుకునేవాణ్ణి కాబట్టి అది నాన్నను ఏమీ చేయలేకపోయింది. ఒక్కరోజు లేకపోయేసరికి దానికి అవకాశం దొరికింది’’ అంటున్నాడు అలోక్. ‘‘నీకెలా తెలుసు బాబూ’’ అన్నారు మామగారు. ‘‘నాకు తెలుసు. నాకే తెలుసు. నాన్నకు కూడా తెలీదు. ఓరోజు రాత్రి నేను దెయ్యంతో గొడవపడ్డాను. నాన్నను చంపుతాను అని అది ఆయన గదిలోకి వెళ్లబోతుంటే నేను పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేశాను. ‘చూస్తా ఎంతకాలం మీ నాన్నను కాపాడుకుంటావో’ అని వికృతంగా నవ్వుకుంటూ గాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుంచీ నేను నాన్న మంచం మీదే, నాన్న పక్కనే పడుకుంటున్నాను. దెయ్యాలు కలలోకి వస్తున్నాయి నాన్నా.. అని నాన్నకు అబద్దం చెప్పి ఆయన పక్కనే పడుకుంటున్నాను’’ అని చెప్పాడు అలోక్. అత్తమామమలు ముఖముఖాలు చూసుకున్నారు. అఖిలకైతే ఏమీ అర్థం కావడం లేదు. పదో రోజు. ఫ్యామిలీ అల్బమ్ చూస్తున్నాడు అలోక్. పక్కనే అఖిల ఉంది. ‘‘ఎవరీవిడ?’’ అంది ఆల్బమ్లో ఓ ఫొటోపై వేలు ఉంచి.‘‘మా పిన్నమ్మ’’ అని చెప్పాడు. ‘‘మీ అమ్మ సొంత చెల్లెలా?’’ అని అడిగింది. ‘‘అవును. మా నాన్నంటే తనకు కోపం. ప్రేమించిన తనను కాదని, నాన్న తను ప్రేమించిన అమ్మను చేసుకున్నాడని. అమ్మ అనారోగ్యంతో చనిపోయినప్పుడు.. ‘అది బతికుండగా నన్ను చేసుకోలేదు. ఇప్పుడైనా చేసుకుంటావా?’ అని నాన్నను అడిగితే నాన్న కాదన్నారట. నాన్న మీద ప్రేమతో, అమ్మ మీద కోపంతో ఆమె పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. మనోవేదనతో మంచం పట్టి ఏడాదిన్నర క్రితం చనిపోయింది’’ అని చెప్పాడు అలోక్. అఖిల మౌనంగా ఉండిపోయింది. అలోక్ చెబుతున్న దానికీ, ఆ రోజు మామగారి గదిలో ఆయన మంచం పక్కనే అత్తగారి ఫొటో పడి పగిలి ఉండడానికీ... ఏదైనా సంబంధం ఉందా అని ఆమె ఆలోచిస్తోంది. -
నాథముని
(నమ్మాళ్వార్ కోసం తపస్సుచేసి నాలాయిర ప్రబంధం సాధించి లుప్తమైపోయాయనుకున్న తమిళ వేదాలను పునరుద్ధరించిన మహానుభావుడు నాథముని.) ‘మా పెద్దలు మాకు నేర్పారు. కంఠస్థం చేసి పాడుకుంటున్నాం స్వామీ, అవును ఇంకా 990 పద్యాలు ఉండాలి. కాని ఎక్కడున్నాయో తెలియదు. ఎప్పుడో లుప్తమైపోయి ఉంటాయి. ఎక్కడా దొరకడంలేదు. బహుశా శఠగోపులు కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) గ్రామంలో వీటిని వ్రాసి ఉంటారు. అంతకన్నా మాకు తెలియదు స్వామీ’ అన్నారు వారు. నాథముని దుఃఖపడ్డారు. కానీ వీటినెలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. అన్వేషణ ఆరంభమైంది. శ్రీరంగంతో సహా దివ్యదేశాలయిన అనేక ఆలయాల్లో వెతికారు. నమ్మాళ్వార్ పుట్టిన ఆళ్వార్ తిరునగరి లోనే ప్రయత్నించడం మంచిదనుకున్నారు. తిరునగరిలో ఆదినాథస్వామిని దర్శించి లుప్తమైన ప్రబంధాన్ని గురించి అక్కడ మధురకవి ఆళ్వార్ శిష్యులైన పరాంకుశ దాసుల వారిని అడిగారు. ‘‘నాయనా, ఇదొక్కటే కాదు, ఆళ్వారులందరూ పాడిన అనేక పాశురాలు ప్రబంధాలు పోయినాయి. ... నీ పట్టుదల చూస్తుంటే మాగురువుగారు చెప్పిన మాట నీకు చెప్పాలనిపిస్తున్నది... నమ్మాళ్వారుల పాదాలమీద మనసు నిలిపి, ఆయన దివ్య విగ్రహం ముందు కూర్చుని ఏకాగ్రతతో ఈ పది పాశురాలను (ఈ దశకానికి కణ్ణినున్ శిరుత్తాంబు అని పేరు) పన్నెండు వేల సార్లు జపిస్తే, ఆ తపస్వికి ఈ తిరువాయ్ మొళి వరప్రసాదంగా లభించే అవకాశం ఉందని మాగురువుగారన్నారు’’. ఓహో ఒక దారి దొరికిందనుకున్నారు నాథముని. వెంటనే ఆ పరాంకుశ దాసులను ఆచార్యులుగా స్వీకరించి వారు కణ్ణినున్ శిరుత్తాంబు ను ఉపదేశిస్తే, నమ్మాళ్వార్ జీవనకాలమంతా గడిపిన చింతచెట్టు కింద ఆయన విగ్రహం ముందు కూర్చుని ఆ దశకాన్ని మంత్రంగా పన్నెండు వేల సార్లు నిశ్చలమైన మనస్సుతో పంచేద్రియాల్ని ఏకోన్ముఖం చేసి జపించారు. బాహ్యస్మృతి కోల్పోయి, ప్రవహిస్తున్న కాలాన్ని గమనించకుండా సాగిన ఆయన తపస్సుకు మెచ్చి నమ్మాళ్వార్ సాక్షాత్కరించారు. ‘‘నాయనా, నా వంటి ఆళ్వార్లు నాకన్న ముందూ, తరువాతా కొందరు జన్మించారు. పరంధాముని ఆజ్ఞతో మేమంతా వేదసారాన్ని మన స్థానిక భాష (తమిళం)లో నాలుగు వేల పద్యాల రూపంలో రచించే భాగ్యానికి నోచుకున్నాము. అందులో నా వంతు సామవేద సారాన్ని వేయి పద్యాలలో రచించినాను. మిగిలిన మూడు వేల పద్యాలలో రుగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదాల సారాన్ని కూర్చి మరికొందరు ఆళ్వారులు రచించారు. ఇదే దివ్య ద్రావిడ వేద ప్రబంధం, పరమాత్మ స్వరూప గుణవైభవాన్ని తెలిపి, ఆయనను ఆశ్రయించే విధానాన్ని వివరించి, పరమశుభమైన పరమపదాన్ని పొందే పద్ధతులు విశదీకరించిన అద్భుతమైన భక్తి సాహిత్యం ఇది. ఈ పద్యాలు చదువుకోవడానికి ఏ ప్రతిబంధకాలు లేవు, నియమాలు లేవు, నిషేధాలు లేవు, హాయిగా చదువుకుని బాగుపడే అవకాశం అందరికీ సమానం గా ఉంది. ఇవి అందుకోవడానికి నీవు కఠోరమైన తపస్సు చేసి నాకు మహదానందం కలిగించావు నాయనా. భగవంతుడు మాతో సంశ్లేషించి, మాలో అపారమైన భక్తిని నింపి, అజ్ఞానాన్ని లేశమాత్రం కూడా లేకుండా తుడిచిపెట్టి మేము భక్తి పారవశ్యంలో ఉన్న సమయంలో మాచేత వ్రాయించిన ఈ నాలుగువేల పద్యాలనే నాలాయిర దివ్యప్రబంధం అంటారు. మేం ఆ పద్యాలు ఏ విధంగా, ఏదశలో, ఎప్పుడు వ్రాశామో మాకూ తెలియదు. అంత దివ్యమైన అత్యద్భుతమైన పాశురాలవి’’ అన్నారు నమ్మాళ్వార్. ‘‘అదే స్వామీ ఏదీ ఆ పద్యామృతం, నాకు ఏ విధంగా లభిస్తుంది..’’ అని నాథముని ఆత్రంగా ప్రశ్నించారు. ‘‘ఇన్ని వేల సంవత్సరాల కాలంలో భూమిమీద మరుగున పడిపోయినా అక్కడ పరమపదంలో నిత్యం ఈ నాలాయిర పాశురాల అనుసంధానం జరుగుతూనే ఉంది’’ అన్నారు నమ్మాళ్వార్. ‘‘అయితే నాకు ఆ దివ్యప్రబంధాన్ని అనుగ్రహించండి స్వామీ’’ అని వేడుకున్నారు నాథముని. నాథముని తపన గమనించిన నమ్మాళ్వార్ ‘‘అంతకన్న కావలసిందేముంది. నేను రచించినవే కాకుండా మన ఆళ్వార్లు రచించిన అన్ని పాశురాలను ఇస్తాను తిరువాయ్ మొళి తో సహా నాలాయిర ప్రబంధాన్ని నీ ద్వారా ఈ ప్రపంచానికి, భావితరాలకూ చేరే అవకాశం లభించింది.’ అంటూ తమకూ నాథమునులకూ మధ్య తెరకట్టించి, ఆ పద్యాలను ఏకధాటిగా ఉపదేశించడం ప్రారంభించారు. (నమ్మాళ్వార్ విగ్రహం నోరు తెరిచి పద్యాలు ధారగా వెలువడ్డాయని కొందరు, మొత్తం నాలాయిర ప్రబంధం నమ్మాళ్వార్ దయతో నాథమునికి స్ఫురించిందని, ఆయన వాటిని తాళపత్రబద్ధం చేశారని మరికొందరు రచయితలు వ్రాశారు) తదేక దృష్టితో నాథముని తిరువాయ్ మొళి వేయిపద్యాలను, మరో మూడు వేల పద్యాలను కూడా చకచకా తాళపత్రాలమీద లిఖిస్తూపోయారు. ఆ సమయంలోనే నమ్మాళ్వార్ పరంధామానికి జీవుల్ని చేర్చగల మూడు రహస్యాల సిద్ధాంతాన్ని యోగరహస్యాలను నాథమునికి విశదం చేశారు. కాలగర్భంలో కలిసిపోయిన దివ్యప్రబంధం ఆళ్వార్ వరప్రసాదమై తపఃఫలంగా లభించింది. ‘‘కాని నేను వృద్ధుణ్ణి అయిపోతున్నానే, ఈ దివ్ర ప్రబంధాన్ని సామాన్యప్రజానీకానికి చేర్చడం సాధ్యమా’’ అనుకుని అదే మాట అడిగారు నమ్మాళ్వార్లను. ‘‘ఈ ఆళ్వార్ తిరునగరిలోనే మధుర కవి ఆళ్వార్ కు ఇచ్చిన భవిష్యదాచార్యుల విగ్రహం ఉంది. మరో 500 సంవత్సరాల లోపున ఒక ఆచార్యుడు అవతరిస్తాడు నాయనా’’. అని విగ్రహాన్ని చూపారు నమ్మాళ్వార్. అదే భవిష్యదాచార్యుల విగ్రహం. నాథమునికి స్వప్నంలో వీరనారాయణపురం మన్ననార్ స్వామి కనిపించి ‘‘నీవు తెలుసుకున్న పాశురాలను నాకు వినిపించు’’ అని ఆదేశించారు, నాథముని ఆళ్వార్ తిరునగరి మూలదైవం శ్రీఆదినాథ స్వామికి ఈ స్వప్నవృత్తాంతం తెలిపి అనుమతి తీసుకుని మన్ననార్ ఆలయానికి తిరిగి వెళ్లారు. ఆత్మలకు శరీరాన్నిచ్చి పంచేంద్రియ జ్ఞానాన్నిచ్చి, సన్మార్గంలో నారాయణుడిని చేరడానికి శాస్త్రపరమైన మార్గదర్శకత్వాన్ని కూడా అందించినా ప్రయత్నాలు సంపూర్ణం కావడం లేదు. ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధాలు మళ్లీ మాయం కాకుండా చూసుకోవలసి ఉంది. కనుక ఈ నాలుగువేల పాశురాలకు సంగీతాన్ని సమకూర్చి పాడుకోవడానికి వీలుగా అందరికీ అందిస్తే బాగుంటుందని నాథమునిని వీరనారాయణుడు ఆదేశించారు. వేదాలలో కీలకమైన ఉదాత్త అనుదాత్త స్వరిత లక్షణ సమన్వితంగా దివ్యమైన సంగీతాన్ని కూర్చి నాలాయిర దివ్యప్రబంధాలను గానం రూపంలో కూడా మళ్లీ సుస్థిరం చేశారు నాథముని. అంతేకాదు. నాలాయిర పాశురాలకు నాట్యానికి అనుగుణంగా రాగతాళాలను నిర్దేశించారు. ఈ ప్రక్రియను ఆరైయార్ సేవ అంటారు. శ్రీరంగం వెళ్లి ఆరైయార్ సేవను ప్రదర్శించారు. అనేక ఆలయాల్లో ఆరైయార్ సేవ ద్వారా పాశురాలు ప్రజల్లోకి వెళ్లాయి. అంతర్థానమైన నాలాయిర ప్రబంధం మళ్లీ ఇక్కడి నాథముని వల్ల అవతరించి, ఇక్కడే జనపదాల్లోకి వెళ్లింది కనుక ఈ మన్ననార్ కాట్టు మన్నార్ అయిందని అంటారు. (కాట్టు అంటే తమిళంలో కనిపించడం అని దివ్యప్రబంధాన్నిచూపిన ఆలయం అని అర్థం.) నాథముని మనుమడే యామునాచార్యులు (ఆళవందార్). నమ్మాళ్వార్ చూపిన విగ్రహాన్ని తన మనవడికి ఇవ్వాలని, నాలాయర ప్రబంధాన్ని జనహృదయాలలోకి చేర్పించే కార్యక్రమం కొనసాగించాలని శిష్యులకు ఆదేశించి పరమపదించారు నాథముని. తాతగారు ఇచ్చిన భవిష్యదాచార్య విగ్రహంలో పోలికలను యువ రామానుజునిలో గమనించిన వారు యామునాచార్యులవారే. పన్నిద్దరు (12) ఆళ్వార్లు వైష్ణవ మతంలో వాగ్గేయకారులు 12 మంది. వీరు మహాభక్తులు, తపస్వులు, దివ్యప్రబంధ రచయితలు, ఆ పాశురాలను స్వరలయబద్ధంగా గానం చేసిన వారు. వీరు ఈ భూమిపైన ఉన్న 106 దివ్య నారాయణ క్షేత్రాలలో ఆ పాశురాలతో మంగళాశాసనం చేసిన వారు. కనుక వీరిని ఆళ్వారులు అన్నారు. ఆళ్వారులు గానం చేసిన ఈ ఆలయాలను దివ్యదేశాలని అన్నారు. ఈ 106 నారాయణాలయాలకు తోడు పరమపదంలో ఉన్న రెండు ధామాలను కలిపి 108 దివ్యదేశాలని అంటారు. 106 దివ్యదేశాలను దర్శించి ఆళ్వారులు గానం చేసి ఆరాధించిన నారాయణ మూర్తులను సేవించి వైష్ణవమార్గాన్ని అనుసరిస్తే మిగిలిన రెండు పరంధామాలను చేరడం సులువు అని మరో ముక్తి మార్గాన్ని చూపిన వాడు రామానుజాచార్యుడు. కాట్టుమన్నార్ అభిమాన స్థలం కాట్టుమన్నార్ వైష్ణవ అభిమాన స్థలం. దివ్యదేశం కాకపోయినా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాన్నిఆళ్వారుల ఆచార్యుల అవతార ప్రదేశాన్ని అభిమాన స్థలం అంటారు. ఇక్కడ నాథముని, ఆయన మనవడు యామునాచార్యులు (ఆళవందార్) జన్మించిన చోటు. వీరనారాయణ పెరుమాళ్ నెలకొని ఉండడం వల్ల ఇది వీరనారాయణ పురం అయింది. చోళ రాజు వీరనారాయణ చోళ రాజు పునర్నిర్మించిన ఆలయం. శ్రీమనన్నార్ (రాజగోపాలం) వేంచేసి ఉండడం వల్ల మన్నార్ కోయిల్ అయింది. కాట్టుం అంటే చూపించేది. నారాయణుడు మన్నన్ (రాజు) వలె లక్ష్మీదేవి చేయిపట్టుకుని వచ్చి నాథమునికి నమ్మాళ్వార్ ద్వారా నాలాయిరప్రబంధం తెలియజేయాలని సూచించినందుకు ఈ ప్రాంతానికి కాట్టుమ్ మన్నన్ ఆనార్ (కాట్టుమన్నార్) పేరు వచ్చింది. నాలాయిర గేయాలు, నాట్యగీతాలుగా మార్చి అరైయార్ సేవ అనే ప్రక్రియను సృష్టించి వాగ్గేయకారుడైనారు. పోయిగై నుంచి తిరుమంగై ఆళ్వార్ దాకా సాగిన పన్నిద్దరాళ్వార్ల కాలం ముగిసిన తరువాత ఆచార్యపరంపర మళ్లీ నాథమునితో ప్రారంభమైంది. నాథముని మనవడు (ఆళవందన్) యమునై తురైవన్ ఇక్కడే జన్మించి ఈ నాలాయిర ప్రబంధాన్ని ప్రచారం చేశారు. రామానుజుడు ఆచార్యుడుగా వస్తాడని యమునాచార్యులు మళ్లీ తెలియజేస్తారు. ఆళవందన్ శిష్యులలో పెరియనంబి, తిరుకోష్టియూర్ నంబి, తిరుక్కచ్చినంబి ముఖ్యులు. కూరత్తాళ్వార్ ఇక్కడే సమారంభామ్ నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్ అనే గురుంపర శ్లోకాన్ని సమర్పించారు. -
రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం
బాబు పాలన: బాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ, కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. - కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులను అప్పట్లోనే నిర్మించి ఉంటే ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది. - బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. - ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు. - ఆనాడు కేంద్రంలో తానే చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... కేంద్రంలో మాట్లాడి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేకపోయారు. మన రాష్ట్ర సాగునీటి హక్కులు కాపాడలేక పోయారు. రాజన్న రాజ్యం అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి బిందువునూ ఒడిసి పట్టుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని కలలుగన్న ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం... జలయజ్ఞం! దివి నుంచి భువికి గంగను రప్పించే భగీరథయత్నం.. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం.. కోటి ఎకరాలకు నీరందించి రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు మహానేత తీసుకున్న దృఢసంకల్పం జలయజ్ఞం! - ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు వైయస్సార్. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. - జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. - ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి. - ఆయన హయాంలో వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్ను మార్చడం వల్ల మళ్ళీ టెండర్లను ఖరారు చేయానికే ప్రభుత్వం మూడేళ్ళ సమయాన్ని తీసుకుంది. వైఎస్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే... ఈ సమయానికి పూర్తయి...పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 లక్షల ఆయకట్టుకు నీటి వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్కు 80 టీఎంసీల నీటిని తరలించడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది. - ఆ ఒక్క ప్రాజెక్టునే కాదు, మహానేత మరణానంతరం ఇతర ప్రాజెక్టులను సైతం పట్టించుకున్న నాధుడే లేడు. జగన్ సంకల్పం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంది. పోలవరంతోపాటు పెండింగ్లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాతిపదికపై నిర్మాణం పూర్తిచేయడం జరుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రభావం మైనింగ్, ట్రాన్స్పోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్, వినిమయ రంగాలపై ప్రసరించి, 2004-09 మధ్య విస్తరించిన అభివృద్ధి మాదిరిగానే ఆయా రంగాల పురోగతికి దోహదం చేస్తుంది. సిమెంట్, స్టీల్, నిర్మాణ సామగ్రి... వీటన్నింటి కొనుగోళ్ళూ పెరగటం, మైనింగ్, ట్రాన్స్పోర్టు పెరగటం అంటే ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా మళ్ళీ జీవం పోయటమే! -
పల్లెల్లోకే పాలన
* కార్డుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదు. * రేషన్కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పక్కా ఇంటి కార్డు ఇలా.... * అన్ని కార్డులు, పత్రాలు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 24 గంటల్లో జారీ. * ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాఫీసు. * ప్రభుత్వాన్ని మీ ఇంటి ముందుకే తెస్తాం. - ప్రతి గ్రామంలోనూ ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంచాలన్నది మా లక్ష్యం. దీని కోసం ప్రతి గ్రామంలోనూ కార్యాలయం ఏర్పాటు చేసి ఐరిస్ కార్యక్రమం ద్వారా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, సామాజిక పింఛన్ కార్డులు, పక్కా ఇంటి కార్డులు, ఆధార కార్డు సహా ఏ కార్డు అయినా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ప్రజలకు అందించే విధానాన్ని అమలు చేస్తాం. ఈ కార్యాలయాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటర్, ఐరిస్ మిషన్, లామినేటింగ్ మిషన్ సదుపాయం ఉంటుంది. - సిటిజన్స్ చార్టర్: నిర్ణీత కాల వ్యవధిలో ప్రజల పనులు పూర్తయ్యేలా చూస్తాం. - ఫైళ్ళ సమీక్ష: ఎమ్మార్వో కార్యాలయం మొదలు సచివాలయం వరకూ అన్ని ఫైళ్ళకూ బార్ కోడ్ ఇచ్చి ఫైళ్ళ సమీక్ష నిర్వహిస్తాం. ప్రజలు తమ ఫైళ్ళు ఏ కార్యాలయంలో, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవటానికి ఇది తోడ్పడుతుంది. - మహిళా అదాలత్లు/ న్యాయ వ్యవస్థ: మహిళా కేసులను త్వరితగతిన విచారించి, న్యాయం చేకూర్చటానికి రాష్ట్రంలోని అన్ని కోర్టులూ సాయంత్రం పూట కూడా పనిచేస్తాయి. - రాష్ట్ర స్థాయి లోకాయుక్త (లోక్పాల్)ని పటిష్ఠం చేస్తాం. - అన్ని పంచాయతీల్లోనూ జన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. - అర్హత ఉన్న అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనం చేకూరుస్తాం. - అన్ని ప్రభుత్వ కార్యక్రమాలనూ నిర్ణీత వ్యవధిలో సమీక్షించి, ప్రజాభిప్రాయం ప్రకారం మరింత పటిష్ఠపరుస్తాం. - పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ అన్ని చట్టాలనూ పునఃపరిశీలిస్తుంది. కమిటీ సూచనల మేరకు కాలదోషం పట్టిన చట్టాలన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఆచరణయోగ్యమైన చట్టాలను తీసుకువస్తాం. - {పజలకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేసి, నూరు శాతం ఈ-గవర్నెన్స్ను సాధిస్తాం. - భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తాం. భూమి లావాదేవీలను బెంగళూరులో మాదిరిగా ఆన్లైన్లో నిర్వహిస్తాం. - కాలం చెల్లిన బ్రిటిష్ పోలీస్ చట్టం స్థానంలో కొత్త పోలీస్ చట్టాన్ని తెచ్చి ప్రజలకు సత్వరంగా, చిత్తశుద్ధితో పోలీసులు సేవలందించేలా చేస్తాం. - ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం: నీటి కాలుష్యంతో వచ్చే రోగాలను అరికట్టటానికి ప్రతి గ్రామంలోనూ ఆర్వో, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. మినరల్ వాటర్ను నామ మాత్రపు ధరలకే సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తాం. ఈ ప్లాంట్ల నిర్వహణలో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యం ఇస్తాం. - నిర్ణీత వ్యవధులలో పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, నూరు శాతం టీకాలు వేయించుకునేలా చేస్తాం. ‘హయ్యర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్’ సాధించటానికి నూరు శాతం ‘డీ వార్మింగ్’ చేస్తాం. పిల్లలకు ఉచితంగా కళ్ళద్దాలు అందిస్తాం. - గుజరాత్, తమిళనాడులలో మాదిరిగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు రూపాయికి ఓ ప్యాడ్ చొప్పున శానిటరీ నేప్కిన్లను సరఫరా చేస్తాం. - ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లను నిర్మించటం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తాం. - ఆధార్ కార్డు సహాయంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పిస్తాం. వలస కూలీలకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. రేషన్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. - రేషన్ దుకాణాల్లో విటమిన్ ఏ, డీ, ఐరన్, క్యాల్షియం బిళ్ళలను విక్రయించడం ద్వారా ఆహార పరిపుష్టత కల్పిస్తాం. - మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంత గ్రామాలలో ఉచిత సౌరశక్తి లాంతర్లు, పొగరాని పొయ్యిలు ఏర్పాటు చేస్తాం. -
బాబు, వైఎస్ పాలనలో.. చేనేత
బాబు పాలన: నేత కార్మికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చంద్రబాబు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పెపైచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు. - 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్నగర్లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుం బంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సృష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు. - బాబు హయాంలో 1999-2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు. - నేత కార్మికులకు పింఛనివ్వాలని బాబు ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు. - చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలలో దాదాపు వంద వరకు మూసేశారు. - ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు. - బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భివండి, సూరత్లకు వలసపోయారు. రాజన్న రాజ్యం సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వైఎస్ ఆర్థికసాయం అందించారు. మొత్తం 125 కుటుంబాలకు రూ. లక్షన్నర చొప్పున సాయం చేశారు. 1997 నుంచి ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నలకు ఈ ప్యాకేజీ వర్తింపజేశారు. ఇందులో కార్మికుడి అప్పుల సర్దుబాటుకు రూ. యాభైవేలు, కుటుంబ జీవనోపాధికి మరో రూ.లక్ష అందించారు. మరో 120 కుటుంబాలకు రూ.25వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. - 12వేల మంది నేత కార్మికులకు అంత్యోదయ అన్న యోజన పథకం(ఏఏవై) కార్డులు అందించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలనెలా 35కిలోల బియ్యం అందుతున్నాయి. - చేనేత కార్మికుల ఆరోగ్య సమస్యల దృష్ట్యా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ 50వేల మందికి ప్రతి నెలా రూ.200 పింఛనిచ్చారు. - 2004లో రూ.32కోట్లు ఉన్న ఆప్కో టర్నోవర్ను రూ.250కోట్లుగా మార్చి ఆదుకున్నది వైఎస్సే. - పెరిగిన చిలపనూలు ధరల వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంటే వైఎస్ పదిశాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. - వైఎస్ హయాంలో 2008 నాటికి వలసలు తగ్గాయి. ఆదాయం లేకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లే బస్సులు రద్దయ్యాయి. - సిరిసిల్ల స్త్రీలను చైతన్యవంతులను చేసి 1,480 సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి స్త్రీకి రూ.50వేల రుణం అందించారు. ఒక్క సిరిసిల్లలోనే రూ.74 కోట్ల పావలావడ్డీ రుణమివ్వడంతో మైక్రోఫైనాన్స్ వేధింపులు తగ్గాయి. - చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరం ఏర్పాటు చేసి 84 మంది వైద్యులతో వైద్య సేవలు అందించారు. - ఇళ్లు లేని పేద చేనేత కార్మికులకు సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి, మండెపల్లి, సారంపల్లిలో 4,800 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ. - సిరిసిల్ల పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీరందించేందుకు రూ.36.50కోట్ల పథకాన్ని గ్రాంటు రూపంలో మంజూరు చేశారు. - నేతన్నల సంక్షేమం కోసం రూ. 2 కోట్ల కార్పస్ఫండ్ మంజూరు చేశారు. - జనశ్రీ బీమాలో కార్మికుల ప్రీమియంను రూ.80నుంచి రూ.40కి తగ్గించి మిగతా రూ.40 ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేసి లక్షన్నరమంది కార్మికులకు ఆరోగ్య ధీమా కల్పించారు. - నేత కార్మికులు ప్రైవేటు రుణాల బారిన పడకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలావడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేశారు. - రాష్ట్ర వ్యాప్తంగా 77వేలకు పైగా ఉన్న పవర్లూంలకు 2004-05 నుంచి 2008-09 నాటికే రూ.29.55 కోట్ల విద్యుత్ సబ్సిడీ నిధుల విడుదల. - 2 లక్షలమంది కార్మికులకు ఉపయోగపడేలా పావలా వడ్డీకే రుణాలిచ్చారు. - వైయస్సార్ సిఎం అయ్యాక 327 కోట్ల రూపాయల మేరకు చేనేత రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2 లక్షలమంది చేనేత కార్మికులకు మేలు జరిగే ఈ నిర్ణయం అమలు చేయాల్సిన దశలో ఆయన హఠాన్మరణం చెందారు. రోశయ్య సిఎం అయ్యాక ఈ పథకానికి కోత విధించారు. కేవలం రూ.148 కోట్లతో 67 వేలమందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా చేసి వైయస్సార్ ఆశయాలపై నీళ్లు చల్లారు. జగన్ సంకల్పం - చేనేత కార్మికులు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాం. చేనేత కార్మికులకు రూ లక్ష వరకూ వడ్డీ లేని రుణాలివ్వటమే కాకుండా వారికి చేనేత షెడ్డుతో కలిపి ఇల్లు కట్టించి ఇస్తాం. మరమగ్గాల చేనేత కార్మికులకు యూనిట్కు రూ. 1.50కి విద్యుత్ సరఫరా చేస్తాం. ముడి పదార్థాల మీద సబ్సిడీ పెంచుతాం. జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరించటం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ, పాఠశాలల్లోనూ చేనేత వస్త్రాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తాం. ఆర్టిజాన్ కార్డులపై ప్రయోజనాలు కల్పిస్తాం. చేనేత కార్మికుల పింఛన్ను రూ. 1000కి పెంచుతాం. -
వైఎస్, బాబు పాలనలో.. అర్చకుల సంక్షేమం
గుళ్ల నుంచి ఇళ్ల దాకా ఏ శుభకార్యం జరగాలన్నా, భగవంతుడికి-భక్తుడికి అనుసంధానంగా వుండాలన్నా పూజారి ఉండాల్సిందే. కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న బ్రాహ్మణుల జీవితాల్లో మాత్రం అంతా చీకటే! రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది బ్రాహ్మణులు ఉండగా, 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. చాలాచోట్ల పూజారుల నెలసరి ఆదాయం రూ. 1500, పురోహితుల ఆదాయం రూ. 2000కు మించి ఉండదు. అందుకే, వీరిలో చాలామంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అయితే, బాధాకరమైన విషయమేంటంటే, వీరికి తెల్ల రేషన్ కార్డులు కూడా లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదు. చాలామందికి సొంత ఇళ్లు కూడా లేవు. 12 ఏళ్లపాటు అభ్యసించిన వేదవిద్యకు ఆదాయం ఈ రకంగా ఉండడంతో చాలామంది నిరుత్సాహపడి అర్చక వృత్తినే వదిలేస్తున్నారు.రాష్ట్రంలో 84 వేల ఆలయాలున్నా, దేవాదాయ శాఖ మాత్రం ఆదాయమున్న 100 ఆలయాల కోసమే అన్నట్లు పనిచేస్తోంది. బాబు పాలన చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా అర్చకుల, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న 1987 దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు. 2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్మెంట్ స్కీంను కూడా పెట్టారు. జీతాలు లేవు... పెన్షన్లు లేవు... రిటైర్మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది. దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి 2001 సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న రాజ్యం వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు. చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని వైఎస్సాఆర్ను అర్చకులు అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా. ఈ హామీతో వైఎస్సాఆర్కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు. - అర్చక వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దాని ద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు - అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు - విద్య గృహ నిర్మాణానికి రుణాలు అందజేశారు - గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు - ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ. లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు - కామన్గుడ్ ఫండ్ను ఏర్పాటు చేసి దేవాలయాల - పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు జగన్ సంకల్పం హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని క్రమంగా తగ్గించటానికి మేము కట్టుబడి ఉన్నాం. అర్చకులకు, దేవాలయాల సిబ్బందికి పనిచేసేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తాం. ధూప దీప నైవేద్యాల కోసం ఇప్పుడు ఇస్తున్న కనీస మొత్తాన్ని నెలకు రూ. 2500 నుంచి రూ.5000కు పెంచుతాం. హిందూ దేవాలయాల విషయంలో, అర్చకుల విష యంలో వైయస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు పరచటానికి కట్టుబడి ఉన్నాం. ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చే నిధులను, పదవీ విరమణ చేసిన అర్చకుల పింఛన్ను పెంచుతాం. -
బాబు, వైఎస్ పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగులు
బాబు పాలన.. ‘‘ఏం? పిచ్చ పిచ్చగా ఉందా?’’ ‘‘ఏం మాట్లాడుతున్నావ్? నాతోనే వాదిస్తావా? తమాషాలు పడుతున్నావా?’’ ...ఇవి ఏ తాపీ మేస్త్రీయో తన దగ్గర పని చేసే కూలీలపై అరిచిన అరుపులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి నోటి వెంట జాలువారిన తిట్ల దండకాలు. ‘పిచ్చ పిచ్చగా ఉందా’ అంటూ దుయ్యబట్టిందెవరినో తెలుసా? అంబేద్కర్ వర్సిటీ వైఎస్ చాన్సలర్ను! ఇక ‘తమాషాలు పడుతున్నావా’ అంటూ నోరు పారేసుకున్నదేమో ఏకంగా న్యాయ శాఖ అదనపు కార్యదర్శిపై! అక్కడితో ఆగకుండా, ‘నీ పరిధిలో నువ్వుండు! యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అప్పారావు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే! అత్యున్నత ప్రభుత్వాధికారులకే చుక్కలు చూపిన చంద్రబాబు... సాధారణ ప్రభుత్వోద్యోగుల విషయంలోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు! ‘మీ గుండెల్లో నిద్రపోతాను’ అంటూ నిత్యం బెదిరించేవారు. బెదిరించడమే కాదు... తన పాలన పొడవునా వేతన జీవులు ఏనాడూ కంటినిండా నిద్ర కూడా పోకుండా చేశారు. జనం ముందు, సాటి ఉద్యోగుల ముందు వారిని దోషుల్లా నిలబెట్టి, నిలువునా పరువు తీయడాన్ని, కసురుకోవడాన్ని, సస్పెండ్ చేసి పారేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు... అదో భయానక గతం..! బాబు ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా బలైంది ఉద్యోగులే! ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పద్ధతినే చంద్రబాబు భాషలో సంస్కరణలు అంటారని సామాజిక కార్యకర్తలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు కూడా. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురు పోసుకుంటూనే సాగింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఘనుడు బాబు! ఉద్యోగుల కుదింపుకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! 1998లో 747 మంది కార్మికులను, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారు. పైగా, ‘రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమే మహా ఎక్కువ. మళ్లీ డీఏ కూడానా? ఇచ్చేది లేదు’ అంటూ అధికారంలో ఉండగా తెగేసి చెప్పిన చరిత్ర చంద్రబాబుది! తను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఉన్న ఉద్యోగాలనే వీలైనంతగా తొలగించిన బాబు ఇప్పుడు అధికారంకోసం కొత్త ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతామని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు! ఈ రెండు నాల్కల ధోరణేంటి బాబూ..? - అధికారం కోసం కుటుంబానికో ఉద్యోగం అంటూ ఊదరగొడుతున్న బాబుకు, రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయో తెలుసా? అసలు ఎన్ని ఉద్యోగాలిస్తారో స్పష్టంగా చెప్పరేం? అలా సంఖ్య చెబితే అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యమో కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఎటూ తేల్చకుండా తెలివిగా తప్పించుకుంటున్నారన్నది నిజం కాదా? - ‘ఒక వంటగది వాడుతున్న వారంతా ఒక కుటుంబం’ అనే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని జనాభా లెక్కల సేకరణ విభాగం 2011లో చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.1 కోట్ల కుటుంబాలున్నాయి. వాస్తవానికి నేటి లెక్క ప్రకారం కుటుంబాల సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది. - ఇక ఉద్యోగ లెక్కల్లోకి వస్తే - ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపి కూడా రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలే. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ, సేవ రంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల్లోపే. మరి కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తానని నమ్మిస్తున్న బాబు, ఈ లెక్కన మరో 3 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి సృష్టిస్తారో ఆయనకే తెలియాలి! ఉద్యోగస్థుల్ని బాబు పురుగుల్లా చూశాడు! ఉద్యోగులంటే బాబుకు ఏమాత్రం గౌరవముండేది కాదు. వారిని పురుగుల్లా చూసేవారు. మా సమస్యలపై విన్నవించడానికి ఎప్పుడు వెళ్లినా గద్దింపు స్వరమే సమాధానమయ్యేది. సమస్య వినకుండానే, మా చేతుల్లోని వినతి పత్రాలను లాక్కుని పక్కనే ఉన్న ఐఏఎస్ అధికారుల చేతుల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కనీసం కూర్చోబెట్టే మర్యాద కూడా తెలియదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి అయ్యాక ఐదున్నరేళ్ల కాలం ప్రభుత్వ ఉద్యోగులకు సువర్ణయుగంలా గడిచింది. అసలు ప్రభుత్వోద్యోగిని మనిషిగా చూడటం వైఎస్ పాలనలోనే జరిగింది. ఏ సమస్యపై వెళ్లినా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించే వారు వైఎస్! ఆ రోజులు మాకిప్పటికీ గుర్తే! - గోపాల్రెడ్డి, ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు బాబు ‘మనసులో మాట’... ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృథా. ప్రభుత్వోద్యోగం అనగానే శాశ్వతం, భద్రం అనే భావన పనిచేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరగడానికి జీతాల పెరుగుదలే కాక ఉద్యోగుల సంఖ్య పెరగడమూ ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగడం లేదు. (పేజీ. 63) కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంలో ఉత్తమమైన మార్గం... ఉన్న ఉద్యోగాలను స్తంభింపచేయడం. అంటే రిటైరైన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకుండా ఉండడం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల స్తంభీకరణ కిందితరగతి ఉద్యోగాల స్థాయిలో జరిగింది. (పేజీ.66) రాజన్న రాజ్యం ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నిరుద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు. దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. 1999 గ్రూప్-2 నోటిఫికేషన్లో ఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరదించారు. తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. భారీగా ఉపాధ్యాయ పోస్టులు, కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు! జగన్ సంకల్పం రాష్ట్ర విభజన ద్వారా తలెత్తిన ఉద్యోగుల సమస్యలను, పెన్షనర్ల సమస్యలను ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పటం ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేస్తాం. క్యాష్లెస్ ట్రీట్మెంటును ప్రోత్సహిస్తాం. - వైయస్ఆర్ గర్వపడేలా పిఆర్సీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. బాబు హయాంలో ఉద్యోగులకు పిఆర్సీ 16 శాతం వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారి హయాంలో 39 శాతం పిఆర్సీ ఇచ్చారు. ఏ లోకంలో ఉన్నా రాజశేఖరరెడ్డిగారు గర్వపడేలా పిఆర్సీని ఇస్తాం.’ - ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సొంత ఇల్లు ప్రతి ఉద్యోగికీ ఇల్లు ఒక హక్కుగా ఇవ్వాలి. ప్రతి ఉద్యోగికీ ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం. క్లాస్-4 ఎంప్లాయిస్కు కూడా ఇల్లొచ్చేలా చేస్తాం. - ఆరోగ్యశ్రీ తరహాలో క్యాష్లెస్ పాలసీ.. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్మెంట్ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ పాలసీని తెస్తాం. - కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తులు చలా బాధలుపడుతున్నారు. జీతాలు తక్కువ, రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్లు రావు. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికీ హామీ ఇస్తున్నాం... అధికారంలోకి వచ్చాక ఓ కమిటీ వేస్తాం. అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ రెగ్యులరైజ్ చేస్తాం. - వయో పరిమితి 40 ఏళ్ళు ప్రభుత్వోద్యోగ నియామకాల వయోపరిమితిని 34 నుంచి 40కి (వన్టైమ్) పెంచుతాం. ఎస్సీ ఎస్టీలకు కూడా తదనుగుణంగా వయో పరిమితిని (వన్టైమ్) పెంచుతాం. ఏపీపీఎస్సీని సమూలంగా తీర్చి దిద్దుతాం. - సమైక్యతకు సలాం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన సమ్మెను ప్రత్యేకమైనదిగా పరిగణించి, ప్రభుత్వోద్యోగులందరికీ సమ్మె కాలానికి జీతాన్ని చెల్లిస్తాం. -
బాబు, వైఎస్ పాలనలో.. విద్యుత్
బాబు పాలన.. రైతులకు ఉచిత విద్యుత్..? ఏ పాలకుడూ ఊహించని పథకం ఇది. కానీ, తొమ్మిదేళ్లు సీఎంగా, రైతులను అన్ని రకాలుగా వేధించిన చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికే పనికొస్తాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా వినిపించుకోకపోగా, చంద్రబాబు వ్యవసాయం దండగమారి వ్యవహారమని, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. కరువు కాటకాలతో కుంగి కృశిస్తున్న రైతులు విద్యుత్ బకాయిలు కట్టకపోతే వారి మోటార్లు, స్టార్టర్లను పీక్కెళ్లేవారు. అంతేకాదు రైతులను జైళ్లకు కూడా పంపారు. బకాయి వసూలు, పెనాల్టీల వసూలు కోసం ప్రత్యేక జీవోలు విడుదలయ్యాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే హైదరాబాద్లోని బషీర్బాగ్లో వారిని పిట్టల్లా కాల్చారు. రైతులు, చేనేత కార్మికులు పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అవమానించిన రాజకీయ నాయకుడు చరిత్రలో చంద్రబాబునాయుడే. - ప్రభుత్వం చేసే ప్రతీ పనికీ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలన్నది బాబు పాలసీ, ఫిలాసఫీ. ఇందులో భాగంగానే వ్యవసాయానికీ విద్యుత్ చార్జీలను వసూలు చేశారు. - విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. - మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు. - ప్రతీ ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. అటు గృహ వినియోగానికీ, ఇటు వ్యవసాయానికీ కరెంటు చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే. - చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లు తొలగించారు. పొలాల మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు. - ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలకు బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారు. విద్యుత్ పోటు.. బాబు హయాంలో విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. వ్యవసాయ రంగం మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన రూ. 50లకు హార్స్పవర్ విద్యుత్ చార్జీని రూ.250కి పెంచి కోలుకోలేకుండా దెబ్బ తీశారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. - విద్యుత్ సంస్కరణల వెనుక రహస్య ఎజెండా ఏదీ లేదని పదేపదే ప్రకటించుకున్నా బాబు ప్రపంచబ్యాంకు ఎజెండానే అమలు చేశారు. విద్యుత్ చార్జీలను పెంచాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జేమ్స్ ఉల్ఫెన్సన్ ప్రకటించారు. - సామాన్యుల మీద విద్యుత్ భారం మోపడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఏటేటా విద్యుత్ చార్జీలు వడ్డిస్తామని చంద్రబాబు అధికారంలో ఉండగానే ప్రకటించారు. రాజన్న రాజ్యం ఉచితంపైనే తొలి సంతకం - అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారు. - ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు రెండు లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దయ్యాయి. - ప్రతీ ఏటా కొత్తగా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. - 2004 నుంచి ఒక్క ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జీ అయిన రూ. 20ని కూడా వసూలు చేయలేదు. - వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ హామీ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు. జగన్ సంకల్పం ఉచిత విద్యుత్ - వ్యవసాయానికి రోజుకు 7 గంటల నిరంతర ఉచిత విద్యుత్. - పగటిపూటే రైతులకు కరెంటు. - 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. - రైతు కుటుంబాల్లో మళ్లీ కాంతులు పండిస్తాను. 150 యూనిట్ల కరెంటు రూ. 100 కే... * తప్పుడు బిల్లులు, ఛార్జీల భారంతో ఇన్నాళ్లూ ఇక్కట్లు * పెద్ద బిల్లులు కట్టకపోతే కనెక్షన్లే కట్ చేశారు. * ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ * నిరుపేద కుటుంబాలు కరెంటు కోసం * పక్కమార్గాలు వెతుక్కుంటున్నారు. ఇకపై ఈ చీకట్లు ఉండవు... * 150 యూనిట్ల వరకు నెలకు రూ.100కే కరెంటు ఇస్తాం. * 3 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో * విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితి లేకుండా చేస్తా. మరింత కరెంటు - అన్ని గృహ, వాణిజ్య సముదాయాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. సోలార్, విండ్ విద్యుత్తు పార్కులను ప్రోత్సహిస్తాం. - సౌరశక్తిని, పవనశక్తిని పూర్తిగా వినియోగించుకోవటంపై, చిన్న తరహా జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. - అంతే కాకుండా 800 మెగా వాట్ల కృష్ణపట్నం థర్మల్ కేంద్రం రెండో దశ, 800 మెగా వాట్ల వీటీపీఎస్ 5 వ దశ, 960 మెగావాట్ల పోలవరం జలవిద్యుత్ కేంద్రం, 1600 మెగావాట్ల వాడరేవు మెగా విద్యుత్ కేంద్రం మొదటి దశల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం.