Madabhushi Sridhar
-
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్లు అను కున్నంత కాలం లాకప్లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
‘మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి’
తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీల కండకావరం... దాదాపు చావు నుంచి బయటపడ్డాను. గొంతు తొక్కి, తోసి బయట పారేశారు. నా మిత్రుడి కాలు తొక్కి పడేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం మా ప్రాణానికి వచ్చింది. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతివాడినీ చంపేయాలా? అదృష్టవశాత్తూ చావు తప్పి, బయటపడ్డాం. ఈ పరిస్థితి నాకు (మాడభూషి శ్రీధర్), సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికీ ఎదురైంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవడం భావ్యం కాదనుకుని ‘అలయ్ బలయ్’కి వెళ్ళాం. సీఎం వస్తున్నదశ. నేను, పాశం యాదగిరి దూరం నుంచి వేదిక వద్దకు రాకముందే సెక్యూరిటీ వారి అతి వల్ల ప్రమాదం వచ్చిపడింది. సీఎం చుట్టూ ఎవరు చచ్చిపోయినా ఫరవాలేదన్నట్టుగా రక్షకభటులు వ్యవహరించారు. నా గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉంది. యాదగిరి కాలిపైన నెత్తురు గాయమైంది. మందులు వాడుతున్నాం. ఇలాంటి రక్షణలో ఉండే సీఎం సామాన్యులకు రక్షణ ఏమిస్తారు? సీఎం చుట్టూ ఉన్నవారు మమ్మల్ని తొక్కిపారేశారు. ఒక దశలో నేను చనిపోతాననే అనిపించింది. అసలే ఆరోగ్యం పూర్తిగా బాగుకాని దశలో ఉన్నవాణ్ణి. నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? నిజానికి సెక్యూరిటీ వారు మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, ముఖ్యమంత్రిని భద్రంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ మాత్రం కనీసపు ఇంగితం వాళ్ళకు లేకపోయింది. వీరు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? మా ప్రాణాలు పోతే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే ఏం చేస్తారు? సంతాపం చెబుతారు. లేదంటే కుటుంబానికి కొన్ని లక్షలు ఇస్తారు. మనుషుల ప్రాణాల విలువ అంతేగా! సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానె... సామాన్యుల్ని చంపకండి. బండారు దత్తాత్రేయ గారూ! మీ అలయ్ బలయ్ పేరుతో మీ మిత్రులనుకునే వారిని కూడా చావుకు సిద్ధం కమ్మనడం న్యాయం కాదు. ఈ పని బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. ఇదేదో అనుకోకుండా జరిగిన చిన్నతప్పు అని తోసిపారేయకండి. ఇక ముందు ఏ వేదిక దగ్గరా ఏ మనిషినీ తోసి, తొక్కేయకండి. నా వయసు 69. యాదగిరి 73 దాటిన వారు. పదిమంది కండలు పెంచుకున్న వారి దాడులకు మేం తట్టుకోలేం. ఈ రాష్ట్రం తట్టుకోలేదు. గొంతు నొక్కకుండా, కొట్టకుండా వీలు కాకపోతే ఈ అలయ్ బలయ్ లేకపోయినా ఫరవా లేదు. మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి. - మాడభూషి శ్రీధర్, రచయిత, ప్రొఫెసర్ - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ -
ఎవరిని మభ్యపెట్టాలని ఈ చట్టాలు?
కొత్త న్యాయ చట్టాలను తీసుకు వచ్చామని ఆర్భాటంగా ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి: ఆ చట్టాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందా లేక పాత చట్టాల నుంచి వివిధ అంశాలను స్వీకరించిందా? ఎందుకంటే పేరుకు కొత్త చట్టాలే కాని వీటిలో అధిక భాగాలు పాత చట్టాల నుంచి కాపీ కొట్టినవేనని న్యాయశాస్త్ర కోవిదులు చాలా మంది ప్రకటిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ తరుణబ్ ఖైతాన్ ఈ చట్టాలను ‘టర్ట్ ఇట్ ఇన్’ అనే టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించినప్పుడు బయటపడిన అంశాలు ఈ సందర్భంగా గమనార్హం.1. భారతీయ న్యాయ సంహిత –2023లోని 83 శాతం అంశాలు ఇండియన్ పీనల్ కోడ్ 1860 (పాత బ్రిటిష్ చట్టం) నుంచి కాపీ, పేస్ట్ చేసిందే.2. భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023ను అంతకు ముందున్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్–1973 నుండి 82 శాతం తీసుకున్నదే.3. భారతీయ సాక్ష్య చట్టం–2023 అంతకుముందు అమ లులో ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ చట్టం–1872 నుంచి 82 శాతం మక్కీకి మక్కీ కాపీ కొట్టినదే.ఈ సందర్భంగా కాపీ కొట్టడం గురించి కొంత వివరణ చూద్దాం. నల్సార్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్న ప్పుడు వేపా పార్థసారథి (వీపీ సారథి) అనే అద్భుతమైన ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన సాక్ష్య చట్టంలో ప్రముఖ నిపుణుడు. మొత్తం చట్టం ఒక్కో అక్షరం, పదం, కామా, ఫుల్స్టాప్ వంటి అర్థాలను చక్కగా వివరించేవారు.ఓసారి జడ్జీలకు క్లాస్ చెబుతున్నారు. ‘సాక్ష్య చట్టంలో ఇలా ఉంది సార్’ అని ఓ వ్యాఖ్యానం ప్రతిపాదించారు ఓ జడ్జిగారు. వారు చాలా బాగా అధ్యయనం చేసిన జడ్జి గారు. అప్పుడు సారథిగారు ‘మీరు ఈ కామా గురించి చూడాలి. అందువల్ల దాని అర్థం మారిపోతుంది’ అని వివరించడంతో జడ్జి అవాక్కయ్యారు. అంత సునిశితంగా పరిశీలించే సారథిగారు మన పాత నేర చట్టాలపై తన అభిప్రాయాన్ని ‘పాతదే అయినా మన సాక్ష్య చట్టాన్ని 90 శాతం సవరించాల్సిన అవసరం లేదు, కొన్ని మంచి సంస్క రణల అవసరం ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. ప్రతి పాఠాన్నీ సున్నితమైన హాస్యంతో కలిపి అద్భుతంగా క్రిమినల్ లా సూత్రాలను చెప్పేవారాయన.ఆయన కాపీ కొట్టే విషయంలో ఒక జోక్ చెప్పేవారు. ఓ విద్యార్థికి ఓ అంశం మీద 5 పేజీల వ్యాసం రాయాలని పరీక్ష పెట్టారు. ఆ విద్యార్థి ఎవరిదో పరిశోధనాపత్రంలోని విషయాలను చక్కగా దించేశాడు. కానీ పరిశోధనా పత్రం రాసిన స్కాలర్ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఆ పరీక్ష పేపర్ దిద్దుతున్న ప్రొఫెసర్ అది తన వ్యాసాన్ని కాపీ కొట్టి రాసిన జవాబుగా గుర్తించారు. ప్రశ్నకు 10 మార్కులకు గాను 8 మార్కులు ఇచ్చారు. విద్యార్థి ‘సార్ నేను ఫెయిల్ అవుతాననుకున్నాను. మీరు 8 మార్కులు ఇచ్చారే ఆశ్చర్యం’ అన్నాడా విద్యార్థి క్లాసులో. అందుకు ‘నిజమే, అప్పట్లో మా ప్రొఫెసర్ నే రాసిన ఈ జవాబుకు చాలా తక్కువగా 4 మార్కులే ఇచ్చారు. ఇప్పటికీ నేనే కరెక్టు రాశానని నా నమ్మకం. అదే రాసిన నీకు నేను 8 మార్కులు ఇచ్చాను’ అన్నారట ప్రొఫెసర్. దీంతో విద్యార్థి నోరెళ్ల బెట్టా డట. అటువంటి పార్థసారథిగారు ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన అభిప్రాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి.ఇండియన్ ఎవిడెన్స్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేనే లేదనీ, ఒకవేళ ఎవరైనా మార్చితే దాన్ని ప్రభుత్వాలు దుర్మార్గం చేయడానికే వాడతాయనీ ఆయన అనేవారు. ఎవిడెన్స్ చట్టాన్ని నేను కూడా బోధించే వాడిని. అందుకే నేను కొన్ని మార్పులు, సూచనలు చేశాను. సారథిగారు ఒక రోజంతా చదివి ఆలోచించి, మరునాడు నల్సార్లో నా గదికి వచ్చి, ‘మీరన్నది కరెక్టే, కొన్ని మార్పులు చేయడం అవసరమే’ అని ఒప్పుకోవడమే కాకుండా, తరువాత వచ్చే ఎడిషన్లో ‘ప్రొఫెసర్ శ్రీధర్ సలహా ఇచ్చారు’ అనిముందుమాటలో నా పేరు రాశారు. ఎంత గొప్పవ్యక్తి ఆయన! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకరి అభిప్రాయమో, లేక పుస్తకం, వ్యాసాల్లో ఉన్న విషయాలనో మనం ఉపయోగించి ఏమైనా రాసేటప్పుడు తప్పనిసరిగా సోర్స్ను ఉటంకించడం కనీస ధర్మం. ప్రొఫెసర్ పార్థసారథి చేసింది అదే. ఇంగితం ఉన్న ఎవరైనా చేయాల్సిందీ అదే!పాత బ్రిటిష్ కాలపు క్రిమినల్ చట్టాలను పూర్తిగా సంస్కరించుకునే బంగారంలాంటి అవకాశాన్ని ప్రభుత్వం, పార్లమెంట్, ఎంపీలు పూర్తిగా వదిలేసుకున్నారని మా నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థి... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ప్రొ‘‘ అనూప్ సురేంద్రనాథ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఏమర్థమవు తోంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ కొత్త నేర చట్టాలు?– మాడభూషి శ్రీధర్. వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ఇవి చదవండి: Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు! -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి?
మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. రాజ్యాంగ నియమాలతో పాటు కొన్ని సంప్రదాయాలూ అనేక ఏళ్ల నుంచీ కొనసాగుతున్నాయి. అందులో సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకాలనూ, బదిలీలనూ చేపడతారు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానో లేదా రాజ్యాంగ నిబంధనలను అనుసరించో ఏర్పడింది కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిణామం చెందిన వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వం వహిస్తారు. నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు కొలీజియానికి ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సు చేసినవారిని ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇటీవల కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనే ప్రతిపాదన చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వివాదాస్పదమయింది. సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పుల వల్ల... నియమాల కన్నా ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగానే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొలీజియం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రతి నిధి ఉండాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే దెబ్బ తీసేవిధంగా ఉందని పలువురు న్యాయనిపుణులు అంటు న్నారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి స్థానం గురించి మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సమాఖ్య, కార్యనిర్వాహకవర్గం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ ముఖ్య విభాగాలు అని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన సంగతిని పేర్కొన్నారు. కొలీజియంలో పార్లమెంట్, ప్రభుత్వ పెద్దలకు స్థానం కల్పించడానికి చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్నీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) చట్టాన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ‘పెద్దలు’ (ముగ్గురు) పరోక్షంగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును ఒప్పుకోవడం లేదనీ, ఆ నిర్ణయాన్ని మరో దారిలో అమలుచేయాలని చూస్తున్నారనీ ట్విట్టర్ వేదికగా ఆయన అన్నారు. ‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్ఖర్ కలగలిపి వేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించ గలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదనీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదనీ అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయశాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’ అని చిదంబరం అన్నారు. అంతేకాదు ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామను కోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జమ్మూ –కశ్మీర్లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా? వాక్ స్వాతంత్య్రాన్నీ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛనూ, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? స్త్రీ పురు షులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించి... స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకు తీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయ కుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని చిదంబంరం పేర్కొన్నారు. రాజ్యాంగ సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా... ప్రధానమంత్రీ, ఇతర ముఖ్యమైన మంత్రులూ, నాయకులూ తమ బాధ్యతను మరచి రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొలీజియంలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కాకుండా చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పాల్గొనే విషయాన్ని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. ఇదే జరిగితే న్యాయం బతుకు తుందా? - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
Dhanurmasam 2022: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం
గోదాదేవి పేరుతో తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్ అంటూ తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయం లోనే పఠించాలి. అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చింది. అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి తమను ఆదుకోమని గోప గోపీజనులు కోరారు. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించి, తెల్లవారు ఝామున రావాలని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు. దాంతో తిరుప్పావై కథావస్తువు మొదలైంది. శ్రీకృష్ణుడితో గడిపితే కలిగే ఆనందం, ఉత్సాహం గుర్తుకు వచ్చి గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగు వేల కవితలను నాలాయ రమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవేద్యం తరువాత నాలాయిర ప్రబంధ పారాయణం... తిరుప్పావై మంగళా శాసనం ప్రణవ నాదంతో ముగుస్తుంది. ఈ తమిళ ప్రబంధ పారాయణానికి ఏ ప్రతి బంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణ భేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. నారాయణ మంత్ర సారాంశాన్ని పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పినవాడు రామానుజుడు. కుల మత భేదాలు లేకుండా అంద రికీ నారాయణుని చేరే జ్ఞాన, వ్రత, మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ– గోదాదేవి, శ్రీరామానుజుడు. తిరుప్పావై జీయర్ అని రామానుజుని అంటారు. గోదాదేవి పుట్టి కావేరి నది తీరంలో శ్రీరంగనిలో లీనమైన రెండు వందల ఏళ్ల తరువాత క్రీస్తు శకం 1000లో జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణమైతే... తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీ సుందర బాహుస్వామికి వేయి బిందెల పాయసం చేయిస్తానన్న మొక్కును ఆయన తీర్చడం మరో కారణం. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కు తీర్చలేకపోయారు. ఆ విషయం విన్న మరుక్షణమే రామానుజుడు శ్రీసుందర బాహుస్వామి ఆలయా నికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారట. శంగత్తమిళ్ అంటే అందమైన తమిళ భాష అని అర్థం. డిసెంబర్ మధ్యలో ఉండే ధనుర్మా సంలో వచ్చే తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. గోదాదేవి రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. ఆ విధంగా 30 అందమైన ఎనిమిది పాదాల కవితలు గోదా గళం నుంచి జాలు వారాయి ఈ నెలలో. పదం పదంలో పుణ్యకథ కనిపిస్తుంది. వాటిని వింటుంటే రామాయణ ఘట్టాలూ, భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇందులో భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కానీ ఇది సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధనా, సాధనా... ఒక పిలుపు, వ్రతం, ఆరాధన కలిసిన ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు రచించిన పాశురాలు విన్న తరువాత... శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున మొత్తం 30 వింటాడు. గోదా గీతాగోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మి కోద్యమం ఇది. (క్లిక్ చేయండి: అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..) - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్ర యూనివర్సిటీ (డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా) -
దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!
ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్ ఒక సంఘం, విద్వేష కేంద్రం కాదు అనేది తొలి పాఠం. నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వాన్ని ‘సంఘం’ అని రాజ్యాంగం అంటోంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష విధ్వంస ఉద్వేగ ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి, భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో... రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. ‘నేషనల్’ అన్న పదానికి తెలుగులో మనం ‘జాతీయ’ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశభక్తి భావాలను రక రకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం. మన నాయకుల సంగతి మరీ దారుణం. చంపండి, నరకండి అని తెలుగు సినిమా ఫ్యాక్షన్ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను వేదికల మీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడే వారు దేశద్రోహులు. వాడుకగా పత్రికల్లో, టీవీల్లో మనం ‘కేంద్రం’ అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనే మాటే లేదు. ఆ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తొలి తెలుగుదేశం వ్యవస్థాపకుడు (చంద్రబాబు నాయుడికి ముందు తెలుగుదేశం) ఎన్టీ రామారావు ‘కేంద్రం’ అనే పదం ‘మిథ్య’ అనేవారు. రాష్ట్రాలు లేకపోతే దేశం ఎక్కడ అనేవారు. అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా వాదించేవారు. మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా? రాష్ట్రం గొప్పదా? అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కేంద్రం అని. గొప్పదంటే ఏమిటీ? ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికల ద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సమానమే కదా? సమానమే కానీ కేంద్రం ‘ఎక్కువ సమానం’. ఎందుకంటే... దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు, ఇవన్నీ యూనియన్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్ లిస్ట్ అని ఏడో షెడ్యూల్లో కొన్ని అంశాలపై పాలనాధికారాలనూ, శాసనా ధికారాలనూ ప్రత్యేకించి యూనియన్కే పరిమితం చేశారు. యూనియన్ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం. కానీ వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. రాజనీతి పరంగా... రాజ్యాంగ వాడుకలో స్టేట్ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్ అంటే రాజ్యం అనీ, దేశ పాలనా వ్యవస్థ అనీ అర్థం. మార్గ దర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానతను సాధించడానికీ, పేద ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికీ కృషి చేయాలనే సూత్రం ఒకటి ఉంది. స్టేట్ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా ‘రాజ్యం’ రాష్ట్రమైంది. ‘రాష్ట్రం’ దేశమైంది. ‘దేశం’ కేంద్రమైంది. రాష్ట్రం కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలకపదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటాం. న్యాయ పరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది. ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగం తొలి అధికరణం సంవిధాన రచన ఆరంభమవుతుంది. ఆర్టికల్ 1 సంఘం (యూనియన్) పేరు ప్రాదేశిక పరిధి: (1) ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సంఘమై ఉంటుంది. (2) రాష్ట్రాలు వాటి ప్రాదేశిక పరిధుల వివరణ తొలి షెడ్యూలులో ఉంది. (3) ఈ ఇండియా పరిధిలో ఉండేవేవంటే... (ఏ) ఆయా రాష్ట్రాల పరిధి, (బీ) తొలి షెడ్యూల్లో పేర్కొన్న కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి, (సీ) భవిష్యత్తులో స్వాధీనం చేసుకోబోయే ప్రాంతాలు ఏవైనా ఉంటే అవీ. (క్లిక్: రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు) తొలి షెడ్యూల్లో ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాల రాష్ట్రాలను, వాటి పరిధులను పేర్కొన్నారు. (ఏ) భాగంలో బ్రిటిష్ ఇండియాలోని తొమ్మిది ప్రొవిన్స్లూ, (బీ)లో స్వతంత్ర రాజ్యాలు, (íసీ)లో కేంద్ర పాలనలో ఉన్న అయిదు రాష్ట్రాలు; అండమాన్ నికోబార్ దీవులు (డీ)లో చేర్చారు. ఏడో రాజ్యాంగ సవరణ (1956) ద్వారా పార్ట్ (ఏ) (బీ)ల మధ్య తేడాను తొలగించారు. తరువాత రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్నిర్మించారు. ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న మాట వెనుక హేతుబద్ధత ఏదీ లేదనే విమర్శలకు గురైన విధానం ఇది. అయిదారు రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. వాటన్నిటినీ కలపడం భావ్యమా? తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటి అనే వాదం కూడా తెలంగాణ ఏర్పాటు కార ణాల్లో ఒకటి. 1950లో లేని అనేక కొత్త రాష్ట్రాలు ఆ తర్వాత వచ్చాయి. తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. కానీ జమ్ము–కశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. (క్లిక్: రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసివుంటే...) ‘భారత్’ అని ఇండియాను పిలవాలంటూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం 2016లో దాఖలైంది. మన రాజ్యాంగంలో మన దేశానికి భారత్ అనీ, ఇండియా అనీ రెండు పేర్లున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్ర వాక్యం ‘భారత్ మాతాకీ జై’. అందులోంచి భారత్ అన్న పేరును స్వీకరించారు. ప్రతి భారతీయుడికీ ఈ రెండు పేర్లలో ఒక పేరును ఎంచుకునే హక్కు ఉందని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అంటూ ఈ పిటిషన్ను కొట్టి వేశారు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో నిర్ణయించే నిరంకుశాధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. (క్లిక్: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు
రాజ్యాంగం తొలి ప్రతిని 1948 నవంబర్ 4వ తేదీన రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ మొదటినుంచీ రాజ్యాంగం చిత్తుప్రతిలో లోపాలను ఎత్తిచూపుతూ ఉండేవారు. ఆయన మాత్రమే కాదు, కె. సంతానం (మద్రాస్), ఆర్ ఆర్ దివాకర్ (బాంబే), మౌలానా హస్రత్ మోహానీ (యునైటెడ్ ప్రావిన్సెస్) కూడా రాజ్యాంగ రచనను పదే పదే విమర్శించేవారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ... చట్ట వ్యతిరేకంగా తనను తాను రాజ్యాంగ సంఘం (కానిస్టి ట్యూషన్ కమిటీ)గా మార్చుకున్నదని వ్యాఖ్యానించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ సభ నిర్ణయాలను రచనలో పొందుపర్చడమే కాకుండా... ఆ నిర్ణయాలను సమీక్షించారనీ, కొన్ని చోట్ల వాటికి కొత్తరూపం ఇచ్చారనీ దివాకర్ విమర్శిం చారు. తర్వాతి రోజుల్లో రాజ్యంగ ‘పీఠిక’గా మారిన ‘రాజ్యాంగ లక్ష్య తీర్మానం’ (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) పైనా మోహానీ విమర్శలు కురిపించారు. ఇదంతా ఎందుకంటే ఈ పీఠిక (ప్రియాంబుల్) రాసిం దెవరు అనే ప్రశ్న కోసం. నిజంగా వెంటనే సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్న ఇది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, మార్పులు, చేర్పులు, ప్రసంగాల వివరాలు ఉన్నాయి కానీ... రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుల మధ్య జరిగిన చర్చలు, సవరణ ప్రతిపాదనలు; చేసిన మార్పులు, చేర్పులు; తుది రూపం ఇచ్చేముందు జరిపిన సంప్రదింపులకు సంబం ధించిన సమాచారం లేదు. ఆ వివరాలు ఎక్కడా రాసిలేవు. రాజ్యాంగ సభలో ఈ పీఠికకు తుది రూపంపై చర్చకు ముందు జరిగిన వివరాలూ లేవు. యూపీఎస్సీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేవారంతా పీఠిక ఎవరు రాశారు అనగానే జవ హర్లాల్ నెహ్రూ అని జవాబు ఇస్తారు. దానికి కారణ మేమంటే.... నెహ్రూ ప్రతిపాదించిన ‘లక్ష్య తీర్మాన’మే భావి భారత రాజ్యాంగానికి లక్ష్య, ఉద్దేశ్య ప్రకటనగా రూపొందింది. రాజ్యాంగ రచనాసభలో చర్చించిన వివరాలు లేకపోవడం మోహానీ వంటివారు కొందరు విమర్శించడానికి కారణమైంది. ఇక్కడే అసలు రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతి సేకరించి, అన్ని నియమాలు ఒకచోట గుమిగూర్చి, చర్చకు ప్రాతిపదికగా రూపొందించిన ఘనత రాజ్యాంగ సభ సలహాదారుడైన బిఎన్ రావ్కు దక్కుతుందనేవారు ఉన్నారు. తొలి చిత్తు ప్రతి రూప కల్పనలో రావ్ పాత్ర నిర్వివాదాంశం. అయితే పీఠిక కూడా ఆయనే రాశారనడానికి వీలు లేదు. ప్రతి సభ్యుడి ప్రతిస్పంద నను ఆధారంగా చేసుకుని, చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వాక్యా లను రచనా సంఘం... ముఖ్యంగా అంబేడ్కర్ నిర్మించారనేది నిర్వివాదాంశం. అయినా వివాదం చేయదలచుకున్న వారికి వివాదం కావచ్చు కూడా! రాజ్యాంగ రచన ఉపసంఘం సమావేశాల కాలంలో చాలా సందర్భాలలో అందరు సభ్యులూ హాజరు కాలేదు. పీఠికా నిర్మాణ సమయంలో రాజ్యాంగ రచనా ఉపసంఘానికి చెందిన నలుగురు మాత్రమే తొలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రోజూ వదలకుండా మొత్తం రచనా ఉపసంఘం సమావేశా లన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబే డ్కర్కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. అయితే రాజ్యాంగ రచన, పీఠిక రచన రెంటికీ మధ్య సారూప్యత ఉన్నా.. కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ‘ముఖ్య నిర్మాత’ అన్నంత మాత్రాన అన్ని భాగాల రచయిత వారే అవుతారని అనడానికి వీలుండదు. అంబేడ్కర్ రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత చేసిన ప్రసంగం, నెహ్రూ లోక్సభలో 6 డిసెంబర్, 1956 (అంబేడ్కర్ నిర్యాణ దినం) నాడు ఇచ్చిన ఉపన్యాసం... రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేడ్కర్ అనే విషయాన్ని ధృవీ కరిస్తాయి. ‘‘సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలలో అంబేడ్కర్ ఒకరు అంటారు. కానీ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ, కష్టపడ్డవారు గానీ మరొకరు లేరు’’ అని నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తనకొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివ రంగా చెప్పారు. ఈ రకరకాల చర్చల మధ్య రాజ్యాంగ పీఠికకు కర్త ఎవరు అనే విషయం మరుగున పడిపోయింది. ఆకాశ్ సింగ్ రాథోర్ మాత్రం తన పుస్తకానికి ‘‘అంబేడ్కర్స్ ప్రియాం బుల్’’ అని పేరు పెట్టారు. ‘రాజ్యాంగ రహస్య చరిత్ర’ అని కూడా ఉపశీర్షిక తగిలించారు. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా వర్సిటీ -
‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం
1215లో మెగ్నా కార్టా అనే హక్కుల ప్రకటన ఉద్యమం ప్రారంభం అయినప్పుడు మొట్టమొదట అడిగిన హక్కు ‘అడిగే హక్కు’. దాన్ని ‘రైట్ టు పిటిషన్’ అంటారు. అడిగే హక్కు ప్రాణ హక్కు కన్నా గొప్పదా అంటే సమాధానం... అవును. అడిగే హక్కు ఒక్కటి ఇస్తే అందులో ప్రాణ హక్కు అడుగుతాం, అభివృద్ధి హక్కు అడుగుతాం. ఇంకేం కావాలన్నా అడగవచ్చు. ఆ అడిగే హక్కు ఇప్పుడు భావప్రకటనా స్వాతంత్య్రం.‘‘నాకు తెలుసుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అంతరాత్మ చెప్పినట్టు వాదించే స్వేచ్ఛ ఇవ్వు. అదే అన్నిటికన్నా గొప్ప స్వేచ్ఛ’’ అంటాడు మిల్టన్. అభిప్రాయాలు, ఆలోచనలు అందరికీ ఉంటాయి. కనుక చెప్పే హక్కు సహజమైన హక్కే. చెప్పిందే చెప్పినా ఫరవాలేదు, చెబుతూ పోవడమే కర్తవ్యం. చెప్పకుండా నోరుమూసుకుని కూర్చుంటే అన్ని అన్యాయాలను ఆమోదించినట్టే! మౌనం అర్ధాంగీకారం అంటారు. కాదు. మౌనం సంపూర్ణాంగీకారం... ఉక్రెయిన్పై రష్యా దౌర్జన్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించినపుడు ఎన్నడూ లేని సమైక్యత పాటించిన మనమూ, మన ఇరుగు పొరుగూ... పాకిస్తాన్, చైనా; మరో 32 దేశాలు తటస్థంగా ఉన్నాయి. దాని అర్థం రష్యా మానవ హనన సమరాన్ని సంపూర్ణంగా సమర్థించినట్టే. ఇది దురదృష్టకరం. కనీసం ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని అడిగి... ధర్మం, న్యాయం పాటిస్తే బాగుండేది. మానవత్వపు విలువల వలువలను దుశ్శాసనులు ఊడదీస్తుంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మౌనం పాటించడాన్ని తటస్థవైఖరి అంటారా ఎవరైనా? తటస్థ వైఖరి వల్ల ఎవరికి లాభమో వారిని సమర్థించినట్టే. మౌనం కూడా ఒక వ్యాఖ్యానమే, భావవ్యక్తీకరణే. ఐక్యరాజ్యసమితి 1948 మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్ 19లో భావవ్యక్తీకరణ సహజ హక్కును గుర్తించింది. ప్రతి వ్యక్తీ అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కూ, వ్యక్తం చేసే హక్కూ కలిగి ఉంటాడు. ఉండాలి. మనిషికి ప్రతివాడి గురించీ తీర్పులు ఇవ్వడం అలవాటు. సోషల్ మీడియాలో బాధ్యతారహితమైన తీర్పులు ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల ఈ స్వేచ్ఛకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అంబేడ్కర్ తన ఆలోచనా స్వేచ్ఛనూ, అనుభవాల నుంచి నేర్చుకున్న అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనూ విరివిగా వాడుకున్నారు. లాహోర్ తీర్మానం (1940)లో ముస్లింలీగ్ పాకిస్తాన్ వేర్పాటును డిమాండ్ చేసిన తరువాత అంబేడ్కర్ 400 పేజీలలో ‘థాట్స్ ఆన్ పాకిస్తాన్’ అనే పుస్తకం రాశారు. అందులో పాకిస్తాన్ అనే బీజం పుట్టుక, వికాసం గురించి విశ్లేషించారు. హిందువులు పాకిస్తాన్ను ముస్లింలకు ఇవ్వాలని వాదించారు. పంజాబ్, బెంగాల్ ప్రదేశాలను హిందూ ముస్లిం నివాసాలను బట్టి పునర్విభజించాలని సూచించారు. ఒక దశాబ్దం పాటు ఈ ఆలోచనలు అనేక చర్చలకు దారితీశాయి. ముస్లిం లీగ్, కాంగ్రెస్ల మధ్య చర్చలకు అంబేడ్కర్ ఆలోచనలు ప్రాతిపదిక అయినాయి. చివరకు భారతదేశ విభజన తప్పలేదు. అభిప్రాయ ప్రకటన హక్కులో ఎవ్వరి జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండడం, ప్రాదేశిక హద్దులకు అతీతంగా ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్నీ, అభిప్రాయాలనూ అడిగి, స్వీకరించి, బోధించే స్వాతంత్య్రం ఈ హక్కులో ఉంటాయని ఆర్టికల్ 19 వివరిస్తుంది. సహజ హక్కు అంటే ప్రజలందరికీ ఉండాలి. కానీ మన రాజ్యాంగం పౌరులకు మాత్రమే ఈ హక్కు పరిమితం చేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తను పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే ఆ భారతీయుడు కోల్పోయే తొలి ప్రధానమైన హక్కు ఇదే. (చదవండి: అకడమిక్ బ్యాంకు క్రెడిట్.. విద్యార్థికి మేలే గానీ...) ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన... వ్యక్తులందరికీ ఈ స్వేచ్ఛ ఉండాలనీ, అనేక మాధ్యమాలు ఉండవచ్చుననీ, ఈ స్వేచ్ఛకు దేశాల సరిహద్దులు ఉండవనీ, ఇందులో సమాచార హక్కు, ఇతరుల నుంచి సమాచారం పొంది ఇతరులకు పంచే హక్కు కూడా ఉంటాయనీ; ఇతరుల అభిప్రాయాలు కోరి, విని, స్వీకరించి, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఉంటుందనీ వివరించింది. అభిప్రాయ స్వేచ్ఛకు చాలా విస్తృతి ఉన్నది. మన రాజ్యాంగంలో ఈ హక్కుపై చాలా పరిమితులు ఉన్నాయి. మొదటి పరిమితి కేవలం పౌరులకే ఇవ్వడం. ఇందులో సమాచార హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో చెప్పింది. 2005 దాకా దాన్ని పట్టించుకోలేదు. విభిన్న స్థాయుల్లో శాస్త్రీయ పరిశోధన చేసేందుకు, ప్రచురించేందుకు తగిన స్వేచ్ఛ ఉండాలి. దాన్ని శాస్త్రీయ స్వేచ్ఛ అంటారు. 1766లో పత్రికా స్వేచ్ఛ చట్టాన్ని స్వీడన్ అమలు చేసింది. ఇదే సమాచార హక్కును కూడా 1766లోనే ఇచ్చింది. 1947 ఆగస్టు 15న మనదేశం స్వతంత్రం సంపాదించింది. కానీ చాలాకాలం డొమినియన్గా ఉండింది. భారతీయ జన గణ మన తంత్రం అప్పటికి ఆవిర్భవించలేదు. స్వతంత్రం గణతంత్రంతోనే సంపూర్ణమవుతుంది. గణతంత్రం లేకపోతే సొంత తంత్రమేదీ ఉండదు. స్వతంత్రం కూడా ఉండదు. చెదురు మదురుగా ఉన్న జనం సాధికారిక పాలకులుగా నాయకత్వం స్వీకరించడానికి కొన్ని వ్యవస్థలు ఉండాలి. విధానాలు ఏర్పడాలి. ప్రక్రియ ఉండాలి. పద్ధతులు ఏర్పడాలి. అప్పుడు జనతంత్రం గణతంత్రంగా పరిణమిస్తుంది. నిర్ణీత గణతంత్ర విధానాల సమగ్ర నిర్మాణం ద్వారా మాత్రమే మనం స్వతంత్రం కాపాడుకోగలం. - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
‘గెజిట్’తో నదులు, ప్రాజెక్టుల స్వాధీనం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు, వాటిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రముఖ న్యాయనిపుణుడు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్టు కేంద్రం చెపుతోందని, అయితే నదులు, వాటిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ఈ చట్టం లో ఎక్కడా లేదన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసి, వాటి అధికార పరిధిని నిర్ణయించే అవకాశమే కేంద్రానికి ఉందన్నారు. గెజిట్ నోటిఫికేషన్పై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం శనివారం ఇక్కడ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డుల అధికార పరిమితిని నిర్వచించే సాకుతో గెజిట్ ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుందని విమర్శించారు. దీనివల్లరూ.70 వేల కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు ఆగిపోతే రాష్ట్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. కేంద్రం తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయసమ్మతంగా ఉండాలి: తెలంగాణ భౌ గోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదీ జలాల్లో న్యాయమైన కేటాయింపులను జరపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తీసుకోవాలంటే అధిక సమయం, వ్యయం అవుతుందని, అదే ఏపీలో కేవలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం ద్వారా నీళ్లు వస్తాయని అన్నారు. కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ వల్ల హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం తాగునీటి కోసం కటకటలాడాల్సి వస్తుందని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్రెడ్డిలు ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా వ్యవహరించారు. -
బాబా రాజ్యాంగ సాహెబ్
అంబేడ్కర్ రాజ్యాంగ రచయిత కాదు. అంబేడ్కర్ మన రాజ్యాంగానికి తండ్రీ, కీలక మైన నిర్మాత కూడా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూ షన్! రచయిత కన్నా... తండ్రి, నిర్మాత గొప్పవారు. పార్లమెంటు వేరు. రాజ్యాంగ రచనా సభ వేరు. కేవలం రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కను మరుగయ్యేది రాజ్యాంగ రచనా సభ. 1947, ఆగస్టు 29న అంటే మనకు స్వాతంత్య్రం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ రచనా సభ ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ప్రముఖ పరి పాలనాధికారి, న్యాయవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజ్యాంగ సభ సలహాదారు అయిన బీఎన్ రావ్ (కన్నడ) రూపొందించిన తొలి చిత్తుప్రతిని ఈ రచనా సంఘం పరిశీలించి రాజ్యాంగ సభ ముందు చర్చకు సమర్పించాలని... ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశిం చారు. ‘‘రాజ్యాంగ నిర్మాణం చేసిన ఘనత నాకు ఇచ్చారు, కానీ నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బీఎన్ రావ్కు చెందుతుంది. రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారు. ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అని అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చెప్పారు. అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు. అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోశన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించి అధ్య యనం చేసిన వ్యక్తి. కనుక రాజ్యాంగ రచనా ఉప సంఘంలో ఉండాలని రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ సంఘంలో ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్ (వీరు అనారోగ్యంతో రాజీనామాచేస్తే ఎన్ మాధవరావు సభ్యులైనారు), డీపీ ఖైతాన్ (వీరు 1948లో మరణిస్తే టీటీ కృష్ణమాచార్య చేరారు). ఉప సంఘం సభ్యులు 1947 ఆగస్టు చివర తొలి సమా వేశంలో అంబేడ్కర్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యవ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు. సాదుల్లా, మాధవరావులకు డిల్లీ వాతావరణం సరిపడలేదు. పాలన, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పు డున్న ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ను విస్తరిస్తూ రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని న్యాయ, రాజ్యాంగ రంగాలలో నిపుణుడైన బెనెగల్ నర్సింగరావ్ రూపొం దించారు. ఆ తరువాత అందులో సూత్రాలను పునర్ని ర్మించడంలో కీలకమైన కృషి చేశారు. ఆయన కూడా తరువాత విదేశాల్లో ఉండిపోవడం వల్ల అందు బాటులో లేరు. ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరి కొందరి పాత్ర స్వల్పం, మొత్తం భారం అంబేడ్కర్ పైన పడిందని టీటీ కృష్ణమాచారి చెప్పారు. అంబేడ్కర్ ఆ బాధ్యతను నిర్వహించి రాజ్యాంగ పిత అయ్యారు. మరికొన్ని ఉపసంఘాలు కూడా చాలా సహకరిం చాయి. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీకి నేతగా పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఎన్నో ఉప సంఘాలు పనిని పంచు కున్నాయి. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేడ్కర్ ఇచ్చిన వివరమైన పత్రం చాలా కీలకమైంది. సభలో రాజనీతిజ్ఞులైన ప్రముఖులెందరో బాగా ఆలోచించి 7,635 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2,473 సవరణలను చర్చించి ఆమోదించారు. మిగిలినవి చర్చించి తిరస్కరించారు. ప్రతి పదంపైనా, వాక్యం పైనా వివాదాలు వచ్చాయి. అన్నిటికీ అంబేడ్కర్ సమాధానం చెప్పారు. సరైనవనుకున్న వాటిని ఆమో దించారు. బీఎన్ రావ్ 243 ఆర్టికల్స్, 13 షెడ్యూళ్లతో రాజ్యాంగ చిత్తు ప్రతిని రూపొందిస్తే, అంబేడ్కర్ అధ్య క్షతన ఉన్న రచనా కమిటీ అనేక చర్చలు సవరణల తరువాత 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లతో పూర్తి చేసింది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య
‘వరకట్నమరణ’ నేరాన్ని మెకాలే కనిపెట్టలేదు. భారతదేశ భర్తలు, అత్తమామలు, ఆడపడచుల అనేక ఘోరనేరాల వల్ల భారత సమాజమే స్వతంత్రదేశంలో దీన్ని కొత్త నేరంగా నిర్వచించింది. సాక్ష్యాలు లేని నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులే, అంటే పాత నేరగాళ్లు కాదు, సాగించే దారుణమైన హత్యలకు సరైన శిక్షలు విధించడానికి కావలసిన నియమాలు, విధానాలు పార్లమెంటు రూపొందించింది. మనం గొప్పగా చెప్పుకునే అద్భుతమైన వారసత్వ సంస్కృతి, మనమంతా పిలుచుకునే గొప్ప నాగరికత, అంతరిస్తున్న ప్రేమలు, విజృంభిస్తున్న ద్వేషాలు, ధనాశ, క్రౌర్యం నుంచి పుట్టిన కుటుంబ నేరం ఈ ఘోరం. సిగ్గుపడవలసిన సరికొత్త భారత జాతీయనేరం. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) జార్ఖండ్ రాష్ట్రంలో ఒక భర్త రామ్సహాయ్ మహతో, అత్త పార్వతీదేవి, మామ నేమా మహతో కలిసి కోడలు ఫుల్వాదేవిని వరకట్నం తేలేదని చంపిన సంఘటన ఇది. రాజ్దూత్ మోటార్ సైకిల్, 20 వేలరూపాయల వరకట్నం కోసం వధువును హింసించారు. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తామని బెదిరించారు. తండ్రి అంత డబ్బు తేలేడని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. 1997లో పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆమె జీవితం ముగించారు. ఆమెను నదీ తీరానికి తీసుకువచ్చి నదిలోకి తోసి చంపేశారు. కూతురు కనిపించడం లేదని తండ్రి బోధి మహతో ఫిర్యాదు చేశారు. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) 1997లో వధువును చంపేశారు. కేసు రిజిస్టర్ అయింది. 20వ తేదీ సెప్టెంబర్ 1999 గిరిడిత్ అడిషనల్ సెషన్జడ్జి నేరం రుజువైందని పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో నేరంలో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని తీర్పులో పేర్కొన్నారు. అంటే కేవలం పదేళ్లే శిక్ష అని అర్థం. 2007లో అంటే ఏడేళ్ల తరువాత హైకోర్టు శిక్షలను నిర్ధారించింది. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు శిక్షలను సమర్థించింది. ఈలోగా నేమా మహతో (మామ) 2009 సుప్రీం కోర్టులో అప్పీలు కోసం ఎస్ఎల్పీ వేశాడు. కానీ అంతలో మరణించాడు. కనుక ఆయనపై కేసులేవీ ఉండవు. అత్తమీద ఆరోపణలు స్పష్టంగా లేకపోవడం, రుజువులు సరైనన్ని లేకపోవడం వల్ల ఆమెను విడుదల చేశారు. 21 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుదీర్ఘ అన్యాయాలస్యం తరువాత న్యాయం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లి ఈ అప్పీలు విచారించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక శిక్ష తరవాత మరొక శిక్ష అమలవుతుంది. అంటే ఇదే అమెరికాలో అయితే కోడలిని చంపిన ఈ హంతకులకు 13 ఏళ్ల జైలు శిక్ష పడేది. నేర విచారణ దశలో తమ ఇంట్లోంచి వధువు ఏ విధంగా మాయమైపోయిందో చెప్పలేకపోయారు అత్త మామలు, భర్త. ఆమె తనతో నివసించడం లేదని వారు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు భావించింది. తమతో కాకుండా తన బావతో ఆమె నివసించేదని చెప్పడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిందనీ తరువాత దొరకలేదనే మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. వెతకడానికి ఏం ప్రయత్నాలు చేశారో చెప్పలేకపోయారు. నిజంగా ఆమె ఇంటినుంచి మాయమైపోతే ఆమె తల్లిదండ్రులకు చెప్పకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం చూస్తే వారి ప్రవర్తనపై అనుమానాలు ధృవపడుతున్నాయి. వరకట్న హత్యలకు ప్రత్యక్ష సాక్షులు ఉండరు. నేరగాళ్లే సాక్షులు. వారి ప్రవర్తన, పరిస్థితులు, ముందు వెనుక వారి వ్యవహారాలు, అంతకుముందు జరిగిన సంగతులు వారి నేరాన్ని పట్టి ఇస్తాయి. మామూలు హత్యలకు ఈ హత్య లకు ఇదీ తేడా. హత్య జరిగిందని చెప్పే సాక్షులు ఉండని పరిస్థితులలో, వీరే హత్య చేసి ఉంటారు అని భావించడానికి తగిన పరిసర సాక్ష్యాలు కోర్టు ముందుంచడం ఒక సవాల్. దీనికిగానూ ప్రాసిక్యూషన్ వారు నీతిమంతంగా, న్యాయంగా, చాలాశ్రద్ధతో కృషి చేయవలసి వస్తున్నది. సెక్షన్ 304 బి ఇండియన్ పీనల్ కోడ్ కింద, నిందితులే నేరం చేసి ఉంటారని భావించడానికి కొన్ని సూత్రాలను ఈ తాజా తీర్పు వివరిస్తున్నది. 1. సాధారణ పరిస్థితుల్లో కాకుండా మరోరకంగా మరణం సంభవించి ఉండటం, కాలిన గాయాలో మరోరకం శారీరక గాయాలో అయి ఉండాలి. 2. పెళ్లయిన ఏడేళ్లలోగా అసాధారణ మరణం జరిగి ఉండాలి. 3. మరణానికి ముందు అప్పుడప్పుడే ఆమె హింసకు గురై ఉండాలి. 4. ఆ హింస, క్రౌర్యం వరకట్నం కోసమో లేక దానికి సంబంధించినదై ఉండాలి. ఇందులో వధువు తండ్రి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నిందితుడు తన కూతురికి హాని చేస్తానని బెదిరించినట్టు సాక్ష్యం చెప్పాడు. తండ్రి, తమ్ముడు, బావ చేసిన ప్రయత్నాల వల్ల ఆమె శరీర భాగాలు లభించాయి గానీ పోలీసులేమీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు అంత పకడ్బందీగా లేదు. కానీ 304బి కింద పరిస్థితుల సాక్ష్యం నిందితుల నేరాన్ని రుజువు చేస్తోంది. ఫుల్వాదేవి పెళ్లయిన కొద్ది నెలలకే కట్నం కోసం హింసకు గురికావడం, కొద్దిరోజులకే అత్తవారింటి నుంచి మాయం కావడం (ఆరోపణ స్థాయిలో కూడా నమ్మలేని మాట), తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, వధువు సోదరుడు వచ్చినపుడు ఇంటిల్లిపాదీ లేకపోవడం, ఇంటికి తాళం వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం, ఆమె అస్తిపంజరం నదీ తీరంలో దొరకడం, భర్త, అత్త మామల మాటలు పొంతనలేకుండా ఉండటం వంటి వన్నీ నేరాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇది హత్య. సాక్ష్యాలు దొరికితే హత్య అని నిరూపించి సెక్షన్ 302 కింద శిక్షించే వీలుంది. సెక్షన్ 304బి హత్యల వర్గంలోనే ఒక కొత్తరకం నేరం. దీన్ని చట్టం హత్య అనకుండా వరకట్న మరణం అని పేరుపెట్టినంత మాత్రాన ఇది హత్య కాకుండా పోదు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నది కుటుంబపెద్దల క్రూర స్వార్థ మనస్తత్వం. (చదవండి: వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
రామాయణంలో శేషేంద్రకు దొరికిన ఆణిముత్యాలు
వాల్మీకి పదబంధాలను వ్యాసుడు యథాతథంగా వాడుకున్నాడు. రామాయణానికి భారతం ప్రతి బింబం. ఈ మాట నమ్మడం సాధ్యమా? నేటి భాషలో అయితే వ్యాసుడు వాల్మీకి కాపీరైట్ ఉల్లంఘించాడనాలి. ఈ మాట నేను ఇప్పుడు అనడం లేదు. సాక్షాత్తూ గుంటూరు శేషేంద్ర శర్మ విశేష రచన ‘షోడశి’ (రామాయణ రహస్యములు)లో 1967లో అంటే 54 ఏళ్ల కిందటే ఈ రహస్యాన్ని వెల్లడిం చారు. ఆ విషయాన్ని విశ్వనాథ బయటపెట్టారు. నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో ఆంధ్రప్రభ సాహితీ అనుబంధంలో 1963–67 మధ్య ధారావాహికగా షోడశి వ్యాసాలు ప్రచురితమైనాయి. విశ్వనాథ ‘షోడశి’కి రాసిన ముందుమాటలో చెప్పిన మాటలు: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్యమేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీ శర్మగారు చూపించిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి’’. ‘‘శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వాని యంతట వానినే భగవంతుడైన వ్యాసుడు వాడుకొనెను. వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మొదటివాడు వ్యాసుడు’’. శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవిసమ్రాట్ : ‘‘శ్రీ శర్మగారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేననుకొనలేదు. అప్పుడ ప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయించినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యావిషయమునింత లోతుగా తెలిసిన వారనుకొనలేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండవలసిన విషయము’’. షోడశి వ్యాసాలలో శ్రీసుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చిందనే అధ్యాయంలో వెల్ల డించిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రవచన కర్తలు సాధారణంగా ప్రస్తావించని అంశాలు సాహిత్యపరంగా పరిశోధించి మన ముందుంచారు శేషేంద్ర. సుందరకాండ సుందర నామం ధరించడానికి చాలా కారణాలున్నాయి. అవి: హనుమంతుడు సుందరుడగుట వలన, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట అని. సుందరాయ నమః అని శ్రీరామాష్టోత్తర నామములలో ఉన్నది. కాని హనుమ గురించి కాదు. బ్రహ్మాండ పురాణములో సుందరకాండకు ‘‘చంద్రబింబ సమాకారం వాంఛి తార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండే ఉత్తమే’’ అన్నారు. షోడశ కళా ప్రపూర్ణ అయిన శక్తియే చంద్రబింబం అంటే. ఈ కాండలో సీతారాములకు ఏ భేదమూ లేకపోవడం వల్ల రాముని పరాశక్తిగా భావించాలని పారాయణ విధాన వివరణ తాత్పర్యం. రాముడు సుందరుడు, సుందరి కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ, బ్రహ్మాండ పురాణము సౌందర్యకాండ అనే మాట వాడినారు. ఈ సౌందర్యము శంకరులు సౌందర్యలహరి అని చెప్పినదే. కనుక సుందర హనుమంతుడనగా దేవీ భక్తుడైన హనుమ అని అర్థమే గానీ హనుమ సుందరముగా ఉన్నాడని గాదు. హనుమ నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే, సుంద రకాండగా దర్శనమిచ్చుచున్నది. ‘తదున్నసం పాండురదంత మవ్రణం శుచిస్మితం పద్మపలాశ లోచనం ద్రకే‡్ష్యతదార్యావదనం కదాన్వహం, ప్రసన్నతారాధిప తుల్యదర్శనం’ అని ఓ తల్లీ నిన్ను నేనెప్పుడు చూతునో గదా అని హనుమ పరితపిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘తెలుగుసీమలో సుందరయ్య, సుందరరామయ్య అని బాలా త్రిపురసుందరీ సంప్రదాయ సిద్ధ నామధేయములు ప్రజలు పెట్టుకొను వ్యవహారమున్నది. ఇతర సీమలలో కూడా సుందరేశన్, సుందర్ సింగ్ సుందర్ బాయ్ అట్టి చోట్ల త్రిపురసుందరీపరమైన అర్థమే గానీ హనుమత్పరమైన అర్థము లేద’ని శేషేంద్ర వివరించారు. హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజనేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కానీ తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి? సుందరుడు అని శేషేంద్ర, విశ్వనాథ వెల్లడించారు. ఇది వాల్మీకి చెప్పలేదు. ఆ మహర్షి పరమ గూఢమైన రచన చేసినాడు. సుందరుని కథా సమగ్రమయిన సుందరకాండకు ఆ పేరు వచ్చిందని వివరించారు. ఆ విధంగానే మరికొన్ని అసలు పేర్లను పేర్కొన్నారు. ద్రౌపది అసలు పేరు కృష్ణ అనీ శూర్పణఖ అసలు పేరు బాల అని ప్రస్తావించారు. కవి సమ్రాట్ విశ్వనాథ ‘‘రామాయణమునందు తక్కిన కాండలకు తత్తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి సుందరకాండమన్న పేరు విడిగానేల పెట్టవలసి వచ్చినదన్న ప్రశ్ననిచ్ఛలు వినిపించునదే. ఈ సందియము పలుమందికి కలదు’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. విశ్వనాథ ప్రశంస ఇంకా సాగింది. ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయత్రీ మంత్రములోని పాదముల సంఖ్యయు నక్షరముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధమైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహస్ఫోరకముగా నున్నది: వారి శ్రధ్ధను నిరూపించుచున్నది. ఇది పారాయణము చేయనెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్పరాదు.’’ ....‘అన్నిటికంటే ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే.. ఈ నిరూపణ మాత్రమాశ్చర్యజనకముగా ఉన్నది. శ్రీ శర్మగారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ యనలేదు. వాల్మీకి వేదముననుసరించి శ్రీరామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇదినిరూపించుటకు నాకు శ్రీశర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అని విశ్వనాథ పేర్కొన్నారు. షోడశి హిందీ ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడం కూడా విశేషమే. సుందరకాండలో కుండలినీ యోగాన్ని దర్శించిన శేషేంద్ర శర్మది లోతైన పరిశోధన. త్రిజట స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర వృత్తిని శేషేంద్ర శర్మచూచిన తీరు, వేద రహస్యాలను లోతుగా చదివితేనే అర్థమయ్యేట్టు సూచనప్రాయంగా వాల్మీకి పొందుపరిచిన విధానాన్ని పరిశీలిస్తే రామాయణంలో షోడశి కొత్త కోణాలను ఆవిష్కరించిందని అర్థమవుతుంది. భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాఙ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథం ఇది. వాల్మీకి ఏ విధంగా రామాయణాన్ని సృష్టించారనే విశ్లేషణ గొప్పది. కథా సందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి దేశకాల పరిస్థితులు, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్నీ తెలిస్తే కానీ వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శేషేంద్ర శర్మగారు అన్నారంటే ఆయన రామాయణ మహార్ణవంలో లోతులను ఎంతగా పరిశోధించారో తెలుస్తుంది. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ (నేడు గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి) -
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?
భారత సంవిధానం ఆర్టికల్ 19(1)(ఎ)లో పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రం ఉన్నా కోర్టు ధిక్కారం చేస్తే శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉందంటున్నది. న్యాయ స్థానాల తీర్పులను సమం జసంగా విమర్శించవచ్చునని, వారికి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించకుండా అభిప్రాయ వ్యక్తీ కరణ చేయవచ్చునని కోర్టు ధిక్కార చట్టం వివరిం చింది. రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసును వేగంగా ముగించి బాధితురాలిని బయటకు గెంటి ప్రధాన న్యాయమూర్తిని నిర్దోషిగా ప్రకటించి నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో సహా చాలా మంది మౌనంగా ఉండడం కూడా భావవ్యక్తీకరణ హక్కు వినియోగమే. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదు. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు నోరుమూసుకుని ఉండొచ్చు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం సివిల్ పర మైన తప్పిదం. న్యాయమూర్తి వ్యతిరేక తీర్పు చెప్పి నందుకు కోపించి, కోర్టులోనే చెప్పు విసరడం, తిట్టడం, అరవడం పైపైకి వెళ్లడం కోర్టు ధిక్కార నేరాలు. కోర్టుకిచ్చిన ప్రమాణ పత్రాలలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోయినా కోర్టు ధిక్కా రమే. వీటితో పాటు నిందాత్మక విమర్శలు అనే నేరం మరొకటి ఉంది. మామూలు కేసుల విచారణ నింపాదిగా దశాబ్దాల పాటు సా..ఆ..ఆ..గుతుంది. కానీ రాజ్యాంగ అధికారాలను వినియోగించి పెద్ద న్యాయస్థానాలు కోర్టు ధిక్కారం కేసులు స్వీకరిస్తే, శరవేగంగా జరుగుతాయి. దీన్ని సమ్మరీ హియ రింగ్ అంటారు. కోర్టు ధిక్కారం కేసులో పెద్దగా రుజువు చేయవలసిన అంశాలేమీ ఉండవు. నింది తుడు చేసిన వ్యాఖ్యానాలు ప్రింట్లోనో, వీడియో లోనో, సోషల్ మీడియాలోనో భద్రంగా ఉంటాయి. అబద్ధాలు చెప్పి రేప్లు హత్యలు చేయలేదని చెప్పు కోవచ్చేమో కాని ‘కోర్టు ధిక్కారమా నాకు తెలి యదు, నేను చేయలేదు’ అని తప్పించుకోలేరు. ప్రశాంత్ భూషణ్తోపాటు కోర్టుధిక్కారం కేసులో ట్విట్టర్ కంపెనీవారు కూడా నిందితులు. క్షమాపణతో వారు బయటపడ్డారు. అయితే రెండు ట్వీట్లను వారు మళ్లీ ప్రచారంలో పెట్టకూడదు. ట్వీట్ కవులు, వాట్సాప్ విద్వాంసులకు ఇచ్చిన తీవ్ర మైన హెచ్చరిక సుప్రీంకోర్టు తాజా తీర్పు. సుప్ర సిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రెండు ట్వీట్లు ఆయనను దాదాపు జైలుకు పంపేవే. రూపాయి జరిమానాతో ఆయనకు జైలు తప్పిపోయింది. సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ నేరం చేశారని అందుకు ఆయన శిక్ష అనుభవించాల్సిందేనన్నది. ఒకవేళ ఆ రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు సాధారణ జైలు జీవితం గడపాలని నిర్దేశించింది, బయటికి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయకూడదని నిషేధిం చింది. వీటికన్నా రూపాయి చెల్లించడం నయమని తెలిసి తమ ఉత్తర్వును వెంటనే పాటిస్తారని సుప్రీంకోర్టు చాలా కరెక్టుగా అంచనా వేసింది. కోర్టు ధిక్కారం చేసిన నేరగాళ్లందరినీ అంతే దయతో చూస్తుందని గ్యారంటీ లేదు. కొందరు ప్రముఖు లకు ఎక్కువ సమానత సమర్థనీయం అంటారు. ప్రశాంత్ భూషణ్ అన్నటువంటి మాటలే ఇదివరకు కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ మాట్లాడారు. సుప్రీంకోర్టు యాభైరూపాయల జరిమానాతో ముగించింది. మన తెలుగు నేత శివశంకర్ కేంద్రంలో న్యాయశాఖ మంత్రి ఓ అడుగు ముందుకు వేసి ‘‘ఫెరా ఉల్లంఘించే వారికి, వధువు లను తగలబెట్టేవారికి, జమీందార్లకి మన సుప్రీం కోర్టు స్వర్గం వంటిది’’ అన్నారు. కానీ అది ఒక అభిప్రాయం, విమర్శ అనీ, కోర్టు ధిక్కారం ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు వదిలేసింది. శివశంకర్ అన్నారుకదా అని మనమెందుకు రాయకూడదని ఫేస్బుక్, ట్విట్టర్లలో టకాటకా కామెంట్లు కొడితే చకచకా కటకటాలకు పోవలసి వస్తుంది. రాజ ద్రోహ, కోర్టు ధిక్కార నేరం వంటి ఈ భయానక శాసనాలు బ్రిటిష్ పాలకులకు అవసరమయ్యాయి. బ్రిటన్తో సహా అనేక దేశాలు ఈ నేరాలను తీసేసి నాగరికు లయ్యారు. మనమే ఇంకా రాజభక్తితో ఈ నేరాలను బతికించి స్వేచ్ఛాజీవులుగా మరణిసు ్తన్నాం. పౌరసమాజం– ఈ అన్యాయ, బానిస, భయానక, అప్రజా స్వామిక నేర శాసనాలను సంవిధానపు పునాదుల నుంచి నిర్మూ లించేందుకు ఉద్యమాలు నిర్మించాల్సిందే. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వడ్డీపై వడ్డీతో చిన్నవ్యాపారి నడ్డి విరుస్తారా?
ఫేస్బుక్ నిండా దేశభక్తులే ఉంటారు. పత్రికా ప్రకటనలు, ప్రసంగాలు చేసేప్పుడు ప్రభువులంతా రాముళ్లే. ఇన్ని కోట్ల మంచివాళ్లుంటే ఇన్ని ఘోరనేరాలు ఎందుకో? మంచి ప్రభువులుంటే సంక్షేమం ఎందుకు అందడం లేదో? మనం దేశ భక్తులమేనా మన రాజులు మంచి రాజులేనా? కరోనా కాలంలో అప్పులు వాయిదా వేశాం అని గంభీరంగా రాజసింహాలు సింహనాదాలు చేశాయి. టీవీలు కొన్ని డజన్ల గంటలు చర్చలు జరి పాయి. పత్రికలు ఎకరాలకొద్దీ వ్యాసాలు రాశాయి. కోవిడ్ కాలంలో రామరాజ్యం అని ఆనందభాష్పాలు రాల్చారు. చిన్నవ్యాపారుల అప్పులపై వడ్డీపై వడ్డీ వేసి వారి నడ్డి విరుస్తారా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రభువులు కరోనాలో అప్పులపై వడ్డీ వసూలు వాయిదా వేశామన్నారు కదా. మొదట మూడునెలలు వాయిదా వేశారు. అంటే మార్చి 2020 వరకు వడ్డీ పైన మారటోరియం. తరువాత మరో మూడు నెలలు మొత్తం ఆర్నెల్ల పాటు మారటోరియం అన్నారు కదా. తరువాత సంగతేమిటి? ఆ వడ్డీ ఉంటుందా ఉండదా? ఈ బకాయిలను బ్యాంకులవారు తరువాత చార్జీల్లో బాదుతారా, బాదరా? వడ్డీ వదిలేస్తారా? ఈ ప్రశ్న నాది కాదు. ప్రతిపక్షాలది కాదు. లోక్సభ ఎంపీల సవాల్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలది కాదు. సామాన్యుడి ప్రశ్నే కానీ ఎవడు వింటాడు? సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ ప్రశ్న లేవనెత్తారు. భారతీయ రిజర్వ్ బాంక్, ఎట్టి పరిస్థితిలో వడ్డీ రద్దు కాదు– అని చెప్పింది. దీని అర్థం ఏమిటి, తరువాత వసూలు చేస్తారని. దీనిపైన కేంద్ర ప్రభుత్వం విధానం ఏమిటి? ఈ ప్రకటనలు చేసేముందు, పెద్ద సంస్కరణ చేసినట్టు ఆర్భాటం చేసే ముందు ఈ వడ్డీపై ఆర్నెల్ల మారటోరియం అంటే ఏమిటో వివరించాల్సిన బాధ్యత లేదా? సామాన్యుడి ప్రశ్నలకు జవాబు చెప్పరు. ఆర్టీఐ కింద అడిగినా చెప్పరు. కోవిడ్ కాలంలో కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం సాధ్యం కాదు. వీడియో సమావేశాల ద్వారా కేసులు వినాలంటే అన్నీ వినలేము. కేవలం అత్యంత కీలకమైన సంవిధాన, విధాన సమస్య ఉంటేనే కేసును వినడానికి ఎంచుకుంటారు. మామూలుగా మారటోరియం ప్రకటించినపుడు ఆ స్కీంలోనే పొందుపరచవలసిన సామాన్యమైన సమాచారం కోసం పిల్ వేయాలి. ఆగ్రా నివాసి గజేంద్ర శర్మ పిల్ వేశారు. లాక్డౌన్లో బతకడమే కష్టంగా ఉంది. మారటోరియం కాలంలో కూడా వడ్డీ పడుతుందనీ, అప్పుతీసుకున్నవారు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయని, లాక్డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నపుడు అప్పుతీసుకున్నవాడు చెల్లింపులు చేయడం సాధ్యం కాదని, అపుడు బతికే హక్కు భంగపడుతుం దని, అందుకని తాను కోర్టుకు వచ్చానని ఆయన కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు 2020 జూన్ 13న పిల్ విచారించింది, తరువాత జూన్, జూలైలలో కూడా విచారణ సాగించింది. ఆర్బీఐ జవాబు ఏమంటే.. ‘‘ఇప్పుడు వడ్డీ రద్దు కాలేదు. వసూలు చేయవలసిందే. కోవిడ్ కాలంలో ఇది వసూళ్ల ఒత్తిడి తగ్గించడానికి వాయిదా వేయడం మాత్రమే. వడ్డీ మాఫీ చేయడం లేదు, చేస్తే బ్యాంకింగ్ రంగం స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ వడ్డీవాయిదా అంటే సామాన్యమైనది కాదు రెండు లక్షల కోట్ల రూపాయల సొమ్ము. అంటే ఇది మన జీడీపీలో ఒక్కశాతం. రుణం తీసుకున్నవాళ్లు రకరకాలుగా ఉంటారు కనుక ఈ డబ్బు ఎలా వసూలు చేయాలో ఆయా అప్పులిచ్చిన బ్యాంకులకు వదిలేస్తున్నాము’’ అని ఆర్బీఐ కోర్టుకు విన్నవించింది. మారటోరియంపై మీ విధానమేమిటో తెలపండి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. జూన్ 4న మొదటి విచారణలో ఈ చర్చ జరిగింది. కేంద్రం విధానమేమిటో చెప్పడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన బెంచ్ విచారణను రెండు సార్లు వాయిదావేసింది. తన విధానమేమిటో చెప్పకుండా ప్రభుత్వం వాయిదాలు అడిగింది. మేము ఆర్బీఐ, ఇతర బ్యాంకులతో మాట్లాడుతున్నాం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆగస్టు 26 నాడు కూడా విధానం చెప్పలేకపోయింది. మారటోరియం కూడా 31 ఆగస్టున ముగుస్తుంది. అప్పు తీసుకున్నవాళ్లకు ఇంకా తెలియదు వడ్డీ కట్టాలా లేదా, వాయిదా పడితే వడ్డీమీద వడ్డీ వేస్తారా వేయరా అని. బ్యాంకుల వ్యాపారం విషయంపైనే దృష్టి కాని సామాన్యుల బతుకుల గురించి కరోనాలో వారి గతి గురించి పట్టించుకోరా? విధానం చెప్పకుండా ఎన్నాళ్లు దాటవేస్తారు. మీరు లాక్డౌన్ పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. రిజర్వ్ బ్యాంక్ వెనక దాక్కుం టారా, మీ వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానం అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది తీర్పుకాదు. ఒక ప్రశ్న. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మీరు బౌన్సర్ల వైపా లేక రోగుల వైపా?
గతవారం సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన ‘కొత్త బందిపోట్లు–వైద్యవ్యాపారులు, వారి బౌన్సర్లు’ అనే నా వ్యాసం కొందరు డాక్టర్లకు కోపం తెప్పించింది. వాట్సాప్లో తిట్లను నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అసభ్య, అసత్యప్రచారం చేయిస్తున్నారు. సాక్షిలో నా కాలమ్ ఆపేయిస్తామని బెదిరించేవారు కొందరైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయమని ఆదేశాలిచ్చేవారు ఇంకొందరు. కానీ ఎవరూ నా వ్యాసం కాపీ పెట్టడం లేదు, దాంట్లో ఫలానా మాట తప్పు అని చెప్పలేకపోతున్నారు. వ్యాసం చదివిన తరువాత ‘నిజమే డాక్టర్లపై ఒక్క నింద కూడా లేద’ని తెలుసుకుని చెప్పిన డాక్టర్లు చాలామంది ఉన్నారు. అన్ని ప్రయివేటు హాస్పిటళ్లూ చెడ్డవి కాకపోవచ్చు. కానీ అవినీతి వ్యాపారం చేసే కొన్ని చెడ్డ కార్పొరేట్ల క్రూరత్వం కనబ డటం లేదా? వారిక్రౌర్యానికి బలైన బాధిత రోగులు వందలాది మంది సాక్షిలో నా వ్యాసం ముమ్మాటికి నిజం అన్నారు. దుర్మార్గాన్ని నిలదీసే బదులు నిలదీసిన సాక్షిని, రచయితను నిందించే ముందు డాక్టర్లు, వారి సంఘం ఆలోచించుకోవాలి– మీరు రోగుల వైపా.. బౌన్సర్ల వైపా? డాక్టర్లను నిజాం కాలపు జీతగాళ్లుగా మారుస్తున్నారు కొన్ని కార్పొరేట్ వైద్య పెత్తందార్లు. వ్యాపారుల చేతుల్లో బలయ్యేవారు కొందరు, బానిసలయ్యేవారు కొందరు. అప్పులు చేసి చదువుకున్న డాక్టర్లు, వడ్డీకట్టడానికి జీతాలకోసం వారిచేతుల్లో పావులైపోతున్నారు. ఒకవైపు వృత్తిధర్మానికి కట్టుబడి కొందరు డాక్టర్లు ప్రాణాలు పోస్తుంటే బౌన్సర్లతో విపరీత బిల్లులతో రోగులను దోచుకునే కార్పొరేట్ హాస్పిటల్స్కు అండగా నిలబడేవారు మరికొందరు. ఈ విషయాలు వైద్యసంఘాలకు తెలియవా? తమ అనారోగ్యాన్ని లెక్కచేయకుండా వందలాది కరోనా రోగులకు చికిత్స చేసి తమ కుటుంబాల్ని ప్రాణాపాయంలో పడేసే డాక్టర్లూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్పత్రులలో హక్కుల ఉల్లం ఘనలు, మరొకవైపు ప్రయివేటు వైద్యదుకాణాల్లో రోగులపై బౌన్సర్లు. వైద్యవ్యాపారంలో వస్తున్న దారుణ ధోరణులను ఎత్తిచూపడం అందరి బాధ్యత. రోగులు ఈ వ్యాపారుల చేతుల్లో నానాకష్టాలూ పడుతుంటే.. వైద్యవృత్తిలో ఉన్నవారు, వారిసంఘాలు ఈ దుర్మార్గపు వైద్య వ్యాపారాన్ని ఖండించకుండా భరించడం న్యాయమా? రోగుల బంధువులు గొడవలకు దిగకుండా ఆపడానికే కండలు పెంచిన యువకులను బౌన్సర్ల పేరుతో హైదరాబాద్లోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నియమించుకున్నామని, చెప్పుకుంటున్న వార్తలను చదవలేదా? రోగిని హాస్పిటల్లో చేర్చేప్పుడు తప్ప ఇంకెప్పుడూ రోగుల గతి, ప్రగతి తెలుసుకునే అవకాశం లేకుండా పోతున్నదనీ, బిల్లులు కట్టడానికి తప్ప వాటి విషయంలో వివరాలు అడగడానికి డైరెక్టర్ల దగ్గరికి వెళ్లనివ్వడం లేదని, పూర్తి డబ్బు చెల్లించేదాకా శవాలు కూడా ఇవ్వకుండా బౌన్సర్లు అడ్డుకుంటున్నారనే సంఘటనలు ఈ వైద్యనేతల కంటికి కనబడలేదా? రోగులను భయపెట్టే బౌన్సర్ సమస్య గురించి రాస్తే డాక్టర్లకు, సంఘంనేతకు కోపం రావడమేమిటి? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. బౌన్సర్ల నియామకాన్ని, రోగులపై వారి నియంత్రణను సమర్థిస్తున్నారా? చేసిన చికిత్స ఏమిటో చెప్పరు. మెడికల్ రికార్డులు ఇవ్వరు. వేసిన ధరల సమంజసత్వం ఏమిటో చెప్పరు. ఎందుకంత విపరీతమైన రేట్లు వేస్తున్నారో వివరించరు. రోగి చనిపోతే శవం ఇవ్వరు. లక్షల రూపాయల బాకీలు తీర్చేదాకా శవం వారి అధీనంలో ఉంటుందని రాస్తే వైద్యవ్యాపారులు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడడం లేదు. కానీ పురమాయించి నామీద తిట్లు, వాట్సాప్ల ప్రచారాలు సాగిస్తున్నారు. పంపుతున్నారు. ఎంఆర్పీ ధరలకు అమ్మకపోతే చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ మంత్రి హెచ్చరించారు. దీనికి వైద్యులు బాధ్యులని అనలేదే. హాస్పిటల్స్ నడుపుతూ లాభనష్టాలు భరించే కార్పొరేట్ హాస్పిటల్ యజమానులను ఈ ప్రశ్నలు అడగాలా వద్దా? డాక్టర్లు, ఉద్యోగులు కనుక రోగుల తరఫున అడగలేరు. కానీ కరోనాతో, ఇతర రోగాలతో, తప్పుడు చికిత్సలకు నిర్లక్ష్యాలకు బలైనవారితో, రోగుల శవాలతో వ్యాపారం చేస్తున్నవారు బౌన్సర్లను పెట్టుకుని వారి భద్రతలో అన్యాయాలు చేస్తుంటే డాక్టర్ల సంఘాలు ఏం చేస్తున్నాయి? అని ఇంకా అడగలేదు. ఇప్పుడడుగుతున్నాను. ఈ సంఘాలను ఎవరూ నిలదీయవద్దా? నాకు చికిత్స చేయబోమంటూ అసభ్య పదజాలంతో దూషిస్తారా? బౌన్సర్లతో డాక్టర్లకు, సంఘాలకు సంబంధం ఉందని భావించడం లేదు, వారి నెందుకు ఖండించలేదన్నది మొదటి ప్రశ్న. వారినెందుకు సమర్థిస్తున్నారనేది రెండో ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవ్యాపారంలో వస్తున్న అమానవీయ ధోరణులను కూడా అరికట్టడానికి కౌన్సిల్ చర్యలు తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్వచ్ఛంద సంఘం. డాక్టర్లకు, ఐఎంఏ నాయకులకు, కార్పొరేట్ వైద్య వ్యాపారులపై అదుపు ఉండకపోయినా కనీసం దారుణాలను ఆపాలి. ఖండించాలి. వైద్యవ్యాపార దుర్మార్గాలను ప్రశ్నించలేని వైద్యసంఘాలను నిలదీయాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఎమ్మెల్యేల హైజాక్ నేరం కాదా?
విశ్లేషణ నిత్యనూతన ప్రభుత్వాల స్థాపనకోసం ఎమ్మెల్యేలకు మంత్రిపదవి, కార్పొరేట్ అధ్యక్షత, లేదా నగదు లంచాలు ఇవ్వడం నేరం కాదనే రాజనీతి సంస్కరణ, నూతన శాసనాలు ప్రస్తుతం ఎంతైనా అవసరం. ఇప్పుడున్న బ్రిటిష్ కాలపు చట్టాల ప్రకారం లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమే. లంచం డబ్బెక్కువై ఇస్తున్నామా? పని కావడం కోసం ఇస్తున్నాం. అది నేరమా అనే లాజిక్ మిస్ కాకూడదు. ముందే ఏసీబీ వారికి తెలియజేసి రసాయనం పూసిన నోట్లను ఇవ్వడం, నీరు తగలగానే చేయి ఎరుపు కావడం, లంచగొండి రెడ్హ్యాండెడ్గా పట్టుబడడం మనకు వార్తలు. ఇది లీగల్ ట్రాప్. లంచం ఇచ్చిన పౌరుడూ ఇప్పించిన పోలీసులూ, సాయపడిన వారు నేరస్తులు కారు. చట్టం అమలుకు సాయపడిన వారిని మనం సన్మానించాలి. వేరే పార్టీనుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లేదా కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆశ చూపడం కూడా లంచమేననీ చట్టవ్యతిరేకంగా సంతృప్తిపరచడమే లంచ మనీ అవినీతి నిరోధక చట్టం అంటుంది. రాజ్యాంగ ప్రభుత్వాలను పడగొట్టే ఈ ప్రలోభాలు లంచాలు కావని, వీటిగురించి పట్టించుకోరాదనే అభిప్రాయంలో జనం అంతా ఉన్నారు. ఆ పార్టీ చేయలేదా, మేం చేస్తే తప్పా అని దబాయిస్తారు. ఇవి నేరాలే అని చట్టం ఉన్నంత మాత్రాన దర్యాప్తు జరపాలా? రోజువారీ పనులలో అధికారులు లంచాలు తీసుకోగూడదు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకోసం కొందరు రాజీనామా చేయడానికి, పార్టీ మారడానికి లంచాలు ఇస్తే తప్పేమిటి అనేవాదాలు వినిపిస్తున్నాయి. నిరుడు కర్ణాటకలో ఇటీవల రాజస్తాన్లో ఎమ్మెల్యేలను వేలం పాటలో, సంతలో ఎక్కువ ధర చెల్లించినట్టు, ధర పలికి బేరసారాలు సాగినట్టు ట్యాప్ చేసిన ఆడియో టేప్లు విడుదల చేశారు. మందను తోలుకొచ్చిన నాయకుడికి 30 నుంచి 35 కోట్లు, మందలో వచ్చిన మహానుభావుడికి దాదాపు 25 కోట్లు ఇవ్వడానికి బేరసారాల సంభాషణల వివరాలు ప్రచురించారు. బీజేపీకి చెందిన పెద్ద నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. సంపన్నులైన రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, పారిశ్రామిక వేత్తలు డబ్బు లావాదేవీల్లో ఉన్నట్టు ఆ సంభాషణలు వివరిస్తున్నాయి. దర్యాప్తు చేస్తేతప్ప నేరాలు బయటపడవు. కర్ణాటకలో జనతాదళ్ కాంగ్రెస్ సర్కార్ను విజయవంతంగా కూల్చారు. కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కేసులో తమ నాయకుల పేర్లు ఇరికించారని పెద్ద రాజకీయ నేతలకు వాదించే అధికారం పూర్తిగా ఉంది. ఆ టేప్లు కావాలని సృష్టించి ఉంటే అది దొంగ సాక్ష్యాలు తయారు చేసిన నేరమవుతుంది. దాన్నయినా దర్యాప్తు చేయాలి. ఎందుకు చేయరు? దానివల్ల ఎవరికి లాభం? లాభం పొందిన వారే నేరం దాచడానికి దర్యాప్తు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానించే పని జనం చేయడం లేదు. దొరికితేనే దొంగలు. దొంగతనం మానకండి. దొరక్కుండా చూసుకోవడం అంటే దర్యాప్తు ఆపడమే. ఇదివరకు ప్రభుత్వాలు పడిపోయినపుడు బయటపడిన నేరాలు దర్యాప్తు జరపలేదు కనుక అదే అనుసరించతగిన ఆదర్శ కార్యక్రమంగా మారి తాపీగా ఇంకో ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఆఫర్లు, మంత్రి పదవుల ప్రలోభాలు. ఇతర పదవుల ఆశల ఆడియో టేప్లు మళ్లీ విడుదలయినాయి. సంభాషణలు వివరంగా ప్రచురితమయినా మరుగున పడిపోతాయి. ఈ విషయాలు కోర్టులకు తెలియజేస్తారా? కోర్టులముందుకు తీసుకువెళ్లరా? అక్కడే మేధావులైన న్యాయవాదుల పాత్ర మెరుస్తూ ఉంటుంది. రాజ్యాంగంలోని సవాలక్ష అంశాలు మాట్లాడతారే గానీ ఎమ్మెల్యేలను డబ్బుతో, పదవుల్తో కొంటున్నారన్న అంశాన్ని దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేయరు. స్పీకర్ హౌస్లో ఫలానా పని చేయవచ్చా, గవర్నర్ రాజ్భవన్ లాన్స్లో ఏం చేయాలి, శాసనసభా పక్షం సమావేశం శాసనసభా భవనంలో జరగాలా లేక ఆ పార్టీ కార్యాలయంలోనా. అనే నిశితమైన అంశాలపైన అటార్నీ జనరల్ న్యాయనిపుణులు మాట్లాడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు సంవిధాన సంరక్షణకు పాటుపడుతూ ఉంటాయి. లంచగొండితనం నేరాన్ని మాత్రం దర్యాప్తు చేయాలనే ఆదేశాలు అక్కడినించి కూడా రానివ్వరు. అయిదు నక్షత్రాల హోటల్లో కొన్ని వారాలు బసచేయడమంటే కొన్ని లక్షల రూపాయలు రోజుకు ఖర్చుచేయడమే. చార్టర్డ్ విమానాలంటే కోట్ల ఖర్చు. ఎమ్మెల్యేలు హోట ళ్లలో స్వచ్ఛంద బందీలుగా ఉండడం ప్రజాస్వామ్యంలో సాధారణం. పార్లమెంట్లో మీడియాలో కూడా ఈ లంచాలు చర్చకు రావు. లంచం తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాయం చేసి, లంచం ఇచ్చిన పార్టీలో చేరి, మంత్రి అయితే నేరం కాదంటే ఏ గొడవా ఉండదు. ఎన్నికలప్పుడు ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. తరువాత నోట్లతో కూలుతాయి. లంచాలకు టేపు సాక్ష్యాలు ఎవరూ చూడరు. అనుమానాలే కాని రుజువు కావు. కానీ ప్రాథమికంగా లంచాలు ఇచ్చే ప్రయత్నం జరిగినట్టు టేప్లు సాక్ష్యం చెబుతున్నపుడు, ఆ నేరాన్ని ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? ప్రయత్నం స్థాయిలో నిరోధించకుండా నేరం చేయడం పూర్తయిన తరువాతనైనా దర్యాప్తుకోసం చేయకుండా రాజ్యాలేలడమే రూల్ ఆఫ్ లా అవుతుందా? అనే ప్రశ్నలు పదేపదే రాకుండా ఉండాలంటే రాజకీయ లంచాలు నేరాలు కాబోవని కొత్త న్యాయశాస్త్రాన్ని కనిపెడితే ఓ పనైపోతుంది. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ట్రిగ్గర్ నొక్కిన వేళ్లను ఆదేశించిన మెదళ్లేవి?
ఇవ్వాళ నిన్న రెండు పతాక శీర్షికలు పక్కపక్కనే మన ప్రజాస్వామ్య స్వతంత్ర న్యాయ రక్షకభట బాధ్యతల గురించి నమ్మకాలు, అనుమానాలు పెంచేవి. జూలై 22: పైలట్కు హైకోర్టులో ఊరట. దాని పక్కవార్త, ఎమ్మెల్యేను హత్య చేసిన 11 మంది పోలీసుల నేరం రుజువు. జూలై 23: హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు స్పీకర్.. విచారణ ఈరోజు. పక్కవార్త: 11 మంది పోలీసులకు హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్ష. విచిత్రమేమంటే ఈ రెండూ రాజస్తాన్ రాజకుతంత్రాలే. ఒకవైపు ఊరించే రాజకీయ యుద్ధభేరీలు, ఒకవైపు మెదళ్ల కుదుళ్లను కుదిపిలేపే పోలీసు హత్యలు. ఆవైపు ఒక్కరోజులో ఆకస్మిక అద్భుత న్యాయం. ఈ వైపు మూడున్నర తరాల కాలం పాటు (35ఏళ్లు) నేరం రుజువుకాక రాజ్యమేలిన పోలీసు ఎన్కౌంటర్ న్యాయం. ఏ దేశంలో నైనా ఇంత గొప్ప వైవిధ్యం ఉంటుందా? రాజ్యాంగ పాలనకు నిలువెత్తు అద్దాలివి. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి విఠలాచార్య (పూర్వ అపూర్వ జానపద చిత్ర దర్శకుడు) లెవల్ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు ఎడతెగని కత్తి యుద్ధాల్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు. కొనుక్కున్న ఎమ్మెల్యేలు సరిపోవడం లేదు. తూకానికి ఇంకా బరువు కావాలంటే గెహ్లోత్ వర్గం సరుకు అయిదుతారల పూటకూళ్ల మందిరంలో రక్షకభటుల రక్షణలో నిలువ చేయబడ్డారు. సచిన్ పైలట్ వారి సరుకు మరొక నక్షత్ర భోజనవసతిశాలలో భద్రంగా భద్రతా దళాల మధ్య సేదతీరుతున్నారు. ఆ విధంగా పోలీసులు మన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంటే రాజ్యాంగ న్యాయం చేయడానికి కళ్లకు గంతలు కట్టుకుని చేత కత్తి బట్టుకుని మరోచేత్తో తరాజు పట్టుకుని పామును తొక్కుతూ (ఎక్కడ పడతారో తెలియదు) న్యాయదేవతను రమ్మని వకీళ్లు ఆవాహనచేస్తున్నారు. అటు గెహ్లాట్ ఇటు పైలట్. ఇరువురూ బరువులే. బలమైన పార్టీలు వారి వెంట ఉన్నాయి. స్పీకర్ ఏదో ఒక నిర్ణయంతీసుకునే దాకా మనకళ్లగంతలు విప్పవద్దురా నాయనా అని సుప్రీంకోర్టు పదేపదే చెప్పింది. అయినా కత్తి తిప్పుతున్నది రాజస్తాన్ హైకోర్టు. ‘‘స్పీకర్ గారూ నేను ఇంకో రెండు రోజుల తరువాత మీ సంగతి చెబుతాను అందాకా ఏమీచేయకండి ప్లీజ్’’ అని బతిమాలింది. పాతగుర్రాల తబేలా నుంచి గుర్రాలు పారిపోకుండా ఉండాలని కట్లు, ఆ కట్లు తెంపి తరలించుకుపోవడానికి ప్రయత్నాలు. మహాఘనత వహించిన రాజస్తాన్ ఎమ్మె ల్యేలను వారి శిబిరాలనుండి కిడ్నాప్ చేయడానికి చట్టాలు, రాజ్యాంగం, రక్షకభటులు, (సైన్యాన్ని ఒక్కటి వాడడం లేదేమో) అనే రకరకాల పద్మవ్యూహాలను అల్లుతున్న సమయంలో ఒక్కరోజు గడువు ఇచ్చినా బేరసారాల వ్యాపారానికి కొత్త ఊపు వస్తుందని అందరికీ తెలుసు. కానీ చేతిలో కత్తి, కళ్లకు గంతలు. కాలికింద పాము. పీత కష్టాలు పీతవి. సుప్రీంకోర్టు వారు కూడా తమ విలువైన సమయాన్ని వాడి రాజస్తాన్లో రాజ్యం గాన్ని రక్షించడానికి జూలై 23న ప్రయత్నిస్తామన్నారు. చివరికి గురువారం రాజస్తాన్ హైకోర్టు విచారణపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తిరిగీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. నాలుగైదు రోజులనుంచి కరోనాకన్నా గొప్ప కలకలం సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉంటే అది సచిన్ పైలట్ ఆత్మనిర్భర యజ్ఞమే. నిజం చెప్పిన బుల్లెట్లు : మరొకవైపు గొంతుచించుకుని అరిచే మీడియా కథనాలు అల్లే కథ 1985 పోలీసు హత్యాకాండ. రాజామాన్సింగ్ ఆనాటి భరత్పూర్ రాజు. భరత్పూర్ రాజ్యపతాకాన్ని కాంగ్రెస్ నాయకులు అవమానిస్తుంటే రాజామాన్సింగ్ ఆవేశ పడి ఫిబ్రవరి 20, 1985న రాజస్తాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల సభావేదిక వైపు తన మిలిటరీ వాహనంతో శరవేగంగా దూసుకువచ్చి అక్కడ ఆగిన హెలికాఫ్టర్ను ఢీకొన్నాడట. హత్యాప్రయత్నమని కేసుపెట్టారు. మరునాడు ఫిబ్రవరి 21న పోలీసుస్టేషన్లో లొంగి పోవడానికి ఠాకూర్ హరిసింగ్, ఠాకూర్ సుమర్ సింగ్తో కలిసి వెళ్తున్నారు. పకడ్బందీగా అల్లిన కుట్ర ప్రకారం డిఎస్పీ కాన్ సింగ్ భాటి అతని అనుచర పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ చంపేశారు. ఆనాడది ఎన్ కౌంటర్. తమపై కాల్పులు జరుపుతూ ఉంటే ఎదురు కాల్పులు జరిపామని పాతకట్టుకథే. మాన్సింగ్ వీపులో వెనుకనుంచి దిగబడిన బుల్లెట్లు నిజం చెప్పాయి. కోర్టు నిజం వినిపించుకున్నది. మరునాడు ముఖ్యమంత్రి రాజీ నామా చేయడం 1985నాటి విలువ. 35 ఏళ్లకైనా ఎన్ కౌంటర్ హత్య రుజువుకావడానికి కారణం హత్యకేసు పెట్టడమే. ఇప్పుడు కేసు పెడుతున్నారా? ఇందులోకూడా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో తుది న్యాయం ఎన్నేళ్లకు, ఎవరికి దక్కుతుందో తెలియదు. అయినా ట్రిగ్గర్ నొక్కిన పోలీసు వేళ్లను ఆదేశించిన మెదళ్లు కోర్టులకు దొరుకుతాయా? నక్కలు, తమ జిత్తుల రాజకుట్రలకు వకీళ్లను, కోర్టులను, పోలీసులను వాడుకుంటారనే పాఠం అర్థమవుతున్నదా? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఒకే నేషన్ ఒకే రేషన్, ఒకే జీవన్ ఒకే వైరస్
కరోనా వచ్చినా ఎవరైనా బతికి ఉన్నారంటే అది సర్కారు వారి కరుణ కాదు. రోగ నిరోధక శక్తి వారిలో ఉందని, అది పెరిగి రోగకారకశక్తులను తరిమికొట్టిందని అర్థం. కరోనా సోకి ఎవరైనా చనిపోయారంటే దానికి కారణం వారికి రోగ నిరోధక శక్తి కన్నా బలమైన రోగం ఉందని అర్థం. కరోనా చంపిందా లేక తగిన ఆరోగ్యం లేక మరణించారా అని పాలకులు ఆలోచించడం లేదు. మందులమ్ముకునే వ్యాపారుల ఆలోచనలకు, ప్రభుత్వాలకు మధ్య కొంతైనా తేడా ఉంటే బాగుండేది. కరోనా సోకకపోయినా, రోగ నిరోధక శక్తి తగ్గకపోయినా చనిపోయేవారు కూడా ఉన్నారు, వారే భయపడి చచ్చేవారు. వరంగల్లులో ఒక డాక్టర్ ఉండేవారు. చాలా మంచి డాక్టర్. కాని తను చికిత్స చేయలేడనుకుంటే ‘‘ఇదిగో నీకు పెద్ద రోగం వచ్చింది. పెద్దాస్పత్రికి పో. లేకపోతే చచ్చిపోతవు. నేను కుదిర్చే జబ్బుకన్నా నీ జబ్బు పెద్దది. పో’’ అని మహాత్మాగాంధీ స్మారక హాస్పిటల్కు తరిమేవాడు. మనం ఇప్పుడు హైదరాబాద్లో అందరినీ గాంధీ హాస్పటల్కు తరుముతున్నాం. మందుల కోసం, చికిత్సలకోసం ఎదురు చూస్తున్నాం. ఇది వాడితే పది నిమిషాల్లో కరోనా మాయం అనే వీడియోలు విరివిగా చూస్తున్నారు. ఇది వాడకపోతే చస్తావు అంటే అవి కొనుక్కుంటున్నాం. ఏ ఇంట్లో చూసినా కుప్పలు తెప్పలుగా మందులు. ఆయుర్వేదం, యునానీ, హోమియో, అలోపతి. అంతా అంతే. కానీ రోగం రాకుండా ఏంచేయాలి? కరోనా తగిలితే దాన్ని తిప్పికొట్టే నిరోధక శక్తి ఏ విధంగా పెంచాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఔషధ వ్యాపారులకు ఎట్లాగూ ఉండదు. ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి ఇటువంటి ఆలోచన వస్తే బాగుండేది. రోగ నిర్ధారక పరీక్షలు చేయాలని రిట్ వేస్తే హైకోర్టు రిట్ ఇస్తే గిస్తే సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోకపోతే ప్రభుత్వం పరీక్షలు చేస్తుంది లేకపోతే లేదు. కరోనా వైరస్ మహమ్మారిగా వ్యాపించడం మన లద్దాఖ్ సరిహద్దులో చైనా దురాక్రమణ అంతటి భయానక విషయం. మనకు చైనా దాడిలో 20 మంది మరణించడం అర్థమయిందో లేదో గాని కరోనా యుద్ధంలో మన సైనికులు మరణిస్తున్న సంగతి, చాలామంది మరణించడానికి సిద్ధంగా ఉన్న సంగతి గుర్తు రావడం లేదు. వేల కోట్ల రూపాయలు పోసి ఆయుధాలు, యుద్ధ విమానాలు, తదితర సామగ్రి కొంటున్నాం గాని, కరోనా తదితర వ్యాధినిరోధక పోషక బలాన్ని పెంచుకోవడానికి, జనాన్ని రక్షించడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారో లేదో కనిపించడం లేదు. పోషకాల స్థాయి పెంచడం, జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత, ఆ విషయాన్ని రాజ్యం గుర్తించి తీరాలని ఆర్టికల్ 47లో రాజ్యాంగం మార్గదర్శకాన్ని రాసింది. తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. వెంటనే ఇవి కేవలం సూచనలే.. పాటించే పని లేదని వాదించడానికి లాయర్లు తయారుగా ఉంటారు. డబ్బులిచ్చిన వాళ్లకోసం లా ను ఏవిధంగానైనా ఎటైనా వంచగల ప్రతిభను మన ఆంగ్లేయుల నుంచి వారసత్వంగా ఒంటబట్టించుకున్నాం. ఇది మన డీఎన్ఏలో జీర్ణించుకుపోయిన అసలు వైరస్. హక్కుల్లో రాయడం సాధ్యం కానివి ఇక్కడ మార్గదర్శకాల్లో రాస్తున్నాం నాయనా, ‘అమలు చేయడానికి వీల్లేదు. కోర్టులు అడగొద్దు అనే చెత్త వాదనలు చేయకండి. బుద్ధి జ్ఞానం ఉన్న ప్రభుత్వాలు కనుక ఉంటే వారు ఈ డ్యూటీ పాటించాలని’ రాజ్యాంగం పార్ట్ 4 ఘంటాపథంగా చెబుతున్నది. మనం వింటే కదా. మన ప్రధాని మోదీకి మనదేశంలో చాలామందికి ఆకలి ఉందని, పేదరికం ఉందని, తిండి లేదని, అర్థమైనట్టుంది. నవంబర్ దాకా మన నేషన్లో రేషన్ ఉచితంగా ఇస్తానని మరో ప్రాస ప్రామిస్ చేశారు. శుభం. అసలు తిండే లేని వాడికి పోషక పదార్థాలు ఎక్కడినుంచి వస్తాయి అనేది ఒక పాయింట్. తిండి సరే.. పోషక పదార్థాల సంగతేమిటి? ఇది రెండో పాయింట్. ఉచితంగా కాకపోయినా కొనదగిన ధరలకు పోషక పదార్థాలు సామాన్యుడికి అందుబాటులో తేవాలంటే కాస్త ప్లానింగ్ ఉండాలి. రేషన్ ఫ్రీగా ఇవ్వడానికి డబ్బు కేటాయిస్తే చాలు. విడుదల చేయవలసి వచ్చేనాటికి లెక్కలు చూసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ను ప్రింట్ చేసిమ్మంటే ఇస్తుంది. ఒక చిన్న పాప చాక్లెట్లడిగింది. రోజూ చాక్లెట్కు డబ్బెక్కడినుంచి వస్తుందో అని వాళ్లమ్మ మందలించింది. ‘ఎక్కడినుంచి అంటే ఎటిఎం నుంచి. నువ్వు ఎన్ని సార్లు తేలేదు. నెంబర్లు నొక్కితే నోట్లు రావా’ అని తెలివైన పాప జవాబు. మనకు రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం వంటిదే కదా? కాగితాలే కదా ప్రింట్ చేస్తే సరిపోదా? ఈ మాత్రం చాలా మంది ఆర్థిక మంత్రులకు తెలియదేమో. కోట్లాది వలస కార్మికులకు రేషన్ కార్డు లేదని మళ్లీ ప్రధానికి ఎవరూ గుర్తు చేయలేదు. రేషన్ కార్డుంటే ఒక నేషన్ ఒక రేషన్ ఇస్తారు. మరి ఒక రేషన్ కార్డు కూడా లేనివాడు సొంత నేషన్లో ఉన్నట్టా లేనట్టా? రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ఈ నేషన్లో రేషన్ కార్డు లేని వాడికే బతికే హక్కు లేనట్టా? వాడిది కూడా ఒకే నేషన్ ఒకే రేషన్ ఒకే జీవన్ కదా? ఆధార్ కార్డు, రేషన్ కార్డూ, స్మార్ట్ ఫోన్లో సేతు యాప్ లేని వాడికి చావడమే బాధ్యతా? ఔషధాలమ్ముకుందామా లేక రోగాన్ని ఎదుర్కొనే పోషకాహార బలం మన జన సైనికులకు ఇచ్చి చైనాను, వైరస్ను బార్డర్లోనే నిలువరిద్దామా? మన జాతిని బలోపేతం చేసే రాజనీతి మనకు రానే రాదా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈమెయిల్: madabhushi.sridhar@gmail.com -
తెలంగాణకు అన్యాయంపై ఎలుగెత్తిన వాణి
ఆయన పేరు బారు పాండురంగ విఠల్. ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ రామనర్సు పుత్రుడు. ప్రముఖ రచయిత సివిల్ సర్వెంట్ సంజయ్ బారు తండ్రి. తన 93 ఏట తుది శ్వాస విడిచేదాకా దేశం జాతి ప్రజ అని ఆలోచించిన బారు పాండురంగ విఠల్ ఈ దేశ ఆర్థిక రంగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రం మరిచిపోలేని మహనీయుడు. దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక కార్యదర్శి (1972–82). ఒక ముఖ్యమయిన రాజ్యాంగ సంస్థగా ఆర్థిక సంఘం గుర్తింపు పొంది పనిచేసే రోజుల్లో ఆయన పదో ఆర్థిక సంఘం సభ్యుడు (1992–94). తను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, పదవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్నపుడు సభ్యుడిగా విశేష సేవలందించిన విఠల్ను ది మెమోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కాసుబ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం పూర్వాపరాలు, లోపాలు లాభాలు, తెలంగాణకు జరిగిన అన్యాయాలు అన్నీ కంఠతా తెలిసిన వ్యక్తి, వివేకవంతమైన పరిష్కారాలు చూపగల మేధావి. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బిపిఆర్ విఠల్’ అని ఆయన శిష్యులు ప్రచురించిన 550 పేజీల ఉద్గ్రం«థం ఆయన వ్యక్తిత్వానికి సమగ్రమైన దర్పణం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వై వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక వేత్త విఠల్ను గురువుగా గౌరవించేవారు. ఆర్థికరంగం, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం, భౌతికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం, రాజకీయశాస్త్రం వంటి అనేక రంగాలలో సమగ్రమైన అవగాహన, ఆలోచనలు ఉన్న మేధావి విఠల్ అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. ఒక గురువు, శ్రేయోభిలాషి, తనను అభిమానించే ఒక ఉత్తముడిని కోల్పోయానని బాధపడ్డారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అనే సంస్థకు రూపకల్పన చేసి, నెలకొల్పి, నిలబెట్టిన దార్శనికుడు విఠల్. బోధన పరిశోధన కలిసి సాగాలనే ఉద్దేశ్యంతో విఠల్ ఈ సంస్థను తీర్చిదిద్దారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు నివాళులర్పించారు. గాంధీ ప్రభావంతో విద్యార్థిగా తన కళాశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర వీరుడు. ఆంధ్రప్రదేశ్కు చెందినవాడే అయినా తెలంగాణలో స్థిరపడి, హైదరాబాద్లో ఉర్దూ మీడియం బడిలో చదువుకున్నాడు. నిజాం కాలేజి విద్యార్థి. 1949లో సివిల్ సర్వీసులో చేరి 1950లో ఐఏఎస్ అధికారి అయినారు. బారు పాండురంగ విఠల్ తండ్రి ప్రొఫెసర్ రామనర్సు వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆ తరువాత రామనర్సు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. ఆకాలంలో రావాడ సత్యనారాయణ వైస్ చాన్సలర్గా ఉన్నారు. వీరు ఇరువురు తెలంగాణ అస్తిత్వ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆంధ్ర మేధావులు. వారి చిత్తశుద్ధి, జనసంక్షేమపరమైన ఆలోచనలు సాటిలేనివి. తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడం సరైన ప్రయోగం కాదని, అందువల్ల తెలం గాణ చాలా నష్టపోతుందని ఆనాటి రోజుల్లోనే వ్యతిరేకించిన ఆర్థిక శాస్త్రవేత్త విఠల్. వందల కోట్ల రూపాయల మిగులు ధనం ఉండిన సంపన్నరాష్ట్రం తెలంగాణ. అప్పట్లో పన్నుల ఆదాయం కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతో ఈ విలీనం సరైన చర్య కాదని ఆయన వివరించేవారు. అంతే కాదు 1969లో తెలంగాణా ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణకు ఏవిధమైన అన్యాయాలు ఎదురైనాయో రుజువులతో సహా అంకెలన్నీ జనం ముందుంచిన చిత్తశుద్ధి కలిగిన అధికారి. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం అయిదు సూత్రాల పథకాన్ని రూపకల్పన చేసింది బీపీఆర్ విఠల్ గారే. అయితే పెద్దమనుషుల ఒప్పందం లాగే దీన్ని కూడా పాలకులు చెత్తబట్టలో వేశారు. ఆ తరువాత ఆయనే ఆరుసూత్రాల పథకం కూడా కల్పించారు. దానికి కూడా గండి కొట్టారు. 1984లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినపుడు కూడా తెలంగాణకు న్యాయం చేయడానికి ఎన్టీ రామారావును ఒప్పించి 610 జీవో తెచ్చిన ఉత్తముడు, చేతులెత్తి మొక్కాల్సిన వ్యక్తి విఠల్ అని ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి ప్రశంసించారు. అయితే చంద్రబాబునాయుడు పాలనలో తెలంగాణ వ్యతిరేక రాజకీయాలకు ఆ 610 జీవో కూడా బలైపోయింది. 1994లో తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైంది. అప్పుడు తెలంగాణ మిగులు నిథులు ఎన్నో ఉండేవి. అవేమయ్యాయి? అని సవాలు చేస్తూ ఒక పుస్తకం రాశారు విఠల్. ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక అధికారిగా అనేక ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం అయినప్పుడు తెలంగాణా వేర్పాటు ఉద్యమం సరైనదని భావించి ఉద్యమానికి మద్దతు నిచ్చిన ఉన్నతమైన వ్యక్తి బీపీఆర్ విఠల్. గుడ్డిగా ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ రాజకీయనాయకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు తల ఊపడం కాకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలన్న తపన ఉన్న కొందరు సివిల్ సర్వీసు అధికారుల్లో బీపీఆర్ విఠల్ ముఖ్యులు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కాలీకాలని వాత, చాలీచాలని న్యాయం
వాక్ స్వాతంత్య్రం విలువ చాలా మందికి అర్థం కాదు. అందరూ ఏదో లాభంకోసమే విమర్శిస్తున్నారనుకునే సోమరుల మెజారిటీ నానాటికీ పెరుగుతున్నది. దారుణంగా ఒక అమాయకురాలిని తమ పోలీసుస్టేషన్లో రేప్ చేసిన పోలీసుల నేరం రుజువు కాలేదని 1980లలో సుప్రీంకోర్టు మధురా కేస్ అని పిలువబడే కేసులో విచిత్రమైన తీర్పు చెప్పింది. ప్రేమిస్తానని చెప్పి ఒక బాలికను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపి, ఆ బాలిక మీద పోలీసులు అత్యాచారం చేసిన కేసు అది. వారికి కింది కోర్టులో శిక్ష పడింది. కాని ఆ శిక్ష తప్పు అని సుప్రీంకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. అత్యాచారం చేస్తుంటే ఎందుకు అరవలేదు? మౌనంగా ఉందంటే ఆమె కూడా అంగీకరించినట్టే కదా అని వ్యాఖ్యానిస్తూ ఇచ్చిన ఆ తీర్పు ఎంత అన్యాయమైందో ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ తన మిత్రులతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దుర్మార్గపు రేప్ చట్టాల పట్ల దారుణమైన అన్వయం చేసే తీర్పుల పట్ల ప్రజల్లో నిరసన పెల్లుబికింది. చివరకు ఆ ఉద్యమం రేప్ చట్టాన్ని చాలావరకు మార్చేసింది. ప్రొఫెసర్ మనకేం పోయిందనుకున్నా, కోర్టు ధిక్కారం అవుతుందని భయపడినా, మరే కారణంతోనో భజన చేసినా ఈ మార్పులు జరిగేవి కావు. న్యాయానికి విరుద్ధమైన అన్వయం చేయడానికి సిగ్గుపడే పరిస్థితి ఆ విమర్శ వల్ల వచ్చింది. వాక్ స్వాతంత్య్రాన్ని నిర్భయంగా వాడుకుంటేనే ఉన్నతాధికారంలో ఉన్నవారు అప్పుడప్పుడైనా సిగ్గుపడవలసి వస్తుంది. మనం కరోనాతో భయపడిపోతున్నాం. కుటుంబ సంబంధాలు, స్నేహాలను కరోనా నిర్దయగా తెంచి వేస్తున్నది. ఒకరికొకరం దూరమవుతున్నాం. కరోనా పేదలకు నరకం, వలసకూలీలకు మరణం, నియంతలకు స్వర్ణయుగం. మరి ధర్మం, న్యాయం సంగతేమిటి? ధర్మం అంటే సంవిధాన పాలనా ధర్మం. న్యాయం అంటే నిష్పక్షపాత, నిర్భయ, నిర్ద్వంద్వ, స్వతంత్ర న్యాయ నిర్ణయం. దానికి నిజాయితీ ప్రాణం వంటిది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక మంచి న్యాయమైన తీర్పు ఇచ్చింది. లాక్డౌన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మైళ్లదూరాలు నడుస్తూ భరతమాత హైవేలకు నెత్తుటి పాదాలు అద్దిన వలస కార్మికులకు వెంటనే ఉచిత రవాణా, ఉచిత భోజన, ఉచిత ఆవాస సౌకర్యాలు కలిగించాలని సముచిత నిర్ణయం తీసుకుంది. చాలా ఆలస్యమైనప్పటికీ అవసరమైన నిర్ణయం. అంతకుముందు అనేక సందర్భాలలో పిల్లను నిరాకరిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు, ప్రభుత్వం పక్షాన ప్రమాణం చేసి మరీ చెప్పే అవాస్తవాలను నమ్మి ఆదేశాలు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం మానవీయంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని, కరోనా వైరస్ వంటి క్లిష్టసమయంలో మానవత్వాన్ని మించిన న్యాయం లేదని, చాలా హైకోర్టులు ఎంతో హుందాగా వలస కార్మికుల పట్ల దయచూపాలని అనుభవం ఉన్న న్యాయవాదులు ఆవేదన చెందారు. చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకుని, వాక్యాలు నిర్మించి సుదృఢమైన విమర్శ రంగరించి లేఖ రాశారు. వారికి జోహార్లు. న్యాయవాదులకు పదవులుంటాయి, పదవీకాలాలు ఉంటాయి, విరమణలు ఉంటాయి. ఒత్తిడులు భయాలు కూడా ఉంటాయి. ఈ మధ్య భయాలు పెరిగాయి. న్యాయవాదులు స్వతంత్ర వృత్తిగల వారు. స్వతంత్ర ప్రవృత్తి గలవారు కూడా అయితే చాలా బాగుంటుంది. కాని వారికి కూడా చాలా కష్టాలుంటాయి మరి. అయినా ఎవరికీ భయపడకుండా వారు రాసిన లేఖ కదిలించింది. అంతకు ముందు అరడజను హైకోర్టు న్యాయస్థానాలు రాష్ట్రాలను మందలించాయి. వలస కూలీల గురించి పట్టించుకొమ్మని ఆదేశించాయి. కాని ప్రభుత్వాలు ఏం చేశాయో తెలుసా. హైకోర్టులను తప్పబట్టాయి. ఏమనుకుంటున్నారు మీరు సమాంతర ప్రభుత్వం నడుపుతారా అని కోపించాయి. దానికి సుప్రీంకోర్టు జవాబిస్తూ హైకోర్టులు సక్రమంగా, రాజ్యాంగ ధర్మబద్ధంగానే వ్యవహరించాయని మద్దతు పలకడం శుభ పరిణామం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయం ఒకటి మనం తప్పనిసరిగా గుర్తించాలి. సెక్షన్ 51 డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద సంక్షోభ కాలంలో ప్రభుత్వ ఆదేశాలు (ఇక్కడ లాక్డౌన్ ఆంక్షలు) ఉల్లంఘించినందుకు ఏడాదిపాటు జైలుకు పంపే అధికారం ఉంది. ఆ సెక్షన్ కింద వలస కార్మికులమీద ప్రాసిక్యూషన్ మోపాయి. తిండి లేదు, పని లేదు, ఉన్నచోటి నుంచి తరిమేస్తున్నారు, రైళ్లు, బస్సులు లేవు. నడిచిపోదామంటే కేసులు, రాష్ట్రం దాటితే పక్క రాష్ట్రం వారు రానివ్వరు. కేసులు పెట్టే వారు, కొట్టే వారు, గుంజీలు తీయించేవారు, మోకాళ్లమీద కూచోబెట్టేవారు, జైల్లోకి నెట్టేవారు. ఇది ప్రజాస్వామ్యమా? వీరు పాలకులా? ఇవన్నీ మానేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. చాలా ఆలస్యం తరువాత కాలీకాలని వాత, చాలీచాలని న్యాయం అనే విమర్శలకూ అవకాశం ఉన్నా రెండు మంచి ఆదేశాలిచ్చింది అగ్రన్యాయస్థానం. ధర్మం కోసం కంకణం కట్టుకున్న జాతీయ దేశోద్ధారకులనుకునే పాలకులు వలసకూలీలపై ప్రాసిక్యూషన్ మోపినపుడు వారి నిజస్వరూపం తెలుసుకోకపోతే అంతకన్నా గుడ్డితనం మరొకటి ఉండదు. అటువంటి పౌరులకు వెన్నెముక ఉందో లేదో ఎక్స్రే తీయాలి. ఎవ్వరినీ ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ ‘‘మహాఘనత వహించిన డీజీపీలూ మీ పోలీసులకు చెప్పండి. జనం పట్ల అమానుషంగా ప్రవర్తించకండి’’ అని చెప్పింది. పాలకులూ, పోలీసులూ వింటున్నారా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఏడిపించే కొత్త ఏడు చేపల కథ
లాక్డౌన్ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ ప్రాణాలర్పిస్తున్న కార్మికులు వారు. ఇక్కడ రాజ కీయం కాదు, రాజ్యాంగాన్ని చూడాలి. పార్టీని కాదు, పాలకుల్ని అడగాలి. చట్టాల్ని కాదు, చట్టుబండలైన మానవత్వాన్ని అడగాలి. ప్రాణాంతకమైన నేరంచేస్తే, రుజువుచేసి ప్రాణం తీయడమే శిక్ష అని భావించినప్పుడు తప్ప మరే రకం గానూ ప్రాణం తీయవద్దని ఆర్టికల్ 21 జనం ప్రాణాలకు భరోసా ఇచ్చింది. అడుగడుగునా అరికాళ్ల రక్తపు మడుగులతో తడిసిపోతూ రాజ్యాంగమా ఉన్నావా అని అడుగుతున్నది. ఇది మన నాగరికత వేసిన కొత్త ముందడుగు అనుకొని మురిసిపోదామా లేక నిలదీసి అడుగుదామా? వలస కార్మికులను ఏడిపించే కొత్త ఏడు చేపల కథ. మొదటి చేప: అందరికన్నా ముందు, కరోనాకు విరుగుడు వ్యూహం లాక్ డౌన్ అని ప్రకటించిన వలస కూలీల జీవ రాశి ఉందనే విషయం గుర్తులేదు, అదే ఎండని మొదటి చేప. పత్రికలు టీవీలు గాడాంధకార కాంతి చిత్రాలు చూపిస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ పురుషోత్తములు నిట్టూరుస్తున్నారు. పిల్లను చెత్తబుట్టలో వేస్తు న్నారు. కొత్తవి పడుతున్నాయి. రెండో చేప: జనవరి 30న కరోనా తొలి బలితీసుకున్నది. ఓవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తున్నా మార్చి 13న మనం ఇదేమంత ఎమర్జెన్సీ కాదన్నాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాం. వలసకూలీలకు బతుకు భయమేసింది. నాలుగు గంటల నోటీసుతో భారత జాతీయ జనతా అష్టదిగ్బంధనం మార్చి 24న ప్రకటించారు. కోట్లాది వలస కూలీలు భవిష్యత్తు ఆలోచనకు నాలుగ్గంటలు, ప్రమాదమేమీ లేదనే హామీకి, దేశవ్యాప్తలాక్ డౌన్ కు మధ్య కేవలం రోజులు. మూడో చేప: వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తిండి, డబ్బు లేదు. యాజమాన్యాలు పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. అప్పటికే పని చోటుకు చాలాదూరమైపోయారు. రెండింతలు రేషన్ ఇస్తామన్నారు మార్చి 26న. వారిలో చాలా మందికి రేషన్ కార్డే లేదు. ప్రజాపంపిణీలో లేని 8 కోట్ల పేదలకు తిండి పదార్థాలు ఇస్తామని లాక్ డౌన్ 50వ రోజున ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడున్నారో తెలియని 8 కోట్లమందికి తిండిగింజలు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. నాలుగో చేప: శ్రామిక రైళ్లన్నీ వలస కూలీలకే. అందమైన పేరు. కాళ్లరిగేట్టు నెత్తురోడేట్టు తిరుగుతున్న కూలీలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఏప్రిల్ 29 న ప్రకటించింది ప్రభుత్వం. కూలీలు బయలుదేరిన రాష్ట్రం, చేరవలసిన రాష్ట్రం సమష్టిగా కోరితేనే రైళ్లిస్తామన్నారు. ఎవరు సమన్వయం చేస్తారు? కొన్ని రాష్ట్రాల వారికి కూలీలను బయటకు పంపే ఉద్దేశం లేదు. రాజకీయంగా నువ్వంటే నువ్వని తిట్టుకోవడానికి కొత్త సాకు దొరికింది. 58 రోజుల తరువాత వారి ప్రయాణాల సమన్వయానికి ‘జాతీయ వలసకూలీ సమాచార వ్యవస్థ’ను కేంద్రం ప్రకటించింది. అయిదో చేప: వలసకూలీలు హాయిగా సొంతూరికి రైల్లో పోవచ్చు. కాని కరోనాలేదని తేలిన తరువాతే. ఎవరిస్తారీ సర్టిఫికెట్? ఎంతిస్తే ఇస్తారు? ఆన్లైన్ ఫారం నింపాలట.ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తరువాత దానికేమైందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలి? ఇదంతా లాభం లేదని మళ్లీ నడక ప్రారంభించారు. ఆరోచేప: మోదీ ప్రభుత్వం 85 శాతం రైల్వే చార్జీలు భరిస్తాం అని చెప్పింది. ఎంత ఉదారత? రైల్వే పూర్తి చార్జీలు గోళ్లూడగొట్టి మరీ వసూలు చేసింది. ఎంత ఆర్థిక క్రమశిక్షణ? 2011 జనాభా లెక్కల ప్రకారం వలస కూలీలు 5 కోట్ల 60 లక్షలు. అసలు సంఖ్య ఆరున్నరకోట్లు. వీరంతా వెనక్కి రావడానికి రూ. 4,200 కోట్లు కావాలట. ఎవరిస్తారు– ఏ లాభమూ లేకుండా? ఏడో చేప: రైల్వే శాఖ 15 లక్షల మంది వలస కూలీలను తరలించామని సగర్వంగా చెప్పుకున్నది. మిగతా ఆరుకోట్ల 35 లక్షల సంగతేమిటి? వారే రోడ్ల మీద నడుస్తున్నది. పిల్లలను భుజాల మీద మోసుకుని, ముసలాయనను చక్రాల సూట్కేస్మీద, గర్భవతైన భార్యను చక్రాల చెక్కమీద, ఎందుకు వందల మైళ్లు లాక్కుపోతున్నారు? ఈ మధ్యలో కేంద్రప్రభువులు రాష్ట్రాలకు మళ్లీ ఉత్తర్వులు–‘రోడ్ల మీద కూలీలను నడవనీయకండి’ అని. ఉత్తరప్రదేశ్ కూలీలు రాష్ట్రం హద్దులు దాటడానికి వీల్లేదని ఉత్తర్వులు వేసింది. ఒక జిల్లాలో స్థానికులు కూడా వారికి సాయం చేయరాదని ఆదేశించింది. వలస కూలీలు ఓటర్లు కారా? లేక వారికి హక్కులు లేవా? వాళ్లను ఎవరు నడవమన్నారు? వాళ్లు అలా నడిచి వెళితే మేమేం చేయగలం అని అంటారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. మనం మనుషులమేనా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ (madabhushi.sridhar@gmail.com) -
‘అధోగతి’ రాష్ట్రాలకు అధ్వాన్నపు ప్యాకేజీ
మనకు ఇప్పుడు మూడు రకాల చెప్పులు, చెప్పుళ్లు. ఒకటి నెత్తుట తడిసిన వలస కూలీ కాలు సొంతూరివైపు వేసిన అరిగిన చెప్పు. రెండోది విలేకరుల సమావేశంలో ఖాళీ నినాదాల చెప్పుడు. మూడోది దివాళా కోరు ఆర్థిక విధానాలకు మూర్ఖ జనం ఇంకా చూపని చెప్పు. మన ఖజానాలు ఖాళీ, నినాదాలు కూడా ఖాళీ. జాన్ హైతో జహాన్ హై తొలి నినాదం. తరవాత జాన్ భీ జహాన్ భీ. పైపైకి జాన్ భీ అన్నారు గాని, ప్రాణం పోతే పోయింది డబ్బు ముఖ్యం అని అసలు అర్థం. లాక్ డౌన్ నీరుగార్చి డబ్బు కరువు తీర్చడానికి మద్యం కట్టలు తెంచారు. కీలకమైన శాఖలలో సమర్థులను నియమించాలనే శ్రద్ధ మన ప్రభుత్వాలకు లేదు. ప్రధానమైన పదవులకు ఎంచుకున్న వ్యక్తులను పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం పట్ల ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. అయినా మూర్ఖశిఖామణులకు అర్థం కావడం లేదు. కరోనా వైరస్ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. బోలెడు లక్షల కోట్ల ప్రాజెక్టులు మొదలుపెట్టి అప్పులు తెచ్చుకుని చేతులెత్తేసే దుస్థితి. చెప్పుచేతల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ను బతిమాలి బామాలి, వినకపోతే రాష్ట్ర గవర్నర్ను తీసేసినట్టు ఆర్బీఐ గవర్నర్ను తీసేశారు. ప్రపంచం అంతటా నిపుణులైన ఆర్థికవేత్తలను కేంద్ర బ్యాంకులకు గవర్నర్లుగా నియమిస్తే, భారత దేశం మాత్రం చెప్పిన మాట చేతులు కట్టుకుని వినే అనుయాయిని గవర్నర్ చేసేసింది. రాష్ట్ర పన్నులన్నీ పీకి, జీఎస్టీ పన్ను విధించింది. సంస్కరణ అంటే పన్నులు పెంచడం అనే కొత్త నిఘంటు అర్థం. రాష్ట్రాలు గోల చేస్తే రాష్ట్ర జీఎస్టీ అన్నారు. పన్నుల సంఖ్య తగ్గిస్తాం ఒకే దేశం ఒకే పన్ను అని ఇంకో ఖాళీ నినాదం. మనకు వినపడని నినాదం– పన్నుపన్నుకో పన్ను. కట్టకపోతే తన్ను. అన్నన్ని పన్నులు విధించి కేంద్రం, రాష్ట్రం మునిసిపాలిటీలు పళ్లూడగొట్టి వసూలు చేస్తున్నాయి. పన్నుల్లో ఎక్కువ శాతం కేంద్రం ఒళ్లో వచ్చి పడుతుంది. రాష్ట్రాల వాటాలు ఎప్పుడు బకాయిల్లోనే ఉంటూ ఉంటాయి. మాకు వసూళ్లు కావడం లేదు కనుక ఇవ్వం అంటున్నది కేంద్రం. ఉదా.. మహారాష్ట్ర రెవెన్యూ వ్యయానికి ఒక్క శాతం సాయం చేయాలన్నా 33 వేల 500 కోట్లు ఇవ్వాలి. కానీ, విపత్తు నిధికింద వారికి ఇచ్చింది కేవలం 4,300 కోట్లు. ఆదాయపరంగా అగ్రస్థాయిలో ఉన్న మహారాష్ట్ర గతే అదయితే మిగిలిన రాష్ట్రాలది అధోగతే. ఫైనాన్సియల్ రిస్క్ బిజినెస్ మేనేజ్మెంట్ చట్టాన్ని తీసేసి 2017లో కొత్త చట్టం తెచ్చారు. ఈ ‘సంస్కరణ’ ఏమంటే– ఆర్థిక సంక్షోభం వస్తే కేంద్రానికి గండం గడిచే మార్గాలు ఉన్నాయి కాని రాష్ట్రాలకు లేవు. వీటిని తప్పించుకునే మార్గాలు అంటారు. అంటే లక్ష్యంనుంచి దారి మళ్లే సదుపాయం. కేంద్రానికి జాస్తి, రాష్ట్రాలకు నాస్తి. అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వం. బకాయిలు ఇవ్వం. పన్నులు, అధికారాలు, చట్టపరమైన శక్తులు అన్నీ కేంద్రీ కృతం చేస్తాం. అధికారాలన్నీ మా కింద ఉన్న కేంద్ర అధికారుల చేతిలో పెడతాం. ముఖ్యమంత్రులంతా దేబిరిస్తూ ఉండాలని కేంద్రం అంటే దాన్ని ఫెడరలిజం అనీ ఆ పాలనను ప్రజాస్వామ్యం అనీ ఎవరూ అనుకోరు. కేరళ పదిహేను సంవత్సరాలకోసం 9 శాతం వడ్డీతో ఆరు వేల కోట్లరూపాయలు కాపిటల్ మార్కెట్ నుంచి అప్పుతీసుకున్నది. రాష్ట్ర జీడీపీ నిష్పత్తిని బట్టి ఇప్పటికే మన రాష్ట్రాల అప్పులు 27.7 శాతం పెరిగాయి. ఇంకా అప్పులు కావాలంటే ఎక్కువ వడ్డీరేటుతో తీసుకోవాలి. పేరుకుపోయిన ఈ అప్పుల భారాన్ని, తరువాత వచ్చే ప్రభుత్వాలు సంబాళించుకోవడం కష్టం. కరోనా సహాయ బాండులనుకొనే అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మరికొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. లేకపోతే పన్నులు పెంచుకుంటూ పోవడంతప్ప వారికి మరో దారి లేదు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచండి అప్పులు తీసు కుంటా మని రాష్ట్రాలు కోరితే కేంద్రం తన అధికారాలను విపరీతంగా పెంచే బిల్లులను ఆమోదించాలనే షరతు పెట్టింది. భారీనిధులు ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి షరతులు పెట్టరు. విద్యుచ్ఛక్తి సంస్కరణల పేరుతో రాష్ట్రాల అధికారాలన్నీ తుడి చిపెట్టి కేంద్రం గుప్పిట్లో పెట్టుకుంటే రేపు కరెంటు వాటా కోరినప్పుడు కూడా చెత్త షరతులు విధిస్తుంది. ఇదే దుర్మార్గమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విమర్శించారు. రుణపరిమితిని రెండు శాతం పెంచితే 20 వేలకోట్లు వనరులు అందుతాయి. ప్రతి రూపాయి వడ్డీతో సహా రాష్ట్రమే చెల్లించాలి. కేంద్రం మెహర్బానీ ఏమీ లేదు. రాష్ట్రాలను మరింత దిగజార్చే విద్యుచ్ఛక్తి చట్టం మార్పులు ఒప్పుకుని, జనం మీద పన్నుల పెంపు మోత మోగిస్తేనే మరో 2500 కోట్లకు ఇస్తామనడం రాష్ట్రాల పాలనా స్వాతంత్య్రాన్ని దెబ్బ తీయడమే అవుతుంది. రాష్ట్రాల ఖాళీ చిప్పల్లో కేంద్రం ఖాళీ ప్యాకేజీ. కరోనాబూచి చూపి నియంతృత్వాన్ని వ్యవస్థాపితం చేయాలనుకుంటే ఒప్పుకోకుండా విద్యుచ్ఛక్తి కేంద్రీకరణతో సహా కేంద్రం ప్రతిపాదించిన కొత్త షరతులన్నీ ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలు పట్టుబట్టాల్సిందే. తమను మతం పిచ్చిలో మందు మత్తులో ముంచి గెలిచే ఏ పార్టీ కూడా దేశం గురించి ఆలోచించదని జనం తెలుసుకోవాలి. పాలకుల కన్నా ముందు జనం తమ మత మత్తును, మూర్ఖత్వాన్ని వదులుకోవాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఆ పదహారు కూలీల పదహారణాల ఆత్మనిర్భరత
హరిశ్చంద్రుడికి కరోనా రోగం సోకింది. వరుణుడిని ప్రార్థిస్తాడు. నీ కొడుకును బలి ఇస్తానంటే నీ రోగం కుదురుస్తానంటాడు వరుణుడు. సరేనంటాడు రాజు. రాజభవనం నుంచి కరోనా పోయింది. రాజు పుత్రవ్యామోహంలో పడి బలిమాట వాయిదా వేస్తుంటాడు. బలి ఇవ్వక తప్పని దశ వస్తుంది. రాజుగారి సలహాదారుడు మీరు పుత్రుడిని దత్తత తీసుకుని లేదా కొనుక్కుని కూడా బలి ఇవ్వవచ్చునని ఉపాయం చెబుతాడు. రాజు దండోరా వేస్తాడు. బలిచేసే వాడికి ఎవరైనా కొడుకిని దత్తత ఇస్తారా, అమ్ముతారా? కానీ, అజిగర్తుడనే పేదవాడు నాకు నూరు ఆవులిస్తే కొడుకునిస్తానంటాడు. అయితే పెద్దవాడంటే నాకు ప్రేమ అని తండ్రి, చిన్నవాడిని నేనివ్వను అని తల్లి అంటారు. మధ్య వాడు సునఃశ్యేపుడు. తల్లిదండ్రులకు అక్కరలేకపోయిన తరువాత బతకడమెందుకని బలిపశువైపోతాడు. అయితే యజ్ఞంచేసే ముని, బలిని నిర్వహించే ఉద్యోగి మనిషిని నరకలేమంటారు. మళ్లీ అజిగర్తుడు ముందుకొచ్చి ఇంకో వంద ఆవులిస్తే నేనే బలి ఇస్తానంటాడు. నాకెవరూ లేరు, నేనెవరిమీదా ఆధారపడలేను, ప్రేమించే తల్లిదండ్రులే వద్దనుకున్నారు, కాపాడే రాజే బలి కోరుతున్నాడు అని కుములుతున్న సమయంలో అప్పుడే అద్భుతమైన ఉపదేశం ఆకాశవాణిలో విన్నాడు సునఃశ్యేపుడు. ఎవ్వరిమీద ఆధారపడనప్పుడే కావలసింది ఆత్మనిర్భరత అన్న మాట మనసులో నాటుకుపోయింది. వలసకూలీల వలె పట్టాల మీద బలిపశువు కాకూడదనుకున్నాడు. కనీస బాధ్యత లేని తల్లిదండ్రులనుంచి, నియంతృత్వపు రాజు నుంచి, మాయమాటలు నమ్మి చప్పట్లు కొట్టే ప్రజల అజ్ఞానపు చీకట్ల నుంచి కాపాడే చైతన్య ఉషోదయాన్ని ప్రార్థిస్తూ గురువు విశ్వామిత్రుడు చెప్పినట్టు తానే వరుణుడిని ప్రార్థించాడు. వెంటనే వెలుగు విస్తరించింది. వరుణుడు రాజుతో నీవంటి వారి బలి నాకక్కరలేదన్నాడు. సునఃశ్యేపుడు తండ్రిని ఒక చూపు చూసి విశ్వామిత్రుడి వెంట ఎంతో ఆత్మనిర్భరతతో వెళ్లిపోతాడు. దిక్కులేకుండా సునఃశ్యేపుడి వంటి దుర్దశలో ఉన్నపుడు ఆత్మనిర్భరత అవసరం అన్నది ఈనాటి పాఠం. కరోనాను పట్టించుకోకుండా ముందుగా ట్రంప్ జిందాబాద్ అన్నాం, తరువాత పారాసిటమాల్ చాలదా అనుకున్నాం. తరువాత భయపడ్డాం, తాళాలు వేశాం. తాళాలు తప్రాలు వాయిస్తూ భజ నలు చేశాం. భౌతిక దూరం అంటూ కవితలు రాశాం. పై కథ చెప్పిన ఒక పురాణ నిపుణ రచయిత కవితాత్మకంగా ఇంకో మాట చెప్పాడు. 500 కరోనా కేసులున్నపుడు లాక్డౌన్, 5 వేల కేసులున్నపుడు చప్పట్లు, 10 వేల కేసుల సంబరానికి కరెంటు దీపాలు మలిపి, ఆ చీకటిలో కొవ్వొత్తులు వెలిగించడం, 40 వేల కేసుల సందర్భంలో ఆకాశం నుంచి పూలు కురిపించడం. 50 వేల కేసులుం డగా మద్యం దుకాణాలు బార్లా తెరిపించడం. 60 వేల కేసులకు చేరుకుంటుంటే రైళ్లు నడవడం చేసుకుంటున్నాం. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మనిర్భరత ప్రబోధించారు. కనిపించని కరోనా, కనిపించినా కదలలేని సామాన్యులు గందరగోళంలో పడిపోయారు. కేవలం నాలుగ్గంటల నోటీసిచ్చి అంతా 21 రోజుల దాకా బంద్ అంటే నలభై కోట్ల వలస కూలీలు తప్ప అంతా సంతోషించారు. రకరకాల వలస కూలీలకు ఇప్పుడు పని లేదు. పనిలేక తిండి లేదు. పోదామంటే రైలు లేదు, కోట్లాదిమంది నడక మొదలుపెట్టారు. ఎంత దూరం అని పట్టించుకోలేదు. ఒక తల్లి దారిలో ప్రసవించింది, వెంటనే నడకకు సిద్ధమైంది. ఒక తండ్రి పాపను భుజాన మోసుకుని బయలుదేరాడు. ఓ భర్త, చిన్న చక్రాల చట్రం మీద భార్యను, పసిపాపను ఓ మూటను పెట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు. చక్రాల సూట్కేస్ మీద సతిని కూచోబెట్టి మరో పతిదేవుడు తోసుకుపోతున్నాడు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఊరికి 30 కి.మీ. దూరంలో అలసిపోయి చనిపోయాడొకాయన. రైలు ఎక్కనీయకపోతే పట్టాల వెంట నడక ప్రారంభించి నడిచీ నడిచీ అలసిపోయి తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో అక్కడికక్కడే పట్టాల మీద పడి నిద్రపోయారు. ప్యాసింజర్ రైళ్లు లేకపోయినా రైల్వే అధికారులు ఎంతో దేశభక్తితో గూడ్సు రైళ్లు నడుపుతారని వారు ఊహించలేకపోయారు. ఇంజిన్ డ్రైవర్ కర్తవ్య నిర్వహణ పరాయణుడై రైలు నడిపే డ్యూటీ చేశాడు. తీరా లక్షలాది కూలీలు ఊళ్లు చేరిన తరువాత, అన్ని పనుల లాక్ తెరిచారు. రెక్కాడించడానికి మళ్లీ వెళ్లాలా? ఎవ్వరిమీదా ఆధార పడకుండా సొంతంగా బతుకో చావో అనుకునే ఆ పదహారుమంది పదహార ణాల ఆత్మనిర్భరత అలవర్చుకోవాలా? నెత్తురుతో తడిసిన ఆ పట్టాలమీద ప్రగతి రైళ్లు పరుగెత్తి మన దేశాన్ని విశ్వాగ్రరాజ్యంగా మార్చేస్తాయా? స్క్రూలనుంచి ఇంజిన్ దాకా అంతా జపాన్ వారే చేసి మనకు అమ్మే బుల్లెట్ రైళ్లు ఈ పట్టాలమీదే నడుస్తాయా? నడిస్తే లోకల్ అనకండి, అది గ్లోకల్ అని తెలుసుకోండి. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
‘మద్యే మద్యే’ న్యాయం సమర్పయామి
కోవిడ్ 19 అంటురోగపు రోజుల్లో నిత్యావసరాలంటే తిండి, వైద్యం. మరి మందు (ఔషధం కాదండోయ్) సంగతేమిటి? ఉద్యోగం లేకపోయినా ఉపద్రవకాలంలో మద్యం అత్యవసర ద్రవమని అర్థం కాలేదా? జనం తాగకుండా 45 రోజులు బతికి ఉండగలరని నిరూపించుకుంటే ప్రభుత్వాలు 45 రోజు లకన్నా అమ్మకుండా ఉండలేమని చాటుకున్నాయి. పాఠాలు లేని పంతుళ్లకు బ్రాందీ షాపుల కాపలా డ్యూటీ. మగా, ఆడా, చిన్నా పెద్ద తేడా లేకుండా జనం బారులు తీరి ఎంతో ఓపికగా భౌతిక దూరాలలో నిలబడి ఉవ్విళ్లూరుతూ కొనడం మహోన్నత భారతీయ జనతా నాగరికత. దేశాన్ని ఆర్థికమాంద్యం నుంచి కాపాడే దేశభక్తులు ఒక్కరోజులోనే ఒక్కో చోట వందల కోట్ల రూపాయల మద్యం తాగేశారు. లాక్ డవున్ కాలంలో వేరే రోగాలు రాకపోవడానికి కారణాలు అమ్మచేతి వంట తినడం, మందు కొట్టకుండా ఉండడం అని కొందరు అమాయకులు సూత్రీకరించారు. కానీ వెంటనే మద్యప్రవాహం మొదలైంది. సరిగ్గా సాగని చదువులను వానాకాలపు చదువులు అనేవారు. ఇప్పుడు కరోనా కాలపు చదువులనాలి. విమానాలు, రైళ్లు, బస్సులు, హోటళ్లు, సినిమాలు తెరిచే రోజులు వచ్చిన తరువాత చివరకు, విద్యాలయాలు తెరవడం గురించి ఆలోచిస్తారు. ముందు తెరిచింది మద్యం సీసామూతలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే డబ్బు దక్కదు. వలస కూలీలను సొంతూర్లకు పంపడానికి రైళ్లు నడపాలనే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని కేవలం 45 రోజుల ఆలస్యంగా తీసుకున్నారు. వందలాది మైళ్లు వేలాది జతల కాళ్లు నడిచిన తరువాత, కొన్ని ప్రాణాలు పోయిన తరువాత, అది అత్యవసర సేవ అని, ప్రజల చావుబతుకులకు సంబంధించిన సమస్య అనీ తెలుసుకున్నారు. మద్యం కన్నా అత్యవసర వస్తువు న్యాయం అని గుర్తురాకపోవడం ఒక విషాదం. మద్యం బార్ తెరిచినా న్యాయం బార్ మూసే ఉంది. తాలూకా, మండలం, జిల్లా స్థాయిల్లో న్యాయ వితరణ, న్యాయ విచారణ, వివాద పరిష్కారాలు లాక్ డవునైనాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలా సీరియస్ అంశాలను పరిశీలించడానికి వీడియో సమావేశాల ద్వారా న్యాయాన్యాయ విచారణ సాగిస్తున్నాయి. హైకోర్టు మనసు గెలుచుకున్నవారికీ, సుప్రీంకోర్టు కంటికి కనపడిన వారికి న్యాయం అందుబాటులో ఉంటుంది. మిగతావారికి న్యాయం అరుదైన సరుకు, అందని ద్రాక్ష. మద్యం ముందు న్యాయం చివరకు. ఎంత సామాజిక న్యాయం ఇది? లాయర్లు ఈ విషయం ఆలోచించరు. వేసవికి వచ్చే సెలవులు కరోనా పుణ్యాన రావడంతో సంతోషించేవారు కొందరైతే, రెక్కాడితే తప్ప డొక్కాడదన్న రీతిలో బెయిల్ కోసం ఎవడైనా వస్తే తప్ప రెయిల్ నడవని లాయర్కే చాలా కష్టం. 40 కోట్ల మంది కూలీలు వలసవచ్చిన చోట పనిలేక, మరో రాష్ట్రంలో ఉన్న సొంతూరికి పోలేక, బతక లేక చావలేక ఉంటే వారికి న్యాయం అడిగే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, ధర్మాత్ములు ఆశావిశ్వాస సిద్ధాంతమనే ఒక వినూత్న విధానాన్ని కనిపెట్టారు. ఇదేమిటని అడిగాడో మిత్రుడు. హోప్ అండ్ ట్రస్ట్ ఫిలాసఫీ అని ఇంగ్లిష్ మీడియంలో చెప్పాను. వెంటనే ఆ మిత్రుడు అర్థం అయిందన్నాడు. దాని అర్థం ఏమంటే ప్రభుత్వం వారు చేస్తానన్న పని చేస్తారని ఆశించడం, చేశారని విశ్వసించడం అని సుప్రీంకోర్టు న్యాయవాది వివరించారు. వలస కార్మికులకు ప్రభుత్వం ఆహారం ఇస్తున్నామని చెప్పితే నమ్మాలి. ఉన్నచోట ఉండక నడవడమెందుకు అని న్యాయం చెప్పారు. పిల్ కొట్టేశారు. పోలీసులు తన్నినా, లాకప్లో వేసినా, రాజద్రోహం కేసులతో విమర్శల గొంతు నులిమినా, తప్పుడు కేసులుపెట్టినా అడుక్కోవడానికి మన ఊళ్లో న్యాయస్థానం గేట్లు తెరవరు. అక్కడ సర్వోన్నత న్యాయస్థానాధీశులు కరోనా సంక్షోభ కాలంలో పాలక, శాసన, న్యాయవ్యవస్థలు సమన్వయంతో దేశసేవ చేయాలని సెలవిచ్చారు. పాలకుల ఘోర నిర్ణయాలు తీసుకున్నా న్యాయవ్యవస్థ సమన్వయంతో సర్దుకు పోవాలని రాజ్యాంగంలో అంతర్లీనంగా వారికి కనిపించింది. కరోనా అత్యయిక పరిస్థితుల కాలంలో ప్రాథమిక హక్కుల గురించి తపన పడడం ముఖ్యం కాదనీ సర్వోన్నతులు ప్రవచించారు. పాపం జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నాకు ఈ టెక్నిక్ తెలియక, ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు ముఖ్యమని, వాటిని సస్పెండ్ చేయడానికి వీల్లేదనీ తీర్పుచెప్పి తను ప్రధాన న్యాయమూర్తి కాకుండా పోయారు. మొదట్లో ఈ న్యాయాన్ని అన్యాయంగా భావించినా ఇప్పుడు ఖన్నాదే న్యాయమని చాలామంది ఆమోదించారు. హోప్ అండ్ ట్రస్ట్ సిద్ధాంతం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీధిలో ప్రభుత్వమే బ్లాక్ రేట్లో దగ్గరుండి మద్యాన్ని అమ్మిస్తుంటే మందుకొట్టి మత్తుగా పడిపో, లేకపోతే ఇప్పటికిదే న్యాయం అనే ప్రవచనాలు మాత్రమే మననం చేసుకో. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వలస కూలీలు ఓటర్లు కారనుకున్నారా?
నెత్తిన మూటలు, పక్కన పదేళ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, ముసలాయన, మొత్తం కుటుంబం కాలినడకన మైళ్ల ప్రయాణానికి సిద్ధం. వారికెంత ఆత్మస్థైర్యం, ఎంత సహనం? కొందరు నడవలేకపోయారు చని పోయారు. దేశంలో పదినుంచి నలభై కోట్లదాకా వలస కూలీలు ఉన్నారు. లెక్కలు లేవు. వారి పట్ల రాజ్యపాలనా వ్యవస్థ దారుణంగా విఫలమైంది. మాకు కరోనా అంటే భయం లేదు. కానీ పేదకూలీలను మనుషులు అని కూడా గుర్తించని ప్రభుత్వం అంటే చాలా భయం, ఆకలికీ, నిరుద్యోగానికీ, వందల మైళ్ల నడకకూ భయపడడం లేదు. మేం కూడా ఓట్లు వేస్తాం. మాకు విలువే లేదా? అని ఒక కూలీ అడిగాడు. వలసకూలీలకు ఓట్లు లేవనుకున్నారా లేక వారు ఓట్లే వేయరనుకున్నారా? అవినీతి, అసమర్థత, ఆలోచనలేని నిర్ణయాలు వైరస్ కన్నా అల్పంగా ఎవరికీ కనిపించవు. వైరస్కన్నా ప్రమాదకరంగా సూక్ష్మంగా ఉండే అసమర్థతను ఎవరు చూస్తారు? కరోనా వైరస్ కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ ఒక్కటే మందు అని అందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ దీని వెనుక కోట్లాది వలస కూలీలను అసలు పట్టించుకోకపోవడమనే భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు సజీవ సాక్ష్యాలు, కాదు కాదు, జీవన్మృత సాక్ష్యాలు. 8 గంటలకు టీవీలో ప్రసంగించి అర్ధరాత్రి 12 నుంచి లాక్డౌన్ అన్నీ బంద్ అన్నారు. ఆహా భేషైన నిర్ణయం. ఎక్కడెక్కడో చిక్కుకున్న కోట్లాది మంది కూలీల పని హఠాత్తుగా ఆగింది. రైళ్లు, బస్సులు, వాహనాలేవీ కదలవు. పొట్ట చేతబట్టుకుని నగరాలకు వచ్చిన కూలీలు ఎక్కడికి ఎలా వెళ్లగలరు? వీరి బతుకులను ఏం చేయాలనే ప్రణాళిక లేకుండా, వారు బతికి ఉన్నారని, బతికి ఉండేట్టు చూడాలనే ధ్యాస లేకుండా లాక్డౌన్ చేసారు. కరోనా ఖాళీని ఏలినవారిని కీర్తించడానికి సద్వినియోగం చేస్తున్నారు. కూలిపోయిన కూలీల గురించి పట్టించుకోవడం ఎందుకనే నిర్లక్ష్యం ఇది. నగరాలనుంచి గ్రామాలకు వందలాదిమంది నడిచిపోతున్న కఠిన జీవన దృశ్యాలు ఇప్పటికీ హృదయ విదారకంగా పత్రికల్లో టీవీల్లో వస్తూనే ఉన్నాయి. కోట్లాదిమందికి హఠాత్తుగా కూలీ ఉద్యోగం కూడా కూలిపోయింది. బతకాలంటే ఊరికి పోవడం ఒక్కటే మార్గం. నడవడం తప్ప మరో దారి లేదు. వీధిమూల చిన్న చాయ్ దుకాణాలు పెట్టుకునే వాళ్లు, తోపుడు బండ్లమీద తినుబండారాలు అమ్ముకునే వాళ్లు. ఇవ్వాళ్ల సంపాదించిన డబ్బు, తిండికి.. రేపటి వంటలకు పెట్టుబడికి మాత్రమే సరిపోతాయి. రేపు చిన్నవ్యాపారం నడవక వేరే పని లేక రేపు తినగలిగినా మరునాటికి తిండి లేక ఎన్నాళ్లిలా? రాష్ట్ర సరిహద్దులలో పొరుగు ప్రభుత్వం సొంతూరు వెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేస్తే అదృష్టం. కొన్ని రాష్ట్రాలు చేసాయి. కొన్ని చోట్ల వదాన్యులు డబ్బు పోగు చేసి వేరే రాష్ట్రాలనుంచి, జిల్లాలనుంచి వచ్చిన కూలీలకు తిండి పెడుతున్నారు. రోజుకు వందలాది మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. తిరుపతిలో తితిదే దేవస్థానం వారు కొన్ని రోజులు ఆహారం వండి పెట్టారు. చాలా గొప్పపని. మార్చి 22న ఉండాల్సిన బుద్ధి ఏప్రిల్ 20 దాకా రాలేదు. దాదాపు నెలరోజుల ఆకలి.. కూలీల వలసల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ కేంద్రాలు పెట్టాలనిపించింది. కేంద్రానికి సాయం చేయాలనిపించింది. సహాయ నిధులు ప్రకటించారు. భోజన సరఫరా ఏర్పాట్లు చేసారు. అదీ కొందరికి మాత్రమే. ఇవన్నీ అరకొర వ్యవహారాలు. అందరికీ అందించే సమగ్ర ప్రణాళికలేవీ లేవు. చేతగానితనానికి ఒకే నెపం కరోనా లాక్ డవున్. రాష్ట్రాల మధ్య వలస కార్మికుల ప్రయాణాలను అనుమతించబోమని, ఉన్న రాష్ట్రంలోనే వారికి ఉపాధి గ్యారంటీ పనులు ఇవ్వడానికి కొన్ని మార్గదర్శకాలను ఏప్రిల్ 20న కేంద్రం విడుదల చేసింది. కార్మికులు దగ్గరలో ఉన్న కేంద్రాలలో రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారున్న చోటికి వెళ్లి రిజిస్టర్ చేయాలనే బాధ్యతను యంత్రాంగం పైన మోపలేదు. సరైన ప్రణాళిక ప్రకారం కూలీలను గుర్తించి వారు తిరిగి వారి ఊళ్లకు వెళ్లేదాకా లేదా వారికి పని దొరికి వారంతట వారే సంపాదించుకునే దాకా వారిని పోషిం చడం. లేదా వారిని సొంతరాష్ట్రాలకు తరలించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, మతాదాయ సంస్థల బాధ్యత. కేరళలో వచ్చి పడిన లక్షలాది వలసకూలీల బాంక్ అకౌంట్ల వివరాలతో డేటా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ డేటా సేకరిస్తే తగిన ప్రణాళికలు సాధ్యం. బ్యాంక్లో డబ్బు వేసినా తీసుకోవడానికి వీరు వెళ్లగలరా? ప్రసంగాలు, మార్గదర్శకాలు, సలహాలు, ప్రకటనలు జారీచేయడం అనే సులువైన పబ్లిసిటీ వ్యూహాలు దాటి కేంద్రం నిర్మాణాత్మకంగా పనులు చేసి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటే బాగుండేది. పాలకులు ముందుచూపు లేని బదిరాంధులు కాకపోతే బాధ్యతలు తెలుస్తాయి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రైతుల్ని ఆదుకొనేదెవరు?
కరోనా, అకాలవర్షాలనుంచి రైతుల్ని ఆదుకొంటారా? తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల ద్వారా 70 శాతం అధికంగా ధాన్యం పండిందంటున్నారు. యాసంగిలో 31.58 లక్షల ఎకరాలలో వ్యవసాయం సాగించేవారు. ఈసారి నీటిలభ్యత పెరిగి 53 లక్షల 68 ఎకరాల సాగు సాధ్యమయింది. 16.89 లక్షల ఎకరాలలో వరి సాగుచేసే వారు ఈసారి 39.24 లక్షల ఎకరాలలో వరి పండిం చారు. రైతులకు రెండు గండాలు. ఒకటి కరోనా వైరస్ వల్ల రాకపోకల దిగ్బంధనం. రెండు అకాల వర్షాలు. ఈ గండాలను గడిచే శక్తి రైతులకు లేదు. ప్రభుత్వాలు ఆదుకొంటాయా? తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తొట్టతొలి కారణం నదుల వాటాల్లో అన్యాయం, నీటి వనరులను భారీ ఎత్తున మళ్లించడం. విడిపోయిన తరువాత తెలంగాణలో ఆరేళ్లలో అదనంగా పంటపొలాలు తడిపేందుకు నదీ జలాలను కదిలించారు. జలాశయాలు నిర్మించారు, ఎత్తిపోశారు. నీరు పారిన పొలాలు ధాన్యాన్ని పండించాయి. దేశంలో గొప్ప ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగేదశ. యాసంగిలో ప్రతిధాన్యం గింజను ప్రభుత్వం గ్రామాలకొచ్చి కొంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సహజంగానే ఇది రైతులకు సంతోషకరమైన వార్త. గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా విశేషమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం ఉన్నా, తాలు నాలుగు శాతం దాకా ఉన్నా కూడా రైతులనుంచి కొనవచ్చు. కానీ తీరా ధాన్యం అమ్మకానికి వచ్చినపుడు అధికారులు ఈ రెండు నిబంధనలను పాటించడం లేదని, తాలు అసలే లేకుండా నూటికి నూరుపాళ్లు పరిశుభ్రంగా ఉండాలని పట్టుబడుతున్నారని, తేమ కేవలం 13 లేదా 14 శాతం, అంతకన్న తక్కువ ఉన్నా కూడా రైతుల పంటను కొనేవారు కనబడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. అధికారులు కొనే దాకా ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలలో పెట్టుకుని రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులు అక్కడే ధాన్యం ఎండ బెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లని ధాన్యం కుప్పలు కల్లాల దగ్గరే పడి ఉన్నాయి. ఈ మధ్యలో అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటల కోతలు దాదాపు 70 శాతం పూర్తయిన గ్రామాల్లో ధాన్యాన్ని ఏంచేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ధాన్యం ఆరబెట్టినకొద్దీ తూకం నానాటికీ తగ్గిపోతున్నదని రైతులు బాధపడుతున్నారు. తాలు పట్టడానికి రైతులు వేలకు వేల రూపాయలు ఖర్చుచేయవలసి వస్తున్నది. 40 బస్తాలు శుభ్రం చేయడానికి దాదాపు రూ. 8 వేల దాకా ఖర్చవుతుంది. ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వాగ్దానాలు, అనేక నియమాలు చేసినా అధికారుల ఆలస్యం, అవినీతి, బాధ్యతారాహిత్యం వల్ల ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. రైతులు వేధింపులకు గురవుతున్నారు. తేమ, తాలు ఉందని ధాన్యాన్ని మిల్లుల్లోకి కూడా రానీయడం లేదు. ప్రతిబస్తాకు కిలోనుంచి రెండు కిలోల దాకా తరుగు అంటూ దోచుకుంటున్నారని, ధాన్యం కొనకుండా ఏదోఒక నెపంతో ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక్కొక్క రోజు ఆలస్యం అవుతుంటే రైతులకు నష్టం పెరిగిపోతూ ఉంటుంది. మిల్లర్లకు తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో మిల్లర్లకు లాభాలు రావడం, రైతులు పూర్తిగా దెబ్బతినడం ఖాయం. బియ్యం మిల్లులు తప్పు చేస్తే కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడమని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పలు ఐకేపీ కేంద్రాలను పరిశీలించామని, ఇందులో తాలు పేరిట క్వింటాల్కు 3 నుంచి 6 కిలోల తరుగు తీయడం సరి కాదన్నారు. ఈ విధంగా రైతులను బ్లాక్మెయిల్ చేయొద్దని కూడా ఆయన రైస్మిల్ల ర్లకు చెప్పారు. బియ్యం మిల్లుల యజమానులతో విస్తారంగా సమావేశం జరిపారు. తమిళనాడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని తెలంగాణను అడిగిందని, మంచి నాణ్యత కలిగిన ధాన్యాన్ని సేకరించి వారికి ఎగుమతి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఈ విధమైన డిమాండ్ ఏర్పడుతున్న దృష్ట్యా తమకు ధాన్యం విక్రయిస్తున్న రైతులకు వీలైనంత ఎక్కువ ధర ఇవ్వడానికి మిల్లర్లు ప్రయత్నించాలని కూడా మంత్రి హితవు చెప్పారు. అయితే చేసిన హామీలు, ప్రకటించిన నిబంధనలు అమలు చేయకపోతే రైతులు సంక్షోభంలో పడిపోతారని ప్రభువులు తెలుసుకోవాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నర్సులూ.. డాక్టర్లే ఇప్పుడు మన సైనికులు
కరోనా రోగులకు చికిత్స చేస్తున్న నర్సులకు, డాక్టర్లకు, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనిక అతిరథ మహారథులకు తేడా లేదు. ఎన్కౌంటర్లలో పోలీసులు, యుద్ధంలో సైనికులు గెలిస్తే, పోరాడి మరణిస్తే ఇచ్చే అన్ని సౌకర్యాలు, సహాయాలు వారికి చేస్తామని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వాలు వెంటనే డాక్టర్లకు మాస్క్లు, రోగులకు వెంటిలేటర్లు, ప్రత్యేక ఐసీయూ గదులు ఏర్పాటు చేయాలి. అసంఘటిత కార్మికులను, పనిచేస్తే తప్ప తినలేని పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి. జనం రద్దీ ఏర్పడడానికి దారితీసే తిక్క నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోకూడదు. కరోనా సోకిన రోగులు ఆ విషయం చెప్పుకోవడానికి భయపడుతూ ఎటుపోవాలో తెలియకపోవడం వల్ల వైరస్ పెరుగుతున్నదనే సత్యాన్ని పాలకులు గుర్తిం చాలి. డాక్లర్లను ఇళ్లనుంచి ఖాళీ చేయించే అమానుష యజమానుల నుంచి రక్షణ కల్పించాలి. అసలు ఈ రోగాన్ని నిర్ధరించడానికి పరీక్షా పరికరాలు ఉన్నాయా? ఎప్పుడు తెప్పిస్తారో ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. కరోనా వైరస్ కావాలని ఎవరైనా ప్రయోగించిన విధ్వంసకర బయోలాజికల్ అస్త్రమా లేక దానంతట అదే పుట్టుకొచ్చిన ప్రమాదమా చెప్పలేము. సందేహాలు వది లేస్తే వైద్య ప్రముఖులంతా చేతుల నుంచి ముఖం ద్వారా ఈ వైరస్ ప్రవేశిస్తుందని చెబుతున్నారు. వైరస్ వచ్చే దారులు తెలిసినపుడు, ఆ దారులను మూసివేయడమే మన పని. సోకిన తరువాత పరీక్షించడం, ఆస్పత్రి, సౌకర్యాలు, చికిత్స, మందులు అన్నీ సమస్యలే. ప్రభుత్వాలను, ఆస్పత్రులను నమ్ముకోవడంకన్నా నివారించడం ముఖ్యం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎన్ని కోట్లిచ్చాయి, ఉన్నట్టుండి అష్టదిగ్బంధనం చేస్తే మామూలు మనిషి జీవనమెట్లా గడుస్తుంది అనే ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాలి. తప్పదు. అనేకానేక దేశాలు ఈ వైరస్పై యుద్ధంలో గెలవలేకపోతున్నాయి. పూర్తిగా ఓడిపోతున్నాయో లేదో తెలి యదు. చైనా ఘన విజయం సాధించానని చెప్పుకుంటున్నది. రెండు, మూడు రోజులుగా కొత్త కేసులు లేవని ప్రకటిస్తున్నది. నిజమైతే విజయమే. అదో నమ్మకం. అనుకోకుండా విస్తరించిన ఈ వైరస్కు చైనా మొదటి బాధితురాలన్న మాట, చైనా ఆ వైరస్ను తరిమేసిన మాట కూడా నిజమే అయితే, ప్రపంచానికి తను అనుసరించిన విధానాలను చెప్పి, అనుసరించిన వ్యూహాల వివరాలను, విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు పంచాలి. మానవాళి మనుగడకు అవసరమైన ఔషధాలను, వస్తువులను పేటెంట్ లాభాలకోసం ఆపివేసే పెట్టుబడి స్వార్థానికి మేధో సంపత్తి హక్కులలో కూడా అంగీకారం లేదు. కరోనా చికిత్సకు సంబంధించి పేటెంట్ హక్కులకోసం కక్కుర్తి పడకుండా మానవజాతిపైన సాగే ఈ మారణ హోమానికి విరుగుడు దొరికింది దొరికినట్టు ప్రపంచానికి తెలియజేయాలి. దేశం మొత్తంమీద జనాల కదలికలను నిరోధించడం తప్ప ప్రభుత్వాలు నిజంగా వెంటనే చేయగలిగిందేమీ లేదు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లైనా అన్ని రవాణా ప్రయాణ సౌకర్యాలను, ఇంటినుంచి బయటకు వెళ్లవలసిన అవసరాలను నిలుపుదల చేయాలన్నారు. ఇది తప్పనిసరి. కరోనా వైరస్ అని పత్రికల్లో వీడియోల్లో చూపే చిత్రాలు, ఆ వైరస్ జీవి అసలు పరిమాణాన్ని నాలుగు లక్షల రెట్లు పెంచిన తరువాత కనిపించేవి. ఒకే దారంలాగా, ఒక కిరీటంలాగా ఉపరితలం నుంచి చొచ్చుకొచ్చినట్టు కనిపించే ఈ వైరస్ ప్రొటీన్ చుట్టూ ముళ్లున్నట్టుగా ఉంటుంది. ఉపరితలంపైన క్రౌన్ (కిరీటం) వలె ఉంది కనుక కొరోనా అంటున్నారు. కరోనా వైరస్ వంటి ఇతర అంటువ్యాధులు– పందులు, ఇతర పశువులు, గుర్రాలు, పిల్లులు, ఒంటెలు, కుక్కలు, ఎలుకలు, కుందేళ్ల వంటి క్షీరదాలు, పక్షులు, గబ్బిలాలు, తదితర అడవి జంతువుల్లో కనిపిస్తాయని, మూమూలు జలుబు, సార్స్ అంటే తీవ్రమైన శ్వాసకోశ బాధ రూపంలో మనిషిలో కూడా ఈ వైరస్ ప్రవేశించే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు రాశారు. గబ్బిలం కూడా క్షీరదాల జాతి జంతువు. చైనాలో దేన్నయినా తినే అలవాటుంది. ఈ వైరస్ గబ్బిలాలలో పెరిగి, వాటిని తిన్న పాముల్లో ప్రవేశించి, వాటిని (గబ్బిలాలు, పాములు) తిన్న మనుషుల్లో ప్రవేశించిందా లేక ఏదైనా ప్రయోగశాలలోనుంచి బయటపడిందా మనకు తెలియదు. శ్వాసకోశ మార్గంలో రోగ కారకాలైన మానవ కరోనా వైరస్లు 1960 నుంచి కనబడుతున్నాయట. కరోనా వైరస్ 229ఇ అన్నారు. సార్స్ కొవ్ 2003, 2019లో సార్స్ కోవ్ 2 అన్నారు. కంటికి కూడా కని పించని అతి సూక్ష్మ జీవి కరోనా వైరస్ మనం సాధించామనుకుంటున్న ప్రగతిని, శాస్త్ర విద్యను, మొత్తం నాగరికతను, అన్నింటికీ మించి వైద్యశాస్త్రాన్ని సవాలు చేస్తున్నది. కరోనా వైరస్ డిసీస్ 2019ని కోవిడ్ 19 అని పొట్టిగా పిలుస్తున్నాం. చైనాలోని హుబేయ్ రాజధాని వుహాన్లో ఇది బయటపడింది. న్యుమోనియాతో మొదలై శరీరంలోని అన్ని అవయవాలు వైఫల్యంగా పరిణమిస్తుంది. ముందుగా సాధారణ కణంలోని తొడుగులేని భాగపు జీనోమ్లో కణ సైటో ప్లాజమ్లో కరోనా వైరస్ తొడుగుపైన చొచ్చుకు వచ్చిన ముళ్ల వలె ఉన్న ఆకారంతో జొరబడుతుంది. ఎక్కువగా ఈ కణాలు పెరిగిపోయిన వ్యక్తి తుమ్మినపుడు, దగ్గినపుడు బయటకు చిమ్మిన చిన్న తుంపరల ద్వారా మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. గాలినుంచి రాదు. కలుషితమైన ఉపరితలాన్ని తాకి తరువాత ముఖాన్ని తాకినపుడు కూడా వస్తుంది. తలుపు పిడి, మెట్లపక్క కడ్డీలు, లిఫ్ట్ తలుపుల పిడులు, స్విచ్లు, వస్తువులు, కాగితాలు, నోట్లు, కూరగాయలు మొదలైన వాటినుంచి చేతికి, చేతినుంచి ముఖానికి, అక్కడినుంచి శరీరంలోకి. ఇది సోకిన మనిషి మలంపైవాలిన ఈగ మరొకరిపై వాలినపుడు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. ఉపరితలాల మీద 72 గంటలు నివసించే ఈ వైరస్ పెరిగి లక్షణాలు బయటపడడానికి రెండురోజులనుంచి 14 రోజులు పడుతుంది. పరిశుభ్రత, తరచు బాగా చేతులు సబ్బుతో కడగడం, బయటి మనుషులతో మీటర్ దూరంలో సంచరించడం, కడగకముందు చేతులతో ముఖాన్ని తాకడం అలవాటు వదిలించుకుంటే సరైన నివారణ. అనుమానితులు తప్ప ప్రతివాడికీ ముసుగులు అవసరం లేదు. మామూలు గుడ్డ కట్టుకున్నా సరిపోతుంది. ఉగాది, శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు, కల్యాణాలు, పారసిటమాల్ గోమూత్రం వంటి రుజువుకాని మందుల గురించి జనాన్ని తప్పుదోవ పట్టించకుండా శాస్త్రీయంగా ఆలోచించి అంటువ్యాధి విస్తరించకుండా పారిశుధ్య నియమాలు నిక్కచ్చిగా పాటించడం గురించి ప్రజలకు నాయకులు, మీడియా తెలియజెప్పాలి. జనం కూడా మూర్ఖత్వాన్ని వదులుకోవాలి. కరోనా మతాతీతంగా కులాతీతంగా, పేద ధనిక, రాజకీయ పార్టీ రహితంగా దాడిచేస్తున్నప్పుడు, నాగరికులనుకునే వాళ్లుకూడా ఎదుర్కోవడానికి ఏదో ఒకటి కావాలి కదా? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఏ న్యాయానికి ఈ మూల్యం!
ఒకటో ఎస్టేట్ దయతో మూడో ఎస్టేట్ నుంచి రెండో ఎస్టేట్కు ప్రమోట్ అయ్యారు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. ఈయనగారొక్కరే కాదు ఇదివరకు 44 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు పదవి దిగిపోయిన తరువాత సర్కారు ఇచ్చిన హోదాలు అందుకుని న్యాయదేవతను సమర్చించారు. రిటైర్ మెంట్ తరువాత పదవులకోసం ఉవ్విళ్లూరే విధంగా అనేక పదవులను లెజిస్లేచర్ సృష్టించింది. లోక్పాల్, లోకాయుక్త, జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు, లాకమిషన్ ఆఫ్ ఇండియా వంటి అనేక పదవులను మాజీ న్యాయ మూర్తులకే ఇవ్వాలనే చట్టాలున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఇటీవలి కాలంలో రిటైరయిన నూరుమందిలో 70 మంది జడ్జీలు ఆ తరువాత అనేక పదవులు తీసుకున్నారని తేలింది. ఇటీవలే కేరళ గవర్నర్గా సకల అధికార సౌఖ్యాలు అనుభవించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం గుర్తుండే ఉంటారు. అంతకుముందు రంగనాథ్ మిశ్రా గారు సీజేఐ పదవి వదిలిన ఏడేళ్ల తరువాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి, గెలిపించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. 1984 సిక్కు వ్యతిరేక హింసాకాండలో కాంగ్రెస్ ప్రమేయం ఏదీ లేదని వారంతా సచ్చీలురని రంగనాథ్ మిశ్రా న్యాయవిచారణ కమిషన్ నివేదిక ఇచ్చింది. అంత మేలు చేసిన న్యాయమూర్తికి ఆలస్యంగానైనా ధన్యవాదాలు చెప్పుకున్నారు. జస్టిస్ బహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జిగారు సుప్రీంకోర్టుకు రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేసి 1983లో కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు. ఆయన చేసిన మేలు కూడా ఇంతాఅంతా కాదు. ఆనాటి బిహార్ సీఎం జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో అబద్ధాలను వెతికి పట్టుకున్నారు. ఇటీవలే మరణించిన పద్మభూషణ్ అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయ కుడిగా ఉన్న 2012 కాలంలో న్యాయమూర్తుల పదవీ విరమణ తరువాత రెండేళ్ల దాకా ఏ పదవులను అంగీకరించకూడదనీ, వారికి ప్రభుత్వాలు ఏ పదవులూ ఇవ్వకూడదని వక్కాణించారు. చేసిన సేవలు రెండేళ్ల తరువాత గుర్తుపెట్టుకుని పదవులిచ్చే కృతజ్ఞత ఉంటుందా. ఎన్ని పనులు ఉంటాయి? మరిచిపోకముందే రుణం తీర్చుకోవడం ఉత్తమపురుషుల లక్షణం. రంజన్ గొగోయ్ చాలా సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి. సీబీఐ అలోక్ వర్మ తొలగింపు కేసులో న్యాయంచెప్పారు. తరువాత సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ప్రధానితో పాటు కూర్చున్నారు. ఏదో తప్పనిపించి కమిటీ నుంచి తప్పుకున్నారు. రఫేల్ కుంభకోణంలో ప్రభుత్వం తప్పే చేయలేదని గొగోయ్ గారికి అని పించింది. ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో కార్పొరేట్ ల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేయడానికి వీలు కల్పించే పథకంలో ఆయనకు ఏ దోషమూ కనిపించలేదు. కశ్మీర్లో అక్రమ బందీల హెబియస్ కార్పస్ కేసులు వినకుండా ఉంటేనే మేలనుకున్నారు. అయోధ్య వివాదంపైన రాజ్యాంగం కూడా ఊహించని కోత్త కోణం గొగోయ్ గారికి కనిపించింది. అయోధ్యలో రామాలయం వస్తుందా లేదా అన్నదే పాయింట్. మిగతా గోల ఎందుకంట. అస్సాంలో ఎన్నార్సీ తయారీలో సుప్రీంకోర్టు పర్యవేక్షణ చాలా ముఖ్యం. అందులో రంజన్ గొగోయ్ గారిది కీలకపాత్ర. ఎన్నార్సీని దేశం మొత్తానికి విస్తరించే ఊపునిచ్చిన పాత్ర. తనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళను డిసెంబర్ 2018లో ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసారు. తన కేసులో తానే తీర్పు చెప్పు కున్నంత స్థాయిలో తానే బెంచ్ పై ఉండడం. తానే జడ్జిలను ఎంపికచేయడం, తను నిర్దోషిగా బయటపడటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మామూలు విషయాలు. ఈయన గారు సీజేఐ పదవి వదిలి పెట్టిన కొన్నాళ్ళకు ఆ ఆరోపణలు చేసిన మహిళకు జనవరి 23, 2020 నాడు ఉద్యోగం మళ్లీ ఇచ్చారు. అయితే తప్పెవరిది అని తల బద్దలు కొట్టుకునే వారు చాలా మంది. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని భారీ ఎత్తున తగ్గించే చర్య ఈ నియామకం. ఎవరినైనా కొనేస్తాం అనే ధైర్యాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఎవ రైనా అమ్ముడుపోతారేమోననే అనుమానాన్ని కొందరు పెద్దలు కలిగిస్తున్నారు. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మైత్రీపురి పొత్తూరి
ఆయన పేరు పొత్తూరి. మైత్రీపురి అని తన ఈమెయిల్ పేరు పెట్టుకున్నారు. 86 సంవత్సరాల జీవన సంఘర్షణ తరువాత ప్రశాంతంగా మృత్యువు ఒడిలోకి ఒరిగి పోయారు. ఆధ్యాత్మిక జీవనం, తత్వం, భక్తి, వేదాంతం అలవరుచుకుంటున్న రోజులలో ఆయనను అన్యాయంగా క్యాన్సర్ రక్కసి ఆవరించింది. ఆ రాకాసితో ఓపికగా పోరాడి, ఆస్పత్రినుంచి విడుదలై నిజనివాసంలో స్వేచ్ఛావాయు వులు పీల్చుకుంటూ దోసపండువలె రాలిపోయారు. సమాజం కోసం పోరాడుతున్న నక్సలైట్లను ప్రధాన జీవనస్రవంతివైపు మళ్లించాలన్న తపన. వారికీ, ప్రభుత్వానికీ మధ్య సయోధ్య సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేశారు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. 1983–84లో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వరంగల్ విలేకరిగా ఉన్నప్పుడు నాకు పొత్తూరితో సన్నిహిత పరిచయం. వరంగల్లులో సమాచార భారతి విలేకరిగా ఉన్న ప్పుడు నేను రాసిన వార్తలు, పరిశోధనా వ్యాసాలు ఆంధ్రప్రభలో వచ్చేవి. సంచలనం కలిగించే వార్తలు అనేకం వచ్చాయి. అవి కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టాయి. వాటిని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. పొత్తూరి ఉదయం పత్రిక సంపాదకులుగా రావడంతో మళ్లీ ఆయనతో మాకు సన్ని హిత సంబంధాలు ఏర్పడ్డాయి. పత్రికా సంపాదకుడుగా, విమర్శకుడుగా, రచయితగా పొత్తూరి ఎప్పుడూ సంచలనాలను నమ్ముకోలేదు. జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా రాయడం, నిర్మాణాత్మకమైన విమర్శలను చేయడం, సున్నితంగా మందలించడమే గానీ పరుష పదజాలం వాడడం అవసరం లేదనే సౌమ్యుడైన పత్రికా రచయిత. ఒకసారి నేను, సాయిబాబా రాసిన పరిశోధనా వార్తను ఆయన చర్చించి ఆమోదించి ప్రచురించారు. తొలి ఎడిషన్ ప్రతులు జిల్లాల కోసం ట్రక్కులు ఎక్కించాక, రాత్రికి రాత్రి వాటిని వెనక్కు రప్పించి, ఆ వ్యాసం తొలగించి కొత్త పత్రికలు ముద్రించి పంపారు. ఆ వార్త ఆగిపోవడం వెనుక కథ పొత్తూరికి తెలుసు. ఎవరితో ఘర్షణ పడకుండా మౌనంగా రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆయన రాజీనామాకు మేమే పరోక్షంగా కారణమని బాధపడుతూనే ఉంటాం. పొత్తూరి వినియోగదారుల ఫోరంలో సామాజిక ప్రతినిధిగా, న్యాయమూర్తిగా హైకోర్టులో న్యాయపీఠం పైన కూర్చున్నారు. నన్నొకరోజు సహజ న్యాయసూత్రాల గురించి అడిగారు. నేను చదివింది, నేను తరగతి గదిలో చెప్పేది నాకు తెలిసింది చెప్పాను. ఆయన నాకు చిన్న పరీక్ష పెట్టారనీ నేను అందులో ఉత్తీర్ణుడినైనాననీ నాకు ఆ తరువాత తెలిసింది. పొత్తూరి ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తరువాత పిలిచి, పత్రికా రచన, కోర్టు ధిక్కారం, పరువు నష్టంపైన పుస్తకం రాయమన్నారు. తను స్వయంగా చదివి న్యాయధిక్కారం అనే మాటపై విశ్లేషణ చేశారు. మా నాన్నగారు ఎంఎస్ ఆచార్య స్మారక ప్రసంగం 2017లో పొత్తూరి ఇచ్చారు. పొత్తూరి లేని లోటు తీరదు. తెలంగాణ తన శ్రేయోభిలాషిని, తెలుగు రాష్ట్రాలు ఉత్తమ పాత్రికేయుడిని, ఒక చింతనాపరుడిని కోల్పోయాయి. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రాజధాని ‘మౌన’ సిక్తం
పోలీసులు కళ్లు తెరిచి చూస్తే ఇన్ని ప్రాణాలు పోయేవా? పోలీసులు పోలీసులవలె వ్యవహరిం చేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, వారిని స్వతంత్రంగా వృత్తి పనులు నిర్వహించనీయకపోవడం ప్రశ్నార్థకాలు. ఈ మాటలు నేను అంటున్నవి కాదు. న్యాయమూర్తులు ఎస్.కె. కౌల్, కె.ఎం. జోసఫ్ సుప్రీంకోర్టులో ఆవేదనతో చెప్పినవి. జనాన్ని రెచ్చగొట్టి హింసాకాండకు పురిగొల్పిన కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ పైన కనీసం ప్రథమ సమాచార నివేదికలు కూడా నమోదుచేయని పోలీసుల నిష్క్రియనేమనాలి? ఆగ్రహించాలా, విచారించాలా? అని అడిగింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ఆధ్వర్యం లోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అల్లర్ల పైన అర్ధరాత్రి విచారణ చేస్తూ ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రమేమంటే గాయపడిన వారిని క్షేమంగా ఆస్పత్రికి చేర్చాలని, హత్యాకాండ జరిపిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలని కోరుతూ ఈ రిట్ పిటిషన్ దాఖలుచేశారు. మామూలుగా జరగవలసిన ఈ చర్యలు చేపట్టడానికి హైకోర్టు అర్ధరాత్రి సమావేశమై విచారించి ఆదేశాలు ఇవ్వవలసి వచ్చింది. అర్ధరాత్రి విచారణ జరిపి రెచ్చగొట్టిన వారిపై కేసులెందుకు పెట్టడం లేదని నిలదీసిన న్యాయమూర్తి మురళీధర్ను అదే అర్ధరాత్రి హర్యానా పంజాబ్ హైకోర్టుకు బదిలీ చేశారు. వెంటనే అక్కడ ఉద్యోగంలో చేరాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ కేసును గురువారం తన బెంచ్ విచారిస్తుందని డిల్లీ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీలో జరుగుతున్నమారణకాండ జాగ్రత్తగా పరిశీలించిన వారికి అవి మతకలహాలు కావనీ, సీఏఏ వ్యతిరేకులు, అనుకూలుర మధ్య ఘర్షణ కాదనీ, కావాలని కుట్ర పన్ని పథకం ప్రకారం ఎంపిక చేసుకున్న లక్ష్యాలమీద దాడులు చేయడానికి నిర్ణయించుకుని, సానుకూల వాతావరణం కల్పించుకుని నిర్భయంగా నిర్లజ్జగా సాగిస్తున్నహత్యాకాండ, దోపిడీ దహనకాండ, మతోన్మాదం అని అర్థమవుతుంది. మొత్తం సీఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు మూడురోజుల్లో ముగిసిపోవాలని పోలీసులకే అల్టిమేటం ఇచ్చేవాడు ఇంకొక బీజేపీ నాయకుడు, తుపాకులు పట్టుకుని ప్రదర్శన స్థలాలమీద దాడిచేసే వాడింకొకడు, ఈ విధంగా రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి, విశృంఖల దుర్మార్గ విహారం చేస్తున్నారు. అసలైతే ఇటువంటి గోలీమారో, అల్టిమేటం నేరగాళ్లపైన మాత్రమే రాజద్రోహం కేసులు పెట్టాలి. పోలీసులు ఏ కేసులూ పెట్టకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులు తప్పించుకు పోతారని సుప్రీంకోర్టు ఆవేదన చెందింది. షాహీన్బాగ్ నిరసనకారులను అక్కడినుంచి తొలగించాలని కోరే రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు మార్చి 23న విచారిస్తుందట. పోలీసులపై విమర్శా వ్యాఖ్యలు చేస్తే వారిలో నైతిక బలం తగ్గిపోతుందని, కనుక దయచేసి వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వం తరఫున వాదించే తుషార్ మెహతా అన్నారు. ‘‘నేను రాజ్యాంగానికి విధేయుడిని. నేను కొన్ని మాటలు చెప్పదలచాను. నేను చెప్పలేకపోతే నేను నా బాధ్యతలను నెరవేర్చిన వాడిని కాబోను’’ అని న్యాయమూర్తి కె.ఎం. జోసెఫ్ కచ్చితంగా చెప్పవలసి వచ్చింది. ‘‘నేను ఢిల్లీ సంఘటనలకు పరిమితమై మాట్లాడుతున్నాను. నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం లేదు. పోలీసుల వైఫల్యం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు స్వతంత్రంగా వృత్తిబాధ్యతలను వ్యవహరించలేదు’’ అని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు బీజేపీ నాయకులు చేసిన రెచ్చగొట్టే మాటల వీడియోను ప్రదర్శించారు. ఐపీసీ 153ఎ కింద ఇవి నేరాలుగా మీకు కనిపించలేదా, వీటిపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదా అని అడిగారు. పోలీసు అధికారులు తాము ఆ వీడియోలు చూడలేదని హోం వర్క్ చేయని బడిపిల్లల వలె జవాబిచ్చారు. తగిన సమయంలో ఎఫ్ఐ ఆర్ దాఖలు చేస్తామన్నారు. ‘ఇంకా ఎంతమంది చనిపోయిన తరువాత ఆ తగిన సమయం వస్తుంది?’ అని అడిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సామాన్యుల వలె ప్రశ్నించారు. సంతోషం. దాంతోనే సంతోషించాలా? పాలక పార్టీవారే రెచ్చగొడతారు. పోలీసులు మౌనం పాటిస్తారు. పోలీసు అధికారులే హతులౌతారు. సామాన్యుడి ప్రాణానికి భద్రత కరువైంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీదర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్, madabhushi.sridhar@gmail.com -
అమ్మానాన్న రుజువులు తేవాలా?
మనది చాలా గొప్ప ప్రగతి. 70వ రిపబ్లిక్ డే నుంచి మనం ఆల్ ఫూల్స్ డేకు ప్రగతి చెందబోతున్నాం. సరిగ్గా ఏప్రిల్ 1, 2020న జనులు సిద్ధంగా ఉండాలి తమ తమ వివరాలతో, తమ నివాసాలకు రుజువులతో. అమ్మానాన్నల పుట్టుపూర్వోత్తరాలు చెప్పి రుజువులు కూడా తేవాలని మహా ఘనత వహించిన సర్కారు వారు ఆదేశిస్తున్నారు. భారత సంవిధానం పూర్తిస్థాయి అమలు ప్రారంభమై 70 ఏళ్లు గడిచిన తరువాత అప్పటినుంచి బతికి ఉన్న వృద్ధులు కూడా తాము పౌరులమే అని రుజువు చేసుకోవాలి. ఒక వేళ వారు గతించి ఉంటే వారి తనయులు, తమ తల్లిదండ్రులు జనన స్థలం, జనన తేదీలను రూఢిగా అధికారులకు తెలియజేయాలి. ముందు జనపట్టిక కోసం అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పని ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ చివరిదాకా జరుగుతుందని ఎప్పుడో నోటిఫై చేశారు. జనపట్టిక వివరాల్లో తప్పులకు జరిమానాలు ఉంటాయి. అంతకన్న పెద్ద ప్రమాదం ఏమంటే వివరాలు ఇవ్వకపోయినా, రుజువులు చూపకపోయినా పౌరసత్వానికి అనుమానపు ఎసరు వస్తుంది. నిజానికి 2011 నుంచే జనపట్టిక నమోదుకోసం ఎన్పీఆర్ కార్యక్రమం మొదలైంది. అప్పుడు 15 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలన్నారు. దీన్ని 2015లో కొంత మార్చారు. 2019లో ఆరు కొత్త ప్రశ్నలు చేర్చారు. ఆ ఆరు ప్రశ్నల్లో నాలుగు చాలా ఇబ్బందికరమైనవి, అవి 1. తండ్రి పుట్టిన తేదీ, 2. తండ్రిపుట్టిన చోటు, 3. తల్లి పుట్టిన తేదీ, 4. తల్లి పుట్టిన చోటు వివరాలు. 5. ఆధార్ వివరాలు, 6. చదువు వివరాలు. తల్లిదండ్రుల పుట్టుక తేదీ, పుట్టిన చోటు తెలుసుకోవడం, వాటికి రుజువులు కనుక్కోవడం కోట్లాది మంది ప్రజలకు సాధ్యం కాదు. పత్రాలు లేకపోతే ప్రత్యక్ష సాక్షులను తేవొచ్చు అంటున్నారు. ఇది మరొక వింత. తండ్రి పుట్టిన నాడు చూసిన లేదా తెలిసిన సాక్షులు బతికి ఉంటారనీ, ఒకవేళ ఉన్నా వారు ఈనాటికీ సాక్ష్యం చెప్పడానికి వస్తారనుకోవడం అసాధ్యం. ఇప్పుడు బతికున్న మనమంతా మన పుట్టిన చోటు, తేదీ రుజువు చేసుకోవడం సాధ్యం అవుతుందేమో గాని, తల్లిదండ్రులు (ఉన్నప్పటికీ) వారి పుట్టుక తేదీ, చోటు ఏ విధంగా రుజువుచేయాలనేది సమస్య. చాలామందికి సొంత జనన ధ్రువపత్రాలే ఉండని సమాజం మనది. బడిలో ఆరోతరగతిలో చేరడానికి మన ముందు తరాల వారు వెళ్తే ఆ బడిలో పనిచేసే గుమస్తాలు, చాలామందికి జూలై ఒకటిని పుట్టిన తేదీగా నమోదు చేసేవారు. ఇప్పుడు 70, 80 ఏళ్ల వయసున్న పెద్దలందరికీ ఇటువంటి కలి్పత పుట్టిన తేదీలే ఉంటాయి. ఇదీ పొంచి ఉన్న ప్రమాదం. జన పట్టిక వివరాలలో అనుమానం వస్తే స్థానిక రెవెన్యూ అధికారులకు విపరీతమైన అధికారాలు వస్తాయి. తండ్రి, తల్లి పుట్టిన తేదీ, చోటు రుజువు చేయలేకపోతే వారి పేరు పక్కన ’డి‘ అని రాస్తారు. తరువాత మరింత పరిశీలన జరుపుతారు. అప్పుడు ఆ వ్యక్తి తన కేసు చెప్పుకోవచ్చు. ఆ తరువాత అనుమానం తీరినట్టు అధికారి భావిస్తే ప్రమాదమే లేదు. అతనికి పౌర ధ్రువపత్రం లభిస్తుంది. లేకపోతే అతను పౌరుడు కాడంటూ కేసును ఫారినర్స్ ట్రిబ్యునల్కు పంపిస్తారు. అక్కడ సిటిజన్షిప్ చట్టం 1955కు 2019లో చేసిన సవరణ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. అనుమానం స్థిరపడితే ఇన్నాళ్లూ ఇక్కడ భారతీయుడైన వ్యక్తి హఠా త్తుగా పరాయి వాడవుతాడు. తన సొంత దేశానికి పంపే దాకా డిటెన్షన్ సెంటర్లో బంధి స్తారు. ఈ దేశం వాడికి ఇంకే సొంత దేశం ఉంటుంది? అంటే ఏ దేశానికీ చెందని వాడుగా మారిపోతే అతని గతి ఏమిటి? ఎన్నాళ్లు జైల్లో ఉంటాడు? వారి సంతతి ఏమవుతారు? ఇంత దారుణమైన పరిణామాలు ఉంటాయి. జనపట్టిక అనే పేరుతో మన జాతీయతకు, దేశీయతకు, పౌరసత్వానికే ఎసరు పెట్టడం గురించి గమనించాలి. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు. ప్రతి వ్యక్తి భారతీయతకు సంబంధించిన సమస్య. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
చదువులపై కర్ర పెత్తనం
చదువంటే ఏమాత్రం శ్రద్ధ లేని ప్రభుత్వమా మనది? చదువుల శాఖను ఏ విధంగా నిర్వహించారనే ప్రాతిపదికపైన ప్రభుత్వాల పనితీరును నిర్ణయించాలి. విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖ అని పేరు మార్చారు. మానవులను అభివృద్ధి చేయాలంటే అందులో ముఖ్యమయిన వనరు చదువు అని అర్థం. మొదటిసారి బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, పీవీ నరసింహారావు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఆయన సమిష్టి ఆంధ్రప్రదేశ్కు సేవలందించారు. వాజపేయి ప్రభుత్వంలో ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషి ఆ శాఖను నిర్వహించారు. దురదృష్టమేమంటే, డిగ్రీకి, డిప్లొమాకు తేడా తెలియని టీవీ నటిని ఒకామెను తీసుకొచ్చి మానవ వనరుల శాఖ మంత్రిగా నియమించింది 2014లో బీజేపీ ప్రభుత్వం. కొత్తప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ఆశ్చర్యపోయారు. అప్పుడే అనుమానం మొదలైంది. ఆ శాఖ అనేక చేతులు మారి ప్రస్తుతం రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ చేతికి వచ్చింది. మనీష్ వర్మ ఆరోపణల ప్రకారం మంత్రిగారికి బీఏ డిగ్రీ కూడా లేదు. ఈయన ఎంఏ డాక్యుమెంట్ల కాపీలు ఆర్టీఐ కింద కోరితే ఇవ్వడానికి నిరాకరించారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ధారాళంగా మాట్లాడతారు. మరికొందరు బీజేపీ నాయకులకు డిగ్రీలకు అతీతమైన తెలివితేటలున్నాయి. స్మృతి ఇరానీ గారి చదువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశిస్తే ‘కేజీ వివరాలు కూడా ఇస్తాం తీసుకొమ్మనండి’ అని ప్రకటన చేసిన ఈ మంత్రి గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి చదువు వివరాలు తన వ్యక్తిగత గోప్యత, రహస్య అంశాలనీ, బహిర్గతం చేయరాదని వాదిస్తూ స్టే తెచ్చుకున్నారు. వీరు మన చదువుల భవిష్యత్తు తీర్చిదిద్దే మంత్రులు. చదువుల శాఖకు వీరిని మంత్రులుగా నియమించేవారు మన జాతీయ నాయకులు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’ తాజా సంచికలో భారతదేశంలో విశ్వవిద్యాలయాలను రక్షించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఒక సంపాదకీయంలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలమీద ఈ ప్రభుత్వాలకు ద్వేషం. అక్కడ చదువుకున్న విద్యార్థులు ధైర్యంగా పాలకులు చేసే అన్యాయాలను ప్రశ్నించడం వీరికి నచ్చదు. ఆ విధంగా ప్రశ్నిం చడం వారి అధికార పునాదులు కదిలించి వేస్తుం దని గుండెల్లో దడ. కనుక ఆ విశ్యవిద్యాలయాలను నిధులు ఇవ్వకుండా మాడ్చుతారు. అక్కడ పెట్టే ఖర్చులు రేపటి విద్యావంతమైన చైతన్య సమాజానికి అవసరమైన పెట్టుబడులని అర్థం చేసుకోలేరు. లేదా అర్థం చేసుకున్నారు కనుకనే ఈ సంస్థలను నీరసింపచేస్తున్నారేమో. విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు ఒకవైపు, ఇనుప రాడ్లతో దాడులు మరొకవైపు ఈ సంస్థలను నీరు కారుస్తున్నాయి. 2014–15లో మొత్తం వ్యయంలో 4.14 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తే దాన్ని 2019–20 నాటికి 3.4 శాతానికి తగ్గించారు. 2014–15లో దేశ జీడీపీలో విద్యా వ్యయం 0.53 శాతం అయితే 2019–20 నాటికి దాన్ని 0.45 శాతానికి తగ్గించారు. విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే చదువుకోవడాన్ని చదువు‘కొన’డంగా మార్చకుండా చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చదువుకునే పరిస్థితులు, సంస్థలు ఏర్పడాలి. ప్రయివేటు విద్యావ్యాపారులను దొడ్డిదారిన ప్రోత్సహించడం కాదు. ఉపాధి, ఉద్యోగ వనరులను కల్పించాలి. ఈ రెండు మార్గాల ద్వారానే విద్యాలయాల్లో ఆందోళనలు తగ్గుతాయని నేచర్ పత్రిక వివరించింది. జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలలో పోలీసులు వీటిలోకి చొరబడి కనబడిన వారినల్లా చితకబాదారు, శాంతి భద్రతల రక్షణ కోసం. ఇక జేఎన్యూలో ముసుగులు ధరించి గూండాలు ఇనుపరాడ్లతో విద్యార్థుల తలలు పగులగొడుతూ ఉంటే, వందల సంఖ్యలో ఉన్న పోలీ సులు అనుమతి లేదనే నెపంతో మౌనంగా ఉండిపోయారు. మూడు సంఘటనల్లో విద్యాలయాలు నెత్తుటి మడుగులైనాయి. బాధితులే అనుమానితులని వారిపైనే కేసులు పెడుతున్నారు. పోలీసుల నిష్క్రియ మీద ఏచర్యలూ లేవు. ఇవన్నీ చదువు పట్ల మనకున్న గౌరవానికీ, సంస్కారానికీ ప్రతీకలు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ -
వారికి చదువంటే చచ్చేంత భయం
అక్కడ పుస్తకాలు చెల్లాచెదురైనాయి. చదివే మస్తకాలు పగిలాయి. సైలెన్స్ బదులు గ్రంథాలయాల్లో వయొలెన్స్ విలయ తాండవం చేసింది. కలాలు కాదు ఐరన్ రాడ్లు, కంప్యూటర్లు కాదు మొబైల్ ఫోన్లలో వాట్సాప్ కుట్రలు పనిచేసాయి. విద్యార్థులు కాదు విద్యార్థి సంఘాల గూండాలు విజృంభించారు. చంపడం తన్నడం పాఠాలనుకునే వారు, లాఠీతో సరిచేద్దామనుకునే తత్వజ్ఞులు చీకటితో వెలుగు మీద దాడిచేశారు. హాస్టళ్ల అద్దాలు పగిలాయి. బాత్రూంలలో కూడా నెత్తురు చుక్కలు.. వారు ఎవరిమీద ఎక్కడ దాడిచేశారో చెప్పే రుజువులు. కొత్త సంవత్సరం మొదటి ఆదివారం రాత్రి జేఎన్యూలో కాళరాత్రి. ఎవరూ రమ్మనకుండానే వచ్చి ఒక యూనివర్సిటీలో జొరబడి విద్యార్థులను శాంతిభద్రతలకోసం చితకబాదిన పోలీసులు ఈసారి వచ్చి కూడా అనుమతి లేదని కొన్నిగంటలు నిశ్చలంగా ఉండిపోయారు. జేఎన్యూలోని ముగ్గురు వ్యక్తులు గూండాలను తీసుకువచ్చి ఏయే హాస్టల్ గదుల మీద దాడిచేయాలో చూపారని వార్తలు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలిసిన రహస్యమే. ముసుగు పర్వం: పాలకులు ఎవరైనా సరే వారికి చదువంటే భయం. చదువుల నిలయాలంటే భయం. చదువుకునే వారంటే ఇంకా భయం. చదివిన చదువు లక్ష మెదళ్లను కదిలి స్తుంటే భయం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వెంట రాడ్లు తెచ్చుకుని, ముసుగులేసుకుంటారు. జాతీయతా పర్వం: భయాన్ని దాచుకోవడానికి జాతీయత, దేశభక్తి వంటి భారీ పదజాలం కప్పుకోవాలి. లైబ్రరీ అయితే నాకేమిటి, పుస్తకాలు నాకెందుకు. అక్కడ ప్రొఫెసర్ ఉంటేనేం, విద్యార్థి అయితేనేం ఎవడైతే నాకేమిటి. లాఠీతో కొడతాను. పుస్తకం చింపేస్తాను. గొంతు నులిపేస్తాను, శరీరాల్ని నలిపేస్తాను. నీవు చదువుకుని ఏం చేస్తావు? మేం పాలిస్తున్నాం. మీకన్నీ ఇస్తాం. నోరుమూసుకుని పడి ఉండు. అనేదే ఫిలాసఫీ. భయపడే పర్వం: ఈ పిరికి మంద పాడైపోవడాన్ని బాగుపడడం అనుకుంటుంది. పాపం జేఎన్ యూను బాగుచేయాలనుకున్నారు పాడైపోయిందనుకుని, కొట్టి భయపెట్టి. తలలు పగిలితే బాగుపడుతుందని నమ్మారు. ఈ మంద భయపడుతూ శరీరాలపై హింసకు పాల్పడి భయపెడుతున్నానుఅనుకుంటుంది. నిజాలంటే భయం, నిలదీయడమంటే భయం. టెర్రరిజం పర్వం: ఎదురుపడలేని పిరికితనమే టెర్రరిజం. సరిహద్దు అవతలనుంచి విసిరే రాకెట్ కన్న దారుణమైంది విశ్వవిద్యాలయం మీద గూండాల దాడి. సంబంధంలేని వాడిని తన్ని గర్వించడమే టెర్రరిజం. కళ్లు కనబడలేదన్నా వదలరు. కదలలేమన్నా వదలరు. వారికి మెదడు ఉండే చోట మరేదో ఉంది. గుండె ఉండేచోట ఇంకేదో ఉండకూడని పదార్థం ఉంది. సంస్కృతి పర్వం: పిరికితనం దాచుకుని గూండాగిరీ చేసేవారు వాడుకునే మరో ఇనుప రాడ్–సంస్కృతి. సంస్కృతి అంటే లాఠీలు పట్టుకుని రాడ్లు పట్టుకుని, వాట్సాప్లో తోడున్న గూండాలను, మందలను తరలిం చినట్టు తరలించి, పోలీసులు మనోళ్లే, సర్కార్ మనదే, వీసీ మనోడే, ఇంకెవడో కూడా మనోడే అని సంక్షిప్త సందేశాలిస్తూ, తరువాత దొరికిపోతామన్న ఆలోచన కూడా లేకుండా, ముసుగు దాచదన్న భయం లేకుండా మూర్ఖత్వంతో దాడి చేస్తారు. ఇది సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద దాడి. లాఠీ లూటీ పర్వం: రేపటి తరానికి రిజర్వ్ బాంక్ విశ్వవిద్యాలయమే. అది లూటీ చేయడానికి వీలుకాని ధనాగారం. జేఎన్యూలో దాడిచేసిన గూండాల ముసుగులను తొలగించే అంశాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. అందుకే కొందరు సిగ్గు లేకుండా మేమే తన్నాం, మేమే గుద్దాం, మేమే దాడి చేశాం, మాది దక్షిణ పక్షమని ఉన్మత్తంగా చెప్పుకుంటూనే ఉన్నారు. జేఎన్యూ అయింది. ఇక ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అని టార్గెట్లు కూడా నిర్ణయించారు. మౌనాంగీకార పర్వం: దీన్ని ఖండించక మౌనంగా ఉండడానికి ఫేస్బుక్లో లైక్లు పెట్టడానికి పెద్ద తేడా లేదు. మౌనం అతి భయంకరం. విశ్వవిద్యాలయం శత్రుస్థావరం అనుకునే విజ్ఞానవంతులకు రాజ్యాంగం ఎందుకు? నిర్భయ, దిశ కన్న భయంకర నేరం ఇది. వెలుగుదిశ చూపే నిర్భయ విద్య ఎక్కడ? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నేను ఈ దేశపు పౌరుడినేనా?
‘‘ఏ వ్యక్తికీ పౌరసత్వం ఆటోమేటిక్గా దొరకదు, ప్రతి వ్యక్తీ తనకు పౌరుడిగా ఉండే అర్హతలున్నా యని రుజువు చేసుకోవలసిందే’’– ఈ మాట నేను చెప్పడం లేదు, హోం శాఖ ప్రకటించింది. ప్రతి పౌరుడు తనను తాను పౌరుడని రుజువు చేసుకోవలసిన దుస్థితి. ఎందుకొచ్చింది? నన్ను ఓటు అడిగి, నా వంటి వారి ఓటుతో గెలిచి నన్ను పౌరుడిగా రుజువు చేసుకొమ్మంటారా అని లక్షలమంది పౌరులు అడుగుతున్నారు. పౌరసత్వచట్టం, దాని సవరణ చట్టం 2019 జాతీయ పౌర పట్టిక, జాతీయ ప్రజాపట్టిక వంటి శాసనాల అమలు ప్రభావం గురించి ఆలోచించ వలసి ఉంది. జనాభా లెక్కల్లో మిమ్మల్ని లెక్కిస్తే మీరు ఈ దేశ ప్రజ అవుతారే గాని, ఈ దేశ పౌరుడు కాదు. జాతీయ ప్రజా పట్టికలో మీ పేరు నమోదు చేస్తే మీరు జనంలో ఒకరవుతారు కాని పౌరుడని గుర్తించినట్టు కాదు. మీరు ఆధార్ కార్డు చూపితే మీకు ఆధార్ ఉన్నట్టే అవుతుంది కాని అది పౌరసత్వానికి రుజువు కాదు. మీకు ఓటరు కార్డు ఉందా, ఉంటే ఓటేయొచ్చు కానీ, మీరు పౌరుడని దేశం ఒప్పుకోదు. మీకు పాస్ పోర్టు ఉన్నా అది పౌరసత్వానికి రుజువులు కావు. ఈ మాటలు సాక్షాత్తూ హోం మంత్రి అమిత్ షా చెప్తున్నారు. ‘‘ఏది పౌరసత్వానికి రుజువో ఇప్పుడే చెప్పలేము. నియమాలు తయారు చేస్తున్నారు. అప్పుడు ఏ పత్రాలతో పౌరసత్వం రుజువుచేసుకోవాలో వివరిస్తాం. ఇప్పటికి అధికారికంగా చెప్పేదేమంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్లు ఉన్నంత మాత్రాన పౌరసత్వానికి రుజువు కాబోవు’’ అని డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి చెప్పిందేమంటే జన్మించిన స్థలం లేదా తేదీ లేదా రెండూ ఇవ్వడం ద్వారా పౌరసత్వం రుజువుచేసుకోవలసి ఉంటుందని. ఏ పత్రాలు లేని వారు నిరక్షరాస్యులు తన స్థానికతను రుజువు చేసుకోవడానికి ఎవరయినా వ్యక్తిగత సాక్షులను తెచ్చుకోవచ్చునని వివరించారు. కానీ.. జన్మస్థలం, పుట్టిన తేదీకి సంబంధించి వ్యక్తిగత సాక్షులు ఎవరుంటారు? వారిని నమ్మను పొమ్మంటే గతేమిటి? పౌరసత్వ చట్టం సవరణ 2019 కింద పూర్తి ప్రక్రియ వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ న్యాయశాఖతో సంప్రదించి త్వరలో రూపొందిస్తుందని హోం శాఖ ప్రతినిధి వివరించారు. దీని తరువాత ‘‘ఏ వ్యక్తికీ పౌరసత్వం ఆటోమేటిక్గా దొరకదు, ప్రతి వ్యక్తీ తనకు పౌరుడిగా ఉండే అర్హతలున్నాయని రుజువు చేసుకోవలసిందే’’ అని అధికారికంగా ప్రకటించారు. అంటే ఫలానా వ్యక్తి పౌరుడు కాడని రుజువు చేసే బాధ్యత ప్రభుత్వం తనపై ఉంచుకోలేదు. తాను పౌరుడినని రుజువు చేసుకోవలసిన బాధ్యత భారం పౌరుడిదే. ఒకవేళ పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ వ్యక్తి విదేశీయుడైపోతాడు. విదేశీయుల ట్రిబ్యునల్ కూడా విదేశీయుడే అని తేల్చితే వాడి గతి దారుణం. డిటెన్షన్ సెంటర్లో ఉండిపోవాలి. హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. ఎన్నేళ్లలో హైకోర్టు తీర్పు చెబుతుందో, దానికి ఎంత ఖర్చవుతుందో, ఆ ఖర్చు పెట్టుకోలేని వారి గతి ఏమవుతుందో చెప్పలేము. ఇవి పుకార్లు కావు, అనుమానాలు కావు. ప్రభుత్వ అధికారిక ప్రకటనల పరిణామాలు. ఈ ప్రశ్నలకు ఆధారం ఏమంటే అస్సాంలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగించిన పౌరసత్వ నమోదు ప్రక్రియ అనుభవంలో ఎదురైన సవాళ్లు. 19 లక్షల పై చిలుకు ప్రజలు పౌరులు కాదని అస్సాం తుది పౌర జాబితా తేల్చివేసింది. అస్సాంలో ఒక్క డిటెన్షన్ సెంటర్ కోసం 46 కోట్ల రూపాయలు వెచ్చించింది. పౌరులని రుజువు చేసుకోలేక విదేశీయులని ముద్రపడిన మూడు వేలమందికి అందులో స్థలం దొరుకుతుంది. 19 లక్షల మంది అస్సామీయులను పౌరులు కాదని తేల్చిన నేపథ్యంలో వారందరికీ డిటెన్షన్ సెంటర్లలో వసతి కల్పించాలంటే 27 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. అస్సాంలో నిరసన జ్వాలలు ఎగసిపోతుంటే నిరంకుశంగా అణచి వేస్తున్నది. బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ వదిలిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితిలో అస్సాంలోనూ దేశవ్యాప్తంగానూ జాతీయ పౌరసత్వ పట్టిక తయారు చేయాలని పట్టుబట్టింది కేంద్రం. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మీకిది తగునా?
‘బోలెడంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు... వసూళ్లు నడుస్తున్నాయి’ అని ఆర్టీఐ గురించి మన దేశంలో సర్వోన్నత న్యాయమూర్తి బోబ్డేగారు సెలవిచ్చారు. జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బోబ్డే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారిస్తున్నారు. ఇదివరకు సుప్రీంకోర్టు అంజలీ భరద్వాజ్ కేసులో సమాచార కమిషనర్ల నియామకంలో ఆలస్యం చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ తీర్పులో ఇచ్చిన సూచనలు అమలు చేయడం లేదని కేంద్రంగానీ రాష్ట్రాలు గానీ సమాచార కమిషనర్లను నియమించడం లేదని న్యాయార్థులై నిలబడ్డారు. కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప ప్రభువులు నిశ్చర్య నుంచి నిద్రనుంచి మేలుకోవడం లేదు. ఆర్టీఐని బ్లాక్ మెయిల్ కోసం వాడుకుంటున్నారనేది ఆరోపణ. అందులో కొంత నిజం ఉందా లేదా అనడానికి సర్వే లేదు సాక్ష్యం లేదు. బ్లాక్ మెయిల్ అంటే ఏమిటి? లంచం తీసుకోవడం వంటి ఒక తప్పు చేసి దాచిపెట్టిన అధికారి అక్రమాల సమాచారం సేకరించి బయట పెట్టడానికి ఆర్టీఐ కార్యకర్త ప్రయత్నించి ఆ పని ఆపడానికి డబ్బు అడిగినా, అతను అడగకపోయినా ఆ అధి కారి డబ్బు ఇచ్చి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా అది నేరమే. ఆ నేరానికి వారిద్దరికీ శిక్షలు విధించాల్సిందే. కానీ ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించే శక్తి పైన కోతలు విధిస్తానంటే ఎంత వరకు సమంజసం. ఒక సందర్భంలో అవినీతి పరుడైన ఒక ఇంజనీరు ఢిల్లీ ఫ్రభుత్వంలో లంచాలు తీసుకుని అందుకు అనుగుణంగా కాంట్రాక్టు ఫైళ్లను మార్చాడని తెలుసుకున్న ఒక ఆర్టీఐ కార్యకర్త ఆ ఫైల్ కాగితాల ప్రతులను సేకరించారు. దాంతో ఆ అధికారి పదివేలు లంచం ఇవ్వడానికి సంసిద్ధుడై నాడు. లంచం ఇవ్వజూపిన సంభాషణలను రికార్డు చేసి ఆ ఆర్టీఐ కార్యకర్త రెండో అప్పీలులో ఆ విషయమై ఫిర్యాదు చేశాడు. లంచం ఇవ్వబోయిన ఆ ప్రభుత్వ అధికారిపైన చర్య తీసుకోవాలని కోరాడు. సంభాషణ రికార్డు ఉన్న సీడీని కూడా కమిషన్కు సమర్పించాడు. లంచం ఇచ్చినా నేరమే తీసుకున్నా నేరమే. కానీ అది ప్రభుత్వ అధికారి విషయంలో, ప్రభుత్వ కార్యక్రమం విషయంలో నేరమవుతుంది. ఆర్టీఐ కింద సమాచారం అడగకుండా ఉండడానికి మామూలు పౌరుడికి లంచం ఇవ్వడానికి ప్రభు త్వం అధికారి ప్రయత్నిస్తే, లేదా ఇచ్చినట్టు తేలిన తరువాత కూడా అతని పైన ఏ చట్టం కింద చర్య తీసుకోవాలి? అవినీతి నిరోధక చట్టాలలో ఇటువంటి లంచ గొండితనాన్ని శిక్షించేందుకు ఏ నియమాలు చట్టాలూ లేవు. పౌరుడికి ప్రభుత్వేతర పనికోసం ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ మరో చట్టం తెస్తే అందుకు వీలవుతుంది. లేకపోతే ఏం చేయాలి? ఎప్పుడూ జనం నుంచి లంచాలు వసూలు చేసే ప్రభుత్వ అధికారి పౌరుడికి లంచం ఇచ్చే పరిస్థితి రావడం ఒక వింత, విచిత్రం, రాజ్యాంగపాలన అమలైన 70 సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఇందుకు సంతోషించాలో గర్వించాలో ఆలోచించుకోవచ్చు. లంచం ఇవ్వకుండా లంచగొండి అధికారిని రక్షించాలన్నది మన లక్ష్యం కాదు. ఆర్టీఐ దుర్వినియోగం పేరుతో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ప్రచారంతో మనం ఆర్టీఐ కార్యకర్తలను నిరోధించడానికి ఈ చట్టాన్ని సవరించి, పరిమితులు విధించి, ఈ హక్కు ను నీరసించేట్టు చేస్తే అది ధర్మమని అంటారా? అది న్యాయమా? 130 కోట్ల మంది ప్రజలలో కేవలం 3 కోట్ల యాభై లక్షల మంది దాకా ఆర్టీఐ వాడుకున్నారని, వారిలో చాలామంది సమాచారం పొందారని, పది పదిహేను శాతం వరకు సమాచారం కోసం కోర్టులకెక్కి పోరాడవలసి వస్తున్నదని ఒక అంచనా. అంటే మన జనాభాలో కేవలం రెండు లేదా మూడు శాతం మంది సమాచార హక్కును విని యోగించుకుంటేనే ఇంతమంది ఇంతగా భయపడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను రక్షించే ఒకే ఒక ఉత్తమ ఉన్నత సంస్థ న్యాయస్థానం. అంటే సుప్రీంకోర్టు. కానీ ఆ సర్వోన్నత న్యాయపీఠం కూడా సమాచార హక్కు గురించి ఇంతగా చర్చించడం, ధర్మాసనం నుంచి ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏ పరిణామాలకు సంకేతం? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఎన్కౌంటర్ జరిగిందా లేక చేశారా?
హైదరాబాద్లో నలుగురు అత్యాచార నిందితులను కాల్చేసిన సంఘటనపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ హైకోర్టు పిల్ విచారణ జరుపుతున్నది, మానవ హక్కుల కమిషన్ బృందం కూడా ప్రశ్నిస్తున్నది. ఎన్కౌంటర్ చేస్తా అంటే అర్థం చంపేస్తా అని. ఎన్కౌంటర్ చేశారంటే హత్య చేశారనే చదువుకోవాలి. నేరం రుజువు చేయకుండా, పోలీసులు నలుగురికి మరణదండన విధించి, వెనువెంటనే అమలు చేశారు. ఇదో వీరోచిత కార్యంగా భావించి, చాలామంది జనం నీరాజనాలు ఇస్తున్నారు. కొందరు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి ఫొటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు. లైక్స్ సాధిస్తున్నారు. శంషాబాద్ ఘటనలో దిశ.. దిక్కూ దిశ లేకుండా నేరగాళ్ల పాలబడి నలిగిపోతున్న దశలో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్కు వెళ్తే పరిధి కాదని పరుగులు పెట్టించి, చివరకు అర్ధ రాత్రి ఎప్పుడో ఎఫ్ఐఆర్ రాసే సమయానికి ఆమె నామరూపాలు కోల్పోయి మంటల్లో మాడిపోయింది. ఆ రాత్రి పోలీసులు పరుగెత్తి, అక్కడ కాల్పులు జరిపి నలుగురిని చంపి దిశను కాపాడి ఉంటే నిజంగా వారు హీరోలే? దిశపై అత్యాచారం చేసి కాల్చేసిన సంఘటనపై స్థానిక, జాతీయ మీడియా కలిసి పాలనా వ్యవస్థను, వారి నిర్లిప్తతను అసమర్థతను ఎండగట్టాయి. జాతీయ స్థాయిలో పరువుపోయిందని అర్థమయింది. ఆలస్యంగా జూలు దులిపిన ఐదో సింహం నలుగురిని అరెస్టు చేసింది. నిందితుల భద్రత కోసం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్వయంగా పోలీసుస్టేషన్కు వచ్చి 14 రోజుల కస్టడీ మంజూరు పత్రాన్ని ఇచ్చారు. కోర్టు ఆవిధంగా నమ్మి నిందితులను జాగ్రత్తగా పోలీసులకు అప్పగించింది. దిశ నిందితులు నేరస్తులని రుజువుచేసి, శిక్షించే రాజ్యాంగబద్ధమైన అధికారం కలిగి ఉన్నా ఆ అవకాశాన్ని న్యాయస్థానం కోల్పోయింది. కోర్టు విచారణా వ్యవహారంలో అడ్డుపడితే కోర్టు ధిక్కార నేరం. మరి, ఎవరైనా జైలుకు వెళ్తారా? చిల్లర దొంగలను కూడా భద్రంగా కోర్టుకు తీసుకువెళ్లాలి. పారిపోకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కోసారి కాళ్లకు చేతులకు గొలుసులు కడతారు. జాలీ వ్యాన్ కిటికీతో కలిపి బేడీలు వేస్తారు. ఇప్పుడు బేడీలు ఎవరూ వాడని మ్యూజియం పరి కరాలు అవుతున్నాయా? అసలు బేడీలు వాడడం ఎందుకు, తుపాకులే వాడితే సరిపోతుందనేది కొత్త సిద్ధాంతమా? నలుగురు నిందితులను నేరఘటన జరిగిన చోటికి అర్ధరాత్రే తీసుకువెళ్లవలసిన అవసరం ఉందా? తీసుకువెళ్తే అన్ని జాగ్రత్తలు వహించారా లేదా? మూడు బుల్లెట్లు దిగినా, ప్రాణం పోతున్నా మొదటి నిందితుడు తుపాకీ గట్టిగా పట్టుకుని పడిపోయాడా? మీ దగ్గర బేడీలు లేవా? అని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించినట్టు పత్రికల్లో రాశారు. ఆత్మరక్షణ కోసం ఏమైనా చేయవచ్చు. చంపేయవచ్చు. ఆత్మరక్షణ హక్కు సహజమైనది. రాజ్యాంగబద్ధమైనది. చట్టం కల్పించినది. సాక్ష్య చట్టం, శిక్షా చట్టం, ప్రక్రియా చట్టం మూడూ చాలా స్పష్టంగా వివరించిన హక్కు. పోలీసులు కూడా మనుషులే, కనుక వారికీ ఆ హక్కు ఉంది. హైదరాబాద్ పోలీసులు ఈ హక్కు నిజంగా వాడుకుని ఉంటే ఎన్కౌంటర్ సహజంగా జరిగినదే అయితే, రుజువు చేసుకోవలసిన బాధ్యత వారిపైనే ఉందని సాక్ష్య చట్టం వివరిస్తున్నది. కోర్టుకు నమ్మదగిన రుజువులు ఇస్తే సెక్షన్ 100 (ఐపీసీ) కింద మినహా యింపు వర్తిస్తుంది. నిర్దోషులవుతారు. అప్పుడు వారితో సెల్ఫీలు దిగవచ్చు. అందుకని వెంటనే ఎన్కౌంటర్ చేసిన నిందిత పోలీసులపైన కేసు నమోదు చేయవలసిన బాధ్యత ఇతర పోలీసులపైన ఉంది. ఎప్పుడు కేసు పెడతారు? ఎన్కౌంటర్ జరిగిందా? చేశారా? నేరాలకు సాక్ష్యాలు సేకరించాల్సిన బాధ్యత గాలికి వదిలేసి, కాల్చేసి చేతులు దులుపుకునే పోలీసు అధికారులకు ప్రమోషన్ ఇచ్చి న్యాయమూర్తులుగా నియమిస్తే.. వారు ఉరితాడు లేకపోయినా, తలారి రాకపోయినా తక్షణ మరణ దండన విధించవచ్చు, ప్రేక్షకులూ, అభిమానులు ఆలోచనలు మానేసి పాలాభిషేకాలు చేసుకోవచ్చు. జైళ్లకు కోర్టులకు తాళాలు వేసుకోవచ్చు. రాజ్యాంగం కాగితాల్ని తుపాకులను తుడుచుకోవడానికి సద్వినియోగం చేయవచ్చు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మన సంవిధానాన్ని రక్షించుకుందామా?
70 ఏళ్ల కిందట మన రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చిన రోజు నవంబర్ 26, 1949. ‘‘వి ద పీపుల్..’ మనం రూపొం దించుకుని మనకే సమర్పించుకున్న ఒక పరిపాలనా నియమావళి. మనకు ప్రాథమిక హక్కులు వచ్చిన రోజు. 70 ఏళ్ల తరువాత మనం ఆ సంవిధానం సక్రమంగా అమలు చేసుకుంటున్నామా లేక నియమాలన్నీ ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నామా అనేది జనం తేల్చుకోవాల్సి ఉంది. రెండు నెలల తరువాత ఆ సంవిధానం అమలు కావడం ప్రారంభమైన గణతంత్ర దినోత్సవం జనవరి 26. మన దేశం మరిచిపోలేని రోజు. కాని అనుకున్నంత గొప్పగా మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లలేదు. పోలీసులకు నేర పరిశోధన చేసేందుకు కావలసిన అధికారాలన్నీ ఉన్నాయి. నేరస్తుడనుకుంటే, నేరం చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా చెప్పలేదనుకుంటే అరెస్టు చేయవచ్చు. బంధించవచ్చు. కాని అమాయకుడిని అన్యాయం అరెస్టు చేస్తే? అతడిని ఎందుకుబంధించారో కారణాలు లేకపోతే ఎందుకు అరెస్టుచేసారో చెప్పకపోతే అది సమాచారం సమస్యా లేక, జీవన స్వేచ్ఛ ఉల్లంఘనా? లేక జీవితానికి సంబంధించిన విషయమా? జీవించే హక్కు ఉందని గ్యారంటీ ఇచ్చానని చెప్పుకునే సంవిధానం ఏమైపోయినట్టు? రాజ్యాంగ అధికరణం 21 ఉన్నట్టా లేనట్టా? జోగిం దర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యు.పి (1994) 4 ఎస్సిసి 260 కేసులో అరెస్టు చేయడమంటే సరైన సంతృప్తికరమైన సమంజసమైన కారణాలు, సమర్థ నీయమైన పరిస్థితులు ఉంటేనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు వివరించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో అనుసరించవలసిన నియమాలను సుప్రీంకోర్టు వివరించింది. అరెస్టు లేదా ఇంటరాగేట్ చేసే విధినిర్వహించే పోలీసు అధికారి అతని పేరును హోదాను గుర్తింపచేసే బిళ్లను ధరించాలి. ఒక రిజిస్టర్ లో ఆ అరెస్టుకు సంబంధించిన వివరాలను, అరెస్టు కాబడుతున్న వ్యక్తి వివరాలు నమోదుచేయాలి. అరెస్టు అయిన వ్యక్తి వివరాల మెమోతయారు చేయాలి. ఆ మెమోకు బందీ కుటుంబ సభ్యుడు గానీ ఆ ప్రాంతంలోని గౌరవనీయమైన వ్యక్తి గానీ సాక్షిగా సంతకం చేయాలి. ఆ మెమోపైన బందీ సంతకం ఉండాలి. దానిపైన అరెస్టయిన సమయం తేదీ కూడా ఉండాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు. ఈ తీర్పులో ఉన్న అసలైన హక్కు సమాచార హక్కు. సమాచారం లేకపోతే బతికే హక్కు ఉండదు. వ్యక్తిగత స్వేచ్ఛ బతకదు. అరెస్టు చట్టబద్ధంగా ఉండాలని, చట్టబద్ధం కాని అరెస్టుచేస్తే పరిహారం ఉండాలని ఆర్టికిల్ 21 సారాంశం. ఈ తీర్పులోని అంశాలను నియమాలుగా మార్చి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను సవరించారు. అంటే తీర్పు అంశాలన్నీ సమాచార హక్కును ఇచ్చే చట్టబద్దమైన అంశాలుగా మారాయన్నమాట. సం విధానం వచ్చిన నవంబర్ 26 ఎంత గొప్పదో, గుర్తుంచుకోతగిందో అంత గొప్ప రోజు 12 అక్టోబర్ 2005. ఎందుకంటే ఆరోజు సమాచార హక్కు అమలులోకి వచ్చిన రోజు. సమాచారం అధికారుల కబంధ హస్తాలనుంచి బయటకు వచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. కాని ఈ హక్కుకు 14వ సంవత్సరంలో గండం వచ్చిపడింది. అదే 2019 సవరణ. 12 అక్టోబర్ను గుర్తుంచుకొని దినోత్సవాలు చేసుకునే ప్రజలకు మరో పన్నెండు రోజుల తరువాత దారుణంగా గుర్తుంచుకునే చెడురోజును ఈ ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. అదే అక్టోబర్ 24. ఈ రోజున సమాచార హక్కు చట్టాన్ని సవరించి నీరు కార్చి, కమిషన్లను కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే నియమాలు అమలు లోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం జనహితమైన మంచి హక్కును ఈ విధంగా నీరు కార్చి సంవిధానానికి అన్యాయం చేసింది. ఇంకా ఈ దెబ్బనుంచి కోలుకోకముందే సుప్రీంకోర్టు సమాచార హక్కు గురించి ప్రతికూలంగా గుర్తుంచుకునే మరో రోజును సృష్టించింది. అదే సమాచార హక్కును మరింత నిస్సారంగా మార్చి, హక్కు పరిధిని కుదించి, పరిమితులు పరిధులను అపరిమితంగా పెంచే తీర్పును ఇచ్చిన రోజు. మన సంవిధానాన్ని మనం రక్షించుకుందామా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఈ-మెయిల్: madabhushi.sridhar@gmail.com -
సామాన్యుడిపై ‘సుప్రీం’ ప్రతాపం
ప్రభుత్వం సామాన్య పౌరుడి మీద కోర్టులో దావాలు వేయడం మామూలై పోయింది. కింది కోర్టు సామాన్యుడికి అనుకూలంగా తీర్పు ఇస్తే అక్కడితో తగాదా ముగియదు. ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా లాక్కుపోతుంది. మీకు ఎప్పుడైనా సుప్రీంకోర్టు సామాన్యుడిమీద పోరాడినట్టు తెలుసా? అదీ పన్నెండేళ్ల పాటు పోరాడిందంటే ఎంత పట్టుదల, ఎంత విచిత్రం... సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులంతా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అందుకని తమ ఆస్తి పాస్తుల వివరాలు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వా లని 1997లో వారే తీర్మానించుకున్నారు. ఆస్తుల జాబితా ఇచ్చితీరాలని చట్టాలు లేవు. సుభాష్ చంద్ర అగర్వాల్ అనే పౌరుడు 1. ఆ తీర్మానం ప్రతి ఇస్తారా, 2. ఆ తీర్మానం ప్రకారం జడ్జీలు ఆస్తుల జాబితా ఇచ్చారా, 3. హైకోర్టు న్యాయమూర్తులలో ఎందరు ఇచ్చారు అని అడిగారు. ఆ ఆస్తుల చిట్టాల ప్రతులు అడగలేదు. చిట్టాలు చదివారా అని అడగలేదు. చిట్టాలు పరిశీలించి చర్యలు తీసుకున్నారా అని కూడా అడగలేదు. జడ్జీలతో వ్యవహారం కదా అని ఒళ్లు దగ్గరబెట్టుకునే ఆర్టీఐ వేశాడాయన. సుప్రీంకోర్టు కార్యాలయంలో ఉద్యోగులు గాభరా పడిపోయారు. ఈ ఆర్టీఐకి ఏం జవాబిస్తాం? అని తలపట్టుకున్నారు. తీర్మానం కాపీ ఇచ్చారు. ఆస్తుల చిట్టాలు ఇచ్చారా అన్న ప్రశ్నకు జవాబు తమ దగ్గర లేదన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారో లేదో హైకోర్టులనే అడుక్కోమన్నారు. సీఐసీకి వచ్చారాయన. వజాహత్ హబీబుల్లా, ఎ.ఎన్. తివారీ, ఎం.ఎం.అన్సారీ అనే పెద్ద కమిషనర్లు ముగ్గురు కూచుని సుప్రీంకోర్టు ఈ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నిజానికి ఈ ఆదేశం కమిషనర్ కూడా ఇవ్వవచ్చు. కానీ ఎందుకైనా మంచిది, సుప్రీంకోర్టుతో వ్యవహారం అని జాగ్రత్త పడ్డారు. ఇక ఆ మామూలు మనిషి మీద సుప్రీంకోర్టు పోరాటం మొదలు పెట్టింది. ఈ సమాచారం ఇస్తే తమ స్వతంత్రతకు భంగం ఏర్పడుతుందని, భూమి బద్దలవుతుందని, రాజ్యాంగం తల్లకిందులవుతుందని ఇవ్వకూడనిదని ఢిల్లీ హైకోర్టుకు మొర బెట్టుకుంది. న్యాయమూర్తి రవీంద్రభట్ సుప్రీంకోర్టు వారి వాదన విని, ఇది ఇవ్వవలసిన సమాచారమే ఇవ్వండి అని ఆదేశించింది. అప్పటికైనా సమాచారం ఇస్తే బాగుండేది. కానీ సుప్రీంకోర్టు వారు డిల్లీ హైకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఆశ్రయించి రవీంద్రభట్ తీర్పును కొట్టివేయమని, ఈ సమాచారం ఇవ్వకూడదని తీర్పుచెప్పాలని కోరారు. ఆ ధర్మాసనం కూడా చాలా జాగ్రత్తగా విచారణ జరిపింది. వారికీ ఈ సమాచారం ఇవ్వవలసిందేననిపించింది. సుప్రీంకోర్టు గారూ సమాచారం ఇవ్వండి అని ఆదేశించింది. ఇప్పటి కైనా ఇస్తుందేమో అనుకున్నారు. సుప్రీంకోర్టువారు పట్టుదలకు పోయి సుప్రీంకోర్టులో అప్పీలు వేసుకున్నారు. స్టే ఇచ్చుకున్నారు. ఎప్పుడెప్పుడు తీర్పు ఇస్తారా అని కొన్నాళ్లు ఎదురు చూసి ఇక మరిచిపోయారు. పాపం రంజన్ గొగోయ్ తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉండగానే ఈ తగాదా తెగదెంపులు చేయాలనుకున్నారు. దాదాపు పదో సంవత్సరం ముగుస్తుండగా అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి రెండురోజులు జోరుగా వాద ప్రతివాదనలు విన్నారు. తరువాత 13 నవంబర్ నాడు విశేషమైన తీర్పు ఇచ్చారు. న్యాయవ్యవస్థ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాలని అంగీకరించడం చరిత్రాత్మకమైన తీర్పు అని దాదాపు అందరూ అనుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద పబ్లిక్ అథారిటీ అని సుప్రీంకోర్టు అంగీకరించిందని 90 శాతం మీడియా సంస్థలు తొలి పేజీ వార్తలు, తాటికాయంత శీర్షికలు రచించాయి. చాలామంది ఇప్పటినుంచి సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ ఆర్టీఐ కిందికి వచ్చాయని అనుకున్నారు. అద్భుతం అని ప్రశంసించారు. కానీ ఇందులో ఏ అద్భుతమూ లేదు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ప్రత్యే కంగా పబ్లిక్ అథారిటీ కాదని చెప్పింది సుప్రీం కోర్టు. అయితే న్యాయవ్యవస్థలో సీజే కార్యాలయం కూడా ఒక భాగమే కనుక ఆర్టీఐ కింద జవాబుదారీ అవుతుందని వివరించింది. సీజే కూడా విడిగా ఆర్టీఐ కింద జవాబు ఇవ్వాలన్న ఢిల్లీ హైకోర్టుతో ఏకీభవించలేదు. 2005 నుంచి న్యాయవ్యవస్థ ఆర్టీఐ కింద అడిగిన వాటిలో కొన్నింటికి సమాచారం ఇస్తూనే ఉంది. చాలా వాటికి ఇవ్వను పొమ్మంటున్నది. పోనీ చివరికి సుభాష్ గారు అడిగిన సమాచారం ఇచ్చిందా అంటే లేదు. మళ్లీ సుప్రీంకోర్టు లోని సీసీఐఓకి పంపారు. ఆయన జాగ్రత్తగా తన మేధోశక్తికి పదునుపెట్టి 250 పేజీల సుప్రీంకోర్టు తీర్పును చదివి, అర్థం చేసుకుని అందులో వ్యక్తిగత సమాచారం ఉంటే తీసేసి, మూడో వ్యక్తి సమాచారం ఉండి ఉంటే ఆ మూడో వ్యక్తిని అడిగి, ఇంకా ఏదైనా రాజ్యాంగ వ్యతిరేక దుర్మార్గ అన్వయం ఉందేమో చూసి, అప్పుడు ఏమైనా ఇచ్చే వీలుంటే అది ఇవ్వాలని తీర్పు చెప్పారు. పుష్కరకాలం తర్వాత ఇచ్చిన అద్భుతమైన తీర్పుతో న్యాయవ్యవస్థలో పారదర్శకత వెల్లివిరుస్తుందని అందరూ అనుకున్నారు. అసలు అడిగిన ప్రశ్నలేమిటి? వాటికి జవాబులు ఇవ్వకపోవడమేమిటి? ఇందులో న్యాయ మేధావులంతా తలలు బద్దలు కొట్టుకునేంత గొప్ప సంవిధాన సంక్లిష్ఠతలు, న్యాయస్వతంత్ర సార్వభౌమత్వానికి వచ్చిన ముప్పేమిటి అని ఆలోచించే వాడే లేడు. మీ తీర్మానాన్ని మీరే అమలు చేయబోరా? అన్నది సామాన్యుడి ప్రశ్న. చేయం అనేదే జవాబయితే అది ఇవ్వడానికి భయమెందుకు? ఎవరూ ఆస్తిపాస్తుల చిట్టా ఇవ్వలేదు అనండి నూటికి నూరు మార్కులు మీకే. దానికింత రాద్ధాంతం, దాని వెనుక బోలెడంత సిధ్ధాంతం. ఓ సామాన్యుడి ఆర్టీఐ అంటే సుప్రీంకోర్టుకు ఇంత ఉలికిపాటా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఫిరాయింపులపై ఓటరు తీర్పు?
కర్ణాటక స్పీకర్ ఆదేశాల్ని సుప్రీంకోర్టు కేవలం పాక్షికంగా మాత్రమే సమర్థించింది. కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయడం కోసం అనుసరించిన ఫిరాయింపు రాజకీయాలు రాజ్యాంగ పాలనకు ప్రతికూలమైనవి. స్పీకర్ రమేశ్ కుమార్ 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆదేశాలు చెల్లవని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నవంబర్ 13న ఈ వివాదంపైన తీర్పు చెప్పింది. స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. కానీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత మొత్తం శాసనసభ కాలం కొనసాగదు. ఇప్పుడు వారికోసం వాయిదా వేసిన ఉప ఎన్నికలు డిసెంబర్ 5న జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో పోటీచేసే అవకాశం వారికి కలిగింది. న్యాయమూర్తులు ఎన్. వి. రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణమురారితో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పు ఇస్తూ చట్టాలు చేసే శాసనసభ్యులను ఆ విధంగా అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్కు లేదని స్పష్టం చేశారు. 2023 దాకా కర్ణాటక శాసనసభ పదవీ కాలం కొనసాగుతుందని వారు మళ్ళీ పోటీ చేసి గెలిస్తే శాసనసభలో ప్రవేశించే అవకాశాన్ని తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తులు వివరించారు. స్పీకర్ ఎమ్మెల్యేల అర్హతను నిర్ణయించే దశలో కాలాన్ని నిర్ణయించే అధికారం లేదని న్యాయమూర్తులు నిర్ధారించారు. పదో షెడ్యూలులో ఫిరాయింపులు అనర్హతల శాసనం అన్వయంలో స్పీకర్ అధికారాలు సక్రమంగా వినియోగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ తీర్పు యడ్యూరప్పకు పెద్ద ఊరట కలిగిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. 14 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి, ముగ్గురు ఎమ్మెల్యేలను జనతాదళ్ ఎస్ నుంచి బీజేపీ వారు లాక్కుపోయిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తరువాత వీరికే టికెట్లు ఇవ్వడానికి బీజేపీకి వీలు కలిగింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎంతగానో సహకరించిన 17 మంది మళ్లీ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగానే మంత్రిపదవులు ఇవ్వడం బీజేపీ కర్తవ్యం. అందుకు అన్ని పరిస్థితులూ అనుకూలించాల్సిందే. ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారి చేతిలో లేకపోవచ్చు. మరో పార్టీ టికెట్ పైన ఎన్నికై మంత్రి పదవులు అనుభవించే నాయకులు కూడా ఈ 17 మందిలో ఉన్నారు. మంత్రి పదవిలో ఉన్న వారు కూడా బీజేపీకి ఫిరాయిస్తే ఏమనుకోవాలి. ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తే ఏదో పైపదవికోసం వెళ్లిపోయారనుకోవచ్చు. మంత్రిగా అప్పటికే పదవుల్లో వెలి గిపోతున్నవారు దాన్ని వదులుకుని, ఎమ్మెల్యే పదవినీ వదులుకుని, ఎన్నికల్లో పోటీచేసేంత కష్టాలు ఎందుకు తెచ్చుకున్నట్టు? అని కర్ణాటక రాజకీయాలు పరిశీలించిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే పదవీ ప్రలోభం కన్నా మరేవో బలవత్తరమైన కారణాలు వారి అనైతిక ఫిరాయింపుల వెనక ఉండవచ్చునని భావించవలసి వస్తుంది. కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు కూడా తమకు ద్రోహంచేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుకోవడం మామూలే. సహజంగా కాంగ్రెస్కి చెందిన నాయకుడు కావడం వల్ల, స్పీకర్ కాంగ్రెస్కు అనుకూలంగా నిర్ణయాలు చేస్తారనే నింద ఉండనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న దశలో న్యాయంగా వ్యవహరించకుండా చట్టానికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా భూతద్దంలో చూపడానికి మీడియా సిద్ధంగానే ఉంటుంది. స్పీకర్ జాగ్రత్తగా తీర్పు లివ్వాలి. నిజానికి కర్ణాటక స్పీకర్ను తప్పుబట్టడానికి అక్కడ ఏ లోపమూ కనిపించలేదు. అనర్హత అంటే రాజ్యాంగంలోనే సభలో కొనసాగడానికి అర్హత అనే వివరం ఇచ్చే నిబంధనలు ఉన్నాయి. వెంటనే ఉప ఎన్నికలలో పోటీ చేయడానికే అయితే అనర్హతకు అర్థం ఏముంది.? సభ అంటే భవనం కాదు, అయిదేళ్ల పదవీ కాలం. అనర్హత అంటే అయిదేళ్లపాటు ఎమ్మెల్యే కావద్దనే అర్థం. స్పీకర్ తీర్పు, దానిమీద సుప్రీంకోర్టు తీర్పు ముగిసింది. ఇక ప్రజల తీర్పు రావలసి ఉంది. ఫిరాయింపు రాజకీయాలపైన కర్ణాటక ఓటర్లు నిర్ణయించాల్సి ఉంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ముంచుకొస్తున్నది పర్యావరణ ప్రళయం
ఢిల్లీని జాతీయ రాజధానిగా ప్రేమిస్తాం. అది కాలుష్యానికి రాజధాని. ఇక్కడ ఇంధన వనరుల వినియోగం, విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, చెట్లను ధ్వంసం చేసి నేలను చదునుచేసి, కార్బన్ విసర్జన పరిమాణాన్ని నిరంతరం పెంచే దుర్భర కార్యక్రమం జరుగుతున్న దారుణమైన ప్రదేశం ఢిల్లీ. వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రపంచం వ్యాప్తమై ఉందని 11 వేల మంది శాస్త్రజ్ఞులు 153 దేశాల నుంచి మనందరినీ హెచ్చరిస్తున్నారు. మన నవ నాగరిక జీవనానికి ఊపిరులూదుతున్న ఆక్సిజన్ను హరించి, హరిత హరణ విసర్జనలతో పర్యావరణాన్ని ఊహాతీతంగా పతనం చెందిస్తున్న మానవ దైనందిన కార్యక్రమాలలో సమూలమైన మార్పులు రాకపోతే మన సంగతి ఇంతే అని శాస్త్రజు్ఞలు వివరిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 11,258 మంది ఈ వాతావరణ సూచిక మీద హెచ్చరిక సంతకాలు చేశారు. వారిలో 69 మంది మన భారతీయులు. మనం ఏం చేస్తే బాగుంటుందో కూడా వివరించారు. మనం ఏ విధంగా బ్రతకాలో నిర్ణయించుకునే దాన్ని బట్టి మన నిలకడైన భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. మన ప్రపంచ సమాజం సహజ పర్యావరణ పరిసరాలతో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎంత త్వరగా తన వ్యవహార ధోరణి మార్చుకుంటుందో దాన్ని బట్టి మన మనుగడ ఆధారపడి ఉంటుంది. మనకు గడువు లేదు. పర్యా వరణ సంక్షోభం అంతకంతకూ మరింత సంక్లిష్ట మవుతున్నది. పతనం ప్రమాదకరవేగంతో సమీపిస్తున్నది. అనుకున్నదానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 1979లో మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశం జెనీవాలో జరిగింది. ఆ సభ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా బయో సైన్స్ జర్నల్లో వారు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి వారు ప్రతిపాదించిన మొదటి అంశం జనాబా పెరుగుదల రేటును వెంటనే పూర్తిగా అరికట్టడం. ఇది ముఖ్యంగా భారత్, చైనా దేశాలు గుర్తించి ఆచరణాత్మక పథకాలు అమలు చేయవలసి ఉంది. రెండోది భూగర్భ ఇంధనాలను భూమిలో మిగల్చడం. శరవేగంగా సాగుతున్న అడవుల నరికివేతను వెంటనే ఆపాలి. అంతేకాదు మాంసం తినడాన్ని కూడా చాలావరకు తగ్గించాలి. విపరీతంగా పర్యావరణంలో వస్తున్న మార్పులను చూసి ఈ హెచ్చరిక చేయాలనే నిర్ణయానికి వచి్చనట్టు ప్రొఫెసర్ విలియం రిపిల్ వివరించారు. పర్యావరణం ఈ విధంగా విచి్ఛన్నమవుతున్న విషయం జనులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేయవలసి వచ్చిందని ఓరేగావ్ రాష్ట్ర యూని వర్సిటీకి చెందిన రిపిల్ అన్నారు. భూ ఉపరితల, సముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కుతున్నది. సముద్రమట్టం పెరగడం, తీవ్ర ప్రమాదకరం. మనం నలభై సంవత్సరాలుగా ఈ అంశాలను చర్చిస్తున్నాం. కాని చాలా మటుకు ఈ ప్రమాదాన్ని పసి గట్టి నివారించడంలో విఫలమయ్యాం. ఏవో కొన్ని చిన్న చిన్న విజయాలు తప్ప భారీ పరాజయాలే దాదాపు అంతటా ఎదురయ్యాయి. పర్యావరణంలో ఉపసంహరించడానికి వీల్లేని మార్పులు జరుగుతున్నాయి. మనం ఆ పరిస్థితులను మార్చలేం. ఎకో విధానాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. మామూలు ప్రజలను, విధాన విధాతలయిన రాజకీయ నాయకులను హెచ్చరిం చడానికి ఈ ప్రకటన చేయకతప్పడం లేదని శాస్త్రజు్ఞలు అంటున్నారు. ముందు ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయతి్నంచండి. ప్రగతి నిజంగా జరుగుతన్నదో లేదో పరిశీలించండి అని శాస్త్రవేత్తలు నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. భూగర్భ ఇంధనాల బదులు సౌరశక్తి, వాయుశక్తికి మళ్లుతున్నారు. మనం వెంటనే చేయవలసిన పనులను కూడా శాస్త్రవేత్తలు సూచించారు. ఇంధనాన్ని చాలా అరుదైన సమ యాల్లోనే వాడడం అలవాటు చేసు కోవాలి. భూగర్భ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు వాటిమీద భారీ పన్నులు వేయాలి. అమ్మాయిలకు సుదీర్ఘకాలం చదువు చెప్పించడం మంచి వ్యూహమంటున్నారు. అడవుల నరికివేతను ఆపి, మడ అడవులు పెంచి కార్బన్ డై ఆక్సైడ్ను విలీనంచేసుకునే అవకాశాలు పెంచాలి. ఆకు కూరలు ఎక్కువగా తింటూ మాంసాహారాన్ని తగ్గించాలి. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఆర్టీఐ కోరలు పీకిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశాధికారాన్ని ప్రకటించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సమా చార కమిషన్లు ఇక తమ చెప్పు చేతల్లో ఉంటాయని, ప్రభువుల అడుగులకు మడుగులొత్తే విధేయులే సమాచార కమిషనర్లుగా నియమితులవుతారని, అధికారేతరులు ఎంత గొప్ప సేవకులైనా సరే సమాచారాన్ని ఇప్పించే కమిషనర్లుగా నియమితులు కాబోరని పరోక్షంగా స్పష్టపరిచింది. కొద్ది నెలల కిందట సవరణ పేరుతో సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తి మీద గొడ్డలి వేటు వేసిన విషయం తెలిసిందే. ఆర్టీఐని తుదముట్టించడానికి చేసిన సవరణ చట్టం అమలు కోసం అక్టోబర్ 24వ తేదీని నిర్ణయించి, రాజపత్రంలో ప్రచురించారు. అదే రోజు ఆర్టీఐ నియమాలు అమలులోకి వస్తాయనీ ప్రకటించారు. అక్టోబర్ 12న ఆర్టీఐ అవతరణ దినోత్సవంగా దేశమంతా 14 ఏళ్లనుంచి జరుపుకుంటున్నాం. ఇటీవల 14వ వార్షికోత్సవానికి అమిత్ షా వచ్చి తామే తెచ్చిన ఆర్టీఐ సవరణ మరణ శాసనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వెనుకాడారు. దాన్ని బట్టి అది ఎంత చెప్పుకోకూడని సవరణో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ముఖ్య కమిషనర్కు కేబినెట్ సెక్రటరీకి జీతం 2 లక్షల 50 వేలు ఇస్తారు. అదే స్థాయి హోదా సౌకర్యాలు కల్పిస్తారు. కాని ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్తో సమాన స్థాయి అంటే సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన స్థాయి ఉండేది. దాన్ని తగ్గించారన్న మాట. అంటే కేబినెట్ సెక్రెటరీకి మించిన స్థాయి కమిషనర్లకు ఉండకూడదనే కొందరి ఈర్ష్య అసూయలకు ఆర్టీఐ కమిషన్ బలైపోయింది. ఇది వరకు కేంద్ర కమిషనర్లు అందరూ అంటే చీఫ్తో సహా సుప్రీంకోర్టు జడ్జి స్థాయి కలిగి ఉండేవారు. ఇప్పుడు చీఫ్ గారికి 2 లక్షల 50 వేల జీతమైతే, కమిషనర్లకు పాతిక వేలు తక్కువ అంటే 2 లక్షల 25 వేల రూపాయలు నిర్ణయించారు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. చీఫ్ను బాస్గా భావించకుండా అందరిలో ప్రథముడిగా గౌర వించి స్వతంత్రంగా వ్యవహరించే కమిషనర్లు ఇక ఈ దేశంలో ఉండరు. వారి బదులు, చీఫ్ గారి కింది స్థాయి అధికారులుగా అస్వతంత్ర కమిషనర్లు నియమితులవుతూ ఉంటారు. ఇదివరకు ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వ విభాగాల వారు సమాచారం ఇచ్చితీరాలని ఆదేశాలు జారీ చేస్తే, చీఫ్ నుంచి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. చీఫ్కు ఇబ్బందులు వస్తే వచ్చి ఉండవచ్చు. ఇబ్బందులు వచ్చి ఉంటే ఛీఫ్లే చెప్పాలి. చెప్పగలిగే స్వతంత్రం, ధైర్యం కూడా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తక్కువ జీతం, తక్కువ స్థాయితో కమిషనర్లు చీఫ్కు అణగి మణగి వ్యవహరించాలన్న సందేశం చట్ట పరంగా జారీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ సమాచార కమిషన్కు మరణ శాసనాన్ని జారీ చేసింది. కమిషనర్లకు అయిదేళ్ల పదవీ కాలాన్ని అసలు చట్టం నిర్ధారించింది. ఎవరైనా 5 ఏళ్లు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకూ పదవిలో ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు మూడేళ్లే. దీంతో నష్టం ఏమిటి అని వాదించే వారున్నారు. అయిదేళ్ల పాటు స్వతంత్రంగా ఉండగలిగే వ్యక్తిత్వం ఉన్న కమిషనర్ సమాచారాన్ని ఇప్పించడానికి ఎవరికీ భయపడడు. పదవీ కాలం తగ్గిందంటే ఆ వెసులుబాటు అంతమేరకు తగ్గుతుంది. ఇంకో మూడు నియమాలు కేంద్రం చేతిలో అధికారాలను కేంద్రీకరిస్తున్నాయి. ఏ నియమాన్నయినా సరే సడలించి నీరుకార్చే అధికారాన్ని కేంద్రం రూల్ 22 ద్వారా ఇచ్చుకున్నది. ఇంకా ఏ అలవెన్సులు ఇవ్వాలో, ఏ విలాస సౌకర్యాలు కల్పించాలో నిర్ధారించే అధికారాన్ని 21 వ నియమం ద్వారా కేంద్రం తనకు మిగుల్చుకున్నది. ఇవి చాలవన్నట్టు ఈ నియమాల అర్థాలు ఇంకా ఎవరికైనా తెలియకపోతే, కేంద్రం వివరిస్తుంది. ఆ విధంగా కేంద్రం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉన్నా సరైనదనే భావించి తీరాలని రూల్ 23 చెప్పేసింది. శాసనం ద్వారా ఆర్బీఐకి స్థిరమైన హోదాను, పదవీకాలాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని కలి్పంచింది పార్లమెంటు. ఆవిధంగా స్థాయి ఇచ్చే అధికారాన్ని ఈ సవరణ ద్వారా పార్లమెంటు నుంచి లాగేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు ఇప్పుడు చేసిన నియమాలు కూడా ఇష్టం వచి్చనట్టు మారుస్తానని, సడలిస్తానని, వాటి అర్థాలు తానే చెబుతానని కేంద్రం చాలా స్పష్టంగా వివరించింది. ఏలిన వారికి అనుకూలంగా తీర్పులివ్వాలని ఇదొక ఆదేశం. ఇవ్వకపోతే నియమాలు మారుస్తాం అని చెప్పే హెచ్చరిక ఈ రూల్స్. కొందరు మిత్రులు ఆర్టీఐలో రెండు సెక్షన్లే కదా సార్ మార్చింది. ఇంత మాత్రానికి ఇల్లెక్కి అరుస్తారెందుకండీ అనే వారూ ఉన్నారు. రెండే సెక్షన్లు మార్చారనడం కరెక్ట్. కాని దాంతో కమిషన్ అనే పులికి కోరలు పీకారని, తిండి పెట్టక మల మల మాడ్చి పులిని జింకగా మార్చారని వారు అర్థం చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర కమిషన్ పరిస్థితి ఇది అని ఊరుకోవడానికి వీల్లేకుండా రాష్ట్రాల కమిషన్లకు కూడా ఇదే గతి పట్టించారు. వారి స్థాయి మరీ తక్కువ. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లకు కేంద్రం జీతం నిర్ణయించడం ఏమిటి? ఇటువంటి మార్పును ఒప్పుకున్న దివాలాకోరు రాష్ట్రాలనేమనాలి? సిగ్గు చేటు. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఝ్చఛ్చీbజిuటజిజీ.టటజీఛీజ్చిటఃజఝ్చజీ .ఛిౌఝ విశ్లేషణ మాడభూషి శ్రీధర్ -
ఆ అమరవీరుడికి న్యాయం దక్కదా?
27 సంవత్సరాల కిందట హైదరాబాద్ పాతబస్తీలో ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉన్నారన్నా, వారి చేతుల్లో మారణాయుధాలున్నా యన్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ టెర్రరిస్టులు పాతబస్తీ టోలీచౌకీ బృందావన్ కాలనీలో మకాం వేస్తారని అనుకోగలమా. అక్కడ ఏవో తీవ్రమైన కుట్రలు జరుగుతున్నాయని తెలుసుకోవడం ఇంటెలిజెన్స్ వారి విజయమనే చెప్పుకోవచ్చు. ఏదో విధ్వంస రచన జరుగుతున్నదని తెలియగానే యువ పోలీసు అధికారి, అడిషనల్ ఎస్ పి, సాహసి, జి. కృష్ణ ప్రసాద్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు తలుపుతెరిచారు. వారిని దాటి ముందుకు అడుగు వేస్తుండగానే ఏకే 56 పేలింది. బుల్లెట్లు దూసుకు వచ్చాయి, ప్రసాద్ వెంట ఉన్న గన్మెన్పైన కూడా బుల్లెట్లు కురుస్తున్నాయి. ఇద్దరూ నేలకొరిగారు. కానీ పడిపోయే దశలో కూడా ప్రసాద్ తన సర్వీసు రివాల్వర్తో కాల్పులు జరిపారు. అవి కొందరిని గాయపరిచాయి. తరువాత జరిగిన పరిణామాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రసాద్ కాల్పులకు గాయపడిన వారు ఆస్పత్రికి వెళ్లినప్పుడు పోలీసులు పట్టుకోగలిగారు. దాడిలో పాల్గొన్న ఒక టెర్రరిస్టును ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టగలిగారు. మరొక టెర్రరిస్టు ముజీబ్ అహ్మద్ను పట్టుకోగలిగారు. నేరం రుజువు చేసి ముజీబ్ను జైలుపాలు చేయగలిగారు. ఇవన్నీ చెప్పుకోదగ్గ విజయాలే. కానీ తరువాత సంఘటనలు తీవ్రమైనవి. ముజీబ్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అవినీతి పేరుకుపోయిన మన సమాజంలో టెర్రరిస్టులు జైలులో కూడా సకల సౌకర్యాలు పొందుతారు. విశాఖ సెంట్రల్ జైలులో ముజీబ్కు జైలు అధికారుల ప్రేమాద రాలు లభించాయని ఆ జైల్లో కొంతకాలం ఉండి విడుదలైన నక్సలైట్ల నాయకుడు నాగార్జున రెడ్డి ఆగస్టు 2004లో ఓ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ముజీబ్కు మూడు సెల్ఫోన్లు అందుబాటులో ఉంచారని, ఆ టెర్రరిస్టు వాటితో తమ జేకేఎల్ఎఫ్ సహచరులతో సంప్రదింపులు జరిపేవారని నక్సలైట్ ఖైదీ చెప్పారు. విచిత్రమేమంటే నాగార్జున రెడ్డి విడుదలైన నెలలోనే ముజీబ్ కూడా విడుదలైనాడు. నాగార్జున రెడ్డి ఆరోపణలు నిజంకావని జైలు అధికారులు కొట్టి పారేశారు. తమకు సెల్ ఫోన్లున్నా విశాఖ సెంట్రల్జైల్లో పనిచేయవని, నెట్వర్క్ ఎప్పుడూ ఉండదని వారు చెప్పుకున్నారు. ఒకసారి లంచం రుచి మరిగిన వారికి టెర్రరిస్టుల విధ్వంసం కళ్లకు కనబడదు. డబ్బే కనిపిస్తుంది. వీరి అండదండలతో ముజీబ్ తన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాడనుకోవాలి. భారత స్వాతంత్య్రోత్సవ దినాన టెర్రరిస్టుకు స్వతంత్రం లభించింది. ఎంత స్వతంత్రం అంటే ఎస్కార్టు కల్పించి విశాఖ నుంచి హైదరాబాద్ దాకా తీసుకువచ్చి వాడిని సాగనంపారు. అతను హైదరాబాద్లో తన మిత్రులను కలుసుకుని సహచరులతో హాయిగా సంప్రదించి ఉత్తర భారత్ వైపు వెళ్లిపోయి అక్కడ కూడా కొన్ని టెర్రరిస్టు కార్యక్రమాలు జరిపి దొరికిపోయాడని, ఆ తరువాత పోలీసుల అద్భుతమైన కస్టడీ నుంచి తప్పు కుని పారిపోయాడని తెలిసింది. మళ్ళీ దొరకలేదు. జైలునుంచి స్వాతంత్య్ర దినోత్సవ బహుమతి కింద విడుదలైన ఈ టెర్రరిస్టు సాగించిన నేరాలకు ఎవరు బాధ్యులు.అతను ఇంకా నేరాలు చేస్తూ ఉంటే ఆ నేరాలకు ఎవరు బాధ్యులు. టెర్రరిజం ప్లస్ లంచగొండితనం ప్లస్ అసమర్థత, నిర్లక్ష్యం కలిస్తే ఎందరు కృష్ణ ప్రసాద్లైనా నేలకొరుగు తారు. ఎందరు వెంకటేశ్వర్లయినా బుల్లెట్లకు బలవుతారు. ముజీ బ్ను విడుదల చేసిన ప్రభుత్వ అధికారులకు శిక్షలు ఉండవు, ఉన్నా పడవు. ఆ టెర్రరిస్టులను ఎంతో ప్రేమతో ఆదరించిన లంచగొండి అధికారులెవరో తెలుసుకునేందుకు విచారణ కూడా జరపరు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమరులైపోయిన కృష్ణ ప్రసాద్ వంటి వీరులను పట్టించుకోరు, గుర్తించరు, సరైన అవార్డులు, పతకాలు ఇవ్వరు. భారత స్వతంత్ర సమరంలో మద్రాస్లో బ్రిటిష్ పోలీ సుల తుపాకీలకు ఛాతీ విప్పి ఎదుర్కొన్న టంగు టూరి ప్రకాశంగారిని మనం ఆంధ్ర కేసరి అని గౌర విస్తాం. కానీ ఏకే 56 బుల్లెట్లకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన కృష్ణ ప్రసాద్ వంటి అమరవీరులను ఏవిధంగా గౌరవిస్తున్నాం? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ప్రశ్నను చంపేవాడే దేశద్రోహి
హత్యకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపడం. రేప్ కన్నా ప్రజలను భజనపరులుగా మార్చడం, లించింగ్ అనే మూకుమ్మడిహత్యలకన్నా ప్రశ్నించే తత్వాన్ని హత్య చేయడం తీవ్రమైన నేరాలు. పరస్పర ద్వేషాలను రగిలించే విధానాలు అనుసరిస్తూ లించింగ్ సరైనదే అని పరోక్షంగా నేర్పే రాజకీయులు, రాజకీయాలే అసలైన నేరగాళ్లు. రాజకీయ పార్టీలను ప్రశ్నించడం ప్రజాస్వామిక బాధ్యత. కాళోజీ అన్నట్టు అప్పుడే అతను పౌరుడవుతాడు లేకపోతే పోరడు. కానీ అదే అడిగితే? అడిగిన వాడిపై దాడి చేయడం, వేటాడడం, దొంగకేసులు పెట్టడం, పాతకేసులు తవ్వడం, లేదా చెత్తకేసుల్లో ఇరికించడం దారుణాలు. కనిపిం చని హంతకులు చేసే అదృశ్య హత్యలు ఇవి. న్యాయంగా కేసులు నిర్ధారించిన జడ్జీలను కూడా వేధించడం, విభేదించిన వాడిని బాధించడం, నేరవిచారణ అధికారులమీదే నేరాలు బనాయించడం, కిందిస్థాయి అవినీతి పరులను కలుపుకుని తిరుగుబాట్లు చేయించి, వ్యవస్థలను ధ్వంసంచేయడం, మూకుమ్మడి అత్యాచారాలే. కాకతీయ యూనివర్సిటీలో ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు ఎండోమెంట్ ప్రసంగం చేయాలని పిలిచారు. కాళోజీ వ్యక్తిత్వానికి సరిపోయే చర్చనీయాంశం ఏదంటే ‘ప్రజాస్వామ్యం, ప్రశ్నించే తత్వం’ కాక మరేది. ‘ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చార్రా వెంగళ్రావ్’ అంటూ నినదించిన గొంతు ఆయనది. అదీ ఎక్కడ.. వెంగళరావు సీఎం హోదాలో సత్తుపల్లిలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న చోట. ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం వెంగళ్రావ్ పోటీ చేస్తే, కాళోజీ కేవలం ప్రశ్నించడం కోసం పోటీచేసినాడు. గెలిచింది సీఎంయే కానీ ప్రజాప్రతినిధి కావలసిన వ్యక్తి కాదు. ఓడింది ప్రజాస్వామ్యమేగాని కాళోజీ కాదు. బూటకపు ఎన్కౌంటర్లు జరిపించిన తొలి ఎమ ర్జెన్సీ సీఎం అని గొంతెత్తి చెప్పడమే విజయం. తిడితే తిట్టనీ, అడిగితే అడగనీ అని జలగం వెంగళరావు అడిగేవాడిని అడగనిచ్చాడు. జవాబు ఇవ్వలేకపోయినా. పోటీచేస్తే చేయనీ, అని పోటీ చేయనిచ్చాడు. రాజును రోజూ తిడుతున్నా రాజద్రోహం కేసు పెట్టించలేదు. జలగం ఎంత గొప్పవాడు? కాళోజీ ఇప్పుడు బతికి ఉంటే, అప్పుడెప్పుడో సత్తుపల్లిలో ప్రశ్న వేసినందుకు 2019లో రాజద్రోహం కేసు కింద అరెస్టయి పుణే ఎరవాడ జైల్లో వరవరరావుతోపాటు ఉండేవాడేమో?. కాళోజీ వంటి సెలబ్రిటీ వ్యక్తులు 49 మంది ఈమధ్య చేసిన నేరం ఏమంటే ప్రశ్నించడం. గుంపు హత్యలు ఈ దేశ పరువును ప్రతిష్ఠను ధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు. లించింగ్లు జరగకుండా చూడలేరా అని అడిగితే దేశ ద్రోహం ఏ విధంగా అవుతుందో చెప్పగలరా ఎవరైనా? గతవారం ముజఫ్ఫర్ పూర్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ గారికి 49 మంది కళాకారులు మేధావులు ప్రధానికి రాసిన ఈ లేఖలో దేశద్రోహపు రంగులు, కాంతులు, పొగలు, పగలు కనిపించడం ఆశ్చర్యకరం. దేశ ద్రోహం కేసు రిజిస్టర్ చేయాలని ఆదేశించిన ఆ న్యాయాధికారిగారి దృక్పథం ఇదా అని దేశం మ్రాన్పడిపోయింది. మరో 185 మంది సమాజశ్రేయోభిలాషులు అక్టోబర్ 8న ఆ ఉత్తరాన్ని సమర్థిస్తూ మరోలేఖ వ్రాసారు. వారిమీద కూడా దేశద్రోహం కేసు పెడతారా? అయితే ఈ అవివేకపు కారు చీకటిలోనూ కొంత వెలుగు కనిపించింది. బిహార్ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ దేశద్రోహపు ఆరోపణ చేసే ఈ ఫిర్యాదును బుట్టదాఖలుచేయాల్సిందే అని నిర్ణయించడంలో వివేకం విజ్ఞత ఇంకా బతికున్నాయనే ఆశాభావం కన్నుతెరిచింది. న్యాయాధికారి చూడలేకుండాపోయిన నిజాలు పోలీసు అధికారికి సులువుగా కనిపించాయి. ఇది దురుద్దేశపూరితంగా చేసిన తప్పుడు ఫిర్యాదు, దేశద్రోహం ఆరోపణ పైన విచారించడానికి అణుమాత్రం ఆధారంకూడా లేదు అని మనోజ్ కుమార్ వివరించారు. ఈ ఫిర్యాదు చేసిన ఓఝా అనే వ్యక్తి పిటిషన్ పైన జడ్జిగారు జారీ చేసిన ఆదేశం మేరకు కేసు రిజిస్టర్ చేయవలసి వచ్చిందని మరో ఉన్నతాధికారి చెప్పాడు. ‘‘ఒరేయ్ ప్రశ్నించేవానికి, ప్రశ్నకు కూడా ద్రోహం చేస్తావ్ రా ఎన్ని గుండెలు నీకు? అయితే నువ్వేరా దేశద్రోహివి, ఇది తెలిసినోడేరా అసలైన దేశభక్తుడు’’ అని కాళోజీ ఇప్పుడు ఉంటే అనేవాడేమో. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నదులపై పెత్తనం ఎవరిది?
మన సంవిధానం ప్రకారం కేంద్రంతోపాటు రాష్ట్రాలకు సమాన సార్వభౌమాధికారాలు ఉండాలని, కేంద్రీకృత పాలనాధికార కేంద్రం, పెద్దరికం ఉండరాదని పాఠాలు చెప్పుకుంటున్నాం. ఆచరణలో ఇది రానురాను అసాధ్యంగా మారుతున్నది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధికారాలు రక్షించాలని కోరుకున్నవారు, తరువాత కేంద్రంలో అధికారానికి రాగానే కేంద్రానికే ఎక్కువ అధికారాలుండాలని కోరుకోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు భారతీయ సంవిధానంలోని సమాఖ్య లక్షణానికి నదీ శాసనాల నుంచి సవాలు ఎదురవుతున్నది. కేంద్రం హడావుడిగా శాసనాలు చేస్తూ కూలంకషంగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బిల్లు 2019 ద్వారా 13 అంతర్రాష్ట్ర నదులకు పరివాహక ప్రాంత అథారిటీలు ఏర్పాటుచేసి, నదుల నీళ్లను శాస్త్రీయంగా ఆదాయ మార్గంగా వాడుకునే సదుద్దేశం ఉన్నట్టు ప్రకటిస్తున్నారు. రెండో బిల్లు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు 2019 ద్వారా వివాద పరిష్కార కమిటీ ఒకటి, ఆ తరువాత శాశ్వతంగా పరిష్కార న్యాయస్థానం ఒకటి ఏర్పాటు చేయదలచుకున్నారు. మూడో బిల్లు ఆనకట్టల భద్రతా బిల్లు 2019. ఈ మూడు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగిపోయింది. ఎవరూ అధ్యయనం చేసినట్టు లేదు. బిల్లులను కూలం కషంగా అవగాహన చేసుకుని రాష్ట్రాల హక్కులకు ఏవైనా సవరణలు ప్రతిపాదించేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక విభాగం ఉండాలి. లేకపోతే, ఈ బిల్లులన్నీ శాసనాలుగా మారిన తరువాత సవరించడం సాధ్యం కాకపోవచ్చు. కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉన్నా ఎన్నేళ్లకు ఏవిధంగా తెములు తాయో తెలియదు కనుక ప్రయోజనం లేదు. కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాలను పంచడానికి రాజ్యాంగం ఏడవ షెడ్యూలులో మూడు జాబితాలు రచించింది. నదుల నీటిని రాష్ట్రాల జాబితాలో చేర్చారు. అంతర్రాష్ట్ర నదుల విషయంలో వివాదాలు వచ్చినపుడు మాత్రం కేంద్రం శాసనాలు చేయడానికి వీలుగా దాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు. నీటి సరఫరా, సేద్యపు నీరు, సేద్యపు కాలువలు, డ్రైనేజీ, ఆయకట్టు, నీటి నిలువ, జల విద్యుచ్ఛక్తి అంశాలను ఒకటో జాబితాలో చేర్చారు. అంటే అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణకు సంబంధించిన ప్రజాప్రయోజనాల కోసం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా అధికారాలను నిర్వహించాలి. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్రీయ నదీ జలాల వివాదాలు వినడానికి, ఫిర్యాదులు పరిష్కరించడానికి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని వినియోగించి పార్లమెంట్ రివర్ బోర్డుల చట్టం 1956, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ రివర్ బోర్డులు నదుల సమగ్ర అభివృద్ధి కోసం కావలసిన సలహాలు ఇవ్వవలసి ఉంటుంది. దారుణం ఏమంటే ఇంతవరకు ఈ చట్టం అమలు చేయలేదు. ఇది నిర్జీవపత్రంగా మిగిలిపోయింది. రివర్ బోర్డులు లేవు. నదీ జలాల మీద ఇరు రాష్ట్రాల మధ్యనున్న జగడాలు పరిష్కరించడం సాధ్యమే కావడం లేదు. ట్రిబ్యునల్స్ అవార్డు (తీర్పు)లు ఇచ్చినప్పటికీ అవి అమలు కాకపోవడం, దానిపైన సుప్రీంకోర్టుకు రాష్ట్రాలు వెళ్లడం వల్ల వివాదాలు ముదురుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. నదులమీద ఏ శాసనం చేయాలన్నా రాష్ట్రాలతో సమగ్రంగా సంప్రదించాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా కమిషన్ సిఫార్సు చేసింది. నదులు పారే రాష్ట్రాలకు ఆ నదులను రక్షించే బాధ్యత, నదీజలాలను సక్రమంగా వినియోగించి జాతి సంపద పెంచడానికి ప్రయత్నించే బాధ్యత ఉంటాయి. సమాఖ్య లక్షణాలను, రాష్ట్ర కేంద్ర సంబంధాలను సమీక్షించిన సర్కారియా కమిషన్ కూడా ఈ అంశాలనే ప్రస్తావించింది. రాష్ట్రం తనకు మరొక రాష్ట్రంతో వివాదం ఉందని కేంద్రం దృష్టికి తెచ్చిన తరువాత వివాదాన్ని గుర్తించడానికి విపరీత జాప్యం చేయడం, తరువాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం, ట్రిబ్యునల్ కాలాన్ని విపరీతంగా పెంచుతూ పోవడం, చివరకు అవార్డు వచ్చిన తరువాత కూడా దాని అమలుకు సాయపడకపోవడం సమస్యలుగా మారాయి. ఈ సమస్యల పరిష్కారం పేరుతో తెస్తున్న ఈ మూడు నదీ శాసనాలు ఎంతవరకు ఉపయోగపడతాయి. వీటిని తెచ్చే ముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించలేదు. రాష్ట్రాల హక్కులను కాపాడుతున్నారా? నదుల మీద పెత్తనం ఎవరిది? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
గతం వలలో చిక్కుకోవద్దు
21వ శతాబ్దం భవిష్యద్దార్శనికులకు చెందినదే. రేపటి గురించి తపన ఉన్నవారిదే. ఈ మాట సతీశ్ చంద్ర సేథ్ చెప్పారు. 1932–2009 మధ్య జీవించిన ఒక భవిష్యవాది. సివిల్ సర్వీస్ అధికారి, సైన్స్ విద్యాపాలనాధికా రిగా పనిచేసిన మేధావి సతీశ్ సేథ్. బిగ్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ హైవే అని ఈనాడు మనం చూస్తున్న కొత్త సాంకేతిక ప్రక్రియ గురించి కొన్ని దశాబ్దాలకిందటే ఊహించిన భవిష్యద్దర్శకుడు. ఆయన కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి కూడా ముందే ఊహించిన భావి స్వాప్ని కుడు. విరామం లేని భవిష్యమూర్తి అనే పేరున సతీశ్ చంద్ర జీవనయానాన్ని, ఆయన రచనలు, ప్రతిపాదించిన తత్త్వం, వ్యాఖ్యానం, భారతదేశం గురించే కాకుండా ప్రపంచ మానవాళి రేపటి ప్రపంచాన్ని గురించి నిరంతరం చింతించి వెలువరించిన సాహిత్యాన్ని సమీక్షిస్తూ ఒక పుస్తకాన్ని రచించారు. దాని పేరు ‘‘ది రెస్ట్ లెస్ ఫ్యూచరిస్ట్, సతీశ్ సేథ్ క్వెస్ట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా’’. ఈ పుస్తకాన్ని భారతదేశ మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈనెల 14న ఆవిష్కరించారు. ఆ తరువాత సేథ్ స్మారక ప్రసంగం చేశారు. ఈ పుస్తకం చదివితే గతం గురించి ఆలోచించడం కాస్సేపయినా ఆపి, రేపటి పై దృష్టి పెడతారు. సతీశ్ ఒక వ్యక్తి కాదు, ప్రేరణ నిచ్చే ఒక వ్యవస్థ. చమురు లేని శక్తి వనరుల గురించి, పునర్నవీకరణ వీలైన ఇంధనం గురించి ఆయన కలలు కన్నారు. నేటి సమాచార విప్లవం చూస్తుంటే సతీశ్ ఈ విషయాన్ని ముందే ఎలా ఊహించారా అనిపిస్తున్నదని ఆర్.ఎ.మశేల్కర్ ఈ పుస్తకానికి ముందుమాటలో రాసాడు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా విస్తృతమైన సమాచారాన్ని ప్రభుత్వమే వెల్లడించవలసిన బాధ్యత వచ్చింది. రాజస్తాన్లో జన సూచనా పోర్టల్ను ఈ నెలలో ప్రారంభించారు. ఈ అంతర్జాల వేదికమీద వందల మెగా బైట్ల సమాచారం అందిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంతమందికి ఆహార పదార్థాలు ఎంత ఎప్పుడు ఇచ్చారు. మిగిలిందెంత. స్టాకు ఎప్పుడొస్తుంది. నిన్నటిదాకా ఎన్ని నిలువలు ఉన్నాయి. రేషన్ డీలర్ ఎవరు అనే వివరాలు, రేషన్ కార్డు నెంబర్తో సహా అన్ని ఒక క్లిక్తో ఎక్కడి నుంచైనా ఎవరైనా చూసుకోవచ్చు. ఇది ఇదివరకెవరూ ఊహించింది కాదు, ఒక్క సతీశ్ చంద్ర సేథ్ తప్ప. సెక్షన్ 4(1)(బి) నిర్దేశించిన విధంగా 20 సేవలపై 13 విభాగాలు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని జనానికి చేర్చే శక్తి ఈ అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానానికి ఉందని రాజస్తాన్ ప్రత్యక్ష ప్రమాణాలతో రుజువు చేస్తున్నది. ఆర్టీఐ ఐటి సాధించిన అద్భుతం ఇది. చట్టం హక్కు ఇస్తే సాంకేతిక పరిజ్ఞానం ఆ హక్కుకు నిజరూపం ఇచ్చింది. ఎవరెవరికి ఎంత రేషన్ లభించిందో ఎంత మిగిలిందో తెలిస్తే స్టాక్ను చీకటి బజారుకు తరలించే అవినీతికి ఆస్కారమే ఉండదు. పెద్ద ఎత్తున భారీ సమాచారాన్ని శరవేగంగా ఇవ్వడంతో సరిపోదు. విలువలతో కూడిన విజ్ఞానానికి అది దారి తీయాలి అని సతీశ్ చంద్ర సేథ్ అనేవారు. మార్పుల వల్ల వచ్చే సమస్యలు భవిష్యత్తులో టెక్నాలజీకి సంబంధించినవి కావు, నీతి నియమాలకు సంబంధించినవి, నైతిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలే తీవ్రమైనవి అని సతీశ్ చంద్ర సేథ్ అనేవారు. సతీశ్ గారు మరో మాట అనే వారు. మనం గతం పరచిన వలలో చిక్కుకోకూడదు. రేపటి గురించి ఆలోచించడం నేర్చు కోవాలి అని. భారతీయ ప్రజానీకానికి ఒక పరి మితి ఉంది, అది కర్మసిద్ధాంతం. మనం ఈ రోజున్న పరిస్థితికి కారణం గతంలో లేదా గత జన్మలో చేసిన పనులు లేదా పాపం అని స్థిరంగా నమ్మడం వల్ల రేపటి గురించి ఆలోచించి మంచి భవిష్యత్తును నిర్మించుకోలేకపోతున్నాం అని సతీశ్ చంద్ర సేథ్ ఆవేదన చెందారు. ప్రతి నిన్న, మళ్లీ మళ్లీ రేపును కూడా కబళించదు. కాని మనం రేపులో నిన్నను తలుచుకుంటూ భవిష్యత్తును కోల్పోతున్నామా అని ప్రతి వ్యక్తీ ఆలోచించుకోవాలని సతీశ్ ప్రబోధించారు. భవిష్యత్తు ఈ రోజే అని ఆయన నినాదం. భారతదేశ రెండో స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ అల్లుడైన సతీశ్ స్మృతి సభను మాడభూషి పద్మాసేథ్ నిర్వహించారు. కొడుకు ఆదిత్య ప్రణబ్ ముఖర్జీని సన్మానించారు. సతీశ్ పుస్తకంపై జరిగిన చర్చలో ఎన్. భాస్కర్ రావు, రచయిత రాకేశ్ కపూర్, ప్రొఫెసర్ వీణా రామచంద్రన్, ఈ వ్యాస రచయిత పాల్గొన్నారు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
న్యాయం బదిలీ
ప్రభుత్వానికి సైనిక బలం, బలగం, డబ్బు, ఆయుధాలు.. అన్నిటికీ మించి లక్షల కోట్ల ప్రజాధనంపై పెత్తనం, ఆ డబ్బు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారో చెప్పకుండా దాచుకునేందుకు చెప్పనలవి కాని అధికారం ఉంటుంది. ప్రభువులను నియంతలుగా మార్చకుండా ఉండేం దుకే రాజ్యాంగ నియమాలు, పరిమితులు, బాధ్యతలు నిర్మించారు. వీటన్నింటినీ మించిన శక్తి బదిలీ అస్త్రం. నచ్చని వారిని, వారికి నచ్చని చోటికి పంపించే అధికారం పాలకులకు ఉంది. బదిలీ శిక్ష కాదని న్యాయసూత్రాలున్నాయి. కానీ, నేరగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు నీతివంతులైన కింది అధికారులను బదిలీచేయడం శిక్షకాదా? ఇందిరాగాంధీ హయాంలో కోర్టులు కొన్ని నిర్భయంగా తీర్పు చెప్పాయి. ఆమె పాలనలో తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేశాయి. చట్టవ్యతిరేకమయిన పనులను ఎత్తి చూపాయి. ఆమె ఎమర్జన్సీ విధించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరికన్నా సీనియర్ న్యాయమూర్తిని నియమించడం సాంప్రదాయం. కానీ ఇందిరాగాంధీ సీనియర్ న్యాయమూర్తులు ముగ్గురిని కాదని వారికింద ఉన్న నాలుగో స్థానపు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ ముగ్గురూ తమ న్యాయమూర్తి పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. తమ కన్న జూనియర్ న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని నిలబడే అవమానం కన్నా రాజీనామా చేయ డం సరైన నిర్ణయమని భావించి వారు సర్వీసు వదులుకున్నారు. ఇదొక రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పాలన ప్రభావం. ఇటీవల మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి విజయ తాహిల్రమణిని మేఘాలయ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టులో 75 మంది న్యాయమూర్తులు ఉంటారు. మేఘాలయలో చీఫ్తో సహా ఇద్దరే ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. అంతపెద్ద కోర్టునుంచి అంత చిన్న హైకోర్టుకు బదిలీ చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఎందుకనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ దీనికి జవాబు లేదు. బిల్కీస్ బాను కేసులో హత్యలు, అత్యాచారాలు జరిపించిన పదకొండుమందికి శిక్ష పడితే విజయ బాంబే హైకోర్టు న్యాయమూర్తి అప్పీలులో ఖరారు చేసారు. కింది కోర్టు నిర్దోషులని విడుదల చేసిన అయిదుగురు పోలీసు ఉన్నతాధికారులకు, ఇద్దరు డాక్టర్లకు శిక్షలు విధించారు. వారు సాక్ష్యాలను ధ్వంసం చేశారనే నేరాలు రుజువు అయ్యాయని నిర్ధారించారు. ఇది గుజరాత్ మతకల్లోలాలకు సంబంధించిన తీర్పు కావడమే ఆమె బదిలీకి కారణమా అని అనుమానాలు వస్తున్నాయి. ఏడాది కిందట ఆగస్టులో ఆమె మద్రాస్ హైకోర్టుకు వచ్చారు. ఒక్క ఏడాదిపాటు ఉన్నచోట ఉండనీయండి అని ఆమె పెట్టుకున్న అర్జీని కొలీ జియం తిరస్కరించింది. అసలు ఆమె బదిలీకి కారణాలు లేవా? ఉంటే చెప్పడానికి వీల్లేని కారణాలా? కనీసం ఆమెకైనా చెప్పరా? ఇది వరకు జస్టిస్ జయంతి పటేల్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. సీనియారిటీ ప్రకారం ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావలసిన వారు. లేదా కనీసం ఒక హైకోర్టుకు చీఫ్ జస్టిస్ కావలసిన వ్యక్తి. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేశారు. గుజురాత్లో ఇష్రత్ జహాన్ మరో ముగ్గురి ఎన్కౌంటర్ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు జస్టిస్ జయంతి పటేల్. అంతేకాదు ఆ దర్యాప్తును పర్యవేక్షించారు. ఆ దర్యాప్తులో పెద్ద ఐబీ అధికారుల అసలు నేరాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఒత్తిడులకు లొంగకుండా రాజ్యాంగం ప్రకారం న్యాయ నిర్ణయం చేసినందుకు అన్యాయపు బదిలీ చేయడం కక్ష సాధించడమే అని గుజరాత్ బార్ విమర్శించింది. మరో న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ హమీద్ ఖురేషిని కూడా గుజరాత్ హైకోర్టు నుంచి బొంబాయి హైకోర్టుకు బదిలీ చేశారు. సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాకు సీబీఐ రిమాండ్ ఆదేశించారీ న్యాయమూర్తి. గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా ఈ బదిలీని ఖండిస్తూ తీర్మానం చేసింది. అహంకారులైన పై అధికారులు గుమాస్తాలను బదిలీ చేసినట్టు కొలీజియం హైకోర్టు జడ్జిలను బదిలీ చేయడం రాజ్యాంగం న్యాయమూర్తులకు ఇచ్చిన ప్రాధాన్యతకు, స్వతంత్రతకు భంగకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాలిద్ అన్నమాటలు గుర్తు చేసుకోవలసిన సందర్భం ఇది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
భాగ్యనగరం కేంద్రపాలితమా ?
మన భాగ్యనగరానికి కేంద్రపాలిత ప్రాంతమయ్యే ప్రమాదం ఉందా? దాని వల్ల ఎవరికి ప్రయోజనం? రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా దిగజార్చడమే రాజ్యాంగంపైన దాడి, ప్రజాస్వామ్యంపైన అత్యాచారం. సంవిధాన పరంగా మన దేశం రాష్ట్రాల సమాహారం. రాష్ట్రాలతోనే దేశం మనుగడ ముడిపడి ఉంటుంది. అనేక కారణాల వల్ల లదాక్ ప్రాంత ప్రజలు తము ఢిల్లీ పాలకుల అధీనంలో ఉండాలని కోరుకున్నారు. జమ్మూకశ్మీర్తో కలిసి ఉండడం వల్ల వారికీ ఏ ప్రయోజనమూ లేదని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కావడాన్ని లదాక్ ప్రజలు స్వాగతించారు. జమ్మూలోని అధిక సంఖ్యాక ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇక కశ్మీర్ ప్రజల్లో చాలామంది తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని దిగజార్చడంగా భావిస్తున్నారు. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో 370 ఆర్టికల్ గురించి ప్రస్తావించిందేగానీ జమ్మూ కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని చెప్పలేదు. కశ్మీర్ లోయలో వారే కాదు, సొంతంగా సమగ్ర రాష్ట్ర హోదాలో ఉన్న ఏ ప్రాంతం కూడా కేంద్రపాలిత ప్రాంతంగా దిగజారడానికి అంగీకరించదు. జమ్మూకశ్మీర్ను చీల్చి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి కేంద్రం అనుసరించిన పద్ధతి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన తీరు పరిశీలిస్తే, దేశంలో ప్రజాస్వామ్యానికి, ఏ రాష్ట్ర స్వరూపానిౖకైనా ప్రమా దం వాటిల్లుతుందనే భయాలు కలుగుతున్నాయి. జమ్మూకశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తర్వాత మద్దతును ఉపసంహరించి, కేంద్రంలో తన పాలనాధికారాన్ని ఉపయోగించి కేంద్రపాలనను రుద్దింది. రాజకీయ సంక్షోభాన్ని రాజ్యాంగ సంక్షోభంగా దురన్వయం చేసి నిరంకుశ నిర్ణయం తీసుకున్నది. ఆర్టికల్ 3గానీ, ఆర్టికల్ 370 గానీ, మరే ఇతర సంవిధాన సూత్రాలనుగానీ కేంద్రం లెక్కచేయలేదు. జమ్ముకశ్మీర్ రాజ్యాంగ సభ అంటే శాసనసభగా భావించాలని ఆర్టికల్ 370ని సవరించడం ఒకటి. రద్దయిన శాసనసభ అధికారాలను పార్లమెంట్ వినియోగించు కోవచ్చనే మరో ఎమర్జన్సీ సూత్రాన్ని అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు దుర్వినియోగం చేయడం మరొకటి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిపారేయడానికి ఈ దారిలో ప్రయాణిస్తారనే అభిప్రాయాన్ని మీడియాలో బీజేపీ అభిమానులు నాటారు. ఇక దీని మీద వ్యాసాలు, ఉపన్యాసాలు, చర్చలు, ట్విట్టర్లో తిట్లు, ఫేస్బుక్లో లైక్లు మొదలైనాయి. ఇదివరకు సినిమా, క్రికెట్ తారలకు అభిమానులుండేవారు. తారలు సమైక్యంగా ఉన్నా వారి అభిమానులు కొట్టుకునే వారు. ఇదేం పిచ్చి అనుకున్నారే కాని అది విస్తరించి రాజకీయాలను ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భక్తులనే మాట వాడుకలోకి వచ్చింది. వీరభక్తి తెప్పలుగా ప్రవహించడం మొదలైంది. పక్కనే వీరద్వేషపు కాలుష్యం మరొకటి. ఇవన్నీ సోషల్ మీడియాలో పారే మురికితో కలిసి బలీయమైన అభిప్రాయ నిర్ణాయక భూతాలుగా పెరుగుతున్నాయి. ఒకాయనైతే మీరు బానిసలు మేం భక్తులం కనుక మేమే గొప్ప అని ఛాతీ విప్పి చాటుకుంటున్నారు. అసమ్మతిని, భిన్నాభిప్రాయాన్ని తిట్టడానికి రెచ్చగొట్టే పదజాలం వాడుతున్నారు. భక్తులని ఇదివరకు అనబడేవారు ఇప్పుడు గుడ్డిబానిసత్వంలో పడిపోయి కారణాల విచారణను వదిలేస్తున్నారు. పూర్తిగా సమర్థించకుండా, విద్వేషపు జల్లులతో వ్యతిరేకించకుండా, సమతుల్యమైన విశ్లేషణ చేయవచ్చనే వివేకం వదిలేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఖతం చేయడానికో, ఆంధ్రలో రాజకీయంగా ఎదగడానికో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమే బీజేపీ వ్యూహమని అనుకుంటే అది రాజకీయ విజ్ఞతను అనుమానింప చేస్తుంది. సాధారణంగా కేంద్రం ఈ విధంగా తెలంగాణ రాజధానిని కైవసం చేసుకునే వాతావరణం ఉందనిపించడం లేదు. అయినా ఆ పనిచేస్తే తెలుగు ప్రజలలో అది కొత్త ముసలమై తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి కొత్త ఊపిరులూదుతుంది. బీజేపీకి ఏవిధంగా లాభిస్తుందో వారే ఆలోచించుకోవాలి. దక్షిణాదిలో కూడా అగ్నిగుండాన్ని రాజేసే చర్యలు మంచివి కావనే సద్బుద్ధి వికసించాలి మరి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వడ్డించేవాడు మనవాడయితే...!
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు పొరుగు రాజకీయ పార్టీవారి ఎమ్మెల్యేలు అధికారపార్టీకి అంత రుచిగా ఎందుకుంటారు? సైకిల్ గుర్తుకు జనం ఓటేస్తే కమలం పూలు చెవిలో ఎందుకు పెట్టుకుంటున్నారు? చేతికి చేయిచ్చి కారెందుకు ఎక్కుతున్నారు? ఫిరాయింపు ఇంత యింపుగా ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పచ్చ కండువాలు తీసేసి కాషాయం కప్పుకున్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు. ఎమ్మెల్యేలు ఎటు పోవాలో అని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలామంది వైస్సార్సీపీలో చేరడానికి కూడా సిద్ధపడ్డారని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే తలుపు తీస్తామని కొత్త సీఎం షరతు పెట్టడంతో గేట్లు బందైపోయి వారంతా ప్రజాసేవ చేయడానికి మార్గాలు కనబడక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం గేట్లు బార్లా తెరిచి, ఎర్రతివాచీ పరిచి సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ అధ్యక్షుడు తదితర పెద్దలతో గోడ దూకిన వారి ఫోటోలు తీయడానికి మీడియా కెమెరాలు సిద్ధం చేసి ఉంచారు. ఆ నలుగురి తరువాత ఇంకా ఎవరూ రాలేదేమిటి చెప్మా? తెలంగాణా వెనుకబడి ఉందనుకుంటున్నారా? పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జెండాలు వదిలేసి గులాబీ కండువాలు కప్పుకున్నారు. చేయికి చేయిచ్చిన ఎమ్మెల్యేల వల్ల పాపం కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. పన్నెండుమంది ప్రజాసేవ చేయాలనుకున్న మహోన్నత లక్ష్యం ముందు ఒక్క నాయకుడి ప్రతిపక్ష హోదా ఉంటేనేం పోతేనేం. ఎందుకు పార్టీలు మారతారో పిచ్చి జనానికి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. జనం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కోపం రాదా? వచ్చింది. తమ వాక్ స్వాతంత్య్రాన్ని వారు కూడా వాడుకున్నారు. మేం గొర్రెలమా బర్రెలమా అమ్ముడు బోవడానికి? అని కళ్లెర్రజేసారు. ఒక్కొక్కళ్లమే టీఆర్ఎస్లో చేరికతో మమ్మల్ని అనాలె. పన్నెండో వాడు వచ్చేదాకా ఆగినం కదా. మేం భారత రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటిం చాం. తూట్లు పొడవలేదు తెలుసా అని రాజ్యాంగసూత్రపు అరటిపండు ఒలిచిపెట్టారు. మా పరువు తీసే వ్యాఖ్యలపైన మేం పరువు నష్టం కేసులు పెడతాం అని కూడా ప్రకటించారు. ఎమ్మెల్యేలు పరువు పోతే బతకగలరా? ఏం వారేమయినా పార్టీని పెళ్లిచేసుకుని తాళి గట్టించుకున్నారా జీవితాంతం బానిసల్లా పడి ఉండడానికి? రాజ్యాంగం, చట్టం, కోర్టులు వీరి పరువును వీరి హక్కులను, బాధ్యతలను కాపాడటానికి లేవా? 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉంటేనేం. మా పరువు కేసులు ముఖ్యం కాదా అని వారన్నా అనగలరు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమకు టిక్కెట్ ఇచ్చిన పార్టీ పట్ల కృతఘ్నులుగా ఉన్నారని అనడానికి ఏ మాత్రం వీల్లేదు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీకి విలువైన సలహా ఇచ్చారు. కార్పొరేట్ కన్సల్టెన్సీ వారైతే లక్షడాలర్లు ఫీజు వసూలు చేసేవారు. కానీ ఉచితంగా అదీ ఎంతో పారదర్శకంగా ఇచ్చారు. ‘అసలు కాంగ్రెస్ 2014 నుంచి ప్రతి ఎన్నికలో ఎందుకు ఓడిపోతున్నదో’ అంతరాత్మను అడగాలట. ‘మరి ఈ పన్నెండు మంది గెలవడం కాంగ్రెస్ గెలుపు కాదా’ అని మీరడగొద్దు. బుద్ధిగా నోరుమూసుకుని అధికార పార్టీ ఎంఎల్యేలు చెప్పింది వినాలె మరి. ‘గెలిస్తే ఏమిటి. వారంతా టీఆర్ఎస్లో చేరినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయినట్టు కాదా?’ అంటారు. అదీ నిజమే. ఏపీలో టీడీపీని చిత్తుగా ఓడించింది వైఎస్సార్సీపీ అయితే నేతలు బీజేపీలో ఎందుకు చేరుతున్నట్టు? గెలిచిన పార్టీలో చేరాలి కదా అని ఒకాయనకు ధర్మసందేహం వచ్చింది. అందువల్ల వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల బలం పెరిగేది. చేరిన వారికేమో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అండదండలతో బోలెడంత ప్రజాసేవ చేసుకునే వీలు కలిగేది. అయితే ఆ పెద్దల దూరదృష్టి గొప్పది. ఎంపీలంటే కేంద్రంలో ఉండాలి. రాజ్యసభ డిల్లీలో ఉంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. మన రాష్ట్రంలో వారికి ఒక్కసీటు కూడా లేకపోతేనేం. ఇప్పుడు నాలుగు రాజ్యసభ సీట్లిద్దాం అన్న విశాల భావన, దేశభక్తి ఉదయించినప్పుడు మనం తప్పు బట్టకూడదు. ఈడీ, సీబీఐ, ఐబీ, రిజర్వ్బ్యాంక్, తాము ఎగ్గొట్టిన కోట్లరూపాయల అప్పులిచ్చిన ఇతర బ్యాంకుల కన్సార్టియమ్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటాయని తెలియదా? అదీగాకుండా మన ప్రియ తమనేతను ఓడించిన రాష్ట్ర ప్రజల సేవకన్నా దేశ ప్రజలందరికీ సేవచేయడం ఇంకా గొప్ప పనికదా. అయినా వడ్డించేవాడు మనవాడయితే, సభాపతులు, చైర్మన్లు మనవాళ్లయితే ఏ పంక్తిలో ఉంటేనేం ఏ పార్టీలో తింటేనేం? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
భిల్లుల బతుకులతో గుమాస్తాల బంతాట
సర్కారీ గుమాస్తాలు, వారిపై అధికారులు ఈ దేశంలో ప్రజల బతుకులను నిర్ణయిస్తున్నారు. వాళ్లకు ఇష్టమైతేనే లేదా డబ్బు ముడితేనే ఫైళ్లు కదులు తాయి. ఆదివాసుల మను గడ మట్టిపాలు చేయడానికి ఈ గుమాస్తాలు ఓ సులువైన మార్గం కనిపెట్టారు. అదే కాగితాలు మాయం చేయడం. అటవీ హక్కుల చట్టం కింద తమకు నివసించే హక్కు ఇవ్వాలని ఆదివాసులు అర్జీ పెట్టుకోవాలి. రుజువులు ఇవ్వాలి. అటవీ హక్కుల కమిటీ పెద్దలు పరిశీలించి దయకలిగితే ఇస్తారు. లేదా తిరస్కరిస్తారు. 60 రోజుల్లో అప్పీలు చేసు కోవాలి. భ్రష్ట గుమాస్తాలు ఏం చేస్తారంటే తిరస్కార ఉత్తర్వు పత్రాలను ఆదివాసులకు చేర్చరు. పంపినట్టు రాసుకుం టారు. అరవై రోజుల కాల పరిమితి వడిసిపోతుంది. తరువాత అప్పీలు చేసుకోవడానికి వీలుండదు. అంటే శాశ్వతంగా నివాస హక్కులు కోల్పోతారు. ఈ విధంగా దురాక్రమణదారులు ఇంతమంది ఉన్నారండీ అని వీరు సుప్రీంకోర్టుకు ప్రమాణ పత్రాల్లో అంకెలు అతివినయంతో సమర్పిస్తారు. వెళ్లగొట్టకుండా మీరేం చేస్తున్నారు అని న్యాయమూర్తులు కోప్పడి వెంటనే వారిని తరిమేసి మన అరణ్యాల్ని పర్వతాల్ని, పర్యావరణాన్ని రక్షించండి అని ఆదేశిస్తారు. బ్రిటిష్ వారి శిక్షణ ఇది. నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తరతరాలకు పాకిపోతూ ఉంటుంది. రాజస్తాన్ అడవుల్లో 61 మంది భిల్లు జాతి జనం శతాబ్దాల నుంచి ఉంటున్నారు. దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెస్తారు. ఎక్కడెక్కడో కాగితాల్లో ఉన్న ప్రస్తావన ఆధారంగా కొన్ని పత్రాలు దేవీ లాల్ కష్టపడి సేకరించి తనతోపాటు 61 మంది భిల్లు ఆదివాసుల నివాస హక్కుల క్లెయిమ్లు జాగ్రత్తగా అటవీ హక్కుల కమిటీకి పంపారు. ప్రతిస్పందనగా 2015 లో దేవీలాల్కు ఇతర భిల్లులకు, ఫలానా తేదీన రమ్మని సమన్లు వచ్చాయి. భిల్లులు రమ్మన్న రోజున వెళ్లారు. అధికారులు ఏమీ చెప్పరు. ఆ ఆంగ్లం అర్థం కాదు. వాళ్లు వెళ్లిపోతారు. తరువాత ఏమైందో తెలుసుకొమ్మని భిల్లులంతా దేవీలాల్ను పంపారు. ప్రతిసారీ అతను రావడం, వీళ్లు ఫైల్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్పడం, ఈయన తిరిగి వెళ్లిపోవడం. 2015 నుంచి 2017 దాకా తిరిగిన తరువాత విసిగిపోయి మళ్లీ పాత కాగితాల దుమ్ము దులిపి కొత్తగా క్లెయిమ్లు రాసుకుని దస్తావేజులన్నీ పట్టుకుని దేవీలాల్ 61 మంది భిల్లుల బతుకుల కాగితాలని సర్కారు గుమాస్తాలకు సమ ర్పించుకున్నారు. గుమాస్తాలు పిడుగుపాటు వార్త అప్పుడు చెప్పారు. మీ క్లెయిమ్లు తిరస్కరించారు కనుక మీరు మళ్లీ క్లెయిమ్లు పెట్టుకునే వీల్లేదని. ఎందుకు నిరాకరించారంటే–దానికి జవాబు లేదు. ఆర్టీఐ కింద దరఖాస్తులు పెట్టండి అని కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. తమ క్లెయిమ్ల పైన తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వగలరు అని సమాచార హక్కు కింద భిల్లులు కోరారు. కొన్నింటికి ఫైళ్లు లేవనీ, మరికొన్నింటికి పరిశీలనలో ఉంది అనీ తోచిన జవాబులు ఇచ్చారు సర్కారీ గుమాస్తాలు. మా హక్కుల అర్జీలు తిరస్కరించారంటున్నారు కదా ఆ ఉత్తర్వుల ప్రతులు ఇవ్వండి అని కోరారు. అటవీ చట్టం సెక్షన్ 12 (ఎ)(3) ప్రకారం అర్జీ తిరస్కారానికి గురైతే ఆ విషయం వ్యక్తిగతంగా అధికారులు వెళ్లి సంబంధిత దరఖాస్తుదారులకు ఇవ్వాలి. అప్పుడే సకాలంలో వారికి అప్పీలు చేసు కునే వీలుంటుంది. సెక్షన్ 12(ఎ)(10)ప్రకారం ఆది వాసుల హక్కుల పత్రాలను తిరస్కరించడానికి కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఈ రెండు సెక్షన్లను ఉల్లంఘించడం ద్వారా బ్రిటిషు గుమా స్తాలు ఈ దేశ ప్రభువుల స్థాయిలో ఆదివాసుల బతుకులతో బంతాట ఆడుకుంటున్నారు. ఆర్టీఐ కింద దేవీలాల్ తదితర భిల్లుల దరఖాస్తులకు ఇచ్చిన జవాబు ఏమంటే ఫైళ్లన్నీ భైరాంస్రోర్ఘర్ గ్రామ పంచాయతీకి పంపామని చెప్పారు. భైరాంస్రోర్ఘర్ గ్రామ పంచాయతీని ఆర్టీఐ కింద అడిగితే మాకు ఆ ఫైళ్లేవీ రాలేదన్నారు. ఈ విషయాలన్నీ అటవీ హక్కుల కమిటీ వారిని అడిగితే మౌనమే సమాధానం. ఇంతకూ ఆ ఫైళ్లన్నీ ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. కానీ అటవీ అధికారుల కమిటీ మాత్రం మీ హక్కుల పత్రాలు తిరస్కరించారన్నారు. ఆ తిరస్కరణ ఉత్త ర్వులు ఉన్నాయో లేదో తెలియదు. కారణాలు తెలిస్తే వాటిని ఖండిస్తూ అప్పీలు చేసుకోవచ్చు. తిరస్కరణ ఉత్తర్వులు భిల్లులకు ఇవ్వకుండా మాయచేసి వారి నివాస హక్కులకు శాశ్వతంగా గండికొట్టిన ఈ గుమాస్తాలకు ఏ శిక్షలూ ఉండవు. ఆర్టీఐ దరఖాస్తులు వేసే దాకా అటవీ హక్కుల కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ కమిటీలు కూడా చట్టాలు, నియమాలకు భిన్నంగా రూపొందించారని తెలిసింది. సబ్ డివిజనల్ లెవల్ కమిటీలో ఎవరిని నియమించాలో వారిని నియమించలేదు. ఆదివాసుల హక్కులను గుర్తించడానికి పార్లమెంట్ చేసిన చట్టానికి గండికొట్టడం గుమాస్తాల తెలివి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నాగరిక చట్టం అడవికి వర్తించదా?
ఆదివాసులు, మరికొన్ని సంప్రదాయ జాతులు అడవుల్లో తరతరాల నుంచి ఉంటున్నారు. అభివృద్ధి పేరుతో, వారిని ‘అభివృద్ధి చేస్తా’మనే సాకుతో, మనం అభివృద్ధి కావడానికి వారిని వెనుకకు, ఇంకాఇంకా వెనుకకు తోసేస్తున్నాం. తరతరాలుగా అక్కడే ఉండి బతుకుతున్నవారిని నోటీసు లేకుండా తొలగించడం న్యాయమా? ‘మీరు ఇక్కడి నించి వెళ్లిపొండి’ అని వారిని గద్దిస్తే రెండు ప్రశ్నలు వేస్తారు. ‘ఈ నేల ఎందుకు వదలాలి? ఎక్కడికి వెళ్లాలి?’ ఈ ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు? 1927లో బ్రిటిష్ పాలకులు అడవులను రక్షిం చడానికేనని అంటూ, అడవి చట్టం తెచ్చారు. అటవీ అధికారులు, గార్డులు, జవాన్లు తదితర ఉద్యోగులతో ఒక పెద్ద క్యాడర్ తయారైంది. ప్రభుత్వం ఫలానా హద్దుల్లోని ప్రాంతం అడవి అని ప్రకటిస్తే చాలు, అటవీ అధికారులు అక్కడ రాజ్యం ఏలడం మొదలుపెడతారు. మన హక్కులను అమలుచేసుకోవడానికి కాల పరిమితులచట్టం పరిమితులు నిర్దేశించింది. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులను ఎవరైనా కబ్జా చేస్తే ఆ కబ్జా చేసినవారిని ఖాళీ చేయించడానికి ఈ చట్టం 12 సంవత్సరాల కాలపరిమితి విధించింది. ఈలోగా రాకపోతే కబ్జాదారుడే ఆ కబ్జాలో దర్జాగా కొనసాగే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వ భూమి అయితే 30 సంవత్సరాల పాటు ఆక్రమణల్లో ఉంటే ప్రభుత్వం అది నా భూమి అని క్లెయిమ్ చేయకపోతే ఆ తరువాత అవకాశం లేకుండా పోతుంది. ఆదివాసులు, తదితరులు తరతరాలనుంచి కొంత అడవి భూమిని తమ అధీనంలో ఉంచుకుంటే, ప్రభుత్వం ఆ భూమి తనదే అని ఏ విధంగా క్లెయిమ్ చేయగలుగుతుంది? నాగరికుల చట్టం అడవిలో వారికి వర్తించదా? 1927నుంచి అడవి చట్టం కింద అటవీ అధికారులకు తీవ్రమైన అధికారాలు ఇవ్వడం వల్ల తగా దాలు మొదలైనాయి. ఫారెస్ట్ గార్డ్ ఈ అటవీవాసు లకు గాడ్ కన్నా భయంకరుడు. ఈ గార్డ్ చెప్పుచేతల్లో అడవి మనుషుల హక్కులు ఉంటాయి. ఈ నిరంకుశ అటవీ పాలనలో జనం పడ్డబాధల పునాదుల మీద తీవ్రవాదం, నక్సలిజం పుట్టి పెరిగాయి. విభజనవాదం, వేర్పాటువాదం కూడా వచ్చింది. అడవిపైన ఆదివాసులకు యాజమాన్యపు హక్కు ఇవ్వకపోయినా, కనీసం అడవిలో ఉండే హక్కు వారికి ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు, ఉద్యమాలు సాగుతున్నాయి. చివరకు ప్రభుత్వం ఈ ప్రజాందోళనలకు తలొగ్గి 2006లో అడవి హక్కుల చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆదివాసులు 2005 డిసెంబర్ 13 నాటికి తాము అడవిలో ఫలానా హద్దుల మధ్య ఉంటున్నట్టు రుజువుచేస్తే ఆ హద్దుల మధ్య నివసించే హక్కు ఉందని పత్రం ఇస్తారు. ఈ చట్టంద్వారా కొత్త హక్కులు ఇవ్వడం లేదు, ఇదివరకు నుంచి వారి హక్కులను గుర్తించి, రక్షించి, పరిధులను నిర్ణయించడం ఈ చట్టం ఉద్దేశం. ఈ హక్కులను గుర్తించడానికి ఒక ప్రక్రియను నిర్దేశించారు. గ్రామసభకు ఆదివాసులు తమ క్లెయి మ్లను సమర్పించాలి. ఆ హక్కు అభ్యర్థన పత్రాలను, రుజువులను సబ్ డివిజినల్ స్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి ఒక అధికారి అధ్యక్షుడు. వీరి నిర్ణయాన్ని సమీక్షించడానికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. క్లెయిమ్లను పరిశీలించి న్యాయంగా నిర్లక్ష్యం లేకుండా వ్యవ హరిస్తే అటవీ నివాసులకు హక్కులు లభిస్తాయి. నిర్లక్ష్యంగా ఆ క్లెయిమ్లు తిరస్కరిస్తే అప్పీలులో కూడా న్యాయం జరగకపోతే వారేమవుతారు? అనేక రాష్ట్రాలలో నవంబర్ 2018 నాటికి 42 లక్షల 24 వేల క్లెయిమ్లు వచ్చాయని, అందులో 18 లక్షల 94 వేల మందికి హక్కు పత్రాలు ఇచ్చారని, 19 లక్షల 39 వేల క్లెయిమ్లు తిరస్కరించారని కేంద్ర అటవీ శాఖ లెక్కలు వివరిస్తున్నాయి. దాదాపు 44.8 శాతం మంది క్లెయిమ్దారులకు హక్కు పత్రాలు ఇచ్చారు. కానీ మిగిలిన 55 శాతం మంది గతేమిటి? వారిని ఆక్రమణదారులంటారా? అక్కడ నివసిస్తున్నామనడానికి రుజువులు చూపలేకపోతేనో, చూపిన రుజువులు నమ్మకపోతేనో, అవి చెల్లవంటే వారి క్లెయిమ్ ఒప్పుకోరు. అందువల్ల ఆక్రమణదారుడని నిందించి అడవి వదిలి వెళ్లిపోవాలంటారా? అది న్యాయమా? అనేది ధర్మాసనం ముందున్న ప్రశ్న. అర్హులందరికీ పట్టాలిచ్చారా? ఇవ్వని వారంతా అనర్హులైన ఆక్రమణదారులా అని సుప్రీంకోర్టు అడిగింది. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రమాణ పత్రాల ఆధారంగా 16 రాష్ట్రాలలో ఉన్న 11 లక్షల మంది గిరిజనులు, ఇతర సంప్రదాయ నివాసులను తొలగించాలని సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ 11 లక్షలమందిని అడవుల నుంచి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? సమస్య చాలా తీవ్రమైందని గుర్తించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13 తీర్పుపైన తానే ఫిబ్రవరి 28న స్టే ఇచ్చింది. అటవీ వాసుల సమస్య అంతటితో తీరుతుందా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ప్రజాప్రయోజనాలు రహస్యమా?
విశ్లేషణ ఎన్నికల ప్రచారం ఒక రణ రంగం వంటిదే. అందులో అధికారంలో ఉన్న పార్టీకి పైచేయి ఉంటుంది. పాలక పార్టీ చేతిలో చతురంగబలాలు, ప్రజల డబ్బు, విపరీతమైన అధికారం ఉంటాయి. వాటిని ప్రచారానికి ఉపయోగించుకోవాలనే తపన ఉంటుంది. ప్రతిపక్షాలకు ఆ లాభం ఉండదు. ఈ అసమానత తొలగించడానికే అధికారపక్ష అభ్యర్థులపై పరిమితులు విధిస్తారు. ముఖ్యంగా ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు, ప్రచారానికి దిగినపుడు అధికారిక హంగులను వాడుకోకూడదు. ప్రచార నీతి నియమావళిలో ముఖ్యమైన పరిమితులు ఇవే. అబద్ధాలు, తప్పుడు మాటలు చెప్పి, బూటకాలు ప్రసారంచేసి నాటకాలు వేస్తూ మతాన్ని, కులాన్ని వాడుకోవడం తప్పు. సైన్య వ్యవహారాలను కూడా పార్టీ ప్రయోజనాలకు వాడుకునే సంఘటనలు జరగడంతో మరికొన్ని నియమాలను ఎన్నికల కమిషన్ రూపొందించింది. పార్టీల నాయకులను మధ్య మధ్య హెచ్చరించడం ద్వారా వారి ప్రచార దుర్మార్గాలకు పగ్గాలు వేయాలి. కమిషనర్లు స్వతంత్రంగా ధైర్యంగా పనిచేయాలి. నిజానికి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఎన్నికలను నిర్వహించడం మాటలు కాదు. అందుకే ఎన్నికల కమిషన్కు ఆర్టికల్ 324 కింద విస్తృతమైన అధికారాలు ఇచ్చింది మన రాజ్యాంగం. ఎన్నికల సమయంలో ప్రభువులంటే ఎన్నికల కమిషనర్లే. వారు అధికారులను బదిలీ చేయవచ్చు. కొత్తవారిని నియమించవచ్చు. ఆశ్చర్యమేమంటే మతం, కులం పేర్లతో ఓట్లు అడుగుతూ ఉన్నా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు చేస్తున్నా స్వయంగా చర్యలు తీసుకోవలసిన ఎన్నికల కమిషన్ మౌనంగా ఉండిపోయింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలలేదు. స్వయంగా ప్రధానిమీద, అధికార బీజేపీ అధ్యక్షుడిపైన కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు అనేకానేక ఫిర్యా దులు చేశాయి. ప్రసంగాల్లో రెచ్చగొట్టే భాగాలను ఎత్తి చూపించాయి. కాని ఎన్నికల కమిషన్ ప్రతిస్పందనే లేదు. న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కోర్టు తలుపులు తట్టి ఎన్నికల కమిషన్ను నిద్రలేపండి మహాప్రభో అని వేడుకున్నది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా కొన్ని ఫిర్యాదులు వారి పరిశీలనకు నోచుకోకుండా మిగిలిపోయాయి. సుప్రీంకోర్టు చివరకు ఫలానా తేదీలోగా చర్యలు తీసుకోండి అని ఆదేశించవలసి వచ్చింది. అప్పుడు ఎన్నికల కమిషనర్లు సమావేశమై ప్రధాని ప్రసంగాలలో ఏ పొరబాటూ లేదని క్లీన్ సర్టిఫికెట్లు జారీ చేయడం మొదలు పెట్టింది. అంతా ఆశ్చర్యపోయారు. తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం, కనీసం హెచ్చరికలు కూడా జారీ చేయకపోవడం ఏమిటని విమర్శలు మొదలయ్యాయి. ముగ్గురు కమిషనర్లలో ఒకరు అశోక్ లావాసా మిగతా ఇద్దరి నిర్ణయాలతో ఏకీభవించలేదని, తప్పులు జరిగా యని ఆయన ఎత్తి చూపారని తెలిసింది. అశోక్ లావాసా తన అసమ్మతి గురించి లేఖలు రాశారు. తన అసమ్మతి అంశాలను రికార్డు చేయాలని, కమిషన్ తుది తీర్పులో కూడా తన అసమ్మతి కారణాలను వివరించాలని కోరుతూ అశోక్ లావాసా మరో ఉత్తరం రాశారు. చివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదుల విచారణలో తాను పాల్గొనడం వృథా అని భావిస్తున్నానని, కనుక తాను ఆ సమావేశాలకు రాలేనని ఇంకో లేఖ రాశారు. ఈ విషయం పత్రికా వర్గాలలో సంచలన వార్త కావడంతో ఎన్నికల కమిషన్ చర్చించాలని నిర్ణయించింది. మే 21న సుదీర్ఘంగా సమావేశం జరిపింది. ఎవరైనా అసమ్మతి తెలియజేస్తే వారి అభిప్రాయాన్ని రికార్డులో భద్రంగా ఉంచుతామని, కాని దాన్ని తమ తుది ఉత్తర్వులలో భాగంగా చేర్చలేమని ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అసమ్మతిని కనీసం రికార్డులో ఉంచడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ఒక్కటే ఈ వ్యవహారంలో సమంజసంగా కనిపిస్తున్నది. ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులు, వాటి విచారణ, కమిషనర్ల అభిప్రాయాలు దాచడానికి కారణాలు ఏమిటి? అవి అత్యంత రహస్యాలు ఎందుకవుతాయి. అవేమైనా రక్షణ వ్యూహాలా, అధికారికంగా దాచవలసిన అంశాలా, వాణిజ్య రహస్యాలా? చట్టప్రకారం వ్యవహరిస్తామని కమిషన్ పేర్కొ నడం ముదావహం. సమాచార హక్కు చట్టం ఒకటుందని వారు గుర్తించారో లేదో తెలియదు. ఈ చట్టంలో ‘అభిప్రాయాల’ను ‘సమాచారం’గా నిర్వచించారు. రికార్డు (దస్తావేజు)లో ఉన్న అంశం, సెక్షన్ 8 మినహాయింపులకు లోబడి వెల్లడించాలి. అసమ్మతి వివరాల వెల్లడిలో ఉన్న ఇబ్బందులు, దాచడంలో ప్రజాప్రయోజనం ఏమిటో చూపాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వసంస్థపై ఉంటుంది. సెక్షన్ 4 కింద ఎన్నికల కమిషన్ స్వయంగా వెల్లడించాల్సిన అంశాలలో అసమ్మతి కూడా ఒకటి. అర్థ న్యాయ (క్వాసి జ్యుడీషియల్) నిర్ణయం కాదని కమిషన్ వాదిస్తున్నది. నియమ ఉల్లంఘన ఫిర్యాదులపై విచారణ పరిపాలనా చర్య అంటున్నది. పరిపాలనా చర్యలైనా వాటి ప్రభావం పడే వర్గాలకు వెల్లడించాలని సెక్షన్ 4(1)(డి) వివరిస్తున్నది. దాచడానికి వీల్లేని ప్రజాప్రయోజన అంశాలను కాపాడటం ఎవరికోసం? మాఢభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నిష్పాక్షికత కోసమే ఈసీకి అధికారాలు
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం రణరంగంగా మారింది. రాజ్యాంగ అధికరణం 324ను సద్వినియోగం చేశామని కేంద్రం, దుర్వినియోగం చేశారని రాష్ట్రం విమర్శిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ని ఏం చేసైనా సరే ఓడించాలని బీజేపీ పట్టుబట్టినట్టు కనిపిస్తున్నది. బీజేపీకి ప్రథమ శత్రువు తానే అన్నట్టు మమతా బెనర్జీ కూడా హోరాహోరీగా ఎదురుదాడులు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలోకన్నా అక్కడే ప్రధాని ఎక్కువ సభలు ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, టీఎంసీ తమ తమ గూండాలను విచ్చలవిడిగా రంగంలోకి దింపడం సిగ్గుచేటు. బెంగాల్ సంఘ సంస్కరణలకు సాంస్కృతిక వికాసానికి తార్కాణంగా ప్రసిద్ధికెక్కిన ఈశ్వర్ చంద్రవిద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాక దాన్ని ఇరుపక్షాలు ఎన్నికలకు వాడుకుంటున్నాయి. అమిత్ షా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలతో బెంగాల్లో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ టీఎంసీ విద్యార్థి వర్గాల వీధి పోరాటాలు పెరిగాయి. ఎన్నికల కమిషన్ ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రచార సమయాన్ని 20 గంటలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో హింసే కారణమయితే రెండు పార్టీల రోడ్డు ప్రచారాన్ని వెంటనే ఒక రోజు రద్దు చేస్తే న్యాయంగా ఉండేది. వేడిగా వాడిగా సాగుతున్న ప్రచారాన్ని వెంటనే ఆపి శాంతి భద్రతలను కాపాడే బదులు, గురువారం సాయంత్రం దాకా ఎన్నికల ప్రచారాన్ని అనుమతించి, ఆ తరు వాత ప్రచారం నిలిపివేయాలని ఆదేశించడం విచిత్రంగా ఉంది. అందుకు కారణం ప్రధాని ఎన్నికల సభలు ఆ సమయంలో ఏర్పాటు చేసుకోవడమే అని మమతా బెనర్జీ విమర్శించారు. ఒకరంటే మరొకరికి ఏమాత్రం పడని బీజేపీ, టీఎంసీలు ఒక్క విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నాయి. అదేమంటే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదట. నరేంద్రమోదీ, అమిత్ షాల చెప్పు చేతల్లో పనిచేస్తూ, వారు జారీ చేసే ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నదని మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్ను విమర్శించింది. విచిత్ర మేమంటే అమిత్ షా కూడా ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని అంటున్నారు. శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలో ఉన్న అంశమని, అందులో జోక్యం చేసుకుని రాష్ట్రపోలీసు అధికారులను బదిలీ చేయడం సరికాదని బెనర్జీ అన్నారు. కానీ ఎన్నికల సమయంలో శాంతి భద్రతల స్థాయిపై ఈసీ అంచనాకే విలువ ఉంటుందని, ఆ అంచనా ఆధారంగానే ఈసీ తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సుప్రీంకోర్టు హర్యానా కేసులో వివరించింది. బెంగాల్ ప్రచారంలో ఎవరు ఏ నేరాలు చేసారనేది ఇప్పుడే తేలడం సాధ్యం కాదు. బెంగాల్ పోలీసులకు వదిలేస్తే, టీఎంసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తాయి. సీబీఐకి వదిలేస్తే అది కేంద్రం అదుపాజ్ఞలలో ఉండడం వల్ల నమ్మడం సాధ్యం కాదు. ఏదో రకంగా ఎన్నికలు గెలవాలనే స్వార్థంతో తలపడుతున్న రెండు పార్టీల రాజకీ యాల మధ్య రాజ్యాంగం నలిగిపోతున్నది. సుప్రీంకోర్టుతో సహా ఏ కోర్టు కూడా ఎన్నికల కమిషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి వీలుండదు. ఒక సారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడి కొత్త సభ ఏర్పాటయ్యే దాకా ఈసీని పనిచేసుకోనివ్వాలనీ, మధ్యలో స్టేలతో ఆపడానికి వీల్లేదని న్యాయస్థానం అనేక సందర్భాలలో నిర్ధారించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను సవాలు చేసే సంఘటనలు అనేకం జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వాయిదా వేసి కేంద్ర ప్రభు త్వం కొన్ని జనరంజక పథకాలు ప్రకటించడానికి వీలు కల్పించిందని, ప్రధాని ప్రసంగాల భాషపై నియంత్రణ చేయడానికి బదులు అన్యాయంగా క్లీన్చిట్లు ఇచ్చిందని విమర్శలు వచ్చాయి. టి.ఎన్. శేషన్ ఎన్నికల కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం అంటే ఏమిటో చేసి చూపించారు. ఒక్క అధికారి మాత్రమే ఎన్నికల కమిషనర్గా ఉండి అధికారాలు వినియోగిస్తే ప్రమాదకర పరిణామాలు ఎదురౌతాయని భావించి ఎన్నికల కమిషన్లో అనేకమంది కమిషనర్లను నియమించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. ఏక సభ్య సంఘంగా ఉన్న ఈసీని త్రిసభ్య సంఘంగా మార్చారు. ఒక వ్యక్తి ఒంటెద్దు పోకడలు పోకుండా అదుపు చేయడం కోసం ఈ సవరణ చేశారని చెప్పుకున్నారు. బీజేపీ పాలనలో ప్రతి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించారనే విమర్శలు సర్వే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్కు రాజ్యాంగం ఉన్నతాధికారాలను కట్టబెట్టింది స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించడానికే. స్వతంత్రంగా నిష్పాక్షికంగా పనిచేయకపోతే ఆ అధికారాలు దుర్వినియోగం అవుతాయి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఎక్కడి దొరలు అక్కడే గప్చుప్
అయినా మన పిచ్చిగాని, తరగతి గదిలో చెప్పిందే కోర్టు హాల్లో జరుగుతుందా? ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీద చిన్న ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణ చేసినప్పటి నుంచి సహజ న్యాయసూత్రాలు, దర్యాప్తు విధివిధానాలు అని విమర్శలు వచ్చాయి. మూడు వ్యవస్థల్లో న్యాయవ్యవస్థలో మాత్రమే ఆరోపణ, విచారణ బహిరంగంగా జరుగుతాయి. కోర్టులలో సాక్ష్యాలను ఇరుపక్షాల సమక్షంలో జనం అందరూ చూస్తుండగా వింటారు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వారు ఒకరి సాక్షులను మరొకరు క్రాస్ చేస్తారు. నిందితుడికి తెలియకుండా అతని వ్యతిరేక సాక్షులను విచారించకూడదని, నిందితుడిని అరెస్టు చేయడం వెనుక లక్ష్యాలలో ఇది ప్రధానమైందని మేమంతా పాఠాలు చెబుతూ ఉంటాం. వాదాలు, ప్రతివాదాలు, తీర్పులు కూడా అందరిముందే. లైంగిక వేధింపుల ఆరోపణను విచారించడం ప్రాసి క్యూషన్ కాదు. డిపార్ట్మెంటల్ విచారణ వంటిది. దీనికి కూడా నియమాలు ఉన్నాయి. బహిరంగ విచారణ జరపాలని లేకపోయినా రహస్యంగా విచారణ జరపాలని ఎవరూ చెప్పలేదు. మహిళల మర్యాద కాపాడడం కోసం వారిమీద లైంగిక దాడులు, వేధింపుకేసుల విచారణను అందరిలో కాకుండా అవసరమైన వారి సమక్షంలో మాత్రమే నిర్వహిస్తారు. ఆమె కోర్టులో చిన్న ఉద్యోగిని. కానీ గురి పెట్టింది సామాన్యుడి మీద కాకుండా దేశంలోకెల్లా అత్యున్నత న్యాయమూర్తి పైన. నిజం వారిద్దరికే తెలియాలి. లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2013 ప్రకారం ఫిర్యాదును, అందులో భాగాలను పత్రికల్లో ప్రచురించడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా మీడియా వారికి, మూడో వ్యక్తికి ఇవ్వకూడదని ఉంది. రేప్ కేసులో తీర్పు రహస్యం కాదు. సాక్ష్యాల విశ్లేషణ కూడా దాచరు. మహిళల మర్యాదను కాపాడడానికి పేరు చెప్పకుండా మిగతా వివరాలు చర్చించే అవకాశం ఉండాలి. కానీ ఈ మర్యాద నియమం రహస్యాల చీకటికి దారితీస్తున్నది. కొన్ని కేసుల్లో నిందితుడికి కూడా ఫిర్యాదు ప్రతి ఇవ్వరు. ఈ కేసులో కూడా ఫిర్యాదు చేసిన మహిళా విభాగంలోని విచారణ కమిటీకి ఇచ్చి ఊరుకుంటే బయటపడి ఉండేది కాదేమో. ఆమె వెబ్సైట్లకు 22 పేజీల ప్రమాణ పత్రం రూపంలో ఫిర్యాదును ఇచ్చింది. అది అవాస్తవమనీ, కుట్ర అనీ íసీజేఐ తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్మాసనంలో కూచుని చెప్పారు. ఇది కూడా అందరిలో జరిగింది. తరువాత అన్నీ రహస్యాలే. విచారణ విధివిధానాలు రహస్యం. ఆమె లాయర్ కావాలని కోరినా వీల్లేదన్నారు. నాకు భయంగా ఉంది, నేను మీ విచారణలో పాల్గొనలేను అని వెళ్లిపోయింది. ఆమె పరోక్షంలో ఏకపక్షంగా విచారిస్తామన్నారు. సీజేఐ కమిటీ ముందుకు వెళ్లారు, ఏం చెప్పారో, వారు ఏం రాసుకున్నారో రహస్యం. సాక్ష్యాలు చెప్పేవారు ఆమెతో పాటు పనిచేసే చిన్న ఉద్యోగులే. ఆమె భర్త ఉద్యోగం, మరిది ఉద్యోగం కూడా పీకేయ తగిన విగా మారిపోయాయి. సాక్షులు కూడా చిన్నఉద్యోగులే కనుక భయపడి సాక్ష్యం ఇచ్చారో, అసలు ఇవ్వలేదో, ఇస్తే ఏం ఇచ్చారో తెలియదు. ఓ రోజు సీజేఐ నిర్దోషి అనీ, ఆరోపణలలో పస లేదని ప్రకటించారు. అంటే ఏమిటో వివరించలేదు. మైసూర్ నగరంలో ఒక సంఘటనలో కొందరు కర్ణాటక హైకోర్టు జడ్జీలు ఒక రకంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో ఒక కమిటీ ఎవరికైనా ఏ సమాచారమైనా తెలిస్తే చెప్పండి అని జడ్జీల సహచరుల నుంచి సమాచారం సేకరించి అసలేం జరగలేదని తేల్చుకున్నారనీ, సీజేఐ ఆ సమాచారం తన కోసం తెప్పించుకున్నా రనీ, అది దర్యాప్తు కాదని, కనుక ఆ నివేదిక బయటపెట్టలేమని ఆ కేసులో చెప్పారు. ఏమీ జరగలేదని తేలితే దాచాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగితే తదుపరి చర్యలు తీసుకోవడానికి అదేమిటో తెలియాలి. ఈ కేసులో ఇది ఒక స్పష్టమైన ఆరోపణ. సమాచారం సేకరించడం కాదు, ఇది విచారణ. సీజేఐ కోసం కాదు. సీజేఐ పైన. అయినా ఇవ్వరట. ఫిర్యాది లేకుండా విచారణ న్యాయం కాదు. మన పరువుపోతుంది అని జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ ఒక లేఖ రాశారన్నారు. వారు రాయలేదన్నారు. మిగతా న్యాయమూర్తులంతా సీజేఐని కలిసి మేం మీతో ఉన్నాం భయపడకండి అన్నారట. లేఖ రాశారా, రాస్తే జవాబిచ్చారా అదీ చెప్పరు. లా కాలేజిలో చదువుకున్న విద్యార్థులు లాయర్లుగా ఎదిగి కోర్టులో వాదిస్తారు. వారింకా ఎదిగి న్యాయాధికారులు, ఇంకా ఎదిగి హైకోర్టుకు, మరీ ఎదిగి సుప్రీంకోర్టుకు వెళ్తారు. తరగతి గదికి దూరంగా వెళ్లిపోతారు. దురదృష్టమేమంటే లా కాలే జీకే కాదు, లాకు.. రూల్ ఆఫ్ లాకు కూడా మరీ దూరమైపోతున్నారేమోనని భయం. విచారణ విధానాలు, సాక్ష్యాలు, సాక్ష్య విచారణ, తీర్పు కలిగి ఉన్న నివేదిక కూడా రహస్యం. ఇంతెందుకు ఫిర్యాదికి కూడా ఇవ్వకూడని రహస్యం నివేదిక ఎందుకట? అవన్నీ అడక్కండి... ఎక్కడి దొరలు అక్కడే గప్చుప్. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ -
కంచే చేను మేస్తే...
సుప్రీంకోర్టు తను నిర్ధా రించిన న్యాయసూత్రాలు తానే అమలు చేయాలి కదా. పనిచేసేచోట మహిళా ఉద్యోగినులపైన లైంగిక పరమైన వేధింపులు జీవన హక్కు, పనిచేసే హక్కును హరించడమే కాక పీనల్ కోడ్ నేరాలు కూడా అవుతాయని, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు భంగమనీ ఈ దుష్ప్రవర్తపై ఫిర్యాదు చేయడానికి వెసులు బాట్లు, ఒక కమిటీ ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం విశాఖ వర్సెస్ రాజస్తాన్ రాష్ట్రం (1997–6 ఎస్పీసీ 241)కేసులో నిర్దేశించింది. న్యాయమూర్తిపైనే ఆరోపణను ఎవరు విచారిస్తారనే ప్రశ్నకు జవాబులేదు. న్యాయమూర్తిని దర్యాప్తు చేసే ప్రత్యామ్నాయ వ్యవస్థా లేదు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిపైన 2014లో ఒక మహిళాజడ్జిగారు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది. పనిచేస్తున్న హైకోర్టు జడ్జిపైన ఫిర్యాదు రాగానే భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక నిష్పాక్షిక అంతర్గత దర్యాప్తు విధానాన్ని నిర్ధారించి అనుసరించాలని అడిషనల్ సెషన్స్ జడ్జి ‘ఎక్స్’ వర్సెస్ మధ్యప్రదేశ్ హైకోర్ట్ (2015– 4 ఎస్సీసీ 91) కేసులో సుప్రీంకోర్టు సూచించింది. అంతర్గత దర్యాప్తు విధానం (ఇన్ హౌస్ ప్రొసీజర్) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి.. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేయాలి. విచారణ ప్రక్రియను, విచారణ ఫలితాన్ని పర్యవేక్షించాలి. కేసు పూర్వాపరాలను బట్టి పక్షపాతం, అభిమానం, వ్యతిరేకతల నుంచి ఫిర్యాదికి రక్షణ కల్పించే విధంగా అంతర్గత విచారణా విధానాలను మార్చుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో సూత్రీకరించింది. 2013 లైంగిక వేధింపుల నిరోధ చట్టం (2013 చట్టం) సుప్రీంకోర్టు జడ్జిలకు మినహాయింపు ఇవ్వలేదు. లైంగిక నేరాల విచారణకు సుప్రీంకోర్టు రూపొందించిన (జీఎస్ ఐసీసీ) 2013 నియమావళి ప్రకారం ప్రధాన న్యాయమూర్తికే పూర్తి పర్యవేక్షణాధికారాలు ఉన్నాయి. విచారణ కమిటీ సభ్యుల ఎంపిక ఆయనేచేస్తారు, విచారణ ముగిసిన తరువాత సిఫార్సులను ఆయనకే సమర్పిస్తారు. ఆ నిర్ణయాలను తిరస్కరించడమో లేదా ఆమోదించడమో ఆయన విచక్షణకే వదిలేస్తారు. కానీ ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిపైనే ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు ఈ నియమావళి కింద ఇచ్చినది కాదు. కనుక అంతర్గత విచారణా విధానంగానీ, నియమావళి గానీ ఈ కేసులో పనిచేయకపోవచ్చు. ఏ విభాగంలోనైనా చిన్న ఉద్యోగి తనపై ఉన్నతాధికారి సాగించిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే పెద్దల ఆగ్రహానికి గురికావడం సహజం. కనుక ఈ ఫిర్యాదుల విచారణ కమిటీలో సభ్యురాలిగా ఉండడానికి తప్పనిసరిగా ఆ విభాగానికి చెందని, బయట మరో రంగం నుంచి ఒక నిష్పాక్షిక వ్యక్తిని, ఎంపిక చేయాలి. ఆమె లేకుండా జరిపే దర్యాప్తు చెల్లదని కూడా సుప్రీంకోర్టు వారే సెలవిచ్చారు. ఆరోపణకు గురైన అధికారి చెప్పుచేతల్లో పనిచేసే వారితో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తే ఆ దర్యాప్తు చెల్లదని ఎం. రాజేంద్రన్ వర్సెస్ డైసీరానీ అండ్ అదర్స్ (2018–3 ఎంఎల్జే 84) కేసులో మద్రాస్ హైకోర్టు పేర్కొంది. బాధిత మహిళను మరిన్ని వేధింపుల నుంచి రక్షిస్తూ నిందితుడిని బదిలీచేయాలి. ఆరోపణకు గురైన వ్యక్తి న్యాయ మూర్తి అయితే, సాక్షులపై ఆయనకు అధికార పరిధి ఉన్నట్టయితే, ఆయనను ఆ పరిధి నుంచి తప్పించాలని కూడా మధ్యప్రదేశ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు వివరించింది. ఇది సుప్రీంకోర్టుకు వర్తించదా? భారత ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసిన మహిళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు దర్యాప్తులో ఏప్రిల్ 26, 29 న హాజరైనారు. కమిటీ సభ్యులు వేసిన ప్రశ్నలు తనను అదరగొట్టాయన్నారు. తన ప్రకటన నమోదు చేసేటప్పుడు తనకు అండగా ఒక లాయర్నుగానీ, మిత్రుడినిగానీ అనుమతించలేదని, కమిటీ తనలో ఆందోళన బాధ కలిగిస్తున్నదని ప్రకటించారు. తనపై జరిగిన నేరానికి సాక్షులు ఉన్నారని, కానీ వారంతా సుప్రీంకోర్టు ఉద్యోగులే కనుక వారు నిర్భయంగా సాక్ష్యం చెప్పే అవకాశం లేదన్నారు. తాను మొదటిసారి హాజరైనప్పుడు మహిళా పోలీసులు తనను భయానకంగా, అవమానకరంగా సోదా జరిపారనీ, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు దృశ్యశ్రవణ చిత్రీకరణ కోరినా నిరాకరించారని, రికార్డు చేసిన తన వాంగ్మూ లం ప్రతి అడిగినా ఇవ్వలేదని ఆమె చెప్పారు. న్యాయమూర్తి తనతో మాట్లాడిన రెండు సెల్ నంబర్ల వాట్సాప్ కాల్ ఛాట్ వివరాలు, కాల్ రికార్డులు తెప్పిస్తే అవి కీలకమైన సాక్ష్యాలు అవుతాయని ఆమె అన్నారు. దర్యాప్తు ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేమని, దీని నివేదిక కూడా రహస్యమని జడ్జి బోబ్డే తనకు చెప్పారని ఆమె అన్నారు. ఇటువంటి దర్యాప్తులో పాల్గొనజాలనని ఆమె బయటకు వెళ్లిపోయారు. అయినా దర్యాప్తు కొనసాగుతున్నది. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా హాజరై తన వాదం వినిపించారు. ఒకవేళ ప్రతికూల నివేదిక వస్తే బాధితురాలు ఏ కోర్టుకు అప్పీలుకు వెళ్లాలో? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
బీజేపీ, కాంగ్రెస్ దొందూదొందే
పూర్తి మెజారిటీతో గెలిచినా, తక్కువ స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చున్నా, ఒకటి రెండు స్థానాల్లో గెలిచినా, లేకపోయినా తమకు ఓటు వేసినప్రతివాడికీ కృతజ్ఞతగా వారికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఆయా పార్టీలపైన ఉంది. తమ నెత్తినెక్కి అధికారం చెలాయించడానికి అయిదేళ్లపాటు అనుమతి ఇస్తున్న జనులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం పదవిలోకి వచ్చిన పార్టీ గురుతరమైన బాధ్యత. ఎక్కువ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీపైన ప్రధానమైన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ తన వాగ్దానం ప్రకారం విధానం రూపొందించి అందుకు తగిన చట్టం, ఉత్తర్వులు జారీ చేస్తే అదేరకమైన వాగ్దానం చేసిన ప్రతిపక్షపార్టీ దాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదు. వ్యతిరేకిస్తే అదీ వాగ్దానభంగం కిందే భావించాలి. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ‘‘సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి, నియమాలకు అనుగుణమైన చర్యలతో సమాచార హక్కును బలపరుస్తాం. సమాచార కమిషనర్లుగా కేవలం అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను, అర్హులైన వారిని ఎంపిక చేస్తా’’మని వాగ్దానం చేసింది. ఒకవేళ కాం గ్రెస్ స్వయంగానో, సంకీర్ణంగానో ప్రభుత్వం ఏర్పా టుచేస్తే ఆర్టీఐని బలోపేతం చేయడం వారి నైతిక బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఉండాలంటే ప్రభుత్వవిధానాలను తెలుసుకుని, విమర్శించే ప్రాథమికహక్కు ఆర్టికల్ 19(1)(ఎ)లో ఉంది. బీజేపీ తన వాగ్దాన పత్రంలో సమాచార హక్కు విషయంలో మౌనంగా ఉంది. కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారదర్శకమైన పాలన అందిస్తామని తమ ప్రసంగాల్లో పదే పదే ప్రకటించారు. ఒకవేళ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని నీరు కార్చబోదని దీని అర్థం. బీజేపీ పారదర్శక విధానాలు కనుక సమాచార హక్కు చట్టానికి అనుకూలంగా ఉంటే అందుకు అభ్యంతరం చెప్పకుండా సహకరించడం కాంగ్రెస్ బాధ్యత. బీజేపీ కాకుండా కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఆ పార్టీపైన ఆర్టీఐని బలపరుస్తామన్న వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత ఉంటుంది. 2005లో సమాచార హక్కు చట్టం రావడం ఒక గణనీయమైన మార్పు. యశ్వంత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సమాచార హక్కు స్థాయిని పెంచే అపూర్వమైన తీర్పు ఏప్రిల్ 10న ఇచ్చింది. రక్షణ ఆయుధాలు పరికరాల కొనుగోలులో అధికార రహస్యాల రక్షణకన్నా పారదర్శకతా నియమాలకు ప్రాధాన్యం ఉంటుం దని ఈ తీర్పు సారాంశం. బీజేపీ మీద అభిమానంతోనో, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనో ఈ అంశాన్ని పరిశీలించకూడదు. సోషల్ మీడియాలో తమ అభిమాన నాయకుడికి ప్రతికూలంగా వచ్చే అభిప్రాయాలపై∙బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం, బండబూతులు తిట్టే స్వేచ్ఛ స్వాతంత్య్రం రోజూ వ్యక్తమవుతూనే ఉంది. అది పౌరుల బాధ్యతారాహిత్యం అవుతుంది. మరో పక్షంలో ఉండే నేత ఏం చెప్పినా అవహేళన చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి అతీతంగా వాగ్దానాలను అమలు చేసే బాధ్యతను అన్ని పార్టీలపైనా ఉంచి, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా ఆ బాధ్యత వారిపైన విధించేందుకు విధివిధానాలను రూపొందించాలి. సమాచార హక్కు చట్టం పరిథిలోకి ఆరు ప్రధాన పార్టీలను తెస్తూ కేంద్ర సమాచార కమిషన్ 2013లో చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ పన్నురూపంలో ప్రజలకు చెందవలసిన కొన్నివందల కోట్ల రూపాయలు చెల్లించనవసరం లేదు. కనుక ఆ మేరకు ప్రభుత్వం ద్వారా ప్రజాధనం పొందుతున్నట్టే భావించి జవాబుదారీగా ఉండాలని కమిషన్ నిర్ధారించింది. ఈ తీర్పుపై ఏ కోర్టూ స్టే ఇవ్వలేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఎవరూ సవాలు చేయలేదు. మిగిలిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలని కోరుతూ సుప్రీంకోర్టు ముందు ఎ.డి.ఆర్, సుభాష్ చంద్ర అగ్రవాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. ఆర్టీఐ చట్టం పరిధిలోకి రావడం వారికి ఇష్టం లేదు. ఇతర పార్టీలదీ అదేదారి. అధికారంలోఉన్నప్పుడు రాజకీయ పార్టీలను ఆర్టీఐ నుంచి తప్పించడానికి కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేసి విరమించుకున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని నీరుగార్చడానికి అనేక ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. ఆ ధోరణి మారుతుందనే ఆశలు కూడా లేవు. వీరి పారదర్శక వాగ్దానాలు అమలవుతాయా? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ప్రభువుల రహస్యాలపై ప్రజావిజయం
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోల్మాల్ ఆరోపణలపైన సమరం ఇది. ఈ ఒప్పందం గందరగోళంపై దర్యాప్తుకు ఆదేశించాలని బీజేపీ సీనియర్ నాయ కులు, మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును కోరారు. అందుకు కారణాలేమీ లేవని సుప్రీంకోర్టు డిసెంబర్ 2018లో కొట్టేసింది. రఫేల్ కొనుగోలు కోసం బేరసారాలు దారి తప్పాయని తెలిపే మూడు కీలకమైన పత్రాలు పత్రికల్లో బయటపడ్డాయి. వెల్లడయిన రక్షణ కొనుగోలు దస్తావేజులు చూపుతూ పిటిషనర్లు సుప్రీం కోర్టు తీర్పును మరోసారి పరిశీలించాలని రివ్యూ పిటి షన్ వేశారు. సుప్రీంకోర్టు ముందుకు కొన్ని కీలకమైన పత్రాలను ప్రభుత్వం తీసుకురాలేదని వాదించారు. అందుకు ఆధారాలుగా ఈ పత్రాలను చూపారు. కీలకమైన ఒప్పందంలో అత్యంత కీలకమైన రహస్య పత్రాలను దొంగిలించడం నేరమని, ఆ పత్రాలను ప్రచురించిన పాత్రికేయులను, ఆ పత్రాల ఆధారంగా పిటిషన్ వేసిన లాయర్లను క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని అటార్నీ జనరల్ కె. వేణుగోపాల్ కోర్టులో చెప్పడం సంచలనం కలిగించింది. తరువాత పాత్రికేయులను, న్యాయవాదులను ప్రాసిక్యూట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అటార్నీ జనరల్ ప్రకటించారు. మరికొన్నాళ్లకు తమ రహస్య దస్తావేజులన్నీ భద్రంగా ఉన్నాయని వాటినెవరూ దొంగిలించలేదని మరో వివరణ ఇచ్చారాయన. కానీ అత్యంత రహస్య పత్రాలను కాపీ చేయడం, లీక్ చేయడం నేరాలే అని అందుకు కారణమైన వారిపై దర్యాప్తు జరిపిస్తామని హెచ్చరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ పక్షాన వాదిస్తూ అధికార రహస్యాల చట్టం, సాక్ష్య చట్టం ప్రకారం అక్రమ రహస్య పత్రాలు సాక్ష్యాలే కాబోవని, ఈ రహస్య పత్రాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని, అక్రమంగా సంపాదించిన ఈ పత్రా లను పరిశీలించే అధికారం కోర్టులకు కూడా లేదని అటార్నీ జనరల్ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, సంజయ్ కిషన్ కౌల్, కెం.ఎం. జోసెఫ్ వాటిని కొట్టివేస్తూ, పత్రికా స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును నిలబెడుతూ ఏప్రిల్ 10న ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. పత్రికలు ఇటువంటి పత్రాలు ప్రచురించకుండా నిషేధించాలని ప్రభుత్వం కోరింది. కానీ, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పత్రికాస్వాతంత్య్రాన్ని అరికట్టే విధానమని, అది సంవిధానానికి విరుద్ధమని కొట్టివేసింది. సాక్ష్య చట్టం సెక్షన్ 123 ప్రకారం ప్రభుత్వం ప్రచురించని పత్రాలను ఆ శాఖ అధినేత అనుమతి లేకుండా సాక్ష్యంగా కోర్టులు పరిశీలించడానికి వీల్లే దని అటార్నీ జనరల్ మరో లా పాయింట్ లేవదీసారు. ఈ పత్రాలు ఇదివరకే హిందూ తదితర పత్రికల్లో ప్రచురితమైన తరువాత వీటిని అప్రచురిత పత్రాలని ఏవిధంగా అంటారు? మొత్తం ప్రజానీకానికి తెలిసిన పత్రాలను రహస్యాలని ఎలా అంటా రని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రివిలేజ్ కింద ఈ పత్రాలను దాచుకోవాలనుకోవడం కూడా చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ఇంకా ఈ రహస్యాలకు ఏ విలువ ఉందనేది ప్రశ్న. ప్రభుత్వ పాలనకు కొన్ని రహస్యాలు అవసరమని, వాటిని వెల్లడిస్తే ప్రభుత్వాలను ప్రజలు అనవసరంగా విమర్శిస్తూ ఉంటారని అందువల్ల పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రభుత్వ వాదన. ప్రభుత్వపాలనకు కొన్ని రహస్యాలను కాపాడడం అవసరమైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే ప్రజల హక్కు కూడా ముఖ్యమే. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యాన్ని సాధించడానికే సమాచార హక్కు చట్టం ఉపయోగించాలని ఆ చట్టం పీఠిక వివరిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సెక్షన్ 8(1)ఎ ప్రకారం సమాచారం వెల్లడిస్తే భారత భద్రతకు, సమగ్రతకు, విదేశీ స్నేహసంబంధాలకు హాని కలుగుతుందని భావిస్తే సమాచారం ఇవ్వాల్సిన పని లేదు. కానీ సెక్షన్ 8(2) ప్రకారం ప్రజాప్రయోజనాన్ని పరిశీ లించి, సమాచారం వెల్లడిస్తే వచ్చే ప్రయోజనం, దాచడంవల్ల కలిగే హానికన్నా అధికమైతే వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 22 ప్రకారం రహస్యాల చట్టంగానీ, మరే ఇతర చట్టంగానీ సమాచార హక్కు చట్ట నియమాలకు విరుద్ధమయితే ఆ మేరకు సమాచార హక్కు చట్టమే చెల్లుతుందని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఐబి, రా వంటి కొన్ని సంస్థలను సమాచార హక్కు చట్టం కిందనుంచి పూర్తిగా తప్పించిన సెక్షన్ 24లో కూడా రెండు మినహాయింపు లున్నాయి. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని, మానవహక్కుల ఉల్లంఘన సమాచారాన్ని ఆ సంస్థలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కనుక వెల్లడిపై ఆంక్షలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రభువుల రహస్యాల మీద ప్రజా విజయం. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మాజీ సేవకులే, తాజా కమిషనర్లా?
సమాచార కమిషనర్ల నియామకంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తాపీగా, నింపాదిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు గుర్తిం చింది. కమిషనర్లను నియమించకపోవడం, ఉన్న వారు పదవీ విరమణ చేసిన తరువాతైనా కొత్తగా నియామకాలు చేయకపోవడం, మాజీ ప్రభుత్వోద్యోగులను నియమించడమే ప్రభుత్వాలు సమాచార హక్కును నీరుగార్చడానికి పన్నే వ్యూహాలు. కాలపరిమితుల్లో ఫైళ్ల సమాచారాన్ని పౌరులకు ఇప్పించడానికి రూపొందిన ఆర్టీఐ చట్టం కమిషనర్లు లేకుండా సాగదు. పౌరులు అడిగిన సమాచారాన్ని కమిషనర్లు ఇప్పించడంతో పాలకుల సంగతులన్నీ జనాలకు తెలియడం మొదలైంది. జనం ఏమడుగుతారో, ఏం ఇవ్వాల్సి వస్తుందో అని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వారిపై రాజకీయ నాయకులు ఆందోళన చెందడం కూడా పెరి గిపోయింది. దీనివల్ల జనం చైతన్యవంతులవుతున్నారనీ, తప్పులు చేయదలుచుకున్న అధికారులు, ఉద్యోగులు భయపడడం వల్ల అవినీతి తగ్గుతుందని తెలిసినా కమిషనర్లను నియమించడానికి ప్రభుత్వాలు కదలడమే లేదు. ఆర్టీఐ ప్రియులు కోర్టులను ఆశ్రయించి ప్రజాప్రయోజన వాజ్యాలు వేస్తే, దానిపై కోర్టులు నోటీసులు ఇచ్చి నాలుగు అక్షింతలు వేస్తే తప్ప నియామకాల ఫైళ్లు కదలడం లేదు. ఒక్క కేంద్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. కేంద్రంలో ఉన్నంత కదలిక రాష్ట్రాలలో లేకపోవడం దురదృష్టకరం. వెంట వెంటనే నియామకాలు పూర్తి చేయమంటూ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న ఒక గణనీయమైన తీర్పు చెప్పింది. ఏపీ, తెలంగాణతో ఏడు రాష్ట్రాలు వెంటనే పారదర్శకంగా కమిషనర్ల నియామకాలు చేపట్టాలని సుప్రీం సూచించింది. నియామకాలు జరిగిన చోట పరిశీలిస్తే అందరూ మాజీ అధికారులే. ప్రభుత్వ సేవకులనే ప్రభుత్వం కమిషనర్లుగా నియమించడం ఎందుకనీ, మిగతా రంగాలలో మీకు సుప్రసిద్ధులైన వ్యక్తులే దొరకలేదా అనీ నిలదీసింది. ఆర్టీఐ చట్టం సెక్షన్ 12(5)లో ఎనిమిది రకాల వృత్తి ఉద్యోగరంగాలను పేర్కొంటూ అందులో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయాలని ఆదేశిస్తున్నా, కేవలం ఉద్యోగులనే నియమిస్తున్నారు. ‘తమ అధీనంలో పనిచేసిన మాజీ అధికారులనే కమిషనర్లుగా నియమించడంలో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నదని’ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎ కె సిక్రీ, ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఏపీతో సహా చాలా రాష్ట్రాల్లో చీఫ్ కమిషనర్ లేనే లేరు. తెలంగాణలో చీఫ్, ఒక కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు కమిషనర్లను నియమించారు కానీ వారి పని ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో 2019 జనవరి 23 నాటికి పది వేల 102 అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. 2017 అక్టోబర్ 23 నుంచి 2019 జనవరి 23 వరకు దాఖలైన అప్పీల్స్లో 65 శాతం వినడం పూర్తయింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి చీఫ్తోపాటు ఒక కమిషనర్ పనిచేస్తున్నారు. ఈ కమిషనర్ల సంఖ్య సరిపోదు, చాలా తక్కువ అని సుప్రీంకోర్టు విమర్శించింది. కమిషనర్ల నియామకం కాకముందే 6,825 కేసులు ఉన్నాయి. తరువాత పదివేలకు పెరి గాయి. ఈ ఇద్దరు కమిషనర్లు ఎన్నేళ్లు వింటే ఈ కేసులు ముగుస్తాయి? జనానికి ఎప్పుడు సమాచారం ఇస్తారు? తెలంగాణ కమిషన్లో మిగతా ఖాళీలు ఆర్నెల్లలో పూరించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణం. అడిగిన సమాచారం ఇవ్వడం ఎందుకు, రెండో అప్పీలు వినడానికి కమిషనే లేదు. కమిషన్ వేసినా పని మొదలు కాలేదు. ఆ తరువాత మన కేసు కొన్నేళ్లదాకా రాదు. అయినా మన బాస్లే అక్కడ కమిషనర్లు కనుక పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదులే అనే నిర్లక్ష్య వైఖరి అక్కడ నెలకొంది. 2014లో రాష్ట్రవిభజన తరువాత సొంతంగా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఊసే ఎత్తరు. ఉమ్మడి రాష్ట్రం కమిషనర్లలో కొందరు రిటైరయినారు. కొందరి నియామకం రద్దయింది. తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇద్దరిని నియమించుకున్నది. ఏపీలో కమిషనే లేదు. ఈ హక్కు లేకుండానే రెండేళ్లు గడిపింది ఏపీ సర్కార్. హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు పడిన తరువాత ఇటీవల ముగ్గురిని ఎంపిక చేశారు. వారికి నియామక పత్రాలు ఇవ్వడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తరువాత నెలలు గడిచినా వారికి కార్యాలయమైనా ఉందా? కేసుల విచారణ చేపట్టారా? అనుమానమే. చీఫ్ కమిషనర్, ఇంకొందరు కమిషనర్ల ఎంపికకు చర్యలే తీసుకోవడం లేదేమిటి అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. మూడు నెలల్లో చీఫ్ను నియమించండి, కమిషన్ ఖాళీలను పూరించండి అని సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నీతిని అణిచేస్తున్న రాజనీతి
అవినీతిని, భ్రష్టాచారాన్ని, లంచగొండితనాన్ని నిజంగా వ్యతిరేకించే వారెవరయినా ఉన్నారా అని అనుమానం వస్తున్నది. లంచాలు తీసుకునే అధికారులు పెరిగితే నీతివంతుడే వారికి శత్రువు. పగబట్టి నీతివంతుడిని వేధించే పనిలో ముందుండేది ప్రభుత్వమే. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో తమ ఉద్యోగులమీద, అధికారుల మీద ప్రభుత్వం కేసులు నడుపుతున్నది. అన్యాయంగా సస్పెండ్ చేస్తారు. ఉద్యోగి విధిలేక కాట్ న్యాయం అర్థిస్తాడు. అక్కడ న్యాయం దొరికితే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటుంది. హైకోర్టులో గెలిచినా అతనికి న్యాయం దక్కనివ్వకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. తన వద్ద ఉన్న పెద్ద పెద్ద లాయర్లకు ప్రజల డబ్బు ఫీజుగా చెల్లిస్తూ చిరుద్యోగిమీద సుప్రీం సమరం సాగిస్తుంది. సివిల్ సర్వీసులో ఉద్యోగం దొరికితే నీతివంతంగా పనిచేయాలని చిత్తశుద్ధితో అనుకున్నాడొక యువకుడు. ఇండియన్ ఫారెస్టు సర్వీసులో దొరి కింది. ఫైళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న అవినీతిని చూసీచూడనట్టు ఉండటం తెలివైన మేనేజ్ మెంట్, దానికి బదులు చట్టం ప్రకారం చర్య తీసుకోవడం పిచ్చి కింద లెక్క. కనిపిస్తున్న తప్పులన్నింటి మీద కేసులు పెట్టడం ఒక మానసిక వ్యాధి అని ప్రస్తుతం జనం నమ్ముతుంటారు. ఆ అధికారి సంజయ్ చతుర్వేది. తన ముందుకు వచ్చిన కలప రక్షణ ఫైళ్ళలో అక్రమాలు, లంచాలు బయటపడ్డాయి. కేసులు పెట్టారు. అందులో పై అధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. వారందరికీ కోపం వచ్చింది. ఈ అధికారి మీద తప్పుడు కేసులు సృష్టించారు. సస్పెండు చేశారు. బదిలీలతో పాటు అరెస్టు దాకా వెళ్లే ప్రమాదం ఉండటంతో మంత్రిగారికి మొర పెట్టుకున్నారు. అప్పుడు పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేశ్కు కేసులో నిజానిజాలు అర్థమై, దర్యాప్తుచేయమని ఇంటెలిజెన్స్ బ్యూరోని ఆదేశించారు. ఈ యువ అధికారి పెట్టిన కేసులన్నీ వాస్తవాలనీ, ఆయనమీద పెట్టినవన్నీ తప్పుడు కేసులని నిర్ధారించారు. కానీ ఆ నివేదిక ప్రతిని ఆయనకు ఇవ్వడం లేదు. అది రహస్యమట. చివరకు ఆ సమాచారం ఇవ్వాలని కమిషన్ తీర్పుచెప్పింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వం పక్షాన పెద్ద లాయరుగారు దిగారు. ఇటువైపు ఒంటరిగా ఈ మధ్యతరగతి నీతివంతుడైన అధికారి, అంటే డబ్బులు విపరీతంగా లేని వాడని అర్థం. అయినా తనే సొంతంగా వాదించాడు. డిల్లీ హైకోర్టు కరుణించి న్యాయంగా తీర్పు చెప్పి ఆ సమాచారం ఇమ్మని ఆదేశించింది. కానీ హోంమంత్రిత్వశాఖ ఇంకా పెద్ద లాయర్ను రంగంలోకి దించి పెద్ద కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి ముందుకు వెళ్లింది. ప్రభుత్వం ఇలా నీతిపైన పోరాడుతూ ఉంటుంది. ఐదేళ్ల నుంచి సంజయ్ చతుర్వేదికి వార్షిక కార్య సమీక్షా నివేదికల్లో అత్యున్నత తరగతినిచ్చారు పైఅధికారులు. ఆరో సంవత్సరం 2014–15లో ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు. ఆయన పని అక్రమార్జకుల పని పట్టడమే. పెద్దపెద్ద డాక్టర్లతో సహా అనేక మంది పెద్దల అక్రమాలు ఆయన దృష్టికి రావడం, ఆయన కేసులు పెట్టడం జరిగిపోయింది. దాంతో పైఅధికారులు, ఆపైన ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాగారు 2014–సంవత్సరం పనితీరుకు శూన్యం మార్కులు ఇచ్చారు. మధ్యలో సున్నావల్ల ఆయనకు ఉద్యోగంలో పైపదవికి వెళ్లేందుకు వీలుండదు. కనుక పునఃసమీక్షించాలని కోరాడు. హైకోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇటువంటి ఎన్నో కేసుల్లో ఎందరికో న్యాయం చేసిన హైకోర్టు ఈయన గారి కేసులో మాత్రం కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు వెళ్లమని ఉత్తర్వు జారీ చేసింది. ఆయన నైనిటాల్లోని కాట్ బెంచ్కు విన్నవించుకున్నాడు. సెప్టెంబర్ 2017లో తీర్పు ఇస్తూ చతుర్వేదికి మంత్రిగారిచ్చిన సున్నాను పరగణించరాదని కాట్ ఇద్దరు సభ్యుల బెంచి ఆదేశించింది. దానిపైన ప్రభుత్వం వారు డిల్లీలోని కాట్ చైర్పర్సన్ ముందు అప్పీలు చేసుకున్నారు. వారు నైనిటాల్ కాట్ ఉత్తర్వు మీద స్టే జారీ చేశారు. మళ్లీ చతుర్వేది ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లక తప్పని స్థితి. ప్రభుత్వం అనవసరంగా వేధిస్తున్నందుకు పాతిక వేల రూపాయలను ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది. అయినా, కాట్ అధ్యక్షుడే న్యాయమైన తీర్పు ఇచ్చా రని, హైకోర్టే తీవ్ర అన్యాయం చేసిందని వాదిస్తూ ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకు వెళ్లింది కేంద్ర ప్రభుత్వం. అంతా విన్న ధర్మాసనం కాట్ తీర్పును కొట్టివేస్తూ, నీతివంతుడైన అధికారిని వేధించే ఈ ప్రభుత్వం మరో పాతిక వేలు ఖర్చులు చెల్లించాలని ఫిబ్రవరి 1న ఆదేశించింది. విచిత్రం ఏమంటే నీతివంతుడైన అధికారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఆయన పెట్టిన కేసులను తొక్కిపెట్టడమే. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?
అవినీతికి వ్యతిరేకమని చెప్పుకునే అధికార పార్టీ బీజేపీ శారదా మోసాల్లో తన పాత్రకు జవాబు చెప్పుకోవలసిన స్థితి ఏర్పడింది. శారదా గ్రూప్ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడ్డాయి. రెండు, మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించి ఈ గ్రూప్ జనాన్ని ముంచింది. 1920 కాలంలో చార్లెస్ పొంజీ అనే అతి తెలివైన మోసగాడు పెట్టుబడులు ఆకర్షించడానికి పెద్ద వడ్డీ ఆశ చూపడం, వచ్చిన డబ్బుతో పాత డిపాజిటర్లకు లాభాలు చూపి, కొత్త డిపాజిటర్లలో ఆశలు రేపడం, లాభాలు వస్తాయని నమ్మించడం, ఇంకా డిపాజిట్లు వసూలుచేసి చేతులు ఎత్తేసే మోసాలకు పాల్పడ టంతో వీటిని పొంజీ స్కీం అని పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ మోసం బయటపడగానే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. ఇదొక భీకర ఆర్థిక లావాదేవీల గందర గోళం. ఇందులో దర్యాప్తు చేయవలసింది కేవలం పోలీసు మాత్రమే కాదు, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సెబీ, ఆర్బీఐ వంటి కేంద్ర సంస్థలు కూడా. ఆర్థిక సేవలను, మౌలిక వనరుల యాజమాన్యం, ఆటోమొబైల్ రంగం, ఉత్పత్తి రంగాలలో సేవలందిస్తామని చెప్పుకుంటూ శారదా గ్రూప్ డిపాజిట్ల వసూలు కార్యక్రమం మొదలుపెట్టింది. సుదీప్తోసేన్ ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టరూ చైర్మన్ కూడా. సేన్తోపాటు మరో నిందితుడు దేబ్జానీ ముఖర్జీ పారిపోయారు. రాజీవ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటయిన ప్రత్యేక పరిశోధక బృందం వీరిద్దరినీ పట్టివేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ను కూడా సిట్ అరెస్టు చేసింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, మమతా బెనర్జీ సన్నిహితులైన మదన్ మిత్రా, రజత్ మజుందార్లను సిట్ అరెస్టు చేసింది. అధికార పార్టీఎమ్మెల్యేను అరెస్టు చేసి సిట్ నిష్పాక్షికతను చాటింది. ఈ మోసం అస్సాం, త్రిపుర ఒడిశా రాష్ట్రాల ప్రజలను కూడా ముంచేసిన విషయం 2014లో సుప్రీంకోర్టు పరిశీలించి శారదా ఆర్థిక కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగిస్తున్న సిట్ను మొత్తం పత్రాలు సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. వారు అప్పగించారు కూడా. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, ఆరోపిస్తూ శారదా గ్రూప్ సొంతదారులు టీ ఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తే 2013లో ఆయన్ను అరెస్టు చేశారు. కొన్ని గంటల్లోనే కునాల్ ఘోష్ ఈ కుంభకోణంలో ముకుల్ రాయ్తోసహా 12మంది ఉన్నారంటూ తీవ్ర ప్రత్యారోపణలు చేశారు. ముకుల్ రాయ్ ఇంటిపైన, ఆయన భార్య నడిపే న్యూస్ చానెల్పైన అప్పుడు సీబీఐ దాడులు జరిపింది. నవంబర్ 26, 2014న ఆయన్ను ప్రశ్నించింది. అరెస్టు కూడా చేసింది. అస్సాంలో తన వ్యాపారం సాగడానికి నెలకు 20 లక్షల రూపాయలను శారదా చైర్మన్ సుదీప్తోసేన్కు ఇచ్చినట్టు ముకుల్సేన్ మీద ఉన్న ఆరోపణ. అస్సాంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, మీడియా బారన్లు తమ నుంచి డబ్బు వసూళ్లు చేసేవారని ముకుల్ రాయ్ ప్రత్యారోపణ చేశారు. వసూళ్లు చేసిన వారి పేర్లు కూడా ఆయన ఉత్తరంలో సీబీఐకి వెల్లడించారు. ముకుల్ రాయ్ తృణమూల్ వదిలి తమ పార్టీలో చేరాలని 2015 నుంచి బీజేపీ ముకుల్రాయ్తో సంప్రదింపులు మొదలు పెట్టింది. మమతా బెనర్జీకి ఆయన చాలా సన్నిహితుడు. ఆమె తరువాత స్థాయి నాయకుడని పేరు. నవంబర్ 3, 2017న చివరకు ఆయన బీజేపీలో చేరవలసి వచ్చిందో చేర్పించుకున్నారో మనం ఊహించవచ్చు. సుదీప్తో సేన్ డ్రైవర్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ముకుల్ రాయ్ చేసిన మహత్కార్యాలు ఎన్నో వెల్లడయ్యాయి. సుదీప్తోసేన్ కోల్కతా నుంచి పారిపోవడానికి ముకుల్ ఎంతో సాయం చేశారట. అస్సాం కాంగ్రెస్కు చెందిన మరో నాయకుడు హిమంత బిస్వాశర్మ కూడా ఫిరాయించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరు బీజేపీలో చేరిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసును విచారించడంలో అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. కేసు మూలన పడింది. హిమంత బిస్వాశర్మ బీజేపీలో చేరి శుద్ధి పొందినందునే చార్జిషీటులో నిందితుడు కాలేదని విమర్శిస్తే తప్పా? ప్రధాన నిందితుడైన సుదీప్తో సేన్ పారిపోవడానికి సహకరించిన ముకుల్ రాయ్ను సీబీఐ దర్యాప్తు జరుపుతున్న దశలో ఎందుకు చేర్చు కున్నట్టు? శారదా కుంభకోణానికి సహకరించినట్టు ఆరోపితులైన వారు బీజేపీలోచేరిన తరువాత సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆలస్యమయింది? శారదా దర్యాప్తును ఆటంకపరిచింది తృణమూల్ ప్రభువులా, బీజేపీ చక్రవర్తులా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ -
మాజీ అధికారులకే అందలం
‘‘మీకు మాజీ అధికా రులు తప్ప మరెవరూ కేంద్ర సమాచార కమిషనర్ పదవికి అర్హులుగా కనిపించడం లేదా?’’ అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంజలీ భరద్వాజ్ సీఐసీ నియామకాలపై దాఖలుచేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ఇదే విషయాన్ని అనేకమంది ఆర్టీఐ కార్యకర్తలు, మాజీ కమిషనర్లు, ఈ రచయితతో సహా అడిగినా పట్టించుకున్న నాథుడు లేడు. రాష్ట్రపతికి లేఖ రాస్తే చదివినవారు లేరు. అసలు కదలికే లేదు. కమడోర్ లోకేశ్ బత్రా, అంజలీ భరద్వాజ్, అమ్రితా జోహ్రీ ఆర్టీఐ అభ్యర్థనలపై ప్రభుత్వం కొన్ని పత్రాలను వెల్లడిచేసింది. ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా వ్యవహరించిందని తేలింది. అన్వేషణ సంఘం ఎంపిక బృందానికి పంపినవి 14 మంది పేర్లు. అందులో 13 మంది మాజీ ప్రభుత్వ అధికారులవి, ఒక్క పేరు మాత్రం మాజీ హైకోర్టు న్యాయమూర్తిది. అంజలీ తరఫు న్యాయవాది అసలు దరఖాస్తులు పంపుకోకపోయినా ఇద్దరినీ పరిగణిం చారని చెప్పారు. సురేశ్చంద్ర, అమీసింగ్ ల్యూఖామ్ ఈ పదవికోసం దరఖాస్తులు పెట్టుకోలేదని వెల్లడైంది. కానీ వారిపేర్లు తుదిపరిశీలనకు వెళ్లడం, సురేశ్ చంద్ర నియమితులు కావడం తెలిసిందే. న్యాయమూర్తులు ఎ.కె. సిక్రీ, ఎస్. అబ్దుల్ నజీర్... ‘‘మేము మా అనుభవంతో చెబుతున్నాం. విభిన్న ట్రిబ్యునళ్ల పాలక సభ్యులుగా ఎందరో అధికారు లను మేము ఇంటర్వూ్య చేస్తూ ఉంటాం. వారిలో సాధారణంగా ఒక అభిప్రాయం నెలకొని ఉంటుంది. బ్యూరోక్రాట్లు మాత్రమే ఉత్తములని వారు అనుకొంటూ ఉంటారు. చాలా కాలం పాలనా రంగంలో ఉండటం వల్ల వారికి విస్తారమైన అనుభవం ఉందనడంలో సందేహం లేదు. కాని మిగతా రంగాలలో సుప్రసిద్ధులైన వారు ఒక్కరు కూడా సమాచార కమిషనర్ పదవికి పనికి వస్తారని ప్రభుత్వం వారికి కనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతున్నది’’ అని వ్యాఖ్యానించారు. ఏం చెప్పమంటారు? కేంద్రం అయినా రాష్ట్రా లలో అయినా సరే సమాచార కమిషనర్ పదవికి మాజీ అధికారులను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఆ ఎంపిక విధానంలో కూడా అంత దాపరికం ఎందుకో అర్థం కాదు. దాపరికంలేని పారదర్శక పాలనను ప్రోత్సహించవలసిన బాధ్యత చట్ట పరంగా నిర్వహించవలసిన సమాచార కమిషనర్ల ఎంపికలోనే లేకపోతే సమాచార హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేదెవరు? కమిషనర్ పదవికి దరఖాస్తులు పంపుకోవా లని నోటిఫికేషన్లు ప్రచురించేందుకు వేలాది రూపాయల ప్రజాధనం చెల్లిస్తారు. ఆ ప్రకటనలు లోపాలతో ఉంటాయి. కమిషనర్ పదవీకాలం ఎంతో చెప్పరు. జీత భత్యాల గురించి తరువాత చెబుతాం అంటారు. స్థాయి హోదా జీతం తెలియని పదవికి చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోకపోవచ్చు. ఆర్టీఐ చట్టం కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషనర్ హోదాతో సమంగా ఉంటుందని స్పష్టంగా తెలియజేసినా, సర్కారు వారు తమ ఇష్టానుసారం íసీఐసీ హోదాను జీతాన్ని మార్చడానికి వీలుగా చట్టాన్ని సవరించాలనుకుంటున్నారు. అందువల్ల చట్టం నీరుగారిపోయినా, సమాచారం జనానికి అందకుండా పోయినా ఫరవాలేదన్నట్టు, అదే కావాలన్నట్టు వ్యవహరిస్తున్నారనడానికి ఇటీవలి నియామకాలే సాక్ష్యం. ఆగస్టు 27, 2018నాడు సుప్రీంకోర్టుకు కేంద్రం ఒక అఫిడవిట్ను సమర్పించింది. వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారిని ఎంపిక చేయడానికి కొన్ని పద్ధతులను రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. తీరా మినిట్స్ చూస్తే.. అడిగిన వారిని పక్కన పెట్టి, ఏ పద్దతీ లేకుండా అడగని వారికి కూడా పదవి ఇవ్వాలని వీరు ప్రతిపాదించారు. సురేశ్చంద్ర దర ఖాస్తు చేసుకోకపోయినా అన్వేషణ సంఘం ఆయ నను ఎంపిక చేసింది. ఆ ఎంపిక ఆధారంగా ఆయన కమిషనర్గా నియమితులైనారని కోర్టుకు విన్నవించారు. ఆర్టీఐ చట్టం అమలులో ఉన్నా, ప్రజలకు అడిగిన సమాచారం ఇవ్వకుండా దాచడానికి వీలుగా నియామకాల సమయంలోనే విధేయులైన మాజీ అధికారులను నియమిస్తే, రాబోయే కాలంలో సమాచారం వెల్లడవకపోయే అవకాశం ఉందని సమాచార హక్కు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సంకీర్ణం స్థానంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన కమిషనర్ ఎంపిక విషయంలో భిన్నమైన ధోరణిని అనుసరించింది. పనిచేస్తున్న కమిషనర్లలో సీనియర్ను ప్రధాన కమిషనర్గా నియమించలేదు. దాదాపు ఏడాది పాటు చీఫ్ కమిషనర్ లేనే లేడు. ఈ సంప్రదాయాన్ని కాదని సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ను చీఫ్ కమిషనర్గా నియమించకుండా, కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుని సీనియర్ కమిషనర్ సుధీర్ భార్గవ్ను చీఫ్గా నియమించారు. ఇందువల్ల ఒక జూనియర్ కమిషనర్ కింద పనిచేసే ఇబ్బంది ఆయనకు తప్పింది. ఆజాద్కు ఆ సౌకర్యం నిరాకరించారు. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ (madabhushi.sridhar@gmail.com) -
సీబీఐని చుట్టుముట్టిన ఆ రహస్యాలు ఏమిటి?
సీబీఐ డైరెక్టర్ పదవినుంచి ఆలోక్ వర్మను బదిలీ చేయడం అంటే తొలగించడమనే అర్థం. అర్ధరాత్రి హఠాత్తుగా ఆలోక్ వర్మను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, సీబీఐ చట్టం కింద కాకుండా నియామకాలు, తొలగింపుల కోసం ఏర్పాటయిన అత్యున్నత అధికార కమిటీకి మాత్రమే ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తే, ఇంకా న్యాయం మినుకుమినుకు మని మెరుస్తున్నదని సంతోషించాం. అంతలోనే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నతాధికార కమిటీ హఠాత్తుగా సమావేశమైంది. ముందే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపించే వాతావరణం. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హాజరైనప్పటికీ, తొలిరోజు ఏ నిర్ణయానికి రాలేదు. మరునాడు మళ్లీ కమిటీ సమావేశమైంది. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రధాన న్యాయమూర్తి ప్రతినిధిగా జస్టిస్ ఎ.కె. సిక్రీ హాజరయ్యారు. సమావేశం వేగంగా నిర్ణయం తీసుకున్నది. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఉన్న ఆలోక్ వర్మను ఏ ప్రాధాన్యతాలేని ఫైర్ శాఖకు బదిలీ చేశారు. కేవలం ఆ అధికారం ఉంది కనుక కమిటీ ఆయన్ను తొలగించేయవచ్చా? అందుకు ఆధారం ఏదీ ఉండనవసరం లేదా అని న్యాయపరమైన ప్రశ్న. కమిటీలోని ముగ్గురిలో ప్రతిపక్ష నాయకు డుగా ఉన్న ఖర్గే ఒక్కరే తొలగింపు చర్యను వ్యతిరేకించారు. జనవరి 10న అత్యున్నతాధికార కమిటీ సమావేశంలో జరిగిన చర్చలను, నిర్ణయాన్ని వివ రించే మినిట్స్ పత్రం ప్రతి కావాలని అడిగారు. సీవీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ డైరెక్ట ర్ను తొలగించారని అంటున్నారు. మొదటిసారి వర్మను తొలగించినప్పుడు సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. తొలగింపునకు కారణాలని భావిస్తున్న అంశాలను సీవీసీ పరిశోధించాలనీ, ఆ పరిశోధనను మాజీ న్యాయమూర్తి ఎ.కె. పట్నాయక్ పర్య వేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పట్నాయక్ వర్మను తొలగించేంత తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోపణలకు ఏవిధమైన సాక్ష్యాలు లేవని, కనుక వర్మ తొలగింపు చాలా తొందరపాటు చర్య అని విమర్శించారు. సీవీసీ నివేదికను, పట్నాయక్ నివేదికను చదివిన తరువాత, ఆలోక్ వర్మ వివరణను విని సొంత బుర్ర ఉపయోగించి నిర్ణ యం తీసుకోవలసిన బాధ్యత కమిటీపైన ఉందని మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి రాసిన లేఖలో వ్యాఖ్యా నించారు. మరొక డైరెక్టర్ తాత్కాలిక నియామక ప్రతిపాదనను కమిటీ ముందుకు ఎందుకు తీసుకురాలేదని కూడా ఆయన నిలదీశారు. జస్టిస్ పట్నాయక్ గారు ఆ సీవీసీ నివేదికతో తనకు ఏ ప్రమేయమూ లేదని, అది కేవలం íసీవీసీకి మాత్రమే చెందిన నివేదిక అనీ, సీవీసీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి స్వయంగా వివరిస్తూ ఉంటే ఆ నివేదికను కమిటీ సభ్యులకు ఇవ్వకుండా, పట్నా యక్ నివేదికను కమిటీలో పరిశీలించకుండా, ఇంత తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ప్రభుత్వం తనకు అధికారం లేకున్నా ఆలోక్ వర్మను తొలగించేసింది. ఆయన సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఆయనకు కోల్పోయిన పదవి ఇచ్చింది. కానీ ఆలోక్ వర్మను రెండురోజుల్లో మళ్లీ తొలగించేశారు. తొలగించే నిర్ణయం తీసుకున్న కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి రోజు ఉన్నారు. మరునాడు ఆయన ప్రతినిధిగా మరో జడ్జిగారు రావడమే కాకుండా ప్రధానితో పాటు ఏకీభవించి ఆలోక్ వర్మ తొలగింపు నిర్ణయాన్ని సమర్థించారు. ఇవి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు విశ్వసనీయతకు సంబంధించిన కీలక అంశాలు. ఈ పరిణామాల్లో ఎక్కడా పారదర్శకత మచ్చుకైనా లేకపోవడం ప్రమాదకరం. జస్టిస్ పట్నాయక్ నివేదికను, సీవీసీ నివేదికను ఎవరు చూశారు? అందులో ఏముంది? వాటి ప్రతులు మల్లిఖార్జున ఖర్గేకు ఎందుకు ఇవ్వలేదు. ప్రధాన మంత్రి, న్యాయమూర్తి అయినా ఆ నివేదికలు చదివారా? అర్థం చేసుకున్నారా? అందులో కొంపముంచే ఆరోపణలు ఏమున్నాయని, ఎందుకు డైరెక్టర్ను తొలగించవలసి వచ్చిందో చెప్పవలసిన బాధ్యత ఆ పెద్దల మీద లేదా? ఇవి చాలా తీవ్రమైన ప్రశ్నలు. నిజానికి ఈ దేశంలో ప్రతిపౌరుడికి తెలియాల్సిన వివరాలు ఇవి. సీబీఐ వంటి అత్యున్నతస్థాయి సంస్థలో అర్ధరాత్రి దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులను ఉన్నట్టుండి, ఏ కారణమూ చెప్పకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెల్లాచెదురుగా విసిరేస్తూ బదిలీలు జరపడం, అందుకోసం నంబర్ వన్, నంబర్ టు స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను పదవిలోంచి తప్పించడం ఆశ్చ ర్యకరమైన పరిణామాలు. ఆ బృందం దర్యాప్తు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఏ కీలకమైన నాయకులను రక్షించడానికి ఈ తతంగమంతా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ -
ప్రధాని విదేశీ పర్యటనలపై దాపరికమా?
విదేశీ యాత్రలకు వెళ్లండి. ఒప్పందాలపైన సంతకాలు చేయండి, మీతోపాటు అనేక మంది అధికారులను కూడా తీసుకు వెళ్లండి. వాణిజ్య ఒప్పందాలకోసం అవసరమైతే మన దేశంలో పారిశ్రామికవేత్తలను, పెద్ద వాణిజ్యసంస్థల ప్రతినిధులను కూడా తీసుకు వెళ్లండి. కావాలంటే ప్రత్యేక విమానాల్లో వెళ్లండి. పాలనకు అనుకూలమైన ఏ విధానాన్నయినా అనుసరించి విదేశీయాత్రలుచేసే అధికారం, అవసరం, అవకాశం ప్రధాన మంత్రికి, ఇతర మంత్రులకు ఉంది. అయితే మీ వెంట ఎవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, వెళ్లి ఏం సాధించారో చెప్పండి. పరిపాలనలో పారదర్శకత అంటే మీరు చేసినవి చెప్పడం. అంతే. ఇందులో దాపరికం అవసరమైతే ఏ మేరకు అవసరమో కూడా చెప్పవలసి ఉంటుంది.పాలకులు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తారు. వారికి ఆ అధికారాన్ని ప్రజలే ఇస్తారు. ప్రజలపైన ప్రజల సొమ్ము పైన పెత్తనం ఇస్తున్నారు కనుకనే తమకు ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు తాము చేసిన పనులేమిటో చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య సూత్రం. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారం చేపట్టిన మొదటి రెండేళ్లలో అనేక పర్యటనలు చేపట్టారు. ఈ ప్రయాణాలకు మొత్తం రూ. 2,021లు ఖర్చయిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సాధికారికంగా వెల్లడించారు. చాలా సంతోషం. ప్రధాని సందర్శించిన పది ప్రముఖ దేశాల నుంచి మనకు బోలెడంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని కూడా మంత్రి గారు వివరించారు. 2017లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 43,478 మిలియన్ల డాలర్లమేరకు వచ్చాయి. 2014లో 30,930 మిలియన్ డాలర్లు వచ్చాయి. 2009 నుంచి 2014 వరకు ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ యానాలకు రూ 1,346 కోట్లు ఖర్చుచేశారు. మోదీగారి విదేశీయాత్రా వ్యయంలో విమానాల నిర్వహణ ఖర్చు 1583 కోట్లు, ప్రత్యేక (చార్టర్డ్) విమానాలకు 429 కోట్లు, హాట్ లైన్ ఖర్చు 9.11 కోట్లు అని మంత్రి వివరించారు. 48 విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొత్తం 55 దేశాలను సందర్శించారు. కొన్ని దేశాలకు పదేపదే వెళ్లారు. అయితే ఈ లెక్కలో 2017 నుంచి ఇప్పటివరకు హాట్ లైన్ సౌకర్యాల ఖర్చు చేర్చలేదట. వీరి పర్యటనలన్నీ అధికారికమైనవి. వ్యక్తిగత పర్యటనలు కావు. కనుక ఈ పర్యటనల వివరాలను వ్యక్తిగత వివరాలు అనుకోవడానికి వీల్లేదు. ఆ కారణంగా ఈ సమాచారాన్ని ప్రజలకు నిరాకరించే వీలు కూడా లేదు. కేంద్ర సమాచార కమిషన్ ఎన్నో సందర్భాలలో తీర్పులిస్తూ దేశ ప్రముఖులు విదేశాలకు వెళ్లినప్పుడు, లేదా దేశంలోనే తిరిగినప్పుడు వాటిని ప్రభుత్వ శాఖలు ఏదో ఒక హెడ్ కింద జమ కట్టవలసి ఉంటుందనీ, కనుక ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వెళ్లిన ప్రయాణాలకు చెందిన విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు ఇవ్వాలని పేర్కొన్నది. కమోడర్ లోకేశ్ కె బత్ర, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిని ప్రధాని విదేశాలకు ఐఏఎఫ్ వారు ఎంత ఖర్చులుపెట్టుకున్నారు అని అడిగారు. ఆ వివరాల్లో దాచడానికి ఏమీ లేదని కమిషన్ నిర్దేశించింది. ప్రధాని వెంట వెళ్లిన ఎస్పీజీ సభ్యుల పేర్లు తదితర వివరాలు అడగడం అనవసరం. వారి పేర్లు తెలుసుకోవడం అంతకన్నా అనవసరం. భద్రతకోసం తీసుకున్న చర్యలు వచ్చిన వారి వివరాలు తీసి వేసి, మిగిలిన సమాచారం ఇవ్వడంలో ఇబ్బందేమీ ఉండటానికి వీల్లేదని 2012లో సుభాష్ చంద్ర అగ్రవాల్ కేసులో సీఐసీ వివరించింది. నీరజ్ శర్మ ప్రధాని కార్యాలయం పీఐఓకు చేసుకున్న దరఖాస్తులో ప్రధాని వెంట వెళ్లిన ప్రయివేటు వ్యక్తుల పేర్లు చెప్పాలని కోరారు. సెక్యూరిటీ అంశాలతో సంబంధంలేని ప్రయివేటు వ్యక్తుల పేర్లు చెప్పడానికి ఏ ఇబ్బందీ ఉండే అవకాశం లేదని, కనుక 2014 నుంచి 2017 వరకు ప్రధాని వెంట విదేశాలకు వెళ్లిన ప్రయివేటు వ్యక్తుల సమాచారం ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.సమాచార హక్కు చట్టం కింద అడిగితే పౌరులకు అసంపూర్ణ సమాచారం అందింది. విశేషమేమంటే 2018 డిసెంబర్ 12న రాజ్యసభకు జవాబు ఇవ్వవలసిన విదేశీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. ప్రధాని వెంట వచ్చిన మీడియా సభ్యుల పేర్లు మాత్రం ఇచ్చింది. కానీ అధికారులు, అనధికారుల పేర్లు ఇవ్వలేదు. అంతేకాదు ప్రధాని వెంట వెళ్లిన ఒక మంత్రి పేరు అడిగితే ప్రభుత్వం ఆ ప్రశ్నకు జవాబు రాయవలసిన చోట ఏమీ రాయకుండా వదిలేసింది. చాలా సెన్సిటివ్ సమాచారం కనుక ఇవ్వలేమన్నారు. ఖర్చులు, పత్రికల వారి వివరాలిచ్చి, వెంట వచ్చిన అధికార, అనధికారుల సంగతి చెప్పకపోవడం ఎంత అన్యాయం? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ఈ మెయిల్: madabhushi.sridhar@gmail.com -
దాపరికంపైనా దాడేనా?
నీ సమాచారం మేం తీసుకుంటాం, నువ్వే సమాచారం అడిగినా ఇవ్వం. ఇదీ ప్రభువుల ఉవాచ. తస్మాత్ జాగ్రత్త. పది పోలీసు నిఘా విభాగాలు ప్రజల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని పర్యవేక్షించి, జోక్యం చేసుకుని డీక్రిప్ట్ చేయవచ్చునని కేంద్ర ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 69(1) కింద, 2009 నియమాల్లో నాలుగో నియమం ప్రకారం, ఇంటెలిజెన్స్బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, కేబినెట్ సెక్రటేరియట్ (రా), జమ్మూకశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు పౌరుల కంప్యూటర్లలోకి తొంగి చూడవచ్చు. జోక్యం చేసుకోవచ్చు. దోచేయవచ్చు. పాలకుల దుర్మార్గ లక్షణాలలో ముఖ్యమైంది పౌరుల సమాచారాన్ని సేకరించడం. తన దగ్గరున్న సమాచారాన్ని ప్రజలకు ఏం చేసినా ఇవ్వకపోవడం. ఒకవైపు ఆర్టీఐని బలహీనం చేస్తూ, మరోవైపు పౌరుల ప్రైవసీని హరించే ప్రకటనలు చేస్తున్నది. మనం ఉత్తరాలు రాసుకుంటే కవర్లు తెరిచి చూసే అధికారం తనకు తాను ఇచ్చుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ అధికారాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాలకులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడుకుంటూ వస్తున్నారు. టెలిగ్రాఫ్ చట్టంలో కూడా పౌర సమాచార తస్కరణ అధికారాలను రాసుకున్నది బ్రిటిష్ సర్కార్. ఇప్పుడు కంప్యూటర్లలో జనం సమాచారాన్ని కైవసం చేసే అధికారదాహంతో ఉంది. ఇప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు తక్కువ. టెలిగ్రాముల కథ ఏనాడో ముగిసిపోయింది. ఈమెయిల్స్ ఇచ్చుకోవడం, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసుకోవడం జరుగుతూ ఉన్నది. బ్లాగుల ద్వారా ప్రతిపౌరుడూ ఒక స్వయం జర్నలిస్టుగా మారాడు. సెల్ఫోన్ పట్టుకున్న ప్రతివాడూ ఇన్స్టాగ్రామ్లో పౌర పత్రికా ఫొటోగ్రాఫర్గా మారాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని ఆలోచనలను వాక్యాలుగా మలచగల ప్రతి పౌరుడూ తన వాక్ స్వాతంత్య్రాన్ని వినియోగించుకుంటున్నాడు. ప్రింట్ చేయాల్సిన పని లేకుండానే వేలాది మంది ప్రజలకు చేరువయ్యే టెక్నాలజీ సామాన్య మానవుడిని పక్కవాడి భావజాలాన్ని ప్రభావితం చేసే ప్రభావశాలిగా మార్చేసింది. కంప్యూటర్ మాధ్యమాన్ని విరివిగా వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్లలో నిశితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా కోపతాపాలు బయటపెట్టుకుంటూ హద్దులు మీరి తీవ్ర పదజాలాన్ని కూడా వాడుతున్నారు. టెలిగ్రాములు, ఉత్తరాలు తెరచి తరచి చూసే అధికారం సొంతం చేసుకున్న ప్రభుత్వం రహస్యంగా టెలిఫోన్ భాషణలను కూడా వింటున్నది. వ్యక్తుల ఆలోచనా విధానాలను, వారి వ్యక్తీకరణను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఇంకా అధికారం కావాలంటున్నది. జనం స్వేచ్ఛను ఎంత తాగేసినా ప్రభువుల అధికార దాహం తీరడం లేదు. ఇప్పుడు మన సెల్ఫోన్లో సిల్లీ కబుర్లు వింటారట, చూస్తారట. బ్లాగ్లు, వెబ్సైట్లు వెతుకుతారట. పౌరులు వాడుకునే ఆధునిక సంచారఫోన్లు కూడా కంప్యూటర్లే. ఫేస్బుక్ అందరికీ కనిపించేదే. వాట్సాప్ సమాచారం గ్రూప్ సభ్యులకే పరిమితం. ఇప్పుడీ పది సంస్థలు వాటిని కూడా చూడవచ్చు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో జరిగే జాతి వ్యతిరేక కార్యక్రమాలను పసిగట్టడానికి ఈ అధికారం అవసరమట. కానీ టోకున పౌరులందరి కంప్యూటర్లు చూస్తాననటం. సమాచారం తీస్తాను అనడమంటే అపారమైన అధికారాన్ని సొంతం చేసుకోవడమే. వేల కేసుల్లో రహస్యంగా టెలిఫోన్లు వింటూనే ఉన్నారని కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అధికార వర్గాల్లో వినబడుతూంటాయి. పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ట్యాపింగ్ జరుగుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే ఎన్క్రిప్టెడ్ (అంటే తొంగి చూడడానికి వీల్లేని) సేవలందించే వాట్సాప్ వంటి వాటి ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరూ వినలేరనే నమ్మకంతో. ఈ ఉత్తర్వుతో వాట్సాప్ మాత్రమే కాదు మరే ఇతర ఎన్క్రిప్టెడ్ సమాచార ప్రసారాలనయినా డీక్రిప్ట్ చేసి తెలుసుకోవచ్చు. ప్రజల మెదళ్లమీద నియంత్రణకు అధికారం వాడడం, వారి ఆలోచనలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. పౌరుల స్వేచ్ఛకు భంగకరమైన అధికార దుర్వినియోగానికి ఇవి దారి తీస్తాయి. ఇది ఏకపక్ష నియంతృత్వ చర్య. 2017 ఆగస్టు 24న సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ప్రైవసీని ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ, వెంటనే దానికి సంబంధించిన చట్టం చేయాలని సూచించింది. కానీ ప్రైవసీని నిర్వచించి చట్టం చేయవలసిన ప్రభుత్వానికి పార్లమెంటుకు తీరికే లేదు. ప్రైవసీ పేరుమీద ప్రజలకు ప్రభుత్వాధికారుల సమాచారాన్ని ఇవ్వకుండా తీవ్రంగా ప్రతిఘటించే ప్రభు త్వం, ప్రజల ప్రైవసీ మీద చేయదలచుకున్న మూకుమ్మడి దాడికి ఈ ప్రకటన నాంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సీఐసీపై వేధింపు కేసులేంటి?
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటయిన స్వతంత్ర వ్యవస్థ. సమాచార అభ్యర్థనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తున్నదా? ప్రభుత్వ అధికారి మీద వచ్చిన అక్రమాల ఆరోపణల ఫిర్యాదులు, వాటి విచారణ వివరాలు ఇవ్వమంటే అది వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వరాదని పీఐఓలు నిర్ణయించుకున్నట్టుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సాగించిన పనుల పర్యవసానాన్ని వ్యక్తిగత సమాచారం అని ఏ విధంగా అంటారు. యజమాని ప్రభుత్వం అయినపుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధుల హోదాలో లేదా ప్రజాసేవకుల హోదాలో పనిచేస్తున్నప్పుడు యజమానులైన ప్రజలకు వారి సమాచారం ఎందుకు ఇవ్వరు? అనేవి మౌలికమయిన ప్రశ్నలు. కానీ ప్రజాసమాచార అధికారి ఇవేవీ ఆలోచించకుండానే నిరాకరిస్తాడు. మొదటి అప్పీలులో పై అధికారి కూడా ఆలోచించడం లేదు. అప్పుడు విధి లేక రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు రావాల్సి ఉంటుంది. కమిషన్ స్వతంత్రంగా అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా రాజకీయ నాయకులకు భయపడకుండా సమాచారం ఇవ్వాలో వద్దో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా తీర్పులు చెప్పింది కూడా. ఉదాహరణకు పైన ఉదహరించినట్టు ఉద్యోగిపైన వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వ్యక్తిగత సమాచారం కాదని, ఆ సమాచారం ఇవ్వవలసిందే అని ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనం ఉంటే ఇవ్వవచ్చునని ఒక షరతు విధించింది. నిజానికి ఈ షరతు వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు మాత్రమే వర్తిస్తుందని చట్టం చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ దురదృష్టవశాత్తూ బొంబాయ్ హైకోర్టు సమాచార చట్ట వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దానిపైన అప్పీలు అనుమతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అప్పీలు అనుమతి తిరస్కరణను సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా భావించి సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది సమాచార హక్కును నీరుగార్చే ప్రయత్నం. కొన్నిసార్లు కమిషనర్ అనుకూల తీర్పు ఇచ్చినా, బలంగా ఉన్న అవినీతి అధికారి తరఫున ప్రభుత్వమే రిట్ పిటిషన్ వేస్తున్నది. హైకోర్టులు వందలాది స్టే ఉత్తర్వులు ఇస్తున్నాయి. ఇప్పటికి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన వెల్లడి ఉత్తర్వులపైన 1700 రిట్ పిటిషన్లు ఉన్నాయని అంచనా. రాష్ట్ర సమాచార కమిషనర్ల ఉత్తర్వులపైన కొన్ని వందల కేసులైనా ఉంటాయి. పదిరూపాయల ఫీజుతో సమాచారం అడగడం ద్వారా సమస్య పరిష్కరించుకున్న వారు లక్షలాది మంది ఉంటారు. అక్కడ అధికారులు కూడా సహకరిస్తారు. కానీ సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేధిం పులకు గురయ్యే వారు కూడా లక్షలాది మంది ఉంటారు. వారికి సమాచారం ఇవ్వనక్కరలేదని కమిషనర్లుగా ఉన్న మాజీ ఉన్నతాధికారుల్లో కొందరు భావిస్తారు. వారు తమకు ఇన్నాళ్లూ అధికారం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించిన ప్రభుత్వ రహస్యాలను రక్షించే బాధ్యత ఉందనే భావనలో ఉంటారు. రాజకీయంగా తమను ఆదుకుని, పదవీ విరమణ తరువాత ఇంత గొప్ప పదవినిచ్చి, అయిదేళ్లపాటు అందలంలో ఉండి పల్లకీ ఊరేగే అవకాశం ఇచ్చిన నాయకుడికి కృతజ్ఞతతో ఉండటం కోసం సమాచారం ఇవ్వకుండా కాపాడుతూ ఉంటారు. వీరిమీద రిట్ పిటిషన్ వేసేంత తీరిక, డబ్బు సామాన్యుడికి ఉండదు. కేంద్ర కమిషన్ భారత ప్రభుత్వానికి చెందిన సర్వోన్నత న్యాయస్థానం వంటి సంస్థ. అది ప్రభుత్వ విభాగం కాదు. అక్కడ ఉన్నది సమాచార అధికారి కాదు కమిషన్. నిజానికి అది ట్రిబ్యునల్ వలె కోర్టువలె పని చేస్తున్నది. పని చేయాలి. పనిచేయనీయాలి. చట్టం ప్రకారం ఏర్పడిన ఒక నిర్ణాయక సంస్థ, చట్టం కింద నిర్ణయం ప్రకటిస్తే, ఆ నిర్ణయం చట్టం ప్రకారం ఉందో లేదో పరిశీలించడానికి హైకోర్టుకు వెళ్లవచ్చు. కానీ అందులో సీఐసీని పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరయినా కమిషన్ మీద కేసు వేస్తే రక్షించడానికి ప్రభుత్వం లాయర్ను నియమించాల్సింది పోయి, ప్రభుత్వమే కేసు వేయడం ఎంత అన్యాయం. కింది కోర్టు తీర్పు మీద ప్రభుత్వం హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. కానీ అందులో కింది కోర్టును ప్రతివాదిగా చేర్చదు. కమిషన్పైన ప్రభుత్వం స్వయంగా కేసులు వేయడం ఎందుకు? పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రభుత్వం వంచించడం ఎందుకు? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కేంద్రమే కేసులతో బెదిరిస్తోంది
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగమైన సమాచార కమిషన్పై ఆ కేంద్రమే స్వయంగా కోర్టుల్లో కేసులు వేసి బెదిరిస్తోందని ఇటీవలే సమాచార కమిషనర్ పదవి నుంచి విరమణ పొందిన మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆరోపించారు. సమాచారం బయటకు రాకుండా అడ్డుకునేందుకు, సమాచార కమిషన్, కమిషనర్లను కేసులతో భయపెట్టేందుకే కేంద్రం ఇలా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారుల వివరాలు బయటపెట్టాలంటూ ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను శ్రీధర్ ఆచార్యులు ఆదేశించడం, అనంతరం ఈ విషయంలో ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్తో ఆయనకు విభేదాలు తలెత్తడం తెలిసిందే. ‘ఇక్కడ కేంద్రం లక్ష్యం సీఐసీ (కేంద్ర సమాచార కమిషన్), భారత పౌరులే. ఈ కేసులను గెలవడం కేంద్రం ఉద్దేశం కాదు. సీఐసీ కమిషనర్లను భయపెట్టడమే వారికి కావాలి’ అని శ్రీధర్ ఆరోపించారు. రుణ ఎగవేతదారుల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు కూడా గతంలోనే ఆర్బీఐని ఆదేశించిందనీ, అయినా సమాచారం బయటకు రాకపోవడంతో తాను మరోసారి ఆదేశాలు జారీ చేశానని ఆయన తెలిపారు. అయితే ఆర్బీఐ తనపై బాంబే హైకోర్టులో కేసు వేసిందని పేర్కొన్నారు. ఒక్క కేసులో మూడు నోటీసులు ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని తాను ఆదేశిస్తే గుజరాత్ హైకోర్టులో యూనివర్సిటీ ఆ ఆదేశాలను సవాల్ చేసిందని శ్రీధర్ ఆచార్యులు తెలిపారు. ఆ కేసులో తనను సమాచార కమిషనర్గా, సీఐసీ ప్రతినిధిగా, వ్యక్తిగతంగా.. మూడు హోదాల్లో ప్రతివాదిగా చేర్చారనీ, ఒక్క కేసులో మూడు నోటీసులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కేంద్రం తరఫున వాదించేదుకు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చారనీ, మరి సీఐసీ కమిషనర్ అయిన తాను కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే కానీ తన తరఫున మాత్రం ఏఎస్జీ వాదించలేదని శ్రీధర్ ఆచార్యులు వెల్లడించారు. సీఐసీ, సమాచార కమిషనర్లపై ప్రస్తుతం 1,700 కేసులు కోర్టుల్లో ఉండగా వాటిలో అత్యధిక శాతం కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేసినవేనని ఆయన వెల్లడించారు. -
ఆర్టీఐని ఉల్లంఘించిన ఆర్బీఐపై చర్యలేవి?
రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలనే నోటీసును నేను సమాచార కమిషనర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కు ఇచ్చినందుకు కారణాలు అడుగుతున్నారు. చట్టం ప్రకారం సమాచారం ఎవరి దగ్గర ఉందో ఆ అధికారి సమాచారం ఇవ్వకపోతే నోటీసులు ఎన్నోసార్లు ఇచ్చాను. దానిపై ఎవరూ ప్రశ్నించలేదు. ఈ సారి గవర్నర్ స్థాయి అధికారికి ఇచ్చేసరికి చర్చ జరిగింది. ఆర్బీఐ రుణ ఎగవేతదారుల గురించి, బ్యాంకుల ఇన్స్పెక్షన్ నివేదికల గురించి వెల్లడించాలని మన పూర్వ కమిషనర్ శైలేశ్ గాంధీ ఇచ్చిన పదకొండు ఆదేశాలను ఆ సంస్థ పాటించకుండా సుప్రీం కోర్టులో సవాలు చేయడం, మన సర్వోన్నత న్యాయస్థానం, ఆర్బీఐ వాదం చెల్లదని కొట్టి వేసిన తరువాత కూడా ఆ ఆదేశాలను ఆర్బీఐ పాటించడం లేదని బాధపడుతూ శైలేశ్ గాంధీ ఒక సామాన్యవ్యక్తిగా ఆర్టీఐ కింద ఫిర్యాదు చేస్తే, దానికి ఆర్టీఐ దరఖాస్తు ఆధారం లేదనే సాకుతో సమాచార కమిషన్ తిరస్కరించినపుడు ఎవ్వరూ అడగలేదు. బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారి వివరాలు, బ్యాంకు ఇన్స్పెక్షన్ నివేదికలు వెల్లడించాలని కోరుతూ ఆర్టీఐ దరఖాస్తు దాఖలైతేనే కదా ఆ వ్యవహారం సీఐసీని దాటి సుప్రీంకోర్టుదాకా వెళ్లింది? సుప్రీంకోర్టు ఆదేశించినా సరే ఆ సమాచారం ఇవ్వను పొమ్మని ఆర్బీఐ తన అధికారిక అంతర్జాల వేదికపై బాహాటంగా ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో ఒక పిల్ విచారణలో ఉంది కనుక ఇవ్వకపోవడం అన్యాయం. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు వచ్చినపుడు గతంలో పదకొండు అప్పీళ్లలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలను, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆర్బీఐ తిరస్కరించిన విషయాన్ని గమనించి ఇప్పటికైనా ఆ ఆదేశాలను పాటించాలని ఆర్బీఐకి ఉత్తర్వులు జారీచేశాను. ఆర్టీఐ చట్టం రాకముందు 2003లో ఒక పిల్ ద్వారా అప్పుఎగవేతదారుల వివరాలు అడిగితే, సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో ఆ వివరాలు ఇమ్మని ఆర్బీఐని ఆదేశించింది. వారిచ్చారు. ఇంతవరకు ఆ విచారణ ముగియనే లేదు. విచారణలో ఒక అంశం ఉంది కనుక ఆ అంశంపై ఏ సమాచారమూ ఇవ్వబోమని ప్రజాసమాచార అధికారి కూడా సెక్షన్ 8(1)(బి) ప్రకారం అనడానికి వీల్లేదు. కోర్టులు నిషేధించిన సమాచారం మాత్రమే ఇవ్వకూడదు. కాని ఈ చట్టనియమానికి వ్యతిరేకంగా ఇద్దరు కమిషనర్లు పెండింగ్ కేసు నెపంతో, సుప్రీంకోర్టు ఏ విషయమో తేల్చేదాకా మేమేమీ చెప్పం అనడం సబబుకాదు. మరోవైపు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్బీఐ పదకొండు అప్పీళ్లపై విచారణ జరిపి తుదితీర్పు ఇస్తూ వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశిస్తే దాన్ని పాటించకపోవడం తప్పు. సీఐసీ ఇచ్చిన పదకొండు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన విషయం గుర్తించాలి. సెక్షన్ 4(1)(బి) ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ ముఖ్యంగా ఆర్బీఐ స్వయంగా వెల్లడి చేయవలసిన సమాచారం వెల్లడి చేయాలని నిర్దేశిస్తూ ఉంటే, సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా ‘నేను చెప్పను పొమ్మం’టూ ఉంటే ఆ అంశాన్ని పరీక్షించి సరైన చర్యలు తీసుకునే అధికారం సీఐసీకి ఉంది. జనం డబ్బును ఎగవేసిన దురుద్దేశపూర్వక రుణగ్రస్తుల పేర్లను రహస్యంగా కాపాడే నేరానికి సహకరించే చట్టపరమైన బాధ్యతేదీ కమిషన్ మీద లేదు. ఎవరి పేర్లు దాచాలని చూస్తున్నారు? జూన్ 2017 నాటికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, మన భారతీయ బ్యాంకులను కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు, 2017 సెప్టెంబర్ 30 నాటి లెక్కల ప్రకారం లక్షా పదివేల కోట్ల రూపాయలు బాకీ పడిన ఘనులు వారు, వేయి కోట్లరూపాయలకు పైగా అప్పు తీసుకుని మొత్తం 26 వేల కోట్లదాకా ఎగవేసిన 11 అగ్రశ్రేణి రుణగ్రహీతలు వారు, జూన్ 30, 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా 50 కోట్ల కన్న ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు వేస్తే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7000 మంది ఘరానా ప్రముఖులు. ఇంకా ఎందరో థగ్గులు, మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? ఒకవైపు మూడులక్షల మంది రైతులు చిన్న అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక ప్రాణాలు పొలాల్లోనే వదిలేస్తుంటే, మన బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను రక్షించాలని కమిషనర్లుగా మేం ఏదైనా ప్రమాణం చేసామా? ఇప్పటికైనా శైలేశ్ గాంధీ ఇచ్చిన వెల్లడి ఆదేశాలను, వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ అమలు చేయడానికి తగిన చర్యలు మొదలు పెట్టాలి. మన సమాచార చట్టం మీద, సీఐసీ సంస్థ మీద జనానికి ఉన్న నమ్మకాన్ని కాస్తయినా పెంచాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
పారదర్శకతకు దూరంగా బీసీసీఐ
మన దేశంలో ప్రస్తుతం వందల వేలకోట్ల రూపాయలు సంపాదించే బడా వ్యాపార సంస్థలుగా క్రీడా సంస్థలు ఎదిగాయి. ఈ క్రీడా రాజకీయ వ్యాపారులు రహస్యాలు దాస్తుం టారు. వీరు సమాచార హక్కును తమకు పరమశత్రువుగా భావిస్తారు. పారదర్శకత అంటే ఎందుకని అడుగుతారు. వీరు పుఠాణి ప్రియులు. బయటకు ఏదీ చెప్పరు.ఈక్రికెట్ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో సాగించే పెద్ద దుకాణం బీసీసీఐ. కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్ వంటి దారుణాలకు పాల్పడే క్రీడాఘాతకులకు ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఇది కుంభకోణాల పుట్ట. స్కాండల్స్కు పుట్టిల్లు. వీరు ఆర్టీఐ చట్టం కిందకు రావాలని, జనం అడిగిన సమాచారం ఇవ్వాలంటే అందరూ సరే అంటారు. కానీ ఎవరూ సహకరించరు. వీరికి తోడుగా మంత్రులు ఉంటారు. పేరు మోసిన లాయర్లు వీరి కేసులను కోర్టులకు మోసి, కావలిసిన స్టేలూ అవీ ఇవీ తెచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యానికి, సుపరిపాలనకు, అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేయడానికి సానుకూల వాతావరణం ప్రోత్సాహక పథకాలు ఇవన్నీ మంచి వక్తల అంశాలుగా ఉంటాయి. వాటిని వాస్తవాలుగా మలచడం మాటలు చెప్పినంత సులువు కాదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న కాలంలో అజయ్ మాకెన్ అనే నాయకుడు క్రీడామంత్రిగా ఉండేవాడు. ఆయన పాపం క్రీడా సంఘాల పేరుతో సాగే దుకాణ దుర్మార్గాలను నిలిపివేయడానికి వాటిలో పారదర్శకత తేవాలని అనుకున్నాడు. ఎంత మంచి ఆలోచన. క్రికెట్ అనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను ఎంపిక చేసే మహత్తర బాధ్యతలను నిర్వర్తించదలుచుకున్నారా? అయితే మీరు ప్రభుత్వ కార్యవిధులు నిర్వహిస్తున్నట్టే కనుక మీరు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉండండి అని అజయ్ మాకెన్ సందేశం ఇవ్వదలచుకున్నారు. ఆయన ఒక చట్టాన్ని తెద్దామనుకున్నారు. అదేమంటే దేశంలో అన్ని క్రీడా సమాఖ్యలను ప్రభుత్వ సంస్థలుగా పరిగణించి వాటిని ఆర్టీఐ చట్టం పరిధిలోకి తేవడం. బిల్లును తయారు చేశారు గాని దానికి చిల్లులు కొట్టే వారుం టారని పాపం అజయ్ మాకెన్ గారు ఊహించి ఉండరు. మన్ మోహన్ సింగ్ గారి క్యాబినెట్ లో దానికి ఆమోదం లభించలేదు. కారణం బీసీసీఐ వారి లాబీయింగ్ శక్తి అని ది ఫస్ట్ పోస్ట్ అనే అంతర్జాల పత్రికా సంస్థ వ్యాఖ్యానించింది. జనం కళ్లనుంచి తమ క్రికెట్ క్రీడనే కాదు, దేశంలో ఉన్న అన్ని క్రీడా వ్యాపారాలను రక్షించుకుని తమ కార్యకలాపాలను ప్రజల ప్రశ్నలకు గురికాకుండా కాపాడుకోవడానికి క్రికెట్ సంఘం వారు ఎంతగా శ్రమించారో మనకు ఈ సంఘటనతో అర్థమవుతుంది. సుప్రీం కోర్టు వారు ఎన్ని నీతి వాక్యాలను ధర్మసూత్రాలను వల్లించినా, ఎన్ని సలహాలు సందేశాలు ఇచ్చినా ఆదేశాలు జారీచేసినా, రాజకీయాధికారాన్ని శాసించడం కొంచెం కష్టమే. అందుకే ఆ బిల్లు డీలా పడింది. క్రీడా సంస్థలలో పారదర్శకత తేవాలనే ఆలోచన మూలన పడింది. అంతటితో ఆగిందనుకుంటే అదీ పొరబాటే. క్రీడాసంఘాల బలం ఎంత పెరిగిం దంటే మళ్లీ క్రికెట్ క్రీడలో పారదర్శకత అనే మాట మాట్లాడకుండా ఉండాలంటే అజయ్ మాకెన్ నుంచి క్రీడాశాఖనే తొలగించాలని ఆ లాబీ పనిచేసిందని, విజయం సాధించిందనీ ఆ అంతర్జాలపత్రిక రచిం చింది. ఆ తరువాత ఏ క్రీడామంత్రయినా ఆ పదవిలో ఉండాలంటే క్రికెట్ దుకాణాలలో పారదర్శకత గురించి మాట్లాడడానికి ధైర్యం చేయరాదనే నీతి సూత్రాన్ని ఈ కథ నేర్పింది. ముకుల్ ముద్గల్ అనే న్యాయనిపుణుడు రూపొందించిన బిల్లు క్రీడాపారదర్శక క్రమబద్దీకరణ ప్రయత్నం మూలన పడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఇంకో భారీ వ్యాపారం. జాతీయ ఆర్థిక ప్రయోజనాలకు ఉపకరించే భారీ స్థాయిలో డబ్బును సమకూరుస్తున్న క్రికెట్ను ఆరోగ్యవంతంగా కాపాడుకోవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిషన్ లాల్ గెరా వర్సెస్ హర్యానా కేసులో (2011)అభిమన్యుతివారీ (2016) బలరామ్ శర్మ (2010) కేసులో స్పాట్ ఫిక్సింగ్ అన్యాయాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. 2015 బీసీసీఐ కేసులో పరిశోధనల ద్వారా అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్కు ఇందులో ప్రమేయం ఉందని తెలిసి, ఇక చాలు శ్రీనివాసన్ దిగిపొమ్మని అంటే గాని ఆయన దిగిపోలేదు. ఆయన అనుయాయులు కూడా పొటీ చేయరాదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించవలసి వచ్చింది. అయినా పారదర్శకత ను బీసీసీఐ స్వాగతించడం లేదు. ఎంత దుర్మార్గం? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
అమరుల త్యాగానికి గుర్తింపేది?
సర్దార్ భగత్ సింగ్, భారత్ గర్వించదగిన సమరయోధుడు. జాతిపిత గాంధీజీ శాంతి ఉద్యమం ఎంత సమున్నతమైనదో, భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి యువకుల ప్రాణ త్యాగం కూడా అంతే కీలకమైంది. నేతాజీ నడిపిన ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. వారిని గుర్తిస్తున్నామా? అధికారికంగా మన దేశం వారికి ఏ స్థాయి కల్పిస్తున్నది? భగత్సింగ్ను షహీద్ అని ప్రభుత్వం గుర్తించిందా లేదా, గుర్తించడానికి చట్టపరంగా ఏవైనా ఇబ్బందులు, పరిమితులు, ఆంక్షలు ఉన్నాయా, కనీసం ఆయనను స్వతంత్ర సేనానిగా ప్రభుత్వం అంగీకరిస్తుందా అని సమాచారం అడిగారు అమిత్. ఆయన అడిగింది రాష్ట్రపతి భవన్ అధికారులను. వారు ఆయన ఆర్టీఐ దరఖాస్తును హోం శాఖకు పంపించారు. హోం శాఖ దాన్ని అదే వేగంతో పురావస్తుశాఖకు తరలించింది. భగత్సింగ్ జీవితానికి, పోరాటానికి సంబంధించిన పత్రాలను ఎవరైనా వచ్చి చదువు కోవచ్చునని, భగత్ సింగ్ గుర్తింపుపై సమాచారం తమదగ్గర ఉన్న దస్తావేజులలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. సంతృప్తి చెందని అమిత్ కుమార్ సమాచార కమిషన్ తలుపు తట్టారు. ఈ సమాచార అభ్యర్థన నిజానికి ప్రభుత్వం భగత్ సింగ్ వంటి వీర పుత్రుల గురించి ఏదైనా విధాన నిర్ణయం తీసుకుందా, తీసుకుంటే ఆ విధానం గురించి సమాచారం ఇస్తుందా అనేవి అసలు ప్రశ్నలు. ఈ వీరులు తమ యవ్వనాన్ని లెక్క చేయకుండా దేశానికి అర్పించారని ప్రధాని నివాళులర్పించారు. ఆ ముగ్గురు వీరులు ఉరికంబానికి వేలాడిన మార్చి 23న దేశ భక్తులంతా నివాళులర్పిస్తారు. వారు అమరులై 81 ఏళ్లు దాటింది. ఈ సంవత్సరం మార్చి 25న ఆరోరా అనే న్యాయవాది, భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటని అడిగారు. దానికి హోం మంత్రిత్వ శాఖ ‘జీవించి ఉన్న వారినైనా మరణించిన వారినైనా అమర వీరులుగా అధికారికంగా గుర్తించలేదు’ అంటూ ఈ దరఖాస్తును జాతీయ పురావస్తు విభాగానికి బదిలీ చేశారు. ఇలా అయితే రాబోయే తరాలు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉద్ధంసింగ్, కర్తార్సింగ్ వంటి అమరుల త్యాగాలను మరిచిపోతాయని ఆరోరా అన్నారు. భారత ప్రభుత్వం లేదా పంజాబ్, హరియాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమరవీరులకు షహీద్ గౌరవాన్ని ఇవ్వాలి. అధికారికంగా ప్రకటన జారీచేయాలని ఆరోరా కోరారు. అమర వీరులు, స్వాతంత్య్ర పోరాట వీరుల జాబితాలను ముందు తరాలవారి కోసం అధికారికంగా విడుదల చేయాలని కోరారు. ప్రతి ఏడాదీ ఇటువంటి డిమాండ్ వస్తూనే ఉంది. హోం శాఖ మాదగ్గర ఏ అధికారిక పత్రం లేదు. కనుక మేం చెప్పేది ఏమీ లేదని జవాబు ఇస్తూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వం సరబ్జిత్ సింగ్ను జాతీయ అమర వీరుడుగా ప్రకటించింది. మరి భగత్సింగ్ను ఎందుకు వదిలేశారు అని వీరు అడుగుతు న్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టు మార్చి 20 (2018) నాటి తీర్పులో ఈ ముగ్గురు వీరులను షహీద్ అని ప్రకటించాలని ఆదేశించడానికి ఏ చట్టమూ లేదని వివరించింది. ఆర్టికల్ 18 ప్రకారం బిరుదులు ఇవ్వడానికి వీల్లేదని పంజాబ్ ప్రభుత్వం వాదించింది. బీరేంద్ర సంగ్వాన్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, సి.హరిశంకర్ డిసెంబర్ 12, 2017న ఈ విధమైన తీర్పు ఇచ్చిందని పంజాబ్ హరియాణా కోర్టు ఉటంకించింది. 2015లో ఆర్టీఐ దరఖాస్తుకు కూడా హోం శాఖ ఇదే సమాచారం ఇచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ‘భగత్సింగ్ గురించి అధికారిక పత్రాలు ఉన్నా, లేకపోయినా, వారు ఈ దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అవిభాజ్యమైన భాగస్వాములుగా ఉంటారు. వారి వారసత్వాన్ని జాతి గర్వంగా స్వీకరిస్తుంద’ని అన్నారు. భగత్ సింగ్ మనవడు అధికారికంగా వారికి షహీద్ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విభిన్న రంగాలలో పేరెన్నిక గన్న వారికి భారతరత్న, పద్మ అవార్డులు ఇవ్వడానికి, సైన్యంలోని వారికి వీరచక్ర బిరుదులు ఇవ్వడానికి, క్రీడాకారులకు ఖేల్ రత్న బిరుదులు ఇవ్వడానికి అడ్డురాని ఆర్టి కల్ 18 భగత్ సింగ్ను అమరవీరుడని అధికారికంగా పిలవడానికి అడ్డొస్తుందా? భగత్ సింగ్ వంటి వీరులను, ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను అధికారికంగా గుర్తించడానికి ఏమైనా ఆలో చిస్తున్నారో లేదా అనే విషయమై ఇప్పటి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు వీలుగా హోంమంత్రి ముందు ఈ దరఖాస్తును ఉంచాలని సీఐసీ ఆదేశించింది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
లైంగిక వేధింపులపై ఇంత నిర్లక్ష్యమా?
దామోదర్ వ్యాలీ కార్పొరే షన్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులొచ్చాయి, వాటిపైన ఏ చర్యలు తీసు కున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యా దులు పరిష్కరించారో, ఎన్ని పరిష్కరించలేదో తెలియజేయాలని ఆర్టీఐ కింద సౌమెన్ సేన్ కోరారు. అసిస్టెంట్ ఇంజినీర్ శంభుదాస్పైన చేసిన ఫిర్యా దుపై ఆయన నుంచి వాంగ్మూలం రికార్డు చేసి ఉంటే దాని ప్రతిని ఇవ్వాలని కోరారు. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గాని జవాబు ఇవ్వలేదు. కమిషన్ ముందు సౌమెన్ సేన్, ఆమె భర్త హాజరై నిజాలను దాచి నిందితుడిని డీవీసీ అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. దామోదర్ వ్యాలీ సంస్థగానీ, జాతీయ మహిళా కమి షన్గానీ ఏ జవాబూ ఇవ్వకపోవడం న్యాయం కాదని, ఈ రెండు సంస్థల సమాచార అధికారులపై జరిమానా విధించాలని, అడిగిన సమాచారం ఇప్పిం చాలని కోరారు. ఇంటర్నల్ కమిటీని నియమించి ప్రాథమిక విచారణ జనవరి 2013లోనే జరిపించి నప్పటికీ ఇంతవరకు విచారణ ముందడుగు వేయ లేదని, అనేక సార్లు కమిటీలను మార్చుతూ కాలం గడుపుతున్నారని వివరించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన తరువాత నేర సంఘటన జరిగిన మూడు నెలల్లోగా లోకల్ కమిటీని గానీ ఇంటర్నల్ కమిటీనిగానీ నియమించాలని 2013 చట్టం సెక్షన్ 9 వివరిస్తున్నది. నిందితుడు సంస్థలో ఉద్యోగి అయితే సర్వీసు నియమాలను అనుసరించి ఎంక్వయిరీ జరిపించాల్సి ఉందని సెక్షన్ 11 నిర్దేశిస్తున్నది. ప్రాథమికంగా ఆరోపించిన నేరం జరిగిందని తేలితే సెక్షన్ 509 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సెక్షన్ 12 కింద బాధితురాలు తనను గానీ, తనను బాధించిన వ్యక్తినిగానీ మరో చోటికి బదిలీ చేయాలని కమిటీని కోరవచ్చు. అయితే విచారణ నివేదిక ప్రతిలేకుండా ఈ హక్కులను బాధితురాలు కోరడానికి వీల్లేదు. సెక్షన్ 13 బాధితురాలికి విచారణ నివేదిక ప్రతిని విచారణ ముగిసిన పదిరోజులలో ఇచ్చితీరాలని నిర్దేశిస్తున్నది. విచారణలో ఆరోప ణలు రుజువైతే జిల్లా అధికారి నిందితుడిపై ఏ చర్యలు తీసుకోవాలో కమిటీ ఆదేశించే వీలుంది. ఈ పనిని దుష్ప్రవర్తనగా భావించి అందుకు రూల్స్ ప్రకారం చర్య తీసుకోవాలి. అతని జీతం నుంచి కొంత సొమ్మును మినహాయించి, ఆ సొమ్మును బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కూడా ఆదేశించవచ్చు. ఈకేసులో బాధితురాలైన మహిళకు విచారణ నివేదిక ప్రతిని ఇవ్వకపోగా, ఆర్టీఐలో అడిగిన తరు వాత కూడా పీఐఓ ఇవ్వలేదు. అంటే 2013 చట్టాన్ని అమలు చేయలేదు. జీవన హక్కుతో పాటు, పనిచేసే హక్కు కూడా ఉల్లంఘిస్తూ ఉంటే అందుకు సంబం ధించిన సమాచారాన్ని కోరినప్పుడు కేవలం రెండు రోజుల్లో ఇవ్వాలని దామోదర్ వ్యాలీ సంస్థ గానీ, జాతీయ మహిళా కమిషన్గానీ భావించలేదు. మహి ళలపై వివక్ష నిర్మూలన ఒప్పందం (సెడా) విశాఖ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటువంటి చర్య లను నిరోధించవలసి ఉంటుందని మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మ అభిప్రాయ పడ్డారు. రెండు చట్టాలు ఆమెకు ఇచ్చిన హక్కులను రెండు ప్రభుత్వ సంస్థలు, (దామోదర్ వ్యాలీ, జాతీయ మహిళా కమిషన్) ఉల్లంఘించాయని సమాచార కమిషన్ భావించింది. కనుక ఆ రెండు సంస్థల పీఐఓలకు జరిమానా ఎందుకు విధించకూ డదో కారణాలు వివరించాలని నోటీసు జారీ చేసింది. దామోదర్ వ్యాలీ సంస్థ అడిగిన పూర్తి సమా చారాన్ని వెంటనే ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. 2012లో ఇచ్చిన ఫిర్యాదుపైన అయిదేళ్లు దాటినా ఏ చర్య తీసుకోలేదని బాధితురాలు ఫిర్యాదు చేశారు. సమాచార కమిషన్ ఆదేశాల తరువాత 29 పేజీలు ఇచ్చినా అనేక కీలకపత్రాలు ఇవ్వలేదు. కొత్త కమిటీ విచారణ జరుపుతుందని తెలిపినా, ఇంతవరకూ ఏ చర్యా తీసుకోలేదని వివ రించింది. బాధితురాలికి పరిష్కారం చూపకపోగా ఫిర్యాదును ఉపసంహరించుకోలేదన్న ఆగ్రహంతో ఆమెని అనేక పర్యాయాలు బదిలీ చేశారు. చివరకు ఆమె ప్రమోషన్ కూడా నిలిపివేశారు. మహిళా కమిషన్ తనకు అందిన ఆర్టీఐ దర ఖాస్తును దామోదర్ వ్యాలీ సంస్థకు బదిలీ చేసింది. లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించే బాధ్యత కమిషన్కు లేదని వాదించింది. సమాచార కమిషన్ ఆదేశించిన తరువాత 30 పుటలు ఇచ్చాం కనుక జరి మానా విధించరాదని దామోదర్ వ్యాలీ అధికారిణి కోరారు. డీవీసీ అధికారిణి అంశుమన్ మండల్ పైన 25 వేలరూపాయల జరిమానా విధిస్తూ కమిషన్ ఆదే శించింది. అంతేకాకుండా బాధితురాలికి లక్ష రూపా యల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. (16.10.2018న సౌమెన్ సేన్ కేసులో సీఐసీ ఆదేశం ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
ప్రత్యామ్నాయ పరిష్కారాల్లో శిఖర సమానుడు
కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో పుట్టి జాతీయ, అంతర్జాతీయ పరిధుల్లో న్యాయశాఖలో అత్యున్నత పదవులను అలంకరించిన పీసీ రావు ఒక తెలుగు తేజం. చట్టపరమైన పరిజ్ఞానం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, న్యాయం పట్ల నిబద్ధత, వృత్తిపరమైన క్రమశిక్షణ పీసీ రావును అగ్రభాగాన నిలబెట్టాయి. విధులను అంకితభావంతో నిర్వహించడం పీసీ రావు వ్యక్తిత్వం. పాలనాధికారిగా ఉంటూ న్యాయపాలన చేయడం, అంతర్జాతీయ న్యాయ శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, కొత్త పరిష్కార మార్గాలు అన్వేషించడం ద్వారా మరిచిపోలేని మంచి వ్యక్తిగా ఆయన మన జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. ఏళ్లు గడచినా వాయిదాలు పడుతూ పరిష్కారం దొర కని కోట్లాది కేసులకు దారే దైనా ఉందా అని ఆలోచించి ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం (మధ్యవర్తిత్వ ఒప్పంద చట్టం) రూపకల్ప నలో కీలకపాత్ర పోషించిన న్యాయవేత్త పాటిబండ్ల చంద్రశేఖరరావు. ప్రత్యామ్నాయ పరిష్కారాల వేది కలను ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతం చేయడం పీసీ రావు చేసిన గొప్ప సేవ. ఆయన ఐసీఏడీఆర్ (అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం) సెక్రెటరీ జనరల్గా ఈ ఉద్యమాన్ని ముందుండి విజయవంతంగా నడిపారు. కోర్టు కేసుల్లో 60 శాతం సమస్యలు ఇరు పక్షాలూ పరిష్క రించుకోతగినవే. కాని వారి మధ్య చర్చలకు ప్రోత్స హించేవారు లేరు. కార్పొరేట్ వివాదాలకు రాజ్యాంగ పరమైన న్యాయపోరాటాలు అవసరం లేదు. రెండు కంపెనీల ప్రతినిధులు ఒక పెద్దమనిషి దగ్గర కూర్చుని తమ తగాదాలపై అంగీకారానికి రాదలచు కుంటే ఎవరూ ఆపలేరు. వారి రాజీకి డిక్రీ స్థాయి కల్పించి మళ్లీ అప్పీలు లేకుండా దాన్ని అమలు చేసే చట్టం తేవడం వెనుక ప్రధాన కృషి పీసీ రావుది. సివిల్ ప్రొసీజర్ కోడ్లో సవరణల ద్వారా ప్రత్యా మ్నాయ పరిష్కారాలకు చట్టబద్ధత కల్పించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల కోసం ఒక చట్టాన్ని పార్లమెంటు చేయడానికి కూడా పీసీ రావు బాధ్యత వహించారు. పెద్ద కంపెనీల వివాదాలు పరిష్కరించడానికి కోర్టు ముందున్న కేసులన్నీ పక్కన బెట్టాలి. అది సాధ్యం కాదు. డబ్బుకు సమస్యలేని ఈ కంపెనీలు తామే ఒక పెద్దమనిషిని లేదా మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించుకుని తమ కేసును ప్రయి వేటు కోర్టులో విచారణ జరిపించడం అంతర్జాతీ యంగా ఆమోదయోగ్యమైన ప్రక్రియ. ప్రపంచీకరణ తర్వాత వాణిజ్యానికి పెండింగ్ కేసుల వల్ల అవరో ధాలు కలగకుండా ఉండాలంటే మధ్యవర్తిత్వమే ప్రత్యామ్నాయమని అన్ని దేశాలు అంగీకరించాయి. అందులో భారత పక్షాన íపీసీ రావు నిలబడి ఈ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. మధ్యవర్తిత్వంతో పాటు ఇతర వివాదాల పరి ష్కారానికి మధ్యవర్తి ముందు సంప్రదింపులు జర పడం అనే మరో ప్రక్రియ కూడా ప్రారంభించారు. దీన్ని రాజీ ఒప్పందం అని కూడా పిలుస్తారు. సంప్ర దింపు అనే మరో ప్రక్రియలో తగాదాలోని ఇరు పక్షాలూ ఒక చోట కూర్చుని చర్చించుకుంటారు. ఇందుకు ఇరు పార్టీలకు సానుకూల వాతావరణం కల్పించే విధానం కూడా ఈ ప్రత్యామ్నాయ పద్ధ తుల్లో ఒకటి. వివాదం కోర్టుకు వెళ్లాక ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలకు తగాదాను పంపే బాధ్యతను న్యాయాధికారికి అప్పగిస్తూ సివిల్ ప్రొసీజర్ కోడ్ను ఆ తరువాత సవరించారు. ఈ కీలక మార్పునకు ప్రేరణ పీసీ రావే. భారత ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో ఆయన కేంద్ర న్యాయశాఖ కార్య దర్శిగా పనిచేశారు. అనవసరమైన ప్రచారం లేకుండా పనులు సాధించడంలో పీవీ నరసింహా రావు నైపుణ్యం తెలిసిందే. దీని వెనుక పీవీఆర్కే ప్రసాద్, పాటిబండ్ల చంద్రశేఖర రావు వంటి సలహా దారుల కృషి ఉంది. బాబ్రీ మసీదును కూల్చి ఉండక పోతే చర్చలు సఫలమై పరిష్కారం దొరికి ఉండేది కాదని పీసీ రావు ఆ తరువాత తన అనుభవాలను వివరించారు. కె. రామచంద్రమూర్తి (‘సాక్షి’ ఎడిటో రియల్ డైరెక్టర్)తో కలిసి ఈ వ్యాస రాచయిత పీసీ రావును సుదీర్ఘంగా ఇంటర్వూ్య చేసినపుడు ఈ వివ రాలను పీసీ రావు మాతో పంచుకున్నారు. చిత్తశుద్ధితో, స్వార్థం లేకుండా చేస్తున్న ఉద్యో గంలో విధులను అంకితభావంతో నిర్వహించడం పీసీ రావు వ్యక్తిత్వం. పాలనాధికారిగా ఉంటూ న్యాయపాలన చేయడం, అంతర్జాతీయ న్యాయ శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, కొత్త పరిష్కార మార్గాలు అన్వేషించడం ద్వారా మరిచి పోలేని మంచి వ్యక్తిగా మన జ్ఞాపకాల్లో మిగిలిపో యిన చంద్రశేఖరరావుకు నా నివాళి. ఆయన పేరెన్ని కగన్న న్యాయశాస్త్ర కోవిదుడు. అంతర్జాతీయ న్యాయ స్థానంలో సుదీర్ఘ కాలం న్యాయమూర్తిగా ఉన్న సము ద్రన్యాయ శాస్త్ర నిపుణుడు. కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో పుట్టి జాతీయ, అంతర్జాతీయ పరిధుల్లో న్యాయశాఖలో అత్యున్నత పదవులను అలంకరిం చిన పీసీ రావు ఒక తెలుగు తేజం. ఆయన చట్ట పరమైన పరిజ్ఞానం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, న్యాయం పట్ల నిబద్ధత, వృత్తిపరమైన క్రమశిక్షణ పీసీ రావును అగ్రభాగాన నిలబెట్టింది. 2012లో పద్మ భూషణ్ గౌరవాన్ని అందుకున్న న్యాయశాస్త్రవేత్త ఆయన. మద్రాసు యూనివర్సిటీలో బీఏ పట్టాను, ఎల్ఎల్బీ పట్టాను పొందిన పీసీ రావు ఆ తరువాత స్నాతకోత్తర పట్టాను, డాక్టరేట్ను సాధించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లాలో ఆయన 1963 నుంచి 67 దాకా పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగంలో చేరారు. లీగల్ అండ్ ట్రీటీస్ డివిజన్లో సహాయ సలహాదారుడిగా పనిచేశారు. 1972లో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాక్ మధ్య ఒక వివాదంలో ఐసీఏఓ అధికార పరిధి గురించి పీసీ రావు ప్రతిభావంతంగా వాదించారు. దీని ఆధా రంగా నాలుగేళ్లపాటు పీసీ రావును ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ భారత పర్మనెంట్ మిషన్లో న్యాయ సలహాదారుడిగా భారత ప్రభుత్వం నియమించింది. 1996 అక్టోబర్ నుంచి సుదీర్ఘ కాలం ఆయన జర్మనీ లోని హాంబర్గ్లో సముద్ర న్యాయశాస్త్రానికి చెందిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా పనిచే శారు. 1999 నుంచి 2002 దాకా ఆయన ఈ ట్రిబ్యు నల్కు చైర్మన్గా నాయకత్వం వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్న బ్రెడ్ అనే సంస్థలో డాక్టర్ ఎన్. భాస్కర రావు, కె.రామచంద్రమూర్తి, కాకాని రామ మోహన్ రావు ప్రభృతులతో పీసీ రావు, పుష్ప భార్గవ కలిసి పనిచేశారు. ఆంగ్ల భాషలో అంతర్జాతీయ న్యాయశాస్త్రంపై అనేక పుస్తకాలు రచించారాయన. ద న్యూ లా ఆఫ్ మారిటైమ్ జోన్స్, 1982, భారత రాజ్యాంగం– అంతర్జాతీయ చట్టాలు, 1993, ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ చట్టం 1996, ఏ కామెంటరీ, 1997, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలు: అంటే ఏమిటి? ఏ విధంగా పనిచేస్తాయి?, 1996, ది ఇంట ర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ: ఏ కామెం టరీ, 2000, ద రూల్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రిబ్యు నల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ: ఏ కామెంటరీ, 2006 గ్రంథాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న పుస్తకాలు. ఈ అంశాలపైన వీటిని మించినవి లేవు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
నిజనిర్ధారణ కూడా రహస్యమేనా?
తన భర్తను అన్యాయంగా బదిలీ చేశారనీ, సీఈఎల్ (సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్)లో అనేక అన్యా యాలు జరుగుతున్నాయని సుప్రియాకుమారి నాటి మంత్రి వైఎస్ చౌదరికి వినతిపత్రం సమర్పిం చారు. దానిపై ఏ చర్యలు తీసుకుకున్నదీ చెప్పాలని నిజనిర్ధారణ కమిటీ నివే దిక ప్రతి కావాలని, దానిపై వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా విభాగం తీసుకున్న చర్యలు వివరించా లని ఆమె అడిగారు. నివేదిక ప్రతిని, వివరాలను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆర్టీఐ కింద అడిగితే ఈ నివేదిక ఇవ్వవలసి ఉంటుందని సీపీఐఓ సలహా ఇచ్చారు. ఆ నివేదిక ప్రతికి సంబం ధించిన దస్తావేజులున్న మరో శాస్త్రవేత్త ఇవ్వడానికి నిరాకరించారు. దానికి ఆయన ఎంచుకున్న మిష ప్రైవేటు సమాచారం అని. ఎవరి వ్యక్తిగత సమాచా రం? నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇస్తే ఎవరి ప్రైవసీ దెబ్బ తింటుందనే వివరణ లేదు. సీఈ ఎల్లో అవక తవకలపై విచారించిన ఆ కమిటీ ఏం తేల్చిందని అడిగితే, ఆ శాస్త్రవేత్త ఏమీ రుజువు కాలేదని జవా బిచ్చారు. ఇందులో దాచవలసింది ఏమీలేదని, పూర్తి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కార ణాలు వివరించి, సమర్థించుకోవలసిన బాధ్యత ఆ శాస్త్రవేత్తపైన ఉందని మొదటి అప్పీలు అధికారి తన ఆదేశంలో వివరించారు. అయినా ఆ శాస్త్రవేత్త విన లేదు. ఆ దశలో కూడా సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని సూచించారు. అయినా శాస్త్రవేత్త ఇవ్వను పొమ్మన్నారు. రెండో అప్పీలును సమాచార కమిషన్ ముందుకు తెచ్చారు. ఈ నిజనిర్ధారణ నివేదికతో పాటు కొన్ని పత్రాలను సీఈఎల్ తమ న్యాయవాదికి ఇచ్చిందని, కనుక ఈ నివేదిక ప్రతి లాయర్ కిచ్చిన ప్రివిలేజ్ ప్రతి అవుతుందని కనుక ఇవ్వడానికి వీల్లే దని అన్నారు. కమిషన్ విచారణలో ఆయన మరో కొత్త కారణం తెరమీదకు తెచ్చారు. ఈ నివేదికలో వ్యాపార రహస్యాలున్నాయని, వాటిని వెల్లడిస్తే తమ సంస్థ పోటీలో దెబ్బతింటుందని, అలాంటి సమాచారం ఇవ్వకూడదని శాస్త్రవేత్త వాదించారు. సీఈఎల్లో అవకతవకలున్నాయని టెలికాం లైవ్ అనే పత్రికలో వ్యాసం వచ్చిందని, సీఏజీ(కాగ్) నివేదికలో కొన్ని అభ్యంతరాల ఆధారంగా ఆ వ్యాసంలో చేసిన విమర్శలు, ఆరోపణలపై విచారణ జరిపించి తీరాలని కోరారు. నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక సమాచార హక్కు చట్టం సెక్షన్ 2(ఎఫ్) కింద సమాచారం అనే నిర్వచనంలోకి ఖచ్చి తంగా వస్తుందని, ఆ నివేదికను దాచిపెట్టడం చట్ట వ్యతిరేకమని విమర్శించారు. ఇదివరకు మరో ఆర్టీఐ అప్పీలులో సీఐసీ ఈ నిజ నిర్ధారణ నివేదికలో కొన్ని భాగాలను దాచి మిగిలిన నివేదిక కాపీలను ఇవ్వ డానికి అనుమతించిందని డీమ్డ్ సీపీఐఓ శాస్త్రవేత్త అన్నారు. ఈ కేసులో కూడా పూర్తి నివేదిక ఇవ్వ నవసరం లేదని ఆయన తెలిపారు. మరోసారి సీపీఐఓ ఈ నివేదిక ఇవ్వాలని ఉత్తరం రాసినా ఈ శాస్త్రవేత్త ఇవ్వనందున ఆయనపై జరిమానా విధిం చాలని కోరారు. ఎవరి వ్యక్తిగత సమాచారం అందులో లేదని, అయినా ఎందుకు దాస్తున్నారని అడిగారు. మొత్తం దస్తావేజులను రాతపూర్వక వాదాలను పరిశీలిస్తే శాస్త్రవేత్త సమాచార నిరాకర ణకు ఏ ఆధారమూ కనిపించడం లేదని కమిషన్ భావించింది. ప్రతిసారి ఏదో ఒక సెక్షన్ను ఉదహ రించి సమాచారం ఇవ్వనంటున్నారేగాని అది వర్తి స్తుందో లేదో ఆలోచించడమే లేదని, సీపీఐఓ అధి కారి విచక్షణను ఉపయోగించకుండా నిర్ణయాలు తీసుకోవడం న్యాయంకాదని కమిషన్ వివరించింది. మొత్తం నివేదికను పరిశీలించి వాణిజ్య సంబం ధమైన అంశాలు నిజంగా పోటీని దెబ్బతీస్తే, వాటిని మినహాయించి మిగతా భాగం ఇవ్వాలని ఆదేశిం చింది. తర్వాత ఈ శాస్త్రవేత్త ఆ నివేదికలో చాలా ముఖ్య భాగాలను, మినహాయించి పనికి రాని భాగా లను ఇచ్చారని, అధికారుల పేరు రాగానే దానిపైన నలుపు సిరా పూసేశారని విమర్శించారు. దాంతో కమిషన్ మొత్తం నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. దానిలో వాణిజ్యపరంగా దాచవలసిన అంశాలేవీ కనిపించలేదు. పైగా, మొదటి అప్పీలు ఆధికారి ఆదేశాలను కూడా పాటించకుండా వదిలే యడం చట్ట వ్యతిరేకం. మొదటి అపెల్లేట్ అధికారి స్థానంలో ఉన్న శాస్త్రవేత్త ఈ నివేదిక మళ్లీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాత నివేదిక ప్రతి ఇచ్చారు. ఇన్నాళ్లూ సమా చారం ఇవ్వకుండా అన్యాయంగా దాచినందుకు ఎందుకు శిక్ష విధించకూడదో కారణాలు వివరించా లనే నోటీసు ఇచ్చింది. దానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో శాస్త్రవేత్తకు రూ. 5 వేల జరిమానా విధించాలని కమిషన్ ఆదేశించింది. (ఇఐఇ/ఈౖ ఐ ఖ/అ/2018/104889 కేసులో 13.9.2018న సీఐసీ ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్,professorsridhar@gmail.com -
‘టీటీడీ జవాబుదారీగా ఉండాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ప్రజాసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. టీటీడీలో నెలకొన్న వివాదం కేవలం శ్రీవారి నగల సమస్య లేదా శ్రీవారి ప్రాచీన కట్టడాల సమస్యో కాదని వ్యాఖ్యానించారు. శాసనాల్లో ఉన్న నగలకు, టీటీడీలో ఉన్న నగలకు అస్సలు పోలికే లేదని పురావస్తు శాఖకు చెందిన ఒక డైరెక్టర్ చెప్పారని... ఆ నివేదికపై సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా అడిగితే జవాబు చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. టీటీడీలో చెలరేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ... వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సెప్టెంబరు 28ను తుది విచారణ ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ జవాబుదారీగా ఉండటానికి ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవచ్చన్నారు. ప్రజలు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీకి ఉందని స్పష్టం చేశారు. -
ఏది గోప్యత? ఏది సమాచారం?
నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీలో 2001 నుంచి 2007 వరకు మీరెంత మంది యువతీ యువకులను సీనియర్, జూనియర్ స్కాలర్లు, ఫెలోషిప్ స్థానాల కోసం ఎంపిక చేశారు? వారి పేర్లేమిటి? ఏఏ పరిశోధనాంశాల్లో వారు అధ్యయనం చేస్తున్నారు? నిర్ణీత కాలాన్ని మించి పరిశోధన కొనసాగించిన వారు ఎంతమంది? వారెవరు? పరిశోధనా కాలాన్ని కొనసాగించే నియ మం ఉందా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేశారు? పరిశోధన విజయవంతంగా పూర్తిచేసిన వారికి చివరి వేతన చెల్లింపు సర్టిఫికెట్లు ఎప్పుడిచ్చారు? అని సమా చార హక్కు కింద 2017 సెప్టెంబర్ 20న దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, ఈ అంశాలన్నింటినీ వ్యక్తిగత సమాచారమని వర్గీకరించారు. ఈ దరఖాస్తుపై 30 రోజులు గడిచినా ఏమీ చెప్పలేదు. ‘మా పరిపాలనాధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాచారాన్ని నిరాక రించాం’ అని రెండో అప్పీలులో పీఐఓ చెప్పారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(జే) ప్రకారం ఆ సమా చారం ఇవ్వవలసిన పని లేదని అనుకున్నారు. తాను ఇటీవలే పీఐఓగా చేరానని, అంతకుముందు అజిత్ కుమార్ ఈ సమాధానాన్ని 2018 మే 3న చెప్పారని కొత్త పీఐఓ వివరించారు. రెండో అప్పీలు దాఖలైన తర్వాత 2018 జులై 11న అడ్మినిస్ట్రేటివ్ అధికారి కుమారి నిధి శ్రీవాస్తవ సమాధానం ఇచ్చారు. స్కాలర్ల పేర్లు కూడా వారి వ్యక్తిగత సమాచారం ఎట్లా అవుతుందో వివరించాలని అడిగితే జవాబు లేదు. పై అధికారులను ఒక్కోసారి పీఐఓలు సమా చారం కోసం అడుగుతుంటారు. వారు తమ అధికార హోదాతో ఒక్క నిమిషంలో ఏ సమాచారమూ ఇవ్వ ద్దని తేల్చి పారేస్తారు. నెలరోజులైనా ఏ జవాబూ ఇవ్వకపోవడం సమాచారాన్ని నిరాకరించడమే. కొందరు మొదటి దశలో, మొదటి అప్పీలు దశలో కూడా సమాచారం ఇవ్వరు. రెండో అప్పీలు వేసినా పట్టించుకోరు. కాని ఫలానా కమిషనర్ ముందుకు కేసు వచ్చిందని, విచారణ నోటీసు కూడా వచ్చిందని తెలిశాకే స్పందిస్తారు. ‘‘పీఐఓ మారితే నా కన్నా ముందు అధికారి నిరాకరిస్తే నేనెందుకు ఇవ్వాలి? కమిషనర్ కూడా ఆయనకే నోటీసు ఇస్తాడు కదా. అతను బాధపడితే పడనీ’’ అనుకుంటారు. సమాచారం ఇవ్వకుండానే కమిషన్ ముందు విచా రణకు వస్తారు. కొత్త పీఐఓ ఎప్పుడు చేరారో అడిగి, ఆ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న సమాచార దర ఖాస్తులు ఎందుకు చూడలేదని అడిగే అవకాశం ఉండాలి. నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ మౌలికమైన పని గ్రంథాలయ నిర్వహణతో పాటు, పరిశోధకులకు సాయం చేయడం. ఎవరికి స్కాలర్ షిప్ ఇచ్చారు? ఎంతకాలం పరిశోధన జరిగింది? అనే ప్రశ్నలు సామాన్యమైన సమాచార అభ్యర్థన అంశాలు. వాటిని ఏదో ఒక నెపంతో నిరాకరించడం న్యాయసమ్మతం కాదు. చట్టసమ్మతం కూడా కాదు. ఈ పనిచేసింది మొదట సీఐఓ అజిత్ కుమార్. దాంతో పాటు వారి పాలనాధికారి లోపం కూడా ఇందులో భాగం. అజిత్ కుమార్కు తప్పుడు ఆదే శాలు ఇవ్వడమే కాకుండా, మొదటి అప్పీలు అధికారి బాధ్యతలను మరొకరికి ఇవ్వకుండా పీఐఓ అయిన అజిత్ కుమార్కే అప్పగించడం చట్టవిరుద్ధం. ఇందు వల్ల సమాచార అభ్యర్థి తనకు జరిగిన చట్ట వ్యతిరేక నిరాకరణను ప్రశ్నించే అవకాశం కోల్పోయాడు. ఈ రెండు తప్పులకు ఆనాటి పాలనాధినాధికారి నిధి శ్రీ వాస్తవ బాధ్యులు కావలసి వస్తుంది. ఆర్టీఐ చట్టంలో ఉన్న బాధ్యతలను నిర్వహించడానికి పీఐఓకు మిగి లిన అధికారులు అందరూ సహకరించాలి. పై అధికా రులు, కింది ఉద్యోగులు కూడా ఈ ఉన్న తాధికారికి సాయం చేయాలి. పీఐఓ అడిగినపుడు సాయం చేయని మరొక ఉద్యోగి పైఅధికారి అయినా, కింది అధికారి అయినా సరే నిరాకరించిన పీఐఓగా ఆయ నను పరిగణించి ఆయనపై చర్యలు తీసుకునే అధి కారం ఉంది. కనుక సమాచార కమిషన్ పీఐఓ అజిత్ కుమార్కు, సమాచారం ఇవ్వడంలో సహాయం నిరా కరించిన నిధి శ్రీవాస్తవకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పబ్లిక్ అథారిటీలు, పీఐఓలు అడుగడుగునా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, చట్టం వచ్చిన 120 రోజులలోగా తమంత తామే 17 రకాల సమాచారాన్ని సెక్షన్ 4(1) (బీ) కింద ఇవ్వాలి. ఈ కేసులో కోరిన నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీకి సంబంధించిన స్కాల ర్షిప్ వివరాల సమాచారం తమంత తామే ఇవ్వవలసి నది. 30 రోజుల్లో జవాబివ్వలేదు. మొదటి అప్పీలు అవకాశం తొలగించారు. తర్వాత తప్పుడు కారణా లపై ఈ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఇవన్నీ చట్ట వ్యతిరేక చర్యలు. అంతేకాదు 8(1)(జే) దుర్వినియోగం. (డాక్టర్ కమల్ చంద్ర తివారీ వర్సెస్ నెహ్రూ మెమో రియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, CIC/NMMA L/A/2018/616896 కేసులో ఆగస్టు 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఈ దోపిడీ మూలాలేమిటి?
విశ్లేషణ ప్రాణం కాపాడే మందుల ధరలు ప్రజలకు అందుబా టులో ఉంచడానికి. జాతీయ ఔషధ ధరల అథారిటీ గరిష్ట ధరలను నిర్ణయించాలి. నిర్ణీత ధరకు మించి అమ్మితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అథారిటీ ధరలు నిర్ణయించడం లేదు. జాబితాలో నిజంగా అత్యవసరమైనవి చేర్చడం లేదు. నిర్లిప్తత, నిష్క్రియాపరత్వం వల్ల ప్రయివేటు వైద్యవర్తకుల దోపిడీకి అవకాశం వచ్చింది. ఒక అభా గ్యుడికి గుండెపోటు వస్తే ఫరీదాబాద్ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. స్టెంట్ అమర్చాలన్నారు. ఆస్పత్రి వారే స్టెంట్ను లక్షా 26 వేల రూపాయలకు అమ్మారు. స్టెంట్ ప్యాకెట్ బాక్స్పై గరిష్ట ధర లేదు. ఎందుకని అడిగితే ప్రభుత్వం స్టెంట్ను ఔషధంగా ప్రభుత్వం పరిగణించదు కనుక నియంత్రణ లేదట. జాతీయ ఔషధ ధరల అథారిటీ సేకరించిన వివరాల మేరకు జాబితాలో లేని వస్తువులు, మందులకు ధరలు వేయి శాతం నుంచి రెండువేల శాతం వరకూ పెంచేస్తున్నారు. మరో వైపు కార్డియో వాస్క్యులార్ రోగాలు పెరుగుతూ అయిదేళ్లలో ఆంజియోప్లాస్టీ చికిత్సలు రెట్టింపు అయ్యాయి. స్టెంట్ పేర రోగులను నిలు వునా దోచుకుంటున్నారు. ఇదో పెద్ద కుంభకోణం. ఏ స్టెంట్ కొనమనాలో వైద్యశాల యజమానులు డాక్ట ర్లను ఆదేశిస్తారు. డాక్టర్ చెప్పారని ఎంత ధరైనా పెట్టి కొంటారు. మార్కెట్లో మంచి స్టెంట్ ఎంచుకునే స్వేచ్ఛ గుండె రోగులకు లేదా? ప్రయివేటు వైద్య వర్తకుల స్టెంట్ దోపిడీని అరికట్టేందుకు జాతీయ అత్యవసర మందుల జాబితాలో ఈ స్టెంట్లు చేర్చా లని ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వాజ్యాన్ని బీరేందర్ సాంగ్వాన్ ఢిల్లీ హైకోర్టులో 2014లో దాఖలు చేశారు. ఆర్టీఐ ద్వారా సాధించిన సమాచార పత్రాల ఆధారంగా ఈ పిల్ను రూపొం దించారాయన. ఈఎస్ఐ కార్పొరేషన్ తమ ఆస్పత్రుల్లో స్టెంట్ ఇంప్లాంట్ చేసే సౌకర్యాలు లేవనే నెపంతో రోగు లను ప్రయివేటు వైద్యశాలలకు పంపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ ధరలను లేదా ఎయిమ్స్ ధరలను మాత్రమే వసూలు చేయాలని నియమాలు ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఎంత మంది రోగులను ప్రయివేటు ఆస్పత్రులకు పంపారు? వారు ఎంత ధర వసూలు చేశారు? నిర్ణీత ధరలు ఏవి? అని సమాచార హక్కుచట్టం కింద అడిగారు. కోట్ల రూపాయలు ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించే బదులు సొంత ఆస్పత్రుల్లో కావలసిన చికిత్సలు అందించే ఏర్పాట్లు చేయరు. కార్పొరేట్ ఆస్పత్రులకు దోచుకునే అవకాశం ఇస్తున్నారు. దీని వల్ల ఏటా రూ.1500 కోట్ల చొప్పున 2013 నుంచి 2016 దాకా చెల్లించవలసి వచ్చిందని ఈఎస్ ఐసీలో పనిచేసిన ఒక డాక్టర్ వివరించారు. ఔషధం స్రవించే స్టెంట్లను ఇండియాలో 600 నుంచి 2971 డాలర్ల ధర దాకా అమ్ముతున్నారని, అమెరికాలో ఈ స్టెంట్లను అంతకు సగం కన్నా తక్కువ ధరకు అంటే సగటున 1200 డాలర్లకు అమ్ముతున్నారని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ పరిశోధనా పత్రంలో వివరించారు. ఈఎస్ఐసీవారు సాధారణంగా సీజీహెచ్ఎస్ రేటునే చెల్లిస్తారని చెప్పారు. నిజానికి ప్రైవేటు ఆసుపత్రులవారు ఎయిమ్స్ లేదా, సీజీహెచ్ఎస్ రేట్లకన్నా రెండున్నర రెట్లు ఎక్కువ ధరకు వసూలు చేస్తున్నారని, అయినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆర్టీఐ వేసిన ఒక డాక్టర్ విమర్శించారు. ఎయిమ్స్ రేటు లేదా సీజీహెచ్ఎస్ రేటుతో పోల్చితే మార్కె ట్లో ప్రైవేటు ఆస్పత్రుల ధరలు చాలా ఎక్కువ. మార్కెట్ లో గరిష్ట ధర కన్న 15 శాతం తక్కువ చార్జి చేయాలని నియమాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈఎస్ఐసీ వారు సాధారణంగా సీజీ హెచ్ఎస్ రేటునే చెల్లిస్తారని చెప్పారు. పాలనా విధా నాలను సరిచేయడంలో ఆర్టీఐ ప్రజలకు ఒక భూమి కను ఏర్పాటుచేస్తుంది. మొట్టమొదట స్టెంట్ రేటును నియంత్రించాలి. గరిష్ట ధర ఎంతో విస్తృతంగా ప్రజ లకు సులువుగా తెలియజేయాలి. ప్రయివేటు ఆసు పత్రుల గోడల మీద స్టెంట్ గరిష్ట ధర పెద్దగా రాసి ఉండాలి. అంతకు మించిన ధర ఇవ్వద్దనీ, వసూలు చేస్తే ఫలానా వారికి ఫిర్యాదు చేయాలని, మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ కూడా పెద్దగా రాయాలి. ఈ విధంగా రాయని వైద్యశాలల లైసెన్సు రద్దు చేయాలి. కేవలం జాతీయ అత్యవసర ఔషధాల్లో ఒకటిగా స్టెంట్ను చేర్చకపోవడం, అత్యవసర వస్తు వుల ధరల అథారిటీ ధరలను నిర్దారించకపోవడం వల్ల కోట్లాది రూపాయల అవినీతి ప్రభుత్వ రంగం లోనూ, అదే స్థాయిలో అక్రమార్జన ప్రయివేటు ఆస్పత్రి రంగంలోనూ జరుగుతోంది. దోపిడీకి గుర య్యేది మాత్రం సామాన్య రోగులు, మధ్యతరగతి కుటుంబాల వారు. ఈ విధాన నిర్ణయాలు తీసుకోవ డంలో ఎంత ఆలస్యం అయితే అంత మేరకు రోగుల దోపిడీ జరుగుతూనే ఉంటుంది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
అనైతిక వైద్యం వెనుక అవినీతి చీకటి
వైద్య ఖర్చులు భరించలేని పేదల సంక్షేమచర్యలలో భాగంగా కార్మిక జీవిత బీమా సంస్థ వారు (ఇఎస్ఐసి) అనేక వైద్యశాలలు నడుపుతున్నారు. చిన్న ఉద్యోగులకు, కార్మికులకు అందులో చికిత్స ఉచి తంగా ఇస్తారు. ఒక్కోసారి వాటిలో అవసరమైన చికిత్సా సౌకర్యాలు లేకపోతే వారే సమీపంలోని ప్రయివేటు వైద్యశాలలకు చికిత్సకోసం రోగులను పంపించవలసి ఉంటుంది. అక్కడి చికిత్సకు శస్త్ర చికిత్సలకు, రోగులకు అమర్చిన స్టెంట్ వంటి పరికరాలకు అయ్యే ఖర్చులను కార్మిక జీవిత బీమా సంస్థ భరించవలసి ఉంటుంది. ప్రైవేటు వైద్యదుకాణాల వ్యాపారులు స్టెంట్ అనే పరికరాన్ని గుండెజబ్బుతో బాధపడేవారికి అమర్చినందుకు తీసుకునే డబ్బు విపరీ తంగా ఉంటుంది. వాటి అసలు ధరకు, వారు వసూలు చేసే సొమ్ముకు సంబంధమే ఉండదు. ప్రయివేటు ఆస్పత్రులకు ఇఎస్ఐసి పంపే రోగుల చికిత్సకు వాడే పరికరాలకు గాను చెల్లింపుల గందరగోళం గురించి ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖ లైంది. రెండో అప్పీలు రూపంలో ఆ సమస్య కేంద్ర సమాచార కమిషన్కు చేరింది. ఎవరైనా సరే చికిత్సకు వాడే వస్తువులకు ఇష్టం వచ్చినట్టు ధర విధించడానికి వీల్లేదని, ఇఎస్ఐసి వారు కేవలం సీజీహెచ్ఎస్ వారు నిర్ధారించిన ధరల ప్రకారమే రేట్లు వసూలు చేస్తారని సమాధానం ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి రేట్లప్రకారం కూడా చెల్లింపులు ఉంటాయి. ఇఎస్ఐ కూడా ధరలను నిర్ధారించింది. గుండె రోగులకు కార్డో వాస్క్యులార్ డెప్రిబిలేటర్ సింగిల్ చాంబర్, డబుల్ చాంబర్, సీఆర్టీపీ వస్తువులను, పేసర్లను అమర్చుతూ ఉంటారు. అయితే ఇఎస్ఐ తాము పంపిన రోగులకు ఎంత ధర వసూలు చేస్తున్నారనే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రయివేటు ఆస్పత్రుల వారు అడిగినంత డబ్బు ఇచ్చి, రేట్ల తేడాలు పట్టించుకోకుండా ఉండేందుకు ప్రతిఫలాలు అందుకుంటున్నారని దరఖాస్తుదారు పవన్ సారస్వత్ ఫిర్యాదు చేశారు. గుండె సింగిల్ చాంబర్కు వాడే ఐసీడీకి ఎయిమ్స్ వారు లక్షా 75 వేల 786 రూపాయలు ధర నిర్ణయిస్తే ఇఎస్ఐ పంపిన రోగులకోసం ప్రయివేటు వైద్యశాలలు 5 లక్షల 50 వేల నుంచి 8 లక్షల 50 వేల దాకా అడుగుతున్నారని, ఇఎస్ఐసి చెల్లిస్తున్నదని వివరించారు. కార్మికులు. చిన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, బీమా సొమ్మును ఆస్పత్రులు ఈ విధంగా దోచుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు. అసలు ఈ విధంగా స్టెంట్లు వేయడం, ఖరీదైన చికిత్సలు చేయడం కూడా చాలా సందర్భాలలో అవసరం లేదని నిపుణులైన డాక్టర్ల మాట. అవసరం లేని కేసుల్లో కూడా సర్జరీలు చేస్తున్నారని, వారు సూచిం చిన చికిత్స వెంటనే చేయకపోతే ప్రాణాలుపోతాయని, అందుకు తాము బాధ్యులం కామని ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు భయపెడితే ఏమీ తోచక భయపడి రోగులు స్టెంట్లు వేయించుకోవడానికి ఒప్పుకోక తప్పడం లేదని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హృదయాలయ) అన్నారు. సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మనోజ్ అగర్వాల్ ఔషధ వైద్యంద్వారా గుండె జబ్బును నివారించే అవకాశం ఉంటే స్టెంట్ వాడకూడదని అన్నారు. అవసరం లేకపోయినా స్టెంట్ వాడితే అది చాలా తీవ్రమైన అనైతిక చర్య అని వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించారు. అసలు ఇఎస్ఐ వారు ఎందుకు వేలాది మంది రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపించేస్తున్నారనేది ప్రశ్న. రెండున్నర రెట్లకన్న ఎక్కువ ధరను స్టెంట్లకు చెల్లించాల్సి వస్తోందని వారికీ తెలుసు. ఇఎస్ఐ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఆరోగ్య శాఖ వారికి గానీ ఈ సంగతులు వివరించి, ఈ దారుణమైన దోపిడీని ఆపడానికి కనీసం ప్రయత్నించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. అందుకు కారణం ప్రయివేటు ఆస్పత్రులనుంచి వీరికి క్రమం తప్పకుండా ఒక్కో స్టెంట్కు కొంత కమీషన్ చొప్పున సొమ్ము అందుతున్నదని, రోగులను తమకు రిఫర్ చేసినందుకు ఇఎస్ఐసి వారికి తగిన ప్రతిఫలం ముట్టచెబుతారని అన్నారు. వీరి లంచం డబ్బులు కూడా కలుపుకుని, దానికిపైన కూడా తమ లాభాన్ని తగిలించి, రోగులనుంచి, బీమా కంపెనీలనుంచి ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆస్పత్రులు వెనుకాడడం లేదని ఆయన వివరించారు. చర్యతీసుకునే వారెవరు? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
విషయం చెప్పకపోతే వివాహం నిలవదు
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న సమస్య ప్రైవసీ. అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ వ్యవహారాల నయినా రికార్డు చేసి జనం ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరి రహస్యాలు బయటపడే అవకాశాలు పెరిగాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నపుడు తమ వివరాలు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కొనుగోళ్లు, ఇతర ఒప్పందాలకు ముందు అన్ని విషయాలు వెల్లడించడం చట్టపరమైన బాధ్యత. పూర్తి విషయాలు చెప్పకపోయినా, కొన్ని విషయాలు దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసం చేసినా ఒప్పందాలు చెల్లవు. భాగస్వామ్య ఒప్పందాలు, సేవలు, వస్తువుల కొనుగోళ్ల సంబంధాలు కూడా పరస్పర సమాచార మార్పిడి మీదనే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత విషయాలు అనుకునేవి కూడా ఒక్కోసారి పంచుకోకతప్పదు. పెళ్లి, సంతానం, మాతృత్వం, పిల్లలను పెంచడం, వారి చదువులు తదితర అంశాలన్నీ కుటుంబానికి సంబంధించినవి. ఆ విషయాలు ఇతరులకు అనవసరం. ఒకవేళ అవసరం ఉంటే దేనికో చెప్పాలి. ప్రజా ప్రతినిధులు, ప్రజా సేవ కులు, ప్రజలందరికీ తెలిసిన నేతలు, తారలు, క్రీడా కారుల వ్యక్తిగత జీవన పరిధి మిగతా వారి కన్నా తక్కువ. ప్రాథమిక హక్కే అయినా ప్రైవసీకూడా మినహాయింపులకు లోబడి ఉంటుంది. డాక్టర్– పేషెంట్ సంబంధం ప్రైవసీని సృష్టిస్తుంది. అది ఒక కాంట్రాక్టు. సమాచారాన్ని డాక్టరు గోప్యంగా ఉంచాలి. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి దీనికి మినహాయింపు ఉంటుంది. కాబోయే జీవన భాగ స్వామి ఆరోగ్య లేదా రోగనిర్ధారిత సమాచారం భాగస్వామికి తెలియాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ వివాహ చట్టాల్లో ఆరోగ్య సమాచార మార్పిడి అవసరమనే నియ మం ఉంది. పెళ్లయిన తరువాత జంటలో ఒకరికి ఎయిడ్స్ వంటి జబ్బు లేదా ఏదయినా తీవ్రమైన అంటురోగం ఉందని తేలితే వివాహాన్ని రద్దుచేసుకునే అవకాశం చట్టాలు కల్పిం చాయి. హిందూ వివాహ చట్టం సెక్షన్ 13, ముస్లిం వివాహాల రద్దు–1939 చట్టం సెక్షన్ 2, పార్సీ వివాహం, విడాకుల చట్టం 1936, ప్రత్యేక వివాహాల చట్టం సెక్షన్ 27 ప్రకారం భాగస్వామికి వ్యాప్తిచెందే సుఖ రోగం ఉందనే కారణంపై విడాకులు కోర వచ్చు. తనద్వారా మరొకరికి అంటువ్యాధిని నిర్లక్ష్యంగా వ్యాపించేట్టు చేస్తే, అది నేరమని, దానికి ఆరు నెలల జైలు శిక్ష విధించే వీలుందని భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 269 చెబుతోంది. రోగం తెలిసి తెలిసి అంటించేట్టు చేస్తే అందుకు రెండేళ్ల జైలు శిక్షను సెక్షన్ 270 నిర్దేశించింది. అంటే ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి, అతడిని ఒక యువతి తెలియక పెళ్లి చేసు కుంటుంటే చూసి మౌనంగా ఉండడం కూడా ఈ సెక్షన్ కింద నేరమే. తాను పరీక్షించిన వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి, అతడి ప్రేమికురాలు అడిగినా ఆ విష యం చెప్పని డాక్టర్ ఆ తరువాత ఆమెకు ఆ రోగం సోకితే ఈ సెక్షన్ కింద ప్రాసిక్యూషన్కు గురి కావ లసి వస్తుంది. నేరం రుజు వైతే డాక్టర్కు రెండేళ్ల జైలు శిక్ష తప్పదు. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు, ఆ విధంగానే ఆరోగ్యకరమైన జీవి తం కొనసాగించే హక్కు కూడా ప్రాథ మిక హక్కే. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినపుడు ఈ రెండింటిలో ఏది న్యాయ బద్ధమైందో, నీతివంతమైందో అది గెలు స్తుంది. రోగి అయిన వరుడి వివాహ హక్కుకన్నా వధువు ఆరోగ్యవంతమైన జీవన హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ వలసి వస్తుందని సుప్రీంకోర్టు చరిత్రా త్మక తీర్పు చెప్పింది. ప్రతి హక్కు ఒంటరిగా ఉండదు. తగిన బాధ్య తలతో ఉంటుంది. ఒకరి హక్కు మరొకరి బాధ్యతతో ముడిపడి ఉంటుంది. స్నేహబంధమైనా, వ్యాపార సంబంధమైనా, ఉద్యోగ అనుబంధమైనా పూర్తిగా అన్ని విషయాలు తెలియజేస్తేనే నిలుస్తాయి. కుటుం బంలో, భాగస్వామ్య వ్యాపారాలలో దాపరికం, సోమరితనం, చైతన్యరాహిత్యం వల్ల వ్యక్తులు మోస పోతుంటారు. స్నేహం కారణంగా నమ్మామని, ప్రేమవల్ల నమ్మక తప్పలేదని, భర్త కనుక గుడ్డిగా అతని మాటలు విశ్వసించాననే వివరణలు ఇస్తూ ఉంటే అవి మోసపోవడానికి కారణాలు అవుతాయే కాని, నివారణకు పనికి రావు. స్నేహం, ప్రేమ, వివా హం మొదలైన అన్ని బంధాలు నిజాయితీ అనే పునాది మీద ఆధారపడి ఉంటాయి. కుటుంబంలో, కాంట్రాక్టు భాగస్వాముల్లో సమాచార హక్కు ఈ విధంగా కీలక మైనదని అర్థం చేసుకోవాలి. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్