child marriage
-
వరుడికి 25, వధువుకి మాత్రం..!
విరిసీ విరియని.. తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు ‘మాంగల్యం తంతునానేనా..’ అంటున్నారు.. యుక్త వయస్సు రాకుండానే తాళిబొట్టు మెడలో వేయించేస్తున్నారు.. కొద్ది నెలలకే తల్లులవుతున్న ఆ అమ్మాయిలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.. అవగాహనా రాహిత్యమో.. గుండెల మీద కుంపటి దింపేసుకోవాలనే అమాయకత్వమో తెలీదు కానీ.. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా జరుగుతున్న బాల్య వివాహాలు కలవరపెడుతున్నాయి.రాజానగరం: యుక్త వయస్సు రాకుండా బాల్య దశలోనే వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం, అయినప్పటికీ వీటిని నిరోధించడంలో తరచూ అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ప్రకటనలకే పరిమితమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. మండలంలోని భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు, పాతతుంగపాడు తదితర గ్రామాల్లో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అవగాహన లేకనో.. ఓ పనైపోతుందనే ఉద్దేశమో కానీ.. యుక్త వయస్సు రాకుండానే కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేసి, అత్తారిళ్లకు పంపించేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా.. కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు దొడ్డ మణికంఠ, 16 సంవత్సరాల బాలిక పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. వరుడు రోజువారీ పనులు చేస్తూండగా.. వధువును ఆమె తల్లిదండ్రులు 9వ తరగతి వరకూ చదివించి, మానిపించేశారు. ఇంటి వద్దనే ఉంటున్న ఆ బాలికతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది. వారి వివాహానికి బాలిక తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. అయితే, అతడు లేకపోతే తాను బతకలేనంటూ ఆ బాలిక తరచూ అతడి ఇంటికి వెళ్లి వస్తూండేది. ఈ నేపథ్యంలో ఇరువైపుల పెద్దలు అయిష్టంగానే వారిద్దరికీ గుట్టు చప్పుడు కాకుండా బుధవారం రాత్రి ముక్కినాడ గ్రామంలోని దేవాలయంలో సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఆపై వారిద్దరినీ తిరుపతి పంపించేశారు. అధికారులకు తెలియకుండా ఇరు వర్గాల పెద్దలు ఈ వివాహం జరిపించినా.. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాల్య వివాహం గుట్టు రట్టయింది. గతంలోనూ.. ⇒ మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కూడా ఇదేవిధంగా బాల్య వివాహాలు జరిగాయి. ⇒ పుణ్యక్షేత్రం గ్రామంలో గత ఏడాది అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇరు వర్గాల పెద్దలకు బాల్య వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు. దీనిపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే పోలీసులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని, బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. యుక్త వయస్సు రాకుండా పిల్లలకు వివాహం చేయబోమంటూ పెద్దల నుంచి రాతపూర్వకంగా హామీ కూడా తీసుకున్నారు. అంతటితో తమ డ్యూటీ అయిపోయిందని సంబరపడుతూ వెనుదిరిగిన అధికారులు ఆ మర్నాడు అందుకున్న మరో సమాచారంతో షాకయ్యారు. రాతపూర్వక హామీ ఇచ్చిన పెద్దలే.. తమ పిల్లలను వేరొక ప్రాంతానికి తీసుకువెళ్లి, వివాహం చేశారని తెలిసి నిర్ఘాంతపోయారు. ⇒ గడచిన నాలుగేళ్లలో భూపాలపట్నంలో 4, పుణ్యక్షేత్రంలో 6, కొత్తతుంగపాడులో 9, పాతతుంగపాడులో 6 బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం. చట్టం ఏం చెబుతోందంటే.. బాల్య వివాహాలను అరికట్టేందుకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే చట్టాలున్నాయి. మొదటిసారిగా 1929లో చైల్డ్ మ్యారేజ్ రి్రస్టిక్ట్ యాక్ట్ను బ్రిటిష్ వారు తీసుకువచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్–2006 రూపొందించారు. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, 21 సంవత్సరాలోపు అబ్బాయిలను బాలల కిందే పరిగణిస్తారు. ఈ యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారి తల్లిదండ్రులతో పాటు ఆ సమయంలో అక్కడున్న వారు, వివాహ తంతు జరిపించే వారు (ప్రోత్సహించినట్టుగా భావిస్తారు) కూడా శిక్షార్హులే అవుతారు. వీరికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. దీనిలో నేరస్తులైతే బెయిల్ కూడా లభించదు.అధికారుల నిర్లక్ష్యమే కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొత్తతుంగపాడులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, గ్రామ కమిటీకి విషయం ముందుగా తెలిసినా కానీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. బాల్య వివాహం జరుగుతున్న సమాచారాన్ని పై అధికారులకు సకాలంలో ఇవ్వడం లేదు. బుధవారం రాత్రి జరిగిన బాల్య వివాహం గురించి, తహసీల్దార్కు కూడా ఫిర్యాదు చేశాను. – యాళ్ల మాచరయ్య, కొత్తతుంగపాడు ఫలితమివ్వని గ్రామ కమిటీలు బాల్య వివాహాలను నిరోధించండి.. అమ్మాయిల జీవితాలను కాపాడండి.. అంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నాగానీ, ప్రజల్లో సరైన స్పందన రావడం లేదు. వీటిని ఏవిధంగానైనా అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామ మహిళా కార్యదర్శి (పోలీసు), ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, అంగన్వాడీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు కూడా వేశాం. అయినప్పటికీ బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ముందుగా అందడం లేదు. స్థానికంగా ఉండే మొహమాటాలతో తమ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతోందని తెలిసి కూడా చూసీ చూడనట్లు వదిలేసి, తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. – టి.నాగమణి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం, రాజానగరం -
పుత్తడి బొమ్మకు.. పుస్తెల బంధనం!
ఎస్.రాయవరం మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికకు సమీప బంధువుతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. తాను చదువుకుంటానని ఈ వివాహం ఇష్టం లేదని ఏడ్చి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా తాము నిశ్చయించిన వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తండ్రి హెచ్చరించడంతో బాలిక వివాహం చేసుకోక తప్పలేదు. యలమంచిలి పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి పదో తరగతి పూర్తయిన 15 ఏళ్ల బాలికను ప్రసవం కోసం తీసుకురావడంతో వైద్యులు నివ్వెరపోయారు. తమ వద్ద డెలివరీ చేయడానికి కుదరదని చెప్పడంతో వారు పక్క జిల్లాలో ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లిపోయారు. ఈ విషయం బాలిక నివసిస్తున్న గ్రామంలో ఐసీడీఎస్, మహిళా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.యలమంచిలి రూరల్: ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా.. ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. చిన్నారి పెళ్లి కూతురికి పుస్తెల బంధనం తప్పడం లేదు. ఇందుకు నిరక్షరాస్యత, పేదరికం కొంత కారణం కాగా.. తల్లిదండ్రుల ఆలోచనా విధానం మరో ప్రధాన కారణం. తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్న కొందరు తల్లిదండ్రుల ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన బాలికల మెడల్లో పుస్తెల తాళ్లు పడుతున్నాయి. లోకం పోకడ తెలియకుండానే బిడ్డలకు బాల్యంలోనే వివాహాలు చేసి వారి జీవితాలను కొందరు తల్లిదండ్రులు చేజేతులా అగాధంలోకి నెడుతున్నారు. 18 సంవత్సరాలు నిండకుండా వివాహాలు చేస్తే అనారోగ్యంతో కుంగిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. అడ్డుకుంటున్నా.. ఆగడం లేదు బాల్య వివాహాలను మాతాశిశు సంక్షేమ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు బాల్య వివాహాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది.ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్న వారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే, అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. పెద్దయితే తాము చెప్పిన సంబంధం చేసుకుంటుందో లేదో అనే ఆలోచనతో మరికొందరు, ప్రేమలో పడి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తుందేమోనన్న భయంతో ఇంకొందరు.. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గత రెండేళ్లలో అధికారుల దృష్టికి వచ్చిన 151 బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి రాకుండా జరిగిపోతున్న పెళ్లిళ్లు అనేకం ఉంటున్నాయి. బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బాధ్యత మోస్తూనే అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు గర్భం దాలిస్తే తల్లికీ, బిడ్డకు ప్రాణాపాయం ఉంటుంది. ఎంతో సందడిగా ఆనందోత్సాహాలతో జరగాల్సిన పెళ్లి అధికారుల జోక్యంతో అర్థంతరంగా ఆగిపోతే రెండు కుటుంబాల వారికీ నగుబాటే కదా. అందుకే పెళ్లి వయసు రాకుండా ముహూర్తాలు పెట్టుకొని, అడ్డుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఏటా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహం నేరానికి శిక్ష.. బాల్య వివాహం చట్తరీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ కోసం 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు నిండే వరకు బాలికకు వివాహం చేయబోమని ఒప్పంద పత్రం రాయించుకుంటారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ప్రాణానికే ప్రమాదం బాల్య వివాహాల వలన వచ్చే గర్భాల వల్ల బాలికలు ఎనీమియా బారిన పడే ప్రమాదం ఉంది. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం, అధిక రక్తపోటుతో మెటర్నల్ డెత్లు జరుగుతాయి. బిడ్దను మోసే సామర్థ్యం బాలికలకు తక్కువగా ఉంటుంది. 6 నెలల క్రితం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి 17 ఏళ్ల ప్రాయంలోనే గర్భం దాల్చిన కేసు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాను. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రమాదమే. –డాక్టర్ ఆర్.నిహారిక, సివిల్ అసిస్టెంట్ సర్జన్, గైనకాలజిస్ట్, యలమంచిలి సీహెచ్సీ సమాచారం ఇవ్వండి బాల్య వివాహాలు జరిగినట్టు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పెళ్లిని ఆపుచేస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. తగిన వయసు లేకపోతే మానసిక, శారీరక పరిపక్వత ఉండదు. –కె.అనంతలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ, అనకాపల్లి అందరూ బాధ్యులే.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహం జరిపించిన తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, అనుమతించిన పెద్దలు, సహకరించిన వారు కూడా నేరస్తులే అవుతారు. మైనర్ బాలికను పెళ్లి చేసుకొని సంసారం చేస్తే పోక్సో కేసు నమోదవుతుంది. –కె.వి.సత్యనారాయణ, డీఎస్పీ, పరవాడ -
ముస్లిం వివాహాలు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: అసెంబ్లీలో బిల్లు
ముస్లిం వివాహాలు, విడాకుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్యేజ్ అండ్ డివర్స్ బిల్లు-2024’ను ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. మెజార్టీ సభ్యుల అంగీకరంతో ఆమోదం పొందింది. దీని ద్వారా బ్యాల వివాహాలను నిషేధించడం వీలవుతుందని సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందన్నారు.కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు.ఇంతకముందు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి. -
బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్
సాక్షి, అమరావతి: దేశంలో కర్ణాటక, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. 2022లో దేశంలో 1002 బాల్య వివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని నిరోధించేందుకు చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఏపీలో 2022లో కేవలం 26 బాల్య వివాహాలు నమోదయ్యాయని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా బాల్య వివాహాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంది. రక్తహీనత సమస్యను అధిగమిస్తే బాల్యవివాహాలను నివారించడం సాధ్యమనే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాల్యవివాహాలు చేసే అవకాశం ఉన్న వారికి ముందుగానే గుర్తించి, నివారించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది. -
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
బాల్య వివాహాలకు ముగింపు
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో వందకు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదుల రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా.. అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది. ఏలూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా.. అందులో రెండు వివాహాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్లైన్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు. గ్రామస్థాయి నుంచే పటిష్ట చర్యలు బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నివారణకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. యుక్త వయసులో ఉన్న బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాలు వల్ల ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలపై అవగాహన సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల నివారణలో భాగంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించారు. బాల్య వివాహాల నిరోధించడంపై రోజువారీ, నెలవారీ చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత నెలలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్య వివాహాల నివారణకు నెలవారీ క్యాలండర్ ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లలకు చదువు చెప్పండి) పథకం కింద జిల్లాల వారీగా రూ.5.56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో బాలికల విద్యతో పాటు బాల్య వివాహాల నివారణకు అవసరమైన కార్యకలాపాలను నెలవారీ క్యాలెండర్గా నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు విద్యనందించడం, లింగ వివక్షను నివారించడం, ఆడ పిల్లల రక్షణ, సంరక్షణ, బాల్య వివాహాల నివారణ కార్యకలాపాలను జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. -
ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలకు చెక్
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక దృష్టి సారించడం ఫలితాలనిస్తోంది. గత నెలలో 159 బాల్య వివాహాలను నివారించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలను నివారించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాల వారీగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి అక్కడ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, అక్షయ తృతీయ, శ్రావణ, మాఘ మాసాలు మొదలైన శుభ సందర్భాల్లో బాల్య వివాహాలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాల నివారణకు జారీచేసిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 15–18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను, 15–21 సంవత్సరాల వయస్సు గల బాలురను గుర్తించి వారిని ఓపెన్ స్కూల్స్, ఇంటర్, ఇతర దూరవిద్య కార్యక్రమాల్లో చేర్పించాలని సీఎస్ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల బయట ఉన్న కౌమార బాలికలను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇప్పించాలని చెప్పారు. బాల్య వివాహాల నిషేధ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించాలని, బాల్య వివాహాల నివారణతో పాటు బాలల హక్కులు, బాలల రక్షణ సమస్యలపై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. -
బాల్య వివాహం నుంచి బాలికకు విముక్తి
ఏలూరు(మెట్రో): ఫేస్బుక్ ద్వారా కలెక్టర్కి వచ్చిన సమాచారం మేరకు బాల్య వివాహం నుంచి ఓ బాలికకు విముక్తి కలిగింది. స్థానిక చెంచుల కాలనీలో బాల్యవివాహానికి పెద్దలు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వెంటనే స్పందించిన కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి చైల్డ్ హెల్ప్లైన్ బృందం సమన్వయంతో అంగన్వాడీ వర్కర్ సహకారంతో బాలిక ఇంటికి చేరుకొని విచారణ చేశారు. బాలిక తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోగా, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటినుంచి బాలిక తన అక్క, అన్నతో కలిసి నానమ్మ ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. కూలీ పని చేసుకొనే నానమ్మ, తాతయ్య ఆమెకు వివాహం చేయాలని భావించి ఓ అబ్బాయితో నిశ్చితార్థం చేయించారు. మరో నాలుగు రోజుల్లో వివాహ తేదీని నిర్ణయిస్తారని తెలిసిన బాలిక తనకు తెలిసిన వారి ద్వారా విషయాన్ని ఫేస్బుక్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బాలిక నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్యవివాహా ప్రక్రియను రద్దు చేయాలని డీపీపీఓను ఆదేశించారు. అలాగే బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఆమెకు అడ్మిషన్ ఇప్పించడంతో పాటు చదువుకు కావాల్సిన అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సొంత ఖర్చులతో ఆ బాలికకు సైకిల్, బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాం మొదలైనవి కలెక్టర్ సమకూర్చారు. బాలికకు ధైర్యం చెప్పి జీవితంలో ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. డీసీపీవో సీహెచ్ సూర్యచక్రవేణి, సిబ్బంది రాజేష్, శ్రీకాంత్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది రాజు, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
చిన్న వయసులోనే గర్భం..తల్లీ, బిడ్డకు ప్రాణపాయం
ఓ వైపు బాగా చదువుకున్న అమ్మాయిలు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికారణంగా 40 దాటే వరకూ పిల్లలు కలగక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పదహారేళ్లు నిండకముందే కొందరు అమ్మాయిలు తల్లులవుతున్నారు. పరస్పర ఈ వైరుధ్యం పలువురు వైద్యులు, నిపుణులను విస్మయపరుస్తున్న అంశం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వస్తున్న గర్భిణుల్లో 3 శాతానికి పైగా మైనర్ అమ్మాయిలు వస్తున్నట్టు తేలింది. బాల్యవివాహాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 458 మంది మైనర్ అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో 16 ఏళ్లలోపు అమ్మాయిలు 107 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.శ్రీసత్యసాయి జిల్లాలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. మొత్తం ప్రసవాల్లో 3.23 శాతం మైనర్లవే కావడం గమనార్హం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మైనార్టీ తీరని అమ్మాయిలు ప్రేమ– పెళ్లి బాట పడుతున్నారు. ప్రతిబంధకంగా బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయి అంటేనే భారంగా భావిస్తున్నారు. అందుకే 15 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి చదువుతూండగానే పెళ్లి చేస్తున్నారు. బాగా చదువుకుని కెరీర్లో స్థిరపడాల్సిన సమయంలో వారికి పెళ్లి తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. నిఘా పెట్టినా ఆగడం లేదు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అడ్డుకుంటున్నా మరోవైపు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు కుదిర్చిన పెద్దలు, ఇరువురు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడే అవకాశమున్నా కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చైల్డ్లైన్ 1098, హెల్ప్లైన్ 181, డయల్ 100కు ఫోన్ చేస్తే పెళ్లిళ్లు ఆపేస్తారు. దీన్ని వినియోగించుకోవాలని ఐసీడీఎస్ అధికారులు కోరుతున్నారు. = ‘అనంత’ జిల్లాలో 4 మాసాల్లో 458 ‘మైనర్’ ప్రెగ్నెన్సీలు = ఇందులో పదహారేళ్లలోపు అమ్మాయిలు 107 మంది = శ్రీసత్యసాయి జిల్లాలో మరింత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు = చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్న యువతులు 3.23 శాతం = అమ్మాయిలను వెంటాడుతున్న సామాజిక మాధ్యమాల దు్రష్పభావం బాల్యవివాహాలతో భారీ నష్టం = చదువు ఆగిపోయి కెరీర్ అర్ధంతరంగా ముగుస్తుంది = చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బరువు తక్కువ పిల్లలు పుట్టే అవకాశం = చిన్న వయసులో తల్లి కావడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది = ప్రీ మెచ్యూర్ అంటే 9 నెలలకు ముందే పిల్లలు పుట్టే అవకాశం = దీనివల్ల కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం కౌన్సెలింగ్ ఇస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో 15 ఏళ్లు దాటగానే అమ్మాయిలను తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ముందస్తుగా పెళ్లి చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై యువతీ యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ల ప్రభావం ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. –శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. బాలికను తీసుకుని పరార్
సాక్షి, నవీపేట (నిజామాబాద్ జిల్లా): జిల్లాలోని నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అబ్బాపూర్ (బి) తండాలో ఓ తండ్రి రూ.60 వేలకు ఆశపడి 13 ఏళ్ల తన కూతురుకు బాల్య వివాహం జరిపించేశాడు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బాలిక తండ్రిని నిలదీయడంతో అప్పటికే పెళ్లికొడుకు బాలికతో కలిసి పరారయ్యాడు. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మలావాత్ సాయెబ్రావ్ (45)కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాపూర్ (బి) తండాకు చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని సాయెబ్రావ్కు ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను సాయెబ్రావ్ వద్ద నుంచి రూ.60 వేలను బాలిక తండ్రి తీసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇరువురు బంధువుల సమక్షంలో బాలికకు పెళ్లి జరిపించేశారు. అయితే బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయెబ్రావ్ బాలికను తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్హెల్ప్లైన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జ్యోత్స్నదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయెబ్రావ్తో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్ అహ్మద్ పాషా ఫిర్యాదు చేశారు. -
ఆరో తరగతిలోనే పెళ్లి.. చదువు వద్దన్న తండ్రి.. తగ్గేదేలేదన్న భార్య
'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు.. పట్టెనేని బిగియ పట్టవలయు..' అనే వేమన పద్యం అందరికీ తెలిసే ఉంటుంది. రాజస్థాన్కు చెందిన ఓ యువకునికి వేమన చెప్పిన మాటలు సరిగ్గా సరిపోలుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విడువకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఈ కుర్రాడు. ఇంతకీ ఇతను ఏం సాధించాడు. విజయ సాధనలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడి విజయం సాధించారు. ఇందులో రాజస్థాన్కు చెందిన యువకుడు రామ్లాల్ కూడా ఉన్నాడు. ఏకంగా 490 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే.. నీట్లో పాస్ అయినవాళ్లందరి ప్రయత్నం ఓ వైపు.. రామ్లాల్ కృషి మరో వైపు.. 11 ఏళ్లకే బాల్య వివాహం.. రామ్లాల్ చిత్తోర్గఢ్లోని ఘోసుండా ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ యువకునికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా గొప్పగా సాధించాలనే కలలు కనేవాడు. చదువుల్లో మంచిగా రాణిస్తున్న ఇతనికి 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు అతను కేవలం 6వ తరగతి చదువుతున్నాడు. 11 ఏళ్లకు పెళ్లిపీటలెక్కిన రామ్లాల్ భార్య సహకారంతో.. తన కల నీరుగారిపోయిందనుకున్న రామ్లాల్కు భార్య సహకారం తోడయింది. ఆయన భార్య పదో తరగతి వరకు చదువుకుంది. పుస్తకం విలువ తెలిసిన ఆమె భర్తకు అండగా నిలబడింది. రామ్లాల్ తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తన భర్త చదువుకోవడానికి పూర్తి తోడ్పాటును అందించింది. దీంతో రామ్లాల్ 10వ తరగతిలో 74 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం తనకు ఇష్టమైన సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అలుపెరుగని ప్రయత్నం.. 2019లో మొదటి సారి నీట్ పరీక్షను రామ్లాల్ రాశాడు. 720 మార్కులకు గాను 350 వచ్చాయి. మెరుగైన ఫలితాలు రాలేదు. కానీ ఏ మాత్రం క్రుంగిపోకుండా ప్రయత్నాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. కోటా నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్లో చేరి మెలుకువలు నేర్చుకున్నాడు. ఈ సారి 632 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు. 350 మార్కుల నుంచి ఐదో సారికి 632కి చేరుకున్నానని రామ్లాల్ చెబుతున్నాడు. కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చని అంటున్నాడు. తన భార్య ఇచ్చిన సహకారాన్ని కొనియాడుతున్నాడు. ఇక నీట్ 2023 పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రామ్లాల్ దంపతులకు పాప పుట్టడం మరో విశేషం. ఇదీ చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు -
నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా.. దిశా యాప్ ద్వారా బాలిక ఫిర్యాదు
సాక్షి,ఏలూరు టౌన్: తనకు చదువుకోవాలని ఉన్నా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ బాలిక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన బాలికకు ఈనెల 8వ తేదీన వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పినా పెద్దలు వినకపోవడంతో.. ఆమె ఆదివారం ఉదయం 9.37 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన దిశ సిబ్బంది సమీపంలోని తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకన్న, సిబ్బందితో కలిసి 10 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకొని.. ఆమెను విచారించారు. ‘ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలని ఉంది. నా చదువు పూర్తయ్యాక మా అమ్మ, నాన్న చెప్పినట్లే చేస్తా’ అని ఆ బాలిక పోలీసులతో పాటు తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆమె చదువును మధ్యలోనే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బాలికకు పెళ్లి చేయడం నేరమని వివరించారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆమెను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలిక సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు, దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్ -
బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టాలని జిల్లా ఎస్పీలను ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని బాల్య వివాహాలు రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న బాలలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దేశాభివృద్ధికి దోహదం చేసే యువశక్తి నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడుతుందని, మాతా, శిశు మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. -
అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..
అస్సాంలో బాల్య వివాహాలను అణిచివేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కేబినేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దాడులు నిర్వహించారు. ఆఖరికీ అర్థరాత్రి రెండు గంటలకు తలుపు కొట్టడంతో ప్రారంభమైన దాడులు ఆ చిన్నారును తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఈ ఘటనలో చిన్నారులను పెళ్లి చేసుకున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియని ఆ చిన్నారి పెళ్లి కూతుళ్లు భయందోళనలతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నెల రోజుల్లోనే పోలీసులు సుమారు 4 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల కారణంగా కొత్తగా మాతృత్వంలో అడుగు పెడుతున్న నిమి అనే బాల వధువు కన్నీళ్లతో చెక్కిళ్లు తడిచిపోయాయి. అప్పటి వరకు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న రెజీనా ఖాతున్ అనే మరో చిన్నారి నిస్సత్తువుగా చూస్తోంది. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దాడుల్లో భర్తల అరెస్టుతో బాల వధువులు ఆవేదనతో అక్కడి వాతావరణం అంతా విషాదంగా మారిపోయింది. ఒక్క శనివారమే పోలీసులు సుమారు రెండు వేల మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆ వివాహాలు జరిపించిన పూజారులను, ముస్లీం మత పెద్దలు కూడా ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది పారిపోయి పెళ్లి చేసుకున్న మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఆ బాల వధువలంతా ఇప్పుడూ మా పరిస్థితి ఏంటి మా పిల్లలను ఎవరూ పోషిస్తారు, ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అలాగే వారిలో కొంతమంది పెళ్లి సమయానికి మైనర్లు కాదు, ఆధార్కార్డులో తప్పుగా నమోదు చేయడం జరిగిందని కొందరూ వాపోతున్నారు. ఆరోగ్య కార్యకర్తల నుంచి సేకరించిన ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా సాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో అనాధలుగా మారిన బాల వధువుల్లో కొందరికి తల్లిదండ్రుల మద్దతు లభించగా మరికొందరు అధికారుల సంరక్షణలో ఉన్నారు. బాల్యవివాహాలకు చెక్పెట్టడం కోసం జరిపిన దాడుల కారణంగా కొందరూ చిన్నారులు గర్భవతులుగా మరికొందరూ తమ పిల్లలతో అనాధలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రస్తుతం వారంతా ప్రభత్వ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. అంతేగాదు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖలో జెండర్ స్పెషలిస్ట్ అయిన పరిమితా డేకా మాట్లాడుతూ..ఆ మహిళల పట్ల మాకు బాధ్యత ఉంది. ఇది సున్నితమైన వ్యవహారం అని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి శాంతించేలా చేయాలి. ఆ తర్వాత వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..) -
పుత్తడి బొమ్మకు పుస్తెల బంధనం
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన పుత్తడిబొమ్మలకు మూడుముళ్ల బంధనాలు వేసి వారి భవితను చిదిమేస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహన లోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వారికి వివరించి పుస్తెల భారం వేయకుండా పుస్తకాలతో చెలిమి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీలోపు అధికారులు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా..ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నారేమో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లకు వయస్సు రాగానే తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2012 నుంచి 2022 వరకు 589 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని అనుకుంటున్న బాలికలకు కొంతమంది తల్లిదండ్రులు మూడుముళ్లతో బంధనాలు వేసి సంసార సాగరంలోకి తోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తెలు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ ఒక వైపు ఊరూరా ప్రచారం చేస్తూ, మరో వైపు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ బాల్య వివాహాలు ఎక్కువగా 13 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి జరుగుతున్నాయి. బాల్య వివాహాల జరుగుతున్న ప్రదేశాలకు అధికారులు వెళ్లి పెళ్లి అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీటిపై అన్ని మండల కేంద్రాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలపై ఈ నెల 17 వ తేదీ నుంచి 25 లోపు గ్రామ కమిటీల ఏర్పాటు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్లైన్ 1098, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 2012లోనే జీవో జారీ... బాల్య వివాహ నిరోధక చట్టం 2006కు సంబంధించిన జీవో నంబరు 13ను 2012 మార్చి 19న ప్రభుత్వం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటును సూచించింది. జిల్లా స్థాయిలో కమిటీకి కలెక్టరు చైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా ఐసీడీఎస్ పీడీ, ఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో చైర్మన్గా ఆర్డీఓ, సీడీపీఓ, డీఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీకి చైర్మన్గా తహశీల్దారు, మెంబరు కన్వీనర్లుగా ఐసీడీసీ సూపర్వైజర్, ఎస్ఐ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉంటారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్గా, కన్వీనర్గా అంగన్వాడీ కార్యకర్త, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామానికి చెందిన ఉపాధ్యాయడు, మహిళ వార్డు మెంబరు, ఏఎన్ఎం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, యువజన సంఘం ప్రతినిధి, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహం నేరానికి శిక్ష.. బాల్యవివాహాన్ని ప్రోత్సహించే వారికి, చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహాన్ని దాచేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఆ వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. న్యాయమూర్తి ఉత్తర్వుల ఉల్లంఘన కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను ఆపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు...పిల్లల ప్రవర్తన కారణంగా.. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే.. అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. మరి కొందరైతే రకరకాల కారణాల ప్రభావంతో పిల్లలు పెడదారి పడుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అడ్డుకుంటున్నా ..ఆగడం లేదు బాల్య వివాహాలను మాతాశిశు సంరక్షణ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంత వరకు బాల్య వివాహాలు తగ్గినట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. -
పుట్టినరోజే వివాహ బంధనం నుంచి రేఖకు విముక్తి
ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. బాగా చదువుతుంది. నర్సు కావాలన్నది ఆమె కల. కానీ, ఊహ తెలియని వయసులో పెద్దలు చేసిన పనికి.. నరకంలో పడింది. మానసికంగా కుమిలిపోయింది. చివరికి.. ఓ ఉద్యమకారిణి సహకారం, కోర్టు తీర్పుతో మొత్తానికి ఆటంకాలు తొలగి ఆమెకు ఇష్టంలేని వివాహ బంధనం నుంచి విముక్తి లభించింది. రాజస్థాన్ జోధ్పూర్కు చెందిన రేఖ(21).. విచిత్రమైన పరిస్థితుల నడుమ జోధ్పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2002లో అంటే.. ఏడాది వయసున్నప్పుడు రేఖను అదే ఊరికి చెందిన ఓ పిలగాడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి పెద్ద అనారోగ్యంతో.. బంధువుల ఒత్తిడి మేరకు ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే.. ఆ తర్వాత ఆ పసికందు జీవితం సాఫీగానే సాగింది. ఈమధ్య.. కొన్నాళ్ల కిందట అత్తింటి వాళ్లమంటూ కొందరు రేఖ ఇంటికి రావడంతో.. ఆమె షాక్ తింది. ఇన్నాళ్లూ విషయం తెలియకుండానే పెంచారు ఆమెను. దీంతో తల్లిదండ్రులు, చుట్టాల ఒత్తిడి మేరకు ఆమె బలవంతంగానే మెడలో తాళిబొట్టు వేసుకుని.. ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే.. అక్కడికి వెళ్లాక చదువుకోనీయకుండా భర్త, అతని తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో మానసికంగా కుమిలిపోయింది. మరోవైపు ఇన్నాళ్లపాటు వివాహం అయ్యిందనే విషయం దాచినందుకు.. తమ దగ్గరికి పంపనందుకు కుల పరిహారం పేరిట రేఖ తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయసాగారు. ఈ పరిస్థితుల్లో.. రేఖకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి భారతి గురించి తెలిసింది. కృతి భారతి.. ప్రముఖ ఉద్యమకారణి. అంతేకాదు.. బీబీసీ అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మహిళల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న వ్యక్తి కూడా. ఆమె సాయంతో జోధ్పూర్ ఫ్యామిలీకోర్టులో వివాహ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది రేఖ. ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తూ.. చదువుకోవాలనే తన ఆశయానికి సాయపడాలంటూ కోర్టును వేడుకుంది. దీంతో.. బాల్యవివాహంగా పరిగణిస్తూ.. నేరంగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఆమె పుట్టినరోజు నాడే తీర్పు రావడం. దీంతో ఇష్టం లేకుండా.. అదీ తనకు ఊహతెలియని వయసులో జరిగిన వివాహ రద్దు తీర్పు కాపీలను ఆమె కానుకగా కృతి నుంచి అందుకుంది. ఇదీ చదవండి: ఇది కథ కాదు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం -
కొడుక్కి బాల్య వివాహం.. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్పై కేసు నమోదు
సాక్షి, చిత్తూరు: కుమారుడికి బాల్య వివాహం చేసిన ఘటనలో తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్పై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాల్య వివాహ చట్టం కింద రిజిస్ట్రార్పై రాధే శ్యామ్, శ్రీదేవి దంపతులపై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శాంతి నగర్లో నివాసముంటున్న రిజిస్ట్రార్.. తిరుపతి రాఘవేంద్ర మట్టంలో మైనర్ అయిన తన కుమారుడికి మైనర్ బాలికతో వివాహం జరిపించారు. రిజిస్ట్రార్ రాధేశ్యామ్ పూర్వ సంప్రదాయ పద్దతిలో అయిదు రోజుల పెళ్లి జరిపించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించి. అటు అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేవ్వర్లు శ్రావణ కుమారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అస్వస్థత -
ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే
20 ఏళ్లు కూడా లేని కోయెల్ని ఆ ఊళ్లో అంతా విలన్గా చూస్తారు. చంపుతాం అన్నారు. అత్యాచారం చేస్తాం అని బెదిరించారు. కాని కోయల్ వినదు. భయపడదు. కోవిడ్ కాలంలో అనేక కారణాల వల్ల బాల్య వివాహాలు పెరిగిపోయాయి. ఆడపిల్లలు విలపిస్తున్నారు. సిలిగురి ప్రాంతంలో కోయెల్ తనలాంటి అమ్మాయిలతో కలిసి గస్తీ కాస్తోంది. బాల్యవివాహం జరిగే మంటపంలో ప్రత్యక్షమై ‘ఆపరా’ అని అంటోంది.ఆమె వస్తే పెళ్లి ఆగాల్సిందే. ‘తల్లిదండ్రుల ఆలోచన, నిస్సహాయత ఏదైనా కావచ్చు. కాని అది ఆడపిల్ల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఉండకూడదు’ అంటుంది 19 ఏళ్ల కోయెల్ సర్కార్. ఈ అమ్మాయి సిలిగురి (పశ్చిమ బెంగాల్) సమీపంలో ఉండే ఒక గ్రామంలో ‘వరల్డ్ విజన్ ఇండియా’ అనే ఎన్.జి.ఓతో కలిసి పని చేస్తుంది. ఆమె చేసే ప్రధానమైన పని బాల్య వివాహాలను నిరోధించడం. ఇందుకు ఆమెతో పాటు పని చేసే, ఆమె వయసు ఉండే మరో 25 మంది అమ్మాయిల దళం ఉంది. అందరూ రహస్య పోలీసుల కంటే సమర్థంగా తమ ఊళ్లో చుట్టుపక్కల పల్లెల్లో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతాయా అని చూస్తూ ఉంటారు. ‘ఈ రెండేళ్లలో నేను 8 బాల్య వివాహాలను ఆపించాను’ అంటుంది కోయెల్. కాని పెద్దవాళ్లు ఊరికే ఉంటారా? పెద్దవాళ్లు అంటే ఎవరు? వధువు తల్లిదండ్రులు... వరుడి తల్లిదండ్రులు. మాకు లేని నొప్పి నీకెందుకు అని కోయెల్తో తగాదాకు వస్తారు. ‘ఇప్పటికి రెండుసార్లు మా ఇంటి మీదకు జనం దాడికి వచ్చారు. నన్ను, మా చెల్లెల్ని చంపుతాం అన్నారు. నన్ను రేప్ చేస్తాం అన్నారు. ట్యూషన్ నుంచి వస్తుంటే ఒకసారి నా మీద రాళ్ల దాడి జరిగితే సాయంత్రం ట్యూషన్కు వెళ్లడమే మానేశాను. కాని బాల్య వివాహాలను ఆపడం మాత్రం మానలేదు’ అంటుంది కోయెల్. ఆమెకు ఈ పని ఇంత గట్టిగా చేయాలని ఎందుకు అనిపించింది? స్వీయ జీవితం నుంచే. ‘మా అమ్మకు 17 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మా నాన్నతో పెళ్లి జరిపించారు. నేను పుట్టిన మూడేళ్లకు నన్ను. అమ్మను, చెల్లిని వదిలి మా నాన్న వెళ్లిపోయాడు. మా అమ్మకు ఎన్నో ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలు ఉండేవి. అన్నీ నాశనం అయ్యాయి. మేము చాలా కష్టాలు పడ్డాం. అలా ఎవరూ పడకూడదనే నా తపన’ అంటుంది కోయెల్. వెస్ట్ బెంగాల్లో బహుశా దేశంలో చాలా చోట్ల ఈ రెండేళ్లలో పరిస్థితి చాలా మారింది. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయం గండి పడింది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా పిల్లను సాగనంపితే చాలు అనుకుంటున్నారు. కోవిడ్ కాలంలో పెళ్లిళ్లు జనం ఊసు లేకుండా జరిపించే వీలు ఉండటంతో అదీ ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు. స్కూళ్లు మూతబడి, చదువు మానేసి, ఫ్రెండ్స్కు దూరమయ్యి ఇరవై నాలుగ్గంటలు ఇంట్లో ఉంటున్న ఆడపిల్లలు తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నారు. అందుకని కూడా పెళ్లిళ్లకు తొందరపడుతున్నారు. ‘పెళ్లి తొందరలో అమ్మాయి తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి కట్టబెడుతున్నారు. ఆ వెళ్లినచోట ఆ ఆడపిల్లలు ఏ మాత్రం సురక్షితంగా ఉండటం లేదు. సుఖంగా కూడా’ అంటుంది కోయెల్. ‘ఆడపిల్లను క్షేమంగా ఉంచలేమని, ప్రేమలో పడి ఎవరితోనైనా వెళ్లిపోతారని కూడా ఈ పని చేస్తున్నారు’ అంటుంది కోయెల్. అయితే తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నా ఆడపిల్లలు నిజంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒక మేరకు స్థిరపడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం చూడగానే కోయెల్కు ఉప్పందిస్తున్నారు. కోయెల్ తన దళంతో వెళ్లి పెళ్లి ఆపు చేస్తోంది. ‘పెళ్లి ఆపించి ఊరుకోవడం లేదు. అలాంటి ఆడపిల్లల స్వయం ఉపాధికి లేదా తల్లిదండ్రుల ఉపాధికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నాం.’ అంటుంది కోయెల్. బాల్య వివాహాలు ఆపడమే కాదు నేపాల్ సరిహద్దుకు దగ్గర కాబట్టి చైల్డ్ ట్రాఫికింగ్ జరక్కుండా కూడా అడ్డుకునే పని కోయెల్ దళం చేస్తోంది. ‘అమ్మాయిలను ఏమార్చేవారు పెళ్లి కొడుకుల వేషంలో వస్తుంటారు’ అంటుందామె. ఆడపిల్లల గురించి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహక చర్యలు చేపట్టినా తల్లిదండ్రుల అండ లేకపోతే వాళ్లు ముందుకు పోరు. తల్లిదండ్రులు విఫలమైన చోట కోయెల్ వంటి సామాజిక కార్యకర్తలు కావాలి. తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కలిసి పని చేస్తే ఏ ఆడపిల్లకు కూడా పరిణిత వయసుకు ముందే అనవసర పెళ్లిళ్లు జరగవు. అక్కర్లేని సమస్యలు రావు. -
వివాదాస్పద చట్టంపై రాజస్థాన్ సర్కార్ యూటర్న్
జైపూర్: వివాదాస్పదమైన బాల్య వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని చేసిన చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. తప్పనిసరి రిజిస్ట్రేషన్ల వివాహ(సవరణ)బిల్లు-2021ను రాజస్థాన్లో గత నెల అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే. మైనర్ల వివాహాలు సహా అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సవరణ చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో గవర్నర్ వద్ద ఉన్న ఈ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు సీఎం అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు. చట్టాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ బాల్య వివాహాలను తమ ప్రభుత్వం అరికడుతుందని సీఎం తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని కానీ, నిరసన వ్యక్తమవటం వల్ల వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన చట్టం ప్రకారం 18 ఏళ్లకు తక్కువగా ఉన్న యువతలు, 21 ఏళ్లకు తక్కువ ఉన్న యువకులకు సంబంధించిన వివాహాలను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. బల్యవివాహాలను తగ్గించాలనే ఉద్దేశంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇక రాజస్థాన్లో బాల్యవివాహాల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
Jharkhand Radha Pandey: హ్యాపీ న్యూస్.. రాధ పెళ్లి ఆగింది
ఇప్పటి వరకు బాల్యవివాహాలను అడ్డుకున్న ఎంతో మంది సామాజిక కార్యకర్తలను చూశాం. ఇప్పుడు తన వివాహాన్ని తానే అడ్డుకున్న ఓ బాలికను చూస్తున్నాం. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన పెళ్లిని తనే స్వయంగా ఆపి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న ఆ బాలిక పేరు రాధాపాండే. రాధను అభినందిస్తున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ ఘోలప్ కొడెర్మా జిల్లా మధుబన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల రాధాపాండేకు.. ఆమె తల్లిదండ్రులు పక్క ఊరి వరుడితో వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి జూన్ 23 జరగాల్సింది. అయితే మే నెలలో ఆ విషయం తెలుసుకున్న రాధ ‘ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, పెళ్లి ఆపేయమని తల్లిదండ్రులు, బంధువులను కోరింది’. కానీ పెద్దలు ఎవరూ తనకు సహకరించకపోగా పెళ్లికి సిద్ధపడు అని బెదిరించారు. తన తల్లిదండ్రులను ఒప్పించలేక, వరుడి తండ్రి దగ్గరకు వెళ్లి ‘తనకు చదువుకోవాలని ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, పెళ్లిచేసుకుంటే తన కలలన్నీ చెదిరిపోతాయని’ చెప్పి... ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. కానీ ఆయన మనసు కూడా రాధ వేడుకోలుకు కరగలేదు. కేఎస్సీఎఫ్.. ఇదే సమయంలో మధుబన్ పంచాయితీలో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలతో యాక్టివ్గా ఉండే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్సీఎఫ్) గురించి రాధ తెలుసుకుంది. వెంటనే వాళ్లను కలిసి తన బాధ వెళ్లబోసుకుని, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించమని అభ్యరి్థంచింది. దీంతో కేఎస్సీఎఫ్ బృందం రాధ తల్లిదండ్రులను కలిసి వారు తలపెట్టిన బాల్యవివాహాన్ని ఆపాలని చెప్పారు. మొదట్లో రాధ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పద్దెనిమిదేళ్లు రాకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పడంతో, పోలీసులకు భయపడి ఎట్టకేలకు ఒప్పుకున్నారు. వరుడి కుటుంబంతో చర్చించి పెళ్లి రద్దు చేశారు. అంతేగాక రాధకు మైనారిటీ తీరేంత వరకు పెళ్లి చేయబోమని కూడా మాట ఇచ్చారు. దీంతో రాధ పెళ్లి ఆగిపోయింది. జిల్లాకు అంబాసిడర్... రాధ పెళ్లి విషయం, ఆమెకు బాలల హక్కులు, బాల్యవివాహాలపై ఉన్న అవగాహనతో ధైర్యంగా ఎదుర్కొన్న తీరు తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ఘోలప్ ఎంతో సంతోషించారు. ఆయన రాధను అభినందించి, ఆమెను జిల్లాలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడే అంబాసిడర్గా నియమించారు. ‘ముఖ్యమంత్రి సుకన్య’ ప్రభుత్వ పథకం కింద నెలకు రెండు వేల రూపాయలను కూడా జారీ చేయించారు. అంతేగాక రాధ కుటుంబానికి రేషన్ కార్డు, ఉచిత వైద్య సదుపాయం, పెన్షన్ వంటి సదుపాయాలను కలి్పంచారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కేఎస్సీఎఫ్ ఆధ్వర్యంలో రాధ ఇప్పుడు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ తనలాంటి ఎంతో మంది అమ్మాయిలను కాపాడుతోంది. బాగా చదువుకుని భవిష్యత్లో మంచి టీచర్ను అవుతానని రాధ చెప్పడం విశేషం. ప్రతి బాలికలోనూ రాధలాంటి తెగువ, అవగాహన ఉంటే బాల్యవివాహాలు కనుమరుగు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. చదవండి: "Kidnap And Wed": ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే! -
బాల్య వివాహం.. కౌన్సెలింగ్ ఇస్తుండగా జంట పరార్..
సాక్షి, తొర్రూరు(వరంగల్ రూరల్) : బాల్య వివాహం జరగగా, జంటకు కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో పారిపోయిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన మైనార్టీ తీరని బాలికతో అదే తండాకు చెందిన బాలుడికి వివాహం జరిగింది. ఈ మేరకు చైల్డ్లైన్ ప్రతినిధులు, పోలీసులు వెళ్లి బాల్య వివాహం వల్ల భవిష్యత్లో వచ్చే నష్టాలపై వివరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పటికే తప్పు జరిగినందున, సరైన వయస్సు వచ్చిన తర్వాతనే వారిద్దరు కలిసి ఉండేలా చూడాలని సూచించారు. ఇలా కౌన్సెలింగ్ ఇస్తుండగానే వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. చదవండి: మోదీ ‘మన్ కీ బాత్’కి వరంగల్ చాయ్వాలా -
నేను చిన్నపిల్లను; నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా!
సాక్షి,గీసుకొండ: ‘సార్.. నేనింకా చిన్నపిల్లను. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంది. ఎంత చెప్పినా పెద్దలు వినడం లేదు. పైగా 30 ఏళ్ల వ్యక్తికి, అదీ మొదటి భార్యతో విడాకులైన వ్యక్తికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. అందరికీ తెలిస్తే అడ్డుకుంటారని దొంగచాటుగా పెళ్లి చేయాలని ప్రయతి్నస్తున్నారు..నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆపండి.. ఇదీ పద్నాలుగేళ్ల బాలిక తనకు వివాహం చేయాలని పెద్దలు యత్నించిన క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికతో వరంగల్ అర్బన్ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దమనుషులు నిర్ణయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.., చదువుకుంటానని ఆ బాలిక మొరపెట్టుకున్నా పెద్దమనుషులు వినకుండా నిశి్చతార్థం చేశారు. దీంతో దిక్కుతోచని ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్లైన్కు సంబంధించి 1098 ఫోన్ చేయమని చెప్పింది. ఇంతలోనే స్థానిక ఎంపీటీసీ వీరన్న కూడా ఈ విషయాన్ని బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఇది తెలుసుకున్న పెద్దమనుషులు బుధవారం బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించడానికి సిద్ధమవుతుండగా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లి తంతును అడ్డుకున్నారు. చదవండి: 20 మీటర్లు.. 12 అడుగులు..! -
Warangal: నా పెళ్లి ఆపండి సార్..!
డోర్నకల్(వరంగల్) : ‘మైనార్టీ తీరకుండానే నాకు వివాహం చేయాలని చూస్తున్నారు.. నాకు చదువుకోవాలని ఉంది. ఈ వివాహాన్ని ఎలాగైనా అడ్డుకోండి సార్’ అంటూ ఓ బాలిక స్వయంగా చైల్డ్లైన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, బాలికను సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు సిద్ధం కావడంతో ఆ బాలిక.. చైల్డ్లైన్ నంబర్ 1098కు సమాచార మిచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు మంగళవారం గ్రామానికి చేరుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరాకే వివాహం చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. అనంతరం బాలికను సన్మానించారు. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది లక్ష్యమని బాలిక తెలిపింది. కాగా, గ్రామంలో మరో బాల్య వివాహాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు. చదవండి: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
బాల్య వివాహమైన 12 ఏళ్ల తర్వాత కోర్టుకు..
జైపూర్ : బాల్య వివాహం అయిన 12 ఏళ్ల తర్వాత తన వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిందో యువతి. ఈ సంఘటన రాజస్తాన్లోని బిల్వారా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బిల్వారా జిల్లా పలాడి గ్రామానికి చెందిన మన్షి అనే యువతికి 7 ఏళ్ల వయసున్నపుడు 2009లో బాల్య వివాహమైంది. ఆ తర్వాతినుంచి ఇంటి వద్దే ఉంటూ చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అత్తంటి వారు కాపురానికి రావాలంటూ యువతిపై ఒత్తిడి తేసాగారు. సదరు యువతి ఇందుకు ఒప్పుకోలేదు. తనకు జరిగిన బాల్య వివాహం చెల్లదని తేల్చి చెప్పింది. కాపురానికి రాకపోతే పంచాయితీలో పెట్టి కుటుంబాన్ని సామాజికంగా వెలివేయిస్తామని బెదిరింపులకు దిగారు అత్తింటివారు. వారి వేధింపులు ఎక్కువవటంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత సారథి ట్రస్ట్ సహకారంతో మన్షి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు జడ్జి ముకేశ్ భార్గవ.. మన్షి భర్తకు సమన్లు జారీ చేశారు. బాల్య వివాహాల విషయంలో కఠినమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. చదవండి : దుస్తులు విప్పేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది -
వధువు జంప్..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్
భువనేశ్వర్ : మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వధువు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందేనని, వధువు చెల్లెలిని అయినా తనకు కట్టబెట్టాలని వరుడు కోరగా వేరే గత్యంతరం లేక అమ్మాయి కుటుంబసభ్యులు కూడా ఇందుకు ఒప్పుకుంటారు. అనుకున్న సమయానికి పెళ్లికొడుకు..వధువు చెల్లిలో మెడలో తాళి కట్టి అత్తారింటికి తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే అతనికి అసలు సిసలు ట్విస్ట్ ఎదురైంది. ఈ పెళ్లి చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో వరుడు బిత్తెరపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా..వధువు తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. దీంతో తమ పరువు పోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని వరుడు తరుపు వాళ్లు పట్టుబట్టారు. దీంతో వేరే దారి లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. అయితే తంతు ముగిసి అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాకా అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని,చట్టారీత్యా ఇది నేరమని పేర్కొన్నారు. 18 ఏళ్లు వచ్చేదాకా అమ్మాయిని అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో వారు కూడా అంగీకరించారని జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా తెలిపారు. మైనర్ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చదవండి : (వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్) (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్!) -
బాల్యవివాహాలు పిల్లల హక్కుల ఉల్లంఘనే!
భారత ప్రభుత్వం చట్టబద్ధ మైన వివాహ వయస్సును పెంచాలని భావిస్తోంది. అయితే వివాహాలకు చట్టబద్ధమైన వయస్సును పెంచడం ఒక్కటే సరిపోదు. ప్రధానంగా బాల్య వివాహం పిల్లల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వారి శారీరక వృద్ది, మానసిక, భావోద్వేగాల పెరుగుదల, విద్యావకాశాలపై కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్రలో కౌమారదశలోనే పెళ్లయి తల్లులైన వారితో బృంద చర్చలో, చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల తమ బాల్యాన్ని, ఆడుకునే, నేర్చుకునే స్వేచ్ఛను పోగొట్టుకున్నామని చెప్పారు. పెళ్లి కాగానే మానసికంగా సంసిద్ధం కాకుండానే ఆమె కుటుంబ పాత్రలు పోషిం చాల్సి వస్తోంది. భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం మైనర్ బాలికకు కష్టమవుతుంది. దీంతో వారు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురికావడానికి దారి తీస్తుంది. ప్రపంచంలోనే బాలికా వధువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా స్థిరపర్చడం, బాల్యవివాహ నిషేధ చట్టాన్ని అమలుపర్చడం ఉనికిలో ఉన్నప్పటికీ దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో బాల్య వివాహాలు 2005లో 47 శాతం ఉండగా ఇది 2015 నాటికి 27 శాతానికి పడిపోవడం మంచిదే కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో బాల్యవివాహాలు అధికంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 24 ఏళ్ల వయసున్న మహిళల్లో 33 శాతం మందికి 18 ఏళ్ల లోపే పెళ్లవుతున్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్–4 డేటా 2015–16 నివేదిక తెలిపింది. ఇక పురుషుల విషయానికి వస్తే 25 నుంచి 29 ఏళ్ల వయసున్న యువకుల్లో 21 ఏళ్లకు ముందే పెళ్లాడుతున్న వారు 11.8 శాతంగా ఉన్నారు. అదే తెలంగాణలో 20–24 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 25.7 శాతం మంది వివాహం చేసుకుంటూండగా, 15–19 ఏళ్ల ప్రాయంలోని బాలికల్లో 14 శాతం మంది తల్లులవుతున్నారు. అయితే యంగ్ లైవ్స్ లాంగిట్యూడినల్ స్టడీ 2002 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అధ్యయనం మరింత స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2013లో 19 ఏళ్లలోపు వయసున్న బాలికల్లో 25 శాతం మంది చట్టబద్ధమైన వయసుకు ముందే పెళ్లాడుతున్నారని, 2020 నాటికి ఇది 14 శాతానికి పడిపోయిందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో కూడా 2013 నాటికి 19 ఏళ్ల లోపు వయసున్న బాలికల్లో 28 శాతం మంది చట్టబద్ద వయసుకు ముందే పెళ్లాడుతుండగా వీరి సంఖ్య 2020 నాటికి 17 శాతానికి పడిపోయింది. జిల్లాల వారీగా చూస్తే కడప, అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాల్లో 18 ఏళ్లకు ముందే వివాహ మాడుతున్న బాలికల సంఖ్య వరుసగా 20 శాతం, 24 శాతం, 27 శాతంగా నమోదైంది. ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఇది 36 శాతం మేరకు అధికంగా నమోదైంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 9 జిల్లాల్లోనూ, ఏపీలో 5 జిల్లాల్లో సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, విశ్వాసాలు, దారిద్య్రం వంటివి బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. పెద్దగా చదువుకోకపోవడం, విద్యావకాశాల లేమి కూడా వీటికి తోడవుతున్నాయి. రజస్వల అయితే చాలు పెళ్లీడు వచ్చేసినట్లే అని తల్లిదండ్రులు భావించడం, వారిలో అవిద్య, వలసలు, ఎక్కువమంది అమ్మాయిలు ఉండ టం వంటివి కూడా బాల్యవివాహాలను ప్రేరేపిస్తున్నాయి. చట్టం మాత్రమే ఈ దురాచారాన్ని అడ్డుకోలేదని, మార్పు అనేది కుటుంబం, కమ్యూనిటీ స్థాయి నుంచే ప్రారంభం కావాలని న్యాయనిపుణుల మాట. సెకండరీ విద్యను బాలికలకు అనుకూలంగా మలుస్తూ వారి రక్షణకోసం పెట్టుబడి పెట్టాలి. పేదలు బాలికలను బడికి పంపేలా చేయడానికి షరతులతో కూడిన నగదు బదిలీ చేయడం, 18 ఏళ్లదాకా నిర్బంధ విద్యను అందించడం మంచి ఫలితాలను తెస్తుంది. ముఖ్యంగా విద్య, బాల్యవివాహాలపై డేటా బ్యాంకును గ్రామీణ సంస్థలు ఏర్పర్చుకుంటే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది.' వ్యాసకర్త ఆర్థికవేత్త, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ పి. పృథ్వీకర్ రెడ్డి మొబైల్ : 94408 90508 -
ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు
న్యూఢిల్లీ: సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆడది లేకపోతే మానవజాతి మనుగడే కష్టం అంటారు. అమ్మవారిగా పూజిస్తారు.. అదే ఆడపిల్లగా పుడితే మాత్రం చీదరించుకుంటారు. తల్లి గర్భం నుంచి భూమాత ఓడి చేరేంత వరకు ఆడవారు ఎన్ని కష్టాలు దాటాలో. అసలు అమ్మ కడుపు నుంచి బయటకు రాకుండానే రాలిపోతున్న ప్రాణాలు ఎన్నో. భూమ్మిద పడ్డాక కనిపించకుండా పోతున్న స్త్రీల సంఖ్య లక్షల్లో ఉందంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల సంగతి పక్కన పెడితే.. స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే మన దేశంలో శతాబ్దాలుగా ఆడవారి పట్ల చిన్న చూపు.. చులకన భావం. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత అభివృద్ది సాధించిన ఈ తారతమ్యాలు మాత్రం తొలగడం లేదు. యూనైటెడ్ పాపులేషన్ ఫండ్ నివేదిక చూస్తే ఈ మాటలు వాస్తవం అని మరోసారి రుజువు అవుతుంది. యూఎన్ఎఫ్పీఏ 2020 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 46 లక్షల మంది మహిళలు తప్పిపోతున్నారని తెలిపింది. అందులో 4.6 లక్షల మంది బాలికలు లింగవివక్షత కారణంగా తల్లి గర్భంలోనే లేక పురిట్లోనే కన్ను మూస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారత్ ఇప్పటికి కూడా మహిళలకు అత్యంత అసురక్షిత దేశాల్లో ఒకటిగా పేర్కొనడం శోచనియం. పుట్టుకలోనే తప్పిపోవడం బాలికల నిష్పత్తిని పెంచడం కోసం గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. కానీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్(ఎస్డబ్ల్యూఓపీ-స్వాప్) యూఎన్ఎఫ్పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్ బేస్డ్ సెక్స్ సెలక్షన్(జీబీఎస్ఎస్-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కల్గించే అంశం. మరి దారుణం ఏంటంటే దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పురిట్లోనే కనిపించకుండా పోతున్న ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు భారతదేశానికి చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ఎస్ వల్ల 12 లక్షల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతుండగా.. వీరిలో 40 శాతం మందితో భారత్ రెండో స్థానంలో ఉండగా.. 50 శాతంతో చైనా ప్రథమ స్థానంలో ఉంది. లింగవివక్షతకు వ్యతిరేంకగా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని ఈ నివేదిక వెల్లడిస్తుంది. స్వాప్ నివేదిక ప్రకారం 2016-2018 సంవత్సరానికి గాను ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 899 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నది. హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో(ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్) బాలికల సంఖ్య 900 కన్నా తక్కువ ఉందని నివేదిక తెలిపింది. బాల్య వివాహం, ఇతర వివక్షలు జీబీఎస్ఎస్ మాత్రమే కాక భారతదేశంలో బాలికలు బాల్య వివాహం, కట్నం, గృహ హింసతో పాటు లైంగిక వేధింపులు వంటి ఇతర లింగ ఆధారిత దురాగతాలకు గురవుతున్నారని నివేదిక తెలుపుతోంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ 2015-16 సర్వే గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్ళలోపే వివాహం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో 26.8 శాతం మంది 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 8,000 మంది మహిళలపై ఎన్హెచ్ఏఎఫ్ నిర్వహించిన ఈ సర్వేలో 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్న బాలికలలో 32 శాతం మంది వారి భర్త చేతిలో శారీరక హింసకు గురయినట్లు వెల్లడించింది. అంతేకాక 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు వివాహితల్లో ఒకరు తన భర్త నుంచి లైంగిక హింసను అనుభవించినట్లు సర్వే వెల్లడించింది. బాల్యవివాహాల డాటా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు బిహార్,పశ్చిమ బెంగాల్లో ప్రతి ముగ్గురు బాలికలలో ఇద్దరికి 18 ఏళ్ల లోపే వివాహం కాగా.. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకరికి బాల్య వివాహం జరిగినట్లు సర్వే వెల్లడించింది. అబ్బాయే ముద్దు.. ఆడపిల్ల వద్దు భారతదేశంలో కొడుకు అంటే వల్లమాలిన అభిమానం. ఆడపిల్ల పుడితే పెంచి, పెద్ద చేసి కట్నం ఇచ్చి ఒకరింటికి పంపాలి. అదే కొడుకయితే.. ఖర్చు పెట్టినప్పటికి కట్నం వస్తుందనే ఉద్దేశంతో భారతీయులు కొడుకు పట్ల వల్లమాలిన అభిమానం ప్రదర్శిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి వల్లే ఇండియాలో ఆడపిల్లల సంఖ్య బాలుర కంటే తక్కువగా ఉంటుంది. బాల్య వివాహాలకు ఇది కూడా ఓ కారణం అవుతుందని సర్వే తెలిపింది. ప్రస్తుతం చిన్న కుటుంబాలు ఏర్పడటం.. ఆదాయం పెరగటంతో పట్టణాల్లో లింగనిర్థారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. వెంటనే హతమారుస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి కొనసాగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా.. వీరిలో భారత్కు చెదిన వారే 46 మిలియన్ల మంది ఉండటం శోచనీయం. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఆడపిల్లల మనుగడ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని.. ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కుంటుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
పుత్తడి బొమ్మకు పుస్తెల తాడు
సాక్షి, షాద్నగర్ : బాల్య వివాహాలను రూపుమాపాలని ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తెచ్చినా సమాజంలో ఏమాత్రం మార్పు రావడంలేదు. రాజధాని సమీపంలో జరిగిన ఓ బాల్యం వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్నగర్ పరిధిలోని ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లిలో 12 ఏళ్ల బాలికను 37 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంలో బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి పత్తాలేకుండా పారిపోయాడు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యవారి పల్లి గ్రామానికి చెందని మల్లేష్ (37)కు కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. ఇటీవల అతని భార్య అత్మహత్య చేసుకుంది. అయితే మల్లేష్ అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా సమ్మతి తెలపడంతో మే 15న వీరికి రహస్యంగా వివాహం జరిగింది. అయితే బాలికకు పెళ్లి జరిగిందన్న ముచ్చట గ్రామంలో ఆనోటా ఈ నోటా పాకింది. ఈ విషయం షాద్ నగర్ ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో విచారణ ప్రారంభించారు. అధికారులు వస్తున్నారన్న సమాచారం అందటంతో కొత్త పెళ్లికొడుకు పరారయ్యాడు. సీడీపీఓ అధికారి నాగమణి గ్రామానికి వెళ్లికి విచారణ చేశారు. అనంతరం బాల్యం వివాహం జరిపిన బాలిక తల్లిదండ్రులను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం మైనర్ బాలినకు హైదరబాద్లోని ప్రగతి వెల్ఫేర్ కేంద్రానికి తరలించారు. మల్లేష్పై కేసు నమోదు చేశారు. -
బాలిక సమయస్ఫూర్తి.. వివాహం రద్దు
కర్ణాటక, మైసూరు : బాలిక సమయస్ఫూరితో బాల్య వివాహం నుంచి బయటపడిన ఘటన మైసూరు తాలూకా జయపుర హోబళిలో వెలుగు చూసింది. హోబళిలోని మార్బళ్లిహుండి గ్రామానికి చెందిన ఓ బాలిక (15)కు తల్లితండ్రులు బంధువైన యువకుడితో ఈనెల 30న వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బాలిక తల్లితండ్రులకు ఎంతచెప్పినా వినకపోవడంతో ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని భావించిన బాలిక అందుకు ఫేస్బుక్ను మార్గంగా ఎంచుకుంది. మొత్తం విషయాన్ని ఫేస్బుక్ ఖాతా ద్వారా బెంగళూరు నగర పోలీసులకు విషయాన్ని వివరిస్తూ పోస్ట్ పెట్టింది. ఇది గమనించిన బెంగళూరు పోలీసులు వెంటనే మైసూరు పోలీసులకు విషయాన్ని చేరవేయడంతో అప్రమత్తమైన మైసూరు పోలీసులు వెంటనే మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులతో కలసి గ్రామానికి చేరుకున్నారు. మైనర్ వివాహం చట్టరీత్యా నేరమని మరోసారి బాలికకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లితండ్రులు, బంధువులను హెచ్చరించారు. ఒకవేళ అదే యువకుడిని వివాహం చేసుకోవడానికి బాలిక అంగీకరిస్తే బాలికకు మైనారిటీ తీరాక వివాహం జరిపించాలని సూచించారు. -
బాల్యవివాహం అడ్డగింత
జయపురం: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అవగా హన కార్యక్రమాలు చేపట్టినా బాల్య వివాహా లు తరచూ జరుగుతుండడం శోచనీయం. ప్రధానంగా ఆదివాసీల్లో ఉండే ఈ బాల్యవివా హాల సంప్రదాయం ఇప్పటికీ జరుగుతుండ డం విశేషం. అవిభక్త కొరాపుట్లోని ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వివాహాలు ఎక్కువగా జరుగుతుండడం అనాది కాలం నుంచి వస్తుండగా, ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఆదివారం జరిగిన ఓ బాల్యవివాహాన్ని చైల్డ్లైన్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలి లా ఉన్నాయి.. జయపురం సబ్డివిజన్ పరిధిలోని కుంద్రా సమితిలో ఉన్న లిమ్మా గ్రామంలో బుడి హరిజన్ కొడుకు వివాహం, బొయిపరిగుడ సమితిలోని మఝిగుడ గ్రామస్తురాలితో జరుగుతుందన్న విషయం చైల్డ్లైన్ అధికారులు తెలుసుకున్నారు. అనంతరం వారు పోలీసుల సహాయంతో సంఘటన స్థలానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న బాల్య వివాహాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మైనర్లకు వివాహం చేసేందుకు సిద్ధపడిన ఇరు కుటుంబాల సభ్యులకు చైల్డ్లైన్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
10 తర్వాత పెళ్లికాదు.. 11
సాక్షి, తుళ్లూరు: బంధుత్వం పోతుందనో...మంచి సంబంధం వచ్చిందనో.. కట్నం లేని వరుడు దొరికాడనో...ఇలా పలు కారణాలతో చదువుకోవాల్సిన వయసులో, బాలికలను పెళ్లి పీఠలెక్కిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోవాలన్న కోరికను చంపుకొని పెళ్లిపీటలు ఎక్కుతున్నారు చిన్నారి పెళ్లి కూతుళ్లు. తన తోటి స్నేహితులు ఆడుతూ పాడుతూ పాఠశాలలు, కళశాలలకు వెళ్తుంటే, తాము మాత్రం చంటి పాపలను లాలిస్తు.. వారిని పెంచే భారం మోస్తు అవస్తులు పడుతున్నారు. తమ బతుకు ఇంతే అని జీవితం గడిపేస్తున్నారు పలువురు బాలికలు. ఈ నేపథ్యంలో చైల్డ్లైన్, క్రాఫ్, కరుణాలయం వంటి స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలు నిర్మూలన కోసం కంకణం కట్టుకున్నాయి. పది తరువాత పెళ్లి కాదు...11వ తరగతి అని ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నాయి. వివాహ వ్యూహంలో బాల్యం బందీ చదువుకోవాల్సిన వయసులో చిన్నారుల ఆశయాలను పెళ్లి అనే రెండు అక్షరాలు చిదిమేస్తున్నాయి. బాలికల విద్యకు ప్రభుత్వం అనేక పథకాలు, చట్టాలను అమలు చేస్తున్నా సామాజిక, సాంఘిక, ఆర్థిక కారణాలు బాల్య వివాహాలను ఆపలేక పోతున్నాయి. బాల్య వివాహాల నియంత్రణకు ఏర్పాటు చేసిన చైల్డ్లైన్ 1098 దృష్టికి రాకుండానే వివాహాలు జరిగిపోతున్నాయి. 10 తర్వాత పెళ్లికాదు.. 11 బాల్య వివాహాలపై అవగాహన కల్పించినా, ఎన్నోసార్లు హెచ్చరించినా సమాజంలో మార్పురాకపోవడంతో పాఠశాలల స్థాయి నుంచి ప్రభుత్వం అవగాహన కల్పించాలని భావించింది. అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలతో కలిసి 10 తరువాత పెళ్లి కాదు...11వ తరగతి వంటి కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల తల్లిదండ్రుల్లో కొంత మార్పు వచ్చిందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. చట్టమేం చెబుతుంది ? బాల్య వివాహ నిషేధిత చట్టం 1978 ప్రకారం అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు. భారత ప్రభుత్వం చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలను నిషేధించారు. ఈచట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి చేస్తే బెయిల్ లభించని నేరంగా పరిగణిస్తారు. రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. అవసరమైతే వివాహం రద్దు చేస్తారు. పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నాం గ్రామీణ స్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతి పాఠశాలలో చైల్డ్లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్, పోలీసులు అధికారులు 100 కు కూడా ఫిర్యాదు చేయడంపై బాలికలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. ‘పది తరువాత పెళ్లి కాదు.. 11వ తరగతి’ అని ప్రభుత్వాధికారులతో కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నాం. దీనికి కొంత స్పందన కనిపిస్తోంది. బాలికల తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. – బత్తుల బాబు, చైల్డ్లైన్ 1098 ప్రతినిధి -
బాలిక కిడ్నాప్, బలవంతంగా పెళ్లి
అనంతపురం,బొమ్మనహళ్: ప్రేమ పేరుతో వంచించి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఉదంతం నేమకల్లులో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాలివీ.. నేమకల్లు గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక అనంతపురం జెడ్పీ బాలికల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు దోణప్ప కుమారుడు తిప్పేస్వామి ఆ బాలికపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. చివరకు తండ్రీకుమారులు ఇద్దరూ పథకం ప్రకారం అనంతపురంలోని మట్కా బీటర్ బసవరాజు సాయంతో శుక్రవారం మధ్యాహ్నం బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక సరిహద్దులోని బెంచికొట్టాల వద్దనున్న ఆంజినేయస్వామి దేవాలయానికి తీసుకెళ్లి మైనర్ బాలికకు తిప్పేస్వామితో బలవంతంగా వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని బొమ్మనహాళ్ ఎస్ఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ దోణప్ప ఇంటికి వెళ్లి బాలికను ఉజ్వల హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బలవంతంగా బాలిక మెడలో తాళి
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు చంపుతానని బెదిరించి బలవంతంగా వివాహం చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్కిరణ్ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం కె.కన్నాపురం ప్రాంతానికి చెందిన ఆనంద్కుమార్ (23) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ద్వారకాతిరుమలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటివద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఈనేపథ్యంలో ఆనంద్కుమార్ ఆమె వెంట పడుతూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు అతడిని మందిలించినా ఆనంద్కుమార్ పట్టించుకోలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమె ను చదువు మానిపించి తమ వెంట కూలీపనులకు తీసుకువెళుతున్నారు. ఈనెల 15న తల్లిదండ్రులతో పాటు బాలిక కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో భోజనం కోసం ఇంటికి వచ్చింది. అక్కడే కాపుకాసిన ఆనంద్కుమార్ కర్రతో కొట్టి చంపుతానని బెదిరించి బలవంతంగా ఆమె మెడలో తాళికట్టాడు. అనంతరం బాలికను మోటారుసైకిల్పై ఎక్కించు కుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. దీనిపై అదే రోజు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రామ్మోహనరావు నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలు ఆపదలో ఉంటే 100, 112కు కాల్ చేయాలని, అతి తక్కువ సమయంలో రక్షణ కల్పిస్తామని డీఎస్పీ దిలీప్కిరణ్ స్పష్టంచేశారు. ఏలూరు రూరల్ సీఐ ఎ.శ్రీనివాసరావు, పెదవేగి ఎస్సై రామ్మోహనరావు పాల్గొన్నారు. -
విద్యార్థినికి పెళ్లి.. తాళిని తీసి పాఠశాలకు
తమిళనాడు, వేలూరు: కాట్పాడికి చెందిన 12 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థినికి తల్లిదండ్రులు బలవంతపు పెళ్లి చేశారు. అయితే పెళ్లి ఇష్టం లేని విద్యార్థిని తాళిని తీసి పాఠశాలకు వెళ్లింది. ఈ సంఘటన కాట్పాడిలో చర్చనీయాంశం అయింది. వివరాలు.. విద్యార్థిని అక్కకు సమీప బంధువుతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ముందుగా ఇద్దరికి జాతకం చూసేందుకు జ్యోతిష్యుడి వద్దకు వెళ్లారు. పెద్ద కుమార్తె జాతకం బాగాలేదని.. అబ్బాయి జాతకం చిన్న కుమార్తెకు బాగుందని తెలిపారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు చిత్తూరు నుంచి వచ్చిన బంధువుల కుమారుడికి చిన్న కుమార్తెతో వివాహం చేసేందుకు నిర్ణయించారు. తాను చదువుకోవాలని..పెళ్లి ఇష్టం లేదని విద్యార్థిని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు బలవంతంగా చిత్తూరుకు తీసుకెళ్లి ఈ నెల 6న గంగాధరనెల్లూరు మండలం కడపగుంటలో బంధువుల సమక్షంలో పెళ్లి చేశారు. వివాహం అనంతరం ఈ నెల 8న కాట్పాడిలోని బాలిక ఇంటికి వెళ్లారు. విద్యార్థిని తాళిని ఇంటిలో తీసి పెట్టి పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులకు విషయం తెలియడంతో శిశుసంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశుసంక్షేమ శాఖ అధికారి దేవేంద్రన్, విరుదంబట్టు పోలీసులు విద్యార్థిని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బలవంతంగా వివాహం చేసినట్లు తెలియడంతో విద్యార్థినిని కలెక్టర్ షణ్ముగసుందరం ముందు హాజరుపరిచారు. అనంతరం అబ్దుల్లాపురంలోని వసతి గృహంలో చేర్పించారు. బలవంతపు పెళ్లి చేసిన తల్లిదండ్రులు, బంధువులు, పెళ్లి కొడుకుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. -
చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్: వివాహమంటే బొమ్మలాట అనుకునే ప్రాయంలో, ముక్కుపచ్చలారని బాలికను కాసులమీద ఆశతో చావడానికి సిద్ధంగా ఉన్న పండుముదుసలికి ఇచ్చి వివాహం చేయడం సంప్రదాయంగా చెలామణీ అవుతున్న రోజులవి. తెలిసీ తెలియని ప్రాయంలో వితంతువుగా మారిన చిన్నారుల మనోవ్యధలను కన్న తల్లితండ్రులే పట్టించుకోని రోజుల్లో.. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలకు సమాజాన్ని సిద్ధం చేస్తున్న రోజులు.. ఎదురైన ప్రతిఘటనలకు అంతే లేదు. అన్నిటినీ ఎదిరించి, తాను నమ్మిన సంస్కరణోద్యమాన్ని విజయపథాన చేర్చగలిగారు కనుకనే ఆయన యుగపురుషుడయ్యారు. కుహనా వేదాంతుల ఇష్టారాజ్యం ‘ప్రారబ్ధం చాలకపోతే, ప్రతివాళ్లకి వస్తుందది (వైధవ్యం). చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?.. వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వం యెంత ప్రతిష్ఠ బతికారు కాదు?’ నాటి పెద్దమనుషుల మనస్తత్వాలకు అద్దంపట్టే అగ్నిహోత్రావధానులు పాత్ర ద్వారా మహాకవి గురజాడ అప్పారావు పలికించిన ‘సుభాషితాలు’. నాటి సమాజంలో అగ్నిహోత్రావధానులు లాంటి వారికి కొదవ లేదు. చాటుమాటు వ్యభిచారం చేసినా ఫరవాలేదు, పునర్వివాహం మాట వద్దు... కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రలో చెప్పిన ఒక సంఘటన..జ్యోతిష శాస్త్రం వృత్తిగా చేసుకుని జీవనం, జీవితం సాగిస్తున్న ఒక పెద్దమనిషి చెల్లెలు వితంతువు అయింది. సరే అన్నగారు వితంతువులు కట్టుకునే అంచులేని ముతకబట్టలను తీసుకువచ్చి, సోదరిని ధరించమన్నాడు. ఆమె ససేమిరా అంది. నేను పునర్వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. సోదరుడు అయినవారి దగ్గిర తన సోదరిని గురించి వాపోయాడు. సోదరుని ‘హితైభిలాషులు’వచ్చి, ఆ చిన్నారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. చాటుమాటు వ్యభిచారం చేసుకున్నా ఫరవాలేదు కానీ, మారు మనువు తలపెట్టవద్దని హెచ్చరించారు. వారు సూచించిన మార్గంలోనే ఆమె జీవనయానం సాగించింది. (కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రము గ్రంథము– పునర్ముద్రణ 2015.పుటలు 135,136)వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమే అనేక గ్రంథాలను పరిశీలించి, కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలకు శాస్త్ర నిషేధం లేదని నిరూపించారు. విశాఖపట్టణం నుంచి మహామహోపాధ్యాయ పరవస్తు వేంకట రంగాచార్యులు స్త్రీపునర్వివాహం శాస్త్రసమ్మతమని ఒక చిన్న పుస్తకం ప్రకటించారు. కొక్కొండ వేంకట రత్నం పంతులు ఈ వాదనను ఖండించడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు ఛాందసవాదులు కందుకూరిపై భౌతికదాడులకు సైతం వెనుకాడలేదు. 1881 డిసెంబర్ 11వ తేదీన తొలి వితంతు వివాహం కృష్ణా మండలం తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందం నుంచి కందుకూరి ఒక లేఖను అందుకున్నారు. తిరువూరు ప్రాంతం, రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే 12 సంవత్సరాల బాల వితంతువు ఉన్నదని, గౌరమ్మకు మారు మనువు చేయడానికి ఆమె తల్లి సుముఖంగా ఉన్నదన్నది లేఖ సారాంశం. విశాఖపట్టణంలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న గోగులపాటి శ్రీరాములు భార్యను కోల్పోయారు. ఆయనకు కందుకూరిపై గౌరవం, భక్తి ఉన్నాయి. వితంతువును వివాహమాడటానికి ఆయన అంగీకరించారు. ఈ వార్త నగరమంతా పొక్కి, పెద్ద దుమారం లేచింది. వంటమనిషి రావడం మానేసింది. ఇంటి పురోహితుడూ అంతే.. బంధువులు వీరేశలింగాన్ని ఆడిపోసుకున్నారు. ‘ఇంకేముంది? అంతా నాశనమే’ అంటూ శాపనార్థాలు పెట్టారు. తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలో కందుకూరి ఇంట డిసెంబర్ 11వ తేదీ రాత్రి చరిత్రాత్మకమైన తొలి వితంతు వివాహం జరిగింది. నాడు పోలీసులు, విద్యార్థులు కందుకూరికి బాసటగా నిలబడ్డారు.. ‘మహాసంక్షోభంలో వివాహం జరిగిందని కందుకూరి స్వీయచరిత్రలో పేర్కొన్నారు. ఆ తరువాత కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో జరిగిన సుమారు 39 వితంతు వివాహాల వివరాలు లభ్యమవుతున్నాయి. వంకాయలవారి వీధిలోని కందుకూరి జన్మగృహంలో డిసెంబర్ 11వ తేదీ రాత్రి జరిగిన పునర్వివాహాన్ని స్మరిస్తూ, విగ్రహాలను నెలకొల్పారు. నేడు కందుకూరిసంస్కరణోద్యమంపై సెమినార్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఎస్కేవీటీ కళాశాలలో కందుకూరి సంస్కరణో ద్యమం–వితంతు వివాహాలు’ అంశంపై సెమినార్ జరగనుంది. సంస్కరణోద్యమాన్నిముందుకు తీసుకువెళ్లాలి స్త్రీ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అత్యాచారాలు, హత్యాచారాలు మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి. నేటి విద్యార్థి లోకం, మేధావులు ఈ సమస్య పరిష్కారానికి కందుకూరి స్ఫూర్తితో కృషి చేయాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మన లక్ష్యం కావాలి. నాడు సామాజిక దురాచారాలకు, నేడు అత్యాచారాలకు బాధితురాలు స్త్రీమూర్తి కావడం సభ్యసమాజానికి సిగ్గుచేటు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
శ్రీకాళహస్తి రూరల్/ తిరుపతి క్రైం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి డివిజన్ ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిదుర్గ కథనం..మండలంలోని అబ్బాబట్లపల్లెకు చెందిన బత్తెయ్య, బత్తెమ్మ దంపతుల వ్యవసాయ కూలీలుగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి 15 ఏళ్ల కుమార్తె 10వ తరగతి చదువుతోంది. పెట్రోల్ బంకులో కార్మికుడిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకునితో వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు సిద్ధం చేశాయి. బాల్య వివాహం చేస్తున్నారని తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో వారు శ్రీకాళహస్తి పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని రాతపూర్వకంగా బాలిక తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ నమోదు చేశారు. బాల్యవివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా కఠిన శిక్షలు తప్పవని సీడీపీఓతోపాటు పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు బజావతి, శారద, అరుణకుమారి, హెడ్ కానిస్టేబుల్ గంగయ్య పాల్గొన్నారు. సకాలంలో స్పందిస్తాం : అర్బన్ ఎస్పీ ఆపద కాలంలో పోలీసు రక్షణ కోసం స్టేషన్ చు ట్టూ తిరగాల్సిన పనిలేదని అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. డయల్ 100కు ఫోన్ చేస్తే సకాలంలో ఘటనా స్థలం చేరుకుంటామన్నారు. తద్వారానే శ్రీకాళహస్తిలో బాలిక వివాహాన్ని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. డయల్ 100తో పాటు 112, 181 నంబర్లను వినియోగించుకోవాలని కోరారు. బాల్యవివాహం చట్టరీత్యానేరమన్నారు. అంతేకాకుండా చిన్నవయస్సులో వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదన్నారు. -
ఒక వైపు పెళ్లి విందు..మరోవైపు వైవాహిక జీవితం మొదలు
స్త్రీ పురుష సమానత్వం కోసం చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. వర్తమానంలోనూ జరుగుతున్నాయి. అవకాశాల్లో సమానత్వం. వసతులలో సమానత్వం. వేతనాలలో సమానత్వం. ఇప్పుడు పెళ్లీడులో సమానత్వం కోసం న్యాయపోరాటం మొదలైంది! పెళ్లి వయసు 21–18గా ఉంటే నష్టం ఏమిటి? 21–21 ఉంటే వచ్చే లాభం ఏమిటి? ‘యుక్తవయసు’ అంటే పెళ్లీడు అనుకుంటాం. కానీ కాదు! అది యుక్తమైన వయసు. అనువైన వయసు. అర్హమైన వయసు. ఇంగ్లిష్లో ‘రైట్ ఏజ్’ అంటారు. తగిన వయసు అని. జీవితంలో ప్రతి దానికీ యుక్త(మైన) వయసు ఒకటి ఉంటుంది. చదువు ప్రారంభించడానికి. చదువు పూర్తి చేయడానికి. ఉద్యోగాల వేటకు, వివాహానికి. చట్ట ప్రకారం కూడా కొన్నింటికి యుక్తమైన వయసులు ఉన్నాయి. ఓటు హక్కుకు యుక్త వయసు. మైనారిటీ తీరడానికి యుక్తవయసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవడానికి యుక్త వయసు. ఈ కనీస యుక్త వయసుల విషయంలో భారత చట్టాలు స్త్రీ, పురుషులిద్దర్నీ సమానంగా చూశాయి.. ఒక్క మేరేజ్ ఏజ్ లిమిట్లో తప్ప! మనదేశంలో పెళ్లి చేసుకోడానికి అబ్బాయికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. దీన్నిప్పుడు కొంతమంది పురుషాధిక్య ధోరణిగా, ఆడవాళ్ల పట్ల వివక్షగా చూస్తున్నారు. స్త్రీ పురుషులిద్దరూ సమానమైనప్పుడు వివాహానికి యుక్తమైన వయసు ఇద్దరికీ సమానంగానే కదా ఉండాలి అని అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది కొన్నాళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. దానిపై గత సోమవారం కోర్టు స్పందిస్తూ, ‘ఇదేంటో చూడండి’ అని కేంద్ర ప్రభుత్వానికి పురమాయించింది. అక్టోబర్ 30 లోపు సమాధానం రావాలని కూడా కోరింది. కోర్టులో పిల్ వేసిన అశ్విని (పురుష న్యాయవాది) ప్రధానంగా రెండు పాయింట్లు లేవనెత్తారు. ఒకటి: పెళ్లికి కనీస వయోపరిమితిగా అమ్మాయికి ఒక వయసు, అబ్బాయికి ఒక వయసు ఉండడం అశాస్త్రీయం. పురుషులదే పైచేయిగా, పైమాటగా ఉన్న కాలం స్వభావ అవశేషం అది. రెండు : ఇప్పటికే 125 దేశాలు వివాహ వయసును స్త్రీ పురుషులిద్దరికీ సమానం చేశాయి. అయినప్పటికీ మనమింకా వేర్వేరు వయసులకు పరిమితం అయ్యాం. ఇది మహిళల పట్ల వివక్షను కనబరచడమే. ‘ఈ ప్రశ్నకు బదులివ్వండి’ అబ్బాయికి ఉన్నట్లు అమ్మాయికి కనీస వివాహ అర్హత వయసు 21గా లేకపోవడం స్త్రీలపై భారతీయ సమాజం చూపిస్తున్న ఒక ఘోరమైన వివక్షకు నిదర్శనం అని, స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అనే రాజ్యాంగ స్ఫూర్తిని ఈ వివక్ష భంగపరిచేలా ఉందనీ అశ్విని తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టు 29, 30 తేదీలలో ఢిల్లీలో బాల్య వివాహాలపై జాతీయ సదస్సు జరిగింది. సదస్సులోని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం మిగతా దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ పెళ్లికి ఒకే విధమైన వయోపరిమితులను విధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సంగతిని కూడా గుర్తు చేస్తూ అశ్విని తన అభిప్రాయాలను, అభ్యంతరాలను పిటిషన్లో పొందుపరిచారు. ప్రస్తుత వయోపరిమితి అన్సైంటిఫిక్గా (అశాస్త్రీయంగా), స్టీరియోటైప్గా (పాత మూసలో) ఉందని తప్పుపట్టారు. ఈ పిటిషన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డి.ఎన్.పటేల్, జస్టిస్ సి.హరి శంకర్ వచ్చే అక్టోబర్ ముప్పై లోపు ఈ ‘వివక్ష’కు బదులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వయసులో ఏముంది? చట్టం తన పని తను చేసుకుపోతుంది. అయితే చట్టాన్ని ఏర్పాటు చేసే పని వేరొకరు చేయాలి. వాళ్లే ప్రజా ప్రతినిధులు. ప్రజల్లో ఎక్కువ మంది దేన్నైతే కోరుకుంటున్నారో, ఎక్కువ మందికి ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో దానిపై వారు ఒక నిర్ణయం తీసుకుని, చట్ట సభల్లో అమోదం కోసం ప్రయత్నిస్తారు. చట్టాన్ని తీసుకొస్తారు. ఇప్పుడీ పెళ్లీడు ‘వివక్షను’ నిర్మూలిస్తూ ఒక చట్టం రావాలన్నా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. దాన్నలా ఉంచితే, అసలు ఈ పిటిషన్ ఉద్దేశం సరైనదేనా అన్నది ప్రశ్న. పెళ్లి వయసును సమానం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? చెయ్యకపోతే జరిగే నష్టం ఏమిటనే దానిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య వయసు భర్త వయసు కన్నా కనీసం ఒకటీ రెండేళ్లయినా తక్కువగా ఉండేందుకే సమాజం మొగ్గు చూపుతుంది. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. పెద్దల్ని గౌరవించడం అనే సూత్రం దాంపత్యంలోనూ వర్తించి, కాపురంలో కలహాలు రాకుంటా ఉంటాయన్నది ఒక యాంగిల్. ‘గౌరవించడం’ అంటే తగ్గడం. భార్యే ఎందుకు తగ్గాలి? తనకన్నా వయసులో చిన్నది కనుక భర్తే తగ్గొచ్చుకదా అనేది దీనికి కౌంటర్. ‘తగ్గడం’ మంచి విషయం అయినప్పుడు ఎవరు తగ్గితే ఏమిటి? ఎవరి వయసు ఎంతుంటే ఏమిటి? ఇదొక వాదన. దంపతులు సమ వయస్కులుగా ఉన్నప్పుడు.. ‘నేనేం తక్కువ, నేనెందుకు తగ్గాలి’ అనే ఇగో వచ్చి, మనస్పర్థలు తలెత్తే ప్రమాదం ఉందని, వాటిని నివారించడానికి అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని పూర్వికులు ఆలోచించి పెట్టారు అని చెప్పేవాళ్లూ ఉన్నారు. దీనికి భిన్నమైన వాదన ఎలాగూ ఉంటుంది. భార్యాభర్తలు ఒకర్నొకరు అర్థం చేసుకుంటూ నడిస్తే వయసు సమానంగా లేకుంటే మాత్రం నష్టం ఏమిటి అని. అసలిది సమస్యే కాదని, అశ్విని అనే ఆయన పనిలేక ఈ పిటిషన్ వేశార ని అంటున్నవారూ ఉన్నారు. మనదేశంలో అబ్బాయికి అమ్మాయికి కనీస వివాహార్హత వయసును నిర్ణయించడానికి కారణం బాధ్యతల్ని గుర్తెరిగే వయసని. అయితే ఎన్నేళ్లొచ్చినా బాధ్యతల్ని తెలుసుకోని భార్యాభర్తల మాటేమిటి? అది చట్టానికి సంబంధించని విషయం. మంచి కాని దాన్ని నివారించడం చట్టం బాధ్యత. బాల్య వివాహాలు మంచివి కావు. అందుకని చట్టం ఒక ఏజ్ లిమిట్ పెట్టింది. ఇప్పుడు ఆ ఏజ్ని సమానం చేయాలన్న విజ్ఞప్తి కోర్టు దృష్టికి వచ్చింది. దీనివల్ల ఒనగూడే ప్రత్యేక ప్రయోజం ఏదైనా ఉంటే తప్పకుండా ఇదీ ఒక చట్టం అవుతుంది. సమానత్వం కోసం చట్టమే కానీ, చట్టంతో పని లేకుండా సమానత్వాన్ని పాటించడం భార్యాభర్తల చేతుల్లో పనే. ఆచారాలలో సమానత్వం వధూవరుల వయసు సమానంగా ఉండాలన్న దానిపై వాదోపవాదాలను, భిన్నాభిప్రాయాలను పక్కన ఉంచితే, భార్యాభర్తల్లో ఎవరు ఎవరికన్నా వయసులో పెద్దవారైనా, చిన్నవారైనా.. దాంపత్య జీవితంలో వాళ్లిద్దరిదీ సమభాగస్వామ్యమే అని చెప్పే మంచి మంచి సంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచ సంస్కృతులలో అనేకం ఉన్నాయి. జర్మనీలో ఒక వైపు పెళ్లి విందు జరుగుతుండగనే మరోవైపు వధూవరుల చేత అక్కడికక్కడ అందరి సమక్షంలో వారి వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టించేస్తారు! ఒక పెద్ద దుంగను, రంపాన్ని తెచ్చి.. ఆ రంపంతో ఆ దుంగను వాళ్ల చేత రెండు భాగాలుగా కోయిస్తారు. కోసేటప్పడు రాలే చెక్క పొడి వాళ్ల కొత్త బట్టలపై పడుతూ ఉంటుంది. అయినా కోస్తూనే ఉండాలి. వాళ్ల దాంపత్య జీవితంలో వచ్చే మొదటి సమస్యకు సంకేతం ఆ ఆచారం. ఇకముందు ఏ సమస్యనైనా ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పరిష్కారం అవుతుందని చెప్పడం అంతరార్థం. ఫిలిప్పీన్స్ పెళ్లి తంతులో దంపతులిద్దరికీ ఒకే దండ వేస్తారు. సన్నటి దారానికి విలువైన చిన్నచిన్న రాళ్లు గుచ్చి ఉండే ఆ దండను ఎనిమిది ఆకారంలో మెలితిప్పి ఒక భాగాన్ని వరుడికి, ఒక భాగాన్ని వధువుకి వేసి తీస్తారు. ‘యుగల్’ అంటారు ఆ దండను. జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉండండి అని చెప్పడం ఈ సంప్రదాయంలోని ప్రధాన ఉద్దేశం అయినా.. మీరిద్దరూ ఒకరికొకరు ఎక్కువగానీ, తక్కువగానీ కాదని చెప్పడం అంతర్లీన సందేశం. స్కాట్లాండ్లో వధూవరులిద్దరికీ పెళ్లికి ముందురోజు ఒళ్లంతా ఆహార పదార్థాలు పూస్తారు. కోడి ఈకలు అంటిస్తారు. తర్వాత వాళ్లను టాప్లెస్ వాహనంలో ఊరేగిస్తారు. ఈ పూతలు, ఈకలు భవిష్యత్తులో దంపతులపై పడబోయే నిందలకు, ఆరోపణలకు సంకేతాలు. వీటిని ఇద్దరికీ అద్దడం దేనికంటే.. ఒకరిపై వచ్చిన నిందలు, ఆరోపణలు ఇద్దరిపై వచ్చినట్లుగానే భావించి, ఒకరి తరఫున ఒకరు గట్టిగా నిలబడాలని చెప్పడం. ఆఫ్రికన్–అమెరికన్ పెళ్లిళ్లలో వధూవరుల చేత చీపురును దాటిస్తారు. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పడం. అమెరికాలో బానిసత్వ దురాచారం అమల్లో ఉన్న రోజుల్లో ఆఫ్రో–అమెరికన్ పెళ్లిళ్లే ఉండేవి కాదు. రోజులు మారి, ఆ రెండు జాతుల మధ్య ప్రేమ పెళ్లిళ్లకు సమ్మతి లభించాక ఈ చీపురు ఆచారం మొదలైంది. ఆఫ్రిన్ అమ్మాయిని గానీ, అబ్బాయిని గానీ అమెరికన్ అబ్బాయి గానీ, అమ్మాయి గానీ పెళ్లి చేసుకున్నాక.. ఇక తమ జీవిత భాగస్వామి గతాన్ని ఎంత పెద్ద గొడవలోనూ ఎత్త కూడదు. గుర్తు చేయకూడదు. అలాగని ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణానికి గుర్తే చీపుర్ని దాటించడం. క్రమంగా ఇది మామూలు పెళ్లిళ్లలో కూడా ఒక ఆచారంగా స్థిరపడింది. నైరుతి నైజీరియాలో యొరూబా అనే తెగ ప్రజలున్నారు. వాళ్ల పెళ్లిళ్లలో వధూవరులకు రకరకాల రుచుల పానీయాలను ఇస్తారు. వైవాహిక జీవితంలో ఉండబోయే కష్టసుఖాలను శాంపిల్గా చూపించడం ఇది. పానీయం తాగడానికి కాదు. ఒక చుక్క నాలుకపై వేసుకోడానికి. అలా నాలుగైదు రకాల పానీయాలను రుచి చూస్తారు. అలా చేయడమంటే.. ఏ రుచినైనా ఇద్దరం సమానంగా స్వీకరిస్తాం అని చెప్పడమే. చైనాలోని మంగోలియా ప్రాంతాల్లో పెళ్లి అయ్యీ కాగానే వధూవరులిద్దరూ ఒకే కత్తితో కోడిపిల్లను చంపి, కోడిపిల్ల దేహంలో కాలేయాన్ని వెతికి పట్టుకుంటారు. కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి పరిష్కారం కనుక్కోవాలని ఈ ఆచారం సూచిస్తోంది. ఫ్రాన్స్లో ఫస్ట్నైట్కు ముందు దంపతులు తమ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహారాన్ని కలిసి భుజిస్తారు. అది చిన్న కేకు ముక్కే అయినా కలిసి ఒకేసారి నోట్లో పెట్టుకుంటారు. ఉన్ననాడు లేనినాడు ఒకే నోరుగా, ఒకే కడుపుగా ఉండాలని దానర్థం. యూదుల పెళ్లిళ్లలో కొత్త దంపతులు పూల పందిరి కింద ఉంటారు. ఆ సమయంలో చిన్న ఆభరణం కూడా ధరించి ఉండకూడదు. ఒక్కొక్కరూ ఆ పూల పందిరి కిందికి వచ్చి వాళ్లను ఆశీర్వదించి వెళుతుంటారు. ఆభరణాలకు ప్రాముఖ్యం లేనప్పుడు దాంపత్యమే ఒక విలువైన ఆభరణంలా భాసిస్తుందని, నిరాడంబరమైన జీవితం ప్రశాంతతనిస్తుందని చెప్పడం. ఆడంబరంగా ఉండటం తేలిక. నిరాడంబరంగా ఉండాలంటే మాత్రం ఇద్దరూ అనుకుంటేనే సాధ్యం అని అర్థం. వివక్ష అనుకోనక్కర్లేదు ఆడపిల్లల్లో ఎదుగుదల, మానసిక పరిణతి త్వరగా వచ్చేస్తుంది. మగపిల్లల్లో ఈ పరిపక్వత కాస్త ఆలస్యం అవుతుంది. దీనికి అనుగుణంగానే వధూవరుల వయస్సుల మధ్య రెండు మూడేళ్ల వ్యత్యాసం ఉంటూ వస్తోంది. సూక్ష్మంగా చూస్తే.. సమానత్వం కోసమే ఈ స్వల్ప వయోభేదం అనే విషయం అర్థమౌతుంది. దీనిని వివక్ష అనుకోనక్కర్లేదు.– డాక్టర్ అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
సాక్షి, బల్లికురవ (ప్రకాశం): మైనర్ బాలికకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న సంతమాగులూరు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు సిబ్బందితో కలిసి బాల్య వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి బల్లికురవ ఎస్సీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన బొంతా శ్యాంబాబు, బాణమ్మల కుమార్తె కోమలి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతానని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు తమ వద్ద చదివించే స్థోమత లేదని గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన ఇండ్ల కృష్టోఫర్ సింగమ్మల కుమారుడు ప్రభాకర్కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం జొన్నలగడ్డలో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐతే, గురువారం రాత్రి బాలిక ఇంటి వద్ద వివాహ వేడుకలు జరుగుతుండగా అధికారులకు మైనర్ వివాహం జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో సంతమాగులూరు ఐసీడీఎస్ సీడీపీఓ బి. విజయలక్ష్మి, సూపర్వైజర్ వి. నాగమణి, అంగన్వాడీ కార్యకర్త కె. రాజకుమారి బల్లికురవ ఎస్సై పి. అంకమ్మరావు, వివాహ వేడుకలు జరుగుతున్న బాలిక ఇంటివద్దకు వెళ్లారు. బాలికతోనూ, తల్లిదండ్రులతోనూ వేర్వేరుగా మాట్లాడారు. బాలిక తాను ఇంటర్ చదువుతానని, చదివించాలని, అధికారులను వేడుకుంది. మేజర్ అయ్యే వరకు వివాహం చేయమని బాలిక తల్లిదండ్రులు శ్యాంబాబు, బాణమ్మల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాలిక నుంచి కూడా మేజర్ అయ్యేవరకు వివాహం చేసుకోనని స్టేట్మెంట్ తీసుకుని, బల్లికురవ కళాశాలలో చేర్పించాల్సిందిగా అంగన్వాడీ కార్యకర్తను ఆదేశించారు. -
బాలికను కిడ్నాప్ చేసి వివాహం
టీ.నగర్: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న ఆంధ్రా యువకుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పులియాంతోపునకు చెందిన కూలి కార్మికుడు ఒకరు తన 14 ఏళ్ల కుమార్తె కనిపించలేదని ఈనెల 8న పులియాంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తూ వచ్చారు. విచారణలో బాలికను తిరుపతి నుంచి వచ్చిన వారి బంధువు ఒకరు మాయమాటలు చెప్పి ఆంధ్రాకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. పులియాంతోపు పోలీసులు ఆంధ్రాకు వెళ్లి బాలికను రక్షించి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పేరు బాలకృష్ణన్ అని తెలిసింది. పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
‘పెళ్లొద్దు..చదువుకుంటా’
ప్రకాశం, కందుకూరు: నిండా పదిమూడేళ్లు కూడా నిండని ఆ బాలిక చూపిన దైర్యం పలువురికి ఆదర్శంగా నిలిచింది. పెద్దలను ఎదిరించి నాకు పెళ్లి వద్దు నేను చదుకుంటానంటూ అధికారులను ఆశ్రయించింది. అధికారుల చొరవతో మేనమామతో నిశ్చయమైన పెళ్లి నిలిచిపోయింది. బాల్య వివాహం చేసుకోనంటూ పెద్దలను ఎదిరించి ముందుకు వచ్చిన ఆ బాలికను ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించి చదివించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటన గురువారం కందుకూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కందుకూరు పట్టణానికి చెందిన ఓ మైనార్టీ ముస్లిం బాలిక స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ కుటుంబం నిరుపేద కుటుంబం. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లితో కలిసి ఆ బాలిక నాయనమ్మ దగ్గర ఉంటున్నారు. అయితే ఆ బాలికను తన మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నాయనమ్మ నిశ్చయింది. ఈ మేరకు గత డిసెంబర్లోనే నిశ్చితార్థం చేశారు. కానీ నాకు పెళ్లి వద్దంటూ అప్పటి నుంచే ఆ చిన్నారి ఎదిరిస్తూనే ఉంది. తల్లి కూడా కుమార్తెకు అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ నాయనమ్మ ఒత్తిడి వల్ల పెళ్లికి అంగీకరించాల్సిన పరిస్థితి. పెళ్లి చేసుకుంటేనే ఇంట్లో ఉండండి లేదంటే బయటకు వెళ్లండి అంటూ ఒత్తిడి చేయసాగింది. ఈ మేరకు ఈ నెలలో ఆ బాలికకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి అసలు ఇష్టం లేని ఆ బాలిక ఒంగోలు చైల్డ్లైన్ 1098కు సమాచారం ఇచ్చారు. దీంతో హెల్ప్ ప్రోగ్రాం ఆఫీసర్, పారాలీగల్ వాలంటీర్ బీవీ సాగర్ బాలిక కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకోకపోతే నిశ్చితార్ధం కోసం రూ. 40వేలు ఖర్చు చేశాం, వాటిలో రూ. 20 వేలు తిరిగి ఇవ్వాలంటూ పెళ్లికొడుకు తరుఫు వారు డిమాండ్ చేశారు. దీంతో సాగర్ బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్కు చేరిన పట్టణ ఎస్సై ఉన్నం వేమనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లికొడుకు తరుపు వారిని పిలిపించిన ఎస్సై వారిని మందలించారు. చట్ట ప్రకారం బాల్య వివాహం చేయడం నేరమని, మైనార్టీ తీరని బాలికను పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పెళ్లి చేసుకోవాలని గానీ, నిశ్చితార్ధం డబ్బులు తిరిగి ఇవ్వాలని గానీ బాలిక కుటుంబంపై ఒత్తిడి చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో బాల్య వివాహం నిలిచిపోయింది. నిరుపేదరాలైన ఆ బాలిక పరిస్థితిని జిల్లా బాలల సంక్షేమ కమిటీ దృష్టికి తీసుకెళ్లగా బాలికను ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తన బాల్య వివాహాన్ని నిలుపుదల చేసుకునేందుకు తనే ముందుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసిన బాలికను ఆదర్శ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, పారా లీగల్ వాలంటీర్ చీకటి రోశయ్య, అధికారులు బాలికను అభినంధించారు. -
బాల్యానికి మూడుముళ్లు..!
సాక్షి, యాదాద్రి : అధికార యంత్రాంగం చర్యలెన్ని చేపట్టినా జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు వెరసి చిరుప్రాయంలోనే అమ్మాయిలు పెళ్లిపీటలెక్కుతున్నారు. అందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కాలంలో రాచకొండ పోలీసులు, షీటీంలు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాలే నిదర్శనం. గుట్టుచప్పుడు కాకుండా.. జిల్లాలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చేయాల్సిన వివాహాలు 13ఏళ్లకే చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు అడ్డుకుంటున్నా గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరుగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కమిషనరేట్ పరిధిలో 51 బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకోగా ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్(ఎం), భువనగిరి, సంస్థాన్నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, వలిగొండ ఇలా అన్ని మండలాల్లో నిత్యం ఏదో ఒక చోట బాల్య వివాహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాల్య వివాహాలతో అనర్థాలు హైస్కూల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేయడంవల్ల వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అంతేకాకుండా భార్య, భర్తల మధ్యన వివాదాలు తలెత్తి విడాకులకు దారితీస్తున్నాయి. బాల్యవివాహాలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు వివిధ కారణాలతో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలకు కారణాలు.. బాల్య వివాహాలు జరుగడం వెనక పలు సామాజిక కారణాలు ఉన్నాయి. మేనరికం, సమాజంలో బాలికల పట్ల జరుగుతున్న లైంగిక దాడులు, ప్రేమ పేరుతో వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై వివిధ శాఖల అధికారులు నిర్వహిస్తున్న ప్రచారం మొక్కుబడిగా కాకుండా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. బాల్యవివా హాలకు సబంధించిన చట్టాలు, అతిక్రమిస్తే పడే శిక్షలు, చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలగురించి ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద బోర్డులపై రాయించాలి. 41 బాల్య వివాహాల అడ్డగింత రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 51బా ల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. 13ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు వివాహాలు చేస్తుండగా అందిన సమాచారం మేరకు షీ టీం సభ్యులు, స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తక్షణమే స్పందించి ఘటనా స్థలాలకు వెళ్లి అడ్డుకున్నారు. వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలతోపాటు బాల్య వివాహాలు చేస్తే నేరమని ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులతోపాటు మధ్యవర్తులు అందరిపైన కేసులు నమోదవుతాయని వివరిస్తున్నారు. షీటీం రాకతో ఆగిన బాల్యవివాహం తుర్కపల్లి మండలం పెద్దతండాలో ఫిబ్రవరి 22న షీటీం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. 17 ఏళ్ల బాలికను 25ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. 23న వివాహాం జరగాల్సి ఉండగా సమాచారం అందుకున్న షీటీం సభ్యులు స్థానిక పోలీసుల సహకారంతో ముందు రోజే వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించి పెళ్లిని అడ్డుకున్నారు. షీటీంలు అడ్డుకున్న బాల్య వివాహాలు ఇలా... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో షీటీంలు ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. భువనగిరి షీటీం ఆధ్వర్యంలో 28, చౌటుప్పల్ షీటీం 13, ఇబ్రహీంపట్నం షీ టీం 5, మల్కాజ్గిరి షీ టీం 3, ఎల్బీనగర్ షీ టీం 1, కుషాయిగూడ షీటీం1 మొత్తం 51 బాల్యవివాహాలను ఇటీవల కాలంలోనే అడ్డుకున్నారు. ఇందులో 13 ఏళ్ల వయస్సున్న రెండు, 14 ఏళ్ల వయస్సు మూడు, 15 ఏళ్ల వయస్సు 7, 16 ఏళ్ల వయస్సు 19, 17 ఏళ్ల వయస్సు 20 వివాహాలను అడ్డుకుని వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు నేరం బాల్య వివాహాలు చేయడం నేరం. అమ్మాయిల వయస్సు 18, అబ్బాయిల వయస్సు 21ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. అంతకంటే లోపు వివాహాలు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జరిమానా, జైలు శిక్ష రెండు విధించే అవకాశం ఉంది.వివాహం జరిపిన పెళ్లి పెద్ద నుంచి పురోహితుడు, పెళ్లికి హాజరైన వారందరిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మైనర్ బాల, బాలికలు కచ్చితంగా చదువుకోవాలి. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100కు డయ ల్ చేయా లి. లేదా 9490617111 వాట్సాఫ్ నంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుంది. –మహేశ్భగవత్, రాచకొండ సీపీ -
ఆడపిల్లల మనసు అర్థం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్ : ‘బాల్యవివాహాలు చేయకండి.. ఆడపిల్లల మనసు అర్థంచేసుకోండి.. రోజూ ఏడ్చుకుంటూ వుండలేను...అందుకే వెళ్లిపోతున్నా... అందరూ నన్ను క్షమించండి...’ అంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎల్ కాలనీ గాయత్రిపురంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన నర్సయ్య, లక్ష్మి దంపతుల కూతురు గీతాంజలి (26)కి ఖడెం మండలం లక్ష్మీపురానికి చెందిన శంకర్తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. శంకర్ మహారాష్ట్రలో ప్రయివేటు లెక్చరర్గా చేస్తుంటాడు. శనివారం సాయంత్రం గీతాంజలి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గీతాంజలి రాసిన ఏడు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్న తనంలోనే వివాహం చేయటం.... అర్ధం చేసుకోలేని భర్త...చదువుకుని ఉద్యోగం చేయాలన్న కల నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ వల్ల అర్ధం అవుతుందని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ చివర తన పేరు గీతాంజలి, ఐపీఎస్ అని వ్రాసింది, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్యవివాహానికి సిద్ధమైన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
విశాఖపట్నం ,నర్సీపట్నం: ఓ బాలికకు వివాహం చేసేందుకు సన్నాహాలు చేసిన తల్లిదండ్రులకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి, వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకుని సీడీపీవో శ్రీకళ, సిబ్బందితో కలిసి గురువారం బాలిక ఇంటికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రాజా, లక్ష్మీలకు నచ్చజెప్పారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే ఏర్పడే సమస్యల గురించి వివరించారు. ఆ ప్రయత్నం విరమించుకోవాలని సూచించారు. మైనర్లకు వివాహం చేస్తే శిక్షార్హులవుతారని సీడీపీవో తెలిపారు. చదివించడం భారమైతే తాము చదివిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వివాహం జరిపించబోమని వారి నుంచి హామీ పత్రం రాయించుకున్నారు. కౌన్సెలింగ్లో గ్రామపెద్దలు శెట్టి మోహన్ తదితర్లు ఉన్నారు. -
ఆ మైనర్ యువకుడే కావాలంటూ రచ్చ.. మహిళ అరెస్ట్!
ముంబై : మైనర్ యువకుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ.. అతనితో ఉండనివ్వకపోతే చచ్చిపోతానంటూ రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇరవై రెండేళ్ల మహిళ 17ఏళ్ల మైనర్ను పెళ్లి చేసుకుంది. తనతో కలసి ఉండనివ్వాలని ఆ మైనర్ ఇంట్లో నానా హంగామా చేసింది. తనతో ఉండనివ్వకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించింది. అయితే ఈ విషయంపై ఆ మైనర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ కుమారుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆ మహిళకు ఐదు నెలల ఆడబిడ్డ కూడా ఉందని, అంతేకాకుండా ఇప్పటికే తనకు రెండుసార్లు విడాకులయ్యాయని తమ బిడ్డను ఆ మహిళ హింసిస్తోందని. మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని.. తమ బిడ్డకు, ఆ మహిళకు గత రెండేళ్ల నుంచి పరిచయం ఉందని పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పోక్సో , బాల్య వివాహాల చట్టం కింద ఆ మహిళను అరెస్ట్ చేశారు. -
బాలికకు అధికారుల కౌన్సెలింగ్
పశ్చిమగోదావరి, నరసాపురం రూరల్: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పరిధిలోని నక్కావారిపాలెంలో 16 ఏళ్ల బాలిక వివాహం చేసుకోగా ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి బాలసదనంకు తరలించారు. ఐసీడీఎస్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నక్కావారిపాలెంలో ఓ బాలిక తండ్రి చనిపోగా.. తల్లి మేక ఏసుమణి కువైట్లో ఉపాధి పొందుతోంది. అమ్మమ్మ, తాతయ్యలు మేకా ప్రభాకరరావు, మంగతాయారు వద్ద బాలిక ఉంటోంది. ఈ నేపథ్యంలో వీరి ఇంటి సమీపంలోని ఓగిరాల బాబు అనే యువకుడితో పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. సోమవారం వీరి ద్దరూ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది నరసాపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను, వారి బం ధువులను పిలిపించి ఎస్సై మూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ సీహెచ్ ఇందిర కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను ఆకివీడులో బాలసదనం హోంకు తరలించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జి.వెంకటలక్ష్మి, అంగన్వాడీ వర్కర్ ఝాన్సీలక్ష్మి సహకరించారు. -
అంగీకారంతో పెళ్లాడినా.. ఏడేళ్లు శిక్ష
చిత్తూరు అర్బన్: ‘‘మైనర్ బాలికలను వారి అంగీకారంతో పెళ్లాడినా.. కాపురం చేసినా అది చట్టరీత్యా నేరమే. దీనికి ఏడేళ్లకు మించి జైలుశిక్ష పడుతుంది. పిల్లల్ని లైంగిక దాడుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. మం చి సమాజాన్ని నిర్మించుకుని అందులో పిల్లల్ని స్వేచ్ఛగా బతకనిద్దాం..’’ అని జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి మౌలాన్ జునైద్ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ‘పిల్లలపై లైంగిక వేధిం పుల నిరోధక చట్టం (ఫోక్సో)’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ పిల్లల్ని లైంగిక వేధింపుల నుంచి కాపాడే చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. నేరాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీసుశాఖ, విద్యాశాఖ అవగాహన కల్పించాలన్నారు. చెడు ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్బాబు మాట్లాడుతూ 18 ఏళ్ల వయస్సు నిండని బాలికలను వివాహమాడి, వారితో కాపురం పెట్టినా దానికి చట్టబద్ధత ఉండదన్నారు. అమ్మాయి సమ్మతంతోనే పెళ్లి జరిగినా చెల్లదని, పైగా పెళ్లాడిన వ్యక్తిపై కిడ్నాప్, రేప్ కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. అసలు పిల్లలపై లైంగిక దాడులు అరికట్టాలంటే పాఠశాల స్థాయిలోనే ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. పోలీసు శాఖ ఇందులో బాధ్యతగా పనిచేస్తోందని.. గుడ్, బ్యాడ్ టచ్ పేరిట తోడేలు ముసుగులో ఉన్న మగాళ్ల వేషాలను వివరిస్తూ వెయ్యికి పైగా పాఠశాలల్లో పిల్లలకు వీడియోల ద్వారా అవగాహన కల్పించామన్నారు. సమాజంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు పిల్లలు ధైర్యంగా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగయ్య మాట్లాడుతూ పిల్లలో వచ్చే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం వల్ల యుక్త వయస్సులో ఆకర్షణకు లోనవుతుంటారన్నారు. ఈ ఆకర్షణ బాధ్యతవైపు నడిపించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రేరణ కల్పించాలన్నారు. అప్పుడే చెడు మార్గాలవైపు వెళ్లకుండా లక్ష్యాలను కేటా యించుకుని జీవితంలో నిలదొక్కుకుంటారన్నా రు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగశైలజ, ఏఎస్పీ సుప్రజ, మహిళా స్టేషన్ డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. -
మూడో ఏట నిశ్చితార్థం.. రూ.20 లక్షలు కట్టకుంటే..
జైపూర్ : తల్లిదండ్రుల మాట నిలబెట్టాలనే వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన రాజస్థాన్లోని జోద్పూర్ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాలు.. జోధ్పూర్కు చెందిన దివ్యా చౌదరి(22) అనే యువతికి మూడేళ్ల వయస్సు ఉన్నపుడు జీవ్రాజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు మాట ఇచ్చారు. దీంతో దివ్యానే తమ ఇంటి కోడలు అని జీవ్రాజ్ కుటుంబ సభ్యులు భావించేవారు. ఈ క్రమంలో యుక్త వయసు రాగానే వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో గత కొన్ని రోజులుగా.. జీవ్రాజ్ను త్వరగా పెళ్లి చేసుకొని, తమ ఇంటికి రావాలంటూ దివ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు ఇచ్చిన మాటకు కట్టుబడేది లేదని, తను జీవ్రాజ్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని దివ్య తేల్చి చెప్పింది. దీంతో ఈ విషయాన్ని పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు అతడి కుటుంబ సభ్యులు. దివ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంచాయతీ పెద్దలు పెళ్లికి అంగీకరించకపోతే 16 లక్షల రూపాయల జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు. అయితే వారి మాటలను ఖాతరు చేయకుండా దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెలి వేస్తాం జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు 20 లక్షల రూపాయలు కట్టకపోతే దివ్య కుటుంబాన్ని వెలి వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో దివ్య మరోసారి పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, ఉద్యోగం సంపాదించిన తర్వాతే తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటానని పోలీసులతో చెబుతున్న క్రమంలో విషం తాగింది. దీంతో దివ్యను వేధించిన జీవ్రాజ్ కుటుంబ సభ్యులు, పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ అమన్ సింగ్ తెలిపారు. దివ్య మొదటిసారి ఫిర్యాదు చేసినపుడు స్పందించకుండా నిర్లక్ష్యం చేసిన స్థానిక పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బాలికతో వివాహం..యువకుడు అరెస్ట్
బాగేపల్లి : మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడిని సోమవారం బాగేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాగేపల్లి పట్టణంలోని ఐదవ వార్డుకు చెందిన యువకుడు యాదగిరి (23)కి అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (14)తో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో కొద్ది బాలిక గర్భం దాల్చడంతో సోమవారం వైద్యపరీక్షల కోసం బాలిక భర్త, కుటుంబ సభ్యులు చిక్కబళ్లాపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలిక వయసుపై అనుమానం కలిగిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాగేపల్లి పట్టణ పోలీసులు యాదగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో యువకుడు యాదగిరితో పాటు బాల్య వివాహానికి సహకరించిన యువకుడి చిన్నాన్న, పిన్నిలైన వెంకటేశ్, మునియమ్మ, కుమారుడు మణితో పాటు మైనర్ బాలిక తల్లితండ్రులు ప్రసాద్, మంజులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. -
పెళ్లి వేడుకపై ప్రతిష్టంభన
కర్నూలు, తుగ్గలి: మండలంలోని బొందిమడుగుల గ్రామంలో శుక్రవారం జరుగనున్న పెళ్లిపై ప్రతిష్టంభన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొందిమడుగుల గ్రామానికి చెందిన దళితుడు రాజుకు తుగ్గలికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి కుమార్తెకు వయసు లేదంటూ తహసీల్దార్ రామకృష్ణకు కొందరు సమాచారమివ్వడంతో ఆయన ఐసీడీఎస్ అధికారులను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో గురువారం పెళ్లి కూతురు వయసుపై తుగ్గలి పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి విచారణ చేపట్టారు. పెళ్లి కుమార్తె ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి వయసు తక్కువగా ఉందన్నారు. కాగా పెళ్లి కూతురు హైదరాబాద్లో 10వ తరగతి పూర్తి చేసిందని, అందుకు సంబంధించి పత్రాలను వారి కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు. ఆధార్కార్డు, స్టడీకి సంబం«ధించిన పత్రాలో పెళ్లి కూతరు వయసు వ్యత్యాసం ఉండడంతో జిల్లా చైల్డ్లైన్ ఆఫీసర్ విచారణ చేసి నిర్ణయం చెబుతారని ఐసీడీఎస్ సూపర్వైజర్ తెలిపారు. అధికారులు వధువు వయసును నిర్ధారించాల్సి ఉంది. పెళ్లిపై ప్రతిష్టంభన కొనసాగడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెళ్లి వేడుక సమస్యాత్మకంగా మారుతుందని పసిగట్టిన పోలీసులు బొందిమడుగుల గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డోన్ డీఎస్పీ ఖాదర్బాషా ఆధ్వర్యంలో పత్తికొండ, బేతంచెర్ల సీఐలు భాస్కరరెడ్డి, కంబగిరి రాముడు, తుగ్గలి, జొన్నగిరి, పత్తికొండ, దేవనకొండ ఎస్ఐలు పులిశేఖర్, సతీష్కుమార్, మారుతి, శ్రీనివాసులు, గంగయ్యయాదవ్తో పాటు 50మందికి పైగా బందోబస్తు చర్యలు చేపట్టారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
మంచాల : తండాలో జరుగుతున్న బాల్యవివాహాన్ని చైల్డ్లైన్ అధికారులు మంచాల పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. మంచాల మండల పరిధిలోని ఎల్లమ్మతండాకు చెందిన కరంటోత్ రమణ ఆటోడ్రైవర్. ఇతనికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామంలో ఉండే అక్క కుమారుడు సపావట్ సురేష్కు తన కూతురును ఇచ్చి వివాహం చేయాలని రమణ నిర్ణయించాడు. పెద్ద సమక్షంలో ముహూర్తం కూడా ఖరారు చేసుకొని సోమవారం పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న చైల్డ్లైన్ కోఆర్డినేటర్ ఎస్. వెంకటేష్, మంచాల ఎస్ఐ సుధాకర్తో కలిసి తండాకు వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు రమణ, సుశీలకు బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఆడపిల్లలకు వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, అందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాం చేయమని బాలిక తల్లిదండ్రులు రాత పూర్వకంగా అంగీకార పత్రం అందించారు. -
మైనర్ బాలిక కిడ్నాప్, పెళ్లి
సాక్షి ప్రతినిధి, చెన్నై: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్ని యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా సురుంగల్పాళెంకు చెందిన బేల్దారి మేస్త్రీ కుమార్తె (17) అదే ప్రాంతంలోని ఒక ప్రయివేటు మిల్లులో పనిచేస్తోంది. ధర్మపురి జిల్లా అరూరుకు చెందిన కలైయరసన్ (20) ఇదే మిల్లులో పనిచేస్తున్నాడు. ఇరువురూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మిల్లులో ఉద్యోగం మాన్పించి ఈరోడ్ మణికూండులోని ఒక దుకాణంలో పనికి పెట్టారు. ఈనెల 10వ తేదీన కలైయరసన్ బాలికకు ఫోన్చేసి సురుంగల్పాళయం బస్స్టాండుకు పిలిపించుకున్నాడు. బాలికను మభ్యపెట్టి బస్సులో సేలంకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కుమార్తె కనపడడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు సమాచారాన్ని అన్ని మహిళా పోలీస్స్టేషన్లకు పంపారు. కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపం బిక్కిలి గ్రామంలో ఉన్నట్లు కనుగొన్న తమిళనాడు పోలీసులు గురువారం ఇద్దరిని ఈరోడ్కు తీసుకొచ్చారు. మైనర్ బాలికను కిడ్నాప్చేసి, పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడినట్లుగా కలైయరసన్పై పొక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. -
ఐఏఎస్నని..16 ఏళ్ల బాలికతో పెళ్లి
టీ.నగర్: తమిళనాడులో ఐఏఎస్ అధికారినంటూ 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసి పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నామక్కల్ జిల్లా, సేందమంగళం తూత్తికుళం గ్రామానికి చెందిన రాజు కుమారుడు గాంధీకన్నన్ (32). ఇతనికి తిరుచ్చి జిల్లా, తురైయూరు కామరాజర్నగర్కు చెందిన 16 ఏళ్ల బాలికతో గురువారం వివాహం జరిపేందుకు నిర్ణయించారు. శ్రీరంగంలోని ఒక ఆలయంలో వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వధూవరులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యమైనవారు మాత్రం గురువారం ఆలయానికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న తిరుచ్చి జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి భువనేశ్వరి ఆలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే వివాహ తంతు ముగిసి వధూవరులు అక్కడి నుంచి వెళ్లినట్లు తెలిసింది. అధికారులు వధువు తల్లిదండ్రులను విచారించారు. వారు బాలికకు 19 ఏళ్లు పూర్తయినట్లు తెలిపారు. అనుమానంతో వధువు చదివిన పాఠశాలను ఫోన్లో సంప్రదించారు. దీంతో పాఠశాల యాజమాన్యం మార్కుల పదోతరగతి మార్కల లిస్టును అధికారులకు మెయిల్లో పంపింది. అందులో వధువుకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీంతో అధికారులు శ్రీరంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు.. పోలీసులు వరుడు గాంధీకన్నన్, అతని తల్లి సరోజ, వధువు తల్లి జయంతి, బంధువు రాజకుమారిపై కేసు నమోదు చేశారు. జయంతిని పోలీసు స్టేషన్లో ఉంచి విచారణ జరుపుతున్నారు. అధికారి భువనేశ్వరి మాట్లాడుతూ వరుడు గాంధీకన్నన్ తిరువళ్లూరులో ఆర్డీఓగా ఉన్నట్లు వధువు తల్లిదండ్రులకు తెలిపాడన్నారు. వారి బంధువులకు మాత్రం చెన్నై సచివాలయంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నట్లు చెప్పాడన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. వధువుకు 19 ఏళ్లని వీఏఓ సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేస్తున్నామన్నారు. -
బాల్య వివాహంపై ఫిర్యాదు
విజయనగరం ఫోర్ట్ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అధికారులు పదేపదే చెబుతున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులో తాళి కట్టేస్తున్నారు. శుక్రవారం జరిగిన వివాహంలో ఇద్దరూ మైనర్లు కావడం విశేషం. దీంతో బాల్యవివాహా నిరోధక అధికారులు పట్టణంలోని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలికకు విశాఖపట్నం కంచరపాలెంనకు చెందిన 18 ఏళ్ల బాలుడికి కంటోన్మెంట్లోని బాపిస్టు చర్చిలో వివాహం జరిగింది. అయితే ఈ విషయాన్ని అజ్ఞాత వ్యక్తి ఒకరు చైల్డ్లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని చైల్డ్లైన్ సభ్యులు బాల్యవివాహా నిరోధక అధికారులకు తెలియజేశారు. వెంటనే బాల్య నిరోధక అధికారులు, పోలీసులు, బాలల సంక్షేమ కమిటీ, చైల్డ్లైన్, డీసీపీయూ సభ్యులు వివాహం జరిగిన చర్చి వద్దకు వెళ్లారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వారిని చైల్డ్లైన్ కార్యాలయానికి తీసుకుని వచ్చి బాలల సంక్షేమకమిటీ ముందు ప్రవేశ పెట్టారు. బాల్య వివాహ నిరోధక అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్, సభ్యులు పట్నాయక్, వరలక్ష్మి, సుధ, చిట్టియ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధిక, చైల్డ్లైన్ కో ఆర్డినేటర్ రంజిత, యాళ్ల నాగరాజు, పాల్గొన్నారు. -
ప్రియుడికి కుమార్తెనిచ్చి వివాహం
సాక్షి, చెన్నై(టీ.నగర్): ప్రియుడికి కుమార్తెనిచ్చి వివాహం జరిపించిన తల్లి సహా నలుగురిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తమిళనాడులోని తేని సమీపం ఉత్తమపాళయం చిన్న ఓబులాపురం వినాయక ఆలయం వీధికి చెందిన మహిళ (38)కు అదే ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ (22)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను విడిచి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రియుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించినట్టయితే తమ సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని లత భావించింది. దీంతో తన 13 ఏళ్ల కుమార్తెను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపేందుకు నిర్ణయించి, ఈనెల 20వ తేదీన రాజ్కుమార్తో బాలిక వివాహం జరిపించింది. దీనిపై బాలిక తండ్రి రాయప్పన్పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజ్కుమార్, మహిళ సహా నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
బాలికకు వివాహం చేసే ప్రయత్నం
చిల్లకూరు: పదో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లిదండ్రులు వివాహం చేసే ప్రయత్నం చేయగా సదరు బాలిక విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మనగారిపాళెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ కుమార్తెను గూడూరు రూరల్ పరిధిలోని చెంబడిపాళెంకి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బాలికకు వివాహం ఇష్టం లేకపోవడంతో స్థానికంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తను కలుసుకుని సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం సూపర్వైజర్ క్రిష్ణమ్మ సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడింది. తర్వాత వారిని ఎస్సై శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. -
నా బిడ్డకు బాల్య వివాహం చేశారు
వెల్దుర్తి: ‘నా కూతురుకు 14 సంవత్సరాలు. నాకు చెప్పకుండా నా భార్య బాల్య వివాహం చేసింది’ అంటూ కలుగోట్ల గ్రామానికి చెందిన ఓ తండ్రి వెల్దుర్తి పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన మండలంలో వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా భార్య బేతంచెర్ల మండలం పెద్దకొలుముల పల్లె గ్రామ యువకునితో తన కూతురుకు బాల్య వివాహం జరిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజుల క్రితం పుల్లగుమ్మి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో వివాహం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్పందించిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరస్వతమ్మ, ఎస్ఐ–2 నగేశ్ గురువారం గ్రామాన్ని సందర్శించి బాలికతోపాటు తల్లి, పెళ్లి చేసుకున్న యువకుడిని, దళిత సంఘాల నాయకులను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. అనంతరం బాలికను ఆరోగ్య కార్యకర్తల ద్వారా కర్నూలు ఐసీడీఎస్ కేంద్రానికి తరలించినట్లు సరస్వతమ్మ తెలిపారు. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
అతడికి పదహారు.. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబాలను ఒప్పించారు. పెద్దల సమక్షంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక సమస్యేమీ లేదనుకున్న సమయంలో కథ అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి ఫొటోలు వాట్సాప్లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాల్య వివాహమంటూ వధూవరులను వేరు చేసి ఎవరిళ్లకు వారిని పంపించేశారు. కర్నూలు : కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో కలిశారు. వారికి ఎవరిలో ఏ అంశం నచ్చిందో ఏమో తెలియదు కానీ వయస్సును పక్కనబెట్టి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అబ్బాయి కంటే అమ్మాయి వయస్సు దాదాపు 12 ఏళ్లు ఎక్కువ. కొన్నా ళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో గత నెల 27న వరుడి స్వగృహంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పత్రి కల్లోనూ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి వారి కోసం ఆరా తీశారు. వారు ఊళ్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక సోమవారం వధూవరులను, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, జేసీ–2 రామస్వామి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరేళ్ల వరకు ఎవరింటి వద్ద వారు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా జరిగే రెవెన్యూ కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్ అధికారి శారద, ఐసీడీఎస్ ఏపీడీ విజయ హాజరయ్యారు. -
బాల్య వివాహాన్ని ఆపలేక పోయిన అధికారులు
లీగల్ (కడప అర్బన్): చాపాడు మండలం పెద్ద గురువలూరుకు చెందిన కుచ్చుపాప లింగమ్మ, వీరయ్యల కుమారుడు వీరమోహన్ అల్లాడుపల్లెలోని శ్రీ వీరభద్ర దేవస్థానంలో 18 సంవత్సరాలు నిండని బాలికను వివాహం చేసుకున్నాడు. బాలల ఉచిత సహాయం నెంబర్–1098కు అక్కడ వివాహం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపారు. కానీ బాల్య వివాహ నిరోధక అధికారులు ఆ వివాహాన్ని సకాలంలో అడ్డుకోలేకపోయారు. బాల్య వివాహాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు కూడా అధికారులు తీసుకోకపోవడంతో గర్ల్ అడ్వకసీ అలయన్స్ నెట్ వర్క్ సభ్యుడు, ఆల్షిఫా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ రఫి లోక్ అదాలత్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, జడ్జి యుయు ప్రసాద్ పిఎల్సి(ప్రీ లిటిగేషన్ కేసు) నెం. 631/2018గా నమోదు చేశారు. అధికారులకు నోటీసులు జారీ ఈ సంఘటనకు బాధ్యులైన ఐసీడీఎస్ పీడీ జమ్మలమడుగు ఆర్డీఓ, ప్రొద్దుటూరు డీఎస్పీ, చాపాడు తహసీల్దార్, అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం ఈఓ, బాలిక తండ్రి, పెండ్లికుమారుడు, అతని తండ్రికి జడ్జి యుయు ప్రసాద్ నోటీసులను జారీ చేశారు. ఈనెల 15న జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్లో హాజరు కావాలని ఆయన ఆదేశించారు. -
ఆ బాల్య వివాహంపై విచారణ
కర్నూలు, కౌతాళం రూరల్: మండల పరిధిలోని ఉప్పరహల్ గ్రామంలో గత నెల 27న బాలుడికి, మేజర్ యువతికి జరిగిన బాల్యవివాహంపై శుక్రవారం జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. జేసీ–2 రామస్వామి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ఏపీడీ విజయ, డీసీపీఓ శారద, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ తిమ్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, ఆర్ఐ భీమేష్ గ్రామానికి చేరుకుని విచారించారు. సదరు కుటుంబం గ్రామంలో లేకపోవడంతో స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. వివాహం గుట్టుచప్పుడు కాకుండా జరిపించారని, వారు త్వరలో గ్రామానికి వస్తే అధికారుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చేలా చూస్తామని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏకాంబరెడ్డి అధికారులకు చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతూ బాల్యవివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి వాటి గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారి కల్యాణోత్సవం
సాక్షి, రాయదుర్గం టౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన ప్రసిద్ధ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దాదాపు 50 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా స్వామికి ఎనిమిదేళ్ల బాలికతో వివాహం జరిపించారు. ఇలా చేయడం వల్ల ఆ బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడనేది భక్తుల నమ్మకం. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఏడాది రాయదుర్గానికి చెందిన అరవా ప్రకాష్, యశోద దంపతుల కుమార్తె రేఖతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరపున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (రేఖ) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మంత్రోచ్ఛారణల మధ్య పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
బాల్య వివాహం అడ్డగింత
శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పెదపాడు పరిధిలోని గాంధీనగర్కు చెందిన 13 ఏళ్ల బాలికకు పెదపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడితో శుక్రవారం జరగాల్సిన వివాహం వాయిదా పడింది. ఈ మేరకు పెళ్లికొడుకుతో పాటు వారి తల్లిదండ్రులను రూరల్ పోలీస్టేషన్కు చైల్డ్చైన్, అంగన్వాడీ సిబ్బంది తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. నిర్ణీత వయసు వచ్చే వరకు వివాహం చేయబోమని ఇరువర్గాల నుంచి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. -
బాల్య వివాహం చేస్తున్నారు.. న్యాయం చేయండి
వడమాలపేట: తల్లిదండ్రులు గుండెలపై భారాన్ని దించుకోవాలనే తపనతో అభం శుభం తెలియని పసిమొగ్గను వదిలించుకునే ప్రయత్నం చేశారు. తిరగబడిన ఆ బాలిక తనకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. బాధితురాలి కథనం మేరకు.. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తిమ్మాపురం గ్రామానికి చెందిన బాలికను ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన దాము (34)కు ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తనకు వివాహం ఇష్టం లేదని, చదువుకుంటానని బాలిక మొరపెట్టుకున్నా తల్లిదండ్రులు ఖాతరు చేయలేదు. తమ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తల్లిదండ్రులు బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి బాలిక ఒప్పుకుంది. వివాహాన్ని తప్పుపట్టిన బంధువులు శుక్రవారం ఏర్పేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది పుత్తూరు పోలీస్స్టేషన్ పరధిలో కావడంతో కేసును పుత్తూరుకు బదిలీ చేశారు. ఈ విషయమై పుత్తూరు ఎస్ఐ హనుమంతప్పను వివరణ కోరగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. -
బాల్య వివాహం నేరం
పెనుగొండ: ములపర్రు శివారు పితానివారిపాలెంలో శుక్రవారం జరగా ల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు నిలుపుదల చేసారు. గుర్తుతెలియని వ్యక్తులు 1100 సమాచారం అందించడంతో ములపర్రులో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్.వెంకటేశ్వరి విచారణ చేపట్టారు. పితానివారిపాలెంకు చెందిన శీలం వరలక్ష్మి అనే బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఆమెకు వివాహ వయసు రాలేదని గుర్తించిన అధికారులు బాలిక తల్లిదండ్రులు నాగేశ్వరరావు, దుర్గకు అవగాహన కల్పించారు. బాల్య వివాహం చేయడం వలన కలిగే అనర్థాలు, చట్ట నిబంధనలు వివరించారు. వివాహం జరిపిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. సొంగా రాజు, అంగన్వాడీ వర్కర్ కె.దుర్గ పాల్గొన్నారు. -
బాల్యవివాహాలను అడ్డుకున్న అధికారులు
జడ్చర్ల: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెబ్బేరు మండలం కంబాలపురం గ్రామానికి చెందిన ఓ బాలిక(17)కు బాదేపల్లిలో నివాసం ఉంటున్న ఖిల్లాఘనపురం గంగాధర్(24)తో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ మేరకు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగబోతుండగా ఆకస్మికంగా పోలీసులు వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లి కూతురు వయస్సు మైనార్టీ తీరలేదని, నిర్ణీత వయస్సుకు తక్కువగా ఉన్నా పెళ్లి చేస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు సీఐ బాలరాజుయాదవ్ ఆలయానికి చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం పెళ్లి కూతురును పోలీస్స్టేషన్కు తరలించారు. బాలిక ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసిందని, స్కూల్ సర్టిఫికెట్ ఆధారంగా పెళ్లిని రద్దు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించడంతో వారు మహబూబ్నగర్ తీసుకెళ్లారు. దోనూరులో.. మిడ్జిల్ (జడ్చర్ల): మండలంలోని దోనూరులో గురువారం తహసీల్దార్ పాండునాయక్, పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలిక(16)ను హైదరాబాద్లోని ఉలాల్గడ్డకు చెందిన యువకుడితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు వచ్చి తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలిపివేయించారు. -
బాల్యవివాహ ప్రయత్నానికి బ్రేక్
కవిటి: మండలంలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం కళింగపట్నంలో మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నాన్ని ఇచ్ఛాపురం ప్రాంతీయ గెస్ట్ చైల్డ్లైన్ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ... కళింగపట్నంలో 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయికి వివాహం చేయాలని ఇంటి పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు 1098కు అందిన సమాచారం మేరకు చైల్డ్లైన్ ప్రతినిధి ప్రసాద్బిసాయి అక్కడకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టి అమ్మాయి వయస్సును నిర్ధారించుకున్నారు. అనంతరం వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ శాఖలకు సంబంధించిన అధికారులతో బాల్య వివాహానికి సిద్ధమవుతున్న వారి ఇంటికి వెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి వివాహాలను ప్రోత్సహిస్తే బాల్య వివాహాల నిరోధక చట్టానికి లోబడి ఇరువర్గాల కుటుంబాలకు కఠిన శిక్షలు పడతాయని వివరించారు.దీంతో ఇరువర్గాల వారు తమ ప్రయత్నాన్ని విరమించుకొంటున్నామని లిఖిత పూర్వకంగా అంగీకరించారు. కార్యక్రమంలో వీఆర్ఓ కూర్మనాయకులు, పంచాయతీ కార్యదర్శి విజయకుమార్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సీహెచ్ నాగలక్ష్మీ, పోలీసులు పాల్గొన్నారు. -
బాల్య వివాహం చేస్తే జైలుకే..
పెదపాడు: బాల్య వివాహం నేరమని.. అలా చేసిన తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని రాష్ట్ర మహిళా విభాగం చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని ఆర్టీసీ కాలనీలో ఓ బాలికకు వివాహం చేస్తున్నారని తెలియడంతో బుధవారం నన్నపనేని రాజకుమారి పిల్లల కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు తల్లిదండ్రులు లేరని తాము పెంచుకుంటున్నామని పెద్దమ్మ, పెద్దనాన్న ప్రతాప వైదేహీ, లక్ష్మీనారాయణ ఆమెకు చెప్పారు. బాలికకు వివాహం చేయలేదని తమ కుటుంబంలో ముందుగా నిశ్చయించుకుని మైనార్టీ తీరిన తర్వాత వివాహం చేస్తామని లక్ష్మీనారాయణ దంపతులు సమాధానమిచ్చారు. ఈరోజుల్లో అలాంటివి ఎక్కడా చేయడం లేదని, 18 ఏళ్లు నిండేవరకు వివాహం చేయరాదని నన్నపనేని వారిని హెచ్చరించారు. బాలికను చదివించలేని పక్షంలో తాము ప్రభుత్వ హస్టల్స్ లేదా మహిళా హాస్టల్లో ఉంచి చదివిస్తామని చెప్పారు. బాలిక అభిప్రాయం కోరగా పెదనాన్న వద్ద ఉంటానని, పాఠశాలకు వెళ్తానని సమాధానమిచ్చింది. బాలుడు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు మైనార్టీ తీరందని చెప్పి తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాలిక కుటుంబం పురోభివృద్ధికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సాయమందేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని రాజకుమారి హామీఇచ్చారు. ఇరువర్గాలనుంచి మైనార్టీ తీరేవరకూ వివాహం చేయమంటూ రాతపూర్వక హామీని తీసుకోవాలని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసరావును ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, సెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, సీడీపీఓ గిరిజ పాల్గొన్నారు. -
బాలిక వివాహంపై సీడబ్ల్యూసీ విచారణ
ఏలూరు టౌన్ :ఏలూరులో బాలిక వివాహంపై బాలల సంక్షేమ సమితి బెంచ్ అగ్రహం వ్యక్తం చేసింది. శనివారపుపేటలోని బాలుర వసతిగృహంలో ఆదివారం సాయంత్రం బాలిక బంధువులు, పోలీసులను బెంచ్ విచారించింది. తమ సంప్రదాయం మేరకు బాలికకు వివాహం చేయాలని నిశ్చయించామని, జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని మాత్రమే చేశామని, బాలిక మేజర్ అయిన తరువాత వరుని ఇంటికి పంపుతామని, తప్పును మన్నించి తమకు అవకాశం ఇవ్వాలని బాలిక బంధువులు వివరణ ఇచ్చారు. బాలిక వివాహంపై సమాచారం వచ్చినా స్పందికపోవటంతోపాటు, బాలిక మేజర్ అంటూ పోలీస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన డీసీపీవో యూనిట్కు బెంచ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. బాలిక తన పెదనాన్న ఇంటివద్ద ఉండి చదువుకుంటానని చెప్పటంతో బెంచ్ అంగీకరిస్తూ, బాలిక విషయాన్ని పర్యవేక్షించాలని డీసీపీవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ మరీదు మాధవీలత, సభ్యులు ఐకరాజు, వాసే ఆనందకుమార్, ఎస్ఎస్ రాజు, శివకృష్ణ విచారణ చేశారు. చైర్పర్సన్ మాధవీలత మాట్లాడుతూ బాలల హక్కులను హరించేవిధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని తెలిపారు. సంప్రదాయాల ముసుగులో బాలల హక్కులను కాలరాస్తే క్షమించేదిలేదన్నారు. డీసీపీవో సూర్యచక్రవేణికి సమాచారం వచ్చినా స్పందించలేదని, పోలీస్ అధికారులకు కూడా మేజర్ అంటూ చెప్పటం సరికాదన్నారు. ఈ విషయంపై డీసీపీవో యూనిట్కు నోటీసులు జారీ చేస్తామన్నారు. -
వరంగల్ జిల్లాలో బాల్య వివాహం కలకలం
-
‘స్వేచ్ఛా ప్రతిమ’...
అమెరికా నిర్వచనం చెప్పమంటే స్వేచ్ఛ ‘ప్రతిమ’ రూపంలో ఉన్న ఒక దేశం అన్నారట ఎవరో. షెర్రీ జాన్సన్ వంటి వారి గాథలు వింటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. నాగరికతకు మారుపేరుగా నిలిచిన అగ్రదేశంలో బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తల్లిదండ్రులు, జడ్జి సమ్మతి ఉంటే చాలు అక్కడి చట్టాల ప్రకారం మైనర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇలాంటి చట్టాల వల్ల కొంతమంది అమ్మాయిలు తాము కలలోనైనా ఊహించలేని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ కోవకు చెందిన వారే షెర్రీ జాన్సన్. ఎనిమిదేళ్ల ప్రాయం మొదలు పలుమార్లు అత్యాచారానికి గురై, తల్లిగా మారి, పదకొండేళ్ల వయస్సులో అత్యాచారం చేసినవాడినే పెళ్లిచేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. తల్లి కోసం కన్నీళ్లను దిగమింగారు. కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఇక అలా ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని, బాల్య వివాహాలను నిషేధించాలని పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఆమెకు ఎంతో మంది తోడ్పాటునందిస్తున్నారు. వారిలో దక్షిణ ఫ్లోరిడా సెనేటర్లు లారెన్ బుక్, లిజ్బెత్ బెనాక్విస్తో(సెనేట్లో బాల్య వివాహాలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు) ముందున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మీ టూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, లైంగిక హింసకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక్కడ విశేషమేమిటంటే వారు కూడా షెర్రీ మాదిరిగానే బాల్యాన్ని కోల్పోయి, వేధింపులకు గురైనవారే. ఆమె బాల్యం... అంతులేని విషాదం షెర్రీ కథ వింటే కళ్లు చెమర్చకమానవు. ఫ్లోరిడాలోని టంపా సిటీలో తల్లితో పాటు చర్చ్ ఆవరణలోని గదిలో నివసించేది. వారిద్దరూ వారానికి ఆరు రోజులపాటు చర్చిలో సేవ చేసేవారు. చర్చి పెద్దలు చెప్పినట్లుగా నడుచుకువాలనే ఎన్నో నిబంధనల నడుమ ఆమె బాల్యం మొదలైంది. బాల్యానికి సంబంధించి తల్లి చేసే బిస్కెట్లు తింటూ, కలర్ పెన్సిళ్లతో డ్రాయింగ్ చేయడం వంటి అతికొన్ని ఙ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలాయి. మిగతాదంతా అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పసిప్రాయంలో ఆమె గోడు వినేవారే కరువయ్యారు. వల వేసి.. వంచించి భోజనం చేయాలంటే చర్చ్ బిషప్ ఇంటిలో నివసించే తన ఆంటీ ఇంటికి ప్రతిరోజూ వెళ్లాల్సిందే. ఈ క్రమంలో షెర్రీపై కన్నేసిన బిషప్ ఆమె ఆంటీ లేని సమయం చూసి అత్యాచారం చేసాడు. అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లు. అసలు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం చేసుకోలేని పసిప్రాయం. క్రూర మృగాళ్లు.. బిషప్తో పాటు, అతని సహాయకుడు కూడా షెర్రీని బలాత్కారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాలని షెర్రీ ఎన్నోసార్లు ప్రయత్నించినా అరణ్యరోదనగానే మిగిలింది. తన మాటలు తల్లి పట్టించుకోకపోవడంతో ఎదిగే క్రమంలో అత్యాచారానికి గురౌవడం కూడా ఒక భాగమనే నిర్ణయానికి వచ్చింది పాలబుగ్గల షెర్రీ. తోటి విద్యార్థులంతా నీ దగ్గర చేపల వాసన వస్తుందంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి ఏడ్వడం కూడా ఆమెకు అలవాటయింది. బడిలో బయటపడిన నిజం.. విద్యార్థుల సాధారణ చెకప్లో భాగంగా షెర్రీని కూడా పరీక్షించి బయటకు వెళ్లమని చెప్పింది నర్స్. కాసేపటి తర్వాత వస్తువులన్నీ తీసుకుని బయటకు రావాల్సిందిగా షెర్రీని ఆదేశించింది స్కూలు యాజమాన్యం. ఆమె తల్లికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు. కూతురు ఏం తప్పు చేసిందోనని కంగారుగా స్కూలుకు చేరిన తల్లికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమయింది. పదేళ్ల షెర్రీ ఏడు నెలల గర్భవతి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది, కూతురిని నిందించింది. పేగు బంధం.. కనుమరుగైన వేళ కూతురు గర్భానికి కారణం బిషప్ అనుచరుడని చర్చిలో ఉన్నవారందరికీ తెలిసేలా చేసి, ప్రసవం కోసం మరో మృగాడు బిషప్తో షెర్రీని దూరంగా పంపివేసింది ఆమె తల్లి. అమ్మతనానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. బాల్యానికి సంకెళ్లు.. ఆదరించి, ఆలనాపాలనా చూసుకునే తల్లి పక్కనలేక, శరీరంలో వస్తున్న మార్పులకు కారణం చెప్పేవారు లేక హాస్పిటల్ బెడ్పై నరకయాతన అనుభవించింది షెర్రీ. 1970లో పదేళ్ల పసిప్రాయంలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వడంతో చదువుకోవాలనే ఆమె ఆశకు సంకెళ్లు పడ్డాయి. అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. కూతురుకి ఈ గతి పట్టించిన మగాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన షెర్రీ తల్లి, ఆమె బాల్యాన్ని వివాహమనే బందీఖానాలో పడేసేందుకు ప్రయత్నాలు చేసింది. అత్యాచారం చేసిన వాడినే పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టింది. కోర్టు ఇందుకు నిరాకరించినా చట్టాన్ని అడ్డు పెట్టుకుని కూతురి బాల్యాన్ని, బతుకుని చిదిమేసింది. అలా పదకొండేళ్ల ప్రాయంలో 20 ఏళ్ల వ్యక్తికి భార్యగా మారింది షెర్రీ. ఆనాడు కోర్టులో తల్లికి, జడ్జికి జరిగిన సంభాషణ ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుందని 58 ఏళ్ల షెర్రీ చెప్తుందంటే ఆమె ఎంత క్షోభ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగలేదు.. కూతురి పెంపకంలో షెర్రీకి, ఆమె తల్లి సాయం చేస్తుండటం వల్ల మళ్లీ స్కూలుకు వెళ్లే అవకాశం దక్కింది. కానీ ఆమె భర్త నుంచి విముక్తి మాత్రం లభించలేదు. ఒకరి తర్వాత ఒకరికి జన్మనివ్వడమే షెర్రీ నిరంతర కర్తవ్యంగా మారింది. ఏ ప్రేమకు నోచుకోలేదు.. పదేళ్ల ప్రాయం నుంచే పిల్లల డైపర్లు వాష్ చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ గొడ్డు చాకిరీ చేసేది. తన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూంటే తాను వారితో ఆడుకుంటూ కోల్పోయిన బాల్యాన్ని వెదుక్కునేది. భర్తకు మాత్రం ఆమె శరీరంతో తప్ప, మనసుతో సంబంధం ఉండేది కాదు. ప్రేమగా మాట్లాడేవాడు కూడా కాదు. కేవలం తన కోరికల్ని తీర్చే సాధనంగా భావించి చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఆ విధంగా 17 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది షెర్రీ. అతనితో విసిగిపోయిన షెర్రీ విడాకులకు దరఖాస్తు చేసి 19 ఏళ్ల వయసులో ఆ నరకం నుంచి బయటపడింది. రెండో‘సారీ’... మోడువారిన జీవితం చిగురిస్తుందనే ఆశతో.. విడాకులు తీసుకున్న తర్వాత 37 ఏళ్ల వయసున్న మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె ఆశ ఆవిరైంది. అతను కూడా మొదటి భర్త మాదిరిగానే శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పిల్లల కోసం అదంతా మౌనంగా భరించింది. 27 ఏళ్ల వయసుకే ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల బాధ్యత ఆమెకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మౌనం వీడి.. పోరాటానికి సిద్ధపడి తనకు అన్యాయం జరగటానికి ఒక విధంగా తన మౌనమే కారణమని భావించిన షెర్రీ.. ఇకనైనా పోరాట పంథా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. గత ఐదేళ్లుగా అందుకోసం శ్రమిస్తూనే ఉంది. ఆమె ప్రయత్నాలు ఫలించినట్లయితే ఎంతో మంది చిన్నారులు వివాహమనే చెర నుంచి విముక్తులవుతారు. ఫ్లోరిడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మైనర్ వివాహాలను అరికట్టేందుకు చట్టం చేసే మొదటి రాష్ట్రంగా నిలవబోతోంది. ఆత్మకథతో ప్రయాణం... బిల్లు ఆమోదం పొందినట్లయితే తన ఆత్మకథ..‘ఫర్గివింగ్ ద అన్ఫర్గివబుల్ ’ను నాటక రూపంలో ప్రదర్శించాలనే యోచనలో ఉన్నారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్ టూర్ ప్లాన్ చేసి, బడ్జెట్ను కూడా నిర్ణయించేశారు. ఇందుకోసం తన స్నేహితురాలు లారెన్ బుక్ సహాయం తీసుకుంటున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
చిన్న పిల్లను... నా పెళ్లి ఆపండి ప్లీజ్..
అజిత్సింగ్నగర్(విజయవాడ సెంట్రల్): ‘సార్.. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను.. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఓ బాలిక 100కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన బాలిక సత్యనారాయణపురంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. అకస్మాత్తుగా ఇంట్లోవారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పసుపు కుంకుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆ బాలిక ఈ తంతు గురించి 100కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన నున్న రూరల్ పోలీసులు మహిళా మిత్ర సభ్యుల సహాయంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేసి తల్లిదండ్రులు, బాలికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురును చక్కగా చదివిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో బాలికను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
మూఢనమ్మకాలు విడనాడాలి
ధరూరు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూఢ నమ్మకాలను విడనాడి ముందుకు సాగాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రుక్మిణి అన్నారు. ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు మండలంలోని బురెడ్డిపల్లిలో ఆమె విద్యార్థులతో కలిసి ఇంటింటికీ తిరిగి మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. బాలికా చదువులపై ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు. బాలికలను బడికి పంపించి అక్షరాస్యతను పెంపొందించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 250 కుటుంబాల్లో సర్వే నిర్వహించి అన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. సర్పంచ్ బెనకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి గద్వాల రూరల్: గ్రామంలో ప్రతిఒక్కరూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ప్రోగ్రాం అధికారి సుందరమూర్తి అన్నారు. ఆదివారం మండలంలోని రేకులపల్లిలో ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం, ప్రధాన వీధుల్లో ముళ్లపొదలు తొలగించి చెత్తాచెదారాన్ని తొలగించారు. సర్పంచ్ సుజాత, అధ్యాపకులు కృష్ణయ్య, భాస్కర్, వలంటీర్లు పాల్గొన్నారు. -
పెళ్లి నుంచి తప్పించుకొని.. జాతీయ జట్టుకు ఆడుతూ
సాక్షి, హైదరాబాద్ : బాల్యవివాహం నుంచి తప్పించుకున్న హైదరాబాద్కు యువ క్రీడాకారిణి నేడు జాతీయ రగ్బీ జట్టుకు ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే గత ఏడాది హైదరాబాద్కు చెందిన బి అనూష అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న సమయంలో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహం ఇష్టం లేని అనూష చైల్డ్లైన్ అధికారులను ఆశ్రయించింది. పెళ్లికి పదిరోజుల ముందు చైల్డ్లైన్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో అనూష వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమౌతుందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం నుంచి బయటపడిన అనూష ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతే కాకుండా మహిళల రగ్బీఆటలో ప్రతిభ చూపింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం తన లక్ష్యం అని అనూష తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ తరపున ఆడింది. -
మా కూతురు ఉందో, లేదో ..
పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : ఒక పేద కుటుంబాన్ని గత 10 రోజులుగా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైనమిది. జనవరి 23వ తేదీన తాడేపల్లిగూడెంలోని 16వ వార్డు జువ్వలపాలెంలో దాసరి నాగభూషణం, రామలక్ష్మి దంపతులు తమ కుమార్తెకు సమీప బంధువుతో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెండ్లికుమార్తెకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో బాల్యవివాహం చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖకు సమాచారం అందింది. దీంతో సదరు శాఖ సూపర్వైజర్ పెళ్లి చేసే కుటుంబం వద్దకు వెళ్లి విచారించి పెళ్లిని నిలుపుదల చేయించారు. పెళ్లి చేసేందుకు బాలికకు ఇంకా 6 నెలలు రావాల్సి ఉందనీ, అప్పుడు 18 సంవత్సరాలు నిండుతాయని తేల్చారు. దీంతో సదరు కుటుంబం పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకుంది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాతే సీన్ మారిపోయింది. పోలీస్స్టేషన్కు పంచాయితీ ఈ పెళ్లి విషయం ఇంతలో రెవెన్యూ శాఖకు, పోలీసులకు తెలిసింది. దాంతో పెళ్లి పెద్దలతోపాటుగా, బాలికను, పెళ్లి కుమారుణ్ని, వారి తల్లితండ్రులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పారు. కాని అలా జరగలేదు. 24వ తేదీన ఇదే పంచాయితీ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి చేరింది. బాలికను, కుటుంబం మొత్తాన్ని తీసుకుని సదరుశాఖ సూపర్వైజర్ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారని ఆశించారు. ఇరు కుటుంబాలతో రాతపూర్వకంగా పెళ్లి చేయబోమని కాగితాలు తీసుకున్నారు. అనంతరం సదరు సూపర్వైజర్ను, కుటుంబ సభ్యులను తిప్పి పంపేసి కేవలం బాలికను మాత్రం ఐసీడీఎస్ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు. అప్పటి నుంచికాళ్లరిగేలా తిరుగుతున్నారు కేవలం తమ కుమార్తెను మాత్రమే అదుపులో ఉంచుకుని కౌన్సెలింగ్ ఇస్తాం, మరో 24 గంటల్లో రావాలని చెప్పినప్పటి నుంచి కాళ్లరిగేలా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారుల చుట్టూ సదరు కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో, ఎలా ఉందో కూడా ఆ తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వడం లేదు. ఎప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారో, తమ కుమార్తెను ఎప్పుడు తమతో పంపిస్తారో అని గత 10 రోజులుగా ఆ పేద కుటుంబం తాడేపల్లిగూడెం నుంచి ఏలూరుకు ప్రతి రోజూ ఉదయం చేరుకుని కార్యాలయం వద్దే సాయంత్రం వరకు పడిగాపులు పడుతోంది. అధికారులు సమాధానం చెప్పకపోవడంతో తిరిగి రాత్రికి ఇంటికి వెళుతున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న రోజే తమ కూతురు చచ్చిపోతానని బాధపడిందనీ, ఈ నేపథ్యంలో తమ కూతురికి ఏమైందోనని తల్లి కన్నీటిపర్యంత మవుతోంది. కాళ్లుపట్టుకున్నా డీసీపీఓ కరుణించలేదనీ, కనీసం సమా«ధానం కూడా చెప్పడం లేదని తండ్రి బోరున విలపిస్తున్నాడు. మా కూతురు ఉందో, లేదో తెలీడం లేదు మా కూతురు ఉందో లేదో తెలీడం లేదు. కౌన్సెలింగ్ ఇస్తున్నాం అంటున్నారు. వచ్చాక సరైన సమాధానం చెప్పడం లేదు. ఎవర్ని కలవాలో కూడా తెలీడం లేదు. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఛైర్మన్, వార్డు కౌన్సిలర్ కూడా చెప్పారు. అయినా అధికారులు కనికరించడం లేదు. డీసీపీఓ కాళ్లు పట్టుకుని బతిమలాడినా చలించలేదు. తమ కూతురు అసలు ఉందా? లేక అనారోగ్యం పాలైందా? ఉంటే ఎక్కడ ఉందో చెప్పాలి. ఎలా ఉందో చూపించాలి. – దాసరి నాగభూషణం, రామలక్ష్మి, బాలిక తల్లిదండ్రులు నమ్మకం కలిగాక పంపిస్తాం బాలిక మా సదన్లోనే ఉంది. కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మాకు ఎప్పుడు నమ్మకం కలిగితే అప్పుడు పంపిస్తాం. తల్లిదండ్రులకు తెలీదు అనడంలో వాస్తవం లేదు. బాలిక ఆరోగ్యంగానే ఉంది. ఇంకా రెండు, మూడు రోజులు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లేనిపోని అపవాదులు మాపై వేయవద్దు. బాలికలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనే మేం ప్రయత్నిస్తున్నాం. – సీహెచ్ సూర్య చక్రవేణి, డీసీపీఓ మా పరిధిలోది కాదు బాల్యవివాహాన్ని అడ్డుకోవడం వరకే మా పరిధి. తరువాత జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోకి వెళ్లిపోతుంది. బాలికను వారి ఆధీనంలోనే ఉంచుకుంటారు. వారే బాలిక విడుదలకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. – ఎస్.విద్యావతి, ఐసీడీఎస్, ప్రాజెక్టు డైరెక్టర్ -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్ లైన్ సిబ్బంది
దౌల్తాబాద్: మండలంలోని గుండేపల్లి గ్రామంలో శనివారం బాల్యవివాహాన్ని చైల్డ్ లైన్ సిబ్బంది అడ్డుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... గుండేపల్లి గ్రామానికి చెందిన కోటకొండ నర్సప్ప (32) దామరగిద్ద మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయితో శనివారం కర్నాటక రాష్ట్రం మోతక్పల్లి బలభీమసేన దేవాలయం దగ్గర వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని నిలిపివేశారు. అనంతరం దౌల్తాబాద్ పోలీస్స్టేషన్కు వారిని పిలిపించి ఎస్సై చంద్రశేఖర్ సమక్షంలో హమీ పత్రం రాసుకున్నారు. కార్యక్రమంలో చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ హన్మంత్రెడ్డి, ప్రసాద్ ఉన్నారు. బాల్యవివాహాలు జరిపితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. -
పెళ్లి వద్దు.. చదువుకుంటా!
సాక్షి, చిన్నశంకరంపేట: తాను ఇంకా చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి వద్దంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన హలావత్ బాబు, మరోనిల కూతురు సాంకీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేద్దామని తండ్రి బాబు తరచూ ఇంట్లో చర్చిస్తున్నాడు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, ఇంకా చదువుకుంటానని బాలిక తండ్రికి చెబుతున్నప్పటికీ వినకపోగా, బెదిరించడం, కొట్టడం మొదలుపెట్టారు. దీంతో మైనర్ను అయినప్పటికీ పెళ్లి చేస్తానని తన తండ్రి వేధిస్తున్నాడని సాంకీ చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాశ్గౌడ్కు ఫిర్యాదు చేసింది. ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్లతో కలసి ఆయన బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి చదువుకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని, అవసరమైతే బాలసదనంలో ఉంచి చదివిస్తామని ఎస్ఐ వివరించారు. -
ఆపద్బంధు@112
సైదాబాద్కు చెందిన 16 ఏళ్ల కీర్తన టెన్త్ చదువుతోంది. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుండటంతో తల్లి ఫోన్ నుంచి 112కు డయల్ చేసింది. ఫోన్ చేసిన మూడు నిమిషాల్లోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. మైనర్కు పెళ్లి చేయడం నేరమంటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో బాల్యవివాహం బారి నుంచి కీర్తన గట్టెక్కింది. కరీంనగర్ పోలీసు కమిషనరేట్లోని సప్తగిరి కాలనీ.. రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆఫీస్ నుంచి కాస్త లేటుగా ఇంటికి వస్తున్న కావ్యను దారిలో మందుబాబులు ఏడిపించ సాగారు. దీంతో కావ్య 112కు కాల్ చేసింది. తాగుబోతుల వెక్కిరింతలను పసిగట్టిన 112 సిబ్బంది.. కాలర్ లొకేషన్ గుర్తించి పెట్రోలింగ్ను అప్రమత్తం చేశారు. 7 నిమిషాల్లో కావ్య ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకొని ఆకతాయిలను స్టేషన్కు తరలించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రోజూ 1.2 లక్షల మంది బాధితులు నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ డయల్ 112 సేవలను అత్యవసర సమయాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. 911, 000లాగా వివిధ దేశాల్లో ఉన్నట్లుగా అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్కు డయల్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. రాష్ట్రంలో ఇప్పటికే డయల్ 100 (పోలీస్), 101 (ఫైర్ సర్వీసెస్), 108 (అంబులెన్స్) నంబర్ల ద్వారా అత్యవసర సర్వీసులు అందుతున్నా జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నంబర్లలో దేనికి కాల్ చేసినా అది ఆటోమెటిక్గా డయల్ 112కు డైవర్ట్ అవుతోంది. కాల్ అందుకునే రిసీవర్...వెంటనే సంబంధిత విభాగాన్ని క్షణాల్లో అలర్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ మొబైల్స్లో ఎమర్జెన్సీగా...: ప్రస్తుతం జీవీకే సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈఎంఆర్ఐ) కాల్ సెంటర్ ద్వారా అత్యవసర సేవలను పర్యవేక్షిస్తున్నారు. అయితే నిత్యం వస్తున్న కాల్స్లో 40 శాతం వరకు బ్లాంక్ కాల్స్ ఉంటున్నాయని, తాజా స్మార్ట్ఫోన్స్లో లాక్ బటన్ను గట్టిగా నొక్కుతున్నప్పుడు ఆటోమెటిక్గా 112కు ఎమర్జెన్సీ కాల్ కలుస్తున్నట్లు ఈఎంఆర్ఐ, పోలీస్శాఖ అధ్యయనంలో తేల్చాయి. గతంలో ప్రతి సర్వీస్ ఆపరేటర్, మొబైల్ సంస్థలు ఎమర్జెన్సీ, పోలీస్, అంబులెన్స్ సర్వీసు పేరుతో డయల్ 100, 101, 108 నంబర్లను పీడ్ చేసి పెట్టేవని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మూడు నిమిషాల్లో సర్వీస్ డెలివరీ..: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 నిమిషాల్లోనే పోలీస్ సర్వీస్ డెలివరీ ఉందని, అలాగే రాచకొండలో కొంత ప్రాంతం, సైబరాబాద్లో 70 శాతం ప్రాంతం 3 నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారని ఈఎంఆర్ఐ సర్వేలో తేలింది. మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లో పోలీసులు బాధితుల చెంతకు చేరుతున్నట్లు శాంపిల్ సర్వేలో వెల్లడైంది. జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లో సర్వీస్ డెలివరీ 7 నుంచి 8 నిమిషాలు పడుతోందని, మారుమూల ప్రాంతాల్లో మాత్రం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతున్నట్లు ఈఎంఆర్ఐలో డయల్ 112ను పర్యవేక్షించే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలపై డీజీపీ ప్రత్యేక దృష్టి...: హైదరాబాద్ కమిషనరేట్ తరహాలో జిల్లాల్లోనూ పోలీసు సర్వీస్ డెలివరీ వీలైనంత వేగంగా ఉండేలా చూడటంపై డీజీపీ మహేందర్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈఎంఆర్ఐ చేసిన సర్వే ఆధారం గా జిల్లాల్లో పెట్రోలింగ్ విస్తృతం చేయడం, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్ధ అనుసంధానం, జియో ట్యాగింగ్ ద్వారా ప్రజలకు పోలీస్ సర్వీస్ డెలివరీ సమయాన్ని వీలైనంత తగ్గించేలా కార్యచరణ రూపొందించనున్నారు. 94 శాతం సంతృప్తి: రాష్ట్రంలో పోలీస్ సేవలపై ఈఎంఆర్ ద్వారా ఉన్నతాధికారులు శాంపిల్ సర్వే చేయించారు. నిత్యం వచ్చే దాదాపు లక్ష కాల్స్లో పది శాతం అంటే 10 వేల మంది బాధితుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఐదు అంశాలతో కూడిన ప్రశ్నలపై సమాధానాలు సేకరించి నివేదిక సమర్పించారు. దీని ప్రకారం 94 శాతం మంది బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల కేసుల పరిష్కారం, ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. -
నవయుగపు మహోన్నత మహిళ
కాలం ప్రసవించే ఘడియలన్నీ ఒకలా ఉండవు. కొన్ని ఘడియలు సామాన్యులు అసామాన్యులుగా ఆవిర్భవించిన దృష్టాంతానికి సాక్షీభూతమవుతాయి. చరిత్రను మలుపు తిప్పగలిగేవి కూడా అలాంటి ఘడియలే. వంటింట్లో ఉన్న ఆ పది పన్నెండేళ్ల బాలికను, ఆ పాతికేళ్ల యువకుడు వెదురు బెత్తంతో కొట్టాడు. ఆమె వంట సరిగా చేయడం లేదు, అందుకే కొడుతున్నాడు కాబోలుననే అంతా అనుకున్నారు. చుట్టుపక్కల వారు మరో విధంగా ఆలోచించే అవకాశం లేని కాలం. 1877 సంవత్సరం ప్రాంతంలో ఇది జరిగింది. కానీ చుట్టుపక్కల వారి ఆలోచన శుద్ధ తప్పు. ‘కూర్చుని చదువుకోమంటే నీకు వంటింట్లో ఏం పని?’ అని చెప్పి మరీ కొట్టాడతడు. మహిళలు వంటింటికి పరిమితమని శ్రోత్రియ కుటుంబాలతో పాటు, సమాజంలో చాలా వర్గాలు భావిస్తున్న తరుణంలో, ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలకు చదువేమిటి? అనుకుంటూ సమాజం మొత్తం ఆ సూత్రాన్ని ఒక వ్రతంలా ఆచరిస్తున్న కాలంలో అతడా పనిచేశాడు. ఆ పదేళ్ల బాలిక పేరు ఆనంది. ఆ పాతికేళ్ల యువకుడు ఆమె భర్తే. పేరు గోపాల్రావ్ జోషి. అతడు అలా చేయి చేసుకోవడం బాగాలేదనిపించినా, ఆ ఘడియ మాత్రం నిశ్చయంగా గొప్పదే. ఆ కాలంలో కూడా తన భార్యను వైద్యురాలిని చేసేందుకు అమెరికా పంపాలన్న జోషి నిశ్చయాన్ని దృఢంగా వ్యక్తీకరించిన ఘడియ అది. 1880 నాటి భారతీయ సమాజంలో బాల్య వివాహం జరిగిన బాలికకు వైద్యవిద్యకు వెళ్లాలని ఎలా అనిపించింది? ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? వైద్యురాలిని కావాలన్న తన భార్య ఆకాంక్షను తనదిగా చేసుకుని ఆ భర్త ఆమెకు అండదండలు అందించడానికి ఎలా ముందుకు రాగలిగాడు? కాలానికి కూడా ఊహించలేని దృశ్యాలే అవి. కానీ ఈ రెండు ప్రశ్నలను విశ్లేషించుకుంటూ వెళితే ఒక గొప్ప చరిత్ర మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఆనంది (మార్చి 31, 1865– ఫిబ్రవరి 21, 1887)– పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తొలి భారతీయ వనిత. అసలు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అడుగు పెట్టిన తొలి భారతీయురాలు కూడా ఆనందీయేనని చెబుతారు. పూనా (నేటి పుణే)కు చెందిన ఒక సంపన్న శ్రోత్రియ కుటుంబంలో ఆనందీ జన్మించారు. అసలు పేరు యమున. ఒకప్పుడు జమీందారుల కుటుంబం. తరువాత చితికిపోయింది. ఆనందీబాయి అని ఆమె భర్త గోపాల్రావ్ జోషి పెళ్లి తరువాత పేరు మార్చాడు. ఆమెకు తొమ్మిదో ఏటనే వివాహం చేశారు. అప్పటికి ఆయన వయసు 21 ఏళ్లు. మొదటి భార్య చనిపోవడంతో ఆనందీతో ఆయనకది రెండో వివాహం. మహారాష్ట్రలోనే కల్యాణ్లో తంతితపాలా శాఖ గుమాస్తా. వివాహం అయిన తరువాత ఆయనకు అలీబాగ్ బదిలీ అయింది. మరో బదిలీ కలకత్తాకు. అక్కడే వైద్యవిద్యకు సంబంధించిన ఆలోచన ఆమెకు వచ్చింది, నిజానికి కలకత్తాకు బదిలీ కాలేదు. ఆయన చేయించుకున్నారు. ఆనందీ తన 14వ ఏట ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పదిరోజులకే కన్నుమూయడం ఆ జంటను కలచివేసింది. బిడ్డకు సరైన వైద్యం అందలేదు. ఆ కాలంలో వైద్యులంతా క్రైస్తవులైన విదేశీయులే. వారిని ఇంటికి తీసుకురావడం, తాకడం వంటి పనులు జరిగేవి కాదు. ఫలితం–పసికందు కన్నుమూసింది. ఆ బాధ నుంచే ఆమెకు తానే వైద్య విద్యను అభ్యసించి, భారతదేశ చిన్నారులకే కాదు, తల్లులకు కూడా వైద్యసేవలు అందించాలన్న గొప్ప సంకల్పం కలిగింది. చదువుకోవాలన్న తపన, అందునా వైద్య విద్య చదవాలన్న ఆకాంక్ష మొదలైనాకనే, భర్త ఎంతో సంతోషంగా ఆమె చేత ఓనమాలు దిద్దించాడు. తనే ఇంగ్లిష్, సంస్కృతం బోధించడం ఆరంభించాడు. మాతృభాష మరాఠీలో రాయడం నేర్పించాడు. కానీ ఆనందీ తల్లిదండ్రులకు ఇదేమీ నచ్చలేదు. తరచూ కుటుంబంలో కలహాలు రేగేవి. నిజానికి పెళ్లి తరువాత ఆనందీని తాను చదివిస్తాననీ, అందుకు అంగీకారమైతేనే పెళ్లి చేసుకుంటాననీ జోషి షరతు పెట్టారు. అయినా తల్లిదండ్రులు గొడవకు దిగారు. వీరందిరికీ దూరంగా వెళ్లిపోయి ఈ గొడవలకు స్వస్తి పలకాలనీ, ఆనందీ చదువుకు ప్రశాంత వాతావరణం కల్పించాలనీ గోపాల్రావ్ కోరుకున్నాడు. ఫలితమే కలకత్తా బదలీ. కలకత్తా నుంచే ఆయన ఆనందీని అమెరికా పంపే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ రోజుల్లో రాయల్ వైల్డర్ అనే ప్రఖ్యాత మిషనరీ ఉండేవారు. ఆయనకే 1880లో జోషి లేఖ రాశారు. అమెరికాలో ఏదైనా కళశాలలో తన భార్యకు మెడికల్ సీటు, తనకో ఉద్యోగం చూడమని అందులో కోరారు. ఈ రెండూ చేయాలంటే వైల్డర్ ఒక షరతు పెట్టాడు. ఈ ఇద్దరు భారతీయులు మతం మార్చుకోవాలి. ఇందుకు జోషి అంగీకరించలేదు. కానీ ఇలాంటి షరతు పెట్టినా వైల్డర్ చేసిన మేలొకటి ఉంది. ఎంతో వెనుకబడి ఉన్న భారతదేశంలో పుట్టిన మహిళ అమెరికా వచ్చి వైద్యవిద్యను అభ్యసించాలని కోరుకుంటున్న సంగతిని స్థానిక పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించాడు. అంతేకాదు, ‘ప్రిన్స్టన్ మిషనరీ రివ్యూ’లో ఆనందీ చేసిన విన్నపాన్ని కూడా ప్రచురించేటట్టు చేశారు. అది చదివిన థియోడిసియా కార్పెంటర్ అనే ఒక ధనిక మహిళకు (న్యూజెర్సీ) ఆనందీ మీద సానుభూతి కలిగింది. అదికూడా ఎంతో యాధృచ్ఛికంగా జరిగింది. పళ్లు చూపించుకునేందుకు కార్పెంటర్ ఒక డాక్టర్ దగ్గరకు వచ్చారు. అక్కడే ఆనందీ చేసిన విన్నపం గురించి పత్రికలో చదివారు. సనాతన భారతదేశంలో ఇలాంటి దంపతులు ఉండడం ఆమెకు విస్తుగొలిపింది. ఆ కాలంలో అదొక అద్భుతంగా కూడా ఆమె భావించారు. అమెరికా వస్తే తానే వారికి ఆతిథ్యం ఇవ్వగలనని ఉత్తరం రాశారు. ఆ రెండు కుటుంబాల మధ్య చాలాకాలం ఉత్తర ప్రత్యురాలు సాగాయి. అందులో హిందూమతం, భారతదేశానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చేవి. ఆనందీ, కార్పెంటర్ లేఖల ద్వారా సన్నిహిత మిత్రులయ్యారు. అమెరికా వెళితే తమకు కాస్త నీడ దొరుకుతుందన్న భరోసా వచ్చింది. భార్యను దించి రావడానికి జోషి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. అప్పుడే ఆనందీ ఆరోగ్యంలో మార్పులు ప్రారంభమయ్యాయి. నిరంతరం నిస్సత్తువగా అనిపించేది. తరచూ శిరోభారం ఒకటి. అడపాదడపా జ్వరం. ఒక్కొక్కసారి ఊపిరి సలపనట్టు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. ఈ సంగతి ఉత్తరంలో రాస్తే కార్పెంటర్ న్యూయార్క్ నుంచి మందులు కూడా పంపించింది. అంత ప్రేమ కురిపించారామె. కానీ ఆ మందులు పనిచేయలేదు. ప్రయాణం దగ్గర పడింది. అప్పుడే జోషికి సెరాంపూర్ బదలీ అయింది. దీనితో భార్యను మాత్రమే 1883లో కలకత్తా నుంచే పంపించారాయన. ఇందుకు తమ కుటుంబాల నుంచే కాకుండా, సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఆమె తన కలను నిజం చేసుకోవడానికి షాపెరోనెడ్ అనే ఓడలో సుదూర తీరానికి ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలోనే మిషనరీలైన ఇద్దరు వైద్య దంపతులు ఆనందీకి పరిచయమయ్యారు. వారే థోర్బోర్న్ దంపతులు.కార్పెంటర్ స్వయంగా ఓడ దగ్గరకు వచ్చి ఆనందీ జోషిని దింపుకుని, ఎంతో సంతోషంగా తన ఇంటికి న్యూయార్క్ తీసుకువెళ్లింది. థోర్బోర్న్ దంపతుల సలహా మేరకే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా (దీనినే ఇప్పుడు డ్రెక్సల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తున్నారు)లో సీటు కోసం ఆనందీ ఒక విజ్ఞాపన పంపారు. రాషెల్ బాడ్లే అప్పుడు ఆ కళాశాల డీన్. ఆ విజ్ఞాపనలో ఆమె రాసిన వాక్యాలు నిజంగా కదిలిస్తాయి. ఆ వాక్యాల ఆర్తిని, అవసరాన్ని కూడా అప్పటి కాలం, భారతీయ సమాజం అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. కానీ అదొక చరిత్రాత్మక విజ్ఞాపన. మహిళల పురోగతి చరిత్ర రూపం దాలిస్తే అందులో అది గొప్ప స్థానం పొందుతుంది. ‘నా పేద భారతదేశంలో వైద్య సదుపాయానికి నోచుకోక నిస్సహాయంగా కన్ను మూస్తున్న, రోగబాధతోనే జీవితాలను నెట్టుకొస్తున్న మహిళలకు సేవలు అందించాలన్న గాఢమైన ఆకాంక్షే నన్ను వైద్య విద్య వైపు నడిపించింది. నా కుటుంబం, నా కులం, సమాజం, ఆఖరికి నా మిత్రులు కూడా తీవ్రంగా నిరసించినప్పటికీ లెక్క చేయకుండా నేను వైద్య విద్య కోసం వచ్చాను. ఒక పురుష వైద్యుడు తమ శరీరాలను తాకుతూ చేసే పరీక్షల కంటే, రోగంతోæ మరణించడమే మేలని నా దేశంలో మహిళలు అనుకుంటారు. వారికి సేవ చేయమని నా ఆత్మ ఘోషిస్తోంది. మానవత్వపు వాణి నాకు అదే బోధిస్తున్నది. నా ఆకాంక్షకు ఆకృతినివ్వడంలో విఫలం కాకూడదని నేను కోరుకుంటున్నాను.’ రాషెల్కు ఆ విన్నపం ఎంతో నచ్చింది. ఆనందీకి ప్రవేశం లభించింది. మూడేళ్ల కోర్సు అది. నిజానికి స్త్రీల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకంలో భాగమది. అప్పటికి కొల్హాపూర్ సంస్థానం ఇవ్వజూపిన కొంత విద్యార్థి వేతనానికి తోడు, కళాశాల కూడా మూడేళ్లకు కలిపి ఆరు వందల డాలర్లు భృతిగా మంజూరు చేసింది. అమెరికా చలి, ఆహారం ఆనందీ ఆరోగ్యాన్ని కుంగదీయడం మొదలుపెట్టాయి. అయినా ఆమె చదువు విషయంలో అశ్రద్ధ చేయలేదు. ఆమె డిగ్రీ తీసుకునే సమయంలో ‘ఫిలడెల్ఫియా పోస్ట్’ పత్రిక చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం. తరగతిలో ఈ ‘చిన్నారి మహిళ’ ఎంతో ప్రతిభ కనపరిచిందని ఆ పత్రిక రాసింది. కలకత్తాలోనే మొదలైన క్షయ లక్షణాలు అమెరికా వాతావరణానికి విజృంభించాయి. ఆరోగ్యం బాగా పాడైంది. ఆ బాధ మధ్యనే మార్చి 11, 1886న ఆమె ఎం.డి. పట్టా పొందింది. ఈ పట్టా కోసం ఆమె రాసిచ్చిన సిద్ధాంత వ్యాసం ఏమిటో తెలుసా? ‘పురాతన భారతదేశంలో ప్రసూతి పద్ధతులు’. ఇంతకీ ఒక భారతీయ మహిళ ఎండీ పట్టా సాధించిన ఆ కాలానికి అమెరికా మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. మహారాష్ట్రలో నాడు స్త్రీ విద్య కోసం పాటు పడుతున్న సంస్కర్త పండిత రమాబాయి, గోపాల్రావ్ జోషి కలసి ఆనందీ పట్టా తీసుకున్న స్నాతకోత్సవానికి వెళ్లారు. ఆ ఇద్దరితో కలసి ఆమె ఇండియా బయలుదేరింది. బొంబాయిలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. కొల్హాపూర్ వచ్చినప్పుడు కూడా ప్రజలు సగౌరవంగా ఆహ్వానించారు. కొల్హాపూర్లోని అల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్ మహిళా విభాగం అధిపతిగా ఆనందీని నియమిస్తూ సంస్థానాధీశుడు వెంటనే ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇంత జరిగినా వారి ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. ఇందుకు ఆనందీకి లోకమాన్య బాలగంగాధర తిలక్ రాసిన లేఖ నిదర్శనం. మీరు ఎంతటి ప్రతికూలతల మధ్య విదేశాలకు వెళ్లి వైద్య విద్యను పూర్తి చేసుకుని వచ్చారో నాకు తెలుసు. మీరు ఈ నవ యుగపు మహోన్నత మహిళ. కానీ మీరు ప్రస్తుతం కొన్ని డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను. నేనో పత్రికాధిపతిని. నా దగ్గర అపారంగా ధనమేమీ ఉండదు. అయినా మీకు వంద రూపాయలు పంపించాలని ఉన్నది.’కలకత్తాలో ఓడ ఎక్కే ముందు ఆనందీ సెరాంపూర్లో కమ్యూనిటీ సమావేశంలో మాట్లాడారు. అప్పటికి గోపాల్రావ్ బదిలీపై అక్కడికి వెళ్లారు. ఆ మాటలు ఎంతో గొప్పవి. ‘ఇంత ప్రతికూలత ఉన్నా నేను వైద్య విద్య కోసం అమెరికా వెళుతున్నాను. ఈ దేశ మహిళలు వైద్యం లేకుండా ఎంతకాలం ఉండాలి? ఈ దేశంలో వైద్యం లేక ఎందరు పిల్లలు చనిపోవాలి? వారికి వైద్య సేవ చేయడమే ధ్యేయంగా నేను అంత దూరం వెళ్లి వైద్యురాలిగా తిరిగి రావాలని ప్రగాఢంగా వాంఛిస్తున్నాను. నేను తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ కేవలం మహిళల కోసమే ఒక వైద్య కళాశాలను స్థాపించాలని ఉంది. ఈ దేశానికి మహిళా వైద్యురాళ్ల అవసరం ఎంతో ఉంది.’ కానీ ఆమె ఆశయం నెరవేరలేదు. వైద్య విద్యను అభ్యసించినా, పూర్తి స్థాయిలో తన దేశపు మహిళలకు వైద్యం అందించే అవకాశం ఆమెకు రాలేదు. 21 ఏళ్లు దాటి, 22వ సంవత్సరంలోకి ప్రవేశించిన నెలకే ఆనందీ క్షయ వ్యాధి ముదిరి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 26, 1887న జరిగిన ఈ విషాదం మొత్తం భారతదేశాన్ని కుదిపింది. న్యూయార్క్లో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన కార్పెంటర్ కూడా చలించిపోయారు. ఆనందీ చితాభస్మాన్ని అమెరికాకు తెప్పించుకుని హడ్సన్లోని స్మశానవాటికలో తన కుటుంబ సభ్యుల సమాధుల మధ్య ఉంచి, ఆమె పేరున కూడా కార్పెంటర్ ఒక సమాధిని నిర్మించారు. ఇక్కడ మరో ఇద్దరి గురించి ప్రస్తావించడం అసందర్భం కాదు. వారే– కి ఒకామి (జపాన్), తాబత్ ఇస్లాంబూలీ (సిరియా/ఈజిప్ట్). ఈ ఇద్దరు పెన్సిల్వేనియాలోనే ఆనందీ సహాధ్యాయులు. వారిద్దరు కూడా ఆ దేశాల నుంచి వైద్య విద్య కోసం వచ్చిన తొలి మహిళలు. ఇందులో ఒకామి వైద్యురాలిగా పట్టా తీసుకున్నా కూడా వివక్షకు గురయ్యారు. ఆమె చదువు పూర్తయిన వెంటనే టోక్యో హాస్పిటల్లో ప్రసూతి విభాగం అధిపతిగా నియమించారు. కానీ ఆమెను జపాన్ రాజు గౌరవప్రదంగా చూసేవాడు కాదు. కారణం– మహిళ. ఇందుకు నిరసనగా ఒకామి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాబత్ ఏమైందో తెలియలేదు. చిత్రంగా ఖగోళ శాస్త్రజ్ఞులు వీనస్ గ్రహంలో కనిపెట్టిన 34.3 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఒక అగాధానికి ‘జోషీ’ అని ఆనందీ జీవితానికి గుర్తుగా నామకరణం చేశారు. ఆనందీ అల్పాయుష్కుడైన బిడ్డకు జన్మనిచ్చి, గుండె కోతను మిగుల్చుకుంది. కాలం కూడా ఆయుష్షు తక్కువైన ఆనంది వంటి ఒక ప్రతిభా సంపన్నురాలికి జన్మనిచ్చి చరిత్రకు గుండె కోతను మిగిల్చింది. -
అతడికి 64.. ఆమెకు 14
సాక్షి, చాంద్రాయణగుట్ట: అరబ్షేక్ల కామ దాహానికి అమాయక మైనర్ బాలికలు బలవుతున్నారు. బాలికల కుటుంబ ఆర్థికావసరాలను అవకాశంగా తీసుకొని కొందరు దుర్మార్గులు అరబ్షేక్లతో పెళ్లి జరిపిస్తున్నారు. తరువాత వారు పెట్టే హింసను భరించలేక.. వదలిరాలేక నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులే పడుతోంది పాతబస్తీకి చెందిన ఓ బాలిక. విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ తెలిపిన మేరకు.. కామాటీపురా ప్రాంతానికి చెందిన సల్మాబేగం ఆర్థికావసరాలు గమనించిన బీపాషా బీ, రషేదా బీ, షాహిన్లు ఆమెను కలిశారు. ఆమె 14 ఏళ్ల కుమార్తెకు అరబ్ షేక్తో వివాహం జరిపిస్తే కష్టాలు తీరుతాయని నమ్మించి నాసర్ బిన్ మహమూద్, ఫతే బిన్ మహమూద్ల సహకారంతో అరబ్షేక్(64)తో 2014లో వివాహం జరిపించారు. తరువాత స్వదేశానికి వెళ్లిన షేక్ వీసా పంపాడు. ఆ వీసాతో బాలిక ఒమన్కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత బాలికకు అసలు విషయంతెలిసింది. అతను ఫకీర్ అని తేలింది. చేసేది లేక రెండేళ్ల పాటు అక్కడే ఉంది. ఆరోగ్యసమస్యతో నగరానికి ఈ ఏడాది మార్చిలో వచ్చింది. దీంతో సదరు షేక్ బాలికను వెంటనే రావాలని బెదిరించాడు. బెదిరింపులు ఎక్కువ కావడంతో సల్మాన్, సాజిద్ అనే ఇద్దరి సహాయంతో వర్క్ వీసాపై జూలైలో దోహ ఖతర్ వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కూడా ఆమె ఇంటి యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తోంది. చేసేది లేక బాలిక తల్లి కామాటీపురా పోలీసులను ఆశ్రయింయింది. దీంతో పోలీసులు దళారులైన బీపాషా బీ, రషెదా బీ, నాసర్ బిన్ మహమూద్, ఫతే బిన్ మహమూద్, సల్మాన్లను అరెస్ట్ చేశారు. కాజీ సిద్దిక్ అహ్మద్, దళారీ షాహిన్లు పరారీలో ఉన్నారు. బాలికను రప్పించేందుకు యత్నిస్తామని పోలీసులు తెలిపారు. మరో కేసులో.. యాకుత్పురాకు చెందిన కుల్సుం బేగాన్ని బహ్రేన్ దేశానికి చెందిన మహ్మద్ మహమూద్ అబ్దుల్ రహెమాన్ మహ్మద్, యూసుఫ్ మహ్మద్ అబ్దుల్ రహెమాన్ మహమూద్ ఖైరీ లు ఈ ఏడాది మే 24వ తేదీన కలిశారు. కుల్సుం బేగం రెండో కుమార్తె సమీనా బేగం (29)ను బహ్రేన్ దేశస్థులలో ఒకరైన మహమూద్ అబ్దుల్ రహెమాన్ మహ్మద్ కింగ్ కోఠిలో కాజీ అస్గర్ అలీ రఫాయి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం స్వదేశానికి తీసుకెళ్లాడు. కొన్నాళ్ల అనంతరం విడాకులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశాడు. దీంతోపోలీసులను బాధితురాలి తల్లి భవానీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మళ్లీ వారు వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.వారికి ఆశ్రయం కల్పించిన గెస్ట్ హౌజ్ యజమానిని భవానీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాల్యం మెడలో తాళి
నెల్లూరు (క్రైమ్): బాల్యం మెడలో తాళి పడుతోంది. మూడుముళ్ల బంధం వారిని బందీ చేస్తోంది. సమాజం నాగరికత వైపు అడుగులేస్తున్న తరుణంలోనూ ఆర్థిక అసమానతలు.. నిరక్షరాస్యత.. బాలికలను జాగ్రత్తగా పెంచలేమనే బెంగ.. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న అభద్రతా భావం వెరసి ముక్కుపచ్చలారకుండానే వారికి తల్లిదండ్రులు వివాహాలు చేస్తున్నారు. తమ పనైపోయిం దని చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో బాల్య వివాహాలు అధికమయ్యాయి. ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, అల్లూరు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. చట్టాలు చేసినా ఈ వివాహాలు ఆగడం లేదు. ఇలాంటి కేసుల్లో 10 శాతం మాత్రమే అధికారుల దృష్టికి వస్తుండగా.. 90 శాతం బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. వెలుగులోకి కొన్నే.. గుర్తించనవి ఎన్నో గూడూరు మండలం చెన్నూరు రామలింగయ్య కాలనీలో ఇటీవల 14 ఏళ్ల బాలి కకు షఫీ అనే వ్యక్తితో వివాహం చేసేం దుకు తల్లిదండ్రులు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు అడ్డుకున్నారు. నగరంలోని వెంగళరావు నగర్కు చెందిన ఓ చిన్నారికి అదే ప్రాంతానికి చెందిన యువకునితో వివాహం చేస్తుండగా ఐసీపీఎస్ అధి కారులు పోలీసుల సహకారంతో నిలువరించారు. అల్లూరు మండల పరిధిలోని పట్టపుపాలెంలో ఓ చిన్నారికి వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. గడచిన ఐదేళ్లలో 205 బాల్యవివాహాలను అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిలువరించగలిగాయి. అదే ఐదేళ్లలో 2,480 మంది బాలికలకు గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు అయ్యాయని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. కారణాలివీ బాల్య వివాహాలకు అధిక సంతానం, పేదరికం ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. మేనరికం అందుబాటులో ఉండటం.. ఆ సంబంధాన్ని కలుపుకోకపోతే కూతుర్ని ఎలాంటి ఇంటికి పంపించాల్సి వస్తుందోనన్న భయం కూడా బాలికల వివా హాలకు పురిగొల్పుతోంది. వివాహ ఖర్చు పెరగడం, ప్రేమ పేరిట తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో బాలికల్ని బయటి ప్రాంతాలకు పంపించి చదివించేందుకు ఇష్టపడటం లేదు. తాతయ్య, అమ్మమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడం.. వాళ్లు బతి కుండగానే పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందన్న ఆలోచన, పరి మిత విద్యావకాశాలు, చదువులో వెనుకబడటం వంటి కారణాల వల్ల కూడా బాలికలకు వివాహాలు చేస్తున్నారు. తలెత్తే అనర్థాలు.. బాల్య వివాహాల వల్ల ప్రధానంగా స్త్రీలు రక్తహీనతకు గురవుతారు. వారికి పుట్టే బిడ్డలు అనారోగ్యం బారిన పడటం, అవయవాల ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు సంభవిం చడం వంటి సమస్యలు ఉంటాయి. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల వారు బలహీనంగా మారుతారు. జన్యుపరమైన సమస్యలతోపాటు పోషక లోపాలు గల బిడ్డలు జన్మించడం, గర్భస్రావాలు, మాతాశిశు మరణాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దంపతుల నడుమ అవగాహన లోపంతో కలహాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం, కుటుంబ హింస, లైంగిక హింస, ఇంకా అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. చట్టాలున్నా.. బాల్య వివాహాల నిషేధ చట్టం బ్రిటిష్ కాలం 1929నుంచి అమల్లో ఉంది. ఇందులో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006ను రూపొందించింది. దీని ప్రకారం వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21ఏళ్లు నిండితేనే వివాహం చేయాలి. అంతకంటే తక్కువ వయసులో వివాహం చేయడాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు. బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసేవారు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా.. కానిపక్షంలో రెండు విధించవచ్చు. ఇరుపక్షాల తల్లిదండ్రులు, బంధువులు, సంరక్షకులు, పురోహితులు, ఇరుగు పొరుగు వారు అటువంటి వివాహాలు కుదిర్చేందు కు బాధ్యత వహించే పెళ్లి సంఘాలు, వివాహానికి హాజరైన వారంతా నిందితులుగా గుర్తించబడతారు. బాల్య వివాహాల నిరోధానికి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఆరు అంచెల అధికారులతో (సీఎంపీవో) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధానాధికారి, జిల్లా స్థాయిలో కలెక్టర్, ప్రాం తీయ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్ఓ/గ్రామ కార్యదర్శులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఎవరికి ఫిర్యాదు చేయాలి జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 100, చైల్డ్లైన్ నంబర్ 1098కు ఫోన్చేసి చెప్పవచ్చు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా సమగ్ర బాలల సంరక్షణాధికారి, తహసీల్దార్, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు సమాచారం అందించవచ్చు. తల్లిదండ్రుల్లో మార్పురావాలి బాధ్యత తీర్చుకునే పేరుతో బాల్య వివాహం చేయడం చట్ట విరుద్ధం. దీనివల్ల ఆడపిల్ల భవిష్యత్ నాశనమవుతుం ది. తెలిసీ, తెలియని వయసులో పెళ్లి చేసి వారి జీవితాలను నాశనం చేయరాదు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. ఈ వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. – బి.సురేష్, డీసీపీవో -
నాగాపూర్లో బాల్య వివాహం?
హవేళిఘణాపూర్(మెదక్): కుల పెద్దల సమక్షంలో బాల్య వివాహం జరిగిన సంఘటన మండల పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగాపూర్ గ్రామానికి చెందిన బాల్రాజుకు అదే గ్రామానికి చెందిన 17.3 సంవత్సరాల అమ్మాయితో తొగిట రామస్వామి ఆలయంలో సోమవారం వివాహం జరిగింది. అమ్మాయి మైనర్ అని తెలిసీ కులపెద్దలు వివాహం జరిపించారని విశ్వసనీయ సమాచారం. వివా హానికి అమ్మాయి తల్లిదండ్రులు హాజరు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ ఎసీడీపీఓ హేమసత్య, అంగన్వాడీ టీచర్ మంగమ్మ మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించేందుకు యత్నించారు. అమ్మాయి, అబ్బాయి లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. పెళ్లి సంగతి తమకేమీ తెలియదని వారు చెప్పినట్టు తెలిసింది. ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా బాల్య వివాహం జరిగినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.