Kavuri Sambashiva Rao
-
'గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు'
సాక్షి, గుడివాడ : గుడివాడ చరిత్రలో ఈరోజును ఒక గొప్ప రోజుగా గుర్తుంచుకుంటామని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని లింగ వరం రోడ్డు లోని కె కాన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. మంత్రి కొడాలి మాట్లాడుతూ.. ఎందరో ప్రముఖుల పురిటిగడ్డ ఈ గుడివాడ అని, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం తలుపు తట్టే న్యాయ వ్యవస్థ ప్రాంతంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. బట్టు దేవానంద్ గుడివాడ నుంచి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టమని తెలిపారు. సమాజంలో అనేక అసమానతలు తొలిగేలా అంబేద్కర్ ఆశయాలను దేవానంద్ నెరవేర్చుతాని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు,దర్శకుడు, నిర్మాత వైవీయస్ చౌదరి యూనేటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గుమ్మడి రవీంద్ర నాధ్ తదితరులు పాల్గొన్నారు.(‘ఎల్లో’ వైరస్ కరోనా కంటే ప్రమాదకరం) సినీ దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ' గుడివాడలొనే నా విద్యాబ్యాసమంతా కొనసాగింది. నాకు సినిమా రంగంలో స్పూర్తి ఎన్టీఆర్. ఆయన స్పూర్తితోనే నేను సినిమా రంగంలోకి వెళ్ళాను. జీవితంలో ప్రతి ఒక్కరు..నువ్వు అనే పిలుపు నుంచి మీరు అని పిలిపించుకుని స్థాయికి చేరాలి. బట్టు దేవానంద్ నా చిన్ననాటి సహా విద్యార్థి. కానీ నేడు బట్టు దేవానంద్ను మీరు అని పిలిపించుకోవడం మన ప్రాంతం అదృష్టం. మత సామరస్యనికి నిలయం గుడివాడ.విద్యార్థి దశ నుంచే సమయ స్పూర్తి తో నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి బట్టు దేవానంద్' అంటూ తెలిపారు. మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. 'పేద కుటుంబ నుంచి వచ్చి వ్యక్తి ఉన్నత స్థాయికి రావడం సాదరణ విషయం కాదు. స్వాతంత్రం అనంతరం గుడివాడలో ఒక దళితుడు కూడా హైకోర్టు జడ్జి కాలేదు. నేటి రోజుల్లో పేదవారు పైకి రావడం చాలా కష్టం. పేదవారు కూడా ఉన్నత స్థాయికి రావాలన్నదే నా ఉద్దేశం. చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇవ్వాలని నేను దేవానంద్ను కోరుతున్నాను. బట్టు దేవానంద్ సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి చేరాలని ఆశిస్తున్నా' అంటూ వెల్లడించారు. -
‘ఆ భావన తీసుకొచ్చేందుకే చంద్రబాబు కృషి’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదనే భావన తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం’లో కేంద్ర పథకాలను వివరించాలని కోరారు. అశోక్నగర్లోని బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పూటకో పార్టీతో పొత్తుకునే చంద్రబాబు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీపై నెట్టాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. ఆయన సత్తా తేలిపోయింది.. రాబోయే కాలంలో నుంచి 7 నుంచి 8 మంది మంత్రులు, 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు సత్తా ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందనీ, ఆయనకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అబద్ధాన్ని పదేపదే చెప్పి రాహుల్ ప్రజల్ని నమ్మించే యత్నం చేశారు. అందుకే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాఫెల్ పేరుతో కాంగ్రెస్ కుట్రకు పాల్పడిందనే అనుమానాలు కలుగుతున్నాయి’అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని అభూత కల్పనలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో కూడా మహా కూటమికి ఘోర పరాజయం పాలవుతుందన్నారు. -
చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోంది..
-
చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోంది..
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోందని, ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయిందని, ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పామని బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు తెలిపారు. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షా... పార్టీ నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. భేటీ అనంతరం కావూరి విలేకరులతో మాట్లాడుతూ అన్ని విషయాలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు లబ్ది పొందుతున్నారని కావూరి అన్నారు. ఏపీలో జన్మభూమి కమిటీల తీరు అధ్వాన్నంగా ఉందన్నారు. ఏ విషయంలోనూ బీజేపీని టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. మిత్రపక్షం కాబట్టి టీడీపీ ఉన్న వ్యతిరేకత బీజేపీపై పడుతుందన్నారు. నిబద్ధత కలిగిన నేతల వ్యాఖ్యలపైనే తాను స్పందిస్తానని, ఎంపీ కేశినేని నాని లాంటి వారి వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. రాజీవ్గాంధీ మరణం తర్వాత ఫలితాలు తారుమారు అయ్యాయని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని... ఏదైనా జరగవచ్చని కావూరి అన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. -
వాళ్ల చర్చలు మీరు చూశారా.. మేం చూశామా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసిన విషయంలో టీడీపీ నేతలు పెడార్థాలు తీయడం సరికాదని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రిని ఒక ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేముందని ఆమె ప్రశ్నించారు. అయినా.. ప్రధానితో జగన్ తన కేసుల గురించి చర్చించడం మీరు చూశారా.. మేం చూశామా అని టీడీపీ నేతలను ఆమె నిలదీశారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని, టీడీపీ మిత్రధర్మం పాటించలేదనే అనుమానం నెలకొందని పురందేశ్వరి చెప్పారు. ఇక రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని, పొత్తుల నిర్ణయానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉందని తెలిపారు. ఇక ప్రధానమంత్రి మోదీని జగన్ కలవడం మీద టీడీపీ నేతల విమర్శలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వెళ్లి ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటని ఆయన అడిగారు. అసలు వాళ్లిద్దరు కలవడం ఏంటనే ప్రశ్న వేయడమే తప్పన్నారు. కేసుల కోసమే కలిశారని ఎవరైనా చూశారా అని కావూరి నిలదీశారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ నేత కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని కావూరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని కావూరి విమర్శించారు. -
కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా
శ్రీనగర్కాలనీ: రుణాలు తిరిగి చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బాలాపురి బస్తీలోని ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరిట రూ.160 కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిపారు. సక్రమంగా తిరిగి చెల్లించడం లేదన్నారు. దీంతో నిరసనకు దిగినట్టు ని డీజీఎం రాజీవ్పురి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బీఎస్ శర్మ, వెంకటేశ్వర్లు, అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఏపీలో బీజేపీని అణగదొక్కాలని చూస్తే ఊరుకోం'
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షం బీజేపీల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, శాంతారెడ్డి తదితరులు ఈ అంశంపై వైఎస్ఆర్ జిల్లా కడపలో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని, మిత్రపక్షంగా కలుపుకొని వెళ్లాలని కావూరి వ్యాఖ్యానించారు. టీడీపీ పద్ధతి మారాలని ఆయన సూచించారు. జన్మభూమి కమిటీలలో రాజకీయ జోక్యం కారణంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని, ఇది ఎవరికీ మంచిది కాదని చెప్పారు. పేదలకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఇక.. రాజధాని భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్తో టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తుతున్నారని శాంతారెడ్డి ఆరోపించారు. -
'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'
-
'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'
అనంతపురం: చంద్రబాబు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. లంచగొండితనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందారు. కాగా, పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని కావూరి సాంబశివరావు అంతకుముందు డిమాండ్ చేశారు. -
ఇంత దోపిడీ ఎప్పుడూ చూళ్లేదు
ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ తారస్థాయికి చేరిందని కేంద్ర మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతదోపిడీ ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఇసుక ర్యాంపులను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దోపిడీ ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. డ్వాక్రా మహిళ ముసుగులో టీడీపీ నేతలు ఇసుక ర్యాంపులను దోచుకున్నారని, ఇసుక గుట్టలను నోట్లకట్టల్లా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ క్యాడర్ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇసుక ర్యాంపులను అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని హితవు పలికారు. జన్మభూమి కమిటీలను టీడీపీ క్యాడర్తో నింపేశారని ఆయన నిందించారు. ‘గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఇద్దరు డ్వాక్రామహిళలు సభ్యులుగా జన్మభూమి కమిటీ ఉండాలని ఉత్తర్వులు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు, డ్వాక్రామహిళల పేరిట టీడీపీ కార్యకర్తలను నియమిస్తున్నారు’ అని కావూరి పేర్కొన్నారు. బీజేపీ సానుభూతిపరులైన సామాజిక కార్యకర్తలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలగా పూర్తిచేసిన రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కావూరి సూచించారు. -
రాహుల్ను ప్రధాని చేసేందుకే సోనియా...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. గురువారం విజయవాడలో బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే రాష్ట్రాన్ని సోనియా విభజించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను బీజేపీ ఆదుకుంటుందని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే అధిక నిధులు రాష్ట్రానికి తీసుకొస్తామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీలపై ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. -
యూపీఏలో అవినీతి మంత్రులున్నారు కానీ...
విజయనగరం: బీజేపీ నేత కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. గతంలో 10 ఏళ్లు పాటు సాగిన యూపీఏ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ హయాంలోని మోదీ ప్రభుత్వంలో అలాంటి మంత్రులు లేరని తెలిపారు. మోదీ దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇచ్చి తీరాలని ఆయన ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా 2009 ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కావూరి సాంబశివరావు ... యూపీఏ ప్రభుత్వ హయాం 2009 - 2014 మధ్య కాలంలో అంటే 2013లో కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. -
పట్టిసీమతో ఉపయోగం లేదు: కావూరి
-
పట్టిసీమతో ఉపయోగం లేదు: కావూరి
విజయవాడ : బీజేపీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆపార్టీ నేత కావూరి సాంబశివరావు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం మిగతా రాష్ట్రాల అనుమతి తీసుకునే ప్రయత్నం ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏపీకి నిధులు సమకూర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆమె పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. -
ఓటు వేయకపోతే చంపేస్తారా
ఏలూరు : జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా తలపడేవిధంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయూలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.హరిబాబు పిలుపునిచ్చారు. ఏలూరు పేరయ్య కోనేరు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. పార్టీలో ఎంత పనిచేస్తే అంత గౌరవం ఉంటుందని, సిద్ధాం తాల ప్రకారం నడిచే పార్టీ బీజేపీ ఒక్కటేనని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తను సైతం గౌరవించే పార్టీ తమదేనని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి నిట్, ఐఐటీ, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయూలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు మంజూరు చేశామని చెప్పారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఘనత మోడీదేనన్నారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని 148 సంస్థలను ఆంధ్రప్రదేశ్కు దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ఏ ఒక్కటీ దక్కకపోవడంతో నానా కష్టాలు పడుతున్నామన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ సమాజంలో లంచగొండితనం వేనూళ్లకోవడానికి కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. బీజేపీ బలపడటం అంటే మిత్రపక్షమైన టీడీపీని ఇబ్బంది పెట్టడం కాకుండా రాబోయే రోజుల్లో పార్టీ మరింత విస్తరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా నష్టపోయిందన్నారు. సౌకర్యాలు, మందులు లేక ప్రభుత్వ వైద్యరంగం దిగజారిందన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ 100 రోజుల బీజేపీ పాలనలో ఒరిగిందేమీ లేదంటూ కాంగ్రెస్ బూటకపు ప్రకటనలు చేస్తోందని, మోడీ నాయకత్వంలో ప్రజలకు ఏం జరిగిందో ప్రపంచ దేశాలకు సైతం అర్థమైందని అన్నారు. మోడీకి వీసా నిరాకరించిన అమెరికా సైతం ఆయనిను సగౌరవంగా ఆ దేశానికి ఆహ్వానించడం మోడీ నిబద్ధతకు తార్కాణమని పేర్కొన్నారు. ఓటు వేయకపోతే చంపేస్తారా : టీడీపీ తీరుపై కావూరి ఫైర్ తమ పార్టీకి ఓటు వేయని వారిని చంపేస్తామని, పొలాల్లో వ్యవసాయం చేయనిచ్చేది లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు ప్రజలను హింసించడాన్ని చూస్తూ ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొలానికి పాస్ పుస్తకం ఇప్పించేందుకు రూ.10 వేలు, రూ.10 లక్షల పొలానికి నష్టపరిహారం ఇప్పించేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకోవడం రాజకీయూ అవుతుందా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ‘ఈ మాత్రం దానికి రాజకీయాల్లోకి రావడం ఎందుకని, ఏదైనా మంచి వ్యాపారం చేసుకుని బతకొచ్చుకదా’ అని వ్యాఖ్యానించారు. అధికార దర్పంతో ప్రజలను హింసించడమనే నీతిమాలిన బతుకు మరొకటి ఉండదన్నారు. టీడీపీ అఘాయిత్యాల నుంచి ప్రజలను పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా రక్షించే స్థితి లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యే చావా రామకృష్ణ, చేగొండి ప్రకాష్బాబు, నగర సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రాము, కాంగ్రెస్ నాయకుడు పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధ్యక్షుడు గారపాటి చౌదరి, బొజ్జా నరేంద్ర, మాజీ కౌన్సిలర్ కొంపల్లి తాయారు, మేరీపాల్ పద్మావతి బీజేపీలో చేరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సోము వీర్రాజు, పార్టీ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షులు కె.మాలతీరాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, నాయకులు పీవీఎస్ వర్మ, జమ్ముల కిషోర్, పి.వీరరాఘవులు, పొట్లూరి రామ్మోహన్రావు, పీవీ సుబ్రహ్మణ్యవర్మ, కోడూరి లక్ష్మీనారాయణ, కురెళ్ల సుధాకర్కృష్ణ, ముద్దాని దుర్గారావు, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్బాబు పాల్గొన్నారు. -
టీడీపీపై మరోసారి కావూరి ఫైర్
ఏలూరు: బీజేపీ మిత్రపక్షమైన టీడీపీపై ఆపార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగి బీజేపీ కార్యవర్గ సమావేశంలో మిత్రపక్షం టీడీపీపై కావూరి సాంబశివరావు ఆరోపణలు చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది. అధికార పార్టీకి ఓటు వేయకపోతే ఇతర పార్టీల నేతల్ని చంపేస్తారా అంటూ నిలదీశారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ కావూరి విమర్శించారు. రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగిపోయింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీకి సమానంగా బీజేపీ బలపడుతుందని కావూరి అన్నారు. -
టీడీపీలో పవన్ కల్యాణ్ దుమారం
‘పవన్ కల్యాణ్ వల్లే టీడీపీకి అధికారమొచ్చింది. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయినా.. మాకు మాత్రం డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పే ముఖ్యమంత్రి’ అంటూ ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం నేతలు చేస్తున్న కోలాహలం ఎటు తిరిగి ఎటొస్తుందోనన్న చర్చ ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో మొదలైంది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ఇంకా సన్మానాలు, సత్కారాల మోజులోనే ఉన్న టీడీపీలోని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఏలూరులో గత వారం తమ వర్గం నేతల నిర్వహణలో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్కల్యాణ్ను కీర్తిస్తూ ఆ సామాజిక వర్గం నేతలు మాట్లాడితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ... టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ‘వర్గం’ కోణంలో మాట్లాడటం, కేవలం పవన్ ప్రచారంతోనే మన జిల్లాలోని పదిహేను సీట్లూ గెలుచుకున్నామంటూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. టీడీపీకి మొదటి నుంచీ కొమ్ముకాస్తున్న బలమైన ఓ సామాజిక వర్గం నేతలు ఈ వ్యాఖ్యలను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ జనసేన పార్టీ పెట్టకముందే జరిగిన మునిసిపల్, పంచాయతీ, స్థానికసంస్థలు, సహకార ఎన్నికల్లో టీడీపీ పాగా వేసిన విషయాన్ని ఆ వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ప్రభావం లేదని కొట్టిపారేయలేం కానీ.. కేవలం పవన్ వల్లనే అధికారంలోకి వచ్చామన్న భావన, వ్యాఖ్య లు సరైనవి కావని ఆ వర్గం నేతలు అంటున్నారు. ఎటూ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సహా బీజేపీ నేతలు వీలు దొరికినప్పుడల్లా పవన్కు కీర్తిస్తున్నారని, ఇప్పుడు టీడీపీలోని ఓ వర్గం నేతలూ ఇదే రాగం ఆలపిస్తుండటంతో పార్టీకి కొమ్ముకాస్తున్న మిగిలిన వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉందని ఒకింత ఆందోళన చెందుతున్నారు. అరుుతే, పదేళ్ల తర్వాత పార్టీని పవర్లోకి తీసుకువచ్చిన సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో సున్నితమైన ఈ అంశాన్ని బాహాటంగా చెబితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. సఖ్యతతో ‘రాజు’.. లక్ష్యంతో ‘సాంబ’ ఎప్పుడొచ్చామన్నది కాదు.. వార్తల్లో నిలిచామా లేదా.. కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ నేత కావూరి సాంబశివరావు వ్యవహారశైలి ఇప్పుడు సరిగ్గా ఇలాగే నడుస్తోంది. ఎన్నికల ముందు.. ఆ తర్వాత మూడు నెలల పాటు ఎక్కడా కనిపించకుండాపోయిన కావూరి సరిగ్గా ఐదురోజుల కిందట బీజేపీ నేతగా జిల్లాకు వచ్చి హల్చల్ చేశారు. వచ్చీ రాగానే తెలుగుదేశం నేతల అరాచకాలపై నేరుగా విమర్శలు గుప్పించారు. కావూరి వ్యాఖ్యల వెనుక మర్మమేమిటన్నది తొలుత చాలా మందికి అర్థం కాకుండాపోయింది. ఎవరేమనుకున్నా తాను అనాలనుకున్నదీ.. చెప్పాలనుకున్నదీ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కావూరి ఇప్పుడు ఇలా దూకుడుగా వెళ్తుండటం వెనుక చాలా ‘ముందుచూపు’ ఉందంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీకి తోక పార్టీగానే ఉండిపోతోందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న వాస్తవం. సరిగ్గా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన పునాదులపై దృష్టిపెట్టిన బీజేపీలోని ఓ వర్గం టీడీపీతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించిన కార్యాచరణలో భాగంగానే కావూరి అలా దూసుకెళ్తున్నారని అంటున్నారు. మరోవైపు జిల్లాలో తనకంటూ ఓ వర్గా న్ని తయారుచేసుకునే పనిలో కూడా కావూరి ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. భీమవరంలో మునిసిపల్ వైస్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడి.. కౌన్సిలర్గానే మిగిలిపోయిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మను తోడుగా చేసుకుని కావూరి ఆ పార్టీ రాజకీయాల్లో వేగంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కలుకుపుని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఓ వర్గంగా టీడీపీతో సఖ్యతతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీలో కావూరి పవర్సెంటర్గా మరో వర్గం తయారవుతోందని అంటున్నారు. పరస్పర విరుద్ధభావాలతో ఈ రెండు వర్గాలూ సమాంతరంగా ముందుకెళ్తూ జిల్లాలో బీజేపీని ఎటువైపు తీసుకువెళ్తాయో అన్నది కాలమే నిర్ణయించాలి. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
టీడీపీపై కావూరి ఘాటైన వ్యాఖ్యలు
నాయకుడు కావూరి సాంబశివరావు రెండు రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తనదైన శైలిలో అధికార పక్షాన్ని కావూరి టార్గెట్ చేయడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేస్తుండగా, బీజేపీ నేతలకు ఒకింత ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఎక్కడిక్కడ అరాచకాలకు పాల్పతున్నారు. మన జిల్లాలోని టి.నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి చెందిన సాగునీటి పైపుల ధ్వంసం, పెదవేగి మండలం అంకన్నగూడెంలో వైఎస్సార్ సీపీ నేతలు, వారి ఆస్తులు, ఇళ్లపై దాడులకు తెగబడటం వంటి ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కావూరి సరిగ్గా వీటిపై దృష్టిసారించి టీడీపీ నేతల నిర్వాకాలపై ధ్వజమెత్తుతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని, టీడీపీ వాళ్లు సరికొత్త ఆగడాలతో, దుష్టరాజకీయ సంస్కృతికి తెరలేపారని ఆయన వ్యాఖ్యానిం చడం గమనార్హం. వైఎస్సార్ సీపీ నేతలపై జరిగిన దాడులు, ఆ పార్టీ నేతలే లక్ష్యంగా టీడీపీ సాగిస్తున్న అరాచకాలను తప్పుపడుతూ పార్టీలకు అతీతంగా కావూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యూయి. అదేవిధంగా కొల్లేరులో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, బీజేపీ శ్రేణులపై జులుం ప్రదర్శిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కావూరి కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో హెచ్చరించారు. బీజేపీకి టీడీపీ మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని, టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కావూరి విరుచుకుపడటం సంచలనమవుతోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాకు దూరంగా ఉన్న కావూరి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత జిల్లాకు వచ్చీ రాగానే టీడీపీ నేతల ఆగడాలపై ఎటాక్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. -
టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం
ఏలూరు అర్బన్ : ‘జిల్లాలో టీడీపీకి ఎంతకాలం తోక పార్టీగా ఉంటాం.. పార్టీ బలోపేతానికి శ్రేణులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం స్థానిక ఖండ్రికగూడెం పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఏలూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్ధించబోమని, ప్రజల ఆకాంక్షలకు తగినవిధంగా ప్రజాపోరాటాలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ ప్రభంజనంతో యువత పార్టీలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తోందని అన్నారు. మోడీ ఆలోచనలకు అనుగుణంగా యువతను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యకర్తలు రానున్న 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటినుంచే కృషి చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, జిల్లా శాఖ అధ్యక్షురాలు లక్కోజు సుజాత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాని దుర్గారావు, కార్యదర్శి కురెళ్ల సుధాకరకృష్ణ, నాయకులు కత్తి రాము, పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కైరం అప్పారావు పాల్గొన్నారు. -
టిడిపి రౌడీ రాజకీయాలు: మిత్రపక్ష నేత కావూరి
ఏలూరు: టిడిపి మిత్రపక్షమైనా సరే తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని బిజెపి నేత కావూరి సాంబశివరావు చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. 2019లో రాష్ట్రంలో టీడీపీ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. టీడీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కావూరి విమర్శించారు. -
టీడీపీ అధికారం బీజేపీ భిక్షే
ఎమ్మెల్యేలూ ఖబడ్దార్ తెలుగు తమ్ముళ్ల తీరుపై బీజేపీ నేతలు కావూరి, శ్రీనివాసవర్మ ఫైర్ తెలుగు తమ్ముళ్ల తీరుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. బీజేపీ భిక్షతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ శ్రేణులపై జులుం ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. కొయ్యలగూడెం : టీడీపీ నాయకుల వ్యవహార శైలి, హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు ప్రజలను మోసగిస్తున్న తీరుపై బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు, భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్రస్థారుులో ధ్వజమెత్తారు. పోలవరం నియోజకవర్గ బీజేపీ శ్రేణుల సమావేశాన్ని కొయ్యలగూడెంలో సోమవారం నిర్వహించారు. పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ భిక్షతోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందని పేర్కొన్నారు. అరుునా, బీజేపీని అణగదొక్కటానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తమ వల్లే అధికారం వచ్చిందన్న విషయూన్ని టీడీపీ నేతలు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. చాలాకాలంగా టీడీపీలో ఉంటూ అన్యాయూనికి గురవుతున్న నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని పటిష్టం చేయూలని శ్రేణులకు సూచించారు. ఈ నెల 31న ఏలూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున జనసమీకరణ జరపాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చావా రామకృష్ణ వంటి నాయకులు బీజేపీలో చేరడంతో పార్టీ పటిష్టంగా తయూరవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల పాలకమండళ్లలో బీజేపీ నాయకులకే ఆగ్రస్థానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలూ ఖబడ్దార్ కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ శ్రేణులపై జులం ప్రదర్శిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొల్లేరులో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, సానుభూతిపరులపై టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తనను నమ్ముకున్న అనుచర గణానికి రక్షణ తాను కవచంలా నిలబడతానని, రక్తం చిందించైనా కాపాడుకుంటానని కావూరి పేర్కొన్నారు. భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం కల్ల అని, బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం శాపంలా వెంటాడుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా భవిష్యత్లో ఆ పార్టీని వీడి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించగల బీజేపీలో చేరి చరితార్థులు కావాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు అర్జుల మురళి, కోడూరి లక్ష్మీనారాయణ, బొల్లిన నిర్మల, లక్కరాజు సుజాత, సురేంద్రనాథ్బెనర్జీ, కట్టా సత్యనారాయణ, గొలిశెట్టి గంగాధరరావు, మోడేపల్లి నాగు, సరియం రామలక్ష్మి, కొండేపాటి రామకృష్ణ, బొప్పిన నాగేశ్వరరావు, మద్దిబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా!
అంతకు ముందు కాలనీలకు.. పేటలకు.. బస్తీలకు ఓ ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలా హడావుడి కనిపించేది. రోడ్ల వెంబడి బ్లీచింగ్ చల్లేవారు. తోరణాలు.. పూలమాలలు.. స్వాగత సత్కారాలు గట్రా నడిచేవి. ఎందుకంటే ఆ ఏరి యాకి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు వచ్చాడంటే కచ్చితంగాఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలో లేదా శంకుస్థాపనలో పెద్దఎత్తున జరిగేవి. ఒక్కోసారి ఇలాంటివి జరగకపోయినా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి వెంటనే సదరు నేతలు అక్కడి పనులకు సంబంధించి హామీలిచ్చేవారు. కొన్నాళ్లకో.. చాన్నాళ్లకో మొత్తం మీద చాలావరకు పనులు చేసేవారు. మరి మంత్రులే వస్తే.. ఏకంగా ఉప ముఖ్యమంత్రే వస్తే.. ఇప్పుడిదంతా ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్ర 13 జిల్లాలతో ఓ రాష్ట్రంగా మిగిలిన తర్వాత కొలువుదీరిన కొత్త మంత్రులు ఎక్కడికక్కడ గిరాగిరా తిరుగుతున్నారు. ఎటుచూసినా అక్కడో మంత్రి పర్యటన.. ఇక్కడో మంత్రి టూరు. కానీ.. ఆ ప్రాంతాలకు ఏం జరుగుతోంది. అక్కడి జనానికి ఏం ఒరుగుతోంది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ‘ఇదిగో ఈ రెండు నెలల్లో ఇది చేశాం’ అని ఎవరూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితే ఉంది. కొత్తగా వేల, వందలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రకటనల గురించి ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. కనీసం బాధితులకు, క్షతగాత్రులకు మంత్రులిచ్చిన హామీల అమలుకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంటోంది. రెండు వారాల కిందట ఆకివీడు శివారు ధర్మాపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఘట నా స్థలంలోనే ఒక మహిళ.. చికిత్స పొందూతూ మరో మహిళ మృతి చెందారు. వీరి కుటుంబాల పరామర్శకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఆదుకుంటామని హామీలిచ్చింది. క్షతగాత్రుల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తామని మంత్రులు వాగ్దానాలు చేశారు. ఆనక ఎవరూ పట్టిం చుకోలేదు. చివరకు ఓ క్షతగాత్రుడు గత సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ‘సార్.. మమ్మల్ని, మా పిల్లల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెంటనే స్పందించి ఆ పిల్లలను నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో అప్పగించారు. ఇక్కడ విషయమేమిటంటే.. స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు వెళ్లి ఇచ్చిన హామీలు కూడా నెరవేరని స్థితిలో బాధితులు ఏలూరు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకోవడం. ఒకరిద్దరి బాధితులకు సంబంధించిన సహాయ కార్యక్రమాలపైనే పాలకుల స్పందన ఇలా ఉండటం ఒకింత విమర్శలకు తావి చ్చింది. ఇదొక్క ఘటనే కాదు.. జిల్లాలో ఇటీవల మంత్రులు వెళ్లి అక్కడి జనానికి ఇస్తున్న చిన్నపాటి హామీలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యాయో లేదోనన్న పరిశీలన ఇప్పటివరకు ఏ నేత కూడా చేస్తున్న దాఖలాలు లేవు. ఏదో వచ్చామా.. తిరిగామా.. వెళ్లామా.. అన్న తీరు కాకుండా మా గోడు కాస్త పట్టించుకోండంటూ సామాన్య జనం వేడుకుంటున్నారు. వింటున్నారా పాలకులూ! కావూరి ఎక్కడ? రెండుసార్లు ఎంపీగా గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను, ముఖ్యంగా ఏలూరు వాసులను ఎప్పటికీ మరచిపోలేను.. అంటూ మొన్నటివరకు బీరాలు పలికిన కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పుడెక్కడున్నారు.. కనీసం మచ్చు కు కూడా కానరావడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయనకు వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టా రు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన తొలినాళ్లలో సమైక్య ఉద్యమ సారధిగా హడావుడి చేసిన ఆయన కేంద్రమంత్రి తాయిలం దక్కగానే ప్లేటు ఫిరాయించడం, చివరివరకు పదవిని అనుభవించి ఎన్నికల సమయం వచ్చేసరికి కాంగ్రెస్ను కాదనుకుని బయటకు వచ్చేయడం అందరికీ తెలిసినవే. రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేసిందని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అదే విభజన అంశానికి మద్దతిచ్చిన బీజేపీలో చేరడం కేవలం ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమే అన్నది బహిరంగ రహస్యం. సరే.. ఆయన ప్రయోజనాలు, పార్టీల మార్పిడి ఎలా ఉన్నా పదేళ్లు ఆదరించిన ఏలూరుకు ఇటీవలికాలంలో పూర్తిగా రావడం మానేశారు. చివరకు నగరంలోని మోతేవారి తోటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని రెండు నెలల కిందటే ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఎటూ ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి జనం కొత్త పాలకులపైనే ఆశగా చూస్తున్నారు. మరి పదేళ్ల పాటు కావూరినే నమ్ముకుని హల్చల్ చేసిన క్యాడర్ పరిస్థితి ఏమిటో? దుందుడుకు ఎమ్మెల్యేకి సీఎం క్లాస్ గెలిచేవరకే పార్టీలు.. రాజకీయాలు.. ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. అంటే ఎన్నికల్లో తనకు ఓటేసిన వారికి, వేయని వారి కూడా తానే ఎమ్మెల్యే. ఈ కనీస స్పృహ కూడా లేని ఒకాయన ఎమ్మెల్యే అయిన తర్వాత వేరే పార్టీ వాళ్లు కనిపిస్తే చాలు ఎగబడి, కలబడి గొడవ చేస్తున్నారట. అంతే కాదు అధికారులను కూడా నోటికొచ్చినంత మాట్లాడేస్తున్నారట. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు నేతకు గట్టిగా క్లాస్ పీకారట. ‘జాగ్రత్త.. ఆఫీసర్స్తో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ అని తెలిసింది. మరోసారి ఇలాంటివి నా దృష్టికొస్తే ఊరుకోను’ అని గట్టిగానే మందలించారట. మరి ఇప్పటికైనా సదరు నేతలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
'దేశానికే కాదు... కుటుంబానికి ఏమీ చేయలేదు'
తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు ఆరోపించారు. శనివారం కర్నూలులో జరిగిన బీజేపీ పార్టీ సమావేశాలకు కావూరి సాంబశివరావు హాజరైయ్యారు. కావూరి సాంబశివరావు ఈ సందర్భంగా కాంగ్రెస్ సోనియాగాంధీపై నిప్పులు చెరిగారు. దేశానికే కాదు సొంత కుటుంబానికి కూడా ఏమీ చేసుకోలేక పోయారని కావూరి... సోనియాగాంధీని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. ఆ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబుతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరైయ్యారు. -
బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావు
భీమవరం: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో బిజెపిలో చేరారు. భారత్ విజయ్ బహిరంగ సభా వేదికపైకి వచ్చిన కావూరి మోడీని భారీ పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ దేశానికి ప్రధాని కాగల అర్హత మోడీకి ఉందన్నారు. దీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన కావూరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని అయోమయ స్థితిలో ఆయన కొంతకాలం ఉన్నారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నించి విరమించుకున్నట్లు తెలిసింది. చివరకు ఈరోజు ఆయన బిజెపిలో చేరారు. -
బీజేపీలోకి కావూరి జంప్!
-
బీజేపీలోకి కావూరి జంప్!
ఏలూరు : దీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు బీజేపీలోకి జంప్ కానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్పై అసంతృప్తిగా ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని అయోమయావస్థలో కావూరి చిక్కుకున్నారు. టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ నేతలు అడ్డు తగలటంతోగే బీజేపీ వైపు చూసినట్టు వార్తలొచ్చాయి. అప్పట్లో బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా... టీడీపీతో పొత్తు కారణంగా అది సాధ్యం కాలేదని సమాచారం. దాంతో ఆయన చాలారోజులుగా సైలెంట్గా వున్నారు. తాజాగా కావూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మే 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కావూరి ఏలూరు నుంచి భారీ ర్యాలీగా వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా ఈసారి ఎన్నికలకు కావూరి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కావూరి బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపారు కూడా. ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆమె రాజంపేట నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు'
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో చాలామంది వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యనించారు. కావూరి ...బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశంసించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీజేపీ ఇప్పటివరకూ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయకపోవటానికి కారణం ఏంటో చెప్పాలని సుర్జీవాలా డిమాండ్ చేశారు. ప్రజలను విడదీయటమే బీజేపీ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. కాగా రాష్ట్ర విభజనకు నిరసనగా కావూరి సాంబశివరావు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈమేరకు కావూరి ఆపార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. -
కావూరి రూటే సఫరేటు
-
అప్పుడే కొత్త పల్లవి అందుకున్న కావూరి
కేంద్రమంత్రి పదవికి నిన్న రాజీనామా చేశారో లేదో అప్పుడే కావూరి సాంబశివరావు కొత్త పల్లవి అందుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ సమర్థవంతమైన నాయకుడని అభివర్ణించారు. గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధితో మోడీ సత్తా ఏంటో నిరూపించుకున్నారని కావూరి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొద్ది పాటి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానాలేవి పెద్దగా ప్రజలపై ప్రభావం చూపలేదని కావూరి ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరి తనను తీవ్రంగా కలచివేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి కావూరి గురువారం రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కాగా రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఇప్పటికే ఆ పార్టీలోని మహామహులంతా ఇప్పటికే జంపింగ్ రాగం జపిస్తూ ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఆ క్రమంలో కావూరి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు కావూరి రాకను అడ్డుకున్నారు. దాంతో మరో పార్టీ చూసుకో అంటూ కావూరికి చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చారు. దాంతో కావూరి కమలం పార్టీలో వెళ్లాలని చూస్తున్నారు. అందులోభాగంగానే కావూరి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారని సమాచారం. -
కావూరి రాజీనామా.. ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేయబోనని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, ఏ పార్టీలోకి వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఆయన గురువారం ఉదయం పదిగంటలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆయన వెంటనే రాష్ట్రపతికి ఆ లేఖను పంపారు. రాష్ట్రపతి దానిని ఆమోదించారు. విభజన తీరు తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన ప్రతి అంశాన్ని టేబుల్ ఐటంగానే కేబినెట్ ముందుకు తెచ్చారని, అప్రజాస్వామికమైన ఈ నిర్ణయాలను తాను సమర్థించబోనని ప్రతి కేబినెట్ సమావేశంలో సూచించినట్టు అందులో తెలిపారు. రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఎన్నోమార్లు వ్యక్తిగతంగానూ కలసి విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేశారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపాలని కేబినెట్లోనూ, పార్లమెంట్లోనూ ప్రయత్నించానన్నారు. 20 రోజుల కిందటే రాజీనామా చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైందని చెప్పారు. కొత్త రాష్ట్రానికి అభివృద్ధి నిధుల కోసం, పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్, హైదరాబాద్ యూటీ... ఇలా పలు విషయాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామన్న ఉద్దేశంతోనే కేబినెట్లో కొనసాగినట్లు తెలిపారు. తన పనితీరు బాగుందని, రాజీనామా చేయవద్దని ప్రధాని వారించారని తెలిపారు. తాను కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తనకెలాంటి హామీ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జైరాం, కావూరి మాటల యుద్ధం కావూరి రాజీనామాపై జైరాం రమేశ్ మాట్లాడుతూ... కావూరికి వ్యాపార ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలేవీ లేవని దుయ్యబట్టారు. కేబినెట్ నిర్ణయాలు వెలువరించేందుకు జైరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. కావూరి రాజీనామా చేశారని విలేకరులు చెప్పగానే.. పార్టీని కూడా వీడారేమోననుకున్న కావూరిపై విరుచుకుపడ్డారు. ఆయన అప్పులపై ప్రశ్నించకుండా ఉండేందుకు బీజేపీని ఆశ్రయించినట్టున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, కావూరి వంటి వారు కాంగ్రెస్ నుంచి పూర్తి లబ్ధిపొంది ఆ తరువాత కాంగ్రెస్ను వదిలేశారని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారని విలేకరులు చెప్పడంతో సర్దుకుని... ‘‘ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయడం బాధాకరం. పోలవరం గురించి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గురించి పోరాటం చేశారు..’’ అని చెప్పారు. జైరాం వ్యాఖ్యలు తెలుసుకున్న కావూరి సాయంత్రం మళ్లీ విలేకరుల సమావేశం నిర్వహించి నిప్పులు కురిపించారు. దమ్మిడీ విలువ లేని జైరాం లాంటి వారి వల్లే పార్టీకి ఈ గతిపట్టిందని విమర్శించారు. జీవితం లో ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపడనివారు, ఏవో నాలుగు పుస్తకాల్లోని విషయాలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇలాంటివారివల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్కసీటూ గెలవని పరిస్థితికి చేరిందని చెప్పారు. ఇలాంటి వాళ్లను నమ్మితే వందేళ్లయినా పార్టీ తిరిగి అధికారంలోకి రాదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల పదేళ్లుగా ఇన్ఫ్రా కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సన్నాసులు ఎందరున్నారో చూశాక పార్టీలో కొనసాగే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. -
కావూరి ‘సొంత’బాట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని లెక్కచేయకుండా.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా సొంత లాభమే లక్ష్యంగా చివరివరకూ రాజకీయం నడిపించిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎట్టకేలకు పదవులను త్యజించారు. తాజా అడుగు కూడా తన భవిష్యత్ కోసమే వేయడం విశేషం. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఆయన సన్నిహితులే పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు అండతో బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతోనే ఆయన కాంగ్రెస్ను వీడుతున్నట్లు తేటతెల్లమవుతోంది. వరుస ఓటముల నుంచి... కృష్ణా జిల్లాలో వరుస ఓటములతో అల్లాడుతున్న కావూరి సాంబశివరావుకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు పార్లమెంటరీ సీటును ఇప్పించారు. 2009 ఎన్నికల్లోనూ కావూరితో ఇక్కడి నుంచి పోటీ చేయించారు. చివరకు కావూరి మాత్రం పదవే పరమార్థంగా వ్యవహరిస్తూ ప్రజల మనోభీష్టాలను తుంగలో తొక్కారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకున్న సమయంలో ప్రజలు చేపట్టిన సమైక్యాం ధ్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. ఫలితం లేకపోవడంతో అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అధిష్టానం పిలిచి మాట్లాడటంతో వెనక్కి తగ్గారు. అనంతరం విభజనకు కేంద్రం వడివడిగా అడుగులు వేసింది. దీనికి కొద్దిరోజుల ముందే కావూరికి కేంద్ర క్యాబినెట్లో జౌళిశాఖను కట్టబెట్టింది. అప్పటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం రథసారధిగా వ్యవహరించిన కావూరి మంత్రి పదవి వచ్చిన తరువాత సమైక్యాంధ్ర విషయాన్ని పక్కన పెట్టేశారు. ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా... సీమాంధ్ర అంతటా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా కావూరి పట్టించుకోలేదు. జిల్లాకు వచ్చినప్పుడు అనేకసార్లు ఆయన్ని సమైక్యవాదులు, ప్రజలు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కావూరి మాత్రం రాజీనామా చేయకపోవడం ఉద్యమాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి.. ఉద్యమకారులపై దుర్భాషలాడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. చివరకు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత కూడా కావూరి పదవిని వదల్లేదు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసినా ఈయన మాత్రం పదవిని పట్టుకుని వేలాడారు. ఏ దశలోనూ రాష్ట్ర విభజన విషయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేయలేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విభజన నిర్ణయం జరిగిపోయి ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కావూరి రూటు మార్చారు. మంత్రి పదవిని అనుభిస్తూనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీలో చేరటం ద్వారా తిరిగి ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి పావులు కదిపారు. కానీ జిల్లా టీడీపీ నేతలంతా ఆయనను ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో చంద్రబాబు వెనుకడుగు వేశారు. అయితే నేరుగా టీడీపీలో చేర్చుకోకుండా బీజేపీలోకి పంపించి ఆ పార్టీ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదురుతుందనుకున్న నేపథ్యంలో ఆయనకు వీలైతే ఏలూరు లేకపోతే కృష్ణాజిల్లా మచిలీపట్నం సీటు ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతోనే ఆయన పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పణంగా పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్న కావూరి ఆ తర్వాత ఉద్యమాన్నే కించపరిచి ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మారారు. చివరివరకూ కేంద్ర మంత్రి పదవిని అనుభవిస్తూ తన రాజకీయ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని గురువారం రాజీనామా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడుతూనే సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచిన కావూరి చివరకు రాష్ట్రాన్ని విడగొట్టడంలో తనవంతు పాత్ర పోషించిన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్వాదిగా బీజేపీని, చంద్రబాబును వ్యతిరేకించిన కావూరి చివరకు రాజకీయ భవిష్యత్ కోసం వారి పంచనే చేరుతుండటం గమనార్హం. -
కావూరికి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం
-
దమ్మిడీకి పనికిరానివాళ్లు నాకు నీతులు చెప్తారా?
న్యూఢిల్లీ: తనకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి జైరాం రమేష్పై ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్మిడీకి పనికిరానివాళ్లు నాకు నీతులు చెప్తారా అంటూ ధ్వజమెత్తారు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని హైకమాండ్ దగ్గర కుప్పిగంతులు వేస్తున్నారంటూ దుయ్యబట్టారు. దమ్ముంటే జైరాం రమేష్ లోక్సభకు పోటీచేసి గెలవాలని కావూరి సవాల్ విసిరారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి జైరాం రమేష్ లాంటి నాయకులే కారణమన్నారు. వీరిని హైకమాండ్ ప్రోత్సహించరాదని సూచించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన కావూరి సాంబశివరావుపై జైరాం రమేష్ అంతకుముందు విమర్శలు గుప్పించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి కావూరి ఎంతో మేలు పొందారని గుర్తు చేశారు. -
కాషాయం కట్టడమేనా?
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజకీయాల్లో 'దూకు'డు ఆట రసపట్టు మీదుంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబకడంతో సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజకీయంగా సురక్షిత పార్టీలకు చేరుకుంటున్నారు. సమైక్యాంధ్ర వీరుడి ముసుగులో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న కావూరి సాంబశివరావు కాంగ్రెస్లో లాభం లేదనుకుని కొద్దికాలం నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. చేతులు కాలాక...ఆకులు పట్టున్నట్లుగా ఆయన రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేసినట్లు చెప్పకు రావటం విశేషం. ఈ మేరకు కావూరి గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించుకున్నారు. కాగా రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రజలు రాజీమానా చేయమని డిమాండ్ చేసినా కావూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డగించినా లెక్కచేయలేదు. రాష్ట్ర విభజన జరిగిపోతున్న సమయంలోనూ విభజన జరగదని, పార్లమెంటులో తన సత్తా చూపిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలతో అందరినీ గందరగోళంలో పడేశారు. చివరికి కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజనకు అంగీకరించి రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చి మరింత చులకనయ్యారు. పార్లమెంటులోనూ రకరకాల డ్రామాలు ఆడారు. చివరికి విభజన జరిగిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ పరాజయం ఖాయమని సర్వేల్లో వెల్లడి కావడంతో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనాన్ని ఎలాగోలా మభ్యపెట్టేందుకు రంగంలోకి దిగారు. రాజీనామా అస్త్రాన్ని తెరమీదకు తెచ్చి ఇందు కోసం తమ నియోజకవర్గ కార్యకర్తలతో మంతనాలు జరిపి నేనేం చేయాలో మీరే చెప్పండంటూ లేఖలు సంధించారు. అయితే రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరాలన్నది తేల్చుకోకపోవడంతో ఆయన ఇప్పటి వరకు ఆగారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఏ పార్టీలోకి మారాలో తెలియక కొద్దిరోజులు డైలమాలో పడ్డారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా ఏలూరు సీటు కేటాయించేందుకు ఆ పార్టీ హామీ ఇవ్వకపోవడంతో కావూరి వెనుకడుగు వేశారు. ఇక సైకిల్ ఎక్కాలనుకున్నా....స్థానిక నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల చంద్రబాబు కావూరిని తమ పార్టీలోకి ఆహ్వానించలేకపోయారు. దీంతో కావూరి ఇక దారేదీ లేక కాషాయం వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిజెపి అగ్రనేతలతో మాటామంతి జరిపినట్లు మాత్రం మీడియాలో కథనలు వెలువడ్డాయి. చివరికి బీజేపీతో లింకు కుదరడంతో అందులోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
'విభజన తీరు నచ్చకే... రాజీనామా'
-
కావూరికి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం
కేంద్ర మంత్రి పదవికి ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరు సాంబశివరావు రాజీనామా చేయడంపై ఆయన మంత్రి వర్గ సహచరుడు, జీవోఎం సభ్యుడు జై రాం రమేష్ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు.గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావూరి సాంబశివరావుకు ఓ సిద్దాంతమంటూ లేని జై రాం రమేష్ ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని విమర్శించారు. విభజన అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నప్పుడు కావూరి ఎప్పుడూ వాకౌట్ చేయలేదని జై రాం రమేష్ గుర్తు చేశారు. సూడాన్లో పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. దాంతో భారత్ ప్రభుత్వానికి కావూరి వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి కావూరి ఎంతో మేలు పొందారన్నారు. కావూరి రాజీనామాపై స్పందించాలని జై రాం రమేష్ను విలేకర్లు కోరగా ఆయన పై విధంగా స్పందించారు.అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జై రాం రమేష్ స్పందిస్తూ... దుగరాజు పట్నంలో వేల ఏకరాలు స్థలాలు పురందేశ్వరీ కొనుగోలు చేసిందంటూ ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ను పక్క పెట్టడంపై తాను తీవ్రంగా కలత చెందానని ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కావూరి ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన రాజీనామా లేఖను స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్కు కావూరి అందజేసిన సంగతి తెలిసిందే.కావూరి సాంబశివరావు టీడీపీలో చేరేందుకు సిద్ధపడగా, ఆపార్టీలో తలుపులు మూసుకుపోయాయి. దాంతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా
-
కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా
కేంద్ర మంత్రి పదవికి ఏలూరు లోక్సభ సభ్యుడు కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. కావూరి తన రాజీనామా లేఖను గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్కు స్వయంగా అందజేశారు. రాష్ట్ర విభజనే...పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్ పెండింగ్లో పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఈ సందర్భంగా ప్రధానితో కావూరి పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి కావూరి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలను ముమ్మరం చేశారు. కావూరి రాకను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు మాత్రం కావూరి రాకను పూర్తిగా వ్యతిరేకించారు. ఒకానొక క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబు నాయుడుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సదరు జిల్లా నాయకుల మాటలకు తలవంచక తప్పలేదు. దాంతో చంద్రబాబు మరో పార్టీ చూసుకో అని కావూరికి ఓ సలహా పడేశారంటా. దాంతో బీజేపీలోకి వెళ్లేందుకు కావూరి ఇప్పటికే తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారని సమాచారం. అయితే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దగ్గుబాటి పురందేశ్వరీ ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
అసమ్మతి ఆనవాయితీ
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. అక్కడ ప్రధాన పార్టీల నాయకులకు అసమ్మతి బెడద, వర్గపోరు ఆనవాయితీగా వస్తోంది. దీనికితోడు ఇక్కడ ఒకసారి ఓడిస్తే మరో ఎన్నికలో సానుభూతితో గెలిపించే సంప్రదాయం కూడా ఓటర్లలో ఉంది. ఫలితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ నియోజకవర్గం ‘గన్’వరంగా గుర్తింపు పొందింది. 1994 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గద్దె రామ్మోహన్రావు ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. గద్దె చేతిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు పరాజయంపాలయ్యారు. అప్పట్లో సానుభూతి ఓట్లతో గద్దె గెలవడంతో ఓటమిపాలైన బాలవర్థనరావు ఉడా చైర్మన్గా నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం గద్దె తిరిగి టీడీపీలో చేరడంతో 1994 నుంచి 1999 వరకు గద్దె, దాసరి రెండు వర్గాలుగా గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ఎంపీగా గద్దెను పంపి దాసరికి గన్నవరం సీటు కేటాయించి వర్గ వైషమ్యాలను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. 1999 ఎన్నికల్లో అప్పటి ఎంపీ కావూరు సాంబశివరావు మద్దతుతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పొంది గన్నవరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముద్దరబోయినకు అప్పటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు. కాంగ్రెస్లో అసమ్మతికితోడు ప్రజల్లో సానుభూతి తోడుకావడంతో 1999 ఎన్నికల్లో దాసరి విజయం సాధించారు. ఓటమి పొందిన ముద్దరబోయిన నియోజకవర్గంలో మకాం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. అంతకుముందు రెండు ఎన్నికల నుంచి చెల్లాచెదురైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన ముద్దరబోయినకు 2004 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించలేదు. అధిష్ఠానం కడియాల బుచ్చిబాబును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేయడంతో బిత్తరపోయిన ముద్దరబోయిన కాంగ్రెస్ రెబల్గా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్లో చేరిపోయారు. 2009 ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించినప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసిన దాసరి చేతిలో పరాజయం పాలుకాక తప్పలేదు. తాజాగా.. గన్నవరంలో గతం నుంచి కాంగ్రెస్, టీడీపీ నువ్వానేనా అనే రీతిలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది. వైఎస్సార్సీపీ పట్టు సాధించింది. ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మాత్రం అసమ్మతి అనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్లు ఇద్దరూ టికెట్ నాది అంటే నాది అంటూ పంతాలకు పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి సామాజికవర్గానికి చెందిన పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగిలిన వారు అసమ్మతి అనవాయితీని కొనసాగిస్తూ రెబల్ అవుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
కైకలూరు టీడీపీలో ముదురుతున్న ముసలం
టిక్కెట్ల కలకలం ఇంటి సమస్యలే జయమంగళను దూరం చేస్తున్నాయా? తెరపైకి కొత్త ముఖాలు వ్యతిరేకిస్తున్న మాగంటి, జయమంగళ అనుచరగణం కైకలూరు, న్యూస్లైన్ : కైకలూరు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కలకలం మొదలైంది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పార్టీలో చేరతారని వస్తున్న ఊహాగానాలపై లోక్సభ సీటు ఆశిస్తున్న మాగంటి బాబు వర్గం కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. తాజాగా జిల్లాలోని తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కైకలూరు మినహా మిగతావి యథాతథంగా పోటీలో ఉండే అవకాశం ఉందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనం కైకలూరు నియోజకవర్గ పార్టీ వర్గాల్లో శుక్రవారం కలకలం రేపింది. నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు ఈ అంశంపై స్థానిక మాగంటి బాబు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిప్పులు చెరిగారు. టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే బీజేపీలో చేరిన యెర్నేని సీతాదేవికి కైకలూరు సీటు కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కార్యకర్తలు కుండబద్దలు కొట్టినట్టు చె ప్పారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జయమంగళ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, కార్యకర్తల్లో విభేదాలపై అధిష్టానం ఈ సారి సీటు కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తుందనే అనుమానం కార్యకర్తల్లో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అవకాశం దొరికితే పోటీ చేయడానికి మరో ఇద్దరు నేతలు కాచుకు కూర్చున్నారు. సీటివ్వకపోతే వ్యతిరేకిస్తాం... పత్రిక కథనంతో కంగుతున్న నాయకులు జయమంగళకు సీటు కేటాయించకపోతే వ్యతిరేకిస్తామని శుక్రవారం టీడీపీ ఏలూరు లోక్సభ పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసేదిలేక పత్రిక కథనాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని నచ్చచెప్పి పంపించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పెన్మెత్స త్రినాథరాజు, వల్లభనేని శ్రీనివాస చౌదరి, కొత్తూరు విఠల్, రేమల్లి విజయబాబు, నాయకులు సమావేశంలో మాట్లాడుతూ మాగంటి, జయమంగళకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. -
కావూరి కంపెనీపై చర్యలకు ఎస్బీఐ సిద్ధం!
-
కావూరి కంపెనీపై చర్యలకు ఎస్బీఐ సిద్ధం!
ముంబయి : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కంపెనీపై చర్యలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమంటూ మింట్ పత్రికలో ఒక వార్తా కథనం వెలువరించింది. ప్రోగెస్సివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలో పేరుతో తీసుకున్న మొండి బకాయిలు చెల్లించకపోవడంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రోగెస్సివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ పేరిట రుణం తీసుకోగా, రూ.350 కోట్లు ఎస్బీఐకి బకాయిపడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీలో కావూరి సాంబశివరావుకు 41 శాతం వాటా ఉంది. ఇప్పటికే ప్రోగెస్సివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ బకాయిలపై ఈసీకి బ్యాంకర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈకంపెనీ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.49కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు నుంచి రూ.47కోట్లు, అలహాబాద్ బ్యాంకు నుంచి రూ.42కోట్లు అప్పు తీసుకున్నట్లు బ్యాంకర్స్ అసోసియేషన్ ఆరోపించింది. -
టీడీపీ లో సెగలు
చిచ్చురేపుతున్న కాంగ్రెస్ నేతలు వారికే అగ్రతాంబూలం ఇస్తున్న అధిష్టానం ఘెల్లుమంటున్న తమ్ముళ్లు మాగంటి బాబు, ఇతర నేతల్లో తీవ్ర అసంతృప్తి జిల్లాలో వెలిసిపోరున పసుపు జెండాకు టీడీపీ అధినాయకత్వం కొత్త రంగు అద్దుతోంది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పెద్దలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. రాష్ర్ట విభజనకు సహకరించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ నేతలను పిలిచి మరీ పచ్చకండువా కప్పుతున్నారు. నియోజకవర్గాలు, పట్టణాల్లో ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలసి కాపురం చేయూలంటూ తమ్ముళ్లకు హుకుం జారీ చేస్తున్నారు. అధినేత తీరును పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓటర్లు ఆదరించకపోరునా.. పదేళ్లుగా అధికారానికి దూరమైనా.. ఏదో ఒక రోజున అవకాశం రాకపోతుందా అన్న దింపుడు కళ్లం ఆశలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను తన స్వార్థం కోసం అధినేత అధఃపాతాళానికి తొక్కేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అనే సామెతకు తెలుగుదేశం పార్టీ అసలైన అర్థం చెబుతోంది. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నుం చి వచ్చే నాయకులకు అధిష్టానం పెద్దపీట వేస్తుం డటం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది. ప్రజాభిమానం కోల్పోరు.. అన్నిదారులూ మూసుకుపోవడంతో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్లో సూపర్ సీనియర్నని చెప్పుకునే కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, భీమవరం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కారుమూరి నాగేశ్వరరావు సైతం గత్యంతరం లేక అదే బాటలో పయనిస్తున్నారు. వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద సీట్లను రిజర్వు చేసుకుని టీడీపీలోకి వస్తుండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. కిందిస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ అధినేత తీరుపై విరుచుకుపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా చంద్రబాబు వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు. మాగంటి బాబు ఆగ్రహం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తుండటం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబు కు మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలకంగా పనిచేసిన తనను కాదని కావూరికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీని నేరుగా తిట్టలేక కావూరిపై విరుచుకుపడ్డారు. ఆయనవల్లే రాష్ట్రం విడిపోయిందని, కావూరి జెడ్పీటీసీగా కూడా గెలవలేరని బాబు విమర్శించారు. ఆయన టీడీపీలోకి వస్తే సీమాంధ్రలో పార్టీకి నష్టం తప్పదని కుండబద్దలు కొట్టారు. మాగంటి నేరుగా కావూరిపై విమర్శలు చేయడానికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం ఏలూరులో నిర్వహించిన సమావేశంలో మాగంటి గెలిచే అవకాశం ఉంటే టీడీపీ నాయకులు తనను ఎందుకు రమ్మని కోరతారని కావూరి అనటం మాగంటి వర్గీయులకు కోపం తెప్పించింది. దీంతో వారంతా కావూరిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కావూరిని పార్టీలోకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కావూరి టీడీపీలో చేరేందుకు ఉన్నత స్థాయిలో లాబీ నడుపుతున్నారు. ఘెల్లుమంటున్న గూడెం టీడీపీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరడాన్ని అక్కడి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొట్టుకు తాడేపల్లిగూడెం సీటిస్తే తాము పనిచేసేది లేదని అక్కడి నేతలు, కార్యకర్తలు హెచ్చరికలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముళ్లపూడి బాపిరాజు ఈ విషయంపై అధినేత వద్దే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోకుండా వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించడంతో స్థాని క నాయకత్వం డోలాయమానంలో పడింది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని కొత్త వారికి సీటిస్తే సహాయ నిరాకరణ చేయాలనే యోచనలో అక్కడి కీలక నేతలున్నారు. భీష్మిస్తున్న భీమవరం నేతలు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొన్నటివరకూ తమను ఇబ్బందులు పెట్టిన వారి కోసం ఇప్పుడు ఎలా పనిచేస్తామని కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలకు నేతల వద్ద సమాధానం లేకుండాపోయింది. కొత్తవారితో సర్దుకుపోవాలని చంద్రబాబు చెబుతున్న మాటలు వారి చెవికెక్కడంలేదు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకూ పార్టీని నడిపించిన వారి కోసం పనిచేయాలా, కొత్తగా వచ్చిన బయట నేతల కోసం పనిచేయాలో తెలియక కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నారు. -
'కావూరికి ద్వారాలు తెరిచి లేవు'
ఏలూరు : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో రావటాన్ని ఆపార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావూరికి టీడీపీ ద్వారాలు తెరిచి లేవని టీడీపీ నేత, మాజీమంత్రి మాగంటి బాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ కావూరిని టీడీపీలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారుమారు అవుతాయని ఆయన హెచ్చరించారు. జరగబోయే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో తన గెలుపు ఖాయమని మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే యోచనలో ఉన్న ఆయన మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నాయకులతో బయటపెట్టించారు. ఇదే సందర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపించారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ చేయూలని సూచించారు. చివరకు ఎక్కువ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు సమాచారం. -
కావూరి చూపు.. టీడీపీ వైపు
ఏలూరు, న్యూస్లైన్: మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయూనికి వచ్చిన ఆయన ఆది వారం వట్లూరు సమీపంలోని సీతారామ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నా యకులతో బయటపెట్టించారు. ఇదే సం దర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియో జకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపిం చారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయా లి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ ేయూలని సూచించారు. చివరకు ఎక్కు వ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు పేర్కొన్నారు. ఇంట్లో సమాలోచనలు.. సభలో హైడ్రామా అభిప్రాయ సేకరణకు ముందే కావూరి ఏలూరులోని తన క్యాంపు కార్యాల యంలో అనుయూయులతో మంతనాలు సాగించారు. సభలో ఎవరు, ఏం మాట్లాడాలనే విషయమై దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణరుుంచిన ప్రకారం వేదికపైకి సామాజిక వర్గాల వారీగా నాయకుల్ని పిలిచి మాట్లాడిం చారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ట్రస్టు ద్వారా లబ్ధి పొం దినవారే ఊకదంపుడు ప్రసంగాలు చేయ టం విమర్శలకు తావిచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, చావా రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గారపాటి రామసీత, తూతా లక్ష్మణరావు, ముసునూరి నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన కోసం కావూరి పనిచేశారని, ఆయన ఏ పార్టీవైపు నడిస్తే అటువైపు సాగుతామని కొందరు, ఏ పార్టీలో చేరినా మీ వెంట సాగుతామని ఇంకొందరు పేర్కొన్నారు. త్వరలోనే నిర్ణయం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కావూరి కాంగ్రెస్ పెద్దల అసమర్ధత కారణంగానే రాష్ట్రం విడిపోయిం దన్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రి పద వి ఇచ్చే విషయమై రాజీవ్గాంధీ నిర్ణయానికి కొందరు అడ్డుపడ్డారని ఆవేదన వ్య క్తం చేశారు. 2004లో మంత్రి పదవి రాలేదని బాధపడ్డానని, 2009లో మనోవేదనకు గురయ్యానని చెప్పారు. పార్టీ సిద్ధాం తాలకు అనుగుణంగా పనిచేసినా గౌరవం దక్కలేదని వాపోయూరు. త్వరలో అందరికీ సంతృప్తినిచ్చే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సమావేశంలో మాగం టి వీరేంద్రప్రసాద్ (బబ్బు), కలిపిండి అప్పారావు, పెరికే వరప్రసాదరావు, కొత్త సాంబశివరావు, బొమ్మి ప్రభాకర్, సైదు సత్యనారాయణ, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, పులి శ్రీరాములు, కారే బాబూరావు, కత్తి రాములు పాల్గొన్నారు. మాగంటి అనుచరుల ఆరా ఇదిలావుండగా, టీడీపీలోకి కావూరి రాకను వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అనుచరులు ఈ సభపై కన్నేసి ఉంచారు. సమావేశంలో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారనే విషయూలపై ఆరా తీశారు. -
కాంగ్రెస్ లో అసమర్ధ నాయకత్వం: కావూరి
-
కాంగ్రెస్ లో అసమర్ధ నాయకత్వం: కావూరి
ఏలూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితి కనిపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలలో కావూరి ఉన్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారేందుకు అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే తాను ఓ నిర్ణయం తీసుకుంటానని కావూరి అన్నారు. ఆ క్రమంలోనే వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాని కావూరి అన్నారు. కార్యకర్తలు ఒప్పుకుంటే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమర్ధవంతమైన నాయకుడు లేడని.. పార్టీ అసమర్థ నాయకత్వం ఉందని కావూరి ధ్వజమెత్తారు. మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు ఏలూరు నియోజకవర్గంలో జోరందుకున్నాయి. -
అసలు మతలబు ‘ఆత్మీయ’మేనా!
విజయవాడ: కొల్లేరువాసుల ఓట్లు వలలో పడ్డాయి.. ఎంపీ పదవి దక్కింది.. చివరి ఏడాదైనా అనుకున్న కేంద్రమంత్రి పదవి వరించింది.. పైకి ఎన్ని చెప్పినా ఐదేళ్లు పదవులను అనుభవించడం కూడా పూర్తయింది.. ఇంకేముంది అనుకోకండి.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజలు, కార్యకర్తల ‘ఆత్మీయత’ గుర్తొచింది. కొల్లేరు సమస్యలను పట్టించుకోకుండా, రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా కాలాన్ని వెళ్లబుచ్చే ప్రయత్నం చేసిన కావూరి మళ్లీ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తూ సరికొత్త వేషంతో ముందుకు వస్తున్నారు. ఆయన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు. ఎవరికోసం ‘ఆత్మీయ’ సమావేశం తన రాజకీయ భవితను నిర్ణయించుకునేందుకు ఏలూరులో కావూరి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏలూరు లోక్సభ పరిధిలోని కృష్ణా జిల్లాకు చెందిన కైకలూరు, నూజివీడు కాంగ్రెస్ శ్రేణులకు కబురు పంపించారు. నూజివీడులో ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వర్గమే బలంగా ఉండడంతో కావూరి పిలుపునకు అక్కడి నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదు. కైకలూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల్లోని తన సామాజికవర్గం నుంచి ఏలూరు ఆత్మీయ సమావేశానికి గణనీయంగానే జన సమీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో కావూరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో క్యాడర్, ప్రజల సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకుంటానంటూ ప్రతిపాదన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిని బట్టి తన రాజకీయం కోసమే ఈ సమావేశం ఉద్దేశమన్నది బహిరంగ రహస్యం. టీడీపీలోకి వస్తే మాగంటి ఎటాక్.. కాంగ్రెస్ గుర్తుతో పోటీచేస్తే సీటు గల్లంతయ్యే అవకాశం ఉందని భావించిన కావూరి కనీసం పోటీ ఇచ్చినా పరువు దక్కుతుందన్న ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం మొదలైంది. అదే జరిగితే ఇప్పటికే టీడీపీలో ఏలూరు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీమంత్రి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) నుంచి రాజకీయ ఎటాక్ తప్పేలా లేదు. గతంలో ఇద్దరు కాంగ్రెస్లో కొనసాగినా.. అటు తరువాత కాంగ్రెస్, టీడీపీలో చేరొకరు ఉన్నా వీరద్దరి రాజకీయం కొల్లేరు చుట్టూనే తిరిగేది. కొల్లేరువాసుల ఓట్లకు వలవేస్తే గెలుపు సాధ్యమనుకునే వీరిద్దరూ కొల్లేరు రాజకీయాన్ని కొన్నేళ్లుగా చక్కగా పండిస్తున్నారు. ఇప్పటికే మాగంటి ఏలూరు టీడీపీ ఎంపీ టిక్కెట్ తనదే అన్న ధీమాలో ఉన్నారు. ఇంతలో కావూరి ఆ టికెట్ తనుకుపోయి తమ నాయకుడికి కైకలూరు ఎమ్మెల్యే టిక్కెట్తో సరిపెడతారేమోననే భయం మాగంటి బాబు అనుయూయుల్లో మొదలైంది. దీంతో కావూరి టీడీపీలోకి వస్తే వ్యతిరేకించేందుకు మాగంటి సైన్యం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అటు కావూరితో స్నేహ సంబంధాలు, ఇటు మాగంటితో పార్టీ సంబంధాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుందని కైకలూరులో అప్పుడే గుసగుసలు మొదలుకావడం కొసమెరుపు. -
కావూరి కొత్త నాటకం నేనేం చేయాలి!
బహిరంగ లేఖలతో మభ్యపెట్టే యత్నం ఇప్పటికీ కేంద్ర పదవిని వదలని వైనం టీడీపీలో చేరేందుకు సన్నాహాలు మరో ఎత్తుగడగా ప్రజల గుసగుసలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ...’ అంటూ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎన్నికల తరుణంలో బహిరంగ లేఖల పేరుతో జనాన్ని మరోసారి బుట్టలో వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తాను చేసిన అభివృద్ధి పనులు, పార్లమెంటులో తన ప్రతాపం తదితర వివరాలతో ఆయన ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో చివర లైనులో ప్రజలు చెప్పినట్లు చేస్తానని, ఏంచేయాలో చెప్పాలని ఎంతో వినమ్రంగా వేడుకున్నారు. ఈ లేఖను కరపత్రాలుగా ముద్రించి ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గంలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నా రు. ఆ కరపత్రంపైఒక ఫోన్ నంబరు కూడా ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుండటం విశేషం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో జనం రాజీనామా చేయాలని అడ్డుకున్నా, ఘెరావ్ చేసినా, నెత్తీనోరూ మొత్తుకున్నా పదవిని వదలని ఆయన ఇప్పుడు అదే జనాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదట్లో సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పనిచేస్తున్న నేతగా బిల్డప్ ఇచ్చిన కావూరి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన తర్వాత ఆ ఉద్యమాన్నే ఎగతాళి చేసి మాట్లాడటం ఎవరూ మరచిపోలేని విషయం. సమైక్యవాదులు, జనాన్ని వెదవలు, దరిద్రులంటూ ఇష్టానుసారం తిట్టిన కేంద్ర మంత్రివర్యులు ఎన్నికలు ముంచుకురావడంతో ఇప్పుడు వారి కే లేఖలు పంపించి ఎంతో వినమ్రంగా ఏంచేయాలో చెప్పండంటూ ఆడుతున్న నాటకం వెగటు పుట్టించేలా ఉందని ఆయన అనుయాయులే అనుకుంటున్నారు. ప్రజలను పట్టించుకోక..పదవిని వీడక.. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రజలు రాజీమానా చేయమని డిమాండ్ చేసినా మంత్రి కావూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డగించినా లెక్కచేయలేదు. రాష్ట్ర విభజన జరిగిపోతున్న సమయంలోనూ విభజన జరగదని, పార్లమెంటులో తన సత్తా చూపిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలతో అందరినీ గందరగోళంలో పడేశారు. చివరికి కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజనకు అంగీకరించి రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చి మరింత చులకనయ్యారు. పార్లమెంటులోనూ రకరకాల డ్రామాలు ఆడారు. చివరికి విభజన జరిగిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఇంకా కేంద్ర పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనాన్ని ఎలాగోలా మభ్యపెట్టేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆయన పంపిణీ చేయిస్తున్న బహిరంగ లేఖలు కొద్దిరోజులుగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. ఏలూరు నుంచే పోటీకి తహతహ కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే మంత్రి కావూరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖల భాగోతానికి తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఏలూరు లోక్సభ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే అభిప్రాయనికి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో జనాన్ని మభ్యపెట్టేందుకు సర్వదా ప్రయత్నిస్తున్నా రు. ఏలూరు ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశానని.. ప్రజలకే కట్టుబడి ఉన్నాననే ప్రచారాన్ని ముమ్మరంగా చేయిస్తున్నారు.ప్రజల్లో తనపై తీవ్రంగా ఉన్న ఆగ్రహాన్ని కొంతవరకైనా చల్చార్చి టీడీపీ తరఫున ఎంపీ గా బరిలోకి దిగాలనేది ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది. -
కావూరి కోలాటం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పదవే పరమార్థంగా పావులు కదుపుతున్న కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశంలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీల్లో కల్లోలం రేపుతున్నాయి. ఎలాగైనా కావూరిని పార్టీలోకి తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తుండటం కొందరు నేతలకు మింగుడు పడటంలేదు. కావూరిపై వ్యతిరేకతను వ్యక్తం చేసినా అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతుండటంతో టీడీపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్లో లాభం లేదనుకుని.. సమైక్యాంధ్ర వీరుడి ముసుగులో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న కావూరి కాంగ్రెస్లో లాభం లేదనుకుని కొద్దికాలం నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. చివరికి తెలుగుదేశంతో లింకు కుదరడంతో అందులోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 13వ తేదీ లోపు కాంగ్రెస్కు, మంత్రి పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మాగంటి, చింతమనేని అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో చేరితే ఏలూరు లోక్సభ స్థానం నుంచి కావూరిని గానీ ఆయన కుమార్తెను గానీ బరిలో దింపేం దుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఊరూవాడా గుప్పుమంటోంది. కావూరి అనుచరులూ ఈ విషయాన్ని ఇప్పటికే అందరికీ చెప్పుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మింగుడు పడటంలేదు. కావూరి చేరితే తమ సీట్లకు ఎసరు వస్తుందనే భయంతో వారు గంగవైలెత్తుతున్నారు. ఇద్దరికీ ప్రత్యామ్నాయాలు మాగంటి బాబు ఏలూరు లోక్సభ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగేం దుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ రెండోసారి దెందులూరు నుంచి పోటీ చేయడానికి ఎప్పటినుంచో రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారు కావూరిని చేర్చుకోవద్దని అధిష్టానానికి గట్టి సంకేతాలు పంపించారు. వాటిని పట్టించుకోని చంద్రబాబు ఇద్దరికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినట్లు తెలిసింది. మాగంటి బాబును దెందులూరు అసెంబ్లీకి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను నూజివీడులో పోటీ చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమ సీట్లకు ఎసరు పెట్టిన కావూరిపై నిప్పులు కక్కుతూనే ఇద్దరూ కూడా ఒకరినొకరు విభేదించుకుంటున్నారు. కావూరి రాక ఖాయమైతే అనివార్య పరిస్థితుల్లో దెందులూరు నుంచి పోటీ చేయడానికి మాగంటి బాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభాకర్ మాత్రం ఇందుకు ససేమిరా ఒప్పుకోవడంలేదు. తాను దెందులూరును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెబుతున్నట్టు తెలిసింది. కావాలంటే మాగంటి బాబునే కైకలూరు అసెంబ్లీకి పంపించాలని ఆయన వర్గం సూచిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రభాకర్పై మాగంటి బాబు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాజకీయం రసకందాయం మాగంటి బాబు తొలుత దెందులూరు నియోజకవర్గం సీటును తన కుమారుడు రాంజీకి ఇప్పించాలని ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఏలూరు పార్లమెంటును చూసుకోమనడంతో దెందులూరును వదిలేశారు. ఇప్పుడు కావూరి వ్యవహారంతో మళ్లీ దెందులూరుకు మాగంటి పేరును ప్రతిపాదించడం, ప్రభాకర్ దాన్ని వ్యతిరేకించడంతో తెలుగుదేశం రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఏలూరు పార్లమెంటు, దెందులూరు అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందనే అంశం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. కావూరి విషయంలో కొందరు అనుకూలంగా ఉండగా, మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. మాగంటి బాబు, ప్రభాకర్ మధ్య గొడవ సర్దుమణగాలంటే కావూరిను చేర్చుకోకపోవడమే మంచిదని పార్టీలోని సీనియర్లు వాదిస్తున్నట్టు సమాచారం. కావూరి వల్ల మేలు జరగకపోగా నష్టం జరుగుతుందనేది వారి వాదన. దీంతో చంద్రబాబు ఏలూరు పార్లమెంటు, దెందులూరు అసెంబ్లీ సీట్లను పెండిం గ్లో పెట్టినట్టు సమాచారం. -
కేంద్రమంత్రి కావూరి భవిష్యత్ ఏంటీ?
-
కాంగ్రెస్ ఎంపీలకు సోనియా విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం రాత్రి విందు ఇచ్చారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ విందు సమావేశానికి.. సీమాంధ్ర నుంచి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, కిశోర్చంద్రదేవ్, పళ్లంరాజు, చిరంజీవి, జె.డి.శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు ఎస్.జై పాల్రెడ్డి, బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్రెడ్డి, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, సురేష్శెట్కర్, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, రాపోలు ఆనంద్భాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, తదితరులు హాజరయ్యారు. టీఆర్ఎస్తో బంధం ఖరారుకాలేదు: సింఘ్వీ టీఆర్ఎస్తో కాంగ్రెస్ బంధం ఎలా ఉండాలన్న అంశంపై తుది నిర్ణయం జరగలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్సింఘ్వీ పేర్కొన్నారు. ‘తెలంగాణ, సీమాంధ్రకు సమన్యాయం చేసేందుకు కాంగ్రెస్ యత్నించినట్లుగా మరే పార్టీ చేయలేదు. అందుకు అనుగుణంగా అవసరమైన పొత్తులు పెట్టుకునేందుకు మేం సుముఖంగా ఉన్నాం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’’ అని చెప్పారు. -
రాజధానిగా బెజవాడ భేష్ అని చెప్పా: కావూరి
ఏలూరు, న్యూస్లైన్: సీమాంధ్ర రాజధానిని కృష్ణా నది ఒడ్డున విజయవాడలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని, ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పానని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చాలా నష్టం జరుగుతుందని కేంద్ర కేబినెట్లో అనేకసార్లు చెప్పానని, అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని, ఇక్కడ పరిశ్రమలు నిర్మించుకోవడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని కోరిన వెంటనే కేంద్రం అంగీకరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడి నుంచి గెలుపొందే 10 మంది ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ను చూసి అటువంటి మహానగరాన్ని నిర్మించలేమనుకుని, డబ్బును సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని నాయకులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రాన్ని కోరడం, దానికి కేంద్రం అంగీకరించడం చారిత్రాత్మక తప్పిదమని కావూరు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందంటూనే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు గురించి మీరేమంటారు అనే ప్రశ్నకు పార్టీ పెట్టినప్పుడు చూద్దాంలే అంటూ దాటవేశారు. -
కాంగ్రెస్లో కొనసాగాలా.. వద్దా?: కావూరి
ఏలూరు: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నానని, కేడర్, ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేస్తానని కావూరి స్పష్టం చేశారు. 1984 కంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అద్వాన్నంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కావూరి సమర్థించారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పార్టమెంట్లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. నేటి కేబినెట్ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకువస్తామని, భద్రాచలం గుడి గ్రామం తప్పితే డివిజన్లోని అన్ని గ్రామాలు ఆంధ్రాలో కలిసే విధంగా కృషిచేస్తానని కావూరి చెప్పారు. -
రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా
రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. శనివారం సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... విజయవాడ - గుంటూరు నగరాల మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేస్తానని కావూరి సాంబశివరావు తెలిపారు. -
కావూరిపై కురియన్ ఫైర్...
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు మంత్రులు తమ నివేదికలు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండగా.. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు వెల్లో ఆందోళన చేస్తుండటంపై ప్రతిపక్ష నేత అరుణ్జైట్లీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘లోక్సభ సభ్యుడై మంత్రిగా ఉంటే ఈ సభలో వచ్చి ప్రభుత్వపరంగా తన పనితాను చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఎలా సభావ్యవహారాలకు ఆటంకం కలిగిస్తారు..’ అని డిప్యూటీ చైర్మన్ను అడిగారు. వెంకయ్యనాయుడు కూడా లేచి ‘పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ఏంచేస్తున్నారు? మీ మంత్రులే వెల్లోకి వస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. దీంతో.. లోక్సభ సభ్యులు మంత్రులుగా ఉండి ఇక్కడికి వచ్చి.. ఎలా అంతరాయం కలిగిస్తారని కావూరిని డిప్యూటీ చైర్మన్ ప్రశ్నించారు. ‘మీరు సభను వదిలిపెట్టండి..’ అని సూచించారు. మంత్రులుగా ఉన్నవారు నిరసన తెలపాలనుకుంటే.. ఆ పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రమేశ్, సుజనాచౌదరిలు డిప్యూటీ చైర్మన్తో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి సభ మళ్లీ అదుపుతప్పటంతో 3.34 గంటల సమయంలో నాలుగు గంటల వరకు వాయిదావేశారు. తిరిగి సభ సమావేశమయ్యాక పలు బిల్లులను ఆమోదించారు. ఆ తరువాత సభ 4.26 సమయంలో సాయంత్రం 5 గంటలకు వాయిదాపడింది. మళ్లీ సమావేశమయ్యాక కావూరి మాట్లాడుతూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఏ ప్రాతిపదికన తెస్తున్నారని ప్రశ్నిస్తుండగా.. ‘ఆ బిల్లు సభకు రాలేదు.. దానిపై ఇప్పుడు మాట్లాడేందుకు ఏమీ లేదు’ అంటూ కురియన్ సభను గురువారానికి వాయిదావేశారు. -
రాజ్య సభలో పెద్ద రభస
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు), లోక్సభ సభ్యులు రాజ్యసభలోకి ప్రవేశం, సభల పరువు, రాజ్యాంగ నిబంధనలు, రాజ్యసభ చైర్మన్ విచక్షణాధికారాలు... తదితర అంశాలపై ఈరోజు రాజ్యసభలో పెద్ద రభస జరుగుతోంది. వాయిదాలపై వాయిదాలు వేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై తీవ్ర ఆందోళన, గందరగోళం చోటు చేసుకున్నాయి. ఇప్పటికే లోక్సభ పరువు, ప్రతిష్టలు పోయాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాజ్యసభ పరువైనా కాపాడండి, సభ గౌరవం మంటగలపొద్దు అని విజ్ఞప్తి చేశారు. సభను బుల్డోజ్ చేసి బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండని కోరారు. పెద్దలసభలో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు సభ మర్యాదలు పాటించాలన్నారు. లోక్సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును ఉద్దేశించి లోక్సభ సభ్యులు వచ్చి రాజ్యసభను ఆటంకపరచకూడదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. రాజ్యాంగంలో ఈ నిబంధన స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. దయచేసి లోక్సభ్యులు సభను విడిచి వెళ్లాలని కురియన్ కోరారు. సీమాంధ్ర సభ్యులు వెల్లోకి వెళ్లడంతో, వెల్లో నిరసన తెలపాలంటే ముందు రాజీనామా చేయండని డిప్యూటీ చైర్మన్ చెప్పారు. సభ సజావుగా సాగేలా సభ్యులు నడుచుకోవాలని కోరారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సభను అడ్డుకోవద్దని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరారు. నచ్చకపోతే సభ నుంచి వెళ్లిపోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కానప్పుడు సభను ఎలా అడ్డుకుంటారని రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ కావూరిని ఉద్దేశించి ప్రశ్నించారు. మంత్రిగా మాత్రమే సభకు రావొచ్చని తెలిపారు. అంతేతప్ప సభను అడ్డుకోవద్దని కోరారు. రాజ్యసభలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వాళ్ల మంత్రులే బిల్లు ప్రవేశపెడతారు, వాళ్ల మంత్రులే వెల్లోకి వెళ్లి అడ్డుకుంటారని అన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర విభజన బిల్లు పెట్టడానికి వీళ్లేదని విపక్షాలు పట్టుపట్టాయి. కనీసం ఒక రోజు గడువు ఇవ్వాలని కోరాయి. బిల్లుపై చైర్మన్కు విచక్షణాధికారం ఉందని కురియన్ తెలిపారు. ఎప్పుడైనా సభ ముందు బిల్లు పెట్టవచ్చునని చెప్పారు. -
బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దు: సీమాంధ్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దని స్పీకర్ మీరాకుమార్కు సీమాంధ్రకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు లేఖ రాశారు. 14వ తేదీతో ఉన్న ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, పురందేశ్వరి ఉన్నారు. ‘‘నిబంధనావళితో సంబంధం లేకుండా కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలోకి తెచ్చారు. సవరించిన ఎజెండాలో కూడా లేనప్పుడు సప్లిమెంటరీ బిజినెస్లో ఉండడం సభాసాంప్రదాయం. కానీ ఆ బిల్లు సవరించిన ఎజెండాలో లేదు. సప్లిమెంటరీ ఎజెండా కూడా ఏదీ ఇవ్వలేదు. మీరు మాత్రం 12 గంటలకు హోంమంత్రిని పిలిచారు. సప్లిమెంటరీ జాబితా 2 గంటలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా సభా సంప్రదాయాలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్దేశాలను, స్పీకర్ కార్యాలయం ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రకటించడాన్ని బీజేపీ సహా అనేక రాజకీయ పార్టీలు ఖండించాయి. తిరిగి బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి’’ అని అందులో కోరారు. సస్పెన్షన్లపై పునరాలోచించాలి: ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఎత్తివేయాలని కోరుతూ ఈ ఐదుగురు కేంద్ర మంత్రులు స్పీకర్ మీరాకుమార్కు లేఖ రాశారు. సభను అడ్డుకోవద్దు: అద్వానీ కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి, చిరంజీవి, కిల్లి కృపారాణి సోమవారం బీజేపీ అగ్రనేత అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ ప్రాంతానికి తగిన ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేలా సహకరించాలని, తమ ప్రాంత ఎంపీల సస్పెన్షన్ను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు అద్వానీని కోరారు. అద్వానీ సానుకూలంగా స్పందించారు. అలాగే, పార్లమెంటు సాంప్రదాయాలను కాలదన్ని వెల్లో నిరసనలకు దిగడం సరికాదని, సభను అడ్డుకోవద్దని అద్వానీ వారికి సూచించారు. ఈ భేటీలో మరో కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొనలేదు. -
లోక్సభలో రేపు టి బిల్లు: కమల్నాథ్
-
'టి.బిల్లుపై రేపు మాట్లాడనున్న సోనియా'
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై లోక్సభలో రేపు చర్చ జరుగుతుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మంగళశారం లోక్సభలో కచ్చితంగా చర్చ జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్లుపై సోపియా గాంధీ మాట్లాడే అవకాశముందన్నారు. తెలంగాణ బిల్లును వంద శాతం ఆమోదించి తీరుతామన్నారు. బిల్లును వ్యతిరేకించాలనుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల సస్పెన్షన్ తొలగింపుపై లోక్సభ స్పీకర్ మీరాకుమార్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, కమల్నాథ్తో సీమాంధ్ర కేంద్రమంత్రుల వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా విభజన బిల్లును అడ్డుకుని తీరుతామని కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం 3 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ వారంలోనే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. రాజ్యసభ బీఏసీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించారు. రాజ్యసభలో చర్చకు చైర్మన్ హమిద్ అన్సారీ సమయం కేటాయించారు. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో విభజన బిల్లు పెద్దల సభకు వచ్చే అవకాశముంది. -
ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: కావూరి
ఈ మేరకు స్పీకర్కు లేఖ రాస్తాం.. వెల్లోకి వెళతాం.. ప్రతిఘటిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: సహచర సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివే యాలని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ మీరాకుమార్కు లేఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. ‘ఎవరికి చెప్పుకున్నా వినలేని పరిస్థితుల్లోనే వెల్లోకి వెళ్లాలనుకున్నాం. సోమవారం వెళతాం. ఆ తర్వాతా వెళతాం. ప్రతిఘటన తప్పదు..’ అని అన్నారు. ఆదివారం రాత్రి కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై 3 గంటలపాటు చ ర్చించారు. అనంతరం కావూరి మీడియాతో మాట్లాడారు. ‘అసలు హింసాత్మక పద్ధతులకు ఎవరు పాల్పడ్డారు. వీడియో దృశ్యాలు చూడాలి. అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు చెందిన సభ్యులను బయటకు పంపి రాష్ట్రాన్ని విభజించడాన్ని చరిత్ర క్షమించదు. మా సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలి. సభలోకి రావడానికి అనుమతించాలని స్పీకర్ గారిని అడగబోతున్నాం. దీనికి కాంగ్రెస్, ప్రతిపక్షాల నేతలు కూడా సహకరిస్తారని నమ్ముతున్నాం. ప్రధాని, సోనియా, జీఓఎంకు చెప్పినా.. అసెంబ్లీ తిప్పిపంపినా వినకుండా విభజిస్తే దేశం ఎలా ముక్కలవుతుందో చెప్పదలుచుకున్నాం. కేబినెట్లో చర్చించినా మా అభిప్రాయాలకు విలువ లేకపోతే ఎలా? పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నాం..’ అని చెప్పారు. ‘బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నేను కూడా ఉన్నా. సంప్రదాయమేంటి. సవరించిన జాబితాలో పెట్టొచ్చు. అర్జంట్ అయితే సప్లిమెంటరీ ఎజెండాను సభ్యులకు పంచిపెడతారు. సభ్యులు అడ్డుచెబితే సభ అభిప్రాయం తీసుకుని.. సభా సంప్రదాయం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ గొడవలో ఎవరు ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితిలో బిల్లును తెచ్చినట్టు చెప్పడం సబబు కాదు..’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, జేడీ శీలం.. ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట, బాపిరాజు, సారుుప్రతాప్, సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి, కేవీపీ, హర్షకుమార్లు పాల్గొన్నారు. -
తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం: కావూరి
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తాం అని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఆయన నివాసంలో జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీ అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడతారు అని కావూరి మండిపడ్డారు. సస్పెన్షన్ ధర్మబద్దంగా జరగలేదని స్పీకర్ మీరాకుమార్ కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు లేఖ రాశారు. సవరణలను ముందే బిల్లులో చేర్చాలని సీమాంధ్రమంత్రులు డిమాండ్ చేశారు. సవరణలు బిల్లులో పెట్టకుంటే మంత్రులందరం వెల్లోకి వస్తాం అని కేంద్ర మంత్రి కావూరి హెచ్చరించారు. లోక్సభ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిని విడుదల చేయాలి కావూరి కోరారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తారని భావిస్తున్నానని కావూరి ఆశాభావం వ్యక్తంచేశారు. -
తెలంగాణ బిల్లుపై నేతల భిన్నాభిప్రాయాలు
టీ బిల్లును ప్రతిఘటిస్తాం : కావూరి చింతలపూడి, న్యూస్లైన్: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్కు విధేయుడనని, అలాగని ప్రజలకు నష్టం కలిగిస్తే పార్టీలో ఎంతటి వారిపై అయినా తిరగబడతానని పేర్కొన్నారు. విభజన దేశానికి మంచిదికాదని సోనియా సహా కేంద్ర మంత్రులకు పలుమార్లు హెచ్చరించామన్నారు. బతికుంటే మహాత్ముడు సిగ్గుపడేవారు: కోట్ల కోడుమూరు, న్యూస్లైన్: కేంద్ర మంత్రి కమల్నాథ్ నిండుసభలో గుండాగిరి చేశారని, ఈ ఘటన ప్రజాస్వామ్యానికే తలవంపని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి మండిపడ్డారు. మహాత్మాగాంధీ బతికుంటే వీరి తీరుకు సిగ్గుపడేవారని అన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు చెబుతున్నా పార్టీ పెద్దలకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. సీమాంధ్ర ఎంపీల తీరు సరిగాలేదు: పనబాక బాపట్ల/పర్చూరు, న్యూస్లైన్: లోక్సభలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరు సరిగాలేదని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఆమె గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా పర్చూరులో విలేకరులతో మాట్లాడారు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం చూశానన్నారు. బిల్లు ప్రవేశపెట్టేవరకు మౌనంగా ఉన్న లగడపాటి ఒక్కసారిగా పెప్పర్ స్ప్రే చేయడం, ముందుకు దూసుకెళ్లడం సరికాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమన్యాయమంటూ మాట్లాడటం సరికాదని విమర్శించారు. తాను బాపట్ల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానన్నారు. దారులు మూసుకుపోలేదు: జేడీ శీలం అద్దంకి, న్యూస్లైన్: తెలంగాణ బిల్లు విషయంలో సీమాంధ్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంకా దారులు మూసుకుపోలేదని కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం మాట్లాడుతూ.. ‘‘నాలుగు రోజులు ఆగండి. అన్నీ తెలుస్తాయి. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించడానికి తెర వెనుక, ముందు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. రెండు ప్రాంతాల వారి మనసులు విరిగిపోయాయి. ఏనాడైనా విడిపోవాల్సిందే. ఈ సమావేశాల్లో బిల్లు పాసవుతుందో లేదో చెప్పలేం’’ అని అన్నారు. ఫుటేజీ రేపు బయట పెడతా: సబ్బం సాక్షి, విశాఖపట్నం: లోక్సభలో నిజానికి ఎవరు ఎవరిపై దాడికి ప్రయత్నించారనే దానిపై దూరదర్శన్ వీడియో ఫుటేజీలను సోమవారం బయట పెడతానని ఎంపీ సబ్బం హరి ప్రకటించారు. దూరదర్శన్కు ఇప్పటికే ఈ మేరకు లేఖ రాశానని శనివారం చెప్పారు. అంతేగాక అత్యంత సంచలనాత్మకమైన ఒక అంశంపై సోమవారం నోరు విప్పుతానన్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆ అంశంపై లోక్సభ స్పీకర్ మీరాకుమార్కు తానిప్పటికే ప్రశ్న పంపినా అదింకా సభలోకి రాలేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీమాంధ్ర ఎంపీలను సోనియా తన బలంతో, ఇతర రాష్ట్రాలకు చెందిన గూండా ఎంపీలతో దాడికి ఉసిగొల్పేందుకు పూనుకోవడం హేయమని సబ్బం అన్నారు. లోక్సభ స్పీకర్తోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు సోనియా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, వారు అచ్చం బానిసలను తలపిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీది ద్వంద్వవైఖరి: బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. మాట నిలబెట్టుకుంటేనే బీజేపీకి గౌరవం దక్కుతుందన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు మినహా మిగతా ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంచాలని అన్నారు. సస్పెన్షన్ ఎత్తేయాలి: సమైక్యాంధ్ర పోరాట కమిటీ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 17న సీమాంధ్ర జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 21 వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
పార్లమెంట్లో కాంగ్రెస్ గూండాగిరి
* సీమాంధ్ర ఎంపీల ధ్వజం * ఇతర రాష్ట్రాల ఎంపీలను పెట్టి కొట్టించారు * కాంగ్రెస్ చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారు * టెన్ జనపథ్ నుంచే ఫ్లోర్ మేనేజ్మెంట్ * లోక్సభ వీడియోలను ప్రజల ముందుంచుతాం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గూండాగిరి చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలను మోహరింపజేసి తమపై దాడి చేయించారని వాపోయారు. విభజన బిల్లు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో పోలిస్తే లోక్సభలో లగడపాటి రాజగోపాల్ చేసిన పని చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ను సజావుగా నడపాల్సిన లోక్సభ స్పీకర్ మీరాకుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కాంగ్రెస్ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో ఎవరు ఎవరిపై దాడి చేశారో... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరనే విషయంపై లోక్సభ వీడియో పుటేజీలను సేకరించి ప్రజల ముందుంచుతామని తెలిపారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం ఉదయం ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, జి.హర్షకుమార్, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్ తదితరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై గంటకుపైగా చర్చించారు. లోక్సభలో గురువారం జరిగిన పరిణామాలకు తమను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నందున వాస్తవాలను బయటపెట్టేందుకు లోక్సభ వీడియో దృశ్యాలను సేకరించాలని నిర్ణయించారు. దీంతోపాటు విభజన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి వివరించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ మూడూ సవరిస్తే విభజనకు ఓకే: కావూరి రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం ఉండాలి. ఉత్తరప్రదేశ్ను విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ను విభజించవద్దని ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు విడదీస్తున్నారు? మేము ప్రతిపాదించిన మూడు సవరణలకు కేంద్రం సోమవారంలోగా అంగీకరిస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తాం. హైదరాబాద్ను పదేళ్లపాటైనా యూటీ చేయాలి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి. భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలి. వీటిని అంగీకరించకపోతే తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం. నేనూ సిగ్గుపడుతున్నా: లగడపాటి లోక్సభలో గురువారం జరిగిన పరిణామాలపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. అలాంటి చర్యలు ఎవరు చేసినా ఆక్షేపణీయమే. అందుకు నేను సిగ్గుపడుతున్నా. నిన్నటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులేమిటో అందరికీ తెలియాల్సిన అవసరముంది. మాపై దాడి చేయడానికి వందమంది ఎంపీలు వచ్చారు. నా సహచర ఎంపీపైనా దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసమే పెప్పర్స్ప్రే ఉపయోగించాను. మమ్మల్నే ఎందుకు సస్పెండ్ చేశారు?: హరి కాంగ్రెస్ అప్రజాస్వామికంగా బిల్లును ప్రవేశపెట్టింది. గురువారం సుమారు వందమంది ఎంపీలు వెల్లోనే ఉండి ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు? పార్లమెంట్ ఏమైనా జన్పథ్ అనుకుంటున్నారా? జన్పథ్ నుంచి పంపిస్తే తెలుస్తుంది: హర్షకుమార్ రాష్ట్రాన్ని విడగొట్టి మమ్మల్ని హైదరాబాద్ నుంచి పంపుతామంటున్నారు. మిమ్మల్ని (సోనియాగాంధీని ఉద్దేశించి) జన్పథ్ నుంచి పంపితే ఎంత బాధ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. పార్లమెంట్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ అంతా జన్పథ్ నుంచే నడిస్తోంది. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. సీట్ల కోసం విభజిస్తారా?: సాయిప్రతాప్ తెలంగాణలో సీట్లు రావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతిపక్షాలకు తెలీకుండా పార్లమెంట్లో బిల్లును పెడుతున్నారు. ఇంతకంటే అప్రజాస్వామిక చర్య ఏముంటుంది? సస్పెన్షన్ ఎత్తివేయండి స్పీకర్కు లగడపాటి, సబ్బం లేఖలు సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ నుంచి తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నిర్హేతుకం, అన్యాయమైనదని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పేర్కొన్నారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు వేర్వేరుగా లోక్సభ స్పీకర్ మీరాకుమార్కు లేఖ రాశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి నిజమైన ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటు విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇద్దరు సభ్యులు విడివిడిగా లేఖలు రాశారు. -
కావూరి మూడు షరతులు
-
పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి
తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తేనే తాము ఆమోదిస్తామని, లేని పక్షంలో మళ్లీ వెల్లోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండు చేశారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు కూడా భాగం ఇవ్వాలని కావూరి అడిగారు. ఈ సవరణలకు అంగీకరించని పక్షంలో తాము మరింతగా ఆందోళన చేయడం ఖాయమని ఆయన చెప్పారు. -
కావూరి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో నిన్న తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, అనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యచరణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆదివారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
విభజన బిల్లును అడ్డుకుంటాం
-
విభజన బిల్లును అడ్డుకుంటాం
సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రకటన కేంద్ర మంత్రి కావూరి నివాసంలో గంటకుపైగా భేటీ పనబాక, కిశోర్ మినహా మంత్రులంతా హాజరు బీజేపీ కాళ్లు పట్టుకుంటున్న కాంగ్రెస్.. సొంత ఎంపీలకు ఏమి కావాలో అడగలేదా? బిల్లును అడ్డుకొనేందుకు వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్న ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు స్పష్టంచేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఢి ల్లీలోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో బుధ వారం రాత్రి ఎనిమిది గంటలకు సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. గంటకుపైగా సాగిన ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పల్లంరాజు, జేడీ శీలం, చిరంజీవి, ఎంపీలు బొత్స ఝాన్సీ, అనంత వెంకటరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు, బహిష్కృత ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, సబ్బం హరి, సాయిప్రతాప్, ఉండవల్లిఅరుణ్కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన అరగంట తర్వాత కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు వచ్చారు. తెలంగాణ బిల్లు, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపైనా చర్చించినట్లు సమాచారం. బీజేపీ కాళ్లు పట్టుకుని బిల్లుకు మద్దతు కోరుతున్న కాంగ్రెస్ పెద్దలు.. సొంత పార్టీ ఎంపీలను చేతులు పట్టుకుని ఏం కావాలో అడగలేని స్థితిలో ఉన్నారని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకోవాలని వీరంతా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం ఎంపీలు మాగుంట శ్రీనివాసులు, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్ విలేకరులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకునేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు వస్తోందన్నారు. రైల్వే బడ్జెట్ సమయంలోనూ నలుగురు కేంద్ర మంత్రులు వెల్లోకి దూసుకువచ్చి నిరసన తెలిపారని, పార్లమెంటు చరిత్రలోనే ఇది మొదటిసారి అని తెలిపారు. తెలంగాణ బిల్లు పెడితే మిగిలిన మంత్రులు కూడా వెల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బహిష్కృత ఎంపీ సాయిప్రతాప్తో అవిశ్వాస తీర్మానం పెట్టిస్తామని, ఇందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగడుతున్నామని చెప్పారు. నలుగురు కేంద్ర మంత్రులు వెల్లోకి దూసుకెళ్లడంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగిందని లగడపాటి అన్నారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని కవచంలా అడ్డు పెట్టుకుంటామన్నారు. కాగా, ఈ సమావేశానికి సీమాంధ్రకే చెందిన కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిశోర్చంద్రదేవ్ హాజరుకాలేదు. అవిశ్వాసానికి మద్దతివ్వను : కనుమూరి బాపిరాజు పార్లమెంటులో సహచర ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తాను మద్దతివ్వనని లోక్సభ సభ్యుడు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. ప్రజల మనోభావాలు తెలిపేందుకు మూడు రోజులుగా లోక్సభలో వెల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. 36 ఏళ్ల తన రాజకీయ జీవితంలో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలా వెల్లోకి వెళ్లలేదని అన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పదేళ్లు యూటీ చేస్తే ఓకే: కావూరి పదేళ్లపాటు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే తెలంగాణ బిల్లుకు శాస్త్రీయత వస్తుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. పది సంవత్సరాల్లో సీమాంధ్రలో అన్ని సదుపాయాలూ అభివృద్ధి చేసుకునే వీలుంటుందని, అప్పుడు రాష్ట్రం విడిపోయినా ఏ ప్రాంతానికీ ఇబ్బంది ఉండదన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని విజయ్చౌక్వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం ఆత్మగౌరవం, స్వయంపాలన అన్న అంశాల ప్రాతిపదికనే రాష్ట్రాన్ని విభజించడం సరికాదన్నారు. ఇలా చేస్తే దేశంలో అన్ని ప్రాంతాలనూ ముక్కలు చేయాల్సి వస్తుందన్నారు. ఎంపీగా ఏనాడూ సభలో వెల్లోకి వెళ్లని తాను ప్రజల భావాలు తెలిపేందుకు కేంద్ర మంత్రిగా ఉన్నా ఈ రోజు వెల్లోకి వెళ్లానని చెప్పారు. తనది ప్రాంతీయ వాదంకాదని, దే శీయవాదం అని పేర్కొన్నారు. తెలుగు జాతి పరువు తీశారు: టీ ఎంపీలు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, టీడీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్ సందర్భంగా సభలో తెలుగు జాతి పరువు తీశారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. సభలో వెల్లోకి దూసుకెళ్లడం, అధికారులను దూషించడం, బడ్జెట్ కాగితాలను చించివేయడం, పెన్నులు లాక్కోవడం అవమానకరంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సురేశ్షెట్కార్, గుత్తా సుఖేందర్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్లు బుధవారం విజయ్చౌక్లో విలేకరులతో మాట్లాడారు. -
రాష్ట్ర విభజన అనాలోచిత చర్య: కావూరి
-
కేంద్రమంత్రిగా ఉంటే ప్రజల వాదన వినిపించకూడదా?
న్యూఢిల్లీ : సీమాంధ్ర ప్రజల వాదనను వినిపించేందుకే స్పీకర్ వెల్లోకి దూసుకు వెళ్లినట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో టేబుల్ ఐటంగా తీసుకు వచ్చినప్పుడే తెలంగాణ బిల్లుపై అభ్యంతరం తెలిపానని కావూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రిగా ఉంటే ప్రజల వాదన వినిపించకూడదా అని ఆయన ప్రశ్నించారు. లోక్సభలో తొలిసారిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు వెల్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. -
కావూరి కార్యాలయ ముట్టడికి యత్నం
ఏలూరు, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం టీడీపీ శ్రేణులు ఏలూరులోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి కోట రామారావు(బుజ్జి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్లను పోలీసులు అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించేందుకు జీపు ఎక్కించారు. అయితే కార్యకర్తలు జీపుగా అడ్డుగా రోడ్డుపై బైఠాయించడంతో అరెస్టు చేసిన నాయకులను వదిలివేశారు. అనంతరం బడేటి బుజ్జి, మాగంటి బాబు మాట్లాడుతూ సీమాంధ్రుల మనోభావాలను గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో దూకుడుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలవాల్సిన కావూరి సాంబశివరావు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రజలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లేపల్లి రాజు, ఈడ్పుగంటి నరసింహరావు, భీమవరపు సురేష్కుమార్, శేషపు వెంకటేశ్వరరావు, చోడే వెంకటరత్నం, ఎ.మధు పాల్గొన్నారు. -
'తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్న ఢిల్లీ'
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమానికి చిదంబరం ప్రకటనతో మళ్లీ జీవం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ నుంచే ప్రాణం పోస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో బాగా వెనుకబడ్డాం కాబట్టి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణవాదులు తర్వాత మాట మార్చారని చెప్పారు. 1956 తర్వాత తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని శ్రీకృష్ణ కమిటీ తేల్చడంతో.. స్వయం పాలన, మనోభావాలంటూ విభజన కోరుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కావూరి విమర్శించారు. -
40 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉన్నా ప్రాధాన్యతలేదు
తణుకు: తాను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాకూడా ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో కావూరికి సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు ఆయనను నిలదీశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ తాను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. ఆఖరి వరకు సమక్యవాదిగానే పోరాడుతానన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. -
కావూరికి సమైక్య సెగ
ఢిల్లీలో మంత్రి నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర విద్యార్థి జేఏసీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం మొండిగా ముందుకు వెళుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో కావూరి ఇంటిని ముట్టడించారు. విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కావూరి నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేత అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాద్ల నేతృత్వంలో 30 మంది విద్యార్థులు కావూరి ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా కావూరి వారిని కలిసేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. ఇంటిముందు బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యతను కాపాడతానని ప్రతిజ్ఞ చేసిన కావూరి నేడు పదవి కాపాడుకునేందుకు అధిష్టానానికి సహకరిస్త్తున్నారని ఆరోపించారు. కావూరి ఇంటిముం దున్న నేమ్ప్లేట్కు ‘రాష్ట్రాన్ని కాపాడండి’ ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అన్న పోస్టర్లను అతికించారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి నేత కిశోర్తోపాటు ఇతరులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టా రు. 15 రోజుల్లో పోయే పదవి కోసం కావూరి సమైక్య నినాదాన్ని పక్కనపెట్టారని విద్యార్థి నేత కిశోర్ విమర్శించారు. -
కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కుండీలను పగలకొట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి నాయకులు సేవ్ఆంధ్రప్రదేశ్ పోస్టర్లను అతికించి నిరసన తెలిపారు. -
కేబినెట్ లో కావూరి, సీమాంధ్ర మంత్రులకు చుక్కెదురు!
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు చేసిన ప్రయత్నాలకు బెడిసికొట్టాయి. అసెంబ్లీ చర్చించిన బిల్లునే యథాతథంగా కేబినెట్ ముందుకు తీసుకువెళ్లారు. బిల్లును కేబినెట్కు మంత్రివర్గ సభ్యులు చిదంబరం, జైరాంరమేష్లు వివరించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కావూరి చేసిన ప్రతిపాదనను కేబినెట్ తోసిపుచ్చింది. అయితే కనీసం హైదరాబాద్ను యూటీ చేయాలని ముగ్గురు సీమాంధ్ర మంత్రులు చేసిన విజ్క్షప్తికి కేబినెట్ నిరాకరించింది. సీమాంధ్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలను, విజ్క్షప్తులను కుదరదని కేబినెట్ తోసిపుచ్చినట్టు సమాచారం. బిల్లుకు సంబంధించి...మొత్తం 30 నుంచి 40 సవరణలు ఉన్నాయని తెలుస్తోంది. సవరణలను అధికారికంగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధానికి సంబంధించి అన్ని అనుమతులనూ బిల్లు ద్వారా ఓకే కేంద్రం చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదించిన మరికొన్ని అంశాలు: 10 ఏళ్లపాటు సీమాంధ్ర-తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతి భద్రతలు షెడ్యూల్ ప్రకారమే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే యోచన పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రకే సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే కొత్త రాజధానికి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనేదానిపై పార్లమెంట్లో నిర్ణయం సీమాంధ్ర పన్ను రాయితీ ప్రకటించిన కేంద్రం -
తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి
తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే సమస్యే లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. అందుకు తమ వ్యూహాలు తమకున్నాయని, తమ అస్త్రాలు, ఎత్తుగడలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను యూటీ చేయకపోతే కేంద్ర మంత్రివర్గ సమావేశం నుంచి వాకౌట్ చేస్తానని కావూరి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే ఇక సీమాంధ్రులకు ఏరకంగా ఉపయోగం ఉంటుందని ఆయన మండిపడ్డారు. అయితే హైదరాబాద్ నగరాన్ని నేరుగా యూటీ చేయకుండా, యూటీకి ఉండే లక్షణాలన్నీ దానికి కల్పిస్తామని జీవోఎం అంటే, అలా చేస్తే ఉపయోగం ఏమీ ఉండదని కావూరి వాదించారు.