violence
-
Bihar: మళ్లీ పోలీసులపై దాడి
బీహార్: బీహార్లో పోలీసులపై దాడులు ఆగడం లేదు. ముంగేర్ జిల్లాలో ఏఎస్ఐ సంతోష్ కుమార్ సింగ్ హత్యోదంతం మరువకముందే డయల్ 112 విభాగంలో పనిచేస్తున్న మరో పోలీసు కానిస్టేబుల్పై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హవేలీ ఖడంగ్ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫసియాబాద్లో ఆదివారం రాత్రి దొంగతనం ఆరోపణతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని పంచాయతీ భవనంలో బంధించి, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ యువకులను తమతో పాటు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే గ్రామీణులు పోలీసులను అడ్డుకుంటూ, వాగ్వాదానికి దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బబ్లూ రజక్ అనే పోలీసు గాయపడ్డారు. పరిస్థితి కాస్త సద్దుమణిగాక పోలీసులు ఆ ఇద్దరు యువకులను తమతోపాటు పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
సినిమాయకు మంత్రం లేదా!
‘హోమ్వర్క్ చేయలేదేంటి?’ టీచర్ ప్రశ్న. ‘చెయ్యలా’... అన్నాడా స్టూడెంట్ తల వంకరగా పెట్టి.‘నిర్లక్ష్యంగా బదులిస్తావేంటి... క్లాసయ్యే వరకు నిలబడు’‘తగ్గేదేలే’ అంటూ విచిత్రంగా అభినయించాడు.భుజం తిప్పుతూ వికారంగా ముఖం పెట్టాడు.ఇది ఇప్పుడు స్కూళ్లను పట్టి పీడిస్తున్న జబ్బు.ఆ జబ్బుకు విరుగుడు కూడా రోగం మొదలైన చోటే ఉంది.‘మా స్కూల్లో సగం మంది విద్యార్థులు ‘ఫలానా’ సినిమా చూసిన తర్వాత చెడిపోయారు. విద్యార్థుల భాష మారిపోయింది, జుట్టు స్టైల్, డ్రెస్సింగ్ విచిత్రంగా ఉంటోంది. టీచర్లుగా వారికి మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. భాష మార్చుకోవాలని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇస్తోంది?’ ఇటీవల విద్యాశాఖ కమిషనర్ మీటింగ్లో ఓ టీచర్ వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఆమె ఒక్కరే కాదు, బయటకు చెప్పలేక ఎందరో టీచర్లు ఇలాగే ఆవేదన చెందుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జాతీయోద్యమకాలం సినిమాలు ‘‘సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం. అది ప్రధానంగా వినోదసాధనమే. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యతతో కూడిన వినోదాన్ని అందించాలి. జాతీయోద్యమకాలంలో సినిమాలు ఈ పాత్ర పోషించాయి. జనంలో స్వాతంత్య్రపోరాట స్ఫూర్తిని రగిలించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన సినిమాలకు ఒక సామాజిక లక్ష్యం అనేది లేకుండా పోయింది. సినిమా ప్రభావం పిల్లల మీద మంచి–చెడు రెండు వైపులా ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఏం ఉందో అదే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు. సెన్సార్బోర్డు ఒక సినిమాకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు శృంగార దృశ్యాలున్న సినిమాలకు మాత్రమే పిల్లలను మినహాయిస్తున్నారు. హింస ఉన్న సినిమాల విషయంలో పట్టింపుగా ఉండడం లేదు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న మాధ్యమాల్లో సినిమాలతోపాటు టీవీ ప్రసారాలు, సోషల్ మీడియాను కూడా ప్రస్తావించాలి. పిల్లల క్షేమం దృష్ట్యా ఆలోచించి నప్పుడు మనదేశాల్లో పటిష్టమైన నియమాలు లేవు.’’ అన్నారు విద్యావేత్త రేఖారావు. పాడైన విద్యార్థుల లెక్క తేలేదెలా? పిల్లల మీద సినిమాల ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ఆ దుష్ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందని టీచర్లు ఆందోళనపడుతున్నారు. పిల్లలను సరిచేయడానికి మందలింపుగా ఒక మాట అంటే చాలా హింసాత్మకంగా స్పందిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సమాజానికి మంచి పౌరులను అందించలేమని ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్లు ఏం చేస్తున్నారు? సదరు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల గొప్పలు చెప్పడానికి ముందుంటారు. కానీ తమ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పిల్లలు పాడయ్యారో లెక్కచెప్పే ధైర్యం వాళ్లకుంటుందా? ఒకప్పుడు సిగరెట్ గాల్లోకి ఎగరేసి పెదవులతో పట్టుకోవడం హీరోయిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం స్టయిల్ అనే భావనతో సిగరెట్ అలవాటు చేసుకున్న నాటి యువతరం ఇప్పుడు అరవైలు– డెబ్బైలకు చేరి క్రమం తప్పకుండా లంగ్స్ టెస్ట్లు చేసుకుంటోంది. హీరోలు తమ పిల్లలను కూడా ఈ మత్తులోనే ఉంచుతున్నారా? సమాజంలోని పిల్లల పట్ల వారికి బాధ్యత అక్కర్లేదా? లేజీ పేరెంటింగ్ పరిణామాలివన్నీ ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లలు ముఖాలు ఆవేశంగా, అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి, పగలు క్లాస్రూమ్లో కునికిపాట్లు పడుతుంటారు. దీనికి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేక వీడియో గేమ్స్కు అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లయింట్ చేస్తుంటారు. సినిమాలు చూసి పాడయిపోతున్న మాట నిజమే. పిల్లల ఖాళీసమయాన్ని సద్వినియోగం చేస్తే కదా! పెద్దవాళ్లను, టీచర్లను గౌరవించాలనే బుద్ధి పుట్టించే కథలను వాళ్లకు చెప్పి ఉంటే తల్లిదండ్రులను, టీచర్లను ధిక్కరించే ఆలోచనే రాదు. కథలు చెప్పే ఓపిక చాలామంది పేరెంట్స్కు ఉండడం లేదు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఉన్న కథలు మనకెన్నో ఉన్నాయి. కాకి నీటి కోసం కుండలో రాళ్లు వేసిన కథ. నోటిమాటతో డోర్ ఓపెన్ అయ్యే కథల్లో టెక్నాలజీ దాగి ఉంది. ఎలుకలను అమ్మే కథలో స్టార్టప్ మార్గం ఉంది. పంచతంత్ర కథల్లో లేనిదేమిటి? పిల్లల్లో ఇలాంటి అవాంఛిత ధోరణికి సినిమా అనేది ప్రత్యక్ష కారణం అయితే లేజీ పేరెంటింగ్ పరోక్ష కారణం. – రేఖారావు, విద్యావేత్త – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమెపై చెయ్యెత్తడమా?
‘స్త్రీలపై హింస చేయడం తప్పు’ అని భావించేవారు కూడా సినిమాల్లో హీరోయిన్ని హీరో లాగిపెట్టి కొడితే క్లాప్స్ కొడతారు. ఇలా కొట్టే సన్నివేశాలు యువత మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో హీరోలు పెద్దగా ఆలోచించరు– కథకు అవసరమైనా కాకపోయినా. కాని అమోల్ పాలేకర్ మాత్రం నలభై ఏళ్ల క్రితం కొట్టిన చెంపదెబ్బకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ లో తన పుస్తకం ‘వ్యూఫైండర్’ ఆవిష్కరణ సందర్భంగా ఆ ఉదంతాన్ని ప్రస్తావించాడు.‘నేను ప్రధానంగా చిత్రకారుణ్ణి. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని నా కాబోయే భార్య చిత్ర ఆ రోజుల్లో నాటకాలు వేస్తుంటే తోడుగా రోజూ వెళ్లేవాణ్ణి. అప్పుడు నాటక గురువు సత్యదేవ్ దూబే నాతో ‘నా తర్వాతి నాటకంలో వేషం ఇస్తాను చెయ్. నీలో ఏదో టాలెంట్ ఉందని ఆఫర్ చేయడం లేదు. బాగా ఖాళీగా ఉంటున్నావని ఇస్తున్నాను’ అన్నారు. అలా నాటకాల్లోకి... తర్వాత సినిమాల్లోకీ వెళ్లాను. నాటకాల్లో చేయడం వల్ల రిహార్సల్స్ చేసి నటించడం నాకలవాటు. అయితే ‘భూమిక’ (1977) సినిమాలో ఒక సన్నివేశంలో తనకు కావలసిన ఎక్స్ప్రెషన్ స్మితాపాటిల్ ఇవ్వడం లేదని దర్శకుడు శ్యామ్ బెనగళ్ నన్ను పక్కకు పిలిచి– టేక్లో ఆమెను లాగిపెట్టి కొట్టు అన్నారు. అలాగే సార్.. రిహార్సల్కు ఆమెను రమ్మన మనండి అన్నాను. ఆమెకు ఈ సంగతి నేను చెప్పలేదు... నువ్వు నిజంగా కొట్టాలి అన్నారు. నేను షాక్ అయ్యాను. లేదు సార్... అలా చేయను. స్త్రీలపై చెయ్యెత్తడమే తప్పు. యాక్టింగ్ కోసం చేయొచ్చు. కాని నిజంగా చేయమంటే చేయను అన్నాను. ఆయన ఊరుకోలేదు. ‘‘ఇది నా ఆర్డర్. చేస్తావా చేయవా’’ అన్నారు. ఇక నేను ధైర్యం కూడగట్టుకున్నాను. టేక్ మొదలైంది. స్మితాపాటిల్ అద్భుతంగా నటిస్తోంది. సరిగ్గా దర్శకుడు కోరిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన సమయంలో ఆమెను లాగిపెట్టి కొట్టాను. స్మిత స్థాణువయ్యింది. ఆ పని నేను చేయగలనని ఆమె ఊహించలేదు. దాంతో ఎక్స్ప్రెషన్స్ ఒకదాని వెంట ఒకటి ఆమె మొఖంలో పరిగెత్తాయి. మొదట అపనమ్మకం, తర్వాత కోపం, తర్వాత అవమానం, ఆఖరుకు దుఃఖం... డైరెక్టర్ కట్ అనే వరకు నేనూ ఆమె నటిస్తూనే ఉన్నాం. కట్ అన్నాక ఒక్కసారిగా నేను ఏడ్చేశాను. స్మితాను దగ్గరకు తీసుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను. ఆ రోజుల్లో నేను కొత్తనటుణ్ణి. అలా చేశాను. పేరు వచ్చాక అలా చేయలేదు. ఎప్పుడూ చేయను. అసలు స్త్రీల మీద చెయ్యెత్తుతారా ఎవరైనా? ఆమె మీద గొంతెత్తడమే తప్పు. నేనైతే పెద్దగొంతుతో స్త్రీలతో మాట్లాడి కూడా ఎరగను’ అన్నాడు హర్షధ్వానాల మధ్య.స్త్రీలతో పురుషులు– వారు భర్త/తండ్రి/సోదరుడు స్థానంలో ఉన్నాగాని వ్యవహరించవలసిన తీరు ఏమిటో ఆమోల్ ఉదంతంతో బేరీజు వేసుకుని పరిశీలించుకోవాలి. -
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
మొజాంబిక్లో జైల్ బ్రేక్
మపుటో: మొజాంబిక్లో ఎన్నికల అనంతర హింస చల్లారడం లేదు. రాజధాని మపుటో శివార్లలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సెంట్రల్ జైల్లో బుధవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు సిబ్బంది నుంచి కొందరు ఖైదీలు ఆయుధాలు లాక్కుని తోటివారిని విడిపించడం మొదలు పెట్టారు. అల్లర్లు, తిరుగుబాటును అణిచేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 33 మంది మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఆ క్రమంలో జైలు గోడ కూలిపోవడంతో ఏకంగా 6,000 మందికి పైగా జైలు నుంచి తప్పించుకున్నట్టు దేశ పోలీసు జనరల్ కమాండర్ బెర్నార్డినో రఫెల్ తెలిపారు. వారిలో 150 మందిని పట్టుకున్నామన్నారు. ‘‘నేరారోపణలు రుజువైన 29 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా ఖైదీలు విడిపించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు జైళ్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి’’అని వివరించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా గత అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఫ్రెలిమో పార్టీ విజయం సాధించింది. ఫలితాలను నిరసిస్తూ అప్పట్నుంచే దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విజయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ధ్రువీకరించింది. దాంతో ఒక్కసారిగా అల్లర్లు తీవ్రతరమయ్యాయి. వాటిలో ఒక్క రోజే కనీసం 21 మంది మరణించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. -
మొజాంబిక్లో హింస.. 21 మంది మృతి
మ్యాపుటు:తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘనటల్లో21మంది దాకా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డేనియల్ చాపో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. దీనిపై ఓటమి చెందిన అధ్యక్ష అభ్యర్థి వెనాన్సియో సుప్రీంకోర్టుకు వెళ్లారు.కోర్టు చాపో ఎన్నిక సరైనదేనంటూ తాజాగా తీర్పిచ్చింది. దీంతో వెనాన్సియో మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. మొత్తం 236 హింసాత్మక ఘటనలు జరిగాయి. మృతిచెందిన 21 మందిలో ఇద్దరు పోలీసులున్నారు. ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పంటించారు. రాజధాని మ్యాపుటులో అల్లరిమూకలు షాపులు దోచుకున్నారు. హింసకు భయపడి రాజధాని నగరం నుంచి ప్రభుత్వ అధికారులు పారిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆందోళనలతోపాటు దోపిడీలు జరుగుతున్నాయని మొజాంబిక్ తాత్కాలిక మంత్రి పాస్కోల్ రోండా ధృవీకరించారు. కాగా,అధ్యక్ష ఎన్నికల్లో చాపోకు 65 శాతం ఓట్లు రాగా వెనాన్సియోకు 24 శాతం ఓట్లు వచ్చాయి. -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్షాప్లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్తో డేటాబేస్ను బాధితులు యాక్సెస్ చేసే యాప్ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లో షియా-సున్నీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, తాజాగా కుర్రం జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో షియా-సున్నీల హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 122కి చేరింది. ఈ వివరాలను పోలీసులు, ఆస్పత్రివర్గాలు మీడియాకు తెలియజేశారు.సున్నీ- షియా వర్గాల మధ్య హింస గత వారం రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండ అనంతరం గవర్నర్ ఫైసల్ కరీం కుండీ.. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ను ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. నవంబర్ 21న కుర్రం జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్పై ఆకస్మిక దాడి జరిగిన తర్వాత, అలీజాయ్- బగన్ గిరిజన సమూహాల మధ్య హింస చెలరేగింది.నాడు ప్యాసింజర్ వ్యాన్పై జరిగిన దాడిలో 47 మంది మృతిచెందారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రయాణికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 57కి చేరింది. శుక్రవారం వరకు కొనసాగిన కాల్పుల ఘటనల్లో 65 మంది మృతి చెందినట్లు పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వం సమక్షంలో షియా- సున్నీ వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తరువాత దీనిని 10 రోజులకు పొడిగించించారు.ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
Bangladesh: చిన్మయ్ ప్రభు అరెస్టుపై నిరసనల వెల్లువ
ఢాకా: బంగ్లాదేశ్లో ఇటీవలి కాలంలో హిందువులపై దాడుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ పుండరీక్ ధామ్ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణన్ దాస్ను చిట్టగాంగ్లో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపాయి.ఇంతలో బీఎన్పీ, జమాత్ కార్యకర్తలు హిందువులపై దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు 50 మంది గాయపడ్డారు. చిన్మయ్ కృష్ణన్ దాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు మౌల్వీ బజార్లో ‘జై సియా రామ్’, ‘హర్ హర్ మహాదేవ్’ అని నినాదాలు చేస్తూ భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే వారిపై దాడులు చోటుచేసుకున్నాయి. ఇదేవిధంగా షాబాగ్లో చిట్టగాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుశాల్ బరన్పై కూడా దాడి జరిగింది. గాయపడిన ఆందోళనకారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు దాడుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ సంఘటనలను ఖండించారు. చిన్మయ్ ప్రభు అరెస్టు అన్యాయమని, దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని, వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల హక్కుల కోసం చిన్మయ్ ప్రభు నిరంతరం పోరాడుతున్నారని సుకాంత్ మజుందార్ ట్విట్టర్లో రాశారు. ఆయన అరెస్టు దరిమిలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Fighting between colleges have started in US-backed Noble Laureate ruled Bangladesh. Students carrying weapons attacking each other. Many casualties. Chaos at campuses. Situation grim pic.twitter.com/EwQbmKMPBM— Megh Updates 🚨™ (@MeghUpdates) November 25, 2024బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని అరెస్టు చేశారు. పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ ప్రతినిధి రెజౌల్ కరీమ్ తెలిపిన వివరాల ప్రకారం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే అరెస్టు జరిగింది. తదుపరి చర్యల కోసం చిన్మయ్ దాస్ను సంబంధిత పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ ఘటనలు బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల భద్రతపై పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి.ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్లోని సంభాల్లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
ఆకాశంలో సగమంతా గాయమే
ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని! దీన్ని చాటడానికి, వైవిధ్యం అంటే వివక్ష అని అపార్థం చేసుకున్న ప్రపంచాన్ని చైతన్యపరచడానికి యూఎన్ఓ ప్రతి ఏడు నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్) దినంగా పరిగణిస్తోంది.స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత, స్త్రీ–పురుష సమానత్వం.. ఎట్సెట్రా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, చర్చించడానికి బాగుంటాయి! డిక్షనరీలో అర్థాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి!నిజ జీవితంలో మాత్రం.. ఇంటి నుంచి ఆన్లైన్ దాకా మహిళలపై జరుగుతున్న శారీరక, భావోద్వేగ, మాటల దాడులెన్నో కనిపిస్తాయి. అసలు మహిళల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమూ పర్ఫెక్ట్గా లేదని తేలింది ‘విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ (డబ్ల్యూపీఎస్)’ సర్వేలో! మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో డబ్ల్యూపీఎస్ 177 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. అందులో ఏ దేశమూ వందకు వంద మార్కులు తెచ్చుకోలేదు. ఉన్నదాంట్లో చూస్తే మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో మెరుగైన దేశంగా డెన్మార్క్కు మొదటి స్థానం వచ్చింది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లండ్, స్వీడన్, ఫిన్లండ్, లక్సంబర్గ్, ఐస్లండ్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లండ్స్, న్యూజీలండ్ దేశాలు ఉన్నాయి. ఆ జాబితాలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది! గత ఏడేళ్లతో పోల్చుకుంటే మనం 20 స్థానాలు ఎగబాకి కాస్త మెరుగుపడ్డాం. అట్టడుగున అఫ్గానిస్థాన్ కనిపించింది. ఇక మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక కూడా మహిళలపై హింస (డొమెస్టిక్ వయొలెన్స్ వగైరా) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెబుతోంది. అందుకు ఉదాహరణలను చూడండి.. ‘నాకిష్టం లేదు అని చెబితే ఆ మాటను రెస్పెక్ట్ చేయాలి కదా! ఆయన కోరికకు మానసికంగా నేను రెడీగా ఉన్నానా.. లేదా అని పట్టదా? నేనేం యంత్రాన్ని కాను కదా..! భర్తయినంత మాత్రాన భరించాల్సిందేనా.. అర్థం చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదా!’‘ఆ విషయంలో నన్ను మా ఆయన ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు తిరుగుతుంటారు. ఎంత సిగ్గుగా ఉంటుంది! అవేవీ ఆయనకు పట్టవు. అరవైకి దగ్గర పడుతున్న నాలో ముందసలు అంత శక్తి, ఉత్సాహం ఉండాలి కదా.. గ్రహించడు ఎందుకు! ఆయన చెప్పినట్టు వినట్లేదని ఎంత వేధిస్తున్నాడో! ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి..?!‘మా ఇంట్లో నాకన్నిటికీ రిస్ట్రిక్షన్సే! నాకు జీన్స్, క్రాప్ టాప్స్ అంటే ఇష్టం. వేసుకుంటే బాయ్స్ కామెంట్ చేస్తారని మా అన్నయ్య వేసుకోనివ్వడు. కాలేజ్లో, రోడ్డున పోయేవాడు ఎవడు కామెంట్ చేసినా వాళ్లను వదిలేసి నన్ను తిడతాడు, ఇంట్లో వాళ్లతో తిట్టిస్తాడు. నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. కానీ మా అన్నయ్య వల్ల మామూలు బీఎస్సీలో చేరాల్సి వచ్చింది!’‘మా అమ్మాయి మంచి అథ్లెట్. కోచింగ్కి పంపించాలని ఇంట్లో యుద్ధమే చేశా. కానీ ఆ టైమ్లోనే స్పోర్ట్స్ ఫీల్డ్లో మహామహులు వినేశ్ ఫోగట్, సాక్షి లాంటి వాళ్లకు జరిగినవి చూసి.. అమ్మో అమ్మాయి అథ్లెట్ కాకపోయినా పర్లేదు, వేధింపులతో రోడ్డెక్కకుండా ఉంటే చాలు అనుకుని గమ్మునుండిపోయాను!’‘నా సీనియర్ మేల్ కొలీగ్ హెరాస్మెంట్ భరించలేక మేనేజర్కి రిపోర్ట్ చేశాను. అతను నాదే తప్పన్నట్టు బిహేవ్ చేశాడు. దాంతో నా సీనియర్ కొలీగ్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో తలనొప్పులు చాలవన్నట్టు ఆఫీస్లో కూడా ఏం పెట్టుకుంటాను? అందుకే మంచి శాలరీ డ్రా చేస్తున్నా, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక జాబ్కి రిజైన్ చేశాను!’ఇవికాక బాల్యవివాహాలు, బాడీషేమింగ్స్, ట్రోలింగ్స్, డీప్ఫేక్స్, జడ్జిమెంట్స్, వరకట్న వేధింపుల నుంచి నిర్భయ, దిశ, హత్రాస్.. కోల్కత్తా డాక్టర్ హత్యాచార సంఘటనల దాకా.. ఒకటి మరువకముందే మరొకటి కళ్ల ముందే జరుగుతున్న దారుణాలు ఎన్నని! ఇలాంటివన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ఆఫ్లైన్లో ఎక్కడైనా.. ఆన్లైన్లో ఎప్పుడైనా.. మహిళలు, బాలికల మీద ఏ రూపంలో హింస కనిపించినా గళమెత్తాలని చాటుతోంది యుఎన్ఓ! అందుకే ఏటా నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమె¯Œ అండ్ గర్ల్స్) దినంగా జరుపుతోంది. పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. మన దగ్గరున్న మహిళా చట్టాలు...గృహహింస చట్టం.. 2005, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం.. 2013, పోక్సో (ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్.. 2012, బాల్యవివాహాల నిషేధ చట్టం.. 2006, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం.. 1986, వరకట్న నిషేధ చట్టం..1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం.. 1956, రేప్ కేసులకు 376 ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 67, పెళ్లి పేరుతో మహిళను మోసగిస్తే 69 బీఎన్నెస్, పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. 304బి ఐపీసీ (80, బీఎన్నెస్), పలురకాల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 354 ఐపీసీ (74 – 78 బీఎన్నెస్), మహిళ మర్యాదకు భంగం వాటిల్లితే 509 ఐపీసీ (79 బీఎన్నెస్) మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత, రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీ టీమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్క్రైమ్ పోర్టల్, వన్ స్టాప్ సెంటర్స్ వంటివీ అందుబాటులో ఉన్నాయి.గృహహింస అంటే..గృహహింస అంటే కేవలం పెళ్లైన స్త్రీలపై జరిగేదే అనే అపోహ ఉంది. కానీ, ఈ చట్టం ప్రకారం.. తండ్రి మొదలు అన్న, తమ్ముడు, సహచరుడు, భర్త వరకు ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వారిపై గృహహింస కింద కేసు పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా ఎటువంటి భంగం కలిగించినా సదరు పురుషుడికి చట్టపరమైన శిక్ష ఉంటుంది. జైలు శిక్ష ఉండదు కానీ, ఆర్థిక పరిహారం, ప్రత్యేక వసతి, ఆ పురుషుడి నుంచి రక్షణ ఆదేశాలు లభిస్తాయి. మన దేశంలో భర్త పెట్టే లైంగిక హింసకు క్రిమినల్ చట్టంలో శిక్షలు లేనప్పటికీ, గృహహింస చట్టం కింద మాత్రం బాధితులకు ఉపశమనం దొరుకుతోంది. దీనికి, 498ఏ (85 బీఎన్నెస్)కి సంబంధం లేదు. గృహహింస కింద కేసు వేయాలి అంటే, స్త్రీ – శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. 498ఏ ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి.మన దేశంలో స్త్రీలపై హింసకు గల కారణాలు.. మూలం పురుషాధిపత్య భావజాలమే! టీవీ, సినిమా, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూపించడం, నిరక్షరాస్యత, మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం (సీసీటీవీ కెమెరాలు, వీథి లైట్లు, పబ్లిక్ టాయిలెట్లు వగైరా) లేకపోవడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటివన్నీ కారణాలే అని చెబుతున్నారు నిపుణులు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)లో దేశంలోని 30 శాతం మహిళలు (15– 49 ఏళ్ల మధ్య) శారీరక, లైంగిక లేదా గృహహింసకు గురవుతున్నారని తేలింది.ఈ ‘డే’ వెనుక చరిత్రకరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కి 1930ల నుంచి 1960ల దాకా రఫైల్ త్రూహీయో(Rafael Trujillo) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనొక నియంత. హింసకు ప్రతిరూపం. క్రూరత్వానికి పరాకాష్ట. అతని పాలనలో డొమినికన్ రిపబ్లిక్ అట్టుడికింది. తన దారికి అడ్డొచ్చిన వాళ్లందరినీ జైళ్లల్లో పెట్టి.. ఊచకోత కోశాడు. మానవ హక్కులను కాలరాశాడు. జాత్యహంకార ధోరణితో డొమినికన్ రిపబ్లిక్లో ఉంటున్న వేలాది హైతీయుల మీద సామూహిక హత్యకాండకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలను వెదికి తెచ్చిపెట్టేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూశాడు. ఈ నియంత హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ మీరాబాల్ సిస్టర్స్గా పేరొందిన పాట్రియా, మినర్వా, మారియా థెరీసా అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు అజ్ఞాత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విషయం తెలిసి రఫైల్ ఆ ముగ్గురినీ బెదిరించాడు. వాళ్లు బెదరలేదు. దాంతో తరచుగా వాళ్లను అరెస్ట్ చేయిస్తూ.. వేధించేవాడు. అయినా వాళ్లు వెనక్కి తగ్గక ఆ నియంత క్రూరత్వాన్ని వివరిస్తూ, అతని చేతుల్లో మరణించిన వారి పేరు మీద కరపత్రాలను పంచసాగారు. దాంతో ఒకరోజు రఫైల్ తన మనుషుల చేత ఆ ముగ్గురినీ చంపించి, వాళ్ల జీప్లోనే పెట్టి, జీప్కి యాక్సిడెంట్ చేయించి.. దాన్నొక రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. అది రఫైల్ చేయించిన హత్యే అని గ్రహించి, ఆ నియంత మీద తిరగబడి అతణ్ణి చంపేశారు. అలా దాదాపు మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజాస్వామ్యానికి, స్త్రీవాదానికి చిహ్నంగా నిలిచిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను డొమినికన్ రిపబ్లిక్ ప్రజలు "Las Mariposas.. ద బటర్ఫ్లైస్’గా స్మరించుకుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’కి లోగోగా బటర్ఫ్లైనే నిర్ణయించింది యూఎన్ఓ! ‘మీరాబాల్ సిస్టర్స్’ హత్య తర్వాత వాళ్ల మరో సోదరి డిడే.. తన సోదరీమణుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించింది. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, మహిళా హక్కుల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఆ మీరాబాల్ సిస్టర్స్ గౌరవార్థమే యూఎన్ఓ 1999లో నవంబర్ 25ను ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’ గా గుర్తించి, ఏటా నిర్వహించాలని ప్రకటించింది. మహిళల మీద జరుగుతున్న హింస, అణచివేతలను వ్యతిరేకించాలని, నిర్భయంగా ఎదిరించాలని, హింసలేని, శాంతియుత, సంతోషకరమైన జీవితం ప్రతి మహిళ హక్కని ఎలుగెత్తిన ఈ సోదరీమణులను టైమ్స్.. 2020లో ‘హండ్రెడ్ విమెన్ ఆఫ్ ద ఇయర్’ సంచికలో చేర్చింది. పాఠ్యాంశం చేయాలికాలం మారినట్టే హింస కూడా మారుతోంది. స్త్రీల మీద కనిపించే హింస కన్నా కనపడని హింస ఎక్కువైంది. దానికి సామాజిక మాధ్యమాలు వేదికయ్యాయి. ఈ సైబర్క్రైమ్ ట్రోలింగ్ వద్దే ఆగడంలేదు. మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు పోర్న్ సైట్లల్లో పెట్టడం వరకు వెళుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలలో కూడా తగిన మార్పులు చేయడం అత్యంతవసరం. మరోవైపు స్త్రీల భద్రత కోసం ప్రస్తుతమున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. సెక్సువల్ ఎడ్యుకేషన్ను ఎలా అయితే తప్పనిసరి చేశారో, అలాగే స్త్రీల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలు వంటివాటి పైనా స్కూల్ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్ సెన్సిటివిటీని ఒక పాఠ్యాంశం చేయాలి. లేకపోతే ఎప్పటిలాగే స్త్రీల మీద హింస నార్మలైజ్ అవుతుంది.దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల 70 వేలకు పైగా గృహహింస కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ల సంఖ్య కేవలం 3,637 మాత్రమే. ఇందులో 2,655 మంది అడిషనల్ చార్జ్లోని వాళ్లే! చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులే అడిషనల్ చార్జ్లో ఉన్నారు.పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. -
ఘర్షణలకు ముగింపెప్పుడు?
నవంబరు 11 నుంచి కనిపించకుండా పోయిన మహిళలు, పిల్లలవిగా భావిస్తున్న ఆరు మృతదేహాలు మణిపుర్ సరిహద్దులోని నది నుండి స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత రాజధాని ఇంఫాల్ లోయలో భయంకర వాతావరణం నెలకొంది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి, వాహనాలను తగుల బెట్టి, పలువురు ఎమ్మెల్యేల నివాసాలపైనా, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పైనా దాడి చేశారు. దీంతో గిరిజనేతర మెయితీల ఆధిపత్యంలో ఉన్న లోయలోని ఏడు జిల్లాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గిరిజన కుకీ– జోలు ఎక్కువగా ఉండే చుట్టుపక్కల కొండలు, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాలలో కూడా కర్ఫ్యూ విధించారు. ప్రపంచమంతా తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... ఈ క్లిష్ట పరిస్థితు ల్లోనూ మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ శాంతిని పునరుద్ధరించే పని చేపట్టక పోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. ఇరవై నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో హింస రాజుకుంటోంది. 2023 మే 3న రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు దగ్గరగా ఉన్న చురాచాంద్పూర్ పట్టణంలో మెయితీ కమ్యూనిటీ– కుకీ తెగ మధ్య హింస చెలరేగింది. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలని గిరిజనేతర మెయితీ ప్రజలు డిమాండ్ చేయడం ఘర్షణలకు తక్షణ అని అంటున్నారు. కుకీలను మెయితీలు బయటి వ్యక్తులుగా, మాదకద్రవ్యాల వ్యాపారులుగా చూస్తారు. తమకు ఎస్టీ హోదా లేనందువల్ల తాము కుకీ ప్రాంతాల్లో భూములు కొనలేక పోతున్నట్లు వారు భావిస్తారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పరిపాలనా స్థానాలను కలిగి ఉన్న మెయితీలే తమ అవకాశాలన్నింటినీ కొట్టేస్తున్నట్లు కుకీలు భావి స్తారు. కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ప్రస్తుత అల్లర్లు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, విద్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.మణిపుర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఒక్కటే ప్రస్తుత హింసకు కారణం అని చెప్పలేం. అంతర్లీనంగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న కోపం, చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న వైరుధ్యం లాంటివి అన్నీ కలిసి నేటి దుఃస్థితికి దారితీశాయి. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలోని రక్షిత అడవులపై ప్రభుత్వ నిర్బంధం, తాము హింసకు గురవుతున్నామన్న భావన కుకీలలో అసంతృప్తిని కలిగిస్తోంది. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్లో ప్రవేశించిన కుకీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సరిహద్దు ఆవల, మణిపూర్లో తాము నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక కుకీ ల్యాండ్ కావాలనే వేర్పాటువాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం కూడా మరో కారణం. అలాగే కుకీలు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ కుకీ ప్రజలందరినీ ‘డ్రగ్ లార్డ్స్’ అని ప్రస్తావించడాన్ని వారు నిరసిస్తున్నారు. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇదీ కుకీల్లో ఆగ్రహానికి హేతువే.కొత్త గ్రామాలను ఎలా గుర్తించాలనే అంశంపై ప్రభుత్వానికి అసలు ఒక విధానం లేదు. అలాగే మణి పుర్లో పారదర్శకమైన అటవీ విధానం లేదు. దీంతో పాలక బీజేపీ కూటమిలోనూ దుమారం రేగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరింత విషమించకుండా కేంద్రం మరింత వివేకంతో వ్యవహరించాలి.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు ‘ 99899 88912 -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్శాఖ మొన్న అక్టోబర్లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్సింగ్ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
పశ్చిమ బెంగాల్: ఇరువర్గాల మధ్య చెలరేగిన హింస.. నిషేదాజ్ఞలు అమలు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకూ 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు వద్ద ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.ఈ ఘర్షణల కారణంగా సీల్దా నుంచి ముర్షిదాబాద్ వెళ్తున్న భాగీరథి ఎక్స్ప్రెస్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్లో గంతులేస్తూ.. -
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
-
రాజస్థాన్లో చెలరేగిన హింస.. 60 మంది అరెస్ట్
టోంక్: రాజస్థాన్లోని టోంక్ జిల్లాలోని డియోలీ ఉనియారాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్ మీనా ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్డిఎం అమిత్ చౌదరిని చెప్పుతో కొట్టారు. అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. #WATCH | Rajasthan by-poll independent candidate from Deoli-Uniara, Naresh Meena allegedly physically assaulted SDM at a polling station in Samravata villageVehicles vandalised and torched in Samravata village after the incident. pic.twitter.com/dv8jLnymh2— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 13, 2024ఈ ఉదంతంపై ఫిర్యాదు అందిన దరిమిలా పోలీసులు నరేష్ మీనాను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, సంరవత గ్రామస్తులు పోలీసులపై దాడి చేసి, దౌర్జన్యానికి దిగారు. నరేష్ మీనా మద్దతుదారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసినట్లు అజ్మీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాశ్ తెలిపారు. టోంక్ హింసాకాండపై జిల్లా అదనపు ఎస్పీ బ్రిజేంద్ర సింగ్ భాటి మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు నరేష్ మీనా కోసం వెతుకుతున్నామని తెలిపారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. Rajasthan: 60 people have been arrested so far in the case of ruckus, stone pelting, and arson incident in Samravata village last night, when police tried to apprehend Naresh Meena, independent candidate for Deoli Uniara assembly constituency by-polls in Tonk district, after he…— ANI (@ANI) November 14, 2024ఇది కూడా చదవండి: కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే... -
Breaking : మణిపూర్లో మళ్లీ హింస.. 11మంది ఎన్కౌంటర్
-
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరు వర్గాల ఘర్షణ.. పోలీసు కేసు నమోదు
బరేలీ: ఉత్తరప్రదేశ్లోని బరేలీలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బరేలీ జిల్లాలో రెండు వర్గాలు పరస్పరం ఇటుకలు, రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘర్షణలకు కారకులుగా అనుమానిస్తున్న 20 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన బరేలీలోని కిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్మశాన వాటికలోని వాల్మీకి ప్రాంతంలో చోటుచేసుకుంది. మద్యం సేవించే విషయమై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చివరికి ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఉదంతంపై అటుగా వెళ్తున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఇరు వర్గాలవారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు గుంపును లాఠీలతో చెదరగొట్టారు. ఈ కేసులో బాకర్గంజ్ అవుట్పోస్టు ఇన్చార్జి ప్రమోద్ కుమార్తో పాటు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు.. -
బహ్రాయిచ్లో కొనసాగుతున్న ఆందోళనలు
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.బహ్రాయిచ్ జిల్లాలోని మహరాజ్గంజ్ మార్కెట్లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.యూపీలోని బహ్రాయిచ్లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో మృతిచెందాడన్నారు.బహ్రాయిచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్
ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కణికలా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది.ఈనేపథ్యంలో ఇరాన్- ఇజ్రాయెల్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఇదే కాకుండా లెబనాన్, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోందని తెలిపారు.చదవండి: మధ్యప్రాచ్యంలో యుద్ద భేరీ..ఈ మేరకు యూఎస్ వాషింగ్టన్లోని థింక్ తాంక్ కార్నేగీ ఎండోమెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ‘తీవ్రవాద చర్యగా’ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. అది ఎంతో ముఖమన్న జై శంకర్.. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదన చెప్పారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నట్లుఇదిలా ఉండగా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ- తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. -
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్బుక్ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. న్యాయవ్యవస్థపై నిందలా?
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2021 ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత జరిగన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం వెలుపలకు (బెంగాల్ కాకుండా) బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. కాగా ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన కేసు దర్యాప్తును కల్కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న కారణంతో ఈ 45 కేసులను బెంగాల్ నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం.. బెంగాల్లోని మొత్తం న్యాయవ్యవస్థపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై తప్పుపట్టింది. సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఉద్దేశించి బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బదిలీ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని సూచించింది.‘మిస్టర్ రాజు.. బెంగాల్లోని అన్ని కోర్టులు ఘర్షణ వాతావరణంలో ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఎటువంటి ఆధారాలు ఈ పిటిషన్లో ప్రస్తావించారు? విచారణలు సక్రమంగా జరగడం లేదని, అక్రమంగా బెయిళ్లు ఇస్తున్నాయని ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థ మొత్తం ఘర్షణ వాతావరణంలో పని చేస్తోందనేలా పిటిషన్ ఉంది. మీ అధికారులకు (సీబీఐ) జ్యుడీషియల్ అధికారులంటే ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి ప్రకటనలు చేయవద్దు’ అని సీబీఐకి సూచించింది.ఈ పిటిషన్ ధిక్కార నోటీసుకి తగిన కేసని.. న్యాయవాదికి సమన్లు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం బెదిరించింది. అయితే న్యాయవ్యవస్థపైన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా లేవని ఏఎస్జీ రాజు చెప్పారు. పిటిషన్ రాతలో కొంత లోపం ఉన్నట్లు అంగీకరించి క్షమాపణలు కోరవడంతో కోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదు. అనంతరం పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమంతించింది. దీంతో కొత్త పిటిషన్ను సమర్పిస్తామని ఎస్పీ రాజు కోర్టుకు తెలపడంతో పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
మణిపూర్లో హై టెన్షన్.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతిచెందారు.అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన హింసలో దాదాపు 11 మంది ప్రజలు మృతి చెందారు. ఇక, నిన్న(సోమవారం) కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈరోజు విద్యార్థులు మణిపూర్లోని రాజ్భవన్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. मणिपुर में प्रदर्शनकारियों ने राज्यपाल के घर पर किया पथराव. मोदी जी अभी रूस और यूक्रेन के बीच युद्ध रुकवाने में व्यस्त हैं!#ManipurVoilence #Manipur pic.twitter.com/t2E3honaQn— Newswala (@Newswalahindi) September 10, 2024 ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్ల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.Imphal under CurfewIt seems to be the shortcut to maintaining law and order. @NBirenSingh @narendramodi @AmitShah After 16th months of #Manipurcrisis this is what you can come severely affecting the small-time business and unorganised workforce.#ManipurFightsBack… pic.twitter.com/2pDPUKTKrs— khaba (@krishnankh) September 10, 2024 ఏడాది నుంచి ఘర్షణలు..ఇదిలా ఉండగా.. ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఇంక తగ్గడం లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి. The condition in Manipur has become very critical now…#Manipur #ManipurConflict #ManipurCrisis #ManipurFightsBack pic.twitter.com/R8GKNFUOGg— Anindya Das (@AnindyaDas1) September 10, 2024 మరోవైపు.. మణిపూర్ ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్టు సమాచారం. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్కు మచ్చ తెచ్చింది. మణిపూర్లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.ఇది కూడా చదవండి: పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంMatinee show for #ManipurCrisis. When #Meities have to stage a protest this is the precautions the state security forces react,in #Churachandpur and #Kangpokpi, #Kukis_Zo are allowed to march with guns. #ManipurConflict #iPhone16Plus #Kuki_ZoEngineeredManipurViolence #iPhone pic.twitter.com/28FPjkl4JH— Adu-Oirasu. (@themeiteitweets) September 10, 2024 Students are protesting in Manipur after the death of 9 People.The condition in Manipur is getting worse everyday.Godi media is busy in Hindu-Muslim Propaganda….they won’t show these things 👇pic.twitter.com/DHMUUwGilj— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) September 9, 2024 -
మణిపూర్లో మళ్లీ హింస.. ఆరుగురి మృతి
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్పుర్లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా మణిపూర్లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్లోని బిష్ణుపూర్లో రెండు ప్రదేశాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు. -
కోల్కతా నుంచి కేరళ వరకు...
కేరళతో మొదలుపెట్టి కోల్కతా దాకా... దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాష్టీ కపు వార్తలే. ఇవన్నీ దేశంలో మహిళల స్థితిని ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో రాజకీయాల నిర్లిప్తత, వ్యవస్థల వైఫల్యమూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలు కాస్తా హేమ కమిటీ రిపోర్టుతో బట్టబయలయ్యాయి. నటులు, దర్శకులు, సినీ రంగంలోని అన్ని వర్గాల ప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను చూస్తే, ‘అయ్యో’ అనిపి స్తోంది. అధ్వాన్నమైన విషయం ఇంకోటి ఉంది. మహిళకు సమానత్వం, మర్యాద, స్వేచ్ఛ, భద్రత అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడం! ఇదే విషయం మిత్రుడైన ఓ రాజకీయ నేతతో చెబితే... ‘‘మహిళలపై దౌర్జన్యం విషయాల్లో వాళ్లు, వీళ్లు అని ఏమీ లేదు. సొంత ప్రయోజనాలే వారికి పరమావధి’’ అని సమాధానమిచ్చాడు. నిత్యంకించపరిచే వ్యాఖ్యలు వింటూండే మహిళ రాజకీయ నేతలు కూడా పార్టీ అగ్రనేతల హుకుంలకు కట్టుబడ్డారేమో తెలియదు కానీ... గట్టిగా మాట్లాడతారని ఆశించినవాళ్లు కూడా నోళ్లు మెదపలేని స్థితిలో ఉన్నారు. బాధితు లకు రక్షణగా ఉండటం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అనిపించిందేమో వారికి!కోల్కతా ‘అభయ’కు న్యాయం దక్కుతుందని నాకైతే అనిపించడం లేదు. ఇలా చెప్పేందుకూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసులో అక్కడి ఘోరకలి సమగ్రంగా ప్రపంచానికి తెలుస్తుందన్న నమ్మకమూ సన్న గిల్లుతోంది. కాలేజీ అధికారులు బాధితురాలి తల్లిదండ్రులకు చేసిన మూడు ఫోన్ కాల్స్ వివరాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీన్నిబట్టే ఈ కేసు వివరాలపై గోప్యత ఎంతన్నది స్పష్టమైంది.ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా సందీప్ ఘోష్ చలాయించిన అధికారాన్ని అర్థం చేసుకుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కాలేజీ ఇంటర్న్లు ఆత్మ హత్య చేసుకుందామని అనుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. కాలేజీ మాజీ అధికారి అఖ్తర్ అలీ ఆరోపణల ప్రకారం సందీప్ ఘోష్ మృత దేహాలతో వ్యాపారం చేసేవాడు. అవయవాల రాకెట్నూ నడిపేవాడు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? సందీప్ ఘోష్ తరఫున వాదించేందుకు ప్రభుత్వం న్యాయ వాదిని నియమించడం ఏమిటి?ఈ ఘటనను రాజకీయంగా వాడుకోలేదా? అందరూ వాడుకున్నారు. రాళ్లు రువ్వడంతో దేబాశీష్ చక్రవర్తి లాంటి పోలీసు కనుచూపు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటా మాటా నడుస్తోంది. ఇందు కేనేమో... ఆందోళన చేస్తున్న వైద్యులు ఈ రెండు పార్టీల వారు ఎవరూ తమ పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ‘అభయ’లాంటి ఘటన జరిగిన తరువాత చేసిన వ్యాఖ్యలు తప్పేనని తృణమూల్ పార్టీ హుందాగా తమ తప్పు ఒప్పుకుని ఉండాల్సింది. కొద్ది రోజులపాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి... ఆ తరువాత ఒక్క పళంగా విరుచుకుపడింది. ఒకరి ద్దరు పార్టీ ప్రతినిధులు నోటికి ఏదొస్తే అది మాట్లా డేశారు. ఈ క్రమంలోనే ఓ ఎంపీని నా కార్యక్రమం నుంచి వెళ్లిపొమ్మని అడగాల్సి వచ్చింది. ముప్ఫై ఏళ్ల నా వృత్తి జీవితంలో నేను ఇలా ఎన్నడూ చేయలేదు. పశ్చిమ బెంగాల్ ఘటనకు బాధ్యత టీఎంసీదైతే... హేమ కమిటీ నివేదిక పుణ్యమా అని కేరళ సినీ రంగం లేవనెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి లెఫ్ట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జస్టిస్ కె.హేమ కమిటీ తన నివేదికను సిద్ధం చేసేందుకు ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఈ నివేదిక బయటపడటంతో చాలామంది మహిళా ఆర్టిస్టులు ఇప్పుడు పోలీసులకూ, టాస్క్ఫోర్స్కూ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఈ మలయాళ ‘మీ టూ’ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నటీమణులు రేవతి, పార్వతి చెప్పిన దాని ప్రకారం... ఈ కేసులో అటు రాజకీయ నేతలు, ఇటు సినిమా శక్తులు వాస్తవాలను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసిపోయే అవకాశమూ లేకపోలేదని వాళ్లు అంటున్నారు. హేమా కమిటీ నివేదికలోని 11 పేరాలను ప్రభుత్వం ఎందుకు తొలగించిందో ఇప్పటివరకూ ఎలాంటి వివరణ లేదు. గుజరాత్ ప్రభుత్వ పుణ్యమా అని బిల్కిస్ బానో రేపిస్టులు మెడలో పూలదండలతో జైల్లోంచి బయట కొచ్చారు. అభయ విషయంలో మమత ప్రభుత్వం మితిమీరిన అహంకారంతో వ్యవహరించింది. 2012 నాటి నిర్భయ ఘటనలో కాంగ్రెస్వాళ్లూ నానా చెత్తా మాట్లాడారు. ఇవన్నీ మనకు చెబుతున్నది ఏమిటి? రాజకీయ నేతలు పట్టించుకోవాలంటే, మహిళలు ఒక ఓటుబ్యాంకుగా సంఘటితం కావాలి.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బంగ్లాదేశ్లో మళ్లీ హింస.. 40 మందికి గాయాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచిపెట్టాక అక్కడి పరిస్థితులు మెరుగుపడవచ్చని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి మళ్లీ హింస చెలరేగింది.రాజధాని ఢాకాలోని సచివాలయం దగ్గర గుమిగూడిన విద్యార్థులకు, అన్సార్ సభ్యులు(ఒక వర్గానికి చెందిన బృందం)మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణల్లో 40 మందికి పైగా జనం గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీనికి ముందు ఢాకా యూనివర్సిటీలోని హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడికి అన్సార్ గ్రూప్ సభ్యులు వచ్చారు.ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం విద్యార్థుల ఉద్యమ సమన్వయకర్త నహిద్ ఇస్లాంను అరెస్టు చేశారని , బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేత అబుల్ హస్నత్ అబ్దుల్లాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలియగానే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో హస్నత్ అబ్దుల్లా ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. తన నిర్బంధానికి మాజీ అన్సార్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏకేఎం అమీనుల్ హక్ బాధ్యత వహించాలని ఆయన దానిలో డిమండ్ చేశారు. ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు దీనిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మరోమారు అల్లర్లు చోటుచేసుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. -
నెల తర్వాత తెరుచుకున్న బంగ్లా బడులు
ఢాకా: బంగ్లాదేశ్లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17వ తేదీ నుంచి మూతబడ్డాయి. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో..‘ప్రధాన సలహాదారు యూనుస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నాం’అంటూ 15వ తేదీన విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి మొసమ్మత్ రహీమా అక్తర్ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం యూనిఫాం ధరించిన స్కూలు విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకోవడం కనిపించింది. రాజధాని ఢాకాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్లో పాఠశాలలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. -
హిందువుల రక్షణ మన బాధ్యత: మోహన్ భగవత్
బంగ్లాదేశ్లో హింసకు బలవుతున్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్పై ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపై మోహన్ భగవత్ స్పందించారు.అక్కడ నివసిస్తున్న హిందువులను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న హిందువులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన దేశంపై ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని, అందుకు బదులుగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించామన్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న అస్థిరత, అరాచకాల వల్ల అక్కడున్న హిందువులు అవస్థల పాలవుతున్నారని అన్నారు. అందుకే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. -
దేశం మొత్తం ఉలిక్కిపడేలా ఏపీకి చంద్రగ్రహణం..
-
ఎంత అమానుషం: భార్యను తాడుతో కట్టేసి.. బైక్పై ఈడ్చుకెళ్లిన భర్త
రాజస్థాన్లో అమానుష ఘటన వెలుగుచూసింది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. భార్య కాళ్లకు తాడు వేసి దానిని బైక్కు కట్టి కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘోర దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో.. మట్టి, రాళ్లు కలిగిన నేల మీద మహిళను ఈడ్చుకెళ్తుండే.. ఆమె నొప్పితో బాధపడుతూ సాయం కోసం అరవడం వినిపిస్తోంది. అక్కడే ఓ మహిళ, మరో వ్యక్తి (వీడియో తీస్తున్న అతను) ఉన్నప్పటికీ దీనిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. నాగౌర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్ దిగి ఓ సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. గాయాలపాలైన భార్య మెల్లగా లేచి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అయితే ఈ 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు చెందిన ఘటన గత నెలలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలోషేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. అయితే జైసల్మేర్లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా..భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిని ప్రేమ్ రామ్ మేఘ్వాల్గా(32) గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్వాల్ నిరుద్యోగి, డ్రగ్స్ బానిసైనట్లు పంచౌడీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. ప్రస్తుతం మహిళ పంజాబ్లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.Shocking incident in Nagaur: A man, under the influence of alcohol,tied his wife to the back of a bike and dragged her on the road.The video went viral, leading to the man's arrest. Prior to this, the wife was reportedly held captive at home. She is now with her mother in Punjab. pic.twitter.com/Nfik4CJpqj— Smriti Sharma (@SmritiSharma_) August 13, 2024 -
Bangladesh: నీటిలో నిలుచుని.. భారత్లోకి వస్తామంటూ వేడుకోలు
బంగ్లాదేశ్లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా బంగ్లాదేశ్లో ఉంటున్న వెయ్యిమంది హిందూ కుటుంబాలకు చెందినవారు బెంగాల్లోని కూచ్ బెహార్లోని రిజర్వాయర్లో నిలబడి తమను భారతదేశంలోకి అనుమతించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)ను అభ్యర్థిస్తున్నారు. వారిలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సరిహద్దులోని జీరో పాయింట్కు 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.బారత్ - బంగ్లదేశ్ సరిహద్దుపై నిఘా సారించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని ఈ కమిటీకి చైర్మన్గా నియమించారు. దీనికిముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం నిఘాను మరింతగా పెంచింది. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
..అదే కల్లోలం
ఢాకా: బంగ్లాదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. షేక్ హసీనా ప్రధానిగా తప్పుకోవాలంటూ వెల్లువెత్తిన నిరసనలు ఆమె రాజీనామా చేసినా ఆగడం లేదు. సోమవారం సాయంత్రానికే హసీనా దేశం వీడినా రాత్రి పొడవునా దేశవ్యాప్తంగా దమనకాండ కొనసాగింది. అల్లరి మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చలవిడిగా నిప్పు పెట్టారు. చివరికి పోలీస్ స్టేషన్లను కూడా వదల్లేదు. ఒకచోట ఎస్సైని కొట్టి చంపారు. మరోచోట ప్రముఖ సినీ హీరో ఇంటిపై నిరసనకారులు దాడికి దిగారు. హీరో, ఆయన తండ్రి తుపాకీతో బెదిరించడంతో మరింతగా రెచి్చపోయారు. ఇద్దరినీ కర్రలతో చితకబాది చంపేశారు. జోషోర్ జిల్లాలో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నాయకుని హోటల్ను తగలబెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు! సోమవారం ఢాకాలో పాక్షికంగా ధ్వంసం చేసిన హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు.మైనారిటీలైన హిందువులను దేశవ్యాప్తంగా అల్లరిమూకలు లక్ష్యం చేసుకున్నాయి. దేవాలయాలను ధ్వంసం చేశారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. హసీనా పలాయనం అనంతరం దేశవ్యాప్తంగా కనీసం 100 మందికి పైగా అల్లర్లకు బలైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగడంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచి్చనట్టు చెబుతున్నారు. మరోవైపు న్యూయార్క్లోని బంగ్లాదేశ్ కాన్సులేట్పై దాడి జరిగింది. నిరసనకారులు కార్యాలయంలోకి జొరబడి ముజిబుర్ రెహ్మాన్ ఫొటోను, వస్తువులను ధ్వంసం చేశారు. సంబంధిత వీడియో వైరల్గా మారింది.తాత్కాలిక ప్రభుత్వ సారధి గాయూనుస్నోబెల్ గ్రహీత మహమ్మద్ యూ నుస్ సారథిగా సైన్యం కనుసన్నల్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్ష కార్యాల యం మంగళవారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కేసులు, జైలుశిక్ష నేపథ్యంలో యూనుస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. హసీనా సర్కారు పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిణామాన్ని దేశానికి రెండో విముక్తిగా అభివర్ణించారు. అంతకుముందు, విద్యార్థి సంఘాల అలి్టమేటం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు, సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు కూర్పుపై వారితో చర్చించారు. విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సారథి బేగం ఖలీదా జియా (79)ను గృహనిర్బంధం నుంచి విడుదల చేశారు. -
బంగ్లాలో మళ్లీ ఘర్షణలు: 97 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం తొలిరోజే హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య ఆదివారం దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఏకంగా 97 మంది మరణించారు. ఆందోళనల ధాటికి రాజధాని ఢాకాలో దుకాణాలు మూతబడ్డాయి. షాబాగ్లో వేలాది మంది విద్యార్థులు తదితరులు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బంగాబంధు షేక్ ముజీబ్ మెడికల్ కాలేజీలో వీరంగం సృష్టించారు. వాహనాలను తగలబెట్టారు. దాంతో రోగులు, వైద్యులు, విద్యార్థులు భయంతో వణికిపోయారు. దేశ విమోచన పోరాట అమరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను తగ్గించాలంటూ యువత, ఆందోళనకారులు ఇటీవల చేపట్టిన భారీ ఆందోళనల్లో 200కు పైగా చనిపోవడం తెలిసిందే. అందుకు బాధ్యత వహిస్తూ హసీనా గద్దె దిగాలంటూ నిరసనకారులు తాజాగా మళ్లీ ఉద్యమబాట పట్టారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఫేస్బుక్, వాట్సప్, మెసేంజర్, ఇన్స్ట్రాగాం సేవలను నిలిపేశారు. 4జీ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేయాలని మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ఉద్యమం చేస్తున్న వారిలో యువత లేరని, ఉగ్రవాదులే ఉన్నారని హసీనా ఆరోపించారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై ఆర్మీ, పోలీసు విభాగాల అధిపతులతో ఆమె సమీక్ష జరిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామంటూ నిరుద్యోగులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, వారు తిరస్కరించడం తెల్సిందే. రాజుకున్న చిచ్చు... బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
ఏపీలో ముఠాల పాలన: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రెండు నెలలుగా ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు.. రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటనలు వీటికి నిదర్శనం. ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించ కూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.గ్రామంలో మరికొందరికి హానిసుబ్బరాయుడు హత్య అత్యంత దారుణం. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత జయనారపురెడ్డిని రెండుసార్లు చంపేందుకు యత్నించారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నాచేస్తే ఎక్కడ జరిగాయని అడుగుతున్న టీడీపీ నేతలు సీతారామపురం ఘటనపై ఏం సమాధానం చెప్తారు? పోలీసులు, టీడీపీ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోకపోతే ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తాం. అర్ధరాత్రి శ్రీనివాసరెడ్డి 30 మంది అనుచరులతో మహిళలు, వృద్ధులపై దాడిచేయడం హేయమైన చర్య. గ్రామంలో మరికొందరికి ప్రాణహాని ఉంది. పోలీసులు స్పందించాలి. – శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం చేత కాదని చెప్పండి, మా రక్షణ మేం చూసుకుంటాం..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మళ్లీ ఫ్యాక్షన్ విష సంస్కృతిని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారు. దౌర్జన్యాలతో ఏమీ సాధించలేరు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పోలీసులు చేతకాదని చెప్పండి, మా నేతలు, కార్యకర్తలను మేమే రక్షించుకుంటాం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాలసామాన్యులకు రక్షణ ఎక్కడ?రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు రక్షణ కరువైంది. అధికారంలోకి వచ్చింది పరిపాలన కోసమా, రాజకీయ హత్యల కోసమా? వరుస హత్యలపై జగన్ ధర్నాచేస్తే అంతా బూటకమన్న హోంమంత్రి వనిత ఇప్పుడే సమాధానం చెప్తారు? ఎస్ఐ మీదనే పెట్రోల్ పోసి తగలబెడతామంటూ బెదిరిస్తుంటే మీరేమి చేస్తారు? డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సమాధానం చెప్పాలి. జగన్ హత్యా రాజకీయాలకు పుల్స్టాప్ పెడితే మీరు మళ్లీ ప్రోత్సహిస్తున్నారు. – విరూపాక్షి, ఎమ్మెల్యే, ఆలూరుసంపద సృష్టి అంటే చంపడమా!?రాష్ట్రంలో సంపద సృష్టించడమంటే వైఎస్సార్సీపీ నేతలను చంపడమా? మహిళలు, వృద్ధులపై కత్తులు, కర్రలతో దాడులు చేయడం సిగ్గుచేటు. కాపు కులానికి చెందిన సుబ్బరాయుడును కిరాతకంగా చంపడం దారుణం. ఎస్పీకి కాల్చేసి చెప్పినా స్పందించలేదు. గ్రామంలోని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు జయనారపురెడ్డి, జమాల్రెడ్డి, పెద్దిరెడ్డి, మరికొంతమందికి రక్షణ కల్పించాలి. వారికేమైనా జరిగితే పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంరాష్ట్రంలో హింసాకాండ ఆగడంలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్లెదుటే వైఎస్సార్సీపీ వారిని వెంటాడి చంపడం బాధాకరం. హత్యలు చేయడమే అభివృద్ధా. రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు మహిళల జోలికి వెళ్లరని అంటారు. కానీ, ఇక్కడ మహిళలపైనా దాడిచేయడం సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉన్నారు. సహనం నశిస్తే ఎలా ఉంటుందో పోలీసులు ఆలోచించాలి. – శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేభయపెడితే వెనక్కి తగ్గం..రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తే వెనక్కి తగ్గం. కలిసికట్టుగా పోరాడి సీతారామపురంలోని నాయకులు, కార్యకర్తలకు కాపాడుకుంటాం. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మహిళలని కూడా చూడకుండా దాడులు చేయడం హేయం. – ఇసాక్బాషా, ఎమ్మెల్సీ, నంద్యాలహత్యా రాజకీయాలు ఆపాలి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఆపాలి. ప్రశాంతంగా ఉన్న సీతారామపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సుబ్బరాయుడును చంపడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమవుతోంది. వైఎస్సార్సీపీకి ఓటేస్తే చంపేస్తారా? బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. – ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏపీలో అరాచక పాలనపై గత నెల 24వ తేదీన ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టిన వైఎస్సార్సీపీ.. ఈ మేరకు జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ -
బంగ్లాదేశ్లో మళ్లీ హింస.. 91 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడికింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వివాదంపై ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగింది. ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 91 మంది దాకా మృతి చెందినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. ఇటీవలే కోటా వివాదంపై చెలరేగిన హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగడంతో అక్కడ ఉన్న దేశ పౌరులను భారత రాయబార కార్యాలయం అలర్ట్ చేసింది. భారత పౌరులంతా సాయం కోసం తమతో టచ్లో ఉండాలని కోరింది. ఇందుకు పలు ఫోన్ నంబర్లను ప్రకటించింది. ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడేవారు విద్యార్థులు కాదని అలాంటివారిని అణచివేయాలని ప్రధాని షేక్హసీనా పిలుపునిచ్చారు. -
London: ముగ్గురు చిన్నారుల హత్య.. ఆందోళనలు.. హై అలర్ట్
బ్రిటన్లో ఇటీవలి కాలంలో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నార్త్-వెస్ట్ ఇంగ్లండ్లో ముగ్గురు చిన్నారుల హత్య ఆందోళనలకు దారితీసింది. అది హింసాయుతంగా మారి తీవ్ర రూపం దాల్చింది.సౌత్ పోర్ట్కు చెందిన ఒక వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ చిన్నారుల హత్యకు ఒక వర్గానికి చెందిన వలసదారుడే కారణమంటూ ఆరోపించాడు. ఈ నేపధ్యంలో ఆ వర్గానికి చెందిన వలసదారులు ఆందోళనకు దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు వాగ్వాదం తీవ్రమైంది. కాగా ఈ కేసులో పోలీసు అధికారులు 17 ఏళ్ల ఆక్సెల్ రుడాకుబానా అనే కుర్రాడిని అరెస్టు చేశారు. ఇతను వేల్స్లోని కార్డిఫ్లో జన్మించాడు. ఈ కుర్రాడు తొమ్మిదేళ్ల ఆలిస్ డిసిల్వా అగ్యియర్, ఏడేళ్ల ఎల్సీ డాట్ స్టాన్కాంబ్, ఆరేళ్ల బేబ్ కింగ్ హత్యలకు కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఈ హత్యల నేపధ్యంలో బ్రిటన్లోని లివర్పూల్, మాంచెస్టర్, సుందర్ల్యాండ్, హల్, బెల్ఫాస్ట్, లీడ్స్తో సహా పలు ప్రాంతాల్లో హింసాయూత ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. లివర్పూల్లో నిరసనకారులు పోలీసులపైకి సీసాలు, ఇటుకలు విసిరారు. అలాగే వలసదారులకు చెందిన ఒక హోటల్ కిటికీలను పగులగొట్టారు. ఆందోళనకారుల దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసు వ్యాన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో బ్రిటన్ అంతటా హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. -
బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు.. సోషల్ మీడియా యాప్స్పై నిషేధం
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై మళ్లీ అల్లర్లు చెలరేగడంతో ప్రభుత్వం సోషల్ మీడియా యాప్లైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్, యూట్యూబ్లను తాత్కాలికంగా నిషేధించింది. అయితే దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఐస్లు తమ నివేదికలలో బంగ్లాదేశ్లో సోషల్ మీడియా నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, వాట్సాప్ తదితర ప్రముఖ సోషల్ మీడియా యాప్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అదేవిధంగా గ్లోబల్ ఐస్ న్యూస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గ్లోబల్ ఐస్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెటా ప్లాట్ఫారమ్లకు సంబంధించిన నెట్వర్క్ను పరిమితం చేసింది. ఇంటర్నెట్ స్పీడ్ను కూడా తగ్గించింది. ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో ఇటువంటి ఆందోళనలు జరగగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రిజర్వేషన్ కోటాపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కాస్త సద్దుమణిగిన నిరసనలు మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయి. -
ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ శుక్రవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సోమవారం సమాధానమిచ్చారు.2019 నుంచి విదేశాల్లో వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న 633 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు తెలిపారు. ఈ మరణాలు 41 దేశాల్లో జరగ్గా.. కెనడాలో అత్యధికంగా 172 మంది, అమెరికాలో 108 మంది భారతీయ విద్యార్ధులు ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కెనడా, యూఎస్ తరువాత, అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో యూకే (58), ఆస్ట్రేలియా (57), రష్యా (37), జర్మనీ (24) ఉన్నాయి. పొరుగున ఉన్న పాక్లోనూ ఒకరు మరణించారు.అయితే వీరంతా ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి వివిధ కారణాల వల్ల చనిపోయినట్లు చెప్పారు. దీనికితోడు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది మరణించగా.. అత్యధికంగా తొమ్మిది మంది కెనడాలో, ఆరుగురు అమెరికాలో ప్రాణాలు విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు. గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. -
Pakistan: గిరిజన గ్రూపుల ఘర్షణ.. 36 మంది మృతి
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యాయి. దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో రెండు గిరిజన గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందారని, వందలాది మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్నవారు మారణాయుధాలు కూడా ఉపయోగించారని సమాచారం.పాకిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక భూమి స్వాధీనం కోసం రెండు గిరిజన గ్రూపుల మధ్య సాయుధ పోరాటం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసాయుతకాండలో 36 మంది మృతిచెందగా, 162 మంది గాయపడ్డారు. గ్రామంలో గతంలో కూడా వివిధ తెగలు, మత సమూహాల మధ్య ఘర్షణలు జరిగినట్లు అధికారులు తెలిపారు. తాజా ఘటన ఎగువ కుర్రం జిల్లా బొషెరా గ్రామంలో చోటుచేసుకుంది. -
ఏపీ హింసకు కేరాఫ్ అడ్రస్ గా మారింది
-
లఖింపూర్ ఖేరి ఘటన: ఆశిష్ మిశ్రాకు ‘సుప్రీం’ బెయిల్ మంజూరు
ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2021 లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడైన ఆశిష్కు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్ ఇచ్చింది. అయితే ఆశిష్ మిశ్రా ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గతేడాది జనవరిలో ఆశిష్కు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.‘‘ లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి అన్ని అంశాలను పరిశీస్తున్నాం. 117 మంది వద్ద లక్ష్యాలు తీసుకోండి. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేయాలి’’ అని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పెండింగ్లో ఉన్న అంశాలపై ట్రయల్ షెడ్యూల్ చేసుకొని తర్వరగా విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనలు చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Bihar: పోలీసులతో ఘర్షణ...మెడికోలకు గాయాలు!
ముజఫర్పూర్: బీహార్లోని ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(ఎస్కేఎంసీహెచ్)లో వైద్య విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో పోలీసుల చర్యను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.పోలీసుల లాఠీచార్జి అనంతరం వైద్య విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్కేఎంసీహెచ్లో వైద్యులు ఎమర్జెన్సీతో సహా అన్ని సేవలను నిలిపివేశారు. సమ్మెకు దిగుతున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు వైద్య విద్యార్థులు బైక్పై మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నారు. మెడికల్ కాలేజీ గేటు నంబర్ త్రీ దగ్గర అహియాపూర్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ అధికారి వీరిని ఆపారు.ఈ నేపధ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఒక వైద్య విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని మిగిలిన వైద్య విద్యార్థుల వాట్సాప్ గ్రూప్లో విద్యార్థులందరికీ షేర్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థులంతా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని చుట్టుముట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు వాహనాల్లో ఎస్కెఎంసిహెచ్కి చేరుకున్నారు. అనంతరం వారు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రోగులు, వారి బంధువులు భయాందోళనలతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వైద్య విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. -
బంగ్లాదేశ్: కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ఢాకా: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు మొదలు పెట్టింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం తాజాగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విధానంలో మార్పులు తీసుకురావాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటికే 133 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మందిదాకా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుదాటి భారత్లో ప్రవేశించినట్లు సమాచారం. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని షేక్హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. -
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి! 978 మంది భారతీయులు వెనక్కు బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.ఇదీ సమస్య... 1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది. -
బంగ్లాదేశ్లో చల్లారని ఉద్రిక్తతలు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు బాహాబాహీ తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని పేర్కొంది. అయితే, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై యంత్రాంగం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రాజధాని ఢాకా పరిధిలోని నర్సింగ్డి జిల్లాలో ఉన్న జైలుకు శుక్రవారం రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ముందుగా వారు జైలుపై దాడి చేసి, అందులోని వారందరినీ విడిచిపెట్టారు. ‘ఖైదీలంతా పరారయ్యాక ఆందోళనకారులు జైలు భవనానికి నిప్పుపెట్టారు. వెళ్లిపోయిన ఖైదీలు ఎంతమంది అనేది తెలియదు. కానీ, వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది’ అని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు ఏఎఫ్పీ వార్తాసంస్థ వెల్లడించింది. శుక్రవారం ఢాకాలోని ప్రభుత్వ టీవీ కార్యాలయాన్ని సుమారు 1,000 మంది ఆందోళనకారులు ముట్టడించినట్లు ఏఎఫ్పీ తెలిపింది. వీరిని చెదరగొట్టేందుకు సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. వీధుల్లో పెద్ద సంఖ్యలో బుల్లెట్లతోపాటు రక్తం మరకలు కనిపించాయని తెలిపింది. ఆందోళనకారులు గురువారం టీవీ కార్యాలయంలో కొంతభాగాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు.దేశవ్యాప్త కర్ఫ్యూ ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు శృతిమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. -
దాడులు ఆగటానికి ఇంకాస్తా సమయం పడుతుంది
-
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
టీడీపీ అరాచకాలు.. దొరికితే దాడి లేదా ధ్వంసం
-
వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి: రాష్ట్రపతికి అరకు ఎంపీ ఫిర్యాదు
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని అరకు ఎంపీ తనూజారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. మంగళవారం(జులై2) ఆమె రాష్ట్రపతిని కలిశారు. 15 నిమిషాల పాటు రాష్ట్రపతితో తనూజారాణి భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని లేదంటే ప్రత్యేక చట్టం ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అరకు కాఫీ రైతుల బాగు కోసం గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని, ఈ సొసైటీ ద్వారా కాఫీ కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. -
ఏపీలో హింస పెరిగింది: ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింస పెచ్చరిల్లుతోందని, టీడీపీ శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి అన్నారు. సోమవారం(జులై1) రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వైఎస్ఆర్సీపీ తరపున రఘునాథ్రెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతిపరులపై హింసకు తెగబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్జగన్ అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.ప్రత్యేక హోదా వల్ల రాయితీలు, నిధులు ఏపీకి వస్తాయి. ఏపీలో మీడియా ఛానల్స్ ను అణిచి వేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీ మారిటైమ్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అనేక ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు’అని వివరించారు. -
బెంగాల్లో హింసపై బీజేపీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఎంపీలు బిప్లబ్ కుమార్ దేబ్ కన్వీనర్గా, రవిశంకర్ ప్రసాద్, బ్రిజ్ లాల్, కవితా పటీదార్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్ పొడిగింపు?
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు సిట్ ఇన్చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను సమర్పించనున్నారు. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘హింసాత్మక ఘటనలపై ఈసీకి ఇవాళ నివేదిక ఇస్తాం. నాలుగు జిల్లాల్లో టీమ్లు దర్యాప్తులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు చెప్పి.. కొన్ని కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తాం. అలాగే కొంతమంది నిందితులను గుర్తించాం. నేటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తాం’’ అని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్లాల్ ఓ మీడియాతో చిట్చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిట్ ఇలా.. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ సభ్యులు.. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పల్నాడులో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో రెండు బృందాలు, తిరుపతి చంద్రగిరిలో ఒక టీం, అనంతపురం తాడిపత్రిలో మరో టీం పర్యటించింది. డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ చేపట్టింది. అదే సమయంలో.. వినీత్ బ్రిజ్లాల్, ఐజీ (సిట్ ఇన్ఛార్జి)రమాదేవి, ఏసీబీ ఎస్పీసౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీరమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీపి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీవి.భూషణం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (గుంటూరు రేంజ్) కె.వెంకటరావు, ఇన్స్పెక్టర్(ఇంటెలిజెన్స్), విశాఖపట్నంరామకృష్ణ, ఏసీబీ ఇన్స్పెక్టర్జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్స్పెక్టర్మోయిన్, ఇన్స్పెక్టర్, ఒంగోలు పీటీసీఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, అనంతపురం ఏసీబీశివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీసిట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటూ ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంచి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిని మరో అదనపు ఎస్పీకి అప్పగించారు. మొత్తంగా.. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లుసమాచారం. ఇక సిట్ బృందాలకు వైఎస్సార్సీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి, సిట్ బృందాలకి కూడా YSRCP ఫిర్యాదు చేసింది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
సాక్షి, అమరావతి: పోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయని సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. క్లూస్ టీమ్స్తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని తెలిపారు. వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నామని, రెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు .సుమారు 30 నిమిషాలపాటు వీరిరువురి మధ్య సమావేశం జరిగింది. హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్లు డీజీపీకి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించనుంది. ఎఫైఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా?..లేదా సెక్షన్లు మార్చాల అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు కట్టకపోతే..సిట్ కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయించనుంది. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీస్తుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా పరివేక్షణ జరుగుతోంది.మరోవైపు ఎన్నికల హింసపై సిట్ ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఏర్పడిన్ సిట్.. నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారంభించింది.3 జిల్లాలకు మూడు బృందాలను నియమించారు వినీథ్ బ్రిజ్లాల్. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో సిట్ విచారణ జరుపుతోంది. తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావు పేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్ చేస్తోంది.హింసకు కారణమైన పోలీస్ అధికారుల ఊపాత్రమైనా విచారణ జరుపుతోంది. హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్షణ్ణంగా పరిస్తోంది.ఇదిలా ఉండగా సస్పెండెడ్ ఎస్పీ బిందు మాధవ్ను విచారిస్తోంది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను బిందుమాధవ్ కలిశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అల్లర్లు, హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్నారు. గురజాల, మాచర్ల, నరసరావు పేట, సత్తెనపల్లిలో హింసపై విచారిస్తున్నారు. -
అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్
-
పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
-
సీసీ..ఏంటిది ఈసీ ?
-
AP: జెట్ స్పీడ్గా సిట్ దర్యాప్తు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక బృందం(SIT) దర్యాప్తు జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సిట్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది. ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది.ఇంకా 144 సెక్షన్పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలీసుల పచ్చపాత వైఖరిమరోవైపు.. ఏపీలో పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నేతలను, అలాగే వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండిస్తున్నారు. -
చేతులు కాలాక ‘సిట్’!
సాక్షి, అమరావతి: ఎన్నికల హింసపై ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవహరిస్తున్న తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది! రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాకాండకు ఏకైక కారణం రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ ఉన్నతాధికారులను ఈసీ ఏకపక్షంగా బదిలీ చేయడమే! ఆ స్థానంలో వచ్చిన అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడంతోపాటు పచ్చముఠాల ఆగడాలను ఉపేక్షించడం వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలకు దిగిన ఈసీ ఆదేశాల మేరకు హింసాత్మక ఘటనలపై విచారణకు శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది. ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ‘సిట్’ దర్యాప్తు చేయనుంది. హింస చెలరేగడంలో పోలీసు అధికారుల పాత్రను కూడా ‘సిట్’ నిగ్గు తేల్చనుంది. ఆయా చోట్ల నమోదు చేసిన కేసులు, విచారణ తీరుతెన్నులపై పరిశీలించి వాస్తవాలు తేల్చాలని సిట్కు స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లు, అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ల నమోదును సూచించాలని పేర్కొంది. ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు సిట్ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. అనుకూల అధికారుల అండతో..‘సిట్’ ఏర్పాటు చేసి నష్టనివారణ చర్యలకు దిగేలా పరిస్థితులు మారడానికి ఈసీ తీసుకున్న నిర్ణయాలే ముఖ్య కారణంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిళ్లకు తలొగ్గి ఎడాపెడా పోలీస్ అధికారులను మార్చేసి, వారి సూచనల మేరకు ఈసీ నియామకాలు చేపట్టింది. అనుకూల అధికారుల అండ చూసుకుని పల్నాడు, రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి.వైఎస్సార్సీపీ నాయకులు, ఆ పార్టీకి ఓటు వేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. పరిస్థితులు చేయి దాటాక ఈసీ మేల్కొంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీసులపై సస్పెన్షన్ కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో సిట్ ఏర్పాటైంది. మొత్తం వ్యవహారంలో ఈసీ తీరు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చెలరేగిన హింస, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈసీ పక్షపాత వైఖరి ఫలితమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాశీనత..గత ఐదేళ్లుగా అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందించారు. ప్రజాదరణ కోల్పోయి దిక్కుతోచని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాలతో పేట్రేగిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాదరణ దక్కకపోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసకు చంద్రబాబు ప్రణాళిక రచించారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉంటే తమ పన్నాగాలు పనిచేయవని పసిగట్టి నిరాధాణ ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. పురందేశ్వరి సహకారంతో పల్నాడు, ప్రకాశం, తిరుపతి తదితర జిల్లాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను అందచేశారు. పచ్చముఠా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డీజీపీ, నిఘా విభాగం ఇన్చార్జ్తో పాటు పలువురు డీఐజీ, ఎస్పీలను ఈసీ పక్కనపెట్టింది. టీడీపీతో సత్సంబంధాలున్న వారిని రాజకీయ ఒత్తిళ్లతో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించింది. పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్ను నియమించడమే ఇందుకు నిదర్శనం. ఈ అధికారి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. 2019లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలను పార్టీ స్వీప్ చేసింది. దీంతో అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరగకుండా నిలువరించేలా కృష్ణదేవరాయలు స్కెచ్ వేశారు. క్షేత్రస్థాయిలో తన సామాజికవర్గానికి చెందిన వారిని నియమించుకుని పల్నాడులో అరాచకానికి కృష్ణదేవరాయలు ముఖ్యకారణమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చోద్యం చూసిన అధికారులు..అనుకూల అధికారి అండ చూసుకుని పల్నాడులోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, కొత్త గణేశునిపాడులో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు, బరిసెలు, బాకులు, ఇనుప రాడ్లతో స్వైర విహారం చేశాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి ఓటు వేసినట్లు భావించిన వారిపై యథేచ్ఛగా దాడులకు తెగబడ్డాయి. ఇంత జరుగుతున్నా పల్నాడు ఎస్పీ బిందు మాధవ్తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చోద్యం చూశారు. టీడీపీ మూకల నుంచి తమకు, ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు.సీమలో వివాదాస్పదంఅనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలింగ్కు ముందు ఈ జిల్లాకు అమిత్ బర్దర్ను ఎస్పీగా నియమించారు. తొలి నుంచి ఆయన టీడీపీకి కొమ్ముకాశారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడం ఆయన పచ్చపాత వైఖరికి నిదర్శనం. ఎన్నికల రోజు తాడిపత్రిలో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి, దీపక్రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలను నియంత్రించడంలో ఎస్పీ విఫలమయ్యారు. మరోవైపు పోలీసులు పెద్దారెడ్డి నివాసంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. వారి చర్యలు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ముందుగానే ధ్వంసం చేసిన ఫుటేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతి జిల్లాలో చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. ఇక్కడ కూడా అల్లర్లను కట్టడి చేయడంలో ఈసీ నియమించిన పోలీసు అధికారులు దారుణంగా విఫలమయ్యారు.13 మందితో ‘సిట్’సాక్షి, అమరావతి: ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై విచారణకు ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరిపి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్కు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో డీజీపీ ఆదేశించారు.‘సిట్’ సభ్యులు...1. రమాదేవి, ఎస్పీ, ఏసీబీ2. సౌమ్యలత, ఏఎస్పీ, ఏసీబీ3. రమణమూర్తి, డీఎస్పీ, ఏసీబీ, శ్రీకాకుళం4. పి.శ్రీనివాసులు, డీఎస్పీ, సీఐడీ5. వి.శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏసీబీ, ఒంగోలు6. రవి మనోహరా చారి, డీఎస్పీ, ఏసీబీ, తిరుపతి7. వి.భూషణం, ఇన్స్పెక్టర్, గుంటూరు రేంజి8. కె.వెంకట్రావు, ఇన్స్పెక్టర్, ఇంటెలిజెన్స్, విశాఖ9. రామకృష్ణ, ఇన్స్పెక్టర్, ఏసీబీ10. జీఎల్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్, ఏసీబీ11. మొయిన్, ఇన్స్పెక్టర్, పీటీసీ, ఒంగోలు12. ఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, ఏసీబీ, అనంతపురం13. శివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీ -
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.సిట్లో సభ్యులుగా.. ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు..వీ శ్రీనివాసరావు, రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్లు సిట్ సభ్యులుగా నియామకమయ్యారు.కాగా ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్రపైన విచారణ జరపనుంది. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. -
అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీసు అధికారి ఏక పక్ష నిర్ణయంపై గవర్నర్ను కలిసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని అన్నారు.తొందరపాటు నియమకాల వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స పేర్కొన్నారు అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా తమపై నిందలు వేయడం సరికాదని అన్నారు. హింసాకాండకు వైఎస్సార్సీపీ పూర్తి వ్యతిరేకమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు.చదవండి: ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలుమళ్లీ అధికారంలో వచ్చేది తామనేనని అన్నారు బొత్స సత్యనారాయణ. 175 సీట్లకు దగ్గరగా గెలవబోతున్నామని చెప్పారు. జూన్ 9న విశాఖలోనే సీఎంగా వైఎస్ జగన్మోమన్రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. ‘టీడీపీ ఫలితాల పై ఢీలా పడింది.. అందుకే మహానాడు వాయిదా వేసుకున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న సంఘటనలను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నం చేయొద్దు. పోలీసులు కూడా న్యాయ బద్దంగా వ్యవహరించండి. రాజకీయ పార్టీలు హింసను ప్రోత్సహించవద్దు. వైయస్సార్ సీపీ అలాంటి హింసలు ప్రోత్సహించదు. నిన్న విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ ఘటనను రాజకీయం చేస్తున్నారుత్వరలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభిస్తున్న దశలో విశాఖ ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ ప్రశాంతతను కాపాడాలని కోరుకుంటున్నా. .రాజకీయ నాయకునిగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మా పార్టీ సీట్లు అవసరం వుండేలా కేంద్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నా. ఉత్తరాంధ్ర లో 34 సీట్లు వస్తాయి. ప్రజా తీర్పు ఆధారంగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని కోర్టును కూడా కోరుతాo’ అని పేర్కొన్నారు. -
టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు బాధ్యత మరచి హింస చెలరేగేందుకు తావిచ్చినందుకు వేటు పడింది! నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు రాజకీయ ఒత్తిళ్లతో చెప్పినట్లలా ఆడినందుకే ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుట్రలకు తలొగ్గి పచ్చ ముఠాల విధ్వంసకాండకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కన్నెర్ర చేసింది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను హఠాత్తుగా బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసాకాండ చెలరేగిన విషయాన్ని వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులను నియమించడంతో ఎన్నికల వేళ హింస చెలరేగేందుకు ఆస్కారం ఏర్పడింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు తోలు»ొమ్మల్లా వ్యవహరించడంతో టీడీపీ రౌడీ మూకలు బరి తెగించి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. లావు సన్నిహితుడు.. బిందు మాధవ్ ప్రజాదరణ కోల్పోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్రమాలు, హింసకు చంద్రబాబు తెర తీశారు. ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉండటం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వారిపై నిరాధార ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా ఈ కుట్రలను అమలు చేశారు. పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు పోలీసు అధికారులను బదిలీ చేయాలని పేర్కొంటూ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను సమర్పించారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన ఈసీ హడావుడిగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, నిఘా విభాగం ఇన్చార్జ్ పీఎస్ఆర్ ఆంజనేయులతోపాటు గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీని బదిలీ చేసింది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి 14 మందిని బదిలీ చేయడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకు ఆ స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చింది. సమస్యాత్మక పల్నాడు జిల్లా ఎస్పీగా గరికిపాటి బిందు మాధవ్ను నియమించారు. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదే రీతిలో పురందేశ్వరి సూచించిన వారినే తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నియమించారు. పూర్తిగా విఫలమైన ఈసీ నియమించిన అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన, పట్టులేని అధికారులను నియమించడంతో పోలింగ్ సందర్భంగా, అనంతరం టీడీపీ రౌడీ మూకలు చెలరేగిపోయాయి. యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టించాయి. నరసరావుపేట, గురజాల, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో స్వైర విహారం చేశాయి. పెట్రోల్ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికిపాటి బిందు మాధవ్తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్లపై టీడీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడి బాంబులు విసిరినా సరే పోలీసులు పత్తా లేరు. తమపై దాడులు జరుగుతున్నాయని పల్నాడు ఎస్పీకి మొర పెట్టుకున్నా కనీస స్పందన లేదు. పోలింగ్ సక్రమంగా నిర్వహించడంలో పల్నాడు కలెక్టర్ లోతేటి శివ శంకర్ పూర్తిగా విఫలమయ్యారు. అనంతపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారినా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చోద్యం చూస్తూ ఉండిపోయారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, అల్లుడు దీపక్రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు తెగించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఎస్పీ అమిత్ బర్దర్ వీటిని కట్టడి చేయలేకపోయారు. ఏకంగా పోలీసులే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలోకి దూరి విధ్వంసం సృష్టించడం నివ్వెరపరిచింది. చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ అల్లరి మూకలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఏఎస్పీ వల్లే తాడిపత్రిలో అల్లర్లుటీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వైనం తాడిపత్రి రూరల్: అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తీరే తాడిపత్రిలో విధ్వంసానికి కారణమైందని పట్టణంలో చర్చ జరుగుతోంది. టీడీపీకి దన్నుగా నిలిచి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించారని స్పష్టమవుతోంది. అనంతపురంలో ‘సెబ్’ అడిషనల్ ఎస్పీగా ఉన్న రామకృష్ణను పథకం ప్రకారమే అధికారులు తాడిపత్రి ఎన్నికల ఇన్చార్జ్గా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్రెడ్డికి పోలింగ్ కేంద్రాలను పరిశీలించే అనుమతి లేదని, ఆయన రాకతో అల్లర్లు చెలరేగి శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఎన్నికల అధికారులు చెప్పినా, ఏఎస్పీ పెడచెవిన పెట్టారు. పైగా జేసీ ప్రభాకర్రెడ్డి వెంట ఉంటూ వైఎస్సార్సీపీ నాయకులపై చిందులు తొక్కారు. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్లో జేసీ ప్రభాకర్రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. ఆ సమయంలో జేసీ, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏఎస్పీ తమకు అండగా ఉన్నాడన్న ధైర్యంతోనే జేసీ వర్గీయులు అరాచకం సృష్టించారు. ఈ విషయమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేయగానే.. ఏఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి పర్నీచర్, కంప్యూటర్లు ధ్యంసం చేయించడం, దొరికిన వారిని దొరికినట్లు చితక బాదడం చర్చనీయాంశమైంది. -
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం
-
పల్నాడు దాడుల వెనక పోలీసుల నిర్లక్ష్యం...
-
నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ..
-
ఎల్లో టెర్రరిజం..బాబు, పురందేశ్వరి కుట్ర దీనికోసమేనా ?
-
‘సందేశ్ఖాలీ’ ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ అరెస్ట్!
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో చోటుచేసుకున్న హింసాకాండ ఘటన ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షాజహాన్ షేక్ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో షాజహాన్ షేక్ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్ 55 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో షాజహాన్ షేక్ కార్యకలాపాలపై పోలీసుల బృందం నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. షాజహాన్ షేక్ను పోలీసులు బసిర్హత్ కోర్టుకు తరలించారు. జనవరి 5న సందేశ్ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు షేక్ ఇంటిపై దాడి చేశారు. ఆ తరువాత షాజహాన్ షేక్ పరారయ్యాడు. ఈ నేపధ్యంలో షేక్తోపాటు అతని మద్దతుదారులు స్థానికుల భూమిని ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే షేక్ను అరెస్టు చేయాలంటూ సందేశ్ఖాలీ ప్రాంతంలో పలువురు నిరసనలు చేపట్టారు. -
యోగి బాటలో థామీ సర్కార్.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?
ఉత్తరప్రదేశ్లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఉత్తరాఖండ్ హింస: ఢిల్లీలో కీలక నిందితుడు అరెస్ట్
డెహ్రాడూన్: ఉత్తరఖండ్లో చెలరేగిన హింస ఘటనకు సంబంధించిన కీలక నిందితుడు అబ్దుల్ మాలిక్ను ఎట్టకేలకు పోలిసులకు పట్టుబడ్డాడు. హింస చెలరేగిన 16 రోజులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఉన్న అబ్దుల్ మాలిక్ను ఢిల్లీలో పట్టుకోని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 8న హల్ద్వానీ ప్రాంతంలోని బంభూల్పురాలో ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసాను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించింది. దీంతో స్థానికులకు,మున్సిపల్ సిబ్బందికి మధ్య హింస చెలరేగింది. మున్సిపల్ సిబ్బందిపై స్థానికులు రాళ్లు,పెట్రోల్ బాంబులు విసరటంతో మంటలు చెలరేగాయి. ఈ హింస ఘటనలో ఆరుగురు మరణించగా.. సుమారు 100 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులు, మీడియాకు చెందిన వారు ఉండటం గమనార్హం. అయితే.. అబ్దుల్ మాలిక్ మదరసాను నిర్మించాడని తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది ఆ మదస్సాను కూల్చివేయడాన్ని అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక.. కూల్చివేత ప్రక్రియను నిలిపివేయాలని అతని భార్య సఫియా మాలిక్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వారికి అనుకూలమైన తీర్పు వెలువడలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది అనుమతిలేని మదర్సాను కూల్చడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడి స్థానికుల్లో తీవ్రమై వ్యతిరేకత ఎదురైంది. అది కాస్త.. హింసగా చెలరేగింది. అయితే ఈ ఘటనలో అబ్దుల్ మాలిక్ హస్తం ఉందని..కావాలనే అతను హింసను ప్రేరేపించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అబ్దుల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం వెతుకుతున్న ఉత్తరఖండ్ పోలీసులకు ఎట్టకేలకు అబ్దుల్ పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాక్ కౌంటింగ్ వేళ.. ట్విస్టులు, ఝలక్లు!!
పాకిస్థాన్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. అయోమయం, గందరగోళం నెలకొంది. అక్కడ హింస చెలరేగినట్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (PTI) పార్టీని పోటీ చేయకుండా.. కనీసం గుర్తు క్రికెట్ బ్యాట్ను వినియోగించకుండా అక్కడి ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖాన్ మద్దతుదారులు.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనలో జాప్యం.. ఫలితాల తారుమారు చేసేందుకేనంటూ పీటీఐ ఆందోళనకు దిగగా.. ఆందోళనకారులపై ఆర్మీ, అక్కడి పోలీసు బలగాలు దాడులకు తెగబడినట్లు ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లు.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫొటోలు, వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ వెనుకంజలో ఉందని(షరీఫ్ మాత్రం గెలిచారు).. ఖాన్ మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నట్లు పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే పీఎంఎల్-ఎన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా.. ఇమ్రాన్ ఖాన్ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. Social media is flooded with hundreds of such rigging videos. What other evidence could there be than a present on-duty police officer involved in rigging? #ElectionResultspic.twitter.com/eps8QWQ9WX — Usama Butt 🇵🇰 🇬🇧 (@OsamaAhmedButt) February 9, 2024 పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. I have never seen visuals like these in Bahawalpur in my whole life - not even on 9th May.#ElectionResults pic.twitter.com/yU0fumVsEM — نورالہدی 🇵🇰 (@raqsyjunoon) February 9, 2024 ఇదిలా ఉంటే.. పాకిస్థాన్లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగియగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఏం ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. یہ توقع نہیں تھی کہ ہماری فوجی جوان اس ناکارہ عمل کا کھلم کھلا حصہ بنے گے pic.twitter.com/sp8yWUuyfC — Sabir Shakir ARY 𝓯𝓪𝓷𝓼 (@ARYSabiirShakir) February 9, 2024 కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రకటించడం ప్రారంభించారు. అయితే.. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్ కేర్టేకర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్ఫోన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోగా.. కొందరు మాత్రం పాక్లో ఇదీ పరిస్థితి అంటూ నెట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. -
ఉత్తరాఖండ్లో హింస.. ఐదుగురు మృతి
డెహ్రాడూన్: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్లో హింస చెలరేగింది. హల్ద్వానీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చేందుఉకు వచ్చిన అధికారులు, పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. ఈ దాడితో హింస చెలరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఘర్షణలను అదుపు చేసేందుకు ఖర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు కూల్చివేతల కార్యక్రమం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. రాళ్లు రువ్వుతూ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసంచేసి పోలీస్స్టేషన్కు నిప్పుపెట్టారు. అల్లర్లు కొంతవరకు అదుపులోకి వచ్చిననప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. హల్ద్వానీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇదీ చదవండి.. లైవ్లో మాట్లాడుతుండగానే శివసేన నేత హత్య -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్లోని ఖరాన్లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
Pakistan General Elections 2024: పాక్లో నేడే సార్వత్రిక ఎన్నికలు
ఇస్లామాబాద్: పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. నవాజ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పారీ్ట అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్న్స్లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. -
పాక్లో చెలరేగుతున్న హింస.. ఎన్నికలే కారణమా?
పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందుగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 31న ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని బజౌర్ జిల్లాలో రాజకీయ నేత రెహాన్ జెబ్ ఖాన్ను కాల్చి చంపారు. రెహాన్ జెబ్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ఏ-8, పీకే-22 స్థానాల నుండి పోటీ చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్తోపాటు రెహాన్ ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జియో టీవీ కథనం ప్రకారం రెహాన్ జెబ్ ఖాన్ ఎన్నికల ప్రచారం కోసం సాదికాబాద్ ఫటక్ బజార్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కూడా రెహాన్ హత్యను ఖండించింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఈ ఘటనకు సంబంధించిన నివేదికను కోరింది. దీంతో పాటు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికిముందు బలూచిస్థాన్లోని చమన్ నగరంలో అవామీ నేషనల్ పార్టీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక కార్యకర్త మృతి చెందాడు. కార్యకర్తలు ప్రచారంలో మునిగివున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదేవిధంగా క్వెట్టాలోని సరియాబ్ రోడ్లోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల కార్యాలయంపై జరిగిన దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. బలూచిస్థాన్ తాత్కాలిక హోం మంత్రి జుబేర్ జమాలీ ఈ దాడులను ఖండించారు. ఇటీవల స్వాబి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి షా ఖలీద్ను కాల్చి చంపారు. అలాగే పీకే-104 నుండి పోటీ చేసిన కలీముల్లా ఖాన్ను దుండగులు హత్య చేశారు. -
సూడాన్లో హింస.. 52 మంది మృతి!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం (యూఎన్ఐఎస్ఎఫ్ఏ) శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్ఐఎస్ఎఫ్ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. 2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి. -
మణిపూర్లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి
ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులు చనిపోగా.. కాంగ్పోక్పి జిల్లాలో ఒకర్ని దుండగులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మృతులను ఓనామ్ బమోంజావో సింగ్ (61), ఆయన కుమారుడు ఓనామ్ మణితోంబ సింగ్ (32), తియం సోమేంద్ర సింగ్ (55), నింగ్థౌజం నబద్విప్ సింగ్ (40)గా గుర్తించారు. కాంగ్పోక్పిలో మరణించిన పౌరుడిని తఖెల్లంబమ్ మనోరంజన్గా గుర్తించారు. అయితే.. గత రెండురోజులుగా అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లోనే మనోరంజన్ మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక బంకర్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి తౌబల్ జిల్లాలో కాల్పులు జరగడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు నిద్రిస్తున్న భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అంతకుముందు మంగళవారం అర్ధరాత్రి కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ భద్రతా అధికారి మృతి చెందారు. గత ఏడాది మే నెల నుంచి మణిపూర్లో రెండు తెగల మధ్య ఘర్షణ ప్రారంభం అయింది. మెయితీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాటి దాడుల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ.. అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్! -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
అస్సాంలో కీలక పరిణామం.. ఉల్ఫాతో కేంద్రం శాంతి ఒప్పందం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA), కేంద్రంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో శాంతి కోసం యూఎల్ఎఫ్ఏ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూఎల్ఎఫ్ఏ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా జరుగుతున్న (తిరుగుబాటు చర్యలకు) హింసాకాండకు ముగింపు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసలు, తెగలకు భూమి హక్కులు, అస్సాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి సమస్యలు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ‘కాగా వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్తాన్) నుంచి వచ్చిన వలసదారులకు వ్యతిరేకంగా, ప్రత్యేక అస్సాం డిమాండ్తో 1979లో ఏర్పడింది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. దీంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం 1990లో నిషేధిత సంస్థగా ప్రకటించింది. అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాతన తిరుగుబాటు దళంగా కొనసాగుతుంది. చదవండి: గుజరాత్ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్లో మాత్రం.. అయితే ఫిబ్రవరి 2011లో అరబిందా రాజ్ఖోవా నేతృత్వంలోని వర్గం హింసను విడిచిపెట్టి, ప్రభుత్వంతో బేషరతు చర్చలకు అంగీకరించడంతో ఉల్ఫా రెండు గ్రూపులుగా విడిపోయింది. అరబింద సారథ్యంలోని ఉల్ఫా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2011 సెప్టెంబర్ 3న తొలిసారి శాంతి చర్చలు జరిపింది. అయితే పరేశ్ బారుహ్ నేతృత్వం వహిస్తున్న ఉల్ఫా (స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరేశ్.. చైనా-మయన్మార్ సరిద్దులో తలదాచుకున్నట్లు సమాచారం. ఈరోజు అస్సాంకు చారిత్రాత్మకమైన రోజని హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అస్సాం చాలా కాలంగా నష్టపోయిందన్నారు. 1979 నుంచి ఈ హింసలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దశల వారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని అమిత్ షా తెలిపారు. -
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్కు పంపితే క్లయిమాక్స్లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్హాఫ్లో కాకపోతే సెకండ్ హాఫ్లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
భర్త చేసినా అత్యాచారమే
అహ్మదాబాద్: ‘అత్యాచారం ఎవరు చేసినా అత్యాచారమే. భర్త అత్యాచారానికి పాల్పడినా అది నేరమే’ అని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. మహిళలపై లైంగిక హింస పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరముందని న్యాయమూర్తి జస్టిస్ దివ్యేశ్ జోషి అన్నారు. ఓ మహిళ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోడలి పట్ల క్రూరత్వం, నేరపూరిత ప్రవర్తన కారణంగా పిటిషనర్కు బెయిలిచ్చేందుకు నిరాకరించారు. భర్త, కొడుకు కలిసి కోడలిపై అత్యాచారం చేస్తూ వాటిని వీడియోలు తీసి పోర్నోగ్రఫీ సైట్లలో పెట్టి డబ్బు సంపాదిస్తున్నారని తెలిసినా ఆమె మిన్నకుండిపోవడంపై జడ్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఇంకా చల్లారని మణిపూర్
ఘర్షణల సమయంలో తప్ప సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ వార్తలకెక్కని ఈశాన్య భారతం ఇంకా కుదుటపడలేదని మణిపూర్లో సోమవారం రెండు సాయుధ బృందాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం తెలియజెబుతోంది. ఈ కాల్పుల్లో 13 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఏడునెలల క్రితం అక్కడ మొదలైన తెగల ఘర్షణల్లో ఇంతవరకూ 175 మంది మరణించారని, 50,000 మంది నిరాశ్రయులయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ రాష్ట్రంలో పర్యటించి ఎక్కడెక్కడ మారణకాండ జరిగిందో, తాజా పరిస్థితులు ఎలా వున్నాయో వివరిస్తూ నివేదిక సమర్పించింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇంతలోనే తాజా ఉదంతం చోటుచేసుకుంది. మే 3 నుంచి వరస బెట్టి జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్రంలో మెజారిటీగా వున్న మెయితీలకూ, కుకీ–చిన్లకూ మధ్య తలెత్తిన ఘర్షణలు ఏ స్థాయికి చేరాయంటే మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా వూరేగించి అత్యాచారాలకు తెగబడటం యథేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. ఘర్షణల సందర్భంగా పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై గుంపులు దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. ఆయుధాలు అప్పగించినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా వీటిల్లో వెనక్కొచ్చినవి స్వల్పం. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొట్టడం పర్యవసానంగా హింసాత్మక ఘటనలు మొదలుకాగా, అటు తర్వాత జరిగిందంతా ప్రధాన స్రవంతి మీడియా నిర్వాకమని ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. అది ‘మెయితీ మీడియా’గా మారి పక్షపాతం ప్రదర్శించిందన్నది ఆ కమిటీ అభియోగం. ఆ తర్వాత కమిటీ సభ్యులపై మణిపూర్ సర్కారు కేసులు పెట్టడం, ఆ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించటం వేరే కథ. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా వున్నాయని బీరేంద్ర సింగ్ ప్రకటించి నెల్లాళ్లయింది. అయినా అడపా దడపా ఘర్షణల వార్తలు వస్తూనే వున్నాయి. సోమవారం నాటి ఉదంతం ఈమధ్యకాలంలో పెద్దది. మరణించినవారంతా ఎవరో, ఎక్కడివారో అధికారులు ఇంకా తేల్చలేదు. ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాల శిబిరం 10 కిలోమీటర్ల దూరంలో వున్నదంటే ఇన్ని నెలల మారణకాండ నుంచి ప్రభుత్వం నేర్చుకున్నదేమీ లేదన్నమాట. హింసాత్మక ఘట నల సంఖ్య తగ్గిందని అధికారులు సంబరపడుతూవుండొచ్చు. కానీ కనబడని హింస పీడిస్తూనే వుంది. సమాజం మొత్తం రెండుగా చీలిపోయింది. మెయితీలు, కుకీలు గతంలో మాదిరి స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నారు. నెలల తరబడి సాగిన హింస పర్యవసానంగా ఆప్తుల్ని కోల్పోయి, ఎంతో విధ్వంసం చోటుచేసుకుని భవిష్యత్తు అగమ్యగోచరంగా వున్నచోట అంతా బాగున్నదని చెప్పటం పరిహాసాస్పదం అవుతుంది. కుటుంబాల్ని పోషించుకోవటానికీ, చదువుకోవటానికీ, ఇతరేతర వ్యాపకాల కోసం వెళ్లటానికీ స్వేచ్ఛ లేని ప్రశాంతత వల్ల సాధారణ పౌరులకు ఒరిగేదేముంటుంది? ప్రభుత్వ యంత్రాంగం సమగ్రమైన, అత్యవసరమైన చర్యలు తీసుకొనేవరకూ ఇదంతా సాధ్య పడదు. ముఖ్యంగా ఎక్కడికక్కడ రెండు తెగల నుంచి బాధ్యతాయుత వ్యక్తుల్ని గుర్తించి కమిటీలు ఏర్పాటుచేసి సామరస్యత సాధించే దిశగా ప్రయత్నిస్తే వేరుగా వుండేది. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధ రించిన 24 గంటల్లోగానే తాజా ఉదంతం చోటుచేసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఏడు నెలల హింసలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించిన 88 గుర్తు తెలియని మృతదేహాలు ఏడు నెలలుగా ఇంఫాల్లోని రెండు ఆస్పత్రుల శవాల గదుల్లో పడివున్నాయి. రెండు తెగలవారూ భయం భయంగా బతుకుతున్న వర్తమానంలో తమ తమ గ్రామాలొదిలి ఇంఫాల్ వరకూ పోవటం, ఆ మృతదేహాలను గుర్తించటం సాధ్యమేనా? హింస కొనసాగుతున్న కాలంలోనూ, ఆ తర్వాతా తమ వారి జాడ తెలియటం లేదని చెప్పినవారు అనేకులున్నారు. వీరిలో అనేకులు కుకీలు కాగా, మెయితీ తెగకు చెందినవారు కూడా వున్నారు. ఆ మృతదేహాలు కల్లోలం సృష్టించటానికి మయన్మార్ నుంచి వచ్చినవారికి సంబంధించినవేనని అధికారులు చెబుతున్నా అందుకు వారి దగ్గర కచ్చితమైన సాక్ష్యా ధారాలు లేవు. ఆదివాసీ నేతల ఫోరం 22 మంది కుకీల జాడ తెలియటం లేదని ఆ మధ్య ప్రకటించింది. గుర్తుతెలియని మృతదేహాల్లో ఇలా అదృశ్యమైనవారివే అధికంగా వుండొచ్చు. ఇక ఎవరి కోసమూ వేచిచూడకుండా ఈ మృతదేహాలను ఖననం చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించటం మణిపూర్లో విషాదస్థితికి అద్దం పడుతోంది. ఈపాటికే శాంతి సాధనకు తగిన చర్యలు తీసుకునివుంటే, బాధిత వర్గాల్లో భరోసా కల్పించి నట్టయితే ‘గుర్తు తెలియని మృతదేహాల’ సమస్య వుండేదే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హింసాత్మక ఘటనలకు కారకులైనవారినీ, ఇప్పటికీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతియుత పరిస్థితులను ఏర్పర్చటం తేలికవుతుంది. ఈనాటికీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని, అది మెయితీల పట్ల మెతగ్గా వుంటున్నదని ఆది వాసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చేసినప్పుడే తమ వారి మృత దేహాలను గుర్తించి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించటం బాధిత కుటుంబాలకు సాధ్యమవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవటం మణిపూర్ సర్కారు బాధ్యత. -
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవత్వం మేల్కొనేదెప్పుడు?
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గురికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి? ఇంకెందరు మరణించాలి? మానవత్వం అనేది ఉందా? మానవత్వం మేల్కొనేది ఇంకెప్పుడు?అని ఆమె శుక్రవారం ‘ఎక్స్’లో ప్రశ్నించారు. గాజాలో మూడు వేల మంది అమాయక చిన్నారులు సహా మొత్తం ఏడు వేల మందికిపై ప్రాణాలు కోల్పోయినప్పటికీ రక్తపాతం, హింసకు పుల్స్టాప్ పడకపోవడంపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
భారత్ కెనడా వివాదం.. జైశంకర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో భారత్ కెనడాల మధ్య రగులుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖమంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడరాదని అన్నారు. ఈ సందర్భంగా భారత్-కెనడా వివాదంపై జై శంకర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్కు లేదని తెలిపారు. ‘మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు అని జైశంకర్ పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కెనాడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం మాతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, మేము కూడా దానిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో తమ అభర్ధనలకు కెనడా స్పందించలేదని అన్నారు. చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే మీరు ఎలా స్పందిస్తారని అడిగారు. మేము మీ దేశంపై విమర్శలు చేసాం, మీ కాన్సులేట్లపై దాడులకు పాల్పడ్డం. పోస్టర్లు పెట్టాం. దీనిని మీరు సాధారణమైనవిగా భావిస్తారా? ఇదే వేరే దేశానికి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు. కెనడాలో జరుగుతున్నది జనరల్గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా మాకు కెనడా, కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్లతో చర్చించాం’ అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆదేశ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్తోనూ భేటీ అయ్యారు. భారత్- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. చదవండి: సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో -
సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్ను నిలువునా విభజించింది. కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. ‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు. మయన్మార్లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్ యూనిటీ గవర్నమెంట్–ఎన్యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్లకు సమీపంలోని సగాయింగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్లకు పారిపోయారు. వీరిలో కొందరు ఎన్యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్తో దొరికిన సైనిక కల్నల్ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 15న ‘గోవా క్రానికల్’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్వర్క్ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని మయన్మార్ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్ కలాదాన్ ప్రాజెక్టును అరాకాన్ సైన్యం (మయన్మార్) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది. మణిపుర్లోని మోరేతో థాయ్లాండ్లోని మయీ సాట్తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్(మయన్మార్) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మయన్మార్ విదేశాంగ మంత్రి థాన్ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్ స్వేకి వివరించారు. ‘ఎన్యూజీ’కి చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎఫ్) సగాయింగ్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్ నేషనల్ ఫ్రంట్, అరకాన్ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్యూజీ/పీడీఎఫ్తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు. ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి. ఒక సీఆర్పీఎఫ్ భద్రతా సలహాదారు మణిపుర్ సీఎం బీరెన్సింగ్కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్పై మణిపుర్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్ను తొలగించాలని మైతేయిలు డిమాండ్ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్ గానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానీ మణిపుర్ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం. -వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు?
దాదాపు నాలుగు నెలలు గడిచినా మణిపూర్లో హింసాకాండ ఆగడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మెయిటీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆందోళనలతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగింది. గత ఆగస్టు 27న ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇద్దరు విద్యార్థినుల హత్య దరిమిలా జనం ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, కొండ ప్రాంతాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్(ఏఎఫ్ఎల్పీఏ)ను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించే దిశగా ప్రభుత్వం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానం అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఒక జిల్లాలో శాంతిభద్రతలు నిర్వహించడం. అంటే ఈ విధానంలో ఒక జిల్లాలో భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఒక దళానికి అప్పగించనున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా దానికి ఆ దళం బాధ్యత వహిస్తుంది. ఇది హింసాయుత ఘటనలను నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు మణిపూర్లో హింసను అరికట్టడానికి పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివిధ బలగాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా నిర్ధారిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక దళం మోహరించినందున, ఆ దళం అధికారి అక్కడ అల్లర్లు జరగకుండా చూస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించడంలో వివిధ దళాలు తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నాయి. ఆర్పీఎఫ్లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని, వారిని అధికశాతం జిల్లాల్లో మోహరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. మణిపూర్లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. 2023 మే 3 నుండి హింస చెలరేగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీని మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 200 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ హింస ఆగడం లేదు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? -
మణిపూర్ హింసాకాండలో 175 మంది బలి
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు దహనమయ్యాయని తెలియజేసింది. మణిపూర్లో హింస మొదలైనప్పటి నుండి ఆయుధగారాల నుంచి 5,668 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు మళ్లీ స్వా«దీనం చేసుకున్నాయి. అల్లరి మూకల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, బాంబులను కూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గృహ దహనాలకు సంబంధించి పోలీసులు 5,172 కేసులు నమోదు చేశారు. హింసాకాండకు సంబంధించి మొత్తం 9,332 కేసులు నమోదు చేశారు. 325 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అస్సాం రైఫిల్స్ను ఉపసంహరించాలి తమ రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్ దళాలను వెంటనే ఉపసంహరించాలని మణిపూర్ పౌర సమాజ సంస్థలతో కూడిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ(కాకోమీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకోమీ ప్రతినిధులు తాజాగా ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. -
G20 Summit: ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించేది లేదు: రిషి సునాక్
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు దేశ రాజధానిలో అడుగుపెట్టడంతో హస్తీనాలో కోలాహలం పెరిగింది. 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం ఢిల్లీ చేరుకుంది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే వీరికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ దంపతులు కాసేపు వీక్షించారు. అనంతరం షాంగ్రీలా హోటల్కు చేరుకొని బస చేశారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని సునాక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు. హిందువుగా తాను గర్విస్తున్నానని అన్నారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇండియాకు రావడం వ్యక్తిగతం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తనను ప్రేమగా భారతదేశ అల్లునిగా పిలుస్తారని గుర్తు చేశారు. కాగా భారత్కు చెందిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని సునాక్ వివాహామాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సునాక్ ఈ విధంగా చమత్కరించారు. చదవండి: జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో! ఖలిస్థానీ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్) భారత్తో కలిసి పనిచేస్తోందని రిషి సునాక్పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని అన్నారు. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరిస్తున్నాయని చెప్పారు. ‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న బ్రిటన్లో వాటికి తావులేదు. అందుకే ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని అధిగమించేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్ భద్రతా మంత్రి టామ్ తుగేన్ధాట్ భారత్లో పర్యటించారు. లండన్లోని భారతీయ దౌత్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఆందోళనలు బ్రిటీష్ ప్రభుత్వానికి తెలుసు. ఇది భారత్ సమస్య మాత్రమే కాదు బ్రిటన్ది కూడా. కాబట్టి కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను నిర్మూలించేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్లో దానిని నేను సహించను’ అని సునాక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు గత మార్చిలో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపిన అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ స్పష్టం చేసింది. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. -
Nara Lokesh: అవినీతిలో నాన్నారిని మించిపోయిన లోకేష్
"నాన్న పుంగనూరులో నెత్తురు రాజేశారు. కొడుకు భీమవరంలో రక్త చరిత్ర రాశాడు. తండ్రీ కొడుకులకు ఐటీ అధికారులు నోటీసు లిచ్చారు. పరువు పోయిందన్న ఉక్రోషంలో పోలీసులపైనా రాజకీయ ప్రత్యర్ధులపైనా రాళ్లు, కర్రలతో దాడులు చేయించారు. తమ యాత్రలకు షోలకూ ప్రజల నుండి స్పందన లేకపోవడంతో ఆక్రోశంతో రగిలిపోతోన్న తండ్రీ కొడుకులు ప్రజలనూ నెత్తుటిగాయాలతో హింస పెట్టేస్తునర్నారు. ఎన్నికల బరిలో వరుస పరాజయాలు వెక్కిరించడంతో వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందన్న భయంతో నెత్తుటేరులు పారిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు. ఆవు చేల్లో మేస్తోంటే.. దూడ డిజిప్లీన్తో గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలతో పేట్రేగిపోతూ ఉంటే.. ఆయన తనయుడు నారా లోకేష్ తండ్రి చూడని లోతులకు రాజకీయాలను తీసుకుపోతున్నారు. అవినీతిలో చంద్రబాబుకు ఏ మాత్రం తీసిపోనని ఐటీ వెలుగులోకి తెచ్చిన రూ. 118 కోట్ల లూటీ కేసులో చంద్రబాబుతో పాటు లోకేష్ పైనా సాక్ష్యాలతో సహా అభియోగాలు ఉన్నాయి. అంతకు ముందు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలోనూ నాన్నకు ఏమాత్రం తీసిపోకుండా కొడుకు దోపిడీలో సత్తా చాటారు. అవినీతిలో నాన్నలా ప్రయోజకుడైన లోకేష్ ఇపుడు హింసా రాజకీయాల్లోనూ నాన్న నుంచి నాలుగు పాఠాలు నేర్చుకున్నట్లే అనిపిస్తోంది. చదవండి: ఐటీ నోటీసులతో కంటిమీద కునుకు కరవైన చంద్రబాబు తన పర్యటనలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఉక్రోషంతో రగిలిపోయిన చంద్రబాబు నాయుడు పుంగనూరులో కిరాయి గూండాలను మించిన రౌడీ కార్యకర్తలను వెంటేసుకుని వచ్చి రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులు, తుపాకులను తమతో తెచ్చుకుని పథకం ప్రకారం హింసాయుత దాడులకు తెగబడిన రాక్షసాన్ని ఏపీ ప్రజలు మర్చిపోలేదు. అందులో నలభై ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబే స్వయంగా కార్యర్తలను రెచ్చగొట్టి.. పోలీసులు, పాలకపక్ష నేతలను ఉద్దేశించి తరమండి నా కొడుకుల్ని.. కొట్టండి.. ఎవ్వరినీ వదలకండి అంటూ ఎంత నీచంగా రెచ్చగొట్టారో అంతా చూశారు. చంద్రబాబు దర్శకత్వంలో టీడీపీ గూండాలు చేసిన దాడిలో ఒక కానిస్టేబుల్ కంటి చూపు పోగా పదుల సంఖ్యలో పోలీసులు నెత్తుటి గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. పాలక పక్ష నేతలతో పాటు సామాన్య ప్రజలపైనా చంద్రబాబు దాడులు చేయించారు. తాజాగా చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్లు అమరావతిలో తాత్కాలిక భవనాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం ముసుగులో వందల కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా..ఫేక్ ఇన్ వాయిస్ల ద్వారా కాజేసిన వైనాన్ని పిన్ పాయింటెడ్ గా ఐటీ అధికారులు సాక్ష్యాధారాలు చూపిస్తూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు చేసిన లూటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పక్క లోకేష్ యువగళం యాత్రకు స్పందన లేదని మండిపడుతోన్న టీడీపీ అధినేతకు మరో పక్క ఐటీ నోటీసులతో తమ బండారం బట్టబయలు కావడం మరింత కాక రేపింది. జనం దృష్టిలో తమ దొంగతనాలు వెలుగులోకి వచ్చేశాయని అర్ధం కావడంతో ఇక తమకి జనం విలువ ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు అండ్ కో. ఈ నేపథ్యంలోనే ఐటీ నోటీసులను దారి మళ్లించడానికి చంద్రబాబు సూచనల మేరకే నారా లోకేష్ భీమవరంలో పోలీసులపైనా, పాలక పక్ష కార్యకర్తలపైనా దాడులకు తమ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరు తరహాలోనే భీమవరంలోనూ టీడీపీగూండాలు ముందస్తుగానే రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలు తమతో తీసుకు వచ్చారు. ఒక పథకం ప్రకారమే పోలీసులనూ ప్రజలనూ రెచ్చగొడుతూ బూతులు తిడుతూ దాడులకు ప్రేరేపించారు లోకేష్. వన్టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, టూటౌన్ కానిస్టేబుల్ రమేష్తో పాటు మరో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతర పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరికి భీమవరం ప్రభత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబు హింసా రాజకీయాలను ఉమ్మడి ఏపీ హయాం నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే వచ్చారు. తన హింసా వారసత్వాన్ని తన కుమారుడు లోకేష్కు అప్పగించాలనుకున్నారో ఏమో కానీ.. ఇపుడు ఆ నెత్తుటి క్రతువులోనూ కొడుక్కి శిక్షణ ఇస్తున్నారు చంద్రబాబు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసి నెత్తుటి చరిత్ర రాసుకుపోతున్నారు. -యాజులు, సీనియర్ జర్నలిస్టు -
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
చంద్రబాబుకు షాక్.. ‘టీడీపీ గుర్తింపు రద్దు చేయండి’
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. బహిరంగ సభల్లో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించి అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని చెబుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద టీడీపీ గుర్తింపుని రద్దు చెయ్యాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్కు చంద్రమౌళి లేఖ రాశారు. ఈ లేఖలో.. గత ఏడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోగా నలుగురు గాయపడ్డారని, ఈ ఏడాది జనవరి 2న గుంటూరులో జరిగిన సభలో మరో ముగ్గురు చనిపోయారని, ఇక ఇదే నెలలో పుంగనూరులో కార్యకర్తలను రెచ్చగొట్టి ఏకంగా పోలీసులపైనే రాళ్ళ దాడికి పాల్పడేలా చేసి చంద్రబాబు హింసకు తెరతీశారన్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం ఆర్టికల్-2 ప్రకారం ఏ రాజకీయ పార్టీ హింసాత్మక కార్యక్రమాలను రెచ్చగొట్టకూడదు. ఈ చట్టాన్ని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ను చంద్రమౌళి కోరారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలోనూ రాజకీయాలా ? -
‘నారా’జకీయం: అటు పుంగనూరులో.. ఇటు తుక్కులూరులో..
‘హింసే అజెండా. దాడులతో పేట్రేగిపోవడమే సిద్ధాంతం. ఎక్కడికక్కడ రచ్చ రాజేసి అరాచకం సృష్టించడమే లక్ష్యం. ఏం చేసి అయినా.. ఎంత హింస రాజేసి అయినా.. వార్తల్లో కెక్కాలన్నదే ఆలోచన. ఇదే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోన్న విధ్వంస రాజకీయం. విద్వేషాలు రగులుస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. శాంతి భద్రతలను దెబ్బ తీసి పైశాచికానందం చూస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఎన్ని వెధవ్వేషాలు వెయ్యాలో అన్ని వేషాలూ వేస్తున్నారు. సరికొత్త రాకాసి సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చి విలువలకు పాతరేస్తున్నారు.‘ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయ్యింది. ఇంత కాలం తర్వాత ప్రభుత్వం పట్ల జనం వ్యతిరేకతతో ఉండాలని ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. కానీ ఎక్కడా అసంతృప్తి లేకపోవడం ఆయనకు నచ్చలేదు. నాలుగున్నరేళ్ల తర్వాత అయిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి జనం బ్రహ్మరథం పడతారులే అని ఆయన అంచనా వేసుకున్నారు. కానీ అలాగా జరగలేదు. ఇప్పటికీ టీడీపీని జనం తిరస్కరిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజలు టీడీపీని దూరం పెట్టేశామని చాటి చెప్పారు. జనం దూరం అయిపోతే 2024 ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితం కావల్సి వస్తుందన్న ఆలోచనే చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి సరికొత్త గూండా రాజకీయాలను తెరపైకి తెచ్చారు. మొన్నటికి మొన్న పుంగనూరులో చంద్రబాబు తన స్వీయ దర్శకత్వంలో ఎంతటి హింస రాజేశారో అంతా చూశారు. చంద్రముఖిగా మారిన చంద్రబాబు వదనాన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడికెళ్లినా తమ సభలకు ర్యాలీలకు జనం రాకపోతే.. స్పందన లేకపోతే.. మీడియాలో ప్రచారం దొరకదు కాబట్టి వార్తల్లోనే ఉండాలంటే విధ్వంసాలతో దూసుకుపోవడం ఒక్కటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నట్లుందంటున్నారు పాలక పక్ష నేతలు. చంద్రబాబు నాయుడి రోడ్ షోలకు జనం రావడం లేదు. బహిరంగ సభల్లో జనం ఉండడం లేదు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో యాత్ర చేసుకుపోతూ ఉంటే ఊళ్లల్లో జనం ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు తప్ప లోకేష్యాత్రను వీక్షించడం లేదు. జనం ఇలా తమని వెలి వేసేశారన్న కోపమో కడుపు మంటో తెలీదు కానీ జనాన్ని కూడా వదలకూడదనుకున్న టీడీపీ నాయకత్వం ఆదేశాలతో లోకేష్ యాత్ర ఎక్కడికెళ్లినా రెచ్చగొట్టే తిట్ల పురాణాలు.. దాడులతో పేట్రేగిపోతున్నారు. ఏలూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు వీధిరౌడీల్లా వ్యవహరించారు. పాదయాత్ర మార్గంలో ఉన్న ఇళ్లపై రాళ్లతో దాడులు చేశారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు టీడీపీ గుండాలు. చెవులు చిల్లులు పడేలా డీజే పాటలు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను రెచ్చొగొట్టేలా వ్యవహరించారు. సౌండ్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన వైఎస్సార్సీపీ నేత విజయ్ కుమార్.. ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ శ్రేణులు. లోకేష్ ఆదేశాలతో రెచ్చిపోయిన పచ్చ పార్టీ కార్యకర్తలు వైసీపీ నేత విజయ్కుమార్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు.. పచ్చ గూండాల దాడిలో వైసీపీ నేత ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.. అంతటితో ఆగకుండా, పక్కనే రోడ్డుపై నిల్చుని వున్న వైసీపీ కార్యకర్తలపైనా రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, మూడు బైక్లు ధ్వంసమయ్యాయి. యువగళం అరాచకాన్ని చిత్రీకరిస్తున్న పలువురు మీడియా ప్రతినిధులపైనా పచ్చ గూండాలు దాడికి తెగబడ్డారు.. మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కున్నారు.. అడ్డొచ్చిన రూరల్ కానిస్టేబుల్పైనా దాడి చేశారు.. అయితే, పోలీసులు స్పందించి టీడీపీ కార్యకర్తల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు. దీనికి ముందు రోజు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలోనూ లోకేష్యాత్రలో టీడీపీ శ్రేణులు ఇలాగే దాడికి దిగాయి. గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి నాన్న పుంగనూరు లో హింస ఎలా చేయాలో చూపిస్తే తనయుడు లోకేష్ ఏక సంథాగ్రాహిలా దాన్ని అంది పుచ్చుకుని తండ్రికి మించిన తనయుడిల విద్వేషాలు.. విధ్వంసాలతో వికటాట్టహాసం చేసుకుపోతున్నారు. ఇటువంటి హింసా రాజకీయాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకోలేరని రాజకీయ పండితులు అంటున్నారు. ఇటువంటి గూండాగిరీ వ్యవహారాలను ప్రజలు ఏవగించుకుంటారని ఎన్నికల్లో ఇంతకు ఇంత గుణపాఠం చెబుతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ::: సీఎన్ఎస్ యాజులు సీనియర్ జర్నలిస్ట్ -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
ఇదేం చిత్రం చంద్రబాబూ.. ఇదే కదా నీ కొంపముంచేది?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడి జరిగిందా! ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అది నిజమే అయితే కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందే. కాని అందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ అన్న ప్రశ్న వస్తుంది. అంగళ్లు గ్రామం వద్ద, పుంగనూరు పట్టణం వద్ద జరిగిన గొడవలలో రెచ్చగొట్టిందే చంద్రబాబు అయితే, చిత్రంగా ఆయన తనపై హత్యాయత్నం జరిగిందని అంటున్నారు. తనకు రాళ్ల దెబ్బలు తగలకుండా ప్రత్యేక రక్షణ బృందం బుల్లెట్ ఫ్రూఫ్ షీట్ పెట్టిందట. ఇవన్ని నిజమే అయితే ఈపాటికి.. సెక్యూరిటీ గార్డు అధికారి చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చంద్రబాబుపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పారట. ఇవన్ని నిజమే అయితే ఈపాటికి ఏమి జరిగి ఉండాలి. చంద్రబాబు ముందుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఉండేవారు. చంద్రబాబుపై ఎవరైనా రాళ్లు విసిరి ఉంటే ఆయన రక్షణకు ఉన్న ప్రత్యేక గార్డుల టీమ్ తగు చర్య తీసుకోవడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండేది. చంద్రబాబు తత్వానికి ఏ మాత్రం అవకాశం దొరికినా, అక్కడే సీన్ క్రియేట్ చేసి ఉండేవారు. వాహనం దిగి రోడ్డుపైనే బైఠాయించేవారు. తనపై హత్యాయత్నం జరిగిందని గగ్గోలు పెట్టేవారు. కాని ఇవేవి చేయకుండానే ఆయన తన దారిన తాను వెళ్లిపోయారు. ఒకసారి గతం చూస్తే.. ఒకసారి గతంలోకి వెళ్లండి.. ఒక సందర్భంలో తిరుపతి విమానాశ్రయంలో పోలీసులు ఆయనను నిలుపుదల చేశారు. అప్పుడు ఆయన అక్కడే కూర్చుని హడావుడి చేశారు. అలా ఒకసారి కాదు.. ఆయన ప్రతిపక్షంలో ఉంటే అనేకసార్లు గందరగోళాలు సృష్టిస్తారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమం టైమ్లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారం నుంచి తప్పించుకునేందుకు బాబ్లి ప్రాజెక్టు అనే చిన్న ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ మహారాష్ట్రకు వెళ్లి గందరగోళం సృష్టించే యత్నం చేశారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? అప్పుడు అక్కడి పోలీసులు చంద్రబాబును, ఆయనతో వెళ్లినవారందరిని అరెస్టు చేసి ఒక చోట నిలుపుదల చేశారు. తదుపరి ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీరిని ప్రత్యేక విమానంలో ఏపీకి రప్పించారు.ప్రాజెక్టులకు సంబంధించి ఒక యాత్రను చేపట్టిన ఆయన ఆ పని చేసుకోకుండా రోడ్ షోలకు ఎందుకు దిగారో ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారుల కథనం ప్రకారం అంగళ్లు, పుంగనూరులలో ఆయన నిర్దిష్ట రూట్ మాప్ను పాలో కాలేదట. ప్రాజెక్టులు చూసి వెళ్లిపోకుండా ఆయా చోట్ల సభలు జరిపే యత్నం చేశారు. దాడులు చేసేలా పురిగొల్పి.. ఆ క్రమంలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ వారిపైన, అలాగే పోలీసులపైన దాడులు చేసేలా పురిగొల్పారు. అంగళ్లు వద్ద కార్యకర్తలు ఆయనను చూస్తూ వాహనం వైపు ఉన్నారు. కాని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దాడులు చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వగానే వారిలో పలువురు ఆ ప్రకారమే చేసేశారు. అంగళ్లు వద్ద రైతులు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. వారితో పాటు వైసీపీ వారు కూడా కొందరు ఉండవచ్చు. వారంతా కలిపి నలభై మంది కూడా లేరు. చంద్రబాబు రోడ్ షో లో ఒకటి, రెండువేల మంది ఉండవచ్చు. వారంతా దాడులకు పాల్పడితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు. మళ్లీ ఏమి ఎరగనట్లు.. రైతులు నిరసన తెలపడం తనకు ఇష్టం లేకపోవచ్చు. వారు అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేకే అలా అనుచితంగా వ్యవహరించారనుకోవల్సి వస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులకు ప్రభుత్వం చర్యలు చేపడితే వాటిని అడ్డుకుంది చంద్రబాబు, ఆయన పార్టీవారా?కాదా? మళ్లీ ఏమి ఎరగనట్లు ఆ ప్రాజెక్టులు చూడడానికి వెళ్లడం ఏమిటి?. దానిపై ఎవరూ ప్రశ్నించరాదా? అదే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే చంద్రబాబు, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియాలు ఏమని అంటున్నాయి?. ప్రజలంతా నిలదీస్తున్నారని, నిరసన తెలుపుతున్నారని ప్రచారం చేస్తున్నారా? లేదా? అదే చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అలా ఎలా వస్తారని అడుగుతున్నారు. ఇలా టీడీపీ, అనుబంధ మీడియా డబుల్ గేమ్ ఆడుతోంది. బాబు కొత్త పాట.. గతంలో తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ వారు ఏకంగా రాళ్ల దాడికి దిగితే అదంతా పోరాటం అని చెప్పారు కదా! అప్పట్లో బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై అనంతపురంలో నిజంగానే దాడి చేశారు కదా! అవన్ని ఎందుకు?. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే చంద్రబాబు నాయుడు ఏమి చేశారో గుర్తు లేదా?. ఆయనకు స్వాగతం చెప్పకపోగా, ఎందుకు వచ్చావంటూ నిలదీస్తూ దీక్షలు చేశారు. మోదీకి నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన చెప్పారు. అది సరైనదేనా? ప్రధాని భద్రతకు అది ప్రమాదం కాదా?. ఇప్పుడు తనపై దాడి జరగకపోయినా, ఏకంగా హత్యాయత్నం జరిగిందని కొత్త పాట ఎత్తుకున్నారు. చంద్రబాబు కాదనగలరా?.. చంద్రబాబు చేసిన ప్రసంగాలు, రెచ్చగొట్టిన సన్నివేశాల వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని విచారించిన తర్వాతే పోలీసులు చంద్రబాబుపై కేసు పెట్టారు. ఆ వెంటనే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్యాయం అంటూ ఆక్రోశం పెట్టారు. అంతే తప్ప, తాను బూతులు తిట్టలేదని, ఎవరిని రెచ్చగొట్టలేదని చెప్పలేకపోయారు. ఒక డీఎస్పీని బట్టలూడదీసి వెళ్లు అని చంద్రబాబు అన్నారా?. లేదా? అది అవమానించడం కాదా?. రాయలసీమ పర్యటన అంతా ముఖ్యమంత్రి జగన్ ను, వైసీపీ కార్యకర్తలను తిట్టడానికి, టీడీపీ వారిని రెచ్చగొట్టడానికే చేశారు. పుంగనూరు వద్ద దానిని మరింత తీవ్రం చేసి ఏకంగా పోలీసు వాహనాలనే దహనం చేసేవరకు తీసుకువెళ్లారు. వాటిని చంద్రబాబు కాదనగలరా?. కనీసం సానుభూతి కూడా చెప్పలేదే?.. గతంలో తుని వద్ద కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు ఒక రైలును దగ్దం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంపై ఎన్ని విమర్శలు చేశారు?. ఎన్ని ఆరోపణలు చేశారు. రాయలసీమ రౌడీలని, గూండాలని ఇలా ఏవేవో చెప్పారు. కాని పుంగనూరు వద్ద ఆయన కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలను దహనం చేస్తుంటే ఎందుకు వారించలేదు? పోలీసులపై దాడులు చేసేలా టీడీపీ కార్యకర్తలను ఆయనే ప్రేరేపించారన్నది అభియోగం. ఈ దాడులలో 27 మంది పోలీసులకు గాయాలయిన మాట అవాస్తవమా? ఒక కానిస్టేబుల్ కన్ను పోయిన ఘటన గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోయారు. కనీసం సానుభూతి కూడా చెప్పలేదే?. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధ్వంసాలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. సవాళ్లు గుర్తు లేదా? ఘటన జరిగిన ప్రాంతంలో మొత్తం ఐదువేల సిమ్ కార్డులు ఉన్నాయని, అందులో రెండు వేల సిమ్లు స్థానికులవి కావని చెబుతున్నారు. ఇప్పటికే ఎనభై మంది వరకు అరెస్టు అయ్యారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఎన్నిసార్లు తన్నుకుందాం.. రా.. అని చంద్రబాబు కాని, ఆయన కుమారుడు కాని సవాళ్లు చేశారో గుర్తు లేదా?. అలా ఒక సీనియర్ నేత మాట్లాడవచ్చా? చంద్రబాబు ఇంతకాలం తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా తనను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమాతోనే ప్రవర్తించారు. కాని ఎప్పుడో అప్పుడు పరిస్థితి ఎదురు తిరుగుతుంది. అరాచకంగా ప్రవర్తించేవారిపై చర్య తీసుకునే అధికారులు కూడా వస్తారని ఇప్పుడు అర్దం అయి ఉండాలి. అదేదో రెడ్ బుక్ పెట్టుకుని.. ప్రభుత్వ విధానాలపై , లోటుపాట్లుపై విమర్శలు చేయవచ్చు. అలాకాకుండా అచ్చంగా బూతులు తిట్టుకుంటూ, పోలీసులపై విరుచుకుపడుతూ మీ అంతు చూస్తా.. అంటూ బెదిరిస్తూ యాత్రలు చేయడం చంద్రబాబు, లోకేష్ లకు అలవాటైంది. లోకేష్ అయితే అదేదో రెడ్ బుక్ పెట్టుకుని అందరి పేర్లు రాసుకుంటున్నారట. అధికారం వస్తే అందరి సంగతి చూస్తారట. మరి అధికారం రాకపోతే ఆ రెడ్ డెయిరీని ఏమి చేస్తారో తెలియదు. ఇక జగన్కు అధికారం పిచ్చివాడి చేతిలో రాయి అని చంద్రబాబు అన్నారు. నిజానికి అది ఆయనకే వర్తిస్తుందని చెప్పాలి. తనకు అధికారం ఉందని చెప్పి గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానం కోసం గేట్లు మూయించి తొక్కిసలాటకు కారణమయ్యారు. ఫలితంంగా ఇరవైతొమ్మిది మంది మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. తమిళ కూలీలు 20 మందిని తిరుమలలో ఎన్ కౌంటర్ చేసింది ఆయన ప్రభుత్వంలోనే. రాజధాని పేరుతో ముప్పైవేల ఎకరాలు సేకరించి అటు రైతులను, ఇటు ఏపీ ప్రజలను గందరగోళంలోకి నెట్టి రాజధాని అనే భ్రమరావతిని సృష్టించింది ఆయనే. ఇలాంటి వాటిని కదా?. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి అధికారాన్ని వాడారని చెప్పాల్సింది. జగన్ అధికారంలోకి వచ్చాక తన మానిఫెస్టో అమలు చేయడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందా? చంద్రబాబు తన మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందా? లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అబద్దపు హామీ ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే... చంద్రబాబు కేవలం అక్కసుతో, ఈర్ష్యతో జగన్పై నోరు పారేసుకుంటున్నారు. ఆయనకు ఈనాడు, తదితర టీడీపీ మీడియా తాన అంటే తందానా అని వంతపాడుతున్నాయి. అదే చంద్రబాబుకు పెద్ద ప్రమాదం అవుతుంది. వారిని నమ్మే ఇప్పుడు చంద్రబాబు హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. చంద్రబాబును నమ్మి టీడీపీ కార్యకర్తలు జైళ్ల పాలయ్యారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే, పద్దతులు మార్చుకుంటే వారికే మంచిది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబుకు కావాల్సిందే మారణహోమం
కడప కార్పొరేషన్: ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు ఆద్యంతం హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా విమర్శించారు. ఆదివారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో బరితెగించిన చంద్రబాబు మాటలు, ఉచ్ఛ నీచాలు మరిచి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు, గలాటాలు, అల్లర్లు రేపి విధ్వంసం సృష్టించాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్పై, ఆయన కుటుంబంపై కొన్ని రోజులుగా సంస్కారహీనంగా, బజారు మనిషిలాగా బాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెచ్చగొడుతూ చేసిన కామెంట్లతోనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. పోలీసులు ఎంత చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినకుండా కేకలు వేస్తూ, తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడటం దారుణమన్నారు. వాహనాలను తగులబెట్టి పోలీసులను గాయపరచడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అంతిమంగా చంద్రబాబుకు కావాల్సింది మారణ హోమమేనని, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇంత రాక్షసత్వానికి పాల్పడటం దారుణమని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని అంజద్బాషా డిమాండ్ చేశారు. -
Manipur Violence: మళ్లీ మణిపూర్లో హింస
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో రావణకాష్టంగా మారుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం అర్ధరాత్రిదాటాకా బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై జరిగిన దాడిలో తండ్రీకుమారుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. క్వాక్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆందోళనకారులు వీరిపై కాల్పులు జరిపి తర్వాత కత్తులతో నరికారు. చురాచాంద్పూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. తమ వారి మరణంతో ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకునేందుకు చురాచాంద్పూర్కు బయల్దేరబో యారు. వీరిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. అయితే దాడికి ప్రతీకారంగా ఉఖా తంపాక్ పట్టణంలో పలువురి ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. శనివారం ఉదయం మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసుసహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పాలనా యంత్రాంగం కుదించింది. బంద్ ప్రశాంతం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ శాంతి నెలకొనాలంటూ 27 శాసనసభ స్థానాల సమన్వయ కమిటీ ఇచ్చిన 24 గంటల సాధారణ బంద్ ఇంఫాల్ లోయలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు, స్కూళలు మూతబడ్డాయి. అల్లర్లతో అవస్థలు పడుతున్న జనాన్ని మరింత ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ బంద్’ అని సమన్వయ కమిటీ ఎల్.వినోద్ స్పష్టంచేశారు. కుకీ మిలిటెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాన్నాళ్ల తర్వాత చర్చలు పునరుద్ధరించబడిన తరుణంలో అల్లర్లు మొదలవడం గమనార్హం. మరోవైపు శాంతిస్థాపనకు చర్యలు చేపట్టాలని స్థానిక తెగల నేతల ఫోరం(ఐటీఎల్ఎఫ్) విజ్ఞప్తిచేసింది. -
‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం
గురుగ్రామ్: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా అట్టడుకుతోంది. నూహ్ జిల్లాల్లో చెలరేగిన హింసతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ అల్లర్లపై హరియాణా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గురుగ్రామ్, నుహ్లలో 144 సెక్షన్ విధించింది. అయినా కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం, గాయపడటమే కాకుండా గురుగ్రామ్లో స్థానికంగా ఉంటే అనేక వలస కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. బజరంగ్ దళ్ సభ్యులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని పలు ముస్లిం కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. Hamein kuch nahin chahiye... Bas Delhi tak chor do... #Muslim slum-dwellers in #Gurugram after their men were beaten by drunk goons reportedly from #BajrangDal for being Muslim. #NuhConspiracy pic.twitter.com/ST3baTlsyf — Ankita Anand (@ankita_das_) August 2, 2023 ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి గురుగ్రామ్లో నివసిస్తున్న 100 ముస్లిం కుటుంబాల్లో.. ప్రస్తుతం తాము 11 మంది మాత్రమే మిగిలి ఉన్నామని ఓ ముస్లిం వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లర్ల కారణంగా తాము ఎక్కడికి పోలేని పరిస్థితి తలెత్తిందని, సొంత ఊరు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చులు కూడా లేవని కన్నీటి పర్యంతమయ్యాడు 25 ఏళ్ల షమీమ్ హుస్సేన్... చదవండి: Haryana communal violence: బలగాల్ని దింపండి #GuruGramViolence: Muslim owned shops looted & vandalised! Shanties of poor Muslims burnt! Spillover of #NuhViolence was seen in Gurgaon! Fires were reported from 3 locations! Meat shops & Muslim hotels were ransacked & vandalised! Muslims have been threatened to leave Gurugram! pic.twitter.com/H717JUn8pg — Muslim Spaces (@MuslimSpaces) August 2, 2023 ఆయన మాట్లాడుతూ.. ‘గత సాయంత్రం కొంతమంది గుంపు వచ్చి, రెండు రోజుల్లో ఇక్కడున్న ముస్లింలందరూ ఖాళీ చేయాలని బెదిరించారు. రోడ్డు మీదకు వెళ్తే పేరు అడిగి కొడుతున్నారు. తిరిగి వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అప్పు చెల్లించాల్సి ఉంది. నాకేం జరిగినా పర్లేదు. కానీ నాకు ఏడాది వయస్సున్న కొడుకు ఉన్నాడు. మామల్ని కాపాల్సిందిగా ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని ఆర్థిస్తున్నానంటూచేతులు జోడించి వేడుకున్నాడు. మా కుటుంబం జీవనోపాధి కోసం బెంగాల్ నుంచి గురుగ్రామ్కు వచ్చి కేవలం ఏడు రోజులు మాత్రమే అయ్యింది. రెండు రోజుల క్రితమే ఫుడ్ డెలివరీ ఏజెంట్గా ఉద్యోగం దొరకగా.. ఇంకా జీతం ఇవ్వలేదు. నా ఏడాది వయస్సున కొడుకు పేరు అలీషాన్. అల్లరి మూకలు వచ్చి నన్ను, నాభార్యను కొడతారని భయమేస్తోంది. ఇది తలుచుకొని భయపడి నా భార్య రెండు రోజులుగా ఏడుస్తోంది. సొంత ఊరిలోనూ ఉపాధి లేకపోవడంతో తిరిగి వెళ్లలేం.. ఇక్కడా ఉండలేకపోతున్నాం.. ఎలా బతకాలి’ ’ అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ వాపోయాడు. చదవండి: మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్ #MuslimsUnderAttack Is it a crime to do journalism in Gurugram Gurugram: In Sector 70, 200 Muslim families have fled fearing threats and assault by local Bajrang Dal workers. I was threatened twice when I was reporting there. my religion was asked,and the camera was turned off pic.twitter.com/LRZ2FEFZYN — Tarique Anwar (@imtariqueanwar) August 2, 2023 దీనిపై గురుగ్రామ్ జిల్లా కమిషనర్ స్పందిస్తూ.. స్థానిక వలస కార్మికులను ఖాళీ చేయమని బెదిరించినట్లు వార్తలు అందాయని, జిల్లా, పోలీసు అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వలస కుటుంబాలను ఆదుకుంటామని, వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సున్నిత ప్రాంతాలు, ఇరు వర్గాల మతపరమైన ప్రదేశాలైన మసీదులు, దేవాలయాల చుట్టూ రాత్రిపూట మోహరింపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, రేపటి వరకు నగరంలో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. -
హరియాణా అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక..!
-
రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వుకుంటూ..
చంఢీగర్: హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాసిర్, జునైద్ హత్య కేసులో మోనూ మానేసర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే.. బివానీ జిల్లాలో బొలేరో వాహనంలో మోనూ మానేసర్ సంచరించాడనే ఈ అల్లర్లు మొదలైనట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు శోభా యాత్రలో పాల్గొనాలని మోనూ మానేసర్ కోరినట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం యాత్ర ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ ఈ ఘటనపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు యాత్ర కోసం అనుమతులు పొందినట్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇతర వర్గాల ప్రజలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మేవాత్ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి ఆగష్టు 2వరకు ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
చంద్రబాబు అధికారంలో లేకుంటే హింస కోరుకుంటారు
సాక్షిఅమరావతి/వినుకొండ (నూజెండ్ల) : చంద్రబాబు నాయుడు తాను అధికారంలో లేకపోతే రాష్ట్రమంతా హింస చెలరేగాలని కోరుకుంటారని అది ఆయన నైజమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘వినుకొండలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. స్థానికులకు వాస్తవాలేంటో స్పష్టంగా తెలుసు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరపకపోయి ఉంటే అక్కడ ఘటన మరింత ఘోరంగా ఉండేది. ఇటీవల బ్రహ్మనాయుడు వల్లభ డెయిరీ పెట్టారు. ఈ ఫాం నిర్మాణం కోసం గోతులు తవ్వి, మట్టి బయటకు తీశారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేరే చోట నుంచి మట్టిని తరలిస్తున్నారంటూ జీవీ ఆంజనేయులు, టీడీపీ నేతలు యాగీ చేశారు. గోడలు దూకి బ్రహ్మనాయుడు స్థలంలోకి వెళ్లి ఫొటోలు తీసి సెల్ఫీ చాలెంజ్ చేశారు. వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేయరా?. దానికి ధర్నా, ఊరేగింపు చేస్తూ ఈ గొడవకు ఆజ్యం పోశారు. బ్రహ్మనాయుడు జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే చుట్టూ మూగి కారుకు టీడీపీ జెండా కట్టారు. గన్మెన్లకు దెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఫ్రస్ట్రేషన్తో జీవీ అంజనేయులు ఈ దాడులు చేయించారు’ అని అన్నారు. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు.. ఇటీవల చంద్రబాబు టీవీ సీరియల్ లాగా పోలవరం, వ్యవసాయం, రాయలసీమ పరిస్థితులపై పచ్చమీడియాలో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారని, వ్యవసాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి ధ్వజమెత్తారు. పోలవరాన్ని రామోజీరావు బంధువుదైన నవయుగ కంపెనీకి ధారాదత్తం చేసి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు పట్టిన చంద్రబాబు అనే శనిని వైఎస్ రాజశేఖరరెడ్డి వదిలించారని, మరలా 2019లో వైఎస్ జగన్ ఇంటికి పంపారని అన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏపీలో 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కరువు మండలం కూడా లేదని వివరించారు. పల్నాడు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే వరికపూడిసెల ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. -
రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.టీ మేరకు సీజేఐ డీవై చంద్రచుడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. రామనవమి అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. అల్లర్లలో ఎలాంటి పేలుడు ఘటనలు జరగలేదని తెలిపింది. రాజకీయ ప్రలోభంతో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు తీర్పు ఉందని ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం మెట్లెక్కింది. కాగా ఈ ఏడాది రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. దీనిపై మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 మధ్య పలు పోలీసు స్టేషన్లలో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అల్లర్లలో మందుగుండు పదార్థాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, పత్రాలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, సీసీటీవీ ఆధారాలు అన్నీ ఎన్ఐఏకు అప్పగించాల్సిందిగా హైకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. గత మార్చిలో జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 500 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. ఇద్దరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: Zomato Delivery Boy: జొమాటో బాయ్గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు.. -
Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. ఆరోజు జరిగింది ఇదేనా!
కొన్ని నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దిగ్బ్రాంతికరమైన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఫేక్ వీడియో వల్లే మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అతి హీనంగా ప్రవర్తించిన మృగాళ్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రధాని, కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తీవ్రంగా స్పందించాయి. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాయి. అయితే మణిపూర్లో ఘర్షణలు మొదలైన మరుసటి రోజే అంటే మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది. అదే రోజు ఓ బాధిత మహిళ సోదరుడు సైతం అదే మూక చేతిలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఓ ఫేక్ వీడియో వల్ల జరిగినట్లు తేలింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. ఇంఫాల్ లోయలోని మెజార్టీ వర్గమైన మెయితీ తెగ వారు తమను షెడ్యూల్డ్ జాతుల్లో చేర్చాలంటూ చేస్తున్న డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న కుకీ వర్గం వారు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడంతో మెయితీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇదే క్రమేనా హింసాత్మకంగా మారి మణిపూర్లోని తెగల మధ్య అగ్ని జ్వాలలను రాజేసింది. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. దీంతో ఆ మూక తమ ఊరి మీద కూడా దాడి చేస్తుందనే భయంతో మే 4వ తేదిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు(వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు) రక్షణ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఇందులో 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) కాగా.. మరో ఇద్దరు మహిళలు(52, 42) ఉన్నారు. పోలీసుల నుంచి లాకెళ్లి మరీ.. వీరంతా అడవీలోకి వెళ్తుండగా దారిలో నాంగ్పోక్ సెక్మై పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు కనిపించడంతో వాళ్ల వద్దకు వెళ్లారు. అంతలోనే స్టేషన్ ఇంకో రెండు కిలోమీటర్లు ఉందనగా.. దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు.. గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురి బృందాన్ని అడ్డగించింది. పోలీసుల నుంచి వారిని బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధిత గ్రూప్లోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ.. సాయుధ మూకల దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు. సామూహిక అత్యాచారం అనంతరం.. 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించడమే కాకుండా సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే..కొందరు యువకులు మాత్రం అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే అందులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును మే 21న ఘటన జరిగిన నోగ్పోక్ సెక్మై పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. గుర్తుతెలియని దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన నాంగ్పాక్ సెక్మై పోలీసు స్టేషన్కు మే 21న ఈ కేసును బదిలీ చేశారు. ఆందుకే ఆలస్యంగా వెలుగులోకి మణిపూర్లో మే 3 నుంచి ఇంటర్నెంట్ బ్యాన్ అయ్యింది. అందుకే మే 4న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటి వరకు బయటకు రాలేదని తెలుస్తోంది. తాజాగా జులై 19న సోషల్ మీడియాలో రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరి అరెస్ట్ ఈ ఘోర ఘటనకు సంబంధించి ఇప్పటికే తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియోలో కనిపిస్తోన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 12 బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే ఇది జరిగి 77 రోజులుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. -
Poll violence in Bengal: బెంగాల్ పంచాయతీ హింసాత్మకం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు. ఉత్తర దింజాపూర్లోని గోల్పోఖార్లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్గంజ్లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల పరస్పర ఆరోపణలు ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. -
నెత్తురోడిన బెంగాల్.. హింసపై కేంద్రం ఆరా
పంచాయతీ ఎన్నికలు పోలింగ్లో చెలరేగిన ‘రాజకీయ’ హింసా.. హత్యలకు దారి తీయడంతో పశ్చిమ బెంగాల్ నెత్తురోడింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 15 మంది దాకా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే.. గంటలు గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. మృతుల్లో అధికంగా అధికార టీఎంసీ కార్యకర్తలు, నేతలే ఉండగా.. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలూ ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ హింసపై కేంద్రం ఆరా తీసింది. ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కేంద్ర బలగాలు విధులకు దూరంగా ఉన్నట్లు టీఎంసీ ఆరోపిస్తుండగా.. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంలో తడబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇది బెంగాల్ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. Mamata Banerjee has reduced democracy to a joke in Bengal. In Diamond Harbour, her nephew’s LS, villagers found stamped ballot papers in Netra GP, Booth No-5. TMC captured booth last night and ‘completed’ voting. SEC is in contempt of Court orders. No security, no CCTV cameras… pic.twitter.com/52KDOTivsd — Amit Malviya (@amitmalviya) July 8, 2023 పోలింగ్ మొదలైన కాసేపటికే.. రాష్ట్రవ్యాప్తంగా 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.06లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. Not only the Ballot Boxes, in West Bengal, Democracy itself has ended up in the Gutter. pic.twitter.com/i5epumjMp6 — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 8, 2023 💥 అయితే.. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కొట్లాటలు జరిగాయి. కూచ్బెహార్లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్ బాక్సుల్ని ఎత్తుకెళ్లడం.. బ్యాలెట్ పత్రాలను దహనం చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 💥 రాణినగర్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. 💥 డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే ఓట్లు వేశారని బీజేపీ ఆరోపించింది. 💥 జల్పాయ్గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్ ఆరోపించింది. Video of person running with a ballot box during West Bengal Panchayat poll goes viral pic.twitter.com/nrzKKMY9qi — Megh Updates 🚨™ (@MeghUpdates) July 8, 2023 💥 బాంబులు విసురుకోవడం, కాల్పులు.. ఇలా జరిగిన దాడుల్లో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. ‘‘ఎన్నికల వేళ దిగ్భ్రాంతికర ఘటనలు జరుగుతున్నాయి. మా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఆ కేంద్ర బలగాలు ఏమయ్యాయి?’’ అని టీఎంసీ మండిపడింది. అయితే.. #WATCH | West Bengal #PanchayatElection | Abdullah, the booth agent of an independent candidate killed in Pirgachha of North 24 Parganas district. Villagers stage a protest and demand the arrest of the accused and allege that the husband of TMC candidate Munna Bibi is behind the… pic.twitter.com/XHu1Rcpv6j — ANI (@ANI) July 8, 2023 Witness the unsettling scene unfolding in Nadia: election workers silenced by fear, people engulfed in chaos under Mamata's dictatorial policies. Democracy fades as Mamata’s rule leaves a detrimental impact on the lives of many. pic.twitter.com/lr90TgfWp5 — BJP Bengal (@BJP4Bengal) July 8, 2023 ఈ ఎన్నికల కోసం 600 కంపెనీల కేంద్ర బలగాలు.. 70 వేల మంది బెంగాల్ పోలీసులు మోహరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. Now waiting for Zubair's claim that this is not a video of Bengal panchayat election but a 6 months old video of Lohri festival in Punjab. pic.twitter.com/YvhYynpPVz — Varun Kumar Rana (@VarunKrRana) July 8, 2023 వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది. అప్పుడు హింసాత్మక ఘటనలే జరిగాయి. ఇదీ చదవండి: షిండేకు షాక్ తప్పదు ఇంకా.. బీజేపీ మాస్టర్ ప్లాన్ -
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి..
కలకత్తా: బెంగాల్లో నేడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు కాగా.. ఒకరు చొప్పున బీజేపీ, మరో ఇద్దరు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలే ఈ ఘటనలకు కారణమని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఉదయాన్నే 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో అల్లర్లకు కేంద్ర స్థానమైన ముషీరాబాద్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీని దుండగులు హత్య చేశారు. అదే జిల్లాలోని రేజినగర్ ప్రాంతంలో టీఎంసీకి చెందిన మరో కార్యకర్త బాంబు దాడిలో మరణించగా.. ఖార్గ్రామ్ ఏరియాలో మరో కార్యకర్త మృతి చెందాడు. కూచ్ బిహార్ జిల్లాలో బీజేపీకి చెందిన మాదవ్ బిశ్వాస్ అనే కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. తూర్పు బర్దమాన్ జిల్లాలో సీపీఐఎమ్కు చెందిన మరో కార్యకర్త రజిబుల్ హోక్ తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ఘటనలపై అధికార టీఎంసీ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులతో కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టింది. అధికార పార్టీయే దాడులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అధికార బలంతో టీఎంసీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు అన్నారు. 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. బ్యాలెట్ పేపర్లకు నిప్పంటించిన దుండగులు.. -
మూలానికి మందు వేయాలి!
ఒకటి కాదు రెండు కాదు... ఇప్పటికి ఎనిమిది రోజులు. ఫ్రాన్స్ తగలబడుతూనే ఉంది. ప్యారిస్కు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించినందుకు కారు ఆపమన్నప్పుడు ఆపని పాపానికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని నేరానికి 17 ఏళ్ళ నల్లజాతి టీనేజర్ను ఓ పోలీసు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడ్డ పోలీసుపై సరైన చర్య తీసుకోకపోవడం అల్లర్లకు దారి తీసినట్టు పైకి కనిపిస్తున్నా, లోలోపల ఫ్రాన్స్ను పీడిస్తున్న అనేక అంశాలున్నాయి. ఆఫ్రికన్, అరేబియన్ మూలాలున్న నల్ల జాతీయులు, నిరుపేదలు ఏళ్ళ తరబడిగా ఎదుర్కొంటున్న జాతివివక్ష ఇలా విస్ఫోటించింది. యువత వీధుల్లోకొచ్చి కార్లు తగలబెట్టి, బడులు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, దుకాణాల్ని లూఠీ చేసే పరిస్థితి తెచ్చింది. 2018 నాటి ‘ఎల్లో వెస్ట్స్‘ నిరసనల తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ను ఎన్నడెరుగని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపడం సరే కానీ, ఆర్థిక – సామాజిక అసమానతల కేంద్రంగా మారిన ఆ దేశం చేయాల్సిన అసలు పని వేరే ఉంది. సంపన్న సాంస్కృతిక వారసత్వం, చైతన్యశీలతతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఫ్రాన్స్ ఇప్పుడు వీధుల్లోకి విస్తరించిన అసంతృప్తికీ, హింసాత్మక ప్రదర్శనలకూ కేంద్రమవడం గమనార్హం. ప్యారిస్ మొదలు అనేక చోట్లకు విస్తరించిన తాజా అల్లర్లే అందుకు నిదర్శనం. మెక్రాన్ సత్వరమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అల్జీరియన్ సంతతికి చెందిన టీనేజర్ నహేల్ హత్య అంగీకారయోగ్యం, క్షమార్హం కాదంటూనే, మూక దాడులు, విధ్వంసం సైతం సమర్థ నీయం కావన్నారు. ఆయన మాటలు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశమే. అల్లర్లు అదుపులోకి వచ్చాక పాలకులకూ, ప్రజలకూ మధ్య చర్చకు ఆ మాటలు ఉపకరిస్తాయి. కానీ, మాటలొక్కటే సరి పోవు. 2011లో బ్రిటన్ నుంచి 2013లో అమెరికాలో ‘బ్లాక్లైవ్స్ మేటర్’ ఉద్యమం దాకా పాశ్చాత్య దేశాల్లో జాతివివక్ష పోలీసు దౌర్జన్యాలపై అల్లర్లు పదేపదే జరుగుతూనే ఉన్నాయనేది చరిత్ర పాఠం. ఫ్రాన్స్లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా ఆ వాహన చోదకుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. 2017లో చేసిన సవరణ అలాంటి అపరిమిత అధికారం పోలీసులకు కట్టబెట్టింది. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇలాంటి పోలీసు కాల్పులు, మరణాలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది ఇలాంటివి 13 జరిగాయట. ఇన్నేళ్ళలో ఈ బాధితుల్లో అత్యధికులు నల్లజాతి వారే. గీత దాటితే శిక్షించాల్సిందే కానీ, కాల్చి చంపేందుకు అనుమతించడం దారుణం. ఈ చట్టాన్ని ఫ్రాన్స్ తక్షణం రద్దు చేయాలి. పోలీస్ దౌర్జన్యం, పాలనాపరమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం, వర్గ అసమానతలనేవి ఇవాళ ఫ్రాన్స్ సహా ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న అంశాలు. సత్వరం దృష్టి పెట్టాల్సిన సమస్యలు. ఫ్రాన్స్లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాల గృహసముదాయాలైన ‘బాన్లూ్య’లు ఉంటాయి. ఒకప్పటి ఫ్రెంచ్ వలస దేశాల శరణార్థులు ప్రధానంగా ఉండే ప్రాంతాలివి. ఈ శివారు నివాస సముదాయాల, అక్కడి పరదేశీయుల కష్టనష్టాలను నివారించడం కీలకం. 2021 నాటి అంచనా ప్రకారం ఫ్రాన్స్లో 10.3 శాతం మంది వలస జనాభానే. అత్యధికులు అల్జీరియా, మొరాకో, ట్యునీసియాల నుంచి వచ్చినవారు. ఫ్రాన్స్ శ్రామికశక్తిలో వీరిది ప్రధాన పాత్ర. అలాగే, దేశానికి వన్నె తెచ్చే ఫుట్బాల్లోనూ వీరి ప్రతిభ వెలుగులీనుతోంది. అయినప్పటికీ అనేక యూరోపి యన్ దేశాల లానే ఫ్రాన్స్ సైతం ఈ వలసదారుల్ని తమలో కలుపుకోవడంలో విఫలమవుతోంది. చట్ట సంస్థలు ఇప్పటికీ వీరిని అనుమానంగానే చూడడం విచారకరం. ఆ మాటకొస్తే, ఈ శరణార్థుల సంక్షోభానికి మానవీయ పరిష్కారం కనుగొనడంలో దేశాలన్నీ విఫలమయ్యాయి. అది విషాదం. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండే ఫ్రాన్స్లో సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అంతరాలూ అంతే ఎక్కువ. సంపద పంపిణీలో, అవకాశాల్లో భారీ తేడా నెలకొంది. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, లోకువగా చూస్తూ అణచివేయడం వగైరాలన్నీ వలసదారుల్లో ఆశాభంగం, ఆగ్రహం కలిగించి, అలజడి రేపుతున్నాయి. ఇవాళ ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక చీలిక లకు ఇవి ప్రధాన కారణం. అణగారిన ప్రజలు సామాజిక అసమానత, ఆర్థిక అసంతృప్తితో తమ బాధల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికి అల్లర్లను సాధనంగా ఎంచుకుంటున్నారు. జాతి వివక్షతో పోలీసులు జరుపుతున్న దాష్టీకం మారాలని కోరుతున్నారు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సమాజం, ప్రజలు సమ్రగ్ర పరిష్కారానికి చేయూత నివ్వాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలనే పరిణత ప్రజాస్వామ్యమైన ఫ్రాన్స్లోనే పరిస్థితి తద్విరుద్ధంగా ఉండడం చేదు నిజం. అక్కడి పరిణామాలు ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న దేశాలు ఆ విభిన్న ప్రజానీకపు అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రభుత్వ సంస్థల విధి విధా నాలను అందుకు తగినట్టు మార్చుకోవాలి. పాలనలో దీన్ని తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. లేదంటే, ఇవాళ ఫ్రాన్స్లో జరిగినట్టే రేపు తమ దేశంలో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వివక్ష పెంచిన సామాజిక ఉద్రిక్తతలతో చేతులు కాలకముందే మేల్కోవడం వివేకవంతులైన పాలకుల లక్షణం! -
ఫ్రాన్స్లో ఐదో రోజూ అల్లర్లు
పారిస్: ఫ్రాన్స్లో అల్లర్లు ఐదో రోజూ కొనసాగాయి. ఆందోళనకారులు మేయర్ నివాసంపైకి మండుతున్న కారుతో దూసుకువచి్చ దాడికి యతి్నంచారు. పోలీసులతో ఆందోళనకారులు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే, గత నాలుగు రోజులతో పోలిస్తే అల్లర్ల తీవ్రత తగ్గింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు శనివారం రాత్రి మరో 719 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రెలో ట్రాఫిక్ పోలీసులు నేహల్ అనే యువకుడిని కాల్చి చంపడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నేహల్ అంత్యక్రియలు శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. శనివారం రాత్రి పారిస్లో చాంప్స్ ఎలిసీస్ వద్ద గుమికూడిన యువకుల గుంపును పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. ఫ్రెంచి గుయానాలో తుపాకీ బుల్లెట్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. పారిస్ ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు బాణసంచా కాల్చుతూ, రోడ్లపై అడ్డంకులు పెట్టారు. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి వారిని పోలీసులు చెదరగొట్టారు. -
రగులుతున్న ఫ్రాన్స్
-
పోలీసుల అతి.. ఆగని ప్రజాగ్రహం.. రణరంగాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు.. నేహల్ ఎం.. అల్జీరియా సంతతికి చెందిన నేహల్కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది. మైకేల్ జెస్లెర్.. 2020 నవంబర్లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్లో ఉన్న జెస్లర్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ 2020 జూన్లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది. యెల్లో వెస్ట్స్ ఉద్యమం 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు. అడమా ట్రయోర్.. 2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది. పారిస్ ఊచకోత.. 2005 నవంబర్లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిపోతున్న పోలీసు హింస ► ఫ్రాన్స్లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు
17 ఏళ్ల యువకుడి చావు ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది. జూన్ 27న జరిగిన ఓ ఘటన దేశాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. పోలీసుల కాల్పుల్లో యువకుడు నాహేల్ చినపోయిన తర్వాత ఆదోళలు, నిరసలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. గత నాలుగో రోజులుగా హింసా కొనసాగుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 1,311 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అల్లరిమూకల కారణంగా 200 మందికిపైగా పోలీసులు అధికారులు గాయపడ్డారని పేరేంది. నిరసనలు ప్రారంభమైన మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఈ స్థాయిలో అరెస్ట్లు జరగడం ఇదే అత్యధికం. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం బయడపడింది. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దేనికైనా తెగిస్తామన్నట్టుగా ఊరేగింపుగా సాగుతున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఆందోళనలు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. How are French protesters getting their hands on heavy firearms? pic.twitter.com/k9nqO6bFfy — Ian Miles Cheong (@stillgray) July 1, 2023 ప్రస్తుతం హింస కాస్త తగ్గిందని ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆందోళనకారుల నిరసనల్లో 1,350 వహానాలు, 234 భవనాలు తగలబడిపోయాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 45, 000 మంది పోలీసులు సాయుధ వాహనాలతో మోహరించారు. క్రాక్ పోలీస్, ఇతర భద్రతా దళాలను సైతం రప్పించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. ఫ్రాన్స్లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్ మేయర్ బెనాయిట్ పాయన్, వెంటనే అదనపు దళాలను పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు.. ఫ్రాన్స్లోని మూడవ అతిపెద్ద నగరమైన లియోన్లో హెలికాప్టర్, సాయుధ సిబ్బంది క్యారియర్లు మోహరించాయి. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్లో కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం తనిఖీల సమయంలో 17 ఏళ్ల యువకుడు నాహేల్ను ఓ పోలీస్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్సెయిల్, లియోన్లలో హింస, దాడులు అత్యంత దారుణ స్థాయికి చేరాయి. పారిస్ శివారు, గ్రెనోబుల్, సెయింట్-ఎటియెన్లోని కొన్ని ప్రాంతాల్లో హుడ్ ధరించిన నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే బస్సు, ట్రామ్ సేవలను నిలిపివేశారు. బాణసంచా అమ్మకాలను కూడ నిషేధించారు. కాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒమ్మాన్యుయేల్ మాక్రాన్ టీనెజ్ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్లు స్నాప్ చాట్, టిక్టాక్ లలో వాటిని తొలగించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణంలో నాన్టెర్రిలోని స్మశానవాటికలో నాహెల్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు
ఫ్రాన్స్: గడిచిన మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. పోలీసు కాల్పుల్లో మరణించిన నల్ల జాతీయుడు నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పాఠశాలలు, టౌన్ హాళ్లు, పోలీస్ స్టేషన్లు, కార్లు, దుకాణాలను తగలబెడుతూ ఆందోళనకారులు దేశాన్ని నిద్రపోనీయడం లేదు. అసలేం జరిగింది.. మంగళవారం ఉదయం అల్జీరియాకు చెందిన 17 ఏళ్ల ముస్లిం యువకుడు నాహేల్ నాంటెర్రే ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞను అతిక్రమిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. దీంతో పోలీసులు పోలాండ్ నెంబరు ప్లేటు ఉన్న నాహేల్ కారును బ్లాక్ చేసి నాహేల్ ను ప్రమాదకరంగా పరిగణించి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. దీంతో నాహేల్ అక్కడికక్కడే మరణించాడు. వీడియో లీక్.. ఈ హత్యోదంతం తాలూకు వీడియో బయటకు రావడంతో ఫ్రాన్స్ లోని ముస్లింలు పెద్ద ఎత్తున అల్లర్లకు తెరతీశారు. నాహేల్ కు న్యాయం చేయండంటూ మొదలైన నిరసన కాస్తా మెల్లిగా హింసాత్మకంగా మారింది. నినాదాలు చేస్తూ ముస్లింలు కార్లు, దుకాణాలు ప్రజా ఆస్తులను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో మార్సెల్లీ లోని అతి పెద్ద గ్రంథాలయానికి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. They r chanting Allah hu akbar and burning shops, cars, public property looting shops France has a 9% muslim population that is highest in Europe and most of them are African immigrants whom France gave shelter pic.twitter.com/jjkcTM5KIu — STAR Boy (@Starboy2079) June 30, 2023 అక్కడ సర్వసాధారణం.. ఫ్రాన్స్ దేశ జనాభాలో 9% ఉండే ముస్లింలలో అత్యధికులు శరణార్థులు.. వలసదారులే.. వీరికి ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఫ్రాన్స్ జట్టు మొరాకోపై గెలిచినప్పుడు కూడా ముస్లింలు ఇలాగే విధ్వంసాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఎగిసిన ఉద్యమ జ్వాలాగా అభివర్ణస్తుంటే మరికొంతమంది మాత్రం వారు అల్లర్లు చేయడానికి ఏదో ఒక కారణం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అరెస్టులు.. ఆందోళనకారులు చేసిన దాడుల్లో ఇంతవరకు 249 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ అల్లర్లు చేస్తున్న సుమారు 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు 14 నుండి 18 సంవత్సరాల వయసువారే కావడం విశేషం. ఉక్కుపాదం.. ఉద్రిక్త ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా నియంత్రించే క్రమంలో దాదాపుగా 40 వేల మంది రక్షణ బలగాలను మోహరించినట్టు తెలిపారు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మానిన్. Amidst slogans of Allah hu Akbar, Rioters are destroying The France pic.twitter.com/JOBY2bVSDL — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఆ తల్లి కడుపు కోత.. నేను పోలీసు వ్యవస్థపై నింద వేయడం లేదు. నా కుమారుడిని పొట్టనబెట్టుకున్న ఆ ఒక్క అధికారిపైనే నా కోపమంతా. నా బిడ్డను అతనే చంపాడు. నా కుమారుడు అరబ్ అని తెలిసే, అతని కాల్పులు జరిపాడు.. అని నాహెల్ తల్లి మౌనియా ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి సందేశం.. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. ఆందోళనాకరుల పధ్ధతి సరైనది కాదని, కుర్రాడిని కాల్చి చంపిన ఘటనలో పోలీసు అధికారిపై విచారణ జరుగుతోందని ఆందోళనకారులు శాంతించాలని కోరారు. Riots in France (Explained) Tuesday morning, A 17 year old Algirian muslim Nahel was driving a car with Polland number in Bus lane at Nanterre (Suburb of Paris) Police tried to stop him but he didn't stop. Police found him potential threat and shot (Video in last tweet) 1/5 pic.twitter.com/iIXPvEoraM — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఇది కూడా చదవండి : యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
భగ్గుమన్న ఫ్రాన్సు
పారిస్: పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి ఘటనతో ఫ్రాన్సు భగ్గుమంది. పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద మంగళవారం నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. రాళ్లు రువ్వారు. వీటిని నిలువరించేందుకు పోలీసులు పలుమార్లు బాష్పగోళాలు ప్రయోగించారు. దాడుల్లో 100కు పైగా ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. ఆందోళనకారుల దాడుల్లో 170 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఫ్రాన్సు ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు, రైలు సర్వీసులను నిలిపివేసింది. దీని ఫలితంగా రాజధాని, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ప్రస్తుతమున్న పోలీసుల సంఖ్యను 9 వేల నుంచి 40 వేలకు పెంచింది. నిరసనకారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. యువకుడిపై కాల్పుల ఘటనకు కారకులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
మణిపూర్ సీఎంను తొలగించండి
న్యూఢిల్లీ: మణిపూర్లో దాదాపు రెండు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోదీ మౌనం దాల్చడమేంటని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మణిపూర్ గురించి ప్రధాని మోదీ నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే ముందుగా చేయాల్సింది ఆ రాష్ట్ర సీఎంను తొలగించడమేనన్నారు. మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఆ విషయాన్ని కప్పిపుచ్చు కోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పలు ట్వీట్లు చేశారు. ‘గడిచిన 55 రోజుల్లో మణిపూర్ గురించి ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏం చెబుతారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మోదీ జీ నిజంగా మణిపూర్లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నట్లయితే, అక్కడి బీజేపీ సీఎంను ముందుగా తొలగించండి’అని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాద సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో సంభాషణలు జరిపి, ఉమ్మడి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వానికి ఖర్గే సూచించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణానికి వీలు కల్పించాలి. ప్రజలకు నిత్యావవసర వస్తువులను అందుబాటులోకి తేవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి’అని ఖర్గే పేర్కొన్నారు. -
మణిపూర్లో మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా అట్టుడికి పోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం మరోసారి హింస చెలరేగింది. ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది. ఇందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఇంపాల్ వెస్ట్ ప్రాంతంలో గల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ అధికారిక నివాసంపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించారు. చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. ఈ ఘటన బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఘటన సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపడుతున్నారు. నివేదికల ప్రకారం ఖమెన్లోక్ గ్రామంలో దుండగులు అనేక ఇళ్లను తగలబెట్టారు. హింసాత్మకమైన ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భద్రతా సిబ్బంది హైరిస్క్ ప్రాంతాల్లో గస్తీ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో తెంగ్నౌపాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల నుండి తుపాకీలతో పాటు 63 మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 1,040 ఆయుధాలు, 13,601 మందుగుండు సామాగ్రి, 230 రకాల బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో సాధారణ ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండగా.. ప్రస్తుతం ఆ సమయాన్ని ఉదయం 5 నుండి ఉదయం 9 గంటల వరకు కుదించారు. మణిపూర్లోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది, మొత్తం ఈశాన్య రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చదవండి: కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేత.. 400 కార్ల కాన్వాయ్తో భారీ ర్యాలీ.. వీడియో వైరల్ -
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి..
మణిపూర్:మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో జరిగిన హింసాకాండలో మరో 9 మంది మరణించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖామెన్లోక్ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఫైరింగ్లో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఇంఫాల్లో ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. హింసాకాండలో మరణించిన వారి శరీరాలపై అవయవాలు తెగిన గుర్తులు, అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజా ఘటనలతో సడలించిన కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దాడులు జరిగిన ఖామెన్లోక్ ప్రాంతం.. కంగ్పోక్పీ, ఇంఫాల్కు తూర్పున ఉన్న జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా అట్టుడికి పోతోంది. గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా కోసం డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకుని హింసాత్మక వాతావరణం నెలకొంది. తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 100కి పైగా మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:కల్లోల మణిపూర్లో ఆర్మీ మోహరింపు.. జరుగుతోంది ఇదే! -
‘ప్రశాంత మణిపూర్’ ఎట్లా?
నెలరోజులుగా భగ్గున మండుతున్న మణిపూర్లో ప్రశాంతత నెలకొల్పేందుకు ఎట్టకేలకు ఒక రాజకీయ ప్రయత్నం మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించి పరస్పరం కలహిస్తున్న మెయితీ, కుకీ తెగల నాయకులతో, పౌర సమాజ కార్యకర్తలతో, రాజకీయ పార్టీలతో మంగళవారం సమావేశమయ్యారు. సమస్య ఉగ్రరూపం దాల్చినప్పుడు, జనం చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు పాలకులుగా ఉన్నవారు సంయమనంతో మెలగటం, సాధారణ స్థితి ఏర్పడేందుకు ప్రయత్నించటం అవసరం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్కు ఈ ప్రాథ మిక విషయాలు కూడా తెలిసినట్టు లేదు. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 40,000 మంది వరకూ కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఊళ్లకు ఊళ్లే మంటల్లో మాడి మసయ్యాయి. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి తుపాకులు, మందుగుండు అపహరించిన ఉదంతాలు జరిగాయి. ఇలాంటి సమయంలో ‘ఇదంతా కుకీ ఉగ్ర వాదులకూ, భద్రతా దళాలకూ సాగుతున్న ఘర్షణ తప్ప మరేంకాద’ని బీరేన్ సింగ్ ప్రకటించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరోక్షంగా కుకీలను మిలిటెంట్లుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించటమే ఆయన ప్రకటన వెనకున్న సారాంశమన్న విమర్శలు వెల్లువెత్తాయి. రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సీఎం ప్రకటనను తోసిపుచ్చారు. ఇది కేవలం రెండు తెగల మధ్య ఘర్షణేనని తేల్చి చెప్పారు. మెయితీ తెగకు చెందిన నేతగా బీరేన్ సింగ్కు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పాలకుడిగా స్పందించాల్సి వచ్చినప్పుడూ, రాష్ట్రం ఇంకా ఘర్షణలతో అట్టుడుకు తున్నప్పుడూ ఆచి తూచి మాట్లాడాలి. తమ తెగవారిపై జరుగుతున్న దాడుల మాటేమిటని కుకీ శాసనసభ్యులు నిలదీస్తే ఆయన నుంచి సమాధానం లేదు. ఇదొక్కటే కాదు... హింసను సాకుగా చూపి 25 మిలిటెంట్ సంస్థలతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు బీరేన్ సింగ్ ఏకపక్షంగా ప్రకటించటం కూడా సమస్య తీవ్రతను పెంచింది. కుకీలతో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి సీఎం రాలేని స్థితి ఏర్పడటం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు కోరటం రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన అవిశ్వాసానికి అద్దం పడుతుంది. మణిపూర్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడి నాలుగున్నర కోట్ల జనాభాలో 400కు పైగా తెగలున్నాయి. మాండలికాలు సైతం దాదాపు అంతే సంఖ్యలో ఉంటాయి. వీరంతా భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందినవారైనా... అప్పుడప్పుడు అపోహలు తలెత్తిన సందర్భాలున్నా మొత్తంమీద శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే ఇంచుమించు ఏభైయ్యేళ్లుగా ఇదంతా మారింది. తెగల పరిరక్షకులమంటూ సాయుధ బృందాలు తలెత్తటం మొదలైంది. ఉపాధి లేమివల్ల కావొచ్చు... జీవికకు ముప్పు కలుగుతుందన్న భయాందోళనల వల్ల కావొచ్చు చిన్న సమస్య రాజుకున్నా అది క్షణాల్లో కార్చిచ్చుగా మారి కల్లోలం రేపుతోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాన్ని ఏర్పరచాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. వివిధ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను కలిపి ‘ప్రత్యేక నాగాలిమ్’ ఏర్పరచాలని నాగాలు పదేళ్ల క్రితం తీవ్ర ఆందోళనకు దిగారు. పరిమిత వనరులను పలువురితో పంచుకోవటం తప్పనిసరి కావటంతో అవత లివారు శత్రువులుగా కనిపిస్తున్నారు. మెయితీలను సైతం ఎస్టీలుగా పరిగణించాలన్న న్యాయస్థానం ఆదేశాలు ఈ కారణంతోనే ఆదివాసీలైన కుకీల్లో కల్లోలం సృష్టించాయి. ఇదే అదునుగా ఘర్షణలు తలెత్తాయి. పొరుగునున్న మయన్మార్ నుంచి వచ్చిపడుతున్న శరణార్థులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మెయితీ నాయకులు చెప్పటం సమస్యను తగ్గించి చూపటమే అవుతుంది. అసలు కుకీలు స్థానికులు కాదనీ, వారు మయన్మార్ నుంచి వలస వచ్చినవారనీ చాన్నాళ్లనుంచి మెయితీలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ) అమలు చేసి, పౌరసత్వాన్ని నిగ్గుతేల్చి స్థానికేతరులను పంపేయాలని వారు కోరుతున్నారు. 53 శాతంగా ఉన్న మెజారిటీ తెగ నుంచి ఇలాంటి డిమాండ్ రావటం కొండప్రాంతాల్లో ఉంటున్న కుకీల్లో సహజంగానే గుబులు రేపుతోంది. 1901 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో కుకీలు 14.5 శాతం. 110 ఏళ్ల తర్వాత 2011 నాటికి వారి జనాభా పెరుగుదల రెండు శాతం మాత్రమే. అలాంటపుడు కుకీలపై స్థానికేతరుల ముద్రేయటం అసంబద్ధం కాదా? ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనలనూ, తెగల మధ్య అపోహలు పెంచే వదంతులనూ నివారించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానంగానే ఇంత హింస చోటుచేసుకుంది. నిరుడు యూపీలోని మధురలో కన్నవారి కర్కశత్వానికి బలైపోయిన 21 ఏళ్ల యువతిని మెయితీ తెగ మహిళగా చిత్రించి, ఆమెపై కుకీలు అత్యాచారానికి పాల్పడి హతమార్చారని తప్పుడు ప్రచారం జరపడంతో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. కుకీ తెగ మహిళలపై దాడులు జరిగాయి. అత్యాచార ఉదంతాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక చుర్చాంద్పూర్లో హిందూ దేవా లయాలపై దాడులు సాగించారన్న వదంతులు లేవదీశారు. ఇదంతా అబద్ధమని వెంటనే ఆ ప్రాంత మార్వాడీ, పంజాబీ సొసైటీలు, బెంగాలీ సొసైటీ, బిహారీ సొసైటీ సంయుక్తంగా ప్రకటించాయి. తెగల పేరుతో, మతం పేరుతో ప్రజల్లో చీలికలు తెచ్చే యత్నాలను మణిపూర్ పౌర సమాజం ఐక్యతతో తిప్పికొట్టాలి. పాలకులు, రాజకీయ పార్టీల నేతలు జవాబుదారీతనంతో మెలగాలి. అప్పుడే ప్రశాంత మణిపూర్ సాధ్యమవుతుంది. -
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు..
ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి. సాయుధ కుకి మిలిటెంట్లు ప్రత్యర్థి మైతి వర్గానికి చెందిన ఎనిమిది కొండ ప్రాంత గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది వరకు గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కక్చింగ్ జిల్లాలో మిలిటెంట్లు శనివారం అర్ధరాత్రి మైతీ వర్గానికి చెందిన వారి 80 ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో, గ్రామస్తులు భయంతో ఇళ్లు వదిలి తలోదిక్కుకు పారిపోయారు. సుగ్నులో పోలీసులు, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయారు. సుగ్ను, సెరౌ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పది మంది గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో కుకి మిలిటెంట్లు మైతీ వర్గం ప్రజలకు చెందిన 30 ఇళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నిషేధాజ్ఞల సడలింపు సమయాన్ని 11 గంటల నుంచి 6 గంటలకు కుదించారు. కుకీలు దాడులు చేస్తున్నా భద్రతా బలగాలు పట్టించుకోవడం లేదంటూ ఇంఫాల్ వెస్ట్ జిల్లా ఫయెంగ్ గ్రామానికి చెందిన మహిళలు నిరసనకు దిగారు. 40 మంది తీవ్రవాదులు హతం రాష్ట్రంలో పౌరులపై కాల్పులకు దిగుతూ, ఇళ్లకు నిప్పుపెడుతున్న 40 మంది తీవ్రవాదులను ఇప్పటి వరకు బలగాలు చంపినట్లు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తెలిపారు. ‘రాష్ట్రంలో జరుగుతున్నది జాతుల మధ్య వైరం కాదు. కుకి మిలటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరు’గా ఆయన అభివర్ణించారు. షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా విషయమై రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి కుకి, మైతి వర్గాల మధ్య మొదలైన ఘర్షణల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..
పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన తండ్రే ప్రతికార వాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారులు ఆకతాయితనంతో.. తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి సరిచేయడమో లేక మంచిగా చెప్పి వినేలా చేయడమో చేయకపోగా అతడే చిన్న పిల్లాడి మాదిరి ప్రవర్తించాడు. హుందాగా ఆ చిన్నారికి తాను చేసిని పని గురించి వివరించి చెప్పడం మాని అమానుషంగా ప్రవర్తించి కెమెరాకు చిక్కాడు. ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చైనాలో గుయ్గాంగ్లోనో ఓ ప్లే గ్రౌండ్లో పిల్లలు పేరెంట్స్ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు. ఐతే ఓ చిన్నారి ఓ తండ్రి కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ తండ్రి కోపంతో ఆ చిన్నారి వంక చూసి అడ్డుకోవడమే గాక దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా అమానుషంగా కొట్టడం వంటివి చేశాడు. ఆఖరికి ఏదో వస్తువుని గాల్లోకి లేపినట్లుగా ఆ చిన్నారిని లేపి నేలపైకి విసిరేశాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగింది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Dad violently knocks around a stranger’s kid at a playground 😳 pic.twitter.com/wBhBwJkMWj — Daily Loud (@DailyLoud) May 20, 2023 (చదవండి: నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది) -
మే 9 ఒక చీకటి అధ్యాయం: పాక్ ఆర్మీ
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని మే9న అరెస్టు కావడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ హింసాత్మకంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీస్ పబ్లిక రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఆ రోజు జరిగిన విధ్వంసం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఐఎస్పీఆర్ ఆ విధ్వంసాన్ని పాక్ దేశ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది. ఆ ప్రకటనలో ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..ఎలా విధ్వంసానికి తెగబడ్డారో వెల్లడించింది. ఆ నిరసనల్లో ముఖ్యంగా ఆర్మీ ఆస్తులు, సంస్థాపనలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నిరసనకారులను ఉద్దేశిస్తూ..ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయొద్దని గట్టిగా హెచ్చరించింది. అలాగే నిరసకారుల్లో కొందరూ తమ సొంత ప్రయోజనాల కోసం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా చర్యలకు దిగారని ఆరోపణలు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేశారని మండిపడింది. తమ దేశ పాకిస్తాన్ సంస్థలను గౌరవించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పింది. ఈ సమయంలో సైన్యం ఎంతో సహనంతో సంయమనాన్ని ప్రదర్శించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించిందని పేర్కొంది. ఐతే కొందరు సైన్యం ప్రతిస్పందనను నీచ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకునేందుకు రెడీ అయ్యి దారుణాలకు ఒడిగట్టేందుకు యత్నించారని, వాటిని తాము గుర్తించామని వెల్లడించింది. ఇలాంటి ఘటనలకు తెగబడే వారిపై సైన్యం తప్పక కఠిన చర్యలు తీసుకుంటుందని ఐఎస్పీఆర్ హెచ్చరించింది. అలాగే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును సమర్థించిందని ఐఎస్పీఆర్ తెలిపింది. కాగా, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, కరాచీ, క్వెట్టాతో సహా పాకిస్తాన్ అంతటా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకి వ్యతిరేకంగా నిరనలు చేస్తూ హింసాత్మక అల్లర్లకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అగ్నిగుండంగా మారిపోయింది. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే) -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
మణిపూర్ హింస వెనుక డ్రగ్ మాఫియా?
ఢిల్లీ: మణిపూర్లో గిరిజనులు-గిరిజనేతరుల నడుమ చెలరేగిన వివాదాలు.. తీవ్ర హింసకు దారి తీశాయి. అల్లర్ల మూలంగా 60 మంది సాధారణ పౌరులు బలికాగా.. 300 మందిదాకా గాయపడ్డారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోందని మణిపూర్ హోంశాఖ ప్రకటించుకుంది. ఈ తరుణంలో మణిపూర్ హింస వెనుక మరో కారణం ఉందని ఓ ప్రొఫెసర్ అనుమానిస్తున్నారు. మణిపూర్ అల్లర్ల వెనుక డ్రగ్ మాఫియా హస్తం ఉండొచ్చని అంటున్నారు జేఎన్యూ ప్రొఫెసర్ భగత్ ఓయినమ్. తాజాగా.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్లో హింస చెలరేగడానికి గల కారణాలని విశ్లేషించారు. బీజేపీ ప్రభుత్వం డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ దెబ్బకు విలవిలలాడిపోయిన మాఫియా.. మణిపూర్లో హింసకు కారణం అయ్యిందన్నారు. ఇక.. కుకీ వర్గం తమ ఉనికి గురించి ఆందోళన చెందడం కూడా హింసకు మరో కారణమని అన్నారాయన. కుకీ వర్గం మయన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్కు వలస వచ్చిందని ఆరోపించాయారన. మెయితీ కమ్యూనిటీకి గనుక ఎస్టీ హోదా లభిస్తే.. తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని, తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని కుకీ కమ్యూనిటీ అభద్రతా భావంలోకి కూరుకుపోయింది. అందుకే మెయితీలతో ఘర్షణకు దిగి.. మణిపూర్ కల్లోలానికి కారణమైందని తెలిపారాయన. మే 3వ తేదీన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మునుపెన్నడూలేని రీతిలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అగ్గికి ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అప్రమత్తమైన మణిపూర్ సర్కార్.. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. మణిపూర్ సీఎం అభ్యర్ధన మేరకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికప్పుడు స్పందించి పారా మిలటరీ బలగాలను మణిపూర్లో మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంతగా పరిస్థితిని చక్కదిద్దినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టంతో పాటు సుమారు 1,500 నివాసాలు ధ్వంసమై ఆస్తినష్టం వాటిల్లింది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల డిష్యుం.. డిష్యుం. ఎందుకో తెలుసా? -
కర్ణాటక: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలెట్ యూనిట్లను డ్యామేజ్ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్, బాలెట్ యూనిట్తో పాటు మూడు వీవీప్యాట్లు ధ్వంసం చేశారని తెలిపింది. -
హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు 'తీవ్రమైన కేసుల్లో' కనిపిస్తే కాల్చివేతకు మణిపూర్ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. మణిపూర్ మారణహోమంలో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. బుల్లెట్ గాయాలు తగిలిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సాధారణ పరిస్థితిని నెలకొల్పడం కోసం కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దింపింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పోలీసులు బలగాలలు అన్ని సమస్యాత్మక ప్రాంతాలు, రహదారుల్లో పహరా కాస్తున్నాయి. ఆర్టికల్ 355ను సైతం కేంద్ర అమల్లోకి తీసుకొచ్చింది. శనివారం ఉదయం షాపులు, మార్కెట్లు తిరిగి తెరుచుకోవడంతో శనివారం ఇంఫాల్ వ్యాలీలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కురగాయాలు వంటి నిత్యవసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. కార్లు వంటి వాహనాలు సైతం రోడ్డెక్కాయి. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. చదవండి: ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది! గడిచిన 12 గంటల్లో, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయిని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే వేంగంగా స్పందించిన ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు పరిస్థితిని నియత్రణలోకి తీసుకొచ్చాయని తెలిపారు. శుక్రవారం రాత్రి చురాచంద్పూర్ జిల్లాలోని సైటన్లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఐఆర్బీ జవాన్లు గాయపడ్డారని తెలిపారు. గచురాచాంద్పూర్, మోరే, కక్చింగ్, కాంగ్పోక్పీ వంటి ప్రాంతాలను కేంద్ర బలగాలు తమ ఆధినంలోకి తీసుకున్నాయి. ఈ ప్రదేశాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు దాదాపు 10,000 మంది సైనికులు రాష్ట్రంలో మోహరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వెనుక ఉన్న అసలు కారణాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరాతీశారు. అసలు ఎందకీ ఘర్షణలు? మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. అయితే చురాచాంద్పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతు పలుచోట్ల ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది. చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్స్టర్ టిల్లుపై కత్తితో.. వీడియో వైరల్ -
మణిపూర్ లో మరోసారి చెలరేగిన అల్లర్లు
-
మణిపూర్లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
కల్లోల మణిపూర్లో ఆర్మీ మోహరింపు.. జరుగుతోంది ఇదే!
ఇంఫాల్: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికి పోతోంది. గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడ అల్లకల్లోలం చెలరేగింది. అయితే అల్లర్లకు మీరు కారణమంటే మీరే కారణమంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఆ రెండు వర్గాలు. అల్లర్లతో హింస చెలరేగడంతో.. భారత సైన్యం అక్కడ అడుగుపెట్టింది. మెయితీల గిరిజన హోదాకి సంబంధించి తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ చూరాచంద్పూర్లో గిరిజన గ్రూపులు చేపట్టిన యాత్ర.. హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇంఫాల్తో పాటు చూరాచంద్పూర్, కంగ్పోక్పి జిల్లాల్లో చెలరేగిన హింసతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ను బంద్ చేశారు. ► మణిపూర్లోని ఎనిమిది జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. మరోవైపు కల్లోల స్థితిని అదుపు చేసేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఈ ఉదయం(గురువారం) హింస చెలరేగిన ప్రాంతంలో కవాతు నిర్వహించింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నాయి. ఇంటర్నెట్ను బంద్ చేయడంతో పాటు 144 సెక్షన్కు పక్డబందీగా అమలు చేస్తున్నారు అక్కడ. చురాచాంద్పూర్ జిల్లా రెవెన్యూ పరిధిలోని ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందని, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. బయట వ్యక్తులను ఎవరినీ రానీయకుండా సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ► అలా మొదలై.. మెయితీలు తమను షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారం ఊపందుకోవడంతో.. గిరిజన సంఘాలు రంగంలోకి దిగాయి. మెయితీల డిమాండ్ను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఈ క్రమంలో.. చురాచంద్ పూర్ జిల్లాలోని తొర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) ‘గిరిజన సంఘీభావ యాత్ర’ను బుధవారం చేపట్టింది. యాభై వేల మందికి పైగా గిరిజనలు ఒకేచోట చేరి.. గిరిజన హక్కుల పరిరక్షణ నినాదాలు చేశారు. అయితే.. ఈ యాత్ర హింసకు దారి తీసింది. యాత్రలో పాల్గొన్న కొందరు గ్రామంలోని రోడ్లపై టైర్లు, ఇతర వస్తువులను తగలబెట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులను దారి తీసింది. దీంతో పోలీసులు లాఠీలకు, టియర్ గ్యాస్లకు పని చెప్పారు. అయితే ఇది మెయితీల పనేనని గిరిజన సంఘాలు, కాదు కుకీ గిరిజనుల పనేనని మెయితీలు ఆరోపించుకుంటున్నారు. ► మెయితీలు మణిపూర్ కొండ, లోయ ప్రాంతాలతో రెండుగా విభజించబడింది. లోయ ప్రాంతంలో మెయితీలు, కొండ ప్రాంతాల్లో నాగా, కుకీ చిన్ మిజో, జో గిరిజన తెగలు జీవిస్తున్నాయి. మణిపూర్ జనాభాలో.. దాదాపు సగం జనాభా మెయితీ కమ్యూనిటీదే!. అయితే.. మయన్మార్, బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున అక్రమ వలసల కారణంగా.. తమ జీవనానికి ఇబ్బంది కలుగుతోందని మెయితీలు చెబుతున్నారు. ఈ క్రమంలో చొరబాటు దారులను కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినా లాభం లేకుండా పోయింది. అయితే.. మణిపూర్ చట్టాల ప్రకారం లోయ ప్రాంతాల్లో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వాళ్లు జీవించడానికి. దీంతో వాళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తుండగా.. తమనూ గిరిజనుల్లో చేర్చాలని, ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, అలాగే.. కొండ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేయించాలని డిమాండ్కు దిగారు వాళ్లు. ► ఈనాటిది కాదు.. మెయితీ కమ్యూనిటీ డిమాండ్ దశాబ్దాల కాలం నాటిది. అయితే పదేళ్ల కిందట ఈ డిమాండ్ విషయంలో కీలక అడుగు పడింది. మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశం పరిశీలనకు అప్పటి ప్రభుత్వం మణిపూర్ అసెంబ్లీ హిల్స్ ఏరియాస్ కమిటీని ఏర్పాటు చేయగా.. అది సుదీర్ఘ పరిశీలనల తర్వాత మెయితీస్కు వ్యతిరేకంగా ఓ తీర్మానం పాస్ చేసింది. దీంతో ఆ కమ్యూనిటీ భగ్గుమంది. ఈ అంశంపై మణిపూర్ హైకోర్టును ఆశ్రయించగా.. మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని నాలుగు వారాల్లోగా పరిశీలించాలని, అలాగే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలంటూ ఆదేశించింది. దీంతో పరిస్థితులు అల్లర్లు హింసకు దారి తీశాయి. ► డీజీపీ స్పందన కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే చిత్రాలు, విద్వేష ప్రసంగాలు, విద్వేష వీడియో సందేశాల ప్రసారం కోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నాయని మణిపూర్ హోం శాఖ ఒక లేఖలో పేర్కొంది. వదంతులు వ్యాపింపజేసేవారికి సోషల్ మీడియా ఒక సులభమైన సాధనంగా మారిందని, సాధారణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారని, ఇది మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని తెలిపింది. మరోవైపు బిష్ణుపూర్, చురాచంద్పూర్ జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా, అస్థిరంగా ఉందని డీజీపీ సీ డౌంగెల్ తెలిపారు. మరోవైపు ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సీఎం బీరెన్ పిలుపు ఇవ్వగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ పరిస్థితులపై బీరెన్తో ఫోన్లో చర్చించారు. ► మెయితీలు వర్సెస్ కుకీలు మణిపూర్ కొండల్లోని భూములు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371సీ, మణిపూర్ భూ రెవెన్యూ & భూ సంస్కరణల (MLR & LR) చట్టం 1960లోని సెక్షన్ 158 ప్రకారం.. గిరిజనులకే చెందుతాయి. మెయితీలతో పాటు గిరిజనేతర వ్యక్తులకు బదిలీ చేయకూడదనే పాయింట్ మీద మెయితీల గిరిజన హోదా డిమాండ్ను కుకీ తెగ వ్యతిరేఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గిరిజన హక్కుల పరిరక్షణ పేరిట చేపట్టిన యాత్రలో ముఖ్యభూమిక పోషించింది కూడా. మరోవైపు మెయితీల జనాభా 1951 జనాభా లెక్కల ప్రకారం.. మణిపూర్ జనాభాలో 59 శాతం మెయితీలే ఉండేవాళ్లు. అయితే.. 2011 నాటికి ఆ జనాబా 44 శాతానికి పడిపోయింది. అయితే తాము గతంలోనే గిరిజనులుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నామని చెబుతున్నారు. 1891లో.. మెయితీలను అటవీ గిరిజనులుగా గుర్తించింది అప్పటి బ్రిటిష్రాజ్యం. ఆపై 1901లో ప్రధాన గిరిజనులుగా వాళ్లను రికార్డుల్లోకి ఎక్కించారు. తిరిగి 1931లో.. హిందూ గిరిజనులుగా గుర్తించారు. కానీ, 1950 నుంచి వాళ్లను గిరిజనులుగా పరిగనించడం లేదు. ఆ కారణం ప్రభుత్వాలకే తెలియాలని అంటున్నారు మెయితీలు. ఇదీ చదవండి: అన్ని కోట్లు సంపాదించాలంటే.. ఎంత టైం పడుతుందో? -
నెత్తురు చిందిన బస్తర్
చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు లేకుండా కనీసం రెండేళ్లనుంచి ప్రశాంతంగా కనబడుతున్న ఛత్తీస్గఢ్లో బుధవారం నక్సలైట్లు ఐఈడీ పేల్చి మినీ బస్సులో వెళ్తున్న పదిమంది జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులనూ, ఒక డ్రైవర్నూ హతమార్చిన ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పల్నార్–అరణ్పూర్ మధ్యలో ఇటీవలే నిర్మించిన రహ దారిపై ఈ ఐఈడీని అమర్చారనీ, అది కూడా రెండు మూడురోజుల క్రితమేననీ వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుపాకులు పట్టామని చెబుతున్న మావోయిస్టుల్లోగానీ, వారిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాల తీరులోగానీ ఏ మార్పూ రాలేదని తాజా ఘటన చెబుతోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉన్న వామపక్ష తీవ్ర వాదం చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. 2000కు ముందు పది రాష్ట్రాల్లోని 200 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ సంఖ్య 2021 నాటికి 41కి పడిపోయిందంటున్నారు. ఇప్పుడది 25 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనీ, గత ఎనిమిదేళ్లలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 55 శాతం తగ్గాయనీ, మరణాలు కూడా 63 శాతం తగ్గాయనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాలుగు నెలల క్రితం విడుదల చేసిన నివేదిక తెలిపింది. హింసను కట్టడి చేయ టానికి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న పర్యవ సానంగా మావోయిస్టుల లొంగుబాట్లు కూడా అధికంగానే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. అయితే ఇలాంటి విజయాలే పోలీసు బలగాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీశాయా అన్నది ఆలోచించుకోవాలి. తాజా ఉదంతాన్నే తీసుకుంటే అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావో యిస్టుల కదలికలున్నాయని అందిన సమాచారంతో డీఆర్జీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేముందూ, తిరిగొచ్చేటప్పుడూ ఒకే మార్గాన్ని ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ తప్పని సరైతే రెండుసార్లూ బలగాల కన్నా ముందు ఒక ప్రత్యేక టీం వెళ్లి ఆ దారిలో మందుపాతరలు, ఇతరత్రా బాంబులు లేవని నిర్ధారించాలి. పైగా ఈమధ్యకాలంలో మావోయిస్టుల వైపునుంచి ఐఈడీల వినియోగం బాగా ఎక్కువైందని తెలుస్తూనే ఉంది. గత నాలుగు నెలల్లో ఐఈడీలు గుర్తించి వెలికితీసిన ఉదంతాలు 34 వరకూ ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. గతంలో భారీయెత్తున ఆది వాసీలను సమీకరించి పోలీసు బలగాలపై విరుచుకుపడిన మావోయిస్టులు ఇటీవల తక్కువమందితో బృందాలను ఏర్పాటుచేసి దాడులకు దిగుతున్నారని ఒక మీడియా కథనం తెలిపింది. పైగా లోగడ కేవలం అయిదారు కేజీల ఐఈడీని పేలుళ్లకు వినియోగిస్తే ఇప్పుడది 30, 40 కేజీలవరకూ ఉంటోంది. అందువల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి అయినా అరణ్పూర్ వెళ్లిన డీఆర్జీ పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఒకప్పుడు లొంగిపోయిన ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రైవేటు దళాలను ఏర్పాటుచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఆ తర్వాతే ఛత్తీస్గఢ్ పోలీసు విభాగంలో డీఆర్జీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటయింది. ఇందులో కూడా అత్యధికులు లొంగిపోయిన మావోయిస్టులు. వారంతా ఆదివాసీలు. కనుక మావోయిస్టులకు వారిపై గురి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఘటన జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు బలంగా ఉండేవారనీ, ఇప్పుడు వారి ప్రభావం పూర్తిగా పోయిందనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఆర్జీ పోలీసుల్లో నిర్లక్ష్యానికి అది కూడా కారణమైవుండొచ్చు. ఒకప్పుడు మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న తాము ఎందువల్ల బలహీ నపడవలసి వచ్చిందన్న ఆత్మవిమర్శ మావోయిస్టుల్లో కొరవడిందని తాజా ఉదంతం చెబుతోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయే తప్ప దానివల్ల కలిగే మార్పేమీ ఉండదని పదే పదే రుజువవుతోంది. మావోయిస్టులు ఏదో ఒక చర్యకు పాల్పడగానే సమీప ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలపై పోలీసులు విరుచుకుపడటం, అమాయ కులు సైతం బాధితులుగా మారడం చాన్నాళ్లుగా కనబడుతూనే ఉంది. అరెస్టులు, కేసులు, ఏళ్ల తరబడి జైళ్లపాలు కావటం పర్యవసానంగా ఆదివాసీ కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషించేవారు లేక ఎన్నో కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావంలో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. కనీసం ఈ పరిణామమైనా తమ హింసాత్మక చర్యల్లోని నిరర్థకతపై పునరాలోచన కలిగిస్తే బాగుండేది. కానీ ఆ మాదిరి మార్పు రాలేదని ఈ ఉదంతం నిరూపించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలను ప్రకటించటానికీ, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయనుకున్నప్పుడు వాటికి వ్యతి రేకంగా ప్రజానీకాన్ని కూడగట్టడానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. అలాంటి ఉద్యమాలను ప్రభుత్వాలు అణచివేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన కూడా అదే స్థాయిలో వస్తున్నది. సాగు చట్టాలపై ఏడాదిపైగా సాగిన రైతు ఉద్యమాన్ని నయానా భయానా నియంత్రించాలనుకున్న కేంద్రం చివరకు వారి డిమాండ్లకు తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోకతప్పలేదు. వీటన్నిటినీ మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. తమ హింసాత్మక చర్యలవల్ల సాధించేదేమీ లేకపోగా ఆదివాసులే కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తున్నదని గుర్తించాలి. -
మణిపూర్లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గురువారం రిజర్వ్ చేసిన రక్షిత అడవులు, చిత్తడి నేలలు, వంటి ప్రాంతాలపై బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేని ఆదివాసి గిజన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ కార్యక్రమానికి చెందిన వేదికను ఓ గుంపు ధ్వంసం చేసి, నిప్పంటించారు. దీంతో అధికారులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనులు తలెత్తకుండా 144 సెక్షన్ని విధించి నిషేధాజ్ఞాలు జారీ చేశారు. ఉద్రిక్తతలు మరింతగా చెలరేగేలా..ప్రజలు ఎవరితోనూ కమ్యూనికేట్ చేయకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రజల ప్రాణలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తాము శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్లట్జోయ్ గాంగ్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా బంద్కు గిరిజన నాయకుల ఫోరం పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రైతులు, ఇతర గిరిజన నిర్వాసితులు రిజర్వు అటవీ ప్రాంతాలను తొలగించడం కోసం కొనసాగుతున్న డ్రైవ్ను నిరసిస్తూ ప్రభుత్వానికి పదేపదే మెమోరాండంలు సమర్పించారు. అయినప్పటికీ తమ కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం సుముఖత లేదా చిత్తశుద్ధి చూపలేదని గిరిజన నాయకుల ఫోరం పేర్కొంది. ఈమేరకు కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్కు మద్దతుగా నిలిచింది. ఆదివాసులపై ప్రభుత్వం సవతి తల్లి మాదిరిగా ప్రవర్తిస్తుందిన కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. మత కేంద్రాలను కూల్చివేయడం, గిరిజన గ్రామాలను అక్రమంగా తొలగించడం వంటి వాటితో గిరిజన హక్కులను నిర్వీర్యం చేస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నట్లు ఆర్గనైజేషన్ పేర్కొంది. కాగా, మణిపూర్లోని మూడు చర్చిలను ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కూల్చివేసి, వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొనడం గమనార్హం. (చదవండి: ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..) -
Kaliyaganj: మళ్లీ హింస.. ఆ వీడియోపై దుమారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కలియాగంజ్ హింసతో అట్టుడికి పోయింది. ఓ మైనర్ గిరిజన బాలిక హత్యాచారానికి గురికావడంపై రగిలిపోయారు స్థానికులు. ఆందోళనకు దిగి పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బాడీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం, గ్రామస్తులు అడ్డుకునే యత్నాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసకు దారి తీసింది. గురువారం సాయంత్రం.. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని గంగువా గ్రామానికి చెందిన ఓ బాలిక ట్యూషన్కని చెప్పి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆ రాత్రంతా ఆమె కోసం గాలించింది ఆమె కుటుంబం. శుక్రవారం ఆమె శవాన్ని స్థానికులు ఊరి శివారులో ఉన్న ఓ కొలను పక్కన పొదల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆమె హత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి గ్రామస్తులు రగిలిపోయారు. రోడ్లను దిగ్భంధించి.. నిరసనలు చేపట్టారు. పరిస్థితి హింసాత్మకంగా మారే సూచనలు కనిపించడంతో.. పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శనివారం ఒక్కరోజే.. ఆందోళనకారులపై రెండుసార్లు టియర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు. మరోవైపు పోలీస్ సిబ్బంది బాధితురాలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి రాజకీయ విమర్శలకు దారి తీసింది. అయితే.. గ్రామస్తుల నుంచి బాలిక మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది సాయంతో స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు పంపించామని, ఆలస్యమైతే కీలక ఆధారాలు చెరిగిపోయే అవకాశం ఉన్నందునే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఉత్తర దినాజ్పూర్ ఎస్పీ సనా అక్తర్ మీడియాకు వెల్లడించారు. బాలిక డెడ్బాడీ పక్కనే ఓ సీసా దొరికింది. బహుశా అది విషం బాటిల్ అయ్యి ఉండొచ్చు. ఆమె ఒంటిపైనా ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘోరంతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు అని ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన ఆధారంగా టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని, పోలీసులు సైతం నేరాల కట్టడిలో ఘోరంగా విఫలం అవుతున్నారని మండిపడుతోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఓ వీడియో పోస్ట్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యం అది. అంతేకాదు.. ఆ మైనర్ రాజ్బోంగ్షి కమ్యూనిటీకి చెందిందని అమిత్ మాలవియా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన ఆధారంగా మమతా బెనర్జీ సర్కార్పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే.. పోలీసులు ఆ గ్రామంలోకి రాజకీయ నేతలు రాకుండా ఆంక్షలు విధించారు. কালিয়াগঞ্জে নাবালিকা রাজবংশী মেয়েকে গণধর্ষণ করে নৃশংসভাবে হত্যা করা হয়। ধর্ষিতা পরিবারের সঙ্গে দেখা করলেন রাজ্য সভাপতি ডঃ @DrSukantaBJP, সাংসদ @DebasreeBJP ও @khagen_murmu বিধায়ক গোপাল চন্দ্র সাহা, সত্যেন্দ্রনাথ রায়, চিন্ময়দেব বর্মন ও শ্রীরূপা মিত্র চৌধুরী। pic.twitter.com/S19YFNucha — BJP Bengal (@BJP4Bengal) April 22, 2023 బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్నట్లు ట్విటర్లో షేర్ చేసిన వీడియోను జాతీయ మహిళా కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంది. వివరణ ఇవ్వాలంటూ బెంగాల్ డీజీపీని ఆదేశించింది. In this video, the body West Bengal Police is insensitively dragging is that of a minor rape and murder victim from the Rajbongshi community in Uttar Dinajpur’s Kaliaganj. Such haste is often seen when the purpose is to eliminate or dilute evidence and cover up the crime… pic.twitter.com/zgz2Rxlik1 — Amit Malviya (@amitmalviya) April 22, 2023 ఇంకోవైపు ఎన్సీపీసీఆర్(జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం) సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నిజనిర్ధారణకమిటీ ద్వారా కేసును పర్యవేక్షించబోతోంది. అంతేకాదు ఈ ఘటనపై తమకు సమాచారం అందింటలేదంటూ.. బెంగాల్ సీఎస్తో పాటు ఉత్తర దినాజ్పూర్ కలెక్టర్పైనా ఆరోపణలు గుప్పించింది. పోలీసులు మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. -
సూడాన్ ఘర్షణల్లో భారతీయుడు మృతి
సూడాన్ రాజధాని ఖార్టూమ్లోని సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 61 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో ఆల్బర్ట్ ఆగస్టీన్ అనే భారతీయుడు ఉన్నారు. సూడాన్లో 2021 అక్టోబర్లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అత్యున్నత మండలి అధికారం చెలాయిస్తోంది. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారం అప్పగించే విషయంలో ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఖార్టూమ్లోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రయాన్ని, ఇతర కీలక ప్రాంతాలు తమ ఆధీనంలోనే ఉన్నట్లు సైన్యం, పారా మిలటరీ బలగాలు ప్రకటించుకున్నాయి. శనివారం నుంచి రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తలెత్తిన హింసాత్మక ఘటనల్లో 61 మంది పౌరులు చనిపోయారు. ఇరుపక్షాలకు చెందిన డజన్లకొద్దీ మరణించి ఉంటారని వైద్యుల సంఘం ఒకటి అంటోంది. మరో 670 మంది గాయపడినట్లు చెబుతోంది. దాల్ గ్రూప్ కంపెనీ ఉద్యోగి, భారతీయుడు ఆల్బర్ట్ ఆగస్టీన్ తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. చదవండి: ఆశాకిరణం ఆఫ్రికా..! -
భారత్లోని ముస్లింలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
వాషింగ్టన్: భారత్లోని ముస్లింలపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో కంటే భారత్లో ముస్లింలు ఎంతో మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. పాక్లో మైనార్టీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని వారి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. దేశంలో ముస్లింలపై వివక్షత, దాడులు జరుగుతున్నాయంటూ పాశ్చాత్య పత్రికల్లో వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోని ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం కేంద్ర మంత్రి వాషింగ్టన్లో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF), ప్రపంచ బ్యాంక్తో సహా వివిధ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. . భారత్ పెట్టుబడులపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆమె తప్పుబట్టారు. తనకంటే భారత్కు వస్తున్న పెట్టుబడిదారులే దీనికి సరైన సమాధానం చెప్తారని అన్నారు. ‘ఇండియాలో పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి ఉన్న వారిని నేను ఒకటే కోరుతున్నా..ఎవరో చెప్పింది వినడం కంటే.. #WATCH | "Union Finance Minister Nirmala Sitharaman responds to a question on 'violence against Muslims' in India and on ‘negative Western perceptions' of India pic.twitter.com/KIT9dF9hZC — ANI (@ANI) April 11, 2023 భారత్కు రండి.. దేశంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి’ అని పీఐఐఈ ప్రెసిడెంట్ ఆడమ్ ఎస్ పోసెన్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలోని ఎంపీలు హోదా కోల్పోతున్నారని, భారతదేశంలోని ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతున్నారని పాశ్చాత్య పత్రికల్లో వచ్చిన వార్తలపై సీతారామన్ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉందన్నారు. ముస్లింలా జనాభా సంఖ్యాపరంగా పెరుగుతోందన్నారు. ముస్లింలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని, వ్యాపారాలను హాయిగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. భారత్లో 1947 తరువాత ముస్లింల జనభా తగ్గడం గానీ, మరణాలు పెరగడం గానీ జరిగాయా అని ప్రశ్నించారు ‘భారత్ ఏర్పడిన సమయంలోనే పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. పాక్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు కానీ అక్కడ మైనారిటీల పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. అంతేగాక ముస్లింలోని కొన్ని తెగలు సైతం క్షీణిస్తున్నాయి. అక్కడి మైనార్టీలపై చిన్న చిన్న ఆరోపణలకే తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు. వ్యక్తిగత కోపాలను తీర్చుకునేందుకు కఠిన శిక్షలు, మరణశిక్షలు విధిస్తున్నారు .విచారణ లేకుండానే అనేకమంది బాధితులను వెంటనే దోషులుగా మార్చుతున్నారు. పాక్లోని ముస్లింల కంటే భారతదేశంలోని ముస్లింలు మెరుగ్గా పనిచేస్తున్నారు’ అని నిర్మలా పేర్కొన్నారు. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
ఓఐసీ ప్రకటనపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత్ అంతర్గత వ్యవహారాలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఓఐసీ. అయితే.. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ల కమ్యూనల్ మైండ్సెట్(మతపరమైన ఆలోచనాధోరణికి) ఇది మరో ఉదాహరణ అని, భారత్ వ్యతిరేక ఎజెండాను ఆ దేశాలు మరోసారి బయటపెట్టాయని భారత్ మండిపడింది. భారత్ అంతర్గత వ్యవహారాలలో ఓఐసీ జోక్యం అక్కర్లేని అంశమని భారత్ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా ముస్లింలు లక్ష్యంగా హింస, విధ్వంసం చోటుచేసుకున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. అధికారులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్లో ముస్లింల భద్రతకు, హక్కులకు భరోసా ఇవ్వాలని ఓఐసీ తన ప్రకటనలో భారత్ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే.. భారత్ తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య జనరల్ సెక్రటేరియెట్ పేరిట రిలీజ్ అయిన ప్రకటనను, బాగ్చీ ఖండించారు. అలాగే జమ్ము కశ్మీర్ అంశంలోనూ ఓఐసీ(ఇందులో పాక్ కూడా ఉంది) జోక్యాన్ని అవసరమైన అంశంగా తేల్చారు ఆయన. -
ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..!
పాట్నా: బిహార్ రోహ్తాస్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు 144 సెక్షన్ విధించారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 4వరకు సెలవులు ప్రకటించారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్లను కూడా తెరవొద్దని నిర్వాహకులకు తెలిపారు. కేంద్రహోమంత్రి అమిత్షా పర్యటనకు ముందు మార్చి 31న నలంద జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత రోహ్తాస్ జిల్లాలోనూ గురువారం ఘర్షణలు చెలరేగాయి. శనివారం వరకు ఇవి కొనసాగాయి. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పోలీసు బలగాలను రంగంలోకి దించి పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 50మందినిపైగా అరెస్టు చేశారు. పలుకేసులు నమోదు చేశారు. బిహార్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్షా కూడా శాంతిభద్రతల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..! -
జాడలేని అమృత్పాల్ సింగ్.. ఎన్నారై భార్యతో అక్కడికి ప్లాన్?
దేశంలో ఎక్కడ విన్నా ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ పేరే వినిపిస్తోంది. సినిమా రేంజ్లో ట్విస్ట్ ఇస్తూ వేషాలు మారుస్తూ ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కార్లు, బైకులు మారుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇక, అమృత్పాల్ దేశం విడిచి పాకిస్తాన్, నేపాల్లోకి వెళ్లినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. అమృత్పాల్ పరారీ నేపథ్యంలో ఆయన భార్య కిరణ్దీప్ కౌర్పై పోలీసులు నిఘా పెంచారు. కిరణ్దీప్ సహా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారం విచారించారు. మహిళా పోలీసు అధికారితో సహా పోలీసు బృందం దాదాపు గంటపాటు కిరణ్దీప్ కౌర్ ఆమె తండ్రి తార్సేమ్ సింగ్, తల్లిని విచారించింది. అమృత్పాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్దీప్ కౌర్ను పోలీసులు ప్రశ్నించారు. ఫండింగ్ గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక, కిరణ్దీప్ యూకేకు చెందిన ఎన్నారై. ఆమె స్వస్థలం పంజాబ్లోని జలంధర్. కిరణ్దీప్ను అమృత్పాల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నాడు. వీరి పెళ్లి జల్లూపూర్ ఖేడాలో జరిగింది. కాగా, పెళ్లి తర్వాత తన భార్యను అమృత్పాల్ తనతోనే ఇండియాలోనే ఉండాలని కోరాడు. ఇది విదేశాల నుంచి పంజాబీల రివర్స్ మైగ్రేషన్ను పోత్సహించేందుకు ఉపయోగపడుతుందని ఆమెకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు.. కిరణ్దీప్ కౌర్ కెనడా వెళ్లేందుకు ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, అమృత్పాల్ భారత్ విడిచి కెనడా పారిపోయే అవకాశం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అమృత్పాల్ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్(బీఎస్ఎఫ్)ను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు, అంతకు ముందు.. విదేశీ ఖలిస్థానీ సానుభూతిపరుల ద్వారా వచ్చిన డబ్బుతో అమృతపాల్ అక్రమ ఆయుధాలతో పాటు 35 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేశాడు. అతడికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయంటూ భద్రతా సంస్థలు గుర్తించాయి. పంజాబ్లో శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు యువ సిక్కులను తన గ్రూపు కిందకు తీసుకురావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పార్లమెంటరీ విచారణ బృందంపై దాడి.. వాహనాలు ధ్వంసం
త్రిపురలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన పార్లమెంటరీ బృందంపై దాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎవరికీ ఏం కాలేదు. అయితే మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పార్లమెంటరీ బృందం తన షెడ్యూల్లో మార్పులు చేసుకుంది. అయితే.. ఇది బీజేపీ పనేనంటూ కాంగ్రెస్, సీపీఎంలు ఆరోపణలకు దిగాయి. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఎనిమిది జిల్లాల్లో హింస చెలరేగింది. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా వెయ్యి దాడులు చోటు చేసుకోగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింసలో ముగ్గురి ప్రాణాలు పోయాయి కూడా. ఈ నేపథ్యంలో.. నలుగురు లోక్సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ బృందం ఒకటి ఆ హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు త్రిపుర వెళ్లింది. మూడు బృందాలుగా విడిపోయి.. శుక్ర, శనివారాల్లో వెస్ట్ త్రిపుర, సెపహిజల, గోమతి జిల్లాల్లో పర్యటనకు సిద్ధం అయ్యాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం బిసల్ఘడ్లోని నేహల్చంద్ర నగర్ బజార్లో పార్లమెంటరీ బృందం పర్యటించగా.. కొందరు నినాదాలు చేస్తూ వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. ఆ సమయంలో ఎంపీలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, కొందరు నేతలు కూడా అక్కడ ఉన్నారు. అయితే.. పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఎంపీల బృందాన్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఎవరికీ గాయలు కాలేదని, వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు.. అలాగే మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. దాడి యత్నాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఖండించారు. బిలాస్ఘడ్తో పాటు మోహన్పూర్లోనూ కాంగ్రెస్ నేతల బృందంపై బీజేపీ గూండాలు దాడి చేశారని, పోలీసులు అక్కడే ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారాయన. అంతేకాదు ఈ ప్రాంతంలోనే బీజేపీ ఎన్నికల విక్టరీ ర్యాలీకి ప్లాన్ చేసిందని, కాబట్టి ఇది బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగిన దాడి అంటూ ఆరోపించారాయన. మరోవైపు సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి జితేంద్ర చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. దాడి నేపథ్యంలో పార్లమెంటరీ బృందం తన కార్యక్రమాలను నిలిపివేసిందని, షెడ్యూల్లో మార్పు చేసుకుందని చెప్పారు. A delegation of Congress leaders was attacked by BJP goons today in Bishalgarh & Mohanpur in Tripura. Police accompanying the delegation did NOTHING. And tomorrow BJP is having a victory rally there. Victory of party-sponsored violence. pic.twitter.com/gZfBm4qEWB — Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2023 -
మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది! యూఎన్లో భారత్
మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస ప్రబలంగా ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈమేరకు రుచిరా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవి. పైగా ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా మహిళలు, బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్లో మహిళల శాంతి భద్రతలపై ఐరాస భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందన, తదితరాల్లో మహిళల పాత్రను తెలియజేస్తోంది. అంతేగాదు ఇది సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతలకు సంబంధించి అన్ని రకాలుగా వారి పూర్తి ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మహిళలకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి చట్టబద్ధమైన నియమాలు తప్పనిసరి. అలాగే అఫ్ఘనిస్తాన్ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 2021లో భారత్ కౌన్సిల్ ఆఫ్ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యూఎన్ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం.. అప్ఘనిస్తాన్లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిథ్య పాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షార్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయసంస్థలకు సాయం చేయాలి. సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలి. శాంతిస్థాపన ప్రయత్నాలలో మహిళలపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే భారత్లో లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నాం. జనవరి 2023లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా సైన్యాన్ని అందించిన దేశాలలో భారత్ ఒకటి. 2007 లైబీరియాలో మొత్తం మహిళా పోలీసుల విభాగాలను ఏర్పాటు చేసిన మొదటి దేశం భారతదేశం. అంతేగాదు మహిళ రక్షణ సలహాదారుల విస్తరణకు భారత్ మద్దతు ఇస్తోంది. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు ఇప్పటికీ తక్కువగానే ప్రాతినిధ్యం వహించడం బాధకరం. కానీ భారత సాంస్కృతిక సంప్రదాయల్లో భూమిని తల్లిగా పరిగణించటం ప్రజలకు నేర్పింది. దేశ సాధికారతకు మహిళ పురోగతి చాలా ముఖ్యమని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని రుచిరా అన్నారు. (చదవండి: వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్) -
పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు: ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత పట్టాభి విషయంలో ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభి విషయంలో ఏం జరిగిందో ఎస్పీ జాషువా కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ లీడర్ పట్టాభిని పోలీసులు కొట్టారనేది అవాస్తమని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ జాషువా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నిందలు వేయడం సరికాదు. పట్టాభి అవాస్తవంతో కోర్టును తప్పుదారి పట్టించాలని చూశారు. పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు. డాక్టర్ల బృందం రెండుసార్లు పరీక్షించినా ఎలాంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైంది. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా సుమోటోగా కేసు నమోదు చేశాం. వీడియో ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. -
పట్టాభిని కొట్టారంటూ ఈనాడు తప్పుడు రాతలు
-
అడ్డంగా బుక్కైన ‘ఈనాడు’.. ఫేక్ వార్తల్లో పచ్చ మీడియా స్టైలే వేరు!
అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!. సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో.. సీఎం జగన్ సర్కార్పై తప్పుడు రాతలు, ఫేక్ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. తాజాగా బొక్కబొర్లాపడే రీతిలో మరో అడుగేసింది ఈనాడు. అదీ మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం!. ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడూ అసత్య ప్రచారమే చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ ప్రజలకు నిజలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకుని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ, అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తప్పులు సహజం కావొచ్చు. కానీ, ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. రెండేళ్ల క్రితం గన్నవరం ఘటనలో జగన్ సర్కార్పై కూడగలుపుకుని ‘ఈనాడు’, టీడీపీ దుష్ప్రచారం చేశాయి. టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ విష ప్రచారం చేశాయి. చంద్రబాబు డైరెక్షన్లో.. రామోజీ యాక్షన్లో ఈనాడు ఓ పె.. ద్ద కథనం రాసుకొచ్చింది. అయితే, 2021 నాటి ఘటనలోని ఫొటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అభాసుపాలైంది. రెండేళ్ల క్రితం ఫొటోలను ప్రచురించి.. ప్రస్తుతం జరిగిన ఘటనలో పట్టాభిని కొట్టారంటూ కలరింగ్ ఇచ్చింది ఈనాడు. ఇక, దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం. టీడీపీ.. ఈనాడు తప్పుడు ఫొటో కథనాలను ట్వీట్ చేసి సీఎం జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారంటూ కోర్టులో ఈనాడు ఫొటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం, వైద్యులు.. పట్టాభికి ఎలాంటి గాయాలు లేవని పూర్తిగా ఫిట్గా ఉన్నాడని ధృవీకరించారు. అయితే, వైద్యుల ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ప్చ్.. చేసేదేమీ లేకపోవడంతో చింతిస్తున్నామంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్ను విడుదల చేసింది. ఈ ఫొటోలు 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్గా చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రికా విలువలను పక్కనపెట్టి.. పరువు పొగొట్టుకుంది. -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
లఖీంపూర్ ఖేరి కేసు విచారణకు ఐదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అమాయకులైన రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న లఖింపూర్ ఖేరి హింసా కాండ కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుందని సుప్రీంకోర్టుకు సెషన్స్ కోర్టు విన్నవించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న ఈ కేసులో 208 మంది సాక్షులు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు ఉన్నాయని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి తెలిపారు. ఆశిశ్ మిగ్రా బెయిల్ విచారణ సందర్భంగా గత నెలలో ఈ కేసు విచారణ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందని సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఈ విధంగా బదులిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, వి రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఒక నివేదికను సుప్రీంకు సమర్పించింది. తదుపరి విచారణను జనవరి 19కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 3, 2021న నూతన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చెలరేగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిని విషయం తెలిసిందే. చదవండి: ఆప్కు భారీ షాక్.. పదిరోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే, లేకుంటే ఆఫీస్కు సీజ్! -
యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు..పలువురికి గాయాలు
లక్నో: అలహబాద్ యూనివర్సిటీ తీవ్ర హింసాత్మకంగా మారింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వడం, మోటారు సైకిళ్లుకు నిప్పంటించడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపు విషయమై నెలల తరబడి నిరసన జరుగుతోంది. అందులో భాగంగా ఓ విద్యార్థి నాయకుడు క్యాంపస్లోని బ్యాంకుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే గార్డు అందుకు అనుమతించ లేదు. దీంతో వాగ్వాదం ఏర్పడి అది కాస్త ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్పై విదేశాంగ మంత్రి ఫైర్) -
Kerala: హింసాత్మకంగా మారిన ఫిఫా విక్టరీ సంబురాలు
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్లోనూ ఈ ఆటకు కోట్లలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. ముఖ్యంగా కేరళ ప్రజలు షుట్ బాల్ ఆటను విపరీతంగా ఫాలో అవుతుంటారు. ఖతర్ వేదికగా జరిగిన 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ పోరులో చివరికి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాదే పైచేయి అయ్యింది. 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ను అర్జెంటీనా ముద్దాడింది. దీంతో మెస్సీ అభిమానులు వీర లెవల్లో పండగ చేసుకుంటున్నారు. Calicut Kerala❤️🔥#WorldCup2022 pic.twitter.com/aZu5tlHnak — ForumKeralam (@Forumkeralam2) December 18, 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా కేరళలోని ఫ్యాన్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్ జెర్సీలు ధరించి జెండాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. జట్టు సభ్యుల భారీ కటౌట్లతో హోరెత్తించారు. ఫ్రాన్స్పై అర్జెంటీనా బృందం అద్భుత విజయం సాధించడంతో కేరళలో సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వీట్లు, ఉచితంగా ఫుడ్ పంపిణీ చేస్తూ.. రోడ్లపై టపాసులు పేల్చుతూ డ్యాన్స్లతో అర్జెంటీనా విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు. అయితే వేడుకలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. కేరళలోని కన్నూర్లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొచ్చిలోని కలూర్లో అర్జెంటీనా అభిమానుల బృందం మద్యం సేవించి బైక్లపై ఊరేగింపుతో హంగామా సృష్టించారు. వీరిని నియత్రించడానికి ప్రయత్నించిన ముగ్గురు పోలీసులు సైతం గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకోగా, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. FIFA WC 2022 AGRENTINA WIN Raising flags in Kerala. People enjoying. No complaints No FiR No Case No Arrest But when Pakistan Flag Rises...🙆 Why Double standard🤷 pic.twitter.com/qvGJJ3gjjV — MAK🇮🇳 (@MAKBABA7) December 19, 2022 అదే విధంగా తిరువనంతపురం, పొజియూర్లో విజయోత్సవ వేడుకలను నియంత్రించేందుకు ప్రయత్నించిన సబ్ఇన్స్పెక్టర్ గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లంలో వేడుకల్లో పాల్గొన్న 18 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందాడు. -
మెటాకు భారీ షాక్..మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఆఫ్రికన్లను ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు హింసను ప్రేరేపించేలా వ్యవహరించిందంటూ మెటాపై పిటిషనర్లు పరువు నష్టం దావా వేశారు. అందుకు పరిహారంగా మెటా తమకు 2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి డిమాండ్ చేశారు. ఆ పిటిషన్ను ఇథియోపియన్ పరిశోధకులు అబ్రమ్ మీరెగ్,ఫిస్సెహా టెక్లే, కెన్యా మానవ హక్కుల సభ్యులు, కటిబా ఇన్స్టిట్యూట్తో పాటు చట్టపరమైన లాభాపేక్షలేని ఫాక్స్గ్లోవ్ సహకారంతో కెన్యా హైకోర్టులో దాఖలు చేశారు. గత నవంబర్లో మీరెగ్ తండ్రి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ మీరెగ్ అమరేను’పై దాడికి చేసేలా ప్రోత్సహించేలా మెటాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టులు షేరింగ్ తర్వాత గుర్తుతెలియని దుండగులు అమరేను ఇంట్లోకి వెళ్లి కాల్చిచంపినట్లు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం..మెటా "తన ప్లాట్ఫారమ్లో హింసను పరిష్కరించడంలో వైఫల్యం, ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా ప్రమాదకరమైన కంటెంట్ను ప్రోత్సహించేలా ప్రాధాన్యతనిచ్చే మెటా నుంచి ప్రజలకు రక్షణ అవసరమని పిటిషనర్లు ఈ సందర్భంగా వాదించినట్లు బ్లూమ్బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అంతేకాదు 2021లో 117.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన మెటా సిఫార్సు అల్గారిథమ్ను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతిక ఆధారంగా ప్రజలు ఏ కంటెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారో.. అందుకు అనుగుణంగా ఆ కంటెంట్ను ప్రచారం చేస్తోంది. దీంతో వ్యాపారస్తులు యాడ్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలా మెటా తన ఆదాయాన్ని పెంచుంటున్నట్లు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నివేదించారు. ఈ సందర్భంగా మెటా ఈ తరహా కంటెంట్ను ప్రోత్సహిస్తున్నందుకు కోర్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తమకు జరిగిన నష్టం కింద సదరు సోషల్ మీడియా సంస్థ 2 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.