RTI
-
సోషల్ మీడియాకు సీఎం సిద్ధరామయ్య ఖర్చెంత?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ప్రతీనెలా సోషల్ మీడియాకు ఎంత ఖర్చు చేస్తారనేది వెల్లడై వైరల్గా మారింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆర్టీఐ కార్యకర్త మారలింగ గౌర్ మాలీ పాటిల్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడానికి ఎంత ఖర్చచేస్తారనేదానికి సమాధానం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ ఏజెన్సీ కర్ణాటక స్టేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ (ఎంసీఏ) సమాధానం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 25 నుంచి మార్చి 2024 వరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్మీడియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం సీఎంఓ ప్రతి నెలా దాదాపు రూ.53.9 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో 18 శాతం జీఎస్టీ కూడా ఉంది. సిద్ధరామయ్య ఖాతాలను నిర్వహించే పాలసీ ఫ్రంట్ అనే కంపెనీకి ఈ చెల్లింపు జరిగింది. ఈ కంపెనీలో 25 మంది సభ్యులు ఉన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే, సిద్ధరామయ్య సోషల్ మీడియాలో చాలా తక్కువ ఖర్చు చేస్తారని సీఎం కార్యాలయం తెలిపింది. -
ఎన్నికల బాండ్లు: ‘ఆర్టీఐ’ కింద రిప్లైకి ‘ఎస్బీఐ’ నో
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) తెలపాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఒక పిటిషన్ దాఖలైంది. ఎస్ఓపీ వివరాలు ఇవ్వడానికి ఎస్బీఐ నిరాకరించింది. హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాండ్ల విక్రయాలు, ఎన్క్యాష్ కోసం బ్యాంకు బ్రాంచ్లకు జారి చేసిన ఎస్ఓపీ అనేది తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని ఎస్బీఐ పిటిషనర్కు సమాధానమిచ్చింది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు వెల్లడించకుండా కమర్షియల్ కాన్ఫిడెన్స్ కింద ఆర్టీఐ చట్టంలో మినహాయింపులున్నాయని తెలిపింది. ఎస్బీఐ సమాధానంపై అంజలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందని, వీటికి సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ఎస్బీఐ ఎస్ఓపీ వివరాలు దాచడం సరికాదన్నారు. కాగా, రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ప్రకటించిన విషయం తెలిసిందే. స్కీమ్ను ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందజేయాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. దీంతో ఎస్బీఐ ఈసీకి వివరాలు అందించిన వెంటనే ఈసీ వాటిని తన వెబ్సైట్లో బహిర్గతం చేసింది. ఇదీ చదవండి.. వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై మరో కేసు -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్(ఆర్టీఐ) ప్రశంసించింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం, రోగ నిర్ధారణ పరీక్షల సేవల పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పీహెచ్సీ, వీహెచ్సీల కంటే ఫ్యామిలీ డాక్టర్ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ పరీక్షలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలిచ్చింది. అనంతరం సీఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ, రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్ తదితరులున్నారు. -
ప్రజాస్వామ్యం బలోపేతంలో ఆర్టీఐది కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు. అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సందేశం పంపించిన సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాచార కమిషన్ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు. -
ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ మొత్తం ఎన్ని సెలవులు తీసుకున్నారంటూ పూణేకు చెందిన ఓ పౌర హక్కుల కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేయగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం సమాధానమిచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పొందుపరుస్తూ మా ప్రధాని మా గర్వకారణం అని రాశారు. పూణేకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ పి సర్దా ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయానికి రెండు అంశాలపై ఆరా తీశారు. మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని? రెండవది ప్రధాని ఇంతవరకు విధులకు హాజరైన మొత్తం రోజులు, వివిధ కార్యక్రమాలకు హాజరైన దినాలు ఎన్ని? ఈ వివరాలు తెలపమని కోరారు. ప్రధాని కార్యాలయంలో ఆర్టీఐ అర్జీల వ్యవహారాలను సమీక్షించే కార్యాలయ సెక్రెటరీ పర్వేశ్ కుమార్ ఈ రెండు ప్రశ్నలకు బదులిస్తూ.. మొదటిగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని రెండవదిగా ఆయన ప్రతిరోజూ విధులకు హాజరవుతూనే ఉన్నారని ఈ తొమ్మిదేళ్లలో సుమారు 3000 కార్యక్రమాలకు హాజరయ్యారని.. అంటే కనీసం రోజుకొక కార్యక్రమంలోనైనా ఆయన పాల్గొంటూ వస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం తెలిపిన ఈ వివరాలను అస్సాం ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. మరో కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ప్రధానితో కలిసి పనిచేయడాన్ని క్రికెట్ పరిభాషలో చెబుతూ.. కెప్టెన్ మోదీతో పని ఉదయాన్నే 6 గంటలకు మొదలై.. చాలా ఆలస్యంగా ముగుస్తుందని అన్నారు. ఆయన మనకు అవకాశమిస్తే మనము వికెట్ తీస్తామని ఆయన అంచనా వేస్తుంటారని అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టమని.. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నారని గానీ ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని గానీ నేను ఈ మాట చెప్పడంలేదన అన్నారు జయశంకర్. గతంలో కూడా 2016లో ప్రధాని సెలవుల గురించి మరొకరు ఇలాగే ఆర్టీఐ ద్వారా ఆరా తీశారు. అప్పుడు కూడా ప్రధాని కార్యాలయం ఇదే సమాధానాన్నిచ్చింది. #MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke — Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023 ఇది కూడా చదవండి: మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం -
గ్రామ సచివాలయాల్లో ‘సమాచారహక్కు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత పారదర్శకత తీసుకొస్తూ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయాల స్థాయిలోను సమాచారహక్కు(ఆర్టీఐ) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో సమాచారహక్కు చట్టం అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆ శాఖ కమిషనర్ను ఆదేశిస్తూ జీవో నంబరు 437 జారీచేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో సమాచారహక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–ఏపీఐవో), సమాచార హక్కు సంబంధిత అధికారి(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–పీఐవో)లను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఏపీఐవోగాను, పంచాయతీ కార్యదర్శి పీఐవోగాను కొనసాగుతారని కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాని వినతులపై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ అథారిటీగా ఆ మండల ఎంపీడీవో పనిచేస్తారని తెలిపారు. -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ!
రూ. 88,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లు కనిపించడం లేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఆర్బీఐ కొట్టిపారేసింది. కరెన్సీ నోట్లపై వివరణ తప్పుగా ఉందని పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్లో 375.450 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించినట్లు రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) వెల్లడించింది. అయితే, ఆర్బీఐ మాత్రం ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య కాలంలో కేవలం 345.000 మిలియన్ల నోట్లు మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు చెప్పింది. మరి మిగిలిన కరెన్సీ నోట్లు ఎక్కుడున్నాయి? అనే అంశం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో నోట్ల విషయంలో నివేదికలు అస్పష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ప్రింట్ ప్రెస్లలో ముంద్రించిన నోట్లన్ని ఆర్బీఐ వద్దకు చేరాయని, అందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓ వర్గానికి చెందిన మీడియా సంస్థలు కరెన్సీ నోట్ల గురించి కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలు తన దృష్టికి రావడంతో ఆర్బీఐ స్పందించింది. ఈ నివేదికలు సరైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw — ReserveBankOfIndia (@RBI) June 17, 2023 నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్లతో సహా, ప్రెస్లలో ముద్రించబడిన, సరఫరా చేయబడిన బ్యాంక్ నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉన్నామని ఆర్బీఐ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఇస్తున్న సమాచారం సరైందేనని, ప్రజలు వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వెల్లడించింది. ఇదీ చదవండి : స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్మ్యాన్’! -
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే! ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది. హెచ్పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది. డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది. తీర్మానాలే ఫైనల్ కాదు 2018 డిసెంబర్ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది. కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది. 2018 డిసెంబర్ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్ మదన్ బి.లోకూర్ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్ చేయలేదని పేర్కొంది. అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్ రిజిజు కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
అమ్మా.. పోలీసులు తీసుకెళుతున్నారు!
న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్ గోఖలేని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని తృణమాల్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. సాకేత్ గోఖలే సోమవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి రాజస్తాన్లోని జైపూర్కి విమానంలో వెళ్లారని, అక్కడ ముందుగానే వేచి ఉన్న గుజరాత్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఓబ్రెయిన్ ట్విట్టర్లో తెలిపారు. ఆయన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు తన అమ్మకు ఫోన్ చేసి తనను పోలీసులు అహ్మదాబాద్ తీసుకువెళ్తున్నారని, మధ్యాహ్నానికి అక్కడకి చేరుకుంటానని చెప్పారు. ఆయనకు పోలీసులు ఫోన్ చేయడానికి కేవలం రెండు నిమిషాలే ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోఖలే మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన గురించి కొన్ని వార్తపత్రికల క్లిప్పింగ్ల తోపాటు మోర్బీ ప్రధాని పర్యటనకు రూ. 30 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్టీఐ పేర్కొందని ట్వీట్ చేశారు. ఐతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ వార్తలను నకిలీవిగా పేర్కొనడం గమనార్హం. ఐతే ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం గోఖలే చేసిన ట్వీట్లను గుర్తించింది. గోఖలే చేసిన ట్విట్లను దృష్టిలో ఉంచుకునే ఇలా తప్పుడూ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందంటూ తృణమాల్ కాంగ్రెస్ నేత ఓబ్రెయిన్ ఆరోపణలు చేశారు. ఐతే ఆయన ఇక్కడ ఏ ట్వీట్ అనేది స్పష్టం చేయలేదు. ఇలాంటి చర్యలతో తృణమాల్కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల నోటిని మూయించలేరన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యను మరో స్థాయికి తీసుకువెళ్తోందంటూ విరుచుకుపడ్డారు. కాగా, జైపూర్ విమానాశ్రయ పోలీసు ఇన్ఛార్జ్ దిగ్పాల్ సింగ్ ఈ విషయమై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఎవరు తెలియజేయ లేదని స్పష్టం చేశారు. (చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్!) -
రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది. (Audi Q5Special Edition:స్పెషల్ ప్రైస్..లిమిటెడ్ పీరియడ్, త్వరపడండి!) 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ 2వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.507మిలియన్లు తగ్గిపోయిందనీ, అలాగే 2018-19 ఏడాదిలో ఇది 46.690 మిలియన్ నోట్లుగా ఉందని ఐఏఎన్ఎస్ దాఖలు చేసిన RTI క్వెరీ లో తెలిపింది. మరోవైపు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న 2 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2,272 నుండి 2,44,834కు గణనీయంగా పెరిగిందని పార్లమెంటులో ఇటీవల (ఆగస్టు 1న) సర్కార్ తెలిపింది.డేటా ప్రకారం, 2016లో దేశంలో పట్టుబడిన మొత్తం రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 2,272 కాగా, 2017లో 74,898కి పెరిగి 2018లో 54,776కి తగ్గింది. 2019లో ఈ సంఖ్యలు 90,566గా ఉండగా, 2020గా ఈ సంఖ్య ఏకంగా 2,44,834గా ఉంది. (SuperMeteor 650: రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) కాగా నవంబర్ 8, 2016న అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోటును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. -
ఏపీలో వేగంగా ఆర్టీఐ అప్పీళ్ల పరిష్కారం
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సమాచార కమిషన్కు వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా స్పందిస్తున్నట్లు ‘భారతదేశ సమాచార కమిషన్ల పనితీరు 2021–22’ నివేదిక స్పష్టం చేసింది. కేరళలో ఒక ఫిర్యాదును పరిష్కరించడానికి 15 నెలలు, కర్ణాటకలో 14 నెలలు, తెలంగాణలో ఏడాది సమయం పడుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం 4 నెలల్లోనే పరిష్కరిస్తున్నట్లు వివరించింది. వివిధ రాష్ట్రాల్లో కమిషన్లో పోస్టులు భర్తీ చేయకపోవడం, కమిషనర్లు కేసుల పరిష్కారంలో లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడం ఆలస్యానికి కారణంగా పేర్కొంది. కర్ణాటక సమాచార కమిషన్లో ఈ ఏడాది జూన్ 30 నాటికి అత్యధికంగా ఫిర్యాదులు, అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని, తమిళనాడులో సమాచార చట్టం కింద కోరిన సమాచారాన్ని అందించట్లేదని చెప్పింది. ఆర్టీఐకి వచ్చిన కేసుల్లో బ్యాక్లాగ్, నెలవారీ డిస్పోజల్ రేట్ను ఉపయోగించి ఢిల్లీకి చెందిన సిటిజన్స్ గ్రూప్, సతార్క్ నాగరిక్ సంగతన్ (ఎస్ఎన్ఎస్) బృందం ఈ ఏడాది జూలై 1న అప్పీళ్ల పరిష్కారాల సమయాన్ని లెక్కించింది. 2022 జూన్ 30 నాటికి దేశ వ్యాప్తంగా 26 సమాచార కమిషన్లలో 3,14,323 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా.. ఇందులో కర్ణాటకలో 30,358, తెలంగాణలో 8,902, కేరళలో 6,360, ఆంధ్రప్రదేశ్లో కేవలం 2,814 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది. జరిమానాల్లో కర్ణాటక టాప్ కర్ణాటకలో 2021 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 మధ్య అత్యధిక అప్పీళ్లు నమోదు, పరిష్కారం పొందాయి. ఇక్కడ 26,694 అప్పీళ్లు వస్తే.. 25,710 కేసులను పరిష్కరించారు. తెలంగాణలో 7,169 కేసులకు గానూ 9,267 (గత ఏడాది పెండింగ్ కలిపి) అప్పీళ్లను, ఏపీలో 6,044 కేసులు నమోదవగా, 8,055(పెండింగ్తో కలిపి) డిస్పోజ్ అయ్యాయి. నిర్దిష్ట సమయానికి సమాచారం ఇవ్వకపోవడం, కావాలని జాప్యం చేయడం వంటి కారణాలతో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 1,265 కేసుల్లో రూ.1.04 కోట్లు జరిమానాలు విధించింది. కేరళ 51 కేసుల్లో రూ.2.75 లక్షలు, తెలంగాణ 52 కేసుల్లో రూ.2 లక్షలు, ఏపీ 9 కేసుల్లో రూ.55 వేలు జరిమానా విధించాయి. మధ్యప్రదేశ్లో రూ.47.50 లక్షలు, హరియాణా రూ.38.81 లక్షలు పెనాల్టీ విధించాయి. అయితే, సమాచారం ఇవ్వడంలో జాప్యానికి జరిమానాలు విధించడానికి అర్హత ఉన్నప్పటికీ, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే పెనాల్టీ వేశారని పేర్కొనడం గమనార్హం. ఏపీలో కమిషన్కు జవసత్వాలు రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం అమలు, సమాచార కమిషన్ నియామకంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విభజన అనంతరం 2014 నుంచి 2017 వరకు సమాచార కమిషన్ను ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత మొక్కుబడిగా నలుగురు కమిషనర్లను నియమించి చేతులు దులిపేసుకుంది. ఇక్కడ కమిషన్ ఉన్నప్పటికీ సరైన మౌలిక వసతులు లేక 2019 వరకు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సమాచార కమిషన్కు నూతన జవసత్వాలు తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న నలుగురు కమిషనర్లకు తోడు కొత్తగా మరో నలుగురిని నియమించి కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టింది. ఇటీవల ఇద్దరు కమిషనర్లు పదవీ విరమణ చేయగా.. ఆ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేసింది. తద్వారా కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వేగంగా పరిష్కరించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఆర్టీఐ డే! రాష్ట్రంలో పూర్తిస్థాయిలో సమాచార కమిషన్ ఉండటంతో ఆర్టీఐపై వచ్చే అప్పీళ్లను వేగంగా పరిష్కరిస్తున్నాం. ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించేలా ఆర్టీఐ వారోత్సవాలను నిర్వహించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెల మూడవ శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా ప్రకటించింది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్ను బలోపేతం చేయడం సంతోషంగా ఉంది. – ఆర్.శ్రీనివాసరావు, చీఫ్ కమిషనర్ (ఇన్చార్జి) -
ఒకే ఉత్తర్వుతో 545 ఆర్టీఐ దరఖాస్తులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి దాఖలు చేసిన 545 దరఖాస్తులకు సంబంధించి ఒకే ఉత్తర్వుతో వాటికి మోక్షం కల్పించింది. శ్రీనివాస్రెడ్డి అనే న్యాయవాది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి బడ్జెట్లో వివిధ పద్దుల కింద ఎంతెంత బడ్జెట్ కేటాయించారు..ఎంత ఖర్చు చేశా రో వివరాలు ఇవ్వాలంటూ ఒక్కో అంశంపై పది పేజీలతో కూడిన మొత్తం 545 దరఖాస్తులను ఆర్టీఐ చట్టం కింద దాఖలు చేశారు. సమాచారంకోసం ఒక వ్యక్తి పరి మిత సంఖ్యలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న నిబంధనేదీ లేకపోవడంతో న్యాయవాది శ్రీనివాస్రెడ్డి వాటిని దాఖలు చేశా రు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బు ద్దా మురళి ఏడాది కాలంగా ఆ న్యాయవాది ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. వాటన్నిటికీ ఒకే ఉత్తర్వునిస్తూ ఆయన కోరిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులను ఆర్టీఐ కార్యాలయానికి పిలిపించి ఆ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వివరాలు బడ్జెట్ పుస్తకాల్లో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వగా.. వ్యయం వివరాలు కూడా ఇవ్వాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు. కాగా, ఒకే వ్యక్తి వందల సంఖ్యలో దరఖాస్తులు ఇవ్వడం వల్ల అధికారుల సమయం వృథా అవడమేకాక, కమిషన్పై భారం పడుతుందని ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి పురపాలక శాఖలో వివరాలు కావాలంటూ రెండు వందలకు పైగా దరఖాస్తులు సమర్పించారని చీఫ్ కమిషనర్ తెలిపారు. వాటికి కూడా ఒకే ఉత్తర్వు జారీ చేశామని చెప్పారు. -
నిలదీయడమే నేరమా!
పదిహేడేళ్లక్రితం అడుగుపెట్టినప్పుడు అందరిలో ఆశలు రేకెత్తించిన సమాచార హక్కు చట్టం ఆచరణలో క్షీణ చంద్రుణ్ణి తలపిస్తూ నానాటికీ తీసికట్టవుతున్న వైనం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. గుజరాత్ సమాచార కమిషన్ సైతం ఆ బాణీలోనే ఒకదాని వెంబడి ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. పౌరులకుండే సమాచార హక్కునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత పద్దెనిమిది నెలల కాలంలో ఏకంగా పదిమంది దరఖాస్తుదారుల్ని జీవితంలో మరెప్పుడూ ప్రశ్నించొద్దంటూ ఈ కమిషన్ నిషేధించింది. వీరంతా ఒకటికి పది ప్రశ్నలు వేస్తూ అధికారులకు చిర్రెత్తిస్తున్నారట! వేధిస్తున్నారట!! దురుద్దేశంతో, ప్రతీకార ధోరణితో సమాచారం అడిగారని కొందరిని అయిదు సంవత్సరాల వరకూ కమిషన్ గడప తొక్కొద్దని హుకుం జారీ చేసింది. ఒక జంట తమ రెసిడెన్షియల్ సొసైటీ గురించి 13 ప్రశ్నలు వేసిందని రూ. 5,000 జరిమానా విధించారు. తమ విలువైన సమయాన్ని వృథాపరిచారని, ఉద్దేశపూర్వకంగా కీలకమైన సమాచారాన్ని దాచారని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ న్యాయస్థానాలు పిటిషనర్లపై అడపా దడపా చర్యలు తీసుకుంటున్న ఉదంతాలు ఉంటున్నాయి. న్యాయమూర్తులకు చట్టాలు ఆ అధికారాన్నిచ్చాయి. కానీ సమాచార హక్కు కమిషన్ సైతం అదే తోవన పోతానంటే కుదురుతుందా? వాటిని ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతినదా? దేశ రక్షణ, చట్టసభల హక్కులకు భంగకరంగా ఉండేవి, మేధోపరమైన హక్కులు, నిఘా విభాగాల కార్యకలాపాలువంటివాటికి సమాచార హక్కు చట్టం నుంచి మొదట్లోనే మినహాయింపు ఇచ్చారు. అనంతరకాలంలో ఆ చట్టం పరిధిలోకి తాము రాబోమని చెప్పే ప్రభుత్వ విభాగాలు ఎక్కువే ఉండేవి. రాను రాను ఎంతోకొంత మార్పు వచ్చింది. ఐక్యరాజ్యసమితి 1949లో విడుదల చేసిన విశ్వ మానవ హక్కుల ప్రకటనలోనే సమాచార హక్కు చట్టం మూలాలున్నాయి. ప్రపంచపౌరులందరికీ మానవహక్కులుండాలని ఆ ప్రకటన కాంక్షించడంతోపాటు ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్ని కోరే, స్వీకరించే హక్కు దేశదేశాల ప్రజలకూ ఉంటుందని స్పష్టం చేసింది. సమాచార హక్కు కోసం అరుణారాయ్వంటి వారెందరో ఉద్యమించారు. ప్రజల్ని చైతన్యవంతులను చేశారు. ఫలితంగా 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. పారదర్శక పాలన అందించటానికి ప్రయత్నిస్తున్న 70 దేశాల సరసన మన దేశం కూడా చేరింది. అంతక్రితం ప్రభుత్వాల పనితీరు గురించి ఎలాంటి ప్రశ్నలు వేసినా పాలకులు 1923 నాటి అధికార రహస్యాల చట్టం మాటున, మరికొన్ని ఇతర చట్టాల మాటున దాగేవారు. రహస్యం పాటించేవారు. ఇందువల్ల పాలకులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, అయినవారికి ఏకపక్షంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడం రివాజయ్యేది. సమాచార హక్కు చట్టం వచ్చాక దేశంలో అంతా సవ్యంగా ఉన్నదని, పారదర్శకత పెరిగిందని చెప్పలేం. కానీ అధికారవర్గానికి ఎంతో కొంత జవాబుదారీతనం వచ్చింది. అయిష్టంగానైనా, ఆలస్యంగానైనా పౌరులు అడిగిన సమాచారం బయటికొస్తోంది. చట్టం అంటే వచ్చిందిగానీ దాన్ని ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న పౌరులకు అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వారి ప్రాణాలకు సైతం ముప్పువాటిల్లుతోంది. నిలదీసినవారికి రాజకీయంగా అండదండలు లేవనుకుంటే వారి ఇళ్లకుపోయి బెదిరించటం, దుర్భాషలాడటం, దౌర్జన్యం చేయటంవంటి ఉదంతాలకు లెక్కేలేదు. తొలి దశాబ్దంలోనే దాదాపు 65మంది పౌరులు అవినీతి, ఆశ్రితపక్షపాతం, ప్రభుత్వ పథకాల అమలు వగైరా అంశాలపై ప్రశ్నించిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రశ్నించినవారికి అండగా చట్టం ఉంటే ఈ దుస్థితి ఉండేదికాదు. కానీ ఆర్టీఐ చట్టం వచ్చిన ఆరేళ్ల తర్వాత, ఎన్నో ఉద్యమాలు జరిగాక 2011లో విజిల్బ్లోయర్ చట్టం వచ్చింది. విషాదమేమంటే దాని అమలు కోసం జారీ చేయాల్సిన నోటిఫికేషన్కు ఇన్నేళ్లయినా అతీగతీ లేదు. ఇది చాలదన్నట్టు 2019లో సమాచార హక్కు చట్టాన్నే నీరుగార్చే సవరణలు చేశారు. మరోపక్క సమాచారాన్ని కోరుతూ ఏటా దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతుండగా సమాచార కమిషన్ కార్యాలయాలు తగిన సంఖ్యలో కమిషనర్లు లేక బావురుమంటున్నాయి. అందువల్ల దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవడం, తగిన ఆదేశాలివ్వటం వంటి అంశాల్లో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రభుత్వ విభాగాల సంగతి చెప్పనవసరమే లేదు. అవినీతికి అలవాటుపడిన అధికారులు పౌరులు అడిగిన సమాచారం ఇవ్వకపోగా, ఆ అడిగినవారి గురించి అవతలి పక్షానికి ఉప్పందించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, పౌరులు కోరిన సమాచారాన్ని అందించేందుకు తప్పనిసరిగా ఒక అధికారి ఉండాలన్న నియమం ఉంది. కానీ అస్తవ్యస్థ ఆచరణతో సమాచారం బయటకు రావడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది. ఇన్నివైపులనుంచి ఆర్టీఐ చట్టానికి అందరూ తూట్లు పొడుస్తుంటే ఇప్పుడు స్వయానా సమాచార కమిషనే ఆ పనికి పూనుకోవడం ఆందోళనకరం. సమాచార కమిషనర్లకు ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ, పౌరులకు చట్టాలు కల్పిస్తున్న హక్కులపై గౌరవం ఉండాలి. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని పారదోలాలన్న దృఢ సంకల్పం ఉండాలి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం నేపథ్యం, దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలియాలి. ఈ లక్షణాలు కొరవడినవారిని అందలం ఎక్కిస్తే అది కోతికి దొరికిన కొబ్బరికాయ చందం అవుతుంది. -
బండి బదిలీ.. భలే బురిడీ
సాక్షి, హైదరాబాద్: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా కొందరు ఆర్టీఏ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొందరు వాహనదారులు ఎన్ఓసీ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై ఎన్ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది. కొంతమంది వాహనదారులు ఎన్ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడే కొందరు ఆర్టీఏ సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్ఓసీ తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. (చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’) -
బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్ బ్యాంక్లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్బీఐ తెలిపింది. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యాకు గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
అనుమతి తీసుకోవాలని చట్టంలో లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకునే వారికి పీఐవోలు సమాచారం ఇచ్చే ముందు సంబంధిత విభాగం ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని హైకోర్టు స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమాచార అధికారులు (పీఐవో) ఇతర అధికారుల సాయం కోరవచ్చని వెల్లడించింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లో అనుమతి తీసు కోవాలని పేర్కొనడం సరికాదని అభిప్రాయ పడింది. సమాచారం ఇచ్చే ముందు పీఐవోలు తమ శాఖల అధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్య దర్శులు, ప్రత్యేక కార్యదర్శుల నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈనెల 13న జారీ చేసిన సర్క్యులర్ అమ లును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్టీఐ చట్టంపై సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని చిత్రపు శ్రీధృతి పార్టీ ఇన్ పర్సన్గా, ఆర్టీఐ ఉద్యమకారుడు గంజి శ్రీనివాసరావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి... సమాచారం ఇచ్చే ముందు పీఐవోలు ముందస్తు అనుమతి పొందాలని చట్టంలో ఎక్కడా లేదని, ఈ తరహా నిబంధనలతో సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని పిటిషనర్లు నివే దించారు. పీఐవోలు కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ సమాచారం ఇస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే సీఎస్ ఈ ఉత్తర్వు లిచ్చారని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. పీఐవోలు కోరిన సమాచారం ఇవ్వడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయిస్తు న్నారని తెలిపారు. సమాచారం ఇచ్చే ముందు ఇతర అధికారుల సాయం కోరవచ్చని చట్టంలోని సెక్షన్ 5(4) స్పష్టం చేస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పీఐవోలు సాయం కోరడం వేరని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడం వేరని, అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. -
తండ్రితోనే కాపురం పెట్టిందని తెలిసి షాకైన కొడుకు
లక్నో: నాన్న చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. కనిపించడం లేదంటూ ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఒక కొడుకు. కాగా ఆర్టీఐ తన నాన్నకు సంబంధించిన సమాచారం దొరికిందని చెప్పగానే జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసుకు సంతోషంగా వెళ్లాడు. కానీ వారు ఇచ్చిన వివరాలు చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. కారణం ఆ యువకుడి నాన్న మరో యువతిని పెళ్లిచేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువతి ఎవరో కాదు.. ఐదేళ్ల కిత్రం ఆ యువకుడి మాజీ భార్యే కావడం విశేషం. ఇప్పుడు తన మాజీ భార్యనే పిన్నిగా పిలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2016లో సదరు యువకుడు మైనర్గా ఉన్నప్పుడు ఒక మైనర్ అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ యువకుడు రోజు తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆరు నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తర్వాత ఆ యువకుడు ఊరి పెద్దల మధ్య ఇక ఎప్పుడు గొడవపడనని చెప్పాడు. కానీ ఆ యువతి అందుకు ఒప్పుకోకుండా విడాకులు తీసుకుంది. కాగా ఆ యువకుడి తండ్రి సానిటేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి అవసరాలతో పాటు కొడుకుకు కూడా డబ్బులు తనే ఇస్తుండేవాడు. ఇటీవలే కొన్ని రోజుల నుంచి తన తండ్రి కనిపించడం లేదని.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి సాంబల్ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి జాడ తెలిసిందనగానే జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు. తన మాజీ భార్యనే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, అక్కడే ఆమెతో కాపురం పెట్టాడని తెలుసుకున్నాడు. వెంటనే బసౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పోలీసులు జూలై 3న ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే యువకుడి తండ్రి భార్య మాత్రం ఇప్పుడు వరుసకు కొడుకు అయ్యే అతనితో కలిసి ఉండలేనని పేర్కొంది. తన రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని.. అతన్ని మా దగ్గరకు పంపొద్దని పోలీసులకు చెప్పింది. పోలీసులు మరోసారి దీనిపై మాట్లాడదమని చెప్పి వారిని అక్కడినుంచి పంపించేశారు. -
టికెట్ లేకుండా 27 లక్షల మంది
న్యూఢిల్లీ: టికెట్ లేకుండా రైల్వేస్టేషన్లోకి ప్రవేశించడానికే అనుమతి లేకపోగా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 27 లక్షల మంది టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. మధ్యప్రదేశ్కు చెందిన సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్కు సమాధానంగా రైల్వే శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 2019–20తో పోలిస్తే ఇది 25 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. పట్టుబడిన 27 లక్షల మంది నుంచి రూ. 143.82 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించింది. 2019–20 సంవత్సరంలో 1.10 కోట్ల మంది టికెట్లు కొనకుండా ప్రయాణిస్తూ పట్టుబడగా, వారి నుంచి రూ. 561.73 కోట్లు వసూలు చేశారు. ఎప్పటి నుంచో ఉన్నదే..: భారత రైల్వేలో టికెట్లు కొనకుండా ప్రయాణించే సమస్య ఎప్పటి నుంచో ఉందని, రైల్వేకు అది ఓ సవాలు అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నరైన్ పేర్కొన్నారు. ప్రయా ణికులకు దానిపై హెచ్చరికలు చేస్తున్నామని, జరిమానాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలి పారు. గత సంవత్సరాలతో పోలిస్తే 2020–21 సంవత్సరంలో తక్కువ రైళ్లు తిరిగాయి, అయినప్ప టికీ భారీ స్థాయిలో టికెట్లు లేకుండా ప్రయాణించినవారు పట్టుబడ్డారు. గతేడాది ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకు లాక్డౌన్ కారణంగా రైళ్లు తిరగలేదు. ఆ తర్వాత కూడా కొన్ని రైళ్లు మాత్రమే తిరిగాయి. టికెట్ విజయవంతంగా బుక్ అయిన వారినే రైల్వేస్టేషన్లోకి అనుమతించినా ఈ స్థాయిలో టికెట్ లేకుండా పట్టుబడటం గమనార్హం. -
‘ప్రధాని మాస్క్ విలువ వెల్లడించలేం’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఎలాం టి మాస్కు ధరిస్తు న్నారు? దాని విలువ ఎంత? ఆయనకు వ్యాక్సిన్ వేశారా? అన్న సందేహాలతో హైదరాబాద్కి చెందిన రాబిన్ గతేడాది డిసెంబర్లో ఆర్టీఐ కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పీఎంవో తాజాగా స్పందించింది. ప్రధాని ధరించే మాస్కు వివరాలు, వ్యాక్సినేషన్ వివరాలు వ్యక్తిగతమైనవి పేర్కొంది. ఆర్టీఐ యాక్ట్లోని సెక్షన్ 8(1) కింద మీరు అడిగిన వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది. ప్రధానికయ్యే ఈ ఖర్చును ప్రభుత్వం భరించదని సమాధానమిచ్చింది. -
స్పీడ్పోస్టు, కొరియర్లలో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా జరుగుతోందని మరోసారి తేటతెల్లమైంది. ప లువురు విదేశీయులు ఇక్కడ మాదక ద్రవ్యా లు విక్రయిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్శాఖ అంగీకరించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) స మాచార హక్కు చట్టం ద్వారా వేసిన ప్రశ్నకు ఎక్సైజ్శాఖ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించింది. హైదరాబాద్లో అనేక మార్గాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగు తుండగా.. ఈ వ్యవహారాలను మొత్తం విదేశీయులే నడిపిస్తున్నారని, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. నేరుగా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా నిషేధిత మాదకద్రవ్యాలు చేరుతున్నాయని ఎక్సైజ్శాఖ బాంబు పేల్చింది. కొనుగోలుదారులు ఆర్డర్ చేసే డ్రగ్స్ గ్రా ముల్లో ఉండటంతో వాటిని గుర్తించడం కష్టమని, విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఉత్తరాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. గుట్టుగా సాగుతున్న ఈ దందాను మరింత విస్తరించేందుకు విద్యార్థులను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్శాఖ అరెస్టు చేసిన డ్రగ్స్ విక్రయదారుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉండటం విస్తరించిన నెట్వర్క్ తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిని మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయా కాలేజీలు బహిష్కరించాయి. ఇంగ్లండ్, జర్మనీల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ నేరుగా ఇంటికే చేరుతున్నాయన్న విషయం కూడా వెల్లడైంది. స్టీల్బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డీలను భారత్కు దిగుమతి చేస్తున్నారని గుర్తించారు. అదే సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఓ ఫార్మాలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పైపైనే.. డ్రగ్స్ కేసుల విచారణలో ఎక్సై జ్ శాఖ లోతుగా వెళ్లడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నిందితుల్లో అధికశాతం పలుకు బడి కలిగిన రాజకీయ, సంప న్న కుటుంబాల వారు కావడం తో విచారణ ముందుకుసాగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 2017లోనూ ఇదే తరహాలో సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ కేసులో 60 మంది పేర్లు జాబితాలో పొందుపరిచిన అధికారులు, మరో 12 మంది సినీ ప్రముఖులనూ గుర్తించారు. తొలుత విచారణ నిష్పక్షపాతంగానే సాగినా.. చార్జిషీట్లలో ఎక్కడా సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో కేసు పక్కదారి పట్టిందన్న విమర్శలకు బలం చేకూర్చింది. విద్యార్థులు బలి కాకుండా చూడాలి: పద్మనాభరెడ్డి, ఎఫ్జీజీ సెక్రటరీ హైదరాబాద్లో విస్తరిస్తోన్న డ్రగ్స్ కల్చర్పై ప్రభుత్వం స్పందించాలి. మాదకద్రవ్యాలకు విద్యార్థులు అలవాటుపడితే... అది మొత్తం దేశంపైనే చెడు ప్రభావం చూపుతుంది. ఇకనమోదైన కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. నిందితులెవరైనా శిక్ష పడేలా చూడాలి. -
తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం.. కరోనా సాయంలో భాగంగా తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 2.44 లక్షల ఎన్–95 మాస్కులు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు అందజేసినట్లు వివరించింది. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్మెంట్–డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు.. ఆ సంస్థ ద్వారా మాస్కులు, కిట్లు ఇతర సాయాలు తెలంగాణకు పంపినట్లు తెలిపింది.(కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి) కుటుంబసభ్యులకు కరోనా బాధితుల సమాచారం గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైద్య ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
రూ. 68,607 కోట్ల బాకీల రైటాఫ్
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వ్ బ్యాంక్.. ఏప్రిల్ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరోవైపు, డిఫాల్టర్ల జాబితాలో చాలా మంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అందుకే, దీనిపై తాను పార్లమెంటులోనే ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ 2019 సెప్టెంబర్ దాకా బీజేపీ ప్రభుత్వం రూ. 6.66 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది. -
షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి జారిపోతున్న వేళ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన వ్యాపార వేత్తలకు సంబంధించి రూ. 60వేల కోట్లకుపైగా మాఫీ (రైట్ ఆఫ్) చేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకులు 68,000 కోట్ల రూపాయల వరకు రుణాలను నిలిపి వేసినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం నిరాకరించడంతో తాను ఇదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించినట్టు గోఖలే ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 16 న టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా, ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు చెల్లించాల్సిన మొత్తం రూ .68,607 కోట్లు మాఫీ అయ్యాయని గోఖలే ట్వీట్ చేశారు. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తదితరులు ఉన్నారు. ప్రధానంగా ఈ సంస్థల్లో ఆరు డైమండ్ అండ్ జ్యుయల్లరీ సంస్థలు ఉండటం గమనార్హం. 'విల్ఫుల్ డిఫాల్టర్స్' జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజయ్ ఝున్ ఝన్ వాలాకు చెందిన ఎఫ్ఎంసిజి సంస్థ ఆర్ఇఐ ఆగ్రో లిమిటెడ్, (రూ. 4314 కోట్లు), జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ ( రూ.4వేల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.2,850 కోట్లతో కాన్పూర్ ఆధారిత కంపెనీ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వీరితో పాటు బాబా రామ్దేవ్ బాలకృష్ణ గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండోర్ (రూ .2,212 కోట్లు) డిఫాల్టర్ల జాబితాలో ఉంది. ఇక రూ.1,943 కోట్ల విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా ఈ జాబితాలో వుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బీఐ నిరాకరించింది. This is why Finance Minister @nsitharaman tried to escape from a straight & clear question asked by Rahul Gandhi. Sadly - the truth can never stay hidden too long. Massive kudos to RG for calling the govt’s bluff way back in March! PS: Here’s the list if anyone missed it 😊 https://t.co/OA4moYdTYz pic.twitter.com/JsaoBewhBT — Saket Gokhale (@SaketGokhale) April 28, 2020 -
ఆ సీఎం పౌరసత్వ వివరాలు లేవు
చండీగర్ : హరియాణా ముఖ్యమంత్రి పౌరసత్వానికి సంబంధించి ఒక వ్యకి ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా అడిగిన సమాచారానికి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్, కేబినెట్ మంత్రులు, గవర్నర్ల పౌరసత్వానికి సంబంధించిన వివరాలు కావాలంటూ పానిపట్క చెందిన ఓ వ్యక్తి లేఖ రాశాడు. పౌరసత్వ లేఖకు సమాధానంగా హరియాణాకు చెందిన ప్రజా సంబంధాల అధికారి (పీఐఓ) స్పందిస్తూ..తమ రికార్డులలో సీఎం, మంత్రుల పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు. పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు ఎలక్షన్ కమిషన్ వద్ద లభ్యమవ్వచ్చని హరియాణాకు చెందిన పీఐఓ అధికారి పేర్కొన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎన్ఆర్సీని (జాతీయ పౌర పట్టిక) అమలు చేస్తామని సీఎం ఖత్తర్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ప్రజలు మతపరమైన హింస వల్ల హరియాణాలో నివసిస్తున్నారని..వారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వవచ్చని గతంలో ఖత్తర్ మీడియాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు -
మీకిది తగునా?
‘బోలెడంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు... వసూళ్లు నడుస్తున్నాయి’ అని ఆర్టీఐ గురించి మన దేశంలో సర్వోన్నత న్యాయమూర్తి బోబ్డేగారు సెలవిచ్చారు. జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బోబ్డే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారిస్తున్నారు. ఇదివరకు సుప్రీంకోర్టు అంజలీ భరద్వాజ్ కేసులో సమాచార కమిషనర్ల నియామకంలో ఆలస్యం చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ తీర్పులో ఇచ్చిన సూచనలు అమలు చేయడం లేదని కేంద్రంగానీ రాష్ట్రాలు గానీ సమాచార కమిషనర్లను నియమించడం లేదని న్యాయార్థులై నిలబడ్డారు. కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప ప్రభువులు నిశ్చర్య నుంచి నిద్రనుంచి మేలుకోవడం లేదు. ఆర్టీఐని బ్లాక్ మెయిల్ కోసం వాడుకుంటున్నారనేది ఆరోపణ. అందులో కొంత నిజం ఉందా లేదా అనడానికి సర్వే లేదు సాక్ష్యం లేదు. బ్లాక్ మెయిల్ అంటే ఏమిటి? లంచం తీసుకోవడం వంటి ఒక తప్పు చేసి దాచిపెట్టిన అధికారి అక్రమాల సమాచారం సేకరించి బయట పెట్టడానికి ఆర్టీఐ కార్యకర్త ప్రయత్నించి ఆ పని ఆపడానికి డబ్బు అడిగినా, అతను అడగకపోయినా ఆ అధి కారి డబ్బు ఇచ్చి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా అది నేరమే. ఆ నేరానికి వారిద్దరికీ శిక్షలు విధించాల్సిందే. కానీ ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించే శక్తి పైన కోతలు విధిస్తానంటే ఎంత వరకు సమంజసం. ఒక సందర్భంలో అవినీతి పరుడైన ఒక ఇంజనీరు ఢిల్లీ ఫ్రభుత్వంలో లంచాలు తీసుకుని అందుకు అనుగుణంగా కాంట్రాక్టు ఫైళ్లను మార్చాడని తెలుసుకున్న ఒక ఆర్టీఐ కార్యకర్త ఆ ఫైల్ కాగితాల ప్రతులను సేకరించారు. దాంతో ఆ అధికారి పదివేలు లంచం ఇవ్వడానికి సంసిద్ధుడై నాడు. లంచం ఇవ్వజూపిన సంభాషణలను రికార్డు చేసి ఆ ఆర్టీఐ కార్యకర్త రెండో అప్పీలులో ఆ విషయమై ఫిర్యాదు చేశాడు. లంచం ఇవ్వబోయిన ఆ ప్రభుత్వ అధికారిపైన చర్య తీసుకోవాలని కోరాడు. సంభాషణ రికార్డు ఉన్న సీడీని కూడా కమిషన్కు సమర్పించాడు. లంచం ఇచ్చినా నేరమే తీసుకున్నా నేరమే. కానీ అది ప్రభుత్వ అధికారి విషయంలో, ప్రభుత్వ కార్యక్రమం విషయంలో నేరమవుతుంది. ఆర్టీఐ కింద సమాచారం అడగకుండా ఉండడానికి మామూలు పౌరుడికి లంచం ఇవ్వడానికి ప్రభు త్వం అధికారి ప్రయత్నిస్తే, లేదా ఇచ్చినట్టు తేలిన తరువాత కూడా అతని పైన ఏ చట్టం కింద చర్య తీసుకోవాలి? అవినీతి నిరోధక చట్టాలలో ఇటువంటి లంచ గొండితనాన్ని శిక్షించేందుకు ఏ నియమాలు చట్టాలూ లేవు. పౌరుడికి ప్రభుత్వేతర పనికోసం ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ మరో చట్టం తెస్తే అందుకు వీలవుతుంది. లేకపోతే ఏం చేయాలి? ఎప్పుడూ జనం నుంచి లంచాలు వసూలు చేసే ప్రభుత్వ అధికారి పౌరుడికి లంచం ఇచ్చే పరిస్థితి రావడం ఒక వింత, విచిత్రం, రాజ్యాంగపాలన అమలైన 70 సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఇందుకు సంతోషించాలో గర్వించాలో ఆలోచించుకోవచ్చు. లంచం ఇవ్వకుండా లంచగొండి అధికారిని రక్షించాలన్నది మన లక్ష్యం కాదు. ఆర్టీఐ దుర్వినియోగం పేరుతో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ప్రచారంతో మనం ఆర్టీఐ కార్యకర్తలను నిరోధించడానికి ఈ చట్టాన్ని సవరించి, పరిమితులు విధించి, ఈ హక్కు ను నీరసించేట్టు చేస్తే అది ధర్మమని అంటారా? అది న్యాయమా? 130 కోట్ల మంది ప్రజలలో కేవలం 3 కోట్ల యాభై లక్షల మంది దాకా ఆర్టీఐ వాడుకున్నారని, వారిలో చాలామంది సమాచారం పొందారని, పది పదిహేను శాతం వరకు సమాచారం కోసం కోర్టులకెక్కి పోరాడవలసి వస్తున్నదని ఒక అంచనా. అంటే మన జనాభాలో కేవలం రెండు లేదా మూడు శాతం మంది సమాచార హక్కును విని యోగించుకుంటేనే ఇంతమంది ఇంతగా భయపడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను రక్షించే ఒకే ఒక ఉత్తమ ఉన్నత సంస్థ న్యాయస్థానం. అంటే సుప్రీంకోర్టు. కానీ ఆ సర్వోన్నత న్యాయపీఠం కూడా సమాచార హక్కు గురించి ఇంతగా చర్చించడం, ధర్మాసనం నుంచి ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏ పరిణామాలకు సంకేతం? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
సీజేఐ గొగోయ్కి వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్ డే. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. వివాదం.. సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్ గొగోయ్.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్ గొగోయ్కి క్లీన్చిట్ ఇచ్చింది. తిరుగుబాటు.. 2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జీల్లో(గ్యాంగ్ ఆఫ్ ఫోర్) జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్ గొగోయ్తో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కీలక తీర్పులు జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది. రఫేల్ డీల్లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని. జస్టిస్ గొగోయ్ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్ఘాట్కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్ గొగోయ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ వారికి చెప్పారు. కష్టాల వల్ల పట్టుదల మరింత పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కి శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగోయ్కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎవరూ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అట్టహాసాలు లేకుండా, నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే సహా అత్యున్నత న్యాయస్థానంలోని దాదాపు అందరు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ గొగోయ్ ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని సింపుల్గా నిర్వహిస్తున్నామని ఎస్సీబీఏ కార్యదర్శి ప్రీతి సింగ్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పనిచేసిన అత్యున్నత న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరని ఎస్సీబీఏ అధ్యక్షుడు రాకేశ్ఖన్నా ప్రశంసించారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణల పక్కన కూర్చున్న జస్టిస్ గొగోయ్.. ఇతర న్యాయమూర్తులతో కబుర్లు చెబుతూ, న్యాయవాదుల నుంచి బొకేలు స్వీకరిస్తూ సరదాగా కనిపించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు కూడా జడ్జీలతో పాటు కూర్చున్నారు. -
ఆర్టీఐ కోరలు పీకిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశాధికారాన్ని ప్రకటించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సమా చార కమిషన్లు ఇక తమ చెప్పు చేతల్లో ఉంటాయని, ప్రభువుల అడుగులకు మడుగులొత్తే విధేయులే సమాచార కమిషనర్లుగా నియమితులవుతారని, అధికారేతరులు ఎంత గొప్ప సేవకులైనా సరే సమాచారాన్ని ఇప్పించే కమిషనర్లుగా నియమితులు కాబోరని పరోక్షంగా స్పష్టపరిచింది. కొద్ది నెలల కిందట సవరణ పేరుతో సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తి మీద గొడ్డలి వేటు వేసిన విషయం తెలిసిందే. ఆర్టీఐని తుదముట్టించడానికి చేసిన సవరణ చట్టం అమలు కోసం అక్టోబర్ 24వ తేదీని నిర్ణయించి, రాజపత్రంలో ప్రచురించారు. అదే రోజు ఆర్టీఐ నియమాలు అమలులోకి వస్తాయనీ ప్రకటించారు. అక్టోబర్ 12న ఆర్టీఐ అవతరణ దినోత్సవంగా దేశమంతా 14 ఏళ్లనుంచి జరుపుకుంటున్నాం. ఇటీవల 14వ వార్షికోత్సవానికి అమిత్ షా వచ్చి తామే తెచ్చిన ఆర్టీఐ సవరణ మరణ శాసనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వెనుకాడారు. దాన్ని బట్టి అది ఎంత చెప్పుకోకూడని సవరణో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ముఖ్య కమిషనర్కు కేబినెట్ సెక్రటరీకి జీతం 2 లక్షల 50 వేలు ఇస్తారు. అదే స్థాయి హోదా సౌకర్యాలు కల్పిస్తారు. కాని ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్తో సమాన స్థాయి అంటే సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన స్థాయి ఉండేది. దాన్ని తగ్గించారన్న మాట. అంటే కేబినెట్ సెక్రెటరీకి మించిన స్థాయి కమిషనర్లకు ఉండకూడదనే కొందరి ఈర్ష్య అసూయలకు ఆర్టీఐ కమిషన్ బలైపోయింది. ఇది వరకు కేంద్ర కమిషనర్లు అందరూ అంటే చీఫ్తో సహా సుప్రీంకోర్టు జడ్జి స్థాయి కలిగి ఉండేవారు. ఇప్పుడు చీఫ్ గారికి 2 లక్షల 50 వేల జీతమైతే, కమిషనర్లకు పాతిక వేలు తక్కువ అంటే 2 లక్షల 25 వేల రూపాయలు నిర్ణయించారు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. చీఫ్ను బాస్గా భావించకుండా అందరిలో ప్రథముడిగా గౌర వించి స్వతంత్రంగా వ్యవహరించే కమిషనర్లు ఇక ఈ దేశంలో ఉండరు. వారి బదులు, చీఫ్ గారి కింది స్థాయి అధికారులుగా అస్వతంత్ర కమిషనర్లు నియమితులవుతూ ఉంటారు. ఇదివరకు ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వ విభాగాల వారు సమాచారం ఇచ్చితీరాలని ఆదేశాలు జారీ చేస్తే, చీఫ్ నుంచి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. చీఫ్కు ఇబ్బందులు వస్తే వచ్చి ఉండవచ్చు. ఇబ్బందులు వచ్చి ఉంటే ఛీఫ్లే చెప్పాలి. చెప్పగలిగే స్వతంత్రం, ధైర్యం కూడా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తక్కువ జీతం, తక్కువ స్థాయితో కమిషనర్లు చీఫ్కు అణగి మణగి వ్యవహరించాలన్న సందేశం చట్ట పరంగా జారీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ సమాచార కమిషన్కు మరణ శాసనాన్ని జారీ చేసింది. కమిషనర్లకు అయిదేళ్ల పదవీ కాలాన్ని అసలు చట్టం నిర్ధారించింది. ఎవరైనా 5 ఏళ్లు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకూ పదవిలో ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు మూడేళ్లే. దీంతో నష్టం ఏమిటి అని వాదించే వారున్నారు. అయిదేళ్ల పాటు స్వతంత్రంగా ఉండగలిగే వ్యక్తిత్వం ఉన్న కమిషనర్ సమాచారాన్ని ఇప్పించడానికి ఎవరికీ భయపడడు. పదవీ కాలం తగ్గిందంటే ఆ వెసులుబాటు అంతమేరకు తగ్గుతుంది. ఇంకో మూడు నియమాలు కేంద్రం చేతిలో అధికారాలను కేంద్రీకరిస్తున్నాయి. ఏ నియమాన్నయినా సరే సడలించి నీరుకార్చే అధికారాన్ని కేంద్రం రూల్ 22 ద్వారా ఇచ్చుకున్నది. ఇంకా ఏ అలవెన్సులు ఇవ్వాలో, ఏ విలాస సౌకర్యాలు కల్పించాలో నిర్ధారించే అధికారాన్ని 21 వ నియమం ద్వారా కేంద్రం తనకు మిగుల్చుకున్నది. ఇవి చాలవన్నట్టు ఈ నియమాల అర్థాలు ఇంకా ఎవరికైనా తెలియకపోతే, కేంద్రం వివరిస్తుంది. ఆ విధంగా కేంద్రం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉన్నా సరైనదనే భావించి తీరాలని రూల్ 23 చెప్పేసింది. శాసనం ద్వారా ఆర్బీఐకి స్థిరమైన హోదాను, పదవీకాలాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని కలి్పంచింది పార్లమెంటు. ఆవిధంగా స్థాయి ఇచ్చే అధికారాన్ని ఈ సవరణ ద్వారా పార్లమెంటు నుంచి లాగేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు ఇప్పుడు చేసిన నియమాలు కూడా ఇష్టం వచి్చనట్టు మారుస్తానని, సడలిస్తానని, వాటి అర్థాలు తానే చెబుతానని కేంద్రం చాలా స్పష్టంగా వివరించింది. ఏలిన వారికి అనుకూలంగా తీర్పులివ్వాలని ఇదొక ఆదేశం. ఇవ్వకపోతే నియమాలు మారుస్తాం అని చెప్పే హెచ్చరిక ఈ రూల్స్. కొందరు మిత్రులు ఆర్టీఐలో రెండు సెక్షన్లే కదా సార్ మార్చింది. ఇంత మాత్రానికి ఇల్లెక్కి అరుస్తారెందుకండీ అనే వారూ ఉన్నారు. రెండే సెక్షన్లు మార్చారనడం కరెక్ట్. కాని దాంతో కమిషన్ అనే పులికి కోరలు పీకారని, తిండి పెట్టక మల మల మాడ్చి పులిని జింకగా మార్చారని వారు అర్థం చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర కమిషన్ పరిస్థితి ఇది అని ఊరుకోవడానికి వీల్లేకుండా రాష్ట్రాల కమిషన్లకు కూడా ఇదే గతి పట్టించారు. వారి స్థాయి మరీ తక్కువ. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లకు కేంద్రం జీతం నిర్ణయించడం ఏమిటి? ఇటువంటి మార్పును ఒప్పుకున్న దివాలాకోరు రాష్ట్రాలనేమనాలి? సిగ్గు చేటు. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఝ్చఛ్చీbజిuటజిజీ.టటజీఛీజ్చిటఃజఝ్చజీ .ఛిౌఝ విశ్లేషణ మాడభూషి శ్రీధర్ -
రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!
న్యూఢిల్లీ: ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా రాకపోవడాన్ని గమనించారా...? గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు...! గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడమే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంఖ్యాపరంగా 2016–17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018–19లో ఆర్బీఐ 4.66 కోట్ల నోట్లు ప్రింట్ అయ్యాయి. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. నల్లధనం కూడబెట్టుకునేందుకు పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. 2019 జనవరిలో ఆంధ్ర– తమిళనాడు సరిహద్దుల్లో రూ.6 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం (లెక్కల్లో చూపని) ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016–17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017–18లో 17,929 నోట్లు బైటపడ్డాయి. -
నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను కోరింది. దీంతో అధికారులు నయీం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నయాం కేసులో బీసీ సంఘాల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కేసులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరినవారే కావడం గమనార్హం. నయీం కేసును సిట్కు అప్పగించిన తర్వాత 250 కేసుల నమోదు అయ్యాయి. అంతేకాకుండా 1.944 కేజీల బంగారం, 2,482 కేజీల వెండి, రెండు కోట్ల రూపాయలకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు. ఆ జాబితాలోని పేర్లు... అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్రెడ్డి డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్రావు, వెంకటనర్సయ్య పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇన్స్పెక్టర్లు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకటరెడ్డి, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేంద్రగౌడ్, దినేశ్, సాదిఖ్మియా టీఆర్ఎస్ నాయకులు.. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య మాజీ సర్పంచ్ పింగల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ్ 2016లో షాద్నగర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంటకాగి.. భారీగా భూ దందాలు సాగించారు. -
నయీమ్ కేసు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసుల వ్యవహారంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ (ఎఫ్జీజీ) లేఖాస్త్రం సంధించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో గవర్నర్కు లేఖ రాసింది. కబ్జాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు, హత్యలతో రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్ పరిసరాల్లో వ్యాపారులకు కంటి మీద కనుకు లేకుండా చేసిన నయీమ్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2016లో నయీమ్ను ఎన్కౌంటర్ అనంతరం సాగిన దర్యాప్తు, పురోగతి, ఎవరెవరిని అరెస్టు చేశారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారో వివరాలు తెలపాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’(ఎఫ్జీజీ) సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. సంస్థ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆర్టీఐ ద్వారా ఈ ప్రశ్నలను సంధించారు. కానీ, పోలీసుల నుంచి దర్యాప్తు జరుగుతోందన్న సమాధానం మాత్రమే వచ్చింది. దీంతో సదరు ఆర్టీఐ కాపీతోపాటు పలు సందేహాలతో కూడిన లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. మూడేళ్లవుతున్నా నత్తలా నడుస్తున్న కేసు పక్కదారి పడుతోందంటూ గవర్నర్కి లేఖ ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. -
సమాచారానికి గ్రహచారం!
‘‘దేశంలోని పార్లమెంటేరియన్లు తమ పార్లమెంటరీ వ్యాపకాల్ని అబద్ధాలతోనే ప్రారంభిస్తారు’’(All MPs start their Parliamentary careers with lies). – మాజీ ప్రధాని వాజ్పేయి ఉవాచ: ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు రాజీవ్ గౌడ్ ప్రస్తావన (26–07–2019) ‘‘సకల అధికారాల కేంద్రీకరణ అనేది, అది శాసన వేదిక లేదా పాలక వర్గం లేదా న్యాయవ్యవస్థ తాలూకు అధికారాలన్నీ కొద్దిమంది చేతుల్లో ఉన్నప్పుడు వారు ఒకరా, కొద్దిమందా లేదా ఎక్కువమందా లేక వారు వంశపారంపర్య శక్తులా లేదా ఎన్నుకోబడిన శక్తులా అన్నదానితో నిమిత్తం లేకుండానే ఒక్క ముక్కలో చెప్పాలంటే నిరంకుశత్వానికి నికార్సయిన నిర్వచనం’’ – అమెరికా స్వాతంత్య్ర ప్రదాతలలో ఒకరైన జేమ్స్ మాడిసన్ : ది ఫెడరలిస్ట్ నం: 47 (1758 జనవరి 30) ‘‘కళ్లు మూసుకుంటే జీవితం తేలిగ్గా గడిపేయవచ్చు. కాని కళ్లు చూస్తున్న దానినల్లా అపార్థంగా భావించడమే అసలు దోషం!’’ – జాన్ లెన్నిన్ : లూథర్ కింగ్ సమఉజ్జీ నిజమే, మన కళ్లముందే చాలా ఘటనలు (అనుకూల ప్రతికూల) అలా డొల్లుకుపోతున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్, ఎన్డీయే కూటమి తొలి అయిదేళ్ల పాలన (2014–19)లో నరేంద్ర మోదీ, అమిత్ షా కాంబినేషన్లో ఎలా మోసపూరిత, ఆర్థిక విధానాలతో, దేశ ప్రజా బాహుళ్యం ఆర్థిక స్థితిగతులను (సంపన్నవర్గాలు మినహా) అర్ధంతరంగా నోట్లరద్దు కార్యక్రమం ద్వారా ఎలా అతలాకుతలం చేసిందీ అనుభవించిన దేశ ప్రజలు చూశారు. ఆ క్రమంలోనే బీజేపీ–ఆరెస్సెస్ ఒరిజినల్ ఎజెండా అయిన ‘హిందూ రిపబ్లిక్’ స్థాపన లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వందల సంఖ్యలో గత అయిదేళ్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన దళితులపైనా, మైనారిటీలపైన అత్యాచారాలకు, హింసా కాండకు, మారణకాండకు తెరలేపారు. ఇది ఉత్తర భారతంలోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాలకూ ఏదో రూపంలో పాకించి, ప్రజా బాహుళ్యంలో ఆందోళనకు కారణమైంది. ఈ వరసలోనే జరుగుతున్న దారుణ సంఘటనలకు నిరసనగా ఉద్యమించి ప్రజల్ని సమీకరించి పాలక విధానాలకు నిరసనగా ఉద్యమించిన గోవింద పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి లాంటి పెక్కుమంది మేధావులను, లంకేష్ లాంటి పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను హతమార్చడమో, అరెస్టుల ద్వారా నిర్బంధించడమో జరిగింది. ఈ దారుణ పరిణామాలకు నిరసనగా దేశంలోని పెక్కుమంది మేధావులు తాము గతంలో పొంది ఉన్న అనేక కేంద్ర ప్రభుత్వ బిరుదులను, పురస్కారాలను బీజేపీ ప్రభుత్వ ముఖం మీద కొట్టి స్వాతంత్య్రానంతర దశలో తొలి త్యాగశీలతను ప్రదర్శిం చారు. ఇక ఆ దశ ముగిసిన దరిమిలా కూడా ఇంతకు ముందు దేశ వ్యాపితంగా పేరెన్నికగన్న మేధావుల హత్యకు కారకులైన దుండుగుల్ని (వారెవరో హత్యలు చేయించిన వారికి తెలుసు) గత అయిదేళ్లుగా పట్టి శిక్షించిన ఉదాహరణ ఈరోజుదాకా భారత ప్రజలు ఎరుగరు! కాగా, రెండోసారి అనేక కుంభకోణాల మధ్య, సామాజిక వ్యత్యాసాలకు, ఆర్థిక అసమానతలకు మధ్యనే కుమ్ములాటలు పెంచి తగాదాలు పెంచి, వారిలో కొందరిని చీల్చి కాంగ్రెస్ అనుసరించిన విభజించి పాలించే సూత్రాన్నే బీజేపీ పాలకవర్గం కూడా జయప్రదంగా అనుసరించి రెండో దఫా పగ్గాలు అందుకుంది. పైగా, గెలుపే ప్రధాన ధ్యేయంగా, వాపే బలుపుగా భావించి ప్రతిపక్షాలలో పేరుకున్న అనైక్యతను పెంచి వాటి నుంచి కొందరు సత్తరకాయలను తమ వైపునకు ధన, అధికార ప్రలోభాలతో గుంజుకుని రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజులనాడు రాజ్యసభలో దేశ సమాచార హక్కు పరిరక్షణా చట్టానికి బీజేపీ పాలకులు తెచ్చిన సమాచార వ్యతిరేక సవరణ బిల్లు సందర్భంగా మాట్లాడిన ఒక సీనియర్ సభ్యుడు ఆ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపడానికి ప్రభుత్వం నిరాకరించినందుకు కారణం పేర్కొంటూ. ‘నాకిప్పుడు అర్థమైంది, రెండో దఫా బీజేపీ సంకీర్ణం ఈసారి 303 స్థానాలను లోక్సభలో ఏ పద్ధతుల్లో పొంది ఉంటుందోనని’ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. కథ అంతటితో ముగియలేదు. దేశ పౌరులు సమాచారం పొందే హక్కును గుర్తించి రాజ్యాంగ బద్ధతను పొందిన చట్టాన్ని బీజేపీ అనుకున్న రీతిలో మార్చాలంటే రాజ్యసభ అనుమతి కూడా అవసరం. కానీ రాజ్యసభలో బీజేపీ–ఆరెస్సెస్–ఎన్డీఏ కాంబినేషన్కు మెజారిటీ లేదు. లేని మెజారిటీని ఎలా ‘కుకప్’ చేసి చూపాలి? ఆ పనిని బీజేపీ దొడ్డి దారిన వెళ్లి దారి దోపిడీకి పాల్పడింది. ఈ దోపిడీకి సహకరించిన వాడు చంద్రబాబు స్నేహితుడు, కేసులనుంచి తప్పించుకునేందుకు టీడీపీని వదిలి కాషాయ కండువా కప్పుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీఎం రమేష్. ఆర్టీఐ సవరణ చట్టానికి ఎలాగోలా మద్దతు కూడగట్టే పనిని ఇతనికి బీజేపీ పురమాయించింది. తైనాతీ పని చెప్పింది చేయడమే. రాజ్యసభలో బీజేపీకి లేని ‘వాపు’ను తీసుకురావడానికి ఓటింగ్ ‘స్లిప్పు’ లను తానే నిర్వహించి కొందరి సభ్యులకు వాటినిచ్చి, తిరిగి ఆ స్లిప్పులను సభ మార్షల్ వసూలు చేసి సభాధ్యక్షునికి అందజేయాల్సి ఉండగా –రమేష్ ఆ పని చేయడం సభాధ్యక్షునికే ఆశ్చర్యం వేసి, ‘ఏంటి మీరు చేస్తున్న పని, మీకేం పని, వెళ్లి నీ స్థానంలో కూర్చో’ అని పలు మార్లు గద్దించాల్సి వచ్చిందని మరవరాదు. ఈ తకరారు ఓటింగ్ ద్వారానే ఆర్టీఐ సవరణ చట్టం సభలో నెగ్గడంతో ‘వాపును బలం’గా చూపించు కోవాల్సి వచ్చింది. ఒకవైపు నుంచి ఆర్టీఐ చట్టాన్ని నీరుకార్చుతూ, మరొ కవైపు నుంచి ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) సవరణ పేరిట ఏ పౌరుడినైనా ‘టెర్రరిస్టు’ (ఉగ్రవాది)గా ముద్ర వేసే హక్కు కేంద్రానికి దఖలు పడుతుంది. మోదీ రెండోసారి పాలనకు వచ్చిన వెంటనే జరిగిన పని– సుప్రసిద్ధ చలనచిత్ర దర్శక నిర్మాత ఆదూరి గోపాలకృష్ణన్పైన, ఇతర స్వతంత్ర భావాలుకల కళాకారులపైన వరుస దాడులను బీజేపీ కనుసన్నల్లో నిర్వహించడం. సామాజిక కార్యకర్తలపైన దళిత బహుజనులపైన, మైనారిటీల పైన తరచుగా పనిగట్టుకుని ఆవుపేరిట, గోమాంసం పేరిట విచ్చలవిడిగా సాగిస్తున్న హింస, దౌర్జన్యాలకు, వేధింపులకు మోదీ అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. పాలక పక్షంలో రోజు రోజుకీ అసహనం పెరిగి పోవడానికిగల కారణాలలో ప్రధానమైనవి– రక్షణ శాఖ కొనుగోళ్లలో (ఉదా. రాఫెల్) జరిగినట్టు పొక్కిన కుంభకోణాలను, పాలకవర్గంలోని అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల విద్యార్హతలు, ఆర్థిక వ్యవస్థ పతన దశల గురించిన ప్రశ్న పరంపరలను పౌర సమాజాలు, వేగులవాళ్లు (విజిల్ బ్లోయర్స్) సమాచార హక్కు చట్టం కింద గుచ్చి గుచ్చి ప్రశ్నించడాన్ని పాలకవర్గం సహించలేక పోతోంది. కనుకనే తొలి ఆర్టీఐ సమ్మతించి అమలులోకి తెచ్చిన ప్రజల ‘సమాచార హక్కు’ చట్టానికి తూట్లు పొడిచి తమ నిరంకుశాధికార ప్రతిపత్తికి రక్షణ కవచంగా వాడుకోవడాన్ని ప్రజలు సహించరు. చివరికి సుప్రీంకోర్టులో అత్యంత ప్రసిద్ధ గౌరవ సీనియర్ న్యాయవాదులలో ఒకరుగా పేరొందిన ఇందిరా జైసింగ్, ప్రసిద్ధ సామాజిక కార్యకర్త, న్యాయవాది, ‘లాయర్స్ కలెక్టివ్’ ఉద్యమ సంస్థ అధ్యక్షుడైన ఆనంద్ గ్రోవర్ తదితరులపైన ‘విదేశీ విరాళాల రెగ్యులేషన్ యాక్టు కింద కేసులు మోపి వేధిస్తోంది పాలక వర్గం. కానీ అదే సమయంలో అనేక బ్యాంకులను మోసం చేసిన బడా బడా ఆర్థిక నేరగాళ్లపై ‘చర్యల’ పేరిట జారీ చేసిన ‘లుకౌట్’ నోటీసుల వివరాలు ప్రజలకు వెళ్లడించడానికి మోదీ ‘మనసులోని మాట’ పెగిలి బయటకు రావటం లేదు. తొలి అయిదేళ్ల పాలనలోనే కాదు, రెండవసారి అధికారం చేపట్టిన నేటి దశలో సైతం పెక్కు మత విద్వేష కార్యకలాపాలలో మైనారిటీలను వేధిస్తున్న పలు ఉదాహరణలను, దాడులను ప్రధాని దృష్టికి తెస్తూ వివిధ రంగాలలోని 49 మంది ప్రముఖులు ఈ దారుణ దౌర్జన్యకాండను నిలిపివేయవలసిందిగా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. అందుకు పోటీగా ఎవరో 60 మంది సంతకాలతో బీజేపీ ఒక ప్రకటనను విడుదల చేయించింది. టెర్రరిజాన్ని (ఉగ్రవాదాన్ని) ఎదుర్కోవలసిందే– అది వ్యక్తిగతమైనదైనా, అధికార సంస్థాగత ఉగ్రవాదమైనా ఒకటే. అందుకే జాతీయవాది, మత సామరస్యవాది, సంస్కరణ వాది అయిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ ‘భారతీయ తీరాలు’ పేరిట (ఆన్ ది షోర్స్ ఆఫ్ భారత్) పాలక శక్తులకు బుద్ధివచ్చే కవిత రాశారు: ‘‘భారతీయ తీరాలు/ సకల జాతుల మనుషులను/ఒక్కచోట చేర్చుతాయి/ మేలుకో, ఓ మనసా మేలుకో!/చేతులు బారలు చాపి నిలుచున్నా/ మానవతా దైవానికి నమస్సులు తెలుపుకుంటున్నా/రండి, రండి మానవతా దైవాన్ని మాత్రమే కొలవండి/ఎవరి పిలుపునందుకునోగానీ /మానవులు తీరాలుదాటి తెరలుగా అలలుగా వస్తున్నారు/వీరు భారతమనే మహా సంద్రంలో ఏకమైపోతారు– వారు/ఆర్యులు, అనార్యులు, ద్రావిడులు, హూణులు, పఠాన్లు/మొగలాయీలు– ఒకరా, వీరంతా/ ఒక్క శరీరమై కలసిపోయారు!’’ విశ్వకవి పాఠం పాలకులకు గుణపాఠమైతే అంతకన్నా విశ్వజనీన సత్యం ఎక్కడుంటుంది?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు సవరణ చట్టం బిల్లును పార్లమెంట్ గురువారం నాడు ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించిన విషయం తెల్సిందే. బిల్లులో ఎలాంటి సవరణలు చోటు చేసుకున్నాయి ? ఆ సవరణలను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వాటి వల్ల ప్రమాదకర పరిణామాలు ఏమైనా ఉంటాయా? అసలు మాజీ సమాచార కమిషనర్లు దీనిపై ఏమంటున్నారు? ప్రభుత్వ కార్యకలాపాలు, విధుల నిర్వహణకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. సమాచార కమిషనర్ల ఆదేశం మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖ, విభాగం ప్రజలు అడిగిన సమాచారాన్ని విధిగా అందించాలి. సమాచార కమిషనర్లు ప్రభుత్వానికి లొంగకుండా తటస్థ వైఖరిని అవలంబించాలనే ఉద్దేశంతో సమాచార కమిషనర్లకు భారత ఎన్నికల కమిషన్లోని కమిషనర్లకు ఇచ్చినంత జీతభత్యాలను ఇవ్వాలని చట్టంలోనే నిర్దేషించింది. వారికి ఐదేళ్ల కాల పరిమితిని కూడా నిర్ణయించింది. ఇప్పుడు ఈ నిబంధనలను ఎత్తివేస్తూ జీతభత్యాలను, పదవీ కాలాన్నీ ప్రభుత్వమే నిర్ణయించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీంతో సమాచారా కమిషనర్ల వ్యవస్థతో పారదర్శకత లోపిస్తుందని, ప్రభుత్వం ఒత్తిడి వారు లొంగిపోయే అవకాశం ఉందంటూ విపక్షాలు గొడవ చేశాయి. అలా జరగదని, ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగం ప్రకారం వచ్చిందని, రాజ్యాంగ సవరణల ద్వారానే అందులో మార్పులు, చేర్పులు చేసుకున్నాయని, అదే సమాచార చట్టాన్ని పార్లమెంటరీ చట్టం ద్వారా తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఎన్నో వ్యవస్థలపై ప్రభావం ప్రభుత్వ వాదనను ప్రమాణంగా తీసుకుంటే పార్లమెంటరీ చట్టం కింద ప్రత్యేక స్వయం ప్రతిపత్తిగల సంస్థలైన సుప్రీం కోర్టు, హైకోర్టులు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లోక్పాల్, జాతీయ మానవ హక్కుల కమిషన్లను సవరించాల్సి ఉంటుందని, అలా చేస్తే వాటి స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతింటాయని మాజీ సమాచార కమిషనర్లు అభిప్రాయపడుతున్నారు. -
ఆర్టీఐకి మరణశాసనం
ప్రధానమంత్రి మోదీ పారదర్శకత అంటే చాలా ఇష్టపడతారు. అవినీతిని సహించేది లేదని పదేపదే చెప్పారు. గుజరాత్లో అనేకసార్లు, కేంద్రంలో ప్రధానిగా రెండుసార్లు గెలిపించారంటే మోదీ మాటను జనం పూర్తిగా నమ్మారని నమ్మక తప్పదు. పారదర్శకతను పెంచడానికి మాత్రమే ఆర్టీ ఐని సవరిస్తున్నానని మంత్రిగారు, బీజేపీ అధికార ప్రతినిధులు నమ్మబలుకుతూనే ఉన్నారు. ప్రభుత్వం దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని, గుట్టు దాచడంకన్న విప్పి చెప్పడంలోనే వారి శ్రేయస్సు ఉందని మనం అనుకుంటున్నాం. కానీ, పదిరూపాయలు పడేసి ఆర్టీఐ కింద ఓ దరఖాస్తు రాసేసి మా ప్రాణం తీస్తున్నారని ప్రభుత్వ పెద్దలు కోప్పడుతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని నిస్తేజం చేయడానికి కేంద్రం దాదాపు తొమ్మిది నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కాస్త వెనుకంజ వేసింది. తరువాత మే నెలలో జరిగిన ఎన్నికలలో ప్రజలు అద్భుతమైన రీతిలో విజయం కట్టబెట్టడంతో తాము ఏం చేసినా చెల్లుతుందనే సాహసిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సవరణ తంతు పూర్తి చేసి సమాచార కమిషనర్లను తమ కింది స్థాయి ఉద్యోగులుగా మార్చడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నది. లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. రాష్ట్రపతి అయినా దీని మీద సంతకం పెట్టకుండా ఆపుతారేమోననుకుంటే అది దింపుడు కళ్లం ఆశేనేమో. ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల కమిషన్తో సమా చార కమిషనర్కు సమాన స్థాయి, హోదా, అధికారం వేతనం ఉండాలని చట్టం నిర్దేశించింది. ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా కలిగి ఉంటారు. అయిదేళ్లు లేదా 65 సంవ త్సరాల వయసు ఏది ముందైతే ఆ కాలానికి పదవి ముగుస్తుందని చట్టంలో చేర్చారు. అంటే ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై కమిషనర్ మనుగడ ఆధారపడదు. కనుక ప్రభుత్వ పెద్దల ఆగ్రహానుగ్రహాలతో సంబం ధం లేకుండా సొంతంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పెద్ద అధికారులు తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని పౌరుడు ఈ చట్టం కింద తెలుసుకునే హక్కు పొందాడు. నిజానికి ఈ సమాచారం వెల్లడికావడం వల్ల ఎవరికీ హాని ఉండదు. కానీ వెల్లడైన ఈ సమాచారం ద్వారా అందాకా దాగిన రహస్యాలు బయటపడితే జైలుకు పోయే ప్రమాదం కూడా వస్తుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు. ఈ భయం ఆర్టీఐకి ఎసరుగా మారింది. ఆర్టీఐ పూర్తిగా తీసివేయడానికి కూడా ఈ పాలకులకు భయమే. కనుక ఆర్టీఐ కోరలు పీకాలి. కాటేయడానికి వీల్లేని పాముగా మార్చి, వారి నాగస్వరానికి నాట్యం చేసే బానిసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ స్థాయిని సమాచార కమిషనర్కు ఇవ్వడం తప్పు కనుక తగ్గిస్తాం అని చట్టం లక్ష్యాల ప్రకటనలో పేర్కొన్నారు. తగ్గించనీ అనుకుందాం. ఏ స్థాయికి తగ్గిస్తారు? ఆ విషయం రహస్యం. పోనీ తగ్గించే జీతం ఎంత? అయిదేళ్ల పదవీకాలాన్ని ఎంత కాలానికి తగ్గిస్తారు? అదీ చెప్పరు. మామూలు జనాలకే కాదు, పార్లమెంటు సభ్యులకు కూడా చెప్పడం లేదు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామని చెబుతూ, సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెం టుకు కూడా చెప్పకుండా దాచడమే పారదర్శకత పెంచడమా? తాము నిర్దేశించబోయే నియమాలకు అనుగుణంగా కమిషనర్ స్థాయి నిర్ణయిస్తామని చేర్చ డమే ఈ చట్టం సవరణ. అంటే స్థిరంగా ఒక పాలసీ లేదు. ప్రభుత్వంలో ఎవరుంటే వారి ఇష్టం వచ్చిన రీతిలో స్థాయిని నిర్ణయించుకోవచ్చు అని దీని అర్థం. ఉదా‘‘కు... ఓసారి ఇద్దరు కమిషనర్లను నియమించా లనుకుంటే అప్పుడు కొన్ని సూత్రాలు కనిపెడతారు. ఓ రెండేళ్ల పదవీకాలం, జాయింట్ సెక్రటరీ హోదా అని, ఆ తరువాత రెండేళ్లకు వచ్చే ఖాళీలు పూరించడానికి పూనుకున్నప్పుడు మూడేళ్ల పదవీకాలం, డిప్యూటీ సెక్రటరీ హోదా అని కూడా అనవచ్చు. రాష్ట్రాలు నియమించే కమిషనర్లకు కూడా కేంద్రమే హోదాను, వేతనాన్ని, పదవీకాలాన్ని నిర్ణయిస్తుందట. జనం అడిగిన సమాచారం ప్రభుత్వానికి ఇబ్బందికరమైతే ఇవ్వకూడదు అన్నది పైకి చెప్పని ఆదేశం. బహిరంగ రహస్యం. కాగితాల మీద కనిపించదు. సమాచార హక్కు సవరణను కనుక రెండు సభలు ఆమోదిస్తే, ఇక మళ్లీ సవరించే అవసరం లేదు. ఆ చట్టంలో మిగిలేది ఏమీ ఉండదు కనుక. ఈ బిల్లును అత్యంత రహస్యంగా కాపాడి, సభ్యులు చదువుకుని మార్పులు ప్రతిపాదించే వీలు లేకుండా బిల్లు ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పి, హడావుడిగా ముందుకు తోశారు. ఈ హక్కును అమలులో నీరుగార్చేందుకు, అనేక ప్రభుత్వ విభాగాలలో ఒకదానిగా మార్చి అనుబంధ శాఖగా మార్చేందుకు వేసిన పకడ్బందీ ప్రణాళిక అని స్పష్టంగా విశదమవుతూ ఉన్నది. పార్లమెంటు నుంచి అధికారాన్ని గుంజుకునే సవరణ ఇది. ఇది ఆర్టీఐ కమిషనర్ వ్యవస్థకు మరణశాసనం. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఆర్టీఐ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ : సమాచార హక్కు (ఆర్టీఐ) సవరణ బిల్లు తీవ్ర గందరగోళం మధ్య లోక్సభ ఆమోదం పొందింది. ఆర్టీఐని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం సవరణ బిల్లును ప్రతిపాదించిందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ బిల్లును ఆర్టీఐ నిర్మూలన బిల్లుగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని డిమాండ్ చేశాయి. ఈ బిల్లును ప్రభుత్వానికి తగినంత సంఖ్యా బలం లేని రాజ్యసభలో అడ్డుకునే అవకాశం ఉంటుందని విపక్షాలు ఆశిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్రస్ధాయిలో సమాచార కమిషనర్ల వేతనాలు, కాలపరిమితికి సంబంధించిన సవరణలకు బిల్లులో చోటుకల్పించారు. ఎన్నికల కమిషన్ అధికారుల స్ధాయిలో వారికి వేతనాలు ఇవ్వచూపడం, కాలపరిమితి వంటి అంశాలను ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా సవరణ బిల్లులో పొందుపరిచారు. ఆర్టీఐ చట్టంలో ప్రస్తుతం వీటికి సంబంధించిన నిబంధనల ప్రస్తావన లేదు. కాగా ఆర్టీఐ కమిషనర్ల విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సవరణలు చేశారని విపక్షం ఆరోపించింది. ఆర్టీఐ చట్టాన్ని నీరుగార్చేలా ఈ నిబంధనలు ఉన్నాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్మోషన్లో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు. సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
సర్జికల్ దాడులు.. కాంగ్రెస్కు చుక్కెదురు
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమాధానంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. జమ్ముకశ్మీర్కు చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు. ఇందుకు సమాధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016, సెప్టెంబర్లో యూరి సెక్టార్లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. -
7% వృద్ధి రేటు అనుమానమే!
న్యూఢిల్లీ: భారత్ ఏడు శాతం వృద్ధి రేటు సాధనపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి గణాంకాలపై ఉన్న సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తగిన ఉద్యోగాల కల్పన జరగని పరిస్థితుల్లో 7 శాతం వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గణాంకాల విషయంలో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి నిష్పక్షపాత కమిటీ ఏర్పాటు అవసరమనీ ఆయన సూచించడం గమనార్హం. భారత్ వాస్తవ వృద్ధిని కనుగొనడానికి గణాంకాల మదింపు ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ అవసరం అన్నారు. సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెం బర్ 2016 వరకూ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన రాజన్, తాజాగా ఒక వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ∙నాతో ఇటీవల ఒక మంత్రి (పేరు వెల్లడించలేదు) మాట్లాడారు. తగిన ఉపాధి కల్పన లేనప్పుడు మనం ఎలా 7 శాతం వృద్ధి సాధించగలమని ఆయన అడిగారు. ఈ కారణాన్ని చూపిస్తే, మనం ఏడు శాతం వృద్ధిని సాధించే అవకాశం కనపించడం లేదు. ∙వృద్ధి రేట్ల సమీక్ష అనంతరం, ఆయా గణాంకాల పట్ల అనుమానాలు పెరిగాయి. వీటిమీద సందేహాలు తొలగాలి. ఇందుకు సంబంధించి నిష్పాక్షిక కమిటీ ఏర్పడాలి. గణాంకాల పట్ల విశ్వాసం మరింత పెరగాలి. (2018 నవంబర్లో కేంద్ర గణాంకాల శాఖ కాంగ్రెస్ హయాంలోని యూపీఏ కాలంలో జీడీపీ వృద్ధిరేట్లను తగ్గించింది. మోదీ పాలనలో గడచిన నాలుగేళ్ల జీడీపీ వృద్ధి రేట్లను యూపీఏ కాలంలో సాధించిన వృద్ధిరేట్లకన్నా ఎక్కువగా సవరించింది). ∙వివాదాస్పద పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్) వంటి తన నిర్ణయాల వల్ల జరిగిన మంచి చెడులను ప్రభుత్వం సమీక్షించి, మున్ముందు ఎటువంటి తప్పులూ జరక్కుండా చూసుకోవాలి. -
మాజీ అధికారులకే అందలం
‘‘మీకు మాజీ అధికా రులు తప్ప మరెవరూ కేంద్ర సమాచార కమిషనర్ పదవికి అర్హులుగా కనిపించడం లేదా?’’ అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంజలీ భరద్వాజ్ సీఐసీ నియామకాలపై దాఖలుచేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ఇదే విషయాన్ని అనేకమంది ఆర్టీఐ కార్యకర్తలు, మాజీ కమిషనర్లు, ఈ రచయితతో సహా అడిగినా పట్టించుకున్న నాథుడు లేడు. రాష్ట్రపతికి లేఖ రాస్తే చదివినవారు లేరు. అసలు కదలికే లేదు. కమడోర్ లోకేశ్ బత్రా, అంజలీ భరద్వాజ్, అమ్రితా జోహ్రీ ఆర్టీఐ అభ్యర్థనలపై ప్రభుత్వం కొన్ని పత్రాలను వెల్లడిచేసింది. ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా వ్యవహరించిందని తేలింది. అన్వేషణ సంఘం ఎంపిక బృందానికి పంపినవి 14 మంది పేర్లు. అందులో 13 మంది మాజీ ప్రభుత్వ అధికారులవి, ఒక్క పేరు మాత్రం మాజీ హైకోర్టు న్యాయమూర్తిది. అంజలీ తరఫు న్యాయవాది అసలు దరఖాస్తులు పంపుకోకపోయినా ఇద్దరినీ పరిగణిం చారని చెప్పారు. సురేశ్చంద్ర, అమీసింగ్ ల్యూఖామ్ ఈ పదవికోసం దరఖాస్తులు పెట్టుకోలేదని వెల్లడైంది. కానీ వారిపేర్లు తుదిపరిశీలనకు వెళ్లడం, సురేశ్ చంద్ర నియమితులు కావడం తెలిసిందే. న్యాయమూర్తులు ఎ.కె. సిక్రీ, ఎస్. అబ్దుల్ నజీర్... ‘‘మేము మా అనుభవంతో చెబుతున్నాం. విభిన్న ట్రిబ్యునళ్ల పాలక సభ్యులుగా ఎందరో అధికారు లను మేము ఇంటర్వూ్య చేస్తూ ఉంటాం. వారిలో సాధారణంగా ఒక అభిప్రాయం నెలకొని ఉంటుంది. బ్యూరోక్రాట్లు మాత్రమే ఉత్తములని వారు అనుకొంటూ ఉంటారు. చాలా కాలం పాలనా రంగంలో ఉండటం వల్ల వారికి విస్తారమైన అనుభవం ఉందనడంలో సందేహం లేదు. కాని మిగతా రంగాలలో సుప్రసిద్ధులైన వారు ఒక్కరు కూడా సమాచార కమిషనర్ పదవికి పనికి వస్తారని ప్రభుత్వం వారికి కనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతున్నది’’ అని వ్యాఖ్యానించారు. ఏం చెప్పమంటారు? కేంద్రం అయినా రాష్ట్రా లలో అయినా సరే సమాచార కమిషనర్ పదవికి మాజీ అధికారులను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఆ ఎంపిక విధానంలో కూడా అంత దాపరికం ఎందుకో అర్థం కాదు. దాపరికంలేని పారదర్శక పాలనను ప్రోత్సహించవలసిన బాధ్యత చట్ట పరంగా నిర్వహించవలసిన సమాచార కమిషనర్ల ఎంపికలోనే లేకపోతే సమాచార హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేదెవరు? కమిషనర్ పదవికి దరఖాస్తులు పంపుకోవా లని నోటిఫికేషన్లు ప్రచురించేందుకు వేలాది రూపాయల ప్రజాధనం చెల్లిస్తారు. ఆ ప్రకటనలు లోపాలతో ఉంటాయి. కమిషనర్ పదవీకాలం ఎంతో చెప్పరు. జీత భత్యాల గురించి తరువాత చెబుతాం అంటారు. స్థాయి హోదా జీతం తెలియని పదవికి చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోకపోవచ్చు. ఆర్టీఐ చట్టం కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషనర్ హోదాతో సమంగా ఉంటుందని స్పష్టంగా తెలియజేసినా, సర్కారు వారు తమ ఇష్టానుసారం íసీఐసీ హోదాను జీతాన్ని మార్చడానికి వీలుగా చట్టాన్ని సవరించాలనుకుంటున్నారు. అందువల్ల చట్టం నీరుగారిపోయినా, సమాచారం జనానికి అందకుండా పోయినా ఫరవాలేదన్నట్టు, అదే కావాలన్నట్టు వ్యవహరిస్తున్నారనడానికి ఇటీవలి నియామకాలే సాక్ష్యం. ఆగస్టు 27, 2018నాడు సుప్రీంకోర్టుకు కేంద్రం ఒక అఫిడవిట్ను సమర్పించింది. వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారిని ఎంపిక చేయడానికి కొన్ని పద్ధతులను రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. తీరా మినిట్స్ చూస్తే.. అడిగిన వారిని పక్కన పెట్టి, ఏ పద్దతీ లేకుండా అడగని వారికి కూడా పదవి ఇవ్వాలని వీరు ప్రతిపాదించారు. సురేశ్చంద్ర దర ఖాస్తు చేసుకోకపోయినా అన్వేషణ సంఘం ఆయ నను ఎంపిక చేసింది. ఆ ఎంపిక ఆధారంగా ఆయన కమిషనర్గా నియమితులైనారని కోర్టుకు విన్నవించారు. ఆర్టీఐ చట్టం అమలులో ఉన్నా, ప్రజలకు అడిగిన సమాచారం ఇవ్వకుండా దాచడానికి వీలుగా నియామకాల సమయంలోనే విధేయులైన మాజీ అధికారులను నియమిస్తే, రాబోయే కాలంలో సమాచారం వెల్లడవకపోయే అవకాశం ఉందని సమాచార హక్కు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సంకీర్ణం స్థానంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన కమిషనర్ ఎంపిక విషయంలో భిన్నమైన ధోరణిని అనుసరించింది. పనిచేస్తున్న కమిషనర్లలో సీనియర్ను ప్రధాన కమిషనర్గా నియమించలేదు. దాదాపు ఏడాది పాటు చీఫ్ కమిషనర్ లేనే లేడు. ఈ సంప్రదాయాన్ని కాదని సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ను చీఫ్ కమిషనర్గా నియమించకుండా, కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుని సీనియర్ కమిషనర్ సుధీర్ భార్గవ్ను చీఫ్గా నియమించారు. ఇందువల్ల ఒక జూనియర్ కమిషనర్ కింద పనిచేసే ఇబ్బంది ఆయనకు తప్పింది. ఆజాద్కు ఆ సౌకర్యం నిరాకరించారు. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ (madabhushi.sridhar@gmail.com) -
దాపరికంపైనా దాడేనా?
నీ సమాచారం మేం తీసుకుంటాం, నువ్వే సమాచారం అడిగినా ఇవ్వం. ఇదీ ప్రభువుల ఉవాచ. తస్మాత్ జాగ్రత్త. పది పోలీసు నిఘా విభాగాలు ప్రజల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని పర్యవేక్షించి, జోక్యం చేసుకుని డీక్రిప్ట్ చేయవచ్చునని కేంద్ర ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 69(1) కింద, 2009 నియమాల్లో నాలుగో నియమం ప్రకారం, ఇంటెలిజెన్స్బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, కేబినెట్ సెక్రటేరియట్ (రా), జమ్మూకశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు పౌరుల కంప్యూటర్లలోకి తొంగి చూడవచ్చు. జోక్యం చేసుకోవచ్చు. దోచేయవచ్చు. పాలకుల దుర్మార్గ లక్షణాలలో ముఖ్యమైంది పౌరుల సమాచారాన్ని సేకరించడం. తన దగ్గరున్న సమాచారాన్ని ప్రజలకు ఏం చేసినా ఇవ్వకపోవడం. ఒకవైపు ఆర్టీఐని బలహీనం చేస్తూ, మరోవైపు పౌరుల ప్రైవసీని హరించే ప్రకటనలు చేస్తున్నది. మనం ఉత్తరాలు రాసుకుంటే కవర్లు తెరిచి చూసే అధికారం తనకు తాను ఇచ్చుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ అధికారాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాలకులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడుకుంటూ వస్తున్నారు. టెలిగ్రాఫ్ చట్టంలో కూడా పౌర సమాచార తస్కరణ అధికారాలను రాసుకున్నది బ్రిటిష్ సర్కార్. ఇప్పుడు కంప్యూటర్లలో జనం సమాచారాన్ని కైవసం చేసే అధికారదాహంతో ఉంది. ఇప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు తక్కువ. టెలిగ్రాముల కథ ఏనాడో ముగిసిపోయింది. ఈమెయిల్స్ ఇచ్చుకోవడం, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసుకోవడం జరుగుతూ ఉన్నది. బ్లాగుల ద్వారా ప్రతిపౌరుడూ ఒక స్వయం జర్నలిస్టుగా మారాడు. సెల్ఫోన్ పట్టుకున్న ప్రతివాడూ ఇన్స్టాగ్రామ్లో పౌర పత్రికా ఫొటోగ్రాఫర్గా మారాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని ఆలోచనలను వాక్యాలుగా మలచగల ప్రతి పౌరుడూ తన వాక్ స్వాతంత్య్రాన్ని వినియోగించుకుంటున్నాడు. ప్రింట్ చేయాల్సిన పని లేకుండానే వేలాది మంది ప్రజలకు చేరువయ్యే టెక్నాలజీ సామాన్య మానవుడిని పక్కవాడి భావజాలాన్ని ప్రభావితం చేసే ప్రభావశాలిగా మార్చేసింది. కంప్యూటర్ మాధ్యమాన్ని విరివిగా వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్లలో నిశితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా కోపతాపాలు బయటపెట్టుకుంటూ హద్దులు మీరి తీవ్ర పదజాలాన్ని కూడా వాడుతున్నారు. టెలిగ్రాములు, ఉత్తరాలు తెరచి తరచి చూసే అధికారం సొంతం చేసుకున్న ప్రభుత్వం రహస్యంగా టెలిఫోన్ భాషణలను కూడా వింటున్నది. వ్యక్తుల ఆలోచనా విధానాలను, వారి వ్యక్తీకరణను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఇంకా అధికారం కావాలంటున్నది. జనం స్వేచ్ఛను ఎంత తాగేసినా ప్రభువుల అధికార దాహం తీరడం లేదు. ఇప్పుడు మన సెల్ఫోన్లో సిల్లీ కబుర్లు వింటారట, చూస్తారట. బ్లాగ్లు, వెబ్సైట్లు వెతుకుతారట. పౌరులు వాడుకునే ఆధునిక సంచారఫోన్లు కూడా కంప్యూటర్లే. ఫేస్బుక్ అందరికీ కనిపించేదే. వాట్సాప్ సమాచారం గ్రూప్ సభ్యులకే పరిమితం. ఇప్పుడీ పది సంస్థలు వాటిని కూడా చూడవచ్చు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో జరిగే జాతి వ్యతిరేక కార్యక్రమాలను పసిగట్టడానికి ఈ అధికారం అవసరమట. కానీ టోకున పౌరులందరి కంప్యూటర్లు చూస్తాననటం. సమాచారం తీస్తాను అనడమంటే అపారమైన అధికారాన్ని సొంతం చేసుకోవడమే. వేల కేసుల్లో రహస్యంగా టెలిఫోన్లు వింటూనే ఉన్నారని కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అధికార వర్గాల్లో వినబడుతూంటాయి. పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ట్యాపింగ్ జరుగుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే ఎన్క్రిప్టెడ్ (అంటే తొంగి చూడడానికి వీల్లేని) సేవలందించే వాట్సాప్ వంటి వాటి ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరూ వినలేరనే నమ్మకంతో. ఈ ఉత్తర్వుతో వాట్సాప్ మాత్రమే కాదు మరే ఇతర ఎన్క్రిప్టెడ్ సమాచార ప్రసారాలనయినా డీక్రిప్ట్ చేసి తెలుసుకోవచ్చు. ప్రజల మెదళ్లమీద నియంత్రణకు అధికారం వాడడం, వారి ఆలోచనలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. పౌరుల స్వేచ్ఛకు భంగకరమైన అధికార దుర్వినియోగానికి ఇవి దారి తీస్తాయి. ఇది ఏకపక్ష నియంతృత్వ చర్య. 2017 ఆగస్టు 24న సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ప్రైవసీని ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ, వెంటనే దానికి సంబంధించిన చట్టం చేయాలని సూచించింది. కానీ ప్రైవసీని నిర్వచించి చట్టం చేయవలసిన ప్రభుత్వానికి పార్లమెంటుకు తీరికే లేదు. ప్రైవసీ పేరుమీద ప్రజలకు ప్రభుత్వాధికారుల సమాచారాన్ని ఇవ్వకుండా తీవ్రంగా ప్రతిఘటించే ప్రభు త్వం, ప్రజల ప్రైవసీ మీద చేయదలచుకున్న మూకుమ్మడి దాడికి ఈ ప్రకటన నాంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సీఐసీపై వేధింపు కేసులేంటి?
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటయిన స్వతంత్ర వ్యవస్థ. సమాచార అభ్యర్థనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తున్నదా? ప్రభుత్వ అధికారి మీద వచ్చిన అక్రమాల ఆరోపణల ఫిర్యాదులు, వాటి విచారణ వివరాలు ఇవ్వమంటే అది వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వరాదని పీఐఓలు నిర్ణయించుకున్నట్టుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సాగించిన పనుల పర్యవసానాన్ని వ్యక్తిగత సమాచారం అని ఏ విధంగా అంటారు. యజమాని ప్రభుత్వం అయినపుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధుల హోదాలో లేదా ప్రజాసేవకుల హోదాలో పనిచేస్తున్నప్పుడు యజమానులైన ప్రజలకు వారి సమాచారం ఎందుకు ఇవ్వరు? అనేవి మౌలికమయిన ప్రశ్నలు. కానీ ప్రజాసమాచార అధికారి ఇవేవీ ఆలోచించకుండానే నిరాకరిస్తాడు. మొదటి అప్పీలులో పై అధికారి కూడా ఆలోచించడం లేదు. అప్పుడు విధి లేక రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు రావాల్సి ఉంటుంది. కమిషన్ స్వతంత్రంగా అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా రాజకీయ నాయకులకు భయపడకుండా సమాచారం ఇవ్వాలో వద్దో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా తీర్పులు చెప్పింది కూడా. ఉదాహరణకు పైన ఉదహరించినట్టు ఉద్యోగిపైన వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వ్యక్తిగత సమాచారం కాదని, ఆ సమాచారం ఇవ్వవలసిందే అని ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనం ఉంటే ఇవ్వవచ్చునని ఒక షరతు విధించింది. నిజానికి ఈ షరతు వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు మాత్రమే వర్తిస్తుందని చట్టం చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ దురదృష్టవశాత్తూ బొంబాయ్ హైకోర్టు సమాచార చట్ట వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దానిపైన అప్పీలు అనుమతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అప్పీలు అనుమతి తిరస్కరణను సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా భావించి సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది సమాచార హక్కును నీరుగార్చే ప్రయత్నం. కొన్నిసార్లు కమిషనర్ అనుకూల తీర్పు ఇచ్చినా, బలంగా ఉన్న అవినీతి అధికారి తరఫున ప్రభుత్వమే రిట్ పిటిషన్ వేస్తున్నది. హైకోర్టులు వందలాది స్టే ఉత్తర్వులు ఇస్తున్నాయి. ఇప్పటికి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన వెల్లడి ఉత్తర్వులపైన 1700 రిట్ పిటిషన్లు ఉన్నాయని అంచనా. రాష్ట్ర సమాచార కమిషనర్ల ఉత్తర్వులపైన కొన్ని వందల కేసులైనా ఉంటాయి. పదిరూపాయల ఫీజుతో సమాచారం అడగడం ద్వారా సమస్య పరిష్కరించుకున్న వారు లక్షలాది మంది ఉంటారు. అక్కడ అధికారులు కూడా సహకరిస్తారు. కానీ సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేధిం పులకు గురయ్యే వారు కూడా లక్షలాది మంది ఉంటారు. వారికి సమాచారం ఇవ్వనక్కరలేదని కమిషనర్లుగా ఉన్న మాజీ ఉన్నతాధికారుల్లో కొందరు భావిస్తారు. వారు తమకు ఇన్నాళ్లూ అధికారం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించిన ప్రభుత్వ రహస్యాలను రక్షించే బాధ్యత ఉందనే భావనలో ఉంటారు. రాజకీయంగా తమను ఆదుకుని, పదవీ విరమణ తరువాత ఇంత గొప్ప పదవినిచ్చి, అయిదేళ్లపాటు అందలంలో ఉండి పల్లకీ ఊరేగే అవకాశం ఇచ్చిన నాయకుడికి కృతజ్ఞతతో ఉండటం కోసం సమాచారం ఇవ్వకుండా కాపాడుతూ ఉంటారు. వీరిమీద రిట్ పిటిషన్ వేసేంత తీరిక, డబ్బు సామాన్యుడికి ఉండదు. కేంద్ర కమిషన్ భారత ప్రభుత్వానికి చెందిన సర్వోన్నత న్యాయస్థానం వంటి సంస్థ. అది ప్రభుత్వ విభాగం కాదు. అక్కడ ఉన్నది సమాచార అధికారి కాదు కమిషన్. నిజానికి అది ట్రిబ్యునల్ వలె కోర్టువలె పని చేస్తున్నది. పని చేయాలి. పనిచేయనీయాలి. చట్టం ప్రకారం ఏర్పడిన ఒక నిర్ణాయక సంస్థ, చట్టం కింద నిర్ణయం ప్రకటిస్తే, ఆ నిర్ణయం చట్టం ప్రకారం ఉందో లేదో పరిశీలించడానికి హైకోర్టుకు వెళ్లవచ్చు. కానీ అందులో సీఐసీని పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరయినా కమిషన్ మీద కేసు వేస్తే రక్షించడానికి ప్రభుత్వం లాయర్ను నియమించాల్సింది పోయి, ప్రభుత్వమే కేసు వేయడం ఎంత అన్యాయం. కింది కోర్టు తీర్పు మీద ప్రభుత్వం హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. కానీ అందులో కింది కోర్టును ప్రతివాదిగా చేర్చదు. కమిషన్పైన ప్రభుత్వం స్వయంగా కేసులు వేయడం ఎందుకు? పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రభుత్వం వంచించడం ఎందుకు? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
రూపాయి నాణెం = రూ.1.11?
సాక్షి,ముంబై: రూపాయి నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.11. అవునా... అని ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఆర్బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటే దాని మార్కెట్ వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట. ఆర్టీఐ ద్వారా ఇండియా టుడే అడిగిన ప్రశ్నను వివిధ ప్రభుత్వ నాణేల ముద్రణా కార్యాలను పంపించింది రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా. అయితే నాణేల ఉత్పత్తి కయ్యే మొత్తం వ్యయం వివరాలను అందించేందుకు ఇండియన్ గవర్నమెంట్ మింట్ (ఐజీఎం) నిరాకరించింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 8 (1) (డీ) ప్రకారం వాణిజ్య రహస్యమని పేర్కొంది. మింట్ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవలకాలంలో భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో నాణేల తయారీని భారీగా తగ్గించి వేసింది మింట్. 2016-17లో 2201 మిలియన్ల నాణేలను తయారుచేసిన మింట్..2015-16లో 2151 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో రూపాయి నాణేల 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది. హైదరాబాద్ మింట్ కూడా గత నాలుగు సంవత్సరాల గణాంకాల సమాచారాన్ని అందించింది. ముంబైతోపాటు హైదరాబాద్లలో ఉన్న మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2. రూ.1 నాణేలు తయారవుతున్నాయని మింట్ తెలిపింది. ఖర్చులు పెరిగినప్పటికీ నాణేల తయారీని నిలిపివేసే అవకాశాలు లేవని మింట్ ప్రకటించింది. అయితే రూపాయి నాణెంతో పోలిస్తే మిగిలిన నాణేల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ. 2 నాణెం తయారవుతుండగా, 5 రూ. నాణేనికి రూ.3.69, 10 రూపాయల నాణేనికి రూ. 5.54 ఖర్చు అవుతోంది. -
ఆర్టీఐని ఉల్లంఘించిన ఆర్బీఐపై చర్యలేవి?
రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలనే నోటీసును నేను సమాచార కమిషనర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కు ఇచ్చినందుకు కారణాలు అడుగుతున్నారు. చట్టం ప్రకారం సమాచారం ఎవరి దగ్గర ఉందో ఆ అధికారి సమాచారం ఇవ్వకపోతే నోటీసులు ఎన్నోసార్లు ఇచ్చాను. దానిపై ఎవరూ ప్రశ్నించలేదు. ఈ సారి గవర్నర్ స్థాయి అధికారికి ఇచ్చేసరికి చర్చ జరిగింది. ఆర్బీఐ రుణ ఎగవేతదారుల గురించి, బ్యాంకుల ఇన్స్పెక్షన్ నివేదికల గురించి వెల్లడించాలని మన పూర్వ కమిషనర్ శైలేశ్ గాంధీ ఇచ్చిన పదకొండు ఆదేశాలను ఆ సంస్థ పాటించకుండా సుప్రీం కోర్టులో సవాలు చేయడం, మన సర్వోన్నత న్యాయస్థానం, ఆర్బీఐ వాదం చెల్లదని కొట్టి వేసిన తరువాత కూడా ఆ ఆదేశాలను ఆర్బీఐ పాటించడం లేదని బాధపడుతూ శైలేశ్ గాంధీ ఒక సామాన్యవ్యక్తిగా ఆర్టీఐ కింద ఫిర్యాదు చేస్తే, దానికి ఆర్టీఐ దరఖాస్తు ఆధారం లేదనే సాకుతో సమాచార కమిషన్ తిరస్కరించినపుడు ఎవ్వరూ అడగలేదు. బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారి వివరాలు, బ్యాంకు ఇన్స్పెక్షన్ నివేదికలు వెల్లడించాలని కోరుతూ ఆర్టీఐ దరఖాస్తు దాఖలైతేనే కదా ఆ వ్యవహారం సీఐసీని దాటి సుప్రీంకోర్టుదాకా వెళ్లింది? సుప్రీంకోర్టు ఆదేశించినా సరే ఆ సమాచారం ఇవ్వను పొమ్మని ఆర్బీఐ తన అధికారిక అంతర్జాల వేదికపై బాహాటంగా ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో ఒక పిల్ విచారణలో ఉంది కనుక ఇవ్వకపోవడం అన్యాయం. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు వచ్చినపుడు గతంలో పదకొండు అప్పీళ్లలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలను, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆర్బీఐ తిరస్కరించిన విషయాన్ని గమనించి ఇప్పటికైనా ఆ ఆదేశాలను పాటించాలని ఆర్బీఐకి ఉత్తర్వులు జారీచేశాను. ఆర్టీఐ చట్టం రాకముందు 2003లో ఒక పిల్ ద్వారా అప్పుఎగవేతదారుల వివరాలు అడిగితే, సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో ఆ వివరాలు ఇమ్మని ఆర్బీఐని ఆదేశించింది. వారిచ్చారు. ఇంతవరకు ఆ విచారణ ముగియనే లేదు. విచారణలో ఒక అంశం ఉంది కనుక ఆ అంశంపై ఏ సమాచారమూ ఇవ్వబోమని ప్రజాసమాచార అధికారి కూడా సెక్షన్ 8(1)(బి) ప్రకారం అనడానికి వీల్లేదు. కోర్టులు నిషేధించిన సమాచారం మాత్రమే ఇవ్వకూడదు. కాని ఈ చట్టనియమానికి వ్యతిరేకంగా ఇద్దరు కమిషనర్లు పెండింగ్ కేసు నెపంతో, సుప్రీంకోర్టు ఏ విషయమో తేల్చేదాకా మేమేమీ చెప్పం అనడం సబబుకాదు. మరోవైపు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్బీఐ పదకొండు అప్పీళ్లపై విచారణ జరిపి తుదితీర్పు ఇస్తూ వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశిస్తే దాన్ని పాటించకపోవడం తప్పు. సీఐసీ ఇచ్చిన పదకొండు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన విషయం గుర్తించాలి. సెక్షన్ 4(1)(బి) ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ ముఖ్యంగా ఆర్బీఐ స్వయంగా వెల్లడి చేయవలసిన సమాచారం వెల్లడి చేయాలని నిర్దేశిస్తూ ఉంటే, సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా ‘నేను చెప్పను పొమ్మం’టూ ఉంటే ఆ అంశాన్ని పరీక్షించి సరైన చర్యలు తీసుకునే అధికారం సీఐసీకి ఉంది. జనం డబ్బును ఎగవేసిన దురుద్దేశపూర్వక రుణగ్రస్తుల పేర్లను రహస్యంగా కాపాడే నేరానికి సహకరించే చట్టపరమైన బాధ్యతేదీ కమిషన్ మీద లేదు. ఎవరి పేర్లు దాచాలని చూస్తున్నారు? జూన్ 2017 నాటికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, మన భారతీయ బ్యాంకులను కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు, 2017 సెప్టెంబర్ 30 నాటి లెక్కల ప్రకారం లక్షా పదివేల కోట్ల రూపాయలు బాకీ పడిన ఘనులు వారు, వేయి కోట్లరూపాయలకు పైగా అప్పు తీసుకుని మొత్తం 26 వేల కోట్లదాకా ఎగవేసిన 11 అగ్రశ్రేణి రుణగ్రహీతలు వారు, జూన్ 30, 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా 50 కోట్ల కన్న ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు వేస్తే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7000 మంది ఘరానా ప్రముఖులు. ఇంకా ఎందరో థగ్గులు, మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? ఒకవైపు మూడులక్షల మంది రైతులు చిన్న అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక ప్రాణాలు పొలాల్లోనే వదిలేస్తుంటే, మన బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను రక్షించాలని కమిషనర్లుగా మేం ఏదైనా ప్రమాణం చేసామా? ఇప్పటికైనా శైలేశ్ గాంధీ ఇచ్చిన వెల్లడి ఆదేశాలను, వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ అమలు చేయడానికి తగిన చర్యలు మొదలు పెట్టాలి. మన సమాచార చట్టం మీద, సీఐసీ సంస్థ మీద జనానికి ఉన్న నమ్మకాన్ని కాస్తయినా పెంచాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
లైంగిక వేధింపులపై ఇంత నిర్లక్ష్యమా?
దామోదర్ వ్యాలీ కార్పొరే షన్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులొచ్చాయి, వాటిపైన ఏ చర్యలు తీసు కున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యా దులు పరిష్కరించారో, ఎన్ని పరిష్కరించలేదో తెలియజేయాలని ఆర్టీఐ కింద సౌమెన్ సేన్ కోరారు. అసిస్టెంట్ ఇంజినీర్ శంభుదాస్పైన చేసిన ఫిర్యా దుపై ఆయన నుంచి వాంగ్మూలం రికార్డు చేసి ఉంటే దాని ప్రతిని ఇవ్వాలని కోరారు. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గాని జవాబు ఇవ్వలేదు. కమిషన్ ముందు సౌమెన్ సేన్, ఆమె భర్త హాజరై నిజాలను దాచి నిందితుడిని డీవీసీ అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. దామోదర్ వ్యాలీ సంస్థగానీ, జాతీయ మహిళా కమి షన్గానీ ఏ జవాబూ ఇవ్వకపోవడం న్యాయం కాదని, ఈ రెండు సంస్థల సమాచార అధికారులపై జరిమానా విధించాలని, అడిగిన సమాచారం ఇప్పిం చాలని కోరారు. ఇంటర్నల్ కమిటీని నియమించి ప్రాథమిక విచారణ జనవరి 2013లోనే జరిపించి నప్పటికీ ఇంతవరకు విచారణ ముందడుగు వేయ లేదని, అనేక సార్లు కమిటీలను మార్చుతూ కాలం గడుపుతున్నారని వివరించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన తరువాత నేర సంఘటన జరిగిన మూడు నెలల్లోగా లోకల్ కమిటీని గానీ ఇంటర్నల్ కమిటీనిగానీ నియమించాలని 2013 చట్టం సెక్షన్ 9 వివరిస్తున్నది. నిందితుడు సంస్థలో ఉద్యోగి అయితే సర్వీసు నియమాలను అనుసరించి ఎంక్వయిరీ జరిపించాల్సి ఉందని సెక్షన్ 11 నిర్దేశిస్తున్నది. ప్రాథమికంగా ఆరోపించిన నేరం జరిగిందని తేలితే సెక్షన్ 509 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సెక్షన్ 12 కింద బాధితురాలు తనను గానీ, తనను బాధించిన వ్యక్తినిగానీ మరో చోటికి బదిలీ చేయాలని కమిటీని కోరవచ్చు. అయితే విచారణ నివేదిక ప్రతిలేకుండా ఈ హక్కులను బాధితురాలు కోరడానికి వీల్లేదు. సెక్షన్ 13 బాధితురాలికి విచారణ నివేదిక ప్రతిని విచారణ ముగిసిన పదిరోజులలో ఇచ్చితీరాలని నిర్దేశిస్తున్నది. విచారణలో ఆరోప ణలు రుజువైతే జిల్లా అధికారి నిందితుడిపై ఏ చర్యలు తీసుకోవాలో కమిటీ ఆదేశించే వీలుంది. ఈ పనిని దుష్ప్రవర్తనగా భావించి అందుకు రూల్స్ ప్రకారం చర్య తీసుకోవాలి. అతని జీతం నుంచి కొంత సొమ్మును మినహాయించి, ఆ సొమ్మును బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కూడా ఆదేశించవచ్చు. ఈకేసులో బాధితురాలైన మహిళకు విచారణ నివేదిక ప్రతిని ఇవ్వకపోగా, ఆర్టీఐలో అడిగిన తరు వాత కూడా పీఐఓ ఇవ్వలేదు. అంటే 2013 చట్టాన్ని అమలు చేయలేదు. జీవన హక్కుతో పాటు, పనిచేసే హక్కు కూడా ఉల్లంఘిస్తూ ఉంటే అందుకు సంబం ధించిన సమాచారాన్ని కోరినప్పుడు కేవలం రెండు రోజుల్లో ఇవ్వాలని దామోదర్ వ్యాలీ సంస్థ గానీ, జాతీయ మహిళా కమిషన్గానీ భావించలేదు. మహి ళలపై వివక్ష నిర్మూలన ఒప్పందం (సెడా) విశాఖ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటువంటి చర్య లను నిరోధించవలసి ఉంటుందని మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మ అభిప్రాయ పడ్డారు. రెండు చట్టాలు ఆమెకు ఇచ్చిన హక్కులను రెండు ప్రభుత్వ సంస్థలు, (దామోదర్ వ్యాలీ, జాతీయ మహిళా కమిషన్) ఉల్లంఘించాయని సమాచార కమిషన్ భావించింది. కనుక ఆ రెండు సంస్థల పీఐఓలకు జరిమానా ఎందుకు విధించకూ డదో కారణాలు వివరించాలని నోటీసు జారీ చేసింది. దామోదర్ వ్యాలీ సంస్థ అడిగిన పూర్తి సమా చారాన్ని వెంటనే ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. 2012లో ఇచ్చిన ఫిర్యాదుపైన అయిదేళ్లు దాటినా ఏ చర్య తీసుకోలేదని బాధితురాలు ఫిర్యాదు చేశారు. సమాచార కమిషన్ ఆదేశాల తరువాత 29 పేజీలు ఇచ్చినా అనేక కీలకపత్రాలు ఇవ్వలేదు. కొత్త కమిటీ విచారణ జరుపుతుందని తెలిపినా, ఇంతవరకూ ఏ చర్యా తీసుకోలేదని వివ రించింది. బాధితురాలికి పరిష్కారం చూపకపోగా ఫిర్యాదును ఉపసంహరించుకోలేదన్న ఆగ్రహంతో ఆమెని అనేక పర్యాయాలు బదిలీ చేశారు. చివరకు ఆమె ప్రమోషన్ కూడా నిలిపివేశారు. మహిళా కమిషన్ తనకు అందిన ఆర్టీఐ దర ఖాస్తును దామోదర్ వ్యాలీ సంస్థకు బదిలీ చేసింది. లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించే బాధ్యత కమిషన్కు లేదని వాదించింది. సమాచార కమిషన్ ఆదేశించిన తరువాత 30 పుటలు ఇచ్చాం కనుక జరి మానా విధించరాదని దామోదర్ వ్యాలీ అధికారిణి కోరారు. డీవీసీ అధికారిణి అంశుమన్ మండల్ పైన 25 వేలరూపాయల జరిమానా విధిస్తూ కమిషన్ ఆదే శించింది. అంతేకాకుండా బాధితురాలికి లక్ష రూపా యల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. (16.10.2018న సౌమెన్ సేన్ కేసులో సీఐసీ ఆదేశం ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
మిస్త్రీని తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన
ముంబై: టాటా సన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్గా సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం స్పష్టం చేసింది. కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో పాటు టాటా సన్స్ స్వంత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్కి చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆగస్టు 31న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ముంబైలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఉదయ్ ఖొమానె ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు, దీనిపై స్పందించేందుకు టాటా సన్స్ వర్గాలు నిరాకరించాయి. -
ఎన్ఆర్ఐలూ ఆర్టీఐ దరఖాస్తు చేయొచ్చు!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న భారతీయులు (ఎన్ఆర్ఐలు) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రభుత్వ విభాగాలను సమాచారం కోరవచ్చని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఆర్టీఐ దరఖాస్తులు చేసేందుకు ఎన్ఆర్ఐలు అర్హులు కాదని ఈ ఏడాది ఆగస్టు 8న సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు తెలియజేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం భారతీయులందరికీ ఆ అవకాశం ఉంటుందనీ, ఎన్ఆర్ఐలు కూడా భారతీయులేనంటూ లోకేశ్ బాత్రా అనే సామాజిక కార్యకర్త మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో జితేంద్ర సింగ్ ఇచ్చిన సమాచారాన్ని మార్చి, ఆ సమాధానాన్ని ప్రభుత్వం మళ్లీ లోక్సభ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. -
సిక్కిం మ్యూజియం అవినీతి
నవాంగ్ గ్యాట్సో లాచెంపా ఒక నవ యువకుడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్న విద్యావంతుడు. చాలామంది వలె విదేశాల్లోనే స్థిరపడి అక్కడ డాలర్లు సంపాదించాలనుకునే (వి)దేశ భక్తుడు కాదు నవాంగ్. తన ప్రాంతానికి రావాలని, అక్కడ తన చదువుతో ఏమైనా చేయాలని అనుకున్న వాడు. కాని తీరా సిక్కింకు చేరుకున్న తరువాత అతనికి అవినీతి విలయతాండవం చేస్తూ కనబడింది. అక్కడా ఇక్కడా వ్యాపించిన భ్రష్టాచారాన్ని ఏ విధంగా ఆపడం? చివరకు మ్యూజియంలో కూడా అవినీతి. కనిపించిన దారి ఆర్టీఐ. ఆర్టీఐకి దరఖాస్తు దాఖలు చేశాడు. మ్యూజియం గ్రాంట్ స్కీం పైన నిపుణుల సంఘం 29.12.2016నాడు జరిపిన 14వ సమావేశం నిర్ణయాలు (మినిట్స్) ప్రతులు ఇవ్వాలన్నాడు. ఈ సమావేశం జరిగిందని సాంస్కృతిక మంత్రిత్వశాఖ అంతర్జాల వేదికమీద రాశారని, ఈ సమావేశం సిక్కిం రాష్ట్ర మ్యూజియం ప్రాజెక్టు (అంచనా 1574 లక్షల రూపాయలు) గురించి జరిగిందని చెప్పారు. 31 డిసెంబర్ నాడు ఈ మెయిల్లో ప్రస్తావించిన నియమాలను పాటించకుండా రాష్ట్రం తన వంతు నిధులు ఇవ్వకపోతే ఏ చర్యలు తీసుకుంటారని కూడా అడిగారు. సీపీఐఓ ఏ సమాధానమూ ఇవ్వలేదు. సిక్కిం రాష్ట్రానికి మ్యూజియం గ్రాంట్ స్కీంను మంజూరు చేసిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ స్కీం అమలులో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై తగినచర్యలు తీసుకోవాలని రెండో అప్పీల్లో కోరారు. డిసెంబర్ 31, 2016 న కేంద్రం మంజూరు చేసిన నిధులను సిక్కిం రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల వారసత్వ శాఖ కార్యాలయంలో అధికారులు మింగారని కమిషన్కు విన్నవించారు. మ్యూజియం గ్రాంట్ స్కీంకు 1574 లక్షలు కేటాయించి, 500 కోట్లు విడుదల చేశారు. దీంతో సిక్కిం రాష్ట్ర మ్యూజియంను పునరుద్ధరించి ఆధునీకరించేందుకు రాష్ట్రం వంతుగా 10 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఎనిమిదినెలలు గడిచినా ప్రాజెక్టు మొదలు కాలేదు. రాష్ట్రంలో వివరాలు ఇవ్వకపోవడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి 8.4. 2018న ఫిర్యాదు చేశారు. సిక్కిం మ్యూజియం స్కీంలో నిధుల గల్లంతు జరిగిందని, ప్రాజెక్టు నిధులు లక్ష్యాల సాధనకు వినియోగించడం లేదని నవాంగ్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ పనులపైన నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మంజూరీ లేఖ నుంచి మ్యూజియం గ్రాంట్ స్కీంపైన నిపుణుల కమిటీ 29 డిసెంబర్ 2016 నాటి 14వ మీటింగ్ నిర్ణయాల నివేదిక దాకా అన్ని పత్రాలు పరిశీలించిన తరువాత రూ. 3.44 కోట్లు మాత్రమే సిక్కిం రాష్ట్ర వాటాగా ఇచ్చిందని తేలింది. నవాంగ్కు అన్ని పత్రాలు ఇవ్వడంతోపాటు ఈ ఆర్టీఐ దరఖాస్తును అప్పీలును మోసంపైన ఫిర్యాదుగా భావించి, విచారణ జరిపించాలని సమాచార కమిషన్ సూచించింది. నిజానికి నవాంగ్ అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికిగానీ, వాయిదా వేయడానికిగానీ వీలు లేదు. ఇటువంటి సమస్యల మీద ఫైళ్లలో సమాచారం నమోదై ఉండకపోవచ్చు. కనుక సమాధానం ఇవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ తమ వద్ద ఈ అంశంపై ఉన్న ఏ సమాచారమైనా సరే ఇవ్వకపోవడం తప్పవుతుంది. మ్యూజియం పునరుద్ధరణ ఫైళ్లను, సంబంధిత కాగితాలను అన్నీ దరఖాస్తు దారుడికి చూపడం ద్వారా పీఐఓ తన బాధ్యతను నిర్వర్తించవచ్చు. లేదా ఆయన అడిగిన ప్రశ్నలకు తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. లేదా పై అధికారుల ముందు ఫైల్ ఉంచి సమస్య వివరించి అధికారులు తీసుకున్న నిర్ణయాలను వివరించాలి. సమాచార హక్కు చట్టం నిష్క్రియపైన సవాలుచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నెలరోజులలోగా నిర్ణయం తీసుకోలేకపోతే ఆ విషయం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. నెలరోజులలో ఏ విషయమూ చెప్పనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంలో నిష్క్రియ, నిష్పాలన, నిర్లజ్జ ప్రధాన సమస్యలు. సిక్కిం మ్యూజియంలో అవినీతి జరిగిందని అనేక పర్యాయాలు ఈ యువకుడు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు లేడు. నిష్క్రియ నిశ్చేతనంపై సవాలు చేయడానికి ఆర్టీఐని నమ్మి ఆయన సమాచారం అడిగాడు. దానికి ఏవో కారణాలుచెప్పి కేంద్రం, రాష్ట్రం తప్పించుకోజూస్తున్నాయి. ఏవైనా చర్యలు తీసుకుంటే తప్ప ఏ చర్యలు తీసుకున్నారో చెప్పడానికి ఉండదు. చర్యలు తీసుకోరు కనుక జవాబు చెప్పకుండా కుంటిసాకులు చూపుతుంటారు. ఇందుకు సిక్కిం మ్యూజియం అవినీతి కేసు మరొక ఉదాహరణ. అంతే. (నవాంగ్ గ్యాట్సో లాచెంగ్పా కేసు CIC/MCULT/A/2017/607024 లో íసీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
విరమణతోనూ దక్కని పింఛను
దశాబ్దాలు పనిచేసి రిటై రైన వారికి నెలనెలా పింఛ ను ఇవ్వాలని పీఎఫ్ చట్టం 1952, పింఛను పథకం 1995 స్పష్టంగా నిర్దేశి స్తున్నాయి. కానీ విరమణ చేసి చాలా ఏళ్లు గడచినా పెన్షన్ దక్కని బెనర్జీ అనే వృద్ధుడి పక్షాన ప్రవీణ్ కోహ్లీ అనే వ్యక్తి పోరాటం జరిపాడు. వినియో గదారుల కమిషన్ బెనర్జీకి అనుకూల తీర్పుఇచ్చినా పింఛను ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? అంటూ కోహ్లీ కొన్ని ప్రశ్న లు వేశాడు. పీఎఫ్ ఆఫీస్ నిష్క్రియ వల్ల బెనర్జీ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. తన మిత్రుడు బెనర్జీ తరఫున కోహ్లీ వేసిన ఆర్టీఐ దరఖాస్తుతో పని జరిగింది. కోల్కతాలో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగి కోసం గుర్గావ్ నుంచి అతని మిత్రుడు ఆర్టీఐ దర ఖాస్తుపెడితే, ఢిల్లీ దగ్గరి గుర్గావ్ నుంచి కోల్కతా వచ్చి దస్త్రాలు చూసుకుని ప్రతులు తీసు కోవాల న్నారు. దీంతో రెండో అప్పీలులో కోహ్లీ తన మిత్రు డు కష్టాలు ఏకరువు పెట్టారు. 1969లో సర్వీసులో చేరి 58 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన బెనర్జీకి నెల పింఛనుకు అర్హుడు. కానీ ఇవ్వలేదు. కోల్కతా జిల్లా వినియో గదారుల ఫోరంలో కేసు ఓడిపోయాడు. రాష్ట్ర కమిష న్ బెనర్జీకి పింఛను అర్హత ఉందని వెంటనే చెల్లిం చాలని ఆదేశించింది. విరామం లేకుండా 33 ఏళ్ల 7 నెలలు పనిచేసిన బెనర్జీకి పింఛను ఆపాల్సిన కారణ మే లేదని, పింఛను పథకం కింద మూడునెలల్లో ఆయన పింఛను లెక్కించి 2002 సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి పింఛను ఇవ్వాలని ఆదేశించింది. 26వేల 400 రూపాయలు తప్ప మరే ఇతరమైన తగ్గింపులు చేయరాదని, నెల రోజుల్లోగా బెనర్జీకిS పింఛను బకాయిలన్నీ చెల్లిం చాలని, అన్యాయంగా పింఛను ఇవ్వనందుకు జరి మానాగా 12 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర కమిషన్ ఆదేశించింది. కానీ, ఏదో అన్యాయం జరిగినట్టు కోల్కతా ఈపీఎఫ్ జాతీయ వినియోగదారుల కమి షన్ కు అప్పీలు చేుసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఉత్తర్వును ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ హుందాగా గౌరవించాల్సింది. కానీ అన్యాయంగా జాతీయ ఫోరం దాకా లాగడం న్యాయం కాదు. పీఎఫ్ సంస్థ ఈ ఉద్యోగికి ఇచ్చే స్వల్ప పింఛను కన్నా చాలా ఎక్కువ డబ్బు ఖర్చుచేసి ఈ అప్పీలు వేసి ఉంటుందని జాతీయ వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంత జరిగాక కూడా ఆ పేద కార్మికుడిపై ఈపీఎఫ్ పగ బట్టినట్టు సుప్రీంకోర్టులో జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుచెల్లదని దుర్మార్గంగా అప్పీలు దాఖలు చేసింది. తరువాత ఎవరో పుణ్యాత్ముడైన అధికారి ఆదేశాల మేరకు ఈ అప్పీలును ఉపసంహరించుకుంది. ఇప్పుడైనా పింఛను ఇస్తారేమో అనుకుంటే బెనర్జీకి నిరాశే ఎదు రయింది. తీర్పు అమలు చేయలేదు. కేవలం ఒక నెల వేయి రూపాయల పింఛను ఇచ్చి, ‘‘ఇంతే. నీకేమీ రాదు. నీ పింఛనుసొమ్మంతా సంస్థ స్వాధీనం చేసు కుంది,’’ అని ఈపీఎఫ్ నిర్దయగా ఉత్తర్వులు జారీ చేసింది. బెనర్జీ పింఛను నిరాకరణ కథ ప్రభుత్వ హింస, సర్కారీ క్రూరత్వానికి ఒక ఉదాహరణ. జాతీ య వినియోగదారుల కమిషన్ తీర్పును కూడా అమ లు చేయకపోవడం అన్యాయం అని అతను మొర బెటు ్టకుంటే వినేవాడు లేడు. ప్రధానమంత్రికి, కేంద్ర కార్మి క శాఖ కార్యదర్శికి విన్నపాలు పెట్టుకున్నారు. కానీ ఎవ్వరికీ దయ రాలేదు. కనీసం పీఎఫ్ ఛీఫ్ కమిషనర్ అయినా వినిపించుకుంటారేమో అనుకు న్నారు. కానీ ఆయనకు కూడా తీరిక లేదు. ఆ దశలో ఆర్టీఐ దరఖాస్తు వేస్తే అది కూడా దున్నపోతుమీద వానే అయింది. జితేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ అనే సామాన్య ఉద్యోగికి జార్ఖండ్ ప్రభుత్వం పింఛను నిరాకరించడమేగాక, ఈ విషయమై ఈ విధంగానే సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఉద్యోగ విరమణ చేసిన సామాన్య పౌరుడిపై పోరాడింది. పింఛను, గ్రాట్యుటీ అనేవి ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు కావు. అది వారి రాజ్యాంగ హక్కు (300 ఏ). వారి ఆస్తి. ప్రభుత్వం వాటిని అకారణంగా స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. పైగా పింఛను, గ్రాట్యుటీ మొత్తాలను నిలిపివేసి, స్వాధీనం చేసుకునే అధికా రాన్ని ప్రభుత్వానికి ఏ చట్టమూ ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఉద్యోగుల పింఛను పథకం –1995 ప్రకారం ఉద్యోగుల యజ మానులు లేదా సంస్థలు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆ సంస్థల నుంచి జరిమా నా, నష్టపరిహారాలను వసూలు చేయాలని పన్నెండో నియమం అధికారాన్ని ఇస్తున్నది. మొత్తం దస్తావే జుల ప్రతులు బెనర్జీకి ఇవ్వాలని, నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూ డదోచెప్పాలని, కార్మికుడిని వేధిం చినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. (ప్రవీణ్ కోహ్లీ వర్సెస్ ఇపీఎఫ్ఓ కొల్కత్తా ఇఐఇ/ఉ్కఊౖఎ/అ/2018/153919 కేసులో 28.9.2018 నాటి ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
క్రికెట్ ‘సమాచారం’ చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ పరిపాలనకు సంబంధిం చిన కీలక పరిణామం... ఇప్పటి వరకు సగటు క్రికెట్ అభిమాని దేని గురించి అడిగినా ‘చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ దాటవేస్తూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పవర్కు బ్రేక్... బీసీసీఐని కూడా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రజలు సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం కోరితే బీసీసీఐ తప్పనిసరిగా దానిని వెల్లడించాల్సి ఉంటుంది. వివిధ చట్టాలు, సుప్రీం కోర్టు ఉత్తర్వులు, లా కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక, జాతీయ క్రీడా మంత్రిత్వశాఖ నిబంధనలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) పరిధిలోకి బీసీసీఐ వస్తుందంటూ సీఐసీ తేల్చింది. ‘దేశంలో క్రికెట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సర్వహక్కులు ఉన్న బీసీసీఐ ప్రభుత్వ ఆమోదం పొందిన జాతీయ స్థాయి సంస్థ అంటూ సుప్రీం కోర్టు కూడా గతంలోనే స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం పరిధిలో జాతీయ క్రీడా సమాఖ్య జాబితాలో బీసీసీఐ ఉంటుంది. బోర్డుతో పాటు అనుబంధ సంఘాలన్నింటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది’ అని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు తన 37 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టాన్ని సమర్థంగా అమలు పరచడం కోసం 15 రోజుల్లోగా దరఖాస్తులు స్వీకరించే ఏర్పాట్లు చేసుకోవాలని, సమాచార అధికారులను కూడా నియమించుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, సీఓఏలకు ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. బీసీసీఐ ఏ మార్గదర్శకాల కింద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందో, భారత్కు ఆడే ఆటగాళ్లను ఎంపిక చేస్తోందో తెలపాలంటూ గీతారాణి అనే మహిళ చేసిన దరఖాస్తుతో ఇదంతా జరిగింది. టీమిండియా క్రికెటర్లు దేశం తరఫున ఆడుతున్నారా లేక ప్రైవేట్ సంఘం బీసీసీఐ తరఫున ఆడుతున్నారా అని ఆమె ప్రశ్నించింది. తమ దగ్గర తగిన వివరాలు లేవంటూ ఆమెకు కేంద్ర క్రీడాశాఖ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో సీఐసీ జోక్యం అనివార్యమైంది. అసాధారణ అధికారాలు ఉన్న బీసీసీఐ పనితీరు వల్ల ఆటగాళ్ల మానవ హక్కులకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని... ఇలాంటి అంశాలపై ఇన్నేళ్లుగా బోర్డును బాధ్యులుగా చేయాల్సి ఉన్నా సరైన నిబంధనలు లేక ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదని కూడా ఆచార్యులు అభిప్రాయ పడ్డారు. -
‘టీటీడీ జవాబుదారీగా ఉండాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ప్రజాసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. టీటీడీలో నెలకొన్న వివాదం కేవలం శ్రీవారి నగల సమస్య లేదా శ్రీవారి ప్రాచీన కట్టడాల సమస్యో కాదని వ్యాఖ్యానించారు. శాసనాల్లో ఉన్న నగలకు, టీటీడీలో ఉన్న నగలకు అస్సలు పోలికే లేదని పురావస్తు శాఖకు చెందిన ఒక డైరెక్టర్ చెప్పారని... ఆ నివేదికపై సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా అడిగితే జవాబు చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. టీటీడీలో చెలరేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ... వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సెప్టెంబరు 28ను తుది విచారణ ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ జవాబుదారీగా ఉండటానికి ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవచ్చన్నారు. ప్రజలు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీకి ఉందని స్పష్టం చేశారు. -
కోహినూర్ వజ్రం మనకు దక్కేనా?
మన చరిత్ర, సంస్కృతి కాపాడుకోవడంలో మన ఘనత ఏమిటి? మన తాతలు తాగిన నేతుల కథలు చెప్పి మూతుల వాసన చూడమంటున్నామే గాని, ఆ ఘనత చాటే సాక్ష్యాలను దోచుకుపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామా? అని ఓ పౌరుడు ఆర్టీఐలో ప్రశ్నించాడు. కోహినూర్ వజ్రం, సుల్తాన్గంజ్ బుద్ధుడు, నాసాక్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం, ఉంగరం, మహారాజా రంజీత్ సింగ్ బంగారు సింహాసనం, షాజహాన్ మద్యపాత్ర, అమరావతి నిర్మాణ వస్తువులు, వాగ్దేవి చలువరాతి బొమ్మ, టిప్పు సుల్తాన్ దాచుకున్న యాంత్రిక పులి బొమ్మ వంటి విలువైన వస్తువులను విదేశీ పాలకులు మన దేశం నుంచి తరలించుకుపోయారని, వాటిని రప్పించే ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయో తెలపాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరుతూ రాజమండ్రికి చెందిన బీకే ఎస్ఆర్ అయ్యంగార్ ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. ప్రధాని కార్యాలయం ఆ పత్రాన్ని వెంటనే పురావస్తు శాఖకు బదిలీ చేసింది. కళాఖండాల ఖజానా చట్టం ప్రకారం 1972 తరువాత దేశం నుంచి తస్కరించిన పురాతన వస్తువులను తెప్పించేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది గాని అంతకుముందు స్మగ్లింగ్ అయిన వస్తువులు, వాటి తరలింపుపై తాము ఏ చర్యలూ తీసుకోలేమని ఏఎస్ఐసీపీఐఓ తెలిపారు. దేశం నుంచి తరలించుకుపోయిన 25 ప్రాచీన వస్తు వులను తిరిగి రప్పించగలిగామని, దరఖాస్తుదా రుడు అడిగిన కోహినూర్ వంటి అత్యంత విలువైన వస్తువుల గురించి తామే చర్యలు తీసుకోలేమని జవాబు ఇచ్చారు. తనకు కావలసిన సమాచారం ఇవ్వలేదని కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలు చేశారు. స్వాతంత్య్రానికి ముందే తరలి పోయిన కోహి నూర్ వజ్రం, టిప్పు ఖడ్గం వంటి చారిత్రక వార సత్వ చిహ్నా లను స్వదేశం రప్పించే అధికారం, వన రులు ఏఎస్ఐ శాఖలకు లేవని తనకు తెలుసనీ, అందుకే ప్రధాని కార్యాల యాన్ని సమాచారం అడిగానని, దానికి సమాధానం చెప్పకుండా, అధికారాలు లేని పురావస్తు శాఖకు బదిలీ చేయడం అన్యాయమని అయ్యంగార్ విమర్శించారు. కోహి నూర్ వజ్రం తిరిగి తెప్పించాలని కోరుతూ అఖిల భారత మానవ హక్కులు, సాంఘిక న్యాయం ఫ్రంట్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. తమకు ప్రజల భావాలు తెలుసనీ, కనుక కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోందని, బ్రిటన్ ప్రభు త్వంతో సంప్రదింపులను కొనసాగిస్తుందని సుప్రీం కోర్టుకు సర్కారు విన్నవించింది. సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి రెండు రోజులు దాటకముందే ప్రభు త్వం మాట మార్చింది. బ్రిటిష్ రాణికి బహుమతిగా ఇచ్చిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని అడ గడం సాధ్యం కాదని తెలిపింది. గత ప్రభుత్వాల వాదన ప్రకారం కోహినూర్ విదేశీ పాలకులు దొంగి లించిన వస్తువు కాదని 1956లో ప్రధాని నెహ్రూ వజ్రాన్ని తిరిగి ఇమ్మని కోరడానికి ఏ ఆధారాలూ లేవని, అయినా డిమాండ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారని ప్రభుత్వ పక్షాన లాయర్లు వాదించారు. వాటిని వెనక్కి రప్పిం చడానికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని దాఖ లైన ఆర్టీఐ దరఖాస్తును పురావస్తు శాఖకు బదిలీ చేయడానికి బదులు ప్రధాన మంత్రి కార్యాలయమే జవాబు ఇవ్వాలని కేంద్ర సమాచార కమి షనర్ కోరారు. దేశం నుంచి తరలిపోయిన పదో శతాబ్దపు దుర్గా మాత విగ్రహాన్ని జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సంపాదించి 2015లో ప్రధాని నరేంద్రమో దీకి బహూ కరించారు. 900 ఏళ్ల పురాతన కీరవాణి సాలభంజిక సంపాదించి 2015 ఏప్రి ల్లో కెనడా ప్రధాని ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఆబట్ 2014లో భారత పర్యటనకు వచ్చినపుడు తమ దేశపు ఆర్ట్ గ్యాలరీల్లో ఉన్న హిందూ దేవతామూర్తులను మన ప్రధానికి అంద జేశారు. టవర్ ఆఫ్ లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని రప్పించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రధానమంత్రి 2016లో ఉన్నతాధికారు లతో సమావేశం నిర్వహించారని వార్తలువచ్చాయి. ఈ సమాచారం ప్రధాని కార్యాలయంలో ఉంటుంది కానీ పురావస్తు సర్వే సంస్థ దగ్గర ఉండదు. ముందుగా ప్రధాని కార్యాల యాన్ని ఈ సమాచారం కోరితే, వాటిని రప్పించే అధికారం లేదని తెలిసి కూడా వారు ఈ దరఖాస్తును పురావస్తుశాఖకు బదిలీ చేయడం సమంజసం కాదు. హోం మంత్రిత్వ శాఖ లేదా విదేశాంగశాఖ ఈ విషయమై తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి ప్రధాని కార్యాల యమే తెలపాలని కమిషన్ భావించింది. ఈ విధంగా దరఖాస్తులు బదిలీ చేసే ముందు కాస్త ఆలోచించాలి. (బీకేఎస్ఆర్ అయ్యంగార్ వర్సెస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేసులో 2018 ఆగస్టు 20న సీసీఐ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయవద్దు
నియంతల పాలనలో మగ్గిన మానవాళి 800 ఏళ్ళ కిందట తొలిసారి హక్కుల గురించి ఆలోచించింది. మొదట అడిగిన హక్కు పిటిషన్ హక్కు. (వినతి పత్రం సమర్పించే హక్కు). ఆహార హక్కూ, బతుకు హక్కూ కాదు. అదే 1215 నాటి మాగ్నా కార్టా. పిటిషన్ పెడితే రాజధిక్కారం కింద జైల్లో వేసే రోజుల్లో అది చాలా గొప్ప హక్కు. రాజస్తాన్లోని ఒక కుగ్రామంలో జనం ఉచితభోజనం అడగలేదు. మా ఊళ్లో ఆవాస్ యోజన కింద ఇరవై ఇళ్ళు కట్టించారట. ఎవరికి ఇచ్చారో చెప్పండి చాలు అన్నారు. ఇరవై రోజులు ధర్నా చేసేదాకా పంచాయత్ పెద్దలు కదలలేదు. ఆ తరవాత వారు చెప్పిన పేర్లు వింటూ ఉంటే ఒక్కపేరుగలవాడూ ఉళ్లో లేడని తేలింది. అంటే ఇరవై ఇళ్ల సొమ్ము భోంచేశారన్నమాట. అదే చోట ఆ జనమే అవినీతి మీద పోరాడటం ప్రారంభించారు. ఆ పోరాట ఫలి తమే సమాచార హక్కు. పిటిషన్ హక్కు సమాచార హక్కు చేతిలో ఉంటే ఇతర హక్కులు సాధించవచ్చు. రోజూ కొన్ని వేల మంది దేశ వ్యాప్తంగా చిన్న చిన్న సమస్యలను ఆర్టీఐ ద్వారా సాధిస్తున్నారు. పదిరూపాయల ఫీజు ఇచ్చి చిన్న సైజు పిల్ వేసే అవకాశం ఆర్టీఐ కల్పించింది. ప్రతి రాష్ట్రంలో పదిమంది కమిషనర్లు కూర్చుని వచ్చిన వారికి సమాచారం ఇప్పిస్తూ పోతే పింఛను ఆలస్యాలు, రేషన్ కార్డు లంచాలు, స్కాలర్షిప్ వేధింపులు వంటి రకరకాల సమస్యలు తీరుతున్నాయి. అయితే ఆ పది రూపాయల పిల్ హక్కుకు ఇప్పుడు ఎసరు పెడుతున్నారు. కమిషనర్ల అధికారాలు తగ్గిస్తున్నారు. వారి స్వతంత్రతకు తూట్లు పొడిచి తాబేదార్లను చేస్తున్నారు. కమిషనర్ల పదవీకాలం ప్రస్తుతం అయిదేళ్లు లేదా వారికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు అని 2005 చట్టం నిర్దేశిస్తున్నది. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్కు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను, సమాచార కమిషనర్కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదాను ఆర్టీఐ చట్టం నిర్దేశించింది. ఏ ఉన్నతాధికారికైనా సమాచారం ఇవ్వమని ఆదేశించేందుకు ఈ సమున్నత స్థాయి అవసరమని ఆర్టీఐ చట్ట ప్రదాతలు భావిం చారు. ఈ చట్టానికి చేస్తున్న సవరణలు పార్లమెంటు ఆమోదం పొందితే, కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత కాలానికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర కమిషనర్లను నియమించుకోవచ్చు. అప్పుడు కమిషనర్లు స్వతంత్రంగా పనిచేయడానికి ధైర్యంగా సమాచారం ఇవ్వండి అనడానికి వీలుండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పదవీ కాలం ఉంటుంది అని నియమాలు చేర్చుతారట. ఇప్పుడు ఆ హోదా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ద్వారా అప్పుడప్పుడు మార్చుకొనే సవరణ కావాలంటున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దాచిన ఫైళ్లలో దాగిన సమాచారాన్ని వెలికి తీయాలని ఆదేశించే అధికారం, స్వతంత్రత సమాచార కమిషనర్కు ఇవ్వకపోతే ఈ హక్కు అమలు కాదనే ఉద్దేశంతో వారి పదవీకాలాన్ని, హోదాను స్థిరీకరించింది ఆర్టీఐ చట్టం. సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తే తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని భయపడే ప్రభుత్వాలు ఏదో తప్పు చేసినట్టే. ఆ తప్పులు బయటపెట్టకుండా రహస్యాలు కాపాడటానికి సమాచార కమిషనర్లు తమకు లోబడి పనిచేయాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఈ చట్టం సవరణ ద్వారా అప్పుడు ఆదేశిస్తాయి. కమిషనర్లను నియమించాలనుకున్నప్పుడల్లా రూల్స్ మార్చుకునే సౌకర్యాన్ని కట్టబెట్టే ఆలోచన ఇది. ఇప్పుడు ఎన్నికల కమిషన్తో సమాచార కమిషన్కు సమాన హోదా ఇవ్వడం తప్పని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తక్కువజేయాలని చూస్తున్నది. ఓటు హక్కు, సమాచార హక్కు రెండూ భావప్రకటన హక్కులో భాగాలే అయినప్పడు రెండూ ఎందుకు సమానం కావంటారు? సమాచార హక్కు ఏ విధంగా అమలు చేయాలో వివరిస్తూ కమిషనర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడం వల్ల రాష్ట్రాల సార్వభౌమాధికారాన్ని కాపాడిందీ చట్టం. కాని రాష్ట్ర కమిషనర్ల పదవీకాలాన్ని హోదాను జీతాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుందని సవరించడం వారి సార్వభౌమాధికారంతో జోక్యం చేసుకోవడమే. కమిషన్ల నడ్డి విరిస్తే సమాచార హక్కును నీరు కార్చినట్టే. అప్పుడు అవి నీతి అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదు. అదేనా మనకు కావలసింది? ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయకుండా ఆపాల్సింది జనమే. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐకి గండం గడిచినట్టేనా?
పదమూడేళ్లక్రితం పుట్టి, అడుగడుగునా గండాలే ఎదుర్కొంటున్న సమాచార హక్కు చట్టం మరో సారి త్రుటిలో ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నట్టు కనబడుతోంది. ఆ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టదల్చుకున్న బిల్లు నిలిచిపోయింది. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లును సభ ముందుంచాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు మీడియాలో వెలువడిన కథనాలే నిజమైతే పౌర సమాజ కార్యకర్తలు, ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పుడున్న చట్టాన్ని నీరుగార్చడానికే సవరణ బిల్లు తెస్తున్నారని విమర్శలు నలుమూలలా వెల్లువెత్తుతున్నా ఇన్నాళ్లూ ప్రభుత్వం మౌనముద్ర దాల్చింది. దీని వెనకున్న ఉద్దేశమేమిటో చెప్పాలని రెండు నెలలుగా పౌర సమాజ కార్యకర్తలు డిమాండు చేస్తున్నా జవాబు లేదు. విమర్శలు, ఆరోప ణలు వెల్లువెత్తుతున్నా అందులోని అంశాలను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఎకా యెకీ సభలో బిల్లు తీసుకొచ్చి, అంతగా దానిపై రభస జరిగితే ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపా లన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ ఎవరితో చర్చించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా రూపొందించిన ఈ బిల్లును అడ్డుకుంటామని విపక్షాలు గట్టిగా చెప్పడం వల్ల కావొచ్చు... చివరి నిమిషంలో సవరణ బిల్లు ప్రతిపాదనను వాయిదా వేశారు. జాతీయ స్థాయిలోని సమాచార ముఖ్య కమిషనర్(సీఐసీ), ఇతర సమాచార కమిషనర్లు... రాష్ట్రాల స్థాయిలోని సమాచార ముఖ్య కమిష నర్లు, ఇతర సమాచార కమిషనర్ల హోదాలు, జీతభత్యాలు, పదవీకాలం వగైరా నిబంధనలకు మార్పులు తీసుకొస్తూ వివిధ సెక్షన్లకు ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించారు. ప్రస్తుత చట్టం ప్రకారం సీఐసీకి ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదా, ఇతర కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల హోదా కల్పించారు. అలాగే రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్ల హోదాను, ఇతర కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాను ఇచ్చారు. జీతభత్యాలు కూడా వారి వారి హోదాలకు తగ్గట్టు నిర్ణయించారు. సమాచార హక్కు కమిషన్లో బాధ్యతలు నిర్వ ర్తిస్తున్నవారు ప్రభుత్వాల ఒత్తిళ్లకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఇవి దోహదపడ తాయని భావించారు. ఎన్నికల సంఘంలో పనిచేసేవారి విధులు... సమాచార హక్కు కమిషన్లో పనిచేసేవారి విధులు వేర్వేరు గనుక హేతుబద్ధం చేసేందుకు ఈ సవరణల తలపెట్టామని ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఎవరినీ నమ్మించలేదు. ఈ సవరణలు సమాచార హక్కు కమిషన్లోని కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ మొదలుకొని రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల వరకూ అంద రినీ అనిశ్చితిలో పడేస్తాయి. సర్కారు దయాదాక్షిణ్యాలకు విడిచిపెడతాయి. వారి బాధ్యతల నిర్వ హణలో అడుగడుగునా అడ్డం పడతాయి. 2004లో ఆర్టీఐ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ లకూ, వాటికి ముందు పార్లమెంటరీ స్థాయీ సంఘంలో వ్యక్తమైన అభిప్రాయాల స్ఫూర్తికీ ప్రస్తు తం తలపెట్టిన సవరణలు విరుద్ధమైనవి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే డిప్యూటీ కమిషన ర్లుండాలని ఆ బిల్లు ప్రతిపాదించగా, అది కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తుందని భావించి స్థాయీ సంఘం దాన్ని తొలగించింది. ఇప్పుడు ప్రభుత్వం వేరే రూపంలో ఆ పనే చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. అమెరికా, వివిధ యూరప్ దేశాలు పారదర్శకత విస్తృతిని నానాటికీ పెంచుకుంటున్నాయి. ఆసియా ఖండంలోని పలు దేశాలు కూడా ఆ దిశగానే కదులుతున్నాయి. ప్రజాస్వామ్య మూలాలు పటిష్టంగా ఉండాలంటే ఏ మినహాయింపూ లేకుండా పాలనా సంస్థలు పారదర్శకంగా పనిచేయా లని, చేసే ప్రతి చర్యకూ అవి జవాబుదారీ వహించాలని అన్ని సమాజాలూ భావిస్తున్నాయి. ప్రజల నుంచి ఒత్తిళ్లు నానాటికీ పెరగడంతో అన్నిచోట్లా ప్రభుత్వాలు దిగొస్తున్నాయి. పాలనలో దాపరికం లేనప్పుడే నిజాయితీ పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని జనం బలంగా విశ్వసి స్తున్నారు. కానీ అదేం దురదృష్టమో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో పాలకులు అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని, నీతినిజాయితీ లతో పాలిస్తామని హామీ ఇచ్చినవారే అధికారంలోకొచ్చాక అది తమ జాగీరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నిలదీసినవారి నోరు మూయించాలని చూస్తున్నారు. చిత్రమేమంటే 2005లో అమల్లోకొచ్చిన సమా చార హక్కు చట్టానికి మూలాలు 1976లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులోనే ఉన్నాయి. సమా చారం కోరడం పౌరుల ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాలుగు దశాబ్దాలనాడు సమాచార హక్కుపై చైతన్యం వచ్చిన దేశంలో ఆర్టీఐ చట్టానికి అడుగడుగునా ఇలా అడ్డంకులు ఎదురవుతుండటం దిగ్భ్రాంతికరం. ఈ చట్టానికి నారూ నీరూ పోసిన యూపీఏ ప్రభుత్వమే అది తనకు కంట్లో నలుసుగా మారుతున్నదని గ్రహించి ఏడాది తిరగకుండా దాన్ని నీరుగార్చాలని చూసింది. ఆ తర్వాత కూడా పలు ప్రయత్నాలు చేసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న తేడా లేకుండా దాదాపు అన్ని ప్రభుత్వాలూ సమాచార హక్కుకు నిరంతరం అడ్డం పడుతూనే ఉన్నాయి. కేంద్ర సమాచార కమిషన్లో నాలుగు స్థానాలు చాన్నాళ్లనుంచి ఖాళీగా పడి ఉన్నా భర్తీ చేయలేదు. దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈమధ్యే ముగ్గురు సమాచార కమిషనర్ల పేర్లను ఖరారు చేసింది. కేంద్ర సమాచార కమిషన్లోనూ, వివిధ రాష్ట్రాల్లోని సమాచార కమిషన్లలోనూ గుట్టగుట్టలుగా దరఖాస్తులు పడి ఉంటున్నాయి. ఫలితంగా పాలనలో పారదర్శకత తీసుకురావాలన్న ఆర్టీఐ చట్టం మౌలిక ఉద్దేశమే దెబ్బతింటోంది. ఈ పరి స్థితిని చూసి ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలను మందలించింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోదల్చుకున్నదో ఎక్కడా వెల్లడి కాలేదు. కానీ సభా ప్రవేశం చేయబోయి ఆగిన ఈ సవరణ బిల్లు ఆర్టీఐ చట్టాన్ని మరింత భ్రష్టు పట్టించేలా ఉంది. దీన్ని ఉప సంహరించుకోవడం తక్షణావసరం. -
జనాయుధానికి జనాందోళనే రక్ష
సమకాలీనం విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికారులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్ఫైల్స్) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడతాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. ‘ఔను, మీవి ప్రజాకార్యాలయాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్యపరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజలు పోరాడి సాధించు కున్న పౌర సదుపాయం, సమాచార హక్కు చట్టాన్ని పలుచన చేసే ప్రమాదం మూడో మారు ముంచు కొచ్చింది. ఆ ప్రమాదం తెస్తున్నదెవరో కాదు, స్వయానా కేంద్ర ప్రభుత్వమే! ఇదివరకు రెండు మార్లు ప్రయత్నం చేసిందీ కేంద్రమే! కాకపోతే ఇంతకు మున్ను యూపీఏ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు చేస్తున్నది ఎన్డీయే ప్రభుత్వం. లోగడ చేసింది రెక్కలు విరిచే యత్నమైతే ఇప్పుడు చేసేది తలనరకడమే! ఈ ప్రయత్నాన్నీ అడ్డుకోవాల్సింది ప్రజలే! ఇదివరకటి రెండు యత్నాల్నీ దేశ పౌరులే సమర్థంగా అడ్డుకొని చట్ట సవరణ జరగనీకుండా తమ హక్కును కాపాడు కున్నారు. ఇక ముందైనా కాపాడుకోవడం పౌర సమాజం కర్తవ్యంగా మారింది. క్షేత్రపరంగా ఆర్టీఐ అమలును క్రమంగా గండికొట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు చట్టపరంగానూ దెబ్బకొట్టే ప్రతిపాదనను ముందుకు తోస్తున్నాయి. ఫలితంగా, సమాచారం పొందే పౌర హక్కు విషయమై రాజ్యాంగ స్ఫూర్తికే భంగం వాటిల్లు తోంది. పౌరసంఘాలతో పాటు విపక్ష రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు ముసాయిదాను రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను గురువారం ఎజెండాలో చేర్చారు. కానీ, జరగలేదు. ఇక పార్లమెంటు లోపలా, బయటా గట్టి వ్యతిరేకత, ప్రజాందోళనలు వస్తే తప్ప ఈ సవరణ ఆగక పోవచ్చు! అదే జరిగితే ఆర్టీఐ చట్టం అమలు మరింత నీరుకారడం ఖాయం. గుండెకాయనే బలహీనపరిస్తే... సమాచార హక్కు చట్టం అమలులో అత్యంత కీలక పాత్ర సమాచార కమిషన్లది. 2005లో వచ్చిన ఈ చట్టం, ప్రభుత్వాలతో సహా మరే సంస్థలకూ ఆ బాధ్యతను అప్పగించలేదు. కేంద్ర ప్రభుత్వంలోని పౌర కార్యాలయాల్లో చట్టం అమలు బాధ్యత కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ది కాగా రాష్ట్రాల్లో ఆ బాధ్యత రాష్ట్ర కమిషన్లు (ఎస్ఐసీ) నిర్వహించాలి. ఫిర్యాదులు, అప్పీళ్లను కూడా పాక్షిక న్యాయస్థాన హోదాలో కమిషన్లే పరిష్కరించాలి. çపూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలి. ఇప్పుడా కమిషన్లను బల హీనపరిచే ప్రక్రియకు కేంద్రం పూనుకుంది. కమి షన్లో ముఖ్యులైన కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాల విషయంలో మార్పులు ప్రతిపాదిస్తున్నారు. చట్టంలో పొందుపరచినట్టు కాకుండా నిర్ణ యాధికారాన్ని ఏక పక్షంగా కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరచడమే తాజా చట్టసవరణలోని ముఖ్యాంశం. కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ (సీఐసీ) స్థాయిని ప్రస్తుత చట్టంలో కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ (సీఈసీ)కు సమాన హోదాగా పేర్కొ న్నారు. తత్సమాన జీత–భత్యాలు ఇస్తున్నారు. కేంద్ర ఇతర సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల సమాన హోదాను, జీతభత్యాలనూ కల్పించారు. రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదా, సమాచార ఇతర కమిష నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హోదాను చట్టం కల్పిస్తోంది. చట్టం పకడ్బందీ అమ లుకు ఇది అవసరమని అప్పట్లో భావించారు. ప్రభు త్వాలకు లొంగిఉండనవసరం లేకుండా, స్వేచ్ఛగా– స్వతంత్య్రంగా వ్యవహరించేందుకే వాటిని కల్పిం చారు. ఎవరూ మార్చడానికి వీల్లేకుండా ఈ అంశాల్ని చట్టంలో భాగం చేశారు. పార్లమెంటు స్థాయీ సంఘం (పిఎస్సీ) చొరవతోనే అప్పుడీ నిర్ణయం జరిగింది. గత పుష్కర కాలంగా అమలు పరుస్తున్నారు. ఇది సముచితం కాదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరందరికీ అయిదేళ్ల పదవీ కాలాన్ని చట్టం నిర్దేశిస్తోంది. అలా కాకుండా, ఇకపై హోదా, పదవీకాలం, జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి, అమలుపరిచే విధంగా అధి కారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయనున్నారు. ఎన్నికల ముఖ్య కమిషనర్ అన్నది రాజ్యాంగ హోదా అని, సమాచార ముఖ్య కమిషనర్ చట్టపరమైన హోదా కనుక సమానంగా ఉండనవసరం లేదనేది తాజా వాదన. కమిషనర్ల పదవీ కాలాన్ని మొదట్లో అయిదేళ్లని పేర్కొన్నారు, అంత అవసరంలేదనే కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ మార్పులు ఏ మంచికోసమో ఎక్కడా సరైన వివరణ లేదు. ముసాయిదాలో సవరణ బిల్లు ఉద్దేశాలు–లక్ష్యాలను వెల్ల డిస్తూ, హోదాలను హేతుబద్దం చేయడానికే అని పేర్కొన్నారు. మరోపక్క ఇది ఖచ్చితంగా చట్టం అమలును నీరు కారుస్తుందని పౌర సమాజం ఆందోళన. ప్రజా సమాచార హక్కు జాతీయ ప్రచార మండలి(ఎన్సీపీఆర్ఐ), మజ్దూర్ కామ్గార్ శక్తి సంఘటన్ (ఎమ్కేఎస్సెస్)వంటి సంఘాలు అప్పుడే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రం ఇకపై సమాచార కమిషన్లను, తద్వారా వ్యవస్థను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే అన్నది విమర్శ. ప్రజా క్షేత్రంలో ఏ చర్చ జరుపకుండానే ఈ ప్రతి పాదన తెస్తున్నారు. ఈ ‘కత్తిరింపులు’, కేంద్ర గుత్తాధిపత్యం వల్ల అధికార యంత్రాంగం ఇక కమిషనర్లను, స్థూలంగా కమిషన్లను ఖాతరు చేయదనే భయ ముంది. ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ సమా చార నిరాకరణ, జాప్యం సర్వసాధారణమయ్యే ప్రమా దాన్నీ ప్రజాసంఘాలు శంకిస్తున్నాయి. అప్పుడు విచక్షణతో చేసిందే! రాజ్యాంగపరమైన బాధ్యత నిర్వహించడమంటే రాజ్యాంగంలో ఆ పదవిని విధిగా ప్రస్తావించి ఉండా లనే వాదన సరికాదు. పౌరుల ఓటు హక్కుకు రక్షణ కల్పించం ఎలాంటి బాధ్యతో, పౌరులు సమాచారం తెలుసుకునే హక్కును పరిరక్షిం చడం కూడా అంతే బాధ్యతాయుతమైన కార్యం. ఈ రెండు హక్కుల మూలాలూ... భారత రాజ్యాంగం భద్రత కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కు (అధికరణం 19)లో ఒదిగి ఉన్నాయి. పాలకులుగా ఇష్టమైన వారిని ఎన్ను కోవడం ద్వారా తమ భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులు వినియోగించుకున్నట్టే, వివిధ కార్యక్ర మాల్లో పాల్గొని ప్రయోజనం పొందేలా వాటి గురిం చిన సమాచారం తెలుసుకోవడం కూడా వారి ప్రాథ మిక హక్కులో భాగమే! ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో (స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్ నారాయన్–1976, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా–1982) నొక్కి చెప్పింది. ప్రభుత్వ వ్యవస్థల నుంచి సమాచారం పొందడం పౌరుల ప్రాథమిక హక్కేనని ఐక్యరాజ్యసమితి మానవహ క్కుల సంఘం కూడా తన 2011 నివేదికలో నిర్ద్వం దంగా వెల్లడించింది. పౌరుల ప్రాథమిక హక్కు రక్షణ విధులు నిర్వర్తించే సమాచార కమిషన్లు, అందులోని కమిషనర్లు రాజ్యాంగ విహిత బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే లెక్క. వారికి కేంద్రంలో ఎన్నికల కమి షనర్ హోదా, రాష్ట్రంలో సీఎస్ హోదా కల్పించడం నిర్దిష్ట లక్ష్యంతోనేనని, ఇదే లేకుంటే ఇంతటి వ్యవ స్థను ఏర్పాటు చేయడంలో అర్థమే లేదని పార్లమెం టరీ స్థాయి సంఘం (పీఎస్సీ) కూడా పేర్కొంది. వివిధ స్థాయిల్లో చర్చ కూడా జరిగింది. 2005 చట్టం రూపొందే క్రమంలో చేసిన బిల్లు ముసాయిదాలో ఒక ప్రతిపాదన ఉండింది. ప్రతి కమిషన్లోనూ అదనంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే డిప్యూటీ కమిషనర్లు ఉండాలన్నది ఆ ప్రతి పాదన. దానివల్ల, కేంద్రం జోక్యంతో కమిషన్ల స్వయం ప్రతి పత్తికి భంగమని పీఎస్సీనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకేనేమో, చట్టంలో సదరు డిప్యూటీ కమిషనర్ల వ్యవస్థకు స్థానం కల్పించలేదు. అటు వంటిది, ఇప్పుడు అందుకు భిన్నంగా కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాలంతా కేంద్రం ఇష్టా నుసారం జరగాలని చేస్తున్న ప్రతిపాదన కమిషన్ల స్వతంత్ర పనితీరుకు పూర్తి భంగకరమే. ప్రతిఘటనతోనే ఆగిన కుయుక్తులు! స్వాతంత్ర భారత చరిత్రలో వచ్చిన అతి కొద్ది మంచి చట్టాల్లో మేలైనది, జనహితమైనదిగా సమాచార హక్కు చట్టానికి పేరుంది. పాలనా వ్యవస్థల్లో ఎంతో కొంత పారదర్శకతకు, తద్వారా అధికార యంత్రాంగం జవాబుదారీతనానికి ఈ చట్టం కారణమౌ తోంది. రాజకీయ వ్యవస్థ దుందుడుకు తనాన్నీ కొంతమేర నియంత్రించగలుగుతోంది. జనాల్లో అవ గాహన పెరిగే క్రమంలోనే ఇది మరిన్ని ఫలాలు అందించి, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ఆస్కార ముంది. కానీ, ప్రభుత్వాలు, ముఖ్యంగా పాలనా యంత్రాంగం దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు నిరంతరం సాగిస్తూనే ఉన్నాయి. కమిషన్లను రిటైర్డ్ ఉద్యోగులతో నింపడమో, అసలు నింపక ఖాళీలతో కొనసాగించడమో చేస్తున్నాయి. మరోవైపు చట్టాన్ని పలుచన చేసే ఎత్తుగడలకు వెళ్తున్నాయి. చట్టం వచ్చి ఏడాది తిరగక ముందే గండికొట్టే యత్నం జరిగింది. విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికా రులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్ఫైల్స్) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడ తాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. వాటిని ఈ చట్టపరిధి నుంచి తొలగించే యత్నం 2006 జూలైలోనే జరిగింది. ఇందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టీఐ కార్యకర్తల చొరవతో దేశ వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అన్నాహజారే దీక్షకు దిగారు. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమాచారంలో భాగమైన ‘నోట్ఫైల్స్’ను నేటికీ ఏ పౌరుడైనా పొందవచ్చు. ఈ హక్కును నీరుగార్చే రెండో దాడి 2013 ఆగస్టులో జరిగింది. లోక్సభలో బిల్లు ముసాయిదాను కూడా ప్రవేశపెట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలో ఏర్పడ్డ రాజకీయపక్షాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించేందుకు చేసిన యత్నమది. దాని క్కూడా పౌర సంస్థల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమైంది. మినహాయింపుకోసం చట్టసవరణకు యత్నించిన వారు, పౌర కార్యాలయాలుగా రాజకీ యపక్షాలన్నీ చట్టం పరిధిలోకే వస్తాయి అంటే మాత్రం ఒప్పుకోరు! ‘ఔను, మీవి ప్రజాకార్యాల యాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్య పరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజాస్వామ్య పరిపుష్ఠికి ఆయుధమైన ఆర్టీఐ చట్టాన్ని పోరాడైనా కాపాడుకోవడం పౌరసమాజ కర్తవ్యం. వ్యాసకర్త సమాచార పూర్వ కమిషనర్ దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సుప్రీం మొట్టికాయలు: ఏపీకి ఆర్టీఐ కమిషనర్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామకం చేపట్టింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత సమాచార కమిషనర్లను నియమించింది. మాజీ ఐపీఎస్ అఫీసర్ బీవీ రమణకుమార్(కృష్ణా జిల్లా), మాజీ ఐఎఫ్ఎస్ రవికుమార్ (రాజమండ్రి), టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు జనార్థన్రావు(కడప)లను ఆర్టీఐ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
జన చేతనే రక్షణ కవచం
రాజ్యం అధికార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్షణకు వచ్చిన సందర్భాలెన్నో! ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్టబద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌర హక్కుల స్ఫూర్తికి ప్రభుత్వాలే పాతరేస్తు న్నాయి. ప్రజలకు రాజ్యాం గం కల్పించిన హక్కుల్ని, ప్రత్యామ్నాయ సదుపా యాల్ని నిలువునా తొక్కేస్తున్నాయి. ఫలితంగా... చట్టాలు అయినవాళ్లకు చుట్టాలయి, కాని వాళ్లకు కష్టాలయి కూర్చున్నాయి. ప్రజల హక్కులకు భంగం కలిగినపుడు ఆసరాగా నిలిచే పలు స్వతంత్ర, ప్రజా స్వామ్య, హక్కుల సంస్థల్ని పనిగట్టుకు నీరుగారు స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పౌరసమాజం వీధుల్లో పోరాడో, న్యాయస్థానాల తలుపు తట్టో వాటిని నిలుపుకోవాల్సి వస్తోంది. ఆయా సంస్థల్ని ప్రభుత్వాలు అసలు ఏర్పాటే చేయవు. చేసినా... పాలకులు అక్కడ తగిన బాధ్యుల్ని నియ మించరు. నియమించినా... అందుకు అవసరమైన సదుపా యాలు కల్పించరు, అరకొర కల్పించిన చోట కూడా... నామ మాత్రపు వ్యవహారమే తప్ప స్ఫూర్తిని రక్షించే ఒక్క చర్యా ఉండదు. ఇలా నిర్లక్ష్యం లానో, ఉదాసీనత లాగానో బయటకు కనిపించే సర్కారు చర్యల వెనుక లోతైన వ్యూహమో, ఎత్తుగడో దాగి ఉండటం ఇటీవలి పరిణామాల్లో కొట్టొచ్చినట్టు కని పిస్తోంది. అది మరింత బాధాకరం! కొంచెం లోతుగా పరిశీలిస్తే... ప్రజాస్వామ్య సంస్థల్ని ఏలిన వారు నిర్వీర్యం చేయడం వెనుక ఉండే దురుద్దేశాలు ఒకటొకటిగా తేటతెల్లమౌతున్నాయి. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మానవహక్కుల సంఘాలు లేవు, లోక్పాల్–లోకాయుక్తల్లేవు, బాలల హక్కుల సంఘా లదీ అదే గతి! సమాచార హక్కు కమిషన్ ఒక చోట లేనే లేదు, మరోచోట నామమాత్రం! పరిపాలనా ట్రిబ్యునల్ ఒక చోట లేనే లేదు మరో చోట అంతంత మాత్రమే. అఖిల భారత స్థాయిలో హరిత న్యాయ స్థానాల వ్యవస్థను పలుచన చేస్తున్నారు. ఇంకా ఇతరేతర సంస్థల్లోనూ ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీ, ఖాళీ! ఇదీ వరుస! పరిపాలనలో పారదర్శకత కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు నీడన పనిచేయా ల్సిన సమాచార హక్కు కమిషన్లను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే తప్పుబట్టింది. ‘కమిషన్లు ఎందుకు పనిచేయ ట్లేదు? కమిషనర్లను ఎందుకు నియమించలేదు? పెండింగ్ ఫిర్యాదులు, అప్పీళ్లనెలా పరిష్కరిస్తార’న్న సుప్రీంకోర్టు ప్రశ్నకు విస్పష్టంగా సమాధానమే లేని దుస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది! మూడు వారా లకు వాయిదా పడిన తాజా కేసులో, సుప్రీంకోర్టుకి అవేం సమాధానం చెబుతాయో వేచి చూడాలి. కనీస హక్కుల రక్షణకు వ్యవస్థల్లేవు! మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు వాటిని ఎత్తి చూపి, తగు రక్షణ పొందే వ్యవస్థల్ని మన రాజ్యాంగమే కల్పించింది. అటువంటి ఉపద్రవాల నుంచి సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాలే పౌరులను కాపాడాలి. ప్రభుత్వాలు, వాటి వివిధ విభాగాలు, సంస్థలు నైతిక సూత్రాలను, చట్ట నిబంధనలను ఉల్లంఘించినపుడు, తద్వారా మానవ హక్కులకు భంగం కలిగినపుడు పౌరులకు రక్షణ అవసరం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని అందుకే నెల కొల్పుతారు. చట్టాల అమలుకు బాధ్యత వహించా ల్సిన ప్రభుత్వాలే కట్టుదప్పి వ్యవహరిస్తే, ఆ తప్పుల్ని ఎత్తిచూపే తెగువ, స్వేచ్ఛ, చొరవ కోసమే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తటస్థ సంస్థల ఏర్పా టును రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యం అధి కార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్ష ణకు వచ్చిన సందర్భాలెన్నో! అందుకే, నేరుగా రాజ్యాంగం ద్వారా కొన్ని, అందులోని స్ఫూర్తితో రూపొందించుకున్న చట్టాల ద్వారా మరికొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. ఆ స్ఫూర్తి కోసమే ఆయా సంస్థలు సంపూర్ణ స్థాయిలో, స్వేచ్ఛగా, ఏ అవరో ధాలూ లేకుండా పనిచేయాలి. కానీ, ప్రభుత్వాలు అలా చేయనీయవు. సదరు సంస్థల్ని కొన్నిసార్లు అసలు ఏర్పాటే చేయవు! తమకు ఇతరేతర విష యాలు ప్రాధాన్యమైనట్టు, ఆయా విషయాల్ని పట్టిం చుకోవడానికి తమ వద్ద సమయమే లేనట్టు ప్రభు త్వాలు నటిస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నదదే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు లోకా యుక్త, ఉప లోకాయుక్త సంస్థలకు అధిపతులు లేరు. రెండు చోట్లా మానవహక్కుల సంఘాలూ పనిచే యడం లేదు. మానవహక్కుల సంఘానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వారు నేతృత్వం వహించాలి. జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ పదవీ విరమణ తర్వాత మరెవరినీ ఆ పదవిలో నియమించలేదు. ఇప్పుడక్కడ సభ్యులు కూడా లేరు. నిబంధనలకు భిన్నంగా... కార్యదర్శి స్థాయి అధికారే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, కమిష న్ను నడుపుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత, ఉద్యోగుల సర్వీసు వివాదాలు పరిష్కరించే పరిపా లనా ట్రిబ్యునల్ (ఏటీ) తెలంగాణకు లేకుండా పోయింది. అధికారికంగా దాని రద్దు ప్రకటించారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డపుడు నమోదయ్యే ఏసీబీ కేసులు, ఉన్నతాధికారులపై వచ్చే అభియో గాల విచారణను నిర్ణయించాల్సిన విజిలెన్స్ కమిషన్ కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. పలు ఇతర హక్కుల సంస్థలదీ ఇదే గతి! హైకోర్టు మందలించినా తోలు మందమే! పాలనలో పారదర్శకత కోసం దేశంలో పుష్కర కాలంగా అమలవుతున్న సమాచార హక్కు చట్టానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టకాలమొచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. చట్టం అమలును పర్యవేక్షించే, ఫిర్యాదులు–అప్పీళ్లు పరిష్క రించే కమిషన్ను క్రమంగా బలహీనపరిచాయి. ఈ పరిస్థితులు, పౌరులు కోరుకునే సమాచారం వెల్లడి విషయమై అన్ని స్థాయిల్లో అలసత్వాన్ని పెంచి పోషించాయి. సమాచారం సులువుగా లభించని పూర్వస్థితి మళ్లీ బలపడుతుండటంతో ప్రజలు భంగ పోతున్నారు. అంతకుముందు నియమించిన కమి షనర్ల పదవీ కాలం ముగిసి, కమిషన్లో అసలు కమి షనర్లే లేని పరిస్థితి తలెత్తినా... ప్రభుత్వాలు పట్టించు కోలేదు. ఆ దశలో జోక్యం చేసుకున్న ఉమ్మడి హైకోర్టు, నిర్దిష్టంగా ఒక తేదీ లోపల కమిషన్ ఏర్పాటు చేసి, కమిషనర్లను నియమించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ‘ఆ మేరకు’ ప్రధాన సమాచార కమిష నర్తో పాటు ఒక కమిషనర్ను నియమిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది. తొమ్మిది వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్లో ఉంటే, పది మంది వరకు కమిషనర్లను నియమించుకునే వెసలుబాటున్నా, ఎందుకు నియ మించటం లేదన్నది న్యాయస్థానాల ప్రశ్న. అదనపు సమయం కావాలని పలుమార్లు వాయిదాలు కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపు పదినెలలు కావ స్తున్నా ఇప్పటివరకు కమిషనర్లను నియమించలేదు. కమిషన్ ఏర్పాటుకు ఒక ఉత్తర్వు, కమిషనర్ల పోస్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో ఉత్తర్వు ఇచ్చి చేతులు దులుపుకొంది. కమిషనర్ల నియామకాలు జరుపలేదు. ఇదే విషయమై హైకోర్టు గట్టిగా నిలదీసినపుడు, చేసేస్తున్నామని మాట ఇచ్చింది. కానీ, ఇప్పటికీ అదేమీ చేయకపోవడం న్యాయధిక్కా రమనే అభియోగంతో కొందరు తిరిగి కోర్టును ఆశ్ర యించిన కేసు శుక్రవారం విచారణకు రానుంది. ప్రజ లకు మేలు చేయడం కన్నా, తమ వారికి పదవులు కట్టబెట్టి, అధికారంలో తామున్నా, లేకున్నా రాబోయే అయిదేళ్లు వారిని కీలకస్థానాల్లో చూసుకోవాలనే రాజకీయ స్వార్థంతోనే ఈ వ్యూహాలన్న విమర్శలు న్నాయి. వారి ఎత్తుగడల్లో చిత్తవుతున్నది మాత్రం ప్రజా ప్రయోజనాలు! జరుగుతున్నది పౌర హక్కుల హననం! చట్టం చెప్పే ప్రమాణాలు తుంగలో సమాచార హక్కు కమిషన్లలో ఖాళీలు భర్తీ చేయండి అన్న సుప్రీంకోర్టు సూచనకే హక్కుల కార్యకర్తలు సంబరపడి పోతున్నారు. ఈ ఇల్లు అలకడాలతో పండు గైపోయినట్టు కాదు. నిజానికి, చట్ట స్ఫూర్తి గల్లంతవు తున్న మతలబంతా అక్కడే ఉంది. ఈ ప్రభుత్వాలు తమకు వీలయినంత కాలం కమిషన్లను ఏర్పాటు చేయవు. ఇక తప్పదన్నపుడు, చట్టం నిర్దేశిం చిన అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ‘తమ’ వారితో కమిషన్లను నింపేస్తున్నాయి. స్వతంత్ర ప్రతి పత్తి స్ఫూర్తినే గంగలో కలిపి, ఆయా సర్కార్లు– సదరు కమిషనర్లు పరస్పర ప్రయోజనకరంగా వ్యవహ రించడం దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు రిటైర్డ్ అధికారుల్ని ముఖ్య కమిషనర్లుగా, కమిషనర్లుగా నియమిస్తు న్నారు. సర్వీసు కాలమంతా సమాచారాన్ని చెరబట్టి, జనాన్ని విలువైన సమాచారానికి దూరం పెట్టిన వారు అంత సులువుగా సమాచార వ్యాప్తికి ఎలా నడుం కడతారన్న పౌర సంఘాల ప్రశ్నకు సమాధానమే లేదు! ఆర్టీఐ చట్టం (2005), సెక్షన్లు 12 (5), 15 (5)లో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియా మకానికి ఎలాంటి వారై ఉండాలో విస్పష్టంగా పేర్కొ న్నారు. ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి, న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, యాజమాన్య నిర్వ హణ, జర్నలిజం, జనమాధ్య మాలు, పరిపాలనలో విశేషానుభవం కలిగిన వారై ఉండాలని పేర్కొన్నారు. అంటే, అవన్ని రంగాల్లో విస్తృత పరిజ్ఞానమో, ఆ ప్రాధాన్యతా క్రమంలో ఏదైనా అంశంలో విశేష ప్రజ్ఞనో కలిగి ఉండటం ప్రామాణికం. అంతే తప్ప, ప్రభుత్వ సర్వీసుల్లో పదవీ విరమణ చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు. దాని వల్ల వివిధ స్థాయిల్లో చిక్కులు తలెత్తుతున్నాయి. కమిషన్ నిర్వ హణ, సమచారం ఇచ్చే ప్రక్రియ, ఫిర్యాదులు–అప్పీ ళ్లను పరిష్కరించే విధానం అన్నిట్లోనూ ఈ ‘అధికార ముద్ర’ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఫలితంగా, సమా చార కమిషన్ వ్యవస్థ కూడా జనహితానికి భిన్నంగా పనిచేస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్ట బద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దిలీప్ రెడ్డి -
ప్రియుడి రోగంపై ప్రియురాలి ఆర్టీఐ
అస్సాంలో ఒక పెద్ద మనిషికి ఎయిడ్స్ ఉందేమోననే అనుమానం. అక్కడ 1990ల్లో రోగ నిర్ధారణ సౌక ర్యాలు లేక ఆయనను చెన్నైకి పంపారు. రోగితో పాటు ఒక యువ డాక్టర్ కూడా జతగా వెళ్లారు. ఇద్దరి నుంచీ రక్తం నమూనా తీసుకున్నారు. పెద్దాయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. విచిత్రమేమంటే ఈ యువ వైద్యుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని పరీక్షలో బయట పడింది. విషయం అస్సాం దాకా పాకింది. అప్పటికే ఈ యువ వైద్యుడు తన సహాధ్యాయి అయిన అమ్మాయితో ప్రేమలో పడటం, నిశ్చితార్థం జరిగిపోయాయి. చివరికి ఆ అమ్మాయికి కూడా తన ప్రియుడి రోగ సమాచారం తెలిసిపోయింది. వాస్త వం తెలుసుకోవడానికి ఆమె చెన్నై డాక్టర్కు ఫోన్ చేసి నిజమేనా అని అడిగింది. ఆ డాక్టర్ చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. హిపోక్రటిక్ ప్రతిజ్ఞ ప్రకా రం తాను పరీక్షించిన రోగుల వ్యాధి రహస్యాలు అందరికీ వెల్లడించకూడదు. వధువుకు విషయం వెల్ల డించకపోతే లేదా అబద్ధం చెబితే ఆమె జీవితం ఏం కావాలి? ఏమైతే అదైందని ధైర్యంచేసి ఆ డాక్టరు, ‘అవునమ్మా, చికిత్స అవసరం. మందులు కూడా చెప్పాం,’ అని వివరించాడు. ఆమె నిశ్చితార్థాన్ని రద్దుచేసుకుంది. వరుడికి పెద్ద డాక్టర్ మీద కోపం వచ్చింది. ఆయన వల్లే తన పెళ్లి రద్దయిందని, తనకు వివాహ హక్కు లేకుండా పోయిందని బాధ పడ్డాడు. కేసు పెట్టాడు. సుప్రీంకోర్టు దాకా తగాదా వెళ్లింది. ఈ యువకుడికి పెళ్లి హక్కు ఉందా? ఒప్పుకున్న నేరానికి ఎయిడ్స్ రోగితో కూడా పెళ్లిచేసుకోవలసిన బాధ్యత వధువుపై ఉందా? ఈ సమాచారం రహ స్యంగా కాపాడవలసిన బాధ్యత పెద్ద డాక్టర్పై ఉందా? ఇది గోప్యంగా దాచ వలసిన వ్యక్తిగత సమాచారమా లేక మరొకరి జీవితానికి సంబంధించి వెల్ల డించవలసిన కీలకమైన అంశమా? సుప్రీంకోర్టులో దీనిపై పెద్ద లాయర్లు వాదించారు. మిస్టర్ ఎక్స్ వర్సెస్ హాస్పి టల్ జెడ్ అనే పేరుతో 1998లో తీర్పు వచ్చింది. ఈ సమాచారం చెప్పవలసిందే నని, ప్రియురాలికి ప్రియుడి ఆరోగ్య వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, ప్రియుని వివాహ హక్కు కన్నా ప్రియురాలి జీవన హక్కు కీలకమైందని జడ్జీలు సాఘిర్ అహ్మద్, బీఎన్ కృపాల్ వివరించారు. మొదట ఎయిడ్స్ రోగులకు పెళ్లిచేసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాని మానవ హక్కుల సంఘాలు ఇది అన్యాయం అంటూ మళ్లీ అభ్యర్థిస్తే, ఎయిడ్స్ రోగికి కూడా పెళ్లి హక్కు ఉంది కాని, జబ్బు వివరాలు మొత్తం కాబోయే జీవిత భాగస్వామికి చెప్పాక, స్వచ్ఛందంగా అంగీకరిస్తేనేనని వివరించింది. కొన్ని ఉద్యోగాలు చేయాలంటే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. చూపు సరిగా లేకపోతే రాని ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. జీవితబీమా చేయాలంటే ఏజెంటు ముందుగా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయిస్తాడు. మన అలవాట్లు, రోగాల ఆధారంగా మన బీమా ధర నిర్ణ యిస్తారు. మనకు కూడా తెలియని మన రోగాలు బీమా కంపెనీలకు అధికారికంగా తెలుస్తాయి. వారి బీమా దస్తావేజుల్లో మన రోగాల వివరాలు భద్రంగా ఉంటాయి. విచిత్రమేమంటే బీమాకు, ఉద్యోగానికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, రోగ నిర్ధా రణలను పెళ్లి, ప్రేమ విషయంలో పట్టిం చుకోం. ఎన్నో ప్రేమలు, పెళ్లిళ్లు రోగాల గురించి ముందే చెప్పకపోవడం వల్ల విఫ లమవుతున్నాయి. నపుంసకత్వం కూడా ఒక రోగం. దాని గురించి చెప్పరు. తెలి సినా మాట్లాడరు. రుజువు చేయడం కష్టం. 60 శాతం నపుంసకులను పట్టుకోవడం ఇంకా కష్టం. వధువు అడగడానికి వెనుకా డుతుంది. అడిగితే భర్త అనేక నిందలు వేస్తాడు. భార్య అల్లరి చేస్తే తప్ప ఈ విషయం తేలదు. నేరా నికి లింగభేదం ఉండదు. లింగవివక్ష లేనివేవంటే –నేరం, అవినీతి, దుర్మార్గం, దొంగతనం. డిటెక్టివ్ల సేవలను కొనుక్కున్నా వరుడి రోగాలు, వధువు జబ్బులు ఒకరికొకరికి తెలిసే అవకాశం లేదు. కాంట్రాక్టు చట్టం ప్రకారం ఏదైనా ఒప్పందం ఖరారు కావడానికి ముందు ఇరు పక్షాల మధ్య పూర్తి సమా చార మార్పిడి జరగాలి. లేకపోతే కాంట్రాక్టు చెల్లదు. పెళ్లి కూడా ఒప్పందమే. పారదర్శకత లేని పెళ్లి లాయర్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. వధూవ రుల రోగాల గురించి కోర్టులు తెలుసుకోవడానికి ఏళ్లు పడుతుంది. రహస్యాలతో నిర్మించుకునే అబ ద్ధాల గోడల వల్ల కాపురాలు కూలిపోతాయి. మన దేశంలో అనేక కుటుంబాలకు, సంస్థలకు పట్టిన పెద్ద వ్యాధి దాపరికం. ఆరోగ్యం విషయంలో దాపరికం అందరికీ కీడే చేస్తుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఎమ్మెల్యే గారికి ఏ రోగం వచ్చింది?
ఎమ్మెల్యే గారికి ఏదైనా రోగం వస్తే దాని గురించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తెలుసు కోవచ్చా? పది రూపాయల ఫీజుతో ఏదైనా అడగ వచ్చనే ధోరణి మనకు కనిపిస్తోంది. ప్రజలతో సంబంధం లేని, ప్రజాప్రయోజనం లేని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రొత్సహించడం మంచిది కాదు. ఒక్కోసారి ఎమ్మెల్యే చికిత్సకు విపరీతంగా ప్రజాధనం ఖర్చుచేసినప్పుడు అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో సురూప్ సింగ్ హ్రియా నాయక్ అనే ఎమ్మెల్యే కోర్టు ధిక్కార నేరం చేశారని సుప్రీంకోర్టు నెల రోజుల శిక్ష విధించింది. ఆయనను జైలుకు తీసుకుపోయిన ఒకటి రెండు రోజులకే ఛాతీ పట్టుకుని నొప్పి అనగానే అధికార పక్ష ఎమ్మెల్యే కనుక ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. 27 రోజులు చికిత్స చేశాక జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యేకు చేసిన చికిత్స ఆయన వ్యక్తిగత సమాచారం కాదు. ఆయ నకు అనారోగ్యం నిజమేనా? జైలు శిక్ష తప్పించు కుని, సకల సౌకర్యాలున్న ఆస్పత్రిలో గడపడానికి ఇలా నాటకమాడారా? అనే విషయం తెలుసుకోవల సిన అవసరం ఉంది. ప్రజాసేవకుడి గురించి సమా చారం దాచడానికి వీల్లేదన్నది నియమం. ఆయన వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదనేది దానికి మినహా యింపు. ఆ మినహాయింపునకు కూడా ఒక మినహా యింపు ఉంది, అదేమంటే ప్రజాప్రయోజనం ఉంద నుకుంటే ఆ సమాచారం కూడా ఇవ్వవలసిందే. భారత వైద్య మండలి చట్టం 1976 కింద ప్రొఫె షనల్ కాండక్ట్ (ఎటికెట్ అండ్ ఎథిక్స్) రెగ్యులేషన్ 2002 ప్రకారం వైద్య దస్తావేజులు, రోగి వైద్య పత్రాలు ఇతరులనుంచి గోపనీ యంగా ఉంచాలి. అవి అందరికీ ఇవ్వా ల్సిన వివరాలు కావు. కాని సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 8(1)(జే) ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజాప్రయోజనం కోసం ఇవ్వవచ్చు. ఈ రెండు నియమాల మధ్య వైరుధ్యం ఏర్ప డినప్పుడు ఏ నియమాన్ని అనుసరిం చాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. సూరూప్ సింగ్ హ్రియా నాయక్ కేసులో సమాచార హక్కు చట్టం కింద ఆయన రోగ వివరాల గురించి అడిగితే అది ఆయన వ్యక్తి గత సమాచారం అవుతుంది కనుక ఇచ్చేది లేదని ఆస్పత్రి వర్గాలు తిరస్కరించాయి. కేసు హైకోర్టుకు చేరింది. నాయక్ వైద్య చికిత్స, జబ్బు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జైలు శిక్ష తప్పించుకోవడానికే రోగం వచ్చినట్టు నటిస్తే అది న్యాయవ్యవస్థను మోసం చేసినట్టవుతుంది. ఛాతీ నొప్పికి 27 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయవ లసిన అవసరం రాదు. ఒకవేళ రోగం నకిలీ అనీ, చికిత్స పేరుతో జైలు శిక్ష తప్పించుకునే మోసమని తేలితే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. కనుక ప్రజా ప్రయోజనం దృష్ట్యా సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. బాంబే హైకోర్టు మరో అంశాన్ని కూడా పరిశీలిం చింది. పార్లమెంటు, శాసనసభలకు నిరాకరించని సమాచారాన్ని ప్రజలకు నిరాకరించడానికి వీల్లేదని సెక్షన్ 8(1) కింద మినహాయింపు చేర్చారు. ఒకవేళ ఎమ్మెల్యే జబ్బు గురించి శాసనసభలో ఎవరైనా అడి గితే ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పకత ప్పదు. పౌరుడు సమాచారహక్కు చట్టం కింద అడిగితే కూడా ఇవ్వక తప్పదు. సమాచార హక్కు చట్టంతో వైద్య మండలి నియమాలు విభేదిస్తే, సమాచార హక్కు చట్టం నియమాలనే అనుసరిం చాల్సి వస్తుందని సమాచార చట్టంలో సెక్షన్ 22 స్పష్టంగా వివరిస్తోంది. కనుక సురూప్ సింగ్ హ్రియా నాయక్ జబ్బు, చికిత్స సమాచారం చెప్పవలసిందేనని బోంబే హైకోర్టు వివరించింది. ఈ విషయంలో ఏఐఆర్ 2007 బాంబే 121లో ప్రచురితమైన తీర్పు వెల్లడి నియమాలను నిర్దేశించింది. నిషాప్రియా భాటియా వర్సెస్ మానవ ప్రవర్తనా పరిశోధనా సంస్థ కేసులో ఒక మహిళ తనకు ఆస్పత్రిలో చేసిన చికిత్స వివ రాలు అడిగింది. దానికి ఆ ఆస్పత్రి అధికారులు తాము ఆమె భర్తపై నమ్మకంతో సమాచారం ఇచ్చా మని, దాన్ని వెల్లడించలేమని ఆ మహిళకు జవాబి చ్చారు. తప్పకుండా ఆ సమాచారాన్ని వెల్లడిం చాల్సిందేనని సమాచార కమిషనర్ 2014 జూలై24న ([CIC/AD/A/2013/001681SA) తీర్పు చెప్పారు. ఒక వ్యక్తికి చేసిన చికిత్స వివరాలు వాణిజ్య గోపనీయత కిందికి ఎలా వస్తాయో అధికారులు వివరించలేకపోయారు. ఇది ఒక అన్యాయాన్ని, నేర స్వభావాన్ని రక్షించడానికి సమాచారం నిరాకరించే దుర్మార్గం తప్ప మరొకటి కాదు. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
అనైతిక వైద్యులకు శస్త్ర చికిత్స అవశ్యం
(మే నెల 18న ‘వైద్యులంటే నెత్తుటి వ్యాపారులా’ అన్న శీర్షిక కింద సాక్షి సంపాదకీయ పేజీలో వచ్చిన వ్యాసం చదివి నొచ్చుకున్నవారిని మన్నించాలని కోరుతున్నాను. నెత్తుటి వ్యాపారులెవరూ నన్ను తిట్టలేదు. కొందరు మంచి డాక్టర్లకు మాత్రం కోపం వచ్చింది. వైద్యవృత్తిలో ప్రమాణాల రక్షణకు విచి కిత్స అవసరం, అధిక సంఖ్యాకులౌతున్న అనైతిక వైద్యులకు శస్త్ర చికిత్స కూడా అవసరం –రచయిత) మన వృత్తిలో ఉన్నారన్న ఏకైక కారణంతో వైద్యవృత్తికే కళంకం తెచ్చే వారిని సమర్థించినా మౌనంగా సహించినా, ఆ కళంకితుల సంఖ్య పెరుగుతుందని గమనించాలి. డాక్టర్ల మీద వైద్యశాలల మీద వినియోగదారుల ఫోరంలలో దాఖలవుతున్న వేలాది కేసులు చూడండి. ఆర్టీఐ కింద డాక్టర్ల ఘోరాలను ఎండగడుతున్న దరఖాస్తులు, కమిషన్ ముందు అప్పీళ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో పేదరోగులను కూడా పట్టి పీడించే జలగలు ఎన్ని ఉన్నాయో గమనించి వైద్యులే వాటిని నివారించాలి. పెద్ద పట్టణాల్లో, మహానగరాల్లో మందులమ్ముకునే దుకాణాలతో పర్సెంటేజులు లేని డాక్టర్లెంతమంది ఉన్నారో వృత్తి ప్రేమికులు అంచనా వేసుకోవాలి. ఆస్పత్రులలో రోగుల అంగాంగాలు అమ్ముకొం టున్న కుంభకోణాల గురించి చదువుకోవాలి. ఏడేళ్ల అమ్మాయికి 661 సిరంజిలు 1546 గ్లోవ్స్ వాడామని అబద్ధం చెప్పి బిల్లు వేసిన వైద్యశాల వారు, కేసులుపెడితే వసూలుచేసిన డబ్బు తిరిగి ఇచ్చారు. ఆ అమ్మాయికి ప్రతిగంటకు రెండు సిరంజిలు అయిదు జతల గ్లోవ్స్ వాడారని అవాస్తవాలు చెప్పి గరిష్ట ధరకు అయిదింతలు ధర వసూలుచేస్తే ఆ వైద్యశాల డాక్టర్లు కూడా మనకెందుకని మౌనంగా ఉన్నారు. జరుగుతున్న ఘోరాలను చూడబోమని కళ్లుమూసుకుంటే అది వివేకవంతమైన పని కాదు. తాము మంచి వారమనుకునే డాక్టర్లంతా వెంటనే రోగులకు తమ చికిత్సా వివరాలు ఎప్పడికప్పుడు అందించే ఏర్పాట్లు చేయాలని నా మనవి. రోగులకు చికిత్సా వివరాలు ఇవ్వడం గొప్ప ముందడుగు అవుతుంది. ఇవ్వాళ నేనొక్కడినే అడుగుతుండవచ్చు. కాని 2005 దాకా సమాచార హక్కు అంటే నవ్వి హేళన చేసిన వారంతా ఈరోజు ఆ హక్కు తెస్తున్న మార్పులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వైద్యశాలల ఆల్మరాల్లో దాక్కున్న రోగుల చికిత్సా వివరాలు బయటికి వచ్చే రోజు వస్తుంది. చీకట్లో సాగే అవైద్య ఔషధ అవినీతి వ్యాపార వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయి. బయట దొరికే మందులకన్నా తక్కువ ధరకు ఆస్పత్రులు మందులు అమ్మితేనే వారికి తమ ఆస్పత్రి భవనంలో మందుల దుకాణం పెట్టుకునే అర్హత రావాలి. బయటకన్నా ఎక్కువ ధరకు మందులు అమ్ముకునే వారు వైద్యవృత్తి చేస్తున్నట్టా? నల్లబజారు నడుపుతున్నట్టా? అడిగే వాడు లేక, దాడులు చేసి పట్టుకునే అధికారుల్లో నీతి లేక, వైద్యుల, వైద్యశాలల అక్రమ మందుల వ్యాపారాలు నడుస్తున్నాయి. ప్రతిదానికీ కోర్టుకు పోలేక, కోర్టుల్లో ఏళ్లకొద్దీ పోరాడలేక అడిగేవాడు కరువైపోతున్నాడు. మేం నీతివంతంగా చికిత్స చేస్తాం, రికార్డులు స్వచ్ఛంగా రాస్తాం, మీకు ఇస్తాం, మందుల ధరల్లో మా కమిషన్ మినహాయించుకుని, లాభం తగ్గించుకుని లేదా లాభంలేకుండా నష్టం లేకుండా మందులు ఇస్తాం, బయటకన్నా మాధర తక్కువ అని ఢంకా బజాయించి చెప్పుకునే డాక్టర్లు, నర్సింగ్ హోంల యజ మానులు ముందుకు రావాలి. వస్తారా? రోగుల చికిత్సా వివరాలు దాచుకున్నంతకాలం వీరి చిత్తశుద్ధిని, విత్తబుద్ధిని ఎందుకు అనుమానించకూడదో చెప్పండి దయచేసి. ఉచి తంగా చికిత్స చేయకండి. అప్పులు చేసయినా మీ బిల్లులు కడతారు. కాని ఏం చేస్తున్నారో చెప్పండి, చెప్పిందే చేయండి. వైద్యో నారాయణో హరిః అంటే భవరోగాలకు అసలు వైద్యుడు నారాయణుడు అని అర్థం, కాని ప్రతివైద్యుడూ నారాయణుడని కాదు. దేవుడికన్న పూజనీయులైన వైద్యులు లేరని కాదు. వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. వైద్యం ఒక సేవావృత్తి. త్యాగనిరతి కలిగిన వృత్తి. నిరంతరం ఆరోగ్యాన్ని, దేహాన్ని రక్షించే వృత్తి. కాని అవన్నీ కట్టు కథలేనా? ఈ కాలంలో కనిపించే అవకాశం ఉందా? ఆయా వృత్తులలో అనైతిక ధోరణులను, ఆయా వృత్తులలో ఉన్న సంఘాల వారే నివారించాలి. డాక్టర్లు రోగులను అడిగి తమ లోపాలను తెలుసుకుని సరిదిద్దుకోవాలి. విమర్శించే వారిని కాదు. పొగిడే వారిని తిట్టాలి. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
ఆదాయ పన్నుల బకాయిల రద్దు ఉత్తిదే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఆదాయపు పన్ను విభాగం ప్రధాన ముఖ్య కమిషనర్ కార్యాలయం 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రూ.3,002.20 కోట్ల ఆదాయ పన్నుల బకాయిలను రద్దు చేసినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాల్లో వాస్తవం లేదని ఆ శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బకాయిలను రద్దు చేయడంతో పాటు రద్దు చేసేందుకు ప్రకటించడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద రూ.3,002.20 కోట్ల పన్నులు రద్దు చేసినట్లు వెల్లడిస్తూ తమ కార్యాలయం పొరపాటుగా సమాధానమిచ్చిందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో హైదరాబాద్ ఆదాయపు పన్ను విభాగం బేషరతు క్షమాపణను కోరుతున్నట్లు పేర్కొంది. కేవలం ఏమరుపాటుతోనే అసంబద్ధమైన సంఖ్యను ఆర్టీఐకి వచ్చిన ఓ ప్రశ్నకు జవాబుగా ఇచ్చామని ఆదాయపు పన్ను హైదరాబాద్ విభాగం స్పష్టీకరించింది. -
బ్యాంకింగ్ స్కాంలతో భారీ నష్టం, కోట్లకు కోట్లు ఆవిరి
ఇండోర్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్ కుంభకోణాలతో దేశంలో ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.25,775 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంకేనని తెలిసింది. ఈ ఏడాది ముగింపు వరకు వివిధ రకాల కుంభకోణాలతో పీఎన్బీకి అత్యధిక మొత్తంలో రూ.6461.13 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్టీఐ డేటాలో తేలింది. చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బ్యాంకింగ్ కుంభకోణాల్లో అతిపెద్దది డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలది. వీరు పీఎన్బీ అధికారులతో కుమ్మకై, బ్యాంకులో దాదాపు రూ.12,636 కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకింగ్ కుంభకోణాల వల్ల రూ.2390.75 కోట్ల నష్టం వచ్చినట్టు ఆర్ఐటీ సమాధానంలో తెలిసింది. ఇదే కాలంలో బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.2,224.86 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడాకు రూ.1,928.25 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1520.37 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,303.30 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.1,224.64 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.1,116.53 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,095.84 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,084.50 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు రూ.1,029.23 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.1,015.79 కోట్ల నష్టం వచ్చినట్టు వెల్లడైంది. కుంభకోణాలతో ప్రస్తుతం బ్యాంకులు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఎకనామిస్ట్ జయంతిలాల్ భండారి అన్నారు. దీని వల్ల ప్రస్తుతం బ్యాంకులు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా... భవిష్యత్తులో కొత్త రుణాలు అందివ్వడంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని హెచ్చరించారు. -
ఆ వివరాల వెల్లడికి పీఎన్బీ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో వెల్లడైన రూ 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆడిట్, విచారణ వివరాలను వెల్లడించేందుకు బ్యాంక్ నిరాకరించింది. ఈ వివరాలు వెల్లడిస్తే విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని పీఎన్బీ పేర్కొంది. స్కామ్కు సంబంధించి తనిఖీ చేసిన పత్రాల నకలును వెల్లడించేందుకూ పీఎన్బీ నిరాకరించింది. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు బ్యాంక్ బదులిస్తూ సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇతర నిఘా సంస్థలు విచారణ చేపడుతున్న దృష్ట్యా ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం 8 (1) (హెచ్) కింద ఇవ్వలేమని ఆర్టీఐ దరఖాస్తుదారుకు బ్యాంక్ స్పష్టం చేసింది. కేసు విచారణ పురోగతి, నిందితుల ప్రాసిక్యూషన్పై ప్రభావం చూపే సమాచారాన్ని సదరు సెక్షన్ల కింద నిరాకరించవచ్చని పేర్కొంది. పీఎన్బీలో నకిలీ పత్రాలతో బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్లు మెహుల్ చోక్సీ రూ వేల కోట్లు రుణాలు పొంది విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే. -
వైద్య వివరాలు ఇవ్వకపోవడం నేరం
ప్రయివేటు డాక్టరయినా ప్రభుత్వ డాక్టరయినా చికిత్సా వివరాల పత్రాలు ఇవ్వకపోతే వైద్యలోపం ఉందని భావిస్తారు. చికిత్సాపత్రాలు నిరాకరిస్తే అది వైద్యంలో నిర్లక్ష్యమే. వైద్యలోపానికి నష్టపరిహారం చెల్లించకతప్పదు. కేరళ హైకోర్టు రాజప్పన్ వర్సెస్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్సిటిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ ఎల్ ఆర్ 2004 (2) కేరళ 150) కేసులో రోగుల సమాచార హక్కును చాలా స్పష్టంగా నిర్దేశించింది.‘‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ 1.3.1 ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన, వాటిపైన సలహా, పరిశోధన తరువాత రోగ నిర్ధారణ జరిగితే ఆ వివరాలు, రోగికి ఇవ్వాలి. రెగ్యులేషన్ చివర ఇచ్చిన మూడో అనుబంధంలో పేర్కొన్న ప్రకారం కేస్ షీట్ ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తి మరణిస్తే అన్ని కారణాలు తెలియజేసే వివరాలు అందులో ఉండాలి, డాక్టర్ ఏ మందులు ఎప్పుడు వాడాలో నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేస్ షీట్లో తేదీల వారీగా ఉండాలి. చికిత్స వివరాలు చాలా సమగ్రంగా ఉండాలి. రోగి గానీ అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో మొత్తం కేస్ షీట్ తదితర వివరాలు అందించాలి. ఈ రెగ్యులేషన్ల ద్వారా రోగికి తన రికార్డు కోరే హక్కును చట్టం గుర్తించింది. పొందే మార్గాలను కూడా నిర్దేశించింది.’’ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపూ లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేస్ షీట్, మూడో అనుబంధపు వివరాలతో పాటు సంబంధిత పత్రాలు ఇంకేమయినా ఉంటే వాటినీ ఇవ్వాలి. ఏ చట్టంలోనూ దీనికి మినహాయింపు లేదనీ కనుక మొత్తం చికిత్స వివరాల ఫోటో కాపీలు ఇవ్వక తప్పదని కేరళ హైకోర్టు వివరించింది. హాస్పటల్ ఇచ్చిన ఈ మెడికల్ రికార్డును తమకు వ్యతిరేక సాక్ష్యంగా రోగులు వాడుకుంటారని వైద్యశాల యజమానులు వాదించారు. కాని ఈ కారణంపై వైద్యులకు మినహాయింపు ఇచ్చే అవకాశమే లేదని హైకోర్టు తెలిపింది. ఒకవేళ వైద్యులు సక్రమంగా వైద్యం చేసి ఆ వివరాలే నమోదు చేసి ఉంటే డాక్టర్లకు అది అనుకూల సాక్ష్యమవుతుంది. డాక్టర్లు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు సాక్ష్యంగా వాడుకోవలసిందే. మంచి చికిత్స చేసిన వారు కేసులు వస్తాయని భయపడాల్సిన పనే లేదు. తప్పుడు చికిత్స నిరోధించాలంటే రోగులకు చికిత్సచేసిన వివరాలకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాల్సిందే. ఈ కేసులో న్యాయార్థికి తన కూతురికి చేసిన చికిత్సవివరాలు తీసుకునే హక్కు ఉందనీ, ఇచ్చే బాధ్యత డాక్టర్లపైన హాస్పటల్ పైన ఉందని హైకోర్టు వివరించింది. ఈ వైద్యవివరాలను నిరాకరించడం అంటే తన బాధ్యతానిర్వహణలో అది లోపమో నిర్లక్ష్యమో అవుతుందని అనేక హైకోర్టులు వినియోగదారుల హక్కుల న్యాయస్థానాలు వివరించాయి. కన్హయ్యాలాల్ రమణ్ లాల్ త్రివేది వర్సెస్ డాక్టర్ సత్యనారాయణ విశ్వకర్మ (1996, 3 సి.పి.ఆర్ 24 గుజరాత్) కేసులో ఆస్పత్రి అధికారులు, వైద్యులు రోగికి రికార్డులు ఇవ్వలేదు. దీన్ని వైద్య లోపంగానూ, నిర్లక్ష్యంగానూ నిర్ధారించింది. వారు మెడికల్ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి కూడా నిరాకరించారు. నివేదికలను నిరాకరించడం వల్ల ఆ వైద్యులు అందించిన చికిత్సలో ప్రమాణాలు లోపించాయని భావించడానికి ఆస్కారం ఏర్పడింది. వారు రోగికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. పైగా రికార్డులలో ప్రస్తావించవలసిన వివరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక హాస్పటల్ వారు కేస్షీట్లో అనస్థటిస్ట్ పేరును తమ ఆపరేషన్ నోట్స్లో వెల్లడించలేదు. ఆకేసులో ఇద్దరు అనస్థటిస్టులు రోగికి అనస్థీషియా ఇచ్చారు. ఒకే రోగికి రెండు రకాల ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయని తేలింది. రెండు పత్రాలు విడిగా సమర్పించారు. దీన్ని బట్టి హాస్పటల్ వర్గాలు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మీనాక్షి మిషన్ హాస్పటల్ అండ్ రిసర్చ్ సెంటర్ వర్సెస్ సమురాజ్ అండ్ అనదర్ [I(2005) CPJ(NC)] కేసులో జాతీయ కమిషన్ తీర్పు చెప్పింది. (కేంద్ర సమాచార కమిషన్ నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్యరంగం పారదర్శకతపై రచ యిత సమర్పించిన పరిశోధనా పత్రంలో భాగం). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
15 లక్షల ప్రామిస్పై బదులిచ్చారు
సాక్షి, న్యూఢిల్లీ ; గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను ప్రజలెవరూ మరిచిపోలేదు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనానంత వెనక్కి తెప్పించి.. ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ నాటి ఎన్నికల ప్రచారంలో ప్రామిస్ చేశారు. అయితే దీనిపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరణ అడిగ్గా.. ప్రధాని కార్యాలయం ఇప్పుడు స్పందించింది. ఆర్టీఐ చట్టాన్ని అనుసరించి ఇది అసలు ‘సమాచారం’ కిందే రాదంటూ ఆ దరఖాస్తును తిరస్కరించింది. నవంబర్ 26, 2016న(అంటే మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన 18 రోజుల తర్వాత) మోహన్ కుమార్ శర్మ అనే వ్యక్తి ప్రధాని కార్యాలయానికి.. ఆర్బీఐకు ఆర్టీఐ కింద లేఖలు రాశారు. ‘రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ చెప్పారు. అది ఎంత వరకు వచ్చింది? అని ఆయన వివరణ కోరారు. అయితే దానికి పీఎంవో ఆఫీస్ ఇప్పుడు స్పందించింది. ఆర్టీఐ చట్టం సెక్షన్-2(ఎఫ్) ప్రకారం ఇదసలు సమాచారం కిందే రాదంటూ ప్రధాన కార్యాలయపు సమాచార కమిషనర్ ఆర్కే మథుర్ పేరిట అశోక్కు బదులు వచ్చింది. ఇక నోట్ల రద్దు నిర్ణయం కొన్ని ప్రింట్ మీడియాలకు ముందే ఎలా తెలిసిందంటూ అశోక్ మరో లేఖ రాయగా.. అది కూడా సమాచారం కింద రాదంటూ పీఎంవో ఆఫీస్ పేర్కొంది. సమాచార హక్కు చట్టం-2015 లోని సెక్షన్-2(ఎఫ్) ప్రకారం.. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు సమాచారం కిందకు వర్తిస్థాయి . ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉండొచ్చు. -
శ్రీదేవి అంత్యక్రియలపై...
సాక్షి, ముంబై : లెజెండరీ నటి శ్రీదేవి అంత్యక్రియల విషయంలో నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని తెలిపారు. అనిల్ గల్గాలి అనే ఉద్యమవేత్త రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగానికి(సీఏడీ) ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఏ ప్రతిపాదికన ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని అందులో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ‘శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 25న అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అందులో ఉంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ముంబై సబ్ అర్బన్ కలెక్టర్, పోలీసు కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. పైగా పద్మ అవార్డు గ్రహీతలకు(శ్రీదేవికి పద్మశ్రీ దక్కింది) గౌరవ లాంఛనాలతో నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి’ అని లేఖలో ప్రస్తావించింది. ఇక గత ఆరేళ్లలో మొత్తం 41 మందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. అందులో మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ముఖ్, ఏ ఆర్ అంతులే, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తదితరుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆమె గొప్ప నటే కావొచ్చు. అయినా జాతీయ పతాకాన్ని కప్పేంతగా ఆమె దేశానికి ఏం చేశారు? అని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థ్రాకే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
పాలకులు కాదు.. పాపాలకులు
విశ్లేషణ ఫైళ్లు మాయం కావన్న నమ్మకమైన వ్యవస్థ ఉంది కనుక మాయమైతే ఏం చేయాలో ఆంగ్లేయులు రాసుకోలేదు. మనం మరీ దారుణం కదా. మాయం చేస్తాం. రికార్డుల చట్టం చేస్తాం. కాని మాయం చేస్తే ఏం చేయాలో రాసుకోం. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించేది రాజ్యాంగం. సంవిధానం అని కూడా అంటారు. సమతా సమానతా ధర్మాన్ని తీర్చిదిద్దిన ఒక గతిశీల, ప్రగతి శీల ఆచరణాత్మక మార్గదర్శిక మన సంవిధానం. పాటించవలసిన బాధ్యతలను వివిధ విభాగాల అధికారుల మీద మోపిన సూచిక భారత రాజ్యాంగం. ప్రజల హక్కులేమిటో చెబుతూ ప్రభుత్వ బాధ్యతలను నిర్ధారించింది. ప్రభుత్వానివి అపారమైన అధికారాలు. లక్షలకోట్ల ప్రజాధనం మీద శతకోటి జనప్రాణాల మీద పెత్తనం అంటే అత్యధిక అధికారాలు. దేశాధినేతగా ఉన్న వ్యక్తిచేతిలో ఆ అత్యున్నత అధికారం కేంద్రీకరించకుండా మంత్రి మండలి, అందులో అపారమైన శక్తివంతుడైన ప్రధాని మంత్రివర్గ సభ్యులతో చర్చించి సమిష్టిగా నిర్ణయించాలి. మంత్రి వర్గం పార్లమెంటు ఉభయసభల్లో ప్రజాప్రతినిధులకు జవాబుదారు. తన నిర్ణయాలను వారి ముందుంచి అనుమతి తీసుకోవాలి. ఆ చట్టసభ సభ్యులు దేశ ప్రజలకు తాము ఏంచేసారో చెప్పుకొమ్మని చెప్పింది రాజ్యాంగం. మంత్రివర్గం ప్రభుత్వం, పార్లమెంటు పనుల రాజ్యాంగ బద్ధతను సమీక్షించి అవి రాజ్యాంగ వ్యతిరేకమైతే కోప్పడి కొట్టివేసే అత్యున్నతాధికారాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులకు కట్టబెట్టింది. రాజ్యాంగమనే న్యాయపాలనా చక్రంలో ఒక్కో ఆకు ప్రజలకు గ్యారంటీ ఇచ్చిన ఒక్కో హక్కు. ఏ ఒక్క ఆకు (చక్రం పుల్ల) విరిగినా చక్రం బలహీనమవుతుంది. కాలక్రమంలో తుప్పుబట్టి కదలలేకపోతుంది. రాజ్యాంగ ధర్మచక్రాన్ని తుప్పుబట్టకుండా తప్పుబట్టమని చెప్పే కందెనే సమాచార హక్కు. తప్పుల్ని అడిగేసి నిప్పులతో కడిగేసే పౌరులు లేకపోతే, చక్రాలకు, రథాలకు తుప్పుబడుతుంది. హక్కులు దాక్కున్న ఖనిజాలు. వాటిని నిజాలు చేయగల హక్కు ఆర్టీఐ. అధికారంతో విర్రవీగే అధికారులకు ఇది తెలుసు, కాని వారి స్వార్థం, అవినీతి సర్పాలు పడగలెత్తి లేచి చెప్పొద్దంటాయి. వారి నిశ్చర్యలను అడిగితే తప్ప చర్యకు ఉపక్రమించరు. హంతకుడు వెంటనే సాక్ష్యాన్ని హత్య చేసినట్టు తప్పు చేసిన వాడు ఆ దస్తావేజు మాయం చేస్తాడు. సాక్ష్యం ఫైల్ నోట్స్లో ఉంటుంది. ఇవ్వక తప్పదు. కనుక మాయం చేస్తారు. ఫైళ్లను మాయం చేస్తే ఎవరు అడుగుతారు? ఎవరిని ఏమంటారు? అసలు ఏం చేస్తారు? దస్తావేజు అదృశ్యం చేస్తే నేరాలు దాగుతాయి. కుంభకోణాలు బయటపడవు. వారితో కలిసున్న నేరగాళ్ల పరంపర అంతా బతికి పోతుంది. సమాచార హక్కును ఈ రోజు మొత్తంగా కబళించే భూతం తప్పిపోయిన దస్తావేజు. లేదా దారి తప్పిన వారు తప్పించిన దస్తావేజు. బ్రిటిష్ పాలనలో ఉన్న ఒకే ఒక గొప్ప క్రమబద్ధమైన లక్షణం ఏమంటే చేసిన ప్రతిపనికీ ఒక దస్త్రం ఉంటుంది. తేదీల వారిగా కాగితాలను భద్రపరిచే విధానం ఉంటుంది. వారు ఫైళ్లు మాయమవుతాయనే ఊహకు కూడా ఆస్కారం ఇవ్వలేదు. ఫైళ్లు చూస్తే చాలు ఏం జరిగిందో చెప్పగలిగేవారు. అవినీతి పనులకు కూడా కాగితాలు ఉండేవి. వారి మీద చర్యలు తీసుకోవడమనేది మళ్లీ వారి వారి నీతిపైన, రాజనీతిపైన ఆధారపడతుందని వేరే చెప్పనవసరం లేదు. కాని దస్తావేజుల సృష్టి, నిర్వహణ, రక్షించడంలో ఆ కచ్చితత్వం, ప్రాచీన అభిలేఖాగారాలకు తరలించే పద్ధతిని భారతీయ పాలకులు రాను రాను నీరుగార్చి చివరకు సమాచార హక్కు వచ్చే నాటికి ఫైలు పోయింది ఏం చేయమంటారు సార్ అనేదాకా తీసుకువచ్చారు. ఫైళ్లు మాయం చేసే వాడు పాలకుడు కాడు. పాపాలకుడు. దీనికి తాజా ఉదాహరణ, బాలగంగాధర్ తిలక్ సినిమా తీయడానికి 2.5 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసిన ఫైలు లేకపోవడం, రకరకాల ఉత్సవాలు చేయడానికి ఒక విభాగాన్ని సృష్టించి వంద కోట్లు ఇచ్చారట. ఆ విభాగంలో పనిచేసేవారు పర్మినెంటు ఉద్యోగులు కాదు. వారు వెళ్లిపోయిన తరువాత చాన్నాళ్లకు మరొక విభాగాన్ని తయారుచేసి ఉద్యోగులను నియమించారు. వారికి ఒక్క కాగితం కూడా దొరకలేదట. సమాచార దరఖాస్తు ద్వారా ఈ డబ్బు మాయం, దస్త్రం మాయం సంగతి బయటపడింది, డబ్బు తీసుకున్న తిలక్ సినిమా దొంగ దొరికాడు. కాని డబ్బు ఇచ్చిన దొంగలు, సంతకాలు పెట్టి పంపకాలు చేసుకున్న సర్కారీనౌకర్లు దొరకలేదు. పుచ్చుకున్నవాడు నేరస్తుడే కాని వారికి అప్పళంగా జనం డబ్బు కోట్లు అప్పగించిన వాడు తక్కువ నేరస్తుడా? ఫైళ్లు మాయం కావన్న నమ్మకమైన వ్యవస్థ ఉంది కనుక మాయమైతే ఏం చేయాలో ఆంగ్లేయులు రాసుకోలేదు. కానీ, మనం మాయం చేస్తాం. రికార్డుల చట్టం చేస్తాం. మాయం చేస్తే ఏంచేయాలో రాసుకోం. మార్చి ఆరున కేంద్ర సమాచార కమిషన్ నూతన భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కమిషనర్లతో పదినిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కాని ఆయన పెద్దమనసుతో అరగంట మాట్లాడారు. మాయమైపోతున్న ఫైళ్లగురించి ఏమయినా చేయాలని, ఒక వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని, ఆ వ్యవస్థ లేకపోతే ఆర్టీఐ అవస్థల పాలవుతుందని ఈ రచయిత చెప్పారు. ప్రధాని చాలా శ్రద్ధగా విన్నారు. ‘‘ఫైళ్లు మాయమైతే పట్టుకోవడంపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. డిపార్ట్మెంట్లో ఫైలును మాయం చేసిందెవరో అది ఎక్కడుందో పరిశోధించే సమర్థులు పోలీసు ఉన్నతాధికారులే కదా..’’ అంటూ మరో కమిషనర్ ఐపీఎస్ అధికారి యశోవర్థన్ ఆజాద్ వైపు చూసారు ప్రధాని. తనతో ఉన్న పీఎంఓ, డీఓపీటీ శాఖల మంత్రి జితేందర్ సింగ్ వైపు చూసి ‘ఇది చాలా తీవ్రమైన సమస్య. వెంటనే విచారించే వ్యవస్థ ఏర్పాటు కావాలి’ అని సూచించారు. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
తపాలా తప్పులకూ పరిహారమే!
విశ్లేషణ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అన్నా, పోస్ట్ మ్యాన్ అన్నా నమ్మకానికి మారుపేర్లు. కానీ ఇటీవల పోస్టాఫీసులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు, సమాచార నిరాకరణలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవేనా ఆ తపాలా కార్యాలయాలు అనిపిస్తుంది. తపాలా కార్యాలయం అంటే ప్రతి గ్రామంలో ఒక చైతన్య కేంద్రం. అందరికీ ఆత్మీయ సందేశాలను అందించే ఒక ఆప్త బంధువు. డబ్బు దాచుకోవచ్చు. కుటుంబానికి డబ్బు మనీయార్డర్ చేయవచ్చు. దేశమంతటా మారుమూల గ్రామాలలో సైతం విస్తరించిన పోస్టాఫీసులు ప్రజల మిత్రులు పోస్ట్ మ్యాన్ ఊళ్లో వాళ్లందరికీ పరిచితుడు. ఎవరెవరు ఎక్కడుంటారో తెలిసినవాడు. కానీ ఇటీవల పోస్టాఫీసులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు, సమాచార నిరాకరణలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవేనా ఆ తపాలా కార్యాలయాలు అనిపిస్తుంది. ఉత్తరం చేరకపోవడం చాలా అరుదుగా జరిగేది. డబ్బు ఠంచనుగా అందేది. మానాన్న గారు చిన్నాయన గారి చదువుకోసం వందరూపాయలు మనీయార్డర్ పంపడం తెలుసు. అది ఆయనకు 99 శాతం వరకు సకాలానికే అందేది. ఇప్పుడంతా తిరగబడింది. అనేకానేక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సమాచార హక్కు ఈ శాఖలో జరుగుతున్న దురన్యాయాలను నిర్లక్ష్య ఆలస్యాలను, ఖాతాల్లో డబ్బు మాయం దుర్మార్గాలను ఎండగట్టడానికి ఒక అద్భుతమైన పరికరంగా ఉపయోగపడుతున్నది. అడిగేవాడు లేకుండా విర్రవీగుతున్న తపాలా దురుద్యోగులకు సమాచార హక్కు దరఖాస్తులు సింహస్వప్నాలు. ఉద్యోగానికి, లేదా కోర్సులో చేరడానికి ఆఖరి తేదీలోగా దరఖాస్తు పంపితే వారికి ఎందుకు చేర్చలేదని జనం నిలదీసి అడుగుతున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ చేసిన వస్తువులు ఉత్తరాలు, ప్రధానమైన పత్రాలు ఎందుకు మాయమై పోతున్నాయని చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. వేలాది పోస్టాఫీసుల్లో అవినీతిని ఊడ్చివేయడానికి ఆర్టీఐ కొత్త చీపురు కట్టగా పనిచేస్తున్నది. తపాలా సేవలను వినియోగించి భంగపడిన ఒక పౌరుడు ఆర్టీఐ అభ్యర్థనలో కొన్ని ప్రశ్నలు సంధించాడు. 2015 నవంబర్లో పంపిన రిజిస్టర్డ్ పోస్టు వస్తువు ఎందుకు చేరలేదు, తాను ఇచ్చిన మూడు ఫిర్యాదులపై ఏ చర్య తీసుకున్నారు అని. అది మరో డివిజన్కు సంబంధించిన విషయమని ఆ డివిజన్ ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించారని సీపీఐఓ జవాబిచ్చాడు. సరైన సమాచారం ఇచ్చాడని మొదటి అప్పీలు అధికారి సమర్థించారు. ఫిర్యాదుల విచారణ పోర్టల్కు ఫిర్యాదు కూడా చేశాడు. రూ. 63ల నష్టపరిహారం తీసుకోవాలని అతనికి చెప్పారు. డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం రూ. 63ల రిజిస్టర్డ్ చార్జీలతో పాటు వంద రూపాయల కనీస పరిహారం ఇవ్వవలసి ఉన్నా ఇవ్వలేదు. సరైన, పూర్తి సమాచారం ఇవ్వకపోవడం సీపీఐఓ చేసిన తప్పులు. కనుక జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే నోటీసు జారీ చేసింది కమిషన్. చాలా కీలకమైన పత్రాలను తన మేనల్లుడికి పంపానని, దానికి 480 రూపాయలు ఖర్చయిందనీ, దానితో పాటు 50 రూపాయల పుస్తకాన్ని పంపానని దరఖాస్తుదారుడు వివరించాడు. ఈ కవర్ అందకపోవడం వల్ల తన మేనల్లుడు ఒక పరీక్షకు హాజరు కాలేకపోయాడని, తదుపరి ఏడాది పరీక్షకు హాజరు కావలసి వచ్చిందని పరి హారం చెల్లించాలని కోరాడు. పరిహారం ఎందుకు ఇవ్వకూడదో వివరించాలని మరో నోటీసుకూడా జారీ చేసింది కమిషన్. పోస్టాఫీసు అధికారి మాత్రం రిజిస్టర్డ్ పోస్ట్ ఎందుకు అందలేదో విచారించి రూపొందించిన నివేదిక ప్రతిని ఆర్టీఐ అడిగిన వ్యక్తికి ఇచ్చామని చెప్పారు. విలువైన వస్తువులు పంపే వ్యక్తులు దానికి బీమా చేయించాలని, తాము పోయిన వస్తువు విలువను పరిహారంగా ఇచ్చే వీల్లేదని, రూల్స్ ప్రకారం కేవలం వంద రూపాయలు పరిహారం రూ. 63ల చార్జీలు మాత్రమే ఇస్తామని వివరించారు. సమాచారం త్వరగా ఇచ్చినప్పటికీ అది తప్పుడు సమాచారం కనుక పరిహారం ఇవ్వవలసిన కేసు అని కమిషన్ నిర్ధారించింది. సెక్షన్ 19(8)(బి) కింద రూ. 3,630ల పరిహారం (పూర్తి సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు 2 వేలు, పరి హారం 100, ప్రయాణ ఖర్చుల కింద రూ. 1,000లు, కోల్పోయిన వస్తువుల విలువ రూ. 53లు) ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. సేవల వితరణలో నిర్లక్ష్యం కారణంగా వినియోగదారుడికి నష్టం జరిగితే పరి హారం ఇవ్వడం ఏ సర్వీసు సంస్థకయినా తప్పదు. ఇదే పౌర నష్టపరిహార న్యాయసూత్రం. కానీ చిన్న చిన్న పరిహా రాలకోసం వినియోగదారులు కోర్టుకు వెళ్లడం లేదా మామూలు కోర్టుకు వెళ్లడం భరించలేని భారం అవుతుంది. కనుక డిపార్ట్మెంట్లోనే కొన్ని పరిహార సూత్రాలు ఏర్పాటు చేసుకుని న్యాయంగా పరిహారం చెల్లించాలి. పోస్ట్ చేసే వారు విలువైన వస్తువులను పంపేటప్పుడు వాటిని విధిగా బీమా చేయాలనే అంశానికి బాగా ప్రచారం ఇవ్వాలి. తరువాత ఆ బీమా సొమ్ము బాధితుడికి ఇవ్వడానికి తపాలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. అసలు పరిపాలనే మరిచిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకన్న ఘోరంగా తపాలా కార్యాలయాలు తయారు కావడం దురదృష్టకరం. కనుక పౌరులు విధిలేక ఆర్టీఐ ఆసరా తీసుకుంటున్నారు. దానికి కూడా సరైన సమాధానాలు ఇవ్వకుండా అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 19 అనేక పరిష్కారాలను కల్పిస్తున్నది. అందులో ఒకటి నష్టపరిహార నియమం. సమాచారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, పూర్తిగా ఇవ్వనందున, ఇచ్చినా ఆ సమాచారం తప్పుల తడక కావడం వల్ల కలిగిన నష్టాలకు అందుకు పౌరుడి పైన పడిన భారాన్ని కూడా ఆర్టీఐ భంగపరిచిన అధికార సంస్థ చెల్లించాలని 19(8) (బి) నిర్దేశిస్తున్నది. అయితే ఈ నష్టమే కాకుండా, ఇతర నష్టాలను, లోపాలను కూడా భర్తీ చేయాలని ఆ నియమంలో ఉంది. నిజానికి ఈ కేసులో పౌరుడి బంధువు పరీక్షకు హాజరుకాలేకపోవడం వల్ల ఏడాది సమయాన్ని కోల్పోయాడు. ఈ పరిహారాన్ని లెక్కించడం చాలా కష్టం. నామమాత్రంగా నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది. దరఖాస్తుదారుడు కూడా సరిగ్గా తన నష్టాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. అది కూడా జరగడం లేదు. (CIC/POSTS/ A/2017/167339 రాకేశ్ గుప్తా వర్సెస్ పోస్టాఫీస్ కేసులో సీఐసీ 9 జనవరి 2018 న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
సమాచార నిరాకరణ నేరం
విశ్లేషణ సమాచార చట్టం వచ్చి 13 ఏళ్లు దాటుతున్నా ఇంకా సెక్షన్ 8 ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆరోపణలకు గురైన ఉద్యోగి తప్పిదాన్ని రుజువు చేయడానికి ముందు ఆరోపణలకు సంబంధించిన వివరాలు అతనికి పూర్తిగా ఇవ్వడం న్యాయం. సమాచార అధికారుల అసంబద్ద సమాధానాలతో సెక్షన్ 8 నియమాలను ఎడా పెడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎంక్వయిరీ నడుస్తున్నదన్న కారణంగా కోరిన సమాచారం నిరాకరించడానికి వీల్లేదని, వెల్లడి చేయడం వల్ల ఎంక్వయిరీలో ప్రతిబంధకం ఏర్పడుతుందని రుజువు చేయగలిగినప్పుడే సమాచారం నిరాకరించడం సాధ్యమని సెక్షన్ 8(1) హెచ్ వివరిస్తున్నది. కాని ఆ సెక్షన్ పేరును వాడుకుని నిరాకరిస్తూ ఉన్నారు. కోర్టులో కేసు పెండింగ్, పోలీసులు, ఇతర సంఘాలు దర్యాప్తు చేస్తున్నాయని, నేర నిర్ధారణ జరుగుతున్నదంటూ సమాచారం నిరాకరించడం చట్టవిరుద్ధం. 2007వ సంవత్సరంలో భగత్ సింగ్ వర్సెస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ అదర్స్ కేసులో కేవలం దర్యాప్తు ప్రక్రియ అమలులో ఉన్నంత మాత్రాన అది సమాచార నిరాకరణకు కారణం కాబోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ అథారిటీ అయితే ఆ కారణంపైన సమాచారాన్ని నిరాకరిస్తున్నదో, ఆ అధికారి సమాచారాన్ని ఇస్తే దర్యాప్తు ప్రక్రియ కుంటుపడుతుందనడానికి సంతృప్తికరమైన కారణాన్ని చూపవలసి ఉంటుంది. పరిశోధనా ప్రక్రియను దెబ్బతీస్తుందనే అభిప్రాయానికి రావడానికి తగిన సాక్ష్యం కూడా ఉండాలి. లేకపోతే సమాచారం ఇవ్వకుండా ఆపడానికి సెక్షన్ 8(1)(హెచ్) నియమం ఒక స్వర్గధామంగా ఉపయోగపడుతుందని హైకోర్టు ఆక్షేపించింది. శ్రీ సత్యారాయణన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో సీఐసీ 2011 నాటి ఉత్తర్వులో ఇటువంటి ఆదేశాన్నే వెలువరించింది. పి. శివకుమార్ వర్సెస్ సిండికేట్ బ్యాంక్ కేసులో కూడా 2012లో ఇచ్చిన తీర్పులో కేంద్ర సమాచార కమిషన్ ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(హెచ్)లో పేర్కొన్న పదాలను వివరిస్తూ, దర్యాప్తు పెండింగ్లో ఉంటే సమాచారం ఇవ్వకూడదనేదే పార్లమెంటు ఉద్దేశమయితే ఆ విధంగానే పదాలు రచించేదని ప్రత్యేకంగా దర్యాప్తునకు ప్రతి బంధకంగా కనిపించే సమాచారాన్ని మాత్రమే వెల్లడించవద్దని చెప్పి ఉండేది కాదని పేర్కొన్నది. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన పత్రాల ప్రతులు అడిగితే ఇవ్వలేదని శ్రీనివాసులు సమాచార కమిషన్ ముందు అప్పీలులో విన్నవించారు. తనపై దర్యాప్తు జరిపిన తరువాత నివేదిక ప్రతి తనకే ఇవ్వలేదని, దర్యాప్తు పూర్తయిన తరువాత కూడా తనకు కావలసిన కాగితాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ప్రతి దానికీ సెక్షన్ 8 కింద మినహాయింపు క్లాజులను చూపిస్తారే కాని ఏ నియమం ప్రకారం, ఏ కారణాల వల్ల సమాచారం నిరాకరించారో వివరించకపోవడం జన సమాచార అధికారులు చేసే ప్రధానమైన పొరపాటు. సమాచార చట్టం వచ్చి 13 ఏళ్లు దాటుతున్నా ఇంకా సెక్షన్ 8ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆరోపణలకు గురైన ఉద్యోగి తప్పిదాన్ని రుజువు చేయడానికి ముందు ఆరోపణలకు సంబంధించిన వివరాలు అతనికి పూర్తిగా ఇవ్వడం న్యాయం. తాను నేరస్తుడు కాదని రుజువు చేసుకోవడానికి, చెప్పుకునేందుకు పూర్తి అవకాశం ఇవ్వాల్సిందే. ఆ అవకాశం ఇవ్వకపోతే సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన కింద ఆ దర్యాప్తు గానీ, దానిపై ఆధారపడి తీసుకున్న చర్య గానీ చెల్లకుండా పోతాయి. అనుమతి తీసుకోకుండా విధులకు హాజరు కాలేదన్నది ఆరోపణ అయితే అందుకు కావలసిన హాజరీ వివరాలు నిందితుడికి ఇవ్వవలసి ఉంటుంది. సమాచార అధికారిగా ఉండవలసిన సీపీఐఓ సూపరిం టెండెంట్ ఆఫ్ పోస్ట్ పదవిలో తొమ్మిదేళ్లనుంచి ఉంటూ పై అధికారులతో కుమ్మక్కయి సమాచార దరఖాస్తులను పూర్తిగా నిరాకరిస్తున్నారని, వీరి ఆధ్వర్యంలో సమాచార చట్టం పూర్తిగా దెబ్బతింటున్నదని ఆరోపించారు దరఖాస్తుదారుడు. ప్రజాసంబంధ అధికారి డీఎస్ పాటిల్పై జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలని నోటీసు జారీ చేసింది. అతని హాజరీకి సంబంధించిన రికార్డులను 15 రోజుల్లో ఇవ్వాలని కూడా ఆదేశించింది. శ్రీనివాసులుకి 10.12.2015 నాడు సమాధానం ఇచ్చామని, 2014–15 నాటి హాజరీ రిజిస్టర్లను పరిశీలించడానికి రావచ్చునని అతనికి అవకాశం ఇచ్చామని తన వివరణలో డీఎస్ పాటిల్ (మాజీ సీపీఐఓ) వివరించారు. 21.06.2017 నాడు కమిషన్ ఉత్తర్వులు వచ్చిన తరువాత పూర్తి సమాచారం ఇచ్చామని చెప్పారు. పై అధికారిని ధిక్కరించినందున శ్రీనివాసులు పైన రూల్ 16 కింద క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు నోటీసు జారీ చేసి దర్యాప్తు చేపట్టామనీ, విచారణలో ఆరోపణలు రుజువై ఇంక్రిమెంట్ను మూడేళ్లపాటు నిలిపివేయాలని నిర్ణయించారని వివరించారు. శ్రీనివాసులు మొదటి అప్పీలు తిరస్కరించిన తరువాత అతనిపై దర్యాప్తు పూర్తయి ఇంక్రిమెంట్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారని సీపీఐఓ పాటిల్ చెప్పారు. కేవలం కోర్టులో సవాలు చేయడానికి మాత్రమే ఈ పత్రాలు అడుగుతున్నాడని, కనుక ముందుగా సమాచారం ఇవ్వలేదని వివరిం చారు. సీపీఐఓ మరో వాదం లేవదీశారు. తనపై విచారణకు సంబంధించిన సమాచారం అడుగుతూ ఉంటే అది మూడో వ్యక్తి సమాచారం కాబట్టి సెక్షన్ 11 ప్రకారం తాను సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే సీపీఐఓ అది ఏ మూడోవ్యక్తి సమాచారమో తెలియజేయలేదు. ఆ వ్యక్తిని సంప్రదించారో లేదో తెలియదు. తనపై క్రమశిక్షణా చర్యల వివరాలు అడిగితే అది మూడో వ్యక్తి సమాచారం ఏ విధంగా అవుతుందో చెప్పలేకపోయారు. హాజరీ పట్టిక విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వవలసినవే. ఆ పత్రాలు అతని కోర్టు వివాదానికి అవసరమో కాదో పూర్తిగా తెలుసుకోకుండా, కోర్టుకు కేసును తీసుకువెళ్తాడు కనుక అడిగిన సమాచారం ఇవ్వబోమనడం మరొక తప్పు. మొత్తానికి సమాచారాన్ని అన్యాయంగా నిరాకరించారని తేలింది. అందుకు బాధ్యుడైన సీపీఐఓ డీఎస్ పాటిల్ పైన సమాచార హక్కు చట్టం 20 కింద 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. (CIC/BS/A/2016/ 000955 ఎం. శ్రీనివాసులు వర్సెస్ పోస్టల్ డిపార్ట్ మెంట్. కేసులో 18.1.2018 నాటి ఆదేశం ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
టీ, స్నాక్స్కు రూ. 69 లక్షలు ఖర్చుపెట్టిన సీఎం
డెహ్రాడున్ : అతిథులకు ఇచ్చే టీ, స్నాక్స్ కోసం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం( ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా వెల్లడైంది. త్రివేంద్ర సింగ్ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 నెలల కాలంలో అతిథులకు స్నాక్స్, టీ కోసం ఎంత ఖర్చైందో తెలియజేయాలని ఆర్టీఐ చట్టం కింద హేమంత్ సింగ్ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. త్రివేంద్ర సింగ్ గత ఏడాది మార్చి 18న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అతిథులకు టీ, స్నాక్స్ కోసం రూ. 68,59,685 లు ఖర్చైనట్లు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ డబ్బును మంత్రులు, ప్రభుత్వ అధికారులు, అతిథుల సమావేశాల్లో ఇచ్చే టీ, స్నాక్స్కు సైతం ఖర్చు చేశారని ఆర్టీఐ అధికారి పేర్కొన్నారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మంత్రులకు టీ, స్నాక్స్ కోసం సుమారు రూ.9కోట్లు ఖర్చుపెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. -
ఆ చర్యలంటే మోదీకి కూడా భయమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతమొద్దిస్తానంటూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విస్తతంగా ప్రచారం చేశారు. అవినీతిపరులు ఎవరైనా సరే, ఆఖరికి తన పార్టీ వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ‘చేతనైతే చేయి లేదంటే చచ్చిపో’ అంటూ జాతిపిత మహాత్మాగాంధీ నినాదమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2022 వరకల్లా అవినీతి రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని భరోసా కూడా ఇచ్చారు. 2జీ స్పెక్ట్రమ్ లాంటి భారీ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, స్కామ్లకు బాధ్యులైన వారంతా శిక్షలు అనుభవించాల్సిందేనని మోదీ చెప్పారు.(సాక్షి ప్రత్యేకం) అవినీతికి వ్యతిరేకంగా నాడు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించడం వల్ల ఆయన నాయకత్వాన భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. మరి, ఈ మూడున్నర ఏళ్ల కాలంలో అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు మోదీ ప్రభుత్వం తీసుకుంది? అవినీతిపరుల్లో ఎంత మందికి శిక్షలు పడ్డాయి? సరైన సాక్షాధారాలు లేవంటూ 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కేసును ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు ఎందుకు కొట్టివేయాల్సి వచ్చింది? అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుకన్నా మోదీ ప్రభుత్వం రికార్డేమీ మెరుగ్గా లేదు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ఎన్నిచర్యలు తీసుకుందో తెలుసుకోవడానికి ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద పీఎంవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధానంగా మూడు ప్రశ్నలు వేశారు.(సాక్షి ప్రత్యేకం) దేశంలో దాదాపు ఐదువేల మంది ఐఏఎస్ అధికారులు ఉండగా, వారిలో వంద మందిపైనా అవినీతి ఆరోపణలు రాగా, వారిలో ఎంత మందిపై ఫిర్యాదులు నమోదు చేసుకున్నారని, ఎంత మందిపై విచారణ కొనసాగుతోంది, ఎంత మందికి శిక్షలు పడ్డాయన్నది మొదటి ప్రశ్న. ఐఏఎస్ల అవినీతి గురించి ప్రధాని కార్యాలయాన్ని అడగడానికి కారణం వారిని విచారించాలన్నా, శిక్ష విధించాలన్నా నిర్ణయం తీసుకోవాల్సిందీ ప్రధానియే కనుక. 12 మంది అవినీతి ఐఏఎస్ అధికారులపై చర్యకు ఉపక్రమించామని, విచారణ పూర్తయ్యేందుకు 12 ఏళ్లు పడుతుందని కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. 2012 నుంచి 2014 మధ్య, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోగా బీజేపీ మూడున్నర ఏళ్ల కాలంలో 12 మందిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఐఏఎస్ అధికారులపై రెండు రకాలుగా విచారణ జరుగుతుంది. అవినీతి నిరోధక చట్టం కింద కోర్టులో విచారణ ఒకవైపు జరిగితే, డిపార్ట్మెంట్పరంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో మరోవైపు విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సదరు అధికారి దోషిగా తేలితే ఆయనపై విజిలెన్స్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నోడల్ మినిస్ట్రీకి నివేదికను పంపిస్తుంది.(సాక్షి ప్రత్యేకం) ఆ నోడల్ మినిస్ట్రీ కూడా తగిన చర్యలకు సిఫార్సు చేస్తుంది. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారిని తక్షణమే పదవి నుంచి తొలగించాలా లేదా పదవి విరమణ చేయించాలా, పదవీ విరమణ తర్వాత వారికొచ్చే పింఛన్ సొమ్ములో కోత విధించాలా? తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ప్రధాన మంత్రిదే. రెండేళ్ల కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చట్టం సూచిస్తున్నా ఈ ప్రక్రియ పూర్తచేయడానికి సంబంధిత ప్రభుత్వాలు ఏడెనిమిదేళ్లు తీసుకుంటున్నాయి. ఈలోగా ప్రభుత్వాలే మారిపోతున్నాయి. ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు తదితరుల అందరిపై వచ్చే అవినీతి ఆరోపణల కేసులను విచారించేందుకు వీలుగా లోక్పాల్ను ఇంతవరకు ఎందుకు ఎంపిక చేయలేదన్న సామాజిక కార్యకర్త ప్రశ్నకు మోదీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. లోక్పాల్, లోకాయుక్త చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లోనే తీసుకొచ్చింది. దాన్ని తక్షణమే అమలు చేయాలంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ లోపల, వెలుపల పెద్ద ఎత్తున గొడవ చేయడంతో 2014, జనవరిలో యూపీఏ ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసింది. అదే ఏడాది మే నెలలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదట్లో లోక్పాల్ ఊసుకూడా ఎత్తలేదు.(సాక్షి ప్రత్యేకం) ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు లోక్పాల్ నియామకం గురించి ప్రశ్నించగా లోక్పాల్ను ఎంపికచేసే ప్యానల్లో ప్రతిపక్షం నాయకుడు తప్పనిసరిగా ఉండాలని, పార్లమెంట్లో ఎవరికి ఆ హోదా రాకపోవడంతో నియామక ప్రక్రియను చేపట్టలేకపోతున్నామని మోదీ ప్రభుత్వం సమర్థించుకుంది. చట్టం ప్రకారం లోక్సభలోని 545 సీట్లలో కనీసం పది శాతం సీట్లు లభిస్తేనే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. లోక్సభలో పాలకపక్షం తర్వాత ఏ పార్టీకి అధిక సీట్లు లభిస్తే అదే ప్రతిపక్షం అవుతుందని, అందుకు అనువుగా చట్టాన్ని ఎందుకు మార్చడం లేదని సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా విమర్శించడంతో 2014, డిసెంబర్ నెలలో చట్టం సవరణకు ప్రతిపాదన చేసింది. దాన్ని ఆ తర్వాత పార్లమెంట్ స్థాయీ సంఘానికి నివేదించింది. 2015, డిసెంబర్ నెలలో కొన్ని మార్పులతో ఆ నివేదికను కేంద్రానికి స్థాయీ సంఘం నివేదించింది. (సాక్షి ప్రత్యేకం)అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం పరిశీలనలోనే ఆ నివేదిక ఉందని సామాజిక కార్యకర్త ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికైనా అవినీతిని నిర్మూలించడం పట్ల చిత్తశుద్ధి ఉంటే లోక్పాల్ నియామకం ఎప్పుడో జరిగేదని రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
పబ్లిసిటీ ఘనం.. మరి పాలన?
సాక్షి, న్యూఢిల్లీ : మూడేన్నరేళ్ల బీజేపీ పాలనలో పబ్లిసిటీ పేరిట పెట్టిన ఖర్చెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. సుమారు 3,755 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా ఖర్చు చేశారు. సమాచార హక్కు కింద దాఖలు చేసిన ఓ పిటిషన్ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్ 2014 నుంచి అక్టోబర్ 2017 దాకా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, అవుట్డోర్ పబ్లిసిటీ పేరుతో అక్షరాల 37, 54, 06, 23, 616 రూపాయలను ఖర్చు చేశారు. ఇక విడివిడిగా చూసుకుంటే రేడియో, డిజిటల్ సినిమా, దూరదర్శన్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, టీవీ తదితర ఎలక్ట్రానిక్ మీడియా అడ్వర్టైజ్మెంట్ల కోసం 1,656 కోట్లు ఖర్చు చేసింది. ప్రింట్ మీడియాకొస్తే.. 1,698 కోట్లు, హోర్డింగ్లు, పోస్టర్లు, బుక్లెట్లు, క్యాలెండర్లు తదితర ఔట్డోర్ అడ్వర్టైజ్మెంట్ల కోసం 399 కోట్లు కేంద్ర ఖర్చు పెట్టింది. ఒక ఏడాది బడ్జెట్ లో ఏదైనా ఓ శాఖ కోసం కేటాయించే నిధుల కంటే ఇది చాలా ఎక్కువ. అంతెందుకు గత మూడేళ్లలో కాలుష్య నివారణ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 56.8 కోట్లు కావటం విశేషం. గతంలో తన్వర్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కేంద్ర సాంకేతిక సమాచార శాఖను కోరగా.. జూన్ 1, 2014 నుంచి ఆగష్టు 31, 2016 వరకు మోదీ యాడ్స్ కోసం 1100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పాలన, పథకాల గురించి ప్రచారం చేసిన సమయంలో 526 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. బీజేపీ-కాంగ్రెస్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఈ విషయం వెలుగు చూడటంతో బీజేపీని ఏకీపడేసేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. -
షాకింగ్: 210 వెబ్సైట్లలో మన ఆధార్ డేటా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆధార్లోని వ్యక్తిగత సమాచారంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం సమాచార భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విషయంల తెలిసిందే. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు అధికార వర్గాలు ఇచ్చిన సమాధానం వ్యక్తిగత సమాచార గోప్యతపై పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని సైట్లు ఆధార్కార్డు వివరాలను ఉపయోగించుకుంటున్నాయనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 210 కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లుతోపాటు విద్యాసంస్థలు ఆధార్డేటాను అధికారికంగా ఉయోగించుకుంటున్నాయని ఆధార్ అధికారులు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు సైతం ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించుకుంటున్నాయి. వాటిలో ఆధార్కార్డు నెంబర్ను నమోదు చేయగానే కార్డు దారుని పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు, లావాదేవీల ఖాతాల వివరాలు కనిపిస్తున్నాయని కేంద్రం తెలిపింది. వినియోగదారుడి వ్యక్తిగత సమాచర భద్రత కోసం యూఐడీఏఐ పలు అంచెల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని ఆధార్ వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు వాటి పనితీరును అధికారులు సమీక్షిస్తారని ముఖ్యంగా డేటా సెంటర్లను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామని ఓ అధికారి తెలిపారు. డేటా భద్రత, గోప్యతను బలోపేతం చేయడానికి భద్రతా ఆడిట్లను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, డేటా సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
బిహార్ ఎగ్జామినేషన్ బోర్డు మరో నిర్వాకం
పట్నా: బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వాకం మరోకటి తాజాగా వెలుగు చూసింది. మెరిట్ స్టూడెంట్ను ఫెయిల్ చేసిన మరో తప్పు చేసింది. పదవతరగతి విద్యార్థికి హిందీ సబ్జెక్టులో 79 మార్కులకు వస్తే.. రెండే మార్కులు వచ్చాయంటూ ఫెయిల్ చేసి పడేసింది. అయితే దీనిపై బాధిత ఆర్టీఐను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఐఐటీ కలలుకంటున్న పదవ తరగతి విద్యార్థి ధనుంజయ్ కుమార్ అనూహ్యంగా ఫెయిల్ అయ్యాడు.. దీంతో అతను తీవ్ర నిరాశలో కూరుకు పోయాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. అయితే కుటుంబం ఇచ్చిన మద్దతుతో బతికి బయపడ్డాడు. సమాచార హక్కు చట్టం కింద బాధిత విద్యార్థి హిందీ పేపర్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రీవాల్యుయేషన్లో 79 మార్కులు వచ్చాయి. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 500 మార్కులకు గాను ధనుంజయ్ 421 మార్కులు సాధించాడు. దీనిపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. హిందీలో ఫెయిల్ చేయడంతో ఉన్నత విద్యకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కలలను బీహార్ బోర్డు నీరుగార్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. గత ఆరు నెలలుగా అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చింది ధనుంజయ్ కుమార్ సోదరుడు వాపోయాడు. దీంతో తన తమ్ముడు సరిగ్గా చదువులోక పోయాడన్నాడు. దీనిపై టెన్త్ బోర్డ్ స్పందించాల్సి ఉంది. కాగా, గత అక్టోబర్లో బిహార్ బోర్డ్ మరో విద్యార్థికి కూడా ఇలాంటి షాకే ఇచ్చింది. సంస్కృతంలో 100కి 80 మార్కులువస్తే.. 9 మార్కులు, సైన్స్ లో 61 మార్కులు వస్తే 29 మార్కులు వేసి ఫెయిల్ చేసింది. చివరికి తప్పు ఒప్పుకున్న బోర్డు మార్కులను సవరించింది. మరో ఘటనలో లెక్కల్లో 94 మార్కులు వచ్చినా జీరో మార్క్ ఇచ్చింది. -
మృతుడికి డబ్బు చెల్లించారా?
విశ్లేషణ మనకు పదివేల కోట్ల రూపాయల మోసాల గురించి థ్రిల్లింగ్ వార్తలు చదవడం, భారతీయుడు వంటి సినిమాలు చూడడం సరదా. కానీ రోజూ ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతున్న భారీ మోసాల గురించి పట్టింపు ఉండదు. ‘‘ఒక్క మాట చెప్పండయ్యా, నా భర్త చనిపోయిన మూడేళ్ల తరువాత మీ పోస్టాఫీసుకు వచ్చి ఎన్ఎస్సి సర్టిఫికెట్ల డబ్బు తీసుకుపోయినాడా?’’ ఇది.. భర్తను కోల్పోయి ప్రభుత్వ పింఛను పై ఆధారపడిన ఒక మహిళ టి. సుబ్బమ్మ నిలదీసి అడిగిన ప్రశ్న. కర్నూలు పోస్టాఫీసు సూపరింటెండెంట్ని నిరుత్తరుడిని చేసిన ప్రశ్న. టి. సుబ్బమ్మ భర్త చిన్న ఉద్యోగి. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో పదివేల రూపాయల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు 5 కొనుక్కున్నారు. ఆయన మరణించిన తరువాత డబ్బు ఇమ్మని కోరితే పోస్టాఫీసు జవాబివ్వలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. సెక్షన్ 8(1)(జె) కింద మూడో వ్యక్తికి చెందిన సొంత సమాచారమంటూ తిరస్కరించారు. మొదటి అప్పీలు వల్ల ప్రయోజనం లేదు. ఎంబీఏ చదివిన కుమారుడు సుధాకర్ తాము అడిగిన వివరాలు ఇప్పించాలని కమిషన్కు విన్నవించారు. సర్టిఫికెట్లు కొన్న వ్యక్తి, సుబ్బమ్మగారి భర్త ఆది శేషయ్య స్వయంగా వచ్చి డబ్బు తీసుకున్నారని, సుబ్బమ్మ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపినప్పుడు ఈ విషయం తేలిందని కమిషన్కు పోస్ట్ మాస్టర్ తెలియజేశారు. నివేదిక ప్రతిని కూడా సుబ్బమ్మకి ఇచ్చామని వివరించారు. సుబ్బమ్మ: ఏ తేదీన తీసుకున్నారయ్యా? అధికారి: 2007 జూన్ 27న ఒక సర్టిఫికెట్ డబ్బు, జూన్ 29న రెండు సర్టిఫికెట్ల డబ్బు, జూలై 2న మరొక సర్టిఫికెట్ డబ్బును మీ భర్త తానే స్వయంగా తీసుకున్నారమ్మా. సుబ్బమ్మ: మా ఆయన 10.5.2004న చనిపోయాడయ్యా, మూడేళ్ల తరువాత 2007లో ఆయనే వచ్చి డబ్బు ఏ విధంగా తీసుకున్నారయ్యా? వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో ఆ అధికారి ఫైళ్లన్నీ వెతుకుతూ నీళ్లునములుతూ కనిపించారు. ‘‘అయ్యా మరణ ధృవీకరణ పత్రం కూడా ఉంది సార్‘‘ అని సుబ్బమ్మ కుమారుడు వీడియోలో చూపించాడు. ఇప్పుడు చెప్పండి అని కమిషనర్ అడిగితే జవాబు లేదు. తన భర్త వచ్చి డబ్బు తీసుకున్నట్టు రామలింగయ్య అనే వ్యక్తి దొంగ క్లెయిమ్ పత్రాలు కల్పించారని, ఆ తరువాత ఎన్. బుజ్జి అనే పోస్ట్ మాస్టర్ నియమాల ప్రకారం చెక్కు ఇవ్వడానికి బదులుగా నగదు రూపంలో డబ్బు ఇచ్చారని, అదే మోసానికి తగిన సాక్ష్యమని సుబ్బమ్మ కొడుకు సుధాకర్ వాదించారు. చిన్న వెంకయ్య, రామలింగయ్య, తపాలా ఉద్యోగి గౌస్, దొంగ సాక్షి సుంకన విజయ కుమార్ ఆ డబ్బును బుజ్జితో పంచుకుని ఆ రాత్రి మందు, విందు చేసుకున్నారని కూడా సుధాకర్ ఆరోపించారు. సుబ్బమ్మ పోస్టాఫీసులో పనిచేసిన అధికారులపైన ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల సమాచారం లేదా పత్రాలు, విచారణ సాక్ష్యాలు, ఆ అధికారి వ్యక్తిగత సమాచారం అవుతుందని అధికారులు వాదించారు. దీన్ని మొదటి అప్పీలు అధికారి కూడా ఆమోదించడం మరీ ఆశ్చర్యకరం. ఇది దారుణమైన నిరాకరణ. ఒక భర్తలేని మహిళ డబ్బు కాజేయడానికి తోటి అధికారులు చేసిన మోసాన్ని, అవినీతిని రక్షించడానికి సమాచార అధికారులు సెక్షన్ 8(1)(జె)ను, సుప్రీంకోర్టు గిరీశ్ రామచంద్ర దేశ్పాండే కేసులో ఇచ్చిన ఒక తీర్పును ఉటంకిస్తూ ఇటువంటి ఫిర్యాదులు.. మోసం చేసిన అధికారుల వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వబోమని తిరస్కరించారు. గోప్యతా అనే పదాన్ని దానికి సంబంధించిన మినహాయింపును దుర్వినియోగం చేసి మోసాలు చేయడానికి వీల్లేదని కమిషన్ విమర్శించింది. పోస్టాఫీసు వాదాన్ని తిరస్కరిస్తూ అడిగిన వివరాలన్నీ ఇవ్వాలని, మొత్తం సంఘటనలపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే చిన్న అవినీతి ఇది. దీన్ని పత్రికలు పట్టించుకోవు, విజిలెన్సు వారికి కూడా చిన్నదనిపిస్తుంది. ఇవి ఏసీబీ, సీబీఐ దాకా వెళ్లవు. చదువురాని సుబ్బమ్మకు ఏం చేయాలో తోచదు. చదువుకున్న కొడుకు సాయం చేస్తున్నాడు. కోర్టులో పోరాడాలంటే బోలెడంత డబ్బు ఖర్చు. గెలుస్తారో లేదో? లాయర్ల ఫీజులకే డబ్బు ఒడుస్తుంది. మోసం జరిగిందని పోస్టాఫీసులో అందరికీ తెలుసు. బుజ్జి తరువాత వచ్చిన పోస్ట్మాస్టర్లంతా ఈ ఫైలు కప్పిపుచ్చారే తప్ప సుబ్బమ్మకు న్యాయం చేయాలనుకోలేదు. మధ్యలో ఒక పోస్ట్మాస్టర్ మాత్రం అన్యాయాన్ని గుర్తించి విచారణకు ఆదేశించారు. చనిపోయిన వ్యక్తే వచ్చి డబ్బు తీసుకున్నాడని విచారణాధికారి నిర్ణయించారు. సమాచార చట్టం కింద సవాలు చేస్తే ధైర్యంగా విచారణ నివేదిక ప్రతి ఇచ్చారు. కానీ ఇతర వివరాలు నిరాకరించారు. రోజూ ఇటువంటి దాపరికాలు ప్రతి కార్యాలయంలో ఒకటో రెండో జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండో అప్పీలు తీర్పులో మానవాసక్తికరమైన వార్త ఉంది. కాని ఒకటి రెండు పత్రికలకు తప్ప మరెవరికీ పట్టదు. పోస్టాఫీసు మోసం ఒక చిన్న సంఘటన. కానీ ఈ మోసాలను వెలికి తీయకుండా ఆర్టీఐని అడ్డుకుంటున్నది గిరీశ్పై తీర్పు. ప్రభుత్వ అధికారులు పన్నిన కుట్రలు, మోసాలు, లంచగొండితనం ఫిర్యాదులు వారి వ్యక్తిగత సమాచారం అంటూ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన గిరీశ్పై తీర్పు అవినీతి అధికారుల ‘సొంత’ సమాచారానికి దాపరికపు తెర. మన పౌరుల కుంభకర్ణ నిద్రకు దోమతెర. (టి సుబ్బమ్మ వర్సెస్ పోస్టాఫీసు CIC/POST S/A-/2017/123421 కేసులో 29.9.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐకి 12 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: సామాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఈ గురువారానికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ 12 ఏళ్లలో సమాచార హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే అవకాశం లభించింది. సమాచార హక్కు చట్టం గురించి కొన్ని ముఖ్యాంశాలు మీ కోసం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సగటున రోజూ ఆర్టీఐ చట్టం కింద 4,800 దరఖాస్తులు నమోదవుతున్నాయి. అక్టోబర్ 2005 నుంచి అక్టోబర్ 2016 వరకూ.. మొత్తం కోటి 75 లక్షల దరఖాస్తులు ఆర్టీఐ చట్టం కింద నమోదయ్యాయి. ఒక్క 2015-16లోనే 11 లక్షల 75 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 65 మంది ఆర్టీఐ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. అదే విధంగా 400 మంది కార్యకర్తలను వివిధ రకాల వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్టీఐపై ఇప్పటికీ అవగాహన లేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటినుంచీ ఇప్పటి వరకూ కేవలం 14 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 2015-16 సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు అత్యధికంగా 1.55 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రెండోస్థానంలో సామాచర ప్రసార శాఖ ఉంది. ఈ శాఖకు మొత్తంగా 1.11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
నల్లధన ‘సిట్’ ఆర్టీఐ పరిధిలోనే: సీఐసీ
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సమాచార హక్కు(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త వెంకటేశ్ నాయక్ దాఖలుచేసిన ఓ పిటిషన్ను విచారిస్తూ కమిషన్ ఈ విధంగా పేర్కొంది. జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు ఉద్యోగి ఒకరు గతంలో సిట్ చైర్మన్ ఎంబీ షాకు రాసిన లేఖ నకలు ప్రతిని ఇవ్వాలని వెంకటేశ్ కోరగా, అందుకు ఆదాయపు పన్ను విభాగం నిరాకరించింది. సిట్ను పబ్లిక్ అథారిటీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీచేయాలని ఆయన సీఐసీని ఆశ్రయించారు. ‘ ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన, నల్లధనం వెలికితీత లాంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న సిట్ ప్రజల కోసమే పనిచేస్తుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద తెలుసుకునే హక్కు పౌరులకుంది’ అని కమిషనర్ పేర్కొన్నారు. -
చనిపోయిన నా భర్త డబ్బు ఎలా తీసుకున్నాడు?
న్యూఢిల్లీ: మూడేళ్ల కిందట చనిపోయిన తన భర్త జాతీయ పొదుపు పత్రాలను(ఎన్ఎస్సీ) ఎలా క్లెయిమ్ చేసుకున్నాడంటూ ఓ మహిళ కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీఐసీ.. వెంటనే విచారణకు ఆదేశించింది. కర్నూలు జిల్లాకు చెందిన టి.సుబ్బమ్మ భర్త ఆదిశేషయ్య రూ.10 వేల విలువైన ఐదు జాతీయ పొదుపు పత్రాలను కొనుగోలు చేశాడు. 2004లో ఆయన మరణించాడు. అప్పట్నుంచి ఆయన భార్య ఈ సొమ్ము కోసం అనేక పర్యాయాలు కర్నూలు పోస్టాఫీసును సంప్రదించింది. అయినా సరైన సమాధానం లభించలేదు. కొన్నాళ్ల తర్వాత స్పందించిన పోస్టాఫీసు సిబ్బంది.. 2007లో ఆమె భర్త ఈ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకున్నట్లు తెలియజేశారు. అయితే 2004లో చనిపోయిన తన భర్త 2007లో ఎలా క్లెయిమ్ చేసుకుంటారని సుబ్బమ్మ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరింది. అయినా సరైన స్పందన లేకపోవడంతో సీఐసీని ఆశ్రయించింది. చనిపోయిన వ్యక్తి మూడేళ్ల తర్వాత పోస్టాఫీసుకు వెళ్లి రూ.50 వేలు వడ్డీతో సహా ఎలా తీసుకున్నాడో చెప్పాలని కోరింది. ఆమె పిటిషన్పై పోస్టల్ డిపార్ట్మెంట్ స్పందన చట్టవిరుద్ధంగా ఉందని, అవకతవకలను కప్పిపుచ్చుకునేలా వారు వ్యవహరించారని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడినట్లు ఆమె కుమారుడు చెప్పారు. తమ బంధువు సహాయంతో పోస్టాఫీసు సిబ్బంది మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. కర్నూలు సూపరింటెండెంట్ కృష్ణమాధవ్కు సీఐసీ షోకాజ్ నోటీస్ జారీ చేసిందన్నారు. నవంబర్ 1 లోగా పూర్తి వివరాలను సమర్పించాలని చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ను సీఐసీ ఆదేశించిందని తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛపై గోప్యతా సంకెళ్లా?
విశ్లేషణ ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని/ఆమె జీవిత వివరాలను మెచ్చుకుంటూ లేదా విమర్శిస్తూ ప్రచురిస్తే తప్పే. ప్రభుత్వం వ్యక్తి గోప్యతను భంగపరిస్తే అది రాజ్యాంగహక్కు ఉల్లంఘనే అని జస్టిస్ జీవన్రెడ్డి చరిత్రాత్మక తీర్పు చెప్పారు. గోప్యత ప్రస్తుతం ప్రాథమిక హక్కు. ఈ ప్రైవసీకి నిర్వచనం ఏమిటి? ఏమైనా పరిమితులు ఉన్నాయా? సమాచార హక్కు ఒకవైపు వెల్లడి చేయాలని ఒత్తిడి చేస్తూ ఉంటే మరొక వైపు గోప్యత వ్యక్తుల ప్రాథమిక హక్కు అని పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం వివరిం చింది. అనవసరంగా ఇంట్లో జొరబడి ప్రశాంతత చెదరగొట్టకపోవడమే ప్రైవసీ హక్కు. వారంట్ లేకుండా ఇల్లు సోదా చేయడానికి వీల్లేదు. ఇంటిచుట్టూ నిఘా పెట్టడం, అర్ధరాత్రి తలుపు తట్టడం అన్నీ గోప్యత హక్కు ఉల్లం ఘనలే, చట్టపరమైన కారణాలుంటే తప్ప. ఆటోశంకర్ అనే కరడుగట్టిన నేరస్తుడికి ఆరు హత్యా నేరాల్లో ఉరిశిక్ష పడింది. సుప్రీంకోర్టు మరణశిక్షను తగ్గించలేదు. రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వలేదు. ఆ తరువాత ఆటోశంకర్ జైల్లో ఆత్మకథ రాసుకున్నాడు. అందులో తనకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతస్థాయి పోలీసు అధికారులతో ఉన్న సత్సంబంధాలు వారిచ్చిన ప్రోత్సాహం వంటి వివరాలను పేర్కొన్నాడు. లాయర్ ద్వారా తన ఆత్మకథను నక్కీరన్ మాసపత్రికలో ప్రచురించడానికి పంపించాడు. ఆ పత్రిక సంపాదకుడు ఆర్ రాజగోపాల్ పోలీసు అధికారులతో సంబంధాలున్న నేరగాడు ఆటోశంకర్ ఆత్మకథ త్వరలో ప్రచురణ అని ప్రకటించాడు. పోలీసు అధికారుల వెన్నులో చలి మొదలైంది. ఆటోశంకర్ను నానాహింసలు పెట్టి తన ఆత్మకథ ప్రచురించకూడదని ఎడిటర్కు ఉత్తరం రాయించారు. ప్రచురిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజగోపాల్కు అప్పటికే తమిళ పోలీసులతో చేదు అనుభవం ఉంది. మూడు భాగాలు ప్రచురించిన తరువాత ఆటోశంకర్ ఆత్మకథను నిలిపివేశాడు. తనకు ఐజీపీ జారీ చేసిన హెచ్చరికను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. కేసు సుప్రీంకోర్టుకు చేరింది. పోలీసువారి తరఫున తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ ఆటోశంకర్ ప్రైవసీని భంగపరిచే విధంగా అతని ఆత్మకథను నక్కీరన్ ప్రచురించడానికి వీల్లేదని, పోలీసు అధికారులకు నేరస్తులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రచురణ సాగిస్తే పరువునష్టం జరుగుతుందని, కనుక ఈ ప్రచురణను నిరోధించే అధికారం ఉందని వాదించింది. ఆర్టికల్ 19(1)(ఎ) కింద ఆటోశంకర్కు కూడా వాక్ స్వాతంత్య్రం ఉందని, ఆ ప్రచురణ జరగకముందే నిరోధిస్తే తమ పత్రికా స్వాతంత్య్రం కూడా దెబ్బతింటుందని రాజగోపాల్ వాదించాడు. మరణశిక్ష కోసం ఎదురుచూసే ఖైదీకి వాక్ స్వాతంత్య్రం ఉందా, అతనికి గోప్యతా హక్కు ఉంటే దానిగురించి ఎవరు మాట్లాడాలి? అతని ప్రైవసీ పేరుమీద ప్రభుత్వం వారు కోర్టుకెక్కి ఒక పత్రికా ప్రచురణను నిరోధించవచ్చా? అప్పుడు పత్రికా స్వాతంత్య్రం ఉన్నట్టా అనే ప్రశ్నల్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని జీవిత వివరాలను మెచ్చుకుంటూ లేదా విమర్శిస్తూ ప్రచురించినా తప్పే అవుతుంది. ప్రభుత్వం వ్యక్తి గోప్యతను, ప్రశాంతతను భంగపర్చడం రాజ్యాంగహక్కు ఉల్లంఘనే అని 1994 లో జస్టిస్ జీవన్రెడ్డి చరిత్రాత్మకమైన తీర్పు చెప్పారు. యూరోపియన్ మానవహక్కుల సమావేశంలో గోప్యతను మానవహక్కుగా పరిగణించారు. ఒమ్ స్టెడ్, టైం ఇంక్ కేసులలో తీర్పులను, వారెన్, బ్రాండీస్ 1890లో రాసిన వ్యాసాన్ని ఉదహరిస్తూ గోప్యత వ్యక్తి స్వాతంత్య్రంలో భాగమని జస్టిస్ జీవన్రెడ్డి 23 ఏళ్ల కిందటే నిర్ధారించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవన స్వేచ్ఛ పరిధిలో వ్యక్తిని తన మానాన తనను వదిలేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఒక వ్యక్తి సొంత విషయాలు, అంటే కుటుంబం, వివాహం, పిల్లలను కని పెంచడం మాతృత్వం, గర్భధారణ, చదువులు మొదలైనవన్నీ వ్యక్తిగతమైన అంశాలు, ఇంటి గుట్టుకు సంబంధించినవి. వాటిగురించి అనవసరంగా ప్రచురించడం, ఆ వ్యక్తి ప్రశాంతతను దెబ్బతీయడం జీవనహక్కును ఉల్లంఘించడమే. అయితే పబ్లిక్ రికార్డ్లో ఉన్న అంశాలను ప్రచురిస్తే గోప్యతా భంగం కిందకు రాదు. దీనికి ఒక మినహాయింపు ఉంది. రేప్ తదితర లైంగిక నేరాలు, దాడులకు గురైన బాధితుల వివరాలు పబ్లిక్ రికార్డులో ఉన్నా ప్రచురించడం మంచిది కానందున సభ్యత ఆధారంగా పత్రికా స్వేచ్ఛపైన ఆ పరిమితి విధించడం రాజ్యాంగ బద్ధమే. ప్రభుత్వ ఉద్యోగి, ఉన్నతాధికారి, నాయకుడు, రాజకీయ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, తమ విధులకు సంబంధించి వ్యక్తిగత అంశాలు ప్రచురిస్తే అది గోప్యతా భంగకరం కాదని జస్టిస్ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రచురించబోయే వ్యాసంలో గోప్యతను, పరువును భంగపరిచే వాక్యాలు ఉండబోతాయన్న అనుమానంతో ఆ వ్యాస ప్రచురణను నిరోధిం చాలని ఆదేశించే అధికారం ప్రభుత్వాలకు లేదని జస్టిస్ జీవన్రెడ్డి నిర్ధారించారు. ఒకవేళ ఆ ప్రచురణ వల్ల గోప్యత భంగపడినా, పరువునష్టమైనా చట్టపరంగా పరి ష్కారాలు కోరుతూ కోర్టుకు వెళ్లవచ్చుననీ వివరించారు. వాక్ స్వాతంత్య్రంలో సమాచార హక్కు భాగమే. రాజ్యాంగంలో ప్రైవసీ ఆధారంగా రచనా స్వాతంత్య్రం మీద ఆంక్షలు విధించే అవకాశం లేదు. 1983లో జస్టిస్ పీఏ చౌదరి, 1994లో జస్టిస్ జీవన్రెడ్డి ఇచ్చిన తీర్పులు గణనీయమైనవి. గోప్యత జీవనస్వాతంత్య్రంలో భాగమని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com