Fertilizer dealers
-
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
నకిలీ గడ్డి మందుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్: నకిలి విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగుల మందులను విక్రస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ విత్తనాలు, మందులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 13మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు ఫర్టిలైజర్ షాప్ యాజమానులపై కూడా కేసు నమోదయ్యింది. ఈ దాడిలో నిందితుల నుంచి 75 లక్షల విలువైన నకిలీ, గుడువు తీరిన పురుగుల మందు, నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడ్డ మందుల్లో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, 3 లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందు ఉన్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు. గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ముఠాల గుట్టురట్టయిందని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామన్నారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. మందులు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి రంగనాథ్ రైతులకు సూచించారు. -
డీఏపీ ధర పెంచవద్దు
న్యూఢిల్లీ: డీఏపీ తదితర యూరియాయేతర ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. వాటిని పాత రేట్లకే అమ్మాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా యూరీయాయేతర ఎరువుల రేట్లను పెంచడంపై కేంద్రం ఈ మేరకు ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ(డై అమ్మోనియం ఫాస్పేట్), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్పీకే తదితర నాన్ యూరియా ఎరువుల రిటెయిల్ ధరల నిర్ధారణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయా ఫర్టిలైజర్ కంపెనీలే ఆ ధరలను నిర్ధారిస్తాయి. అయితే, ప్రభుత్వం ఏటా వాటికి నిర్ధారిత మొత్తంలో సబ్సీడీ ఇస్తుంది. ‘ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల ధరలను పెంచవద్దని ఫర్టిలైజర్ కంపెనీలకు సూచించింది. గతంలో ఉన్న రేట్లకే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. దానికి ఆ కంపెనీలు అంగీకరించాయి’ అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రైతులకు పాత ధరలకే ఆ ఎరువులు లభిస్తాయన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకుల ధర భారీగా పెరగడంతో ఇటీవల ఈ ఎరువుల ధరలను పెంచుతూ ఫర్టిలైజర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రిభ్కో, ఎంసీఎఫ్ఎల్, జువారీ అగ్రో కెమికల్స్, పారాదీప్ ఫాస్పేట్స్ సంస్థలు డీఏపీ చిల్లర ధరను బ్యాగ్కు రూ. 17 వందలకు పెంచాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పాస్ఫరస్, పొటాషియం ఎరువుల ధరలకు ఇచ్చే సబ్సీడీలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. గత సంవత్సరం నైట్రోజన్(ఎన్)కు కేజీకి రూ. 18.78 చొప్పున, ఫాస్పేట్(పీ)కు కేజీకి రూ. 14.88 చొప్పున, పొటాష్(కే)కు రూ. 10.11 చొప్పున, సల్ఫర్కు రూ. 2.37 చొప్పున సబ్సిడీని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగనుంది. -
బె‘ధర’గొడ్తూ!
నేలకొండపల్లి: ఎన్నెన్నో ఆశలతో సాగు పనుల కు శ్రీకారం చుడుతున్న రైతులు ఆదిలోనే బెదిరేట్లుగా ఎరువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి రేట్ల పెంపుపై ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రాకున్నా..వ్యాపారులు మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువ చేసి అమ్మేస్తున్నారు. దీంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న తరుణంలో ఇలా..ఎరువుల ధరలు పెరగడమేంటని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.1250 ఉన్న డీఏపీ కట్ట ప్రస్తుతం మార్కెట్ లో రూ.1470 పలుకుతోంది. దీంతో ఒక్కో బస్తాపై అదనంగా రూ.200కు పైగా భారం మోయాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ సమీపిం చిన నేపథ్యంలో రైతులు పొలాల బాట పట్టారు. దుక్కులు దున్నుతూ ఇతర పనులు చేస్తూ, వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసుకుంటూ..వారం పది రోజుల్లో రుతుపవనాలు రానుండటంతో ఖరీప్ సాగుకు అంతా సన్నద్ధమవుతున్నారు. అయితే పెరిగిన ఎరువుల ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో పెంచిన లెక్క ప్రకారమే విక్రయాలు జరుపుతుండటంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సాగు అంచనాలు ఇలా.. జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్లో 2,30,498 హెక్టార్లు సాగు చేసే అవకాశాలున్నాయి. అందులో వరి–59,361 హెక్టార్లలో వేయనున్నారని అంచనా. ఇంకా పత్తి–96,116 హెక్టార్లు, మొక్కజొన్న 3,802 హెక్టార్లు,పెసర–9,249 హెక్టార్లు, కంది–2,340 హెక్టార్లు, మిర్చి–21,250 హెక్టార్లలో పండించే అవకాశాలున్నాయి. ఖరీఫ్లో వినియోగం 2.34 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. యూరియా– 72,408 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంది. ఇంకా డీఏపీ–31,561 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 22,946 మెట్రిక్టన్నులు, కాంప్లెక్స్ –1,05,560 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ–2500 మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్లో వినియోగిస్తారని అంచనా. తగ్గిన భూసారాన్ని పెంచుకోవాలంటే మళ్లీ సేంద్రియం ఒక్కటే మార్గం అంటున్న శాస్త్రవేత్తల సూచనలను అందరూ పెడచెవిన పెడుతున్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా..ఆచరణలో ఆశించిన స్థాయిలో అమలు కావట్లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా..వ్యవసాయాన్ని కాపాడేందుకు సేంద్రియ విధానాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. రైతులపై మోయలేని భారం.. అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. రైతుల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వెంటనే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. – గుడవర్తి నాగేశ్వరరావు, రైతుసంఘం నేత, నేలకొండపల్లి పెట్టుబడి ఇంకా పెరిగింది.. వ్యవసాయం ప్రతి ఏటా భారంగా మారుతోంది. ఒకపక్క పెరిగిన పెట్టుబడి, మరోపక్క కౌలు పెరగడంతో సాగు చేయాలంటేనే భయమేస్తోంది. కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాలకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. – కాశిబోయిన అయోధ్య, కౌలురైతు, సింగారెడ్డిపాలెం -
మౌనం వీడేనా?
కల్తీ ఎరువులు రైతులను కలవర పెట్టాయి. జిల్లాలోని యూరియాను కొంతమంది అక్రమార్కులు పక్క రాష్ట్రం ఒడిశాకు తరలించి.. అక్కడ దానికి రంగు వేసి తిరిగి జిల్లాకు తీసుకొచ్చి డీఏపీ ఎరువుగా విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో మంగళవారం వ్యవసాయాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నకిలీ ఎరువుల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లోనైనా వ్యవసాయశాఖ అధికారులు మౌనం వీడి.. చర్యలకు ఉపక్రమిస్తారో..లేదోనని రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలి: జిల్లాలో కల్తీ ఎరువులపై స్వయంగా నేను చెప్పినా పట్టించుకోరు...టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కల్తీ ఎరువులు విక్రయిస్తున్నారని డీలర్ల పేరుతో సహా ఫిర్యాదులు వస్తున్నా మీరేం చేస్తున్నారు... వ్యవసాయాధికారులు నిద్రపోతున్నారా...డీలర్లతో లాలూచీపడుతున్నారా అంటూ సాక్షాత్ జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తేలియక వ్యవసాయ శాఖ అధికారులు కలవర పడుతున్నారు. కలెక్టర్ హెచ్చరికలతోనైనా కల్తీ ఎరువుల బాగోతంపై అధికార యంత్రాంగం స్పందిస్తుందా లేక ఇదంతా మామూలే అని పెడచెవిన పెడతారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. జిల్లాలో కల్తీ ఎరువులపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అధికారులు తూతూ మంత్రంగా హడావుడి తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే కలెక్టర్ ధనంజయరెడ్డి మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించనట్లుగా కల్తీలకు పాల్పడుతున్న ప్రాంతాలు, డీలర్ల పేర్లుతో సహా పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ వ్యవసాయాధికారులు మౌనం వహించడంలో ఆంతర్యమేమిటో కలెక్టర్ హెచ్చరికలో కొన్ని మాటలతో ఏకీభవించక తప్పదు. ఖరీఫ్ ఆరంభం నుంచి పెద్ద ఎత్తున కల్తీ ఎరువులు జిల్లాకు వస్తున్నప్పటికీ వ్యవసాయాధికారులు మాత్రం కనీసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించలేదనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. మరో వైపు విజిలెన్స్ పరిశీలనతో సైతం పూర్తి స్థాయిలో ప్రగతి లేకపోవడంతో అనేక సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కలెక్టర్ ధనంజయరెడ్డి చేసిన హెచ్చరికలతోనైనా వ్యవసాయాధికారుల్లో చలనం కనిపిస్తుందా...విజిలెన్స్ యంత్రాంగం ఈ మాటలను చాలెంజ్గా తీసుకుని సంయుక్తంగా విచారణ చేస్తారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై దృష్టి సారించకపోవడంపై సందేహాలు యూరియా (సూపర్ రకం) లో గ్రాన్యూల్స్ రకం ఎరువును ఒడిశాకు తరలించి అక్కడ డీఏపీ రూపంలో కల్తీ జరిగి మరళా ఆంధ్రా ప్రాంతానికి తరలివచ్చి వాటిని కొంత మంది దళారీలతో గ్రామాల్లో అమ్మకాలు చేసినట్లు గతంలో అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే దీనిపై అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం సర్వత్రా విమర్శలకు నెలవైంది. ఇటీవల కాలంలో విజిలెన్స్ అధికారులు డివిజన్ కేంద్రమైన టెక్కలిలో తనిఖీలు నిర్వహించే సమయంలో కొంతమంది ఎరువుల దుకాణాల డీలర్లు మూకుమ్మడిగా వారి దుకాణాలను మూసివేసి పారిపోయారు. ఈ విషయం అధికారుల కళ్లెదుటే జరిగింది. దుకాణాలను ఎందుకు మూసివేశారనే అనుమానం కూడా అధికారుల్లో రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై అధికార యంత్రాంగం కనీసం దృష్టి సారించలేదనే చెప్పాలి. కల్తీ డీఏపీపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఇన్వాయిస్, ఈ–పాస్ అమ్మకాలపై సమగ్ర పరిశీలన చేస్తే అసలు దొంగలు ఇట్టే దొరికిపోతారనే విషయం సామాన్య ప్రజలకు తెలిసినట్లుగా అధికార యంత్రాంగానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కల్తీ ఎరువులపై జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి హెచ్చరించిన దానిపై వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా సమగ్ర పరిశీలన చేస్తారా లేదా అనే విషయం వారి చర్యలపై ఆధార పడి ఉంటుందనే చెప్పుకోవాలి. -
ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతుల ధర్నా
నర్సాపూర్రూరల్/వెల్దుర్తి(తూప్రాన్) : పురుగుల నివారణకు నకిలీ ముందులు ఇవ్వడంతో వరి పంట ఎండిపోయిందని వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం నర్సాపూర్ పట్టణంలోని కపిల్ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ధర్నా నిర్వహించారు. మానేపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మయ్య గత నెలలో తనకు ఉన్న రెండు ఎకరాల వరి పంటకు మొగి పురుగు సోకడంతో కపిల్ ఫర్టిలైజర్ దుకాణంలో నివారణ ముందులు కొనుగోలు చేశాడు. వాటిని పంటపై పిచికారి చేయగా రెండు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గొల్ల లక్ష్మయ్య పంట చేను చుట్టుపక్కల రైతుల పంటకు సైతం మొగిపురుగు సోకగా మెదక్, వెల్దుర్తి, కౌడిపల్లి ఇతర గ్రామాల్లో నివారణ మందులు కొనుగోలు చేసుకొని తీసుకు వచ్చి పిచికారి చేశారు. వారి పంటలో పూర్తిగా పురుగులు చనిపోయాయని, పంట ఏపుగా పెరుగుతోందని తెలిపారు. ఫర్టిలైజర్ దుకాణం యజమాని పురుగుల మందులు రాకెట్, మాక్స్, ఎన్ప్యూజ్ అనే మూడు రకాలవి ఇచ్చాడన్నారు. ఆయన సూచన మేరకు వాటిని కలిపి పిచికారి చేస్తే పంట పూర్తిగా ఎండిపోయి చేతికి రాకుండా పోయిందని రైతులు తెలిపారు. నకిలీ పురుగుల మందులు ఇవ్వడంతోనే గొల్ల లక్ష్మయ్య రెండు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని, అతడికి నష్ట పరిహారం చెల్లించాలని పట్టుబడుతూ దుకాణం ఎదుట ధర్నా చేశారు. కంపెనీ వారితో మాట్లాడి న్యాయం చేస్తానని దుకాణం యజమాని నచ్చజెప్పడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. ఫర్టిలైజర్ యజమాని హన్మంతరావును వివరణ కోరగా లక్ష్మయ్య నేను ఇచ్చిన మొగిపురుగు మందులతోపాటు గడ్డి మందు కలిపి కొట్టడంతోనే వరి పంట ఎండిపోయిందని తెలిపారు. కంపెనీవారితో మాట్లాడి లక్ష్మయ్యకు నాయ్యం జరిగేలా కృషి చేస్తానని తెలిపాడు. -
ఎరువు భారం 35 కోట్లు
మోర్తాడ్(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్ అయ్యింది. డాలర్ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్ ఎరువుల ముడిసరుకు ధరకు రెక్కలు తొడిగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధర పెరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. పంటల దిగుబడి పెరగాలంటే కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు అధికం అవుతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందనే చందంగా రైతుల పరిస్థితి తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్లో కాంప్లెక్స్ ఎరువుల ధర ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.173 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం ఒక బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది. గతంలో పెరిగిన ధరల వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల భారం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ధర పెరగడంతో మరో రూ.35 కోట్ల ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీకి వినియోగించే ముడిసరుకును ఎరువుల ఉత్పత్తి కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి సరుకుపై డాలర్ ప్రభావం పడుతుండటంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇఫ్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్ ఎరువుల ధర పెరగడం వల్ల ప్రతి రైతు ఒక హెక్టార్కు రూ.వెయ్యిని ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో, కామారెడ్డి జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు కొంత మేర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వరి కంటే వాణిజ్య పంటలలోనే కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. డీఏపీ రకం కాంప్లెక్స్ ఎరువు ధర గతంలో రూ.1,295 ఉండగా ఇప్పుడు రూ.1,345కు చేరింది. 20:20 రకం ఎరువు ధర రూ.960 నుంచి రూ.1,025కు చేరింది. 12:32:16 రకం ఎరువు రూ.1175 నుంచి రూ.1275 కు చేరింది. రైతులు ఎక్కువగా డీఏపీతో పాటు 20:20 రకాన్ని వినియోగిస్తున్నారు. డాలర్ ధరలో మార్పు లేక పోతే కాంప్లెక్స్ ఎరువుల ధరలో తగ్గుదల కనిపించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డాలర్ ధరలు పెరిగినా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం పెరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డాలర్ ధరలు పెరగడం వల్లనే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడం వల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరల్లో పెరుగుదల ఏర్పడింది. ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందువల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. – మారుతి ప్రసాద్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి. లేకుంటే రైతులు ఇంకా భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను అదుపులో ఉంచాలి. ధరలు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. – ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్ పెట్టుబడులు అధికం అవుతున్నాయి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడుతారు. – కొప్పుల భాజన్న, రైతు, మోర్తాడ్ -
అనుమతిలేని బయోమందుల పట్టివేత
నల్లబెల్లి : అనుమతిలేని బయోమందులు, త్రీజీ గుళికలు టాటా ఏసీ వాహనంలో తిరుగుతూ రైతులకు అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ నాయకులు, రైతులు వాహనాన్ని పట్టుకొని వ్యవసాయాధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకొంది. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు గొనే వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మచ్చిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బయో ఫర్టిలైజర్కు సంబందించిన గోల్డెన్ త్రీజీ గుళికలు, వేపపిండి బస్తాలను టాటా ఏస్ వాహనంలో ఓ వ్యాపారి తీసుకువచ్చి రైతులకు అక్రమంగా అంటగడుతున్నాడు. ఈ మందులను మండలంలోని మామిండ్లవీరయ్యపల్లి, నాగరాజుపల్లి గ్రామాలలో రైతులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో నల్లబెల్లి ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ నాయకులు మామిండ్లపల్లి గ్రామానికి చేరుకొని బయోమందుల విక్రయాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా గ్రామాలలో బయోమందులు ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు వ్యవసాయాధికారి పరమేశ్వర్కు సమాచారాన్ని అందించారు. దీంతో గ్రామానికి చేరుకొన్న వ్యవసాయాధికారి వ్యాపారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయోమందులతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గ్రామాలలో తిరుగుతూ బయోమందులు రైతులకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
చేతులు శుభ్రం చేసుకోక..మహిళ మృతి
మానవపాడు (అలంపూర్): వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. ఎస్ఐ పర్వతాలు కథనం ప్రకారం.. మండలంలోని చంద్రశేఖర్నగర్ కాలనీకి చెందిన చిన్న రామన్న వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో బుధవారం భార్య పెద్ద ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది. ఈ క్రమంలో ఆమె చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండానే భోజనం చేసింది. దీంతో బుధవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే మానవపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా గురువారం ఉదయం మృతిచెందింది. ముణెమ్మ భర్త చిన్న రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ‘ఎరువు’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్వావలంబన దిశగా మరో అడుగు ముందుకు వేశాయి. తాజాగా రైతులకు ఎరువులు అమ్మే వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 రైతు మహిళా సంఘాలు వివిధ జిల్లాల్లో ఎరువుల వ్యాపారం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇవి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ (ఎఫ్పీజీ)లుగా ఏర్పడ్డాయి. ఇందులో 3 సంఘాలు ఎరువుల అమ్మకాన్ని ప్రారంభించాయి. మహిళా రైతులతోఎఫ్పీజీల ఏర్పాటు.. ఒక్కో గ్రామంలో భూములున్న మహిళా రైతులను ఒక్కో గ్రూప్లో 15 నుంచి 20 మంది వరకు ఎంపిక చేసి ఎఫ్పీజీని ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యురాలు సభ్యత్వం కింద రూ.500 గ్రామ స్థాయిలోని ఎఫ్పీజీ బాధ్యులకు చెల్లించాలి. ఇలా మండల స్థాయిలోని అన్ని ఎఫ్పీజీ గ్రూపులు కలిపి ఎరువుల వ్యాపారం చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎరువుల వ్యాపారం నిర్వహించి ఇందులో వచ్చే లాభాలను గ్రూప్ సభ్యులందరికీ పంపిణీ చేస్తారు. అంతేకాకుండా ఈ గ్రూప్ సభ్యులు తమ కుటుంబ వ్యవసాయానికి కావాల్సిన ఎరువులను కూడా ఎఫ్పీజీ నిర్వహించే దుకాణం నుంచి తీసుకోవచ్చు. అన్ని గ్రూప్లనుంచి వచ్చిన సభ్యత్వ రుసుముతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చే ఆర్థిక సహకారంతో ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. మార్క్ఫెడ్ నుంచి ఎరువుల సరఫరా.. రైతు మహిళా గ్రూపులు నిర్వహించే ఎరువుల దుకాణాలకు మార్క్ఫెడ్ నుంచి ఎరువులు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రారంభమైన మూడు దుకాణాలకు మార్క్ఫెడ్ ఒక్కో దుకాణానికి 20 టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేసింది. ఎరువులతోపాటు వరి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, పెసర్ల విత్తనాలతోపాటు ఆయా ప్రాంతాల్లో రైతులకు ఏరకం విత్తనాలు అవసరమో వాటిని కూడా మార్క్ఫెడ్ నుంచి తెప్పించుకుంటామని ఈ దుకాణాల ఎఫ్పీజీలు పేర్కొంటున్నాయి. సహకార సంఘాలకు సరఫరా చేసినట్లుగానే ఈ దుకాణాలకు మార్క్ఫెడ్ రవాణా ఖర్చులు లేకుండా ఎరువులను అందజేస్తుంది. సెర్ప్ ఇచ్చే నిధులు, సభ్యుల వాటాధనంపై.. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేస్తారు. ఎరువుల అమ్మకం వ్యాపారంలోకి స్వయం సహాయక సంఘాలు ప్రవేశించడంతో..ఎరువుల కొరత ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు గ్రూపులు తొలి అడుగు రాష్ట్రంలో ఇలా ఏర్పడిన ఎనిమిది ఎఫ్పీజీలు ఎరువుల వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లోని సంతోష ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్లోని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలలో చివ్వెంల ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీల ఎఫ్పీజీలు ప్రస్తుతం ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకం ప్రారంభించాయి. ముందుగా ఈ గ్రూపు సభ్యుల వాటా ధనంతో ఎరువులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఒక్కో దుకాణానికి సెర్ప్ రూ.10 లక్షలు అందజేసింది. ఇక సిద్దిపేట జిల్లాలోని కొయిర్ (నేలతల్లి) ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, మెదక్ జిల్లాలో కోడిపల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో యాచారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు త్వరలో ఎరువుల వ్యాపారం ప్రారంభించనున్నాయి. రైతులకు అందుబాటులో ఎరువులు మండలంలోని రైతు మహిళా సంఘాల సభ్యుల వాటాధనంతో దుకాణం ప్రారంభించాం. సెర్ప్ నుంచి కూడా ఆర్థిక సాయం అందింది. రైతులకు ఎలాంటి ఎరువులు కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ఇక్కడే ఎరువులు తీసుకోవాలని సంఘంలోని సభ్యులకు చెప్పాం. ఇది ఒక రకంగా రైతులకు సేవ చేయడమే. – ధరావత్ పార్వతి, చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఎరువుల కొరత ఉండదు.. మా సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. దళారులు రైతులను ముంచకుండా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి వెంటనే డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు ఎరువులు అమ్ముతున్నాం. రైతులకు ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయని చెప్పుకునేలా చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఎరువులు తెచ్చాం. రానున్న రోజుల్లో రైతులకు ఏ ఎరువులు కావాలో అన్నీ తెప్పిస్తాం. – వేములకొండ పద్మ, వైస్ చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ -
సిండి‘కేటు’
అల్లాదుర్గం(మెదక్) : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో సిండికేట్ దందా ప్రారంభించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు అరువు ఇస్తున్నారు. ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 5 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్ప డుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దందా అల్లాదుర్గం ఉమ్మడి మండలంలో ఐదేళ్లుగా యథేచ్చగా కోనసాగుతుంది. ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం.. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలో సుమారు 45 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులంత సిండికెట్గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు. గ్రామానికో బ్రోకర్.. దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నారు. వట్పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వట్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ విత్తనాలు అమ్మడంతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు విచారణ జరిపినా ఆ వ్యాపారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్రంగా మోసం చేస్తున్నారు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం. – నాగరాజు రైతు, ముప్పారం. చర్యలు తీసుకుంటాం.. ఈ సిండికేట్ అక్రమ వ్యాపరం గురించి మా దృష్టికి రాలేదు. మండల వ్యవసాయ అధికారి ద్వారా విచారణ చేపడతాం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. –పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
అందుబాటులో విత్తనాలు, ఎరువులు: పోచారం
సాక్షి, హైదరాబాద్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాధార పంటల సాగు ఆశాజనకంగానే ఉందని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి ఇంకా నీరు రానందున వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంటుందన్నారు. వ్యవసాయ యాం త్రీకరణకు ఈ ఏడాది అధిక నిధులను కేటాయించామని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోతల వరకు అన్ని పనులు యంత్రాలతోనే జరి గేలా చూడాలని మంత్రి సూచించారు. యం త్రాల ద్వారా సాగు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను కూడా అధిగమించ వచ్చన్నారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏఈఓ) నియమించినట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్లో సాగుకు అవసరమైన యంత్రాల వివరాలను అధికారులు రూపొందించాలన్నారు. రైతు వేదికల నిర్మాణం వేగం పుంజుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్, పాల్గొన్నారు. -
ఎరువులపై ధరల దరువు
నెల్లిమర్ల రూరల్ విజయనగరం : ఎరువుల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒకేసారి పదిశాతం మేర ధరలు పెరగడంతో జిల్లా రైతాంగంపై మరో రూ.7 కోట్ల భారం పడనుంది. వాస్తవంగా జీఎస్టీ అమలు సమయంలో ఎరువుల ధరలు తగ్గుతాయనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎరువులపై ఇచ్చే సబ్సీడీలను ఎత్తివేయడంతో మార్కెట్లో రసాయనిక ఎరువులతో పాటు, పురుగు మందుల ధరలు పెరిగిపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం... జిల్లాలో 1.92లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. రసాయనిక ఎరువుల కొనుగోలు కోసం ఏటా రూ.71 కోట్ల దాకా ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం ఎరువుల ధరలు మరో 10 శాతం పెరగడంతో రైతులపై మరో.7 కోట్లు భారం పడనుంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి భారం తడిసిమోపెడుకానుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎరువుల నియంత్రణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎరువులు, పురుగుల మందులపై గత ప్రభుత్వాలు సబ్సీడీలు అందిచేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎరువులపై ఇచ్చే సబ్సీడీలను పూర్తిగా ఎత్తేసింది. పెట్టుబడి రాయితీ కింద పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు మాత్రం భూసార పరీక్షలు, చంద్రన్న వ్యవసాయ క్షేత్రాలంటూ ప్రచారం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తూ పంటల సాగుకు ఎలాంటి సహకారం అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సూక్ష్మ పోషక ఎరువులను ఉచితంగా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. పెట్రో ధరల ప్రభావం.... ఎరువుల ధరలపై పెట్రో, డీజిల్ ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా చూపుతోంది. పెట్రో ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి వ్యాపారులు మరింత ధరలు పెంచారంటూ రైతులు చెబుతున్నారు. కొనుగోలు తరువాత వాటిని ఇంటికి తెచ్చుకోవాలంతే రవాణా చార్జీలు భారమవుతున్నాయని అంటున్నారు. రవాణా చార్జీల పెంపు వల్ల ఒక్కో బస్తాపై రూ. 100 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందంటున్నారు. -
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ, తూకాల్లో రైతులను మోసం చేస్తున్న వ్యాపార సంస్థలపై తూనికలు కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులతో విక్రయిస్తున్న పలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. రైతులకు విక్రయించే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇప్పటికే విత్తనాల కంపెనీల మోసాలపై గతవారంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 154 కేసులు నమోదు చేసి, రూ.2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇక మీదట ఏ వ్యాపారి అయినా తూకం పేరుతో రైతులను మోసం చేసినా, చేయడానికి ప్రయత్నించినా సహించబోమని, భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులు కూడా తమకు జరుగుతున్న మోసాలపై నేరుగా 7330774444 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. -
తూనిక.. రైతు రక్షణకు పూనిక
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టింది. కొన్ని విత్తన కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చాలావాటికి తయారీ లైసెన్సు లేకపోవడమేకాకుండా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎరువుల బస్తాలపై బరువు సూచికల్లో వ్యత్యాసాలున్నట్లుగా కూడా గుర్తించారు. విత్తనాల తయారీ.. గడువు వివరాలు కూడా సంచులపై లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. తయారీ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా జరిపిన తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీలపై జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విత్తన కంపెనీల మోసాలకు సంబంధించి ఏ మాత్రం సమాచారమున్నా రైతులు వెంటనే వాట్సప్ నంబర్కు 73307 74444కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
గ్రామగ్రామాన ‘పెట్టుబడి’ దందా!
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీప గ్రామంలో పదెకరాల భూమి ఉన్న రైతు కృష్ణమోహన్. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున వస్తుందని ఆశపడుతున్నాడు. ఇటీవల ఓ రోజు ఆ గ్రామ కార్యదర్శి ఫోన్ చేసి ఎకరానికి రూ.400 చొప్పున రూ.4 వేలు ఇస్తేనే పెట్టుబడి సొమ్ము వస్తుందని, లేకుంటే తామేమీ చేయలేమని బెదిరించాడు. రూ.4 వేలు కోసం రూ.40 వేల పెట్టుబడిని పోగొట్టుకోలేక ఆ రైతు గ్రామ కార్యదర్శికి అడిగినంత ముట్టజెప్పుకున్నాడు. మరో రైతు రంగారెడ్డి. ఖమ్మం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈయన గ్రామం. ఇప్పటివరకు భూములకు పట్టాలివ్వలేదు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాసు పుస్తకం రావాలన్నా, పెట్టుబడి సొమ్ము అందాలన్నా ఎకరానికి రూ.500 ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారి ఒకరు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెబుతున్నాడు. దీంతో గత్యంతరం లేక లంచం ముట్టజెప్పుకునేందుకు రంగారెడ్డి సిద్ధమయ్యాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడి దందా సాగుతోంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 1.62 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సొమ్ము అందజేయనున్నారు. సమయం సమీపిస్తుండటంతో అనేకచోట్ల అధికారులు దందాలు మొదలుపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు కొందరు లంచాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లంచాలు ఇవ్వకుంటే అడ్డుపుల్ల వేస్తారన్న భయంతో రైతులు గత్యంతరం లేక అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చాపకింద నీరులా జరుగుతోంది. ఇలా అధికారులు లంచం తీసుకున్నారని తమ పేరు, గ్రామం వెల్లడిస్తే పెట్టుబడి సొమ్ము రాదని రైతులు వేడుకుంటున్నారు. లంచం ఇచ్చినా బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. లంచం ఇస్తే.. మేనేజ్ చేస్తాం.. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా వ్యవసాయ సంబంధిత ఖర్చుల కోసం.. ఖరీ ఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పు న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డబ్బులిస్తే రైతులకు అందుతా యో లేదోనని భావించిన సర్కారు.. చివరకు చెక్కులు ఇవ్వాలని, అవి కూడా గ్రామ సభ లో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెక్కులు పంపిణీ కావడానికే ముందే రైతుల నుంచి లంచాలు వసూలు చేయాలని కొన్ని చోట్ల రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు పన్నాగాలు చేస్తున్నారు. ‘నీ భూమి సాగుకు యోగ్యంగా లేదు. అలా అని రికార్డుల్లో రాసేస్తే నీకు పెట్టుబడి సాయం రాదు. లంచమిస్తే మేనేజ్ చేస్తాం’అంటూ రైతులను బెదిరిస్తున్నారు. ఇప్పటికీ ప్రభు త్వం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతుల్లో ఆందోళన నెలకొంది. దీన్నే అవకాశంగా తీసుకొని రెవెన్యూ అధికారులు పలుచోట్ల ‘నీకు పట్టాదారు పాసుపుస్తకం, పెట్టుబడి సొమ్ము రావాలంటే ముట్టజెప్పుకోవాల్సిందే’ అంటూ హెచ్చరిస్తున్నారు. భయ పెడుతూ వసూళ్లు సాగిస్తున్నారు. చూసీచూడనట్లుగా రైతు సమితులు పెట్టుబడి సొమ్ము రైతులకు సక్రమంగా పంపిణీ చేయడంలో రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒక్కో గ్రామంలో 15 మందితో రైతు సమితులను ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులున్నారు. అయితే గ్రామాల్లో పెట్టుబడి దందా యథేచ్ఛగా మొదలైనా రైతు సమితి సభ్యులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతు సమితి సభ్యులను కూడా మచ్చిక చేసుకొని దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. -
ఎరువుల ఖర్చు తగ్గించే సరికొత్త గ్రాఫీన్.
రైతులకు ఉన్న అనేకానేక కష్టాల్లో ఎరువుల ఖర్చు ఒకటి. పోనీ ఇంత ఖర్చు పెట్టి వేసిన ఎరువులు పూర్తిస్థాయిలో ఫలితమిస్తాయా? అంటే అదీ లేదు. వానొస్తే లేదా నీళ్లల్లో కలిస్తే ఎరువులు వాటితో కొట్టుకుపోతాయి. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గ్రాఫీన్ ఆక్సైడ్ పదార్థం ఆధారంగా కొత్త రకం ఎరువులను తయారు చేశారు. భూమిలోకి చేరిన తరువాత ఇవి చాలా నెమ్మదిగా తమ లోపల ఉండే ఎరువులను విడుదల చేస్తాయి. సాధారణ ఎరువులు కేవలం 12 నుంచి 24 గంటల్లోపు వాటిలోని పోషకాలన్నింటినీ విడుదల చేసేస్తాయి. ఈ క్రమంలో అవసరమైన సమయంలో మొక్కలకు ఎరువులు అందే అవకాశం లేకుండా పోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైక్ మెక్లాగిన్ తెలిపారు. అయితే గ్రాఫీన్ ఆక్సైడ్ ఆధారంగా తయారైన ఎరువులు నెలరోజుల వరకూ పోషకాలను నెమ్మదిగా విడుదల చేసేలా తయారు చేసుకోవచ్చునని మైక్ తెలిపారు. తాము తమ పరిశోధనల్లో జింక్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలను గ్రాఫీన్ ఆక్సైడ్ ద్వారా గోధుమ పంటకు అందించారు. సాధారణ ఎరువులతో పండుతున్న పంటలతో పోల్చి చూసినప్పుడు గ్రాఫీన్ ఆక్సైడ్ ఎరువులు వాడిన పంటల్లో ఈ రెండు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మైక్ వివరించారు. భూమిలో ఉండే సేంద్రియ కార్బన్ నిర్మాణాన్ని దగ్గరగా పోలి ఉండటం వల్ల గ్రాఫీన్ ఆక్సైడ్ వాడకం పర్యావరణపరమైన సమస్యలేవీ సృష్టించదని మైక్ అంటున్నారు. -
‘ఎరువుల సబ్సిడీ కంపెనీలకే’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఎరువుల సబ్సిడీ లబ్ధిదారులకు కాకుండా ఫెర్టిలైజర్ కంపెనీలకే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.లబ్ధిదారులకు రిటైలర్లు ఎరువులు విక్రయించిన అనంతరం సబ్సిడీని ఆయా కంపెనీలకు చెల్లిస్తామని ఎరువులు, రసాయనాల మంత్రి రావు ఇంద్రజిత్సింగ్ మంగళవారం లోక్సభలో వెల్లడించారు.ఈ వ్యవహారంపై లోతైన విశ్లేషణ జరిపిన నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఎల్పీజీ తరహాలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందచేయడం ఎరువుల సబ్సిడీ విషయంలో సాధ్యపడదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెడుతుందని చెప్పారు. రిటైలర్లు లబ్ధిదారులకు విక్రయించిన ఎరువుల ఆధారంగా సబ్సిడీని గ్రేడ్ల వారీగా ఆయా ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులు సైతం కిసాన్ క్రెడిట్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు చూపి సబ్సిడీపై ఎరువులను కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు. -
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు. -
పురుగు మందు కొంటేనే యూరియా!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల కంపెనీలు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాల్సిందేనని షరతు పెడుతున్నాయి. ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచి యూరియాతోపాటు ఇతర ఎరువులను అంటగడుతున్నాయి. దీంతో రైతులు అవసరం లేకున్నా ఇతర ఎరువులను కొంటున్నారు. ఎడాపెడా ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన పరిస్థితిని కంపెనీలు రైతులకు సృష్టిస్తున్నాయి. తద్వారా వివిధ ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. రైతులకు సాగు ఖర్చు పెరిగి నష్టం చవిచూసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. కొంప ముంచుతున్న టార్గెట్లు రబీలో 98 శాతం పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి నాట్లు పడ్డాయి. సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. యూరియా కూడా ప్రస్తుత లక్ష్యానికి మించి అందుబాటులో ఉంది. కాని కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెడుతుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచి అంటగడుతున్నారు. ఖమ్మంలో ఒక ప్రముఖ కంపెనీ రూ.1.08 లక్షల విలువ చేసే ఒక లారీ (400 బస్తాల) యూరియాను డీలర్కు అమ్మితే, దాంతోపాటు కచ్చితంగా రూ.50 వేల విలువైన ఇతర ఎరువులను అంటగడుతోంది. ఈ టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నారు. హైదరాబాద్లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతోపాటు ఫలానా ఎరువు, పురుగు మందు వాడితే ప్రయోజనం ఉంటుందంటూ రైతులను డీలర్లు మభ్యపెడుతున్నారు. వాస్తవానికి యూరియాతోపాటు ఇతర ఎరువులు, పురుగు మందులను లింక్ పెట్టి విక్రయించకూడదని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ దాన్ని వ్యవసాయాధికారులు అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు. పైగా జిల్లాల్లో కంపెనీలకు, వ్యవసాయాధికారులకు మధ్య సంబంధాలు ఉంటాయి. ఈ తతంగం గురించి తెలిసినా వారు మిన్నకుంటున్నారు. కొందరు వ్యవసాయాధికారులకు కమీషన్లు అందుతుండటం వల్లే ఈ దందా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. మండల వ్యవసాయాధికారి ప్రిస్కిప్షన్ ఉంటేనే ఎరువులు, పురుగు మందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా.. అది అమలు కావట్లేదు. గుళికలు కొనాలి యూరియా కొనాలంటే అదనంగా గులికలు కొనాలని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం సబ్సీడీపై ఇచ్చే యూరియాపై వ్యాపారులు అదనంగా లాభం పొందడానికి రైతులను ఇబ్బందుల పాలుచేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. –సీహెచ్ రాంచందర్, రైతు సంఘం నాయకుడు, దేవరకద్ర నియంత్రణ ఏదీ ఎరువుల దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే రైతులను వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏది కొనాలన్నా అదనంగా ఇతర ఎరువులు కొనాలంటున్నారు. దీన్ని నివారించాలి. –కొండారెడ్డి, రైతు, వెంకటగిరి కఠిన చర్యలు తీసుకుంటాం: యూరియాతోపాటు ఇతర ఎరువులను విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారులతో మాట్లాడుతాం. యూరియాతోపాటు ఇతర ఎరువులను లింక్ పెట్టి అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ జగన్మోహన్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఇక.. చీటీ ఉంటేనే మందులు!
సాక్షి, తాండూరు : ఇక.. ఇష్టారాజ్యంగా పంటలపై మందుల వినియోగానికి చెక్ పడనుంది. వ్యవసాయాధికారులు అగ్రి వైద్యులుగా మారనున్నారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాలు అగ్రి మెడికల్ షాపులుగా మారనున్నాయి. రైతులు పంటలకు అధిక మోతాదు మందులు వినియోగించి నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో పురుగులమందు దుకాణాలు అగ్రి మెడికల్ దుకాణాలుగా మారనున్నాయి. వ్యవసాయాధికారులు చీటీ ఇస్తేనే ఇకపై మందులు ఇచ్చే పద్ధతి అమలులోకి రానుంది. జిల్లాలో 18 మండలాలు, 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7లక్షల ఎకరాలు సాగుకు అమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1.74లక్షల హెక్టార్లలో కంది, మినుము, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా పురుగుమందులు వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటివరకు రైతులు పురుగుమందులను దుకాణదారుల సూచన మేరకు వినియోగించేవారు. ఈక్రమంలో ఒక్కోసారి అధికమొత్తంలో కూడా ఉపయోగిస్తూ తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన సర్కారు కొత్త పద్ధతిని అమలులోకి తీసుకురానుంది. ఇకపై ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే.. పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో రైతులు పంటలకు రసాయన మందులను అధిక మోతాదుతో వినియోగించి తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పురుగు ఆశించిందని నేరుగా మందుల దుకాణాదారులను అడిగి వారు ఇచ్చిన మేరకు పిచికారీ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో రైతులకు దుకాణాదారులు నకిలీ మందులను సైతం అంటగట్టేవారు. తద్వారా వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. ఈనేపథ్యంలో తీవ్రనష్టాలకు గురై కొన్నిసందర్భాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. దీం తో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చర్యల కు ఉపక్రమించింది. ఇకపై వ్యవసాయ అధికారులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయా లు చేయకుండా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాదారులకు ఉత్తర్వులు జారీ చేయనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి.. జిల్లాలో ఉన్న రసాయనిక పురుగుమందు, ఎరువుల దుకాణాల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి విత్తనం విత్తే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అవసరమైన మందులను వ్యవసాయాధికారులు సూచనల మేరకు దుకాణాదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈఓల కొరత.. జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 99 వ్యవసాయ క్లస్టర్లుగా ఉండాలి. అయితే, ప్రస్తుతం జిల్లాలో 53 క్లస్టర్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక ఏఈఓ అందుబాటులో ఉండాలి. కాగా, జిల్లాలో 44 మంది ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయాధికారులకు ఇప్పటికే తలకు మించిన భారం ఉండటంతో పని ఒత్తిడి తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల చీటీ రాసి ఇవ్వడం మంచిదే అయినా, ఈ పద్ధతి నిర్వహణలో ఇబ్బందులు తప్పేలా లేవని క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. చీటీ రాసి ఇస్తేనే మందులు.. రైతులు పండిస్తున్న పంటలకు పిచికారీ చేసేందుకు వ్యవసాధికారులు చీటీ రాసి ఇవ్వాల ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో ఏఈఓల కొరత ఉంది. ప్రభుత్వం త్వరలో ఏఈఓలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏఈఓలు బీజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. –గోపాల్, వ్యవసాయాధికారి,వికారాబాద్ జిల్లా -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
అమలాపురం టౌన్: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు అమలాపురంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువరం ఆకస్మిక దాడులు చేశారు. ప్రధానంగా రెండు ఎరువుల దుకాణాలపై దాడులు చేసి స్టాక్లు, బిల్లులను తనిఖీ చేశారు. పట్టణంలోని అనంత లక్ష్మి సీడ్స్, గంగా సీడ్స్కు చెందిన ఎరువుల దుకాణాల్లో ఈ దాడులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగాయి. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు సీఐ టి.రామమోహనరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో ఈ దాడులు, తనిఖీలు జరిగాయి. ఈ రెండు దుకాణాలకు ఆయా కంపెనీల నుంచి వచ్చిన ఎరువుల స్టాక్కు గోడౌన్లలో ఉన్న స్టాక్కు లెక్కలు తేడా వచ్చాయని విజిలెన్స్ సీఐ రామ్మోహనరెడ్డి తెలిపారు. అలాగే రైతులకు అమ్మిన ఎరువులను బిల్లులను కూడా తనిఖీ చేశారు. స్టాక్లు, బిల్లుల పరంగా తేడాలు ఉండడంతో ఆ రెండు దుకాణాల్లో రూ.8.33 లక్షల విలువైన ఎరువు బస్తాలను సీజ్ చేశామని సీఐ వెల్లడించారు. ఎరువులు కొనుగోలు చేసి వెళుతున్న కొంత మంది రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఏఓ మహేష్ భగవత్, రెవెన్యూ అధికారులతో కలిసి ఈ తనిఖీలు చేశారు. పట్టణంలోని కొన్ని ప్రముఖ ఎరువుల దుకాణాలను కూడా సోదాలు చేశారు. -
యూరియా.. రైతుపై లేదు దయ
సాక్షి, హైదరాబాద్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా యూరియా దందా నడుస్తోంది. ఎరువుల డీలర్లు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. రూ.లక్షలు బొక్కేస్తున్నారు. 50 కిలోల యూరియా బస్తా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) రూ.295 మాత్రమే. ఆ యూరియా బస్తాను దుకాణదారులకు రూ.265కు ఇవ్వాలి. కానీ దళారులు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు సిండికేటుగా ఏర్పడి ఎరువుల దుకాణదారులకు అధిక ధరలకు అంటగడుతున్నారు. దీంతో దుకాణాదారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. తగినంతగా యూరియా సరఫరా కావటం లేదని, కంపెనీలు పంపడంలేదని రైతులకు చెబుతున్నారు. యూరియాతోపాటు, కాం ప్లెక్స్ ఎరువుల పరిస్థితి కూడా అలాగే ఉందని ప్రచారం చేస్తున్నారు. కొరత లేదు.. కానీ.. రబీ అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31,92 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 27.07 లక్షల (85%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 15 లక్షల (98%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. రబీలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 5.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. అందులో ఇప్పటివరకు 3.59 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలకు ఇవ్వాల్సి ఉండగా, 3.50 లక్షల మెట్రిక్ టన్నులను అందజేసింది. ఇదిగాక పాత యూరియా 1.69 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే అందుబాటులో ఉంది. మొత్తంగా 4.19 లక్షల టన్నులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రస్తుత లక్ష్యానికి మించి యూరియా అందుబాటులో ఉంది. ఇందులో మార్క్ఫెడ్ 1.07 లక్షల మెట్రిక్ టన్నులు, మిగిలినవి వ్యవసాయ శాఖ ద్వారా వివిధ కంపెనీలు జిల్లాలకు సరఫరా చేశాయి. ఇంత అందుబాటులో ఉన్నా సరఫరా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దందాలు మొదలయ్యాయి. కమీషన్లకు కక్కుర్తి.. మార్క్ఫెడ్ నుంచి ప్రాథమిక సహకార సంఘాలు, దాని లైసెన్సుదారుల ద్వారా యూరియా సరఫరా కావాలి. వ్యవసాయశాఖ అనుమతి మేరకు కంపెనీల నుంచి ఎరువుల డీలర్లకు సరఫరా కావాలి. మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులే సరఫరాలో కీలకం కావడంతో వారే కృత్రిమ కొరత సృష్టించి కమీషన్లు ఇచ్చిన వారికే సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో యూరియాను నల్ల బజారుకు తరలిస్తున్నారు. కింది నుంచి పైస్థాయి వరకు దందాలు జరుగుతుండటం, ముడుపులు తీసుకుంటుండటంతో ఎవరూ నోరు మెదపడంలేదు. ఖమ్మం జిల్లా మార్క్ఫెడ్కు చెందిన అధికారి ఒకరు ఎరువుల దుకాణాలకు అక్రమంగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అలా సరఫరా చేసినందుకు ఒక లారీకి రూ.10 వేల చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. అలాగైతేనే యూరియా సరఫరా చేస్తానని బెదిరిస్తున్నారంటూ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఆ కమీషన్ ప్రభావం రైతులపై పడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కీలకమైన ఎరువుల కంపెనీకి సంబంధించిన ఆ జిల్లా ప్రతినిధి ఒకరు యూరియాను కమీషన్లు తీసుకొని దళారులకు అప్పగిస్తున్నాడు. ఆ దళారీ దుకాణాలకు అధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. ఈయన పేరు కట్ల రాంబాబు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన రైతు. దుకాణాల్లో యూరియా బస్తా రూ.330 నుంచి రూ.340 వరకు విక్రయిస్తున్నారని తెలిపాడు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా నాణ్యతలేని, నిల్వ చేసిన యూరియాను విక్రయిస్తున్నారని రాంబాబు చెప్పాడు. మిర్యాలగూడకు చెందిన రైతు టి.వెంకటయ్య బస్తాను రూ.350కు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఇదేమని అడిగితే ఎరువుల దుకాణదారులకే రూ.320కు వస్తుందని చెబుతున్నారని, లాభం వేసుకొని రూ.350కు బస్తా ఇచ్చినట్లు వివరించాడు. తప్పని పరిస్థితిలో కొన్నా నాగార్జున సాగర్ నీటిని ఆరుతడి పంటలకు విడుదల చేయటంతో రెండెకరాల్లో వేరుశనగ వేశా. అందుకోసం ఒక్కో బస్తా యూరియా రూ.330 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. అసలు ధర రూ.295 కాగా ఎందుకింత ధర అని వ్యాపారిని ప్రశ్నిస్తే.. రవాణా చార్జీలు ఉంటాయని చెప్పాడు. దీంతో తప్పని పరిస్థితిలో రూ.330కు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చింది. – బుంగ లింగయ్య, వందనం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా -
అధిక ధరలకు ఎరువులమ్మితే లైసెన్సు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. ఎరువుల కొరతేమీలేదని పేర్కొన్నారు. ఎరువులను గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే ఎక్కువ ధరకు ఎక్కడైనా విక్రయించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. డీఏపీ సహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచిన నేపథ్యంలో పాతస్టాక్ను పాత ధరల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత ఎరువులను విక్రయించిన తర్వాతే కొత్తవాటిని రైతులకు విక్రయించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విక్రయాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చినందున పీవోఎస్ యంత్రాల ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎరువుల డీలర్లు పాత, కొత్త స్టాకు ధరలను దుకాణాల ముందు రైతులకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాలను పర్యవేక్షించేలా మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీచేయాలన్నారు. దుకాణాల రికార్డు బుక్కుల్లో పాత, కొత్త స్టాకు వివరాలు సరిగా ఉన్నాయో... లేవో పరిశీలించాలని సూచించారు. -
సబ్సిడీ విత్తనాలు.. 12 లక్షల క్వింటాళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వ్యవసాయ సీజన్కు 12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆయా విత్తనాలను ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఖరీఫ్కు 7.5 లక్షలు, రబీకి 4.5 లక్షల విత్తనాలను సరఫరా చేయనుంది. 2017–18 వ్యవసాయ సీజన్లో 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2018–19 సీజన్లో అదనంగా 2 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి పథకాన్ని వర్తింప చేయనున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. ప్రభు త్వ అంచనా ప్రకారం 1.62 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. సాగు పెరుగనున్న క్రమం లో విత్తన పరిమాణం కూడా పెంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 17 రకాల విత్తనాలను ఖరీఫ్, రబీలకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయనుంది. వీటిని 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందిస్తుంది. రైతు కోరుకునే విత్తనాలేవీ? ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నలో కొన్ని హైబ్రిడ్ రకాలకు బాగా డిమాండ్ ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్నకు డిమాండ్ లేకపోవడంతో రైతులు పెద్దగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. -
ఎరువు.. బరువు
గత ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలించలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటలకు చీడపీడలు, దోమపోటు.. అరకొర పంటలు చేతికొచ్చినా గిట్టుబాటు ధర దక్కలేదు. పెట్టుబడి అప్పులకు వడ్డీ పెరిగి తడిసి మోపెడయింది. దీనికితోడు కాంప్లెక్స్ ఎరువుల ధర పెంపు నిర్ణయం రబీ ఆశలపై నీళ్లు చల్లింది. వెరసి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. బూర్గంపాడు : ఖరీఫ్ కలిసిరాకపోవడంతో రైతులు ఆశలన్నీ రబీపై పెట్టుకుని సాగుకు ఉపక్రమించారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు నిర్ణయించడంతో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరి నుంచి ఎరువుల ధరలు పెరుగుతాయని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఎరువుల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఎరువుల తయారీలో వినియోగించే ముడిసరుకు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగటంతో ఎరువుల కంపెనీలు ధరలను పెంచేందుకు నిర్ణయించుకున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలను సుమారు 10శాతానికి పైగానే పెంచేందుకు కంపెనీలు నిర్ణయించాయి. డీఏపీ ధర ప్రస్తుతం రూ. 1100 వరకు ఉంది. దీని ధర సుమారు రూ.125 వరకు పెరిగే అవకాశముంది. రైతులు అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువు 20:20:00:13 ధర బస్తా ప్రస్తుతం రూ 900 వరకు ఉంది. దీని ధర సుమారు రూ 100 వరకు పెరిగే అవకాశముంది. 28:28:00 ధర కూడా రూ.125 వరకు పెరగవచ్చు. వీటితో పాటు 14:35:14 ధర రూ. 130, 10:26:26 ధర రూ 110 వరకు, 17:17:17 ధర రూ 70 వరకు పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు రైతులకు ముందుగానే తెలియపరుస్తున్నారు. పెరగనున్న ధరలు రబీసాగు రైతులకు భారం కానున్నాయి. రైతులకు పెరగనున్న పెట్టుబడి భారం జిల్లావ్యాప్తంగా రబీలో సుమారు 11 వేల హెక్టార్లలో వరిపంట సాగుచేస్తున్నారు. 1200 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఇవిగాక కూరగాయలు, అపరాలు మొత్తం కలిపి మరో 2500 హెక్టార్లలో రబీలో సాగుచేస్తున్నారు. రబీ పంటల సాగు మొదలై కేవలం నెలరోజులు కావస్తోంది. రైతులు మొదటిధపా ఎరువులు మాత్రమే వేసుకున్నారు. ఇంకా రెండో, మూడో విడతల్లో పంటలకు ఎరువులు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచితే రైతులపై ఎకరాకు కనీసం రూ.400కు పైగానే భారంపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులను పాతధరలకే విక్రయించాల్సిఉంది. కొత్తగా వచ్చేటువంటి ఎరువుల స్టాక్ మాత్రం కొత్తరేట్లలో అమ్మకాలు చేయాల్సిఉంటుందని డీలర్లు చెబుతున్నారు. పెట్టుబడులకు కటకటలాడుతున్న సమయంలో ఎరువుల ధరలు పెంచితే సాగు భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ముద్ర వేస్తేనే ముద్ద!
సాక్షి, మహబూబ్నగర్: పంటల సాగుతో రైతులకు అవసరమయ్యే రసాయన ఎరువుల విషయంలో పక్కదారి పట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. అయినా తరచుగా అక్రమాలు బయటపడుతున్నట్లు ప్రభుత్వాలు గుర్తించాయి. గతంలో పలు సీజన్లలో కొందరు వ్యాపారులు ఎరువులను మిక్సింగ్ ప్లాంట్లకు అమ్ముకోవడంతో కృత్రిమ కొరతను ఏర్పడడమే కాకుండా రాయితీ ఎరువులు పక్కదారి పట్టాయి. ఈమేరకు ఈనెల 1నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తె చ్చాయి. రైతు ఆధార్ కార్డుతో వస్తే నంబ ర్ నమోదు చేశాక, వేలిముద్రతో సరిచూసుకున్నాకే ఎరువులు అందజేసే విధానం ప్రస్తుతం జిల్లాలో ప్రారంభమైంది. ఈ విధానం ద్వారా ఎరువులపై కేంద్రప్రభు త్వం ఇచ్చే సబ్సిడీ దుర్వినియోగం కాకుం డా ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన. జిల్లాలో 192 దుకాణాలు జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు అమ్మే ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులు 192 ఉన్నాయి. ఆయా షాపుల యజమాన్యాలకు నూతన విధానాన్ని అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఆధార్ నంబర్, వేలిముద్రల నమోదుకు అవసరమైన పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను 173 షాపులకు వ్యవసాయ శాఖ పంపిణీ చేసింది. అలాగే, ఈ విధానంలో ఎరువుల విక్రయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కట్టు తప్పితే లైసెన్స్ రద్దు బయోమెట్రిక్ విధానాన్ని పాటించకుండా ఏ వ్యాపారి కూడా ఎరువులను విక్రయించొద్దని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే లైసెన్సు రద్దు చేయమని కలెక్టర్ రొనాల్డ్రాస్ ఇటీవల జరిగిన సమీక్షలో వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వ్యాపారులకు అందజేసిన ఈ–పోస్ యంత్రాల్లో ఆధార్ నంబర్ నమోదు చేయడంతో పాటు రైతు వేలిముద్ర వేశాక సరిపోలితేనే వారికి కావాల్సిన ఎరువులు అందజేస్తారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన యంత్రాలను అందజేశారు. ప్రస్తుతానికి రైతులు నగదు ద్వారానే కొనేలా పీఓఎస్ యంత్రాల సాప్ట్వేర్ ఉందని.. త్వరలోనే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనేందుకు యంత్రాల్లో మార్పులు చేస్తారని డీఏఓ సుచరిత ‘సాక్షి’కి తెలిపారు. ఈ సీజన్కు 30 వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో వర్షాకాలం చివర్లో భారీగా వర్షా లు కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో భూగ ర్భ జలాల మట్టం పెరగడంతో బోరుబావుల్లోనూ నీరు లభ్యత ఉంది. అలాగే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24గంట ల పాటు విద్యుత్ను సరఫరా చేస్తుండడం తో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి 30 వేల హెక్టార్లు, వేరుశనగ 30వేల హె క్టార్ల విస్లీర్ణం సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని భావించి అందుబాటులో ఉంచారు. ఆధార్ కార్డు ఉంటేనే ఎరువులు రైతులకు ఎరువులు కొనాలంటే దుకాణానికి అధార్కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఈ విధానంలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే మండల వ్యవసాయధికారి లేదా విస్తరణ అధికారులను సంప్రదించాలి. బయోమెట్రిక్ ద్వారా విజయవంతంగా రైతులకు ఎరువులను అమ్మేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సాంకేతిక సమస్య ఎదురైతే వెంటనే అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి -
‘ఆధార్’ ఉంటేనే ఎరువులు
సాక్షి, ఆదిలాబాద్టౌన్: ఎరువుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఆధార్ను అనుసంధానం చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల డీలర్లలకు ఆపరేటింగ్ సెల్ మిషన్ల (పీవోఎస్)ను అందజేశారు. అన్ని ఎరువుల దుకాణాల యజమానులు ఈ ప్రక్రియను జనవరి నుంచి కచ్ఛితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సు రద్దు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఈ పద్ధతి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 1,05,600 మంది రైతులు ఉన్నారు. లక్షా 97 వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 32 వేల హెక్టార్లలో పత్తి, 23 వేల హెక్టార్లలో సోయా, 19 వేల హెక్టార్లలో కందులు, 5 వేల హెక్టార్లలో జొన్న, 2 వేల హెక్టార్లలో మినుములు, 16 వందల హెక్టార్లలో పెసరి, 3 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల యూనియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాషియం, 5 వేల మెట్రిక్ టన్నుల పాస్పరస్ అవసరం అవుతుంది. అలాగే రబీ సీజన్లో 4,700 మెట్రిక్ టన్నుల యూరియా, 2780 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1900 మెట్రిక్ టన్నుల పొటాషియం, 3,400 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎప్పటికప్పుడు సమాచారం.. పీవోఎస్ మిషన్లలో రైతుల ఆధార్ నంబర్, వారి పంట భూమి వివరాలను నమోదు చేశారు. రై తుకున్న వ్యవసాయాన్ని బట్టి మాత్రమే ఎరువులలు ఇస్తారు. ఆధార్కార్డు లేకుంటే ఎరువులను విక్రయించరు. జిల్లాకు ఎన్ని ఎరువులు వచ్చాయి.. ఎన్ని మంది రైతులు ఏయే ఎరువులు కొ నుగోలు చేశారు. ఇంకా ఎంత స్టాక్ ఉందనే వివరాలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తోంది. విక్రయించిన ఎరువులకు మాత్రమే డీలర్లకు సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. 135 మందికి పీవోఎస్ మిషన్లు.. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 135 మంది డీలర్లకు పాయింట్ ఆఫ్ సెల్ మిషన్లను పంపిణీ చేశారు. ఇంకా 85 మంది డీలర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీలర్లకు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పీవోఎస్ మిషన్ల ద్వారా ఎరువుల సరఫరా వల్ల అక్రమాలను నివారించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు యూరియా, డీఏపీ ఇతర ఎరువులను ఆయా కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు. కొంత మంది డీలర్లు రైతులకు విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువులు విక్రయించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సబ్సిడీ వారి అకౌంట్లలో జమ అవుతుంది. ఇకనుంచి ఇలాంటి అక్రమాలకు చెక్ పడనుంది. నేటి నుంచి అమలు.. ఎరువుల పంపిణీకి ఆధార్ అనుసంధానం పూర్తి చేయడం జరిగింది. నేటి నుంచి అ మలు చేస్తున్నాం. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. 135 మందికి పీ వోఎస్ మిషన్లు అందజేశాం. మిగతా వారికి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం. శిక్షణ కూడా ఇచ్చాం. పీవోఎస్ అమలు చేయని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం. -ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో.. రైతులు 1,05,600 సాధారణ సాగు విస్తీర్ణం 1,97,000 హెక్టార్లు ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎరువుల విక్రయాలు (మెట్రిక్ టన్నులలో) యూరియా 35 వేలు డీఏపీ 10 వేలు కాంప్లెక్స్ ఎరువులు 15 వేలు పొటాషియం 5 వేలు పాస్పరస్ 5 వేలు రబీలో అవసరమయ్యే ఎరువులు యూరియా 4,700 డీఏపీ 2780 పొటాషియం 1900 కాంప్లెక్స్ ఎరువులు 3,400 -
ఆధార్ ఉంటేనే ఎరువులు!
సాక్షి, హైదరాబాద్: రైతులు ఎరువులు కొనాలంటే ఇకపై ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఎరువుల దుకాణాలకు 6,641 పాయింట్ ఆపరేటింగ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను సరఫరా చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై కలెక్టర్లకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురాకుంటే ఎరువులు విక్రయించకూడదని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అమలు ప్రక్రియపై ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. సాంకేతికంగా ఇబ్బందులు ఉన్న చోట చక్కదిద్దారు. కొన్నిచోట్ల పీవోఎస్ యంత్రాలు పని చేయకపోతే కొత్త వాటిని అందజేశారు. సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. తాజా నిర్ణయంతో సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్ ప్లాంట్లు, ఇతర అవసరాలకు వెళ్లకుండా అడ్డుకోవ చ్చు. పీవోఎస్ పద్ధతి ద్వారా నేరుగా లబ్ది చేకూర్చే బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్ యంత్రాలను తీసు కోకున్నా, ఈ పద్ధతిని అమలు చేయకున్నా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కూడా సర్కారు స్పష్టం చేసింది. ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా సరిపడా పీవోఎస్ యంత్రాలు అందుబాటు లో లేకపోవడంతో వాయిదా వేశారు. ఎట్టకేలకు నూతన సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. డబ్బులే చెల్లించాలి.. డీబీటీ విధానంలో ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే ప్రస్తుతానికి డెబిట్ కార్డును ఉపయోగించే పద్ధతిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి రైతులు డబ్బులు చెల్లించే ఎరువులు కొనుగోలు చేస్తారు. మున్ముందు డెబిట్ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్ యంత్రాలను తీర్చిదిద్దుతారు. వాటిలో డెబిట్ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్వేర్ను ప్రస్తుతం ప్రవేశపెట్టడం లేదు. రైతులు పూర్తిస్థాయి లో డెబిట్ కార్డు లేదా రూపె కార్డు కలిగి ఉన్నట్లు నిర్ధారించుకున్నాక పీవోఎస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రా నికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. -
ఆధార్ ఉంటేనే ఎరువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే ఎరువులు కొనుగోలుకు ఆధార్కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్ ద్వారా ఎరువులు కొనే పద్ధతిని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. రైతులు తమ వెంట ఆధార్ తీసుకురాకున్నా.. ఎవరికైనా ఆధార్ లేకున్నా అట్లాంటి రైతులకు ఎరువులు అమ్మకూడదని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అలాగే ఆయా దుకాణాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) యంత్రాలను కూడా అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల పీవోఎస్ యంత్రాలను సరఫరా చేయాలని భావించగా.. ఇప్పటికి 5 వేల దుకాణాలకు అందజేశారు. అందులో 3 వేల దుకాణాల్లో పూర్తిస్థాయిలో పీవోఎస్ యంత్రాలను బిగించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల పీవోఎస్ యంత్రాలు పనిచేయకపోతే వాటిని మార్చి కొత్త వాటిని అందజేస్తున్నారు. మున్ముందు డెబిట్ కార్డు స్వైప్.. డీబీటీ విధానంలో రైతు ఎరువుల బస్తా కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే మున్ముందు డెబిట్ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్ యంత్రాలను ఇస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం డెబిట్ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టడంలేదు. రైతులు పూర్తిస్థాయిలో డెబిట్ కార్డు లేదా రూపే కార్డు కలిగి ఉన్నట్లు నిర్థారించుకున్నాక పీవోఎస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆధార్ ద్వారా, మున్ముందు డెబిట్ కార్డుతో ఎరువుల విక్రయాలు జరుపుతారు. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే.. యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే దుకాణాల్లో రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. అయితే సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్ ప్లాంట్లు, ఇతర అవసరాలకు మళ్లకుండా ఈ కొత్త విధానాన్ని కేంద్రం అమలులోకి తీసుకువస్తోంది. పీవోఎస్ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చే బదిలీ(డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్లను తీసుకోకపోయినా, ఈ పద్ధతిని అమలు చేయకపోయినా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సర్కారు స్పష్టంచేసింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా.. సరిపడా పీవోఎస్ యంత్రాలు అందుబాటులో లేక వాయిదా వేశారు. -
ఎరువులే తింటున్నాం!
సాక్షి, అమరావతి: తొమ్మిది రోజుల పాటు మూడు ఖండాల్లోని మూడు దేశాల్లో ఉన్న ఏడు నగరాల్లో పర్యటించామని, కుదుర్చుకున్న ఎంఓయూల ద్వారా 10 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆ విశేషాలను తెలిపేందుకు శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో విదేశీ టూర్లంటే ఎక్కువగా ఐటీ కంపెనీలకు వెళ్లేవాడినని, ఈసారి వ్యవసాయ టెక్నాలజీపై దృష్టి పెట్టానని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతుల కళ్లల్లో దీపావళి చూసేందుకు అమెరికాలో దీపావళి రోజు వ్యవసాయ క్షేత్రాల్లో గడిపానన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంలో విపరీతంగా ఎరువులు వాడుతున్నారని, దీనివల్ల అందరూ ఎరువుల్నే తింటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశంలో ఎక్కువగా ఎరువుల్ని వినియోగించే రాష్ట్రాల్లో హర్యానా, ఆంధ్రప్రదేశ్లు ముందున్నాయని తెలిపారు. ఎరువుల వాడకం తగ్గించమని రైతులకు చెబుతున్నామన్నారు. ప్రపంచం అంతా ఆర్గానిక్ వ్యవసాయంపై ముందుకెళుతోందని దానిపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. గోల్డెన్ పీకాక్ అవార్డు తీసుకున్నానని, ఇలాంటి వాటి వల్ల మనలో నమ్మకం పెరుగుతుందని ఆయన చెప్పారు. విదేశాల్లో పర్యటనల సందర్భంగా తొమ్మిది రోజులు విమానంలోనే పడుకున్నానని, అందులోనే స్నానం చేశానని, అక్కడే ముఖం కడుక్కున్నానని చెప్పారు. కొన్నిరోజులైతే స్నానం కూడా లేకుండా తిరిగానని తెలిపారు. స్తూపం డిజైన్కు తొలి ప్రాధాన్యం... రెండు వేల ఏళ్ల నాటి వారసత్వాన్ని ప్రతిబింబించేలా నీటిలో ఉండే అసెంబ్లీ భవనం రెండు డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిందని సీఎం తెలిపారు. వాటిలో అమరావతి స్తూపం డిజైన్కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ మేరకు మార్పులు చేసి తీసుకురమ్మన్నామని చెప్పారు. హైకోర్టుకు స్తూపాకారం డిజైన్ అందంగా వచ్చిందని దాన్ని ఓకే చేశామన్నారు. సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించే డిజైన్ ఇచ్చారని, అవి ఒకే వరుసలో నిర్మించాలా, లేక రెండు, మూడు వరుసల్లోనా అనే అంశంపై రెండు, మూడు ఆప్షన్లతో డిజైన్లు సిద్ధం చేసి చూపించాలని చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 14 శాతం లెస్కు కాంట్రాక్టర్కి ఇచ్చారని, ఇప్పుడు అతను దాన్ని పూర్తి చేసే స్థితి లేదన్నారు. 60 సి కింద ప్రాజెక్టులోని కొన్ని పనులను విడిగా అవుట్సోర్సింగ్కి చేయించే అవకాశం ఉందని, చర్చిస్తున్నామని చెప్పారు. ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
ఎరువులా? మారణాయుధాలా?
- ఎరువులు, పురుగుమందులతో ప్రమాదకరమైన ఆయుధాలు - బాంబులు, రసాయన ఆయుధాలు తయారు చేస్తున్న ఉగ్రవాదులు - ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా దాడులు - దేశంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఎరువులు, పురుగు మందులు - అవి దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు ప్రమాదమే! - నియంత్రణ లేకపోవడంపై ఆందోళన.. అవగాహన కల్పించేందుకు చర్యలు - దీనిపై హైదరాబాద్లో ఇండో–అమెరికా వర్క్షాప్ ► అల్కాయిదా ఉగ్రవాదులు 2001 సెప్టెంబర్లో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీవో)పై విమానాలతో దాడి చేసి వేల మందిని పొట్టనపెట్టుకున్నారు. అయితే ఆ దాడికి ముందు వారేం చేశారో తెలుసా..? పంటలకు ఉపయోగించే పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి.. రద్దీగా ఉండే ప్రాంతంలో చల్లడం ద్వారా వేలాది మందిని చంపేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎందుకో అది వీలుగాక.. విమానాలతో దాడి చేశారు.. ► 1995లో అమెరికాలోని ఓక్లహామాలో ఉగ్రవాదులు ఒక భవనంపై బాంబుదాడి చేసి 168 మందిని బలితీసుకున్నారు. ఆ బాంబును దేనితో తయారు చేశారో తెలుసా..? పంటలకు వినియోగించే ఎరువులు, పురుగుమందులు కలిపి రూపొందించారు.. ... ఎరువులు, పురుగు మందులు పంటల రక్షణ కోసమే కాదు.. పెద్ద సంఖ్యలో మనుషులను బలితీసుకునే మారణ హోమాలకు ఆయుధాలుగా కూడా మారుతాయని ఈ రెండు ఘటనలు చెబుతాయి. ఉగ్రవాదులు ఎరువులు, పురుగుమందులను రసాయన ఆయుధాలుగా మార్చి 1975 నుంచి 2002 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 146 భారీ విస్ఫోటనాలు సృష్టించారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. దీంతో ఎరువులు, పురుగు మందుల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చ జరుగుతోంది. వ్యవసాయక దేశమైన భారత్లో ఎరువులు, పురుగుమందులను విçస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో... అవి దుష్టుల చేతిలో పడకుండా చర్యలు చేపట్టడంపై భారత్, అమెరికాలు దృష్టి సారించాయి. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో సదస్సు జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన ఇంధనశాఖ, స్టేట్ కెమికల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, పసిఫిక్ నార్త్వెస్ట్ నేషనల్ లేబొరేటరీ (పీఎన్ఎన్ఎల్)ల∙శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్ పురుగు మందులతో మారణ హోమమే భారత్ వ్యవసాయక దేశం. దీంతో ఇక్కడ ఎరువులు, పురుగు మందుల వినియోగం విస్తృతంగా ఉంటుంది. ఇందులోనూ దేశవ్యాప్తంగా ఉపయోగించే వాటిలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 24% వరకు ఉండటం గమనార్హం. దీంతో ఇక్కడ అవి పక్కదారి పట్టడానికి అవకాశాలు ఎక్కువ. పైగా హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయి. ఉగ్ర వాదులు, మిలిటెంట్ ఉద్యమకారులు, క్రిమినల్ల చేతిలోకి ఎరువులు, పురుగుమందులు వెళితే అత్యంత ప్రమాదం. పురుగు మందుల సాంద్రత పెంచి ఇతరత్రా రసాయనాలు కలిపితే.. విధ్వంసకర ఆయుధాలుగా తయారవుతాయి. పురుగుమందులను అధిక సాంద్రతతో స్ప్రేచేస్తే విష ప్రభావంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎరువులతో బాంబులు ఎరువులు, పురుగు మందులతో బాంబులు తయారు చేయడం సులువు, చవక కూడా.. నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులు వాటిని ఉప యోగించి తక్కువ సమయంలోనే బాంబులు తయారు చేయగలరని ఇప్పటికే వెల్లడైంది. యూరియాకు నైట్రిక్ యాసిడ్ కలిపి భారీ పేలుడు సృష్టించే బాంబుగా తయారు చేయవచ్చని చెబుతున్నారు. అంటే మనం పెద్దగా పట్టించుకోని ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదు లు, క్రిమినల్స్ చేతిలో పడితే జరిగే నష్టం చాలా ఎక్కువ. దీంతో అమెరికా, భారత నిఘా వర్గాలు ఇప్పుడీ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాయి. పక్కదారి పట్టకుండా చూడాలి ‘‘ఎరువులు, పురుగు మందులు ఉగ్రవాదుల చేతిలో పడితే బాంబులు తయారు చేయడానికి ఆస్కార ముంది. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగు తోంది. పురుగు మందులు, ఎరువుల సరఫరా కట్టుదిట్టంగా ఉండాలి..’’ – డాక్టర్ జీవీఎం శర్మ, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐసీటీ, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేయాలి.. ‘‘పురుగు మందులు, ఎరువులు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకుండా జాగ్ర త్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను ఏర్పా టు చేయాలి. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. డీలర్లను, వ్యాపారులను చైతన్యం చేయాలి. తయారీ యూని ట్లన్నీ భద్రత నడుమ ఉండాలి. దేశంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 66 పురుగు మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రకటించి, నిషేధించారు. అందులో మన దేశంలో 18 పురుగు మందులపై నిషేధం ఉంది..’’ – పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
స్వల్పంగా తగ్గిన ఎరువుల ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ప్రభావంతో రసాయన ఎరువుల ధరలు కొంతమేర తగ్గాయి. మొన్నటి వరకు 50 కిలోల యూరియా బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీతో మూడు రూపాయలు తగ్గి.. రూ.295 వద్ద స్థిరపడింది. అలాగే కోరమాండల్ కంపెనీకి చెందిన డీఏపీ ధర రూ.1092 ఉండగా ప్రస్తుతం రూ.1081కి తగ్గింది. 10.26.26 బస్తా ధర రూ.1155 ఉండగా 1044కు తగ్గింది. 28.28.0, 14.35.14 బస్తా ధర రూ.1134 నుంచి రూ.1122కు తగ్గింది. 20.20.0.13 బస్తా ధర రూ,829 నుంచి రూ.821కి తగ్గింది. ఎంఓపీ ధర రూ. 577 నుంచి రూ. 575కు తగ్గింది. ఎంసీఎఫ్ఎల్కు చెందిన డీఏపీ ధర మొన్నటి వరకు రూ. 1118 ఉండగా 1105కు తగ్గింది. 20.20.0.13 ధర రూ.883 నుంచి రూ.872కు తగ్గింది. క్రిబ్కొ డీఏపీ ధర రూ.1086 ఉండగా రూ.1076కు తగ్గింది. ఎంఓపీ ధర రూ.583.25 నుంచి 577.50కి తగ్గింది. పీపీఎల్ కంపెనీ డీఏపీ ధర రూ.1118 నుంచి 1105కు తగ్గింది. 10.26.26 ధర రూ.1082 ఉండగా రూ.1076కు తగ్గింది. 20.20.0.13 ధర రూ.882 నుంచి రూ.872కు తగ్గింది. జువారి కంపెనీకి చెందిన డీఏపీ బస్తా ధర రూ.1123 నుంచి రూ.1105కు, 19.19.19 ధర రూ1081 నుంచి 1071కి, ఎంఓపీ ధర రూ.580 నుంచి రూ.579కి తగ్గాయి. మద్రాసు పర్టిలైజర్స్ లిమిటెడ్కు చెందిన 17.17.17 బస్తా ధర రూ.రూ.998 నుంచి 989.50కి తగ్గింది. -
రైతులకు శుభవార్త
ఢిల్లీ: వస్తు సేవాలపై పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేది నుంచి అమలులోకి వచ్చింది. రైతులపై ఈ జీఎస్టీ భారం అవుతుందని మొదట నుంచి విమర్శలోస్తున్నాయి. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయలు తీసుకున్నారు. రైతులకు భారం కానున్న ఎరువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్, స్పేర్ పార్ట్స్ పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. -
‘ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి’
అనంతపురం అగ్రికల్చర్ : ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్లు, స్వైపింగ్ యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో పెట్టుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై నుంచి డైరెక్ట్ టు బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి వస్తుండటంతో కొత్త పద్ధతిలో ఎరువుల అమ్మకాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. మొదట ఎరువులు తర్వాత విత్తనాలు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ అమ్మకాలు ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ఎరువులు డీబీటీ పద్ధతిలో విక్రయించాల్సి ఉండటంతో బయోమెట్రిక్, స్వైపింగ్ పరికరాలు మూడు రోజుల్లోగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతు ఆధార్ నెంబర్ ఆధారంగా ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు. -
పంట దిగుబడులకు పోషకాలు అత్యవసరం
– ఖరీఫ్ పంటల్లో ఎరువులు యాజమాన్యం చేపట్టాలి – ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్ అనంతపురం అగ్రికల్చర్ : పంట దిగుబడులు రావాలంటే తప్పనిసరిగా పోషకాలు అందించాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షాధారంగా వేసే పంటలైనా సేంద్రియ, రసాయన ఎరువులతో సమగ్ర యాజమాన్యం చేపట్టాలని సూచించారు. పోషకాలు అత్యవసరం : జిల్లాలో వేరుశనగ 6 లక్షల హెక్టార్లు, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, అలసంద, పెసర, కొర్ర, సజ్జ తదితర మిగతా పంటలు మరో రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా సేంద్రియ ఎరువులు తగ్గించి రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. కొందరు రైతులు అసలు ఎరువులు వేయడమే మానేశారు. అయితే పంటకు తగినంత పోషకాలు వేయకుంటే అనుకున్నంత పంట దిగుబడులు రావడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులు వాడకం పెరగాలి. పశువుల ఎరువు, వర్మీ వంటి సేంద్రియ పదార్థంలో ఎన్పీకే, సూక్ష్మపోషకాలతో పాటు 16 రకాల పోషకాలు లభిస్తాయి. సేంద్రియ ఎరువులకు కొంత రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం ఇలా: + వేరుశనగ పంట వేసే రైతులు ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువులు వేయాలి. ప్రతి మూడు పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్సల్ఫేట్ వాడాలి. + ఎకరా కంది పంటకు రెండు టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల యూరియా, 125 కిలోల సూపర్ పాస్ఫేట్ వేయాలి. + పత్తి పంట ఎకరాకు దుక్కిలో 150 కిలోల సూపర్ పాస్ఫేట్, 50 కిలోల ఎంఓపీ వేసుకోవాలి. పంట విత్తుకున్న తర్వాత 30, 60, 90 రోజుల సమయంలో ఎకరాకు 35 కిలోల యూరియా చల్లాలి. + ఎకరా ఆముద పంటకు రెండు టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 20 కిలోల ఎంఓపీ వేసుకోవాలి. విత్తుకున్న 30, 60, 90 రోజుల సమయంలో ఎకరాకు 15 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. + మొక్కజొన్న సాగు చేసే రైతులు ఎకరాకు ఆఖరి దుక్కిలో 150 కిలోల సూపర్ పాస్ఫేట్, 50 కిలోల ఎంఓపీ ఎరువులు వేయాలి. అలాగే 100 కిలోల యూరియాను రెండు భాగాలుగా చేసుకుని 50 కిలోలు దుక్కిలోనూ తర్వాత 30 నుంచి 35 రోజులు, 50 నుంచి 55 రోజుల సమయంలో మిగతా ఎరువు వేసుకోవాలి. -
ఎరువు.. జీఎస్టీ దరువు
► పెరగనున్న ఎరువుల ధరలు ► జిల్లా రైతులపై రూ.35 కోట్లకు పైగా భారం ► పురుగు మందులు మరింత ప్రియం వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) ప్రభావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలు రానున్నాయి. యూరియాతో పాటు అన్నిరకాల రసాయనిక ఎరువుల ధరలు పెరగనున్నాయి. దీంతో వ్యవసాయం భారమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): జీఎస్టీ ప్రభావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఏర్పడింది. జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగొచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. వాస్తవంగా ఎరువుల ధరల కొన్ని నెలల క్రితమే కొంత మేరక తగ్గాయి. ఇప్పటి వరకు అన్ని రకాల ఎరువులపై వ్యాట్ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలైతే ఏకంగా పన్ను 12 శాతానికి పెరుగుతోంది. అంటే పన్ను భారం అదనంగా 7 శాతం పడుతోంది. అదే స్థాయిలో ధరలు పెరుగనున్నాయి. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి 100 వరకు పెరిగే అవకావం ఉంది. యూరియా భారం రూ.4.07 కోట్లు ఖరీప్ సీజన్కు 3,38,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్ని రకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా.. ఇంతవరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు ఊరట కల్పిస్తోంది. ప్రస్తుతం 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీ కారణంగా యూరియా ధర రూ. 316కు పెరుగనుంది. అంటే బస్తాపై రూ.18 వరకు పెరుగనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా అవసరం అవుతోంది. టన్నుపై రూ.360 వరకు పెరుగనుంది. అంటే కరువు రైతులపై రూ.4.07 కోట్లకు పైగా భారం పడే ప్రమాదం ఏర్పడింది. ఇతర ఎరువులు.. జిల్లాకు డీఏపీ 65600 టన్నులు, ఎంఓపీ 16432 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు( ఎన్పీకే) 1,42,733 టన్నులు అవసరం అవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు డీలర్లకు సమాచారం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతులపై జీఎస్టీ భారం ఎక్కువగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డై అమ్మోనియా సల్పేటు( డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం గరిష్టంగా బస్తా ధర రూ. 1155 వరకు ఉంది. ఈ ధర గరిష్టంగా రూ.1221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 65600 టన్నులు అవసరం అవుతుండగా రైతులపై రూ. 8 కోట్లకు పైగా భారం పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం 28.28.0 ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1134 ఉంది. ఈ ధర రూ.1200 ఆపై పెరిగే అవకాశం ఉంది. 10.26.26, 14.35,14 ఇలా అన్ని రకాల ధరలు పెరుగనున్నాయి. ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. భారం కానున్న పురుగు మందుల ధరలు... రైతులకు పురుగు మందులు కూడ భారం కానున్నయి. జిల్లాలో ఏటా దాదాపు దాదాపు 50వేల టన్నుల పురుగు మందుల అమ్మకం అవుతున్నాయి. వీటిపై దాదాపు 18 శాతం వరకు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. వీటితో వివిధ కంపెనీల బయో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. -
కర్షకుడిపై జీఎస్టీ కత్తి
► 18 శాతం మేర పెరగనున్న పురుగు మందుల ధరలు ► ఆందోళనలో అన్నదాత ములకలచెరువు: రైతుల సంక్షేమమే తమ ద్యేయమని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నడ్డి విరుస్తున్నాయని అన్నదాతలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పండిన పంటలకు గిట్టుభాటు ధరలు లేక నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీ( వస్తు సేవా పన్ను) పన్ను విధానం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాగా మారనుంది. 18 శాతం మేర పురుగు మందులు, ఎరువు పెరగనుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీతో పురుగు మందులు భారం: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో పురుగు మందులపై 18 శాతం పన్ను భారం మోపనుంది. జూలై 1 నుంచి ధరలు పెరనుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వివిధ కంపెనీలు ధరలు పెంచేశాయి. యూరియాతో పాటు జింకు, మెగ్నీషియం, బయో ఫర్టిలైజర్స్పై ఐదు శాతం ధరలు పెరగనున్నాయి. పురుగు మందులపై 18 శాతం పెంపు తప్పని సరిగా మారింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఖరీఫ్లో సుమారుగా 70 వేల హెక్టార్లలో పంటలు సాగుచేస్తారు. యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వాడుతారు. వీటితో పాటు పురుగుల మందులు సైతం వాడుతారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు రైతులకు అదనపు భారం కానుంది. జీఎస్టీతో ఎరువుల కంపెనీలు ధరలు అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం యూరియా బస్తా రూ.298 ఉండగా జీఎస్టీతో జూలై 1 నుంచి 315కు పెరగనుంది. అలాగే డీఏపీ రూ.1155 నుంచి రూ. 1217కు పెరగనుంది. పెరిగిన ధరలతో నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు కోట్ల రూపాయలు అన్నదాతలపై భారం పడనుంది. పండిన పంటలకు గిట్టుభాటు ధరలు లేక పెట్టుబడులు దక్కక రైతులు నష్టపోతున్నారు. గిట్టుభాటు ధరలు కల్పించని ప్రభుత్వం ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు. ఇలాగైతే కాడి వదిలేయాల్సిందేనని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై అధనపు భారం ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడం రైతులపై అదనపు భారం మోపడమే. సాగు ఖర్చులు పెరిగితే వ్యయం మరింత భారమవుతుంది. పండించిన పంట పెట్టుబడులకే సరిపోతుంది. - శంకర్రెడ్డి, రైతు, వేపూరికోట. ఇదెక్కడి న్యాయం రైతులు పండించిన పంటకు గిట్టుభాటు ధరలు కల్పించని ప్రభుత్వాలు ఎరువు, పురుగుల మందుల ధరలు పెంచడం దారుణం. దేశానికి వెన్నెముక వంటి రైతులపై భారం మోపడం తగదు. జీఎస్టీ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలి. - అంజనప్ప, రైతుసంఘం నాయకుడు, ములకలచెరువు. -
పంట వేస్తేనే ప్రభుత్వ ‘సాయం’!
- లేకుంటే తర్వాతి సీజన్కు రైతుకు ఆర్థిక సాయం అందదు - పెట్టుబడి పథకం మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ మేధోమథనం - ఖాళీగా ఉంచి ఎకరానికి రూ.4 వేలు తీసుకుంటామంటే కుదరదు - వచ్చే ఏడాది నుంచి మొత్తం వ్యవసాయ భూమిని సాగులోకి తేవడమే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తమ వ్యవసాయ భూమిలో పంట వేసే రైతులకే పెట్టుబడి పథకం కింద సాయం అందించాలని సర్కారు యోచిస్తోంది. పంట వేయని రైతులకు ఆర్థిక సాయం చేయడం వల్ల ఆ పథకం స్ఫూర్తి దెబ్బతింటుందని భావిస్తోంది. 2018 ఖరీఫ్ సీజన్ నుంచి ఎరువులు, విత్తనాలు, ఇతర పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. యాసంగి సీజన్లోనూ రూ.4 వేలు ఇస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో వ్యవ సాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నతస్థాయిలో మేధో మధనం జరుపుతోంది. నీటి వసతి లేకపోవడం.. తదితర కారణాలతో కొందరు రైతులు తమ భూములను బీడ్లుగా వదిలేస్తున్నారు. కొందరు సాగు వదిలేసి వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూమి ఉంటే చాలు ఎకరానికి రూ.4 వేలు చొప్పున పెట్టుబడి పథకం వర్తిస్తుందా, లేదా అనే అంశంపై రైతుల్లో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో రైతు ఏదో ఒక పంట వేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడి పథకం ప్రారంభించే వచ్చే వర్షాకాల సీజన్లో భూమి ఉన్న ప్రతీ రైతుకు ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు సాయం చేయనుంది. అనంతరం ఎవరెవరు సాగు చేశారు, ఎవరు చేయలేదో ఏఈవోలతో సర్వే చేయిస్తుంది. వర్షాకాలంలో పెట్టుబడి సాయం పొంది తమ భూమిని సాగులోకి తీసుకురాలేదంటే.. తర్వాత యాసంగిలో సాగు చేసినా వారికి ఆర్థిక సాయం అందదు. 1.55 కోట్ల ఎకరాల భూమి.. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 55.53 లక్షల మంది రైతులున్నారు. అందులో సన్నచిన్నకారు రైతులు 47.68 లక్షల మంది, మధ్యతరహా రైతులు 7.09 లక్షల మంది, ధనిక రైతులు 16 వేల మంది ఉన్నారు. వారికి 1.55 కోట్ల ఎకరాల భూమి ఉంది. అయితే రాష్ట్రంలో వర్షాకాల సీజన్లో 1.08 కోట్ల ఎకరాలు, యాసంగిలో 37.62 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 1.46 కోట్ల ఎకరాలు సాగవుతుంది. వానాకాలంలో పంట కోతలు పూర్తయితే అదే భూమిలో యాసంగి పంటలూ వేస్తారు. పత్తి, మిరప వంటి కొన్ని పంటలు మాత్రం యాసంగిలోనూ కొనసాగుతాయి. అంటే సీజన్ మొత్తానికి గరిష్టంగా 1.25 కోట్ల ఎకరాల భూమి మాత్రమే సాగవుతున్నట్లు లెక్క. కొంత భూమిలో ఉద్యాన పంటలు సాగవుతాయి. అలాగే మరో 10 లక్షల ఎకరాలకుపైగా భూమి సాగు కావడంలేదని వ్యవసాయ అధికారులు విశ్లేషిస్తున్నారు. సీజన్ బాగోలేకుంటే ఒక్కోసారి 30 లక్షల ఎకరాల వరకు సాగు జరగదు. ఈ నేపథ్యంలో పెట్టుబడి పథకం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందనేది అధికారుల భావన. ఒకవేళ భవిష్యత్తులో సాగునీటి వసతి ఏర్పడితే అప్పుడు సాగు పెరగవచ్చు. ఈ నేపథ్యంలో భూమి సాగు చేస్తేనే సాయం అనే నిబంధన తప్పనిసరిగా ఉంచాలని అంటున్నారు. ఏదో ఒక పంట తప్పనిసరి.. ఇప్పటివరకు బీడుగా వదిలేసిన భూమిలో కనీసం గడ్డి మొక్కలైనా లేదా పండ్ల తోటలైనా వేస్తేనే అధికారులు పరి గణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ప్రభు త్వం రాయితీతో ఇచ్చే 84 లక్షల గొర్రెలకైనా ఆహారం లభ్యంకానుంది. అలాగే పర్యావర ణానికి మేలు జరుగుతుందనేది సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు ఒక్కో సారి సరైన వర్షాలు లేక విత్తనాలు వేసినా మొలకెత్తవు. అప్పుడు పంట వేసిన ఆనవాళ్లు కూడా ఉండవు. అలాంటి సంద ర్భాల్లో తదుపరి సీజన్కు రైతుకు ఆర్థిక సాయం అందుతుందా, లేదా అనే అనుమా నాలున్నాయి. ఏదేమైనా మార్గదర్శకాలు ఖరారయ్యాకే స్పష్టత రానుంది. ఇటీవల రైతు సమగ్ర సర్వే ప్రకారం కేవలం 46.17 లక్షల మంది రైతులు మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. -
ఎరువు బరువు
►కరువు జిల్లాపై పిడుగుపాటు ►అన్నదాతపై జీఎస్టీ భారం ►12శాతం పన్ను శ్లాబులో ఎరువులను చేర్చడంపై ఆందోళన జీఎస్టీ (వస్తు సేవలపన్ను) రైతుకు గుదిబండగా మారనుంది. అన్ని రకాల ఎరువులను 12శాతం పన్నుల శ్లాబులోకి చేర్చడంతో అన్నదాతపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఎరువులపై అన్ని రాష్ట్రాల్లోనూ 4 నుంచి 8 శాతం పన్ను పరిధిలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏకంగా 12 «శాతానికి పెంచడంతో ఎరువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేటి పరిస్థితుల్లో ఎరువులపై పన్నులు పెంచడం మూలిగేనక్కపై తాటికాయ పడ్డచందంగా ఉందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. చిత్తూరు, సాక్షి: దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ విధానం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ విధానం కొన్ని వర్గాలకు మేలు చేస్తుంటే దేశానికి వెన్నెముకవంటి అన్నదాతపై మోయలేని భారం అవుతోంది. ఇప్పుడున్న ధరల విధానంతోనే ఎరువులు కొనా లంటే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో కర్షకులు ఉంటే.. ఎరువులపై మరింత పన్ను వేస్తూ వారి నడ్డివిరుస్తోంది. 12«శాతం పన్ను శ్లాబు లోకి ఎరువులను తేవడంతో టన్ను యూరి యాపై రూ.400, 50 కేజీల డీఏపీపై రూ.125, ఇతర కాంప్లెక్స్ ఎరువులపై టన్నుకు రూ.350 వరకు రైతులపై భారం పడనుంది. ఎరువుల ధరలపై విపరీతంగా ఖర్చుపెరుగుతున్నా..దిగుబడికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక్క ఖరీఫ్లోనే.. జిల్లాలో ఖరీఫ్లో యూరియా 40,539, డీఏపీ 12050, పొటాషియం 8500, కాంప్లెక్స్ ఎరువులు 31,900, పాస్పేట్ 2300 టన్నుల వినియోగం ఉంటుంది. యూరియాపై రూ.16.10 కోట్లు, డీఏపీపై రూ.3.01 కోట్లు, పొటాషియంపై రూ.34 లక్షలు, కాంప్లెక్స్ ఎరువులపై రూ.12 కోట్లు, పాస్పేట్పై రూ.5.75 లక్షలు భారం పడనుంది. ఒక్క ఖరీఫ్లోనే రూ.32 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్స్పై ఎలాంటి పన్నులు లేవు. వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవడంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడుతున్న జిల్లా రైతాంగానికి ఇది ఏమాత్రం రుచించడం లేదు. ఓ వైపు సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులపై ఒకింత ఒత్తిడి తెస్తూనే పన్నులు వేయడం.. నోటితో చెప్పి నుదిటితో వెక్కిరించినట్లు ఉందని వారు అంటున్నారు. స్పష్టత లేదు.. ఎరువులపై పెరిగిన పన్నును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఒక్క యూరియా బస్తాపైనే సుమారు రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్కే సుమారు జిల్లాలో రూ.16కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది అనుమానించాల్సిన విషయం. ఇతర సూక్ష్మపోషకాల కంటే ఎక్కువ సబ్సిడీ యూరియాపైనే ఉండడంతో రైతులందరూ యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు యూరియాపై కూడా జీఎస్టీ బండ పడడంతో వినియోగం తగ్గుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. -
జీఎస్టీతో ఎరువు మరింత బరువు
-
ఎరువు మరింత బరువు!
యూరియాకు జీఎస్టీ దెబ్బ ► టన్నుకు రూ.300–400 వరకు పెరగనున్న ధర ► 50 కిలోల డీఏపీపై రూ.100–125 వరకు పెరిగే అవకాశం ► ఎరువులపై 12 శాతం జీఎస్టీని నిర్ణయించిన కౌన్సిల్ ► రాష్ట్రంలో వచ్చే సీజన్లో 13.5 లక్షల బస్తాల యూరియా, 2.5 లక్షల బస్తాల డీఏపీ వినియోగం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం కోసం తీసుకువస్తున్న ‘వస్తుసేవల పన్ను (జీఎస్టీ)’తో రైతులపై మాత్రం భారం పడనుంది. ఎరువులపై ప్రస్తుతం 4 నుంచి 8 శాతం మధ్య పన్నులు ఉండగా.. జీఎస్టీలో ఎరువులపై 12 శాతం పన్ను విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల విక్రయ ధరలు అనివార్యంగా పెరగనున్నాయి. దీనివల్ల సాగు వ్యయం పెరుగుతుందని, ఎరువుల వినియోగంలో సమతుల్యత దెబ్బతింటుందని ఎరువుల కంపెనీలు వాదిస్తున్నాయి. రూ.100 వరకు పెరగనున్న యూరియా జీఎస్టీలో 12 శాతం పన్ను విధించడంతో.. దేశంలోనే అత్యధికంగా వినియోగమయ్యే యూరియా ధర టన్నుకు ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగే అవకాశముంది. డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) వంటి ఎరువుల ధరలు కొన్ని రాష్ట్రాల్లో టన్నుకు రూ.3 వేల వరకు పెరగనున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎరువులు, సూక్ష్మ పోషకాలపై ఎటువంటి పన్నులూ లేవు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు న్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎరువుల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఇక రోడ్డు రవాణాపై 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల కూడా ఎరువుల చిల్లర ధరలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఎరువుల రవాణాపై ఎటువంటి సర్వీసుట్యాక్స్ లేకపోవడం గమనార్హం. వందల కోట్ల భారం.. జీఎస్టీ విధింపుతో ఏయే రకం ఎరువు ధర ఎంతమేర పెరగనుందనే లెక్కలు వేస్తున్నారు. అంతేగాకుండా పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేక రైతులపైనే భారం వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ మొత్తాన్నీ ప్రభుత్వమే భరిస్తే మాత్రం ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. అయితే యూరియా ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోంది. ప్రస్తుతం టన్ను యూరియా ధర రూ.5,630గా ఉంది. ఇది మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆయా కంపెనీలే ఉత్పత్తి వ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించుకుంటాయి. కాగా రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం 8 లక్షల టన్నులు, యాసంగి కోసం 5.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీంతో పన్ను కారణంగా ధరలు పెరిగితే.. భారం ఎవరిపై పడుతుందనేది ప్రాధాన్యంగా మారింది. డీఏపీ కూడా భారమే.. 50కిలోల డీఏపీ బస్తా చిల్లర ధర రూ.100–125 వరకు పెరిగే అవకాశ ముం ది. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.వెయ్యి వరకు ఉండగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను తో కలిపి రూ.1,125 అవుతుందని మార్కె ట్వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభు త్వం అత్యధిక సబ్సిడీ ఇస్తున్న యూరియా కు డీఏపీ సహా మిగతా ఎరువులకు మధ్య ధరలో తేడా బాగా పెరిగే అవకాశ ముంది. దీంతో రైతులు యూరియానే ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడతారని ఎరువుల కంపెనీలు అంటున్నాయి. దానివల్ల సూక్ష్మ పోషకాలు అందక పంటల దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొం టున్నాయి. కాగా రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్కు 2.5 లక్షల బస్తాల డీఏపీని సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. -
కన్నారెడ్డి కేసు: సర్కారు సీరియస్
లంచం ఇవ్వబోనని చెప్పడమే కాక లంచగొండి అధికారిని ఏసీబీకి పట్టించాలని అనుకున్నందుకు పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కన్నారెడ్డి కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కన్నారెడ్డిని చితకబాదిన కేసులో మోమన్పేట ఎస్ఐ రాజు, ఏఎస్ఐ వీరాస్వామితో పాటు హెడ్ కానిస్టేబుళ్లు వెంకటయ్య, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్లను హెడ్ క్వార్టర్స్కు ఎటాచ్ చేశారు. ఫెర్టిలైజర్ షాపు అనుమతి కోసం వ్యవసాయాధికారి నీరజను కన్నారెడ్డి కలిశారు. అయితే అందుకు అతడి నుంచి నీరజ రూ. 20వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఎందుకివ్వాలని అడిగినందుకు కన్నారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా నీరజ ఫిర్యాదుతో ఎస్ఐ రాజు, సిబ్బంది కలిసి కన్నారెడ్డిని చితకబాదారు. రాజు దాడితో కన్నారెడ్డి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు హైదారబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వన్నె తగ్గిన పసుపు
క్వింటాల్కు రూ.3వేలు తగ్గిన ధర - గతేడాది రూ. 9 వేల దగ్గరలో.. - ఇప్పుడు రూ. 5 వేల వరకే.. - పెరిగిన కూలి రేట్లు, పెట్టుబడి ఖర్చులు - పెట్టుబడులూ గిట్టవంటున్న రైతులు సాక్షి, మహబూబాబాద్: రైతులకు పసుపు పంట కూడా నిరాశే మిగిల్చింది. కనీసం పెట్టు బడి చేతికి అందివచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. గత ఏడాది క్వింటాల్ పసుపునకు రూ.9 వేలు పల కగా.. ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ధర పలుకుతోంది. సోమవారం జిల్లాలోని కేసముద్రం మార్కెట్ పసుపు కాడిరకం గరిష్టంగా రూ. 5,300, కనిష్టం రూ. 4,217 పలికింది. గోళ రకం గరిష్టంగా రూ. 4,900, కనిష్టంగా రూ. 4,170 పలికింది. రాష్ట్రంలో నిజామామాబాద్ తర్వాత మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్లో పసుపు క్రయ, విక్రయాలు అధికంగా జరుగుతాయి. రాష్ట్రంలోనే సాగు విస్తీర్ణంలో కూడా మహబూబాబాద్ జిల్లా మూడోస్థానంలో నిలుస్తోంది. ఆదాయం మాట ఏమో గానీ పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 9,390 హెక్టార్లలో పసుపును సాగు చేశారు. గతంలో ఎకరా విస్తీర్ణంలో సాగు చేయడానికి రూ.50వేల వరకు ఖర్చు కాగా, పెరిగిన పెట్టు బడులు, కూలీల రేట్లతో ఇప్పుడు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధార ణంగా ఎకరం విస్తీర్ణంలో 20 క్వింటాళ్ల ఎండిన పసుపు దిగుబడి వస్తుంది. ఈ సారి మాత్రం దాదాపు అందరికీ 15 క్వింటాళ్ల దిగుబడే అందుతోంది. దీన్ని మార్కెట్లో విక్రయిస్తే రూ. 90వేలు సైతం రావడం లేదు. పెరిగిన కూలి రేట్లు.... మార్కెట్లో పడిపోయిన ధరకు తోడు కూలి రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. గత ఏడాది మహిళ కూలీకి రూ.100 ఉండగా, ఈ సారి రూ.250కి పెరిగింది. ఎకరం పంటను తీయడానికి 60 మంది కూలీలకు రూ.15,000 వరకు చెల్లిస్తున్నారు. మార్కెట్లో కూలి రేట్లు పెంచాలని నెల రోజులుగా ఇక్కడి కూలీలు సమ్మె చేస్తున్నారు. అయితే, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూలీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నెల రోజుల తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైంది. శ్రమ అంతా వృథా అయింది పసుపుకు మార్కెట్లో ధర బాగా వస్తుందని పండించాను. విత్తనాల ఖర్చు కాకుండానే రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్కు వచ్చే సరికి క్వింటాల్కు రూ. 4,981, గోల రకానికి రూ. 4,500 ధర పలికింది. పెట్టుబడి కూడా రాలేదు. శ్రమ అంతా వృథా అయింది. –బొడ్డుపెల్లి శ్రీను, నెక్కొండ, వరంగల్ రూరల్ జిల్లా ఎకరం పసుపు సాగుకు పెట్టుబడి వివరాలు ► విత్తనం(8 క్వింటాళ్లు) రూ.32,000 ► దుక్కి దున్నేందుకు రూ.3,000 ► సేంద్రియ ఎరువుకు రూ.10,000 ► విత్తనం వేసేందుకు(12మంది కూలీలకు) రూ.3,000 ► విత్తనం వేయడానికి నాగలి కూలికి రూ.800 ► విత్తనం వేసేముందు దుక్కి దున్నేందుకు రూ.1,500 ► కలుపు మందుకు రూ. 300 ► గుంటక దున్నేందుకు(5 సార్లకు) రూ. 3,500 ► మూడు సార్లు కలుపు తీతకు కూలీలకు రూ. 9,000 ► ఎరువులు(యూరియా, పొటాష్) రూ. 5,400 ► పురుగు మందులకు రూ.1,500 ► గుళికలు(దుంపకుళ్లు నివారణకు),ఫంగిసైట్స్ రూ. 3,000 ► పసుపు దున్నడానికి నాగలి కూలి రూ. 6,000 ► భూమి నుంచి పసుపు తీసేందుకు (60 మంది కూలీలకు) రూ.1,5000 ► ఉడకబెట్టడానికి ఆరుగురు కూలీలకు రెండు రోజుల పాటు రూ.7,000 ► ఎండిన పసుపును పాలిష్ చేసేందుకు రూ. 2,000 ► ఎకరం పసుపును పండించడానికి చేతికి అందే సరికి ఇలా మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 1,03,000 -
మార్కెట్లకు మాన్సూన్ కిక్
ముంబై: బెటర్ మాన్సూన్ అంచనాలు దలాల్ స్ట్రీట్ లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈసారి రుతుపవనాలు బాగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలపై వాతావరణ శాఖ అనుకూలమైన అంచనాలతో ఎరువులు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ మేకర్స్ ఎఫ్ఎంసిజి కంపెనీలకు మంచి డిమాండ్ పుట్టింది. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 2 శాతానికిపైగా లాభాలతోబిఎస్ఇలో టాప్ సెక్టార్గా నిలిచింది. బుల్రన్లో ఇతర సెక్టార్లతోపాటు,ఎరువులు, విత్తనాలు కంపెనీల షేర్లపై మదుపర్ల ఆసక్తి నెలకొంది. కొనుగోళ్ల ధోరణి భారీగా కనిపిస్తోంది. దీంతో అన్నిఫెర్టిలైజర్స్, ఇతర విత్తనాల కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీఎఫ్ 4.85 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 2.5 శాతం, జీఎస్ఎఫ్సీ 1.8 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2.4 శాతం, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 3.66 శాతం, జువారి ఆగ్రో 2 శాతం, అగ్రి టెక్ 4 శాతం పైగా పెరిగాయి. అలాగే జైన్ ఇరిగేషన్, ర్యాలీస్ ఇండియా ఎస్కార్ట్స్ లాభపడుతున్నాయి. దీంతోపాటు స్టాక్మార్కెట్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో జోరు కనిపిస్తోంది. ఈ రంగంలోని దాదాపు అన్ని స్టాక్స్లోను కొనుగోళ్లు పెరిగాయి. ఐటీసీ, ఇమామి, బ్రిటానియా షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఈ లాభాల మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైంని తాకి జోరుమీద ఉన్నాయి. -
రూ.5.62 లక్షలు విలువైన ఎరువుల బస్తాలు సీజ్
అనంతపురం సెంట్రల్ : అనంతపురం తపోవనం సమీపంలోని సీడబ్యూహెచ్సీ గోదాముపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇఫ్కో కంపెనీకి చెందిన 20–2–0–13 రకం ఎరువులు గడువు మీరిన వాటిని కొత్త సంచుల్లోకి మార్పిడి చేసి విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 564 బస్తాలు సీజ్ చేయగా, వాటి విలువ సుమారు రూ. 5.62 లక్షలు ఉంటుందని అంచనా. రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఎరువులను పాత సంచుల నుంచి కొత్త సంచుల్లోకి మార్పు చేస్తున్నట్లు తేలిందన్నారు. సదరు ఎరువులను శాంపిల్ తీసి అగ్రికల్చర్ ల్యాబ్కు పంపనున్నట్లు వెల్లడించారు. తదుపరి చర్య నిమిత్తం డిటెన్షన్ నోటీసు జారీ చేశామని చెప్పారు. తనిఖీలో విజిలెన్స్ సీఐ రెడ్డప్ప, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉమాపతి, స్థానిక ఏఓ వాసుప్రకాశ్ పాల్గొన్నారు. -
అన్నీ లాభాలే
- అన్ని పంటలకూ వాడుకోవచ్చు – ఖరీఫ్కు అవసరమైన ట్రైకోడెర్మావిరిడీ సిద్ధం – వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : జీవరసాయన ఎరువులైన ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్ ఫ్లోరోసెస్లు అటు వ్యవసాయ ఇటు ఉద్యాన పంటలలో విత్తన శుద్ధిగానూ, పిచికారీ మందుగానూ సమర్థవంతంగా పనిచేస్తాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. తక్కువ ధరతో అధిక ప్రయోజనాలు కలిగే ఈ రకం మందుల గురించి రైతుల్లో మరింత అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో విత్తన వేరుశనగ పంపిణీతో పాటు విత్తనశుద్ధి మందుగా ట్రైకోడెర్మావిరిడీని పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక్కడే తయారు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న బయోకెమికల్ ల్యాబ్ (బీసీ ల్యాబ్)లో వీటిని తయారు చేస్తున్నాము. ఈ ఏడాది ఖరీఫ్కు అవసరమైన 80 టన్నుల ట్రైకోడెర్మావిరిడీ, 2 వేల కిలోలు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ సిద్ధం చేస్తున్నాము. విత్తన వేరుశనగ పంపిణీ సమయంలో 75 శాతం రాయితీతోనూ, ఇతర వ్యవసాయ పథకాల కింద 50 శాతం రాయితీతో రైతులకు అందుబాటులో పెడుతున్నాము. ట్రైకోడెర్మావిరిడీ 500 గ్రాముల ప్యాకెట్ రూ.50, సూడోమోనాస్ 500 గ్రాములు రూ.75 ప్రకారం తీసుకోవచ్చు. ఇతరత్రా మందులతో పోల్చిచూస్తే ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్ ఫ్లోరోసిస్ తక్కువకే లభిస్తాయి. రైతులు ఎప్పుడు కావాలన్నా అందించడానికి బీసీ ల్యాబ్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరిన్ని వివరాలకు 08554–231713 ఫోన్ నెంబర్లో సంప్రదించొచ్చు. ట్రైకోడెర్మావిరిడీ ఇది పైర్ల ఎదుగుదలకు సహకరించే మిత్ర శిలీంధ్రం. అన్ని రకాల భూముల్లో సాధారణంగా ఉండే జీవకణాలకు విభజించి హానికరమైన శిలీంధ్రాలను అదుపులో పెడుతుంది. విషపూరితమైన కణాలను ఉత్పత్తి చేసి విత్తనాలకు కవచంగా ఉంటూ హానికరమైన శిలీంధ్రాల నుంచి రక్షిస్తుంది. నిర్ధారించిన తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. విత్తనం లేదా భూమి నుంచి సోకే తెగుళ్లను అరికట్టి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. నులిపురుగులు అభివృద్ధి కాకుండా నిరోధిస్తుంది. రోగ నిర్మూలన కాయకుళ్లు, మొదలుకుళ్లు, మాగుడు తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, ఎండుతెగులు, పసుపుకొమ్మ తెగుళ్లు లాంటి వాటిని నిర్మూలిస్తుంది. శనగ, వేరుశనగ, కంది, పొద్దుతిరుగుడు, టమోటా, సోయాచిక్కుడు, చెరకు, పసుపు, గోధుమ, ఆవాలు, వరి, ఉల్లి, అరటి, తమలపాకు, వంగ, మిరప, చీనీ, కాలీఫ్లవర్, పత్తి, దోస, ఇతర పండ్ల తోటల్లో విరిడీని వాడొచ్చు. విత్తన శుద్ధిగా అయితే కిలో విత్తనానికి 10 గ్రాములు విరిడీ మందు కలిపి వాడాలి. భూమిలో చల్లే విధానం అయితే 100 కిలోల మెత్తని పశువుల ఎరువులో నాలుగు కిలోల విరిడీ పొడి కలిపి దానికి 10 కిలోల వేపచెక్క కలిపి వారం రోజులు నీడలో ఉంచి నీళ్లు చిలకరిస్తూ తెల్లటి బూజు వచ్చేన తర్వాత ఎకరా భూమిలో చల్లుకోవాలి. ఇలా అనేక రకాలుగా ఈ మందులు ఉపయోగపడుతున్నందున వీటి వాడకంపై రైతులు దృష్టి సారించాలి. -
ఎరువులే కాదు విత్తనాలూ కొనుక్కోవచ్చు
♦ రూ.4 వేల సాయంపై మంత్రి పోచారం స్పష్టీకరణ ♦ కౌలు రైతులకూ న్యాయం చేస్తామని వెల్లడి ♦ గ్రామ సభల ద్వారా రైతుల జాబితా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ. 4 వేల సాయం కేవలం ఎరువుల కోసమే కాదనీ, ఆ సొమ్మును సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఇతరత్రా అవసరాలకు పెట్టుబడి ఖర్చుగా రైతులు ఉపయోగించుకోవచ్చని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో డీసీసీబీ అధ్యక్షులు, సహకార బ్యాంకుల సీఈవోలతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రైతులకు ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో గ్రామ సభల్లో గుర్తించి జాబితా తయారుచేస్తామన్నారు. ఆ ప్రకారం వారికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. కౌలు రైతులకు ఎలా సాయం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తించేలా డాక్యుమెంటు ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా నేరుగా ఇవ్వడం సాధ్యంకాదని తెలిపారు. ఒకవైపు రుణమాఫీ పూర్తిగా చేసి, ఇప్పుడు పెట్టుబడి ఖర్చు కింద డబ్బులు ఇవ్వడం చరిత్రాత్మకమన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతు యూనిట్గా మార్పు చేయాలని తాము కేంద్రానికి సూచించామన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీతోనూ సీఎం చర్చించారని వెల్లడించారు. ఏఈవో యూనిట్గా కొనుగోలు కేంద్రం ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) యూనిట్గా కొనుగోలు కేంద్రాలు నడుస్తాయని పోచారం తెలిపారు. అంతేగాక ఏఈవోనే విత్తనాలు, ఎరువులను కూడా రైతులకు అందజేస్తారన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ‘మన తెలంగాణ, మన వ్యవసాయం’కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎండీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ భూములను పంట కాలనీలుగా మార్చాలి రాష్ట్ర జనాభాకు అనుగుణంగా వ్యవసాయ భూములను పంట కాలనీలుగా మార్చి రైతులకు లాభాలు, వినియోగదారులకు నాణ్యమై న ఆహార ఉత్పత్తులు అందే విధంగా ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏదైనా పంటకు మంచి ధర రాగానే తదుపరి ఏడాది రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ధరలు పడిపోయి నష్టపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించి.. రైతులకు, వినియోగదారులకు లాభం చేకూర్చడానికి ఈ పంట కాలనీలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. -
ఎరువులే రైతు గుదిబండలు
అభిప్రాయం పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లు.. ఈ మూడింటి భారం దించిన రోజున సేద్యం దండగ కాదు పండగే అవుతుంది. వ్యవసాయం బతుకు దెరువు మాత్రమే కాదు. అది పల్లె జీవన విధానం. మట్టి మనుషుల సంస్కృతి. దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయం వాటా 16 శాతం మాత్రమే కానీ దేశ జనాభాలో 53 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. వ్యవసాయం పండగ కావాలంటే పంటల ఉత్పాదకతలో మెరుగుదల ఉంటాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు లాభాలను చూడగలిగి తేనే రైతు బతుకుతాడు. కానీ ఏ రాష్ట్రంలో చూసినా వ్యవసాయం ఆశాజనకంగాలేదు. దాదాపు 17 రాష్ట్రాల్లో రైతు వార్షిక ఆదాయం రూ 20 వేలే ఉంది. అంటే నెలకు రూ. 1,666లు అన్నమాట. ఇలాగైతే వ్యవసాయం బతకటం చాలా కష్టం. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీ యంగా తగ్గుతోంది. 1999 నుంచి 2000 సంవత్సరంలో 60 శాతం ఉండగా.. 2011–12 కు వచ్చే సరికి 49 శాతానికి పడిపోయింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో 3 కోట్లమంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలేశారు. 2019–20 నాటికి మరో 2.5 కోట్ల మంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలిపెట్టవచ్చని అంచనా. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే పంట ఉత్పత్తిలో మెరుగుదల ఉండాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు, లాభాలు చూడగలిగితే రైతు బతుకుతాడు. దేశంలో ఏ ప్రాంతం, రాష్ట్రం కేసి చూసినా మన పలెటూళ్లలో రైతుకు ఎరువులు, విత్తనాలే గుదిబండలు. ఎదుగుతున్న పైరుకు అదును మీద ఎరువులు వేయాలంటే రైతు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. యూరియా కట్టకైనా, కాంప్లెక్స్ ఎరువుకైనా షావుకారే దిక్కు. షావుకారి దోపిడీకి మా నాయన రామకృష్ణారెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దుబ్బాక మండలం చిట్టాపూర్లో మాకు ఏడు ఎకరాలు ఉండేది. చెరువు కింద భూమి. వరి పండేది. మా కుటుంబానికి జీవనాధారం ఆ భూమే. అప్పటికే అప్పు సప్పో చేసి నాటు పట్టేది. ఇక మందు కట్టలు అంటే మా ఊరి షావుకారు దగ్గరకు వెళ్లాల్సిందే. ఆయన లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేది. మందు కట్ట ధర మీద రూ 150 ఎక్కువ రాసుకునేటోడు. పంట చేతికి అందే నాటికి దానికి రూ 3 చొప్పున వడ్డీ లెక్కకట్టేవాడు, ఇక్కడ ఇంకో షరతు ఉండేది. చేనులో పండిన పంట మందు కట్టలు ఇచ్చిన షావుకారికే అమ్మాలి. అది కూడా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా, ఆయన నిర్ణయించిన ధరకే. ఆ పంటను కూడా మా నాయనే తీసుకుపోయి, సిద్దిపేట మార్కెట్లో అమ్మి డబ్బు తెచ్చి షావుకారు చేతిలో పెట్టే వాడు. అంత దుర్మార్గమైన దోపిడీ ఉండేది. నా యవ్వనపు తొలినాళ్లలో నక్సలిజం వైపు నా అడుగులు పడటానికి ఇలాంటి దోపిడీ ఓ కారణం. పల్లెల్లో ప్రతి రైతు పరిస్థితి ఇదే. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న రైతాంగం కాళ్లకింది పునాది కదిలిపోతున్న సందర్భంలో పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పందిరి మెట్ల మాదిరిగా పెనవేసుకొనిపోయిన కరువు, అప్పులు, ఆడబిడ్డ పెళ్లి, చేతి వృత్తుల విధ్వంసం, చెరువుల విలుప్తం.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిళ్లే రైతు ఆత్మహత్యలకు కారణం. ఈ మూడింటి భారం దించిన రోజున వ్యవసాయం దండగ కాదు పండగే అవుతుంది. రైతన్న రాజన్న ఆయితాడు. ఇప్పటి వరకు రాజ్య పాలన చేసిన వాళ్లెవరూ ఆ స్థాయి శోధన కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఉద్యమ నేతగా, పెద్ద రైతుగా కేసీఆర్ రైతు కష్టాలకు మూలాలను అన్వేషించారు. పాలకపక్ష నేతగా అన్నదాత కన్నీళ్లు తుడిచే పరిష్కారం చూపెడుతున్నారు. ఒక్కొక్క సమస్యను విడగొట్టి రైతు కష్టాలు బాపే వైపు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సమగ్ర ప్రగతికి సాగు భూమి, చేతి వృత్తుల అభివద్ధే వెన్నెముకలని ఉద్యమం తొలినాళ్లలోనే గుర్తించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానని పంతం పట్టారు. రెండేళ్లలో గోదావరి జలాలు తెలంగాణ బీడు భూముల్లోకి మలిపేందుకు కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. పల్లెను మళ్లీ పచ్చగా నిలబెట్టే మహాయజ్ఞం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 36 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తూ నాలుగు విడతల్లో 17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఆ పని చేయలేక నిక్కినీల్గుతున్నవేళ.. కేసీఆర్ ఉచిత ఎరువుల పంపిణీ పథకం రైతన్నకు మళ్లీ వ్యవసాయంపై భరోసాను ఇచ్చింది. రాష్ట్రంలో 57 లక్షల మంది సన్నచిన్నకారు రైతుల చేతిలో 1.57 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాలుసరి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారు. వాస్తవానికి రైతులు అవగాహనా లోపంతోనే మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, రాష్ట్ర రైతుల అవసరాలకు 17.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరిపోతాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈలెక్కన చూస్తే ఎరువుల సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి యేటా 6,300 కోట్ల భారం పడుతుందని అంచనా. యూరోపియన్ దేశాలతో పాటు బ్రెజిల్, చైనా, ఇండోనేసియా, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికావంటి దేశాల్లో వ్యవసాయం సబ్సిడీలపై భారీగానే ఖర్చు చేస్తున్నాయి. అయితే రైతుకు అత్యంత అవసరమైన ఎరువుల మీద ఏ దేశంలోనూ ప్రణాళికబద్ధమైన విధానాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎరువులపై సబ్సిడీ ఇచ్చి, ఆ డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ విధానం భవిష్యత్తులో ప్రపంచ దేశాల సబ్సిడీ అమలుకు ఒక ఆసక్తికరమైన అంశంగా మారనున్నది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త టీఆర్ఎస్ శాసన సభ్యుడు, రాష్ట్ర శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
ఈ-పాస్ మిషన్లతోనే ఎరువుల పంపిణీ
- 1 నుంచి పకడ్బందీగా ప్రక్రియ - కర్నూలు సబ్ డివిజన్ డీలర్ల అవగాహన సదస్సులో ఏడీఏ కర్నూలు(అగ్రికల్చర్): మే నెల 1నుంచి రసాయన ఎరువులను విధిగా ఈ-పాస్ మిషన్ల ద్వారానే పంపిణీ చేయాలని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై కర్నూలు సబ్ డివిజన్లోని రసాయన ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...డీలర్లకు నాగార్జున, గ్రీన్ఫీల్డ్, క్రిప్కో కంపెనీలు ఈ-పాస్ మిషన్లను సరఫరా చేస్తాయన్నారు. ప్రతి డీలరు విధిగా తమ వివరాలను ఈ-పాస్ మిషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్లు, వెబ్ల్యాండు వివరాలను కూడా వీటిలో అప్లోడ్ చేస్తామన్నారు. మే నెల 1నుంచి మాన్యువల్గా ఒక్క బస్తా కూడా విక్రయించరాదన్నారు. భూసార పరీక్ష పలితాలను బట్టి, సాగు చేసే పంటను బట్టి ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ చేయలేమని భావించే డీలర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలగవచ్చన్నారు. జేడీఏ కార్యాలయ ఫర్టిలైజర్ ఏఓ వేదమణి, సీ.బెళగల్ ఏఓ సురేష్బాబు ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు వ్యవసాయాధికారులు అశోక్కుమార్రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులకు బయోమెట్రిక్
- మే నెల నుంచి అమలుచేసే యోచన - రైతులకు పొంచివున్న కష్టాలు ఉదయగిరి: రైతులు ఇప్పటివరకు తమకు కావాల్సిన ఎరువులను నేరుగా ఎరువుల దుకాణానికి వెళ్లి తీసుకునే వారు. కానీ మే నెల నుంచి ఈ విధంగా కొనుగోలు చేసేందుకు వీలుకాదు. దీనికి కారణం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఎరువులు కొనుగోలు చేసే రైతు ఎరువుల వ్యాపారుల వద్దనున్న బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రలు, ఐరిష్ సరిపోలితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకునే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంది. ఆ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో మే నెల నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి తేవాలని యోచిస్తోంది. అమలు విదానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువులకు సబ్సిడీలు నేరుగా కంపెనీలకు చెల్లిస్తోంది. అందులో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. ఈ అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవాలని సంకల్పించింది. ఈ క్రమంలో కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన ఎరువులను డీలర్లకు పంపిణీ చేస్తారు. గతంలో అయితే సరుకులు డీలర్లకు అందిన వెంటనే ప్రభుత్వం సబ్సిడీ నేరుగా కంపెనీలకు అందచేసేది. ప్రస్తుత విధానంలో డీలరు నుంచి రైతు కొనుగోలు చేసిన ఎరువులకు మాత్రమే సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తుంది. దీంతో ఖచ్చితత్వం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు తిప్పలు తప్పవా! జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల్లో వివిధ రకాల పైర్లు సాగు చేస్తారు. ఇందుకుగాను ఖరీఫ్ సీజన్లో యూరియా 34,320 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9899 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7798 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 24,699 మెట్రిక్టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 4944 మెట్రిక్ టన్నులు విని యోగిస్తారు. అదేవిధంగా రబీ సీజన్లో 4,93,589 మెట్రిక్ టన్నులు డీఏపీ, 10,583 పొటాష్ 8806, కాంప్లెక్స్ ఎరువులు 14588 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 6327 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారు. ఈ విధానం అమల్లోకొస్తే ఎరువులు కొనుగోలు రైతులకు కష్టతరంగా మారనుంది. ఇప్పటివరకు తమకు అవసరమైన ఎరువులను నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ కొత్త విధానంలో పీబీటీ, ఈ–పాస్ మిషన్లో వేలిముద్రలు వేసి ఎరువులు తీసుకోవాల్సివుంది. వేలిముద్రలు పడని వ్యక్తులకు ఐరిష్ ద్వారా ఎరువులు అందచేస్తారు. ప్రస్తుతం రైతులకు కావలసిన ఎరువులన్నీ కొనుగోలు చేయవచ్చు. ఆంక్షలైతే లేవు. కానీ భవిష్యత్తులో ఎరువులు కొనుగోలు కూడా కోటా పద్ధతినే అనుసరించే అవకాశముంది. రైతులకు సంబంధించిన ఆధార్, వ్యవసాయ భూములతో ఖచ్చితంగా అనుసంధానం కావాల్సివుంది. ఆన్లైన్లో ఆ రైతు పేరుమీద ఉన్న భూములకు మాత్రమే ఎరువులు అందించే అవకాశముంది. రాన్రాను వ్యవసాయ అధికారులు ఒక ఎకరాకు సిఫార్సు చేసిన ఎరువులు మాత్రమే రైతులకు అందే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఈ విధానం మంచిదే అయినప్పటికీ చిత్తశుద్ధితో అమలు ప్రక్రియపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ తరగతులు పదిహేను రోజుల క్రితం ఈ విధానం అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది వ్యవసాయాధికారులను ఎంపికచేసి విజయవాడలో మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు ఆయా వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోవున్న వ్యవసాయాధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ వ్యవసాయాధికారులు వారి పరిధిలోవున్న ఎరువుల దుకాణ యజమానులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్లో చివరి వారానికి అన్ని ఎరువుల దుకాణాలకు డీబీటీ, ఈ–పాస్ యంత్రాలను సరఫరా చేస్తారు. మే నెల 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధానాన్ని కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు మూడు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఎంపిక చేసిన అధికారులతో జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు సమావేశం ఏర్పాటుచేసి ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు పలు సూచనలిచ్చారు. -
ఎరువులో బోరు మట్టి !
చెన్నేకొత్తపల్లి : మండల వ్యాప్తంగా కల్తీ ఎరువులు హల్చల్ చేస్తున్నాయి. ఎరువులో బోరు మట్టిని కలిపి విక్రయిస్తుండడంతో రైతులు గుర్తించలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు సూరి గోరు చిక్కుడు సాగు చేశారు. 15 రోజుల క్రితం ధర్మవరంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి 17-17-17 రకం కాంప్లెక్స్ ఎరువును కొనుగోలు చేశారు. డ్రిప్ ద్వారా పంటకు అందజేసేందుకు రెండు కిలోల ఎరువును బకెట్ నీటిలో కలిపితే బకెట్ అడుగున బోరు మట్టి పేరుకుపోయి కనిపించింది. దీంతో మరికొందరు రైతులను ఆయన విచారణ చేయగా మరికొందరికి ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలిసింది. అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమల ఎరువుల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి రెండు ఫైరింజిన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ సేవలు బంద్
► నిలిచిపోయిన ఎరువులు, విత్తన లైసెన్స్ లు ►జిల్లాల పునర్విభజనతో కొత్త ఇబ్బందులు ► ఆన్ లైన్ లో కనిపించని 61 మండలాలు సాక్షి, వరంగల్: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖలో మార్పులు చేయలేదు. దీంతో వ్యవసాయ విస్తరణ సేవలు, ఎరువులు, విత్తనాల విక్ర యాల కోసం ఇచ్చే లైసెన్స్ ల జారీలో కొత్త సమస్యలు వచ్చాయి. జిల్లాల పునర్విభజన లో మారిన మండలాల్లో విత్తనాలు, ఎరు వుల విక్రయాల లైసెన్స్ ల ప్రక్రియ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో విత్తనాలు, ఎరువుల లైసెన్స్ ల జారీ ఆగిపోయింది. ఆన్ లైన్ లో జారీ పారదర్శకత కోసం వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువుల లైసెన్స్ జారీ ప్రక్రియను ఆన్ లైన్ లో జారీ చేస్తోంది.లైసెన్స్ లు అవసరమైన వారు... అవసరమైన గ్రామం, మండలం, జిల్లా పేర్లను పేర్కొంటూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేవారు. అధికారులు వాటిని పరిశీలించి గడువులోపులైసెన్స్ లను జారీ చేసేవారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ పరంగా మండలం, డివిజన్, జిల్లాల యూనిట్లుగా పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్కో అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఒక యూనిట్గా మార్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మరొక జిల్లాల్లోకి మారిన మండలాల్లో సాంకేతికంగా సమస్య ఉంది. పాత ఉమ్మడి జిల్లాల్లో పరస్పరం మారిన మండలాల్లో వ్యవసాయ శాఖ సేవల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
వ్యవసాయంలో క్యాష్లెస్కు శ్రీకారం
- ఎరువులు, విత్తన దుకాణాలు, సహకార కేంద్రాల్లో స్వైపింగ్ మిషన్లు - 15 రోజుల్లోగా సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రైతులను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆ శాఖ నూతన కమిషనర్ జగన్మోహన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎరువులు, విత్తన డీలర్లు, దుకాణదారులు 15 రోజుల్లోగా స్వైపింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రైతుల వద్ద ఉండే డెబిట్ కార్డుల ద్వారానే ఆర్థిక లావా దేవీలు జరపాలని.. తద్వారా వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని.. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధి కారుల(డీఏవో)ను ఆదేశించారు. ఇక స్వైపింగ్ మిషన్ల సరఫరాకు అవసరమైన సాంకేతిక సహకారం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ)కి లేఖ రాశా రు. రైతులను, వ్యవసాయాధికారులను నగదు రహిత లావాదేవీల వైపు నడిపించేందుకు జగన్మోహన్ జిల్లాల్లో పర్యటిం చనున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రాథమిక సహకార సంఘాలు(ప్యాక్స్), డీసీసీబీల్లోనూ స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచా లని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞపి చేసింది. వ్యవసాయశాఖ నిర్ణయంతో వేలాది స్వైపిం గ్ మిషన్లకు గిరాకీ ఏర్పడింది. ఎరువులు, విత్తన డీలర్లు, ప్యాక్స్లు కొత్తగా మిషన్లను కొనుగోలు చేయాలి. 15 రోజుల్లోగా స్వైపిం గ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోకపోతే వ్యవసాయశాఖ అధికారులు డీలర్లపై చర్య లు తీసుకునే అవకాశం ఉంది. -
సేంద్రియ ఎరువులు వాడాలి
కలెక్టర్ అరుణ్కుమార్ బోట్క్లబ్ (కాకినాడ) : రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం కృషిభవన్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో సారం తగ్గడంతోపాటు రైతులు ఎక్కువ పెట్టుపెడి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ విషయం భూసార పరీక్షల్లో వెల్లడైందన్నారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతగా తయారవుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మనరాష్ట్రం ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని పలు పంట పొలాల్లో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు రైతులు జింక్, బోరాన్ వంటి వాటిని వేసుకోవాలన్నారు. వీటిని సబ్సిడీపై అందిస్తున్నట్టు చెప్పారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రైతులు కూడా రూపేకార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాలని కోరారు. ప్రస్తుతం రైతులు ధాన్యం అమ్మిన నగదు బ్యాంకుల్లో జమవుతుందని , రైతుల ఖాతాల్లో ఎంత నగదు పడినా దానికి పన్ను కట్టనవసరం లేదన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పురుగు మందులు కొనుగోలు చేస్తుంటే పలు దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదని, సేంద్రియ ఎరువుల వాడడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ డీడీలు వీటీ రామారావు, లక్ష్మణరావు, కాకినాడ ఏడీ భవానీ, వైవీ సుబ్బారావు రైతులు పాల్గొన్నారు. -
‘రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: రబీ సాగు కోసం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు విత్తనాలు, ఎరువు లు, పురుగుమందులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రుణమాఫీతో సంబంధం లేకుండా బ్యాంకుల ద్వారా రైతులకు కొత్త అప్పులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు. ఈ ఏడాది ఖరీఫ్లో 313 మండలాల్లో పంటనష్టం వాటిల్లినా కరువును ప్రకటించకుండా రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం బాధ్యతారహిత ప్రకటనలు చేశారన్నారు. పంటనష్టపోరుున రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1,350 కోట్లు కరువు సాయం కింద విడుదల చేసిందని, 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. -
ఫెర్టిలైజర్ షాపులపై విజిలెన్స్ దాడులు
► ఒక షాపుపై 6ఏ కేసు నమోదు ►రూ.21.1 లక్షల బయో అమ్మకాలు నిలిపివేత చీరాల టౌన్ : చీరాల పట్టణం, మండలంలో ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై మంగళవారం ఒంగోలు విజిలెన్స్ డీఎస్పీ ఈ.సుప్రజ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకువిజిలెన్స్, వ్యవసాయశాఖ సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు లోపాలను గుర్తించామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర, సుభాషిణి, అన్నపూర్ణ, ఆర్కే, బాలాజీ, వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతి పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, ’ఓ’ ఫారం తదితర లావాదేవీలను పరిశీలించారు. పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.21.1 లక్షల విలువ కలిగిన బయో ఉత్పత్తులు కలిగి ఉండటంతో పాటు వీటి అమ్మకాలను నిలిపివేయడంతో, వాటిని అమ్మకూడదని దుకాణదారుడిని హెచ్చరించారు. అలానే ఆర్కే ఫెర్టిలైజర్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు కలిగి ఉండటంతో షాపు నిర్వాహకుడిపై 6 ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స డీఎస్పీ సుప్రజ విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సర్టిఫైడ్ కంపెనీకి చెందిన ఎరువులు, పురుగు మందులే విక్రరుుంచి రైతులకు అన్ని రకాల బిల్లులు ఇవ్వాలన్నారు. అరుుతే, కొందరు పురుగు మందుల విక్రయదారులు నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా బయో ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న స్టాక్ను సీజ్ చేయడంతో పాటు అమ్మకందార్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ ఏడీఏ కె.రాజకుమారి, ఏవో ఫాతిమాబేగం, విజిలెన్స సీఐ నాయక్, ఎస్సై సాంబయ్య, డీసీటీవో నవీన్, ఎఫ్ఆర్వో బాబు, వీఆర్వోలు శివారెడ్డి, రాంబాబు ఉన్నారు. -
ఎరువుల వ్యాపారి దారుణ హత్య
బంటుమిల్లి: శివాలయానికి వెళ్లి వస్తున్న ఓ ఎరువల వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకంది. స్థానికంగా నివాసముంటున్న పబ్బిశెట్టి బద్రినారాయణ(45) ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం ద్విచక్రవాహనంపై శివాలయానికి వెళ్లి వస్తుండగా.. ఆంధ్రాబ్యాంకు సెంటర్ గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం వల్లే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఎరువుల అంగళ్లలో స్వైప్మిషన్లు తప్పనిసరి
– వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు తప్పనిసరిగా స్వైప్మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్స్–పీవోఎస్) ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. త్వరితగతిన వాటిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏవోలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కరెంటు అకౌంట్లు కలిగిన బ్యాంకుల్లో రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలావుండగా.. జేడీఏ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ వ్యవసాయాధికారి(ఏవో) జే.వాసుప్రకాష్ శనివారం నగరంలోని అన్ని దుకాణాలు తిరిగి స్వైప్మిషన్ల ఏర్పాటు, పనితీరు, సమస్యలపై డీలర్లకు వివరించారు. ఆధార్, పాన్, పిన్, అకౌంట్ నెంబర్ సమర్పించి తక్షణం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వాటిని రైతులకు అందజేయడానికి వీలుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో డీలర్లకు, రైతులకు ఎలాంటి సమస్యా ఉండదన్నారు. -
అన్నదాతకు విత్తన కష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పెద్ద నోట్ల రద్దు అన్నదాతలకు మరిన్ని ఇక్కట్ల పాల్జేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఖాతరు చేయపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను విత్తన దుకాణాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు స్వీకరించడం లేదు. ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లను తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అధికారులు ఆ ఉత్తర్వులను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు, విత్తనాలు ఎరువులు కొనే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంలలో చిల్లర అందుబాటులో లేక రైతులకు కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ జరుగుతోంది. ఇటీవలే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 63 వేల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 30 నుంచి 40 శాతం మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేయలేదు. విత్తనాలు కొనుగోలు చేద్దామనుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీంతో రైతుల వద్ద డబ్బులు అందుబాటులో లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేయలేకపోయారు. 10 రోజులు దాటుతున్న పరిస్థితి యధాతథంగానే ఉంది. బ్యాంకులు, ఏటీఎంలలో సైతం కొత్త నోట్లు దొరికే పరిస్థితి లేదు. చాలా బ్యాంకులు వాటి ఏటీఎంలు మూతబడ్డాయి. తగినంత డబ్బులు ఎప్పటికి అందుబాటులోకి వస్తోందో కూడా తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది రైతులు విత్తనాలు కొనలేక అలాగే ఉండిపోయారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చేయని అధికారులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సంబంధించి రైతుల వద్ద పాత నోట్లను తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనరేట్ ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 24 వరకు పాత నోట్లను తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు, పాత నోట్లను తీసుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పాత నోట్లు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పొలాలు బీళ్లుగా ఉంచక తప్పదని రైతులు వాపోతున్నారు. -
బనగానపల్లెలో కౌలు రైతు మృతి
బనగానపల్లె రూరల్: పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలురైతు దూదేకుల హుసేని(54) మరణించాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పట్టణంలోని కరీంబాగ్ కాలనీకి చెందిన దూదేకుల హుసేని వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఈ క్రమంలో పంటలకు అవసరమైన రసాయనిక మందుల కొనుగోలు కోసం హుసేని ఆదివారం సైకిల్పై ఇంటి నుంచి బయలుదేరాడు. పెట్రోల్బంకు వైపు వెళ్తుండగా కోవెలకుంట్ల మలుపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హుసేనిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మరణించాడు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. కాటసాని పరామర్శ.. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటసాని రామిరెడ్డి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, నాయకులు పెద్దవెంకటరెడ్డి, బాలరాజు, న రసింహరెడ్డి, సురేష్ తదితరులున్నారు. -
ఎరువుల గోదాముపై తూ.కో దాడులు
అనంతపురం సెంట్రల్ : రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని అవంతి ఎరువుల గోదాముపై తూనికలు కొలతల శాఖ సీఐ శంకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. జైకిసాన్ కంపెనీ చెందిన 20–20–0–13, 20–0–13 రకాల ఎరువులు బస్తాల్లో భారీగా తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి బస్తాలో ఐదు కిలోలు తక్కువ ఉన్నట్లు తనిఖీలో తేలిందని సీఐ వివరించారు. అలాగే ఎమ్మార్పీ, తయారీదారుడి చిరునామా తదితర వివరాలు ఏవీ లేకుండా విక్రయిస్తున్నారన్నారు. వీటన్నింటినీ సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే అనంతపురం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో చౌకడిపోలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ముగ్గురు డిపో డీలర్లపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
సంపులో పురుగుల మందు కలిపిన దుండగులు
ఉంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఉంగుటూరు మండలం ఉప్పకపాడు గ్రామంలోని మంచినీటి సంపులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. మంచినీటి సంపులో పురుగుల మందు డబ్బా(కంటోల్) ఉండటాన్ని వాచ్మన్ గమనించడంతో ఈ విషయం బయటపడింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ శాపం
– ఎరువులు, కాంప్లెక్స్ల్లో భారీ మోసం – నకిలీవి అంటగట్టిన వ్యాపారి – 300 ఎకరాల్లో మిరప.. 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న వైనం – లబోదిబోమంటున్న అన్నదాతలు పెట్టుబడుల కోసం వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేస్తున్న రైతులను నకిలీ ఎరువులు నట్టేట ముంచుతున్నాయి. పంట ఎదుగుదల లేకపోవడంతో వారికి ఏం చేయాలో దిక్కుతో^è డం లేదు. ఓ ఫర్టిలైజర్ యజమాని నిర్లక్ష్యంతో యర్రగుంటలో రైతుల బతుకులు ఛిద్రం అయ్యాయి. కణేకల్లు : మండలంలోని యరగ్రుంటలో రైతులు మిరప, వరి పంట సాగు చేశారు. పంట ఎదుగుదల, దిగుబడి కోసం స్థానికంగా ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో రైతులు కాంప్లెక్స్లు, ఎరువులు కొనుగోలు చేశారు. వారం క్రితం రైతులు మిరప పంటకు కాంప్లెక్స్లను వేశారు. భూమిలో కాంప్లెక్స్ వేసిన తర్వాత ఒక రోజులో అదంతా కరిగిపోవాలి. గాలి, భూమిలో ఉన్న తేమకు కరిగిపోయే గుణం కాంప్లెక్స్ ఉంటుంది. అయితే వారం తర్వాత కూడా కాంప్లెక్స్ కరిగకపోగా మిరప పంట పసుపు పచ్చరంగులోకి మారుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నకిలీ కాంప్లెక్స్లు కావడంతో అవి కరగకుండా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. వరి పంట బలం, దిగుబడి కోసం పలువురు రైతులు డీఏపీ, కాంప్లెక్స్లు, యూరియాలు వాడినా ఫలితం కన్పించకపోవడంతో ఇవన్నీ నకిలీవేనని రైతులు వాపోతున్నారు. మిరప, వరినాట్లు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. పంట కాపు దశకు వచ్చిన సమయంలో ఎదుగుదల లేక పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. స్థానిక ఫర్టిలైజర్ యజమానిపై రైతులు మండిపడుతున్నారు. ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదు నాకు 6 ఎకరాల భూమి ఉంది. నాలుగు నెలల క్రితం మిర్చి పంట వేశాను. వారం క్రితం స్థానికం ఫర్టిలైజర్ షాపులో కాంప్లెక్స్లు తీసుకొని పంటకు వేశాను. ఉన్నట్టుండి పంట ఎదుగుదల ఆగిపోయింది. పూత కూడా రాలేదు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ఆత్మహత్య తప్ప మరో మార్గం కన్పించడం లేదు. నకిలీ కాంప్లెక్స్ల గురించి సదరు యజమానిని నిలదిస్తే నా మర్యాద పోతోంది ఎవరికీ చెప్పుద్దంటూ నాలుగు కాంప్లెక్స్ బస్తాలిచ్చి పంపాడు. – లక్ష్మన్న, బాధిత రైతు వరికి కంకి రాలేదు 28 ఎకరాల్లో డీఏపీ, కాంప్లెక్స్, యూరియా మొత్తం 250 బస్తాలు వాడాను. వరి పంట పెట్టి 3 నెలలైంది. పంట బలంగా ఉండి మేలైన దిగుబడి వస్తుందని ఎరువులు వాడాను. నేటికీ వరికి కంకి రాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అధికారులు స్పందించి పంటలను పరిశీలించి న్యాయం జరిగేలా చూడాలి. – పి.రామచంద్రారెడ్డి , రైతు, యర్రగుంట పంటలను పరిశీలిస్తాం కాంప్లెక్స్, ఎరువులు, యూరియా వాడి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తాం. సంబంధిత డీలర్ షాపుకెళ్లి స్టాక్ ఎక్కడి నుండి తెప్పించాడు ? ఎప్పుడు వచ్చింది ఇన్వాయిస్ బిల్లులతో సహా పరిశీలిస్తాం. నిల్వ ఉన్న స్టాక్ నుండి శ్యాంపిల్ తీసి ల్యాబ్కు పంపుతాం. – మద్దిలేటి, ఏడీఏ , రాయదుర్గం -
కృష్ణపట్నంలో ఎరువుల తయారీ పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఎన్పీకే ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఓసీపీ(మొరాకో), ప్రభుత్వ రంగ కో-ఆపరేటివ్ ఎరువుల సంస్థ క్రిబ్కో సంయుక్త భాగస్వామ్యంతో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి మన్సుక్ ఎల్ మాండవ్య సమక్షంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2019 ఏప్రిల్ నాటికి పరిశ్రమను ఏర్పాటు చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చిందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
ఆ‘దేశం’ మేరకే!
* విత్తన, ఎరువుల షాపుల్లో తనిఖీలపై వివక్ష * అధికార పార్టీ నేతల షాపుల్లో శాంపిల్స్ సేకరించని వైనం * మాచర్లలో అడ్డుకున్న టీడీపీ నేత * ఇప్పటి వరకు 560కు పైగా శాంపిల్స్ సేకరణ సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న తనిఖీల్లో ‘పచ్చ’పాతం చూపుతున్నారు. అధికార పార్టీ నేతల షాపుల్లో ఎటువంటి తనిఖీలు నిర్వహించడం లేదు. జిల్లాలో రెండు రోజులుగా 560 షాపులకు పైగా తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. వీటిలో ఒక్క షాపు కూడా అధికార పార్టీ నేతలు, సానుభూతిపరులవి లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను నివారించేందుకు అధికారులు, సిబ్బంది 70 బృందాలుగా ఏర్పడి జిల్లాలో రెండు రోజులుగా ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. దుకాణాల్లో ఉన్న సరుకును పరిశీలించి శాంపిల్స్ తీస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలను జిల్లాలో ఇన్చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాసు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 560కి పైగా శాంపిల్స్ను సేకరించినట్లు సమాచారం. నకిలి విత్తనాలు, బయో ఉత్పత్తులపై ప్రత్యేకంగా విచారణ బృందాలు ఏర్పాటు చేసి, అందుకు బాధ్యులైన కంపెనీలు, డిస్టిబ్యూటర్లు, డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్లు ధనుంజయరెడ్డి కనుసన్నల్లో సాగుతోంది. ఇప్పటికే వారు నకిలీల వ్యవహారంలో ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. నమూనాల సేకరణలో... ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తుల షాపులు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో ఉన్నాయి. అయితే ఆ షాపులకు సంబంధించిన శాంపిల్స్ను తీయకుండా కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మెనేజ్ చేసినట్లు దుకాణాదారుల్లోనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తులకు సంబంధించి శాంపిల్స్ తీయలేదని సమాచారం. మాచర్ల నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమకు అనుకూలంగా ఉన్న యజమానుల షాపుల్లో శాంపిల్స్ తీయకుండా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకున్నట్లు తెలిసింది. షాపుల ఆకస్మిక తనిఖీల్లో సైతం వివక్ష చూపుతున్నారని, అధికార పార్టీ నేత షాపులకు సంబంధించి శాంపిల్స్ తీయక పోవడం ఏమిటనీ కొంత మంది వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. నమూనాలు నిరంతం సేకరిస్తాం.. జిల్లా వ్యాప్తంగా అన్ని షాపులను తనిఖీ చేస్తున్నాం. ఇప్పటికే 500కు పైగా షాపులకు తనిఖీ చేసి షాంపిల్స్ సేకరించాం. పారదర్శకంగా అన్ని షాపులను తనిఖీ చేసి శాంపిల్స్ తీస్తున్నాం. మరో నాలుగైదు రోజులపాటు దాడులు చేస్తాం. – కృపాదాసు, జేడీఏ, వ్యవసాయశాఖ తనిఖీల పేరుతో వేధించొద్దు.. చట్ట పరిధిలోనే వ్యాపారం చేస్తున్నాం. అధికారులకు అన్ని విధాల సహకరిస్తున్నాం. తనిఖీల పేరుతో డీలర్లలను వేధించడం తగదు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను విక్రయించేలా అసోసియేషన్ తరఫున కృషిచేస్తున్నాం. – వీవీ నాగిరెడ్డి, ఎరువులు, పురుగు మందుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు -
రైతు ఎస్సెమ్మెస్ పంపిస్తేనే సబ్సిడీ
– ఎరువుల సబ్సిడీలో కొత్త విధానం – నేరుగా కంపెనీలకు జమ – ఎరువులు కొన్నట్టు రైతు ఎస్ఎంఎస్ పంపిస్తేనే.. – జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు – వచ్చేనెల 1 నుంచి అమలు జంగారెడ్డిగూడెం : ఎరువులకు ఇచ్చే సబ్సిడీపై ప్రభుత్వం కొత్త విధానం అమలుచేయనుంది. తొలుత ఎరువులకు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం యోచించినా అది సాద్యంకాదని భావించి కొత్త విధానానికి శ్రీకారంచుట్టింది. దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిరే్ధశించింది. వీటిలో రెండు జిల్లాలు రాష్ట్రానికి చెందినవి. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కాగా, మరొకటి కృష్ణా జిల్లా. అక్టోబర్ 1 నుంచి సబ్సిడీలపై కొత్త విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం నిరే్ధశించింది. వంటగ్యాస్ లాగానే ఎరువుల సబ్సిడీని రైతుల ఖాతాకు నేరుగా నగదు బదిలీని చేయాలని తొలుత కేంద్రం భావించినా దానిని పక్కన పెట్టింది. అయితే తాజాగా రైతులకు కాకుండా ఆయా ఎరువుల కంపెనీలకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా జమచేసే మొత్తాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం ప్రారంభించనుంది. రైతుకు ఎరువులు చేరిన తరువాతే సబ్సిడీ మొత్తం ఎరువుల కంపెనీల ఖాతాల్లో జమ అవుతుంది. ఈప్రయోగాత్మక పథకం అమలుకు దేశ వ్యాప్తంగా 8 జిల్లాలను గుర్తించింది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ పథకం ద్వారా ఎరువుల దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు, అసలు దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందో కూడా తెలుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎరువులు పక్కదారి పట్టడం, పక్క రాష్ట్రాలకు తరలి పోవడం, బ్లాక్ మార్కెటింగ్ తదితర అవినీతి మార్గాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎరువులకు ఇచ్చే సబ్సిడీని ఆయా ఎరువుల కంపెనీల నుంచి డీలర్ల ద్వారా రిటైల్ వ్యాపారులకు చేరిన తరువాత కంపెనీ ఇచ్చిన లెక్క ప్రకారం సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తోంది. ఈ విధానంలో ఎరువులు పక్కదారిపట్టడం కారణంగా కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికంగాపడుతున్నట్లు గుర్తించింది. వీటన్నింటిని అరికట్టేందుకు ఇటీవల ఈపోస్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కొత్త సబ్సిడీ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త విధానంలో రైతులకు అమ్మిన ఎరువులకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. దీనికోసం కంప్యూటర్ ఆధారిత డిజిటల్ నెట్వర్క్ వినియోగిస్తుంది. ఎరువులు అమ్మే సమయంలో రైతుల వివరాలను దీనిలో నమోదు చేయాలి. ఎరువులు కొనుగోలు చేసిన తరువాత రైతు తన మొబైల్ఫోన్ ద్వారా ఫెర్టిలైజర్స్ మానిటరింగ్ వ్యవస్థకు ఎస్ఎంఎస్ చేయాలి. ఈ ఎస్ఎంఎస్ అందిన తరువాత ఏ కంపెనీ ఎరువు ఏ రైతు ఎంతకు కొన్నాడో ఆ కంపెనీకి ప్రభుత్వం సబ్సిడీని జమచేస్తుంది. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈపోస్ వ్యవస్థను ఏర్పాటు చేయగా , తాజాగా కొత్త విధానం కూడా అమలులోకి తేనుంది. దీనికి రైతు ఆధార్ నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు రైతులు, కౌలు రైతులు, అన్ని రకాల రైతులు కలిపి సుమారు 5 లక్షల మంది ఉన్నారు. ఖరీఫ్సీజన్లో 1.64 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తుండగా, రబీ సీజన్లో 2.33 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. కాగా జిల్లాలో ప్రై వేట్డీలర్లు, సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా , డీసీఎంఎస్ ద్వారా ఎరువుల సరఫరా మొత్తం అందరూ కలిపి 1160 మంది డీలర్లు ఉన్నారు. కొత్తవిధానం అమలు సాధ్యమేనాః ఎరువుల సబ్సిడీ లో కొత్త విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల్లో అంతగా చదువుకున్న వారు తక్కువగా ఉంటారని, రైతులందరికీ ఎరువులు కొనుగోలు చేసిన తరువాత ఎస్ఎంఎస్ పంపేందుకు సెల్ఫోన్లు ఉంటాయన్నది ప్రశ్నార్ధకమే. దీనికోసం రైతులకు సెల్ఫోన్లు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. అంతేగాక ఎక్కువ శాతం కౌలురైతులే ఉంటారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొన్నారు. -
నవంబర్ 15కు ముందు వరి నార్లు పోయొద్దు
రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: వర్షాలు కురుస్తున్నాయని రైతులు వరి నార్లు పోయొద్దని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధనా కేంద్రం శనివారం ప్రకటనలో తెలిపింది. నవంబర్ 15 కంటే ముందు వరి నార్లు పోయకూడదని, అంతకు ముందే నార్లు పోస్తే చలికి దిగుబడి రాదని పేర్కొంది. నీట మునిగిన పొలాల్లో నీటి మట్టం తగ్గిన వెంటనే ఎకరాకు 35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలని శాస్త్రవేత్తలు చెప్పారు. సిఫారసు చేసిన మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడకూడదన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే గాలిలో అధిక తేమ శాతం వల్ల సుడిదోమ, కంకినల్లి, అగ్గి తెగుళ్ల ఉధృతి పెరుగుతాయని..రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
అనంతపురం సెంట్రల్ : జిల్లా వ్యాప్తంగా ఎరువులు, మందుల దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. బుధవారం తాడిపత్రిలోని మహాలక్ష్మి ఆగ్రో ఏజెన్సీస్పై దాడులు చేసి 50 బస్తాల స్వాల్ కంపెనీ ఎరువులను సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు. కంపెనీ పేరు, కస్టమర్ కర్ తదితర వివరాలేవీ లేకపోవడం సీజ్ చేసినట్లు వివరించారు. మాతాశ్రీ గార్మెంట్ షాపుపై దాడులు చేసి నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తున్న దుస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చేతబడి నెపంతో ముగ్గురి దారుణహత్య!
ఒడిశా: సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసం చెరిగిపోవడం లేదు. మూఢ నమ్మకాలతో సాటిమనుషుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా గుణుపురంలో చేతబడి చేస్తున్నారని నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణ లేకుండా దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. గతకొంత కాలంగా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారంటూ పుకార్లు లేచాయి. అది నిజమని నమ్మిన గుణుపురం గ్రామస్తులు.. ఆ ముగ్గురు కుటుంబ సభ్యులకు పురుగుల మందు తాగించి హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎరువులపై సిగ్నల్ దరువు
భీమవరం : ఎరువుల అమ్మకాల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పోస్ విధానంతో రైతులు, వ్యాపారులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పోస్ యంత్రాలకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా ఎరువుల కొరత నివారణ, ఆహార పదార్థాలపై విష ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ విధానం అమలులోకి తీసుకువచ్చినా ప్రభుత్వ నిబంధనలతో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎరువులు పొందాలంటే ఎరువుల డీలర్లు, సహకార ‡సంఘాల వద్ద పట్టాదార్ పాస్పుస్తకం, ఆధార్కార్డు నకళ్లను తీసుకువెళ్లి దానిలో నమోదుచేయించుకుని ఎరువులు పొందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రైతులు ఈ పోస్ విధానంలో ఎంత ఎరువునైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. సరిగా పనిచేయని సిగ్నల్స్ రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు), ఎరువుల వ్యాపారుల వద్దకు ఆధార్ కార్డుతో వెళ్లాలి. దాని ద్వారా రైతుకు ఏ ఎరువు ఎంత మొత్తంలో కావాలో ఈ పోస్ విధానం ద్వారా ఆన్లైన్లో దానిని పొందుపర్చి కొనుగోలు చేసిన ఎరువుల మొత్తానికి రశీదు ఇచ్చి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ యంత్రాలకు సిగ్నల్స్ సరిగా అనుసంధానం కాకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ సమావేశాల్లో చర్చ ఎరువుల విక్రయంలో ఈ పోస్ విధానం అమలు కారణంగా సహకార సంఘాల్లో ఎదురవుతున్న సమస్యలను ఇటీవల జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ జనరల్ బాడీ సమావేశాల్లో సహకార సంఘాల ఉద్యోగులు, రైతులు ఏకరవు పెట్టారు. ఈ పోస్ విధానం వేగవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రైతులు సొసైటీలపై అభాండాలు వేసే ప్రమాదముందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా చేతిలో సొమ్ము, ఎదురుగా ఎరువులున్నా పంట పొలాలకు వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ధ్వజమెత్తారు. కొనుగోలులో కష్టాలు ఈ పోస్ విధానంలో ఎరువుల కంపెనీలు, డీలర్ల నుంచి సహకార సంఘాలు, వ్యాపారులు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న ఎరువుకు ఆయా కంపెనీల నుంచి ఎక్నాలేడ్జ్మెంట్ పొందాల్సి ఉంటుంది. ఎరువులు దిగుమతి చేసిన వాహనదారుడు తిరిగి వెళ్లి ఆయా కంపెనీలు, డీలర్లకు వారు దింపుకున్న మొత్తం వివరాలను తెలిపిన తరువాత వాటిని ఆన్లైన్లో పొందుపరిస్తే స్టాక్ రిజిస్టర్లో చూపిస్తుంది. అప్పటివరకు వ్యాపారులు ఎరువులు అమ్ముకునే అవకాశం లేదు. డీలర్లు, కంపెనీలు వెనువెంటనే ఆన్లైన్ చేయకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో చూపించకపోవడం వల్ల తమ వద్ద సరుకు ఉన్నా అమ్ముకునే వీలులేకుండా పోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సరికొత్త విధానం ప్రస్తుతం రైతుల భూముల వివరాలను వెబ్ల్యాండ్లో పొందుపరుస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి రైతులు ఎరువులు కొనుగోలుకు వెళ్తే వెబ్ల్యాండ్ను పరిశీలించి దానిలో వివరాల మేరకే ఎరువుల వ్యాపారులు, సొసైటీల్లో ఎరువులను విక్రయించాల్సి ఉంది. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు ఎరువులను అందించనున్నారు. రైతులు ఏ ఎరువులు కొనుగోలు చేసినా పూర్తి ధరకే కొనాలి. అనంతరం ఆయా ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు!
దేశంలో వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ప్రభావంపై 31 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన స్థాయీ సంఘం (2015-16) అధ్యయనం చేసింది. బీజేపీ ఎంపీ హుకం దేవ్నారాయణ్ యాదవ్ అధ్యక్షతన గల ఈ స్థాయీ సంఘం ఈనెల 11వ తేదీన పార్లమెంటు ఉభయ సభలకు నివేదికను సమర్పించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడటం వల్ల భూసారం దెబ్బతినడం, పంట దిగుబడుల్లో పెరుగుదల మందగించడంతోపాటు.. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి, పశువుల ఆరోగ్యానికి ముప్పు వచ్చిందని ఆందోళన వెలిబుచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకుంటూనే.. సేంద్రియ రైతులకు సాంకేతిక సహాయంతోపాటు నేరుగా ఆర్థిక తోడ్పాటునివ్వడం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.. 1960వ దశకం నుంచి దేశంలో అమలుచేస్తున్న హరిత విప్లవం వల్ల వరి, గోధుమల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగి మన అవసరాలు తీరడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే దశకు చేరామని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక వివరించింది. 1960-61లో 8.3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15 నాటికి 25.27 కోట్ల టన్నులకు పెరిగింది. 1960వ దశకంలో 10 లక్షల టన్నుల కన్నా తక్కువగానే రసాయనిక ఎరువులు వాడేవాళ్లం. 2014-15 నాటికి వీటి వాడకం 2.56 కోట్ల టన్నులకు పెరిగింది. హెక్టారుకు బంగాళదుంపల సాగులో 347 కిలోలు, చెరకు సాగులో 239 కిలోలు, పత్తి సాగులో 193 కిలోలు, గోధుమ సాగులో 177 కిలోలు, వరి సాగులో 165 కిలోల రసాయనిక ఎరువులు వాడుతున్నాం. ప్రజారోగ్యంపై రసాయనిక ఎరువుల ప్రభావం ఎలా ఉంది? అని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగాన్ని ప్రశ్నించింది. ఈ విభాగం ఏం చెప్పిందంటే.. మోతాదుకు మించి / అశాస్త్రీయంగా రసాయనిక ఎరువులు పంటలకు వేయటం వల్ల పర్యావరణానికి హాని జరగడంతోపాటు ప్రజల ఆరోగ్యం పరోక్షంగా దెబ్బతింటున్నది. మనుషులతోపాటు జంతువులను కూడా రసాయనిక ఎరువులు తీవ్రమైన జబ్బుల పాలు చేస్తున్నాయి. రసాయనిక ఎరువుల్లో ఉండే పాదరసం, సీసం, సిల్వర్, నికిల్, సెలీనియం, థాలియం, వనాడియం, కాడ్మియం, యురేనియం వంటి భార ఖనిజాలు మనుషుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయని కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగం పేర్కొంది. ఈ భార ఖనిజాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం పనితీరును దెబ్బతీస్తుండడంతోపాటు కేన్సర్ కారకాలుగా మారుతున్నాయి. రసాయనిక ఎరువుల కారణంగా మనుషుల్లో బ్రెయిన్ కేన్సర్, లింఫొమ, ప్రొస్టేట్ కేన్సర్, లుకేమియా, పెద్ద పేగు కేన్సర్ ముప్పు ఆరు రెట్లు పెరిగింది. రసాయనిక ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉందని స్థాయీ సంఘం స్పష్టం చేసింది. రసాయనాల ప్రభావంపై సమగ్ర సర్వే అవసరం వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తుల వృద్ధి రేటు 1960-70లలో 8.37% ఉండగా, 2000-2010 నాటికి 2.61%కి తగ్గిపోయింది. సాంద్ర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరగడంతో భూసారం బాగా క్షీణించింది. జింక్, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు భూమిలో లోపించడం వల్ల, ఆ భూముల్లో పండించిన పంటలు తిన్న మనుషులకు అనేక జబ్బులు వస్తున్నాయని.. మనుషులు, పశువుల్లో ఎదుగుదల దెబ్బతింటున్నదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఏ విధంగా ఉందో కచ్చితంగా తెల్సుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2025 నాటికి 30 కోట్ల టన్నుల మేరకు మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాల్సి ఉంది. కాబట్టి రసాయనిక ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా సముచితంగా వాడేలా రైతులను చైతన్యవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టాలని స్థాయీ సంఘం సూచించింది. ద్రవరూప సేంద్రియ ఎరువులకూ సబ్సిడీ భూసారాన్ని, సూక్ష్మజీవరాశిని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, జీవన ఎరువుల వాడకం, పంట మిగుళ్లను తిరిగి భూమిలో కలియదున్నటం వంటి పద్ధతులపై రైతుల్లో అవగాహన కలిగించాలని సూచించింది. రసాయనిక ఎరువుల సబ్సిడీ విధానాన్ని సమూలంగా మార్చాలి. ప్రకృతికి అనుగుణమైన జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, ప్రభావశీలమైన ద్రవరూప సేంద్రియ (జీవామృతం, పంచగవ్య వంటి) ఎరువులను దక్షిణాది రైతులు ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడే సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులకు నేరుగా నగదు సబ్సిడీ అందించే మార్గాలను అన్వేషించాలని, మన దేశానికి అనుగుణమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి స్థాయీ సంఘం సిఫారసు చేసింది. సేంద్రియ సేద్యం చేపట్టే రైతులకు నేరుగా సాయం పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని, పశుసంపదను రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం నుంచి కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వెనువెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం కోరింది. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి మారదలచుకునే రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయాన్ని వారికే నేరుగా అందించాలని.. అందుకు అవసరమైన సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంతోపాటు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులను సమన్వయ పరచి, దీక్షతో ప్రణాళికాబద్ధమైన కృషి చేయాలని కేంద్రానికి స్థాయీ సంఘం సూచించింది. సేంద్రియ సేద్యంలోకి మారే దశలో రైతులకు విస్తరణ సేవలందించే యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని పేర్కొంది. ఎన్పిఎం పద్ధతులను ప్రోత్సహించాలని, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని నియంత్రించేందుకు పెస్టిసైడ్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. రైతుసంఘాలు, నిపుణులు, స్వచ్ఛంద / పరిశోధనా సంస్థల ప్రతినిధులతో సంప్రదించి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968కు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సవరణలు చేయాలని కూడా స్థాయీ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. - పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ పురుగుమందుల సంగతేమిటి? పంటలపై రసాయనిక పురుగుమందులు విచక్షణారహితంగా వాడటం వల్ల ఎటువంటి ప్రభావం ఉంది? అని కేంద్ర వ్యవసాయ శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. అయితే, రసాయనిక పురుగుమందుల ప్రభావాలపై తమ శాఖ ఎటువంటి అధ్యయనమూ చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సెలవిచ్చింది! -
మందులు పిచికారీ చేయండి
కొత్తచెరువు: ప్రస్తుతం వేరుశనగ పంటకు ఆకుమచ్చ, తామర పురుగు, సూక్ష్మలోపాలను నివారించాలంటే మందులను పిచికారీ చేయాలని కదిరి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శివశంకర్నాయక్ తెలిపారు. ఆదివారం మండలంలోని తలమర్ల పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించారు. తామర పురుగు నివారణకు మోనోక్రోటోపాస్ ఎకరాకు 400 మిల్లీలీటర్లు, ఆకుమచ్చ తెగుళ్లకు ఎక్సప్ కోనజోల్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వేమన,చండ్రాయుడు, రైతులు పాల్గొన్నారు. -
620 టన్నుల ఎరువులు సీజ్
గీసుకొండ : నగరంలోని మూడో డివిజన్ ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని ఎత్తుగడ్డ వద్దనున్న అవంతి వేర్ హౌజింగ్ సర్వీసెస్కు చెందిన గోదాముల్లో మండల వ్యవసాయ శాఖ ఏఓ శ్రీనివాస్ శనివారం తనిఖీలు చేశారు. ఈసందర్భంగా గోదాముల్లో 2011 సంవత్సరం నుంచి కొరమాండల్ కంపెనీకి చెందిన గోదావరి పాస్గోల్డ్ ఎరువు 569 టన్నులు, గోదావరి రాక్గోల్డ్ ఎరువు 51 టన్నులు నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇంతకాలంగా విక్రయించకుండా నిల్వ చేయడంతో, దాన్ని పొలాల్లో చల్లినా ప్రభావవంతంగా పనిచేయదు. దీంతో మొత్తం పాత స్టాక్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువుల విలువ రూ.46.56 లక్షలు ఉంటుంది. శాంపిల్స్ను సేకరించి, హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించినట్లు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. ఎరువుల నాణ్యత తేలే వరకు వాటిని మార్కెట్లో విక్రయించొద్దని సూచించారు. తనిఖీల్లో ఏఈఓలు స్రవంతి, కల్యాణి పాల్గొన్నారు. -
రూటే సెపరేటు
-పాత ధరలకే ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులు ∙-రైతులకు నాసిరకపు మిశ్రమ ఎరువుల అమ్మకం - ఇటీవల మరికల్లో అధికారుల తనిఖీల్లో వెలుగులోకి.. -డీసీఎంఎస్లోనూ అధికధరలకు విక్రయిస్తున్న వైనం - 2610గాను 80శాంపిళ్ల ఎరువులు మాత్రమే సేకరణ -పంట దిగుబడి రాక ఏటా నష్టపోతున్న రైతన్నలు మహబూబ్నగర్ వ్యవసాయం:ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినా.. జిల్లాలో కొందరు వ్యాపారులు మాత్రం పాతరేట్లకే విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారు. దీంతోపాటు అనుమతి లేని మిశ్రమ ఎరువులను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఇటీవల వ్యవసాయశాఖ అధికారులకు సూచించినా చర్యలు తీసుకోలేదు. ఖరీఫ్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో రైతులు పంటలసాగుపై మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు, వ్యాపారులు కలిసి ప్రభుత్వ అనుమతులు లేని నాసిరకం ఎరువులను రైతులకు అంటగట్టేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో వారంరోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ డీడీఏ(పీపీ) సింగారెడ్డి ధన్వాడ మండలంలోని మరికల్లో అనుమతులు లేని 3.3టన్నుల ఎరువులను డీలర్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో నాసిరకం ఎరువులను విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పొరుగురాష్ట్రాలు ఏపీ, కర్ణాటక నుంచి రాత్రివేళల్లో గట్టుచప్పుడు కాకుండా డీలర్లకు చేరవేస్తున్నారు. దీంతో అధిక మార్జిన్కు ఆశపడిన కొందరు వ్యాపారులు రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా గద్వాల, ఆత్మకూర్, కొత్తకోట, వడ్డేపల్లి, ధరూర్, నారాయణపేట, మల్దకల్, గట్టు, అయిజ, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, ఎర్రవల్లి, పెబ్బేరు, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్ తదితర మండలాల్లో నాసిరకం ఎరువులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. వీటిని కొనుగోలుచేసిన రైతులు పంట దిగుబడి రాక మరింత నష్టపోతున్నారు. పాతధరలకే విక్రయం రైతులను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వం గతనెల 16న ఎరువుల ధరలు తగ్గించింది. ఈ రేట్లు అదేరోజు నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో డీఏపీ బస్తాపై ప్రభుత్వం కంపెనీ బట్టి రూ.120 నుంచి రూ.170 వరకు తగ్గించింది. అలాగే మ్యురేట్ ఆఫ్ పోటాష్ ధరలను రూ.250 నుంచి రూ.263కు తగ్గించింది. అయితే ఈ ధరలు జిల్లాలో ఎక్కడా అమలుకావడం లేదు. దీంతో రైతులు ఎరువుల భారం మోయలేక లబోదిబోమంటున్నారు. పాతరేటు కంటే ఎక్కువ ధరలకు డీఏపీ, మిశ్రమ ఎరువులను అంటగడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికధరలు జిల్లాలోని మారుమూల గ్రామాలు, మండలాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణమే. జిల్లా కేంద్రంలోనూ ఇవే ధరలకు విక్రయిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ రంగసంస్థ డీసీఎంఎస్లో రూ.1155కు విక్రయించాల్సిన డీఏపీని బస్తాను రూ.1210కు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ఈ సంస్థ నోటిస్ బోర్డుపైనే డీఏపీ బస్తాకు రూ.1210కు అమ్ముతున్నట్లు రాసి బహిరంగ దోపిడీకి పాల్పడుతోంది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని చాలా దుకాణాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి. -
ఫర్టిలైజర్ షాపుపై స్పెషల్స్క్వాడ్ దాడులు
నల్లబెల్లి : మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులపై హైదరాబాద్కు చెందిన స్పెషల్ స్క్వాడ్ ఏడీఏ మదన్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపి తనిఖీలు నిర్వహిం చారు. ఎరువులు కొనుగోలు చేసి తీసుకెళుతున్న రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే రైతులకు విక్రయించిన ఎరువుల బస్తాలపై ఆరా తీశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్రావు, స్పెషల్స్కాడ్ ఏఓ అనిల్కుమార్, నర్సంపేట, నల్లబెల్లి ఏఓలు యాదగిరి, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
– వ్యవసాయశాఖ విజిలెన్స్ బృందం ఏడీఏ సురేష్బాబు వెంకటగిరి : ఎరువుల దుకాణదారులు విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్ బృందం ఏడీఏ రమేష్బాబు హెచ్చరించారు. గురువారం వెంకటగిరిలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో పురుగు మందులు, ఎరువుల నాణ్యత, అమ్మకం రేట్లు, అమ్మే ఎరువులకు సంబంధించి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించిందన్నారు. నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పొదలకూరు డివిజన్లలో తనిఖీలు చేయగా 27 ఎరువులు, 15 పురుగుమందుల దుకాణాల్లో సుమారు రూ.60 లక్షల విలువైన ఎరువులు, సుమారు రూ.50 లక్షల విలువైన పురుగు మందులను దుకాణదారులు అనుమతి లేని కంపెనీల సరుకు అమ్ముతున్నట్లు గుర్తించామని, వాటి అమ్మకాలు నిలుపుదల చేసినట్లు చెప్పారు. వీరికి 21 రోజులు గడువు ఇచ్చి క్రమబద్ధీకరించుకునేలా అవకాశం ఇస్తామని, స్పందించని దుకాణదారుల్లోని ఎరువులను స్వాధీనం చేసుకుంటామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ బృందం సభ్యులు ఎంసీ మద్దిలేటి (ఏడీఏ రాయదుర్గం, అనంతరంపురం జిల్లా) రవీంద్ర (ఏఓ తాడిపత్రి ) డక్కిలి వ్యవసాయాధికారిణి సుజాత, వెంకటగిరి ఏఈఓ ఎస్పీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులతోనే విక్రయాలు చేయాలి
హిందూపురం రూరల్ : రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర వాటిని విక్రయం చేసే దుకాణదారులు అనుమతులు తీసుకుని వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం హిందూపురంలోని బృందావనం ట్రేడర్స్, నందినీ హైబ్రిడ్ సీడ్స్ ఏజెన్సీ, రైతు మిత్ర తదితర దుకాణాల్లో ఆయన తనిఖీలు చేశారు. దుకాణదారుల యజమానులతో ప్రిన్సిపల్ సర్టిఫికెట్, సోర్స్ సర్టిఫికెట్ తదితర అనుమతులు తీసుకున్న తర్వాత విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేపట్టాలన్నారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో వ్యాట్, ట్రేడింగ్ నెంబర్, పరిమితి మించి పోయే కాలం తదితర వాటిని తప్పనిసరిగా బిల్లులో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.11,18,375 విలువ చేసే విత్తనాలు, రూ. 6 లక్షల విలువ చేసే పురుగుల మందు, రూ.27,88 716 ఎరువులను దుకాణంలో విక్రయించకుండా తాత్కాలికంగా అనుమతులు రద్దు చేశారు. వీటì అమ్మకాలు చేపట్టాలంటే ప్రిన్సిపల్ ధ్రువ పత్రాలు తీసుకుని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి రామారావు, స్థానిక ఏఓ శ్రీలత తదితరులు ఉన్నారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నంద్యాల రూరల్: నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కర్నూలు డీడీఏ ప్రభాకర్రావు ఆధ్వర్యంలో మార్కాపురం ఏడీఏ సుదర్శన్రాజు, చిత్తూరు జిల్లా ఏఓ అజయ్కుమార్, నంద్యాల ఏడీఏ సుధాకర్, ఏఓ ఆయూబ్బాషాల ఆధ్వర్యంలో బుధవారం దాడులునిర్వహించారు. నూనెపల్లెలోని హర్షిత, సాయిసుదర్శన్, నూకల సుదర్శన్, ఆర్కే వెంకటసాయి, డీఎంఆర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేయగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.45 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులను గుర్తించారు. వాటిని విక్రయించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశామని డీడీఏ ప్రభాకర్రావు తెలిపారు. తగ్గిన ధరలకు ఎరువులను విక్రయించకుండా పాత ధరలకే కొందరు అమ్మడాన్ని ఆయన ఆక్షేపించారు. తక్షణమే గోదాముల్లోని పాత స్టాక్కు రికార్డులు చూపాలని, ఎరువుల దుకాణాల యజమానులను ఆదేశించారు. ప్రతినెల క్రయవిక్రయాల సమాచారాన్ని ఏఓ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. అనుమతిలేని ఎరువులు, పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.