Prithviraj Chavan
-
తిరుగు లేదనుకుంటే.. తిప్పిపంపారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు దిగ్గజ నేతలు కూడా ఓటమిని చవిచూశారు. తమకు మంచి పట్టు, ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలలో విజయం ఖాయమని భావించి బరిలోకి దిగిన మహామహులు పరాజయభారాన్ని మోయక తప్పలేదు. తమకు తిరుగులేదని, ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కొందరు విజయోత్సవాలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఓటర్లు ఊహించని విధంగా తీర్పునివ్వడంతో వారంతా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తథ్యమనుకుని బరిలో దిగి ఓటమిని చవిచూసిన వారిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.సోలాపూర్ నార్త్సిటీ.. బీజేపీదే ఐదోసారీసోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ ఘనవిజయం సాధించారు. ఈ దఫా రాష్ట్రంలో మహా వికాస్ అగాఢీ తరపున కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించినప్పటికీ తన ప్రత్యర్థి ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి మహేష్ కోటేపై మాభైఒక్కవేల ఎనభైఎనిమిది ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ గెలుపుతో వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన అభ్యర్థిగా విజయ్ కుమార్ దేశ్ముఖ్ రికార్డు సృష్టించారు.బీజేపీ, మహాయుతి కూటమి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారని, ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని విజయ్ కుమార్ దేశ్ముఖ్ ప్రశంసించారు. అన్ని వర్గాల మద్దతు వల్లే తన గెలుపు సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, మహాయుతి కూటమి పదాధికారులు, కార్యకర్తలు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు పేలుస్తూ గులాల్ జల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.వర్లీలో ఆదిత్య ఠాక్రే ఘనవిజయం ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఘనవిజయం సాధించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో మొదటిసారిగా పోటీ చేసిన గెలిచిన ఆదిత్య ఈసారీ విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఈఎన్నికల్లో శివసేన (యూబీటీ) నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేయగా, శివసేన (శిందే) నుంచి మిలింద్ దేవ్రా ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) నుంచి సందీప్ దేశ్పాండే పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వర్లీలో ఆదిత్య ఠాక్రే విజయం కోసం స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. చివరకు 8,801 ఓట్ల మెజారీ్టతో ఆదిత్య ఠాక్రే తన ప్రత్యర్థి మిలింద్ దేవ్రాపై విజయం సాధించారు.భివండీ రూరల్లో శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం భివండీ: భివండీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహాయుతి కూటమి శివసేన (శిందే) అభ్యర్థి శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. మహావికాస్ ఆఘాడీ కూటమి శివసేన(యూబీటీ) అభ్యర్థి మహాదేవ్ ఘటల్పై 57,962 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. చదవండి: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలుహోరాహోరీగా సాగిన కౌంటింగ్లో శాంతారామ్ మోరే 1,27,205 ఓట్లతో మొదటిస్థానంలో, మహాదేవ్ ఘటాల్ 69,243 ఓట్లతో రెండోస్థానంలో, జిజావు సంస్థ స్వతంత్ర అభ్యర్థి మనీషా ఠాక్రే 24,304 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి ఈసారి కేవలం 13, 816 ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నారు. -
పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్ దిగ్గజం) రాయని డైరీ
‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్ భారత్లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్ చేసి! ఆ ఫోన్ వచ్చింది ఆరెస్సెస్ నుంచి. ఆ ఫోన్ చేసింది ఆరెస్సెస్లోని ఒక పెద్ద మనిషి. ‘‘నేనిప్పుడు నా 78లో ఉన్నాను. అయినప్పటికీ... ‘మీరు మీ వృద్ధాప్యంలో ఆలోచిస్తారు...’ అని మీరు నాతో అనటం ద్వారా నా వయసు పట్ల మీరు కనబరుస్తున్న గొప్ప ఔదార్యం నన్ను కట్టిపడేస్తోంది. అలాగని నేను కాంగ్రెస్ కట్లు తెంపుకొని బీజేపీలోకి వచ్చేయలేను...’’ అన్నాను మృదువుగా.‘‘కట్లు అని మీరే అంటున్నారు. తెంపుకొని వచ్చేయటానికి ఏమిటి ఆలోచన?!’’ అన్నారాయన.‘‘అవి నన్ను నేను కాంగ్రెస్తో కట్టేసుకున్న కట్లు. కాంగ్రెస్ నన్ను ఫోన్ చేసి పిలిపించుకుని కట్టిపడేసిన కట్లు కావు...’’ అన్నాను. పెద్దగా నవ్వారాయన.‘‘మీలోని ఈ కట్టుబాటే నా చేత మీకు ఫోన్ చేయించేలా బీజేపీని ప్రేరేపించింది చవాన్జీ! ఢిల్లీలో బీజేపీకి మీ అవసరం ఉంది. సీనియర్ మోస్ట్గా మీకూ బీజేపీలో తగినంత గౌరవం ఉంటుంది. వచ్చేయండి...’’ అన్నారు.కోరుకున్న చోట దక్కే గౌరవం, కోరుకోని చోట పొందే గౌరవం... రెండూ ఒకటి కావు. దక్కింది సంతృప్తిని ఇస్తుంది. పొందిందిసంతోషాన్ని మాత్రమే ఇస్తుంది.‘‘నాకిక్కడ కాంగ్రెస్లో తగినంత గౌరవం దక్కుతూనే ఉంది మహోదయ్ జీ...’’ అన్నాను. ఆయన మళ్లీ నవ్వారు.‘‘నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆరేళ్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సహాయ మంత్రిగా ఉండటం, ఒక టర్మ్కు పైగా రాజ్య సభలో ఉండటం, రెండు టర్మ్లు లోక్సభలో ఉండటం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం... ఇవన్నీ నిజంగా దక్కుదలలే అంటారా చవాన్ జీ... ఒక్కసారి మీ మనసును అడగండి...’’ అన్నారాయన!ఆయన ఉద్దేశం – ఇవేవీ ఆరెస్సెస్ ‘ప్రచారక్ ’, ‘విచారక్’లతో కానీ, బీజేపీ ‘మార్గదర్శక్ మండల్’ సభ్యత్వంతో కానీ సమానమైనవి కావన్నట్లుగా ఉంది!మొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసింది ఎన్నికల నోటిఫికేషన్కు ముందు. రెండోసారి ఫోన్ చేసింది నామినేషన్లకు ముందు. మూడోసారి ఫోన్ చేసింది నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందు. ఇప్పుడు మళ్లీ ఫోన్ చేసి, ‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేయండి, చవాన్ జీ...’’ అంటున్నారు 20న పోలింగ్, 23నకౌంటింగ్ పెట్టుకుని!కరద్ సౌత్ నుంచి వరుసగా రెండుసార్లు నా మీద పోటీ చేసి ఓడిపోయిన అతుల్ సురేశ్ భోసలేనే మళ్లీ నాపై నిలబెట్టింది బీజేపీ. మొదటిసారి 18 వేలు, రెండోసారి 9 వేల ఓట్ల తేడాతో అతుల్ ఓడిపోయారు కనుక ఈసారి ఆయన కచ్చితంగా గెలిచి తీరుతారని ఆ పార్టీ నమ్మకం.నమ్మకాలు బీజేపీకి మాత్రమే ఉంటాయా?! కరద్ సౌత్లో మళ్లీ నేనే వస్తానని కాంగ్రెస్ నమ్ముతోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ వస్తే నేనే సీఎం అని నేను నమ్ముతున్నాను. తనే సీఎం అని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే నమ్ముతున్నారు.అడ్డు తొలగించుకోవటం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. బీహార్లో తమ కన్నా తక్కువ సీట్లు వచ్చిన నితీశ్కు సీఎం సీటును ఇచ్చేస్తుంది. కరద్ సౌత్లో అతుల్కి దీటైన పోటీ లేకుండా నన్ను పార్టీలోకి తీసుకోటానికి ఆరెస్సెస్తో ఫోనూ చేయిస్తుంది. ‘‘వృద్ధాప్యంలో మీరు ఆలోచిస్తారు...’’అంటూ ఈసారి మళ్లీ ఆ ఆరెస్సెస్ మహోదయ్ ఫోన్ చేస్తే ఒకటే చెప్పాలి... కాంగ్రెస్లో వృద్ధాప్యమనేదే ఉండదని గట్టిగా చెప్పాలి! - మాధవ్ శింగరాజు -
కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: కాంగ్రెస్ నేతలందరూ కలసి ఎన్నుకునే వ్యక్తి పార్టీకి తోలుబొమ్మ అధ్యక్షుడిగా ఉండకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కొత్తగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడికి తగిన సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. పాతికేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా..ఆయన రాజీనామా దురదృష్టకరమన్నారు. పార్టీలో ఆయన సీనియర్ నేతని, ఆయన లౌకికవాదని వివరించారు. గ్రూప్ 23లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పార్టీలో అంతర్గత సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి 2020లో లేఖ ఇచ్చామని, అయితే పార్టీ ప్రయోజనాలకు కాపాడేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మాత్రమే ఆ లేఖను ఇచ్చామని అయితే పార్టీలోని కొంతమంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్) -
‘మీకు మసీదులు, చర్చిలు గుర్తుకు రావా’
ముంబై: కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలు తప్ప మసీదులు, చర్చిల జోలికి వెళ్లరేందుకని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఏం చవాన్ ‘కరోనాపై పోరుకు ప్రభుత్వం దేశంలోని అని మత ట్రస్టుల వద్ద వున్న బంగారాన్ని వినియోగించాలి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మన దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది. తక్కువ వడ్డీ రేటుకు ఈ బంగారాన్ని బాండ్ల ద్వారా తీసుకోవచ్చు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హిందూ దేవాలయాల నుంచి బంగారం తీసుకునే ముందు.. కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు భారీ సంపదను కూడబెట్టారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ముందు వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి’ అని ‘తపస్వి చావ్ని’ స్వామి పరమన్స్ అన్నారు. (కరోనా : చివరి చూపైనా దక్కలేదు) మహాంత్ కమల్ నయన్ దాస్, మణి రామ్ దాస్ చావ్ని వంటి వారు ‘కాంగ్రెస్ నాయకులు ‘దేశ వ్యతిరేకులు’’ అని ఆరోపించారు. ‘చవాన్ దేవాలయాల నుంచి మాత్రమే డబ్బు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ మసీదులు, చర్చిల జోలికి వెళ్లడం లేదు ఎందుకు’ అని వారు ప్రశ్నించారు.(రూ.1000 కోట్లలో వారికి చేరేది సున్నా..) -
తెలంగాణలో మార్పు తథ్యం
సాక్షి, హైదరాబాద్: నియంతృత్వ పాలనను ఇక తెలంగాణ సమాజం అంగీకరించబోదని, ఇక్కడ మార్పు ఖాయమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ మీడియా సెల్ నేతలు యతీశ్, ప్రశాంత్, ఏఐసీసీ సభ్యుడు ఫయీంలతో కలసి మీడియాతో మాట్లాడారు. మరింత వేగంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, అయితే ప్రజలు ఆశిం చినా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన విషాదాన్నే మిగిల్చిందని దుయ్యబట్టారు. గత ఎన్నికల హామీ ల్లో ఒక్క దాన్ని కూడా నెరవేర్చని కేసీఆర్, మళ్లీ ఇప్పుడు ఎలా హామీలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, అందుకే కేసీఆర్ ముం దస్తు ఎన్నికలకు వెళ్లి బాధ్యతల నుంచి తప్పించుకున్నారన్నారు. అకారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మోసం చేసిన కేసీఆర్.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ నమ్మిం చి మోసం చేశారని చవాన్ ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులే ఇసుక మాఫియా నడిపిస్తూ ప్రశ్నించిన నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు 10 వేలు కూడా దాటలేదని, లక్ష ఉద్యోగాలిస్తామని మాట తప్పారని విమర్శించారు. ‘హస్తం’ అధికారంలోకి వస్తే అందరికీ మేలు.. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తామని, ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చవాన్ చెప్పారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీజేపీకి శివసేన కటీఫ్ చెబుతుంది
పుణె: బీజేపీతో మిత్రబంధాన్ని శివసేన తెగదెంపులు చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల లోపు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరించుకుంటుందని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ముంబై నగరపాలక సంస్థతో పాటు మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ లోగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలుగుతుందని చవాన్ పేర్కొన్నారు. శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడుతుందని, అప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయని అభిప్రాయపడ్డారు. -
‘మాఫీ’పై మీ వైఖరేంటి?
ముంబై : రుణమాఫీపై ప్రభుత్వం తన వైఖరి తెలిపే వరకు కాంగ్రెస్ చర్చలో పాల్గొనదని ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తేల్చి చెప్పారు. రుణమాఫీపై మీడియా తన మాటలు వక్రీకరించిందని ఫడ్నవీస్ చెప్పారని, అదే నిజమైతే ఆ వ్యాఖ్యలను సభలో ప్రకటించాలన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని సీఎం అన్నప్పుడు సభలో దానిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో సభా కార్యక్రమాలు మొదలైన తర్వాత మాఫీపై ప్రభుత్వ వైఖరి తెలపాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. కాగా, రైతుల రుణ మాఫీ కోసం విధాన్ భవన్ ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు ఎన్సీపీ మద్దతు ప్రకటించలేదు. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలపడమే దీనికి కారణమని తెలుస్తోంది. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఎన్సీపీతో కాంగ్రెస్ కలవకుండా బీజేపీతో పొత్తు పెట్టుకొని జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంది. బీజేపీకి వైస్ ప్రెసిడెంట్ పదవి చేజిక్కించుకుంది. మరోవైపు భండారాలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంది. వైస్ ప్రెసిడెంట్ పదవి ఎన్సీపీ చేజిక్కించుకుంది. మరోవైపు బీజేపీతో కలసివెళ్లాలనే గోందియా స్థానిక నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం స్వాగతించదని కాంగ్రెస్ నేతలంటున్నారు. శాసనమండలి కాంగ్రెస్ నేత మానిక్రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. రెండు పార్టీలు రైతు సమస్యలపై కలసికట్టుగా పోరాడతాయన్నారు. గోందియా వ్యవహారంలో నిర్ణయాన్ని సోమవారం తెలుపుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్దాస్ అగర్వాల్తో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అనేకమార్లు చర్చించినప్పటికీ దాస్ను ఒప్పించడంలో విఫలమయ్యారు. చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతాం: అశోక్ చవాన్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ప్రెసిడెంట్ అశోక్ చవాన్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై ప్రభుత్వ వైఖరేంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై పోరాడేందుకు చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతామన్నారు. గోందియా విషయాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం సభ 45 నిమిషాలు వాయిదా పడి తిరిగి సమావేశమైన అనంతరం కాంగ్రెస్ రైతు సమస్యలపై చర్చించింది. విఖే పాటిల్ మాట్లాడుతూ.. తీవ్ర కరువు, అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రుణమాఫీ ఒక్కటే రైతుల సమస్యలకు పరిష్కారం కాదని చెప్పారు. రుణమాఫీ సాధ్యంకాదని తాను చెప్పలేదన్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. రైతుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. విత్తనాలు విత్తి ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో వర్షాల జాడలేదని ఆవేదన వ్యక్తం చే శారు. రైతులు మళ్లీ విత్తానాలు విత్తుకోవాల్సి ఉంటుందన్నారు. రూ. 3000 కోట్లు రాబట్టుకోవడం కోసం ఎల్జీటీ, టోల్ అనుబంధ డిమాండ్లను విధించింద ని విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్చ జరగ కుండా ఉండేందుకు ఓ వ్యూహాత్మక అవగాహనతో బీజేపీ, ఎన్సీపీలు సభ వాయిదావేసేలా ప్రవర్తిస్తున్నారని ఓ శివసేన విమర్శించారు. రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించేంతవరకు సభా కార్యక్రమాలు జరగనివ్వమని ఎన్సీపీ ఆందోళన చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. రుణమాఫీపై సీఎం తన మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, రుణమాఫీ కోసం ప్రకటించడం కోసం ఆందోళన చేపట్టడంలేదని దుయ్యబట్టారు. ఇతర సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలా ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణలపై మండలి చైర్మన్ విచారణకు ఆదేశిస్తే.. నిర్దేశించిన సమయంలోపు ప్రభుత్వం నివేదిక సమర్పిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీతో శివసేనకు వైరం పెంచేందుకు ఎన్సీపీ సభా కార్యక్రమాలను అడ్డుకుంటోదని ఆరోపించారు. మొత్తం 63 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది గ్రామీణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలని, ఈ ఎమ్మెల్యేలంతా రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారన్నారు. రుణ మాఫీ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని ఎన్సీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీకి శివసేన ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఉపసంహరించుకోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తమ నియోజకవర్గాలకు వెళ్లినపుడు అక్కడి ప్రజలకు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. -
వారంలోగా సీఎం ‘వర్షా బంగ్లా’కి..
సాక్షి, ముంబై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ అధికార నివాసమైన ‘వర్షా బంగ్లా’ లోకి వచ్చే వారం గృహప్రవేశ ం చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రెండు రోజుల కిందటే వర్షా బంగ్లా ఖాళీ చేసి వెళ్లారు. దీంతో కొత్తగా అందులోకి వచ్చే ముఖ్యమంత్రికి, కుటుంబ సభ్యులకు అనుకూలంగా, నచ్చే విధంగా బంగ్లాలో మార్పులు, చేర్పులు చేయడం రివాజు. కాని ఆ బంగ్లాలో మార్పులు చేయడానికి ఫడ్నవిస్ అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. అందులో ఉన్న ఫర్నిచర్, ఇతర సౌకర్యాలతోనే సరిపెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. రెండు రోజుల్లో బంగ్లాను శుభ్రం చేసే పనులు పూర్తవుతాయి. మంగళవారం ఫడ్నవిస్తోసహా కుటుంబ సభ్యులు బంగ్లాను సందర్శిస్తారు. ఆ త ర్వాత అందులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వారి సూచనల మేరకు ఆధునికీకరణ పనులు చేపడతారు. వచ్చే వారంలో ముహూర్తం చేసుకుని సీఎం వర్షా బంగ్లాలోకి గృహ ప్రవేశం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన మాజెస్టిక్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని నాలుగో అంతస్తులోని 421 ఫ్లాట్లో నివాసముంటున్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్లో భారీమార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఫలితాలకు ముందు లేదా ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో అనేక మార్పులు జరగనున్నాయని తెలిసింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్పై వేటు పడే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఓ వైపు లోకసభ ఎన్నికల్లో ఘోరపరాజయం.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వెనకబడిపోయామని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పృథ్వీరాజ్చవాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు తీవ్ర తలనొప్పులు తీసుకువచ్చాయి. అలాగే రాష్ట్రంలోని పార్టీకి సంబంధించిన ఇతర కార్యవర్గాలను కూడా మార్చి నూతన కార్యవర్గాలను నియమించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయం కాలేదు. -
'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా'
పుణే: తన కంటే ముందు పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర తాజా మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఏమరుపాటుగా జరిగిన పొరబాటని ఆయన వివరణయిచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పతనమైతే... ఆదర్శ్ కేసులో మాజీ ముఖ్యమంత్రులు విలాస్ రావ్ దేశ్ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్ లపై చర్యలు తీసుకుంటానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ పేర్కొన్నారు. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నానని ఆయన తెలిపారు. తన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా ఆయన అన్నారు. -
నాయకుడు లేని పార్టీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం వహించేందుకు బీజేపీకి నాయకుడెవరూ లేరని, తమ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ఆధారపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ఎన్నికల ప్రచారం అసాధారణమని పేర్కొన్నారు. ఇంతవరకూ ఏ ప్రధాన మంత్రి కూడా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని బహిరంగసభల్లో పాల్గొనలేదని చెప్పారు. ఇది బీజేపీకి ఉన్న బలహీనత అని చవాన్ మంగళవారం ఇక్కడ పలు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే మరణంతో బీజేపీకి చెప్పుకోదగిన నాయకుడే లేకుండా పోయారని అన్నారు. ఆ బలహీనతను దాచేందుకు మోడీని రాష్ట్రమంతటా తిప్పుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ దురహంకారిగా మారిందని ఆరోపించారు. ప్రచారం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడుతో పాటు రాజస్థాన్, గోవా ముఖ్యమంత్రులను ప్రచారం చేసేందుకు పిలుస్తున్నారని అన్నారు. దీనిని బట్టి స్థానిక నాయకత్వంపై బీజేపీకి విశ్వాసం లేనట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముంగిట తన ప్రభుత్వానికి మద్దతునుపసంహరించిన ఎన్సీపీపై విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా దొడ్డిదారిలో మోడీకి అధికారం అప్పగించేందుకు చేసిన కుట్ర అనిఅన్నారు. ఆచరణ సాధ్యం కాని షరతులను విధించడం వల్లనే ఎన్సీపీతో పొత్తు కుదేలైందని చవాన్ చెప్పారు. బీజేపీకి సహకరించేందుకు ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉన్నాం..: బీజేపీ నేతలు ఫడ్నవిస్,జవదేకర్ సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ధులేలో జరిగిన పార్టీ ప్రచారసభలో తానున్నంత వరకు మహారాష్ట్రను ఎవరూ ముక్కలు చేయలేరనిప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన అనంతరం రాష్ట్రానికి చెందిన అదే పార్టీ నాయకులు ఇలా మాట్లాడడం విస్మయం కలిగించింది. మోడీ సభ అనంతరం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో జవదేకర్, ఫడ్నవిస్లు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నరేంద్ర మోడీ చెప్పింది ముంబైని మహారాష్ట్ర నుంచి ఎవరు విడగొట్టలేరని చెప్పారని, ఆయన వ్యాఖ్య విదర్భ గురించి కాదని వారు వివరణ ఇచ్చారు. -
ఆసక్తికర పోరు
కరద్: సతారా జిల్లాలోని కరద్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ తలపడుతున్న వారిలో ఒకరు రాజకీయాల్లో తలపండిన వారైతే అతని ప్రత్యర్థి రాష్ట్రాన్నే ఏలినవారు. ఒకరు వరుసగా ప్రజాభిమానంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారైతే, అతనిపై పోటీకి దిగిన వ్యక్తి అటు కేంద్ర మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా పని చేసినవారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఈ ఇద్దరు మహామహుల మధ్య పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్చవాన్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతుండగా, ఆయన ప్రత్యర్థి 79 ఏళ్ల విలాస్రావ్ ఉండాల్కర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉండాల్కర్కు కాకుండా అతని స్థానంలో పృథ్వీరాజ్ చవాన్ను బరిలోకి దించింది. దీంతో ఉండాల్కర్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పని చేసిన చవాన్ 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరివీ విరుద్ధమైన వ్యక్తిత్వాలు. ఉండాల్కర్ ఈ ప్రాంతంలో కాకా పేరుతో ప్రసిద్ధులు. అమెరికాలో విద్యనభ్యసించిన చవాన్ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు. చవాన్ను ఇక్కడి గ్రామాల ప్రజలు బాబా అని పిలుచుకుంటారు. ధోవతి, కుర్తా ధరించే కాకా వద్ద కనీసం ఓ పెన్ను, లేదా మొబైల్ ఫోన్ కూడా ఉండదట. కానీ పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను పేరు పెట్టి గుర్తించగలరని అతని మద్దతుదారులంటున్నారు. ఈ విషయంలో చవాన్ చాలా వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రిగా చవాన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇక్కడి అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చు చేశారు. మచ్చలేని వ్యక్తిత్వం, కరద్ అభివృద్ధికి ప్రత్యేక కృషి, తనతోపాటు తల్లిదండ్రులు ఆనంద్రావు, ప్రేమలతాయిలు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహించడం వంటివి చవాన్కు కలసి వచ్చే అంశాలు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అతుల్ భోస్లే కూడా నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడే. సహకార, విద్యా సంస్థల నెట్వర్క్ ఉన్న రాజకీయ కుటుంబంనుంచే ఈయన కూడా వచ్చాడు. కరద్ నియోజకవర్గంలో ఎన్సీపీ తన అభ్యర్థి రాజేంద్ర యాదవ్ను పోటీ నుంచి ఉపసంహరించి ఉండాల్కర్కు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్సీపీపై కినుకు వహించిన యాదవ్ను చవాన్ చేరదీశారు. తమకు తాగు, సాగు నీటి సమస్యను కాకా పరిష్కరించారని ఓ సర్పంచ్ చెప్పారు. ఈసారి పోటీ చేయడం కాకాకు ఇష్టం లేదని, కానీ తామే బలవంతపెట్టామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే దాకా చవాన్ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఉండాల్కర్కు ప్రజాదరణ తగ్గిపోయిందని, 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చెప్పుకోదగిన అభివృద్ధి పనులేమీ చేయలేదని చవాన్ మద్దతుదారులంటున్నారు. 2.75 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో చవాన్ తన ప్రత్యర్థికన్నా ఒక అడుగు ముందే ఉన్నప్పటికీ విజయం అంత సునాయాసం కాబోదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధికి ఓటేయండి: సీఎం నాసిక్: మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించిందని కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేయాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిందని అన్నారు. తమ హయాంలోనే అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. జిల్లాలోని పలు ఎన్నికల సభల్లో మాట్లాడిన చవాన్ తమ ప్రభుత్వాలు అమలు చేసిన పలు పథకాలను ఏకరువు పెట్టారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, వాటిని కాంగ్రెస్పార్టీ మాత్రమే చేయగలదని చెప్పారు. -
అభివద్ధికి ఓటు వేయండి: చవాన్
నాసిక్: మహారాష్ట్రలో అభివద్ధికి ఓటు వేయాలని ఓటర్లకు మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ పిలుపునిచ్చారు. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన కోరారు. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్రం ఆర్థిక స్థిరత్వం సాధించిందని అన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని చవాన్ తెలిపారు. -
‘ఉపసంహరణ’ పూర్తి..
సాక్షి, ముంబై: నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగడంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ జరగనుంది. మరోవైపు ఈసారి కూడా దాదాపు అన్ని పార్టీల్లోనూ తిరుగుబాటుదారుల బెడద కన్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,646 నామినేషన్లు దాఖలు కాగా వీటిలో పరిశీలన పూర్తి తర్వాత 6494 నామినేషన్లు మిగిలాయి. కాగా చాలా మంది బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రాష్ట్ర ఎన్నికల అధికారి వల్వీ తెలిపారు. అయితే ఉపసంహరించుకున్న వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని రాత్రి పది గంటల సమయంలో ‘సాక్షి’కి చెప్పారు. ఈసారి ఇండిపెండెంట్లతోపాటు పలు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు కూడా రద్దు కావడం విశేషం. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ పార్టీల అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పృథ్వీరాజ్ చవాన్ కోసం ఎన్సీపీ అభ్యర్థి ఉపసంహరణ.. కరాడ్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రికృతమైన దక్షిణకరాడ్ అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్కు ఎన్సీపీ ఊరటనిచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి రాజేంద్ర యాదవ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దక్షిణ కరాడ్ అసెంబ్లీ నుంచి పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేయనున్నారని తెలిసినతర్వాత స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులైన విలాస్కాకా ఉండాల్కర్కు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో చివరి రోజున ఎన్సీపీ రాజేంద్ర యాదవ్ నామినేషన్ను వెనక్కితీసుకోవాలని సూచించి, విలాస్ కాకాకు మద్దతు ప్రకటించింది. ఉపసంహరించుకున్న బీజేపీ అభ్యర్థి రమేష్ మాత్రే.. అసెంబ్లీ ఎన్నికల వాడివేడి కొనసాగుతున్న తరుణంలో కళ్యాణ్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రమేష్ మాత్రే తన నామినేషన్ను వెనక్కితీసుకున్నారు. ఈ సంఘటన బీజేపీకి షాక్నిచ్చిందని చెప్పవచ్చు. మొదట శివసేన టికెట్ ఆశించిన మాత్రేకు ఆ పార్టీ మొండిచేయి చూపడంతో తిరుగుబాటుచేసి రమేష్ మాత్రే బీజేపీలో చేరి కళ్యాణ్ రూరల్ నుంచి శివసేన అభ్యర్థి సుభాష్ భోయిర్కు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అయితే చివరి రోజు ఊహించని విధంగా రమేష్ మాత్రే నామినేషన్ వెనక్కితీసుకోవడంతో స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వర్సోవా అసెంబ్లీ శివసేన అభ్యర్థి నామినేషన్ రద్దు... పశ్చిమ అంధేరిలోని వర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన టికెట్పై బరిలోకి దిగిన రాజు పటేల్ నామినేషన్ ఫారాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం రద్దు చేసింది. నామినేషన్తోపాటు ప్రతి/్ఞ పత్రాన్ని జతపరచపోవడంతో నామినేషన్ను రద్దుచేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే ఈ విషయంపై రాజు పటేల్ కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. -
వారిది గేమ్ ప్లాన్..
ముంబై: ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించడం ద్వారా కేంద్రంలో పదవులు పొందడం కోసమే ఎన్సీపీ తమతో పొత్తు తెగతెంపులు చేసుకుందని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ కోరిన తర్వాత ఏమాత్రం సమయం ఇవ్వకుండానే ఇక్కడ రాష్ట్రపతిపాలనకు కేంద్రం మొగ్గుచూపిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్సీపీ తొలగిన వెంటనే గవర్నర్ విద్యాసాగర్ రావు తనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారన్నారు. అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించేలా కేంద్రం సంతకం చేయించిందని విమర్శించారు. అతడిని కనీసం న్యాయ సలహా కూడా తీసుకోనివ్వలేదని ఆరోపించారు. కాగా దీని వెనుక ఎన్సీపీ హస్తం కూడా ఉందని ఆయన విమర్శించారు. తమను 144 అసెంబ్లీ సీట్లు అడగటంతోపాటు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడే వారు తమతో పొత్తును తెగతెంపులు చేసుకోవడానికే సిద్ధపడిపోయారని అర్ధమైపోయిందని చవాన్ చెప్పారు. వారు ఈ విషయంలో ముందే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో మంత్రి పదవులు పొందేందుకు రాష్ట్రాన్ని వారికి ధారాదత్తం చేశారని విమర్శించారు. కాగా ఎన్సీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు నీటిపారుదల కుంభకోణంలో క్లీన్ చిట్ రావడంపై చవాన్ స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ‘తమిళనాడు సీఎం జయలలిత పరిస్థితి చూశారు కదా.. 18 యేళ్ల తర్వాత ఆమెపై ఆరోపణలు కోర్టులో నిరూపించబడ్డాయి.. నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. మాధవ్ చితాలే కమిటీ అతడి(అజిత్ పవార్)కి క్లీన్ చిట్ ఇచ్చి ఉంటే.. కోర్టు ఎందుకు పవార్, సునీల్ తత్కారేలపై విచారణకు ఆదేశించింది?.. నీటిపారుదల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా ఒక మంత్రి ఉండకూడదని చితాలే కమిటీ నివేదించింది. అయితే ఆ సమయంలో అజిత్ మంత్రి కాదా? మన న్యాయవ్యవస్థ కొంత నెమ్మదిగా స్పందించవచ్చేమో గాని చివరకు న్యాయమే గెలుస్తుంది.. జయలలితకు కూడా 18 యేళ్ల తర్వాతే దోషిగా తేలింది కదా..’ అంటూ వ్యాఖ్యానించారు. తాను మహారాష్ట్రలో ఉన్న అవినీతిని అంతమొందించడానికే సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించానన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో తన పనిని సంపూర్ణంగా చేయలేకపోయానని చెప్పారు. ఈసారి తమకు పూర్తి మెజారిటీ వస్తే.. మొదట రాష్ట్ర సహకార సంఘాలకు చైర్మన్గా మంత్రులను నియమించడాన్ని రద్దు చేస్తానన్నారు. మహారాష్ట్రకు కేంద్రం సాయం అవసరంలేదని, రాష్ర్ట అభివృద్ధికి కావాల్సిన వనరులు ఇక్కడే ఉన్నాయని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై చవాన్ స్పందిస్తూ.. ఈ రాష్ట్రం భారతదేశంలో భాగమే తప్ప ప్రత్యేకంగా లేదు కదా.. రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు పరిణతి లేని రాజకీయ వ్యాఖ్యలన్నారు. తమకు అధికారం ఇస్తే కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుబంధాన్ని దృఢతరం చేస్తామని బీజేపీ నాయకులు ఇస్తున్న హామీలపై చవాన్ వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తమతో సత్సంబంధాలు కొనసాగించదా అంటూ ప్రశ్నించారు. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కేబినెట్ శనివారం సిఫార్సు చేయగా.. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి పాలన విధింపు ప్రకటనపై ప్రణబ్ సంతకం చేసినట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, దీంతో సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయడం తెలిసిందే. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: వచ్చే నెల 15న శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం సిఫార్సు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేసిన మరుసటి రోజునే ఢి ల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పదిహేనేళ్ల పొత్తుకు స్వస్తి చెబుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చవాన్ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తన నివేదిక పంపుతూ, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాగా, నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. -
ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిమ్ అజ్మీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రేను కలిసి చర్చలు జరిపారని సమాజ్వాదీ ప్రతినిధి అబ్దుల్ ఖాదిర్ చౌదరి చెప్పారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన అన్నారు. శివాజీనగర్-మన్ఖుర్ద్ నుంచి అబూ ఆజ్మీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీవండి, కుర్లా, మిరాజ్, నాగపూర్ సెంట్రల్ స్థానాలను తాము కోరుతున్నామని చెప్పారు. విదర్భలో ప్రాబల్యం ఉన్న జోగేంద్ర కవాడే, సులభ కుంభారేలతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలిసింది. -
షరతులతో పొత్తు కష్టమే: సీఎం
ముంబై: సాధ్యం కాని షరతులు విధిస్తే ఇక ఎన్సీపీతో పొత్తు కొనసాగించటం కష్టంగా మారగలదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను దూరంగా ఉంచేందుకు గాను ఎన్సీపీతో పొత్తును కొనసాగించాలన్నదే కాంగ్రెస్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అయితే అసాధ్యమైన షరతులు విధించడం వల్లనే పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని అన్నారు. షరతులు లేకండా చర్చలు ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్ని సమస్యలూ పరిష్కారమై ఉండేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరద్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సగం కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కోరిందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు చవాన్ నిరాకరించారు. అయితే ఈ అంశాన్ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే ధ్రువీకరించారు. ఎన్సీపీ డిమాండ్పై ముఖ్యమంత్రి చవాన్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారని చెప్పారు. కరద్లో తన మద్దతుదారులతో మాట్లాడిన చవాన్, తాను పోటీ చేయాలనుకుంటున్న నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరద్ తన స్వస్థలమని, ఈ పట్టణాన్ని తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. -
నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్లో చేరిక
యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్ను కలిసి తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. -
మీ నాయకుడెవరు?
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బీజేపీకి సవాలు విసిరారు. నరేంద్ర మోడీ పేరిట ఓట్లు అడగటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజువారీ నిర్ణయాలు చేసేది ముఖ్యమంత్రి అని, ప్రధాన మంత్రి కాదని పేర్కొన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉన్నపక్షంలో వారిని తొలగించేందుకు వెనుకాడబోమని చవాన్ స్పష్టం చేశారు. యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. అదే సమయంలో తమ నియోజకవర్గాలను తీర్చిదిద్దిన వారిని విస్మరించబోమని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవానికి, యువతకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు చవాన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరు. ఢిల్లీలో మాకు మోడీ ఉన్నాడని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుండవచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది. ఇక్కడ రోజువారీ వ్యవహారాలను నడపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా?’ అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని అన్నారు. నాయకత్వం అంశంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహాకూటమిగా ఉద్ధవ్ ఠాక్రే నాయకునిగా ఉంటారని శివసేన ఇదివరకే ప్రకటించింది. ప్రజలు పార్టీని, పార్టీ విధానాలను, పార్టీ నేతను బట్టి ఎన్నుకుంటారని చవాన్ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ నాయకులను ప్రకటించాయని, బీజేపీ మాత్రమే ఇంతవరక వెల్లడించలేదని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారానికి వస్తుందని చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలల కాలంలో అనేక ప్రజల నిర్ణయాల్లో మార్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల తీర్పు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఓటర్లు భిన్నంగా స్పందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తారా అన్న ప్రశ్నకు చవాన్ సానుకూలంగా స్పందించారు. అయితే గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గాలను తీర్చిదిద్దిన ఎమ్మెల్యేలను వదిలివేయబోమని స్పష్టం చేశారు. మంచిపనులు చేసిన ఎమ్మెల్యేలకు మరో అవకాశం తప్పకుండా ఇస్తామని చెప్పారు. తమ పార్టీలో యువత, మహిళలు చురుకుగా పని చేస్తున్నారని, విద్యావంతులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉందని అన్నారు. -
పొత్తా?.. ఒంటరి పోరా?
మహారాష్ట్రలో తేలని ప్రధాన కూటముల పొత్తుల కొట్లాట 119 కన్నా ఎక్కువ సీట్లివ్వబోమన్న శివసేన; 130 కావాలంటున్న బీజేపీ 124 ఇస్తానంటున్న కాంగ్రెస్; ఇంకా ఎక్కువ కోరుతున్న ఎన్సీపీ పొత్తులపై కాంగ్రెస్, ఎన్సీపీల కీలక భేటీ నేడు సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు కలసి పోటీ చేస్తాయా? లేదా ఒంటరిగా పోటీ చేస్తాయా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శివసేన, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలోను.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లోనూ సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో.. ఆయా పార్టీలు ఒంటరి పోరు దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ(సెప్టెంబర్ 27) దగ్గరపడుతుండటంతో నాలుగు ప్రధాన పార్టీలు ఒకవైపు పొత్తులపై చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు తమతమ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించాయి. అవసరమైతే సొంతంగా బరిలో దిగుతామంటూ ఒకవైపు కత్తులు దూస్తూనే.. పొత్తును కాపాడుకుంటామంటూ మరోవైపు ప్రకటనలు చేస్తున్నాయి ఈ రెండు కూటములు. పాతికేళ్ల బంధం కొనసాగుతుందా? బీజేపీ, శివసేనల పాతికేళ్ల పొత్తుకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెబుతుండగా, 135 సీట్లు కావాలంటూ బీజేపీ కోరుతోంది. కనీసం 130 సీట్లైనా తమకు ఆమోదయోగ్యమేనని చెబుతోంది. ఆ ప్రతిపాదనకూ శివసేన ససేమీరా అంటోంది. ‘మేము 130 స్థానాలు కోరడం ద్వారా మేం ఒక ఉదాత్తమైన ప్రతిపాదన పంపాం. అదీ శివసేన ఏనాడు గెలవని స్థానాలనే మాకివ్వమంటున్నాం. దానికీ ఒప్పుకోకపోతే.. మొత్తం 288 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం స్పష్టం చేశారు. పొత్తును కాపాడేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడారని.. సాయంత్రం ప్రధాని మోదీ కూడా ఉద్ధవ్కు ఫోన్ చేసి, సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపు ఉండాలని హితవు చెప్పారని సమాచారం. 20, 30 మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఉద్ధవ్ చెప్పిన 119 స్థానాలే తమ చివరి మాట అని శివసేన సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. పదిహేనేళ్ల పొత్తు భవితవ్యమేంటి? అధికార ప్రజాసామ్య కూటమి(డీఎఫ్)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 144 స్థానాలు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా.. 124 ఇస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సోమవారం పార్టీ కోర్ కమిటీ భేటీలో.. పొత్తును కొనసాగించాల్సిందేనని నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 స్థానాలు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. 15 ఏళ్ల పొత్తును కాపాడుకునేందుకు మంగళవారం ఉదయం ఇరు పార్టీల మధ్య మరో భేటీ జరగనుందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బీజేపీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలను కొట్టివేశారు. కాంగ్రెస్ కూడా సీట్ల విషయంపై గట్టిగానే ఉంది. అన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించామని పేర్కొంది. ఒకస్థాయిలో పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని, మరో స్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. మోదీపై ‘సామ్నా’ ప్రశంసలు ఒకవైపు పొత్తు పట్లు కొనసాగుతుండగా.. మరోవైపు మోదీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. భారత ముస్లింపై మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. మాతృభూమిపై ముస్లింల దేశభక్తికి మోదీ గ్యారంటీ ఇచ్చి కొత్త అధ్యాయం లిఖించారని, ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముస్లింలపైనే ఉందని అందులో పేర్కొంది. ముస్లింలను ప్రశంసించడాన్ని ..మోదీలో హిందుత్వవాదం సన్నగిల్లినట్లుగా చూడరాదని తెలిపింది. ప్రధానమంత్రిగా మోదీ అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారంది. నకిలీ లౌకికవాదులు మోదీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించారని తెలిపింది. -
వివాదం ముదిరేనా?
సాక్షి, ముంబై: దక్షిణ కరాడ్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే వివాదం మరింత ముదిరే అవకాశముంది. అక్కడి నుంచి పోటీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి కనబరుస్తుండగా, వదులుకునేందుకు సిద్ధంగా లేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విలాస్కాకా పాటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ అధిష్టానం దక్షిణ కరాడ్ నుంచి తనకు అభ్యర్థిత్వం ఇవ్వని పక్షంలో మరో పార్టీ నుంచైనా పోటీ చేస్తానని, ఒకవేళ అదికూడా వీలుకాకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని పాటిల్ పేర్కొన్నారు. దీంతో ఈ నియోజక వర్గంపై వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా పృథ్వీరాజ్ చవాన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశం ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఈ సమస్య ఎటూ తేలకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో గందగోళం నెలకొంది. వచ్చే నెల 15న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో దక్షిణ కరాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇందులోభాగంగా అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ నియోజక వర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన విలాస్కాకా పాటిల్ ఈ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆదివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అవసరమైతే ఢిల్లీ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తానని పేర్కొన్నారు. ‘దక్షిణ కరాడ్ నియోజక వర్గం నాకు కంచుకోట. ఇప్పటికే అక్కడినుంచి రెండుసార్లు గెలిచా. ఈ ఎన్నికల్లోనూ నా గెలుపు తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని వదులుకోను’అని అన్నారు. దీంతో చవాన్ ఇరకాటంలో పడిపోయారు. -
సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, ముంబై: షిర్డీలో 2018లో జరగనున్న సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ యాజ మాన్యం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. రూ.1,104 కోట్లతో కూడిన ప్రతి పాదనను పరిపాలనా విభాగానికి సమర్పించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి ృథ్వీరాజ్ చవాన్ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. రహదారులు, నీరు, విద్యుత్, ఆరోగ్యం తదితరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచనున్నారు. 2018 డిసెంబర్లో జరగనున్న సాయి సమాధి శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాదిమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. వారందరికి భోజనం, ప్రసాదంతోపాటు బస తదితర వసతులను కల్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు వేలాదిగా వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి రాధాకృష్ఱ విఖేపాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలకోసం షిర్డీ సాయి ఆలయ సంస్థాన్తోపాటు ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తొలి విడత కింద కనుక రూ.153 కోట్లు మంజూరైతే షిర్డీలో రహదారుల మెరుగు పనులను ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు. గత సంవత్సరం నాందేడ్లో సిక్కు మత పెద్దల శతాబ్ది ఉత్సవాలు ఏ స్థాయిలో జరిగాయో అదే స్థాయిలో షిర్డీలో కూడా సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. -
సరైన సమయంలో ‘పొత్తు’!
ముంబై: వచ్చే 15వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో తమ పొత్తుపై తుదినిర్ణయం సరైన సమయంలో తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందస్తు పొత్తు మంచిదా.. లేక తర్వాత పొత్తు పెట్టుకుంటే మంచిదా అనేది చర్చల్లో తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ఇప్పటివరకు 5 సార్లు ఎన్నికల్లో పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే ఆరోసారి అవుతుంది. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఎటువంటి పొత్తు లాభదాయకమో చర్చల ద్వారా నిర్ణయించుకుంటామని చవాన్ తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రజల మద్దతు పొందిన ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సీఎం పదవి చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరాటంపై ప్రశ్నించగా.. అతడు అధికారానికి కొత్త అని చవాన్ అన్నారు. గత బీజేపీ, సేన ప్రభుత్వంలో ఉద్ధవ్ పనిచేయలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే, ముంబై, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార బీజేపీ-శివసేన కూటమి అధ్వాన పాలనను తాము ఈ ఎన్నికల్లో తమ అస్త్రం గా వాడుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే ముస్లింలు, మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన ్ల ప్రజాస్వామ్య కూటమి కల్పించిందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ కృషిచేస్తున్నారని చవాన్ కొనియాడారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఒకేవిధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత విధానపరమైన నిర్ణయా ల్లో పురోగతిపై దృష్టిపెట్టానని చవాన్ చెప్పారు. ప్రచారానికి సోనియా, రాహుల్ ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. మహారాష్ట్రలో ప్రచారానికి మొత్తం 40 మంది పార్టీల ప్రముఖుల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ వెల్లడించారు. ఆజ్తక్ చానెల్ ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయం చెప్పారు. అభివృద్ధి విషయంలో గుజరాత్ కంటే తాము అన్ని విధాలా ముందు ఉన్నామని స్పష్టీకరించారు. ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మరింత ముందుకు నడిపిస్తామని పృథ్వీరాజ్ చవాన్ వివరించారు. -
కారుపై ఎర్రబుగ్గను తొలగించే ప్రసక్తే లేదు!
ముంబై: తన అధికారిక వాహనంపై ఉన్న ఎర్రబుగ్గ (రెడ్ బీకాన్)ను తొలగించేది లేదంటూ ముంబై నగర్ మేయర్ స్నేహాల్ అంబేకర్ తేల్చిచెప్పారు. ఆమె కొత్తగా మేయర్ గా ఎన్నికైన అనంతరం తన అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను కల్గి ఉండటంతో వివాదం చెలరేగింది. దీంతో స్పందించిన ఆమె.. ముఖ్యమంత్రి వాహనంపై ఎర్రబుగ్గకు అనుమతి ఇచ్చి.. మేయర్ కారుపై తొలగించాలని పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. అంతేకాకుండా మేయర్ పదవి అనేది సీఎం పదవితో సమానం అంటూ ఎద్దేవా చేశారు. 'మేయర్ స్థానం సీఎం స్థానంతో సమానం. సీఎం వాహనంపై రెడ్ బీకాన్ ఉంటుంది. మరి నాకు ఇబ్బంది ఏంటి' అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా అభిప్రాయాన్ని అడిగితే ఇది సమాధానం చెబుతానని ఆమె మొండికేశారు. సీఎం అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను వాడగా అభ్యంతరం లేనిది.. తన వరకూ వచ్చేసరికి ఏమిటిని ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. ' ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నియమాలు కూడా ఉంటాయ్' అని స్పష్టం చేశారు. తాజా ప్రభుత్వ నియమావళిలో మేయర్ వాహనంపై రెడ్ బీకాన్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని మాజీ మేయర్ సునీల్ ప్రభూ కూడా ఖండించారు. మేయర్ తన అధికారి కారుపై ఎర్రబుగ్గను వాడటం ఒక సాంప్రదాయంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. -
ప్రధాని కార్యక్రమంపై టీచర్లు, తల్లిదండ్రుల తీవ్ర అసంతృప్తి
ముంబై: ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులతో టీవీద్వారా నేరుగా సంభాషించాలనే ప్రధాని ప్రతిపాదనపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉండాలనే ఉద్దేశంతో తాము సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని తిలక్భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్కులర్లోని అంశాలు సరిగా లేవని, దీనిని ఈ అంశాన్ని సరైన వేదికపై ప్రస్తావిస్తామన్నారు. ఒక్క వ్యక్తికి ప్రచారం కల్పించేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుకుంటున్నారన్నారు. ప్రధాని ప్రసంగాన్ని విద్యార్థులు ఆలకించాలనడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. కాగా ప్రధాని కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని, ఎటువంటి ఒత్తిళ్లు ఉండబోవని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. పాలన విఫలం ప్రధానమంత్రి నరేంద్రమోడీ 100 రోజుల పాలన విఫలమైందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. కనీసం హోం శాఖ మంత్రి సైతం తన అనయాయుడికి పదవిని ఇప్పించుకోలేని స్థితిలో పడిపోయారన్నారు. నాయకత్వ లోపమే కారణం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కేంద్రంలో సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని చవాన్ ఆరోపించారు. ప్రధాని షోలాపూర్ పర్యటనకు ముందే విద్యుత్ సంక్షోభంపై హెచ్చరించానన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆనా టి సభలో తాను ప్రసంగించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయించిన కోటాలో కేవలం 60 శాతం బొగ్గు మాత్రమే వస్తోందన్నారు. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలోని అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయన్నారు. ఇక ఎన్నికల విషయమై మాట్లాడుతూ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా యన్నారు. -
గుజరాత్ కంటే మేమేముందున్నాం..
ముంబై: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ అనుసరించిన గుజరాత్ అభివృద్ధి నమూనా గురించి చర్చ జరుగుతుండడం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాత్రం ఈ విధానంతో ఒరిగేదీ ఏమీ లేదన్నారు. అన్ని రంగాల్లో ఆ రాష్ట్రం కంటే తాము ముందంజలో ఉన్నామని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గత 15 ఏళ్లలో తమ ప్రభుత్వం మహారాష్ట్రను గుజరాత్ కంటే ఎక్కువే అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. ‘ప్రతి రంగంలోనూ మేం గుజరాత్ కంటే ముందే ఉన్నాం. మోడీ చేసింది.. మేం చేయనిది ఏంటి ? ఉద్యానవనాలు, పారిశ్రామికీకరణ, విద్య, వైద్యం.. ఇలా అన్నిరంగాల్లో మేం పురోగతి సాధించాం. మాది పూర్తిగా పరిశ్రమల అనుకూల విధానం. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తుల్లో 18.4 శాతం మా రాష్ట్రం నుంచే వస్తున్నాయి. స్థూల దేశీయ ఉత్పత్తిలోనూ మా వాటా 14.09 శాతం. మా రాష్ట్రానికి రూ.14,73,466 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తే గుజరాత్కు వచ్చిన వాటి విలువ రూ.13,98,347 కోట్లు మాత్రమే. పోషకాహార లోపాలను నివారించేందుకు మేం చేసిన కృషిని యూనిసెఫ్ కూడా ప్రశంసించింది. చిన్నారుల్లో ఎదుగుల లోపాలను కూడా చాలా వరకు అరికట్టగలిగాం. ఇక నుంచి పారిశ్రామిక కేంద్రాలు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తాం. 10, 12వ తరగతుల విద్యార్థులకు నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రైవేటు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఫలితంగా వ్యవ సాయరంగంలోకి ఆధునిక పరిజ్ఞానం ప్రవేశించి మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలియజేసేందుకు మేం ప్రత్యేకంగా ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తాం. మోడీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. మాది వ్యక్తిగత ప్రచారం కాదు. సమష్టిగా ప్రజప్రయోజనం కోసం దీనిని నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. ఈసారి కూడా గెలుపు మాదే.. ముఖ్యమంత్రి, పార్టీ వేర్వేరు కాదని, పార్టీ గెలిస్తే నాయకులు, కార్యకర్తలంతా గెలిచినట్టేనని స్పష్టం చేశారు. ప్రజల్లో తనపై సానుకూల అభిప్రాయం ఉంటే, అది ఎన్నికల్లో బయటపడుతుందన్నారు. ‘ప్రజలు నన్ను మరోసారి సీఎంగా కోరుకుంటే ఓట్లు వేస్తారు. యూపీఏ-2 ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో దానికి పరాభవం తప్పలేదు. అందుకే లోక్సభ ఎన్నికల్లో మేం పరాజయం పాలయ్యాం. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిం చడం ద్వారా ఈ వైఫల్యాన్ని అధిగమిస్తాం. అధికార వ్యతిరేకత మాకు సమస్యే కాదు. మా ప్రభుత్వం ఏం చేసిందనేదే ప్రజలకు ముఖ్యం’ అని అన్నారు. ఎన్నికల కోసమే మరాఠాలు, ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్న విమర్శలకు బదులిస్తూ ఈ వర్గాల వెనుకబాటుతనంపై అన్ని రకాల అధ్యయనాలు పూర్తి చేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. ఎన్సీపీని మా కార్యకర్తలు నమ్మడం లేదు.. కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మహారాష్ట్రను గత 15 ఏళ్లుగా ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని ఎన్సీపీ పట్టుబట్టడంతో ఇరు పక్షా ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీట్ల పంపకాలపై చర్చలు స్తంభించాయి. ఎన్సీపీ వైఖరిపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ చర్యలన్నీ కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నట్టు తమ కార్యకర్తలు భావిస్తున్నారని చవాన్ చెబుతున్నారు. అయితే ఈసారి కూడా ఎన్సీపీతో కలసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ‘కాంగ్రెస్ను ఓడించాలని ఎన్సీపీ పలుసార్లు స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపింది. అందుకే మా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది’ అని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ తమకు 144 కేటాయించాల్సిందేనని ఎన్సీపీ అగ్రనాయకుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ కాంగ్రెస్ కంటే రెండు ఎక్కువ సీట్లు సాధించడంతో పవార్తోపాటు మరికొంద రు నాయకులు ఈ డిమాండ్ను లేవనెత్తారు. లేకుంటే ఒంటరిగానే పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై చవాన్ స్పందిస్తూ ‘అధిష్టానం సూచన మేరకు సీట్ల సర్దుబాటు గురించి నేను చాలా సార్లు ఎన్సీపీ వాళ్లతో మాట్లాడాను. అక్టోబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. ఇవి నాతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి పరీక్ష వంటివి. ఈసారి బీజేపీ ఓడిపోతే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధిం చిన విజయం పాలపొంగు వంటిదని ప్రజలు భావించే పరిస్థితి వస్తుం ది’ అని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. -
మెట్రోకు భూమిపూజ
సాక్షి, ముంబై: ముంబై మెట్రో-3 ప్రాజెక్టు పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుణే మెట్రో జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలపై సమాచారం అందకపోవడమే కారణమని తెలిపారు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై సమాచారం లభించడంతో తొందర్లోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం మరోల్లోని అంధేరీ-ఘాట్కోపర్ లింకు రోడ్డు (మరోల్ అగ్నిమాపక కేంద్రం) సమీపంలో జరిగింది. ఈ మెట్రో-3 ప్రాజెక్టును పూర్తిగా సొరంగాల ద్వారా భూగర్భంలో నిర్మిస్తారు. ఇది 2019 వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుమారు రూ.23,136 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. మెట్రో రాకతో ముంబైలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఇప్పటికే ఘాట్కోపర్-వర్సోవా మధ్య మెట్రోరైలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెట్రో-3 ప్రాజెక్టులో బాగంగా కొలాబా నుంచి సీప్జ్ వరకు మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
మోడల్పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!
ముంబయి: మోడల్పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ సునీల్ పరాస్కర్కు ఊచ్చు బిగుసుకుంటుంది. సునీల్ను విధులు నుంచి తొలగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవన్ వద్దకు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారి మంగళవారం ముంబైలో వెల్లడించారు. ఆయనకు ఇప్పటికే ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 25న ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై మాజీ అదనపు నగర కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్(57) ... 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్ను కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మలవానీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను కలసి పరాస్కర్పై ఫిర్యాదు చేసింది. మరోవైపు పరాస్కర్పై ఆరోపణలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సునీల్ను విధుల నుంచి తప్పించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర సర్కార్ సునీల్పై చర్యలకు ఉపక్రమించింది. -
పోటీకి రాజ్ దూరం
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. నాగపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నీ తనవేనని, ప్రస్తుతం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నాసిక్ లేదా ముంబైలో ఏదో ఒక శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని రెండు నెలల కిందట ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. కచ్చితంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇటు ప్రజల్లో, అటు ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు తాను పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఆందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా...? ఆ నియోజకవర్గానికే పరిమితమవుతాను. అందుకే పోటీకి దూరంగా ఉంటున్నాను. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ నావే’ అని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం తరువాత మే 31న మొదటిసారి బహిరంగా సభ ఏర్పాటుచేసి ప్రజల ముందుకు వచ్చారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి తన సత్తా ఏంటో నిరూపిస్తానని ప్రకటించారు. దీంతో ఠాక్రే కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి రాజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీచేయడం లేదని తాజాగా ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘మా కుటుంబంలో ఇంతవరకు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది మా ‘జన్యుపరమైన’ సమస్య’ అంటూ చమత్కరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం ఇస్తే మహారాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఏం చేస్తామో తెలియజేసే మార్గదర్శక నివేదికను (బ్లూప్రింట్) వచ్చే వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని ఈ సందర్భంగా రాజ్ స్పష్టం చేశారు. మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని ప్రశంసించిన ఠాక్రే ఆదివారం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటీవల నాగపూర్లో మోడీ సభను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బహిష్కరించడం సబబేనని అన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించి, అవమానించడం సరికాదన్నారు. చివరగా రాజ్ మాట్లాడుతూ కేవలం తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లోనేగాక మొత్తం 288 శాసనసభ స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. -
కావాలనే అవమానించారు
బీజేపీ హామీ ఇస్తేనే మోడీ సభలకు వెళ్తానని స్పష్టీకరణ సాక్షి, ముంబై: బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించేంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనబోనని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే షోలాపూర్ సభలో తనను అవమానించారని స్పష్టం చేశారు. షోలాపూర్లో మోడీ సభ సందర్భంగా కొందరు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చవాన్ ప్రసంగం ఆపాలని, మోడీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీంతో సీఎం ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి చెందినట్టు సీఎం చెప్పారు. తనతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు వ్యతిరేక ంగా బీజేపీ కార్యకర్తలు ఇలాగే వ్యవహరించారని విమర్శించారు. అందుకే తాము మోడీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని హామీ లభిస్తే ఆయన కార్యక్రమాలకు హాజరవుతానని పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పుణే మెట్రో లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై తాను అసంతృప్తి చెందలేదని సీఎం వివరణ ఇచ్చారు. మోడీ ఎలా బాధ్యుడు ? ప్రధాని సభల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రుల ప్రసంగాలను అభిమానులు అడ్డుకుంటే దానికి నరేంద్ర మోడీ ఎలా బాధ్యుడని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. షోలాపూర్ సభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రసంగాన్ని అడ్డుకున్న వాళ్లు గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచో రాలేదు. వీళ్లంతా మహారాష్ట్ర వాళ్లే. హర్యానా, జార్ఖండ్లోనూ అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఇలాగే పరాభవం జరిగింది’ అని శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. మోడీ భారీ ప్రజామద్దతుతో గెలిచారని, అందుకే ఎక్కడైనా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మూడు రోజుల క్రితం నాగపూర్లో జరిగిన మోడీ సభకు చవాన్ గైర్హాజరు కావడం దురదృష్టకరమని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. అక్కడి సభలో ప్రజల నినాదాలు గమనిస్తే కాంగ్రెస్పై వారికి ఎంత విముఖత ఉందో స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషించింది. యూపీఏ హయాంలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోందని సామ్నా వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సులు జరిగినప్పుడు మోడీని సవతి సోదరుడి మాదిరిగా చూసే వారని ఉద్ధవ్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ నాగపూర్లో మోడీ సభకు గైర్హాజరు కావాలని సీఎం చవాన్ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ప్రధాని సభల్లో ముఖ్యమంత్రులతో వ్యవహ రించే విధానం సరిగ్గా లేనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీసీసీ స్పష్టం చేసింది. షోలాపూర్ సభలో చవాన్ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీసీసీ అధ్య క్షుడు మాణిక్రావు ఠాక్రే ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నా రని విమర్శించారు. -
చవాన్ డుమ్మా కరెక్టే: నితిన్ రౌత్
నాగపూర్: ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి తమ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ గైర్హాజరు కావడాన్ని మహారాష్ట్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి నితిన్ రౌత్ సమర్థించారు. సోలాపూర్ లో మోడీ సభలో పరాభవం ఎదువడంతో చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులను అవమానించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు భూపిందర్సింగ్ హూడా, హేమంత్ సోరెన్కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది. -
సోరెన్కూ తప్పని అవమానం
మోడీ పర్యటన సభలో బీజేపీ కార్యకర్తల నిరసన ప్రజాస్వామ్యంపై అత్యాచారమన్న సొరేన్ మా సీఎంలపై కుట్ర: కాంగ్రెస్ రాంచీ: మహారాష్ర్ట, హర్యానా ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, భూపిందర్సింగ్ హూడాల తరహాలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది. రాంచీలో జరిగిన సభలో మోడీ సమక్షంలో సోరెన్ ప్రసంగించేందుకు మైకు వద్దకు రాగానే మోడీ మద్దతుదారులు అడ్డుతగిలారు. మోడీ అనుకూల నినాదాలతో సభను హోరెత్తించారు. సంయమనం పాటించాలంటూ మోడీ సూచించినా సోరెన్ ప్రసంగం ముగిసే వరకూ నినాదాలు చేశారు. ప్రధాని హర్యానా, మహారాష్ట్ర పర్యటనల్లోనూ హూడా, చవాన్లకు ఇదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రధాని సభకు చవాన్ గైర్హాజరయ్యారు. ప్రజాస్వామ్యంపై అత్యాచారం: సోరెన్ రాంచీ సభలో మోడీ మద్దతుదారులు తన ప్రసంగానికి అడ్డుపడటంపై జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేంఎంఎం) నేత హేమంత్ సోరెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై అత్యాచారంగా అభివర్ణించారు. సీఎం హోదాలో ప్రసంగిస్తున్న తనను మోడీ మద్దతుదారులు గేలి చేస్తూ అవమానించడం ఎంతో బాధించిందన్నారు. కాగా, మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని జేఎంఎం డిమాండ్ చేసింది. సీఎంల గేలి వెనక కుట్ర: కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను మోడీ మద్దతుదారులు ఎగతాళి చేయడం వెనక మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మద్దతుదారులను పురికొల్పడం ద్వారా సీఎంలను అవమానించే హక్కు ఎవరికీ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అంబికా సోని పేర్కొన్నారు. మోడీ సభలకు 500 మంది కార్యకర్తలను పంపి ఎగతాళి చేయించడం తమకు పెద్ద కష్టమేమీ కాదని...కానీ ఆ చర్య ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అగ్ర పథానికి దేశాన్ని అభివృద్ధి బాటలో అగ్ర పథానికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సమతౌల్య అభివృద్ధి అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. అదే సమయంలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. గురువారం జార్ఖండ్లో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాంచీ-ధరమ్జేగఢ్-సిపాత్ల మధ్య రూ. 1,600 కోట్లతో పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 765 కేవీ అంతర్రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. (తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన తొలి అంతర్రాష్ట్ర లింకు ఇదే. దీని ద్వారా తూర్పు ప్రాంతంలోని మిగులు విద్యుత్ను పశ్చిమ ప్రాంతం మీదుగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు బదిలీ చేసే వీలు కలుగుతుంది.) అలాగే దేవ్గఢ్ జిల్లాలోని జాసిదిహ్లో ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 109 కోట్లతో నిర్మించిన ఆయిల్ టర్మినల్ను ఆయన ప్రారంభించారు. ఉత్తర కరాన్పురాలోని ఛాత్రాలో ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంటు (ఒక్కోటీ 660 మెగావాట్ల సామర్థ్యంగల మూడు యూనిట్లు) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాంచీలో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ అభివృద్ధిలో గుజరాత్ను ఎన్నో రెట్లు అధిగమించగల సామర్థ్యం జార్ఖండ్కు ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల వెనకబడిపోయిందని...ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శంకుస్థాపన చేసిన ఉత్తర కరాన్పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును గత యూపీఏ ప్రభుత్వం పదేళ్లుగా పెండింగ్లో పెట్టి రాష్ర్ట ప్రజలకు అన్యాయం చేసిందని విమర్శించారు. తన ప్రభుత్వం ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీకి రావాల్సిన అవసరం లేకుండానే జార్ఖండ్కు ఏటా రూ. 400 కోట్ల లబ్ధి చేకూర్చేలా ఖనిజ మైనింగ్పై రాయల్టీని పెంచిందన్నారు. నిరంతర విద్యుత్కు ప్రాధాన్యం... జార్ఖండ్ పర్యటన అనంతరం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోడీ...నాగ్పూర్లోని మౌడాలో రూ. 5,459 కోట్ల వ్యయంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. అలాగే నాగ్పూర్లో మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని గ్రామాలకూ నిరంతర విద్యుత్ను అందించేందుకు తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి మహమ్మారిని రూపుమాపుతానన్నారు. -
ప్రధాని సభకు డుమ్మా
సాక్షి ముంబైః ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. ముందుగా పేర్కొన్నట్టుగానే వీరు ఈ కార్యక్రమాలను బహిష్కరించారు. వీరితోపాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి నితిన్ రావుత్ కూడా హాజరుకాలేదు. పుణే, షోలాపూర్లో ఇటీవల జరిగిన కార్యక్రమాల సందర్భంగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం తెలిసిందే. బొగ్గు కుంభకోణం, యూపీఏ అవినీతి వంటి అంశాలను ప్రస్తావించడంతో చవాన్ ఇబ్బందిపడ్డారు. మోడీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే నాగపూర్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లడంలేదని, ప్రభుత్వం తరఫున ఒక అధికారి మాత్రం వెళ్లనున్నట్టు పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయం సబబుకాదు: బీజేపీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ తీసుకున్న నిర్ణయం సబబుకాదని ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే పేర్కొన్నారు. అభివృద్ధిలో బాగంగా ఎంతో కీలకమైన ప్రాజెక్టుల కోసం నిర్వహించిన కార్యక్రమానికి స్వయానా ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని ప్రకటించడంపై మండిపడ్డారు. పృథ్వీరాజ్ చెప్పినట్టుగా ప్రధాని ఎవరినీ అవమానించలేదన్నారు. చవాన్ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. చవాన్ చర్య సరైందే: కాంగ్రెస్ నాగపూర్లో మోడీ సభకు గైర్హాజరు కావాలని సీఎం చవాన్ నిర్ణయం సరైందేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని సభల్లో ముఖ్యమంత్రులతో వ్యవహరించే విధానం సరిగ్గా లేనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీసీసీ స్పష్టం చేసింది. షోలాపూర్లో శనివారం నిర్వహించిన సభలో చవాన్ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్రావు ఠాక్రే ఆరోపించారు. -
సరిహద్దు వివాదం..
ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శివసేన మండిపడింది. మహారాష్ట్ర రాజకీయ పార్టీల వల్లే ఈ అంశం తీవ్రరూపం దాల్చుతోందని కన్నడ సీఎం విమర్శించారు. రామయ్య మాటలకు ధీటుగా బదులు చెప్పాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను మంగళవారం డిమాండ్ చేసింది. బెల్గాం వివాదంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సరిహద్దు గురించి మహారాష్ట్రతో ఎలాంటి వివాదమూ లేదని, మహాజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. దీనిపై సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదానికి మహాజన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ఒక్కటే మార్గమని రామయ్య స్పష్టీకరించారు. ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ అయినా ఈ విషయంలో రామయ్యకు ధీటైన బదులు చెప్పాలని సేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయం అభిప్రాయపడింది. బెల్గాం వివాద పరిష్కారానికి మహాజన్ కమిటీ ఒక్కటే పరిష్కారం చూపలేదని వ్యాఖ్యానించింది. స్వార్థప్రయోజనాల కోసం మహారాష్ట్ర నాయకులు బెల్గాం వివాదం సద్దుమణగకుండా చూస్తున్నారని రామయ్య విమర్శించారు. కర్ణాటక సరిహద్దు పట్టణం బెల్గాంలో ఇబ్బందిపడుతున్న 20 లక్షల మంది మరాఠీల గురించి మాట్లాడడం తప్పెలా అవుతుందని సామ్నా నిలదీసింది. కర్ణాటక అధికారులు మరాఠీలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈ సమస్య కొనసాగుతూనే ఉందని ఆరోపించింది. ‘ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న మరాఠీ ప్రజలకు రామయ్య కృతజ్ఞతలు చెప్పాలి’ అని పేర్కొంది. బెల్గాం యెల్లూర్ గ్రామంలో మహారాష్ట్రకు అనుకూలంగా ఒక ఉన్న సైన్బోర్డు తొలగింపుపై గత నెల హింస చెలరేగింది. దీనిపై చవాన్ రామయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనను సేన తీవ్రంగా ఖండించింది. ఇది కన్నడిగుల ఉగ్రవాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భగవత్ వ్యాఖ్యలకు ఉద్ధవ్ సమర్థన భారత్ హిందూదేశమన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాఖ్యలను శివసేన అధిపతి ఉద్ధవ్ఠాక్రే సమర్థించారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదని స్పష్టీకరించారు. బాల్ఠాక్రే కూడా ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారని, దీనిపై తమ వైఖరి మారబోదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రస్తుతం భారత్లో నివసిస్తున్న వారంతా హిందూ సంస్కృతి నుంచి వచ్చినవారేనని కూడా భగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ప్రణాళికాసంఘం రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించడానికి కూడా ఉద్ధవ్ తప్పుబట్టారు. ఆ సంఘంతో ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘సంఘం రద్దుపై చవాన్ అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లలో ప్రణాళికాసంఘం ప్రజలకు చేసిన మేలేంటో ఆయన తెలియజేయాలి’ అని అన్నారు. కాశ్మీరీ వేర్పాటువాద నేతతో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం చర్చలు జరపడంపై మాట్లాడుతూ ఇక నుంచైనా ప్రభుత్వం పాకిస్థాన్తో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పాక్ హైకమిషన్ చర్యకు నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఇరు దేశాల విదేశీ కార్యదర్శుల సమావేశాలను రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. -
జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ
రాయ్గఢ్ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాంతాన్ని సందర్శించడంతో తన జన్మ ధన్యమయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నవశేవాలో సెజ్కు శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. నౌకాశ్రయాల అనుసంధానానికి రూ.1,926 కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా భూమిపూజ నిర్వహించారు. షోలాపూర్లోనూ పవర్ గ్రిడ్ను ఆవిష్కరించారు. సాక్షి, ముంబై: ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్రలో తొలిసారిగా రాయగఢ్కు రావడంతో తన జన్మ ధన్యమయిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాచీన హిందూ నగర రాజధాని అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాయగఢ్ నవశేవాలో రూ.నాలుగు వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించబోయే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. నవశేవాలోని ‘జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్’ (జేఎన్పీటీ) సమీపంలో దీనిని నిర్మిస్తారు. బీజేపీ పాలనలో భూమిపుత్రులకు (అన్నదాతలు) అమిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై’ అన్న నినాదంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ చివర్లోనూ ఇదే నినాదం చేసి రాయగఢ్ ప్రజల మనసులను గెలుచుకున్నారు. అదేవిధంగా నౌకాశ్రయాల అనుసంధానం కోసం రూ. 1,926 కోట్లతో నిర్మించనున్న రహదారి ప్రాజెక్టుకు కూడా మోడీ భూమిపూజ నిర్వహించారు. భూమిపుత్రులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ విద్య,ఆరోగ్యంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయగఢ్ పర్యటనతో తన జన్మ ధన్యమయిందని వ్యాఖ్యానించినప్పుడు చప్పట్లు మార్మోగాయి. ఈ సెజ్ కారణంగా నష్టపోయిన రైతులకు ఈ సందర్భంగా మోడీ చేతుల మీదుగా భూములు పంపిణీ చేశారు. విలాస్ జోషి, బాలకృష్ణ ధరణే, మధుకర్, ఠాకూర్, కమలాకర్ ధరణే తదితరులకు భూమి పత్రాలు అందజేశారు. ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది... మనదేశానికి దిగుమతులకంటే ఎగుమతుల అవసరం అధికంగా ఉందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యువశక్తితో ఎగుమతులను వృద్ధి చేయవచ్చన్నారు. ‘ఓడరేవులు దేశానికి ప్రవేశద్వారాలుగా మారాలి. ఎగుమతుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడాలి. ఇలా జరిగితే మన జాతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమార్కెట్ లో మనదేశంసుస్థిరస్థానాన్ని సాధించగలుగుతుం ది. అంతర్జాతీయ విపణిలో సముద్రవాణిజ్యం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కం టెయినర్లు హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్నాయి. భవిష్యత్లో సముద్ర వాణిజ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని వివరించారు. అందుకే రేవు పట్టణాల్లో ‘సాగర్మాల’ పథకాలను ప్రారంభిస్తామని ప్రధాని ప్రకటించారు. వీటి వల్ల తీర ప్రాంతాలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. చవాన్.. ఆందోళన చెందకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 146 సెజ్ల గురించి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ముందుకు కదలడం లేదని అన్నారు. దీనిపై నరేంద్ర మోడీ స్పందిస్తూ సెజ్ల పురోగతిపై ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ‘రోగులను బాగుచేసేందుకు మంచి డాక్టర్ అవసరం. అలాంటి డాక్టర్ లభించారు. మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సమస్యలను మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్నారాయణ, ప్రతిపక్ష నాయకులు ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డేతోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తాం షోలాపూర్, న్యూస్లైన్: దేశవ్యాప్తంగా పుష్కలంగా విద్యుత్ను అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మారుమూల గ్రామాలకు సైతం 365 రోజులు విద్యుత్ను అందించడమే తమ లక్ష్యమన్నారు. షోలాపూర్కు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్న నరేంద్ర మోడి హోం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. షోలాపూర్-పుణే నాలుగు లైన్ల రహదారి, పవర్గ్రిడ్నును జాతికి అంకితం చేశారు. అలాగే షోలాపూర్-సంగారెడ్డి, షోలాపూర్-ఎడిషి వరకు నిర్మించబోయే నాలుగులైన్ల రహదారులకు శంకుస్థాపన చేశారు. గవర్నర్ కె. శంకర్నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎంపీ రవీంద్ర గైక్వాడ్, వినోద్ తావ్డే, దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే జపాన్ రాయబార కార్యాలయ అధికారులు, విద్యుత్శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘బీఎస్పీ.. బిజ్లీ(కరెంటు), సడక్ (రోడ్లు), పానీ (నీరు)కి తమ ప్రభుత్వం అత్యధికం ప్రాధాన్యం ఇస్తుంది. కరెంటు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటేనే మంచి దిగుబడి సాధిస్తాడు. సువిశాల రహదాలు ఉంటేనే ధాన్యాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మవచ్చు. మనదేశంలో వర్షాలకు కొదవ లేదు. ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. ఈ మూడూ సక్రమంగా ఉంటే రైతులు దేశంలో బంగారం పండిస్తారు. షోలాపూర్ పవర్గ్రిడ్ ద్వారా దేశంలోని నలుమూలలకూ విద్యుత్ సరఫరా చేయవచ్చు’ అని మోడీ అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సరిపడా బొగ్గు, గ్యాస్ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి చవాన్ విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్స్ హబ్లను ఏర్పాటు చేస్తున్నామని, మరమగ్గాలు అధికంగా ఉన్న షోలాపూర్ వంటి పట్టణాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ నాలుగులైన్ల రహదారులు, విద్యుత్ ఉత్పత్తికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే చవాన్ ప్రసంగం ప్రారంభించగానే.. జనం ‘వద్దు వద్దు’ అంటూ నినాదాలు చేయగా, మోడీ వారించారు. దీంతో కేవలం ఐదు నిముషాల్లో చవాన్ ప్రసంగం ముగిసింది. -
మధ్యతరగతికి సొంత ఇల్లు
ముంబై: రాష్ట్రంలోని నగరాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆయన మంత్రాలయ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముంబై సహా ఇతర మహా నగరాల్లో నివసిస్తున్న మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. త్వరలోనే దీనికోసం కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో మహారాష్ట్రను ‘ఆన్లైన్’ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చవాన్ చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తమకు కావాల్సిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చునన్నారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పారదర్శక, స్ఫూర్తిదాయక పాలన అందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పల్లెలకు సైతం ఈ పథకం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. తమ ప్రభుత్వం మరాఠాలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల వల్ల మైనారిటీ వర్గాలైన ముస్లింలు, మరాఠాలు ఉద్యోగ,విద్యా రంగాల్లో తగిన అవకాశాలు పొందగలుగుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్గాంధీ జీవన్దాయి ఆరోగ్య యోజన పథకం ద్వారా లబ్ధిదారులు పైసా ఖర్చు లేకుండానే తగిన వైద్య సేవలు పొందగలుగుతున్నారన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.62 లక్షల మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం వీరి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.712 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఇదిలా ఉండగా, నాగపూర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి నితిన్ రావుత్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెండో రాజధాని అయిన నాగపూర్ను దివంగత ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ ఆలోచనలకు రూపంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు డీఎఫ్ సర్కార్ కృషిచేస్తోందని అన్నారు. నగరానికి పశ్చిమంలో 1800 ఎకరాల్లో గోరెవాడా జూను అభివృద్ధిచేసేందుకు కార్యాచరణ రూపొంది స్తున్నామన్నారు. పుణ్యక్షేత్రమైన సుఫీ సెయింట్ బాబా తాజుద్దీన్ సమాధి వద్ద రూ.132.49 కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే ఆహార భద్రత చట్టం కింద సుమారు 7.17 కోట్ల మందికి ఆహార దినుసులను అందజేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.900 కోట్లు ఖర్చుపెడుతోందని రావుత్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కృష్ణ, పోలీస్ కమిషనర్ కె.కె.పాఠక్, డివిజనల్ కమిషనర్ అనూప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, గడ్చిరోలీ జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ‘మాఝీ ముంబై- నిర్మల్ ముంబై’ డ్రైవ్ ప్రారంభం ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ‘మాఝీ ముంబై-నిర్మల్ ముంబై’ అనే కార్యక్రమాన్ని ధారవిలో ప్రారంభించారు. నగరంలో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో చెత్త సమస్య చాలా ఎక్కువగా ఉంద న్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించనున్నట్లు చవాన్ వివరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. -
ప్రీమియం పన్ను రద్దు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయం ప్రాజెక్టు బాధితులకు అందజేసే స్థలంపై ‘ప్రీమియం పన్ను’ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రతి పాదనపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆమోద ముద్రవేశారు. దీంతో ఇక్కడి నివాసులకు, రైతులకు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొంతమేర ఊర ట లభించినట్లయింది. నవీముంబైలో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణం కోసం అనేక మంది తమ స్థలాలు కోల్పోయారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇలాంటి బాధితులకు నష్ట పరిహారంతోపాటు 22.5 శాతం ప్రత్యామ్నాయ భూములు ప్రభుత్వం అందజేయనుంది. అయితే ఈ భూములకు ‘లీజు ప్రీమియం పన్ను’ సిడ్కోకు చెల్లించాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. నవీముంబైలో ఉన్న స్థలాలన్నీ సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ఆధీనంలో ఉన్నాయి. ఈ స్థలాలను నివాసులకు, పరిశ్రమలకు, ఇతర ప్రయోజనాలకు 60 ఏళ్ల కోసం లీజుకు ఇచ్చింది. అందుకు సిడ్కో వీరి నుంచి లీజు ప్రీమియం వసూలు చేస్తోంది. ఇప్పుడు ప్రతిపాదిత విమానాశ్రయం ప్రాజెక్టు కోసం స్థలా లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం అందజేస్తున్న 22.5 శాతం భూమిపై లీజు ప్రీమి యం తీసుకోకూడదని సిడ్కో నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయం నిర్మాణం కోసం 2,268 హెక్టార్ల భూమి అవసరముండగా సిడ్కో ఆధీనంలో 1,572 హెక్టార్ల స్థలం ఉంది. అదనంగా 671 హెక్టార్ల స్థలం సేకరించాల్సి అవసరం ఏర్పడింది. సుమారు పది గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. అందుకు బాధితులకు పుష్పనగర్ ప్రాంతంలో 22.5 శాతం స్థలాన్ని అందజేయనున్నారు. ఈ స్థలానికి ఎలాంటి లీజు ప్రీమియం పన్ను వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో సిడ్కో సుమారు రూ.70 కోట్లు ఆదాయం కోల్పోయినట్లే. గతంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆం దోళనలు నిర్వహించారు. ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం, వివిధ ప్యాకేజీలు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు కొద్ది నెలలు అటకెక్కింది. చివరకు రాజ కీయ నాయకులు, స్థానిక ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. బాధితుల డిమాండ్ ప్రకారం ప్రత్యామ్నాయ స్థలం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే లీజు ప్రీమియం పన్ను విషయం తెరమీదకు వచ్చింది. దీనిపై ఎటూ తేలకపోవడంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ఎట్టకేలకు లీజు ప్రీమియం పన్ను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ముందుకురావడంతో ఓ పెద్ద సమస్య పరిష్కారమైందని ప్రజలు, అధికారులు భావిస్తున్నారు. -
ముంబై మెట్రో రైళ్లలో భద్రత డొల్ల
సాక్షి, ముంబై : మెట్రో రైళ్లలో మహిళలకు భద్రత కరువైంది. కొందరు ఆకతాయిలు ఒక బోగీ నుండి మరో బోగిల్లోకి తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మెట్రో రైల్లో ఓ యువతితో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వివషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలా ఫిర్యాదులకు నోచని సంఘటనలెన్నో ఉన్నాయి. ఈనేపథ్యంలో మెట్రో రైళ్లలో మహిళల కోసం ప్రత్యేక బోగీని కేటాయించాలన్న డిమాండ్ మరింత ఊపందుకొంది. ప్రత్యేక బోగీలు లేవు ఘాట్కోపర్-డీఎన్నగర్ల మధ్య నడిచే మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తీవ్రమైంది. ముఖ్యంగా మహిళ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక బోగీలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైళ్లలో నాలుగు బోగీలుంటాయి. ఒక బోగీ నుండి మరో బోగీలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఈక్రమంలో ఆకతాయిలు ఒకబోగీ నుంచి మరోబోగీలోకి వెళ్తూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మెట్రో రైలుకు ఉండే నాలుగు బోగీలల్లో ఒక బోగీని మహిళల కోసం కేటాయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ‘అన్ని ప్రాంతాల్లో సీసీటీవి కెమెరాలున్నాయని, మహిళల భద్రతకు ఎలాంటి ఢోకాలేదని ముంబే మెట్రోవన్ ప్రెవైట్లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) ప్రకటించింది’. కానీ, జూలై 4వ తేదీ జరిగిన సంఘటన అనంతరం మహిళ ప్రయాణికుల భద్రతపై తక్షణమే స్పందించాలని మహిళలు పట్టుబడుతున్నారు. రైళ్లలో మహిళల భద్రతపై ఘాట్కోపర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలి : ఎన్సీడబ్ల్యూ మెట్రో రైళ్లో మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలని ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా’ (ఎన్సీడబ్ల్యూ) మహారాష్ట్ర శాఖ డిమాండ్ చే స్తోంది. ఈ విషయంపై ఎన్సీడబ్ల్యూ మహారాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శుశిబేన్ షా మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కనీసం ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలోనైనా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బోగీ కేటాయించాలని అన్నారు. మెట్రో రైళ్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. -
గెలుపుగుర్రాలకే టికెట్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఈసారి గెలుపుగుర్రాలకే టికెట్లు లభిస్తాయని, వారిలో నాయకుల బంధువులు ఉండొచ్చు... ఉండకపోవచ్చునని సీఎం వ్యాఖ్యానించారు. ఆగస్ట్ క్రాంతి దినాన్ని పురస్కరించుకుని శనివారం సీఎం,పలువురు నాయకులు ఆగస్ట్ క్రాంతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. టికెట్ల కేటాయింపులో గెలుపు గుర్రాలకే పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు. ‘అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు.. వారిలో పలువురు మంత్రుల, బడానేతల కుమారులు, బంధువులు కూడా ఉన్నారు.. అయితే పోటీచేస్తానంటోంది నాయకుడి కుమారుడా, బంధువా అని చూడటం లేదు.. టికెట్ ఇస్తే సదరు వ్యక్తి గెలవగలడా..లేదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.. అటువంటి వ్యక్తులకే టికెట్ కేటాయించాలని స్పష్టం చేసింది..’ అని తెలిపారు. కాగా, ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపైనే సీఎం పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తనకు తగిన గుర్తింపునివ్వడం లేదని, ముఖ్యమంత్రి పనితీరు బాగాలేదని ఇటీవల మంత్రి పదవికి నారాయణ్ రాణే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పార్టీని కూడా వీడి వెళ్లనున్నట్లు ప్రకటించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీచేయాలని లేదని, పార్టీ అధిష్టానం ఆదేశాలనుసరించి పనిచేస్తానని ప్రకటించిన రాణే తన కుమారుడు అసెంబ్లీకి పోటీచేస్తాడని ప్రకటించారు. రాణే ప్రకటన తర్వాత సీఎం శనివారం పై విధంగా స్పందించడంపై పలురకాల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాణే సహా నాయకులెవరూ తమ పిల్లలు, బంధువులకు టికెట్ల కోసం సిఫారస్ చేయొద్దని సీఎం పరోక్షంగా హెచ్చరించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎటువంటి విధివిధానాలు పాటించనున్నారోననే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. -
ముప్పుగ్రామాలను గుర్తిస్తామని హామీ
ముంబై: అసమర్థ ముఖ్యమంత్రి.. అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను పృథ్వీరాజ్ చవాన్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆగడాలు కొనసాగకుండా అడ్డుపడుతున్నందునే తనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చవాన్ అనేక విషయాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో పారదర్శకతను తీసుకురావాలనుకున్నాను. ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాను. భూమి ధరల పెరుగుదల ఏ కొందరికో లాభం చేకూర్చదని భావించాను. రియల్ ఎస్టేట్ సెక్టార్ను ప్రక్షాళను చేశాను. ఈ నిర్ణయాలు కొందరికి ఇబ్బం దిని కలిగించాయి. దీంతో వారు నాపై లేనిపోని ఆరోపణలు చేయడం, వాటిని పనిగట్టుకొని ప్రచారం చేయడం ప్రారంభిం చారు. అవి నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ బిల్డరు ఎవరనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం నా వైఖరిని మార్చుకోకూడాదని నిర్ణయించుకున్నా. ప్రత్యర్థులు చేస్తున్నట్లు నేను అసమర్థుడినే అయితే కీలక నిర్ణయాలు ఎలా తీసుకునేవాడిని..? ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మరాఠా రిజర్వేషన్ బిల్లును సభముం దుకు తెచ్చే ధైర్యం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. 2000 మురికివాడలను క్రమబద్ధీకరిస్తామని 2004, 2009 ఎన్నికల్లో హామీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటిని నా ప్రభుత్వ హయాం లో పూర్తి చేశాం. కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలోనే నిలబెట్టాం. గుజరాత్తో రాష్ట్రాన్ని పోల్చేందుకు నేను ఇప్పటికీ సిద్ధ మే. మరాఠా ఎలా ముందుందో నేను వివరిస్తాను. పోషకాహార లోపాన్ని కూడా తగ్గించాం. నేను అసమర్థుడినైతే ఇవన్నీ ఎలా జరుగుతాయి. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా... పనిచేసినవారెవరో.. చేయనివారెవరో స్వయంగా మీరే నిర్ణయించుకోండి. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ కొంతమందికో ప్రయోజనం కలిగించడానికి కాద’న్నారు. రాణే విమర్శలను ఎప్పుడో మర్చిపోయా... తనపై విమర్శలు చేస్తూ.. తన పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రిపదవికి రాజీనామా చేసిన రాణేపై చవాన్ సానుభూతి ధోరణి కనబర్చారు. రాణే చేసిన విమర్శలన్నింటిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఉధ్వేగంతో ఆయన ఏవేవో మాట్లాడారని, వాటన్నిం టిని నేను మర్చిపోయానని,కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాటిని మర్చిపోయారని తాను ఆశిస్తున్నానన్నారు. -
బదిలీలుంటే చేసుకోండి
సాక్షి, ముంబై: ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రాకముందే ఉద్యోగుల బదిలీలు ఎవైనా ఉంటే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించించింది. దీంతో ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఎన్నికల సంఘం చేసిన సూచన విషయం తె లుసుకున్న అధికారులు బదిలీల కోసం ఫైరవీలు మొదలుపెట్టారు. తాము కోరుకున్న స్థానాలకు పంపేలా సంబంధిత మంత్రులు, శాఖల అధిపతులకు అర్జీలు పెట్టుకుంటున్నారు. కీలక బదిలీలపై చవాన్ దృష్టి... కీలకమైన శాఖల్లో అధికారుల బదిలీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్వయంగా దృష్టి సారించారు. బదిలీలకు సంబంధించిన ప్రతీ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు పంపిస్తున్నారు. దీంతో తమకు నచ్చిన చోటకు బదిలీ చేయాలని పైరవీలు చేసుకున్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు కలవరం మొదలైంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు తమకు ఫలానా శాఖకు, ఫలాన చోటుకు బదిలీ చేయాలని కోరుతూ మంత్రులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా ముఖ్యమంత్రి తీరుతో జాగ్రత్తపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బదిలీ ప్రక్రియ జూన్ ఆఖరు వరకు పూర్తి చేయాలి. ఆ తరువాత జరిగే బదిలీల ప్రక్రియ ప్రత్యేక అంశంగా పరిగణించి చేస్తారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయనే ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు విధించారు. పోలీసు, రవాణ, రెవెన్యూ, నగరాభివృద్థి, ప్రజాపనులు తదితర కీలకమైన శాఖలకు బదిలీ కావాలంటే అధికారులు భారీగానే అవినీతికి పాల్పడతారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలకమైన శాఖల బదిలీలపై చవాన్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఎలాంటి సిఫార్సులకు తావీయకుండా ఎవరిని, ఏ శాఖకు బదిలీ చేయాలనే విషయంలో చవాన్ స్వయంగా తుది నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు. వారంరోజుల కిందట పోలీసు శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్, ఇతర సీనియర్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రకియకు ముందు ముఖ్యమంత్రి చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రతి అధికారి ఫైలును చవాన్ స్వయంగా పరిశీలించారు. నియమాలకు లోబడి ఉన్న అధికారులను మాత్రమే బదిలీ చేశారు. రవాణ, రెవెన్యూ లాంటి కీలకమైన శాఖల బదిలీలను కూడా చవాన్ ఇదే పద్ధతిలో చేపట్టారు. కొందరు అధికారులు మంత్రుల అండచూసుకొని తమ తమ బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారి ఆటలు సాగలేకపోయాయి. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో చవాన్ అదే పద్ధతిలో ముందుకు సాగుతారని చెబుతున్నారు. దీంతో బదిలీలపై ఆశలు పెట్టుకున్న అధికారులకు చివరకు నిరాశే మిగిలే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. -
‘చేయి’జారలే..!
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని కూడా వీడనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు మాణిక్రావ్ మంత్రాంగంతో తెరపడింది. నారాయణ రాణే జులై 21న మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో రాణే పార్టీని వీడనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాణేను బుజ్జగించేందుకు అధిష్టానం మాణిక్రావ్ ఠాక్రేను రంగంలోకి దించింది. వీరిమధ్య మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం రాణే తన రాజీనామాను వెనక్కితీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, మంత్రిపదవిలోనూ కొనసాగుతానని స్వయంగా రాణే ప్రకటించారు. ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రేతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలోని ధ్యానేశ్వరి నివాసస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ... మంత్రి పదవిని చేపట్టి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను నెరవేరుస్తామని పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిందని చెప్పారు. ఈసారి మాట తప్పబోమంటూ పార్టీ చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాన్నారు. మంత్రిపదవికి చేసిన తన రాజీనామాను ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇంత వరకు స్వీకరించలేదన్నారు. దీంతో తాను మంత్రి పదవిలో కొనసాగడంతోపాటు పార్టీలో క్రియశీలంగా వ్యవహరించనున్నట్టు స్పష్టం చేశారు. మూడు నెలలు అధ్యక్ష పదవి కావాలి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడునెలపాటు తనను అధ ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానాన్ని కోరానని, బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాణే వివరణ ఇస్తూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని భావించానని, విషయాన్ని అధిష్టానానికి తెలిపానన్నారు. అయితే ఈసారి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కోరిందని, దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాణే స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు తన కుమారుడు నితేశ్ రాణే పోటీ చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ఉద్దవ్పై మండిపాటు... శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివసేనలో చేరిన దీపక్ కేసర్కర్పై రాణే తీవ్రంగా మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కేవలం శివసేన అధినేత దివంగత బాల్ఠాక్రే కారణంగా ఉద్ధవ్కు రాజకీయాల్లో చోటు దక్కిందనే విషయం మరచిపోవద్దని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా అసెంబ్లీలో కూడా అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని కలలు కంటున్న ఉద్ధవ్కు భంగపాటు తప్పదన్నారు. ఎన్సీపీని వీడి, శివసేన పార్టీలో చేరి దీపక్ కేసర్కర్పై కూడా రాణే విమర్శలు కొనసాగించారు. ఎమ్మెల్యేగా విఫలమైన కేస్కర్ శివసేనలో చేరారని, అసలు కేస్కర్ ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి పనులే మా ఎజెండా... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ది పనులే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. మంచిరోజులు వస్తాయంటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజలను మోసగించారని, ఆయన పాలనలో ధరలు మరింతగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి రాష్ట్ర ప్రజలు మోడీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
'సోషల్ మీడియాలో ప్రచారం చేయండి'
నాగపూర్: రాజకీయ నాయకులు సోషల్ మీడియా మంత్రం జపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సామాజిక సంబంధాల వెబ్సైట్లను వాడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మీడియాను సమర్థవంతంగా వాడాలని పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ టెక్నాలజీని మనదేశంలోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి చెందినప్పటికీ వాటిని వినియోగించడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చవాన్ అన్నారు. -
ఆదుకుంటాం: సీఎం పృథ్వీరాజ్ చవాన్
సాక్షి, ముంబై: పుణే జిల్లా అంబేగావ్ తాలూకాలోని మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. మాలిన్ గ్రామప్రజలందరికీ పునరావాసం కల్పించనున్నట్టు చెప్పారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. దీంతోపాటు ఈ సంఘటనలో గాయపడినవారందరికీ చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించనుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామం దాదాపు భూస్థాపితమైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 53 మంది మృతి చెందారని వీరిలో 25 మంది మహిళలు, 21 మంది పురుషులు, ఏడుగురు చిన్నారులున్నట్టు చెప్పారు. ఇంకా 100 మందికిపైగా శిథిలాల కింద ఇరుక్కుని ఉన్నారని భావిస్తున్నారు. వర్షం, బురద కారణంగా శిథిలాల తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ యుద్ధప్రాతిపదికపై ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. ముందుకు వచ్చిన ముంబై ‘డబ్బావాలా’లు... మాలిన్గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ముంబై డబ్బావాలాలు ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయం చేసేంత స్థోమత లేకున్నప్పటికీ తమదైన పద్ధతిలో మాలిన్ వాసులకు సహాయం చేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ముంబైలోని సుమారు రెండు లక్షల మందికి భోజనం డబ్బాలతోపాటు మాలిన్ గ్రామ ప్రజలకు సాయం చేయాలని కోరుతూ ఓ లేఖను అందించనున్నారు. దీంతోపాటు అంధేరిలోని ‘డబ్బావాలా గోవింద పథక్’ (డబ్బావాలా ఉట్టికొట్టే మండలి)’ ఉట్టీలు పగులకొట్టి గెలుచుకున్న నగదులోనుంచి కొంత మాలిన్గ్రామంలోని చిన్నారులకు అందించనున్నట్టు ప్రకటించారు. రూ. 50 లక్షల సాయం ప్రకటించిన సిద్ధివినాయకుని మందిరం... మాలిన్ వాసులకు అండగా నిలిచేందుకు ముంబై ప్రభాదేవిలోని సిద్ధివినాయకుని ఆలయ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గ్రామ పునరావాసం కోసం రూ. 50 లక్షల సాయం అందించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నరేంద్ర రాణే ప్రకటించినట్లు ట్రస్టు సభ్యుడు ఏక్నాథ్ సంగం ‘సాక్షి’కి తెలిపారు. ముందుకు వస్తున్న అనేక సంస్థలు... సర్వం కోల్పోయిన మాలిన్ గ్రామప్రజలకు అండగా నిలిచేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. బాధితుల కోసం ఆరు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు మంచర్ రోటరి క్లబ్ పేర్కొంది. విఘ్నహర చక్కెర పరిశ్రమ రూ. అయిదు లక్షల మద్దతును ప్రకటించింది. ఇదిలా ఉండగా మంచర్లోని రేణుకామాతా పొదుపు సంఘం (రేణుకామాతా బచత్ ఘట్), బిన్దాస్ పొదుపు సంఘం (బిన్దాస్ బచత్ఘట్)లు సహాయక చర్యలు చేపడ్తున్న ప్రజలకు, గాయాలైనవారి కోసం భోజన సదుపాయాలు కల్పిస్తోంది. మాలిన్గ్రామంలోని 16 మందికి జీవితా బీమా పాలసీలు ఉన్నాయని, వారి కుటుంబీకులకు వీలైనంత త్వరగా క్లైమ్లు ఇప్పేంచేందుకు ప్రయత్నిస్తామని ఎల్ఐసీ అధికారులు హామీ ఇచ్చారు. మాలిన్ గ్రామాన్ని గురువారం సందర్శించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మృతుల కుటుంబీకులకు రూ. రెండు లక్షల చొప్పున మద్దతు ప్రకటించడంతోపాటు మాలిన్గ్రామం పునరావాసం కోసం రూ. 50 లక్షలను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 10 వేల డాలర్ల సాయం ప్రకటించింది. కొనసాగుతున్న గాలింపు సాక్షి, ముంబై: ‘మాలిన్’ ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గ్రామంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులైనప్పటికీ శిథిలాల కింద ఇరుక్కున్నవారందరినీ బయటికి తీయడానికి బురదతోపాటు వర్షం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల మేరకు మృతుల సంఖ్య 63కు చేరింది. అక్కడి పరిస్థితులను బట్టి కనీసం మరో మూడు నాలుగు రోజులపాటు శిథిలాల తొలగింపు పనులు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మూడు రోజులు కావస్తుండడంతో శిథిలాల కింద ఇరుక్కున్నవారు ప్రాణాలతో ఉండేందుకు ఆస్కారాలు సన్నగిల్లినట్టేనని భావిస్తున్నారు. పలువురి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. బాధితులకు ఆఠవలే పరామర్శ ముంబై: మాలిన్ గ్రామ అభివృద్ధికి రాజ్యసభలో తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆర్పీఐ అధినేత ఆఠవలే ప్రకటించారు. ఆయన శుక్రవారం మాలిన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. సహాయక కార్యక్రమాలను ఇంకా విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను వీలైనంత త్వరగా బయట తీయడానికి కృషిచేయాలన్నారు. గ్రామస్తులందరికీ పునరావాసం కల్పించాలన్నారు. కొండల అంచుల్లో ఉన్న ఇతర గ్రామాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘మాలిన్’ ఘటన పునరావృతం కానివ్వం : కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మాలిన్’ ఘటనను పునరావృతం కానివ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనుమల అంచుల్లో ఉన్న గ్రామాల రక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాస్త్రీయ అధ్యయనం జరిపి, తగిన నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కాగా, ఇటువంటి ఘటనలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)ను ఆదేశించామన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. -
‘పాల్ఘర్’ పాలన షురూ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో 36వ జిల్లా అవతరించింది. ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారికంగా ప్రారంభించారు. దీంతో స్థానికుల 29 యేళ్ల కల నిజమైనట్లయ్యింది. ఈ జిల్లాలో మొత్తం ఏడు (పాల్ఘర్, వసాయి, డహాణూ, జవ్హార్, మోఖాడా, విక్రమ్గఢ్, తలాసరీ, వాడా) తాలూకాలున్నాయి. దీంతో ఠాణే జిల్లాలో ప్రస్తుతం ఏడు (ఠాణే, కళ్యాణ్, ఉల్లాస్నగర్, అంబర్నాథ్, ముర్బాడ్, భివండీ, షాపూర్) తాలూకాలే మిగిలాయి. పాల్ఘర్ జిల్లా ఏర్పాటును జవార్, విక్రమ్ఘడ్, తలాసరి, మోఖాడా తదితర తాలూకాలోన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి సంబంధించి నల్లజెండాలను కూడా ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు. ఇది మినహా జిల్లా అవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్ఘర్ సెషన్కోర్టు సమీపంలోని సేల్స్టాక్స్ నూతన భవనంలో జిల్లా కార్యాలయాన్ని పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. వర్షం కారణంగా పాల్ఘర్కు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్ జిల్లా అవిర్భావోత్సవ కార్యక్రమం జాప్యం కాకుండా ఉండేందుకు రైలుమార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆయన బాంద్రా-వాపి షటిల్ రైల్లో పాల్ఘర్కు చేరుకున్నారు. అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మళ్లీ పాల్ఘర్ రైల్వేస్టేషన్ నుంచి గుజరాత్ ఎక్స్ప్రెస్లో ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరాత్, వసంత్ డావ్కరే, జిల్లా ఇంచార్జీ మంత్రి గణేష్ నాయిక్లతోపాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాల కిందటే ఠాణేను విభజించి, పాల్ఘర్ లేదా జవార్ జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ అధికారికంగా 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న శరద్పవార్ జిల్లా విభజన అవసరమని చెప్పారు. రాజకీయంగా... ఠాణే జిల్లా విభజన అనంతరం కూడా ఠాణే జిల్లానే రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. కాగా, జిల్లా విభజన అనంతరం జిల్లా విస్తరణ, క్షేత్ర విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఠాణే జిల్లా కంటే పాల్ఘర్ పెద్ద జిల్లాగా అవతరించింది. రాజకీయపరంగా పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు ఠాణేకే పెద్దపీట వేశారు. పాత జిల్లాలో నాలుగు లోకసభ, 22 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. కాని విభజన అనంతరం పాల్ఘర్ జిల్లాలో కేవలం ఒక లోకసభ (పాల్ఘర్) మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే ఠాణేలో మాత్రం మూడు లోక్సభ (ఠాణే, భివండీ, కళ్యాణ్), 18 అసెంబ్లీ నియోజకవర్గాలుండనున్నాయి. -
మరమగ్గాలకు చేయూత
షోలాపూర్, న్యూస్లైన్ : పట్టణంలోని మరమగ్గాల పరిశ్రమల యజమానులకు శుభవార్త. ఎన్నో ఎళ్లుగా పరిశ్రమలు నడుపుతూ అప్పులపాలయ్యారు. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు తీర్చేస్థోమత కూడా లేకుండా పోయింది. సంక్షేమం చతికిలబడింది. ఇలాంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న యజమానులకు కాసింత ఊరట లభించింది. పట్టణంలోని 472 మరమగ్గాల పరిశ్రమల యజమానులకు 50 శాతం రుణ మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వస్త్ర పరిశ్రమ, సహకార, ఆర్థిక శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయాన్ని మరమగ్గాల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధర్మన్న బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముంబైలోని సహ్యద్రి అతిథి గృహంలో సీఎం చవాన్, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ శిందే, ఎంఎల్ఏ ప్రణతి శిందే,ఆయా శాఖల కార్యదర్శులు మంగళవారం మరుమగ్గాల పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. మరమగ్గాల యజమానుల పలు సమస్యలను ఎమ్మెల్యే శిందే సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ‘ఈ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ప్యాకేజీని ప్రకటించాలి. మరమగ్గాల వారికి నాగరి సహకార బ్యాంక్ మూత పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విధించిన రుణంపై వడ్డిని తాత్కాలికంగా మాఫీ చేసి ఓటీఎస్ పథకం వర్తించేలా చూడాలని సీఎం సహకార శాఖ కార్యదర్శిని ఆదేశించారు. మరమగ్గాల సహకార సంస్థలకు కూడా ఈ పథకం వర్తించే అంశంపై మంత్రి వర్గ సమావేశానికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. వీటితో పాటు మరమగ్గాల వారికి రుణ మాఫీ సదుపాయం, మరమగ్గాల కార్మికుల సంక్షేమ మండళ్ స్థాపించడానికి రుణ మాఫీ 50 శాతం అంటే రూ. 17 కోట్ల 50 లక్షలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారని’ ధర్మన్న వివరించారు. ఈ మేరకు చేనేత సొసైటీ రుణ మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో కృష్ణారి చిన్ని, కార్పొరేటర్ అనిల్ పల్లి, సింద్రం గంజి, రాజు రాఠి, చంద్రకాంత్ దయమాలతో పాటు భివండీకి చెందిన మహేష్ చిలువేరి పాల్గొన్నారు. -
భ్రమలు తొలగుతున్నాయ్!
మోడీ సర్కార్ పనితీరుపై సీఎం చవాన్ విమర్శ ముంబై: నరేంద్ర మోడీ సర్కార్ పనితీరుపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నరేంద్రమోడీ కాస్తా మౌనేంద్ర మోడీ అయ్యారంటూ విమర్శించారు. మోడీ ప్రభుత్వంపై ఉన్న భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగతున్నాయని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడమే అందుకు నిదర్శనమన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీపై, ఎన్డీయే ప్రభుత్వ పనితీరుపై చవాన్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘గుజరాత్లో మోడీ పాలన నిరంకుశంగా సాగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఢిల్లీలో కూడా అటువంటి పాలనే కొనసాగుతోంది. మోడీ అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనను ఎదుర్కోవాల్సిందంటూ ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మోడీ ప్రభుత్వంలో మంత్రులకు విలువ లేకుండా పోతోంది. ఆయన కూడా అన్ని విషయాలకు మౌనమే సమాధానమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కీలక విషయాలపై కూడా మోడీ నోరు విప్పడంలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా తమ ప్రభుత్వ విధానం ఇలా ఉంటుందంటూ మోడీ చెప్పలేదు. విదేశాంగ విధానం గురించి కూడా ఎన్డీయే ప్రభుత్వం తన విధానమేంటో వెల్లడించలేదు. సామాజిక సమస్యలు, ఆర్థిక వ్యవహారాల కూడా మోడీ వైఖరి ఏమిటో ఇప్పటికీ స్పష్టం కావడంలేదు. వారికి ఆర్ఎస్ఎస్ నిర్ణయం శిరోధార్యంగా మారింది. కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్మేందుకు ప్రత్యర్థి కంపెనీల ఉత్పత్తులపై విమర్శలు చేసి అమ్ముకుంటాయి. అధికారంలోకి వచ్చేందుకు మోడీ కూడా ఎన్నిలకు ముందు కాంగ్రెస్పై విమర్శలు చేసి ప్రధాని అయ్యారు. మోడీ పాలనను, కాంగ్రెస్ పాలనతో బేరీజు వేసుకోవడం ప్రజలు అప్పుడే మొదలుపెట్టారు. మోడీ పాలన నుంచి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని ఆశించలేం. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేవీ ప్రజోపయోగంగా ఉండడంలేదు. ఆయన ప్రజల పక్షాన నిలిచి ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత నిరంకుశంగా ఉంటున్నాయో తెలిసేది. కానీ ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలు ఆయనకు కనిపించడంలేదు. ట్విటర్లో గొప్ప గొప్ప రాతలు కనిపిస్తున్నాయి. నిజానికి అవి మోడీ రాస్తున్నారో... లేక ప్రతిభావంతులైన మరే ఇతర అధికారులు రాస్తున్నారో తెలియడంలేదు. బీజేపీలో ప్రతిభావంతులకు కొదవలేదు. అయితే మోడీ మాత్రం వారిని ఉపయోగించుకోవడానికి సందేహిస్తున్నారు. మంత్రులను అనుమానించే సంస్కృతి బీజేపీలో ఇటీవలే బయటపడింది. గుజరాత్తో పోలిస్తే మహారాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ. ఏ రకంగా చూసిన మహారాష్ట్ర, గుజరాత్ కంటే ముందంజలోనే ఉంద’న్నారు. ఎన్సీపీతో కలిసే ఎన్నికలకు... భాగస్వామ్య పార్టీ ఎన్సీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మరోసారి స్పష్టం చేశారు. మతతత్వ పార్టీలను ఎదుర్కోవాలన్నా, సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండాలన్నా మరోసారి కూటమిగానే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు పోట్లాడుకుంటే ప్రయోజనం పొందేవి మతతత్వ పార్టీలేనని, వాటికి ఆ అవకాశం ఇవ్వబోమని చవాన్ స్పష్టం చేశారు. అయితే ఇటీవల మంత్రిపదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపై విమర్శలు చేసేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్ర ప్రజల క్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని, సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లడం సరికాదంటూ సున్నితంగా చురకలంటించారు. ఇక సీట్ల పంపకాల గురించి మాట్లాడుతూ.. ఎన్సీపీతో సీట్ల పంపకాలపై చర్చలు సరైన సమయంలోనే జరుగుతాయన్నారు. ఇప్పటికే సూచనప్రాయంగా ఒప్పందం కుదిరిందని, దాదాపుగా అదే ఖరారవుతుందన్నారు. అయితే ఈ ఒప్పందం ఒకరికొకరు సహకరించుకునేలా ఉంటుందని మాత్రమే చెప్పారు. -
సరిహద్దు లొల్లి..
సాక్షి, ముంబై: కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ మరాఠీ ప్రజలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. కర్ణాటక పోలీసులు యెళ్లూర్ గ్రామంలోని మరాఠీ ప్రజలను ఇళ్లల్లోకి చొరబడి చితకబాదారు. ఇది చాలా అమానుష’ మంటూ దుయ్యబట్టారు. భారత్-పాక్ సరిహద్దు అంశం ఎంత కీలకమైనదో.., శివసేనకు కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం కూడా అంతే కీలకమైనదని ఉద్దవ్ నొక్కి చెప్పారు. సరిహద్దులోని యెల్లూర్ సంఘటనపై సోమవారం ప్రచురితమైన ‘సామ్నా’ సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక తీరుపై మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సంఘటనపై ఏపార్టీ నాయకులూ ఎందుకు నోరు విప్పడంలేదని నిలదీశారు.‘ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ సంఘటనపై అన్ని పార్టీలూ రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించాయి. మరి ఈ ఘటనపై ఎవరూ ఎందుకు నోరు విప్పడంలేదో అర్థం కావడంలేదు.. ఇది మన ఆత్మగౌరవ సమస్య..’ అని అన్నారు. సరిహద్దులోని మరాఠీ ప్రజలకు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ భవిష్యత్తులో ఎటువంటి దుర్ఘటనలు జరిగినా కేంద్రం బాధ్యత వహించాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో కొన్నేళ్లుగా సమస్య నడుస్తోంది. సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న మరాఠీలు తమను కర్ణాటక ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని ఎప్పటినుంచో ఉద్యమం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఐదు దశాబ్దాల కిందట యెళ్లూర్లో ఏర్పాటుచేసిన మహారాష్ట్ర రాజ్-యెళ్లూర్’ అనే హోర్డింగ్ను పోలీసులు శనివారం తొలగించారు. దిమ్మెను పగలగొట్టేశారు. దాంతో స్థానిక మరాఠీలు ఆందోళనకు దిగడంతో కర్ణాటక పోలీసులు మరాఠీయులను చితకబాదారు. శని,ఆదివారాల్లో జరిగిన ఘటనలో సుమారు 50మందికి పైగా మరాఠీలు గాయపడ్డారు. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ముంబైలో కర్ణాటక సంఘం, భవనం కూడా ఉన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో వాళ్లు హోటల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి స్థానిక మరాఠీలు ఎన్నడూ ఎటువంటి హానీ తలపెట్టలేదు. కాని కర్ణాటకలో ఉన్న మరాఠీయులను మాత్రం స్థానిక ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది..’ అని ఠాక్రే విమర్శించారు. ఇదే విషయమై గతంలో బేల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం మరాఠీ ప్రతినిధులే విజయం సాధించారని.. దీన్ని బట్టి అక్కడి స్థానికుల్లో ఉన్న ఆకాంక్షను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలకు కేంద్రం న్యాయం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎంకు పృథ్వీరాజ్ చవాన్ ఫోన్.. యెళ్లూర్ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసే చర్యలకు దిగకూడదని హితవు పలికారు. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషిచేయాలన్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే మాట్లాడుతూ ముంబైలో కర్ణాటక దినోత్సవాన్ని జరగకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే ముంబైలోని డబ్బావాలాలు సైతం కర్ణాటకలో మరాఠాలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఆందోళన నిర్వహించారు. యెళ్లూర్ ఘటన జరిగి ఉండాల్సింది కాదని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘటనకు కారకులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, సరిహద్దు గ్రామాల్లో శాంతిస్థాపనకు కృషిచేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. -
కాంగ్రెస్ను గౌరవిస్తేనే ఎన్సీపీతో పొత్తు: చవాన్
ముంబై: కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తేనే ఎన్సీపీతో పొత్తు ఉంటుందని, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘ఆత్మగౌరవంపై మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు గౌరవం దక్కనట్లయితే.. మేము కూటమిలో కొనసాగలేం. సొంతంగానే పోరాడతాం’ అని గురువారం చవాన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు ఎన్సీపీ అంగీకరించని నేపథ్యంలో చవాన్ పైవిధంగా స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే.. అందులో సగం అంటే 144 సీట్లు ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి వరకూ ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. -
మా పార్టీని గౌరవిస్తేనే పొత్తు
ముంబై: కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తేనే ఎన్సీపీతో పొత్తు ఉంటుందని, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘ఆత్మగౌరవంపై మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు గౌరవం దక్కనట్లయితే.. మేము కూటమిలో కొనసాగలేం. సొంతంగానే పోరాడతాం’ అని గురువారం చవాన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు ఎన్సీపీ అంగీకరించని నేపథ్యంలో చవాన్ పైవిధంగా స్పందించారు. మహారాష్ట్రలో అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే.. అందులో సగం అంటే 144 సీట్లు ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి వరకూ ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంతప్తిగా ముగిశాయి. దీనిపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ను ప్రశ్నించగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం బలహీనంగా ఉన్న కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేస్తే అది బీజేపీ-శివసేనలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో పొత్తు ఉన్నా లేకున్నా.. ఆగస్టు 7 నాటికి అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. -
చేజేతులా అసమ్మతి!
పూలమ్మినచోటే కట్టెలు అమ్మడం అంటే ఏమిటో ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి అనుభవంలోకి వస్తున్నది. పార్టీలో పదవి ఉన్నా లేకున్నా ఆయన తిరుగులేని నాయకుడిగానే చలామణి అయ్యారు. కానీ, అదేం ప్రారబ్ధమో ఆయనకూ, విజయానికీ ఎప్పుడూ చుక్కెదురే. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను స్వీకరించి, ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరి పోరు వ్యూహాన్ని ఖరారుచేశారు. ఇది బెడిసికొట్టి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఏణ్ణర్ధంక్రితం కీలకమైన పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకున్నాక విలేకరుల సమావేశాలు పెట్టి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ప్రారంభించారు. ప్రధానితోసహా ఎవరినీ ఏనాడూ వద ల్లేదు. కేవలం వారసత్వంవల్లే ఇలా మాట్లాడే వెసులుబాటు కలిగినా... అవకాశం వచ్చినప్పుడల్లా వారసత్వ రాజకీయాలనూ చెరిగిపారేశారు. అధికారానికి చేరువగా ఉన్నా ఆయన తనను తాను తటస్థుడిగా భావిం చుకుని అధికారం విషంతో సమానమని మాట్లాడారు. అది తనకు సరిపడని విషయమన్నట్టు చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాళ్లకు బలపం కట్టుకు తిరిగినా ఓటర్లు ఆ పార్టీని కనికరించక రెండం కెల స్థానాలకు సరిపెట్టారు. ఫలితంగా పార్టీలో ఒక్కో గొంతే ధిక్కార స్వరం వినిపిస్తున్నది. మిత్రులు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. అసోంలో విద్యామంత్రి, సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్పై నిప్పులు చెరిగారు. మంత్రి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిం చారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ నాయకత్వంలో తాము పనిచేయలేమని అక్కడి మంత్రి నారా యణ్ రాణే నిర్మొహమాటంగా చెప్పారు. ఇలాంటి ‘విఫల నేతల’తో కలిసి ప్రయాణించి పార్టీకి దాపురించబోయే ఓటమిలో భాగస్వామిని కాదల్చుకోలేదన్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది ఆఖరుకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసోం అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండుచోట్లా తిరుగు బాటు చేసిన నేతలకు ముఖ్యమంత్రి పదవు లపై మోజున్న మాట నిజమే. నారాయణ్ రాణే అయితే కాంగ్రెస్లో చేరిననాడే తనకు ముఖ్యమంత్రి పదవిని స్తామని వాగ్దానం చేశారని నేరుగా చెప్పారు. ఇలాంటి స్థితి ఏర్పడటానికి ఎవరినైనా తప్పుబట్టేముందు పార్టీ అధినేతలు తమను తాము ప్రశ్నించుకోవాల్సి ఉంది. రాష్ట్రాల్లోని లెజిస్లే చర్ పార్టీల మనోగతాన్ని లెక్కచేయకుండా సీల్డ్ కవర్లలో నిర్ణయాలను పంపి రుద్దే వైఖరే ఇలాంటి అసంతృప్తికి కారణమవుతున్నది. ఎమ్మెల్యే లందరూ మెచ్చినవారికి పట్టంగడితే అలాంటివారు స్థానికంగా బలపడ తారేమో, తమకు పక్కలో బల్లెంలా మారతారేమోనన్న భయంతోనే ఈ సీల్డ్ కవర్ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. పృథ్వీరాజ్ చవాన్ అలా వచ్చినవారే. ఇక తరుణ్ గోగోయ్ విషయానికొస్తే ఆయన నాయక త్వంలో వరసగా మూడుసార్లు పార్టీ అసోంలో విజయం సాధించినా ఆయనను అదుపులో ఉంచుకోవడం కోసం అసంతృప్తవాదులను ఎప్ప టికప్పుడు పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. ఏతావాతా రెండు చోట్లా ఇప్పుడు పార్టీకి సంకట స్థితి దాపురించింది. రాహుల్గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు కట్టబెట్టాక ఆయన ఇలాంటి ధోరణులను అరికట్టడంపై దృష్టి సారించివుంటే వేరుగా ఉండేది. స్థానికులు మెచ్చిన నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అవకాశమిచ్చి వారు స్థిమితంగా పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తే మంచి ఫలితాలు వచ్చేవి. పార్టీ తిరుగులేని స్థితిలో ఉండేది. అందుకు భిన్నంగా అధిష్టానం ఆశీస్సులతో ఎప్పటిలాగే నడిచిన రాజకీయాల పర్యవసానంగా రాష్ట్రాల్లో పాలన పడకేసింది. అసంతృప్తి నానాటికీ పెరిగింది. కానీ, రాహుల్కు ఇదంతా పట్టినట్టు లేదు. ఆయన తనదైన ప్రపంచంలో ఉండిపోయారు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలోనే కాలంవెళ్లబుచ్చారు. ఎన్నికల రాజకీయాల్లో తలపండిన నేతలను కాదని యువరక్తాన్ని ఎక్కించాలన్న ఆత్రుతలో ఇంటర్వ్యూల ద్వారా కొత్త నేతలను ఎంపికచేశారు. వారిలో కొందరికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించారు. వాస్తవానికి బీహార్, యూపీ ఎన్నికలప్పుడే ఆ ప్రయోగం విఫలమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు అమెరికాలో జరిగే ప్రైమరీ ఎన్నికల నమూనాను అనుసరించడానికి ప్రయత్నించారు. కానీ, అలాంటివారంతా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పార్టీలో ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చడానికి ఏంచేయాలో తెలియని స్థితిలో రాహుల్గాంధీ ఉంటే, దీనిపై ఎలాంటి చర్యలు అవసరమవుతాయో అర్ధంకాక సోనియాగాంధీ అయోమయపడు తున్నారు. మహారాష్ట్రలో అయితే మరో ఆరునెలల్లో ఎన్నికలు జరగబో తున్నాయి. ఈ దశలో ముఖ్యమంత్రి పదవినుంచి చవాన్ను తప్పిం చినా అది పార్టీకి ముప్పు కలిగిస్తుంది. అలాగని కొనసాగించినా రాణే రూపంలో వచ్చిపడిన తిరుగుబాటు పర్యవసానంగా అక్కడ వేరే ఫలితాలు వచ్చే స్థితి కనిపించడంలేదు. ఇక అసోంలో తరుణ్ గోగోయ్ను సమర్థించాలని రాహుల్ నిర్ణయించాకే అక్కడి మంత్రి ధిక్కార స్వరం వినిపించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఇలావుంటే మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్కు బాహాటంగానే షాకులిస్తున్నది. త్వరలో ఎన్నికలు జరగబోయే జమ్మూ-కాశ్మీర్లో ఇక కాంగ్రెస్తో కలిసి పోటీచేసేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా దేశ ప్రజలు తమకేమి సందేశం ఇచ్చారో ఇప్పటికైనా గ్రహించి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టిస్తే, రాష్ట్రాల్లోని పార్టీ నేతలు ఏం కోరుకుంటున్నారో గుర్తిస్తే కాంగ్రెస్ కాస్తయినా కోలుకుంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వస్తుంది. -
పంచాయితీ ఢిల్లీకి..
సాక్షి, ముంబై: కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షా బంగ్లాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి రాణే, చవాన్తోపాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ నాయకులు హాజరయ్యారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాణే ఈ సందర్భంగా పట్టుబట్టినట్లు తెలిసింది. రాజీనామాను ఉపసంహరించుకొని, తమతోపాటు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చవాన్, ఠాక్రే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తనను సంతృప్తి పరిచేందుకు చవాన్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాణే స్పష్టం చేశారు. దీంతో ఎటువంటి పరిష్కారం లేకుండానే సమావేశం ముగిసింది. మంగళవారం నాటిచర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ముఖ్యమంత్రి చవాన్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనతోపాటు రాణే, ఠాక్రే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అవుతామని ప్రకటించారు. ఆమె ఆపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమావేశం అనంతరం చవాన్ వెల్లడించారు. సోనియాగాంధీ దృష్టికి రాణే డిమాండ్లను తీసుకెళ తామని అన్నారు. ఈ సమావేశంలో రాణే రాజీనామా అంశంతోపాటు వచ్చే శాసనసభ ఎన్నికల విషయంపైనా చర్చించినట్లు చవాన్ తెలిపారు. ఇదిలా ఉండగా సోనియాతో భేటీ అనంతరం రాణే ఎంత వరకు శాంతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మీకు ఎంపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు రాణే బదులిస్తూ ‘నాకు అలాంటి అవకాశం ఇస్తామని ఎవరూ చెప్పలేదు. నేను లేవనెత్తిన అంశాలకు పరిష్కారం చూపిస్తే రాజీనామా ఉపసంహరణ గురించి ఆలోచిస్తానని చెప్పాను’ అని వివరించారు. ఈ సందర్భంగా చవాన్ మీడియాతో మాట్లాడుతూ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. 2005లో శివసేనను వీడిన రాణే కాంగ్రెస్లో చేరడం తెలిసిందే. తమ పార్టీలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికీ ఆ పని చేయకపోవంతో ఆగ్రహానికి గురైన రాణే రాజీనామా బాట పట్టారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
ముఖ్యమంత్రి కుర్చీ ఇక భద్రం
ఇదిగో మారుస్తారు.. అదిగో మారుస్తారు అని చెబుతూ వస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.. ఇక బేఫికర్గా ఉండొచ్చు. ఆయన యథాతథంగా కొనసాగుతారని, ముఖ్యమంత్రి పదవిలో మార్పు ఏమీ లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మోహన్ ప్రకాష్ తెలిపారు. పృథ్వీరాజ్ నిస్సందేహంగా తన పదవిలో కొనసాగుతారని అన్నారు. అంతకు ముందు పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పడతారనే ఊహాగానాలు దాదాపు రెండు మూడు వారాల నుంచి అటు మహారాష్ట్రతో పాటు ఇటు ఢిల్లీల్లో కూడా జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు మరోసారి గుప్పుమన్నాయి. అయితే 48 గంటలు గడవకుండానే మళ్లీ ఆయన పదవి సేఫ్ అని చెప్పారు. అధిష్ఠానం పిలుపుతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున చవాన్కు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఒక దశలో భావించింది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిండే, నారాయణ రాణే, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయంతో మరోసారి వారందరికీ ఆశాభంగం కలిగింది. -
కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎంను మారుస్తుందా?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పట్టనున్నారా? మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ మేరకు ఊహాగానాలు జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి హుటాహుటిన పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బవాన్ ను ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నేతృత్వం భావిస్తోంది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిందే, నారాయణ రాణే, రాధాకృస్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చవాన్ ను తొలగించాలని ఎన్సీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
చర్చల తరువాతే నిర్ణయం
సాక్షి ముంబైః కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సంయుక్తంగా నిర్వహించే సమావేశంలోనే సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. కొందరు నాయకులు అసెంబ్లీ సీట్ల పంపకాల విషయంపై ప్రకటనలు చేస్తూ ఆయా నియోజకవర్గాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ను ఉద్దేశించి చేసినవని భావించవచ్చు. గత కొన్ని రోజులుగా సీట్ల పంపకంపై ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమకు అధికంగా సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎంతమాత్రమూ సుముఖంగా లేదు. ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోకుంటే, రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో ఎన్సీపీ పోటీ చేస్తుందని అజిత్ పవార్ హెచ్చరించడం సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన పృథ్వీరాజ్ చవాన్ పైవ్యాఖ్యలు చేశారు. ‘మా మిత్రపక్షం ఎన్సీపీతో కలిసే చాలా ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రతిసారీ ఎన్నికలకు ముందు మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడిగానే తీసుకున్నాం. ఈసారి కూడా సీట్ల పంపకాలపై సంయుక్త సమావేశం ఉంటుంది. కొందరు నాయకులు ఇప్పుడే సీట్ల పంపకాలు జరిగినట్టు ప్రకటిస్తూ, ఆ నియోజకవర్గాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేయడం సరైందికాదని మిత్రపక్షానికి సూచిస్తున్నాను. సీట్ల పంపకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు’ అని చవాన్ వివరణ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా గురించి విలేకరులతో మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధి వల్ల మహారాష్ట్ర దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ కంటే మహారాష్ట్ర ముందున్నదని, అందరికీ మేలు జరగాలని తాము కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ముంబైలో రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని, మరో రూ.15 వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. దీంతోపాటు రూ. 36 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని చవాన్ చెప్పారు. ఇవి పూర్తయితే ముంబై రూపురేఖలు మార తాయని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) బుధవారం ప్రకటించింది. -
పాండురంగా పాహిమాం
షోలాపూర్, న్యూస్లైన్: రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని, ప్రజలు నిత్యం సుఖఃసంతోషాలతో ఉండేలా వర్షాలు కురిపించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విఠల-రుక్మిణి దంపతులను వేడుకున్నారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం వేకువజామున మూడు గంటలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా పండరీపూర్లోని విఠల-రుక్మిణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుణుడు నెల రోజులు ఆలస్యంగా కరుణించడంతో రాష్ర్టంలోని రైతాంగం నిరాశకు లోనయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకుసాగుతున్నదని అన్నారు. విఠలుడి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున, వారికి తగిన సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇక్కడి మఠాలు, ధర్మశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు భారీగా నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. షోలాపూర్ పట్టణవ్యాప్తంగా రూ.81 కోట్ల వ్యయంతో సులభ్ మరుగుదొడ్ల కాంప్లెక్స్లను నిర్మిస్తామని ప్రకటించారు. భీమనది తీరంలోని గోపాల్పూర్ వద్ద స్నానపు గదులు నిర్మించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సంత్ నామ్దేవ్ స్మారకం నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు. పల్లకీ యాత్రలు సాగే దేహూ, ఆలంది, బండారా, డోంగారు, నెవాసా తదితర ప్రాంతాలు, రోడ్ల అభివృద్ధికి రూ.143 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు రూపొందించామన్నారు. పల్లకీయాత్ర సందర్భంగా మరణించిన, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కిక్కిరిసిన భక్తజనం... లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల ‘పాండురంగ విఠల విఠల’ నామస్మరణతో పండరీపూర్ పులకించిపోయింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న విఠల-రుక్మిణి ఆలయం సమీపంలోని చంద్రబాగా నదీతీరం వెంబడి వార్కారీలు, భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి పల్లకీలు, కాలినడకన, వాహనాల ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకొని చంద్రబాగా నదిలో స్నానాలు ఆచరించారు. విఠల రుక్మిణిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ తీర్థయాత్రలో పాల్గొనేందుకు రాష్ర్టం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎదురవడంతో ఎనిమిది లక్షల మంది మాత్రమే వచ్చారు. ప్రతి ఏటా 10 నుంచి 12 లక్షల మంది ఈ యాత్రకు వస్తుంటారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక రథాన్ని అలంకరించి అందులో ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు విఠలుడికి ఎండు ఖర్జూరాలు, బాదం పప్పు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రికి సన్మానం... పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయ కమిటీ తరఫున అధ్యక్షుడు అన్నాసాహెబ్ డాంగె, పాలకవర్గ సభ్యులు.. ముఖ్యమంత్రి దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి దంపతులతోపాటు ఈ పూజలో పాల్గొనేందుకు కర్ణాటక బీదర్ జిల్లా వాసులైన శేలుకే రాము, ప్రమీల దంపతులకు అదృష్టం దక్కింది. మూడుతరాలుగా తమ కుటుంబీకులు వార్కారీలుగా ప్రతి ఏటా పండరీపూర్కు వస్తున్నట్లు రాము తెలిపారు. ముఖ్యమంత్రి ఈ దంపతులను సన్మానించారు. జీవితాంతం ఉచితంగా ఎంఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా పాస్లను అందజేశారు. -
మోనోరైలుకు విశేష స్పందన
సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ల మధ్య 11.4 కి.మీ ప్రయాణించే మెట్రో రైలును జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన విషయం తెలి సిందే. మంగళవారానికి నెల రోజులు పూర్తవుతోంది. ఈ మెట్రో రైళ్లు మొత్తం 13 వేల ట్రిప్పులు కొట్టాయి. దాదాపు లక్షన్నర కి.మీ ప్రయాణించాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రిలయన్స్ ఇన్ఫ్రా అభిప్రాయపడింది. సెలవుదినాల్లో చిన్నారులకు ఉచితం ముఖ్యంగా ప్రతీ శని, ఆదివారాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించింది. పిల్లలతోపాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నారని ఇన్ఫ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం శని, ఆదివారాలు కార్యాలయలు, పాఠశాలలకు సెలవులు కావడంతో అత్యధిక శాతం జాయ్ రైడ్ కోసమే అందులో ప్రయాణిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. ప్లాట్ఫారాలపై రద్దీకూడా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారు మినహా పిల్లలు, జాయ్ రైడ్ చేసే పెద్దల సంఖ్య అంతగా కనిపించడం లేదు. పర్యాటకుల ఆకర్షణ ముఖ్యంగా ఈ మెట్రో రైళ్లు స్థానిక ముంబైకర్లతోపాటు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బోగీలన్నీ మూసి ఉండడంతో బయటి శబ్ధం లోపలికి ఏమాత్రం వినిపించదు. రైలంతా ఏసీ, విశాలమైన కిటికీ అద్దాల్లోంచి బయట నగర అందాలను తిలకించేందుకు వీలుంది. దూర ప్రాంత ఎక్స్ప్రెస్ రైళ్ల మాదిరిగా ఈ చివర నుంచి ఆ చివర వరకు వెళ్లేందుకు బోగీలన్నీ జాయింట్ చేశారు. లోపల ఎలక్ట్రానిక్ ఇండికేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రైలు ఆగిన స్టేషన్, వచ్చే స్టేషన్ పేరు ముందుగానే హిందీ, ఇంగ్లిష్లో ప్రకటిస్తుంది. తత్ఫలితంగా ఈ రైళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కూర్చునే సామర్థ్యం తక్కువగా ఉంది. నిలబడి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం కేటాయించారు. అతి తక్కువ సమయంలో కోటికిపైగా ప్రయాణికులను చేరవేసిన ఘనత ముంబై మెట్రో రైళ్లు దక్కించుకున్నాయి. -
డాక్టర్ల సమ్మె విరమణ
సాక్షి, ముంబైః పదోన్నతులు, జీతాలు, పదవీ విరమణ పెంపు తదితర డిమాండ్లతో ‘మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ గెజిటెడ్ మెడికల్ ఆఫీసర్స్’ (మాగ్మో) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డాక్టర్ల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్తో చర్చల అనంతరం మాగ్మో అధ్యక్షుడు రాజేష్ గైక్వాడ్ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. సందర్భంగా రాజేశ్ గైక్వాడ్ మాట్లాడుతూ ‘గత ఆరు రోజులుగా కొనసాగిన సమ్మె కారణంగా ఇబ్బందిపడ్డ రోగులకు మేం క్షమాపణలు చెబుతున్నాం. ఇక నుంచి మా డాక్టర్లంతా రోజుకు రెండు గంటలు అదనంగా పనిచేస్తారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు మేం సమ్మెను విరమిస్తున్నాం’ అని ప్రకటించారు. మాగ్మో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె ప్రభావం అనేక ఆస్పత్రుల రోగులపై పడింది. పరిస్థితి విషమిస్తుండడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సోమవారం ఆందోళనకు దిగిన డాక్టర్లతో చర్చలు నిర్వహించారు. సహ్యాద్రి అతిథి గృహంలో మధ్యాహ్నం మాగ్మో నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లతోపాటు అనేక విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం సమ్మె చేపట్టినవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జల్గావ్ జిల్లాలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృతి చెందిన అనంతరం సమ్మె నిర్వహిస్తున్న డాక్టర్లపై ‘మహారాష్ట్ర ఎస్సెన్షియల్ సర్వీస్ అండ్ మెయింటెన్స్’ (మెస్మా) పోలీసు ఠాణేలో ఫిర్యాదు చేయాలని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సుజాతా సైనిక్ సూచించారు. సమ్మె విరమించేదాకా చర్చలు ఉండబోవని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే సమ్మె చేపట్టిన ఆరవ రోజు ఎట్టకేలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వారితో చర్చలకు అంగీకరించారు. ఇక నుంచి బీఏఎమ్మెస్ డాక్టర్లకు త్వరగా పదోన్నతులు కల్పించడం, పదవీ విరమణ వయసును పెంచడం తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్ల సేవలను క్రమబద్దీకరిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే మాగ్మో సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అష్టకష్టాలకు గురయ్యారు. చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు. -
ఇవేం సేవలు..!
సాక్షి, ముంబై: ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మెట్రో సేవలకు నగరవాసుల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నా అప్పుడప్పుడూ నిరాశ పరుస్తూనే ఉన్నాయి. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గత నెలలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రోరైలు ప్రారంభించిన తరువాత మొదటి ట్రిప్పులోనే సాంకేతిక సమస్య తలెత్తి దాదాపు అర గంటసేపు రైలు ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక స్టేషన్లో సమస్యలు ఎదురుకావడం పరిపాటిగా మారింది. ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడంతో సుమారు 25 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో వారం తరువాత ఓ బోగీ డోర్లు తెర్చుకోకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రో ల్ రూమ్కు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో 20 నిమిషాల పాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా బుధవారం మరోల్ స్టేషన్లో రైలు ఆగినా రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. దీంతో అక్కడ దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడ్డారు. అప్పటికే రైలు ముందుకు కదలడంతో తరువాత వచ్చే సాకినాకా స్టేషన్లో దిగిపోయారు. ఇక బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెట్రో రైలు బోగీల్లోకి నీరు వచ్చిచేరింది. ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో లోపలున్న ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. మెట్రోరైలు ప్రారంభించిన తరువాత అతి తక్కువ సమయంలోనే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శని, ఆది వారాల్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో మెట్రోకు భారీ ఆదాయమే వస్తోంది. మొత్తం 16 మెట్రో రైళ్లుండగా ప్రతీరోజూ దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. మూడోవంతు జనానికి సేవలందించే సమయంలోనే ఇన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటే పూర్తిస్థాయిలో జనం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
నీరు, విద్యుత్ పొదుపు చేయండి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చవాన్ పిలుపు ముంబై: వర్షాభావ పరిస్థితుల కారణంగా జల వనరులు క్లిష్ట స్థితికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, నీరు, విద్యుత్ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో రుతుపవనాల పరిస్థితిపై సమీక్షించారు. అవసరమైన ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ట్యాంకర్లను వినియోగించాలని, ఇందుకు తహసీల్దార్ (రెవెన్యూ అధికారి)లకు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు. ట్యాంకర్ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో అధికారులు పైసేవరి (పంటను విలువకట్టడం) పరిశీలించరాదని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో నీటి కొరత క్లిష్ట దశకు చేరుకుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోయింది. అందువల్ల ప్రజలు నీటిని, విద్యుత్ను జాగ్రత్తగా వినియోగించాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూన్ 30 నాటికి 58.50 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తం 355 తాలూకాలకు గాను, 194 తాలూకాల్లో 0 నుంచి 25 శాతం వర్షాలు మాత్రమే కురిశాయి. 123 తాలూకాల్లో 50 శాతం వరకు, 28 తాలూకాల్లో 75 శాతం వరకు వర్షపాతం నమోదైంది. ఠాణే, రాయిగఢ్, నాసిక్, దూలే, నందుర్బార్, జల్గావ్, పుణే, ఔరంగాబాద్, జాల్నా, ఉస్మానాబాద్, నాందేడ్, హింగోలీ, బుల్దానా, అకోలా, యవత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో 0 నుంచి 25 శాతం వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 19 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. 1,359 గ్రామాలు, 3,317 హేమ్లెట్లలో 1,464 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రణాళికను ఐదు రోజుల్లో సిద్ధం చేసి, పుణే, నాసిక్, ఔరంగాబాద్ డివిజన్లలో తాగునీటికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయాలు పదోన్నతి పొందే అవకాశం లేని ప్రభుత్వోద్యోగులకు అడిషనల్ గ్రేడ్ పే చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. బీడ్ జిల్లా ఆస్పత్రిలో అదనంగా మరో 200 పడకలను మంజూరు చేసింది. దీంతో పాటు ఆస్పత్రిని ఉన్నతీకరిస్తూ, 125 కొత్త పోస్టులను సృష్టించనున్నట్లు మంత్రివర్గం పేర్కొంది. గ్రామీణ నీటి సరఫరా పథకాలలో ప్రజలు పది శాతం చెల్లించాలన్న నిబంధనను రద్దు చేసింది. గ్రామ పంచాయతీల వాటాను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది. -
హైలెస్సా..లెస్సా..హైలెస్సా..
సాక్షి, ముంబై: సబర్బన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించే నిమిత్తం నగర తూర్పు తీరప్రాంతాల్లో త్వరలోనే జల రవాణా సేవలను అందుబాటులోకి తేనున్నారు. అయితే ఐలాండ్ ప్యాసింజర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ (ఐపీడబ్ల్యూటీ) ప్రాజెక్టుకు మంచి స్పందన వస్తుందో లేదో అని రాష్ట్రప్రభుత్వం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ జల రవాణాను నెరుల్ నుంచి మండ్వా వరకు కొనసాగించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. స్టేట్ చీఫ్ సెక్రటరీ (సీఎస్), ఇతర ముఖ్యమైన విభాగాలకు చెందిన అధికారులు ఇటీవలే ఈ విషయమై ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ప్రాజెక్టు నిమిత్తం తయారు చేయాలనుకున్న జెట్టీల పరిమాణంపై సమావేశంలో చర్చించారు. మొదట చిన్న సైజు జెట్టీలను నడపాలని, జలరవాణాకు మంచి స్పందన లభించిన తర్వాత జెట్టీల పరిమాణం మరింత పెంచవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సేవలతో హార్బర్ మార్గంలో కొంత మేర రద్దీ తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఎంఆర్డీఏ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సమావేశంలో తూర్పు తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్న జల రవాణా విజయవంతం అవుతుందో లేదో అన్న సందేహాన్ని అధికారులు వెలిబుచ్చారన్నారు. దీంతో జెట్టీల పరిమాణం తగ్గించాలని ఎంఎస్ఆర్డీసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ జెట్టీల పరిమాణం ప్రతిపాదనలో 40 మీటర్లు ఉండగా 10 మీటర్లు తగ్గించమని అధికారులు సూచించారన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా వుండగా 40 మీటర్ల జెట్టీలు నిర్మించడానికి సుమారు రూ.1,300 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అంత ఖర్చు పెట్టిన తర్వాత జలరవాణాకు తగిన స్పందన రాకపోతే కష్టమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రయోగాత్మకంగా 30 మీటర్ల జెట్టీలను నడపాలని యోచిస్తోంది. దీని వల్ల ఖర్చు కూడా సుమారు రూ.350 - 400 కోట్లు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, నెరుల్ జెట్టీ నిర్మాణాన్ని రూ.308.28 కోట్లతో ఫెరీ వార్ఫ్కు కాంట్రాక్టుకు ఇవ్వగా, జె.కుమార్ ఫౌండేషన్ అసోసియేట్స్, డీబీఎం సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు... మండ్వా జెట్టీల నిర్మాణాన్ని రూ.63.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ జెట్టీల నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎంఎస్ఆర్డీసీ ప్రైవేట్ వ్యక్తులకు ఈ సేవలను అప్పగించనుంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ జెట్టీల నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. జల రవాణాతో లాభాలు... ఈ జల రవాణా పర్యావరణానికి ఎలాంటి చేటు కలిగించదు. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది. జల రవాణా సేవలు వేగంగా ఉండడమే కాకుండా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటాయి. నగర వాసుల వాహన నిర్వహణ ఖర్చు కూడా కొంత మేర ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా రోడ్లపై కూడా కొంత మేర రద్దీ తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణ, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. -
తాగునీటికి ప్రాధాన్యత
ఔరంగాబాద్, పుణే, నాసిక్ విభాగ కమిషనర్లతో సీఎం సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సూచించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యతనిచ్చిన తర్వాతే మిగతా అవసరాలపై దృష్టి సారించాలన్నారు. వర్షా బంగ్లాలో శుక్రవారం ఔరంగాబాద్, పుణే, నాసిక్ విభాగ కమిషనర్లతోపాటు ఈ మూడు విభాగాల్లోని 20 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కరువు పరిస్థితి ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే విషయమై నివేదికలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. తాగునీటి కోసం ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ నిధులను వినియోగించుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకునే విధానాలను అనుసరించాలని, తాగునీటికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు నీరు వృథాకాకుండా చూడాలన్నారు. కలెక్టర్ల అనుమతి లేకుండా జలాశయాల్లోని నీటిని విడుదల చేయవద్దన్నారు. నీటి సరఫరా పథకానికి, సిమెంట్ నాలా ఆనకట్టల నిర్మాణానికి కావల్సిన నిధులను ప్రతి జిల్లాకు అందచేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి ప్రధాన కార్యదర్శికి అందజేయాలన్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, అందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.ఎస్. సహారియా, వ్యవసాయశాఖ ఉన్నత ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధీర్కుమార్ గోయల్, ఆర్థికశాఖ ఉన్నత ప్రధాన కార్యదర్శి సుధీర్కుమార్ శ్రీవాస్తవ్లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వర్షాభావం కొనసాగితే తాగునీటికి కోతే... ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో నగరంలోని జలాశయాల్లో నీటి స్థాయి తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగరవాసులకు నీటి సరఫరాలో 15 శాతం కోత విధించే అవకాశం ఉంటుందని పురపాలక సంఘ అధికారులు శుక్రవారం చెప్పారు. జూన్ నెలలో ఇప్పటివరకు మూడు శాతం వర్షపాతం మాత్రమే నమోదైందని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీఎం)కు చెందిన సీనియర్ అధికారి అన్నారు. సాధారణంగా ఇప్పటికి 15 శాతం వర్షపాతం నమోదు కావాలని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో నగరంలో వర్షాలు కురవకపోతే నీటి సరఫరాలో 10 నుంచి 15 శాతం కోత విధించక తప్పదని అన్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో జరగనున్న సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ బంబాలే చెప్పారు. నగరంలో వర్షాలు ముఖం చాటేసిన నేపథ్యంలో పౌరులు నీటిని పొదుపుగా వాడాలని, తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించరాదని బంబాలే సూచించారు. నీటి కొరత ఏర్పడినందున నీటిని వృథా చేయకూడదని పౌరులను హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఎంతగా వీలైతే అంతగా నీటిని సంరక్షించుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయో లేదో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని బంబాలే ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీరు కూడా ఇంకిపోతే ఇక తాము చేసేదేమీ ఉండదని ఆయన నిరాశను వ్యక్తం చేశారు. ప్రస్తుతం, నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు ప్రధాన చెరువుల్లో 1.32 లక్షల మిలియన్ లీటర్ల నీరు ఉందని బంబాలే చెప్పారు. ఈ నీరు ఒక నెలకు మాత్రమే సరిపోతుందని అన్నారు. గతేడాది ఇదే సమయంలో 3,33,906 లక్షల మిలియన్ లీటర్ల నీరు ఉందని పేర్కొన్నారు. నగరంలో నీటి సంక్షోభం ఇంతకుముందు 2009 జూలైలో ఏర్పడిందని, అప్పుడు 30 శాతం కోత విధించాల్సి వచ్చిందని బంబాలే గుర్తు చేశారు. ముంబై నీటిసరఫరా నెట్వర్క్ అనుమతించిన మేరకు గరిష్టంగా నీటి సరఫరాలో కోత విధించామని ఆయన చెప్పారు. -
సరే.. సహకరిస్తాం!
ముంబై: తమ నివాసాలను కాపాడుకునేందుకు దశాబ్దకాలానికిపైగా పోరాటం చేసిన క్యాంపాకోలావాసులు గత్యంతరంలేక ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను కలిసిన తర్వాత మున్సిపల్ అధికారులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. దీంతో క్యాంపాకోలా కాంపౌండ్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందికి మార్గం సుగమమైంది. నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని, చట్టానికి అంతా సహకరించాలని చవాన్ క్యాంపాకోలా వాసులతో చెప్పడంతోనే వారు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే ఫ్లోర్స్పేస్ ఇండెక్స్ విషయంలో క్యాంపాకోలా వాసుల డిమాండ్ను సీఎం సూచనప్రాయంగా అంగీకరించడంతోనే వీరంతా వెనక్కు తగ్గినట్లు సమాచారం.క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 96 ఫ్ల్లాట్లు అక్రమంగా నిర్మించారంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో బీఎంసీ అధికారులు కూల్చివేయాలని నిర్ణయించారు. గతంలో అనేక పర్యాయాలు బీఎంసీ సిబ్బంది వాటిని కూల్చివేసేందుకు వెళ్లారు. కాని తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖాళీ చేతులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అప్పటికే కొందరు నివాసులు కోర్టు తీర్పును గౌరవిస్తూ ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగతావారు మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాల అండదండల మొండిగా అక్కడే ఉంటూ వచ్చారు. చివరకు నీటి, గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని బీఎంసీ ప్రకటించింది. అక్కడికి వెళ్లిన అధికారులను అడ్డుకోవడం, గేట్లు మూసివేసి లోపలికి రాకుండా చేయడం వంటి ఘటనలు గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నవిషయం తెలిసిందే. సీఎం చవాన్ జోక్యంతో ఎట్టకేలకు సంవత్సరన్నర నుంచి జరుగుతున్న ఆందోళనకు తెరపడింది. దీంతో సోమవారం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అసలేం జరిగింది... మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఎమ్మెల్యే బాలా నాంద్గావ్కర్ ఆదివారం నివాసులతో కలిసి సీఎం చవాన్తో భేటీ అయ్యారు. సోసైటీలో అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ని వినియోగించి నివాసులకు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని చట్టపరంగా పరిశీలించాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేను ఆదేశించారు. అంతేకాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, మీరు కూడా సహకరించాలని కోరడంతో అందుకు నివాసులు అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే కూల్చివేత పనులను తప్పనిసరిగా చేపట్టాల్సి వస్తోందని, మానవతా దృక్పథంతోనే క్యాంపాకోలా వాసులు డిమాండ్ చేసినట్లుగా 67,000 చదరపు గజాలా ఫ్లోర్స్పేస్ ఇండెక్స్ను ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలించాలని చెప్పినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి వద్దకు.. క్యాంపాకోలా వివాదం చివరకు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లినట్లు తెలిసింది. స్థానిక ప్రతినిథుల బృందం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిందని సమాచారం. ఈ విషయమై క్యాంపాకోలా వాసి అంకిత్గార్గ్ మాట్లాడుతూ... ‘సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీకి లేఖ రాశాం. తమ విషయంలో కరుణ చూపాలని కోరాం. నివాసాలను కూల్చివేస్తే వందలాదిమంది రోడ్డున పడతారని, వారిలో పిల్లలు, వృద్ధులు ఉన్నారని, వారందరికి కొత్తగా నివాసాలు దొరకడం ముంబై మహానగరంలో అంత త్వరగా సాధ్యం కాదని, జోక్యం చేసుకొని క్యాంపాకోలా వాసులకు ఊరటనివ్వాలని కోరామ’న్నారు. దీనిపై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ వాఘ్రాల్కర్ మాట్లాడుతూ... ‘రాష్ట్రపతికి లేఖ రాసినా అక్కడి నుంచి ఎటువంటి సమాచారమైతే మాకు అందలేదు. దీంతో మా విధులు మేం నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకోసం పోలీసు బలగాలను కూడా రంగంలోకి దింపాలని యోచిస్తున్నాం. సోమవారం కూల్చివేత పనులను కొనసాగిస్తామ’న్నారు. -
పోయివచ్చిరి హస్తినకు..!
ఢిల్లీకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు శనివారం ఢిల్లీకి క్యూకట్టారు. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నందున రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వారంరోజులుగా మీడియాలో అనేకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను మార్చవని, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రేను కూడా మార్చనున్నారంటూ మీడియా ఊదరగొట్టింది. దీంతో ఈ విషయంపై సీఎం చవాన్ కూడా స్వయంగా స్పందించారు. ఇప్పటిదాకా తనకు ఎటువంటి సమాచారం లేదని, మీడియాలో వస్తున్నవన్నీ కబుర్లేనంటూ కొట్టిపారేశారు. అయితే మరుసటి రోజు ఉదయమే ఆయన ఢిల్లీ విమానం ఎక్కారు. ఆ వెనుక విమానాల్లో పార్టీలోని కీలక నేతలుగా చెప్పుకుంటున్న నారాయణ్ రాణే, శివాజీరావ్ మోఘే తదితరులు ప్రయాణమయ్యారు. దీంతో మీడియాలో వస్తున్న కథనాలు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో మొదటి నుంచి రాణే పేరు వినిపిస్తోంది. ఆయన ఇటీవల సోనియాతో సమావేశమైనట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇక పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కోసం మోఘే ఫైరవీలు చేస్తున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. దీంతో వీరిద్దరు కూడా విమానం ఎక్కడంతో అధిష్టానం వీరిని పిలిపించిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఇదిలావుండగా అటు ఢిల్లీలో సీన్ మాత్రం మరో ఉన్నట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి చవాన్ బిజీబిజీగా గడిపారు. రాణే, మోఘే ఎవరిని కలిశారన్న సమాచారం అందకపోయినప్పటికీ మీడియా ప్రతినిధులు మాత్రం పూర్తిగా చవాన్పైనే దృష్టిపెట్టారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో అధినేత్రి సోనియాతో చవాన్ భేటి అయినట్లు తెలిసింది. అయితే పార్టీ పెద్దలు మాత్రం పార్టీ అంతరంగం ఏమిటనే విషయం నేరుగా చెప్పకుండా రకరకాల లీకులు మీడియాకు విడుదల చేశారు. షిండేకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు వెళ్లాయని కొందరు చెప్పగా నాయకత్వ మార్పుపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించేందుకు మొగ్గుచూపుతోందని మరికొందరు చెప్పారు. దీంతో అసలు విషయం ఏమిటన్నది తేలలేదు. -
సోనియాతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ భేటి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం పదవి, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్ రావు ఠాక్రేను మారుస్తున్నారనే వార్తల నేపథ్యంలో సోనియాతో పృథ్వీరాజ్ చవాన్ భేటి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పత్రికలు, టెలివిజన్ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని శుక్రవారం చవాన్ ఖండించారు. అయితే మార్పు లేదని చవాన్ వెల్లడించినప్పటికి.. మహారాష్ట్రలో సీఎం మార్పు తప్పదని రాజకీయవర్గాలు తమ వాదనల్ని బలంగా ప్రచారం చేస్తున్నాయి. -
శరద్ పవార్ బాంబు పేల్చారు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాంగ్రెస్ కి మిగిలిన అతికొద్దిమంది మిత్రుల్లో ఒకరైన శరద్ పవార్ ఉన్నట్టుండి బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేస్తోందని, మళ్లీ అశోక్ చవాన్ లేదా సుశీల్ కుమార్ షిండే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం నుంచి రావలసింది. కానీ కాంగ్రెస్ మిత్రపక్షం నుంచి వస్తోంది. అదే విచిత్రం. అంతే కాదు. మిజోరాం, అసొం ముఖ్యమంత్రులను కూడా కాంగ్రెస్ మార్చేయబోతోందని ఆయన ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కి ఎన్ సీ పీకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. శరద్ పవార్ మేనల్లుడు, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ చాలా కాలంగా ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి మహారాష్ట్ర లోకసభ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత పృథ్వీరాజ్ ను తొలగించాలన్న డిమాండ్ బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై శరద్ పవార్ ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగానే కాంగ్రెస్ సీఎంను మార్చాలని భావించి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే పవార్ మాత్రం ఈ నిర్ణయం వెనుక తన ఒత్తిడేమీ లేదని అంటున్నారు. తనకు అసలు కాంగ్రెస్ అంతర్గత విషయాలతో సంబంధమే లేదని ఆయన అన్నారు. -
కథనాలన్నీ ‘కబుర్లే’!
సాక్షి, ముంబై: తనతోపాటు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రేను మారుస్తున్నారంటూ పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఈ విషయమై పుణేలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనున్నట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదు. అధిష్టానం ఈ విషయమై ఎటువంటి ఆలోచనలు చేయలేదు. ఇవన్నీ కేవలం వార్తాపత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలు మాత్రమే. ఒకవేళ అదే నిజమైతే అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తా. వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతగా నిర్వర్తిస్తా. లోకసభ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో తమ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీనికి బాధ్యత వహిస్తూ తాము అప్పుడే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధిష్టానానికి చెప్పాం. పార్టీలో అవసరమైన మార్పులు చేయాలని మేమందరం అధిష్టానాన్ని కోరాం. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరమే జరిగింది. అప్పటి పరిణామాలపై మీడియాలో ఇప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయి. తాజాగా అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా నాకు తెలియదు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదయోగ్యమే. ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తాన’న్నారు. ఎన్నికలపై చర్చలు జరిగాయి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఎన్సీపీతో ఇటీవల చర్చలు జరిగాయని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళ్లాలనే విషయంపై పార్టీ సీనియర్ నాయకులతో ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ చర్చలు జరిపారని, అదే విషయమై తనతోకూడా చర్చలు జరిపారన్నారు. నాయకత్వమార్పు విషయంపై తమ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. తనకు ఏదైనా సమాచారం అందితే ముందుగానే మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఇదిలాఉండగా ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ కూడా నాయకత్వ మార్పు కథనాలను కొట్టిపారేశారు. ఎన్నికలముందు ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టంచేశారు. -
తలకాయలు మార్చినా తలరాతలు మారేనా?
ముంబై: లోక్సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల్లో అంతర్మథనం మొదలైంది. అనేకరకాల సమీక్షల తర్వాత ఇరుపార్టీల అధిష్టానాలు.. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్న నాయకులను మార్చాలని నిర్ణయించాయి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రేతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను మార్చాలని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక ఎన్సీపీలో కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్ను మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రకమైన మార్పులు ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తలకాయలు మార్చినంత మాత్రనా ఇరుపార్టీల తలరాతలు మారే అవకాశం లేదని కొందరు చెబుతుండగా నాయకత్వ మార్పు కొంతమేరకైనా ప్రజలపై ప్రభావం చూపుతుందని మరికొందరంటున్నారు. సోనియాను కలిసిన నారాయణ్ రాణే... లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ నేత నారాయణ్ రాణే, అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. దీంతో రాణేను పార్టీ అధినాయకత్వమే పిలిపించిందా? లేక రాణే స్వయంగా వెళ్లి అధిష్టానాన్ని కలిశారా? అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేకున్నా మొత్తానికి పార్టీ పదవులతోపాటు ముఖ్యమంత్రి పదవిలో కొత్తవారిని కూర్చోబెట్టాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందనే సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని షోలాపూర్ నేత, మాజీ హోంమంత్రి సుశీల్కుమార్ షిండేకు ఇవ్వనున్నట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఇక ఎంసీసీసీ అధ్యక్ష పదవిని మాజీ ముఖ్యమంత్రి అశోక్రావ్ చవాన్కు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్ దాని నుంచి బయటపడితేగానీ ఏ నిర్ణయం తీసుకోలేమనే నిర్ణయంలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఫలిస్తే సరే.. మరి వికటిస్తే.. పార్టీ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఫలిస్తే సరే... మరి వికటిస్తే పరిస్థితి ఏంటని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎంపికచేసేవారి విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంపిక చేసే ముందు కూడా పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. కీలక పదవుల బాధ్యతలను కొత్తవారికి అప్పగించినప్పుడు వారి మద్దతుదారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా వారి ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. వ్యక్తులకే కాకుండా ప్రాంతాలవారీగా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో సమతూకం పాటించినప్పుడే మార్పులు సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు. జాదవ్ స్థానంలో ఎవరో? కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీలో కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాధవ్ను మార్చనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల పదాధికారులతో శరద్పవార్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై అభిప్రాయాలు కూడా సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. భాస్కర్ జాదవ్కు మంత్రి మండలిలో చోటిచ్చి పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునీల్ తట్కరే కు అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆ దిశగానే యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్లో మార్పుల జరిగిన తర్వాత వాటికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఠాక్రేలకు భుజ్బల్ చురకలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్సీపీ నేత, ప్రజాపనుల శాఖమంత్రి ఛగన్ భుజ్బల్ చురకలించారు. ‘ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నవారందరికీ శుభాకాంక్షలు’ అంటూ పరోక్షంగా ఠాక్రేలిద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్ఠాక్రే, ఉద్ధవ్ఠాక్రేలు ముఖ్యమంత్రులు కావాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఇటీవల వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన భుజ్బల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. -
అందుబాటులోకి ఫ్రీవే
సాక్షి, ముంబై: దశాబ్దాలుగా వే ధిస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి దక్షిణ ముంబైవాసులకు విముక్తి లభించనుంది. ఇకపై దక్షిణ ముంబై నుంచి ఘాట్కోపర్కు వెళ్లాలంటే కేవలం అరగంట చాలు. ఎందుకంటే పశ్చిమ శివారులోని ఖేర్వాడి ప్రాం తంలో నిర్మించిన ఫ్లైఓవర్, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డులను సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించనున్నారు. ఖేర్వాడి ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంవల్ల దహిసర్ నుంచి నేరుగా వర్లీ వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించవచ్చు. పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డు వంతెన వల్ల దక్షిణ ముంబై నుంచి తూర్పు శివారు ప్రాంతం వరకు కేవలం అర గంటలోపే చేరుకోవచ్చు. ఈ వంతెన కారణంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది. ఖేర్వాడి ఫ్లైఓవర్ 580 మీటర్ల పొడవుంది. ఈ వంతెనను వినియోగించే వాహన చోదకులకు ఖేర్వాడి జంక్షన్ వద్ద ఎదురయ్యే భారీ ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి లభించనుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. ఈస్టర్న్ ఫ్రీవే మార్గంపై నిర్మించిన పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు వంతెన 2.80 కి.మీ. పొడవుంది. కొద్ది రోజులుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. దక్షిణ ముంబై-పాంజర్పోల్ వరకు ఇది వరకే 13.60 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పు డు 2.80 కి.మీ. వంతెన కూడా సిద్ధం కావడంతో మొత్తం 16.40 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి రానుంది. అత్యంత పొడవైన ఈ వంతెన అం దుబాటులోకి రావడంవల్ల దక్షిణ ముంబై నుంచి నేరుగా తూర్పు శివారు ప్రాంతం వరకు ఎలాంటి అడ్డులేకుండా కేవలం అరగంట లోపు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఖేర్వాడి వంతెనను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డును మూడున్నర గంటలకు సీఎం చవాన్ ప్రారంభిస్తారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. -
రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన
ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం సీఎం రేసులో షిండే, ఎంపీసీసీ అధ్యక్షుడి రేసులో అశోక్చవాన్ సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు కాగానే సీఎంను తప్పించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు ముందే సీఎం పృథ్వీరాజ్ చవాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడిని కూడా మారుస్తారని, ఈ రెండు స్థానాలను అనుభవం ఉన్న నేతలకు అప్పగిస్తారని చెబుతున్నారు. పవార్తో చర్చించిన సోనియా..? ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్పవార్, సోనియాగాంధీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమిని అధికారంలోకి తేవడానికి ఏం చేయాలనే విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయమై కూడా సోనియా పవార్ను అడిగినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలోనే ఈ మార్పులు జరగడం ఖాయమని చెబుతున్నారు. మొదలైన ఫైరవీలు... ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పదవులను దక్కించుకునేందుకు రాష్ట్ర నేతలు అప్పుడే ఫైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులతోపదవుల కోసం రాయబారాలు సాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రేసులో ఎవరెవరు? ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడుతుందన్న ప్రశ్నలకు పార్టీ నేతల నుంచి హర్షవర్ధన్ పాటిల్, సుశీల్కుమార్ షిండే, రాధాకృష్ణ విఖేపాటిల్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరంతా లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీ వీరివైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అధిష్టానం తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఇదిలావుండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రేను మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లయితే ఈ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ను కూర్చుండ బెట్టే సూచనలు మెండుగా ఉన్నాయంటున్నారు. అయితే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సీఎం పదవిని పోగొట్టుకున్న అశోక్ చవాన్ను పెయిడ్ న్యూస్ కేసు వెంటాడుతోంది. దీనిపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 20లోపు విచారణ పూర్తిచేసి నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 20 తర్వాత ఒకవేళ అశోక్ చవాన్కు క్లీన్ చిట్ లభిస్తే పీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు ఆయనకే కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. -
ప్రభుత్వమే నిర్మిస్తుంది
శివ్డీ-నవాశేవా సీలింకుపై సీఎం చవాన్ సాక్షి, ముంబై: శివ్డీ-నవాశేవా సీలింకు పనులు చేపట్టేందుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి కనబర్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. దీంతోపాటు రూ.10 వేల కోట్లతో దక్షిణ ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాజెక్టును మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్వయంగా చేపట్టనుందని చవాన్ స్పష్టం చేశారు. ముంబై-నవీముంబై ప్రాంతాలను కలిపే శివ్డీ-నవాశేవా సీలింకు ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు పదేళ్ల కిందట ప్రభుత్వం ప్రకటించింది. అందుకు రిలయన్స్ కంపెనీతోపాటు అనేక ప్రైవేటు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ తర్వాత రద్దు చేసుకున్నాయి. దీంతో పదేళ్లకుపైగా పెండింగులో పడిపోయిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.9,630 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చవాన్ చెప్పారు. ఇదిలావుండగా భావుచా ధక్కా-నెరుల్-రేవస్-మాండ్వా జలరవాణా మార్గాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీడ్కో), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెస్సార్డీసీ), మెరీ టైం బోర్డు సంయుక్త కంపెనీలకు జలరవాణా బాధ్యతలు అప్పగించింది. ఇందులో సిడ్కో 40 శాతం, ఎమ్మెస్సార్డీసీ 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు సమకూర్చనున్నాయి. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ముంబై: పట్టణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చట్టం రూపకల్పన కోసం బీఎంసీ కమిషనర్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శాసనసభకు గురువారం తెలిపారు. ఉల్హాస్నగర్ భవనాల క్రమబద్ధీకరణ విధానాన్ని ఇతర నగరాలకూ వర్తింపజేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా సమస్య ఉంటుంది కాబట్టి ప్రత్యేక విధానాలు అవసరమవుతాయన్నారు. పింప్రి-చించ్వాడ్లో అక్రమ నిర్మాణాలపై చర్చలో పాల్గొంటూ ఆయన పైవిషయం తెలిపారు. ఉల్హాస్నగర్లో 6,623 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించినా, 100 నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించలేదు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్మాణ పటిష్టత అత్యంత ముఖ్యమని సీఎం చెప్పారు. పింప్రి-చించ్వాడ్లోని అక్రమ నిర్మాణాల గణాంకాల విశ్లేషణను ఈ నెలాఖరుకు సమర్పించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. వేసవిలో పోలీసు ఉద్యోగాల భర్తీ వద్దు పోలీసుల ఉద్యోగాల కోసం ముంబై, నాసిక్లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇద్దరు యువకులు మరణించడంతో.. ఇక నుంచి వేసవిలో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయవద్దని పలువురు సభ్యులు సభలో గురువారం సూచించారు. నాసిక్లో మరణించిన అంబాదాస్ కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాలేగావ్ ఎమ్మెల్యే దాదా భూసే ప్రభుత్వాన్ని కోరారు. పేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. విక్రోలీ వద్ద ఉన్న భర్తీ కేంద్రంలో తాగునీటి వంటి కనీస సదుపాయాలు కూడా లేవ న్నారు. ఐదు కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నప్పుడు వడదెబ్బ తగిలి అంబాదాస్ మరణించాడని అన్నారు. వేసవిలో ఎండలు అధికం కాబట్టిఅక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మెల్యే బాలానంద గావ్కర్ అన్నారు. ఆర్.ఆర్.పాటిల్కు క్లీన్చిట్ అత్యాచారాల నిరోధంపై హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఒక పోలీసు ఉన్నా అత్యాచారాలను నిరోధించడం సాధ్యం కాదని మంత్రి సభలో బుధవారం అన్నట్టు వార్తలు వచ్చాయి. మీడియా వచ్చిన కథనాలు, అసెంబ్లీ రికార్డులను పరిశీలించానని, పాటిల్ మాటల్లో తప్పేమీ లేదని స్పీకర్ అన్నారు. మంత్రి అలాంటి మాటేదీ అనలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ తనను కించపర్చాలనే దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంటికీ ఒక పోలీసును నియమించడం సాధ్యం కాదని మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ మీడియా సభా కార్యకలాపాలను ప్రసారం చేయడానికి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. -
ఇక రెండోమార్గం...
ముంబై: మెట్రోరైలు మొదటిమార్గం ఇటీవలే ప్రారంభమైన నేపథ్యంలో ఇక రెండోదశ కారిడార్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ఆర్థిక, సాంకేతిక అంశాలపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వేశాఖ అధీనంలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్)ను కోరింది. రెండోదశలో నిర్మించబోయే దహిసర్-చార్కోప్-బాంద్రా-మాన్ఖుర్ద్ మార్గ నిర్మా ణం కోసం అధికారులు ప్రాజెక్టు సవివర నివేదికను కూడా తయారు చేస్తున్నారు. చార్కోప్లోనిర్మించాల్సిన మెట్రోరైళ్ల డిపోను దహిసర్కు తరలిస్తున్నందున కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు నిరాకరించే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ఇదే అంశంపై శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన పైవిషయాలను వెల్లడించారు. వివిధ శాఖల నుంచి అనుమతులు రాకపోవడం వల్లే రెండోదశ ప్రాజెక్టు ఇది వరకే ఆలస్యమయింది. డిపోల తరలింపు వంటి మార్పుల ఫలితంగా పనుల్లో మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రెండోదశ కారిడార్ను పూర్తిగా భూగర్భంలోనే నిర్మించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దహిసర్-చార్కోప్-బాంద్రా-మాన్ఖుర్ద్ మార్గం నిర్మాణం కోసం 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు. లింకురోడ్డు, ఎస్వీరోడ్డును స్టేషన్లతో అనుసంధానించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరు ఆలస్యమవుతుండడమేగాక, చాలా ప్రాంతాల్లో ఓవర్హెడ్ వైర్లు ఉండడం, జుహూ ఎయిర్పోర్టు సమీపాన ఉండడం తదితర అడ్డంకులనూ అధిగమించాల్సి ఉంటుంది. ముంబై తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే ఘాట్కోపర్-వెర్సోవా మెట్రోమార్గాన్ని ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెట్రో రెండోదశ మార్గాన్ని కొలాబా నుంచి చార్కోప్ వరకు 40 కిలోమీటర్ల మేర నిర్మించాలని మొదట భావించారు. కొలాబా-మహాలక్ష్మి మార్గాన్ని పూర్తిగా భూగర్భంలోనే నిర్మించాలనే ప్రతిపాదించారు. సొరంగాల తవ్వకానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి చార్కోప్ నుంచి మాన్ఖుర్ద్ వరకు ఉపరితలంపైనే (35 కిలోమీటర్లు) మెట్రోమార్గాన్ని నిర్మించేలా సవివరణ ప్రణాళికలో మార్పులు చేశారు. పెరుగుతున్న మెట్రో వినియోగం ముంబైలో ఆదివారం నుంచి మెట్రోరైలు సేవలు మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం వరకు పది లక్షల మంది ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ కారిడార్ మార్గంలో మెట్రో సేవలు మొదలవడం తెలిసిందే. తొలి 59 గంటల్లో 10 లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేసిన ఘనత ముంబై మెట్రోకు దక్కింది. ఇంత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన మొదటి మెట్రోరైలు తమదేనని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. బుధవారం ఉదయం 5.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు 1.71 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. ఇది నిత్యం ఏడు లక్షల మందికి సదుపాయాలు కల్పించగలదని నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా తొలిరోజే ప్రకటించింది. ఒక్కో రైలులో దాదాపు 1,500 మంది వరకు ప్రయాణింవచ్చు. పార్కింగ్ కష్టమే... బైకులు, కార్లను నిలిపి ఉంచేందుకు మెట్రో స్టేషన్లలో తగినంత స్థలం లేకపోవడంతో వాహన యజమానులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేషన్ల సమీపంలో ఎక్కడో ఓ చోట పార్కింగ్ చేసి మెట్రోలో ప్రయాణించవలసివస్తోందని వాళ్లు చెబుతున్నారు. వెర్సోవా, డీఎన్ నగర్, ఆజాద్ నగర్ తదితర స్టేషన్లలో పార్కింగ్ కేంద్రాలు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. -
మెట్రో రైలు రాకతోరవాణాసంస్థలకు ముప్పే
అత్యాధునిక సదుపాయాలకు నెలవైన మెట్రోరైలుతో తక్కువ ధరలో తొందరగా గమ్యస్థానం చేరే అవకాశం ఉంది కాబట్టి బస్సుల్లో ప్రయాణించే వారిలో అత్యధికులు మెట్రోకు మారతారని భావిస్తున్నారు. ఫలితంగా బెస్ట్ వంటి ప్రభుత్వ రవాణా సంస్థలకు మరిన్ని నష్టాలు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు ప్రారంభం కావడంతో ప్రజారవాణా వ్యవస్థ మరో మైలురాయిని అధిగమించినట్లయింది. ఈ మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విలువైన సమయం, డబ్బు ఆదా కాయడం ఖాయం. అయితే కొన్ని దశాబ్దాలుగా ముంబైలో సేవలు అందిస్తున్న వివిధ ప్రజారవాణా సంస్థలను మెట్రోరైలు ఆర్థికంగా దెబ్బతీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) వంటి రవాణా సంస్థలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీనికితోడు ఆదివారం నుంచి మెట్రోరైలు మొదలుకాగా, మోనోరైలు మార్చి నుంచే సేవలు అందించడం మొదలుపెట్టింది. కొన్ని దశాబ్దాలుగా నగరంలో తిరుగతున్న బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, ముంబైకర్లకు లైఫ్లైన్గా పేరుగాంచిన లోకల్ రైళ్లపై ఆదాయంపై మెట్రో ప్రభావం పడనుంది. మెట్రో ప్రభావం అన్నింటికంటే బెస్ట్పై ఎక్కువగా ఉండవచ్చని సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బెస్ట్ బస్సుల టికెట్ల చార్జీలు విపరీతంగా పెరగడంతో.. ఇద్దరుంటే చాలు ట్యాక్సీ లేదా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నారు. అత్యధికులు ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. ఇప్పటికే అనేక రూట్లలో బెస్ట్ ఆదాయం పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మెట్రో కారణంగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య తిరిగే బెస్ట్ బస్సుల్లో కలెక్షన్లు మరింత తగ్గుతాయని అంటున్నారు. బెస్ట్కు నష్టాలు ఏటా పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి తోడు మోనో, మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోనుంది. దీంతో సంస్థ పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. మెట్రో స్టేషన్లో ప్రమాదం ఘాట్కోపర్లోని మెట్రోస్టేషన్ ఎస్కలేటర్ ఎక్కిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తూ కింద పడడంతో గాయాలయ్యాయి. వీరిని ఘాట్కోపర్లోని రాజావాడి ఆస్పత్రిలో చేర్పించారు. వీరిని అంధేరిలో నివాసముంటున్న వైశాలి దేశాయ్ (60), సునీతా రాణే (50), ఘాట్కోపర్వాసి రిజ్వానా షేక్ (50)గా గుర్తించారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. తొలిరోజే విశేష స్పందన మెట్రోరైలుకు మొదటి రోజే భారీ స్పందన కనిపించింది. ఆదివారం దాదాపు 2.40 లక్షల మంది వరకు ప్రయాణించారని దీని నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్, రిలయన్స్ గ్రూపు సంస్థల అధిపతి అనిల్ అంబానీ, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆదివారం మెట్రోరైలు ప్రారంభం కావడం తెలిసిందే. ‘మెట్రోరైలు ప్రారంభోత్సవం మాకు మరపురాని వేడుక. ఆదివారం సెలవు దినం అయినప్పటికి మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచి 2.40 లక్షల మంది రైలులో ప్రయాణించారు. ఇది ముంబైకర్ల ప్రయాణరీతిని మార్చేసింది’ అని రిలయన్స్ ఇన్ఫ్రా సీఈఓ లలిత్ జలాన్ అన్నారు. ముంబై తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రతినిత్యం ఏడు లక్షల మందికి సేవలు అందిస్తామని తెలిపారు. ప్రోత్సాహక పథకంలో భాగంగా మొదటి నెల రోజులపాటు వర్సోవా నుంచి ఘాట్కోపర్ వరకు (11.40 కిలోమీటర్లు) కేవలం రూ.10 చార్జీలు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. మెట్రోచార్జీలపై స్టే కోరిన ఎమ్మెమ్మార్డీయే ముంబై: ప్రభుత్వం సూచించిన వాటికంటే మెట్రో నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా అధిక చార్జీలు వసూలు చేయడంపై ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) హైకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ అధిక చార్జీలు వసూలు చేయకుండా స్ట్టే మంజూరు చేయాలని సోమవారం అభ్యర్థించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి రిలయన్స్ ఇన్ఫ్రా కాస్త సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ఆర్డీ ధనూకా ప్రకటించారు. విచారణ సందర్భంగా ఎమ్మెమ్మార్డీయే న్యాయవాది ఏపీ భరూచా మాట్లాడుతూ మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి కాబట్టి కేసు విచారణ త్వరగా చేపట్టాలని కోరారు. మెట్రో చార్జీల టారిఫ్పై ఎంఎంఓపీఎల్, ప్రభుత్వం మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. మెట్రో చట్టం ప్రకారం చార్జీల విధింపు తన పరిధిలోకి వస్తుందని రిలయన్స్ వాదిస్తోంది. కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 మధ్య చార్జీలు ఉండేలా టారిఫ్ తయారు చేసింది. ప్రభుత్వం మాత్రం చార్జీలు రూ.9-13 మధ్య ఉండాలని కోరుకుంటోంది. -
మెట్రో గురించి 20 ముచ్చట్లు
ముంబై: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై మెట్రోరైలు సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ముంబై రవాణా వ్యవస్థకు అత్యంత కీలకంగా మారిన మెట్రోరైలు గురించి 20 ఆసక్తికర అంశాలివి. * ప్రభుత్వం సూచించినట్టుగా తక్కువ చార్జీలతో కూడిన టారిఫ్ అమలు చేయకుంటే మెట్రోరైలు ప్రారంభోత్సవానికి రాబోనని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దీని ప్రమోటర్, రిలయన్స్ అనుబంధ సంస్థ ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)ను హెచ్చరించారు. * టారిఫ్ను పెంచేందుకు బీజేపీ ఎంఎంఓపీల్కు సహకరిస్తోందంటూ సీఎం బీజేపీపై మండిపడ్డారు. * మెట్రోరైలు సేవలను జూన్ ఎనిమిది నుంచి ప్రారంభిస్తామంటూ ఎంఎంఓపీఎల్ అధికారికం గా ప్రకటన చేసిన వేదికపై ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే), రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేరు. మరో ఆసక్తికర సంగతి ఏమంటే మెట్రోలో ఎమ్మెమ్మార్డీయేకు 26 శాతం వాటా ఉంది. * ఎమ్మెమ్మార్డీయే మెట్రోరైలును ప్రారంభించకుంటే తామే బలవంతంగా మొదలుపెడతామని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య హెచ్చరిం చంతో ఎంఎంఓపీఎల్ హఠాత్తుగా ఈ ప్రకటన చేసింది. * ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు మెట్రో సేవలను ప్రారంభిస్తూ ఘాట్కోపర్ వద్ద చిన్న పూజ కూడా నిర్వహించడం విశేషం. * ప్రభుత్వం సూచించిన దానికంటే ఎంఎంఓపీఎల్ ప్రకటన ప్రారంభోత్సవ చార్జీలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే తుది టారిఫ్పై ఎంఎంఓపీఎల్, ప్రభుత్వం మధ్య వివాదం ఉంది. మెట్రో చట్టం ప్రకారం చార్జీల విధింపు తన పరిధిలోకి వస్తుందని ఎంఎంఓపీఎల్ వాదిస్తోంది. కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 మధ్య చార్జీలు ఉండేలా టారిఫ్ తయారు చేసింది. ప్రభుత్వం మాత్రం చార్జీలు రూ.9-13 మధ్య ఉండాలని కోరుకుంటోంది. * ప్రభుత్వం 2009లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే మెట్రో పాలన సాగాలని ఎంఎంఓపీఎల్ పట్టుబడుతోంది. * మెట్రో అంచనావ్యయం రూ.2,356 కోట్ల నుంచి రూ.4,321 కోట్లకు పెరిగింది. * వెర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో రిలయన్స్ ఇన్ఫ్రా 11.40 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించింది. * దీని నిర్మాణ పనులు 2007లో లాంఛనంగా ప్రారంభమైనా, నిర్దేశిత గడువులు తరచూ వాయిదాపడ్డాయి. * ప్రతి మెట్రోరైలుకు నాలుగు కోచ్లు ఉంటాయి. ఒక్కోదాంట్లో 375 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో రైలులో మొత్తం 1,500 మంది దాకా ప్రయాణించవచ్చు. * ప్రతినిత్యం 200-250 ట్రిప్పులు నడపడం ద్వారా 11 లక్షల మందికి సేవలు అందిస్తామని ఎంఎంఓపీఎల్ ప్రకటించింది. * వెర్సోవా నుంచి ఘాట్కోపర్కు రోడ్డు ద్వారా ప్రయాణిస్తే కనీసం గంట పడుతుంది. మెట్రోరైలు ద్వారా కేవలం 21 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. * రైల్వే తదితర సంస్థల నుంచి అనుమతులు రాకపోవడం, భూసేకరణ సమస్య, పరిహారం చెల్లింపు తదితర సమస్యల వల్ల మెట్రోమార్గం నిర్మాణంలో జాప్యం తప్పలేదు. * ఈ మార్గంలో మొదట రోజుకు ఏడు లక్షల మంది వరకు ప్రయాణించవచ్చని, తదనంతరం దీనిని 11 లక్షలకు పెంచుతామని ఎంఎంఓపీఎల్ అంటోంది. * సాధారణ కౌంటర్లతోపాటు స్మార్ట్కార్డులు, టోకెన్ల ద్వారా కూడా టికెట్లు కొనవచ్చు. అన్ని స్టేషన్లలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. * మెట్రోరైలు ప్రారంభం వల్ల వెర్సోవా-అంధేరీ ప్రాంతాల్లో స్థిరాస్తిరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తుల కన్సల్టింగ్ సంస్థ జోన్స్లంగ్ లాజెలే ప్రకటించింది. * ఈ సంస్థ చెప్పినట్టే మెట్రో వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు గత ఎనిమిది సం వత్సరాల్లో 400 శాతం పెరిగాయి. భవిష్యత్లో మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. * మెట్రోరైలు సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కొత్తగా సంస్థలు, దుకాణాలు పెద్ద ఎత్తున వెలుస్తాయని అంచనా * రైల్వేశాఖ ముంబై మెట్రోరైలు ప్రారంభించడానికి గురువారం తుది అనుమతులు మంజూరు చేసింది. -
ముహూర్తం ఖరారు
నేడు ప్రారంభం కానున్న ముంబెమైట్రో సేవలు సాక్షి, ముంబై: నగరవాసులకు అత్యాధునిక ప్రయాణసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని గంటలే మిగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముంబై మెట్రోరైలు సేవలు ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10.30 గంటలకే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రయాణికులను అనుమతిస్తారని మెట్రోప్రాజెక్టు సీఈవో అభయ్ మిశ్రా తెలిపారు. భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అత్యాధునిక సదుపాయాలతో సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ముంబై మెట్రో అన్నివిధాలా సిద్ధంగా ఉందన్నారు. ఈ సేవలు ప్రారంభమైతే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని చెప్పారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో సుమారు 45 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రయాణ సమయంతోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఆగుతూ వస్తే కనీసం రెండున్నర గంటలకుపైగానే సమయం అవసరమవుతోంది. మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే 90 నుంచి 120 సమయం ఆదా అవుతుంది. దీంతోపాటు బస్సు, ఆటో, ట్యాక్సీ చార్జీలతో పోలిస్తే మెట్రో చార్జీలు చాలా తక్కువ. దీంతో ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. ఉదయం 5.30 గంటల నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయి. రాత్రి 12.00 వరకు కొనసాగుతాయి. ప్రతి 15 నిమిషాలకో రైలు చొప్పున మొత్తం 16 రైళ్లు సేవలందిస్తాయి. ఒక్కో బోగీలో 350 మంది కూర్చుండే సామర్థ్యం ఉండగా ఒక రైలుకు నాలుగు బోగీలుంటాయి. దీంతో ఒక్కో రైలులో 1,500 మంది ప్రయాణించే అవకాశముంది. ఇలా 16 రైళ్లు రోజుకు లక్షల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ముఖ్యాంశాలు పేరు: ముంబై మెట్రోలైన్ ఏ-1 మార్గం ప్రారంభం: ఉదయం 10.30 గంటలకు వాణిజ్య సేవలు: మధ్యాహ్నం 12.00 గంటల నుంచి దూరం: వర్సోవా నుంచి ఘాట్కోపర్ వరకు 11.40 కిలోమీటర్లు స్టేషన్లు: వర్సోవా, డీఎన్ నగర్, ఆజాద్నగర్, అంధేరి, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, చకాల, ఎయిర్పోర్టు రోడ్, మరోల్, సకినాకా, అసల్ఫా, జాగృతినగర్, ఘాట్కోపర్ సేవలు: ఉయదం 5.30 గంట నుంచి రాత్రి 12.00 వరకు వేగం: గంటకు 80 కిలోమీటర్ల వేగంతో.. ప్రయాణికుల సామర్థ్యం: సేవలందించనున్న 16 రైళ్లలో ఒక్కో రైలులో 1,500 మంది ప్రయాణించే సామర్థ్యముంది. ఫ్రీక్వెన్సీ: ప్రతి 15 నిమిషాలకో రైలు -
కాంగ్రెస్ కోటా భర్తీ
ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించిన చవాన్ సాక్షి, ముంబై: ఎట్టకేలకు కాంగ్రెస్ కోటాలోని మంత్రి పదవులు భర్తీ అయ్యియి. శనివారం రాత్రి ముగ్గురు మంత్రులకు శాఖలు కే టాయించారు. అబ్దుల్ సత్తార్ కు పాడిపరిశ్రమ, పశుసంవర్ధకశాఖ, మధుకర్ చవాన్కు రవాణ, అమిత్ దేశ్ముఖ్కు ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరిలో అబ్దుల్ సత్తార్, అమిత్ దేశ్ముఖ్ గత సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తోపాటు మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో తేరుకున్న ఎన్సీపీ ఇటీవల మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీచేసి చేతులు దులుపేసుకుంది. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులను కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. దీంతో ఎవరికి? ఏ శాఖ? కేటాయిస్తారనే విషయమై సర్వత్రా నెలకొన్ని ఉత్కంఠకు పృథ్వీరాజ్ చవాన్ శనివారం రాత్రి తెరదించారు. అయితే ఇంత ఆదరాబాదరగా శాఖలు కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే సమయమున్నందున గెలుపుదిశగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులోభాగంగానే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎన్సీపీ కాస్త ముందున్నా కాంగ్రెస్ మాత్రం దూకుడుగా వ్యవహరించినట్లు కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులు భర్తీ కావడం జరగని పనే అనుకున్నారంతా. అయితే అకస్మాత్తుగా శనివారం రాత్రి భర్తీ చేయడంతో పార్టీ నేతలు సైతం నివ్వెరపోయారు. -
తగ్గిస్తేనే వస్తా!
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రా నిర్ణయించిన మెట్రో చార్జీలు ఆమోదయోగ్యంగా లేవని, నిర్హేతుకమైన చార్జీల పెంపుదల విషయంలో వెనక్కు తగ్గకపోతే ప్రారంభోత్సవానికి తాను వచ్చేదిలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంకేతాలిచ్చారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని పరుగు తీయడానికి సిద్ధమైన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చవాన్ ఇచ్చిన ఈ సంకేతాలు ఇప్పుడు నగరంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. 11.40 కిలోమీటర్ల మేర రూ. 3,400 కోట్లతో నిర్మించిన ఈ మార్గంలో కనీస చార్జీ రూ. 9 గరిష్ట చార్జీ రూ. 13గా వసూలు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కనీస చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ. 40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్జీల పెంపుదల నిర్హేతుకమైనదని, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్ ఇన్ఫ్రా కట్టుబడి ఉండాలని, లేదంటే తాను ప్రారంభోత్సవానికి రాననే సంకేతాలనిచ్చారు. బీజేపీ ఎంపీలు కిరీట్ సోమయ్య, గోపాల్శెట్టి అండదండలు, ప్రోత్సాహంతోనే రిలయన్స్ ఇన్ఫ్రా చార్జీలను పెంచే సాహసం చేస్తోందని చవాన్ ఆరోపించారు. చార్జీల పెంపుదలపై బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చవాన్ డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకున్న తర్వాతే పెంపుదల విషయమై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలన్నారు. ఇదిలాఉండగా ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి అభయ్ మిశ్రా మాట్లాడుతూ.... ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై నగరంలో మెట్రో సేవలను జూన్ 8, మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలను లక్షలాదిమంది నగరవాసులకు అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. మెట్రో ప్రయాణంపై చేసే ప్రచారంలో భాగంగా మొదటి నెల రోజులు కేవలం రూ. 10 మాత్రమే చార్జీగా వసూలు చేస్తాం. ఈ చార్జీతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీలోని ఏ స్టేషన్ వరకైనా ప్రయాణించవచ్చు. అయితే ఇది కేవలం ప్రచారం కోసం నిర్ణయించిన చార్జీ మాత్రమే. ఆ తర్వాత మెట్రో చార్జీలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తామ’న్నారు.