local body elections 2014
-
రాయబేరాలు!
సంఖ్యాబలం సమీకరణకు ప్రలోభాలు రూ.కోటి నగదు, ఫార్చ్యూనర్ కారు ఎర టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ సభ్యుడు? ఆసక్తికరంగా జెడ్పీ రాజకీయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్లు వ్యూహాలకు పదునుపెట్టాయి. మేజిక్ ఫిగర్ను చేరేందుకు, అవసరమైన సంఖ్యకు చేరుకునేందుకు జెడ్పీటీసీలతో రాయబేరాలు సాగిస్తున్నాయి. నజరానాలు, ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 17 మంది సభ్యులు అవసరం. మొత్తం 33 మంది జెడ్పీటీసీలకుగాను ప్రస్తుతం కాంగ్రెస్కు 14, టీఆర్ఎస్కు 12, టీడీపీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. ఈ క్రమంలోనే మేజిక్ నంబర్ కోసం ఇరుపార్టీలూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లు టీడీపీపై మద్దతుపై గట్టి ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఇరుపార్టీలు తమకు ఉమ్మడి శత్రువు కనుక.. ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. ఒకవేళ అనివార్యమై తే కాంగ్రెస్కు అండగా నిలుస్తాం తప్ప టీఆర్ఎస్తో జతకట్టేదిలేదని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ మద్దతుపైనే ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు మంతనాలు కూడా సాగిస్తున్నారు. నజరానాల ఎర జిల్లా పరిషత్ చైర్మన్పై కన్నేసిన ఓ ప్రధాన పార్టీ.. ప్రత్యర్థి పార్టీల సభ్యులపై వల విసురుతోంది. సరిపడా సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తూర్పు డివిజన్లోని ఓ కాంగ్రెస్ సభ్యుడితో టీఆర్ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరిపినట్లు ప్రచారమవుతోంది. కోటి రూపాయల నగదు, ఫార్చునర్ కారును ఎరవేయడం ద్వారా సదరు జెడ్పీటీసీని ఆకర్షించడంలో సక్సెస్ అయినట్లు తెలిసింది. ఇదే తరహాలో మిగతా సభ్యులను కూడా చేరదీయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్లు క్యాంపు రాజకీయాలు నెరపుతున్నప్పటికీ, మరోవైపు ఆయా పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, విప్ ఉల్లంఘించినా ఏమీ కాదనే ధీమాతో కొందరు సభ్యులు గోడ దూకేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సస్పెన్షన్ వేటు పడ్డ కాంగ్రెస్ జెడ్పీటీసీ, గులాబీ గూటికి చేరే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్లో నైరాశ్యం అలుముకోవడం, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి కూడా సొంత పార్టీ సభ్యుల గొంతెమ్మ కోరికలను తీర్చే విషయంలో వెనుకడుగు వేస్తుండడాన్ని అనువుగా మలుచుకున్న టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అసంతుష్టులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. వారిని సంతృప్తి పరచడం ద్వారా మేజిక్ ఫిగర్ను సులువుగా చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ కూడా ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీలపై వల విసరకుండా అప్రమత్తమైంది. సభ్యుల కదలికలపై నిఘాను విస్తృతంచేసింది. -
మొదలైన క్యాంపులు
సాక్షి, హన్మకొండ: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నాడో సినీ కవి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజే రాజకీయ నేతలు తమ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్లుగా బరిలో నిలి చిన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. గెలిచిన వారు ఎట్టి పరిస్థితుల్లోను తమ పట్టు నుంచి జారిపోకుండా... ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఈ ఏడాది మార్చి 30న పోలింగ్ జరిగింది. మొత్తం 115 మంది వార్డులకు 651 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి చైర్పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరగనుంది. ఈ మేరకు ప్రతి మునిసిపాలిటీలో ఎక్కువ వార్డుల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, తమలో ఒకరిని మునిసిపాలిటీ చైర్మన్గా, మరొకరిని వైస్చైర్మన్గా ఎ న్నుకుంటారు. దీంతో గెలిచిన ప్రతి వార్డు మెంబరూ కీలకం గా మారారు. ఈ నేపథ్యంలో ఐదు మునిసిపాలిటీలకు సం బంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నిట్ క్యాంపస్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక రోజు ముందుగానే... భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్లో చైర్పర్సన్ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భూపాలపల్లిలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు జతకట్టగా... మహబూబాబాద్లో టీఆర్ఎస్ సీపీఐలు ఒక జట్టుగా ఎన్నికల బరిలో నిలిచాయి. భూపాలపల్లి నుంచి వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులను ఒకరోజు ముందుగానే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు హన్మకొండలోని రహస్య ప్రదేశాలకు తరలించారు. సోమవారం ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులను అక్కడి నుంచి అటే పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లే యోచనలో నాయకులు ఉన్నారు. కాగా.. మహబూబాబాద్ టీఆర్ఎస్ వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఒక బృందంగా ఏర్పడి ఆదివారం రాత్రి మహబూబాబాద్ నుంచి హన్మకొండకు చేరుకున్నారు. వీరందరూ కౌంటింగ్ కేంద్రానికి దగ్గరల్లో ఉన్న లాడ్జిలో బస చేసినట్లుగా సమాచారం. మరోవైపు భూపాలపల్లిలో టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వార్డు మెంబర్లు సోమవారం తెల్లవారు జామున మొలుగూరి బిక్షపతి ఇంటికి చేరుకుని... అక్కడి నుంచి ప్రత్యేక వాహానంలో హన్మకొండకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. పరకాలలో టీడీపీ, బీజేపీ గణనీయమైన సంఖ్యలో వార్డుమెంబర్లుగా గెలుస్తామని అంచనా వేస్తున్నాయి. రెండు పార్టీలు ఒక జట్టుగా ఏర్పడి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికలో కీలక పాత్ర పోషించాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కట్టడి చేయడంపై స్థానిక నాయకత్వం దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా... జనగామ, నర్సంపేట మునిసిపాలిటీల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రంగంలోకి దూకాలని అక్కడి నేతలు భావిస్తున్నారు. -
రేపే ‘స్థానిక’ ఫలితాలు
చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. జిల్లాలోని 65 జెడ్పీటీసీ స్థానాలకు 266 మంది, 887 ఎంపీటీసీ స్థానాలకు 2414 మంది పోటీ పడ్డారు. ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రాత్రికే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించడానికి జిల్లా వ్యాప్తంగా ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ఒక్కో మండలం కౌంటింగ్ పూర్తవుతుండగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారికి అప్పటికప్పుడే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను ఒకేసారి లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 10 గంటలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ధీమా జెడ్పీ పీఠం కచ్చితంగా తమకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, రుణమాఫీ, వైఎస్.జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్రలు ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తాయని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. దీనికితోడు టీడీపీకి 13 మండలాల్లో రెబల్స్ బెడద ఉండటం, చంద్రబాబు గత పాలన వద్దంటూ రైతులే బహిరంగంగా చెప్పడంతో ఆ పార్టీ నేతలకు ఎన్నికల ఫలితాలపై దిగులు పట్టుకుంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మెజారిటీ స్థానాలు తమకే వస్తాయంటూ చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఓటర్లు చెప్పిన తీర్పు బహిరంగం కావడానికి మరికొన్ని గంటలు ఆగాల్సిందే. -
కౌంటింగ్కు పక్కా ఏర్పాట్లు
కడప కలెక్టరేట్, న్యూస్లైన్: ఈనెల 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట డివిజన్కు కడపలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, జమ్మలమడుగు డివిజన్కు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్కు కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సులను డీజీటీ వాహనాల్లో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని, ఈ సమాచారాన్ని అభ్యర్థులకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ శిక్షణ తరగతులు ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లోనే నిర్వహిస్తారన్నారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమం ఈ నెల 14 ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూలులో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏఓ గుణభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ తేదీల్లో మద్యం విక్రయాలు బంద్ కడప అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 12, 13, 16 తేదీల్లో నిర్వహించే ఆయా ఎన్నికల కౌంటింగ్ల ఈ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధితోపాటు చుట్టు ఐదు కిలోమీటర్ల మేరకు మద్యం షాపులను మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. శనివారం కడప ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారన్నారు. ఎన్నికలు జరిగే రోజుల్లో కూడా 48 గంటలపాటు మద్యంషాపులను మూసి వేయించామన్నారు. అలాగే కౌంటింగ్ జరగనున్న తేదీలలో కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేది సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలన్నారు. అలాగే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం షాపులను మూసి వేయాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీతోపాటు కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గట్టి బందోబస్తు కడప అర్బన్, న్యూస్లైన్: జిల్లాలో ఈనెల 12న మున్సిపల్,13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్తోపాటు నగరంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, డప్పులు లేదా బ్యాండులతో ఊరేగింపులు, బాణసంచా కాల్చడం నిషిద్ధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో పార్కింగ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి వాహనాలను నగర శివార్లలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకు రావాలని పేర్కొన్నారు. -
12న మునిసిపల్, 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: మునిసిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ఈనెల 12న కర్నూలు శివారులోని సెయింట్ బాలికల జూనియర్ కళాశాల జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13న కర్నూలు డివిజన్లో అన్ని మండలాల ఓట్ల లెక్కింపు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ, డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్)లోను జరుగుతుందని పేర్కొన్నారు. ఆదోని డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోందని వివరించారు. వీటికి కూడా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. -
రాజకీయ పార్టీల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ నెల 12న మునిసిపల్, 13న మండల, జిల్లా ప్రాదేశిక, 16న అసెంబ్లీ, పార్లమెంట్ ...ఇలా వరుసగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఘడియ సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో వరుస ఎన్నికలను ఎదుర్కొన్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఫలితాల గడువు సమీపించే కొద్దీ.. పల్స్ రేటు పెరుగుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆలోచనలతో అభ్యర్థులు రోజులను భారంగా గడుపుతున్నారు. ఫలితాల టెన్షన్ నుంచి బయటపడేందుకు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కుటుంబంతో గడపడం, కార్యక్రమాలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా... ఫలితాల ప్రస్తావనే వెంటాడుతోంది. ‘పుర’ పరీక్షే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మునిసిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారాయి. జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు ఈ నెల 12న వెలువడనున్నారుు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కావడంతో జనగామ మునిసిపల్ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా ఉండనుంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రస్తుత సాధారణ ఎన్నికల్లోనూ పొన్నాల లక్ష్మయ్యకు టీఆర్ఎస్ అభ్య ర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. గెలుపుపై రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముం దు వెల్లడయ్యే జనగామ మునిసిపల్ ఫలి తంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూపాల పల్లి నగరపంచాయతీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల తీర్పును ప్రభావితం చేస్తుందనే వాదనలు వినపడుతున్నారుు. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఇక్కడి రాజ కీయ పరిస్థితులు మారిపోగా... గండ్ర వెంకట రమణారెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్నట్లు శ్రేణు లు భావిస్తున్నారుు. మానుకోట మునిసిపల్ ఎన్నికల ఫలితం ఇదే తీరుగా ఆసక్తిని పెంచుతోంది. నర్సంపేట, పరకాల నగర పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఇక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులకు పరీక్షగానే మారాయి. ‘పరిషత్’ ప్రామాణికం... సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపైనే అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు వీటి ఫలితాలు, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఎంపీటీసీ ఎన్నికలు ఆయా గ్రామాల్లోని స్థాని క సమీకరణలపై జరిగినా... జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం సాధారణ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న వెల్లడ య్యే పరిషత్ ఫలితాలను ఎమ్మెల్యే అభ్యర్థులు తమ గెలుపోటములకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో పరిషత్, సాధారణ ఎన్నికల మధ్య రాజకీయ పరిస్థితుల్లో తేడా ఉంది. అప్పటివరకు నర్సంపేట కాంగ్రెస్ ఇన్చార్జ్గా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొంతి మాధవరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. భూపాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న గండ్ర సత్యనారాయణరావు... బీజేపీ అభ్యర్థిగా సాధారణ ఎన్నికల బరిలోకి దిగారు. పరకాల నియోజకవర్గం లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో సహోదర్రెడ్డి పోటీ లో ఉన్నారు. ఇలా మూడు సెగ్మెంట్లు మినహాయిస్తే... మిగిలిన అన్నింటిలోనూ స్థానిక, సాధారణ ఎన్నికలను ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యం లో స్థానిక ఫలితాలు వచ్చిన తర్వాత మూడో రోజు సాధారణ తీర్పు వెలువడుతుండడం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. -
ఫలితాల మేళా ఎదురుచూపులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల ఫలితాల కోసం ఏకంగా రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో అటు అభ్యర్థులు, ఇటు ఆయా పార్టీల నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పూర్తయిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలూ వెలువడక పోవడంతో ఓ అంచనాకు రాలేక పోతున్నారు. ఈ నెల 12న మున్సిపల్, 13వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలైంది. ఈ ఫలితాల ఆధారంగా తమ గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది. జిల్లాలో ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు మున్సిపాలిటీలు, మరో రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. స్థానిక అంశాలు ప్రభావితం చేసినా, మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాడో, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అదే పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అంచనాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపల్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో రూరల్ ఓటరు కీలకం కానున్నాడు. ఈ కారణంగానే 16వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఫలితాల కంటే ముందే 12,13 తేదీల్లో వెలువడే మున్సిపల్, ప్రాదేశిక ఫలితాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇదీ ... లెక్క నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.21లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటే, ఒక్క నల్లగొండ మున్సిపాలిటీలోనే 1.21లక్షల పైచిలుకు ఓట్లున్నాయి. అంటే సగానికి సగం ఓట్లు పట్టణ ఓటర్లవే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు ఇదే తరహాలో ఓటింగ్ సరళి ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ఇట్టే ఓ అవగాహనకు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.07లక్షల ఓట్టుంటే, మున్సిపాలిటీలో 75,364, సూర్యాపేట నియోజకవర్గంలో 2.16లక్షల ఓట్లకు గాను, మున్సిపాలిటీలో 77,638 ఓట్లున్నాయి. భువనగిరి, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల్లోనూ చెప్పుకోదగిన రీతిలోనే పట్టణ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 3.96లక్షల పైచిలుకు పట్టణ ఓటర్లు ఉన్నారు. ఇరవై అయిదు లక్షల పైచిలుకు జిల్లాలో ఉన్న ఓట్లలో మిగిలినవ న్నీ రూరల్ ఓట్లే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఫలితాలు వెలువడితే ఏ పార్టీ ఎన్ని జెడ్పీటీసీ, ఎన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుందో తెలిస్తే, రూరల్ ఓటు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి పడ్డాయో అంచానా వేసే వీలుంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే వెలువడుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగిశాక ఫలితాల కోసం రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో ఉత్కంఠకు గురవుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు, పార్టీల నేతలు కనీసం మున్సిపల్, స్థానిక ఫలితాలతో అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై రకరకాల సమీకరణలు, అంచనాలు తెరపైకి వచ్చాయి. కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కూడా సాగుతోందని సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలే జరగడంతో అభ్యర్థుల గెలుపుపై స్పష్టమైన ఓ అంచనాకు రాలేకపోతున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ప్రచారంలో ఫైటింగ్ సీన్
నడిరోడ్డుపై తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ యువసేన కన్వీనర్ వర్సెస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎమ్మెల్యే కవిత ఎదుటే బాహాబాహీ అడ్డుకున్న శ్రీరాంభద్రయ్య, భరత్చందర్రెడ్డి, పార్టీ శ్రేణులు కేసముద్రం, న్యూస్లైన్ : కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఎన్నికల వేళ మరోసారి భగ్గుమన్నాయి. మొదటి నుంచి ఒకరికొకరు పోటీపడుతూ ప్రచారంలో పాల్గొంటున్న ఇద్దరు నాయకుల మధ్య వివాదం చివరికి తన్నులాటకు దారితీసింది. సాక్షాత్తు ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి ఎదుట ఈ ఫైటింగ్ జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాహుల్ యువసేన మండల కన్వీనర్ చిలువేరు సమ్మయ్యగౌడ్ ఎమ్మెల్యే కవిత ప్రచారానికి తన అనుచరులతో బైక్ర్యాలీతో హాజరయ్యాడు. అలాగే కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు దస్రూనాయక్ కూడా ప్రచారంలో పాల్గొన్నాక కేసముద్రంవిలేజ్లోని ఓ నాయకుడి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పార్టీశ్రేణులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటకు సమ్మయ్యగౌడ్ను పిలిపించి తన గ్రామానికి చెందిన తన వ్యతిరేకులను నువ్వు ఎలా ప్రచారానికి పిలుస్తావని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోతూ దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటే సమ్మయ్యగౌడ్పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి కంగుతిని ఘర్షణను అడ్డుకున్నారు. కంటతడి పెట్టిన సమ్మయ్యగౌడ్ను బుజ్జగించి, కారులో తీసుకుని బయల్దేరారు. విషయం తెలుసుకున్న సమ్మయ్యగౌడ్ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. శ్రీరాంభద్రయ్య, భరత్చందర్రెడ్డి కారులో తమతోపాటు సమ్మయ్యగౌడ్ను కూర్చొబెట్టుకుని ఆయనకు సర్ధిచెపుతూ అక్కడున్న దస్రూను కూడా కారులోకి రమ్మని పిలిచారు. ప్రచార వాహనం నుంచి కారు వద్దకు వెళ్తున్న దస్రూనాయక్ను వెంబడించిన సమ్మయ్య అనుచరులు తీరా కారు డోర్ తీస్తుండగానే దస్రూపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడున్న నాయకులు ఎందరు అడ్డుకున్నా వారు ఆగలేదు. పరిస్థితి చేయి దాటుతుండడంతో కారులో నుంచి ఇద్దరు నాయకులు దిగి రెండు వర్గాల నాయకులను చెరోవైపు చెదరగొట్టారు. స్థానికుల విస్మయం.. ఓట్లడగడానికి వచ్చిన నాయకులు ఇలా కొట్టుకుంటున్నారేమిటంటూ అక్కడున్న ప్రజలు విస్మ యం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలా క్రమశిక్షణ లేకుం డా ముందుకెళితే పరిస్థితి చేయిదాటుతుందంటూ మరికొందరు నాయకులు వాపోయారు. కాంగ్రెస్ శ్రేణుల్లో విబేధాలు తరచూ రచ్చకెక్కుతుండడం ఎమ్మెల్యే కవితకు తలనొప్పిగా మారింది. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..
కైకలూరు, న్యూస్లైన్ : అయ్యా.. చంద్రబాబు గారు.. నా భర్త 33 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలందించారు.. గతంలో టిక్కెట్టు ఇస్తానని చెప్పి మోసం చేశారు.. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్య భార్య లక్ష్మీపార్వతి. ఈ దంపతులిద్దరూ శనివారం చివరి నిమిషంలో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. శుక్రవారం చంద్రబాబును కలిసి కాళ్లావేళ్లాపడి వేడుకున్నా ఏ మాత్రం కనికరించకుండా.. నేనెవరికి చెప్పుకోవాలి అంటూ మాట్లాడారని వాపోయారు. రామానుజయ్య మాట్లాడుతూ గోడు తెలపడానికి వెళ్లిన తన భార్యను, అభిమానులను మహిళ అని చూడకుండా చంద్రబాబు యాత్రలోని పోలీసులు, సెక్యూరిటీ చితకబాదారన్నారు. ఈ ఘటనలో ఒకరి చేయి విరిగిందన్నారు. అస్పత్రిలో చికిత్ర పొందుతుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ కనీసం ఎలా ఉందని పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులలో భాగంగా బీజేపీకి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళకు గాని, తనకు గాని టిక్కెట్టు కేటాయిస్తే కలసి పనిచేస్తామని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. -
జనాభా కంటే ఓటర్లెక్కువ!?
2011 జనగణన ప్రకారం ‘గ్రేటర్ ’ జనాభా 67,31,790 జీహెచ్ఎంసీలో ప్రస్తుత ఓటర్లు 78,48,259 ఇదీ గ్రేటర్ వి‘చిత్రం’ సాక్షి, సిటీబ్యూరో : సాధారణంగా మొత్తం జనాభాలో ఓటర్లు 70 శాతానికి అటూ ఇటూగా ఉంటారనేది నిపుణుల అంచనా. అదేమి విచిత్రమో కానీ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మాత్రం జనాభా కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే జనాభా 2011 జనగణన వివరాల మేరకు కాగా.. ఓటర్ల సంఖ్య మాత్రం తాజాది. 2011 జనగణన ప్రకారం గ్రేటర్ జనాభా 67,31,790 ఉంటే ఓటర్లు 78,48,259 మంది ఉన్నారు. అంటే కేవలం మూడేళ్లలోనే ఓటర్లు జనాభాను మించిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారా? అంటే గత మూడేళ్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అదీ లేదు. అయినా గ్రేటర్లో జనాభా కంటే ఓటర్లు సుమారు 11 లక్షలకు పైగా పెరిగిపోయారు. ఇదే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2011లో జనగణన జరిగిన సమయంలో టీ ఆర్ఎస్, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె, ఇతరత్రా ఆందోళనలు జరిగాయని జీహెచ్ఎంసీ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. నిర్ణీత వ్యవధిలోగా జనగణన వివరాలు అందజేయాలి కనుక అప్పట్లో జనగణన కార్యక్రమం గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లో సవ్యంగా జరగలేదని ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. దీనికితోడు ఓటు హక్కుపై పెరిగిన ప్రచారం, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల పెరిగిన చైతన్యం వెరసి ఓటర్లు ఇటీవల భారీగా పెరిగారు. గడచిన మూడుమాసాల్లోనే కొత్త ఓటర్లుగా 3.66 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారంటేనే ఓటుపై ప్రచారం ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కంటే ఓటర్లుగా పేరు నమోదు చేయించుకున్న వారు పెరిగినప్పటికీ.. జనాభా కంటే ఎక్కువైతే ఉండరు. జనగణన సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. మరో ముఖ్యవిషయమేమిటంటే.. మెదక్జిల్లా పరిధిలోని పటాన్చెరు డివిజన్ కూడా గ్రేటర్లోనే ఉంది. ఈ నియోజకవర్గంలోని రెండు డివిజన్లు మాత్రమే గ్రేటర్లో ఉన్నందున ఆ నియోజకవర్గ ఓటర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ నియోజకవర్గ మొత్తం ఓటర్లను (2,93,768మందిని) పరిగణనలోకి తీసుకుంటే ఓటర్లు 81,42,027 గా ఉన్నారు. ఈ లెక్కల్ని బట్టి గ్రేటర్ జనాభా దాదాపు కోటికి చేరి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
వైఎస్ విజయమ్మకుజననీరాజనం
పశ్చిమ కృష్ణా జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు.. దారిపొడవునా ప్రజల నీరాజనాలు నడుమ మండుటెండను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో వైఎస్సార్ జనభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కోసం నిరీక్షించిన ప్రజలను ఉద్దేశించి పలుచోట్ల ప్రసంగిస్తూ జిల్లాలో రోడ్షో నిర్వహించారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల శంఖారావం పూరించారు. సోమవారం జిల్లాలోని జగ్గయ్యపేట నియోజవర్గంలో ప్రారంభమైన యాత్ర మైలవరం నియోజకవర్గంలో ముగిసింది. -
పచ్చి మోసగాడు ‘బాబు’
చంద్రబాబు రోడ్షోలో పాత చెప్పులతో నిరసనకు నిర్ణయం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిన సుబ్బారావు రాజమండ్రి రూరల్, న్యూస్లైన్ : మాదిగలకు మాటిచ్చి మోసం చేసిన తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మంగళవారం మండపేటలో నిర్వహించే రోడ్షోలో పాతచెప్పులతో నిరసన తెలియజేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ హెచ్చరించారు. సోమవారం ఆయన జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగనై పుడతానని చెప్పుకున్న చంద్రబాబు జిల్లాలో మూరు రిజర్వ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. మంగళవారం జిల్లాలో పర్యటించే చంద్రబాబుకు ప్రతి మాదిగ ఒక చెప్పుతో నిరసన తెలిపాలని పేర్కొన్నారు. యనమల వెన్నుపోటు పొడిచాడు మాదిగలకు సీటు రాకుండా ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజానగరం జడ్పీటీసీ స్థానం కేటాయిస్తానని చెప్పి మోసం చేసిన పెందుర్తి వెంకటేష్ను ఎన్నికల్లో ఓడించి తీరుతామన్నారు. 2004, 2009 ఎన్నికలలో మాలలకు, మాదిగలకు సమాన రాజకీయ అవకాశం కల్పించింది వైఎస్సార్ ఒక్కరే అన్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకోకపోతే మహాజన సోషలిస్టు పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందన్నారు. -
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు
సాల్వాపూర్, మన్సాన్పల్లిలో భారీగా పంటనష్టం వెయ్యి ఎకరాల్లో ధ్వంసమైన వరి పంట రాలిపోయిన మామిడి కాయలు బచ్చన్నపేట, న్యూస్లైన్ : ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వారం రోజుల క్రితం కురిసిన వడగళ్లతో కుదేలైన రైతులు, ఆదివారం రాత్రి మరోసారి ప్రకృతి సృష్ట్టించిన బీభత్సానికి విలవిలలాడారు. వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, వాన దుమారంతో వందలాది ఎకరాల్లో మామిడి చెట్లు విరిగిపోవడమేగాక, కాయలు రాలిపోయాయి. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్పల్లి, లింగంపల్లి, కొన్నె, పడమటికేశ్వాపూర్, ఇటికాపల్లి, బచ్చన్నపేట, తమ్మడపల్లి, కట్కూరు, చినరామన్చర్ల, బసిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు మండలవ్యాప్తంగా గోలి సైజులో గంటన్నరపాటు కురిసిన వడగళ్లు వెయ్యి ఎకరాల్లో వరి పంటను నాశనం చేశాయి. సుమారు 250 ఎకరాలకుపైగా మక్క పంట, మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు. బాధిత రైతులను ఆదుకోవాల ని ఆయా గ్రామాల సర్పంచ్లు చొక్కం వరల క్ష్మి, బండకింది చంద్రకళ, భైరగోని బాలమణి, బేజాటి సిద్దులు, కాంగ్రెస్ నాయకులు గూడ చెన్న కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. మద్దూరులో గాలి దుమారం మద్దూరు : మండలంలో ఆదివారం సాయంత్రం భారీ గాలిదుమారం రావడంతో చేతికందిన వరి పంట నాశనమైంది. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయి నిలవ నీడలేకుండా చేశాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికందే సమయంలో గాలి దుమారం రావడంతో రైతు లు కన్నీరుమున్నీరయ్యారు. చేసిన అప్పులు ఎలా తీరేదని వాపోతున్నారు. మామిడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
విధుల పంచాయితీ
వివాదంగా మారిన ఉద్యోగుల కాపలా {స్టాంగ్రూంల వద్ద సెక్యూరిటీ గార్డు బాధ్యతలపై విమర్శలు జెడ్పీ సీఈఓ ఆదేశాలపై సర్వత్రా నిరసన విధుల్లో చేరిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చిన మినహాయింపు జిల్లా పరిషత్, న్యూస్లైన్ : స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్లు భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్ద జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టడం వివా దంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని ములుగు, పరకాల, మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట, జనగామ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆరు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్స్లను భద్రపర్చారు. వీటి భద్రత బాధ్యతలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సుప్రీం కోర్టు వాయిదా వేయడంతో స్ట్రాంగ్ రూంల వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుప్రీం ఆదేశాల ప్రకారం వచ్చే నెల ఏడో తేదీ తర్వాతే లెక్కింపు చేపట్టాలి. తుది విడత పోలింగ్ జరిగిన రోజు నుంచి లెక్కేస్తే... సుమారు 30 రోజుల వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే కలెక్టర్ గానీ... జేసీ గానీ, రెవెన్యూ డివిజన్లలో ఉంటే ఆయా డివిజన్లకు చెందిన ఆర్డీఓలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్లు చెదలు, చీడపురుగులతో పాడవకుండా పరిశీలించేందుకు ఆర్డీఓలతోపాటు ఆయా మండలాలకు చెందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు... పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో వారంలో ఒక రోజు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న బ్యాలెట్ బాక్స్లను పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్ఈసీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉంది. ఈ క్రమంలో జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా ఉండాలని సీఈఓ ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ముగ్గురు చొప్పున సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూడు షిప్టులుగా ఎనిమిది గంటలపాటు విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అరుుతే ఈ విధుల నుంచి మహిళా ఉద్యోగులను మినహాయించడం వారికి ఊరటనిస్తోంది. ఇది సరికాదు... ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టినప్పటికీ... పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం సరికాదని తెలంగాణ పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బేహర శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే... ఇక్కడ పీఆర్కు చెందిన ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీఆర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎన్నడూ స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించలేదని... జెడ్పీ సీఈఓ నిర్ణయంతో వారు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. స్ట్రాంగ్రూంల వద్ద పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం పోలీసులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయంపై సీఈఓ పునరాలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు?
బాబు తీరుపై ప్రజల ఆగ్రహం తప్పని నీటి కష్టాలు ట్రాఫిక్ సమస్య యథాతథం కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు ‘కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకు ముందు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. కనీసం తాగునీటి కష్టం తీర్చలేకపోయారు. పిల్లలు చదువుకునేందుకు డిగ్రీ కాలేజీ లేదు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకు నీకు ఓటేయాలి బాబూ’ అంటూ కుప్పం ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నుంచి ఎంపికవుతూ పాతికేళ్ల కాలంలో చంద్రబాబు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు తప్ప, తమను మాత్రం సరిగా పట్టించుకోలేదని కుప్పం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవీ సమస్యలు సాగు, తాగునీటికి శాశ్వత సౌకర్యం కల్పించలేదు. నియోజకవర్గంలో చిన్నపాటి నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. పాలారు ప్రాజెక్టు నిర్మాణం అప్పట్లో చేపట్టి ఉంటే ఇప్పుడు కుప్పం ప్రాంతంలో నీటి కొరత ఉండేది కాదు. ఇంటర్ విద్య వరకే కుప్పంలో అవకాశం ఉంది. కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాతి పనిచేసేవారు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో కార్మికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. సువూరు 8 వేల వుంది నిత్యం బెంగళూరు పట్టణానికి కూలి పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారే గానీ, ఒక్క పరిశ్రవును కూడా తీసుకురాలేదు. కుప్పంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ట్రాఫిక్ సవుస్య తీరలేదు. పట్టణంలోని ఆర్ఎస్ పేట, కొత్తపేటలకు అనుసంధానంగా ఉన్న రైల్వే గేట్ను వుూసివేయూలని రైల్వే అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే జరిగితే పట్టణం రెండు భాగాలై, కొత్తపేట వాసులతో పాటు అటువైపు ఉన్న గ్రావూల ప్రజలు వ్యాపార, రాకపోకలకు ఇబ్బంది పడాల్సిందే. అండర్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటికి వురవ్ము తులు చేసిన దాఖలాలు లేవు. జాతీయు రహదారి వురవ్ముతుల కోసం అధికారులు రూ.42 కోట్లతో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. వుుందుచూపు లేకపోవడంతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కొత్తపేటలోని కాంప్లెక్స్ నిరుపయోగంగా వూరింది. రైల్వేగేట్ వుూసివేతకు గురైతే ఈ కాంప్లెక్స్లో గదులు అద్దెకు అడిగే వారుండరు. స్పోర్ట్స్ స్టేడియుం, వూర్కెట్ యూర్డు, గార్మెంట్స్ పరిశ్రవుల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమైంది. రూ.కోట్లతో నిర్మించిన వాటర్ ప్లాంట్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. ప్రత్యావ్నూయు ఏర్పాట్లూ చేయలేదు. తాగునీరు ఇస్తున్న సాయిబాబా ట్రస్ట్ కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రావుంలోనూ పుట్టిపర్తి సారుుబాబా ట్రస్టు ఆధ్వర్యంలో వుంచినీటి ట్యాంకుల నిర్మాణం జరిగింది. ఈ ట్యాంకుల ద్వారానే ప్రస్తుతం ప్రజలకు తాగునీరు అందుతోంది. సాయిబాబా ట్రాస్ట్ వారికి ఉన్న మనస్సు కూడా ఆ నియోజకవర్గాన్ని పాలించే పాలకుడికి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. తమను పట్టించుకోకున్నా ఇన్నేళ్లుగా ఓట్లు వేస్తున్న ప్రజలు, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. -
వైఎస్ఆర్సీపీలో మైనారిటీలకు పెద్దపీట
జెడ్పీకి నీలూఫర్ మదనపల్లెకు షమీమ్ అస్లాం, పుంగనూరు మునిసిపాలిటీకి షమీం చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించిన మిథున్రెడ్డి మదనపల్లె, న్యూస్లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లీం మైనారిటీలకు పెద్దపీట వేసిందని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మిథున్రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్, మదనపల్లె, పుంగనూరు మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా రొంపిచెర్లకు చెందిన నీలూఫర్, మదనపల్లె మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా గుండ్లూరి షమీం అస్లాం, పుంగనూరు మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా షమీంను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముస్లీం మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటించారని, ఇందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రకటించినట్లు మిథున్రెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఆభ్యర్థులను ఖరారుచేసి ప్రకటించామని చెప్పారు. మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థి గుండ్లూరి షమీమ్ అస్లామ్ మాట్లాడుతూపమాణ స్వీకారంచేసిన వెంటనే నీరుగట్టువారిపల్లెలో మరమగ్గాలు ఉన్న భవనాలను కమర్షియల్ నుంచి నాన్ కమర్షియల్కు మారుస్తామని చెప్పారు. పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం ప్రతిపాదించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. మైనారిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజీ అక్తర్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీలంతా పార్టీకి పట్టుకొమ్మల్లా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, రాష్ట్ర బీసీ నాయకులు పాల్ బాలాజీ, జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, సింగిల్ విండో చైర్మన్ ఆనంద్, సర్పంచ్ శరత్రెడ్డి, మైనారిటీల నాయకులు బాబ్జాన్, జింకా వెంకటా చలపతి, సురేంద్ర, లక్ష్మీనారాయణ, దండాల రవిచంద్రారెడ్డి, మహిళా నాయకులు కొంగా పద్మావతి, శ్రీదేవి,మల్లిక, వైజయంతి, గిరిజ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడే తేలేది..
నేడే తేలేది.. బరిలో మిగిలేదెవరో.. తప్పుకునేదెవరో! ఊపందుకున్న బుజ్జగింపులు ప్రచారాస్త్రాలతో సమరాంగణంలోకి.. వ్యూహ ప్రతివ్యూహాలకు పదును సాక్షి, సిటీబ్యూరో: వాడివేడి వ్యూహాలు.. బుజ్జగింపులు..బేరసారాలు.. సిద్ధమైన ప్రచారాస్త్రాలు.. గ్రేటర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరాహోరీ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులంతా నేటి నుంచి సమరాంగణంలోకి దూకనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి రెబల్స్గా బరిలో దిగిన వారిని బుజ్జగించే యత్నాలు జోరందుకున్నాయి. రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే ఎన్నికల బ్యాలెట్లో వారి పేరుంటుంది. దీన్ని నివారించేందుకు ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల పోటీ నుంచి తప్పుకునేందుకు రెబల్స్ ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచార సన్నాహాలు తుదిగా బరిలో ఎవరెవరు ఉంటారో నేడు తేలిపోనుంది. ప్రత్యర్థులెవరో దాదాపు తెలిసిపోయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నారు. హంగు ఆర్భాటాలు, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో ప్రచార కార్యక్రమాల్ని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రారంభించనుండటం ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల, టీడీపీ, టీఆర్ఎస్ అధినేతలు చంద్రబాబు, కేసీఆర్ గ్రేటర్ వ్యాప్తంగా రోడ్షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలకు భారీగా జనాన్ని తరలించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు. అధికారులకు ఈవీఎంల బెడద నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు కావడంతో, చివరకు బరిలో ఎందరు మిగులుతారనే దానిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్కు వినియోగించే ఈవీఎంలలో మొత్తం 16 బటన్లుండగా, వీటిలో ఒకటి ‘నోటా’కు పోను 15 పార్టీ చిహ్నాల డిస్ప్లేకు వీలుంటుంది. అంతకుమించి రంగంలో మిగిలితే మరో ఈవీఎంను అదనంగా వాడాల్సిందే. శనివారం ఈ విషయంలో స్పష్టత ఏర్పడనుంది. కొందరు దారిలో.. ఇంకొందరు బరిలోనే.. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, హఫీజ్పేట కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్.. ప్రజల మద్దతున్న తాను పోటీలోనే ఉంటానని చెబుతున్నారు. పలు బస్తీలవాసులు ఆయనను కలిసి అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన మనసు మారే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన పోటీలో ఉంటే అది లోక్సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని భావిస్తున్న చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కార్తీక్రెడ్డి, ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్గౌడ్ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది శేరిలింగంపల్లిలో టీడీపీకీ రెబల్ పోటు తప్పేలా లేదు. మొవ్వా సత్యనారాయణ పట్టు వీడేది లేదని చెబుతున్నారు. గడువులోగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే ఎల్బీనగర్ నుంచి టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీలో ఉంటాననే చెబుతున్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్స్గా బరిలో ఉన్న పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్, ఏడుకొండ లు ఆంతర్యం పార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు గోషామహల్లో పార్టీ అభ్యర్థికి సవాల్ విసురుతున్న గోవింద్రాఠి, నందకిశోర్వ్యాస్, రామస్వామిలను బుజ్జగించడంలో బీజేపీ అధిష్ఠానం కొంతమేర సఫలమైనట్లు తెలుస్తోంది ముషీరాబాద్లో కాంగ్రెస్ రెబల్స్ సునీతాప్రకాశ్, బీసీ సెల్ చైర్మన్ నగేష్ముదిరాజ్లను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అభ్యర్థి డాక్టర్ వినయ్కుమార్ సునీతా ప్రకాశ్ ఇంటికి వెళ్లి సహకరించాలని కోరడంతో ఆమె మెత్తబడ్డట్లు సమాచారం. నగేశ్ ముదిరాజ్ను దారిలోకి తెచ్చుకునే పనిలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తోంది -
బాబు కపటప్రేమను నమ్మొద్దు
కిరణ్కూ ప్రజలే బుద్ధి చెబుతారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి మబ్బు చెంగారెడ్డిది గొప్ప మనసు : భూమన కరుణాకరరెడ్డి తిరుపతి కార్పొరేషన్, న్యూస్లైన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపట్ల చూపుతున్న కపటప్రేమకు మోసపోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్, ఆర్టీసీ బస్సుచార్టీలను విపరీతంగా పెంచిన ఘనత ఆయనదేనని, వాటిని తగ్గించాలని కోరినందుకు రైతులు, మహిళలను లాఠీలతో కొట్టించి, తుపాకులతో కాల్పించిన విషయూన్ని ప్రజలు మరచిపోరాదని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, దివంగత నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శుక్రవారం ఉదయం రెండు వేలమందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెంగారెడ్డికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు మోపించిన చంద్రబాబు ప్రస్తుతం వారిపై కపటప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ను మించిన విధంగా టీడీపీ మేనిఫెస్టోలో అలవికాని హామీలిస్తున్నారని, వీటికి ప్రజలు మోసపోవద్దన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచిన మరో మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఓ పార్టీ పెట్టారని, ఆయనకు ఈ ఎన్నికల్లో ఁచెప్పురూ. గుర్తుతోనే తగిన బుద్ధిచెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న మబ్బు కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం శుభపరిణామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా మంచి పథకాలన్ఙుమేనిఫెస్టోరూ.లో రూపొందించారని స్పష్టం చేశారు. జగన్ బాటలో పయనిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గుండెలు హత్తుకునేలా ఆత్మీయుడైన తమ్ముడు మబ్బు చెంగారెడ్డిని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారూ. అని చెప్పారు. పది మందికి సాయం చేసే గొప్ప మనసు చెంగారెడ్డిదని, ఆయన పార్టీలోకి రావడం అభినందనీయమని తెలిపారు. ఆయన సేవలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించదని, భవిష్యత్లో ఆయనకు సమున్నత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో స్వార్థ రాజకీయలకు అతీతంగా తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల పాటు మబ్బు కుటుంబాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మబ్బు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మా అన్న మబ్బుదేవ నారాయణరెడ్డి అన్నా, మబ్బు కుటుంబం అన్నా ఎనలేని గౌరవం ఉందరూ.న్నారు. తాను తన అన్నను విభేదిస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. కాంగ్రెస్ పార్టీని, సిద్ధాంతాలను మాత్రమే విభేదించి బయటకు వచ్చా, మబ్బు కుటుంబం అన్నా, మా అన్న అన్నా ఎప్పటికీ గౌరవం ఉంటుందిరూ. అని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజానాయకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చెంగారెడ్డి పార్టీలో చేరడం సంతోషమఅన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కే బాబు, ఆదికేశవులురెడ్డి, అమరనాథరెడ్డి, మబ్బు యువసేన నాయకులు కాండ్ర సత్యనారాయణ, ఆర్ఆర్ శ్రీనివాసులు, వెంకటముని యాదవ్, పరందామ్, గుణశేఖర్, మహిళా నాయకురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు. మబ్బు యువసేన నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో చెంగారెడ్డి, కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డిని సన్మానించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. -
టీడీపీ దౌర్జన్యకాండ
తుది విడత పోరులో చెదురుమదురు ఘటనలు జెడ్పీటీసీల్లో 82.46, ఎంపీటీసీల్లో 82.64 శాతం పోలింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నానికే 60 శాతం పోలింగ్ మలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు దిగారు. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో వీరంగం చేశారు. దళితులపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళలను కూడా చూడకుండా తరిమి తరిమి కొట్టారు. మాకు ఎన్నికలే వద్దు వెళ్లిపోతామని కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు. సాక్షి, తిరుపతి : పరిషత్ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన తుదివిడత ప్రాదేశిక పోలింగ్ సందర్భంగా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నారుు. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తొలివిడత కన్నా ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు క్యూ లు కట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామానికే సుమారు 60 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు 16.4, 11 గంటలకు 39.31, ఒంటి గంటకు 59.3, మధ్యాహ్నం మూడు గంటలకు 72.33 శాతం పోలింగ్ జరిగింది. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటింగ్కు హాజరైనట్టు పోలింగ్ సరళి తెలియజేస్తోంది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు బారులుతీరడంతో పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల పోలింగ్ ప్రారంభించడానికి సమయం తీసుకున్నారు. మొత్తానికి స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుదివిడతలో 34 జెడ్పీటీసీ , 442 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 11,15,630 ఓట్లకు గాను 9,19,938 ఓట్లు పోల్ కాగా 82.46 శాతం పోలింగ్ నమోదైంది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 10,86,804 ఓట్లకు గాను 9,98, 184 ఓట్లు పోలయ్యాయి. 82.64 శాతం పోలింగ్ నమోదైంది. విజయపురంలో స్వల్పంగా లాఠీచార్జి .. - విజయపురంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. స్థానికేతరులు ఓటింగ్లో పాల్గొంటున్నారని ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పంగూరులో పంచాయతీ కార్యదర్శి గృహనిర్బంధం ఏర్పేడు మండలం పంగూరు పోలింగ్ కేంద్రంలో రాజకీయపార్టీలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఇవ్వడంతో పోలింగ్ సమయంలో ఏజెంట్లు ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యకు పంచాయతీ కార్యదర్శి కారణమని తెలుసుకున్న గ్రామస్తులు అతడిని గృహనిర్బంధంలో ఉంచారు. పోలింగ్కు అంతరాయం కలగడంతో అధికారులు, పోలీసులు నచ్చజెప్పి అతడిని విడిపించారు. పోలింగ్ కొనసాగింది. వాహనాల్లో ఓటర్ల తరలింపు తుది విడత పోలింగ్ జరిగిన పలు మండలాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఓటర్ల కోసం ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో ఈ ఏర్పాట్లు ఎక్కువగా జరిగాయి. తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలివీ.... - పరిషత్ ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభపెట్టిన తెలుగుదేశం పోలింగ్ రోజున దౌర్జన్యాలకు దిగింది. విజయావకాశాలు లేనిచోట్ల ఓటర్లను, పోలింగ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసింది. - పాలసముద్రం మండలం శ్రీకావేరిరాజపురం పోలింగ్ స్టేషన్లో విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ మహేష్ ఓటర్లను క్యూ లో నిలుచోవాలని సూచిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను అక్కడికి రప్పించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినప్పటికీ పరారైనట్టు సమాచారం. - చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేసుకున్నట్టు ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధ ర్నాలో వైస్సార్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం పుదిపట్ల పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జనరల్ ఏజెంట్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడి నుంచి భాస్కర్రెడ్డి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. - చంద్రగిరి మండలం ఎం. కొంగరపల్లి, ముంగిలిపట్టు పోలింగ్స్టేషన్లలో టీడీపీ కార్యకర్తలు ఏకపక్షంగా పోలింగ్ చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు తరిమివేసి ఓటింగ్ జరుపుకున్నారు. - శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రూరల్ మండలం ఎంపేడులో ఓటు చూపించి వేయాలని తెలుగుదేశం నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులను కూడా లెక్కచేయలేదు. - మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం ఊరందూరులో ఆయన సోదరుడు హరినాథరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దనే కూర్చుని ఓటర్లను ప్రలోభపెట్టారు. - సత్యవేడు మండలం మదనంబేడు పోలింగ్ కేంద్రంలో టీడీపీ కార్యకర్త ఒకరు మద్యం సేవించి విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. - పుత్తూరు రూరల్ మండలం నేసనూరులో ఓట్లు చూపించి వేయాలని టీడీపీ జనరల్ ఏజెంట్ వాజ్పేయినాయుడు బెదిరించడంతో గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరొకరికి దేహశుద్ధి చేశారు. - పూతలపట్టు మండలం వేపనపల్లి పోలింగ్ కేంద్రంలో టీడీపీ సర్పంచ్ చిట్టిబాబు ఓటు వేసేందుకు వచ్చిన వెంకటేశ్వర్లు అనే ఓటరుపై దౌర్జన్యం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే మండలం ఎగువపాలకూరు గ్రామానికి చెందిన దళితులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కొంతకాలంగా టీడీపీ నాయకులు తమ ఓట్లు వేసుకోనీకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. -
‘పరిషత్’లో ఫ్యాను స్పీడు
రెండో విడతలోనూ మెజారిటీ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు అవకాశాలు గెలుపుకోసం ప్రలోభాలను రెట్టింపు చేసిన టీడీపీ సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆరో తేదీన మదనపల్లె డివిజన్ పరిధిలో తొలివిడతలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ జోరు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండోవిడత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అదే జోరు ప్రదర్శించనున్నట్టు రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం, కార్వేటినగరంలో టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా, వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క చంద్రగిరిలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో వడమాలపేట మండలంలో మాత్రం పోటాపోటీగా ఉంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సులువుగా గెలుస్తుందనే అభిప్రాయం ఉంది. హస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఒకటిరెండు మండలాలు మినహాయిస్తే మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలపవనాలు వీస్తున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ సంప్రదాయ ఓటర్లు ఉన్న మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓ మోస్తరు పోటీ ఉంది. మెజారిటీ జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. తొలివిడత జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇందులో రెండు చోట్ల గెలిచే అవకాశం ఉంది. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు గెలుచుకోనున్నారు. రెట్టింపు మొత్తంలో ‘దేశం’ ప్రలోభాలు తొలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండో విడతలోనూ కొనసాగించింది. తొలివిడత ఎన్నికల ఓటింగ్ సరళి ప్రతికూలంగా ఉన్నట్టు అంచనాకు రావడంతో రెండో విడతలో రెట్టింపు మొత్తంలో డబ్బు పంపిణీ చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ఎత్తులు వేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం ఒక్కరోజు రెండు చోట్ల మద్యం పంపిణీ చేస్తుండగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అదేవిధంగా పుత్తూరు రూరల్ మండలంలోనూ ఐదుగురు టీడీపీ కార్యకర్తలు మద్యం పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. పూతలపట్టు నియోజకవర్గంలో యువకులకు ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో భారీ విందులు ఏర్పాటు చేశారు. పూతలపట్టు, ఐరాల మండలాల్లో ఓటర్లకు ఒక్కొక్కరికి *500 నుంచి *2000 వరకు డబ్బు పంపిణీ చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని కామచిన్నయ్యపల్లె, రామకృష్ణాపురం ఎంపీటీసీ సెగ్మెంట్లలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. చంద్రగిరి -2 ఎంపీటీసీ సెగ్మెంట్లో వెండి దీపపు స్తంభాలు ఇంటింటికి చేరవేశారు. -
12నుంచి లోకేష్ యువప్రభంజనం
కోనేరుసెంటర్(మచిలీపట్నం), న్యూస్లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ జిల్లాలో 12వ తేదీ నుంచి యువప్రభంజనం పేరుతో బస్సు ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కార్యాలయంలో గురువారం స్థానిక నాయకులతో కలిసి ఉమా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల్లో కనీస వసతులు లేక ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. రెండో విడత జరగబోయే ఎన్నికల్లోనైనా అధికారులు కనీస వసతులు కల్పించాలని కోరారు. 12వ తేదీ మధ్యాహ్యం 3 గంటలకు లోకేష్ నిమ్మకూరులోని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, బసవతారకమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడి నుంచి బస్సు ర్యాలీగా పామర్రు మీదుగా గుడివాడ చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. అనంతరం కంకిపాడు మీదుగా విజయవాడ చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారన్నారు. ఆ రోజు రాత్రి విజయవాడలో బస చేసి అనంతరం గుంటూరుకు వెళతారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య , మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యన్నారాయణ, చిలంకుర్తి తాతయ్య, నారగాని ఆంజనేయప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, బత్తిన దాసు, సాతులూరి నాంచారయ్య పాల్గొన్నారు. -
తుది సమరం
ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మారుమూల గూడేలకు గుర్రాలపై బ్యాలెట్బాక్సుల తరలింపు విశాఖ రూరల్/పాడేరు, న్యూస్లైన్ : మలి విడత ప్రాదేశిక సమరానికి రంగం సిద్ధమైంది. మన్యంలోని మారుమూల గూడేలకు బ్యాలెట్బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపునకు అధికారులు అష్టకష్టాలు పడ్డారు. పెదబయలు మండలం ఇంజరి సెగ్మెంట్లోని చీకుపనస, ఇంజరి కేంద్రాలకు ఎన్నికల సామగ్రి,సిబ్బందిని చేరవేసేందుకు గుర్రాలను ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది. 17 మండలాల్లో 38 సమస్యాత్మక,73 అత్యంత సమస్యాత్మక, 189 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 572 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, బూదరాళ్ళ, జీకేవీధి మండలం గుమ్మరేవుల, గాలికొండ, జర్రెల, వంచెల, దేవరాపల్లి, పెదవలస, చింతపల్లి మండలం కుడుముసారి, తమ్మెంగుల, జి.మాడుగుల మండలం లువ్వాసింగి, కోరాపల్లి, బీరం, బొయితిలి, పెదబయలు మండలం ఇంజరి, జామిగుడ, బొంగరం, ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, కుమడ, లక్ష్మిపురం, రంగబయలు, బుంగాపుట్టు వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బ్యాలట్ పత్రాలు, బాక్సుల తరలింపు కత్తిమీద సామైంది. చాలా మంది సిబ్బంది కాలినడకనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఏర్పాట్లు పూర్తి : 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీలకు 1062 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,84,825 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 3,33,545 మంది పురుషులు, 3,51,279 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 795 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1624 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 874 మంది పీవో, 874 మంది ఏపీవో, 2620 మంది వోపీవో మొత్తంగా 4368 మంది సిబ్బందిని నియమించారు. వీరు గురువారం మధ్యాహ్నం ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. వారి కోసం అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 29 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ : సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 519 కేంద్రాల్లో పోలింగ్ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్ను నియమించారు. 41 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంతం వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అనకాపల్లి డివిజన్కు ఏఎంఏఎల్ కాలేజీలోను, నర్సీపట్నం డివిజన్తో పాటు పాడేరులో మూడు మండలాల బ్యాలెట్ బాక్సులను నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, పాడేరులో మిగిలిన 8 మండలాలకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీకాలేజీలో స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేశారు. -
టీడీపీ సూట్కేసుల పార్టీ
కంటతడి పెట్టిన మొవ్వా ‘కుటుంబాన్ని వదిలి పార్టీయే సర్వస్వంగా పనిచేస్తే డబ్బులకు అమ్ముడుపోయిన పార్టీ నన్ను దూరం పెట్టింది’ అని శేరిలింగంపల్లి టీడీపీ ఇన్చార్జి మొవ్వా సత్యనారాయణ కం టతడి పెట్టారు. శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం సన్నిహితులు, కార్యకర్తలతో మియాపూర్లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై అభిప్రాయాలనుసేకరించారు. ‘పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి సర్వస్వం కోల్పోయాను. చివరకు మొండిచేయి చూపారు. టీడీపీ సూట్కేసుల పార్టీలా తయారైంది’ అని వ్యాఖ్యానిస్తూ మొవ్వా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు కంటతడి పెట్టారు. అనంతరం మొవ్వా మాట్లాడుతూ- కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఏ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లు, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు ఈ సందర్భంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఖాకీలకు ఎన్నికల పరేషాన్
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగానికి గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పని ఒత్తిడి పెరిగింది. గతంలో సార్వత్రిక ఎన్నికల వరకు బందోబస్తు నిర్వహించి, కౌంటింగ్ ముగియగానే సేద తీరేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులు స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఉత్తర్వులు ఇవ్వడంతో ఒకటిన్నర నెల వ్యవధిలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్లో మొదటి విడత పరిషత్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలను భద్రపరచడం, బ్యాలెట్బాక్స్లకు భద్రత కల్పించడం కత్తిమీద సాముగా మారింది. ఇందు కోసం పారా మిలటరీ దళాలతోపాటు, స్థానిక ఆర్మ్డ్ రిజర్వు పోలీసులను ఉపయోగించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఒకేసారి మూడు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్బాక్స్లు భద్రపరచాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసులు మున్సిపల్ ఎన్నికలకు ఆయా మున్సిపాల్టీల్లోనే స్ట్రాంగ్రూమ్లు ఏర్పా టు చేసి భద్రత కల్పిస్తున్నారు. దీనికితోడు మూడు డివిజన్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఆయా డివిజన్లలోనే స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించాల్సి ఉంది. ఇప్పటికే మదనపల్లె పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేసి భద్రపరిచారు. ఏప్రిల్ 11న జరిగే చిత్తూరు, తిరుపతి రెండు డివిజన్ల పరిషత్ ఎన్నికల బ్యాలెట్బాక్స్లకు కూ డా స్ట్రాంగ్రూమ్లు అవసరం. ఈ రెండు ఎన్నికల ఫలితాలు మే 7వ తేదీ సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాకే వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు వీటిని కాపలా కాయాల్సి రావడం పోలీసులకు అదనపు భారంగా మారింది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో గ్రామ గ్రామానికి, ప్రతి పోలింగ్బూత్కు భద్రత కల్పించాల్సి ఉంది. ఇందు కోసం వేల సంఖ్యలో కేంద్ర పారా మిలటరీ దళాలను రంగంలోకి దించుతున్నారు. స్ట్రాంగ్రూమ్ల వివరాలు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన తరువాత ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూములను అన్నినియోజకవర్గాలకు చిత్తూరులోనే ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ పూర్తి అయిన సాయంత్రమే ఈవీఎంలను చిత్తూరుకు తరలించనున్నారు. చిత్తూరు లోక్సభతోపాటు, అన్ని నియోజకవర్గాల ఈవీఎంలను చిత్తూరు సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి , కౌంటింగ్ చేపడుతారు. తిరుపతి, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మన జిల్లాలో వచ్చే నియోజకవర్గాల ఈవీఎంలను చిత్తూరు సమీపంలోని సీతమ్స్ కళాశాలలో భద్రపరచి కౌంటింగ్ చేపడతారు. భద్రతా పరంగా సాయుధ పారా మిలటరీ దళాలకు స్ట్రాంగ్రూంల భద్రత అప్పగిస్తారు. ఆ పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుమతి లేనిదే ఎన్నికల సిబ్బందిని కూడా స్ట్రాంగ్రూంల వద్దకు అనుమతించరు. రెండో విడత పరిషత్ ఎన్నికలకు భారీ బందోబస్తు జిల్లాలో జరిగే రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు పోలీసు జిల్లాతో పాటు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని తిరుపతి డివిజన్లోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఎస్పీ పీహెచ్డీ రామక్రిష్ణ, అర్బన్ ఎస్పీ రాజశేఖర్బాబు ఎన్నికల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. చిత్తూరు ఎస్పీ పరిధిలోని 25 మండలాల్లో భద్రత వివరాలు.... ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్పీలు 2 , డీఎస్పీలు 10 మంది ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తారు. సీఐలు 17, ఎస్ఐలు 75, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు 285, కానిస్టేబుళ్లు 820, స్పెషల్ పార్టీ పోలీసులు 190, నాలుగు సెక్షన్ల పారా మిలటరీ బలగాలను బందోబస్తు నిర్వహించనున్నారు. -
‘రెండో విడత’ టీడీపీ డబ్బు పంపిణీ
సాక్షి, తిరుపతి: రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడటంతో ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునేందు కు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. పోలింగ్ కు 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో డబ్బు పంపిణీతో పాటు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. తొలివిడతలో భారీగా డబ్బు పంపిణీ చేసినా ఓటింగ్ సరళి అనుకూలంగా లేకపోవడంతో రెండో విడత మరింత ఎక్కువగా పంపిణీ చే స్తున్నారు. ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థులు పోటీలు పడి ఎంపీటీసీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీ అభ్యర్థులు డబ్బుతో పాటు తాయిలాల పం పిణీలో తలమునకలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో టీడీపీ వారు రూ.కోటి వరకు పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. సత్యవేడు మండలం లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి పది లక్షల రూపాయలు అందజేశారు. ఇక్కడ ఓట్ల సంఖ్యతో పనిలేకుండా ఇంటికి రెండు వేల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు. పుత్తూరు మండలంలో మహిళలకు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, యువకులకు క్రికెట్ కిట్లు అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ నమూనాలు చూపించి తాయిలాలు ఇస్తున్నారు. ఇక్కడ మద్యం కూడా భారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయలు వంతున పం పిణీ చేస్తున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో గురువారం డబ్బు పంపిణీ చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
భారీగా మద్యం సీసాల పట్టివేత
టాస్క్ఫోర్స్ అదుపులో 11 మంది వీరిలో పలువురు ‘దేశం’ కార్యకర్తలే విజయవాడ క్రైం, న్యూస్లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ మలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం నిల్వ చేసిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పలువురిని బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి పెద్ద మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం షాపులు మూసేయడంతో పలు ప్రాంతాల్లో మద్యం నిల్వ చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్రెడ్డి, సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి ఉంగుటూరు, గన్నవరం, ఉయ్యూరు మండలాల్లో దాడులు నిర్వహించారు. మొత్తం 1163 మద్యం సీసాలు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని 11మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉంగుటూరు మండలం నందమూరులో 230, మానికొండలో 140, ఇందుపల్లిలో 144, ఉంగుటూరులో 35 మద్యం సీసాలను, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలోని ఓ ప్రాంతంలో 178, మరో చోట 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు, గొల్లనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద 190 మద్యం బాటిళ్లు, రూ.34వేల నగదు, రామచంద్రపల్లిలోని ఓ రెస్టారెంట్ నుంచి 30 మద్యం సీసాలతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉయ్యూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆకునూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద 134 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఉయ్యూరు టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గండిగుంటలో ఓ వ్యక్తి నుంచి 67 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలో అప్పగించారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి గుడ్లవల్లేరు, ఉయ్యూరు, కలిదిండి మండలాల్లో ప్రచారం మచిలీపట్నం, న్యూస్లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే గుడివాడ రెవెన్యూ డివి జన్లలోని గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర, ఉయ్యూరు మండలం కాటూరు, కలిదిండి మండలం పెదలంక, మూలలంక, భాస్కరరావుపేట తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులతో కలిసి పద్మావతి బుధవారం ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.100 మాత్రమే విద్యుత్ బిల్లు వసూలు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు తప్పక అమలవుతాయని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అల్లూరి శిరీష, బి.శ్రీసంధ్య, ఉయ్యూరులో మండలంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ పడమట సురేష్బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి వల్లే శ్రీనివాసరావు, కలిదిండి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి మోకా లక్ష్మి పాల్గొన్నారు. కైకలూరులో జెడ్పీటీసీ అభ్యర్థి మీగడ చంద్రావతి, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థిం చారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి మోతుకూరి స్వర్ణలక్ష్మి, మండవల్లి జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.నాంచారమ్మ, పార్టీ నాయకులు పలువురు ప్రచారం నిర్వహించారు. ఆగిరిపల్లిలో తోట చంద్రశేఖర్ ప్రచారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనరు తోట చంద్రశేఖర్ ఆగిరిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్అప్పారావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గంపలగూడెం మండలంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త రక్షణనిధి ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెం మండలంలో కోనేరు ప్రచారం మండలంలోని నాగులూరు, తాడిగూడెం, బూరుగగూడెం, రంగాపురం, రెడ్డిగూడెం, అన్నేరావుపేట, సీతారామపురం, మద్దులపర్వ, శ్రీరామపురం,ముచ్చనపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుఫున పార్టీ విజ యవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోనేరు రాజేంద్రప్రసాద్ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల్లో మోటారుసైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 1600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పూర్తిస్థాయిలో అమలు చేశారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయగల సమర్థుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని, పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఎంపీటీసీ, జెట్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోనేరు, జోగి కోరారు. -
ష్.. గప్చుప్
ఇక ప్రలోభాల వల జోరుగా నగదు, మద్యం పంపిణీ మచిలీపట్నం, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికల తుది పోరులో ప్రచారం ముగిసింది. ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు, గుడివాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నూజివీడు డివిజన్లో 14 జెడ్పీటీసీ, 234 ఎంపీటీసీ, గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రలోభాలకు తెర తీశారు... రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు. ఓటుకు రూ.300 నుంచి పోటీని బట్టి వెయ్యి వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాత్రి నుంచే నగదు పంపిణీ కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. గుడివాడ, నూజివీడు డివిజన్లలో మద్యం పంపిణీ ఊపందుకుంది. ఏర్పాట్లు పూర్తి... రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం రఘునందన్రావు తెలిపారు. 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. రెండు డివిజన్లలో 9,36,252 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 1230 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది అభ్యర్థులు, 129 ఎంపీటీసీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. నూజివీడు డివిజన్లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు గాను 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకు 610 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తితే సమాచారం తెలుసుకునేందుకు జిల్లా పరిషత్లో కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ 08672-252572, టోల్ ఫ్రీ నంబరు 1077కు తెలియజేయాలని సూచించారు. 11న నూజివీడు, గుడివాడ డివిజన్లలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. ఏఎస్పీతో పాటు ఎనిమిది మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 110 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 1050 మంది కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులు, రెండు ప్లటూన్ల ఏఆర్, ఏపీఎస్పీ బృందాలతో పాటు అటవీశాఖ, ఎక్సైజ్, స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని ఎన్నికల్లో విధుల్లో నియమించినట్లు చెప్పారు. -
అందరికీ ‘సంక్షేమం’ జగన్తోనే సాధ్యం
తిరుపతి(మంగళం), న్యూస్లైన్: ‘ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ ఫలాలతో అభివృద్ధి చెందండి’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, సినీ నటుడు టీఎస్. విజయ్చందర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి పరిధిలోని చంద్రశేఖర్రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజాబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్చందర్ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే అందించే సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందుతారన్నారు. టీటీడీ చైర్మన్గా ఉండి శ్రీవారి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారతాడని, దీంతో ముస్లిం, మైనార్టీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కుమ్మక్కు రాజకీయాలతో కిరణ్, చంద్రబాబు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఒక్క వైఎస్. జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా అన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కె. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, నీలకంఠారెడ్డి, హర్షవర్ధన్, కేతం జయచంద్రారెడ్డి, పుల్లయ్య, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పాముల రమేష్రెడ్డి, ఎస్కె.చోటా, తాల్లూరి ప్రసాద్, చింతా రమేష్యాదవ్, లోకేష్బాబు, రఫీ, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, గీతాయాదవ్, పుణీత, శాంతారెడ్డి, మల్లికమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు సిపాయి గుడ్బై
రెండు రోజుల్లో కొత్తపార్టీ తీర్థం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్-బీజేపీ సమాన భాగస్వాములు బీజేపీతో పొత్తున్న పార్టీలకు భంగపాటు తప్పదు స్పష్టం చేసిన అనుచరులు శ్రీకాళహస్తి, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు దోహదపడిన కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం గుడ్బై చెప్పనున్నారు. మరో రెండురోజుల్లో కొత్త పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన పట్టణంలోని పొన్నాలమ్మగుడి ఆవరణలో తమ అనుచరులతో రెండు గంటల పాటు చర్చించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీ సమాన భాగస్వాములని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. దీంతో బీజేపీకి గానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు గానీ ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అలాంటి పార్టీలు అవసరం లేదన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే బడుగు బలహీన వర్గాల పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీతో భవిష్యత్ ఉండదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి చర్చలు జరిపి నిర్ణయం వెల్లడించనున్నారు. తిరుపతిలో ప్రముఖ డాక్టర్గా పేరొందిన రష్ ఆస్పత్రి అధినేత సిపాయి సుబ్రమణ్యం 2009 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. సినీనటుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో శ్రీకాళహస్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 25 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఇష్టం లేకున్నా సిపాయి కూడా అదే పార్టీలో కొనసాగారు. పట్టణంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చుర్గుగా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని గ్రహించిన ఆయన సోమవారం తన అనుచరులతో చర్చలు జరిపారు. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయనకు అనుచరులు సూచించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కాంగ్రెస్తో పాటు బీజేపీ ప్రధానపాత్ర పోషించిందని, అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకున్న టీడీపీలోకి వెళితే రాజకీయ ఇబ్బందులు తప్పవని వివరించారు. దీంతో మంగళ, బుధవారాలు తన అనుచరులతో మరోసారి చర్చలు నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. విభజనతో సీమాంధ్రకు నష్టం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాను. -డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం -
చిచ్చు రాజుకుంది
బీజేపీ పొత్తుపై మన్యం టీడీపీ నేతల ఆగ్రహం అరకు ఎంపీ..పాడేరు అసెంబ్లీ కమలానికి కేటాయించడంపై సెగలు బాబును నమ్ముకుని నష్టపోయామంటూ నిరసనలు బీజేపీకి సహకరించేది లేదంటూ తెగేసి చెబుతున్న వైనం ఏజెన్సీలో ఉనికి కోల్పోతున్న తెలుగుదేశం సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో పొత్తు చిచ్చు రాజుకుంది. అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ బలాన్ని ఇది కుంగదీసింది. అరకు ఎంపీ.. పాడేరు అసంబ్లీ స్థానాలు కమలనాథుల కోటాలో చేరడంతో తెలుగుతమ్ముళ్ల పరిస్థితి దిక్కుతోచనివిధంగా తయారైంది. పార్టీ అధినేత ఆదేశాలతో పనిచేసుకుంటున్న ఆశావహులు నీరుగారిపోయారు. తాము ఖర్చుపెట్టిన సొమ్మంతా బూడిదలో పోసినట్టేనని వాపోతున్నారు. పాడేరులో బీజేపీకి కనీస బలం కూడా లేదని వీరు గుర్తుచేస్తున్నారు. సీటు చే జార్చి అధినేత తమ గొంతుకోశారంటూ ఇక్క డి టీడీపీ నాయకులు నిప్పులు కక్కుతున్నారు. మాజీ మంత్రి మణికుమారి, కొట్టుగుల్లి సు బ్బారావు, లోకుల గాంధీ, బొర్రా నాగరాజు,చల్లంగి జ్ఞానేశ్వరి,ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు ఇప్పటికే భారీగా ఖర్చుచేశారు. చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారి వీరిని పిలిపించి గట్టిగా పనిచేయండి, కచ్చితంగా టిక్కెట్ ఇస్తానని అనేక సార్లు నమ్మబలకడంతో వీరంతా ఎవరికివారే పోటీగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఈసీటును సీపీఎంకు కేటాయించారు. అప్పుడే పార్టీ బాగా బలహీనపడింది. మరోమారు అదే చరిత్ర పునరావృతం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. బీజేపీకి సహకరించేదిలేదని కరాఖండిగా చెబుతున్నారు. అరకులోనూ ఇరకాటమే.. అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే సిరివేము సోమ ఈఎన్నికల్లో టిక్కెట్ తనకే వస్తుందని భావించారు. కాని బాబు ఇటీవల పార్టీలో చేరిన కుంభా రవిబాబుకు టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో సోమ పరిస్థితి అయోమయంగా మారింది. అటు అరకు పార్లమెంట్ సీటుకూడా బీజేపీకి కట్టబెట్టడంపై ఆశావహులు పార్టీని వీడడానికి సమాయత్తమవుతున్నారు. పాడేరులో పోటీ తీవ్రంగా ఉన్నందున తనకు అక్కడ సీటు ఇవ్వకపోతే కనీసం పార్లమెంట్ ఇవ్వాలని మణికుమారి చంద్రబాబును కోరారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన డాక్టర్ పార్వతీశం కూడా ఈ టిక్కెట్పై కన్నేశారు. ప్రజాబలం లేని బీజేపీకి ఇవ్వడంతో ఇప్పుడు వీరందరి దారెటో అర్థంకావడంలేదు. మొత్తానికి ఏజన్సీ కంచుకోట అని గొప్పలు చెప్పుకునే టీడీపీకి ఇప్పుడు ఉనికి ప్రశ్నార్థమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పటికే మన్యంలో తగిన బలం లేక ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బోర్లాపడింది. ఈనెల 11న జరగబోయే మలివిడత జెడ్పీ ఎన్నికలపైనా బీజేపీతో పొత్తు ప్రభావం పార్టీని మరింత దెబ్బతీయనుంది. -
క్యా సీన్ హై...
*తలసాని హైడ్రామా.. *చెప్పిందొకటి.. చేసిందొకటి *అయోమయానికి గురైన క్యాడర్ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు ఊసరవెల్లులే అవాక్కయ్యే రీతితో సన్ని‘వేషాలు’ సృష్టిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా క్షణాల్లో రూటు మార్చేసి.. మాట తప్పేసి క్యాడర్నే అయోమయంలో పడేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ శని, ఆదివారాల్లో నడిపిన రాజకీయమే ఇందుకు నిదర్శనం. సీన్ తారుమారైందిలా.. నిజానికి శనివారం నాటి ఎజెండాతో సమావేశం జరిగి ఉంటే సీన్ మరోలా ఉండేది. నాటి ఆవేశకావేశాలు ఏ నాయకుల్లోనూ కనపడలేదు. కొందరు నేతలు రప్పించిన మనుషులు కొద్దిసేపు ఆయా నేతలకు అనుకూలంగా నినదించారు. మధ్యలో కిరోసిన్ పోసుకోవడాలు, ఫ్లకార్డుల డ్రామాలు రక్తి కట్టించాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలూ సమావేశానికి వస్తారన్నారు. అయితే, కనీసం హైదరాబాద్ జిల్లా పరిధిలోని వారూ రాలేదు. ముఖ్య నేతలూ హాజరు కాలేదు. పొత్తులో భాగంగా పోతుందని తెలిసిన ముషీరాబాద్ నేతలతో పాటు నియోజకవర్గాల ఇన్చార్జులైన కె.విజయరామారావు, సాయన్న, ముజఫర్ అలీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాబాజ్అహ్మద్ఖాన్ తదితరులు ముఖం చాటేశారు. ఏ అంశంపైనైతే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారో.. దాన్ని చక్కగా పక్కదారి పట్టించారు. సర్దుకుపొమ్మన్నారు. తలసాని మార్కు రాజకీయం! తలసాని శ్రీనివాస్యాదవ్.. టీడీపీలో ఆయన స్టైలే వేరు. అనుకున్నది ఏదోలా దక్కించుకోవడం ఆయన నైజం. తొలిసారిగా ఎమ్మెల్యే టిక్కెట్ ద క్కించుకోవడంనుంచి.. నేటి అత్యవసర సమావేశం దాకా అదే తీరు. వాస్తవానికి శనివారం వరకు త లసాని పోటీ చేయాలని భావించిన సనత్నగర్ నియోజకవర్గం టీడీపీకి వస్తుందో.. బీజేపీకి వెళ్తుందో తెలియని పరిస్థితి. బీజేపీ ఆ స్థానం కోసం గట్టి పట్టుదలతో ఉంది. ఆ సీటు చేజారిపోతుందనే సందేహంతో.. అప్పటికప్పుడు భేటీ కావాలని అధ్యక్షుని హోదాలో జిల్లా పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. పొత్తుకు ఒప్పుకుంటే జిల్లాలో పార్టీకి మనుగడే ఉండదనే ప్రకటనలు ఇప్పించారు. అందుకు తగ్గట్టే టెంట్లు, పులిహోర వంటి వాటితో హడావుడి చేశారు. తీరా శనివారం రాత్రి పొద్దుపోయాక ‘సనత్నగర్’పై హామీ లభించింది. ఇంకేముంది.. ఆందోళన కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అనువుగా మార్చేసుకున్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముగించేశారు. శ్రేణుల్లో ఎమోషన్స్ పెరిగితే పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించి త్వరితంగా ముగించేశారు. ఈ లోగుట్టంతా తెలియని కొందరు నేతలు, శ్రేణులు ఇప్పటికీ ఎందుకిలా జరిగిందో అర్థం కాక అయోమయంలోనే ఉన్నారు. శనివారం సాయంత్రం.. పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయానికి వ్యతిరేకంగా గ్రేటర్లో ఎక్కువ స్థానాలు బీజేపీకివ్వాలనే అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ టీడీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తలసాని తమ వెంటే ఉన్నారని, జిల్లా కార్యవర్గమంతా రాజీనామా చేస్తుందని ప్రకటించారు. ‘బీజేపీ హటావో.. టీడీపీ బచావో’ అనే నినాదాన్ని సృష్టించి హోరెత్తించారు. ఆదివారం ఉదయం.. జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో భారీ టెంట్లు.. పార్టీతో సంబంధం లేనివారూ పోగయ్యారు. పులిహోర పొట్లాలు పంచారు. ఒకరిద్దరు నేతలు మాట్లాడుతూ- ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులకు ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. 2009 లోనూ పొత్తు వల్లే చంద్రబాబు సీఎం కాలేకపోయారన్నారు. మన నాయకుడు తలసాని నాయకత్వం లో మన దారిలో మనం వెళ్దామంటూ ప్రసంగించా రు. అంతలో తలసాని కల్పించుకున్నారు. ‘మీ ఆవేదన నాకు తెలుసు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే ముందుకు సాగాలి. ‘దేశం’ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకిప్పుడు మనకొక అండ అవసరం. అందుకే బీజేపీతో పొత్తు.. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అండగా నేనుంటా. క్రమశిక్షణగా ఉండండి’ అంటూ ముగించారు. శనివారం నాటి హాట్ హాట్ పరిణామాలకు కొనసాగింపుగా ఆదివారం నాటి సమావేశం ఆందోళనలలో అట్టుడికిపోతుందనుకుంటే, గాలి తీసేసిన సైకిల్ చక్రంలా సీన్ మారిపోవడంతో క్యాడర్ అయోమయానికి గురైంది. -
‘దేశా’నికి మైనార్టీలు దూరం
సాక్షి, సిటీబ్యూరో: బీజేపీతో దోస్తీ కట్టిన చంద్రబాబుపై టీడీపీ మైనార్టీ శ్రేణులు నిప్పులు కక్కుతున్నాయి. పొత్తును నిరసిస్తూ రాజీనామాలు సంధించారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి టీడీపీ పక్షాన పోటీ చేసిన జాహెద్ అలీఖాన్ ఆదివారం రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. పార్టీ మైనార్టీ సెల్ మాజీ అధికార ప్రతినిధి అనాస్ సయ్యద్ సలీం సైతం రాజీనామ సమర్పించారు. ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. గ్రేటర్ హైదరాబాద్లో మైనార్టీ ఓట్లు సుమారు 19.38 లక్షల వరకు ఉన్నాయి. రెండు లోక్సభ, 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
తొలిపోరు ప్రశాంతం
తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.52 శాతం నమోదు అక్కడక్కడా చెదురుమదురుసంఘటనలు, స్వల్పంగా లాఠీచార్జ్ ఓటు వేసేందుకు ఉదయం నుంచి బారులుతీరిన జనం కిరణ్ స్వగ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని ఏకపక్షంగా పోలింగ్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు సాక్షి, తిరుపతి: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మదనపల్లె డివిజన్లో జరిగిన తొలివిడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 31 జెడ్పీటీసీ స్థానాలకు 445 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 80.52 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 10,85,763 మందికి గాను 8,78,339 మంది ఓటర్లు పోలింగ్కు హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా చిన్నగొట్టిగల్లు మండలంలో 89.12, అత్యల్పంగా పీలేరు మండలంలో 69.72 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కనిపించలేదు. కుప్పంలో ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగియడానికి కొద్దిసేపటికి ముందు కేంద్రానికి ఎక్కువ మంది ఓటర్లు చేరుకోవడంతో ఆలస్యంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. పనులకు వెళ్లే వారు కూడా ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చారు. మహిళలకు కేటాయించిన క్యూలు భారీగా కనిపించాయి. ఉదయం ఏడు-తొమ్మిది గంటల మధ్య 15 శాతం నమోదు కాగా 9-11 గంటల మధ్య 36 శాతం, 11-01 గంటల మధ్య 55.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పోలింగ్ ముగిసే సమయానికి 80.52 శాతం నమోదైంది. కుప్పం మండలం లక్ష్మీపురం, శాంతిపురం మండలం కడపల్లె పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. కుప్పం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని డీకేపల్లెలో ఆందోళన చేస్తున్న ఓటర్లను స్వల్పంగా లాఠీచార్జి చేసి అక్కడి నుంచి తరిమివేశారు. పీలేరు మండలం ముడుపులవేములలోనూ పోలీసులు లాఠీచార్జి చేశారు. పలమనేరు మండలం మొరవ పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ పత్రాలపై ఓటర్లు వేసే స్వస్తిక్ గుర్తు ఇంకు ముద్దగా రావడంతో బ్యాలెట్ మడిచినప్పుడు ఇంకో అభ్యర్థి సింబ ల్పై కూడా ఆ గుర్తు పడుతుందని భావించిన అధికారులు కొద్దిసేపు పోలింగ్ నిలిపివేశారు. ఆ తరువాత కొనసాగించారు. మదనపల్లె మండలం పోతనపల్లె పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారని ఓటర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్కు అంతరాయం కలిగింది. పుంగనూరు మండలం బీముగారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వసతులు కల్పించలేదని ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పోలింగ్ కొనసాగింది. కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ కుప్పం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ కనిపించారు. కుప్పం- 1 ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోనూ సమాగుట్టపల్లె, అనుంగానిపల్లె, పెద్దబంగారునత్తం తదితర కేంద్రాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు, పోలింగ్ సిబ్బంది పట్టించుకోలేదు. ఓట్లు గల్లంతైన కారణంగా దళావాయినత్తపల్లె, చీమినాయునిపల్లె పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ఓట్లు టేబుల్ డ్రాలో వేసినా.. వి.కోట మండలం దానమయ్యగారిపల్లెపోలింగ్ కేంద్రంలో ఓటర్లు, ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను అక్కడి టేబుల్ డ్రాలో పడవేసి వెళ్లారు. ఇలాంటివి 16 బ్యాలెట్ పత్రాలు డ్రాలో కనిపించాయి. బ్యాలెట్ పత్రాలను బాక్సులో వేయాలన్న అవగాహన లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. అంతమంది ఓటర్లు బ్యాలెట్ బాక్సులో వేయనప్పటికీ పోలింగ్సిబ్బంది గుర్తించలేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని అధికారులను నిలదీయడంతో వారు అప్రమత్తమయ్యారు. కొద్దిసేపు పోలింగ్ నిలిపివేసి ఏజెంట్లకు నచ్చజెప్పి కొనసాగించారు. కాగా పలమనేరు నియోజకవర్గం పెదపంజాణి మండలంలో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి అనుచరులు పలుచోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. -
ఓట్లేశారు...
{పాదేశిక పోరు ప్రశాంతం గూడూరులో రాత్రి 8 గంటల వరకూ ఓటింగ్ భూపాలపల్లిలో అర గంట ఆలస్యం ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు పలు ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, డీఐజీ, ఎస్పీ 11న రెండో విడత స్థానిక ఎన్నికలు హన్మకొండ/జిల్లాపరిషత్, న్యూస్లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఆదివారం జరిగిన తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నర్సంపేట, ములుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 20 మండలాల్లో 20 జెడ్పీటీసీ, 244 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 84.38 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 6,07,943 మంది ఓటర్లుండగా... 5,12,987 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా గోవిందరావుపేట మండలంలో 77.43 శాతం.. అత్యధికంగా నర్సంపేటలో 90.04 శాతం ఓట్లు పోలయ్యూయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూ కట్టారు. ఆ తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత సేపు తగ్గుముఖం పట్టినా... చివరకు మళ్లీ జోరందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదుకాగా... సాయంత్రం రెండు గంటల వ్యవధిలో సగటున 14.38 శాతం నమోదైంది. రేగొండలో రాత్రి 8 గంటల వరకూ పోలింగ్ సాగగా... భూపాలపల్లిలోని 15, 18వ పోలింగ్ కేంద్రాల్లో 30 నిమిషాల ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. దీంతో క్యూలో నిల్చున్న ఓటర్లు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిని నర్సంపేటలో వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, ఎన్నికల అబ్జర్వర్ జగన్మోహన్రావు, గూడూరులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్, రేగొండ, తిర్మలగిరిలో రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు పరిశీలించారు. కాగా, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలో జెడ్పీటీసీ. ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. చెదురుమదురు సంఘటనలు జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు ఆది వారం జరిగిన పోలింగ్లో అక్కడక్కడా చెదురు ముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి, ఖానాపూర్ మండలం ధర్మరావుపేటలో రోడ్లపై ప్రచారం చేస్తున్న పలు పార్టీల కార్యకర్తలు, నాయకులపై పోలీసు సిబ్బంది స్వల్ప లాఠీచార్జ్ చేశారు. నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలోపోలింగ్ కేంద్రాల వద్దే ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ, టీఆర్ఎస్ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏజెంట్ పోలింగ్ బూత్లో గొడవకు దిగాడు. రిగ్గింగ్ జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఈ విషయం బయటకు రావడంతో పోలింగ్ కేంద్రం బయట టీడీపీ, టీఆర్ఎస్ వర్గాలు గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ రాజకీయ పార్టీల నేతలు వాగ్వాదానికి దిగినా... పోలీసులు చెదరగొట్టారు. పరకాల మండలం నాగారంలో వంద మీటర్ల పరిధిలోనే ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. మాదారం పోలీంగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న వారిని ఓటేయూలని టీ ఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థించడంతో గొడవ జరిగింది. కామారెడ్డిపల్లి గ్రామంలో దొంగ ఓటు వేస్తున్నారంటూ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించి అటువంటిది ఏమీ లేదని తేల్చిచెప్పారు. -
బాబుతో దోస్తీ.. బాధించిం
పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నా.. తెలంగాణ ద్రోహి చంద్రబాబు సిగ్గులేకుండా బీజేపీ అధిష్టానం వద్ద మోకరిల్లాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి కేసముద్రం, న్యూస్లైన్ : సమైక్యవాద టీడీపీతో తమ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని... ఇందుకు నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి చంద్రబాబు బీజేపీ హైకమాండ్ వద్ద మోకరిల్లి సిగ్గులేకుండా పొత్తుకుదుర్చుకున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే చచ్చిపోయిన టీడీపీని కాస్త బతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాడని, తమ పార్టీ నేత వెంకయ్యనాయుడుతో ఈ పొత్తును ఖరారు చేయించుకున్నాడని మండిపడ్డారు. టీడీపీతో ఎన్నికల్లోకి పోతే బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. ఒకప్పుడు మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో తాము పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పుచేశానన్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఏ తప్పు చేసి పొత్తుపెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తాము పార్టీ అధిష్టానం వద్ద పొత్తువద్దని, సమైక్యవాద పార్టీతో పొత్తుపెట్టుకుంటే నష్టపోతామని చెప్పినా.. చివరకు పొత్తుపెట్టుకోవడం తనను మనస్థాపానికి గురిచేసిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని, కనీసం పార్టీ నుంచి పావులా బిళ్ల కూడా ఇవ్వనప్పటికీ ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి స్వతహాగా ఖర్చుపెట్టుకుని తమ కార్యకర్తలు,నాయకులు పని చేశారని, అలాంటిది తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం బాధించిందన్నారు. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేసి.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ప్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం నిజం తెలుసుకోవాలని కోరారు. ఆయనతో పాటు రాష్ట్ర కిసాన్మోర్చా ఉపాధ్యక్షుడు రామచందర్రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లబు వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భుక్యా బాలునాయక్, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు కందునూరి నగేష్గౌడ్ తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. -
పసుపు..కాషాయం
టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారు బీజేపీకీ ఒక ఎంపీ... 4 అసెంబ్లీ స్థానాలు వరంగల్ తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాలపల్లి కేటాయింపు వర్ధన్నపేటపై తొలగని అస్పష్టత మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి జిల్లాలో ఒక లోక్సభ, నాలుగు అసెంబీ స్థానాలు దక్కాయి. వరంగల్ లోక్సభ స్థానంతో పాటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాలను టీడీపీ.. బీజేపీకి కేటాయించింది. వర్ధన్నపేటను సైతం బీజేపీకే ఇవ్వగా.. ఈ సీటుకు బదులుగా స్టేషన్ఘన్పూర్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. వర్ధన్నపేటలో మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో ఆయనకు మద్దతు తెలపాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయింది. దీంతో స్టేషన్ఘన్పూర్ సీటు కోసం ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే టీడీపీ దీనికి నిరాకరిస్తోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తే... స్టేషన్ఘన్పూర్కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీని వల్లే టీడీపీ సైతం ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాజీనామా నిర్ణయాలు తీసుకోని చాలా మంది నేతలు అసంతృప్తితో ఎన్నికల్లో పనిచేయబోమని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోనూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుతో సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరగడంతో ఈయన స్వతంత్రంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పొత్తులతో అసంతృప్తులు ఎలా ఉన్నా... పోటీ చేసే స్థానాల సంఖ్య తేలడంతో రెండు పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. -
పోల్ కేక
అత్యధికం.. పెందుర్తిలో 92.1 అత్యల్పం.. కశింకోటలో 69.66 6.30 గంటలకేబారులు తీరిన ఓటర్లు ఓటింగ్ సరళిని వెబ్కెమేరా ద్వారా తెలుసుకున్న అధికారులు డీఎల్పురంలో ఓటేసి వృద్ధుని మృతి బ్యాలెట్పై సిరాతో అనకాపల్లి బీఆర్టీ కాలనీలో వివాదం విశాఖ రూరల్, న్యూస్లైన్ : తొలిదశ ప్రాదేశిక పోరు ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనా..ఆ తర్వాత క్రమంగా వేగం పుంజుకుంది. 22 జెడ్పీటీసీలకు, 379 ఎంపీటీసీ స్థానాలకు సాయంత్రానికి అంచనాలకు మించి 83.2 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా పెందుర్తిలో 92.10 శాతం ఓటింగ్ జరగగా, అత్యల్పంగా కశింకోటలో 69.66 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఉదయం 6.30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోలాహలం మొదలైంది. ఎండ తీవ్రత ఉన్నా.. యువ ఓటర్ల నుంచి పండుటాకుల వరకూ ఉత్సాహంగా తరలి వచ్చి కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ఇంటర్నెట్ సదుపాయమున్న 29 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. రాష్ట్ర పరిశీలకుడు టి. కృష్ణబాబు నక్కపల్లి మండలపరిషత్ కార్యాలయం నుంచి వెబ్కెమేరా ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అలాగే 225 మంది వీడియోగ్రాఫర్లను నియమించి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును వీడియో తీయించారు. కొన్ని చోట్ల ఆలస్యంగా.. : 22 మండలాల్లో 2397 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కొని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ విధానం ద్వారా జరిగిన ఈ క్రతువులో ఎన్నికల సిబ్బంది ప్రారంభంలో కొంత ఇబ్బం దులు పడ్డారు. దీంతో పెందుర్తి మండలం కోట్నివానిపాలెం దాదాపు 45 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది. గొరపల్లిలో 7.30 అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అనేక కేంద్రాల్లో నిర్ణీత సమయం కంటే 10 నుంచి 20 నిమిషాలు ఆల స్యంగా పోలింగ్ మొద లైంది. ఆ తరువాత మాత్రం ఓటర్లు అధిక సంఖ్యలో కేంద్రాలకు వచ్చినప్పటికీ వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేశారు. నక్కపల్లి మండలం డిఎల్పురంలో కిల్లాడ నాగరాజు ఉరఫ్ కొండయ్య(68) ఓటేసి ఇంటికెళ్లాక మృతి చెందాడు. అనకాపల్లి మండలం బీఆర్టీకాలనీ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్పై సిరా అంటుకోవడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు అత్యత్సాహం కనబరిచి లాఠీచార్జి చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో ఏఎస్పీ పకీరప్ప అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎండను లెక్క చేయక.. : ఓటర్ల సంకల్పం ముందు ఎండ చిన్నపోయింది. ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత సైతం ఓటర్లను నిలువరించలేకపోయిం ది. మంటలు పుట్టించే వేడి వాతావరణంలో భారీగా లైన్లలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతూనే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ తొలి రెండు గంటలు భీమిలి(21 శాతం), ఎస్.రాయవరం(21 శాతం), రాంబిల్లి(18 శాతం) మినహా మి గిలిన మండలాల్లో కాస్త మందకొడిగానే జరిగింది. 9 గంటలకు 13.39 శాతం జరగగా...11 గంటలకు 30 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 47.30 శాతం నమోదైంది. ఒకే సమయంలో భారీగా కేంద్రాలకు రావడంతో క్యూలైన్లలో ఇబ్బం దులు పడ్డారు. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యంతో అవస్థలకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు 62.70 శాతం, సాయంత్రం 5 గంటలకు మొత్తంగా 83.2 శాతం పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఈ ఎన్నికల కోసం అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా అన్ని కేంద్రాల్లోను పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పెందుర్తి, భీమిలి మండలంలో కొన్ని కేంద్రాల వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఓటర్లు కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి కొట్లాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిలువరించగలిగారు. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండో దశ ఎన్నికలు ఈ నెల 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్నాయి. సిబ్బంది గైర్హాజరుపై కలెక్టర్ కొరడా ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ప్రాదేశిక ఎన్నికలకు 220 మంది గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించారు. వారందరిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తొలివిడత పోలింగ్కు 1295 మంది పీవోలు, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవోలు మొత్తంగా 6473 మందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో 220 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలమేరకు విధులకు రాని వారి జాబితాను జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రమే అందజేశారు. వారందరిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. విశాఖ డివిజన్లోనివి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లోను, అనకాపల్లి డివిజన్వి ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్వి డాన్బాస్కో స్కూల్లోని స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపరిచారు. -
చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు
ఎమ్మెల్యే రాజుపై మండిపడుతున్న ఓ వర్గం సీనియర్లను విస్మరిస్తున్నారని ఆరోపణ తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థుల్లో ఆందోళన చోడవరం రూరల్, న్యూస్లైన్ : చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు బలంగా కనిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా టీడీపీకి అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పట్ల పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక విషయంలో కేఎస్ఎన్ చివరి వరకు నాటకీయతకు తెరతీయడంతో టికెట్టుపై ఆశపెట్టుకున్న అభ్యర్థుల్లో మరింత అసంతృప్తికి కారణమైంది. ముందుగా అభయం ఇచ్చిన వారికి కాకుండా చివరి నిమిషంలో మరో అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతూ వస్తున్నారు. వీరంతా అదనుకోసం చూస్తున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలోను ఇటువంటి అసంతృప్తులే అప్పటి జెడ్పీటీసీ అభ్యర్థి దాడి గంగరాజు ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. చోడవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బెన్నవోలుకు చెందిన మజ్జి గౌరీశంకర్కు టికెట్టు దాదాపు ఖరారయిందని భావించిన సమయంలో ఇదే టికెట్టు కోసం మండలంలోని గంధవరం మాజీ సర్పంచ్ పల్లా అర్జున యాదవ్ కూడా ఆశ పెట్టుకున్నారు. వీరితోబాటు గోవాడకు చెందిన ఏడువాక సన్యాసినాయుడు, గజపతినగరం గ్రామానికి చెందిన కనిశెట్టి సన్యాసిరావు(మత్స్యరాజు ) పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అనూహ్యంగా కనిశెట్టి మత్య్సరాజుకు టికెట్టు ఖరారు కావడంతో మిగిలిన ఆశావాహులంతా కంగుతిన్నారు. ఇంతకాలం ఎమ్మెల్యే రాజు వెంట ఉన్నప్పటికీ ధన బలం ఉన్న వారికే టికెట్టు ఇచ్చారని ఆశావహులు మధనపడుతున్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన గంటా వర్గీయులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై కూడా ఆ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గంటా వర్గీయులు జెడ్పీటీసీ, లేదా ఎంపీపీ పదవికాని తమకు కేటాయించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజు వీరిని పట్టించుకోకపోవడంతో వారంతా రాజు తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాల్లోని సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన వారినే ప్రోత్సహిస్తున్న రాజు తీరుపై సీనియర్లు అక్కసుతో ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలా రాజుపై ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థులు మధనపడుతున్నారు. -
అటు చేరికలు..ఇటు పొత్తు..టీడీపీ చిత్తు
పార్టీని వెన్నాడుతున్న తాజా కష్టాలు తలనొప్పిగా మారిన సీట్ల సర్దుబాటు గంటా బృందం చేరికతో కుమ్ములాట బీజేపీ డిమాండ్లతో మరింత సంక్షోభం తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చేరికలు, బీజేపీలో కుదురుతుందనుకుంటున్న పొత్తు జిల్లా టీడీపీకి వరంగా మారకపోగా శాపంగా పరిణమించింది. కొత్తగా వచ్చిన నేతలకుు సర్దుబాటు చేయలేక అష్టకష్టాలు పడుతుంటే బీజేపీ పొత్తు మరింతభారంగా తయారైంది. పొత్తు పెట్టుకొని అన్యాయం చేయవద్దంటూ అనితా సుకురు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు శనివారం పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు సైతం దిగారు. మరోవైపు టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లు వద్దని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. పొత్తు వల్ల ఓట్ల మాట అటుంచి ఎన్ని సీట్లు పోతాయోనన్న ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు శానసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్బాబు, యూవీ రమణమూరిలు చేరిన తరువాత పార్టీ ప్రతిష్ట పెరగకపోగా కుమ్ములాటలతో దిగజారింది. కన్నబాబు వందల కోట్ల దోపిడిదారు అని స్వయంగా చంద్రబాబు గతంలో ఆరోపించడం, రమేష్బాబు, వెంకట్రామయ్య, శ్రీనివాస్ల భూకబ్జాలకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమాలు నిర్వహించడంతో వీరి చేరికను క్యాడర్ ఇప్పటికీ ఆమోదించలేకపోయింది. ఈ ముగ్గురు ప్రభుత్వ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను పలు రకాలుగా వేధించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా గంటా కోట్ల రూపాయల ప్రభుత్వ గ్రంధాలయ స్ధలాన్ని దుర్వినియోగం చేయడం,పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై అప్పట్లో టీడీపీ విరుచుకుపడింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లిలో ఎన్టీఆర్ విగ్ర హ ఆవిష్కరణను అడ్డుకోవడం,సమైక్యాంధ్రా ఉద్యమకారులను అరెస్టులు చేయించి జైలుకు పంపడం వంటివాటిని టీడీపీ నేతలు మరువలేకపోతున్నారు. వీరి వెంట కాంగ్రెస్ క్యాడర్ రాక,టీడీపీ క్యాడర్ వీరితో కలవక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ పరిస్ధితులను దృష్టిలో వుంచుకొని పార్టీ అధిష్టానం ఈ ఐదుగురిలో ముగ్గురికి టికెట్లకు నామం పెట్టేందుకు ఎత్తులు వేస్తోంది. టికెట్ రాదేమోఅన్న అభద్రతాభావంతో గంటా మిత్రులు, వీరి చేరికవల్ల తమ అవకాశాలు సన్నగిల్లాయని సీనియర్లు మదనపడుతున్నారు. కన్నబాబు, వెంకట్రాయమ్య, శ్రీనివాస్ల టికెట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇక, వీరి చేరికల వల్ల టీడీపీ సీనియర్ నేతలు భరణికాణ రామారావు, కోన తాతారావు, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్కుమార్ తదితరులు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. బీజేపీతో పొత్తు పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టనుంది. నగర మొదటి మేయర్ బీజేపీ నుంచే ఎన్నిక కావడం, గతంలో ఈ జిల్లానుంచి ఆ పార్టీకి శానసభ్యులుండడంతో కనీసం ఒక ఎంపీ, రెండు ఎంఎల్ఏ టి కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ పట్టుపడుతోంది. బీజేపీ సీమాంధ్రా అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు కూడా విశాఖ వాసే కావడం, డీవీ సుబ్బారావు, పీవీ చలపతిరావు వంటి పెద్ద నేతలు వుండడంతో ఆ పార్టీ టికెట్లకు డిమాండు పెరిగింది. ఇటీవల పలువురు నగర ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు బీజేపీలో చేరారు. పోటీకి వీరు సిద్ధపడ్డం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలో పొత్తు కుదిరితే కుమ్ములాటలు తప్పవని టీడీపీ జిల్లా నేతలు భయపడుతున్నారు. విశాఖ ఎంపీతో పాటు విశాఖ ఉత్తర, దక్షిణ లేదా అరకు శాసనసభాస్ధానాలు కావాలని బీజేపీ అడుగుతుండడం టీడీపీలో టెన్షన్ను పెంచుతోంది. -
నేడే పోలింగ్
తొలివిడత ప్రాదేశిక సమరానికి సర్వం సిద్ధం కర్నూలు(అర్బన్), న్యూస్లైన్ : జిల్లాలో ఆదివారం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 జెడ్పీటీసీ స్థానాలు, 496 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నూలు డివిజన్లోని 19 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది.. నంద్యాల డివిజన్లోని 17 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు డివిజన్లలోని 496 ఎంపీటీసీ స్థానాలకు 1,311 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,451 మంది సిబ్బంది ఎన్నికల విధులకు గాను శనివారం ఆయా గ్రామాలకు తరలివెళ్లారు.169 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 400 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు. ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను తరలించారు. మండలాల్లోని ఆర్ఓ, ఏఆర్ఓలు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచనలు, సలహాలను మరోసారి వివరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సిబ్బంది తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు.. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. కర్నూలు డివిజన్కు సంబంధించి 57 జోన్లు.. 111 రూట్లను ఏర్పాటు చేయగా.. 76 జీపులు, 118 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను వినియోగిస్తున్నారు. నంద్యాల డివిజన్లోని 49 జోన్లు, 94 రూట్లకు 67 జీపులు, 97 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు. -
బీజేపీలో ‘స్థానిక’ పోరు!
పొత్తులతో చిక్కులు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్న నేతలు గెలుపే ముఖ్యమంటున్న మరి కొందరు నేతలు సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పొత్తు దాదాపుగా ఖరారవుతుండటంతో టికెట్లు ఆశించేవారిలో ఆందోళన ప్రారంభమయింది. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమం, కైకలూరు అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండే బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత పోరు మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు తమకే కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే పశ్చిమం లేదా కైకలూరు సీట్లలో ఒకటే ఇస్తామంటూ టీడీపీ నేతలు సూచిస్తున్నారు. చివరకు సెంట్రల్ బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారికే అవకాశం కల్పించాలని, కొత్తవారిని తీసుకొస్తే ఊరుకొనేది లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకునేవారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ ఉండదని సలహాలిస్తున్నారు. వారు గెలి చినా, ఓడిపోయినా హైదరాబాద్లోనే ఉంటారని, దీనివల్ల స్థానికంగా పార్టీ అభివృద్ధి చెందదని పేర్కొంటున్నారు. బీజేపీ కూడా టీడీపీలాగానే ‘కార్పొరేట్ సంస్థ’గా మారిపోయిం దని, హైదరాబాద్లో నేతలకు డబ్బు సంచులు ఇచ్చి సీట్లు తెచ్చుకోవచ్చని కొంతమంది నేతలు భావిస్తున్నారని, అందువల్లనే స్థానికేతరుడికి సీటు ఇవ్వకూడదని బలంగా వాదిస్తున్నారు. ఏనాడూ పార్టీ జెండా పట్టుకోనప్పటికీ ముఖ్యనేతలను సంతృప్తి పరిచి బీఫారంతో దిగుమతి అయితే సహించబోమని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నారు. స్థానికుల కోటాలో బీజేపీ సీమాంధ్ర కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నేతలు వీరమాచినేని రంగ ప్రసాద్, రామసాయి తదితర పేర్లు పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. గెలుపుగుర్రాలపైనే దృష్టిపెట్టాలి సెంట్రల్ సీటు బీజేపీకి దక్కితే పార్టీని గెలిపించే వారికే అవకాశం కల్పించాలి తప్ప స్థానికుడికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అర్బన్ పార్టీలోనే మరికొంతమంది నేతలు వ్యాఖానిస్తున్నారు. సీనియార్టీనే ప్రాధాన్యతగా తీసుకుంటే జనసంఘ్ నుంచీ పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గతంలో టికెట్ ఆశించి భంగపడి, కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి ‘స్థానికుడికే సీటు’ అంటూ కొత్తవాదనలు తెస్తున్నార ని ఈ వర్గం వాదిస్తోంది. బీజేపీకి ఉన్న ఓటింగ్కు తోడు తన ప్రభావంతో పార్టీకి పది ఓట్లు తీసుకొచ్చే అభ్యర్థి అవసరమని, కేవలం సీనియార్టీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ వర్గాలతో మంచి సంబంధాలు, సినీ రంగంతో పరిచయం ఉన్నవారైతే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని వివరిస్తున్నారు. కొత్తవారి కోటాలో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. పశ్చిమం, కైకలూరు సీటు లభించినా అక్కడ నుంచి కూడా పోటీ చేసేందుకు నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే లభించే ఒకటి రెండు సీట్ల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. -
ఓటుపై వేటు..
వైఎస్సార్సీపీ అనుకూల ఓటుపై టీడీపీ కుట్ర ఓటరు స్లిప్ల పంపిణీలో గిమ్మిక్కులు పెనమలూరులో వెలుగులోకి ఓటరు స్లిప్ లేకున్నా అనుమతిస్తామన్న కలెక్టర్ సాక్షి, మచిలీపట్నం : రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం.. వ్యూహాలకు పదును పెట్టడం సర్వసాధారణం. కానీ ఏకంగా ఇతర పార్టీలకు పడే ఓట్లపై వేటు వేసేందుకు జరిగే ప్రయత్నాలను మాత్రం ఎవరూ హర్షించరు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేకచోట్ల ఓటరు జాబితాల్లో తమకు అనుకూలంగా ఉండేవారి ఓట్ల నమోదు, వ్యతిరేక పార్టీకి చెందినవారివి తొలగింపు అనేక పర్యాయాలు వివాదాస్పమైన సంగతి తెల్సిందే. తాజాగా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తుగడ పన్నింది. జిల్లాలో పలు పంచాయతీల్లో తమకు అనుకూలంగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు, సిబ్బందిని ప్రయోగించి వైఎస్సార్సీపీకి అనుకూల ఓటర్లకు ఓటరు స్లిప్లు ఇవ్వకుండా అడ్డుకుంది. గతంలో ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఓటరు స్లిప్ ఇచ్చినా దాన్ని తీసుకుని వెళితే పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ ఇచ్చేవారు. ఆ బ్యాలెట్లో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేవారు. కానీ ఈసారి పార్టీలు, అభ్యర్థులు గుర్తులతో ఇచ్చే ఓటరు స్లిప్లను అనుమతించేది లేదని, నేరుగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇచ్చే ఓటరు స్లిప్లనే అనుమతిస్తామంటూ ఎన్నికల కమిషన్ నిబంధన పెట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ప్రతీ ఇంటికి ఆయా గ్రామాల్లోని సిబ్బంది ఓటరు స్లిప్ల పంపిణీ చేపట్టారు. అంతవరకు బాగానే ఉన్నా అసలు మెలికను టీడీపీ నేతలు ఇక్కడే పెట్టారు. ఓటరు స్లిప్ లేకుండా ఓటు లేదనుకునో, ఓటు వేయనివ్వరనుకునో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి మానేస్తారు. దీంతో టీడీపీ వ్యతిరేక ఓటుకు అడ్డుకట్ట వేసే కుట్ర గ్రామాల్లో పురుడుపోసుకుంది. ఇది పెరిగి పెద్దదై జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారులు, ఆయా గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యులు ఎన్నికల దిగువస్థాయి సిబ్బందిని తమ చేతిలోకి తీసుకుని వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లకు ఓటరు స్లిప్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు పెనమలూరు నియోజకవర్గంలో ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పడే ఓటర్లను టార్గెట్గా చేసుకుని అవి పడకుండా వేటు వేసేందుకు ఓటరు స్లిప్లు ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదులు అందాయి. కానూరులో వెలుగులోకి... పెనమలూరు మండలం కానూరు పంచాయతీలో ఓటరు స్లిప్లను అంగన్వాడీ వర్కర్కు బదులు వార్డు సభ్యుడి చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే ఆ వార్డు సభ్యుడు ఒక ఇంటి వద్దకు వెళ్లి మొదట ఓటరు స్లిప్లు ఇచ్చాడు. మీరు ఓటు ఎవరికి వేస్తారని ఆ ఇంటి యజమానిని పంచాయతీ వార్డు సభ్యుడు ప్రశ్నించాడు. దీంతో నేను వైఎస్సార్సీపీకి ఓటేస్తానని ఇంటి యజమాని బదులివ్వడంతో అతనికి ఇచ్చిన ఓటరు స్లిప్ను లాగేసుకుని వెళ్లిపోయినట్టు అతను వైఎస్సార్సీపీ నాయకుల దృష్టికి తేవడంతో ఈ వ్యవహారం గుప్పుమంది. ఇలా జిల్లాలో చాలా చోట్ల ఓటర్లకు స్లిప్లు ఇవ్వకుండా కుట్ర చేశారని చెబుతున్నారు. ఓటరు స్లిప్ లేకుంటే తమ ఓటు లేదనో, స్లిప్ ఇవ్వలేదు కాబట్టి ఓటు వేయనివ్వరనో కారణంతో చాలా మంది ఓటర్లు ఓటుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. తెల్లకాగితంపై రాసి తెచ్చినా ఓటిస్తాం : కలెక్టర్ ఓటరు స్లిప్ లేదని కంగారుపడనవసరం లేదని, తెల్ల కాగితంపై వివరాలు రాసుకుని వచ్చినా ఓటిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్రావు స్పష్టం చేశారు. పెనమలూరులో జరిగిన ఉదంతాన్ని ‘సాక్షి’ ఆయన దృష్టికి తెచ్చింది. ఈ విషయాన్ని అన్ని నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారుల నుంచి ఆరా తీస్తానని ఆయన తెలిపారు. ఓటరు స్లిప్ అందలేదని ఓటర్లు కంగారు పడక్కర్లేదని చెప్పారు. పార్టీల గుర్తులు, రంగులు లేని తెల్లకాగితంపై ఓటరు పేరు, ఓటరు జాబితాలో సీరియల్ నంబర్ వంటివి రాసుకుని తెస్తే ఓటు వేసే అవకాశం ఇస్తామని అన్నారు. ఓటరు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పెనమలూరులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు పెనమలూరులో వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను పడకుండా చేసేందుకు టీడీపీ చేసిన కుట్రను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విజయవాడ సబ్ కలెక్టర్ దాసరి హరిచందనకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్బాబు ‘సాక్షి’కి శనివారం రాత్రి చెప్పారు. ఓటు వేసేందుకు కీలకమైన ఓటరు స్లిప్లు మండల కార్యాలయాలు, పంచాయతీల్లో ఇచ్చి పర్యవేక్షణ చేయకపోవడంతో వాటి పంపిణీలో పక్షపాత ధోరణులు ఉన్నాయని సురేష్బాబు తెలిపారు. ఓటరు స్లిప్లు లేవని కంగారుపడవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామంటూ సబ్కలెక్టర్ హరిచందన హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద హెల్స్ డెస్క్లు ఏర్పాటు చేసి ఓటరు స్లిప్లు లేనివారికి వాటిని అందించేలా చర్యలు తీసుకుంటానని సబ్కలెక్టర్ తెలిపారని ఆయన వెల్లడించారు. -
పోరుకు సర్వం సిద్ధం
రేపు మదనపల్లె డివిజన్లో తొలి విడత స్థానిక ఎన్నికలు సన్నద్ధమైన యంత్రాంగం 31 జెడ్పీటీసీలు, 447 ఎంపీటీసీలకు పోలింగ్ బరిలో 1408 మంది అభ్యర్థులు చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్ : జిల్లాలో తొలి విడతగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. 6వ తేదీన జిల్లాలో తొలి విడతగా మదనపల్లె డివిజన్ లోని 31 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 144 మంది జెడ్పీటీసీ స్థానాలకు, 1264 మంది ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతున్నారు. 10.77 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనుకోనుండగా, మొత్తం 1408 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోలింగ్ మండలాలు ఇవే... మదనపల్లె డివిజన్ పరిధిలోని 31 మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ డివిజన్లో బి.కొత్తకోట జెడ్పీటీసీ స్థానంతోపాటు 17 ఎంపీటీసీ సెగ్మెంట్లకు బెరైడ్డిపల్లెలో 16, చిన్నగొట్టిగల్లు 7, చౌడేపల్లె 12, గంగవరం 16, గుడుపల్లె 13, గుర్రంకొండ 12, కంభంవారిపల్లె 12, కలకడ 10, కలికిరి 14, కుప్పం 34, కురబలకోట 12, ములకలచెరువు 13, మదనపల్లె రూరల్ 27, నిమ్మనపల్లె 9, పలమనేరు 9, పెద్దమండ్యం 10, పెద్దపంజాణి 17, పెద్దతిప్పసముద్రం 15, పీలేరు 21, పుంగనూరు 16, రామకుప్పం 16, రామసముద్రం 14, రొంపిచెర్ల 8, శాంతిపురంలో 18, సదుం 10, సోమల 12, తంబళ్లపల్లె 11, వాల్మీకిపురం 13, వి.కోట 25, ఎర్రావారిపాళెంలోని 8 ఎంపీటీసీ సెగ్మెంట్లతో పాటు జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 7 వేలకు పైగా సిబ్బంది తొలి విడత ఎన్నికలకు మొత్తం 7,742 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ముగ్గురు సిబ్బందిని నియమించారు. 1,550 మంది పీవోలు, 1,550 మంది ఏపీవోలు, 4,642 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1.381 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 141 సమస్యాత్మక, 152 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు న్నాయి. ఇక్కడ పోలింగ్ సవ్యంగా నిర్వహించడానికి 146 మంది వీడియోగ్రాఫర్లు, లైవ్ వెబ్కాస్టింగ్కు 140 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 99 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సిబ్బంది కోసం 347 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాలతో తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్లు వారి నిర్ణయాన్ని బ్యాలెట్ పత్రాల ద్వారా తెలియజేయనున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులతో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మదనపల్లె డివిజన్లో 31 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి 12.95 లక్షల బ్యాలెట్ పత్రాలు, 447 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి 17.61 లక్షల బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఇప్పటికే వాటిని ఆయా పోలింగ్ కేంద్రాల సమీపంలోని మండల కేంద్రాలకు తరలించారు. -
కుమ్మరిస్తున్నారు..
నోట్లతో ఓట్ల కోసం టీడీపీ ఎర కుప్పంలో ఆకు, వక్కతోపాటు డబ్బు పంపిణీ పీలేరులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ పోలింగ్ రోజున మాంసం కోసం టీడీపీ టోకన్లు సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారా విజయం సాధించేం దుకు తెలుగుదేశం పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. డబ్బుతోపాటు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకమైన ప్రలోభాలకు తెరతీసింది. పోలింగ్కు ఇక 24 గంటలు మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. మదనపల్లెలో డబ్బు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ పోలీసులకు చిక్కారు. దీన్నిబట్టి ఓట్ల కోసం ప్రలోభాలపైనే టీడీపీ ఎంతగా ఆధారపడిందో అర్థమవుతోంది. పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 31 జెడ్పీటీసీ, 447 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడును ఎదుర్కొనేందుకు ఆ పార్టీ శ్రేణులు డబ్బు కుమ్మరిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కుప్పంలో ఏదో రకంగా గెలుపు సాధించాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్లోనూ ఓటుకు రేటు కట్టారు. కుప్పం మండల సెగ్మెంట్లో మహిళలకు ఆకు, వక్కతో పాటు డబ్బు పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్లో అత్యధికంగా వెయ్యి రూపాయలు కూడా పం పిణీ చేసినట్టు సమాచారం. పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలో యువతను ఆక ర్షించేందుకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో యువతకు ప్రత్యేకంగా యూత్ డిన్నర్స్ ఏర్పాటు చేశారు. ఈ విందులో మందు, మాంసాహారం అందించారు. బెరైడ్డిపల్లెలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. గంగవరం మండలంలో పది మందికి పైగా ఓట్లు ఉన్న ఇళ్లకు టోకుగా ప్యాకేజీలు నిర్ణయించి ఆ మేరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. పలమనేరు మండలంలో పోలింగ్ జరిగే ఆదివారం రోజున మాంసం తెచ్చుకునేందుకు వీలుగా టోకెన్లు పంపిణీ చేశారు. కుటుంబంలోని ఓటర్ల సంఖ్యను బట్టి రెండు నుంచి మూడు కేజీల చికెన్, మటన్ టోకెన్లు ఇచ్చారు. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేశారు. చౌడేపల్లె మండలంలో టీడీపీ అభ్యర్థులు తెప్పించినదిగా భావిస్తున్న 210 కేసుల బీరు, బ్రాందీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్ మదనపల్లె జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. కోటపోలు గ్రామంలో స్వయంగా డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. రామసముద్రం మండలంలో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు. నిమ్మనపల్లెలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఓటుకు రేటు కట్టారు. కిక్కెక్కించిన జై సమైక్యాంధ్ర పార్టీ పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మందు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల డబ్బు పంపిణీ చేసినప్పటికీ మద్యం పంపిణీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ హవా ఉన్న సెగ్మెంట్లలో జై సమైక్యాంధ్ర వారు ఐదు నుంచి వెయ్యి రూపాయల వరకు డబ్బు పంపిణీ చేశారు. -
తొలి విడత...ప్రచారానికి తెర
పరిషత్ పోరు 6న మొదటి విడత పోలింగ్ విజయవాడ, మచిలీపట్నం డివిజన్లలో నిర్వహణ 26 జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది పోటీ 450 ఎంపీటీసీలకు బరిలో 1,187 మంది పోలింగ్ కేంద్రాలు 1,437 నేడు సిబ్బందికి ఎన్నికల సామగ్రి అప్పగింత మచిలీపట్నం, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 జెడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ సీఈవో, స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సుదర్శనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత నెల 24తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం మొదటి విడత ఎన్నికలు జరిగే మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలో జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,187 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. విస్తృత ప్రచారం... గత 11 రోజులుగా మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రచారానికి చివరిరోజైన శుక్రవారం అభ్యర్థులు, వారి తరఫున నాయకులు పోటాపోటీగా పర్యటించారు. బ్యాలెట్ బాక్సుల్లోనే... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బందికి సామగ్రిని అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పోటీలో ఉన్న తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే విజయవాడ డివిజన్లో 10, మచిలీపట్నం డివిజన్లో 4 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 1,437 కేంద్రాల్లో పోలింగ్... మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లోని 12 జెడ్పీటీసీ స్థానాలకు, 157 ఎంపీటీసీ స్థానాలకు, విజయవాడ రెవెన్యూ డివిజన్లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు, 293 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,437 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 42 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. 26 మంది మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొత్తం 7,185 మంది సిబ్బందితో పాటు మరికొంతమందిని రిజర్వులో ఉంచారు. పటిష్ట బందోబస్తు... మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ బీడీవీ సాగర్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుని ఎన్నికలు నిలిచిపోతే ఈ నెల ఏడో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం మండల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆయా డివిజన్ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. నగదు, మద్యం జోరు... ఎన్నికల ప్రచారం ముగియటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మద్యం పంపిణీని ప్రారంభించారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఓటుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ స్థానం ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఓటుకు రూ.3 వేలు వరకు పలుకుతోంది. ఐదారు ఓట్లు ఉన్న కుటుంబంలో వారు నగదు తీసుకోరని భావిస్తే గృహోపయోగమైన వస్తువులను అందిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. పురపాలక సంఘ ఎన్నికల అనంతరం చెక్పోస్టులలో నిఘా తగ్గించటంతో ఎలాంటి ఆటంకం లేకుండానే మద్యం, నగదు గ్రామాలకు చేరిపోతోంది. -
ఇక ఆపదే
5 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ టికెట్లు ఖరారు! సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మూడు పది స్థానాలపై తొలగని అనిశ్చితి గంటా బృందం టిక్కెట్లపై సస్పెన్స్ ఇరకాటంలో అరకు టికెట్ సాక్షి,విశాఖపట్నం: టీడీపీ నాన్చినాన్చి ఐదు అసెంబ్లీ స్థానాలకు టికెట్లను ఖరారు చేసింది. శుక్రవారం వీటిపై స్పష్టత వచ్చినా పొత్తుల సాకుతో శనివారానికి వాయిదా వేసింది. మూడుచోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలకు ఖరారు చేసింది. విశాఖ తూర్పు- వెలగపూడి, చోడవరం- కేఎస్ఎన్ రాజు, మాడుగుల-గవిరెడ్డి రామానాయుడు పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమం- గణబాబు, నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు పేర్లు కూడా బయటకు వచ్చాయి. సిట్టింగ్లను ప్రకటించిన చోట అసమ్మతి స్వరం భగ్గుమంది. ఇక్కడ టికెట్లు ఆశిస్తున్న వారంతా శుక్రవారం రాత్రి నుంచి కారాలుమిరియాలు నూరుతున్నారు. తమను పార్టీ వంచించిందని ఆరోపిస్తున్నారు. ముందుంది అసలు పండగ జిల్లాలో మిగిలిన పది సీట్ల విషయమే పీటముడిగా తయారైంది. ఒకరి పేరు ప్రకటిస్తే మరొకరు భగ్గుమనే పరిస్థితులు కనిన్నాయి. దీంతో వివాదంగా మారిన వాటి జోలికి పోలేదని భోగట్టా. బీజేపీతో పొత్తు తేలక అభ్యర్థులను ప్రకటించలేదని అధిష్టానం పేర్కొంటుండడంతో సస్పెన్స్ వీడక ఆశావహులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులు తలపట్టుకుంటున్నారు. ఇటీవల పార్టీలో చేరిన గంటా బృందమైతే ముచ్చెమటల్లో మునుగుతోంది. వీరంతా రాజధానిలో మకాం పెడుతున్నారు. ఎలమంచి,గాజువాకల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, చింతలపూడికి టికెట్లు కష్టమని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు, ఇతర సీనియర్ నేతల నుంచి పోటీ కారణంగా ఉత్తరం నుంచి ప్రస్తుత పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబుకు కూడా టికెట్ గగనమని తెలుస్తోంది. ఇక్కడి టికెట్పై గంటా బాబు వద్ద పంచాయతీ పెట్టినట్లు భోగట్టా. భీమిలిలో గంటా వర్గం నేత అవంతికి పోటీ తీవ్రంగా ఉంది. విశాఖ దక్షిణంలో వాసుపల్లికి టిక్కెట్ ఖరారని ప్రచారమైనా చివరి నిమిషంలో బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో అక్కడ పనిచేస్తోన్న వాసుపల్లితో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే ఆయన గురువారం చంద్రబాబును కలిసి అసంతృప్తి కూడా వెల్లగక్కారు. ముగ్గురు సిటింగులకు టికెట్ కేటాయించిన బాబు అరకు విషయంలో ఇరకాటంలో పడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే సిరివేము సోమ పేరును మాత్రం ప్రకటించలేదు. ఆస్థానం బీజేపీకి ఇవ్వవచ్చనే ప్రచారం ఉంది. పెందుర్తి,పాయకరావుపేట,పాడేరు,భీమిలి,అనకాపల్లి,గాజువాక తదితర స్థానాల్లో చిక్కుముడుల కారణంగా మున్ముందు ఏప్రకటన వెలువడుతుందో తెలియక రాజధానిలోనే పాగావేశారు. -
పొత్తులు.. కత్తులు
‘దేశం’లో ముసలం తమ్ముళ్ల తిరుగుబాట అధినేత ఇంటి వద్ద నిరసన అమీతుమీకి సిద్ధం స్వతంత్రులుగా పోటీకి సై సాక్షి, సిటీబ్యూరో: పోటీకి ముందే సొంత పార్టీల్లో పేచీలు.. ఒకపక్క పొత్తుల కోసం ఎత్తులు పై ఎత్తులు.. మరోపక్క అవి పొసగక కత్తులు దూస్తున్న శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో చిచ్చు రగులుతోంది. పోటీపై స్పష్టత కొరవడటంతో మంటలు రేగుతున్నాయి. ఇన్నాళ్లూ తాము పోటీ చేద్దామని ఆశించిన నియోజకవర్గాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ధారాదత్తం చేస్తున్నారనే సమాచారంతో ఆయా పార్టీల శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఇతర పార్టీలకు ఆ సీట్లను కట్టబెడుతుండటాన్ని జీర్ణించుకోలేని నాయకులు అధిష్ఠానాలతోనే అమీతుమీకి సిద్ధమవుతున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోబోమని, ఇతర పార్టీల్లోకి ఫిరాయించైనా పోటీ చేస్తామని, లేకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతామని సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా ఈ పరిణామాలు గ్రేటర్ హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయని భావించిన ఆయా నియోజకవర్గాల నేతలు ఏకంగా చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. ఇంకొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం తీరును నేతలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఆర్నెళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్న అధిష్ఠానం అది చేయకపోగా, తీరా నామినేషన్ల సమయంలో ఉత్తచేయి చూపడాన్ని ఆయా నియోజకవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు, అభ్యర్థుల ఎంపికకు ఐవీఆర్ఎస్ను వినియోగిస్తున్నామని చెప్పిన అధినేత.. బీజేపీతో పొత్తుపై ఎందుకు అభిప్రాయాలు సేకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ‘దేశం’లో ఇదీ వరస.. మహేశ్వరం నియోజకవర్గం టిక్కెట్ను టీడీపీ.. బీజేపీకి కేటాయించనుందనే ప్రచారంతో మాజీ మేయర్, ఆ స్థానాన్ని ఆశిస్తున్న తీగల కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. మహేశ్వరం సీటును బీజేపీకి ఇవ్వరాదని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఎల్బీనగర్ టిక్కెట్ ఆశిస్తున్న ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్వీ కృష్ణప్రసాద్ సైతం చంద్రబాబు ఇంటి సమీపంలో బైఠాయించారు. ఈ సీటు బీజేపీకి ఇస్తే సహించమని తేల్చి చెప్పారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన హైదరాబాద్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బద్రినాథ్యాదవ్ సైతం ఆందోళనకు దిగారు ఖైరతాబాద్ను బీజేపీకి కేటాయించవద్దని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కె.విజయరామారావు మూడ్రోజుల క్రితం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్కు జై.. చంద్రబాబు నై నై! బీజేపీతో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న నేతలంతా కూటమిగా ఏర్పడి ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రచారంలో.. పార్టీ జెండాలు, బ్యానర్లు వాడాలని, అయితే వాటిలో ఎక్కడా చంద్రబాబు బొమ్మ లేకుండా, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బొమ్మ మాత్రమే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న తమకు అదే పార్టీలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకు, ఎన్టీఆర్ ఏ ఆశయాలతో టీడీపీని ఏర్పాటు చేశారో అందుకు వ్యతిరేకంగా ప్రస్తుత టీడీపీ నడుస్తోందని చెప్పేందుకు ఈ ప్రదర్శనలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. అసలైన టీడీపీ వాళ్లం తామేనని ప్రకటించుకోవడంతో పాటు, టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం చేసేందుకూ ఇది తోడ్పతుందని అంచనా వేస్తున్నారు. ముషీరాబాద్, అంబర్పేట, గోషామహల్ నియోజకవర్గాల నేతలు ఈ యోచనకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందువల్ల తమ గెలుపు సంగతెలా ఉన్నా.. తమకు టిక్కెట్ రాకపోవడానికి కారకులైన వారూ గెలవరాదనేది వీరి తలంపుగా ఉంది. ప్రచారంలో ‘ఎన్టీఆర్ జిందాబాద్’ నినాదమే తప్ప ఎక్కడా చంద్రబాబు పేరు, బొమ్మల్ని ప్రస్తావించరాదని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా ‘చంద్రబాబు ముర్దాబాద్’ అని వేరుగా చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నారు. కాగా, కార్వాన్, యాకుత్పురా/చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి/కుత్బుల్లాపూర్ను సైతం బీజేపీ కోరుతుండటంతో ఆ నియోజకవర్గాల టీడీపీ నేతలూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. -
బావకు బిర్యానీ పెట్టండ్రా..!!
ఓటరు మారాజుకు మహద్భాగ్యం బిందెలు, చీరలు, స్టీలు క్యాన్లు పంపిణీ తాగినోడికి తాగినంత...మస్తుగా బిర్యానీ పల్లెల్లో పండగ వాతావరణం నర్సీపట్నం టౌన్, న్యూస్లైన్: ‘ఒరేయ్...మా సిమాచలం బావొచ్చాడు...కూకోబెట్టి బిర్యానీ పెట్టండ్రా...ఏటి గంగక్కా ఈ మద్దిన కనబడ్నేదు......మా మేన కోడలు బాగా సదువుతందా ? ఇదా ఈ స్టీలు బిందె, చీర ఉంచు...వచ్చేవారం జరిగే ఎలచ్చన్లలో ఈ తమ్ముడికి ఓటెయ్యడం మర్సిపోకు సుమీ...’ పల్లెల్లో ఎక్కడ చూసినా ఇదే సందడి...సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండగలు ముగిశాక వస్తున్న ఈ ఓట్ల పండక్కి నేతలు సిద్ధమై, ప్రజల్నీ సంసిద్ధుల్ని చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలూ శక్తియుక్తులు ధారపోస్తున్నాయి. గతంలో వేలల్లో అయ్యే ఖర్చు ఇప్పుడు లక్షలు దాటింది. అప్పట్లో జాకెట్ ముక్క ఇస్తే గొప్ప...మరిప్పుడు ఖరీదైన చీర, ఇంకా స్టీలు బిందెలు ఇవ్వాల్సిందే. దీంతోబాటు విచ్చలవిడిగా తాగినోడికి తాగినంత మద్యం. తిన్నోడికి తిన్నంత బిర్యానీ...రోజూ రాత్రిళ్లు విందు సమావేశాలతో పల్లెల్లో ఒకటే సందడి నెలకొంది. నర్సీపట్నంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు పోలింగ్కు సమయం దగ్గరపడుతుండడంతో ఓటర్లను తమకు తోచిన స్థాయిలో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. గతంలో ఎంపీటీసీగా అభ్యర్థికి రూ.20-30 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడది కొన్నిచోట్ల రూ.2-5లక్షలకు చేరింది. గత ఎన్నికల్లో మహిళలను అకట్టుకునేందుకు జాకెట్ ముక్కలు ఇచ్చే వారు. పురపాలక ఎన్నికల్లో ఈ పరిస్థితి మారింది. జాకెట్ ముక్కలకు బదులు చీరలను ఇవ్వడంతో పాటు గాజుల ఖర్చు నిమిత్తం మరో రెండొందలు ఇస్తున్నారు. పరిషత్ ఎన్నికలు గ్రామాలకు పరిమితం కావడంతో మహిళలు, రైతులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న ప్రలోభ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు పాలు కేంద్రానికి తీసుకువెళ్లడానికి వీలుగా పాల క్యాన్లు, ఇళ్లలో వినియోగానికిగాను స్టీల్ క్యాన్లు ఇస్తున్నారు. పలు గ్రామాల్లో అయితే ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరు మీద ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఈ సరుకులు పంపిణీ చేసుకుందామని, ఓటరుకు ఎవరు ఇష్టమైతే వారికే ఓటు వేస్తారని ఒప్పందానికి వచ్చారు. ఇక మద్యం పంపిణీకి హద్దులేదు. -
గప్ చుప్
తొలి విడత 22 మండలాల్లో నేటితో ప్రచారానికి తెర అంతటా అభ్యర్థుల హడావుడి రాజకీయ వేడితో గ్రామాలు గరం గరం 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీలకు 6న పోలింగ్ విశాఖ రూరల్, న్యూస్లైన్: ప్రాదేశిక తొలి విడత ఎన్నికల ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఆపేయాలన్న నిబంధన మేరకు శుక్రవారం సాయంత్రంతో అంతటా గప్చుప్ వాతావరణం నెలకొన నుంది. దీంతో ఆఖరి రోజు ప్రచారానికి అభ్యర్థులు తమదైన శైలిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఉన్న కొద్ది సమయాన్ని పల్లె వాసులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశగా 6న 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీలకు, రెండో విడతగా 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతగా 7,37,269 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్కు రెండు రోజులే గడువుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటికి తిరిగి తమ వారికి ఓట్లను వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. గ్రామాల్లో నాయకుల మకాం ‘పరిషత్’ పోలింగ్కు సమయం సమీపిస్తున్నకొద్దీ నియోజకవర్గ నేతలంతా గ్రామాల్లోనే తిష్టవేశారు. వీరంతా స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే సార్వత్రికం దృష్ట్యా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు తమను బలపరచాలని కోరుతూ గ్రామాల్లో రాజకీయాలు నడుపుతున్నారు. పగలంతా ప్రచారంలో మునిగి, రాత్రిళ్లు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్లలోను, పట్టున్న నేతల విడిదిలోను బస చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలుపే లక్ష్యంగా తాయిలాలు ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దీటుగా ఖర్చుకు సైతం వెనుకాడడం లేదు. పల్లెల్లో కులసంఘాలు, మహిళా సంఘాలకు తాయిళాల ఎర వేసి తమ వైపు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా గంపగుత్తుగా ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ముట్టజెబుతున్నారు. ప్రధానంగా యువతకు క్రీడా సామాగ్రి, ఆటవస్తువులు, మహిళలకు చీరలు పంచిపెడుతున్నారు. తాగినోడికి తాగినంత అన్నట్టు పీకలదాక మందు పట్టిస్తున్నారు. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల సిబ్బందికి బస్సులు తొలి దశలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరం, చీడికాడ, కశింకోట, కె.కోటపాడు, మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎన్నికల విధులకు 2633 మందిని అధికారులు నియమించారు. వీరు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారు జామున ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి ఐదు బస్సులు బయలు దేరుతాయని జెడ్పీ సీఈవో ఎం.మహేశ్వరెడ్డి తెలిపారు. -
విచ్చలవిడిగా మద్యం పంపిణీ
ఓ సాధువు శిష్యులతో కలిసి ఊరూరూ పర్యటిస్తుంటారు. వీలున్న చోట బస చేస్తుంటారు. ఒకరోజు తన శిష్యులతో కలిసి బస చేసిన ఊళ్లో ఒక వ్యాపారి ఆయనను చూడ్డానికి వచ్చాడు. ‘‘గురువుగారూ, నన్ను క్షమిం చాలి’’ అని పాదాలకు నమస్కరించాడు. ‘‘నువ్వెవరు? నిన్నెందుకు క్షమించాలి? నువ్వు చేసిన తప్పేంటి?’’ అని సాధువు అడిగారు. ‘‘నేను ముప్పై ఏళ్లుగా ఇదే ఊళ్లో వ్యాపారం చేస్తున్నాను. గత ఏడాది నాకు పోటీగా ఒకడు వ్యాపారం మొదలుపెట్టాడు. నా దగ్గరకు వచ్చే వాడుకదారులు అందరూ అతని దగ్గరకు వెళ్తున్నారు. నాకు నష్టం వస్తోంది. దాంతో అతన్ని నేను కోపావేశంతో శాపనార్థాలు పెట్టాను’’ ‘‘ఏంటా శాపనార్థాలు?’’ ‘‘అతని వ్యాపారం దెబ్బతినాలని శపించాను, దాంతో అతడు ఏడాది తిరగకముందే తీవ్రంగా నష్టపోయాడు. అయితే నాకు అతని నష్టం ఏ మేరకూ తోడ్పడలేదు. ఇంకా ఆర్థిక బాధలతోనే సంసారాన్ని లాగిస్తు న్నాను’’ అన్నాడు వ్యాపారి. సాధువు ఒక నవ్వు నవ్వారు. ‘‘నువ్వు చేసిన ఆ పాత పాపానికి క్షమించమని అడిగేకన్నా దానిని మరచిపోయి ఏదైనా మంచి పని చెయ్యడం మొదలుపెట్టు. నలుగురూ బాగుండేలా ఏదైనా చెయ్యి’’ అని సూచించారు. కానీ అతను అందుకు ఒప్పుకోలేదు. ‘‘లేదు గురువుగారూ, నన్ను మీరు మన్నించాలి. అప్పుడే నా మనసు శాంతిస్తుంది. ఇందుకు ఏదైనా సలహా ఇవ్వండి’’ అని మళ్లీ ఆయన పాదాలపై పడ్డాడు. సాధువు తన శిష్యులవైపు చూశారు. ‘‘మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది’’ అని శిష్యులతో చెప్పారు. శిష్యులు తమ గురువు వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ‘‘కొందరు జరిగిపోయిన కాలంలోనే జీవిస్తుంటారు. అలా ఉండటమే వారికి నచ్చుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోరు. ఆనందమో, ఆవేదనో దానినే స్మరించుకుంటూ గతంలోనే జీవిస్తుంటారు. అటువంటి వాళ్లు వర్తమానంలో అడుగులు వేసి ఏదీ చెయ్యలేరు. భవిష్యత్తులోనూ తొంగి చూడలేరు’’ అని గురువుగారు ఆ వ్యాపారిని ఉద్దేశించి ఈ నాలుగు మాటలు చెప్పి పొరుగూరికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. - యామిజాల జగదీశ్ -
కాంగ్రెస్కు చెయ్యిచ్చి.. సైకిలెక్కేశారు
విలువలకు పాతర...పదవులకు పాకులాట బుద్ధప్రసాద్కు అవనిగడ్డ ? పిన్నమనేనికి ఏదో ఒకటి! సాక్షి ప్రతినిధి,విజయవాడ : విలువలు.. విశ్వసనీయతకు చెల్లుచీటీ రాసేసి పదవే పరమావధిగా జిల్లాలో కీలక నేతలు ఇద్దరూ కాంగ్రెస్కు చెయ్యిచ్చి సైకిలెక్కేశారు. అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ను నమ్ముకుంటే పదవులు దక్కవనే ఆలోచనతో వాళ్లు పార్టీ ఫిరాయించడంపై ఆయా నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. వారి తండ్రుల కాలం నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా తెచ్చుకున్న మంచి పేరు కాస్తా పార్టీ ఫిరాయింపుతో పోగొట్టుకున్నారన్న విమర్శలు రేగుతున్నాయి. గాంధేయవాది కృష్ణారావు... మండలి బుద్ధప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు గాంధేయవాదిగా గుర్తింపు పొందడంతో పాటు ఎంత కష్టమొచ్చినా కాంగ్రెస్ను వీడలేదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1957లో కృష్ణారావు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం 1962లో కూడా లోక్సభకు ఇక్కడి నుంచే పోటీచేసి ఓటమి చవిచూశారు. 1972లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 1978, 1983 వరుస ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినప్పుడు కూడా ఆయన గెలుపొందడం విశేషం. ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి హ్యాట్రిక్ సాధించిన మండలి వెంకట కృష్ణారావు పలుమార్లు మంత్రి పదవులను నిర్వహించారు. జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మండలి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు. జై ఆంధ్ర ఉద్యమంలోను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఆయన ఉద్యమకారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా మండలి వెంకట కృష్ణారావు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఉనికి కోసం పాట్లు... వెంకట కృష్ణారావు వంటి రాజకీయ నేతకు వారసుడిగా వచ్చిన మండలి బుద్ధప్రసాద్ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం, ఉనికి కోసం కునికిపాట్లు పడటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1999, 2004 ఎన్నికల్లో రెండు పర్యాయాలు వరుస విజయాలు సాధించిన మండలి బుద్ధప్రసాద్ 2009 ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారం చేపట్టడంతో.. ఓడిపోయినప్పటికీ బుద్ధప్రసాద్కు తగిన గుర్తింపు లభించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కలిగిన అధికార భాషా సంఘం చైర్మన్ పదవిని ఇచ్చింది. కాంగ్రెస్లో పదవులను ఎంజాయ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని గుర్తించారు. అంతే గత కొద్ది రోజులుగా పావులు కదిపిన ఆయనకు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పార్టీ ఫిరాయించారు. గతనెల 27న విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన మహిళా గర్జనలో బుద్ధప్రసాద్ చేరాల్సి ఉంది. అప్పుడు రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్రావు ఫోన్ చేసి బ్రేక్ వేయడంతో ఆలస్యంగానైనా బుద్ధప్రసాద్ హైదరాబాద్ వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తంశెట్టికి హ్యాండిస్తారా? టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్కు అవనిగడ్డ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు బాబు హామీ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సీటు ఇస్తామంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఖర్చులు పెట్టించిన ముత్తంశెట్టి కృష్ణారావును నమ్మించి మోసగిస్తారా అనే అనుమానాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. నోవా విద్యా సంస్థల అధిపతిగా ఉన్న ముత్తంశెట్టి ఎమ్మెల్యే పదవిపై మోజుతో చంద్రబాబు ఆమోదంతో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్గా క్యాడర్ను చక్కబెట్టుకుంటున్నారు. మొదట్లో ముత్తంశెట్టిని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా స్థానిక సమరంలో అభ్యర్థుల ఖర్చు ఆయనే పెట్టుకుని క్యాడర్ను బుజ్జగించుకుంటున్న తరుణంలో తీరుబడిగా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్ ఎగరేసుకుపోయేలా బుద్ధప్రసాద్ రావడం ముత్తంశెట్టి అనుచరులకు మింగుడు పడటంలేదు. శ్రీహరిప్రసాద్ను కాదని.. అవనిగడ్డలో అంబటి బ్రాహ్మణయ్యపై సానుభూతిని ఓట్లుగా మలుచుకునేందుకు ఆయన కుమారుడిని ఎన్నికల్లో దించి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న టీడీపీ అంబటి శ్రీహరిప్రసాద్ను కాదని ముత్తంశెట్టిని రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ముత్తంశెట్టికి చెయ్యిచ్చి బుద్ధప్రసాద్కు పచ్చకండువా కప్పేసింది. అవనిగడ్డ కాకుంటే బందరు నుంచి బుద్ధప్రసాద్ను పోటీకి దించేలా మరో ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా బుద్ధప్రసాద్ కుటుంబానికి కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని పదవుల కోసం టీడీపీ పంచన చేరిపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పిన్నమనేనికి ఏదో ఒకటి చేస్తారంట... టీడీపీలో చేరితే ఏదోక అవకాశం రాకపోదనుకున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సైతం 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. మూడు పర్యాయాలు జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టిన పిన్నమనేని కోటేశ్వరరావు రెండు పర్యాయాలు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుమారుడిగా పిన్నమనేని వెంకటేశ్వరరావు 1989, 1999, 2004లో ముదినేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు 2004లో వైఎస్ క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కృష్ణా జిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయని ఆయన పదవుల కోసం టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ఏదో ఒక పదవి ఇస్తారనే ధీమాతో పిన్నమనేని వెంకటేశ్వరరావు వ్యూహాత్మకంగా పార్టీ ఫిరాయించేయడం కొసమెరుపు. -
కమలంలో అయోమయం
టీడీపీతో కొలిక్కిరాని బీజేపీ చర్చలు ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లు లీక్ నేడు మదనపల్లెలో బీజేపీ బహిరంగసభ సాక్షి, తిరుపతి: తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో జిల్లా బీజేపీ శ్రేణుల్లో అయోమయం చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీల నడుమ అవగాహన ఉంటుందని భావిస్తున్నప్పటికీ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిరాశకు గురవుతున్నాయి. ఇప్పటికే తిరుపతి లోక్సభ స్థానంతో పాటు తిరుపతి, మదనపల్లె, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ లీక్ చేసింది. పొత్తులపై చర్చలకు ముందే లీకులు రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత కొత్త పరిణామాలు చోటుచేసుకోవడం, టీడీపీతో సీట్ల సర్దుబాటు ఉంటుందనే ప్రచారం జరగడంతో కార్యకర్తలను నిస్తేజం ఆవహించింది. ఒకవేళ సీట్ల సర్దుబాటు జరిగితే జిల్లాలో తిరుపతి లోక్సభ స్థానంతో పాటు మదనపల్లె లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఖాయంగా బీజేపీకి కేటాయిస్తారని అంటున్నారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా తిరుపతి లోక్సభ స్థానానికి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి విజ యం సాధించారు. దీంతో ఈసారి కూడా తిరుపతి లోక్సభ స్థానంపై బీజేపీ కన్నేసింది. ఈ స్థానానికి ఇప్పటికే ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఇంకా కొందరు పోటీ పడుతున్నారు. వైద్యవృత్తిలో ఉన్న కొందరు ప్రముఖులు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ మునిసుబ్రమణ్యం, డాక్టర్ సుకుమార్ పేర్లు తిరుపతి లోక్సభకు పముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ లోక్సభ సభ్యులు వెంకటస్వామి కుమారుడు గౌతమ్ పేరు కూడా వినిపిస్తోంది. చల్లపల్లెకు మదనపల్లె టీడీపీతో పొత్తు కుదిరినా, ఒంటరి పోరాటమైనా బీజేపీ తరఫున శాసనసభకు పోటీ చేసేందుకు ఆ పార్టీ కిసాన్మోర్చా జాతీయ కార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి సిద్ధమవుతున్నారు. పొత్తు కుదిరితే మదనపల్లె నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే తంబళ్లపల్లె లేదా మదనపల్లె నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తంబళ్లపల్లె నుంచి ఒక దఫా పోటీ చేసిన చల్లపల్లె విజయం అంచుల వరకు వెళ్లారు. అప్పట్లో 620 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తంబళ్లపల్లె, మదనపల్లె స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే అభిప్రాయం ఉంది. నేడు బహిరంగ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం మదనపల్లెలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడుతో పాటు మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా హాజరవుతున్నారు. ఈ సభ పార్టీ శ్రే ణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. -
లోకల్ అలయెన్స్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక ఎన్నికల్లో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ఉప్పునిప్పులా ఉంటున్న పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉంటాయో... లేదో... ఇంకా స్పష్టత రాలేదు. కానీ... స్థానిక సమరంలో ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో రోజూ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్లు జిల్లాలోని జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి నడుస్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో పేచీ వచ్చిందంటూ.... ఒకరోజు దూరంగా, మరొక రోజు దగ్గరగా ఉంటున్న టీడీపీ, బీజేపీలు కొన్ని మండలాల్లో కలిసిపోయాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు లోకల్ అలయెన్స్!ఉన్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చే స్తున్నారు. టీఆర్ఎస్ 49 స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ 47 స్థానాల్లోనే బరిలో ఉంది. తమ అభ్యర్థులు లేని స్థానా ల్లో ఈ రెండు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి నడుస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్.. కాంగ్రెస్ కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందని రెండు పార్టీల శ్రేణులు భావించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు న విలీనం పూర్తవుతుందని ఆ రెండు పార్టీల నేతలు అంచ నా వేశారు. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయూరుు. విలీనం లేదు కదా... కనీసం పొత్తు కూడా కుదిరే పరిస్థితి కనబడడం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా విమర్శలు చేసుకునేది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే. ఇలా ప్రధాన ప్రత్యర్థులుగా మారిన టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ జెడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తు కుదిరింది. ఇక్కడ టీఆర్ఎస్ ఎవరినీ పోటీలో దింపలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తోంది. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఇక్కడ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్, టీడీపీ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. టీడీపీ... బీజేపీ తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో టీడీపీ పూర్తి దెబ్బతిన్నది. మూడు స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. జనగామ, రేగొండ, హసన్పర్తి మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. జిల్లాలో వరుసగా రెండుసార్లు జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీకి... ఇప్పుడు అభ్యర్థులు దొరకకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇస్తోంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉంటుందని ఒక రోజు, ఉండకపోవచ్చని మరొక రోజు వార్తలు వస్తున్నా... జిల్లాలో మాత్రం రెండు మండలాల్లో బీజేపీకి మద్దతు ఇస్తోంది. గెలిచే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సూత్రంగా పని చేసే తెలుగుదేశం... ఇప్పుడు నరేంద్రమోడీ హవాను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో వెళ్తోంది. అభ్యర్థులు లేని జనగామ, రేగొండ మండలాల్లో బీజేపీ అభ్యర్థులకు టీడీపీ సహకరిస్తోంది.టీడీపీకి అభ్యర్థి లేని హసన్పర్తిలో దేశం శ్రేణులు చెరోదారిగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీలోని రెండు వర్గాల్లో ఒక వర్గం కాంగ్రెస్కు, మరొక వర్గం టీఆర్ఎస్కు సహకరిస్తున్నాయి. -
ఎవరి లెక్కలు వారివే !
పోలింగ్పై నేతల విశ్లేషణలు కౌన్సిలర్ అభ్యర్థుల్లోనూ ఎడతెగని చర్చలు మున్సిపల్ కౌంటింగ్పై నేడు హైకోర్టు తీర్పు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు జయాపజయాల లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో 70 శాతం పోలింగ్ దాటడంతో ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ నెలకొని ఉంది. అయితే కొన్నిచోట్ల స్వతంత్రులు కూడా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. చిత్తూరు కార్పొరేషన్లో రెండు ప్రధాన రాజకీయపార్టీలతో పాటు, సీకే.బాబు స్వతంత్ర ప్యానల్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో ఇక్కడ గెలుపు లెక్కల్లో చాలావరకు స్పష్టత లేదు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు, ప్రజల్లో వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనటం తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు లాభించే అంశాలుగా ైవె ఎస్సార్ సీపీ నేతలు భావిస్తున్నారు. నగరి మున్సిపాలిటీలో జిల్లాలోనే అత్యధికంగా 88 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఇక్కడ ఫ్యాను గాలి ఓట ర్లలో బలంగా వీచిందని పోలింగ్ సరళి తేటతెల్లం చేసింది. ఒక దశలో దీనిని సహించలేక 3వ వార్డులో మాజీ మంత్రి చెంగారెడ్డి అనుచరులు గొడవకు దిగారు. పుత్తూరు మున్సిపాలిటీలోనూ పోలింగ్ సరళి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంది. పుంగనూరులోనూ అత్యధిక స్థానాలు గెలుచుకుని చైర్మన్ కుర్చీ కైవసం చేసుకునే దిశగా వైఎస్సార్ సీపీ ఉంది. పలమనేరులోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థు లు గెలుస్తారని, పోలింగ్సరళి తమకు అనుకూలంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నేతల విశ్లేషణ. మున్సిపాలిటీల్లో ఇలా వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటుండగా, ఎన్నికల సారథ్యం వహించిన రెండు పార్టీల నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇన్చార్జ్లు ఫలితాలు వెల్లడైతే ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలో ఉన్నారు. వార్డుల్లో అభ్యర్థులుగా పోటీ చేసినవారు తాము పెట్టిన ఖర్చులకు గెలుపు వరిస్తుందా? వార్డుల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పోలయి ఉంటాయనే విశ్లేషణలో పడ్డారు. నేడు మున్సిపల్ కౌంటింగ్పై తీర్పు జిల్లాలో నిర్వహించిన చిత్తూరు కార్పొరేషన్, మరో ఆరు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి మంగళవారం కోర్టు తీర్పు వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించాలని కోరుతూ కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం కోర్టు తీర్పుకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మే 7 తరువాత వెల్లడి కానున్నాయి. అలాగే జరిగితే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ల విశ్లేషణలు మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం మున్సిపల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇన్చార్జ్లుగా ఉన్నవారు తమ తమ వర్గాల నుంచి వివరాలు, ఓటింగ్ సరళి తెప్పించుకుని సొంతంగా విశ్లేషిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో నిలబడేందుకు ఈ ఎన్నికల ఫలితాలు తమకు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి? ఎంతవరకు ప్రతికూలంగా ఉండొచ్చునని లెక్కలు వేస్తున్నారు. ఒక రకంగా తమకు మున్సిపల్ ఎన్నికల వల్ల మంచే జరుగుతుందని, ఒకవేళ ప్రతికూల పవనాలు వీస్తున్న వార్డులు ఏవనేది గుర్తించి అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు జాగ్రత్త వహించేందుకు అవకాశం ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు చెబుతున్నారు. -
రెండో విడత.. అభ్యర్థులకు కలత
5 రోజులపాటు అదనపు వ్యయం ఒక్కో స్థానానికి రూ.2.5 కోట్లని అంచనా టీడీపీని వెంటాడుతున్న నైరాశ్యం ఏంచేయాలో పాలుపోని పరిస్థితి విశాఖ రూరల్, న్యూస్లైన్: ప్రాదేశిక ఎన్నికలు అభ్యర్థులకు సంకటంగా మారాయి. తొలి విడత 22 జెట్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న జరగనుండగా అయిదు రోజులు తరువాత రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈనెల 11న రెండో విడత కింద 17 జెట్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ అయిదు రోజులు ప్రచారాలకు సమయముందన్న ఆనందం కంటే.. అధిక వ్యయం రెండో దశ అభ్యర్థులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని భావించిన పార్టీలు సర్వశక్తులు ఒడ్డయినా ఇందులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా గత పదేళ్లుగా అధికారం కోసం కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవోలా మారాయి. ఒకవైపు పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం, ప్రతీ సర్వే ఫలితాలు వ్యతిరేకంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఎలాగైనా ఇందులో విజయం సాధించడానికి పార్టీలు కోట్లకు కోట్లను వెదజల్లుతున్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ఒక్కో స్థానానికి రెండు నుంచి రెండున్న కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయి. సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. అభ్యర్థిత్వాలు ఖరారు కాని పార్టీల్లో ఆశావహులు తమ సీట్లను పదిలం చేసుకోడానికి మండలాల్లో విపరీతంగా డబ్బును కుమ్మరిస్తున్నారు. తొలి దశలో జరిగే స్థానాలకు ఒక్కో దానికి రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. రెండో దశ గుబులు తొలి ఎన్నికలకు ఇంకా అయిదు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ అయిదు రోజుల్లోనే అభ్యర్థులకు కోట్లు ఖర్చుకానున్నాయి. రెండు దశ ఎన్నికలకు 10 రోజులు సమయముంది. దీంతో ఈ దశలో జరిగే 17 స్థానాల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తొలి దశ ఎన్నికల తరువాత అప్పటి ట్రెండ్స్కు అనుగుణంగా అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అదనపు సమయంలో అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, కానుకలు సమర్పణతో పాటు, మందు, విందులకు చేతి చమురు అధనంగా వదిలించుకోవాల్సిందేనని తర్జన భర్జన పడుతున్నారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టయినా ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రభావంతో సాధారణ ఎన్నికలకు వెళ్లాలనుకున్న పార్టీలకు సుప్రీం కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత చేపట్టనుండడంతో ఆ పార్టీలకు ఏం చేయాలో దిక్కుతీచకుండా పోయింది. సాధారణ ఎన్నికల్లోపు ప్రజలను తమవైపునకు తిప్పుకోడానికి ఇప్పటికే విజయం కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసిన పార్టీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. -
ఓటెత్తారు!
సాక్షి, గుంటూరు: పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలో 12 మునిసిపాలిటీలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరిగింది. సగటు పోలింగ్ శాతం 78.94గా నమోదైంది. మంగళగిరిలో అత్యధికంగా 86.59 శాతం నమోదు కాగా, అత్యల్పంగా తెనాలిలో 73.72 శాతం నమోదైంది. రేపల్లెలో 79.83 శాతం, సత్తెనపల్లిలో 80.08, బాపట్లలో 76.45, మాచర్లలో 75.62, పొన్నూరులో 79.89, తాడేపల్లిలో 83.57, పిడుగురాళ్ళలో 79.05, నరసరావుపేటలో 79.14, వినుకొండలో 80.34, చిలకలూరిపేటలో 81.34 శాతంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఆ వెంటనే మంగళగిరి, పొన్నూరులలో ఈవీఎంలు మొరాయించాయి. కరెంటు కోతలతో పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాడేపల్లిలో కరెంటు కోతతో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో పార్టీ గుర్తులు సరిగా కనిపించక ఇబ్బందులు పడ్డారు. ఓటింగ్ మొదలైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు డబ్బు పంచుతూ పోలీసులకు దొరికిపోయారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే వీరంగం మాచర్ల 29 వార్డులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మద్దతుదారుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఈవీఎంను పగలకొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన లక్ష్మారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టగా పోలింగ్ సిబ్బంది ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, టీడీపీ నేతలు భారీగా అక్కడకు చేరుకున్నారు. రేంజ్ ఐజీ సునీల్కుమార్ ఆ సమయంలో అక్కడే ఉండటడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జ్ చేసి నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొట్టారు. లక్ష్మారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేశారు. ఈవీఎంను నేలకేసి కొట్టడంతో వార్డులో పోలింగ్ గంట ఆలస్యం అయింది. దీంతో రిటర్నింగ్ అధికారి మరో గంట సమయం పొడిగించి ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. నరసరావుపేటలో పోలీసులు ఓవరాక్షన్తో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వినుకొండలో పోలీసుల లాఠీఛార్జి కారణంగా ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్ధికి పోలింగ్ సిబ్బందికి సహకరిస్తున్నారని అక్కడ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఎన్నికల సంఘం ఉన్నతాధికారి నవీన్ మిట్టల్కు ఫిర్యాదు చేశారు. -
వామ్మో.. పెరుగన్నం, వాటర్ బాటిల్ రూ.300 !
శ్రీకాళహస్తి, న్యూస్లైన్: అదేదో ఫైఫ్స్టారో, త్రీస్టారో హోటల్ కాదు; అయినా పెరుగన్నం, వాటర్ బాటిల్ ఖరీదు అక్షరాలా రూ.300..! ఇదేమి చోద్యం అని అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారుల వడ్డన ఇది..! ఆ పెరుగున్నంలోకి స్పూను పెడితే... మున్సిపల్ ఎన్నికల్లో విధుల నిర్వహణకు పలమనేరు నుంచి 150 మంది ఉద్యోగులు శనివారం శ్రీకాళహస్తికి వచ్చారు. ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాత ఉద్యోగులకు మున్సిపల్ అధికారులు రూ.500 మాత్ర మే ఇచ్చారు. వాస్తవానికి రూ.800 ఇవ్వాల్సి ఉంది. మరో రూ.300 ఇవ్వాలని ఉద్యోగులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం పెరుగు అన్నం, వాటర్ బాటిల్కు రూ.300 కట్ చేసినట్లు చెప్పారు. దీంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. పెరుగన్నం, వాటర్ బాటిల్కు మూడు వందలా!? అంటూ మండిపడ్డారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పారు. గంటపాటు ధర్నా చేసిన వారు చేసేదేమీలేక పలమనేరు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు మదనపల్లె సిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఆదివారం ఆకలికేకలతో అలమటించారు. మదనపల్లె మున్సిపాలిటీలో 34 వార్డుల్లో ఎన్నికల సిబ్బందికి ప్యాకెట్లలో ఇచ్చిన అల్పాహారం, భోజనం పాచిపోయి ఉండడంతో వాటిని ఎవరూ తినలేదు. పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. వాస్తవానికి ఎన్నికల సిబ్బందికి రెండు రోజులకుగాను రూ.300 ఖర్చు చేయాల్సి ఉండగా మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శించారని ఎన్నికల సిబ్బంది ఆరోపణ. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎన్నికల విధులకు వస్తే డీఏలో కూడా కోతలు పెట్టారని పేర్కొన్నారు. -
అరుణమ్మపై సీనియర్ల గుర్రు
సాక్షి, తిరుపతి: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఆ పార్టీ సీనియర్ల జంట గుర్రుగా ఉంది. సొంత నియోజకవర్గాలకు వెళ్లిన సమయంలో తప్పితే జిల్లా లో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ ఒకటిగా వెళ్లే ఈ సీనియర్లు పార్టీలో అరుణమ్మ చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో గల్లా కుటుం బానికి అంతోఇంతో పేరుంది. దీంతోపాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. నిన్నటి వరకు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో భవిష్యత్తులో అధినేత చంద్రబాబు దగ్గర తమ ప్రాధాన్యం తగ్గుతుంద నేది సీనియర్లయిన మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల ఆందోళనగా టీడీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఆ వర్గాలు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ మేర కు అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన మనసు మార్చుకుని గుంటూరు నుం చి లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కుమారుని రాజకీ య భవిష్యత్తు దృష్ట్యా గల్లా అరుణకుమారి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 8వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏడాది కాలంగా నడుస్తున్నప్పటికీ బొజ్జల గాని ముద్దుకృష్ణమ గాని గల్లా చేరికపై పెదవి విప్పలేదు. రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు అరుణకుమారి ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరు సీనియర్ల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా వారి చేరిక సమయంలోనూ జిల్లా పార్టీలో కీలకం గా వ్యవహరిస్తున్న బొజ్జల, ముద్దుకృష్ణమ లేరు. ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిసింది. అరుణకుమారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు విమర్శించిన నోటితోనే ఆమెను ప్రశంసిస్తూ ఆహ్వానం పలకడమంటే ప్రజల్లో చులనభావం ఏర్పడే ప్రమాదం ఉన్నందునే తాము ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని సీనియర్లు అక్కడక్కడ మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. నిజానికి వారి గైర్హాజరు వెనుక ఉన్న అసలు విషయం వీలైనం త వరకు అరుణమ్మకు దూరంగా ఉండాలన్న అభిప్రాయమని తెలిసిం ది. టీడీపీలో చేరిన తర్వాత కూడా ముగ్గురు మాజీ మంత్రులు ఒక వేదికపైకి వచ్చిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు అంతర్గతంగా రగిలిపోతున్నట్టు సమాచారం. ఒకే సామాజికవర్గం కావడంతో తన అవకాశాలను అరుణమ్మ ఎక్కడ ఎగరేసుకుపోతారోనన్న ఆందోళన ఆయనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఒకటిగా ఉంటూ వస్తున్న ముద్దుకృష్ణమ, గోపాలకృష్ణారెడ్డి ఇదే ఐక్యత కొనసాగించాలనే నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది. ఎవరి అవకాశాలకు అరుణమ్మ గండికొట్టే ప్రయత్నం చేసినా ఇద్దరూ కలసికట్టుగా ఎదుర్కోవాలని వారు భావిస్తున్నారు. చంద్రగిరిలో అరుణమ్మకు పొగబెట్టే ప్రయత్నం? చంద్రగిరి నియోజకవర్గంలో అరుణకుమారికి పొగబెట్టేప్రయత్నం జరుగుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముద్దుకృష్ణమనాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు అరుణమ్మకు ఏ మాత్రం సహకరించడంలేదు. ఈ నియోజకవర్గ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న పేరం హరిబాబు, వలపల దశరథనాయుడు తదితరులను తెరవెనుక నుంచి ముద్దుకృష్ణమ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అరుణమ్మ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు రావడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఎంపీ శివప్రసాద్పైనా సీనియర్ల ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి పూర్థిస్థాయిలో సహకారం అందిస్తున్న చిత్తూరు లోక్సభ సభ్యులు ఎన్.శివప్రసాద్పై కూడా శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు దగ్గర సొంత ఇమేజ్ పెంచుకునేందుకు అవసరానికి మించి శివప్రసాద్ వ్యవహరిస్తున్నారనే భావన ఇద్దరు సీనియర్లలో ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో అరుణమ్మ చేరిక వ్యవహారం ఒక వర్గానికి ఇబ్బందికరంగా ఉందనేది మాత్రం స్పష్టం అవుతోంది. -
ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు
నగరి, న్యూస్లైన్: మున్సిపల్ పరిధిలోని 27 వార్డుల్లో అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము లేక తెలుగుదేశానికి బహిరంగంగా వత్తాసు పలుకుతూ మాజీ మంత్రి చెంగారెడ్డి దౌర్జన్యాలు చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 3వ వార్డులో జరిగిన గొడవల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మూడో వార్డులో పోలింగ్ జరుగుతుండగా ఆ వార్డుకు సంబంధంలేని కాంగ్రెస్ నాయకులు చిరంజీవిరెడ్డి, బాబురెడ్డి ఓట్లడగడం గొడవకు కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకపోయినా ఆ ప్రాంతానికి మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె రావడమే ఘర్షణకు దారి తీసిందన్నారు. రచ్చలు పెట్టడమే కాక పోలీస్ స్టేషన్కు వచ్చి ఆయన ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. చేతకాని కాంగ్రెస్ నాయకులు టీడీపీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ను తుంచేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది వారి తాతమ్మలు, జేజమ్మలు దిగివచ్చినా జరిగే పని కాదన్నారు. వైఎస్ఆర్ సీపీలో ఉన్నవారు రౌడీలని చెంగారెడ్డి చెబుతున్నారని, 35 సంవత్సరాలుగా ఆయన వెనుక పని చేసినపుడు రౌడీలని ఆయనకు తెలియలేదా అన్నారు. ఆయన ప్రవర్తన నచ్చక వచ్చినవారు వైఎస్ఆర్ సీపీలో ఉన్నారని, రౌడీలు ఆయన వెంటే ఉన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు వెంట ఉన్నారన్నారు. 3వ వార్డుపై ప్రత్యేకంగా కాంగ్రెస్, టీడీపీ దృష్టి సారించాయని, పలుమార్లు గొడవలకు కూడా లాగారన్నారు. పోలింగ్ రోజున కూడా గొడవలు జరిగే ఆస్కారముందని మూడు రోజులుగా పోలీసులకు చెబుతూనే ఉన్నామన్నారు. చివరకు ఊహించిందే జరిగిందన్నారు. మూడో వార్డు అభ్యర్థి కుమారుడు రామ్కుమార్కు గాయాలయ్యాయన్నారు. -
ఓటెత్తారు
7 గంటలకేబారులు తీరిన ఓటర్లు పోలింగ్పై కానరాని పండగ ప్రభావం కొన్నిచోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్ ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్లైన్ : జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అంచనాలకు మించి యలమంచిలిలో 82.99 శాతం, నర్సీపట్నంలో 76.14శాతం నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. కొత్త అమావాస్య పం డగ ప్రభావంతో ఒకదశలో మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది. మరోపక్క ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్లను ఆటోలు, రిక్షాలు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకేసారిగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో కొన్ని కేంద్రాల వద్ద గంటలతరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చే శారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ పూర్తయింది. యలమంచిలి మున్సిపాలిటీలో 32,459 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డు ఏకగ్రీవం అయింది. 23 వార్డుల్లోని 31,168 మందికి 25,867 ఓట్లు పోలయ్యాయి. 82.99 శాతంగా నమోదయింది. 23 వార్డుల్లో 58మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 9గంటలకు 19శాతం, 11గంటలకు 40.80శాతం, 1గంటకు 60.18శాతం, 3గంటలకు 74.86శాతం పోలింగ్ నమోదయింది. 8వ వార్డులో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆడారి లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కొక్కిరాపల్లి పోలింగ్స్టేషన్ను పరిశీలించి పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై ఆరాతీశారు. ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ పెదపల్లి, యలమంచిలి తులసీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని ఆరా తీశారు. నర్సీపట్నంలోని 27 వార్డుల్లో మొత్తం 76.14 శాతం మంది ఓటు వేశారు. ఈ పట్టణంలోని మొత్తం 44,097 ఓటర్లకు 33,574 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా ఇక్కడి మహిళలంతా ఆలయాలకు వెళ్లడంతో ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి పుంజుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటలకు 16శాతం, 11 గంటలకు 35, ఒంటి గంటకు 57.8, 3 గంటలకు 66.33, పోలింగ్ ముగిసే సమయానికి 76.14 శాతం పోలింగు నమోదయింది. ఇక్కడి పోలింగ్ సరళిని కలెక్టరు ఆరోఖ్యరాజ్, ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అనితా రామచంద్రన్తో పాటు ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ ఎన్నికల అధికారి సింహాచలం పరిశీలించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతుండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు పోలీసులు, పోలీసు అధికారులు కేంద్రాలవద్ద ఓవర్యాక్షన్ చేశారు. బూత్లకు సమీపంలో ఉన్న అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి, సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. అలాగే ఏజెంట్లను సైతం బూత్ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. చిన్న, చిన్న అవాంతరాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
హాస్టల్ విద్యార్థినుల నిర్బంధం
అమలాపురం టౌన్, న్యూస్లైన్ :వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారన్న నెపంతో హాస్టల్ విద్యార్థినులు ఓటేయకుండా.. వారిని నిర్బంధించిన టీడీపీ నేతలకు చుక్కెదురైంది. అమలాపురం 9వ వార్డులో ఈ ఘటన జరగ్గా, పోలీసుల చొరవతో ఆ విద్యార్థినులు తమ ఓటేశారు. వివరాలు... తొమ్మిదో వార్డులో ఉన్న కోనసీమ నర్సింగ్ హాస్టల్కు చెందిన 30 మంది విద్యార్థినులకు మున్సిపాలిటీలో కొత్తగా ఓటు హక్కు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతుగా ఉన్న వీరంతా గత వారం అమలాపురంలో ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి స్థానిక ఎర్రవంతెన సాయిబాబా ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. వీరిని జగన్మోహన్రెడ్డి ఆ ప్యాయంగా పలకరించారు. వీరంతా వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తారని 9వ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు నిర్ధారణకు వచ్చాడు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్నాడు. విద్యార్థినులు బయటకు రానీయకుం డా ఆదివారం ఉదయం నుంచి ఒత్తిడి చేయ డం మొదలుపెట్టాడు. ఆ ప్రాంత టీడీపీ నాయకుడొకరు హాస్టల్ సిబ్బందిని మభ్యపెట్టి.. వి ద్యార్థినులను బయటకు రానీయకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. భయాందోళనకు గురైన విద్యార్థినులు సాయంత్రం 4 గంటల వరకు హాస్టల్లోనే ఉండిపోయారు.ఓ అజ్ఞాత వ్యక్తి ఈ విషయాన్ని అమలాపురం పోలీసులకు సమాచారం అందించాడు. అమలాపురం రూ రల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తన సిబ్బం దితో ఆ హాస్టల్కు చేరుకున్నారు. పోలీసులను చూసి, అక్కడున్నవారు పరారయ్యారు. మొత్తం 30 మంది విద్యార్థినులకు సీఐ భద్రత కల్పించి, పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దీంతో వారు నిర్భయంగా ఓటు వేయగలిగారు. టీడీపీ కార్యకర్త వీరంగం ఇంతలో లక్ష్మణరావు అనే టీడీపీ కార్యకర్త అక్కడకు చేరుకుని హాస్టల్ విద్యార్థినులతో ఓట్లెలా వే యిస్తారని సీఐని ప్రశ్నించాడు. విద్యార్థినుల చేతి లో ఉన్న ఓటర్ స్లిప్పులను సీఐ చూపించారు. ఏమైనా అభ్యంతరముంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకుంటారని పోలీసులు అతడిని నిలువరిం చారు. ఓ సందర్భంలో ఆ కార్యకర్తకు, పోలీసుల కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదంతా దళితుల వల్లే జరిగిందంటూ ఓ టీడీపీ కార్యకర్త కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ.. పోలింగ్ బూత్ ఎదురుగా 216 జాతీయ రహదారిపై ఆ సామాజిక వర్గీయులు బైఠాయించారు. సీఐ హామీతో వారు శాంతించారు. -
9393610113 నంబరు నుంచి మాజీ మంత్రి బెదిరింపులు ?
స్వతంత్రులకు మద్దతివ్వాలంటూ హుకుం వ్యాపారుల నుంచి చందాలకు డిమాండ్ ? పట్టణంలో కలకలం రేపిన వైనం ఉయ్యూరు, న్యూస్లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం పెచ్చుమీరింది. వైఎస్సార్ సీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఆయా వార్డుల్లో అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న నాయకులను, కార్యకర్తలను, వ్యాపారులను మీ అంతు చూస్తామంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు వార్నింగ్లు ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. కృష్ణా జిల్ల ఉయ్యూరులో ఆరో వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగవీటి శ్రీనివాసప్రసాద్కు మద్దతుగా రజక సంఘ నాయకుడు, వైఎస్సార్ సీపీ అభిమాని కె.సాయిశ్రీనివాస్ ప్రచారం చేశారు. అక్కడ మాజీ మంత్రి పార్థసారథి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపిన సయ్యద్ అజ్మతుల్లా గెలుపునకు సాయి శ్రీనివాస్ ఆటంకంగా మారారు. ఇది సారథికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకేముంది సదరు మాజీ మంత్రి అగ్గిమీద గుగ్గిలమై 9393610113 నంబరు నుంచి ఫోన్ చేసి సాయిశ్రీనివాస్తో దుర్భాషలాడారు. బెదిరించారు. ‘ఏరా సాయి.. ఒళ్లు బలిసిందా.. నాతో పనులు చేయించుకుని వాడెమ్మట తిరుగుతావా.. వైఎస్సార్ సీపీకి మద్దతుగా వెళ్తే నీ అంతు చూస్తా.. నా మద్దతుదారుడికే చేయ్.. లేకుంటే తొక్కేస్తా..’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ విరుచుకుపడ్డారు. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఈ విషయాన్ని రజకసంఘం, పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు చాగంటి సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, బాపట్ల సుబ్బారావు స్థానిక రాయల్ సమావేశపు హాల్లో శనివారం సమావేశమై మాజీ మంత్రి సారథి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలానే మరికొందరి వ్యాపారులపైనా సారథి, ఆయన అనుచరులు చిందులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘నేను అధికారంలో ఉండగా పనులు చేయించుకుని ఇప్పుడు షాపుల్లో కూర్చుంటారా. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లకపోతే మీ అంతు చూస్తా..’ అంటూ బెదిరిస్తున్నట్లు పట్టణం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే సారథి అనుచరుల ఆగడాలు మరింత పెరిగాయి. ఓ బడా వ్యాపారి వద్దకు వెళ్లి చందా అడగ్గా, ఆ వ్యాపారి కొంత మొత్తం ఇచ్చాడు. ‘ఈ మొత్తం చాలదు. నీవు లక్ష ఇవ్వాల్సిందే’ అంటూ పట్టుబట్టాడు సదరు మాజీ మంత్రి అనుచరుడు. దీంతో నివ్వెరపోయిన ఆ వ్యాపారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండగా, ఓ మధ్యవర్తి జోక్యం చేసుకుని మధ్యేమార్గంగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది. -
ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
ఒంగోలు రూరల్, న్యూస్లైన్ : ఒంగోలు మండల పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. శనివారం ఉదయం వల్లేటివారిపాలెంలో ఎంపీటీసీ అభ్యర్థి కామని రాఘవేంద్రరావు, కరవది దక్షిణంలో మన్నే సుజాత ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో ఆ పార్టీ నాయకులు వాకా బసివిరెడ్డి, నాయకులు మన్నే శ్రీనివాసరావు, మన్నే చిరంజీవి, డాకా అంజిరెడ్డి, నల్లమలపు హనుమారెడ్డి, డాకా ఆదిరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు, దగ్గుమాటి గోపాల్రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు సోమన హనుమంతరావు, నంది అవార్డు గ్రహీత యలమంద, బాలినేని యూత్ఫోర్స్ బాబురావు, కైలా శ్రీను, రమేష్, కోటి పాల్గొన్నారు. దేవరంపాడు, బొద్దులూరిపాలెంలో గంటా అంజమ్మ విజయాన్ని కాంక్షిస్తూ మండువ సుబ్బారావు నేతృత్వంలో సాగి ప్రసాద్, సాగి అంగిరాజు, చుంచు నాగేశ్వరరావు, నడిపినేని రాంబాబు, మాజీ సర్పంచ్ కొట్టే హనుమంతరావులు ప్రచారం చేశారు. మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య నేతృత్వంలో మండలంలోని యరజర్ల, వలేటివారిపాలెం, ఉలిచి, చింతాయిగారిపాలెం, చేజర్ల, మండువవారిపాలెం, దశరాజుపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. కొత్తపట్నం మండలంలో.. కొత్తపట్నం-2 ఎంపీటీసీ స్థానానికి వెఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తంబి కాంతారావు శనివారం స్థానిక డీటీ కాలనీ, డీడీ కాలనీల్లో ప్రచారం చేశారు. కాలనీ వాసులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి చేసిన సేవలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో పార్టీ కొత్తపట్నం గ్రామ అధ్యక్షుడు ఎం సుధాకర్రెడ్డి, బేతాళ రమేష్, కొత్తపట్నం ఉప సర్పంచ్ మాకాణి ఏడుకొండలు, హరి, రామ్మోహన్, రాగాల పోలయ్య, మూగ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదే విధంగా కొత్తపట్నం-1లో సీపీఐ అభ్యర్థి మేడా సుబ్బారావు కొత్తపట్నం బస్టాండ్, బీసీ కాలనీ పోస్టాఫీస్ బజారులో ప్రచారం చేశారు. -
ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఆర్వో
గిద్దలూరు, న్యూస్లైన్: నగర పంచాయతీ రిటర్నింగ్ అధికారి ఎస్ఎండీ అస్లాం ఎమ్మెల్యే వర్గానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వారి ఓటరు స్లిప్పులు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి దమ్మాల జనార్దన్, అతని భార్యకు చెందిన ఓటరు స్లిప్పులను ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు బలపరుస్తున్న బీఎస్పీ అభ్యర్థి పరుచూరి సుభాషిణికి అప్పగించారు. స్వయంగా రిటర్నింగ్ అధికారి, తహసీల్దారు సుధాకరరావు శనివారం రాత్రి ఆమె గృహంలో సోదాలు నిర్వహించగా 28 మంది ఓటరు స్లిప్పులు బయటపడ్డాయి. అభ్యర్థి గృహంలో స్లిప్పులు దొరికినప్పటికీ, అవి ఎలా వచ్చాయో అభ్యర్థితోనే స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అధికారులు, అలా కాకుండా వారి బంధువుల అమ్మాయి చేత స్టేట్మెంట్ రికార్డు చేయించారు. అభ్యర్థి సుభాషిణి ఎదురుగా ఉండగానే..ఆమె ఇంట్లో లేదని వేరే బాలిక చేత స్టేట్మెంట్ రికార్డు చేయడం గుర్తించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి దమ్మాల జనార్దన్ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్రెడ్డితో కలిసి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్ సత్యం దృష్టికి తీసుకెళ్లారు. నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న సత్యం ఓటరు స్లిప్పులను, బాలిక చేత నమోదు చేయించిన స్టేట్మెంట్ రికార్డును పరిశీలించారు. అభ్యర్థి ఇంట్లో ఉంటే, ఆమెతో కాకుండా బాలికతో స్టేట్మెంట్ ఎందుకు తీసుకున్నారని నగర పంచాయతీ రిటర్నింగ్ అధికారి అస్లాంపై మండిపడ్డారు. ఓటరు స్లిప్పులు ఒక అభ్యర్థి ఇంటికి ఎలా చేరాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మాల జనార్దన్, అతని భార్య భాగ్యలక్ష్మి ఓటరు స్లిప్పులు వారి ఇంట్లో ఉండటమేంటని ప్రశ్నించారు. తమ అభ్యర్థిని ఓటేయకుండా చేయడానికి, చనిపోయిన వారి ఓట్లు వేసుకునేందుకు ఇలా కుట్రపన్నారని అశోక్రెడ్డి మండిపడ్డారు. అధికారులు ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సత్యంను కోరారు. ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, అవగాహనా రాహిత్యం వలనే ఇలా జరిగిందని సత్యం అన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ వద్ద ఉన్న 26 ఓటరు స్లిప్పుల్లోని ఓటర్లను విచారించి అవి సంబంధించిన వారికి ఇచ్చారా లేదా అని తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. 5వ వార్డులో అవకతవకలకు ఎక్కువగా పాల్పడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని ముత్తుముల అశోక్రెడ్డి కోరారు. దీనిపై మున్సిపల్ ఎన్నికల అధికారి అస్లాంను వివరణ కోరగా, బాలికతో స్టేట్మెంట్ రికార్డు చేసింది తాను కాదన్నారు. తహసీల్దారు సుధాకరరావు తీసుకున్నాడని, తనకు పూర్తిగా తెలియకనే ఇలా జరిగిందన్నారు. ఉద్యోగిగా ఉంటూ తాను ఒక పార్టీకి కొమ్ముకాయాల్సిన అవసరం లేదన్నారు. -
నేడే పోలింగ్
తుదిఘట్టానికి చేరిన మునిసిపల్ ఎన్నికలు 115 వార్డుల్లో 1,390 మంది పోటీ.. 1,63,068 మంది ఓటర్లు సాక్షి, హన్మకొండ: మునిసిపల్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి తెరలేచింది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు.. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలకు సంబంధించి ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. వాయిదా పడిన వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మినహా మిగతా మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 116 వార్డులు ఉంన్నాయి. జనగామలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో... మిగిలిన 115 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,390 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ ఏరాపట్లను జిల్లాయంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయగా... 169 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) అందుబాటులో ఉంచింది. 1,005 మంది ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ పూర్తికాగానే ఈవీఎంలను స్ట్రాంగ్రూంలలో భద్రపరచనున్నారు. ఆదివారం జరిగే పోలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ ఒకటో తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓటర్ల వివరాలు రెండు మునిసిపాలిటీలు, మూడు నగరపంచాయతీల పరిధిలో 1,63,068 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 82,265 మంది, మహిళలు 80,794 మంది ఉన్నారు. మహబూబాబాద్ మునిసిపాలిటీలో అత్యధికంగా 40,164 మంది ఓటర్లు ఉండగా... పరకాల నగర పంచాయతీలో అతి తక్కువగా 20,729 మంది ఓటర్లు ఉన్నారు. జనగామలో పోటాపోటీ జనగామ మునిసిపాలిటీ ఎన్నికల్లో 27 వార్డుల నుంచి అత్యధికంగా 408 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. భూపాలపల్లి నగరపంచాయతీలో 20 వార్డుల నుంచి అతి తక్కువగా 171 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు
షర్మిల యాత్రతో పట్టణాల్లో పట్టు విజయవాడకే పరిమితమైన బాబు గర్జన జిల్లాలో ప్రచారంలో తెలుగుదేశం వెనుకబాటు టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : పురపాలకులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. జయాపజయాలపై అప్పుడే సర్వేలు, బెట్టింగులు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణల మాట ఎలా ఉన్నా నేతల పర్యటనలు సైతం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మూడురోజులపాటు మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం విజయవాడలో మహిళాగర్జనకు పరిమితమయ్యారు. ఇంకా కాంగ్రెస్, మిగిలిన పార్టీలు కనీసం పురప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘ఫ్యాన్’ గాలి... తన ప్రచార యాత్రతో కేడర్లో మరింత ఉత్సాహం కలిగించిన షర్మిల పలు మున్సిపాలిటీల్లో ఓటర్లను ఆకట్టుకుని ఫ్యాన్ గాలి స్పీడు పెంచారు. జిల్లాలోని ఉయ్యూరు, పెడన, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో షర్మిల ప్రచారానికి విశేష స్పందన లభించింది. చంద్రబాబు మహిళా గర్జన సాకుతో షర్మిల యాత్రకు బందోబస్తు ఇవ్వలేమని విజయవాడ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున షర్మిల ప్రచారానికి అవాంతరం వచ్చింది. అయినా మున్సిపల్ ప్రచారంతోనే షర్మిల ఆగిపోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసేలా పామర్రు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతంలోను నిర్వహించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో జిల్లాలో జరగనున్న వరుస ఎన్నికలపై ఆమె ప్రచార ప్రభావం వైఎస్సార్సీపీకి మరింత బలం పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో షర్మిల యాత్ర కారణంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. చంద్రబాబు చిర్రుబుర్రులు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వెనుకబడ్డ చంద్రబాబు మహిళా గర్జన కోసం జిల్లాకు వచ్చి పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడారు. మహిళా గర్జనకు జన సమీకరణ బాగాలేదని జిల్లా నేతలను తిట్టిపోసిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే షర్మిల యాత్రతో కలవరపడుతున్న తెలుగు తమ్ముళ్లను బాబు పట్టించుకోకపోవడంతో వారు కినుక వహించారు. సొంత పార్టీలో ఏళ్ల తరబడి సేవలందించినవారిని వదిలి కొత్తవారి కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తీరుతో ఆ పార్టీలోనే సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడో జరిగే సార్వత్రిక ఎన్నికలపై హడావుడి చేయడంతో చాలా పట్టణాల్లో సైకిల్ పరుగుపెట్టలేకపోతోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీల్లోను కుమ్మక్కు కుట్ర.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ టీడీపీతో కుమ్మక్కు కుట్రలు సాగిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మరోమారు నిస్సిగ్గుగా కలిసిమెలిసి ప్రచారం చేశారు. గతంలో సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు సాగించిన సంగతి తెల్సిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే దుస్థితి దాపురించింది. దీంతో ఆ పార్టీ నేతలు మరోమారు టీడీపీతో కుమ్మక్కై పురపోరులో పాల్గొంటున్నారు. తమకు కొన్ని మున్సిపల్ వార్డులు ఇచ్చినా చాలు అని బేరసారాలు జరిపిన కాంగ్రెస్ చాలాచోట్ల బాహాటంగానే టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహించడం కొసమెరుపు. ఏది ఏమైనా కుమ్మక్కు కుట్రలను నిశితంగా గమనిస్తున్న ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించే సమయం వచ్చింది. -
మున్సి‘పల్స్’పోలింగ్ నేడే
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు విజయవాడ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు 945 పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఈవీఎంలలోనే పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు మచిలీపట్నం, న్యూస్లైన్ : జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి శనివారం ఈవీఎంలు తదితర సామగ్రిని అందజేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించిన అనంతరం శనివారం మధ్యాహ్నం నుంచి అధికారులు పోలింగ్స్టేషన్లకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి పంపిణీలో, సిబ్బంది నియామకంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి చక్కబడింది. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని నియమించే సమయంలో కొంత గందరగోళం నెలకొంది. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని ఎన్నికల విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు వాగ్వాదానికి దిగారు. ఏజేసీ చెన్నకేశవరావు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికల విధుల్లో 1088 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1088 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 3700 మంది సిబ్బందిని నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సిబ్బందిని నియమించిన అనంతరం మిగిలినవారిని రిజర్వులో ఉంచారు. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు పనిచేయకుంటే వెంటనే వాటిని మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10.21 లక్షల మంది ఓటర్లు... విజయవాడ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 10 లక్షల 21 వేల 914 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 వార్డుల్లో 859 మంది, విజయవాడ కార్పొరేషన్లోని 59 డివిజన్లలో 508 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 277 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం 945 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఓటుకు రూ.2,500... పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నా వారి కళ్లుగప్పి అభ్యర్థుల అనుచరులు మద్యం పంపిణీలో తమ పంతం నెగ్గించుకున్నారు. శనివారం రాత్రి మద్యం పంపిణీ అన్ని ప్రాంతాల్లో జోరుగా సాగింది. గత రెండు, మూడు రోజులుగా ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం అభ్యర్థులు గుట్టుగా చేపట్టారు. ఉయ్యూరు పురపాలక సంఘంలోని ఓ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ల అభ్యర్థుల మధ్య నగదు పంపిణీలో పోటీ నెలకొనడంతో ఒక్కొక్కరు ఓటరుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. జగ్గయ్యపేట పురపాలక సంఘంలోనూ ఒకటి, రెండు వార్డుల్లో నగదు పంపిణీ చేశారు. తిరువూరు పురపాలక సంఘంలో ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు పంపిణీ చేశారు. -
సిబ్బంది లేక ఇబ్బంది!
జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో... ఉన్నవారి పైనే మోయలేని భారం ఔట్సోర్సింగ్ వారికి వేతనాల్లేవు పని లేని విభాగాల్లో అదనపు సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లా ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీలోని ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బందవుతోంది. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ విభాగాలు.. ఆయా విభాగాలకు తగినంతమంది సిబ్బంది.. ఆయా పనుల నిర్వహణకు నోడల్ ఆఫీసర్లు.. వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు.. నియమావళి ఉల్లంఘనలను పరిశీలించేందుకకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వంటి ఏర్పాట్లున్నాయి. కానీ ఎన్నికలకు సంబంధించిన కార్యాలయ విధులను నిర్వహించేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగమే జన గణన తదితర విధులు నిర్వహిస్తోంది. స్పెషల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వంటి ఉన్నత పోస్టులు పోను కార్యాలయ పనులకు సంబంధించిన విధుల నిర్వహణలో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు ఎల్డీసీలు మాత్రం ఉన్నారు. వీరికి సహాయకులుగా ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓటర్ల జాబితా లో పేర్ల నమోదుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హులను జాబితాలో చేర్చడం వరకు.. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు.. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పనుల క్రోడీకరణ తదితర బాధ్యతలన్నీ ఈ విభాగంపై ఉన్నాయి. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ పోతుండటంతో, ఆ మేరకు వీరికి పనిభారం పెరుగుతోంది. పెరిగిన దరఖాస్తులకు అనుగుణంగా కొత్తగా పెరిగిన ఓటర్లు.. పురుషు లు, మహిళల నిష్పత్తి.. కొత్త ఓటర్లు.. వయస్సుల వారీగా ఓటర్ల విభజన, డూప్లికేట్లను గుర్తించ డం తదితర బాధ్యతలన్నీ వీరిపైనే ఉంటున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఇలాంటి పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాల్సి ఉండటంతో, ఉన్న సిబ్బందిపైనే మోయలేని భారం పడుతోంది. ఉన్నతాధికారులు తరచూ నిర్వహిస్తున్న సమీక్షలకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించడం ఇతరత్రా బాధ్యతలూ వీరిపైనే ఉన్నాయి. దీంతో, ఈ విభాగంలోని ఉద్యోగులు పని ఒత్తిడితో తరచూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఓవైపు ఎన్నికల సమయం కావడంతో సెలవులు తీసుకోలేకపోవడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో వారు సతమతమవుతున్నారు. కార్యాలయంలోని విధులతోపాటు ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరే సమస్త సమాచారాన్ని ఆగమేఘాల మీద అందజేయలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల నమోదు సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు తదితర పనుల్లోనూ వీరిని భాగస్వాములను చేస్తున్నారు. ఎంసీహెచ్గా ఉన్నప్పుడు ఉన్న సిబ్బందితోనే జీహెచ్ఎంసీగా మారాక కూడా నెట్టుకొస్తున్నారు. స్టాఫింగ్ ప్యాట్రన్పై సిఫార్సు చేసిన ప్రసాదరావు కమిటీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేక లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. పనితీరు మెరుగుపడాలంటే కొత్తగా తీసుకోవాల్సిన 145 మంది అసిస్టెంట్ కమిషనర్లలో కొందరిని ఎన్నికల విభాగంలో నియమించాలని కూడా సూచించింది. వారితో పాటు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొంది. ఆ నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగానైనా అదనపు సిబ్బంది అవసరం ఉంది. ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదునెలలుగా వేతనాలు అందకపోయినా పట్టించుకున్నవారు లేరు. ఓవైపు వేతనాల్లేక, మరోవైపు అద నపు భారం మోయలేక వారు సతమతమవుతున్నారు. పనుల్లేని చోట అదనపు సిబ్బంది ఎన్నికల సమయంలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు పనులు పెద్దగా లేని పలు విభాగాల్లో భారీ సిబ్బంది ఉన్నారు. అవసరమున్నా, లేకపోయినా వివిధ కారణాలతో పలువురిని ఆయా విభాగాల్లో తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులే కాక.. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లోనూ ఇదే వరుస. పైరవీలతో.. పై వారి ఆదేశాలతో ఇబ్బడి ముబ్బడిగా తీసుకున్న వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మేయర్, కమిషనర్ కార్యాలయాల్లో సైతం లేనంతమంది సిబ్బంది కొందరు హెచ్ఓడీల అజమాయిషీలో పనిచేస్తున్నారు. ఔట్సోర్సింగ్పై తీసుకున్న వారిలోనూ కొందరు హెచ్ఓడీలకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) వంటి వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వారు చేసే పనులేమిటో ఎవరికీ తెలియదు. కారుణ్య నియామకాల కింద తీసుకున్నవారితో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకున్న పలువురికి పని చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పనులున్న సమయంలో సైతం ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేకపోవడమే విచిత్రం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశాల్ని పరిశీలించి, అదనపు సిబ్బంది ఉన్న విభాగాల్లోని వారిని సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాల్లో నియమించాలని పలువురు జీహెచ్ఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యలివీ... జీహెచ్ఎంసీకి ఎన్నికల విభాగానికి 2 సూపరింటెండెంట్ల పోస్టులు మంజూరు కాగా, ఒక్కరే పనిచేస్తున్నారు. యూసీడీ పోస్టులు మంజూరైనవి 17. పనిచేస్తున్నది ఇద్దరు. ఎల్డీసీ పోస్టులు 24 మంజూరైనా, ఆరుగురు మాత్రమే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల విభాగంలో 24 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్పై తీసుకున్నారు. వారికి గత ఐదునెలలుగా వేతనాల్లేవు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుతాం
మామిడికుదురు, న్యూస్లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. పాశర్లపూడిలో శనివారం జరిగిన సమావేశంలో పలువురు సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ సీపీలో చేరారు. సర్పంచ్లు మొల్లేటి త్రిమూర్తులు, దాకే సుభాష్ చంద్రబోస్, తాడి లక్ష్మణరావు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోరం సూర్యభాస్కర్, పాశర్లపూడి సత్రం చైర్మన్ గుండాబత్తుల గోవిందరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాండ్రేగుల మహలక్ష్మి, మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యులు తోలేటి ఆదినారాయణమూర్తి, పసుపులేటి మహలక్ష్మీరావు, వీరవల్లి చిట్టిబాబు, నాయకులు చిట్టూరి బుల్లియ్య, జాలెం సుబ్బారావు, బొంతు మణిరాజు, జక్కంపూడి వాసు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి, మాజీ మంత్రి విశ్వరూప్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా కేవలం జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని చిట్టబ్బాయి పేర్కొన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి నయనాల రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, మిండగుదుటి మోహన్, కొండేటి చిట్టిబాబు, యాళ్ల దొరబాబు, యూవీవీ సత్యనారాయణ, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, తాడి పుష్పరాజ్, పిల్లి శ్రీను, ముత్యాల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
తెగ పంచారు
యథేచ్ఛగా సాగిన ప్రలోభాల పర్వం రంగంలోకి దిగిన లిక్కర్ లాబీలు పాలకొల్లులో గరిష్టంగా ఓటుకు రూ.3 వేలు తాడే పల్లిగూడెంలో టీడీపీ నేతలకు పోలీసుల సహకారం ! సాక్షి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రజాదరణ మెండుగా ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పతాక స్థా యిలో ప్రలోభాలకు తెరతీశాయి. చీరలు, బిందెలు, వెండి వస్తువులు, కరెన్సీ నోట్లు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఎన్నికల మంత్రాంగంలో ఎంతో అనుభవం ఉండి, ప్రలోభాల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆరితేరిన నాయకులంతా కలిసి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచే పలు మునిసిపాలిటీల్లో టీడీపీ, దాని మిత్రపక్షాల నేతలు చివరి మంత్రాంగాలను కొనసాగించారు. ఈ ఎన్నికలు రాజకీయం గా జీవన్మరణ సమస్యగా భావిస్తున్న ఆయా పార్టీల నేతలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముం దుకు సాగారు. ఇవేమీ పట్టని వైఎస్సార్ సీపీకి చెందిన అధికశాతం మంది అభ్యర్థులు ఓటరు దేవుళ్లపైనే ఆధారపడి ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. డబ్బు వెదజల్లారు 2005 ఎన్నికల్లో అధిక శాతం మునిసిపాలిటీల్లో ఓటమి పాలైన టీడీపీ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముం దే క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వైఎస్సార్ సీపీ బలాన్ని అంచనా వేసుకుంది. ప్రజలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కీలక సమయంలో ప్రలోభాలపైనే దృష్టిపెట్టారు. విజయావకాశాలను ప్రభావితం చేసే వర్గాల ఓటర్లను, స్వతంత్ర అభ్యర్ధులను తమవైపు తిప్పుకునేందుకు నానాతంటాలు పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా పార్టీ శ్రేణుల్ని పంపి ఓట్లు కొనుగోలు చేయించారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీల్లో ఇప్పటికే నగదు పంపిణీ పూర్తయ్యింది. ఒక్కో ఓటుకు రూ.వెయియ వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. పాలకొల్లులో ఒకట్రెండు వార్డుల్లో గరిష్టంగా ఓటుకు రూ.3 వేల వరకూ పంపిణీ చేసినట్లు తెలి సింది. తాడేపల్లిగూడెంలో రూ.500 వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులు గరిష్టంగా రూ.25 లక్షల వరకూ ఖర్చు చేశారు. తాడేపల్లిగూడెంలోని ఒకరిద్దరు పోలీసు అధికారులు తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పూర్తి సహకారం అందిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగాను, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రతి కూలంగాను వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎక్కువ మం దిపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీ సులు టీడీ పీ నేతలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తాడేపల్లిగూడెం టూటౌన్ ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ అభ్యర్థినుంచి రూ.8 లక్షలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు ఓ ప్రధాన నాయకుడు ఫోన్ చేయడంతో ఆ మొత్తాన్ని తిరిగి అప్పగించేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. జంగారెడ్డిగూడెంలోని 12 వార్డుల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొం ది. భీమవరం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీల్లోనూ ప్రలోభాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయానికి చివరి విడత పంపిణీని పూర్తి చేసేందుకు అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ఊపందుకున్న లిక్కర్ లాబీలు ఇదిలావుండగా చాలాచోట్ల లిక్కర్ లాబీలు రంగంలోకి దిగాయి.పలువురు అభ్యర్థులు ఊరి శివార్లలోని దాబాల్లో శిబి రాలు నడిపారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో శనివారం మధ్యాహ్నం నుంచి దాబాల్లో మకాంవేసి వర్గాల వారీ ఓటర్ల లెక్క లు తీసి కొత్త సమీకరణలకు మంత్రాంగాలు నడిపారు. కొవ్వూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం మునిసిపాలిటీల్లో కొందరు నేతలు విందు రాజకీయాలు నిర్వహిం చారు. కీలకమైన వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసే వివిధవర్గాల నాయకుల్ని విందుకు ఆహ్వానించి ఆయా వర్గాల ఓట్లకు పెద్దఎత్తున గాలాలు వేసినట్లు సమాచారం. -
బరితెగింపు
అసత్య ప్రచారాలకు తెరలేపిన టీడీపీ పందాలకు రమ్మని.. మొహం చాటు వాస్తవాలను జనం పసిగట్టడంతో కలవరం సాక్షి, ఏలూరు: మునిసిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు సమయం ఆసన్నమైంది. చివరి నిమిషంలో అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణలతో టీడీపీ నేతలకు దిమ్మతిరుగుతోంది. దీంతో ఓటర్లను ఓ వైపు ప్రలోభపెడుతూనే మరోవైపు అసత్య ప్రచారాలను ఆ పార్టీ నేతలు ముమ్మరం చేశారు. అన్నిచోట్లా తమదే పైచేయి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. అనుమానం ఉంటే పందెం కాయండంటూ రెచ్చగొడుతున్నారు. చివరకు టీడీపీ సృష్టించిన మబ్బులు వీడుతున్నాయి. ఆ పార్టీ చేస్తున్న కుట్రలను గ్రహించిన ఓటర్లు వైసీపీ వైపు మళ్లుతున్నారు. ఆఖరి క్షణంలో తమ ఎత్తులు జనం పసిగట్టారని తెలిసి పార్టీవర్గాలు కలవరపడుతున్నాయి. వార్డుల్లో టీడీపీ నేతల బరితెగింపు తారస్థాయికి చేరుకుంది. పంచాయతీ ఎన్నికల్లో చేసిన విధంగానే మైండ్గేమ్ ఆడుతున్నారు. అప్పట్లో పంచాయతీలన్నీ తమ ఖాతాలోకే వచ్చేస్తున్నాయని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఫలితాలు వెలువడ్డాక వాస్తవం ఏమిటనేది ప్రజలకు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడమే కాకుండా ఓట్లను సైతం గల్లంతు చేశారు. ఆ తర్వాత సహకార ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని అవలంభించారు. తమకు అనుకూలంగా లేని సహకార సంఘాల్లో రైతుల ఓట్లు సైతం తొలగించారు. కొన్నిచోట్ల లేని ఓట్లు సృష్టించారు. అప్పుడూ అన్నిచోట్లా తమదే గెలుపు అని గొప్పలు చెప్పుకున్నారు. చివరకు చతికిలపడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థులే ఏకైక లక్ష్యంగా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తస్మదీయులు కుటిల రాజకీయాలుఉపయోగించి ఎత్తులు వేశారు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ లేకపోయినా ఏకపక్షంగా గెలిచేస్తామంటూ ప్రచారానికి తెరలేపారు. అనుమానం ఉంటే పందెం కాయండం టూ సవాలు విసిరారు. తీరా పందానికి సిద్ధమైతే పత్తాలేకుండా పోతున్నారని కొం దరు వెల్లడించారు. విజ్ఞులైన ఓటర్లు టీడీపీ కుతంత్రాలను చివరి నిమిషంలో పసిగట్టారు. దీంతో పురపోరులో అనూహ్య పరి ణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేత ల అంచనాలు తారుమారు కానున్నాయి. జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టేం దుకు సిద్ధపడుతున్నారు. తామెంత తప్పు డు ప్రచారం చేసినా, విచ్చలవిడిగా డబ్బు లు వెదజల్లినా జనం వైసీపీ వైపు మొగ్గుచూపడం టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పోలింగ్కు రెండురోజుల ముం దు తమ ఎత్తులు చిత్తవడంపై ఆ పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఏలూరు నగరపాలక సంస్థతోపాటు అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ చెప్పింది, చేసింది అవాస్తవమనే విషయూలను గ్రహించి వైఎస్సార్ పార్టీ అభ్యర్థులకు పట్టం గట్టేందుకు ఓటర్లు ముందుకు వస్తున్నారు. -
‘పుర’పోరుకుసర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 532 పోలింగ్ స్టేషన్లు... 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మునిసిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 5,72,115 మంది అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 128 2,089 మందితో భారీ పోలీస్ బందోబస్తు సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించేందుకు ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, పాల కొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో అధికారులు విసృ్తత ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు, మిగిలిన పట్టణాల్లో 291 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మొ త్తంగా 291 స్థానాల్లో 946 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 143 మంది మహిళా అభ్యర్థులు. 5,72,115 మంది ఓటర్లు ఏలూరు నగరపాలక సంస్థ, 8 పట్టణాల్లో మొత్తంగా 5,72,115మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరులో 1,39,363 మంది, పాలకొల్లులో 44,518 మంది, భీమవరంలో 1,02,725, నిడదవోలులో 32,303 మంది, తణుకులో 72,462 మంది, కొవ్వూరులో 28,739 మంది, తాడేపల్లిగూడెంలో 72,251 మంది, నరసాపురంలో 42,566, జంగారెడ్డిగూడెంలో 37,188 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉం ది. వీటిలో 585 పోస్టల్ బ్యాలెట్లు, 112 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 539 పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 135 సమస్యాత్మకమైనవికాగా, 128 ఘర్షణలు జరగడానికి అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వెబ్ కెమెరాల ఏర్పాటు పోలింగ్ జరిగే ప్రాంతాలను 38 జోన్లు, 56 రూట్లుగా విభజించా రు. పోలింగ్ కేంద్రాలతోపాటు ఇతర చోట్ల 197 వెబ్ కెమెరాలను అమర్చారు. ఏ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందనేది ఈ వెబ్కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. 34 మంది వీడియోగ్రాఫర్లను సిద్ధం చేశారు. పోలింగ్ను పర్యవేక్షించేందుకు 121 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 595మంది పోలింగ్ అధికారులు, మరో 595 మంది సహాయ పోలింగ్ అధికారులు, 1,785 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 19 షాడో బృందాలను రంగంలోకి దింపారు. 2,089 మందితో బందోబస్తు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరిగే 9 పట్టణాల్లో 2,089 మంది సిబ్బందిని నియమించారు. 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు, 96 మంది ఏఎస్సైలు, 109 మంది హెడ్కానిస్టేబుళ్లు, 1,230 మంది కానిస్టేబుళ్లు, 493 మంది హోంగార్డులు, 32మంది ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఓటరు స్లిప్ల పంపిణీ.. ఈసారి ఓటరు స్లిప్పులను అధికార యంత్రాంగమే పంపిణీ చేయాలని నిర్ణయించి కొంతమేరకు చేయగలిగింది. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని స్లిప్పులను పంపిణీ చేశాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ మునిసిపాలిటీల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రంగా ఉంది. వామపక్షాలు అక్కడక్కడా బరిలో ఉండగా, టీడీపీ పొత్తుతో బీజేపీ కొన్నిచోట్ల పోటీకి దిగింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు చాలామంది రంగంలో ఉన్నా రు. పోటీ మాత్రం వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల విసృ్తతంగా ప్రచారం చేసింది. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంతోపాటు రకరకాల ఊహాగానాలు, దుష్ర్పచారాలకు తెరలేపి ఓటర్లను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేసింది. అయినా జనంలో వైఎస్సార్ సీపీకి ఆదరణ కన్పిస్తోంది. -
మున్సిపల్ ఫలితాల ప్రకటనపై ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా టెన్షన్ నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను మే 7 తర్వాత ప్రకటించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా ఈ ప్రభావం పడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. కోర్టు తీర్పును ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్లు 2వ తేదీ ఓట్లు లెక్కిస్తారా..లేదా అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు గూడూరు, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలీట్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవసరమైన చోట్ల 31న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మాత్రం ఒకటో తేదీన కోర్టు వెల్లడించే తీర్పుపై ఆధారపడి జరగనుంది. -
పుత్తూరులో టీడీపీ అరాచకాలు
పుత్తూరు న్యూస్లైన్: పుత్తూరులో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తనదైన శైలిలో ప్రత్యర్థి అభ్యర్థులపై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. 19వ వార్డులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జి.బాబుపై శుక్రవారం అక్రమ కేసు పెట్టించారు. పరోక్షంగా పోలీసులు సహకరించారనే వాదన వినిపిస్తోంది. 19వ వార్డు అభ్యర్థి జి.బాబు 16వ వార్డుకు వెళ్లి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని వద్ద రూ.15 వేలు ఉంది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కూడా కాదు. ఏ అభ్యర్థి అయినా రూ.25 వేల వరకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఉంచుకోవచ్చని ఎన్నికల నియామావళి ఉంది. ఓటర్లను ప్రలోభపెడుతూ డబ్బు ఇవ్వచూపినప్పడు అరెస్ట్ చేయవచ్చు. అయితే బాబు విషయంలో అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా కేవలం ముద్దుకృష్ణమనాయుడు ఆరోపణను ఆధారంగా చేసుకొని పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఈ విషయంపై డీఎస్పీ కృష్ణకిషోర్రెడ్డి మాట్లాడుతూ 19వ వార్డు అభ్యర్థి రూ.15 వేలు తన వద్ద ఉంచుకుని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై అరెస్టు చేసినట్లు వివరించారు. దుకాణానికి నిప్పు జీవనాధారమైన దుకాణానికి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని బాధితుడు దావూద్ ఆరోపిస్తున్నారు. పుత్తూరు మున్సిపాల్టీలోని 11వ వార్డు నుంచి డి.విమల అనే స్వతంత్ర అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నందుకే ఈ దాడి జరిగిందని దా వూద్ ఆరోపిస్తున్నాడు. ముస్లిం మైనారిటీలకు చెం దిన తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో గెలుపు కష్టమవుతోందని భావించిన తెలుగుదేశం పార్టీ వారు ఇలా తన పాతసామాన్ల దుకాణానికి నిప్పుపెట్టారని ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయని వాపోయారు. టీడీపీ మద్యం స్వాధీనం ఆటోతో సహా 432 క్వార్టర్ బాటిళ్లు ఉన్న 9 బాక్సులను పుత్తూరులో ఎక్సైజ్ శాఖ సీఐ గౌస్ మహమ్మద్ స్వాధీ నం చేసుకున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్ సి.మోహన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. చెర్లోపల్లికి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో బ్రాందీషాపు నుంచి 9 కేసుల మద్యం ఆటోలో తీసుకెళ్తుండగా ఎక్సైజ్శాఖ సీఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తు లు తప్పించుకోగా ఆటో డ్రైవర్ దొరికిపోయాడు. విచారిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు బేరం మాట్లాడి, తాను పట్టుబడిన తర్వాత తప్పుకోవడం దురదృష్టకరమని నిందితుడు ఆవేదనకు లోనయ్యారు. ఇది అన్యాయం: రోజా ఎన్నికల నియమావళి మేరకు రూ.25 వేల వరకు డబ్బు కలిగి ఉండవచ్చనే విషయాన్ని మరచి తెలుగుదేశం నేత ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చిన సూచనలతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా ఖండించారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ వారు అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్రెడ్డి తెలిపారు. -
స్థానిక’ తేదీలు ఖరారు
6న మదనపల్లె డివిజన్ 11న చిత్తూరు, తిరుపతి డివిజన్లు మే 16 తరువాత ఓట్ల లెక్కింపు? చిత్తూరు(అర్బన్), న్యూస్లైన్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు తేదీలు ఖరారయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పోలింగ్ నిర్వహించాలనే విషయంపై గురువారం కూడా అధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో శుక్రవా రం జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి పోలింగ్ తేదీలపై వివరణ ఇవ్వడం తో జిల్లా కలెక్టర్ వీటిని ఆమోదించారు. ముం దుగా అనుకున్నట్లుగానే మదనపల్లె డివిజన్లో ఏప్రిల్ 6న, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో ఏప్రిల్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీపీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాంగోపాల్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. ఎన్నికల సంఘం సైతం దీన్ని వెంటనే ఆమోదించడంతో ఇక సవ్యంగా పోలింగ్ నిర్వహించడం ఒక్కటే మిగిలింది. మదనపల్లెలో తొలి విడత జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలివిడతగా మదనపల్లె డివిజన్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్ పరిధిలోని బి.కొత్తకోట, బెరైడ్డిపల్లె, చిన్నగొట్టిగల్లు, చౌడేపల్లె, గంగవరం, గుడుపల్లె, గుర్రంకొండ, కంబంవారిపల్లె, కలకడ, కలికిరి, కుప్పం, కురబలకోట, ములకలచెరువు, మదనపల్లె (రూరల్), నిమ్మనపల్లె, పలమనేరు, పెద్దమండ్యం, పెద్దపంజాణి, పెద్దతిప్పసముద్రం, పీలేరు, పుంగనూరు, రామకుప్పం, రామసముద్రం, రొంపిచెర్ల, శాంతిపురం, సదుం, సోమల, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, వి.కోట, ఎర్రావారిపాళెం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న రెండో విడత ఇక రెండో విడతలో చిత్తూరు, తిరుపతి డివిజన్ల పరిధిలోని ఎన్నికలు నిర్వహిస్తారు. చిత్తూరు డివిజన్లోని బంగారుపాళెం, చిత్తూరు, గంగాధరనెల్లూరు, గుడిపాల, ఐరాల,రామచంద్రాపురం, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం,పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఎస్.ఆర్.పురం,తవణంపల్లె, వడమాల పేట, వెదురుకుప్పం, విజయపురం, యాదమరి మండలాల్లో ఏప్రిల్ పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే తిరుపతి డివిజన్లోని బుచ్చినాయుడుకండ్రిగ, చంద్రగిరి, కేవీబీపురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచెర్ల,రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి రూరల్, వరదయ్యపాళెం, ఏర్పేడు మండలాల్లో సైతం ఇదే రోజు పోలింగ్ జరుగుతుంది. 50 లక్షల బ్యాలెట్ పత్రాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ సారి కూడా బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించనున్నారు. ఇందు కోసం దాదాపు 12 టన్నుల కాగితాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక్కో టన్నుకు 2 లక్షలకు పైగా బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే డివిజన్ల వారీగా ముద్రిస్తున్నారు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాలకు దాదాపు 50 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు. అయితే 901 ఎంపీటీసీ స్థానాల్లో 14 ఏకగ్రీమవడంతో 887 సెగ్మెంట్లలో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 22 లక్షల మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్పీటీసీ బరిలో 65 స్థానాలకు 266 మంది ఉండగా, 887 ఎంపీటీసీ స్థానాల్లో 2414 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు వాయిదా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించకూడదని అధికారులు నిర్ణయించారు. మే 7 తరువాత ఎన్నికల ఫలితాలు వెల్లడించొచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 16 తరువాత ఓట్ల లెక్కింపు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
విశ్వసనీయతే జగన్ ఆయుధం
మైలవరం,న్యూస్లైన్,విలువలకు, విశ్వసనీయతకు, ఇచ్చినమాటకు కట్టుబడే వ్యక్తి జగన్ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. జయభేరిలో భాగంగా దొమ్మరనంద్యాల నుంచి వేపరాల వరకు శుక్రవారం సాయంత్రం రోడ్షో జరిగింది. ఈ సందర్భంగా దొమ్మరనంద్యాల గ్రామ చావిడి దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అధిక శాతం ఉన్న చేనేత కార్మికులను రాబోయే తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. జనతావస్త్రాలను పునరుధ్ధరీకరించి, సబ్సిడీపై చేనేతలకు నూలును అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నేతన్నల అత్మహత్యలకు అడ్డుకట్ట వేసి అన్నివిధాల ఆదుకుంటామన్నారు. చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలను ఇస్తామన్నారు. గతంలో చేనేతలు తీసుకున్న రుణాలు పూర్తిస్తాయిలో రుణమాఫీ కాలేదని బడ్జెట్లో రూ. 316 కోట్లు కేటాయించగా అందులో రూ. 96 కోట్లతోనే కిరణ్కుమార్రెడ్డి సర్కార్ సరిపెట్టిందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలు జగన్తోనే సాధ్యమన్నారు. సభలో కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బిరామిరెడ్డి(భూపేష్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేపరాల వరకు రోడ్షో జరిగింది. -
కాంగ్రెస్ నేతల్లో టికెట్ టెన్షన్
దిగ్విజయ్తో బలరామ్, కవిత భేటీ ఏఐసీసీ నేతల చుట్టూ ప్రదక్షిణలు ఢిల్లీలో జిల్లా కాంగ్రెస్ నేతల మకాం వరంగల్, న్యూస్లైన్ : కాంగ్రెస్ సిట్టింగ్లతో సహా ఆశావహుల్లో టికెట్ టెన్షన్ పెరుగుతోంది. నిన్నటి వరకు తమకు టికెట్ గ్యారంటీ అని భావించిన నేతల్లో సైతం అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సిట్టింగ్లు, ఆశావహులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్సింగ్, వయలార్ రవి, కుంతియాలను కలుసుకొని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. శుక్రవారం తొలి జాబితా వస్తుందని భావించిన నేపథ్యంలో వాయిదా పడడంతో మరింత ఆందోళనకు లోనవుతున్నారు. పొత్తు ప్రచారంతో ఆందోళన టీఆర్ఎస్తో పొత్తులేదని ఇరుపార్టీల నేతలు ప్రకటిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయిలో పొత్తుంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా తొలి జాబితా విడుదల జాప్యమైనట్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తుంటే తమ స్థానం గల్లంతేనని భావించేవారు, సీపీఐతో పొత్తుంటే తమ పరిస్థితేమిటని ఆందోళన చెందేవారు, కొత్తగా టికెట్ కోరుకునే నేతలంతా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ఇప్పటికే నేతలను కలిసి వచ్చారు. పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవితలు కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ను కలిసి ఈ ఎన్నికల్లో తమకే టికెట్ కేటాయించాలని విన్నవించారు. అయితే బలరాంనాయక్, కవితల పని తీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే ప్రచారం ఊ పందుకున్నది. ఈ దఫా సిట్టింగ్లైనప్పటికీ టికెట్ దక్కుతుందో?లేదో?ననే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్లో వర్గపోరుతో ఈ సమ స్య మరింత పెరిగింది. ఒక కుటుంబం నుంచి ఒకరి కే టికెట్ అని ప్రచారం కావడంతో ఎమ్మెల్యే కవితలో ఆందోళన నెలకొంది. తాజాగా శుక్రవారం మహబూబాబాద్కు వచ్చిన సీపీఐ నేత నారాయణ సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు దద్దమ్మలంటూ వారికి ప్రజాదరణ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. సీపీఐతో పొత్తుంటే ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆశావహులంతా అక్కడే.. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు, టికెట్ వస్తుందోరాదోననే భయం ఉన్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి తమకు మరోసారి పోటీకి అవకాశం కల్పించాలని కోరారు. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఘంటా నరేందర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి, తాజాగా పాలకుర్తి నుంచి తమకు అవకాశం కల్పించాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనాయణ, స్టేషన్ఘన్పూర్ ఆశావహులు డాక్టర్ విజయరామారావు, రాజారపు ప్రతాప్, భువనగిరి ఆరోగ్యం, పరకాల టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. -
మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే దద్దమ్మలు
పనిచేసే నాయకులకే ఓట్లు వేయండి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మహబూబాబాద్, న్యూస్లైన్ : మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే చేతగాని దద్దమ్మలు.. కనీసం గాడిదలు కాయడానికి కూడా పనికిరారు.. వారి నిర్లక్ష్యం వల్లే పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో సీపీఐ పోటీచేస్తున్న వార్డుల్లో శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేశారు. నెహ్రూ సెంటర్, పాతబజార్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆర్యూబీ నిర్మాణం ఏళ్లతరబడి కొనసాగుతోంది.. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్ధతే కారణమని ధ్వజమెత్తారు. పట్టణ సమస్యలపై సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేసింది.. పనిచేసే నాయకులకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం పాలక మండలి ఏర్పడిన తరువాత ఆరు నెలల్లో తాగునీటి సమస్య, ఆర్యూబీ పూర్తి కాకుంటే దీక్ష చేపట్టి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు అడిగే ధైర్యం లేకే ప్రచారంలో పాల్గొనలేద న్నారు. ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆర్యూ బీ నిర్మాణంతో వ్యాపారుల కుటుంబాలు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమ ని, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చే శారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ, మార్నేని వెంకన్న, అంజయ్య, శంకర్నాయక్, విశ్వేశ్వరరావు, రవి, విజయ్ సారథి తదితరులు పాల్గొన్నారు. బీజేపీని భూస్థాపితం చేయూలి : నారాయణ జనగామ, న్యూస్లైన్ : మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశంలో అరాచకాలకు అడ్రస్గా మారిన బీజేపీని భూస్థాపితం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన జనగామలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సినీహీరోలు పవన్కల్యాణ్, అక్కినేని నాగార్జున రాజకీయాలలోకి రావడం సంతోషకరమని, కానీ దేశ పరిస్థితులను వారు అర్థం చేసుకోకుండా మోడీ చెంతకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. పవన్కల్యాణ్ చెగువెరాను ఆదర్శంగా తీసుకుని.. అందుకు భిన్నవైన వ్యక్తిత్వం గల మోడీ దగ్గరకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. నాగార్జున తనకు ఉన్న భూసంపదను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీలో పురందేశ్వరి చేర డం అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వడాన్ని ఆయన ఆత్మహత్య సదృశ్యంగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నిక ల్లో సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంనర్సింహారావు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి పాల్గొన్నారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తొలి, మలి దశలు ఖరారు
గుడ్లవల్లేరు, న్యూస్లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తొలి, మలి దశల పోలింగ్ ఖరారైంది. జిల్లాలో నాలుగు డివిజన్లు ఉండగా మచిలీపట్నం, విజయవాడల్లో ఏప్రిల్ ఆరో తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. నూజివీడు, గుడివాడ డివిజన్లలో 11న మలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల జిల్లా పర్యవేక్షణాధికారిణి, ఉడా వైస్ చైర్పర్సన్ పి.ఉషాకుమారి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన ఆమె స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. గుడ్లవల్లేరు మండలంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ఎంపీడీవో పి.రమాదేవిని ఆమె ఆరా తీశారు. ఓటరు జాబితాల్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగారు. ఎన్నికల అధికారులకు మెటీరియల్ అందజేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల బడ్జెట్ విడుదలపై ఆరా తీశారు. ఎన్నికల మెటీరియల్ చేరకపోతే తెలియజేయాలన్నారు. ఎన్నికల కేంద్రాల్లో స్టాంప్ ప్యాడ్లు, రూలర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, ర్యాంప్ల వసతుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులందరికీ సమాచారం ఇవ్వాలని, వారికి శిక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చే కోడింగ్ను జాగ్రత్తగా చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అపమ్రత్తంగా ఉండాలని తెలిపారు. జోనల్, రూట్ ఆఫీసర్లతో పాటు వాహనాల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తు తీసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ గుడివాడలోనే... గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాక బ్యాలెట్ బాక్సుల్ని ఎక్కడ భద్రపరచనున్నారని గుడివాడ ఆర్గీవో వెంకట సుబ్బయ్యను ఉషాకుమారి అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ గుడివాడ ఏఎన్నార్ కాలేజీలోనే స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. పామర్రు మండల బాక్సులు కూడా గుడివాడలోనే భద్రపరిచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఉషాకుమారి సూచించారు. -
ఓటుకు రేటు..ఎరేస్తున్నారు
పట్టణాల్లో పట్టు కోసం యత్నాలు మున్సిపల్ ఓటర్లకు ప్రలోభాలు పోలీసు నిఘాతో చీరలు, నజరానాల పంపిణీకి చెక్ డబ్బు పంపిణీకే పెద్దపీట జోరుగా విందు రాజకీయాలు ఇదీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రలోభాల తీరు మున్సిపాలిటీల్లో ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. పట్టణాల్లో పట్టు దక్కించుకునేందుకు ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఓటుకు రేటు కడుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రెండు రోజులుగా విందు, రాజకీయం జోరుగా సాగిస్తున్న అభ్యర్థులు పోలింగ్ సమయం సమీపించడంతో నజరానాల పంపిణీపై దృష్టి పెట్టారు. సాక్షి, మచిలీపట్నం : పురపోరుకు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో శుక్రవారం రాత్రి నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో డబ్బు పంపిణీ మొదలైంది. ఈసారి ఎన్నికల కమిషన్ కాస్త పట్టు బిగించడంతో నజరానాల కంటే డబ్బు పంపిణీ పైనే అభ్యర్థులు ఎక్కువగా ఆధారపడ్డారు. తిరువూరులో గత రెండు రోజులుగా పలువురు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు తమ పరిధిలోని ఇంటింటికి కోడి మాంసం, వేట మాంసం కిలో చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలలో నిఘా కట్టుదిట్టం చేయడం, పోలీస్ చెక్పోస్టుల తనిఖీల హడావుడితో చీరలు, వెండి వస్తువులు వంటి నజరానాలను పట్టణ ఓటర్లకు అందించేందుకు అభ్యర్థులు ధైర్యం చేయలేదు. దీంతో ఒకటి రెండు పట్టణాల్లో మినహా అన్నిచోట్లా గతంలో మాదిరిగా చీరలు తదితర వస్తువుల పంపిణీ పెద్దగా జరగలేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోను గెలుపు కోసం అభ్యర్థులు తమ స్తోమతును బట్టి డబ్బు పంపిణీ చేపట్టారు. వార్డుల్లోనూ ఓటుకు రూ.200 నుంచి రూ.500... పలు మున్సిపాలిటీల్లో వార్డులకు సైతం ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. ఉయ్యూరు, జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీల్లో సంపన్న వర్గాలు పోటీచేసిన వార్డుల్లో పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటుకు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. ప్రలోభాల పర్వం ఇలా... మచిలీపట్నంలో పలువురు అభ్యర్థులు పంతాలకు పోయి డబ్బు ఖర్చు చేస్తున్నారు. చాలాచోట్ల ఓటుకు రూ.200 నుంచి 500 వరకు పంపిణీకి సిద్ధమవుతుండగా, కొన్నిచోట్ల వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ చీరలు తెచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేయడం, వారి విధినిర్వహణకు అడ్డు వచ్చిన కౌన్సిలర్ అభ్యర్థిపై కేసు పెట్టి అరెస్టు చేసి. వ్యక్తిగత బెయిల్పై విడుదల చేయడం తెలిసిందే. దీంతో చీరల పంపిణీని అభ్యర్థులు విరమించుకున్నారు. పెడనలోని ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఒకరు శుక్రవారం ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ మొదలుపెట్టారు. మరో వార్డులో చీరలు ఇచ్చి మహిళల ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. గుడివాడలో ఓటు రేటు వెయ్యి పలుకుతోంది. నూజివీడులో రూ.500 నుంచి వెయ్యి వరకు పంపిణీ చేపట్టారు. తిరువూరులో ఓటుకు వెయ్యి ఇస్తారని ప్రచారం జరిగినా శుక్రవారం రూ.500 చొప్పున పంపిణీ మొదలుపెట్టారు. మద్యం పెద్ద ఎత్తున పంపిణీ చేసి పలావు కూడా పెడుతున్నారు. ఇంటింటికి కోడిమాంసం, వేట మాంసం పంపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం రోజుకు రూ.200 చొప్పున ఇస్తామని కిరాయి మనుషులను వెంట తిప్పుకొన్న టీడీపీ అభ్యర్థులు వారం రోజులైనా వారికి డబ్బులివ్వకపోవడంతో వివాదం నెలకొంది. శుక్రవారంతో ప్రచారం ముగియడంతో ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.1,400 మొత్తాన్ని ఇవ్వకపోవడంతో వాళ్లు లబోదిబోమంటున్నారు. నందిగామ ఓటు రేటు రూ.500 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. సంపన్న వర్గాలు పోటీ చేసే రెండు వార్డుల్లో ఓటు రేటు బాగా పలుకుతోంది. ఏకంగా రూ.5 వేలు వరకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. జగ్గయ్యపేటలో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.5 వేలు వరకు ఇస్తున్నారు. ప్రధానంగా సంపన్నవర్గాలు ఉండే వార్డుల్లో ప్రతిష్టాత్మకంగా మారడంతో ఏకంగా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకోవడం విశేషం. ఉయ్యూరులో రూ.500 నుంచి రూ.1500 వరకు పంపిణీ చేశారు. ఒక వార్డులో 1500 చొప్పున పంపిణీ పూర్తి చేశారు. చీరలు, గాజులు, కుంకుమ, పసుపు కూడా పంపిణీ చేసి సెంటిమెంట్ ఓటుతో గట్టెక్కేందుకు అభ్యర్థులు ఎత్తులు వేయడం కొసమెరుపు. -
ఓటుతో బుద్ధి చెప్పండి
51 రోజుల్లో బడుగుల జీవితాలు మారనున్నాయి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ మరచిపోలేనిది: రెహమాన్ ఎమ్మెల్యే బొజ్జల ఖర్జ్జూరం వ్యాపారి: మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి, న్యూస్లైన్: ప్రజల వద్దనున్న ఓట్లు కత్తుల కన్నా పదునైన ఆయుధాలని, వాటితో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటుని వినియోగించుకుని మళ్లీ రాష్ట్రంలో బడుగుల రాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మరో 51 రోజుల్లో రాష్ట్రంలో రాజన్న కాలంనాటి బడుగు, బలహీన వర్గాలవారి పరిపాలన రానుందని జోస్యం చెప్పారు. దీంతో పేదల బతుకులు మరోసారి చిగురిస్తాయని తెలిపారు. ఓట్లు వేసే సమయంలో ప్రతిఒక్కరు దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను గుర్తుంచుకోవాలని కోరారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్పార్టీతో టీడీపీ కుమ్మక్కై సీబీఐని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. బియ్యపు మధుసూదన్రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఖర్జూరం వ్యాపారస్తుడని అభివర్ణించారు. ఎక్కడ ఉత్సవాలు జరిగితే ఖర్జూరం వ్యాపారులు ఆ నాలుగు రోజులు అక్కడే ఉండి, ఉత్సవం కాగానే దుకాణాలు సర్దుకుని వెళిపోతారన్నారు. అలానే ఎన్నికల సమయంలో నాలుగు రోజు లు శ్రీకాళహస్తిలో ఓట్లు దండుకుని హైదరాబాద్కు వెళ్లిపోవడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి గత ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో టోపీల ఫ్యాక్టరీ నిర్మిస్తానని, అం దులో అందరికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత ప్రజలకు కుచ్చు టోపి పెట్టారని తెలిపారు. 121 రోజులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా శ్రీకాళహస్తిలో ఉద్యమాలు జరిగాయని, నిరాహారదీక్షలు చేపట్టామన్నారు. అయితే తండ్రీకొడుకులు కంటికి కనిపించలేదన్నారు. గంగ కార్యాల యూలను తిరుపతికి బదిలీ చేస్తుంటే ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. కొట్టేడి మధుశేఖర్, సిరాజ్బాషా, నాని, సాగీర్బీ, పసల సురేష్ పాల్గొన్నారు. -
నేటితో మున్సిపల్ ప్రచారానికి తెర
చిత్తూరు కార్పొరేషన్,ఆరు మున్సిపాల్టీల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగిన ప్రచారం సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీలకు నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారం ముగిం చాలి. మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండడంతో మైక్ల హోరు, అభ్యర్థనల జోరుకు నేటితో తెరపడనున్నది. 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు దాదాపు రెండు వారాలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీల నుంచి చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనేరు మున్సిపాల్టీల్లో అన్ని డివిజన్లు, వార్డులకు అభ్యర్థులను నిలిపారు. వీరి తరువాత స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగారు. కాంగ్రెస్ శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థులను నిలిపింది. మొత్తం 813 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి గెలుపు కోసం వైఎస్ఆర్ సీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి తదితరులు జోరుగా ప్రచారం చేశారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు గాలి, బొజ్జల, జంగాలపల్లి శ్రీనివాసులు, కఠారి మోహన్, దొరబాబు ప్రచారం నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్ సీపీ, తెలుగుదేశంతోపాటు ఎమ్మేల్యే సీకే బాబు అనుచరులు స్వతంత్ర ప్యానల్గా రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం వార్డుల్లో పోటా పోటీగా సాగింది. -
కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు
మహబూబాబాద్/నర్సంపేట/జనగామ, న్యూస్లైన్ : తెలంగాణ అన్ని విధాలుగా వెనుకబడటానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కార ణం.. ఆ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్, నర్సంపేట, జనగామ పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానుకోటలో హరీష్రావు మాట్లాడుతూ బయ్యారం లో ఉక్కు పరిశ్రమకు అవసరమైన వనరులు న్నా ఏర్పాటు చేయలేదు.. కేంద్రమంత్రి బలరా మ్ నాయక్ గిరిజనుడై ఉండి, గిరిజన సమస్యలను పట్టించుకోలేదు.. మానుకోట అన్ని విధా ల అభివృద్ధి కుంటుపడటానికి పాలకుల నిర్లక్ష్య మే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటున్న తరుణంలో పార్టీని బతికించుకోవడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టం ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం సీపీఐ కూడా ఉద్యమించిందని తెలిపా రు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మానుకోటలో ఐటీడీఏ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏడాదిలోపే తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీపీఐ నాయకులు మడత కాళిదాస్, తమ్మెర విశ్వేశ్వరరావు, విజయ్సారథి, అజయ్, టీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, బానోత్ రవికుమార్, జి.అంజయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి అనిత నెహ్రూనాయక్, శంకర్నాయక్, సంగులాల్, నెహ్రూనాయక్, జిన్నారెడ్డి పద్మజ, జేరిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వారిని గెలిపిస్తే గులాంగిరీ చేస్తరు.. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే చంద్రబాబు వద్ద, కాంగ్రెస్ వారిని గెలిపిస్తే ఢిల్లీలో గులాంగిరీ చేస్తారే తప్ప ప్రజలను పట్టించుకోర ని హరీష్రావు విమర్శించారు. నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలవూలలు వేసి నివాళులర్పించిన అనంతరం రోడ్ షోలో మాట్లాడారు. నర్సంపేటలో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్లుగా పాలించి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించని మీరు ఏం ముఖా లు పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకుండా టీడీపీ నాయుకులు అడ్డుకుని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఆయున వెంట పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్రెడ్డి, సీతారాంనాయుక్, రాంచాం దర్ నాయుక్, శ్రీజానాయుక్, నయీమొద్దీన్, వుర్రి యూదవరెడ్డి, శరత్చంద్ర, ఎంవీ.రావూరావు, నంద్యాల కృష్ణారెడ్డి, మోతె జైపాల్రెడ్డి, నారుుని నర్సయ్యు, కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, పుట్టపాక కువూరస్వామి, వుచ్చిక నర్సయ్యు, వూజీ సర్పంచ్ గుంటి కిష న్, దార్ల రవూదేవి, గుండె బోరుున కొంరయ్యు, తదితరులు పాల్గొన్నారు. జనగామకు ‘పొన్నాల’ చేసిందేమీ లేదు మంత్రిగా పదేళ్లపాటు కొనసాగిన ప్రస్తుత టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామ అభివృద్ధికి చేసిందేమి లేదు.. ఆడుకుందామంటే క్రీడా మైదానం లేదు.. కూర్చుందామంటే పార్కులేదు.. మోరీలు లేవు.. దోమలను చూసి ఇక్కడోళ్లకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నేత హరీష్రావు విమర్శించారు. రాత్రి జనగా మ పట్టణంలోని 1, 11 వార్డుల్లో నిర్వహించి న రోడ్షోలో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం లో భాగంగా తెలంగాణను 24 జిల్లాలుగా.. అందులో జనగామన జిల్లా కేంద్రంగా చేసి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పా రు. కేసీఆర్ది కుటుంబపాలన అని విమర్శించే ముందు తన పరిస్థితి ఏమిటో పొన్నాల ఆలోచించుకోవాలన్నారు. కూట్లో రాయి తీయనోడు యేట్లో రాయి తీస్తాడా అని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలకు అవకాశం ఇచ్చాం.. అభివృద్ధి జరుగలేదు.. ఒక్కసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూసిప్తామని హరీష్రావు అన్నారు. రైతులకు 8 గంటల కరెంటు, ఎస్టీలకు ఉద్యోగ, విద్యలో 12 శాతం రిజర్వేషన్, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బక్క నాగరాజు, ఆరుట్ల దశమంత్రెడ్డి, ఉల్లెంగల కృష్ణ, ఆలూరి రమేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
బస్సు మిస్సే!
సాక్షి, అనంతపురం : పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఆ పార్టీ బస్సు యాత్ర అనుకున్న రీతిలో ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవిని చూడటానికి వచ్చిన కొద్ది మంది అభిమానులు మినహా కాంగ్రెస్ కార్యకర్తలెవరూ కనిపించలేదు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాణాలు తీసిన వారినే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కున చేర్చుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పదవీ వ్యామోహంతో విలువలను పక్కన పెట్టి ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్లో మొన్నటి వరకు పదవులు అనుభవించిన పెద్ద నాయకులు పార్టీని వదలి పోయారని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. 63 జెడ్పీటీసీ స్థానాలకు గాను 30 మంది, 863 ఎంపీటీసీ స్థానాలకు గాను 214 మంది, 273 మున్సిపల్ వార్డుల్లో 146 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవితో పాటు మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొండ్రు మురళీ తమ ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు కుర్చీ కోసం విలువలను సైతం పక్కన పెడుతున్న వైనంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేశారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మాంగల్యాన్ని లాక్కొన్న వారినే చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీలో చేర్చుకున్నాడని ఆనం గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని, విభజించాలని లేఖలు ఇచ్చి ఒత్తిడి తీసుకరావడం వల్లే రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ పాత్ర లేదని నాయకులు చెప్పే ప్రయత్నం చేయగా.. కార్యకర్తలు అడ్డుతగిలారు. మీ ప్రసంగాలు అవసరం లేదంటూ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో రఘువీరారెడ్డి కలుగ జేసుకొని ఏయ్.. ఏయ్.. నేను చెప్పేది వినండి.. మీ భవిష్యత్తు కోసమే సభ నిర్వహించి వాస్తవాలు తెలియజేస్తున్నామని పలుమార్లు చెబుతూ హెచ్చరించే విధంగా మాట్లాడినప్పటికీ ఆయన మాటలను సైతం ఎవరూ పట్టించుకోలేదు. సభలో జనం కన్పించకపోయినా పెద్ద ఎత్తున తరలివచ్చారని తమ ప్రసంగాల్లో చెప్పుకొన్నారు. కేవలం రాంచరణ్ అభిమానులే కేక్ కట్ చేయించాలని అక్కడికి వచ్చారు. నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో బహిరంగ సభ పేలవంగా కన్పించింది. చిరంజీవి తన ప్రసంగం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ప్రసంగం మాదిరి కాకుండా ఆయన పుస్తకం చదివినట్లు చదువుకుంటూ పోవడంతో అభిమానులు ఒక్కొక్కరూ వెళ్లిపోయారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనుల కోసం తన చుట్టూ తిరిగి ఇప్పుడు కన్పించకుండా పోయారని ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. ఈ సభలో కేంద్ర మంత్రి జేడీ శీలం, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రులు బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, నాయకులు నాగరాజు, రవీంద్ర, కేటీ శ్రీధర్, దేవమ్మ, దాదా గాంధీ, కేవీ రమణ పాల్గొన్నారు. -
పోలింగ్ రోజు ఆరంచెల బందోబస్తు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్లైన్: ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రూరల్ జిల్లా పరిధిలో మొత్తం పది మున్సిపాలిటీల్లో 556 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. 90కి పైగా అత్యంత సమస్యాత్మక, 195 సమస్యాత్మక పోలింగ్స్టేషన్లను గుర్తించామని తెలిపారు. ఆయాప్రాంతాల్లో ఆరంచెల విధానాల్లో బందోబస్తు కొనసాగుతుందన్నారు. నిఘానీడలో ఎన్నికలు కొనసాగుతాయన్నారు. స్థానిక పోలీసులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల గస్తీ, వీడియోగ్రఫీ, మైకుల ద్వారా నిషేదాజ్ఞల ప్రచారం తదితర ఎన్నికలకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా ఎన్నికల ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవన్నారు. సాధారణ ఎన్నికలు ముగిసేవరకూ మొత్తం 21 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాలో విధులు నిర్వహిస్తాయన్నారు. పలు ధఫాలుగా ఆయా కంపెనీలు జిల్లాకు చేరుకుంటాయన్నారు. పల్నాడు ప్రాంతంలో అదనంగా కేంద్ర బలగాలను మోహరింప జేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.ఇప్పటివరకూ జిల్లాలో పోలీసులు, ఎన్నికల పరిశీలకులు 15 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ స్టేషన్లవద్ద అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయటంలో వెనుకాడేదిలేదని హెచ్చరించారు. -
ఖరారైన ‘స్థానిక’ ముహూర్తం
సాక్షి, కాకినాడ : నెల రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు సుప్రీం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలను మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే ప్రకటించాలన్న సుప్రీం ఆదేశాలు ప్రధాన రాజకీయ పార్టీలకు కొంత ఊరటనిచ్చాయి. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు 242 మంది తలపడుతుండగా, ఎన్నికలు జరుగుతున్న 1040 ఎంపీటీసీ స్థానాలకు 2705 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో ఒక్కొక్క విడతలో మూడేసి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని జెడీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోను, రెండో విడతలో అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలోను జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తొలి విడతలో.. 26 జెడ్పీటీసీ స్థానాలు, 513 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాకినాడ డివిజన్ పరిధిలో 8 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 164 ఎంపీటీసీ స్థానాలకు, రాజమండ్రి డివిజన్ పరిధిలో ఆరు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 124 ఎంపీటీసీ స్థానాలకు, పెద్దాపురం డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 225 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతలో మూడు డివిజన్ల పరిధిలోని 26 జెడ్పీటీసీ స్థానాలకు 111 మంది పోటీ పడుతుండగా, 513 ఎంపీటీసీ స్థానాలకు 1321 మంది తలపడుతున్నారు. రెండో విడతలో వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్ కార్యకర్తలు రెండో విడతలో అమలాపురం డివిజన్ పరిధిలో 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 309 ఎంపీటీసీ స్థానాలకు, రామచంద్రపురం డివిజన్ పరిధిలో 8 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 156 ఎంపీటీసీ స్థానాలకు, రంపచోడవరం డివిజన్ పరిధిలో 7 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో ఎన్నికలు జరిగే 31 జెడ్పీటీసీ స్థానాలకు 131 మంది పోటీ పడుతుండగా, 527 ఎంపీటీసీ స్థానాలకు 1384 మంది ఈ ఎన్నికల పోరులో తలపడుతున్నారు. -
దోస్త్ మేరా దోస్త్
మైనార్టీలను మనసారా ప్రేమించిన మహానేత ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతం అచ్చమైన మిత్రత్వానికి ప్రతిరూపం ఎన్నో ప్రయోజనాలు.. సంక్షేమ పథకాలు స్వార్థానికి వాడుకున్న మిగిలిన నేతలు విశాఖ రూరల్, న్యూస్లైన్ : సంకుచిత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన ఉదాత్తుడిగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మైనార్టీల, ప్రత్యేకించి ముస్లిముల అభ్యున్నతి విషయంలోనూ ఆయన ఈ ఔదార్యాన్ని, ఈ చిత్తశుద్ధిని కనబరిచారు. అందుకే ఆయన నేటికీ ముస్లిముల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకునే స్వార్థ రాజకీయాలకు అతీతంగా ఆయన వారికి మేలు చేయాలని తపించారు. వరాల జల్లులు కురిపించి, తర్వాత వారిని పక్కన పెట్టే కుయుక్తిపరులకు భిన్నంగా వారి అభ్యున్నతికి కృషి చేశారు. అయితే ఆయన మరణం తర్వాత కథ మొదటికొచ్చింది. ముస్లిముల సంక్షేమం మళ్లీ తెరమరుగైంది. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకు పాలకులు గోరీ కట్టారు. విద్య, ఉద్యోగం, వృత్తి నైపుణ్యం అవకాశాలను మెరుగుపర్చే కార్యక్రమాలను మధ్యలోనే నిలిపివేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 42,43,570 మంది జనాభా ఉండగా ఇందులో 75,981 మంది ముస్లింలు ఉన్నారు. మైనార్టీ జనాభా శాతం పెరుగుతున్నా.. వారి సంక్షేమానికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించడం లేదు. దీంతో అన్నింటా మైనార్టీ వర్గాల వారు వెనుకబడిపోతున్నారు. గుండెల నిండా సంక్షేమం మైనార్టీల సంక్షేమం కోసం వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పనకు శ్రీకారం చుట్టారు. మైనార్టీల విద్య, ఉపాధి కల్పనకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉండేది. చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం ఒక పథకాన్ని కూడా ప్రారంభించలేకపోయారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక వారికి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, సబ్సిడీ రుణాలు, నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు, ఉన్నత విద్యావకాశాలకు హాస్టళ్లు కల్పించారు. ముస్లిం నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల్లో ఉచితంగా శిక్షణనిచ్చేందుకు స్టడీ సర్కిల్ను 2005లో జిల్లాకు మంజూరు చేశారు. బీచ్ రోడ్డులో ఉన్న ఈ స్టడీ సర్కిల్లో విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మైనార్టీలు శిక్షణ పొందుతున్నారు. పదో తరగతి తరువాత మైనార్టీ పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించడానికి వీలుగా మైనార్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ను జిల్లాలో 2007లో జూలై 16న గాజువాక అజీమాబాద్ ప్రాంతంలో ప్రారంభించారు. వైఎస్ మరణం తరువాత స్టడీ సర్కిల్ విద్యార్థుల కోసం హాస్టల్ సదుపాయం కల్పించాలని మైనార్టీ యువతీ, యువకులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఏ ఒక్కరు పట్టించుకున్న పాపానపోలేదు. ఏటా తగ్గుతున్న రుణ లక్ష్యాలు నిరుద్యోగ మైనార్టీల ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు మంజూరు చేసే పథకాన్ని వైఎస్ ప్రారంభించారు. ఆయన మరణం తరువాత రుణ లక్ష్యం గానీ, లబ్ధిదారుల సంఖ్యలో గానీ ప్రగతి కానరాలేదు. 2008లో 101 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించి అందించగా ఆయన మరణం తరువాత 2009-10లో ఒక్కరికి పైసా కూడా ఇవ్వలేదు. వైఎస్ ప్రారంభించిన పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లు అందించే విషయంలో మైనార్టీ విద్యార్థులపై ప్రభుత్వాలు చిన్నచూపుచూస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఎగనామం పెట్టేశారు. సబ్సిడీలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు.. ఇలా అడుగడుగునా పాలకులు అన్యాయమే చేస్తున్నారు. -
ఇంకెన్నాళ్లీ వివక్ష
{పగతికి నోచని ముస్లింవాడలు దశాబ్దాలుగా తీరని వెతలు జనాభా ఘనం.. జీవనం అధ్వానం వైఎస్ హయాంలోనే వెలుగులు.. పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల్లో వీరి ఓట్లే కీలకం సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: గతమంతా ఘన చరిత.. వర్తమానం దీనావస్థ.. నాటి వైభవం నేడు ప్రాభవం కోల్పోయింది. నాడు నగరానికి ఏలికలు.. నేడు నకనకలాడే కడుపులతో ఆకలికేకలు.. ఇదీ హైదరాబాద్ ముస్లింల జీవన చిత్రం. పట్టెడన్నం కోసం ఒళ్లంతా రెక్కలు ముక్కలు చేసుకొంటున్న వారు కొందరు.. పొట్టచేత పట్టుకుని ఎడారి దేశాలకు వలస వెళ్లి రెక్కలు తెగుతున్న వారు ఇంకొందరు.. హైదరాబాద్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల సంఖ్యా బల మున్న ముస్లింలు బతుకీడ్చడానికి మాత్రం నానా అగచాట్లు పడుతున్నారు. ఇరుకు రోడ్లు, పొంగే డ్రైనేజీలు, శిథిలావస్థకు చేరిన నివాసాలు.. చదువుకునే వయసులో కుటుంబ పోషణ కోసం బరువెత్తిన బాల్యం.. అభివృద్ధి జాడలేని మురికివాడలు.. తాగు నీరు కలుషితం.. వెలగని వీధి దీపాలు.. ఇదీ పాత నగరం దయనీయ దృశ్యం. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న దక్షిణ మూసీ ప్రాంతమైన చార్మినార్, యాకుత్పురా, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, మలక్పేట నియోజకవర్గాల్లోని మురికివాడల్లో పాలకుల వివక్ష తాలూకు క్రీనీడలు కళ్లెదుట కదలాడుతాయి. ఏవీ ఆ రోజులు.. పాతబస్తీ ఒక వెలుగు వెలిగిందీ.. అసలుసిసలు ప్రగతిని చూసిందీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. ఆయన ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇక్కడ పలు దఫాలుగా పర్యటించారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.2 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఈ నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీ, బీటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, మంచినీటి రిజర్వాయర్లు, పైప్లైన్లు, పాఠశాల భవనాలు వంటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు ఆయన చూపిన చొరవను పాతబస్తీ ప్రజలు ఎన్నటికీ మరువరు. వైఎస్ మరణానంతరం పట్టించుకునే వారు లేక పాతబస్తీని చీకట్లు ముసురుకున్నాయి. ఇప్పుడు పరిస్థితి మళ్లీ షరా మామూలు. ఎన్నికల వేళ నేతలు హామీలతో ఊదరగొడుతున్నారు. ముస్లింలు మాత్రం ఇంకెన్నాళ్లీ వివక్ష అని ప్రశ్నించడానికి, నిలదీయడానికి సిద్ధమవుతున్నారు. పేదరికంతో సహవాసం గ్రేటర్ హైదరాబాద్లోని 2 (మొత్తం 3) పార్లమెంట్, 15 (మొత్తం 24) అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. జనాభాలో, ఓటర్లలో ముస్లింల గణాంకాలు ఘనంగానే ఉన్నా జీవన ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయి. కాసుల కోసం కన్నపేగుల్ని ముసలి అరబ్ షేక్ల చేతుల్లో పెడుతున్న పేద కుటుంబాల దయనీయ ఉదంతాలు నేటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముస్లింల జనాభాలో కాయకష్టం చేసుకుంటూ బతుకీడ్చే వారే ఎక్కువ. చదువుకు సెలవు ముస్లిం విద్యార్థుల డ్రాపవుట్స్ రాష్ట్రం మొత్తమ్మీద నగరంలోనే ఎక్కువ. ఇందుకు సాంఘిక, ఆర్థిక అంశాలతో పాటు మైనార్టీలపై పాలకుల చిన్నచూపూ కారణమే. ఒకటి నుంచి రెండో తరగతికి వెళ్లేలోపే 10 శాతం మంది బడి మానేస్తున్నారు. బాలికల్లో ఇది 16 శాతంగా ఉంది. 2వ తరగతిలో 5 శాతం, 3వ తరగతిలో 6, 4వ తరగతిలో 5, 5వ తరగతిలో ఏకంగా 16 శాతం, 6వ తరగతిలో 6, 7వ తరగతిలో 11 శాతం మంది బడి మానేస్తున్నారు. ఉర్దూ మీడియంలో చదువుతున్న పిల్లలు 3 శాతంలోపే ఉన్నారు. వక్ఫ్ ఆస్తులు పరాధీనం వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములు, ఆస్తులు పరాధీనమైపోతున్నాయి. ఒకవైపు పాలకులే స్వయంగా వక్ఫ్ ఆస్తులను అడ్డగోలుగా ప్రైవేటు పరం చేస్తుండగా మరోవైపు అక్రమార్కులు కబ్జాలకు తెరలేపుతున్నారు. వక్ఫ్ భూముల లీజులు, ఆస్తులపై వచ్చే అద్దె లు తదితర ఆదాయంతో పేద ముస్లింల అభివృద్ధితో పాటు ప్రాథమిక విద్య సునాయాసంగా అందించవచ్చు. వక్ఫ్ చట్టమూ ఇదే చెబుతున్నా.. ఆచరణలో అమలు కావట్లేదు. ముస్లిం విద్యార్థులకు వరం.. వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్ ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ పలువురికి భరోసానిచ్చింది. ముస్లిం విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్తో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, మూడేళ్ల-ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎంటెక్, ఎం.ఫామ్ తదితర కోర్సుల్లో సీట్లు సాధించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలతో వేలాది మంది ఉన్నత చదువులు పూర్తి చేయగలిగారు. రిజర్వేషన్ కేటగిరిలో పలువురు ఉద్యోగాలు పొందారు. ఇక, వైఎస్ ప్రవేశపెట్టిన సామూహిక వివాహాల పథకం నిరుపేద ముస్లిం యువతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ముస్లిం వితంతువులకు పెన్షన్ అందింది. విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంగ్లిష్ మీడియం గురుకుల విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఐటీ ఉద్యోగం చేస్తున్నా.. మా కుటుంబంలో ఉన్నతవిద్య కు నోచుకున్నది నేనొక్కడినే. ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ వల్లనే సాధ్యమైంది. ఇదే లేకపోతే ఇంటర్ తరువాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకొనే వాడినేమో. ప్రస్తుతం నేను ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. - మహ్మద్ఖాన్, గోల్కొండ నా చదువు ఆయన చలవే.. ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు యువత కోసం రాజీ వ్ ఉద్యోగ శ్రీ పథకం ప్రవేశపెట్టి మాకు దారి చూపారు వైఎస్. ఆయన కల్పించిన ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాను. - ఎస్కే సికిందర్, బీటెక్ (మెకానికల్) మూడో ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుకున్నా.. ఉన్నత చదువులు అభ్యసించాలనే అభిలాష ఉన్న మాలాంటి పేద విద్యార్థులను డాక్టర్ వైఎస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆయనిచ్చిన స్కాలర్షిప్లు మా ఉన్నతికి బాటలు వేశాయి. - అబ్దుల్ హఫీజ్, బీటెక్ సెకండియర్ ఇంటరే కష్టమనుకున్నా.. ఇంటర్మీడియట్ చదవడమే కష్టమనుకున్నా.. అదే సమయంలో అప్పటి సీఎం వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నాలో భరోసా నింపింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుకోగలుగుతున్నాను. - మేరాజ్బేగ్, సమతాకాలనీ ఉపాధి కోసం గల్ఫ్బాట రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి ఉపాధి కోసం ఏటా లక్షల్లో జనం వస్తుంటారు. కానీ, నగర ముస్లిం, మైనార్టీలు మాత్రం ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. ఇలా వెళ్లే వారు ప్రతి ఇంటా ఒకరో ఇద్దరో ఉంటారు. అక్కడి నుంచి అంతోఇంతో పంపితే కానీ ఇక్కడ పూట గడవదు. ఇక, గల్ఫ్ వెళ్లే క్రమంలో ఏజెంట్ల చేతుల్లో, ఎడారి దేశాల్లో దగా పడుతున్న వారెందరో. ఇటీవల సౌదీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టం నతాఖా ప్రభావంతో నగరానికి చెందిన సుమారు పదివేల మంది అర్ధంతరంగా స్వస్థలాలకు తిరిగొచ్చారు. ఇదీ నగర ముస్లింల ఎజెండా... ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక మైనార్టీ సబ్ప్లాన్ పేద ముస్లిం యువతుల సామూహిక వివాహాలకు ఆర్థిక సహాయం రూ.25 వేల నుంచి రూ. లక్షకు పెంచాలి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో నగరంలోని ముస్లింలకు ప్రత్యేకంగా కనీసం పది శాతం కోటాను కేటాయించాలి మైనార్టీల విద్యాభివృద్ధికి పాతబస్తీలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక మైనార్టీ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి డివిజన్ కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి పారిశ్రామిక రంగంలో ముస్లిం నిరుద్యోగ యువత ప్రోత్సాహానికి ఏపీఐఐసీలో ప్రత్యేకంగా పది శాతం కోటా కేటాయించాలి స్వయం ఉపాధి కల్పనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు నేరుగా రుణాలు అందించాలి వక్ఫ్ ఆస్తుల అద్దె, లీజు తదితర ఆదాయాలతో పేద ముస్లింల సంక్షేమం, అభివృద్ధి చేపట్టాలి వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో అన్ని మసీదుల ఇమామ్లకు నెలకు రూ.3 వేలు, మోజన్లకు రూ.2 వేలు అందించాలి -
రిజర్‘వేషం’ మారెన్!
హన్మకొండ, న్యూస్లైన్ : ఆ మండలం జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. ఐతే.. ఇంకేం పార్టీల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్న నేతలు తమ సతీమణులను బరిలోకి దింపుతారు. ఇది సాధారణంగా జరిగే సంగతి. అయితే.. మహిళా రిజర్వేషన్ స్థానంలో ఓ ఎస్టీ వ్యక్తి నామినేషన్ వేశాడు.. స్వీకరించిన అధికారులు అన్నీ పరిశీలించి కుల ధ్రువీకరణ పత్రం లేదంటూ జనరల్ వ్యక్తులకు తీసుకునే డిపాజిట్ తీసుకుని చెల్లుబాటు జాబితాలో చేర్చారు. ఆటోరిక్షా గుర్తు సైతం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్కు పురుషుని నామినేషన్ ఎలా చెల్లుబాటు చేశారంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తేరుకుని రాత్రికి రాత్రి హడావుడిగా ఫైనల్ జాబితా నుంచి తొలగించారు.. ఇదీ మన జిల్లా పరిషత్ ఎన్నికల అధికారుల లీల. ఇదీ జరిగింది.. కొత్తగూడ జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ, కాంగ్రెస్తో సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఫైనల్ జాబితాలో బరిలో నిలిచినట్లు ప్రకటించారు. జనరల్ మహిళ స్థానంలో ఇదే మండలం పూనుగుండ్ల గ్రామానికి చెందిన పెనుక కృష్ణారావు(ఎస్టీ) నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో అధికారులు జనరల్ అభ్యర్థులకు తీసుకునే డిపాజిట్ *5000 తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు *2500 తీసుకుంటారు. నామినేషన్ల పరిశీలనలో పేజీని నాలుగుసార్లు చూసిన అధికారులు అన్నీ ఒకే చెప్పారు. ఉపసంహరణల అనంతరం చెల్లుబాటు అయిన నామినేషన్ల జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో కొత్తగూడ మండలం నుంచి ఏడుగురు బరిలో ఉన్నారని, వారిలో ఐదుగురు స్వతంత్రులంటూ పేర్కొన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకూ ఏడుగురు అభ్యర్థులకు గుర్తులిచ్చారు. కృష్ణారావుకు సైతం ఆటోరిక్షా గుర్తు కేటాయించారు. ఆయన కరపత్రాలు ముద్రించి.. ప్రచారం మొదలుపెట్టారు. అయితే మహిళా జనరల్ స్థానంలో కృష్ణారావు ఎలా పోటీ చేస్తున్నాడనే సందేహాలు వ్యక్తమైన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు ఫైనల్ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను పెట్టి.. క్రిష్ణారావు పేరును తొలగించారు. రిజర్వేషన్ల మార్పుతో గందరగోళం పదేపదే రిజర్వేషన్లు మారడం, మూడు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో అధికారులు సైతం తికమక పడుతున్నారు. తొలిసారి రిజర్వేషన్ల జాబితాలో కొత్తగూడ ఎస్టీ జనరల్కు వచ్చింది. చివరిసారిగా ఇచ్చిన జాబితాలో జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. ఇలా రిజర్వేషన్లు మారడంతో అటు పోటీలో ఉండే నేతలు, ఇటు అధికారులు గందరగోళంలో పడ్డారు. పోటీలో ఉండేలా చేయాలి : కృష్ణారావు, అభ్యర్థి నామినేషన్ ఓకే చేసి నాకు గుర్తు కేటాయించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లో పోటీలో ఉండరాదంటూ అధికారులు చెబుతున్నారు. నా నామినేషన్పై నా భార్యకు అవకాశం కల్పించాలి. దేవరుప్పుల మండలంలో కోలుకొండ ఎంపీటీసీ అభ్యర్థి స్వరూప బలపర్చే అభ్యర్థి పేరు రాయాల్సిన చోట గ్రామం పేరు రాస్తే తిరస్కరించారు. ఇక్కడేమో మహిళా రిజర్వేషన్లో నా దరఖాస్తు తీసుకుని చెల్లుబాటు చేశారు. ఇదెక్కడి న్యాయం. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఇందుకా.... లెక్క తగ్గింది ఉపసంహరణ అనంతరం జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు 338 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాబితాను జెడ్పీ కార్యాలయం నోటిస్ బోర్డ్పై అతికించారు. మరుసటి రోజు ఈ బరిలో ఉన్న అభ్యర్థులు తమ పేర్లను చూసుకొని ప్రచారంలోకి దిగారు. మహిళ స్థానంలో పురుషునికి ఎలా గుర్తు కేటాయించారని ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు మేల్కొన్నారు. అంతే.. హడావుడిగా జాబితాను సవరించి 337మంది పోటిలో ఉన్నారని మరో ప్రకటన చేశారు. అందుకే పోటీ అభ్యర్థుల సంఖ్య ఒకటి తగ్గింది. జాబితా మార్పుపై అధికారులు ఇప్పటికీ పెదవి విప్పడం లేదు. అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. -
ఆశావహుల మెడపైపొత్తుల కత్తి
సాక్షిప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఉండదని స్పష్టత రావడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశిం చారు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుకూలత ఉందని... ఇప్పుడే పోటీ చేయాలని కొత్త నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పొత్తులు ఉండవని అన్ని రకాలుగా పోటీకి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు సీసీఐ పొత్తు, టీఆర్ఎల్డీ విలీనం పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ రెండు పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలే చెబుతుండడంతో పోటీ చేసే ఆలోచనతో ఉన్న వారికి షాక్ తగిలినంత పనవుతోంది. సీపీఐ పొత్తుతో ఒక అసెంబ్లీ సీటు, టీఆర్ఎల్డీ విలీనంతో ఇంకో సీటు... కాంగ్రెస్కు తగ్గనున్నాయి. టీఆర్ఎల్డీ విలీనం జరిగితే వరంగల్ పశ్చిమ సీటును ఎమ్మెల్సీ దిలీప్కుమార్కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐకి ఇచ్చే అసెంబ్లీ స్థానం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సీపీఐతో సర్దుబాటు, టీఆర్ఎల్డీ విలీనంతో రెండు సీట్లు పోతే కాంగ్రెస్ వారికి పది సీట్లు మాత్రమే ఉండనున్నాయి. ఇది కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలకు ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు ఖరారైందని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని ఇరు పార్టీల ముఖ్యలు చెబుతున్నారు. సీపీఐతో పొత్తులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కనీసం ఒక అసెంబ్లీ సీటును.. మొత్తం 12 సీట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా వరంగల్ జిల్లాలో సీపీఐ ప్రధానంగా మహబూబాబాద్ సీటును తమకు ఇవ్వాలని కోరుతోంది. 1967, 1994లో ఇక్కడ సీపీఐ గెలిచింది. 1972, 1989లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీటు విషయంలో సీపీఐ తీవ్రంగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోత్ కవిత ఉన్నారు. కవిత తండ్రి డి.ఎస్.రెడ్యానాయక్ డోర్నకల్ అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రం వర్తింపజేసి మహబూబాబాద్ను సీపీఐకి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీపీఐ జిల్లాలో రెండో సీటు కోరితే స్టేషన్ఘన్పూర్ ఉంటుందని తెలిసింది. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్కు సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడంతో రెండు పార్టీలకు ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. రెండు పార్టీల పరిస్థితిని చూస్తే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గమే సీపీఐకి వెళ్తుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ఆ పార్టీలో చేరిన జి.విజయరామారావు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నర్థకంగా ఉంది. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్, టీడీపీ ఇంచార్జీలు టీఆర్ఎస్లో చేరవడం వల్లే విజయరామారావు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు సీపీఐకి సీటు కేటాయిస్తే విజయరామారావుకు మళ్లీ ఆశాభంగం తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందున కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేసే ప్రతిపాదనతో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) ఉంది. విలీనం లేకున్నా పొత్తు కుదిరే అవకాశం ఉంటుందని టీఆర్ఎల్డీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్కుమార్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎల్డీ విలీనం జరిగినా, పొత్తు కుదరినా ఈ సీటు దిలీప్కుమార్కు పోతుంది. కాంగ్రెస్లోని 12 మంది నాయకులు వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. టీఆర్ఎల్డీ విలీనం లేదా పొత్తు ప్రతిపాదనతో వీరందరిలో ఆందోళన నెలకొంది. వరంగల్ పశ్చిమ(హన్మకొండ) సెగ్మెంట్ను కాంగ్రెస్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయిస్తోంది. 2004లో టీఆర్ఎస్కు ఈ సీటు ఇచ్చినప్పుడు మినహా ఇదే జరుగుతోంది. కపిలవాయి దిలీప్కుమార్ ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్లో టీఆర్ఎల్డీ విలీనం జరిగినా... పొత్తు కుదిరినా దిలీప్కుమార్కు టిక్కెట్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎన్నికల పోరు...ఫ్యాన్ జోరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్స్గా జరగనున్న మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, ప్రాదేశికాలలో తమ జెండాలను ఎగురవేయాలని ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నెగ్గుకురాగలిగిన వారికే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇదే సూత్రాన్ని శిరసావహిస్తూ వైఎస్ఆర్ సీపీ పట్టుబిగిస్తోంది. ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతూ, మరోవైపు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నలు చెరగులా... నలుగురు.. జిల్లా నలుచెరగులా నలుగురు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్కృష్ణ రంగారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం, అరకు పార్లమెంట్ సమన్వయకర్తలు బేబీనాయన, కొత్తపల్లి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రణాళిక ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. నాలుగు మున్సిపాల్టీలను, జిల్లా పరిషత్తో పాటు అత్యధిక మండల పరిషత్లు ఆ పార్టీకి దక్కేలా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ సీపీలోకి వలసల జోరు కాంగ్రెస్, టీడీపీల నుంచి వస్తున్న వేలాది మంది కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారు. ఒక్క బుధవారమే గరుగుబిల్లి మండలంలోని కాంగ్రెస్, టీడీపీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు, పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరారు. అలాగే తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాల్లో కూడా చేరికలు జరిగాయి. సుజయ్కృష్ణ రంగారావు, బేబీనాయన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేరికలు జరగ్గా, నెల్లిమర్లలో పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్బాబు, గజపతినగరం నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గంలో బెల్లాన చంద్రశేఖర్, కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల చంద్రశేఖర్రాజు, సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర, పార్వతీపురంలో జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. బలమైన బొబ్బిలి.. వైఎస్ఆర్ సీపీకి బొబ్బిలి బలమైన కోటగా ఆవిర్భవించింది. ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్కృష్ణరంగారావు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బేబీనాయన పార్టీకి రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వేలాది మంది పార్టీలో చేరుతున్నారు.ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా కుదేలయింది. మూడు ప్రధాన పార్టీలూ 30 వార్డుల్లోనూ పోటీ చేస్తున్నా మిగతా పార్టీలకంటే ఫ్యాన్గాలి జోరుగా వీస్తోంది. సరైన నాయకత్వం లేకపోడంతో టీడీపీ క్యాడర్ జారుకుంటోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ గూడుపుఠాణీకి దిగడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ఆ పార్టీల గ్రాఫ్ దిగజారుతోంది. పార్వతీపురం.. పార్వతీపుంలో సుజయ్కృష్ణరంగరావు, బేబీనాయన, కొత్తపల్లి గీతతో పాటు స్థానిక సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ఇతర నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్ తదితరులు కృషి ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జయమణి కూడా వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గుచూపడం ఆ పార్టీకి కలిసివచ్చింది. టీడీపీలో టిక్కెట్ల కేటాయింపులో గందరగోళం, టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్పై వ్యతిరేకత వల్ల ఆ పార్టీ నష్టపోనుంది. పార్వతీపురం మున్సిపాలిటీలోని గల 30 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 27 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగింది. ప్రచారంలో కూడా కాంగ్రెస్ కనుమరుగుకాగా, టీడీపీ వెనుకంజలో ఉంది. సాలూరు.. సాలూరులో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర చేరిన తరువాత వైఎస్ఆర్ సీపీ బలపడింది. పార్టీలోకి వలసలజోరు పెరిగింది. పార్టీకి ప్రజాబలం ఎక్కువగా ఉంది. టీడీపీ కూడా పోటీపడుతోంది. అయితే వైఎస్ఆర్ సీసీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడింది. విజయన ‘గరం...గరం’ విజయనగరంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్కృష్ణరంగారావు విస్తృతంగా పర్యటిస్తుండడంతో పార్టీ బలం మరింత పెరిగింది. మరో వైపు టీడీపీ కూడా గట్టిపోటీ ఇస్తోంది. కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. -
ఓటుకు ‘తెలుగు’ నోటు
ఓటుకు రూ.500 పంచి ఒట్టేసుకుంటున్న తెలుగుతమ్ముళ్లు పోలింగ్కు నాలుగురోజులకు ముందే ప్రలోభాలు పుత్తూరులో మూడు వార్డుల్లో నగదు పంపిణీ హస్తిలో నాలుగు వార్డుల్లో పంపకం పూర్తి మదనపల్లెలో ఓటర్ల ఇంటికి వస్తువులు, బియ్యం సాక్షి, చిత్తూరు: మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు నాలుగురోజుల ముందే ఓటర్లకు పలు రకాల తాయిలాలు అందజేస్తున్నారు. పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచి నిఘా ఎక్కువగా ఉంటుందని భావించి నగదు పంపిణీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ప్రధానంగా చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు రాత్రి సమయాల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల లిస్టు ఆధారంగా ఓటుకు రూ.500 ఇస్తున్నట్లు సమాచారం. మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. పుత్తూరు పట్టణంలో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుందనుకున్న వార్డులను వదిలేసి, మిగిలినవార్డుల్లో తెలుగుతమ్ముళ్లు డబ్బులు పంపిణీ చేసినట్లు ఆ పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఓటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారని వారు చెబుతున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలోని నాలుగువార్డుల్లో కూడా ఓటుకు *500 చొప్పున డబ్బులు పంచి, ఓటేస్తామని ప్రమాణం చేయించుకున్నట్టు సమాచారం. చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటికే భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. డబ్బులు పంచి ఓటర్లను ఆకట్టుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శివారు డివిజన్లలో అర్ధరాత్రి నగదు పంచుతున్నట్టు తెలిసింది. పుంగనూరు మున్సిపాలిటీ, మదనపల్లె మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బులతో పాటు బియ్యం కూడా అందజేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది. మదనపల్లెలో టీడీపీ అభ్యర్థికి చెందిన బియ్యం బ్యాగ్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు డబ్బులు కన్నా చీరలు, ముక్కుపుడకలు పంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. నగరి మున్సిపాలిటీలోనూ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము సొంతంగానైనా డబ్బులు పంచాల్సిందేనని తమ్ముళ్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఆరు మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్లో అభ్యర్థులు ఓటర్లకు నోటు తాయిలం ఇచ్చేందుకు రంగంలోకి దిగేశారు. -
టీడీపీ పోటీ నామమాత్రమే
మున్సిపాలిటీల్లో ఎన్నికల సరళి పుంగనూరులో నామమాత్రంగా ప్రచారం పలమనేరు, మదనపల్లెలోఉనికి చాటుకునే ప్రయత్నం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, మదనప ల్లె మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుభి మోగించనుంది. ఈ మున్సిపాలిటీల్లో తాము గెలిచే అవకాశం లేదని టీడీపీ వారు చేతులెత్తేశారు. పుంగనూరులో నామమాత్రంగా ప్రచారం చేస్తున్నారు. పుంగనూరులోని 24 వార్డుల్లో ఒకచోట వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. 23 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వైఎస్ఆర్ సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పీ.ద్వారకనాథరెడ్డి ప్రచారం చేస్తున్నారు. రాజకీయా ల్లో అపార అనుభవం ఉన్న పెద్దిరెడ్డి తన శక్తిని ఉపయోగించి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేయనున్నారు. టీడీపీ నుంచి వెంకటరమణరాజు, శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి ఒకటిరెండు రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వెంకటరమణరాజు, శ్రీనాథరెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పుంగనూరులో 20 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, మూడు వార్డుల్లో మాత్రమే పోటీ ఉంటుందని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పలమనేరులో.. పలమనేరు మున్సిపాలిటీలోనూ వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ మెజారిటీ రానుంది. మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో 18 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ సునాయాసంగా గెలుస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి నాయకత్వంలో పీవీ.కుమార్, పీ.శారద, హేమంతకుమార్రెడ్డి (మిలటరీ హేమంత్), మండి సుధ, మురళీకృష్ణ, ఖాజా, చాంద్బాష, రహీంఖాన్ వంటి ముఖ్య నాయకులు మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనిమిది వార్డుల్లో ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించారు. వీరంతా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో 37,900 ఓట్లు ఉండగా ముస్లిం ఓట్లు సుమారుగా 13,900 ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓట్లన్నీ వైఎస్ఆర్ సీపీకేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తరఫున గల్లా అరుణకుమారి అనుచరులు ఐదుగురు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో సుభాష్చంద్రబోస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాయకులు ఎవ్వరూ టీడీపీ తరఫున కనిపించకపోవడంతో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు కూడా నీరసించారు. మదనపల్లెలో.. మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ పోటీ నామమాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. వైఎస్ఆర్ సీపీ పది వార్డుల్లో సునాయాసంగా గెలుస్తుందని, 18 చోట్ల టీడీపీకి, వైఎస్ఆర్ సీపీకి పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య 18 వార్డులకు జరిగే పోటీలో మూడొంతుల వార్డులు వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని, అంటే సుమారు 14 వార్డుల్లో తప్పకుండా గెలుస్తామనే ధీమాలో వైఎస్ఆర్ సీపీ వారు ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు షమీమ్అస్లామ్, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డిల నాయకత్వంలోజిల్లా నాయకులు ఉదయ్కుమార్, గాయత్రీదేవి, మైనారిటీల నాయకులు బాబ్జాన్, అక్తర్ మహమ్మద్, మాధవరెడ్డి వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరులోనూ వైఎస్ఆర్ సీపీ అంటే ఎంతో అభిమానం ఉందని వారు చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున రాందాస్ చౌదరి, బోడపాటి శ్రీనివాస్, నాదెండ్ల విద్యాసాగర్, శ్రీరామ్చినబాబు, మిట్స్ కృష్ణకుమార్, బీఆర్ తులసీప్రసాద్ ప్రచారం సాగిస్తున్నారు. -
జగన్ విజయాన్ని అడ్డుకోలేరు
పమిడిముక్కల, న్యూస్లైన్ : చంద్రబాబునాయుడు వంటి కుహనా నేతలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ...దివంగత మహానేత తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత, జననేత జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. వీరంకిలాకులోని కళ్యాణమండపంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కల్పన మాట్లాడుతూ వెఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మండలానికి చెందిన పలువురు ప్రముఖులతో సహాదాదాపు 200మందికి పైగా వెఎస్సార్సీపీలో చేరారు. వారికి కల్పన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరావు , మండలకాంగ్రెస్ అధ్యక్షుడు దండమూడి బాపూజీ , డీసీసీ ప్రధానకార్యదర్శి పి.చంద్రపాల్, మండల కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి పి.యేషయ్యబాబు, వేల్పూరు సర్పంచి టి.బోసుబాబు, మండలకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టి.యేసుబాబు, మేడూరు ఎంపీటీసీ అభ్యర్థి డి.వెంకటదుర్గారావు , పమిడిముక్కల ఎంపీటీసీ అభ్యర్థి శొంఠి నాగేశ్వరావు, హనుమంతపురం ఎంపీటీసీ అభ్యర్థి వై.వీరవెంకటేశ్వరావు , కిష్ణాపురం ఎంపీటీసీ అభ్యర్థి వీరంకి చిరంజీవి , కాంగ్రెస్పార్టీనాయకులు బి.రమేష్, కూచిపూడి వెంకటేశ్వరావు, అబ్ధుల్నజీర్ , ఎన్.రాజ్యలక్ష్మి, తిమోతి, యేసుపాదం, సంగీతరావు, కాకాని, ఎన్.కుటుంబరావు, కె.మాధవ, పి.దశరద, పి.రామ్మెహన్, అరిగె రమేష్లతోపాటు పెనుమత్స, హనుమంతపురం తదితర గ్రామాలకు చెందిన వందలాదిమంది పార్టీలో చేరారు. కల్పన మాట్లాడుతూ పార్టీలో చేరినవారికి ప్రాధాన్యత కల్పిస్తామని హమీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్ ఆశయసాధనకు పాటుపడుతున్న జగన్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే వైఎస్సార్సీపీలో చేరామని శొంఠి వెంకటేశ్వరావు, బాపూజీ తెలిపారు. మండలంలో పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా పాటుపడతామని తెలిపారు. మండలంలోని ప్రముఖ నాయకులంతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యేగా తననూ, ఎంపీ అభ్యర్థిగా కె. విద్యాసాగర్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కల్పన కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి బొబ్బా సురేష్ను మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. మాజీ ఎంపీపీ లోయరామశాస్త్రి, సర్పంచులు పి.విజయరాణి, జి.నాగమల్లేశ్వరావు, పార్టీనాయకులు అజీజ్, పి.మేరీ, మహేష్, సతీష్, నాగేంద్ర, రమేష్, బాలాజీ, రాజ్యలక్ష్మి,రజని, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
వసూల్ రాజా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయనొక పార్టీ జిల్లా అధ్యక్షుడు. సంపాదన కోసం పరితపిస్తున్నారు. సొమ్ము చేసుకోవడానికి సరైన అధికారిక పదవి దక్కలేదని ఏళ్ల తరబడి అసంతృప్తిగా ఉన్న ఆయనకు అనూహ్యంగా లభించిన జిల్లా పార్టీ పదవిని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బీ-ఫారాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే అప్రతిష్టను మూటగట్టుకున్నారు... తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని, చైర్పర్సన్ పదవికి లైన్ క్లియర్ చేస్తానని ఆశావహుల నుంచి డబ్బు గుంజుతున్నారు. దీంతో సొమ్ముతో పాటు వసూలు రాజాగా బాగా పేరు గడించారు. అప్పుడప్పుడు పోటీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తప్ప విజయం దరిచేరడం లేదు. దీంతో ఎన్నాళ్లైనా ఇలాగే ఉండిపోతున్నాన్న ఆవేదన ఒక పక్క, కూడబెట్టుకోవడానికి అవకాశం దక్కడం లేదన్న బాధ మరో పక్క ఆయన్ను పీడించాయి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఎన్నికల రాక ముందు నమ్మకంగానే పనిచేశారు. అధినేతల అడుగుజాడలో నడుస్తూ, వంగి వంగి నమస్కారాలు పెట్టి గురుభక్తి చాటుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు రావడమే తరువాయి చెలరేగిపోవడం మొదలు పెట్టారు. తొలుత మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ. లక్షలు తీసుకున్నారు. దీనిపై పార్టీలో కూడా వివాదం చోటు చేసుకుంది. గొడవ పడేవరకూ కార్యకర్తలు వచ్చారు. ఇదే విషయమై అధినేతలు సంజాయిషీ కోరినట్టు తెలిసింది. అయినా ఆయన మారలేదు. ఎంపీటీసీ బీ-ఫారాలు ఇచ్చేందుకు కూడా సొమ్ము వసూలు చేశారు.ఇదొక వైపు జరుగుతూనే మరోవైపు జెడ్పీ పదవులకు అడ్డు రాకుం డా ఉంటానని, తనవంతు సహకారమందిస్తానని చెప్పి ఆశావహుల నుం చి పెద్ద ఎత్తున వసూలు చేశారు. అలాగే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని కూడా కొంతమంది నుంచి రూ.20లక్షల నుంచి రూ.40లక్షల వరకు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడాయన ఆ పార్టీలో హాట్ టాపి క్ అయ్యారు. అధికారంలో లేనప్పుడే ఇంత దందా చేస్తుంటే చేతిలోకి అధికారం వస్తే ఇంకెంత రెచ్చిపోతారోనన్న చర్చ మొదలైంది. అంతా అధికారం కోసం పాకులాడుతుంటే పార్టీ పదవితో డబ్బులు కోసం ఆరాటపడుతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన గురిం చి ఆ పార్టీలోని నాయకులను కదిపితే ఆయనకిదేమీ కొత్తకాదని, కాకపోతే ఇప్పుడు మరింత ఎక్కువగా గడిస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి ఆయ న తీరుతో పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
కిస్సా కుర్సీకా!
జెడ్పీ పీఠం కోసం పోటీ పడుతున్న వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు కాడెవదిలేసిన కాంగ్రెస్ ! విజయనగరం ఫోర్ట్, న్యూస్లైన్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఏ పార్టీ దక్కించుకుంటే ఆపార్టీ బలపడుతుందనే విశ్వాసం జిల్లా నేతల్లో ఉంది. అందుకే ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో పార్టీలు పోటీపడుతున్నాయి. జిల్లా పరిషత్ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతాయి. దీంతో జిల్లాలో ఉన్న నేతలంతా ఏ పనికైనా జిల్లా పరిషత్ మెట్లు ఎక్కవలసిందే. చైర్మన్ పీఠంపై అధిరోహించే నేతలకు జిల్లా అంతటా పరిచయాలు ఏర్పడతాయి. బలమైన నాయకునిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ పదవి వల్లే మంత్రి బొత్స కుటుంబీకులు రాజకీయంగా ఎదిగారు. ఎంపీ ఝాన్సీలక్ష్మి తొలుత జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం బొబ్బిలి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆమెను విజయం వరించింది. ఆ తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎంపీగా, ఆమె భర్త బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా, మరిది అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయినప్పటికీ బొత్సకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. బొత్స కుటుంబం రాజకీయ ఎదుగుదలకు జిల్లా పరిషత్ చైర్మన్ గిరీ ఎంతో దోహదపడింది. 10 ఏళ్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఆధీనంలో ఉంది. ఈసారి ఆ పార్టీకి అభ్యర్థులు కరువవడంతో మిగతా పార్టీలు ఈ పీఠంపై దృష్టిసారించాయి. ఎలాగైనా పదవిని కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు పోటీ జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు వైఎస్సార్, టీడీపీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకుని సత్తా చాటాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కార్యకర్తల బలం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తమకు ప్లస్పాయింట్లు అవుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని జెడ్పీటీసీ స్థానాలకు ఈ రెండు పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించాయి. ఈ పీఠం కోసం పోటీపడుతున్న తెలుగుదేశంలో పార్టీలో చాలా వరకు కాంగ్రెస్ రక్తం చేరడం, వారి మధ్య సక్యత లేకపోవడంతో లోపాయికారిగా ఎక్కడ దెబ్బ కొడతారోనని ఆ పార్టీ నేతలు మధనపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి నేతలు వచ్చారు గాని, క్యాడర్ రాకపోవడంతో ఈ పరిణామం ఎటు దారితీస్తుందోని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న నేతలు కలిసినప్పటికీ మనసులు మాత్రం కలవలేదన్నది ఆ పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. జిల్లాలో 34 జెడ్పీ స్థానాలున్నాయి. వీటిలో 18 స్థానాలు గెలుచుకున్న పార్టీకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 135 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే వీరి భవితవ్యం తేలనుంది. స్వతంత్రులు కీలకం ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు గెలిచినా వారికి మంచి డిమాండ్ ఉంటుంది. వైఎస్ఆర్ సీపీ, టీడీపీలకు జెడ్పీటీసీ స్థానాలు సమానంగా వస్తే స్వతంత్ర అభ్యర్థుల బలంతోనే జెడ్పీ పీఠాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో ఈ కుర్చీ ఎవరికిదక్కనుందో తేలిపోనుంది. -
వైఎస్ఆర్సీపీలో పలువురి చేరిక
ఎం.ఆర్.అగ్రహారం(తెర్లాం రూరల్), న్యూస్లైన్: త్వర లో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కుమ్మక్కై నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయ కర్త ఆర్వీఎస్కెకె రంగారావు(బేబీనాయన) అన్నారు. తెర్లాం మండలంలోని ఎంఆర్ అగ్రహారం పంచాయతీ సర్పంచ్ దాలి లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 200 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం రాత్రి చేరారు. అలాగే ఇదే పంచాయతీ కుమ్మరిపేట గ్రామానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్ ముచ్చి సత్యనారాయణ ఆధ్వర్యంలో బేబీనాయన సమక్షంలో పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బేబీనాయన మాట్లాడుతూ తమ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంద న్నారు. ైవె ఎస్ఆర్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసి న పథకాలన్నీ మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్ర మే కొనసాగించగలరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వై ఎస్ఆర్ సీపీ అన్నిజిల్లాల్లో అఖండ విజయం సాధించి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను అత్యధికమెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మండల పార్టీ నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, కూనాయవలస సర్పంచ్ బొమ్మి శ్రీనివాసరావు, డి.గదబవలస మాజీ సర్పంచ్ వావిల పల్లి ఆదినారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోరుకు సిద్ధం
ఒంగోలు, న్యూస్లైన్: జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపైనే దృష్టి సారించారు. అయితే ఈ పోరులో కాంగ్రెస్పార్టీ పూర్తిస్థాయిలో కుదేలైంది. కనీసం అభ్యర్థులను కూడా బరిలోకి దింపలేక చేతులెత్తేసింది. డీసీసీ అధ్యక్షుడు సైతం తన నియోజకవర్గంలోనే పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు లోక్సత్తాతోపాటు కమ్యూనిస్టులు, బీజేపీ, బీఎస్పీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆదివారం సాయంత్రానికి 539 మంది జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారిలో 212 మంది సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల సంఖ్య 327 మంది. మొత్తం 790 ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైఎస్సార్సీపీకి 9 స్థానాలు లభించగా టీడీపీకి 4, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు లభించాయి. మిగిలిన 773 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీ జరగనున్నాయి. ఇక జెడ్పీ చైర్మన్ అభ్యర్థి పోరుకు సిద్ధం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ గుడ్లూరు, పుల్లలచెరువు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో గుడ్లూరు నుంచి ఆయన ఉపసంహరించుకొని పుల్లలచెరువు నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి అభ్యర్థులుగా భావిస్తున్న మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మన్నె రవీంద్ర దొనకొండ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో అభ్యర్థి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పొన్నలూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జనన మరణాల నివేదికలు సకాలంలో పంపాలి ఒంగోలు సెంట్రల్, న్యూస్లైన్ : జనన మరణాల నివేదికలు సకాలంలో పంపాలని డెరైక్టరేట్ ఆఫ్ సెన్సస్ అదనపు డైరక్టర్ వై సుబ్రహ్మణ్యం ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వచ్చే జనన మరణ నెలసరి నివేదికలు కౌంటర్ ఫైళ్లతో పాటూ సకాలంలో జనన మరణ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపడంలో జరుగుతున్న జాప్యాలను పరిశీలించడానికి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కందుకూరు, పొన్నలూరు, సింగరాయకొండ, మర్రిపూడి, పొదిలి మండలాలను సందర్శించారు. వివిధ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులతో క్షేత్ర స్థాయిలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పరిశీలనలో కుటుంబ నియంత్రణ గణాంక అధికారి పీ శ్రీధర్రావు, అబ్దుల్ కలాం, ఎల్డీ కంప్యూటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీటీసీ బరిలో135 మంది
విజయనగరం ఫోర్ట్, న్యూస్లైన్ : జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు 135 మంది, 549 ఎంపీటీసీ స్థానాలకు 1,495 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థలకు సోమవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొననున్నాయి. 549 ఎంపీటీసీ స్థానాలకు గాను 3,286 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 1791 మంది బరిలో నుంచి తప్పుకున్నారు. అలాగే 34 జెడ్పీటీసీ స్థానాలకు 250 నామినేషన్లు దాఖలుకాగా, ఒక నామినేషన్ను తిరస్కరించారు. 114 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 135 మంది బరిలో నిలిచారు. జిల్లాలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్యే అసలైన పోటీ నెలకొంది. చాలా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు పడని పరిస్థితి నెలకొంది. 549 ఎంపీటీసీలకు గాను కేవలం 296 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. 34 జెడ్పీటీసీ స్థానాలకు గాను 24 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచారం ఉధృతం
వైఎస్ఆర్సీపీ దెబ్బకు టీడీపీ నేతల పరుగులు సాక్షి, చిత్తూరు: మున్సిపోల్స్ ప్రచార పర్వం తారస్థారుుకి చేరుకుంది. నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రచారానికి దిగడంతో ఆయా పట్టణాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్ఆర్ సీపీ జోరుకు టీడీపీ నాయకులు కంగారుపడుతున్నారు. ప్రచారం ప్రారంభ మైనా చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ నాయకుల్లో గందరగోళం వీడలేదు. చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏఎస్ మనోహర్ ఉదయం నాలుగు వార్డులు, సాయంత్రం నాలుగు వార్డుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు గ్రూప్ తగాదాలను సర్దుబాటు చేసుకోవడంలోనే మునిగిపోయారు. ప్రధానమైన కఠారి మోహన్, జంగాలపల్లి గ్రూప్లు ఎవరి మద్దతుదారులను వారు గెలిపించుకునేందుకు పరిమితమయ్యాయి. పుంగనూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం చేసుకుంది. చాలా వార్డుల్లో ఏకపక్షంగా ముందు కు దూసుకెళ్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మైనారిటీల మద్దతుతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుంది. ఇద్దరు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్న టీడీపీ ఇంత వరకు ఇక్కడ ప్రచారం లో వెనుకే ఉంది. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటున్న అనిషారెడ్డి భర్త శ్రీనాథరెడ్డి రెండు రోజులుగా రంగంలోకి దిగారు. పుత్తూరు, నగరి మున్సిపాల్టీల్లో వెఎస్ఆర్ సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆధ్వర్యంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి పోటీ ఇచ్చేందుకు, ప్రచారం ఉధృతం చేసేందుకు ఎమ్మెల్యే గాలి ముద్దుక్రిష్ణమనాయుడు తంటాలు పడుతున్నారు. వార్డు వార్డుకు వెళ్లేందుకు తన కుమారులను ప్రచారంలోకి దించారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఎమ్మేల్యే బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి వైఎస్ఆర్ సీపీ హవాను అధిగమించేందుకు ఏం చేయాలా? అని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డుల్లో ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రచారానికి ప్రజల్లో స్పందన లేదు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఇల్లిల్లు తిరుగుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న సుభాష్ చంద్రబోష్, ఆయన తమ్ముడు బాలాజీ ప్రచారం కోసం పరుగులు పెడుతున్నారు. మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీం అస్లాం వార్డుల్లో తిరుగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న గంగారపు రాందాస్చౌదరి సన్నిహితులతో కలిసి దేశం అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లోకి వెళ్తున్నారు. -
సత్తాచూపుతాం!
బొబ్బిలి, న్యూస్లైన్: పుర ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని, జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో మంచి ఫలితాలను సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. బొబ్బిలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.పార్టీకి ఫ్యాన్ గుర్తు వచ్చాక జరుగుతున్న మొదటి ప్రత్యక్ష ఎన్నికలు ఇవని, అందుకు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో సత్తా చూపుతాం! చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఈ నెల 27 జగన్ జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార సమయం ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో నాలుగు పురపాలక సంఘాల్లో సభలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నాలుగు రోజులుగా తాను వార్డుల్లో ఇంటింట ప్రచారం చేస్తున్నానని, ఆ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. సాధారణ ఎన్నికల కంటే నెల 15 రోజుల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని, అయినా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో జయభేరి మోగిస్తామని చెప్పారు. తమ పేరు చెప్పుకొని చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారని తెలిసిందని, దానిని ఎవరూ నమ్మవద్దని, తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారంలు ఇచ్చిన తరువాత ఫ్యాను గుర్తును కేటాయించారని,వారికే ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్బ్యాంకు మాజీ చైర్మన్ గునాన వెంకటరావు, 7వ వార్డు అభ్యర్థి రాంబార్కి శరత్కుమార్, మాజీ కౌన్సిలరు బొబ్బాది తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వలస ఓటర్ల కోసం వల
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్లైన్: హలో బావా... ఎలాగున్నావ్రా.. సెల్లీ,పిల్లలు బాగున్నారట్రా... ఏటీ లేదు కానీ... మన వార్డు ఎలచ్చన్లు ఈ నెల 30న జరుగుతున్నాయి బావా... ఈ సారి నేనే పోటీ చేస్తున్నాను... నువ్వు.. సెల్లి వచ్చి ఓటేసి వెల్లండి బావా..! హలో ... హలో... అన్నయ్య... బాగున్నావా... ఏంటి సంగతులు... పెద్దోడి పెళ్లి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి... మీకేటి అన్నయ్య మంచి కోడలనే పట్టేశారు... ఏం లేదుకానీ... ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మన వార్డులో నేను పోటీ చేస్తున్నా... నువ్వు, ఒదినా, పెళ్లి కొడుకు ఓటేయటానికి రావాలి... ఇదీ ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆత్రం. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్గా భావిస్తుండడంతో అభ్యర్థులు కూడా అందుకు తగినట్టుగా వలస ఓటర్లపై ప్రలోభాల వల విసురుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారికి ఫోన్ చేసి... ఊరొచ్చి ఓటేయమని వేడుకుంటున్నారు. వలస ఓటర్ల కరుణ కోసం అన్ని వైపులా ప్రయత్నాలు ప్రారంభించారు. మహిళలకు కానుకలు, మగవారికి మనీ, మందూ సమర్పించుకుంటూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. త్రిముఖ పోటీ అనివార్యమవడంతో ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్క ఓటును కూడా వదులుకోవడానికి సాహసించడంలేదు. తమకు వారి ముఖాలు తెలియకపోయినా అక్కా, బావా అంటూ వరసలు కలుపుతూ ఫోన్లు చేస్తున్నారు. లేని ప్రేమలను ఒలకబోస్తున్నారు. దారిఖర్చులు తామే భరిస్తామని, వచ్చి వెళ్లిన సమయంలో నష్టపోయిన కూలీ డబ్బులకు అదనంగా మరింత సొమ్ము ఇస్తామని, ఇక్కడ ఏ లోటూ లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తూ తమకు ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న.... దూరప్రాంతాకు వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా తమ అభ్యర్థనను విన్నవించుకుంటున్నారు. విజయనగరం మున్సిపాలిటీ లో 40 వార్డుల్లో లక్షా 76 వేల 931 మంది ఓటర్లు ఉండగా... ఆయా వార్డుల నుంచి 159 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 41 వేల మంది ఓటర్లు ఉండగా ఆయా వార్డుల నుంచి 117 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 32,500 ఓటర్లు ఉండగా 95 మంది అభ్యర్థులు, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 33,796 ఓటర్లుండగా... 153 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. అయితే నాలుగు మున్సిపాల్టీల పరిధిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉపాధి, ఉద్యోగావకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికలు రావటంతో బరిలో ఉన్న అభ్యర్థులు వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించి ఫోన్ చేయడంతో పాటు, నేరుగా అక్కడికి వెళ్లి మరీ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. -
వైఎస్ఆర్ సీపీలో పలువురి చేరిక
గజపతినగరం రూరల్, న్యూస్లైన్: దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఎస్సీ కాలనీకి చెందిన మాలపేట వాసులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, దత్తిరాజేరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి గొటివాడ అప్పలమ్మ ఆధ్వర్యంలో వారంతా సోమవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీల తీరుతో విసుగు చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెదమానాపురం మాజీ సర్పంచ్లు గుటివాడ దాసు, గుటివాడ సంజీవి తెలిపారు. అన్ని మండలాల్లోనూ కాంగ్రెస్ ఖాళీ అయినట్లు సర్వేలు చెబుతున్నాయని, భవిష్యత్లో ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని కడుబండి శ్రీనివాసరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు సైని కుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీలో సుమారు 250 కుటుంబాలు చేరినట్లు పెదమానాపురం ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. కార్యక్రమంలో గుటివాడ కుప్పారావు, గుటివాడ ఆంతోని, గుటివాడ సింహా చలం, గుటివాడ గాబ్రేలు, యజ్జా భాస్కరరావు, పెదమానాపురం సర్పంచ్ సి.హెచ్.సన్యాశినాయుడు, ఉపసర్పంచ్ కె.కనక రాజు, కనిమెరక తిరుపతి, రౌతు రామునాయుడు, జిల్లా గొర్రెల పెంపకం దారుల సలహా సంఘం అద్యక్షులు బమ్మిడి అప్పలనాయుడు, సీహెచ్ సన్యాశినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తుది పోరుకు సై
శ్రీకాకుళం, న్యూస్లైన్: ప్రాదేశిక ఎన్నికల పోరులో తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ముగి సింది. సోమవారం సాయంత్రం 3 గంట లకు ఉపసంహరణ గడువు ముగియడం తో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రధాన పోటీదారులతోపాటు, మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంతన్నది తేలిపోయింది. ఇక ప్రచారంతో హోరెత్తించి.. పోలింగ్లో అదృష్టం పరీక్షించుకోవడమే మిగిలింది. జిల్లా లో 38 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 37 స్థానాలకు 139 మంది రంగంలో ఉన్నారు. అలాగే 675 ఎంపీటీసీలు ఉండగా 26 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 649 స్థానాలకు 1511 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. జెడ్పీటీసీలకు మొత్తం 296 నామినేషన్లు దాఖల య్యాయి. వాటిలో 12 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీనిపై నలుగురు అభ్యర్థులు కలెక్టర్కు అప్పీల్ చేసుకోగా ఒకరి నామినేషన్ మాత్రమే తీసుకున్నారు. దీంతో 285 మంది అభ్యర్థులు తుది పోరుకు సై మిగిలారు. కాగా ఆదివారం 17 మంది, సోమవారం 128 మంది(మొత్తం 145) నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుదిపోరులో 139 మంది మిగి లారు. 675 ఎంపీటీసీలకు 3550 నామినేషన్లు దాఖల య్యాయి. తిరస్కరణలు, ఉపసంహరణలు పోగా 24 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించా రు. మిగిలిన 651 ఎంపీటీసీలకు ఎన్నిక జరగనుండా 1511 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 24 ఎంపీటీసీలు ఏకగ్రీవం జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 24 ఎంపీటీసీలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. జిల్లాలో 675 ఎంపీటీసీలు ఉండగా.. 3,550 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత సింగిల్ నామినేషన్లు మిగిలిన 24 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వజ్రపుకొత్తూరు మండలంలో 5 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. సోంపేటలో 3, పాతపట్నం, కొత్తూరు, కవిటి, కంచిలి, నరసన్నపేట మండలాల్లో రెండు చొప్పున, సీతంపేట, హిరమండలం, జలుమూరు, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, బూర్జ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ పరిస్థితి దారుణం జిల్లా ఇటీవలి వరకు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. ఏకంగా 23 జెడ్పీటీసీల్లో ఆ పార్టీకి అభ్యర్థులు లేకుండాపోయారు. ఈ నెల 20న నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేనాటికి 18 మండలాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. అయితే మరో 5 జెడ్పీటీసీల అభ్యర్థులు సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 23 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ పోటీలో లేకుండాపోయింది. నరసన్నపేట ఇప్పటికే ఏకగ్రీవం కాగా 15 మండలాల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ, 22 మండలాల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్య ముఖాముఖీ పోరు జరగనుంది. కాగా నరసన్నపేట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున శిమ్మ ఉషారాణి, టీడీపీ తరఫున చింతు శకుంతల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అఫిడవిట్పై సంతకాలు లేకపోవడంతో ఉషారాణి నామినేషన్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానం ఏకగ్రీవమైంది. ఇక ప్రచార పోరు ఇప్పటి వరకు నామినేషన్ల ఘట్టంతో బీజీగా ఉన్న అభ్యర్ధులు, నాయకులు మంగళవారం నుంచి అసలు పోరు ప్రారంభించనున్నారు. అన్ని మండలాల్లోనూ ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ నెలకొననుంది. గ్రామీణ ఓట్లను కొల్లగొట్టేందుకు పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ 15 మండలాలకే పరిమితమైంది. అయితే ఆ మండలాల్లోనూ ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగా తెలుగుదేశం పార్టీలో చాలా మండలాల్లో అసంతృప్తి నెలకొంది. అసంతృప్తవాదులను బుజ్జగించేందుకు జిల్లా నాయకులు ప్రయత్నిస్తున్నా అవి ఫలించే సూచనలు కనిపించడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంలోనే పలువురు అభ్యర్థులు, వారి బంధువులు తమ నాయకులపై దుమ్మెత్తిపోస్తూ కనిపించారు. ఇటువంటి పరిణామాలతో తెలుగుదేశం బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం సహకారం తీసుకోవాలని యోచిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజాదరణ ఉందని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు లోపాయికారి ఒప్పందాలతో ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం ప్రజల్లో తమకున్న ఆదరణే కొండంత అండగా భావిస్తూ.. అదే భరోసాతో ప్రచారపర్వంలోకి దూకుతున్నారు. నేడు గుర్తుల కేటాయింపు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థులకు మంగళవారం గుర్తులు కేటాయించనున్నారు. నామినేషన్లు ప్రక్రియ ముగియడంతో గుర్తులు కేటాయింపుపై అధికారులు దృష్టి సారించారు. బీ ఫారాలు సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు వారు కోరిన గుర్తులు, అవి లేని పక్షంలో వేరొక గుర్తు కేటాయిస్తారు.సోమవారం రాత్రంతా ఈ కసరత్తు పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నంలోగా అభ్యర్థుల తుది జాబితాను గుర్తులతో సహా ప్రకటిస్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
హవా
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు ఏవైనా సరే ప్రజానీకంలో ఒకే తీర్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే తీర్పును చూపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా కాగా అందులో 16 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఆరు స్థానాలను మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. ఒక స్థానంతోనే కాంగ్రెస్ సరిపెట్టుకుంది. మరో స్థానాన్ని వైఎఎస్సార్సీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. మొత్తం మీద స్థానిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. జిల్లాలో 2011 నుంచి ప్రత్యక్ష ఎన్నికలు ఏవైనా అంతిమ విజయం వైఎస్సార్సీపీదేనని రుజువు అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రకటనతోనే ఆపార్టీ మద్దతుదారుడుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసిన దేవగుడి నారాయణరెడ్డి గెలుపొందారు. 2011 మేనెల 8న కడప పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో ఏడు నియోజకవర్గాలలో ఎన్నికలు చోటుచేసుకోగా వైఎస్సార్సీపీకి 67 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 14.2శాతం, తెలుగుదేశం పార్టీకి 12.5శాతం ఓట్లు లభించాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి 6,92,251 ఓట్లు లభించాయి. అత్యధికంగా 5,45,672 ఓట్ల మెజార్టీని వైఎస్ జగన్ సాధించారు. 2012 మే12న చోటు చేసుకున్న ఉప ఎన్నికల్లో కూడా జిల్లా ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. రాయచోటిలో 57శాతం ఓట్లు ఆపార్టీకి దక్కగా, కాంగ్రెస్ పార్టీకి 15.9శాతం, తెలుగుదేశం పార్టీకి 21.4శాతం ఓట్లు ద క్కాయి. రైల్వేకోడూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 53.8 శాతం ఓట్లు లభించగా, కాంగ్రెస్ పార్టీకి 27.9శాతం, తెలుగుదేశం పార్టీకి 14.2 శాతం ఓట్లు దక్కాయి. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి 52.5శాతం ఓట్లు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి 26.4శాతం, తెలుగుదేశం పార్టీకి 14.6 శాతం ఓట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ తన ఆధిపత్యాన్ని ఆ ఎన్నికల్లో చాటుకుంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 52.5 శాతం నుంచి 67 శాతం వరకూ ఓటర్లు ఆపార్టీకి అండగా నిలిచారు. సహకార, పంచాయితీ ఎన్నికల్లో సైతం.... ఎన్నికలు ఏవైనా వైఎస్సార్సీపీ బలపర్చిన వ్యక్తులకే అనుకూలంగా ఓటర్లు తీర్పు చెబుతున్నారు. అందుకు సహకార సంఘాలు, పంచాయితీ ఎన్నికలు దర్పం పడుతున్నాయి. జిల్లాలో 77 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 21 చోట్ల తప్పనిసరిగా ఓటమి చెందుతామని భావించిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2చోట్ల కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించలేదు. 54 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే 34 సహకార సంఘాల పాలక వర్గాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. ప్రభుత్వం వాయిదా వేసిన 21 సంఘాలకు తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వాటిని కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పంచాయితీ ఎన్నికల్లో కూడా ఆపార్టీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేశారు. 783 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో 453 సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. 152చోట్ల కాంగ్రెస్ పార్టీ వర్గీయులు, 143 చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 35చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఇలా జిల్లాలో ఎన్నికలు ఏవైనా లక్ష్యం ఒక్కటేనని జిల్లా ప్రజానీకం ఏకపక్షంగా తీర్పు ఇస్తున్నారు. ప్రస్తుతం అదే తీర్పును స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపెడుతున్నారు. ఇప్పటికే ఏకగ్రీవంగా 24 ఎంపీటీసీలు ఎంపికైతే 16చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఒక చోట ఆపార్టీ సానుభూతి పరుడు స్వతంత్రుడుగాను ఎంపికయ్యారు. -
కింజరాపు కుటుంబానికే ఆయన గులాం!
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: సొంత ఆలోచనలు లేవు.. నిర్ణయాలు అసలే తీసుకోలేరు.. అటువంటి వ్యక్తి మా పార్టీకి జిల్లా అధ్యక్షుడు..! పోనీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ మొత్తానికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే.. అదీ లేదు.. పార్టీ అంటే కింజరాపు కుటుంబమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు... వారి అడుగులకు మడుగులొత్తుతూ.. వారు చెప్పినట్లే చేస్తూ.. ఆ కుటుంబ గుమాస్తాగా మారిపోయారు. చివరికి పార్టీ అధినేత నిర్ణయాలనే బుట్టదాఖలు చేస్తున్నారు.. ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎవరో టీడీపీకి వ్యతిరేకులు చేసినవి కావు.. సాక్షాత్తు ఆ పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి కొవగాపు సుధాకర్ నోటి నుంచి వెలువడిన ఆరోపణల తూటాలు. పార్టీలో ఉంటూనే పార్టీ జిల్లా అధ్యక్షుడిని.. కింజరాపు కుటుంబాన్ని తుర్పారబట్టారంటే.. వారి వైఖరితో ఆయన ఎంత విసిగిపోయారో.. ఇంకెంత క్షోభకు గురయ్యారో అర్థమవుతుంది. శ్రీకాకుళంలో సోమవారం ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ పార్టీ జిల్లా నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.. సొంత ఆలోచనలు లేని.. నిర్ణయాలు తీసుకోలేని జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ.. కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులకు వ్యక్తిగత గుమాస్తాగానే వ్యవహరిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నాకే స్థానిక ఎన్నికలకు సంబంధించి బీ ఫారాలు ఇవ్వాలని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా చౌదరి బాబ్జీ పట్టించుకోలేదు. నన్ను కాదని.. నేరుగా అచ్చెన్నాయుడికి ఇచ్చారు. జిల్లా పార్టీకి బాధ్యుడిగా ఉండాల్సిన ఆయన కింజరాపు నేతల చేతిలో రబ్బర్ స్టాంప్లా మారిపోయారు. అలాగే బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు కాకుండా, కాంగ్రెస్లో అసమర్థ మంత్రిగా పేరు పొందిన శత్రుచర్ల విజయరామరాజుకు పాతపట్నం టిక్కెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు నారాయణను కలిసి, నియోజకవర్గం పరిస్థితులను వివరించాను. ఆయన స్పందించి వెంటనే పార్టీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. బాబుకు కూడా పరిస్థితి వివరించాను. పాతపట్నం టిక్కెట్ విషయమై శత్రుచర్లకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, నాకే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన బీ ఫారాలు కూడా నాకే ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు, ఇదే విషయాన్ని బాబ్జీకి కూడా సమాచారం పంపారు. అయితే పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను సైతం బాబ్జీ లెక్కచేయకుండా, కింజరాపు నేతలనే అధిష్టానంగా భావించి పాతపట్నం నియోజకవర్గ బీ ఫారాలు తీసుకెళ్లి అచ్చెన్నాయుడి చేతిలో పెట్టారు. ఈ విషయంలో నాకు తీవ్ర అవమానం జరిగినట్లు భావిస్తున్నానని.. అసలు అచ్చెన్న, రామ్మోహన్లకు ఎన్టీఆర్, చంద్రబాబులపై కూడా గౌరవం లేదని.. అంతా ఎర్రన్నాయుడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే రీతిలో కింజరాపు నేతలు పనిచేస్తే రానున్న ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శ్రీకాకుళం ఎంపీగా రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యేగా కలమట రమణ గెలిచే పరిస్థితులు కన్పిస్తున్నాయని.. ఇదే జరిగితే దీనికి పూర్తి బాధ్యత కింజరాపు నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షుడిదే. -
వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎర్రబెల్లి
ప్రధాన కార్యదర్శిగా రేవూరి టీడీపీ కమిటీలో జిల్లా నేతలకు చోటు మేనిఫెస్టో కమిటీలో ముగ్గురు సాక్షి, హన్మకొండ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు కమిటీల్లో జిల్లాకు చెందిన ఐదుగురికి స్థానం లభించింది. తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎర్రబెల్లి దయాకర్రావును నియమించారు. ఇదే కమిటీకి ప్రధాన కార్యదర్శిగా రేవూరి ప్రకాశ్రెడ్డి నియమితులయ్యారు. తెలుగుదేశం తెలంగాణ మేనిఫెస్టో కమిటీలో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్లో సోమవారం ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్తో సరి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని ఆశించిన టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావుకు నిరాశే ఎదురైంది. కొత్త రాష్ట్రంలో పార్టీపై పట్టు కోసం ఎర్రబెల్లి చేసిన ప్రయత్నాలకు చంద్రబాబునాయుడు గండికొట్టారు. ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపుచ్చారు. తెలంగాణ ఎన్నికల కమిటీ కార్యనిర్వాహక అధ్యక్ష (వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిని ఎర్రబెల్లి దయాకర్రావుకు కట్టబెట్టారు. రాష్ట్ర స్థాయిలో ఎర్రబెల్లి దయాకర్రావుకు పదవి ఇచ్చినా... ఇదే స్థాయి పదవి ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి చంద్రబాబునాయుడు ఇచ్చారు. -
జెడ్పీటీసీ బరిలో 338 మంది
ఎంపీటీసీ స్థానాలకు 3042 మంది పోటీ జెడ్పీటీసీకి అర్హత పొందిన నామినేషన్లు 611 ఉపసంహరించుకున్న వారు 273 ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు జిల్లా పరిషత్, న్యూస్లైన్: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఈనెల 17నుంచి 20వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో జెడ్పీటీసీ స్థానాలకు 785 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న జరిగిన నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాలతో 23 తిర స్కరణకు గురయ్యాయి. ఇందులో పది మంది అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోగా మహబూబాబాద్ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న జెన్నారెడ్డి వెంకటేశ్వర్లు నామినేషన్ను ఆమోదించారు. 50 జెడ్పీటీసీ స్థానాలకు 785 నామినేషన్లలో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సెట్లు వేసిన వారిని అధికారులు మినహాయించారు. దీంతో నామినేషన్ల సంఖ్య 611కు చేరింది. ఇందులో 273 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోగా 338 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. బీ-ఫారంలు 232 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి దాఖలు చేశారు. మిగిలిన 106 మంది అభ్యర్థులను స్వతంత్రులుగా భావించి రాత్రి పొద్దుపోయాక గుర్తులు కేటాయించారు. జిల్లాలోని 705 ఎంపీటీసీ స్థానాలకు ఉపసంహరణ అనంతరం 3,042 మంది బరి లో ఉన్నట్లు తెలిసింది. పోటీలో అసంతృప్తులు... పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు పలువురు బరిలో ఉన్నారు. జనగామ జెడ్పీటీసీగా తన భార్యకు టికెట్ రాకపోవడంతో అధికార పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లింగాలఘనపురం లో సీనియర్లను వదలి జూనియర్కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో రెబల్గా రంగంలోకి దిగా రు. తాడ్వాయి మండలంలో జెడ్పీటీసీగా పార్టీ బీ-ఫారాలను ఇద్దరు దాఖలు చేయడంతో రెబల్ అభ్యర్థి కూడా పోటీలో మిగిలారు. పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే బీ-ఫారంలు ఇచ్చారు. కొత ్తగా చేరిన వారి వర్గానికి టికెట్లు దక్కకున్నా బరిలో నిలి చారు. కాగా, జెడ్పీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను కార్యాలయ నోటీసు బోర్డులో చూసుకోవాలని ఆర్ఓ నాయక్ సూచించారు. -
నువ్వా.. నేనా..?
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : జిల్లాలోని 57 జెడ్పీటీసీ స్థానాలకు 366 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మొత్తం 57 స్థానాలకు పోటీ చేస్తుండగా, పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ సగం స్థానాలకే పరిమితమయ్యాయి. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపింది. టీడీపీ 28 స్థానాల్లో, బీజేపీ 22 స్థానాల్లో పొత్తులో భాగంగా పోటీచేస్తుండగా, మరో ఏడు స్థానాల్లో స్నేహపూర్వకంగా తలపడుతున్నాయి. సీపీఐ 11 స్థానాల్లో పోటీలో ఉండగా, సీపీఎం ఐదు స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో, మహిళల స్థానాలపై రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. చైర్పర్సన్ హోదాకు తగిన విధంగా ఆయా స్థానాల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. జెడ్పీ పీఠం దక్కాలంటే కనీసం 29 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జెడ్పీ పీఠాన్ని దక్కించుకొనేంతగా కాకున్నా, చైర్పర్సన్ ఎన్నికల్లో కీలకం కావాల్సిన సీట్లైనా సొంతం చేసుకోవాలని ఇతర పార్టీలు ఆరాటపడుతున్నాయి. వైదొలిగిన శారద జెడ్పీ చైర్పర్సన్ రేసులో ఉంటున్నట్టు ప్రచారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి నేరెళ్ల శారద రామడుగు నుంచి వేసిన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. పార్టీ టికెట్ కోసం ఢిల్లీ వరకు ప్రయత్నాలు చేసినప్పటికి ఆమెకు ఫలితం లేకపోయింది. కోల మంజులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో, ఆమె తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఖరారు కాని పోలింగ్ తేదీలు : గందరగోళంలో అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్పై ఎన్నికల సంఘం ఎటూ తేల్చకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ముందుగా ఎన్నికలను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం, ఆ తరువాత 6, 8 తేదీల్లో రెండు విడుతలుగా నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మొదటి, రెండవ విడతల వివరాలను వెల్లడిస్తామని చెప్పినప్పటికి, ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ప్రచారపత్రాల్లో ఏ పోలింగ్ తేదీ వేయాలో తెలియక తికమకపడుతున్నారు. -
పోలింగ్ 90 శాతానికి తగ్గొద్దు
అర్హులైన ప్రతి ఓటరుపేరుజాబితాలో ఉండాలి అధికారులకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ సూచన బీఎల్ఓలు ఇంటింటికి పోల్ చీటీలు పంచుతారు ఓటర్ల నమోదుకు రాజకీయ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో 2009 సాధారణ ఎన్నికల్లో 72శాతం పోలింగ్ నమోదయిందని, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 90 శాతానికి తగ్గకుండా చూడాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ జిల్లా అధికారులకు సూచించారు. ఓటర్ల నమోదులో అధికారులతో పాటు రాజకీయ పక్షాలు కూడా సహకరించాలని కోరారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో విడివిడిగా సమావేశ మయ్యారు. కలెక్టర్ జి.కిషన్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీలు వెంకటేశ్వర్రావు, కాళిదాసు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో భన్వర్లాల్ మాట్లాడుతూ పోలింగ్ విషయంలో అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని, అర్హులైన ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆందోళన చేసే పరిస్థితి కల్పించవద్దని చెప్పారు. ఈవీఎంల వాడకంపై ప్రతి ఓటరుకు అవగాహన ఉండేలా ఛైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను భన్వర్లాల్ అభినందించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వారం ముందు పోల్చీటీల పంపిణీ ఓటరు జాబితాలో పేరు విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు పోలింగ్కు వారం రోజుల ముందు బీల్వో(బూత్ లెవల్ ఆఫీసర్)లు ఇంటిం టికి వెళ్లి చీటీలు పంచుతారని, పంపిణీ క్రమంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని భన్వర్లాల్ కోరారు. ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు రాజకీ య పార్టీలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన కండువాలు, జెండాలు ఒకసారి కొనుగోలు చేసినవే ఎన్నికలు పూర్తయ్యేవరకు ఉపయోగస్తామని, వానిటి ప్రతిచోటా లెక్కించడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని భన్వర్లాల్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో టేబుల్, కుర్చీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో కాగ్రెస్ పార్టీ నుంచి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి గుడిమల్ల రవికుమార్, టీడీపీ నుంచి ఎడబోయిన బస్వారెడ్డి, బీజేపీ నుంచి మురళీమనోహర్, సీపీఐ నుంచి టి.శ్రీనివాస్రావు, వీరగంటి సదానందం, బీఎస్పీ నుంచి కట్కం యాదగిరి పాల్గొన్నారు. నిట్లో భన్వర్లాల్.. నిట్ క్యాంపస్ : జిల్లా ఎన్నికల అధికారుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ సోమవారం నిట్ గెస్ట్హౌజ్లో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. భన్వర్లాల్ను కలెక్టరేట్లో జరిగే సమావేశానికి ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్ కిషన్, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు వచ్చారు. ఈ సందర్బంగా భన్వర్లాల్ జిల్లా కలెక్టర్ కిషన్ను సాధారణ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారులతో సమావేశం కావడానికి భన్వర్లాల్ బయలుదేరి వెళ్లారు. -
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి
కట్టంగూర్, న్యూస్లైన్ బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్ర శేఖర్ తెలిపారు. సోమవారం ఎరసానిగూడెం, కల్మెర గ్రామాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేంద్రమోడీ ప్రధాని అయితేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో తలారి యాదగిరి, కటికం శ్రీను, కొరివి శివశంకర్, బంటు సుదర్శన్, శ్రావన్కుమార్రెడ్డి, సురేష్, కార్యక్రమంలో గోలి అమరేందర్రెడ్డి, గుండగోని గిరిబాబు, కూతురు లక్ష్మారెడ్డి, మండల వెంకన్న ఉన్నారు. -
ఏకమవుతున్న తస్మదీయులు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కలసి ఎన్నికల వేళ ప్రజలను మరోసారి వంచి స్తున్నారుు. రాష్ట్రాన్ని నిరభ్యంతరంగా ముక్కలు చేసేసుకోవచ్చం టూ తెలుగుదేశం పార్టీ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం రాసిస్తే.. ఆఖరి బంతి మిగిలే ఉందంటూ చివరి వరకూ నమ్మబలికి జనానికి మొండిచేయి చూపించారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఆ రెండు పార్టీల నాయకులు ఓట్ల కోసం ఏకమవుతున్నారు. ఏమార్చడానికి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. జిల్లాలో సహకార ఎన్నికల నుంచీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయం కొనసాగుతోంది. వ్యవసాయం దండగ అని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన టీడీపీతో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు అనుకూలంగా లేని రైతుల ఓట్లను గల్లంతు చేసింది. అదే పొత్తు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగింది. గెలవడం కోసం ఎంతటికైనా తెగించే ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థులకు మేలు చేసేందుకు అధికార దుర్వినియోగానికి కూడా వెనకాడలేదు. మునిసిపాలిటీల్లో పనులు మంజూరు చేయడం దానిలో భాగంగా జరిగిందే. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలచేశారు. తద్వారా గ్రామీణ నిరుద్యోగులకు గాలమేశారు. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుండగా పాత మిత్రులకు ప్రలోభాలు ఎరవేసి టీడీపీ తనవైపు లాక్కొంటోంది. ఇన్నాళ్లూ చీకటి ఒప్పందాలు చేసుకుని తెరవెనుక మద్దతు తెలిపిన వారిని ప్రత్యక్షంగా తమ పార్టీలో చేర్చుకుంటోంది. తద్వారా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఇందుకోసం సామాజిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా ఓ సామాజిక వర్గానికి నష్టం వాటిల్లుతుందనే భయాన్ని సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి తామంతా ఒక్కటేనని బహిర్గతం చేస్తున్నారు. పదవే ముఖ్యమని చాటుతున్నారు. -
బేరసారాలు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పోలింగ్కు మరో వారం రోజులే గడువు ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఒకప్పటిలా పరిస్థితి లేదు. నేతల హామీలకు ఓట్లు రాలే పరిస్థితి లేదు. దీంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమకు తెలిసిన విద్యలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. బంధుత్వాలతో వరసలు కలుపుకోవడం ఒక ఎత్తయితే.. స్థానిక నాయ కులు, కుల పెద్దలతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. ఓటర్లకు వ్యక్తిగతంగా మందు, నగదు, నజరానాలు అందజేసేందుకూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే డబ్బు మూటలు దిగుతున్నాయి. ఒక్కమాటలే చెప్పాలంటే గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల కోసం బేరసారాలు ఊపందుకున్నాయి. ఈ ప్రక్రియలో చోటా నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే డీల్ మాట్లాడుకుని డబ్బు మూటలు అందజేస్తున్నారు. అభ్యర్థులు కూడా గెలుపే లక్ష్యంగా ఎంతకైనా సై అంటున్నారు. అంతటా ఓటూ... నోటే...! సాధారణ ఎన్నికలను తలదన్నేలా జిల్లాలో మున్సిపల్ పోరు మారుతోంది. కొద్ది రోజుల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఈ ఎన్నికల ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యేలతోపాటు భవిష్యత్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వారు.. బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులకు దన్నుగా నిలుస్తున్నారు. దీంతో ధన ప్రవాహం పెరిగింది. ప్రచారానికే ఒక్కో అభ్యర్థీ రూ.లక్షల మీద ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. భోజనాలు, మద్యం, ఇతర తాయిలాలు ఈ ఖాతాలోకే వస్తాయి. ప్రచారానికి ఖర్చు తడిసిమోపెడవుతున్నా అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం విశేషం. ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఓటుకు ఇంత ఇస్తామని ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 129 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతటా కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఎదురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు టీడీపీ నేతలు. గెలుపే ధ్యేయంగా అడ్డదారులు తొక్కేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు వెచ్చించేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నట్లు వినికిడి. చెర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న అభ్యర్థుల వార్డులో అయితే ఓటు ధర రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం ఎంతైనా వెచ్చించేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా తీవ్రమైన పోటీ ఉన్న వార్డుల్లో 100 నుంచి 200 ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. అలాంటి ఓట్ల కోసం కచ్చితమైన హమీతో రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు ఇస్తామని కొంతమంది ముందుకు వస్తున్నారంట! స్పాన్సర్లను రంగంలోకి దించిన అధికారపక్షం..! ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల కోసం అటు అధికార, ఇటు ప్రతిపక్ష టీడీపీలు స్పాన్సర్లను రంగంలోకి దింపాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ‘నువ్వు ఆ వార్డుకు వంద కేసులు మద్యం పంపించు... నువ్వు ఆ వార్డుకు రూ.3 లక్షలు డొనేషన్ ఇవ్వు...’ అంటూ తమ చేతికి తడి అంటుకోకుండా వారి సేవలు వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి ఇది ఎన్నికల నియామవళికి విరుద్ధం. కానీ సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. దీంతో ధన బలం ఉన్న నాయకులు స్పాన్సర్లకు బాధ్యతలు అప్పగించి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ పరిణామాలతో మున్సిపల్ పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. -
రాజుకుంటున్న అగ్గి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కసి తీర్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండమని పరోక్షంగా హెచ్చరించారు. తనకిష్టం లేకపోయినా పార్టీలోకి వచ్చినందుకు పొమ్మనకుం డా పొగ పెడుతున్నారు. ప్రాదేశిక అభ్యర్థుల బీ-ఫారాలను ఆయన వర్గీయులకు ఇవ్వకుండా ఝలక్ ఇచ్చారు. దీంతో శత్రుచర్లతో పాటు ఆయన వర్గీయులంతా కంగుతి న్నారు. తీవ్ర అవమానానికి గురయ్యామని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారు. తాడో పేడో తేల్చుకోవాలని అనుచరులంతా శత్రుచర్లను డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోకి రాకుండా శత్రుచర్లను నిలువరించకపోయినా తనతో పెట్టుకుంటే ఇంతేసంగతులని హెచ్చరిస్తూ అవమానాలను రుచిచూపిస్తున్నారు. మిగతా విషయాల్లో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. తనతో పాటు థాట్రాజ్కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టాలన్న డిమాండ్తో పార్టీలోకి వచ్చిన శత్రుచర్లకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘ఏరు దాటే వరకు ఏరు మల్లన్న ఒడ్డు దాటక బోడి మల్లన్న’ అన్న చందంగా పార్టీలో చేరేవరకు పాజిటివ్గా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో శత్రుచర్ల రాకపట్ల అయిష్టంగా ఉన్న అశోక్ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. తొలుత జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని ప్రకటించి శత్రుచర్లకు ఝలక్ ఇచ్చారు. ఆ తర్వాత కురుపాం ఎమ్మెల్యే టిక్కెట్ నిమ్మక జయరాజ్కే ఇస్తున్నట్టు అధినేతతో భరోసా ఇప్పించి ‘రాజు’కుంటున్న అగ్గి పరోక్షంగా దెబ్బకొట్టారు. దీంతో జనార్దన్ థాట్రాజ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ప్రాదేశిక ఎన్నికల్లో తమ బలం చూపించి, ఎమ్మెల్యే టిక్కెట్ తనకిచ్చేలా సత్తా చూపించాలన్న ఉద్దేశంతో శత్రుచర్ల ఆశీస్సులతో కురుపాం నియోజకవర్గం పరిధిలోని గరుగుబిల్లి, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో తమ వర్గీయులతో థాట్రాజ్ నామినేషన్ వేయించారు. బీ-ఫారాలు తమకే వస్తాయన్న విశ్వాసంతో అభ్యర్థుల్ని బరిలోకి దించారు. అయితే నిమ్మక జయరాజ్ బరిలోకి దించిన అభ్యర్థులకే పార్టీ బీ-ఫారాలను జిల్లా నాయకత్వం అందజేసింది. దీని వెనుక అశోక్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పక్కా ప్లాన్తో శత్రుచర్లను దెబ్బకొట్టడమే కాకుండా అవమానానికి గురి చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో శత్రుచర్ల వర్గీయులు ‘దేశం’ నాయకత్వంపై మండి పడుతున్నారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ను కలిసి తమ గోడు వినిపించారు. తమకెవరికీ బీ-ఫారాలు ఇవ్వలేదని, పార్టీలోకి వస్తే ఇచ్చే గౌరవమిదేనా అని ప్రశ్నించినట్టు తెలిసింది. అంతా విన్న జగదీష్ ఇందులో తన ప్రమేయం ఏమీలేదని, జయరాజ్తో మాట్లాడుతానని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా ఏదో ఒకటి తేల్చాలని కోరుతూ శత్రుచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. పాతపట్నంలో ఉన్న శత్రుచర్ల వద్దకెళ్లి జరిగిన పరిణామాలు వివరించి, తాడోపేడో తేల్చుకోవాలన్న యోచనకొచ్చారు. ఈ నేపథ్యంలో శత్రుచర్ల ఏ రకంగా పావులు కదుపుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధినేత దృష్టికి తీసుకెళ్లి తమ అనుచరులకు బీ-ఫారాలను సాధిస్తారో లేదంటే బరిలో ఉన్న అభ్యర్థుల్ని రెబెల్గా ఉసిగొల్పుతారో చూడాలి. -
టికెట్ల కోసం తమ్ముళ్ల సిగపట్లు
పార్టీకి పనిచేయని వారికి టికెట్లు ఎలా ఇస్తారు మాజీ మంత్రుల ఎదుట తంబళ్లపల్లె పంచాయతీ మదనపల్లె నాయకుడిపై కార్యకర్తల ఆగ్రహం బి.కొత్తకోట, న్యూస్లైన్: పార్టీ టికెట్ల వ్యవహారంపై తంబళ్లపల్లె తెలుగు తమ్ముళ్లు మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయు డు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎదుట శివాలెత్తారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఈ వ్యవహారంలో మదనపల్లెకు చెందిన పార్టీ నాయకుడి పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో విరుకుచుపడ్డారు. ఆదివారం మదనపల్లె రెడ్డీస్కాలనీలోని ఓ మిల్లు లో మదనపల్లె టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు కోసం తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు మదనపల్లెకు రావాలని ఆహ్వానం పలికారు. దీంతో బి.కొత్తకోట, తంబళ్లపల్లె, ముల కలచెరువు మండలాలకు చెందిన నాయకులు సొసైటీకాలనీలోని శంకర్ కార్యాలయానికి తరలివచ్చారు. మాజీ మం త్రులు వచ్చారనే విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లారు. ముద్దుకృష్ణమనాయుడు, గోపా లక్రిష్ణారెడ్డి వెలుపలకు వస్తుండగా కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టా రు. పార్టీలో ఒక్కరోజైనా పనిచేయని చల్లపల్లె భాస్కర్రెడ్డికి తంబళ్లపల్లె జెడ్పీటీసీ టికెట్ను ఎలా ఇస్తారని నిలదీశా రు. పార్టీకి చెందని వ్యక్తులకు ఎంపీటీసీ టికెట్లు ఇస్తున్నారని, ఇంతకాలం పార్టీకి పనిచేసిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇంతలో తంబళ్లపల్లె వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మదనపల్లె నాయకుడిపై విరుచుకుపడ్డారు. సింగిల్విండో, సర్పంచ్ ఎన్నికల్లో తమకు ముష్టి ఇచ్చినట్టు చేతులు దులుపుకున్నారని దుమ్మెత్తిపోశారు. దీనిపై తేరుకొని మాజీమంత్రులు సోమవారం గౌనివారి శ్రీనివాసులు తంబళ్లపల్లెకు వచ్చి సమస్యలు తీరుస్తారని అక్కడి నుంచి శంకర్ కార్యాలయానికి వచ్చేశారు. అప్పటికే బి.కొత్తకోట జెడ్పీటీసీ టికెట్ వ్యవహా రంపై నిలదీసేందుకు నాయకులు వేచి ఉండగా టికెట్ విషయంలో సర్వే జరుగుతోందని, ఎవరికి అనుకూలమైన ఫలి తాలోస్తే వారికి టికెట్ ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ పర్వీన్తాజ్ కలుగజేసుకున్నారు. దశా బ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారి గతేం టని ప్రశ్నించారు. మీరు జెడ్పీ చైర్మన్ స్థాయి వ్యక్తని చెప్పడంతో అసహనానికి గురైన ఆమె తాను జెడ్పీటీసీ స్థాయి వ్యక్తేనని, పెద్దహోదా అవసరంలేని సమాధానమిచ్చారు. బీసీలు, మైనార్టీల మద్దతు పార్టీకి అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో సమావేశం పూర్తికాకనే మాజీ మంత్రులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ముందే ఖరారు చేసి ముచ్చట్లు బి.కొత్తకోట జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో అభ్యర్థులను ముందే ఖరా రు చేసుకున్న నాయకులు ఆశావహుల తో మొక్కుబడి చర్చలు జరిపారు. మదనపల్లెలోని శంకర్ కార్యాలయంలో తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు జీ.శంకర్ యాదవ్, మదనపల్లె నాయకులు మల్లికార్జుననాయుడులు ఆశావహులతో వేర్వేరుగా చర్చించారు. టికెట్ ఎవరికిచ్చినా పని చేయాలంటూ మొక్కుబడి గా మాట్లాడి పంపారు. దీనిపై టికెట్లు ఆశిస్తున్న నాయకులు అసంతృప్తికి గురయ్యారు. బీ.ఫారాలు దగ్గరే పెట్టుకుని నాటకాలాడుతున్నారని, మమ్మల్ని తి ప్పించుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. -
పరీక్షల కాలం..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాబోయే రెండు నెలలు అందరికీ పరీక్షల కాలమే. సామాన్యుడి నుంచి నాయకుల వరకు, విద్యార్థి నుంచి ఓటరు వరకు అందరికీ పరీక్షలే పరీక్షలే. ఓ వైపు టెన్త పరీక్షలు దగ్గరపడడంతో విద్యార్థులు హైరానా పడుతున్నారు. మరోవైపు మున్సిపల్ మొదలుకుని అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తుండడంతో నాయకులు హడావుడి చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యా ప్రజలూ పరీక్షలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 27 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. జిల్లాలో 30,648 మంది విద్యార్థులు తమ భవిష్యత్ను పరీక్షించుకోనున్నారు. ఉక్కపోత, కరెంటు కోతకు తోడు టీ20 వరల్డ్ కప్ క్రికెట్ల వేడిని సైతం పక్కకుపెట్టి విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంకొకవైపు నేతలు మున్సిపల్ సమరానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో స్థానిక ఎన్నికలకూ గ్రౌండ్ వర్క చేస్తున్నారు. దీంతో పాటు అతిపెద్ద సార్వత్రిక యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా నాయకులు కష్టపడుతున్నారు. ఎలచ్చన్లు... జిల్లాలో ప్రస్తుతం నాలుగు మున్సిపాల్టీల్లో 129 కౌన్సిలర్ స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్సత్తా తదితర పార్టీల అభ్యర్థులు కూడా తామేమీ తక్కువ కాదంటున్నారు. మున్సిపోల్స్ తర్వాత జరిగే 549 ఎంపీటీసీ స్థానాలకు, 34 జెడ్పీటీసీ స్థానాలకు రాజకీయ పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. దీంతో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల కోసం కార్యకర్తలు, నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. మేలో జరిగే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం ఎన్నికలకు ఆశావహులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఎవరికి టికెట్లు దక్కుతాయో ఎవరికి దక్కవోనని ఆందోళన చెందుతున్నారు. టిక్కెట్ల వేట కూడా పరీక్షా కాలంగా తయారైంది. ప్రజలకు కూడా... ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు దంచేస్తున్నాయి. ఇప్పుడే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. దీనికి తోడు కరెంటు కోతలు ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. దీనికి తోడు పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయడం. నాయకుల వెనుక తిరగడం కూడా వీరికి పరీక్షే. ప్రస్తుతం ఆర్థిక స్థోమత ఉన్న వారు ఏసీ, కూలర్లు తదితర సౌకర్యాలతో ఉపశమనం పొందుతున్నా సామాన్య ప్రజల కు మాత్రం అవస్థలు తీరడం లేదు. ఇక అప్రకటిత కోతలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సందట్లో సడేమియాలా ఇప్పుడీ ఎన్నికల ప్రచారాలతో నాయకులు చెవులను హోరె త్తిస్తున్నారు. -
బస్సు యాత్ర
దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి పూర్వ వైభవం కోసం నాయకుల తంటాలు కనుచూపు మేరలో కానరాని నాయకత్వం, క్యాడర్ అధికారం అనుభవించి సైకిలెక్కేశారు మాజీ సీఎం కిరణ్ సొంత కుంపటి తిరుపతిలో చిరంజీవికి హ్యాండిచ్చిన అనుచరవర్గం సాక్షి, చిత్తూరు: పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించాలని నూతన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చిత్తూరు జిల్లాలో కొంచెం కూడా ఫలించేలా కనిపించడం లేదు. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించనున్న బస్సుయాత్ర ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు ఇవ్వడం కష్టమే. నూతన పీసీసీ సారథి రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మరికొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి చిత్తూరు జిల్లాలో 25వ తేదీన బస్సుయాత్ర ప్రారంభం కానున్నది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్గ్రౌండ్స్లో ఎన్నికల బహిరంగసభ నిర్వహించనున్నారు. తరువాత రోజు కూడా జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ బస్సుయాత్రకు అవసరమైన ఖర్చులు కూడా జిల్లా నాయకత్వం పెట్టుకునే పరిస్థితి లేదు. డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి నిన్న మొన్నటి వరకు ఒక మండల నాయకుడిగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయూలపై పట్టు సాధించడం అంత సులభం కాదు. అదే సమయంలో తిరుపతి ఎంపీ చింతామోహన్ ఒక్కడే కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా మిగి లారు. ప్రస్తుతం ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్కు ప్రధాన నాయకత్వం లేదు. నిన్నమొన్నటి వరకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒకరకంగా షాకే. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా చివరి వరకు మంత్రి పదవి అనుభవించారు. నాలుగుసార్లు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి కొద్దిరోజుల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనికి తోడు ఇప్పటి వరకు తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్న వెంకటరమణ పదవిలో ఉంటూనే తెలుగుదేశం జెండా భుజానికి ఎత్తుకున్నారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ ఇదే బాటలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో రవి, షాజహాన్ బాషా కూడా కాంగ్రెస్ను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్కు ప్రధాన నాయకత్వం కొరవడటంతో పరిస్థితి దారుణంగా మారింది. 14 నియోజకవర్గాల్లో చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్లో లేరు. తిరుపతిలో చిరంజీవికి దిక్కులేదు సామాజికవర్గం దయతో చిరంజీవి తిరుపతిలో ఎమ్మెల్యే అయ్యారు. అదే సామాజికవర్గం ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా చిరంజీవి తిరుపతికి వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. తిరుపతిలోని పూర్వపు పీఆర్పీ నాయకులు అందరూ చిరంజీవి వెంట కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి అనుభవిస్తూ తమను గాలికి వదిలేశాడని, ఆయన దారి ఆయన చూసుకున్నాడన్న కోపంతో ఆయనకు షాకిచ్చారు. ఒకప్పుడు చిరంజీవికి సన్నిహితంగా ఉన్న సైకం జయచంద్రారెడ్డి కాంగ్రెస్ను వదలి టీడీపీ నీడన చేరారు. తిరుపతి నియోజకవర్గం పీఆర్పీ నాయకులుగా, చురుకుగా ఉంటూ చిరంజీవి వెంట నడిచిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఊకా విజయకుమార్ తదితర పూర్వపు పీఆర్పీ నాయకులు అందరూ ఇప్పుడు చంద్రబాబు పంచన చేరారు. దీంతో చిరంజీవి అనుచరవర్గమంతా తుడిచి పెట్టుకుపోయినట్టయింది. రెండో శ్రేణితో నెట్టుకొచ్చే యత్నం రెండో శ్రేణిలో ఉన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను బతిమాలి, భవిష్యత్లో పదవులు ఇస్తామని ఆశలు చూపుతూ వారిని సమావేశాలకు రప్పించుకుంటున్నారు. నేరుగా అధినాయకులే జిల్లాకు వస్తున్నారు. ‘మీరు ఏం చెబితే అదే చేస్తాం... టిక్కెట్ల విషయంలోనూ మీ సలహాలు తీసుకుంటాం’ అంటూ చోటా నాయకులకు చెబుతూ వారు ‘చేయి’ జారిపోకుండా తంటాలు పడుతున్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి
ఇచ్ఛాపురం,న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి కోరారు. ఆది వారం సాయంత్రం మున్సిపాలిటీలోని 5, 6,7, 8, 9 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఓటర్లను పలకరించి, పార్టీ కరపత్రాలను అందజేస్తూ వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీని గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నా రు. మహిళలు శాంతికి పూల మాలలు వేసి హారతులిచ్చి స్వాగతం పలికారు. కాగా వృద్ధులకు పూలమాల లు వేసి వారిని శాంతి గౌరవించారు. మంగళవారం పేటలొ ఓ వృద్ధురాలు తన ఇంటికి వచ్చిన రెడ్డి శాంతిని అప్యాయంగా పలకరించి వైఎస్ఆర్కాంగ్రెస్కే తన మద్దతు అని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు నరేంద్రయాదవ్, మాజీ ఎమ్యెల్యే పిరియా సాయిరాజ్, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, నాయకులు కాళ్ల దేవరాజ్, ఏఎంసీ చైర్మన్ శ్యాంపురియా, మున్సిపల్ కన్వీనర్స్ పిలక పోలారావు, మున్సిపల్ అభ్యర్థులు సోమయ్య, పి.మంజులత, నం దిక హరిత, పల్లంటి తారకేశ్వరి పాల్గొన్నారు. -
నేడు నామినేషన్ల ఉపసంహరణ
జిల్లా పరిషత్, న్యూస్లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రం 3.00 గం టల వరకు ఉంది. ఈనెల 17 నుంచి కొనసాగిన నామినేషన్ల ప్రక్రి య 20న ముగిసింది. 21న పరిశీలన అనంతరం 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వారు జిల్లా ఎన్నికల అధికారి కిషన్కు 22న అప్పీల్ చేసుకోగా సంబంధిత అభ్యర్థుల నామినేషన్లను 23న కలెక్టర్ నేతృత్వంలో తిరిగి పరిశీలించారు. ఇందులో మహబూబాబాద్ జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన జెన్నారెడ్డి వెంకటేశ్వ ర్లు పోటీ చేసేందుకు కలెక్టర్ అనుమతిచ్చినట్లు రిటర్నింగ్ అధికారి ఈఎస్.నాయక్ తెలిపారు. ఉపసంహరణ కార్యక్రమం నేడు ఉద యం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల లోపు ఉం టుంది.. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఉపసంహరణ పత్రాలు ఎవరికివ్వాలి జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా పరిషత్లోని రిటర్నింగ్ అధికారి ఈఎస్.నాయక్కు, ఎంపీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థులు మండల పరిషత్ కార్యాలయాల్లోని రిటర్నింగ్ అధికారులకు ఉపసంహరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఉపసంహరణ పత్రాలను నామినేషన్ వేసిన అభ్యర్థి వ్యక్తిగతంగా.. లేదా ప్రతిపాదకుడి ద్వారా నైనా అందించవచ్చు. ప్రతిపాదకుడి ద్వారా అందించే అభ్యర్థులు అతడి సంతకాన్ని అటెస్టెడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పోటీలో ఉన్నట్లు పరగణించబడతారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న ఏడుగురు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఆదివారం ఏడుగురు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్.నాయక్ తెలిపారు. వారిలో గూడూరు మండ లానికి చెందిన వేం శ్రీనివాస్రెడ్డి, రేగొండకు చెందిన మండల ప్రవర్థన, కోసరి మంజుల, పరకాలకు చెందిన కోరె రమేష్, జంగిలి రాజమౌళి, ములుగుకు చెందిన రుద్రోజు ఆనందాచారి, జఫర్గఢ్కు చెందిన బానోతు బుజ్జమ్మ ఉన్నట్లు తెలిపారు. -
నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి
మూడు గంటల వరకే సమయం జెడ్పీ నామినేషన్లు 422 తిరస్కరణకు గురైనవి 52 ఉపసంహరణలు 20 ఎంపీటీసీ నామినేషన్లు 4,820 తిరస్కరణకు గురైనవి 204 ఉపసంహరణలు 329 ప్రధాన అభ్యర్థుల గుండెల్లో మోగుతున్న రె‘బెల్స్’ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగియనుంది. రె‘బెల్స్’ బెడద ఉన్నచోట్ల వారిని పోటీనుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు తమ యత్నాలు ముమ్మరం చేశారు. వారి నామినేషన్లు ఉపసంహరింపజేయకపోతే తమ ఓటుబ్యాంకు చీలుతుందనే భయం వారిని వెన్నాడుతోంది. మచిలీపట్నం న్యూస్లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలకు 422 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 52 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 826 ఎంపీటీసీ స్థానాలకు 4,820 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 204 తిరస్కరించారు. ఆదివారం జెడ్పీటీసీ అభ్యర్థులు 20 మంది తమ నామినేషన్లు ఉపసంహరించారు. ఎంపీటీసీ సభ్యులు 329 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐదు కౌంటర్ల ద్వారా నామినేషన్లు స్వీకరించగా ఈ కౌంటర్ల ద్వారానే నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నడుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తొలగని రెబల్స్ బెడద... అనేకచోట్ల ప్రధాన అభ్యర్థులకు రెబల్స్ బెడద ఇంకా తొలగలేదు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన అభ్యర్థులు బుజ్జగించో.. ప్రలోభ పెట్టో.. పోటీనుంచి వారిని తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ ఓట్లు చీలకుండా చూసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే నేతలు పలువురు రెబల్ అభ్యర్థులను బుజ్జగించి ఉపసంహరింపజేయగా, మిగిలినవారు మాత్రం పట్టుదల వీడకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏదేమైనా సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉండే అవకాశముంది. ఉపసంహరణలు ఇలా... జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్సీపీలో నెరుసు షర్మిల (గన్నవరం), కారుమంచి రమేష్, కారుమంచి శ్రీనివాసరావు (గూడూరు), నరసారెడ్డి దనుకొండ, చెరకు నరసారెడ్డి, శీలం కృష్ణారెడ్డి, చావా వెంకటేశ్వరరావు (గంపలగూడెం), బోయిన వేణుగోపాల్ (కోడూరు), కటికోల ప్రమీలారాణి (జగ్గయ్యపేట) తమ నామినేషన్లు ఉపసంహరించారు. టీడీపీలో అమ్మనబోయిన రూతు (జగ్గయ్యపేట), కోగంటి శివనాగమల్లేశ్వరి (కంచికచర్ల), భూపతి శ్రీనివాసరావు (పెడన), అబ్బూరి హేమలత, కలపాల రజని (బాపులపాడు), కావిటి కృష్ణకుమారి (ఎ.కొండూరు), పాలంకి విజయలక్ష్మి (రెడ్డిగూడెం), తురకా తిరుపతమ్మ (వీరులపాడు), తాతా సుస్మిత (మొవ్వ), బొడ్డు నాగమ్మ (ముదినేపల్లి) తమ నామినేషన్లు ఉపసంహరించిన వారిలో ఉన్నారు. రేపల్లె సీతారామాంజనేయులు (మోపిదేవి) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్నారు. ఎంపీటీసీల వివరాలు ఇలా ఉన్నాయి... జిల్లాలో సోమవారం ఎంపీటీసీ స్థానాలకు 329 మంది అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ 121, టీడీపీ 170, కాంగ్రెస్ 11, సీపీఎం 1, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 22 మంది అభ్యర్థులు ఉన్నారు. -
ప్రచారం హోరు
మున్సిపల్ ప్రచారానికి గడుపు మరో అయిదు రోజులే నర్సీపట్నం, యలమంచిలిలో ప్రలోభాలకు యత్నాలు బరిలో మొత్తం 143 మంది రేయింబవళ్లు అభ్యర్థుల ప్రచారం వైఎస్సార్సీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఆపసోపాలు సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ ఎన్నికల ప్రచా రం ముగింపునకు గడువు ముంచుకొస్తోంది. 30న జరగనున్న పోలింగ్కు రెండురోజుల ముందే ప్రచారం ముగించాల్సి ఉన్నందున పార్టీలు సర్వశక్తులూ పణంగా పెట్టి ప్రచారం చేస్తున్నాయి. వార్డులు హోరాహోరీ ప్రచారంతో హోరెత్తుతున్నాయి. నర్సీపట్నం,ఎలమంచిలి మున్సిపాల్టీల్లో మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవరికివారు పార్టీనేతల సహాయంతో అవిశ్రాం తంగా ప్రచారం తీవ్రం చేస్తున్నారు. పనిలో పనిగా ఓటర్లను ప్రభావితం చేయడానికి తెరవెనుక ఏర్పాట్లు సాగుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ఏర్పాట్లు సాగుతున్నా, ఎన్నికలకోడ్ పేరుతో నిఘా గట్టిగా ఉండడంతో రాత్రి రంగంలోకి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్సార్సీపీ ఊహించనివిధంగా రెండుమున్సిపాల్టీల్లో దూసుకుపోతూ ఉండడంతో అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం తీవ్రం చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరెండు మున్సిపాల్టీల్లో మంగళవారం నుంచి ప్రచారానికి వస్తూ ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చేట్టు కనిపిస్తోంది. ఆయన రాకతో కచ్చి తంగా రెండు మున్సిపాల్టీల్లో వైఎ స్సార్సీపీ విజయఢంకా మోగించనుందని కార్యకర్తలు ఉత్సాహంగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎ స్సార్సీపీ-టీడీపీ మధ్యేనన్నది విస్పష్టం. విజయావకాశాలు వైఎస్సార్సీపీకే ఉండడంతో టీడీపీ నేతలకు ఏంచేయాలో అర్థం కావడంలేదు. దాంతో పార్టీ బలహీనంగా ఉన్న వార్డులలో సీనియర్ నేతలు ప్రచారానికి వస్తున్నారు. నర్సీపట్నంలో పార్టీ సీనియర్నేత అయ్యన్నపాత్రుడు వార్డు అభ్యర్థుల కన్నా ఎక్కువగా ప్రచారం చేస్తుండడం విశేషం. నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ మరింత బలపడడంతో గట్టి పోటీ ఇవ్వాలన్న పట్టుదలతో అయ్యన్న నేతృత్వంలో పార్టీ నాయకులు పని చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వార్డుల్లో ఓటర్లపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కూడా యత్నిస్తున్నారన్న విమర్శలు ఉ న్నాయి. ఎలమంచిలిలోనూ వైఎస్సార్సీపీకి అడ్డుకట్ట వేయాలన్న ఆరాటంతో టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. అందుకే ఇటీవల పార్టీలో చేరిన కన్నబాబురాజు ఆదివారం నుంచి స్వ యంగా ప్రచారం మొదలుపెట్టారు. పోలీసుల నిఘా తీవ్రతరం గడచిన కొన్నిరోజులుగా పోలీసులు రెండుమున్సిపాల్టీల్లో నిఘా మరింత తీవ్రం చేశారు.ఈప్రాంతాలకు వచ్చిపోయే మార్గాల్లో చెక్పోస్టులు పెంచారు.ఇప్పటివరకు గ్రామీణప్రాంతంలో సుమారుగా రూ. 51 లక్షల నగదు స్వాధీనంచేసుకున్నారు.నర్సీపట్నం,ఎలమంచిలో సమస్యాత్మకప్రాంతాలు ఎక్కువగానే ఉన్ననేపథ్యంలో అనకాపల్లి,సబ్బవరం ఇతర ప్రాంతాలనుంచి ఈనెల 28 రాత్రికి అదనపు బలగాలను దింపనున్నుట్టు ఎస్పీ దుగ్గల్ వివరించారు. పోలింగ్రోజున వీడియోలతో పోలింగ్స్టేషన్ల వద్ద నిఘా పెంచనున్నారు. -
బరిలో నిలిచేదెవరో?
నేడు తేలనున్న లెక్కలు ఏకగ్రీవాల కోసం రాత్రి రాజకీయాలు... జోరుగా గ్రూపుల మంతనాలు బలమైన అభ్యర్థులను దింపేందుకు {పధాన పార్టీల వ్యూహం బి-ఫారం ఇవ్వకుంటే స్వతంత్రులే విశాఖ రూరల్, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికల ముఖ చిత్రం నేడు స్పష్టంకానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగియనుండడంతో తుది పోరులో అభ్యర్థులు ఎవరన్నది కొలిక్కి రానుంది. నామినేషన్ల సమర్పించిన వారిలో ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే ఉపసంహరించుకున్నారు. ఇంకా ఒక్కో స్థానానికి ఒక పార్టీ నుంచి ముగ్గురు నుంచి 10 మంది వరకు పోటీ ఉన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో 39 జెడ్పీటీసీ స్థానాలకు 387, 656 ఎంపీటీసీలకు 4264 నామినేషన్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం అధికారులు వివిధ కారణాలతో ఆరింటిని తిరస్కరించారు. దీంతో ప్రస్తుతం 381 నామినేషన్లు ఉన్నాయి. శని,ఆదివారాల్లో భారీగా నామినేషన్ల ఉపసంహరణలు ఉంటాయని అధికారులు భావిం చారు. అయితే కేవలం ఐదుగురు మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు యుగియనుండడంతో భారీగా ఉపసంహరణలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తగ్గనున్న నామినేషన్లు కొంత మంది అభ్యర్థులు నాలుగైదు సెట్లు నామినేషన్లు వేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో డెమ్మీలగానూ వేయించారు. ఎన్ని సెట్లు వేసినా అన్నింటిని ఒకటిగానే పరిగణిస్తారు. అలాగే అభ్యర్థుల డెమ్మీలు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఈ విధంగా 100 వరకు నామినేషన్లు సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావి స్తున్నారు. జోరందుకున్న బుజ్జగింపులు ఉపసంహరణ గడువు సమీపిస్తుండడంతో రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయి. నయోనో, భయానో వారిని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీల అగ్రనాయకులు రంగంలోకి దిగారు. గడువు సమీపిస్తుండటంతో ప్రత్యర్థులకు దీటైన వారిని పోటీలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రెబల్స్ వల్ల నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో నాయకులు అభ్యర్థులకు తాయిళాల ఎరవేస్తూ వారిని సర్ధిచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారు. రాత్రిళ్లు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం లోగా వీరిని ఓ దారికి తెచ్చుకోకుంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న భయం అన్ని పార్టీలను వెంటాడుతోంది. వామపక్ష పార్టీలు, బీజేపీ మినహా మిగిలిన అభ్యర్థులందరూ బి-ఫారం లేకుండానే పార్టీల పేరు మీద నామినేషన్లు వేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గం టలలోగా అభ్యర్థులు బి-ఫారంను అధికారులను సమర్పించాల్సి ఉంది. భి-ఫారం ఇవ్వనిపక్షంలో వారిని సత్వంత్రులుగానే పరిగణిస్తారు. ఇండిపెండెంట్లుగానే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. -
దేశం కోటకు బీటలు
పాపన్నపేట,న్యూస్లైన్: పాపన్నపేట దేశం కోట బీటలు వారుతోంది. స్థానిక సమరం ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఎన్నికల యుద్ధానికి ముందే కొంత మంది అభ్యర్థులు అస్త్ర సన్యాసం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. గెలుపుపై అపనమ్మకంతో టీఆర్ఎస్లో చేరి కొందరు..మద్దతిస్తూ మరి కొందరు.. రాజకీయ పదవులు పొందేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలో పాపన్నపేట మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొంత మంది మాత్రం టీడీపీలోనే ఉంటూ ఎంపీటీసీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న స్థానాల్లో నామినేషన్లు ఉపసంహరించుకుని, టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఎంపీపీ పదవిపై ఆశతో అటు జెడ్పీటీసీకి, ఇటు ఎంపీటీసీకి టీడీపీ తరఫున నామినేషన్ వేయించిన ఓ కీలక నేత ఇప్పుడు టీఆర్ఎస్లో చేరేందుకు గులాబీ నేతలతో మంతనాలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కొత్తపల్లికి చెందిన కుల నేత, సొసైటీ బాధ్యులు, మూడు నాలుగు గ్రామాలకు చెందిన టీడీపీ సర్పంచ్లు, కార్యకర్తలు సొంత పార్టీకి పంచ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మండల స్థాయి టీడీపీ నేత టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు పార్టీలోనే ఉంటూ ఎంపీటీసీ అభ్యర్థుల్లో బలహీనమైన అభ్యర్థులను రంగం నుంచి తప్పించి టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పార్టీ వీడినా.. వారు గతంలో తమ మిత్రులే కాబట్టి, వారే మండల పరిషత్ అధ్యక్ష పదవి చేపట్టేలా చూడాలని వీరు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి ఒక్క ఎంపీటీసీ స్థానం నుంచి కూడా నామినేషన్ వేయక పోగా, మరో రెండు స్ధానాల నుంచి అభ్యర్థులను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నింటికన్నా ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏమిటంటే జెడ్పీటీసీకి,ఎంపీటీసీ స్థానానికి తన కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించిన టీడీపీకి చెందిన ఓ కీలక నేత టీఆర్ఎస్లోకి మారితే , టీడిపికి జెడ్పీటీసీ అభ్యర్థే ఉండని పరిస్థితి నెలకొని ఉంది. -
చేతులెత్తేశారు !
‘స్థానికం’లో తేలిపోయిన కాంగ్రెస్ 33 జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నిల్ 685 ఎంపీటీసీల్లో నామినేషన్లు లేవు వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులెత్తేశారు. జిల్లాలోని అన్ని స్థానాల నుంచి కనీసం అభ్యర్థులనూ నిలబెట్టలేకపోయారు. జిల్లాలోని 33 మండలాల నుంచి జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ రాలేదు. 901 ఎంపీటీసీ స్థానాలకు గాను 685 సెగ్మెంట్లలో అభ్యర్థులు కరువయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థులేరీ? జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి మెజారిటీ స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీకి చావుదెబ్బతగిలింది. చిత్తూరు డివిజన్ పరిధిలో యాదమరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం, గుడిపాల, రామచంద్రాపురం, పాలసముద్రం, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థులు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. తిరుపతి డివిజన్లోపిచ్చాటూరు, పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, పులిచెర్ల, సత్యవేడు, బీఎన్.కండ్రిగ మండలాల నుంచి నామినేషన్లు పడలేదు. మదనపల్లె డివిజన్లో గంగవరం, చౌడేపల్లె, గుర్రంకొండ, చిన్నగొట్టిగల్లు, కలికిరి, కురబలకోట, వాల్మీకిపురం, పీటీఎం, పలమనేరు, రొంపిచెర్ల, సోమల, మదనపల్లె రూరల్, నిమ్మనపల్లె, రామసముద్రం, పీలేరు, కేవీ పల్లె జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ నుంచి ఆ పార్టీ తప్పుకుంది. ఎంపీటీసీల్లో ఘోరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా అభ్యర్థులు మొహం చాటేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 901 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 216 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. -
రాజన్న రాజ్యాన్ని సాధిద్దాం
కోటవురట్ల, న్యూస్లైన్ : రాజన్న రాజ్యం కోసం అందరం ఐక్యంగా పోరాడదామని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమరనాథ్ అన్నారు. ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయరాజు, పాయకరావుపే ట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెంగల, ఏటికొప్పాక షుగర్స్ చైర్మన్ రామ భద్రరాజు, రామచంద్రరాజు తది తరులతో కలిసి ఆయన కోటవురట్లలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలూ కైవసం చేసుకుని జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇద్దామన్నారు. రెండు ముక్కలైన తెలుగుజాతిని కాపాడగల నేత జగన్ మాత్రమేనన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చవద్దంటూ పోరాడిన ఏకైక హీరో జగన్మోహన్రెడ్డి అన్నారు. మహానేత వైఎస్సారే ఉండుంటే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేదికాదన్నారు. పేదల కోసం ఆయన అందించిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని గాడిలో పెట్టినే నేత వైఎస్సార్ అన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనంతా అవినీతిమయమేనన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే అమ్మఒడి పథకం, పింఛన్ సొమ్ము పెంపు, డ్వాక్రా రుణాల మాఫీతో బాటు వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ దిగ్విజయంగా అమలవుతాయన్నారు. మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేలా కలసికట్టుగా కృషిచేద్దామన్నారు. ఫ్యాన్గుర్తును ప్రజలందరికీ వివరించాలని, అఖండ మెజార్టీతో గెలుపొంది, సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పిలుపునిచ్చారు. ఇంకొంత కాలం శ్రమిస్తే ప్రజలందరి కష్టాలు తీరతాయన్నారు. అనంతరం 16 ఎంపీటీసీ స్థానాలకు సంబందించి అభ్యర్ధులను ఖరారు చేసి వారికి బిఫారాలను ఎమ్మెల్సీ, చెంగల అందించారు. జానకి శ్రీను అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణరాజు, దత్తుడు సీతబాబు, పైల రమేష్, యల్లపు కుమారరాజా, పులగాల నర్సింహమూర్తి, కిల్లాడ శ్రీనివాసరావు, రాజులనాయుడు పాల్గొన్నారు. అనంతరం అమర్నాథ్ రావికమతంతో సమన్వయకర్త ధర్మశ్రీతో కలసి కార్యకర్తల సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచూపాలని పిలుపునిచ్చారు. అచ్యుతాపురంలో మాట్లాడుతూ జనబలం ముందు టీడీపీ ఎత్తులు చంద్రబాబు జిత్తులు చిత్తవుతాయన్నారు. తన పాలనలో చంద్రబాబు పేదలకు నరకం చూపించారన్నారు. -
బుజ్జగింపులు
నామినేషన్ల ఉపసంహరణకు బేరసారాలు రెబల్స్ను బుజ్జగిస్తున్న పార్టీ నాయకులు ‘పరిషత్’పోరులో అభ్యర్థుల హైరానా బీఫారం కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు విశాఖ రూరల్, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుజ్జగింపులు,బేరసారాల పర్వం జోరందుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా రెబల్స్ను పోటీ నుంచి వైదొలిగేలా అన్ని పార్టీలవారు ప్రయత్నాలు చేపట్టారు. ఇది తలకుమించినదైనప్పటికీ ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. అలకబూనినవారు, వేరే పార్టీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నవారి ఇళ్లకు నాయకులు వెళ్లి బుజ్జగిస్తున్నారు. అవసరమైతే నజరానాలను ఆశచూపుతున్నారు. నామినేషన్లు వేసినవారంతా పార్టీ అభ్యర్థిగా బీఫారాల కోసం అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ‘పరిషత్’పోరులో అభ్యర్థులు, రాజకీయపార్టీల హైరానా అం తటా కనిపిస్తోంది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు 39 జెడ్పీటీసీ స్థానాలకు 387, 656 ఎంపీటీసీలకు 4264 నామినేషన్లు వచ్చాయి. ఒక స్థానానికి ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి ఏడుగురు వరకు బీఫారాలు లేకుండా నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 123 మంది, టీడీపీ నుంచి 150, కాంగ్రెస్ 39, సీపీఎం 22, సీపీఐ 11, బీజేపీ 16, బీఎస్పీ 3, లోక్సత్తా నుంచి ఇద్దరితో పా టు 21 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులను మినహా మిగిలిన వారిని బుజ్జగించడం కొన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రాదేశికం ప్రతిష్టాత్మకం : సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉంటుందని పార్టీలన్నీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ సా ్థనాల్లో విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ స్థానాలకు అభ్యర్థుల ఎంపికే పార్టీలకు ఇబ్బందిగా మారింది. ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో వారిలో ఎవరికి బి-ఫారం ఇవ్వాలన్న విషయంపై నాయకులు మల్లగుల్లాలుపడుతున్నాయి. బలమైన అభ్యర్థులను గుర్తించి మిగిలిన వారితో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం పార్టీలకు సవాలుగా మారింది. టీడీపీకి తొలనొప్పులు : ప్రాదేశిక స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ కిందామీదా పడుతోంది. గ్రామాల్లో ఆ పార్టీకి పట్టులేకపోయినా... మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు ఒక్కో సెగ్మెంటుకు ముగ్గురు నుంచి పది మంది వరకు నామినేషన్లు వేశారు. 39 జెడ్పీటీసీలకు 150 నామినేషన్లు వేయడం ఇందుకు తార్కాణం. తీరా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశాక ఎవరిని బరిలో నిలపాలన్న విషయంపై ఇప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం. దీంతో ఎవరికి బి-ఫారం వస్తుందన్నది చెప్పలేకపోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కేవలం రెండు రోజులే ఉంది. ఇప్పటికీ ఆ పార్టీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థులెవరో తేలలేదు. ఇదే ఆ పార్టీ కొంపముంచేట్టు ఉంది. -
బీతిల్లుతున్న దేశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో వలసలు కాకపుట్టిస్తున్నాయి. పాత కొత్త నాయకులు సలసలమని కాగిపోతున్నారు. నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత, కొత్త నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరింది. వీరి మధ్య బీ-ఫారం గొడవ నడుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందోనని జిల్లా నాయకత్వం భయపడుతోంది. వలస నాయకులతో బలపడుతుందనుకున్న పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడనుంది. ‘తెలుగు కాంగ్రెస్’గా మారిపోయిన ఆ పార్టీలో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఇటీవల పార్టీలో చేరిన నాయకుల్లో అత్యధిక మంది పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. తమకంటూ వర్గాన్ని తయారు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. దీనికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నారు. తమ ప్యానెల్గా పలువురు అభ్యర్థులను బరిలోకి దించి పాత నాయకులకు సవాల్ విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది. గత పదేళ్లూ నరకయాతన పెట్టిన నాయకులొచ్చి తమపై పెత్తనం చెలాయిం చడం ఏంటని పాత నాయకులు, వారికంత సీన్ లేకపోవడంతోనే తమను ఆదరించారని కొత్త నాయకులు పంతానికి పోవడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. బీ-ఫారాల గొడవ గజపతినగరం, కురుపాం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లో బీ-ఫారాల సమస్య ఎక్కువగా ఉంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల టీడీపీ నాయకుల మ ధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కురుపాంలో .... ఎన్నాళ్లగానో టీడీపీలో ఉండి, బరిలోకి దిగిన అభ్యర్థులకు బీ-ఫారం టెన్షన్ పట్టుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటున్న నిమ్మక జయరాజ్, తాజాగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ్ ప్రాదేశిక స్థానాలకు వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టారు. స్థానిక ఎన్నికల కోసం కలిసే పనిచేస్తామని ఇద్దరూ చేతులు కలిపినా పోరుకొచ్చేసరికి చెరో దారి చూసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో చెరో ప్యానెల్ పెట్టుకున్నారు. తమకే బి-ఫారాలు దక్కుతాయని ఇరువర్గాలు చెప్పుకుంటున్నాయి. తాము సూచించిన వాళ్లకే ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికంతటికీ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నమే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఎవరికైతే బి-ఫారాలు దక్కవో వారంతా రెబెల్స్గా పోటీ పడాలని చూస్తున్నారు. గజపతినగరంలో... గజపతినగరం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాత నాయకులు ఒక వర్గంగా, ఇటీవల పార్టీలో చేరిన మక్కువ శ్రీధర్ మరో వర్గంగా నామినేషన్లు వేయడంతో రగడ చోటుచేసుకుంది.ముప్పై ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పించడం ఎంత వరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. గెలవనోళ్లకి బీ-ఫారాలు ఎందుకని కొత్త నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో అంతర్గత పోరు ఏర్పడింది. ఈ క్రమంలో బీ ఫారాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు గా రంగంలోకి దిగుతామని ఇరువర్గాలు హెచ్చరిస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో ... చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో రెండు వర్గాల పోరు నడుస్తోంది. కొత్తగా చేరిన మీసాల వరహాలనాయుడు వ్యవహారం టీడీపీ నాయకులకు మింగుడుపడటం లేదు. ఆయన పార్టీలో చేరినప్పుడు పోటీ చేసే స్థానాల విషయమై చేసుకున్న ఒప్పందానికి తిలోదకాలిచ్చారని పాత నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు బరిలో ఉండటంతో ఎవరికి బీ -ఫారం ఇవ్వాలో జిల్లా పార్టీ తేల్చుకోలేకపోతోంది. ఇక, గరివిడి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆ పా ర్టీలో కురు వృద్ధుడు బలగం కృష్ణకు అధిష్టానం బొట్టుపెట్టిం ది. దీంతో ఆయన నామినేషన్ వేశారు. కానీ, పార్టీలో చేరిన కొత్త నేత తెరవెనుక ఉండి కోనూరు మాజీ సర్పంచ్ రమణమూర్తి కూడా గరివిడి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారన్న వాదనలు ఉన్నాయి. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసినట్టయ్యింది. ఇదే పరిస్థితి మెరకముడిదాం మండలంలో కూడా కొనసాగుతోంది. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గం పాచిపెంటలో, బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపుం, బాడంగి మండలాల్లో, ఎస్.కోట నియోజకవర్గం జామి మండలంలో, జిల్లా కేంద్రమైన విజయనగరంలో కూడా కొత్తగా వచ్చిన నాయకులు తామొక వర్గంగా పలు స్థానాల్లో నామినేషన్లు వేయించారు. ఇప్పుడా మండలాల్లో పార్టీలో రగడ చోటు చేసుకుంది. దీంతో బీ-ఫారం ఇచ్చే విషయంలో పార్టీ నాయకత్వం సతమతమవుతోంది. బీ-ఫారం దక్కని వారంతా రెబెల్గా బరిలో ఉండిపోనున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే వలసలతో టీడీపీకి చేటు తప్పలాభం లేదని స్పష్టమవుతోంది. పంచాయతీ పరిష్కరించుకోలేకపోతే రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. -
పుర పోరు.. ఫ్యాన్ జోరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దాంతోపాటు ఎన్నికల వ్యూహరచనలో పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరగనున్న ఈ మున్సిపల్ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. సామాజికవర్గ సమతూకం.. బలీయంగా ఉన్న స్థానిక నేతలు.. క్షేత్రస్థాయిలో పట్టున్న అభ్యర్థులు.. వెరసి పుర పోరులో ఆ పార్టీ ముందంజ వేస్తోంది. తీవ్రపోటీ ఇస్తుందని భావించిన టీడీపీ అసలు పరీక్ష సమయానికి పట్టు సడలించేసింది. నియోజకవర్గస్థాయిలో పటిష్ట నాయకత్వం లేకపోవడంతో ఎన్నికల వ్యూహరచనలో విఫలమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే కుదేలైపోవడంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. ముఖాముఖీ పోరులో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల పోరును పరిశీలిస్తే.. ఆమదాలవలసలో దిలాసా ఆమదాలవలస మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. కౌన్సిల ర్, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిత్వం విషయంలో నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పూర్తి పరిపక్వతతో వ్యవహరించారు. దీంతో మొత్తం 23 వార్డులకుగాను 15కుపైగా వార్డుల్లో ఆ పార్టీ అగ్రపథంలో దూసుకుపోతోంది. మరో 5 వార్డుల్లో బలోపేతమవుతోంది. ఇక్కడ టీడీపీ ప్రాబల్యం 4 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూన రవికుమార్కు మున్సిపాలిటీ పరిధిలో ఏ మాత్రం పట్టు లేదు. దాంతో ఆయన పూర్తిగా ద్వితీ య, తృతీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైపోయింది. నేరుగా అభ్యర్థులను పోటీకి నిలిపేందుకే సాహసించలేకపోయింది. స్వతంత్ర అభ్యర్థుల ముసుగులో ఆ పార్టీ నేతలు నామినేషన్లు వేయడం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తోంది. పాలకొండంత బలం కొత్తగా ఆవిర్భవించిన పాలకొండ నగర పంచాయతీలో తొలిపోరు ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాలకొండ బలమైన కేంద్రంగా గుర్తింపు పొందింది. సీనియర్ నేత, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. ఆయన సతీమణి ఇందుమతి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఉండటం పార్టీకి కలసివస్తోంది. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 10 చోట్ల తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. మరో 5 వార్డుల్లో రోజురోజుకు బలోపేతమవుతోంది. కాగా టీడీపీల ప్రాబల్యం 4 వార్డులకే పరిమితమైపోయింది. పాలవలస కుటుంబాన్ని ఢీకొట్టే స్థాయి గల నేత లేకపోవడం, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిపై స్పష్టత కొరవడటం టీడీపీకి ప్రతికూలాంశాలుగా మారాయి. స్థానిక టీడీపీ ముఖ్య నేత వివాదాస్పదుడు కావడం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నామమాత్రంగానే పోటీ చేస్తోంది. పలాసలో ప్రత్యర్థుల పలాయనం వాణిజ్య కేంద్రమైన పలాస-కాశీబుగ్గ మున్సిపల్ పోరు జిల్లావ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య కేంద్రీకృతమైంది. సంస్థాగతంగా బలోపేతంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ కొంతవరకు ఆధిక్యం సాధించగలుగుతోంది. గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసిన వజ్జ బాబూరావు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండటం.. ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అండదండలు.. ఇటీవల పలాస పీఏసీఎస్ ఎన్నికల్లో విజయం సాధించిన దువ్వాడ సోదరుల బలం.. కలిసి పార్టీని ఎన్నికల యుద్ధంలో ముందంజలో ఉంచుతున్నాయి. మొత్తం 25 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 12 వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 6 వార్డుల్లో బలీయంగా ఉంది. కాగా టీడీపీకి 5 వార్డుల్లోనే ఆధిక్యం ఉంది. మిగిలిన వార్డుల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. ఈ కారణంతోనే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గౌతు శివాజీ కూడా మున్సిపల్ ఎన్నికలకు దూరం జరుగుతున్నారు. తన కుటుంబ సన్నిహితులకు బాధ్యతలు అప్పగించేసి ఆయన తప్పుకుంటున్నారని టీడీపీవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని దుస్థితిలోకి కూరుకుపోయింది. వైఎస్ఆర్సీపీకి ‘ఇష్టా’పురం రాష్ట్ర సరిహద్దు మున్సిపాలిటీ ఇచ్చాఫురంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ మున్సిపల్ స్థాయి కంటే వార్డుస్థాయి రాజకీయ సమీకరణలే నిర్ణాయక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ ఆచితూచి ఎన్నికల వ్యూహాన్ని రూపొందించింది. మాజీ ఎమ్మెల్యే ఎం. వి.కృష్ణారావు, పార్టీ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, సమన్వయకర్త నర్తు నరేంద్ర క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్కు సానుకూల వాతావరణం నెల కొంది. మొత్తం 23 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 12 చోట్ల తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. మరో 6 వార్డుల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతోంది. కాగా నియోజకవర్గస్థాయి నాయకత్వలోపం టీడీపీకి ప్రతికూలంగా మారింది. ఆ పార్టీ ఇన్చార్జి బెందాళం అశోక్కు మున్సిపాలిటీపై ఏమాత్రం పట్టు లేదు. టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్న పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కింజరాపు రామ్మోహన్నాయుడు కూడా ఈ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పార్టీ 5 వార్డుల్లోనే ప్రభావం చూపిస్తోంది. ఇక్కడా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. ఆ పార్టీ ప్రాబల్యం కేవలం ఒక్క వార్డుకే పరిమితమైపోయింది. -
బుజ్జగింపులు.. బెదిరింపులు
కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) పోరులో రెబల్స్ బెడద మొదలైంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో తిరుగుబాటు అభ్యర్థులు తప్పుకోమని చెబుతున్నా రు. వారిని బుజ్జగించే పనిలో పార్టీల ముఖ్యులు ఉన్నారు. ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాయిలాలు, నజరానాలు ఇచ్చి తప్పించే విధంగా మధ్యవర్తులతో రాయబేరం చేస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఉపసంహరణకు సోమవారమే గడువు ఉండటం తో ఎవరిని బరిలో ఉంచాలనేది పార్టీలు తేల్చుకోలేక పోతున్నాయి. ఫలితంగా పార్టీల నేతలకు రెబల్స్ దడ పుట్టుకొస్తోంది. అయి తే నామినేషన్ వేసిన వారికి ఎంతో కొం త ముట్టజెప్పాలని ఇప్పటికే నేతలు అభ్యర్థుల ముందు ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. స్థానిక పోరులో పలుకుబడి గల అభ్యర్థులు పోటీలో ఉండడంతో పార్టీ ల నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫలితంగా ఇప్పుడు నన్ను చూసు కో.. తర్వాత నిన్ను చూసుకుంటా.. అంటూ మంతనాలు సాగిస్తున్నారు. దీంతో స్థానిక బరి లో నిలిచే అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఒక్కో స్థానానికి నలుగురు.. జిల్లా వ్యాప్తంగా 52 జెడ్పీటీసీ, 636 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 52 జెడ్పీటీసీ స్థానాలకు 596, 636 ఎంపీటీసీ స్థానాలకు 4,688 నామినేషన్లు వచ్చాయి. కొన్ని పార్టీల నుంచి ఒక స్థానానికి ఒక అభ్యర్థి నామినేషన్ వేయగా, మరికొన్ని పార్టీల నుంచి ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపడంతో నామినేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రధానంగా ఎంపీటీసీ నామినేషన్లలో ఈ పర్వం స్పష్టంగా కన్పిస్తోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎవరికి వారు తమది ఫలానా పార్టీ పేర్కొంటూ నామినేషన్లు దాఖలు చేశారు. మండల పరిషత్ పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్నిచోట్ల వర్గాలవారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ బుజ్జగింపులు లేదంటే బెది రింపులు, రాయబేరాలు చేస్తున్నారు. రెబల్స్ను బుజ్జగించడానికి నజరానా ఇవ్వడం ఒకటయితే.. బీఫాం దక్కించుకోవడానికి కూడా జేబు ఖాళీ అవుతోంది. 24 జెడ్పీటీసీ.. 181 ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ.. జిల్లావ్యాప్తంగా 52 జెడ్పీటీసీ స్థానాలకు దాఖలైన 596 నామినేషన్లకు 24 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 572 నామినేషన్లు అమోదించారు. తిరస్కరణకు గురైనా జెడ్పీటీసీ నామినేషన్లపై కలెక్టర్ అహ్మద్ బాబు శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అప్పీలును స్వీకరించారు. 24 జెడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, శనివారం అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 24 మంది అప్పీలు చేసుకోగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. అప్పీలు చేసుకున్న అనంతరం మరో ఏడు జెడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. తిరస్కరణకు గురైనా వారిలో క్రిష్ణస్వామి (నార్నూర్), చిట్టి స్వప్న (సారంగపూర్), జి. సుమలత (సారంగపూర్), కాసు రాధిక (భైంసా), కుటికల ఆశన్న (ఉట్నూర్), వందనబాయి (ఇం ద్రవెల్లి), మోతుకూరి వెంకటస్వామి (లక్సెట్టిపేట) నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. ఇదిలా ఉండగా జిల్లాలో 636 ఎంపీటీసీ స్థానాలకు 4,688 నామినేషన్లు రాగా, 181 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగతా 4,507 నామినేషన్లు అమోదించడం జరిగింది. కాగా, ని బంధనల మేరకు లేకపోవడంతో కొందరి నామినేషన్లు తిర స్కరణఖు గురయ్యాయని కలెక్టర్ అహ్మద్బాబు, జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్ పేర్కొన్నారు. -
ప్రచార‘వేడి’
మండే ఎండల్లోనూ ‘పుర’ ప్రచారం పల్లెల్లో పుంజుకుంటున్న వైనం ఈ నెల 28తో మున్సిపల్ ప్రచారం సమాప్తి సాక్షి, మచిలీపట్నం : ప్రచండ భానుడితో పోటీ పడుతూ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార వేడి పుంజుకుంది. మండుతున్న ఎండల్లోనూ చెమటలు కక్కుతూ వ్యయప్రయాసలకోర్చి అభ్యర్థులు ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ప్రచారం ముమ్మరం కాగా, పల్లెల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో వార్డుల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 28తో పట్టణాల్లో ప్రచార గడువు ముగియనుంది. పట్టణాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎండలను సైతం లెక్కచేయక జనాన్ని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రలోభాల వల... జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ హవాను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు అప్పుడే ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. వెంట తిరిగే వారికి మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అందిస్తున్నారు. వైద్య శిబిరాలు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేయడంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. పత్తా లేని కాంగ్రెస్... మున్సిపల్, స్థానిక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ అభ్యర్థుల హడావుడి కనిపించడం లేదు. జిల్లాలోని పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. పలు పట్టణాల్లో గెలుపు కోసం టీడీపీ ప్రలోభాల వల విసిరేందుకు సిద్ధమవుతోంది. పార్టీలకు తప్పని రెబెల్స్ బెడద ప్రధాన రాజకీయ పార్టీల్లో సైతం టిక్కెట్పై ఆశలు పెరగడంతో స్థానిక ఎన్నికలో బరిలో ఉన్న అభ్యర్థులకు రెబెల్స్ బెడద తప్పలేదు. ఇటువంటి పరిస్థితిలో పదవి దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నెల 24న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించడంతో రాజకీయ పార్టీల నేతలు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. పార్టీలోని రెబెల్స్ను బుజ్జగించడం, ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 21న జరిగిన నామినేషన్ల పరిశీలనలో జిల్లాలోని 52 జెడ్పీటీసీ, 204 ఎంపీటీసీ నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో 49 మండలాలకు 370 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 836 ఎంపీటీసీ స్థానాలకు 4616 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వైఎస్సార్సీపీ తరఫున 161 జెడ్పీటీసీ అభ్యర్థులు, 1822 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున 146 జెడ్పీటీసీ అభ్యర్థులు, 2007 మంది ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్కు అభ్యర్థులే దొరకని దుస్థితిలో ఉండటంతో నామినేషన్లు తక్కువగానే వేశారు. 49 జెడ్పీటీసీ స్థానాలకు 41 మంది, 836 ఎంపీటీసీ స్థానాలకు గాను 283 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక స్వతంత్రులు జెడ్పీటీసీ స్థానాలకు 36 మంది, ఎంపీటీసీ స్థానాలకు 513 మంది నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తిరువూరులో అత్యధికం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 17 నుంచి 20 వరకు వేసిన నామినేషన్లను పరిశీలిస్తే తిరువూరు జెడ్పీటీసీ స్థానానికి అత్యధిక అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తిరువూరు జెడ్పీటీసీ పదవికి 19 నామినేషన్లు దాఖలయ్యాయి. మొవ్వ, పామర్రు, వీరులపాడు మండలాల్లో నాలుగు నామినేషన్లు చొప్పున దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. -
జనహోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర శనివారం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాలల్లో జరిగింది. బహిరంగ సభలు, రోడ్షోల్లో వేలాది మంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహానేత వైఎస్సార్ తనయకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర జిల్లాలో మూడోరోజు శనివారం అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో సాగింది. గుంటూరు జిల్లా నుంచి ఉదయం అద్దంకి చేరుకున్న షర్మిలకు సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. షర్మిల వెంట వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వేలాదిమందినుద్దేశించి ఆమె ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మద్దతు వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి అభివృద్ధి చెందాలన్నా..ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న మృగాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ పాలన ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు పార్టీలో చేరారు. అద్దంకిలో సమావేశం ముగిసిన అనంతరం మార్గమధ్యంలో షర్మిల తనకోసం వేచి ఉన్న వికలాంగులను కలుసుకున్నారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం పర్చూరు వచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తన పాలనలో జరిగినవి చెప్పకుండా వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తాను చేపడతానని చెప్పుకుంటున్నాడని అన్నారు. పులిని చూసి నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా..నక్క నక్కే అవుతుంది కానీ పులికాదని అన్నారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అపూర్వస్పందన లభించింది. సభానంతరం జనభేరి యాత్ర చీరాల చేరుకుంది. మార్గమధ్యంలో కారంచేడులో షర్మిల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. రాత్రి 9 గంటలకు చీరాల చేరుకున్న ఆమె పట్టణంలో రోడ్షో నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. తొలుత నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని పాలన రాష్ట్రంలో వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పాలేటి రామారావు, పార్టీ నాయకులు అవ్వారు ముసలయ్య, కన్నేటి వెంకటప్రసాద్, వరికూటి అమృతపాణి తదితరులు పాల్గొన్నారు. అభిమానుల కోలాహలంతో దారిపొడవునా ఆమెకు ఘన స్వాగతం లభించింది. -
బాబూమోహన్ ఇంటింటా ప్రచారం
జోగిపేట, న్యూస్లైన్: అందోల్ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ఇంటింటా ప్రచారం చేశారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీల్లో తిరుగుతూ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక 5, 6, 7, 8, 9 వార్డుల్లోని ప్రజలను కలసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు, తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేయాలని బాబూమోహన్ అభ్యర్థించారు. కార్యక్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులు సావిత్రి, జంగం మహేష్, సదాశివుడు, ఫర్హానా బేగం, భవానీ, టీడీపీ నాయకులు డీ వీరభద్రారావు, దుర్వాసులు, రత్నం గౌడ్, మాణిక్యం గౌడ్, టీడీపీ టేక్మాల్ మండల అధ్యక్షుడు యూసూఫ్, నాయకులు గోపాల్, భూమమ్మ పాల్గొన్నారు. -
వైసీపీ దూకుడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే వ్యూహాలకు పదును పెడుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ హడావుడి చేస్తున్నా వార్డులు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు తేలిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కనీసం 20 శాతం వార్డుల్లో కూడా అభ్యర్థులను పోటీకి దింపలేక చేతులెత్తేసింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ అన్నీ తానై నడిపిస్తున్నారు. డివిజన్లలో విసృ్తతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో వెనుకబడింది. ఆ పార్టీ నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత పెదబాబు భార్య నూర్జహాన్ను పోటీకి దింపగా, అంతగా ప్రభావం చూపలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో వైసీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నేతృత్వంలో కౌన్సిలర్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు తారస్థారుుకి చేరారుు. ఈ పరిస్థితి ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. జనాదరణ పెంచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందంజలో పయనిస్తోంది. పాలకొల్లులో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరడంతో అక్కడ రాజకీయం ఏకపక్షంగా మారింది. టీడీపీ పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోం ది. తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. రెండు పార్టీలు విసృ్తతంగా ప్రచారం చేస్తున్నాయి. కొవ్వూరు మునిసిపాలిటీలోనూ వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వైసీపీ నేతలు ఏకతాటిపై నిలబడి అభ్యర్థుల గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే టీవీ రామారావుపై టీడీపీ నేతల మధ్య నెలకొన్న వ్యతిరేకత అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. నిడదవోలును చేజిక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ సమన్వయకర్త రాజీవ్కృష్ణ తిప్పికొడుతున్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో వైసీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా పట్టణ ప్రముఖుడైన తల్లాడి సత్తిపండు సతీమణి వరలక్ష్మిని ప్రకటించడంతో టీడీపీ ఆందోళనలో మునిగిపోయింది. ఇక అన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. 291 వార్డులుండగా, ఆ పార్టీ 47వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలపగలిగింది. మొత్తంగా మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ ముందంజలో పయనిస్తోంది. -
చెరిగిన ‘హస్త’ రేఖలు
సాక్షి, గుంటూరు: 125 ఏళ్ల ఘన చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మచ్చుకైనా కనిపించని దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనకు సహకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ప్రజాగ్రహానికి గురైంది. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నా స్థానిక ఎన్నికల్లో నామివేషన్ వేసేందుకు సైతం అభ్యర్థులు లేని దైన్య స్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది. కొన్ని చోట్ల ఒకరిద్దరు నామినేషన్లు వేసినప్పటికీ టీడీపీతో కుమ్మక్కై ప్రచారం సాగిస్తున్నారు. గురువారం ముగిసిన మండల, జెడ్పీ ఎన్నికల నామినేషన్లు పరిశీలిస్తే మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండ లాల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక్కరు కూడా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ ఐదు మండలాల్లో 70 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లు వేయగలిగింది.తాజా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సొంత గ్రామమైన గురజాల నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండలాలకు జెడ్పీటీసీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. ఈ నాలుగు మండలాల పరిధిలో 65 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేవలం 20 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరో తాజా మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి సొంత నియోజకవర్గమైన నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.నరసరావుపేట మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 27 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 15 చోట్ల మాత్రమే నామినేషన్లు వేయించగలిగారు. -
మండపేట.. మమకారపు కోట
‘తాపేశ్వరం కాజా’ను ‘తీపిలో రారాజు’ అనొచ్చు. ఆ వంటకం పొరల నడుమ ఇమిడి ఉండే తేనెలాంటి మధురాతి మధురమైన రసమే దానికి కారణం. అలాంటి మాధుర్యాన్నే తలదన్నే మమతల మధువు ప్రజల మనసు పొరల నుంచి జాలు వారుతుండగా తనివి తీరా చవి చూశారు జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ సాగిస్తున్న ఆయన శుక్రవారం మండపేటలో రోడ్ షో నిర్వహించారు. ఆ పట్టణానికి ప్రతీక వంటి కలువపువ్వు సెంటర్తో సహా ప్రతి కూడలిలో జనాభిమానం వేలరేకులుగా వికసించింది. సాక్షి, మండపేట : ఎవరైనా ఎన్నికల ప్రచారం అంటే ‘మా అభ్యర్థికి ఓటేయండి. మా గుర్తుకు ఓటేయండి’ అని అభ్యర్థిస్తారు. కానీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రజల బాగోగులు, కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ‘ఆ మహానేత వరవడి పదిలంగానే ఉంది’ అన్న భరోసాను కలిగించారు. ఎండ మండినా, ఉక్కబోసినా.. అణుమాత్రం అలుపెరగక, వేలమందితో మమేకమయ్యారు. ‘అవ్వా ఎలాగున్నావ్.. అయ్యా బాగున్నవా.. అమ్మా ఏంచేస్తున్నావ్’ అంటూ ఎదలోతుల్లోంచి ఎగసే ఆత్మీయతను పంచారు. వారిని అక్కున చేర్చుకున్నారు. ఇక ప్రజలు.. నిప్పులు చెరిగే ఎండను నలుసంత లక్ష్యపెట్టకుండా తమ అభిమాననేతను చూసేందుకు బాటలకిరువైపులా గంటల తరబడి నిరీక్షించారు. జననేతను చూడగానే పట్టలేని ఆనందంతో జేజేలు పలికారు. ఆయనను దగ్గరగా చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఆయనను ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకునిలా కాక తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఆప్యాయతానురాగాలు కురిపించారు. తన వ ద్దకు రాలేని అశక్తులను చూసి, ఎద కదిలిన జననేత తానే వాహనం దిగి వారి దగ్గరకు వెళ్లి అనునయించారు. అది చూసిన జనం ‘మహానేత తనయుడనిపించుకున్నారు. ఆయనలాగే మా కష్టాలు కడతేర్చేందు కు కంకణం కట్టుకున్నారు’ అంటూ మురిసిపోయారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో రోజైన శుక్రవారం మండపేటలో జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్ షోకు కనివినీ ఎరుగని స్పందన లభించింది. పార్టీ మండపేట కో ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పినిపే విశ్వరూప్, మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరిలతో కలిసి నిర్వహించిన ఈ రోడ్ షో సాగినంత మేరా మండపేట మొత్తం కదిలివచ్చిందా అన్నట్టు జనసంద్రమైంది. దారులకిరువైపులా జనం కిక్కిరిసిపోయారు. అడుగడుగునా హారతులు.. మెయిన్రోడ్లోని చౌదరి గెస్ట్హౌస్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో పెదకాల్వవంతెన వరకూ సాగింది. కామత్ మోటార్స్ ఎదురుగా పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో వందలాదిమంది మహిళలు, యువకులు జగన్ బొమ్మలతో ఉన్న ప్లకార్డులు చేబూని అపూర్వ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్యాన్’ను జననేతకు బహూకరించారు. రాజారత్నం సెంటర్ నుంచి ఎస్సీ కాలనీ, కొండపల్లివారి వీధి, న్యూ కాలనీ, మారేడుబాక సెంటర్, కేపీ రోడ్డు సెంటర్, కలువపువ్వు సెంటర్ వరకు రోడ్లు జనప్రవాహాన్ని తలపించాయి. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా, యువకులు, చిన్నారులు పూలవర్షం కురిపించారు. ఎస్సీ పేట, కొండపల్లివారి వీధి, న్యూ కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చి జగన్నినాదాలు చేశారు. జగన్ను చూసిన వృద్ధులు తమ కుమారుడే కష్టపడుతున్నట్టు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనను అక్కున చేర్చుకొని ‘నువ్వు చల్లంగుండాలయ్యా’ అని దీవించారు. వారితో పాటు మహిళలు ఆయనకు తాపేశ్వరం కాజా, తొక్కుడులడ్డూ, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటారు. ‘మేమంతా నీకు అండగా ఉంటాం. నీకే ఓటేస్తాం’ అంటూ స్పష్టం చేశారు. వారి మమతానురాగాలకు ఉద్వేగానికి లోనైన జననేత ‘మరో రెండు నెలల్లో రాజన్న రాజ్యం వస్తుంది.. మీ అందరికీ మంచి రోజులొస్తాయి’ అని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. ఓపిక పట్టండి.. వచ్చేది మన సర్కారే.. ఏడేళ్ల క్రితం వంట చేస్తుండగా ముఖమంతా కాలిపోయిన అరివి లోవమ్మ అనే మహిళ రాజారత్నం సెంటర్లోజగన్ను కలిసి ఆదుకోవాలంటూ గోడు వెళ్ల బోసుకుంది. ‘మన ప్రభుత్వమొచ్చిన వెంటనే ఆదుకుంటా’నని జగన్ భరోసా ఇచ్చారు. ట్రైసైకిల్పై వచ్చిన నందికోళ్ల రాజు, దుర్గా దున్నా అనే వికలాంగుల వద్దకు తానే వెళ్లి పరామర్శించారు. ‘మరో రెండు నెలల్లో మీకు పింఛన్ వెయ్యి రూపాయలు చేస్తా’నని చెప్పారు. అంధురాలైన లంకా నారమ్మ ఇంటికి వెళ్లి ‘పింఛన్ వస్తోందా తల్లీ’ అని ఆరా తీశారు. రావడం లేదని చెప్పగా ‘కొంచెం ఓపిక పట్టమ్మా.. 1000 పింఛన్ ఇప్పిస్తా’నని ధైర్యం చెప్పారు. ముమ్మిడివరపు నాగమణి అనే పోలియో బాధితురాల్ని పరామర్శించారు. న్యూ కాలనీలో రెండుకాళ్లు చచ్చుబడిన నిమ్మలపూడి సత్యనారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. పార్వతమ్మ అనే 95 ఏళ్ల వృద్ధురాలిని కాన్వాయ్పై నుంచే చూసి ఆమె వద్దకు వెళ్లి ‘అవ్వా బాగున్నావా’ అంటూ పలకరించడంతో ‘నువ్వు చల్లంగుండు బాబూ’ అని దీవించింది. తనపై కొండంత అభిమానంతో, కడలంత నమ్మకంతో వచ్చిన వారందరికీ అభివాదం చేస్తూ, జననేత వారి కష్టసుఖాలను ఓపిగ్గా విన్నారు. పట్టణ పరిధిలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు ఏకంగా పది గంటలకు పైగా పట్టిందంటే జన నేతపై జనాదరణ ఏ స్థాయిలో అర్థమవుతుంది. మారుమూలన ఉన్న తమ పేటలకు ఏ రాష్ర్టస్థాయి నాయకులూ రాలేదని, జగన్ ఒక్కరే తమ గడప దగ్గరకు వచ్చారని సామాన్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రోడ్ షోలో రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సీఈసీ సభ్యుడు రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్కుమార్, ఆకుల వీర్రాజు, బొంతు రాజేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, రాష్ర్ట యూత్, బీసీ కమిటీల సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, పెంకే వెంకట్రావు, యువజన నాయకుడు జక్కంపూడి రాజా, మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మండపేటలో రోడ్ షో అనంతరం జగన్ సామర్లకోట చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. -
స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగిస్తాం
దొండపాడు(మేళ్లచెర్వు), న్యూస్లైన్ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగి స్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని దొండపాడు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు గున్నంనాగిరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బలంగా ఉన్న ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందన్నారు. స్థానికంగా కాంగ్రెస్, టీడీపీ, బీ జేపీ యేతర పార్టీలతో పొత్తులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఒకే నెలలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే హుజూర్నగర్ నియో జకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మేళ్లచెర్వు మండలం దొండపాడు, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలు, పులిచింతల ముంపు గ్రా మా ల ప్రజలకు పునరావాస ప్యాకేజీ, మం డలంలోని పరిశ్రమలకు పూర్తి స్థాయి సౌ లభ్యాలు, ఇతర అభివృద్ధి పనులు రాజశేఖరరెడ్డి హ యాంలోనే జరిగినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే, మం త్రిగా ఉన్న ప్రస్తు త టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి మండలానికి ఒక్క పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను గానీ తీసుకరాలేక పోయారని విమర్శించారు. ఆయన వెంట వేముల శేఖర్రెడ్డి, మల్లయ్య యాదవ్, విజయభాస్కర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎడతెగని.. స్క్రూటినీ
నల్లగొండ, న్యూస్లైన్, ప్రాదేశిక అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన అధికారులకు ఓ ప్రహసనంలా మారింది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగింది. మండలాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన వేగంగానే పూర్త్తయినప్పటికీ, జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక్కో పార్టీ నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో అధికారులు నామినేషన్ల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయే వరకు ‘న్యూస్లైన్’కు అందిన సమాచారం మేరకు జెడ్పీటీసీ 59 స్థానాలకు 14 మండలాల నామినేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం 59 స్థానాలకు గాను 1250మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 1245 మంది అర్హత సాధించారు. 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.45 మండలాల నామినేషన్ల పరిశీలన పూర్తయితే తిరస్కరణకు గురియ్యే నామినేషన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంపీటీసీ 835 స్థానాలకు గాను 8.766 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిల్లో 53 మండలాల్లో 8,463 అర్హత సాధించాయి. 303తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల నిబంధనలకు లోబడి నామినేషన్లు లేకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. అభ్యర్థుల పడిగాపులు.. జెడ్పీ ప్రాంగణంలో అభ్యర్థులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇంగ్లీషు అక్షరమాల ప్రకారం డివిజన్ల వారీగా జెడ్పీటీసీ అభ్యర్థులను సమావేశ మందిరంలోకి ఆహ్వానించి నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్రావు సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సాయంత్రం జెడ్పీకి వచ్చి పరిశీలన కార్యక్రమాన్ని సమీక్షించారు. నేడు అప్పీళ్లు.. నోటీసులు అందుకున్న అభ్యర్థులు శుక్రవారం అప్పీలు చేయనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీఓల వద్ద, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్కు అప్పీలు చేసుకుంటారు. అధికారులు అందజేసిన నోటీసులు, అభ్యర్థుల అప్పీళ్లను పరిశీలించిన పిద ప తుది నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తారు. -
ఆమే కీలకం
అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్న మహిళలు...రాజకీయరంగంలో ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పుణ్యమాని సగం స్థానాలను దక్కించుకోగలుగుతున్నా, చట్టసభల విషయానికొస్తే 50 శాతం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా మహిళలకు దక్కుతున్న రాజకీయ అవకాశాలు తక్కువే. 1952 నుంచి 2009 దాకా జరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే రాష్ట్ర శాసనసభలో అడుగిడగలిగారు. నల్లగొండ, న్యూస్లైన్ : జిల్లాలో మొత్తం ఓటర్లు 24,89,228మంది. అయితే పురుషులు, మహిళలకు మధ్య ఓటర్ల వ్యత్యాసం కేవలం 10,104 మాత్రమే. స్త్రీ, పురుష జనాభా నిష్పత్తిలో తేడా వల్ల మహిళా ఓటర్లు తక్కువగా ఉంటున్నారు. మహిళలు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష బలపడి సంఘటితంగా ఉద్యమించి పిడికిలి బిగిస్తే ఎన్నికల స్వరూపాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి వారికి ఉంది. 50శాతం కోటాను చట్టసభల్లో కూడా అమలు చేయాలని మహిళలు ఉద్యమిస్త్తే రాజకీయ పార్టీలు మెట్టు దిగిరాక తప్పదు. తొమ్మిది చోట్ల... జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అత్యధికంగా నల్లగొండలో 16,224, మిర్యాలగూడలో 11,656 మంది ఓటర్లు పెరిగారు. ఆ తర్వాత స్థానంలో నాగార్జునసాగర్లో 10,896, కోదాడలో 9,563 మంది పెరిగారు. పురుషులకు మించి మహిళా ఓటర్లు అత్యధికంగా నాగార్జునసాగర్లో 329, మిర్యాలగూడలో 29 , హుజూర్నగర్లో 951, కోదాడలో 1831, సూర్యాపేటలో 1073 మంది ఉన్నారు. అయితే మహిళ ఓటర్లు గతంతో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగానే పెరిగారు. స్థానికంలో సగం.. స్థానిక పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మహిళలకు కేటాయించారు. రాజకీయాల్లో మహిళలకు 50 శాతం స్థానాలు అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం జరగుతున్న ఎన్నికల్లో మహిళల స్థానాలను పరిశీలిస్తే... రెండు నగర పంచాయతీలు మినహా ఐదు మున్సిపాలిటీల చైర్మన్ల పదవులు మహిళలకు రిజర్వు చేశారు. అదేవిధంగా జెడ్పీటీసీ 59 స్థానాల్లో మహిళలకు 30 సీట్లు రిజర్వు చేశారు. ఎంపీటీసీ 835 స్థానాలకు గాను మహిళలకు 435 సీట్లు కేటాయించారు. గతేడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మహిళలకు అగ్రస్థానమే ఇచ్చారు. చట్టసభల్లో మహిళల ప్రస్థానం.. జిల్లా నుంచి చట్టసభలకు వెళ్లిన మహిళలు చాలా తక్కువనే చెప్పాలి. శాసనసభ, లోక్సభ స్థానాల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని ఢంకా బజాయించి చెప్తున్న ఏ ఒక్క పార్టీ కూడా వారికి సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన నాటి తరం మహిళలు మాత్రమే చట్టసభల్లో అడుగుపెట్టగలిగారు. ఆ తర్వాత మృతి చెందిన ప్రముఖ నాయకుల సతీమణులు ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాణించారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మహిళ లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేదు. 1952 నుంచి 2009 సార్వత్రిక ఎన్నికల వరకు జిల్లా నుంచి ఆరుగురు మహిళలు చట్టసభల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా కొందరికి మాత్రమే అదృష్టం దక్కింది. వారిలో 1952-1962 వరకు ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1972లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి మూసపేట కమలమ్మ, 1978-83 వరకు తుంగతుర్తి నుంచి మల్లు స్వరాజ్యం, 1985లో నల్లగొండకు జరిగిన ఉప ఎన్నికల్లో గడ్డం రుద్రమదేవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2000-2009 వరకు భువనగిరి నియో జకవర్గం నుంచి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా పనిచేశారు. 2002 ఉప ఎన్నికల్లో దేవరకొండ నుంచి భారతీ రాగ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జెడ్పీ పీఠంపై తొలి మహిళ.. జిల్లా పరిషత్ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి 2001 వరకూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఏలారు. 2001లో తొలి సారిగా జెడ్పీ చైర్మన్ స్థానాన్ని బీసీ మహిళలకు రిజర్వు చేయడంతో మహిళలకు అవకాశం దొరికినట్లయైంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలిచిన వేమవరపు ప్రసన్న రత్నాకర్ చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించారు. ఆమె మరణానంతరం కీతా లక్ష్మమ్మ చైర్పర్సన్ అయ్యారు. -
నామినేషన్ల ఘట్టం ముగిసింది
ఇందూరు, న్యూస్లైన్: నాలుగు రోజులుగా కొనసాగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నా మినేషన్లు దాఖలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్లు వేయడానికి మండలాల నుంచి రాజకీయ నాయకులు, అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అభ్యర్థుల తాకిడి భారీగా కొనసాగింది. సమయం దాటిన తరువాత, అప్పటికే అక్కడ ఉన్న 150 మంది అభ్యర్థులను జిల్లా పరిషత్లోపలికి అనుమతించారు. టోకెన్ల ద్వారా వారి నామినేషన్లను క్రమ సంఖ్యలో తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. ఒక్క సారిగా అభ్యర్థులు లోనికి రావడంతో అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. మండల కార్యాలయాలలో కూడా ఎంపీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు పోటీపోటీగా నిమినేషన్లు వేశారు. నాలుగో రోజు దాదాపుగా జడ్పీటీసీకి 500 మంది అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. ఎంపీటీసీకి సూమారుగా 3వేల నామినేషన్లు రావచ్చని అధికారులు అంచనా వేశారు. నామినేషన్లకు శుక్రవారం పరిశీలిస్తారు. తిరస్కరించినవాటిపై అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేస్తే, వాటిని వెంటనే పరిష్కరిస్తారు. జడ్పీటీసీ నామినేషన్లు వేసిన పలువురి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ మండలం నుంచి పుప్పా శోభ (కాంగ్రెస్), ఎల్లారెడ్డి మండలం నుంచి విమలమ్మ(వైఎస్ ఆర్సీపీ), నిజమాబాద్ మండలం నుంచి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాదే కృష్ణ అక్క ఈర్ల వసంత(బీజేపీ), నవీపేట్ మండలం నుంచి నర్సింగ్రావు(టీఆర్ఎస్). -
ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో అచ్చెన్న డ్రామా
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: కోటబొమ్మాళి మండలంలో తన మాటకు ఎదురే ఉండదని రీతిలో వ్యవహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీపీ విషయంలో తన వర్గంలోని వారికే గట్టి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిని మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మితోపాటు తిలారు సర్పంచ్ తర్రా రామకృష్ణ ఆశిస్తున్నారు. దీంతో అచ్చెన్న తెరవెనుక రాజకీయానికి తెరతీశారు. రామకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు అచ్చెన్న ప్రకటిస్తే విజయలక్ష్మికే మద్దతని అచ్చెన్న సోదరుడు ప్రసాద్ అంటున్నారు. ఎంపీపీగా రామకృష్ణ పేరును బుధవారమే ప్రకటించిన అచ్చెన్న ఆ విషయాన్ని విజయలక్ష్మికి చెప్పి బరిలోంచి తప్పుకోవాలన్నారు. దీంతో నామినేషన్ వే సేందుకు సిద్ధమైన ఆమె నిరుత్సాహంగా ఉండిపోయారు. ఆమె మరో ఆరుగురితో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వకపోతే పార్టీని వీడుతానని రామకృష్ణ హెచ్చరించడంతో అచ్చెన్న సీను నుంచి తాను తప్పుకుని మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్ను పంపించి తర్రాకే మద్దతిస్తున్నట్లు చెప్పించారు. మరోవైపు విజయలక్ష్మికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చేలా సోదరుడు ప్రసాద్ ద్వారా కబురు పంపించి గురువారం ఆమె చేత నామినేషన్ వేయించారు. దీనివెనుక లోగుట్టు పరిశీలించిన రామకృష్ణ తన తల్లి దమయంతితో హడావుడిగా నామినేషన్ వేయించారు. దీంతో అచ్చెన్న వ్యూహం బెడిసికొట్టింది. అయినప్పటికీ గురువారం బయటకు రాకుండా కథ నడిపించే యత్నం చేశారు. తర్రా వంటి సీనియర్ నేత వేరే పార్టీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎంపీపీ ఆశ చూపించారని, ఏదిఏమైనా అచ్చెన్నకు సన్నిహితురాలైన విజయలక్ష్మికే ఆయన ఎంపీపీ ఇప్పిస్తారని ఆయన స్వభావం తెలిసిన వారు అంటున్నారు. దీంతో ఎంపీపీ అభ్యర్థిత్వం రాకపోతే తర్రా బృందం పార్టీని వీడేందుకు వీలుగా గురువారం రాత్రి తిలారులో సమావేశమయ్యారు. ఏక్షణంలోనైనా అచ్చెన్న తన నిర్ణయం మార్చుకుంటే గట్టిగా బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. ఇదే తీరులో అటు విజయలక్ష్మి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. -
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ పరిశీలకులు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలవారీగా పార్టీ పరిశీలకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. పరిశీలకుల వివరాలు.. కొయ్య ప్రసాదరెడ్డి (శ్రీకాకుళం), పిరియా సాయిరాజ్ (విజయనగరం), సుజయకృష్ణ రంగారావు (విశాఖపట్నం), జి.ఎస్.రావు (తూర్పుగోదావరి), కె.దొరబాబు (పశ్చిమ గోదావరి), పి.రామచంద్రారెడ్డి (కృష్ణా), డాక్టర్ జహీర్ అహ్మద్ (గుంటూరు), చిన వెంకటరెడ్డి (ప్రకాశం), జ్ఞానేందర్రెడ్డి (నెల్లూరు), వైఎస్ వివేకానందరెడ్డి (చిత్తూరు), పి.రవీంద్రనాథ్రెడ్డి (అనంతపురం), వైఎస్ అవినాష్రెడ్డి (వైఎస్సార్ కడప), చదిపిరాళ్ల నారాయణరెడ్డి-ఎమ్మెల్సీ (కర్నూలు), వినాయక్రెడ్డి (ఆదిలాబాద్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), సింగిరెడ్డి భాస్కర్రెడ్డి (కరీంనగర్), డాక్టర్ శ్రావణ్కుమార్రెడ్డి (మెదక్), గాదె నిరంజన్రెడ్డి (రంగారెడ్డి), గున్నం నాగిరెడ్డి (మహబూబ్నగర్), గట్టు శ్రీకాంత్రెడ్డి (నల్లగొండ), ఎం.సోమేశ్వర్రావు (వరంగల్), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం). -
వైఎస్సార్సీపీలోకి వలసల జోరు
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పార్టీలో చేరిక ఖాళీ అవుతున్న కాంగ్రెస్ టీడీపీకీ తప్పని షాక్ సాక్షి ప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా రు. రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ నుంచైతే అధిక సంఖ్యలో బయటకు వస్తున్నారు. ప్రజాదరణ లేని నాయకులంతా టీడీపీలో చేరుతుండగా, ప్రజాభిమానం ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలంతా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఒకవైపు జోరుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్నా మరోవైపు వైఎస్సార్సీపీ పట్ల ఆకర్షితులై వేలాదిమంది పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వలసల జోరుతో ఫ్యాన్గాలి బలంగా వీస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యం గల గ్రామాల న్నీ ఖాళీ అయిపోతున్నాయి. కార్యకర్తలతో సహా నాయకులంతా వైఎస్సార్సీపీలో చేరి పోతున్నారు. నెల్లిమర్ల, భోగాపురం, మెంటాడ, పాచిపెంట, పార్వతీపురం, బలి జపేట, సీతానగరం, పూసపాటిరేగ తదితర మండలాల్లో కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయింది. తాజాగా పూసపాటిరేగ మండలంలో 27 పంచాయతీల కేడర్ అంతా వైఎస్సార్సీపీలోకి వచ్చేసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త బేబినాయన, మాజీ ఎంపీ కొమ్మూరి సంజీవరావు, సమక్షంలో వేలాది మంది కార్యకర్త లు చేరారు. చీపురుపల్లి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో ఒకటి రెండు పంచాయతీల మినహా కాంగ్రెస్ ఖాళీ అయింది. ఇప్పుడా పార్టీలో కార్యకర్తలే కాదు నాయకులకు కూడా ఉండడం లేదు. ఒకచోట చేరికలు జరుగుతుంటే తమ వద్దకు ఎప్పుడొచ్చి చేర్చుకుంటారని అడుగుతున్న పరిస్థితి చాలా గ్రామాల్లో కన్పిస్తోందని వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు. గజపతినగరం, ఎస్.కోట, చీపురుప ల్లి, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇన్నాళ్లూ వేధించిన కాంగ్రెసోళ్లను తీసుకొచ్చి తమ నెత్తిపైకి ఎక్కిస్తున్నారన్న ఆవేదనతో చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కొన్నిచోట్లైతే కాంగ్రెస్ తుక్కుతో తాము పనిచేయలేమంటూ వలసబాట పడుతున్నారు. మొత్తానికి వైఎస్సార్సీపీలోకి వరుసగా జరుగుతున్న చేరికలతో కాంగ్రెస్ ఖాళీ అవుతుండగా, టీడీపీకి ఊహించని షాక్ తగులుతోంది. టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆ పార్టీ నాయకులు అప్రమత్త మై అసంతృప్తి వాదులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వాదు లు బయటికొచ్చి వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ వద్దు.. స్వతంత్రమే ముద్దు
నిడదవోలు రూరల్, న్యూస్లైన్: అదో జాతీయ పార్టీ. 120 ఏళ్ల ఘన చరిత్ర దాని సొంతం. దేశంలో ఎన్నో కష్టాలను ఒంటి చేత్తో అధిగమించిన ఆ పార్టీకి ఇప్పుడు కనీసం అభ్యర్థులు కూడా లేని దీనస్థితి. ఇదంతా కాంగ్రెస్ గురించే. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తెలుగోడి దెబ్బ పూర్తిగా దెబ్బతినకుండానే చేతులెత్తేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని దుస్థితికి చేరింది. నిడదవోలు మండలంలో స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాలేదు. ‘పార్టీ పరువు పోతోంది.. బాబ్బాబు.. పోటీ చేయండి’ అంటూ నియోజకవర్గ నేతలు గ్రామాల్లోని నాయకులను అభ్యర్థించినా లాభం లేకపోయింది. రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గం, గ్రామాల్లో చక్రం తిప్పిన నేతల్లో మెజారిటీ శాతం వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. మిగిలిన వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పరిషత్ పోరులో బరిలోకి దిగాలని భావించిన నాయకులు ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. కాంగ్రెస్ తరఫున అయితే ఓడిపోవడం ఖాయమని ముందే గ్రహించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.నిడదవోలు మండలంలో గురువారం సాయంత్రానికి ఎంపీటీసీలకు 80 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ తరఫున ఒక్కటి కూడా లేకపోవడం ఆ పార్టీ అంటే ప్రజల ఏహ్యభావానికి నిదర్శనంగా చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజలకు చేసిన అన్యాయానికి ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
తమ్ముళ్లకు సమైక్య సెగ
తణుకు, న్యూస్లైన్: పురపోరులో నిలిచి ఓటడిగేందుకు ప్రజల వద్దకు వెళుతున్న తెలుగు తమ్ముళ్లకు సమైక్య సెగ తగులుతోంది. రాష్ట్ర విభజన అంశంతో సమైక్య ఉద్యమసెగకు భయపడి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువైన విషయం తెలిసిందే. విభజనకు మద్దతుగా టీడీపీ లేఖ ఇవ్వడంతో తమ వద్దకు ఓటు అడిగేందుకు వస్తున్న టీడీపీ అభ్యర్థులను తణుకు పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో మీ అధినేత చంద్రబాబు సీమాంధ్రులను నిలువునా ముంచారంటూ మొహం మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో తమ్ముళ్లు బిక్కమొహాలు వేస్తున్నారు. సమైక్య సెగ ప్రభావం మునిసిపల్ ఎన్నికలతో పాటు ప్రాదేశిక పోరులోనూ ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంతమేర కలిసొచ్చేదని, ఈసారి వారిని దూరంగా ఉంచటం కూడా తమ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులు 32 వార్డుల్లో పోటీ చేస్తుండగా, ఒక వార్డు సీపీఐకి, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తోంది. రెండుచోట్ల సీపీఎంతో వైసీపీ పొత్తు సమైక్య ఉద్యమాన్ని భుజానవేసుకుని.. ఉద్యమంలో ప్రజల వెంట నడచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఇదే అంశాన్ని ప్రచారంలో వివరిస్తున్నారు. మునిసిపాలిటీలో 34 వార్డులుండగా సమైక్యవాదం వినిపించిన సీపీఎంతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంది. రెండు వార్డులను సీపీఎం అభ్యర్థులకు కేటాయించారు. ప్రజల్లో మంచి పేరు, పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నవారిని గుర్తించి వైసీపీ తమ అభ్యర్థులుగా నిలపటం వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ఆదరణ పొందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నమ్మించి నయవంచన టీడీపీ నేతలు తమను నమ్మించి నయవంచన చేశారని బీజేపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ వరకు సీట్లు సర్ధుబాటంటూ టీడీపీ నేతలు నమ్మించి, చివరి నిమిషంలో సీట్లు ఇచ్చేది లేదని నయవంచనకు పాల్పడ్డారని బీజేపీ నేతలు టీడీపీ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుండటం టీడీపీకి మింగుడు పడడం లేదు. పట్టణంలో బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా 5 స్థానాల్లో పోటీకి దిగింది. లోక్సత్తా 5 స్థానాల్లో పోటీ చేస్తోంది. -
జగన్తోనే సంక్షేమం సాధ్యం
మచిలీపట్నం టౌన్, న్యూస్లన్ : రాష్ట్రంలో విశ్వసనీయమైన జనరంజక పాలన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి ద్వారానే సాధ్యమని బందరు,గుడివాడ, పెడన నియోజకవర్గ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం వైఎస్సార్సీపీలో భారీగా చేరారు. బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కుక్కల విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) సమక్షంలో బందరు పట్టణం 22వ వార్డు ఫతుల్లాబాద్కు చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబోయిన జగన్నాధంతో పాటు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సీలింగ్ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా ఓటర్లను చైతన్యపరచి అభ్యర్థులకు అఖండ విజయాన్ని చేకూర్చేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అర్భన్బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, 22వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ముస్తాఫా(అచ్చేబా), మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు, మాదివాడ రాము, ఎస్కే జలీల్, ఎండీ పాషా, ఖాజాబేగ్, మీర్ నజాప్అలీ, సయ్యద్మెహముద్, జగన్, మాడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత టీడీపీ కార్యకర్తలు శేషగిరి, భట్రాజు బాబ్జీ, గోవాడ శివాజీ, రాజు, గడ్డం జయరాం, భట్రాజు వీరాస్వామి, మాడపాటి సుబ్రహ్మణ్యం, పవన్, బోయిన నాగరాజు, భట్రాజు శ్రీను, రమణ, చేబోయిన వీరభద్రరావు, తోట నాంచారయ్య, సాయిల ఆండాలమ్మ, శ్రవణం ఉషారాణి, జినిత్, జీ గంగాభవాని తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్సీపీతోనే పట్టణాభివృద్ధి: కొడాలి గుడివాడ : జననేత జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీతోనే గుడివాడ పట్టణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొడాలిశ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. స్థానిక 9వ వార్డులోని శేగు టవర్స్ వద్ద పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులతోపాటు, పట్టణ టీడీపీ, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో చేరిన వీరందరికీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన పార్టీ కండువాలను వేశారు. పార్టీలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరపతయ్య, పోకూరి మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధిచెందాలంటే జగన్, కొడాలినానిని గెలిపించాలన్నారు. గుడివాడ మున్సిపల్,సాధారణ ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తున్నామని వివరించారు. పార్టీలో చేరిన వారు వీరే.... పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దుడ్డు వెంకటేశ్వరరావు (చిన్నా), ఆర్యవైశ్య మహాసభ సభ్యుడు బొగ్గరపు తిరపతయ్య, ఆర్యవైశ్య కళ్యాణ మందిర అధ్యక్ష, కార్యదర్శులు పోకూరి మోహనరావు, తిరువీధి శ్రీరాములు నాయకత్వంలో ఆర్యవైశ్య ప్రముఖులంతా పార్టీలో చేరినట్లు ప్రకటించారు. కాగా కాపు యువత పట్టణాధ్యక్షుడు ఆవుల నరేంద్ర, తెలుగుయువత నాయకులు తోట రాజశేఖర్ నాయకత్వం లో 56 మంది యువకులు, యూత్ కాంగ్రెస్ నాయకుడు టంకాల రామకృష్ణ నాయకత్వంలో 10 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సబ్యులు మండలి హనుమంతరావు, డాక్టర్ ఎం.విజయకుమార్రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాసచక్రవర్తి, పల్లంట్ల శ్రీను, పి.రమణ, పి.రమేష్, పి.ఆంజనేయులు పాల్గొన్నారు. జోగిరమేష్ అనుచరుల చేరిక.... బంటుమిల్లి : పెడన నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు జోగి రమేష్ అనుచరుడు, అర్తమూరు గ్రామ మాజీ సర్పంచి బొర్రా రమేష్ తన అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యార్లగడ్డ శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వార్డుసభ్యులు జి. పార్వతి, వై. భాగ్యలక్ష్మి, డి. కోటేశ్వరరావు, ఆర్. శ్రీనివాసరావు, జి. పద్మావతితోపాటు 400 మందికి పైగా పార్టీలో చేరారు. మలిశెట్టి రాజబాబు, కందుల నాగేశ్వరరావు కాగిత జయరాం, కె. రాఘవులు, బి. ప్రసాదు తదితరులున్నారు. -
మున్సిపోల్స్ పై నిఘా నేత్రం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: రాజకీయ పార్టీలు సెమీఫైనల్స్గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడేవారు. అనతికాలంలోనే ప్రజాదరణ పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా తొలిసారి మున్సిపల్ బరిలో దిగుతున్నారు. ఈ మూడు పార్టీలకు తోడు బీజేపీ, లోక్సత్తా, వామపక్షాల అభ్యర్థులతోపాటు, ఇండిపెండెంట్లు కూడా పలుచోట్ల పోటీకి దిగుతున్నారు. దీంతో ఇప్పటికే మున్సిపాలిటీల్లో వాతావరణం వేడెక్కింది. వార్డు స్థాయిలో పెనుసవాళ్లు ఎదురవుతాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. జిల్లాలోని సున్నితమైన, అతి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆయా వార్డుల్లో వెబ్ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రామకాంత్రెడ్డి బుధవారం జారీ చేసిన ఓ లేఖలో ఆదేశించారు. అవసరమైతే జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల సేవలను వినియోగించుకోవాని సూచించారు. ల్యాప్టాప్లు కలిగి వాలంటీర్లుగా పని చేయడానికి ముందుకొచ్చే ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని, ఇందుకోసం ఎన్నికల జరిగే ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలను ముందుగా సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలపైనే దృష్టి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 16 అతిసమస్యాత్మక, 16 సమస్యాత్మక, మరో ఐదు సున్నిత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. సాలూరు మున్సిపాలిటీలో మూడు సమస్యాత్మక, తొమ్మిది అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. పార్వతీపురంలో రెండు అతిసమస్యాత్మక, తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులనూ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఇందులో అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా, సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ ద్వారా, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జిల్లా యంత్రాంగం పర్యవేక్షించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే నిఘా ప్రారంభం వాస్తవానికి వెబ్ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్నీ పర్యవేక్షించే వీలుంటుంది. ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన చోటుచేసుకున్నా తక్షణమే యంత్రాంగం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. వెంటనే దానిని నివృత్తి చేసేందుకు వీలు కుదురుతుంది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందనే భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
అయ్యో పాపం.. కాంగ్రెస్!
నెలిమర్ల, న్యూస్లైన్: జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయూరైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయా లంటే ఎంతోమంది నేతలు సిఫారసు చేయాల్సి వచ్చేది.. పార్టీ టిక్కెట్ కావాలంటే నేతల మద్దతుతో పాటు కొన్ని సందర్భాల్లో కొంత మొత్తం కూడా చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నేతలు కోరుండి టిక్కెట్లు ఇస్తామన్నా..అభ్యర్థులు దొరకడం లేదు. నెల్లిమర్ల మండలంలోని 26 పంచాయతీలకు మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అభ్యర్ధులు దొరకలేదు. నిన్న మొన్నటి వరకు కనీసం ఐదారు స్థానాల్లోనైనా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని ఆ పార్టీ నేతలు ఆశిం చారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిం ది. దీంతో గెలుపు మాట అటుంచితే..కనీసం ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ నుంచి ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం మండలం నుంచి కేవలం ఐదు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యూరుు. పూసపాటిరేగలో 21 ఎంపీటీసీ స్థానాలుండగా.. ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. వైఎస్సార్ సీపీ, టీడీపీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు మండలాల్లో డిపాజిట్లు కడతామని పార్టీ నేతలు ముందుకొచ్చినా అభ్యర్థులు ముందుకు రా వడం లేదు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలోని భోగాపురం, డెంకాడ మండలాల్లోనూ నెలకొం ది. భోగాపురం మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు మూడు రోజులుగా కేవలం ఐదు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖల య్యాయి. డెంకాడ మండలంలోనే కాస్త మెరు గ్గా కాంగ్రెస్పార్టీ తరుపున నామినేషన్లు పడ్డా యి. ఇక్కడ ఇప్పటిదాకా పదిస్థానాలకు నామినేషన్లు పడ్డాయి. నామినేషన్లు వేసేందుకే అభ్యర్థులు దొరక్కపోతే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. -
భారీగా నామినేషన్లు
విజయనగరం ఫోర్ట్, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికలకు బుధవారం భారీగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు గురువారం... తిధి చవితి కావడంతో ముందుగానే చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు క్యూకట్టారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులతో జిల్లా పరిషత్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. బుధవారం జెడ్పీటీసీ స్థానాలకు 73, ఎంపీటీసీ స్థానాలకు 1,423 మంది నామినేషన్లు వేశారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎన్. మోహన్రావు,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నారాయణరాజు, శ్యామ్ సుందర్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఉదయం 10.30 గంట ల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 15 మంది, టీడీపీ తరుపున 40 మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 12 మంది, లోకాసత్తా , బీజేపీ ,సీపీఎం తరఫున ఒక్కొక్కరు, స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 377 మంది, సీపీఎం -28 మంది, సీపీఐ ఒకరు, లోక్సత్తా ఒకరు, కాంగ్రెస్ - 336 మంది , టీడీపీ తరఫున 606 మంది, స్వతంత్ర అ భ్యర్థులుగా 74 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేయడానికి గురువారం చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. -
జెట్పీటీసీ స్థానాలకు 96 నామినేషన్లు
శ్రీకాకుళం, న్యూస్లైన్: జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు 96 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం 96 నామినేషన్లు దాఖలు కాగా అంతకు ముందు దాఖలు చేసిన ఏడు నామినేషన్లతో కలిపి మొత్తం 103కు చేరింది. బుధవారం బీజేపీ నుంచి 3, సీపీఎం నుంచి 3, కాంగ్రెస్ నుంచి 5, వైఎస్ఆర్సీపీ నుంచి 5, టీడీపీ నుంచి 42, లోక్సత్తా నుంచి 1, స్వతంత్రులు 4 నామినేషన్లు దాఖలు చేశారు. ఎనిమిది మండలాల నుంచి నామినేషన్లు నిల్: జిల్లాలోని ఎనిమిది మండలాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పలాస, కొత్తూరు, సీతంపేట, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, రాజాం, జి.సిగడాం, సరుబుజ్జిలి మండలాల నుంచి ఒక్క నామినేషన్ కూడా ఇప్పటి వరకూ దాఖలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే: జిల్లాలోని 38 మండలాల్లో ఐదు మండలాలనుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇది ఆ పార్టీకున్న అభ్యర్థుల కొరతను తేటతెల్లం చేస్తోంది. ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల అసంతృప్తుల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇటువంటి వారికి చివరి క్షణంలో బీఫారాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే అసంతృప్తులు కాంగ్రెస్ మినహా మరే పార్టీకైనా వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారే తప్ప ఆ పార్టీ పిలిచినా వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎంపీటీసీ స్థానాలకు 1098 నామినేషన్లు ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి మొత్తం 1098 నామినేషన్లు స్వీకరించారు. శ్రీకాకుళం మండలంలోలో 30 నామినేషన్లు, గారలో 13, ఎచ్చెర్లలో 48, లావేరులో 26, రణస్థలంలో 65, జి.సిగడాంలో 44, నామినేషన్లు దాఖలయ్యాయి. పాలకొండలో 24 నామినేషన్లు, సీతంపేటలో 21, భామినిలో 33, వీరఘట్టంలో 34, పాతపట్నంలో 19, హిరమండలంలో 17, ఎల్ఎన్ పేటలో 22, మెళియాపుట్టిలో 14, కొత్తూరులో 15 నామినేషన్లు దాఖ లయ్యాయి. రాజాంలో 14, రేగిడి లో 18, వంగరలో 19, సంతకవిటిలో 13, పొందూరులో 12, సరుబుజ్జిలిలో 14, ఆమదాలవలసలో 40, బూర్జలో 16 నామినేషన్లు దాఖల య్యాయి. నరసన్నపేట మండలంలో 28, పోలాకిలో 28, సారవకోటలో 25, జలుమూరులో 31 , టెక్కలిలో 34, కోటబొమ్మాళిలో 24, సంతబొమ్మాళిలో 44, నందిగాంలో 36, పలాసలో 23, మందసలో 49, వజ్రపుకొత్తూరులో 40, ఇచ్ఛాపురంలో 21, కంచిలిలో 39, కవిటిలో 50, సోంపేటలో 55 నామినేషన్లు దాఖలయ్యాయి.